Home ఇంట‌ర్వ్యూలు ‘మంచి’ అనేది సమాజంలోకి వెళ్లాలి – అంపశయ్య నవీన్

‘మంచి’ అనేది సమాజంలోకి వెళ్లాలి – అంపశయ్య నవీన్

by Aruna Dhulipala

కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ నవలాకారులు అంపశయ్య నవీన్ గారితో మయూఖ ముఖాముఖి…….

తమ రచనల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసి, అనేకుల అభిమానాన్ని సంపాదించుకొని ‘అంపశయ్య’ అనే తమ నవలనే ఇంటిపేరుగా చేసుకొని ప్రసిద్ధి వహించిన ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ గారి జీవనం మరియు సాహిత్య ప్రస్థానాలను గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్🙏🏼

మీ నవలల ద్వారా విశేష ప్రజాదరణ పొంది, ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు. అటువంటి మీ జీవిత విశేషాలను మా మయూఖ పాఠకులకు పరిచయం చేయడం సదవకాశంగా భావిస్తున్నాం. సమగ్ర రూపంలో మీ జీవిత విశేషాలను తెలియజేయండి. మొదటగా….

జ:    నమస్కారం! నేను పాలకుర్తి దగ్గర వావిలాల గ్రామం. దొంగరి పిచ్చమ్మ, దొంగరి నారాయణ నా తల్లిదండ్రులు. నేను 1941, డిసెంబర్ 24 న పుట్టాను. మా నాన్నగారు పూర్తి వ్యవసాయదారుడు. మాకు చాలా భూములు ఉండేవి. నేను కూడా అదే వృత్తి స్వీకరించాలని మా నాన్న కోరిక. కానీ నాకు ఇష్టం లేకుండేది. బాగా చదువుకొని లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించుకున్నాను. ఒక రచయితగా అందరి మన్ననలు పొందాను. నాకు ఒక తమ్ముడు, నలుగురు సిస్టర్స్. నేను ఉద్యోగం చేసేటప్పటికి ఇద్దరు సిస్టర్స్ ని చదివించగలిగాను. వాళ్లిద్దరూ టీచర్లు అయ్యారు. మా తమ్ముడు ఎమ్. కామ్ చేసి జాబ్ సంపాదించుకున్నాడు. మా అమ్మ సాధారణ గృహిణి.

జ:      నేను మా ఊళ్ళో మూడవతరగతి వరకు చదివాను. నిజాం హయాం కాబట్టి ఒకే ఒక్క ముస్లిం టీచరు ఉండేవాడు. ఉర్దూ మీడియం. నాకు నచ్చేది కాదు. స్వాతంత్య్రం వచ్చాక  తెలుగు మీడియం వచ్చింది. ఒక మంచి టీచరు స్కూలుకి రావడంతో చదువు మీద ఇంట్రెస్ట్ కలిగింది. మా ఊరికి దగ్గర్లో ఉన్న కొడకండ్లలో మా ఇద్దరు మేనత్తలు ఉండేవారు. అక్కడ నన్ను నాలుగవ తరగతిలో చేర్పించాడు మా నాన్న. అక్కడికి దగ్గర్లోనే ‘కొరివి’ అనే ఊళ్ళో మా చిన్నమ్మ ఉండేది. ఆ ఊళ్ళో ఐదవ తరగతి చదివాను. తిరుమల గిరి ఊళ్ళో 6,7 తరగతులు చదివాను. ఇక ఎనిమిదవ తరగతికి చుట్టుపక్కల అవకాశం లేదు.  అందువల్ల వరంగల్ ఎ. వి. స్కూల్లో చేరాను. అది మంచి ప్రయివేటు స్కూల్. విశ్వనాథ వారి తమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు మాకు తెలుగు చెప్పేవారు. మాథ్స్ కొండల్ రావు గారు చెప్పేవారు. మాకు ప్రిన్సిపాల్ గా ఉన్న వై. కె. శాస్త్రిగారు ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేవారు. మంత్లీ టెస్ట్ పెడితే నేనొక్కణ్ణే పాసవడంతో ఆయన నామీద ప్రత్యేక దృష్టి పెట్టారు. 1957 లో మెట్రిక్యులేషన్ మంచి మార్కులతో పాసయ్యాను. అదే సమయంలో కరువు రావడం, వ్యవసాయాధారిత కుటుంబం కావడం వల్ల మా నాన్న ఇక కాలేజీలో చదివించలేనని మెట్రిక్యులేషన్ తో కూడా జాబ్ వస్తుంది కాబట్టి ఉద్యోగం చూసుకోమన్నాడు. నిజానికి టీచరు జాబ్ చేయడం నాకిష్టం లేకుండేది.

అరుణధూళిపాళ అంపశయ్య నవీన్ గారితో

జ:   ఆ సమయంలో “చూద్దాం! పరిస్థితులు మారకపోతాయా?” అన్న ఆశతో ఒక సంవత్సరం పాటు ఊళ్ళోనే వ్యవసాయపు పనులలో మా నాన్నకు సహాయం చేస్తుండేవాడిని. కానీ నా వల్ల కాలేదు. అమ్మ దగ్గర పది రూపాయలు తీసుకొని వరంగల్లుకు వచ్చాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అప్లికేషను పెట్టాను. పి యు సి లో సీట్ వచ్చింది. నాకు 8వతరగతి నుండే వంట చేసుకోవడం అలవాటు. మా స్నేహితులతో కలిసి ‘సత్సంగ్’ అనే దాంట్లో రూమ్ కిరాయికి తీసుకున్నాం. పియుసి తర్వాత బిఏ కూడా అక్కడే పూర్తి చేశాను. జి.వి.సుబ్రహ్మణ్యం గారు, ఇరివెంటి కృష్ణమూర్తి గారు, వేటూరి ఆనందమూర్తి గారు వంటి హేమాహేమీలు ఉపాధ్యాయులుగా ఉండడం నాకు తెలుగు సాహిత్యం మీద అభిరుచి కల్గించింది. శ్రీనివాస ఉపాధ్యాయ అని ఎకనామిక్స్ అద్భుతంగా చెప్పేవాడు. నిజంగా చెప్పాలంటే ఆ కాలేజీ నన్ను బాగా ప్రభావితం చేసింది. మొదటిసారి ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ చూశాక ఇక్కడ చదవకపోతే నా జన్మ వ్యర్థం అనిపించింది. మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. మళ్లీ అమ్మ చాటుగా డబ్బులు ఇచ్చింది. స్కాలర్ షిప్ కూడా కొంత వచ్చింది. వరవరరావు, రాంరెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్స్. ముందు పొలిటికల్ సైన్సు, తెలుగు రెండు సబ్జెక్టులలో  సీట్ వచ్చింది. కానీ నా ఫ్రెండ్స్ ఎకనామిక్స్ అయితే బాగుంటుందని, వెంటనే ఉద్యోగం కూడా వస్తుందని ఒత్తిడి చేశారు. దాంట్లో అప్లై చేస్తే అందులో కూడా సీట్ వచ్చింది. ఆ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్. ఏ పూర్తి చేశాను. వాళ్ళు చెప్పినట్టు ఎమ్. ఏ అయిపోయిన రెండు నెలలకే జాబ్ వచ్చింది.

జ:    వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ నన్ను బాగా ప్రభావితం చేసిందని ఇందాక చెప్పాను కదా! అక్కడ ఎప్పుడూ కథానిక, లేఖ, కవిత్వం, విమర్శ, ఇట్లా అన్ని ప్రక్రియల మీద సాహిత్య పోటీలు జరిగేవి. వాటిల్లో నేను పాల్గొనేవాడిని. తేటగీతిలో పద్యాలు కూడా రాశాను. కానీ గద్యం మీద ఉన్న ఆసక్తి పద్యం మీద ఉండేది కాదు. నేను ఎ. వి స్కూల్లో చదువుతున్నప్పుడే ఒక కథ రాసి విశ్వనాథ వెంకటేశ్వర్లు గారికి చూపెడితే చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. అడవి బాపిరాజు నవలలన్నీ చదివి వాటి మీద ఒక వ్యాసం రాసి జి.వి.సుబ్రహ్మణ్యం గారికి చూపితే “ఇంత చిన్న వయసులో చాలా బాగా రాశావు” అని ప్రశంసించారు. ఒక యదార్థ సంఘటన తీసుకొని దాన్ని కథగా మలచి పోటీకి పంపితే ప్రైజ్ వచ్చింది. మా కాలేజీలో మంచి లైబ్రరీ ఉండేది. బుచ్చిబాబు నవలలు నన్ను బాగా ఆకర్షించాయి. మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ వచ్చారు. చలం మ్యూజింగ్స్, బుచ్చిబాబు ఆశావాది నవల ఆ ఉత్సవంలో నాకు వచ్చిన బహుమతులు. అవి నన్ను బాగా ఆకట్టుకోవడంతో వాళ్ళ రచనలన్నీ చదివాను. అప్పటికి చదవడానికి నాకు శ్రీశ్రీ పుస్తకాలు నాకు దొరకలేదు. ఒకసారి వరంగల్ చౌరాస్తాలో బస్సు కోసం నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఒకతను పుస్తకాలు అమ్ముతున్నాడు. అందులో శ్రీశ్రీ మహాప్రస్థానం కనిపించింది. నా దగ్గర బస్సు టికెట్ కోసం ఒక్క రూపాయి మాత్రమే ఉంది. పుస్తకం వెల ఒక్క రూపాయి. వెంటనే పుస్తకం కొని హన్మకొండ వరకు నడుచుకుంటూ వచ్చాను. ప్రతీ సంవత్సరం కాలేజీలో పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకునేవాడిని. శ్రీశ్రీ, బుచ్చిబాబు, చలం వీళ్ళ ప్రభావం నా మీద చాలా ఎక్కువ.

జ:   నేను మొదటినుండీ నవలలు విపరీతంగా చదివేవాణ్ణి. ఎమ్.ఏ సెకండ్ ఇయర్ లో డబ్బులు లేక చాలా కష్టపడ్డాను. ఈ కష్టాలన్నిటిని ఒక నవలగా రాస్తే ఎట్లా ఉంటుంది అనిపించింది. నల్గొండలో నాకు ఉద్యోగం వచ్చిన తరువాత అంపశయ్య రాసి వరవరరావుకు చూపించాను. చాలా బాగుందని చెప్పాడు. దీన్ని “Stream of Consciousness” అంటారని చెప్పాడు. అట్లా ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. ఆ రకంగా మొదటి నవల రాయడం జరిగింది.

జ:    రవి పాత్ర పూర్తిగా నాదే అనడంలో ఎటువంటి సందేహం లేదు (పెద్దగా నవ్వుతూ). అయితే ఈ నవల ఒకేసారి రాసింది కాదు. రెండు సంవత్సరాల్లో పూర్తయింది. నవల పుస్తకరూపం రావడానికి చాలా కష్టపడ్డాను. ఈ నవలను చూసి మా స్నేహితుడు ఆంధ్రజ్యోతికి పంపుమని సలహా ఇచ్చాడు. ఆ రోజుల్లో కొత్తవారికి వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు. విజయవాడకు వెళ్లి, పత్రిక ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్యశర్మను కలిసి నవల ఇచ్చాను. ఆయన రెండు నెలల్లో చెప్తానన్నాడు. నాలుగు నెలలు ఎదురుచూసినా ఎటువంటి సమాచారం రాలేదు. మళ్లీ వెళ్లి కలిశాను. “అంత తొందరైతే ఎలా? మీకు ఇష్టం లేకపోతే తీసుకువెళ్లండి” అన్నాడు నిర్లక్ష్యంగా. వెంటనే తెచ్చుకున్నాను. హైదరాబాద్ లో ‘యువ’ అనే మాసపత్రిక వచ్చేది. దానికి ఎడిటర్ చక్రపాణి. కానీ మొత్తం చూసే వ్యక్తి దండమూడి మహీధర్. ఈయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవాడు. ఆయనకు ఇచ్చాను. కొత్తగా చాలా బాగుందని, ఎడిటర్ కు చూపించి చెప్తానన్నాడు. చక్రపాణి గారు ఓ పదిపేజీలు చదివి “ఇది వేస్తే మన పేపర్ సర్క్యులేషన్ పడిపోతుంది” అన్నాడట. నాకసలు ఏమీ తోచలేదు. చదివిన వాళ్ళు అంతా బాగుంది అంటున్నారు. కానీ ఏ పత్రికలో రావడం లేదు. పత్రికలో రాకుండా ప్రజలకు చేరేదెలా? వరవరరావు, నేను చాలా చర్చించుకున్నాం. ఆ సమయంలో మేం ‘సృజన’ అనే మ్యాగజైన్ తెస్తున్నాం. అది త్రైమాసిక పత్రిక. దాంట్లో వేయాలంటే అంత పెద్ద నవలను వేయడం కష్టం కదా! ముందు సీరియల్ గా వేద్దామనుకున్నాం. పాఠకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. పుస్తకంగా వేద్దామంటే డబ్బులు లేవు. నా భార్య తన బంగారు గొలుసు ఇచ్చి బ్యాంకులో పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ప్రింటు చేయమన్నది. ఆ గొలుసుకు 1200 రూపాయలు వచ్చాయి. దాంతో పుస్తకంగా ప్రచురించాం. నర్సింహారెడ్డి అనే చిత్రకారుడు రేఖాచిత్రంగా ముఖచిత్రం వేశాడు. అది కూడా అందరినీ చాలా ఆకట్టుకుంది. 4,5 నెలల్లోనే 100 పుస్తకాలు అయిపోయాయి. అద్దేపల్లి రామ్మోహన్ గారు, ఆవంత్స సోమసుందర్ గారు, ఆరుద్ర గారు చదివి ప్రశంసించారు. శ్రీశ్రీ గారి షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. నేనూ వెళ్ళాను. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు నేను వచ్చానని తెలిసి నన్ను కలవడానికి వచ్చారు. మా హాస్టల్ లో జరుగుతున్న విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టు రాశారు. ఇవన్నీ మీకెట్లా తెలిశాయి? అని ఆశ్చర్యంగా అడిగారు. నా రచన అందరినీ ఆకట్టుకుంటున్నదని అర్థమైంది. ఇప్పటికి 17 పర్యాయాలు రీప్రింట్ అవడమే పాఠకుల ఆదరణకు ఉదాహరణ.

జ:    బిభూతి భూషణ్ అనే రచయిత రాసిన బెంగాలీ నవలను ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే  పథర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సంసార్ అనే సీక్వెల్ గా మూడు సినిమాలు తీశాడు. అది చూసి అట్లా రాయాలనే ప్రేరణ కలిగింది. మొదటి నవల ‘అంపశయ్య’లో రవి అనేక కష్టాల మధ్య చదువుకుంటాడు. రెండవది ‘ముళ్లపొదలు’ .రవి, అతని స్నేహితుల పాత్రలతో రాశాను. వారి ఆలోచనా మార్గాలు వేరు. ఒకరేమో లెఫ్టిస్ట్ భావాలు కలవాడు. మరొకరు నక్సలైట్, ఒకతను ప్రత్యేక తెలంగాణ కోరుకునేవాడు. మరొకరు అమెరికా వెళ్లాలనే కలలు కనేవాడు. రవి సాహిత్యంలో ఉన్నవాడు. ఆ కాలంలో జాబ్స్ పొందడానికి ఎన్ని కష్టాలు ఉండేవో ఒక్కో క్యారెక్టర్ ద్వారా వివరించాను. దాశరథి రంగాచార్య నాకు స్నేహితుడు. కథ చదివి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ముళ్లపొదలు అనే పేరు ఆయనే పెట్టాడు. ఇక మూడవది ‘అంతస్స్రవంతి’. ఇందులో రవికి జాబ్ రావడం, పెళ్లి జరగడం, వైవాహిక జీవితంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు అన్నీ వివరించాను. మొత్తంగా ఒక వ్యక్తి జీవితంలోని సంఘర్షణ పరిపూర్ణంగా మూడు నవలల్లో ఉంటుంది.

జ:  ఆ కాలంలో జరిగిన ఆంధ్ర మహాసభలు పునరుజ్జీవనాన్ని కలిగించాయని చెప్పుకోవాలి. దాంట్లో భాగంగానే గ్రంథాలయోద్యమం వచ్చింది. ప్రతీ ఊళ్లో ఒక స్కూల్, ఒక లైబ్రరీ ఏర్పాటు, వెట్టిచాకిరీ నిర్మూలన వంటివి ఆంధ్ర మహాసభ లక్ష్యాలు. ఆ తరువాత అది అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది. అయితే 11 వ ఆంధ్ర మహాసభ జరిగేనాటికి అది పూర్తిగా కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1944లో భువనగిరిలో 11 వ ఆంధ్రమహాసభ ఘనంగా నిర్వహించారు. దీనికి ముందు అన్ని గ్రామాల్లో మీటింగులు పెట్టి, దాని గురించి వివరించి, సభకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యేటట్లు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే మా ఊళ్లోనూ ఒక మీటింగ్ నిర్వహించారు. రావి నారాయణరెడ్డి దానికి అధ్యక్షుడు. ఆయనతో పాటు బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా సభకు వచ్చారు. 11 వ మహాసభకు సంకేతంగా ఒక బండిని బాగా అలంకరించి, 11 జతల ఎడ్లతో వీధుల వెంబడి ఉత్సవంగా తిప్పారు. అప్పుడు నాకు నాలుగైదేండ్ల వయస్సు. ఆ ఘట్టం నన్ను బాగా ఆకర్షించింది. రావి నారాయణ రెడ్డి గారు ప్రధాన వక్తగా ఆనాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. అంపశయ్య రాసిన తర్వాత మరో నవల రాయలని ఆలోచన వచ్చింది. ఈ 11వ మహాసభ గురించి , తెలంగాణ పరిస్థితులను గురించి రాయాలని కాలరేఖలు రాశాను.

జ:    అవును. రవిత్రయం లాగా “కాలరేఖలు” కూడా ట్రయోలజీలో రాశాను. నేను దీంట్లో పూర్తి తెలంగాణ చరిత్రను రాయాలనుకున్నాను. 1944 నుండి మొదలుకొని 1995 వరకు తెలంగాణా ప్రజల చరిత్ర అది. నేను 1996 రిటైర్ అయ్యాను. అప్పుడు రాసిన నవల ఇది. ఇంత చరిత్రను ఒకే పుస్తకంగా కూర్చడం చాలా కష్టం. అందుకే మూడు భాగాలుగా చేశాను. 11 జతల ఎడ్ల బండి దానికి ప్రేరణ. మూడూ కలిపి1600 పేజీలకు పైగా ఉంటుంది. మొదటిది కాలరేఖలు 1944 నుండి 1956 వరకు తెలంగాణలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు, చారిత్రక సంఘటనలను గురించి రాశాను. దీనికే 2004 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రెండవది చెదిరిన స్వప్నాలు. ఇందులో 1957 నుండి 1970 వరకు ఆ కాలంలో జరిగిన చైనా, పాకిస్తాన్ యుద్దాలు మొదలైన సంఘటనలతో పాటు భారతీయులు స్వతంత్రం వచ్చాక కన్న కలలు నెహ్రూ పాలనలో భంగం కావడాన్ని చెదిరిన స్వప్నాలుగా వివరించాను. ఇక 1970 నుండి 1995 వరకు జరిగిన ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్య, ఆర్థికంగా వచ్చిన మార్పులు వీటన్నింటినీ మూడవది “బాంధవ్యాలు” లో చిత్రించాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉండే సమస్యలను వివరించాను. రవిత్రయం వ్యక్తి ప్రధానమైతే, కాలరేఖలు చరిత్ర ప్రధానమైంది. నా స్నేహితుడు, నాకు శిష్యుడు ఒకతను నేను రాస్తున్నప్పుడు చూసి ఇంత పెద్ద పుస్తకం వేయడం కష్టం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లు నవల గానీ ఆటో బయోగ్రఫీ కానీ రాసినవాళ్లకు ముద్రించే స్కీమ్ ఒకటి పెట్టారని, దానికి పంపుమని సలహా ఇచ్చాడు. నా పేరు మీద అతనే ఫారం నింపి పంపాడు. ఎంతో ఆశ్చర్యం! కేంద్రప్రభుత్వం రెండేళ్లలో దానిని పూర్తి చేయడానికి నెలకు ఆరువేల చొప్పున సీనియర్ ఫెలో షిప్ ఇచ్చింది. అట్లా రెండేళ్లలో దాన్ని పూర్తిచేశాను. విమర్శకుల నుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నాను.

జ:    సహజంగా ఇది హైస్కూల్లో చదువుతున్నప్పటి నుండే మొదలయింది. అంతకుముందు పల్లెటూళ్ళో ఉండేవాడిని కాబట్టి తెలియదు. వరంగల్ వచ్చాక మొట్టమొదటి సారి 8వ తరగతిలో మా స్నేహితుడు “మనోహర” అనే డబ్బింగ్ మూవీకి తీసుకువెళ్లాడు. అట్లా అలవాటయి వరుసగా చూసేవాణ్ణి. సినిమాలు చూడడం వల్ల నా చదువుకు ఎటువంటి ఆటంకం కలుగలేదు. జ్ఞాపకశక్తి బాగా ఉండేది. అసలు మొదట్లో సినిమాలకు కథలు రాయాలని, నటించాలని ఉండేది. కానీ తెలంగాణా వాళ్లకు అవకాశం రాదని అర్థమైంది. మంచి కథలతో కూడిన ఆర్ట్ సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడేవాణ్ణి. సత్యజిత్ రే సీక్వెల్ గా తీసిన సినిమాలు చూశాను. నేను కరీంనగర్ లో పన్నెండు సంవత్సరాలు ఉన్నాను. అక్కడ స్నేహితులతో కలిసి ఫిలిం సొసైటీ ఏర్పాటు చేశాం. దాని ద్వారా బెంగాలీ, మరాఠీ వాటిలోని మంచి సినిమాలు ప్రదర్శింపజేశాం. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సినిమా అనిపించుకున్న సినిమాలన్నీ ఆ సొసైటీ ద్వారా ప్రదర్శించాం. అక్కడినుండి నాకు వరంగల్ ఉమెన్స్ కాలేజీకి ట్రాన్స్ ఫర్ అయింది. అప్పటికే వరంగల్ లో ఫిలిం సొసైటీ ఉంది. దాన్ని ఇంకా అభివృద్ధి చేశాం.

జ:  అవును. నా నవలల్లో నేను చూసిన సినిమాల ప్రభావం ఉంది. మీరన్నట్టు దృక్కోణం కూడా ఆ విధంగా వచ్చిందే. జపనీస్ డైరెక్టర్ అకీరా కురోజవా తీసిన ‘Rashoman’ సినిమాలో ఉన్న కథ చాలా విభిన్నమైంది. ఒక జరిగిన సంఘటనను చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తారు. ఎవరి ఆలోచనా విధానం వారిది. ఆ సినిమా ఆధారంగా “దృక్కోణాలు” రాశాను. ఇతివృత్తం ఏంటంటే ఒక డెంటిస్ట్ దగ్గర పనిచేసే వ్యక్తి ఆయనను దగ్గరగా చూస్తూ అన్ని పనులూ నేర్చుకున్నాడు. మంచి మనసు కలవాడు. తనే ఒక క్లినిక్ పెట్టి, ఫీజు తక్కువగా తీసుకొని వైద్యం చేసేవాడు. చాలా మంది ఆయన మీద నమ్మకంతో వచ్చేవారు. వచ్చినవారికి పంటి సమస్యలు బాగా తగ్గిపోయేవి. ఒకరోజు ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన పన్ను తీయడానికి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె నొప్పి భయంతో గట్టిగా అరిచింది. దాంతో ఆయనంటే గిట్టని వాళ్లు ఆయన మీద నిందలు మోపారు. ఆయన మంచితనాన్ని తెలిసిన వాళ్లేమో ఆయన అలాంటివాడు కాదనడం. ఇట్లా అందరూ అనేకరకాలుగా మాట్లాడుకున్నారు. ఆ మాటలు నేను విన్నాను. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇంత జరిగితే అసలేమైందో ఎవరికీ తెలియదు. చెప్పేవాళ్లూ ఉండరు. ఇలాంటివి లోకంలో ఎన్నో జరుగుతుంటాయి. అందుకే నా ఉద్దేశ్యం ఏమిటంటే ‘మంచి’ అనేది సమాజంలోకి, ప్రజల్లోకి వెళ్లాలని.

నవీన్ గారి రచనలు

జ:   అంపశయ్య నా జీవితమే కాబట్టి మొదట అదే ఇష్టం. ఆ తర్వాత నాకు బాగా పేరు తెచ్చిన నవల, ఇష్టమైన నవల “చీకటిరోజులు”. 1975లో ఎమర్జెన్సీ విధించారు. ఇందిరాగాంధీని ఎలక్షన్స్ లో పాల్గొనకూడదని జడ్జిమెంట్ వచ్చినరోజులు. ఆమె రిజైన్ చేయకుండా తనకు వ్యతిరేకులైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయించింది. నా స్నేహితుడు తిరుపతయ్య. అతను అమాయకుడు. వరవరరావు వల్ల విరసంలో జాయిన్ అయ్యాడు. నన్ను కూడా చేరమని ఒత్తిడి చేశారు కానీ నేను చేరలేదు. దేంట్లోనైనా ఒక పక్షం వహించడం నాకు ఇష్టం ఉండదు. తటస్థంగా ఉంటాను. వరవరరావు తిరుపతయ్యకు రాసిన రెండు, మూడు ఉత్తరాలు ఆయనకు చేరకుండానే వాళ్ల కంట్లో పడడం వల్ల తిరుపతయ్యను కూడా లెఫ్టిస్టు అనుకొని అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచారు. నేను వెళ్లి అతన్ని కలవడానికి కూడా వీలు లేకుండేది. ఆయన విడుదలయ్యాక ఆయనను కలిశాను. అక్కడ తనను అంతగా హింసించకపోయినా త కళ్ళముందు జరిగిన హింసాత్మకమైన విషయాలను గురించి చెప్పాడు. “ఇవన్నీ ఒక నవల రాయొచ్చు కదా!” అని అడిగాను. “ఇప్పటికే వాళ్ళ దృష్టిలో నేనున్నాను. నువ్వు రాయి” అన్నాడు. ఆలోచించి నవల లాగా కాక ఒక డైరీ లాగా రాయాలనుకున్నాను. “చీకటిరోజులు” అనే పేరుతో రాశాను. ఈనాడులో నా ఫ్రెండ్ చలసాని ప్రసాదరావు ఇది చదివి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆదివారం ఎడిషన్ లో వేద్దామన్నాడు. రామోజీరావుకు చూపించాడు. అప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. నా నవల కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న నవల. కాబట్టి పేపర్ లో వేస్తే ఇబ్బంది అవుతుందని ఆయన అన్నాడు. పత్రికల్లో వేయించడానికి ఎన్నో అగచాట్లు ఎదుర్కొని చివరకు ప్రత్యేకంగానే పుస్తకం వేశాను.

జ:   చలం గారి జీవితంలోని విషయాలను “ప్రేమకు ఆవలి తీరం” అనే నవలగా రాశాను. వాస్తవానికి చెప్పాలంటే 1950 తర్వాత చలం అంతకుముందు చలం కాదు. రమణాశ్రమానికి వెళ్లిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు “మ్యూజింగ్స్” లో భగవద్గీతను ‘సిల్లీ బుక్’ అని రాసిన వ్యక్తి అక్కడికి వెళ్లిన తర్వాత భగవద్గీతకు వ్యాఖ్యానం రాయడం చాలా ఆశ్చర్యం. ఆ మాయలో ఎంతగా పడిపోయాడంటే.. 1962లో “అష్టగ్రహ కూటమి” అనేది ఒకటి వస్తున్నట్లు, దానివల్ల ప్రళయం సంభవించబోతున్నట్లు వచ్చిన వార్తలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. దానికి ఆయన ఆ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకొని బతకాలంటే రమణ మహర్షి ఆశ్రమానికి రమ్మని శ్రీశ్రీ వంటి ఎంతోమందికి ఉత్తరాలు రాయడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నాకు ఆయనతో ప్రత్యక్షంగా పరిచయం లేకున్నా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఈ విషయంలో నాకు కూడా ఆ ఉత్తరం వచ్చింది. అంతేకాదు ఉత్తరంతో పాటు చిన్న విభూతి పొట్లాన్ని కూడా పంపాడు. మూఢ నమ్మకాలను పూర్తిగా ఖండిస్తూ స్త్రీ, పురుష సమానత్వాన్నీ, స్త్రీ స్వేచ్ఛను కోరుకున్న వ్యక్తి, ఆ భావజాలంతో పుస్తకాలు రాసిన వ్యక్తి మూఢనమ్మకాల వలయంలో చిక్కుకుపోవడం నాకు ఎట్లాగో అనిపించింది. అందువల్ల ఇటువంటి విషయాలు కాకుండా ఆయన అంతకుముందున్న చలంగానే రాశాను. ఇది “Beyond the shore of love” అనే పేరుతో ఇంగ్లీషులోకి అనువదించబడింది.

జ:   నా భార్య అనసూయ. అంపశయ్య నవలా ముద్రణకు ఆమె బంగారు గొలుసు ఇవ్వడం గురించి మీకు చెప్పాను కదా! మా అరవయ్యేళ్ళ దాంపత్యానికి సంకేతంగా “అనురాగదీపం” అని పేరు పెట్టి నవల రాశాను. ఆమెతో నా స్మృతులు, ఆమె లేకపోవడం వల్ల కలిగిన వేదనకు అక్షరరూపం ఈ నవల. అందులో ఎక్కడా కల్పన లేదు. నాకు ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఉన్నది ఉన్నట్టు రాశాను. ఆమె ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి అది క్యాన్సర్ అని తేలింది. అది చివరిదశ. ఆమెకు కూడా తాను ఎక్కువరోజులు బతకదని తెలిసిపోయింది. ఇక రెండ్రోజుల్లో చనిపోతుందనగా నాతో రాస్తూనే ఉండమని, రాయడం ఆపవద్దని, మా చిన్నబ్బాయికి సమస్య ఉండడం వల్ల వాడిని బాగా చూసుకోమని ఈ రెండు విషయాలు గట్టిగా చెప్పింది. ఆమె మాటలను ఆచరిస్తూనే ఉన్నాను.

జ:   ఇవేంటంటే ఇవి ఏర్పరచుకున్న వ్యక్తులు వాటికి కట్టుబడి ఉంటారు. ఉదాహరణకు స్త్రీ వాదం రాకముందే నేను స్త్రీల పట్ల సానుభూతితో రాసిన ఎన్నో నవలలు ఉన్నాయి. అందరూ అదే మాట అనడం జరిగింది కూడా. కానీ ఎప్పుడూ అదే వాదం నిలుస్తుందనడానికి వీలుండదు. కాలక్రమంలో మార్పులు జరగొచ్చు. జరిగిన మార్పులను బట్టి వాళ్ల దృక్పథాలను వాళ్లు మార్చుకోరు. దానివల్ల నష్టాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. ఈ వాదాలకంటే ఏది మంచి, ఏది న్యాయమో ఆ పక్షం వహించి ఉండడం సమాజానికి ఉపయోగకారి అవుతుంది.

జ:   ముఖ్యంగా ఒక నవల అంటే ఆ నవలల్లో ఉండే పాత్రలు రీడర్ కు కనెక్ట్ కావాలి. తనను తాను చూసుకున్నట్టు ఉండాలి. తనలో ఆ పాత్ర ప్రతిబింబించాలి. సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఇతివృత్తాలు కావాలి. ఊహలకు, కల్పనలకు తావు ఉండకూడదు. నేను ఏది రాసినా అలాగే రాశాను. చాలామంది ఫోన్లు చేసి చెప్పేవారు. అందువల్లే అందరినీ ఆకట్టుకున్నాయి. యద్దనపూడి సులోచనారాణి నవలలు బాగా చదివేవాడిని. ఏ రచయిత్రి రచనలు కూడా నేనంతగా చదవలేదు. ఆమె ఒకసారి నాతో “మీ నవలలు చాలా బాగుంటాయి” అన్నారు. ఆమెను ప్రత్యక్షంగా కలవాలనుకున్నాను. కానీ ఆ కోరిక తీరలేదు.

జ:   లేదు. అట్లా చెప్పడానికి వీలు లేదు. మంచి రచయిత లక్షణమేమిటంటే ‘ఇది మంచి’ అని చెప్పకూడదు. తాను చెప్పదలచుకున్నది మాత్రమే చెప్పాలి. కానీ ‘ఇదే’ అని నిర్ధారణ చేయకూడదు. ఒక రచనను చదివినప్పుడు పాఠకుడు అది మంచిదా కాదా? సమాజానికి ఉపయోగపడుతుందా లేదా? అని తానే నిర్ణయించుకోవాలి. నేను రాసిన “రక్త కాసారం” నవలలో ఆనాడు పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఉండే వాతావరణాన్ని చిత్రించాను. ఒక కవి “మీరు ఎవరిని సమర్థిస్తున్నారని, స్పష్టంగా చెప్పకుండా ఎందుకు వదిలేశార”ని నన్నడిగాడు. అక్కడ ఎవరు కరెక్ట్ అనేది చెప్పినందువల్ల అది కేవలం నా అభిప్రాయమే అవుతుంది. అందువల్ల అక్కడ వాతావరణాన్ని చిత్రించినప్పుడు దాన్ని బట్టి పాఠకుడు మంచి చెడుల అంచనా వేస్తాడు. కాబట్టి రచయిత ఎప్పుడూ తన అభిప్రాయాలను పాఠకుల మీద రుద్దకూడదని నా ఉద్దేశ్యం.

జ:  ఉన్నమాట నిజమే (నవ్వుతూ). నా జ్ఞాపకాలను గురించి రాయాలని ఉంది. స్నేహితులు కూడా చెప్తున్నారు. బహుశా 1770-71 ప్రాంతంలో శ్రీశ్రీ షష్టిపూర్తి ఎంతో వైభవంగా జరిగింది. ఎంతోమంది సాహితీ దిగ్గజాలు వచ్చారు. ఒకవేళ ఆనాటి నా జ్ఞాపకాలను నేను రాస్తే అప్పటి రచయితలు, కవులు, వారి మాటలు అన్నీ ఈనాటి కాలం వారికి తెలుస్తాయి కదా! ఒక సాహితీవేత్తగా, నవలాకారునిగా, నాకున్న అనుభవాలను, మధురస్మృతులను రాసుకుంటే తర్వాతి తరాలకు తెలుస్తాయి. అందువల్ల అది రాయాలని కోరిక. ఇక మీరడిగినట్టు అసంతృప్తి కూడా ఉంది. ఒక పత్రికకు ఎడిటర్ కావాలని ఉండింది. ‘సృజన’ అని వరవరరావుతో కలిసి పెట్టాం. ఆయనే ఎడిటర్.  ఆధునిక సాహిత్య వేదిక అనేది దాని టాగ్ లైన్. అంటే కొత్తగా వచ్చే రచనలను ప్రోత్సహించాలని మా ఉద్దేశ్యం. మొదట్లో అది త్రైమాసిక పత్రిక. తరువాత మాసపత్రికగా మార్చాం. నా పత్రిక అన్నట్టు వర్క్ చేసేవాడిని. 15 ఎడిషన్స్ వచ్చాక వరవరరావు పూర్తిగా విప్లవ సాహిత్యం వైపు వెళ్లాడు. అప్పుడది విప్లవ సాహిత్యవేదిక అనిపించుకుంటుంది కానీ ఆధునిక సాహిత్యవేదిక కాదు. అందుకే వదిలేశాను. ఆవిధంగా నా కోరిక నెరవేరలేదు. రాజకీయాలతో ప్రమేయం లేకుండా పూర్తి సాహిత్యపత్రిక పెట్టాలన్న నా కోరిక అట్లాగే మిగిలిపోయింది. చాలా పత్రికలు మంచి లక్షణాలతోనే మొదలవుతాయి. కానీ తొందరగా మూతపడతాయి. ఎప్పుడైనా కొత్తగా రాసేవాళ్లకు అవకాశం ఇవ్వాలి. రచనలు రాసే వారి సంఖ్యను పెంచాలి. చాలా సంతోషం సార్🙏🏼మీ అమూల్యమైన సమయాన్ని  మా కోసం వెచ్చించి మీ జీవితంలోని ఎన్నో అనుభవాలను, మీ సాహితీ ప్రస్థానాన్ని గురించి సమగ్రంగా తెలియజేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేక కృతజ్ఞతలు.

You may also like

Leave a Comment