Home వ్యాసాలు సాహితీగిరి – డా:తిరునగిరి

సాహితీగిరి – డా:తిరునగిరి

ఆధునిక తెలుగు సాహిత్యంలో అద్వితీయమైన రచయిత, “తిరునగరి” గా అందరికీ సుపరిచితుడైన “తిరునగరి రామానుజయ్య” పద్యం, వచనం, గేయం, సమీక్ష, ప్రక్రియ ఏదైనా సరే తనదైన ప్రామాణికతతో సంబంధిత రచనకు రమణీయత తీసుకురావడంలో సిద్ధహస్తుడు.
చక్కని రచయితగానే కాక, ఎంతో చక్కని వక్తగా, కూడా వాసికెక్కిన తిరునగరి తెలుగు మాస్టారు కావడం “పసిడికి పన్నీరు పూసిన” చందమే!! మూడు దశాబ్దాలపాటు ఆయన చేసిన తెలుగు బోధన వ్యాసంగం ద్వారా వేలాది మంది విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాల బోధనతో పాటు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి పెంచి ప్రేరణగా నిలిచారు, అనేకమంది కవులు వికసించడానికి కారకుడయ్యారు,
ఈ తెలుగు సాహితీ కృషి వలుడు 1945 సెప్టెంబర్ 24న జానకిరామక్క- మనోహర్, దంపతులకు భువనగిరి సమీపంలోని రాజపేట వద్ద గల బేగంపేట ప్రాంతంలో జన్మించారు, ఉద్యోగరీత్యా ఎక్కువకాలం ఆలేరులో నివసించారు.


“కవిత్వం రాయందే కాలం గడవదు” అని చెప్పుకునే తిరునగరి రోజు ఒక్క కవిత, రచన, చేయందే నిద్రపోయేవారు కాదు,
ఆయన పద్యం ఎంత దారణగా ఉంటుందో, వారి వచనం కూడా అంతే సుందరంగా కనిపిస్తుంది, అంతే కాదు ఆయన మాటల ప్రవాహం కూడా అంతే ఆకర్షణీయంగా సాగుతుంది, అదే ఆయన్ని మంచి వక్తగా మలిచింది, కమ్మనైన వారి ప్రసంగాల పాల బువ్వ నిండా మధురమైన జీడిపప్పు లాంటి సూక్తులు ఎన్నో!! ఏరుకున్న వారికి ఏరుకున్నన్ని.
ఈయన సందర్భోచితంగా పాడే పద్యాల జావళి ఎంతో మనోహరంగా ఉంటుంది, “దాశరథి” అంటే ఆయనకు అంతులేని అభిమానం, అంతేకాదు “దాశరథి కృష్ణమాచార్య” రాసిన కవిత్వం, పద్యాలు, ఆసాంతం కంఠతా పట్టిన నిజమైన కవితామూర్తి మంతుడు తిరునగరి,
“బాలవీరశతకం” తో ప్రారంభమైన ఆయన సాహితీ ప్రస్థానం, ఐదు దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాగింది, ప్రతీ రచనకూ తనదైన ముద్రతో నిండిన పరిణితి పులిమే వారు,
తిరునగరి కవిత్వంలోని సరళత, సౌకుమార్యత, ఎంత హృద్యంగా ఉంటాయో ఆయన వ్రాసిన “చెమట నా కవిత్వం” అద్దం పడుతుంది.
అతి సున్నితమైన వస్తువును అత్యంత అద్భుతంగా కవిత్వీకరించిడం ఒక్క తిరునగరికే సొంతం, చెమటకు సమాజానికి దాని ఉన్నతికి గల అవినాభావ సంబంధం ఎంత చక్కగా చెప్పార అంటే….!
“ఈ చెమట తోనే/ బీళ్లు వరి మళ్ళయ్యాయి /ఈ చెమట తోనే పట్టణాల్లో ఫ్యాక్టరీలు వెలిశాయి/……. చెమట తోనే/ ఈ ప్రపంచ మనుగడ/చెమ టోడిస్తేనే /కడుపునిండా తిండి కదా/… అంటారు ఆయన,
కవిత్వంలో నిండి ఉండే ఉత్తేజం, ప్రేరణలను, ఆకళిoపు చేసుకున్న తిరునగరి కవితా అక్షరాలన్నీ ఆదిశగానే అడుగులు వేశాయి,…….. మనిషి ఉన్నతుడు కావాలంటే/ ఉన్నతాశయం ఉండాలి/ ఉన్నతికి చేరాలంటే/ ఉద్యమ స్ఫూర్తి ఉండాలి…..
అంటూనే కార్యసాధనలో విజేత కావాలి అంటే కష్టం అనే “మట్టి” అంటకుండా ఉండదు అనే సందేశం హెచ్చరికను ఎంతో చక్కగా అందిస్తారు.
శృంగార నాయకులు, కొవ్వొత్తి, వసంతం కోసం, అక్షర ధార, తిరునగరీయం, మాపల్లె, ఉషోగీతం, నీరాజనం, యాత్ర, చెమట నాకవిత్వం, ఆయన వ్రాసిన పుస్తకాలలో ప్రధానంగా చెప్పవచ్చు,
ఆలోచన, తిరునగరీయం, పద్య సౌరభం, లోకాభిరామాయణం, లోకాలోకనం, వంటి శీర్షికల పేర్లతో పలు ప్రముఖ సాహితీ పత్రికల్లో ధారావాహికంగా వెయ్యికి పైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు.
మాతృభాష తెలుగుతోపాటు ఆంగ్లం, సంస్కృతం, హిందీ, భాషలపట్ల కూడా సాధికారత సాధించిన తిరునగరి, కొన్ని ఆంగ్ల, హిందీ, కవితలను తెలుగులోకి అనువదించారు, ఈయన వ్రాసిన కవితలు, గేయాలు, దేశభక్తి గీతాలు, లలితగీతాలు, వందకు పైగా ఆకాశవాణి, దూరదర్శన్, కేంద్రం నుండి ప్రసారం అయ్యాయి.
తిరునగరి రచనలపై విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు సైతం జరిగాయంటే వారి రచనల్లోని ప్రామాణికత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు, ఆయన ఏ ప్రక్రియలను స్పృశించిన అది “మాననీయత”అనే చేయితోనే !!
తన కవితా వస్తువు “మానవవేదనకు” ప్రతిబింబమై కనిపిస్తుంది, ఆయన రచనా శైలి అతి సరళమై ప్రతి వారిని పలకరిస్తుంది పరవశింప చేస్తుంది.
నిత్య కవిత్వ చైతన్య శీలి తిరునగరి యొక్క భాష సాధికారతను మెచ్చిన భోపాల్ లోని “అఖిలభారత భాషా సాహిత్య సమ్మేళన్” వారు 2003 సంవత్సరపు “భారత్ భాషా భూషణ్” పేరున “గౌరవ డాక్టరేట్”ను అందించారు.
తిరునగరి యొక్క విశేష సాహితీ కృషిని స్థానిక విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలు, కూడా గుర్తించి గౌరవించాయి, అందులో భాగంగానే తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, “ఆట వారి” సత్కారంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే “దాశరధి పురస్కారం” ఇది తన వజ్రోత్సవ పుట్టిన సంవత్సరం 2020లో అందుకోవడం కాకతాళీయమే అయినా అది ఆయనకు లభించిన సత్కారాలు అన్నిటికీ మకుటాయమానంగా నిలుస్తుంది.
నిత్యం అధ్యయనం, భాషణం, రచన, అనే త్రివేణి పథంలో పయనించిన తిరునగరి సాహితీ ప్రయాణంలో మాతృ సాహిత్యాన్ని ఎంత అవగాహన చేసుకున్నారో! పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను, అంతే ఆకళింపు చేసుకున్న సాహితిపిపాసి తనం ఆయనలో అడుగడుగునా కనిపిస్తుంది, “మనిషే జెండా మానవత్వమే ఎజెండా”గాసాగిన తిరునగరి కలం ఏవాదానికి చిక్కని మానవత్వపు అక్షరమై నిలిచింది.
దాశరధి అన్నట్టు తిరునగరి కవితలు” తేజ స్వంతాలు ఓజ స్వంతాలు” “అభ్యుదయ”అంగీకరించిన తిరునగరి నిండా మాననీయ రక్తం ప్రవహిస్తుంది,
చివరిదాకా తనదైన విజన్ తో కలం సేద్యం చేసిన ఈ అక్షర కృషివలుడు హృదయ సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోనే 25 ఏప్రిల్ 2021 న “ఆచార్య తిరువడిగలళి”కి చేరినారు, ఆయన భౌతిక రూపం కనుమరుగైన తన కనువిందైన కవనం ద్వారా మన కళ్ళల్లో సదా కదలాడుతూనే ఉంటారు.

••••••••••••••••••••••• {నివాళి} డా:అమ్మిన శ్రీనివాసరాజు,

You may also like

Leave a Comment