మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

రామప్ప – ఉలి కళ దర్భశయనం శ్రీనివాసాచార్యుల కవిత

by Dharba Shyayanam Srinivasacharyulu August 25, 2021
written by Dharba Shyayanam Srinivasacharyulu

దర్భశయనం శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను 6.1. 2012 వ తేదీన రంచించారు . 27.2.2012 ఆంధ్రప్రభ దినపత్రిక లో మొదటిసారి అచ్చయింది. శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను , వారు రామప్పను స్వయంగా దర్శించినప్పుడు అక్కడ వీరికి రామప్పను గురించిన విశేషాల్ని గోరెంట్ల విజయ్ కుమార్ అనే గైడ్ కు అంకితం చేసానని చెప్పారు . వరంగల్ జిల్లా లోని అద్భుత శిల్పసౌందర్యం , శిల్పి నైపుణ్యం రామప్ప విశేషాలను ప్రపంచానికి తమ ‘ఉలికళ’ కవితద్వారా తెలియజేయాలని ఎన్నో వేదికలపైన చదివాను అని అన్నారు . మయూఖ లో మీకోసం.

August 25, 2021 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

రామప్ప శిల్పబంధం

by mayuukha August 25, 2021
written by mayuukha

రామప్ప శిల్పబంధం ఎన్నో విషయాలు చెప్పిన కొండపల్లి శేషగిరిరావుగారు ప్రపంచం మెచ్చిన ప్రఖ్యాత చిత్రకారులు . ఆయన కుంచె దించిన రంగుల్లో ఒదిగిన ప్రకృతి అందాలు గాని, ప్రబంధ నాయికానాయకులుగాని మనను ముగ్ధులను చేసినవే. ఆయన గీసిన రేఖాచిత్రాలలో దాగిన భారతీయ శిల్పసంపద మన చూపులను కట్టిపడేసేవే.
1940 దశకంలో కొండపల్లివారు విద్యార్థిగా ఉన్నప్పుడే కాకతీయ శిల్ప సంపద వైభవాన్ని , ప్రత్యేకంగా రామప్ప శిల్పకళను రేఖాచిత్రాలుగా చిత్రించి సభ్యసమాజానికందించారు. మారుమూల అడవి ప్రాంతం . జనసమ్మర్ధమైన స్థలకాదు. అంతగొప్ప దేవాలయం అక్కడ ఉన్నదని ఆనాడు ఎవరికీ ఎక్కువ తెలియదు. ఫోటో కెమెరాలు ఇంకా తెలంగాణ లో అడుగుపెట్టని ఆ కాలంలో హైదరాబాద్ లో ఉన్న ఆనాటి సాహితీవేత్తలకూ, సాధారణ ప్రజలకు కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రలే రామప్ప శిల్ప సౌందర్యం పరిచయం చేసాయి. వారి రేఖాచిత్రాలు మచ్చుకు కొన్ని మయూఖ పాఠకులకు – మన తెలంగాణ ప్రతికలోని కొండపల్లి శేషగిరిరావు రామప్ప గురించిన వ్యాసం ప్రచురితమైంది.

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సినీగేయాల పరామర్శ

by ఏలూరు అశోక్ కుమార్ రావు August 25, 2021
written by ఏలూరు అశోక్ కుమార్ రావు

పాటల పల్లకీలో ఊరేగించిన సముద్రాల రాఘవాచార్యులు

సముద్రాలగా పేరు తెచ్చుకున్న రాఘవాచార్యులుగారు సినీ గీత రచయితే కాకుండ, సిని మాటలకు, కథ, సంభాషణలు మాత్రమే కాదు వినాయక చవితి, బబ్రువాహన సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.  1958వ సంవత్సరంలో విడుదలైన “భూకైలాస్” సినిమాలో పాటలన్నీ సముద్రాల వారే వ్రాశారు. ఇందులో ఒక పాట.

“జయ జయ మహాదేవా, శంభో సదాశివా, ఆశ్రిత మందారా, శృతి శిఖర సంచారా” తో మొదలయ్యే ఈ పాట  ఘంటసాలగారి భక్తి గీతాలలో ఎన్నదగినది, మిన్నయైనది.

శృతులనబడే వేదాల శిఖరమందు ఉండేవి ఉపనిషత్తులు. జీవాత్మను పరమాత్మను సన్నిధికి సమీపంగా (ఉప), నియమబద్ధంగా (ని), ఉంచునది (షత్). కనుక ఆ ఉపనిషత్తులలో సంచరించే వాడా అనే అర్థంలో వాడిన ‘శృతి శిఖర సంచారా’ వాక్యాన్ని మన కందించిన సముద్రాల వారి పాండిత్య వైభవానికి నమో వాక్కాలు.

నీలకంధరాదేవా, దీనబాంధవారావా, నన్ను గావరా ||నీలకంధరా||

సత్యసుందరాస్వామి, నిత్య నిర్మలాపాహి,

అన్యదైవమూ కొలువా, నీదు పాదమూ విడువా,

దర్శనమ్మునీరా, మంగళాంగా గంగాధరా ||నీలకంధరా||

ఈ పాట పల్లవి ‘నీలకంధరా’ నుండి ‘గంగాధరా’ వరకు ‘తిలంగ్’ రాగాన్ని ఉపయోగించారు.

‘దేహియన వరములిడు దానగుణ సీమా, పాహియన్నను ముక్తినిడు పరంధామా’, నీమమున నీ దివ్య నామ సంస్మరణా, ఏ మరకసేయుదును భవతాపహరణా, నీ దయా మయ దృష్టి దురితమ్ములారా, వరసుధా వృష్టి నా వాంఛలీడేరా, కరుణించు పరమేశ దరహాస భాసా, హరహర మహాదేవ కైలాసవాసా’

ఇంతవరకు శుద్ధసావేరి రాగాన్ని ఉపయోగించారు.

“ చరణం నుండి పాట పూర్తి అయ్యేవరకు హృదయమున్న ప్రతి మనిషి, స్పందనకు లోను కావలసిందే. లేకుంటే

దానిని పాషాణంగా అనుకోవాలి.

“అన్య దైవమూ కొలువా’ చరణం ద్వారా రావణ బ్రహ్మ వ్యక్తిత్వాన్ని సముద్రాలవారు ఆవిష్కరించారు.

‘ఫాల లోచన నాదు మొరవిని జాలిని పూనవయా,

నాగభూషణ నన్నుగావక జాగును సేయకయా, 

కన్నుల విందుగ భక్తవత్సల కావగ రావయ్యా ||కన్నుల||

ప్రేమీ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా ||ప్రేమ||

శంకరా శివశంకరా, అభయంకరా, విజయంకరా

ఈ చరణంలో సముద్రాలవారు ‘నాద నామక క్రియ’ రాగాన్ని ఉపయోగించారు.

నందమూరి తారాకరామారావు, రావణబ్రహ్మగా అభినయించిన ఈ పాటలో నాగభూషణం (పరమశివునిగా), బి.సరోజాదేవి (పార్వతీదేవిగా) కనిపిస్తారు.

సుదర్శనం, గోవర్ధనం, సంగీతం కూర్చిన ఈ పాటను పాటల పోటీలలో పాడే ఏ గాయకుడైనా ప్రత్యేకంగా ప్రశంసించబడతాడు.

సముద్రాలవారు పండిత కుటుంబం నుండి వచ్చినవారు. వారికి విషయ పరిజ్ఞానం, గ్రంథపఠనా బలం, భాషా పటిమ మెండుగా వున్నాయి.

ఈ పాటలో సముద్రాలవారు విశేషణాలు బాగా వాడారు.

భూ కైలాస్ సినిమా ఎ.వి.యం సంస్థ నిర్మించినది. దర్శకుడు కె.శంకర్. 1958 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం  తమిళ, కన్నడ భాషల్లో కూడా నిర్మాణం జరిగి, 3 భాషల్లోనూ విజయవంతమైనది.

రావణబ్రహ్మ తన తల్లి అయిన కైకసి కోరిక మేరకు పరమశివుని ఆత్మలింగం తేవడానికి తపస్సు చేస్తాడు. మహావిష్ణువు మాయ ప్రభావంతో ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని ఇవ్వమని శివుని కోరతాడు రావణుడు. తిరిగి రెండవసారి తపస్సు చేయగా పరమశివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తు ఎట్టి పరిస్థితుల్లోనూ లింగాన్ని నేలపై పెట్టవద్దని చెప్తాడు. నారద మహర్షి సలహామేరకు గణేషుడు బాల బ్రాహ్మణుని రూపంలో రాగా, రావణుడు, సంధ్యావందనం చేయడానికి, ఆత్మలింగాన్ని గణేషునికి ఇచ్చి తాను వచ్చేవరకు, లింగాన్ని పట్టుకోవాలని కోరతాడు. తాను 3 సార్లు పిలుస్తానని, ఆలోగా రాకపోతే నేలపై పెట్టేస్తానని గణేషుడు షరతు విధిస్తాడు. రావణుడు సంధ్యావందనం చేస్తున్న సమయంలో గణేషుడు 3 సార్లు పిలువగా రానందున ఆత్మలింగాన్ని గణేషుడు నేలపై పెడతాడు. రావణుడు వచ్చి లింగాన్ని తీయడానికి ప్రయత్నించగా, భూమిలో నుండి లింగం రాలేదు. ఆ ప్రదేశమే గోకర్ణ క్షేత్రం (భూకైలాస్)గా ప్రసిద్ధి చెందినది.

సముద్రాల సీనియర్ వి మరికొన్ని పాటలు

జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే పాట లవకుశ (1963)
జననీ శివకామినీ నర్తనశాల (1963)
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అనార్కలి (1955) చిత్రం
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట లవకుశ (1963)
సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట సీతారామ కళ్యాణం (1961) సినిమా
జయహే కృష్ణావతారా పాట శ్రీకృష్ణావతారం (1967) చిత్రం

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ – పి. సుశీల బృందం – రచన: సముద్రాల సీనియర్
కరణా చూడవయా వరముజూపవయా మురళీ మోహనా వినీల మేఘశ్యామా – ఘంటసాల బృందం
పలుకరాదటే చిలుకా సముఖములో రాయభారమెందులకే – ఘంటసాల
ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు చిందెడి – ఘంటసాల, పి.భానుమతి
ఓ చిగురాకులలో చిలకమ్మా … చిన్నమాట వినరావమ్మా

ఇది మంచి సమయము రారా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతం. ఈ పాటను అలనాటి నటి, గాయని అయిన బెజవాడ రాజరత్నం భక్త పోతన (1942) చిత్రంలో రాజనర్తకి భోగిని పాత్రధారిణి అయిన సామ్రాజ్యం అనే నటీమణికి పాడారు. ఈ పాటను అలనాటి ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్య  రచించారు.

సముద్రాల జూనియర్

సముద్రాల సీనియర్ కుమారుడే సముద్రాల వెంకట రామానుజాచార్యులు, తన తండ్రికి ఇష్టం లేకపోయినా, ఇతరుల ఆకాంక్షమేరకు సినీరంగంలోకి అడుగుపెట్టి, మాటలు, పాటలు వ్రాశాడు.

బ్రుతుకు తెరువు సినిమాలోని ‘అందామె ఆనందం’ పాట సముద్రాల జూనియర్ కలం నుండి జాలు వారినదే.

తండ్రి, కొడుకు ఇద్దరు కూడా సినీరంగంలో ఉండడంతో, తండ్రిని సీనియర్, కొడుకుకు జూనియర్ గా టైటిల్స్ లో వ్రాసేవారు.

బ్రతుకు తెరువు సినిమా వచ్చింది. తనకు బతుకు తెరువునిచ్చింది అని సముద్రాల (జూనియర్) చెప్పేవారు.

‘అందమె ఆనందం’ వ్రాశానని తన తండ్రి రాఘవాచార్యులగారితో  చెప్పబోతే , కీట్స్ ‘A thing of beauty is joy for ever’ను తెలుగు భాషలోకి తిప్పివ్రాశావా ఏమిటి? అని ఆయన సణిగారట.

అందమె ఆనందం, అందమె ఆనందం

ఆనందమె జీవిత మకరందం

కేవలం బాహ్య సౌందర్యమే కాకుండ, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులోను మన అందాన్ని ఆస్వాదించవచ్చని, ఆ ఆస్వాదనే మనకు ఆనందం కలిగిస్తుందని, మన జీవితంలో తేనెను కురిపిస్తందని సముద్రాల (జూనియర్)గారి భావన.

పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమపరాగం

ఒడిలో చెలి మోహనరాగం, జీవితమే మధురాను రాగం

సాయంకాలవేళ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కిరణాలు అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటాయి. ఆ సాయంకాలవేళ ఆ అందాన్ని ఆస్వాదించడం ఒక అదృష్టంగా భావిస్తారు సముద్రాల. ఆ కిరణాలు పూలమొక్కలపై పడి, ఆ మొక్కలకున్న పూలపుప్పొడిని ద్విగుణీకృతం చేస్తే, మన మనస్సు మధురానురాగంలోకి వెళుతుంది. తన ఇష్టమైన ప్రేయసి తన ఒడిలో పడుకొని మోహనరాగాన్ని ఆలపిస్తే, ఇంకేం కావాలి మానవ జీవితానికి.

పడిలేచే కడలి తరంగం, ఒడిలో జడిసిన సారంగం

సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం

సముద్రం ఒడ్డుకు కూర్చొని, అలలు ఒడ్డుకు చేరే సమయంలో ఆ సవ్వడిని ఆస్వాదించునపుడు మన జీవితం పులకిస్తుంది. జింక భయపడి, రక్షణకొరకు మనలను చేరినపుడు దానిని మనం మన ఒడిలో పెట్టుకొని, దాని శరీరాన్ని, నిమురుతంటే ఆ కోమలత్వంతో మన మనస్సుకు కూడా హాయి అనిపిస్తుంది. గాలిపటం (పతంగం) ఆకాశంలో ఎగరవేస్తుంటే, సుడిగాలి వచ్చినపుడు అది గింగిరీలు కొడుతూ, కొద్దిసేపు క్రిందికి వచ్చి, మళ్ళీ పైకి ఎగురుతున్నప్పుడు, మన జీవితం కూడ పతంగంలాగే ఉన్నత స్థితికి, నీచస్థితికి అనగా ఒడిదుడుకలకు లోనై, ఒక నాటక రంగంలా వుంటుందని రచయిత భావన. నాటక రంగంలో కొంతసేపు శోకరసం,కొంతసేపు శాంతరసం ప్రదర్శించబడతాయో, పతంగం లాగే మన జీవితాలు కూడ అనుభవాలకు లోనవుతాయని రామానుజాచార్యుల వారి భావన.

జూనియర్ గారు వ్రాసిన మరికొన్ని పాటల పల్లవులు

  1. పాండురంగ మహత్మ్యం సినిమాలో “జయకృష్ణా ముకుందా మురారి”
  2. శాంతినివాసం సినిమాలో “తుషార శీతల సరోవరాన”
  3. మంచి మనసుకు మంచి రోజులు సినిమాలో “ధరణికి గిరిభారమా”
  4. కులదైవం సినిమాలో “పయనించే ఓ చిలుకా”
  5. బొబ్బిలి యుద్ధం సినిమాలో “శ్రీకర కరుణాలవాల”

పాటలు జూనియర్ గా ప్రతిభకు తార్కాణాలు. వారు లేకున్నా వారి పాటలు మన తెలుగు నేలలో “ఊగేములే తులతూగేములే ఇక తొలిప్రేమ భోగాలా” అంటూ అందరినీ ఊసులాడుతున్నాయి.

August 25, 2021 1 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వ్యంగ్య చిత్రాలు కార్టూన్లు

by మూటుపూరు విఠల్ చందర్ రావు August 25, 2021
written by మూటుపూరు విఠల్ చందర్ రావు

-మూటుపూరు విఠల్ చందర్ రావు
Tech Arch Delivery Manager, Accenture
+91-9908817120

August 25, 2021 1 comment
3 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణకలనం

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి August 25, 2021
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

పదకిరణ కలనం – 3 ఆధారములు
**********
అడ్డం
***
01. కార్మిక కర్షకుల పనివేళ. (4)
05. అబ్దము అప్పులను ఇస్తుంది. (4)
08. సూర్యుడు చంద్రుడు గాలి. (2)
09. కాకి దాణా. (2)
10. రక్షించు. (2)
11. కూర్కు. (2)
12. తాపత్రయం లో సామ్యం. (2)
14. పర్వతంలో నవ్వులో సోకుసొమ్ము. (2)
16. తిన్నట్లు చేసి రుచి చూసి, (2)
18. నాగరికం నేర్పేది. (4)
20. విశ్వ రచయితల సంఘం. అరసం సరసం కాదు. (3)
22. మానవతి తెలిపే సంఖ్య. (3)
24. బెల్లంతో దుడ్డుకర్ర. (3)
27. యావత్తును కోల్పోయిన తరగతి. పగ. (2)
28. నెమలిపురి మాచిపత్రి. (2)
30. ఆనందంతో అంగీకారం. (4)
31. గట్టి మట్టి. (2)
34. ఆ గంటలో పాపం! పిల్లల అల్లరి. (2)
35. స్వ కానిది మూడింట ఒక వాక్కు. (2)
36. ఒకచోట నిలువని శంపా శ్రీ. (3)
38. శరీరంతో సాగిన అంగీకారం. (4)
40. శైవరసం. (2)
41. నిగ్గు తేలితే నిలిచేది. (2)
43. పైకప్పు అంచు పొడి (2)
44. సిరి చీమ. (2)
45. శ్రుతిపతి కావచ్చు. (2)
46. కడుపూద, పగ. (4)
48. నూటనొకటి. (4)

నిలువు
**
01. పదహారింట ఒక ఉపచారం. (4)
02. సవ్వడి. (2)
03. దీవి దొర, మయుని దశమగ్రహం. (5)
05. ధర్మరాజు మేనత్త కావచ్చు. ఒకనాటి సత్యభామ. (3)
06. ముందరి ఋషి. (2)
07. వెన్నెలదొర నవ్వు రావణాయుధం. (4)
13. అనారోగ్యం కారణాలు. (4)
15. గుహ. (2)
17. సన్నగిల్లిన చిన్న. (2)
19. మాయలఫకీరు ప్రేయసి. (2)
21. వసుంధర నాలుక పాతాళం. (2)
23. హిరణ్యకుడు కొరికింది దక్షిణము కుడి దిక్కు. (3)
25. డాబు విజృంభణం. (3)
27. గుఱ్ఱము నడకలో తొక్కేది ఇదీ కదండీ. (2)
30. కొండ చెట్టు. (2)
31. లేదని చెప్పు వెక్కిరించు. (5)
32. ఆలకించాలని పెట్టుకునేది. (2)
33. ఒకటి ముఖ్యం. (2)
34. ఆ నదితో కొత్తపోకడ. (4)
35. పంటి పెక్కు. (2)
36. వెండి నెమలికన్ను. (2)
37. మొదలుకొని. (4)
39. కొబ్బరి వక్కల పొడి కావాలనుకొను. (2)
40. ఏకవింశతి నరకాలలో ఒకటి. (3)
42. జోడు దంపతులు. (2)
43. కొంచెం భిన్నహారభిన్నం. (2)

ఏకాక్షరులు
***
04. 26 తో నడుము.
26. 29 తో పొగడ్త.
29. 47 తో నమస్కారం.
47. 33 నిలువుతో మోసం.

August 25, 2021 1 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ యాదాద్రీశ వైభవమ్

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు August 25, 2021
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు

శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలయిన డా|| ఎస్. లక్ష్మణ మూర్తి

డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.

ధన్యం మాన్యం వదాన్యం విఫలిత రిపురాజన్య మూర్థన్య జన్యం

మాద్య ద్విత్సుత్సముద్య ద్విమల తనురుచి వ్యాప్తరో ధంతరాళం

దౌష్ట్యేష్టాభీష్ట నష్టం గణితరణ రమత్సింహ నా దానుమోదం

వందే యాదక్షమాభ్పతటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్

తాత్పర్యము :  ధన్యుడు, మన్నింప దగినాడు, ఆహ్లాదకరముగా మాట్లాడువాడు, దానశీలి, తమ ప్రయత్నములన్నీ విఫలములై, విపరీతములైన ఫలితములు కలిగినవేళ శ్రతు (రాక్షస) రాజ్రశేష్ఠులతో జయశీలియై యుద్ధమొనర్చినవాడు; మదించిన శ్రతువుల (దానవుల) వలన ఉత్పన్నములైన ఆపదలను తన పరాక్రముచేత అణచుటవలన కలిగిన విజయముచేత తన ప్రకాశిస్తున్న తన నిర్మలమైన శరీర కాంతిచేత వ్యాపించిన భూమ్యంతరిక్షముల మధ్య భాగము కలవాడు; దుష్టతనమునందే తమకు కల ఇష్టములన సూరలు, మునులు మొదలైనవారికి హాని కలిగించటమే తమ లక్ష్యము (అభీష్టము)గా పెట్టుకున్న దానవులకు నష్టం కలిగించినవాడు, తనను స్తుతించే భక్త జనులకు తన రణరణ ధ్వని పూర్వకమైన సింహనాదములచే తన సంతోషమును, సమ్మతిని తెలుపుచున్నవాడు అయిన యాదాద్రిపై నెలకొని తన భుజబలమును ప్రదర్శిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు : శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి ధన్యుడు. ధనం అంటే పుణ్యం. అది కలిగినవాడు ఆర్తత్రాణ పరాయణమనే పుణ్య కార్యమునే తన ప్రవృత్తిగా పెట్టుకున్నవాడు. సర్వ లోకాలచేత మన్నింప (పూజింప)బడేవాడు, మాన్యుడు. ఆపన్నులకు – భక్తజనులకు – వారి సమస్తములైన కోర్కెలను తీర్చే వదాన్యుడు – దానశీలి! శ్రీ లక్ష్మీదేవి తన భార్యగా కల శ్రీ మన్నారాయణ మూర్తికి భక్త జనుల కోసం ఇవ్వలేని దంటూ ఏముంటుంది?

ఎందరో రాక్షసులు, దానవ రాజులు ఘోర తపస్సులు చేసి, బ్రహ్మను మెప్పించి, ఎన్నో అసాధ్యములైన వరాలను పొందారు. లోకాలన్నింటినీ గడగడలాడించారు. కాని చివరికి వారు సంపాదించిన వరబలం విపరీత ఫలితాలను ఇచ్చింది. వారి ప్రయత్నాలు నిష్ఫలాలైనాయి. అటువంటి దానవ రాజాధిరాజుల్ని కూడా ఎన్నో అవతారాలెత్తి శ్రీహరి యుద్ధం చేసి సంహరించాడు. “ధర్మో రక్షతి రక్షితః” అన్న వేదాను వచనానికి ఇంతకంటే ఇంకేం ప్రమాణం కావాలి?

(మాద్యత్ +ద్విట్ + సుత్ + సముద్యత్ =)వర బలంవలన మదించిన శత్రు (దాన)వులచేత దేవతలకు, మునులకు, మానవులకు ఎన్నో ఆపదలు కలుగుతుంటాయి. వారిని నివారించటం కోసం వివిధ అవతారాలెత్తి, దుర్మార్గులను తన (సముద్యత్ =) పరాక్రమంచేత నిర్మూలించినవాడు విష్ణుమూర్తి! అటువంటి శ్రీహరి యొక్క నిర్మలమైన (విమల + తను +  రుచి + వ్యాప్త + రోధస్ + అంతరాళం రోధస్ + అంతరాళం ఉంది. ఇక్కడ “రోదంతరాళం” అన్నది ముద్రణా దోషం (అచ్చు తప్పు) కావచ్చు)=) శరీరకాంతులు భూమ్యాంతరిక్షాల మధ్య భాగమందంతటా వ్యాపించి ఉన్నదట! కీర్తిని తెల్లగా ఉందని వర్ణించటం కవి సమయం. శ్రీహరి దుష్టసంహారం కోసం ఎత్తిన నృసింహావతారం యొక్క దివ్యశరీరకాంతులు దశదిశలా, సర్వలోకాలలో వ్యాపించినవని కవి దర్శించాడు.

(దౌష్ట్య + ఇష్టా + అభీష్ట + నష్టం = ) దానవులు ధర్మేతరాలైన దుష్ట కార్యాలు చేయటంలో ఇష్టం కలిగి ఉంటారు. అడేవాళ్ల అభీష్టం కూడా. అటువంటివాళ్ళ అభీష్టానికి (లక్ష్యానికి) నష్టం కలిగించేవాడు శ్రీహరి. (గణి + తరణ + రణత్ + సింహనాద + అనుమోదం =) గణించట అంటే భగవంతుణ్ణి స్తుతించటం అని అర్థం. ‘గణి’ అంటే స్తుతించేవాడు, భక్తుడు అని అర్థం! భక్తుల్ని వారికి కలిగిన ఆపదల నుండి తరింపజేయటం, రక్షించటం శ్రీహరి అపారకరుణకు ఉదాహరణ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులను ఆపదలనుండి ఉద్ధరించిన తరువాత సింహనాదం చేశాడట! ఆ శబ్దం భక్త జనులు చేస్తున్న స్త్రోత్రపాఠాలకు తన అనుమోదం (సమ్మతి) తెలిపినట్లుగా ఉందట!

యాదాద్రిపై నెలకొని తన పటుతరమైన భుజబలాన్ని చూపిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను అని కవి వినమ్రుడై పలుకుచున్నాడు!

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

తెలుగు లో బాల సాహిత్యం- మన బాధ్యత

by vedantasuri August 25, 2021
written by vedantasuri
బాల్యం ఎంతో విలువైనది. వ్యక్తిత్వానికి పునాది వంటిది బాల్యం. పిల్లలకు ఈ వయసులో ఏది చెబితే  అది అర్థం చేసుకుంటారు, అనుసరిస్తారు. లేకుంటే పెద్దలను చూసి అనుకరిస్తారు. చిన్నపిల్లలే కదా. అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే. పెద్దల మనస్తత్వాలు, అలవాట్లు వారు నిరంతరం గమనిస్తుంటారు. పిల్లల పెంపకం విషయం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక పిల్లల రచనల విషయం లో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. కథలు, గేయాలు, సంఘటనలు, జ్ఞాపకాలు వారికి నిరంతరం చెబుతుండాలి. యెంత చెప్పినా వారు నేర్చుకోవడానికి సిద్ధంగా వుంటారు . వారి అభిరుచులను గమనిస్తూ అందుకు అనుగుణంగా మనం నడుచుకోవాలి ఉంటుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా బాలల అభిరుచుల్లో, అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి మార్పులకు అనుగుణంగా పెద్దలలో కూడా మార్పు రావాలి. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. పరిసరాలు, జంతువులు , పళ్ళు , కూరగాయలు, చెట్లు, పూలు, .. ఇలా ఒక్కటొక్కటిగా పిల్లలకు చెబుతుండాలి , నడవడిక, మర్యాద, స్నేహం, మిత్రులు, బంధువులు ,దుస్తులు. పరిశుభ్రత తదితరాలను  పరిచయం చేస్తుండాలి.
విదేశాల్లో పిల్లలకు పాఠశాలకు వెళ్లక ముందే. డే కేర్ కు పంపిస్తారు. అక్కడ ఇవన్నీ అలవాటు చేస్తారు. ఇంగ్లీష్ భాష కూడా బాగా వస్తుంది. ఐదేళ్ల కు స్కూల్ కు వెళ్ళగానే నేర్చుకోవడం సులువవుతుంది.
ఇక మనకు గతం లో చదివిన చందమామ, బాల మిత్ర, బొమ్మరిల్లు కథలు ఈ తరం పిల్లలకు నచ్చక పోవచ్చు . వారికి తగిన కథలు, అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన అవసరం వుంది. వారు ఇష్టపడే మాధ్యమాల ద్వారా చెప్పాలి. మనం అనుకున్నట్టుగా వారు ఉండాలనుకోవడం తగదు. వారి అభిరుచులకు అనుగుణంగా చదువులు, ఉండాలి. ఈ విషయం లో మనం విదేశాల వారు అనుసరించే విధానాలను అధ్యయనం చేయవలసిన అవసరం వుంది. మన దేశం లో పిల్లల అభివృద్ధిని కాంక్షించే వారంతా భవిష్యత్ కు అందమైన రూపు రేఖలు దిద్దేవారే. కానీ అటు  సమాజం, ఇటు తల్లి తండ్రులు, మరో వైపు ఉపాధ్యాయులు, రచయితలు బాల్యాన్ని విస్మరిస్తున్నారు. మరో మాటలో చెప్పాలం
టే బాలల భవిష్యత్తు పైన సరైన అవగాహన ఉండటం లేదు ఇది విచారించతగిన అంశం. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. బాలలకు చేసేవన్నీ మొక్కుబడి పనులే కానీ చిత్తశుద్ధి తో మాత్రం కాదు.
కాలం తో పాటు మనుషులు, అవసరాలు, ఆలోచనా విధానాలు మారుతుంటాయి. అదే విధానంగా ఈ తరం బాలల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది. కానీ వారి అవసరానికి సరిపడా వనరులు లేవు. ఈ మధ్య కరోనా వలన పిల్లల్లో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది. మరి వారి కోసం ఎవరు ఏమి ఆలోచిస్తు
న్నారు.
ప్రస్తుతం బాల సాహిత్య రచనలు చేసే వారు కేవలం తమకు పేరు రావాలని, అవార్డులు కావాలని రాస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఇంగ్లీష్ లో ఆర్కే నారాయణ్, మార్క్ ట్విన్ వంటి వారి పుస్తకాలు ఎవరైనా చదివారా. ఎక్కడో జె. కె. రోలింగ్ లండన్ లో ఉంటూ హరీ పాటర్ పుస్తకాలు రాస్తే హైదరాబాద్ లో క్యూ ల్లో నిలబడి పుస్తకాలు కొనుగోలు చేసిన సంఘటనలు వున్నాయి కదా.మరి పిల్లలను ఆకట్టుకునే రచనలు ఎందుకు రావడం లేదు.
తెలుగు బాల సాహిత్యం లో రాసి పెరుగుతుంది కానీ వాసి ఉండటం లేదు.   ఇంగ్లీష్ మాధ్యమం ప్రభావం మరింత పెరిగితే తెలుగు బాల సాహిత్యం మనుగడ కష్టం.
ఈ విషయం లో నిజాయితీ గల బాల సాహితీ వేత్తలు ముందుకు వచ్చి ఒక కార్యాచరణ రూపొందించు కోవాలి. పాత కథలను ఆధారం చేసుకుని పిల్లలకు అర్థం అయ్యే రీతిలో మార్చి రాయాలి, ఈ తరం పిల్లలు ఇష్టపడే రచనలు చేసి వారిని ఆకట్టుకోవాలి . అందరు కలిసి కట్టుగా ముందుకు వచ్చి మంచి సాహిత్యం కోసం కృషి చేయాలి, అలాంటి వారిని, సమాజం, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

ReplyForward
August 25, 2021 3 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

అమ్మమనసు

by valipe Ramchetan August 25, 2021
written by valipe Ramchetan

అనగనగా రామాపురం అనే ఊరిలో రాధమ్మ అనే స్త్రీ ఉండేది .ఆమె చాలా మంచిది,తెలివైనది. ఆమె భర్త పేరు గోపాల్. అతడు చాలా మంచివాడే కానీ అహంకారం ఎక్కువ. అతడు బ్యాంకులో పని చేస్తూ ఉండేవాడు. వారు ఇద్దరికీ నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్లు. వారి పేర్లు. రవి, ఆనంద్, ఊర్మిల, శృతి. ఆనంద్ వాళ్ళ అమ్మ పోలిక. కాబట్టి అతడు చాలా మంచివాడు. కానీ ఆనంద్ కు కోపం ఎక్కువ. తనముందు తప్పు జరిగితే అక్కడికక్కడే వారిని శిక్షిస్తాడు.అతనికి అమ్మ మీద ప్రేమ ఎక్కువ. రవి,ఊర్మిల, శృతి వాళ్ళ నాన్న పోలిక కాబట్టి వారికి అహంకారం ఎక్కువ. రవి రాధమ్మ మీద ఎప్పుడూ కోప్పడుతూ ఉండేవాడు. తను మంచి చెప్పినా చెడు చెప్పినట్లుగానే అర్థం చేసుకునేవాడు. రవి ఎప్పుడూ రాధమ్మను తిడుతూనే ఉండేవాడు. ఆ మాటలకు రాధమ్మ చాలా బాధపడేది. ఊర్మిల తనకు ఎవ్వరూ సరిలేరు అంటూ గర్వపడుతూ ఉండేది. తను రాధమ్మతో తల్లి అని కూడా చూడకుండా తనతోనే అన్ని పనులు చేయిస్తూ ఉండేది. రాధమ్మ తనకు గర్వపడడం తప్పు అని చెప్తున్నా కూడా తను వినిపించుకునేది కాదు. ఊర్మిల ఏదైనా తప్పు చేసినా రాధమ్మ మీదకు నెట్టేసేది. ఇంట్లో వాళ్ళందరూ రాధమ్మను అవమానించేవారు. ఆ తిట్లు విని ఊర్మిల సంతోషించేది. రాధమ్మ తనలో తాను కృంగిపోయేది.
శృతి చాలా బద్ధకస్తురాలు.తను ఎప్పుడూ బయటనుండి ఏదైనా ఆహారం తెప్పించుకుని తింటూనే ఉండేది. తను ఎంత తినేదంటె రోజూ సుమారు ₹2000/-దాకా తిండి కోసం ఖర్చు చేసేది. రాధమ్మ తనకు“అమ్మా శృతి అలా తినవద్దు అమ్మా”,అని చెప్పినా వినిపించుకునేది కాదు. పైగా తను దొంగచాటుగా తినేది ఎందుకంటే గోపాల్ తను తినడం చూస్తాడని. ఒకవేళ గోపాల్ చూస్తే శృతి“నాన్న!నన్ను ఇవన్నీ అమ్మ తినమని చెప్పింది”,అని చెప్పేది. గోపాల్ ఆ మాటలను నమ్మి రాధమ్మను తిడతాడు. శృతి మాత్రం అమాయకురాలిగా నటిస్తూ ఉండేది. రోజూ ఇలా గొడవ జరుగుతుండడంతో ఇరుగు-పొరుగు వాళ్ళు గోపాల్ ఇంటికొచ్చి“మీరిలా గొడవ పడితే మా పిల్లలకు నిద్ర పట్టడం లేదు కాబట్టి మీరు గొడవ పడకండి”,అని హెచ్చరిస్తూ ఉండేవారు. ఈ విషయంలో కూడా గోపాల్ రాధమ్మదే తప్పు అన్నట్లు రాధమ్మను తిడుతూ ఉండేవాడు. ప్రతిరోజూ అలాగే జరుగుతుండేది. రాధమ్మ ఇవన్నీ చూసి“నేనెవ్వరికీ అవసరం లేదు”,అని అనుకుంటూ బాధపడేది. రాధమ్మ తన పిల్లలెవ్వరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా తను వారికి సేవ చేసి మామూలు స్థాయికి తీసుకొచ్చేది. కొన్ని రోజుల తర్వాత రాధమ్మకు జ్వరం వచ్చింది. ఆనంద్ చాలా బాధపడుతూ ధైర్యం చెబుతున్నాడు. ఆనంద్ గోపాల్ దగ్గరకు వచ్చి“నాన్న అమ్మకు జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయి”,అంటూ కంగారుగా చెప్పాడు.గోపాల్ వినలేదు. ఎందుకంటే తనకు మాధవపురం అనే ఊరికి బదిలీ చేశారు. ఆనంద్ ఏడుస్తూ ఉన్నాడు. గోపాల్ అక్కడి నుండి మాధవపురానికి వెళ్ళిపోయాడు. ఆనంద్ కు ఏం చేయాలో తెలియక శృతి,ఊర్మిలల దగ్గరకు వెళ్ళాడు వారు నిద్రపోతున్నాడు. ఆనంద్ ఎంత నిద్ర లేపినా వాళ్ళు లేవలేదు. ఆనంద్ తన అన్నయ్య అయిన రవి దగ్గరకు వెళ్ళాడు. తను కూడా నిద్ర పోతున్నాడు. ఆనంద్ తనను లేపి జరిగిందంతా చెప్పి“అన్నయ్య! డాక్టర్ కు ఫోన్ చేయి అన్నయ్య,”అని వేడుకున్నాడు. రవి కోప్పడుతూ“జ్వరం మాత్రమే కదా వచ్చింది రెండు రోజులైతే అదే తగ్గిపోతుంది”, అనన్నాడు. ఆనంద్ బాధపడుతూ పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి డాక్టర్ నంబర్ తీసుకుని, డాక్టర్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. కొద్ది సేపుతర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి రాధమ్మను చూసి“పని ఎక్కువగా చేయడం వల్ల ఈ జ్వరం వచ్చింది”,అని చెప్పింది. మందులు ఇచ్చి డబ్బులు అడిగింది. ఆనంద్ తను రాధమ్మ ఇచ్చి దాచిపెట్టుకోమన్న డబ్బులను ఇచ్చాడు. డాక్టర్ ఆ డబ్బులు తీసుకుని వెళ్ళింది. ఆనంద్ డాక్టర్ ఇచ్చిన మందులను రాధమ్మకు వేసాడు. తను పడుకుంది. రవి, ఊర్మిల, శృతిలు నిద్రలేచి పాలు, బూస్ట్, హార్లిక్స్ అంటూ గట్టిగా అరిచారు రాధమ్మ ఆ మాటలు విని వెంటనే లేచి ఆనంద్“లేవొద్దమ్మా!”,అని చెబుతున్నా వినకుండా పాలు, బూస్ట్, హార్లిక్స్ సిద్ధం చేసి వారి దగ్గరకు వెళ్ళి పాలు, బూస్ట్, హార్లిక్స్ ఇచ్చింది. ఊర్మిల, శృతి లు బూస్ట్, హార్లిక్స్ తాగుతంటే రవి మాత్రం పాలు తాగి“జ్వరం వస్తే ఆలస్యంగా తీసుకొస్తారా?!”,అంటూ గట్టిగా అరిచాడు. రాధమ్మ ఏడుస్తూ రవి గదిలో నుండి వెళ్ళిపోయింది.కొద్ది రోజుల తర్వాత రాధమ్మకు జ్వరం తగ్గింది.గోపాల్ మాధవపురంలో బ్యాంకులో పని చేస్తుండగా రాజు అనే వ్యక్తి వచ్చాడు.అతడు ఒక రౌడీ అతడు చాలా చెడ్డవాడు. అతడు గోపాల్ దగ్గరకు వచ్చి అప్పు కావాలని అడిగాడు. గోపాల్ పక్కనే ఉన్న ఒక వ్యక్తి“ఇదిగో గోపాల్ గారు! ఇతని పేరు రాజు ఇతను చాలా చెడ్డవాడు,ఇతనొక రౌడీ,”అని మెల్లగా చెప్పాడు. గోపాల్ “రాజు గారు మీరు ఏ పని కోసం అప్పు అడుగుతున్నారు”,అని అడిగాడు. రాజు“ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా! ”, అంటూ బెదిరించాడు. గోపాల్ జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పమని అంగరక్షకుడికి సైగ చేశాడు. పోలీసులు వచ్చి రాజును తీసుకుబోతుండగా రాజు“రేయి గోపాల్!నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను,”అని బెదిరించాడు. గోపాల్ ఆ మాటలను విని కంగారుపడి తన పై అధికారులతో మాట్లాడి మళ్ళీ రామాపురాని బదిలీ చేపించుకున్నాడు. గోపాల్ ఇంటికొచ్చాడు. ఇంట్లో చూస్తే రాజు ఎప్పుడో వచ్చేశాడు. గోపాల్ లోపలికి వచ్చాడు. రాజు“రా గోపాల్! రా, జైలులో నుంచి ఎలా వచ్చాను అని అనుకుంటున్నావా, ఇదంతా నాకు మామూలే”,అని అన్నాడు. గోపాల్ “ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు?”,అని అడిగాడు. రాజు“నీ కుటుంబాన్ని చంపేయడానికి వచ్చాను”,అని అన్నాడు. గోపాల్ ను రాజు మనుషులు బంధించారు. ఆ సమయంలో రాధమ్మ వంటగదిలో వంట చేస్తుంది. ఆనంద్ లెక్కలు వ్రాస్తున్నాడు. రవి ఆట ఆడుతున్నాడు. ఊర్మిల టీ.వీ చూస్తుంది. శృతి తింటుంది. రాజు గోపాల్ పిల్లల గదిలోకి వెళ్లి పిల్లలను లాక్కొచ్చి వారి మీద కత్తి పెడుతూ“నీ పిల్లలను నేను చంపేస్తాను”,అంటూ గట్టిగా అరిచాడు.ఆ అరుపులు విని రాధమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. రాధమ్మ బాబు! నీకు దండం పెడతాను, వయసులో నీకంటే పెద్దదాన్ని అయినా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను,నా పిల్లలను వదిలేయి”,అని వేడుకుంది.రాజు వినకుండా కత్తితో పొడుస్తుండగా రాధమ్మ అడ్డుగా వచ్చింది. కత్తి రాధమ్మకు బలంగా గుచ్చుకుంది.రాధమ్మ క్రింద పడింది. అందరూ కంగారు పడ్డారు. రాజు శృతిని పొడవబోతుండగా గోపాల్ రాజును కిందకి తోసాడు. కత్తి రవికి గుచ్చుకుంది రవి కూడా కింద పడ్డాడు. రాజూకి బల్ల తాకి క్రింద పడ్డాడు. గోపాల్ రాజు మనుషుల నుంచి తప్పించుకుని రాధమ్మను, రవిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. రవికి ముందే రక్తం చాలా తక్కువ. డాక్టర్ వచ్చి“గోపాల్ గారు రవికి రక్తం ఎక్కించాలి”,అని చెప్పింది. గోపాల్ కు మిగతా వారికి రవి యొక్క రక్తం లేదు. రాధమ్మ స్పృహలోకి వచ్చింది. డాక్టర్ జరిగిన విషయమంతా రాధమ్మకు చెప్పింది. రాధమ్మ వద్దన్నా వినకుండా రవికి రక్తం ఇచ్చింది. కొన్ని గంటల తర్వాత రవి స్పృహలోకి వచ్చాడు. డాక్టర్ జరిగిన విషయమంతా రవితో పాటు అందరికీ చెప్పింది. అందరూ కొన్నేళ్లుగా చేసిన తప్పులను తెలుసుకుని రాధమ్మకు క్షమాపణలు చెప్పారు. రాధమ్మ సంతోషించింది. కొద్ది రోజుల తర్వాత అందరూ ఇంటికొచ్చారు.రవి రాధమ్మ మీద కోప్పడడం మానేశాడు. ఊర్మిల గర్వపడడం మానేసి తల్లిని గౌరవించడం మొదలుపెట్టింది. శృతి ఎక్కువగా తినడం మానేసి తల్లిమాట వింటుంది. గోపాల్ కూడా తనను అర్థం చేసుకున్నాడు. అలా కుటుంబం అంతా సంతోషంగా ఉంది.

నీతి:అమ్మ ఏం చెప్పినా అది మన
మంచి కోసమే. కాబట్టి అమ్మ
ఏం చెప్పినా వినాలి.

August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

శ్రీరామచంద్రమూర్తి

by రొంపిచర్ల శ్రీ రంగ సిద్ధార్థ August 25, 2021
written by రొంపిచర్ల శ్రీ రంగ సిద్ధార్థ

శ్రీ గురుభ్యోన్నమః. సభకు నమస్కారం. నా పేరు రొంపిచర్ల శ్రీ రంగ సిద్ధార్థ. నేను ఎనిమిదో తరగతి, ఏఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, గుడవల్లేరు, విన్నకోట గ్రామము, కృష్ణాజిల్లా, ఆంధ్రపదేశ్ నుండి వచ్చాను. నేను ఈరోజు రామాయణంలోని శ్రీరామచంద్రమూర్తి పాత్ర గురించి చెప్పబోతున్నాను.

మనిషి ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో ధర్మాన్ని పట్టుకున్నవాళ్ళు ఎంత గొప్పవాళ్లు అవుతారో యుగాలు మారిపోయిన శ్రీ రామచంద్రమూర్తి యొక్క జీవిత వృత్తాంతం నేటికీ పసిపిల్లలకు కూడా తమ తల్లుల చేత రామాయణ కథగా చెప్పబడుతోంది. అందులోని పాత్రలు, స్వభావాలు నేటి మానవాళికి మచ్చు తునకలు.

రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అనగా రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యత్. అయోధ్య నగరానికి రాజయిన దశరథ మహారాజు, కౌసల్యదేవిల పుత్రుడు, శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఒక రాశి భూతమైన ధర్మము.  ఆయన సత్యము చేత లోకాన్ని గెలిచాడు. శుశ్రూష చేత గురువులను గెలిచాడు. తన యొక్క దాన గుములతో దీనులను గెలిచాడు. శ్రతువులను తన యొక్క పౌరుష పరాక్రమాలు చేత గెలిచాడు. ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు. ఇలా 16 గుముల కలయికతో నరునిగా నడయాడిన పరిపూర్ణ అవతారఁ శ్రీరామావతారం. బుద్ధి, సాత్వికత, మధురమైన భాష, నిరాడంబర జీవితం, నిర్మలమైన మనస్సు తత్వం, నిస్వార్థత, మితభాషి, నిగర్వి, ఏకపత్నీవ్రతుడు, పరాక్రమవంతుడు, సదాచారాము పాటించేవాడు, సమయస్ఫూర్తి కలవాడు, పిత్రు ఆజ్ఞాపరిపాలకుడు, గురువు మాట శాసనం, తండ్రి మాట శిలాశాసనంగా భావించేవాడు, ఇన్ని సుగుణాలను మకుటంగా ధరించి ప్రజారంజకంగా పాలించి రామ రాజ్యంగా పేరొందిన శ్రీరామచంద్రమూర్తి గురించి మూడు నిమిషాలు కాదు మూడు గంటలు చెప్పినా చాలదు.

శ్రీరాముని గురిఁచి నేను మీకు ఇచ్చే సందేశం

ఒకటవ తరగతి నుండి ఐఏఎసం, ఐపీఎసంవరకూ రామాయణాన్ని ఒక పాఠ్యాంశంగా బోధించాలి.

రాముని నమ్ముకున్నవారికి అంతా విజయమే ఉదాహరణకు హనుమంతుడు.

రాముని ఆశ్రయించిన వారు కీర్తిని, ఉత్తమ గతులను పొందుతారు. ఉదాహరణకు జటాయువు పక్షి.

ధర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

ఇంతటి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారములు. ధన్యవాదములు తెలుపుకుంటూ శ్రీరామ రక్ష సర్వజగ్రదక్ష.

జై శ్రీరామ్

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

వేదవ్యాసుడు

by రొంపిచర్ల శ్రీ రంగ సిద్ధార్థ August 25, 2021
written by రొంపిచర్ల శ్రీ రంగ సిద్ధార్థ

శ్రీ గురుభ్యోన్నమః సభకు నమస్కారం నా పేరు రొంపిచర్ల శ్రీరంగ సిద్ధార్థ. నేను ఎనిమిదో తరగతి గుడవలేరు ఏ.ఏస్.ఎస్ & వి.వి.ఆర్.ఎస్.ఆర్. హైస్కూల్, గుడ్డవల్లేరు, విన్నకోట గ్రామము, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను.

నేను ఈ రోజు మహాభారతంలోని ప్రధానకర్త అయిన వ్యాసభగవానుని గురించి చెప్పబోతున్నాను.

పుట్టుకతోనే వేదములను అవగతం చేసుకుని, పంచమ వేదమైన మహాభారతాన్ని ప్రపంచానికి అందించిన, బ్రహ్మంశ సంభూతుడైన వ్యాసమహర్షి వాఙ్మయాన్నికంతటికీ వెలుగుల దివ్వె లాంటివారు. ఆయనే లేకపోతే కటిక చీకటి గాఢాంధకారము.

నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర యేన త్వయా భారత తైల పూర్ణ హ ప్రజ్వాలితో జ్ఞానమ య ప్రదీపః

అనగా ఒక ప్రమిదలో మహాభారతం అనే తైలాన్ని పోసి, జ్ఞానమనే వత్తిని వెలిగించి మనకందరికీ ప్రకాశాన్ని అందించి ఆ వెలుగులో ధర్మమార్గాన్ని నిర్దేశించారు వ్యాసమహర్షి. మహాభారతం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ. మహాభారతం ప్రపంచాన్ని శాసించే భారతీయ ఇతిహాసం.

వ్యాసమహర్షి లోకంలో వెలిగిన మొట్టమొదటి జ్ఞానజ్యోతి. ఆ జ్యోతి నుండి మిగిలిన జ్యోతులన్నీ వెలిగాయి. ఏ గురు స్వరూపమైన వ్యాస వాక్కుతో పరవశించిపోతుంది. అన్ని గురుస్వరూపాలు వ్యాసుని హృదయాన్నే ఆవిష్కరిస్తాయి. మహా తపోజ్ఞాని అయిన పరాశర మహర్షి జాలరి కన్య అయిన సత్యవతీదేవి యందు తమకము చెందడం వలన సద్యోగర్భుడైన కుమారుడు యమునా ద్వీపంలో జన్మించారు. ఆయనే వేదవ్యాసుడు, త్రిమూర్తి స్వరూపుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడుగా పేరుంది. తల్లి ఆశీస్సులతో ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పి తపస్సుకి వెళ్ళిపోతాడు వ్యాసుడు. కొన్ని ఆర్షమైన ధర్మములను నిరూపణ చేయడానికి అనేకసార్లు వ్యాసమహర్షి మనకు మహాభారతంలో కనిపిస్తారు. ఆయన ప్రతి రాకకు ఒక కారణం, ప్రయోజనం ఉంటుంది. జ్ఞానఖని అయిన వ్యాసుడు తల్లి అభ్యర్థన మేరకు భీష్ముని కోరిక మేరకు దేవర న్యాయం చేత, ధార్మికంగా, కురువంశ అభివృద్ధికి, కురువంశ రక్షణకు కారణమయ్యారు.

గాంధారిదేవికి గర్భసోకము కలిగినప్పుడు శివుని యొక్క వరము మేరకు పిండమునకు నూటొక్క ముక్కలుగా చేసి నూటొక్క మంది సంతానం కలగడానికి కారణమయ్యారు. త్రికాలజ్ఞాని అయిన వ్యాసుడు తన తల్లి సత్యవతిదేవి, అంబికా, అంబాలికలు రాబోయే కఠిన పరిస్థితులను తట్టుకోలేరని భీష్మునికి చెప్పి, వారిని తపస్సుకు పంపి, వారికి శాంతి మార్గము చూపి, వారి మోక్షానికి కారణమయ్యారు. కౌరవులు, పాండవులు విలువిద్యా ప్రదర్శన సమయంలో వ్యాసుని రాక ఒక కుటుంబపరమైన కర్తవ్యాన్ని నిర్వహింపచేయడానికి మార్గదర్శకమైంది. అనేకసార్లు పాండవులు, కౌరవుల దుశ్చర్యలు వలన మానసికంగా ఆందోళన చెందుతున్నప్పుడు, దైన్య పరిస్థితులను అనుభవిస్తున్నప్పుడు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో త్రిమూర్తి స్వరూపుడైన వ్యాసుడు వచ్చి సమస్య పరిష్కారానికి మార్గం చూపి, పాండవులకు ధర్మమార్గాన్ని నిర్దేశించారు. అలాగే కౌరవులు తప్పు చేస్తున్నప్పుడల్లా వ్యాసుడు వచ్చి కౌరవులకు హితబోధ చేసినా వారు పెద్ద వారి మాటలను ధర్మచక్రంలో ఇముడ్చుకోక తమ నాశనాన్ని తామే కోరుకున్నారు. కానీ పాండవులు ధర్మంతో ఉండుట వలన భగవంతుడు వారి పక్షాన ఉండుటవలన విజయాన్ని, ఖ్యాతిని పొందారు.

వ్యాసమహర్షి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు :

వ్యాసమహర్షి సమయానుకూలంగా పరిణితి చెందిన పెద్దరికంతో కురువంశ రక్షణ చేశారు. కురువంశ అభివృద్ధికి పాటుపడ్డారు.

అలాగే పాండవులు కూడా వ్యాసమహర్షి చెప్పిన ధర్మసూక్ష్మాలను పాటించి ఆయన్ని సమున్నత స్థానంలో నిలిపారు. కాబట్టి ఎవరికైతే ఓర్పు, నేర్పు, సహనం, శాంతి, సత్యం, ధర్మం, వినయం, విధేయత, పెద్దల యందు గౌరవం ఉంటాయో వారికి పెద్దల దీవెనలు, వారి సూచనలు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటాయి.

మహాభారతంలో అంతర్భాగమైన కీలకపాత్ర పోషించిన వ్యాసమహర్షిని గురించి మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. వ్యాసుడు అంటే పదవి, ఈ సభలో వ్యాసపదవి అలంకరించిన నా గురుస్వరూపులందరికీ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు తెలుపుకుంటూ

‘వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ నమః నమో బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః’

కృష్ణం వందే జగద్గురుం

August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us