షట్ శాస్త్రాల్లో తలస్పర్శి
పాండిత్యం ఉన్నా,నిరాడంబరతతో మెదిలిన మహనీయులు డా. శ్రీ ఊ వే శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి వారు.
హర్షా మర్ష భయ క్రోధదులేవి స్పృశించని నిర్మలమైన జీవన శైలి ఆచార్యుల వారిది. నిష్కలంక చరిత్ర వారిది.
నడయాడే శ్రీ భాష్యం, కదిలే విజ్ఞాన సర్వస్వము, పుంభావ సరస్వతి. జ్ఞానానుష్టానములను భక్తి వైరాగ్యాలను కలిగిన వారు ఆచార్యులు శ్రీమాన్ రఘునాథ ఆచార్య స్వామి వారు.
సంస్కృత సాహిత్యంలో ఎంతటి మేరునగ శిఖరమో, విశిష్టాద్వైత సంప్రదాయంలో అంతటి లోతైన పరిజ్ఞానం కల అపర రామానుజ స్వరూపం వారిది. ఉపన్యాసం ద్వారా వేలాదిమంది ని తేజపరిచి నూతన ఆవిష్కరణలు చేస్తూ ప్రతి సభను అద్వితీయంగా నడిపిన ధిషణ వారిది.. అధ్యాపకులుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపక కేసరి. వేలాది పండిత సభల్లో నూతన ప్రతిపాదనలు చేసిన ప్రతిభాశీలుడు. ఎంతటి ఉన్నతులైన, శాస్త్ర విషయాలలో రచనలలో తప్పులను ఎత్తిచూపి, సరియైన మార్గదర్శనం చేసిన మహానుభావులు.
జననం
పండితోత్తములు ప్రపన్నులు అయినా
శ్రీమాన్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల తాతాచార్యులు శేషమ్మ గారలకు తేదీ 01.05 19 26న మోటూరు కృష్ణాజిల్లా (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్. )లో
జన్మించినారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరంగం రఘునాథచార్య స్వామి వారు.
విద్యాయానం!!
అమావాస్య నాడు అక్షరాభ్యాసాన్ని పొందిన వీరు
తదుపరి అసమాన్యమైన పండితులుగా రూపుదిద్దుకోవడం జరిగింది.
చిన్ననాడే ఆచార్యులవారు తమ తండ్రిగారి వద్ద సంస్కృత ప్రాథమిక జ్ఞానాన్ని పొందినారు.
ఇంగ్లీష్ భాషా పాఠశాలలో వేసిన ఎందుకో అది అబ్బకుండా పోయింది.
వేదాంతవర్ధిని
సంస్కృత పాఠశాల సీతారాం బాగ్ హైదరాబాద్
లో విద్యాభ్యాసం కోసం తీసుకెళ్లినప్పుడు
వీరి భాష విజ్ఞానం చూసి భారవి క్లాసులో చేర్చుకున్నారు. సాధారణ విద్యార్థులు సంస్కృత ఎంట్రన్స్ పరీక్ష రాయటానికి ఒక్క సబ్జెక్టు మాత్రమే ఎంచుకొని రాస్తారు. కానీ ఆచార్యులవారు నాలుగు ఎంట్రన్స్ పరీక్షలను తర్క, వ్యాకరణ ,సాహిత్య మీమాంస శాస్త్రాలను ఒకేసారి రాసి విజయం పొందిన చురుకైన విద్యార్థి. గురువుగారైన శ్రీమాన్ శఠగోప రామానుజాచార్య స్వామి వారు ఆచార్యుల వారిని అప్పటినుంచి చతుస్తంత్రి అని పిలిచేటువంటివారు.
తదుపరి ఉద్యోగం నిమిత్తం విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకొని ఉపన్యాసకులుగా కొనసాగింపబడిన విరాణమూర్తి.
శ్రీమాన్ ఆచార్యుల వారు వేదాంతవర్ధిని సంస్కృత పాఠశాలలో చదివిన విద్యార్థి జీవితాన్ని, కృతజ్ఞతావిష్కరణం అనే పేరిట సంస్కృత కావ్యాన్ని అత్యద్భుతంగా వెలువరించి గురువులకు శిష్యులకు ఒక మార్గదర్శనం చేశారు. తదుపరి కృతజ్ఞతావిష్కరణం అనే సంస్కృత కావ్యాన్ని ఆచార్య లక్ష్మణ మూర్తి గారు తెలుగులోకి అనువదించటం విశేషం.

