బోయి భీమన్న (19 సెప్టెంబరు 1911-16 డిసెంబర్ 2005) మధ్య జీవించారు. సామాజిక మార్పు కు సామాజిక చైతన్యాన్నాశించి రచనలు చేశారు.అతిపేద దళిత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆశావహ దృక్పథంతో జీవించారు. వీరి “గుడిసెలు కాలిపోతున్నై” అనే రచన ఒక బలమైన సామాజిక సమస్యను చర్చకు పెట్టింది. వీరి సాహిత్యకృషికి ( “గుడిసెలు కాలిపోతు
న్నై” కి) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సామాజిక కృషికి ” పద్మభూషణ్” , రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు ,కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్ లు లభించాయి. “పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న” గ్రంథం హైమవతి గారు రచించారు. బోయి భీమన్న గారి బహుముఖీన సాహిత్య , సామాజిక దృక్పథానికి ఈ గ్రంథం చుక్కాని వంటిది. జాతీయతతో తాను పుట్టిపెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే ఆత్మగౌరవం తో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది. ఈ అనుగుణంగా ఉండటమంటే అస్పృశ్యతకు వ్యతిరేకంగా ,కులాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడటమే. ఈ వాస్తవికాల ద్వారానే ఎదిగి కులనిర్మూలన పంథా రావాలని ,వేయేళ్ళ బానిసత్వానికి కారణమైన మన యీ అనైక్యత పోవాలని బోయి భీమన్న , అంబేద్కర్ ల ఆశయం, ఆకాంక్ష. సామాజిక న్యాయం లభించిన తర్వాత ప్రతిభ ,ప్రజ్ఞ , జిజ్ఞాస కలవారిని మాత్రమే ఎన్నిక చేయాలని కులప్రాతిపదికగా చేయరాదని వారి పోరాటం. ఇదే వారి కులనిర్మూలనోద్యమానికి ప్రాతిపదిక. దాదాపు 15 వరకు కవిత్వ సంపుటులు, 13 నాటకాలు , 8 వచన రచనా సంపుటుల ద్వారా తన అభ్యుదయ , ప్రగతిశీల భావాల్ను బోయి భీమన్న గారు ప్రకటించారు. బోయి భీమన్న సాహిత్య పీఠం ద్వారా ప్రముఖులకు అవార్డు ప్రధానం జరుగుతుంది. ఇది శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వారి ద్వారానే నిర్వహించబడుతుంది. మన బోయి భీమన్న వర్థంతి 16 డిసెంబర్ సందర్భంగా అన్ని రకాల హింసను వ్యతిరేకించి ,సమన్వయ దృక్పథాన్ని ఆచరించిన ఆయన పరిణితిని , పోరాట శీలాన్ని స్మరించుకుంటూ ఆచరిద్దాం.
కుర్చీలోంచి విసురుగా లేచాడు రమణ.
“గాయత్రీ..! ఫర్ గాడ్స్ సేక్.. మళ్లీ నీ ఎపిసోడ్ మొదలెట్టకు. వినీవినీ విసుగొచ్చింది. నువు ముందా ఏడుపు మానెయ్యి. ఐ కాంట్ టేక్ ఎనీమోర్ ఆఫ్ దిస్” చిరాకునంతా ముఖంలో ప్రదర్శిస్తూ అన్నాడు.
అతని అనవసర ఇరిటేషన్ నాకూ కోపం తెప్పించింది. కానీ సర్దుకున్నాను.
“నేను చెప్పేది ఎపిసోడ్ లా అనిపిస్తుందా నీకు?”
“కాదామరి, మాట్లాడితే మన పెళ్లి ఎప్పుడంటావు. అసలా బాండింగ్ కోసం ఎందుకంత తొందర?”
“ తొందర కాదు, అవసరం. మనం కలిసుందామని డిసైడైనప్పుడు అది కొద్దిరోజులు మాత్రమే అనుకున్నాం. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఇప్పటికి ఏడాదిన్నర దాటింది. నువ్వుగా ప్రస్తావన తేవు. నేను పెళ్లి మాటెత్తితే దాటేస్తావు. దీనివల్ల మనమధ్య మనస్పర్థలు, దూరం పెరుగుతున్నయి. మన ప్రేమ మీద ఇష్టంతో, భవిష్యత్తు మీద నమ్మకంతో సహజీవనానికి ఒప్పుకున్నా. ఇప్పుడేమో నువు పెళ్ళిని తేలిగ్గా తీసుకుంటున్నావు. అసలు నీ మనసులో ఉన్నదేమిటో స్పష్టం చెయ్యి. ఒక క్లారిటీ వస్తే మంచిది”
“జస్ట్ షటప్ ఐసే.. నీ సోది మళ్ళీమళ్ళీ వినే ఓపిక నాకు లేదని ముందే చెప్పాను. ఇంట్లో ఉంటే ఒక్కక్షణం మనశ్శాంతిగా ఉండనీవు. అందుకే వెళ్లిపోతున్నా” మాట పూర్తిచేస్తూనే విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనుకే పెద్దచప్పుడుతో తలుపు మూసుకుంది.
గత కొన్నిరోజులుగా జరుగుతున్నదే మళ్లా ఈరోజూ జరిగింది.
ఒక సందర్భానికి తనకు అనుకూలమైన విధంగా ముగింపు పలికి అతడు తప్పుకున్నాడు. చిక్కని నీడలాంటి మరో సాయంత్రం నాముందు పరుచుకుంది. ఇల్లంతా నిండిన నిశ్శబ్దం… నన్ను కావలించుకునే ఒంటరితనం. నిస్సహాయతతో ఏడుపొస్తుంది. కానీ ఇప్పడేడ్చి లాభమేమిటి?
అనుకోకుండా మొదలైన మా సహజీవనం మరొకలా రూపం మార్చుకుంది. అప్పటికి ఇద్దర ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. అంతకుమించి మంచి స్నేహితులం. మామీద ఆఫీసులో, బయటా ఏవేవో రూమర్స్ పుట్టేంత సన్నిహితులం.
ఒకరోజు లంచ్ టైములో కేంటీన్లో చెప్పాడు రమణ.
“ఇంకో వారంలో నేనుండే ఇల్లు వెకేట్ చేయాలి గాయత్రీ ..! ఎంత ప్రయత్నించినా నాకు సూటయ్యే మరో కొంప దొరకడం లేదు. ఈ నగరంలో సరైన ఇల్లు, అందులోనూ మన స్తోమతకు తగింది దొరకడం కష్టమని తేలిపోయింది”
“ఇల్లు కోసం వెతుకుతున్నావా ఏమిటి..?”
“అవును. ఇల్లు సౌకర్యంగా ఉందనిపిస్తే అద్దెలు ఎక్కువున్నయి. తక్కువలో కావాలనుకుంటే అసౌకర్యంగా, మన ఆఫీసుకు చాలా దూరంగా ట్రాన్స్ పోర్టుకు ఇబ్బంది అయ్యేలా ఉన్నాయి”
“ఇది అందరికీ ఎదురయ్యే సమస్యనే. ప్రత్యేకించి నీకొక్కడికే కాదు” నవ్వాను.
“అందుకే మరెవరినైనా కలుపుకొని షేరింగులో మంచి ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందనే యోచనలో ఉన్నా”
“నాదగ్గరో మంచి ఐడియా వుంది..చెప్పనా?”
“చెప్పు.. సందేహం ఎందుకు?”
“మరి నువు షేర్ చేసుకునే హౌస్ మేట్ నేనే అయితే ఎలా ఉంటుంది..?”
రమణ ఒక్కక్షణం అయోమయంగా నాముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు. ఇబ్బంది పడినట్టు కనిపించాడు.
“ ఇది మంచి ఐడియా యెలా అవుతుంది? అందరూ ఏమనుకుంటారు? ముఖ్యంగా మీ తల్లితండ్రులకు తెలిస్తే…”
“ఏమీ కాదు. నేనేం చేసినా అది నాయిష్టం. నాకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉంది. పైగా మనం ఒకర్నొకరు
బాగా సన్నిహితులం. మన భవిష్యత్తుకూ, పరస్పరం సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకూ ఇదో అవకాశంగా భావించు.”
“నీతో కలిసివుండటం ఒక అద్భుతం, కానీ…”
“ఇంకేం ఆలోచించకు. నేను కూడా పీజీ నుంచి ఖాళీ చేయాల్సివుంది. ఇద్దరం కలిసి మంచి ఇల్లు వెతికి ఈ వీకెండుకే చేరిపోదాం”
“నువు నిజంగానే నాతో కలిసుండాలనుకుంటున్నావా?” అతనిలో ఏదో సంశయం.
రమణకు వివరంగా సర్దిచెప్పాను. అట్లా ఎక్కువకాలం ఉండాల్సిన అవసరం లేదన్నాను. త్వరలోనే మనకూ ఒక కుటుంబం ఏర్పడి అంతా సెటిలైపోతుందని చెప్పాను. ఆవిధంగా ఇద్దరం ఒకచోట వుండాలనుకున్నాం. నేనప్పటికే అతన్ని ఇష్టపడి ఉన్నాను. పైకి అనకపోయినా రమణ కూడా అంతేనని నాకు తెలుసు. అయితే ‘మనం వెంటనే పెళ్లి చేసుకుందామని’ మాత్రం చెప్పలేకపోయాను.
మేము కలిసివుండటం మా అమ్మా నాన్నలకు ఇష్టంలేకపోయింది.
“కలిసివుండటం ఎందుకు? ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లిచేసుకోవచ్చుగద. మిమ్మల్నెవరు కాదన్నారు?” అమ్మ అన్నది.
“ కొద్దిరోజులే మమ్మీ..! తొందర్లోనే మ్యారేజీ చేసుకుంటాం. రమణ చాలా మంచివాడు”
“ ఏ మాత్రం బెడిసికొట్టినా నష్టపోయేది స్త్రీ మాత్రమే. ఆ సంగతి గుర్తుంచుకో బేబీ”
నాన్న ఎందులోనూ లోతుగా జోక్యం చేసుకోడు. ఈ విషయంలో నన్ను సున్నితంగా హెచ్చరించాడు.
“అతను మంచివాడే కావొచ్చు బేబీ..! కానీ సహజీవనమంటే కాలక్రమంలో అతనికి నీమీద గౌరవం పోవొచ్చు. ఇప్పుడున్న ఆపేక్షలు ముందు ముందు ఉండకపోవచ్చు. నా సలహా ఏమంటే మీరు పెళ్లి చేసుకుంటేనే మంచిది.”
“ అదేం కాదులే నాన్నా. నేను అన్నీ ఆలోచించాను. నా నిర్ణయంలో మార్చులేదు”
“తప్పు చేస్తున్నావు బేబీ..! ఏదోరోజు బాధపడే స్థితి తెచ్చుకోకు. ఎదురుదెబ్బలు తినకుండా చూసుకో” అమ్మ చివరి హెచ్చరికగా అన్నది.
నేను వాళ్ళ జాగ్రత్తలు, హితవచనాలను పట్టించుకోలేదు. అమ్మానాన్న నన్ను సరిగా అర్థం చేసుకోలేదనిపించింది. నాజీవితాన్ని నేనే మలుచుకోవాలని భావించుకున్నాను. నేను రమణని ప్రేమించాను. అతనితో కలిసి నాకిష్టమైనట్టుగా బతకాలనుకున్నా. జీవితం రొటీన్ కావడం నాకు నచ్చదు. రమణతో సహజీవనంలో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లిచేసుకోవడం, నా సంసారం.. పిల్లలు.. ఇదే నాక్కావలిసింది.
గడియారం వంక చూశాను. పది గంటలు దాటింది. రమణ ఇంటికి రాలేదు. మరునాడు కూడా రాలేదు. ఆవేశమూ ఆవెనుకే నిస్సహాయతా నన్ను కుదిపివేశాయి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అతనిప్పుడు పనిచేసే కంపెనీకి కాల్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదు. పెళ్లి విషయంలో అతన్నుంచి పదేపదే తిరస్కార స్థితిని ఎదుర్కోవడం ఓటమిగా అనిపించి ఆవేదన పెరిగింది. మనసులో అలుముకున్న నా గోడు వెళ్లబోసుకుంటే తప్ప బరువు దిగదనిపించింది. నాన్నతో మాట్లాడే ధైర్యంలేక అమ్మకు కాల్ చేశాను. వెంటనే ఫోనెత్తింది.
“హలో మమ్మీ..!”
“హలో బేబీ..! ఎలా ఉన్నావు. బిజీ అనుకుంటా.. మొన్న ఫోన్ చేస్తే లిఫ్టు చేయలేదు”
“నేను బాగానే ఉన్నాను మమ్మీ”
“మరి నీ గొంతు అట్లా ధ్వనించడం లేదే”
అమ్మ మాటకు తెలియకుండానే ఏడుపొచ్చింది. దుఃఖం గొంతులోంచి జారకుండా సర్దుకున్నాను.
“అవును మమ్మీ..! మేము మళ్ళీ గొడవపడ్డాం. మొన్న ఇంట్లోంచి వెళ్ళిన రమణ ఇంకా రాలేదు”
తల్లికి ఏం అర్థమైందో, ఎలా ఫీలయిందో తెలియదు, కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది.
“చాలారోజులుగా నీకు అబద్ధం చెపుతూ వొచ్చాను. నిజానికి రమణ పెళ్ళికి సిద్ధంగా లేడు మమ్మీ. అడిగితే దాటేస్తున్నాడు.
లేదా ఘర్షణపడి బయటికి పోతాడు. అతనితో సహజీవనం విషయంలో మీరొద్దన్నా వినకుండా తొందరపాటు నిర్ణయం
తీసుకున్నాననిపిస్తుంది”
“పెళ్లి గురించి నువు ఖచ్చితంగా అడిగావా?”
“చాలాసార్లు అడిగాను. అతనిలో ఆ ధ్యాసే లేదు. పెళ్లి, పిల్లలు, ఒక కుటుంబం కోసం నేనెంత ఇష్టంగా ఆరాటంగా ఉన్నదీ చెప్పినా అతడు వినిపించుకోవడం లేదు. రమణ నేను ఊహించుకున్న వ్యక్తి కాదు. నన్నతడు వాడుకుంటున్నాడని అనిపిస్తుంది”
“మీరిలా గొడవలకుపోతే సమస్య తీవ్రమవుతుంది. ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి. అతని ఉద్దేశ్యమేమిటో తెలుస్తుంది. అంతేకాదు, నీ పరిస్థితేమిటో.. నువ్వెక్కడున్నావో కూడా నీకు అర్థమవుతుంది” అమ్మ చెప్పింది.
సహజీవనం తొలుత స్వర్గతుల్యం అనిపించింది. ఎంతో అన్యోన్యంగా గడిపాం. ఒకరిమీద ఒకరు ఎంతో ఆపేక్ష కనబరిచాం. రోజులెట్లా గడిచాయో తెలియలేదు. గంటలకొద్ది కబుర్లు, సినిమాలు, షికార్లు, వీకెండ్ విహారాలు, మోహాలు, తాపాలు, సుఖాలు. కానీ కాలక్రమంలో సహజీవన చిత్రం రంగు మారసాగింది. నెలలు గడిచినా రమణ ఏనాడూ పెళ్లి మాటెత్తలేదు. భవిష్యత్ జీవితం, పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు విషయం దాటేస్తూ వొచ్చాడు. పెళ్లి.. సంసారం.. పిల్లలు అంటే అనాసక్తిగా ఉండేవాడు. నాకు అసహనం పెరగసాగింది. అసలు రమణ నన్ను ఇష్టపడ్డాడా అనే సందేహం చాలా రోజులకుగానీ నాకు కలుగలేదు. అతన్ని గట్టిగా నిలదీసి అడుగలేకపోయాను.
అందుకు అతడు నాకు ద్రోహం చేస్తాడన్న ఊహ నాలో లేకపోవడమే. ఎంత వొత్తిడి చేస్తున్నా అతడు తేలిగ్గా తీసుకున్నాడు.
“పాతకాలపు ఆడపిల్లలా ఏమిటి నీ చాదస్తం..! మనకు పెళ్లి అవసరమేముంది.. ఇప్పుడు బాగానే ఉన్నాముగా”
అతని ధోరణిలో నాకు నిర్లక్ష్యం కనిపించి హృదయం విలవిలాడుతుంది. ఒక అభద్రతా భావన మొలకెత్తి బలపడసాగింది.
అతడు మరో అమ్మాయివేపు మొగ్గుతున్నాడా? వేరే పెళ్లిచేసుకోవాలని చూస్తున్నాడా అనే అనుమానం. ఆ ప్రభావం క్రమేపీ మా సహజీవనం మీద చూపుతున్నది. అతడు అనవసరంగా చిరాకుపడటం, కోపగించుకోవడం సాగించాడు. ఇంట్లో ఉండటం తగ్గించి ఎక్కువగా బయటకు వెళ్లి వొస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదనిపించింది. అమ్మ చెప్పిన సలహా ప్రకారం అతన్ని నిలదీసి మనోగతం తెలుసుకోవాలి.
***
నాలో ఒక అభద్రతా భావం పెరుగుతున్నది. దానికితోడు నేనిప్పుడు గర్భవతిని.
“రమణా.. అట్లా కూర్చో. మనం సీరియస్ గా ఒక విషయం మాట్లాడుకోవాలి” అతన్ని నిలదీశాను.
కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి రెండ్రోజుల తర్వాత తిరిగొచ్చిన గిల్టీ గానీ, ఇబ్బంది పడుతున్న స్థితిగానీ అతనిలో కనిపించలేదు. రమణ అసహనంగా చూస్తూ “ఏంమాట్లాడాలి? పాత పాటేనా? నువు పెళ్లి.. పిల్లలు.. సంసారం అన్నావంటే సారీ..! నాకు వినే ఓపిక లేదు”
“నేను మళ్ళీమళ్ళీ అనేందుకు ఏముంది? ఈ సమస్య కొత్తది కాదు. ఎన్నోరోజుల ముందే మొదలైంది.”
“ఇందులో సమస్య ఏముంది? మనకేం గొడవలు లేవు. హాయిగా ఉంటున్నాం. సగటు ఆడపిల్లలా ఆలోచించి సమస్యను నువ్వే సృష్టించుకుంటున్నావు”
“అయితే పెళ్లి వద్దంటావు. కలిసి కాపురం చేయగాలేంది పెళ్ళంటే అభ్యంతర మేమిటి? అసలు నీ మనసులో ఎమున్నదీ చెప్పు”
“నాకు ఎలాంటి బాదరబందీలు ఇష్టం లేదు గాయత్రీ ..! జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం నాది. నేను ఇంటరు చదువుతున్నప్పుడే మానాన్న పోయాడు. మా అమ్మే కష్టపడి నన్ను చదివించింది. ఉద్యోగంలో చేరిన తర్వాత కుటుంబం బరువులన్నీ నామీద వేసుకున్నాను. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిచేశాను. ఇందుకోసం చాలా సర్దుబాటుతో బతికాను. ఇప్పుడు అమ్మ కూడా పోయింది. ఒంటరిని. నాకే బంధనాలు లేకుండా హాయిగా గడపాలని అనుకున్నాను. అందులో భాగంగానే నీతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నా. మనం పరస్పర ఇష్టంతోనే సహజీవనానికి సిద్ధపడ్డాం. ప్రేమ, పెళ్లి, సంసారం, బంధాలు ఇవన్నీ నాకు నచ్చనివి. నువు ఏవేవో ఊహించుకొనివుంటే అందుకు నేను బాధ్యున్ని కాదు. ఇక పిల్లలంటావా.. దానికి ఏనాడూ అంగీకరించను. నాకే జంజాటాలు వొద్దు. జీవితంలో మొదటిసారి స్వేచ్ఛను అనుభవిస్తున్నా. నాకు దీన్ని కోల్పోవడం ఇష్టం లేదు. మళ్లా బరువులెత్తుకోవడం నావల్ల కాదు.”
“ఈ ఆలోచన ఉన్నవాడివి నాతో సహజీవం ఎందుకు? ఎంజాయ్మెంటులో ఇదీ భాగమేనా? పెళ్లి విషయంలో నీకిప్పుడే జ్ఞానోదయమైందా? అంటే… ఇంతకాలం నన్ను ఉద్దేశపూర్వకంగానే వాడుకొని..” మాట్లాడుతుంటే దుఃఖంతో నాకంఠం వొణికింది.
“ నన్ను మాత్రమే దోషిని చెయ్యాలని చూడకు. నీకిష్టం లేకనే నాతో సహజీవనం చేశావా? నాతోపాటు నువ్వూ ఎంజాయ్ చేశావు కదా. కొత్తగా ఈ పెళ్లి.. పిల్లలు అంటూ ఏళ్లతరబడి బాధ్యతలు మోయలేను..సారీ”
“నీ సంసారం, నీకుపుట్టే పిల్లలు భారం ఎట్లా అవుతుంది? నిన్ను ప్రేమించినట్టే ఇల్లు, సంసారం, పిల్లలంటే నాకు ప్రేమ. రమణా.. అర్థం చేసుకో”
“అయాం సారీ..! ఈ విషయంలో నువు ఎప్పటికీ నిరాశచెందక తప్పదు”
ఒకరోజు అతనికి అసలు విషయం వెల్లడించాను.
“అయామ్ ప్రెగ్నెంట్ రమణా..” చిన్నగా చెప్పినా నాగొంతు స్పష్టంగా ఉంది.
విషయం తెలిసి సంతోషిస్తాడనుకున్నా. కానీ ఏదో వినకూడనిది విన్నట్టు నావైపు తీక్షణంగా చూశాడు. సోఫాలో కూర్చొని ఫోనులోకి చూస్తున్నవాడల్లా ఆపేసి పూర్తిగా నావైపు తిరిగాడు. కోపంగా తల విదిలించి “నో..! అలా జరగడానికి వీల్లేదు. ఈ విషయం ఇన్నిరోజులు ఎందుకు దాచావు? నాకెందుకు చెప్పలేదు?”
“ఇందులో రహస్యం ఏముంది.. సంతోషపడే సంగతే కద. నాకిప్పుడు మూడోనెల”
“కాదు, నువు కావాలనే దాచావు. దీన్నడ్డం పెట్టుకొని నువు అనుకున్నది సాధించాలనుకున్నావు. కానీ పెళ్ళీ, పిల్లలూ నాకెంతమాత్రం ఇష్టంలేదు. నేను టాలరేట్ చేయను అంతే..”
“రమణా.. ఏమిటి నీ ధోరణి? వాట్స్ రాంగ్ విత్ యూ?”
“నో.. ఐ కాంట్ డు దిస్. నువ్వెంత చెప్పినా అస్సలు ఒప్పుకోను. నేను ఒక భర్తగా, తండ్రిగా సెటిలయ్యే మనిషిని కాదు. నా కోరికలు వేరు, జీవితం వేరు. ఐనా ఇప్పుడేమైంది? ముందు కడుపు తీయించుకో. వెంటనే ఆస్పత్రికి పోతే అబార్షన్ చేస్తారు”
“ఇడియట్..!” గట్టిగా అరిచాను. “నీకు బుద్ధుందా? అసలు మనిషివేనా? గర్భం తొలగించుకోమంటావా? బిడ్డకు తండ్రిగా ఇదా నీ మాట? కనీస మానవత్వం కూడా లేదా? పుట్టబోయే బిడ్డలను చంపేస్తూ మనం మాత్రం హాయిగా ఎంజాయ్ చేద్దామంటావా? పశువులా బిహేవ్ చేయకు..” మాటలంటుంటే నన్ను నేను కంట్రోలు చేసుకోలేక ఏడిచాను.
“నువ్వెంత సెంటిమెంటలైనా, నీ ఫీలింగ్స్ ఏవైనా నాకు సంబంధం లేదు. ఏడ్చి గగ్గోలు పెట్టినా లాభంలేదు. నా మనసు మారదు. గుర్తుంచుకో”
దుఃఖం ఆపుకొని నార్మల్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ అన్నాను: “ నిజమే.. నువు మారవు. ఇదంతా నీ తప్పుకాదు, నాది. మొదటినుంచీ నీ మనసులో నిర్ణయాలు ఉన్నాయి. నన్ను నువు ప్రేమిస్తున్నావని నేనే తెలివితక్కువగా నమ్మి మోసపోయాను. జీవితంలో మనిద్దరం రెండు వేర్వేరు ఇష్టాలతో భిన్నమైన అంశాలను కోరుకున్నాం. నిజానికి నీకు నేనంటే ఏనాడూ ప్రేమ అనేదే లేదని నాకనిపిస్తుంది”
“అయితే ఏమిటిప్పుడు..? నన్ను వెళ్లిపొమ్మంటావా?”
“ నువ్వెందుకు.. నేనే వెళ్లిపోతాను. మనమిప్పుడు చేయగలిగేది అదొక్కటే. ఇంతజరిగి.. అసలు వాస్తవం తెలిశాక ఇక మనం ఒకే గూట్లో వుండటం అసందర్భం.. అసాధ్యం” కళ్లవెంట నీరు కారుతున్నా నాస్వరం కటువుగా పలికింది.
మరోమాట లేకుండా అతడు బయటికి వెళ్ళిపోయాడు. రెండ్రోజుల తర్వాత ఫోన్ చేసి తనకు బెంగళూరు బదిలీ అయిందని, వెళ్లిపోతున్నానని తెలిపాడు. శాశ్వతంగా గుడ్ బై అనికూడా చెప్పాడు.
నాకర్థమైపోయింది ఇక అతడు తిరిగిరాడని. ఏమీచేయలేని నిస్సహాయురాలిగా దుఃఖమొచ్చింది. కొంతసేపటికి తేరుకొని మామూలయ్యాను. చేయవలసిన దానిగురించి ఆలోచించాను. జీవితాంతం కలిసి బతకాలనుకున్న మనిషి అసలు రూపం బయటికొచ్చింది. ఒక సంకుచిత నిర్ణయాన్ని అతడు తీసుకున్నాడు. నాకు తోడు కాలేకపోయాడు. అతనికోసం దేబిరిస్తూ.. ఎదురుచూస్తూ ఎందుకుండాలి? బంధాలు వద్దనుకున్నవాడు పెళ్ళికి ఒప్పుకుంటాడా? అతన్ని ప్రేమించడం, నమ్ముకోవడం నాదే తప్పిదం. జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటూ నేనుగా ముందుకు సాగాలనుకున్నా. ప్రెగ్నెన్సీ నిలుపుకోవాలని, బిడ్డను కనాలనే నిర్ణయించుకున్నా. ఆఫీసుకి సెలవుపెట్టి పుట్టింటికి వెళ్లిపోయాను.
***
కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. నాకిప్పుడు ముద్దులు మూటగట్టే పాప ఉన్నది. రమణ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అతని గురించి గుర్తుచేసుకునే తీరికా.. ఇష్టమూ ఇప్పుడు నాలో లేవు. అతడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, నా బతుకులోంచి. కొత్తదారిలో చాలాదూరం వొచ్చేశాను. ఆశలు వెతుక్కుంటూ బతుకుబాటలో నాదైన రీతిలో సాగిపోతున్నాను.
కాలింగ్ బెల్ చప్పుడువిని వెళ్లి తలుపు తీశాను. అతడు నన్ను దాటుకొని లోపలికొచ్చాడు.
“బాగున్నావా గాయత్రీ..” అంటూ నా జవాబు కోసం చూడకుండా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
గుర్తుపట్టాను.. రమణ. బాగా మారిపోయాడు. “ఇక్కడికెందుకొచ్చావు? ఎవరు చెప్పారు నేనిక్కడున్నట్టు” చిరాకుపడుతూ అన్నాను.
“మనసుంటే మార్గాలకేం? తెలుసుకోలేననుకున్నావా?”
“మళ్లీ ఎందుకొచ్చావు? ఇంకా ఏంచేద్దామని? నా బతుకేదో బతకనివ్వవా?”
“నీకు కీడు చేద్దామని రాలేదు డియర్. నేనిప్పుడు మారిపోయాను. నీకు మేలుచేద్దామనే వొచ్చాను”
“ఇప్పటివరకు నువు చేసిన మేలు చాలు. నన్నిట్లా వొదిలెయ్యి. బెంగళూరు నుంచి స్టేట్స్ వెళ్ళినట్టు నీ పాత కొలీగ్ అప్పుడెపుడో చెప్పాడు. మళ్లా ఎందుకొచ్చావు?”
“ అవును, నెలరోజుల క్రితమే ఇండియా వొచ్చాను. ఇప్పుడేమో నీకోసం వొచ్చాను”
“ఏం.. ఇంకెవరూ ఆడవాళ్ళు దొరుకలేదా? నేను నీకోసం తయారుగా ఉంటాననుకున్నావా?”
“అంత కటువుగా మాట్లాడకు డియర్ ..! మీ ఊరువెళ్ళి మీ అమ్మ నాన్నను కలిసి నేను చేసిన తప్పు గురించి చెప్పాను. తప్పును
తెలుసుకున్నట్టు కూడా తెలిపాను. సరిదిద్దుకుంటానన్నాను. వాళ్లు నన్ను క్షమించారు. నువు కంపెనీ మారినట్టూ.. ఒంటరిగానే
ఉంటున్నట్టూ చెప్పారు. నీ అడ్రసు తెలుసుకొని నేరుగా వొచ్చాను”
నేను మాట్లాడకుండా అతనివైపు చూశాను. రంగుతేలి బాగా లావయ్యాడు. డాలర్లు వొంటికి పట్టి దర్జా అలవడినట్టుంది. నన్ను వెతుక్కుంటూ వొచ్చిన అతనిపట్ల నాలో ఏమాత్రం స్పందన లేదు.
“ఎట్లా ఉండింది అమెరికా జీవితం..? ముఖ్యంగా నీ స్వేచ్ఛా జీవితం”
నామాటల్లోని వ్యంగ్యానికి అతడేమీ నొచ్చుకున్నట్టు కనిపించలేదు.
“మా పెద్ద చెల్లెలు న్యూజెర్సీలో వుంది. ఆమె దగ్గర కొన్నిరోజులు వున్నాను. తర్వాత మరో ఇద్దరితో కలిసి షేరింగ్ ఫ్లాట్ తీసుకొని వున్నాను. ఎక్కువ సంపాదన, కొత్త స్నేహాలు, అమ్మాయిలు.. బాగానే ఎంజాయ్ చేశాను”
“మరింకేం, అక్కడే హాయిగా ఉండకుండా ఇండియాకు ఎందుకొచ్చావు?”
“డబ్బు, స్వేచ్ఛ, ఇవేవీ జీవితంలో అసలైన ఆనందాలు కావని గ్రహించాను. చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా వాళ్ళెవరూ నావాళ్ళనిపించలేదు. వారిలో ప్రేమానురాగాలు, కన్సెర్న్ లేవు. పరిచయాలైనా, స్నేహాలైనా అన్నీ అవసరపూర్తివే. కొందరు నావెనుకున్న డబ్బునుచూసి కమిట్ అయ్యేందుకు సిద్ధపడితే, ఇంకొందరు నాకంటే మెరుగైనవాడి కోసం వెతుక్కున్నారు. ఎవరి స్నేహమైనా కొద్దిరోజులకన్నా మిగల్లేదు. ఒక బంధంలో ఇరుక్కోవడం ఎవరికీ ఇష్టంలేక పోయింది. నాకనిపించింది.. అంతపెద్ద దేశంలో మాచెల్లెలు ఒక్కరు తప్ప నాకోసం నిజాయితీగా తలచేవారెవరూ కనిపించలేదు”
“ దాదాపు రెండేళ్లు అమెరికాలో వుండి వొచ్చావు. ఎవరినీ తోడు తెచ్చుకోలేదేం..? బాదరబందీ ఎందుకనుకున్నావా? బంధాలు, బాధ్యతలు నీకు సరిపడవు కదా”
నా ఎగతాళి, ఎత్తిపొడుపు రమణ గ్రహించినా పట్టించుకోనట్టు కనిపించాడు.
“ఈపాటికి నువు పెళ్లిచేసుకొని ఉంటావనుకున్నా. కానీ ఒక్కదానివే ఇలా. నీ తెగువను మెచ్చుకుంటున్నా. అన్నట్టు పాప పుట్టిందటగదా. ఏదీ మన పాప..? నాకు చూపించవా?”
“మన పాప కాదు.. నాపాప” నా మాటల్లో కఠినత్వం.
“అయాం సారీ గాయత్రీ ..! నీపట్ల నేను చేసిన ద్రోహానికి ఎంత చింతించానో నీకు తెలియదు. ఏ అమ్మాయితో వున్నా నువ్వే గుర్తొచ్చేదానివి. నేన్నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చేది. నిన్ను తలుచుకోకుండా, నీ ఫోటో చూస్తూ నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా లేను. అప్పుడు అర్థమైంది నీ ఉనికి.. నీ విలువ. అంతేకాదు, నిన్ను ఎంత ప్రేమించానో కూడా నాకు తెలిసింది. మనం సంతోషంగా వున్నప్పటి రోజులు పదేపదే జ్ఞాపకమొచ్చి బాధపడ్డాను. దయచేసి నన్ను క్షమించగలవా?”
“క్షమించడానికి నేనేవరు..? నిన్ను ప్రేమించడం, అట్లాగే నీ మనోగతం తెలుసుకోకుండా, నువ్వూ నన్ను ఇష్టపడ్డావని నమ్మడం నాదే తప్పు. మనిద్దరం జీవితంలో వేర్వేరు అంశాలను కోరుకున్నాం. అది తెలుసుకోలేక చాలారోజులు భ్రమలో నీతో కలిసి బతికాను. అసలు వాస్తవం ఆలస్యంగా గ్రహించినందుకు సిగ్గనిపించింది. నువు కొట్టిన ఎదురుదెబ్బ పాఠం నేర్పింది. నీమీద నాకేం కోపం లేదు. నిన్ను మర్చిపోయాను కూడా. ఇక క్షమించడాలెందుకు? ఎవరి దారులు వారివి. ఎవరి జీవితాలు వాళ్లవి.”
“అట్లాఅనకు..! ప్లీజ్.. ఫర్ గివ్ మీ. నేను చేసిన తప్పును ఇప్పటికైనా దిద్దుకోనీ. మనం మళ్లా కలిసివుందాం. కాదు, పెళ్లిచేసుకొని మనకంటూ ఒక ఇల్లు, పిల్లలు, కుటుంబంతో ఆనందంగా ఉందాం”
“ఇందులో తప్పు నీ ఒక్కడిదే కాదు. నేను కోరుకున్నదే నువ్వూ కోరుకుంటావని భావించి దెబ్బతిన్నాను. ఇది తెలుసుకునేసరికే నష్టం జరిగిపోయింది”
“నేను మారిపోయాను గాయత్రీ ..! మనం మళ్ళీ అన్యోన్యంగా ఉండగలం. నాకిప్పుడు భార్యా.. పిల్లలూ.. ఇల్లు అన్ని బంధాలు, బాధ్యతలు కావాలి. అన్నిటికంటే ముఖ్యం.. నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ సోమచ్. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే వుంటా. నన్ను ప్రేమించగలవా?” అంటూ అతడు నాచేరువగా వొచ్చి రెండు భుజాలపైన చేతులు వేశాడు.
“నువు స్వీకరిస్తావనే నమ్మకం వందశాతం వుంది. అందుకే మళ్లా వొచ్చాను” అన్నాడు.
అతని ధోరణికి దిగ్భ్రాంతి చెందాను. కొద్దిక్షణాలు బొమ్మలా వుండిపోయాను. అది తనకు సానుకూలంగా భావించినట్టున్నాడు రమణ. నా ముఖం మీదుగా వొంగి పెదాలను నోటితో అందుకున్నాడు. నాకు కడుపులో తిప్పినట్టయింది. అతనిమీద ఎంత విముఖత ఉందో నా శరీర ప్రతిస్పందన చెప్పింది. అతన్ని ఉన్నపాటున వెనక్కి తోసేశాను.
“బయటికి వెళ్లిపో రమణా..! ఇంకెప్పుడూ నాకు ముఖం చూపించకు” గట్టిగా అరిచాను.
బాధపడుతూ చూశాడు రమణ. అతని ముఖంలో పశ్చాత్తాపం లాంటిది చూశాను. కానీ ఇప్పుడు నా బతుకును తప్ప దేన్నీ నమ్మలేని స్థితి. నాదారిలో నేను చాలాదూరం వచ్చేశాను.
***
గతమూ, వర్తమానమూ అలలుగా కదిలిపోతూ కళ్లు చెమ్మగిల్లాయి.
చేతుల్లో ముఖం కప్పుకున్నాను. నాకు తెలుసు భవిష్యతు పూలపాన్పు కాదని. దారిలో ఎన్నో ముల్లు.. చిక్కుముడులు. కానీ ఎవరి ఆసరా లేకుండా బతకడం నేర్చుకుంటున్నా. ఇప్పుడు నాకు తోడుగా నా ఏడేళ్ళ పాప. నాబిడ్డ నాకో వరంలా వొచ్చింది. నాకున్న ధైర్యంతో, నా చిన్నారి ప్రేమతో ముందుకు సాగుతాను. కష్టం కావొచ్చు. కానీ సాధిస్తాను.
———————–
నచికేతుడు ఉపనిషత్ వాఙ్మయాకాశంలో వెలుగొందే ధ్రువతార. అతని చరిత్ర కఠోపనిషత్తుతో చోటు చేసుకున్నది.
నచికేతుడు ఉద్దాలకుని కుమారుడు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనగలవాడు. ఎలాంటివారినైనా, ఎలాంటి ప్రశ్ననైనా వేసి సమాధానం పొందగలడు. అలాంటివాణ్ణి మనం వాఙ్మయంలో చాలా తక్కువగా చూస్తాం.
ఉద్దాలకుడు యశస్సుతోపాటు మోక్షాన్ని కోరి, ‘విశ్వజిత్తు’ అనే పేరు గల యజ్ఞాన్ని నిర్వహించాడు. సంపూర్ణంగా తన సంపదను అర్థులకు దానం చేశాడు. ఉద్దాలకుడు దానం చేసిన వాటిలో గోవులు కూడా ఉన్నాయి. అవి గడ్డి వేయలేనివి. నీళ్లు తాగలేనివి. పాలీయలేనివి. సంతానోత్పత్తికి పనికిరానివి. అటువంటి గోవులను దానంగా ఇస్తుంటే నచికేతుడు చూశాడు. దానంవల్ల కలిగే పుణ్యం కంటె ఉపయోగానికి రాని గోవులను దానం చేయడం వల్ల తన తండ్రికి పుణ్యానికి బదులు పాపమే వస్తుందని భయపడ్డాడు నచికేతుడు. అందుకే నిర్భయంగా ‘నాన్నా నన్నెవరికిస్తావు’ అని అడిగాడు. ఉద్దాలకుడు పరధ్యానంలో ఉండడంవల్ల పుత్రుని మాటలు వినలేదు. దానితో నచికేతుడు మరో రెండుసార్లడిగాడు. చివరి మాటకు స్పందించిన తండ్రి తన పనికి కుమారుడడ్డుతగులుతున్నాడని భావించి ‘నిన్ను మృత్యువు కిస్తున్నాను’ అన్నాడు.
‘మృత్యువు’ అంటే భయపడవలసిన పనిలేదు. ‘ఆచార్య మృత్యుః’ అని అధర్వణ వేదం చెబుతుంది. మృత్యువుకిస్తున్నావని తండ్రి పలికిన మాటలకు నచికేతుడు తనను గురువు కర్పిస్తున్నట్లు గ్రహించాడు.
తండ్రి మాటలకు నచికేతుడు బెదరలేదు. చకితుడుకానివాడే నచికేతుడు. కాని తెలివిగల్గినవాడు కనుక ఆలోచనలో పడ్డాడు. అతనంతకుపూర్వమే సమీప పాఠశాలలో చదివి ఉన్నాడు కనుక, చాలామంది విద్యార్థులలో తమ ఉత్తమ శ్రేణికి చెందిన విద్యార్థిగా ఉన్నాననే నమ్మకం ఉంది. తండ్రికి కూడా తాను తెలివిలేని బాలుడనే భావన లేదు. ఐనా తండ్రి గురువు దగ్గరికి పంపుతున్నాడంటే, అందులో ఏదో ప్రయోజనముందని గ్రహించాడు నచికేతుడు. అందుకే మృత్యువనే పేరు గల యమాచార్యుని ఆశ్రమానికి బయల్దేరాడు. తీరా గురుకులానికి వస్తే అక్కడ ఆచార్యుడు లేడు. అతడు మూడు రోజుల తర్వాత వచ్చాడు ఆశ్రమానికి. అప్పటి దాకా నచికేతుడు పచ్చినీళ్ళు కూడా ముట్టలేదు. పస్తులున్నాడు!
ఆశ్రమవాసుల ద్వారా నచికేతుని గూర్చి తెలుసుకున్న ఆచార్యుడు అతనిలో ‘ఓ జ్ఞానీ, నీవు మా అతిథివి. అయినా మూడు రోజులు ఉపవాసమున్నావు. అందుకు నన్ను క్షమించు. దినానికొకటి చొప్పున మూడు వరాలు కోరుకో అని’ సెలవిచ్చాడు.
తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు తన తండ్రి కోపపడకుండా ఉండేలా వరమిమ్మని మొదటి కోరిక కోరినాడు నచికేతుడు. ఆచార్యుడు ‘సరే’ అన్నాడు. స్వర్గప్రాప్తికి సాధనమైన అగ్ని విద్యను బోధించమని నచికేతుడు రెండవ వరాన్ని కోరగా ఆచార్యుడు దానికి అంగీకరించాడు.
మూడు ఆశ్రమాలలో చేసే అగ్నిహోత్రానికే అగ్ని విద్య అని పేరు. ఎవరైతే జీవో కాలంలో తప్పకుండా యజ్ఞ దీక్షను పొంది క్రమం తప్పకుండా అగ్ని విద్యనుపాసిస్తారో వారికి స్వర్గప్రాప్తి అనగా మరుసటి జన్మలో అత్యంత సుఖం కల్గుతుంది. ఇదే అగ్ని విద్య రహస్యం!
రెండు వరాలిచ్చిన ఆచార్యుడు మూడవ వరాన్ని కోరుకొమ్మని నచికేతుడు ప్రోత్సహించినాడు.
‘మనిషి చనిపోయిన తర్వాత అతడు ఉంటాడా? ఉండడా? ఈ సందేహాన్ని తీర్చిండి. ఇదే నా మూడవ తరం’ అన్నాడు నచికేతుడు.
నచికేతుడు కోరుకున్న మూడు వరాల్లో మొదటిది మనుజులోకానికి సంబంధించింది. రెండవ వరం పునర్జన్మకు సంబంధించింది. కాగా, ఈ మూడవ వరం పూర్తిగా ఆత్మకు సంబంధించింది.
“చనిపోయిన తర్వాత ఆత్మ ఉండదా? ఉండదా అనే విషయం సామాన్యులకర్థం కాదు. కాబట్టి ఈ ప్రశ్నకు బదులు మరొక వరాన్ని కోరుకో” అని ఆచార్యుడు తెలియజేశాడు. సామాన్యులకర్థం కాని విషయం ఆచార్యుని కంటె మరెవ్వరూ చెప్పలేరని నచికేతుడు పట్టుబట్టాడు. “ఇంత కఠినమైన విషయాన్ని మీరు దప్ప మరొకరు చెప్పలేనప్పుడు, ఇతరులను అడగడంవల్ల ప్రయోజనం ఉండదు. దయచేసి ఆత్మ అస్తిత్వాన్ని తెలియజేయండి” అని ప్రార్థించాడు.
ఆచార్యుడతనికితరమైన వరాలు కోరుకొమ్మని ఆశ చూపాడు. కాని అతడేమాత్రం వెనుకంజ వేయలేదు. తన సందేహాన్ని తీర్చవలసిందేనని అంతవరకు ఆశ్రమాన్ని విడిచిపెట్టవని భీష్మించుకొని కూర్చున్నాడు. ఆ ఆచార్యుని దర్శనం చేతనే అన్ని సంపదలు లభిస్తాయని, కనుక కోరదగిన సంపద లేవీ లేవని, ఆత్మజ్ఞానం అనే సఁపదనే అనుగ్రహించమని కోరిన నచికేతుడు సామాన్యుడు కాడని చెప్పవచ్చు.
యమాచార్యుడు చేసిన ఉపదేశం ఇలా ఉంది. “ఓ నచికేతా! లోకంలో మనిషి నడుచుకునే మార్గాలు రెండున్నాయి. ఒకటి శ్రేయోమార్గం, రెండవది ప్రేయోమర్గం. సామాన్యులకు వీటి భేదం తెలియదు. సాంసారిక సుఖానుభవమే ప్రేమోమార్గం. ఆధ్యాత్మిక సుఖానుభవమే శ్రేయోమార్గం. ప్రేయోమార్గంలో వెళ్ళినవారికి పునర్జన్మ ఉంటుంది. శ్రేయోమార్గంలో వెళ్లినవారికి మోక్షం లభిస్తుంది. ఐతే ఏ మార్గంలో ప్రయాణిఁచినా దేహమే నశిస్తుంది కాని ఆత్మ నశించదు. ఆత్మ శాశ్వతమైంది. ఆత్మజ్ఞానమే పరమాత్మ సాక్షాత్కారానికి కారమవుతుంది. పరమాత్మ ఓంకారవాచ్యుడు. అతడు పరమాణువులకంటే, జీవాత్మ కంటే సూక్ష్మమైనవాడు. అతడు లేని చోటు లేదు. అతడు మన హృదయకమలంలోను ఉన్నాడు కనుక, మనం అతన్ని అక్కడే ధ్యానించాలి. శరీరం రథం లాంటిది. జీవాత్మ రథస్వామి. బుద్ధి సారథి. మనస్సనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపులో పెట్టుకోవాలి. జీవుడు మట్టి నుంచి పుట్టిన కుండ లాంటివాడు కాడు. అతడు శాశ్వతుడు. ఐతే కర్మవశాన అతడు ఒక శరీరం నుండి మరొక శరీరం లోనికి ప్రయాణిస్తుంటాడు. అతడొక విధంగా ఈ శరీరానికి అతిథి. కర్మఫలాలు తీరగానే శరీరాన్ని విడిచిపెడతాడు. అంతేకాని జీవునికి చావులేదు. శరీరం నశించినా జీవుడు మాత్రం నశించడు. ఇదే నీవడిగిన మూడవ వరం”.
యమాచార్యుడు నచికేతుకీ విధంగా ఆత్మశాశ్వతమైందని, కర్మవశాన జన్మలెత్తుతుందని, పరమాత్మ మాత్రం జన్మలెత్తడని, అతనికి కర్మలుగాని, కర్మవాసనలుగాని అంటవని చెప్పగా అతడు సంతోషాంతరంగుడయ్యాడు. చిన్నవాడైనప్పటికీ, బ్రహ్మజ్ఞానంలో అతని ముఖం ఎంతో ప్రకాశమానమైంది.
కఠోపనిషత్తులోని నచికేతునికి యుద్ధ సమయంలో విషాద యోగంలో మునిగిన అర్జునునికి తేడా ఏమీ లేదు. యమాచార్యుని స్థానంలో శ్రీ కృష్ణుడన్నాడు. అటు యమాచార్యుడు, ఇటు కృష్ణుడు చేసిన ఆత్మబోధ సమానమే. అందుకే కఠోపనిషత్తు ప్రభావం భగవద్గీత మీద ఉందని విద్వాంసుల అభిప్రాయం.
విజయా సంస్థ నిర్మించిన “జగదేక వీరుని కథ” చిత్రం 1961లో విడుదలైనది. ఆ చిత్రంలోని ఒక పాట.
రారా కన రారా
కరుణ మానిరారా ప్రియతమ లారా ||రారా||
నాలో నాలుగు ప్రాణులనగా
నాలో నాలుగు దీపములనగా ||నాలో||
కలిసిమెలిసి అలరించిన చెలులే ||కలిసి||
నను విడనాడెదరా ||రారా|
మీ ప్రేమలతో మీ స్నేహముతో ||మీ ప్రేమ||
అమరజీవిగా నను చేసితి రే
మీరు లేని నా బ్రతుకేలా ||మీరు||
మరణమె శరణముగా
రారా కనరారా
కరుణ మానినారా ప్రియతమ లారా
ఈ పాటను గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు అద్భుతంగా ఆలపించగా ప్రతాప్ గా నటించిన నందమూరి తారక రామారావు అభినయించారు. మధ్య మధ్య సన్నివేశ ప్రాధాన్యంగా ఇంద్రకుమారి జయంతిగా నటించిన బి.సరోజాదేవి, నాగకుమారి నాగినిగా నటించిన యల్. విజయలక్ష్మి, వరుణకుమారి వారుణిగా నటించిన జయంతి, అగ్నికుమారి మరీచిగా నటించిన బాల కనిపిస్తారు. రసస్పర్శ అంటే ఏమిటో అవగాహనతో, అనుభూతితో ఘంటసాలగారి గళంలో పెండ్యాల నాగేశ్వరరావు తన సంగీత దర్శకత్వంలో “భాగీశ్వరి” రాగంలో మనకు అందించారు.
భూలోకంలోని రాకుమారుడైన ప్రతాప్, తన జీవిత లక్ష్యమైన, తన కలల రూపంలోని నలుగురు దేవకన్యలను వివాహమాడతాడు. కాని ఆ నలుగురు తనను విడిచి ఊహకందని లోకాలకు తిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో ఉద్దేశించి కథానాయకుడు పాడిన పాట ఇది.
ఇటువంటి శోకతప్త గీతాలకు సాధారణంగా సింధుభైరవి, ముఖారి, ముల్తానీ, అసావేరి, తోడి, ఘార్జరీ, భాగీశ్వరి రాగాలను వాడతారు. పెండ్యాలవారు ఈ పాటను భాగీశ్వరి రాగంలో ట్యూన్ ని దర్శకులు కె.వి.రెడ్డిగారికి వినిపించారు. ఈ ట్యూన్ లో ఆర్తి, ఆరాధనా భావం బాగా వచ్చాయని కె.వి.రెడ్డిగారు అభిప్రాయపడ్డారు. ఆ మరునాడు మరో రాగంలో ట్యూన్ చేసి కె.వి.రెడ్డిగారికి వినిపించారు పెండ్యాలవారు. ఆ ట్యూన్ కూడా బాగుందనిపించింది కె.వి.రెడ్డిగారికి. కె.వి.రెడ్డిగారు ఈ రెండు రాగాల్లో ఏ ట్యూన్ తో రికార్డింగ్ చేయించాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డారు. పాత్రధారి ఎన్టీఆర్ ను రమ్మని కబురు పంపించి, ఈ రెండు ట్యూన్ లలో ఏది బాగుందో తెలియజేయమని, ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసికొన్నా, కట్టుబడి వుంటానన్నారు కె.వి.రెడ్డిగారు. పెండ్యాలవారు చేసిన రెండు స్వర రచనలను రెండుసార్లు పాడి ఎన్టీఆర్ కు వినిపించారు. 5 నిమిషాలపాటు ఎన్టీఆర్ మనసులో తర్జనభర్జన చేసికొని, అరబిక్ మెలోడీలోని ట్యూన్ సాహిత్యాన్ని కొంచెం వెనుకకు నెట్టి ముందుకు దూకుతోంది. సంగీతమే ముందు చెవులను తాకుతుంది. కాని భాగీశ్వరి రాగంలో సంగీత సాహిత్యాలు రెండు కూడా ఒకేసారి మనసును తాకుతున్నాయి. సన్నివేశానికి భాగీశ్వరి రాగం ట్యూన్ నిండుదనం కలిగిస్తుందని ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ లోతైన సునిశిత పరిశీలన కె.వి.రెడ్డిగారికి నచ్చింది. భాగీశ్వరి రాగంలో ట్యూన్ చేయబడిన ఈ పాట ఈ రోజువరకు సజీవంగా ఉన్నది. తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నంలో, ఒక రాకుమారుడు చేసిన సాహస కార్యముల గాథ “జగదేక వీరుని కథ”.
గీత రచయిత పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా మాటల, పాటల రచయిత మాత్రమే కాకుండా, నాటక రచయిత, పాత్రికేయుడు.
మన పండుగలు వ్యక్తిని లౌకిక జీవితాన్నుంచి ఆధ్యాత్మిక చింతనకు మార్గనిర్దేశకత్వం సూచిస్తాయి మకర సంక్రాంతి మనకు సంప్రదాయ సిద్ధమైన గొప్ప పండుగ ఈ సంక్రాంతి పండుగ ఆనందోత్సవాలతో మూడు రోజులూ గొప్పగా జరుపుకుంటారు ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపదకు భారతదేశం భారతీయ సంప్రదాయం సకల జనులకు ఆచరణ యోగ్యము.
“జననీత్వం హీవో కానాం సప్తమీ సప్త సప్తకే వ్యాహాతికే
వేది నమస్తే “…. అంటే సప్తాశ్వయలతో విరాజిల్లే ఓ సప్తమీ నీవు అన్ని లోకాలకూ మాతృకవి. సర్వ శక్తి సంపన్నుడైన ఈ లోకపు ప్రాణ ప్రదాత అయిన సూర్యభగవానుని ఈ లోకానికి అందించిన నీకివే వందనములు అంటూ “మకర సంక్రాంతి ” నాడు సూర్యు భగవానుని ఆరాధిస్తూ జనులు పూజలు నిర్వహిస్తారు.
“సంక్రాంతి “అంటే సూర్యాది గ్రహారాశుల అంతర గమనం అని చెప్పబడింది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని “సంక్రమణం ” అంటారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని “మకర సంక్రమణం ” లేదా “సంక్రాంతి” అంటారు.
‘సం ‘అంటే చక్కని,’ క్రాంతి’ అంటే ‘మార్పు’ కాబట్టి ‘సంక్రాంతి ‘ అంటే చక్కనైన మార్పు తో కూడిన చైతన్యం అని అర్థం. ‘మకరం’ మొసలి పట్టుకు సంకేతం. ‘సంక్రాంతి’ పండుగ పుష్య మాసంలో హేమంత ఋతువులో వచ్చే మకర సంక్రాంతికి ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది
సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంతవరకూ దక్షిణాయనంలో తిరుగుతున్నా సూర్యుడు ఉత్తరాయణంలో కి ప్రవేశిస్తాడు ఇది మహా పుణ్యకాలం. ఇది దేవతలకు ప్రీతికరమైన కాలంగా మన శాస్త్రాలు తెలుపుతున్నాయి ఆరోజు స్వర్గ ద్వారాలు తెరవడం ఉంటాయని ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని అందుకే భీష్మాచార్యులు ఉత్తరాయన పుణ్య కాలం వరకూ నిరీక్షించి పుణ్యకాలం మహాభారతంలో ఉంది . ఉత్తరాయణ కాలంలో మరణించిన వారి అంత్యక్రియలు సూర్యాస్తమయం లోగానే నిర్వహిస్తారు అదే దక్షిణాయానం సూర్యాస్తమయ కాలము లో మరణిస్తే ఆ ఆ మరుసటి రోజున సూర్యోదయమైన మొదటి కాలంలో అంత్యక్రియలు చేయడంలో గల అంతరార్థం ఉత్తరాయణం పుణ్యకాలం కావడమే.
ప్రతి సంక్రాంతి పర్వదినమున సంక్రాంతి పురుషుడు వాహనంపై అధిష్టించి వస్తాడనే విశ్వాసం వాహనాన్ని బట్టి ఆ ఏడాదిలో జరగబోయే సంఘటనలు ఊహిస్తారు
ఈ పండుగను నాలుగు రోజులు జరుపుకుంటున్నారు తొలి రోజున భోగి, మలి రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ గాను కూడా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతికి ముందున్న సంక్రాంతి ధనుస్సుంక్రాంతి.
మన హైందవ సంస్కృతి ప్రాభావానికి దర్పణం సంక్రాంతి పండుగ. సూర్య సంక్రమణం ప్రతినెలా జరుగుతూ ఉంటుంది కానీ పుష్య మాసంలో జరిగే మకర సంక్రమణానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అదే సంక్రాంతి గా ప్రసిద్ధి పొందింది.
“దక్షిణాయాణే….. పాపం మూర్తీ భవత్ సర్వమ్ బహి ర్యాత్యుభరాయలే ” దక్షిణాయానం లో ఉన్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించగానే మానవులు చేసిన పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.
మానవుడు ఐహిక విధి నిర్వర్తనం కోసం దైహికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. బుతు చక్రభ్రమణంలో మార్గశిర, పుష్య మాసాలు హేమంత సంకేతాలు, గ్రీష్మ,వర్ష శరదృతువులు ముగుస్తూ మానవ జీవితంలో క్రమక్రమంగా వణుకు మొదలవుతుంది. ‘పారమార్ధిక చింత భాస్కర తేజం’మవో మకరంలో ప్రవేశిస్తే చిత్తమ సంధాన సౌభాగ్యం’ లభిస్తుందని అంటారు. వణుకుని తగ్గించి, ఉల్లాసాన్ని పెంచి “భోగి” యోగి కాగల మార్గం ఈ మాసంలో గోచరిస్తుంది
మకర సంక్రమణం నాడు ఉపయోగించే నువ్వులు, జొన్నలు, సజ్జలు వంటి ధాన్యాలు. గుమ్మడి, బీర, పొట్ల వంటి కూరగాయలు బంతి, చేమంతులు ,మానవుని శారీరక ఆరోగ్యానికి ప్రసాదాలు.
” భోగి ” అంటే భోగము అని హేమాద్రి పండితుడు భోగి విశిష్టతను గురించి తెలిపాడు. భోగి నాడు ఉదయం భోగిమంటలు వేస్తే అశుభాలు తొలగి పోతాయి భోగి పండుగ రోజు భోగిమంటల వల్ల హేమంత ఋతువులో చలితో పాటు విజృంభించే క్రిములు కీటకాలు ప్రాణులకి అపకారం కలిగిస్తాయి మన ప్రాచీనులు తెల్లవారుజామున వేసుకునే భోగి మంటల వల్ల వచ్చే దాహక శక్తికి క్రిములు నశిస్తాయి అనే రహస్యం తెలిసి భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ భోగి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటే శుభ ఫలితాలు పొందుతారు దక్షిణాయనమున వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతించే ఈరోజు ఈ భోగిపండుగ. ఈ భోగిమంటల వల్ల హేమంత రుతువులో చలితో పాటు విజృంభించే క్రీములు ప్రాణులకి అపకారాన్ని కలిగిస్తాయి కనుక మన ప్రాచీనులు ఎక్కువ సంఖ్యలో వుండే తెల్లవారుజామున వల్ల వచ్చే దాహక శక్తికి క్రిములు నశిస్తాయి అనే భావనతో భోగి మంటలను ఏర్పాటు చేశారు పండుగ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాల బాల బాలికలకు రేగుపండ్లు చెరుకుగడలు చిల్లర నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. భోగి పండ్ల పేరిట పేరంటానికి వచ్చిన ముత్తయిదువులంతా పిల్లల తలపై రేగుపండ్లు పోయటం వల్ల పిల్లలకు తగిలిన దిష్టి పోతుందని ఆ సంవత్సరం అంతా శుభాలే కలుగుతాయని భావిస్తు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆశీర్వదిస్తారు. ఇలా చేయటం వలన ఎటువంటి దృష్టి దోషాలైనా నివారించేందుకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.
సంక్రాంతి రోజున ప్రాతఃకాలంలోనే అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చిన్నలు పెద్దలు ఆశీర్వాదాలు పొందుతారు ఆరోజు తెల్లవారగానే స్త్రీలు రంగవల్లికలతో ప్రతి ఇంటి ముందు శోభాయమానంగా అలంకరిస్తారు.కొత్తగా వచ్చిన ధాన్యంతో ఆవు పాలను కలిపి పొంగలి తయారుచేసి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని కి నివేదించిన తర్వాత ఇంట్లోని వారందరూ స్వీకరిస్తారు.ప్రతి సంవత్సరం పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుని కోరుకుంటారు.
మూడవ రోజు కనుమ. పరోపకారమే ద్యేయంగా గల ఈ మూగ జీవాలను గౌరవించడమే నికి పశువులను శుభ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మెడలో గజ్జెలు వేసి పూలమాలలు వేసి ప్రదక్షిణ చేయడం కనుమ. ఇది రైతులకు ప్రత్యేకమైన పర్వదినం సంవత్సరమంతా కష్టపడి నా శ్రమ ఫలితమైన ధాన్యరాశులు నిలుస్తాయి. ఇంటికి తెచ్చుకున్న కొత్త ధాన్యము తో పొంగలి చేసి సూర్యభగవానునికి నివేదిస్తారు మనకు ప్రత్యక్ష దైవమైన సూర్య దేవునికి సంబంధించిన పండుగ సంక్రాంతి ఈ మకర సంక్రాంతినాడు సూర్యోపాసన సూర్యారాధన విశిష్టమైనది సకల సృష్టి లోని ఏ ప్రాణీ సూర్య భగవానుని దివ్య శక్తి వల్లనే మనగలుగుతోంది ప్రాణదాత అయినా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి సూర్యుణ్ణి పూజించాలి అని శాస్త్రవచనం. ఈ కనుమ రోజున పశువులను అలంకరించి పూజించిన అనంతరం వాటికి భక్ష్యములను తినిపించి మూగజీవాల పట్ల తమ ప్రేమను ప్రకటించుకున్నారు.హరిదాసులు గంగిరెద్దుల వారు బుడబుక్కలవారు పల్లెల్లో తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ గ్రామాలకు కొత్త శోభను వాతావరణాన్ని తీసుకొస్తారు.
ఈనాటికి నిజమైన జానపదుల పండుగ కళ్ళల్లోనే కనబడుతుంది మారుతున్న కాలంలో నేటి ఆధునిక యుగంలో కనుమరుగవుతున్న జానపద కళలు అంతరించిపోకుండా సంప్రదాయ పండుగ ఆనవాయితీ గా చేసుకోవడం నేటికీ పల్లెల్లో కనబడుతుంది. హరిదాసులు తెల్లవారుజామునే హరిలో రంగ హరి అంటూ హరి రామ కీర్తనలు స్మరణ లు చేస్తూ గ్రామాలలో ప్రజలను మేల్కొలుపుతారు. హరిదాసుల తల పై గుమ్మడి ఆకారపు ఇత్తడి పాత్రలు ధరించి ఆ పాత్రకు కుదురు చుట్టుకుని హరి కీర్తనలు పాడుతూ అనుగుణంగా చిందులు వేస్తారు. భక్తులు ప్రీతితో ఇచ్చే బియ్యాన్ని దక్షిణలు తీసుకుని భిక్ష పెట్టిన వారిని ఆశీర్వదిస్తారు చొక్కా ధరించి దాని మీద నల్లకోటు వేసుకుని ఎర్ర తలపాగా చుట్టుకుని మీద ఎర్రని బొట్టు పెట్టుకుని ఇంటి యజమానుల భవిష్యత్తును పాటల రూపంలో చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతూ అంబ పలుకు జగదంబ పలుకు అంటూ ఆశీర్వదిస్తూ ధనం ధాన్యం భిక్ష స్వీకరించి దీవిస్తా రు. గంగిరెద్దుల వాళ్ళు పండుగ దినాలలో ప్రతి ఊరిలో దర్శనమిస్తారు. ఎద్దుల మెడలో గంటలు మువ్వలు గవ్వలతో అందంగా కొట్టిన వస్త్రాలు వృద్ధుడిపై సింహాద్రి అప్పన్న విగ్రహం కొమ్ములను వీపుపై రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ధనుర్మాసమంతా ఉదయాన్నే గంగిరెద్దులతో పాటు శృతి సన్నాయి డోలు వంటి వాయిద్యాలు పట్టుకొని పల్లెల్లో వాటిని ఆడిస్తారు. వాయిద్యాలకు అనుగుణంగా బసవన్న తో నృత్యాలు చేయిస్తూ అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ బల్లపై నాలుగు కాళ్లు పెట్టి మోకాళ్లపై నడిపించి ఒకే కాలుతో దండం పెట్టించి సంతోషపరిచే ఇచ్చే ధాన్యం వస్త్రం దక్షిణ కానుకలు స్వీకరించే సింహాద్రి అప్పన్న చల్లగా చూడాలని దీవిస్తారు. మన భారతీయ సంస్కృతికి అద్దంపట్టే సంక్రాంతి పండుగ పాలిచ్చే గోవులకు పసుపు కుంకుమ పనిచేసే బసవనికి పత్రీ పుష్పం లక్ష్మీ అనుగ్రహంతో పాడిపంటలు వృద్ధి చెందే పాడిపంటల సిరి మకర సంక్రాంతి.
ఈ సంక్రమణ కాలం లో ఎవరైతే దానధర్మాలు ఇతోధికంగా చేస్తారో అవన్నీ ఆ దానవ వీరులతో జన్మ జన్మ లోనూ లభిస్తాయని ధర్మసింధు తెలుపుతోంది మానవుడికి మోహన్ అనేది ముసలి పట్టుకుని వదలదు ఆ మోహన్ నుంచి తప్పించుకోవడానికి ఈ మకర సంక్రాంతి కాలంలో నువ్వులు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు విరివిగా దానధర్మాలు చేయాలి అని పురాణ వచనం.
బొమ్మల కొలువులు, కోడి పందాలు, జంగమ దేవరలు గంగిరెద్దు దాసర్లు పశు పూజలతో లక్ష్మికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ పద్ధతిగా జరుపుకునే మకరసంక్రాంతి వైభవ శోభకు పల్లె సీమలే సాక్ష్యం.
తెలుగులో చారిత్రక శతకాలు – సింహాద్రి నారసింహ శతకం (గోగులపాటి కూర్మనాధ కవి (1720-1795) )
సమాజ హితాన్ని ఆకాంక్షించడమే శతక సాహిత్య ప్రధాన లక్ష్యం. సంస్కృత, తమిళ, కన్నడ భాషా సాహిత్యాలలో ప్రారంభమైన శతక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 12వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథ కవి రాసిన శతకం మొదటి శతకం అని అనేకులు అన్నప్పటికీ తెలుగు సాహిత్యంలో అనేక మంది కవులు భక్తి, చారిత్రక, శృంగార, నీతి, వేదాంత, తాత్విక, దాస్యం, జీవితచరిత్రలు, స్వీయచరిత్రలు, స్థలమహాత్యం, నిందాస్తుతి శతకములు, కథా శతకాలు, సమస్యాత్మక శతకాలు, నిఘంటువు, అనువాద, అచ్చ తెలుగు, చాటువులు అని అనేక రకాల శతకాలు వెలువరించారు.
శతక లక్షణాలు:
లయాత్మకమైన ఛందస్సు, ప్రాణసమమైన శబ్ద సౌందర్యంతో ప్రతి పద్యం పాఠకులను అలరించాలి.
సంఖ్యాపరంగా వంద పద్యాలు కానీ కొందరు 100/108/116 పద్యాలు వ్రాస్తారు. ద్విశతి (200) త్రిశతి (300) పంచశతి (500) సప్తశతి (700) సహస్రం (1000) పద్యాలు రాసినా ఒకే మకుటంతో ఉంటే శతకం అనే పిలుస్తారు. శతకానికి మకుటం ఉండడం వలన ప్రతి పద్యాన్ని ఒకటి లేక రెండు వృత్తాలలో రాయాలి. శతకంలోని అన్ని పద్యాలు ఒకే రసంతో ప్రతిపాదించబడాలి.
చారిత్రక నేపథ్యంలో ఆధ్యాత్మికతను జోడించి సింహాచల నారసింహునిపై రాసిన “సింహాద్రి నారసింహ శతకం” కళింగాంధ్రను పాలించిన పూసపాటి విజయనగరరాజుల కాలం నాటిది.
క్రీ.శ.1720లో జన్మించిన గోగులపాటి కూర్మనాధ కవి ఇప్పటికి మూడు శతాబ్దములు పూర్తి అయిన ఈ శుభ సమయంలో శతక సాహిత్యానికి జరుగుతున్న ఈ సాహిత్య పట్టాభిషేకంలో అతని స్థానం సుస్థిరం. అతని రచనలలో మృత్యుంజయ విలాసము అను యక్షగానము; సింహాద్రి నారసింహ శతకము; లక్ష్మీనారాయణ సంవాదము; సుందరీమణి శతకము (అముద్రితము) ముఖ్యమైనవి.
శతక లక్షణాలైన
సంఖ్యాపరంగా నూట ఒక్క పద్యాలు మాత్రమే లభిస్తున్నాయి. .
మకుటం “వైరిహరిరంహ! సింహాద్రి నారసింహా!”
కవి గోగులపాటి కూర్మనాధ కవి
లేఖకుడు ఆదుర్తి హరిహర దాసు
108 పద్యాలకు ఇద్దరూ అవసరమైన పరిస్థితి చాలా విచిత్రమైనది.
గోగులపాటి కూర్మనాధ కవి (1720-1795)
గౌరమాంబా బుచ్చనామాత్యుల కుమారుడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. వీరికి వెంకన్న, కామన్న అనే ఇద్దరు సోదరులున్నారు. వీరు కాశీ, రామేశ్వర యాత్రలు చేశారు. రామతీర్థంలో ప్రాథమికవిద్య పూర్తిచేసుకుని సంకీర్తనాచార్యుడుగా ఉండేవారు. శ్రీ తిరుమల పెద్దింటి సంపత్కుమార్ వేంకటాచార్యులు వారి శిష్యుడు. ఈ విషయాలను కూర్మనాథ కవి తన ‘మృత్యుంజయ విలాసము’ అను యక్షగానమునందు వ్రాసుకొని ఉన్నాడు.
ద్విపద
“సలలిత పెద్దింటి సంపత్కుమార
శ్రీ వేంకటార్య దేశికుల శిష్యుండ
పావన గౌరమాంబ బుచ్చన్న మంత్రి
వర పుత్రుడను సూర వరుని పౌత్రుండ//”
ఇతడు విజయనగరసంస్థాన ఆస్థానకవిగా, దేవస్థాన ఉద్యోగిగా, ప్రభువుల నుండి అగ్రహారాలు పొందాడు. రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకాకుళంలో పనిచేశారు. అడిదము సూరకవి, లక్ష్మీ నృసింహకవి సమకాలికులు. ఆఖరి రోజులలో దేవుపల్లి గ్రామంలో ఉండేవారు. ఆ గ్రామంలో దేవాలయ సమీప స్థలము గోగులపాటి వారి నివేశనమని ఈ రోజుకీ పిలువబడుతోంది. సుమారు 1795సం:లోఇచ్చటనేపరమపదించినట్లుగాచెప్తారు.
సంస్కృత కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నా తెలుగు మధుర కవిత అంటే ఇష్టం.
గోగులపాటి కూర్మనాధకవి ఆశువుగా చెబుతుండగా ఆదుర్తి హరిహర దాసు తాళపత్రాలపై రాసిన సింహాద్రి నారసింహ శతకము అనేక ముద్రణలు పొందినది. 1930లో “శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ శతకము” పేరుతో విశాఖపట్టణంలో ముద్రించిరి. శ్రీ రామానుజ విలాస ముద్రాశాల యందు 1930లోనే విజయనగరంలో ముద్రింపబడింది. 1941లో విజయనగరంలో ఆంధ్ర విజ్ఞాన సమితి వారు కూర్మనాథ కృతులను ప్రకటించారు.
1962లో సాహిత్యాచార్య, కవితాశేఖర పంతుల లక్ష్మీనారాయణశాస్త్రిగారు ఆంధ్ర భాషా శాఖాధ్యక్షుడు, ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల వారిచే తిరిగి వ్రాయబడినది. 1963 లో సింహాచల దేవస్థానం ధర్మకర్త అయిన శ్రీ పూసపాటి ఆనంద గజపతిరాజు గారు దేవస్థానం వారిచే తిరిగి ముద్రింప చేశారు.1983 లో తిరిగి ముద్రింపబడింది.
సింహాద్రి నారసింహ శతకం
సింహాచలేశుని స్తుతిస్తూ గోగులపాటి కూర్మనాధ కవి రాసిన 108 సీస పద్యాలతో సింహాద్రి నారసింహ శతకము చారిత్రకంగా మిక్కిలి ప్రసిద్ధి పొందింది.
చారిత్రక ప్రాధాన్యత:
1753 సం:న దక్కను సుబేదారైన సలాబత్ జంగ్ ఉత్తరసర్కారులు బుస్సీకి కౌలునకొసంగెను. కౌలుకు తీసుకొనిన ఉత్తర సర్కారులు స్వాధీనపరచుకొనుటకు పరాసు బుస్సీ మచిలీపట్టణమునకు గవర్నర్ అయిన మారిసన్ అను అతనిని రాజమహేంద్రవరం శ్రీకాకుళం సర్కారులకు పంపెను. కానీ శ్రీకాకుళములో ఫౌజుదారుగా ఉన్న జాఫర్ అలీ ఖాన్ నకు ఈ విషయం ఇష్టం లేదు. అందుచే బలవంతుడైన మొదటి విజయరామ గజపతితో సంధి చేసుకుని ఆయన సహాయము వలన శ్రీకాకుళం, రాజమహేంద్రవరము స్వాధీనం చేసుకుని ఏకఛత్రాధిపత్యంగా సర్కారులను పాలించదలచెను.
మారిసన్ ఈ విషయం గ్రహించి తాను ముందుగానే విజయరామ గజపతితో సంధి చేసుకున్నాడు అన్న విషయం జాఫరల్లీ తెలుసుకుని శ్రీకాకుళం విడిచి పారిపోయెను. విజయరామగజపతి పైనను, ఫ్రెంచి వారి పైనను పగ సాధించదలచి ఫ్రెంచి వారితో యుద్ధం చేస్తున్న రఘోజీ భాంస్లే కుమారుని సైన్యముతో శ్రీకాకుళం సర్కార్ కు కొండల మీదుగా రమ్మనెను. ఆ కొండ మార్గమును చూపుటకు పాచిపెంట జమిందార్ అయిన వీరప్ప దొర వారికి తోడ్పడెను. మహారాష్ట్రులు గ్రామములను దోచుకొనుచుండగా, తురకలు దేవాలయములు పడగొట్టుచుండిరి. సింహాచలం వరకు వారు చేరిరి అని తెలుసుకుని దేవస్థాన ఉద్యోగులూ భక్తులూ అయిన ఆదుర్తి హరిహరదాసు మరియు గోగులపాటి కూర్మనాధకవి ఇరువురూ స్నానం చేసి దేవాలయం గర్భగుడి లోనికి ప్రవేశించి తలుపులు మూసుకుని శతక రచన చేసిరి. గోగులపాటి కూర్మనాధ ఆశువుగా శతకము చెప్పుచుండగా గంటముతో తాటి ఆకులపై హరిహర దాసు వ్రాసెను.
తురక దండు కొండపైకి ఎక్కి కట్టడములు పాడు చేయుచుండిరి. క్రమముగా దేవుని కళ్యాణ మండపం పాడు చేసి గుడి ఆవరణలో ప్రవేశించి అచ్చటి రాతి రథము నందు గల గుఱ్ఱములను పాడు చేసిరి. గర్భాలయం లోనికి ప్రవేశించుచుండగా కంచు తుమ్మెదలు ఉద్భవించి వారిని వెంటనే సంహరింప వారు వెనుతిరిగిరి. కానీ వారిని విశాఖపట్టణం సమీపమున గల తుమ్మెదల మెట్ట వరకు వెంటనంటి అంతర్ధానమైనవి.
విజయరామ గజపతి సైన్యమును సక్రమముగా సమకూర్చుకుని రఘూజీ సైన్యములను అనకాపల్లి వద్ద తుమ్మపాల వద్ద ఎదిరించి, ఓడించి సింహాచలము తిరిగి వచ్చెను. వచ్చినప్పుడు త్రోవలో కనబడిన అశ్వముల యొక్కయు అశ్వికుల యొక్కయు మృత కళేబరములను చూసి సింహాచలము చేరి విషయం అంతయు తెలుసుకుని శతకమును ఆశువుగా చెప్పినందుకు కూర్మనాథ కవికి రామతీర్థం దగ్గర ఒక అగ్రహారము, తిరిగి అడగకుండా వ్రాసినందుకు హరిహరదాసుకు కొత్తవలస దగ్గర నిమ్మలపాలెం అగ్రహారము ఇచ్చెను. నేటికినీ హరిహరదాసు కుటుంబీకులకు దేవుని కళ్యాణంలో నాలుగవ దినమున కొంత సొమ్ము ఇచ్చే రివాజు కలదు.
శతకము లోని విశేషములు
గోగులపాటి కూర్మనాధకవి శ్రీ సింహాద్రినాథునికి ఆంతరంగిక భక్తుడు. స్వామి వద్ద ఎంతో చనువు కలదు.
ఈ శతకము లోని కవిత్వం నిరర్గళ ధారా ప్రవాహ సదృశంగా సంస్కృతాంధ్రములందు కవికి గల అసమాన పాండిత్యము చాటుచున్నది. కవిత కదళీ పాకము నందు నడచినది.
ఇందులో జాతీయ పద ప్రయోగములు, పెక్కు సామెతలు, ఉర్దూ మాటలు కూడా కలవు.
తురక మాటలు తెలుగులో కలిపి సీసములందు చెప్పుట ఉదా: బేగ్ అరే అరబ్బీ పడోరే
లోకోక్తి ప్రదర్శన
వ్రతము చెడ్డా సుఖం దక్కదు
ఏండ్లెగసనైన, బుద్ధి దిగసన వచ్చెనో
తినగ తినగ గారెలైనను కనరువేయు
కందకు లేని దురద బచ్చలికి నేల గల్గు
ఈకవికిగల కవితానైపుణ్యం తెలియ జేయుచున్నది.
ఈ శతకము చదువుట వలన ఆనాటి రాజకీయ సాంఘిక ఆర్థిక విషయములు తెలుసుకొనుటయే కాక ఆనాటి సింహాచల దేవస్థానం ప్రాశస్త్యము ఆలయ నిర్మాణ కౌశలం గ్రహింపగలము. సింహాద్రి నారసింహ మహిమ వర్ణించు ఈ శతకము భక్తులకు శిరోధార్యం చారిత్రిక పరిశోధకులకు చైతన్య దీపిక.
కూర్మ దాసు కవి రచనా విశిష్టత:
“వైరిహరిరంహ! సింహాద్రి నారసింహా!” అను మకుటంతో రాసారు. వైరి అనగా శత్రువులను సంహరించుట యందు వేగము కలవాడైన సింహాచల నారసింహా! అని వేడుకున్నాడు. శత్రువులు సింహాచలమును ముట్టడించుటకు శరవేగంగా వచ్చుచుండిన ఆ సమయములో వేగము అత్యావశ్యకము కనుక ప్రతి పద్యంలోనూ సింహాచలం నారసింహుని ఆ విధమైన మకుటము తో సంబోధించెను.
సింహాచలం దేవాలయమునకు శత్రువుల వలన విపత్తులు సంభవించే సమయమున భయోద్వేగ, భావోద్వేగ, భక్తి ఉద్వేగంతో కూడిన ఈ కవితాధార ఆశుధారా రూపంలో వెలువడి శతక రూపమును ధరించినది. అందువలన ఈ శతకము మొదటి నుండి తుది వరకు అపూర్వమైనా ధారా విశిష్టతను కలిగి ఉన్నది.
సీ// శ్రీమద్రమారమణీ మణీ రమణీయ
సరస చిత్తాబ్జ బంభర! పరాకు
శంఖ చక్ర గదాసి శార్జ్ఞ చాపాలి భా
సుర దివ్య సాధనకర! పరాకు
ప్రహ్లాద నారద వ్యాస శుకాదిక
భక్త సంరక్షణ పర!పరాకు
బహుతర బ్రహ్మాండ భాండ పరం పరా
భరణ లీలా దురంధర! పరాకు
తే// నీకు సాష్టాంగ వినతు లనేక గతులఁ
జేసి విన్నపమొనరింతుఁ జిత్తగింపు
చెనఁటి వీఁడని మదిలోనఁ గినుక మాని
వైరి హర రంహ సింహాద్రి నారసింహ!
తొలి వాక్యమును ప్రభువును సుముఖుని చేసికొనుటకై మొదటి పద్యం మొదటి పాదములో
“శ్రీమద్రమా రమణీ మణీ రమణీయ సరస చిత్తాబ్జ బంభర!” అని సంబోధించి, విపద్దశను గుర్తింప చేయుటకు “పరాకు” అని నుడివెను.
రెండవ పాదములో “శంఖ చక్ర గదాసి….. దివ్య సాధనకర! “పరాకు” అను సంభోధనమున శత్రుసంహారమునకు ఉపయోగించు యుద్ధ సాధనములు నీ హస్తమున నెలకొని ఉన్నవనియు, మరియు అవి దివ్యములు కనుక శత్రువులను సంహరింపవలయుననియు చెప్పెను. మూడవ పాదమున ప్రహ్లాద నారద….. భక్త సంరక్షణ పర పరాకు అనగా నీవు భక్త సంరక్షణాసక్తుడవు కనుక ఈ మహా విపత్తు నీవే తొలగింప పూనుకొనుము. నాలుగవ పాదములో బహుతర బ్రహ్మాండ భాండ పరంపరాభరణ లీలా దురంధర! పరాకు అనుదానిచే ఒక్కొక్క బ్రహ్మాండమందు పదునాలుగు లోకములు గల ఈ లెక్కలేనన్ని బ్రహ్మాండములు నీకు భాండములుగా ఉన్నవి. అటువంటి నీకు ఈ శత్రువులను శిక్షించి, నీ ఆలయమును రక్షించు కొనుట అనునది అత్యల్ప కార్యము కావచ్చును అంటూ భక్తి భావధ్వని ప్రధానమైన కావ్యం. ఇందలి పద్యములన్నియు భక్తిభావమునే ధ్వనింప చేయుచున్నవి.
ఈ శతకంలో స్వామి వద్ద తనకు గల చనువుతో నిందలతో, నిష్టురములతో, అధిక్షేపములతో అవహేళనములతో స్వామిని హెచ్చరిస్తూ విపత్కర పరిస్థితుల్లో ధైర్యంతో, నిర్భీతితో, ఆశుధారా రూపమున తన నోట వెలువడిన ప్రతి పదమును, తిరిగి అడగకుండా లిఖించిన హరిహరదాసు ప్రశంసనీయులు.
7వ పద్యములో “పొట్నూరులోని కోదండరామ మూర్తి ఏ పొదలలో దాగెనో, భీమసింగిలోని గోపాల మూర్తి యెక్కడి కేగెనో, జామి లోని జనార్ధనస్వామి యెచ్చోటికి వెళ్ళెనో, చోడవరములోని కేశవ రామమూర్తి ఎన్ని పాట్లు పడుచున్నాడో” అను వాక్యముల చేత ఆయా ఆలయములను తురక సైన్యములు పాడుచేసెను అను విషయము స్ఫురింప చేయబడినది.
8వ పద్యములో యవనులూ, ఖానులూ, తురకలూ “నీకు వారి నమాజులు మున్నగు వానియందే ఇచ్చ పుట్టెనా” అని భగవానుని ఎత్తిపొడిచెను. వీరినందరినీ శీఘ్రముగా ఢిల్లీకి తొలగ ద్రోలుము” అని చెప్పుట చేత వీరిని విధ్వంసం చేయకుమని ప్రార్థించుటచేత భారతీయ సహజమైన కవీంద్రుని అహింసా దృష్టి వెల్లడగును.
ఈ శతకంలోని ప్రతి పద్యము అర్థవంతమైనది.
9వ పద్యంలో నీ కొండమీదికి ఈ దుష్టులు భక్తులను కొట్టుట, పవిత్రములగు మంటపములందు కల్లు త్రాగుట, నీ వంటశాలలో మాంసపు ముక్కలను వండుట, గుడిలో చొచ్చి పరసతుల భంగపరచుట మొదలగు దుష్కార్యము లను చేయకుండగనే వారిని పౌరుషంతో పారద్రోలు ము అని ప్రార్ధించెను.
11వ పద్యంలో ఒక్క భార్యగల గృహస్థులు ఇన్ని ఇడుములు పొందినప్పుడు అష్ట భార్యలు 16000 సతులు కల నీవు ఎక్కడికి వలస పోయెదవు? అని అధిక్షేపించెను.
యవనుల ముట్టడియు, శతక రచన ఏక కాలమున జరుగుచుండుట క్రమముగా పద్యములలో కనబడును.
మహమ్మదీయులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో వారి దృశ్యాలను చూసిన కవి నరసింహుని గేలి చేస్తూ
“జడ విప్పి జులపాలు సవరింపు మిరువంక
……. బీబీ నాంచారిని బిలిపింపు వేగమే
తుదకభ్యసింపు మీ తురక భాష” (32)
ఆత్మ కీర్తన చేయ హరి భక్తులేటికీ
కేకలు వేయగా ఫకీర్లె గలరు (41)
ఈ శతకం చెప్పారు. తురుష్కుల దుశ్చర్యలను నిశితంగా ఖండించి దేవుని సైతం మేలుకొలిపాడు.
“నీవు సింహాచల గుహలలో దాగిన నిన్ను పిరికివాడందురు” అని భగవానునికి నిందా భయమును కలిగించెను.
ఇంతలో శత్రు సైన్యములు సింహాచలం కొండ ఎక్కుతూ ఉన్నవి. ఈ విషయమును కవి
“అరి సైన్యధూళి సూర్యాక్రాంతమై మించె నింకేమి దయఁ జూచెదీవుమమ్ము ”
జాగరూకుడవై రిపు క్షయ మొనర్పు”
“నాకేమియు నిమ్మని నినుఁగోరుట లేదు
నీ పద సేవలు చేయు మాకు వేరు కోరికలెందులకు” అంటూ ప్రార్థించారు.
ప్రజలు గ్రామములను వదిలి వలస పోయిరి. దుష్టులు సర్వము దోచిరి. ప్రజలు పడరాని పాట్లు పడిరి. ఇప్పుడు తురక దండు మీ చెంతకే వచ్చింది.
“శీఘ్ర బుద్ధే పలాయనమ్” శీఘ్ర బుద్ధి కలవానికి పారిపోవుటయే కర్తవ్యము” అని లోకోక్తితో ఎత్తిపొడిచెను.
“నిఖిల విశ్వంబును నీయందణఁగియుండు
విశ్వంలో నీవు వెలసినావు”(59)
దుష్టుల శిక్షింప వేమి? అని ప్రార్ధించి
ఇంత బ్రతిమాల మాకేలా?
కందకు లేని దురద బచ్చలి కేల?
అది నిరుత్సాహం ప్రదర్శించెను.
భగవంతుని లీలా విశేషాలను శ్రీరామచంద్రుని ప్రసన్నతను ఇలా చెప్పారు
“నీ పాద రజమున నిముషంబు లోపల
బాపురే! సతి అయ్యే చాపరాయి!”
కానీ భగవంతుని పొగిడెను.
వెంటనే ఉక్కు మూతులు గల గండు తుమ్మెదలను పంపి ఆ దుష్ట సైన్యమును చీల్చి చెండాడగా, యవనుల గర్వము అణిగినది. ప్రజలు రక్షించబడిరి. ఆలయమునకు ప్రమాదం తప్పింది. (69)
గీత// అరుల బరిమార్చి, వైశాఖ పురసమీప
గిరి బిలంబున డాగె, బంభరములెల్ల
అది మొదలె తుమ్మెదల మెట్టయండ్రుదాని
వైరి హరి రంహ! సింహాద్రి నారసింహ!(70)
తరువాత ఈ మహాకవి భగవంతుడైన నరసింహుని తాను నిష్టురోక్తుల బలికి నిందించినందులకు పశ్చాత్తాపపడి “అపరాధిని నపరాధిని” అని 32 పర్యాయములు పలికి, దయ చూపుమని క్షమాపణ వేడుకొనెను.
వీరాధివీరుడువై విరాజిల్లు నిను
బిరికివాడంటిని భీతి లేక”
క్షమాపణ కోరుకున్న తరువాత అతని మనస్సు శాంతి పొంది భగవత్ మహత్యమును ప్రత్యక్షముగా సందర్శించి బ్రహ్మానంద పారవశ్యమును పొంది హృదయమున గల భక్తితో
“ప్రభూ! శత్రువులను మర్దించి అలసితివి
నా హృదయ శయ్యయందు పరుండుము
నేను నీ పదములొత్తెదను”
78 నుండి 98 వరకూ ప్రౌఢమైన రచనతో దశావతారములు వర్ణించెను.
మకుట కుండల కేయూర మహిత కంక
ణాంగుళీయక ముఖ్య భూషాంగ, విశ్వ
నిలయు, నారాయణ స్వామి నిన్నుఁ గొలుతు
వైరి హరి రంహ! సింహాద్రి నారసింహ!(101)
ఈ విధంగా
కూర్మనాథకవి ఆశువుగా శతకాన్ని చెపుతూంటే తన సహచరుడైన ఆదుర్తి హరిహరదాసు గంటం పట్టుకుని తాటి ఆకులపై వ్రాసారు. కవి మొర ఆలకించి స్వామి కొండ గుహల నుంచి తుమ్మెదల దండును పంపి మహమ్మదీయులను భయంకరంగా హింసించి విశాఖపట్టణం స్మశానం దాకా తరిమి వేసేటట్లు చేశాడు. నాటి నుండి ఆ ప్రాంతానికి తుమ్మెదల మెట్ట అని పేరు వచ్చింది.
విజయరామరాజు తుమ్మపాలెం వద్ద శత్రువులను ఓడించి తిరిగివస్తూ ఈ విషయాన్ని విని కూర్మనాథ కవికి రామతీర్థం సమీపాన ఒక అగ్రహారాన్ని, శతకాన్ని తాటి ఆకులపై వ్రాసిన హరిహర దాసుకు కొత్తవలస వద్ద నిమ్మ పాలెం అను అగ్రహారాన్ని ఈనాముగా ఇచ్చారు. నేటికీ సింహాచలంలో దేవుని కళ్యాణం రోజున వీరికి కొంత దక్షిణ ఇచ్చుకునే ఆచారం వుంది. ఈ శతకానికి తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉంది.
తెలుగు భాష, సాహిత్య రంగాలలో విశేషకృషి చేసిన సాహితీవేత్తలకు 2015 నుంచి ఏటా ప్రభుత్వం ప్రదానం చేస్తున్న కాళోజీ పురస్కారం 2021 సంవత్సరానికి గాను పెన్నా శివరామకృష్ణ గారికి కాళోజీ జయంతి రోజున హైదరాబాదులోని రవీంద్ర భారతిలో 1,01,116 నగదు, శాలువా, జ్జాపిక తో అందజేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన పెన్నా శివరామకృష్ణ అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన అలల పడవల మీద, నిశ్శబ్దం నా మాతృక వంటి కవితా సంకలనాలను వెలువరించారు. గజల్ ప్రక్రియలో ఆయన విశేషమైన కృషి చేశారు.
సాహిత్య విమర్శలోనూ తనదైన ముద్ర వేశారు.నిత్య సాహిత్య కృషీవలుడిగా సంపుటాలు, సంకలనాలు ఎన్నో వెలువరించారు. 11 కవిత్వ సంకలనాలు, 8 సాహిత్య విమర్శ సంపుటాలు, పదుల సంఖ్యలో ఇతర రచనల సంపుటాలు వెలువరించారు. కవిత్వం, సాహిత్య విమర్శ, వచనం.. ఏది రాసినా అది సామాజిక ప్రయోజనం కోసం రాశారు. పలు సాహిత్య విమర్శనా గ్రంధాలను వెలువరించారు. మానవీయతను తన కలం లోకి ఒంపుకొని మానవీయ పరిమళాలను వెదజల్లుతున్న శివరామకృష్ణ ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఆయనతో మాడిశెట్టి గోపాల్ జరిపిన ముఖాముఖి.
మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలపండి?
నల్లగొండకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలోని దుగునవల్లి గ్రామం మా సొంత ఊరు. ఒకటి నుంఛి నాలుగవ తరగతి వరకు అక్కడే చదువుకున్నా. ఐదు నుంచి పదవ తరగతి వరకు, మాఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరులో. డి, ఓ. యల్. రెండేళ్ళు, బి. ఓ. యల్. మూడేళ్ళు, నల్లగొండలోని మా చిన తాతగారు మేడిపల్లి రాధాకృష్ణమూర్తి గారి ఇంట్లో ఉండి, గీతా విజ్ఞానాంధ్ర కళాశాలలో చదువుకున్నా. యం. ఏ. (తెలు

గు), యం. ఫిల్., పిహెచ్. డి. లు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో. శేషీంద్రశర్మ గారి “నా దేశం నా ప్రజలు” కావ్యం మీద యం. ఫిల్., “శేషేంద్ర కవిత్వానుశీలనం” అనే అంశం మీద పిహెచ్. డి. పూర్తి చేశా. “శేషేంద్ర కవిత్వానుశీలనం” అనే పుస్తకాన్ని 1993 లో ప్రచురించాను.
కవిత్వం, విమర్శ, గజల్స్ …..వీటిలో మీరు బాగా ఇష్టపడే ప్రక్రియ ఏది?
అన్ని ప్రక్రియలనూ అభిమానిస్తాను. కవిత్వంలోనైనా, విమర్శలోనైనా, తిరిగి చూసుకున్నప్పుడు, “నేనే మొదటిసారి చెప్పాను” అనిపించిన, “ఇది నేను మాత్రమే చెప్పగలిగినది” అనిపించిన ప్రతి వాక్యమూ నాకు ఇష్టమే.
విమర్శలో మీ ప్రత్యేక దృష్టికోణం ఏమిటి?
కొన్ని మంచి కవితలు, నాకు గొప్ప అనుభూతినో, కొత్త ఆలోచననో, నూతన చైతన్యాన్నో కలిగించినప్పుడో, వాటికి కారణాలను నాలో నేను ఆలోచించుకుంటూ, నా అభిప్రాయాలను తోటి సాహిత్యాభిమానులతో పంచుకోవడం కోసమే రాశాను. ఇలాంటివి రాసేటప్పుడు (రాసిన తర్వాత) నేనేదో సాహిత్యవిమర్శ రాస్తున్నాను అనే భావం నాకు లేదు. నేను చేసినది ఎక్కువగా కవిత్వ శిల్పవిశ్లేషణమే. విమర్శ పరిభాషలో “శిల్పానుశీలన విమర్శ” అనవచ్చునేమో!
గజల్ ప్రక్రియ గురించి వివరిస్తారా?
అరబ్బీ, పారసీ రెండు భాషలలోను
ఆరంభమై, వికసించిన కవిత్వ ప్రక్రియ గజల్. కొన్ని అరబ్బీ, కొన్ని పారసీ సంప్రదాయాలు సమ్మిళితమై, పదవ శతాబ్ది ప్రాంతానికి గజల్ ఒక స్థిర రూపాన్ని సంతరించుకున్నది. ఇరాన్ సంస్కృతిలో భాగంగా, గజల్, రుబాయీలు భారతదేశంలో ప్రవేశించాయి. పారసీ ద్వారా ఉర్దూలోకి, ఉర్దూ నుంచి ఇతర భారతీయ భాషలలోకి ఈ ప్రక్రియలు వ్యాపించాయి. గజల్ లోని షేర్లను మొదటిసారిగా తెలుగులోకి అనువదించినవారు, గజల్, రుబాయీలను తెలుగులో తొలుత రాసినవారు దాశరథి గారు. తెలుగులో గజల్ కు వ్యాప్తి కలిగించిన వారు సి. నా. రె. గారు. గజల్ అంటే ప్రియురాలితో సంభాషణ. గజల్ లోని ప్రేమించబడే వనిత లేదా ప్రియురాలు కఠిన హృదయ, శాశ్వత అప్రాప్య. ప్రియుడు లేదా ప్రేమించిన వ్యక్తి, ప్రియురాలితో పరోక్షంగా, ఏకపక్షంగా జరిపే సంభాషణే గజల్. ఇతర వస్తువులతో గజల్ రాసిన వారు కూడ ఉన్నారు. ఈ రెండూ చమత్కార ప్రధానమైన ప్రక్రియలు. శబ్దాలంకృతి, అర్థాలంకృతి పరస్పర పోషకంగా ఏకత్ర సమ్మిళితమై ఉండాలన్నది ఈ ప్రక్రియలలోని ప్రధాన నియమం. వస్తు, రూపాల పరంగా, అన్ని ప్రక్రియలకు ఉన్నట్లే, ఈ రెండు ప్రక్రియలకు కూడ కొన్ని ప్రత్యేకతలు, పరిమితులు ఉన్నాయి. అన్ని ప్రక్రియలలోనూ ఎప్పుడూ నాసిరకమైన రచనలు అధికంగా, ఉత్తమ రచనలు స్వల్పంగా వస్తూ ఉంటాయి. ఈ రెండు ప్రక్రియలలోనూ అదే జరుగుతున్నది.
ఇప్పటి వరకు ఎన్ని కవితాసంపుటులు ప్రచురించారు? మీకు నచ్చిన కవితాసంపుటి ఏది?

మూడు వచనకవితా సంపుటులు, మూడు హైకూ సంపుటులు, రెండు గజళ్ళ సంపుటులు, ఒక రుబాయీ సంపుటి ప్రచురించాను. నా లౌకిక జీవితానుభవాలకు, విషాదానందానుభూతులకు, సంఘర్షణలకు, వేదనలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలు “దీపఖడ్గం”లో ప్రతి ఫలించాయి; నా మానసిక స్థితిగతులలోని మరికొన్ని పార్శ్వాలు, వివిధ దశలలో “సల్లాపం”, “శిశిరవల్లకి” అనే గజళ్ళ సంపుటులలో, “అశ్రుధార” అనే రుబాయీ సంపుటిలో, (రాబోయే) “పెన్నాసరాలు”లో వ్యక్తమైనాయి. ఇవన్నీ నాకు ఇష్టమైనవే.
మీరు సాహిత్యేతర రచనలు కూడ ఎక్కువగానే రాశారు కదా! అవి ఎందుకు రాయాల్సివచ్చింది?
వివిధ సందర్భాలలో, వివిధ అవసరాల రీత్యా (ఆసక్తులలోని వైవిధ్యాన్ని అనుసరించి) సాహిత్యేతర రచనలను, కవులు, రచయితలు కూడ చదువుతూనే ఉంటారు. అటువంటప్పుడు సాహిత్యేతర పుస్తకాలను రాస్తే తప్పేమిటి? నా సాహిత్యేతర రచనలలో కొన్ని సమాచార ప్రధానమైనవి. విలువైన సమాచారాన్ని ఒకచోటికి చేర్చడంలోను నాకు ఆనందమే కలిగింది. సఫల, విఫల ప్రేమలు, ఎడబాటు, ముద్దు మానవజీవితంలో ఉన్నవే కదా! అవేమీ రచనలకు నిషిద్ధ వస్తువులు కావు కదా! ఎవరో, ఎదో అనుకుంటారని జంకకుండా, నా ఆసక్తులను తృప్తిపరచుకోవడం కోసమే కొన్ని సాహిత్యేతర పుస్తకాలను రూపొందించాను. అవేమీ మనుషులను చెడు దారి పట్టించేవి కావు, సమాజానికి హాని చేసేవి కావు.
మీ సంపాదకత్వంలో వైవిధ్యభరితమైన పుస్తకాలు వచ్చాయి కదా! వాటి గురించి చెప్పండి?
నేను సహసంపాదకత్వం వహించిన చాల సందర్భాలలో, నేనే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. దీనిని నేను సద్వినియోగం చేసికొన్నాను. వ్యక్తిగత రాగ ద్వేషాలకు అతీతంగా, నా దృష్టిలోని మంచి కవితలను ఎక్కువమంది సాహిత్యాభిమానుల వ
ద్దకు చేర్చడానికి ప్రయత్నించాను. ఇందుకు సహకరించిన సహసంపాదకులకు అందరికీ కృతజ్ఞుడిని.
శివారెడ్డి గారికి సంబంధించిన మూడు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు కదా! శివారెడ్డి గారి గురించి, మీరు సహసంపాదకత్వం వహించిన పుస్తకాల గురించి చెప్పండి?
విప్లవకవిగా కొనసాగినా, మనిషి యొక్క సమస్త భౌతిక, ఆంతరిక పార్శ్వాలను స్పృశించిన కవి శివారెడ్డి. వస్తువైవిధ్యం ఎక్కువ. తాత్త్విక దృష్టి లేని వారు ఎవరూ గొప్ప కవి కాలేరు. శివారెడ్డి గారి కవిత్వమంతటా తాత్త్వికత ప్రధానంగా కనిపిస్తుంది. తన శైలిని తానే అనుకరించకుండా, ఎప్పటికప్పుడు తన శిలిని తానే మార్చుకుంటూ వచ్చారు. వారి వ్యక్తీకరణ రీతులు కాలానుగుణంగా పరిణతి చెందుతూ వచ్చాయి. కవి వ్యక్తిత్వం వలన (ముఖ్యంగా సమకాలంలో) అతని కవిత్వం కూడ సానుకూల, ప్రతికూల ప్రభావాలకు లోనవుతూ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కూడ శివారెడ్డి గారి కవిత్వాన్ని గమనించవలసి ఉంటుంది.
నాకు తెలిసినంత వరకు, ఆయన రాసినన్ని స్త్రీ ఇతివృత్త కవితలు మరెవరూ రాయలేదు. అవి కూడ వస్తు, వ్యక్తీకరణల పరంగా వైవిధ్యభరితమైనవి. అందుకే వారి స్త్రీ ఇతివృత్త కవితలను “ఆమె ఎవరైతే మాత్రం” (2009) అనే పేరుతో సంపుటిగా తెచ్చాము. నేను వారి కవిత్వం మీద విమర్శ పుస్తకం రాస్తున్నప్పుడు, వారి కవిత్వం మీద వచ్చిన విమర్శ వ్యాసాలను, సమీక్షలను చాల సేకరించాను. వాటితోపాటు ఆ తర్వాత వచ్చిన వాటిని కూడ సేకరించి “శివారెడ్డి కవిత్వం – విమర్శలు, విశ్లేషణలు” (2009) పుస్తకం తెచ్చాము. వారు ఇప్పటికి వందకు పైగా పుస్తకాలకు ముందుమాటలు రాశారు. 86 ముందుమాటలను సేకరించి “శివారెడ్డి పీఠికలు” (2013) అనే పుస్తకం తెచ్చాము. ఇది ఐదు వందల పేజీల గ్రంథం. ఈ మూడు పుస్తకాలను గుడిపాటి గారు నేను కలసి రూపొందించాము.
ఈమధ్యన వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో విస్తృతంగా కవిత్వం వస్తున్నది కదా దాని మీద మీ అభిప్రాయం ఏమిటి?
అచ్చు అయినది అంతా మంచి కవిత్వం కానట్లే, సోషల్ మీడియాలో లైకులను, ప్రశంసలను పొందేవి అన్నీ మంచి కవితలు కావు. తమ రచనలలోని గుణదోషాలను మమకార రహితంగా పరిశీలించుకునే శక్తి ప్రతి రచయితకు అవసరం. కవులలో అంతరాలు ఉన్నట్లే, చదువరులలోనూ స్థాయీ భేదాలు ఉంటాయి. ఎవరి ప్రశంసను, లేదా ఎవరి విమర్శను ప్రామాణికంగా తీసుకోవాలి అనేది నిర్ణయించుకునే వివేకం ఉండాలి. ఇలాంటివి లేనప్పుడు, ఏ మీడియా అయినా పెద్దగా భేదం ఏదీ ఉండదు.
సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది చదువరులకు, రచనలు వేగంగా చేరే అవకాశం ఉంటుంది. ఆ మేరకు అది ఉపయోగకరమే. వ్యసనంగా మార్చుకోకుండా దుర్వినియోగం చేయకుండా ఉండడం అవసరం.
తెలంగాణ బిడ్డగా పరంపరలో మీరు అనుభూతి చెందిన గొప్ప అంశాలు….?
1969 లో నల్లగొండకు సమీపంలోని కట్టంగూరులో ఐదవ తరగతి చదువుతున్న రోజులు. అప్పటి ఉద్యమంలోనే, తెలిసీ తెలియని వయసులో, రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఒక రోజు నిరాహార దీక్ష చేశాను. విద్యార్థిగా, ఉద్యోగిగా వివిధ దశలలో ఆధిపత్య భావాలను, హేళనలను గమనించాను, అనుభవించాను. కనుక అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే గొప్ప ఆనందం. రాష్ట్ర అవతరణ అనంతరం, అవహేళన చేసిన వారే మన భాషా సంస్కృతులను అనుకరించే పరిస్థితి ఏర్పడడం మరింత ఆనందం.
మంచి సాహిత్యం వెలువడాలి అంటే, బాధ్యత రచయితలపై ఉంటుందా? పాఠకులపై ఉంటుందా?
హృదయంలోని బరువును దించుకోడానికో, బాధ్యతగానో, విషాద, ఆనందానుభూతులను పంచుకోడానికో, మానసిక సంఘర్షణలనుంచి వేదనల నుంచి కొంత సాంత్వన పొందడానికో, చైతన్యపరచడానికో, రాయకుండా ఉండలేకనో, రచయితలు (కవులు) రచనలు చేస్తారనుకుంటా. సమకాలంలోని సానుకూల ప్రతిస్పందనలు, రచయితలకు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నది వాస్తవం. కాని ఒక రచయిత ఒక వస్తువును సాహిత్యంగా (కవిత్వంగా) మార్చే ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమైనప్పుడే ఉత్తమ రచన రూపొందుతుంది. ఆ స్థితిలో చదువరుల మీద దృష్టి ఉంటే నిమగ్నత భగ్నమవుతుంది. సమకాలికుల ప్రశంసలు మాత్రమే ఆశించే రచయిత ఎక్కువకాలం ఉత్తమ రచయితగా నిలువలేడని అనుకుంటాను. కనుక మంచి సాహిత్యం రావడానికి, చదువరుల కంటే రచయిత బాధ్యతే ఎక్కువ అని నా అభిప్రాయం. గతకాలపు మహా కవుల రచనలను నేటికీ చదువుతున్నాము కదా! ఆయా కవులు సమకాలిక చదువరుల మీదనే ఆధారపడితే, వారి రచనలు నేటి దాకా నిలిచి ఉండేవి కాదేమో?
సాహిత్యసృజన, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ…ఈ రెండింటి పైన మీ అభిప్రాయం..?
సాహిత్యసృజన ఆంతరంగిక వ్యవహారం. ఎవరేమనుకున్నా అది ఒక కళ. కార్యక్రమాల నిర్వహణ కూడ కళే, కాని అది లౌకిక వ్యవహారం. కొంతమేరకు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఒకరికే రెండూ చేయగల సామర్థ్యం ఉంటే మంచిదే. చాల మంది సాహిత్య స్రష్టలకు కార్యక్రమ నిర్వహణ సామర్థ్యం ఉండదని నాకు అనిపిస్తుంది.
కాళోజీ పురస్కారం పొందిన సందర్భంగా మీ అనుభూతి / ప్రతిస్పందన…..?
నా కంటే వయసులో పెద్ద వాళ్ళు, సాహిత్యరంగంలో నా కంటే ఎక్కువ కృషి చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అట్లా ఎంతో మంది ఉండగా కాళోజీ పురస్కారం నాకు రావడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.
*******************
గాఢమైన తాత్త్విక అభివ్యక్తికి చిరునామాగా భాసిల్లుతున్న కవి మునిమడుగుల రాజారావు గారు గత రెండు దశాబ్దాలకు పైగా కవిత్వ సృజన చేస్తూ.. తెలుగు పాఠక లోకానికి చేరువైనారు. తాత్విక చింతనతో సాహితీ యానం చేస్తున్న ఆయన ‘అనాగరిక గేయం’, ‘దుఃఖనది’ పేర్లతో గ్రంథాలను వెలువరించి.. అందరి దృష్టినాకర్షించారు. తాత్విక తిలకాన్ని అద్దుతూ “నేను ఎవరు?” దీర్ఘ కవితను రూపుదిద్దిన ఆయన… ప్రతి రచనలో మానవుని అస్తిత్వ పరివేదనను అక్షరాల్లో నిక్షిప్తం చేసిన అనుభవం ఆయనకు ఉంది. కవిత్వంలో వర్తమాన జీవితంలోని సత్యాలను ఆవిష్కరించడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం. శ్రమకి.. మనిషి దుఃఖానికి ఉన్న సంబంధాన్ని తాత్త్విక కోణంలో కవిత్వ సృజన చేయడంలో ఆయన సిద్ధహస్తులు. కవి మునిమడుగుల గారి కవిత్వంలో బహుళత్వాల్ని అడుగడుగున చూస్తాం.. అలతి అలతి పదాలతో అద్భుతమైన తాత్వికతతో ఆయన జ్ఞాపకాలను విలక్షణమైన అభివ్యక్తితో కవిత్వంలో నిక్షిప్తం చేయడం ప్రశంసనీయం.

‘అనాగరిక గేయం’, ‘దుఃఖ నది’, ‘నేను ఎవరు?’ గ్రంథాలతో పాటు మునిమడుగుల గారు ‘సత్యం వైపు పయనం’, ‘సత్యమంటే ఏమిటి?” తాత్త్విక వ్యాసాల సంపుటిని ప్రచురించారు. గత రెండు దశాబ్దాలకు పైగా ఆయన రాస్తున్న కవిత్వాన్ని సమగ్ర దర్శనం చేసేందుకు “మునిమడుగుల రాజారావు సమగ్ర కవిత్వం” పేరుతో పాలపిట్ట పబ్లికేషన్స్ ద్వారా ఓ గ్రంథం వెలువరించారు. ఈ గ్రంథంలో రాజారావు గారి కవిత్వాన్ని సమగ్రంగా వీక్షించగలం.. సామాజిక సంక్లిష్టతలకీ, జీవన సంవేదనలకీ గల మూలాలను ఆవిష్కరించేందుకు ఆయన కవిత్వాన్ని పండించిన తీరు ఈ గ్రంథం ద్వారా గ్రహించగలం.. ప్రతీ కవితలోనూ ఆయన తాత్విక కవితాధారను గమనించగలం.
“పాదముద్రలు” శీర్షికతో రాసిన కవితలో… ఎక్కడినుంచో వస్తోన్న / పాదాల పయనంలో / కుండల కొద్దీ నింపుకు
న్న / సామాజిక దుఃఖమంతా ఘనీభవించాక / ఇప్పుడు కన్నీటి బొట్లు / రాలడానికి నిరాకరిస్తున్నాయనీ.. కారణం.. / కన్నీళ్ల వర్షానికి | వసంతం వచ్చి | చిగురించిన చెట్టు కదా / జీవితమని.. జీవితాన్ని / తాత్త్విక కోణంలో అద్భుతంగా ఆవిష్కరించారు.
మరో కవితలో.. అసమాన శాసన విషపు కోరల్లో చిక్కి / విలవిలలాడిన పాదాలు.. | తలల ముందర నడవలేక.. / కాళ్లని చేతుల్ల పెట్టుకుని నడిచెల్లిన పాదాలు / బ్రతుక్కి అర్థమేంటో తెలీక అంటూ / రాసిన పంక్తులు ఆయన కలం బలాన్ని సూచించేలా కొలువుదీరాయి.
“అణచివేతకు అనేక రూపాలు” శీర్షికతో రాసిన కవితలో.. అణచివేతకు గల అనేక రూపాలను ఏకరువు పెట్టారు. కనురెప్పల ప్రకంపనాలకు శబ్దాలు ప్రసవించవని.. రాజ్యమేలే వెలుతురులో నక్షత్రాలు ప్రకాశించవని చక్కని ముగింపునిచ్చారు.
“శిల్పి తాకని రాయి కూడా శిల్పమే”
కవితలో.. కవి రాజారావు గారు చక్కని భావుకతను ప్రదర్శించారు. నువ్వులో నూనె వుందనీ.! పువ్వులో మకరందముందనీ.. పాలలో నెయ్యి వుందనీ.. వాటిని పిండుకుని గ్రోలిన మనిషి.. శిల్పి తాకని రాయి కూడా ఒక శిల్పమే అన్న ‘ఎరుక’ లేక మహా నిశ్శబ్ద అడుగు పొరల కింద అజేయమైన దాని అంతః సౌందర్య స్పృహ లేక.. గొంగళి పురుగును అనాకారి అన్నాడని వ్యాఖ్యానించడంలో కవి ఔచిత్యాన్ని ప్రశంసించి తీరుతాం.
కాలమంటే / నిన్న నుంచి రేపటికి / జీవిత సాగిన దూరమని తేల్చి చెబుతూ..
వర్తమానం.. కాలం నడిచే భూమిక’ కవితను రాశారు. కాలమంటే ఏమిటో విభిన్న కోణాల్లో కవి చిత్రించిన తీరు బాగుంది.
‘దుఃఖ నది’ కవితలో కవి యొక్క తాత్త్వికత ఆద్యంతం కానవస్తుంది. ఈ భూమ్మీద మనిషి పుట్టకముందే మరణం పుట్టిందని విడమరిచి చెప్పారు. కాలాన్ని మూడు ముక్కలుగా నరికి.. గత కాలపు దారాలకు వేలాడుతూ.. క్షణక్షణం మరణించనందుకే.. మనసు మరుక్షణం నూతనంగా జన్మించనందుకే.. మానవజాతి అంత క్షేత్రంలో దుఃఖపు ఊట బయలు దేరిందనీ.. ఆపై నదిలా నడక కొనసాగిందని మంచి సందేశాన్నందించారు.
‘నాగలి శవమైంది’ కవితను ఆరంగా తీర్చిదిద్దారు.
‘చివరి ఆత్మీయుడు’ కవితలో కాటికాపరిని ఉన్నతంగా ఆవిష్కరించారు. అనురాగ బంధపు వలలు.. ఒంటరిగా స్మశానంలో.. చివరి ఆత్మీయుడైన కాటికాపరి సేవలను ప్రస్తావించిన తీరు బాగుంది.
‘ప్రసవించని ఒక పురిటి నొప్పుల కల’ కవిత అర్థవంతంగా మలచబడింది.
నాగలితో / పొలాలను దువ్వీ దువ్వీ / పుండు పుండైన / ఎద్దుల కాలి డెక్కల సాక్షిగా… అంటూ పొట్టకొచ్చిన పొలంను అక్షరాల్లో బంధించారు. కోతకొచ్చిన పొలమంతా తెల్లదోమ కాటుకు తెల్ల బోయింది.. మట్టిని నమ్ముకున్నందుకు కాదు.. నమ్మించి వంచించే మనిషిని నమ్ముకున్నందుకు అంటూ.. నర్మగర్భంగా నకిలీ మందులు అమ్మే వ్యాపారులను ఎండగట్టారు. పశువుల కన్నీళ్ల సాక్షిగా.. శ్రమ జీవుల నాలుగు కాళ్ల సాక్షిగా.. కవి ఆర్ద్రమైన భావాలతో ఈ కవితను రాశారు.
“ప్రేమ కరువై బీడు” కవితను ప్రేమికుల ఆత్మహత్యలకు చలించి రాశారు.
ఎన్ని మార్లయినా సరే! | గాయాలకు గేయాలకు | దుఃఖమే | చివరి చరణమంటూ ‘దుఃఖ తీరాలు’ శీర్షికతో రాసిన కవితలో నవ్వులన్నీ ఆత్మల మెరుపులైనాక.. దుఃఖమొకటే వెచ్చని ఊపిరితో సేదదీర్చే తల్లిడొక్క అని వ్యాఖ్యానించారు.
కవితకే అనర్హం అని శ్రీశ్రీ గారన్నట్లు.. కవి రాజారావు గారు “ఆదిలాబాద్ రంజన్లు” శీర్షికతో మరో కవితను ఇందులో పొందుపరిచారు. ఎదులాపురంలోని ఎద్దుల్లా కష్టించే మట్టి జీవాల స్పర్శతో రూపుదిద్దుకునే రంజన్ల వెనుక ఉన్న శ్రమైక సౌందర్యాన్ని ఈ కవితలో ఆవిష్కరించారు.
అలికిడి లేని పరమాద్భుత ప్రకంపనాలతో / మూసుకుపోయిన అంతర్లోకాలకు / దారులు తెరిచే / నిశ్శబ్ద ప్రపంచంగా.. స్మశానాన్ని అభివర్ణిస్తూ మరో కవితను రాశారు.
‘నులక మంచం’ కవితలో చుట్టాల చూపులకు… మమతల మర్యాదలిచ్చీ | అనుబంధాల ఆత్మలను కలిపినవి / నులక మంచాలేనని తేల్చి చెప్పారు. ఎక్కడినుంచో వచ్చిన సింగిల్ కాట్, డబుల్ కాట్లకు కాల్లు విరిగిన నులక మంచం మూలన మూలుగుతున్నదని వాపోయారు.
కర్తవ్య పిడుగు చప్పుడు ఉలికిపడి లేచి.. నిద్ర దుప్పటిని నిలువునా తన్నేసి.. వేగుచుక్క కన్నా వేగంగా లేస్తాడంటూ “పాలవాడు” కవితలో పాలవాడిని ఉన్నతంగా దృశ్యమానం చేశారు.
“పొయిల కట్టెలు” కవితలో నెత్తిమీద బతుకు బరువును .. కాళ్ళతో జోక్కుంటూ.. పరుగులాంటి నడకతో.. ఆ పూట తిండి గింజల కోసం తిప్పలుపడే పొయిల కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని అమ్మకానికి బయలుదేరే బడుగు జీవుల కష్టాలను ఆర్బంగా అక్షరాల్లో నిక్షిప్తం చేశారు. సన్నగిల్లిన సుట్ట పేల్క అశక్తతతకు బరువును మోయలేక.. వాళ్లు బేరంలో ఓడిపోతారని కవి తమ ఆవేదనను వ్యక్తపరిచారు.
“అస్థిపంజరం ఆగని నవ్వు” కవితలో మనిషి నైజంకు అద్దం పట్టారు.
మనిషికి భ్రమలో జీవించడం గొప్ప హాయి అని వ్యాఖ్యానించారు. మనిషి తన జీవితమంతా ఏడుస్తాడు. లోపల అస్థిపంజరం పగలబడి నవ్వుతూ ఉంటుందని వివరించారు. ముగింపులో పెదాలు విచ్చుకుంటే నవ్వైంది.. పెదాలు రాలిపోతే భయమైంది అంటూ తాత్వికతతో కూడిన జీవన సత్యాన్ని ఆవిష్కరించారు.
“నీరెండ సౌందర్యం” కవితలో పల్లెతనాన్ని.. పల్లె జీవన సంస్కృతిని ప్రస్తావించిన తీరు బాగుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లెలు చిల్లంకల్లం అవుతున్న తీరుతెన్నులను తెలియజెబుతూ ముగింపులో.. పల్లె నాగరికతలను తరాలుగా మోసి మోసి.. నొనలు విరిగి కమ్ములూడి పల్లె సంస్కృతికి ప్రతీకగా మిగిలిన “కచ్చులం..” నీరెండలో పరమాద్భుత ప్రకటన అంటూ నర్మగర్భంగా నీరెండ ప్రాశస్త్యాన్ని వివరించారు.
“అమ్మ స్పర్శ కోసం…” కవితలో పదబంధాల కూర్పు చాలా బాగుంది. అనారోగ్యానికి గురైనప్పుడు.. తమ ఊరెళ్లడం.. అమ చేతి స్పర్శ ఓ దివ్య ఔషధంలా పనిచేయడం.. మళ్లీ మామూలు మనిషినైపోవడం అంటూ రాసిన పంక్తులు.. బాగున్నాయి.. పల్లె పట్ల.. పల్లె అందాల పట్ల.. ఉన్న మక్కువ.. మరియు అమ్మ పట్ల ఉన్న ప్రేమాభిమానాలను కవి ఈ కవితలో చక్కగా ప్రస్తావించారు.
“బంగారు బాల్యం” కవితలో కవి చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
“కవిత బిడ్డకు బారసాల” కవితలో.. పుస్తకావిష్కరణ శుభకార్యాన్ని ‘కవిత’ బిడ్డకు బారసాలగా అభివర్ణించారు. కవి రాజారావు గారు వృత్తిరీత్యా బీమా సంస్థలో ఉద్యోగి.. కనుక వృత్తి పట్ల గౌరవంతో “బీమా దీపం’ కవితను రాసి మెప్పించారు.
ఇంకా ఈ గ్రంథంలో “పిచ్చుక గూళ్లు”, “వలలోని పక్షులు”, “గుడిసె” కన్నీళ్లు, “చెట్లే నయం”, “చినుకు విత్తనాలు” కవితలు ఆలోచనాత్మకంగా తీర్చి దిద్దబడినాయి. “నా తలకాయ నాది కాదు”, “బతుక్కి అర్థం?”, “మానవతా చిరునామా” వంటి కవితలు గ్రంథానికి నిండుదనాన్ని కూర్చాయి.
“నేను ఎవరు?” దీర్ఘకవితలో పరిపూర్ణంగా జీవించడానికి వీలుగా.. తనపై తనకు స్పష్టతను యివ్వడానికి మానవీయ విలువలు కాపాడటానికి మనిషిగా ఎప్పుడో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుని.. హృదయ సంస్కారం చేసుకోవాలన్న గొప్ప సందేశాన్నిస్తూ కవి రాజారావు గారు తమ తాత్త్విక భావధారకు చోటు కల్పించారు. ‘ఎరుక’తో సముద్రంలోంచి సముద్రంలోకి” సత్యాన్వేషణకై చేసే ప్రయత్నం ఈ దీర్ఘ కావ్య లక్ష్యంగా మనకు కనబడుతుంది. అద్భుతమైన అభివ్యక్తితో… విలక్షణమైన చతురతతో.. చక్కని భావుకతతో ప్రతీ పంక్తిని కవితామయం చేశారు. లోతైన భావాలతో, తాత్త్విక చింతనతో ఈ దీర్ఘ కవితకు జీవంపోశారు. ఈ కవితలో జీవం ఉంది.. జీవితముంది. వర్ణనలు.. ఉపమానాలు.. పోలికలు.. సందర్భోచితంగా.. ఔచిత్యవంతంగా ప్రయోగించడంలో కవి సఫలీకృతు లైనారు. లోలోపలి ప్రేమ జగత్తును తట్టి లేపి.. లోలోపలి ఆత్మకు దారుల్ని చూపేలా కవితా రచనను కొనసాగించారు. ఉద్వేగ వైరుధ్యాలన్నీ దుఃఖ పునాదికి ధాతువులేనని తేల్చి చెప్పారు. చేజారిన ప్రతీది మళ్లీ చేతికి అదే రూపేణ ఇవ్వలేమనీ.. బంధాలన్నీ జ్ఞాపకాలేననీ.. అవి మనసు పరుపుపై కుంభకర్ణునిలా కునుకులేస్తుంటాయని పేర్కొన్నారు. ఆలోచనలు అంతా ఒక మనసు పెట్టేననీ.. అది గతం ఉత్పత్తి చేసిన తీయని జ్ఞాపకాల తేనె తుట్టె అని అభివర్ణించడం బాగుంది.
మనసంటే గతమేననీ.. అది అనేక అనుభవాల మూట అనీ… ఎన్నెన్నో జ్ఞాపకాల పూదోటగా వర్ణిస్తూ రాసిన పంక్తులు కవితలో చక్కగా ఒదిగిపోయాయి.
మనసంటే – మనిషి /మనిషంటే – మనసు/మనసే – నేను / (నేను ఎవరో తెలిసే దాకా)/కాని / ‘నేను’ అంటే అహం | అహంకారమంటే / మనసు ఉపరితల ఆకారమని.. మనసు కదే రూపొందించిన ఓ పెద్ద కారాగారమని తెలియజెప్పడంలో కవి రాజారావు గారి తాత్త్విక దృక్పథాన్ని అభినందించి తీరుతాం. “నేను ఎవరు?” ప్రశ్నకు.. “అంతిమ సత్యం” అని తేల్చి చెబుతూ.. ఈ కావ్యానికి ఆలోచనాత్మక ముగింపు నిచ్చారు. కవి రాజారావు గారి ఈ దీర్ఘకావ్యం ఓ కరదీపికలా పని చేస్తుంది. ఈ గ్రంథం చివరన అణచివేతకు అనేక రూపాలు శీర్షికన రాసిన కవితలన్నీ కవి యొక్క పరిశీలనా పటిమకు.. ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి… సున్నిత మనస్తత్వానికి అద్దం పట్టే విధంగా ఉన్నాయి.
జీవితమంటేనే కఠిన పార్శ్వాల్ని నిశ్శబ్దంగా మోస్తూ కొనసాగించాల్సిందన్న అర్థం ధ్వనించే విధంగా “పాత చెప్పులు కు(కొట్టువాడు” కవితను రూపుదిద్దారు. ఇంకా ఈ విభాగంలో “నిర్మల్ కోటలు”, “ఒక చెట్టు కథ”, “పాత సామాను కొంటాం”, “విధివంచితుడైన కండక్టర్”, “కదిలె” సెలయేరు, “లోపలి తలుపు తెరిచాక”, “రెండూ అయినప్పుడూ”, “పాములతోనే జీవితమైనప్పుడూ”, “బాలసంతోని పాట” వంటి శీర్షికలతో కవి రాజారావు గారు వస్తువైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు.
ఇలా రెండు దశాబ్దాలకు పైగా కవి రాజారావు గారు రాసిన కవిత్వంలోని ఆణిముత్యాలను ఒకే చోట లభ్యమయ్యేలా తాను రికార్డు చేసి “సమగ్ర కవిత్వం” రూపంలో పాఠక లోకానికి అందివ్వడం అభినందనీయం.
పేజీలు : 224, వెల: రూ.150/-
ప్రతులకు :
మునిమడుగుల రాజారావు
ఇ.నెం. 7-2-83/49/294,
ఇందిరానగర్, నిర్మల్ – 504106
9493430130
శా|| శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు
యేలోకానాం స్థితి మావహంత్యవిహితాం స్త్రీ పుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితావస్సురైః
భూయాసుః పురుషోత్తమాంబుఝభవ శ్రీకంధరా శ్శ్రేయసే
ఆదికావ్య నిర్మాత నన్నయ మహాకవి తన తెలుగు భారతములో తొట్ట తొలుత ఈ శార్దూల విక్రీడిత పద్యము రాసినాడు. అది సంస్కృతంలో ఉంది. తెలుగు భారతానికి సంస్కృత స్తుతి ఎందుకు?
సంస్కృతంలో రాయడానికి కారణం దేవభాషా వందనం. సంస్కృతంలో రాసిన కారణం మరొకటి ఉంది.
ఇది త్రిమూర్తి స్తుతి. వీరిని సురలు సంపూజ్యం చేస్తున్నారన్నాడు. సురల భాష గీర్వాణి. అందుకే ఈ గైర్వాణం భావం మనోనేత్రం తెరిపించేంత గొప్పది. ఛందస్సు ఉభయ భాషా ప్రచవితం.
వ్యాసప్రోక్త భారతం సంస్కృతం. తెలుగుభాషకు వెన్నుదన్ను వంటిది. “గాసట బీసటల గాథలు తవ్వుకుంటున్న” తెలుగువారికి పంచమ వేదాన్ని రుచి చూపించబోతున్నాడు ఆదికవి. గాసట అంటే గాథా సప్తశతి వంటి ప్రాకృత భాషా కథలు బీసట అంటే బృహత్కథ వంటి పైశాచీ భాషా కథలు తెలుగువారి తొలి కథా సాహిత్యం… తాను రాయబోయేది సంస్కృత మహాకావ్యగాథ. ధర్మం కావాల్సినవారికి ధర్మం. పౌరాణికులకు పురాణం. తత్త్వజ్ఞులకు తత్త్వశాస్త్రం. కృష్ణభక్తులకు కార్ ష్ణ్యం ఐన అలాంటి కావ్యానికి తొలి ప్రార్థనగా త్రిమూర్తుల వర్ణనగా దేవభాషలో రాసి తన సంస్కృత భాషా, కావ్య, కల్పనా ప్రాగల్భాన్ని పండించినాడు.
లక్ష్మీ సరస్వతీ పార్వతులు వరుసగా వక్షము, ముఖమున, శరీరార్థ భాగమున నిలుపుకొని మూడు వేదముల సారం మూర్తిమత్వం పొందిన సకల భువన రక్షణ ప్రభువులు, ఆద్యులు ఐన హరిహర హిరణ్యగర్భులను పద్మోమా వాణీపతులను నన్నయ ఈ శ్లోకమున స్తుతించినాడు.
నన్నయ తన కావ్యాన్ని లోనారసి చూడమన్నాడు. లోతుల్లో కావ్యకళను నిక్ష్తిప్తం చేసినాడని సూన. పై పద్యం చూద్దాం.
ముగ్గురు మాతలు శ్రీ, వాణీ, గిరిజలు, శ్రీ కావ్యారంభ శబ్దం. సంపద్వంతం. మరి బ్రహ్మతో ప్రారంభించాలి కదా త్రిమూర్తి స్మరణ! ముగ్గురు పరమ పురుషులు. లోకముల సృష్టి, స్థితి, లయలకు కారకులు. స్థితిమంతుడు విష్ణువు బ్రహ్మను బొడ్డు తామరలో సృజించినందున విష్ణువే తొలుత స్మరణీయుడైనాడు. ఆ విషయాన్ని అంబుజభవ శబ్దంతో స్మరించినాడు.
ముగురమ్మలు లేక సృష్టి లేదు. స్త్రీ పుంస యోగములో సృష్టి అని సూచన. మానవ దృష్టికి యోగమంటే సంయోగము. కాని ఈ త్రిమూర్తులు తమ లోకపాలనంలో అనగా స్థితి, సృష్టి లయలలో వక్షోముఖాంగములలో తమ స్త్రీలను స్థిరపరచుకొన్నారట. వక్షస్థలంలో లక్ష్మి, ముఖంలో వాణి, అంగార్థంలో గిరిజనులున్నారు. ప్రేమస్థానం హృదయం వక్షస్థలం, వాగ్రూప స్థానం నోరు, శక్తిస్థానం శరీరం కదా! అలా ఉంచినారు. పైగా అవిహతమ్మని స్థిరంగా, శాశ్వతంగా ఉన్నారని, ప్రతిక్షణం ‘లోకానాం స్థితి’కి కారణమైనారు అని వివరణ.
ఆ ముగ్గురి స్థితి ఏమి? వేదస్వరూపం. వేదాలు మూడు. వేదస్థితి మూడు దశలు. అందుకే వేద త్రయమూర్తులు అన్నాడు. అవి ఋగ్ యజుస్సామాలు. ఇవి పరస్పర అర్థమైత్రి కలవి. లోనారసి చూస్తే ఈ మూడువేదాల అంతమైన సారభూత దశ త్రిమూర్త్యాత్మకం ఐన విశ్వం. ‘ఋచస్సామాని జజ్ఞిరే’ అని, వేదాలు మూడేనని తైతి్తరియోపనిషద్వాక్య ప్రమాణం. “వేదాంతేషు యమాహు రేక పురుషం” అని ఈ ముగ్గురు “ఏక పురుషుడే”ని కాళీదాసుని కవితా నిష్కర్ష. అపుడు ముగ్గురు స్త్రీలు ఏకీకృతమైన శక్తి స్వరూపమైన ముగ్గురమ్మల మూలపుటమ్ముగా మారి లోకస్థితి శక్తిగా నిలిచినట్టు నన్నయ సూచన.
పురుష శబ్దం స్థితికి, భవశబ్దం సృష్టికి, శ్రీ శబ్ద (శ్రీ కంధర = విషకంఠ) మనగా విష శబ్దం లయకు సంకేతాలుగా నన్నయ నిష్కర్ష ‘చిరాయ’ శబ్దంలో సృష్టి వయస్సును నిపతించినాడు.
శ్రీ, వాణీ, గిరిజలను, వక్షో, ముఖా, అంగములలో పురుషోత్తముడు, అంబుజభవుడు, శ్రీ కంధరుడు ఊర్థ్వ, భూలోక, పాతాళ నామ లోక్రతయ రూప విశ్వంలో ఏలుటగా క్రమాలంకారంలో పేర్చినాడు నన్నయ.
దధతః అనగా ధరించినారని విశ్వాన్ని, విశ్వ ప్రజలకు శ్రేయస్సును ఇమ్మని ఆ సురలచే సంపూజితులైన వారిని ప్రార్థించినాడు.
శ్రీతో ప్రారంభించి, విషశబ్దం పరిహార్యం కనుక పర్యాయమైన శ్రీ శబ్దంతో మరియు శ్రేయశ్శబ్దంతో శ్లోకాన్ని ముగిస్తూ కావ్య ప్రపంచ శ్రేయస్సుకు, లోక శ్రేయస్సుకు త్రిమాతృ త్రిమూర్తి వందనం చేసి తెలుగు సారస్వత ప్రపంచాన్ని ప్రారంభించినాడు ఋషి సదృశుడైన ఆదికవి. “ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోను ధావతి” అన్నట్లు త్రిమూర్తి సంకేతంగా మూడు పర్వాలే రాయబోతున్నట్టు చెప్పి, అంతే అనుసృజించి, మహాకవి నిత్యసత్యవచనుడైనాడు.
(ఈ శీర్షికన ఆంధ్రసాహిత్యంలో అనర్ఘ పద్య రత్నాలను ధారావాహికంగా అందిస్తున్నాం. – సంపా.)
మహా మహోపాధ్యాయ, కవి పండితులు, నిఘంటు నిర్మాతలు, గుణ గరిష్ఠులు, ఆచార్య వరిష్ఠులు, సంస్కృతాంధ్రభాషా సాహిత్యాలలో పండితులు నిగర్వి నిరాడంబురులు ఆచార్య రవ్వా శ్రీహరిగారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి భాషామతల్లి సేవలో జీవనయానం కొనసాగించిన బహుముఖ ప్రజ్ఞాశీలి ఆచార్య రవ్వాశ్రీహరిగారు. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠం నుండి దిద్దుకున్న సంస్కృత భాషా తిలకం ఉపకులపతి పీఠమెక్కి విద్యా ప్రభలు పంచింది. ఎం.ఎ.(తెలుగు) ఎం.ఎ.సంస్కృతం, భాస్కర రామాయణం – విమర్శనాత్మక పరిశీలన అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టాను పొందిన ప్రతిభ వారిది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఒరియంటల్ కళాశాలలో ఉపన్యాసకులుగా, ఉపన్యాసక వృత్తిలోకి అడుగిడినారు. సీనియర్ తెలుగు పండితుని నుంచి ప్రొఫెసరందాకా ఆదర్శవంతమైన అద్భుతమైన బోధన చేసిన ఉత్తమ ఆచార్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ద్రావిడ యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా, హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన పరిపాలనా దక్షత వీరిది. రవ్వా శ్రీహరిగారు వివిధ విశ్వవిద్యాలయాలలోని విద్యా సంఘాలతో లెక్కకు మిక్కిలి పదవులు నిర్వహించిన ఘనత వీరిది.
శ్రీహరిగారు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీహరి నిఘంటువు. తెలుగు సారస్వత క్షేత్రంలో నిలిచిపోయే అనేక అంశాలను అనుశీలించారు. తెలుగు నిఘంటువులున్నంత కాలం, సూర్యరాయాంధ్ర నిఘంటువుతోపాటు ‘శ్రీహరి నిఘంటువు’ కూడా నిలిచిపోతుందని పరిశోధకుల అభిప్రాయం.
మరొక అద్భుత గ్రంథం సంకేత పదకోశం. దీనిలో మనకు కావల్సినన్నివ్యాకరణ, తర్క, మీమాంస, జ్యోతిష, అలంకారాల ఆయుర్వేద మొదలైన శాస్త్రాలకు సంబంధించిన పదాల కూర్పు జరిగింది. రెండవ ముద్రణలో మరిన్ని అంశాలను చేర్చి పాఠకులకు ఆసక్తిని కలిగించారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య కీర్తనల్లోని అచ్చ తెలుగు పదాలను, క్లిష్టమైన భాషాంశాలను భక్తి భావ సంపన్నతను, సంగీత ప్రావీణ్యతను భాషా ప్రయోగ చతురతను ఎన్నింటినో అన్నమయ్య పదకోశంలో వివరించిన విజ్ఞానవంతులు ఆచార్యులు. తెలంగాణా భాషా ప్రాచీనతను, ప్రామాణికతను ఎత్తి చూపిన శ్రీహరిగారి రచన తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు. తెలంగాణాలో వాడుకలో వున్న ఎన్నో పదాలకు అర్థాలను తెల్పినారు. నల్లగొండ జిల్లా ప్రజల భాష….. మాండలిక పదకోశం నిర్మించినారు. వ్యాకరణ పదకోశము, వాడుక తెలుగులో అపప్రయోగాలు, లఘుసిద్ధాంత కౌముది, పాణినీయ అష్టాధ్యాయి తెలుగు అనువాదం , కాశీకాసహితం ౨ సంపుటాలు) సంస్కృత రచనలలో సంస్కృత సూక్తి ముక్తావళి సంస్కృత న్యాయాలు, సంస్కృత నీతి రత్నాకరం, సంస్కృత న్యాయదీపిక అనువాదాలలో డా|| సి.నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా ఫిరదౌసి, గబ్బిలం వేమన శతకం శేషప్ప నరసింహ శతకం, మాతృగీతమ్, స్వీయరచనలు సంస్కృతీ వైజయంతితోపాటు అనేక రచనలకు సంపాదకత్వం వహించిన కవి పండితులు, భాషావేత్త, వీరి సాహిత్య వ్యాసాలు చాలావరకు పరిశోధనాత్మకమైనవి, ఆలోచనాత్మకమైనవి. రవ్వాగారి గ్రంథాలలో ప్రామాణికత, శాస్త్రీయ స్పష్టంగా గోచరిస్తుంది. తెలుగులో భాషా సాహిత్యానికి సంబంధించిన వీరి రచన ఉదయభారతి. ఇందులో తెలుగు, సంస్కృతం భాషా సాహిత్యాలకు వ్యాసాలు, వ్యాకరణ సంబంధితాలున్నాయి. తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, భాస్కర రామాయణు – విమర్శనాత్మక పరిశీలనము (సిద్ధాంత గ్రంథము)
శ్రీహరిగారి రచన భాషా విశేషాంశాలు, వ్యాకరణ సంబంధితాలు, సాధికారతతో చెప్పి పరిశోధకులకు, భాషా ప్రియులకు అనేక విషయాలు తెల్పి ఇంకా తెల్పవలసిని అనేకం ఉన్నాయంటూ భావి పరిశోధకులకు వదిలివేసినారు.
నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలం వెలువర్తిలోని నిరుపేద చేనేత కుటుంబంలో 5 మే 1943న రవ్వా వేంకటటనరసమ్మ,నరసయ్య దంపతులకు జన్మించినారు. అమ్మమ్మ తాతయ్యల ప్రోత్సాహంతో భువనగిరిలో 5వ తరగతి వరకు చదివినారు. తల్లగారి మరణంతో చదువుకు అవాంతరం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి శ్రీహరి గారిని చదివించలేనని తెలియజేశారు. దినపత్రికలోని యాదగిరి దేవస్థానము సంస్కృత విద్యాపీఠం ఉచిత చదువును భోజనాల్ని కల్పిస్తారని తెల్సుకొని అక్కడ చేరిన ఆచార్యులవారి జీవితం మలుపు తిరిగింది. అక్కడ నుండి బయలుదేరి ఉన్నత చదువులు, ఉన్నతోద్యోగాలు నిర్వర్తించిన ఉభయభాషా ప్రౌఢి.
ఆచార్య శ్రీహరిగారి పంచశతి (75 సంవత్సరాలు) పురస్కరించుకొని ‘శ్రీహరి విజయం’ పుస్తకం వేయడం జరిగింది. దీనిలో అనేక వ్యాసాలు సాహితీవేత్తల అభిప్రాయాలు, రచనలు వీరి సంబంధిత సాహిత్య విశేషాంశాలు పొందుపరచబడినాయి.
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన, నిఘంటువు నిర్మాణం వీరి ప్రతీ అక్షరం వినూత్నం. వీరీ విశేష కృషికి పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. సంస్కృతి విద్యాపీఠ్ తిరుపతి వారి మహామహోపాధ్యాయ కేంద్ర సాహిత్య అకాడమి వారి పురస్కారం (అనువాద రచనకు), తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, జాషువా సాహిత్య పురస్కారం, న్యూజెర్సి అమెరికావారి బ్రౌన్ పురస్కారం, సౌశీల్య పురస్కారం, పరవస్తు చిన్నయ సూరి జాతీయ పురస్కారం లాంటి చాలా పురస్కారాలు పొందినారు.
ఆచార్య రవ్వా శ్రీహరిగారంటే నడిచే విజ్ఞాన సరస్వం. వీరి గురించి రాయటం ఒడవని ముచ్చట. ఇలాంటి మహానుభావులపై అత్యంత ఇష్టంతో, జాగరూకతతో అల్పుడిని అంటూ అనల్పమైన శ్రీహరిగారి తెలుగు రచనలు – సమగ్ర పరిశీలనపైన డా|| సి.యాదగిరి ఆచార్య సాగి కమలాకరశర్మగారి వద్ద పరిశోధన చేసి పట్టాను పొంది తెలుగు ఉపాధ్యాయులు కాకున్నా డా || యాదగిరి గారు తమ పరిశోధనలో ఎన్నో విషయాలను తేటతెల్లం చేసినారు. ఇంకా రవ్వాగారి మీద చాలా పరిశోధనలు రావాల్సి ఉంది.
ఆచార్య రవ్వా శ్రీహరి గారి కలం నుండి ఇంకా ఎన్నోరావల్సి ఉండేది. అనారోగ్య కారణాల వలన పూర్తి కాలేకపోయినాయి. ప్రస్తతం డా||సి.యాదగిరి గారు పరిశోధనలో భాగంగా శ్రీహరి చేసిన ఇంటర్వ్యూ యదాతథంగా మీకు అందిస్తున్నాం.
-కె.ఎస్.అనంతాచార్య
వెలువర్తి వెలుగు రవ్వ!!
సార్ మీ బాల్య విశేషాలు తెలియజేయండి?
మా అమ్మమ్మగారి ఊరు రామన్నపేట తాలుకాలోని ‘మునిపంపుల’ గ్రామం. అక్కడ చదువు బాగా ఉంటుందని మా అమ్మగారు ప్రాథమిక విద్యాభ్యాసం కోసం అక్కడే ఉంచినారు. నాలుగవ త
రగతి వరకు అక్కడే చదివినాను.
పల్లెటూరి చదువుల ప్రభావం వివరించండి?
‘మునిపంపుల’ పల్లెటూరైనా అక్కడి తల్లిదంద్రుడుల తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తమ పిల్లలను చక్కని విద్యావంతులుగా చేయాలని వారికి ఆసక్తి ఉండేది. అందువల్ల అక్కడి అధ్యాపకులందరు కూడా చక్కగా విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని మంచి విద్యావంతులుగా సిద్ధం చేసేవారు.
ఉన్నత పాఠశాల చదువులవరకు ఏమైనా విశేషాలు తెలియజేయండి?
మునిపంపులలో నాల్గవ తరగతి అయిపోగానే ఉన్నత పాఠశాల విద్యభ్యాసం కోసం భువనగిరిలోని ప్రాథమికోన్నత పాఠశాల లో చేరడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం మాత్రమే చదివి 5వ తరగతి పూర్తి చేసుకున్నాను.
పాఠశాల చదువులు వదిలిపెట్టి గురుకుల విద్యకు ఎలా వచ్చారు?
5వ తరగతి పూర్తి చేసిన సంవత్సరమే వేసవి సెలవులలో మా అమ్మగారు పరమపదించడంవల్ల నా చదువు కొనసాగే సూచనలు సన్నగిల్లినాయి. ఇక పై తరగతులు చదివించడం, కుటుంబ ఆర్థిక కారణాల కారణంగా సాధ్యం, కాదని మా, నాన్నగారు చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆ సమయంలోనే ఒకరోజు పత్రికలో యాదగిరి దేవస్థానంవారి సంస్కృత విద్యాపీఠం ప్రవేశానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఆ పాఠశాలలో చేరే విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యాలు ఉంటాయని, ఫీజులేవి ఉండవని సంస్కృతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఎంట్రెన్స్ పరీక్షకు బోధన ఉంటుందని తెలియచేసినారు. ఆ ప్రకటన చూసి యాదగిరి గుట్ట సంస్కృత విద్యాపీఠంలో చేరడం జరిగింది. అక్కడే నాలుగు సంవత్సరాలు సంస్కృత విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత సికింద్రాబాద్ లోని మున్నాలాల్ సంస్కృత కళశాలలో ఒక సంవత్సరం చదివి ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణుడను కావడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో చేరి నాలుగు సంవత్సరాలు సంస్కృత వ్యాకరణాన్ని అధ్యయనం చేసి బి.ఓ.ఎల్. పట్టాను ప్రథమ శ్రేణిలో సంపాదించినాను.
సంస్కృత కళాశాలలో మీ చదువు ఎలాంటి నియమాలతో కొనసాగేది?
నేను చదువుకున్నటువంటి సంస్కృత పాఠశాలలో ఇంచుమించు అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. నలు
గురైదుగురు మాత్రమే బ్రాహ్మణేతరులు ఉండేవారు. వీరు కూడా బ్రాహ్మణ విద్యార్థుల మాదిరిగా బ్రాహ్మణ ఆచారాలను పాటించాల్సి ఉండేది. విద్యార్జనే ప్రధానంగా పెట్టకున్నవాణ్ణి కనుక వారి నియాలన్నింటిని నేను కూడా తు.చ. తప్పకుండా అనుసరించేవాణ్ణి. ఆ నియమాలన్నీ కూడా తరువాతి కాలంలో నా క్రమశిక్షణ జీవితానికి మంచి పునాదులు వేసాయి.
గురువుల ప్రభావం మీ మీద ఎలా ఉండేది?
తొలిదశలో కేరళ సుబ్రహ్మణ్యశాస్త్రి గారు సంస్కృత అక్షరాభ్యాసం చేయించిన గురువులు. వారు అప్పుడే మైలాపూర్ సంస్కృత కళాశాలలో (మద్రాస్/ చెన్నై) శిరోమణి పరీక్షలో ఉత్తీర్ణులై యాదగిరి విద్యాపీఠంలో సంస్కృత అధ్యాపకులుగా చేరినారు. వారు మంచి అధ్యాపకులు, అంతేకాక విద్యార్థుల యొక్క క్రమశిక్షణపై మంచి శ్రద్ధ కలవారు. అందువల్ల వారి శిక్షణలో తొలిదశలో సంస్కృతాన్ని చక్కగా అధ్యయనం చేయడానికి పునాదులు పడ్డాయి. వారు తొలి దశలో వేసిన పునాదే నాకు తర్వాతి కాలంలో ఎంతో లాభాన్ని చేకూర్చింది. తొలి దశలో వారి ప్రభావం నాపై ఎంతగానో పడింది. ఆ తర్వాత నాకు వ్యాకరణ విద్యను ప్రసాదించినటువంటి గురువులు ముగ్గురు. ఒకరు కోయిల్ కందాడై శఠగోప రామానుజాచార్యులుగారు, శ్రీమాన్ ఖండవల్లి నరసింహశాస్త్రిగారు, శ్రీమాన్ అమరవాది కృష్ణమాచార్యులవారు. ఈ ముగ్గురూ వ్యాకరణ గురువులు. మునిత్రయం అనదగినవారు నాకు సంస్కృత వ్యాకరణాన్ని మహాభాష్యాంతం అనుగ్రహించిన గురువులు. వీరు నన్ను పుత్రునిలాగా భావించి నా విద్యాభ్యాసంతోపాటు నా యోగక్షేమాలు కూడా చూస్తూ నన్ను ప్రోత్సహించినవారు. వీరి ప్రభావం నా మీద అమితంగా పడిందని చెప్పవచ్చు.
సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుంచి వచ్చిన మీకు అధ్యయనంలో కలిగిన అనుభవాలు ఏమిటి?
సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుండి వచ్చిన నాకు సంస్కృత అధ్యయనంలో, శాస్త్ర అధ్యయనంలో కాని ఏ విధమయిన ఆటంకాలు ఏర్పడలేదు. మా అధ్యాపకులు అందరూ బ్రాహ్మణులే. అయినా నన్ను చాలా అభిమానంతో, ప్రేమతో చూచుకునేవారు. నేను బాగా చదువుతానని అందులోను బ్రాహ్మణేతర కుటుంబం నుండి వచ్చి వ్యాకరణ శాస్త్రాన్ని చక్కగా బ్రాహ్మణ విద్యార్థులతో సమానంగా అధ్యయనం చేస్తున్నందుకు వారెంతో సంతోషపడి నన్ను ప్రోత్సహించేవారు. ఒకసారి పరీక్షలో నేనెంతో బాగా రాసిన సమాధాన పత్రానికి సంతుష్టులయిన మా గురువుగారు శ్రీమాన్ శఠగోప రామానుజాచార్యుల వారు ఎంతో ఆనందించి నా పై తరగతి విద్యార్థులకు పాఠం చెబుతూ నా సమాధాన పత్రాన్ని వారికి చూపి నన్నెంతో ప్రశంసించినారట. ఈ విషయం విన్ననాడు నాకు మా గురువుగారు ఎంత విశాల హృదయులో అవగతమయింది. అంతేకాక నా మరో గురువు శ్రీ అమరవాది కృష్ణమాచార్యులవారు. నేను కళాశాల విడిచిపెట్టిన తర్వాత కూడా విద్యార్థులందరికీ కూడా నా గురించి చెబుతూ నన్ను ప్రశంసిఁచేవారని అప్పటి ఆ విద్యార్థులు వచ్చి చెప్పేవారు. వారి విశాల హృదయానికి నా జోహార్లు. కనుక విద్యాభ్యాస దశలో సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుండి వచ్చినా నన్నందరూ అభిమానించారే కాని నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు.
సంస్కృతంలో డిగ్రీలు సాధించినా తెలుగు ఉపన్యాసకులుగా మీ అనుభవాలు?
నేను మౌలికంగా అధ్యయం చేసింది సంస్కృతమే కాని ఆ రోజుల్లో సంస్కృతం చదువుకున్న పండితులందరికీ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకులుగానే ఉద్యోగానికి అవకాశం ఉండేది. సంస్కృత అధ్యాపకుల ఉద్యోగాలు ఉండేవి కావు. కనుక నేను కూడా తొలి దశలో ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగానే చేరి 5,6 సంవత్సరాలు పనిచేసినాను. తెలుగులోను, సంస్కృతంలోను, ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయినాను. అయితే సంస్కృత శాఖలో నాకు అవకాశం రాకపోవడంతో తెలుగుశాఖలో ఉపన్యాసకునిగా చేరడం జరిగింది. అయితే సంస్కృతంలోలాగా తెలుగులో కూడా నేను ప్రావీణ్యం సంపాదించి తెలుగుశాఖలో కూడా ఉత్తమ అధ్యాపకుడిగా పేరు సంపాదించుకున్నాను.
భాషా పరిశోధనలకు ఎందుకు పూనుకున్నారు?
నాకు అభిమాన విషయం సంస్కృత వ్యాకరణం. అందులో మహాభాష్యాంతం చదువుకున్నాను. ఆ కారణంగా తెలుగు వ్యాకరణాలను కూడా బాగా అద్యయనం చేయడం జరిగింది. పాణినీయ వ్యాకరణంలో భాషా శాస్ర్తానికి సంబంధించిన మౌలికమైన అనేకాంశాలు ఉన్నాయని ఆధునిక భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆధునిక భాషా శాస్త్రం కూడా కొంత అధ్యయనం చేయడంవల్ల భాషా పరిశోధనపై నాకు ఎక్కువ ఆసక్తి కలిగింది.
వ్యాకరణ శాస్త్రంలో సాధించిన విజయాలు వివరించండి?
నేను అటు సంస్కృత వ్యాకరణాన్ని ఇటు తెలుగు వ్యాకరణాన్నిఇటు తెలుగు వ్యాకరణాన్ని రెండింటిని అధ్యయనం చేయడంవల్ల రెండింటిలో కొంత కృషి చేయడం జరిగింది. విశ్వవిద్యాలయంలో, కళాశాలలో అనేక సంవత్సరాలు బాల వ్యాకరణం, ప్రౌఢవ్యాకరణం, ఆంధ్రశబ్ద చింతామణి మొదలైన అనేక వ్యాకరణ గ్రంథాలను బోధించడం జరిగింది. సంస్కృతంలో లఘుసిద్ధాంత కౌముది గ్రంథంలో తెలుగు విద్యార్థులకు అవసరమయ్యే కొన్ని భాగాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే పాణిని రచించిన అష్టాధ్యాయి గ్రంథాన్ని ఇటీవల కాశికావృత్తితో పాటుగా అనువాదం పూర్తి చేయడం జరిగింది. దీనిని తెలుగు అకాడమీ వారు రెండు సంపుటాలలో ముద్రించి వెలుగులోకి తెచ్చినారు.
నిఘంటు నిర్మాణంలో అనుభవాలు తెలియజేయండి?
మొట్టమొదటగా నేను తెలుగు అధ్యాపకుడిగా చేరి అధ్యాపన చేస్తున్నప్పుడు నాకు కలిగిన కొన్ని అనుభవాలే నా నిఘంటు నిర్మాణ కార్యక్రమానికి దోహమయినాయని చెప్పవచ్చు. నేను రచించిన నిఘంటువులన్నీ విద్యార్థులు యొక్క అవసరాలను తీర్చడం కోసమే. అయితే నిఘంటు నిర్మాణం అనేది చాలా శ్రమతో కూడిన పని. ఎంతోమంది సమష్టిగా చేయవలసిన పని, అయినా నాకా ప్ర్రకియపై ఉన్న అభిమానమే నాచే అనేక నిఘంటువులను నిర్మింపచేసింది. నిఘంటు నిర్మాణం వల్ల భాషకు సంబంధించిన అనేకాంశాలను నేను క్రొత్తగా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా “శ్రీహరి నిఘంటువు” నిర్మాణ సందర్భంలో తెలుగు సాహిత్యంలోని అనేక గ్రంథాలను పరిశీలించే అవకాశం కలిగింది. అనేక నిఘంటువులను పరామర్శించే అవకాశం కూడా కలిగింది.
సంస్కృతం నుండి తెలుగుకు, తెలుగు నుండి సంస్కృతంలోకి అనువాదాలు ఎందుకు చేయాలనుకున్నారు? వాటి నేపథ్యం, అనుభవాలు వివరించండి?
నేను విద్యార్థిగా ఉన్నప్పుడే నాకు సంస్కృత శ్లోక రచనపై ఎందుకో ఆసక్తి కలిగింది. మొట్టమొదటగా కాళహస్తీశ్వర శతకంలోని ఒక పది పద్యాలను సంస్కృతంలోకి అనువదించడం జరిగింది. ఆ శ్లోకాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృతశాఖ ప్రచురించే ‘జయంతి’ పత్రికలో ప్రచురింపబడ్డాయి కూడా. కొంతమంది అవి బాగున్నాయన్నారు. ఆ ఉత్సాహమ తెలుగులోని రచనలను సంస్కృతంలోకి అనువదించడానికి స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితోనే ప్రపంచ పదులు, ఫిరదౌసి, గబ్బిలం, నరసింహశతకం గ్రంథాలను, అన్నమయ్య సూక్తులను సంస్కృతీకరించడం జరిగింది.
‘విశ్వంభర’ లాంటి సినారె మహా కావ్యాలు ఎన్నో వుండగా, ‘ప్రపంచ పదులు’ ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
‘విశ్వంభర’లోని విషయం గహనమైంది. ‘ప్రపంచపదులు’లోని విషయం ప్రతి వ్యక్తిని స్పృశిస్తుంది. ఇదొక శతకం లాగా వుంది. ‘విశ్వంభర’లో గాఢత్వముంది. సులభ గ్రాహిత్యం తక్కువ. బాగా ఆలోచిస్తే గానీ అది అర్థం కాదు. ‘ప్రపంచపదులు’ అలా కాదు. శతకాల మాదిరిగా అందులోని భావాలు సమాజంలోని అందరికీ సంబంధించినవి. భాష కూడా సరళంగా వుంటుంది. సులభంగా అర్థం అవుతుంది. ఈ కారణాలచేత ‘ప్రపంచపదులు’ సంస్కృతంలోకి అనువదిస్తే అది అందరినీ ఆకర్షిస్తుందని భావించాను. అంతేకాకుండా ఇందులోని ఛందస్సులోనూ ఒక విశేషముంది. ముఖ్యఁగా సంస్కృతంలో ఒక కొత్త ఛందస్సును – రుబాయి ఛందస్సును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది అనువాదం చేస్తే , అందుచేత అదే ఛందస్సులో సంకలనంలోని 108 కవితలు అనువదించాను. అనువాదం అంటే సాధారణంగా భావాన్ని తీసుకుని ప్రాచీన ఛందస్సులైన చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం ఇత్యాదుల్లో పొందుపరుస్తారు. కానీ నేను, నారాయణరెడ్డిగారు ఏ ఛందస్సును, ఏ మాత్రా ఛందస్సును ఆశ్రయించి ఆ రుబాయిలను వ్రాశారో, అదే పద్ధతిలో సంస్కృతంలో వ్రాశాను. సంస్కృతంలో సంప్రదాయ పద్దతులకు భిన్నంగా వ్రాయడం సాధారణంగా ఉండదు. అయినా నేను ఆధునికంగా వ్రాశాను.
నారాయణరెడ్డిగారి కవిత్వం ఎక్కువగా శబ్దాశ్రయ చమత్కారానికి చెందింది కదా? సంస్కృతంలోకి మీరు ఎలా అనువదించారు?
చాలావరకు ఆయన చూపినటువంటి శబ్దాలకు సంబంధించిన సొగసులన్నీ సంస్కృతంలో తీసుకురావడానికి ప్రయత్నించాను. ఎక్కడో కొన్ని రాలేదు కానీ ఎనభై శాతం దాకా వారు శబ్దాలంకారాల్లో చూపిన సొగసును సంస్కృతంలో తెచ్చాను. అదే ఛందస్సులో అంత్యప్రాసలతోపాటు అనువదించాను. మూల రచనలాగే నా అనువాదం లయాత్మకంగా, సరళంగా వుంది.
లోగడ మీరేమి సంస్కృతీకరించారు?
మొట్టమొదటి నుంచీ నేను సంస్కృతంలో కృషి చేసినప్పటికీ సంస్కృతంలో ఈ అనువాద ప్ర్రకియను మాత్రం ఈ ‘ప్రపంచ పదులు’తోనే ప్రారంభించాను. దీని తర్వాత మహాకవి జాషువా ‘ఫిరదౌసి’ కావ్యాన్ని సంస్కృతంలోకి తెచ్చాను. ఆయన మహాకావ్యం ‘గబ్బిలం’ ‘తైలపాయిక’ శీర్షికన సంస్కృతీకరించాను. ఇవి కాకుండా నేరుగా సంస్కృతంలో శతక రూపంలో ‘మాతృగీతిక’ను ఎప్పుడో వ్రాశాను. మొదట పరిశోధన, నిఘంటు సంబంధ కృషి చేశాను. కవిత్వపరమైన కృషి చాలా ఆలస్యంగా ప్రారంభించాను.
సంస్కృతంలో పాఠకులు చాలా తక్కువగా ఉన్నారు కదా? అలాంటప్పుడు మీ ప్రయత్నం పాఠకులకు ఎంతవరకు చేరుతుందని భావిస్తున్నారు?
సంస్కృత పాఠకులను మనం మొత్తం దశంలో పరిగణలోకి తీసుకోవాలి. విదేశాలలో కూడా సంస్కృతం వుంది. మన దేశంలో ఎంత శ్రద్ధతో సంస్కృతం చదువుతున్నారో, అంత శ్రద్ధగా విదేశాలలోనూ సంస్కృతం చదువుతున్నారు. ఆ మధ్య కార్డోనా అనే గొప్ప సంస్కృత జ్ఞాని ఇక్కడికి వచ్చారు. ఆయన కాశీలో వుండి సంప్రదాయ పండితుల వద్ద మహాభాష్యం, వ్యాకరణం చదువుకుని గొప్ప భాషావేత్తగా ప్రసిద్ధికెక్కారు. ఇలా ఇఁకా చాలామంది వున్నారు. సంస్కృతం విశ్వవ్యాప్తమైన భాష. కాబట్టి మన దేశంలో, విదేశాలలో సంస్కృతం చదువుకునేవారు పెద్ద సంఖ్యలో వున్నారు. వారు ఈ గ్రంథాలు చదివితే చాలు.
మరి సంస్కృతం మృతభాష అని కొందరు హేతువాదులే వాదిస్తున్నారు. మీరేమంటారు?
మృతభాష అంటే వారి దృష్టి – వ్యవహారంలో లేని భాష అని. వ్యవహారానికి ఉపయోగించని భాషలు ఎన్నో ఉన్నాయి. విజ్ఞానమంతా ఈ సంస్కృత భాషలోనే వుంది. అందుచేత సంస్కృత భాష విషయంలో ఇది దురభిప్రాయం. ఇలా ఎందుకు జరిగిందంట – సఁస్కృత భాషలో అనేక సాంకేతిక రంగాలకు చెందిన శాస్ర్త గ్రంథాలు వున్నప్పటికీ కేవలం ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం మాత్రమే ఇంతకాలంగా ఇతర భాషలలోకి వచ్చాయి. మిగతా శాస్త్రాలు ఇతర భాషల్లోకి రాలేదు.
ఈ తరుణంలోనైనా మిగతా సాంకేతిక శాస్త్రాలను కూడా ప్రాంతీయ భాషలలోకి తేవచ్చు కదా?
అనువాదం చేయవచ్చు. కానీ ఆ పరిభాషిక పదాలు ప్రస్తుతం అర్థం కావు. అవి వ్యవహారంలో లేవు కాబట్టి క్లిష్టంగా వుంటాయి. నేను భరద్వాజ విమాన శాస్త్రం చదివాను. ఇలా ఇంకా ఎన్నో శాస్త్రాలు వున్నాయి. మైసూరు విశ్వవిద్యాలయం వారు “శివతత్త్వ రత్నాకరం” అనే గొప్ప గ్రంథం ప్రచురించారు. అందులో నగరం ఎలా కట్టాలి? ఏ భవన ఎలా నిర్మించాలి? తోటలు ఎలా, ఎక్కడ వుండాలి? తోటల్లో ఎలాంటి చెట్లు పెంచాలి? ఊళ్ళో ఎలాంటి చెట్లు పెంచాలి? వాటికి ఎలాంటి ఎరువులు వేయాలి? ఇత్యాదులు అన్నీ చెప్పారు. మేఘాల గురించీ చెప్పారు. అవి ఎన్ని రకాలు, ఎలాంటి మేఘం వర్షిస్తుంది లాంటి వెన్నో వున్నాయి. అలాగే – ‘రత్నశాస్త్రం’, ‘లోహశాస్త్రం’, ‘జలార్గళ శాస్త్రం’ వుంది. ఇందులో విమానశాస్త్రం హిందీలోకి వచ్చింది. మిగతావి అన్నీ సంస్కృతంలో మాత్రమే వున్నాయి. వాటిని ప్రస్తుతం ఇతర భాషలలోకి పారిభాషిక పదాలు వెదికి అనువదించడం చాలా కష్టం. శ్రమపడి ఒకవేళ ఎవరైనా అనువదించినా ఆ పారిభాషిక పదావళి ఎవరికీ అర్థం కాదు. భూకంపాలు ఎప్పడు వస్తాయి? అనే అంశంపై ఈ మద్య తిరుపతిలో కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వారు ఇప్పటి శాస్త్రంతో పోల్చుతూ, వరాహమిహిరుడు ప్రభృతులు ఏమి చెప్పారో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే మహాభారతంలోని వాస్తు విజ్ఞానాన్ని గురించి వివరిస్తూ ఆ మధ్య తెలుగులో ఒక గొప్ప సిద్ధాంత గ్రంథం వచ్చింది.
సంస్కృతంలో విజ్ఞానం ఇంత వుండగా, ఆ భాష గురించిన దురభిప్రాయం కేవలం మన దేశంలోనే వుంది. అన్ని విదేశాలలోనూ సంస్కృతం పట్ల గౌరవభావమే ఈనాటికీ నెలకొని వుంది. నిజానికి హేతువు లేని వాదాన్ని మన దేశంలో హేతువాదులే చేస్తున్నారు. ‘ధ్వన్యాలోకం’, ‘రసగంగాధరం’ లాంటి గ్రంథాలు ఇంకెక్కడా, ఏ భారతీయ భాషలోనూ లభించవు. భరతుని నాట్యశాస్త్రమంత గొప్ప గ్రంథం ఏమొచ్చింది? వాత్స్యాయనుడి కామసూత్రమంత గొప్ప కామశాస్ర్త
గ్రంథం ఏమొచ్చింది? అలాగే పాణిని ‘అష్టాధ్యాయి’ అంత గొప్ప వ్యాకరణం ఇంతవరకు రాలేదు. కార్డొనా పాణినిని క్షుణ్ణంగా పఠించాడు. చెప్పగలడు. మనవాళ్ళు కొంత చాదస్తం చేశారు. అయితే దాన్ని మనం పక్కనపెట్టి భాషను చదవాలి. అందులోని శాస్త్రాలు తెలుసుకోవాలి.
ఆంగ్లం ఇత్యాది ఆధునిక భాషలపై మోజు చూపుతున్న ఈ తరుణంలో మీరు సంస్కృత భాషా రంగంలోకి ఎలా ప్రవేశించారు?
అది విచిత్రంగా జరిగింది. నేను నాల్గవ తరగతిదాకా మా ఊళ్ళో చదివాను. ఐదవ తరగతి భువనగిరికి వెళ్ళి చదివాను. ఆ వేసవిలోనే మా అమ్మగారు పోయారు. అంతటితో నా చదువు కూడా ఆపేయ్యమన్నారు. భువనగిరిలో చదివితే డబ్బు కావాలి. నెలకు పదిహేను సేర్ల దాకా బియ్యం, ఖర్చులకు ఐదు రూపాయలు కావాలి. ఆ డబ్బు వీలు కాదు పంపన్నన్నారు మా నాయనగారు. ఆ సమయంలో యాదగిరి గుట్ట దేవస్థానంలో సంస్కృత విద్యాపీఠం పెడుతున్నట్టు, అక్కడ ఉచితంగా విద్య చెప్పడమే కాకుండా భోజన వసతి కల్పిస్తున్నట్టు పత్రికలో వార్త వచ్చింది. అది చూసి నేను, నా తోటి మరో నలుగురు స్నేహితులు కలిసి యాదగిరిగుట్ట వెళ్ళాం. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు, సురవరం ప్రతాపరెడ్డిగారు, మందుముల నరసింగరావుగారు అక్కడ కమిటీలో వున్నారు. వారి సహృదయతవల్ల నేను 1953లో అందులో చేరాను. అప్పుడు నాకు పది సంవత్సరాలు. నిజానికి మాకు అప్పుడు సంస్కృతం అంటే ఏమిటో తెలియదు. ఉచితంగా విద్య నేర్పుతారు, భోజనం పెడతారనీ, ఇంటి నుంచీ బయటపడవచ్చునని బయలుదేరాం.
అయితే ఒక షరతు పెట్టి లక్ష్మణశాస్త్రిగారు మమ్ములను తీసుకున్నారు. మూడు మాసాల పరీక్షలో ఉత్తీర్ణులయితే చదువు కొనసాగిస్తాననీ, తప్పితే తప్పించివేస్తానని చెప్పారు. దానికి కట్టుబడి చేరాం. చివరికి నేనొక్కణ్ణే ఆ పరీక్షలో ఉత్తీర్ణుడిని అయ్యాను. మిగతా నా స్నేహితులను ఇంటికి పంపారు. అమరకోశం, శబ్దమంజరి ఇత్యాదులు సంప్రదాయబద్ధంగా చెప్పారు. అక్కడ ఐదు సంవత్సరాలు చదివితే ‘ఎంట్సన్స్ కు’ పంపుతారు. నేను ‘ఎంట్రన్స్’ ఆ తర్వాత డి.ఒ.ఎల్., బి.ఒ.ఎల్. – అన్నింట్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. బి.ఒ.ఎల్.లో ప్రథమ శ్రేణిలో మొదటిర్యాంకు. వ్యాకరణం ప్రత్యేకంగా చదివాను. నేను పద్దెనిమిదిన్నర సంవత్సరాలకే బి.ఒ.ఎల్ పూర్తి చేశాను. దాన్ని ‘శిరోమణి’ అని మద్రాసులో, ‘విద్వాన్’ అని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంటారు. మొత్తం తొమ్మిది సంవత్సరాలు సంస్కృతం చదివాను. అందులో ఐదేండ్లు యాదగిరిగుట్టలో, నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ లోని సీతారాంబాగ్ లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో శఠగోప రామానుజాచార్యుల అధ్యాపకత్వంలో ఎంతో నేర్చుకున్నాను. బి.ఒ.ఎల్. కాగానే వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో (1962)లో అధ్యాపకుడిగా చేరాను. అంతకుముందు ప్రైవేట్ గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. పండిట్ శిక్షణ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను. ఇక్కడ ఐదు సంవత్సరాల అధ్యాపక వృత్తిలో వుండి ఎం.ఏ సంస్కృతం ప్రథమ శ్రేణిలో ప్రథమ ర్యాంకుతో 1967లో ఉత్తీర్ణుడనయ్యాను. బంగారు పతకం పొందాను. వెంటనే ఆంధ్ర సారస్వత పరిషత్తువారి కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరాను. ఇక్కడ చేరాక తెలుగులో ఎం.ఏ. చేసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. అంతకముందే బి.ఒ.ఎల్. కూడా తెలుగులో పూర్తి చేశాను. ఇక్కడ ఐదున్నర సంవత్సరాలు పనిచేశాక ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఉపన్యాసకుడిగా చేరాను. అక్కడే ‘భాస్కర రామాయణంపై’ పరిశోధన డాక్టర్ బి.రామరాజుగారి పర్యవేక్షణలో చేశాను. అలాగే భాషా శాస్త్రంలో పి.జి.డిప్లొమా కూడా ప్రథమ్రశేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. రీడర్ అయ్యాను. ఐదు సంవత్సరాలు పనిచేశాక ప్రొఫెసర్ అయి, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధిపతిగా తొమ్మిదేండ్లు పనిచేశాను. ఆ తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా 3 ½ సంవత్సరాలుగా చేశాను.
పరిశోధన రంగంలో మీరు అనుసరించిన పద్ధతులు వివరించండి?
ప్రధానంగా నా పరిశోధన సాహిత్యానికి, భాషకు సంబంధించినది. సాహిత్యంలో ప్రధానంగా ప్రాచీన సాహిత్యం పైనే కృషి చేయడం జరిగింది. భాస్కర రామాయణంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రచించినాను. ఇంతకుపూర్వం సాహిత్యం రంగంలో నిష్ణాతులయిన వేటూరి ప్రభాకర శాస్త్రి, మానపల్లి రామకృష్ణకవి, నిడదవోలు వెంకట్రావు, ఆచార్య బిరుదురాజు రామరాజు మొదలైన పరిశోధకులు అనుసరించిన పద్ధతినే నేను అనుసరించడం జరిగింది. భాషా రంగంలో కూడా కొంత పరిశోధన చేయడం జరిగింది. ఇందులో ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావు నాకు మార్గదర్శకులు.
ఉపన్యాసకులుగా మీ అనుభవాలు తెలియజేయండి?
ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత 1967లో ఆంధ్రసారస్వత పరిషత్ వారు నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరినాను. ఆ రోజుల్లో ప్రాచ్య కళాశాలలో తెలుగు సంస్కృతాలలో మంచి ప్రవేశం ఉన్న ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరేవారు. పాఠ్యప్రణాళికలో కూడా మంచి స్థాయి గల గ్రంథాలు పాఠ్యగ్రంథాలుగా ఉండేవి. వయస్సులో నాకంటే పెద్దవాళ్ళు కూడా విద్యార్థులుగా ఉండేవారు. అందువల్ల పాఠ్యాంశాలను బాగా చదువుకొని పాఠాలు చెప్పవలసి ఉండేది. ఆ కళాశాల సాయం కళాశాల కనుక నేను ఉదయమంతా కూడా ఈ పాఠ్యాంశాలను బాగా చదువుకని పాఠం సిద్ధం చేసుకుని వెళ్ళడంవల్ల నా విజ్ఞానం బాగా పెరగడానికి అవకాశం కలిగింది. మౌలికంగా నేను చదువుకున్నది సంస్కృతమే అయినా తెలుగు సాహిత్యం, తెలుగు వ్యాకరణాలు ఇవన్నీ నేను స్వయంగా చదువుకుని అధ్యాపనం చేసే అవకాశం లభించింది. ఈ కళాశాలలోని బోధన, తెలుగులో మంచి పాండిత్యం సంపాదించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను, కేంద్రీయ విశ్వవిద్యాలయంలోను తెలుగుశాఖలో అధ్యాపకుడిగా పనిచేసే అవకాశం కలిగింది. ఈ విశ్వవిద్యాలయాలలో ప్రధానంగా నేను వ్యాకరణం, సంస్కృతం, భాషా శాస్త్రం ఈ విషయాలను బోధించేవాణ్ణి. విద్యార్థులకు ఈ విషయాలు బోధించేటప్పుడు పరిశోధనాత్మక దృష్టిని, తులనాత్మక పరిశీలనా దృష్టిని అలవరచుకోవడం జరిగింది. వ్యాకరణం, సంస్కృతం ఇవి కొంత కఠినమైన అంశాలయినా విద్యార్థులు చాలా శ్రద్దగా వినేవారు. పరీక్షలలో కూడా బాగా వ్రాసి మంచి మార్కులు తెచ్చుకునేవారు. విద్యార్థులకు వ్యాకరణం, సంస్కృతం, భాషా శాస్త్రం చెప్పేటప్పుడు చాలా ఆనందంగా ఉండేది. వ్యాకరణం చెప్పేటప్పుడు ప్రధానంగా ఆయా వ్యాకరణ గ్రంథాలలోని ఉదాహరణలే కాక తక్కిన సాహిత్యంలోని ఉదాహరణలు కూడా చెప్పడంవల్ల విద్యార్థులకు ఆయా గ్రంథాల పరిచయం కూడా కలిగేది. నిజంగా ఉపన్యాసకుడిగా ఉంటూ విద్యార్థులకు పాఠాలు బోధించడం భగవంతుడిచ్చిన ఒక వరంగా భావించినాను.
తెలుగుశాఖ అధ్యక్షులుగా మీ అనుభవాలు వివరించండి?
కేంద్ర విశ్వవిద్యాలయం (హైదరాబాద్)లో నేను తెలుగుశాఖకు సుమారు 8,9 సంవత్సరాలు అధ్యక్షునిగా ఉన్నాను. అధ్యక్షునిగా ఉన్న కాలంలో నాకు నా సహాధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సహకరించినారు. అందువల్ల నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు. విద్యార్థులంతా కేవలం చదువుమీదనే శ్రద్ధ కలవారు కావడం చేత అధ్యాపకులు బోధన, పరిశోధన రంగాలలో నిమగ్నులై ఉండడంవల్ల మా తెలుగు శాఖలోని కార్యక్రమాలన్నీ సజావుగా సాగేవి. విద్యార్థులంతా క్రమశిక్షణతో ఉండటంవల్ల పరిపాలనలో నాకేవిధమైన ఇబ్బంది కలుగలేదు. నేను అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఎంతోమంది విద్యార్థులు యుజిసివారి జె.ఆర్.ఎఫ్.స్కాలర్ షిపంలను పొందినారు. ప్రతి సంవత్సరము ఒకటి, రెండు సెమినార్లు నిర్వహిస్తుండడంవల్ల విద్యార్థులలో పరిశోధనాసక్తి బాగా వృద్ధి చెందింది. పాఠ్యంశాలు నిర్ణయించడంలో మా శాఖకు స్వాతంత్ర్యం ఉండడంవల్ల ఎప్పటికప్పుడు సమయానుకూలంగా విద్యార్థులకనుగుణమైన క్రొత్త పాఠ్యంశాలను నిర్ణయించే అవకాశం ఉండేది.
విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా మీ అనుభవాలు తెలుపండి?
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఉండగా నాకు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్ష పదవి లభించింది. ఇది ద్రావిడ భాషల యొక్క తులనాత్మక అధ్యయనానికి, ద్రావిడ సంస్కృతి అధ్యయనానికి ఏర్పడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి నేను రెండో ఉపాధ్యక్షుణ్ణి. విశ్వవిద్యాలయం స్థాపించిన నాలుగవ ఏట (సంవత్సరం) నేను ఉపాధ్యక్ష పదవి చేపట్టినాను. అప్పటికి ఆ విశ్వవిద్యాలయానికి కొన్ని భవనాల నిర్మాణం జరిగినా విద్యాత్మకంగా మంచి పునాదులు వేయడం జరుగలేదు. రెండు, మూడు శాఖలు మాత్రమే అప్పటికి ఉండేవి. అధ్యాపకులు కూడా ఆరేడుగురు మాత్రమే ఉండేవారు. నేను ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత క్రొత్త శాఖలను ఏర్పాటు చేయడమే కాక ఆ శాఖల్లో అధ్యాపకుల నియామకాన్ని కూడా చేపట్టడం చేత దానికొక స్వరూపం ఏర్పడింది. విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో చేరడం జరిగింది. భవనాల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మొత్తంమీద నేను ఉపాధ్యక్షుడుగా ఉన్న మూడున్నర (3 ½) సంవత్సరాలలో ఆ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం కృషిచేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అధ్యాపకులు విద్యార్థులు, అధికారులు అందరూ సహకరించడంవల్ల ఈ విశ్వవిద్యాలయాన్ని నా పరిపాలనా కాలంలో నా శక్తి మేరకు అభివృద్ధి పథంలో నడిపింపగలిగాను.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల ముఖ్య సంపాదకులుగా మీ పరిశ్రమ, ప్రయోజనాలు వివరించండి?
అధ్యాత్మిక ప్రచారం కోసం గ్రంథ ప్రచురణను ఒక ప్రధాన సాధనంగా చేసుకున్న దేవస్థానాలలో ఏకైక దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. దేవస్థానంలో జరుగుతున్న గ్రంథ ప్రచురణల కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రత్యేక అధికారి అవసరమని భావించి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఐ.ఎ.ఎస్ గారు తృప్తినిచ్చినటువంటి వృత్తి అధ్యాపక వృత్తి. అధ్యాపనంవల్ల కలిగే ఆనందం ఎంతో గొప్పది. ఒక్కొక్కసారి ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకొని దానిని విద్యార్థులకు చెప్పినపుడు కలిగే ఆనందమే వేరు. పరిపాలనలో కొన్ని మంచి పనులు చేయవచ్చు. కాని పరిపాలనలో అందరి మన్నన పొందడం కష్టమే. దానివల్ల కలిగే తృప్తి తాత్కాలికమే అని భావిస్తాను. అధ్యాపక వృత్తిలో ఎంతో మందికి జ్ఞానభిక్షపెట్టి వారిని సమున్నత స్థాయికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ నాకు అధ్యాపనమంటే ఎంతో ఇష్టం. కుప్పంలో ఉపాధ్యక్షుడుగా ఉన్న కాలంలో కూడా ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధించేవాడిని.
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన వంటి వాటిలో మీకు ఇష్టమైన అంశం ఏది? ఎందుకు?
అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన వంటి వీటిలో అన్నీ నాకు ఇష్టమైన అంశాలే. ఈ అంశాలన్నింటిలో ఇంతో అంతో నేను కృషి చేయడం జరిగింది. కొన్ని గ్రంథాలు కూడా రచించినాను. వాఙ్మయానికి సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియ విశిష్టమైనదే. ఈ ప్రక్రియలన్నీ సాహిత్యానికి అవసరమైన అంశాలే.
మీ మాండలిక భాషా సంబంధ కృషి గురించి తెలుపండి?
చిన్ననాటి నుండి నాకు మాండలికాలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా మా నల్లగొండ జిల్లా మాండలిక పదాలంటే ఎంతో ప్రాణం. చిన్నతనంలో ఇంట్లో మా అమ్మమ్మ వాడే ‘కొర్కాసు’, ‘సోయి’ వంటి మాండలిక పదాలు నాకిప్పటికీ జ్ఞాపకమున్నాయి. నేను ఉపన్యాసకుడిగా పనిచేస్తున్నప్పుడు మా నల్లగొండ జిల్లా మాండలిక పదాలను అధ్యయనం చేస్తూ “నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం” అనే గ్రంథాన్ని సమకూర్చినాను. అలాగే మాండలిక పదకోశం” అనే గ్రంథాన్ని సమకూర్చినాను. అలాగే మాండలిక పదాలకెన్నింటికో కావ్య ప్రయోగాలను గుర్తించి వాటికి కూడా ‘తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు’ అని ఒక నిఘంటువును కూర్చినాను. ఈ రెండు నిఘంటువలేకాక అనేక మాండలిక పదాలను – వివిధ జిల్లాలకు సంబంధించిన వాటిని నా ‘శ్రీహరి నిఘంటువు’ కూడా చేర్చినాను.
ఈ రెండు నిఘంటువులకు కూడా విపులమైన పీఠికలను కూడా సంతరించినాను. నల్లగొండ జిల్లా మాండలిక పదకోశానికి వ్రాసిన పీఠికనే నల్లగొండ జిల్లా ప్రజల భాష అనే పేరుతో ముద్రించాను.
వీటితోపాటు మాండలికాలకు సంబంధించిన ఎన్నో వ్యాసాలను కూడా రచించడం జరిగింది. ఇటీవలే ప్రచురించిన అన్నమయ్య పదకోశంలోను, ‘అన్నమయ్య’ పదకోశంలోను, ‘అన్నమయ్య అచ్చ తెలుగు’ అన్న గ్రంథాలలో రాయలసీమ మాండలిక పదాలను, ఇతర మాండలిక పదాలను కూడా పేర్కొని అన్నమయ్యకు మాండలిక ప్రయోగాలపై ఉన్న అభిమానాన్ని వివరించడం జరిగింది.
ఆంధ్రసారస్వత పరిషత్తు మరియు వివిధ సాహిత్య, విద్యా విషయిక సంస్థలతో మీకు గల సంబంధం తెలుపండి?
నాకు మొట్టమొదటగా సంస్కృత భాషపై ప్రజలకు ఆసక్తిని పెంపొందించటానికి, సంస్కృత భాషా వ్యాప్తికీ ఏర్పడిన ‘సురభారతీ’ సమితితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. జస్టిస్ అల్లాడి కుప్పుస్వామిగారు, శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు, ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడుగారు మొదలైన ప్రముఖులెందరో ఈ సమితిలో ఉండేవారు. ఈ సంస్థకు నేను కొంతకాలం సంయుక్త కార్యదర్శిగా ఉండినాను. తర్వాత తెలుగుభాషా సాహిత్యాలకు తెలంగాణాలో ఎనలేని సేవచేస్తున్నఆంధ్రసారస్వత పరిషత్తులో సభ్యుడిగా, పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా ఉండి యథాశక్తి సేవలను అందించడం జరిగింది. ఆంధ్రసారస్వత పరిషత్తు ట్రస్టులో కూడా ఇప్పటివరకు నేను సభ్యునిగా ఉన్నాను. ఇవికాక సంస్కృత భాషా ప్రచారసమితి (హైదరాబాద్)కి కులపతిగాను, సరస్వతీ విద్యాపీఠానికి (ఆంధ్రప్రదేశ్) అధ్యక్షునిగాను ఉండి నా సేవలను అందించడం జరిగింది.
సాహిత్య సంస్థలతోనే కాక అనేక విద్యా సంస్థలతోను నాకు సంబంధం ఉంది. హైదరాబాద్ లోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలకు ఉపాధ్యక్షునిగాను, త్రిలింగ విద్యాసమితికి అధ్యక్షునిగాను, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పాలకమండలి సభ్యునిగాను, తెలుగు అకాడమి పాలకమండలి సభ్యునిగాను, ఇంటర్ మీడియట్ బోర్డు పాలకమండలి సభ్యునిగాను, ఎపి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ సొసైటీ పాలకమండలి సభ్యునిగాను ఇలా ఎన్నెన్నో సంస్థలతో సంబంధం ఉంది. అన్నమయ్య పదకోశ నిర్మాణానికి పూనుకున్నాను. అనేక పండితులను సంప్రదించి వివిధ ఆకారాలను పరిశీలించి, కొన్ని మారుమూల నిఘంటువులను పరిశీలించి నా శక్తి మేరకు నిఘంటువును సిద్ధం చేయడం జరిగింది. ఇది సమగ్రమైన నిఘంటువని భావించడం లేదు. నిజంగా ఏ నిఘంటువూ సమగ్రం కాదు. పండితుల సూచనతో ఈ నిఘంటువును సమగ్రం చేయడానికి ప్రయత్నించాను.
అన్నమయ్య భాషా వైభవంపై మీ కృషిని తెలియజేయండి?
అన్నమయ్య సంకీర్తనల్లో కనిపించే భాషా వైభవం ఎంతో గొప్పది. తెలుగు భాష యొక్క సహజమైన విరాట్ స్వరూపం ఆ సంకీర్తనల్లో గోచరిస్తుంది. అచ్చమైన తెలుగు పదాలు, మాండలికపదాలు, లోకోక్తులు, పదబంధాలు మొదలైన వాటివల్ల అన్నమయ్యకు తెలుగుభాషపై ఉన్న ప్రేమతోపాటు ఆయనకున్న సర్వతోముఖమైన పాండిత్యం వ్యక్తమవుతుంది. సంస్కృత దీర్ఘ సమాసాలతో రచనలు చేసే కాలంలో అలతి అలతి అచ్చ తెలుగు పదాలతో వ్యావహారిక భాషలో గొప్ప గొప్ప భావాలను అతి హృద్యంగా వర్ణించడం ఆయనకే చెల్లు. ఒక విధంగా వ్యావహారిక భాషకు, వ్యావహారిక భాష ఉద్యమానికి అతడే ఆద్యుడని చెప్పవచ్చు. అన్నమయ్య ప్రదర్శించిన ‘తెలుగు భాషా వైభవం’ నన్నెంతో ఆకర్షించింది. భాషా విశేషాలకు అన్నమయ్య సంకీర్తనలు పెన్నిధులని చెప్పవచ్చు. అందుకే అన్నమయ్య భాషపై నేను ‘అన్నమయ్య భాషవైభవం’, ‘అన్నమయ్య – అచ్చ తెలుగు, అన్నమయ్య నవ్వులు’ అన్న గ్రంథాలను ప్రచురించడం జరిగింది.
ఆధునిక కాలంలో తెలుగు పరిశోధకులకు అలబ్ధవాఙ్మయం గురించి మీ సలహాలు?
ప్రాచీన కాలంలో వివిధ కవులు రచించిన కావ్యాలన్నీ మనకిప్పుడు లభించడం లేదు. మన అలసత, అజ్ఞానం వల్ల పూర్వకవులు రచించిన ఎన్నెన్నో గ్రంథాలను ఎర్రన రామాయణం వంటి అమూల్యమైన గ్రంథాలను పోగొట్టుకున్నాం. ప్రస్తుతం మనకు లభ్యంకాని గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. సంకలన గ్రంథాలు, కావ్యపీఠికలు మొదలైన ఆధారాల ద్వారా ఈ గ్రంథాల ఆచుకీ తెలియవస్తుంది. ఈ అలబ్ధ వాఙ్మయంపై మానవలి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి మహామహులు కృషిచేసిన విషయం తెలిసిందే. వారి ఆదర్శంతో ఈ విషయంలో నేను కొంత కృషిచేసి తెలుగులో అలబ్ధ వాఙ్మయం, అలబ్ధ కావ్య పద్యముక్తావళి అని రెండు గ్రంథాలను రచించడం జరిగింది. ప్రాచీన సాహిత్యంపై అభిమానం కలిగిన పరిశోధక విద్యార్థులు ఈ రంగంలో కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనివలన ప్రాచీనులు వివిధ ప్రక్రియలతో ఎంతో శ్రమించి రచించిన అమూల్య గ్రంథాలను గురించి తెలియవస్తుంది. అంతేకాక ఆయా గ్రంథాలు ఎవరి దగ్గరనైనా ఉంటేవాటిని సంపాదించి లోకానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ కృషి తెలుగు సాహిత్య చరిత్ర సమగ్ర రచనకు కూడా దోహదకారి అవుతుంది.
తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి మీ సూచనలు?
పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత సాహిత్యానికి, తెలంగాణా ప్రాంత కవులకు, తెలంగాణ భాషకు ఏ కారణం చేతనో ప్రాధాన్యం దక్కలేదు. తెలంగాణాలో గొప్ప గొప్ప కావ్యాలు రచించిన కవులు ఎంతోమంది ఉన్నావారిని గురించిన అధ్యయనానికి ప్రాధాన్యం లభించలేదు. తెలంగాణాలో మరింగంటి కవులు మొదలయిన కవి కుటుంబాలు ఎన్నో ఉండినట్లుగా, ఆయా కుటుంబాలలోని కవులు తరతరాల సాహిత్యాన్ని పండించినట్లుగా మనకు తెలుస్తుంది. కనుమరుగై వెలుగులోకి రాని తెలుగు కవిపండితులను గురించి ఆచార్య బిరుదురాజు రామరాజుగారు ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. కనుక ఇక్కడి కవి పండితులు తెలంగాణా ప్రాచీన కవులను, పండితులను గూర్చి పరిశోధనలు చేసి వారి వైశిష్ట్యాన్ని వెలుగులోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక తెలంగాణా భాషను గురించి – పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా భాష ఎంతో ఈసడింపుకు గురైంది. తెలంగాణా మాండలికాలకు, విశిష్ట ప్రయోగాలకు రచనలో ఏ మాత్రం స్థానం లేకుండా ఉండేది. ఎక్కడైనా తెలంగాణా రచయితలు తమ మాండలిక పదాలను రచనలలో వాడినా పరిహాసానికి గురయ్యేవారు. తెలంగాణా భాషలో ప్రాచీనమైన పలుకుబడులు ఎన్నో కనిపిస్తాయి. ఉదాహరణకు కోలెన్, తల (సమయం), సంచకారి మొదలైనవి. తెలంగాణా భాషలో పదబంధాలు, సామెతలు ఎన్నో విశిష్టమైనవి ఉన్నాయి. అవన్నీ తెలుగుభాషకు అమూల్యమైన అలంకారాలు. వాటినన్నింటినీ ప్రస్తత రచయితలు తమ భాషలో వాడుకుంటూ తెలంగాణా భాష యొక్క వైశిష్ట్యాన్ని ప్రయోగ విశేషాలను అందరికీ తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తెలంగాణాలో ప్రత్యేకంగా వాడబడే మాండలిక పదాలకు, పదబంధాలకు, సామెతలకు ప్రత్యేకంగా నిఘంటువులు రావలసిన అవసరం ఉంది. తెలంగాణా భాషాభిమానులు ఇందుకు పూనుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాకరణ అధ్యాపకులకు మీ సూచనలు?
భాష అనేది వ్యాకరణ యుక్తంగానే వ్యవహరింపబడుతుంది. అయితే ప్రతి వ్యవహర్త తాను వ్యాకరణ యుక్తంగానే మాట్లాడినా, తాను మాట్లాడుతున్న భాషలోని నియమాలను వివరించలేదు. వ్యాకర్త మాత్రమే మనం మాట్లాడుతున్న భాషలోని భాషా నియమాలను గ్రహించగలడు. ఆ భాషా నియమాలే ఒక విధంగా వ్యాకరణం.
వ్యాకరణాన్ని బోధించే అధ్యాపకులు ప్రధానంగా వ్యాకరణ గ్రంథాలలో ఉన్న ఉదాహరణలను మాత్రమే విద్యార్థులకు బోధిస్తారు. అలా కాకుండా ఆయా కావ్యాలలోని ప్రయోగాలను కూడా విద్యార్థులకు తెలియచేయాలి. ఉదాహరణకు “ఉపయోగంబునందు ఆఖ్యాతకు తోడ వర్ణకంబగు” అనే బాల వ్యాకరణ సూత్రానికి బాల వ్యాకరణంలోని ఉదాహరణ మాత్రమే చెబుతారు. కాని మహాభారతం మొదలైన గ్రంథాలలోని ప్రయోగాలను వెదకి వాటిని కూడా విద్యార్థులకు చెప్పవలసిన అవసరం ఉంది. విద్యార్థులే స్యయంగా ఆ ప్రయోగ విశేషాలను గమనించే విధంగా ఉపాధ్యాయుడు శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. వ్యాకరణాన్ని కేవలం ఉపాధ్యాయుడు బోధించడం కాకుండా విద్యార్థులచే భాషా ప్రయోగాలలోని విశేషాలను గమనింపచేసే విధంగా ప్రయత్నం చేస్తే విద్యార్థికి వ్యాకరణం అంట ఆసక్తి కలుగుతుంది. వ్యాకరణమంటే అదొక కొరకరాని కొయ్య అనే భావం తొలగిపోతుంది.
మీరు అభిమానించే ప్రాచీన కవులు వారి ప్రత్యేకతను తెలుపండి ?
ప్రాచీన కవుల్లో నాకు బాగా నచ్చిన కవులు నన్నయ్య, తిక్కనలు. నన్నయ కాలానికి తెలుగులో కావ్య రచన అంతగా సాగలేదు. కావ్యాలు రాలేదు. కనుక తెలుగు సమగ్ర కావ్య రచనకు అనుగుణంగా పూర్తిగా రూపుదిద్దుకోలేదు.
