Home ఇంట‌ర్వ్యూలు ఆమె కలం…ప్రార్థన కూడా…ప్రబోధం కూడా…

ఆమె కలం…ప్రార్థన కూడా…ప్రబోధం కూడా…

ప్రముఖ రచయిత్రి వీణా రెడ్డిగారితో మయూఖ ముఖాముఖి. పరిచయం చేస్తున్నది రంగరాజుపద్మజను….

వీణారెడ్డిగారు :— నమస్కారమండి పద్మజ గారు!

వీణారెడ్డి:– నాపూర్తి పేరు కడుకుంట్ల వీణారెడ్డి. నాతల్లిదండ్రులు కీ.శే.మర్యాద సులోచనమ్మ- జనార్దన్ రెడ్డి గారు.
పుట్టిన ఊరు కల్వరాల గ్రామం, వనపర్తి జిల్లా. పుట్టిన తేదీ 3 -8 -1955.విద్య -డీ కాం( Dcom) పాలిటెక్నిక్, వనపర్తి.
మెట్టిన ఊరు బొందలపల్లి గ్రామం, నాగర్ కర్నూల్ జిల్లా. భర్త కె.హనుమంత రెడ్డిగారు. పద్య కవి,పోస్టల్ రిటైర్డ్ ఉద్యోగి. మా సంతానం కవిత, వంశీధర్ రెడ్డి, శశిధర్ రెడ్డి. నివాసం నంది హిల్స్ కాలనీ, మీర్పేట్, హైదరాబాద్.
వృత్తి గృహిణి, ప్రవృత్తి సామాజిక స్పృహ గల రచన వ్యాసంగం, అభిరుచులు ఆధ్యాత్మిక చింతన, ధ్యాన ప్రక్రియ, తోట పని, సంగీత శ్రవణం, జీవ కారుణ్య సేవ, మొదలైనవి… సాహిత్య, సంగీత నేపథ్యం గల వ్యవసాయ కుటుంబం మాది! బాల్యం నుండే పొలం పనులకు, ఇంటి పనులకు వచ్చే శ్రామిక జనులతో కూడి, వారి నుండి జానపద కథలు, పల్లె పాటలు శ్రద్ధగా వినేదాన్ని. వీధి నాటకాలు కూడా చూసేదాన్ని. ఐదవ తరగతి నుండి ఏడవ తరగతి దాకా గ్రంథాలయం నుండి బాలల భారత, భాగవత, రామాయణాది పుస్తకాలు, నీతి కథలు అలాగే, అదే పాఠశాల లైబ్రరీ నుండి అప్పటి ఆధునిక రచయిత్రులైన యద్దనపూడి, కోడూరి, మాదిరెడ్డి.. వంటి వారి నవలలు తెచ్చేదాన్ని. అవి అమ్మతో పాటు నేను కూడా చదివేదాన్ని. నానమ్మ, నాన్న పెదనాన్నల అభిరుచుల మేరకు ఇంట్లో కొలువైన పలు రకాల సనాతన భక్తి సాహిత్యాలను పఠించేదాన్ని.
రాత్రి వేళల్లో ఆరుబయట చందమామ వెన్నెల్లో నాన్నమ్మ చెప్పే హరిభక్తికథలను ఆసక్తిగా ఆలకించేదాన్ని. సెలవుల్లో పుస్తకాలను తీసుకొని పొలానికి వెళ్ళి , నాన్న తో పాటు రాతి గట్లమీద,పొలం గట్లమీద, పశువుల పాకలోనూ, పుస్తక పఠనం గావించడం పరిపాటి.
1960 లోనే ఇంట్లో గ్రామఫోన్ రికార్డుల ద్వారా సంగీతం , నాటకాలు, చలనచిత్రాలు వింటూ, పనులు చేసే వారికి వినిపిస్తూ శ్రమతో అలసట పొందకుండా చేసేవాళ్ళం. మానాన్న మంచి చిత్రకారులు… వారు వేసే చిత్రాలలో నేనూ పాల్గొనేదాన్ని

ముఖాముఖి గ్ర

హీత రంగరాజు పద్మజ, వీణారెడ్డి

వీణారెడ్డి :— ప్రాథమిక విద్యార్థి దశ నుండే తెలుగు అధ్యాపకుల శ్రావ్యమైన పద్యాలు, పాఠ్యాంశాలలోని పౌరాణిక చారిత్రకాంశాలు అమితంగా ఆకర్షించేవి. ఆ కాలం పెద్ద వాళ్ళ పెట్టెలో ఉన్న పుస్తకాలు అపూర్వ చింతామణి ,విషకన్య , వివేకానంద చరిత్ర వంటివి చదివి ఆ కథలను సాటి విద్యార్థులకు వినిపించేదాన్ని. ఎనిమిది నుండి పదవ తరగతి దాకా శ్రీ విద్యా శ్రీ ప్రగతి వంటి అంశాలను వేదిక ప్రసంగాలలోనూ సాంస్కృతిక కార్యక్రమాలలోనూ పాల్గొని, ప్రశంసలు అందడం, పిల్లల చేత ప్రదర్శింపజేయడం శుభకార్యాల్లో పాటలు పాడడం వంటివి చేసే దాన్ని.
పిల్లులు, కుక్కలు, పొట్టేళ్లు, రామచిలుకల వంటి పెంపుడు జంతువులు, పక్షులు, కోళ్లు మొదలైన వాటికి ఆహారం అందిస్తూ ఆవులు, గేదలు పాలు పిండుతూ పెరుగును కవ్వంతో చిలుకుతూ ఆనందించేదాన్ని పద్మజ గారూ…

వీణారెడ్డి:— నా రచనా యానం అనేది పుస్తక పఠనం, కథా శ్రవణం వంటివే అదే ప్రేరణగా ఆరంభమైంది. వికలాంగులు, అన్నార్తులు, అభాగ్యుల వంటి వారిని, ఇంకా అమాయకులు, మంచివారు,మహానుభావులు, మంచి కళాకారులను… గాంచినప్పుడు కలిగిన స్పందనలే హృదయాన్ని చలింప చేస్తూ… మానవీయ కోణాలను కదిలిస్తూ.. అవే కలం -కళలుగా రూపొందినవని చెప్పాలి ! రచయిత్రిగా నాపై ఎక్కువ ప్రభావం చూపినవి ఆనాటి పత్రికలు, అందులోని పాఠకుల ప్రశంసలు, మా శ్రీవారి స్పందనా విధానం అని కూడా చెప్పవచ్చు. ఇంక గ్రంథాల మాటకొస్తే.. పాఠశాల దశలో శరత్ సాహిత్యం, కాలేజీ దశలో తెన్నేటి హేమలత గారి మోహన వంశీ, ఆపైన రవీంద్రుని గీతాంజలి ఎక్కువ ప్రభావం చూపాయి. ఆ పై ఆధ్యాత్మిక ఆచార్యులైన ఎక్కిరాల కృష్ణమాచార్య గారి పురుషమేధం గ్రంథం భక్తి- ఆధ్యాత్మికతలకు అంకురార్పణ గావించింది. ఇక రచనల వివరాల విషయానికొస్తే 1975 నుండి ప్రారంభమైన రచనా వ్యాసంగంలో, 1980 ఆ ప్రాంతంలో సాహిత్య దుందుభి పత్రికలో ప్రచురింపబడిన ప్రధమ బహుమతి కథతో ప్రారంభమైన ప్రధమ కథ ఓ ఆకలి కథ నుండి, వివిధ పత్రికలలో ముద్రితమైన 150 పైగా 15 అవార్డులతో… కథలు, 100 దాకా బహుమతులతో కూడిన వ్యాసాలు, 50 దాకా కొన్ని అవార్డులతో కూడిన కవితలు, గేయాలు ప్రచురితాలు…ముద్రణా గ్రంథాలు కథావి పంచి, జీవన్మణులు( 2019) సంవత్సరంలో, *కథావిపంచి-2 *, *నిషాంత కాంతులు(2020) శాంతివనం వ్యాసమాలిక (2022) (1988) లో కావ్య జ్యోతి వారపత్రికకు అసోసియేటెడ్ ఎడిటర్ గా కూడా పనిచేయడం జరిగింది.
ప్రస్తుతం కూడా భక్తి జ్ఞాన ఆధ్యాత్మిక సామాజిక రచనా పరంపర కొనసాగుతున్నది. ముఖ్యంగా ఎడిటర్ పవన్ గారి అక్షరాంజలి మాసపత్రికలో నెల నెల నా ఆధ్యాత్మిక వ్యాసరచనలు ముద్రింపబడుతున్నవి. మరొక కథా సంకలనం, కవితా సంపుటి త్వరలో రానున్నవి.

వీణారెడ్డి:– సృష్టిలో దేని సహజత్వం దానికుంటుంది. మానవుడిగా జన్మించిన వాడికి మానవీయత ప్రధాన గుణమై ఉండాలి! మనిషి ప్రాణంతో ఉండడానికి గుండె కొట్టుకోవడమే కాదు! మానవత్వంతో బ్రతకడానికి హృదయాన్ని పట్టుకొని ఉండాలి. సామాజిక ప్రగతికి సాంకేతికత ఎంత అవసరమో సామాజిక సంక్షోభానికి మానవత కూడా అంతకన్నా ఆవశ్యకం. మనిషి మనిషిగా నిలబడడానికి మనిషి ముందుగా తన స్థాయిని దిగజార్చే ఇంద్రియాలను మనసు ద్వారా జయించాలి. ఆ మనసు మళ్ళి తన చంచలత్వంతో కిందికి జారకుండా బుద్ధి- విచక్షణల ద్వారా దాన్ని నిగ్రహింపజేయాలి. మంచి- చెడు విచక్షణ కలిగి బుద్ధిమంతుడైన మనిషి.. మనిషిగా మనీషిగా మారగలడు. అలా మారాలంటే అందుకు మనిషి పాటించవలసిన మానవీయ విలువలు ఏమిటంటే… మనుషులంతా ఒకటేనని, చావు పుట్టుకలు అందరికీ సమానమేనని, అందరిలోని అంతర్గత ఆత్మ సౌందర్యం ఒకటే ప్రకాశమని… అనేకంలా కనిపించే లోకంలో మానవాళి అంతా ఏకమేనన్న ఏకాత్మతా భావనతో, తనలాగే తన సాటి వారన్న అవగాహనతో చరించగలగాలి! అప్పుడే జాతి, మత, కుల, వివక్ష… ఉన్నోడు- లేనోడు అన్న భేద భావము, అందం- అనాకారితనం అన్న తారతమ్యం; స్త్రీ- పురుష వ్యత్యాసం అనేవి అంతరించి అందరిలోనూ మానవీయ విలువలు సంతరించుకొంటాయి. ఉప్పునీటి దాహం వంటి అంతులేని సంపాదన కన్నా… ఆత్మసంతృప్తి అనే అమృత సంపాదన పొందగలగాలి!
నా రచనల ద్వారా పాఠకుడిలో కొంతైనా స్వార్ధ భావం నశించి, కాసింతైనా పరమార్ధ భావం కలగాలని, ఎన్ని కష్ట నిష్టూరాలు ఎదురైనా ఆదరణ కనువు కానీ పర ధర్మాన్ని అనుసరించక, అంతగా ప్రయోజన కారి కాకపోయినా ఎంతో ప్రశాంతతకు దారి అయిన, ప్రకృతి పరంగా తనకు ప్రాప్తమైన సహజసిద్ధమైన తన స్వధర్మం విలువ తెలుసుకొని, తన వ్యక్తిగత సామాజిక ధర్మాన్ని తన కర్తవ్యం ద్వారా నిరూపించుకోవాలని, ఎన్నెన్నో ఆశయాలకు గాక, కొన్ని ఆశయాలకు తావివ్వగల సుమంలా రూపొందగల ఏ కొద్ది ప్రేరణ కలిగినా చాలనే అభిలాషతో, అనుభవంతో, అంకిత భావంతో నిరంతర ప్రయత్నమే నిజమైన విజయం లా నా రచనా పరంపర కొనసాగిస్తున్నాను.

వీణారెడ్డి ఒక రచయిత్రికి తన ప్రయత్న లోపం లేని సంపూర్ణ సామాజిక బాధ్యత ఉండాలి. వీలైనంత వరకు తన రచనల ద్వారా సూచించిన ఉదాత్తమైన అంశాలు అనేవి తన జీవితంలో ఆచరించిన అనుభవ సారాలై ఉండాలి. ఎక్కడో చదివినవి ఎవరో బోధించినవి కాక అందులోని సాధకబాధకాలను గ్రహించి మరీ ఖచ్చితమైన తీర్పునివ్వగలిగేలా ఉండాలి.

వీణారెడ్డి :– 1986లో వనితలో వచ్చిన నచ్చిన వరుడు అనే కథలోని కట్నం కోరని ఆదర్శ పాత్రలా, మా బంధువుల్లో జరిగిన ఆదర్శ వివాహం ఒక అనుభవం … అలాగే, నా రచనా ప్రేరణ తో మరొక వితంతు వివాహం జరగడం, ఆధ్యాత్మిక రచనల వల్ల పాఠకుల్లో కలిగిన కొంత స్వార్థ చింతన తొలగడం, ముఖ్యంగా మా పిల్లల్లో కలిగిన అనుసరణీయ భక్తి, జ్ఞాన, ఆధ్యాత్మిక చింతన, సామాజిక సేవా నిరతి, జంతు సంరక్షణ, అహింసా విధానం… వంటివి అలవడినవి. ఇవి నాకు జరిగిన అనుభవాలు.

వీణారెడ్డి:– నేటి సమాజాన్ని కలవరపెడుతున్నవి అన్నీ ముఖ్యమైన సమస్యలే ! పద్మజ గారూ! ముఖ్యంగా స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణా రాహిత్యం, విచ్చలవిడి ప్రవర్తనం, పై పై వ్యామోహాలకు లోనై పోతున్న విలాసాల జీవితాలు, సంపద అధికమై శ్రమలోపించిన పరిస్థితులు, తాగుడు, వ్యభిచారం, వంటి వ్యసనాలు… యువత సహజీవనాలు, మత్తులోని అత్యాచారాలు, హత్యలు, అహంకార పూరిత హింసా ప్రవృత్తులు, పాలకుల పదవీ వ్యామోహాలు, అధికారుల లంచగొండితనాలు, ప్రజల ప్రలోభాలు తాత్కాలిక ఆవేశాలు, ఆత్మహత్యలు ఎన్నో ఒకదానికొకటి ముడివడిన సమస్యలు సామాజిక సంక్షోభానికి కారణం అవుతున్నవి.

వీణారెడ్డి :— ఒక రచన చేయడానికి ముందు, ఆలోచనలోనే ఆ కథా సంవిధానం, దాని ఆద్యంతాలు ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేసుకుంటాను. ఆ తర్వాత ఆయా పాత్రలుగా మారిపోయిన అనుభూతి- అనుభవాల ద్వారా రచనను గావిస్తాను. తొలిపాఠకురాలి పాత్రగా కూడా రూపొంది మరీ దాన్ని పఠించి, అవసరమైన సవరణలు గావించుకుంటాను. భావం తర్వాతనే శైలి నిర్మాణం జరుగుతుంది.

వీణారెడ్డి:— నేటి యువత సాహిత్య రంగంలోకి రావాలంటే సమాజంలో తాను ఎలాంటి విలువలను కోరుకుంటున్నాడో అలాంటివి ముందుగా వీలైనంతగా తాను పాటించాలి! ఏ అంశాలు తనను అధికంగా స్పందింప చేస్తాయో వాటి పట్ల దృష్టిని కేంద్రీకరించాలి. అలాంటి ఉత్తమ రచనలనే పఠించాలి… పరిశీలించాలి! కథ,కవిత, వ్యాసం, పద్యం అనేవి దేని సంప్రదాయం దానికుంటుంది. కనుక అనుభవిజ్ఞులైన రచయితల (రచనల) ద్వారా దాన్ని తీర్చిదిద్దుకోవాలి! మంచి భాషకు, పద రమణీయతకు కృషి చేయాలి. రచనలు అచ్చులో చూసుకోవాలని ఆసక్తే కాక సమాజాన్ని మార్చే శక్తిగా రచన ఉండాలనే తపనతో రచన ఆరంభించాలి. ఫలితాలు ఎలా ఉన్నా పట్టువదలని ప్రయత్నంగా రచనలు కొనసాగిస్తూ ఉండాలి! నిరంతర సాధన ద్వారానే లక్ష్యాన్ని సాధించాలి!

వీణారెడ్డి:– నాకు సంతృప్తినిచ్చిన క్షణాలు ఏవంటే ?గృహిణిగా నా పరిపూర్ణ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే… నేను గావించిన తీరిక వేళల్లోని సమాజ సేవలోని భాగంగా ప్రఖ్యాత సంస్థల ద్వారా ప్రముఖుల పేర్లమీదుగా పురస్కారాలు అందుకున్న సందర్భాలు….
రాయాలనుకున్నా కానీ రాయలేకపోయిన అంశమేమిటంటే భగవద్గీత శ్లోకాల ఆధారంగా చిన్నచిన్న కథల శీర్షిక నిర్వహించాలని అనుకున్నా! సరైన వేదిక, ప్రోత్సాహం లేక వీలు కాకపోవడంతో చేయలేకపోయాను. ఇక ముందు వీలైతే అది కూడా సాహితి భవిష్యత్తులో సంపూర్ణం చేసుకుంటాను.

వీణారెడ్డి:— ఆత్మ అనంతం… దాని ఆధారంగానే జన్మ పరంపర (జీవుడి కర్మ ఫలాల కారణంగా) కొనసాగుతుందని, విశ్వసించగలిగితే… భక్తి ఆధ్యాత్మికంశాలనేవి నాకు (అనంతకాలం) నుండి పూర్వజన్మల, కారణజన్మల సంస్కారాలుగా శ్రీరామ పరంధాముని, శ్రీకృష్ణ పరమాత్ముని, మధుర భక్తిగా సంక్రమించినవని అర్థమవుతున్నది. భక్తి- ఆధ్యాత్మిక, పౌరాణిక గ్రంథ పఠనాలు, భక్తి ధార్మిక విలువలతో కూడిన అలనాటి చలనచిత్రాలు, మధుర భక్తి గీతాలు మొదలైనవి లౌకికాలౌకిక స్పందనలుగా నా రచనల్లో చోటుచేసుకుని, భావ గాంబీర్యత నలవరుచుకొని అనుభవైక వేద్య వైవిధ్య నైవేద్యాలుగా బహుమతులు అంది పాఠకులకు అందించబడినవి.

వీణారెడ్డి :– మానవీయత, జీవ కారుణ్యం, సామాజిక స్పృహ, ఆధ్యాత్మికత అనేవి నాలుగు కూడా జీవన రథానికి నాలుగు చక్రాల వంటివి.
మానవీయత అనేది ఐకమత్యమే బలం అనిపించేలా మనిషిని మనిషిని కలిపి ఉంచే సమతా మమతల సంబంధ సాధనం!
జీవ కారుణ్యం అనేది దయగల హృదయమే దైవ మందిరం అని నిరూపించే నిష్కల్మష విధానం. స్థాయీ బేధాన్ని మరిచి, పసిపాపలను లాలించినట్టుగా సృష్టిలోని జీవజాలాన్ని ఆదరించగల భావ లాలిత్యం కరుణ తత్వమనేది సామాజిక హృదయాన్ని మాతృ మందిరంలా మార్చగలదు.
సామాజిక స్పృహ అనేది మనిషిలోని చేతనత్వాన్ని జాగృతపరిచేది. నిస్పృహను నివారించేది , కర్తవ్యాన్ని బోధించి ఉద్యమింప చేసేది, త్యాగమే యోగంలా సామాజిక సంక్షేమానికి తనకున్నంతలో సర్వ సమర్పణ గావించగల అంకిత భావాన్ని కలిగించేది ఆధ్యాత్మికత!
అనగా ఆత్మను గురించి తెలిపేది, ఆత్మసత్యం తనువనిత్యం అన్న జ్ఞానాన్ని కలిగించేది, అనిత్యమైన తనువు కోసం, అశాశ్వతమైన భోగభాగ్యాల కోసం అర్రులు చాస్తూ, స్వార్థ భావాలతో అనుచిత విధానాలతో మనిషి పతనం కాకుండా, శాశ్వతాశాశ్వతాలను వివరిస్తూ మనిషికి తన జన్మ కారణాలను వివరిస్తూ, చేయవలసింది ఏమిటో చేయకూడనిది ఏమిటో వివరిస్తూ, అవగాహన కలిగిస్తూ ఫలితంపై దృష్టి లేని ధార్మిక కర్తవ్యాన్ని నిర్వహింప చేస్తూ, అశక్తత నుండి శక్తి వైపుగా…చీకటి నుండి వెలుగులోనికి నడిపించేది, మృత్యువును కూడా అమృతంలా భావించి ఆహ్వానింపచేయగల అద్భుత సాధనం….

వీణారెడ్డి :— రచయిత్రిగా నాకు తొలి ప్రేరణ అనేది ఒక పాఠకురాలిగా పుస్తక పఠనాశక్తి సామాజిక సమస్యల పట్ల అవగాహనా భావమనే చెప్పవచ్చు!

వీణారెడ్డి:—- సమాజ సమస్యలపై రాయడం అనేది… ఆయా సమస్యలు వ్యక్తిగత స్పందనలుగా రూపొంది, ఆ సంఘర్షణల ప్రభావమే సాంఘిక బాధ్యతలకు, సాహితీ సారధ్యాన్ని వహింప చేసింది.
రచయిత్రి సమాజానికి తన రచనల ద్వారా, తన ఆచరణాత్మక విధానాల ద్వారా, మంచి మార్గదర్శిని కావాలి !రచయిత్రి దృక్కోణం అనేది వ్యక్తిగతాన్ని కాక సామాజిక హితాన్ని అవలోకిస్తుంది. ఇంటికే పరిమితమై బంధింప పడకుండా సంధించిన అస్త్రంలా సమాజం వైపు దూసుకుపోతోంది! ఇల్లే సమాజంలా… సమాజమే ఇల్లుల భావిస్తూ ఉభయతారకంలో ఉపకరిస్తుంది!

వీణారెడ్డీ:— మహిళా సాహిత్యకారిణిగా నాకు ఎదురైన సవాళ్ళు సమాజంలో కన్నా సంసారంలోని గృహిణి పాత్ర రచయిత్రికి విసిరిన విసురైన సవాలక్ష సవాళ్లు విద్యుక్త ధర్మాలే!
స్త్రీ స్వరాన్ని ఒకప్పుడు అణిచివేత పర్వం యొక్క ప్రభావంగా భావించిన సమాజం, ఈ ఆధునిక యుగంలో ఎలుగెత్తిన స్త్రీస్వరాన్ని స్వేచ్ఛారావంలా ప్రగతి సంకేతంలా భావిస్తున్నది… గౌరవిస్తున్నది. స్త్రీల హక్కుల స్వరాలనే కాక ,బాధ్యతల పర్వాలను గృహిణి నుండి ఉద్యోగ నిర్వహణ దాకా స్వాగతిస్తుంది నేటి ఆధునిక సమాజం. నా రచనల్లో స్త్రీ పాత్ర అనేది …మంచి కుటుంబ జీవనానికి ప్రతికగా, సామాజిక జీవన ప్రగతిగా ఆదర్శంగా, మాతృకగా, అధర్మ ఖండితగా, హక్కులకన్నా బాధ్యతల్ని మోసే త్యాగ భరితగా, ధన్య చరితగా, నా అభిలాష మేరకు ఆవిష్కరింపబడుతుంది.

వీణారెడ్డి::— సాహిత్యం సమాజాన్ని మార్చగలదు! సమాజంలోని అజ్ఞానాంధకారాలకు జ్ఞాన నేత్రమై దారి చూపగలదు! స్వాతంత్రోద్యమానికి పూర్వం నుండే నినదించిన అక్షర దిక్కార స్వరాలు, ఉద్యమ సాహిత్యాలు, విప్లవ గీతాలు, ఇంకా కరుణరాసాత్మక కావ్యాలు, జానపద నేపథ్యాలు గల నీతి పద్యాలు, వైదిక, పౌరాణిక ,చారిత్రక గ్రంథాలు మానవ నాడీ గ్రంధుల్ని ప్రభావితం గావించి మనో విశాలతకు, త్యాగనిరతికి, సామాజిక ప్రగతికి, సాధనాలుగా… నాటి జీవన విధానాలకు, అరుదైన చరిత్రలకు, అద్భుత పరిణామాలకు స్ఫూర్తి ప్రతీకలుగా… నిలిచినవి… నిలుస్తున్నవి… నిలుస్తాయి!

వీణారెడ్డి:– మార్పు అనేది కాలానికి మలుపు వంటిది. కాలాతీతుడు కాలేని పాఠకుడు కూడా మనిషే కనుక, కాల ప్రభావానికి కట్టుబడిపోయిన మానవుడిగా, పాఠకుడిలోని మారుతున్న అభిరుచి కూడా అతి సహజంగా కాలంతోపాటు స్వీకరించవలసిందే!

వీణారెడ్డి :– నేటి యువతలో అధిక భాగం సంపాదనే ధ్యేయంగా, ఆధునిక సౌకర్యాలే సర్వస్వంగా, స్వేచ్ఛే పరమావధిగా, సాంకేతిక విద్యే వైవిధ్య సాధనంగా, అంతకుమించి మరి దేనికీ తీరికలేని యాంత్రిక జీవనమే ఆనవాయితీగా అదే లోకంగా జీవిస్తున్నారు. మరి కొద్ది మంది యువతీ యువకులు సేవా భావంతో మానవీయ విలువలతో సామాజిక స్పృహతో కూడిన చైతన్యంతో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సాంకేతిక విధానాలను సైతం సామాజిక ప్రగతికి వినియోగిస్తూ సాధన లేవైనా సరే ఉపయోగించుకునే విధానాలపై వాటి ప్రభావం ఉంటుందని నిరూపిస్తూ ఆదర్శభావాలతో కూడిన ఆధునికత కూడా అద్భుత సామాజిక చైతన్యమని రుజువు చేస్తున్నారు. అరచేతిలో ఉసిరికలా అందుబాటులో ఉన్న సోషల్ మీడియా అనేది సాధారణ మహిళల కన్నా రచయిత్రులకు ఉపయుక్తమైన ఉపకరణ. అది ముంగిట్లోని సూర్యకిరణాల విశ్వ సందర్శనం కలిగిస్తూ విశాల భావ స్పందనను వైవిధ్య సృజనను రచనకు ప్రేరణ కలిగిస్తుందని చెప్పవచ్చు!

వీణారెడ్డి:— స్పృహతో కూడిన చైతన్యంతో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, సాంకేతిక విధానాలను సైతం సామాజిక ప్రగతికి వినియోగిస్తూ, సాధనలేవైనా సరే ఉపయోగించుకునే విధానాలపై వాటి ప్రభావం ఉంటుందని నిరూపిస్తూ, ఆదర్శ భావాలతో కూడిన ఆధునికత కూడా అద్భుత సామాజిక చైతన్యమని ఋజువు చేస్తున్నారు.

వీణారెడ్డి:– ప్రస్తుత సామాజిక సమస్యల్లో అత్యంత ఆందోళన కలిగించేది… పోరాట పటిమతో స్వేచ్ఛనూ, సమాన హక్కులను పొందిన మహిళలను స్వేచ్ఛగా తిరగనివ్వని అత్యాచార పర్వాలు, ప్రగతికి ప్రథమ సోపానమైన పడతిని భాగ్య దేవతగా గాక…భోగ్య వస్తువుగా భావించడం.

వీణారెడ్డి :– రాసే ముందు ఎక్కువగా ఆలోచిస్తాను పద్మజ గారు.

వీణారెడ్డి:— నా సాహితీ ప్రయాణంలో అందుకున్న అవార్డులు, పురస్కారాలు, సన్మాన విశేషాలు సంక్షిప్తంగా వివరిస్తాను.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా 2024 సంవత్సరానికి నాళం కృష్ణారావు గారి స్మారక ఉత్తమ రచయిత్ర కీర్తి పురస్కారం, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక, ఆచార్య పాకాల యశోద రెడ్డి సాహితీ పురస్కారం, 2024 కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళా పీఠం ద్వారా కపిలవాయి కిషోర్ బాబు -భార్గవి దేవి*ల పురస్కారం (2002)లో, సాహిత్య వేదిక తెలుగు పూలవనం సంస్థలచే *ఉమ్మెత్తల యజ్ఞరామయ్య కథా సాహిత్య పురస్కారం( 2020)లో, శ్రీశ్రీశ్రీ కురుమూర్తి దేవస్థానం వారి ద్వారా బెల్లం నాగన్న స్మారక పురస్కారం (2024)లో, జయజయ సాయి ట్రస్ట్ వారిచే వేద భారతి *ఉత్తమ జాతీయ పురస్కారం *( 2022)లో,
పుడమి సాహితి వేదిక ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారం(2021)లో, విశ్వహిందూ పరిషత్ వారిచే ఉత్తమ గీతా వ్యాసర చయిత్రి పురస్కారం (2022)లో, రైట్ వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రిగా ఎక్స్లెన్సీ అవార్డు (2019)లో,
శిఖరం ఆర్ట్ థియేటర్స్ వారిచే విజయసేవానంది పురస్కారం( 2021)లో, ఈసీఐ మరియు డి ఐ సి సి ఐ ఫౌండేషన్ ద్వారా మహిళా సేవా రత్న అవార్డు( 2021) లో , ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా సాహితీ సేవా రత్న పురస్కారం ( 2021)లో, డిటెన్ వరల్డ్ ఛానెల్ వారి లాంతర్ * అవార్డు (2020)లో, శ్రీశ్రీ సిరి కల్చరల్ ఫౌండేషన్ ద్వారా *శ్రీ వికారి ఉగాది ప్రతిభా పురస్కారం ( 2019)లో, పివి గారి శతజయంతి కవితాంజలి శుభకృతు ఉగాది పురస్కారం( 2022)లో, ఇంకను పలు ప్రముఖ సంస్థల ద్వారా మరో 15 పురస్కారాలు పొందడం జరిగింది.
కొన్ని సమీక్ష వ్యాసాలు, ప్రసంగాలు ,టీవీ, రేడియో ప్రోగ్రాంలు, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ, మరియు పలు సంస్థలు నిర్వహించిన కవి సమ్మేళనాలలోపాల్గొని కావించిన కవితా పఠనాలు, ఇంకనూ అతిథిగా పాల్గొనడం వంటివి. వివిధ ప్రక్రియల ద్వారా ఎన్నో వేదికలపై సన్మానాలను అందుకున్నాను. సాహితీ సామాజికవేత్త మరియు భారత్ రాజశ్రీ బిరుదులతో సత్కరింపబడడం జరిగింది.
భారత స్వాతంత్ర అమృత్యోత్సవాల సందర్భంగా 20-21 లో విశ్వహిందూ పరిషత్తు గీతా జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన లక్ష యువగళ గీతార్చన కార్యక్రమంలో ఆ పుస్తక సంకలన ఆవిష్కరణ సందర్భంగా అందులోని భవసాగర తరుణం భగవద్గీత చరణం వ్యాసకర్తగా ఉత్తమ వ్యాస రచయిత్రిగా పొందిన పురస్కారం 15- 5- 2002లో..

వీణా రెడ్డి నాకలం నుండి వెలువడిన భక్తి ప్రచోదన రచనలకు మూల కారణం బాల్యంలోనే కలిగిన కృష్ణ భక్తి భావనయే పూర్వజన్మల సంస్కారాల కారణంగా జన్మించిన మధుర భక్తి కృష్ణ ప్రేమ ప్రేరణగా పాటించే కృష్ణ చరితలు, కృష్ణ భక్తి కథలు కృష్ణా అంశం గల చలనచిత్రాలు ఎంతో పారవశాన్ని కలిగించేవి అవే రచనలుగా గేయాలుగా రూపొంది ఆ అలౌకిక అనుభూతితో వాణి సందేశాలను ఆలకిస్తూ ఆ దైవీజ్ఞాన సంపత్తిని నిత్య సత్యాలుగా విశ్వ స్వరూపాలుగా ప్రేమ చాగతత్వాలుగా భక్తి ఆధ్యాత్మిక ప్రచోదన రచనలుగా అవి వెలువడుతున్నాయి.

ముగింపు ప్రశ్నలు…రాపిడ్ ఫైర్ ( ఒక్క వాక్యంలో)

వీణారెడ్డి మహిళా సమస్యల కారణంగా యువ రచయితలకన్నా యువ రచయిత్రులే అదనంగా కృషి చేయాలి.

వీణారెడ్డి విలువలు గల కుటుంబ జీవనంతో సామాజిక జీవనం శాంతి మయం కావాలని,

వీణారెడ్డి సమాజంలో కలగబోయే పరిణామాలకు అనుగుణంగా చెడు పర్యవసానాలకు బలికాకుండా మంచి మార్గాలను సూచించే దిక్సూచిలా ఉండాలని…

ధన్యవాదాలు అండి పద్మజ గారు! మీతో పరిచయ కార్యక్రమం నాకు ఎంతో ఆనందదాయకం మయూఖ పత్రికకు నా మన పూర్వక కృతజ్ఞతలు…

రంగరాజుపద్మజ:–

సామాజిక స్పృహ ఉన్న రచయిత్రి అంటే మాటలతో సమాజాన్ని కదిలించే వ్యక్తి. అలాంటి వారి ఇంటర్వ్యూ అంటే కేవలం ప్రశ్నలు కాదు… ఒక ఆలోచనా యాత్ర. నేను అడిగిన ప్రశ్నలు లోతుగా, ఆవేశంగా, ఆత్మీయంగా ఎలా ఐతే ఉన్నాయో…బహుముఖ ప్రజ్ఞాశాలులైన శ్రీమతి వీణారెడ్డిగారు ఆధ్యాత్మిక ప్రశ్నలకు అంతే లోతైన సమాధానాలు; జీవకారుణ్య సందేహాలకు దయాంతరంగులుగా స్పందిస్తూ…సామాజిక బాధ్యత ఉన్న రచయిత్రిగా తన రచనా కాగడాలను చూపి వెలుగులు పంచిన ఈ ముఖాముఖి ఎందరికో స్ఫూర్తిదాయకమని భావిస్తూ..

మీ రంగరాజు పద్మజ.

You may also like

Leave a Comment