ఆరోజు భరత్ భర్త్ డే!
“గుడ్ మార్నింగ్ అండ్ హాపీ భర్త్ డే డాడీ” అంటూ పిల్లలు వరుణ్, పవన్ ,
“మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అంటూ అతడి భార్య దివిజ అభినందనలు తెలిపారు.
“థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ”అంటూ ఆనందంగా అందరినీ హగ్ చేసుకున్నాడు భరత్.
భర్త్ డే ఆదివారం కావడంతో ఇంట్లో అందరూ ఎంతో ఉత్సాహంగా వున్నారు.
“ఈరోజు నా భర్త్ డే సందర్భంగా..ఇంట్లో అమ్మకు వంటపని లేకుండా కేక్ తో పాటు ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాము ఓకేనా?”
“ఓకే డాడీ.. అలాగే చేద్దాం” అంటూ సంబరంతో ఎవరికేది ఇష్టమో ఆ లిస్ట్ మెన్షన్ చేశారు పిల్లలు!
టిఫిన్ కార్యక్రమం తర్వాత, ముందురోజు ఆల్టరేషన్ కని ఇచ్చిన తన కొత్త డ్రస్ తెచ్చుకుందామని వెళ్లి తిరిగొచ్చేటపుడు, గేటుదాకా వచ్చిన భరత్ వర్షం చినుకుల కారణంగా ర్యాంప్ మీద కాలు జారి కింద పడిపోయాడు!
“అయ్యో డాడీ” అంటూ ఆందోళనగా తండ్రిని పట్టుకొన్న పిల్లలు “మమ్మీ.. డాడీ కింద పడ్డాడు” అంటూ కేకేశారు. ఆదుర్దాగా అటువచ్చిన దివిజ పిల్లల సాయంతో భర్తను లేవనెత్తింది. కుడికాలికి గేటు దిమ్మె తగిలి బాగా నొప్పి కావడంతో, భార్య భుజంపై వేసి, పిల్లల ఆసరాతో ఇంట్లోకి నడిచివచ్చి మంచంపై వాలిపోయాడు భరత్. కదలనీయని కాలిబాధతో “అమ్మా..అబ్బా” అంటూ తల్లడిల్లిపోతున్న భరత్ ను, పక్కింటాయన సాయంతో క్యాబ్ లో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. స్కానింగ్ చేసి, కాలి మడమ దగ్గర హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పి కాలికి బ్యాండేజ్ వేశారు హాస్పిటల్లో!
*********
“ఎలా వుంది భరత్ ? నీవు కిందపడ్డావని, కాలికి లైట్ ఫ్రాక్చర్ అని తెలిసి వచ్చాను. డాక్టర్ ఏమన్నాడు?” అని అడిగింది పక్క కాలనీలో వున్న, అప్పుడే అక్కడికొచ్చిన భరత్ మేనత్త మీనాక్షి.
“రెండు నెలలు రెస్టు తీసుకొమ్మని చెప్పి, క్యాల్షియం టాబ్ లెట్స్ , పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఇంటికి పంపించారత్తమ్మా” అన్నాడు భరత్ నీరసంగా.
“కాలు బాగా బాధ పెడుతోందా?” ఆర్తిగా అడిగింది మీనాక్షి.
“బాగానే బాధపెడుతోంది.. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తప్ప నిన్నటినుండీ నిదురకూడా పట్టడంలేదు!” మూలుగుతూనే అన్నాడు భరత్.
“పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం అంత మంచిదికాదు కదా.. నొప్పికలవాటుపడుతూ మెల్లమెల్లగానూ సహజంగానూ కంట్రోల్ కావడమే కరేక్టేమో కదా”
“అమ్మో అత్తమ్మా అది నావల్ల కావడం లేదు.. పెయిన్ కిల్లర్ వేసుకోకుంటే పెయిన్ నన్ను కిల్ చేసేలా వుంది!”
బాధగా మూలుగుతూనే అన్నాడు భరత్ .
“అయ్యో భరత్ నీ భర్త్ డే నాడే ఇలా జరగడం బాధగా అనిపిస్తుందిరా!”
” నా సగం అదనపు బాధంతా అదేకదా అత్తమ్మా.. ఎంతో ఉత్సాహంగా వున్న ఇంట్లోని వాళ్లనంతా నిరుత్సాహపరిచిన ఫీలింగ్ నన్ను అంత తొందరగా హీలింగ్ కానివ్వదేమోననిపిస్తుంది!”
“బాధపడకు భరత్.. వాళ్లు నీ ఫ్యామిలీ మేంబర్సేగా.. కష్టం సుఖం కలిసి పంచుకోవలసిన వాళ్లేకదా! అవునూ ఇంతకూ నీ పుట్టినరోజుకు ఎవరెవరిని ఆహ్వానించివుండిన్నవు?”
“ఎవరినీ లేదు.. ఓన్లీ ఫ్యామిలీమెంబర్స్ అంతే!”
మూలుగుతూనే అప్సెట్ మూడ్ తోనే అన్నాడు
” అన్నట్టు నేనోమాటడుగుతాను బాధపడవుగా భరత్ ?”
“బాధెందుకత్తమ్మా.. మొదటినుండీ నువ్వు నాకు ఎన్నో చెప్పేదానివి.. వెల్ విషర్ వే కాదు నాకు రోల్ మోడల్ వి కూడా! నువ్వంటే నాకెంతో గౌరవం అభిమానం!”
“థ్యాంక్యూ భరత్.. అదే చనువుతో అడుగుతున్నాను.. నిన్నటి నీ జన్మదిన సందర్భం లో పాల్గొనేది ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అన్నావు.. ఎవరెవరి గురించి అన్నావు?”
“ఇంకెవరు ఫ్యామిలీ అంటే భార్య దివిజ, పిల్లలు వరుణ్ పవన్ లు.. అంతేకదా అత్తమ్మా!”
” అంతేనా భరత్.. నీ జన్మదిన పర్వంలో ప్రధానంగా పాల్గొనవలసినవాళ్లింకెవరూ లేరా?”
“అంతకన్నా ముఖ్యమైనవాళ్లింకెవరుంటారు?”
“వుంటారు.. వున్నారు భరత్.. నీ జన్మదినవేడుకల్లో పాల్గొనవలసిన వాళ్లలో అందరికన్నా అతిముఖ్యమైన వ్యక్తి ఎవరంటే.. నీకు జన్మనిచ్చి, నీకోపుట్టినరోజును కల్పించిన మీ అమ్మ శాంతమ్మ!”
“అత్తమ్మా” ఆశ్చర్యం కలవరం కలగలిసిన స్వరంతో అన్నాడు భరత్ .
” అవును భరత్ ఆలోచించు.. నీవు కడుపున పడిననాటినుండీ తొమ్మిది నెలలు గర్భవికారాలను భరించిమరీ నీబరువును మోసిన భూమాతకాదా నీ జన్మదాతగా మీ అమ్మ?”
అవును అన్నట్టు తలాడించాడు అంతలోనే కదిలిన కాలి బాధతో “అమ్మా” అని మూలిగాడు భరత్.
“చూడు భరత్ నీ కాలికి అయిన చిన్న హెయిర్ లైన్ క్రాక్ కే ఇంతలా ఇబ్బంది పడుతున్నావ్.. కానీ.. కానీ.. నీ తల్లి తన ప్రసవవేదన సమయంలో ఎంతబాధ భరించివుంటుందో ఊహించనైనా ఊహించివుంటావా?” అంటున్న మీనాక్షి కంఠం వణికింది. వింటున్న భరత్ భారంగా బాధ వ్యక్తపరుస్తూనే అయోమయంగా చూశాడు.
“భరత్.. నేనీమధ్యే ఒకలేడీ డాక్టర్.. అందునా ప్రసవానుభవంవున్న గైనకాలజిస్ట్ చెప్పగా విన్నాను.. ప్రసవ సమయంలోని నొప్పి స్థాయిని అంచనావేసేది, జీరో టు టెన్ పాయింట్ ఫైవ్ దాకా వుండేది డోల్ స్కేల్ అనేదాని మెజర్ మెంట్ ప్రకారం.. దాదాపు దాని చివరి సంఖ్య దాకా తాకే బాధ ప్రసవవేదనేనట! అలాగే మరో అంచనా ప్రకారం, సగటున మానవశరీరం భరించగలిగేది 45యూనిట్ల బాధ మాత్రమేనట! కానీ.. కానీ.. పురిటినొప్పుల్లో మాత్రం ఆ మాతృమూర్తి భరించే బాధస్థాయి 57యూనిట్లదాకా వుంటుందట.. అంటే అది మామూలు బాధకాదుకదా భరత్ ?”
“అత్తమ్మా” చిన్నగా భరత్ కంఠం కంపించింది.
“అవును భరత్.. బాధయొక్క ఆఖరి అంచుకు చేరిన ఆపురిటినొప్పి స్థాయిని అంచనావేయగలమా? ఒకేసారి 20 ఎముకలు విరుగుతున్నంత బాధ వుంటుందట! చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కే నీవింత హైరానా పడుతున్నావ్ .. కానీ.. నీకు జన్మనిచ్చిన, నీ జన్మదినానికి కారణమైన నీతల్లి నీకు జన్మనిచ్చేవేళ, అంతటి ఆ పురిటినొప్పులనెలా భరించి నిన్నీలోకంలోకి తీసుకొచ్చిందో అర్థంచేసుకోగలవా?”
“అమ్మా” అప్రయత్నంగా భరత్ కంటివెంట నీటితోపాటు నోటివెంట ఆమాట వచ్చింది.
“భరత్ దీన్నిబట్టి నీకింకా ఏమర్థమవుతుంది.. ప్రసవ సమయంలోని మరణావస్థను దాటి నీకు జన్మనిచ్చిన తల్లికూడా మరోజన్మ ఎత్తిందన్న సత్యం అందులో వెల్లడి కావడం లేదా? నీ పుట్టినరోజు నీ ఒక్కడిదేకాదు, అది నీతల్లి మళ్లీ పుట్టినరోజు అని గుర్తించలేకున్నావా?”
భారమైన, సంచలనాత్మకమైన భావాలతో క్షణం కళ్లు మూసుకున్నాడు భరత్.
“నీ పుట్టుకకు ఆధారమైన, నీ పుట్టినరోజు వేడుకకు కారణమైన, అందరికన్నా ముందు నువ్వు నీ తల్లిని తలచుకోవలసిన రోజు.. నీ తల్లితో కలిసి నీ జన్మదినాన్ని నీ జనని జన్మదినంగా కూడా జరుపుకోవలసిన దినం.. అలా ఎలా మరిచిపోయావు మీ అమ్మ శాంతమ్మను?”
హితవైన మందలింపుతో కూడిన ఆ ప్రశ్నతో , ఎంతో ఆవేదన, అంతులేని ఆర్ద్రతా భావం కలిగింది భరత్ లో!
“అమ్మా.. నన్ను మన్నించమ్మా” అంటూ అమ్మను తలుచుకుని, అమ్మ యొక్క తనజన్మ భారాన్ని తెలుసుకొన్న ఆ వేదనాస్పందన అనేది తన హెయిర్ లైన్ ఫ్రాక్చర్ బాధను తేలికపరిచినట్టనిపించి, పెయిన్ కిల్లర్స్ తో పనిలేదనిపించింది భరత్ కు!
తన తల్లికి కొత్త జన్మనిచ్చిన తన జన్మదినం.. తన జనని జన్మదినం అనికూడా అనిపించి తన మాతృమూర్తి పట్ల ఒక అమృత భావన కలిగిందతడిలో!
“అత్తమ్మా.. అమ్మను మరిచి జరుపుకున్న ఇన్నేళ్ల నా జన్మదినాలన్నీ నిరర్థకమైనవే! ప్రసవవేదన అనే మరణావస్థను కూడా మధురబాధగా భరించి నాకు జన్మనిచ్చి తాను మళ్లీ జన్మించిన నాతల్లితోనే ఇకపైన నా జన్మదినాలన్నీ! కొత్తగా నాకు మాతృదర్శనం కలిగించి, సత్య సందర్శనం గావించిన నీకు వేనవేల ధన్యవాదాలత్తమ్మా!” అంటూ మేనత్త చేతుల్ని తన చెమరించిన కళ్లకద్దుకున్నాడు భరత్!
*********
కె. వీణారెడ్డి,
హైదరాబాద్.
7337058025
కథలు
అమ్మగారు ఓ అమ్మగారు! అంటూ పిలుస్తూ లోపలికి వచ్చింది కుమారి.
లోపలికి వచ్చిన కుమారికి హాల్లో ఎవరు కనిపించలేదు.
“అదేంటి ఈపాటికి పెద్దమ్మ గారు వంట చేస్తూ, వంటింట్లో కనిపిస్తారు. ఈరోజు చడీ, చప్పుడు లేదు. ఆరోగ్యం బాగాలేదా ఏంటి?”అని అనుకొని పెద్దమ్మ అనబడే దమయంతి గదిలోకి వెళ్ళింది.
అప్పటికే దమయంతి స్నానం చేసి, పూజ చేసుకున్నట్లు కనిపించింది. కానీ రోజు వంటింట్లో ఉండే బదులు ఈరోజు గదిలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చునిఉంది.
“ఇక్కడ ఉన్నారామ్మా! వంట అయిపోయిందా? లోపల లేకుంటే ఒంట్లో బాగా లేదేమో అనుకొని వచ్చానమ్మా”అన్నది కుమారి.
“ఒంట్లో బాగానే ఉంది. రోజు వంటింట్లో పని చేసి, చేసి చిరాకు వచ్చేసింది. ఎవరికి బాధ్యత లేదు
నేను చేసి పెట్టడం అందరూ కూర్చొని తినడం”అనీ దమయంతి కొంచెం కోపంగా అన్నది.
“అదేంటమ్మా? ఎప్పుడు సంతోషంగా పనిచేస్తూనే ఉంటారు. ఈరోజు అంత మాట అనేసారు”అన్నది కుమారి.
“నువ్వు వెళ్లి పని చేసుకో కుమారి”అంటూ పుస్తకం చదవటంలో నిమగ్నం అయ్యింది దమయంతి.
“కోడలమ్మ ఏం చేస్తుందో చూస్తాను. అయినా ఆ అమ్మాయి ఆలస్యంగానే లేస్తుంది కదా”అనుకుంటూ కోడలు వినీల గదిలోకి వెళ్ళింది.
అప్పటికే లేచి కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది వినీల.
“వినీలమ్మ కూడా పని చేసుకుంటూ ఉంది. ఆలస్యంగా లేచినా, వినీలమ్మ తాను మొదటిసారి టీ తాగుతూ, అత్తగారికి ఓ కప్పులో ఇస్తుంది. ఇద్దరు కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ తాగుతారు. ఈరోజు ఏంటి! చెరొక గదిలో కూర్చున్నారు”అనుకుంటూ..
“వినీలమ్మ! ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటే ఏం చేస్తున్నారో అని ఇక్కడికి వచ్చాను. చాయ్ తాగారామ్మ! మీఅత్తమ్మ నువ్వు ఇద్దరు కూర్చుని తాగుతారు కదా”అన్నది కుమారి.
“నాకు చాయ్ పెట్టుకునే ఓపిక లేదు. అవసరమనుకుంటే ఆమె పెట్టుకొని తాగుతుంది”అన్నది వినీల.
ఇదేంటబ్బా? ఎప్పుడూ లేనట్లుగా వీళ్ళిద్దరూ ఎడ ముఖం పెడ ముఖం గా ఉన్నారు” అనుకున్నది.
తన పని తాను చేసుకోవడం మొదలు పెట్టింది కుమారి.
కుమారి ఇలా ఎందుకు ఆలోచించిందో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే మనకి అర్థం అవుతుంది.
పొద్దున్నే కాలింగ్ బెల్ మోగ గానే దమయంతి తలుపు తీస్తుంది.
” కప్పులో టీ పోసి పెట్టాను. తాగి పని చేసుకో కుమారి”అని నవ్వుతూ చెప్పింది దమయంతి.
“నాకు చాయ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవు నువ్వు ఎన్ని పనులున్నా, రోజు ఇక్కడే టీ తాగి వెళ్తానమ్మ”అన్నది కుమారి టీతో పాటు దమయంతి ఇచ్చిన బిస్కెట్ టీలో ముంచుకుని తింటూ.
“ఒక్కదానివే పని అంతా చేస్తావు. నీకు కష్టం అనిపించదా అమ్మా” అన్నది కుమారి.
“మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి కష్టమంటే ఎలా? అయినా ఎవరికి చేస్తున్నాను? నా కొడుకు ,కోడలు మనవళ్ళుకే కదా”అన్నది దమయంతి సాంబార్లో పోపు వేస్తూ..
“మా అత్తయ్య అయితే ఒక్క నాడు ఇంత పని చేయదమ్మ. నేను ఇళ్లలో పనిచేసే ఇంటికి పోయి, నేనే చేసుకోవాలి. తిని బిడ్డ ఇంట్లో పోయి కూర్చుంటది. నా పిల్లలు మాత్రం తన మనవళ్లు కాదా? అన్నం అయినా తినిపించవచ్చు కదమ్మ! మీరు చేసేది మంచి పని. కోడలును ఇలా చూసుకోవాలి”అన్నది బాధగా.
“అయ్యో! చేస్తే ఏమైంది ?రెక్కలు ఏం కట్టుకుపోతామా? నలుగురికి చెయ్యని చేతులు ఏం చేతులు?”అన్నది దమయంతి.
ఎనిమిది గంటల వరకు రోజు స్నానం పూజ వంట ముగించేది.
నెమ్మదిగా లేచిన కోడలు, తాను చాయ్ పెట్టుకుని, అత్తగారికి ఒక కప్పు ఇచ్చి, తాను కూడా పక్కనే కూర్చుంటుంది.పిల్లలకు బాక్సు లు కూడా దమయంతి పెడుతుంది.
ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. ఇంట్లోకి కావలసిన సరుకులు, పిల్లల బట్టలు, చదువులు ఇలా ఎన్నో.
ఆ తర్వాత వినీల కంప్యూటర్ ముందు కూర్చుంటుంది. పనిమనిషి పని అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత తోచిన పారాయణం చదువుకొని, పిల్లలకి వచ్చే వరకు ఏదైనా చేద్దామని ఆరాటంలో ఉంటుంది దమయంతి. ఊరికే ఉండడం అంటే అసలే నచ్చదు. భర్త పోయి దాదాపు నాలుగేళ్లు అయింది. అప్పటినుండి ఊరు విడిచి ఉన్న ఒక్క కొడుకు దగ్గరే ఉంటుంది వీలైనప్పుడు ఊరికి వెళ్లి వస్తూ ఉంది.
కొడుకు, కోడలు కూడా దమయంతికి బాగా గౌరవం ఇస్తారు. గౌరవంతో పాటు ప్రేమను కూడా పంచుతున్నారు.
అన్ని విధాల అమర్చిపెట్టే అత్తగారంటే దమయంతికి ఎనలేని అభిమానం. తాను వర్క్ చేసుకుంటుంటే టీ తెచ్చి పెట్టడం, స్నాక్స్ ఇవ్వడం చేస్తుంది దమయంతి.
“నేను వచ్చి చేస్తాను కదా అత్తయ్య! ఎందుకు మీరు కష్టపడతారు”అని అన్నది వినీల.
“ఈ పనులు నేను చేయగలనమ్మ! నీ ఉద్యోగం నేను చేయగలనా? అందుకే నాకు వచ్చిన పనులు నన్ను చేయని, ఊరికే కూర్చొని మాత్రం ఏం చేస్తాను? మీకు ఏదైనా చేసి పెడితే నాకు సంతోషంగా ఉంటుంది. మీ మామయ్యకి కూడా అంతే, ఎప్పుడూ మీ గురించే ఆలోచించేవాడు”అన్నది కొంచెం బాధగా దమయంతి.
నవ్వుతూ టీ కప్పు అందుకున్నది వినీల.
సెలవులు ఉన్నప్పుడు మాత్రం దమయంతిని ఒక్క పని చేయ నీయకుండా అంతా తానే చేసుకునేది వినీల. బయటకు వెళ్తే తప్పకుండా దమయంతి రావాల్సిందే.
“వాళ్లకి ప్రైవసీ లేకుండా తాను వెళ్లడం ఎందుకు” అని ఎన్నోసార్లు వద్దని చెప్పినా, వినకుండా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతారు.
అత్తగారికి కావలసిన వస్తువులు ఏవైనా ఉంటే అప్పటికప్పుడు కొనుక్కొని వస్తుంది వినీల.
దమయంతి ఎప్పుడైనా బయటకు వెళ్తే, కోడలు కోసం ఎన్నో వస్తువులను తెస్తుంది.
అప్పుడప్పుడు వీళ్ళతో కొడుకు రాకున్నా,వీళ్ళిద్దరూ మాత్రం వెళ్లడం పక్కగా ఉండేది.
ఇలా ప్రశాంతంగా సాగుతున్న కుటుంబంలోకి ఒక చిన్న రాయి అడ్డంగా వచ్చింది. అంతే పరిస్థితి అంతా తారుమారు అయ్యింది.
ఒక రోజు ఇంటికి ఒక దూరం బంధువు వచ్చింది. ఇక్కడ నగరంలో ఏదో పని ఉందని, వారం రోజులు ఉండిపోయింది. ఉన్న మనిషి తిని ఊరికే ఉండక, ఇటు దమయంతి మనసు, అటు వినీల మనసును పాడు చేసింది.
పొద్దున్నే వంటింట్లో హడావుడిగా ఉన్న దమయంతి దగ్గరికి వచ్చింది. చుట్టం చూపుగా వచ్చిన దయ్యపు మనిషి.
“దమయంతి వదినా! ఇంత వయసు వచ్చినా, నీకు వంటింటి పని తప్ప లేదన్నమాట. హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపే వయసులో, ఈ పనులన్నీ చేసుకోవలసి వచ్చింది”అన్నది సన్నాయి నొక్కులు నొక్కుతూ.
“నా చేతుల్లో శక్తి ఉంది చేస్తున్నాను. అయినా ఎవరికి చేస్తున్నాను? నా పిల్లలకే కదా”అన్నది దమయంతి.
“నీ పిల్లలు నీ పిల్లలు అని నువ్వు అనుకుంటావు. కానీ ఆ వచ్చిన కోడలు అనుకోవద్దు ఇంత సేపైనా లేవలేదు. అత్తగారి వయసు అయిపోయింది .కాస్త యినా సహాయం చేద్దాం అనేది ఉందా? అదే నీకు కూతురు ఉంటే ఇలా చేసేదా వదిన! నువ్వే ఆలోచించుకో”అన్నది చుట్టపు దయ్యం.
ఇలా మూడు రోజులుగా ప్రతి దాంట్లో తాను వేలు పెట్టి, తాను ఎంత కష్ట పడుతుందో అనేది దమయంతి మనసులోకి బాగా ఎక్కించేసేది.
ఇక దమయంతి మధ్యాహ్నం పడుకున్న సమయంలో వినీల దగ్గరకు వెళ్లి..
“ఎంత కష్టపడి పోతున్నావు తల్లి! ఇటు ఆఫీసు పని, మళ్ళీ ఇంటి పని. అందులో మీ అత్తగారు ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుందాయే! మరో కొడుకు ఉంటే అక్కడికి నాలుగు రోజులు వెళ్లి వచ్చేది. మీకు ఇబ్బంది కదా! మీ భార్యాభర్తలిద్దరూ ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెను తీసుకొని వెళ్లాల్సిందే, పాపం ఈరోజుల్లో నీలాంటి వాళ్ళు ఎవరున్నారే పిచ్చి తల్లి”అని వినీల దగ్గర మరో రాగం అందుకుంది.
“అదేంటి మా అత్తయ్య గురించి అట్లా అంటారు. పొద్దున వంటంతా తానే చేస్తుంది. బయటకు వెళ్తే మాతో వస్తుంది తప్పేంటి? బయట మేమిద్దరమే ఉంటామా ఏంటి? వేరే జనం ఉండరా”అన్నది వినీల చిరాగ్గా.
“మీ అత్తయ్య అంటే నీకు ఎంత ప్రేమనే తల్లి! కానీ ఆమె అలా అనుకుంటుందా? కష్టపడి నేనే పని చేస్తున్నాను అని పొద్దున్న అంటూనే ఉంది. పనిమనిషి తో కూడా నీ మీద ఏదేదో చెప్పడం నేను విన్నానమ్మ”అన్నది చుట్టపు దయ్యం.
“అదేంటి నేను అత్తయ్యను సొంత తల్లి లాగా చూసుకుంటే, ఇలా నామీద చెప్తోందా? వంట తానిష్టంతోనే చేస్తాను అన్నది కదా? లేకుంటే నేను చేసుకో లేనా?”అనీ బాధపడ సాగింది.
ఇటు దమయంతికి కూడా బాధ పెరిగింది. “ఇంటెడు పని నేనే చేస్తున్నాను. పోనీ చేస్తున్నాను అనే సానుభూతి కూడా ఎవరికీ లేదు. ఈ వయసులో నేను ఎందుకు చేయాలి? మా అత్తయ్య నాకు చేసి పెట్టిందా “?అంటూ ఆలోచించసాగింది.
చుట్టపు దయ్యం నాటిన విషపు బీజాలు ఇద్దరిలో మొలకలై, వృక్షాలై పెరిగిపోయాయి. అంతే ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి.
దమయంతి పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది.
వినీల కూడా లేచిన తర్వాత తన టీ కప్పు తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతుంది.
ఎప్పుడో మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చి అన్నం ఒక కూర చేసి తాను ప్లేట్లో పెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది.
వినీల చేసిన కూర సహించని దమయంతి తాను ఏదో పచ్చడి ఒకటి చేసుకుని తినేస్తుంది. కొడుకు ఎక్కువగా ఆఫీస్ లో తింటాడు కాబట్టి ఈ కోల్డ్ వార్ అతనికి అర్థం కాలేదు. ఒకసారి వరుసగా మూడు రోజులు సెలవు వచ్చాయి. కొడుకుకి విషయం అంత అర్థమయింది. “ఇద్దరు మాట్లాడుకోవటం లేదు కానీ కారణం తెలియదు.ఎలా ఈ సమస్యకు పరిష్కారం?” అనుకున్నాడు.
అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇల్లంతా అశాంతిగా ఉంది. మునుపటి సంతోషం లేకుండా పోయింది.
ఒకరోజు వినీల ఆఫీసుకు వెళ్లింది. అప్పుడు కుమారి వచ్చి దమయంతి దగ్గర కూర్చుంది.
“అమ్మగారు ఒక మాట చెప్తా. మీ అత్త కో డళ్ళిద్దరూ, తల్లి కూతుర్ల లాగా ఉండేవాళ్లు. ఎందుకు అమ్మ ఈమధ్య ఇలా అయిపోయారు?”అని అడిగింది.
“మీఅమ్మని అడగాల్సింది నన్ను ఎందుకు అడుగుతున్నావ్?”అన్నది దమయంతి.
“నాకు అర్థమైంది ఒకటి ఉందమ్మా! ఈ ఇంటికి ఒక చుట్ట పామే వచ్చింది. దయ్యం లాగా మీ మధ్య ఏదో పెట్టింది. అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వంటింట్లో ఉన్నంతసేపు మీతో ఏదో మాట్లాడేది. తర్వాత మీరు పడుకున్నప్పుడు వినీలమ్మ గదిలోకి వెళ్లి గుసగుసగా చెప్పేది. నాకు ఎలా తెలుసు అంటే, ఒకరోజు మధ్యాహ్నం పనికి వచ్చాను నేను. మీరు పడుకొని ఉన్నారు. ఆ గది ఊడుస్తుంటే ఆమె ఏదేదో చెప్తుంది. అప్పుడే అనుకున్నాను ఈవిడ ఏదో చిచ్చు పెడుతుంది అని ,అదే నిజమైందమ్మ. అలాంటి వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి మీపచ్చని కుటుంబాన్ని అశాంతిపాలు చేసుకోవద్దమ్మ! నేను చదువుకోని దాన్ని. కానీ ఎన్నో ఇళ్లల్లో చూస్తున్నాను మీ ఇంట్లో ఉన్నంత మంచిగా ఎక్కడ ఉండరు .కలిసి ఉండండి అమ్మ”అని చెప్పింది.
దమయంతికి ఒక్కసారిగా విషయం అర్థమైంది.” అవును, ఆ చుట్టం వచ్చినప్పటి నుండి మనశ్శాంతి కరువైంది. ఆమె ఇవన్నీ చెప్పడం వల్లనే కదా నేను ఇలా చేస్తున్నాను” అనుకుంది.
దమయంతి మధ్యాహ్నం పడుకున్నప్పుడు, ప్రత్యేకంగా కుమారి ఇంటికి వచ్చి వినీల గదిలోకి వెళ్ళింది..
“చిన్నమ్మ నేనొక మాట చెప్తాను విను. మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది ఆ చుట్టపామేనమ్మ. పొద్దున పెద్దమ్మకి మీ గురించి ఏదేదో చెప్పేది. మధ్యాహ్నము ఆమె గురించి మీకేదో చెప్పింది. అప్పటినుండి మీ కుటుంబం లో కలతలు మొదలయ్యాయి. మీ ఇద్దరు మీదికి గొడవ పడకున్నా,మనసులో ఏదో దిగులు ఉన్నారు. వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, ఎప్పటిలాగా ఉండండమ్మ,! నా మాట వినండి”అని చెప్పి వెళ్ళిపోయింది.
వినీల కూడా ఆలోచించసాగింది. ఇంత చదువుకొని ఎవరో చెప్పిన మాటలు విని, నేను ఇలా అవడం ఏంటి? వెళ్లి అత్తయ్యను క్షమించమని అడుగుతాను” అని గదిలో నుండి బయటకు వచ్చింది.
అప్పుడే దమయంతి కూడా “నా వయస్సు, నా జ్ఞానం ఏమైపోయింది? ఎవరి మాటనో పట్టుకొని ఇలా అయ్యాను. చిన్నదైనా కోడలికి నేను క్షమాపణ చెప్తాను” అంటూ బయటకు వచ్చింది ఇద్దరూ ఒక్కసారిగా ఎదురుపడ్డారు.
ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరు ముఖాలలో బాధ కనిపిస్తుంది. మాటల్లో ఏమి చెప్పకుండా ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ఒకరి మనసు ఒకరికి అర్థమయిపోయింది ఇద్దరి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. .తేరుకున్న దమయంతి,
“వినీల! మంచి టీ తయారుచేసి తీసుకొస్తాను. నువ్వు లోపలికి వెళ్లే పని చేసుకో”అన్నది దమయంతి.
“మీరెళ్ళి హాల్లో కూర్చోండి. నేనే టీ పెట్టుకుని అలాగే ఏదైనా స్నాక్స్ చేసుకొని వస్తాను”అన్నది వినీల.
సరే ఇద్దరం వంటింట్లోకెళ్లి చేసుకుందాం పద” అంటూ నవ్వుకుంటూ ఇద్దరు వంటింట్లోకి వెళ్లిపోయారు. మాటల్లో చెప్పలేని భావం వాళ్ళ మనసుల్లో కలిగింది. ఇకముందు ఏ చుట్టపు దయ్యాలకి వాళ్లు అవకాశం ఇవ్వలేదు. అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకు ఇద్దరిని చూసి సంతోష పడ్డాడు.
చిట్టి కథ
చైనీస్ బ్యాoబు అని ఒక చెట్టు యొక్క విత్తనం నాటిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎదుగుదల కనిపించదు. కానీ ఓపికగా ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఐదవ సంవత్సరము కూడా ఆ నాటిన విత్తనాలకు నీళ్లు పడుతూ ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక సంవత్సరం చాలా తక్కువ సమయంలో ఆరువారాలలోనే 90 ఫీట్ ఎత్తు ఎదుగుతుంది. చూసేవాళ్ళందరూ దానిని ఆశ్చర్యంగా చూస్తారు. అరే!!!! ఇన్ని రోజులు ఎక్కడేసిన గొంగడి అక్కడ లాగే ఉన్నది ఇది. ఆరు వారాల్లో ఎంత ఎత్తు ఎదిగిపోయింది అని. కానీ చూసే వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అది స్తబ్దుగా ఉంది కాదు కాదు ఉన్నట్లు కనిపించింది కానీ అది ఎంతో గ్రౌండ్ వర్క్ చేసింది. వేర్లను బలంగా భూమిలోకి పాతుకపోయింది. పైన దాని యజమాని ఎంత కష్టపడ్డాడో, అది అంతకు రెట్టింపు భూమిలోనికి పాదుకొని పోయింది. దేనికైనా ఒక సమయం అంటూ వస్తుంది కదా!!!! అదే విధంగా దానికి కూడా సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అలా ఆకాశానికి ఎదుగుతుంది. దాని యజమాని నిరాశ పడి ఇది పెరగట్లేదు అని దానికి నీరు పట్టడం ఆపేస్తే ఆ మొక్క ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉండేదేమో.!!! కానీ ఆయన అలా చేయలేదు .ఐదు సంవత్సరాలు ప్రతిరోజు దానికి నీళ్లు పట్టేవారు .పోషణ అందించేవాడు. యజమాని ఎంత కష్టపడ్డాడో దానికి రెట్టింపు ఆ మొక్క కూడా భూమి లోపల తన పని తాను చేసుకుని అకస్మాత్తుగా అందరు ఆశ్చర్యపడే విధంగా ఆకాశానికి ఎదిగింది.అదేవిధంగా మనిషి కూడా అవకాశం కోసం ఎదురు చూడకుండా అవకాశాన్ని సృష్టించుకుని పనిని కల్పించుకొని నమ్మకంతో మొదలుపెట్టిన పనిని పూర్తి అయ్యేవరకు ఎదురు చూడగలిగితే అది తన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకే మన పెద్దలు అంటారు కష్టేఫలి అని. కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం వండకుండా నోట్లోకి ముద్ద రావాలి అనుకునే అంత మూర్ఖత్వం. నిజాయితీగా కష్టపడితే ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక రోజుఫలితం తప్పకుండా దక్కుతుంది . ఈ ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సినవి ప్రకృతి మనకు నేర్పించేవి చాలా ఉంటాయి. సరిగ్గా శ్రద్ధ పెడితే ప్రకృతిలో కనిపించే ప్రతిదీ మనకు పాఠం నేర్పించేదిగానే కనిపిస్తుంది. తదనుగుణంగా మనం మసలగలిగితే అది మన ఎదుగుదలకు సహకరిస్తుంది. చిట్టి కథ గొప్ప సందేశం. నాకైతే బాగా నచ్చి మీ అందరితో పంచుకోవాలనిపించి రాశాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.
సర్వేజనా సుఖినోభవంతు
డింగ్ డాంగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది.
తలుపు తెరిచిన జయప్రదకి బయట జయసుధ నిలబడి ఉండటం చూసింది.
“ఏంటి జయా! ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు? ఉరుములేని పిడుగులా ” అన్నది నవ్వుతూ.
” లోపలికి రానిస్తావా లేదా?”అంటూ లోపలికి తోసుకొని వచ్చి సోఫాలో కూర్చుంది.
ఫ్రిజ్లో నుండి చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్ తెచ్చి పెట్టింది జయప్రద.
చల్లగా గొంతులో పడ్డాక జయసుధ కాస్త స్థిమిత పడింది.
“ఇప్పుడు చెప్పు. ఈ అకాల ఆగమనానికి కారణం?”అన్నది జయప్రద.
“ఏమీ లేదే, మా అత్తయ్య బాధ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను. ఏంటి ఇల్లంతా చిందరవందరగా ఉంది. అందంగా దమడమ ఇల్లు లాగా ఉంటుంది అనుకున్నాను”అన్నది జయసుధ ముఖం చిట్లిస్తూ.
“ఏంటి అద్దంలా మెరుస్తూ ఉంటుందా? ఎలా ఉంటుంది? పిల్లలు, ఇంటి సభ్యులు అలా పడేస్తూనే ఉంటారు. ఎన్నో పనులు ఉంటాయి. రోజంతా తుడిచినయే తుడవటం కడిగినవే కడగటం చేయలేం కదా!”అన్నది జయప్రద ఆయాసంగా.
” మొన్న వంటింట్లో నేను వంట చేస్తున్నాను. ఇంతలో మా అత్తయ్య పిలిచారు.
తీరా ఎందుకు పిలిచారు, అని వస్తే యూట్యూబ్ లో హోమ్ టూర్లు చేసే వాళ్ళ వీడియోస్ చూపించి, మన ఇల్లు ఇలా ఎందుకు ఉండదు? అని పెద్ద క్లాసు. ఇలా రోజూ నస తో చంపేస్తుంది .ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను”అన్నది జయసుధ.
ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ చప్పుడు అయింది.
తలుపు తీసి చూసిన జయప్రదకు బయట శ్రీదేవి నిలబడి ఉంది.
“ఒసేయ్ శ్రీ, నువ్వేంటే ఇలా వచ్చావు. ఇప్పుడే జయసుధ వచ్చింది”అన్నది నోరు 70mm సైజ్ చేసి.
శ్రీదేవి కూడా లోపలికి వచ్చి కూర్చుంది. మంచినీళ్లు, కూల్ డ్రింక్ తాగింది.
తనది కూడా అదే సమస్య. ఇక్కడ వాళ్ళ ఆయన యూట్యూబ్ వీడియోస్ చూపించి, “నువ్వు అలా ఎందుకు సర్దుకోవు?ఎప్పుడు చూసినా మన ఇంట్లో ఎక్కడివి అక్కడే ఉంటాయి” అని అరుస్తున్నాడు.
“నా సంగతి అంతేనే! మా ఇంట్లో కూడా అదే గోల. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొన్న హోమ్ టూర్ చేసే ఆవిడ..
“ఇది మాహాలు. ఈ సామాను మా అభిరుచికి తగ్గట్టు కొనుక్కున్నామండి. ఇది సోఫా, సోలాపూర్ నుంచి తెప్పించాము. ఆర్డర్ చేసిన నెలకి వచ్చింది.
ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ ఢిల్లీ నుంచి తెచ్చాము. దీన్ని ఇలా నీట్ గా సర్దితేనే నాకు ఇష్టం. ఇదిగో చూసారా దీనిమీద ఫ్రూట్స్ ఇలా బాస్కెట్స్లో అందంగా పెట్టాను. ఈ బాస్కెట్ బాంగ్లాదేశ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను.
ఇదిగో కిచెన్ చూడండి. ఈ డబ్బాలన్నీ ఇలా వరుసగా ఎలా పెట్టుకున్నానో !ఇవన్నీ మా ఆడపడుచు అమెరికా నుంచి పంపించింది. నాకు అన్ని డబ్బాలు నీట్ గా ఉండి, వాటిలో సామాను కూడా సర్దేసి ఉండాలి. కొంచెం డస్ట్ ఉన్నా నాకు అసలు నచ్చదు.
ఇప్పుడు మా బాత్రూంలోకి రండి. టట్టడాయ్! ఎంత బాగుందో చూసారా? అసలు ఎంత పరిమళం! ఎప్పుడు మా బాత్రూం ఇలాగే ఉంటుంది.
ఈ సబ్బులు సబ్బాయి కంపెనీలో ఆర్డర్ చేశాను. ఇదిగో ఈ షాంపు కంపుల సైట్ లో ఆర్డర్ చేశాను.
ఇదేమో వాష్ బేసిన్. అదేమో కమోడ్ దానిమీద కూర్చుంటాం అన్నమాట. మరి మీరు ఎలా కూర్చుంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి”ఇలా ఇల్లంతా చూపించి సొల్లు వాగుతుంది. చివరికి బెడ్ రూమ్ లు కూడా వదలలేదు. ఆమె పెట్టుకునే ఇన్నర్స్ దగ్గర నుండి డ్రాలు ఓపెన్ చేసి చూపించింది.
అప్పటి నుండి మా ఇంట్లో సమస్య మొదలైంది. నువ్వు అస్సలు శుభ్రంగా పెట్టవు అంటూ.
అయితే మీకు ఒక గుడ్ న్యూస్ నేను చెప్పాలి. ఈ హోమ్ టూర్ చేసిన ఆవిడ ఇల్లు ఇదే కాలనీలో ఉందట. మనం ఒకసారి వెళ్లి ఆమె ఎలా పెట్టుకుంటుందో అడిగి వద్దామా”అన్నది జయప్రద.
“నిజమా? ఈ కాలనీలో ఉంటుందా? వెళ్లి కలుద్దాం,ఆమె పేరు డమడమ”అన్నది జయసుధ.
“అయితే మరి వాళ్ళ ఇంటికి వెళితే చూడటానికి పర్మిషన్ ఇస్తుందో! లేదో! ఏం చేద్దాం”అన్నది శ్రీదేవి.
“ఆమె చూడటానికి కూడా చాల అందంగా ఉంటుంది”అన్నది జయప్రద.
“ఆమె కోసం కొన్ని గిఫ్ట్ లు కొనుక్కొని వెళ్దాము. ఉత్త చేతులతో వెళ్తే బాగుండదు” అని అనుకోని, ముగ్గురు షాపులో ఖరీదైన గిఫ్ట్ లు కొనుక్కొని, వాళ్ళ ఇంటికి వెళ్లారు. గేటు దగ్గర ఎవరూ లేరు. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే, యూట్యూబ్ లో చూపినంత అందంగా ఏమీ లేదు. ఎక్కడి చెత్త అక్కడ పేరుకొని ఉంది. యూట్యూబ్లో వీడియో లో చూపించినప్పుడు, అందమైన పెద్ద రంగు రంగుల ముగ్గు కనబడింది. ఇప్పుడు కనీసం పాచి ఊడ్చినట్లు కూడా లేదు.
చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. నీళ్లు పోసి ఎన్ని రోజులు అయిందో తెలియదు. యూట్యూబ్లో చూపించినప్పుడు మాత్రం రకరకాల పువ్వులు కనిపించాయి. అన్ని ఆర్టిఫిషియల్ గా పెట్టినట్లు ఉంది.
బెల్ కొట్టగానే ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. మురికి పట్టిన పాత నైటీ, ముఖమంతా ముడతలు, జుట్టంతా రేగిపోయి ఉంది.
“ఎవరు కావాలి” అని అడిగింది.
“డమడమ గారు కావాలండి”అన్నారు ముగ్గురు.
“నా పేరు డమడమ మీరు ఎందుకు వచ్చారు”? అని అడిగింది.
ముగ్గురు షాక్ తిన్నారు. ఈమె ఏంటి ఇలా ఉంది? ఎంతో అందంగా ఉంటుంది కదా వీడియోలో” అని అనుకొని మనసులో భావాలు బయట కనబడకుండా నవ్వుతూ..
“మీరంటే మాకు చాలా ఇష్టం. మీ వీడియోస్ చూస్తూ ఉంటాము. మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాము. అని గిఫ్ట్ లను చూపించారు.
అవి చూడగానే నోరు తెరిచి పార పండ్లతో నవ్వింది.
లోపలికి రమ్మని పిలవగానే వెళ్లి సోఫాలో కూర్చున్నారు.
అందంగా ఉండనుకున్న ఆ ఇల్లు భయంకరంగా ఉంది. సోఫాలో కుక్క పడుకుని ఉంది .కుక్క జుట్టు అంతా సోఫాల నిండా ఉంది. ఇల్లంతా దుమ్ము .ఎక్కడ సామాను అక్కడే ఉంది. అందంగా కనిపించే ఉయ్యాలలో బట్టల మూట కనిపించింది.
యూట్యూబ్లో అందంగా కనిపించే ఆ ఇల్లు బూత్ బంగ్లా లాగా ఉంది.
ముగ్గురు ముఖా ముఖాలు చూసుకున్నారు.
“డమడమ గారు! మీ ఇల్లు చూడవచ్చా?”అని అడిగారు.
“దానికేమి భాగ్యం రండి” అని లోపలికి తీసుకెళ్ళింది.
ఘోరాతి ఘోరమైన ఆ ఇంటిని చూడలేకపోయారు. వంటిల్లు అయితే చెప్ప తరం కాదు .అక్కడి వంట ఎవరు తిన్నా, తిన్నగా హాస్పిటల్ కి వెళ్లడమే.
హాల్లో ఉన్న వాష్ బేసిన్ నిండా మరకలు నిండి అసహ్యంగా ఉంది. ఇక బాత్రూం ఏ లెవెల్ లో ఉంటుందో అనుకున్నారు.
“టీ పెడతాను. అక్కడి నుండి నాకోసం వచ్చారు మీరు”అన్నది డమడమ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ లని ఊహించుకొని.
“వద్దు వద్దు” అని ముగ్గురు ఒకటేసారి అరిచారు.
మేము ఇక వెళ్తామండి. చాలా థాంక్స్ మీ అందమైన ఇల్లు చూపించినందుకు. అలాగే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు” అని చెప్పి ఉరుకుల పరుగుల మీద జయప్రద ఇంటికి వచ్చి పడ్డారు.
“ఆ ఇల్లు ఏంటి అంత చెండాలంగా ఉంది? ఒక్కసారి మనవాళ్ళకి చూపిస్తే అర్థం అయ్యేది. యూట్యూబ్లో చూపించేదంతా నిజం కాదని? అయినా 24 గంటలు అద్దంలా పెట్టుకోవడం ఎవరికైనా కుదురుతుందా? పిల్లలు ఉన్న ఇంట్లో సామాను కుదురుగా ఉంటుందా? వీలైనంతవరకు శుభ్రంగా అమర్చుకుంటాము. మన ఇళ్లే నయం ఆమె ఇంతకన్నా.క అద్దంలా పెట్టుకోవడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా? ఎవరి ఇల్లు అయినా ఓ మోస్తారు గా ఇలాగే ఉంటాయి. మన వాళ్ళకి ఒకసారి ఆ ఇల్లు చూపిద్దాము. అప్పుడు గాని నోళ్లు మూసుకోరు”అని ముగ్గురు అనుకున్నారు. కాకపోతే వారికి ఒక సంతృప్తి మిగిలింది. యూట్యూబ్ లో చూపించే ఇళ్ళు నిజంగా రోజంతా ఇలా ఉండవని.
ఇంట్లో వాళ్లకి ఈ విషయం ఎలా చెప్పి కన్విన్స్ చేయాలని ముగ్గురు ఆలోచించనలో పడ్డారు.
ఈ మధ్య ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టడం, ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది కదా! అని తలబాదుకున్నారు ముగ్గురూ!!
మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? ఉండరు కాక ఉండరు. దేవుడికి కూడా ఇష్టమైన పండు మామిడి పండే. కావాలంటే రోజు ఒక పండు నైవేద్యం పెడతారు కదా? మామిడిపండు పెట్టిన రోజు మందిరంలో ఉన్న దేవుడి ముఖం చూడండి. ఎప్పుడు తినాలి అన్నట్టు ఉంటారు స్వామి. అదన్నమాట మామిడిపండు మహిమ.
మామిడి పండు అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలియా లంటే ఈ మామిడిపండ్లు ఏం మాట్లాడుతున్నాయో వినండి!
ఒక తోటలో బోలెడన్ని మామిడి చెట్లు ఉన్నాయి. అందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు కాసిన కాయలు ఇలా మాట్లాడుకుంటున్నాయి.
“మనము ఇప్పుడే పిందెలుగా మారాము. ఇప్పటి నుండే మనకు కష్టాలు మొదలు”అన్నది బంగి నపల్లి.
“అవునే! కసి పిందెలమని కూడా చూడకుండా, కసా కసా కోసి, ఉగాది పచ్చడితో మొదలుపెడతారు. తర్వాత కోసి ఉప్పు కారం పెట్టుకొని ఓ కన్ను మూసుకొని, ఓ కన్ను తెరిచి లొట్టలు వేసుకుంటూ తింటారు”అన్నది తోతాపురి.
“ఏంటో నే సంవత్సరానికి ఒకసారి వస్తామా? మనల్ని పీల్చి పీల్చి పెడతారు ఈ మనుషులు”అన్నది రసాలు.
“పిందే నుండి కాయగా మారుతామా! అప్పటినుండి మొదలు లేతావకాయ అని రోజు ఉప్పు, కారం వేసి మనల్ని ముక్కలుగా తరిగి, వాటిని ఊరబెట్టుకొని రోజు వేడన్నంలో తింటారు”అన్నది మల్లిక.
“ఇంకా ముందుంది! కాయ పాకం పట్టిన తర్వాత ఇక అసలైన ఆవకాయలు మొదలు. ముక్కలు కొట్టి రకరకాల ఆవలు పెట్టుకుంటారు. వాళ్ల ముఖాలు మండ! ఒళ్లంతా మంట పుడుతుంది. ఆ కారంతో సంవత్సరం పొడుగునా ఆ జాడీలల్లో మనల్ని మగ్గబెడతారు”అన్నది నూజివీడు.
“ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్లీ కాయలు మిగిలాయని, తొక్క తీసి ఉప్పు కారం చల్లి, ఎండలో పెట్టుకుని సంవత్సరమంతా తింటారు”అన్నది రసాలు.
“ఇవన్నీ అయిపోయాక అసలు ముచ్చట ఉంటుంది. మనల్ని తీసుకెళ్లి ఓ రూమ్ లో పడేసి, ఆకులు కప్పేసి తలుపులు గట్టిగా బిగించి పెట్టేసి, మగ్గబెడతారు .అసలు ఊపిరాడుతుందా”అన్నది ఆల్ఫాంజా.
“నాలుగు రోజుల తర్వాత తలుపులు తీసి, మెత్తబడ్డ మనలని గొర గోరా తీసుకొని వచ్చి ,నీళ్లలో పడేస్తారు” అన్నది దశేరి.
“ఆ తరువాత చక్కగా వేడి అన్నం కంచాలలో వడ్డించుకుని, మనతోనే పెట్టుకున్న ఆవకాయను వేసుకొని, మనల్ని పిండి తింటారు. లొట్టలేసుకుని వాళ్లు తింటుంటే నాకైతే చిరాకు వస్తుంది” అన్నది కేసరి.
“అదంతా సరే ఎన్ని పండ్లను తిన్నా వీళ్ళకు అగడు తీరదా? వత్తి వత్తి రసమంతా పీల్చేస్తారు కదా? అయినా వాళ్లకు తనివి తీరదు. పీచును పట్టి చీకేసి ,నాకేసి గట్టిగా కొరికేస్తుంటే ఒ ళ్ళంతా నొప్పులు. వీళ్ళకి ఏం పోయేకాలం ?అన్ని పండ్లు తిన్న కడుపునిండదా “అన్నది సువర్ణ రేఖ.
“నన్నయితే వాళ్ళ పిల్లలు బయట అరుగు మీద కూర్చొని, నా లోపల ఉన్న పీచుని అసలు నేనేనా అనిపించేంత ఘోరంగా మార్చివేశారు .తెల్లగా అయిపోయింది. జుట్టంతా పోయింది. ఇంకా నాకుతూనే ఉన్నారు. పిల్లలా పిశాచాలా?”అన్నది నీలం.
ఇలా పండ్లన్ని వాళ్ళ బాధలు చెప్పుకుంటూనే ఉన్నాయి.
“మరి మనమంతా ఏం చేద్దాం? మన బాధకు విముక్తి లేదా?”అని బాధ పడ్డాయి.
అందులో నుండి ఒక మామిడికాయ చెప్పింది “మనం బ్రహ్మ దగ్గరికి వెళదామా? మన సమస్యకు పరిష్కారం అడుగుదాము. అందర్నీ పుట్టించింది ఆయననే కదా?” అన్నది.
“వద్దు, వద్దు పోయినసారి మన చాయ గిన్నె ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అటు ఉంచు ,మళ్ళీ ఆ గిన్నెలో చాయ్ పెట్టమని అడిగాడు.( నా కథ చాయ్ గిన్నె లో )”అన్నది మరో మామిడి.
“పోనీ ఈసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాము”అని అన్ని అనుకొని మామిళ్ళన్ని కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాయి.
హాయిగా పాలసముద్రంలో శేష శాయి పై పడుకొని లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతుంటే, కళ్ళు మూసుకొని ఇళయరాజా గారి పాటలు వింటున్నాడు. మామిళ్ళు మెల్లగా వైకుంఠపురం చేరుకునేసరికి మామిడిపండ్ల వాసన స్వామికి విపరీతంగా వచ్చింది.
“లక్ష్మి! చక్కని మామిడి పండ్ల వాసన వస్తున్నది .ఎక్కడ నుండి?”అన్నాడు కళ్ళు తెరిచి.
“ఏమో స్వామి నాకు కూడా వచ్చుచున్నది”అన్నది లక్ష్మి పాదాలు వత్తడం మానేసి.
ఇంతలో మామిళ్లన్ని కట్ట కట్టుకొని విష్ణుమూర్తి చెంతకు చేరాయి.
అన్ని మామిళ్ళను ఒక్కసారి చూడగానే విపరీతమైన ఆశ్చర్యం వేసింది విష్ణుమూర్తికి. లక్ష్మీదేవి కూడా అపురూపంగా చూడ సాగింది.
“ఏంటి ఇలా వచ్చారు”అని స్వామి అడిగాడు.
“ఏం చేయమంటారు స్వామి !మా కష్టాలు ఎలా చెప్పమంటారు? సంవత్సరానికి ఒకసారి కాస్తామా? మమ్మల్ని ఈ మనుషులు పీక్కొని తింటున్నారు. రకరకాలుగా మమ్మల్ని హింసిస్తున్నారు. ప్రతి వంటలో వాడుతున్నారు .పప్పని, ఉప్పని ఇలా అన్నింట్లోనూ మమ్మల్ని వేసేస్తున్నారు. అదీ గాక సంవత్సరం పొడవున నిలువ కూడా ఉంచుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? మా సమస్య తీర్చండి స్వామి”అంటూ మామిడిలన్నీ మొరపెట్టుకున్నాయి.
“ఆహా కమ్మటి సువాసన వస్తుంది”అంటూ లక్ష్మీదేవి వైపు తిరిగాడు.
“వాళ్ళు ఏదో చెప్తున్నారు. నాకైతే ఏమీ వినపడటం లేదు. నువ్వు వెళ్లి ఒక డజన్ పూరీలు చెయ్యి. అందులోకి ఈ మామిడి పండ్లను రసం చేసి పెట్టు. నేను రాత్రికి మామిడిపండ్ల రసం నంచుకుంటూ పూరీలను తింటాను. ఇంతకు వాళ్ళు వచ్చిన పని ఏంటో అడుగు. నాకు నిద్ర వస్తుంది “అంటూ కళ్ళు మూసుకొని పడుకున్నారు.
లక్ష్మీదేవి మెల్లగా లేచి..
“స్వామి ఏమంటున్నారో విన్నారు కదా! స్వామికి రాత్రి నైవేద్యం మీతోనే రండి మరి” అని దగ్గరికి రాసాగింది.
అంతే! మామిడిలన్నీ కట్టకట్టుకొని ,మనకి ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. పదండి మన కర్మ ఇంతే !మానవులకు పంటికింద ఆహారమై ఉండవలసిందే. ఇప్పుడు స్వామి కూడా మనల్ని ఆరగిస్తే,మన జాతులు మళ్లీ చిగురించవేమో! పదండి పోదాం”అంటూ పరిగెత్తి భూలోకం కి వెళ్ళిపోయాయి.
“అమ్ములు! లే నాన్నా! ఈరోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. తొందరగా లేచి తయారు కావాలి తల్లి” అంటూ ఒక గంట నుండి లేపుతుంది అమ్ములు తల్లి శాంత.
ఈ అమ్ములు అనబడే సుకుమారి 25 ఏళ్ల పాపాయి. అతి కష్టం మీద బీటెక్ పూర్తి చేసి, తనకి వచ్చిన ర్యాంక్ కి ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, అని నిశ్చింతతో ఇంట్లో ఓటిటిలో వచ్చిన సినిమాలన్నీ చూసేస్తూ, వెబ్ సిరీస్ ను నమిలేస్తూ, తల్లి చేసిన వంటకాలన్నీ మింగేస్తూ, శరీరాన్ని పెంచేస్తూ అలా ఇంట్లోనే సెటిల్ అయ్యింది.
ఇక పెళ్లి చేయాలి అని తలచిన తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ లో సంబంధాలు చూస్తున్నారు. ఫోటోల్లో ఈ సుకుమారి రూపం చూసి 90% మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు.
చివరికి ఒక సంబంధం వచ్చింది. వాళ్లే అమ్ములును ఈరోజు చూసుకోవడానికి వస్తున్నారు. పెళ్ళికొడుకు డాక్టర్. చదువు ధ్యాసలో పడి పెళ్లి విషయాన్ని మర్చిపోయాడు. అందులో డాక్టర్ వృత్తి బిజీగా ఉంటుంది కదా! చివరికి ఇంట్లో బామ్మ 4 మొట్టి కాయలు వేస్తే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అతనికి కూడా ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు. ముదురు టెంక అయ్యాక ,లేత టెంకలు ఎలా దొరుకుతారు? ముందు అందమైన అమ్మాయిలను చూస్తే, వాళ్లంతా రిజెక్ట్ చేశారు. చివరికి ఎవరైనా సరే అనేసి ఈ అమ్మాయి చూడటానికి ఒప్పుకున్నాడు.
“అమ్ములు! లేచావా”?
“ఆ లేచాను కాపీ ఏది”అన్నది బెడ్ మీద అలాగే కూర్చుని.
“ఇదిగో చూడు తీసుకొచ్చాను” అని ట్రై లో కాఫీ దానితో పాటు 6 బిస్కెట్స్, కొంచెం బూందీ తెచ్చి పెట్టింది.
అదంతా చూస్తున్నా తండ్రి బక్కారావు కి( సార్ధక నామధేయుడు) ఒళ్ళు చిలచిర లాడసాగింది.
“అసలు దీని వాలకం ఏంటో అర్థం కావడం లేదు. మంచం మీద నుండి సోఫాలోకి సోఫాలో నుండి బాత్రూంలోకి వెళుతుంది. అంతకుమించి నాలుగు అడుగులు ఎక్కడికి వేయదు. దీని పెళ్లి అయితే ఎన్ని సమస్యలు తెచ్చి పెడుతుందో! అందుకు తోడు ఈ శాంత ఒకటి ఎప్పుడూ దాన్ని మేపుతూనే ఉంటుంది. ఒక్క పని చెప్పదు”అనుకున్నాడు స్వగతంగా .పైకి అంటే ఇంకేమైనా ఉందా? తల్లి కూతుర్లు ఆయుధాలు లేకుండా యుద్ధానికి వచ్చే లాగా ఉంటారు. గతాన్ని మరవని బక్కా రావు మాట నోట్లోనే కుక్కుకున్నాడు.
“అమ్మ ఈరోజు స్వీట్ పెట్టలేదు”అని అరిచింది.
“ఈరోజు పెళ్లిచూపులు కదా! స్వీట్ తింటే ఇంకా లావుగా కనిపిస్తావు. కొంచెం స్లిమ్ గా ఉందాలి. ఈ మాత్రం తిను తల్లీ! వాళ్ళు వెళ్ళాక బోలెడు స్వీట్స్ మిగిలిపోతాయి. అవన్నీ నువ్వే తిను”అన్నది శాంత బుజ్జగిస్తూ.
“నువ్వెప్పుడూ ఇంతే! అడిగింది ఏది పెట్టవు”అన్నది మూతిని పిడకలా చేసుకుని. లక్క పిడత కాదండి బాబు పిడకనే.
పెద్ద మగ్గునిండా కాఫీ జురా జురా జుర్రుకుంటూ తాగేసింది. మధ్య మధ్యలో పెద్ద చప్పుడు వచ్చేలా బిస్కెట్లు, బూందీ తింటూ టీవీ ముందర సెటిల్ అయింది.
శాంత బ్రేక్ ఫాస్ట్ తేవడానికి హడావుడిగా ఉంది.
“అమ్ములు స్నానం చేసి రా! నీకు టిఫిన్ పెడతాను ఇప్పటికే 11 అయ్యింది మళ్లీ లంచ్ తినాలి. ఆ తర్వాత పెళ్లి వాళ్ళు వస్తారు. నువ్వు రెడీ కావాలి కదా”? అన్నది గారాబంగా.
“టీవీ కూడా ఎక్కువసేపు చూడని వ్వరు”అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది అమ్ములు.
అక్కడే ఉన్న తండ్రికి మనసులో రకరకాలుగా ఉంది. ఏ రకంగా ఉన్నా ఏమీ చేయలేడు అర్భకప్రాణి.
స్నానం చేసి ఒక నైటీ దిగేసుకుని వెంటనే వచ్చి సోఫాలో కూర్చుంది. కుయ్యో మని సోఫా సౌండ్ వచ్చింది. ఆ సోఫాకి మాటలొస్తే బండ బూతులు తిట్టేదేమో?
ఇంతలో శాంత ఒక ప్లేట్ లో నాలుగు వడలు, 4 ఇడ్లీలు, పచ్చడి సాంబారు పెట్టుకొని తీసుకొని వచ్చి, అమ్ములు ముందర ఉన్న టీపాయ్ మీద పెట్టింది.
“నాకు ఇడ్లీ వద్దు. ఆ ఇడ్లీలు తీసేసి దాని బదులుగా మరొక ఆరు వడలు పెట్టేసేయ్”అన్నది సుకుమారి అమ్ములు.
“అలాగే కన్నా” అంటూ ఆరు వడలు తెచ్చి ప్లేట్లో వేసి ఇడ్లీలు తీసేస్తుంటే,
“వద్దులే అమ్మ !ఇడ్లీలు ఆరోగ్యానికి మంచిది కదా! మధ్య మధ్యలో నంచుకుని తింటాను”అన్నది అమ్ములు ప్లేటు మీదకి దాడి చేస్తూ.
వేడివేడి వడలు తింటుంటే చెమట పట్టసాగింది. అమ్ములుకు లేచి ఫ్యాన్ వేసుకునే ఓపిక ఎక్కడిది? వెంటనే అటు పక్కకు వెళ్తున్న నాన్నను చూసి,
“నాన్న నాకోసం నువ్వు ఒక్క పని కూడా చేయవు? ఫ్యాన్ వేసి వెళ్ళు”అన్నది తండ్రిని కొర కొరా చూస్తూ.
“లేచి ఫ్యాన్ వేసుకుంటే, ఇంకో రెండు వడలు ఎక్కువ పడతాయి కడుపులో. అందుకే నేను వేయలేదు. లేచినప్పుడు ఫుడ్ కిందకి వెళ్తుంది. “అన్నాడు మనసులో కోపాన్ని దాచుకొని.
“లంచ్ లో అలాగే చేస్తాను. ఇప్పుడైతే ఫ్యాన్ వేసి వెళ్ళు”అన్నది పెద్ద పెద్ద వడలను నోట్లో పెట్టుకుంటూ.
“కర్మ కర్మ “అని తిట్టుకుంటూ ఫ్యానేసి వెళ్ళాడు బక్క రావ్.
ఇలా అమ్ములు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అయ్యేసరికి మూడున్నర అయ్యింది.
“ఇక చీర కట్టుకో తల్లి. అదిగో ఆ గదిలో చీర, నగలు అన్ని పెట్టాను”అన్నది శాంత.
“వెబ్ సిరీస్ చూస్తున్నాను. నాకు డిస్ట్రబ్ అవుతుంది. నేను టీవీ చూస్తుంటాను .నువ్వు నాకు చీర కట్టేసేయ్”అన్నది అమ్ములు.
అమ్ములు కి చీర కట్టే ప్రయత్నంలో ఉన్నది శాంత. ఆరు గజాల చీరకు రెండు కుచ్చిళ్ళు కూడా రాలేదు. జాకెట్ మోచేతుల వరకు కూడా ఎక్కలేదు. యుద్ధ ప్రాతిపదికన బ్లౌజ్ కుట్లని వి, చీరకు రెండు మీటర్ల బట్టను జాయిన్ చేసి చీర కట్టింది శాంత. లాంగ్ చైన్ కాస్త మెడకు బిగుతుగా సరిపోయింది. గాజుల అవస్థ చెప్పలే ము.
మొత్తానికి పెళ్లి చూపులకు తయారైంది అమ్ములు.
“అబ్బాయి ఫోటో చూసావా? అమ్ములు”అని తండ్రి అడిగాడు.
“చూసానులే నాన్న.ఎలా ఉంటే ఏంటి? వాళ్ళింట్లో టీవీ ఉంటే చాలు.వంటకి వంటమనిషి ఉందో లేదో అడగాలి” అన్నది నాలుగు చిప్స్ నోట్లో వేసుకుని.
తల కొట్టుకుని బయటకు వెళ్ళాడు బక్క రావ్
సాయంత్రం నాలుగు గంటల సమయంలో పెళ్లి వారు వచ్చారు. పెళ్ళికొడుకు, అతని తల్లిదండ్రులు.
పెళ్ళికొడుకుని పరిశీలించాడు బక్క రావ్.
తల మొత్తం రాజస్థాన్ ఎడారిలా ఉంది. ఎండకు ఇసుక మెరిసినట్లు గుండు మెరుస్తుంది. వెనుకకు ఉన్న నాలుగు వెంట్రుకలను జాగ్రత్తగా దువ్వి ముందరికి వేసుకున్నాడు.
ఇంట్లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ గా తిరుగుతుంది. పెళ్ళికొడుకుకు భయమేసింది. ఆ ఉన్న నాలుగు వెంట్రుకలు మళ్లీ వెనక్కి వెళ్ళిపోతే గుండోదయం అవుతుందని.
లోపలికి రావడంతోటే..
“కాస్త ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తారా? నాకు ఫ్యాన్ గాలి పడదు”అన్నాడు గడప దగ్గరే నిలబడి.
బక్కరావు వెళ్లి ఫ్యాన్ స్పీడ్ తగ్గించి, వాళ్లను కూర్చోమని చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
శాంత లోపలి నుండి నోటిని సెవెంటీ ఎంఎం సైజ్ చేసి, పారల్లాంటి పళ్ళతో నవ్వుకుంటూ వచ్చి, మంచినీళ్లు అందించింది.
వాళ్లు నీళ్లు తాగే ప్రయత్నంలో ఉండగా, పెళ్లికూతురుని బయటకు తీసుకొని వచ్చారు.
“అమ్ములు ముందు చిప్స్ ప్యాకెట్ లోపల పెట్టు. తర్వాత తిందువు గాని”అని బలవంతంగా చిప్స్ ప్యాకెట్ మంచం మీద పడేయించి, బయటకు తీసుకొని వచ్చింది.
బయటకు వచ్చిన అమ్ములు వాళ్ళందర్నీ తేరిపార చూసింది. పెళ్ళికొడుకు ఎవరో అర్థం కాలేదు.
బక్కరావు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మరియు పెళ్ళికొడుకును పరిచయం చేశాడు.
“అదేంటి మామగారు అనుకున్నాను. పెళ్లికొడుకా? ఎలా ఉంటే ఏముందిలే! సంపాదన బాగానే ఉంది కదా” అనుకుని తనకోసం వేసిన స్పెషల్ సోఫాలో కూర్చుంది. సోఫా స్క్రీగ్స్ కుయ్యో మొర్రో అంటూ మరొకసారి అరిచాయి.
“మా అమ్మాయిని ఎండ కన్నెరుగకుండా పెంచాం బాబు” అన్నది శాంత.
” నీ మొహం! ఎండ తగలకుంటే డి విటమిన్ తగ్గి సమస్యలు వస్తాయే పిచ్చి ముఖమా!” అనుకున్నాడు పెళ్లి కొడుకు బట్ట తలని నిమురుతూ.
” ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు” అన్నాడు బట్టా రావు( పెళ్లి కొడుకు).
“వాళ్ళమ్మ వండి పెడితే వేస్టే కాకుండా తిని పెడుతుంది అంతే” అన్నాడు అక్కసుగా బక్కా రావు.
శాంత ఉరిమి చూసింది. ఆ చూపుకే చలి జ్వరం వచ్చినట్లు వణికి ఎవ్వరూ చూడకుండా చెంపలు వేసుకున్నాడు.
“తినడం కాదు, ఉద్యోగం చేస్తుందా” అని అడిగాను.
“లేదండీ, అమ్మాయి ఉద్యోగం చేస్తే సినిమాలు, సిరీస్ లు ఎవరు చూస్తారు? మరీ ఇలా అడగటం బాగో లేదండీ” అన్నాడు బక్కారావు శాంత ఉరుము మరచి పోయి.
తల బాదుకున్నాడు బట్టా రావు. నెత్తి మీద గుప్పెడు జుట్టు లేదని మరచిపోయి. తల మంట పుట్టి కెవ్వు మనే అరుపు నోట్లో కుక్కేసుకున్నాడు.
“మా అమ్మాయిని కాలు కందకుండా పెంచాం” అన్నది శాంత.
“కాళ్లకు ఒత్తిడి కలగాలని మేము ఆక్యుపంచర్ చెప్పులను వాడమని అంటున్నా ము, చెప్పులు లేకుండా నడవాలని చెప్తున్నాము. ఈమె కాళ్లు కందకుండా పెంచారట. అసలు బిడ్డను పెంచుతుందా పిల్లి పిల్లని పెంచుతుందా? ఎందుకంటే అవి వాటి పనులు అవి చేసుకోలేవు. కానీ ఈ పిల్ల మనిషి కదా! అయినా నా పిచ్చి గానీ ,రూపం చూస్తే అర్థం కావట్లేదా ఓన్లీ తినడానికి పుట్టిందని?”అని మనసులో గులుగుకొని ఓ పిచ్చి నవ్వు నవ్వాడు బట్టా రావు.
ఇంతలో శాంత రకరకాల టిఫిన్లు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. అమ్ములు చూపంత ఆ టిఫిన్ మీదనే ఉంది. మొహమాటానికి పెళ్లి కొడుకు వాళ్ళు ఏమి తీసుకోలేదు.
ఆగలేకపోయిన అమ్ములు చటుక్కున నాలుగు జిలేబీలు అందుకున్నది.
బక్కరావుకు ఒళ్ళు మండుతున్నది. శాంత కళ్ళతో సైగ చేసింది. కానీ ఆ సైగలు ఏమి పని చేయలేదు. జిలేబి రసం కారుతుంటే కుక్కుకొని తింటూనే ఉంది అమ్ములు.
పాపం బట్ట రావు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. “అసలే కొడుకుకు వయసు పెళ్లీడు దాటింది. ఇప్పుడు ఈ అమ్ములు అనే శాల్తి ని చేసుకుంటే, జీవితాంతం నేను వంటగదికే అంకితం అవుతాను. తండ్రి సామాన్లు తేవడానికి సరిపోతాడు. కొడుకు మందులు ఇవ్వడానికి సరిపోతాడు. ఈ సంబంధం కొడుకు ఒప్పుకోకుండా ఉంటేనే బాగుంటుంది. పెళ్లి కాకున్నా సరే” అని పాత దేవుళ్ళు కొత్త దేవుళ్ళు అందరినీ తలుచుకుంది బట్ట రావు తల్లి బిక్కమ్మ.
బట్ట రావు ను చేయితో గోకింది. అతని ముఖంలోకి అమాయకంగా చూసింది బిక్కమ్మ.
భుజాలు వాల్చి కూర్చున్న తండ్రిని చూశాడు బట్టా రావు. ముఖమంతా పీక్కొని పోయి కొడుకు సమాధానం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయోమయరావ్.
ఇంతలో జూస్ తెచ్చింది శాంత. అందరూ గ్లాసులు అందుకున్నారు. అమ్ములు సీసా ఎత్తి తాగసాగింది. ఒక పక్క టీవీ చూడాలని మనసులో ఉంది.
ఇక బట్టా రావు ఆగలేక చేతిలో ఉన్న గ్లాస్ టప్పుమని శబ్దం వచ్చేలా టీపాయ్ మీద పెట్టి.
అమ్మ, నాన్న వెళ్లి కార్లు కూర్చోండి అన్నాడు.
జీవితమంతా రోగులకు సేవ చేస్తాను. కానీ నాకు ఈ అమ్ములు వద్దు. భవిష్యత్తు లో సొమ్ములు వద్దు. అంటూ ఉన్న నాలుగు వెంట్రుక పోచలను వెనక్కి తోసి పరిగెత్తాడు.
అమ్ములు హాయిగా సిరీస్ చూస్తూ చిప్స్ లాగించ సాగింది.
బక్క రావు బిక్కు బిక్కు మంటూ నిలబడ్డాడు.
శాంత అశాంతంగా లోపలికి వెళ్ళింది.
ఉదయం 7 గంటలు అవుతోంది. ఫోను అదేపనిగా మోగుతున్నది. ఇండియా నుండి ఆంజనేయ శాస్త్రి కాల్.
“హలో మామయ్యా! బాగున్నారా? ఏంటి విషయాలు?” అడిగాడు అమెరికాలో ఉన్న ‘భారవ్’ అలియాస్ భార్గవరామ శర్మ.
“నాయనా! నిన్న గుడికి గర్భాలయం కట్టడం పూర్తి అయిందో లేదో! ఇవాళ పొద్దటి నుండి ఆగకుండా వాన పడుతోంది. ఇప్పుడు మాకు రాత్రయింది కదా! ఇంకా కురుస్తూనే ఉంది. వరస చూస్తుంటే తగ్గేటట్టు అనిపించడం లేదు. అంతా ఆ అమ్మవారి దయ. ఆనందంతో చెప్పుకుపోతున్నాడు ఆంజనేయ శాస్త్రి.
“వాట్! ఎంత శుభవార్త చెప్పారు. ఇక మన ఊరి కష్టాలు తీరినట్టే మామయ్యా! గుడి పనులు మొత్తం పూర్తి చేయించండి. ఇంకా ఎంత కావాలో చెప్పండి.
డబ్బులు వెంటనే పంపిస్తాను” అన్నాడు పొంగిపోతూ భార్గవరామశర్మ.
“ఇదంతా నీ వల్లే నాయనా! పుట్టిన ఊరి ఋణం తీర్చుకుంటున్నావు” అన్నాడు శాస్త్రి.
“ఇట్లాంటి మాటలతో నన్ను సిగ్గుపడేలా చేయకండి మామయ్యా! ఇప్పటికే నేను చేసిన దానికి కృంగిపోతున్నాను”
“ఆ అమ్మవారు నీ హృదయంలో ప్రవేశించి నిన్ను ఇంతటి పని చేయిస్తున్నది. ఇంతకంటే మనకేం కావాలి? పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు పూర్తయినట్టే. వార్షికోత్సవం సమయానికి ప్రతిష్ఠ జరగాల్సిందే. ఇప్పటికైనా మీ తండ్రి ఆత్మ శాంతిస్తుంది. సరే నాయనా! ఉంటాను” అని ఫోను పెట్టేశాడు ఆంజనేయశాస్త్రి.
********* ********* *******
నేలపల్లి ఊరు. ఎప్పుడూ సస్యశ్యామలంగా ధాన్యాలు కుప్పబోసిన రాశిలా నిండుగా నవ్వుతూ ఉండేది. ఊరిప్రజలు అరమరికలు లేకుండా ఎదుటివారి
కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు.
ఆ ఊళ్ళో పురోహితుడు నరసింహశర్మ. ఆయన ఆ
ఊళ్ళో శ్రీరాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని కట్టించాడు. పురోహితుడు అనే పదానికున్న అర్థాన్ని సార్థకం చేస్తూ ఊళ్లోని బాగోగులను పట్టించుకునేవాడు. ఊరి పెద్దలు కూడా ఏ చిన్న సమస్య అయినా ఆయనతో చర్చించేవారు.
గుడి చిన్నదే. కానీ చుట్టూ విశాలమైన ఆవరణ. రావి, వేప కలిసి ఉన్న నీడనిచ్చే పెద్ద చెట్టు ఉండేవి. శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు జరిగేవి. వచ్చే భక్తులకు అన్నదానం కూడా చేసేవారు. రైతులు తాము పండించిన పంటల్లో కొంతభాగాన్ని ఆలయానికి సమర్పించేవారు. పాడిసంపద ఉన్నవాళ్లు ఉత్సవాల సమయంలో పాలు, పెరుగు, నెయ్యి కావలసినంత ఇచ్చేవాళ్ళు.
ఇక గుడి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. చుట్టుపక్కల ఊళ్ల నుండి ఎంతోమంది
వచ్చేవారు. పూజా కార్యక్రమాలతో పాటు హరికథా శ్రవణం, ఒగ్గుకథలు, ఎడ్లబండ్ల పూజలు, అగ్నిగుండాలు, రథోత్సవం ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణలు. సంగీత, నాట్య కళా ప్రదర్శనలు కూడా రసజ్ఞులను అలరించేవి. ఆ సమయంలో వాటిని చూడడానికి జనం విరగబడేవారు. బొమ్మల షాపులు, తినుబండారాల బండ్లు, గారడీ ప్రదర్శనలు, కనికట్టు మాయాజాలాలు ఒకటేమిటి? విద్యుద్దీపాలతో రాత్రుళ్ళు కూడా పట్టపగళ్లయ్యేవి.
నరసింహ శర్మకు ఒక్కడే కొడుకు భార్గవరామశర్మ.
అందరిలాగే కొడుకును పెద్ద చదువులు చదివించి, విదేశాలకు పంపాలన్న కోరిక వేల కిలోమీటర్ల దూరంతో పాటు దగ్గరకు రాలేనంతగా మనసునూ దూరం చేసింది.
చదువుకొని ఉద్యోగరీత్యా వెళ్లినవాడు తండ్రి శ్రీరాముని మీద భక్తితో పెట్టిన పేరును కూడా ‘భారవ్’ అని స్టైల్ గా మార్చుకున్నాడు. అది తండ్రికి మరింత భారంగా తోచింది. తనతో చదువుకుంటున్న అమ్మాయి సౌమ్యను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు ‘భారవ్’. అప్పుడో ఇప్పుడో ఒక ఫోన్ కాల్ అంతే. తండ్రి ఫోన్ చేసినప్పుడు ముక్తసరి మాటలతో సరిపెట్టడం.
దిగులుతో మంచం పట్టిన ఆయన అకాల మరణానికి చేరువయ్యాడు. కర్మ కాండ జరిపించడానికి భార్యతో సహా వచ్చిన భార్గవరామశర్మ తప్పదన్నట్టు తల్లిని తమతో రమ్మన్నాడు. ఆత్మాభిమానం గల ఆ ఇల్లాలు ఇల్లు, ఊరును వదిలి రానన్నది. తన మాట వినలేదని కోపంతో వెళ్ళిపోయాడు భార్గవరామశర్మ.
ఇల్లు బోసిపోయింది. అదే ఇంట్లో ఆమె కొడుకు పంపించే డబ్బుతో, భర్త జ్ఞాపకాలతో, ఇరుగుపొరుగువారి ఆదరణతో బతుకును ఈడుస్తున్నది. పూజలు కరువయి, ఉత్సవాలు లేక గుడి మెల్లమెల్లగా శోభను కోల్పోసాగింది.
కారణం తెలియదు కానీ ఊరిపెద్దలు ఎంతగా ప్రయత్నించినా గుడిలో పూజారిగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఏడాది వర్షాలు కురవలేదు. ఏమో కాల మహిమ! అనుకున్నారు జనం. కష్టనష్టాలు భరిస్తూ కాలంతో రాజీ పడ్డారు. తరువాత మూడేళ్లు అదే పరిస్థితి. చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో వర్షం విపరీతంగా పడేది. ఇక్కడ పడకపోయేది. మబ్బులు ఎంతగా కమ్ముకున్నా తేలిపోయేవి. చినుకు పడేది కాదు. బతుకును వెతుక్కుంటూ ఊరిజనం మెల్లగా వలసదారి పట్టారు.
****** ******** ********
ఆంజనేయ శాస్త్రి, నరసింహ శర్మ మంచి స్నేహితులు.
రెండూళ్ల అవతల నాగులపల్లి ఆయన ఊరు. ఆయన కూడా పౌరోహిత్యం చేసేవాడు. రెండు కుటుంబాలు ఎంతో ఆత్మీయంగా ఉండేవి. చిన్నప్పటి నుండీ భార్గవరామశర్మకు అతడిని ‘మామయ్యా’ అని పిలవడం అలవాటు. ఆ చనువుతో నరసింహ శర్మ చనిపోయినప్పుడే ఆంజనేయశాస్త్రి, భార్గవరామశర్మకు హితబోధ చేసే ప్రయత్నం చేశాడు కానీ భార్గవరామశర్మ పట్టించుకోకపోవడంతో వదిలేశాడు.
నేలపల్లి ఊళ్ళో జరుగుతున్న పరిస్థితులు ఆంజనేయ శాస్త్రికి తెలుస్తూనే ఉన్నాయి. చూస్తూ ఊరుకోలేక పోయాడు. ఏదో ఒక పరిష్కారం చూడకపోతే తన వృత్తికి అర్థం లేదనుకున్నాడు. భార్గవరామశర్మకు ఫోను చేసి విషయమంతా వివరించాడు. అయినా అతని మనసు కరగలేదు. నాకు ఇంకెప్పుడూ ఈ విషయంలో ఫోను చేయొద్దని, అది నా సమస్య కాదని కోపగించుకున్నాడు. అట్లా రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆంజనేయ శాస్త్రి
భంగపడ్డాడు.
******* ******** ******
ఒకరోజు హఠాత్తుగా భార్గవరామశర్మ నుండి ఆంజనేయ శాస్త్రికి ఫోను వచ్చింది.
“మామయ్యా! గుడి పునర్నిర్మాణం జరగాలంటే ఎంత ఖర్చవుతుంది?” అని అడిగాడు. ఆ గొంతులో ఆర్తి, ఆవేదన స్పష్టంగా తెలుస్తున్నాయి.
“భార్గవరామా! ఏమైంది నాయనా?” అడిగాడు నెమ్మదిగా ఆంజనేయశాస్త్రి.
“నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు మామయ్యా! నాన్నను దూరం చేసుకున్నాను. బతికి ఉన్న అమ్మను ఆదరించడం లేదు. నా పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నా. నిన్న రాత్రి నాకు వచ్చిన కలను మర్చిపోలేక పోతున్నాను. కరువుతో అల్లాడుతున్న ఊరి జనం నా చుట్టూ దీనంగా నిలబడి ఉన్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. బీడుగా మారిన పంటపొలాలు. కళ్ళముందు ప్రత్యక్షమైనట్లు కనిపించాయి. ఆ దృశ్యం చూడలేకపోయాను. నాన్న
తరువాత ఆయన కొడుకుగా గుడి పాడువడకుండా చూసుకోవాల్సింది. మీరు ఎంత చెప్పినా నేను వినలేదు. ఆ పాపమే కావచ్చేమో! పెళ్లయి పదేళ్లు అయినా నాకు సంతానం లేదు. మామయ్యా! నన్ను మన్నించి నా కోరిక ఒక్కటి తీర్చండి. అన్నీ తెలిసినవారు. ఇప్పుడు నా ధ్యేయం ఒక్కటే. మన ఊరి ప్రజలను కాపాడాలి. ఎంత డబ్బు అయినా పంపిస్తాను. మీరు దగ్గరుండి గుడి నిర్మాణం మొదలుపెట్టండి. ఇంతకుముందు దానికంటే విశాలంగా కట్టించండి. ఊరి పెద్దలతో నేను మాట్లాడతాను”అని పూడుకు పోతున్న కంఠంతో చెప్పాడు.
“కొద్ది రోజులు అమ్మకు మీ ఇంట్లో ఆశ్రయమిచ్చి ఇల్లును కూడా బాగు చేయించండి. దయచేసి కాదనొద్దు మామయ్యా!” అంటూ బతిమిలాడాడు. ఆంజనేయశాస్త్రి ఆనందానికి అవధులు లేవు.
********* ****** ********
భార్గవ రామశర్మ నిర్ణయానికి పెద్దలు హర్షించారు. ఊరు నిలబడితే చాలనుకున్నారు. ఆంజనేయశాస్త్రి ఆధ్వర్యంలో అన్నీ జరగడానికి ఒప్పుకున్నారు. డబ్బు
చేతిలో ఉంటే పనులు జరగడం ఎంతసేపు?ఎనిమిది నెలల్లో గుడి నిర్మాణం పూర్తయింది. గుడి పూజారిగా ఆంజనేయ శాస్త్రికి ఇల్లు ఏర్పాటయింది. నరసింహ శర్మ ఇల్లు కూడా బాగయింది
వార్షికోత్సవ సమయంలోనే శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠాపన చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ జనాలతో కళకళ లాడింది ఆ ఊరు. రెండు నెలల సెలవు తీసుకొని నాలుగు రోజుల ముందే భార్యతో పాటు ఊరికి వచ్చాడు భార్గవరామశర్మ.
తాను వచ్చినప్పటినుండీ ఊరి పెద్దలు, ప్రజలు ఆదరిస్తున్న విధానానికి ఆశ్చర్యపోయాడు. గుడి నిర్మాణం జరగుతుండడం వల్ల వాళ్ళకు కలుగుతున్న ఆనందాన్ని కళ్లారా చూశాడు. వాళ్లకు తండ్రి పట్ల ఉన్న అపార గౌరవాన్ని అర్థం చేసుకున్నాడు. ఇన్నిరోజులు తాను ఏం కోల్పోయాడో తెలిసి కన్నీరు ఉబికివచ్చింది.
ఆరోజు వార్షికోత్సవంలో నాలుగవ రోజు. రాత్రి ఒంటిగంట. డప్పుల మోత అంతకంతకూ తీవ్రమవుతున్నది. సాయంత్రం నుండి తగులబెట్టిన కర్రలు నిప్పు కణికలై రుద్రుని ఫాలనేత్రం వలె ఎర్రగా
మండుతున్నాయి. సమానంగా పేర్చిన ఆ నిప్పుల మీద నడవడానికి ఆ అగ్నిగుండం చుట్టూ దాదాపు పదిహేను మంది నిలబడి ఉన్నారు.
వీరశైవజంగాల, బలిజల భక్తిపారవశ్యం మిన్నంటుతున్నది. ఆ రోజంతా వారి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. ‘దండకాలు’ చదువుతున్నారు. ఒక్కసారి “అశ్శరభ శరభ శరభ, అశ్శరభ శరభ శరభ”
అని గట్టిగా అరుస్తూ ఒకరి తరువాత ఒకరు నిప్పులమీద నడుస్తున్నారు. వారిలో కొంతమంది ఆడవాళ్లు కూడా ఉన్నారు. కోరికలు తీరాలనో, తీరిన కోర్కెల మొక్కులో? ఏది ఏమో కానీ వాళ్ళ పాదాలకు ఎటువంటి బాధ కలగడం లేదు. ఊపిరిబిగబట్టి చూస్తున్న వందలాది జనం ఆనందంతో, ఆశ్చర్యంతో, భయంతో తమను తాము మర్చిపోయారు. వారి ఆనందకేరింతలు గత వైభవాన్ని పునరావృతం చేస్తున్నాయి.
గుడి మెట్ల మీద కూర్చొని ఇదంతా గమనిస్తున్న భార్గవ రామశర్మకు తన బాల్యంలో జరిగే జాతర గుర్తొచ్చింది. తిరిగి అటువంటి అనుభూతిని పొందుతూ
తన పక్కన ఉన్న ఆంజనేయశాస్త్రి వైపు చూశాడు. ఒకేసారి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో అవ్యక్తమైన భావం. ఒకరి పట్ల ఒకరికి ఆరాధనా భావం కదలాడింది. కన్నీటి పొర కదలాడుతుండగా అమాంతం వంగి ఆంజనేయ శాస్త్రి పాదాలకు నమస్కరించాడు భార్గవరామశర్మ. అతడిని దగ్గరకు తీసుకొని లాలనగా తల నిమిరాడు ఆంజనేయ శాస్త్రి.
అంతా సద్దుమణిగే సరికి 3 గంటలు అయింది. తెల్లవారి వార్షికోత్సవం ముగుస్తుంది. ఇంటికి వెళ్లి తల్లి మంచం దగ్గరకు వెళ్ళాడు. అలికిడికి నిద్రలేచిన తల్లి ఒడిలో పడుకున్నాడు. తల్లి కళ్ళు చెమర్చాయి. తండ్రి రూపం కళ్ళల్లో కదలాడి తనను ఆశీర్వదిస్తున్నట్టు తోచింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. తలుపు చప్పుడుకు రూములో నుండి బయటకు వచ్చిన సౌమ్య వాళ్ళిద్దరిని అట్లా చూసి చిన్నగా నవ్వుకుంది. వచ్చిన ఈ వారం రోజుల్లోనే ఆమె అత్తగారికి చాలా దగ్గరైంది.
చివరి రోజు పూర్ణాహుతి. ఉదయమే గుడికి వెళ్ళడానికి సిద్ధమైన సమయంలో “అమ్మా! బాగున్నారా?” అంటూ ఒక వ్యక్తి వచ్చాడు. నరసింహశర్మ భార్య ఆయనను గుర్తు పట్టలేదు.
“అమ్మా! నేను చంద్రాన్ని. నేను బతికి ఉన్నానంటే మీరే కారణం. ఏడేళ్ల కింద ఉత్సవానికి వచ్చినప్పుడు నాకు గుండెపోటు వచ్చింది. మీరు ఎవరితోనో మాట్లాడి కారు ఏర్పాటు చేసి నాభార్యకు తోడుగా మీరూ బయలుదేరి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమయానికి తీసురావడం వల్ల బతికాడని డాక్టర్లు చెప్పారు. మీ మేలు జీవితంలో మరువలేను” అని కాళ్లకు దండం పెట్టాడు. “ఓ నువ్వా చంద్రం! ఇప్పుడు గుర్తుకు వచ్చింది” అంటూ కబుర్లు మొదలు పెట్టిన తల్లిని, చంద్రాన్ని చూస్తూ మైమరచిపోయాడు భార్గవరామశర్మ. తన తల్లిదండ్రులకు ఆ ఊరితో పెనవేసుకున్న జ్ఞాపకాలకు చలించిపోయాడు. అమ్మను తనతో రమ్మన్నప్పుడు ఆమె ఎందుకురాలేదో అర్థమై మనసు బాధతో మూల్గింది.
సెలవు పూర్తయిన భార్గవరామశర్మ తనతో పాటు కొంతకాలం తల్లిని తీసుకువెళ్లేందుకు ఒప్పించాడు. ప్రయాణానికి మూడు రోజుల ముందు షాపింగు కోసమని తల్లిని, భార్యను హైదరాబాద్ కు తీసుకువెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో షాపు మెట్లమీద కళ్ళు తిరిగి హఠాత్తుగా తనమీదకు ఒరిగిపోయిన సౌమ్యను హడావిడిగా ఆసుపత్రిలో
చేర్చాడు. ‘ఆమె గర్భవతి’ అని డాక్టర్లు చెప్పిన మాటకు అతని సంతోషం మిన్నంటింది. తల్లిని భుజాలు పట్టి కుదిపేశాడు. అమ్మవారికి మనసులో నమస్కరించుకున్నాడు. భార్య ఆరోగ్యదృష్ట్యా ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఊళ్ళోకి రావడంతోనే
ఆంజనేయశాస్త్రి చెవిలో తాను తండ్రి కాబోతున్న శుభవార్తను చెప్పాడు నవ్వుతూ. ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ “ఆహా! ఎంత కరుణామయివి తల్లీ! ఏమి నీ లీల?” అని రెండు చేతులు జోడించాడు
భక్తి పరవశతతో.
శత్రువుపై ముప్పేట దాడి చేస్తూ ముట్టడి చేసే సామర్థ్యమున్నటు వంటి సైన్యాన్ని త్రివిధ దళాలు అంటారు. సరిహద్దు వివాదాలుగానీ, మరే ఇతర కారణాల వల్లగానీ తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సివస్తే వీరు ప్రదర్శించే ధైర్య సాహసాలుగానీ, శౌర్యప్రతాపాలు గానీ వర్ణించడానికి ఏ భాషా సరిపోదేమో, బంధాలు, అనుబంధాలను కోల్పోతామేమో నన్న బాధలో కొందరు, కోల్పోయి కొందరు అనుభవిస్తున్న బాధ ఒకవైపయితే, మనకోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న వారి కోసం, వారి కుటుంబాల కోసం ఏమీ చేయలేకపోతున్నామనే సాధారణ పౌరుల బాధ మరోవైపు. వారి త్యాగాలకు వెలకట్టడం అసాధ్యమే అయినా, కృతజ్ఞతాపూర్వకంగా వారి వేదనలపై సింహావలోకనం……
పొరుగు రాష్ట్రానికి చెంది, భాగ్యనగరంలో నివసిస్తున్న ఒక కుటుంబంతో నాకు చక్కని స్నేహ సంబంధాలున్నాయి. ఆ ఇంటి ఇల్లాలి గురించి చెప్పాల్సి వస్తే, సద్గుణ సంపన్నుడైన భర్త, చక్కని వ్యక్తిత్వం,విలువలతో పెరిగి, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులైన పిల్లలతో, పండ్ల బరువుకు వంగిన చెట్టువలె ఫలప్రదమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ, ఏదో ఒక సమయంలో ఆమె కంటి చెమరింత నా దృష్టిని దాటిపోలేదు, ఎంత దాచాలని ప్రయత్నించినా ఎప్పుడో ఒకప్పుడు ఆమె గొంతులో ధ్వనించే జీర నా చెవిని దాటిపోలేదు. ఎంత చక్కని స్నేహం అయినప్పటికీ, అది కొన్ని పరిమితులకులోనై ఉండాలన్న వివేకంతో నేను కూడా ఎప్పుడూ ఆమెను ఆ విషయంపై ప్రశ్నించలేదు. మా స్నేహం ఇలా సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండగా, తమాయించుకోలేని ఆమె ఒకరోజు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తనకు తానుగా నాతో పంచుకున్న విషయమేమిటంటే, తమ ఆరుగురు తోబుట్టువుల్లో అందరికంటే చిన్నదైన తమ చెల్లికి (వయసులో కూడా చాలా తేడా ఉండటంతో, ఆమె అడుగుల కింద తామంతా అరచేతులు పరిచి పెంచామని) పెళ్ళీడు రాగానే సమీప బంధువుతో పెళ్లి జరిపించామనీ, సరిగ్గా ఒక్క నెల రోజుల వైవాహిక జీవితానంతరం ఉద్యోగ నిర్వహణకని వెళ్లిన అతను కార్గిల్ యుద్ధభూమిలో వీరమరణం పొందాడనీ చెప్పింది.
ఎంతటి గాయాన్నైనా మాన్పే శక్తి కాలానికి ఉందన్న సత్యాన్ని అనుసరించి, పునర్వివాహానికై ఒప్పించాలని తామంతా ఎంతగా ప్రయత్నించినా (అత్తింటివారు నిండు మనసుతో సంపూర్ణ సమ్మతిని తెలియజేసినప్పటికీ కూడా) ఆమె ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వలేదనీ, తన సామర్థ్యానికి తగిన ఉద్యోగాన్ని చేసుకుంటూ, వృద్ధులైన తల్లిదండ్రులకు సేవచేస్తూ, కవల పిల్లలకు జన్మనిచ్చి, పురిట్లోనే కన్ను మూసిన ఓ మాతృమూర్తి అంతరంగాన పరకాయ ప్రవేశం చేసి, ఆ శిశువులిద్దరినీ తన ఒడికి చేర్చుకొని, గుండెలకు హత్తుకుని, వాళ్లను ప్రయోజకులను చేసి తన జన్మను సార్థకం చేసుకున్నప్పటికీ కూడా, ఆమె జీవితంలోని నీలి నీడల్ని ఒక తోబుట్టువుగా తాను హరాయించు కోలేకపోతున్నాననీ, షడ్రసోపేతమైన భోజనపళ్ళాన్ని భగవంతుడు తన చేతికి అందించినా, పూర్తిస్థాయిలో దాన్ని ఆస్వాదించలేకపోతున్నాననీ చెప్పింది.
ఈ విషయం నాకు తెలిసి చాలా సంవత్సరాలైనప్పటికీ,ఈ మధ్యనే వాళ్ళింట్లో అంగరంగ వైభవంగా జరిగిన ఒక శుభకార్యానికి నేను వెళ్లడం, ఆమె తన చెల్లిని నాకు పరిచయం చేయడం(నేను ఆమెను చూడటం అదే మొదటిసారి) జరిగింది. కలయిక మొదటిదే అయినప్పటికీ, ఒకరి గురించి ఒకరు తెలిసిన వాళ్ళం కావడం వల్ల, ఇద్దరం ఎంతో స్నేహంగా మాట్లాడుకుంటూ, వాళ్ల బంధువులు కూడా చాలా మట్టుకు తెలిసినవారే కావడంతో వారికి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ, పైకి కులాసాగా గడిపినట్టు కనిపించినప్పటికీ, లో లోపల నా గుండెనెవరో మెలిపెడుతున్నంత బాధన నుభవిస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని తిలకిస్తూ, వారి బంధువులు, ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతూ తిరుగుతున్నానన్న మాటేగానీ నా మనసు మనసులో లేదు. ముఖానికి చిరునవ్వు పులుముకుని, తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో రెండు గంటల నటనా నంతరం, ఆ ఇంటి వారి వద్ద సెలవు తీసుకుని, కంటి చెలిమెలో ఊరే నీటిని కనిపించనీయకుండా శతవిధాల ప్రయత్నిస్తూ, ఇంచుమించుగా నా వయసులోనే ఉన్న ఆ వీరపత్నికి పైకి కరచాలనం చేస్తూ, మనసులో పాదాభివందనం చేసి ఇల్లు చేరాను.
కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ పద్మపాణి గారిని గురించి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన విషయాలకు( వీరమరణం పొందిన ప్రతి సైనికుడి త్యాగం మరువలేనిదే, దానికి హెచ్చుతగ్గులు గానీ, స్థాయీ భేదాలుగానీ ఉండవనేది అందరూ అంగీకరించి తీరాల్సిన విషయమే)ప్రజల గుండెల్లో ఎప్పటికీ మరపుకు తావుండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అతని అర్ధాంగి గర్భం ధరించి ఉండటం, పుట్టబోయే శిశువుకు సంబంధించి అతను తన తల్లిదండ్రులకు ఉత్తరాలు రాయడం, అతని పార్థివ దేహం కుటుంబ సభ్యులకు చేరుకునే లోపు వార్తాపత్రికల్లో ఆ సమాచారం విస్తారంగా రావడం కారణమనిపి స్తుంది. ఆ వీరుడి రక్తంతో ఊపిరి పోసుకున్న చిట్టితల్లి, తన చిట్టి గుండెతో వ్రాసుకున్న పుస్తకానికి పెట్టిన శీర్షిక ‘నేను చూడని నాన్న’. శీర్షికతోనే గుండెల్ని మెలిబెట్టే ఆ పుస్తకాన్ని చదివే సాహసం బహుశా కొందరికే సాధ్యమవుతుందేమో.
దేశ శ్రేయస్సు కోసం అహర్నిశలు తపిస్తూ, వీరోచితంగా పోరాడుతూ నేలకొరిగిన ప్రతి వీరుడికీ, వారిని కోల్పోయి గర్వంతో కూడిన వేదన ననుభవించే వారి కుటుంబాలకి బదులుగా ఏమిచ్చినా, మన రుణం తీరేది కాదు.
వీరులారా వందనం
వీరమాతలారా వందనం
వీరపత్నులారా వందనం
“మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా?”
అకస్మాత్తుగా వినిపించిన ప్రశ్నకు, ఆశ్చర్యంగా చూసి “ఏమిటీ? నన్ను పెళ్ళిచేసుకుంటారా?” పకపకా నవ్వింది రాజి.
“అబద్ధం కాదు నిజంగానే అంటున్నాను. మా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్, అతని సహాయంతో మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాను. నన్ను నమ్మండి” సీరియస్గా అన్నాడు విశ్వం.
“మీరు చదువుకున్నారు, మంచి ఉద్యోగం వస్తుంది. అసలు మీరు ఇక్కడికి రావటమే విచిత్రం! వచ్చినప్పటి నుంచి కబుర్లు చెపుతున్నారు. పైగా నన్ను పెళ్ళిచేసుకుంటారా? అభ్యుదయభావాలా?” గమ్మత్తుగా అడిగింది.
“ఈరోజు మా స్నేహితుడి బలవంతం మీద కొంత, అసలు ఈ అనుభవం ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలంతో కొంత వచ్చాను. మిమ్మల్ని చూడగానే ఏదో ఆత్మీయ భావం కలిగింది. అందుకే అడుగుతున్నాను నన్ను పెళ్ళి చేసుకుంటారా?” మళ్ళీ అడిగాడు విశ్వం.
విశ్వం కళ్ళల్లో కనిపించిన ప్రేమ, నిజాయితీని చూసి “మీకెందుకు ఆభావన కలిగింది? నాలో ఏమి ఆత్మీయత చూసారు? నేనొక వేశ్యనని మర్చిపోతున్నారా?” విస్మయంగా అడిగింది.
“ఎందుకు? ఏమిటి? అంటే ఏమి చెప్పను? కొన్నిటికి సమాధానం ఉండదు” జవాబిచ్చాడు విశ్వం.
విశ్వం వైపు సాలోచనగా చూసింది. ఒక్క క్షణం ఆగి, “ నిజంగా మీకు నామీద ఆత్మీయతాభావం ఉంటే ఒక సహాయం చేయగలరా?” కన్నీటిని కనురెప్పల మాటున దాచుతూ అడిగింది రాణి.
“ఏమి సహాయం చేయాలి?”
“మా నాన్న ఆటో డ్రైవర్. అమ్మ ఒక పెద్దింట్లో పని చేసేది.మేము హైద్రాబాద్లో ఒక బస్తీ లో ఉండేవాళ్లము. నేను, మా చెల్లి, తమ్ముడు అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళము. నేను తెల్లగా, అందంగా ఉండేదానిని అని నన్ను రాణీ అని పిలిచేవారు అమ్మానాన్నా. నేను ఎనిమిదవ తరగతి చదువుతుండగా జబ్బు పడ్డాను. చాలా వీక్ అయ్యాను. అందుకని ఆ సంవత్సరం స్కూల్ మానిపించి, అమ్మ తనతో పెద్దింటికి తీసుకెళ్ళేది. వాళ్ళ నాలుగేళ్ళ లోయర్ కేజీ చదువుతున్న, బాబుని స్కూల్కు తీసుకెళ్ళి, మధ్యాహ్నం స్కూల్ అయిపోయవరకు అక్కడే ఉండి, ఇంటికి తీసుకొచ్చేదానిని. మేడంకు చిన్నచిన్న పనులు చేసిపెడుతూ సహాయంగా సాయంకాలం వరకూ అమ్మతో ఉండేదానిని. బాబును స్కూల్కు తీసుకెళ్ళే డ్రైవర్ మురళి. అతనూ నాతోపాటే స్కూల్ అయిపోయేవరకూ ఉండేవాడు. ఆ సమయంలో నాతో చాలా చనువుగా ప్రేమ మాటలు చెపుతుండేవాడు. నన్ను పెళ్ళి చేసుకుంటాననేవాడు. అప్పుడు నాకు నిండా పద్నాలుగు ఏళ్ళు కూడా లేవు. ఏమీ తెలియని రోజులు.బాబు వచ్చేవరకూ కార్లో కూర్చొని అతను చెపుతుండే ప్రేమ కబుర్లు నన్ను సుందరస్వప్నలోకంకు తీసుకెళ్ళేవి. పైగా చూస్తున్న సినిమాల, టీ.వీ షోల ప్రభావమనుకోండి, ఏదైనా అనుకోండి, ఓ రోజు స్కూల్ నుంచి అటే అతనితోవచ్చేసాను. అమ్మా వాళ్ళ గురించి కానీ స్కూల్లో ఉన్న బాబు గురించికానీ ఆలోచించలేదు! ఇక ఆతరువాత చెప్పేదేముంది? అందరికీ తెలిసిన మామూలు కథే! కడుపుతో ఉన్న నన్ను ఇక్కడ అమ్మేసి చెక్కేసాడు! ఇప్పుడు నా బాబుశౌర్యకు నాలుగు సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే వాడికి ఊహ తెలుస్తోంది. ఇక్కడే ఉంటే నాకే విటులను తీసుకొచ్చేవాడవుతాడు. వాడు ఇక్కడ పెరగటం నాకు ఇష్టం లేదు. బాగా చదువుకొని జీవితంలో మంచి వ్యక్తిగా స్థిరపడాలని నా కోరిక. మీకు వీలవుతే వీడిని ఈ వాతావరణానికి దూరంగా తీసుకెళ్ళి ఏదైనా స్కూల్లో, హాస్టల్లో చేర్చండి. డబ్బు సంగతి ఆలోచించకండి. నేను వీడికోసం ఎంతైనా కష్టపడుతాను. ఫీజులు నేనే కడుతాను. అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటాను. ఇక్కడి మౌసీకి నేను ఇక్కడే ఉండి, డబ్బులు సంపాదించి ఇస్తే చాలు. అభ్యంతర పెట్టరు” అని వేడుకోలుగా అన్నది రాజీ.
ఆ తల్లి హృదయం ను అర్థం చేసుకున్న విశ్వం శౌర్యను కలింగ్పాంగ్ లోని స్కూల్లో, తన స్నేహితుని కొడుకని, తల్లితండ్రులు ఆక్సిడెంట్లో చనిపోయారని, తను గార్డియన్ అని చెప్పి చేర్చాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. శౌర్య గ్రూప్ పరీక్షలు పాస్ అయ్యి, పోలీస్ ఆఫీసర్ అయ్యాడు.
“ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టు” విశ్వ తన ఎదురుగా నిలబెట్టిన యువకుడిని తేరిపారా చూసింది రాజి. అప్పుడప్పుడు కలింగ్పాంగ్ వెళ్ళి కొడుకును దూరం నుంచి చూస్తూ ఉండేది. ఇప్పుడుయూనీఫాంలో ఎదురుగా ఉన్న కొడుకును కన్నీరుతో కళ్ళు మసకలుబారుతుండగా, ప్రేమగా తడుముతూ భావోద్వేగానికి గురయ్యింది రాజి! విశ్వ వైపు తిరిగి రెండు చేతులూ జోడించింది!
తల్లిని పొదివి పట్టుకొని, తనవైపు భయంభయంగా, ఆసక్తిగా చూస్తున్న అందరినీ చిరునవ్వుతో చూసి, పెద్ద సోఫాలో కూర్చొని ఉన్నావిడతో “మౌసీ మా అమ్మను తీసుకెళుతున్నాను” అన్నాడు శౌర్య.
అప్పటి వరకూ వాళ్ళిద్దరినీ గమనిస్తున్న మౌసీ, యూనీఫాంలో ఉన్న శౌర్యను ఏమనలేక “సరే తీసుకెళ్ళు కానీ కాస్త మమ్మలిని కూడా చూసుకుంటూ ఉండు” అంది ఆదరంగా.
“అలాగే నువ్వింకే అమ్మాయినీ తీసుకురాకుండా కనిపెట్టి ఉంటానులే నవ్వుతూ అని పదమ్మా” అన్నాడు శౌర్య అమ్మతో.
అప్పటి వరకూ ఒక ట్రాన్స్లో ఉన్నట్టున్న రాజీ”నేనెందుకు వద్దు. నేను నీతో వస్తే సమాజంలో నీకు గౌరవం ఉండదు. నాతో గడిపిన ఎందరో ఎదురైనప్పుడు నిన్ను చిన్నచూపు చూస్తారు. నీకు పెళ్ళి కాదు. వద్దు నన్ను ఇట్లాగే ఉండనీయి. నేను కోరుకున్నట్లుగా నువ్వు పెద్ద ఆఫీసర్వి అయ్యావు. ఆతృప్తి చాలు నాకు” వణుకుతున్న గొంతుతో అంది రాజి.
“నాకు నా అమ్మ చాలు. ఈ సమాజంతో నాకు పనిలేదు. నిన్ను ఇష్ఠపడి, గౌరవంగా చూసుకునే అమ్మాయి వస్తే పెళ్ళి చేసుకుంటాను. లేకపోతేలేదు. ఇంక మాట్లాడక పద” అన్నాడు శౌర్య.
అదేమిటి రాజీ, ఈరోజు కోసమే కదా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసింది. ఇన్నాళ్ళు ఈ మురికి కూపంలో కష్టపడ్డావు. ఇక కొడుకు దగ్గర గౌరవంగా ఉండు” మందలింపుగా అన్నాడు విశ్వ.
ఇక మారు మాట్లాడకలోపలి నుంచి సూట్కేస్ తెస్తున్న రాజీ చేతిలోని సూట్కేస్ తీసి కింద పెడుతూ “ఇక్కడ నుంచి ఏమీ తేవద్దు. ఈ సామానులనూ, ఈ జ్ఞాపకాలనూ అన్నీ ఇక్కడే వదిలిరా” అంటూ తల్లిని పోలీస్ జీప్ ఎక్కించాడు.
పోలీస్ జీప్ ఎక్కుతుంటే రాజీ కాళ్ళు తడబడ్డాయి. కొడుకును పట్టుకున్న చేయి కూడా వణికింది. ఇప్పటి వరకూ ఎన్ని సార్లో పోలీస్ వాన్, పోలీసులు బందిలి దొడ్డిలోకి పశువులను తోలుతున్నట్లుగా లాఠీతో అదిలిస్తుంటే ఎక్కింది. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ తల్లిగా ఎక్కుతుంటే చెప్పలేని భావోద్వేగానికి గురి అవుతోంది. తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న శౌర్య అమ్మ చేతిని మృదువుగా తట్టి, చిన్నగా ఎక్కించాడు.
***
పదమ్మా అంటూ అమ్మ భుజాల చుట్టూ చేయివేసి ఇంట్లోకి నడిపించాడు శౌర్య. Sourya I.P.Sగేట్ ముందున్న నేమ్ ప్లేట్ను ఆప్యాయంగా, గర్వంగా తడుముతూ లోపలికి నడిచింది.
పోలీస్ కాలనీలో చిన్న, ముచ్చటైన క్వాటర్శౌర్యది. హాల్, కిచెన్, మూడు బెడ్ రూంస్, ఇంటి చుట్టూ అందమైన తోట, ఆర్డర్లీ, వంటమనిషి, పని మనిషి అన్నీ అమర్చిన ఇంటిని చూసి మురిసిపోయింది రాణి. ఇంత వైభోగానికి తను తగునా అని నూన్యతాభావం కలుగుతోంది. పోలీస్లను చూసి ఉలిక్కిపడుతోంది. ఎవరిని చూసినా తనను చూసి నవ్వుకుంటున్నారేమోననే భావననే కలుగుతోంది. అమ్మను గమనిస్తూనే ఉన్నాడు శౌర్య. ఓరోజు ఒక మధ్యవయస్కురాలిని వెంటబెట్టుకొచ్చాడు.
“అమ్మా, ఈవిడ పేరు శారద. ఈవిడ రామకృష్ణామఠం లో యోగా నేర్పిస్తారు. ఇక నుంచి రోజూ మనింటికి వచ్చి నీకు యోగా నేర్పిస్తారు. చదువు చెపుతారు. బయటకు తీసుకెళుతారు” అని ఆవిడను పరిచయం చేసాడు.
నాకెందుకు నాన్నా యోగా, చదువు అనబోయింది కానీ శౌర్యను చూస్తూ అనలేక పోయింది. శారద వైపు చూసింది. తెలుపుకు ఎరుపు రిబ్బెన్ అంచు ఉన్న నేత చీర, తెలుపునలుపు కలగలిసిన జుట్టుతో చిన్న ముడి, నుదుటన చిన్న కుంకుమ బొట్టుతో సింపుల్గా ఉంది. రాజీ తనవైపు చూడగానే చిన్నగా నవ్వింది ఆవిడ.
“మా అమ్మ, రాజేశ్వరి” శారదకు పరిచయం చేసాడు.
ఎప్పుడో నా అసలు పేరు రాజేశ్వరి అని చెప్పింది వీడికి బాగానే గుర్తుందే అనుకుంది రాజీ.
మరునాడు సాయంకాలం నాలుగు గంటలకు రాజేశ్వరిని రామకృష్ణమఠంకు తీసుకెళ్ళింది శారద. అక్కడ ఒక హాల్లో ఒక స్వామీజీ భగవద్గీత వినిపిస్తున్నారు. కాసేపు అక్కడ కూర్చున్నాక, వేరే హాల్లోకి తీసికెళ్ళింది. అక్కడ పిల్లలకు యోగా నేర్పిస్తున్నారు. అక్కడ నుంచి వెనుక వైపు ఉన్న మందిరంకు తీసుకెళ్ళింది. అక్కడ కూర్చున్నారు. ప్రశాంతంగా ఉన్న మఠం పరిసరాలు రాజేశ్వరికి చాలా నచ్చాయి. రాజేశ్వరి సెల్ తీసుకొని, యూట్యూబ్ తెరిచి, చాగంటి, గరికపాటి వారి ప్రవచనాలు ఎలా వినాలో, నచ్చిన పాటలు ఎలా వినాలో చూపించింది. శారదతో వస్తున్నప్పుడు తన గురించి ఏమైనా అడుగుతుందేమో, తన సంగతి తెలిసి చిన్న చూపు చూస్తుందేమో అని ఉన్న రాజీ, శారద అసలు ఆ విషయం గురించే మాట్లాడకపోవటము, తెలిసినట్లే లేకపోవటముతో నూన్యతాభావన, బెరుకు పోయాయి రాజేశ్వరిలో. శారద ఆహార్యం, స్నేహశీలత్వం నచ్చాయి రాజేశ్వరికి. ప్రతిరోజూ సాయంకాలం వచ్చి రాజేశ్వరిని బిర్లా మందిర్, రామకృష్ణామఠం అలా తీసుకెళ్ళేది. శారద సత్ సాంగత్యంలో రాజేశ్వరి మంచి సాహిత్య పఠనం, ప్రవచనాలు విని ఆకళింపు చేసుకోవడం అలవరుచుకుంది.
రాజేశ్వరిలోని మార్పును ఆనందంగా గమనిస్తున్నాడు శౌర్య. ఒకసారి అమ్మ చిన్నప్పుడు ఉన్న బస్తీని వెతుక్కుంటూ తీసుకెళ్ళాడు. పోలీస్ జీప్ ఇంటి ముందు ఆగేసరికి చాలా భయపడ్డారు వాళ్ళు. రాజేశ్వరిమాటలతో జ్ఞాపకం తెచ్చుకున్నారు. తమ్ముడి, చెల్లెలి పెళ్ళిళ్ళు అయ్యాయి. బాగానే సెటిల్ అయ్యారు. తమ్ముడి కుటుంబం, అమ్మానాన్నా కలిసి ఉన్నారు. కాలం తెచ్చిన మార్పు వారిలో కనిపిస్తోంది. కాసేపు కూర్చొని వచ్చేసారు. తనవాళ్ళను చూసేసరికి తనలో మనోబలం పెరిగినట్లుగా అనిపించింది రాజేశ్వరికి!
ఆ రోజు ఆగస్ట్ పదిహేను. బస్తీ మధ్యలో ఝండా ఎగురేసి మైక్ చేతిలోకి తీసుకొని చుట్టూ చూసింది. అక్కడ ఉన్న పిల్లలను చూస్తుంటే తన బాల్యం గుర్తొచ్చింది. ఝండాను పోలినట్లు, తెలుపుకు ఆకుపచ్చ అంచున్న ఖాదీ చీర, నారింజ రంగు జాకెట్టు, మెడలో సన్న స్పటికపు మాల, చిన్న ముడితో డిగ్నిఫైడ్గా ఉన్న రాజేశ్వరిని ఆరాధనగా, ఏమి చెపుతుందా?! అని అసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ.
“అందరికీ నమస్కారం. మీలో పెద్దవాళ్ళు కొంత మందికైనా నేను గుర్తు ఉండే ఉంటాను. నా చిన్నప్పుడు మీ అందరిలాగే ఆటపాటలతో ఇక్కడే పెరిగాను. ఆనందంగా అమ్మానాన్నల నీడన ఉన్న నాకు ఒక త్రాష్టుడు తగిలాడు. వాడి మాయమాటలకు మోసపోయి, నా జీవితాన్ని చిందరవందర చేసుకున్నాను. ఇంకో పుణ్యాత్ముని సహాయసహకారము వలన నా కొడుకు ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్గా మీ ముందుకు వచ్చాడు. నేను ఒక ముళ్ళ కంచె నుంచి బయటకు వచ్చాను. ఇదంతా మీకెందుకు చెపుతున్నాను అంటే నాలాగా ఏ ఆడపిల్లా మోసపోకూడదని. అమ్మాయిలూ, అబ్బాయిలూ మీ వయసు చదువుకునే వయసు. ఇది వరకులాగా మనలని అమ్మానాన్నలు పనులకు పంపటం లేదు. వాళ్ళ శక్తి కొద్దీ మంచి స్కూల్స్లోనే చదివిస్తున్నారు. ప్రభుత్వం మనకు ఎన్నో రాయతీలూ, అవకాశాలు కల్పిస్తోంది. వాటిని ఉపయోగించుకోండి. చక్కగా చదువుకోండి. అమ్మాయిలూ అనవసరపు వ్యామోహాలకు లొంగిపోకండి. గుడ్ టచ్, బాడ్ టచ్ ఏదో తెలుసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే అమ్మకు, టీచర్కు చెప్పండి. వాళ్ళు మీ బాగు కోరేవారే. ముందుకోపం చేసినా తరువాత అక్కున చేర్చుకుంటారు. అబ్బాయిలూ మీరూ అనవసరమైన వ్యాపకాలు పెట్టుకోకండి. పిచ్చిపిచ్చి, భయంకరమైన వీడియోలు చూడకండి. వాటి వ్యామోహంలో పడితే మీ జీవితాలే నాశనమవుతాయి. మీ తోటి అమ్మాయిలను గౌరవించండి, తెలిసీతెలియక ప్రేమ అంటూ, ఏవో అనుభవాలు కావలంటూ వారిని వేధించకండి. మీకోసం మీ తల్లి తండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించండి. ఈనాటి బాలలే రేపటి పౌరులు. ఈనాడు మీ ప్రవర్తన బాగుంటే రేపటి సమాజం బాగుంటుంది. మీరే అందరికీ విజ్ఞాన దీపికలు.
ఏదీ అందరూ లేచి నిలబడి “మేము బాగా చదువుకుంటాము. మంచి ప్రవర్తన కలిగి ఉంటాము. పెద్దలు చెప్పిన మాట వింటూ వారిని గౌరవిస్తాము. దేశం కోసం పాటుపడతాము అని ప్రమాణం చేయండి” అని అందరితో ప్రమాణం చేయించింది.
‘జై హింద్’ అని సమావేశం ముగించింది.
ముళ్ళ కంచెను దాటి, శిధిలమైన శిలలా ఆత్మన్యూన్యతో బాధపడిన అమ్మ దేవుని గుడిలో వున్న శిల్పంగా కనిపిస్తున్న అమ్మను అపురూపంగా చూసాడు శౌర్య!
హిమాంశ్ – మణిపూర్లో పనిచేస్తున్న ఒక యువ ఇంజినీర్.
సుష్మిత – తమిళనాడులో పుట్టి పెరిగి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్.
ఒక వివాహ పరిచయ వేదిక ద్వారా కలుసుకున్న వీరు, ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు పూర్తైంది. ఒకరికొకరు తగిన సహచరులుగా నిరూపించుకున్న ఈ దంపతులు, తమ జీవితంలో మొదటి మూడు సంవత్సరాలు నిత్యజీవన పోరాటాలలో గడిపేశారు.
ఉద్యోగాలలో స్థిరత్వం వచ్చేసరికి, కొంత సమయం తమకోసం గడపాలనిపించింది. “నువ్వెప్పుడూ చెబుతూ ఉంటావుగా కాశ్మీర్ గురించి… స్వర్గమేనంటూ,” అన్నాడు హిమాంశ్.
ఆ మాటకు మురిసిపోయింది సుష్మిత. బాల్యంలో పుస్తకాల్లో చూసిన దాల్ సరస్సు, టులిప్ తోటలు, మంచుతో కప్పిన పర్వతాలు—తన కలల ప్రపంచం కళ్ళ ముందు కదలాడింది.
విమానం కాశ్మీర్ మీదుగా వచ్చినప్పుడు, వారిద్దరూ కిటికీ పక్కన కూర్చొని చూసిన దృశ్యం జీవితంలో మరువలేనిది. ఎత్తయిన పర్వతాలపై కురిసిన మంచు కప్పు, గగనాన్ని తాకే చిలిపి మేఘాలు, తాను ఊహించుకున్న రకాల రకాల పూల పరిమళం అప్పుడే తన నాసికను తాకిన అనుభూతి కలిగింది సుస్మిత కు.
“ఇది నిజంగా మన భారత్ లోనిదేనా?” అని ఆశ్చర్య పోయారు ఇద్దరూ.
శ్రీనగర్ చేరుకున్న మరుసటి రోజు వారిద్దరూ దాల్ సరస్సు సందర్శించేందుకు బయలుదేరారు. అలసిపోయిన మనసుకు అది ఒక శాంతి నిలయం. ఓ బోట్ హౌస్లోకి ఎక్కి, ఆ ప్రశాంతత మధ్య ప్రేమతో మాటలు చెప్పుకుంటూ సాగిపోయారు.
చుట్టూ దర్పణంలా మెరుస్తున్న నీళ్లు, వాటిలో ప్రతిబింబించే పర్వత శిఖరాలు, బోటు మీద కొలువైన కాష్మీరీ కళాకృతులు ఇవన్నీ ఒక గంధర్వ లోకాన్ని తలపించాయి. అక్కడే ఓ పూల బోటులో అమ్మాయిలు వదిలిన టులిప్ పూలు, ఆర్చిడ్ల పరిమళాలు శ్వాసలో నింపుకున్నారు.
“ఇదేనా మన కలల ప్రపంచం?” అని ఆశ్చర్యంగా అన్నాడు హిమాంశ్.
ఏప్రిల్ నెల. తక్కువ గాలి, మంచు ఇంకా కాస్త బాగానే ఉంది. శ్రీనగర్ చేరుకున్న రోజు నుంచే వాళ్లను అబ్బురపరిచిన పర్వతాలు, పూల తోటలు, దాల్చిన చెట్లు, చలిగాలి ఒకరిపై ఒకరికి మరింత అనురాగాన్ని పెంచుతున్నాయి. ఈ ప్రయాణానికి తన అత్తమామలను కూడా రమ్మని ఎంతగానో కోరింది సుస్మిత. వీరికి ఏకాంతం కలిగించేందుకో, లేక నిజంగానే చెప్పారో, “ నా ఆరోగ్యానికి అంత చల్లని వాతావరణం సరిపడదమ్మా, మీరు వెళ్ళండి. మరేదైనా తీర్థయాత్రకు అందరం కలసి వెళదాం,” అంటూ తన మాట తోసి పుచ్చిన అత్తగారితో తన మనసులోని భావాలు పంచుకునేందుకు ఫోన్ చేసింది.
“అత్తయ్యా! మీరు చూడాలి ఈ పువ్వుల తోటల్ని… మన జీవితంలో ఒక్కసారైనా రావాలి ఇక్కడకి. భూమి మీద స్వర్గం అంటే ఇదే అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది,” అంటూ ఫోన్లో ఉద్వేగంతో చెప్పింది సుష్మిత.
“చాలా సంతోషం తల్లీ, నువ్వు ఎంతగా ఆనందిస్తున్నావో నీ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది. హాయిగా ఎంజాయ్ చేయండి. నాకూ, మీ అమ్మకూ మంచి షాల్స్ తీసుకురండి. సంతోషంగా తిరిగి రండి,” నిండుగా ఆశీర్వదించారు పార్వతి గారు.
తరువాత శ్రీనగర్ లోని ఓ ప్రముఖ ఆర్కిడ్ తోట. వివిధ రంగుల్లో విరజిమ్ముతున్న పూలు. వేలాది రంగుల పుష్పాల మధ్య నడవడం అంటే భూమిపై ఆకాశంలో నడిచినట్టే. సుష్మిత అబ్బురపడింది.
“ఒక్కో పువ్వు ఒక్కో భాషలో ప్రేమను పలికిస్తున్నాయనిపిస్తోంది,” అంది. హిమాంశ్ తన ఫోన్లో వాటి ఫోటోలు తీస్తూ నవ్వాడు. “నీ ముఖంలో ఆనందాన్ని చూసేందుకే ఈ ట్రిప్,” అన్నాడు ప్రేమగా.
అక్కడ నీలీ, పచ్చ, నారింజ రంగుల ఆర్కిడ్స్ తో పాటు, చాలా అరుదైన పుష్పాలు కూడా ఉన్నాయి. వాటిపై పడే మంచు తుంపర్లు, హాయిగా వీస్తున్న వసంతగాలులు — మదిని మంత్రముగ్ధం చేశాయి.
“ఇక్కడే ఓ చిన్న ఇంట్లో ఉండిపోతే ఎంత బాగుండు,” అంటూ తన భర్త చేతిని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుని మైమరపుగా అన్నది సుష్మిత.
బోట్ హౌస్ లో ఆ రాత్రి, చలిగాలి తాకుతూ ఉన్నా, సుష్మిత తన డైరీ తీసుకుని కాసేపు ఏదో రాసింది.
“ఏమిటది?” అడిగాడు హిమాంశ్.
“నీ కోసం. ఈ కాశ్మీర్ నాకు నిన్ను కొత్తగా పరిచయం చేసింది,” అంది. “ఏదీ, దేవిగారేం రాశారో మేం తెలుసుకోవచ్చా?” గోముగా అడిగిన హిమాంశ్ ను చూస్తూ తన పేరు లాగానే వెన్నెలలా హాయిగా నవ్వింది సుస్మిత.
ఈ మంచు చల్లదనం కంటే నీ పలుకులు మృదువైనవి,
ఈ సరస్సు ప్రశాంతతకంటే నీ మౌనం లాలిత్యమైనది.
ఈ పర్వత శిఖరాలను మించినవి
మనం ఆశగా అల్లుకున్న జీవన శిఖరాలు!
పూల తోటల మధ్య విహరిస్తున్నా,
నీ శ్వాసే నాకు గొప్ప పరిమళం.
ఇక్కడి వర్ణాలు, వాయువులు, నీటి ప్రతిబింబాలు
అన్నీ నాకు నీవైపే చూపిస్తున్నాయి.
ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటే
నిన్ను చూస్తే చాలనిపిస్తోంది.
నీవుంటే – ఈ పయనం పూర్ణం,
నీవే లేకపోతే – కాశ్మీర్ కూడా రంగులేని శూన్యం.
హిమాంశ్ నిశ్శబ్దంగా ఆమె కవితను విన్నాడు. ఆమె కళ్ళలో తనకోసం మెరిసిన ప్రేమలోతులు అర్థమయ్యాయి. ఆ క్షణం బోట్ హౌస్లో కాకుండా, వాళ్లు ప్రేమ అనే మరొక లోకంలో విహరించారు.
*************************
ఓ స్థానిక టూర్ గైడ్తో కలిసి మరికొంతమంది పర్యాటకులను కలసుకుని పహల్గామ్ చూడాలని నిర్ణయించుకున్నారు. చుట్టూ మంచు పర్వతాలు, నదుల ప్రవాహం. అక్కడే కొత్తగా పరిచయమైన బెంగుళూరుకు చెందిన నవవివాహిత దంపతులు – అనీష్, నీతా. వాళ్లతో కలసి సాయంత్రం హడావుడిగా గడిపారు.
“ఓ… నీతా ఎంత బాగుంది నువ్వు కట్టుకున్న దుపట్టా. మా ఆడపడుచుకి కూడా ఇలాంటిదే తీసుకుంటాను,” అని సుష్మిత చిరునవ్వుతో చెప్పింది.
తర్వాతి రోజు పహల్గామ్కు బయలుదేరారు. పర్వతాల మధ్య నెమ్మదిగా ప్రయాణించి ఒక చిన్న మైదానం దగ్గర బస్ ఆగింది. పర్యాటకులంతా దిగారు. కొందరు ఫొటోలు తీస్తుంటే, కొందరు ఆ ప్రాంతం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మరికొందరు ఎడ్వెంచర్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వీరిద్దరూ తమ తల్లిదండ్రుల కోసం కశ్మీరీ శాలువాలు కొనాలనుకుని కొండ దిగువ దుకాణం వద్దకు వెళ్లారు.
కొంతసేపటికి టపటపా గాలిలో తూటాల మోత. పర్వత మార్గం అంతా గర్జనలతో, అరుపులతో మారుమోగింది. ప్రజలు పరుగులు, ఏడుస్తూన్న పిల్లలు, రక్తపు మడుగులో పర్యాటకులు, భీకరమైన మానవ సృష్ట దుశ్ఛర్య.
కొంత సేపటి తర్వాత సైన్యం వచ్చి పరిస్థితిని నియంత్రించగలిగారు. కానీ అప్పటికే… అనేక ప్రాణాలు మట్టిలో కలిశాయి.
హిమాంశ్ సుష్మిత అక్కడే ఉండాల్సింది. వారు షాల్ దుకాణానికి వెళ్లడం వాళ్ళ ప్రాణాలకు రక్షణగా మారింది. అదే సమయంలో తమ పెద్దవారి కోసం శాల్స్ కొనేందుకు వెళ్ళడం, వారి ఆశీర్వాదమేనేమో! కానీ, వారి కళ్ళముందు బాధాకరమైన దృశ్యం. అనీష్ను, నీతా భర్తను కాల్చి చంపారు ఆ ఉన్మాదులు. తల్లడిల్లిన నీతా, భర్త శవాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తుంటే, అక్కడ ఉన్న వారి హృదయాలు బద్దలయ్యాయి.
“ఇక్కడ మనిషిగా జీవించడం ఎంత కష్టం అన్నది ఇప్పుడు అర్థమయింది,” అంది సుస్మిత. ఆమె మాటల్లో ఉలిక్కిపాటు లేదు, ఉత్కంఠ లేదు — ఒక తీవ్రమైన మనోవేదన ఉంది. ఆ క్షణం వరకూ స్వర్గాన్ని తలపించిన ఆ ప్రాంతంలో మృత్యువు కరాళ నృత్యం చేయడం కళ్ళారా చూడడంతో ఆమె షాక్ కు గురయింది.
ఆ 26 మంది అమాయక హిందూ పర్యాటకులు, తమ కుటుంబాలతో కశ్మీర్ లోని పహల్గాం, గల్గస్, సోనమార్గ్ లాంటి అందమైన ప్రాంతాలు చూసేందుకు వచ్చినవారే. కానీ మతాన్ని అడిగి, ‘నువ్వు హిందువా? ముస్లింవా?’ అని ప్రశ్నించి, ‘హిందువు’ అని చెప్తేనే మృత్యుదండన విధించిన ఉగ్రవాదుల చర్య యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది.
ఈ వార్త కశ్మీర్ లోని స్థానిక చానెల్ లో వెలువడగానే, దేశవ్యాప్తంగా మీడియా దాన్ని బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేయసాగింది. “పహల్గామ్ లో ఉగ్రవాదుల పైశాచికత్వం. మతం అడిగి మరీ 26 మంది అమాయక హిందూ పర్యాటకుల హత్య.” దేశమంతా ఉలిక్కిపడింది.
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద యువతతోపాటు పెద్దలూ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ముంబైలో, బెంగుళూరులో, హైదరాబాద్లో, కోల్కతాలో నిరసనలు ఎగిసిపడ్డాయి. సోషల్ మీడియాలో –
#JusticeFor26, #StopTerrorin Kashmir, #HindusAreNotSafe అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి.
పోలీసులు, సైన్యం తీవ్రంగా అలర్ట్ అయ్యాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి.
ప్రధానమంత్రి తక్షణమే విదేశీ పర్యటన రద్దు చేసుకుని తిరిగి వచ్చారు. టీవీ చానెళ్ల ద్వారా దేశ ప్రజలతో ప్రత్యక్ష ప్రసంగం చేశారు. “ఈ ఉన్మాద చర్య మన దేశ గౌరవాన్ని విచ్ఛిన్నం చేయడమే కాదు, ఇది మానవత్వం పై దాడి. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తాం. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను మాత్రమే కాదు, వారికి మద్దతుగా నిలిచిన వారికి కూడా తగిన గుణపాఠం నేర్పుతాం,” అని ప్రకటించారు.
ఆ తర్వాత ప్రయాణం ఆగిపోయింది. మరుసటిరోజు తిరుగు ప్రయాణం అయ్యే లోగా తమ బంధువులంతా తమ యోగక్షేమాల గురించి వాకబు చేస్తుండడంతో వారికి తమ క్షేమ సమాచారాన్ని మెసేజ్ ద్వారా తెలిపారు వారిద్దరూ.
భారమైన హృదయంతో తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. ఇప్పుడు జీవితంపై వారి దృక్పథం మారింది. వాళ్లు హోటల్ నుంచి ఇంటికి ఫోన్ చేసినప్పుడు, “ఇక్కడి ప్రజలకు ఈపాటికే మనసులు విరిగి పోయి ఉండాలి. అయినా సరే, చిరునవ్వుతో మనల్ని స్వాగతిస్తున్నారు,వారికి ధన్యవాదాలు,” చెప్పింది సుష్మిత తన తల్లితో.
హైదరాబాద్ చేరుకున్న తర్వాత, సుష్మిత తన ఉద్యోగంలోకి వెళ్లే ముందు చిన్న మెసేజ్ వ్రాసి టేబుల్ మీద పెట్టింది.
“ప్రతి ఉదయం నా కళ్లెదుట నువ్వు ఉండటం ఒక అద్భుతం. ప్రతిరోజూ మనం మనసు విప్పి మాట్లాడుకోగలిగితే – అదే నిజమైన స్వర్గం. కాశ్మీర్ ఇది నేర్పింది.”
ఆ ప్రయాణం వారిద్దరిలో మార్పు తీసుకొచ్చింది — సహజమైన అందం పట్ల ప్రేమను, మానవీయత పట్ల మమకారాన్ని, ఒకరి జీవితంలో మరొకరి విలువను మరింత లోతుగా అర్థం చేసుకునే సాధనగా మారింది.
ప్రకృతి ఎంత అందమైనదైనా, మనిషి హృదయం కన్నా పెద్ద స్వర్గం లేదు. మనం ప్రేమతో, శాంతితో జీవించగలిగితే, ఏకంగా ఒక కాశ్మీర్ మన హృదయంలోనే నెలకొంటుంది.
