మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

స్వామి వివేకానంద

by - మూర్తి కెవివిఎస్ August 25, 2021
written by - మూర్తి కెవివిఎస్

ఈరోజు వివేకానంద స్వామి వర్ధంతి.ఆధ్యాత్మిక భాష లో చెప్పాలంటే మహా సమాధి లోనికి ప్రవేశించిన రోజు.ఈ సందర్భంగా ఆయన రాసిన ఓ వ్యాసం అనువాదం చేయాలనిపించింది.అది యూరపు ఖండం గురించినది,ఇంకా ముఖ్యం గా చెప్పాలంటే పారిస్ నగరం గురించినది.ఆయన చికాగో ఉపన్యాసం నిమిత్తం అమెరికా కి మాత్రమే  ప్రయాణించినట్లు చాలా మందికి తెలుసు కాని యూరపు లోని పలు దేశాల్లో కూడా ఆ తర్వాత పర్యటించారు. చాలా ఆసక్తికరం గా అనిపించింది. మరి అనువాదం లోపలికి వెళదామా..! సరే…!!

*                 *               *

“అసలు యూరప్ అంటే ఏమిటి..? ఎందుకని నల్లని వారు,కాంస్య,పసుపు రంగుల లో ఉన్నవారు,ఆసియా,ఆఫ్రికా,అమెరికా ఖండాల లో ఉన్న సమస్త నివాసితులు ఈ యూరోపియన్ల కి తలవంచారు..? ఈ కలియుగం లో ఎందుకని వీరు తిరుగులేని పాలకులయ్యారు..? ఈ యూరప్ ని అర్ధం చేసుకోవాలంటే ముందు ఫ్రాన్స్ ని అర్ధం చేసుకోవాలి.అవును దాని ద్వారానే రావాలి. పశ్చిమ దేశాల్లోని ప్రతి సమున్నత భావం ఇక్కడ అత్యున్నత స్థాయిని చేరుకుంది.ప్రపంచాన్ని శాసించే గొప్ప శక్తి యూరప్ అయితే దానిలోని ప్రధాన కేంద్రం పారిస్ నగరం.పాశ్చాత్య సంస్కృతి కి పట్టుగొమ్మ.

యూరపు కి సంబంధించిన నైతిక విషయాలు,మర్యాదలు,ఆచారాలు ఇంకా మంచీ చెడు వెలుగు చీకటి అన్నీ కూడా ఇక్కడ ఫలప్రద దశ ని పొందాయి.ఇది ఒక మహా సముద్రం వంటిది.దీనిలోపల ఎంతో విలువైన వజ్రాలు,పగడాలు,ముత్యాలు ఉన్నాయి.అదే విధంగా భయంకరమైన సముద్రజీవాలు,షార్క్ లు వంటివీ ఉన్నాయి. ఈ ఖండం అంతటికి కర్మ క్షేత్రం వంటిది ఫ్రాన్స్ దేశం.

చిత్తరువు లా తీర్చిదిద్దినట్లు ఉండే దేశం ఇది.మరీ చల్ల గా గానీ,మరీ వేడి గా గానీ ఉండదు.సారవంతమైన నేల.ఆకాశం నిర్మలం గా ఉండి,సూర్యుడు ఎంతో హాయి గా అనిపిస్తాడు. ఓక్,ఎల్మ్ వృక్షాలు విరివిగా ఉంటాయి.గడ్డి భూములు,మనోహరమైన పర్వతాలు, పారే సెలయేళ్ళు ఎంతో అందం గా ఉంటాయి. చైనా లోని కొన్ని ప్రాంతాల్లో తప్పా ఇంత అందమైన దేశాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఆ నీటి లోని సౌందర్యం,ఆ భూమి లోని మోహ భావం,ఆ గాలి లోని వెర్రితనం, ఆ ఆకాశం లోని ఉన్మత్త ఆనందం…ఆహా..!

ధనికులు,పేదలు ఇంకా యువకులు వృద్ధులు అందరూ తమ ఇళ్ళని,గదులని,వీథులని,తోటలని,ఇతర ప్రదేశాల్ని ఎంతో అందం గా,కళాత్మకం గా ఉంచుకుంటారు.మొత్తం దేశం అంతా కూడా చిత్తరువు లా ఉంటుంది. ప్రకృతి పట్ల,కళ పట్ల అటువంటి ప్రేమ ని ఒక్క జపాన్ లో తప్పా ఇంకెక్కడా నేను చూడలేదు.మహా నిర్మాణాలు ,తోటలు ఇంద్రుడి స్వర్గాన్నే తలపిస్తాయి. రైతులు పండిచే ఆ భూముల్లో కూడా…ప్రతి దాంట్లోనూ ఒక కళాత్మకతని ప్రయత్నించి సఫలమయ్యారు.

పారిస్ నగరం యూరపు ఖండ నాగరికత కి అత్యున్నత శిఖరం.గంగా నదికి గోముఖి ఎలాగో అలా.ఆ మహా నగరం ఎల్లవేళలా ఆనందం తో పొంగిపొర్లుతూ భూమి మీద స్వర్గం లా ఉంటుంది.లండన్ లో గాని,బెర్లిన్ లో గాని ఇంకెక్కడ గాని అలాంటి విలాసవంతమైన,ఆనందకరమైన జీవనం మనకి కనబడదు.అయితే ఒకటి నిజం…లండన్ లోనూ,న్యూయార్క్ లోనూ అపారమైన సంపద ఉన్నది.బెర్లిన్ లో గొప్ప జ్ఞాన సంపద ఉన్నది. అయితే వాటిల్లో ఎక్కడా ఫ్రాన్స్ వంటి నేల లేదు,ఫ్రెంచ్ వారిలో ఉండే జీనియస్ లేదు.సమృద్ధి గా ధనం ఉండవచ్చు గాక,జ్ఞానం ఉండవచ్చుగాక,ప్రకృతి సౌందర్యం ఉండవచ్చు గాక…కానీ మనిషి అనే వాడు ఎక్కడ..?

ప్రాచీన గ్రీకు ల యొక్క అంశయే ఈ ఫ్రెంచ్ ప్రజల్లో ఉన్నది. అప్పుడు మరణించి మళ్ళీ వీరి లో మొలకెత్తింది. ఎప్పుడూ సంతోషం గానూ,ఉత్సాహం గానూ ఉంటారు.దేనిపట్ల పట్టింపులేనట్లు గానూ,సిల్లీ గానూ ఉంటారు.మళ్ళీ కొన్నిసార్లు చాలా విచారం గానూ,పట్టింపు ఉన్నట్లు గానూ,ప్రతి పని పట్టుదల తో చేయాలనట్లు గా ఉంటారు.ఏ మాత్రం ఎదురుదెబ్బ వచ్చినా నిరుత్సాహం గా అయిపోతారు.అయితే ఆ నిరుత్సాహం కాసేపు మాత్రమే,మళ్ళీ ఆ ఫ్రెంచ్ వ్యక్తి మొహం కొత్త ఆశ,నమ్మకం తో కళకళ వెలుగులీనుతుంది.

యూరపు లోని యూనివర్సిటీలు అన్నిటికీ పారిస్ యూనివర్సిటీ యే మోడల్ అని చెప్పాలి.ప్రపంచం లోని అన్ని వైజ్ఞానిక అకాడెమీ లు ఫ్రెంచ్ అకాడెమీ కి అనుకరణలే.వలస దేశాల్లో సామ్రాజ్యాల్ని ఏర్పరచడం లో తొలిగురువు ఫ్రాన్స్ దేశమే.మిలటరీ,ఆర్ట్ విషయా ల్లో ఉపయోగించే పదసంపద చాలా వరకు ఫ్రెంచ్ పదాలే.చాలా యూరోపియన్ భాషల్లో ఉపయోగించే శైలీ విలాసం,పద బంధాలు ఫ్రెంచ్ భాష లో నుంచి తీసుకున్నవే.సైన్స్,తత్వశాస్త్రం,కళలు వంటి విషయాల్లో పారిస్ ఒక గని వంటిది అని చెప్పాలి.

ప్రతి చోట ఫ్రెంచ్ వారి నుంచి తీసుకున్న అనుకరణలు కనిపిస్తాయి.ఆయా విషయాల్లో ఫ్రెంచ్ వారు పట్టణ ప్రజలు కాగా మిగతా వారు గ్రామీణులు అనవచ్చు.ఫ్రెంచ్ వాళ్ళు ప్రారంభించినదాన్ని జెర్మన్లు,ఇంగ్లీష్ వాళ్ళు అనుకరిస్తుంటారు.అది యాభై ఏళ్ళ తర్వాత కావచ్చు, ఇరవై ఏళ్ళ తర్వాత కావచ్చు, విద్య లో గాని, సాంఘిక విషయాల్లో గాని, కళ ల్లో గాని…జరిగేది అదే..!

స్కాటిష్ రాజు ఇంగ్లండ్ కి రాజు అయినపుడు ఈ ఫ్రెంచ్ నాగరికత స్కాట్ లాండ్ దాకా పాకింది.అప్పుడు ఇంగ్లాండ్ లో గొప్ప తిరుగుబాటు భావాలు పెల్లుబికినాయి.ఇంగ్లాండ్ లో రాయల్ సొసైటీ లాంటి గొప్ప సంస్థలు స్కాట్ లాండ్ కి చెందిన స్టూవర్ట్ వంశపు రాజులు పాలించిన కాలం లోనే రూపుదిద్దుకున్నవి.

మళ్ళీ ఇంకొకటి,ఫ్రాన్స్ దేశం స్వేఛ్చ కి పుట్టినిల్లు.ఇక్కడ,ఈ పారిస్ నగరం నుంచే ప్రజాశక్తి ప్రవహించి యూరపు లోని పునాదుల్ని కంపింపజేసింది.ఆ రోజు నుంచి యూరపు యొక్క ముఖ చిత్రం మారిపోయి,కొత్త యూరపు ఉనికి లోకి వచ్చింది.స్వేఛ్చ,సమానత్వం,సౌభ్రాతృత్వం అనేవి ఇకమీదట వినిపించవు,కారణం ఇపుడు ఫ్రాన్స్ వేరే భావాల్ని ఇతర లక్ష్యాల నిమిత్తం అనుకరిస్తున్నది.అయితే ఫ్రాన్స్ వెదజల్లిన ఆ విప్లవ భావాలు యూరపు లోని అన్నిదేశాల్లోనూ తమ పని తాము చేసుకుంటూపోతూనే ఉన్నాయి.

ఒకరోజు ఇంగ్లాండ్ కి చెందిన ఓ ప్రసిద్ధ శాస్త్రవేత్త తో మాట్లాడాను. పారిస్ నగరం తో ఏ దేశం సంబంధం పెట్టుకుంటుందో ఆ దేశపు జనుల ప్రగతి లో ఆ మార్పు కనబడుతుంది.ప్రపంచానికి కేంద్ర బిందువు వంటిది అది అని ఆయన చెప్పాడు.వినడానికి కొంత అతిశయోక్తి లా ఉన్నా కొంత నిజమూ లేకపోలేదు. ఎవరు ప్రపంచానికి ఏ కొత్త భావాన్ని ఇవ్వాలన్నా పారిస్ చాలా అనువైన ప్రదేశం.

పారిస్ ఒక విషయాన్ని అంగీకరించిందంటే చాలు,మొత్తం యూరప్ అంతా కూడా దాన్ని ఆమోదిస్తుంది.ఒక శిల్పి,చిత్రకారుడు,సంగీతకారుడు,నృత్యకారుడు ఇంకా ఏ కళాకారుడు గాని మొదట పారిస్ లో పేరు తెచ్చుకోగలిగితే మిగతా అన్ని దేశాల్లో అతడు కీర్తిని గౌరవాల్ని పొందుతాడు.

మనదేశం లో పారిస్ నగరం యొక్క చీకటి కోణాన్ని మాత్రమే ప్రచారం చేశారు.అది భయంకరమైన ప్రదేశమని,భూలోక నరకమని..! కొంతమంది ఇంగ్లీష్ జాతీయుల అభిప్రాయం అది.ఇంద్రియ సుఖాలు తప్పా మరేది లేదనుకునే కొంతమంది ధనికులకి,సహజం గానే పారిస్ అంటే భోగ సంస్కృతి కి పర్యాపదం లా కనిపిస్తుంది.

పశ్చిమ దేశాల్లోని అన్ని పెద్ద నగరాల్లోనూ ఇవి సహజమే.అది లండన్,బెర్లిన్,న్యూయార్క్ ఏదైనా గానీ.అయితే తేడా ఏమిటంటే,మిగతా దేశాల్లో ఈ ఇంద్రియ సుఖాలు పొందే విధానాలు చాలా వల్గర్ గా ఉంటాయి. పారిస్ లోని దుమ్ము సైతం బంగారు ఆకుల తో కప్పినట్టుగా ఉంటుంది.మిగతా నగరాల్లోని విధానాలు బురద లో పొర్లాడే పంది లా ఉంటే,పారిస్ లో విధానాలు నెమలి సుతారం గా పింఛం విప్పి ఆడినట్లుగా ఉంటుంది.

సంతోషం గా, ఆనంద జీవనం గడపాలని ఏ దేశం మాత్రం కోరుకోదు..? అలా కానట్లయితే పలు ప్రదేశాలనుంచి ధనికులు అంతా ఇక్కడికి, ఈ పారిస్ కి ఎందుకు వస్తున్నట్లు..? ఎందుకని గొప్ప చక్రవర్తులు,రాజులు మారుపేర్ల తో ఇక్కడ నివసిస్తూ ఇంద్రియ సుఖాల్లో ఓలలాడుతుంటారు..?ప్రతి దేశం లోనూ ఎవరైనా సుఖమే గదా కొరుకునేది,తేడా ఏమిటంటే ఫ్రెంచ్ వాళ్ళు సుఖం పొందే విధానాల్ని ఒక సైన్స్ లా అభివృద్ధి చెసుకున్నారు.ఈ నిచ్చెన లో వాళ్ళు బాగా పై స్థాయి కి చేరుకున్నారు.

 

 

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఆ వరండాలు

by Jwalitha August 25, 2021
written by Jwalitha

నేనొక లాంతరు పట్టుకుని
ఆ వరండాలలో నడుస్తూంటాను

పగిలిన స్లాబు నుండి కిందకు జారుతున్న నీటి బొట్లను వింటూ

పర్వతపు లోతుల్లో
పక్షిగూళ్ళలల్లో,
నా స్నేహితుల ఎడదల్లో నా నడక,

వారివి పాలరాతి కళ్ళు.
వెలుతురు నీడలు మాత్రమే చూడగలం
వారి ముఖాల మీద
జీవితం విసిరిన దుఃఖపు ఛాయలు.

చీకటి లోపలికి దారితీసే
దట్టమైన ప్రదేశానికి నా నడక,
ఏ శక్తులు లేని చోట,

నా అడుగుల ప్రతిధ్వని మాత్రమే…

కందిలి వెలుతురు అంతమయ్యే వరకూ నా నడక
విధి వశాత్తు అపరిచిత మలుపులో
నేను  శిలగా మారుతాను.

కానీ ప్రవేశద్వారం వద్ద, కొండచరియలు విరిగి
దారి మూతబడిందని
త్వరగా మరచిపోయాను,

ఒక సతతహరితారణ్యంలో
హిమనీనదం నుండి
సెలఏరు పారే చోట
ఆడజింక ఒకటి
తన మచ్చలకూనకు జన్మనిస్తుంది

మలయ మారుతం హఠాత్తుగా
చిక్కని ఆకుల ఉడతలను ఎగురవేస్తుంది,
అందరిలాగే నేనూ చూస్తూంటాను

ఉదయపు ప్రతి ఆనందాన్ని తిరిగి పొందుతాను ,
పొడవైన పండ్ల తోటలలోని
ప్రతి యాపిల్ రుచిని నేను ఆస్వాదిస్తాను
కాబట్టి నేను ప్రేమించిన ప్రతిదానిని
నేను ప్రశాంతంగా వదిలివేయగలను.

భూమి జలచరాలతో పాటు వంపు తిరిగిన మద్యం పాత్రలను,
ఇత్తడి షాన్డిలియర్లను మోస్తుంది.

ఎప్పుడో ఒక రోజు
కుక్కలు ఎలుగుబంటిని వెంటాడుతున్నప్పుడు
మంచునేల పై పగళ్ళు తెరుచుకుంటున్నప్పుడు

తరతరాల ప్రజలు
గోడలపై క్షీణించిన
మన అక్షరాలను అర్థంచేసుకుంటారు

పనికిరాని రాజభవనం
చాలా అల్పమైనదని

వారి స్వంత ఆనందాలెన్నో
మేము ఎరుగుదుమని తెలుసుకొని
ఆశ్చర్యపోతారు వారు.

(ఒరెగాన్-బర్కిలీ, 1964)

English poem by : Czeslaw Milosz (జెస్లో మిలోస్)

THOSE CORRIDORS

I walk those corridors by torchlight Hearing water trickle down onto broken

Deep into the mountain. In niches, busts of my friends, Their eyes are of marble. Only the light and shadow Throw over their faces a brief sour grimace of life.

So, farther into the labyrinth leading to the dark interior, Where there are no kobolds, only the echo of my steps. Until the torch gutters out, and on the unknown bend Where it is fated, I will turn to stone.

But at the entrance, blocked by a landslide and soon forgotm In a fir forest by a stream falling from a glacier, A doe will give birth to her freckled fawn and the air

Will unfurl intricate leafy spirals to other eyes, as once to m

And every joy of morning will be discovered again, Each savoring of an apple picked in the tall orchard.

So I can leave peacefully everything I loved.

The earth will carry aqueducts, amphoras, brass chandelier

And when some day dogs chasing a bear

Burst into a crevasse and people of far-off generations Decipher our angular letters on the walls

They will be amazed that we knew so many of their own Though our futile palace has come to mean so little.

Oregon-Berkeley, 1964

“మీరు తప్పు చేశారు”

ఒక సామాన్యునికి అన్యాయం చేసిన మీరు
నేరాన్ని చూసి అట్టహాసంగా నవ్వుతారు
మంచి చెడును కలగాపులగం చేసి
విచక్షణా పంక్తిని మసగ పరిచేందుకు
మీ చుట్టూ మపు గుంపును ఉంచుకుంటారు

ప్రతి ఒక్కరూ మీ ముందు నమస్కరించినప్పటికీ
ధర్మం వివేకం మీకు కలగాలని వారంటారు,
మీ గౌరవార్థం బంగారు పతకాలను పొందిన తర్వాత
మరో రోజు గడిపినందుకు సంతోషిస్తారు

సురక్షితంగా ఉన్నామనుకోకండీ,
కవి గుర్తుంచుకుంటాడు అన్నీ
మీరు ఒకరిని చంపవచ్చు, కాని మరొకరు పుడతారు
తేదీల వేసి రాసిన ఒప్పందం ఇది

ఒక శీతాకాలపు ఉషోదయాన
ఒక మంచి పని చేస్తారు మీరు,
ఒక చెట్టుకొమ్మ వంగి పోయేలా
ఉరితాడు కట్టుకొని వేలాడుతారు

(వాషింగ్టన్, D.C., 1950)
English poem by : Czeslaw Milosz (జెస్లా మిలోస్జ్)

YOU WHO WRONGED

You who wronged a simple man Bursting into laughter at the crime, And kept a pack of fools around you To mix good and evil, to blur the line,

Though everyone bowed down before Saying virtue and wisdom lit your way, Striking gold medals in your honor, Glad to have survived another day, you,

Do not feel safe. The poet remembers. You can kill one, but another is born. The words are written down, the deed, the date.

And you’d have done better with a winter dawn, A rope, and a branch bowed beneath your weight.

Washington, D.C., 1950

చెస్లా మిలోజ్

“చెస్లా మిలోజ్’ ఒక పోలిష్-అమెరికన్ కవి, గద్య రచయిత, అనువాదకుడు దౌత్యవేత్త.
20 వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకడిగా గుర్తించబడ్డాడు. అతను 1980లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. ( కవిత్వం లో నోబుల్ బహుమతి పొందిన మొదటి పోలాండ్ కవి ఇతనే). ఆ ప్రస్తావనలో, స్వీడిష్ అకాడమీ మిలోజ్ గురించి” ప్రపంచంలో మనిషి ఎదుర్కొన్న తీవ్రమైన సంఘర్షణలను బహిర్గతం చేసిన గొప్ప కవి” అని ప్రశంసించింది.

చెస్లా మిలోజ్ సెటెనల్, కౌనో గవర్నరేట్, రష్యన్ సామ్రాజ్యం లో 30 జూన్ 1911లో జన్మించాడు

14 ఆగస్టు 2004 (వయసు 93) క్రాకోవ్, పోలాండ్లో మరణించాడు.

ముఖ్యమైన రచనలు :
రెస్క్యూ -1945,  ద కాప్టివ్ మైండ్ – 1953,  ఎ ట్రేటైస్ ఆన్ పోయెట్రీ- 1957

భార్య పేర్లు: జనీన మిలోజ్ (1956-1986),  కరోల్ తిజ్పిన్(1992-2002)

సంతానం: ఆంథోనీ,  జాన్ పీటర్

చెస్లా మిలోజ్ కొడుకు ఆంథోని తన తండ్రి కవితలను కొన్నింటిని ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. చెస్లా మిలోజ్ సోదరుడు ఆండ్రజ్ మిలోస్ (1917- 2002) కూడా సాహితీవేత్తే. అతడు పోలిష్ జర్నలిస్ట్, అనువాదకుడు, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత. మిలోజ్ రెండవ ప్రపంచ యుద్ధంలో వార్సాపై జర్మన్ ఆక్రమణ నుండి బయటపడి , యుద్ధానంతర కాలంలో పోలిష్ ప్రభుత్వానికి సాంస్కృతిక అనుబంధకర్తగా మారాడు. కమ్యూనిస్ట్ అధికారులు అతనిని బెదిరించినప్పుడు, అతను ఫ్రాన్స్ కు వెళ్ళాడు. యునైటెడ్ స్టేట్స్ లో బహిష్కరణను ఎదుర్కొన్నాడు. అక్కడ అతను బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయ్యాడు. అతని కవితలు ముఖ్యంగా అతని యుద్ధకాల అనుభవం గురించి వ్యక్తపరిచాయి. ‘ది క్యాప్టివ్ మైండ్’ అనే గద్యరచన స్టాలినిజం గురించి ఆయన చేసిన , ఒక ప్రముఖ వలస కళాకారుడిగా, మేధావిగా అతనికి పేరు తెచ్చి పెట్టింది.  జీవితమంతా మినోజ్  తన రచనలలో నైతిక విలువలు, రాజకీయాలు, చరిత్ర, విశ్వాసం వంటి అంశాలపై ప్రశ్నలను విశ్లేషించాడు. అనువాదకుడిగా, అతను పాశ్చాత్య రచనలను పోలిష్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు,  పండితుడిగా సంపాదకుడిగా, పశ్చిమ దేశాలలో స్లావిక్ సాహిత్యంపై ఎక్కువ అవగాహన సాధించాడు.

మిలోజ్ 2004 లో పోలాండ్‌లోని క్రాకోవ్‌లో మరణించాడు. పోలాండ్‌లో ప్రసిద్ధ ధ్రువాలకు గౌరవ ప్రదేశంగా పిలువబడే చర్చి అయిన ‘స్కాల్కా’లోవిశ్లేషణ అతన్ని ఖననం చేశారు.

సాహిత్యంలో నోబెల్ బహుమతితో పాటు, మిలోస్ ఈ క్రింది అవార్డులను అందుకున్నారు:

పోలిష్ PEN అనువాద బహుమతి (1974) ,  గుగ్గెన్‌హీమ్ ఫెలోషిప్ ఫర్ క్రియేటివ్ ఆర్ట్స్ (1976),  న్యూస్టాడ్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ (1978),  నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ (యునైటెడ్ స్టేట్స్ 1989)

రాబర్ట్ కిర్ష్ అవార్డు (1990)

ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగిల్ (పోలాండ్, 1994)

మిలోజ్ మిచిగాన్ విశ్వవిద్యాలయం, ఓక్లహోమా విశ్వవిద్యాలయంతో సహా అనేక సంస్థలలో విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ గా పేరు పొందారు. అక్కడ అతను 1999 లో పుటర్‌బాగ్ ఫెలోగా ఉన్నారు. అతను అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, లో ఎన్నికైన సభ్యుడు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ , మరియు సెర్బియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్లలో 1971లో అతను హార్వర్డ్ నుండి గౌరవ డాక్టరేట్లను పొందాడు.

1992 లో లిథువేనియాలో మిలోస్జ్ గౌరవార్థం  అతని జన్మస్థలాన్ని మ్యూజియం, సమావేశ కేంద్రంగా మార్చారు.  1993 లో, అతన్ని క్రాకోవ్ గౌరవ పౌరుడిగా చేశారు.   ఆయన పుస్తకాలకు అనేక అవార్డులు వచ్చాయి.

*  అతని మొదటి పుస్తకం ‘ఎ పోయమ్ ఆన్ ఫ్రోజెన్ టైమ్’కు విల్నోలోని పోలిష్ రైటర్స్ యూనియన్ నుండి అవార్డును లభించిందది.

* ది సీజర్ ఆఫ్ పవర్ ప్రిక్స్ లిట్టరైర్ యూరోపీన్ (యూరోపియన్ లిటరరీ ప్రైజ్) ను పొందింది.

*”రోడ్ సైడ్ డాగ్’ సేకరణ పోలాండ్లో నైక్ అవార్డును అందుకుంది.

*1989 లో, మినోస్జ్ రెండవ ప్రపంచ యుద్ధంలో వార్సాలో యూదులను రక్షించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తించి, హోలోకాస్ట్‌కు ఇజ్రాయెల్ యొక్క యాడ్ వాషెం స్మారక చిహ్నంలో “రైటియస్ అమాంగ్ ది నేషన్స్”గా పేర్కొన్నారు.

మిలోజ్  మరణానంతరం కూడా గౌరవించబడ్డాడు. పోలిష్ పార్లమెంట్  ఆయన నూరవ జయంతి 2011వ సంవత్సరాన్ని “మిలోజ్ ఇయర్” గా ప్రకటించింది. ఇది పోలాండ్ అంతటా, న్యూయార్క్ నగరంలో, యేల్ విశ్వవిద్యాలయంలో, డబ్లిన్ రైటర్స్ ఫెస్టివల్‌లో, అనేక ఇతర ప్రదేశాలలో సమావేశాలు మరియు నివాళి ద్వారా గుర్తించారు. అదే సంవత్సరం అతని పేరున లిథువేనియన్ తపాలా స్టాంపు విడుదల చేశారు.  పారిస్ సమీపంలో వీధులకు అతని పేరు పెట్టారు. విల్నియస్, పోలిష్ నగరాలైన క్రాకోవ్, గ్డాన్స్క్, బియాస్టాక్, పోజ్నాస్, వ్రోకావ్ లలో అతని పేరున ‘మిలోజ్  స్క్వేర్’ లు ఉన్నాయి.  2013 లో, విల్నియస్ లోని ఒక ప్రాధమిక పాఠశాలను మిలోజ్ స్మారకంగా   పెట్టారు.

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

వారందరిలో ఎక్కువ సంతోషి ఎవరు?

by ఒద్దిరాజు మురళీధరంరావు August 25, 2021
written by ఒద్దిరాజు మురళీధరంరావు

మీను చికాకు పడింది. కోపంతో మూతి ముడుచుకొని నాయనమ్మతో మాట్లాడనంది. కాని ఎక్కువసేపు నాయనమ్మతో కోపంగా ఎవరుండగలరు? నాయనమ్మ అందరితో చాలా ప్రేమగా ఉండేది. ఎవరి తప్పులు మనసులో పెట్టుకోకండి.

నాయనమ్మా, మూడురోజులు అయింది. నువ్వు ఒకరాజు కథ ఇంకా చెప్పక అంటూ మీను గులిపింది.

నాయనమ్మ తల ఊపింది, అవును నిజమే, మీనూ. అది నా తప్పే. నీకు రాజు గురించన కథ వెంటనే చెప్పవలసి యుంటిని.

ఇప్పుడు నేను ఒక మంచి రాజు కథ చెబుతాను విను కానీ నాయనమ్మా ఎవరైతే ప్రజలకు మేలు చేస్తాడో, మంచి పనులు ప్రజల కోసం చేస్తాడో, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టడో, శిక్షలు వేయడో, జైల్లో పెట్టడో, అతని గురించి మాత్రమే చెప్పమని మీను సవరించుకొని కూర్చొని అడిగింది.

మంచిది పాప, ఇక్కడ ఒకరాజు మీరు కోరుతున్నట్లే ఉన్నారు అంటూ నాయనమ్మ కథ మొదలుపెట్టింది.

అమృత్ అనే ఒకరాజు ప్రజలను ప్రేమగా చూచుకునేవాడు, మరియు రాజ్య వ్యవహారాలు కూడా మంచిగా చూచుకునేవాడు. అతని మంత్రి “చందన్” చాలా తెలివైనవాడు, అతను విరామం లేకుండా రాజ్యవ్యవహారాల్లో రాజుగార్కి సహాయ పడేవాడు.

ఒక రోజు రాజు అమృత్ మరియు మంత్రి చందన్ రాజుభవనంపై డాబాలో ఇటూ అటూ నడుస్తుండిది. అక్కడి నుండి దూరం వరకు అన్నివైపుల మంచి దృశ్యాలు కనబడుతుండెను. ఒకవైపున అంగడిలో జనులు కూరగాయలు, పండ్లు, ఫలాలు, అందమైన దుస్తులు వేసుకున్నవారు –కొనేవాళ్ళను, అమ్మేవాళ్ళను చూచి వారి సంతోషాన్ని గమనించి, రాజు చాలా సంతోషించాడు. ప్రజలవద్ద కొనేందుకు చాలినంత డబ్బుఉండటం రాజుకు తృప్తినిచ్చింది. చూద్దామన్నా బీదలు కనిపించలేదు. రాజ్యంలోని సుభిక్షతో రాజుకు ఎంతో తృప్తి కలిగించింది.

ఇతర మంచి పాలకుల వలెనె తన ప్రజలతో తను కూడా ఎంతో సంతోషంగా ఉంటుండేవాడు.

అతను చందనంవైపు చూసి ఇలా అన్నాడు, చూడూ మన ప్రజలు ఎంత తృప్తిగా ఉన్నారో, కాని నేను రేపు స్వయంగా వారితో మాట్లాడి వారి సంతోషానికి కారణం తెలుసుకోదలచాను. రేపు ప్రతి వృత్తివారిని మన దర్బారుకు పిలిపించండి మంత్రిగారు. చందన్ కు రాజు విచిత్రమైన కోరికలు వినడం పరిపాటే, కాబట్టి తల ఊపి రాజాజ్ఞ అమలు చేయడానికి వెళ్ళారు.

మరునాడు రాజు సంతోషంగా కూనిరాగం తీసుకుంటూ దర్బారులోకి వచ్చారు. గుమికూడిన ప్రజలనందరిని చూచి చాలా సంతోషించాడు. గొంతు సవరించుకొని లాశిగా అన్నాడు. మీ అందరిని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగటందుకు పిలిపించాను. మీ రాజుగా మీరందరూ తృప్తిగా ఉన్నారాయని తెలుసుకోదలచాను. మీ అవసరాలకు చాలినంత ఉందా? మీకు ఎవరైనా సంతోషం లేనివాడు తెలుసా? ప్రజలు ఒకరి ముఖం చూసుకొని నెమ్మదిగా జవాబు చెప్పుటకు ముందుకు వచ్చారు. ఒకరి తరువాత ఒకరు, వారు ఎంతో సంతోషంగా ఉన్నారో చెప్పారు. వారి వంటశాలలో సమృద్ధిగా సరుకులు ఉన్నాయి, వాళ్ళ వ్యపారాలు సజావుగా జరిగిపోతున్నాయి. రైతులు మంచి పంటలు పండిస్తున్నారు. నదులు, చెరువులు చేపలతో నిండి ఉన్నాయి. రాజును కోరవలసినది ఇంక ఏమున్నది?

రాజు ఇది విని ఇంకా చాలా సంతోషించాడు. అతని మంత్రి చందన్ మాత్రం అసంతృప్తితో ప్రజలు చెప్పిన మాటలు విన్నాడు. ఎందుకు అసంతృప్తి ఏం జరిగింది? వెంటనే అతను రాజుగారి దగ్గరకు వెళ్ళి వారి చెవులో ఏమో చెప్పారు. రాజుగారి కనుబొమ్మలు ఆశ్చర్యంతోపైకి లేచాయి. చందన్ మాత్రం మామూలుగానే ఉన్నాడు.

రాజుగారు దర్బారువైపు తిరిగి ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. మీరంతా సంతోషంగా ఉన్నారని చెప్పినందుకు నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను. కాని నేను దీన్ని పరిరక్షించదలచాను. రేపు ఉదయం సంతోషంగా వున్న ప్రజలందరు అంటే మీరందరు రాజ్యపు రాజుగారి తోటవద్దకు వచ్చి నన్ను కలువాలి. కానీ ఒక నిబంధన (షర్తు), మీరంతా  తోట ముఖ ద్వారం నుండి (Main gali) లోపలికి ప్రవేశించాలి. తోటంతా తిరుగుకుంటూ తోట వెనుక గేటు నుండి యటికి వచ్చి నన్ను కలువాలి. మీ కోసం నేను అక్కడ ఎదిరి చూస్తుంటాను. మీరు ప్రవేశించేపుడు మీకు ఒక సంచీ (Bag) ఇవ్వబడుతోంది. తోటలో మీకు నచ్చిన ఫలాలు, పుష్పాలు మీరు తినవచ్చు, సంచల్లో నిండా నింపుకోవచ్చు, గుంపులో అందరూ సంతోషంగా మన రాజు మంచినాతని కేరింతలు గొట్టారు. సామాన్యంగా రాజుగారి ప్రత్యేక తోటలోకి ఎవరికి ప్రవేశం కూడదు. ప్రపంచంలోని అందమైన మరియు విచిత్రమైన చెట్లను ఆ తోటలో పెంచారు.

మరుసటి రోజు నిర్ణయించిన సమయానికి అందరూ తోటముఖద్వారం వద్దకు చేరారు. ఆ సమయంలో తోట గేటు కీపర్లు గేటు తెరిచి అవలా ఒక సంచి ఇచ్చారు. మగవారు, ఆడవారో, పిల్లలు తోటలో అందమైన చెట్టు తీగల చుట్టూ తిరుగనారంభించారు. వారికి సేబులు, దానిమ్మలు, సపోటాలు, మామిడిపండ్లు మొదలుగునవి ఆకర్షణీయంగా కనబడినాయి. రాజుగారి ఆజ్ఞ ఉంది కాబట్టి తిన్నన్ని తిని, సంచుల నిండా నింపుకున్నారో, వారు ఇంతకు ముందు చూడని పూలుచూచి జడల్లో సంతోషంగా తిరుగుతున్నాడు.

అక్కడి నుండి కొంత ముందుకు పోగానే వారికి చెట్లమీద బంగారు సేబులు వెండి మామిడి పండ్లు చాలా ఆకర్షణీయంగా కనబడినాయి. తీగలు వజ్ర వైరుధ్యాలతో చెట్లకు చుట్టుకొని కనబడినాయి. ఇవి చూచి అందరు వారు సహజమైన పండ్లను కింద కుమ్మరించి బంగారు పండ్లతో ఆశ కొద్ది సంచులు నింపుకున్నారో. తోటంతా సహజమైన పండ్లతో నేంతా నిండిపోయి కుళ్ళిపోవునట్లయింది. బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు ధనం కాలం ప్రజలు ఆశపడినారు.

ఆ బరువైన సంచులతో వెనుక గేటు వద్దకు చేరాడు. అక్కడ రాజుగారు ఉన్నారు. అంతా చూస్తున్నారు. అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే వారి ఆశ్చర్యానికి అక్కడ వేగంతో ప్రవహించే నీళ్ళ కాలువ ఎదురయింది. అది దాటుటకు పడవలు లేకుండెను. అది వారి బరువైన సంచులతో దాటటం వీలవదని అక్కడనే కాలువపక్కన తలకాయలు గోక్కుంటు ఆగిపోయారు, చాలాసేపు వరకు, ఇంతలకు వారిలో నుండి ఒక యువకుడు పేరు వేణుబాయి. తన సంచీని నది పక్కనే వదిలేసి కొంతదూరం కాలువలో నడిచి తరువాత ఈదుకుంటూ కాలువ దాటాడు.

తరువాత అందరూ కూడా అతడిని అనుసరించారు రంథిగా. వారు జీవితాంతం సుఖంగా ఉండేంత ధనం ఉందనుకున్నారు. ఆ విలువైన సంచులను కాలువ పక్కన వదిలేసి ఈదుకుంటూ నది దాటుతూ వటి్ట చేతులతో అక్కడి నుండి తడిగుడ్డలతో రంధిగా మరియు కోపంగా కాళ్ళు ఈడ్చుకుంటూ రాజు మరియు చందన్ వద్దకు చేరారు. చందన్ ముఖంపై చిరునవ్వు, రాజుమటుకు రంధిలో ఉండెను. ఎప్పుడైతే వారందరూ రాజుగారి ముందు కలిశారో, అతను అన్నాడు, నిన్న అడిగినపుడు మీరంతా సంతోషంగా, తృప్తిగా ఉన్నామని చెప్పారు గదా! కాని ఈ రోజు తోటలోని బంగారు పండ్ల సంచులను వదిలేసి రంధిగా మాములందు నిలబడినారు. వాస్తవంగా మీరు మీ జీవితంలో సంతోషంగా వుంటే మీరు బంగారు పండ్లతో ఎందుకు సంచులు నింపుకున్నాడు, మరియు ఎందుకు ఈ రోజు ఎంతో రంథిగా ఉన్నారు? అందరూ తాము చేసిన పనిపై సిగ్గుతో తలలోంచుకొని నిలబడినారు.

కేవలం తన సంచిని ఏ మాత్రం విచారించకుండా నది పక్కన వదిలేసి నది దాటిన యువకుడు వేణుబాబు మాత్రం మామూలుగా కనిపించాడు. చందన్ ఇతడిని కనిపెట్టి ముందుకు రమ్మనిపిలిచాడు. అతడిని చందన్ అడిగాడు, చెప్పు నీకు నీ విలువైన పండ్ల సంచీ నది పక్కన వదిలేసి వచ్చినందుకు నీకు రంధి అవుతూ లేదా?

ఆ యువకుడు అన్నాడు, “నేను బంగారు ఫలాలు, పుష్పాలు తెంపుకోలేదు. నేను సహజమైన తినే పండ్లకు తృప్తిగా తిన్నాను. ఇంటివద్ద ఉన్న నా కూతురు కొరకు కొన్ని సంచీలో వుంచాను. అమ్మాయి ఈ తీయని మామిడి పండ్లను తిని సంతోషిస్తుందని, కానీ ఎప్పుడైతే నది దాటే వీలు లేదనుకున్నారో, నేను ఏమి విచారించకుండ నా సంచీని నది పక్కన వదిలేశారు. నా చంటిది ఏదైన వేరే చోటు నుండి మంచి రుచికరమైన పండ్లు పొందవ్చు. కాని రాజు మమ్ముల తన ప్రత్యేకమైన తోటలో సంతోషంగా తిరుగటానికి వీలు కలిగించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. అక్కడ మంచి మంచి వృక్షాలు, మొక్కులు, జంతువులను చూచాను. అతను గొప్ప రాజు, ఇంత అందమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో తిరుగుతూ ఎంతో ఉల్లాసంగా ఉండింది.

చివరగా అమృతరాజు ముఖంపై చిరునవ్వు కన్పించింది. చందన్ రాజువైపు చూచి అంటాడు, ఓ రాజూ, ఇప్పుడు మీరు గమనించియుండవచ్చు, ప్రజల తృప్తి ఆహారం, డబ్బు వుంటే ఉండదు, వారు కూడా మనసులో సంతోష పదాలనుకుంటారు. అప్పుడేవారు ధనం కలిగినా, కోలుపోయినా విచారించదు. ఇదే పాఠం ఎవరికైనా – ఒక రాజైనా, సామాన్యుడైనా గుర్తించుకోవలసింది.

రాజు సంతోషంతో తల ఊపాడు, అతని ప్రజలవలె, పాఠం తొందరలో ఎవరు కూడా మరచిపోరు. వారందరిలో అతిసంతోషి యువకుడు వేణుబాబు.

కథ ఇష్టమైందా మీనూ? రఘు అడిగాడు. ఓహ్ అతను, మీనూ తల ఊపింది. కాని నేను రాజు కన్న మంత్రి ఇష్టపడుతాను. అది నిజమే మీనూ, నాయనమ్మ ఒప్పుకుంది, రాజులకు తెలివైన మంత్రులు అవసరం, సరియైన నిర్ణయాలు తీసుకునేందుకు అక్బరుకు, బీర్బల్, కృష్ణదేవరాయలకు తెనాలి రామకృష్ణుడు ఉండిరి.

రాజులకే కాదు, మనసు కూడా ఎవరైనా తెలివైనవాడు ఉండాలి, మనం తప్పుచేసినపుడు సరియైన వారి చూపేందుకు, మన తల్లిదండ్రులు, తాతలు, నాయనమ్మలు అమ్మమ్మలు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు లేక మంచి స్నేహితులు కావచ్చు. ముఖ్యమైన విషయం అవసరమైనపుడు మనం వారి సూచనలు పాటించడం మంచిది.

 

 

 

 

 

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

జయహో ‘‘భారతీయ మహిళ’

by ShailajaMitra August 25, 2021
written by ShailajaMitra

​‘‘యత్ర నార్యన్తు పూజ్యంతే` రమంతే తత్ర దేవతా:!
​యత్రైతాస్తు స పూజ్యంతే ` సర్వాస్తత్రాఫలా:క్రియా: !!
​శోచంతి జామయోయత్ర -వినశ్యత్యాశు తత్కులం!
​నశోచంతితు యత్రైతా: `వర్ధతే తద్ధి సర్వదా !!
​తస్మాదేతా సదా పూజ్యా: `భూషణాచ్ఛాదనాశనై : !!’’
​మహిళలు గౌరవం పొందే స్థలంలో దేవతలు ఆనందంతో నిలుస్తారు. స్త్రీలను అగౌరవపరిచే వారికి ఏ పనులలోనూ మంచి ఫలితాలు లభించవు. ఏ స్త్రీలు వంశంలో దు:ఖిస్తూ ఉంటారో ఆ వంశం నాశనమైపోతుంది. నిజానికి వారి సంతోషమే వంశోన్నతికి మూలం. ఎపుడూ వారికి అన్నం, వస్త్రం తదితర సామగ్రీ ఉండే విధంగా వ్యవహరించాలి అనేది శాస్త్రం. వాస్తవం కూడా.
​అనాది నుండి అత్యాధునికం వరకు మహిళ తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ తన ఉనికి పతాక స్తాయిలో వినువీధుల్లో విస్తరిస్తూనే ఉంది. ఇది నిజం. నిజానికి ఆదిలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత రాను రాను తగ్గుతూనే వస్తుందని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మహిళ కి ఇన్ని పరిమితులు విధించి ఉన్నట్లయితే కులాలకతీతంగా ఒక రaాన్సీ లక్ష్మీబాయి, సమ్మక్క సారక్కలు, జ్యోతీరాయ్‌పూలే, మొల్ల, చాకలి ఐలమ్మ వంటి వారు ఉండేవారే కారు. ఆ కాలంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాను రాను ఎప్పుడైతే పితృస్వామ్యవ్యవస్థ అహంతో ముందువరసలోకి వచ్చిందో అపుడే స్త్రీల అణచివేత ప్రారంభమైంది. కన్యాశుల్కం ఇచ్చిన రోజులనుంచి నేడు వరకట్నం ఇస్తున్న నేటి రోజుల వరకు  మహిళ ఆర్థికంగా సమానత్వం సాధించినా కూడా ఇంకా ఇంకా అణచివేత సాగుతూనే ఉంది. వీటిని ఎలా అధిగమించడం? అమ్ముడుపోతున్న చట్టాలను ఎదిరించి గెలిచే ధైర్యమూ ఎవరికీ లేదు. మరి ఆడపిల్లను ఎలా పెంచడం? కాపాడటం ఎలా? అంతరిక్షానికి ఎగురుతున్నా కూడా ఇంకా అణగారిన కథలే వినిపిస్తున్నాయంటే లోపం ఎక్కడుంది? అసలు ఆడపిల్ల సమాజంలో బతకగలదా? తనకు తానే ధైర్యంగా ఈ సమస్యలను ఎదుర్కోగలదా? వంటి అనేక పశ్నలకు సమాధానంగా వెలువడిన ‘‘భారతీయ మహిళ’’ అమూల్యమైన గ్రంథాన్ని రూపొందించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
​ఈ గ్రంథంలో వేదాలలో మహిళలు, పురాణాల్లో మహిళలు, భాగవతంలో మహిళలు, రామాయణంలో మహిళలు, మహాభారతంలో మహిళలు, దేశ చరిత్రలో మహిళలు, ఆధునిక కాలంలో మహిళలు , పూజ్యశ్రీ గురూజీ చెప్పిన మహిళల భాగస్వామ్యం వంటి అతి విలువైన అంశాలు ప్రస్తావనలోకి వచ్చాయి.
​భారతీయ మహిళ` మాతృశక్తి లో ఆత్మకు స్త్రీ అనీ, పురుషుడనీ, మృగమనీయ పక్షి అయనీ పాము అనీ భేదం లేదు. అందరిలోనూ అంతటా ఉన్న ఆత్మ ఒక్కటే.  సంసారంలో ఎవరి విధి వారు నిర్వర్తిస్తారు. పరస్పరం సహకరించుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ జీవిస్తారు. వర్గపోరాటమే జీవితమనుకుంటే అదే చరిత్ర అనుకుంటే కలిసి బతికే వ్యవస్థ ఏర్పడి కాదు ఆత్మీయత , అనురాగం సర్వ ప్రాణుల మధ్య ఎప్పటికీ ఉంటాయి. ఈ సువిశాల భావాలు, ఆచారాల కారణంగా, మహిళను భార్యగా, అక్కగా, చెల్లెలిగా గౌరవించబడుతున్న కారణంగానూ, జీవితంలో పురుషుడు స్త్రీనే అనుసరించి నడుస్తాడని చెప్పడం జరిగింది.
​ఋగ్వేదంలోని అనేక మంత్రాల్ని మహిళలే దర్శించినట్లు అంతర్గత సాక్ష్యాలున్నాయని అంటారు. ‘‘గార్గి, రోమశ, ఘోషా, విశ్వాపర, ఆత్రేయ, లోపాముద్ర, వసుక్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, కామాయని, వైవస్వతి, యామిపైలమి, సూర్య, స్వస్తి, శిఖండిని, ఊర్వశి, శచి, దేవరని, ఇంద్రమాత, సర్వరాజ్ఞి, వాక్‌, గోధ..  తదితరుల పేర్లు ఉన్నాయి. వీరందరూ దార్శనికులైన మేధావినులు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాహిత్యం, కళలు వంటి వివిధ వృత్తులు, రాజనీతి తదితర రంగాలలో ప్రతిభావంతులుగా వెలిగారు. మహిళావికాసం సమగ్రంగా జరిగిన కాలమది. ఆ కాలంలోని కొంతమంది మహిళామణులను గురించి తెలుసుకోవాలంటే ముందుగా
​బ్రహ్మవాదిని గార్గి గురించి: మహావేదాంతి రాజఋష జనకుడు మిథిలను పరిపాలిస్తున్న రోజుల్లో సీత తండ్రి జనకుడు కాడు. రామాయణ కాలం కన్నా ఎంత ముందున్నవాడు. ఈ రాజవేదాంతి ఆస్థానంలో గార్గి అనే బ్రహ్మవాదిని ఉండేది. యాజ్ఞవల్క్య అనే ఋషి ఉండేవాడు. వీరిరువురికి బ్రహ్మతత్త్వ వివేచనార్థం సభ జరుగుతున్నప్పుడు ఆకాశం, నేల, నీరు వంటి పంచభూతాల పట్ల వాదోపవాదాలు జరిగింది. చివరికి యాజ్ఞవల్క్యుని బ్రహ్మజ్ఞానిగా గార్గి గుర్తించింది. అంటే అతను బ్రహ్మజ్ఞాని అని గుర్తించిన మహామేధావి గార్గి అన్నమాట. అందుకే ఈమె బ్రహ్మవాది అయింది.
​శ్రేయోమార్గంలో మైత్రేయి యజ్ఞవల్కుని భార్య. వీరికొక ఆశ్రమమున్నది. పోషణ నిమిత్తుం ఆశ్రమ భూములున్నాయి. గోవులున్నాయి. ఫలధాన్య సమృద్ధి వున్నది. ఆయన ఆశ్రమం విడిచి వెళ్ళి కొన్నాళ్ళపాటు తపస్సు చేసి దేశ పర్యాటన చేసి రావాలనుకుని మరో భార్య అయిన కాత్యాయనికి మొదటి భార్య మైత్రేయికి ఆస్థి విభజన చేసి రక్షించుకోవలసినదిగా తెలిపి మైత్రేయితో ఈ విషయం ప్రస్తావించాడట. కానీ మైత్రేయి ఈ భూమి వల్ల నేను అమృతత్త్వం పొందుతానా? అని అడిగిందట. అందుకు ఎప్పటికీ పొందలేవు. సంపదలున్నవారు అమృతత్త్వాన్ని పొందలేరు అంటే అమరత్వం పొందని ఈ ఆస్తి వలన, సంపద వలన నాకేం ప్రయోజనం ఉంది అని తిరస్కరించిందట.  అయితే ఆత్మ బ్రహ్మ ఒక్కరే! ధ్యానం చేయాలి. ఆత్మను తెలుసుకోవాలి, ఇంద్రియాలను తాడిరచి ఆత్మను శోధించి ఈ పంచభూతాత్మక ప్రపంచం కంటే ఆత్మ ఎలా భిన్నమైనదో భార్యకు యజ్ఞవల్కుడు వివరించాడట. పృథ్వి జలము, అగ్ని , వాయువు, ఆదిత్యుడు, దిశలు, విద్యుత్తు, మేఘం, ఆకాశం తదితర వివరాలు చెప్పి ధర్మమే సర్వప్రాణులకు ప్రీతియని మైత్రేయి తెలుసుకున్నది.. కానీ రెండవ భార్య మాత్రం ఆస్తివైపే దృష్టిని సారించి కఠోపనిషత్తులోని శ్రేయస్సును, ప్రేయస్సును స్వీకరించింది. ఇపుడు కాత్యాయని సంసారాన్ని నడుపుతోంది. మైత్రేయి మోక్ష పథంలో ఉంది. యాజ్ఞవల్క్యుడు తపస్సులో ఉన్నాడు ముగ్గురిలో ఒకరు ప్రేయస్సుకు ప్రతీక, మైత్రేయి శ్రేయస్సుకు ప్రతీక, యాజ్ఞవల్క్యుడు తపస్సుకు ప్రతీక అనచ్చు. ఇలా సుజ్ఞాని సులభ జనక మహారాజుతో సులభ వేదాంత గోష్టి చేసిన అంశం భారతంలో సూచించబడిరది.  వేదాల్లో వందల కొలది మహిళలు పృథ్వి, ఇల, సరస్వతి, భారతి, సినీవాలి, రాఖ, సూనృత, పురంధ్రి, ధిషణ, అనుమతి, తిఱిని, ఇంద్రాణి, ఉషస్సు, రాత్రి, శ్రద్ధ, అనుమతి, అరామతి, దంపతి, అరణ్యాని, వరుణాని వంటి వారంతా మహిళా రూపంలోని దేవతలే అనవచ్చు. ఇలా మహిళల పేర్లు ఎన్నో ఒక్క ఋగ్వేదంలోనే ఉన్నాయి. వీటన్నిటిమీద ప్రత్యేకాధ్యయనం చేయాల్సిందే అంటారు రచయిత.
​మాతృశక్తి దివ్యత్వాన్ని తీసుకుంటే ఆదిశక్తి మహామాయగా అవతరించింది. ఈ తల్లికి మహాకాళి అని పేరు. మొదటి అవతారంలో ఈ అమ్మవారు మధుకైటభులనే రాక్షసులను సంహరించారు.
​రెండవ అవతారం మహిషాసురమర్థిని. సింహవాహనjైున ఈ తల్లికి ‘మహాలక్ష్మి’ అనే పేరుంది. ఈ తల్లి మహిషముఖుడైన అసురుడిని సంహరించింది. మూడవ అవతారం అయిన మహాసరస్వతి రక్తబీజుడ్ని సంహరించింది. నాల్గవ అవతారంలో యోగమాయగా జన్మించి కంసుడ్ని భయపెట్టి అదృశ్యమైపోయింది. ఐదవ అవతారంలో అమ్మవారు దంతాలనే ఉపయోగించడం వల్ల రక్తదంతిగా పేరును సంపాదించుకుంది. లోకంలో కరువు కాటకాలు ఎక్కువై పోవడంతో తల్లి అంతటా శాకాలు సృష్టించి కరువును తొలగించింది. అందుకే ఈ తల్లిని శాకాంబరిగా పిలుస్తారు. ఏడవ అవతారంలో దుర్గుడునే రాక్షసుడ్ని సంహరించినందువలనే దుర్గాంబగా పేరు వచ్చింది. ఎనిమిదవ అవతారంలో తల్లి మాతంగుని ఇంట పుట్టి మాతంగిగా పిలవబడిరది. తొమ్మిదవ వతారంలో రాక్షస సంహారం నిమిత్తం అమ్మవారు భ్రమరాలను సృష్టించి విజయం సాధించింది. అందువల్లే ఈ అవతారానికి భ్రామరి అనే పేరు వచ్చింది. ఇలా భిన్న రూపాలతో వర్ణితమైన పురాణాది ప్రక్రియలను ఆధారంగా గ్రహించి రేఖామాత్రంగా మనకు దర్శనమిస్తున్నాయి.
​పురాణాల్లో మనసావాచా కర్మణా శుచీ దేవి. శచీదేవి, వేదవేత్త వేదవతి, వరూధిని మన నాయనమ్మ, అరుంధతి మన అంతర్యామి, ఆత్మబంధువు అనసూయ, ప్రేమరస చైతన్యమూర్తి ఊర్వశి, సుస్థిర మానస సుకన్య, ఎల్లలు లేని ఎల్లమ్మ రేణుకమ్మ, సత్యసారమతి చంద్రమతి, సంపదల దేవి లక్ష్మీదేవి, పరాశక్తి పార్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి వంటి దివ్యశక్తులున్న మహిళలెందరో పురాణాల్లో ఉన్నారు. మన జీవితాలు, ప్రవర్తనలు భారతీయ మహిళలకు ఆదర్శాలయి, ఆచరణ యోగ్యాలయ్యాయి.
​ఇంద్రసేన, దేవసేనచ పులోమ, ఇల, అంగీరస, కావేరి, ఘృతాచి, జలంధర, తిలోత్తమ, మనోరమ, యమున, రాధ, లోపాముద్ర, శతరూప ఇలా  మరో వందమంది పురాణ మహిళల ద్వారా సార్వకాలీన సత్యాల్ని అనుసరించవచ్చు. అయితే ఈ పురాణ మహిళలు ఏం చేసారు? అని ఆలోచిస్తే సత్యమే మాట్లాడుతారు. స్వేచ్చాభిప్రాయాలు ప్రకటిస్తారు. రాజీపడి జీవిస్తారు. ప్రేమను పంచి పెడతారు.అన్యాయాన్ని ఎదిరిస్తారు. పురుషునితో పాటు సమానంగా వ్యవహరిస్తారు. జన హితం కోసం దేశ హితం కోసం త్యాగాలు చేస్తారు. ఆత్మబంధువులై అందరినీ ఆదుకుంటారు. శక్తి పూత్కారం చేస్తారు. జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. అంతేనా?  అంటే కాదు. మహిళాలోకానికి ఆదర్శవంతులై నిలిచారు. ఆధునిక మహిళా ప్రస్థానంలో ప్రాథేయాలంగా మహిళలంతా నిలిచారు. ఒక్కొక్కరి స్పర్శ ఒక్కొక్క పీఠికై నిలిచేలా చేసారు. నేడు దారులు వేరైనా గమ్యం ఒకటే అనిపించేలా ఆనవాళ్ళను ఉంచి మరీ కదిలారు.
​భాగవతంలో ఆదితి మాత నేతృత్వం. వ్యతిరేక దిశలో దితి ప్రయాణం, దివ్య మార్గం చూపిన దేవహూతి, సహనశీలి ఆశావాది దేవకి, వాత్సల్యద యశోద, చంద్రునికో నూలుపోగు అంటున్న కుబ్జ, జగన్మోహిని యుక్తి, అరుచి సురుచి వినీతి సునీతి, తమస్సు చీల్చిన ఉషస్సు ఉష, జనగణనాయక రాధ, మహిళా చైతన్య ప్రతీక సత్యభామ, కృష్ణ చైతన్య స్రోతస్విని రుక్మిణి వంటి వారెందరో మహిళలు భారతీయ మహిళల జీవితాలతో పెనవేసుకుపోయారు. వీరిలో కొందరు భారతాది గ్రంథాల్లోనూ, అన్య పురాణాల్లోనూ వచ్చారు. కొందరిని మాత్రమే పరామర్శించే అవకాశం ఉంది. వీటి వివరణలు ఈ గ్రంథంలో చదవవచ్చు.
​రామాయణంలో మహిళలు గమనిస్తే ఈ మహాకావ్యం నిండా మహిళల కథలే. మహితమైన దారిలో నడిచిన మండోదరి, రాజనీతి దురంధర మంథర, జైజైజై కైకామాతా దేవహిత కార్యనిర్మాత స్త్రీ జనాభ్యుదయతారా తార, అసురత్రాత, కైకసి కైసేత,, సత్య సౌందర్యమూర్తి సరమ, జనరంజన అంజన, కౌశల పూర్ణ కౌసల్య, ఫలిత పర్ణ శబరి, విషాగ్ని వృక్షం శూర్పణఖ, యోగిని ఊర్మిళ, పరమపునీత లోకమాత సీత తలుచుకుంటే రామాయణమంతా రమణుల కథే కదా అనిపించకమానదు.
​మహేతిహాసంలో (మహాభారతంలో)మహిళల విషయానికి వస్తే  స్వేచ్ఛాజీవి గంగ, ధీరమానస సత్యవతి, సౌజన్యవతి శర్మిష్ట, స్వాభిమాని దేవయాని, కపటి కద్రువ వినీత వినత, మేధానిది మేనక, సత్యవాది సరమ, ధర్మవాదిని జరత్కారువు, మృత్యుంజయ సావిత్రి, పరమ పతివ్రత పారమార్థికత, వీరమాత కుంతి, భారత భారతి ద్రౌపది. వీరిని తలుచుకుంటూనే ఉంటాం. మళ్ళీ మనం యథాస్థానంలోకి వస్తూనే ఉంటాం.
​దేశ చరిత్రలో మహిళల్ని ఆలోచించుకుంటే గృహంలో యశోధర, ప్రచారిక సంఘమిత్ర, దేవిగా మారిన ఉభయభారతి, ఉత్తమ సేవిక సుజాత, వీర నారి రుద్రమ, రామాయణ రచయిత్రి మొల్ల, నాయకురాలు నాగమ్మ, వీరునికి వెన్ను చూపని చానమ్మ, చితిని వరించిన సంయుక్త, కృష్ణభక్తిని చూపే మీరాబాయి, విద్వేషాల మంటల్లో దుర్గావతి, యువతకు ప్రేరణ రaాన్సీరాణి ఇలాంటి చరిత్రలో ఎందరో ఇంకెందరో ఉన్నారు.
​కీస్తు శకారంభం నుండి ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం వరకు ఎందరో మహిళలు గృహిణులుగా, వీర వనితలుగా, పరిపాలకులుగా, విద్యావేత్తలుగా, వ్యవసాయదారులుగా, వృత్తి నైపుణ్య రమణులుగా, నాట్యగత్తెలుగా, సంగీత విద్వాంసులుగా, దార్శనికులుగా, కర్మయోగినులుగా, భక్తి ప్రచారకులుగా, దేశికలుగా, ఋషికలుగా, రచయిత్రులుగా, కవయిత్రులగా దేశంలో భిన్న ప్రాంతాలలో వికసించారు. అయితే ఈ దేశం జాతిలో శక్తి తగ్గి విదేశీయులను తనలో జీర్ణించుకునే పాటవం కోల్పోయిన నాటినుంచి స్వతంత్య్రాన్ని కోల్పోతూ వచ్చింది. దానివల్ల, స్వదేశీ ఆచారాలపై జీవన విధానాలపై విదేశీయ అశాస్త్రీయ భావజాలం పెత్తనం చలాయిస్తూ వచ్చింది.  ఇది కాస్త రాజ్య సభల్లో, వీధుల్లో వీర విహారం చేసినా చాలాకాలం గృహంలోనే ప్రవేశించలేకపోయింది. అందువల్ల విశాల హిందూ ధార్మిక సాంస్కృతిక తాత్త్వికాంశాలను ఎన్నింటినో గృహిణి అందించగలిగింది. ఇలా జాతి జీవనాడి నిత్య చైతన్యంతో పోరాడిన స్థలం గృహమే. ఈ గృహానికి యజమానే గృహిణి. ఆమె పుణ్యఫలమే జాతిలో స్వాతంత్య్ర భావబీజాలు నాటుకోవడం, ఆధునిక మహిలకు స్పూర్తి ప్రదాతగా నిలవడం అంటూ వివరిస్తున్న రచయిత భావాలకు ప్రణమిల్లక తప్పదు.
​ఇదొక అద్భుతమైన గ్రంథం. ప్రతి మహిళ ఇంట్లో నిత్యం నిలవాల్సిన గ్రంథం కూడా. స్వేచ్ఛ అనేది ఒకప్పుడు లోక కళ్యాణం కోసం ఉపయోగించేవారు. నేడు స్వేచ్ఛ దుర్వినియోగం ఎక్కడ ఎలా అవుతోందో అనే విషయాలు ఈ గ్రంథం చదివితే అందరికీ ఖచ్చితంగా బోధపడుతుంది.  నామటకు నాకు చాలా కాలమైంది ఇంత చక్కని గ్రంథం చదివి అనిపించింది.  గౌరవనీయులైన కసిరెడ్డి వెంకటరెడ్డి గారి కలం నుండి వెలువడిన ఈ గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఒక తలమానికం.

కసిరెడ్డిగారి గురించి

కసిరెడ్డి వెంకటరెడ్డి కవిగా, వక్తగా, వ్యాసకర్తగా, జానపద వాజ్మయ పరిశోధకుడిగా, ధార్మిక సామాజిక విజ్ఞాన వ్యాఖ్యాతగా వాసికెక్కాడు

పద్య సంపుటులు:::చైతన్యశ్రీ, సుభాషిత గీత త్రిశతి, లేతమబ్బుల

గేయ సంపుటులు: సింహగర్జన, ప్రబోధమాల, మున్నూరు ముక్తకాలు, శ్రీ భగవద్గీత

వచన కవితా సంపుటాలు, శతకాలు,కథాసంపుటాలు, నవలలు, వ్యాససంపుటాలు,  అనువాదాలు, బాలసాహిత్య ం,  వ్యాఖ్యానాలు, పరిశోధన, యాత్రా చరిత్ర తదితరాలు ఎన్నో పుస్తకాలు వ్రాశారు.
Attachments area
August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

బి.సి.వాద సాహిత్య స్తబ్దతను బద్దలుకొట్టిన గ్రంథం

by Laxminarayana August 25, 2021
written by Laxminarayana

సాహిత్యం యొక్క ప్రధాన భూమిక సమాజ‌ హితాన్ని కాంక్షించడం. రాయబడే ప్రతీ విషయం సాహిత్యం లో భాగం అవుతుందా అనే ప్రశ్నకు సమాజ శ్రేయస్సును కోరుతూ, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినదైతే అది సాహిత్యంగా పరిగణించడం ఏ మాత్రం తప్పు కాదు. సాహిత్యం యొక్క పరిధిని, సాహిత్యంలోని రీతులను పనికట్టుకొని హాద్దులు నిర్ణయించడం సాధ్యం కాని పని. ఒకనాడు మౌఖిక సాహిత్యం ఆ తర్వాతి కాలంలో 11వ శతాబ్దం నాటి నన్నయ  నుండి నేటి ఆధునిక కవుల దాకా, నాటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుండి నేటి నానీలు, హైకూలవంటి ప్రక్రియలదాకా దేనికీ కొలమానాలు రూపొందించలేం. కాబట్టే

సాహిత్యం యొక్క పరిధి విస్తృతమైంది. సామాజిక స్పృహతో పాటు, వ్యక్తిని సంకుచితత్వం నుండి విశాల భావాలోచన వికాసం వైపు పయనించేలా చేయగలిగిన శక్తి సాహిత్యానిది.

తెలుగు సాహితీ ప్రపంచాన ఎందరో గొప్ప కవుల ఉదయాస్తమానాలు జరిగినా వారు నాటిన ఆలోచనాంకురాలు సమాజాన్ని కాలానుగుణంగా ప్రభావితం చేస్తూ వున్నాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం విప్లవాలకు దారితీయొచ్చు కాని అది విప్లవాత్మక వేగంతో జరుగుతుందా అనేది ఎవ్వరం నిర్ణయించలేం. తెలుగు సాహిత్యంలో సాహితీ కలాలు ఎన్నో వాదనలను, ఎన్నెన్నో వేదనలను కాగితపు కాన్వాస్ పై పుటలు, పుటలుగా చిత్రించాయి.  కాల, స్థల, పాలనా పరిస్థితులకు అనుగుణంగా  పేదల, పీడితుల కష్టాల, కన్నీటి కథలను ఎందరో కవులు సిరాచుక్కలతో వ్యవస్థపై కుమ్మరించారు. సాహితీ కలానికుండే శక్తి ప్రశాంతంగా కనిపించే అగ్ని పర్వతం లాంటిది. ర

చనాభిరుచి అనేది వ్యక్తి, వ్యక్తిని బట్టి మారుతుంది. అది పూర్తిగా స్వనిర్ణయ సాధికారతను కల్గి వుంటుంది. ఒకనాడు శిష్ట కులాలకు మాత్రమే అనే చందాన సాగేది పాండిత్య, రచనా ప్రస్థానం కాని నేడు  అన్ని వర్గాలకు వ్యాపించడం శుభపరిణామం. దాని వల్ల జరిగిన లాభం ఏమిటంటే? ఇతరుల భాదను చూస్తూ రాస్తున్న వ్యక్తి కంటే అనుభవించిన వాడు చేసే వ్యక్తీకరణ మరింత సహజంగా, ప్రభావవంతంగా వుంటుంది.  కుటుంబ ప్రాతిపాదికన వ్యక్తుల సమూహం చేత భాషా, ప్రాంత, కుల, మత వైరుధ్యాలచే నిర్మితమయ్యే సంక్లిష్ట వ్యవస్థ సమాజం. సాహిత్యమెప్పుడూ సాధారణ ప్రజల పక్షాన నిలిచి వారి నిత్యజీవితంలో నిక్షిప్తమై వున్న ఘోషను, గోసను వినిపించే స్వరం అవుతుంది. ఈ క్రమంలో దళిత వాదం, స్త్రీ వాదం, మైనార్టీ వాదం, బహుజనవాదం మొదలైన సాహితీ వాదాలు ఉనికిలోకి వచ్చాయి.

ఏ వాదమైనా వ్యక్తి, వ్యవస్థ యొక్క అస్థిత్వాన్ని, జీవికను ఉనికిలో ఉంచే లక్ష్యంతో కొనసాగుతూ సమాజపు విపరీత పోకడలను నిరసించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ మూలంగా మన సమాజాల్లో ఏర్పడిన సంఘర్షణలు, సంపీడిత పరిస్థితులను బహిష్కృతం చేసే స్వభావాన్ని కల్గి వుంటాయి. అక్కడి నుండి ఉద్భవించినవే దళిత, స్త్రీ, మైనార్టీ, బహుజన వాదాలు. ఈ క్రమంలో బిసీ వాదం అనే ప్రత్యేక వాదం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తక తప్పదు. ఈ ప్రశ్నకు సమాధానంగా నిలిచే దానికి సంబంధించిన అంశాలను చర్చించే వివిధ బీసీ వాద గ్రంథాల క్రమంలో నిలిచిన మరొక గ్రంథం “తెలంగాణ బి.సి. వాద సాహిత్యం”. ఈ పుస్తక రచయిత అట్టెం దత్తయ్య. అట్టెం దత్తయ్య నేటి కామారెడ్డి జిల్లాలోని షెట్పల్లి గ్రామ వాస్తవ్యులు. ఈయన ఇటీవలే “మహభారతంలో సంవాదాలు- సమగ్ర పరిశీలన” అనే అంశంపై పరిశోధనను పూర్తి గావించారు. ఇంతకుముందు ఈ రచయిత ఆధ్వర్యంలో ‘కళ్ళం’(సాహిత్య వ్యాస రాశి) 2018 అనే గ్రంథం వెలువడింది.

‘ఆకాశంలో సగం’ అనే నినాదంతో పురుషుల్లో సగభాగంగా వున్న స్త్రీలు వారి పట్ల కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ వాదం అనే పేరుతో పోరాడుతున్నారు. సమాజంలో సగ భాగంగా వున్న బిసీలు అనేక ఉద్యమాలలో క్రియాశీలంగా వుంటున్నప్పటికీ అటు రాజ్యాధికారమూ, ఇటు అస్తిత్వమూ లేని పరిస్థితుల్లోకి నెట్టి వేయబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బిసిలు అస్తిత్వ, రాజ్యాధికారం వైపుగా ఆలోచించడం అవసరం. దానికై సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనం తథ్యంగా రావాలి. బిసీలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక అంశాలు బహుజన సాహిత్యం ముసుగులో అసౌష్ఠవ రీతిలో విసిరివేసినట్లుగా వున్న సందర్భంలో వాటినంతటినీ ఒక చోటకు చేర్చడం అనివార్యమైంది. ఈ అనివార్యతను తొలగించి బిసీ సాహిత్యం యొక్క స్థాయి, వ్యాప్తిలను తెలిపిన నిర్మాణాత్మక రచన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ ఈ పుస్తకానికి ‘బహుజనుల వీలునామా’ పేరుతో పీఠిక రాశారు ఎస్.రఘు గారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వైశ్వీకరణం(గ్లోబలైజేషన్), వైశ్యీకరణం( వాణిజ్యీకరణం) మూలంగా చేతి వృత్తులు, కుల వృత్తులతో పాటు అన్ని వర్గాలు అస్తిత్వాన్ని కోల్పోయి వృత్తి, విషయ నైపుణ్యాలకు విలువ లేకుండా పోయింది. వాటి పర్యవసానంగా సంపద కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ పెరిగిపోయి అన్ని వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నాయి. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఏకరువు పెట్టే క్రమంలో కొందరు స్వానుభవం చేత, మరికొందరు పరిశీలన అనుభవం చేత సాహిత్యాన్ని సృష్టించారు. ఆ సాహిత్యాన్ని సంకలనం చేస్తూ విమర్శించిన పుస్తకం ఈ ” తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ పుస్తక పీఠిక రాశారు సాగి కమలాకర శర్మ గారు.

“బహుజనులు దళితులు ఒక్కరే, ఇవి రెండు సమానార్థక పదాలు. ఈ విషయం గుర్తించకుండా ఎస్సీలను దళితులుగా, బిసీ లను బహుజనులుగా పేర్కొని వారి మధ్య దూరం పెంచకూడదు” (తెలంగాణ బిసీ వాద సాహిత్యం-పేజీ  24) అంటూ కాలువ మల్లయ్య స్పష్టం చేశారు. లక్ష్మీనర్సయ్య ‘చిక్కనవుతున్న పాట’ లో ఎస్సీ, ఎస్టీ, బిసీ కవులందరూ తమ స్వానుభావాల్ని కూర్చుతూ రాసిన కవిత్వమే దళిత కవిత్వం అన్నాడు. పరాయి పల్లవి వ్యాసంలో సతీష్ చందర్ దళిత వాడలు అగ్రహారనికి ఎంతదూరమో బిసీ పేటలకూ అంతే దూరం. హరిజనోద్దరణ‌ కవిత్వం పేరుతో పులుపు చావని బిసీ కవులు మళ్ళీ రాయనవసరం లేదంటూ ఘాటుగా స్పందించాడు. బిసీ సాహిత్యకారులు తమ కోణాల్లో సాహితీ సృజన చేస్తున్నప్పటికీ వారి సాహిత్యం బిసీ అస్తిత్వవాద సాహిత్యంగా ఎందుకు గుర్తించబడలేదు అనే ప్రశ్నను బాణాల శ్రీనివాస్ లేవనెత్తాడు. ఇదే విషయంపై ఎస్.రఘు “కొన్ని గాయాలు మానవు కాని మానినట్టుగా వుంటాయి. అస్తిత్వ ఉద్యమాలు కూడా గాయాల్లాంటివే కొన్నిసార్లు అవి ఉవ్వెత్తున ఎగసి పడలేక పోవచ్చు, కాని అంతర్గత స్రావాలు జరుగుతూనే వుంటాయి అని చెప్తూనే బిసీల కన్నా పై తరగతి వారి చేతుల్లో మూల్గిన సాహిత్యం ఇప్పుడిప్పుడే వారికి సాన్నిహిత్యంగా ముందుకు సాగుతుండడం వల్ల బిసీలు తమ అస్తిత్వవాదాన్ని బలపర్చడానికి కొంత తెగింపును ప్రదర్శించడం లేదు” అనే కారణాన్ని తెలియపరిచాడు. ఇలాంటి సమయంలో 2001లో పూర్తి బిసీ వాద కవిత్వంగా జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’ అనే సంకలన గ్రంథం వెలువడింది. ఆయన అగ్రకుల అధిపత్య, భూస్వామ్య వర్గాల అణచివేతను ఎదిరించడానికి దళిత, బిసీ, మైనార్టీలందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని కోరుకున్నారు. కాని ఈ విషయాన్ని దళితులు మరో కోణంలో అర్థం చేసుకున్నారంటూ ‘కొత్త తొవ్వలు తీస్తున్న బిసీ కవిత్వం’ అనే వ్యాసంలో పగడాల నాగేందర్ తెలుగు సాహిత్యంలో దళితవాద కవిత్వం ఒక పాయలాగ మొదలై 1995-2000 మధ్య పూర్తి పాయలాగా చీలిపోయింది. దానికి కారణం “అనాది కాలం నుండి అగ్రకులాల చేతిలో అవమానాలకు గురికావడం వల్ల వారికి వారే అన్నట్లుగా భావించడం, దాంతోపాటు బిసీలను మీరు మాతో సమానమైన పీడితులు కాదు అంటూ వారిలో నిక్షిప్తమైన ఎత్తిపొడుపు భావన” అంటూ వివరించారు. శతాబ్దాలుగా సమాజంలో, చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్న సమాజ నిర్మాతలు, సంపద సృష్టికర్తలు బిసీలు అంటూ బి.ఎస్. రాములు ఒక వ్యాసంలో తెలియపర్చారు. దళిత సాహిత్యం, మాదిగ సాహిత్యం, మైనార్టీ సాహిత్యం, గిరిజన సాహిత్యం, క్రైస్తవ సాహిత్యం అంటూ అన్నింటికీ ఒక అస్తిత్వం వుంది. కాని బిసీ సాహిత్యం మాత్రం దళిత, బహుజన సాహిత్యంలో అంతర్భాగమైన నేపథ్యంలో బిసీ సాహిత్యం ‘సబ్బండ సాహిత్యం’ గా బలపడాలి అంటూ కాలువ మల్లయ్య తన వాదనను తెలియపర్చారు. ఇలా పలువురు రచయితల నిర్వచన, అభిప్రాయాలతో ఈ పుస్తకంలో  బి.సి.వాదం ఎందుకు ప్రత్యేకంగా ప్రారంభమైంది, ఇది కావడానికి ప్రేరణలు, కారణాలు ఏమిటి, బి.సి.ల గురించి వచ్చిన మొదటి గ్రంథాలు ఏవి, వెలువరించిన గ్రంథాల మీద వచ్చిన కుట్రపూరిత విమర్శ, విస్మరణ, అట్లాగే బి.సి.పదాన్ని మరో పదంగా మార్చుకోవాలనే సాహితీకారులు సమావేశాల ద్వార నిర్ణయించిన పదాలు,  బి.సి.వాదం గురించి రాస్తున్న వారిలో కనిపిస్తున్న రెండు ధోరణులు వంటి విషయాలను సోపపత్తికంగా “తెలంగాణ బిసి వాద సాహిత్యం- పరిచయం”  అనే విభాగంలో చర్చించారు.

ఈ పుస్తకంలోని ప్రధాన శీర్షికల్లో మొదటి అంశం “తెలంగాణ పద్య కవిత్వం – బిసీ వాదం”. పురాణం, ప్రబంధం, శతకం, ఉదాహరణం ప్రక్రియ ఏదైనా విషయాన్ని ఉద్ఘాటించడానికి పద్యం వారధిగా నిలిచింది. తెలంగాణ సాహిత్యంలో మొదటిసారిగా బిసి కులాలకు తన బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు స్థానమివ్వడంతో ప్రారంభం అయింది. పాత జ్ఞాపకాల వెలికితీత, బాధలు, వివక్షల ఇతివృత్తంతో,  వృత్తి ఆధారంగా కులం ఏర్పడిందా? కులం ఆధారంగా వృత్తి ఏర్పడిందా? అనే ప్రశ్న వస్తుంది. కొన్నిసార్లు అవసరం నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర కుల వృత్తులు చేపట్టిన వారున్నారు. అంత మాత్రాన వారి కులం మారుతుందా? అనేది ప్రశ్న. ఇక వృత్తి పనిని నమ్ముకొని కాలం వెళ్ళదీస్తున్న వారికి, సమాజంలో కనీస ఆదరణ లేక వారి జీవన ఉపాధి పరిస్థితులు ఏవిధంగా మారాయి అనే తాత్వికతతో వివిధ రచయితలు రాసిన పద్యాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వాటిలో వృషాధిప శతకంలో పాల్కురికి ” గొల్ల స్త్రీ లు వీధుల్లో చల్లను అమ్మేవారని” రాసిన విషయాన్ని, అలాగే బసవ పురాణంలో ” వీధిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి బసవరో అని కేక పెట్టగా బసవన కాపాడినాడు” లాంటి విషయాలు కలవు. వీటి ద్వారా బిసి కులాలకు చెందిన గొల్లల ప్రస్తావన నాటి కాలంలోనే రాయబడింది అనే విషయం ధ్రువీకరించాడు రచయిత దత్తయ్య. గొల్లడా! అనే శీర్షికతో కేశపంతుల వేంకట నర్సింహశాస్తి రాసిన ఐదు పద్యాలు చేర్చాడు. దోరవేటి ఒక పద్యంలో ఉప్పరుల గూర్చి ‘కట్టడముల ధాత! కరము మోడ్తు’ అని పల్కిన సందర్భాన్ని తెలియజేశాడు. దానితోపాటు దోరవేటి అన్ని కులాలను గురించి పద్యాల్లో ప్రస్తావించిన విషయం తెలియ పర్చాడు. గంగుల శాయి రెడ్డి ‘కాపుబిడ్డ'(1937) లో మున్నూరు కాపులు మొదటి రోజుల్లో పడ్డ కష్టాలను తెలుపుతూ రాసిన పద్యం అయిన ” కుడిమూపుపై కాడి యెడమ భుజంబున,,,,,,,,,,,” ను గూర్చి రాశారు. “తెలంగాణ పద్య కవిత్వం- బిసీ వాదం” శీర్షికలో 14 కులాల ప్రస్తావనతో వివిధ రచయితలు వారి రచనలలోని పద్య పంక్తులను సహ వాటి నేపథ్యంతో కూడిన విషయ వివరణ తెలియజేశారు.

ఈ పుస్తకంలో మరొక శీర్షిక “తెలంగాణ పాట- బిసి వాదం”. ఆట- పాట, పని- పాట, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే ఇలాంటి మాటలను బట్టి చూస్తే మనిషి జీవితంలో పాటకున్న ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం అవుతుంది. పండితులకూ, పామరులకు అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆదరపూరకమైనది పాట. “జర్మన్ భాషా సుభాషితం ప్రకారం ప్రతి వస్తువులోనూ ఒక  పాట నిద్రిస్తూ వుంటుంది, ప్రతి వస్తువూ ఆ పాటను స్వప్నిస్తూ వుంటుంది(అదే, పుట :73)” అన్నట్టుగా ఈ శీర్షికలో పాటల ద్వారా బిసీ కులాలు, వారి జీవన విధానం, సంఘర్షణలు, వారి పాటలో వృత్తికి సంబంధించిన పంక్తులు మొదలైన అంశాల పరిశీలన కలదు. అలాంటి కొన్ని ఉదాహరణలు: గూడ అంజయ్య చేతివృత్తుల వారి కష్టాలను తెలుపుతూ రాసిన పాట ‘బావయ్యో…బావయ్యో’, గోరటి వెంకన్న సబ్బండ వర్ణాల కష్టాలను తెలిపిన పాట ‘పల్లే కన్నీరు’ ఇందులో కుమ్మరి, కమ్మరి, మంగలి, కంసాలి, సాకలి, గౌడ, కురుమ కులాల బతుకు చిత్రం ఎలా ఛిద్రం అవుతుందో తెలియపరిచాడు. బిసీ కులాలను గూర్చి ఒకే పాటలో పలికిన మరో రచయిత జయరాజ్ పంక్తులు: ‘గడ్డాలు మీసాలు గీసి/గుడ్డల్ని శుభ్రంగ ఉతికి/ వండె గుండిల్ని చేసి/ వంటా వార్పుల నేర్పి/మనిషిని మనిషిగ చేసి ,,,,,,,,,,బహుజనులే మన ప్రేమ పావురాలు/బహుజనులే మన శాంతి కపోతాలు’ అంటూ బహుజన కులాల ప్రాముఖ్యాన్ని తెలిపాడు. అదే విధంగా కందికొండ రాసిన యూట్యూబ్ పాటలో: ‘చలో చలో చలో చలో బిసి/ నీవే నీ తలరాతను రాసుకోలేసి/60శాతం ఉండి అడుక్కునుడు ఏంది’ అంటూ బిసిల్లో ఐక్యత నింపేలా వారు రాజ్యాధికారం వైపు అడుగులు కల్పించాలంటూ స్ఫూర్తిని నింపే మరో పాటను నొక్కిచెప్పాడు. ఈ శీర్షికలో వివిధ రచయితలు పాటల రూపంలో బిసి కులాలకు సంబంధించి ప్రత్యేకంగా స్పృశిస్తూ రాసిన పాటలను, బహుజన, సబ్బండ వర్ణాల నేపథ్యంగా రాయబడిన పాటల ప్రస్తావనను గూర్చి అట్టెం దత్తయ్య విశ్లేషించారు. ఈ విభాగంలో సూచించిన ప్రధానమైన అంశం బి.సి.ల ఆశ్రితగాయకుల మౌఖిక సాహిత్యం అంతా గ్రంథస్థం అయిననాడు బి.సి.ల నిజమైన అస్తిత్వం తెలుసుకునే అవకాశం ఉంది అనే అంశం తెలిపాడు.

“తెలంగాణ వచన కవిత్వం- బిసీ వాదం” అనేది మరొక శీర్షిక. నిజానికి బిసీ వాద సాహిత్యం ఎక్కువ మొత్తంలో వచన కవిత్వంలో వచ్చిందని చెప్పొచ్చు. దానికి కారణం పీ.వీ.నరసింహ రావు గారి నూతన ఆర్థిక సంస్కరణల వల్ల జరిగిన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణల ఫలితంగా చేతి, కులవృత్తుల ప్రాభవం తగ్గిపోయింది.  బిసీల జీవన స్థితిగతులు దైన్యంలోకి నెట్టబడ్డాయి. వాటిని ఏకరువు పెట్టేందుకు 2000 సంవత్సరం తర్వాత చాలా మంది రచయితలు తమ కలాల గలాలను వచన రూపంలోనే ఎక్కువ  మొత్తంలో వినిపించారు. అలాంటి వచన కవితా సంకలనాలలో కొన్ని ‘ బహువచనం’, ‘మేమే‘, ‘మొగి‘,  ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’, ‘ఇరుసు’, ‘సమూహం’, ‘బి.సి.కవితా సంకలనం’ వంటి వచన కవితా సంపుటాలలో వారి అస్తిత్వాన్ని, జీవన సంఘర్షణలను, వృత్తుల విలువ తగ్గడం వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతిబింబించే రీతిలో వచ్చిన వచన కవితా సంకలనాలను పూర్తిస్థాయిలో విశ్లేషించే ప్రయత్నం కనిపిస్తుంది. వీటితో పాటు కొన్ని కులాల మీద వచ్చిన దీర్ఘ కవిత అయిన‘బువ్వకుండ’ వంటి వాటిని విశ్లేషిండం వల్ల రచయిత దత్తయ్య పాఠకులకు బిసీ సాహిత్యంలో రూపొందిన వచన కవిత్వ సాంద్రతను తెలిపే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు యువ రచయిత, పరిశోధకుడైన వడ్కాపురం క్రిష్ణ కుమ్మరి కులం వారి వ్యధలను తెలుపుతూ రాసిన ‘మట్టి చిత్రం’ కవితలో కొన్ని పంక్తులు:

“జీవితమంతా మట్టిమయం

అంతెందుకు!?

అసలు మట్టి అంటేనే జీవితం

జీవితమే మట్టి కదా

అదే మట్టికుండ నాడు

రాగి, ఇత్తడి,వెండి

ఆఖరుకు ఇనుమును కూడా తట్టుకుని నిలబడింది

నేడు ప్లాస్టిక్

చెరలో బందీగా కనుమరగవగా

ఉత్పత్తి కులం నేడు ఉత్తి చేతులతో నిలబడిపోతున్నది…”

ఇలా వచన కవిత్వంలో బిసీలకు సంబంధించిన వివిధ కులాలపై వచ్చిన కవిత సంపుటాలను, అందులోని వాదాన్ని, వర్ణనలను పాఠకులకు పరిచయం చేశారు.

తెలంగాణ కథ- బి.సి వాదం, తెలంగాణ నవల బి.సి వాదం అనే పేర్లతో మరో రెండు శీర్షికలు కలవు. ఇక కథ, నవలల్లో బిసిల ప్రస్తావన అస్తిత్వ ఉద్యమానికి ముందు నుంచే వారి కులాలకు చెందిన, వారి జీవనశైలికి సంబంధించిన అంశాలతో కథలు, నవలలు కలవు. సమాజంలో ఉత్పత్తి, సేవా, చేతివృత్తుల పాత్ర గణనీయమైనది అవ్వడం మూలంగా వారి జీవన ముఖచిత్రాల గూర్చి ప్రత్యేకంగా  బిసీ వాదం పేరుతో కాకుండా ఒక కథ, నవలకు కథా వస్తువును ఎంచుకొనే క్రమంలో సహజంగానే కథా సంవిధానాల్లో వారి జీవిత చిత్రాలు అల్లబడినాయి. కథ, నవల ఎప్పుడూ ప్రజల పక్షం వహిస్తూ అన్ని వర్గాల వారి శ్రామిక, పీడిత, సమస్యాత్మక అంశాలను, భూస్వామ్య, పెట్టుబడిదారీ, పారిశ్రామికీకరణల పర్యవసానంగా ఉత్పన్నమైన సమస్యలను, వివాదాలను చిత్రీకరించే విధంగా వుంటాయి. దానికి తోడు సమకాలీన, చారిత్రక కల్పిత అంశాలచేత మనిషిని ఒక కొత్త ప్రపంచంలో లీనమయ్యేలా చేయగల్గి, సగటు మనిషిని వాటిలో ప్రతిబింబించే స్వభావాన్ని  కల్గి వుంటాయి. సమాజంలో, కుటుంబంలో అంతర్గతంగా ఇనుమడింపబడిన విభిన్నత కల్గిన కథావస్తువుతో సమాజాన్ని పెద్ద కాన్వాస్ లో దర్శించడానికి కథలు, నవలలు తోడ్పడ్తాయి.  బహుజనులను ఆధారంగా చేసుకొని వచ్చిన కథలు, నవలలకు సంబంధించిన వివరాలను రచయిత ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో ఎక్కువ మొత్తంలో నమోదు చేశారు. అందులో కొన్ని: చేనేత జీవిత సాధకబాధకాలను చెప్పే ‘పడుగు పేకలు’, గొల్ల- కురుమల కథల సంకలనం ‘వేపకాయంత నిజం’, నేరెల్ల శ్రీనివాస్ గౌడ్  ‘ మా బతుకులు’, తుమ్మల రామకృష్ణ సంపాదకత్వంలో నాయీ బ్రాహ్మణుల జీవితాలను చిత్రించిన ‘అడపం’, ఉప్పల నరసింహం ‘సబ్బండ వర్ణాల సారస్వతం’ మొదలైన కథల సంపుటాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక నవలల విషయానికి వస్తే గుడెళ్ళగుమ్మి మారెమ్మ, పట్నమొచ్చిన పల్లె- భూపాల్, సాంబయ్య సదువు, చీకట్లో చిరుదీపం, భూమిపుత్రుడు- కాలువ మల్లయ్య, సంకెళ్లు తెగాయి- ముదిగంటి సుజాతా రెడ్డి, ఊరువాడబ్రతుకు- దేవులపల్లి కృష్ణమూర్తి, పరంపర- శిరంశెట్టి కాంతారావు, సుషుప్తి- మాదిరెడ్డి సులోచన, బతుకు తాడు, కల్తీ బతుకులు- నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ మొదలైన నవలలు ఇవన్నీ కూడా కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే. దత్తయ్య ఈ పుస్తకంలో బహుజన, సబ్బండ కులాలపై వివిధ కవులు రాసిన కథలు, నవలలను చాలా మొత్తంలో తెలియపరిచారు. ముఖ్యంగా కథలను గురించి రాస్తూ బి.సి.ల జీవితాలకు సంబంధించి కథకులు విస్తృతంగా రాసినప్పటికి వాటిలో కులాల ప్రస్తావనలు మరుమరుగుగా చేయడం వెనుకున్న భయమేమిటో సందిగ్ధత ను రేకెత్తించే విషయం అని కథా రచయితలను ప్రశ్నిస్తాడు.

ఇక ఈ శీర్షికల తర్వాత చివరగా ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్య విమర్శ’ పేరుతో ఒక శీర్షిక కలదు. విమర్శ అనగా సమీక్షించడం, పర్యాలోచించడం అనే అర్థాలు కలవు. బహుశా వెనుకబడిన వర్గాలపై వచ్చిన సాహిత్యం గురించి విమర్శ చేయడం పై స్థాయి వర్గాల వారికి ఆసక్తి వుండకపోవచ్చు. అందుచేత బిసీల, బహుజనుల సాహిత్యం పెద్దగా విమర్శకు నోచుకోలేదు. కవిత్వం, నవల, నాటకం, కథ ఇలా ప్రక్రియ ఏదైనా రచయిత దానిని ఏ పరిస్థితుల్లో రాశాడు, ఏ కోణంలో రాశాడు, ఏ ఆశయం చేత రాశాడు, తదుపరి దాని ప్రభావం ఎలా వుండబోతుంది అనే విషయాలన్నింటికీ విమర్శ దారి చూపుతుంది. బిసి సాహిత్య విమర్శలో ప్రధానంగా చెప్పబడే నాలుగు పుస్తకాలను తెలిపారు. అవి ‘బి.సి కథలు ఒక విశ్లేషణ 2000-2010’- కథా సాహిత్యం పై బి.ఎస్.రాములు 2011 లో వెలువరించారు. ‘కవిత్వంలో బిసి సూర్యోదయం’ 2015 లో జూలూరి గౌరీశంకర్, ఈయన ఆధ్వర్యంలోనే బిసీ వాద కవిత్వం పై ‘ఒక కవిత ఇరవై కోణాలు’. మరొక విమర్శ గ్రంథం ‘ప్రవాహం’ ఇది బిసి అస్తిత్వవాద యువ కవిత్వం పై వెలువడిన సంకలనం దీనికి చింత ప్రవీణ్ సంపాదకత్వం వహించారు.  ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావించిన దత్తయ్య ’వినతి‘ అనే శీర్షకలో ఇదొక చిన్న ప్రయంత్నమని వినయంగా చెప్పుకుంటాడు. ఇంకా కొన్ని కులాల గురించి, కొన్ని ప్రక్రియలలో వచ్చిన బి.సి.ల జీవితాలను గురించి ముందు ముందు రాసే ప్రయత్నం చేస్తానని చెప్పుకోవడం సమగ్రతకోసం ప్రామిస్ చేసినట్లుగా కనిపిస్తుంది.

అట్టెం దత్తయ్య రూపొందించిన “ఈ తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో పద్యం,పాట, వచన, కథ, నవలా ప్రక్రియల్లో బిసిలకు సంబంధించి కవులు వివిధ కోణాల్లో బహుజన, బిసీ కులాలను గూర్చి వ్యక్తం చేసిన అంశాలను విస్తృత పరిశీలనతో సంక్షిప్తంగా పొందుపరిచారు.  దత్తయ్య చేసిన ఈ ప్రయత్నం మాటల్లో, వాక్యాల్లో మాట్లాడినంత సులభం కాదనే విషయం పుస్తకాన్ని చదివే  ప్రతీ పాఠకుడికి అర్థం అవుతుంది. ఈ పుస్తకం బిసీలు, వారి అస్తిత్వవాదానికి సంబంధించిన కోణంలోనూ, పరిశోధన చేస్తున్న, చేయబోయే వారికి మార్గదర్శనం చేయడంలో ఎంతో కొంత పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. బిసీ వాదం పై వచ్చిన పుస్తకాల వరుసలో అట్టెం దత్తయ్య పుస్తకం కూడా విలువైనదిగా మారబోతుందనేది సత్యం. ఏదేమైనా అట్టెం దత్తయ్య  సలిపిన ఈ కృషి ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తుంది. అదేమిటంటే నాడు తెలంగాణ ప్రాంతంలో సాహితీవేత్తలు, సాహిత్యమే లేదన్న ఆంధ్ర సాహితీ మేధావులకు తెలంగాణ సాహిత్య విస్త్రృతిని, సాహిత్యకారులను పరిచయం చేస్తూ సురవరం వారు రూపొందించిన  ‘ఆంధ్ర కవుల సంచిక’ లాగానే,  నేడు దళిత, మైనార్టీ, బహుజన వాద సాహిత్యాల ముసుగులో బిసీ వాద సాహిత్యం విస్తృతి, కవులు తెరచాటైన  స్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో రచయిత దత్తయ్య రాసిన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్య గ్రంథం” బీసీ వాద సాహిత్యం యొక్క విస్తృతిని, కవులను సాహితీ ప్రపంచానికి తెలియజేసి నాటి  సందర్భాన్ని పునరావృతం చేసిందని చెప్పొచ్చు. ఏదేమైనా బీసీ వాదాన్ని వ్యక్తీకరించే  ప్రయత్నం లో ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” గ్రంథం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు.

తెలంగాణ బి.సి.వాద సాహిత్యం   రచయిత: అట్టెం దత్తయ్య

ప్రచురణ సం: 2021   పుటలు : 259

వెల : 23

ప్రచురణ : ప్రణవం పబ్లికేషన్స్

రచయిత పరిచయం

పేరు                         :         అట్టెం దత్తయ్య

చదువులు               :         బి.ఏ (ఎల్), టి.పిటి, ఎం.ఏ. తెలుగు (ఓ.యు) ఎం.ఏ (జర్నలిజం), ఎం.ఏ(సంస్కృతం)

రచనలు:    1. కళ్ళం (సాహిత్య వ్యాసరాశి) (2018) 2. తెలంగాణ బి.సి.వాద సాహిత్యం (2021)

సంపాదకత్వం:   1. నిత్యాన్వేషణం (సాహిత్య దీర్ఘవ్యాసాల సమాహారం) 2018, 2. శిలాక్షరం (బి.ఎన్.శాస్త్రి సాహిత్యం – సమాలోచనం) 2019

సహాయ సంపాదకత్వం

  1. ఆలోకనం (31 తెలంగాణ జిల్లాల సాహిత్యం – చరిత్ర, సంస్కృతీ సమాలోచనం) 2017, మూసీ ప్రచురణ
  2. శతవాసంతిక (ఉస్మానియా వందేళ్ళ సంబరాల ప్రత్యేక జ్ఞాపిక 1917-2017) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.
  3. తెలంగాణ సాహిత్యం – సమాలోచన (పరిశోధక విద్యార్థుల సాహిత్య వ్యాసాలు) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.

ఇంకా

జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 25కు పైగా పత్రసమర్పణలు, వివిధ ప్రతికలలో 70కి పైగా వ్యాసాల ప్రచురణ.

చిరునామా : ఇం.నెం. 3-9/3, గ్రా.శట్పల్లి, మం.లింగంపేట్, జిల్లా, కామారెడ్డి, తెలంగాణ

ఫోన్ : 9494715445

 

 

 

August 25, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

స్త్రీ అస్తిత్వపు సంవేదన ‘నీల’ సమీక్ష

by vanaparti padma August 25, 2021
written by vanaparti padma

ఆనాటి కాలంలోనే చలం తన రచనల్లో స్త్రీకి స్వేచ్ఛ కావాలని కోరుకున్నాడు. ఆమెకు మనసుంది, దాని స్పందన ఉంటుంది. ఆ స్పందనకు స్వేచ్ఛ కావాలని ఆమె ఆలోచనకు రూపం ఉండాలని స్త్రీని గౌరవిస్తూ ఆమెకు మాట్లాడే హక్కుతోపాటు జీవన స్వేచ్ఛ కావాలని చాలా సందర్భాల్లో చెప్పారు.

నేటి కాలంలో స్త్రీ చదువుకుంది. ఎన్నోరకాల ఉద్యోగాలు చేస్తూ రాజకీయాల్లోను తన ప్రతిభ చాటుకుంటుంది. కాని మానసికంగా స్వాతంత్రాన్ని కుటుంబపరంగా స్వేచ్ఛను పొందలేక పోతున్నది. ఎ.కె.మల్లీశ్వరిగారు రాసిన ‘నీల’ నవల ద్వారా మహిళ స్వాతంత్రాన్ని మరింత నిశితంగానూ నిర్ధిష్టంగాను తెలుసుకునె అవకాశం లభించింది. స్త్రీ పురుషుల మధ్య సహచర్యం ఆర్థిక రాజకీయ స్వాతంత్రాల వల్ల వచ్చేది కాదు. కేవలం మానసిక స్వాతంత్ర్యం వల్ల మాత్రమే సాధ్యం అంటారు స్త్రీ వాద రచయితలు. మన చుట్టూ ఉన్న పదిమంది మనకు అండగా ఉంటారనుకోవడం మానవ సహజం. అయితే ఒకరు లేకపోతే జీవితమే శూన్యం అనుకోవడం బేలతనం అవుతుంది. అలాంటి బేలతనం నుండి తన జీవన ప్రయాణం నుండి తెలుసుకున్న పాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్నపాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్న ఆమె జీన పోరాటము అందులోని సామాజిక అసమానతుల, స్త్రీ పురుషుల సమానత్వం అంటూనే స్త్రీని అణచివేస్తున్న పరిస్థితులకు నిలువెత్తు రూపం ‘నీలం’ నవల సముత్ర చెలియలి కట్ట దాని అలలే దాన్ని నియంత్రించినట్లుగా స్వేచ్ఛ లేనపుడు పెళ్ళి, ప్రేమ, సహజీవనం ఒంటరి జీవితం బరువే అంటారు. అలాంటి సందర్భాల్లో వ్యక్తికీ – వ్యక్తికీ స్వేచ్ఛ నిర్వచనాలు మారుతాయి. ఒకరికి స్వేచ్ఛ అనుకున్నది. మరొకరికి విశృంఖలత్వం అనిపించవచ్చు. ఇవి అన్ని కూడా వ్యక్తులు మనస్తత్వాలు, సంస్కారాలను వాటి పరిమితిల్లో నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఓ మహిళ జీవితంలో జరిగిన సంఘటనలే ‘నీల’ నవలగా చెప్పవచ్చును.

 

నీల బాల్యం నుండి కష్టాల కొలిమిలో రాటు తేలింది. తన తల్లిని చంపిన తండ్రి జైలుకెళ్ళగా అనాథగా జీవనం సాగించింది. మానసిక పరిపక్వత చెందని వయస్సులోనే పెంచినవాళ్ళు పెళ్ళి చేయగా తనకు ఓ తోడు దొరకదని ఆనందపడింది. ఓ బిడ్డకు తల్లిగా మారింది. అంతలోనే తన భర్తకు మరో స్త్రీతో సంబంధం ఉందని తెలుసుకొని ‘స్వచ్ఛమైన, నిష్కలషమైన ప్రేమకోసం పరితపించింది. ఋతువులు మారుతున్నాయీ కాని నీల జీవితంలో ఏ వర్ణము ఆమెను దరిచేరలేదు. కుటుంబ జీవితంలో హింసను చూసింది తనను హింసిస్తున్న మగవాడి పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు. పైగా అతను పడుతున్న హింస నుంచి విముక్తి కల్గించాలనుకుంది. అంటే తను విముక్తమవ్వాలి అనుకుంది. అందుకే పెళ్ళి పేరున ఏర్పడిన సాహచర్యాన్ని తెంచుకుంది. సహజీవనంలో భద్రత కోరుకుంది. స్వచ్ఛతని, సమానత్వాన్ని కోరుకుంది. స్త్రీ పురుషుల సాహచర్యంలో ప్రేమ, స్వేచ్ఛలతో కూడిన దృఢమైన బంధం కోసం వెతికింది. అతి హింసాత్మక నేపథ్యం నుంచి దుర్భర దారిద్ర్యం నుంచి భవిష్యత్తు సందేహంగా మారగా ‘నీల సుదీర్ఘ ప్రయాణంలోని అనుభవాల నుంచి మరియు చుట్టూ వున్న తనలాంటి మరికొందరి జీవితాల నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకుంది. తనలాంటి నీలవేణులకు జీవితపు అస్తిత్వము సులుపు చేయాలనుకుంది. మళ్ళీ కథలోకి వస్తే పెళ్ళి బంధం నుండి విముక్తి అయిన తరువాత నీల తొలి ప్రేమ పరదేశిపై కల్గింది. కాని అప్పటికే పరదేశి మరో స్త్రీతో రిలేషన్లో వున్నట్లు తెలుసుకుని తన ప్రేమను విరమించుకుంది. ఎవరి వ్యక్తిగత జీవనం వాళ్ళదే దానివల్ల కలిగే మంచి చెడ్డల ఫలితం అనుభవించేది కూడ వాళ్ళే అందులోకి తొంగి చూసె అవసరంకాని ప్రమేయం లేదు. స్త్రీ పురుషుల సహజీవనానికి ప్రేమ అవసరం కాని సమాజం, కుటుంబ విధించిన నియమాల సంకెళ్ళ, చిక్కుదారులు అనేకం వాటిని తెంచుకొని స్వేచ్ఛ కోసం వెతుకులాడే వాళ్ళంతా నీలగాను, నీల తల్లిగాను, నీల నేస్తం సంపూర్ణం, పరదేశిలాగా, ఆపన్న హస్తం అందించిన అజితలాగ సంఘర్షణకు గురికావల్సిందే. స్త్రీ ఆర్థిక స్వాతంత్ర్యానికి, లైంగిక స్వేచ్ఛకి వున్న కనిపించని సంబంధాలు గూర్చి వెలువడిన ఎన్నో ప్రశ్నలకు రచయిత ఈ నవలలో సమాధానాల కోసం అన్వేషణ చేశారు. కొన్నిటికి సూచనప్రాయంగా జవాబులు ఉన్నట్లు కన్పిస్తుంది. ఈ నవలలోని ‘నీల’ వేసుకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు జీవితానుభవం ద్వారా తనకు తానే రాబట్టుకుంది. ఆమెకు తెలియకుండానే జారిపోయిన వాటిని వొడిసి పట్టుకుని తనకు నచ్చిన రీతిలో సరిదిద్దుకునే క్రమంలో తనను తాను తెల్సుకుంది. చదువుకుని సొంత కాళ్ళమీద నిలబడింది. తనని బాధించే హక్కు ఎవరికీ లేదు. తాను ఎవరి బాధకీ కారణం కాకూడదు అనే జీవన తత్త్వంగా మార్చుకుంది. ‘నీల’ స్వీయ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ కోసం చేసిన పెనుగులాటే ఆమె గమనంగా మారింది. దాతృత్వం కాన్సెప్ట్ తో పనిచేసే స్వచ్ఛంద సంస్థలో లోపిస్తున్న దీర్ఘకాలిక ప్రయోజనాల్ని తెలుసుకుంది. అభివృద్ధి నీడ కింద సమాజం అనుభవించే వేదనని అర్థం చేసుకని జీవించే హక్కు కోసం పోరుసల్పె జనంతో కలిసి రాజ్యం చేస్తున్నఅమానవీయం హింసకు వ్యతిరేకంగా నిలవాలని నిర్ణయించుకుంది.

‘నీల’ అనే వ్యక్తి జీవిత చిత్రణలో సామాజిక చరిత్రను చేర్చారు. వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే రాజకీయ సామాజిక సంఘటనల్ని ప్రస్తావిస్తూ ‘నీల’కి సొంత జీవితము, సామాజిక జీవితము వేర్వేరుగా లేవు అనే స్పృహతోనే రచయిత ‘నీల’ని ‘ఒక పిరియడ్’ ‘నవల’ తీర్చిదిద్దారు. ఒక నిర్దిష్ట కాలంలో గ్రామీణ పట్టణ నగర నేపథ్యాలు స్త్రీల స్వేచ్ఛపై లైంగికతపై చూపే ప్రభావాల్ని వాటిలోని భిన్న పార్శ్వాల్ని కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి. స్వశక్తి డ్వాక్రా గ్రూపుల ద్వారా స్త్రీలకు కొత్తగా ఆర్థిక వెసులుబాటు వల్ల దాంపత్య సంబంధాల్లో వచ్చిన మార్పుల వల్ల కుటుంబ వ్యవస్థపై అధిక ప్రభావము లేకున్న స్త్రీ పురుష లైంగికతపై బలమైన ప్రభావాన్ని చూపాయని సూచనప్రాయంగా తెలిపారు. గ్రామాల్లో సైతం కమ్యూనిజం కోరలు చాచింది. మార్కెట్ గద్ద రెక్కలు విప్పుకోగా దేశీయకళాకారులకీ కొత్త మార్కెట్ లభించింది. చాలా సందర్భాల్లో పురుషులు కుటుంబ భారాన్ని ఆడవాళ్లకి వొదిలేశారు. ఊర్లు ఆత్మహత్యలకి, అత్యాచారాలకి నిలయంగా మారాయి.  స్వశక్తి గ్రూపులు స్త్రీ వోటు బ్యాంక్ రాజకీయాలకు దారులు వేశాయి. మహిళలు కొత్త సవాళ్ళు ఎదుర్కొన్నారు. అధికారుల కోసం ఆధిపత్యపు కులాల ఎత్తుగడలకు వీళ్ళు పావులుగా బలైనారు. నవల్లో రచయిత్రి ఈ విషయాన్ని విస్తృతంగానే వివరించారు. సమకాలీన స్థానీక రాజకీయాల్తో పాటు పలాస అడవుల్లో ‘నీలధార’ సాక్షిగా నడిచిన గిరిజన ఉద్యమాల ఊసులు, స్టాలిన్ సూర్యం పాల్గొన్న ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమాలపై అమలైన అణచివేత జాడలు నవల్లో సందర్భానుసారంగా ప్రస్తావనకి వచ్చాయి.

ప్రకృతి వనరుల్ని మల్టీ నేషనల్స్ కి అప్పజెప్పడానికి సముద్ర మైదానం అడవి తేడా లేకుండా మానవ విధ్వంసానికి ప్రకృతి వినాశనానికి తెగబడ్డ భీభత్స సందర్భంలో మల్లీశ్వరి నీల గురించి నీల లాంటి మరికొందరి నీల చేయబోయే నూతన ప్రస్థానం గురించి మనం మాట్లాడటం అనివార్యమే కాని ఆ అనివార్యములోంచే ఈ నవల పుట్టి వుండవచ్చు. ‘సముద్రం కార్పోరేట్ల నీటి తొట్టి’ అవడానికి కారణాలు అనేకం. వాటిని తెలుసుకునే దిశగా ‘నీల’ ప్రస్థానం మొదలైంది. ‘జీవితమంతా పోరాటమైన స్థితి నుంచి పోరాటాన్నే జీవితంగా’ మార్చుకునే కొత్త ప్రణాళికల్ని రచించుకుంటుంది. నాలుగు పదులు కూడ  నిండని ‘నీల’ మరింత సంఘర్షణాత్మకమైన దారిలో నీల తనలాంటి మరెందరినో కలుపుకుని అడవుల వేడి నిట్టూర్పుల్ని సాగరాల గంభీర శ్వాసని వింటు నడుస్తుంది. స్వతంత్ర జీవనం గడపాలి అనుకునేవాళ్ళు, జాలరి పైడమ్మ లాంటి పీడితుల కోసం పరదేశిలా భుజంకాయారి అనుకునేవాళ్లు సదాశివలా స్వేచ్ఛని గౌరవించగల వాళ్ళు అందరూ నీలకు హితులే, సన్నిహితులే.

మానవ సంబంధాల్లో బలీయమైనది ప్రేమ, స్వేచ్ఛకి సంకెళ్ళుగా పరిణమించిన సంఘర్షనాత్మక సందర్భాల్లో క్లేశాన్ని అధిగమిస్తూ చిక్కుముడులు నిప్పుకుంటూ ప్రేమ – స్వేచ్ఛల మధ్య సమన్వయం సాధించటానికి ఓ స్త్రీ జీవన పోరాటమే ‘నీల’ నవల.

Writer: A. K. Malleswari

ఈ నవలని రచయిత్రి దృష్టిలోంచి చూసినపుడు అశాంతిని కాక జీవశక్తిని ఆవిష్కరిస్తుంది. అది వ్యక్తిలో అపార జీవశక్తి ఉంది. ఆమె వైరిలో ఉద్వేగముంది. సన్నివేశ కల్పనలోను, మనోభావాల్ని పట్టుకొని వివరించడంలో కౌశల్యముంది. కె.ఎఫం.మల్లీశ్వరిగారు రచించిన ‘నీల నవల’ ‘తానా’ బహుమతి పొందినది. మన ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ అన్ని దశల్లో పురుషుడి మాటునే ఉండాలనే నియమాలకు విరుద్ధంగా స్త్రీ స్వేచ్ఛ కోసం ‘నీల’ పాత్ర ద్వారా మనకు అనేక విషయాలను సమా కోణంలో చూపిస్తూనే స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ఎంత అవసరమో చెప్పడంలోనను కొన్ని మెళుకువలతోపాటు ఆధిపత్యపు సంస్థ ద్వారా స్త్రీ జీవన సంఘర్షణని చూసారు. ఈ నవల ప్రతి ఒక్కరిని చదివించేదిలా ఉంది.

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

పడమటి గాలుల్లో తెలుగు పరిమళాలు

by శాంతిక్రిష్ణ August 25, 2021
written by శాంతిక్రిష్ణ

భాష పుట్టుకకు ప్రాంతముంటుంది కానీ దాని పరిమళాలు నిండిన గాలులు ఏ ప్రాంతంలో వీస్తాయో ఎవరూ చెప్పలేము…

భాష వైభవం సాహిత్యంలోనే కనిపిస్తుంది…

భాష మనుగడ సాహిత్యంతోనే ముడిపడి ఉంటుంది…

సరిహద్దులు దాటి స్వేచ్ఛగా విహరించేదే కదా సాహిత్యమంటే…

కమ్మనైన అమ్మభాషకు కవుల కలాలే కప్పురపు హారతులు…

కాదంటారా…!?

అనేక ప్రక్రియల్లో తనదైన ప్రత్యేక శైలితో పడమటి గాలుల్లో తెలుగు పరిమళాలను నింపుతున్న కవి , రచయిత శ్రీధర్ బిల్లా…వీరి స్వస్థలం వరంగల్ జిల్లాలోని మల్లక్కపల్లి గ్రామం. ప్రస్తుతం ఉంటున్నది కాలిఫోర్నియా(అమెరికా). దాదాపు పది సంవత్సరాలుగా సాఫ్ట్వేర్  ఇంజనీర్ గా అమెరికాలోనే ఉంటున్న శ్రీధర్ కు తెలుగుభాషన్నా , భారతీయ సంప్రదాయమన్నా ఎంతో అభిమానం. తన చుట్టూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను , తన బాల్యాన్ని , తన వృత్తిని ఇలా అనేక అంశాలను వస్తువులుగా తీసుకుని వాటిని వివిధ ప్రక్రియలలో అక్షరీకరించారు.

ఒక్కో ప్రక్రియకు ఒక్కో పుస్తకాన్ని విడిగా వేసుకుంటున్న ఈ రోజుల్లో అన్ని ప్రక్రియలను కలిపి ఒకే సంపుటిగా తీసుకు రావడం కాస్త సాహసమనే అంటాను…ఏదైనా కవిత్వమే కదా అంటారు శ్రీధర్…

కవి మనసుకు ప్రతిబింబమే అతని సాహిత్యం…బహుశా అందుకే తన ఈ సంపుటికి “ప్రతిబింబం” అని పేరు పెట్టారని అనుకుంటాను.

ఇందులో వచన కవిత్వం, నానీలు, రుబాయీలు, పద్య ఖండికలు ఉన్నాయి.

వచన కవిత్వం ఎక్కువగా దీర్ఘ కవితలుగా ఉన్నాయి. అందుకే తీసుకున్న ప్రతి వస్తువుకు పూర్తి న్యాయం చేశారనిపిస్తుంది.

ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న బాల్య వివాహాల గురించి ”ఒంటరీ బందీ” అనే కవితలో హృద్యంగా తెలియజేశారు. ఇది తన బాల్యంలో జరిగిన ఓ సంఘటన…తన సోదరిలాంటి బాల్య మిత్రురాలికి జరిగిన బాల్య వివాహం గురించి ఆవేదనతో రాసుకున్న అక్షర నివాళి ఇది…

// హృదయాంతరాళం ప్రళయ ఘోష చేస్తున్న,

అధరం దాటని మూగ ఆర్తనాదం తాను! మౌన శిఖరం తాను!

గర్భమంతా మంచుకాసారం నిండియున్నా ,

మంచుగప్పి మలయమారుతం వీస్తున్న మహాగ్ని పర్వతం తాను! // అంటూ ఆవేదనతో రాశారు…

//పెంచిన తల్లివి గావు!   తండ్రివీ గావు!

తోడబుట్టిన దానవు కావు! కానీ, తోడై నిల్చిన దానవు!// అంటూ ”ఎర్ర బర్రె” కవితలో తన బాల్యంలోని ఆత్మబంధువైన ఎర్ర బర్రెను ఆత్మీయంగా తలచుకొన్నారు.

అకాల వర్షాల వల్ల రైతు ఆశలు ఎలా కొట్టుకు పోతాయో “చినుకుల మాటున” కవితలో మన కళ్ళ ముందుంచారు.

రెక్కలొచ్చిన పిల్లలు సుదూర తీరాలకు ఎగిరెళ్ళిపోతే…రెక్కలుడిగిన ముసలి ప్రాణం ఎంత తల్లడిల్లి పోతుందో ”ముసలోడు” కవితలో ఇలా రాశారు…

//ఏ జ్ఞాపకం హఠాత్తుగా ఏ కలవరాన్ని మోసుకొచ్చిందో

పక్కనున్న మంచాన్ని ఒక్కసారి తడిమి చూశాడు

ముసల్ది మరణించిందని ఓ క్షణం పాటు మరచాడేమో

ఖాళీ మంచం వేళాకోళమాడుతూ వెక్కిరించింది//

//తాను విలపిస్తూ చితికి శిధిలమై పోతుంటే

ఆ విలాప శిధిలాలతో పేరుస్తున్న విలాస సౌధాలు

కళకళలాడుతున్నాయి//అంటూ వేశ్యల జీవితాలలోని ఆక్రందనలను ”ఆక్రందన” కవితలో అక్షరీకరించిన తీరు కవికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను మనకు తెలియజేస్తుంది.

//అందమైన ఒకనాటి ఆంధ్రదేశానికి

జాతీయ భాషను నేను

జాతీయ భాషగా వేరొకటి రుద్దగా

‘ప్రాంతీయ భాషనయ్యాను’ నేడు!//

అంటూ ”తెలుగు అనే నేను” కవితలో నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలియజేస్తూ విదేశాలలో మన భాష ఎంత గొప్పగా వెలుగొందుతోందో

//ప్రాంతీయ భాషగా

భారతావనిలో భారంగా బతుకీడుస్తున్నా,

ప్రవాస సంఘాల కృషితో

ప్రపంచ భాషగా గుర్తింపు పొందుతున్నా!// అంటూ ఈవిధంగా తెలియజేశారు. ఇలా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్న వచన కవితలు 38 శీర్షికలతో ఉన్నాయి.

ఈ కవికి అంత్యానుప్రాసలు బాగా ఇష్టమనుకుంటాను. అందుకే అతని కలం ప్రాసలను అందంగా జాలువార్చింది.

ఇంక నానీలు , రుబాయీలు, పద్య ఖండికలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి.

శ్రీధర్ రాసిన కొన్ని నానీలను చూద్దాం…

//నాలుగు మెతుకులు

ఆకలి మంటల్లో

బాలల హక్కులు

కాలిపోయాయి//

//ఆటలాడి

రాటుతేలాల్సిన దేహం

రాళ్ళు కొడుతూ

రాటుదేలుతోంది!// అంటూ ‘బాల కార్మికులు’ అనే శీర్షికలో సందేశాత్మక నానీలను రాశారు. ఇంతే కాకుండా మామగారు , కొడుకులు, బడి , చెత్తకుండీ, పందెం కోడి , రోడ్డు గుంత అనే శీర్షికలతో కూడా నానీలు ఉన్నాయి.

ఇంకా ఈ సంపుటిలో “అన్వేషణ”, “దిన దినం” శీర్షికలతో రుబాయీలు కూడా ఉన్నాయి…

చివరగా 14 శీర్షికలతో పద్యఖండికలు కూడా ఉన్నాయి.

తే.గీ. నీదు ఇంటిలోన, కటిక పేదరికపు

కాళరాత్రుల చీకట్లు కప్పియుండె!

నీవు జెక్కిన శిల్పము, దేవళమున

దీపములలో వెలుగుచుండె, తేజమలర!

అంటూ రాసిన ఈ తేటగీతి “శిల్పి” అను శీర్షికలోనిది.

పద్యఖండికలోని పద్యాలన్నీ సులభ శైలితో పాఠకులకు సులభంగా అర్ధమయ్యే విధంగా ఉన్నాయి.

ఇందులోని సాహిత్యం చదువుతుంటే ఈ కవికి సామాజిక బాధ్యతే కాకుండా భాషాభిమానం కూడా చాలా ఉందని మనకు తెలుస్తుంది.

ప్రచురింపబడిన మొదటి పుస్తకం ఇదే అయినా మరెన్నో గ్రంథాలను త్వరలో ఆవిష్కరించాలని కోరుకుంటూ…

“ప్రతిబింబం” రచయిత  శ్రీధర్ గారికి ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నాను.

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“స్థితస్యగతిః చింతనయా”

by Kura Chidambaram August 25, 2021
written by Kura Chidambaram

అవును! ఎంతటి చింతనీయమైన ‘దుర్గతి’ ఇది!

భూమి, నీరు, వెలుగు, సమీరాకాశాలను కేవలం తన కడకంటి చూపుతో, 4 అంగుళాల అరచేతిలో ఇమిడపోయిన ‘రిమోట్’ ఒకచోట వ్రేలి కొస నొక్కుతో శాసించగల్గిన మానవుడికేనా – ఈ చింతనీయ గతి!

త్రివిక్రముడులా అపరపరాక్రమంతో ఒక కాలు భూమిపై నుంచి, మరోకాలు చంద్రమండలాన్ని తాకి విర్రవీగిన మానవుడికేనా – త్వరలో అంగారక సదృశ గ్రహాన్ని ఆవాసంగా మార్చుకోబతోన్న మానవుడికేనా ఈ దుస్థితి!

‘సర్వాంతర్యామి’ అనే వాడెవడో, ఎక్కడో లేడని, భూలోకంతో సహా 14 భువనాలు తనవేనని, తనే సర్వవ్యాపి, సర్వంతర్యామి, సర్వంతనేనంటూ విర్ర వీగుతూ తనే మాన్యుడనీ మరెవరినీ కొలువొద్దని విర్రవీగుతోన్న అసురసంధ్యవేళ పుచ్చిపోయిన మొగురం (స్థంభం)లోంచి, అటు మనిషి కాక ఇటు జంతువుకాని ప్రాణి ఉద్భవించి తన ఇనపగోళ్ళతో గర్వాంధుడు మదాంధుడు అయిన హిరణ్యకశిపుడిని సంహరించినట్లు, అటు సురల్నీ ఇటు అసురుల్నీ, తన ఉనికి, స్థితి, చింతనకు తెచ్చినట్లు –

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఊహించను కూడా వీలుకాని ‘ఊహాన్’ నగరంలో, బొగ్గురామిత్రవ్వే చీకటి గనుల్లో, అటు జంతువుకాక ఇటు పక్షీ కాక, నోరు, విసర్జక అవయవం ఒక్కటే అయి, పరమ రోత కలిగించే గబ్బిలం కడుపులో పుట్టి, మానవ హిరణ్యకశిపుల్ని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా అన్ని జాగ్రత్తలకు అతీతంగా, పేద ధనిక ఆడ, మగ, ఇక్కడ అక్కడ, అనే తేడా చూపకుండా ఈ మానవ హిరణ్యాక్షులను తన వాడిగోళ్లతో, కళ్లకు కనిపించక, దును మాడటం ఏమిటి?

అంతటి అసమాన పరాక్రమశాలి, అతులితబలుడు అస్త్ర, శస్త్ర సంపన్నుడూ అయిన మానవుడు ఈ కంటికి కనిపించని శ్రతువు ఖడ్గ ప్రహారాలకు బెంబేలెత్తి, కకావికలై ‘తాను శాసిస్తున్నాను’ అనుకున్నా ఉచితంగా ప్రకృతిలో అనాయాసంగా, ఆయాచితంగా దొరికే వాయువు; ప్రాణవాయువు, ప్రాణాధార సమీరాన్ని లీటర్ల చొప్పున లక్షలు వెచ్చించి కొనుక్కోవటం ఏమిటి? ఇంతా చేసినా, లక్షలు ధారపోసినా, ప్రాణాలు దక్కక విలవిలలాడటం ఏమిటి?

ఇంత చేసినా, బ్రహ్మ కలంపోటుతో కసువుగా మారి అసువులు బాస్తే – పూడ్చటానికో, కాల్చటానికో ఆలుబిడ్డలకు దూరమై ‘అనాధ’ చావు చస్తే, ఎవరూ భయంతో రాకపోతే, మ్యునిసిపాలిటీ వాడి కుక్కల బండే, వైకుంఠరథమై ప్రయాణం కట్టటం ఏమిటి? విలయం కాకపోతే, ఇది ఏమిటి?

సర్వాంతర్యామి మానవాతీత శక్తి మహాదేవుడు – ఎవరూ లేరని అన్నీ తానేనంటు, అన్ని వనరుల్ని అప్పనంగా అనుభవించాల్సింది తానేనని విర్రవీగిన ఈ మానవ హిరణ్యాక్షుడిని కరోనా – అవును- కరోనా ఎక్కడి నుండి ఎక్కడకు దిగజార్చింది!

ఇలాంటి గతిలో, దుర్గతిలో నరజాతి సమస్తం విలవిల్లాడుతోంటే – చీకటి కుహరంలోకి త్రోయబడి చివరకు గాలి కూడా ఆడని గతిలో, 68 కళలు సాహిత్య సౌరభాలు గానసభలు, కళారంగ భారతిలు ఎవరడిగేను? ఎవరికి గుర్తు వచ్చేను?! సన్మాన పంచాంగాలు కాదు: ప్రాణాంగ దక్కితే చాలు; గండం గడిస్తే చాలు; బలుసాకు తినగలిగే స్థితిలో ఉన్నా చాలు.

మనల్ని ఈ కష్టకాలంలోంచి పైకి చేదుకునే ప్లహ్లాదుడు – అదుగో వస్తున్నాడు. సూది మొనయై మన భుజకండాల్లోకి, సున్నితంగా దిగబడి మనలో ఎదురిచే అస్త్రశ్రస్తాలను నింపటానికి వస్తున్నాడు. చిక్కగా క్రమ్ముకుని మసకేసిన మబ్బులు ప్రపంచాన్ని చెదరగొడుతూ చెదిరిన మబ్బు పూలదండ ఆయన గళహారంగా ప్రకాశిస్తోంటే , మనల్ని ఆదుకోవటానికి, చేదుకోవటానికి వాక్సీనై వస్తున్నాడు.

మనల్ని ఈ సమస్య వలయంలోంచి పైకి లాక్కుని అలిసిన మన ‘పాల’ బంధువుల్ని తుడిచి స్వాంతన చేకూర్చుతాడు. సకల కళాభారతిని గంధర్వగాన సభల్ని మళ్ళీ వింటాము. చింతవద్దు. తొందరవద్దు.

(బుర్రా లక్ష్మీనారాయణగారి మబ్బుదండ (పాలపిట్ట మే 21) చదివాక.

 

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

2021 దాశరథి పురస్కార గ్రహీత ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారితో ముఖాముఖి

by madishetti gopal August 25, 2021
written by madishetti gopal
ప్రముఖ సాహితీ వేత్త గా, కవిగా, తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి గా, ఉత్తమ పరిశోధకుడిగా, ప్రామాణిక విమర్శకుడిగా, ఆచార్యుడిగా, రచయితగా, పేరు గాంచిన వారు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వారు అందజేస్తున్న దాశరథి పురస్కారం స్వీకరించిన సందర్భంగా ఆయనతో మయూఖ అంతర్జాల పత్రిక పక్షాన మాడిశెట్టి గోపాల్ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్ర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న తెలంగాణ మహాకవి 
దాశరథి జన్మదిన సందర్భాన్ని పురస్కారించుకొని ప్రతిష్టాత్మక పురస్కారం ఇటీవల  స్వీకరించిన సందర్భంగా  మీ అనుభూతి లేదా స్పందన తెలియజేస్తారా?
• ప్రభుత్వం ఇచ్చే ఏ అవార్డ్ ఐనా ప్రతిష్టాత్మకమైనదే. నన్ను గుర్తించి పురస్కారం అందించిన సందర్భంగా ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సాధారణంగా దాశరథి పైన కృషి చేసిన వారికే దాశరథి పురస్కారం ఇస్తారని అనుకుంటారు. సాహిత్యం లో కృషి చేసిన వారికి దాశరథి పేరిట పురస్కారం ఇస్తారు. మూడు కారణాల వలన నాకు ఈ పురస్కారం వచ్చిందని అనుకుంటున్న. సురవరం ప్రతాప రెడ్డి  గారి పైన చాలా కృషి చేయడం, ఆయన జీవిత చరిత్ర రాయడం అలాగే ఆయన శత జయంతి సందర్భంగా వైజయంతీ సంస్థ నుండి దేవులపల్లి రామానుజ రావు గారి సూచన తో సురవరం ప్రతాప రెడ్డి గారి పైన 1988 నుండి 1996 వరకు 12 పుస్తకాలు అచ్చు వేశాము. నేను తెలుగు శాఖ కు అధ్యక్షునిగా ఉన్నప్పుడు 1996 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ప్రతాప రెడ్డి గారిపైన నా ఆధ్వర్యం లో సెమినార్ చేయడం తో పాటు పుస్తకం కూడా వేశాము.  రెండవ కారణం నేను తెలంగాణ సారస్వత పరిషత్ కు 16 సంవత్సరాలు కార్యదర్శిగా ఉన్నాను. 20 సంవత్సరాలు ఆ సంస్థ తో అనుబంధం ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఇక మూడవ కారణం నాదీ వనపర్తి సంస్థాన పరిధికి చెందిన సుదీర్ఘ సాహిత్య జీవితం.  ఈ ప్రాంతం నుండి సీనియర్ వ్యక్తికి పురస్కారం ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారేమో. ఈ మూడు కారణాల వలన నాకు పురస్కారం వచ్చిందని అనుకుంటున్నాను. ఈ పురస్కారం నాకు వ్యక్తి గతంగా వచ్చిందని అనుకోకుండా సంస్థలకే చెందుతుందని అనుకుంటున్నాను.
ప్ర. దాశరథిగారితో మీకున్న పరిచయ విశేషాలు, సాన్నిహిత్యం గురించి చెప్తారా?
• దాశరథి గారితో పరిచయం ఉంది కానీ పెద్ద పరిచయం కాదు. నేనూ ఆయన కలిసి పది సభల్లో పాల్గొన్నాము. దాశరథి గారి కవిత్వం గురించి నేను చాలా చోట్ల మాట్లాడాను. కొన్ని వ్యాసాలు కూడా రాశాను. దాశరథి గారి లో నేను గమనించిన గొప్ప గుణం ఏమిటంటే ఆయన ప్రసంగించేటప్పుడు మనిషి ఎత్తు తక్కువైనా, ఆ భావావేశంలో ఏడడుగుల మనిషి లాగా కనిపించే వారు.  టీచర్స్ అందరికీ ఆ లక్షణం ఉంటే బాగుండు అనిపిస్తుంది. దాశరథి గారు మహంధ్రోదయం అనే పుస్తకాన్ని సురవరం ప్రతాప రెడ్డి గారికి అంకితం ఇచ్చారు. నాకు నచ్చిన అంశాలలో అది మొదటిది.  ఆయన పట్ల నాకు అమిత గౌరవం.
ప్ర. మీ విద్యాభ్యాసం వివరాలు తెలుపుతారా ?
• నేను ప్రాథమిక విద్యభాసం మా వూరి లోనే చేశాను. మా వూరు తాళ్ళూరు వనపర్తి జిల్లా లో ఉంది. మా వంశం లో ఎవరు కూడా 4 వ తరగతి చదువుకున్న వారు లేరు. వ్యవసాయం ప్రధానంగా ఉన్న కుటుంబం మాది. తర్వాత కొల్లాపురం లో 5 వ తరగతి నుండి హెచ్.ఎస్సీ వరకు చదువుకున్నాను. హైదరాబాద్ న్యూ సైన్స్ కళాశాలలో పి.యు.సి. బి.యస్సీ చదివాను. పి.జి చెయ్యాలనుకున్నప్పుడు మిత్రులు అంతా ఏం.ఏ. తెలుగు చేయమన్నారు. నాకు ఏం.ఎస్సీ జియాలోజీ లో ఆసక్తి. నాకు తెలియకుండానే మిత్రులు అప్లికేషన్ ఇవ్వడం తో ఏం.ఏ తెలుగు చేశాను. అక్కడి ప్రముఖులు దివాకర్ల వేంకటావధాని, సినారె గారు, తాటిబండ్ల మాధవ శర్మా గారు,పల్లా దుర్గయ్య గారు లాంటి వారు నన్ను అభిమానించే వారు. ఏం.ఏ లో నాకు బంగారు పథకం వచ్చింది. దివాకర్ల వేంకటావధాని గారు మహా భారతం పైన పి.హెచ్.డి చెయ్యమని సూచన చేశారు. ఆయన రిటైర్ అవబోతుండడం తో నారాయణ రెడ్డి గారి కింద నన్ను పి.హెచ్.డి విద్యార్థిగా వేశారు. విద్యార్థి గా నన్ను సినారె గారు బాగా అభిమానించే వారు.. అలా పి.జి. పి.హెచ్.డి పూర్తయ్యింది. 1970 లో తెలంగాణ ఉద్యమ సమయం లో తెలుగు అకాడమీ లోఉద్యోగం వచ్చింది. నాకు బొధన చాలా ఇష్టం. అందుకే ఏ.వి కళాశాలలో లెక్చరర్ గా చేశాను. ఆ సమయం లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ సురవరం ప్రతాప రెడ్డి గారి రచనలు, సాహిత్యం మీద గ్రంథాలు రాయమని ఒక పోటీ పెట్టింది. అప్పుడు నేను సురవరం ప్రతాప రెడ్డి గారి జీవితం సాహిత్యం అనే పుస్తకానికి నాకు అకాడెమీ అవార్డ్ వచ్చింది. ఈ లోగా ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ లో లెక్చరర్ పోస్ట్ కు అప్లికేషన్ లు కోరడం తో నేను అప్లై చేశాను. 1973 లో నాకు ఆ పోస్ట్ వచ్చింది. ఆ విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా, రీడర్ గా, బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గా, హెడ్ గా 34 సంవత్సరాలు పని చేశాను. 2005 లో ఉద్యోగ విరమణ చేశాను.
ప్ర. మీ పరిశోధన గురించి తెలుపండి.
• ఆంధ్ర మహా భారతం లో రస పోషణ విరాట్ ఉద్యోగ పర్వాలు అంశం పైన పరిశోధన చేశాను. నేను ముఖ్యంగా సైన్స్ విద్యార్థి ని కావడం, అందులో మహా భారతం గురించి పరిశోధన చేయడం తో చాలా కష్టపడాల్సి వచ్చింది. సినారె గారు మధ్య మధ్యలో తొందరగా చేయమని అడిగేవారు. నేను ఆసక్తి తో సంస్కృతం కూడా కొంత నేర్చుకున్నాను. మహా భారతం ప్రౌడ రచనా కావడంతో సంస్కృతం తెలుగు టెక్స్ట్ చదివి అవగాహన చేసుకున్నాను. నా అనుభూతిని ఆసరాగా చేసుకొని థీసిస్ పూర్తి చేశాను. అది కొంత విలక్షణమైన అంశం అయినప్పటికీ అందరూ నన్ను ప్రసించారు.
ప్ర. పరిషత్తు తో మీ అనుబంధం గురించి చెప్పండి?
• నా పైన దేవులపల్లి రామానుజ రావు గారికి మంచి అభిమానం ఉండేది. అందుకే పరిషత్తు కార్యక్రమాల లో నన్ను ఇన్వాల్వ్ చేసే వారు. సురవరం గారి రచనల పైన పుస్తకాలు తేవాలని వేసిన కమిటీ కి నేనే ఛైర్మన్ ను. దాదాపు 12 పుస్తకాలు అచ్చు వేశాము. మొదట కార్యదర్శిగా చేశాను. సినారె గారి అస్తమయంతో కమిటీ నన్ను అధ్యక్షునిగా ఎన్నుకుంది. అలా అకాడమీ కి ప్రస్తుతం అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను. సినారె గారి పలుకుబడి గొప్పది. ఆయన పేరు చెప్పితే ఎవరైనా సహకరించే వారు. అంతా క్రితం పరిషత్తు స్థలం ప్రభుత్వం లీజ్ కు ఇచ్చింది. సినారె గారు అధ్యక్షులుగా, నేను సెక్రెటరీ గా ఉన్న సమయం లో అప్పుడు చంద్రబాబు నాయుడు  ప్రభుత్వం వారు ఆ స్థలాన్ని  పరిషత్తుకు ఇచ్చి 14 లక్షలు డబ్బు కట్టమని అడిగారు. కానీ అప్పుడు పరిషత్తు దగ్గర అంత డబ్బు లేదు. కాని  సినారె గారు రెడ్డి లాబ్స్ అంజిరెడ్డి గారిని అప్పుగా అడిగితే వారు ఉచితంగానే సమకూర్చారు. అలా స్థలం పరిషత్తు కు స్వంతమయ్యింది. పరిషత్తుకు ఆదాయం కోసం వెనుక బిల్డింగ్ మరియు షాప్ లు వేశాము. సినారె గారి పీరియడ్ లో అద్భుతమైన పని జరిగింది. వారు కీర్తి శేషులయ్యాక ఒకటే సారి పైనుండి క్రిందికి పడ్డట్టు అయ్యింది. శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు ఒకసారి పరిషత్తు కు వచ్చినప్పుడు ఆడిటోరియం పునరుద్ధరణ పనుల కోసం కొంత సహకారం గురించి అడగగానే అందుకు అంగీకరించి సంపూర్ణ సహకారం అందించారు.తద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించ గలుగుతున్నాము.  గ్రంథ ప్రచురణ, సదస్సులు, గ్రంథావిష్కరణలు , పురస్కారాలు తదితర కార్యక్రమాలతో సారస్వత పరిషత్తు అమోఘమైన సేవలు అందిస్తున్నది.  ఈ మధ్య పురస్కారాలు అందించాలనుకున్న వారు లక్ష యాభై వేలు ఇస్తే వారి పేరిట సంవత్సరానికి ఒకసారి 5 వేల రూపాయల పురస్కారం అందిస్తున్నాము. పరిషత్తు ఎప్పుడు పైరవీ లకు, పక్షపాతానికి లొంగదు. ఇటీవల పురస్కారాల ప్రదానం జరిగింది.  7 మందిని ఎంపిక కోసం 24 మంది న్యాయ నిర్ణేతలను పెట్టాము. అలా పారదర్శకంగా పురస్కారాల ఎంపిక కొనసాగుతుంది. వరప్రసాద్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇచ్చి ఒక పురస్కారం ఇవ్వమన్నప్పుడు తిరుమల శ్రీనివాసా చార్య గారికి ప్రదానం చేశాము. భవిష్యత్తు లో వనరులను చూసుకొని ముఖ్యంగా యువ కవులకు, యువ రచయితలకు ప్రోత్సాహం అందిద్దామని అనుకుంటున్నాము. తెలుగు భాషను అభిమానించే అందరికీ పరిషత్తు ఒక కేంద్రంగా ఉండాలని మా ఆశయం. ఇటీవల ఒక పుస్తకాన్ని పది మంది తో వ్యాసాలు రాయించి అచ్చు వేశాము. కవిత్వం రాయడం ఎలా అనేది ఆ పుస్తకం. అది చాలా మంచి పుస్తకం. ఆ పుస్తకం చివర దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఇంటర్వ్యూ వేశాము. ఏదైనా ప్రయోజన కరమైనది ఉంటే గాని , అణగారిన వర్గాల గురించి కవిత్వం రాస్తే గాని అవి వేస్తున్నాము. సమాజానికి ప్రయోజనం లేని అంశం తీసుకుంటే మనం నిలువలేము. సమాజం ముఖ్యం. అలాగే సాంప్రదాయాన్ని విస్మరించ కూడదు. సంప్రదాయం తల్లి వంటిది. ఆధునిక సాహిత్యం అర్థాంగి లాంటిది. భార్యతో జీవించాలి. తల్లిని గౌరవించాలి.
ప్ర. తెలుగు సాహిత్యం పట్ల మీరు ఎలా ఆకర్షితులు అయ్యారు?
• మా చేను  లో కూర్చుంటే కృష్ణ తుంగభద్రా నది సంగమం, సంగమేశ్వర దేవాలయం కనిపించేవి. అలా నది నాకు బాల్యం నుండే ఒక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే లక్షణాన్ని ఇచ్చింది. బహుశా నాన్న గారు సంగమేశ్వరం లో శివుణ్ణి చూసే నాకు ఆయన పేరు పెట్టారని అనిపిస్తుంది. తెలుగు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఆసక్తి కలిగించేలా చెప్పే వారు. చంద్రమౌళి శర్మ గారు నాకు చక్కగా పాఠం చెప్పే వారు. ఆ ప్రభావం నాపైన చాలా ఉంది. సహజంగా చిన్నప్పటి నుండి ఎందుకో తెలియదు కానీ తెలుగు భాషపైన అభిమానం కలిగింది. విద్యార్థి గా కూడా కొన్ని రచనలు చేశాను. హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ లో ఉండేవాడిని. దాని పక్కనే అప్పటి ఆంధ్ర సారస్వత పరిషత్ ఉండేది. మరో పక్కన శ్రీకృష్ణ దేవరాయ భాష నిలయం ఉండేది. విద్యార్థి గా ఉన్నప్పుడే పరిషత్తుకు, భాష నిలయం లో జరిగే అనేక సభలకు వెళ్ళి వినే వాడిని. సినారె గారిని మొదట చూసింది భాషా నిలయం లోనే 1963 లో అలా నాకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగింది. భగవంతుడి దయ, గురువుల ఆశీర్వాదం నాకు అన్నీ అవకాశాలు వచ్చాయి. అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు.
ప్ర. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి గా, గురువుగా మీ అనుబంధం తెలుపండి.
• నా జీవితం లో ఆ విశ్వ విద్యాలయాన్ని తలుచుకోని రోజు ఉండదు. నాకు ఎన్ని ఆస్తులైన ఉండవచ్చు కాక, కానీ  నాకు అన్నం పెట్టిన యునివర్సిటి అది. చాలా గొప్ప విశ్వవిద్యాలయం అది. తెలుగు శాఖ లో సినారె, దివాకర్ల వారి పేరు చెప్పితే ఆరోజులలో చాలా గౌరవంగా చూసేవారు. సినారె గారు పాఠం చెప్పితే గోడలు విన్నాయి, మేడలు విన్నాయి,వాడలు విన్నాయి  అనే కవిత్వం రాశాను ఇటీవల. నేను ఉద్యోగం లో చేరే సమయం లో వి.సి. గా నూకల నరోత్తమ రెడ్డి గారు ఉండేవారు. ఆయన ఒకప్పుడు గోల్కొండ పత్రిక సంపాదకులు. ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ నాకు పరిస్థితులు అనుకూలించడం తో ఆ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం లభించడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
ప్ర. మీ రచనా వ్యాసంగం గురించి తెలియజేస్తారా ?
‘పూల కారు’ అని కవిత్వం 1984 లో అచ్చయ్యింది. విచిత్రం ఏమిటంటే కె.సి.ఆర్‌ గారు ఆ పుస్తకాన్ని సిద్దిపేట లో ఆవిష్కరించారు. ఆ సమావేశం లో కసిరెడ్డి గారు ఉన్నారు. జాతీయ సాహిత్య పరిషత్తు నుండి అక్కడ ప్రస్తుత సి.ఎం గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. యువభారతి వారు కోరితే ఒక చిన్న పుస్తకం రాశాను. తిక్కన రసభారతి విమర్శగ్రంథము, ముసలమ్మ మరణం వంటి పుస్తకాలను ప్రచురించాను.  ఆకాశవాణి భావన ప్రసంగాల సంపుటి ‘భావ దీపాలు’, సురవరం ప్రతాపరెడ్డిగారి జీవితం, సాహిత్యం, సిద్ధాంత గ్రంథమైన ఆంధ్రమహాభారతంలో రసపోషణం గ్రంథాలను వెలువరించాను.
ప్ర. తెలుగుసాహిత్య అధ్యాపకునిగా, తెలుగు సాహిత్య భాషా సాహిత్యసేవకునిగా మీ అనుభవ, అనుభూతి విశేషాలను తెలుపుతారా?
దాశరథి గారి కవితావేశం, సినారె గారి బోధనా కౌశలం, దివాకర్ల గారి పాండిత్యం ..ఇవన్నీ చూసిన తర్వాత కొన్నైనా అలవరచుకుంటే విద్యార్థులకు మేలు కలుగుతుందని అనుకోని నేను కృషి చేశాను. నాకు బోధన ప్రాణం. నా ఉద్యోగ విరమణ రోజున నేను చెప్పాను..డబ్బులు ఇవ్వకున్న ఫరావా లేదు ఉచితంగా పాఠాలు చెపుతాను అని. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను తెలుగు లెక్చరర్ గానే జన్మిస్తాను.
ప్ర. మీ ఇతర పురస్కారాల వివరాలు తెలుపండి.
• చాలా ఉన్నాయి కానీ పురస్కారాలకు పొంగిపోయే మనస్తత్వం కాదు నాది. ఇచ్చేవారు గౌరవం తో ఇస్తారు మనం తీసుకుంటాం అంతే. నాకు 1972 లో సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది. వివిధ ప్రైవేట్ సంస్థల పురస్కారాలు దాదాపు ఇరవై దాకా ఉన్నాయి.
ప్ర. మీ గురించి చెప్పాల్సి వస్తే ఒక సాహితీ వేత్త గా, కవిగా, ఉప కులపతి గా, పరిశోధకులు గా, విమర్శకులు గా ఆచార్యులుగా ఉన్నారు. మీకు సంతృప్తి నిచ్చిన అంశం ఏది?
• మంచి ప్రశ్న అడిగారు. నేను ఉస్మానియా బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు నాకు అందరూ బాగా సహకరించారు. నా జీవితం లో ఇప్పటివరకూ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు చేయడం, సాటి వారి మీద కుట్రలు చేయడం నా జీవితం లో లేదు. అందుకే విద్యార్థులు, అధ్యాపక వర్గం నాకు సహకరించారు. నా పదవీ కాలం లో నా పైన చిన్న గొడవ కూడా లేదు. పూర్వ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి టీచర్ గా నా మీద గౌరవం. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి గా నాకు అవకాశం ఇచ్చారు. నాకు అక్కడ అందరి సహకారం అమోఘం గా లభించింది. మొదటి సమావేశం లోనే దేన్నైనా సహిస్తాను కానీ, క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పాను. అప్పటి వరకు తెలుగు విశ్వవిద్యాయంకు, నాక్ గుర్తింపు లేదు.  నేను నాక్ కమిటీ గుర్తింపు వచ్చేలా చేశాను. దాని కోసం నేను కష్టపడ్డాను, అందరూ సహకరించారు. యునివర్సిటి కి సున్నం వేయించి అందంగా కనపడెలా చేశాను. అక్కడ గార్డెన్ కూడా డెవలప్ చేశాను. పరిసరాల అందం మారిపోతే విద్యార్థులు కూడా ఆనందం గా చదువుతారనే భావన తో  ఆ పనులు చేశాను. తెలుగు విశ్వవిద్యాలయం  రూపు రేఖలు మారాయని అందరూ ప్రశంసించారు. ప్రపంచ తెలుగు సభల సందర్భంగా నన్ను 30 రోజుల వ్యవధి లో ఒక పెద్ద సావనీర్ తీసుకురావాలని కోరారు. దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని కొందరు అధ్యాపకుల సహకారం తో నాలుగు రోజులలో 1100 పేజీల రాయల్ సైజ్ లో ప్రింట్ చేయించాను. మేము స్టాల్ పెడితే కొన్ని వేల కాపీలు అమ్ముడయ్యాయి అవి. సుమారు 60 లఘు పుస్తకాలు కూడా వేశాము. సరియైన అంశం పైన, నాణ్యమైన పేజీ లతో వేశాము అవి.  అది తెలుగు విశ్వవిద్యాలయానికి దక్కిన ఘనత.
ప్ర. ప్రస్తుతం వస్తున్న సాహిత్యం పట్ల మీ అభిప్రాయం చెప్తూ వర్థమాన రచయితలకు సూచనలు ఏవైనా ఇస్తారా..
• సాహిత్యం లో అనేక ప్రక్రియల లో రాస్తున్న ఎవరినీ నిరాకరించకూడదు. కానీ ఒక ప్రయోజనం ఉండాలి. ఒక సందేశం ఉండాలి. భాషా చాతుర్యం ఉండాలి. అవి లేకుండా అంతగా రచన రాణించదు. సినారె గారి భావన లో  ఎవరైనా ఒక రచనా బాగా లేదని అంటే కాలం ఒక ప్రవాహం. కాలం ప్రవహిస్తూ ఉంటుంది. అది మంచిని తీసుకెళ్లి, చేత్తను ఒడ్డు పైన పడేసి పోతుంది. సాహిత్యం కూడా అలాంటి ఒక ప్రవాహం అని అనేవారు.  ఇప్పుడు చాలా మంది చదవడం కు దూరంగా ఉంటున్నారు. సమయం చాలా అమూల్యమైనది. రచయితలు సమాజనికి ఉపయోగపడే రచనలు చేస్తే మంచిది. ఎవరు రాసిన ఒక ప్రామాణికతతో రాయాలి. భాష పట్ల గౌరవం ఉండాలి. భాష జ్ఞానం ఉండాలి. సంస్కృతి పైన, భాష పైన గౌరవం లేక పోతే ఆ జాతి ఎక్కువ కాలం నిలువదు. దేశాభిమానానికి భాషాభిమానమే మూలం అని కొమర్రాజు లక్ష్మణ రావు అన్నారు. ఇప్పుడు వస్తున్న భాష తీరు కొంచెం మారి తెలుగుదనం ఎక్కువ అయితే బాగుంటుంది.
August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

వెల్లంకి సాహితీ పాలకంకి

by Ananthaacharaya K.S. August 25, 2021
written by Ananthaacharaya K.S.

“పల్లియలోనే పుట్టితిని పల్లియయె నను పెంచె, పల్లియె ఇల్లును వాకిలిన్ కలిమినిచ్చె బతుకు మెరుంగుపెట్టె’, ఆ పల్లియ ‘అమ్మ’, ‘ఆవనుచు’ పల్కులు పలుకగ నేరిపించె, నా పల్లియ నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వరా !

పల్లె వాసనల మట్టి పరిమళం అద్దుకొని, మల్లెలంత తెల్లని మనసుతో, చేను చెల్కల మీద పశువుల గిట్టల శబ్దాల నడుమ ఉదయించిన వెల్లంకి సాహితీ పాలకంకి డా|| కూరెళ్ళ విఠ్ఠలాచార్య గారు. తండ్రి ఛాయలు తెల్వదు ఆయన అనుపాలను నోచుకోలేదు. అమ్మ చేతుల పెరిగి అమ్మ తాతల గారాలపట్టిగా, మేనమామ మురిపాల అల్లుడై పల్లె పెరిగిన ఆచార్యుల వారు తన జీవితాన్ని పల్లెతోనే ముడివేసుకొని వెల్లంకిలోనే స్థిరపడినారు. ఆధునిక భావాలు, తిరుగుబాటు చిన్నప్పుడే అలవాటు చేసుకొని అన్ని కులాల పిల్లలను ఒకచోట చేర్చి సహపంక్తి భోజనం చేయించిన సాహసి. తదుపరి అనేక పరిణామాలకు బాధ్యుడిగా నిలిచి సమానత్వపు ఊపిరు లూదిన విఠలుని విరాట్ స్వరూపం. కష్టం వారి చిరునామ, కన్నీళ్ళు వారి దాహం తీర్చాయి. ఉపవాసాలు, పెద తండ్రి చిన్నచూపు అన్నీ కలిసి కూరెళ్ళ వారిలో చదువువైపు అడుగులు వేయించింది. ఒక ఆశయం, ధ్యేయంవైపుకు సాగే నిరంతర శ్రామికులై విద్యాసాధన చేసిన వినమ్రశీలి.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నీరునెముల గ్రామంలో కూరెళ్ళ లక్ష్మమ్మ వేంకటరాజం దంపతులకు జన్మించినారు. ఉర్దూ మాద్యమంలో ప్రారంభమైన చదువులోఎక్కడా వెనకబడలేదు. ఏడవ తరగతిలోనే తెలుగులో ఉత్తమ మార్కులు పొంది బేతోజు లక్ష్మీనారాయణ ఈశ్వరమ్మ ల పురస్కారం పొందిన పట్టుదల వీరిది. వీరి ఊరి కరణం కుమారుడు శ్రీహరిరావుగారిచ్చిన ప్రోత్సాహమే వీరి ఉన్నత విద్యకు కారణం. 7వ తరగతిలోనే వీరి తాతగారు బేతోజులక్ష్మీనారాయణ గారు మరణించినపుడు ‘స్మృతి కావ్యం’ రచించారు. 9వ తరగతిలో గోవిలాపంరాసారు. ఇది పాఠశాల కుడ్య పత్రిక ఉదయంలో ప్రచురించబడింది.

1954లో వెల్లంకి గ్రామంలో మిత్రులతో కలిసి శ్రీశంభు లింగేశ్వర స్వామి పేర గ్రంథాలయంస్థాపించారు. పెదనాయిన ఆధిపత్య ధోరణి కూరెల్ల వారిని వామపక్ష భావాల వైపు వెళ్ళేటట్లు చేసికమ్యూనిస్టుల పత్రిక విశాలాంధ్ర చదివేవారు. ఆ పత్రిక చదువద్దని ఆనాటి ప్రభుత్వం పోలీసు నిఘాపెట్టింది. నాటి కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి పక్క గ్రామానికి వస్తే గొంగడి కప్పుకొనివెళ్ళి రహస్యంగా చూసి వచ్చిన సాహసి. రెవెన్యూ, కో-ఆపరేటివ్, విద్యుత్, న్యాయస్థానం, సేల్ టాక్స్ఆఫీసులలో ఉద్యోగం చేసినా నచ్చక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొన్న కర్మశీలి.

దేవుడొక్కడే నివసించు దేశమొక్కటే

జాతి ఒక్కటి చేయు భోజనమునొకటే

అయిన నెందుకో? కులముల పైన శ్రద్ధ

ఎవరో తలలేనివారు సృష్టించినారు

అని రాసిన అపర వేమన. తన అభిప్రాయాన్ని సూటిగా అలతి పదాలతో అద్భుతంగా రాసిఆదరణ పొందినారీ కవివరేణ్యులు. ఒకవైపు ఉద్యోగం మరొకవైపు రచనా వ్యాసంగంతో పాటుఉన్నత విద్య ఆర్జించాలనే తపనతో 1972లో ఎం.ఏ. పరీక్ష రాసి ఉత్తీర్ణులై ఉపాధ్యాయుని పదవినుండి ఉపన్యాసకులుగా ఎదిగారు. ఇంటి గేదెకు వైద్యం చేయించుచుండగా అది మీదపడటంమూలాన కూరెళ్ళ వారి కాలు విరిగింది. మూడు నెలలు బెడ్ మీద ఉండి కూతుర్లతో తను చెప్తూ’విఠలేశ్వర శతకం’ పూర్తిచేసిన ఘనత వీరిది.

తన విలువైన ఆస్తి ఆరెకరాల సారవంతమైన పంట భూమిని పేదల ఇళ్ళ నిర్మాణానికి అందించినఘనత వీరిది. నిరాడంబరత, నిర్భీతి, నిగర్వం, నిబద్ధత, నిజాయితీలతో కూడిన జీవితం విఠలాచార్యగారిది. నిండైన తెలుగు వేషధారణతో కన్పిస్తారు. క్రమశిక్షణ, సమయపాలన వీరికి రెండు కళ్ళలాంటివి. కార్యసాధన, వినమ్రత, కృతజ్ఞత, ఆదరణా ఆప్యాయతతో పూర్ణ

స్వర్ణభాండ మూర్తిమత్వంవీరిది. వీరి ప్రోత్సాహంతో ఎదిగిన వారిలో డా|| ఏనుగు నర్సింహారెడ్డి గారు, డా|| పోరెడ్డి రంగయ్య,కూరెళ్ళ శ్రీనివాస్, ఏలె లక్ష్మణ్, డా|| వాసా భూపాల్, సాగర్ల సత్తయ్యలాంటి వారు ఎందరో.

“నాకు కవిత్వమె బ్రతుకు, నాకు శ్రమియించెడివాడు ఇష్టుడున్” అని వీరు రాసిన త్రిపదలుదొందు దొందే రిక్షా కార్మికునికి అంకితం చేసిన ఆదర్శవంతులు.

పద్యాన్ని ప్రాణప్రదంగా ప్రేమించినా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనే గద్య రచనను శక్తివంతంగాఅందించిన ధీశాలురు. జీవచైతన్యపు రచన ఇది. శ్రీ శ్రీ మహాప్రస్థానమ్ లాగా సాగిందీ రచన. మరొకఅద్భుత రచన శిల్పాచార్యులు. ఇందులో మనకు తెలుగు

గొప్పతనం, కవుల పరిచయాలు, కళాకారులుసకలం కల్పి వడ్డించిన విస్తరిది.

నానీల నేత్రాలు రాసి ప్రజలకు మరింత చేరువయినారు. మహాకవి దాశరథి పురస్కారాలతోపాటు అనేక పురస్కారాలు అందుకొన్న వీరు అన్నీ సాహితీ ప్రక్రియలను సుసంపన్నం చేశారు.ఇంకా 12 అముద్రిత గ్రంథాలున్నాయి. అయితే! సాహితీ బ్రహ్మ కూరెల్ల విగ్ధలాచార్య గారి సమగ్రసాహిత్యం ఒకే చోటికి రావాలని ఆశిస్తున్నాం. పదండి వారి ఇంటర్వ్యూలోకి వెళదాం…..

 1. ప్ర. బాల్యంలో కష్టపడిన ఉన్నత విద్యను అభ్యసించిన మీ విద్యా ప్రస్థానం గురించి తెల్పండి?

మా తండ్రిగారు నేను ఐదు నెలలపుడే ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. అమ్మ లక్ష్మమ్మకుఅప్పుడు 15 సం||లు మాత్రమే. మా మాతామహులు బేతోజు లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ గారిగ్రామం నీరునెములలో విద్యాభ్యాసం ప్రారంభమైంది. మసూల్ దార్ అనే ముస్లిం ప్రయివేటు టీచర్  వద్ద పీర్ల కొట్టంలో అక్షరాభ్యాసం జరిగింది. ఉర్దూ మాధ్యమంగా విద్య కొనసాగింది. తిరిగి వెల్లంకికి వచ్చి షేక్ అహ్మద్ అనే ప్రైవేటు ముస్లీం టీచర్ వద్ద చేరి ఫీజు కట్టలేక బడి ఊడ్చి చదివాను. మా ఊరి కరణం కొడుకు బసవరాజు శ్రీహరిరావు గారి ప్రోద్బలం వలన రామన్నపేటలో 7వ తరగతి వరకు చదివాను. పన్నెండేళ్ళ వయసులోనే తాతగారి మరణం ‘స్మృతి కావ్యాన్ని’ రాయించింది. 1954- 55లో విశ్వకర్మ హాస్టల్ లో చేరి చదువు ప్రారంభించినా కష్టాల కడలిలోనే తేలియాడి, ప్రతి ఇంటిని ఆశ్రయించాను. హైస్కూలులో సుప్రసిద్ధ పండితులు కోవలె సంపత్కుమారాచార్యులు గారు సంస్కృతం బోధించినారు. 9వ తరగతిలో పాఠశాల కుడ్య పత్రిక ‘ఉదయ’కు సంపాదకుడని అయ్యాను. జనగామ రైలు ప్రమాదం పేరిట ‘అధిక వృష్టి’ కవిత వ్రాసి కరుణశ్రీ జంధ్యాల వారి పుస్తకం బహుమతిగా పొందాను. అందులోని పుష్పవిలాప ఘట్టం చూసి ‘గో విలాపం’ రాసాను. 1957లో హెచ్.ఎస్సీ. పూర్తి చేసాను. అనేక చిన్నాచితక ఉద్యోగాలనంతరం మేడ్చల్ ఉపాధ్యాయ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకొని నాటి గవర్నరు చేత షీల్డు అందుకున్నాను.

2. ప్ర. పాఠశాల ఉపాధ్యాయుడి నుండి ఉపన్యాసకుల వరకు మీరున్న ప్రతిచోట సాహిత్య వాతావరణం, సాంస్కృతిక వైభవం తీసుకొని వచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది?

1960 లోనే భువనగిరి సమితిలోని వడాయిగూడెంలో అక్షరాస్యతా ఉద్యమం ప్రారంభించి “చచ్చేముందు సంతకమైనా చేయాలని” వయోధికులకు చదువు నేర్పించాను. నాకు మొదటి నుండి సాహిత్యం కళలు అంటే ఎక్కువ మక్కువ. గూడెం ప్రజలందరినీ చైతన్యపరిచి నాటకం వేయించి బహుమతులు ఇప్పించాను. సాహితీ సాంస్కృతిక వాతావరణం ద్వారా పిల్లల్లో సృజనాత్మకత పెంచవచ్చుననే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాను. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధియే లక్ష్యం పెట్టుకొని పాఠశాల నుండి జూనియర్ కళాశాల స్థాయినకు ఎన్నో సాహితీ పత్రికలు ప్రారంభించి తోటివారి ప్రోత్సాహం కరువైనా నా లక్ష్యం పూర్తి చేసాను. నాకు ఇష్టమైన ఈ కృషికి ఎందరో సహకరించారు.

౩. ప్ర. ఉపాధ్యాయ ఉద్యమనేతగా, సాహితీ విస్తరణ, గ్రంథాలయం ఉద్యమం ఇలా బహుముఖీనంగా జీవనంలో పోరు అలవాటుగా సాగి విజయం పొందారు విశేషాలు తెల్పండి?

సాహిత్యం నా శ్వాస నా రచనలను ఎప్పటికప్పుడు కొనసాగిస్తూనే, ఇవి నాతో ఆగకుండా వుండటానికి నా విద్యార్థులను రచనలవైపు ప్రోత్సహించాను. అలా అప్పటి నా విద్యార్థులు సాహితీవేత్తలుగా ఎదిగినారు. పరిశోధన చేసి, డాక్టరేటును పొందడం సంతోషకరమైన అంశం.

స్టేట్ టీచర్స్ యూనియన్ బాధ్యునిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాను. ఉపాధ్యాయులు ప్రశాంతంగా ఉంటే పాఠశాల విద్య ప్రశాంతంగా కొనసాగుతుందని అభిప్రాయంతో వారికి అండగా నిలిచాను.

4.ప్ర. మీ సాహితీ ప్రస్థానానికి బీజాలు వేసి మిమ్మల్ని ప్రభావితం చేసిన గురవరేణ్యులు ఎవరు?

శ్రీ డోకూరి బాలబ్రహ్మచారి గారి వారు పుట్టు అధులు, అష్టావధాని. వారి అష్టావధానం విని ప్రభావితుణై వారికి చేరువయినాను. వారికి దృష్టిలోపం వలన నేనే అనేక గ్రంథాలు చదివి వినిపించాను. వారి ప్రభావం నాపై ఉంది. పద్యరచనలో నాకు వారు మార్గదర్శకమయినారు. కోవెల సంపత్కుమార గారి సంస్కృత బోధన నాకు బలాన్నిచ్చింది. బి.ఎన్.శాస్త్రి గారి లాంటి వారెందరో నా రచనలకు ప్రోత్సాహాన్ని అందించినారు.

5.ప్ర. మీరు చాలా సాహిత్య పత్రికలు నడిపారు కదా, వాటి వివరాలు తెల్పండి?

1961లో బాపూభారతీ అనే పత్రికను గోకారం పాఠశాలలో ప్రారంభించి విద్యార్థుల రచనలు పొందుపరిచాను. 1963లో మా ఊరు వెల్లంకి పాఠశాలకు ఉపాధ్యాయునిగా వచ్చి ‘మా తెలుగు తల్లి’ కుడ్య పత్రికను, 1967లో వలిగొండ ఉన్నత పాఠశాలలో ‘వలివెలుగు’ను ప్రారంభించి విద్యార్థులను కలం తట్టి ప్రోత్సహించాను. 1977లో సిరిపురం ఉన్నత పాఠశాలలో ‘చిరంజీవి’ పత్రికను ఏర్పాటు చేశాను. 1979లో నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపన్యాసకునిగా పదోన్నతి పొందాను. 1980లో ‘ప్రియంవద’ పత్రికను కళాశాల విద్యార్థులకు కొరకు వెలువరించాను. రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘ముచికుంద’ అనే వార్షిక సంచికను 1987లో తీసాం. రాష్టోపాధ్యాయ సంఘం పక్షాన, రామన్నపేట నుండి ‘మన పురోగమనం’ అనే పత్రిక తీసుకొచ్చి నడిపాం.

6.ప్ర. మీ పద్యాలు సులభశైలిలో ఉంటాయి. సమాజాన్ని ఆలోచింప చేస్తాయి, వీటి గురించి చెప్పండి?

‘విఠలేశ్వర శతకం’ సామాజిక స్పృహతో నిండిన శతకం అనేక అంశాలతో సాగింది. ‘శిల్పాచార్యులు’ పద్య సంకలనం సాహితీవేత్తలను, తెలుగు భాషను ఉగాది లాంటి సందర్భాలనో అక్షరబద్ధం చేశాను. ఇవన్నీ శ్రోతలకు ఆనందాన్ని, ఆలోచనలను కలిగిస్తాయి. కవితా చందనం, తెలంగాణా కాగడాలు, స్మృత్యంజలి లాంటి పద్య శైలిలో తీసుకొచ్చాను. నా పద్యాలు సులభశైలిలో నడుస్తాయి.

7.ప్ర. మీరు డాక్టరేటు పట్టా కోసం చేసిన పరిశోధన విశిష్టమైందీ విలక్షణమైంది వివరాలు చెప్పండి?

1977లో ఎం.ఫిల్ పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాను. అప్పటివరకు ఎవరూ సృష్టించని ‘తెలుగులో గొలుసుకట్టు నవల’ ప్రక్రియను పరిశోధనాంశంగా తీసుకొని పరిశోధన కొనసాగించాను. ఆచార్య ఇరివెంటి కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో ఇరువది నాలుగు రచయితలు, రచయిత్రులను ఇంటర్వ్యూ చేసి వారి కొత్త అంశాలను వివరించాను. 1988లో ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి మార్గదర్శకత్వంలో ‘తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణ’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పట్టాను పొందటం మరిచిపోరాని అనుభవం.

8.ప్ర. చాలా సాహితీ సంస్థలను, విద్యా సంస్థలను ప్రోత్సహించి ముందుకు నడిచేలా వెన్నుదన్నుగా నిలిచి మార్గదర్శకత్వం చేశారు. వీటి గురించి చెప్పండి?

నేను ఎక్కడ పని చేసానో, ఆ కార్యక్షేత్రం నాకు మక్కువయింది. అందువల్ల ప్రతీచోట సాహితీ సంస్థను స్థాపించి కవులను, కవయిత్రులను ప్రోత్సహించాను. నృత్యభారతి, ప్రజాభారతి, మల్లెల భారతి, జనభారతి, మహిళాభారతి, భువనభారతి, అక్షరభారతి వేరువేరు ప్రదేశాల్లో ఎన్నో సంస్థలను స్థాపించినాను. కొన్ని సంస్థలు ఇప్పటికీ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. అలాగే సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థలను కూడా స్థాపించాను. సత్యగాయత్రీ ఆశ్రమం, వెల్లంకి, చైతన్య కళాస్రవంతి, సాహితీ స్నేహితులు, స్పందన- రామన్నపేట, స్ఫూర్తి సిరిపురం, పూర్వ విద్యార్థుల సమిది-వెల్లంకిలో ప్రారంభించాను. గీతాజయంతి ఉత్సవ సమితి- ఇంద్రపాల నగరం, సీనియర్ సిటిజన్ సమాఖ్య, బతుకమ్మతల్లి కళాబృందం లాంటి 25 సంస్థల వరకు స్థాపించి, ప్రోత్సహించాను. 11 విద్యాసంస్థల స్థాపనలో ముందున్నాను. అందులో మైత్రీ విద్యాలయం – సంతోష్ విద్యామందిర్ వెల్లంకి, 5 స్కూల్లు రామన్నపేటలో చందన ప్లే స్కూలు, చౌటుప్పల్ లో స్థాపనకు ముందున్నాను. శ్రీ శ్రీ విద్యాలయం చిట్యాలలో ఆ సంస్థలు చక్కగా కొనసాగుతున్నాయి.

9.ప్ర. మీ ఇంటినే గ్రంథాలయంగా మార్చి అనేక సాహిత్య గ్రంథాలను పరిశోధకులకు, సాహితీ పిపాసకులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన ఎలా జరిగింది?

అందరినీ చదివించాలన్నదే నా ధ్యేయం. ముఖ్యంగా సాహితీ సృజన జరుగటానికి చదవటం సోపానం. మా అమ్మాయిలను ఒప్పించి రెండు కోట్ల విలువగల మా ఊరు వెల్లంకిలో ఉన్న మా ఇంటిని గ్రంథాలయంగా మార్చి వేసాను. 2 లక్షల రూపాయల విలువ గల పుస్తకాలను సేకరించి ఉంచాను. చదువరులకు ఈ గ్రంథాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ముఖ్యంగా నేను చదువుకొనేప్పుడు పడిన ఇబ్బంది ఇప్పటివారు పడకూడదనే ఈ గ్రంథాలయం స్థాపించాను. నా ఇంటిని గ్రంథాలయంగా మార్చినాక దాని ప్రక్కన చిన్న స్థలంలో రెండు గదులను నిర్మించుకొని అందులోనే ఉంటున్నాను. నా సర్వస్వం గ్రంథాలయం మాత్రమే.

10.ప్ర. మీ రచనల పైన ఎం.ఫిలు, డాక్టరేట్లు వచ్చాయి కదా వీటి గురించి చెప్పండి సార్?

నా ‘వ్యక్తిత్వం – సాహిత్యం’పై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నాగపురి శ్రీనివాసులు పిహెచ్.డి. పట్టాను అందుకొన్నారు. ‘విఠలేశ్వర శతకం’పై రెబ్బల మల్లికార్జున్ ఎం.ఫిల్ చేశారు. నా ‘శిల్పాచార్యులు’ గ్రంథంపై గంజి కళావతి ఎం.ఫిల్ చేశారు. ఇంకా అనేక పరిశోధనలు వివిధ విశ్వ విద్యాలయాల ద్వారా జరుగుతున్నాయి.

11.ప్ర. మీరు చాలా పురస్కారాలు, బిరుదులు పొందినారు కదా, పురస్కారాల మీద మీ అభిప్రాయం ఏమిటి?

దాశరథి పురస్కారం, రాధేయ, తేజా ఆర్ట్స్ జీవన సాఫల్య పురస్కారం లాంటివి ఎన్నో పొందాను. అభినవ పోతన, తెలంగాణ వేమన లాంటి బిరుదులు అందుకున్నాను. పురస్కారాలు, బిరుదులు వాటంతటవే మన సాహిత్య సృజనకు వెతుక్కుంటూ రావాలి. కాని మనం వాటికోసం పెంపర్లాడరాదు. పురస్కారాలు మనల్ని ప్రోత్సహిస్తాయి. అవి మనను ఇవి ముందుకు నడిపిస్తాయి.

12. ప్ర. మీరు సృజియించిన సాహితీ ప్రక్రియ ‘త్రిపద’ ప్రత్యేకత ఏమిటి?

త్రిపద నేను సృజియించిన ప్రక్రియ. అనుకోకుండా భావాత్మకంగా నేను రాసిన మూడు పాదాల రచనయే త్రిపదగా రూపుదిద్దుకుంది. జీవితంలోని అనేక సంఘటనలు సన్నివేశాలు, సంభాషణలు నా మనసుకు చిక్కి నన్ను కలిచివేసినప్పుడు పుట్టినవి ఈ త్రిపదలు. ఇందులో మొదటి రెండు పాదాలు భావ స్వామ్యం గలవిగా ఉంటూ మూడవ పాదం దాన్ని సమర్థిస్తూ మకుటంగా మలచబడింది.

“దేవుడు లేని గుడి / దేశికుడు లేని బడి / దొందూ దొందే” ఇలా సాగినాయి. ఈ ప్రక్రియ కవులందరు కొనసాగిస్తే బావుంటుంది.

13. ప్ర. వర్ధమాన కవులు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు?

నేటి కవులలో అధ్యయనం చాలా తగ్గిపోయింది. తమ రచనలను మాత్రమే చదువుతారు. అలా కాకుండా ఇతర కవులను, సాహిత్యాన్ని, ఇతర భాషల సాహిత్యాన్ని పరిశీలించాలి. అధ్యయనం బాగా జరుగాలి. అప్పుడే సృజన బయటికొస్తుంది. కవి వాదసిద్ధాంతిగా మిగులకూడదు. ఆచరణావాదిగా మిగలాలి. ఈ సిద్ధాంతంపైన నేను నడిచాను. ఇదే ప్రబోధిస్తాను.

14. ప్ర. తెలంగాణా ఉద్యమంలో మీరు పాలుపంచుకున్న విధానం ఏమిటి?

నల్లగొండకు మంజూరైన విశ్వవిద్యాలయానికి ‘పోతన’ విశ్వవిద్యాలయంగా నామసాధనోద్యమం ప్రారంభించి నాయకత్వం వహించాను. ‘బతుకమ్మ’ కళాబృందం స్థాపించి ఉద్యమానికి స్ఫూర్తిని రగిలించాను. 1952లో విద్యార్థిగా తొలి ఉద్యమంలో 1969 మలి ఉద్యమంలో 2001 నుండి తుది ఉద్యమంలో కవి, రచయిత, సీనియర్ సిటిజన్ గా పాలుపంచుకున్నాను. అందరు నగరాలలో స్థిరపడ్డా మా వెల్లంకిలో స్వంత ఇంటిని ‘సాయీ సాహితీ’ కుటీరంగా ఏర్పరుచుకొని, ఇక్కడినుండే సాహితీ, సాంస్కృతిక, సామాజిక, విద్య, ఆధ్యాత్మిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాను. ఏ కవియైనా నన్ను వారి పుస్తకానికి ముందుమాట రాయమంటే, పల్లెటూరిలో ఆవిష్కరణ చేసుకుంటే తప్ప రాయను అని నిష్కర్షగా తెలిపి, దాని మీదనే, ఆ మాట మీదనే ఇప్పటివరకు నిలబడి ఉన్నాను.

15. ప్ర. వచన పద్యగేయ వ్యాస ప్రక్రియలను అన్నింటినీ నిర్వహించారు కదా మీకు ఏది చాలాఇష్టం?

కాన్ఫిడెన్షియల్ రిపోర్టు (గద్య కవితా సంకలనం) రాసినా, పంచమి సాహిత్య సంపుటి వేసినా ఏం రాసినా నా ఆయువుపట్టు పద్యం నాకిష్టమైనది పద్యం. అందుకే నా సాహిత్యంలో సింహ భాగం పద్యాలు ఆక్రమించాయి. అన్ని ప్రక్రియలు ప్రత్యేకమైనవే వేటికవి గొప్పవే.

16. ప్ర. మీ ఈ సాహితీ యానంలో మీ కుటుంబ పాత్రను తెల్పండి ?

నాకు 1963లో యమునతో వివాహం జరిగింది. ముగ్గురు కుమార్తెలు నర్మద, తపతి, సరస్వతి. అందరికీ వివాహాలు జరిగాయి. తపతి ఉపన్యాసకులుగా పని చేస్తుంది. అందరూ సత్సంతానం పొందినారు. నా భార్య యమున పక్షవాతంతో మరణించింది. తాను ఎప్పుడూ నా సాహితీ సృజనను ప్రోత్సహించిందే తప్ప నిరుత్సాహ పరుచలేదు. అలాగే మా అమ్మాయిలు మా ఇంటిని గ్రంథాలయంగా మార్చడానికి ఇవ్వడం సంపూర్ణంగా సహకరించినారు.

17.ప్ర. మీరు ఇంకా సాధించలేనివి ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా?

పుస్తకాలతో ఒక వాహనం ఏర్పాటుచేసి, ఇంటింటికి పంపి అందరినీ చదువరులుగా మార్చాలి అన్నదే నా ధ్యేయం. గ్లకోమా వలన ఏర్పడిన అంధత్వాని అధిగమించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. నా ఈ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నా. చదువరులను తయారుచేసే ప్రణాళికలు రూపొందిస్తున్నా.

18. ప్ర. సాహితీ సంస్థలకు మీరందించే సందేశం ఏమిటి?

సాహితీ సంస్థలు ప్రణాళికాబద్ధంగా నడపాలి. వైవిధ్యభరిత కార్యక్రమాలు రూపొందించాలి. వ్యక్తి కేంద్రంగా కాకుండా సమిష్టిగా సాహితీ కార్యక్రమ నిర్వహణ జరిగితే మంచిది.

 

 

 

August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us