మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

తెలుగు సాహిత్య మార్తాండుడు సి.పి.బ్రౌన్

by Cheedella Seetha Lakshmi August 25, 2021
written by Cheedella Seetha Lakshmi

కొడిగట్టి మిణుకు మిణుకు మంటున్న తెలుగు సాహిత్య జ్యోతిని శ్రమ అనే చమురుపోసి వెలిగించి కాంతులు వెదజల్లిన తెలుగు భాషాభిమాని బ్రౌన్ దొర.

బ్రౌన్ దొరగా ప్రాచుర్యం పొందిన ఆయన పూర్తిపేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నవంబర్ 10 వ తేదీ 1798 సంవత్సరంలో భారతదేశం

కలకత్తాలో ఆల్దీన్ డేవిడ్ బ్రౌన్,కౌలే దంపతులకు జన్మించాడు.
తండ్రి క్రైస్తవ విద్వాంసుడు.తండ్రి స్ఫూర్తి వల్లనే బ్రౌన్ చిన్నప్పుడే గ్రీక్,లాటిన్,పారసీ,
సంస్కృత భాషల్లో పట్టు సాధించాడు. తండ్రి పోయాక వీరి కుటుంబం ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది.
ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగ నిమిత్తం 1817 సంవత్సరంలో తిరిగి మదరాసు వచ్చి ఉద్యోగంలో చేరి తన బాధ్యతలో భాగంగా తెలుగు భాష మాట్లాడడం తప్పనిసరి అయి కోదండరామ పంతులు అను పండితుడి దగ్గర తెలుగు భాషను నేర్చుకున్నాడు బ్రౌన్.

తర్వాత 1820 సంవత్సరంలో కడపలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే తెలుగు భాష,సాహిత్యం కొరకు ఎనలేని కృషి చేసిన మహనీయుడు బ్రౌన్. ఒక బంగళాను ప్రత్యేకంగా తెలుగు పుస్తకాల కోసం కొన్న భాషాభిమాని. తెలుగు గ్రంథాల సేకరణ,పరిష్కరణ చేయుటకై పండితులకు,పామరులకు వసతి నేర్పాటు చేసి అయోధ్యారెడ్డి అను అతని పర్యవేక్షణలో కొనసాగించాడు.

తెలుగుసాహిత్యంలో సీ.పీ.బ్రౌన్ చేసిన కృషి అనితరసాధ్యమైనది.
ఎన్నో కావ్యాలను సేకరించి,పరిష్కరించి ముద్రించాడు.

ఆ కాలంలో తన స్వంత డబ్బును ఖర్చుపెట్టి తెలుగువారు కూడా చేయలేనంత కృషిని తెలుగు సాహిత్యం కోసం చేసి తనదైన ఒక ప్రత్యేక స్థానం ఆక్రమించాడు.
ఈనాటికీ ప్రామాణికమైన నిఘంటువులను, వ్యాకరణాన్ని వ్రాసి ముద్రించడమే కాక వేమన పద్యాలను ఇంగ్లీష్ లో అనువాదం చేసి తెలుగుభాషకు ఖండ
ఖండాన్తరాలలో కీర్తిని తెచ్చిపెట్టిన ఘనుడు.

తెలుగు సాహిత్యంలో బ్రౌన్ చేసిన కృషి ఎలా ఉందో,ఎంత కష్టపడ్డాడో తెలుసుకోడానికి ఆయన పండితులకు రాసిన లేఖలు,పండితులు బ్రౌన్ కు రాసిన లేఖలు ఎంతో దోహదం చేస్తాయి. బ్రౌన్ లేఖలను పరిశీలించినట్లయితే వివిధ అంశాలను బట్టి బ్రౌన్ వ్యక్తిత్వం తెలుసుకొనవచ్చును. బ్రౌన్ ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ లాంటి వాడు అనడానికి ఆ లేఖలే ప్రత్యక్ష సాక్ష్యం.

బేతంపూడి సుందరరాయుడు,రావిపాటి గురుమూర్తి శాస్త్రి,పాటూరి రామస్వామి శాస్త్రులు అను పండితులు బ్రౌన్ దొరకు ఉత్తరాలు రాశారు.ఈ లేఖల వల్ల ఆనాటి సామాజికస్థితి
బ్రిటిష్ దొరల పాలనలో తెలుగువారి దీనస్థితి కన్నులకు కట్టినట్లు తెలుపబడింది. కుటుంబ భారాన్ని మోయడానికి విద్య ఉన్నపటికీ ఉద్యోగం కోసం దొరలను ప్రాధేయపడడం,
వారి కొలువునాశ్రయించడం మొదలగు విషయాలతో పాటు బ్రౌన్ దొర వ్యక్తిత్వం ద్యోతకమవుతుంది.

కంపెనీ ఉద్యోగుల్లో పాశ్చాత్యులకు తెలుగు నేర్పే గురువులు మన తెలుగువారు కావడం తెలుగు నేర్చుకున్నాక
వారిని పరీక్షించే పరీక్షాధికారి బ్రౌన్ అని పండితులు రాసిన ఈ కింది లేఖాంశం వల్ల తెలుస్తోంది. “మార్చి నెలలో తమ సముఖములోనికి వచ్చి పరీక్ష ఇవ్వవలెనని ఉన్నారు.”

పండితులు ఉద్యోగాలిప్పించామని బ్రౌన్ కు లేఖలు రాశారు. బేతంపూడి సుందరరాయుడు బ్రౌనుకు రాసిన లేఖలో “కాలేజీ తెలుగు మునిషీలలో విశ్వంభర శాస్త్రులు రాజీనామా ఇచ్చినట్లు నాకు తెలిసినది. అక్కడ తిరిగి ఒకటి ఖాళీ అయితే నాకు ఇత్తురనే
అభిప్రాయంతో జీవనానికి గడియక నానా శ్రమ పడుతూ ఉన్నానని అంటూనే

“విశ్వరంభర శాస్త్రుల సర్టిఫికెట్ నాకు దయచేసి నన్ను పరీక్ష చేయవలెనని తమ అభిప్రాయం ఉంటే అది అయ్యేవరకు ఆ పని వకరకిన్ని ఇవ్వక నిలిపి పెట్టవలెనన్ని,నేను వచ్చిన మీదట నన్ను తమరు పరీక్ష చేసి తరువతనైనా నాకు ఆ పని ఖాయంగా చేసి ఇవ్వవలెనని ప్రార్థిస్తున్నాను.” అనడం వలన తెలుగు చదువుకున్న పండితుల పాండిత్యాన్ని తూచి విలువ కట్టే అధికారి ఆ కాలంలో బ్రౌనే అని తెలుస్తుంది.

పండితులు ఉద్యోగం ఇప్పించమని అర్థించడమే కాక కలెక్టర్ దొరగారితో…సిఫారసు చేసి కలెక్టర్ కచేరీలోనైనా తాలూకా కచ్చేరీలలో నైనా ఒక పని ఇచ్చేట్లు దయ చేయించవలెనని కూడా వ్రాయడం వలన
బ్రౌన్ కు ఉన్న అధికార హోదాను,పలుకుబడిని,అంచనా వేయవచ్చు. పై అధికారి సిఫారసు లేకుండా ఉద్యోగం లభ్యం కావడమనేది ఇప్పటి కాలపరిస్థితుల వలె ఆ కాలంలో కూడా
సులభం కాని విషయం అని తెలుస్తుంది.

బ్రౌన్ పండితులను ఆదరించేవాడు. పరోపకారి,ఎన్నో కుటుంబాలకు సహాయం చేసిన ఉదారస్వభావి అనడానికి పండితులు
బ్రౌన్ కు రాసిన లేఖలే నిదర్శనం.బ్రౌన్ ఉన్నత వ్యక్తిత్వం లేఖల్లో తేటతెల్లం అవుతుంది.
వారి వ్రాతలనే పరిశీలించినట్లయితే బ్రౌను సహృదయతను
గమనించవచ్చు.

రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారి లేఖలో తన బంధువు గురించి “బందరు లో ఏమైనా ఒక పని కావలెనని ఆపేక్షించి సముఖమునకు వచ్చినాడు.తమ కోర్ట్ లో లాయర్ పని ఇప్పించితే తమ అనుగ్రహానికి పాత్రుడై కనిపెట్టుకుని ఉంటాడు.” అని రాశాడు.

పాటూరి రామస్వామి శాస్త్రుల లేఖలో తను చాలా కష్టంలో ఉన్నానని,నన్ను రక్షించే ప్రభువులెవరూ
ఇక్కడ లేనందున అన్న వస్త్రాలకు కూడా లేక పిల్లలతో చాలా శ్రమ పడుతూ ఏమీ తోచక
అనేక కుటుంబ సంరక్షకులయిన తమ దర్శనం చేసుకుని తమ సముఖములో నా విద్యమానము యావత్తు
శృతపరచుకొన్నట్టు అయితే తమరు నా గొప్పకుటుంబముతో కూడా నన్ను సంరక్షణ చేతురని యెంచి సముఖమునకు యీ మనవి వ్రాసుకొన్నాను” అని రాయడం బట్టి బ్రౌన్ దాన నిరతి,
పలు కుటుంబాలను రక్షించిన ధర్మప్రభువు అని తెలుస్తుంది. ఈ రకంగా సంఘంలో పండితుల యెదలో
బ్రౌన్ కు గొప్ప స్థానముందని గమనించవచ్చు.

ఇలా లేఖల ద్వారా ఆనాటి సామాజిక పరిస్థితి తెలుస్తుంది. దొరల ఏలుబడి కావడం వలన దొరలనాశ్రయిస్తే కానీ బ్రతకలేని దుర్భర పరిస్థితి ఆనాడు ఉండేది.

బ్రౌన్ కాలంలో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుని ఉద్యోగాలు కూడా తీసి వేయించారనే విషయం కూడా లేఖల ద్వారా విదితమౌతుంది.
పోట్లాటలు, అసూయలు ఒకరు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు. గిట్టనివారు లోలోపల
కుట్ర చేసి ఉద్యోగం నుండి ఊడబీకించే ప్రయత్నాలు చేయడం మొదలైన విషయాలు పాటూరి రామస్వామి శాస్త్రులు రాసిన లేఖ ద్వారా. ద్యోతకమవుతాయి.
ఉద్యోగంలో చిక్కులు ఆనాటి సమాజ వాతావరణం ఈ లేఖలో కళ్ళకు కట్టినట్లు తెలుపబడింది.
గవర్నమెంట్ ఆర్డర్ చొప్పున కాలేజీ బోర్డు వారు పనులను నిలిపివేయగా అన్న వస్త్రానికి లేక
కష్టపడుతున్న సమయంలో మారీస్ దొరగారు అడిషనల్ మునిషీ ఉద్యోగం ఇచ్చి
కథలను ఏర్పరచి వ్రాసే విధంగా ఏర్పాటు చేయగా ఉద్యోగనిర్వహణలో నిమగ్నమై ఉన్న సమయంలో గిట్టనివారు కక్ష కట్టి ” నా మీద లోలోపల తంటలు చేసి నన్ను ఆ పనిలోంచి తీసి వేయించారు” అని తన కథను ఈ లేఖలో పాటూరి దీనంగా వివరించాడు. దొరవారు నిజం తెలుసుకుని మళ్ళీ ఉద్యోగం ఇవ్వగా రౌలాన్స్ దొర మీకు ఇంగ్లీష్ రానందున అడిషనల్ మునిషీ పని అయినా ఇవ్వడానికి లేదని చెప్పడం వలన
ఆ కాలంలో కంపెనీ ఉద్యోగులకు ఇంగ్లీష్ భాష ఆవశ్యకత తెలుస్తుంది.

బ్రౌన్ తెలుగు కావ్యాలను అచ్చు వేయాలన్న ఆసక్తి కలవాడు.తెలుగు సాహిత్య అభివృద్ధిని కాంక్షించేవాడు.
హయగ్రీవశాస్త్రి గారి లేఖలో
“అచ్చు వేసే విషయమును గురించి తమరు సర్వసాధారణముగా
సహాయము చేయవలెనని తలంపులు గల ప్రభువులయినందు వల్లన్ను, ఆంధ్రభాష యందు గల పుస్తకములు శుస్టుగా
దిద్దివేయించవలెననే కోరిక గలవారైనందున
నున్ను, నా విషయముగా అచ్చునకు కావాల్సిన
పుస్తకములనిచ్చి సహాయము చేస్తామని
లోగడనొక తూరి జాబు వ్రాసి పంపించి యుండడము నున్ను,”
అని వ్రాయడం వలన
తెలుగు కావ్యముద్రణ పట్ల బ్రౌన్ కు గల శ్రద్ధ, ముద్రాపకులను ప్రోత్సహించి కావ్య ముద్రణాభివృద్ధిని
ఆశించడం బట్టి బ్రౌన్ కు తెలుగు సాహిత్యం పట్ల గల అనురాగం వ్యక్తమౌతుంది.

బ్రౌన్ వ్యాఖ్యాన సహిత వసుచరిత్ర కావ్యాన్ని ముద్రిస్తున్న సమయంలో మధ్యన అంతరాయం కలిగినట్లయితే డబ్బు ఖర్చు అవుతుందనే బాధను వ్యక్తం చేయక మధ్యలో ఆగిందనే ఆవేదన చెందేవాడు.”ఇంటికి గోడలు కట్టిన తర్వాత పైకప్పు మాత్రం ఖాళీ వుంచి ఆ కొంచం కుదిరించకుండా యిల్లు యావత్తు పాడు చెయ్యడం” లాంటిదని చెప్తూ ఒకరు మొదలుపెట్టిన పనిని వారే ముగించితే బాగుంటుందంటాడు.” పరులు యిందులో ప్రవేశించి కడకు సాగించిన పక్షమందు దీని యొక్క ఫలమేమి పెట్టుబడి రూకలు యేమి” అని చెప్పి పని పూర్తి చేస్తే దివ్యఫలము,శాశ్వత ఫలము కలదని చెప్పాడు.అచ్చు విషయంలో బ్రౌన్ కు గల శ్రద్దకు నిదర్శనం.ఏదైనా సగం చేసిన పనిలో తృప్తి వుండదు.చేసే పని పూర్తిగా చేస్తే తృప్తి వుంటుందనే మనస్తత్వం కలిగిన వాడు.

వేమన పద్యాలంటే బ్రౌన్ కు చాలా ఇష్టం.పండితులచేత పరిష్కరించి టీకా వ్రాయించేవాడు.
పండితులకు స్వయముగా లేఖలు వ్రాసి సలహాలు ఇచ్చేవాడు.
“కష్టమైన పద్యాలు వస్తే వాటి అర్థం మీరు తలుచుకున్న వెంటనే వక టీకా తగిలించవలసినది మంచి గుణము గల పద్యములు వచ్చేటప్పుడు వాటికి ఏమీ దుఃఖపడే దానికి అవసరం ఉండదు” అని వ్రాసి చేసే పని సవ్యంగా నిర్దోషంగా చేయాలంటాడు.

వేమన పద్యాలలాగానే తెలుగులో “సర్వ గ్రంథములకు మహా సులభమైన వక వ్యాఖ్య
అల్లించేటందుకు బుద్ధి ఉన్నది” “మార్గ దేశీ భేదం లేదు” గ్రామ్యోక్త గ్రంథం అయినా సరే అనడం వల్ల బ్రౌన్ ఆశయసిద్ధి వ్యక్తమౌతుంది. తెలుగు కావ్యాలు సామాన్య ప్రజలకు
అర్థం కావడానికి అందుబాటులో ఉండటానికి వ్యాఖ్యానాలు రాయించాడు.

కావ్యాలకు వ్యాఖ్యలు రాయించడానికి బ్రౌన్ చూపిన చాకచక్యం,మెళకువలు పైడిపాటి వెంకట నర్సయ్యకు రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది. పెద్ద పెద్ద కావ్యాలకు టీకా రాయించేటప్పుడు పండితులకు తగిన సూచనలు ఇచ్చేవాడు. “శబ్దమునకు శబ్దము యంత మాత్రము అల్లించకుండా తేలే తాత్పర్యం
బోధ చేస్తే చాలుతుంది” అని రాయడం వలన ప్రతిపదార్థం అవసరం లేదని కావ్యంలో ఏవో కఠిన శబ్ధాలకు మాత్రం అర్ధం చెప్పి తాత్పర్యాన్ని బోధిస్తే సరిపోతుందని సలహా చెప్పేవాడు. కవిత్వ విషయాలను లోతుగా కావ్య పరిశీలన చేసి విమర్శించి విశదం చేయడం తనకిష్టం లేదని ఖచ్చితంగా చెప్పాడు. అట్లా అని ఏదో కావ్యాన్ని దాటి వేసే ప్రయత్నం కూడా లేదు.

పండితులు రోజుకెంత పని చేసేదో లేఖల ద్వారా తెలిపేవారు.

తెలుగు గ్రంథాల సేకరణ కొరకు బ్రౌన్ పడ్డ శ్రమ బ్రౌన్ స్వయముగా రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది. ధర్మవరం సుబ్బన్నకు రాసిన లేఖలో గ్రంథసేకరణలో బ్రౌన్ కనబరిచిన తాపత్రయం వ్యక్తమౌతుంది. ఎవరైనా గ్రంథాలను జాగ్రత్త చేసి ఇస్తే ఊరికే తీసుకోకుండా విరాళంగా డబ్బు ఖర్చుపెట్టేవాడు.డబ్బుకోసం వెనుకా ముందు చూసేవాడు కాదు.తనకు కావలసిన గ్రంథాలు దొరికితే చాలు అనే తాపత్రయం కలవాడు. ఏ ప్రదేశాల్లో
కావ్యాలు దొరుకుతాయో తెలుసుకుని తెప్పించుకునే ఏర్పాటు చేసుకునే వాడు.పల్నాటి వీరచరిత్ర కావ్యాన్ని తెప్పించుకోడానికి కన్నడభాష కనుక కన్నడవాండ్ల వద్ద విచారించవలసినదని రాశాడు.
ఏయే ప్రాంతాల్లో దొరుకుతాయో వాకబు చేసేవాడు.గౌరన ‘నవనాథ చరిత్ర’ కావ్యం చేబ్రోలు శంభుదేవర గారి మతంలో వున్నదని తెలిసి గుండవరపు కృష్ణయ్య గారికి ఉత్తరం వ్రాసి తెప్పించుకునే పద్ధతి చూస్తే ఆశ్ఛర్యమేస్తుంది. కావ్య సేకరణలో బ్రౌన్ కనబర్చిన చాతుర్యం శ్రద్ధకు ఈ లేఖ ప్రత్యక్ష సాక్ష్యం.కావ్యం యొక్క మాతృక పంపించమని అడుగుతూ మాతృక పంపించే ధైర్యం లేకుంటే ‘కరదాకాగితా’ ల మీద వ్రాసి కాపీని పంపించమని అడిగాడు.తన దగ్గర ఒక ప్రతి వున్నా కానీ సంతృప్తి పడక చేబ్రోలులో వేరే ప్రతి వుందని తెలిసి అక్కడనుండి తెప్పించుకోవడానికి సిద్ధపడ్డాడు.
“ఒక వేళ మాతృక పంపించినట్లయితే నెల రోజుల లోపల పత్రిక వ్రాయించి తిరిగి నిరాయాసంగా మీ దగ్గరకు చేరేటట్టు” చేస్తానని వాగ్దానం చేసాడు. శైవ గ్రంథం కాబట్టి ఆరాధ్యుల దగ్గరుండొచ్చని ‘నవనాథ చరిత్ర’ అనే పేరు తెలియకుండా ‘సారంగధర చరిత్ర’ అని భ్రమపడే అవకాశమున్నదని కాబట్టి కవి పేరు సరిగా చూసి గ్రంథాన్ని పంపించాల్సిందని వ్రాశాడు.దీన్నిబట్టి చూస్తే బ్రౌన్ చూపే మెళకువ,జాగ్రత్తలు తెలియడమే కాకుండా పరిష్కరణ కోసం కావ్యం పనికి వస్తుందనే దూరాలోచన కలిగినవాడని తెలుస్తుంది.

‘పల్నాటి వీరచరిత్ర’ గ్రంథాన్ని తెప్పించుకోవడానికి ఐదు రూపాయలకు గాను యాభై రూపాయలు ఖర్చుపెట్టడానికైనా సిద్ధపడి డబ్బును లక్ష్యపెట్టక,
కావ్య సేకరణే పరమోద్దేశ్యంగా కలిగిన నిరంతర సాహిత్యపిపాసి బ్రౌన్ అని చెప్పవచ్చును.

ఇదే సందర్భంలో పెదగంజాం అప్పయ్యకు ముక్కుసూటిగా సమాధానం వ్రాసి ఆయన తలంచుకునే పద్ధతిలో నిర్మొహమాటంగా,నిర్భయంగా బదులిచ్చాడు ఎక్కడైనా ఉద్యోగమిప్పించమని అప్పయ్య అడిగినందుకు అప్పయ్యకు బ్రౌన్ వ్రాసిన జాబులో “మేము ఆడిగినకొద్దీ గ్రంథము నిమిత్తము మీకు యిది అది చేయవలెనని కలెక్టర్ సాహెబ్ పేరట జాబులు వ్రాయవలెనని మనవి చేసుకోవడము పెద్ద మనిషి నడక్కాదు” అని మందలింపు ధోరణిలో ఘాటుగానే వ్రాసి ‘పల్నాటివీర చరిత్ర’ గ్రంథం పంపిస్తే యాభై రూపాయలిస్తామని,
లేకుంటే వేరేవిధంగా గ్రంథం రాబట్టే మార్గం ఆలోచిస్తామని ముక్కుసూటిగా చెప్పడం వలన బ్రౌన్ ది లంచానికి మంచం వేసే స్వభావం కాదని,ఎదుటివానికి ఖచ్చితంగా సమాధానం చెప్పే వ్యక్తిత్వం కలవాడని తెలుస్తుంది.

ఈ విధంగా ఎందరెందరికో యెన్నెన్ని రకాలుగానో జాబులు వ్రాసి,ఆశలు చూపి,స్వంత డబ్బు ఖర్చు పెట్టి కావ్య ప్రతులు సేకరించి,శుద్ధ ప్రతులను తయారుచేసి,వ్యాఖ్యానాలు వ్రాయించి ముద్రించడంలో బ్రౌన్ ఎదుర్కొన్న కష్ట నిష్టూరాలు, నిరంతర కావ్యపరిశోధనకు “బ్రౌన్ లేఖలు” ఎంతో దోహదం చేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

బ్రౌన్ నిఘంటువు తయారు చేసేప్పుడు అనుమానం వస్తే పండితులకు ఉత్తరాలు వ్రాసి సందేహ నివృత్తి చేసుకునేవాడు.ఒక పదానికి అర్థ నిర్ణయం చేసేటప్పుడు “మేటికోఱు” మొదలగు వానికి పండితుల సలహాలు స్వీకరించేవాడు.
తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి గారు,అద్వైత బ్రహ్మ శాస్త్రులు గారు వ్రాసిన లేఖలే దీనికి సాక్ష్యం.

కృష్ణారెడ్డి బ్రౌన్ కు వ్రాసిన లేఖ వలన కాలేజీ బోర్డు వారి గ్రంథాలయానికి కావ్యాలను ఇప్పించే యేర్పాటు చేశాడని తెలుస్తుంది. కృష్ణారెడ్డి బ్రౌన్ దొర మాటను గౌరవించేవాడు.”యే ప్రకారం శలవు అయితే ఆ ప్రకారం శిరసావహించి నడుచుకుంటూ వుంటాను” అని వ్రాయడం కృష్ణారెడ్డికి బ్రౌన్ పట్ల వుండే గౌరవభావం సూచిస్తుంది. గ్రంథాలయానికి యే ప్రాంతం నుండైనా పుస్తకాలు చేర్చే బాధ్యతను కృష్ణారెడ్డికి అప్పగించ ఆ పనిని సమగ్రంగా నిర్వహించిన విశ్వాస పాత్రుడు. బ్రౌన్ వ్యక్తిత్వం సంఘంలో బ్రౌన్ కు గల ఉన్నత స్థానం,పండితులకు బ్రౌన్ ఇచ్చిన విలువ,
పండితులకు బ్రౌన్ పట్ల వుండే ఆదరభావం,కావ్య సేకరణ,ముద్రణలో బ్రౌన్ పడ్డ పాట్లు,శ్రద్ధ అనేక విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.

ఆనాడు తెలుగు భాషను,సాహిత్యాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకొని అహర్నిశలు కృషి చేసి ధనాన్ని వెచ్చించి జీవితాన్ని అంకితం చేసిన పాశ్చాత్యుడు బ్రౌన్. తెలుగు వాడు కాకపోయినా తెలుగు భాషను నేర్చుకొని రక్షిస్తే ఈనాడు ఆంగ్ల మోజులో పడి తెలుగు భాష ఔన్నత్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్భం జరుగుతోంది. దిగజారుతున్న నేటి స్థితిని చూస్తే బాధ,ఆగ్రహం కలుగుతుంది.
అసలు బ్రౌన్ అనేవాడు లేకుంటే తెలుగు సాహిత్యం లేదనడంలో అతిశయోక్తి లేదు. ముద్రణా సౌకర్యం లేని ఆ రోజుల్లోనే అసూర్యం పశ్యగా వున్న తెలుగు కావ్యాలను సేకరించి పరిష్కరించి వ్రాతప్రతులను తయారు చేయించడం,ప్రచురణ చేయడం ఖర్చులన్నింటినీ ఒంటి చేత్తో భరించడం మామూలు విషయం కాదు. ముద్రణా యంత్రాంగం విస్తరించినాక తెలుగు సాహిత్య ప్రభ వెలిగింది. మార్గదర్శకుడు మాత్రం బ్రౌన్ దొర అని మనం గర్వంగా చెప్పుకునే తెలుగు భాషాభిమాని,తెలుగు వాళ్ళు మరిచిపోలేని మహనీయుడు,నిత్య స్మరణీయుడు బ్రౌన్ దొర ఇంగ్లాండ్ వెళ్లిన తరువాత కూడా లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా నియమింపబడ్డాక కూడా తెలుగు భాష కొరకే తన జీవితాన్ని ధారపోసిన బ్రౌన్ మహనీయుడు 1884 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన తనువు చాలించినప్పటికీ మన తెలుగు వారి మదిలో నిత్యం వెలిగే కాంతి పుంజం.
ఇలా తన జీతం,జీవితాన్ని తెలుగు భాష సాహిత్యం పునరుద్ధరణ కోసం ధారబోసిన త్యాగధనుడు,
ఆజన్మబ్రహ్మచారి,
కారణజన్ముడు,ప్రాతఃస్మరణీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్.

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన ‘ఘన’ గణపతి

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) August 25, 2021
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

మన ‘ఘన’ గణపతి

గణానాం త్వా గణపతిగం హవామహే!

కవిం కవీనా ముపమశ్రవస్తవం!!

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః !

శృణ్వన్నూతిభి: సీదసాదనం!!

ఈ మంత్రం గణపతిని స్తుతించేది. ఋగ్వేదం రెండవ మండలంలోని ఇరవై మూడవ సూక్తంలోనిది. ఈ సూక్తం బృహస్పతి దేవతలను ఉద్దేశించి చెప్పింది. గణనీయమైన వారికి ఈశ్వరునివంటి వాడనీ, సర్వజ్ఞులకు సర్వజ్ఞుడవనీ ప్రసిద్ధులందరిలోనూ విరాజమైన వాడివనీ మేము తలస్తున్నాం. ఓ గణనాధా ! నీవు వచ్చి మా హృదయ ఫలకాలపై అధిష్ఠించు అని అర్థం .

‘గ’ అనగా వివేకం, ‘ణ’ అనగా ‘ముక్తి’ లేక ‘మోక్షము’ అని అర్థాలు ఉన్నాయి. గణపతి అంటే ‘శుద్ధ మనస్సు’ అని నిర్వచనం. గణమనగా 36 తత్వాల సమూహం అనీ భావము.

ఎవరీ విఘ్నేశ్వరుడు ?

మన దేశంలో త్రిమూర్తుల తర్వాత విశేషంగా వినాయకుడినే పూజిస్తారు.  ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సమాప్తి కావడానికి వినాయకుని పూజతో ప్రారంభమవుతుంది. ప్రతి శుభకార్యం తొలిగా ఆరాధింపబడే దైవం. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు జన్మించాడు కాబట్టి ఆ రోజు విశేష పూజలు జరుపుతారు. వినాయక చవితి నాడు సూర్యోదయానికి ముందు తూర్పున ఎలుక ఆకారం, దానిమీద ఏనుగు ఆకారం గల రెండు నక్షత్రాల గుంపులు ఉదయిస్తాయని, సూర్యోదయానికి ముందు ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించిన దైవాన్ని పూజించాలని ఋగ్వేదంలో పేర్కొనడం వల్ల వినాయక పూజ భాద్రపద శుద్ధ చవితినాడే జరుపుతున్నారు.

విఘ్నాలకు నాయకుడు విఘ్నేశ్వరుడు. విఘ్నాలు అంటే ఒక పనికి పూనుకున్న వారికీ ఎదురయ్యే అడ్డంకులను ‘విఘ్నాలు’ అంటారు. వినాయకుడు విఘ్న గణాలను తన ఆధీనంలో ఉంచుకొని భక్తులకు ఆ విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. మన ఇంట్లో ఉన్న పదార్థాలను మూషకం ఎలా కాజేస్తుందో, అలాగే గణపతి వాహనమైన మూషకం జీవుల హృదయాల్లో ఉన్న అజ్ఞానాన్ని అపహరిస్తూ ఉంటుంది. సర్వాంతర్యామియైన ఈశ్వరుడే గణపతిని సేవించాలని మూషక రూపం ధరించి వాహనమయ్యాడని కూడా అంటారు.

గజవదనం గణపతిది. సర్పాలే ఆభరణాలు, అనింద్యుడనే మూషిక వాహనం, చేటల్లాంటి చెవులు, చిన్న చిన్న నేత్రాలు, గణపతికి గొప్పవారని కాని, పేదవారనిగాని బలవంతుడనిగాని, బలహీనుడనిగాని తారతమ్యాలు లేవని, వారి గజవదనం, మూషిక వాహనం తెల్పుతున్నాయి. సర్పాలకు మూషికాలకు జన్మ శతృత్వం కాని, మితృత్వంగాని లేదని పాములు ఆభరణాలుగా, మూషికం వాహనంగా కల్గి వున్నారు. చిరు నేత్రాలు సూక్ష్మబుద్ధికి తార్కాణం. భక్తులు ఏ దిక్కు నుండి పిలిచినా అంటే అష్టదిక్కులే కాక, ఊర్ధ్వ, అధో భాగాలనుండి పిలిచినా భక్తుల మొర విని ఆదుకొనే గణపతి దేవుని పూజిస్తే సకల విద్యలు, సకలైశ్వర్యాలు కలిగి సకల కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని ప్రతీతి.

హిందూ దేవతలలో వినాయకుడు అగ్రగణ్యుడు. ఈ స్వామి పుట్టుక, అతడి రూపం, విన్యాసాల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయకుడికి ఈ రూపం ఎలా వచ్చింది అనే అంశం కూడా ఈ అష్టగణపతులలో వక్రతుండుడు సింహవాహనుడు మత్సరాసురుని సంహరించాడు. ఏకదంతుడు మూషక వాహనుడు మదాసుర నిహంత మహోదరుడు మూషక వాహనుడు జ్ఞానదాత. మోహాసుర నాశకుడు, గజాననుడు మూషిక వాహనుడు సాంఖ్యసిద్ధి ప్రదుడు, లోభా సుర సంహర్త లంబోదరుడు మూషక వాహనుడు, క్రోధాసుర వినాశకుడు. వికటుడు, మయూర వాహనుడు, కామాసురాంతకుడు. విఘ్నరాజు శేషవాహనుడు మమతాసుర ప్రహర, ధూమ్రవర్ణుడు మూషక వాహనుడు, అహం తాసురహంత. దీనిని బట్టి యెవ్వరు గణపతిని ఉపాసింస్తున్నారో వారికి గణపతి అనుగ్రహబలముచే కామక్రోదాదులు నశించి తత్త్వజ్ఞానం సిద్ధింస్తుందని తెలుస్తున్నది. వక్రతుండ, మహోదర, ఏకదంత, గజానన, లంబోదర, వికటుడు, విఘ్నరాజు, దూమ్రవర్ణ అని గణపతి ఎనిమిది అవతారాలను ఎత్తినట్లుగా ముద్గల పురాణం పేర్కొంది.

కలియుగంలో రెండు చేతులు కలిగి తెల్లని కాంతి గలవాడై, కోర్కెలన్నిటిని దీర్చు గణపతిని ధ్యానించాలి. సర్వవిఘ్నాలను హరించేవాడు కావడం వలన ఈయన ప్రథమ పూజ్యుడైనాడు. విఘ్నేశ్వరుని పూజించనిదే ఎవ్వరికిని ఏ కార్యమూ సిద్ధించదు. “అపూజితో విఘ్నకరోపిమాతూ” అను గణేశ పురాణ వచనం. కార్యారంభమున తన్ను స్మరింపనిచో కన్నతల్లికైనా విఘ్నము కలిగిస్తాడని తెలుపుచున్నది. ఇది వినాయకుని నిష్పాక్షిక ప్రవృత్తికి నిదర్శనం.

“త్వమేవ కేవలం ఖల్విదం బ్రహ్మసి” అని గణపత్యుపనిషత్తు పేర్కొంటున్నది. దేవతల్ని పూజించటానికి ముందు గణపతిని పూజిస్తేనే నిర్విఘ్నంగా పూజా ఫలం లభిస్తుందని, లేకపోతే ఆ పూజలన్నీ వ్యర్థమైపోతాయని మన నమ్మకం. అందుకనే మనం ఏ కార్యం తలపెట్టినా ఓం ప్రథమంగా పసుపుతో వినాయకుణ్ణి చేసి, “సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణకః” అంటూ గణేశుని పూజిస్తుంటాం. శ్రీ విఘ్నేశ్వరున్ని ఆరాధిస్తే విఘ్నాలు తొలగి, విజయాలు సిద్ధిస్తాయి. ఈ గణేశుని పండుగని “చవితి”నాడే ఎందుకు జరుపుకోవాలో జ్యోతిష్యశాస్త్ర రీత్యా పరిశీలించినట్లయితే,

వేదకాలంలో మన మహర్షులు మన పండుగలను జ్యోతిషశాస్త్ర ఆధారంగా హిందూ పంచాంగాన్ని ప్రమాణికంగా చేసికొని ఏర్పాటు చేశారు. మనకు వినాయక చవితి గొప్ప పండుగ.

“చవితి”నాడే గణేశుని పండుగని ఎందుకు జరుపుకోవాలి?!

భాద్రపద మాసం సూర్యుడు సింహరాశి చివరలో ఉండగా రావడం, శుక్లపక్ష చవితినాడు చంద్రుడు కన్యారాశితో హస్తానక్షత్రం మీద ఉదయిస్తాడు. అయితే హస్తా నక్షత్రం చేతి వేళ్ళవలె హస్తాకారంలో, అంటే చేతివంటి ఆకారంలో ఉంటుంది. భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుడుదయించే సమయానికి శిరస్సున హస్త నక్షత్రంలో కనిపిస్తాడు. హస్త ముఖమును కలిగినవాడు కనుక హస్తిముఖుడు. హస్తి అంటే ఏనుగు అని కూడా కదా! దీనిని బట్టి గణపతికి ఏనుగు ముఖము అని హస్తి ముఖుడు అన్నారు.

ఇలా ఒక్క భాద్రపద శుద్ధ చతుర్దినాడే హస్తలో చంద్రుడుండగా ఉదయిస్తాడు. హస్తా నక్షత్రానికి కన్యారాశికాగా, దీని అధిపతి బుధుడు. ఈ బుధుని రంగు పచ్చ, మరకతం, అందుచే గణపతిని ఆకుపచ్చ రంగుగా ఉండే గరిక చిగుళ్ళు, దూర్వాంకులాలతో, పత్రితో పూజిస్తారు.

ఋషులు పూర్వం ఆశ్రమాలలో బ్రహ్మ విద్యాభ్యాసం వినాయక చవితి మరుసటి రోజున అంటే పంచమి రోజున (గణపతి) ప్రారంభించేవారు. పంచమి సప్త ఋషులతో ఉదయిస్తుంది. కనుక ఆనాడు గణపతి విద్యలకెల్ల నొజ్జయై బ్రహ్మ విద్యాధిపతి కాగా, రాశులలో కన్యారాశి ఆరవది. ఈ అరవస్థానం జ్యోతిష్య శాస్త్రములలో శత్రువులకు, అపనిందలకు, రోగములకు, విఘ్నములకు మూలస్థానం కాబట్టి ఈ రాశిలో విఘ్నములకు, శత్రువులకు కారకుడైన గణపతిని ఏర్పాటుచేసి పూజించితే, సుఖ సౌఖ్యాలతో ఉంటామని ఋషులు భాద్రపద శుద్ధ చతుర్థినాడు ఆ విఘ్నములు తొలగుటకు వినాయకుని పండుగను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

విశేషమేమంటే వినాయక చవితి వ్రత కథలో కూడ, సింహం చేత మరణించిన ప్రసేకుడు నీలాపనిందల పాలైన శ్రీకృష్ణునికి మిత్రుడే శత్రువైన, జాంబవతునితో వైరము శతృత్వానికి ప్రమాదాన్ని సృష్టించే శమంతకమణి కథ ఈ జ్యోతిష్య రహస్యాన్ని సూచిస్తున్నది.

ఎందుకు వినాయకుని దంతం విరిగింది?

శివభక్తుడైన పరశురాముడు మహా ముక్కోపి. ఓసారి కైలాసం వస్తాడు. శివపార్వతులను దర్శించాలనుకుంటాడు. ద్వారం వద్దనున్న గణపతి పరశురాముడిని అడ్డుకుంటాడు. దాంతో ముక్కోపి అయిన పరశురాముడు ఆగ్రహిస్తాడు. ఇద్దరికి భయంకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వినాయకుడు తన తొండంతో ఎత్తి పరశురాముడిని దూరంగా విసిరేస్తాడు. పరశురాముడు తనకు శివుడు ప్రసాదించిన మహిమాన్వితమైన పరశువుని వినాయకుడిపై ప్రయోగిస్తాడు. ఆ పరశువు దెబ్బవల్లే వినాయకుని తొండం విరిగిందని పురాణ ఐతిహ్యం.

ఎందుకు గణపతికి తొలిగా కొబ్బరికాయ కొడతారు?

కొబ్బరికాయ కొట్టి గణపతి పూజ ‘మొదలు పెడతాం. ఇలా కొబ్బరి కాయ కొట్టడంలో ఒక పరమార్థం దాగి వుందట. తామ్ర, లోహ, స్వర్ణ ఈ మూడు త్రిపురాలను ఆక్రమించిన ముగ్గురు రాక్షస రాజులు ప్రజలను పట్టిపీడిస్తుంటే, శివుడు వారిని సంహరించడానికి పూనుకోగానే ఏదో ఒక విఘ్నం సంభవించేదట. విఘ్న రాజైన పుత్రుడు వినాయకుని సంప్రదించగా విఘ్నరాజు సూచన ప్రకారం శివుడికి ప్రతి రూపంగా మూడు రంధ్రాలున్న కొబ్బరికాయను ఛేదించి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి, ఆ ముగ్గురు రాక్షసులను ఎలాంటి విఘ్నాలు లేకుండా సంహరించాడని, ఆ నాటి నుండి వినాయక పూజకు ముందుగా కొబ్బరికాయ కొట్టడం మొదలైందని ఐతిహ్యం.

ఎందుకు తులసి గణేశుని పూజకు పనికిరాదు?

గణపతికి ఏకవింశతి పత్రాణి పూజ చేస్తారు. కాని ఇరవైనొక్క రకాల పత్రాలతో పూజలందే గణనాథునికి తులసి పత్రాలతో అర్చించే భాగ్యం లేదు. ఈనాడు కొన్ని వినాయక వ్రత పుస్తకాల్లో “గజకర్ణకాయ నమ: తులసీ పత్రం పూజయామి” అని కనిపిస్తున్నది. కాని ‘తులసీ పత్రం వినాయక పూజకు పనికి రాదు’ అని శాస్త్రం చెబుతున్నది. శ్రీమహావిష్ణువుని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్న తులసీదేవి గణపతిని చూచి, “నీవు సాక్షాత్తు శ్రీకృష్ణుడివి. విష్ణువుకూ, నీకు భేదం లేదు కనుక నిన్ను వరిస్తున్నాను. పెళ్లి చేసుకో! ” మని అడిగితే ‘నాకు వివాహేచ్చ లేదు. నేనసలు నిన్నే కాదు, ఎవరినీ పెళ్లి చేసుకోను’ అని ఆయన తిరస్కరించాడు. అప్పుడు తులసికి కోపం వచ్చి “నీకు త్వరలోనే వివాహం అగుగాక” అని శాపమిచ్చింది. అప్పుడు గణేశుడు “నీకు రాక్షసుడు భర్త అవుతాడు. వచ్చే జన్మలో నువ్వు వృక్షానివై పుడతావు. సమస్త దేవతలు నీ దళాలతో పూజింపబడినప్పటికీ నాకు మాత్రం అవి పనికి రాకుండా పోతవి” అని ప్రతి శాపమిచ్చాడు. ఈ కథను మనం బ్రహ్మవైవర్తంలో గమనించవచ్చు. అలా గణపతి శాపం ఉండటం మూలాన తులసీ పత్రాలు వినాయకపూజకు పనికిరావని చెప్పటం జరిగింది. భగవంతుడు కోరిన ఫల, పుష్ప, పత్రాలతో పూజిస్తేనే భక్తి, ముక్తి.

ఎందుకు చంద్రుడు శాపానికి గురైనాడు?

ఓరోజు గణేశుడు మూషికవాహనంపై తిరుగుతుండగా ఓ పాము కనిపించేసరికి, మూషికం కంగారు పడి వినాయకుడ్ని పడేస్తుంది. ఆయన దగ్గర ఉన్న మోదకాలన్నీ పడిపోతాయి. దాంతో వినాయకుడికి కోపం వచ్చి పాముని తన పొట్టకు ఆభరణంగా చుట్టుకుంటాడు. తనను చూసి నవ్విన చంద్రుడి పైకి కోపంతో విరిగిన దంతాన్ని విసిరి “ఇక నుండి నీవు కాంతి విహీనుడివి అవుతావని శపిస్తాడు.” అప్పడు చంద్రుడు కాంతి విహీనుడయ్యేసరికి ప్రతిరోజూ చీటి రాత్రులవుతాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు వినాయకుడిని తన శాపాన్ని ఉపసంహరించుకోమని కోరతారు. దాంతో ఆయన నెలలో సగం రోజులు పూర్ణచంద్రుడిగాను, మిగిలిన రోజులలో అర్థచంద్రుడిగాను ఉంటాడని అనుగ్రహిస్తాడు. చంద్రుడు శాపానికి గురైన రోజు భాద్రపద చతుర్థి. ఆరోజు చంద్రుని చూడకూడదని, చూస్తే నీలాపనిందలు వస్తాయని ప్రజలలో ఒక విశ్వాసం ఉంది. ఒకవేళ చూస్తే ఆ దోష పరిహారార్థం

సింహం ప్రసేన మవధీత్

సింహా జాంబవతాహతః

సుకుమారక మారోః

తవ హ్యేష శమంతకః ||

అనే శ్లోకం పఠించాలి, లేదా శమంతకోపాఖ్యానం వినాలని మన పురాణాలు చెబుతున్నాయి.

గణేశుని ప్రార్థించిన రావణుడు

రావణుడు ఒకసారి శివుని కోసం మహాతపస్సు చేసి విచిత్రమైన వరాన్ని కోరతాడు. అతనికిగానీ, అతని రాజ్యానికి గానీ ఎవరివల్లా ఎటువంటి హాని ఎప్పటికీ జరగకుండా ఉండేలా వరం ఇమ్మని అడుగుతాడు. అప్పుడు, శివుడు ఓ శివలింగం ఇచ్చి, దీనిని రాజ్యానికి తీసుకుపోయి సదా పూజా కార్యక్రమాలు నిర్వహించమంటాడు. ఐతే మార్గ మధ్యంలో దానిని కింద పెట్టకూడదన్న షరతు పెడతాడు. రావణుడెంతో సంతోషంతో ఆ లింగం తీసుకుని బయల్దేరతాడు. శివుడు రావణుడికిచ్చిన ఈ వరానికి మిగిలిన దేవతలంతా భయపడిపోయి వినాయకుడిని ప్రార్థిస్తారు. రావణుడు తన రాజ్యానికి పయనించే మార్గంలో వరుణదేవుడు ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. అలాంటి పరిస్థితులలో రావణుడు చేతిలో ఉన్న శివలింగాన్ని పటుకోలేకపోతాడు. అలా శివలింగాన్ని కింద పెట్టడానికి కూడా అతని మనసు అంగీకరించదు. అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితులలో అతడిని ఎవరో బాలుడు పిలిచినట్లయి అక్కడ ఉన్న ఓ నేలమీద పెట్టి, తనను ఎవరు పిలిచారా అని నలుదిక్కులా వెతికి అతను కనబడితే సంహరించాలని చూస్తాడు. అప్పుడా బాలుడు గణేశుని రూపంలో ప్రత్యక్షమై రావణుని ఓ బంతిలా చుట్టి ఆకాశానికి విసిరేస్తూ ఆటలా ఆడుకుంటాడు. అప్పుడు రావణుడు తన తప్పు తెలుసుకుని తనకున్న పరిమితులను గుర్తించి గణేశుడెంతటి శక్తివంతుడో గ్రహించి, అతడిని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తాడు. ఇలా ఎన్నెన్నో సంఘటనలు, గణేశుని కోపానికి, శాపానికి గురైన విషయాలు గణేశ పురాణంలో కోకొల్లలు.

మట్టి వినాయక నిమజ్జన మహిమ :

వినాయకుని పూజించి చివరి రోజున చెరువుల్లో, బావుల్లో, నీటిలో నిమజ్జనం చేస్తారు. భూ -జల తత్వాల నుంచి ఏర్పడిన మూర్తిని, తిరిగి అవే తత్వాలలోనికి చేరడం ప్రకృతి ధర్మం. వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ చోట నుండి కొద్ది మట్టిని తెచ్చి, ధాన్యపు గాదెల్లో వేస్తారు రైతులు. ఇలా చేయడం వలన పంటలు బాగా పండి, గాదెల నిండ ధాన్యం పుష్కలంగా చేరుతుందని రైతన్నల నమ్మకం.

పూర్వం కలుషిత జలాన్ని శుభ్రపరిచేందుకు ఈనాటి మాదిరిగా సౌకర్యాలు ఆనాడు ఉండేవి కావు. నీరు కలుషితం కాకుండా వినాయకుడి పూజలో ఉపయోగించిన ఏక వింశతి (21) పత్రాలను నీటిలో నిమజ్జనం చేయడం వలన ఔషద గుణాలు కల్గిన పత్రాలు నీటిని శుభ్రపరిచి కాలుష్యాన్ని, వ్యాధి కారక క్రిములనూ పోగొట్టి నీటిని శుద్ధి చేస్తాయి. ఇది వినాయక పూజ పత్రాల్లో దాగిన రహస్యం.

నిమజ్జనం: నీళ్ళు స్థానంగా కలిగినటువంటివాడు నారాయణుడు. అయన ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. గణపతిని ఉత్సవాల అనంతరం నీటిలో నిమజ్జనం చేస్తున్నామంటే, గణపతి రూపమైన విష్ణుమూర్తి యొక్క స్థానమైన నీటిలో నిమజ్జనం ప్రాముఖ్యత.

హిందూ మతశాఖల్లో గాణాపత్యం ఒకటి. భారత దేశంలోనే కాక గణపతిని బ్రెజిల్, మెక్సికో, బర్మా, థాయిలాండ్, గ్రీస్, కాంబోడియా, చైనా, జపాన్ వంటి విదేశాల్లో సైతం ఆరాధిస్తుండగా జైనులు, బౌద్ధులు కూడా పూజిస్తున్నారు.

గణపతి ఆరాధన – ఆరోగ్య సాధన

గణపతి జ్ఞాన సాగరుడు. అట్టి గణపతిని మనం పర్యావరణానికి హానిచేయని మట్టితో తయారుచేసిన విగ్రహాలకు ప్రాముఖ్యత నిచ్చి పర్యావరణ భద్రతకు సహకరించి, శాంతి సౌభాగ్యాలకోసం పవిత్ర హృదయాలతో గణపతిని ఆరాధించి ఇహపర సౌఖ్యాలను పొందుదాం!

పూజలలో ప్రథముడు విఘ్నేశ్వరుడు. ఏ శుభకార్యమైన “శ్రీ మహా గణాధిపతయే నమ:” అని, శుక్లాంభరధరం అనే శోకంతో ప్రారంభిస్తారు.

శ్రీ మహాగణపతి సగుణ నిర్గుణ స్వరూపుడు. షోడశనామ ధరుడగు మంత్ర ద్రష్ట, నిర్విఘ్న మూర్తియైన విఘ్నాకారకుడు, బ్రహ్మాది దేవతలచే, లంభోదరంతో, సింధూర వర్ణంతో విరాజిల్లుతూ గణాలన్నింటిలో ప్రథమ గణంగా పొగడబడుచున్నాడు. సకల శ్రేత, స్మార్త, కర్మాలకు, శుభా శుభకర్మలకు “అదౌపూజ్యోగణాధిపః”గా తొలిగా పూజలందుకునే మంత్రానుష్ఠాన ప్రథమ దేవత వినాయకుడు.

గణపతి చవితి పూజనాడు కూడా ముందు గణపతి పూజ చేసిన తర్వాత సిద్ది వినాయక పూజ చేస్తారు. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి కూడా గణపతి పూజే చేస్తారు. దీనిని బట్టి సర్వ దేవతా పూజలకు వినాయకుని పూజ ముఖ్యంగా కనబడుతుంది. సృష్టికి ముందు, సృష్టి తర్వాత ప్రళయానంతరం కూడా సత్య స్వరూపుడై ప్రకాశించే వాడే మహాగణపతి.

గణత్యుపనిషత్తు “త్వమేవ కేవలం ఖల్విదం బ్రహ్మాస్మి” అని పేర్కొంది. దేవతలను పూజించడానికి ముందు ఈ గణపతిని పూజిస్తేనే నిర్విఘ్నంగా పూజాఫలం లభిస్తుంది. కనుకనే మనం ఏ శుభకార్యం తలపెట్టినా, ‘ఓం’ ప్రథమంగా పసుపుతో గణపతిని చేసి “సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణకః” అంటూ గణపతి పూజ నిర్వహిస్తూ ఉంటాము. గణపతి సర్వదేవతా అనుగ్రహ ప్రదాత అని గణేశపురాణ వచనం. “విగతోనాయకః యస్వసః వినాయకః” అని వ్యుత్పత్తి. సర్వస్వతంత్రుడు నాయకులు లేని నాయకుడు.

నూటఎనిమిది ఉపనిషత్తులున్నాయని తెలుస్తున్నా, అందులో ఎనభై తొమ్మిది ఉపనిషత్తు గణపతోపనిషత్తు. పురాణాల ప్రకారం వినాయకుని అవిర్భావం బహు విచిత్రంగానే ఉంటుంది. గణపతి దేవుడు వేదమంత్రాలకు అధిపతియని, వేదాలు, ఉపనిషత్తులు కూడా అనేక విధాల స్తుతించాయి. ఈ సృష్టి అంతా ఎవరి వలన పుట్టిందో, ఎవరి మీద ఆధారపడి ఉందో, ఎవరిలో లయం అవుతుందో అట్టి సాక్షత్ పరమేశ్వరుడే గణపతి యని ఉపనిషత్తులు విశదీకరిస్తున్నాయి.

జ్యోతిశ్శాస్త్రంతో కూడా ముడిపడి ఉన్నది గణపతి ప్రాముఖ్యం. భాద్రపద శుద్ధ చవితి సూర్యోదయాత్పూర్వము గగనంలో హస్తా నక్షత్రం ఉదయిస్తుంది. సూర్యోదయాత్పూర్వవం ఉద్గమనమైన నక్షత్రాల నారాధించడం సంప్రదాయం. అది గణపతి ఆకారం గల నక్షత్ర సముహమని కొందరు జ్యోతిశ్శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

మంత్ర శాస్త్రాల్లో గణపతి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఇతడు నాగరి లిపిలోని ఓంకార రూపాన్ని పోలి ఉంటుంది. ఓం కారాకారుడు అనగా బ్రహ్మ, ఇతని ప్రణవ స్వరూపునిగా మన పూర్వులు ఉపాసించారు. యంత్రశాస్త్రంతో ఇతని ఉపాసన సంబంధాన్ని కలిగి ఉన్నది. ఇతని యంత్రం త్రిభుజరేఖలుగా పరిగణింపబడినవి. ఈ త్రిభుజాలు ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తులకు ప్రతీకలు.

విఘ్నాలకు నాయకుడు విఘ్నేశ్వరుడు. ‘వి’ అంటే విఘ్నం కాబట్టి విఘ్న గణాలను తన ఆధీనంలో ఉంచుకొని భక్తులకు అవిఘ్నాలనూ, భక్తి రహితులకు విఘ్నాలనూ ప్రసాదిస్తూ ఉంటాడు. గణపతి చేతుల్లో ధరించిన పాశం భక్తుల మనస్సులలోని మోహన్ని బంధిస్తుంది. అంకుశం దుష్టనాశనం కావిస్తుంది. ఆయన వరముద్ర భక్తాభీష్టాలను సిద్ధింపజేస్తూ ఉంటుంది. ఆభయముద్ర ఆత్మ తత్త్వవేత్తలకు మోక్ష రూపమైన అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది.

మహాగణపతి ఆయుధాల తత్వం : ఆవిద్యా వాసనలు లేని బీజముతో నిండిన మాయరూప బీజఫలం, ఒక చేతను అవిద్యా కార్యమస్తకభేది, విద్యా రూపగదను, మనస్సు అనే చెఱకువిల్లును, త్రిపుటీరూప త్రిశూలాన్ని, సంసార రూప చక్రాన్ని, అజ్ఞానమనే నిద్రనుండి మేల్కొలుడానికి, మ్రోగించే శంఖాన్ని, రాగరూప పాశాన్ని, శుద్ధజ్ఞానం వల్ల వికసించిన హృదయం రూప ఉత్పలాన్ని, జీవులకు ఆనందం కలిగించేదిగా వడ్లకంకిని, ఖండనరూప భిన్నదంతాన్ని, జ్ఞానవిజ్ఞాన రత్నపూరిత అమృత కలశాన్ని పదిచేతులలోనూ, తొండమునందు ధరించినవాడు మహాగణపతి.

మాయాకార నరశరీరమూ కంఠానికి దిగువ ప్రదేశంలో పురుషాకార గజవదనం, కంఠ ప్రదేశానికి ఉపరిభాగాన రూపముగా కల్గినవాడు. జాగ్రత్, స్వప్న సుషుప్తి అనే మూడు స్వ ప్రపంచాలకు సాక్షిభూతమైన త్రినేత్రము కల్గినవాడు, బ్రహ్మశక్తి రూపమైన సిద్ధిలక్ష్మిని ఆలింగనం చేసుకున్నది శ్రీమహాగణపతి రూపం. ప్రపంచ సృష్టి, స్థితి, లయకారుడు అష్టపురి అనే ఈ శరీరంలో ఉండేవాడు, శ్రీ మహాగణపతి యొక్క సగుణరూపం.

విఘ్నేశ్వరుడికి వినాయక చవితి రోజు ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజాయామి అని బృహతీ పత్రిని ఇలా బిల్వ పత్రం, దూర్వాయుగ్మం (గరిక), దుత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), ఆపామార్గ (ఉత్తరేణి), తులసి, చూత (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణు క్రాంతి, దాడిమీ (దానిమ్మ), దావదారు, మరువక (దవనము), సింధూవార (వావిలి), జాజీ, గండకీ, శమీ (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (మద్ది), అర్క (జిల్లేడు) 21 పత్రాలతో స్వామివారిని పూజిస్తే మనకి శారీరకంగా చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఈ వినాయక పూజలోని పత్రిలో ఆ కాలానికి, అంటే వర్షాకాలానికి వచ్చే సాధారణ వ్యాధుల్ని నివారించే, నయం చేసే ఎన్నో ఔషధగుణాలు పుష్కలంగా ఉండడం వలన స్వామివారికి సమర్పిస్తారు.

మరో కోణంలో అంతర్గత దృష్టితో పరిశీలిస్తే 21 తత్వాలను ఏకం చేసి ఏకాగ్రతతో గణపతిని అర్చిస్తే జన్మరాహిత్యం, మోక్షం కలుగుతుందని శాస్త్రోక్తి. మన శరీరంలో ఇంద్రియాలన్నింటికీ అధిష్టాన దేవతలున్నారు. పైకి కనిపించే శరీరాన్ని స్థూల శరీరమని, లోపలి శరీరాన్ని సూక్ష్మ శరీరమని గురువులు బోధిస్తారు. ఇటువంటి స్థూల శరీరం జ్ఞాత తత్వాలతో కలిసి ఉంటుంది. మన సూక్ష్మ శరీరం 19 తత్వాలతో అధిష్టాన దేవతలతో కూడి ఉన్నది. పంచజ్ఞానేంద్రియాలు శ్రోత్రం, త్వక్, చక్షుర్, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు. శ్రీతేంద్రియానికి దిక్కులు, త్వణేంద్రియానికి వాయువు, చక్షురింద్రియానికి సూర్యుడు, జిహ్వేంద్రియానికి వరుణుడు, ఋణేంద్రియానికి అశ్వినీ దేవతలు. ఇక కర్మేంద్రియాలు ఐదు అవి వాక్, పాణి, పాద, గుహ్య, వాయువులు. అయితే వాగ్వేంద్రియానికి అగ్ని, వాణేంద్రియానికి ఇంద్రుడు, పాడేంద్రియానికి విష్ణువు, గుహేంద్రియానికి ప్రజాపతి, వాయురింద్రియానికి మృత్యువు అధిష్టాన దేవతలు. వాయువులు ఐదు వ్యాస, ఉదాన, సమాన, ప్రాణ అని అపానములు. వీటికి విశ్వయోని, అజుడు, జయుడు, విశిష్ఠుడు, విశ్వకర్త అధిష్టాన దేవతలు. ఇక అంతఃకరణాలు నాలుగు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, అహంకారానికి  రుద్రుడు అధిష్టాన దేవతలు. ధ్యానంలో ఈ 19 సూక్ష్మశరీర తత్వాలను దాటితే మహాత్తత్వం. మహాతత్వం నుండి అవ్యక్త తత్త్వము, అవ్యక్త తత్త్వము దాటితే, అంటే ఏక వింశతి తత్వాలు దాటితే మనలో ఉన్న ఆత్మ అంతటా నిండిఉన్న పరమాత్మలో లీనమవుతుంది. అందుకే గణపతికి ఏక వింశతి పత్రాణి పూజ నిర్వహణ అంతరార్థమిది. గణపతి ఏక వింశతి నామాలతో కీర్తింపబడుతున్నాడు. అందుకే ఏకవింశతి పూజ కల్పంలో విధింపబడింది. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, దశేంద్రియాలు, మనస్సు అనే 21 ఏకవింశతి తత్వాలపై గణపతికి అధికారం ఉన్నది. కాబట్టి ఏకవింశతి నామాలు, ఏక వింశతి పత్రపూజ విధింపబడినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.

వరదాభయహస్తుడైన, గజాననుడు ఆశలనెడి పాశాలలో జీవుని తగుల్కొననీయక అంకుశంతో గజం యొక్క మత్తును విదలించినట్లు జీవుని నిత్య జాగరూనికి చేస్తూ, మోక్షమనేడి వరదానాన్ని ఇచ్చి, అభయమనే అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. గణపతిని సేవించి, పూజించి, ఆరాధించి ఆయన కృపకు పాత్రులు కావాలి!

 

కావ్య సుధ (హరిశంకర్)

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

యోగ ప్రాముఖ్యత

by Bandi Usha August 25, 2021
written by Bandi Usha

యోగా అంటే కలయిక, కూడిక, ఏకమగుట. వీటిని సాధించటమే యోగము.

శరీరము, మనసు కలయిక కోసం చేసేసాధనే యోగా. ఆ రెండూ ఏకమవటం యోగము.

“యజ్యతే ఏతదితి యోగః,

యుజ్యతే అనేన ఇతి యోగః”

ఇంద్రియములను వశపరచుకొని ఏకాగ్రత సాధించటానికి అత్యుత్తమమైన మార్గం యోగ.

“యోగా సమత్వ ముచ్చితహః”

“చిత్త వృత్తి నిరోదహః”

అభ్యాస వైరాగ్యాల వలన చిత్తవృత్తులను నిరోధించే సమత్వంతో జీవించటానికి రాచబాట యోగ.

యోగా రెండక్షరాల పథము. ఇందులో శతకోటి శతఘ్నుల బలం ఉంది. ఇది ఒక శాస్త్రము. శాస్త్రము అంటే నిరూపించబడినది. ఆధునిక వైద్యశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం రెండూ ముక్తకంఠంతో యోగాకు యోగ్యతా పత్రాన్ని ఇచ్చాయి.

వేదభూమిగా ఖ్యాతిగాంచిన భరతావని సకలశాస్త్రాలకు పుట్టినిల్లు, సర్వశాస్త్రాలకు మూలం వేదాలు. మానవ జీవిత పరిపూర్ణత్వమునకు  శాస్త్రీయపరమైన మూలప్రమాాలు వేదాలే. ఇందు యోగశాస్త్రము కూడా తెలియజేయటం జరిగింది.

5000 సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగము యోగా. మానవునిలోని అనంతమైన మేధోశక్తిని వెలికి తీసి పరిపూర్ణ జీవన విధానానికి తోడ్పడుతుంది. ఇందుకు యోగా, ధ్యానము అవసరము. అప్పుడే ఏకతా స్థితిలో జీవించవచ్చు.

ఈ చరాచర సృష్టిలోని సమస్త జీవరాశుల కన్నా మానవ జన్మ లభించటం అదృష్టమైతే, అది సద్వినియోగపరుచుకున్నప్పుడు వరము అవుతుంది.  ఎందుకంటే జీవితాన్ని యాంత్రికంగా కొనసాగించటానికి, చైతన్య వంతంగా గడపటానికి ఎంతో తేడా ఉంది.

నేటి మానవుడు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో  అభివృద్ధి చెందినప్పటికీ, ఆరోగ్య విషయంలో మాత్రం నాటి మానవుని కన్నా వెనుకంజలో  ఉన్నాడు.  దీనికి కారణం వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినట్లుగా నేటి మానవుడు శ్రద్ధ వహించటం లేదు. భౌతిక వస్తువులకు, ధనము, దుర్వ్యసనాలకు ప్రాముఖ్యత నిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. దీనితో వ్యక్తిగత జీవితంలోను, సామాజిక జీవితంలోను సుఖశాంతులు కరువయ్యి ఆనందమనే సహజ స్థితిని కోల్పోతున్నాడు.

వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, పుట్టగొడుగుల్లా కొత్త వ్యాధులు పుట్టడంతో మనిషి ఆయుఃప్రమాణం తగ్గిపోతుంది. దీనికి పరిష్కారం యోగ విద్యే.

జీవితంలో కొన్ని విషయాలను కనుక్కోవటం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అది మానవుని యొక్క జీవనశైలిని సులభతరం చేయటమేకాక జీవిత లక్ష్యాన్ని తెలియచేయటం. అలాంటివాటిలో యోగా ప్రముఖమైనది. మన ప్రాచీనులంతా యోగ విద్య నాచరించి సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు. శరీరానికి ఎటువంటి హాని ఉండదు. శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఋజువ అవటంతో మన పాశ్చాత్యులు కూడా దీనిని ఆచరిస్తున్నారు.

మనిషి శరీరం చేయకల్గిన అత్యున్నత వ్యాయామాలతో యోగా ప్రథమస్థానంలో ఉంది. అందుకే ప్రస్థుతం ప్రపంచంలో ఎంతో ఆదరణకు నోచుకుంది. ఏ ఇతర వ్యాయామాలతో పోల్చి చూసుకున్నప్పటికి దీనిలో ఉన్న విశిష్టత వలన యోగ విద్య నాచరించే వారిని ప్రత్యేకంగా నిలబెడుతుందని నిస్సహందేహంగా చెప్పవచ్చు.

శరీరంలో రుగ్మత ఉంది అంటే, అది మనసుకు సంబంధించిన లోపమే. క్రమం తప్పకుండా యోగా చేస్తూ, ధ్యానమాచరిస్తూ శారీరక దృఢత్వం, మానసిక పటుత్వాన్ని పెంచుకుంటే మనలోని శక్తులు వికాసము పొంది పరిపూర్ణానందానికి సహకరిస్తాయి. యోగా అవసరం గుర్తించి ఎక్కువ మంది ఆ వైపుకు పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఇంకా మార్పు రావాలి.

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చే ఆచరణాత్మక, క్రియారూపమైన ఈ విద్యను అందరూ నిరంతర సాధనతో ఆనందంగా, ప్రశాంతంగా, సుదీర్ఘ ఆయువుతో, సంపూర్ణ స్వేచ్ఛతో పరిపూర్ణంగా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ముందుముందు యోగా, ధ్యానం వాటి ఆచరణ విధానం చిత్రాలతో తెలియచేస్తారు.

ఈ బ్రహ్మవిద్యను ఆదరించి, ఆచరించి, ఆరోగ్యం పొందితే నేను చేసిన కృషి సఫలమవుతుంది.

 

 

August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నాట్యశాస్త్ర కోవిదుడు – ఆధునిక భరతముని – తెలుగు భాషా, సంస్కృతీ వికాసానికి అవిరళ కృషి చేసిన – డాక్టర్ పోణంగి శ్రీ రామ అప్పారావు

by Ponangi BalaBasker August 25, 2021
written by Ponangi BalaBasker

సహృదయులు, సాహితీమూర్తి, అలుపెరుగని నిత్య పరిశోధకులు, సాంస్కృతిక సేవా తత్పరులు, శ్రీ కళాపూర్ణ బిరుదాంకితులు ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు – పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురం అనే గ్రామంలో 1923 జూలై 21వ తేదీన శ్రీయుతులు పోణంగి రామమూర్తి, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 11వ సంతానంగా జన్మించారు.  అంటే ఈ రోజు వారి 98వ జయంతి సందర్భంగా  ఆ ఆధునిక భరతముని జీవిత విశేషాలను ఒకసారి మననం చేసుకుందాం.

భరతముని సంస్కృతంలో రచించిన ” నాట్యశాస్త్రం ” గ్రంధాన్ని P.S.R. అప్పారావు గారు – గుప్త భావ ప్రకాశిక సహితంగా – తెలుగులోకి అనువదించారు. దీనినే ఆయన ఆంగ్లంలో ” A Monograph on Bharata’s Natya Sastra ” అనే పేరుతో రచించారు.  ” నాట్యశాస్త్రం ” గ్రంథ రచన అప్పారావు  గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది.  మామూలు అధ్యాపక వృత్తి నుంచి, పరిశోధకునిగా, విమర్శకునిగా, కళా వ్యాఖ్యాతగా రూపాంతరం చెంది – ఆయన విశేషమైన కీర్తి గాంచారు. 1952లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు – B.A. విద్యార్థులకు ” సాహిత్యం – సౌందర్య శాస్త్రం – తులనాత్మక అధ్యయనం ” బోధించవలసి వచ్చింది. తనకు అంతగా పరిచయం లేని ఈ పాఠ్యఅంశాన్ని బోధించడానికి లోతుగా అధ్యయనం చేయాలని భావించి భరతుని నాట్యశాస్త్రాన్ని కూలంకషంగా చదివారు. భరతుడు సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రంలోని ప్రతి వాక్యం, ప్రతి పదం ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా ఉన్నాయని గ్రహించి – ఎంతో శ్రమకోర్చి తెలుగులోకి అనువదించారు. 36 అధ్యాయాలలోని 6 వేల శ్లోకాలను తేట తెలుగులోకి అనువదించి ఆంధ్రులకు చక్కటి కళా గ్రంధాన్ని బహూకరించిన ధన్యజీవి ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావుగారు.  సుమారు వెయ్యి పేజీలకు పైన ఉన్న ఈ గ్రంధంలో సంస్కృత మాతృకలోని శ్లోకాలలోని భావాన్ని పాశ్చాత్య తత్వాలతో పోలుస్తూ – సహేతుకమైన వ్యాఖ్యానాన్ని రచించారు. రాజమండ్రి నుండి వెలువడిన ” సంస్కృతి ” పత్రికలో ” నాట్యశాస్త్రం ” ధారావాహికంగా ప్రచురితమైంది.  1961లో ఈ గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  ఈ బహుమతి అందుకోడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు – అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమ మధ్య అప్పారావు గారిని కూర్చోబెట్టుకుని తేనీటి విందు స్వీకరించి – గ్రంథకర్తలు, మేధావుల పట్ల  తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.

భరతముని ” నాట్యశాస్త్రం ” తో పాటు ఆచార్య అప్పారావు గారు నందికేశ్వరుని ” అభినయ దర్పణం ” గ్రంధాన్ని – తెలుగు, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించి – అభినవ నదికేశ్వరునిగా ఆంద్ర వాజ్మయ చరిత్రలో నిలిచారు. అలాగే ఆయన రచించిన – సాత్వికాభినయం, ఉత్తమాంగ అభినయం, శారీరాభినయం, చేష్టాకృత అభినయం, హస్తాభినయం వంటి గ్రంధాలు నృత్యాన్ని అభ్యసించే కళాకారులకు పఠనీయ గ్రంథాలుగా – ఆయా కళలను బోధించే అధ్యాపకులకు కరదీపికలుగా విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. నాట్య, నాటక, సాహిత్య రంగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఆయన రచించిన “విశ్వభారతి” నవల ఉన్నత పాఠశాల విద్యార్థులకు తెలుగు ఉపవాచకంగా ఎంపికయ్యింది.  ఇంకా “తాజ్ మహల్” నాటకం, “వేణువు” వచన కవిత, మంత్రి తిమ్మరుసు, ఉలూపి వంటి రచనలు విశేషంగా సాహిత్యాభిమానుల ప్రశంసలందుకున్నాయి. అప్పారావుగారి సృజనాత్మక సృష్టికి నిదర్శనాలుగా నిలిచాయి.

అప్పారావు గారు తెలుగు భాషా సమితి వారు ప్రచురించిన – విజ్ఞాన సర్వస్వం – తెలుగు సంస్కృతి – విశ్వసాహితి – లలిత కళల సంపుటాల్లో – పలు వ్యాసాలు రచించారు. అదేవిధంగా – భారతి, కిన్నెర, పరిశోధన, జయంతి వంటి పత్రికల్లోనూ – వివిధ అభినందన సంచికల్లోనూ – ఎంతో విలువైన సమాచారంతో వీరు రచించిన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఆయన పరిశోధనా పటిమకూ, సాహిత్య ప్రతిభకు, పాండిత్య వైభవానికీ ప్రతీకలుగా నిలిచాయి.  ఆచార్య అప్పారావు గారు ఆంధ్రప్రదేశ్ లోని నృత్యాలపై రచించిన పుస్తకాన్ని – 1969 లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ప్రచురించింది. మహా నాటక కర్త ” ధర్మవరం రామకృష్ణమాచార్య ” జీవిత గాధను – అప్పారావు గారు రచించగా – కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీలు – 1974,  1989 సంవత్సరాల్లో ప్రచురించాయి. వీరు రచించిన ” ప్రధమ ఆంద్ర నాటక కర్తలు ” అనే గ్రంధంలో – అనేక మంది నాటక రంగ ప్రముఖుల జీవిత విశేషాలతో పాటు – ను సోదాహరణంగా వివరించారు.

ఇరవయ్యో శతాబ్దంలో జన్మించిన సుప్రసిద్ధ శాస్త్ర-సాహిత్య పరిశోధకులలో డాక్టర్ పోణంగి శ్రీ రామ అప్పారావు  గారిది ఒక ప్రత్యేక స్థానం.  1860 నుండి 1960 వరకు ఉన్న నూరేళ్ళ తెలుగు నాటక వైభవాన్నిసమగ్రంగా సమీక్షించి ” తెలుగు నాటక వికాసం ” అనే పరిశోధనా గ్రంధాన్ని తెలుగు ప్రజలకు, ముఖ్యంగా నాటక రంగ ప్రేమికులకు కానుకగా అందించారు. నాటక సాహిత్యంపై పరిశోధన చేసిన, చేస్తున్న ప్రముఖులందరికీ అప్పారావుగారు అనువదించిన ఈ సిద్ధాంత గ్రంధమే స్ఫూర్తినిస్తోంది.  1956 – 1959 సంవత్సరాల మధ్య – హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి పర్యవేక్షణలో చేసిన ఈ పరిశోధనకు – 1961 లో పీ హెచ్ డీ పట్టా పొందారు. ఈ పరిశోధనలో భాగంగా అప్పారావుగారు సుమారు 2 వేల నాటకాలు, 4 వేల ఏకాంకిక నాటికలు, వెయ్యి మంది రూపకర్తల వివరాలను సేకరించి సమీక్షించి మనకు అందించారు. ఈ గ్రంధం ఆయనకు మంచి ఖ్యాతినార్జించి పెట్టింది.

B.A. ఆనర్స్ డిగ్రీ పొందిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం లోని D.N.R. కళాశాలలో తెలుగు ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం రాజమండ్రి, మద్రాసు, కడప, శ్రీకాకుళం మొదలైన పట్టణాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు అధ్యాపకునిగా దాదాపు 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు.   రాజమండ్రీ లో అక్కడ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నాటికలు రచించి వారిచేత ప్రదర్శింపజేశారు. విద్యార్థినుల చేత మగ వేషాలు వేయించి వారిని ప్రోత్సహించారు.

ఆ తర్వాత 1959 లో పాఠ్యపుస్తకాల జాతీయీకరణ ప్రత్యేక అధికారిగా, సాంస్కృతిక వ్యవహారాల ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. పాఠ్య గ్రంధాల రచన, ముద్రణ విషయంలో అప్పారావు గారు చూపిన శ్రద్దాసక్తులను గమనించి, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న P.V. నరసింహారావు గారు 1968లో  ఏర్పాటైన తెలుగు అకాడమీకి మొదటి డైరక్టరుగా అప్పారావు గారిని ఎంపిక చేశారు. తెలుగు అకాడమీ లక్ష్యాలైన తెలుగు భాషా వ్యాప్తి, అభివృద్ధి, ఆధునికీకరణ, అధికార భాషగా అమలులో రాష్ట్రప్రభుత్వానికి సహకరించడంతో పాటు – వివిధ పాఠ్యపుస్తకాలు, పరిభాషక పదకోశాలు, అనువాద గ్రంధాల ప్రచురణ పెద్ద ఎత్తున చేపట్టారు. అతి తక్కువ కాల వ్యవధిలో – దాదాపు 4 వందల పాఠ్య పుస్తకాలు తెలుగు మాధ్యమంలో తీసుకువచ్చిన ఘనత అప్పారావుగారిదే.  తెలుగు అకాడమీ చేపట్టిన అన్ని పాఠ్య, విద్యా విషయక ప్రచురణల్లో – వ్యవహారిక భాషనే ప్రవేశపెట్టారు. తెలుగు అకాడమీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లేలా పనిచేశారు. తద్వారా తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారు.

1974లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, విద్యా, సాంస్కృతిక శాఖ మంత్రి మండలి వేంకట కృష్ణారావు గారు, ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించాలని తలపెట్టినప్పుడు – ఆ కార్యక్రమ నిర్వహణా భారాన్ని అప్పగించడానికి సమర్ధుడైన అధికారి ఎవరా అని అన్వేషించి – చివరికి ఆ బాధ్యతను P.S.R. అప్పారావు గారి భుజస్కంధాలపై పెట్టారు. చేపట్టిన ప్రతి పనినీ కేవలం ఉద్యోగ ధర్మంగా కాకుండా స్వంత పనిగా భావించేవారు. పగలంతా రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక అధికారిగా సచివాలయంలోనూ, రాత్రంతా ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శిగా రవీంద్రభారతి మొదటి అంతస్తులోని కార్యాలయంలోనూ – నిద్రాహారాలు మాని పనిచేశారు.  1975 ఏప్రిల్ నెల 12వ తేదీ నుంచి వారం రోజులపాటు – హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో వైభవోపేతంగా జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహా సభలను అనితర సాధ్యంగా నిర్వహించారు. ఇది వారి కీర్తి కిరీటంలో కలికి తురాయిగా భాసిల్లింది.

ప్రపంచ తెలుగు మహా సభల్లో చేసిన తీర్మానం నేపథ్యంలో ఏర్పాటైన అంతర్జాతీయ తెలుగు సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు గా నియమితులైన అప్పారావుగారు ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులతో – విద్యా, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించి, తెలుగు భాషా సంస్కృతులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడానికీ – ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రముఖులను అందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావదానికీ – విశేష కృషి చేశారు. అదేవిధంగా విదేశాలలో జరిగిన తెలుగు మహా సభలలో కూడా – ఆయన – ప్రముఖ పాత్ర పోషించారు.

1981లో ఆనాటి ముఖ్యమంత్రి N.T. రామారావు గారు దానిని తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేయడంతో – అప్పారావు గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరక్టర్ గా బదిలీ పై వచ్చి, 1983 లో పదవీ విరమణ చేశారు.

తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు వ్యవస్థాపక డైరక్టర్ గా ఆయన చేసిన కృషి అపర భగీరథ ప్రయత్నంగా పేరుగాంచింది.  అప్పారావు గారు మృదుభాషి. సౌమ్యుడు. విద్వన్మణి.  బంధు మిత్రులతో సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ పరుషంగా కానీ, కటువుగా కానీ మాట్లాడేవారు కాదు. సహోద్యోగులు తప్పు చేస్తే మృదువుగా మందలించేవారే తప్ప ఎవరి మనసును నొప్పించేవారు కాదు. తనతో భావ సారూప్యం గల వ్యక్తులతో తన అవసరానికి తగ్గట్టు ఒక జట్టును తయారుచేసుకుని, తనకు అప్పగించిన బాధ్యతను – చడీ చప్పుడూ లేకుండా పూర్తిచేసేవారు.

చివరగా రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకునిగా ప్రభుత్వ సర్వీసు నుండి పదవీ విరమణ చేసిన ఆచార్య అప్పారావు గారు ఆ తర్వాత సాహితీ, సాంస్కృతిక సేవకు ద్విగుణీకృత ఉత్సాహంతో పునరంకితమయ్యారు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రం లో తెలుగు సాంస్కృతిక రంగ అభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సాహితీ, సాంస్కృతిక, విద్య విషయక సంస్థలకు శ్రీకారం చుట్టి, తమ దీక్షా, దక్షతలతో వాటికి గుర్తింపు, రాణింపు తెచ్చారు.  చాలా కాలం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థను వ్యవస్థీకరించి – సమన్వయ కర్తగా, ఆచార్యులుగా పనిచేసి – ఆ సంస్థ ఉన్నతికి ఎంతగానో శ్రమించారు.   ఆ విధంగా పరిపాలన, బోధన, పరిశోధనా రంగాల్లో – అప్పారావు గారు చేసిన కృషి అనిర్వచనీయమైంది. ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి.

* రాష్ట్ర ప్రభుత్వంనుంచి-1980లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు – పలు అవార్డులు, రివార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

* వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థల నుంచి 1987 లో రాష్ట్ర నాట్య సామ్రాట్, 1990లో నాటక రత్న, 1992 లో కళారత్న వంటి బిరుదులు అనేకం అందుకున్నారు.

* మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, రాజాలక్ష్మీ సాహిత్య పురస్కారం ఆయన్ను వరించాయి.

వీరి తండ్రి గారు  గ్రామ కరణంగా పనిచేసేవారు.  నిత్యం భాగవత పారాయణ చేస్తూ ఉండేవారు. వారు చదివేటప్పుడు దగ్గర కూర్చుని ఆలకించడం వల్ల, చిన్న వయస్సులోనే పోతనామాత్యుని పద్యాలు కొన్ని అప్పారావుగారికి కంఠస్తమయ్యాయి.  తల్లి గారు ఏమీ చదువుకోలేదు. ఎప్పుడూ పిల్లలతో, మనమలతో సతమతమౌతూ ఉండేవారు. అనుబంధాలతో, మమకారాలతో అల్లుకున్న పెద్ద ఉమ్మడి కుటుంబం వారిది. వారి మండువా లోగిలి ఎల్లప్పుడూ బంధుమితృలతో, పరివారంతో, పశుసంపదతో, ధాన్యాదులతో కళకళ లాడుతూ ఉండేది.

వారి చిన్న తనంలో – గ్రామంలో పిచ్చుకుంట భాగవతార్లు ప్రదర్శించే ” ప్రహ్లాద” , “రామ నాటకం” వంటి నృత్య రూపకాలు అప్పారావుగారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ కళాకారులను వీరి తండ్రిగారు, ప్రోత్సహించి, పోషించేవారు. అదే వారి కళాతృష్ణకు బీజం నాటింది.  అప్పుడే – ఆయనకు – కళల పట్ల అవ్యాజమైన అనురాగం పుట్టింది. ప్రాధమిక విద్య స్వగ్రామం లో పూర్తి చేసిన అనంతరం అప్పారావు గారు కొవ్వూరులో అన్నగారి ఇంట్లో ఉండి, విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అప్పారావు గారు ఆరవ తరగతి నుండి స్కూల్ ఫైనల్ వరకు కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. రాజమండ్రీ లో ఇంటర్మీడియట్ చదివారు. ఆ రోజుల్లోనే – కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి ” వేయి పడగలు ” చదివి – ఆ సాహితీమూర్తి పట్ల – ఆరాధన పెంచుకున్నారు. ఆయన వద్దే B.A. చదవాలన్న తలంపుతో – విజయవాడ శ్రీ రాజా రంగయ్య అప్పారావు కళాశాలలో డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు గారు ప్రిన్సిపాల్ గా ఉన్న కాలంలో డిగ్రీ పూర్తిచేసి – 1944 లో విశాఖపట్నం ఆంద్ర విశ్వవిద్యాలయం నుండి – తెలుగు భాషా, సాహిత్యాలు అభిమాన విషయాలుగా B.A. ఆనర్స్ పట్టా అందుకున్నారు. విశ్వనాథ గారి సాంగత్యంలో తెలుగు సారస్వతంపై విపరీతమైన ఆసక్తి పెరిగింది.  అక్కడ చదువుతుండగానే ” తాజ్ మహల్ ” నాటికను రచించారు.  విద్యార్థి దశ లోనే చిన్న చిన్న నాటికలు వ్రాసి, దర్శకత్వం వహించడంతో పాటు వాటిలో పాత్ర పోషణ కూడా చేసి, తోటి విద్యార్థులతోకలిసి ప్రదర్శించేవారు.  1946 లో M.A. డిగ్రీ తీసుకున్నారు. 1956లో  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PHD చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు – అప్పారావు గారికి – సాహితీ స్రష్టలు దేవులపల్లి – రాయప్రోలు – నార్ల వంటి వారితో పరిచయం ఏర్పడింది.

1941 లో S.S.L.C. పరీక్షలో ఉత్తీర్ణులైన అనంతరం వెంకటరమణమ్మ గారితో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరూ ఉన్నత విద్యలనభ్యసించి, ఉన్నత స్థాయిలో స్థిరపడి, తండ్రిగారి ఆశయాలకు అనుగుణంగా జీవనం సాగిస్తున్నారు.

ఆధునిక భారతమునిగా నిర్విరామ సాహిత్య, కళా సేవ చేసిన ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు కొంత కాలం అనారోగ్యంతో బాధపడి 2005 జూలై ఒకటవ తేదీన హైదరాబాద్ లో తుది శ్వాస విడిచి కళా సరస్వతి చెంత చేరారు.

82 సంవత్సరాలు ఎంతో ఫలవంతమైన జీవితాన్ని గడిపిన అప్పారావు గారు  – ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకున్నా- తన రచనల ద్వారా మన హృదయాలలో వెలిగించిన విజ్ఞాన జ్యోతి – నిరంతరం కాంతిని ప్రసరిస్తూనే ఉంటుంది. తరతరాలకూ ఉపయోగపడే అపూర్వ సాహితీ సంపదనూ, కీర్తి, ప్రతిష్టలనూ మనకు మిగిల్చిన ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు నిజంగా ధన్యజీవి.

 

 

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

బన్నూఫ్యాషన్స్

by కోటమర్తి రాధాహిమబిందు August 25, 2021
written by కోటమర్తి రాధాహిమబిందు

లక్ష్మి ఏవెన్యూలో రెండు బ్లాకులు.. ధనలక్ష్మి.. వరలక్ష్మి.. ఒక్కో బ్లాక్లో వంద ఫ్లాట్స్.. రెండు బ్లాక్స్కు కలిపి ఓ లేడీ స్క్లబ్.. భర్త నారాయణ రిటైర్కావడంతో వారం రోజుల క్రితం వరలక్ష్మి బ్లాక్ లోకి అద్దెకి వచ్చింది అలివేలు. అంతకు ముందే భర్త కూతురి ఆలోచనతో ప్రోత్సాహంతో ఇంట్లో వుంటూనే బట్టలు అమ్మే బిజినెస్ చేయాలి అనుకుంది.. ఓ సాయంత్రం లేడీస్ క్లబ్బుకు వెళ్లి తన గురించి తాను పరిచయం చేసుకొని ఫలానా అని చెప్పుకుంది. నాలుగు రోజుల తర్వాత విజయ అనే ఆవిడ అలివేలు ఇంటి తలుపు తట్టింది.. అదృష్టం ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుంది కరెక్ట్గా ఆ టైం లోనే తలుపు తీయాలి అన్న వీరలెవెల్లో తలుపు తీసింది అలివేలు.

‘రండి రండి రండి దయ చేయండి.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అన్న పాట లెవెల్లో విజయను ఆహ్వానించింది అలివేలు.. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.

“ఇప్పటికి ఎంత మంది వచ్చారు”?

“ఒకరు వచ్చారు.. మీరు సెకండ్.. మీరు నాకు చాలా చాలా నచ్చారు.. నేను ఎప్పటి నుంచో మీకు పరిచయమైన  వ్యక్తి లా మీరు మాట్లాడుతుంటే నాకు భలే హ్యాపీగా ఉంది.. మీకో చీర ఫ్రిగా ఇస్తాను.. దయ చేసి ఎవరితో మాత్రం అస్సలు అనకండి.. నేను ఇలా అందరికీ ఇవ్వలేను కదా” అలివేలు అలా అనేసరికి విజయ తెగ ఆనంద పడిపోయి తాను ఆమెకు నచ్చేలా మాట్లాడి నందుకు తనని తానే గొప్పగా మౌనంగా అభినందించుకుంది.. పైకి మాత్రం చాలా బింకంగా మెయింటెయి న్చేసింది.

“ఏ అవసరం పడినా ధనలక్ష్మి బ్లాక్లో ఉండే ప్రతిమ దగ్గరే బట్టలు కొనాల్సి వచ్చేది.. విపరీతంగా ధరలు పెంచుతుంది.. అందరం కాస్త తగ్గించాం..మీరు  క్లబ్కు వచ్చి చెప్పారు కదా.. చీరెలు మిగతా వెరైటీస్ ఎలా వున్నాయో చూసి పోదామని వచ్చాను” అంది విజయ.

“మెనీమెనీ థాంక్స్అండి.. ఎవరో మంజుల గారు అట.. ఆవిడే మొదట వచ్చారు.. నాలుగు చీరలు కొన్నారు ఈ రోజు ఇద్దరిని తీసుకొస్తామన్నారు కొత్తగా వచ్చాం.. మీరూ పది మందికి చెప్పి సహాయ పడండి.. రేట్స్ కాస్లీ  ఉంటాయి ముందు రెండు వాయిదాల్లో చెల్లించేలా అనుకున్నాను.. కొత్త కాబట్టి  మూడు వాయిదాల్లో ఇద్ధామనుకున్నాను. కాశీ నుండి పట్టు చీరలు తెప్పిస్తాను డిమాండ్ని బట్టి సొంతంగానే యిస్తున్నాం కూడా.. మీరు ఏవైనా కొత్త కొత్త సలహాలు ఇస్తే తప్పక పాటిస్తాను.. మీరు నాకు చాలా మంచిగా అనిపిస్తున్నారు.. మీలాంటి వాళ్ల ప్రోత్సాహమే మాకు అండ..బలం” అలా చాలాసేపు ఆమెను ఆపి ఆపి పోనివ్వకుండా మాట్లాడింది అలివేలు.

అలివేలు మాటల తాకిడికి మూడు వెయ్యి రూపాయల చీరలతోపాటు ఒక ఫ్రి

కూడా  పట్టు కెళ్ళింది  విజయ. అలివేలు ఆ చీరెధర కూడా టోటల్లో కలిపి వేసిందన్న వూహ విజయకు రాలేదు..అలివేలుకు రావాల్సినంత వచ్చింది.

****                         ****

“అక్కడ రేట్లు తక్కువగా ఉన్నాయి అంటున్నారు”

“సరితా మేడం..  మీరు కూడా ఇలా అంటే నేను ఎవరికీ చెప్పుకోవాలి? మీరు ఎన్నిసార్లు ఎన్ని చీరెలు నాదగ్గర కొన్నారు? అయినా  మన బ్లాక్వాళ్ళు నాకు అండగా ఉండరా? మనం మనం ఒకటి కదా.. నా గురించి ఎవరో పుకారు లేపారు.. అందుకే ఇలా కాస్తా డౌన్ అయ్యాను.. అయినా ఏం పర్వా లేదు మేడం మీలాంటి వాళ్ళ అండ నాకు చాలా ఉంది” చెప్పిందే ఇంకోసారి మరోసారి గంటసేపు చెప్పింది ప్రతిమ. సరిత ప్రతిమ మాటల ప్రవాహానికి తల్లడిల్లిపోయింది. ఒక్కో చీర పదిహేను వందల రూపాయల చొప్పున మూడు చీరలు.. వెయ్యి రూపాయల చొప్పున రెండు డ్రెస్సులు మొత్తం ఆరు వాయిదాల్లో చెల్లించేట్లు మాట్లాడుకుని వెళ్ళిపోయింది.. ఆ రోజు క్లబ్లో అలివేలు ప్రతిమల టాపిక్లు మెయిన్గా అయ్యాయి.

****                         ****

పదిహేనురోజులు గడిచాయి.. అలివేలు నోట్చేసుకున్న పేపర్లోని వివరాలు ఏవరో ఇచ్చిన కొత్త డైరీ లోకి  ఎక్కించాడు నారాయణ.

“ఇదిగో.. అన్ని ఇలా నోట్చేసుకో.. విడి పేపర్ల మీద రాయకు..ఇంకో విషయం. వచ్చిన వాళ్ళతో నీకు మాట్లాడడం అంత బాగా రావటం లేదు.. నువ్వు ఏదన్న తప్పుగా మాట్లాడితే నేను ఒక స్పూనో.. ఒకగరిటో.. ఓ ప్లేటో.. క్రింద పడేస్తాను.. నువ్వు అర్థం చేసుకుని లోపలి కన్నారా.. లేదా జాగ్రత్తపడు”

“అలాగే”

“చాలా మంది వాట్సాప్ లో బట్టలు డ్రెస్సులు ఫోటోలు పెట్టమంటున్నారుకదా.. ముందు మనం ఈ బిజినేస్కు ఒక మంచి పేరు పెట్టాలి”

“ఇంట్లోనే కదా అమ్మటం..పేరు ఎందుకు”?

“ఫ్యూచర్లో ఇలాగే ఉంటామా ఏంటి? ఒక మంచి పేరు అయితే ఉండాలి”

“చిన్ను..జున్నూ..గున్నూలాగా మన మనవడి పేరు బన్నూ ఫాషన్స్ అని పెడదామా”?

“బాగుంది బాగుంది.. బిజినెస్ లోకి రాగానే నీబుర్ర కూడా బాగానే పనిచేస్తుంది”

కాలింగ్బెల్మోగింది..”సరే.. నా బుర్ర ఎంత బాగాప నిచేస్తుందో ముందు ముందు మీకే తెలుస్తుంది గాని.. మీరు వంట ప్రయత్నం మొదలు పెట్టండి” నవ్వుకుంటూ ముందు గదిలోకి వెళ్ళింది అలివేలు.

****                             ****

నెల రోజులు గడిచాయి.. వరలక్ష్మి బ్లాకులో అలివేలు బట్టల బిజినెస్  జోరుగా సాగుతుంది.. బట్టల బండిల్ రావటం అయిపోవడం.. రావటం అయిపోవడం.. “నిత్య ఖరీదులు.. పచ్చ నోట్లలా” ఉంది వ్యాపారం.. ఆనందంతో  కూతురికి ఫోన్చేసింది అలివేలు.

“అమ్మా..ఎలా ఉన్నారు”?

“బాగున్నాం”

“అల్లుడు ఊరెళ్తా అన్నారు..వెళ్లారా”?

“వెళ్లారు.. నాన్న ఏం చేస్తున్నారు”?

“నాన్న..కూర చేస్తున్నారు..వచ్చిపోయే వాళ్ళు ఎక్కువయ్యారు”

“అన్నిజాగ్రత్తగారాసుకుంటున్నావా”?

“డైరీలోనోట్చేశారు నాన్న..నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను.. అయినా ఇంకా కొత్తక దానాకు.. ఈ వ్యాపారం పుణ్యమా అని నాన్నకు బోర్కొట్టకుండా ఉంది.. నాకు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు.. ముఖ్యంగా నాన్నకు వంట పని కూడా అలవాటు అయింది.. నేను వంటజోలికే వెళ్లటం లేదు.. సరే ఉంటానమ్మా.. మళ్లీ మాట్లాడుతానులే.. ఎవరో వచ్చారు” కాల్కట్చేసింది అలివేలు.

****                             ****

రెండు రోజులు గడిచాయి.. అలివేలు లేచి తలుపు తీసేసరికి నాలుగు పెద్దపెద్ద కార్టన్స్ కనిపించాయి. భర్తను కేకేసి వాటిని లోపలికి జరిపించింది. సంవత్సర కాలం గడిచింది.. అలివేలు వ్యాపారం ముప్పయి పువ్వులు అరవై కాయల్లా అయింది. ఫ్లాట్స్లో వాళ్లంతా వాళ్లు కొనుక్కోవడమే కాకుండా బంధు వర్గాలు స్నేహితులతో కూడా కొన్నికొన్ని కొనిపించసాగారు.. అలివేలు మాటకారి తనం అంతగా వాళ్ళను ప్రభావితం చేసింది. మొబైల్మ్రోగింది.

“అమ్మా..చెప్పు” అంది అలివేలు.

“అమ్మా..నీకు మెనీమెనీ థాంక్స్ అమ్మా”

“నాకా? ఎందుకే”

“అమ్మా..నేను పడిపోకుండా నన్ను నిలబెట్టినందుకు”

“నీమొహం.. చాల్లే.. అయినా ఇందులో నేను చేసింది ఏముందే.. అన్ని ఆలోచనలు మీనాన్న గారి వినీవి. .దేనికైనా పోటీ ఉంటేనే కదా లాభం. నాన్న రిటైరయ్యారు.. పెన్షన్ ఫర్వాలేదు.. ఇద్దరం హాయిగా బ్రతకవచ్చు.. నీ పరిస్థితి తెల్సుకుని నీకు పోటీగా నన్ను నిలబెట్టారు.. వచ్చాం..వ్యాపారం వృద్ధిచెందటానికి అల్లుడుగారు సరుకుతెస్తున్నారు. ఎన్నెన్ని వూర్లు తిరుగు తున్నారు? ఎంతెంత సరుకు ఇద్దరికీ తెస్తున్నారు.. అంతా వాళ్లిద్దరి సహకారమే కదా.. డల్ గా ఉన్న నీ వ్యాపారం మళ్లీ పుంజుకుంది. . తల్లి తండ్రిగా మాకు ఇంతకంటే ఇంకేం ఆనందం కావాలి”?

“అమ్మా”

“వ్యాపార మెళకువలు.. మాట్లాడే విధానం నువ్వు నాన్న నాకు నేర్పించారు.. నీతోపాటు మాకు లాభాలు వస్తున్నాయి.. ఖాళీగా వుండకుండా చేదోడు వాదోడు అన్నట్లు ఎంత హాయిగా రోజులు వెళ్ల దీస్తున్నాం.. సరదాగా  ఒక మాట చెప్పనా? నేను నాన్నలా ఉద్యోగం చేస్తున్నట్లు నాన్న నాలా వంట చేస్తున్నట్లుగా వుంది. మళ్ళీ నాన్నతో అనకు ఫీల్ అవుతారు.. నేను అందరికీ తెలిసిపోయాను.. అంతా పెళ్లిళ్లకు కూడా మన దగ్గర కొంటున్నారు. ఇంకేంకావాలి? కానీ ఓ విషయం”

“నేను చెప్తాను నువ్వు ఉండు.. మనం తల్లి బిడ్డలమని బయట చెప్పేద్దాం”

“అదే చెప్పబోతున్నాను.. అప్పుడే వద్దే పిచ్చిమొహమా.. ఇలాగే కొంతకాలం గడవనీ.. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు.. ఇదో బిజినె స్టాక్టిక్స్.. పోటీ ఉంటే లాభం ఎక్కువ.. ఈ మాట ఇదివరకే అనుకున్నాం.. అయినా ఏ ప్లాట్స్లో ఉండేవాళ్ళు అయినా ఎక్కువగా తలుపులు మూసుకునే ఉంటారు.. ఎవరి బిజీ వాళ్ళది.. మన విషయంలో ఎందుకు ఇంట్రెస్ట్చూ పిస్తారు? ఏదో కనుక్కోవాలనే తీరిక ఎవరికి ఉంది”?

“ఎప్పుడన్నా బయటపడితే”

“అయ్యో.. మీకు తెలియదా.. చాలామందికి తెలుసు.. అని  నవ్వుకుంటూఅంటాం.. అదే మన సమాధానం”

“అమ్మా”

“అంతగా ఆశ్చర్యపోకు.. ఇది వ్యాపారం.. మనవడు బన్నుఎలా వున్నాడే? నన్ను అడుగు తున్నాడా”?  అలలు అలలుగా నవ్వింది అలివేలు.

“పేరు పెట్టావుగా.. బన్నూ ఫాషన్స్ అని..రేపటిరోజున  వాడి పేరు పెట్టుకున్నందుకు నీ బిజినెస్లో నిన్ను ఎంత పర్సంటేజ్ అడుగుతాడో.. వాడు నీకంటే తెలివికలవాడు.. ఉంటానమ్మా” ఆనందంగా అంది  అలివేలు  కూతురు  ప్రతిమ.

“మంచిదమ్మా.. ఆల్దబెస్ట్.. గుడ్లక్” అంది ప్రతిమ తల్లి అలివేలు.

 

****        సమాప్తం         ****

August 25, 2021 7 comments
1 FacebookTwitterPinterestEmail
కథలు

కాని కాలం

by Butam Mutyalu August 25, 2021
written by Butam Mutyalu

నాలుగు అన్నం పొట్లాలను వారి చేతికిచ్చి ”ఇగ నడవుండ్రి” అన్నడు. అవి దీస్కున్న జోగమ్మ, పుల్లయ్య, సామి, సాయమ్మలు
వారికి చేతులెత్తి నిండ సలామ్‌లు పెట్టిర్రు అలా పెట్టి వారు వడివడిగా ముందాుకు కదిలారు.
అటువైపునుంచి ఓ కాళీ ట్రాలీ ఆటో రయ్యిమంటు దాూసుకొచ్చింది. ఆ పెద్దాసారు దాన్ని ఆపి ”ఎటువైపు
ఎల్తున్నవ్‌రా” అని అడిగాడు. ”సారు మా ఇంటికెళ్తున్న” అని ఆటో అతననగానే ”అచ్చ మూటముళ్లెత్తుకుని పోతున్న
గాళ్లను, వారు వెళ్లే చివరి బస్టాప్‌లో దింపు.” అని తన మానవతను చాటుకున్నాడు. డ్యూటీలో లాటిపట్టి కఠినంగా
వ్యవహరించే అతను తనలోను సాటిమనుషులపట్ల దాయాజాలికరుణ ఉందాన్నడనికినిదార్శనంగా నిలిచాడు అతను.
”అలాగే సార్‌” అంటు ట్రాలీ ఆటో ముందాుకు పోనిచ్చి వారి ముందాపిండు, ఆటో దిక్కు కంగారుపడుతూ
చూసింది సాయమ్మ ”ఇగో సూడండి ఆ పెద్దా సారు చెప్పిండు బస్టాపుల దింపుత జల్ది ఎక్కుర్రి” అని ఆటో అతననగానే
”అమ్మయ్య కశ పాణం తావున పడ్డది సారు దాయళ్లోడేరో ఎక్కుర్రా” అని శిడంల ఎక్కి కూకుండ్రు అందారు. ఆటో
రయ్యిమంటు ముందాుకు దాూస్కపోతుంది.
”ఏంది పుల్లయ్య బావ మనబతుకు ఇట్టైపోయే బతికిచెడ్డోని భాగ్యం చూడల్నట చెడిబతికినోని చెంపలు చూడలట,
చెంపలు ఉబ్బిందిలేదాు, బాగుపడ్డది లేదాు” అని సాయమ్మ అనగానే ”ఏం చేస్తం పిల్ల లోకం మీదా పాపం పెర్గింది ఇది
దాుర్గాలం అందాుకే కాలం ఇట్టైంది. ఇది ఎన్కటి కాలమా మనిషిని మనిషి పీక్కతినే కాలం, మనకు ఇగ గతిలేని పానాన్కి
గంజినీల్లె పాన్కం అదే ఆసరైతది గనిపా” అని నిరాష వదానంతో అన్నడు పుల్లయ్య.
ఆటో రైయిమంటు ముందాుకు సాగింది వారు చెప్పిన చోట ఆగింది. వారు దిగి వీస్తూపోయి అటిటు దిక్కులు
చూడసాగారు. ఎటు చూసినా పిల్లపీసులేదాు పట్నం కరోన మహమ్మారి చింతల చిన్నబోయింది. పోలీసుల గస్తీ కొన
సాగుతుంది. ఆక్కడక్కడ కాళ్లకు బుద్దిచెప్పి వారికి మల్లె ఊరిబాట పట్టినవారు పెట్టెబేడతో నడుస్తూ ముందాుకు సాగుతుండ్రు
”వారిని చూస్తూ మనము నడుద్దాం పదాండి” అంటు కదిలిండు పుల్లయ్య. అతని వెనకాల వారు కదిలారు.
”అన్నం పొట్టం బద్రాంగ సంచిల బెట్ననా” అని అడిగిండు పుల్లయ్య భార్యవైపు చూస్తూ.
”ఆ… పెట్టిన గని అన్యాల్కం పాడుగాను మన బత్కు చచ్చిచెడి కుడ్తిల పడ్డ ఎల్కయిపాయె” అని దీనంగ పలికింది
జోగమ్మ.
”దేవుడు మనిషి పాపాలకు కోపాలు దెచ్చుకొని కండ్లెర్రజెత్తే మన బత్కులు కానికాలం కాటున బడ్తున్నయ్‌ు
ఎన్కట్కి గత్తరొస్తె ఊర్లకు ఊర్లె ఇడ్సిరని పెద్దాలు చెప్తుంటె ఇనలేదా. ఇప్పుడు పేరుకు తిధాులు అయ్యె, నచ్చత్రాలు,
రాశులు, ఋతువులు గయ్యెగని మన్సి బుద్ది మారింది. అవినీతి, బందాుప్రీతి, దోస్కతినుడు, లొప్కతాగుడు గిదేగిప్పుడు
మనిషినైజం. నమ్మితిర సిద్దా అంటె ముంచితిరా బిడ్డ అంటుండు అంటుండు దాుర్భుద్దితో” అంటు వారగా చూస్తూ
నడుస్తునే ఆయిసులేని మొముతో పల్కిండు పుల్లయ్య
”అయితే మంచి గింతన్న లేదాంటవా” అన్నడు స్వామి.
”లేకం ఉండబట్టె గాయినకు బుద్దిబుట్టి బువ్వ పొట్లమిచ్చె, కాని ఎన్కట వీరబ్రహ్మం చెప్పినట్లు జర్గుతుంది”
అన్నడు పుల్లయ్య.
”అవునవును ఏడుదొడ్లకు ఒకదొడ్డి మిగులుద్దాని అన్నడట, తాత అంటుంటె ఇన్న” అని పలికిండు స్వామి.

”అయ్యల మన చిన్నతనాన ఊరినిండ పసులు, ఇంటికో దొడ్డి మరి గియ్యాల ఊల్య పసురం సూద్దామన్న వాటి
జాడ లేదాు ఒకవేళ అయిదెచ్చిన ఆట్కి మేత కర్వు గడ్డిగాసం కర్వు యంత్రాలదెచ్చి ఎవుసాలుజేస్తుండు అందాుకే ఊల్య
కూలి కర్వు. బస్తిల స్తే తలపైకెత్తిసూసె బంగ్లాలు, నడ్మంత్రపు సిరితో సుఖానికి మరిగి తూగుటుయ్యాల గట్కొని
ఊగుతుండు” అని పల్కుతూనే సరసర ముందాుకు సాగుతుండు పుల్లయ్య.
అబ్బబ్బా అట సర్రసర్ర నడుస్తరు! నడ్సినడ్సి కాళ్లు పీక్కపోతున్నాయ్‌ు. ఇంత దాూరం నడ్సినం పిల్లల కాళ్లు సుత
గుంజపట్టె ఇంక నడ్వ మన వశమైతాదా” నీరసంగ పలికింది సాయమ్మ.
”ముంతెడు నీళ్లకే ముడ్డివొర్గల బెడ్తెఎట్ల, జపజపనడుర్రి”. అన్నడు పుల్లయ్య.
”ఇగనావల్లగాదాు కాసేపు కూలపడి దాూపతీర్చుకొని పోదాం” అన్నది జోగమ్మ. సరె అంటూ అందారూ కాసెపు సేదా
తీరీ దాూపతీర్చుకున్నారు.
”ఏమయ్య ఏదాన్న కాళీగొచ్చె లారిని ఆపయ్య” అన్నది పెనిమిటిని దిగులుపడుతు సాయమ్మ.
”నేను అదే సూస్తున్న” అంటునే ఎదాురుగా వచ్చే లారికి చెయ్‌ు అడ్డం పెట్టి ఆపిండు. వీరి అవతారం చూసిన లారి
డ్రైవర్‌ పిసరంత జాలితో వారిముందాు లారీ ఆపిండు. ఆకలి దాూపతో అగుడుపట్టినట్టు గబగబ లారీ ఎక్కిండ్రు.
”ఎక్కడి వరకు పోవాలి” అని అడిగాడు వారివైపు చూస్తూ లారీ డ్రైవర్‌.
”అన్నన్న నువ్వు ఏడిదాంక పొయినా సాలు ఆడ దింపు అదే మాకు పదివేలు, మీ మేలు మరువం” అని అతనివైపు
చూస్తూ ఊపిరి పీల్చుకుండు పుల్లయ్య. డ్రైవర్‌ లారీ స్పీడ్‌ పెంచాడు. లారీ రయ్యిన ముందాుకు దాూసుకుపోతుంది వారు
అందాులో కూలపడ్డరు మనసున రుక్మతితో కుదార్థంగా మనాదిల పడ్డరు. లారీ అద్దాంకి బైపాస్‌ వద్దా వారిని దింపి
మిర్యాలగూడ వైపు సాగిపోయింది.
లారీ దిగిన వారు కాసింత సేదా దీరుదాం అంటు చెట్టు నీడన కూలపడ్డరు. సంచిలో ఉన్న పొట్లం బైటికి తీసింది
జోగమ్మ ఆకలిగొన్న పోరడు కండ్లు పెద్దావి చేసి తల్లివైపు తహతహలాడుతూ చూస్తున్నాడు. పోరనిక గింత తిన్పంచి
తనుగింత తిన్నది. అంతా ఆకలి దాూప తీర్చుకొని కూలపడ్డరు. వారు నడ్సినదాన్కి ఇంకా కాళ్లు గుంజుతున్నయ్‌ు. వాడిన
మొఖంతో ”కాళ్లు గుంజినా కడ్పునొచ్చినా మనకీ తిప్పలు తప్పయి అంటు చెట్టు దాప్కు ఒరిగిండ్రు అతని బట్టలు
సోరుపుతో మురికిపట్నయ్‌ు, సెమట ఒంటికి అట్టుకట్టింది. వారు ఒకరిని ఒకరు చూసుకుంటు పరేషాన్‌లో పడ్డరు,
”ఏంది జోగా సింత చేస్తున్నవా” అని బార్యవైపు వారగా చూస్తూ అడిగాడు.
”ఏంలేదాు బావ” అని అంటూనే ”నాకు మనం ఊరికి పోవడం సుతారం ఇష్టం లేదాు” అని నేల చూపులు చూస్తూ
పలికింది, వారివైపు కొడుకు శివ అమాయకంగా చూడసాగాడు.
”ఎందాుకిష్టం లేదాు” అని అతననగానే ”నీకు తెల్వదా మా నాయిన పచ్చి తాగుబోతోడు ఇంటిగురించి చింతలేనోడు.
మాయమ్మ, నేను కూలినాలి చేసి ఇల్లెల్లదీస్తుంటే అయ్య మా ర్కెలకాశపడి ఉంటడు. ఆడదాని రెక్కలకాశపడ్డ మొగడుంటేంది
లేకుంటేంది. మా అమ్మేం సుఖపడ్డది మేమేం బాగుపడ్డం. నేను పెళ్లీడుకు వచ్చినని కట్నాలు ఇచ్చి పెళ్ళి చేయలేక పెళ్లాం
సచ్చినోన్కి మారుమనుం ఇచ్చి చేతులు దాుల్పాలనుకుండు అయ్య. అది తల్సుకుంటే నా ఒళ్ళు కంపరంపుడ్తది. అది
ఇష్టం లేకే నీదాంట చేర్తి ఇంట్ల చెప్పాపెట్టకుంట కాలు గడపదాటి నీతోని పట్నంలో పడ్తి. ఇగ నా బతుకు నువ్‌ సూడన్ద

ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలి నేను మనిషినే నాకు మనస్సుంది అంగట్ల బెట్టి బేరం జెయ్య నేను పసురాన్ని
కాదాు కదా” ఎగదాన్నుకొచ్చే దాుక్కాణ్ణి అదాునుకొని ఒణుకుతున్న స్వరంతో ముక్కుని చీదాుకుంట పలికింది.
”జోగ నువ్వన్నది నిజమే కాని నిన్ను ఏంసుఖపెడ్తి యాడికిపోయినా మన బతుకు గింతేగని నివ్వేంపికరుచేయకు”
అని ఓదార్పు మాట పలికిండు.
”అబ్బ కాళ్ళు గుంజుతున్నయ్‌ు అమ్మో” అని శివగాడు తల్లి ఒడిలో వాలిండు.
”లేత అరికాళ్ళకు బొగ్గలొచ్చినయ్‌ు ఒర్సుకో నాయన మా అయ్యగని కాసేపయితే ఇంట్లపడ్తం” అని కొడుకును
చూస్తూ పలికిండు అప్పుడమెకు కొడుకును చూస్తాలికి పాణం దేవినట్టయింది. ఒడిలో అలాగే కొడుకు కాళ్ళు నిమురుతూ
నిద్రాపూచ్చింది. తనకాళ్లు చూస్కుంది కాయాగాశ్న కాళ్ళు నడ్సినడ్సి పచ్చి పుండ్ల్షెనట్టున్నయ్‌ు ఒళ్లంతా అలిసి పులిసిపోయింది.
ఆమెకు కాసింత ధైర్యం చెప్తు ”అట్ట ఆయాసపడితే ఎట్ల ఓర్సుకో ఓర్సుకున్నోనికి ఓరుగల్లంత పట్నం దాక్కుతుందాట”
అని అన్నడు. ”నన్ను ఓపిక ఓపిక పట్టు అంటున్నవ్‌ నీకుమటుకు లేదా ఒళ్లు నొప్పి, మనకా ఊరిలో తినే తిండి కరువు,
కట్టే బట్ట కరువు పుట్టి బుద్దెరిగిన సంది ఈతంగ తిన్నది లేదాు సుఖంగ పన్నెది లేదాు. కష్టాలకాడి ఎత్తుకుని రెక్కలు
అలువంగ చేస్తిమి” అంటు లోలోన మదానపడసాగింది.
”మనకీ ఈ ఊరికి రావాలని కుషాలా గతిలేని సంసారానికి మతిలేని మొగుడన్నట్టు అయిపాయ్‌ు నా బత్కు”
అన్నడు పుల్లయ్య.
”అదేమో మాయదారి కరోనా భీమారి తుఫాను లెక్క దాూసుకొచ్చే. ఉరుముల్లేవ్‌ మెరుపులేక బతుకులపై పిడుగులు
కురిపిస్తుండే, దానిదెబ్బకి గుండెళ్ల ఒకటే దాడదాడ మొదాలైంది. కుదాురులేని దాడదాడతో జనం దాంచికొడ్తున్న తుఫానుకు
చెట్టుకొకరు పుట్టకొకరైర్రూ. అదేమో అలిపిరిడువక జనం అంతు సూస్తుండే” అన్నడు స్వామి.
”అవునవును అన్ని బందాు పెట్టి జనం ఇంటికే అంటిలయ్యిర్రు. యాడ సూసినా ఏ నోట విన్న గొంతు పెగలక
భయంతో ఒణుకుతుర్రు పీనిగె ముట్టని రోజులకొచ్చింది. సచ్చినోడు ఆకరి చూపులకు నోచుకోకుంటయిపాయె. అదేమో
గుండెలమీదా కుంపటి రాజేసి పేదా, ధానిక తేడ లేక అందార్ని కాల్చుకతింటుంది. దీని ముదానష్టం గాను ఎందార్ని
మింగుదో, ఎందారి ఉసురు తీస్తదో, కూలీ జనం బతుకుల్ల మిన్ను విరిగి మీదా పడట్టాయే” అన్నది సాయమ్మ.
”ఎల్లకాలం ఉంటాది దీనికి పాడే గట్టి ఉప్పుపాత్రేశే రోజొస్తది”
”అగో ఆ రోజెప్పుడోస్తదో గాని డక్టర్లు, నర్సులు, పాణాలు లెక్క, జెయ్యక ఇళ్ళు పిల్లలిడ్సి రోగులకు సేవ
జేస్తుండ్రి కంటికి కనిపించని కాని రోగం బారిన పడి సస్తుర్రి ఏం లాభం అది నిజమేగని ప్రైవటు దావఖానలల్ల గీ
రోగానికి లక్షలకు లక్షల ఫీజులు గుంజుతుండ్రట, అగో చచ్చిన శవాలను ఒక చిథిపేర్సి కాష్టం పెడ్తుండ్రు ఆ చావు
పగోనికి రావద్దాు తల్లి. ఆ నలుగురు ఎవనికి ఎవ్వరు ఏమికారు, ఒక వూరు అసలే కాదాు. ఒక చితిమీదా తగులపడ్తుండ్రి
గిదేంగోసనే తల్లి” అని జోగమ్మ అనగానే
”నిజంగానానే” అని మిడిగుడ్లతో చూస్తూ సాయమ్మ అన్నది.
”అవునే అమ్మ రాత్రి టి.వి.ల చూస్నా కొన్ని తావులల్ల డోజర్‌తోటి మాయబొందాలు దోడి సచ్చిన పీనుగలను
కుప్పకుప్పకే అళ్ళేసి పూడ్సుండ్రు ఏం కాలంవచ్చే భగవంత” అని నిట్టురుస్తూ అనగానే ”అయ్యో పాపం మందాులేని

రోగాలను చూసినం గని గిసోంటి రోగాన్ని మనుండంగ ఎన్నడు చూడలే తల్లి, తల్చుకుంటే పాణం గడగడవనుకుపుడ్తుంది.
అది జాదిలకొస్తేనే ముద్దా మింగుడుపడ్తలేదాు. టి.వి. లచూస్తే వాంతికి అయితట్లయిందే అని దీనంగా పలికింది జోగమ్మ.
”గాజోలి ఎందాుకు దాలుస్తవు, మాయరోగం కట్టడికి నిద్రాహారాలు మాని పాపం పోలీసులు సుత రాత్రిపగలు
డ్యూటీ చేస్తుండ్రి. అదేందో గని విచిత్రంగ ఆళ్ళకు సోకుతుంది దీనమ్మ దెష్ట ముండ ఎన్ని రోజులిట్ల గోస దీపిస్తదో,
ఫోన్లల్ల పలకరింపులు, ఫోన్లల్లనే ఏడ్పులు, తూడ్పులు అరిగోసె దీపిస్తుంది దీనిగత్తర తగల” అని జోగమ్మ అన్నది.
”అమ్మా గాళ్లు సుత మూతికి ముస్కులేకుండ తిరిగేటోళ్ళను కసరెళ్ళదీస్తుండ్రు అని స్వామి అనగానే అది మనకోసమేగా
అనే పుల్లయ్య.”మరి గంతగనమా ఎవ్వరిదైన ప్రాణమేచచ్చెదాంక కొడ్తరే యముని లెక్క”
”అదే గత్తరై కుసుంటే దానికేడ తాక్తది గత్తర. ప్రపంచం సాంతిమి సాపలెక్క సుట్టుకొనొస్తుంది. ఏమో పోవయ్య
మన బతుకు శివడు చీదాకుంటాయో, మశడు వొల్లకుంటయ్‌ుపాయె” అన్నది సాయమ్మ.
”ఎందాుకు తియ్‌ు గంజో గట్కో తాగి పాణాలు నిలుపుకుందాం వాన రాకడ పాణం పోకడ తెల్సినోడెవడు, పొయ్యే
జీవిని ఆపేటోడెవడు, ఎట్టయ్యే దాుంటే అట్టయ్‌ుతది సరే గాని చిన్నగ బట్టదాుల్పుకొని బాటపడదాం” అని పలికిండు
పుల్లయ్య.
”ఔనానే ఇంతకు మనల ఊళ్యకు రానిస్తరా పరీక్ష చేశ్నంకనే రానిస్తరట” అని పలికిండు స్వామి.
”ఇన్ని అనుమానాలెందాుకురా నీకు, అనుమానం పాత రోగం. మనకు ఇళ్ళే దావఖాన అయిన ఊళ్యకు పోయ్యేటోనికే
ఒస్తున్నాది ఊళ్య ఉన్నోళ్లకి రోగం సోక్తలేదా పొయ్యేటోడు ఏడంగనైనా పోతడుగాని ఏమే జోగి శివగాన్ని నాకియ్యి నే
నేెత్తుకుంట, సంచి నీవు సేతపట్టు” అని లేసిండు పుల్లయ్య. పిలగాన్ని పెనిమిటిచ్చి ఆమె సంచి చేతబట్టి అతనెనకాల
బాట పట్టింది. వారు వాళ్ళ ఊరివైపు సాగుతుండ్రు. బతుకుపై ఆశతో రేపటి తరాన్ని బతికించాలన్న తపనతో……

August 25, 2021 1 comment
11 FacebookTwitterPinterestEmail
కవితలు

ఇన్‌ల్యాండ్ లెటర్

by ఆచార్య ఎన్. గోపి August 25, 2021
written by ఆచార్య ఎన్. గోపి

చాలా కాలం తర్వాత
ఉత్తర మొచ్చింది.
అదీ ఒక ఇన్‌ల్యాండ్ లెటర్.
ఎంత అందంగా ఉందిది!
ఇది కార్డు ముక్కకు అక్క
లిఫాఫాకు చెల్లెలు.

అందుకోగానే చిరగ కుండా
అపురూపంగా విప్పడం అలవాటు నాకు.
దానిని మడత పెట్టే టప్పుడు కూడా
అంతే జాగ్రత్త!
ఒక వైపు గ్రహీత చిరునామా
ఇటు వైపు మన అడ్రసు
అంటించిన తర్వాత
లోపల ముత్యాల్లాంటి గరగరలు
నాస్టాల్జియా అని
కొట్టి పారెయ్యకండి!
ఇది పోస్టాల్జియా.

మడతలే
ఇన్‌ల్యాండ్ లెటర్ ప్రత్యేకత,
కాని
ఓ మిత్రుడు మరణించిన వార్తను
తెచ్చి నప్పుడు మాత్రం
అది అతనికి కప్పిన
కఫన్‌లా అనిపించింది.

విప్పితే చిన్నదే కావచ్చు
కాని
500 చ. సెంటీ మీటర్ల విస్తీర్ణంలో
అక్షరాల పంట లెన్నో పండించ వచ్చు.
భావుకులకైతే
అదొక కావ్య ఖండికల వేదిక
రాయక ముందూ
రాసిన తర్వాతా
దానిని తూకం వేస్తే
ఎడమ వైపే ఎక్కువ బరువు తూగుతుంది.

అనుబంధాలూ దుఃఖాలూ
అరోపణలూ వాగ్దానాలూ
రోగాలూ రొష్టులూ
అన్నింటినీ భద్రంగా
ఉద్దిష్ట వ్యక్తికి అందించే
ఉత్తమ విశ్వాస ధూతిక.

ఎన్నడూ నేను
శ్రీమంతుణ్ని కాదు
కాని పెళ్లికి ముందు నా అర్ధాంగి రాసిన ప్రేమలేఖలూ
మహా కవి సినారె ఓ కుర్ర కవికి రాసిన
ఆశీః పూర్వక ప్రత్యుత్తరాలూ
ఇప్పటికీ నా పెట్టె అడుగున
ధగధగ లాడుతున్నాయి.

ఎర్రని పోస్టు డబ్బా
అడవిలో కనపడ్డా
ఒక ఆత్మీయుణ్ని కలిసినంత
సంబర పడి పోతాను
ఒక చోట కదల కుండా వుంటూనే
సమస్త విశ్వాన్ని కదిలించే
అద్భుత వ్యవస్థకు ప్రతీక అది.

ఇవాళంతా ఇన్‌ల్యాండ్ లెటర్‌ను
జేబులో పెట్టు కొని తిరుగుతాను
కరెన్సీ నోట్లు
చిన్న బుచ్చు కున్నా సరే.

August 25, 2021 5 comments
4 FacebookTwitterPinterestEmail
కవితలు

ఫినామినల్ పెయింటర్ (విలక్షణ చిత్రకారుడు)

by Atla VenkataRamireddy August 25, 2021
written by Atla VenkataRamireddy

సూర్యుని మించిన చిత్రకారుడు
ఎవరైనా ఉన్నారా !
కనిపించిన ప్రతిదానికీ
రంగుల భంగులు దిద్దీ దిద్దీ
చివరికి తానే
రంగుల్లో మునిగి పోతాడు
రోజురోజూ !

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

*ఎంతో గొప్ప*

by గురిజాల రామశేషయ్య August 25, 2021
written by గురిజాల రామశేషయ్య

భావాలు ఆవహిస్తే చాలు !
అక్షరాలు నీటి బిందువులై
అక్షరాలు పదబంధువులై
పదాలు వాక్యపథ రసాస్పదలై
వాక్యాలు వాంఛితార్థప్రదాలై
*_కవిత్వం_* రూపుగడుతుంది.
ధరించే సంఘటనల’దుస్తులను
మనఃకాసారంలో చక్కగా ఉతుక్కొని
తేట విమర్శనలో ఝాడించుకొని శ్రద్ధగా శుభ్రపరచుకొని పిండుకొని
గౌరవ’భద్రంగా నీరెండకు ఆరవేసుకొని
జాగ్రత్తగా తీసుకొని తొడుక్కుంటూ
పై కండువా సవరించుకుంటూ
అక్షర వీథుల్లో మందహాస వదనంతో
గంభీరంగా కవిగా’నడవటం ఎంత గొప్ప !!
( “కవి కావటమే గొప్పసంఘటన” ౼ సినారె__నా ‘అక్షర పతాక’ కవితా సంపుటిని అంకితంగా స్వీకరిస్తూ ఆవిష్కరణ సభ లో సినారె గారు పలికిన మాటలు గుర్తుకు వచ్చి ..)

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జీవితపు సరిహద్దుల దగ్గర

by ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ August 25, 2021
written by ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్

మనిషి ఎదురుపడితే
పులి ఎదురుపడ్డట్టే
ఆత్మీయ ఆలింగనాలు
సోదర కరచాలనాలు కాదు
‘ఆత్మకు శాంతి కలుగుగాక ‘
సానుభూతుల వెల్లువ –

కడప దాటితే
అమావాస్య అడవిలో ఆగమయినట్టే
ఏ ముట్టడి నుండి
ఏ స్ట్రైన్ కమ్ముకుంటుందో (స్ట్రెయిన్)
భయపడినట్టే ఇల్లు ఇల్లంత వేడెక్కి
ఎవరికి వారు ఒంటరై
అంబులెన్సుల్లో ఆసుపత్రుల్లో
వింత వింత శబ్దాల మధ్య
నల్ల బజార్లో, ప్రార్థనా స్థలాల్లో
ప్రాధేయపు చూపుల ఆశల మిధ్య –

చివరికి శ్వాసకూ శ్వాసకూ మధ్య
ఊపిరాడని పెనుగులాట
చావుకీ బతుక్కీ మధ్య
సమయం దోబూచులాడుతుంది
అది విముక్తో
ఈ నేలను విడిచి పోతున్న విషాదమో –

జీవితమంతా ‘క్యూ’ ల్లో నిలబడీ నిలబడీ
చితి మంటల సాక్షిగా
చివరి యాత్ర ‘క్యూ’ల్లో చిక్కుకుంది
ఇప్పుడు ఏ ఓదార్పులు లేవు
ఓటికుండలు లేవు
ప్రభుత్వాలకు మనం ఒక అంకె మాత్రమే
ఇంతకూ మన ఊపిరితిత్తుల మీద
మృత్యు సంతకం చే‌స్తున్నది ఎవరు !?
అంతిమ సంస్కారాలకు అడ్డు పడుతున్నది ఎవరు !??

August 25, 2021 8 comments
2 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us