Home వ్యాసాలు కవిత్వ నైపుణ్యాలు-5 కవిత్వము – భావనాశక్తి – భావుకత

కవిత్వ నైపుణ్యాలు-5 కవిత్వము – భావనాశక్తి – భావుకత

కవిత్వం వస్తువు గురించి తెలిసిన తర్వాత, వస్తువు పట్ల ఎంత సరళమైనటువంటి, ఎంత స్పష్టమైనవటువంటి అవగాహన కలుగుతుందో శిల్పం దగ్గరికి వచ్చేసరికి తదనంతర భావుకత మొదలైనటువంటి విషయాల్లో నిర్ణీపమైన పద్ధతి అంటే ఇదీ అని చెప్పడానికి వీలు కలిగించే అంశం ఒకటి సాహిత్యంలో కొనసాగుతుంది. అట్లాగే శిల్పం తయారుకావడానికి ఒక రూపం ఒక శిల్పం కావడానికి – శిల్పం కళ కావడానికి మూలభూతమైనటువంటిది మొదటిది భావుకత. ఒకే వస్తువు మీద అందరం రాస్తాం. కాని కొన్ని మాత్రమే ఆకట్టుకుంటాయి. కారణం మొదటి మాట శిల్పం వలన అంటాం. ఎందుకు అంటే ఇక్కడ శిల్పం లేదు – అక్కడ శిల్పం బావుంది అనే చర్చ వింగడింపు జరిగినప్పుడు కవికి భావనాశక్తి ఉన్నప్పుడు ఆ శిల్పంలో పరిణతిగా భావించడానికి, ఆ పరిణతి కనిపించడానికి అవకాశం ఉంటుంది. కవికి ప్రధానమైనది భావనాశక్తి. కవికి గనక భావనాశక్తి లేకపోతే ఆ కవిత్వం కవిత్వం కాదు. కాబట్టి కవికి భావుకత ఉండాలన్నారు. భావుకతను ఇంగ్లీష్ లో ‘ఇమాజినేషన్’ (Imagination) అన్నారు. మీరు కథ రాయండి, కవిత్వం రాయండి కవిత్వంలో మళ్ళీ పాట రాయండి, వచన కవిత రాయండి   ; ఏది రాసినప్పుడైనా కూడా, ఒక వస్తువును వర్ణించేటప్పుడు, శిల్పం రూపం తీసుకునేటప్పుడు అత్యంత క్రియాశీలమైంది, ఆధార భూతమైంది, మూలమైంది ఏదీ అంటే భావనాశక్తి.

అంటే కవిత్వ శక్తి కాబట్టి పాశ్చాత్య విమర్శకులు కూడా భావనాశక్తిని, ఆధునిక కాలంలో వచ్చినటువంటి విమర్శకులు కూడా భావనాశక్తిని కీలకమైందిగా భావించారు. ముఖ్యంగా ప్రాచీన ఆలంకారికులు భావనాశక్తి పై ఎక్కువగా మాట్లాడలేదు గాని వాళ్ళు వేరువేరుగా చెప్పారు.

కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆధునిక కవిత్వ వస్తువును గురించి ‘కవిత్వ తత్త్వ విచారము’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ప్రాచీన కవిత్వ విధానాన్ని కూడా సునాయాసంగా విమర్శలోకి తీసుకొచ్చాడు. ఎట్లాంటి విమర్శ తీసుకొచ్చాడంటే భావనాశక్తి లేని కవిత్వం తేలిపోతుంది అని వారు ప్రతిపాదికగా ప్రధానంగా తేల్చి చెప్పిన అంశం. ఇమాజినేషన్, భావనా శక్తి లేదా కల్పనాశక్తి అనేటు వంటిది చాలా కీలకమైనది.

అయితే ఇమాజినేషన్, భావనాశక్తి, ఊహాశక్తి, కల్పనాశక్తి అనే మాటల కన్నా కూడా ఊహాశాలిత్వం తరుచుగా వాడుతుంటారు అందరు. మీరెప్పుడైనా వ్యాసం చదువుతున్నపుడు ఊహాశక్తి ఎక్కువుంది, కల్పనాశక్తి ఎక్కువుంది అనేవి చూస్తుంటారు. ఇవన్నీ ఈ ఇమాజినేషన్ చుట్టూ తిరుగుతుంటాయి. కాబట్టి ఇమాజినేషన్కు భావనాశక్తి మాట పర్యాయపదంగా వాడుతుంటారు. దానికి తోడుగా ఊహాశక్తి, భావనాశక్తి అనేవి వాడడం జరుగుతుంది. ఇట్లా చూసినప్పుడు మనం కవిత్వాన్ని బాగా రాణింపజేయాలని, బాగా పండించాలి, తీసుకురావాలి అనుకున్నప్పుడు ఈ భావనాశక్తిని తీసుకురావలసిన అవసరం ఉన్నది. ఇది పెంచుకునేదా, స్వతహాగా వచ్చేదా? పెంచుకునేదా అంటే ఖచ్చితంగా చెప్పలేం. స్వతహాగానే వస్తుందని చెప్పడానికి లేదు. అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. భావన అనేది ఇక్కడ కవి యొక్క హృదయానికి సంబంధించింది. భావన అనేది ఎక్కడ ఉంటుంది అంటే, హృదయంలో ఉంటుంది. తెలుగులో ఒకమాట ఉన్నది. లేదా సంస్కృతంలో ఒక మాట ఉన్నది అది భావము అని. భావము, భావాల యొక్క పొందికనే కవిత్వము అని అనుకుంటుంటాము.

కవులు సాధారణంగా పండితులను ఒప్పుకోరు. పండితులు కవులను ఒప్పుకోరు. కట్టమంచి రామలింగారెడ్డి ఏమన్నాడంటే పండితులంటే ఎవరంటే, ఇంట్లో కూర్చొని నిఘంటువులు, శాస్త్రాలు కంఠతాబట్టి పండితులవుతారు అన్నాడు.

కాని కవి అట్లా గాదు కవికి కవిత్వం కంఠతా పడితే వచ్చేది కాదు. కవి ప్రకృతితో మమేకం కావాలి. రూపంతో మమేకం చెందాలి. మనుషులతో, జీవితంతో మమేకం కావాలి. కాబట్టి జీవితంతో, మనుషులతో మమేకం కావాలంటే, మనకు ప్రధానంగా భావనాశక్తి కావాలి. భావనాశక్తే కీలకం. ఒకమాట ఆయనే ఏమని చెప్పాడంటే భావనా శక్తియనగా విషయములను మనసులో ప్రతిబింబింప చేయు సామర్థ్యము అని అన్నాడు. అంటే ఒక వస్తువును చూస్తే, ఒక వస్తువును కవిత్వంలో ఆవిష్కరించాలి అనుకున్నప్పుడు, ఒక సంఘటనను ఆవిష్కరించాలి అన్నప్పుడు మనకు కావాల్సింది భావనాశక్తి అని అంటున్నాం. ఈ భావనాశక్తిని ఆయన ఏమని నిర్వచిస్తున్నాడూ అంటే, “ఆ విషయాన్ని మనసులో ప్రతిబింబింప చేయు ఒక సామర్థ్యము” అని అన్నాడు. అందరం ప్రతిబింబించడానికి ప్రయత్నం చేస్తాం గాని, కొందరికి మాత్రమే ప్రతిబింబించే సామర్థ్యం ఉంటుంది. కొందరికి మాత్రమే దాన్ని చిత్రిక పట్టడానికి సాధ్యం అవుతుంది. కొందరికి మాత్రమే ఆ రూపాన్ని సరిగా ఆవిష్కరింప చేయడానికి సాధ్యమవుతుంది. దీన్ని ప్రాచీన కవులయితే ఎక్కువ వరకు ‘ప్రతిభ’ అని చెప్తూ వచ్చారు. ప్రతిభ అనేది టాలెంట్ అనేదని చెప్పారు. కాని ఆధునిక కాలంలో అయితే దీన్ని ఇమాజినేషన్, భావనాశక్తి పైనే చెప్పారు. కాబట్టి భావనాశక్తి కీలకం. విషయాన్ని మన మనసుకు గోచరించేటట్లు చెప్పేటటువంటి ఒక సామర్థ్యమే భావనాశక్తి. అందుకని ఈ భావనాశక్తి, ఈ భావుకత కవిత్వంలో చాలా కీలకమైంది. ఆంగ్ల సాహిత్యంలో కూడా భావనాశక్తికి సంబంధించి చాలా సుదీర్ఘకాలం చర్చించడం జరిగింది. ఇమాజినేషన్ అనే పదం కంటే ముందు మనకు ‘ఇమేజ్’ అనే పదం ఉన్నది. ఇమేజ్ చేయడం ఇమాజినేషన్. ఇమేజ్ చేయడానికి శక్తి కలిగి ఉండటమే ఇమాజినేషన్. ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ అంటే బొమ్మ, ఒక రూపం. ఆంగ్లంలో జరిగినటువంటి చర్చలో ఇంగ్లీష్ లో జరిగిన చర్చలో చాలామంది కవులు, లేదా విమర్శకులు చేసిన ప్రతిపాదనలేంటీ అంటే ఒక వస్తువు ఉదాహరణకి మనం రాసేటప్పుడు కాగితం, కలం పట్టుకొని రాస్తాం. ఇప్పుడు సరిగ్గా మన ఎదురుగా పువ్వు ఉండక పోవచ్చు. పువ్వును గురించి మనం రాస్తూ ఉంటాము. వర్షం గురించి రాస్తాం అనుకోండి. కానీ ఆ రోజు వర్షం పడకపోవచ్చు. కానీ కవి రాస్తాడు. వాన పడకపోయినా వానను గురించి రాస్తాడు, పువ్వు లేకపోయినా, ఎదురుగా లేకపోయినా పుష్పాన్ని గురించి రాస్తాడు. చీకటి పూట అర్ధరాత్రి వేళ సూర్యుని గురించి రాస్తాడు. ఎట్లా రాస్తాడు?? అంటే సూర్యుడు ఎదురుగా ఉంటే కదా సూర్యుని గురించి రాయాలి? అని అంటే ఇంగ్లీష్ లో చాలా చర్చ జరిగింది. ఏంటంటే మనము ఒక వస్తువును చూసినప్పుడు, ఒక దృశ్యాన్ని చూసినప్పుడు, వస్తువు, దృశ్యము చూడగానే ఒక స్పందన ఏర్పడుతుంది. రూపం మనసులో ముద్రింప బడుతుంది. ఇంక ప్రతిసారి చూడనక్కర లేదు. మన మనసులో ముద్రించబడిన ఒక రూపం ఉంది. కనుక, మనం రాయదలుచుకున్నప్పుడు దాన్ని ఆవాహన చేసుకుంటాం. అంటే భావనాశక్తికి రెండు దశలు. ఒకటి ప్రైమరీ ఇమాజినేషన్, మరొకటి సెకండరీ ఇమాజినేషన్ అనేవి ఉన్నాయి.

ప్రైమరీ ఇమాజినేషన్ అంటే మనం చూడగానే మన మనసులో పడిన రూపు వస్తువుకు సంబంధించిన ఒక ముక్క అని ముందే అనుకుని ఉంటాం. అంటే ఇమేజ్ అంటే ఒక రూపం, ఒక ప్రతీక ఉంటుంది. అది తొలి దశ. ఉదాహరణకు ఒక గులాబి పువ్వున్నది. గులాబి పువ్వు అనగానే అది ఎరుపు రంగులో ఉంటుందని, దాని రిక్కల అందం హృదయంలో నాటుకొని ఉన్నది. కాబట్టి ఇమాజినేషన్ చేయగలం. కానీ ఎక్కడ ఉన్నాయి అంటే దానియొక్క రూపుగాని, దాని అందంగాని దాని సొగసులు మన మనసులో ఆ వస్తువు యొక్క స్వరూపం ముద్రబడి ఉన్నది, గులాబి ఎట్లా ఉంటుందో స్థిరపడింది. కాబట్టి దాని గురించి చెప్పగలం, రాయగలం. ఇది మొదటి దశ. ఇక రెండవది సెకండరీ ఇమాజినేషన్ ఏంటంటే. తన మనసులో ముద్రించబడిన విషయం. చాలా రోజుల క్రిందటి జలపాతాన్ని ఇప్పుడు చూడకపోవచ్చు. కాని ఆ జలపాతాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చూపుతాం. ఒక నది ఉన్నది. ఆ నదిని ఎప్పుడో చూసి ఉండడం వల్ల, మనస్సులో నాటుకొని ఉండడం వల్ల దాన్ని మనం వర్ణించడానికి వీలుగా మన హృదయాల్లో భద్రపరచుకోవడం వల్ల కవిత్వం భావాలను రాయగలగాలి. ఆ ఆవిష్కరించేటు వంటి శక్తి కవి మనసులో ఎంత బలంగా ముద్ర వేసుకుంటే కవిత్వంగా అంత బలంగా  ఉంటుంది. కనుక కవిత్వంగా వస్తుంది. ఆ చిత్రాన్ని ఊహించుకొని ఆవిష్కరించే వీలవుతుంది. కాబట్టి కవి యొక్క మనసులో ఉంటుంది గనుక, ఏదో ఉంది గదా అని అందిన దాన్ని మనసులోకి జ్ఞాపకం తెచ్చుకొని రాస్తావు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది కూడా జీవం రావడానికి కుదరదు. అందుకని నీ మనసులో కూడా, కవి యొక్క మనసు ఎట్లా ఉంటుంది అనంటే, ఇప్పుడే పూసిన గులాబీ పువ్వు ఏవిధంగా ఉంటుందో ఆ విధంగా తాజాగా ఉండేటువంటిదే భావనాశక్తి. అటువంటి భావనాశక్తి నీ హృదయంలో ఉంటుంది. పండితునికి, కవికి తేడా ఉంది. పండితునికి మొత్తం కావ్యాలు, మొత్తం పద్యాలు ఏవి ఎక్కడ ఉన్నాయో ఏకరువు పెట్టేటువంటి శక్తి పండితులకు ఉంటుంది. కాని కవికి ఆ పద్యాలకంటే ఆ పద్యాలలో ఉండే భావము, ప్రకృతిలో ఉండే దృశ్యం, ఇంకెక్కడో చాలా చిన్నప్పుడు చూసిన దృశ్యం కవికి మనసులో ఉంటుంది. నాస్టాల్జియా గురించి రాస్తున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు రాయడం అన్నమాట. కవిత్వం జల్లుతున్నారు ఈ మధ్య బంగారు ఈ పురుగుకు దారం కట్టుకొని ఆడిన మన జ్ఞాపకాలు ఉంటాయి.

చిన్ననాడు బంగారుపురుగును పట్టుకోవటం, దానికి దారం కట్టడం, అగ్గిపెట్టెలో పెట్టడం దానికి బంతాకులు ఆహారంగా పెట్టడం, అది బంతి ఆకులు మాత్రమే తింటుంది. అది ఒక నమ్మకం. గిరగిర తిప్పితే అది రెక్కలారిస్తే మనకు పరమానందం, బ్రహ్మానందం. అట్లా ఉండేటప్పుడు ఎప్పుడో యాభై ఏళ్ళ క్రింద ఆడిన ఆటలు అంతా కూడ ప్రతిరూపం. అంతా కూడా ముద్ర అంతా కూడా ఇవ్వాళటికీ కళ్ళక్కట్టుకోవడం ఈ విధంగా మనకు గుర్తుంటుంది. మనం రాయదలుచు కున్నప్పుడు మన భాషలో ఇది మొత్తం ఆవిష్కరిస్తాం. దీనికి కీలకమైనది ఆ భాష. ఆ భావన. అందుకనే భావనాశక్తి చాలా కీలకం. ఎప్పుడో మీ మనసుల్లో నాటుకొని, ముద్రపడిన భావాలు కవిత్వంగా రాస్తారు.

భావాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు ఇవన్నీ కూడా హృదయంలో, మనసులో భద్రపడి ఉంటాయి, ముద్రపడి ఉంటాయి. వాటినే కవిత్వంలో రాస్తాము. ఇవి కావాలనుకున్నప్పుడు నేనేనును అనుకుంటూ ఆ భావాలన్నీ మీ ముందుకు వచ్చి వాలుతాయి. అవి తీసుకుని మనం కాగితంపై అలంకరిస్తాం. అవి అలంకరించాలంటే సౌందర్యారాధన శక్తి ఉండాలి. ఇష్టపడే అది కవిత్వీకరిస్తాం. కేవలం భాష రాగానే సరిపోదు. కవులగుట అసంభవము. కట్టమంచి రామలింగారెడ్డి స్పష్టంగా “కొయ్యల రీతినో, మహర్షుల రీతినో నిర్వికారస్థితినుండువారు పద్యములు రాయనేర్తురు గాని కవులగుట అసంభవము” అని అన్నాడు. జాగ్రత్తగా వినండి.

కట్టిగా ఉంటేనో, మహర్షులుగా ఉంటేనో, నిర్వికారంగా ఉంటేనో కవిత్వాన్ని వ్రాయలేరు. తమకున్న ప్రతిభతో పద్యాలల్లుతారు కొందరు. కాని, పద్యాలు రాయగలిగిన వారంతా కవులుగా లేరు అని అంటాడు. ఎందుకంటే పద్యం ఛందస్సు అవన్నీ వ్యాకరణంగాని పద్యాన్ని గాని రాయగలుగుతాయి. తీర్చిదిద్దుతాయి గాని, ఈ కవిత్వాన్ని హృదయానికి చేరవేసే శక్తి పద్యానికిగాని, ఛందస్సుకు గాని ఉండవు అని ఆయన అభిప్రాయం. అందుకని ఆయన ప్రబంధ కవులను చాలా తీవ్రంగా విమర్శిస్తాడు. తిక్కన బాగా హృదయానికి హత్తుకునేలా రాస్తారు. తిక్కనంత గొప్ప కవి లేడు అని భారతం రాయడం గురించి చెప్తాడు కట్టమంచి రామలింగారెడ్డి. ప్రబంధ కవులలో ఒకే ఒక్క కవి పింగళసూరన ఒక్కడే గొప్ప కవి అంటాడు. కారణం ఏమిటో అంటే తిక్కన జీవితానికి ఇచ్చినంత విలువ, భావనా శక్తికి ఇచ్చినంత విలువ అలంకారాలకు ఇవ్వలేదు. అలంకారాలు కూర్చినటువంటివారే ప్రబంధ కవులన్నారు.

అష్టాదశ వర్ణనలలో వర్ణిస్తారు. అంటే పద్దెనిమిది వర్ణనలలో రాస్తారు. నీకు ఇష్టమున్నా లేకున్నా అష్టాదశ వర్ణనలు చేయాలి. వీటిలో పడి, ఈ జీవితం, జీవితం యొక్క అనుభవం మరుగునపడి పోతుంది అనేది ఆయన భావన. నీ హృదయంలో పుట్టినటువంటి భావం సహజంగా సజీవంగా ఆవిష్కరించాలంటే నీకు ఉండాల్సింది భావనాశక్తిగాని, అలంకార శక్తి కాదు అనేటువంటిది ఆయన ప్రతిపాదించిన విషయం. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ని రాసాడు. గీతాంజలిలో నన్ను బాగా ఆకట్టుకున్న ఒక పోలిక ఉన్నది. అది మనకు ఇప్పుడు సరిగ్గా సరిపోయేటువంటిది. అందుకే ఆ ప్రస్తావన తీసుకువస్తున్న.

పిల్లలందరూ ఆడుకుంటూన్నారు. అందరితో ఆడుకోవడానికి రాజుగారి కొడుకు కూడా, అంటే బాలరాజు, చిన్నపిల్లవాడైనటువంటి ఆ రాజు కూడా ఆడుకోవడానికి వెళ్ళాలనుకున్నాడు. ఆయన రాజకుమారుడు కదా అందరిలాగా వెళ్తే ఆయనకు విలువ ఉండదు గదా. అందుకని ఆయన ఏం జేసాడు ఇంట్లో ఆడుకోవడానికెళ్ళేటప్పుడు కూడా అతనిని అలంకరించి, మంచిగా ఆభరణాలు పెట్టి, నగలు వేసి మంచి బట్టలు వేసి ఆడుకోవడానికి పంపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు. ఆయనెట్లా ఆడుకోగలడు. ఆడుకోబోతే ఈ మట్టిలో ఆడితే దుస్తులు మాసిపోతాయని భయం. ఆడుకోవాలంటే, పిల్లలతో ఆడుకోవాలని కోరికగా ఉన్నదిగా, వాళ్ళతో ఆడుకుంటుంటే బట్టలు మాసిపోతాయేమోనని భయం. ఆడుకుంటే ఈ ఆభరణాలెక్కడ జారిపోతాయేమోనని భయం. ఆడుకుంటే తన ఒళ్లు ఎక్కడ కందిపోతుందేమోనని భయం. ఆయన పిల్లలతో ఎట్లా ఆడుకుంటాడు. ఎట్లా మమేక మవుతాడు? ఆ పిల్లలు ఆటల ద్వారా పొందుతున్న ఆనందం ఇతను ఎట్లా పొందుతాడు? అని రాసాడు. ఆ పిల్లవాడి దృష్టి అంతా ఎక్కడ ఉన్నది? దుస్తుల మీద ఉంది, నగల మీద ఉంది, శరీరం మీద ఉంది, అలంకరణ మీద ఉంది. ఈ అలంకరణ మీద ఆయన ధ్యాస ఉన్నప్పుడు ఆటలను ఆనందించ గలుగుతాడా? పిల్లలతో కలిసిపోగలుగుతాడా? ఎందుకంటే అతనిని ముట్టుకోవాలంటే చెయ్యికి మట్టంటుతుంది. అతనిని ముట్టుకోగలరా? అతనితో ఆడగలరా? ఈ ఆటలే మట్టిలో ఉంటాయి. చిన్నప్పుడు ఆడే ఆటలన్ని గూడా మట్టితో సంబంధం లేకుండా ఉండవు. కాబట్టి ఎక్కడున్నది ఆనందం? ఎక్కడున్నది భావోద్వేగం? ఎక్కడున్నది హృదయానికి ఒక శక్తి, ఒక అనుభవం? అంటే హృదయానికి అనుభవం నిన్ను నువ్వు మరిచిపోవడంతోనే ఉంది. నిన్ను నీవు మరిచిపోయే టట్లు ఉండడంలోనే ఆనందం ఉంది. ఆ ఆటలో కావచ్చు, ఆ వస్తువులో కావచ్చు, ఆ సంఘటనలో కావచ్చు నిన్ను నీవు మరిచిపోయే దాంట్లోనే ఉన్నది. నిన్ను నీవు మరచిపోయి లీనంగా వాలి అనేది ఈ భావనాశక్తి యొక్క మూలం. కాబట్టి నీలో భావుకత ఉంటే, ఇవన్నీ మరచిపోయి పిల్లలతో ఆలింగనం చేసుకుంటావు. నీకప్పుడు దుస్తుల మీద దృష్టి ఉండదు, చేతులకు మట్టి అంటుతుందనే ఆలోచనే రాదు. పిల్లలతో ఆడడం ఒక్కటే నీ లక్ష్యమై ఉంటుంది. ఆడడం కోసమే నీ మనసు నిన్ను ఒత్తిడి చేస్తుంది. కాబట్టి నీ నగల మీద దృష్టి ఉండదు, నీ దుస్తుల మీద దృష్టి ఉండదు, చేతుల మీద దృష్టి ఉండదు, మొహం  మీద దృష్టి ఉండదు. అట్లాంటి దృష్టి ఉండనటువంటి ఒకానొక తన్మయ స్థితికి భావనాశక్తి అని పేరు. కాబట్టి ఈ భావనాశక్తి కీలకం. అందుకే కట్టమంచి రామలింగారెడ్డి గారు ఇంకోమాట కూడా అన్నారు. “వృతాంతమును, స్థితిగతులను అందలి పాత్రల సుఖదుఃఖములను రోమరోమ మునకు తానే అనుభవించినప్పుడే పాత్రలకు ఆపాదించి అభివర్ణించడానికి సాధ్యమవుతుంది” అన్నారు.

ఒక కవిత రాసినా, ఒక కథ రాసినా అందులోని భావాలను మనస్పూర్తిగా రోమరోమమున అనుభవించడం. మనం ఒక కవిత చదువుతూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకున్నవి అంటాం. మీలో చాలామందికి కవిత్వం రాసే అలవాటు ఉన్నవారందరికి ఒక అనుభవం తప్పక ఉంటుంది. ఈ మాట కూడా నా అనుభవంలోనూ ఉన్నది, మీ అనుభవంలోనూ ఉన్నది. ఏంటిదయ్యా అంటే మీరు రాస్తున్నప్పుడు మీ రోమాలే నిక్కబొడుచుకుంటాయి. మీరు రాస్తున్నప్పుడు కళ్లవెంట తడితడిగా చుక్కలు రాలుతుండే అవకాశముంటుంది. మీరు రాస్తున్నప్పుడు ఏ అనుభవంతో రాస్తున్నారో ఆ అనుభవం వల్ల మీ హృదయం ఉప్పొంగుతుంది. అట్లా ఉప్పొంగగలగాలి. కాబట్టి రోమరోమమూ తానే అనుభవించగలగడం తానే ఎట్లా అనుభవిస్తాడని ఒక దుర్యోధనుని గురించి రాస్తాడు. ఒక కర్ణుని గురించి రాస్తాడు. ఒక అర్జునుని గురించి రాస్తాడు. ఒక రాముని గురించి రాస్తాడు. ఒక సీత గురించి రాస్తాడు. కవి ఎన్ని పాత్రలను పరకాయ ప్రవేశం చేయాలి? స్త్రీల గురించి తెలుసా? వాల్మీకికి సీత గురించి తెలుసా? తెలియకపోతే సీతను ఆవిష్కరించలేడు. తెలియాల్సిందే. తెలియకపోతే సీత దుఃఖాన్ని ఆవిష్కరించలేడు. తెలియకపోతే సీత ప్రక్కన త్రిజటను ఆవిష్కరించలేడు. సీత , ఆమె చెప్పుకోవడానికి ఎవరూ లేనప్పుడు, రాక్షస స్త్రీ అయిన సీత ప్రక్కన ఉండి ఓదారు స్తుంది. సీతకు నమ్మినటువంటి ఒకే ఒక్క రాక్షస పాత్ర త్రిజట. అందుకని తెలిసినటు వంటి ఒక్క పాత్ర ఉన్నప్పుడే వాల్మీకి రాయగలడు. రాయడానికి సీత పాత్ర తెలియాలి. అంటే భావనాశక్తి ఉన్నప్పుడే ఆ పాత్రలోకి ప్రవేశించి రాయగలడు. నువ్వు చూస్తున్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు, అనుభవిస్తూ ఉన్నప్పుడు స్త్రీల యొక్క మాటలెట్లా ఉంటాయి, స్త్రీ యొక్క దుఃఖమెట్లా ఉంటుందో, స్త్రీల వేదనెట్లా ఉంటుందో తెలియాలి.

నువ్వు ఎవరినైనా విన్నప్పుడు, కన్నప్పుడు కలిగిన భావాలు, నీ మనసులో బలంగా నాటుకొని ఉన్నప్పుడు మాత్రమే రాయగలుగుతావు. దీనికి కావలసింది ఏమిటీ అనంటే, రోమరోమాన తానే అనుభవించడం, అనుభవించగలిగినవారే రాయగలుగుతారు అంటాడు. అందుకని సీత యొక్క దుఃఖాన్ని మనము రోమ రోమాన అనుభవించగలిగేలా ఉండడమే భావనాశక్తి అంటాడు. అందుకని ఈ భావనా శక్తి ఇట్లానే ఉంటుందని చెప్పడానికి ఉండదు.

అద్భుతమైన ఘట్టాలన్నీ మనను కదిలించిన ఘట్టాలు, మనను ఒప్పించిన ఘట్టాలన్నీ ఎట్లా వచ్చినవి అంటే, ఎక్కడి నుండి వచ్చినవి అంటే ఈ భావనాశక్తి గనక సరిగ్గా లేకపోతే అది ఆ కవిత్వము రాణించడానికి అవకాశం లేదు. అందుకని ఈ ఇమాజినేషన్ అనేది చాలా కీలకం. నాట్ ఇంటలెక్చువల్ ఇమాజినేషన్ అనేటువంటిది హార్ట్ ఫుల్ నెస్, హృదయంగమమైంది, హృదయగతమైంది. హృదయంలో మనం మన హృదయం యొక్క సామర్థ్యాన్ని పెంచుకో వలసినవి. అందుకే పి.బి.షెల్లీగారు కవిత్వం గురించి నిర్వచించేప్పుడు ఏమన్నారంటే “పొయెట్రీ ఈజ్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్’ అని అన్నాడు. వస్తువును చెప్పడం కాదు. వస్తువును అందరు కవులు చెప్తారు. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ది కంటెంట్, ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ది ఫీలింగ్. ఈ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ది కంటెంట్ అందరు చెప్తారు. ఈయనేమన్నాడు అనంటే ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ది ఇమాజినేషన్ అని అన్నాడు. నీ భావనాశక్తిని వ్యక్తీకరించటమే కవిత్వం. కాబట్టి నీ భావనాశక్తి ఎంత వుంది అనేది కవిత్వానికి కావాల్సింది. ఇదంతా కూడా నువ్వు వ్యక్తీకరించే దాన్ని బట్టి ఉంటుంది. హృదయం నిండా నిండాలి. రోమ రోమాంచితమైంది కావాలి అని చెప్తున్నాడు. అందుకని ఒక నటుడు కావాలన్నా, ఒక చిత్రకారుడు కావాలన్నా, ఒక కవి గావాలన్నా ఇవన్నీ అతనికి తెలుసుండాలి. నువ్వు విషాదాన్ని నటించు అని డైరెక్టర్ చెప్తాడు. నువ్వు ఇపుడు చాలా ఇబ్బందుల్లోఉన్నావు. నీ ప్రేమ విఫలమైపోయింది. నువ్వు విరహరంలో ఉన్నావు, వియోగంలో ఉన్నావు కాబట్టి ఈ దశలో నువ్వు ఉద్వేగభరితంగా అభినయించు, ఆక్ట్ చెయ్యి అన్నాడు. అంటే ఎట్లా ఆక్ట్ చేస్తాడీయన? ఆయన చెప్పిందంత ఆక్ట్ చేయడానికి కుదరదు. డైరెక్టర్ అంతా ఆక్ట్ చేసి చెప్పడు. కొందరు డైరెక్టర్లు చెప్పవచ్చు. ఆ డైరెక్టర్ కూడా ఇమాజినేషన్ పవర్ ఉన్న డైరెక్టర్ అయితే చెప్పగలడు. కాని ఇక్కడ నటుడికి కూడా ఇమాజినేషన్ ఉండాలి. ఎవరైనా నటుడైనా ఆ పాత్రలోకి ప్రవేశించి ఏడిస్తే ఎట్లా ఏడుస్తారు? నవ్వుతే ఎట్లా నవ్వుతారు హాయిగా ఉంటే ఎట్లా తాదాత్మ్యం చెందుతారు అనేదంతా కూడా ఇతను తన హృదయానికి అవగతమై ఉండాలి. మన హృదయాలకు అందించాలంటే ఇంతకు ముందే ముద్రింపబడి ఉండాలి. ఆ ముద్రింపబడి ఉండేటువంటి శక్తి ఏది అంటే భావనా శక్తి ఉండాలి. అందుకే కొందరు ఉత్తమ నటులు కాగలుగుతారు. కొందరు మామూలు నటులుగా ఉంటారు. ఉత్తమ నటులందరికి కూడా ఈ భావనాశక్తి ఉంటుంది. కోపాన్ని ప్రదర్శించాలి అన్నప్పుడు నీ కళ్ళతోనా? నీ ముక్కుతో? నీ మాటతోనా? ఎక్కడ ఎట్లా ప్రదర్శిస్తావు? నీ యిష్టం. ఇవన్నిట్లల్లోనా ఎట్లా ప్రదర్శిస్తావు? కోపం అంటే కండ్లు మిడిగుడ్లు తెరువగానే కోపం గాదది. కోపం అనేది నీ చూపులో ఉండాలి. నీ కళ్ళలో ఉండాలి. నీ కదలికలో ఉండాలి. అట్లాగూడా నీవెప్పుడూ ప్రతిభావంతంగా ప్రదర్శించగలుగుతావూ అనంటే భావనాశక్తి ఉన్నప్పుడే నీవు ప్రదర్శించగలుగుతావు. నీవు కోపానికి వచ్చినప్పుడు నీవు ముద్రించుకొని ఉంటే కోపమంటే ఇట్లా ఉంటుంది కదా అని తెలుసుకున్నప్పుడు నువ్వు బాగా ప్రదర్శించ గలుగుతావు. కవి అనేవాడు ఆ కోపాన్ని రాస్తాడు గనక ఆ కోపాన్ని రాసేటప్పుడు ఎట్లా రాయాలి? తిక్కన భీమునికి వచ్చినటువంటి కోపాన్ని ఒక పద్యంలో వర్ణిస్తాడు. పండ్లు కొరుకుతాడు. కండ్లు కొరికినప్పుడు కండ్లు ఎర్రబడతాయి, ఆ ముఖం కంది పోయి ఉండడం అనేవి తిక్కన భీముని కోపాన్ని అద్భుతంగా వర్ణించాడు. అట్లా వర్ణించగలిగి నటువంటి ఒక నేర్పు ఉండడమనేది భావనాశక్తి వల్లనే సాధ్యమవుతుంది.

యుద్ధానికి వెళ్లే ఒక సైనికుడు ఎట్లా ఉంటాడు? ఈ మధ్య సైనికుని గురించి చాలా కవిత్వం రాస్తున్నారు. ఆ సైనికుడు యుద్ధానికెట్లా వెళ్తున్నాడు. చనిపోతే ఎట్లా ఉంటుంది అని రాస్తున్నారు.

ఈ అన్ని అంశాలని తమ భావనాశక్తితో మాత్రమే రాయగలరు. ఎక్కడో దూరంగా ఉండే ఒక సైనికుని యొక్క స్థితిని రాయదలుచుకున్నప్పుడు అందులో ఒక దుఃఖం ఉంటుంది. తన కుటుంబానికి దూరమైపోయినాడనేది ఒక దిగులు ఉంటుంది. ఒక దిగులు ఉంటుంది. నేనిక్కడే చనిపోతే నా కుటుంబాన్ని నేను ఇక చూడలేను అనే దిగులూ ఉంటుంది. అట్లనే ఒక రోషం ఉంటుంది. నా దేశానికి సంబంధించిన ఈ సరిహద్దు భాగాలను వాళ్లు ఆక్రమిస్తే నేనెందుకు ఊరుకుంటాను? ఒక సైనికునిగా నా శక్తినంతా ధారబోసి నిలుపుతాను, వాడెంతటి వాడైనా అవతలివాళ్ళను నేను తరిమి కొడ్తాను అనే రోషముంటుంది. తన శక్తిమీద తనకు, తన ఆత్మవిశ్వాసం మీద తనకు ధైర్యం ఉంటుంది. ఒక్కడే అయినా కూడా ముందుకు వెళ్ళేప్పుడు పదిమంది తన వెనుక ఉన్నారా లేదా అని కూడా చూసుకోకుండా తన దేశం కోసం ప్రాణాలను లెక్కచేయక ముందుకు సాగిపోతాడు. ఆ సాహసం ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు మాత్రమే అతని యొక్క ఆ సైనికుని యొక్క చిత్రాన్ని మనం ఆవిష్కరించుతాం. ఇవన్నీ కలిగి ఉండే శక్తి ఎక్కడ ఉంటుంది అంటే నీ హృదయంలో ఉండేటువంటి భావనాశక్తిలో ఉంటుంది.

ఆ భావనాశక్తి మేళవించినప్పుడే ఈ ఆత్మవిశ్వాసంతో ఇవన్నీ ఒక దిగులు, ఒక దుఃఖం, ఒక ధైర్యం, ఒక సాహసం, ఒక రోషం, ఒక కోపం ఇవన్నీ కూడా మేళవించే శక్తి, హృదయ పూర్వకంగా చెప్పగలిగే శక్తి ఎక్కడిదంటే కేవలం భావనాశక్తిదే. ఈ భావనాశక్తి అనేది ప్రతిసారి రెండు రకాలుగా – ఏకకాలంలో అది వ్యక్తిగతమైనది, అట్లాగే అది బహుముఖమైనదిగా ఉంటుంది. అంటే ఒక ప్రక్కనించి భావనాశక్తితో ఏదైనా రాస్తావు. వేదనను రాసేటప్పుడు, నీ స్వీయవేదనను రాస్తావు, ఈ స్వీయవేదనను రాసేటప్పుడు ఆ విషయానికి ఆధారమైనది లోకంలోని భావమే. ఈ భావనాశక్తితో ఏం రాస్తావు? అది లౌకికమయ్యేదే రాస్తావు. కృష్ణశాస్త్రి చెప్పినటువంటిది అందరికి తెలిసిన పద్యమే – ఏమయ్యా ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగితే, నీ హృదయం ఏమిటి? ప్రేమ ప్రేమ అంటావు ఎందుకు? అంటే

సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబు

చంద్రికల నేల వెన్నెల కురియు చందమామ

ఏల సలిలంబు పారు, గాడ్పేల వీచు

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

ప్రియురాలు ప్రియుణ్ణి పట్టుకొని అడిగింది. ఏల ప్రేమించగలవు అని. అడిగితే, ఆ విధంగా ప్రియుడు అన్నట్టు కృష్ణశాస్త్రిలోని భావుకుడు ఇట్లా చెప్పాడు. ఎందుకు కలుగుతుందో తెలియదు. లోకాన్ని ఆధారం చేసుకొనే కవి చెప్తాడు. వ్యక్తిగతంగా తన స్వీయ మేధనుండి చెప్పినా లోకాన్ని ఆధారం చేసుకొని, పూలు సౌరభాలను ఎందుకు విరజిమ్ముతాయి అంటే ఏం చెప్పాలి నేను? చంద్రుడు వెన్నెలను కాయడానికి ఏం కారణం అంటే ఏం చెప్పగలం? ఏల సలిలంబు పారు అంటే నేను ఏం చెప్పాలి? నీళ్ళు ఎందుకు ప్రవహిస్తాయి? గాడ్పు ఎందుకు విసురుతుందో? ఎందుకు వీస్తుందో? నేను అందుకు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇది కృష్ణశాస్త్రి కవిత్వం. భావనా శక్తికి గాలి, నీరు, పూలు, వెన్నెల ఇన్ని కారణమయినాయి. ఇన్ని కారణమైతే తప్ప తన ప్రేమను సమర్థించు కోలేడు ఒక భావుకుడు. కవి భావనాశక్తిని బట్టి కవి సామర్థ్యాన్ని బట్టి కవిత్వంలో తన అనుభవాన్ని బట్టి చెప్పగలుగుతాడు. ఈ వామనునికి నువ్వు ఇస్తే అడిగింది మూడడుగులే అయినా కాని నువ్వు నష్టపోతావు వద్దు అని  శుక్రాచార్యుడు చెప్పినా కూడా బలిచక్రవర్తి దానమియ్యడానికి ఒప్పుకుంటాడు. సిద్ధపడ్డాడు. శుక్రాచార్యుడు అంతే అంటే బలిచక్రవర్తి ద్వారా పోతన అడిగిస్తాడు. ఏమనంటే అయితే అయ్యింది, నేను మోసపోతే పోతాను అని అనుకొని ఏమన్నాడు అంటే…

“ఆదిన్ శ్రీసతి కొప్పుపై… అంసోత్తరీయంబుపై…

ఏదో పై… ఇట్లా మహావిష్ణువు యొక్క చెయ్యిని వర్ణించాలి. ఆ చెయ్యిని వర్ణించిందెట్లా అంటే “ఆదిన్ శ్రీసతి కొప్పుపై” మొదట శ్రీలక్ష్మి యొక్క కొప్పును ముట్టుకున్న తనువును ముట్టుకున్న చెయ్యి, ఆమె కొప్పును సవరించివచ్చు ఆ తర్వాత ఆమె అంసోత్త రీయం భుజాలుపై నుండే ఆమె కొంగును సవరించివచ్చినటువంటిది, ఆట్లా సవరించి సవరించి పాలిండ్లపై నడయాడినటువంటి చెయ్యి లక్ష్మీదేవి యొక్క అవయవాలపై నూతన మర్యాదలు తెలిసిన చెయ్యి అయిన విష్ణువు చెయ్యి కిందికి ఉంటుంది. నా చేయి మీద ఉంటుంది అంటాడు. ఇది భావనాశక్తికి చెందినటువంటి విషయం ఊరికే ఆ చెయ్యి కిందా, నా చేయి మీద అంటే కాదు, ఎట్లా వర్ణించాడు అంటే మహావిష్ణువు చెయ్యి, మహాలక్ష్మి యొక్క శరీరాన్ని తడమగలిగినటువంటి చెయ్యి క్రింద ఉన్నది, నా చెయ్యి మీదై ఉంది.. పోతే పోనీ అంటాడు. “కారే రాజులు…’ రాజులు ఎంతోమంది అవుతారు. నా పేరు ఇట్లా ఉండిపోతుంది ఉండనీ అని అంటాడు. అందుకని ఈ భావన అంతాకూడా పోతనకు హృదయంలో ఉన్నటువంటి భావనా శక్తి్. హృదయంలో ఉన్న సామర్థ్యం అంతా ఈ రూపములో తీసుకురావడంవల్ల వ్యక్తీకరించడం వల్ల ఆ పద్యాలు, బలిపాత్ర అద్భుతమైనటువంటి ఆ వర్ణన అలా వచ్చింది, మిగిలి ఉంది. కాబట్టి భావనాత్మకమైన విషయాన్ని కీలకం మనం గుర్తుకు తెచ్చుకుంటూ మనకు శాస్త్రము సత్యాన్ని చెప్పవచ్చు గాని, సత్యము ఒకటే ఉంటుంది. శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి సూత్రము ఒకటే ఉంటుంది. (A+B)­2=A2+B2+2AB అని ఉంటుంది. ఇంతే ఉంటుంది. 2X2=4, నాలుగే అవుతుంది. ఇది సత్యానికి సంబంధించినటువంటిది. అది సైన్స్, అది అట్లాగే ఉంటుంది. కాని కవిత్వం అట్లా కాదు. 1+1=1 వన్ ప్లస్ వన్ ఇజ్ క్వల్ట్ వన్ అని రాసాడు శ్రీశ్రీ. 1+1=1 ఎట్లా అవుతుంది? కానీ అవుతుంది అదే కవిత్వం. అదే సాహిత్యము. ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కలిసి ఒకటవడం. ఒక స్త్రీ + ఒక పురుషుడు ఇద్దరు కలిసి ఒకటవడం. 1+1=2 అనేది శాస్త్రంలోనిది. కాని సాహిత్యంలో అట్లా కాలేదు. మనుషులకు చెప్పాడు. రెండు మనసులు ఒకటై ఉంటాడు. రెండు మనసులు ఎప్పుడు కాని నిజ జీవితంలో ఒకటి కావు. కాని కవిత్వంలో ఒకటవుతాయి. హృదయంలో ఒకటవుతాయి. భావనలో ఒకటవుతాయి. ఉన్నాగూడా ఒక్కటిగా మారిపోతాయి. అది కవిత్వానికి సంబంధించిన అంశం. అందుకని కవిత్వము వైవిధ్యపూరితమైంది. శాస్త్రం కేవలం సత్యానికి నిబద్ధమై ఉంటుంది. సత్యం ఒక్క రకంగానే ఉంటుంది. కాని కవిత్వము వివిధ రూపాలను పొందినటువంటిది. చాలామంది అనుకుంటూ ఉంటారు. రెండు లైన్లు రాస్తారో లేదో పొంగిపోతారు అని అంటుంటారు. ఆయన పాట రాస్తాడు ఎన్నో హృదయాలను, ఎంతోమందిని ఆకర్షిస్తుంది. ఎట్లా ఆకర్షిస్తుంది? రవీంద్రుడు గీతాంజలి రాశాడు కొన్ని కోట్లమందిని ఆకర్షించాడు. ఎట్లా ఆకర్షించాడు? అంటే కవిత్వానికి వివిధ హృదయాల్ని అలరింపజేసేటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తి దేనివల్ల వచ్చింది? ఈ శక్తి భావనాశక్తి వల్ల వచ్చింది. భావనాశక్తి గనక కవికి లేకపోతే లేదా పాఠకునికి లేకపోతే, లేదా సహృదయులకు లేకపోతే ఈ కవిత్వము ఇంతమందిని ఆకర్షించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ భావనాశక్తి కీలకం. ఈ భావనాశక్తి హృదయంలో ఒకటే విధంగా ఉండకపోవచ్చు. రెండు విధాలుగా మూడు విధాలుగా ఎనిమిది విధాలుగా ఉండవచ్చు. అట్లా లెక్కబెట్టాల్సిన పని లేదు. అవసరమైనప్పుడు మీరేదైతే రాయదలుచుకుంటారో ఎప్పుడో మీ చిన్నప్పుడు చూసిన విషయాన్ని ఇప్పుడూ రాయాలి. ఎప్పుడూ చూసింది మీకు జ్ఞాపకం ఉంటుంది. మీరు ఇప్పుడు రాసేప్పుడు అది నేనున్నాను అని పరిగెత్తుకుంటూ వస్తుంది. దానికి కావలసింది భావనాశక్తి. ఆ భావనాశక్తికి కావలసిందల్లా నీ హృదయానికి ఉద్వేగం కలిగించేదయ్యి ఉండాలి. కాబట్టి ఈ ఆవిష్కరించే భావనాశక్తి కీలకమైందని చెప్తూ, తేనెటీగ అనేది అన్ని పువ్వులమీద వాలుతుంది. అన్ని పువ్వుల యొక్క మకరందాన్ని అది ఆస్వాదిస్తుంది. ఆస్వాదించి అదంతా తన దగ్గర భద్రపరుచుకుంటుంది. భద్రపరుచుకొని అది తేనె తెట్టెను తయారుచేస్తుంది. అది అనేక పువ్వుల మీద వాలకపోతే, అది మకరందాన్ని ఆస్వాదించకపోతే తనదైన తేనెను తయారుచేసే అవకాశం ఉండదు. అనేక పువ్వుల మీద వాలగలిగేటువంటి శక్తే అనేక మకరందాలను గ్రోలగలిగే శక్తే భావనాశక్తి. అది భద్రపరుచుకోవడం అనేది కొత్త తేనెను తయారు చేయగలిగేటువంటి శక్తిని ఇస్తుంది. అందుకని భావనాశక్తి ఎటువంటిది అంటే ఎక్కడెక్కడి రసాలను, ఎక్కడెక్కడి అనుభవాల రసాలను ఒక్కదగ్గర భద్రపరుచుకొని, అది నీకు అవసరమైనపుడు నీకు ఇవ్వగలిగేటవంటి శక్తి ఈ భావనాశక్తికి ఉంటుంది. అందుకని చాలా చిత్రమైనటువంటిదీ ఈ భావనాశక్తి. వ్యక్తిగతమైనటువంటి దానిని సార్వజనీనం చేస్తుంది. ఇందాక కృష్ణశాస్త్రి వర్ణనలోని బాధ, చలం మాటల్లోనే కృష్ణశాస్త్రి బాధ లోకానికి బాధ, లోకం బాధ శ్రీశ్రీ, లోకం బాధ కవి బాధ అవుతుంది. కృష్ణశాస్త్రి బాధ లోకం బాధ చేసాడు. అదే భావనాశక్తి వల్ల లోకం బాధ శ్రీ శ్రీ బాధ అయింది. కవి యొక్క బాధ లోకం బాధ అయ్యే భావన చేశాడు. శ్రీశ్రీ ఏమన్నాడు “పతితులార భ్రష్టులార బాధాతప్త ప్రజలారా, ఏడవకండేడవకండి వస్తున్నాయ్ వస్తున్నాయ్ మీకోసం వస్తున్నాయ్, వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్ వస్తున్నాయ్” అన్నాడు. ఎక్కడి రథచక్రాలు? ఎక్కడో పూరీలో ఉన్నాయి జగన్నాథ రథచక్రాలు అవి పూరీలో ఉంటే అవి పూరీలో తిరుగుతాయి. యాడాదికొక్కసారి ఊరేగిస్తారు. కాని శ్రీశ్రీ ఏం చేస్తాడు. పూరీలో ఊరేగే జగన్నాథ రథచక్రాలను తీసుకొచ్చి సమసమాజానికి ప్రతీకగా మార్చి, అనేకమంది యొక్క దుఃఖాన్ని తుడిచి వేయడానికి శ్రీశ్రీ చేసిన భావనాశక్తి అది. ఒక దేవుడిని ఊరేగించాల్సి వచ్చినప్పుడు ఉత్సవ విగ్రహాల్ని ఊరేగించే రథమది.

ఊరేగింపులో ఉపయోగించే రథాన్ని తీసుకొచ్చి, దాన్ని సమాజం కోసం వస్తున్నట్టు భావించి సమసమాజాన్ని భావించి “పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార, ఏడవకండేడవకండి వస్తున్నాయి వస్తున్నాయ్ – మీ కోసం వస్తున్నాయ్ అని సమసమాజ స్థాపనకు ఆపాదించి రాసాడు, శ్రీశ్రీ అక్కడికి వెళ్ళాడు గనక చూసాడు గనక తన హృదయంలో భద్రపరుచు కున్నాడు. ఆయన రష్యాలో చైనాలో తిరిగాడు గనక అక్కడ చూసిన సామాజిక చైతన్యం ఇక్కడ కూడా రావాలని సమసమాజం యొక్క చైతన్యాన్ని ఆవాహన చేసుకున్నాడు. దీన్ని అర్ధవంతంగా భావించి రథచక్రాన్ని భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని అన్నాడు. ఇక్కడ కవిత్వాన్ని సృష్టించాడు. ఆకాశపు దారులలోనుంచి రథాన్ని తీసుకొస్తాడు. ఇక్క సంబంధం లేని పద్ధతుల్లో వెళ్తున్నాయి. కవులు ఆకాశంలోనుంచి రథాన్ని తీసుకొచ్చి మళ్ళీ కోట్లాది హృదయాలకు అందేలా తీసుకువచ్చాడు. అట్లాంటి భావనాశక్తే పెద్దనకు, మనుచరిత్రలో ప్రవరోపాఖ్యానంలో ప్రవరుడనే పాత్రను హిమాలయాలకు తీసుకువెళ్తాడు. ఆయన నడుచుకుంటూ పోవాలంటే పదుల సంవత్సరాలు పడుతుంది. అందుకోసం అతని కాళ్ళకు పసరును పూసిన వర్ణన చేస్తాడు. ఈ పసరుతో శక్తి పోతుంది. ఆయన అక్కడి హిమాలయాలకు పోయినట్లు రాయడం అది ఆయన ఇమాజినేషన్ కు సంబంధించింది. కాళ్ళకు పూసిన పసరు శక్తి ఎప్పుడైతే భూమి మీద దిగిన తర్వాత కరిగి శక్తి పోతుంది. దిగిన దగ్గర వరూధిని ఉంటుంది. అక్కడ మాయా ప్రవరుడు ఉంటారు. అక్కడ వర్ణన ఇద్దరు మధ్య ఒక నరుడు, ఒక గంధర్వుడు నడుస్తుంది. అక్కడంతా కవి మళ్ళీ తన అనుభవమే ఉంటుంది. అతడు బాట చెప్పమంటే వరూధిని అంటుంది. “ఇంతలు కన్నులుండ భూసురోత్తమ” అని “ఓ బ్రాహ్మణుడా నీకు ఇచ్చిన పెద్ద కళ్ళు ఉన్నాయి, నీకు ఈ బాట వెలువదా?” అంటుంది. ఇది ఇక్కడి లౌకిక జీవనంలోని విషయాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రవరునికి ఆపాదిస్తాడు. ప్రవరుడు తొవ్వ దొరకడం లేదని అంటాడు. గంధర్వ కన్యతో మాట్లాడేప్పుడు ఒకమాటను పెట్టి “ఇంతలు కన్నులుండ” అనే మాటను వరూధినితో అనిపించడం అనేది హృదయాంతరాళలతో ఉన్న భావనాశక్తి లౌకిక విషయంగా, తెలిసిన మాటను అక్కడ పెడతాడు. ప్రవరుని మాటలో పెడ్తాడు. గంధర్వ కన్యను తీసుకొచ్చి, ఒక లౌకి జీవనంలో ఉండేటువంటి మాటను ఆమెతో అనిపిస్తాడు కవి. ఇలా పెట్టడం అనేది ఇది భావనాశక్తికి సంబంధించినటు వంటిది. కవి హృదయాంతరాళాల్లో ఉన్నది కవిత్వమవుతుంది. వర్ణన అవుతుంది.

కవిత్వానికి కళ వస్తుంది. ఈ కవిత్వానికి ఒక ప్రాణకళ రావాలన్నా ఈ భావనాశక్తి వల్లనే. దీనివల్లనే ఈ కవిత్వానికి ఒక ప్రాణమొస్తుంది. కవిత్వానికి ఒక తేజమొస్తది అని కట్టమంచి రామలింగారెడ్డి అన్నాడు. ఈ కవిత్వానికి ఒక కళ రావాలంటే, దేనివల్ల వస్తుందంటే మనోగాంభీర్యం వల్ల వస్తుంది. ఈ మనశ్శక్తి వల్ల వస్తుంది. ఈ భావనాశక్తి వల్ల వస్తుంది అన్నాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరికొన్ని ఉదాహరణలు తెలుసుకోవాలి. హిందీలో కల్పన, చతురత, భావన అనేవే ఉన్నాయి. హిందీలో కూడా చాలా చర్చ జరిగింది. ఈ భావనాశక్తి ప్రయోజనాలను నెరవేరుస్తుంది. ఈ భావనాశక్తి కొన్నిచోట్ల వాస్తవమైందేమో కృతకమైన దానిలా కనిపిస్తుంది. కృతకమైందేమో వాస్తవంగా కనిపించవచ్చు. ఈ కృతకమైంది ఈ వాస్తవమైంది రెండింటినీ మేళవించి వర్ణించేదే భావనాశక్తి. నీవు అద్భుతమైన కల్పన చెయ్యాలంటే ఎక్కడినుంచి చేస్తావు? వాస్తవమైన ప్రపంచం నుంచే చెయ్యాలి. స్వర్గం ఉన్నదని అన్నారు. భూలోకాన్ని చూడలేకపోతే స్వర్గాన్ని సృష్టించలేరు. రంభను చిత్రించాలన్నా ఊర్వశిని చిత్రించాలన్నా భూలోకంలో ఉన్న అందగత్తెలను చూస్తేనే అట్లా చిత్రించడం సాధ్యం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చూడకుండా, లౌకికమైన విషయాలు చూడకుండా పారలౌకికమైన విషయాలు వర్ణించడం సాధ్యం కాదు. కృతకమైన వాటిని వాస్తవికతతో, వాస్తవమైనవి కృతకమైనవిగా మేళవించి చెప్పగలిగే శక్తి ఈయనకుంటుంది. అట్లా “లౌకికమైన విషయాలను మాత్రమే మేళవించి కొత్త అర్థాలను, కొత్త అందాలను, కొత్త ఆలోచనలను, సొగసులను సృష్టిస్తుంది ఈ భావనాశక్తి” అంటాడు. అంతా మనకు తెలిసినదే, అంతా మనం అనుభవాలే, అంతా మనం చూసిన జీవితమే. కాని నీ భావనాశక్తి వల్ల, వాటి మేళవించడం వల్ల, రంగరించడం వల్ల దానికి ఒక కొత్తదనం రావడానికి కొత్త సొగసు, కొత్త బలం వచ్చే అవకాశమున్నది. అట్లా ఇవ్వి చాలా కీలకమైనవి కాబట్టి భావనాశక్తి మనకు కవులు వర్డ్స్ వర్త్ అంటాడు. సాయం సమయాన మంచు బిందువులు సూర్యుడు రాలేనందువల్ల రాల్చే కన్నీటి బిందువులల్లే ఉన్నాయి. సూర్యుడు రాలేనందువల్ల కమలాలు రాల్చే కన్నీరువలె ఉన్నది అని అన్నాడు. సూర్యునికి, కమలానికి ఉన్న ప్రణయబంధం ఉన్నట్లుగా మనకు చాలామంది కవులు వర్ణించారు. కాని కురిసిన మంచు కన్నీటి సూర్యుడు రానందున కమలాలు కన్నీరు రాల్చాయి. ఈ మంచు బిందువులు అవి రాల్చిన కన్నీటి బిందువులు అని కల్పన చేశాడు వర్డ్స్ వర్త్.

అట్లానే జాషువా కవిత్వం చదువుతూ వుంటే ఆకర్షించినటువంటి మాట ఏమంటే “దినదినము క్రుంకు జీవనము కట్టెడి బ్రహ్మ – ఆ పాపము ఏల లిఖించెనో నాథా….” వనకన్యలు జాలిపడుతున్నా రన్నాడు. ఇది వనకన్యని చూసి ఎందుకు జాలి కలిగింది జాషువాకు అంటే, “దినదినము గ్రుంకు జీవనమును చూసి జాలిపడ్డాడు. రోజూ అస్తమించేది రాయడం. రోజూ అట్లానే ప్రకాశమానంగా ఉంటున్నట్టు రాయకుండా, ఆ బ్రహ్మ సూర్యుణ్ణి సృష్టించేటప్పుడు రోజూ అస్తమించాలి మళ్లీ ఉదయించాలి అని అనేటువంటిది చూసి రాశాడు. ఆ వనమనే దానిని కన్యగా భావించి, ఆ వనకన్యలంతా సూర్యునికి ఇట్లా రోజూ అస్తమించేటువంటి రాత రాసిన బ్రహ్మదేవుణ్ణి కొంచెం కోపిస్తూ దుఃఖిస్తున్నటువంటి స్థితిని ఆయన రాశాడు. అట్లా మనం చూసినప్పుడు చంద్రసేన్ అనేటువంటి కవి చిన్న చిన్న పదాలతో జీవితాన్ని చెప్పాడు. ఈ కవివి మీకందరికీ తెలిసిన మాటలే. “కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ప్రయాణం” అని రాశాడు. మనం చూస్తన్నదే మనం కన్ను మూస్తాం, తెరుస్తాం. కాని అందరికీ ఆ ఊహాశక్తి రాలేదు. ఈ భావనాశక్తి చంద్రసేన కు మాత్రమే వచ్చింది. ఒక పుట్టుక కన్ను తెరవడం, ఒక చావు కన్ను మూయడం. ఇంతేకదా అంటాడు.

అట్లా పాపినేని శివశంకర్ కవిత్వంలోనూ ఇట్లాంటి మంచి మాటలు ఉన్నాయి. “రెండు కళ్ళు, రెండు అపురూప కార్యాల కోసం వేచి వున్నాయి” అని రాస్తాడు. “ఒకటి నీ దుఃఖం కోసం, రెండవది పరాయి దుఃఖం కోసం”. రెండు కళ్లెందుకున్నాయనంటే ఒకటి మనకోసం ఏడవాలి. ఒకటి పరాయి దుఃఖం కోసం అంటాడు.

అందుకని ఈ రెండు కళ్ళను అట్లా ఊహించడం అనేది సార్వజనీనదృష్టికి ప్రతీకగా చేసి రాసాడు పాపినేని శివశంకర్. కొపర్తి “నా కవిత్వం నన్ను పలకరించి ఎన్నాళ్ళయ్యిందో, నాకు నేను కాకుండాపోయి అన్నాళ్ళయ్యింది. కవిత్వం వెళ్ళిపోయి నన్ను నాలో నేను మిగలకుండా చేసింది” అంటాడు. కవిత్వం వెళ్ళిపోయి నన్ను మిగులకుండా చేసింది అని గొప్పగా అన్నాడు. “పశువుల కాపరి ఒకడైనా రెండు చేతులను ఇలా నోటి చుట్టు పెట్టి ఒక పొలికేక వేసినా సరిపోయేది. నా కవిత్వం మైదానాల్లో, లోయల్లో ప్రతిధ్వనించి ఉండేది” అన్నాడు. ఎక్కడి పశువుల కాపరి? కవి ఇక్కడ కూర్చుని కవిత్వం రాస్తున్నాడు. కవి ఎక్కడినుంచి కవిత్వం తీసుకుంటాడు అంటే కవి అనుభవించిన విషయాల్లోంచి, ఆయన చూసిన ప్రకృతి నుంచి సేకరించుకుంటాడు. ఆయన చూసిన మనుషుల నుండి తీసుకుంటాడు. ఆయన, దుఃఖించినటువంటి అనేక వ్యక్తుల యొక్క కథ చెప్పవలసి వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది.

ఆ ఉడుత ప్రయాణం చేస్తూ వచ్చి ఇసుకలో దొర్చి దులుపుకుంటున్నటువంటి దృశ్యాన్ని చూసిన వాల్మీకి, ఏం రాస్తాడు? మీకందరికీ తెలిసిందే. వారధి కడూ ఉన్నప్పుడు ఒక ఉడుత వస్తుంది రాముని దగ్గరికి. ఎందుకా ఉడుత? ఎందుకా ఉడుత వచ్చింది అనేది వాల్మీకికి తెలియాలి? నిజమైన కవికి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే, ఆ ఉడుత అక్కడికి రావడం, ఇసుక రేణువుల్ని తీసుకొచ్చి పోస్తూ ఉంటే రాముడు వచ్చి దగ్గరికి తీసుకొని నవ్వుతూ, వీపు మీద నిమురుతూ ఉంటాడు. అవే, ఆ ఉడుత మీద మూడు చారలుగా పడి నిల్చి ఉంటాయి అని. అంటే భావనాశక్తి అనేది కవికి అట్లా ఉంటుంది. అంత సూక్ష్మంగా కవి హృదయంలో ముద్రపడిపోయి భద్రపరుచుకుంటాడు. ఈ రాముడు ఉడుత వీపు మీద దువ్వడం వల్లనే ఈ మూడు గీతలు వచ్చినవి అని ఊహిస్తారు. ఉడుత లేకపోయినా కథకు ఏమీ నష్టం లేదు. శబరి పాత్ర లేకపోయినా కథకు ఏం కాదు. అయినా ఇటువంటివన్నీ జీవితంలో కనిపించడం, జీవితానికి దగ్గరగా రావడం జరుగుతుంది. శబరి రామునికి ఎంగిలిపండ్లు ఇస్తుంది. ఇదంతా మనకందరికీ తెలిసిన కథే. ఈ ఎంగిలి పండ్లు ఇవ్వడమెందుకు? కవి యొక్క భావనాశక్తి అట్లా రాముడు లాంటి ఒక గొప్ప వ్యక్తి వస్తే అతనికి ఎంగిలి పండ్లు ఇవ్వడమేమిటి? తను సగం తిని, అవి రుచికరంగా ఉన్నాయా లేదా అని చూసి, నీకు ఇస్తున్నాను అని అంటుంది. భక్తి పారవశ్యానికి అంతేలేదు అనేలా. సరిగ్గా శబరికుండేటువంటి భావనాశక్తి లేదా శబరిలో ఉన్న భావనాశక్తి, వీటిని ప్రవేశింపజేసిన వాల్మీకి భావనాశక్తి గొప్పది. శబరి పాత్ర ద్వారా ప్రవేవించి పలికించినటువంటి భక్తి భావన ఇవన్నీ వాల్మీకి భావనాశక్తి వల్లనే ఈ పాత్రలన్నీ సజీవ పాత్రలయినవి.

అలాంటిదే “నాకోసం ఒక కన్ను దుఃఖిస్తుంది, ఇంకొక కన్ను పరుల కొరకు దుఃఖిస్తుంది” అని శివశంకర్ అంటాడు. “ఒక పశువుల కాపరి పిలిచినప్పుడు ఒక కేక వింటే నాలోని కవి బతుకుతాడు” అని పరిగనేరుకునేటువంటి వేళ నా కోసం ఎదిరి చూడు. పత్తికాయ పగిలినప్పుడు ఎట్ల అయితే శబ్దం వినిపిస్తుందో ఆ వేళ నాకోసం విని చూడు అట్లా నా హృదయంలో భావన వినిపించాలి అని అనడం. ఇట్లా శివసాగర్ ఒక కవిత రాసాడు. అట్లా కవి ఎప్పుడో చూసిన విషయాలను తన కవితలో ప్రతిబింబింపజేయడం, తన భావన ఆవిష్కరింపచేయడం. భావనను మనసులో ముద్రింప చేసుకోవడం, మనసులో భద్రపరుచుకోవడం వల్లనే ఆవిష్కరింపచేయడం జరుగుతుంది. నీ భావనాశక్తితో సంఘటనలు, దృశ్యాలు పరిపూర్ణమయ్యేలా పెంచుకోవడం. ఇది పెంచుకుంటే వస్తుందా అంటే, ఇది నీ హృదయంలో నీవు గుర్తు పెట్టుకోవాలని అనుకొని గుర్తుపెట్టుకోవు. నీవు ఏడవాలనుకొని ఏడవవు. అనుకోవు. ఇందాక కృష్ణశాస్త్రి చెప్పినట్లుగా పూలెందుకు సువాసనలు విరజిమ్ముతాయో, నీళ్ళెందుకు పారుతాయో కవి హృదయం కూడా అందుకే తాపత్రయపడుతుంది. ఇది భావనాశక్తి వల్లనే జరుగుతుంది అని చెప్తూ, ఆ భావనాశక్తిని మన లోకజ్ఞానం ద్వారా అనేక సంఘటనల ద్వారా మన హృదయం యొక్క సంస్కారం వల్ల వస్తుంది.

అందరికి కూడా సాధన వల్లనే సాధ్యమవుతుందని అనలేనుగాని, ప్రతీదీ సిద్ధమై ఉండదు. భావనాశక్తి సాధించడం వల్ల వస్తుందని అనలేము. గాని మనం గడించిన అనుభవాలని నీవిగా

చేసుకొని, ఆ ఉద్వేగాలను ఆస్వాదించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం గడిచి వచ్చిన, మనం నడిచి వచ్చిన జీవితమంతా కూడా నీ భావనాశక్తికి రంగస్థలంలాగా, వేదికలాగా ఉంటుంది. నీ ఊహలను ప్రతిబింబిపచేయడం, రోమరోమాన నువ్వు అనుకొని ఆస్వాదించి రాయాలి.

ఇందాకే, రామలింగారెడ్డి చెప్పినట్టు అనుభవాలని నీవిగా చేసుకొని రాస్తే, ఉద్వేగంతో పాత్రల యొక్క భావుకత వ్యక్తమవుతుంది. భావనాశక్తి అందుతుంది. దాన్ని అందుకోవాలని కోరుకుంటూ కవిత్వం భావనాశక్తి అనేది సాధించాలి. భావుకత మీలో ఉంటే తప్ప ఇంతసేపు వినలేరు! (చదవలేరు!)

 

You may also like

Leave a Comment