Home వ్యాసాలు కవిత్వ నైపుణ్యాలు: కవిత్వము-వస్తువు

కవిత్వ నైపుణ్యాలు: కవిత్వము-వస్తువు

కవిత్వానికి సంబంధించిన నిర్మాణమెలకువలు, లేదా శిల్ప రహస్యాలు, కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించుకునే వేదికగా దీన్ని రూపొందించాము. మూడవ అంశం – కవిత్వము – వస్తువు.

కవిత్వం అనగానే వస్తువు, రూపము రెండు అంశాలు మిళితమై ఉండేటటువంటిది కవిత్వం అని అంటాము. కవిత్వానికే గాదు, ఏ వస్తువుకైనా గూడా ఈ రెండు అనివార్యమైనవి. ఈ రెండు రూపాలు ప్రతిదాంట్లో గూడా ఒకటి వస్తువు ఉంటుంది ఒకటి రూపము ఉంటుంది. ప్రతి పదార్థానికి ఈ రెండు అనివార్యంగా ఉంటాయి. మనం ఏ వస్తువునైనా తీసుకున్నా రెండు ప్రధానమైనవి ఒకటి రూపము, రెండవది అది వస్తువు ఉంటాయి. రెండూ ప్రధానమైనవే.

కవిత్వం అనేది కళ గనుక, ఆ కళ అనేది ప్రత్యేకంగా నైపుణ్యంతో, పనితనంతో ప్రత్యేకతతో కూడుకున్నది కనుక, ఈ పనితనమూ, నైపుణ్యమూ దేనికి వస్తుంది? దేనివల్ల వస్తుంది? అని తెలుసుకునేటటువంటి ఒక క్రమంలో మనం ఈ చర్చలన్నీ ప్రారంభించుకోవటం జరిగింది. దాంట్లో శిల్పం సంగతి రెండవ విషయంగా మనం అనుకుంటే దానిని  ‘పర్సీవ్ డ్’ లేదా ‘డిస్కవరీ’ అంటాము.

ఏదైతే సృష్టిలో ఉండేటువంటి లేదా జీవితంలో ఉండేటువంటి ఒక అంశాన్ని ఏదైతే తెలుసుకున్నారో ఇతరులకు తెలుపాలని అనుకున్నారో అది వస్తువు. అందుకని సమ్ థింగ్ ఎట్, దిస్ కంటైన్ అన్నారు. ఏదో ఒక విషయాన్ని చేరవేసేది. అందులో ఏంజేస్తుంది అని అంటే, మీకు కలిగిన అనుభవాలను లేదా ఒక పరిచయాన్ని పాఠకులకు, లేదా సహృదయులకు చేరవేసేటువంటి అంశం. దీన్ని ఒక వస్తువు అని ఒక నిర్ణయానికి రావచ్చు. అంటే మనం చెప్పదలచుకున్నటువంటి, లేదా సహృదయానికి చేర్చాలనుకున్నటు వంటి విషయాన్ని వస్తువు అంటాం. దీనికి భారతీయ సాహిత్య ఆలంకారికులు కూడా చాలా విలువ ఇచ్చారు. కవిత్వంలో ఇదే కీలకమనీ చాలాసార్లు అన్నారు. ఎందువల్లనంటే “ఇతివృత్తంతు కావ్యేనశరీరం పరికీర్తితమ్” అని భరతుడు అన్నాడు.  ఈ ఇతివృత్తమనేది వస్తువు. ఇది కావ్యానికి శరీరంతో సమానం. కావ్యం అనే దానికి ఒకటి శరీరం, ఒకటి ఆత్మ అనేది ఉన్నాయి అనుకుంటే, ఈ శరీరమనేటువంటిది వస్తువు. ఇతివృత్తము అని అన్నారు. అందుకని కథలోకి వెళ్లడమే కాదు ఒక నవల రాయండి, ఒక కవిత రాయండి, ఏదైనా రాయండి, ఏమైనా చేయండి చేసేప్పుడు దానికి తప్పని సరిగా శరీరమనేది ప్రధానం.  ఈ శరీరము ఉంటేనే, అలంకరణ ఉంటుంది. శరీరము లేకపోతే అలంకరణ ఉండదు. దానికి విషయమేదీ ఉండదు, ప్రాతిపదిక ఏమీ ఉండదు. అందుకే మొదట ఉండవలసింది శరీరం. ఆ శరీరాన్ని అలంకరించేటువంటి పద్ధతి వచ్చినప్పుడు అది తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు శరీరం అనేది ఉండాలి.   శరీరం కవిత్వంలో, సాహిత్యంలో శరీరం అంటే ఇతివృత్తం. “ఇతివృత్తం” అంటే ఇదీ విషయం అని చెప్పేటువంటిది.  వృత్తం అంటే మనం తిరుగదలుచుకున్న ఒక పరిధి. చెప్పదలుచుకున్నటువంటి ఒక పరిధి. పరిధి ఇదీ అని చెప్పేటువంటిది ఇతివృత్తం. ఇది కథ! లేదా ఇది అంశం, ఇది చెప్పదల్చుకున్నటువంటి విషయం, అని చెప్పదలుచుకున్నది ఒక పద్ధతి ఇతివృత్తం. ఈ ఇతివృత్తం అనేది కావ్యానికి శరీరంతో సమానమైనది అని చెప్పడం జరిగింది.  అట్లానే “పోయెట్రీ ఈజ్ ఎ జర్నీ ఇన్ టు ది కంటెంట్?” (Poetry is a Journey in to the content.)  Rilke  అనే ఒక కవి. విమర్శకుడు ఏమన్నాడు అంటే శరీరం అంటే వస్తువు అని. ఈ వస్తువులోకి ప్రయాణించడమే కవిత్వం అన్నారు. అంటే వస్తువులోకి ప్రయాణించడం. అంటే, ప్రయాణించడానికి వస్తువు అనేది ఉండాలి. వస్తువు ఉంటే కథలోకి పోయేది. అందుకని చుట్టూ ఉండేటువంటి వాతావరణంలోంచి, ప్రకృతిలోంచి, లేదా జీవితంలోంచి, లేదా సమాజంలోంచి ఈ వస్తువును ఎంపిక చేసుకొని రాసే అవసరమున్నది. కాబట్టి మనం ఏదైతే దర్శించినామో, విశదీకరించినామో ఏదైతే గ్రహించినామో, ఏదైతే పరిశీలించినామో  అదే వస్తువు. అయితే ఏ వస్తువును స్వీకరించినా  ఒక ప్రశ్న వస్తుంది. వస్తువును ఎట్లా స్వీకరించాలి అనే ప్రశ్న వస్తుంది.

మన చుట్టూ అనేక వస్తువులుంటాయి. ;ఎవరు ఏ కవి రాసినా కూడా ఎక్కడి నుండి తీసుకుంటాడు? చుట్టూ ఉండే వాతావరణంలో నించి లేదా సమాజంలోంచి ఎంపిక అయితే సృష్టి అంటే ప్రకృతి లేదా, జీవితం లేదా సమాజం, చరిత్ర, సంస్కృతి లేదా మనిషి. ఇది తప్ప కవికి ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు. సృష్టి, ప్రకృతి, మనిషి, సమాజం, ఊడి పడ్తుందా? ఎక్కడో ఆకాశం నుండి రాలిపడదు. చాలామంది అంటుంటారు. నాకు వస్తువు దొరకడం లేదు, ఏ వస్తువు మీద రాయాలి అని. సబ్జెక్ట్ దొరకడం లేదు అని అంటుంటారు. అది సరైనటువంటిది కాదు. సబ్జెక్ట్ ను మనం స్వీకరించాలి, వెతుక్కోవాలి. వెతకాలి అంటే ఎక్కడి నుండి తీసుకోవాలనేముంది? ప్రకృతి నుంచి తీసుకోవచ్చు. రవీంద్రనాథ్ టాగూర్ ఉన్నాడు, కృష్ణశాస్త్రి ఉన్నాడు. వీరంతా కూడా ప్రకృతిలోంచి వస్తువును స్వీకరించారు. శ్రీ శ్రీ ఉన్నాడు. ఆయన సమాజంలోంచి, చరిత్రలోంచి వస్తువును స్వీకరించాడు. ఒక చారిత్రక నేపథ్యం నుంచి కవిత్వం తీసుకొని రాసాడు. అట్లా మనిషినే కేంద్రంగా చేసుకొని నారాయణరెడ్డిగారు రాయడం జరిగింది. ‘విశ్వంభర’ కావ్యంలో రాయడం జరిగింది. సృష్టినుంచి ప్రకృతి నుంచి, సమాజం నుంచి, మనిషి నుంచి వస్తువును తీసుకోవాలి. ఇంతకుమించి, వస్తువు ఇంకోటి ఉండదు. వీటికి సంబంధించిన వాటి నుంచే మన చుట్టూ ఉండే వాతావరణం ఏదైతే ఉంటుందో దానినే వస్తువుగా తీసుకోవాలి. తీసుకునే అవకాశం ఉన్నది. అందులో మనకు ఏది నచ్చితే అది వస్తువుగా స్వీకరించాలి. మనకు ఒక మంచి జర్మనీ సామెత (సెయింగ్) ఒకటి ఉన్నది. మన చుట్టూ ప్రతి వస్తువులో ఒక పాట నిద్రిస్తూ ఉంటుంది. ఆ ప్రతి వస్తువు ఆ పాటను స్వప్నిస్తూ  ఉంటుంది. కవి గుర్తించి పాడతాడు. ఆ తదనంతరం లోకం గుర్తిస్తుంది అని ప్రతి వస్తువులో ఒక పాట ఉంటుందని, అది పాటను స్వప్నస్తుందని. కాదేదీ కవితకనర్హం. కవిత్వానికి అనర్హమైనదేదీ లేదు అని గతంలోనూ తెలుసుకున్నాం. ప్రతిదీ కవిత్వానికి అర్హమైనదే అని అన్నారు.

అందుకే ప్రతి వస్తువులో ఒక పాట కలిసి ఉంటుందనీ, ఆ వస్తువు పాట గురించి స్వప్నిస్తూ ఉంటుందని. ఆ వస్తువును కవి గుర్తించాలి. కవి గుర్తించి, తను మొదటగా పాడితే తర్వాత లోకమంతా పాడుతుంది. ఇదీ కవి ఈ గుర్తించి స్వీకరించడమనేది, దాని యొక్క దర్శనం పైన ఆధారపడి ఉన్నది. ఏది దర్శిద్దాం? ఏది చూద్దాం? దేన్ని స్వీకరిస్తాం? అని అన్నప్పుడు మన జీవితంలో ఉండేటువంటి అత్యంత కీలకమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవచ్చు. అయితే, దీన్ని తీసుకోదలచుకున్నప్పుడు వస్తువును ఎంపిక చేసుకోదలుచుకున్నపుడు, మనకు ఏమేమి ఉండాలి? ప్రకృతి నుండి తీసుకోండి, సృష్టి నుండి తీసుకోండి, సమాజం నుండి తీసుకోండి, ఎంపిక చేసుకోవలసిన నాలుగు అంశాలు ఉన్నవి. ఈ నాలుగు అంశాలు కీలకమైనవి. ఒక అంశం మీద పరిచయం లేనటువంటి వస్తువుమీద చాలామంది రాయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసినప్పుడు మనకు పరిచయం లేని వస్తువును ఎంపిక చేసుకుంటే కొంత తేలిపోయే ప్రమాదమున్నది. అందుకే మనకు అత్యంత సమీపమైన, తెలిసిన వస్తువు తీసుకోవాలి. మనకు బాగా తెలిసి ఉన్నవారు తెలిసిన వస్తువును తీసుకున్నప్పుడు మనం అన్ని కోణాలను పరిశీలించి, విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. కనుక వస్తువు ఎంపికలో మనం జాగ్రత్త తీసుకొనే మనకున్న నేర్పరితనానికి సులువవుతున్నది. మొట్టమొదటిది ఏ పరిచిత వస్తువుకైనా తీసుకోవాలి. పరిచయం లేని వస్తువు జోలికి పోవద్దు. తేలిపోయినట్లు ఉంటుంది. దాంట్లోనే రెండవ లక్షణం, అంశం, రెండవ జాగ్రత్త ఏంటంటే, అది కొత్తగా ఉండాలి. ఇంతకుముందు తీసుకున్నప్పుడు ఆయనే రాసాడు గదా, మళ్ళీ ఈయనేం రాసాడు అని కవిని తక్కువ చేసే ప్రమాదమున్నది. అప్పుడు అలాంటి వస్తువును తీసుకున్నప్పుడు శిల్పంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శిల్పంతో నెట్టుకురావాల్సి ఉంటుంది. వస్తువే ముఖ్యం అనుకున్నప్పుడు శిల్పం కంటే ముందు వస్తువే వినూత్నమైనపుడు ఇక శిల్పం సంగతేంటి? అందుకే రెండవ అంశంగా కొత్తది తీసుకోవాలి. మూడోది ఆ అంశం ఆ కాలానికి పరిచయం ఉన్న సమకాలీనమైనదై ఏ కాలంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు కాలాన్ని చేరుకుంటారు. అంటే వాళ్ళ అభిరుచులకు దగ్గరగా ఉండాలి. వర్తమానంలో ఏ పాఠకులైతే, ఏ సహృదయులైతే కవిత్వాన్ని చదువుతూ ఉన్నారో వాళ్ళ అభిరుచులకు దగ్గరగా, అనుగుణంగా ఉండాలి మనం ఎంచుకున్నది. అంటే దాని అర్థం ఏంటంటే, సమకాలీనత ఉండాలి. మనం ఎంచుకునే వస్తువుకు మూడవ లక్షణం సమకాలీనత. నాలుగవ లక్షణం మానవీయత. లేదా అర్హత కలిగి ఉండాలి. మానవీయత అంటే మానవులకు ఉన్న భావోద్వేగాలను స్పృశించడం. కనెక్ట్ చేయడం. లేకపోతే అతను మనకు కనెక్ట్ కాడు. మానవుడు అనుభవించిన దానిని మనం కనెక్ట్ చేయడం. ఆయన అనుభవించిన దాంట్లోని అంశాన్ని మనం టచ్ చేయడం. అటువంటి అంశాన్ని మనం స్వీకరించగలిగితే కవిత్వంతో చేరుకోగలిగితే తప్పకుండా మానవుని చేరుకోగలుగుతాడు కవి. అందుకని నాలుగంశాలని ప్రథమంగా చెప్తాం. 1. పరిచయమైనటువంటి వస్తువును ఎంపిక చేసుకోవాలి.   2. కొత్త వస్తువును నవీనమైనది తీసుకోవాలి. 3. సమకాలీనమై ఉండాలి. 4. మానవీయమై ఉండాలి. స్పందనలకు, భావోద్వేగాలకు దగ్గరగా ఉండేది కావాలి. అప్పుడే మానవుడు స్పందించగలుగుతాడు. లేకుంటే స్పందించలేడు. లేదంటే స్పందించే అవకాశం లేదు. కనుక ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని, చుట్టూ ఉండే వాతావరణంలోంచి కవిత వస్తువును తీసుకోవాలి. అప్పుడే అనుకుంటాం మనం. ఎక్కడినుండి తీసుకుంటాం అంటే ప్రకృతి నుంచి. ఎక్కణ్ణించి తీసుకుంటామంటే జీవితంలోంచి, ఎక్కణ్ణించి తీసుకుంటామంటే మనిషి నుంచి, ఎక్కణ్ణించి తీసుకుంటామంటే కాలం నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ వస్తువును ఎన్నుకునేటప్పుడు ముందు ఇంకొక అంశం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగంశాలు తెలిసినటువంటివి తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఏం చూసుకోవాలి? అని అన్నప్పుడు, మనం మాట్లాడినప్పుడు దర్శనం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎన్ని కోణాల్లోంచి మనం పరిశీలిస్తే దాని యొక్క సారం దాని యొక్క తత్త్వం మనకు బోధపడ్తుందో ఆ కోణాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. పరిశీలించాలి. మొత్తం కోణాన్ని పరిశీలించడం సాధ్యపడదు. కనుక వర్ణింపదలిచిన  వస్తువును ఎంపిక చేసుకున్న తర్వాత, దాని యొక్క కోణం ఎక్కడినుండి ఎట్లా చూసే దాని కోణం కనిపిస్తుందో ఏ కోణంలోంచి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ దగ్గరి నుండి చూస్తే దాని యొక్క సారం తెలుస్తుందో దాన్ని మనం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవలసినటువంటిదవి. అందుకని కోణంకూ దృష్టికి ముఖ్యమైనది. వస్తుకోణం, దృష్టికోణం అనేటు వంటివి కూడా చాలా కీలకమైనవి. అందుకని ఆ కోణాన్ని మనం ఎంచుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోటోగ్రాఫర్ కూడా ఫోటో తీయదలుచుకున్నప్పుడు కొందరేమో ఎదురుగా, ఫ్రంట్ గా నిలబెట్టి తల పైకెత్తు కిందికి పెట్టు అని రకరకాలుగా మనని తీస్తాడు. తర్వాత చూస్తే మనది మనకే చూడబుద్ది కాకుండా తీస్తాడు. ఎందుకంటే ఆయనకు కళాత్మక దృష్టి ఉండాలి. ఈ వ్యక్తిలో ఏ కోణంలోంచి ఫోటో తీస్తే బాగుంటుందో అట్లా తీయాలి.  వ్యక్తి యొక్క తత్వం లేకుంటే ఆయన ముఖంలో ఉండే కళ, తేజస్సు కనబడుతుందో అర్థం కానివాడు తీస్తే వృథా. కళాత్మకమైనటువంటి కోణం తెలిసినటువంటి ఫోటోగ్రాఫర్ తీస్తే ఒకరకంగా బాగా ఉంటుంది. అందుకని కళాకారులు – అంటే ఇక్కడ కవి గనుక, ఈ కవి ఏం చేయాలంటే పాయింట్ ఆఫ్ వ్యూ, దృష్టి కోణాన్ని మనం నిర్వహించుకోవాలి. నాలుగు అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటూనే, ఈ నాలుగు అంశాలతో పాటు మొదట ఎంపిక చేసుకునేప్పుడు, స్వీకరించేపుడు దాని దృష్టికోణం కూడా చాలా కీలకమైనది అని అర్థం చేసుకోవాలి. అందుకని మనం మొదటి అంశం వస్తువును దర్శిస్తాం, స్వీకరిస్తాం. వస్తువును స్వీకరించేపుడు ఇక్కడ దృష్టికోణం కీలకమైంది. ఎందుకు కీలకమైంది అన్నప్పుడు వస్తువును, రూపాన్ని విడదీయలేము. చాలాసార్లు ఏం జరుగుతుందీ అంటే, వస్తువునూ రూపాన్ని విడదీయలేము కానీ ఒక్కోసారి వస్తువే రూపాన్ని విడదీసే అవసరమొస్తుంది. అవకాశమొస్తుంది. అందుకే వస్తువు ఎంపిక దగ్గరి నుండి జాగ్రత్త వహించాలి. అంటే వస్తువును ఎనుకున్నప్పుడే దాని రూపము నిర్ధారణ అయిపోయే అవకాశముంటుంది. కృష్ణశాస్త్రి గారు “బాక్ టు ద నేచర్” ( Back to the Nature). ఆయన “ఒక కొమ్మలో కొమ్మనై ఆకులో ఆకునై” అనే అంశాన్ని స్వీకరించడంతో అనుకున్నపుడు దానితో కలిసిపోవాలనుకున్నప్పుడు అప్పుడు ఉన్నదాంట్లో ఇక రాసుకుంటా పోయాడు. “ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై.. నునులేత రెమ్మనై” అంటూ అట్లా రాసుకుంటూ పోవడం. కనుక ఈ ఎంపిక చేసుకోవడం అనేది చాలా కీలకం. ప్రకృతి నుంచి రాయాలి అనేటువంటి అంశాన్ని ఎక్కడ మొదలు పెట్టి ఎట్లా ఏ కోణంలోంచి రాయాలి అనేది, ఎట్లా చిత్రించాలి అనేది రెండో అంశంగా చెప్పేది వస్తువు. ఈ అంశాన్ని తీసుకున్నప్పుడు ఈ వస్తువునే తీసుకున్నప్పుడు మానవీయ స్పందనలు ఉండేటువంటి దానిలో ఏదైనా విశేషత ఉండాలి. చెప్పడానికి అనువైనటువంటి ఏదో ఒక విశేషము ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ‘స్నేహం మీద’ కవిత రాయాలి అని అన్నప్పుడు.. అందరూ ఏం రాస్తారు? “సృష్టిలో తీయనిది స్నేహమే” అని రాస్తారు. అట్లా ప్రాచుర్యంలో ఉండేటువంటి ఆ కోటేషన్ నే చెప్పుకుంటూ రాస్తారు. మధురత్వము అనేది లేకుండా, తీపి లేకుండా స్నేహం ఇంత గొప్పది, అంత గొప్పది అని తప్పించి వేరేదెవరూ రాయరు. కానీ, దానివలన ఏమవుతుంది? ఈ మొత్తం ఒకటే వస్తువు ఉండటం వల్ల అదే వస్తువు ఉండటం వల్ల, రాయడంలో ఏ నైపుణ్యం ప్రకటించకపోవడం వల్ల అది మూసగా నిలిచిపోయే ప్రమాదమున్నది. కొత్తదనం లేకపోవడం వల్ల అంటే మోనాటమీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ప్రమాదం ఏర్పడుతుంది. రూపం కూడా పాతది అయిపోతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైన ఒక వస్తువు ద్వారా ఏదైనా ఒక విశేషాన్ని చెప్ప దల్చుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువును స్వీకరించగలగాలి. దాని ద్వారా మనం ఒక విశేషాన్ని, సందేశాన్ని అనుభవంతో అందించాలి. అప్పుడే ప్రతిదీ, మనం అవతలి వ్యక్తికి ఇవ్వగలం. అదే కీలకం. ఈ వస్తువును, ఎదుటి వ్యక్తి ఆకట్టుకునే వస్తువు అయి ఉండాలి అన్నారు. మనమనుకున్నట్లు మానవీయ స్పందనలో భాగమైనటువంటిది ఉండాలి. మానవ భావోద్వేగాలతో సంబంధం లేనిది ఆకట్టుకోదు కనుక మానవ సంబంధ భావనతో స్పందనలతో, అందులోంచే వస్తువును తీసుకోవాలి. లేనిదే ఆకట్టుకునే అవకాశం లేదు గనుక తప్పకుండా మానవ అనుభవాలను తీసుకొనే రాయాలి. చాలాసార్లు ప్రకృతిని ప్రకృతి, ప్రకృతి లాగా రాయం. ఇవన్నీ మానవునికి అన్వయిస్తూ రాస్తాం. ఇవన్నీ టెక్నిక్స్.

కానీ, ప్రకృతిని కూడా మానవరూపంలోకి, మానవ స్వభావంలోకి ఆరోపించుకొని రాయడం ఏదైతే ఉన్నదో ఇక్కడే ఈ తెలివితేలటన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అని తెలుస్తుంది. అందుకని మనం ఈ వస్తువు ఎంపిక దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆ కవిత్వం అంత బాగా పండేటువంటి అవకాశమున్నది . ఒక్కోసారి మనం రాయడంలో కొంత నైపుణ్యత తగ్గినా కూడా అందులో విశేషత  ఉంటే అది ఆకట్టుకుంటుంది. అందుకని చాలాసార్లు కొత్తది స్వీకరించాలంటే ఒప్పుకుంటారో, ఒప్పుకోరో అనే భయం అనేది ఒకటుంటుంది. ఇది మనకే కాదు కాళిదాసు నాటికే కాళిదాసుకే వచ్చిందని ఆయనొక మాటన్నాడు. పాతదే తీసుకోవాలి అని, ఇప్పటివరకు చెప్పినటువంటి అలంకారికుల వల్ల ఆయన వాళ్ళకు సంజాయిషీనివ్వడం, అలంకారికులు ఏమన్నారంటే ప్రఖ్యాత వస్తు విషయం “ప్రఖ్యాత వస్తువిషయం ప్రఖ్యాతోదాత్తనాయకం చైవ – రాజర్షి వంశచరితం తదైవ దివ్యాశ్రయోపేతమ్” భరతుడు అన్నాడు. వస్తువును తీసుకోవాలన్నప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి భారతీయ లాక్షణికులు ఏం చెప్పినారంటే విషయం కొత్తది తీసుకోవద్దన్నారు. ప్రఖ్యాతమైన వస్తువును తీసుకోమన్నారు. అందుచేత మనకు ప్రాచీన కాలంలోని ఆ భారతానికో రామాయణానికో, భాగవతానికో సంబంధించిన వస్తువులే మిళితమై ఉంటాయి. అంటే విషయం, వస్తువు ప్రఖ్యాతమైనదై, ఎప్పటికీ ప్రాచుర్యమైనదై ఉండాలి. దాని వలన మనం ఎక్కువ కష్టపడకుండానే సమాజానికి చేరే అవకాశముంటుంది అని చెప్పడం.

ఇక్కడనే రెండవది ఆ వస్తువుతో పాటు అందులో నాయకుడెవరుండాలి అంటే ఉదాత్తుడైన నాయకుడై ఉండి ఉండాలి. ప్రఖ్యాత నాయకుడై ఉండి ఉండాలి అని. అయితే కాళిదాసు వరకు వచ్చేటప్పటికి, ఒక సమస్య ఏర్పడ్డది. ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తము అని అన్నప్పుడు ఉన్నదాంట్లో నించే తీసుకోవాలి. నాయకుడు బాగా ప్రఖ్యాతుడై ఉండాలి అంటే, అయితే దేవుడు కావాలి లేకపోతే రాజు కావాలి అని. భరతుడు వంటి ఆలంకారికులు చెప్పిన విషయాలను గమనిస్తే, ఆ విషయాల ప్రకారమైతే ఒకనాటికి బాగానే ఉండవచ్చు గాని, తదనంతర కాలానికి లేదు అని. అందువల్ల కాళిదాసు కొత్తదనాన్ని ప్రయోగించదలుచుకున్నప్పుడు, ఆ కాళిదాసులాంటి వాళ్ళే కాదు ఇవ్వాళటి వరకు కూడా కొత్తదనాన్ని మనం తీసుకున్నప్పుడు, కొత్త వస్తువును తీసుకురావాలనుకున్నప్పుడు, ఒక విశేషమైన వస్తువును తీసుకురావాలనుకున్నప్పుడు కొత్తదే స్వీకరించాలి. కొత్తది స్వీకరించినప్పుడు, ఆయనే, కాళిదాసే స్వయంగా చెప్పుకున్నదేమంటే “పురాణమిత్యేవ నసాధుసర్వం, నచాపికావ్యం నవమిత్యవద్యం” కాళిదాసు అన్నాడు. అంటే పురాణమైనదంతా కూడా గొప్పదని చెప్పడానికి వీల్లేదు. ప్రాచీన కాలంలోని దంతా కూడా గొప్పదని చెప్పడానికి వీల్లేదు. పాతదంతా గొప్ప అని చెప్పడానికి వీల్లేదు. పాతది కూడా కొన్నిసార్లు ప్రక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. వస్తువు ఏదైనా సరే పాతదైపోతే తప్పనిసరిగా అది ఎంతగా మనకు ఇష్టమైన వస్తువు ఏదైనా, ఉదాహరణకు ఒక గులాబి పువ్వున్నది, నిన్న పూసిన పువ్వు, మొన్న పూసిన పువ్వు వాడిపోయింది, ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత రాలిపోతుంది. ఇంకా నాకిష్టమైంది అని ఇంట్లో పెట్టుకుంటామా? రాలిపోయి ఎండిపోయినప్పుడు దాని పరిమళము పోయినప్పుడు దాని రంగు కూడా పోయినప్పుడు, దాని రిక్కలు కూడా రాలిపోతున్నప్పుడు, ఇన్నిబోతున్నప్పుడూ అది నేను అదే పెట్టుకుంటానంటే కాదు. ప్రతిరోజు పుష్పం కొత్తది వస్తుంది. కొత్తగా పుడ్తుంది. అది చాలా శుభ్రంగా ఉంటుంది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. చాలా కొత్తదనంతో ఉంటుంది. చాలా సొగసులతో ఉంటుంది. దాన్ని స్వీకరించాలి. అని చెప్తూ ఆయనేమన్నాడు పురాణమైనదంతా కొత్తగాదు, కొత్తదైనంతమాత్రాన దానిని స్వీకరించడానికి అంతా యోగ్యమైనది కాదు అన్నాడు. ఇది ప్రక్కనబెట్టుకో అన్నాడు.

అందుకనే కాళిదాసు మేఘాన్ని దూతగా తీసుకున్నాడు. శ్రీశ్రీ కొత్తదనం కోసమే ‘నవ కవనం’ అనే కొత్త పేరుతో తమ కవిత్వంలో ఏమేమి కావాలో అవి రాసాడు.

“కదిలేది కదిలించేది మునుముందుకు నడిపించేదీ, పాడేదీ పాడించేదీ పెనునిద్దుర వదిలించేది పరిపూర్ణపు బతుకిచ్చేది కావాలోయ్ నవకవనానికి” రాసేది కొత్త కవిత్వం. ఈ కొత్త కవిత్వానికి ఏం కావాలి అంటే అది పాడాలి పాడించాలి. అది కదలాలి కదిలించాలి. పెనునిద్దుర నొదిలించాలి. ఇంతకుమందు నిద్రబోయే సాహిత్యం వచ్చింది. నిద్రబుచ్చే సాహిత్యం వచ్చింది. ఇది నిద్రను మేల్కొలిపేటువంటి సాహిత్యం. అని చెప్తూ ఆయన కొత్తదనాన్ని స్వీకరించాడు. గురజాడ అప్పారావు గారు అప్పటివరకు ఉన్నటువంటి ఒకరకమైన సాహిత్యం ఉంటే ఆయన కూడా కొత్తదనాన్ని స్వీకరించాడు. తర్వాత తర్వాత అట్లా మనం తప్పనిసరిగ కొత్తదనాన్ని స్వీకరించాలి అనే భావం ఏర్పడింది. ఎంతో కొంత ప్రత్యేకతను ప్రదర్శించకపోతే మనం అక్కడ ఉండడానికి అవకాశం లేదు. అందుకని వస్తువు ఎన్నిక దగ్గర కొత్తదనంతో కూడినటువంటి వస్తువును ఇంతకుముందు ఎవరూ స్వీకరించనటువంటి వస్తువును స్వీకరిస్తే, తీసుకుంటే అది రాణిస్తుంది. రాణించే అవకాశం ఉంటుంది. అయితే వస్తువు కొత్తదా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? అదొక ప్రశ్న మళ్ళీ. ఇది అధ్యయనం ద్వారానే తెలుస్తుంది తప్ప, మళ్ళీ మనం చదవకపోతే తెలియదు. ఎప్పుడో చాలా రోజుల క్రింద, ఏ ముప్పై ఏళ్ళ క్రిందనో పుస్తకంలో దాచుకున్న నెమలీకను “నా జ్ఞాపకం” అని నేను ఏదో రాసాను. అది ముప్పై ఏళ్ళ కింద రాసిందైతే, అది ఆ తర్వాత ఎంత ప్రచారమైందంటే రాసుకున్న నెమలీక, దాచుకున్న నెమలికన్ను అని రాసారు. చాలామంది దాదాపు ఒక ఇరవైమంది రాసుంటారు. ఈ ఇరవై ఒకటో ఆయనకు అది ముప్పై ఏళ్ళ క్రింద రాసిన కవిత అని తెలియదు. తెలియకపోవడం వల్ల ఏమవుతది. అది పాతది అనుకోడు, నేనే రాసిన అనుకుంటాడు. ముప్పై ఏండ్ల క్రింద రాసిందనుకోడు. ఇది ఎవరు పట్టుకుంటారు మళ్ళీ ? దీన్ని ఒక విమర్శకుడు పట్టుకుంటాడు. ఓ ముప్పై ఏళ్ళ క్రింద రాసింది, ఫలానాయన రాసినాయన, తర్వాత ఇంకో ఇరవైమంది వరకు రాసినారని, ఆ తర్వాత ఇరవై ఒకటవ వ్యక్తి కూడా రాసాడు అని అంటాడు. అందువల్ల కొత్తదనం లేదని అంటాడు. అందుకని తప్పనిసరి మనం విస్తృతంగా అధ్యయనం చేయడం ద్వారానే విశేషత్వం ఏంటిది, కొత్తదనం ఏంటిదని, ఇప్పుడు నువ్వు రాసిందేంటిది? రాయాల్సిందేంటిది? అనేది తెలుస్తుంది. బోధపడే అవకాశం ఉంటుంది. కనుక ఇది ఒకటి తప్పనిసరిగా గుర్తుకు పెట్టు కోవాల్సినటువంటిది. ఇంకొక అంశం కూడా ఈ వస్తువు ఎంపిక విషయంలో ఇంకో సమస్య ఉంటది. ఇంకో సమస్యేంటిదీ అనంటే, ఎప్పుడైనా సమకాలీనమైన వస్తువును స్వీకరించాలి అని అనుకుంటే, చుట్టూ ఉండేటువంటి ఒక వాతావరణం ఆ వస్తువును నిర్ణయిస్తూ ఉంటుంది. మన స్వేచ్ఛతో సంబంధం లేకుండా, మన ఇష్టంతో సంబంధం లేకుండా మన చుట్టూ ఒక సమన్వయం, ఒక సమస్య ఉంటుంది. ఒక సాహిత్య వాతావరణం ఉంటుంది. ఈ సాహిత్య వాతావరణం చాలాసార్లు ఇందాక అనుకున్నట్టు, ఒక సబ్జెక్ట్ ఇచ్చి రాయమంటుంది. ఒక టాపిక్ ఇచ్చి రాయమంటుంది. కొన్ని సార్లు ఏం జేస్తది అంటే ఎక్కడో బార్డర్ లో సైనికుడు పోరాడుతుంటాడు. దాని గురించి రాయవలసిన సందర్భం ఏర్పడుతది. ఇటువంటి సమకాలీన విషయాలు రాసేప్పుడు, అది అందరినీ ప్రేరేపించేలాగా, అందరినీ ప్రభావితం చేసేట్లుగా రాయాలి. అట్లనే ఇప్పటి పరిస్థితికి సమన్వయం చేయ దలుచుకుంటే, ఇప్పటి సాహిత్యానికి, కవిత్వానికి సమన్వయం చేయదలుచుకుంటే మనం ‘కరోనా’ కాలంలో ఉన్నాం. ఈ కరోనా కాలంలో ఉన్నప్పుడు, మనతో సంబంధం లేకుండ, మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, చుట్టూ ఉన్న సమాజంలో వాతావరణంలో ఈ కరోనా ఉంటుంది కనుక అందరికీ కరోనా గురించి రాయాలని ఉంటుంది. అందరమూ రాస్తాం. ఈ కరోనా ప్రభావం బాగా ఉన్నదని ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు. నేను రాస్తున్నదే బాగున్నది అని అనుకుంటాం. ఎవరికి వాళ్ళు అనుకోవడం తప్పులేదు. కానీ, కరోనా అనే ఒక అంశంమీద, ఒక వస్తువు మీద కవిత్వం రాసేటప్పుడు అనివార్యంగా ఇంతకుముందు కవులు రాసినటువంటి కవితలను చదవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా వాళ్ళు వదిలి పెట్టిన అంశాలేవైనా ఉన్నాయా అనేటువంటిది తెలుస్తుంది. వస్తువే గొప్పది అని మనం రాసేప్పుడు దాన్ని వీలైనంతవరకు ఆ కరోనా ఏమిటి? ఆ కరోనా యొక్క స్థితిని, దాని లోతుల్ని మనం పట్టుకున్నప్పుడు అటువంటి వస్తువును చూడాలి. కనుక పైపైన చూడడం ఒక అంశం, దాని లోతుల్ని చూడడం ఒక అంశం. దాని హృదయాన్ని ఆవిష్కరించటం. దాని హృదయం అంటే, దాని కాలం, కరోనా కాలంలో ఉండేటువంటి స్థితియొక్క ఉపద్రవ స్థితిని మనిషి యొక్క ఆర్ధమైనటువంటి స్థితిని చిత్రించాలి అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆర్ధమైనటువంటి వస్తువును కవి పట్టుకోవాలి. ఇదే మన దృష్టి కోణమైతే అనివార్యంగా వచ్చినటువంటిది ఈ కరోనా. అనివార్యంగా వచ్చిన వస్తువు ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది చెప్పడం. అందుకని మనం అనివార్యంగా ఈ భౌతిక పరిస్థితులను, ఈ చుట్టూ ఉన్న పరిస్థితులనూ మనం మభ్య పెట్టడానికి వీలుకాదు. కాబట్టి అలాంటివాటిలోంచి మనం కవిత్వాన్ని వస్తువుగా ఎంపిక చేసుకునే పరిస్థితి, అవసరముంటుంది. అందుకే ఇక్కడ ఎంతో మెలకువగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమున్నది. అందుకని ఇవన్నీ మనం ఎట్లా జేసుకుంటాం అనేది మన అనుభవం ద్వారా, మన పరిణతి ద్వారానే తెలుసుకునే అవసరముంటుంది. మొదలు చూడం. అక్కడినుంచే వెళ్తుంటాయి, ప్రక్కనుంచే వెళ్తుంటాయి మనం చూడం. జంధ్యాల పాపయ్య శాస్త్రికి ‘పుష్పవిలాపం’, పువ్వు ఏడుస్తున్న దుఃఖం కనబడి ఉండొచ్చు. వాల్మీకికి మనిషి యొక్క దుఃఖం కనబడి ఉండొచ్చు. శ్రీశ్రీకి బాటసారి యొక్క దుఃఖం కనబడి ఉండొచ్చు. చాలా ఆశ్చర్యంగా ఈ కరోనాతో వలసజీవులు కాలిబాటలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరికి ఇంకే మార్గాలు లేకుంటే ఏం లేకుండా, పాదాలకు ఏమీ లేకుండా నడి ఎండలో పోతూఉంటే వాళ్ళ కష్టాలెవరూ అందుకోనప్పుడు కవులెవరూ దాన్ని అందుకోనప్పుడు శ్రీ శ్రీ ఎలాగైతే బాటసారిని

“కూలి కోసం, కూటి కోసం, పట్టణంలో బతుకుదామని

తల్లిమాటను చెవిన పెట్టక, వెళ్ళినట్టి బాటసారికి

ఎంత కష్టం ఎంత కష్టం చలివేస్తే, జ్వరం వస్తే..

ఎండ వస్తే ఎంత కష్టం ఎంత కష్టం” అని శ్రీ శ్రీ బాటసారిలో ఏ కవితనైతే రాసాడో ఆ కవితనే టీవీలలో తిరిగి తిరిగి వేయాల్సి వచ్చింది. కారణం ఏంటిది? అంటే అప్పటికి వలస సమస్యను కరోనా సమస్యను పట్టుకుని ఉండవచ్చు గాని, కరోనా వల్ల బాధపడున్న వలస జీవుల యొక్క కష్టాన్ని అందుకోలేని స్థితి ఉంది. వాళ్ళ జీవితానికి ఆసరాగా రానిస్థితి ఉంది. కవులు దాన్ని పట్టుకున్న తర్వాత చాలా కవిత్వం వ్రాశారు. దార్శనికతతో పట్టుకున్నది చాలా కీలకం. అలా పట్టుకున్నవాళ్ళు గొప్ప కవులు అవుతారు. చాలా కవిత్వం వచ్చింది. ‘వలస దుఃఖం’ అనే పుస్తకం వచ్చింది. ఆదిలాబాద్ నుంచి కూడా ఇంకో పుస్తకం వచ్చిందట.  ఏదో పేరుతోని అందుకని ఇవన్నీ తరువాత ఇంకా వచ్చి ఉండవచ్చు. కానీ ఇవన్నీ కూడా మనం, కవిగా దార్శనికతతోని ఉండాలి. ముందు పట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. అట్లా పట్టుకున్నటివాళ్ళు తప్పనిసరిగా చాలా మంచి కవులు అయ్యేందుకు అవకాశమున్నదనేది చెప్పవచ్చు. కాబట్టి ఒకే వస్తువు కొన్ని కొన్నిసార్లు ఎట్లా మారుతూ ఉంటుందంటే, ఒకే వస్తువు దృష్టికోణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఎమ్. ఫిల్. లో నా పరిశోధనాంశంగా ‘సూర్యుడు’ అనే టాపికను తీసుకున్నా. నాకిష్టంతోటి తీసుకున్న ‘సూర్యుడు’ అనే వస్తువు ప్రకృతిలో ఉన్న వస్తువు. అది భిన్నకాలాలలో భిన్న రూపాలలో వచ్చింది. వేదకాలంలో వచ్చేసరికి సూర్యుడు ఒక సూర్యభగవంతుడుగా, ఒక దేవుడుగా తీసుకున్నారు. పౌరాణిక దృష్టితో చూసినప్పుడు వైదిక దృష్టితో చూసినప్పుడు సూర్యుణ్ణి ఒక భగవంతునిగా చూడడం, కొనియాడడం జరిగింది. లేదా సృష్టికి ప్రాణం పోసేటువంటి వ్యక్తిగా చూడడం జరిగింది. తదనంతర కాలంలో మధ్యయుగాల వరకు వచ్చేసరికి, రాతి యుగం అంతరించి, మధ్యయుగ కాలంలోకి వచ్చేసరికీ, ప్రబంధ యుగంలోకి వచ్చేసరికి ప్రాచీన కవుల యొక్క దృష్టి శృంగార దృష్టి ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గరికొచ్చేసరికి అదే సూర్యుడేమయి పోయాడు? అదే సూర్యుడు ప్రియుడైపోయాడు. కమలం ప్రేయసి అయిపోయింది. సూర్యుణ్ణేమన్నారు?  కమల బాంధవుడు అన్నారు. కమలమనేటువంటి ప్రేయసి, ప్రియురాలు అయినట్లయితే, ఆ ప్రియురాలిని ప్రభావితం చేసేటువంటి వాడు సూర్యుడు అని. అంటే సూర్యునికి కమలానికి మధ్య హృదయాన్ని, ప్రణయాన్ని చిత్రించడమనేటువంటిది మనకు కావ్యయుగంలో, మనకు ప్రబంధ యుగంలోని కావ్యాల్లో ఎక్కువగా కనబడుతుంది. అంతకుముందు లేదు. భగవంతుడుగా ఉండిన సూర్యుడు అకస్మాత్తుగా ప్రియుడవుతాడు. ఈ ప్రియుడైనటువంటి సూర్యుని నుంచి మరికొంతకాలం ముందుకు వచ్చిన తర్వాత భావకవిత్వం దగ్గరికొచ్చేసరికి, భావకవిత్వంలో ప్రియుడు తక్కువ, ప్రేయసి ఎక్కువ. అంటే స్త్రీని అంతకుముందు ఏదైతే అంగాంగ సౌందర్య వర్ణన చేస్తుండేదో, శృంగార దృష్టితో బాహ్య సౌందర్యాన్నే చూస్తుండేవారో, అదే భావకవిత్వం దగ్గరికొచ్చాక అంతస్సౌందర్యం గురించి చెప్పారు, మొదలుబెట్టారు. అంటే భావకవిత్వం కొచ్చేసరికి ఆత్మసౌందర్యంతో చూసే ప్రేయసిని చాలా ఉదాత్తమైనదిగా చెప్పారు. ఆ ఉదాత్త రూపం దాల్చినపుడు సూర్యుణ్ణి ప్రేయసితో సమానంగా సరోజను “వికసింపజేయు సూర్యుణి ప్రియురాలివి నీవు” అనే అర్థం ఒక కవి వాడాడు. అంటే ఇక్కడ కవి ప్రియుడైతే కమలం ప్రియురాలు. ఆ ముఖ సౌందర్యాన్ని వికసింపజేసేటువంటివి ప్రియునివి నీవు అని సూర్యుని వర్ణించారు. భావ కవుల దృష్టిలో సూర్యుడు ప్రియుడైండు.. మళ్ళీ అభ్యుదయ కవుల దగ్గరికి వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే, తెల్లవారుతున్నది. ఒక మార్పుకు సంకేతంతో చూడడం జరిగింది. ఒక ప్రబోధానికి, ఒక ప్రగతిశీలతకు ఒక పురోగమనానికి ఒక ఉదయానికి, ఒక సరికొత్త మానసిక పరివర్తనకు చెప్పారు. ఆ తర్వాత తర్వాత వరకు విప్లవ కవిత్వం వచ్చేసరికి “సూర్యుని అరచేతబట్టి రైతు దుక్కిదున్నును” అన్నాడు శివసాగర్. సూర్యుని అరచేతబట్టి అంటే సూర్యుణ్ణి తన చేతిలో పట్టుకొని భూమిని దున్నుతాడని అన్నారు. విప్లవ కవిత్వంలో సూర్యుడు ఒక తిరుగుబాటు పతాకగా, తిరుగుబాటు జెండాగా చెప్పినారు. అదే తదనంతర కాలంలో, ఆశ్చర్యకరమైనటువంటి అంశమిది. దళిత కవిత్వం వచ్చింది. దళిత కవిత్వం వచ్చాక అదే సూర్యుణ్ణి, భగవంతుడు లేడు, ప్రియుడు లేడు, ప్రేయసి లేదు, తిరుగుబాటుదారుడు లేడు, విప్లవకారుడు లేడు అంటే సూర్యుడంటే ఒక రచయితేం చెప్పాడు – “నల్లా సూర్యుడు నల్లనల్లా సూర్యుడు” ఒక నల్లని సంకేతానికి వాడుకున్నారు. దళిత కవిత్వానికి ప్రతీకగా వాళ్ళు వాడడం జరిగింది. అంటే “నల్లటి సూర్యుడు” అని వర్ణించేటప్పుడు ఇందులో మళ్ళీ ఒక్క సూర్యుడే ఇన్ని విధాలుగా మారాడు. అంటే కవి యొక్క దృష్టికోణం మారింది. కాలం మారినప్పుడు భావజాలం మారింది. వస్తువును చూసే కోణం కూడా మారింది. మారుతుంది అని చెప్పవచ్చు. దీనితో మనకు అట్లానే, ప్రాచీనకాలంలో వస్తువును స్వీకరించడానికి నియమాలు పెట్టారు. భరతుడు అన్నదాని ప్రకారం ప్రఖ్యాతమైన వస్తువును తీసుకోవాలి. ప్రఖ్యాతమైన వస్తువు అంటే అనివార్యంగా ఉపనిషత్తుల్లోనో, లేదా పురాణాల్లోనే ఉండేటువంటి వస్తువును మాత్రమే తీసుకోవాలి. అదే పద్ధతిలో ప్రఖ్యాత, ఉదాత్త నాయకుణ్ణి తీసుకోవాలి అన్నారు. ప్రఖ్యాతుడైన, ఉదాత్తుడైన నాయకుణ్ణి మాత్రమే తీసుకోవాలి. అందుచేత నాయకుణ్ణి నాలుగు వర్గాలుగా చెప్పారు. నిర్ణయించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పరిణామం ఎట్లా వచ్చింది అని చెప్తున్నాను. నాలుగు రకాల నాయకున్ని నిర్ణయించారు, వివరించారు. దీని గురించే రాయమన్నారు. 1.ధీరోదాత్తుడు, 2. దీరోద్ధతుడు, 2. ధీరలలితుడు, 4. ధీరశాంతుడు. అని నాలుగు భాగాలుచేసి, ఈ ధీరుల గురించే కావ్యం వ్రాయమన్నారు. ఈ ధీర అనేది మాత్రం నాలుగు రీతుల్లో ఉన్నది. ఎవరు ధీరుడు? అంటే అనివార్యంగా దేవుడే అయి ఉండాలి. తర్వాత వచ్చేసి ప్రభువు. ప్రభువంటే రాజు, వీళ్ళ గురించే రాయాలి అనేటువంటి ఒక ఆలంకారికలు చెప్పింది, పరిణతి ఒక రోజున్నది. ఆ ఒకరోజు ఉండేదానిని గురించి తదనంతర కాలంలో ఎప్పుడైతే దృక్పథం మారిందో, దర్శనం మారిందో నాయకుడు కూడా మారాడు. నాయకునికి ఉండవల్సిన లక్షణాలు మారినవి. ఉదాత్తుడైన, ధీరుడైన నాయకుని నుంచి అభ్యుదయ కవిత్వం కాలం నాటికొచ్చేసరికి బాటసారి కూడా నాయకుడయ్యాడు. శ్రీశ్రీ కవిత్వానికి నాయకుడెవరు? బాటసారి. గురజాడ కవిత్వానికి నాయకుడెవరు? నాయిక ఎవరు? ఇంతకుముందు నాయకురాలుకు ఏం నియమాలు పెట్టారు? ఒక కావ్యంలో నాయిక కావడానికి మూడు నియమాలు పెట్టారు. ధీరురాలైన నాయిక, ధీరోదాత్తమైన నాయిక అంటే సగం ధీర, సగం అధీర నాయిక ఉండొచ్చు. అంటే ధైర్యం లేనటువంటి, అధీర అయినటువంటి ఏమాత్రం ధైర్యం లేనటువంటి నాయిక కావచ్చు అని చెప్పారు. వీటి కంటే ఎక్కువ అష్టవిధ శృంగార నాయికలు అని. ఎనిమిది రకాల ప్రణయ నాయకురాళ్ళను చెప్పారు. ఇది ఇక్కడ అవసరం లేదు. అయితే ఈ ప్రణయ నాయికను అందంగానైనా ఉండాలి. ధైర్యంగా వీరురాలైన నాయికగానైనా ఉండాలి. అటువంటి వాళ్ళను పెట్టి రాయాలన్నప్పుడు గురజాడ వరకు వచ్చేసరికి ‘పూర్ణమ్మ’ను నాయకురాలుగా చెప్పారు. కాని పూర్ణమ్మ ధీరురాలు గాదు, శృంగార నాయిక గాదు, ఆమె నాయిక అయ్యింది. ఎందుకు? ఎందుకంటే కాలం మారింది గనుక, ఆధునిక భావాలు, కొత్త భావాలూ వచ్చినవి గనుక, కొత్త చైతన్యం వచ్చింది గనుక, ఆంగ్ల కవిత్వంతో సంపర్క మేర్పడింది కనుక, సామాజిక విషయాన్ని కవిత్వంలోకి తీసుకురావలసిన అవసరం ఏర్పడింది గనుక, సాంఘిక ఆచారమైన బాల్య వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్ణమ్మను నాయికను చేశారు. అందుకని పూర్ణమ్మ నాయిక ఎప్పుడైందీ అంటే మొత్తం నీ భావజాలం అంతా మారింది కాబట్టి నాయిక అయ్యింది. అప్పుడే పూర్ణమ్మ నాయకి అవడానికి వీలైంది. “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, విన్నారమ్మా ఈ కథను” అని “మేలిమి బంగరు మెలతల్లారా, నెలతల్లారా” అని ఆయన రాసి, ఆయన శైలినీ మార్చాడు, వస్తువునూ మార్చాడు. అప్పటికి పూర్ణమ్మ నాయిక కావడానికి వీల్లేదు. మధురవాణి నాయిక కావడానికి వీల్లేదు. అలాంటి పూర్ణమ్మను నాయికగా మార్చే స్థితి గురజాడ కాలంలో వచ్చింది. ఇట్లా మనకు కాలం సాహిత్య సూత్రాన్ని మార్చేస్తుంది. సహించే సూత్రాన్నిస్తుంది. మనస్సు వస్తువు ఎంపికకు మారి అందుకు ముందున్న సూత్రాన్ని మార్చేస్తుంది. అందుకనే వస్తువును ఎంచుకునే కాలమని మనం పెట్టుకున్నాం. సమకాలీనమైన వస్తువును స్వీకరించాలి అని ఎందుకన్నామంటే, అందరినీ ఒకప్పుడు ఆకర్షించవచ్చు గాని, ఇప్పటి మనుషుల అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు మారుతున్నవి కనుక నచ్చకపోవచ్చు. కాబట్టి వాటికి దగ్గరగా ఉండేట్టు రాయాల్సిన అవసరం ఉన్నది అన్నదే ఇక్కడ కీలకమైనది. అక్కడ వస్తువుకు దగ్గరగా ఉన్న ప్రఖ్యాతుడై, ధీరుడై, ఉదాత్తుడై, ధీరురాలై ఉన్నటువంటి వాళ్ళ దగ్గరినుంచి, ఒక సామాన్యుడు గూడా కావ్యనాయకుడయ్యే ఒక పరిణామమంతా కూడా అభ్యుదయ కవిత్వం కాలంనాటికి వచ్చింది. ఎందుకంటే ఒక బాటసారి నాయకుడయ్యాడు. అభ్యుదయ కవిత్వంలో వస్తువును తీసుకున్నట్లయితే ఒక కార్మికుడు నాయకుడు. ఒక కర్షకుడు నాయకుడు. అట్లనే ఒక బాటసారి నాయకుడైనాడు, ఒక నిరుద్యోగి నాయకుడైనాడు. ఒక గుమాస్తా నాయకుడైనాడు, మధ్యతరగతివాడు, కింది మధ్యతరగతివాడు, ‘సినీవాలీ’ అనే పేరుతో ఆరుద్రగారు ఒక కావ్యాన్ని రాసాడు. ఆ సినీవాలి అనే కావ్యం ఒక గుమాస్తా, సూర్యారావు ఒక క్లర్క్ క్లర్క్ గురించి ఒక కథ. అంతకుముందు ఒక క్లర్క్ నాయకుడు కాదు. రానున్న కాలంలో భటుల గురించి రాసేదే తెలియదు మనకు. ఆ కాలం నాటికి ఆ దృష్టి లేదు. తరువాత కాలంనాటికి ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళను గురించి రాయడం అనేది కవిత్వంలో వస్తువైంది. అందుకే, “ప్రభువెత్తిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవరోయ్” అన్నాడు శ్రీశ్రీ. అంతకుముందు ప్రభువెక్కినటువంటి పల్లకిలో గూర్చునట్లవంటి ప్రభువు గురించి రాసిండు. కానీ తదనంతరం ఆ ప్రభువు గొప్పదనమేముంది? ఆ ప్రభువు ఉట్టిగ కూర్చున్నాడు. అది, ఆ పల్లకిని మోసినటువంటి వారి గురించి రాయాలిగాని అని, మోసినవాండ్ల గురించి, బోయిల గురించి రాశాడు శ్రీశ్రీ.

ఇక నిన్న యస్.పి. బాలసుబ్రహ్మణం గురించి చదువుతున్నప్పుడు నాకు ఆర్థంగా అనిపించిన అంశమేంటిదీ అంటే, ఆయన శబరిమలైకి వెళ్ళాడు. అందరు కూడా వెళ్లారు కావచ్చు. నడకలో ఆ గుట్ట ఎక్కడానికి ఎక్కలేనివారు డోలాల్లో పోతరు. ఆయనగూడా డోలా ఎక్కి పోయాడు. నడువలేడు కనుక డోలా ఎక్కి పోయాడు. దిగిన తర్వాత ఆయన తనకు ఎక్కడైతే కూర్చోబెట్టి సన్మానం చేస్తారో ఆ కుర్చీలో డోలాలో తీసుకొచ్చిన వాళ్ళను కూర్చోబెట్టి, వాళ్ళ పాదాలకు నమస్కరించాడు. దీన్ని పాతకాలంలోకి వెళ్ళి ఊహించలేము. ఆధునిక కాలంలో మాత్రమే ఊహించగలుగుతాం. ఒక డోలా మోసినటువంటి బోయీలకు, మోసినవాళ్ళకి కాళ్ళు మ్రొక్కడమనేది వచ్చింది. ఉత్తమ సంస్కారం అది. ఆధునిక కాలానికే సాధ్యం. బాలసుబ్రహ్మణ్యం లాంటి గొప్ప వ్యక్తి, గాయకుడు అక్కడ డోలా ఎత్తిన బోయీలకు వాళ్ళ కాళ్ళకు మొక్కాడు. నమస్కారం బెట్టడమనేది ఆయన యొక్క సంస్కారానికి నిదర్శనం అంటే, వస్తువు కాలాన్ని బట్టి మారుతుంది అని చెప్పడం. అందుకని ఈ వస్తువులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఒక బిచ్చగత్తె గురించి, ఒక సాధారణమైన వృత్తి గురించి, తర్వాత కాలంలో రాసారు. అలిశెట్టి ప్రభాకర్ అయితే, వేశ్యల గురించి రాసాడు. అంతకుముందు వేశ్యల గురించి రాయవచ్చు. కాని వాళ్ళ దృష్టికోణం వేరు. స్త్రీని సుఖసాధనంగా, సౌఖ్య సాధనంగా మాత్రమే రాసారు. కాని ఇక్కడ వాళ్ళ బాధని, దుఃఖాన్ని రాసాడు. తదనంతర కాలంలో ఆమె బాధను, ఆమె దుఃఖాన్ని పట్టించుకున్నారు. అట్లాంటి స్థితి తదనంతర కాలంలో ఉంటుంది.

అదే వస్తువును మనం చూసేటువంటి దృష్టికోణం నుండి కూడా ఆ వస్తువును ఎంపిక చేసుకొని, దాన్ని దర్శించినది రాయడం అనేది ఉంటుంది. అట్లా మనం చూసుకుంటూ వచ్చినప్పుడున్నది ఏది? వస్తు స్వీకరణలో మొదటిది, కవి యొక్క దృక్పథం అందులో ఉంటుంది. రెండోది కవి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కవి వ్యక్తిత్వం, కవి దృక్పథం, కవి సంస్కారం ఉంటుంది. వీటితో మాత్రమే కొత్త వస్తువును, అవసరమైన వస్తువును తీసుకుంటాడు. ఈ సంస్కారం అనేటువంటిది పరిణత రూపంతో గనుక లేకపోతే వస్తువు కవిత్వ వస్తువుగా సరితూగదు. ఇప్పుడందరు కూడా రాస్తున్నారు. ఈ ప్రపంచీకరణ వచ్చింతర్వాత మనందరికి తెలిసిందే. ప్రపంచీకరణ వచ్చాక మానవ సంబంధాలపైన ఎక్కువ కవిత్వం రాస్తున్నాం. ఇంతకు ముందు కనిపించదిది. వర్తమాన కవిత్వంలో అది కనబడుతుంది. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అని అందెశ్రీ రాస్తాడు, “పల్లె కన్నీరు బెడుతున్నదని” గోరెటి ఎంకన్న రాస్తాడు. అట్లా “ఎట్లున్నవే ఓ పల్లె” అని నేనాల కిశోర్ రాస్తాడు. “ముఖమో, పుస్తకమో కాని చోట మనం కలుసుకుంటున్నాం” అంటాడు నారాయణస్వామి. ఫేస్ బుక్ అనేదానికి ఆయన, ఫేస్ అంటే ముఖము, బుక్ అంటే పుస్తకము అని, ఇవి మనం కలుసుకునేచోట ముఖమూ ఉండదు పుస్తకము లేనిచోట, కానిచోట మనం కలుస్తున్నాం. అంటే ఈ ఫేస్ బుక్అంటారు. కాని ఫేస్ ఉండని, బుక్ ఉండని చోట కలుసుకుంటున్న అట్లాంటి ఒక స్థితిని వర్ణిస్తున్నారు. ఎక్కడైతే కవి ఆలోచన, దృక్కోణం మారుతుందో అక్కడ వస్తువూ మారుతుంది. ఇప్పుడు కవులు నాస్టాల్జియా అనేటువంటిది, ఇటీవల కాలంలో చాలామంది రాస్తున్నారు. మనందరికీ తెలిసిందే.

ముఖ్యంగా ప్రపంచీకరణ వచ్చాక అందరూ మారిపోయారు, ముఖ్యంగా యూజ్ అండ్ త్రో ఫిలాసఫీ వచ్చిన తర్వాత ఉపయోగించుకోవటం, పడేయటం, ఇలాంటివి వచ్చిన తర్వాత, గతంలో సిరంజీని వేన్నీళ్ళలో వేడి చేసి తిరిగి వాడేది, ఇంజక్షన్ చేసేవారు. స్టెరిలైజ్ చేసి వాడేవారు. ఇప్పుడు స్టెరిలైజ్ చేసే అవసరం లేదు. వేడినీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు యూజ్ అండ్ త్రో ఇంజక్షన్లు దొరుకుతున్నవి. అవి ఏసేస్తరు పడేస్తారు. ఇవి దొరుకుతున్నవి కనుక కొంటం తీసుకుంటం పడేస్తాం. ఇలాంటి ధోరణి వచ్చింతర్వాత మనకు నాస్టాల్జియా, బాల్యము – జ్ఞాపకాలు రాయటమనేది బాగా ఎక్కువవుతున్నది. దండెం మీద, మంచం మీద, టేబుల్ మీద వీటన్నింటి మీద కవిత్వం రాసేటువంటి పద్ధతి కూడా వచ్చింది. కనుక వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కవిత్వ వస్తువును ఎంపిక చేసుకోవటంలో ఒక అంశంగా చెప్తే, ఈ వస్తువులకు సంబంధించి మంచి పద్యం ఒకటున్నది. రామరాజ భూషణుడు తన ‘వసుచరిత్ర’లో ఒక పద్యం రాసాడు.

“కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నముల్

ఆద్యత్కథల్ వావిరి పుట్టు రత్నముల్

అవారిత సత్కవి కల్పనా విభూషావహ పూర్వ వృత్తములు

సానలు దీరిన జాతిరత్నముల్” -రామరాజు భూషణుడు

ఒక రత్నాన్ని వస్తువుగా తీసుకొని కల్పన చేసేప్పుడు అవి కృత్రిమ రత్నాలు కనుక ఆర్టిఫిషియల్ రత్నాలు అయితే, కేవలం వాటినే వర్ణిస్తే అవి కృత్రిమ ఆర్టిఫిషియల్ కనుక ఈ కృత్రిమ రత్నాలకు తేజం రాదు, కాంతి రాదు, శోభ రాదు, వెలుగు రాదు, సొగసు రాదు. కనుక కృత్రిమరత్నం, ఆర్ట్ ఫిషియల్ ఆర్ట్ ఫిషియలే గనుక. ఇది కల్పనా కథ. ఆయనన్నదాని ప్రకారమే “ఆద్య సత్కథల్…” పురాణాల్లో, ఉపనిషత్ లలో ఉండేటువంటి గొప్ప మంచి కథలు ఈ కథలు ఏవైతే ఉన్నవో అవి అన్నీ “పుట్టు రత్నాలు”. అంటే ముడిరత్నాలు. సానబెట్టనటువంటివి వాటికి కూడా సమస్యలు ఉంటాయి.  సానబెట్టినవి కూడా ఉంటాయి, సొగసుగా ఉంటాయి. మరి ఏవి తీసుకోవాలన్నా ఇవి కృత్రిమ రత్నాలైతే ఏమిటి? అవేమో ముడిరత్నాలైతే ఏమిటి? భూమిలోంచి తవ్వి తీసిన రత్నాలైతే ఏంటి? అంటే ఎవరైనా ఇష్టపడేది సానబెట్టినటువంటి జాతిరత్నాలనే తీసుకోవాలి. అవేంటివంటే “తత్కవి కల్పనా… పూర్వరూము” అవి జీవితంలో ఉండాలి, ఆ జీవితంలో ఉండేటువంటి కల్పనను, దానికి జోడించాలి, పూర్వవృత్తమై ఉండాలి. అంటే మానవ వృత్తమై ఉండాలి. దానియొక్క సంబంధాలలో ఉండేటువంటివి, మనిషి జీవితంలో ఉండాలి. పూర్వరూపంతో ఉండాలి. ఇవి కవి యొక్క కల్పనలు. ఇవి రెండూ జోడించినప్పుడు అవి జాతిరత్నాలుగా మారుతాయని వివరించాడు. మరి జాతి రత్నాలుగా భావించేవి, అటువంటి వస్తువును తీసుకుని, సానబట్టిన రత్నాలను తీసుకోవాలి. మనం జాతిరత్నాలు అనేవి ఎటువంటివో జాతిరత్నాల్లాంటివేవో అవి తీసుకోవాలన్నప్పుడు అనేటువంటిది కొంచెం ఈ పద్యాన్ని సరిబెట్టుకుంటే ఇది మనకు సమకాలీనమైన ఈ ముడిరత్నాన్ని మనం సానబెట్టుకోవచ్చు. మనం సానబెట్టుకోవడానికి దానికి కోణాల్ని కూడా తయారు చేసుకోవచ్చు. అంటే దానికి పార్శ్వాలు, దాని మూలాలు చెక్కినప్పుడు చేసే శోభ పెరుగుతుంది. దాని వెలుగు పెరుగుతుంది. కాబట్టి పార్శ్వాలూ, మూలాలు, కోణాలు తయారు చేసుకునేటువంటి పరిస్థితులలో మనం చైతన్యంతో ఉంటాము, అనేటు వంటిది వస్తుంది. అది మన మానసిక చైతన్యాన్ని బట్టి, పరివర్తనను బట్టి మానవ పరిమితిని బట్టి అది వస్తుంది. అందుకని మనం వస్తువు ఎంపికలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ఒక సామెత కూడా ఉన్నది. వెంట్రుకలున్న కొప్పు ఎట్లున్నా బాగుంటుందని. కొప్పు ముడిచినా బాగానే నైపుణ్యంతో చేస్తే బాగానే ఉంటది, జడేసుకున్నా బాగనే ఉంటది. ముందు మనకు సమృద్ధిగా వస్తువు ఉండాలి. ఉంటే ఆ వస్తువును ఎక్కడ చెక్కుకోవాలో తెలుస్తుంది. మనం తర్వాత మన యొక్క శిల్పనైపుణ్యాన్ని బట్టి చెక్కుతం. కాబట్టి ఈ వెంట్రుకల్లాంటి శిల్పం, వస్తువును ఎంపిక చేసుకోవడం అన్నట్టు.

ఇంకొక పోలిక కూడా చెప్పుకుందాం. వస్త్రం (క్లాత్) ఉన్నది. వస్త్రం అనేది మనం వస్తువు అనుకోవచ్చు. నేసినటువంటి వస్త్రం ఏదైతే ఉన్నదో దానిని వస్తువు అనుకుంటే, దాని ద్వారా మనం ధరించేటువంటి అంగీ లేదా షర్ట్ ను నిర్మించడమనేటువంటిది దాని యొక్క రూపం. వస్త్రం ఉంటేగదా మనం షర్టు కుట్టించుకోవటం అనేది, లేదా షర్ట్ ను తయారు చేసుకోవటమనేది జరుగుతుంది. అసలు వస్త్రమనేదే లేకుంటే షర్ట్ రూపం రాదు. కాబట్టి రూపానికి మలచాలనుకున్నప్పుడు వస్త్రమనేది ఉండాల్సిందే. మెరిసేటట్టు చేయాలనుకుంటే వజ్రాన్ని లేదా రత్నాన్ని అని అనుకుంటే ముందు ఆ ముడి సరుకు ఉండాలి .వస్త్రం అనేది ఉంటే దాన్ని షర్ట్ గా మార్చుకోవచ్చు.

ఒక మాట ఉన్నది నీ షర్ట్ గా కుట్టుమన్నాక కూడా మనమింకా దానికి ఏం జేస్తమంటే టెక్నిక్, షర్ట్ అనేటువంటిది దాని ఫామ్ అనుకుంటే, వస్త్రము దాని కంటెంట్, షర్ట్ అనేది దాని యొక్క ఫామ్. దాన్ని టెక్నిక్ లోకి మార్చి దాన్ని ఇంక కొంచెము టెక్నిక్ ను జోడించి డ్రస్ తయారు చేసుకోవడమూ అన్నమాట. డ్రస్ కు ఐరన్ చేసుకోవడమన్నమాట! మనకు ఫామ్ ఒకటి అవసరము. మనకు ఉతికినా, శుభ్రమైన వస్త్రమే కావచ్చు. ‘మనం’ వెంటనే వేసుకుంటామా అనేది, నచ్చకుంటే అలిగైనా సరే దాన్ని వేసుకోము. ఇస్త్రీ చేసేప్పుడు దానికి మరింత శోభ. అందుకని ఐరన్ చేయడమనేది టెక్నిక్ తో సమానం. ఐరన్ చేసి వేసుకుంటాం కదా అట్లా మనం దీనికి రకరకాల స్థాయిల్లో రకరకాల రూపాల్లోకి మార్చుకొని దానికి పదును బెట్టుకొని, సొగసును దెచ్చుకొని దాన్ని అందంగా తయారు చేసుకొని, అందరికీ ఆకర్షణీయంగా, ఎదుటి వ్యక్తిని ఆకర్షించేలా తయారు కావడమనేది ఉంటుంది. ఉంది, అని. అందు కొరకు అన్నింటి యొక్క లక్షణమేంటని అన్నప్పుడు, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలి. ఇది నచ్చటం అనేది. మనం ఎదుటి వ్యక్తికి ఎందుకు నచ్చాలి అనేదాన్ని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన చుట్టూ ఉంటారు. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటాను అని, నేను మార్చాల్సిన అవసరమే ముందీ అని కూడా అనుకుంటారు. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళలో స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది గాని, వాళ్ళను చూసి ఎదుటి వ్యక్తికి చేర్చాలి అని అనుకునేందుక్కూడా అవకాశమున్నది. ఎదుటి వ్యక్తి హృదయానికి ఒక విషయాన్ని చేర్చాలి అని అనుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని స్పందించాల్సిన అవసరమున్నది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం వస్తువు ఎన్నిక లోపల ఎన్ని రకాల అంశాలు, పాత్రలు వచ్చాయో చూడాలి. స్త్రీవాదం వచ్చినప్పుడు ఏ రకమైన వస్తువులు ఎన్నుకోవడం జరిగింది, దళితవాదం వచ్చినప్పుడు ఏ వస్తు స్వీకరణ జరిగింది. దర్శనంలో కూడా ఇదే చర్చ వస్తుంది. మనం అంతకుముందు చూసిందానికి తర్వాత చూసేదానికి దృష్టికోణం మారింది కనుక వస్తువు మారినది. అట్లా మనకు ఆ ‘చంద్రుణ్ణి’ అనే అంశాన్ని తీసుకొని, వాల్మీకి అందించాడు. రామాయణంలో వర్ణిస్తూ ఏమన్నాడు అంటే “యాగశాలలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఆంబోతులా ఉన్నాడు చంద్రుడు” అని అన్నాడు, వర్ణించాడు. ఈ యాగశాల అని ఎందుకు అన్నాడు అంటే ఆ రోజుల్లో ఈ యాగశాలలు ఉండేవి కాబట్టి అదే వాతావరణం ఉండేది. కాబట్టి అందులో తిరుగుతున్నట్టు అని వ్రాశాడు. ఇదే చంద్రుడు మళ్ళీ కలువుపువ్వును పుష్పింపజేసేటువంటి ప్రియుడిగా మారాడు. చంద్రుడు కలువరేడు, కలువలకు రాజు, కలువలకు ప్రియుడు అయినాడు. ఇదే చంద్రుడు శ్రీశ్రీ దగ్గరికి వచ్చేసరికి “కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగున్నాడు చంద్రుడు” అన్నాడు. అదే ప్రపంచీకరణ వచ్చిన తర్వాత చంద్రుణ్ణి ఒక కవి, తైదల అంజయ్య అనే కవి వర్ణించాడు. ఏమని అంటే చంద్రుడు ఒక ‘డాలరు’గా కనబడుతున్నాడు అని. అంటే ప్రపంచీకరణకు ముందు చంద్రుడు డాలరులాగా కనిపించ లేదు. రూపాయి నాణెంగా కనిపిస్తాడు. కానీ ప్రపంచీకరణ తర్వాత డాలరు రూపాయికి ప్రత్యామ్నాయంగా వచ్చినట్టు చూస్తాం. రూపాయి విలువ తగ్గింది గనుక డాలరు విలువ పెరిగింది కనుక, డాలరు అందరినీ ఆకర్షించింది గనుక, కవిని కూడా ఆకర్షించి, చంద్రుడు నాకెట్లా కనబడుతున్నాడంటే డాలరులాగా కనబడుతున్నాడని అన్నాడు. అట్లా ఎప్పటికప్పుడు చంద్రుణ్ణి చూసినటు వంటి దృష్టికోణంలో కూడా మార్పు వచ్చింది. పఠాభి అనే ఒక కవి ‘ఫిడేలు రాగాలు డజన్’ అనే కవితలో “చైనా బజారులో తగిలించబడిన ఒక పుష్పంలాగా ఉంది చంద్రుడు’. చైనాబజారులో తగిలించిన ఒక వస్తువులాగా ఉన్నాడు చంద్రుడు. జీవితంలోంచి ఆ వస్తువు యొక్క దర్శనం మారి పోతుంది. కవి వర్ణించడంలో ఈ ప్రత్యేకతలన్నీ వచ్చేసినవని చెప్పవచ్చు. వస్తువు స్వీకరణలో నాలుగు అంశాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 1. పరిచయమైన వస్తువై ఉండాలి, 2. సమకాలీన వస్తువై ఉండాలి, 3. మానవ భావోద్వేగాలను ప్రేరేపించేవాటిగా స్పందింపచేసేటువంటిదిగా ఉండాలి అని కవిత్వంలో వస్తువు చాలా కీలకమైనది అని మరోసారి చెప్తూ వస్తు ఎంపిక దగ్గర మన యొక్క ప్రత్యేకత, కవి యొక్క ముద్ర ఉందాలి. కవి యొక్క ప్రత్యేకత ఎంపిక దగ్గరనే కనబడాలి. ఎంపిక దగ్గర తన కవి ముద్ర నిరూపించుకోవాల్సి ఉంటుంది అనీ కవులంతా కూడా గుర్తించాలి. మంచి వస్తువును తీసుకొని మంచి కవిత్వం రాయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

You may also like

Leave a Comment