ఒద్దిరాజు సోదరులు వంద సంవత్సరాల క్రితమే తెనుగు పత్రిక( 12-8-1925) లో ఒక ఆదర్శవంతమైన సంపాదకీయం రాశారు. అదేమిటంటే స్త్రీ విద్యా వ్యాప్తి కోసం సమాజానికి కనువిప్పు కలిగించేలా ఉంది ఆ సంపాదకీయం ! అంతే కాదు! స్వాతంత్ర్యోద్యమం, గ్రంథాలయోద్యమం గురించి చెప్పిన సంపాదకీయం!
ఆ సంపాదకీయాన్ని వంద సంవత్సరాలైనాఎందుకు ఆ విషయం చెప్పుకుంటున్నామంటే…? ఈ సంవత్సరం తెనుగు పత్రిక శత జయంతి జరుపుకుంటోంది. అంతేకాదు స్త్రీ విద్యావశ్యకత చెబుతూనే మగవారి బాధ్యతలను తెలిపారు.అందుకే ప్రత్యేకంగా ఈ అంశాన్ని పాఠకులకు మరియొక సారి తెలియజేయదలచుకున్నాన
మహిళల విద్య గురించి ఇప్పటికీ బాహటంగా
కాకున్నా లోలోపల ..అక్కడక్కడా …పల్లెల్లో కాకున్నా
బాగా చదువుకున్న వారి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
తమ వాదాలు పరిగణనలోకి తీసుకోవాలనీ, నిజా నిజాలు బయట పడాలనీ,కాని పక్షంలో నిందా పాత్రులేననీ, స్త్రీలు విద్యావంతులైతే ఆ సంసారం ఆనందంతో గడపుతూ,సుఖవంతమైన జీవితం జీవించవచ్చనీ,ముఖ్యంగా స్త్రీ విద్య తప్పనిసరనీ,
అప్పుడే మహిళ అంతులేని మెప్పులు పొందుతుందనీ అందరికీ తెలుసు.
ఐనా కొందరు అహంభావులై మహిళలు విద్యావంతులైతే అవిధేయులుగా అవుతారనీ చెడు ప్రచారాలు చేసే వారికి స్వాభిమానం లేదేమో?
చదువుకొన్న యువతులకు మాత్ర స్వాభిమానం తప్పక దెబ్బతింటుంది అనడంలో సందేహమేలేదు.ఆ విషయంలో చర్చకు తావేలేదు.సరే ఆవిషయం వదిలేసి, సాధ్యమైనంత వరకు తమ భార్యా- బిడ్డలను
చదివించడం మంచిదని ఈనాటి కాలానికి అక్కరకొచ్చేది చదువేనని అనుభవం ద్వారా తెలుసుకున్నవారందరూ స్త్రీ విద్య ఆశపడుతున్నారు.
విద్య కొరకు తాపత్రయ పడుతున్న సమాజంలో
నిజామాంధ్ర ప్రదేశ్ లలో ఉన్న చదువుకోవాలనుకునేమహిళల వంటి ( తెనుగు పత్రిక సంపాదకుల జనయిత్రి వంటి ) అంటే ఒద్దిరాజు సోదరుల తల్లిగారైన రంగనాయకమ్మ గారివంటి వారెందరో ఉన్నారు.
వాళ్ళు కేవలం పెద్ద వారి ఆచారమని. మంచిదైనా కాకున్నా దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇక్కడే కాదు ప్రపంచమంతటా అందరూ చదువుకోలేకపోతున్నారు. ఇలా తెలియని వారెందరో ఉన్నా…బహిరంగ సభలలో వేదికలమీద భయమే లేకుండా ఉపన్యాసం చేసేలా స్త్రీ విద్యను సాటి తోటి మహిళలకు తెలిసేలా శ్రీమతి చాట్రాతి లక్ష్మీ నరసమాంబ, శ్రీమతి సత్యవతీబాయి మొదలైన ఏ కొద్దిమంది మాత్రమో మహిళలు అదీ వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మాత్రమే నిజాంరాష్ట్రాంధ్ర దేశంలో స్త్రీ విద్య ఉందనేది కొంచమైనా అపవాదు తొలగించగలుగుతున్నారు.
స్త్రీ విద్యను గురించి శ్రద్ధ తీసుకోవలసిన ఈ సమయంలో సులువైనది, భావుకతతో కూడిన ఉన్నత విద్యాభిరుచికి మూలమైన , అంతులేని లాభాలున్నటువంటి, అందరికీ ఆమోదమైనట్టి ఇంట్లోనే విద్య నేర్చుకునే విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇలా ఇంట్లో ఉండి విద్య నేర్చుకోవడం చాలా తేలిక!కాబట్టి ఆడపిల్లలే కాకుండా గృహిణులు కూడా చదువు నేర్చుకోవచ్చును. అక్షరం ముక్క రాని ఆడవారుసైతం తక్కువ సమయంలోనే తన ఇంటి
కుపయోగపడే పనులను అవలీలగా చేసుకునే శక్తి సామర్ధ్యాలు కలుగుతాయి.
స్త్రీ విద్యపై అభిమానమున్న అన్ననో, కుమారుడో? భర్తనో? తండ్రో ఇంటినుండి చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలనుకునే వారికి కాస్త సహాయం చేయడమేమంత కష్టం కాదు!
ఇలా ఇంట్లో ఉంటూనే చదువుకొని పరీక్షలు రాసే అవకాశము మన రాష్ట్రంలోనూ వ్యాప్తి చెందుతున్నది. అందుకుగాను చాలా సెంటర్లు ఏర్పడ్డాయి. వాటి ద్వారా కావలసిన సమాచారము దొరుకుతుంది. అయినా కూడా యువతులందరికీ ఈ విషయం గురించి తెలిసింది అనుకోవడానికి వీలు లేదు. అందుకే ఎక్కువమంది మహిళలు ఈ పరీక్షలు రాసి పాస్ అవుతారని చెప్పలేము. కానీ ఇలాంటి అవకాశము అందిపుచ్చుకోవడానికి ముందుకు రావడానికి ఎన్నో ఆటంకాలున్నాయి.. అయినా ఎక్కువమంది ఈ విషయం తెలుసుకొన్నారనీ… వారు ముందుకు వస్తారనీ చెప్పలేము. ఎందుకంటే ఎక్కువమంది తెలియని వారే ఉండడంవల్ల అంచనా వేయలేం. ప్రస్తుతం కాదు కూడదని ఈ నలుగురో ఐదుగురో ఈ పరీక్షలలో పాల్గొన్నంతమాత్రాన సరిపోదు.
ఈ పరీక్షలు జాతి లింగ వివక్షత లేకుండా సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడినప్పుడు మగవారు పరీక్ష రాయడం కంటే వారు తమ కోసం ఇంట్లో శ్రమ పడుతున్న మహిళలకు బోధించడంలో సమయాన్ని ఎక్కువ కేటాయిస్తే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కానీ అంతటి ఓపిక ఆడవాళ్ళ లోను మగవాళ్ళ లోనూ ఉండాలి!
విద్యావ్యాప్తి స్త్రీలలో లేకపోవడం వల్ల ఈనాటి గృహ విద్య పరీక్షలో ఆసక్తి కలగాలంటే… కొంత శ్రమ పడాలి! ఇటువైపు స్త్రీల వైపు నుండి కూడా శక్తి కలిగి ఉండి ఉంటే విద్య నేర్చుకోవడానికిఅవకాశాలున్నాయి. స్త్రీ పురుషులు విద్య నేర్చిన వారైతే దేశానికి ఉపకార దీక్ష పూని, పల్లెటూర్లలో కి వెళ్లి అక్కడ సభలను సమావేశాలను ఏర్పాటు చేసి ఉపన్యాసాలు ఇచ్చి స్త్రీలకు విద్య పట్ల ఆసక్తి ముఖ్యంగా ఇంటి నుండి పరీక్షలు రాయాలనే అభిరుచి కల్పించవచ్చు. కానీ అది అంత సులువు కాదు! ఎందుకంటే ఎవరికి తగ్గ పనులలో వారు తలమునకలయ్యే ఈ సమయంలో తమ పనులు విడిచిపెట్టి ఇంకొకరికి విద్యా బోధన, అవగాహన కలిగించడం కష్టమైన పనే.. అయినా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు పర్యటన చేసినా సరిపోదు! ఇది చాలా మంది కూడి జరపవలసిన ఒక బృహత్తర కార్యక్రమం… అందుకే ఈ పని అనుకున్నంత సంతృప్తి కరంగా ఈ విధానంలో వ్యాప్తి చెందదేమో అనిపిస్తున్నది.
విద్యా పక్షపాతి అని పేరు పొందిన నిజాం ప్రభుత్వం ఏ చిన్న ఊళ్ళోనో కాకుండా మిగిలిన ప్రతి గ్రామంలోనూ బాలల పాఠశాల తోపాటు బాలికల పాఠశాల ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది . దాంతో స్త్రీ విద్య అతి తక్కువ కాలంలోనే వ్యాపించవచ్చు అనే ఒక నమ్మకం కలగవలసిన అవసరముంది. కానీ ఏ బస్తీలోనో తప్ప బాలికల పాఠశాలలో గల ప్రతి గ్రామమునందైనా బోధన, పరీక్షల నిర్వహణకై స్థలాన్ని కేటాయించవలసి వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు బదులు ఉపాధ్యాయినులను తక్కువ చూపు చూడకూడదు. పల్లెటూరులలో వాతావరణం వేరుగా ఉంటుంది. సామాన్యంగా ఏ బాలిక అయినా వివాహం ముందు మాత్రమే విద్య అభ్యసించాలని అనుకుంటారు పెద్దలు. తరవాత కుటుంబ పరిస్థితులు సహకరిస్తేనే ఆ విద్య కొనసాగుతుంది… లేని పరిస్థితుల్లో ఆమె చదువుకు అంతరాయం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భర్త, కుటుంబం ఆమెకు సహకరిస్తే అత్యున్నత విద్య ఆమె సొంతం అవుతుంది.
స్త్రీ విద్యాధికురాలైనప్పుడు ఆ కుటుంబం సవ్యదిశలో నడుస్తుంది. పిల్లలు విద్యాధికులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకుగాను ప్రోత్సాహం కూడా ఎక్కువ లభిస్తుంది. అంతేకాదు కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చినపుడు చక్కటి బేరీజు వేస్తుంది. ఏఖర్చుకుఎంత డబ్బు కేటాయించాలి? అనే స్పష్టత ఉంటుంది.కొండొకచో చేదోడువాదోడుగా సంపాదిస్తుంది. అప్పుడు కుటుంబం వీధిలో పడకుండా చక్కని ఆర్థిక పరిపుష్టితో నిలదొక్కుకుంటుంది.
కాబట్టి మన తెలుగు రాష్ట్రంలో మహిళలకు విద్య ఎంతో అవసరమని గుర్తించి మన పాలకులు ప్రతి గ్రామంలోనూ బాలికల పాఠశాలలను స్థాపించాలని సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇలా ఎంతో అవగాహనను కలిపించే సంపాదకీయం రాయడం ఆనాడు ఒద్దిరాజు సోదరులకే చెల్లును.
అంతేకాకుండా నిజాం నవాబుకు బాలికల పాఠశాల నెలకొల్పాలని అర్జీతో పాటు ఒక హెచ్చరిక కూడా చేశారు. పట్టుబట్టి ఇనుగుర్తి గ్రామంలో” “ప్రయోగాత్మక బాలికల ప్రాధమిక పాఠశాల” వచ్చే లా కృషిచేసి, ఏర్పాటు కూడా చేశారు.
ఇలా స్త్రీ విద్యావ్యాప్తికి ఎంతగానో తోడ్పడింది ఈ తెనుగు పత్రిక.
రంగరాజు పద్మజ
రంగరాజు పద్మజ
రంగరాజు పద్మజ ఒద్దిరాజు సోదరులలో చిన్నవారైనా ఒద్దిరాజు రాఘవరంగా రావు గారి కుమార్తె. రంగరాజు పద్మజ. కథా రచన,కథా నిర్వహణ; కథా విమర్శ ( లండన్ విద్యార్ధి) కథాస్రవంతి కార్యక్రమం నిర్వహణ; ‘హరిదాసి ‘ నవల అనుసృజన చేయడం; పెద్దింటి అశోక్ కుమార్ గారి రచన ‘జిగిరి ‘నవలపై రేడియో ప్రసంగం; సుబ్రహ్మణ్యం పిళ్ళై గారి ‘బోయకొట్టములపండ్రెండు’ చారిత్రక నవలపై సమీక్షా వ్యాసం, ఖడ్గతిక్కనపై తెలుగు సాహిత్య అకాడమీ వారు మరియు తెలుగు భాషాచైతన్య సమితి వారి సంయుక్త కార్యక్రమంలో సమీక్షా ప్రసంగం, పద్మజ కథలు ( మనసేకోవెల) కథాసంపుటి, ఆన్ లైన్ పత్రిక లలో పలు కథలు ప్రచురించబడ్డాయి.(కన్నిటి కరువు తీర్చిన కరోనా, కరోనా కుచ్ నహీ కర్ నా,దూరవిద్య, తంగేడు పూలు- అమ్మ ఒక జ్ఞాపకం ) ఇతరులు ప్రచురించిన కథా సంపుటిలలో ఎన్నో కథలు ప్రచురింపబడ్డాయి భారత కథలపై ఆధ్యాత్మిక మాసపత్రికలో వ్యాసాలు, ఆన్లైన్ మాధ్యమంలో రామాయణ పాత్రల విశ్లేషణ, నవలా పఠనం, కథాపఠనం ( స్వీయ మరియు సేకరణ) , అవధాన పృచ్ఛకత్వం మొదలైనవి చేసారు. గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, హైదరాబాద్ 9989758144
పదకొండవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామచంద్ర రాయశర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ నేడు తప్పినది; రేపు తప్పదు.]
శ్లో ॥ ” అస్మిన్ దినేనిష్ఫలతా భవేచ్ఛేత్
శ్వః సమ్యగేవ రచయామి నహిత్యజామి.”
— నవీన తపశ్విని.
భావం :–ఈ రోజున ప్రయత్నించిన కార్యం నిష్ఫలమయినా కానీ ,రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాను కానీ ,దాన్ని వదిలి పెట్టను..మరల మరల..సఫలం అయ్యేదాక ప్రయత్నిస్తూనే ఉంటాను.
వ్యాఖ్య:–
రుద్రమదేవి నవలలోని ఈ కథాభాగానికి సరిగ్గా సరిపోయే అంశాన్ని ” నవీన తపశ్విని ” నుండి ప్రకరణాంశంగా తీసుకోవడం గ్రంథకర్త ప్రతినాయక లక్షణాలను చక్కగా వ్యక్తీకరిస్తూ… కథాగమనానికి ఎంతగానో తోడ్పడింది.
ఇలా పూర్వ కావ్యాలు, సుభాషితాలు. హితోపదేశం వంటివి ప్రకరణానికి పేర్లుగా ఉపయోగించడం వల్ల పాఠకులకు ఆ యా విశేషాలు ఏ గ్రంధంలో ఉన్నాయనే ఉత్సుకతతో వెతుకుతూ ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చదువరులను తయారు చేసే నూతన ఒరవడి .
రంగరాజు పద్మజ
కథాభాగం:-
మహాదేవరాజు దేవగిరిలో తన ఉద్యానవనంలో విచిత్ర మంటపంలో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. క్షణక్షణానికి అతని ముఖ కవళికలు రకరకాలుగా మారుతున్ననందు వల్ల అతడు ఒక విషయం కాకుండా, చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నాడని మనకు తెలుస్తుంది. కోపం, దుఃఖం మొదలైన ఎన్నో భావాలు అతని ముఖంలో స్పష్టంగా కనపడుతూ మాయమవుతున్నాయి.
అప్పుడు సాయంకాలమైంది. ఇంకా చీకటి ముసురకున్నా దీపాలు వెలిగించారు. చల్లటి గాలి వీస్తున్నది. నిర్మలమైన ఆకాశంలో ఎరుపురంగు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. సంతోషం కలిగించే ఆ సమయం రాజులకు వేడుకగా తిరిగే సమయం. అయినా మహాదేవరాజు ఇంకొక మనుషి లేకుండా ఒంటరిగా ఉండడానికి జరిగిన విఫలతయే కారణమని తెలుస్తున్నది.
ఈ ఉద్యానవనం మహాదేవరాజు ఇంటి తోట. ఎన్నో రకాలైన పూలతో ఎప్పుడు చాలా దూరం వరకు సువాసనలను వ్యాపింపజేస్తూ మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. మిగుల మగ్గిన పండ్లున్న చెట్లతో ఉన్న ఆ ఇంటి తోట ఈ మధ్యన నిండుగా ఉన్న నీటితో ఒక కొలను ఒడ్డున అందమైన పర్ణశాల ఉన్నది. దాన్నే ‘విచిత్ర మంటపం’ అని అంటారు. ఈ విచిత్ర మంటపంలోనే మహాదేవరాజు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు.
మహాదేవరాజు ఆలోచిస్తున్న సమయంలో ఒకతను వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. పది నిమిషాల దాకా రాజు ఏమి మాట్లాడలేదు. తరువాత అతనిని కూర్చోమన్నాడు. వచ్చినతను కూర్చున్నాడు.
అప్పుడు అతనితో ఇలా మాట్లాడాడు.
” ప్రహారేశ్వరా!” ఏం విశేషాలు?
ప్రహరేశ్వరుడు దేవగిరికి చెందిన వాడు. బ్రాహ్మణుడు కాక ఇతర వర్ణంవాడు. మహాదేవరాజు అతను కలిసి ఓకే గురుకులంలో చదువుకున్నారు. చిన్నతనం నుండి ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉన్నది. చూడడానికి రూపంలోనూ, వయసులోనూ ఇద్దరికీ అంత తేడా ఉండదు. వాళ్లకు చిన్నతనం నుండి ఉన్న వారి అభిప్రాయాలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. ఇద్దరి మధ్య ఉన్న చనువు అలా కొనసాగటానికే మహాదేవరాజు దగ్గర ప్రహారీశ్వరుడు ఉద్యోగం చేయలేదు. మహాదేవరాజన్న మాటలకు అతను ఇలా బదులిచ్చాడు.
“అనుకున్న పనంతా ఇంకో తీరుగా జరిగింది”. అంతా అవమానం పాలే అయింది. అనుకున్నదొకటి జరిగిందొకటి.
రాజు గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. ఏమైంది? తొందరగా వివరంగా చెప్పు! నా మనసులో మొదలే ఒక అనుమానం వచ్చింది. నీ మాట మరింత భయం కలిగుతుంది. ఆలస్యం చేస్తే మనసులోని బాధ ఎక్కువ అవుతుంది.
” ఏమీ లేదు! మన ముగ్గురు యోధులు మరణించారు”.
చెప్పవెందుకు? కొంపముంచారే? ఎలా జరిగింది?
ప్రహరేశ్వరుడు జరిగిందంతా రాజుకు పూసగుచ్చినట్టు చెప్పాడు. రాజు పదిహేను నిమిషాల దాకా కొయ్యబారిపోయి, ఏమీ మాట్లాడలేదు. తరువాత దీర్ఘంగా నిట్టూర్చాడు.
బాధపడి మనం ఏం చేయగలం? చేయాల్సిన పని చాలా పకడ్బందీగా చేశాం. కాని దైవాజ్ఞ లేక ఫలించలేదు. అని ప్రహరేశ్వరుడు అన్నాడు.
నిజమే! చేసేది ఏమీ లేదు! పని సులువుగా అవుతుందనుకున్నాం. ఏ కారణం లేకుండానే మన పేరు బయట పడింది. అయినా అయ్యేది కాక మానదు! అని మహాదేవరాజు అన్నాడు.
ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఒక భటుడు వచ్చి ఒక కాగితం తెచ్చి మహాదేవరాజుకిచ్చి నమస్కరించాడు.
మహాదేవరాజు ఆ ఉత్తరం తీసుకుని నెమ్మదిగా చూస్తున్నాడు. అందులో ఏమి రాసి ఉన్నదో? కానీ, మహాదేవ రాజు పొగలేని నిప్పువలె మండిపడుతున్నాడు. గడ్డం దువ్వుతూ, మీసం మెలివేస్తూ, పళ్ళు పటపట కొరుకుతూ, లోలోపల చదువుకుంటున్నాడు.
కారణమేమిటో తెలియక ప్రహరేశ్వరుడు అలా చూస్తున్నాడు. మహాదేవరాజును ఆ విధంగా చూసి కారణం ఏమిటని అడిగే అవకాశం ప్రహరేశ్వరునికి ఇవ్వలేదు.
మహాదేవరాజు ఇలా కోపంతో ఊగిపోతూ, తరువాత చూశావా? ప్రహారేశ్వరా! ఆడవాళ్లకు కూడా కళ్ళు తలకెక్కాయి. నా దాసీదైన కమలనెంత అవమానించిందో ఈ రుద్రమ్మ! ” వినాశ కాలే విపరీత బుద్ధి” ( నాశనం అయ్యే సమయానికి వింత బుద్ధి పుట్టింది) అన్నట్టు నన్ను, నా పరివారాన్ని చులకనగా చూడడం ఈ రుద్రమకు పోయేకాలం వచ్చిందేమో? ఈ ఉత్తరం చూడు! అని ఆ ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడికి ఇచ్చాడు.
అంతలోనే” ప్రహారేశ్వరా” ! ఒకసారి ఆ ఉత్తరాన్ని పెద్దగా చదువు! నేను వింటాను.” అని మహాదేవరాజన్నాడు.
ప్రహరేశ్వరుడు ఆ ఉత్తరాన్ని ఈ విధంగా చదవడం మొదలు పెట్టాడు.
” నన్నేలుతున్న నా శౌణ దేశాధీశ్వరులైన మహాదేవరాజ రాజ చూడామణి గారి పాదపద్మాల వద్ద పాద దాసైన కమల రోజూ మూడు కాలాల్లోనూ నా తలతో పాటు సాష్టాంగ నమస్కారాలెన్నో చేస్తూ రాసుకునే మనవి…..
అయ్యా! తమ ఆజ్ఞ తీసుకొని మురారి దేవుడు గారు, హరిహర దేవుడు గారు, ధర్మ వర్ధనుడు గారు, నేను….
సరే అదంతా వదిలేసి, ఉత్తరంలో ముందున్న విషయం చదవమన్నాడు మహాదేవ రాజు.
ప్రహరేశ్వరుడు అలాగే ఉత్తరం కొంత భాగం తన లోలోపల చదువుకొని, తరువాత ఇలా పైకి చదవడం మొదలు పెట్టాడు”ప్రహరేశ్వరుడు.
నన్ను తీసుకొనిపోయి సభలో రుద్రమ్మ ముందు నిలబెట్టారు.
ఆ…. అక్కడ నుండి చదవమని అన్నాడు మహాదేవ రాజు.
రుద్రమదేవి ముందు నిలబెట్టారు. రుద్రమదేవి ఎన్నో విషయాలు అడిగి, చివరకు నావైపు చూసి నిన్ను ఎవరు పంపారు? అని అడిగింది. నేను సమాధానమివ్వలేదు.
ఎవరు పంపారన్నది తెలుస్తూనే ఉన్నది. మహాదేవుడు వంకరగా చూశాడు. మంచిది! చదవమన్నాడు మహాదేవ రాజు.
” సభలో ఎవడో మీ పేరు కూడా చెప్పాడు.” అని చదివాడు.
రుద్రమదేవి సభలో నా పేరు పలికేంత మొనగాడున్నాడా? సరే !మిగతా ఉత్తరాన్ని చదువు !
” తరువాత రుద్రమదేవి నన్ను చూసి ఇవాళే మా రాజ్యం వదిలి వెళ్ళి పో! మా భటులు నిన్ను వెంబడిస్తారు.
నీకో రాజ్యం ఉన్నదా? ఆ రాజ్యం ఎలా దక్కించుకుంటావో నేనూ చూస్తాను.ప్రహారేశ్వరా! చదువు! చివరనున్న ఆ నాలుగు మాటలు ఏమిటో చదువు!
సరే అని ప్రహరేశ్వరుడు చదవడం మొదలు పెట్టాడు.” మళ్లీ మా రాజ్యంలో నీ మొహం కనపడితే నీ ప్రాణాలు దక్కవు!” ఆడదానివైనందున బ్రతికి పోయావు!”
వెంటనే మహాదేవరాజు ఇలా అన్నాడు. ఈ మాటలు విని, నేను తనని ఆడదని, జాలిపడి, విడిచి పెడతాననుకున్నది కావచ్చును… ఇంత అహంకారమా?
మళ్లీ ప్రహరేశ్వరుడు ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు. నీ మహాదేవ రాజు ఆడదై గాజులు తొడుక్కోవడం వల్ల కావచ్చు! బహిరంగ యుద్ధంలో ఆడదానినైన నన్ను ఎదుర్కోలేక, మోసానికి తలపడ్డాడు….
శత్రువులను తిరస్కరించడం మోసమా? సరే! ఇక బహిరంగ యుద్ధమే చేస్తాను. కాచుకో! అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ చదవడం మొదలు పెట్టాడు… సిగ్గు తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయాలనుకోవద్దని చెప్పు!
సిగ్గు తెచ్చుకోవాలా? నిన్ను సింహాసనం ఎక్కించి నందుకు సిగ్గు తెచ్చుకోవాల్సిందే! మళ్లీ ఇటువంటి పని చేయకుండా.. నేనే ఓరుగల్లు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాను. అహంకరించకు లెమ్మని అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ ఉత్తరం ఇలా చదవడం మొదలుపెట్టాడు.
“రాజ్యం దక్కించు కోవాలంటే మాతో స్నేహంగా ఉండమని చెప్పు! ”
ఎలా? ఎలా? నీతో స్నేహం చేయాలా? నీకూ నాకూ మధ్య ఏమైనా బంధుత్వం ఉన్నదా? లేక నాకు వరసైన దానవా? పరాయి ఆడదానివి! అందులోను వితంతువువు! నీతో స్నేహం మాకు ఎలా మంచి జరుగుతుంది? నీతో స్నేహం ఒక యమభటులు మాత్రమే చేస్తారులే! గర్వపడకు! అన్నాడు మహాదేవరాజు.
” గర్వం, అహంభావం, వదులుకో” అని చదివాడు ప్రహరేశ్వరుడు.
” మంచేదో? చెడేదో తెలియని దానివి. మహా నాకు నీతులు చెప్ప వచ్చావా? అన్నాడు మహాదేవరాజు.
” మేము చెప్పే మంచి మాటలను మరిచిపోతే, నీకు తెల్లవారితే మా పదునైన బాణాలు చురచురమని తగిలి బుద్ధి చెప్తాయని చెప్పు! అని చదివాడు.
ఇంతటి పొడుగైన బాణాలు ఎన్నడు చేయించుకున్నావే? చురచుర తలగించు కోవాలనే బుద్ధి ఉంటే… అలాగే తగిలించుకుందువు గానిలే! అన్నాడు మహాదేవరాజు.
” అని కర్ణకఠోరాలైన మాటలని, ఆనాడే నన్ను భటుల నిచ్చి వెళ్ళ కొట్టించింది. నేను మన దేశం వచ్చాను. కొద్ది రోజులలో మీ పాదసేవ చేసి, నా దుఃఖాన్ని అంతా చెప్తాను.
ఇట్లు పాద సేవకురాలు
కమల.
కమల ! పాపం ! కమలకు ఎంత అవమానం జరిగిందో కదా! దీనికి ప్రతీకారం మనం తీర్చుకోకుంటే రుద్రమదేవి గర్వం కానీ, దాసి దుఃఖం కానీ తగ్గదు అన్నాడు ప్రహరేశ్వరుడు.
నిజమే! అన్నాడు.
ఆలస్యం చేయకుండా రేపటి కొలువులో పౌరులు, ఉద్యోగులు, మంత్రులు, సేనాపతులు మొదలైన వారందరిని పిలిపించండి. తగిన పనులు చేసి, ఆలస్యం చేయకుండా ఓరుగల్లు మీద దండెత్తి పోకుంటే మనం చేతగాని వారి వలె అవుతామన్నాడు మహాదేవరాజు.
తప్పనిసరిగా అలాగే చేద్దాం అన్నాడు ప్రహరే శ్వరుడు .
ఇంటికి వెళుతూ నా మాటగా మంత్రికి చెప్పు రేపు దర్బారుకు అందరూ వచ్చేటట్టు చేయమని.
మంచిది అన్నాడు ప్రహారేశ్వరుడు.
రాత్రి కావడంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా మహాదేవ రాజుకు నిద్ర పట్టలేదు. మాటిమాటికి ఆ ఉత్తరాన్ని చూస్తున్నాడు. చిట్టచివరకు తెల్లవారుజామున శరీరం మంచం మీద వాల్చాడు.
మహాదేవరాజు స్థిర చిత్తుడు కాబట్టి ఉలిక్కిపడి లేచి కళ్ళు విప్పి చూశాడు. తెల్లవారి రెండు ఘడియల పొద్దు ఎక్కింది. తను అజాగ్రత్తగా ఉన్నందుకు విచారించి, పడక విడిచి, కాలకృత్యాలు తీర్చుకొని కొలువు కూటమికి నడిచి వచ్చాడు.
మంత్రి ఆజ్ఞ ప్రకారం సభ్యులందరూ ముందే వచ్చి ఎవరి తాహతుకు తగిన ఆసనాలలో వారు కూర్చుని ఉన్నారు. ఇంతలో మహాదేవరాజు సభా మంటపానికి వచ్చాడు. సభలోని వారంతా రాజును చూసి, తమతమ ఆసనాలలో నుండి లేచి నిలబడి రాజుకు నమస్కరించి,రాజుపట్ల తమకున్న ప్రభుభక్తిని చాటుకున్నారు. రాజు సభ్యులందరినీ వారికి తగినట్టుగా మర్యాదతో పలకరిస్తూ వచ్చి తన సింహాసనం మీద కూర్చున్నాడు. సభలోని వారంతా కూర్చున్నారు.
ఎప్పటివలె రోజువారీ కార్యక్రమాల సభ జరుగుతున్నా, ఈరోజు మంత్రి ఆజ్ఞతో సమావేశమైన ఈ సభకు కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు కానీ కారణం ఎవరికీ తెలియదు. ప్రహరేశ్వరుడికి మాత్రం తెలుసు .అతడు మంత్రికి చెప్పలేదు. తెల్లవారక ముందే కాలకృత్యాలు తీర్చుకొని రాజు గారి ఇంటికి వెళ్లి, రాజు కోసం ఎదురుచూస్తూ, రాజు నిద్ర లేవగానే రాజుతో కలిసి సభకు వచ్చాడు. కాబట్టి అసలు విషయం తెలియని ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.
ఇంతలో రాజుసభలోని వారందరినీ చూసి, సభ్యులారా! కొన్ని రోజుల కింద ఒకనాడు ఓరుగల్లు మీద దండయాత్ర గురించి సభ జరిగింది. దానికి మీరు అందరూ ఒప్పుకున్నారు. ఇవాళ అది కలిసి వచ్చింది. రుద్రమదేవికి అహంకారంతో కళ్లు తలకెక్కాయ్. నాకుబుద్ధి చెప్పేంత మొనగత్తె అయింది.
నిన్న మా దాసీదైన కమల నాకు ఒక ఉత్తరం పంపింది. దానిని మీరంతా వినాలి! అది వింటే మీకు రుద్రమ యొక్క గర్వం ఎంత ఉన్నదో తెలుస్తుంది. ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడు చదివి మీ అందరికీ చదివి వినిపిస్తాడు.
” ప్రహారేశ్వరా! ” నన్ను గొనిపోయి సభలో రుద్రమదేవి ఎదుట” అక్కడి నుండి ఉత్తరం చదువు అని అన్నాడు.
ప్రహారేశ్వరుడు కమల రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించాడు. ఆ ఉత్తరం విన్న సభ్యులందరూ” రుద్రమదేవి ఇలా చేయడం తప్పని ముక్త కంఠంతో అన్నారు .
సభలో నుండి ఒకడు లేచి” రాజచంద్రా! మీ శౌర్య ప్రతాపాలకు భయపడిన తమ రాజ్యాన్ని దక్కించుకోవాలనే బలమైన కోరిక ఉండి, తెలుగు వారొక ఆడదానిని మాళవులు ఒక పిల్లవాడిని సింహాసనంపై కూర్చుండబెట్టారు. దాని వల్ల స్త్రీ హింసకు, శిశుహింసకు వెనుకంజ వేసే ప్రభువులైన మీరు వారి దేశాల పైకి దాడికి వెళ్లరని, వాళ్ల రాజ్యాలకు ఎటువంటి అంతరాయం, నష్టం రాదనుకొని, అలా చేశారు. అయినా రాజ్యగర్వం కళ్ళకు మంచేదో?చెడేదో? తెలుపనీయక వాళ్ళమతులు పోగొట్టాయి. కాబట్టి తలచినంత మాత్రాన గుండెల్లో దిగులు పుట్టించే మీకు ద్రోహం చేయాలనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది.తమరు ఇప్పుడు ఇటువంటి మహిళలనీ, శిశువులనీ అనుకుని ఊరుకుంటే మీకు ముప్పు తప్పక కలుగుతుంది.
” దుర్జనం, కాంచనం, భేరీమ్,దుష్టస్త్రీం,దుష్ట వాహనం, ఇక్షుఖండాన్, తిలాన్, మర్దనం- గుణ మర్దనం” అని( నీచులను, బంగారాన్ని, నగారాలనే వాయిద్యాలను, చెడు స్త్రీలను, చెడు వాహనాన్ని, చెరుకు గడలను, నువ్వులను మర్దించాలి… వాటి గుణం మారేదాకా) మర్దించాలని శాస్త్రం తప్పుగా చెప్పలేదు. మత్తెక్కి భూమ్యాకాశాల తేడా తెలియకుండా ఉన్న ఆడదాన్ని నరికినా పాపంలేదు.ఇది ఎన్ని సార్లూ చెప్పినా నిజం ! అని అన్నాడు.
ఇతను గుజరాత్ దేశ పాలకుడైన లవణ ప్రసాదుడు .మహాదేవ రాజుకు సంతోషం కలిగించాలని అనుకొని , దేవగిరికి తన కుమారుడుతో పాటు కలిసి వచ్చి, కొంత కాలమైంది. కుమారుడైన వీరధవలుడిని తన సొంత రాజ్యానికి పంపి,తను ప్రతి దినం మహాదేవ రాజ్యసభకు వస్తూ… రాజ కార్యాలలో జోక్యం కలిగించుకొని, రాజుకు నచ్చేటట్లు మాట్లాడు తుంటాడు. రాజుకు కూడా ఇతనంటే కొంచెం ఇష్టమే. లవణ ప్రసాదుడు అలా అని ,తన ఆసనం మీద కూర్చున్నాడు.
లవణ ప్రసాదు గారు అన్న మాటలు మెచ్చుకునే విధంగా ఉన్నాయి. మనమిప్పుడు సైన్యసహితంగా ఓరుగల్లుకు వెళ్లి, పొగరుతో గుడ్డిదైనా రుద్రమను, ఆమె సేనను యుద్ధంలో ఓడించి, రాజ్యాన్ని మనం చేజిక్కించు కోకపోతే మనకు ఆమె ఉత్తరంలో కలిగిన అవమానం మాసిపోదు. కాబట్టి మనం ఓరుగల్లు పైకి దండెత్తి పోవడానికి ఆలస్యం చేయవద్దని మహాదేవరాజు అన్నాడు.
రాజుగారి ఆజ్ఞ రావడమే ఆలస్యం, సేనా నాయకుడు తమ సైన్యంతో యుద్ధ సామగ్రితో బయలుదేరడానికి ఆలస్యం చేయరని మంత్రి అయిన భోళేశ్వరుడన్నాడు.
నాతో పాటు సేనానాయకులందరూ యుద్ధానికి ఎదురు చూస్తున్నాం. సైనికులు యుద్ధ పరికరాలతో సిద్ధంగా ఉన్నారు మీ అనుమతి తప్ప కొరత ఏమీ లేనేలేదని సేనాపతులలో ముఖ్యుడైన రామశర్మ అన్నాడు.
మంత్రిగారూ! మన విధేయులైన వారు, మిగతా వారైన మండలాధ్యక్షులకు ఉత్తరాలు రాసి పంపాలి. వారంతా వస్తే మనకి ఇంకా మంచిది. రుద్రమదేవి చాలా పెద్ద సైన్యం తయారుచేసింది. ఆమె తండ్రి అయిన గణపతిరాజు కూడబెట్టిన సైన్యాన్ని ఈమె రెండింతలు చేసిందన్నా తప్పు లేదు. కాబట్టి మన దగ్గర ఎంత ఎక్కువ సైన్యం ఉంటే అంత మంచిది. మనకు సహాయం చేసేవారు దేవగిరిలోనే మనతో కలవాలంటే అలా వీలు కాదు. కొంతమంది దేవగిరిలోనూ, కొందరు దారిలో మధ్యన, కొందరు పొలిమేర వరకు, తక్కినవారు ఓరుగల్లు వచ్చి చేరవచ్చును. మనం రాసి పంపే ఉత్తరాలలో ఇలా వివరంగా రాసి పంపాల్సి ఉంటుంది. మన సైన్యం సిద్ధంగా ఉంది కదా? ఇంకా బయలుదేరేందుకు నగారా మోగించేందుకు తగిన ముహూర్తం ఆలోచించాలి. ముహూర్తం అంటే చాలా రోజుల వ్యవధి ఉండకూడదు. జ్యోతిష్యులకు ఈ విషయం చెప్పి పది, పదిహేను రోజులలో మంచి ముహుర్తం నిర్ణయించుకుని వచ్చి నాకు తెలియ చేయాలి. ఆ రోజు మనం బయలుదేరి వెళ్లాలి. ముందుగా రాయబారి కానీ మరెవరినైనా పంపేందుకు నాకు ఇష్టం లేదు. మీరంతా దీనికి ఒప్పుకోవాలి. ఎందుకంటే మనతో సమానులయితే ఎటువంటి రాయబారినైనా పంపవచ్చు. కానీ, ఒక ఆడది, అందునా మనను దూషించిన దాని దగ్గరకు రాయబారం పంపితే సిగ్గుచేటు. మన రాయబారం బాణాలతోనే పంపాలి. నా మాటలు శ్రద్ధగా విని అలా చేయండి! అని మహాదేవ రాజు మంత్రితో అన్నాడు.
చిత్తం! రాజుగారి ఆజ్ఞ! తెల్లారేసరికి మీకు శుభముహూర్తం నిర్ణయించి తెలియజేస్తాను. మిగిలిన సేన మొదలైనవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని మంత్రి చెప్పాడు.
సభలోని వారంతా యుద్ధోత్సాహాన్ని తెలిపారు.
కొంతసేపటికి సభ ముగిసింది. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
పన్నెండవ ప్రకరణ
[ యుద్ధ ప్రయత్నం]
శ్లోకం. ప్రవిష్ట శత్రుసైన్యంహి ప్రాజ్ఞ శత్రురతర్కితః
నిహన్యాదన్తరం లబ్ధ్వాఉలూక ఇవ వాయసాన్
శ్రీమద్రామాయణం- యుద్ధకాండం. సర్గ-17
శ్లో. వధ్యతా మేషతీవృణె దణ్డేన సచివైస్సహ
రావణస్య నృశంసస్య భ్రాతాహ్యేష విభీషణః”
శ్రీమద్రామాయణం-యుద్ధకాండం- సర్గ-17
ఈ శ్లోకాలు విభీషణుడు రామ శరణాగతి కోరి తన మంత్రులతో సహా వచ్చినప్పుడు, సుగ్రీవుడు రామునితో అన్నమాటలు.
భావం :– తెలివైన మరియు జ్ఞానం కలిగిన శత్రువు, శత్రుసైన్యంలో ప్రవేశించి, తరువాతి కాలంలో అవకాశం చూసుకుని, రాత్రిపూట చీకటిలో గుడ్లగూబ కాకులను చంపినట్లుగా …
చంపి వేయగలరు. పైగా విభీషణుడు పర హింసా తత్పరుడైన రావణుడికి తమ్ముడు. కనుక ఇతనిని అనుచరులతో సహా తీవ్రమైన దండనతో వధించవలెను.
కథా భాగం:– క్రీస్తుశకం 1285 వ సంవత్సరంలో రెండు ,మూడు నెలలు గడిచాయి.చలికాలం క్రమంగా పోయి ఎండాకాలం వేడి తగులుతున్నది. పగలు ఎక్కువగా, రాత్రిపూట తక్కువ సమయంగా మారింది. చలి బాధ వల్ల ఎండకు కూర్చోవడం, లేదా చలిమంటల దగ్గర కూర్చుని వేడి కాపులు పెట్టుకోవడం జనాలకు తగ్గింది. శుభకార్యాలు చేయాలనుకునేవారు ఆ పనికి వస్తువులను సేకరించుకోవడం కోసం తిరుగుతున్నారు. ఆధ్యాత్మిక చింతలలో ఉన్న వారు బ్రాహ్మణులు యజ్ఞ యాగాలు చేయాలనుకుని వాటికి కావలసిన వస్తువుల కొరకు భిక్షాటనకు వెళ్లారు. పురోహితులకు,జ్యోతిష్యులకు శుభాకార్యాలు చేయించడం వల్ల, శుభ ముహూర్తాలు నిర్ణయించడం వల్ల తీరిక లేకుండా ఉన్నారు. కొందరు యజమానులు పాత ఇండ్లను కూలగొట్టించి, కొత్త ఇండ్లు కట్టిస్తున్నారు. శ్రీమంతులు కొందరు ఎత్తయిన ఇండ్లను చూసి అటువంటి ఇండ్లు తమకు కావాలని, తమ ఇండ్లు అందంగానూ, గట్టిగా ఉన్నా కూడా వాటిని కూల్చేసి, మళ్లీ కొత్తగా కట్టిస్తున్నారు.
ఓరుగల్లు పట్టణంలో రాతి పనులు, మట్టిపనులు ఎక్కువగా జరుగుతున్నవి. అయినా కారణం లేకుండా అవి జరగడం లేదు. కోటగోడలు అక్కడక్కడా కొద్దిగా కూలిపోయాయి. కూలిపోయిన చోట ముందటి కన్నా బలంగా బాగు చేయిస్తున్నారు. పట్టణం చుట్టూ కంప కోట కట్టిస్తున్నారు. కంప కోట అంటే పెద్ద పెద్ద ఇనుప ముళ్ళు ఉన్న ఇనుప తీగను చిక్కగా, దట్టంగా పట్టణానికి చుట్టూ గుండ్రంగా చుట్టడం. ఎందుకంటే వేగంగా వచ్చిన ఫిరంగి గుండ్లు కంపలో దూరితే అవతలికి గానీ, ఇవతలికి గాని వెళ్లదు. ఈ కంపకోటలో పెద్ద కందకం తవ్విస్తున్నారు. ఆ కందకంలో తవ్వగా వచ్చిన మట్టితో ప్రహరీని ఆనుకుని లోపలి వైపు మట్టికోట కడుతున్నారు. మట్టి కోటకు లోపలివైపు రాతికోట ఒకటి కడుతున్నారు. ఈ రాతికోట సున్నంతో కానీ, మట్టితో కానీ కట్టకుండా బలమైన రాతితో కడుతున్నారు. ఈ రాతికోట మందంగా ఉండి, అష్ట కోణాకారంలో ఉన్నది. రాతితో కట్టినదైనా వెంట్రుక కూడా పట్టేంత సందు లేకుండా కట్టిన ఆ రాతి పనివాడి పని ఈ నాటికీ సందర్శకులకు కళ్ళ పండుగగా ఉంటుంది. ఈ రాతిప్రాకారం లోపల సున్నంతో, ఇటుకలతో మరొక ప్రాకారం కడుతున్నారు. దాన్ని ఇటుకకోటని, భూమి కోటని పిలుస్తారు.
మొదట శత్రువులు దూరరాని కంపకోట, దాని తరువాత అగాధమైన కందకము, దాని వెనుక చాలా మందపాటి, చాలా ఎత్తయిన,పగలకొట్టి చొరబడరానిదైన మట్టికోట, తరువాత వంద వేల శతఘ్నుల పేల్చినా ఏమాత్రం చెడిపోకుండా, దాడికి లొంగని రాతికోట, దాని పక్కన దానికి ఏ మాత్రం తీసిపోని భూమి కోటలుండి ఏకశిలానగరమని తలిస్తే చాలు గుండె దిగులు పుట్టేలా ఉన్నది.
భూమి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు, వాటి పక్కనే ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. రాతి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు, ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. పుట్ట కోటకు ఎనిమిది దుర్గ ద్వారాలు, 18 చిన్నవాకిళ్లున్నాయి. పనివాళ్ళు కూలి వాళ్ళు రాత్రింబగళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. కొంత మంది ఉదయం కొంత మంది రాత్రి వరుసగా అంచలంచలుగా ఎనిమిది సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. అందుకే ఈ కోటలు కందకాలు ఇప్పటికి సిద్ధమైనాయి. అప్పుడు ఇవన్నీ సిద్ధమైనట్టు రుద్రమదేవికి తెలిసింది. రుద్రమదేవి దర్బారులోనికి వచ్చినప్పుడు కట్టడాలను పర్యవేక్షిస్తున్నప్పుడు, గుఱ్ఱపుస్వారీ చేసేటప్పుడు పురుషుల వలె దుస్తులు ధరిస్తుంది. ఆరోజు సిద్ధమైన కోటలను చూసేందుకు రుద్రమదేవి మగవేషం వేసుకొని, వెంట కొంతమంది తోడురాగా బయలుదేరింది. వాళ్ళంతా వరుసగా ఒక్కొక్క కోటను, వాటికున్న బురుజు ద్వారాలు, చిన్న వాకిళ్ళను, కందకాలను, అన్నింటినీ జాగ్రత్తగా చూపారు. రుద్రమదేవికి చాలా సంతోషం కలిగింది. ఆ కట్టడాలను కట్టిన పనివాళ్లు, కూలి వాళ్లు రుద్రమదేవిని చూసి నమస్కరించారు. పని చేయించేందుకు నియమించిన పెద్దపనివాళ్ళు రుద్రమదేవి గుర్రం వెంట నడుస్తూ ఆయా ప్రదేశాలను, కట్టించే టప్పుడు కలిగిన శ్రమను, చాలా సన్నని స్వరంతో రుద్రమదేవికి చెప్పి చూపిస్తున్నారు. చిన్న వాకిళ్ళలో, బురుజు ద్వారాలలో అమర్చిన తికమక దర్వాజలను చేతితో ముట్టి, కదిలించి రుద్రమదేవి స్వయంగా పరీక్షించి చాలా బలంగా ఉన్నాయనుకొని సంతృప్తి పడింది.
రుద్రమదేవి అన్ని చోట్ల భద్రంగా పరిశీలించి నగరానికి బయలుదేరింది. పనివాళ్ళు ఆమె వెంట నడిచారు. ఆమె అంతరంగికులు వెంట నడిచారు. కొన్ని ఘడియలలో వారంతా నగరం చేరారు. రుద్రమదేవి రాజదర్బారులోనికి వచ్చి, వజ్రాల సింహాసనం మీద కూర్చున్నది. ఎప్పటివలె సభ్యులంతా వారివారి స్థానాలలో కూర్చున్నారు. లెక్కలు రాసే వారిని పిలిపించారు. రుద్రమదేవి ఆజ్ఞతో లెక్కలు వ్రాసేవారు, పనివాళ్ళ కూలి, వాళ్ళ జీతాలు మొత్తం లెక్క చేసి ఇచ్చిన డబ్బు తీసేసి , మిగిలిన డబ్బులు లెక్క చెప్పి రుద్రమదేవికి చూపించారు. రుద్రమదేవి కోశాధికారికి ఉత్తరం రాసి పని వాళ్లకు ఇవ్వవలసిన డబ్బును, మరి కొంత ధనాన్ని తెప్పించి వరుసగా అందరికీ లెక్క చొప్పున పంచి పెట్టింది. తరువాత ఒక్కొక్క పని వానికి వాడు చేసిన పని తెలుసుకొని కొంత బహుమతిని తన చేతితో పంచి, వారందరినీ పంపి వేసింది. పని వాళ్ళంతా చాలా సంతోషంతో దీవిస్తూ, పొగుడుతూ, సంతోషంతో కేకలు వేస్తూ రుద్రమదేవికి నమస్కరించి వెళ్లిపోయారు.
తరువాత రుద్రమ్మ కొలువులో ఉన్న తన సేనా నాయకుల పేర్లు పెట్టి పిలిచింది. వెంటనే వాళ్లంతా తమ ఆసనాల నుండి లేచి నిలబడ్డారు. అప్పుడు రుద్రమదేవి గంభీరమైన కంఠంతో ఇలా చెప్పటం మొదలు పెట్టింది.
సైన్యాధికారులారా! ఈనాటికీ మన ఏకశిలా నగరానికి ప్రసిద్ధమైన కోటలుండే భాగ్యం కలిగింది. ఎన్ని కోటలు, ఎన్ని కందకాలున్నా వాటి రక్షణభారం వీర భటులు చేయకుంటే ప్రయోజనం ఉండదు.మనలను ఎదిరించ లేరనుకొని ఊరికే ఉండటం మంచిది కాదని మా నాయన గారి హితవచనం.
అందుకు మనం పూర్తి శ్రద్ధ కలిగి కోటలను రక్షించడంలో ఏకశిలానగరం అందరికీ ఆదర్శంగా ముందుండాలి. దానికి నేను చెప్పేది ఏమిటంటే కోట గోడకు ఆధారంగా వేసిన కొరడు ( కోటకు అవతలివైపు ఉన్న మట్టి దిమ్మ) మీద రక్షణ బాధ్యత రాజ బంధువులలోని ముఖ్యులైన వీరుల ఆధీనంలోనూ, భూమి కోటలోని రక్షణ బాధ్యత మిగిలిన బంధు వీరుల ఆధీనంలో ఉంచాలి. జన్నిగ దేవసాహిణి తను చెప్పిన మాట వినే సేనలోని వారిని భూమి కోటలోని ఎనిమిది చిన్న వాకిళ్ళకు ఒక్కొక్క వాకిలికి ఐదు వందల మంది చొప్పున,18 చిన్న వాకిళ్ళకు ప్రతి ఒక్కొక్క వాకిలికి 100 మంది వీరభటుల చొప్పున, బురుజు ఒక్కదానికి 500 మంది వీర భటులను నియమించి, రాతికోటలోని నాలుగు బురుజుల, ఎనిమిది చిన్న వాకిళ్ళను రక్షించాలి.
అంబయ్య దేవ మహారాజు ఆదేశాల ప్రకారం సైనికులను అక్కడ ఉంచి, మట్టి కోటను రక్షించాలి.
గోనగన్నారెడ్డి తన అధికారం కింద ఉన్న సైనికుల నుండి కోటకు రెండు వైపులా నుంచి కోటను రక్షించాలి.
దాదియ సోమయ సాహిణి తన సైన్యం నుండి బూడిద ఒకటికి యాబై మందిని నిలపాలి. రుద్రమ నాయుడు నాగచమూపతి ఇద్దరూ యుద్ధానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయించాలి. మిగిలిన సేనానులు కంప కోటను, కందకాలను కాపలా కాయాలి. మనకు ఇప్పుడు ఎటువైపు నుండి కానీ యుద్ధం జరుగుతుందనే అనుమానం లేదు. కానీ దుర్మార్గుడైన మహాదేవరాజు విషయంలో మాత్రం కొంచెం అనుమానం ఉన్నది. అతని దుష్టస్వభావంతో నిస్సహాయులైన మమ్మల్ని పట్టుకుని తీసుకొని పోవాలి అనుకున్నాడు. హఠాత్తుగా మన మీద దండెత్తి వస్తాడనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతను దండెత్తి వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. మనం జాగ్రత్తగా ఉంటే అంతా భద్రంగా ఉంటుంది.
రుద్రమదేవి చెప్తున్నప్పుడు సేనా నాయకులు తమకు అప్పగించిన పనులను, తమ రక్షణ కిందకు వచ్చిన కోటలను కాగితాల మీద రాసుకున్నారు. రుద్రమదేవి తాను చెప్పగలిగిన మాటలను చెప్పి ముగించగానే సేనా నాయకులందరూ ఒక్కసారి సింహనాదాలు చేసి తమ చేతులలో ఉన్న బరికత్తులను తళతళమని మెరిసేటట్లు ఊపారు. తర్వాత సభను ముగించారు.ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. సేనానాయకులు రాణిగారి ఆజ్ఞ ప్రకారం ఆయా చోట్లలో సైన్యాన్ని నియమించి, వారు శ్రద్ధగా ఉన్నట్టు గమనించి వచ్చి రాణికి తెలుపుతున్నారు.
కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు సభలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటివలె ఆ రోజు రాత్రి రుద్రమదేవి సభ తీర్చి ఉన్నది. రాజ దర్బారంతా సభ్యులతో కిక్కిరిసి నిండి ఉంది. రకరకాల విషయాలు చర్చిస్తున్నారు.
ఇంతలో ఒక యువభటుడు గబగబా వచ్చి, రాణీకి మొక్కి, సభలోని వారందరూ, రాణి గారు వినేటట్టుగా బిగ్గరగా ఇలా చెప్పాడు.” శౌణదేశాధీశ్వరుడైన మహాదేవరాజు గొప్ప సైన్యంతో దేవగిరి నుండి వస్తున్నాడు” మన ప్రాంతానికి ఇంకా నాలుగైదు రోజులలో ఇక్కడికి చేరగలడు. ప్రభువు ఆజ్ఞతో ఇతర దేశాల నుండి వచ్చే రహదారులను మేము కాపలా కాస్తున్నాం. అక్కడి పరిస్థితి చూసి వచ్చిన సంగతి ఇది. తర్వాత ప్రభువులకు ఎలా అనిపిస్తే అలా జరుగుతుంది. మాకు అప్ప చెప్పిన పని చక్కగా చేసుకుని వచ్చాం.”
మంచిది! నువ్వు వెళ్లిపొమ్మని రుద్రమదేవి అన్నది. గూఢచారి నమస్కరించి వెళ్ళిపోయాడు. రుద్రమదేవి మంత్రి అయిన శివదేవయ్య వైపు చూసి ఏమో చెప్పబోయి, చెప్పదలుచుకున్న విషయం కాస్త రహస్యంగా ఉంచ తలుచుకొని, సేవకుడిని చూసి, ఓరీ! నువ్వు వెళ్లి ఇప్పుడు వచ్చిన గూఢచారిని పిలుచుకొని రా! అని చెప్పింది. సేవకుడు గబగబా నడిచివెళ్ళి ,వెళ్ళిన గూఢచారిని సభలోనికి పిలుచుకొని వచ్చాడు.
ఓరీ! మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడని చెప్పావు కదా! అతని సైన్యం ఎంత ఉందో నువ్వు చెప్పగలవా? అని రుద్రమదేవి గూఢచారిని అని అడిగింది.
అయ్యా! నేను నిజంగా అతని సైన్యం ఎంత ఉందో చెప్పలేను. కానీ ఎంత దూరం చూసిన సైన్యమే కనబడుతున్నది. గుర్రాలను ఏనుగులను ఒకటొకటి లెక్క పెట్ట గలమా? మా పని శత్రుసేన కొంత దూరంగా ఉండగా చెప్పడం వరకే! అదే చేశానని గూఢచారి జవాబిచ్చాడు.
సరే !నువ్వు వెళ్ళి, మీలో ఒకడినిఅక్కడికి పంపి, సైన్యం ఎంత ఉందో సంఖ్య తెలుసుకుని రమ్మని చెప్పు! అని రాణి అన్నది. గూఢచారి వెళ్ళిపోయాడు. రుద్రమదేవి మంత్రితో ఇలా మాట్లాడింది.
చూశారా! మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడట.పూర్తిగా కుటిల మనసున్న వాడైనాడని అనడానికి సందేహం లేదు.
తల్లీ! కాల మారినట్లు గుణాలు మారుతాయి! అయినా వాళ్లు చేసిన దానికి తగిన ఫలితం అనుభవిస్తారు. కారణం లేకుండా మన మీద కోపం పెంచుకుని, మీకు అపకారం చేయదలచి, అందులో విఫలమవడంతో అసూయతో మనసులు నింపుకొని, ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు దండెత్తి రావడానికి అదే కారణం. నాకు ముందే అనుమానం వచ్చి, దేవగిరి తోవకు గూఢచారులను కాపలా పెట్టాను.
దండెత్తి వస్తే రానివ్వు! అతనికి ఎన్ని రోజుల నుండి యుద్ధం చేయాలనే ఆలోచన ఉన్నదో? దానిమీద కాకతీయుల పదునైన బల్లేల రుచి చూస్తాడు. కానివ్వు! అతని ఉద్ధతి ఎంత ఉందో? దాని ప్రకారం ప్రతీకారం జరగనీ! వెనుకటి వాళ్లు కాకతీయుల అగ్నివంటి ప్రతాపాన్ని చూశారు. కానీ రెండు తరాల నుండి వీరికి ఆ రుచి తెలియదు. ఇతడు కావాలను కోరి వస్తే అతనిని చిన్న పుచ్చడం ఎందుకు? మనం కోటలను మరమ్మతు చేయించడం, కొత్తకోటలు కట్టించడం, వాటి మీద గట్టి కాపలా పెట్టడం మంచి పని అయింది. ఒక్క మహాదేవరాజే కాదు వంద మంది మహాదేవ రాజులొచ్చినా ఓరుగల్లుకు నష్టం లేదు.
కోటలే కాదు… మీ శౌర్య ప్రతాపాలు…నేనేమి చేయగలను? మరొకడు ఏమి చేయగలడు? రాజులకు ప్రాణం సైన్యం. ఉదారంగా పౌరుషవంతులైన శూరులు రాజ్యాన్ని దక్కించుకుంటే రాజ్యం దక్కుతుంది.
అందుకోసం మన సేవకులంతా సిద్ధంగా ఉన్నారు. కంఠనాళంలో రక్తప్రసారం జరుగుతున్నంతసేపు యుద్ధం చేసి, తమ ప్రభువును గెలిపించడమే వారి పనిగా మన సైనికులు యుద్ధం ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు.
వీరిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా ఒక్క గూఢచారి సభలోనికి వచ్చి, రుద్రమదేవికి నమస్కరించి, అయ్యా! మహాదేవరాజు దండెత్తి వస్తున్న విషయం ఇంతకు ముందే నా తోటి ఉద్యోగులు మీకు తెలిపి ఉన్నారు. నేను సేనా సంఖ్య ఎంత ఉందో తెలుసుకొని వచ్చాను. మహాదేవరాజు సైన్యం మొత్తం మూడు లక్షలు. యుద్ధ సామాగ్రి, వస్తు సామాగ్రి చాలా ఉన్నది. సైన్యం ఇక్కడికి రావడానికి నాలుగు రోజులు పడుతుందని చెప్పాడు.
మంచిది! నువ్వు నీ పని మీద వెళ్ళు! అని రుద్రమదేవి అతనిని పంపి…
మంత్రిగారూ! మన సైన్యం ఎంత ఉంది? మహాదేవ రాజు సైన్యం మూడు లక్షలట! అని అన్నది.
తల్లీ! అయితే ఏం? బురుజులపైనా, కందకాలపైనా, చెట్లకొమ్మలపైనా ద్వారాల దగ్గరా, చిన్న తలుపుల దగ్గరా ఉన్న సైన్యం కాకుండా… మిగిలిన సైన్యం రెండు లక్షల డెబై వేలని నిన్న మన సేనా నాయకులు లెక్క ఇచ్చారు. కాపలా కాసే వారి సంఖ్యతో కలిసి మూడు లక్షల కన్నా ఎక్కువే ఉంటుంది. వస్తుసామగ్రి కూడా చాలా ఎక్కువగానే ఉంది. మూడు ,నాలుగు సంవత్సరాలు విరామం లేకుండా యుద్ధం చేసినా తక్కువ పడదు.
మనం ఒక్కసారి సైన్యం చూసి వస్తే బాగుంటుంది కదా! నాగచమూ నాయకులు మన వెంట వస్తారు.
సరే!
రుద్రమదేవి లేచి నిలబడింది. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. రుద్రమదేవి భూమి కోట బురుజు ద్వారం దగ్గరకు నడిచింది. మంత్రి , సేనాధిపతులు వెంట నడిచారు. తక్కిన సభ్యులు వారి వారి ఇళ్లకు వెళ్ళారు.
పదమూడవ ప్రకరణ
[ సంధి ]
శ్లో॥ అపనీత శిరఃస్త్రాణాః శేషాస్తుం శరణం యయౌ ;
ప్రణిపాత ప్రతీకారః సంరంభోహి మహాత్మనాం !
— (రఘువంశము)
భావం :– చచ్చిన వారు పోగా బ్రతికి ఉండే వారు టోపీలు తీసివేసి, ఆ రఘువంశ మహారాజును శరణుజొచ్చారు. మహాత్ములు శత్రువుల గర్వం అణిచివేయడంలోనే దృష్టి ఉంచుతారు. కానీ వారు వినయంగా ఉండే వారిని, ముందటి వలె చంపాలనే కోపం ఉండదు కదా!
వ్యాఖ్య:– ఈ రఘువంశంలోని శ్లోకం ప్రకరణ మకుటంగా గ్రంధకర్త తీసుకోవడం, రుద్రమదేవి నవలలోని రుద్రమదేవి- మహాదేవరాజు మధ్య గల సంధిని సూచిస్తూ, కథార్ధ సూచిగా ఎంతో చక్కగా అమర్చారు.
ఈ శ్లోకాన్ని చదువుతూనే కథలోని మలుపులు తెలుస్తునాయి.ఈ విశేషమైన ప్రక్రియ అరుదుగా కనిపిస్తుంది.
కథాభాగం:– మహాదేవరాజు సైన్యం ఓరుగల్లు కోటను ముట్టడించింది. ఏనుగులు, గుర్రాలు వీరభటులు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనపడుతున్నారు. మహాదేవరాజు మూడు లక్షల సైన్యంతో ఓరుగల్లును ముట్టడించి, పదిహేను రోజులు అయింది. ప్రతిరోజు రుద్రమదేవి సైన్యానికి మహాదేవరాజు సైన్యానికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. రెండు వైపులా సైన్యంలో సైనికులు చనిపోతున్నారు.
ఈరోజు పదిహేనవ రోజు యుద్ధం మొదలైంది. రుద్రమదేవి మగవేషంతో ఉత్తమజాతికి చెందిన గుర్రాన్నెక్కి పౌరుషానికి మారురూపుగా వచ్చిందా? అన్నట్టుగా చూడ శక్యం గానంతగా యుద్ధభూమిలో తిరుగుతూ, కనపడ్డ శత్రువులందరిని చంపి వేస్తున్నది. రుద్రమదేవి సేనానాయకులలో ముఖ్యులైన రుద్రమ నాయుడు వెలమ సైనికులకు, నాగచమూపతి కమ్మ సేనకు అధికారులై తమ సైన్యాన్ని ప్రోత్సహిస్తూ వీరవిహారం చేస్తున్నారు.
జన్నిగదేవ సాహిణి, త్రిపురాంతక మహాదేవ రాజు, అంబయ్య దేవమహారాజు, గోనగన్నారెడ్డి, దాదియ సోమన సాహిణి మొదలైన సేనానాయకులు ఎవరూ దగ్గరకు రావడానికి సాహసించ లేనంత భయంకరంగా యుద్ధం చేస్తున్నారు.
రుద్రమదేవి అల్లుండ్లైన ఇందులూరి అన్నమ రాజును, చాళుక్య వీరభధ్రుడు రాజును తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ, యుద్ధభూమిలో తిరుగుతూ, శత్రుసైన్యం గుడారాలను, శత్రువులను కింద మీదలు చేస్తున్నారు. మల్యాల గుండాదీశ్వరుడు మహాదేవరాజుతో యుద్ధం చేస్తున్నాడు. రుద్రమదేవి ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య వయసురీత్యా ముసలివాడైనా యువకునివలె యుద్ధం చేస్తున్నాడు. గుండ ధరాధీశ్వరుని తమ్ములైన మల్లయ్య, బుద్ధయ, కోటయ్య, పిడుగు గుండయలు నాలుగు వైపులా తిరుగుతూ యుద్ధం చేస్తున్నారు. ప్రసాదాదిత్య నాయకులు మొదలైన సేవక వర్గం తమవెంట ఎవరైనా తోడుగా వస్తున్నారా? లేదా? అని చూడకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు.
మహాదేవరాజు మంత్రి అయిన సాధులుడు, సేనాపతులైన భోళేశ్వరడు, రామశర్మ, బిచ్ఛణుడు మొదలైన వారు, కొంకణ దేశపురాజు, ఘూర్జర దేశపు అధినేతైన లవణప్రసాదుడు మొదలైనవారు చెలరేగి యుధ్ధం చేస్తున్నారు. ఇంకా ఎందరో మహాదేవరాజుకు సహాయం కోసం వచ్చిన మాండలికులు వీరవిహారం చేస్తున్నారు. రెండు వైపుల వారు విజయం మాకే కావాలనే కోరికతో గుంపులతో దొమ్మి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.
మధ్యాహ్నం రెండు జాములయింది. చెట్ల కొమ్మల మీద, బురుజుల మీద ఉన్న ఓరుగల్లు సేన మహాదేవరాజు సైనికుల మీద బాణాల వర్షం కురిపిస్తున్నది.
రుద్రమనాయుడు, నాగ చమూపతి తమ పరివార మైన వెలమ,కమ్మ వారిని వెంట తీసుకొని, దేవగిరి దళాన్ని ఎదుర్కొన్నారు. వారి పరాక్రమం చెప్పలేనంతగా ఉన్నది.
మల్యాల గుండదండధీశ్వరుడు శౌణ దేశాధీశ్వరులిద్దరూ కత్తి యుద్ధం చేస్తున్నారు.వారిద్దరి శరీరాలు రక్తంతో తడిసి, ఎర్రని పూలతో ఉన్న మోదుగ చెట్ల వలె కనపడుతున్నారు. యాదవరాజు పదునైన బల్లేన్ని తీసుకొని గుండ దండాధీశ్వరుని గుర్రాన్ని నరికి వేశాడు. అతడు కొంచెం కూడా తొట్రు పడకుండా పదునైన ఖడ్గం తీసుకొని మహాదేవరాజుపైకి ఉరికి అతనెక్కిన ఏనుగును కొట్టాడు. తొండం తెగిపోవడంతో ఆ ఏనుగు గీ అంటూ అరుస్తూ నేలమీద కూలిపోతున్న ది. వెంటనే మావటిని తల నరికేసి, నేలమీదికి దుముకుతున్న శౌణదేశపు రాజును చంపాలని, గుండ దండాధీశ్వరుడు కత్తిగిరగిరా తిప్పి విసిరాడు.
మహాదేవరాజు అతని కత్తి వేటునుండి తప్పించుకొని, యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. దండాధీశ్వరుడు పరిశ అనే ఆయుధాన్ని మహాదేవరాజుపై విసిరాడు. ఆ దెబ్బకతను సొమ్మసిల్లి నేల మీద పడ్డాడు. గుండ దండాధీశ్వరుడు సింహనాదం చేశాడు. దేవగిరి సైనికులు భయపడ్డారు. మహాదేవరాజు వెంటనే తెప్పరిల్లి చీకటిని గిరగిరా తిప్పి దండాధీశ్వరుని పైకి విసిరాడు. ఆ కత్తివేటుకు కంఠానికి తాకినందున అతడు నేలపై పడి ప్రాణాలు విడిచాడు .
అన్న అలా నేల కూలాగానే తమ్ముళ్లు ఒక్కసారిగా యాదవరాజుపై కలియబడ్డారు. శౌణదేశాధిపతికి సహాయంగా లవణప్రసాదుడు, మంత్రి అయిన సాధులుడు వచ్చి కలిశారు. రుద్రమదేవి సేనా నాయకులను చుట్టుముట్టినందు వల్ల వాళ్లు రాజుకు సహాయం చేయలేకపోయారు.
గుండదండాధీశ్వరుని తమ్ముళ్లు ఐదుగురు ఎదురు నిలిచి యుద్ధం చేస్తూ మంత్రిని మూర్ఛ పోగొట్టారు. రుద్రమదేవి యాదవ రాజున్న దగ్గరికి దుర్గాదేవి ప్రత్యక్షమైందా అన్నట్లు భయంకర రూపంతో వస్తూ ఉండగా… తోవలో సేనా నాయకుడైన దాదియ సోమయ సాహిణి వీరమరణం పొందాడనే పిడుగు లాంటి ఆ వార్త విని మళ్లీ వచ్చిన చోటికి వెళ్ళి పోయింది రుద్రమదేవి.
గుండ దండాధీశ్వరుని తమ్ముడు శౌణదేశాధిపతిని చుట్టుముట్టి, మూర్చ పోయిన అతనిని కోటలోనికి మోసుకొని పోతున్నారు. వెలమ, కమ్మ వీరులు పరాక్రమంతో శత్రువులను మట్టి కరిపిస్తున్నారు. సైన్యం ఉత్సాహంగా, బలంగా ఉన్నది. అయినా ఓరుగల్లు సైన్యం అలిసిపోయింది. కానీ బింకం తగ్గలేదు. ఇంతలో” ” శత్రువులను చుట్టు ముట్టండి! వీరులకు వీరస్వర్గం కన్నా మించిన మంచి మార్గం లేదు!” శూరులకు వీర విహారమే ఉత్సాహంగా ఉంటుంది.” పోరాడి పోరాడి విజయం సంపాదించినా, వీరమరణం పొందినా మీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది!” యుద్ధభూమిలో భయపడి,పారిపోయి మీ ఇండ్లకు శరణార్థుల వెడితే మీ భార్యలు మిమ్మల్ని ఆడవారి కన్నా ఎక్కువ హీనంగా చూస్తారు.” మన పూర్వీకుల పౌరుష చరిత్రలు మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి!” ధైర్యాన్ని మీ సొంతం చేసుకోండి!” శత్రువులు పెచ్చుమీరుతున్నట్టున్నారు. వారి పొగరు అణచండి. అని గంభీరంగా అంటూ రుద్రమదేవి అక్కడికి వచ్చింది.
తమ రాణిని దగ్గరగా చూడగానే సైన్యంలో కొత్త ఉత్సాహం నిండి, ఏనుగంత బలం కలిగి,” హరహర ” అంటూ ఒక్కసారిగా శత్రువుల మీద పడ్డారు. అప్పటి ఆ యువ సైన్యాన్ని వర్ణించటం , దేనితో పోల్చాలో వర్ణించడానికి భాష చాలదు.
కోట బురుజుల మీద, కందకాల మీద, చెట్ల కొమ్మల మీద ఉన్న సైనికులు వచ్చి చేరారు. బురుజుల దగ్గర, చిన్న వాకిళ్ల దగ్గర కాపలా ఉన్న సైన్యంలో సగం సైన్యం వచ్చి, చేయూతనిచ్చింది. కోటలో ఉన్న మూలబలం కూడా కేకలు వేస్తూ వచ్చి చేరింది.
రుద్రమదేవి సైన్యం చాలా పెద్దదై శత్రువులను నరికి వేస్తున్నది. తళతళ మని కత్తులు మెరుస్తున్నాయి. తటతట మని తలలు తెగి కింద పడుతున్నాయి. ఇలా రెండు ఘడియల కాలం యుద్ధం చేసేసరికి వెలమనాయకుల, కమ్మ నాయకుల శౌర్యానికి తట్టుకోలేక అక్కడ ఉన్న శత్రువులు పారిపోయారు. రుద్రమదేవి సైన్యం వెంట పడగా… శౌణదేశపు సైన్యం అటు ఇటు పారిపోయింది.
అప్పుడు రుద్రమదేవి అక్కడ సైన్యాన్ని పంపి వేసి, ఉత్తర దిక్కున పోరాడుతున్న వీరుల వైపు తన సైన్యంతో వెళ్లి వారితో యుద్ధం చేసింది.
గుండ దండాధీశ్వరుని తమ్ములైదుగురు రాజును మూసుకొని పోయిన సమాచారం సేనాని అయిన బిచ్ఛణుడు విని, కోపంతో గబగబా వెళ్లి వారితో కలియబడ్డాడు. వాళ్ళు శౌణరాజును విడవకుండా సైన్యాన్ని ఎదుర్కొన్నారు. సైన్యాధిపతి కోపంతో వింటితో బాణాలు ఎక్కుపెట్టి పిడుగు గుండయ్య, విట్టల అయ్యను పడగొట్టాడు. మిగిలిన ముగ్గురు బిచ్చనుడితో యుద్ధం చేస్తున్నారు.
ఇంతలో శౌణరాజు మూర్ఛ నుండి తేరుకున్నాడు. శౌణరాజు తననెవరో మోసుకొని పోతున్నట్టు తెలుసుకొని, కోపంతో మండిపడుతూ నేలమీదకు దుమికాడు. వెంట ఖడ్గాలు చేతిలో పట్టుకొని, మల్లయ్య, బుద్ధయ, కోటయ్యలపై కలియబడేంతలో బిచ్ఛనుడు ప్రాణాలు విడిచాడు. సేనాని పరిస్థితి చూసి, కోపంతో శౌణరాజు ఖడ్గాన్ని తీసుకొని, ఆ ముగ్గురు వీరుల మీద పడి చాలా నొప్పించాడు. కొంతసేపటికి వాళ్ళు ముగ్గురు నిలువలేక పారిపోయారు.
శౌణదేశపు రాజు రుద్రమదేవి దగ్గరకు పోవాలనుకొని తలెత్తి చూశాడు. అప్పుడు అతనికి కలిగిన కలత అంతా ఇంతా కాదు. తన సైన్యం దెబ్బతిని పారి పోతున్నట్లు, రుద్రమదేవి, ఆమె సైన్యం తన సైన్యాన్ని తరుముతున్నట్లు, అతడు చూశాడు.ఎంత ప్రోత్సహించినా తన సైన్యం యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నది అనుకోని, తన సైన్యం చాలా తక్కువ గానూ, రుద్రమదేవి సైన్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు, ఆమె సైన్యంతో ఎదుర్కొంటే ప్రాణాలు దక్కవని, అతడు తెలుసుకున్నాడు.కాలం కలిసి రానప్పుడు తాను మాత్రం ఏం చేయగలడు. రుద్రమదేవికి ఆమెకు సంబంధించిన వారికి కనిపించకుండా ఒదిగి ఒదిగి ఒక పక్కనుండి పారిపోయాడు.
రుద్రమదేవి శౌణసేనను కొంతదూరం తరిమివేసి, మళ్లీ యుద్ధభూమికి వచ్చింది.దేవగిరి రాజును పట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ అతడు కనపడక పోవటంతో మరలి వచ్చింది. ఆమె చుట్టూ సేనా నాయకులు, మిగిలిన సైన్యం నిలబడ్డారు. రుద్రమదేవి తన చుట్టూ మూగిన సైనికులను చూసింది. పెద్ద మొత్తంలో చనిపోయిన సైనికుల గురించి బాధ పడింది. సేనానాయకుడైన దాదియ సోమయ సాహిణియొక్క, గుండదండాధీశ్వరుని యొక్క,అతని తమ్ములయొక్క, మరికొందరు ప్రసిద్ధులైన వీరుల మరణం, మంత్రి అయిన శివదేవయ్య చాలా గాయపడడం ఆమెకు చాలా బాధ కలిగించింది. అప్పుడు ఆమె ఇలా అన్నది.
” ఓ! రాజభక్తి కల సైనికులారా! ఈరోజు మీరు నాకు విజయం కలిగించినా, వీరమరణం పొందిన సైన్యం, సైన్యాధికారులు, వీరులను పోగొట్టుకోవడం నాకు బాధను కలిగించారు. కులదైవంతో సమానమైన ముఖ్యమంత్రి శివదేవయ్య గారు గాయాల పాలవడం చాలా విచారకరం!శౌణదేశపు రాజు మనకు చిక్కకుండా దొంగవలె పారిపోయాడు. అతని పట్టుకోకుండా ఇల్లు చేరవద్దు! నేను సైన్యానికి ఆధిపత్యం వహించి, అధికారిగా ముందుకు నడుస్తాను. మిగిలిన సైనికులు, గాయపడిన వారు నా వెంట రావాలి! అని పెద్దగా అన్నది. సైనికులు, సేనాపతులు సరేనన్నారు.
రుద్రమదేవి గాయపడ్డ సైనికుల కొరకు మంత్రిని కోటకు పంపించి, గాయపడిన వారికి చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేయించింది. కోట నుండి భోజనం తెప్పించింది. వాళ్లంతా స్నానం చేసి , భోజనం చేసి, యుద్ధానికి సిద్ధమై శౌణదేశపు సైన్యం వెంటపడి, మహాదేవ రాజును పట్టి తేవాలనే గట్టి పట్టుదలతో నడిచారు.
ముందు దేవగిరి సైన్యం, వెనుక రుద్రమదేవి పరివారం నడుస్తున్నది ఓరుగల్లు సేన ఉన్న సంగతి శౌణ సైన్యానికి తెలియదు. గెలువలేక పోతిమనే విచారంతో, దేవగిరి రాజు పోయి పోయి రుద్రమదేవి రాజ్యం పొలిమేర దాటి,శౌణదేశపు ప్రాంతంలో ఒకచోట సైన్యాన్ని నిలిపి వేశాడు. అలసట తీరుతుందని, విడిపోయిన సైన్యం వచ్చి కలుస్తుందని రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆనాటి సాయంకాలమే విడిపోయినా కొంత సైన్యం, వస్తు సామాగ్రితో ఉన్న బండ్లు వచ్చి కలిశాయి. మూడు లక్షల సైన్యంతో వెళ్ళిన మహాదేవరాజు పదివేల కన్నా తక్కువ సైన్యంతో తన దేశపు పొలిమేర చేరి నిలిచాడు.
శౌణదేశపు సైన్యం తెల్లవారిన తర్వాత మేలుకొని చూసేసరికి ఏమున్నది? వారి చుట్టూ ఓరుగల్లు సేన ఉన్నది. తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎదిరించి యుద్ధం చేయడానికి రుద్రమ సైన్యం ఎక్కువగా ఉన్నది. ఆలస్యంగా ఈ వార్త రాజుకు తెలిసింది విచారంతో మహాదేవరాజు మంత్రులను, ముఖ్యులను పిలిపించి చేయవలసిన పనులు విచారించాడు. వాళ్లు తమ అభిప్రాయాన్ని రకరకాలుగా చెప్పారు. ఎవరి అభిప్రాయం అయినా యుద్ధం చేయటానికి సైన్యం సుముఖంగా లేదని…
చివరకు వారంతా సంధి కుదుర్చుకోవడం మంచిదని నిశ్చయించుకున్నారు. దేవరాజు రాయబారం నడిపేందుకు భోళేశ్వర సైన్యాధిపతి నియమించి చెప్పవలసిన విషయాలన్నీ అతనికి చెప్పి, రుద్రమదేవి వద్దకు పంపాడు.
భోగేశ్వరుడు ఏ ఆయుధాలు వెంట తీసుకొని పోకుండా. రుద్రమదేవి సైనిక గుడారంలోనికి వచ్చాడు.సైన్యం అతనిని అడ్డగించ లేదు. రాయబారి రుద్రమదేవి గుడారం దగ్గరకు వచ్చి , ద్వారపాలకుడితో తను వచ్చినట్లు లోపలికి తెలియజేశాడు. ద్వారపాలకుడు తిరిగివచ్చి భోళేశ్వరునికి రాణి అనుమతి తెలిపాడు. భోళేశ్వరుడు గుడారం లోనికి వెళ్ళాడు.
రుద్రమదేవి ముఖ్యులతో అంతరంగిక సమావేశమై,భోళేశ్వరుడు రావడం చూసింది.భోళేశ్వరుడు బ్రాహ్మణుడని తెలుసు కాబట్టి తన సింహాసనం నుండి లేచి నమస్కరించింది. భోళేశ్వరుడు యధావిధిగా బ్రాహ్మణ ఆచారపరంగా ఆశీర్వదించి, రాజు వేషంలో ఉన్న రాణి మీది గౌరవం తెలిపాడు. తరువాత తనకు కేటాయించిన ఆసనం మీద కూర్చున్నాడు.
అప్పుడు రుద్రమదేవి భోళేశ్వరునితో ఈ విధంగా మాట్లాడింది.
” మీరు ఏ పని మీద వచ్చారు?”
దేవీ! మారాజు రాయబారం పంపించాడు.
ఏమని?
ప్రస్తుత విషయం గురించి.
ఆ… అర్థమైంది… ముట్టడించడం ఆపివేసి వెళ్లిపొమ్మని కావచ్చును . మా పై పన్నిన కుట్ర…
ఆ విషయాలన్నిటినీ దయతో క్షమించండి!
మంచిది !మేము మూర్ఖపు పట్టుదలతో లేము! సంధిని ఒప్పుకుంటాం! మాకు తలపెట్టిన కుట్ర క్షమార్పణ సరిపోయింది. ఇంకా రాయబారం మూడు మాటల్లో చెప్పనా? యుద్ధ ఖర్చుల కింద ఐదు కోట్లధనం, యాభై ఏనుగులు, వంద గుర్రాలు… ఏమంటారు? మీ రాజు ఒప్పుకుంటాడా?, లేక రాజునడిగి చెప్తారా?
సంధిని కుదుర్చుకుని, అపాయం లేకుండా తమ శౌణదేశపు సైన్యాన్ని తమ దేశానికి చేరవేసేందుకు భోళేశ్వరుడు మారుమాట్లాడకుండ ఒప్పుకున్నాడు.రుద్రమదేవి కూడా అంగీకరించింది.
రాయబారి సెలవు తీసుకొని వెళ్ళి,జరిగిన విషయమంతా రాజుకు తెలిపాడు.అతడు సంతోషించి, ఒప్పుకున్న ధనం,మొదలైన వాటిని రుద్రమదేవికి పంపించాడు.
రుద్రమదేవి జయశాసనాలను అక్కడ స్ధాపించి, సైనికులకు యాభై లక్షల హొన్నులను బహుమతిగా ఇచ్చి, దేవగిరిని ముట్టడించాలన్న ఆలోచన మానుకుని ఓరుగల్లు చేరింది.
(సమాప్తం)
పార్వతి:–
పద పదరా! ఏకదంతా! మనపొదరింటికి!
మంగళంపాడిరి నీకు – మనుషులందరు
మరు సంవత్సరమునకు- మళ్ళి రమ్మని!
విఘ్నేశ్వరుడు:-
ఇంటికి పోనమ్మా! నేనిక్కడే ఉంటానమ్మా!
ఇంటింటికి కుడుములు తింటానమ్మా !!
పార్వతి:-
కుడుములు లేవుర! కుమారా! ఇడుములుపాపుటేరా!
నడు నడు కైలాసానికి! పద పద రా ఏకదంతా!
విఘ్నేశ్వరుడు:–
నన్ను మంచిరి కోనేరులలో…
కోశము తడిసేను- కోరుదు సెలవులు!!
విరిగెను నా దంతము- చదువుట వ్రాయుట ఏలా?
పార్వతి:-
చరవాణి లోనే చక చక చదువుము చంటీ!
చదువులకే వేలుపను పదవి ఊడును తండ్రీ !
ఇల్లిల్లూ తిరుగు-తినుట మానుము నాన్నా !
అద్దంలో నీ ముద్దు మోము చూడరా కన్నా!
నడక అసలే లేక పెరగెను !నీ బొజ్జ!
బడికి పోయి చదవరా తండ్రి!
చదువురాకున్నా!గానీ సన్నగా అయ్యేవు !
విఘ్నేశ్వరుడు:–
నేను సన్నంగా అయితే! కవులకు కష్టం!
వికటకవులు హాస్యం లేక కటకట బడేరు !
ఓ బొజ్జ వెంకయ్య! నీ బంటు నేనయ్య అను
నా స్తుతులు స్తోత్రాలు మార్చి రాయాలమ్మ !!
పలుచబొజ్జ గణపయ్య- పాదాలు పట్టే మని;
నేనూ లేఖకుడినే- లేఖకులంటే నాకు ఇష్టమే అమ్మా!
కష్ట పెట్టను కవులను కనికరముతో…
నన్ను నా రీతి గుండగా నిమ్మమ్మా!
కాలు పెట్టను నేను కైలాస మందు !
కుడుములు తింటూ ఉంటానుఇక్కడే!
కర్మ భూమిన నుందు – కరమొప్పగాను !
సావిత్రికి చిన్నప్పటి నుండి ఒక అలవాటున్నది. తల్లి ఏదైనా వంటకము చేసి పెట్టి రుచి ఎలా వున్నది ? అని అడిగితే “ యమహా “ గా వున్నది … అనేది- తండ్రి కొత్త బట్టలు తెచ్చి అమ్మడూ!బాగున్నాయా? అనడిగితే నాన్న గారూ! “ యమహా “గా వున్నాయనేది. స్నేహితులు ఫలానా సినిమా చూసావా ? ఎలా వుంది ? అని అంటే “ యమహా “ గా ఉన్నదంటుంది.
సావిత్రి రేడియో జాకీగా పనిచేస్తుంది. మైకు పట్టుకుని … హలో !!! హైదరాబాద్ !!!గుడ్ మార్నింగ్ !! ఎలా వున్నారు? నేనైతే యమాహా గా వున్నాను.మీశ్రోతలందరికీ యమా యమాగా మీరు కోరుకున్న పాటలు విని పిస్తాను.ట్రింగ్ …ట్రింగ్ …హలో !! ముందుగా కాల్ చేస్తున్నారు యమాహాగా! M.ధర్మరాజు గారూ ! ఈ రోజు మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు.
హలో ! హలో ! సావిత్రి గారూ ! మీ వాయిస్ బాగుంటుంది .. అది వినాలనే చాలా సార్లు కాల్ చేసాను అదృష్ట వశాత్తూ ఈ రోజు కలిసింది. థాంక్సండీ మీకు ఏ పాట కావాలి ? అవతలి వైపునుండి .. ”యమహో ..యమా యమా అందం “ అనే పాట కావాలి.శ్రీదేవి గారు లేరు కదా ! మరొక్క సారి గుర్తు చేసుకుందామని …
ఓ ! సరే సరే యమ్ ధర్మరాజు గారూ వినిపిస్తాను …వినండి వినండి ఉల్లాసంగా ..ఉత్సాహంగా !!అలా తన డ్యూటీ ముగించుకుని సావిత్రి తన “యమహా “మోటారు సైకిల్ మీద యమా స్పీడుగ భర్త ఆఫీస్ కు వెళ్ళి, ఆయనను పికప్ చేసుకుని , వస్తుంటే… తోవలో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ యమ ధర్మ రాజులా కనపడి( ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు యమధర్మరాజు వేషము వేసుకుని … హెల్మెట్ పెట్టుకోకుంటే మీ ఇంటికి వస్తామని నటిస్తున్నారు జనాలు రూల్స్ పాటించడానికి కొత్త పద్ధతి) హెల్మెట్ లేదనిసఅడ్డగిస్తే …సర్ది చెప్పి బయట పడేసరికి ఆలస్యమయింది. తోవలో ఏదైనా తిని పిల్లలకు తీసుకుని పోదామని అటు చూసేసరికి…స్వర్గలోక్ రెస్టారెంటు కనపడింది. హోటల్ ముందు బోర్డ్ మీద రుచి గా చేసేందుకు ఐదు నక్షత్రాలహోటల్ చెఫ్ యమ్ ( అతని పూర్తి పేరు యామినేని మార్కండేయులు .పేరు పెద్దగా వున్నదని అలా యమ్ అని రాసుకుంటాడు.) చాలా రుచిగా శుచిగ చేస్తాడని, అతనికి సహాయకులుగా నల్,భీమ్ లున్నారని రాసి వున్నది. ఇద్దరూ నవ్వుకున్నారు. కొంప దీసివీడి హోటల్ లో పుఱ్ఱెలలో వడ్డిస్తారేమో అపిటైజర్ కు బదులు ఏ రక్తమో ఇవ్వరు కదా! అని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
భోజనమైన తరువాత వాళ్ళకు ఒక అలవాటు ఎప్పుడైన సరే లోపల కిచెన్ లోపలికి వెళ్ళి ఫలాన నంబరు గల టేబిల్ పై సర్వ్ చేసిన ,భోజనము తయారు చేసిన చెఫ్ ఎవరో తెలుసుకోవచ్చా? అని అడిగితే మాస్టర్ యమ్ (యామినేని మార్కండేయులు) వచ్చి నేనే చేసాను . మీకు నచ్చలేదా ? అనగానే , కాదు కాదు యమహా గా వున్నదని అభినందించి, అక్కడి విజిటర్స్ బుక్ లో రాసి వచ్చినారు.
ఇద్దరూ కూర్చుని మాట్లాడు కుంటూ ఒక మంచి యమహా ఇల్లు కట్టుకోవాలి… ఎన్ని రోజులు ఈ నరకంలో వుంటాము అనుకుంటూ టీవీ ఆన్ చేసినారు. కామెడీ సీన్స్ వస్తున్నాయి. ఇద్దరికీ కామెడీ ప్రోగ్రామ్ లు చాలా నచ్చుతాయి.ఇంతలో స్క్రీన్ మీద “ యమధర్మ రాజు” మీద తీసిన
సినిమా క్లిప్పింగ్ లు వస్తున్నాయి. చూస్తూ నాకు యమదొంగ అంటే ఇష్టం అన్నాడు భర్త, నాకు యమగోల అంటే ఇష్టము …ఏ సినిమా లో నైనా యమధర్మరాజు పాత్ర చాలా నచ్చుతుంది. పాత సినిమాలలోని. సత్యనారాయణ అయినా , ఈ మథ్య నటించిన మోహన్ బాబు యమహా గా అదరగొట్టే డైలాగులని అవే చెప్పుకుంటూ నిద్రలోకి ఒరిగినారు.
తెల్లవారు ఝామున సావిత్రికి మెలుకువ వచ్చింది.ఎదురుగా యమపాశం పట్టుకుని యమధర్మరాజు నిలబడి సావిత్రీ !!! నీకు భూలోకంలో నివసించే సమయము అయిపోయింది రా!! యమలోకం వెళ్ళాలి… అని పిలుస్తున్నాడు. సావిత్రి అనుకుంటున్నది కదా! … కల వచ్చిందని… పడుకునేముందు యమధర్మరాజు సినిమాల గురించి మాట్లాడుకున్నాము ..తను నేను.
ఓహ్! కలనా అని పైకే అన్నది సావిత్రి.కాదు కాదు నువ్వు కల కన లేదు… నిజంగానే నీకుమరణించే రోజు వచ్చింది అన్నాడు యముడు.
“అయ్యో ! అలానా ? అయినా నువ్వు చాలా స్ట్రిక్ట్ కదా ! సరే వస్తాను !! కాని నేను నాభర్తను పిల్లలను చాలా ప్రేమిస్తాను. గమ్మత్తుగా అనుకోకుండా … వాళ్ళిద్దరి పుట్టిన రోజు ఒకేరోజ వస్తాయి.
నాకు కొంచెము సేపు టైమ్ ఇవ్వు… ఈ ఒక్కరోజు నేను వాళ్ళకిష్టమైనవి చేసి సంతోష పెట్టి వస్తాను “అని బతిమిలాడింది. అంటే సరే నేను ఇలా ఎవరికీû టైమ్ ఇవ్వను.వారి మరణమా
సన్నమవగానే …పాశం వేసి , ప్రాణాలు తీస్తాను…ఇలా మాట్లాడుతూ సమయము గడపను. కానీ నీకు చిన్నప్పటి నుండి నన్ను ప్రతి నిమిషము”యమహా! యమహా “ అని తలుచు కుంటావు కాబట్టి… అందునా మానవ లోకంలో నన్ను స్తోత్రము చేసే వాళ్ళే లేరు. అందరూభయపడి మనసు లో కూడా యమ అనరు అటువంటిది అలా ప్రతి పని లో నన్ను మనస్పూర్తిగా తలుచుకుంటూంటావు …. కాబట్టి నేను ముందున్న డ్రాయింగ్ రూంలో కూర్చుంటాను త్వరగా పని ముగించుకొని రా…అన్నాడు యముడు.
ఇక నడుము కు కొంగు చెక్కుకుంది… ఏ పని తో మొదలు పెట్టాలా అను కుంటూ.. గబగబబాయిలర్ లో నీళ్ళు పోసి, చెక్క పేళ్ళతో అంటించి, నీళ్ళు వెచ్చ పడగానే… భర్తకు, కొడుకుకు తలంటుపోయాలి అనుకుంటూ .. వంటింట్లోకి వెళ్ళి చిక్కటి కాఫీ చేసి ఒక కొత్త గ్లాసు లో పోసి ముందు రూంలో వున్న యముడికిచ్చింది అహా ! సావిత్రీ నాకు ఇలా ద్రవ పదార్ధాలు తాగే అలవాటు లేదంటే …కాదు ఒక్క గుక్క తాగండి” యమహా “ గా ఉంటుందని చప్పున నాలుక కరుచుకుంది.
యముధర్మరాజు ఒక్క గుక్క వేసి నువ్వన్నట్టు యమహా గా వున్నదన్నాడు. మీరే కాదు స్వామీ! “నా భర్త స్నేహితులు, చుట్టాలు అందరూ అదే మాటంటారు.
సరే సరే వెళుదాం పద ! నాకు ఇవ్వాళ “ టర్కీ “ దేశంలో వరదలు రావాలని వరుణుడిని పంపాను. అక్కడ చాలా మంది ప్రాణాలు తీయాల్సివుంది” అన్నాడు.
సావిత్రి పనిలో పడింది. బ్రేక్ ఫాస్ట్ మంచిగా చేయాలి. రేపటి నుండి నేనుండను కదా!అని వడ అందరికీ ఇష్టమని వడా , చట్నీ, సాంబార్ చేస్తూ ..మధ్య మధ్య భర్తను , పిల్లలను నిద్ర లేపుతున్నది.అటునుండి , ఇటుతిరిగి పండుకుంటున్నారు.సావిత్రి అటు టిఫిన్లు చేస్తూనే కుక్కర్ లో పప్పు , అన్నం పెట్టి , కూరలు కట్ చేసి మరొక్కసారి అందరిని నిద్ర లేపి , ఇంతలో మునిసిపాలిటీ పంపు రావడంతో …బిందెల తో నీళ్ళు పట్టి , ఫిల్టర్ నింపింది.లంచ్ బాక్స్ లు సిధ్ధం చేసి, భర్త షర్ట్ ఇస్త్రీ చేసి , పిల్లల స్కూల్ బ్యాగ్ లు సర్ది, వాటర్ బాటిల్స్ నింపి , బూట్లు పాలిష్ చేసి , సాక్స్ , యూనిఫాం రెడీగా పెట్టి , దువ్వెన రిబ్బన లు పట్టుకొని మళ్ళీ పిల్లల రూం లోకి వచ్చి వాళ్ళను బలవంతంగా బాత్ రూంలోకి ఈడుస్తూ, బ్రష్ మీద పేస్ట్
పెట్టు తుండగానే యముడి పిలుపు “సావిత్రీ ! త్వరగా రా !” అని గంభీరంగా పలికాడు.
“స్వామీ ! మధ్య తరగతి మహిళలకు పొద్దున్నే యమ పని వుంటుంది. పనిలో పక్కనున్న వారితో అంటారు కూడా … చావ తీరుతులేదు … ఈ పని తో అని మీరే చూస్తున్నారు కదా ! అసలే ఈ రోజు కూరగాయల సంత – అక్కడ యమ రష్ గా వుంటుంది.నాకు కూరగాయలు కొని ఆ యమ రష్ నుండి పడేసరికి యమలోక దర్శనమే. అసలే కూరగాయలు యమ గిరాకీ … అంతేనా? కరెంట్ బిల్లు , వాటర్ బిల్లు చెల్లించడానికి ఈ సేవా సెంటర్ కు వెళితే అక్కడా యమ రష్. అక్కడి నుండి స్కూల్ లో పిల్లల ఫీజు పే చేసి పేరంట్స్ మీటింగు లో వాళ్ళడిగే యమ గందరగోళ ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ స్కూల్ కుయమక్రేజీ..వాళ్ళడిగే ప్రశ్నలు యమ ఈజీ అంటారు కొందరు.
సరే కుటుంబం బాగుండాలని ప్రార్ధిద్దామని కోవెలకు వెళ్ళి …రాముడిని దర్శనము చేసుకోవాలంటే ఆ క్యూలో జనాలు కాళ్ళు తొక్కి , నెట్టేస్తుంటే యమా ! నీవే గుర్తుకు వస్తావు. అంతేనా రేషన్ షాప్ కు వెళితే అదొక యమలోకం.అక్కడ సరుకులిచ్చే వాడు అచ్చంగా నీ వలె (యముడు) కూర్చొని , తూకంలో మాత్రం నీ ధర్మం , నీ న్యాయం పాటించడు సుమా
అన్నీ తప్పుడు కొలతలే …చెడ్డ కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత విసిగి పోతామంటే రేషన్ డీలర్ ఇచ్చిన కిరోసిన్ వాడి మీద పోసి, అంటించి నీ( యమ ) లోకం పంపాలనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సరదాగా వెళ్ళే సినిమా హాలులో క్యూ కొట్లాటలు, బజారులో డేరాలు వేసి మహిళా సంఘాల న్యాయపోరాటాల మోతలతో యమ లోకం కనపడుతుంది….”అంటూండగానే…
ఈ రోజు మొత్తము నీ ఇంటిముందు పడిగాపులు పడ్డా …నీవు నా వెంట వచ్చేటట్ట లేవు , అంటే …అయ్యో! యమా ! ఇంకెక్కడ పని తీరింది…ఈ వంట పాత్రలు శుభ్రం చేసి, ఇల్లంత సర్ది , బట్టలుతికి , నేను ఆఫీసుకు పోయే సరికి , లేటయితే అక్కడ మరొక యముడుంటాడు. అదే మా బాస్ !ఇక ఆయన తిట్ల దండకము అందుకుంటే ఇంతకన్నా తానే నయమని… యమధర్మరాజా! నన్ను నీ లోకం తీసుకెళ్ల వయ్యా! అని అనుకుంటాము మా మధ్య తరగతి మహిళలము అని చెప్తూ అటు తిరిగి చూసేసరికి … యముడు స్పృహ తప్పి పడి, పక్కకు ఒరిగి పోయి వున్నాడు. ఎలా యముడిని లేపడం ? అనుకుంటూ – నాకు నా భర్తా , పిల్లలను లేపడమే యమ కష్ఠం … ఇవాళ యమహా గా యముడిని లేపడం… ఒక సమస్య తరువాత ఒకటి
నేను భరించ లేనయ్యా ! యముడా ! నన్ను తీసుకొన పోవయ్యా ! అని నాలుక కరుచుకొని , చూస్తుండగానే కళ్ళు తెరచి, సావిత్రీ ! వస్తావా లేదా ? ఈ మాయదారి దోమలు కుట్టి కుట్టి నేను వెళ్ళే ప్రయత్నము చేయకుండానే… యమ లోకం పంపేటట్టున్నాయి. అనగానే…
“అయ్యో ! యమా ! నిన్ను హాలులో కూర్చుండ బెడిత బాగుండును…ఈ డ్రాయింగ రూంలో యమ దోమలు అవి కుట్టాయంటే …యమ మంట పుడుతుంది”
అనగానే ఆ ఒక్క పని తక్క మరొకటి చేయ వీలులేదు పోదాం పద !అని గట్టిగా అన్నాడు యముడు. సరే స్వామీ మిగిలిన పని చేసి వస్తానని …ఒక్క గెంతు గెంతింది పెరట్లోకి అపర సావిత్రి యముడు తన చేతిలో పాశం చూస్తూ… భూలోకంలో సగటు మధ్య తరగతి మహిళలకు యమ పాశం అక్కరే లేదు …వాళ్ళ బంధనాలే పాశం , ఇలా పొద్దటి నుండి …సాయంత్రం దాకా పని చేసి చేసి …యమ నీరస పడి పోతారు. ఇక పూర్వ జన్మ పాపాలు పరిహారము చేయడానికే నేను యమలోకం తీసుకొని వెళ్ళేది. వాళ్ళు ఆ శిక్ష లేవో ఇక్కడే అనుభవిస్తున్నారు. ఇంకా నేను తీసుకొని పోయేసరికి … వాళ్ళ చిట్టాలు జమా- ఖర్చు సమానమవుతాయి ఎందుకులే ఈ అబల సావిత్రిని కీసుకొని వెళ్లడము అనుకొని …చెప్పా పెట్ట కుండా వెళ్ళిపోయాడు యమాగా “ సమవర్తి “.
*******************
[ విఫలత ]
( నిరుపయోగం )
అపరాధః సదైవస్య
నపునర్మన్తిణా మయమ్ ;
కార్యం సఘటితం యత్నాత్, దైవయోగాద్వినశ్యతి ”
— హితోపదేశం.
భావం:-అనగా నాకు కలిగిన వంచన మంత్రి యొక్క లోపం వల్ల కాదు. అది దైవకృతాపరాధం. ఏ హేతువు చేతనో బాగా ప్రయత్నం చేసిన పని దైవాధీనం వల్ల నశించింది. కాబట్టి మంత్రి యొక్క దోషం కాదు.
కథాభాగం:– తెల్లవారుజాము చాలా అందంగా ఉంది.తూర్పుదిక్కున ఎరుపు రంగు కనపడుతోంది.కాకులు తమ గూళ్ళను వదిలి అరుస్తూ వెళుతున్నాయి. పశువుల కాపరులు కట్టి వేసిన ఆవుల దగ్గరకు దూడలను వదిలి, కొంచెం పాలు తాగనిచ్చి, తరువాత దూడలకు పాలు అందకుండా దూరంగా కట్టివేసి, పాలు పితికి, కుండలను నింపుతున్నారు. గృహిణిలు నిద్ర లేచి రోజువారీ పనులు చేయడానికి పూనుకున్నారు.కొందరు పశువులను తోలుకొని ఊరి బయలు ప్రదేశానికి మేపడానికి వెళుతున్నారు. తెల్లవారితే ఏవైనా చెడు శకునాలు ఎదురవుతాయని, వాటివల్ల పనులకు అడ్డంకులు కలుగుతాయని, ప్రయాణాలు చేసేవారు ఇండ్ల నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నారు.
ఊరివారు కొందరు రుద్రమదేవి నివసిస్తున్న ఇంటి దగ్గరకు వచ్చి, ఆ రాత్రి జరిగిన ఆ పనికి అందరూ బాధపడుతున్నారు. “ఇంత పని చేయడానికి ఎవరు సాహసించారు?” అని కొందరంటూంటే…ఇంకా కొంత మంది ” ఆ పని చేసేవాడికెంత గుండె ధైర్యం?” అని, ధర్మాత్మురాలైన రుద్రమదేవిని జైల్లో పెట్టారో? చంపేసారో? అయ్యో! అయ్యో!! అని కొందరు బాధపడుతున్నారు. కొందరు ఇంటి లోపలికి వెళ్లి చూసి వస్తున్నారు. కొందరు చుట్టుపక్కల చూస్తున్నారు. ఇలా ఇంటి చుట్టు వాతావరణం దీనంగా తయారయింది.
అక్కడ నుండి ముగ్గురు మగవారు ఒక మహిళ బయలుదేరి ఒకే తోవలో ఒకరి వెంట మరొకరు నడుస్తున్నారు. కొద్ది దూరం నడిచి వారు ఆ ఊరు దాటి చిక్కటి అడవిలోనికి వెళ్లారు. అలాగే కొంత దూరం నడిచి ఒక చోట కూర్చున్నారు.
ఆ ప్రదేశం ఎత్తుగా ఉన్న చెట్లు ఉండటం వల్ల, చిక్కటి పొదలు అల్లుకొని ఉండడం వల్ల రహస్య విషయాలు ఆలోచించు కోవడానికి తగినట్లుగా ఉన్నది. కాబట్టే ఆ నలుగురు ఆ స్థలానికి వచ్చారు. నేలంతా మొనతేలిన కంకర రాళ్ళు ఉండడం వల్ల గడ్డి ఏమంత ఎక్కువగా మొలువలేదు. అలా ఉండడం వాళ్ళకి ఆ స్థలం కూర్చోవడానికి వీలుగా ఉంది.
వారెవరో పాఠకులు ఆలోచించ అక్కరలేదు. ఒక్కడు మురారి దేవుడు, రెండవవాడు హరిహర దేవుడు, మూడవ వాడు ధర్మవర్తనుడు, ఆ మహిళ కమల. అక్కడ కూర్చొని ఇలా మాట్లాడు కుంటున్నారు.
ధర్మ:– చూశారా? పని అంతా ఎలా అయిందో? రుద్రమదేవి మగవాళ్ళను చంపి పుట్టిన ఆడమనిషి. ఆమెకు తెలిసిన అన్ని మాయలు మంత్రాలు మగవాళ్ళకి కూడా తెలియవు. ఏమీ తెలియనట్లుండే రుద్రమదేవి మన ప్రయత్నాన్ని మంట కలిపింది. నాకెందుకో మొదటినుండి అనుమానం గానే ఉన్నది.
మురారి:– నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇంట్లో కట్టు వేసిన వారు ఎలా తప్పించుకున్నారు? చుట్టూ కాపలా ఉన్న వారు కంటిమీద రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు. అదే కాకుండా ఆ ఊరు చుట్టూ ఉన్న మన సైనికుల కనుగప్పి ఎలా తప్పించుకొని పోనిచ్చారు? ఇదంతా గారడి విద్యవలె ఉన్నది.కమలా! నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావు కదా! వారు ఎక్కడికి వెళ్లారు నువ్వు చూడలేదా?
కమల:– నాతో వారెప్పుడూ భయపడుతున్నట్లుగా మాట్లాడనేలేదు. రోజు ఎలా ఉన్నారో రాత్రి కూడా అలానే ఉన్నారు. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లావని కూడా నన్ను అడగలేదు ప్రయాణం ఉందని మాత్రం చెప్పింది. తర్వాత రోజుటివలనే నిద్రపోయాం.
ఇంకా నాకు ఆశ్చర్యం కలిగింది. నేను చూస్తూనే ఉన్నాను. వెనుకనుంచి ఎవరో వచ్చే నా కళ్లను మూసి, నా నోట్లో గుడ్డలు కుక్కి నన్ను తాళ్ళతో కట్టి వేశారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు.
హరిహర దేవుడు:– వాళ్ళు తగిన జాగ్రత్తలు ఉండి భయపడకుండా ఉన్నారు. కావలివాళ్లకు ధనమిచ్చి కట్లు విడిపించుకున్నారు కావచ్చును. లేకపోతే వీళ్లు కాకుండా లోపలికి వేరెవ్వరు రావడానికి కానీ పోవడానికి కానీ ఎలా వీలు చిక్కింది? మనం కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాం కదా!
కమల:– మొదట వాళ్ళకు ఈ సంగతి ఎలా తెలిసింది?
ఆనాడు ధర్మవర్తనుడు గారు చెరువుకట్టపై కూర్చుని ఉన్నప్పుడు చూసింది గూఢచారై ఉంటాడు.అతను మన గుట్టు బయట పెట్టాడా?
అయ్యో! అయ్యో! మన పని అంతా వెల్లిపాయలో కలిపిన చింతపండు లాగా అయింది కదా!
ధర్మ:– మన ఆశలన్నీ వ్యర్థమైనవి. మహాదేవరాజువద్ద మనం చెప్పినవన్నీ అబద్ధాలు అయినవి కదా! అయ్యో! ఎలా కావలసిన పని ఎలా అయ్యింది? ఆ నలుగురు మాట్లాడుకుంటు ఉండగా ఇద్దరు మగవారు వచ్చి నిలబడ్డారు. వారిని చూడగానే మురారి దేవుడు” మీరేం వార్తలు తెచ్చారు? శుభమా? అశుభమా? శుభమని అనుకోవడానికి వీలు లేకపోతే అది ఎలా కలుగుతుంది? మీరంతా మీ మీ పనుల మీద శ్రద్ధతో ఉన్నా కూడా రుద్రమదేవి ఎలా తప్పించుకొని పోయింది? ఇలా తప్పించుకున్నారని ఆలోచించడానికి అవకాశమే లేదని అన్నాడు.
అయ్యా! మీ ఆజ్ఞ ప్రకారం మేమంతా జాగ్రత్తగా ఇంటి చుట్టూ ఉన్నాం. ఇంటి నుండి పిల్లి కూడా బయటకు పోలేదని మేము ఖచ్చితంగా చెప్పగలం. మాలో తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా “రుద్రమదేవి తప్పించుక పోయిందని మీరు చెప్పే దాకా మాకు తెలియదు. ఏమి చేయాలి? మాకు మాట దక్కని రోజు వచ్చిందని వచ్చిన ఇద్దరిలో ఒకడు అన్నాడు.
మరొక చిత్రమైన సంగతి జరిగింది. మీరు అడవిలో కావలి ఉంచిన సైన్యమంతా చనిపోయారని రెండవవాడు చెప్పాడు.
ఆ మాటలకు వారంతా అవాక్కయ్యారు.
ఎలా? ఎలా? సైన్యమంతా చనిపోయిందా? కటకటా! ఆ సైన్యాన్ని చంపిందెవరు? అని హరిహర దేవుడు అన్నాడు.
అయ్యా! ఏమని చెప్పేది? ఊరికే నాలుగువైపులా కావలి ఉన్న సైనికులను రెండు భాగాలుగా మారి ఓరుగల్లు తోవను కాపలా కాస్తూ ఒక సైనిక దళమూ, ఊరిని చుట్టుముట్టి మరొక దళమూ ఉన్నాం. అక్కడక్కడ ఇద్దరిద్దరినీ ఉంచాం. ఎప్పుడు కావాల్సి వస్తే సైగ చేయగానే తోడుగా రావాలని సైగలు ఏర్పాటు చేసుకుని ఎవరి పనుల మీద వారు ఉన్నాం. ఇంతలో గుర్రపు స్వారీ చేస్తూ ఎక్కడినుండో వచ్చారు. మేము ఊరి దగ్గరగా ఉన్నాం కాబట్టి వారు తప్పించుకొని పోతున్న వారనుకొని, వారి మీద దాడి చేశాం , కానీ వాళ్లు నలుగురు మగవారే! కటిక చీకటిలో వాళ్ళను మగవారిగా పోల్చుకోలేదు. పోల్చుకుంటే వారిని ఎదుర్కొనే వాళ్ళం కాదు. ఆ వీరుల శౌర్యం చెప్పనలవికాలేదు. నలుగురు నాలుగు వైపులా మమ్మలను అవతలికి పోనీయకుండా నరికి వేయడం మొదలుపెట్టారు. కొన్ని ఘడియలలో మా సైన్యం పావువంతు మాత్రమే మిగిలింది. చీకటిగా ఉన్నా ఎలానో ఒకలాగ వారి నుండి తప్పించుకొని ఓరుగల్లు తోవను కాపలా కాస్తున్నవాళ్ళను పిలుచుకొని వచ్చేందుకు పోదామనుకునేసరికి శస్త్రాల చప్పుడేదో వినపించింది. పరిగెత్తుకొని అటు వెళ్ళాం. అప్పుడు ఓరుగల్లు సైన్యంతో మనవాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఓరుగల్లు సేన తక్కువగా ఉండి, మన సేన ఎక్కువ మంది ఉండటం వల్ల శత్రువులను ముందుకు రానీయకుండా అరికట్టి నిలిపాం. దాదాపు విజయం మాసొంతమైందని చెప్పవచ్చు. దాదాపు ఇరవై మంది దాకా చంపాం. ఏమనాలి? ముందు మాతో యుద్ధం చేసి, మమ్మల్ని తరిమిన ఆ నలుగురు వీరులు ప్రత్యక్షమై బాధించటం మొదలుపెట్టారు. వారు వచ్చి చాలా మందిని చంపారు. పది పదిహేను మందిమి మాత్రం మిగిలి, అటూ ఇటూ చెల్లాచెదురు అయిపోయాం. మేము కూడా ఊరిలో ఆ ఇంటి చుట్టూ ఉన్న వారితో కలిసి ఏ ఊరుకైనా పోదాం అనుకుని వస్తున్నాం. ఇంతలో ఇతడు కలిసి మీ జాడ మాకు చెప్పాడు. మేమిద్దరం ముందు నడిచి ఇలా వచ్చాం. వారు ఇప్పుడో, ఇంకాసేపటికో ఇక్కడికి వస్తారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తానని అందరూ వినేటట్లు గా బొంగురు గొంతుతో అన్నాడు.
పనంతా తలకిందులైంది. మనలను వారు గుర్తుపట్టారా ఏమో? అని కొంచెం అనుమానం వస్తున్నది. ఒక్క పని చెడిపోయి, ఎంత మందికి బాధ కలిగించిందో కదా! మహాదేవరాజుకు, మాకు, కొందరు మాండలికాలకు చెప్తే కూడా తీరనంత ఆశాభంగం కలిగిందని మురారి దేవుడన్నాడు.
వాళ్లు మనను ఎప్పటినుండో కనిపెట్టి తిరుగుతున్నట్టున్నారు లేకపోతే అవలీలగా తప్పించుకోవడం సాధ్యమా? మన కాపలా వారికి లంచం ఇచ్చి ఉంటారు. రెండో దారి లేదు అని కమల అన్నది.
ఇంతలో మరి కొంత మంది మనుషులు వచ్చి నమస్కరించి నిలబడ్డారు. వారు రాగానే మురారి దేవుడు వారిని చూసి, మీరు ఇంత మంది మాత్రమే బతుక గలిగారా? ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు.
సరిగ్గా చెప్పలేం పది పదిహేను మంది చెల్లాచెదరై పోయి ఉంటారు. వాళ్ళందరిని వెతికి రమ్మని మన వాళ్ళను ఇద్దరు ముగ్గురిని పంపాను. వెతికి మనలను కలుస్తారని వచ్చిన వారిలో ముఖ్యుడన్నాడు.
ఇంకా మనం ఆలస్యం చేయవద్దు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. మన రహస్యం తెలుసుకుంటున్నవారు మనం ఉన్న చోటు తెలుసుకుంటారనడం నిజం! వాళ్లకు దొరికిపోయి, ఇగిలిగించడం కన్నా పరిగెత్తి వెక్కిరించడం మంచిది. లేవండి! వెడదామని ధర్మవర్ధనుడు అన్నాడు.
వారంతా ప్రయాణమైనారు. కమల కూడా వారి వెంటే ఉన్నది. వారంతా అడవిలో పడి ఒక పక్కగా నడుస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు.నాలుగు వైపులా జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్నారు.అర కోసు దూరం నడిచే టప్పటికీ వాళ్లకు ఆడవిలో జనాలు నడుస్తున్నట్టు చప్పుళ్ళు వినబడ్డాయి.ముందుకు నడవకుండా వాళ్ళు నిలిచి తమ చుట్టుపక్కల చూశారు. కొంతమంది బలిష్టులయిన వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తుండటం చూశారు.వచ్చినవాళ్లు క్షణంలో చుట్టుముట్టారు. తప్పించుకుని పారిపోవడానికి అవకాశం చిక్కలేదు. అప్పటికి తగిన పని యుద్ధమే అనుకొని, ఒరల నుండి కత్తులను దూశారు. రెండు వైపుల వారికి పోరాటం జరిగింది. మురారి దేవుడు మొదలైనవారు కూడా మామూలు వ్యక్తులు కారు.యుక్తిగా యుద్ధం చేస్తున్నారు. వారి అనుచరులు కూడా యుద్ధం చేస్తున్నారు. వచ్చి చుట్టూ మూగిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మురారి దేవుడు మొదలైన వారి శౌర్యంతో నిలువలేక గడ్డిపోచ మంటకు మాడిపోయినట్టు క్షణంలో నశించిపోయింది.
క్రమంగా మురారి దేవుడు, హరిహర దేవుడు, ధర్మవరధనుడు నేల మీద కూలిపోయారు.కొందరు సైనికులు చచ్చారు. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. కమల ఒక్కతే వారికి చిక్కింది. ఆ స్త్రీ ఎంత మాయామర్మాలు నేర్చుకున్నా పౌరుషానికి చిక్కితే ఏం చేయగలదు? ఆమెను వారు బంధించారు
కమల ఏడుస్తూ ఏమేమో మొర పెట్టుకుంటున్నది. వీరులు ఆమె మాటలను పట్టించుకోకుండా, జాలి పడక, కట్టిన కట్లు విప్పకుండా ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు.
పదవ ప్రకరణ
[ వార్త నిర్దేశనం]
ఏతదాఖ్యాంతితే సర్వే
హరయోరయోరామ సన్నిధౌ
వైదేహీ మర్షతాం శ్రుత్వా
రామ స్తూత్తరమబ్రవీత్
సుందరకాండ..65 సర్గ 3వ శ్లోకం
ఉవాచ వాక్యం వాక్యఙ్ఞ
సీతాయాదర్శనం యథా
సముద్రం లంఘమిత్వాఽహం
శతయోజనమాయతమ్
సుందరకాండ..65 సర్గ 5వ శ్లోకం
భావం:– వానరులు శ్రీ రాముని దగ్గరకు వెళ్లి సీతమ్మ రావణుడి అంతఃపురంలో బంధింప బడి ఉండడం, రాక్షస స్త్రీలు ఆమెను బెదిరించడం మొదలైన సమాచారమంతా రామునికి చెప్పి మౌనంగా ఉన్నారు.
రాముడు సీతాదేవి నాశనం చెందక క్షేమంగా ఉన్నదని విని వానరులను చూచి ఇలా అన్నాడు. హనుమ సీత ఇచ్చిన మణిని రామునకు సమర్పించి, తాను సీతాదేవిని చూసిన విధం చెప్పెను.నేను నూరు యోజనముల విస్తీర్ణం కలిగిన సముద్రం దాటి సీతాదేవిని చూడడానికి వెతుకుతూ పోయాను.
వ్యాఖ్య:–రామాయణం లోని సుందరకాండలోని సీతాన్వేషణ ఘట్టంలోని హనుమ సీతను చూసినట్లు రామునికి చెప్పినట్టు…
రుద్రమదేవి నవలలో ప్రకరణౌచిత్య శ్లోకం…రుద్రమదేవిని గోనగన్నారెడ్డి చూసినట్లు చెప్తూ…రాబోవు కథాసూచిగా చెప్తూ… మంగళాంతంగా ముగియనున్నట్లు గ్రంథకర్త ఇలా ఇతిహాసోపమానం ఇవ్వడం అనేక పురాణ, ఇతిహాసాల పఠనాసక్తి, పరిచయం ఉన్నట్లు తెలుస్తున్నది…
ఇది ఒక అపూర్వ ప్రక్రియ…ప్రకరణాలకు నామకరణం చేయడం పాఠ్యాంశంగా అభ్యాసానికి సులువైన పద్ధతి…
(రంగరాజు పద్మజ)
కథాభాగం:- ఓరుగల్లులో రుద్రమదేవి రాజదర్బార్ లో కూర్చుని ఉంది. ఆమెకు కుడివైపున ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య, అతని తర్వాత కాయస్థ కులంలో పుట్టిన వాడు” బ్రహ్మరాక్షసుడు” మొదలైన బిరుదులున్న వాడైన మంత్రి, సేనాపతి రెండు పదవులను నిర్వహిస్తున్న జన్నిగదేవ సాహిణి, అతనికవతల కాయస్త వంశీకుడైన” ఏకంగా వీర, వీరావాతార” మొదలైన ఎన్నో బిరుదులున్న మంత్రి, సేనాధిపతి అయిన త్రిపురాంతక మహాదేవ రాజు, అతనికవితల వైపు ఇతని చిన్న తమ్ముడు “రాయ సహస్ర మల్ల” బిరుదు పొందిన గండికోట, ములికి, నాడు, రేనాడు,పెందాడి , పెడకట్ల, సకిలియెరువ, పొత్తపినాడు మొదలైన ప్రాంతాలను రుద్రమదేవికి ప్రతినిధిగా పాలిస్తున్న అంబ దేవమహారాజు, కూర్చుని ఉన్నారు.ఎడమ వైపున నాగదేవరాజు, ఇతని పక్కన రుద్రమదేవి అల్లుండ్లు విక్రమాఢ్యులైన అన్నమ దేవరాజు, చాళుక్య వీరభధ్రరాజు కూర్చుని ఉన్నారు. ఒకవైపు మిగిలిన సైన్యాధ్యక్షులు, మరొకపక్కన ఆస్థాన పండితులు, ఇంకో వరుసలో విదేశీయులు, ఇంకొక చోట ఉన్నతోద్యోగులు, మరోచోట రాయబారులు కూర్చున్నారు.
రుద్రమదేవి పొగలేని నిప్పు వలె భగభగమండి పడుతున్నది. ఆ సభలో ఉన్న వారికి ఆమె మనసులో ఏమి ఆలోచిస్తున్నదో తెలియడం లేదు. ఆమెను అటువంటి వేషంలో ఎవరూ.. ఎప్పుడూ.. చూడలేదు.సభలోనే కొందరు ముఖ్యులకు అసలు ఏం జరిగిందనే కారణం తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారు. అయినా కానీ ప్రశ్నించడానికి ధైర్యం చేయలేదు.
శివదేవయ్య సభ్యుల మనసు తెలుసుకొని, తన ఆసనం నుండి లేచి, అందరూ వినేటట్లు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
” ఓ సభ్యులారా! భారతీయులకు సత్యం వంటి ఆభరణం ఇంకొకటి లేదు… బాహాటంగా యుద్ధంలో ఖడ్గంతో ఖడ్గం పోరాడి శత్రువును గెలవడమో? లేక శత్రువుతో ఓడిపోవడమో మాత్రమే ప్రజలు మెచ్చుకుంటారు.శాస్త్రం కూడా అదే ఒప్పుకుంటుంది దుర్మార్గులు ఈ పద్ధతిని విమర్శిస్తారు. అంతేకాదు మరింత చెడుతోవ తొక్కుతారు. మనకు తల్లితో సమానమైనది, ధర్మానికి మారూపైన మన రాణి గారి యొక్క ఉత్తమమైన ఉదార గుణాలతో, సేవకుల మీది వాత్సల్యంతో ఉండడం మన అందరికీ తెలిసిందే.
” శరణని వచ్చిన వారికి తల్లివలె కాపాడే శ్రీమతి రుద్రమదేవికి దేశంలో కొందరు దేశద్రోహులు కారణం లేకుండా పగబూని, ఈ కుట్ర పన్నారు. మనం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల మన రాణి చిక్కులలో పడిన కూడా శ్రమ పడకుండా బయటపడ్డారని చెప్పడానికి నాకూ, వినడానికి మీకు చాలా ఆనందంగా ఉన్నది. అయినా శ్రద్ధతో పనిచేస్తున్న శత్రువులకు పూర్తిగా దొరికిపోయి, ఎక్కువ శ్రమ లేకుండా తిరిగి రావడం అసంభవమని ఆ ద్రోహులను చూసి మీరు అనుకున్నారు కావచ్చు…..
ఇంతలో ఒకతను సభలోనికి త్వర త్వరగా వచ్చి, రుద్రమదేవికి నమస్కరించాడు. అతని వెంట ఒక మహిళ ఉన్నది. ఆమె తాళ్లతో కట్టి వేయబడి ఉన్నది. రాజభటులు ఆమెను కాపలా కాస్తూ వెంట నడుస్తూ వస్తున్నారు. మరి కొంతమంది కొన్ని పెట్టెలను తలపై పెట్టుకొని వచ్చి, రుద్రమదేవి ముందు దింపి, నమస్కారం చేసి పక్కకు పక్కకు ఒదిగి నిలబడ్డారు.
వచ్చినతను గోనగన్నారెడ్డి. ఇతడు రుద్రమదేవికి నమ్మకమైన బంటు.తనకు అప్పచెప్పిన పనికి వెనకడుగు వేయడు. పేరున్న గొప్ప వీరుడు. గోనగన్నారెడ్డి తన వెంట తీసుకొని వచ్చిన స్త్రీని, ధనమున్న పెట్టెలను రుద్రమదేవికి, సభలోని వారికి చూపించి ఇలా అన్నాడు.
ఈమె శత్రువుతో కుట్ర చేయమని పంపినదే అయినా, కాకతీయ రాణివాసం కొలుస్తూ జీవిస్తున్న దాసి కులంలో పుట్టిందనీ,శ్రీ గణపతి రాజరాజ రాజేంద్రుని దేవికి సేవలు చేసిన లలిత కూతురు అని, క్రీ.శ.1228 లో శ్రీ చక్రవర్తి గారు అద్దంకి సేనపై దాడి చేసినప్పుడు తన తల్లి, తాను శ్రీవారి వెంట ఉన్నామని, ఆ కల్లోలంలో తన తల్లి ఎక్కడో తప్పిపోయిందని, మొదలైన ఏవేవో కట్టుకథలు చెప్పి, తన పేరు మదనమంజరి అని చెప్పింది. దీని పేరు కమల. కానీ మదనమంజరి కాదు. మాయలు పన్నే ఈమె చెప్పిన చరిత్ర తన తల్లి గురించి కాకపోయినా, నిజమైన చరిత్ర కాబట్టి మన రాణిగారు నమ్మవలసి వచ్చింది. మన రాణి చాలా ఉపాయంగా ప్రశ్నలు వేసినా, మాయామర్మాలను బాగా వంట పట్టించుకున్న ఈవంచకురాలు ఆ ప్రశ్నలకు చిక్కక సరైన సమాధానాలిచ్చి, రాణి గారు అనుమాన పడకుండా చేసింది. నాకు మాత్రం మొదటి నుండి దీని విషయం కొంచెం అనుమానంగానే ఉంది. అందుకే నేను ఈమె విషయంలో శ్రద్ధతో గమనిస్తున్నాను. కొన్ని రోజులకు రాణిగారు తమ కూతుళ్లతో బుద్ధగణపతిని పూజించాలని వడ్డేపల్లికి వస్తున్నారు. అప్పుడు ఈ దొంగ దాసీ మంతనాలతో మన రాణిగారి వెంట వీరులను లేకుండా చేసింది. మొదటి నుండి అనుమానం ఉన్న నేను మారువేషంలో రాణిగారి వెంట మొగిలిచర్లకు వెళ్లాను. నేనెప్పుడూ దాసిని కనిపెట్టుకొని ఉన్నా కూడా ఒకనాటి సాయంకాలం ఈ దాసి కనిపించకుండా ఉండటంతో భయం వేసి, అటు ఇటు కొంతసేపు వెతికి, ఈ దాసి దొరకక నిరాశతో ఎక్కడ పోయిందో చూద్దామని చెరువు కట్ట ఎక్కి నడుస్తూ పోతున్నాను. నేను కొంత దూరం నడిచేటప్పటికీ ఈ దాసి కట్టకింద ఉన్న మర్రిచెట్టు దగ్గర నుండి వస్తున్నది. అప్పుడు నా అనుమానం సరైనది అనుకొని, దానికి కనిపించకుండా దాక్కొని, అది వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఏమీ తెలియనట్లు కూర్చొని, నా ద్యాసంతా మర్రిచెట్టు మీదే నిలిపాను. ఎవరో ఆ చెట్టుకింద ఉన్నట్టు, గుసగుసలు పెట్టుకుంటున్నట్టనిపించింది. వాళ్ళ మాటలు స్పష్టంగా వినబడటం లేదు. ఇంతలో ఒకడు వాళ్ళ దగ్గర నుండి నా వైపు వస్తున్నాడు. అతను పైకి వస్తున్నప్పుడు” ఇప్పుడే వెళ్లి త్వరత్వరగా కమలను కలుసుకోవాలి” అనే మాటలు వినబడ్డాయి. చూసి చూడనట్టు వాళ్ళ వైపు చూసి వారి రూపాలను నా హృదయంలో ముద్ర వేసుకున్నాను. వాళ్ళు ముగ్గురు మగవారు, అందులో ఇద్దరు అక్కడ ఉన్నారు. ఒకతను గబగబా నడుస్తూ వచ్చి నన్ను చూసి” ఎవరు నువ్వు?” అని అడిగాడు. నేను వినిపించుకోలేదు. వచ్చిన అతను అచ్చంగా బ్రాహ్మణుడు వలె ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు అడిగాడు. చెవిటి వాడి వలె నటించాను. అతను నన్ను ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు. మర్రిచెట్టు కింద ఉన్న ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు.నేను లేచి ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడించిన బ్రాహ్మణుని వెంట నడిచాను. అతడు అంతకుముందే చాలా దూరం వెళ్ళాడు.అయినా నాకు అతడు కనిపిస్తున్నాడు.అతన్ని చూస్తూ పోతున్నాను. కాబట్టి అతడు తోవలో ఈ దుర్మార్గురాలుని పనికి పురమాయించడం చూశాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, ఏదో మోసం ఉన్నది అని అనుకొని, బుద్ధగణపతి ఆలయానికి వెళ్లి, నా వేశం మార్చుకుని, పరమభక్తుని వేషం వేసుకున్నాను. ఇంతలో ఆ బ్రాహ్మణుడు దేవుడు ఆవేశం అయినట్టు నటించి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. మర్రిచెట్టు కింద నేను చూసిన మరో ఇద్దరు కూడా వచ్చి అతనికి సేవలు చేశారు. ఇదంతా నా అనుమానాన్ని మరింత బలపరిచింది.నా అనుమానం సరైనదే అని తేలేదాక ఆ విషయం రాణిగారికి చెప్పడం సమంజసం కాదని, అప్పటికి చెప్పడం మానివేసి ఆ ముగ్గురి వెంటనే ఉన్నాను.
తెల్లవారకముందే రాణిగారు ఇద్దరు కూతుళ్లతో మాయ బ్రాహ్మణునికి దేవత ఆదేశించినప్పుడు అన్న మాటల ప్రకారం మొగిలిచర్లకు ప్రయాణం అయిపోయారు. నేనా ముగ్గురుతో పాటు వారికి తెలియకుండా మొగిలిచర్లకు వెళ్లాను. వాళ్లు నేరుగా ఆ ఊరికి రాకుండా అడవి నుండి రావడానికి నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచన మోసానికి సంబంధించిందని నేను అనుకొని, రుద్రమదేవి తెలుపాలని అనుకొని, రుద్రమదేవిగారున్న విడిది గృహానికి వెళ్లాను కానీ, ఆ ఇంటి చుట్టూ కాపలా ఉన్న భటలు నన్ను లోపలికి వెళ్లనియ్యలేదు. ఎన్ని విధాల చెప్పినా లోపలికి వెళ్లి వచ్చి,” ఇది సమయం కాదని రాణిగారు అన్నారు అని” నాకు వచ్చి చెప్తున్నారు .
” నా దగ్గరకు ఎవరూ రాలేదని” రుద్రమదేవి అన్నది.
నాకు తెలుసు వాళ్లు శత్రుపక్షం వారు. కాబట్టి లోపలికి వచ్చి మీకు చెప్పలేదని తెలుసు. వాళ్ళని ఎదుర్కొందామంటే నేను ఒక్కడినే ఉన్నాను. అంతే కాదు నా దగ్గర నన్ను నేను రక్షించుకునేంత మాత్రమే ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి సాహసించే వీలు లేకపోయింది.
ఓరుగల్లుకు పోయి సైన్యంతో వద్దామంటే ఆ లోపలే ఇక్కడ ఏం జరుగుతుందో అని మనసొప్పలేదు. అప్పుడు ఆ ఊరికి పోయి దేనికైనా పనికి వస్తుందని నా వెంట తెచ్చిన ధనంతో కొంతమంది మట్టి పని చేసే వారిని నా వెంట తీసుకొని, ఊరి బయట నుండి చిన్న ఎడ కత్తులతో సొరంగం చేసి, దేవిగారు ఉన్న ఇంటి గదిలోనికి సొరంగం తవ్వమని చెప్పి, నేను ఆ ఇంటిని కాపలా కాస్తున్నాను. మళ్లీ ఒకసారి అడవి మధ్యకు వచ్చాను.అప్పటికి ఈ దాసి, ఆ ముగ్గురు అడవిలో కూర్చొని ఏదో రహస్య ఆలోచన చేస్తున్నారు. నేను వచ్చిన సంగతి వాళ్లకు తెలియక, ఆనాటి రాత్రి రుద్రమదేవిని పట్టి బంధించాలనుకుంటున్నారని, పట్టణం చుట్టూ దారుల వెంట జనాలు కాపలా ఉండాలని అనుకుంటున్నారు. నేను అక్కడ నిలబడడం అంత మంచిది కాదనుకుని, ఊరికి వచ్చాను. కానీ ఇంతలోనే మరొక ఆపద ఎదురైంది. ఊరి బయట సొరంగం ఊరికి ఏమంత దూరంలో లేదు.ఆ సొరంగం నుండి రుద్రమదేవి వస్తే,ఇవతల కాచుకొని ఉన్న వారిని ఎదుర్కో లేము. అయినా పనికి విచారించక, గబగబా ఊరికి వెళ్లి, ఒక ఊరు అతని దగ్గరకు పోయి, రహస్యంగా అతనికి కొంత ధనమిచ్చి, శ్రీ శివదేవయ్య మంత్రి పేరు మీద” మోసం జరిగింది. జాము రాత్రి లోపల సైన్యం మొగిలిచర్లకు రావాలని” ఒక ఉత్తరం రాసి పంపాను.
ఇంతలో సొరంగం తవ్వడం అయిందని తెలిసింది. సాయంత్రం అయింది. నాలుగు ఘడియల రాత్రి దాటిన తర్వాత ఆ సొరంగం బయట చాటుగా నాలుగు గుర్రాలను, నాలుగు నిలువు కత్తులను సిద్ధంగా ఉంచి, ఆ సొరంగం ద్వారా నడచి, శ్రీ రుద్రమదేవి దగ్గరకు చేరాను. నేను రావడం దేవికి ఆశ్చర్యం వేసింది. జరిగిన సంగతంతా సంక్షిప్తంగా చెప్పి, దాసిని కట్టేసి, కళ్ళకు గంతలు కట్టి, ఆ వచ్చిన తోవనే బయట పడ్డాము.
సొరంగం తవ్విన వారే వెంటనే దానిని సాధ్యమైనంత వరకు పూడ్చి వేశారు. దాసిని వెంట పెట్టుకొని వెడితే తోవలో రహస్యం దాచడం కష్టమని అక్కడనే కట్టి వేసాం. బయట పడి కొన్ని రాళ్ళు రప్పలు, సొరంగంలో వేసి నలుగురం గుర్రాలనెక్కాము. ఇద్దరు కూతుళ్లతో రాణిగారు కట్టుకున్న బట్టలనే మగవారు కట్టుకున్నట్టుగా సవరించుకున్నారు. మేము నలుగురం నడుస్తూ వస్తుండగా ఊరు చుట్టూ కాపలా ఉన్న వారు మాపై దాడి చేశారు. వాళ్లని అవలీలగా చంపేసి, ఓరుగల్లు తోవ వెంట వస్తుండగా బాటకు కొంచెం దూరంలో రెండు సైన్యాలు యుద్ధం చేస్తున్నట్టు తెలిసి అక్కడికి వెళ్ళాం. అందులో ఒక సైన్యం ఓరుగల్లు సైన్యమని, మేము అంచనాగా తెలుసుకొని, శత్రువులను వెళ్ళగొట్టాం. మేం ఎవరిమో? ఆ సైనికులకు తెలియదు. వాళ్లను వెంట తీసుకొని వచ్చి, కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంకొంత ఓరుగల్లు సైన్యం మాకు కలిసింది. కొత్త సైన్యాన్ని వెంటబెట్టుకుని నేను మళ్ళీ మొగిలిచర్లకు వెళ్లాను. కూతుళ్లు ఇద్దరు నీ వెంట తీసుకొని రాణిగారు జాగ్రత్తగా ఓరుగల్లు చేరారు. నేను మొగిలిచర్లకు వెళ్లి; నేరస్తుల కోసం వెతికాను కానీ వారు ఎక్కడా కనపడలేదు. ఆ రాత్రి అక్కడే గడిపి, తెల్లవారక ముందే చెట్లపై దాక్కొని, వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మేమున్నది తెలియక నడుస్తున్నారు. మేము వాళ్లను చుట్టుముట్టి సైనికులను, ఈ పనికి ముఖ్య కారకులైన మురారి, హరిహర దేవులను, ధర్మవర్ధనుడుని చంపేసి, ఈ దుర్మార్గురాలిని కట్టేసాం. దీనిని అడిగి మురారి దేవుడికి ,హరిహర దేవుడికి సంబంధించిన ధనాన్ని కొల్లగొట్టు కొని తెచ్చాను.ఇక ముందు మీ ఇష్టప్రకారం ఈ ధనాన్ని, ఈ దాసీని ఏమి చేస్తారో చేయవచ్చు. అని చెప్పి గోనబుద్ధారెడ్డి తన ఆసనం మీద కూర్చొన్నాడు.
ఈ విషయం విన్న సభలోని సభ్యులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. కమల వంచిన తల ఎత్తలేదు. అందరూ గన్నారెడ్డి చేసిన సాహస కృత్యానికి , అతని రాజభక్తికి మెచ్చుకున్నారు.
రుద్రమదేవి తన సింహాసనం నుండి లేచి, ” నా ప్రాణాలను ,నా కూతుళ్ళ మాన, ప్రాణాలను ” రక్షించిన గోనగన్నారెడ్డికి నా మనస్ఫూర్తిగా నా చేతిలో ఎప్పుడూ ఉండే ముత్యాల బాకును బహుకరిస్తున్నానని అంటూ తన చేతిలో ఉన్న బాకు గన్నారెడ్డి కిచ్చారు.
రాణీగారు అన్నమాటలతో సభ్యులందరికీ సంతోషంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
గోనగన్నారెడ్డి దిగ్గున లేచి రెండు చేతులతో ఆ కత్తిని తీసుకుని, కృతజ్ఞతగా నమస్కారం చేసాడు.
రుద్రమదేవి కమలను చూస్తూ ” నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?” అని అన్నది.కమల ఏమీ సమాధాన మీయకుండా తలవాల్చుకుని నిలబడింది.
మారుమాట్లాడకున్నంత మాత్రాన నువ్వు నిర్దోషివి కాదు ! నీ ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి.నిజం చెప్పి,నీకొచ్చే ముప్పు తప్పించుకో ! నిన్నెవరు పంపారో? చెప్పు! అని రుద్రమదేవి అడిగింది.
” నన్నేమి చేసినా సరే! నేను మీకేమీ చెప్పలేను.” అని కమల అన్నది.
ఎవరు పంపారన్న అనుమానం మీకక్కరలేదు. వీళ్ళ నందరినీ పంపింది మహాదేవరాజు. ఈ నలుగురు దుర్మార్గులు. మొగిలిచర్లకు చెందిన అడవిలో కూర్చుని మాట్లాడుకుంటుండగా నాకు తెలిసిందని అన్నాడు గోనగన్నారెడ్డి.
నువ్వు చెప్పకున్నా నిన్ను పంపింది మహాదేవరాజని తెలిసింది. నీ నోటితో చెప్పి ఇక్కడ నుండి వెళ్లి పో! అని అన్నది రుద్రమదేవి.
దాసి కొంచెం సేపు ఆలోచించి ” నేనిక్కడ నుండి పోకున్నా, నన్ను మీరు కఠినంగా శిక్షించినా నన్నెవరు పంపారో వారి పేరు చెప్పను. ” అని మొండికేసి నిలబడింది.
దాసి మొండితనానికి రుద్రమదేవికి చాలా కోపం వచ్చింది. ఆడది కావడం వల్ల చంపక వదిలాను.” నువ్వు ఈరోజే మా దేశాన్ని వదిలి వెళ్లిపో! మా ఎల్లలు విడిచే దాకా మా భటులు నిన్ను వెంటాడుతూ ఉంటారు.మళ్లీ మా రాజ్యంలో నీ మొహం కనపడితే నీ ప్రాణాలు నీకు దక్కవు.ఆడుదానివైనందుకు బతికిపోయావు! నీ మహాదేవరాజు కూడా ఆడదాని వలె గాజులు తొడుక్కోవడం వల్లనే కదా! బహిరంగంగా యుద్ధంలో ఆడదానినైన నాతో ఎదుర్కోలేక కుట్ర చేసాడు.
సిగ్గు, బుద్ధి తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయవద్దని చెప్పు. రాజ్యం దక్కించుకోవాలంటే మాతో స్నేహంగా ఉండమనీ గర్వం, అహంకారం వదిలి పెట్టమని చెప్పు! మేము మంచిగా చెప్పిన మాటలు మరచిపోతే మా పదునైన బాణాల గుట్టలై చురచుర మని వచ్చి తగిలి , బుద్ధి చెబుతాయని చెప్పు! అని దాసికి చెప్పి, ” త్రిపురాంతక దేవా! దీన్ని ఈ రోజు మన రాజ్యం దాటించేందుకు నలుగురు భటులకు చెప్పి పంపుమని అన్నది.
త్రిపురాంతక దేవుడు వెంటనే లేచి నమస్కరించి, కమలను వెంటబెట్టుకొని అక్కడ నుండి వెళ్లి పోయాడు.
అంతలో సభలో నుండి ఒకతను లేచి, నిలబడి “నేను వెనీసు వర్తకుడిని , నా పేరు మార్కోపోలో” అని అంటారు. నేను చాలా దేశాలు వ్యాపారంకోసం తిరుగుతుంటాను. పురుష పరిపాలన అజమాయిషీలో ఉన్న దేశాలు , స్త్రీ స్వభావమున్న పరిపాలనలో ఉన్న దేశాలను చూసాను. రాజులకుండాల్సిన ధర్మాలోచన, నీతి సమృద్ధిగా ఉండడం, సేవకుల పట్ల అభిమానం ఆదరణ , రాచకార్యాలు చేసేటప్పుడు చూపించే చతురత కలిగి ఉండడం మొదలైనవి ఈ రాణి దగ్గర చూసినట్లు ఎక్కడా చూడలేదు. రాజు పట్ల ఎంత భక్తి శ్రద్ధలుండాలో అవన్నీ ఈ రాణి సేవకుల దగ్గర మాత్రమే చూడగలిగాను. మిగిలిన దేశాలలో సేవకులకు ఇటువంటి వినయం లేదు.ఈ రాజ్యం కేవలం పురుష రాజశ్రేష్ఠులు పాలిస్తున్నట్టున్నది కానీ మహిళ చేత పరిపాలింప బడుతున్నట్టు లేదు. ఈమెను రాజు అనక తప్పదు.నాకు చాలా సంతోషంగాఉంది. మిగతా దేశాధినేతలు ,ఆ దేశాలలోని సేవకులు ఇక్కడకు వచ్చి ఈ నీతిని నేర్చుకోవాలని బిగ్గరగా అంటూ తన దగ్గర ఉన్న విలువైన విదేశీ వస్తువులను రుద్రమదేవి కి బహుమతిగా ఇచ్చాడు.
సభ్యులందరూ రుద్రమదేవి యొక్క చాకచక్యమైన పనులను పొగుడుతూ అవన్నీ మార్కోపోలోకు తెలిపారు.
సభ్యులారా! ఈనాటి ఈ అపూర్వమైన కార్యక్రమం వల్ల సభయొక్క ఉద్దేశ్యం మీరు ఇంకో తీరుగా అనుకున్నారు. కానీ ముఖ్యమైన అభిప్రాయం తెలుసుకునే అవకాశం చిక్కలేదు. రాయబారులెందరో వచ్చినట్టు తెలిసింది.వారి రాయబారాలను తెలుసుకునేందుకు సమయం చిక్కలేదు. దాడిలో పాల్గొని గెలిచిన వీరులైన సైనికులకు పారితోషికం ఇవ్వలేదు. కుట్రలో బలైనవారెందరో ? ఎంతమంది ఉన్నారో? తెలుసుకొని, వాళ్ల కుటుంబాలకు భరణం ఏర్పాటు చేయలేదు.
ఇప్పుడు సమయం చాలా గడిచి పోవడంవల్ల సభ ఇంతటితో చాలిస్తున్నాం. రేపటి కొలువులో అన్నీ జరుగుతాయని మంత్రి శివదేవయ్య తన ఆసనం నుండి లేచి చెప్పి మరలా కూర్చున్నాడు.
సభలోనివారందరూ ఒప్పుకున్నారు
(కొలువుకూటమి ముగిసింది.)
(సశేషం)
ఆరవ ప్రకరణం
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయశర్మ
సరళీకృతం:- రంగరాజు పద్మజ
( సిగము )
(దేవతావేశం)
పరమభక్తినుపాసించు భక్తవరుల
కొక్క చోటుగాకున్న నింకొక్కచోట
ఫలము బ్రాపింపగోఱి చెప్పంగలేడే?
తద్విధివిధానముల దేవతా ప్రభుండు.
— గ్రంథకర్త.
భావం:- భక్తుడైనవాడు తాను నమ్మిన దైవాన్ని పరమభక్తితో విధివిధానంగా పూజిస్తే ఒకచోట కాకున్నా మరొక చోటైనా ఫలితం పొందగలడు.
వ్యాఖ్య:-గ్రంథకర్త ఈ పద్యాన్ని రుద్రమదేవి తన కూతుర్లకు సంతానం కలగక పోవడంతో బుద్ధ గణపతిని పూజించమని మదనమంజరి చెప్పినప్పుడు “ఎంత పూజించినా లాభమేముంది ?”అని నిరుత్సాహ పడిన సందర్భంలో పూజలు చేయగానే వెంటనే ఫలితం కలగక పోయినా పూజల ఫలితం తప్పక ఉంటుందని భావి కథాభాగాన్ని సూచిస్తూ సాగిన ప్రకరణ ఔచిత్య పద్యమిది–
సాయంకాలం తర్వాత రుద్రమదేవి బుద్ధగణపతి దేవాలయంలో కూర్చుని ఉన్నది. ముమ్మడమ్మ, రుయమ్మలు ఆమె పక్కనే కూర్చున్నారు. మరికొందరు సేవికులు కొంచెం దూరంలో కూర్చున్నారు. మదనమంజరి రుద్రమదేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది.
తల్లీ ! ఈ బుద్ధగణపతి ఆలయంలో ఇంతకు ముందు ఎవ్వరూ ఇంతగా దానం చేసిన వారులేరని అనుకుంటున్నారు. బ్రాహ్మణులు మీరు చేసిన దానాలతో చాలా సంతృప్తి పొందారు. మీరు ఇచ్చిన ధనం మోసుకొని పోలేక దారిలో ఎదురైన వారికల్లా పంచిపెడుతూ పోతున్నారు.
నిజమేనా? అయినా ఫలితం ఏమున్నది? అన్నది రుద్రమదేవి. ఫలితానికి భక్తి కారణమైనా, భక్తి కలిగినప్పుడే ఫలితం కలుగదు ! కొన్ని రోజు

లు కొలిస్తే ఫలితం కనపడుతుంది. అయినా ఇవన్నీ మీకు తెలియవా? నేను మీకు తెలియదని చెప్పడం లేదు. ఫలితం కోరే వాళ్ళు శ్రద్ధతో మనస్సును లగ్నం చేసి అనుకున్న పని నెరవేరే దాకా దేవుడిని పూజించడం వదలకూడదని దాసి అన్నది.
మరిచిపోయాను
నువ్వు చెబితే జ్ఞాపకం వచ్చింది. సాయంత్రం ఎక్కడికైనా వెళ్లావా? కనిపించలేదు? అని రుద్రమదేవి అడిగింది.
అమ్మా! మీరు తప్ప నాకు ఇక్కడ పరిచయస్తులు ఎవరున్నారు? కనుక ఎక్కడికి వెళ్ళలేదు. రుయ్యమ్మ దొరసాని ,నేను తోటలో తిరుగుతూ ఏవో పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశామన్నది మదనమంజరి.
ఆ సంగతి నాకు తెలుసు. అప్పుడు కాదు… మీరు వచ్చేసరికి కొంచెం పొద్దున్నది. ఆ తర్వాత సాయంత్రం నువ్వు కనిపించలేదు. అక్కడా ఇక్కడ చూశానని అన్నది రుద్రమదేవి.
అయ్యోయ్యో! మీరు బిగ్గరగా పిలిచి ఉండరు. అయినా ఎక్కడికైనా వెళ్లే పని నాకు ఏముంది? చిన్న దొరసాని, నేను తోటలో తిరుగుతున్నప్పుడు కొన్ని అందమైన పూలు కనిపించాయి. వాటిని తెంపీ తెచ్చి చిన్న దొరసానులకు ఈరోజు దండలను గుచ్చాలను కున్నాను. అప్పుడు నేను రుయ్యమ్మ గారితో మాట్లాడుతున్నాను. కానీ పూలు ఏరడం కోసం కాదు. దొరసానిని ఇక్క
డికి తీసుకొని వచ్చి, మళ్లీ నేనొక్కదాన్నే వెళ్లి తోటలో ముందు చూసిన పూలను తెంపుకుని వచ్చి, మళ్లీ ఇక్కడ కూర్చుండి పోతే దండలను గుచ్చడానికి అవకాశం దొరకదని అనుకొని, దేవుని గుడి వెనుక కూర్చొని దండలను గుచ్చుకొని వచ్చాను. ఇది సరే! మన మొగిలిచర్ల ప్రయాణం ఎప్పుడు? రేపు తెల్లవారుజామున పోవాలి కావచ్చని అన్నది మదనమంజరి.
ఇక్కడి నుండి ఇంటికే వెళ్ళేది. మళ్లీ ఒకసారి మొగిలిచర్ల ప్రయాణం గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదని రుద్రమదేవి అన్నది.
అప్పటికి రాత్రి రెండు మూడు గడియలు అయింది. ముమ్మడమ్మ, రుయ్యమ్మ బుద్ధ గణపతిని పూజించడానికి వెళ్ళిపోయారు.
రుద్రమదేవి అక్కడే కూర్చుని ఉన్నది. మదనమంజరి ఆమె దగ్గర కూర్చొని, ఒకసారి వెనకవైపు చక్కగా చూసి తర్వాత ఏమేమో విచిత్రంగా మాట్లాడుతూ కాలం గడుపుతున్న ది.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి రుద్రమదేవి దగ్గర నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడు దాదాపు యాబై సంవత్సరాల వయస్సున్న వాడు. వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఎర్రని శరీరం మీద తెల్లని విభూతి రేఖలు స్పష్టంగా కనబడుతున్నాయి. నుదుటిమీద విభూతి రేఖలమధ్య గంధంతో తడిపిన అక్షింతలు అందంగా కనబడుతున్నాయి. మెడలో రుద్రాక్షమాల వేలాడుతున్నది. ఏడువరుసలు కుచ్చిళ్ళు పోసి తెల్లని ధోవతి కట్టుకున్నాడు. పెట్టిన శాలువా భుజంపై రెపరెపలాడుతున్నది.చేతిలో చిన్న పంచ ఉన్నది.
నడుముకు( రొంటిలో) చెక్కిన నశ్యపు కాయ అతడు అచ్చమైన బ్రాహ్మణుడని తెలుపుతున్నది.
ఇలాంటి వేషంతో వచ్చిన బ్రాహ్మణుని చూడగానే రుద్రమదేవి లేచి భయంతోనూ, వినయంతోనూ నమస్కరించింది.
బ్రాహ్మణుడు రుద్రమదేవిని శాస్త్ర ప్రకారంగా ఆశీర్వదించాడు. బ్రాహ్మణుడు, రుద్రమదేవి వారివారి ఆసనాలపై వారు కూర్చుని ఇలా మాట్లాడుతున్నారు.
బ్రాహ్మణోత్తమా! మీరు ఈ ప్రాంతం వారేనా?
అమ్మా నాది; ఈదేశం కాదు.
ఏ దేశం?
పనికిరాని దేశంలో బతికాను. అయినా వెనుకటి మాటలు ఎందుకు?
ముందు మీరు ఏ దేశంలో ఉండేవారో చెప్పండి? మన చరిత్ర మనకే వద్దంటే మరెవరికి అవసరమవుతుంది?
ధర్మానికి మారురూపంగా ఉన్న అమ్మా! నా వెనుకటి విషయాలు చెప్తే నా శత్రువులు నన్ను ఏమైనా హింసిస్తారేమో అని భయం.
నేను ఉన్నంతదాకా మీకేమీ భయంలేదు చెప్పండి!
నేను దేవగిరిలో నివసించే వాడిని.
దేవగిరిని ఎందుకు వదిలారు?
రాజు అవమానించటం వల్ల.
యాదవ రాజులు బ్రాహ్మణులపై కోపగించుకున్నరా?
రాజుల కోపం బ్రాహ్మణులా? భట్టులా? అని చూడనీయదు.
అక్కడ మీరు ఏం పని చేసేవారు?
వారికి నేను పురోహితుడిని. ఒకనాడు కృష్ణ భూపతి ఇంట్లో వ్రతం జరిగింది. ఆ రోజు నాకు ఆరోగ్యం బాగా లేక, లేవలేక పోయాను. వ్రతం చేయించి రమ్మని నా మేనల్లుడిని పంపాను. అలా అతన్ని పంపినందుకు నా మీద చాలా కోపంతో నన్ను మోసం చేయాలని ప్రయత్నించాడు.నాకు ఈ సంగతి తెలిసి వచ్చాను. కృష్ణ భూపుడు మరణించినా… అతని తమ్ముడు మహాదేవరాజు మాపై ఉన్న కోపం వదలలేదు.
ఏవండీ ! మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కృష్ణభూపాలుడు సామాన్యుడు కాడు. తెలివి లేని వాడు అంతకన్నా కాడు. కారణం లేకుండా ఇంత చిన్న విషయానికి మిమ్ములను ఇంత స్థితికి రానివ్వడని నాకు బాగా తెలుసు. మీరు బ్రాహ్మణులు.అబద్ధం ఆడరని నాకుతెలిసినా ఇప్పుడు మీ మాటలు నేను నమ్మలేను. బ్రాహ్మణుని మొహం విచారంగా మారింది.
ఏమండీ! అలా ఎందుకు బాధ పడుతున్నారు? మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే కృష్ణభూపుడు గానీ, మహాదేవరాజు గాని ఈ చిన్న కారణం చేత అలా చేయరు.
నా మాట మీరు నమ్మకపోతే మొన్న నాకు నా స్నేహితుడు రామభట్టు రాసిన ఉత్తరం చూడండి! అది చదివితే మీకే తెలుస్తుంది.
బ్రాహ్మణుడు రుద్రమదేవి చేతికి ఒక ఉత్తరాన్ని ఇచ్చాడు.
రుద్రమదేవి ఆ ఉత్తరం విప్పి చదివింది. దానిలో ఉన్న సమాచారం ఇలా ఉంది.
యజ్ఞయాగాలు చేయించడంలో, పరమ నిష్ణాతులైన షడ్వింశ బ్రాహ్మణులైన శాస్త్రి గారికి…
రాంభట్టు ఈరోజుపదివేల నమస్కారాలు చేస్తూ,
ఇక్కడ మేమంతా క్షేమం! మీ క్షేమసమాచారాలు రాయించగలరు.
తర్వాత చాలా రోజుల నుండి మీ క్షేమ సమాచారాలేమీ తెలియడం లేదు. మీ మీద మహాదేవరాజుగారికి చాలా కోపంగా ఉన్నది ఇప్పట్లో మీరు ఈ దేశానికి రావడం మంచిది కాదు అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీకా మారువేషం బాగానే ఉన్నది. మీ వారు అందరూ క్షేమంగా ఉన్నారు.
కావున దయ ఉంచండి….
ఉత్తరం నిపుణుడైన వాడు రాయలేదని రుద్రమ తెలుసుకుంది. ఆ ఉత్తరం వంకరటింకర అక్షరాలతో రాసి ఉన్నది మళ్లీ రుద్రమదేవి బ్రాహ్మణునితో ఇలా అన్నది .
కావచ్చును కానీ ఈ ఉత్తరం వల్ల మీకున్న శత్రుత్వానికి సరైన కారణం తెలియడంలేదు. మీరు చెప్పిన కారణం మాత్రం సరిగ్గా లేదు
నీ సన్నిధికి వచ్చి రాయబారం అనే మాట ఇంతదాకా వచ్చినప్పుడు అసలు విషయం చెప్పకుండా ఉండడం మంచిది కాదు. నేను ఒక తప్పు చేశాను. దాన్ని వివరించి చెప్తే మీకు తప్పక కోపం వస్తుంది. అయినా చెప్పక తప్పదు. దేవగిరి రాజులు మేము శ్రీకృష్ణుని సంతతి వారమని, యాదవులమనీ, యాదవ శబ్దం మా ఇంటి పేరు గాని, మేము గొల్లవాళ్ళ తెగకు చెందమనీ చంద్ర వంశాన పుట్టిన క్షత్రియులమనీ, మాకు వేదోక్త కర్మలు కావాలని వారంటారు. నేనందుకు ఒప్పుకోక పురాణం చెప్పిన ప్రకారం కర్మలు చేయించేవాడిని. వారికి నామీద అనుమానం ఎక్కువై,ఆ వ్రతం రోజున నేను వెళ్ళక, నా మేనల్లుడైన చిన్నవాడిని పంపాను. రాజు వల్ల అవమానమైనా,సన్మానమైనా చిన్నవాడు అతను భరిస్తాడనీ పంపాను. రాజు ఈ విషయం తెలుసుకున్నాడో? ఏమో? నా అల్లుడిని తిప్పి పంపేసి, నన్ను రమ్మని కబురు చేశాడు, నేను ఒప్పుకోలేదు. ఆ కోపం ఇంతకాలమైనా విడిచిపెట్టలేదు. అందుకే దేశం వదిలి వచ్చాను. కుటుంబాన్ని వదిలి పెట్టాను. ఒంటరి వాడిని పారాయణం ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నాను. ఏం చెప్పను? తల్లీ!? మాటలలో పడి నాసంగతి మీకు చెప్పాను. ఎన్నడూ, ఎక్కడా, ఎప్పుడూ, ఎవరితోనూ చెప్పినా నాకు ముప్పు తప్పదని నాకు పూర్తిగా తెలుసు. తల్లీ! మీరు వారికి తెలిపితే నా కొంప మునుగుతుంది. నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. ముంచినా తేల్చినా మీదే భారం!
భక్తులందరు బుద్ధ గణపతి ఆలయం లోపలికి వెళ్లి స్తోత్రపాఠాలు చేస్తున్నారు. కీర్తనలు పాడుతున్నారు. ఆ శబ్దాలన్నీ భక్తిభావంతో కూడి ఉన్నాయి. గుడి బయట చాలా దూరం వరకు వినవస్తున్నాయి.
” కుమార శాస్త్రి గారూ! మీరు భయ పడకండి! మీ మాటలను నేను రెండో వాడి చెవిలో పడనివ్వను లెండి! అని అన్నది రుద్రమదేవి.
బ్రాహ్మణుడు తల పంకించాడు. తన మాటలకు సమాధానం చెప్పేందుకు తల ఊపాడు అనుకున్నది రుద్రమదేవి. కానీ ఆ బ్రాహ్మణుని తల అలా ఊగుతూనే ఉన్నది… ఆగడం లేదు. తలతోపాటు కాళ్లు చేతులు కూడా ఊగుతున్నాయి. రుద్రమదేవికి ఏమీ తోచటం లేదు. అయ్యా! అయ్యా !!అని పిలిచింది. అతను సమాధానం ఇవ్వలేదు.
ఆయన స్వభావం తెలియని రుద్రమదేవి” రక్షించండి! రక్షించండి! అని పెద్దగా కేక వేసింది. ఆ గుడిలో ఉన్న వారికి వినబడనందున ఎవరు రాలేదు. ఇంతలో దాసి బ్రాహ్మణుని తేరిపార చూసి, అమ్మా! మీరు భయపడవలసిన పనిలేదు ఈ బ్రాహ్మణునికి ఏం భయం లేదు. ఇతనికి దేవత ఆవేశం అయినట్టు అనిపిస్తుంది. ఇతని వల్ల మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే రాశిఫలాలు అడిగి తెలుసుకోవచ్చని అన్నది.
ఆ బ్రాహ్మణుడు అలా వణికి -వణికి కెవ్వుమని కేక వేసి లేచి, బుద్ధ గణపతి కోవెలలోనికి పరిగెత్తి వెళ్ళాడు. రుద్రమదేవి, దాసి ఇద్దరు అతని వెనుకనే నడిచారు.
కుమార భట్టు పెద్దగా అరుస్తూ… ఒక చోట నిలబడకుండా అటూ- ఇటు తిరుగుతూ, ఊగి పోతూ, వణుకుతూ, పండ్లు పటపటా కొరుకుతూ, కౄరంగా దేవతా విగ్రహాన్ని చూస్తున్నాడు.
అతని పరిస్థితి తెలుసుకొని కొందరు కొంత సామ్రాణి, నిప్పును తెచ్చి ధూపంవేసి,” స్వామీ! ఏం సమాచారం? ఇంతగా ఎందుకు ఊగిపోతున్నారు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఆయాస పడుతున్నారని అడిగారు.
రుద్రమదేవి ఇటువంటి వినోదం ఎప్పుడూ చూడలేదు కాబట్టి ముందుకు వచ్చి నిలబడింది. రాణి గారి కొరకు ప్రజలు కాస్త వెనుకకు వెళ్లి చోటుకల్పించారు. దాసిని దగ్గర నిలబెట్టుకొని ఆ వింత చూస్తున్నది రుద్రమ దేవి.
ఒక మనిషి ఆ గుంపు నుండి ముందుకు వచ్చి నమస్కారం చేసి ,చేతులు జోడించి, నిలబడి” స్వామి నా సంగతి ఏమిటి? అని అడిగాడు.
“హూ! ఏమిరా? భక్తుడా? నువ్వు నన్ను పూజిస్తూ ఉండి రెండు మూడు మండలాలైనా ( మండలం అనగా నలబై రోజులు.) కాలేదు, అప్పుడే నీకు ఫలితం కావాలిరా? ఇంకొక మండలం నన్ను పూజించు! నీ కోరిక నెరవేరుతుంది.
హూ! అని గంభీరంగా అన్నాడు.
ఇలా ఒకరి తర్వాత మరొకరు వచ్చి దేవుని వల్ల తమకు ఎటువంటి ఫలాలున్నాయో అని అడిగి తెలుసుకుంటున్నారు. దేవుడు పూనిన బ్రాహ్మణుడు కొందరికి మంచి జరుగుతుందనీ, కొందరికీ చెడు ఫలితాలు ఉన్నాయని చెబుతున్నాడు కొందరికి విభూతి, ఖర్జూర ఫలాలు, సామ్రాణి ఇస్తున్నాడు.
అమ్మా! మనం వచ్చిన పని గురించి అడుగుదామా? అని రుద్రమదేవిని అడిగింది మదనమంజరి. రుద్రమదేవి అవునని కానీ, కాదని కానీ ఏమీ అనలేదు. ఆమెకు ఇది అంతా విచిత్రంగా అనిపిస్తుంది.
మదనమంజరి దేవతావశమైన బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి భయభక్తులతో నమస్కరించి, దేవుడా!మేమొక పని మీద వచ్చాం. మా మనసులోని అనుమానం తొలిగేటట్టు మంచి వరమివ్వమని అడిగి మళ్లీ నమస్కరించింది.
రుద్రమదేవి మనసులో కొంచెం ధైర్యం తెచ్చుకున్నది.ముమ్మడమ్మ, రుయ్యమ్మ కూడా ధైర్యం చెప్పారు దాసి మాత్రం ధైర్యం వదలకుండా… స్వామీ! ఎల్లకాలం మిమ్మల్నేనమ్మి ఉన్న మా కోరికలను తప్పక తీర్చాలి! మీరు తప్ప మాకు వేరే గతిలేదు. మమ్ములను ఆదరించండి !అని వేడుకున్నది.
హా! భక్తురాలా! హూ! మీకు… మంచి ఫలితం లేదని నేను చెప్పలేదు కానీ, మీరు రేపు పొద్దున్నే…హా… లేచి.. మొగిలిచర్లకు పోయి… ఏకవీరా… మహాదేవిని.. హా .. మొక్కండి! ఫలము….హూ! … తెండి… శీతలం
( బెల్లంపానకం) ఏదిరా? అని అరవడం మొదలు పెట్టాడు వెంటనే అక్కడే ఉన్న బ్రాహ్మణుడొకడు” స్వామీ! మీరు అడిగిన శీతలం చేస్తాము! శాంతి పొందండి! అని రెండు బిందెల నీళ్ళలో బెల్లం కలిపి తెచ్చాడు దేవుడు ఆవేశించినవాడు ఆ శీతలం తాగకముందే ” ధభేలుమని” నేల మీద పడ్డాడు. అతనికి స్మృతి లేనట్టున్నది. గుడి అంతా సంక్షోభం తీరిన సముద్రం వలె నిశబ్దంగా మారింది.
ఏడవ ప్రకరణ
గ్రంథకర్త:- ఒద్దిరాజు సీతారామ చంద్రరాయ శర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ ముఖ్యరాలు రుద్రమ చిక్కినది]
అల్పోపాయాన్మహాసిద్ధి
రేతన్మసన్త్ర ఫలంమహత్ ॥
—హితోపదేశము.
భావం:-కొంచెమైన సాధన వల్ల గొప్ప లాభం పొందవచ్చు.విస్తారమైన ఆలోచన వల్ల మరెంతో లాభం పొందువచ్చు
కథాభాగం:- రుద్రమదేవి వడ్డేపల్లి విడిదికి వచ్చి ఐదు రోజులు అయింది. ఇప్పుడు రుద్రమదేవి కూతుళ్లతో, దాసితో మొగిలిచర్లలో ఉన్నది. మొగిలిచర్ల ఓరుగల్లుకు ఈశాన్యదిశలో నాలుగైదు కోసుల దూరంలో ఉంటుంది.
మొగిలిచర్ల పెద్ద ఊరు కాకున్నా ఆ ఊరిలో” ఏకవీర మహాదేవి” చాలా ప్రభావవంతమైన దేవత.ఆ కోవెలతో ఆ ఊరు ప్రశస్తి గాంచినది. ఆ కోవెలలో రుయ్యమ్మ ,ముమ్మడమ్మ ఇద్దరూ ఏకవీరాదేవిని భక్తితో పూజిస్తున్నారు.
మనకథా కాలంలో ఈ ప్రదేశమంతా అడవి ఉండేది. అడవి పగటిపూటనే చీకటి అయిందా ! అని భ్రమ కలిగించేలా చిక్కగా ఉండేది. అడవి నుండి మనుషులు ,బండ్లు నడవడానికి ఒక బాట ఏర్పడింది. ఆ బాటకు ఉత్తరానికి కొంత సాగి తిరిగి తూర్పుదిక్కుకు మళ్ళింది. ధర్మాత్ములు కొందరు ఆ దారి వెంట అక్కడక్కడా మూడు నాలుగు ఆమడలకొక ధర్మసత్రాలు కట్టించారు. అందులో ఎవరూ నివసించరు. కానీ, ప్రయాణపు అలసట తీర్చుకుని తమ వెంట తెచ్చుకున్న భోజన పదార్థాలను తినేందుకు ఉపయోగకరంగా ఆ ధర్మసత్రాలలో యోగులు, బైరాగులు , అడవి జంతువులకు భయపడని వారు ఒక పగలో, ఒక రోజో ఉంటారు.
ఇప్పుడు మన ఈ ప్రయాణానికి సంబంధించిన అటువంటిదే ఒక సత్రం. ఆ సత్రం మొగిలిచెర్లకు దాదాపు ఒక కోసు దూరంలో ఉన్నది. మొగిలిచర్ల నుండి ఉత్తరానికి పోయే బాట తూర్పు దిక్కునకు మరిలే బాట దగ్గర ఆ సత్రం ఉన్నది. అక్కడ ఒక బావి ఉన్నది. అందులో నీరు ఏమంత పరిశుభ్రంగా ఉండదు. అయినా బావి నిండా నీరున్నా వాడక పోవటం చేత నాచు పట్టి ఉన్నది.
ముగ్గురు మగవారు, ఒక స్త్రీ ఆ సత్రం ముందటి వైపు కూర్చున్నారు. ఏమంత పొద్దు పోలేదు. సాయంకాలం అయింది. వాళ్ళందరూ ఏం మాట్లాడు కుంటున్నారు? వారి చూపులు అడవి జంతువులను కనిపెట్టేందుకో ఏమో! నాలుగువైపులా చూస్తున్నారు. అందులో ఇద్దరు మగవారు మాత్రం దాదాపు ఒకే వయసు ఉన్నవారు. ఒకడికి మాత్రం యాబై సంవత్సరాల వయసు ఉన్నది.ఆ స్త్రీ దాదాపు నలబై సంవత్సరాలు వయస్సున్నది. మగవారి చేతులలో నిలువెత్తు ఖడ్గాలు ఉన్నాయి.
ఆ బాట వెంట జనాలు ఎక్కువగా తిరగరు. అందున సాయంకాలమైంది కాబట్టి ఎవరో వస్తారని అనుకోలేము. వారిలో ఒకరి పేరు హరిహర దేవుడు, మరొకరి పేరు మురారి దేవుడు, ముసలి వాడి పేరు ధర్మవర్తనుడు. ఆమె పేరు కమల. వాళ్ళు ఇలా మాట్లాడు కుంటున్నారు.
మురారి:– కమల చాలా నేర్పు ఉన్న స్త్రీ. చక్కని చమత్కారంతో మాట్లాడుతూ పనిని చక్కగా తోవకు తెచ్చింది.అందుకే అంటారు”బుద్ధిష్చాపి చతుర్గుణమ్”
( అంటే ఆడవాళ్లకు మగవారికన్నా బుద్ధి నాలుగు రెట్లు ఎక్కువ పని చేస్తుందని)
ధర్మ:– నిజమే మనం తలపెట్టిన పనికి మూడు వంతుల సహాయం కమలదే! అనుమానమే లేదు.
మురారి:– మీరు మాత్రం సామాన్యమైన వారా? పనిని ఆచరణలో పెట్టే దక్షులు.
హరి:– అవును అలా కాకపోతే వెతికి వెతికి మహాదేవరాజు వీరిని ఎందుకు పంపుతాడు? మన పనికి సగం సహాయం కమల, సగం సహాయం ధర్మవర్తనుడు గారు తల పెట్టిన పనని పూర్తి చేసి వచ్చారు.
ధర్మ:– నా సహాయం ఏం సహాయం? కమలను మెచ్చుకోవాలి. మహాదేవరాజు గారి దగ్గర తాంబూలం పుచ్చుకొని, వచ్చి రుద్రమదేవి దగ్గర చేరి, పన్నిన మాయలను, ఆడిన అబద్దాలను పొల్లు పోకుండా ఎలా సమర్థించుకుంటూ వచ్చిందో చూడండి! పనిలో నైపుణ్యం అంటే ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది? రుద్రమదేవిని ఓరుగల్లు నుండి లేవదీసి వడ్డేపల్లికి తీసుకొని వచ్చింది ఎవరు? మన కమలనే కదా! కమల సాయం మనం మెచ్చుకోవాలి. అవును మరిచిపోయాను కమల నీ పేరేమిటి? కమల కాదు కదా! మదనమంజరీ! మీ అమ్మని ఎత్తుకొని పోయిన వాడెవడు?
కమల సిగ్గుపడింది.
ధర్మ:– చెప్పు చెప్పు! నిన్ను పెళ్లి చేసుకున్న భర్త ఏ రోగంతో ప్రాణాలు కోల్పోయాడు? మీ రుద్రమదేవితో చెప్పిన మాటలే మాతో చెప్పు, కానీ ఏడవ వద్దు!
హరి:– కమలకు ఇప్పుడు ఏడుపు ఎందుకు వస్తుంది? అప్పుడంటే రాచకార్యం ఎలా చక్కబెట్టాలని ఒకవైపు, రుద్రమదేవి తనను ఎలా నమ్ముతుందా? అని మరోవైపు, తనను అనుమానించకుండా పని ఎలా చక్కబడుతుందా! అని ఇలా మూడు రకాల విచారంతో అప్పుడు అలా నటించవలసిన వచ్చింది కానీ ఇప్పుడు విచారం ఎందుకు? ఇద్దరు బిడ్డలతో రుద్రమదేవి మన చేత చిక్కింది. ఇంకో జాముకో అర జాముకోపూర్తిగా మన వశం అవుతారు. సంతోషించే వేళ ఏడ్చేందుకు కమలకేమి గ్రహచారం? రుద్రమదేవికి చెప్పిన విషయం ఎన్నిసార్లు పాఠం అభ్యాసం వలె చేసిందో కానీ అలా చెప్పకుంటే రుద్రమదేవి కమలను నమ్మక పోయేది.
మురారి:– నిజమే! కమల బుద్ధి మెచ్చుకో తగిందే!ఏం మంజరి ఏమంటావు?
కమల:- వడ్డేపల్లికి రుద్రమదేవిని తీసుకొని రావడానికి నాకు అంత కష్టం అనిపించలేదు. కానీ మొగిలిచర్లకు రానని అన్నారు. నా ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఆమె అనగానే నాకు నిరాశ కలిగింది. మన ధర్మవర్తనుడు గారు దేవుడు, ఆ విషయమైయినట్లు నటించి, వారి బుద్ధిని మరలించక ఉంటే వారు రాకపోయే వారు. వారు అలా బ్రాహ్మణ వేషం వేయకపోతే నేను అన్నమాటలు కానీ, నేను పన్నిన పన్నాగం కానీ ప్రయోజనం లేకపోయేది.మీతో నేను వారిని మొగిలిచర్లకు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాను. అప్పటికి నాకు వారి సంగతి పూర్తిగా తెలియదు.” మేము మొగిలిచర్లకు రాము” అని అన్నారని మీకు తెలియజేసి, మన పనిని అక్కడనే చేయాలని ప్రయత్నం చేశాను కానీ వడ్డేపల్లిలో ఈ పని జరుగుతుందా? అని అనుమానంగానే ఉండేది. ఉన్న రెడ్డి వారు రుద్రమదేవిని కనిపెట్టుకొని కాపు వేసినట్లు నాకనిపించింది. ఇంతలో ధర్మవర్తనుడు గారు రావడంతో ఇలా చేస్తే బాగుండు అనిపించింది. అలా ఆలోచన చేశాను. వారు అవునని ఆ వేషం వేశారు .లేకపోతే ఈ పన్నాగం అంతా పాడై పోయేది.
మురారి:- నువ్వూ, మేము చెరువు కట్ట కింద మర్రిచెట్టు నీడలో కూర్చుని మాట్లాడి, నువ్వు పెళ్లిపోయిన మరు నిమిషంలో ధర్మవర్తనుడు గారు మా దగ్గరికి వచ్చారు. పని ఎలా అవుతుందో! అని చూసి రమ్మని వారిని నీ దగ్గరికి పంపాను. వారు నీకు ఎక్కడ కనబడ్డారు?
కమల:– ముందే నాకు వారు కనిపించి తనను పరిచయం చేసుకున్నారు. జరగబోయే సంగతి తెలుసుకొని, వినవచ్చని వారికి చెప్పి తీసుకొని వచ్చాను. రుద్రమదేవితో ప్రయాణం విషయం మాట్లాడుతూ ఉంటే ధర్మవర్ధనుడు గారు మా వెనుక కొంచెం దూరంలో నుండి వింటున్నారు. ముమ్మడమ్మ, రుయ్యమ్మలు దేవుని గుడి లోనికి పోగానే వీరు వచ్చి వింతగా మాట్లాడి చివరకు ఆ వేషం వేశారు. మీరు ఎప్పుడు వచ్చారు? పానకం ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు తడి పడిపోయారు? దేవత నివేదన చేయకుండానే అతని ముందర ఎందుకు పెట్టారు పానకాన్ని?
హరి:– ఏదో జరిగింది జరిగిన దానికేం గాని?
కమల:- ఏం గుర్రపు బండ్లు ,మనుషులు తయారుగా లేరా? ఇంకా మనం విచారించడానికి ఏముంది?
హరి:– అందరూ సిద్ధంగా ఉన్నారు లేకేం? మరి మన ప్రయాణం ఎప్పుడు ?
మురారి :-ఎప్పుడు అనడానికి ఏముంది? మనం ఎప్పడనుకుంటే అప్పుడే! మనలను అడ్డుకొనేవారెవరున్నారు?
మనం ఎంత చేతులు చాపితే బాఱ అంత పొడుగు అవుతుంది.
ధర్మ:– అలా అనుకోవద్దు రుద్రమదేవి సామాన్యురాలు కాదు ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. మహా మేధావతి. కనుమరుగైన అంతవరకూ పనిచేశాం. ఇప్పుడు తప్పించ వలసిన పని జాగ్రత్తగా చేయాలి.
మురారి:– ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు కదా!
కమల:- మన ఇల్లు అంటే? మీరున్న ఇంట్లోనా?
మురారి:- కాదు వారి కోసం కట్టించిన ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఎక్కడికి పోగలుగుతారు? వంటిల్లు చొచ్చిన కుందేలు తప్పి పోగలదా?
ధర్మ:- అలా అనలేము! ప్రాప్తం లేకుంటే చేతిలో ఉన్న పండు బావిలో పడి పోతుంది. మన ఇంట్లో ఉన్న వారు మన చేతికి చిక్కినారని అశ్రద్ధగా ఉండకూడదు. వడ్డేపల్లిలో మనం మర్రిచెట్టు కింద కూర్చుని మాట్లాడుతున్న తర్వాత నేను కమలను చూసేందుకు చెరువు కట్ట ఎక్కినాను. అప్పుడు అక్కడ ఒక అతను ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు కూర్చుని ఉన్నాడు. అతను మన మాటలు విన్నాడో? లేదో ?నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను వచ్చింది అతనికి తెలియదు. నువ్వు ఎవరు ? అని నేను అతనిని అడిగాను. ఆ మాటకు అతను ఉలిక్కిపడి లేచి ఏమి మాట్లాడకుండా వెర్రి చూపులు చూస్తూ వెళ్లిపోయాడు. అతను నిజంగా పిచ్చివాడో? లేదా మన మాటలు విన్నాడో? నాకు అర్థం కాలేదు.
మురారి:– అతనెవరో? ఏదైనా గూఢచారిగా పని చేసేవాడేమో? తన నీడ కనపడినా ఉలిక్కిపడ్తాడు. మన మాటలు వింటే రుద్రమదేవికి తెలియకుండా ఉండదు. ఆమె మన మాటలు అతనికి చెప్పితే వడ్డేపల్లి నుండి ఓరుగల్లుకే పోయేది. మొగిలిచర్లకు ఎందుకు వస్తుంది?
ధర్మ:- ఎందుకు రాదు? మన మోసం తెలిసీ, తెలియనట్లు నటించి మనలను పట్టుకునేందుకు తగిన సైనికులను పిలిపించవచ్చు కదా! వచ్చిన సైన్యాన్ని మనం పట్టుకో కూడదా? ఎలా అయినా మన ప్రయత్నం నెరవేరే దాకా ముందూవెనుకా చేయకూడదు. పట్టు విడిచి పెట్టవద్దు!
హరి:- నిజమే! అయినా కూడా దానికి తగిన పని చేశాం. వారు నివసించి ఉన్న ఇంటి చుట్టూ కత్తులు చేతబూని భటులు అప్రమత్తంగా ఉన్నారు. మన సంగతి తెలిసి బయటపడడానికి ప్రయత్నిస్తే వరుసబెట్టి నరికి వేస్తారు. బయటి సైన్యం రాకుండా ఆపేందుకు ఈ ఊరిలో నాలుగువైపులా అడవిలో చాలినంత మంది జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి వచ్చే సైన్యం కూడా రాలేదు.
ధర్మ:- ఇది మంచి ఏర్పాటు. ఇంకా మనకు ఆలస్యం ఎందుకు? అర్ధరాత్రి దాటిన తర్వాత మన పని మనం చేసుకుందాం! ఊరికి పోదామా!
మురారి:– మంచిది కమలా! నువ్వు వెళ్లి ఎప్పటివలె రుద్రమదేవి దగ్గర ఉండు !
అందరూ తమతమ స్థానాల నుండి లేచి నిలబడ్డారు .ఊరు చేరే దాకా అందరూ కలిసి వచ్చి తర్వాత తలోదారిన వెళ్లారు.
దాదాపు సాయంత్రమైంది. మెల్లగా రాత్రి అవుతున్నది అమావాస్య ముందు దశమి కాబట్టి వెన్నెల జాడలేదు మూడు జాముల రాత్రి అయితే తప్ప సూర్యోదయం కాదని ప్రజలకు తెలియనందున జనలెవరూ వెన్నెల కోసం కానీ ,చంద్రుడి కోసం ఎదురు చూడడం లేదు.
రుద్రమదేవి విడిదిగా చేసుకొన్న భవనం సత్రమని చెప్పటానికి సందేహం లేకున్నా, కేవలం సత్రం వల్లే బట్టబయలుగాలేదు. విశాలంగా లేదు. రెండు మూడు గదులు రెండు మూడు మనసాలలున్న మూసినట్లు ఉన్న ఇల్లు, ఇంటినిండా దీపాలు వెలుగుతున్నాయి. రుద్రమదేవి ఆమె కూతురు ఇద్దరూ ఒక మనసాలలో కూర్చున్నారు.
ఇంతలో మదనమంజరి అక్కడికి వచ్చింది. మదనమంజరి రుద్రమదేవిని వదలిపెట్టి చాలాసేపు అయింది. మదనమంజరి వచ్చేదాకా వాళ్లు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు చాలా నెమ్మదిగా అంటే కనీసం వారికి కూడా వినపడడం లేదేమో అన్నంత మెల్లగా మాట్లాడు కుంటున్నారు. మదనమంజరి రాగానే వారు సంభాషణ ఆపినట్టుగా ఆమె గుర్తించలేదు. మదనమంజరిని చూడగానే అయ్యో! మదన మంజరీ! మమ్మల్ని విడిచి పెట్టి నువ్వు వెళ్లి చాలాసేపు అయింది. కొత్త ఊర్లో తెలిసిన దానివి నువ్వు లేకుండా మాకు పొద్దు ఎలా గడుస్తుంది? దా! కూర్చో! అని అన్నది రుద్రమదేవి.
మదనమంజరి వచ్చి రుద్రమదేవి దగ్గర కూర్చొని ఏదో చెప్పబోయింది ఆమెను మాట్లాడ నివ్వకుండా ఇలా అన్నది.
మదనమంజరీ! నీకు ఒక విషయం చెప్పాలి అనుకుని మరిచిపోయాను. ఈ రోజు ఏకవీరాదేవి దేవాలయం చూశాం. కానీ మదనమంజరి ఏం చెప్పను? దేవికి మా మీద దయలేదు. రుయ్యమ్మకు సంతానం ఇవ్వలేదు. ముమ్మడమ్మకు మాత్రమే సంతానమున్నదని దేవి ఆజ్ఞ!
రేపు ఓరుగళ్ళకు వెళ్లి బ్రాహ్మణ సమారాధన చేయాలి. ప్రయాణానికి తగినట్లు మూటాముళ్ళు కట్టాలి. బండి వాళ్లను, పల్లకీల వాళ్లను ఎక్కడ ఉన్నారో వారికి తగిన జాగ్రత్తలు చెప్పి రావాలేమో? అయినా వారందరూ అంత జాగ్రత్తగా ఉండరేమో? కాచుకొని ఉంటారేమో!
ఇంతలో వంట తయారయిందని లోపల నుండి వంట చేసే సేవకురాలు వచ్చి చెప్పింది. రుద్రమదేవి ఆమె ఇద్దరు కూతుళ్లు లేచి భోజనం చేశారు. మదనమంజరి కూడా తిని లేచింది. పనిచేసే సేవకురాలు ఎప్పటివలె పడుకోవడానికి వెళ్ళింది. మదనమంజరి మూడు పడకలను సిద్ధం చేసింది.దాని మీద ముగ్గురు విశ్రమించారు. మదనమంజరి వారి దగ్గరే తనపడక వేసుకొని పడుకున్నది. అందరూ క్రమంగా నిద్రపోయారు.
దాదాపు జామురాత్రి దాటింది. ఊరి ప్రజలు అందరూ నిద్ర పోయారు. చిన్నపల్లెటూరు కాబట్టి ఊరి వారంతా తలుపులు బిగించుకొని అడవి మృగాల భయం లేదని నిశ్చింతగా నిద్ర పోయారు. రుద్రమదేవి నివసిస్తున్న ఇంటి తలుపులు అన్నీ బిగించబడ్డాయి.
అనుకోకుండా రుద్రమదేవి ఉన్న ఇంటి చుట్టూ ఏదో కలకలం పుట్టింది. ఆ ఇంటి చుట్టూ జనాలు మూగి ఉన్నారు. వారంతా ఊరి వారు కాదు. వాళ్ల చేతులలో కత్తులు మొదలైన సాము చేసే దుడ్డుకర్ర వంటివి చాలా ఉన్నాయి. వారందరూ కలిసి ఇంటి దర్వాజా తడుతున్నారు. కానీ తలుపులు తీయలేదు. తలుపులు రాకపోవడంతో అందులో కొందరు గడ్డపారతో పెళ్లగించి, తలుపులు ఊడదీసి లోపలికి ప్రవేశించారు. మొదట గదిగదికి పది మంది మనుషులు లోపల అంత శ్రద్ధగా వెతుకుతున్నారు. ఒక మనసాలలో మూడు మంచాలపై ఉన్న వారిని కొందరుచూశారు.రుద్రమదేవి ఆమె కూతుర్లు ఆ మంచాలపై నిద్రిస్తున్నారని వారు అనుకున్నారు. మూడు మంచాల మీద ముగ్గురు దుమికారు. ఆ ముగ్గురిలో ఒకడు హరిహర దేవుడు. మరొకడు మురారి దేవుడు. మూడోవాడు ధర్మవర్ధనుడు.
[వీళ్ల ముగ్గురిని మన పాఠకుల్లో నిర్మలాపురం నుండి దేవగిరి కి వెళ్ళే తోవలో ఉన్న చెరువు కట్టమీద మాట్లాడుకున్న అప్పటి నుండి చూస్తూనే ఉన్నారు]
వాళ్లు ముగ్గురూ మూడు మంచాలపై పడి చూశారు. ఆ మంచాలపై ఎవరూ లేరు. వారికి చాలా ఆశ్చర్యం వేసింది. చుట్టుపక్కల చూశారు .ఎవరూ పట్టుబడ్డ లేదు. నాయకులు ముగ్గురూ నిశ్చేష్టులయ్యారు .
ఇంతలో ఒకడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి హరిహర దేవుడికి అప్పగించాడు.
అతడి కాళ్లు చేతులు బట్టలతో కట్టేసి ఉన్నాయి. మోహం కనపడకుండా బట్టతో మూతి కట్టేశారు. కట్టుకున్న బట్టలను బట్టి ఆమె ఒక మహిళ అని తెలుస్తున్నది. దాన్ని చూసి హరహర దేవుడు సేవకులకు ఇలా చెప్పాడు.
మిగిలినవారు చిక్కపోయినా సరే ముఖ్యులైన రుద్రమ్మ మన చేతికి చిక్కింది. దీనిని కట్లు విప్పకుండానే గుర్రం బండిలో వేసి తలుపులు మూసి చాలా త్వరగా నడిపించండి! ఊరూరికి మన బండ్లు ఉన్నాయి. నదుల దగ్గర మన పడవలు ఉన్నాయి.
సేవకులు ప్రభువు ఆజ్ఞ పాటించారు.
ఎనిమిదవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయశర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ అనభిజ్ఞాన సహాయ్యము]
(తెలియనివారి సహాయం)
మ. సమదాటోపత వాయునందనుడు ధృష్టద్యుమ్ను శైనేయు లే
కమనోవృత్తి గడంగితో నడర దోర్వర్గంబు శోభిల్ల శౌ
ర్యము సొంపార నిలింపకోటి వొగడన్ రారాజు సైన్యంబు లొ
క్క మొగిం బెల్లగిలంగ బెట్టడరె సక్రోధాంతరంగంబుతోన్ .
— మహాభారతము
భావం:- క్రోధాంతరంగంతో, పరాక్రమాతిశయంతో భీముడు దృష్టద్యుమ్న , సాత్యకులు తనకు తోడురాగా, దుర్యోధనుడి సేనలు పారి పోయేటట్లుగా విజృంభించాడు. అది చూసి దేవతలు ప్రశంసించారు.
వ్యాఖ్య :—కర్ణపర్వం ద్వితీయాశ్వాసం లోని యుద్ధవర్ణనను… గ్రంథకర్త రుద్రమదేవి నవల కథాసూచిగా తీసుకున్నారు. కథార్ధభాగం అచ్చంగా భారత యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించడం పోలికలో గొప్ప విశేషం.
కథాభాగం:-
రెండు జాముల రాత్రి. ఇంకా చంద్రోదయం కాలేదు. లోకమంతా చీకట్లు కమ్ముకుని ఉంది. వేలవేల నక్షత్రాలు ఆకాశంలో వజ్రాల ముక్కల వలె మెరుస్తున్నాయి. మబ్బులు లేకుండా ఆకాశం నిర్మలంగా ఉంది. చూడడానికి ఎంతో అందంగా కనపడుతున్నప్పటికీ… ఆకాశంలో చంద్రుడు లేని వెలితి స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
మొగిలిచర్ల నైరుతి దిక్కున పెద్ద అడవి ఉంది. సహజంగా లోకమంతా పరుచుకున్న చీకటి ఆ అడవిలో ఇంకా చిక్కగా పరుచుకొని ఉన్నది. ఆ అడవిలోని ప్రాణులకు కళ్లు మూసినా తెరచినా ఒకే తీరుగా ఉంది. కళ్ళు ఆ చోట్ల ఏమాత్రం పనిచేయవు.
ఏదైనా శరీరానికి తాకితే తెలుసుకోవాల్సిందే తప్ప అలా కాకపోతే తెలుసుకోలేరు. ఆ తాకిన వస్తువును కూడా గుర్తించడం కష్టంగా ఉంది ఆ చీకట్లో…
అంత చిమ్మచీకటిలో ఆనాటి అడవిలో కొందరు ద్వంద యుద్ధం చేస్తున్నారు. ఎవరిని ఎవరు కొడుతున్నారో? తాను ఎవరినీ కొడుతున్నాడో? తనను ఎవరు కొడుతున్నారో కూడా తెలియడం లేదు.
కత్తీ కత్తీ తాకినపుడు వచ్చే నిప్పు కణాల వెలుగు అప్పుడప్పుడు కాస్త కనబడుతున్నది. ఆ నిప్పురవ్వలు ఎంతసేపు ఉంటాయి కనుక? దరిద్రుడి మనసులోని కోరికలు పుట్టడం అవి ఎలా తీరుతాయిలే అనే నిరాశలో మాయమై పోయినట్టు మాయమైపోతూన్నాయి.
అలా చీకటిగా ఉన్నా కూడా వారు యుద్ధం చేయడం ఆపలేదు. అసలు తమ వారెందరు జీవించివున్నారో, ఎదుటి వారి వైపు ఎందరు మరణించారో! అని తమ బలంగానీ, ఎదుటి వారి బలంగానీ వారికి తెలియదు. అలా అని కత్తి వేటు ఏ మనిషిపై వేస్తే అది తప్పకుండా ఆ వ్యక్తిని తాకడం లేదు. అలా అని గాయపడని వారు కానీ, చావని వారు కానీ లేరని చెప్పలేం. ఆ దొమ్మి యుద్ధపు కలకలం చాలా ఎక్కువగా ఉన్నది.
ఇంతలో ఒకప్పుడు ఉన్న చీకటి మెల్లగా తొలగిపోయి, నక్షత్రాలు తన సహజమైన వెలుగునిస్తున్నాయి. ఉదయ పర్వత శిఖరం మీద తెల్లని కాంతులు వెదజల్లుతూ చల్లని సూర్యుడు ఉదయించాడు. ప్రపంచమంతా నిర్మలమైన సూర్యకిరణాలతో చక్కగా కనపడుతున్నది.
సైనికులకు అందాకా చీకటితో మూతపడుతున్న కళ్ళు చీకటి తొలగిపోవడంతో చాలా సంతోషపడ్డారు. కొత్త ఉత్సాహంతో రెండువైపులా సైనికులు ఎదురుపడి యుద్ధం చేస్తున్నారు . ఇప్పుడు వారి యుద్ధ నైపుణ్యం చక్కగా కనపడుతున్నది. అంతకుముందు గాయాలపాలైన వారు, చనిపోయిన వారు అందరూ కనపడి ఎవరెవరో తెలుసుకున్నారు. తమ వారు చచ్చిపడి ఉండటం చూసిన వారి కోపానికి అంతేలేదు.
” హుమ్మని” ఒక్కసారిగా ఎదుటివారిపై దూకి యుద్ధం చేస్తున్నారు.కత్తివేట్లను తప్పించుకుంటున్నారు. కొందరు గాయపడుతున్నారు. కొందరు చస్తున్నారు. యుద్ధతీవ్రత ఎక్కువైపోయింది.
ఒకవైపు సైన్యం తక్కువ సంఖ్యలోనూ, రెండో వైపు సైన్యం కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ సైన్యం ఉన్నవారు వారికున్న దళ బలంతో చెలరేగి శత్రు వీరులను చంపుతున్నారు. రెండు వైపులా సైన్యంలో సైనికాధికారులున్నట్టు కనిపించడం లేదు.రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు రెండు వైపులాసైన్యంలోను లేవు. సామాన్య పదాతి దళాలు అయినా బింకంగా, పరాక్రమంతో, పంతంతో బలం గల సేనానాయకులు ఉన్న సైన్యం వలె కనపడుతున్నది.
చంద్రోదయం తరువాత దాదాపు నాలుగు గడియలు యుద్ధం అయ్యే సరికి రెండు వైపులా సైన్యంలో చాలామంది చనిపోయారు. అందులో ఒక వైపు మరీ తక్కువ సైన్యంతో ఉన్నది. అందులో కొందరు శత్రువులచే చంపబడ్డారు. ఇక వారి గెలిచే అవకాశం లేదని అనుకున్నారు. తమను ప్రోత్సహించే వారు లేరు. అయినా ప్రాణాలు ఉన్నంత దాకా పోరాడడమే వారి నిర్ణయం. ఏం చేయగలరు? బలం నశించింది కాబట్టీ శత్రువులను చంపక పోయినా, మనుషులు తమపైన పడకుండా కష్టంగా తప్పించుకుంటున్నారు. శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. తక్కువ సైన్యం ఉన్నవారు వెనుకకు మళ్ళీ పోతున్నారు.ఇంతలో వారికి అడవిలోపల ఫెళఫళమని చప్పుడు వినబడింది. అది జంతువులు పరిగెత్తడం వలన కలిగిన చప్పుడు వలె ఉన్నది. డెక్కలు ఉన్న పెద్ద జాతి జంతువుల పరుగు శబ్దం అది. రెండు వైపులా సైన్యాలు ఆ చప్పుడు విన్నారు. కానీ యుద్ధం ఆపలేదు. యుద్ధం అంత పెద్దగా లేకున్నా… వీరాలాపములు ఎక్కువగా ఉన్నాయి.
ఇంతలో నలుగురు గుర్రపు స్వారీ చేస్తూ వచ్చిన యోధులు త్వరగా త్వరగా వచ్చి రెండు వైపులా ఉన్న సైన్యం మధ్య నిలబడి ఒక సారి అటు ఇటు చూసి, ఎక్కువ సైనికులున్న దళాన్ని నరకడం మొదలు పెట్టారు. ఆ నలుగురూ ఇరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు వయసు ఉన్నవారు.వారు ఎక్కిన గుర్రాలు చాలా ఎత్తుగా, బలంగా ఉన్నాయి. వారు మామూలు మగవారు కట్టుకొనే టటువంటి దుస్తులనే కట్టుకున్నారు. వారి చేతులలో అర్ధచంద్రాకారంలో ఉన్న పదునైన కత్తులు ఉన్నాయి. ఆ వెన్నెల వెలుగులో వారి గుర్రపు జీనులు మిలమిలా మెరుస్తున్నాయి. ఖడ్గాలను పెట్టే ఒరలు ఆ గుర్రపు జీనులకు వేలాడుతున్నాయి. ఆ నలుగురు యోధుల శరీరాలపై, వారు కట్టుకున్న దుస్తులపై నెత్తురు మరకలు ఉన్నాయి. వారెవరు? ఎక్కడనుండి వస్తున్నారు? వారి శరీరాలపై బట్టలపై రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. అలాగే ఆ యుద్ధం చేస్తున్న రెండు సైనిక దళాలు ఎవరివైనవని మనకు తెలియకపోయినా… తక్కువ సైనికులున్న సేన ఈ గుర్రపుస్వారీ చేస్తూ వచ్చిన యోధుల స్వంత సేననో లేక, వారి బంధువుల సేనయో కావచ్చునని మనం ఊహించగలం.
ఆ వీరులు నలుగురు తమకు అండగా రావడం, తనకు బదులుగా శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడం చూసి, ఎక్కువ సేన ఉన్న మిగిలిన సేన యుద్ధానికి సిద్ధపడింది. ఎదుటి పక్షం వారు కొంచెం సేపు యుద్ధం చేశారు కానీ కొత్త వీరుల కోపపు వేడికి నిలువలేక ఎక్కడివారక్కడ పారిపోయారు. యుద్ధభూమిలో శత్రువులు ఎవరూ లేరని గ్రహించారు.
తమను ఆపదనుండి రక్షించిన నలుగురు వీరులు ఎవరైనదీ, సైనికులకు తెలియకపోయినా తమ కృతజ్ఞతా వందనాలు తెలిపి ఇలా చెప్పడం మొదలు పెట్టారు.
అయ్యా! మీరెవరో మాకు తెలియకున్నా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవతా స్వరూపులని అనుకుంటున్నాం. మృత్యువు ఒడిలోకి చేరే సమయంలో ఏ కారణం లేకుండా మాపై దయ చూపారు? ఎందుకు మమ్మల్ని రక్షించారు?
అయ్యా! మేము ఓరుగల్లు సైనికులం. మా రాణి గారు తమ కూతుళ్లతో కలిసి వడ్డేపల్లికి పోయి, అక్కడినుండి మొగిలిచర్ల పోయారట. వారి వద్ద మాయలు చేసే ఒక దాసి దాపురించి, మేము ఎవరమూ వెంట రానీయకుండా చేసి, మా రాణి ఒక్క దాన్ని తీసుకొని వచ్చిందట. మా రాజా దేవేరి మోసగించిన బడిందని ఎలా తెలుసుకున్నారో కానీ, శివదేవ మంత్రీశ్వరులు గారు మమ్మల్ని త్వరగా వెళ్లి మొగిలిచర్లకు పోయే మన ప్రభువు ఉన్న విడిదికి వెళ్లి వారికి రాబోయే ఆపదలను తొలగించి, సుఖంగా ప్రయాణం చేయించుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చి పంపారు. మేము దాదాపు నూటా ఇరవై మందిమి బయల్దేరి వస్తున్నాం. మంత్రి మహారాజు గారికి ఈ వార్త సాయంకాలం తెలిసింది కావచ్చు. మాకు వెంటనే తెలిపారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మేము ప్రయాణమై వస్తున్నాం మమ్మల్ని ఈ సేన రక్షించింది కావచ్చు. రహస్యంగా అల్లరి చేయకుండా తోవను విడిచి, అడవిలో పడి వస్తున్నా కూడా కనిపెట్టి ఎదుర్కొన్నారు. మమ్మల్ని ఎదిరించిన వారు దాదాపు రెండు వందలమంది. సాధ్యమైనంత వరకు యుద్ధం చేసాం. ఎదుటి వారి బలం ఎక్కువగా ఉండడంతో నాలుగువైపులా వాళ్లే నిలిచి, మమ్మల్ని హింసిస్తున్నారు. చివరకు ఈ గుంపుకు చిక్కినాం. ఇరవై మంది ఉన్నామనుకుంటాను. మీరు రాకపోతే మేము మా రాణి గారిని కష్టపడకుండా రక్షించుకోలేక పోయే వాళ్ళం.
అయ్యా! మా నమస్కారాలను అందుకొని మాకు సెలవు ఇప్పించండి. మేము త్వరగా వెళ్లాలి. అక్కడ ఏం జరుగుతుందో ఏమో?
ఎప్పటి వరకు మీరు మొగిలిచెర్లకు పొమ్మని మీ మంత్రి గారు ఆదేశించారు? అని ఒక యోధుడు అడిగాడు.
అయ్యా! మమ్మల్ని మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి సమయం వృధాగా గడిచేలా చేయకండి. ఇప్పటికే ఆలస్యం అయిందని బాధపడుతున్నాం. ఇంకా ఆలస్యం చేస్తే మేము అనుకున్న పని చేయగలమా? అని ఒకడు అన్నాడు.
ఒక విషయం చెప్పండి!
జామురాత్రి కాకముందే పొమ్మని మంత్రి గారి ఆజ్ఞ! మాకు ఇబ్బంది లేకుంటే ఇదివరకే పోయే వాళ్ళం
శత్రువుల వల్ల మీ దొరసానికి ఆపద కలుగుతుందని తెలుసుకొని దానిని ఆపేందుకేనా? మీరు వెళ్ళేది.
ఔను !
మీరు ఇరవై మంది కన్నా ఎక్కువ లేరు. ఇంత తక్కువ మందితో వెళ్లి ఏం చేయగలరు? శత్రువులు మీకన్నా ఎక్కువ మంది ఉన్నారనడంలో సందేహం లేదు.అందున దారిలో మిమ్మల్ని ఎదుర్కొనే వారు ఎక్కువగా ఉన్నప్పుడు… ఇంక ఊరి లో ఎంత మంది ఉన్నారో? ఆలోచించారా? లేకపోతే ఇప్పుడైనా ఆలోచించుకోండి!
ఏది ఏమైనా మాకు విచారం లేదు. మా ప్రాణాలు మా దొరసాని పని కోసం కానీ, వారి కనుల ముందు మా ప్రాణాలు విడువడానికైనా మాకు సంతోషమే! మేము వారి సేవకులుగా ఉన్నందుకు, వారి ఉప్పు పులుసు తింటున్నందుకు మా జన్మలు అప్పుడే సార్థకం అవుతాయి. మమ్మల్ని తొందరగా పంపితే మీకు దండం పెడతాం!
ఎందుకలా తొందర పడుతున్నారు? మీ ప్రాణాలు రక్షించడానికి పైన రెండు మాటలు వినరా?
అయ్యా! మీరంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. అయినా మా రాణీగారి పని కన్నా మీతో మాట్లాడటం మాకు ఎక్కువ కాదు. మీరు మా ప్రాణాలు రక్షించినందుకు మేము మరణించేటప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటూ మరణిస్తాం. దయతలచి మీరెవరో మాకు చెప్పండి! బతికి ఉంటే మళ్లీ ఎప్పుడైనా మీ సేవ చేసుకుంటాం! మేము స్వతంత్రులం కాము. నాకు అప్పజెప్పిన పని చేసేదాకా మేము ఆలస్యం చేయకూడదు.అయినా మీకు తెలియనిది ఏమున్నది?
మేము రాకుంటే యుద్ధంలో మరణించేవారు కదా! అలా అయితే మీరు ఏం చేసేవారు?
అది మాకు మంచే జరిగింది. మా తోటి వారంతా తమ ప్రభువు కోసం ప్రాణాలను సంతోషంగా విడిచారు. మేము కూడా అలాగే విడిచిపెట్టే వాళ్ళం.
అలా అయితే మీ దొరసాని పని ఏమయ్యేది? ఇలా ఆలోచించే వారు ఎవరు?
మీరు అలా అంటారా? మాలాంటి వాళ్లు వేల మంది ఉన్నారు.
ఇప్పుడు కూడా అలానే అనుకోండి!
అయ్యా! మీరెవరో రాజద్రోహుల వలే కనపడుతున్నారు. మమ్మల్ని ప్రభుత్వం పోషిస్తున్నప్పుడు మా రాణిగారి కోసం నీతి లేని మాటలు విన్నప్పుడు మా చేతులలోని కత్తులు ఊరుకోవు! మీరు మా ప్రాణాలు రక్షించుకునేందుకు యుద్ధంలో మా ప్రాణాలు మీకు అర్పిస్తాం! ఇక ముందు ఎటువంటి మాటలని, మమ్మల్ని కృతఘ్నులుగా చేయకండి! మాకాజ్ఞ ఇవ్వండి !
ఓ సైనికులారా! పిచ్చివాళ్ళయి పోయారు! అలా కాదు! మీ మంత్రి ముందే అక్కడికి చేరుకోమని చెప్పాడు. ఆ సమయం దాటింది. మీరు ఇప్పుడు వెళ్తే ఉపయోగం లేదు. అయ్యే పని ఏదో ఇంతకు ముందే జరిగిపోయి ఉంటుంది. మీరు ఇప్పుడు పోయి ఏం చేస్తారు? అని అన్నాను, కానీ మీ రాజు పైన ఉన్న భక్తిని విడిచి పెట్టమని చెప్పలేదు.
ఒకవేళ జరిగితే వారి జాడ తెలుసుకుంటాం. ఇంకేదైనా జరగకుండా తగిన జాగ్రత్త తీసుకుంటాను. మమ్మల్ని విడిచి పెట్టండి!
సరే !వెళ్ళి రండి! మాకేమీ అభ్యంతరం లేదు! అటు బాట వైపు వెళ్లి, మీరు మీ పని మీద, మేము మా పని మీద వెళ్దాం! అడవిలో నుండి ఎందుకు వెళ్లడం?
బాట ఇక నుండి ఎంత దూరం ఉందో?
అదిగో ! దగ్గరలోనే కనపడుతున్నది. మీ మాటలు మాకు బాట వెంట పోయే వారికి సులువుగా వినపడటం చేతనే ఇక్కడికి వచ్చాం. రండి! బాట దగ్గరికి వెళ్దాం!
సైనికులు ఆ మాటలకు ఒప్పుకున్నారు. గుర్రపు రౌతులు ముందు దారిన వెడుతుంటే… సైనికులు వెనుక నడుస్తున్నారు. వారంతా బాట వెంట నడిచారు.
(సశేషం)
నాల్గవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయ శర్మ
సరళీకృతం:- రంగరాజు పద్మజ
సంతానాపేక్ష
శ్లోకం:–
కింతు వధ్వాంత వైతస్యా
మదృష్ట సదృష ప్రజం
న మా మవతి సద్వీపా
రత్నసూరపి మేదినీ.
–(రఘువంశము)
భావం:– అయినను ద్వీప సహితమైన ఈ భూమి రత్నాలను ఇచ్చినప్పటికీ తమ కోడలైన ఈ సుదక్షిణ యందు మాకు సదృశుడైన కుమారుడనే శ్రేష్ట రత్నం కలగక పోవడంతో నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు.
వ్యాఖ్య:– రఘువంశంలో దిలీప మహారాజుకు ఎలాగైతే తమ కోడలైన సుదేష్ణకు సంతానం కలగాలని కోరిక ఉండేదో… అలానే రుద్రమదేవి తన కూతుళ్లకు సంతానం కలుగలేదని బాధపడుతున్నదని సూచిస్తూ రఘువంశ కావ్యం నుండి ఈ శ్లోకాన్ని ప్రకరణ శీర్షికగా రచయిత తీసుకోవడం భావి కథార్ధ సూచికగా పాఠకులకు ఈ కథాభాగంలోని కథ సూచింపబడుతున్నది.
కథాభాగం :— మదనమంజరి రుద్రమదేవి రాణీవాసంలో చక్కగా భక్తిశ్రద్ధలతో ఉంటున్నది. రుద్రమదేవి కూడా మదనమంజరి పట్ల ప్రేమ, ఇష్టం కలిగి ఉన్నది. గంధం తీయడం, ముమ్మడమ్మ, రుయ్యమ్మల కోసం పూల దండలను కట్టటం, పడకల ఏర్పాటు చేయడం, దేవుని గది అలికి ముగ్గులు పెట్టడం మొదలైన పనులను మదనమంజరి చేస్తున్నది. సమయం దొరికినప్పుడు రుద్రమదేవికి వింతైన కథలు చెబుతుండేది.
ఒకరోజు సాయంకాలం ప్రకృతి చాలా అందంగా ఉంది. సాయంత్రపు ఎరుపు రంగు ప్రపంచాన్ని ప్రేమ సామ్రాజ్యంలో ముంచి వేస్తున్నది. పక్షులు ఆకాశం నిండా పరుచుకుని ఎగురుతూ తమ నివాసాలైన గూళ్ళకు పోతున్నవి. ఆకాశంలో రకరకాల మబ్బులు కనపడుతున్నాయి. పిల్లలు ఆ మబ్బులు చూస్తూ” అదిగో రెండు గుర్రాలు! దాని మీద గుట్ట, దాని పక్కనే ఏనుగు, ఏనుగు మీద మనుషి, అదిగో తివాచీ, గుర్రం తలకాయ మాయమైపోయింది. ఏనుగు మీద మనుషి కోడిపుంజుగా మారాడు.” ఇలా మబ్బులు మారుతూ పోతున్నప్పటి ఆ మబ్బుల ఆకారాలకు తగినట్లుగా పేర్లు పెడుతూ ఆడుతూ సంతోష పడుతున్నారు పిల్లలు. ఆవులు” అంబా”అని అరుస్తూ వస్తున్నాయి. కూలి పనులకు వెళ్ళినవారు తమతమ ఇండ్లకు వస్తున్నారు. పశువుల మంద నడవడంతో వీధులలో దుమ్ము లేచి, ఇంకా కూలీనాలీ చేసుకునే ఆడవాళ్ళు వారి ఇంటిలో వంటలు వండుతున్నప్పుడు కమ్ముకున్న పొగా, ఈ రెండూ కలిసి ప్రకృతి అందంగానూ, ఒక వింతగానూ కనబడుతున్నది. వంట కోసం రకరకాల కట్టెలను కాల్చడం వల్ల ఒక రకమైన వాసన గుప్పుమని వస్తున్నది.
కొంతసేపటికి ఆకాశం నిండా వేల కోట్ల నక్షత్రాలు మినుకుమినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆనాడు పౌర్ణమి తెల్లవారి కావడంవల్ల నక్షత్రాల వరుస చాలాసేపు తమ అందమైన రీతి ప్రపంచానికి కనిపించకుండా చల్లని చంద్రుని వెలుగుకు లొంగిపోయి ఒకటొకటే కనిపించకుండా మాయమై పోయాయి. అమృతమయుడైన చంద్రుడు ఆకాశాన వెలుగుతూ వేలవేల తన చల్లని కిరణాలు భూమిపై ప్రసరింపజేసి, తెల్లని రాళ్ళను నేల మీద పరిచినట్టుగా కనబడుతున్నవి. ఆ వెన్నెలలో ఓరుగల్లు నగరం గొప్పగా సింగారించుకున్నట్టు ఉన్నది.
పిల్లలు ఆనందంగా వీధులలో ఆటలు ఆడుతున్నారు. సామాన్య యువత గుంపు గూడి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారు. కూర్చున్న యువకులు తీగలతో ఉన్న యంత్ర వాయిద్యాలతో సంగీతం వాయిస్తున్నారు. కొందరు గుమ్మటెలు ( కుండ వాయిద్యం ) వాయిస్తూ… వీరుల చరిత్రలు పాటలుగా పాడుతున్నారు. కొందరు జంగములు మహావీరులను ఆనంద పరుస్తున్నారు.
దాదాపు మూడు గడియల రాత్రి అవుతున్నది. రుద్రమదేవి, ముమ్మడమ్మ, రుయ్యమ్మ, మదనమంజరి ఇంకో ఇద్దరు చెలికత్తెలు మేడ మీద కూర్చుని ఉన్నారు. ప్రకృతి వారికి ఉల్లాసం కల్గిస్తున్నది. మదనమంజరి ఏవేవో ముచ్చట్లు చెప్పి, అక్కడ ఉన్న వారిని నవ్విస్తున్న ది.
మదనమంజరీ! ముచ్చట్లు చెప్పి కాలక్షేపం చేయడంలో నిన్ను మించిన వారు లేరు. చాలా సమర్థురాలువే! నువ్వు పుట్టినప్పటినుండి మోటు ప్రదేశాలలో తిరిగానని చెప్పినావు! కానీ చక్కగా చాతుర్యంతో మాట్లాడుతూ, హాస్యసంభాషణలతో పొద్దు పుచ్చడం చాలా పాతకథలను చెప్పడం, ఇంకా నీకు బాగా తెలుస్తుంది. చిన్నతనం నుండి నువ్వు అంతఃపురాలలో ఉంటే ఇంకా నీకు ఎంతో నేర్పుగా మాట్లాడడం వచ్చి ఉండేదో? నేను చెప్పలేను” అని రుద్రమదేవి అన్నది.
ఏదో ” మీ దయ నేను అంత నేర్పుగా మాట్లాడక పోయినా, నా మీద మీకున్న దయతో అలా అనిపిస్తున్నదని మదనమంజరి అన్నది.
ఈరోజు ఏదైనా కథ చెప్తావా? కథ అంటే కథ కాదు! జరిగిన విషయం నీకు ఏదైనా తెలిస్తే చెప్పు! కల్పిత కథల కన్నా జరిగిన కథలు సంతోషం కల్పిస్తాయి! రుద్రమదేవి అడిగింది.
మీరు అడిగితే అలాగే చెప్తాను. చాలా పాతకాలం నాటి కథ ఒకటి చెప్పనా? అది అనుమకొండకు సంబంధించిన కథ. అని మదనమంజరి అన్నది.
రుద్రమదేవి చెప్పమన్నది.
రుద్రమదేవి ,మిగతా వారు అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఈ విధంగా కథ చెప్పటం మొదలు పెట్టింది..
చాలా కాలం క్రితం కంధార పట్టణంలో సోమదేవరాజు అనే ఒక రాజు సత్యసంధుడై రాజ్యపరిపాలన చేస్తున్నాడు. సోమదేవ మహారాజుకు బ్రాహ్మణులంటే చాలా భక్తి. ఆవులంటే ఎంతో ఇష్టం. వాటి మీద ప్రేమ ఎక్కువగా చూపేవాడు. ఆరాజు చాలా ఆవుల మందలను మంత్ర కూటం( మంథెన), భద్రాచలం మొదలైన గోదావరి ఒడ్డున ఉన్న పట్టణాలకు మేతకోసం పంపించేవాడు. ఈ వార్త కటకపురం రాజధానిగా ఉత్కల దేశాన్ని పాలించే బల్లహుడు విని ససైన్యంగా వచ్చి సోమ దేవరాజు యొక్క ఆవులను చుట్టుముట్టాడు. ఆవులను మేపేవారు అతనిని అడ్డుకున్నారు. కానీ చక్కని శిక్షణ పొందిన చాలా మంది సైనికుల ముందు శిక్షణ పొందని పశువుల కాపరులు సైనికుల ముందు నిలువ గలరా? కొందరు గాయపడ్డారు. కొందరు చనిపోయినారు. బల్లహుడు మందలను తోలుకొని కటకపురానికి పోయాడు. చావగా మిగిలన పశువుల కాపర్లు వచ్చి కంధార రాజయిన సోమదేవరాజుకు చెప్పారు. రాజు సైన్యం సిద్ధం చేసుకొని బల్లహుడితో పోరాడటానికి బయలుదేరాడు. కానీ బల్లహుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. అలాగే తరుముతూ తరుముతూ పోయి, సోమ దేవరాజు కటకపురిని ముట్టడించాడు. బల్లహునకు సోమదేవరాజు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సోమదేవరాజు ఓడిపోయి కంధారానికి వచ్చి ఎక్కువ బలమైన మరింత సైన్యాన్ని తీసుకొని రెండవ సారి కటకపురిని ముట్టడించాడు. ఇప్పుడు సోమదేవరాజు గెలుపొందాడు. నాలుగు సంవత్సరాల దాకా యుద్ధ ప్రస్తావన వస్తే ఒకసారి కటకపుర రాజు గెలుస్తూ మరొకసారి ఓడిపోయేవాడు. సోమ దేవరాజు అంతటితో యుద్ధతలంపు మాని, తన నగరానికి వచ్చి సంతానం పొందేందుకు మరియు శత్రువును ఓడించటం డానికి పుత్రకామేష్టి యజ్ఞం జరిపించాడు. వైశ్వానరుడి దయ వల్ల సోమదేవరాజు భార్య గర్భవతి అయ్యింది. ఈ సమాచారం కటకపురి బల్లహునకు తెలిసింది. బల్లహుడు తనకు ముప్పు తప్పదనుకొని గొప్ప సేనతో వచ్చి కంధారాన్ని ముట్టడించినాడు. సోమదేవరాజుకు, బల్లహునకు ఇరవై రోజులు అతి భీకరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సోమదేవరాజు వీరమరణం పొందాడు.కంధార పట్టణం బల్లహునకు మనకు స్వాధీనం అయింది. భర్త చెప్పిన విధంగా సిరియాళదేవి దేశం నుండి పారిపోయింది. బల్లహుడు ఆమెకోసం ఊరంతా గాలించాడు. కానీ ఆమె జాడ తెలియలేదు.సిరియాళదేవి కంధారం నుండి పారిపోయి వచ్చి మన అనుమకొండకు చేరుకున్నది. అనుమకొండ మనకి అప్పుడు లేదు. ఊరు కూడా ఇప్పటి వలే పెద్దగా లేదు. శ్రీశైల అడవుల దగ్గర నివసించే వ్యాధుడు అనే వాడు వచ్చి ఇక్కడ ఒక బోయపల్లెని ఏర్పాటు చేసి, దానిని అభివృద్ధి చేశాడు. అతని వంశం వాడే ఎరుకు దేవరాజు అనే పేరుతో రాజ్యాన్ని పాలిస్తున్నాడు. సిరియాళదేవి ఎరుకు రాజు దగ్గ
రికి వెళ్లి,”బల్లహునకు” భయపడి పోయి పారిపోయి వచ్చాను. నా భర్త నన్ను చావవద్దని అన్నాడు. నన్ను కాపాడుమని వేడుకుంది. కానీ బల్లహుడికి భయపడి సిరియాళదేవికి అతను ఆశ్రయము ఇవ్వలేదు. సిరియాళదేవని ఎరుకు రాజుకు తెలుస్తే ..సోమదేవ రాజు సహాయం తాను ఎన్నోసార్లు పొంది ఉన్నాడు కాబట్టి తప్పక ఆశ్రయం ఇచ్చి ఉండేవాడు. ఎరుకు దేవరాజు ఆశ్రయం ఇవ్వకపోవడంతో సిరియాళదేవి బయలుదేరి వెళ్లిపోతూ ఉండగా అనుమకొండ నివాసి సదాచార సంపన్నుడైన మాధవశర్మ సిరియాల దేవిని రమ్మని ఆదరించి భయపడకని ధైర్యం చెప్పి తన ఇంటిలో ఉండుమనీ ఆమెకు ఎటువంటి శ్రమ కలుగకుండా కాపాడుతున్నాడు. ఈ వార్త బల్లహుడు విని, అనుమకొండపైకి దండెత్తి వచ్చాడు. బల్లహుడికి భయపడి ఎరుకురాజు తన ఊరిలో సిరియాళదేవి లేదని చెప్పాడు. బల్లహుడు అనుమకొండలోని అందరి ఇళ్లకు ఆయా జాతుల వారిని పంపి సిరియాళదేవిని వెతికించాడు.మాధవశర్మ ఇంట్లో ఉన్న సిరియాళదేవిని , మాధవశర్మను ఒక బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి రాజుకు చూపించాడు. బల్లహుడు ఆమెనే సిరియాళదేవి అని అనుమానించాడు. ఎరుకుదేవరాజు కూడా అనుమానించాడు. అప్పుడు అనుమకొండలోని బ్రాహ్మణులందరు కూడబల్కొని ఈమె సిరియాళదేవి కాదని మాధవశర్మ కూతురైన లలిత అని, ఒకవేళ ఈ లలితతోనే మీరు అనుకుంటే తీసుకొనిపోండి! మేమేమీ అడ్డు చెప్పము. మీరు చేసిన ఈ పనిని శాసనాల మీద చెక్కించి అందరం అగ్ని పేర్చుకుని అందులో దూకుతామని బ్రాహ్మణులు అన్నారు. ఆ మాటలకు బల్లహుడు అదిరిపోయి ఈమె మీ లలిత అయినా, సిరియాళ దేవైనా మాకు పని లేదు. సిరియాళదేవి జాడ తెలుసుకోవడం ఆమెకు మానహాని కానీ, ఆమె కడుపులో ఉన్న సంతానానికి హాని చేయడానికి కానీ కాదు. ఆమెను మేము మా ఇంటికి తీసుకుని పోయి ఆమె కడుపులో బిడ్డ కలిగితే మాకు విధేయుడిగా ఉండేలా పెంచుతామని, కంధార పట్టణానికి రాజుగా చేస్తామని అది నిజంగా నిజం అని అన్నాడు.
బ్రాహ్మణులు అతని మాట నమ్మక తమ పట్టుదలను వదిలిపెట్టలేదు. తరువాత బల్లహుడు ఆమె మీ కూతురు అయితే ఆమె చేతితో వడ్డించిన అన్నం తినమని అన్నాడు. అప్పుడు వారంతా సరే అన్నారు.
తెల్లవారి సింగేశ్వరాలయానికి పోయి గర్భిణీ చేత అన్నం తినడం ఆచారం కాదని, బల్లహునకు చెప్పి బెల్లం, నేతిని సిరియాళదేవి చేత వడ్డింపించుకొని తిని అనుమానం తీర్చారు.
బల్లహుడు వెళ్ళిపోయిన తరువాత ఒకానొక శుభ ముహూర్తంలో మాధవశర్మ ఇంటిలో సిరియాళదేవి కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి మాధవవర్మ అని పేరు పెట్టారు .
మాధవశర్మ ఇంట్లో సకల వేదాలను, శాస్త్రాలను, ధనుర్విద్యను నేర్చుకొని మొదట ఎరుకు రాజును వెళ్లగొట్టి అనుమకొండను వశపరచుకొని, చాలామంది సంస్థానాధీశులు వెంటరాగా కటకాన్ని ముట్టడి చేసి,
> బల్లహుని చంపి, అతని కుమారుడైన”భండికి” రాజ్య పట్టం కట్టి తన చెప్పుచేతుల్లో ఉండేట్లుగా చేసుకొని, కంధారానికి వచ్చి, కంధారాన్ని , అనుమకొండను ఒకే తీరుగా న్యాయ పరిపాలన చేస్తూ సుఖంగా ఉన్నాడు.
“మదనమంజరీ!” సిరియాళదేవి పడరానిపాట్లు పడింది కదా!బ్రాహ్మణుల ధైర్యం కూడా చాలా గొప్పది.
మాధవశర్మ గారు ఎంతో పరోపకారి. ధీనులను ఆదరించి అక్కున చేర్చుకునే గుణం ,ఎంతో పట్టుదల! ఎంతో నేర్పరులు! వారే లేకుంటే సిరియాళదేవి గతి ఏమై ఉండేదో కదా! కన్నబిడ్డల వలె అనుకొని సిరియాళదేవిని పెంచిన మాధవశర్మ గారు మనందరం ఉదయాన్నే వారిని తలుచుకోవాల్సిన వారు కదా !అని రుద్రమదేవి అన్నది.
అందులో అనుమానమే లేదని అన్నది ముమ్మడమ్మ “. మాధవశర్మ చాలా ప్రేమతో పోషించినట్టు, సిరియాళదేవి కుమారుడు జన్మించడం వల్లనే కదా! చాలాకష్టాలన్నీ తొలగిపోయినవి. లేకపోతే ఇంకేమున్నది, ఒకవేళ కూతురు పుట్టి ఉంటే ఆమెకు పెళ్లి, మనుమడు కలగడం అతను భూమియందు పరాక్రమవంతుడైనప్పుడు కదా! మనవడిగా అధికారియై కంధార రాజ్యానికి రాజైనప్పడు కదా! సుఖం కలిగేది. అంత దాకా సిరియాళదేవి కూతురుతో మాధవశర్మ గారి ఇంట్లో ఉండాల్సి వచ్చేది కదా! కుమారులు లేని జన్మ వృధా అనడంలో అనుమానం ఎందుకు? నా సంగతి చూడు! నాకు ఏమున్నది, ఇద్దరు కూతుర్లు లేకపోతే నాకు ఎంత రాజ్యసంపద ఉన్నా ఎంత ధర్మం ఆచరించినా లాభమేమిటి? అని రుద్రమదేవి అన్నది.
పుత్రులు లేకుంటే పున్నామ నరకం తప్పదని పెద్దలు నిశ్చయంగా చెప్పారు. అయినా కూడా భగవంతుడు మీకు ఇద్దరు పుత్రికలను వరంగా ఇచ్చాడు. వారి కడుపులు పడితే మీకు ఇంక లోపమే లేదు! అని మదనమంజరి అన్నది.
అవును నీవన్నది నిజమే! ఇంకా నాకు ఆ భాగ్యం కలగలేదు. నా కూతుర్లకు పుత్రులు పుట్టడం చూసే భాగ్యం నాకు లేదేమో? అని రుద్రమదేవి అన్నది.
మీరు విచారించకండి! దేవుడు మీ కూతుళ్లకూ త్వరలోనే బిడ్డలనిస్తాడు. ఇప్పుడే మీరు ఇంత బాధ పడటం ఎందుకు? కూతుళ్ళకు ఏమంత ఈడు గడిచిపోయిందని బెంగ?అని మదనమంజరి అన్నది.
అయ్యో !వెర్రిదానా! ఇంకెంతకాలం గడవాలి? ఈ వయసులో ఉన్న ఆడవారు ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని కన లేదా? అటువంటి వారిని చాలా మందిని చూశానని రుద్రమదేవి అన్నది
అవును పేదవారికి అధిక సంతానం కలుగుతుంది. శ్రీమంతులకు ఎంతో ఎదురు చూస్తే తప్ప సంతానం కలిగే భాగ్యం ఇవ్వడు భగవంతుడు. రుయ్యమ్మ దొరసానికి ఏమంత వయసు మీరినది? కనే ఈడు ఏమి మించిపోలేదు. లేత ప్రాయంలోనే ఉన్నారని మదనమంజరి చెప్పింది
ఔనే ! మదనమంజరీ! మా రుయ్యమ్మకింకా ఈడు గడవ లేదనడం నిజమే. మరి ముమ్మడమ్మ పరిస్థితి ఏమిటి? ఆమె పెద్ద బిడ్డ కాబట్టి ఆమె వయసు కొంచెం ఎక్కువ అయింది. ముమ్మడమ్మకు ఇదివరకే సంతానం కలగలిసి ఉండేది! ఈ విచారం తప్ప నిజానికి వేరు విచారాలు నాకు లేవు.ఈ చింత ఎన్నడు తీరుతుందో తెలియదు. వీళ్లిద్దరితో ఎంతో మంది దేవతలను స్థాపింప చేశాను. ఎన్నో దానాలు చేయించాను. నా బిడ్డల బిడ్డలను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే నేను చూడగలనో?లేదో? అన్నది రుద్రమదేవి.
దేవత మాత్రమేం చేస్తుంది? భగవంతుడు అందరి పట్ల ఒకే తీరుగా చూస్తాడు. మనుష్యులు వారు చేసిన పాపాలకు వారికి తగిన ఫలితాలను ఇస్తాడు. సమయం వచ్చేదాకా దేవుడు కూడా శ్రద్ధగా ఉంటాడు. ఇది మనకు తెలిసినా ఫలించే రోజు వచ్చే దాకా చూస్తూ ఊరుకోకూడదు. ఫలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనకు తోచినంత దానధర్మాలు చేస్తూ… దేవతలను ఉపాసించాలని అన్నది మదన మంజరి.
నువ్వు చెప్పింది నిజమే! అందుకే సంతాన గౌరీవ్రతం చేయిస్తున్నాను. మూడు సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇంకేం చేయాలో తెలియడం లేదు. ఒకటి మాత్రం నిజం అనుకుంటున్నాను. ఏమిటంటే వడ్డేపల్లిలో బుద్ధ గణపతి అనే దేవుడు ఉన్నాడు.ఆ దేవుడు చాలా మహిమగల వాడు. కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ దేవుని పూజించమని నా కూతుర్లకు చెప్తాను. చూద్దాం! ఏ దేవుడికైనా దయ రాకపోతుందా? అని అన్నది రుద్రమ్మ దేవి.
మంచి ఆలోచన చేశారు ఇక ఆలస్యం చేయకుండా ఆ దేవుడిని పూజించడం మంచిది .ఆ దేవుడు మంచి ప్రభావం కల దేవుడు. నేను వచ్చినప్పుడు ఆ ఊరు నుండి వచ్చాను. నాతో వచ్చిన వారు ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్లారు. వారివెంట నేను వెళ్ళి దర్శించుకున్నాను. వారందరూ ఆ దేవుని ప్రభావం చాలా గొప్పగా పొగుడుతూ నాకు చెప్పారని మదనమంజరి అన్నది.
అప్పటికి దాదాపు జామురాత్రి దాటింది ఎవరి పడక గదులకు వారు వెళ్లి విశ్రమించారు.
ఐదవ ప్రకరణ
[ అన్యోన్య సంభాషణం]
ఇతి వ్యాహృత్య విబుధాన్
విశ్వయోనిస్తిరోదధే ౹
మనస్యాహితకర్తవ్యాః
తే౽పి దేవా దివం యయుః ౹౹ 2-62
కుమారసంభవము.
భావం:-ఈ విధంగా బ్రహ్మ దేవుడు ఇంద్రాదిదేవుళ్లను గురించి చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ ఇంద్రాది దేవుళ్లు కూడా మనస్సులో కర్తవ్యబుద్ధిని పొందినటువంటివారై స్వర్గలోకానికి వెళ్లారు.
అనుమకొండకు పడమటివైపున దాదాపు నాలుగు మైళ్ళదూరంలో వడ్డేపల్లి అనే గ్రామమున్నది.ప్రస్తుతం ఓరుగల్లు నుండి వడ్డేపల్లి దాకా దాదాపు ఇండ్లు కట్టుకున్నారని చెప్పవచ్చు.మన కథాకాలంలో ఇప్పటివలె కాకుండా దట్టమైన అడవి ఉండేది.
ఈ గ్రామానికి దక్షిణ దిక్కులో ఒక చెరువు ఉన్నది. అయినా అందులోని నీళ్ళు ఉపయోగించడానికి ఆ చెరువు కింద పొలాలు లేవు.గ్రామం చిన్నదవడం వల్ల అక్కడ నివసించే వారు కొంత మంది కాపురస్తులు కొంత మోతాదులో భూమిని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఆ చెరువు వెనుక ఒక మఱ్ఱి చెట్టున్నది.అది చాలా పెద్దది. దాని కొమ్మలెంత పెద్దగా ఉన్నాయంటే… ఊడలు కిందకు దిగి ఇంటి స్తంభాలవలె ఉండి రంధ్రాలున్న ఆకులు చెట్టు బోదెపై ఇంటి కప్పు వలె ఉన్నది. అంతగా ఎత్తు లేని పరపు బండ ఒకటి ఆ మఱ్ఱి చెట్టు కింద పరచినట్టుగా ఉండి రెండు కుటుంబాలు సునాయాసంగా కాపురం చేయవచ్చు.
ఆ చెట్టు కింద ఇద్దరు మగవారు ఒక స్త్రీ కూర్చుని ఉన్నారు. ఒకని పేరు హరిహరుడు, రెండోవాని పేరు మురారి దేవుడు.ఆమె పేరు కమల.వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటే తప్ప తెలిస్తే తెలియవచ్చు.వాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
మురారి:– కమలా! కొరతేమీ లేదు కదా!
కమల:– మీదయ ఉండగా కొరతేముంటుంది ?
మురారి:– ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
కమల:- పాచిక పారింది.
మురారి:- ఎలా?
కమల:- మనమనుకున్నట్టే !
మురారి:-ఆ ఉపాయం చక్కగా పనిచేసిందా?
కమల:- తృప్తిగా .
మురారి:- ఇంకా విశేషాలు ఏమిటి?
కమల:- మీకు తెలియనివి ఏమున్నాయి?
మురారి:- తపస్సు చేస్తున్నావా?
కమల:- చాలా శ్రద్ధగా.
మురారి:- మనం ఇక్కడి నుండి ఎప్పుడు బయలుదేరుదాం ?
కమల:- మీకు దయ వచ్చినరోజు.
హరి:- నువ్వు ఎన్ని రోజులుంటావు ?
కమల:- ఎక్కడ?
హరి:- వడ్డేపల్లిలో…
కమల:- ఇవాళ మాత్రమే.
హరి:- ఈ రోజు మనం వెళ్లి పోవడానికి మంచి అనువుగా లేదా?
కమల:- లేదు.
మురారి:- ఎందుకు లేదు?
కమల:- కొందరు మనలను కనిపెట్టుకుని ఉన్నారు.
హరి:- వారు అడ్డమా?
కమల:- ఎవరికెరుక?
హరి:- మరి ఇవాళ ఇక్కడ నుండి బయలు దేరి ఎక్కడకి వెళ్లాలి?
కమల:- మొగిలిచెర్లకు…
హరి:- ఏమో? మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నవి.చివరకు ఆశ నిరాశవతుందో ఏమో?
కమల:- మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది.
మురారి:- నీ చేతిలో ఉన్నదానికి మా అదృష్టం అంటావేమిటీ?
కమల:- ఉంటే మాత్రం?
హరి:- మొగిలిచెర్లలో ఎన్ని రోజులుంటాము?
కమల:- ఐదు రోజులు.
మురారి:- అక్కడనుండైనా నిజమైన ప్రణాళికేనా?
కమల:- సమయానికి మీదగ్గరకు రాకుండా ఉంటానా?
మురారి:- తప్పనిసరి వస్తావా?
కమల:- వస్తాను…ఇప్పుడు రాలేదా?
మురారి:-ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే …నువ్వు దరిద్రంతో బాధపడకుండా…ఉండేలా చేస్తాం.
కమల:- సాయంత్రం అయింది. ఇక నేను వెళ్లుతాను.
మురారి:- దయ ఉంచు !
కమల అక్కడి నుండి వెళ్లి పోయి చెరువు కట్టనెక్కి ఊరుకు చక్కగా వెళ్లి పోయింది.
(సశేషం)
★★★★★★★★★★★★★★★
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్ర రాయశర్మ
సరళీకృతం :-రంగరాజు పద్మజ
ఒద్దిరాజు సీతారామ చంద్ర రావు గారు
2వ ప్రకరణ
చర్చ
(ప్రకరణ శీర్షిక )
” గుణవదగుణవద్వా
కుర్వతాకార్య మాదౌ
పరిణతి రవధార్యా
యత్నతః పండితేన
అతిరభస కృతానాం
కర్మణా మావిపత్తే
ర్భవతి హృదయ దాహీ
శల్య తుల్య విపాకః ॥
(హితోపదేశం)
భావం:– మంచిది కానీ చెడ్డది కానీ ఒక పని ప్రారంభించేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అని బుద్ధిమంతుడు ముందే ఆలోచించుకోవాలి. అలా ఆలోచన లేకుండా తొందరపడి చేసిన పనులకు బ్రతికినంత కాలం శల్యం లాగా హృదయాన్ని పీడించే దుష్పరిణామాలు కలుగుతాయని అర్థం.
కథాభాగం:–
దేవగిరి రాజ్యం చాలా పురాతనమైనది. దానిని దౌలతాబాద్ అని అంటారు. అది ఇప్పుడు నైజాం రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నది. ఢిల్లీ పట్టణానికి దాదాపు ఏడువందల మైళ్ళ దూరంలో ఉన్నది.
ఈ దేవగిరి పట్టణంలో చాలా అందమైన భవనాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుర్గం ఉన్నది. ఈ దుర్గం గురించి ప్రతి భారతీయుడికి తెలుసు.
దేవగిరి ప్రభువులు యాదవులు. వీరు శ్రీకృష్ణుని సంతతికి చెందినవారు. వీరి వంశంలో రెండు తెగలు ఉన్నాయి. ఒక తెగ వారికి ద్వారక సముద్రం రాజధాని. రెండో తెగవారికి దేవగిరి రాజధాని. ద్వారక సముద్రం రాజధానిగా ఉన్న యాదవకులాన్ని విడిచి, మన కథకు సంబంధించిన దేవగిరి ప్రభుత్వం వారి గురించి కొంచెం తెలుసుకోవడం అప్రస్తుతం ఏమీ కాదు.
మధురానగర నివాసి, యాదవుడైన సుబాహుడు, అతని సంతతివారు ధృఢప్రహారుడు, శౌణచంద్రుడు, ధాడియప్ప, భిల్లముడు, శ్రీరాజావడ్డిగ,ధాడియ నవవల్లభుడు, నేణచంద్రుడు, ఇలా వంశ పారంపర్యంగా రాజ్యాన్ని పాలిస్తూ వచ్చారు. వీరిలో కొంతమంది కొంతకాలం చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. కానీ ఐదవ భిల్లముడు చాళుక్యులను ఓడించి, చాళుక్య సామంతులనే తమ పేరును తుడిచి వేసుకున్నారు.
ఇంతకుముందు పైన చెప్పిన రాజులు ధైర్య సాహసాల యందు అంతులేని శక్తివంతులు అనడానికి ఉదాహరణగా చాళుక్య వంశీయుడు జయసింహుని కూతురును వివాహం చేసుకోవడం,చాళుక్య విక్రమాదిత్యుడికి యుద్ధంలో సహాయం చేయడం, చాళుక్యులను గెలిచి సామంతులనే తమ పేరును తొలగించు కోవడం కీ.శ.1182 వ సంవత్సరంలో ద్వార సముద్రంలో యాదవులను చాణుక్య క్షమావల్లభులను గెలిచి, కళ్యాణపట్టణాన్ని, కృష్ణానదికి ఉత్తరాన ఉన్న రాజ్యాన్ని స్వాధీన పరచుకొనడమే ఇందుకు తార్కాణం.
భిల్లముడు ఒక్కడు మాత్రం కృష్ణానదికి దక్షిణాన ఉన్న కుంతల దేశాధినేత వీరభల్లాణుని పైకి క్రీస్తుశకం1182 సంవత్సరంలో పోయి, ధార్వాడ జిల్లాలో “నిలక్కుండి” అనే స్థలంలో యుద్ధంచేసి, వీరమరణం పొందాడు. ఆ సమయంలో పృథ్వీరాజ్ కు మహమ్మద్ ఘోరికి యుద్ధం జరుగుతున్నది. మొత్తం మీద యాదవ వంశంలో ఒక చివరి భిల్లముడు తప్ప ఎవరూ ఓడిపోలేదు.
భిల్లముడి కుమారుడు జైత్రపాలుడు, అఖండమైన వైభవంతో వెలిగిపోతూ, శత్రువులను ఎదిరించి, రాజ్యసుఖాన్ని పొంది, కాకతీయ గణపతి రాజుతో యుద్ధం చేస్తూ కీ.శ.1247లో మరణించాడు.
జైత్ర పాలుని పెద్దకొడుకు శింగణమాధవుడు తండ్రి కన్నా ముందే మరణించాడు.రెండవ కుమారుడు కృష్ణ భూపుడు అతనికి తండ్రి పదవి ఇవ్వవద్దని సోమ పాలుడు మరణించిన నాడే ఈ కృష్ణ భూపాలుని, ఇతని అక్క అయిన పద్మావతిని, దేశపు ఖజానాను దేవగిరి నుండి తరలించి, ఆ డబ్బుతో పాతాళ మందిరంలో జోడు లేని సుఖాల తేలియాడుతూ, రాజు సంతానాన్ని చెరపట్టినారు. కృష్ణ భూపాలుని తమ్ముడైన మహాదేవరాజును శంకర మంత్రి శత్రువుల నుండి రక్షించారు. స్వామి భక్తి పరాయణుడైన శంకర మంత్రి గణపతి దేవరాజు సహాయంతో శత్రువులను చంపి వేసి, కృష్ణ భూపాలునికి రాజ్యాభిషేకం చేశాడు.
కృష్ణ భూపాలుడు గణపతిరాజుకు అంకితుడై, స్నేహితుడై, దక్షతతో రాజ్యాన్ని పాలించి,కీ.శ. 1260లో కన్నుమూశాడు.
కృష్ణ భూపుని తమ్ముడు మహాదేవరాజు. ఈ మహాదేవరాజే ప్రస్తుతం దేవగిరి రాజు. మహాదేవరాజు విద్యావంతుడు. అంతేకాదు పరిపాలన న్యాయ మార్గంలో చేసేవాడు. అంతేకాదు గొప్ప దానగుణం కలవాడు. చాలా ధర్మకార్యాలు చేశాడు. విద్వాంసులను పోషించాడు. ఇతనికి సంగీతంలోనూ ప్రావీణ్యత ఉన్నది. పెదన్న అయిన సింగణ యాదవుడి కాలం నాటి మంత్రి అయిన సాధులుని కొడుకు శారంఙ్గధరుడు రచించిన సంగీతరత్నాకరం అనే గ్రంథాన్ని శారంఙ్గధరుని దగ్గర నేర్చుకున్నాడు. జ్యోతిష్యంలోనూ మంచి పాండిత్యం ఉన్నది. అన్నతో స్థాపించబడిన జ్యోతిష్య కళాశాలను ఇతడి ఇంకా నడుపుతూనే ఉన్నాడు. చాలామంది జ్యోతిష్యులు ఇతని కొలువులో పండితులుగా ఉన్నారు. వారంతా సింగణ యాదవుని కాలంలో ఆస్థాన పండితులుగా ఉన్నవారే.
ఈ మహాదేవరాజు కొంకణాంధ్ర, ఘూర్జర దేశాల రాజులను ఓడించి, నయానా భయానా చాలామంది రాజులను తన సామంతరాజులుగా చేసుకొని, చక్రవర్తి బిరుదు పొందాడు కాశ్యపస గోత్రీకుడైన కేశవుని ఋత్విక్కుగా చేసుకుని,” యాస్త్యా రామ” అనే యజ్ఞాన్ని చేశాడు.
ఒక్క కాకతీయులు మాత్రం సామంతులు కాలేదనే కొరత తప్ప, మహాదేవరాజుకు ఎందులోనూ లోపం లేదు. కానీ అతనికి కాకతీయులను తన సామంత రాజులుగా చేసుకోవాలనే కోరిక ఉంది. మధ్యమధ్య సభలు ఏర్పాటు చేసి, రాజ్యాంగాన్ని విమర్శించేవాడు. ఆనాటి సభకు చాలా మంది ప్రజలు వచ్చి సభాస్థలంలో వేసిన ఆసనాలపై కూర్చునేవారు.
మహాదేవరాజు సింహాసనం మాత్రం అతడింకా రాకపోవడంతో ఖాళీగా మిగిలి ఉంది ఆ రోజు. ఆ పీఠానికి దక్షిణంలో” శ్రీ కరుణాధిప” అనే బిరుదు పొందిన పోథలా మాత్యుడు, ఇతనికి అవతల ఇతని కుమారుడైన సంగీత విద్వాంసుడైన శారంఙ్గధరుడు, అతనికి అవతల భాస్కరాచార్యుని మనవడు ఛాంగదేవుడు , భాస్కరాచార్యుని తమ్ముని మనుమడైన అనంత దేవుడు కూర్చుని ఉన్నారు. సింహాసనానికి ఉత్తరంలో గుజరాతి దేశ పాలకుడైన లవణ ప్రసాదుడు, అతని కుమారుడు వీరధవనుడు, వారికి అవతల కొంకణ దేశాధినేత మొదలైన సామంతరాజులు, వారికి అవతల ముద్గల గోత్రీకుడు, భోళేశ్వరశర్మ, అతని కుమారులు రామశర్మ,బిచ్ఛణశర్మ, మొదలైన సేనా నాయకులు కూర్చుని ఉన్నారు. రాయబారులు తమ తమ గోడులను వినిపించేందుకు వచ్చిన వారు, వారి వారికి తగిన స్థానాలలో కూర్చున్నారు.
రాజు ఇంకా రాలేదు. సభ్యులు అందరూ ఎదురుచూస్తున్నారు. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో” పృద్వీ వల్లభా! శ్రీ విష్ణు వంశోద్భవా” అనే చారుణుల స్తోత్రగానాలు వినపడ్డాయి. కొన్ని నిమిషాలలో కొద్దిమంది వెంటరాగా ఒక పురుషుడు ఆ సభలోనికి వచ్చినాడు.
అతడి శరీరం చాలా అందంగా ఉండి, తుమ్మెద రెక్కలకు సరిసమానమైన పట్టుకుచ్చులను ఎగతాళి చేసేట్టున్న తలవెంట్రుకలు, గడ్డం, మీసం, ఎర్రని సన్నని చారికలతో ఉన్న తామర పూల రేకుల వంటి కండ్లు, మోకాలును తాకేంత పొడవైన చేతులు, సౌందర్యానికి మారురూపా అన్నట్టున్న అతను జలతారు తలపాగా చుట్టుకొని, మోకాళ్ళ వరకు ఉన్న పట్టు అంగి తొడుక్కుని, అదొక రకమైన చెప్పులను కాళ్లకు తొడుక్కుని ఉన్నాడు . అతనే శౌణదేశపు చక్రవర్తి మహాదేవ రాజు.
మహాదేవ రాజును చూడగానే సభలోని సభ్యులందరూ లేచి, తమకున్న రాజు మీద భక్తిని చాటుకున్నారు. వారుమొక్కుతున్న వారి మొక్కలను అందుకుంటూ, తాను మొక్కగల పెద్ద వారికి తాను మొక్కుతూ పోయి, మహాదేవరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత సభలో ఉన్న వారంతా కూర్చున్నారు.
కొన్ని నిమిషాల తర్వాత మహాదేవరాజు తన కుడి వైపున పీఠం మీద కూర్చున్న మంత్రి సాధులుని చూశాడు.ఎదుటివారి భావాలను గ్రహించగలిగిన నేర్పున్న ఆ మంత్రి వెంటనే తను కూర్చున్న ఆసనం నుండి లేచి, సభలోని వారితో ఇలా చెప్పసాగాడు.
” సభ్యులారా! భారతీయ మహాజనులారా! నేడు శ్రీ పృథ్వి వల్లభులును, శ్రీవిష్ణువంశోద్భవులు అయిన మహాదేవరాజు గారు మిమ్మల్ని ఇలా సమావేశపరచడానికి కారణం ఏమీ లేదని మీరు అనుకోరు. అయినా ఎందుకు పిలిచారో? ఆ కారణం మీకు తెలిసి ఉన్నదో, లేదో ? గట్టిగా చెప్పలేను! కొందరికి తెలిస్తే తెలిసి ఉండవచ్చు! తెలియనివారికి తెలుపడం ముఖ్యం. రాజుగారి ఉప్పు పులుసు తినే సేవకులు, సామంతులు తమతమ ఉదార పరాక్రమాలు తెలపడం వల్లనే సామంతులు ఎక్కువయ్యారు; అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. చక్రవర్తి బిరుదు లభించినందుకు ఆ దేవదేవుడిని ఎప్పుడూ వారి హృదయంలో తలుచుకుంటూనే ఉంటారు.ఇంక ఒకటే కొరత ఉంది వారికిఅది ఏమిటంటే గుజరాతి, కొంకణ దేశాల వలె పూర్తి ఆంధ్రరాష్ట్రం తమ స్వంతం కాలేదనీ, కాకతీయులు పాలించు భాగం ఇంకా మిగిలే ఉన్నదని, దాన్ని జయిస్తే ఇక వారికి కొదవేలేదు అందు కోసమే ఈ సమావేశం ఇక్కడ జరిగింది. మంచిచెడ్డలు బాగా ఆలోచించుకుంటే తప్ప చేయవలసిన పని తేలదు. గౌరవ సభ్యులు అందరూ మీ మీ అభిప్రాయాలను తెలుపగలరు. ఎవరూ అనుమానించ అక్కరలేదు.
ఇలా చెప్పి మంత్రి తన పీఠం మీద కూర్చున్నాడు. ధర్మవర్తనుడు, హరిహర దేవుడు, మురారి దేవుడు వచ్చి ఆ సభలో కూర్చొని ఉన్నారు. మంత్రి చెప్పిన మాటలు మురారి, హరిహర దేవులకు ఎలా అనిపించాయో? తెలియదు కానీ, ధర్మవర్ధనునకు మాత్రం సంతోషంగా ఉన్నాయి. ఎలా అయినా మహాదేవరాజను ప్రార్ధించి, తన యొక్క కుల స్థితిగతులను చెప్పుకొని, ఓరుగల్లు పై దండును తీసుకొని పోవడానికి వచ్చాడు. అందుకే మంత్రి గారు సభలోని వారికి చెప్పిన మాటలు అతనికి ఆనందం కలిగించాయి. అనుకున్న పని ప్రయత్నం లేకుండానే కాబోవడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉండదు?
మంత్రి మాటలకు సమాధానం ఏమని చెప్పాలా? అని సభ్యులు ఆలోచిస్తున్నారు.
ఇంతలో ఒకడు దిగ్గున లేచి శౌణదేశాధినేతకు ఎదురుగా నిలబడి, రాజు తలచుకుంటే దెబ్బలకు తక్కువేమి ఉండదు. అందరు రాజుల వలే కాక శ్రీ ఏలినవారు అనుకున్నదే తడవు కార్యం చక్కగా నెరవేరుస్తారు మీరు జయించాలనుకున్నారు. జయించారు. అదే దానికి ఋజువు. తప్పనిసరిగా కాకతీయుల పాలనలో ఉన్న ఆంధ్రదేశం శ్రీవారి వశమయితే ఇక లోపం ఏమీ ఉండదు. ఇది ఇదివరకెప్పుడో కావలసిఉండే! కానీ కాలేదు. అయినా ఇప్పుడు మాత్రం ఏమిటి? సైన్యం సిద్ధ పరుచుకొని యుద్ధానికి మేము, సైన్యాధ్యక్షులు అందరూ సిద్ధంగా ఉన్నాం. తమరి ఆజ్ఞ అనే పూమాలను మా తలదాల్చి రాజ్యభారం తీరుస్తున్న సామంతరాజులందరూ సిద్ధంగా ఉన్నారు.
సేనాధిపతి మాట నిజం!! ఈ పని ఇంతకు ముందే జరగవలసి ఉండే! అది అలా జరిగిపోయేది! ఒక్క కారణం వల్ల అది ఆగిపోయింది. బలవంతుడైన గణపతి రాజును జయించాలంటే కొంకణ, ఘూర్జర దేశాలలో యుద్ధం చేసిన శ్రీ వారి సైనిక శక్తులనుకున్నారు. ఇంతలో గణపతిరాజు అనారోగ్యం పాలవడం తెలిసినందు వల్ల కొందరిని వారికి కాపలా ఉంచి, అతనిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని చెప్పినారు. ఏ కారణం వల్లనో ఏమో? తమకు అప్పజెప్పిన పని ఎంతో శ్రద్ధ చూపలేదు. గణపతిరాజు మరణించిన ఆదను తెలుసుకొని , రాజ్యాన్ని ఇతరులకు పట్టం కట్టకుండా అడ్డుకొని ఉంటే శ్రమ లేకుండా రాజ్యం చేతికి చిక్కి ఉండేది. గణపతిరాయ మంత్రి అయిన శివదేవయ్య చాలా తెలివికలవాడు. అతడికి ఈ సంగతి ఇలా జరుగుతుందని ముందే గ్రహించి, గణపతిరాజు మరణించిన సమాచారం బయట పడనీయకుండా అతని కూతురు అయిన రుద్రమదేవిని పీఠంపై కూర్చుండబెట్టి నాడు. శ్రీవారి వల్ల పంపబడిన వారు బహు జాగ్రత్తగా ప్రవర్తించినా ఇంతపని జరగక పోయేది. సూది కొరకు దూలం మోసినట్లయింది. ఎలా అయినా ఆ రాజ్యం స్వాధీనానికి తెచ్చుకోకుండా విడిచిపెట్టరని మంత్రి తన పీఠం నుండి లేచి చెప్పి మరలా కూర్చున్నాడు.
” రాజుగారి కార్యం కోసం మా ప్రాణాలను వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆజ్ఞ ఇవ్వడమే ఆలస్యం… సైన్యంతో సహా సిద్ధంగా ఉన్నామని గుజరాతి దేశపు రాజయిన లవణ ప్రసాదుడు చెప్పాడు.
సామంతులు అందరూ ఒప్పుకున్నారు. సభ్యులందరూ అంగీకారం తెలిపారు. ఒక గడియ సేపటివరకు సభ సద్దుమణిగింది. తర్వాత మహాదేవరాజు సభ్యులతో ఇలా అన్నాడు.
” మంత్రి మాటలను విన్న మీ మనుసులకు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే సంగతి తెలియదు. అది మీరు తప్పక నెరవేర్చాల్సిన పని. అది ఏమిటో చెబుతాను. మనం ఇప్పుడే ప్రయాణించి ఓరుగల్లును ముట్టడించాల్సిన పనిలేదు. మనకు కాకతీయులు అంకితమవ్వాల్సి ఉన్నది. రాజ్యం మనవశం కావాల్సి ఉన్నది. కావలసిన పనులు అయినవి. యుద్ధం చేయకుండా చేతికి అందదని అనుకోవడం మూర్ఖుల పని. సామ, దాన, భేద దండోపాయాలు అని పూర్వం నాలుగు మాత్రమే చెప్పారు .బాగా ఆలోచిస్తే ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సహాయ శక్తుల మొదట ప్రయోగిస్తాను. దాంతో పని జరగకుంటే తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి. కాబట్టి ప్రస్తుతం యుద్ధం మాట లేదనడం నిజం. కానీ యుద్ధం లేదనుకొని దానికోసం చేయాల్సిన ప్రయత్నం విరమించుకోవడం మంచిది కాదు. ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఉపాయం వల్ల కార్యం అవుతుందన్నదీ తెలియదు. సాధ్యమైన యుద్ధ ఏర్పాట్లు చేయనందుకు… మనకు అవసరం లేకపోవడం వల్ల అక్కడితో అది సరిపోతుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే యుద్ధమే కావాల్సి వస్తే దానికి సంబంధించిన ప్రయత్న విరమణ ఎలా విషమిస్తుందో నేను మీకు చెప్పకపోయినా… అది మీకే తెలుస్తుంది! అప్పుడు ప్రయత్నించడం ఎలా ఉంటుందంటే… ఇల్లు కాలుతున్నప్పుడు మంటలు చల్లార్చేందుకు నీటి కోసం బావి తవ్వినట్లుగా ఉంటుంది. మీరు ఇప్పటి నుండే యుద్ధ ప్రయత్నాలు మొదలు పెట్టాలి ! మన సైన్యం మొత్తం రెండు మూడు లక్షలు ఉంటేనే కానీ కాకతీయులను ఎదుర్కొని పోరాడ లేము. కాకతీయ సైనికులు, సైన్యాధిపతులు యుద్ధం చేయడంలో ఎంతో అనుభవం ఉన్న వారు.గణపతి రాజు చేతి కింద పనిచేసిన ప్రతి ఒక్కడికీ
బుద్ధికుశలత కలగడం వింతేమీ కాదు. మా అన్నగారు బందీ అయినప్పుడు తన పేరు’ భద్రుడు’ అనీ, ప్రసాదాదిత్యుని పేరు ‘పేరడు’ అని, తిరుమల దేవ నాయకుని పేరు’ తిమ్మడు’ అని పెట్టుకొని ముగ్గురు మాత్రమే వచ్చి ఎంత పని చేశారో ? అది కూడా అతని మంత్రి శివదేవయ్య మన కన్నుగప్పి రుద్రమదేవిని
” మహారాణిగా” చేయడమే వారి యొక్క బుద్ధికుశలతకు తార్కాణం. కాబట్టి మీరందరు జాగ్రత్తగా ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధమై రావడానికి తగ్గినట్లు ఉండాలి”.
రాజు మాటలను కొందరు ఒప్పుకొని సరేనని అన్నారు. అంతటితో సభ ముగిసింది.
(సశేషం)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
మూడవ ప్రకరణ
( మదన మంజరి)
…” స్వశాభృశ మా దృతకజ్ఞత మతి రసోత్పాదనచణ
మధికశోభాటన పాటన మాశ్రిత గన్ధర్వకుల
మాకలిత గోత్రాన్తరం, వఞ్చాధారూపముదఞ్చయన్తి
………అనుయాతవతి.
— భారత చంపు.
శ్రీ మజ్జినేంద్ర పద పద్మ మశేష భవ్యమ్
నవ్యత్రిలోక నృపతీంద్ర మనీంన్ద్ర వన్ద్యమ్
నిశ్శేష దోష పరిఖండన చణ్డ కాణ్డమ్
రత్న త్రయ ప్రభన మద్యగుణైకతానమ్.
అను స్తోత్ర శ్లోకం అనుమకొండ పద్మాక్షి దేవాలయంలో ఉన్న శ్రీ కాకతి ప్రోలరాజు శాసనాలలో ఉండడం వల్ల కాకతి ప్రోలరాజు జిన మతస్థుడు అని,
” అన్యాచ్చానమకొండ నామ నగర్చీ సంవేష్ట్యయోయం
స్థితో నామమణ్డలి కాన్వితో భువిగద్దేవస్య ప్రభుస్తమ్భిత ఏవకార్యణీ రక్తాకషణానిర్గతః
శ్రీ మత్ప్రోల నృపస్య థస్య జయినః
కిం బ్రూమహే గౌరవమ్ ॥ ”
అని అనుమకొండ శాసనము వలన కాకతి ప్రోలరాజు బలవంతుడనీ,
” శివ పాదపద్మ యుగళ ధ్యానామృతా వన్దభూ
రుణ్ఠాకోరిపు సున్దరీ జప మహాసౌభాగ్య సమచ్ఛియ
ప్రోలరాజ ఇతి ప్రసిద్ధ మగమద్వైరీంద్ర దర్పహా
నిశ్శంజ్క ప్రథన ప్రనన మహాహజ్ఞ్కర లజ్ఞేశ్వరః
అనే అనుమకొండ శాసనంలోని శ్లోకం వల్ల జినమతంలో చేరిన కాకతి ప్రోలరాజు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత శైవ మతాన్ని అనుసరించాడు అని తెలుస్తున్నది.
” దేవి ముప్పమనామ ధేయ సహితా యస్యా గుణ స్తారకాః
కీర్తి శ్శారద చంద్రికేవ విలసత్ కౌంతేనేస్తు నైవోపమా
కౌసల్యేవచ, జానకి వచ సతీ కుంతీచ పద్మా చ,సా
పౌలోమి,చణ్డీ కేవచ తథా తస్య భవద్భామినీ ॥
భావం :– కౌసల్య, సీత, సతి, కుంతి, పద్మ, పౌలోమి, చండి మొదలగు త్రిమూర్తులు చంద్రుని కాంతి వంటి కీర్తి గలవారు. వారి వలనే ముప్పమ్మ కూడా గుణాలలో అంతటి కీర్తి కలది. ఆమె ప్రోలరాజు భార్యని ఈ అనుమకొండ శాసనం వల్ల కాకతి ప్రోలరాజు భార్య ముప్పమ్మ అని తెలుస్తున్నది.
” తతో ముప్ప మామ్బాయా అధిగతజనూ రుద్రనృపతి
ర్జయత్యేక స్థానస్థిత ఇవ నృపాణాం గుణగణః
ధనీధీరోవీరశ్శుచి రుచిత కర్మానసుభగః
క్షమీదక్ష్య స్త్యాగీ మిత మధుర వాగార్ధ హృదయః ”
మానుకోట తాలూకా లోని ఇనుగుర్తి గ్రామ శాసనం మీద లిఖించబడిన ఈ శిలా శాసనం మీద ఉన్న ఈ శ్లోకం వల్ల ప్రోలరాజు కు ముప్పాంబికకు శ్రీమత్
ప్రతాపరుద్ర మహారాజు జన్మించినట్లు తెలుస్తున్నది.
” నానావనీ నాధ కిరీట కోటి, తాంశుభిశ్చుమ్బిత పాదపీఠే
నిర్దుష్టమమ్బోనిధి వేష్ఠితాం ,విశ్వమ్బరాంశానతి రుద్రదేవే ॥”
అనే ఈ శాసనం సూర్యాపేట తాలూకా లోని పిల్లలమర్రి గ్రామం శాసన మీద ఉన్న ఈ శ్లోకం అరుద్ర మహాదేవ మహాదేవ రాజు సముద్రంతో చుట్టి ఉన్న భూభాగాన్ని పరిపాలించాడని తెలుస్తున్నది. అంతేకాదు
పరువడి నాటధ్రభాష గల బద్దైన నీతియు సంస్కృతం బుతో
బఱగ ప్రతాపరుద్రవర పాలునిచే రచియింపబడ్డ యా
నరవరు నీతిసారము వినం జదువం గడు మంచిదంచు జె
చ్చెర గలనీతి పద్ధతులు జేసె వినోదము బాల బోధకున్ ॥”
అనే పద్యంలో ప్రతాపరుద్ర మహారాజు సంస్కృత భాషలో గ్రంథం రాసినట్టు తెలుస్తున్నది.
యస్యాః కాకతి రాజవంశ తిలకం ప్రోల ప్రజేశాత్మజః
శ్రీ మద్ద్రుద్ర నృపానుజస్సహి మహాదేవోనృపాలః పితా
మాతా బయ్యమ నామధేయవనితా దేవీ భువో భూషణం
భ్రాతైకోదర సమద్భవో గణపతిర్భూపాల చూడామణిః
అనే ఇనుగుర్తిలోని శాసనంపైన ఉన్న శ్లోకం వల్ల రుద్రమహారాజుకు తమ్ముడైన మహాదేవరాజుకు బయ్యమాంబకు గణపతి రాజు జన్మించినట్లు తెలుస్తున్నది . ఈ గణపతి రాజు శత్రువులకు గుండెలో గాలమై, ఆశ్రయించుకుని ఉన్నవాళ్లకు కల్పవృక్షం వలే ఉన్నాడు.
” కతికత వసంతి భూపాః కతికతి వాగుణ గుణా భరణాః
గణపతి నృపతి స్యైకో, నరపతి శతపోషకః క్షోణ్యాం”
అనే మంగళగిరి తాలూకాలోని మల్కాపురం అగ్రహారంలోని శాసన శ్లోకం గణపతి రాజు నరపతి శత పోషకుడు అని తెలుపుతున్నది. ఈ గణపతి రాజకుమార్తె రుద్రమదేవి. ఈ రుద్రమదేవిని గణపతి రాజు భార్య అని కొందరు అనుకున్నారు కానీ,
” సర్వోర్వీశ కిరీటకుట్టిమ తటీవిన్యస్తపాదామ్భుజా
శాస్త్యేశా చతురమ్బురాశిరసానాం శ్రీ రుద్రదేవ భువమ్
యస్యా జన్మమహోత్సవో గణపతిక్ష్మాపాల చూడామణీః
విస్పూర్జిత్కలికాల కల్మషకథాధ్యాన్తేషు తేజోనిధిః ”
అనే మల్కాపురంలోని శిలాశాసనం వలన రుద్రమదేవి గణపతి రాజు కూతురు అయినట్టు తేటతెల్లమైంది.
(సీతారామ చంద్రరాయ):– పాఠక మహాశయుల రా! కాకతీయుల వంశ పరంపర గురించి ఋజువులతో సహా తెలిపినాను. మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసి, శ్లోకాలను చదువుటకు ఇష్టం లేకపోతే
( చదవక పోయినా పర్వాలేదు) చదవకండి!
కాకతీయులు రెడ్డి వారు.” కాకతి” అనే శక్తిని పూజించడం చేత” కాకతీయుల”ని వీరికి పేరు వచ్చింది. ఈ వంశంలో పుట్టిన రుద్రమదేవి తండ్రి అయిన గణపతిరాజు మరణించిన తర్వాత శివదేవయ్య అనే మంత్రి సహాయంతో తండ్రి సింహాసనమెక్కింది.
రుద్రమదేవి తండ్రికి ఏ మాత్రం తీసిపోనిది. రాజ్యాంగ తంత్రాలు చక్కగా తెలుసు. ఆలోచన చేయడంలో ఆమెకు ఆమే సాటి! న్యాయ గుణం కలిగినది. దుఃఖితుల మీద ఆదరం, ప్రేమ కలిగి ఉంటుంది. శత్రువుల మీద క్రూర భావంతో ఉండడం ఆమెకు సహజగుణాలు.
రుద్రమకు మగసంతానం లేదు. ముమ్మడమ్మ, రుయ్యమ్మ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ముమ్మడమ్మ ను చాళుక్య వంశానికి చెందిన వీరభద్ర రాజుకు, రుయ్యమ్మను మైలారు భీమన ( మైళముభీమన)వంశీకుడైన ఇందులూరి అన్నమ్మ దేవరాజు కు ఇచ్చి వివాహము చేసి, అల్లుళ్లను ఇద్దరినీ తన రాజ్యంలోనే అట్టే పెట్టుకున్నది. ఇద్దరూ అల్లుళ్లు రుద్రమదేవి కుడిభుజం వంటివారు.
కూతుళ్లకు సంతానం లేదనే విచారము రుద్రమదేవికి ఎక్కువగా ఉండేది. బిడ్డల చేత చాలా వ్రతాలు, దానధర్మాలు చేయిస్తూ ఉండేది.
ఒకరోజు రుద్రమదేవి ఇద్దరు కూతుళ్లతో కూడి అనంతపురంలోని ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నది. వాళ్ళు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒక స్త్రీ మెట్లు ఎక్కుతూ వచ్చి, రుద్రమదేవిని చూసి, తలవంచి, నమస్కరించింది.
ఆ వచ్చిన స్త్రీ కూడా దాదాపు రుద్రమదేవి వయసంత వయసే ఉన్నది. ఆమెను చూస్తే మంచి దానివల్ల కనపడుతున్నది.రాగానే నమస్కరించి చేతులు జోడించి తల వంచుకొని నిలబడింది.
ఆమె ఎందుకు వచ్చిందో? ఆమె ఎవరో? కూడా రుద్రమదేవికి తెలియదు. రుద్రమదేవి ఆమెను కూర్చోమని చెప్పింది. ఆమె కూర్చున్నది. తరువాత ఆమె, రుద్రమదేవి ఇలా మాట్లాడుతున్నారు.
” నువ్వు ఎవరు?” ఎక్కడినుండి వస్తున్నావు?
” తల్లీ! ఈ సేవకురాలు మీకు తెలియదు. నేను నా దొరసానిని గుర్తుపట్టలేను. అయినా నా తల్లి మీకుసేవ చేసే భాగ్యం కల్పించింది.
అలా అయితే నీ చరిత్ర వినాల్సిందే! నీ తల్లి ఎవరు? నీ చరిత్ర ఏమిటి?
తల్లీ! నాది రాచ వారికి సేవ చేసే సేవ కులం.
మా అమ్మ మీ అమ్మగారి దగ్గర చాలా కాలము సేవ చేసిందట శ్రీ గణపతి చక్రవర్తి గారు అద్దంకి సీమకు రాజైన శాలంకాయన గోత్రికుడైన మాధవ నాయకునిపైకి దండెత్తి వెళ్లారట. అప్పుడు శ్రీ రాజు గారు రాణిగారితో కలిసే వచ్చారట. నాకు అప్పుడు రెండు సంవత్సరాల వయసు అట. మీకు కూడా రెండు సంవత్సరాల వయసే ఉందని మా అమ్మ చెప్తూ ఉండేది. రాణి గారి వెంట మా అమ్మ, నేను వెళ్ళామట . శ్రీ గణపతి చక్రవర్తి గారు ఆ దాడిలో గెలిచారట.
ఇంతలో ఒక చిత్రమైన కథ జరిగిందట. ఒకతను నన్ను మా అమ్మ నుండి వేరు చేసి, ఆమెను ఎత్తుకొని పోయాడట. మా అమ్మ ఏదో విధంగా అతని నుండి తప్పించుకొని, ఒక్కొక్క ఊరిలో మారువేషంలో బిక్షం ఎత్తుకొని ఎలాగో జీవిస్తూ… నన్ను వెతుకుతూ ఉండేదట ! రాజుగారు గెలిచి ప్రయాణమై పోవడానికి నిశ్చయించుకొని మా అమ్మ కోసం చాలా వెతికారట .
కానీ ఎక్కడో పోయిన అమ్మ వారికి దొరకలేదట. అందుకోసం ఆమెను వెతకటానికి తగిన ఏర్పాటు చేసి వెళ్లిపోయారట.
నన్ను ఒక కాపు అతను పోషించాడు. నాకు వివాహ వయసు వచ్చింది. నన్ను పోషిస్తున్న కాపు ఒక గృహస్థు కొడుకుకు నన్ను ఇచ్చి వివాహం చేశాడు. నా దురదృష్టం కొద్దీ వివాహమైన 15 సంవత్సరాలలోనే అతను మరణించాడు. నా చరిత్రే నాకు తెలియదు. ఇలా ఉండగా కొంత కాలానికి నేను ఉన్న చోటునకు ఒక ముసలమ్మ వచ్చి, నన్ను చూసి చాలా ఏడ్చింది. ఆమె ఎందుకు నన్ను చూసి ఏడుస్తున్నదో నాకు అర్థం కాలేదు. ఆమెను చూస్తున్న కొద్దీ నాకు ఆమె మీద జాలి కలిగింది . చివరకు ఆమెను ఓదార్చి, అసలు సంగతి ఏమిటని? ఏమి జరిగిందని అడిగాను. ఆమె జరిగినదంతా చెప్పింది. అప్పుడు నేను ఆమె కూతురునని తెలుసుకున్నాను. ఆమె మా అమ్మ ని తెలియగానే చాలా సంతోషం అయింది. కానీ ఆమె అప్పటికే పూర్తిగా అనారోగ్యం పాలయింది. వైద్యుడిని పిలిపించుకొని వచ్చి ఆమెకు చికిత్స చేయించాను. ముసలిదవ్వడం వలన ఏ మందు ఆమెకు పని చెయ్యలేదు. వైద్యులు వైద్యం ఆపివేసినారు.రోజురోజుకు ఆమె వ్యాధి ముదిరిపోయి ప్రాణం పోయే స్థితికి వచ్చింది. చివరి సమయంలో మా అమ్మ నాతో “బిడ్డా ! మన వారంతా శ్రీ కాకతీయ వంశాన్ని కొలిచారు! మనకు అదే జీవనోపాధి! నేను బ్రతికి ఉన్నంతకాలం దేవిని కొలువలేక పోయాను. నా ప్రాణాలు రుద్రమదేవి వద్ద విడువ లేకపోయాను. నా తలరాత ఇలా నన్ను విదేశాలకు వెళ్ళే చెట్టు చేసింది. నాకే కొరతా లేదు! నువ్వు మళ్ళీ పోయి మన రాజవంశానికి సేవ చేస్తానని నాకు మాట ఇస్తూ ప్రమాణం చేస్తే… నా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఆశ్రితులను కాపాడడంలో మన ప్రభువులకు నా ప్రేమ లోకంలో ఏ వంశం లోనూ లేదు. నా దొరసానికి నీ వయసంత వయసే కలిగిన కూతురు ఉండేది. ఆమె పేరు రుద్రమదేవి.” ఇంతలో ఆమె కంఠం ఒక్కసారిగా మూగ పోయింది.
” తల్లీ! ఏమని చెప్పను? రాజుల సేవయే పరమ ధర్మంగా తలచిన నా తల్లి ..మ..ర…ణిం..చిం..ది !!
ఆ దాసి కన్నులు కన్నీటితో నిండాయి. రుద్రమదేవికి జాలి కలిగింది. ముమ్మడమ్మ, రుయ్యమ్మలు కూడా కంటతడి పెట్టారు.
అంతలో రుద్రమదేవి” బాధపడకు! విధిరాతను ఎవరు తప్పించగలరు? మీ అమ్మ గొప్ప హృదయం ఉన్న దయామయురాలు. శరీరాలు ఎప్పుడైనా పడిపోయేవే… అయినా మా అమ్మ కొద్ది రోజులైనా తమ రాజు లకు సేవచేసి జన్మ ఎత్తినందుకు సార్ధకత పొంది, మరణించింది. మా అమ్మ నన్ను విడిచి వెళ్ళినప్పుడు నేను రెండేళ్ళ వయస్సు ఉన్న దాన్ని. నేనెవరో నాకే తెలియదు. ఇక రాజ కుటుంబం ఎలా తెలుస్తుంది? నేను ఉన్నది విదేశంలో… నేను తెలియని వారికి నా రాజవంశం గురించి కూడా వారికి తెలియదు. నా అదృష్టవశాత్తు నా తల్లి మళ్లీ రావడం, నా రాజులను కొలవమని నాకు హితవు చెప్పడం, జరిగింది అలా కాకుంటే నేను ప్రభువుల సేవా చేయకపోయే దాన్ని కదా! అని విచారించే దాన్ని!
” అది కూడా దైవాధీనమే!”
” నా భాగ్యం”
” నీ పేరు ఏమిటి?”
” దాసు రాలి పేరు మదన మంజరి”
మామ అప్పుడప్పుడు ఈ విషయాలన్నీ చెప్తూ ఎంతో విశ్వాసం ఉన్న ఆ దాసి ఏమైందో? అని అనుకొనేది.
నీ తల్లి పేరు ఏమిటి?శ్యా…మ…ల..కదా! నాకు అలానే గుర్తున్నది.
” అయ్యో! దొరసానీ ! దాసదాసీల పైన నీకు ఎంత ప్రేమ ఉన్నదో? లేకపోతే దాసి దాని గురించి అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నావా? తల్లీ! ఎంత గొప్ప దొరసానివి? అని కన్నీళ్లు కార్చింది.
తల్లీ! మీకు సరిగా జ్ఞాపకం లేనట్టు ఉన్నది. నా తల్లి పేరు శ్యామల కాదు.” లలిత” అని చెప్పింది.
” ఔనౌను! శ్యామల కాదు! లలిత అని ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని రుద్రమదేవి అన్నది.
రుద్రమదేవికి దాసీ దాని పేరు లలిత అని తెలుసు. అయినా మదనమంజరి ఏమని చెబుతుందో చూద్దామని నటించింది. తల్లి చెప్పిన సమాచారాన్ని తల్లి చెప్పిన పేరునే మదనమంజరి చెప్పడంతో రుద్రమదేవికి నమ్మకం కలిగింది.
” మదన మంజరీ! నీకు సంతానం లేదా?”
” లేదు తల్లీ లేదు!”
” సరే ఇప్పుడు నీ ఉద్దేశ్యం ఏమిటి?”
“మా పూర్వీకులు , నా తల్లి ఎలా జీవించారో.. నేను అలానే జీవించాలని కోరిక!”
“ఏమని? నా దగ్గర ఉండాలను కుంటున్నావా?”
” ఉండడమంటే.. “తిండికి తిమ్మరాజు- పనికి పోతరాజు” అని జనాలు అన్నట్టుగా కాదమ్మా! మీ సేవ చేస్తూ ఉంటాను.”
” సరే నీ ఇష్టం వచ్చినట్లు నా దగ్గర ఉండవచ్చు, పని చేయాలనే బాధలేదు.” ఒకవేళ నువ్వుపని చేయాలనుకుంటే చిన్న చిన్న పనులు చేయవచ్చు.!
నీవే మీ వయసులో ఉన్న దానివి కాదు! పెద్ద పెద్ద పనులు చేయడానికి.. ముసలితనం వచ్చేసింది “కొమ్ములు కోసినంత మాత్రాన కోడె కాజాలదు! నీకు పనిచేయాలని ఎంత ఆసక్తి ఉన్నా వయసు మీద పడిన దానివి కదా!
తల్లీ! కొత్తగా వచ్చిన దాని మీద మీకు ఇంత ప్రేమ ఉంచినందుకు నీకు సేవకుల పట్ల ఎంత దయ ఉన్నదో! అని నిన్ను మెచ్చుకోవచ్చు ను. నాకు అభయమిచ్చినావు! కాబట్టి నిర్భయంగా చెప్తున్నాను. మామ నన్ను మీ దగ్గరికి సేవ చేయడానికి వెళ్లమన్న అప్పటినుండి మీ దగ్గరికి ఎలా చేరుతానో? చేరినా నన్ను మీరు నమ్ముతారో? లేదో? అనుకున్నాను. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి రాణీవాసపు స్త్రీలను చూడలేదు. చక్రవర్తినిలైన మిమ్మల్ని ఎలా సేవించు కుంటానో? అని భయం వేసింది. నన్ను చూసి మా అమ్మ రాణివాస స్త్రీలకు చేసే సేవ చేసింది కాబట్టి వారితో ఎలా మెలగాలో మొదలైన అన్ని విషయాలు చెప్పింది.
” మదన మంజరీ! నీ తల్లి చనిపోయి ఎన్ని రోజులైంది?”
” ఒక సంవత్సరం మీద రెండు నెలలు.”
అంతకు ముందు నువ్వు నీ తల్లి తో కలిసి ఇక్కడికి ఎందుకు రాలేదు? నీ తల్లికి రాజ వైద్యులు, రాజ వైద్యం, సేవలు, ఔషధాలు ఇచ్చేవారు కదా!
అలా జరగలేదు. పాడు క్షయ వ్యాధి దినదినగండంగా గడిచింది. చాతకాని ఆమెను తీసుకొని రావడం మంచిది కాదని అనుకున్నాను. మాకు తెలిసిన వారు కూడా అలానే ఉన్నారు మూర్ఖంగా ప్రవర్తించ వద్దని అనుకున్నాను. అంతే కాదు మా అమ్మ నడవలేకపోతున్నది. మాకు బండి ఇచ్చే వారు కూడా లేరు
” నిన్ను పోషించిన వారు కానీ, నీ అత్త వారింటి బంధువులు కానీ అంతమాత్రం సహాయం చేయలేక పోయారా?
” అయ్యో !తల్లీ! పోయినంత దూరం పొరక దండు”అన్నట్టు అంతా బాగానే ఉన్నది. నన్ను పెళ్లి చేసుకున్న వాడు తప్ప వారి కుటుంబ సభ్యులు ఎవరో నాకు తెలియదు. ఇంకా నన్ను సాదిన వాళ్ళు మా ఊరు విడిచిపెట్టి మరో ఊరికి వలసగా వెళ్లారు. కొంతకాలం నా భర్త సంపాదనతో ఇల్లు గడిపాను. మా అమ్మ వచ్చేందుకు ముందు రెండు సంవత్సరాల ముందే ఆ డబ్బు అయిపోవడం చేత బిక్షం ఎత్తుకొని జీవించాను.
” నీ తల్లి చచ్చిపోయి పద్నాలుగు నెలలు అయింది కదా! ఇంత కాలం ఒక్కదానివే కష్టపడుతూ ఎందుకున్నావు? ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే నేను ఆదరించినను కున్నావా? ఎంతో కాలం నుండి ఉన్న ఊరు వదిలి పెట్టడం ఇష్టం లేదా? నువ్వు మరొక విధంగా అనుకోకు నీ కష్టాలు విని జాలి కలిగింది నీ మీద.
” అడిగితే తప్పేముంది తల్లీ! ? ధర్మ స్వరూపిణులు కనుక జాలిపడి అడిగారు. నా తల్లి చనిపోయి 14 నెలలు అయినా వచ్చేందుకు వీలు కాలేదు. మీరు నన్ను మన్నిస్తారో?లేదో?అని అనుకుంటే ఇప్పుడు ఎలా మీ దగ్గరకు వస్తాను? బిక్షం ఎత్తుకొని జీవించే దానికి పట్టణం వదిలి పెట్ట బుద్ధి కాదా?
” అవును మొదట అనుకోవచ్చు తరువాత ఎవరైనా చెబితే ఆశ్రయం ఇస్తారని రావచ్చు! లేదనకుండా బిచ్చం పెట్టిన ఊరును మాత్రం విడువవచ్చునా?
” ప్రేమతో పెంచే వారు ఉన్నారని తెలిసి, బిచ్చమెత్తాలని అనుకుంటానా? మీరు ఏది చెప్పినా అదే కదా! నా తల్లికి పితృకార్యం చేయాలంటే నేనొక్కదాన్నే కర్తను. కాబట్టి సంవత్సర శ్రాద్ధం అక్కడే పెట్టాలని అందరూ చెప్పటం వలన ఏదో ముళ్ల మీద ఉన్నట్టు ఉన్నాను. సంవత్సరం పూర్తి కాగానే నడుస్తూ వచ్చాను. నాకు ఈ పట్టడానికి తోవ తెలియదు. ఎక్కువ మంది ఏ ఊరికి వెళుతుంటే వారి వెంట ఆ ఊరికి వెళ్లి ఏ దయామయులో అన్నం పెట్టిన నాడు తింటూ… లేనినాడు ఉపవాసం ఉంటూ… చివరికి ఎలాగో మీ పాదాల దగ్గర చేరాను నా కష్టాలన్నీ గట్టెక్కినవని అనుకుంటున్నాను. ఇక మీ చిత్తం నా భాగ్యం !
దాసి చివరి మాటలను బొంగురుపోయిన గొంతుతో అంటూ రుద్రమదేవి పాదాల మీద పడింది.
రుద్రమదేవి ఆదరంగా మదనమంజరిని లేపి, నీవు ఇక దిగులు చెందకు ! నా ఇంట్లో సుఖంగా కాలం గడుపుకొమ్మని ఇదివరకే చెప్పాను. కాకతీయ వంశంలో ఎవరు అబద్ధం ఆడారని గట్టిగా నమ్ము !. అని అన్నది.
( ఒక సేవిక రుద్రమదేవిని నమ్మించి కోటలో పాగా వేయుట… ఈ ప్రకరణంలోని కథ! దేవగిరి కుట్ర మొదలవుతుంది.)
(సశేషం)
●●●●●●●●●●●●●●●●●●


శ్లో ॥ సంబంధ మా భూషణ పూర్వ మాహుః
వృత్తస్స నౌ సంగతయో ర్వనాంతే ,
తద్భూతనాథానుగ నార్హసి త్వం
సంబంధినో మే ప్రణయం విహంతుం.
పదచ్ఛేదము :- సంబంధం , ఆభాషణపూర్వం , ఆహుః
వృత్తః స్సః, నః , నౌ , సంగతయోః , వనాంతే , తత్; భూతనాథానుగ , న, అర్హసి , త్వం , సంబంధినః ,
మే, ప్రణయం , విహంతుం.
అర్థం:— సంబంధం= స్నేహమును, ఆభాషణపూర్వం- ఆభాషణ = సంభాషణమే , పూర్వం = కారణము గాగలిగినదానిగా , ఆహుః = చెప్పుచున్నారు.సః= అట్టి సంబంధము , వనాంతే = వనసమీపమందు, సంగతయోః = సంబంధించిన, నౌ= మనకిద్దరికి, వృత్తః = జరిగెను, తత్ = ఆకారణమువలన ,హే భూతనాథానుగ = ఓయీశ్వరకింకరుడయిన సింహమ, సంబంధినః = మిత్రుడయిన , మే= నాయొక్క, ప్రణయం = యాచనను , విహంతుం = వ్యర్ధపరుచుటకొరకు, నార్హసి = తగవు .
భావము:— ఇద్దరిమధ్యా మాట్లాడుటయే స్నేహమునకు కారణమని అంటారు.అటువంటి స్నేహం మన ఇద్దరికీ ఈ అడవి దగ్గర కుదిరింది. కాబట్టీ భూతనాథుడైన శంకరుని సేవకుడివైన నువ్వు మిత్రడినైన నా యాచనను అంగీకరించకపోవడం న్యాయంకాదు.స్నేహధర్మం కాదు.
రఘువంశంలోని ఈ శ్లోకమును ప్రకరణ ఔచిత్యంగా ప్రధాన శీర్షికగా ఒద్దిరాజు సోదరులు ఎందుకు తీసుకున్నరనీ కాస్త ఆలోచిస్తే …నన్నయ గారి ప్రభావం సోదర కవుల మీద ఉన్నట్టు తోస్తోంది. భావి కథార్ధ సూచిగా ఈ శ్లోకం తీసుకున్నారు. ఆ శ్లోకం చదువుతూనే రాబోయే కథ మనకు ద్యోతకమవుతుంది. అది సూక్ష్మంగా, సూటిగా కథను చెప్పే విధానాలలో ఒకటి. చదువరులకు విసుగు కలుగకుండా కథను లాగిలాగి చెప్పకుండా చదువుతూండగానే కవి ఏమి చెప్తాడన్నది పాఠకుడి ఊహకు వదిలేయడం ఆనాటి రచనా వైచిత్రి.అందుకే ఇలా ప్రతీ ప్రకరణానికీ కావ్యాలనుండి, ఇతిహాస, పురాణాలనుండీ సందేశాల వంటి శ్లోకాలను శీర్షికగా పెట్టడం అద్భుత రచనా శైలి…ముందు ముందు మనం ఆయా సన్నివేశాలు క్లుప్తసుందరంగా వివరించుకుందాము..
ఇక కథలోకి ప్రవేశిద్దామా!
క్రీ॥ శ॥ 1265 వ సంవత్సరం,ఫాల్గుణ శుద్ధ సప్తమి రోజు నిర్మలపురం నుండి దేవగిరికి వెళ్లేబాటమీద ఒకతను నడుస్తున్నాడు. అతనికి దాదాపు 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మంచి దుస్తులు కట్టుకున్నాడు. శరీరం సుకుమారంగా ఉన్నా , చాలా దూరం నుండి ప్రయాణంచేయడం వల్లనేమో అతని చర్మం నల్లగా కమిలిపోయింది.. గడ్డాలు, మీసాలు గుబురుగా పెరిగినా అతనేమీ సన్యాసి వలె లేడు. అతనిని చూస్తే సాత్వికుడి వలె కనపడుతున్నా… గంభీరమైన మనసున్న వాడని, ఎంత గొప్పపనైనా చేయడానికి వెనుకాడడని, చేయాలనుకుంటే ఆ పనిని ఎంతో నేర్పుగా చేయగల సమర్థుడనీ, ఎంత పని చేసినా అలసిపోడని అతనిని చూసిన వారికి అనిపిస్తుంది.ఎక్కువ లావుగానూ ఎక్కువ సన్నగానూ లేకుండా పొడవుకు తగినట్టున్నాడు. అతను ఒక అడవి నుండి ప్రయాణం చేస్తున్నాడు. ఆ అడవి పెద్ద పెద్ద చెట్లతో ఎత్తయిన తరువులతో నిండి ఉండి, వాటి మొదళ్లలోనూ మరి కొన్ని రకాల చెట్లు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు కుప్పలు కుప్పలుగా పెరిగి , ఆ బాట విశాలంగా ఉన్నా కూడా రెండు వైపులా ఆ పొదలు ఉండడంతో బాట ఇరుకై పోయింది. అందుకే ఆ దారి వెంట వెళ్లేవారికి ఆ ముళ్ళపొదలు గీరు కొని పోయేవి. ఆ ఎత్తైన చెట్లపై గుబురుగా అల్లిబిల్లిగా అల్లుకున్న కొమ్మలపై పక్షులు గూళ్ళు తయారుచేసుకుని అందులో జీవిస్తూ చిన్న జాతి పక్షులు చాలా సంతోషంతో కిలకిలమంటూ అరుస్తూ ఆ పొదలలోనూ, బొరియలలోనూ సూర్యుని ఎండ వేడి బాధ లేకుండా హాయిగా అవి ఎలాంటి చెడు పనులు చేయకుండా తమ తమ పిల్లలతో ఆడుకుంటూ ఉండేవి. అలా ఆడుకుంటున్న క్రమంలో ఒక్కొక్కసారి భయంకరంగా అరుస్తూ, మరొకసారి చెవులకు ఆనందం కలిగించే విధంగా అందంగా అరిచే అరుపులు హాయిని కలిగించేవి. కొన్ని పెద్ద జాతి పక్షులు ఆ ఎత్తైన చెట్లపై కూర్చొని, మధ్య మధ్యలో రెక్కలు విదిలించడంతో వచ్చిన చప్పుడు చాలా వింతగా ఉండేది. అటువంటి అడవి నుండి నడుస్తున్నాడు మన బాటసారి. మండే సూర్యుడు పశ్చిమ కొండలవైపు వెళుతున్నా కూడా వేడిమి తగ్గలేదు. ఎండ ఫెళఫెళ మని కాస్తూనే ఉన్నది భూమి ఆకాశాల నిండా ఎండమావులు వ్యాపించి ఉన్నాయి. జీవకోటి జంతుజాలం ఆ ఎండవేడికి కనీసం తలలు కూడా బయట పెట్టలేక పోతున్నాయి. చల్లటి నీడలో పడుకొని సాధు జంతువులు కూడా ఆ ఎండవేడికి రొప్పుతున్నాయి.
మన బాటసారి ఆ దట్టమైన అడవిలో నడుస్తూ ఉండటం వల్లనో, మరే కారణమో కానీ,గొడుగును పట్టుకోవడం కానీ, చెప్పులు తొడుక్కోవడం కానీ, తల మీద కండువా కప్పుకోవడం కానీ చేయలేదు. అతను అలా నడిచి పోతూ ఉంటే కొంతసేపటికి గుబురు అడవిలోని చెట్లు కాస్త పలచబడినట్లు అనిపించింది. అతనికి విపరీతంగా దప్పిక వేయడంతో ఏదైనా చెరువు గాని, బావి గాని చుట్టుపక్కల ఉన్నాయా? అని నాలుగు వైపుల చూశాడు. అంత ఘనమైన అడవిలో తనకు చెరువు కనపడుతుందా? అనుకొని మనసు దిటవు చేసుకుని నడుస్తుండగా అతనికి ఒక కొలను కనపడింది. ఆ కొలను విశాలమైన ఆరుబయలులో ఉంది. అతనికి ఒక్కసారిగా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. గబగబా నడిచి కొలను చూశాడు. అంత చిట్టడవిలో ఆ కొలను ఎందుకు నిర్మించారో తెలియలేదు. ఆ దిగుడుబావి వంటి కొలనులోని స్వచ్ఛమైన నీటిని చూసి చాలా సంతోషం కలిగింది. ఆ కొలనుకు నాలుగు వైపులా నునుపైన, వెడల్పైన రాతిపలకలతో, సున్నంతో కట్టిన మెట్లు ఉన్నాయి.
చుట్టూ గచ్చు గోడ కూడా ఉంది. లోపలికి దిగేందుకు చాలా చోట్ల తోవలు ఉన్నాయి. ఆ నాలుగు తోవలకు తలుపులు ఉన్నట్లుగా గుర్తులు చూశాడు మన బాటసారి. బాటసారి గబగబా నడిచి వచ్చి, చంకలో ఉన్న బట్టల మూటను ఆ ప్రాంతంలో ఉన్న రావిచెట్టు మొదట్లో పెట్టి, మీద కప్పుకున్న బట్టలు తీసి పక్కన పెట్టి, అక్కడనుండి దగ్గర్లో కొలను లోపలికిదిగి,కాళ్ళు చేతులు, ముఖం కడుక్కొని, ముఖం మీద నీళ్లు చల్లుకొని, దోసిలితో నీళ్ళన పట్టి, అందులో చేపలు కప్పలు మొదలైన చిన్న జంతువులు లేకుండా చూసుకొని, నాలుగైదు దోసిళ్ళ నీళ్లు తాగి, దప్పిక తీర్చుకుని, మళ్లీ కొంత నీటిని ముఖంపై చల్లుకొని చాలా హాయిగా ఉంది అనుకుంటూ వచ్చి చల్లటి నీడ నిస్తున్న రావిచెట్టు కింద తన బట్టల మూట దగ్గర కూర్చున్నాడు.
అతనికి ఆ రావిచెట్టు కాండం మొదట్లో కూర్చునేందుకు అనువుగా ఉందనిపించింది. అందుకే దానికి ఒరిగి కూర్చొని, కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాల దాకా తనకు కలిగిన అలసట తీర్చుకుంటున్నాడు. అతడు ఇంతదాకా చెట్ల నీడలో నడిచిన వాడైనా.. ఆ ఎండాకాలపు వేడికి అలసిపోయాడు. ఆ అలసట పోయేదాకా అతనేమీ మాట్లాడకుండా కళ్ళు సగం మూసుకొని ఉన్నాడు. అలసట తీరుతున్న కొద్దీ అతనికి తన గతచరిత్ర అద్దంలో కనపడినట్టు గుర్తుకు వస్తున్నది. అందుకే అతని ముఖంలో కోపం, దుఃఖం పెనవేసుకొని కనబడుతున్నాయి. అప్పుడప్పుడు అతని కంటి వెంట కన్నీరు ఆగకుండా దుముకుతున్నది. కొంచెం సేపటికి అతను తనలో తాను ఇలా అనుకున్నాడు .
ఇటువంటి చెడు పని చేయడానికి అతనికి మనసెట్లు ఒప్పుకున్నదో? ఏమైతేనేం అన్ని ప్రాణులను తమ ప్రాణం వలనే చూడాలి కదా! ఎవరికీ చెడు చేయకూడదు అని భావం రానీయక, ఇలాంటి పని చేయాలనుకోవడం! ఆహా! వేదాలు హింసా ధర్మం గురించి చెప్పలేదా? ఆ వేదం మాటలను ఎందుకు అర్థం చేసుకోలేదు? వేదం చెప్పినట్టు అందరూ నడుచుకోవాలన్న సంగతి తమకు తెలియకపోతే ఇంకొకరు ఎవరైనా చెప్పలేదా? రూపం లేని వాడైనా, అన్నిటినీ సమానంగా చూసే సర్వేశ్వరుడు పైనున్న (16) పదహారు లోకాలకు పైన ఉన్న యాగమీంద్ర లోకంలో ఉన్నా… అతను అంతటా ఉండే వాడు కాబట్టి ఇక్కడ జరిగే అన్నింటిని అతను చూస్తుంటాడు.. పుణ్యాత్ములు నడిచే తోవలో కాకుండా పాపాత్ములు పోయె” అధోలోకములైన ఏడు లోకాలకు పోయిందుకే నిశ్చయించుకుని ఉంటాడు . అన్ని ధర్మాలలోనూ అహింసా ధర్మం గొప్పది కదా! ముఖ్యమైనది కూడా! రాత్రి పూట భోజనం చేస్తే చీకటిలో ఎన్నో జీవులు చనిపోతాయని భోజనం చేయకూడదు! ప్రాణహాని జరుగుతుందని వడియ బోయకుండా మంచి నీళ్లు తాగకూడదు. గట్టిగా అడుగులు వేస్తూ నడవకూడదు అనే ఇటువంటి ధర్మాన్ని లెక్కచేయక, చీమలను దోమలవలె జనాలను లెక్కలేకుండా చంపివేయడం… జైనులు నీకేమి హాని చేశారు? ఒకరి జోలికి పోనివారిని ఇంతటి తప్పు చేసిన నీకే గతి కలుగునో? నీ చేతికి చిక్కి తల నరికించుకున్నప్పుడు , రాతిగానుగలలో పెట్టి చిత్రహింసలు చేసేటప్పుడు, మంటలలో తోసి వేసినప్పుడు తల్లడిల్లి జైనులు ప్రాణాలు విడిచారో వాళ్ల అవస్త కళ్ళారా చూసినప్పుడు నీకెలా మనసు కరగకుండా ఉన్నదో? కదా! నీ మనసులో కొంచమైనా దయ ఉంటే ముప్పైఆరు గ్రామాలను తుదముట్టిస్తావా? ఇటువంటి చెడు పనులు చేసే నీ ప్రభుత్వం లోపాలతో నిండి ఉంది. అంటే తప్పేమిటి?” ” ధర్మం ఎక్కడ ఉందో జయం అక్కడ” అని పెద్దలు చెప్తారు కదా! నీకు ఎప్పుడూ అపజయం కలుగక పెద్దల మాటవట్టిమాటై విలువ లేకుండా పోయింది. ఇది కలియుగం కదా! పాపాత్ములకే విజయం కలుగుతుంది. మా ఖర్మ ఇలా ఉంటే నిన్ను అనవలసిన పని ఏమున్నది?
ఓ ! గణపతి రాజా! నువ్వు నాకు చేసిన ద్రోహం తలచుకుంటే నాగుండె ఝల్లుమంటుంది. పసిబిడ్డలను, భార్యలను, ముసలి వారిని కూడా చంపడానికి వెనకాడలేదే? నువ్వు శాశ్వతంగా రాజ్యమేలు కుంటానని అనుకున్నావేమో? కానీ చివరికి అందరిఉసురు పోసుకున్న నీ ఉసురులను కూడా భగవంతుడు తీయకుండా ఉంటాడా? నువ్వు చచ్చిపోయి ఐదు సంవత్సరాలు అయినా నువ్వు చికాకు పెట్టిన మా మతం, మా దేశం ఇంకా కోలుకోనేలేదు. నీ బారినపడిన నీ నుండి ఎలాగో నావలె తప్పించుకొని విదేశాలకు పారిపోయిన మా వాళ్లకు నీ మరణ వార్త చెప్పక తప్పదని నీకు అనిపించలేదు.
ఓరీ! దేశద్రోహీ ! నువ్వు చేసే పనులు క్రూరాతి క్రూరమైనవి. అసలు ఒక మంచి మనిషి అయినా నీ వంశంలో పుట్టారా? అయినా విత్తు ఒకటి పెడితే చెట్టు ఒకటి మొలుస్తుందా ? ఏ తప్పూ చేయని జనాల శాపం నీకు తగిలి, నీకు సంతానం కలుగక చచ్చి పోయినప్పుడు… ఒక ధర్మప్రభువుగా మరొక రాజు పరిపాలన కొస్తాడని నమ్మకంతో ఎదురు చూసాము. నీ బిడ్డ కూడా నీ పోలికనే ! హా! దైవమా! మా కష్టాలు గట్టెక్కించాలను కోవడం లేదా? ఇప్పుడేం చేయాలి? ఏ తప్పూ చేయని అమాయకులను ఎందరినో తన పొట్టనపెట్టుకున్న రాజవంశం సర్వనాశనం చేయాలి! అయ్యో! తన మతాన్ని, ధర్మాన్ని పాటించకుండా పనికిరాని వాడివైనావు ! ఏం చేయాలి? తలమీద గుండు పడుతున్నప్పుడు ధర్మం ఎంత వరకు పాటించగలము? పాపమైనా పుణ్యమైన సరే! వెనుకకు మరలను. వంశ నాశనం అవుతున్నప్పుడు నేనొక్కడినే నా కులాచారం పాటించటం ఎంతవరకు సబబు? సరే పాపమే వస్తుందనుకుందాం ! పాపం వచ్చినా, ఏ తప్పూ చేయని వారిని వేలకువేలు చంపిన గణపతి రాజునకు అంటిన పాపం లో నూరో వంతు కాదు…. వెయ్యో వంతు కూడా కాదు. లోకానికి ముల్లు వంటి వాడి కుటుంబాన్ని నాశనంచేయడం వల్లనైనా రాజ్యాన్ని, వారి వంశాన్ని, కులాన్ని, వాళ్ల చేతిలో నుంచి జారి విడిచినా కూడా ఏమీ కాదు. ఈ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? ఇతడైనా నా మాట వింటాడో? వినడో? అసలు ఇతని ఆలోచన ఏమిటో తెలియడం లేదు. అతడు ఏం ఆలోచించినా గణపతి రాజులకు వీళ్లకు పైపైన స్నేహ భావం ఉన్నట్టు కనబడినా…. లోలోపల శత్రుత్వం రగులుతున్న నిప్పువలె వెలుగుతున్నదని అటా అటలుగా తెలుస్తున్నది. ఒక ఎత్తువేస్తాను. పాచిక పారిందా సరే సరి! లేదా నాకు సహాయపడే వారితో నేననుకున్న పని నెరవేర్చుకుంటాను. శతృవుకు శతృవు పరమ మిత్రుడు. కానివ్వు ! అయ్యేదేదో కాక మానదు.ముందుగా యాదవరాజును ఒకపట్టు పట్టు పడతాను.తరువాత నా బలాబలాలను తేల్చుకుంటాను.”
ఇలా ఇతను మాట్లాడడం వల్ల ఇతను జైనుడని అనిపిస్తుంది. శ్రీ కాకతీయ గణపతి రాజు జైనులమీద ఎంత కక్ష కట్టాడో అందరికీ తెలిసిందే.ఇతను ఎలానో తప్పించుకొని వచ్చి గణపతి రాజు మరణించినా, కోపము వదలక అతని వంశం పై పగ తీర్చుకోవాలని చూస్తున్నట్టు అతని మాటలను బట్టి తెలుస్తున్నది.
ఈ బాటసారి దేవగిరి తోవబట్టి వెళ్లి పోతుండడం,
“గణపతి రాజులకు వీరికీ పగ” ఉన్నదని అతని మాటలు విచారించినా దేవగిరి పోతున్నవాడని మనం అంత తేలికగా కాకపోయినా..తెలుసుకోవచ్చును. కొంత సేపటికి తన మనసులోని భావాన్ని తెలుపుతూ,అరకన్నులు మూసి ఆలోచిస్తూ, చెట్టు మొదట్లో బోదెను ఆనుకుని కూర్చున్నాడు. ఆ అడవిలో మానవమాత్రుడుండరని అతను అనుకున్నాడు. అందుకే జనాలు లేని ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని, గత చరిత్రను నెమరు వేసుకుంటూ ప్రస్తుతం ఏంచేయాలా ? అని ఆలోచిస్తున్నాడు. ఎండ వేడి అంతగా లేదు.రెండు మూడు ఝాముల పొద్దున్నది.కళ్ళు మూసుకున్న మన బాటసారికి సాయంకాలం అవుతున్నట్లుగా అనిపించింది. ” పొద్దు గుంకక ముందే చేరవలసిన చోటుకు వెళ్లాలి.లేకపోతే క్రూరమైన జంతువుల పాల బడవలసి వస్తుంది. ” అనుకున్నాడు.చాలా సేపటినుండి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు కదా!ఆ కూరుకుపోయిన కళ్ళను
బలవంతంగా తెరిచాడు.
తెరవడంతోనే ఒక్కసారిగా కలవరపడ్డాడు దీనంగా చూసాడు.గుండె దడదడా కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఒళ్ళంతా గగుర్పొడిచింది. పెదవులు ఎండిపోయి, అప్రయత్నంగా నాలుకతో తడుపుకోవడం మొదలుపెట్టాడు.పెద్ద నిట్టూర్పు విడిచాడు.
బాటసారి అలా కావడానికి అతని ముందు ఇద్దరు వ్యక్తులు కళ్ళ ముందు కనపడడమే!
అలా అతని ముందు నిలబడిన ఇద్దరూ ఒకే ఈడువారై పోలికలలోనూ ఇద్దరూ ఒకే తీరుగాఉండి చూసేవాళ్ళకి అన్నదమ్ములవలె కనపడుతున్నారు.ఈ బాటసారి కన్నా పది సంవత్సరాలు చిన్నవారే…కానీ వారి శరీరాలు ఒకప్పుడు మంచి ఉచ్ఛదిశ అనుభవించి, క్రమేణా ఆ వైభవం కోల్పోయిన వారి వలె కనిపిస్తున్నారు.
తన మాటలను ఆ కొత్త వారు విన్నారనుకొని , చాలా చాలా బాధపడుతున్నాడు. వారెవరో అతనికి తెలియదు. వాళ్ళతో తనకేమైనా హాని కలుగుతుందా?అని అనుకుంటున్నాడు.బాటసారి ముఖంలో నిమిష నిమిషానికి రంగులు మారుతున్నాయి.
ఏం మాట్లాడకుండా నిలబడి చూస్తున్న ఆ ఇద్దరికీ బాటసారి స్థితి మొత్తం తెలుస్తున్నది. వెంటనే వారిద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ…
ఏవో సైగలు చేసుకొని , ఏంచెప్పుకున్నారో ఏమో ? మనకైతే తెలియదు.కానీ బాటసారి తో ఇలా అన్నారు.
మొదటివాడు అన్నాడు కదా ! నీవేమీ భయపడవలసిన పని గానీ, విచారించాల్సిన పని కానీ లేదు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాము. వాటికి బదులు చెప్తారా?అని అడిగాడు.
బాటసారి:—అయ్యా! మీరెవరు?
మొదటి వాడు:– నీ వలెనే మేమూ బాటసారులమే!
బాట :– ఎక్కడికి పోతున్నారు?
మొ-వాడు :– దేవగిరికి…మహాదేవరాజు దగ్గరకు.
బాట :— మీరేమైనా తప్పు చేసారా? వారి పట్ల?
రెండవ వాడు:– మేమేమీ తప్పు చేయలేదు. మేము వారికీ శత్రువులమూ కాము; మిత్రులమూ కాము.
బాటసారి:– మీరు మిత్రులూ, శత్రువులూ కాకపోతే మరి అక్కడికి ఎందుకు పోతున్నారు?
రెండవ వాడు:– మీరెందుకు పోతున్నారు?
బాటసారి:– ఒక్కసారిగా భయపడిపోతూ…తన మాటలను వీరు విన్నారనుకున్నాడు.
రెండవ వాడు:– విచారించకండి! మీ మాటలను విని , మీరు కూడా దేవగిరికి పోతున్నారని తెలుసుకున్నాము.మీకు గణపతి రాజు శత్రువని రుద్రమదేవిని రాజ్యపదవి నుండి తప్పించాలని మీరు అనుకోవడం మేము తెలుసుకున్నాము.ఇక ఇప్పుడు ఆ విషయం దాచినా లాభం లేదు.
బాటసారి:– నన్ను రక్షించండి బాబుగారూ! నేనన్న మాటలు మీరు విన్నారు కాబట్టి ఇక నన్ను ఏమి చేసినా మీరే…అంటూ తడబాటుతో బాటసారి మాట్లాడలేక పోయాడు. బాటసారి భయానికి ఆ ఇద్దరూ జాలిపడి ఇంకా వేరే ప్రశ్నలు వేయలేదు.
మొదటి వాడు :– చీకటి పడుతున్నది.మేము కూడా దేవగిరికే పోతున్నాము. కనుక దారి వెంట మాట్లాడుకోవచ్చు రాండి మాతోపాటు.
బాటసారి ఏం చేయలేక , తన బట్టలను ముందటి వలెనే సర్దుకుని , లేచి ప్రయాణమై ఆ ఇద్దరి వెంట నడుస్తున్నాడు. ఏంచేయాలో తెలియని మూర్ఖులు ఎవరు ఎలా చెబితే అలా చేయడానికి వెనుకాడరు కదా!
మొదటి వాడు:– మీరు బాధపడకండి ! మీకెటువంటి ఆపద వచ్చిందో…దాదాపు మాకూ అటువంటి ఆపదే వచ్చింది.
బాటసారి:– మీకు ఆపద ఎవరి వలన వచ్చింది?
మొదటి వాడు:– గణపతి రాజు వల్ల.
జైనుడికి నమ్మకం కలుగలేదు. మొదటివాడు వెనుకకు తిరిగి చూసాడు. రెండో వాడికి చెప్పాడు. అతను నమ్మడం లేదని…
రెండవ వాడు:–మీరు అంతగా బాధపడకుండా మమ్మల్ని నమ్మండి!
బాటసారి:– మీరెవరో చెప్తారా?
మొదటి వాడు:– మా పేర్లు అడుగుతున్నారా?
బాటసారి:– పేర్లు చెప్పండీ…ఇం…కా…
మొదటి వాడు:– తడబడకండీ ! నా పేరు హరిదేవుడు.రెండో వాడి పేరు మురారిదేవుడు. ఇంకా…?
బాటసారి:– మీకూ, మహాదేవరాజుకు మైత్రీ సంబంధంలేదని అన్నారు కదా! అక్కడికి పోవాల్సిన పనేముంది?
మొదటి వాడు:– మాకు వారు ఉత్తరం రాసారు. ఇంతకుముందెప్పుడో పరిచయమున్నది.కానీ మళ్ళీ కలువలేదు.అదీగాక! మేము ఇక్కడ నివసించే వాళ్ళము కాము. కాకతీయుల రాజ్యమున మేము….అయ్యా ! జరిగిపోయిన మాటలు ఇప్పుడెందుకూ?
బాటసారి:– అయ్యా ! దేవరా! చెప్పితే తప్పా?
మొదటివాడు:– తప్పా అని అంటున్నారా? గణపతి రాజు మమ్మల్ని పదవి నుండి తీసేశాడు. అంతేకాదు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నాడు. చేసేదిలేక, మారు వేషాలతో ఆ దేశం లోనే ఉన్నాము. మొరపెట్టుకుందామని పోవాలి అనుకున్నాము. ఇంతలోనే ఉత్తరం కూడా వచ్చింది.
బాటసారి:– మన ముగ్గురం ఒకే తీరు ఆపదలో ఉన్నాం కాబట్టి, ఒకరిపై ఒకరం విశ్వాసం వదులుకోకూడదు. మన మొరలను మహాదేవరాజు వింటాడో?
మొదటివాడు:– నిజంగా స్నేహాన్ని విడిచి పెట్టవద్దు. మా మండలాలు మాకు దక్కితే మిమ్మల్ని మా దగ్గర ఉంచుకుంటాం. గణపతి రాజులకు దేవగిరి ప్రభుత్వం వారికి ఎప్పటినుండో శత్రుత్వం ఉన్నది. మన మాటలపై ఆదరం ఉంచుతారని నా నమ్మకం.
బాటసారి:– ఏమో? ఏమవుతుందో? మన ప్రాప్తం ఎలా ఉందో?
రెండవవాడు:– మీ పేరేమిటి?
బాటసారి:– నా పేరా? ధర్మవర్ధనుడు.
మొదటివాడు:– అయ్యా ! మీరు జైనులా?
బాటసారి:– అవును నేను జైన బ్రాహ్మణుడను. ప్రజా వృక్షానికి వేరుపురుగు వలె గణపతి రాజు దాపురించి, పెట్టరాని కష్టాలు పెట్టినాడు. దాన్ని ఇప్పుడు తలుచుకుంటే గుండెలవిసి పోతాయి. దీనికి అంతటికి కారణం తిక్కన! తిక్కన కవి, బ్రాహ్మణుడు, సోమయాజికూడా. అందుకే గణపతి రాజుకు బోధలు ఎన్నో చేసి, మాకు ఇటువంటి కష్టాలు తెచ్చిపెట్టినాడు.
రెండవవాడు:– విధి బలీయమైనది. కనుకనే అదంతా జరిగింది.
ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ నడుస్తూ… నడుస్తూ… బాటకు కుడివైపుకు అరకోసుదూరంలో ఒక కూలిపోయిన కట్టడం కనిపించింది.
బాటసారి:– అయ్యా! ఇవేమి కట్టడములు? అందచందాలు తగ్గినా పూర్వపు వైభవాన్ని తెలుపుతున్నాయి.
మొదటివాడు:– ఈ కట్టడాల గురించి రాస్తే ఒక చరిత్ర గ్రంథమే అవుతుంది. అయినా క్లుప్తంగా చెబుతాను. నిర్మలపురంలో మూర్ఖుడైన సుదర్శన వర్మ అనే రాజు అనిల పురము సోమ పాలుడు, మరికొంత మంది ఇక్కడ మేడలను కట్టించి, పాతాళంలో మంచి తోటను పెంచి, దానికి “నందనవనము” అని పేరు పెట్టి, దానిలో ఎందరినో అందమైన వయ్యారిభామ లను, వయసులో ఉన్న యువకులను చెర పెట్టి రాగమంజరి అనే ఆమెను అధికారిగా నియమించి, ఆమె ఆధ్వర్యంలో ఆ చెరపట్టిన ఆడ ,మగ వారి మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగేటట్టు చేసి, ” పాతాళ భైరవి” అనే దేవతా పాతాళ మందిరంలో ఉంచి పూజించేవారు. ఈ మహాదేవరాజు అక్క పద్మావతిదేవి అనే ఆమెను, అన్న అయిన కృష్ణ భూపాలుని చెరలో పెట్టి, శౌణదేశమును ఆక్రమించుకోవాలని అనుకున్నారు. నందనవనంలో తమ మాట వినని వారిని ఆ భైరవికి బలి ఇచ్చేవారు. ఈ కట్టడాలు వారికి సంబంధించినవే. ఇక్కడి నుండి పాతాళభైరవి దగ్గరకు పోవడానికి సొరంగ మార్గం ఉన్నది.
ఇలా మాట్లాడుతూ వాళ్ళు నడుస్తుండగా దారి పక్కన పెద్ద రావిచెట్టు కనబడింది. దానిని ఆ ఇద్దరు వ్యక్తులు చూసి బాటసారికి చూపెట్టి ఇలా చెప్పారు.
మొదటివాడు:– ఈ ప్రాంతంలో అప్పుడు శౌణ దేశపు మంత్రి అయిన శంకర రాయుడు నివసిస్తూ, సోమ పాదులు మొదలైన వారి కుట్రలను తెలుసుకొని, వారిని పట్టుకునేందుకు దండు విడిచిన చోటు నుండి వచ్చి ఇక్కడనే ఉన్నాడు.
బాటసారి:– చివరకు ఏం జరిగింది?
మొదటివాడు:– గణపతిరాజు వచ్చి శంకరునితో కలిసిపోయి, సోమ పాలాదుని కుట్రలు తెలుసుకొని , కృష్ణభూపాలుని, పద్మావతిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి, పాతాళ మందిరాలను, బైంపిని నాశనం చేశారు
బాటసారి:– చాలా వింతగా ఉన్నది కదా!
మొదటివాడు:– వింత అనడానికి ఇంకా అనుమానం ఎందుకు? శంకరుడు, గణపతిరాజు లేకపోతే దేవగిరికిప్పుడు రాజు మహాదేవ రాజు కాక నిర్మలా పురము రాజయిన సుదర్శనవర్మ కొడుకు వర్థమానుడు రాజు అయ్యేవాడు.
బాటసారి:– తమకు కుల క్రమానుసారంగా వచ్చే రాజ్యానికి చెర నుండి తప్పించి తన అన్నను రాజులు చేసిన గణపతి రాజవంశంపై మహాదేవ రాజు జోక్యం చేసుకుంటాడో లేదో అని అనుమానం కలుగుతున్నది. అలామాట్లాడుతూ నడుస్తూనే ఉన్నారు. ఇంతలో దేవగిరి వారికి కనపడి ఆనందం కలిగించింది.
( పరిపాలనలో అసంతృప్తుల అయినా ముగ్గురు శత్రువులుగా మారి, రుద్రమదేవిని ఓడించి, ఓరుగల్లు సింహాసనాన్ని దక్కించుకోవాలని దేవగిరి రాజు దగ్గరకు బయలుదేరి పోవడం, అడవి వర్ణన మొదలైనవి ఈ ప్రకరణంలో ని విశేషాలు.)
(సశేషం)
సరళీకృతం
-రంగరాజు పద్మజ
ఒద్దిరాజు సోదరులలో చిన్నవారైనా ఒద్దిరాజు రాఘవరంగా రావు గారి కుమార్తె.
ప్రముఖ కవయిత్రి, రచయిత్రి,
హైదరాబాద్
+91-9989758144
