మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
బాల‌సాహిత్యం

మహాభారతంలో అశ్వత్థామ పాత్ర

by Avantika August 25, 2021
written by Avantika

అందరికీ నమస్కారం. నా పేరు అవంతిక. నేను టైనీ స్కాలర్స్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను మహా భారతంలో అశ్వత్థామ గురించి చెప్పబోతున్నాను.

అశ్వత్థామ కురుపాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతని మేనమామనే కృపాచార్యుడు. అశ్వత్థామ పుట్టుకతోటే నుదుట మీద మణితో జన్మిస్తాడు. యితడు సప్త చిరంజీవులలో ఒకడు. చిరంజీవులంటే మరణం లేని వారు అని అర్థం. చిరంజీవులు ఏడుగురు. వారు బలి చక్రవర్తి, పరశు రాముడు, హనుమంతుడు, విభీషణుడు, వ్యాస మహర్షి, కృపాచార్యుడు మరియు అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి కడు ప్రియమైనవాడు. తన తండ్రి ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియ శిష్యుడు కావడం వల్ల తనకే నేర్పని విద్యను అర్జునిడికి నేర్పడంతో పాండవుల మీద ద్వేషంతో కౌరవులతో స్నేహం చేసి వారి పక్షాన ఉండేవాడు.
కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో అశ్వత్థామ ఒకడు. మహాభారత కాలంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుడు యుద్ధంలో ఉంటె పాండవులు గెలవలేరని భావించిన శ్రీ కృష్ణుడు అశ్వత్థామ మరణించాడన్న పుకారును వ్యాపింపచేస్తారు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకు ద్రోణాచార్యుడు ధర్మరాజు దగ్గరకు వెళతాడు. ద్రోణాచార్యుని ప్రశ్నకు ధర్మరాజు బదులిస్తూ అశ్వత్థామ హతః అని ఆ తరువాత ద్రోణునికి వినపడకుండా కుంజరః అని అంటాడు. చివరి పదాన్ని గమనించని ద్రోణుడు పుత్రుడు మరణించాడన్న విషయాన్నీ విన్న వెంటనే ఆయన అస్త్ర సన్యాసం చేసి ధృష్టద్యమ్నుని చేతిలో మరణిస్తాడు. నిజానికి అశ్వత్థామ మాత్రం మరణించలేదు. అశ్వత్థామ అన్న పేరుగల ఏనుగు సంగ్రామంలో మరణిస్తుంది. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ యుద్దానంతరం ధృష్టద్యమ్నుడిని చంపాలని అనుకుంటాడు.
మహాభారత యుద్ధానంతరం తానూ ఎలాగైనా పాండవులని చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునికి మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రి వేళ దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళతారు. ద్రౌపది పుత్రులైన ఉపపాండవులను పాండవులనుకొని  ఇంకా ధృష్టద్యమ్నుడిని నిద్రిస్తుండగా చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్దానికి తలపడతాడు. ఇద్దరు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోలేక పాండవుల వంశం అక్కడితో ఆగిపోవాలని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులోకి మళ్లిస్తాడు. ఆ అస్త్రప్రభావం వలన శిశువు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు తన శక్తులని ఉపయోగించి శిశువుని తిరిగి బ్రతికించి అతనికి పరీక్షిత్తు అని నామకరణం చేస్తాడు.
అలాగే అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణిని తీసుకొని అశ్వత్థామని మూడు వేల సంవత్సరాల పాటు కుష్ఠు వ్యాధిగ్రస్తుడు కమ్మని శ్రీకృష్ణుడు శపిస్తాడు. శ్రీకృష్ణుని శాపం వాళ్ళ అశ్వత్థామ నుదుటి మీదనుంచి చీము రక్తం కారుతూ ఇప్పటికీ హిమాలయాలలో బ్రతికే ఉన్నాడని అంటారు.

ధన్యవాదములు.

August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

సారమేయుడు

by క్రమధాటి గౌతమ్ August 25, 2021
written by క్రమధాటి గౌతమ్

మూగజీవాల పరిరక్షణ చెయ్యా లి అని ఈ రోజుల్లో అందరూ ముక్త కంఠంతో చెపుతున్నారు. దీని కోసం జీవకారుణా దినోత్సవాలు చేస్తూనే ఉన్నా రు. కానీ ఈ విషయం మహాభారతం ఆదిపర్వంవల్లనే  వేదవ్యాసుడు “సరము” అనే దేవ శునకం ద్వారా మూగజీవాలను పరిరక్షించాలనే సందేశాన్ని తెలిపాడు. మూగజీవాలకి వాటి భావాలను వ్యక్తం చేసే భాష లేదు కానీ వాటికి కూడా బాధలు ఉంటాయి. సంతోషం, దుఃఖం, పుత్ర వాత్శల్స్యం అన్నీ ఉంటాయి అని తెలిపేదే ఈ సరమ కథ.

పరీక్షణ్మ మహారాజు కుమారుడు, అర్జునుని మునిమనవడు, అభిమన్యుని మనవడైన, జనమేజయ మహారాజు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ఒక యజ్ఞం తలపెడతాడు.  ఆ యజ్ఞ ప్రాంగణంలోకి వచ్చి న ఒక కుక్క ని, జనమేజయ మహారాజు తమ్ముళ్ళైన ఉగ్రసేనుడు, భీమసేనుడు, శ్రుత సేనుడు అనే వారు తీవ్రంగా గాయపరిచి తరిమి కొడతారు. ఆ కుక్క పేరు సారమేయము. అది దేవతా శునకమైన సరమ కుమారుడు. సరమ అతి కోపం తో యజ్ఞ భూమికి వెళ్ళి, జనమేజయున్ని నిలదీసింది…  “నా బిడ్డ ను నీ తమ్ముళ్లు అకారణంగా చావబాదారు, నీవు చక్రవర్తివి, సర్వ జీవాలకు అధిపతివి, ధర్మరాజు మనవడివి, నీకు ధర్మం తెలియదా?” అంటూ

తగునిది తగదని యెదలో

వగవక సాధులకు బేధవారెలకెగ్గుల్

మొగిజేయు ధుర్వి నీతుల

కగునని మిత్తాగమంబులై న భయంబుల్

అమాయకులను, మూజీవులను, దీనులను, అబలలను, స్త్రీలను, పిల్లలను హింసిస్తే వారి ఉసురు శాపమై తగులుతుందని, మావంటి దీనులను

బాడపెట్టిన పాపం  ఊరికే పోదు! అని శపించింది.

ఇలా కుక్క కి జరిగిన అవమానంతో భారత్ కథ మొదలవుతుంది. ఇక కుక్క ని సన్మానించిన ఘట్టం మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో కనిపిస్తుంది. శునక సన్మానంతోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని ముగుస్తాడు.

వ్యాసమహర్షి ఆదేశానుసారము, పాండవులు ద్రౌపదీ సమేతంగా స్వర్గానికి బయలుదేరగా వారి వెనుక ఒక కుక్క కూడా ప్రయాణవుతుంది. ఆ ప్రస్థానంలో వరుసగా ద్రౌపదీ, నకుల, సహదేవులు, భీమార్జునులు పడిపయి ప్రాాలు వదులుతారు. ధర్మరాజు మాత్రం వెనుదిరిగి చూడకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కుక్క కూడా అనుసరిస్తూనే వుంటుంది. ఇంద్రుడు వచ్చి ధర్మరాజుని రథం ఎక్కుమన్నాడు. నా వారంతా నన్ను వదిలి వెళ్ళారు, కాని ఈ కుక్క మాత్రం నాతో యే సంబంధం లేకపోయిన నన్నే అంటిపెట్టుకొని నాతోనే వచ్చింది. ముందు ఈ శునకాన్ని రథం ఎక్కించమన్నాడు. సాధువులను హింసించడం బ్రహ్మహత్యాపాతకం  అని బోధించాడు. ఇంద్రుడు చేసేది లేక, కుక్కకి కూడా ఉత్తమ గతులు కల్పించాడు.

ఇలా మహాభారతాన్ని కుక్క తో మొదలు పెట్టి, కుక్కతో ముగించాడు వ్యాసమహర్షి. సరమ కథలో మానవీయ విలువలు కోల్పోకూడదనీ, విధ్వంస

కాండ చేయరాదని, నీతి మార్గాన్నిఅనుసరించాలని సందేశం ఇవ్వ బడింది. అదే విధంగా స్వర్గారోహణపర్వం వల్ల ధర్మరాజు ద్వారా

మూగజీవాలని పరిరక్షించాలని, వాటిని చులకనగా చూడరాదని సందేశం ఇవ్వ బడింది.

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

సుమిత్ర

by Satwika August 25, 2021
written by Satwika

సుమిత్ర కాశీరాజ్యపు రాకుమారి. పుత్ర కామేష్టియాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు లక్ష్మణుడు, శతృఘ్నుడు జన్మించారు.  ఈమె పుత్రుడైనందున లక్ష్మణున్ని సౌమిత్రి అంటారు.

సుమిత్ర అనగా మంచి మైత్రి కలిగినది. అనగా మంచి స్నేహభావం కలిగినది అని అర్థం. రామాయణంలో సుమిత్ర ప్రస్తావన చాలా కొంచెంగా వస్తుంది. ఆమె పాత్రలో చాలా ఉదాత్తత, వివేకం కన్పిస్తాయి. వనవానికి వెళ్ళేముందు సీతారామలక్ష్మణులు ఆమె వద్దకు సెలవు తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడామె దుఃఖిస్తూనే లక్ష్మణునితో,

“రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం,

అయోధ్యయ మటవీం విద్ధిగచ్ఛతాత్ యధాసుఖం”

అంటూ, “నాయినా! ఇకపై రాముడే నీకు తండ్రి. నీ వదిన సీతే నీకు తల్లి.  నీకు అడవే అయోధ్య. అరణ్యాలలో ఏమరుపాటు లేకుండా రాముణ్ణి కాపాడుకో. క్షేమంగా వెళ్ళి రా తండ్రి” అంటూ లక్ష్మణుని శిరస్సును ముద్దాడింది.  “ఇక్ష్వాకు  వంశంలో పుట్టావు. దానాలు చేయటం, యజ్ఞాలు చేయటం, యుద్ధంలో వీరోచిరంగా పోరాడటం , ఈ వంశంలో పూర్వం నుండి వస్తున్న ధర్మ పద్ధతే!  అన్నగారిని అనుసరించి నడవటం అనుజునిగా నీ ధర్మం” నీతి బోధ చేసింది.

పుత్రవియోగంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కౌసల్యను సుమిత్ర ధర్మయుక్తమైన మాటలతో,

మాటలతో ,

“పునుః ప్రవిష్టం ధృష్ట్వాతమ భిషిక్తం మహాశ్రియం,

సముత్ర్యక్షసి నేత్రాభ్యాం క్షిప్రమానం ధ్వజం పయః”

అంటూ, “అక్కా! రాముని కంటే సన్మార్గాన నడిచే గొప్పవాడు లేడు. పదునాలుగు ఏళ్ళ వనవాసం పదునాలుగు రోజుల్లాగా గడిచిపోతాయి.  నీ కుమారుడు త్వరలో వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తాడు. అది చూచి నీవు ఆనందంతో పొంగిపోతావు” అని ధైర్యం చెప్పింది.

సుమిత్ర గొప్ప వీరమాత.  ఇద్దరు బిడ్డలని కన్నప్పటికి ఒక కొడుకుని రామునికి, ఇంకొక కొడుకుని భరతునికి అప్పగించింది. సుమిత్ర తన బిడ్డలు, సవతి బిడ్డలు అనే భేదభావం లేనిది. రామునియందు అమితమైన ప్రేమ కలది. లోకంలో ఎవ్వరైనా తమ సవతి బిడ్డల కోసం తమ బిడ్డలను త్యాగం చేయలేరు. సుమిత్ర అంతటి త్యాగశీలి. గుణవతి. ఈమె చరిత్ర రామాయణంలో ఆచంద్రతారార్కం నిలిచి ఉంటుంది.

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

గజేంద్రుడు

by chiruhasini August 25, 2021
written by chiruhasini

అందరికి నమస్కారములు. నా పేరు చిరుహాసిని. నేను ఏడవ తరగతిలో చదువుకుంటున్నాను. నేను ఈ రోజు గజేంద్రుని గురించి చెప్పబోతున్నాను.

క్షీరసాగరంలో త్రికూట పర్వతం మీద ఒక పెద్ద అడవి ఉన్నదీ, ఆ అడవిలో ఒక గజరాజు అనేక ఆడ ఏనుగులతో కలిసి తిరుగుతూ అక్కడే ఉన్న సరోవరంలోకి దిగి దాహం తీర్చుకుంటూ ఉండగా అందులోనున్న మొసలి గజేంద్రుని కాళ్ళుపట్టుకున్నది. అసలు ఎవరి గజరాజు?

పూర్వం ఇంద్రాజ్ఞామునుడు అనే రాజు అగస్త్యమునిని ఉదాసీనంగ చూడటంవల్ల ఏనుగు జన్మ ఎత్తి నానా బాధలు పడమని అగస్త్యుడు శపించాడు, మరి ఈ మకరం ఎవరు? దేవలుడనే ముని శాపం వల్ల హు హు అనే గంధర్వుడు మొసలి రూపం ఎత్తాడు. ఈసారి మకారులు విధివశాత్తు ఒకచోట చేరి ఈ విధంగా ఘోర పోరాటం సాగించారు.

కరి దిగుచు మకరి సరసికి

కారదరికిని మకర దిగుచు కరికరి బెరయన్

కరికి మకరి మకరికి గరి

బరమగుచును నతల కుతల భటులరుదు వడన్

అన్నట్లుగా ఒకసారి కరి రాజుది పైచేయి అయితే మరొకసారి మకరిపై చేయిగా నిలుస్తూ వారు జరుపుతున్న పోరాటంవల్ల సరస్సులోని జలచరాలన్నీ ప్రాణాలు కోల్పోయాయి.

మోహమనే పెద్ద తీగతో కట్టబడిన పాదాన్ని విడిపించుకోలేని జీవుడి లాగా గజేంద్రుడు మొసలి వాడి కోరలకు చిక్కవేయి ఎల్లకాలం తీవ్రపోరాటం సాగించాడు. తన బలమంతా ఉడిగిపోతున్నది.

గజేంద్రునికి తనలో శక్తి ఉన్నంతవరకు ఏ దేవుడు గుర్తుకు రాలేదు. నిజానికి గజేంద్రుడు విష్ణుభక్తుడు. కానీ అహంకారంతో తనని గెలిచిన వారు లేరన్న ధీమాతో వేయి సంవత్సరాలు పోరాడి

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబట్ట ప్రాణముల్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చి అంటూ అప్పుడు నివే దప్ప ఇతఃపరం బెరుగ అని శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు. రావే ఈశ్వర కావవె వరదా అంటూ అనేక రీతులుగా మొరపెట్టుకున్నాడు.

కలదందురు దీనులయెడ – కలడందురు పరమయోగి అంటూ అనేక రీతులుగా వేడుకున్నాడు.

ఒక మలాప్త ఓ వరద నన్ను కావవే అని ఎలుగెత్తి పిలుస్తున్న తన భక్తుడైన గజరాజు ఆర్తనాదం విష్ణువుకి వినిపించింది. శంఖ చక్రాలను పరివారాన్ని కూడా వదిలి శ్రీ లక్ష్మికైనా చెప్పకుండా ఉన్న ఫలంగా వచ్చాడు, ఆ మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు శ్రీహరి.

మానవుడు తనకి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు నాయంత బలవంతులు, పరాక్రమవంతులు లేరని విర్రవీగుతారు, సత్తువ తగ్గి, కష్టకాలం వచ్చినపుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు అనే నగ్న సత్యం గజేంద్రమోక్షం కథ వల్ల మనకి తెలుసు్తన్నది. భగవంతున్నీ సర్వకాలం సర్వావస్థలందు ధ్యానించుకోవాలని, కేవలం కష్టాలు వచ్చినపుడు కాదనే నీతిని బోధిస్తుది గజరాజు కథ.

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

రుద్రమదేవి 4 & 5 ప్రకరణలు

by రంగరాజు పద్మజ August 25, 2021
written by రంగరాజు పద్మజ

నాల్గవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయ శర్మ
సరళీకృతం:- రంగరాజు పద్మజ
సంతానాపేక్ష
శ్లోకం:–
కింతు వధ్వాంత వైతస్యా
మదృష్ట సదృష ప్రజం
న మా మవతి సద్వీపా
రత్నసూరపి మేదినీ.
–(రఘువంశము)
భావం:–  అయినను ద్వీప సహితమైన ఈ భూమి రత్నాలను ఇచ్చినప్పటికీ తమ కోడలైన ఈ సుదక్షిణ యందు మాకు సదృశుడైన కుమారుడనే శ్రేష్ట రత్నం కలగక  పోవడంతో నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు.
వ్యాఖ్య:–  రఘువంశంలో దిలీప మహారాజుకు ఎలాగైతే తమ కోడలైన సుదేష్ణకు  సంతానం కలగాలని కోరిక ఉండేదో… అలానే రుద్రమదేవి తన కూతుళ్లకు సంతానం కలుగలేదని బాధపడుతున్నదని సూచిస్తూ రఘువంశ కావ్యం నుండి ఈ శ్లోకాన్ని ప్రకరణ శీర్షికగా రచయిత తీసుకోవడం భావి కథార్ధ సూచికగా  పాఠకులకు ఈ కథాభాగంలోని కథ సూచింపబడుతున్నది.
కథాభాగం :—  మదనమంజరి రుద్రమదేవి రాణీవాసంలో చక్కగా భక్తిశ్రద్ధలతో ఉంటున్నది. రుద్రమదేవి కూడా మదనమంజరి పట్ల ప్రేమ, ఇష్టం కలిగి ఉన్నది.  గంధం తీయడం, ముమ్మడమ్మ, రుయ్యమ్మల కోసం  పూల దండలను కట్టటం, పడకల ఏర్పాటు చేయడం, దేవుని గది అలికి ముగ్గులు పెట్టడం మొదలైన పనులను మదనమంజరి చేస్తున్నది. సమయం దొరికినప్పుడు రుద్రమదేవికి వింతైన కథలు చెబుతుండేది.
ఒకరోజు సాయంకాలం ప్రకృతి చాలా అందంగా ఉంది. సాయంత్రపు ఎరుపు రంగు ప్రపంచాన్ని ప్రేమ సామ్రాజ్యంలో ముంచి వేస్తున్నది. పక్షులు ఆకాశం నిండా పరుచుకుని ఎగురుతూ తమ నివాసాలైన గూళ్ళకు  పోతున్నవి. ఆకాశంలో రకరకాల మబ్బులు కనపడుతున్నాయి. పిల్లలు ఆ మబ్బులు చూస్తూ” అదిగో రెండు గుర్రాలు!  దాని మీద గుట్ట, దాని పక్కనే ఏనుగు, ఏనుగు మీద మనుషి, అదిగో తివాచీ, గుర్రం తలకాయ మాయమైపోయింది. ఏనుగు మీద మనుషి కోడిపుంజుగా మారాడు.” ఇలా మబ్బులు మారుతూ పోతున్నప్పటి ఆ మబ్బుల ఆకారాలకు తగినట్లుగా పేర్లు పెడుతూ ఆడుతూ సంతోష పడుతున్నారు పిల్లలు. ఆవులు” అంబా”అని అరుస్తూ వస్తున్నాయి.  కూలి పనులకు వెళ్ళినవారు తమతమ ఇండ్లకు వస్తున్నారు. పశువుల మంద నడవడంతో వీధులలో దుమ్ము లేచి, ఇంకా కూలీనాలీ చేసుకునే ఆడవాళ్ళు వారి ఇంటిలో వంటలు వండుతున్నప్పుడు కమ్ముకున్న పొగా, ఈ రెండూ కలిసి ప్రకృతి అందంగానూ, ఒక వింతగానూ కనబడుతున్నది. వంట కోసం రకరకాల కట్టెలను కాల్చడం వల్ల ఒక రకమైన వాసన గుప్పుమని వస్తున్నది.
కొంతసేపటికి ఆకాశం నిండా వేల కోట్ల నక్షత్రాలు మినుకుమినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆనాడు పౌర్ణమి తెల్లవారి కావడంవల్ల నక్షత్రాల వరుస చాలాసేపు తమ అందమైన రీతి ప్రపంచానికి కనిపించకుండా చల్లని చంద్రుని వెలుగుకు లొంగిపోయి ఒకటొకటే కనిపించకుండా మాయమై పోయాయి. అమృతమయుడైన  చంద్రుడు ఆకాశాన వెలుగుతూ వేలవేల తన చల్లని  కిరణాలు భూమిపై ప్రసరింపజేసి, తెల్లని రాళ్ళను నేల మీద పరిచినట్టుగా కనబడుతున్నవి. ఆ వెన్నెలలో ఓరుగల్లు నగరం గొప్పగా సింగారించుకున్నట్టు ఉన్నది.
పిల్లలు ఆనందంగా వీధులలో ఆటలు ఆడుతున్నారు. సామాన్య యువత గుంపు గూడి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారు. కూర్చున్న యువకులు తీగలతో ఉన్న యంత్ర వాయిద్యాలతో సంగీతం వాయిస్తున్నారు. కొందరు గుమ్మటెలు (  కుండ వాయిద్యం ) వాయిస్తూ… వీరుల చరిత్రలు పాటలుగా పాడుతున్నారు. కొందరు జంగములు మహావీరులను ఆనంద పరుస్తున్నారు.
దాదాపు మూడు గడియల రాత్రి అవుతున్నది. రుద్రమదేవి, ముమ్మడమ్మ, రుయ్యమ్మ, మదనమంజరి ఇంకో ఇద్దరు చెలికత్తెలు మేడ మీద కూర్చుని ఉన్నారు. ప్రకృతి  వారికి ఉల్లాసం కల్గిస్తున్నది. మదనమంజరి ఏవేవో ముచ్చట్లు చెప్పి, అక్కడ ఉన్న వారిని నవ్విస్తున్న ది.
మదనమంజరీ! ముచ్చట్లు చెప్పి కాలక్షేపం చేయడంలో నిన్ను మించిన వారు లేరు. చాలా సమర్థురాలువే! నువ్వు పుట్టినప్పటినుండి మోటు  ప్రదేశాలలో తిరిగానని చెప్పినావు! కానీ చక్కగా చాతుర్యంతో మాట్లాడుతూ, హాస్యసంభాషణలతో పొద్దు పుచ్చడం  చాలా పాతకథలను చెప్పడం, ఇంకా నీకు బాగా తెలుస్తుంది. చిన్నతనం నుండి నువ్వు అంతఃపురాలలో ఉంటే ఇంకా నీకు ఎంతో నేర్పుగా మాట్లాడడం వచ్చి ఉండేదో? నేను చెప్పలేను”  అని రుద్రమదేవి అన్నది.
ఏదో  ” మీ దయ నేను అంత నేర్పుగా మాట్లాడక పోయినా, నా మీద మీకున్న దయతో అలా అనిపిస్తున్నదని మదనమంజరి అన్నది.
ఈరోజు ఏదైనా కథ చెప్తావా? కథ అంటే కథ కాదు! జరిగిన విషయం నీకు ఏదైనా తెలిస్తే చెప్పు! కల్పిత కథల కన్నా జరిగిన కథలు సంతోషం కల్పిస్తాయి! రుద్రమదేవి అడిగింది.
మీరు అడిగితే అలాగే చెప్తాను. చాలా పాతకాలం నాటి కథ ఒకటి చెప్పనా? అది అనుమకొండకు సంబంధించిన కథ. అని మదనమంజరి అన్నది.
రుద్రమదేవి చెప్పమన్నది.
రుద్రమదేవి ,మిగతా వారు అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఈ విధంగా కథ చెప్పటం మొదలు పెట్టింది..
చాలా కాలం క్రితం కంధార పట్టణంలో సోమదేవరాజు అనే ఒక రాజు సత్యసంధుడై  రాజ్యపరిపాలన చేస్తున్నాడు. సోమదేవ మహారాజుకు బ్రాహ్మణులంటే చాలా భక్తి. ఆవులంటే ఎంతో ఇష్టం. వాటి మీద ప్రేమ ఎక్కువగా చూపేవాడు. ఆరాజు చాలా ఆవుల మందలను మంత్ర కూటం( మంథెన),  భద్రాచలం మొదలైన గోదావరి ఒడ్డున ఉన్న పట్టణాలకు మేతకోసం పంపించేవాడు. ఈ వార్త కటకపురం రాజధానిగా ఉత్కల దేశాన్ని పాలించే బల్లహుడు విని ససైన్యంగా వచ్చి సోమ దేవరాజు యొక్క ఆవులను చుట్టుముట్టాడు. ఆవులను మేపేవారు అతనిని అడ్డుకున్నారు. కానీ చక్కని శిక్షణ పొందిన చాలా మంది సైనికుల ముందు శిక్షణ పొందని పశువుల కాపరులు సైనికుల ముందు నిలువ గలరా? కొందరు గాయపడ్డారు. కొందరు చనిపోయినారు. బల్లహుడు  మందలను తోలుకొని కటకపురానికి పోయాడు. చావగా మిగిలన పశువుల కాపర్లు వచ్చి కంధార రాజయిన సోమదేవరాజుకు చెప్పారు. రాజు సైన్యం సిద్ధం చేసుకొని బల్లహుడితో పోరాడటానికి బయలుదేరాడు. కానీ బల్లహుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. అలాగే తరుముతూ తరుముతూ పోయి, సోమ దేవరాజు కటకపురిని ముట్టడించాడు. బల్లహునకు సోమదేవరాజు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సోమదేవరాజు ఓడిపోయి కంధారానికి వచ్చి ఎక్కువ బలమైన మరింత సైన్యాన్ని తీసుకొని రెండవ సారి కటకపురిని ముట్టడించాడు. ఇప్పుడు సోమదేవరాజు గెలుపొందాడు. నాలుగు సంవత్సరాల దాకా యుద్ధ ప్రస్తావన వస్తే ఒకసారి కటకపుర రాజు గెలుస్తూ మరొకసారి ఓడిపోయేవాడు. సోమ దేవరాజు అంతటితో యుద్ధతలంపు మాని, తన నగరానికి వచ్చి సంతానం పొందేందుకు మరియు శత్రువును ఓడించటం డానికి పుత్రకామేష్టి యజ్ఞం జరిపించాడు. వైశ్వానరుడి దయ వల్ల సోమదేవరాజు భార్య గర్భవతి అయ్యింది. ఈ సమాచారం కటకపురి బల్లహునకు తెలిసింది. బల్లహుడు తనకు ముప్పు తప్పదనుకొని గొప్ప సేనతో వచ్చి కంధారాన్ని ముట్టడించినాడు. సోమదేవరాజుకు, బల్లహునకు ఇరవై రోజులు అతి భీకరంగా యుద్ధం జరిగింది.  ఆ యుద్ధంలో సోమదేవరాజు వీరమరణం పొందాడు.కంధార పట్టణం బల్లహునకు మనకు స్వాధీనం అయింది. భర్త చెప్పిన విధంగా సిరియాళదేవి దేశం నుండి పారిపోయింది. బల్లహుడు ఆమెకోసం ఊరంతా గాలించాడు. కానీ ఆమె జాడ తెలియలేదు.సిరియాళదేవి  కంధారం నుండి పారిపోయి వచ్చి మన అనుమకొండకు చేరుకున్నది. అనుమకొండ మనకి అప్పుడు లేదు. ఊరు కూడా ఇప్పటి వలే పెద్దగా లేదు. శ్రీశైల అడవుల దగ్గర నివసించే వ్యాధుడు అనే వాడు వచ్చి ఇక్కడ ఒక బోయపల్లెని ఏర్పాటు చేసి, దానిని అభివృద్ధి చేశాడు. అతని వంశం వాడే ఎరుకు దేవరాజు అనే పేరుతో రాజ్యాన్ని పాలిస్తున్నాడు.  సిరియాళదేవి ఎరుకు రాజు దగ్గరికి వెళ్లి,”బల్లహునకు” భయపడి పోయి పారిపోయి వచ్చాను. నా భర్త నన్ను చావవద్దని అన్నాడు. నన్ను  కాపాడుమని వేడుకుంది. కానీ బల్లహుడికి భయపడి సిరియాళదేవికి అతను ఆశ్రయము ఇవ్వలేదు. సిరియాళదేవని ఎరుకు రాజుకు తెలుస్తే ..సోమదేవ రాజు సహాయం తాను ఎన్నోసార్లు పొంది ఉన్నాడు కాబట్టి తప్పక ఆశ్రయం ఇచ్చి ఉండేవాడు. ఎరుకు దేవరాజు ఆశ్రయం ఇవ్వకపోవడంతో సిరియాళదేవి బయలుదేరి వెళ్లిపోతూ ఉండగా అనుమకొండ నివాసి సదాచార సంపన్నుడైన మాధవశర్మ సిరియాల దేవిని రమ్మని ఆదరించి భయపడకని ధైర్యం చెప్పి తన ఇంటిలో ఉండుమనీ ఆమెకు ఎటువంటి శ్రమ కలుగకుండా కాపాడుతున్నాడు. ఈ వార్త బల్లహుడు విని, అనుమకొండపైకి దండెత్తి వచ్చాడు. బల్లహుడికి భయపడి ఎరుకురాజు తన ఊరిలో సిరియాళదేవి లేదని చెప్పాడు. బల్లహుడు అనుమకొండలోని అందరి ఇళ్లకు ఆయా జాతుల వారిని పంపి సిరియాళదేవిని వెతికించాడు.మాధవశర్మ ఇంట్లో ఉన్న సిరియాళదేవిని , మాధవశర్మను ఒక బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి రాజుకు చూపించాడు. బల్లహుడు  ఆమెనే సిరియాళదేవి అని అనుమానించాడు. ఎరుకుదేవరాజు కూడా అనుమానించాడు. అప్పుడు అనుమకొండలోని బ్రాహ్మణులందరు కూడబల్కొని  ఈమె సిరియాళదేవి కాదని మాధవశర్మ కూతురైన లలిత అని, ఒకవేళ ఈ లలితతోనే మీరు అనుకుంటే తీసుకొనిపోండి!  మేమేమీ అడ్డు చెప్పము. మీరు చేసిన ఈ పనిని శాసనాల మీద చెక్కించి అందరం అగ్ని పేర్చుకుని అందులో దూకుతామని బ్రాహ్మణులు అన్నారు. ఆ మాటలకు బల్లహుడు అదిరిపోయి ఈమె మీ లలిత అయినా, సిరియాళ దేవైనా మాకు పని లేదు. సిరియాళదేవి జాడ తెలుసుకోవడం ఆమెకు మానహాని కానీ, ఆమె కడుపులో ఉన్న సంతానానికి హాని చేయడానికి కానీ కాదు. ఆమెను మేము మా ఇంటికి తీసుకుని పోయి ఆమె కడుపులో బిడ్డ కలిగితే మాకు విధేయుడిగా ఉండేలా పెంచుతామని, కంధార పట్టణానికి రాజుగా చేస్తామని అది నిజంగా నిజం అని అన్నాడు.
బ్రాహ్మణులు అతని మాట నమ్మక తమ పట్టుదలను వదిలిపెట్టలేదు. తరువాత బల్లహుడు ఆమె మీ కూతురు అయితే ఆమె చేతితో వడ్డించిన అన్నం తినమని అన్నాడు. అప్పుడు వారంతా సరే అన్నారు.
తెల్లవారి సింగేశ్వరాలయానికి పోయి గర్భిణీ చేత అన్నం తినడం ఆచారం కాదని, బల్లహునకు  చెప్పి బెల్లం, నేతిని సిరియాళదేవి చేత వడ్డింపించుకొని తిని  అనుమానం తీర్చారు.
బల్లహుడు వెళ్ళిపోయిన తరువాత ఒకానొక శుభ ముహూర్తంలో మాధవశర్మ ఇంటిలో సిరియాళదేవి కొడుకును కన్నది.  ఆ పిల్లవాడికి మాధవవర్మ అని పేరు పెట్టారు .
మాధవశర్మ ఇంట్లో సకల వేదాలను, శాస్త్రాలను, ధనుర్విద్యను నేర్చుకొని మొదట ఎరుకు రాజును వెళ్లగొట్టి అనుమకొండను వశపరచుకొని, చాలామంది సంస్థానాధీశులు వెంటరాగా కటకాన్ని ముట్టడి చేసి,
> బల్లహుని చంపి, అతని కుమారుడైన”భండికి”  రాజ్య పట్టం కట్టి తన చెప్పుచేతుల్లో ఉండేట్లుగా చేసుకొని, కంధారానికి వచ్చి, కంధారాన్ని , అనుమకొండను ఒకే తీరుగా న్యాయ పరిపాలన చేస్తూ సుఖంగా ఉన్నాడు.
“మదనమంజరీ!”  సిరియాళదేవి పడరానిపాట్లు పడింది కదా!బ్రాహ్మణుల ధైర్యం కూడా చాలా గొప్పది.
మాధవశర్మ గారు ఎంతో పరోపకారి. ధీనులను ఆదరించి అక్కున చేర్చుకునే గుణం ,ఎంతో పట్టుదల! ఎంతో నేర్పరులు! వారే లేకుంటే సిరియాళదేవి గతి ఏమై ఉండేదో కదా!  కన్నబిడ్డల వలె అనుకొని సిరియాళదేవిని పెంచిన మాధవశర్మ గారు మనందరం ఉదయాన్నే వారిని తలుచుకోవాల్సిన వారు కదా !అని రుద్రమదేవి అన్నది.
అందులో అనుమానమే లేదని అన్నది ముమ్మడమ్మ “. మాధవశర్మ  చాలా ప్రేమతో పోషించినట్టు, సిరియాళదేవి కుమారుడు జన్మించడం వల్లనే కదా! చాలాకష్టాలన్నీ తొలగిపోయినవి. లేకపోతే ఇంకేమున్నది, ఒకవేళ కూతురు పుట్టి ఉంటే ఆమెకు పెళ్లి, మనుమడు కలగడం అతను భూమియందు పరాక్రమవంతుడైనప్పుడు కదా! మనవడిగా అధికారియై కంధార రాజ్యానికి రాజైనప్పడు కదా!  సుఖం కలిగేది. అంత దాకా సిరియాళదేవి కూతురుతో మాధవశర్మ గారి ఇంట్లో ఉండాల్సి వచ్చేది కదా! కుమారులు లేని జన్మ వృధా అనడంలో అనుమానం ఎందుకు?  నా సంగతి చూడు! నాకు ఏమున్నది, ఇద్దరు కూతుర్లు లేకపోతే నాకు ఎంత రాజ్యసంపద ఉన్నా ఎంత ధర్మం ఆచరించినా లాభమేమిటి?  అని రుద్రమదేవి అన్నది.
పుత్రులు లేకుంటే పున్నామ నరకం తప్పదని  పెద్దలు నిశ్చయంగా చెప్పారు. అయినా కూడా భగవంతుడు మీకు ఇద్దరు పుత్రికలను వరంగా ఇచ్చాడు. వారి కడుపులు పడితే మీకు ఇంక లోపమే లేదు! అని మదనమంజరి అన్నది.
అవును నీవన్నది నిజమే!  ఇంకా నాకు ఆ భాగ్యం కలగలేదు. నా  కూతుర్లకు పుత్రులు పుట్టడం చూసే భాగ్యం నాకు లేదేమో? అని రుద్రమదేవి అన్నది.
మీరు విచారించకండి!  దేవుడు మీ కూతుళ్లకూ త్వరలోనే బిడ్డలనిస్తాడు.  ఇప్పుడే మీరు ఇంత బాధ పడటం ఎందుకు? కూతుళ్ళకు ఏమంత ఈడు గడిచిపోయిందని బెంగ?అని మదనమంజరి అన్నది.
అయ్యో !వెర్రిదానా!  ఇంకెంతకాలం గడవాలి? ఈ వయసులో ఉన్న ఆడవారు ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని కన లేదా?  అటువంటి వారిని చాలా మందిని చూశానని రుద్రమదేవి అన్నది
అవును పేదవారికి అధిక సంతానం కలుగుతుంది. శ్రీమంతులకు ఎంతో ఎదురు చూస్తే తప్ప సంతానం కలిగే భాగ్యం  ఇవ్వడు భగవంతుడు. రుయ్యమ్మ దొరసానికి ఏమంత వయసు మీరినది? కనే ఈడు ఏమి మించిపోలేదు. లేత ప్రాయంలోనే ఉన్నారని మదనమంజరి చెప్పింది
ఔనే ! మదనమంజరీ!  మా రుయ్యమ్మకింకా ఈడు గడవ లేదనడం నిజమే. మరి ముమ్మడమ్మ పరిస్థితి ఏమిటి? ఆమె పెద్ద బిడ్డ కాబట్టి ఆమె వయసు కొంచెం ఎక్కువ అయింది. ముమ్మడమ్మకు ఇదివరకే సంతానం కలగలిసి ఉండేది!  ఈ విచారం తప్ప నిజానికి వేరు విచారాలు నాకు లేవు.ఈ చింత ఎన్నడు తీరుతుందో తెలియదు. వీళ్లిద్దరితో ఎంతో మంది దేవతలను స్థాపింప చేశాను. ఎన్నో దానాలు చేయించాను. నా బిడ్డల బిడ్డలను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే నేను చూడగలనో?లేదో? అన్నది రుద్రమదేవి.
దేవత మాత్రమేం చేస్తుంది?  భగవంతుడు అందరి పట్ల ఒకే తీరుగా చూస్తాడు. మనుష్యులు వారు చేసిన పాపాలకు వారికి తగిన ఫలితాలను ఇస్తాడు. సమయం వచ్చేదాకా దేవుడు కూడా శ్రద్ధగా ఉంటాడు. ఇది మనకు తెలిసినా ఫలించే రోజు వచ్చే దాకా చూస్తూ ఊరుకోకూడదు. ఫలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనకు తోచినంత దానధర్మాలు చేస్తూ… దేవతలను ఉపాసించాలని అన్నది మదన మంజరి.
నువ్వు చెప్పింది నిజమే! అందుకే సంతాన గౌరీవ్రతం చేయిస్తున్నాను. మూడు సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇంకేం చేయాలో తెలియడం లేదు. ఒకటి మాత్రం నిజం అనుకుంటున్నాను. ఏమిటంటే వడ్డేపల్లిలో బుద్ధ గణపతి అనే దేవుడు ఉన్నాడు.ఆ దేవుడు చాలా మహిమగల వాడు. కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ దేవుని పూజించమని  నా కూతుర్లకు చెప్తాను. చూద్దాం!  ఏ దేవుడికైనా దయ రాకపోతుందా? అని అన్నది రుద్రమ్మ దేవి.
మంచి ఆలోచన చేశారు ఇక ఆలస్యం చేయకుండా ఆ దేవుడిని పూజించడం మంచిది .ఆ దేవుడు మంచి ప్రభావం కల దేవుడు. నేను వచ్చినప్పుడు ఆ ఊరు నుండి వచ్చాను. నాతో వచ్చిన వారు ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్లారు. వారివెంట నేను వెళ్ళి దర్శించుకున్నాను. వారందరూ ఆ దేవుని ప్రభావం చాలా గొప్పగా పొగుడుతూ నాకు చెప్పారని మదనమంజరి అన్నది.
అప్పటికి దాదాపు జామురాత్రి దాటింది ఎవరి పడక గదులకు వారు వెళ్లి విశ్రమించారు.

ఐదవ ప్రకరణ
[ అన్యోన్య సంభాషణం]

ఇతి వ్యాహృత్య విబుధాన్
విశ్వయోనిస్తిరోదధే ౹
మనస్యాహితకర్తవ్యాః
తే౽పి దేవా దివం యయుః ౹౹ 2-62
కుమారసంభవము.
భావం:-ఈ విధంగా బ్రహ్మ దేవుడు ఇంద్రాదిదేవుళ్లను గురించి చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ ఇంద్రాది దేవుళ్లు కూడా మనస్సులో కర్తవ్యబుద్ధిని పొందినటువంటివారై స్వర్గలోకానికి వెళ్లారు.
అనుమకొండకు పడమటివైపున దాదాపు నాలుగు మైళ్ళదూరంలో వడ్డేపల్లి అనే గ్రామమున్నది.ప్రస్తుతం ఓరుగల్లు నుండి వడ్డేపల్లి దాకా దాదాపు ఇండ్లు కట్టుకున్నారని చెప్పవచ్చు.మన కథాకాలంలో ఇప్పటివలె కాకుండా దట్టమైన అడవి ఉండేది.
ఈ గ్రామానికి దక్షిణ దిక్కులో ఒక చెరువు ఉన్నది. అయినా అందులోని నీళ్ళు ఉపయోగించడానికి ఆ చెరువు కింద పొలాలు లేవు.గ్రామం చిన్నదవడం వల్ల అక్కడ నివసించే వారు కొంత మంది కాపురస్తులు కొంత మోతాదులో భూమిని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఆ చెరువు వెనుక ఒక మఱ్ఱి చెట్టున్నది.అది చాలా పెద్దది. దాని కొమ్మలెంత పెద్దగా ఉన్నాయంటే… ఊడలు కిందకు దిగి ఇంటి స్తంభాలవలె ఉండి రంధ్రాలున్న ఆకులు చెట్టు బోదెపై ఇంటి కప్పు వలె ఉన్నది. అంతగా ఎత్తు లేని పరపు బండ ఒకటి ఆ మఱ్ఱి చెట్టు కింద పరచినట్టుగా ఉండి రెండు కుటుంబాలు సునాయాసంగా కాపురం చేయవచ్చు.
ఆ చెట్టు కింద ఇద్దరు మగవారు ఒక స్త్రీ కూర్చుని ఉన్నారు. ఒకని పేరు హరిహరుడు, రెండోవాని పేరు మురారి దేవుడు.ఆమె పేరు కమల.వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటే తప్ప తెలిస్తే తెలియవచ్చు.వాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
మురారి:– కమలా! కొరతేమీ లేదు కదా!
కమల:– మీదయ ఉండగా కొరతేముంటుంది ?
మురారి:– ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
కమల:- పాచిక పారింది.
మురారి:- ఎలా?
కమల:- మనమనుకున్నట్టే !
మురారి:-ఆ ఉపాయం చక్కగా పనిచేసిందా?
కమల:- తృప్తిగా .
మురారి:- ఇంకా విశేషాలు ఏమిటి?
కమల:- మీకు తెలియనివి ఏమున్నాయి?
మురారి:- తపస్సు చేస్తున్నావా?
కమల:- చాలా శ్రద్ధగా.
మురారి:- మనం ఇక్కడి నుండి ఎప్పుడు బయలుదేరుదాం ?
కమల:- మీకు దయ వచ్చినరోజు.
హరి:- నువ్వు ఎన్ని రోజులుంటావు ?
కమల:- ఎక్కడ?
హరి:- వడ్డేపల్లిలో…
కమల:- ఇవాళ మాత్రమే.
హరి:- ఈ రోజు మనం వెళ్లి పోవడానికి మంచి అనువుగా లేదా?
కమల:- లేదు.
మురారి:- ఎందుకు లేదు?
కమల:- కొందరు మనలను కనిపెట్టుకుని ఉన్నారు.
హరి:- వారు అడ్డమా?
కమల:- ఎవరికెరుక?
హరి:- మరి ఇవాళ ఇక్కడ నుండి బయలు దేరి ఎక్కడకి వెళ్లాలి?
కమల:- మొగిలిచెర్లకు…
హరి:- ఏమో? మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నవి.చివరకు ఆశ నిరాశవతుందో ఏమో?
కమల:- మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది.
మురారి:- నీ చేతిలో ఉన్నదానికి మా అదృష్టం అంటావేమిటీ?
కమల:- ఉంటే మాత్రం?
హరి:- మొగిలిచెర్లలో ఎన్ని రోజులుంటాము?
కమల:- ఐదు రోజులు.
మురారి:- అక్కడనుండైనా నిజమైన ప్రణాళికేనా?
కమల:- సమయానికి మీదగ్గరకు రాకుండా ఉంటానా?
మురారి:- తప్పనిసరి వస్తావా?
కమల:- వస్తాను…ఇప్పుడు రాలేదా?
మురారి:-ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే …నువ్వు దరిద్రంతో బాధపడకుండా…ఉండేలా చేస్తాం.
కమల:- సాయంత్రం అయింది. ఇక నేను వెళ్లుతాను.
మురారి:- దయ ఉంచు !
కమల అక్కడి నుండి వెళ్లి పోయి చెరువు కట్టనెక్కి ఊరుకు చక్కగా వెళ్లి పోయింది.
(సశేషం)
★★★★★★★★★★★★★★★

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అద్ధంకి గంగాధర కవి “తపతీ సంవరణము” : ఉత్తమ ప్రబంధం

by బ్రాహ్మణపల్లి జయరాములు August 25, 2021
written by బ్రాహ్మణపల్లి జయరాములు

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి


ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.

ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.

మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .

వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్ధమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.

పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.

కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.

ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .

కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .

తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471

 

డా॥ బి. జయరాములు గారి పరిచయం
ఆధునిక తెలుగు సాహిత్యవేత్తలలో, ప్రవచన కర్తలలో సుప్రసిద్ధులైన వారిలో డా|| బి. జయరాములు  గారు ఒకరు. హైదరాబాద్ మహానగరం కేంద్రంగా నిర్వహింపబడే ప్రముఖ సాహిత్య సంస్థల విశేష కార్యక్రమాలలో నిర్వహణ రీత్యా తన ప్రతిభా పాటవాలను ప్రకటించుకొని మెప్పు పొందిన అతి కొద్దిమందిలో జయరాములు గారొకరు.  వీరు డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ గారి ద్విశత, సహస్ర, బృహత్ ద్విసహస్ర, పంచశత తదితర అవధానాల నిర్వహణలో ప్రముఖ పాత్ర  వహించిన సంగతి  పృచ్ఛకులుగా పాల్గొన్న వేలమందికే కాక తదితర ప్రేక్షక వర్గ మహాశయులెందరెందరికో తెలిసిన విషయమే. ఆ విధంగా సభా సమన్వయంలో సమర్థుడని పేరు పొందినారు.
ధార – ధారణ అసాధారణంగా  కలిగిన మహో అవధానులలో డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకరని జగద్విదిత విషయమే. తెలుగు ఠీవి మన పీవీ అంతటివారు పృచ్ఛకులుగా పాల్గొన్న ఘనత అవధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ గారి అవధానానికి గొప్ప మెప్పు శాలువా !  అవధాన సభల నిర్వహణలో  అవధానిగారు ప్రశాంత మనోజ్ఞా వాతావరణంలో  సఫలీకృతం కావటానికి కావలసినంత సమయస్ఫూర్తి, పర్యవేక్షణ దక్షత కలిగినవారు.  సాహిత్యాంశాల సమాకలన – సముచిత వర్గీకరణ వ్యుత్పన్నతలు కలిగినా సభాసమయ సాహిత్య వక్తలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అని వేరే చెప్పనక్కర లేదు.  డా|| జయరాములు గారు “ఇటువంటి సమన్వయ కర్త”.  ఇట్లే డా|| మేడసాని మోహన్, డా|| మలుగు అంజయ్య, డా|| జి.ఎం. రామశర్మ, శ్రీ అష్టకాల నరసింహ రామశర్మ మొదలైన పెద్దల అవధానాలలో సభా సమన్వయంతో పాటు అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకులుగా వీరి దోహదం పేర్కొనదగినది.
ఇక ఉద్యోగవృత్తి నిర్వహణ పరంగా అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రిన్సిపాల్ గా అభ్యుదయ ప్రాచ్య కళాశాలలో 34 సం|| సుదీర్ఘ అనుభవమున్న వారు డా|| జయరాములు గారు.
వీరు సుప్రసిద్ధ విమర్శకులు డా|| జి.వి.సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో “ఆంధ్ర ప్రబంధాలు – శృంగారం – ప్రయోగాలు” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు.  ‘రస’ చర్చ చాలా లోతైన విషయమని తెలుగు ప్రబంధాలలో  ‘శృంగారం’ ప్రధాన రసమని తజ్ఞులకు వేరే చెప్పనక్కర లేదు.  వీరి కూలంకష పరిశోధన గురువుల మెప్పును అందుకున్నది.
ఇదే వరుసలో సత్యభామ తదితర పాత్రలకు చెందిన వీరి మరో గ్రంథము : “సాంత్వన కావ్యాలు – శృంగార నాయికలు” చెప్పుకోదగిందే. ఇట్లే పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయి వరకు పాఠ్యరచన, బోధనా పద్ధతుల గ్రంథాలు రచించినారు. వివిధ పత్రికలలో అసంఖ్యాకంగా వైవిధ్యభరితమైన వ్యాసాలను ప్రచురించినారు.
భక్తి, పూజ, సివిఆర్, హిందూధర్మం,  జెమిని, జయ జయ శంకర మొ|| టి.వి. ఛానల్స్ లో దేవాలయాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, చర్చలు వీరివి ఎన్నో ఎన్నెన్నో. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం పొందిన డా|| జయరాములు గారిని ‘విశ్వసాహితి’ తదితర సంస్థల పురస్కారాలెన్నో వరించినవి.  హైదరాబాద్ మహా నగరంలో ప్రసిద్ధి పొందిన గొప్ప సాహిత్య, కళారంగ సంస్థలకు కొదువ లేదు. అయితే వృద్ధాప్య కారణంగా ఆయా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు తగినంత చేవతో ఆ సంస్థలను నిర్వహించలేని స్థితిలో రెండవతరం నిర్వహణ సామర్థ్యశాలిగా డా|| జయరాములు గారు విశ్వసాహితి, యువభారతి సంస్థల అధ్యక్షులుగా, కార్యదర్శిగా వ్యవహరించడం గమనార్హం.
“విశ్వసాహితి” పక్షాన “నాటి పురాణం – నేటి సమాజం” శీర్షికన ప్రసంగాలను చేయించి గ్రంథాలుగా వెలువరించటం తొలి సంపుటం వెలువడడం జరిగింది.
“యువభారతి” పక్షాన “విశ్వనాథ సాహితీ సమాలోచనం” గురువుగారైన జి.వి.సు. గారితో సహ సంపాదక స్థాయిలో వెలువరించినారు. ఈ క్రమంలో “నేను-నా కళా ప్రస్థానం” ఒక గొప్ప ప్రయోగం. నటులు, కవులు, గాయకులు, సంగీత దర్శకులు, జానపద కళాకారులు, సినీ దర్శకులు, నాట్య కళాకారులు, చిత్రకారులు, శిల్పులు మొదలైన సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞులతో నేటి యువ కళాకారులకు స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్ విధాన ప్రసంగ పరంపర ఎంతో ప్రయోజనకరమైనది. ఇటువంటిదే మరో అడుగు “సాహిత్య కళా రసవాహిని” కార్యక్రమ పరంపర. ఆనందం – సందేశం జమిలిగా కళ యొక్క ప్రయోజనమని అనుభవంలోనికి తెచ్చే సరళీ స్వరకల్పనం ఈ కార్యక్రమాల లక్ష్యం.
“ఆధునికాంధ్ర కవులు” 51 మందిని గురించిన గ్రంథం వీరి గ్రంథాలలో ఒక ప్రత్యేక గ్రంథం. తమ గ్రామమైన చిత్తలూరులోని నల్లగొండ జిల్లాలోని కాకతీయ చారిత్రక ప్రసిద్ధమైన మిని నిర్మాణ రీతిలో  ఉండే “శంభులింగేశ్వరాలయ” దైవము పైన రచించిన శ్రీ శంభులింగేశ్వర శతకం మొదలుగా అనేక కావ్యాల విమర్శన వ్యాసాలూ, పరిశోధన వ్యాసాలూ, అమెరికా పర్యటన సంబంధ విశేషాల గ్రంథాలు వీరివి 15 వరకు ఉంటాయి. పల్లె నుండి మహా నగరం దాకా;  అమెరికా TANTEX దాకా వీరికి జరిగిన సన్మానాలు వీరి సాహిత్య సేవకు సహృదయులందించిన ప్రతిస్పందనల కలికితురాయిలే.
తెలంగాణ ప్రబంధాలలో మేటి ప్రబంధముగా ప్రసిద్ధ విమర్శకులచే ప్రశంసలు పొందిన “తపతీ సంవరణోపాఖ్యానం” గురించి సమగ్ర పరిశీలనతో – చర్చా పూర్వక అంశాలతో నిగ్గుదేల్చినట్లు కొన్ని అంశాలను తేల్చివేసి ఉత్తమ ప్రబంధంగా తపతీ సంవరణాన్ని నిర్ధారించిన డా|| బ్రాహ్మణపల్లి జయరాములు గారికి “తెలంగాణ ప్రబంధాలు”  పరిచయ మాలిక నిర్వహణకర్తగా అభినందనలు, అభివందనములు తెలుపుకుంటున్నాను.  కృత శ్రములకు వందనములు తెలుపుకొనుట కృతజ్ఞతయే.
తెలంగాణ ప్రబంధ వ్యాసపరంపరలో ఇది రెండవ వ్యాసము. సకాలంలో వ్యాసం అందించిన జయరాములు గారికి సాహితీ బంధువుగా ఆప్తవాక్యం పలుకుతూ సహృదయ విద్యాంసులైన పాఠక మహాశయులకు నమోవాకములు సమర్పిస్తూ….

                                                                                                                                   భవదీయుడు
– గురిజాల రామశేషయ్య

 

 

 


తెలుగు సాహిత్యంలో ప్రబంధం ఒక ప్రత్యేక ప్రక్రియ. సంస్కృత లాక్షణిక సంప్రదాయంలో ప్రబంధం అంటే కావ్యమే. కాని 16వ శతాబ్దంలో కవులు రచించిన కావ్యాలకే ప్రబంధాలు అనే రూఢి ఏర్పడింది. ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం. ఆ బంధం శబ్దార్థాలలో పద్యాలలో ప్రధానంగా కనబడుతుంది. వస్త్వలంకారాలలోనూ దాన్ని దర్శింపవచ్చును. అయితే రూఢినిబట్టి ప్రఖ్యాత వస్తుకం, శృంగారరస ప్రధానం, ధీరోదాత్త నాయకం, అష్టాదశ వర్ణన భూయిష్టం, ఆలంకారిక రచనాబంధురం, పంచాశ్వాస పరిమితమైన చంపూ కావ్యాన్నే తెలుగువారు ప్రబంధంగా భావిస్తారు.

ప్రసిద్ధమైన ఏ ఉపాఖ్యానాన్నో గ్రహించి, స్వీయకల్పనలతో పెంచి, అష్టాదశ వర్ణనలతో శృంగార రసబంధురంగా ఆలంకారిక శైలిలో ప్రబంధ రచన చేయడం ప్రబంధ కవి పద్ధతి. వారు ఎన్నుకొనే కథలో ఓ కొత్తదనం, నిర్వహణలో నిండుదనం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మనం అద్దంకి గంగాధర కవి రచించిన “తపతీ సంవరణము” అనే ప్రబంధంలో దర్శించవచ్చు.

కవి – కాలం – స్థలం :

అద్దంకి గంగాధర కవి 16వ శతాబ్ది కవి. ఈయన ఈ ప్రబంధాన్ని 1550-65 మధ్య రచించి ఉంటాడని మల్కిభరాముని పాలనా కాలాన్నిబట్టి నిర్ణయించారు పాటిబండ మాధవశర్మగారు. కాని “ఏలిక ఆసక్తి మేరకు ఆనాటి సాహిత్య లోకపు ‘ఫ్యాషన్’లకు లోబడి వసుచరిత్ర మూసలోనిదా అనిపించేటట్టు ఈ కావ్యాన్ని రచించాడు. అందుకే సాహిత్య చరిత్రకారులూ, విమర్శకులూ కొన్ని కొన్ని అభిప్రాయాలకూ వచ్చారు” అంటూ ఆరుద్రగారు తమ సమగ్రాంధ్ర సాహిత్యం రెండవ సంపుటిలోను, కందుకూరి వీరేశలింగంగారు ఈ ప్రబంధం “వసుచరిత్రమును బోలి వరలుచున్నది” అన్న మాటను కూడా పూండ్ల రామకృష్ణయ్యగారు ఖండిస్తూ “వసుచరిత్రకు వసుచరిత్రమే సాటిగాని మరియొక గ్రంథము మన భాషలో నిప్పటికీ లేదు” అన్న వాక్యాల్ని ఉటంకించారు. అయితే పాటిబండ మాధవశర్మగారు ఈ ప్రబంధ పీఠికలో ఆ అభిప్రాయాలను ఖండించి, “ముందు వచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడి” అన్నట్లు తపతీ సంవరణమే ముందు పుట్టినను, తరువాత పుట్టిన వసుచరిత్రమునకు ముందు ప్రచారము కలిగినది. వసుచరిత్ర పద్యములు ముందుగా చదివి ఉన్నవారు తపతీ సంవరణ పద్యములు చదివి గంగాధరుడు “రామరాజ భూషణుని” అనుసరించెననుట సహజము’’ అనే వాక్యాలను ఉదాహరించారు.  అలా చెబుతూనే ఆరుద్రగారు “…. గంగాధరుడు సత్యమే. ఇతని కావ్యం రస బంధురమే. సుప్తమీన జలాశయంబు చందంబున కనబడే ఈ కావ్యంలో వెతికితే వసుచరిత్రలో లాగా కొన్ని గడుసు పోకడలు కనబడుతాయి” అని మళ్ళీ తరువాత వచ్చిన వసుచరిత్ర పొకడలు “తపతీ సంవరణము”లో కనబడతాయనడం గడుసుదనమే. తర్వాత వచ్చిన ప్రబంధం పోకడలు ముందు దానిలో ఎలా కనబడతాయి? ముందు వచ్చిన (1550-1565) ప్రబంధపు పోకడలే తరువాత వచ్చిన (1580) ప్రబంధంలో కనబడతాయనడం సమంజసం. పాటిబండ వారు చెప్పినట్లు “గంగాధర కవి వసుచరిత్రమును చూడలేదు, అనుకరించను లేదు. రామరాజ భూషణుడే పూర్వకవుల భావములను పెక్కింటిని అనువదించినట్లు గంగాధర కవి భావములను కూడా కొన్నింటిననుకరించెనేమో” అనడం సమంజసం, సత్యం. ఈ తెలంగాణ ప్రబంధమునకు గౌరవ ప్రదం. గర్వకారణం.

గంగాధర కవి తండ్రి వీరయామాత్యుడు. ఇంటి పేరు అద్దంకి. ఆయన గురువు కేదారశ్రీ. ఇంతకుమించిన వివరాలు కవి గురించి లభించడం లేదు. అద్దంకి నెల్లూరు జిల్లాలో ఉండడంవల్ల ఈ కవి పూర్వులు అక్కడ ఉండేవారని పాటిబండవారు ఊహించారు. గంగాధర కవి తాతగారి కాలంలోనో, తండ్రిగారి కాలంలోనో గోలకొండ ప్రాంతానికి వచ్చి ఉంటారని శర్మగారన్న మాటలు సమర్థనీయాలే. దీన్నిబట్టి గంగాధర కవి నూటికి నూరుపాళ్ళు తెలంగాణ ప్రాంతపు కవే. గంగాధర కవి వేదాలు, భాష్యం, మీమాంసాశాస్త్రం బాగా చదువుకున్న పండితుడు. కులీకుతుబ్ షా వంశీయుడైన ఇబ్రహీం (ఇభరాముడు)కు గంగాధర కవి తన తపతీ సంవరణాన్ని అంకితమిచ్చాడు. ఇభరాముడే స్వ యంగా, “….భారతాఖ్యానమందు గలుగు తాపత్య చరితంబు ఘనత నరసి వివిధ శృంగార మహిమల విస్తరించి కబ్బమొనరింపు నా పేర గవివరేణ్య” (1-19) అని అడిగి, ఈ రసవత్పబంధాన్ని అంకితం గొన్నాడు.

ప్రబంధం – సామాజిక నేపథ్యం :

‘పదహారవ శతాబ్దంలో ఆవిర్భవించిన ప్రబంధ సాహిత్యం మాత్రం చాలా ‘విలాసం’గా నింపాదిగా పుట్టింది. రాజుల్లాగా  రాజోద్యోగులు కూడా కృతుల్ని రచింపిం చేశారు. అంకితాలు పుచ్చుకున్నారు. అందుచేత ‘కవి’ సమాజం నుండి ప్రేరణ పొందింది చాలా తక్కువ’ అంటారు ప్రసిద్ధ విమర్శకులు హెచ్.ఎస్. బ్రహ్మానందం (ప్రబంధ సాహిత్యాన్ని సృష్టించిన సమాజ స్వరూపం).

ప్రబంధ కవులు ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకున్నారో పెద్దన చాటు పద్యం చెబుతూంది.

“నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు క

ప్పుర విడెమాత్మ కింపయిన భోజన ముయ్యల మంచ మొప్పు త

ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్

దొరికినగాక యూరక కృతుల్ రచియింపు మటన్న – శక్యమే?”

సప్త సంతానాలలో నశించనిది ‘కృతి’ కాబట్టి రాజులు తమ పేరు ఆచంద్రార్కం నిలుపుకునేందుకు కవులకు ప్రోత్సాహం ఇచ్చారు. ప్రబంధం ఒక ప్రక్రియగా విశిష్ఠ స్థానం పొంది, తెలుగు సాహిత్య చరిత్రలో చిర, స్థిరస్థాయిని సాధించుకున్నది. ప్రబంధాలు సామాజిక దృష్టితో చూస్తే నాటి పరిస్థితులను కొంత చిత్రించినా, సాహిత్య స్పృహతో వ్రాయడంవల్ల ఆనంద పర్యవసాయులుగా అంటే ఆనందం (సద్యఃపరనిర్వృతి) అనే కావ్య ప్రయోజనాన్ని ప్రధానంగా నెరవేర్చేవిగానే దర్శనమిస్తాయి. అయితే ఆకలిదప్పులు మనిషికి ఎంత సహజాతాలో ఒక విధంగా కళానంద లాభము అటువంటిదే కనుక ఆనంద పర్యవసాయి కళలు నిరంతరకాల ప్రయోజనకరాలేనని చెప్పవచ్చును.

శ్రీ కృష్ణదేవరాయల యుగం (16శ.) తెలుగుసాహిత్య చరిత్రలో స్వర్ణయుగంగా ఖ్యాతి గడించింది. నాటి మహమ్మదీయ ప్రభువుల ప్రభావంతో పాలకులలో, కవులలో రసిక జీవనం అలవాటై శృంగార రసప్రబంధాలు రావడానికి మూలమైంది. మొత్తం మీద ప్రబంధ కాలం నాటి రచనలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకొని ఒక యుగంగా సాహిత్య చరిత్రలో స్థిర చిరకీర్తిని పొందాయి. పాఠకునికి మానసోల్లాసం కలిగించడానికి, కవితాతత్త్వం అందించడానికి, నాటి సామాజిక నేపథ్యం తెల్పడానికి ప్రబంధాలు దోహదం చేస్తాయి.

తపతీ సంవరణము – కథా సంగ్రహం :

సంవరణుడు అనే రాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకనాడు ఆ రాజు ప్రమదా వనానికి వెళ్ళి ఒక సహకార (మామిడి) వృక్షం కింద కూర్చున్నాడు. ఇంతలో ఒక చిలుక వచ్చి ఆతని చేతి మణికట్టుపై వాలింది. దాని అందానికి మురిసిన రాజు దాన్ని తన సహచరులకు చూపిస్తూండగా అది మానవభాషలో సూర్యుని కూతురైన తపతి సౌందర్యాన్ని వర్ణించి చెప్పింది. ఆ చిలుక, తపతి కోసం తగిన రాకుమారుని వెదుకుతూ దేశాలన్నీ తిరిగి, అలసిపోయి ఈ చెట్టుపై విశ్రాంతి తీసుకుంటున్నానని, ఇంతలో అతిలోక సుందరుడవైన నిన్ను చూశానని, నువ్వే తపతికి తగిన పతివని చెప్పింది.

సంవరణుడు చిలుక పలుకులు విని మోహపరవశుడై దాన్ని, దాని మాటలను ప్రశంసించాడు. కాని, తపతి దేవకన్య కాబట్టి మానవుణ్ణైన తాను ఆమెను పొందలేనన్నాడు. ‘దైవయోగం ఉంటే ఏదైనా సాధ్యమే’ – అని మీరామెను వరిస్తే పూవుకు తావి అబ్బినట్లు ఉంటుందని రాజునుత్సాహపరిచి, వారిద్దరినీ కలపడానికి యత్నిస్తానంది చిలుక. తపతి తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో నువ్వే ఏదైనా చేయుమని చిలుకను సంవరణుడు వేడుకున్నాడు. సూర్యుడు తపతిని ఆ రాజుకివ్వడానికి అంగీకరిస్తాడని నచ్చచెప్పగా, చిలుకను వెంటనే వెళ్ళి తిరిగి రమ్మని పంపించాడు. చిలుక ‘నీ కోరిక నెరవేరుతుంది’ అని వెళ్ళింది. సంవరణుడు విరహంలో పడి బాధననుభవిస్తుండగా ఆయన పరిచారకులు శిశిరోపచారాలు చేశారు. రాజు తపతి తల్లిదండ్రుల మాట వింటుంది అనే విశ్వాసంతో సూర్యోపాసన ప్రారంభించాడు. సూర్యుడు సంతసించి, తన కూతుర్ని అతనికే ఇవ్వాలనుకున్నాడు.

చిలుక, తపతి ఉన్న చోటుకు వెళ్ళి ఆమె చేతిమీద వాలింది. తపతి, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికెళ్ళావు?’ అని చిలుకను అడిగింది. చిలుక, ‘నీకోసం వరుణ్ణి వెదుకుతూ, అన్ని దేశాలు తిరిగి, హస్తినాపురంలో బహు సుందరుడైన సంవరణుడనే రాజును చూశానని” అతని సౌందర్యాన్ని వర్ణించింది. తపతి, ‘ఆ మనోహరాకారుడు తనను వరిస్తాడా?’ అని సందేహిస్తుండగా చిలుక, ‘తానామె సౌందర్యాన్ని వర్ణించగానే అతడు మోహ పరవశుడయ్యాడని’ చెప్పింది. తపతి కూడా విరహవేదన పొందింది. చిలుక సంవరణుని దగ్గరకు వెళ్ళి, ‘కార్యం ఫలించింది’ అని చెప్పి తానుండే చోటుకు వెళ్ళిపోయింది. తపతిని వెదుకుతూ చెలికత్తెతోపాటు అందరూ ఆమె చెంతకు వచ్చారు.  ఆమె తాపానికి కారణం అడిగారు. ఆమె మౌనాన్ని అర్థం చేసుకున్న ఒక చెలికత్తె అందరినీ  దూరంగా పంపించి, ‘నీ మనోహరుడెవడు?’ అని అడిగింది. తపతి జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పింది. ‘దీనికింత బాధెందుకు? అతడు నీవాడయ్యేటట్లుగా చేస్తా’ నంది చెలికత్తె. ఇంతలో సాయంత్రం కావటం, చీకటి వ్యాపించడం, చంద్రుడుదయించడం జరిగింది. తపతి చంద్రతాపాన్ని తట్టుకోలేక చంద్రోపాలంభన చేసింది. బాధించే మన్మథుని తిట్టి బాధపడింది.  చెలికత్తెలు ఉపచారాలు చేశారు. సూర్యోదయం కాగానే చెలికత్తెలు ఆమెను కాలక్షేపం కోసం భూలోకానికి తీసుకొని వచ్చారు. అది వసంత ఋతువు. చెలికత్తెలు పూలు కోస్తుండగా తపతి మాత్రం విరహవేదన పడుతుంది. వారు మదన పూజ చేశారు. ఇంతలో వేటకు బయలుదేరిన సంవరణుడు వనమంతా తిరిగాడు. అపుడు ఒక వనమయూరం అక్కడికి రాగా దాన్ని పట్టుకోవడం కోసం రాజు ఒక డేగ (సాళువా)ను పంపించాడు.  వాటిని వెన్నంటాడు రాజు. కొంత దూరం వెళ్ళాక అవి కనిపించకుండా పోయాయి. తన గుర్రం అలసిపోవడంతో రాజు, దాన్ని వదలి తాను నడుస్తూ, తపతి, ఆమె చెలికత్తెలున్నచోటికి చేరుకున్నాడు.

సంవరణుడు: ఆ దివ్యకాంతలు, వారి మధ్య తపతిని చూసి ఒక చెట్టు మాటున దాగి వారిని చూశాడు. తపతిని చూసి ఆమె చిలుక చెప్పిన సుందరాంగే అయ్యుంటుందని భావించి, కామ పీడితుడై ఆమెను చేరరాగా చెలికత్తెలంతా మాయమయ్యారు. తపతి మాత్రం ‘చిలుక చెప్పిన రాకుమారుడతడే అయ్యుంటాడని భావించి అక్కడే తను యోగమాయచే దాగి ఉంది. సంవరణుడు ఆమెను కానక దుఃఖిస్తూ నేలపైబడి దొర్లాడు. తపతి జాలిపడి తనను దాచుకొన్న తాను అతని దగ్గరకు వచ్చింది. ఎందుకిలా బాధపడుతున్నావని అడిగింది. రాజు ఉన్న విషయం చెప్పి, గాంధర్వ పద్ధతిలో తనను పెళ్ళి చేసుకొమ్మన్నాడు. ఆమె, తాను తండ్రి చాటు పిల్లనని, సూర్యునారాధించుమని చెప్పింది. మూర్ఛిల్లిన సంవరణుడు తేరుకొని, తన సేనలను నగరానికి పంపి, రత్నకూటంలో తాను తపస్సు చేయడం ప్రారంభించాడు.

వశిష్ఠుడు అరుంధతీ సహితుడై వచ్చి, ఎందుకిలా తీవ్ర తపస్సు చేస్తున్నావనగా, రాజు తమ దివ్యదృష్టికి తెలియనిదేమున్నది?  అన్నాడు. వశిష్ఠుడు విషయం గ్రహించి, ఇంత మాత్రానికి తపస్సెందుకు నేను తపతిని తీసుకొని వస్తానని సూర్యమండలానికెళ్ళాడు. వచ్చిన పని తెల్పగా సూర్యుడు సంతసించి, ఆ దంపతులకు తన కూతురు తపతిని అప్పగించాడు. ఆ ముని దంపతులు తపతిని తీసుకొని వచ్చి తపతీ సంవరణులకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. తానే కన్యాదానం చేశాడు. రాజు తన భార్య తపతితో తన భవనానికి వెళ్ళాడు. ఆమెతో కామ్య భోగాలనుభవిస్తూ మలయ పర్వతంపై విహరిస్తున్నాడు. రాజు పరిపాలనను వదిలేయడంవల్ల రాజ్యంలో అనావృష్టి ఏర్పడి, రాజ్య సంక్షోభం కలిగింది. వశిష్ఠుడు రాజు దగ్గరకు వచ్చి, సదుపదేశం చేసి, పాలన చేయుమన్నాడు. రాజు భార్యతో నగరం చేరి, రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. తపతి గర్భం ధరించింది. శుభలగ్నంలో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు యువకుడు కాగానే అతనికి సంవరణుడు రాజ్య పట్టాభిషేకం చేశాడు.

ఇతివృత్తానుశీలనం – కల్పనా చమత్కృతి :

ప్రఖ్యాతమైన ఇతివృత్తాన్ని గ్రహించి, వర్ణనాదులచే పెంచి, శృంగార రసబంధురంగా, స్వీయ కల్పనా చమత్కృతితో ప్రబంధంగా తీర్చిదిద్దడమే ప్రబంధ కవి రచనా పద్ధతి. మహాభారతం ఆదిపర్వంలోని సప్తమాశ్వాసంలో 68 నుంచి 90వరకున్న కేవలం 23 గద్య పద్యాలలో ఉన్న ఇతివృత్తాన్ని గ్రహించి, గంగాధర కవి సుమారు 500 గద్య పద్యాలున్న ఐదాశ్వాసాల ప్రబంధంగా తీర్చిదిద్దాడు. భారతంలో తపతీ సంవరణం ఒక ఉపాఖ్యానం. దాన్ని స్వతంత్ర ప్రబంధంగా మలిచాడు తెలంగాణ అద్దంకి గంగాధర కవి. అలా మలచడానికి గంగాధర కవి కథలో చేసిన కల్పనలు, పాత్రలను చిత్రించిన విధం, శృంగారాన్ని పోషించిన రీతి, వర్ణనా వైదగ్ధ్యం, కమనీయ కవితా శిల్పం తదితరాలను పరిశీలిద్దాం. వ్యాసపరిధిని బట్టి స్థాలీపులాకన్యాయంగా వీటిని అనుశీలిద్దాం.

ఎ) కథాకల్పనం – సన్నివేశ చిత్రణం : కథా కథనంలో పూర్వాపరాల సమన్వయం కుదరడానికి, కార్యకారణ సంబంధం పొసగడానికి ప్రబంధ కవి కొన్ని సన్నివేశాలను కల్పించాల్సి ఉంటుంది. గంగాధర కవి కథాకల్పనలో – చిలుక రాయబారం, శ్యేన మయూరాల పోరాటం, తపతి చెలికత్తెలు, అనేక వర్ణనలు – అనే నాలుగు అంశాలు మూలకథ కంటే రసపరిపోషక కథన పరంగా  అధికంగా ఈ ప్రబంధంలో దర్శనమిస్తాయి.

  1. చిలుక రాయబారం : ఈ గ్రంథంలోని కల్పనలో ఇది ముఖ్యమైనది. ఈ కల్పన వల్ల నాయికా నాయకుల ప్రేమకు అంకురాది ఫల పర్యంతమైన దశాక్రమం చక్కగా సమకూడింది. ఈ చిలుక ఒకరి సౌందర్యాన్ని మరొకరికి వర్ణించి చెప్పి, పరస్పరం వలపు కలిగేటట్టుగా చేసింది. దాని సౌందర్య వర్ణనారీతి ప్రభావవంతమైంది. అందువల్లనే వనంలో కలుసుకున్నప్పుడు ఒకరినొకరు గుర్తించగలిగారు. ఆ చిలుక సామాన్యమైన చిలుకగాదు చిత్రవర్ణ విహంగ పుంగవం, దివ్యమైన రాజకీరం. వాక్ నైపుణ్యం, విద్యా సంపద బాగా కలిగింది. దాని గురువు తపతే. తన గురువు తపతి గురించి సంవరణునికి చిలుక చెప్పిన మాటలు పరికిస్తే, ఆ చిలుక సామాన్యమైన చిలుక కాదని, విద్యావివేకాలు కలిగిన తెలివైన చిలుకని మనం గ్రహిస్తాం.

“వాచావధూ విడంబిని

యా చారు కటీ రథాంగ యా సకల కళా

వైచిత్రిణి గావున నా

కాచర్యత్వము వహించెనయ్య మహీంద్రా! (ఆ2-37ప)

ఆఱంగములతోడు బారంగతంబుగా

నిగమములను సరహస్యముగను జదివి

కావ్యజాలము లలంకార మిశ్రంబుగా

గరతలామలకంబుగా నొనర్చి

భాష్య ఫక్కిక పాఠ పాతంజలి జలంబు

లాలాజలంబుగా లీలగ్రోలి

మీమాంస లేకుండ మీ మాంసయు బఠించి

బ్రహ్మ సాక్షాత్కార భావమంది

పేరు బలమున దత్వ విచారగరిమ

శుక మహాద్విజ ముఖ్యుతో సూడువట్టి

యున్ననాకిక నితరాంధ్రయుక్తియెంత?

హస్తిపదమున నడగవే యడుగులెల్ల!! (2 ఆ   – 38 ప)

ఈ పద్యంలోని విద్యా విశేషాలు నాయికకు, ఆమె శిష్యుడైన చిలుకకు మాత్రమే ఉన్నట్లు కాదు,  ఇవి పరోక్షంగా గంగాధర కవి పాండిత్య గరిమను తెలిపేవిగా కనపడతాయి. ఇదొక చమత్కార ఇష్టరచన విధానం.

నలోపాఖ్యానంలో హంసరాయబారం ఈ కవికి ప్రేరణ కలిగించి ఉంటుందని పాటిబండ మాధవశర్మగా రన్నారు. నాయికా నాయకుల వినుకలి ప్రేమకు, వారి సమాగమానికి, సంధానకర్తగా వ్యవహరించింది చిలుక. అది మొదట సంవరణుని మణిబంధంపై వాలి, అతడిని సంసిద్ధుడిని చేసి తిరిగి వచ్చి తపతి మణిబంధంపై వాలింది. తపతీ సంవరణుల ‘పాణిగ్రహణా’నికి ఈ విధంగా ప్రతీకాత్మకంగా చిలుక సంధాన కారణమైంది. ఆ చిలుక తపతి సౌందర్యాన్ని వర్ణిస్తూ,

“సారస సంభవుండఖిల సర్గ నిమిత్తము గూర్చియున్న శృం

గార రసంబు నెల్లనిడి కౌతుక మొప్పగ నీతలోదరిం

గా రచియించి….” (2-11) అని చెప్పినట్లుగానే,

ఆమెతో సంవరణుడి సౌందర్యాన్ని వర్ణించి చెబుతూ

“అహహ! ఈ రేడు లోకంబులందుగలుగు

సకల లావణ్య రసమెల్ల సంగ్రహించి

గరిమ నారాజు గావింపఁ గరువు గట్టి

చేసెగాబోలు నేర్పుతో సృష్టికర్త’’ (3-28)

అని చెప్పింది. తపతి శృంగార రసమూర్తియని సంవరణుడు లావణ్య రసస్ఫూర్తియని వారి వారి అందాలను వర్ణించి, ఒకరి రూపం మరొకరి హృదయంలో హత్తుకొనేటట్లుగా చేసింది చిలుక. “స్త్రీ సౌందర్యం పురుషుణ్ణి చురుకుగా స్పందింపజేసే విధమే శృంగార రసమూర్తియని చెప్పినాడు. పురుషుని మెరుగారు లావణ్యమునకు లవణ స్ఫటికములకు తళుకు గుణము ఎక్కువ. పురుషుని తేజో తనము స్త్రీని ఆకర్షించును. కనుక గంగాధర కవి సంవరణుని లావణ్యమూర్తియని పేర్కొని వధూవరుల పరస్పరాకర్షణ సన్నివేశమును బలిపరచినాడు. ఇది ప్రబంధ నిర్మాణ శిల్పమునందలి ఒక ముఖ్య లక్షణము.” చిలుక పాత్ర కల్పనంవల్ల ప్రబంధ కథకు కథనపరమైన ఔచిత్యం శృంగార రసపోషణావకాశం ఏర్పడ్డాయి.

  1. శ్యేన మయూరాల పోరాటం : ఈ పన్నివేశ కల్పనవల్ల వేటకు వచ్చిన సంవరణుని తపతి, ఆమె చెలికత్తెలు ఉన్న చోటికి చేర్చి ‘కనుకలి’ అనే ప్రయోజనాన్ని సాధించాడు కవి. ఇది స్వల్ప కల్పనే అయినా మంచి ఫలాన్ని సాధించిందని, కథాగతికి దోహదం చేసిందని చెప్పవచ్చును.
  2. తపతి చెలికత్తెలు: ఆమె చెలికత్తెల కల్పనవల్ల నాయికా నాయక సమాగమానికి సులభ మార్గం లభించింది. ఆమె హృదయాన్ని తెలుసుకొని, వారు ఆమెను భూ లోకానికి కాలక్షేపం కోసం తీసుకొని రావడంవల్లనే సంవరుణని దర్శించగలిగింది. వారు అతడు కనబడగానే అదృశ్యమైనా, తపతి మాత్రం అతనితో మాట్లాడి, అతని హృదయం గ్రహించి, ఇద్దరి పెళ్ళికి అనువైన మార్గాన్ని సూచించి వెళ్ళగలిగింది.
  3. వర్ణనలు : ఈ ప్రబంధంలోని అనేక వర్ణనలు, ప్రబంధపు గరిమను పెంచడానికి, రసపోషణకు, కవిభావుకతా శక్తిని వెల్లడించడానికి దోహదం చేశాయి. వాటి విశిష్టతను తర్వాత ప్రత్యేకంగా పరిశీలిద్దాం.

శృంగార రస పోషణం : తపతీ సంవరణములో శృంగారం అంగి, తక్కిన వీరాదులు అంగాలు. “విభవాను భావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి:” – అనే భరతుని రస సూత్రం ప్రకారం ఆయా భావాల పోషణ ఈ ప్రబంధంలో అద్భుతంగా జరిగింది. తపతీ సంవరణులు ఆలంబన విభావాలు. ప్రబంధనామమే ఇది శృంగార ప్రధానమైందని తెలుపుతూంది. నాయికా, నాయకుల వర్ణన, వారి ఆభిజాత్యం, వారి వినుకలి ప్రేమ, వారి విరహం (పూర్వరాగం), వారి కలయిక, నాయకుని తపస్సు, వారి వివాహం అనే విషయాలు క్రమపద్ధతిలో సాగిపోయాయి. ఉద్దీపన విభావంగా చిలుక వర్ణించిన నాయికా నాయకుల సౌందర్యాది గుణాలు, అడవిలో వారు కలుసుకోవడం కనిపిస్తుంది. వారిలో అంకురించిన ప్రేమవల్ల వారి మాటలలో, చేష్టలలో భ్రూ విక్షేపకటాక్షాది అను భావాలు దర్శనమిస్తాయి. అలాగే నిర్వేదాది సంచారి భావాలు నాయికా నాయకుల మాటల్లో విరహబాధలో వ్యక్తమయ్యాయి. చిలుక నాయికను వర్ణించి వెళ్ళగానే నాయకునిలో విరహం ఏర్పడింది. శ్రవణం వల్లగాని, దర్శనంవల్లగాని రాగం ఏర్పడితే దాన్ని పూర్వరాగం అంటారు.  నాయిక గుణాలు విని నాయకునిలో పూర్వరాగం ఏర్పడ్డట్లే, నాయిక కూడా చిలుక చెప్పిన సంవరణుని సౌందర్య గుణాలను విని పూర్వరాగానికి లోనయింది. అదే అభిలాష విప్రలంభం. “న వినా విప్రలంభేన శృంగార: పుష్టిమశ్నుతే” అనే ఆలంకారిక వచనం ప్రకారం ఈ విప్రలంభ చిత్రణతో శృంగార రసానికి పుష్టి కలిగింది.

తపతీ సంవరణుల పూర్వరాగంలో దశవిధ మన్మధావస్థలు – అభిలాష, చింత, స్మృతి, గుణకథనం, ఉద్వేగం, సంప్రలాపం, ఉన్మాదం, వ్యాధి, జడత, మృతి (మూర్ఛ) అనే కామావస్థలు – కనబడతాయి. ఈ చిన్న వ్యాసంలో లక్ష్య లక్షణ సమన్వయం కుదరదు. విజ్ఞులు వాటిని నాయికా నాయకుల విరహంలో దర్శంచవచ్చును.

వర్ణనా వైదగ్ధ్యం : తపతీ సంవరణములో గంగాధర కవి ప్రబంధోచిత వర్ణనలు అనేకం చేశాడు. వాటిలో నగర, శైల, ఉద్యానవన, ఋతు, వనవిహార, జలక్రీడ, వేట, సూర్యాస్తమయ, అంధకార, చంద్రోదయ, మలయానిల, సూర్యోదయ, వివాహ వర్ణనలు ఉన్నాయి. ఇవి కాక నాయక వర్ణన, నాయికా వర్ణన, సురత వర్ణన, గర్భవర్ణన, పుత్రోదయ, తపోవర్ణనలు కనిపిస్తాయి.

ఈ ప్రబంధంలోని వర్ణనలలో విశిష్టమైనవి: తపతీ సంవరణుల రూప – గుణవర్ణనలు, వారి విరహ వర్ణనలు, నగర వర్ణన, సంవరణుని సూర్యోపాసన, వారి వివాహ సంభోగ వర్ణనలు, గంగాధర కవి వర్ణనలలోని వైదగ్ధ్యం గ్రహించడానికి కొన్ని ఉదాహరణలిస్తాను.

ఎ. నగర వర్ణన : హస్తినాపురాన్ని ఒక సీస పద్యంలో కవి చక్కగా వర్ణించాడు –

“శ్రీ భా విశేష మిశ్రీభావి భవనంబు

సారస కవిత కాసార సమితి

ప్రాకార వజ్ర దీప్రాకార హర్మ్యంబు

కుంజరంజిత భద్రకుంజరంబు

రమణీయతావాస రమణీయుత విలాసి

కాంచన సౌధాది కాంచనంబు

రాజ హంస కులీన రాజహంస కులంబు

బంధు రమ్య గృహస్థ బంధురంబు

కల్పనానల్ప శోభనా కల్పకంబు

గోపుర ద్వార చుంబిత గోపురంబు

సింధుజన్మాశ్వ దేశీయ సింధుజంబు

గజపురం బొప్పు జితమరుదజపురంబు” (1-46)

హస్తినగరంలోని దుర్గ, పరిఖ, హర్మ్యాదులు, చాతుర్వర్ణ్య ప్రజలు, రథగజ తురగ భటాదులు, విటవేశ్యాపుష్పలావికాదుల వర్ణనలు మనోహరంగా చేశాడు కవి.

బి. నాయక వర్ణన : ఈ ప్రబంధంలోని నాయకుడు సంవరణుడు. ఆయన వీర, కరుణ, దానాదిగుణాలను అనేక పద్యాలతో కవి అద్భుతంగా వర్ణించాడు. ఆ రాజు యొక్క ఐశ్వర్యం, ఆకారం, శౌచం, సహనం దాతృత్వం అనే గుణాలను వర్ణించిన ఈ పద్యం చూడండి.

“సారవిభూతి రెండవ వృషధ్వజు, డాకృతిచే దృతీయబృం

దారక వైద్యు, డిద్ధ శుచితా గుణమందు జతుర్థ పావకుం,

డారయ భూమి మోచుటకు నైదవదిక్పతి, దానరేఖచే

నారవ కల్పవృక్షమన నన్నర పాలుడుమించె గీర్తులన్” (1-72).

సంవరణుడు ధీరోదాత్తుడు, సర్వగుణ సంపన్నుడు. అందుకే శృంగార రసానికి తగిన నాయకుడుగా నిలిచాడు. కవి ఉత్తమ విభావంగా రాజును తీర్చిదిద్దాడు.

సి. నాయిక వర్ణన : తపతిని ఉత్తమ నాయికగా ఈ ప్రబంధంలో చిత్రించి నిరూపించాడు కవి.

“బంగారు మయమైన బ్రహ్మాండ భాండంబు” (2-10)

అనే పద్యం మొదలుకొని అనేక పద్యాలలో తపతి రూప సౌందర్యం, అంగాంగ వర్ణన (2-35) చేసి, ఆమె విద్యా వైభవాన్ని (2-38) చిలుక ద్వారా వర్ణింపచేశాడు కవి. నాయికా సౌందర్యం చిత్రించిన ఈ క్రింది పద్యం చూడండి.

“సారస సంభవుండఖిల సర్గ నిమిత్తము గూర్చియున్న శృం

గార రసంబు నెల్లనిడి కౌతుక మొప్పగ నీ తలోదరిం

గా రచియించి యొండొక సుగంధి సృజింపగలేమి, జుట్టుచే

బారలు నెట్టు బిమ్మటను బశ్చిమ బుద్ధులు గారె బ్రాహ్మణుల్ (2-11).

ఇలా చిలుక వర్ణించిన పద్యాల్లోనే గాక, సంవరణుడు వనంలో తపతిని చూసినపుడు వర్ణించిన అనేక పద్యాల్లో, ఆమె రూప, సౌందర్యాది గుణాలను మనం దర్శించవచ్చును. నాలుగో ఆశ్వాసంలోని 55 పద్యం నుంచి 62వ పద్యం దాకా  నాయిక వర్ణన చక్కగా సాగింది.

“మగువ కన్బొమ్మలు మరుడు గానడు గాక

కనిన వర్ణింపడే కమ్మవిల్లు

శుకసాది సతిమోవి చూడడుగాక చూ

చిన చేతబట్టునే చిగురువాలు….” (4-62)

లాంటి పద్యాలు గంగాధర కవి వర్ణనా వైదగ్ధ్యాన్ని వేనోళ్ళ చాటుతున్నాయి.

డి. విరహ వర్ణన : నాయకుని విరహం, నాయికా, విరహం రెండూ అద్భుతంగా చిత్రించాడు గంగాధర కవి. చిలుక తపతిని గురించి చెప్పి వెళ్ళిపోయాక సంవరణుడు విరహంలో పడ్డాడు. ఈ సందర్భంలో అనేక పద్యాలున్నా ఒకటి మాత్రం –

“ఆ యవనీశుడీ కరణి నంగభవానల బాధ్యమానుడై

హాయని వెచ్చనూర్చు, నకటా! యని దైవముదూఱు, బచ్చపు

ల్గాయెడ నడ్డమైన దనయర్మిలి దూత యటంచుఁ గాయొ పం

డోయని కార్యపద్ధతుల నొయ్యన వేడును భ్రాంత చిత్తుడై (2-97)

దీనిలో ఉన్మాదం అనే మన్మధావస్థ ధ్వనిస్తూంది. అలాగే నాయిక విరహ వర్ణనలోంచి ఒక పద్యం చూద్దాం.

“చిక్కని మోము, మేలిమగు చెక్కులు, చొక్కపుహార వల్లిచే

నెక్కొను పేరురంబు, రమణీయ విశాల విలోచనంబులున్

జక్కుగమించు రాసుతుడు నాదుకవుంగిటి కాపురంబున

జిక్కిన నేలనే? మకర చిహ్నము తారుపట్టుగన్” (3-52)

దీనిలో గుణకథనం, సంప్రతాపం అనే మన్మథావస్థలు మనం చూడవచ్చు. ఇలా కావ్య శాస్త్రోచితమైన ఎన్ని వర్ణనలైనా ఉదహరించవచ్చును. ‘వర్ణనా నిపుణః కవిః’ అన్నారు కదా!

పాత్ర చిత్రణం :  ప్రబంధ వస్తువు ఏక నాయకాశ్రయమై ఉండాలి. తపతీ సంవరణము ఏకనాయకాశ్రితమే అనడంలో ఎలాంటివి ప్రతిపత్తి లేదు. అలాగే ప్రబంధాలలో అపూర్వ పాత్రలుండడం కూడా ఒక లక్షణమే ఈ ప్రబంధంలోని చిలుక, తపతి – రెండూ అపూర్వ పాత్రలే. వశిష్ఠుడు ఆదర్శపాత్ర, పాత్ర చిత్రణలో కూడా గంగాధర కవి అపూర్వ వైశిష్ట్యాన్ని ప్రదర్శించారు. కొన్ని పాత్రోచిత రేఖాంశాలను పరిశీలిద్దాం.

ఎ) రాయబారి చిలుక : ఈ ప్రబంధంలో, తపతీ సంవరణుల సంధానంలో కీలకపాత్ర పోషించింది చిలుక. ఈ చిలుక నాయికా నాయకుల్లో వలపు కలగడానికి, తద్వారా అనుసంధానానికి పూలబాట నేర్పరచింది. ఈ చిలుక గొప్ప మేధావి. మానవ భాషలో మాట్లాడగలిగిన సమర్థురాలు. మానవులను, దివ్యులను ఒకచోటికి చేర్చగలిగిన, ఒకటి చేయగలిగిన అఘటనాఘటన సమర్థురాలు. మాటల మాంత్రికురాలు. తపతికి జీవిత భాగస్వామిని గురుదక్షిణగా తెచ్చుటకు శ్రమించిన బ్రహ్మచారి. అందుకే తపతిచే స్వయంగా తాను కోరిన “వరదక్షిణ”నే గురుదక్షిణగా ఇమ్మని అడిగించుకొంది.

“గురు దక్షిణ భావంబున

గురు దక్షిణ మున్నెయీయ కోరితి విపుడా

వర దక్షిణ యిమ్మదియే

వరదక్షిణ మాకు మదనావాహ వతంసా” (3-43)

ఇది తెలుగు ప్రబంధాలలో మణిపూస వంటి పద్యము. చిలుకకు చెందినది కనుక చిలుకు కొలికి కలికి మణిపూసయనిన మరింత ఒప్పిదము.

బి. సంవరణుడు :  ధీరోదాత్తుడైన నాయకుడు. సకల గుణసంపన్నుడు రాజ్యపాలనాదక్షుడు.

సి) తపతి :  దివ్యనాయిక. అయినా మానుషభావంతో మెలిగిన శృంగార నాయిక. సకల విద్యలు నేర్చిన జాణ విదుషి.

డి) వశిష్ఠుడు :  పురోహితుడుగా, గురువుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన మునీశ్వరుడు.

ఇ) తపతి చెలికత్తెలు : తపతిని భూమ్మీదికి తీసుకొచ్చి, సంవరణుని కలవడానికి వీరు కీలకపాత్ర పోషించారు.

గంగాధరుని కవితా శిల్పం : పద్య రచనా విధానంలో, భావుకతలో గంగాధర కవి గొప్ప ప్రతిభను కనబరిచాడు. “ఆ తపతి దివ్య కన్య. తాను మానవుడు. తననెలా చేరుతుంది” అన్న సంవరణుని సంశయానికి చిలుక చెప్పిన సమాధానం అద్భుతం –

“జలజదళ నేత్ర రెండవ చంద్రరేఖ

ధరణి తలమున రాజశేఖరుడ వీవు

ఇంతకన్నను విధియోగ మేమి కలదు?

కైలాసంలో ఉన్న రాజశేఖరుని ఒక చంద్రరేఖ చేరింది. తపతి రెండో చంద్రరేఖ. భూలోకంలో రాజశేఖరుడవైన నిన్ను ఆమె చేరక తప్పదు. ఇదే దైవయోగం – అని చెప్పడమేగాక మన్మథ, వసంతులు ఇరువురూ తపతిని నీతో కూర్చకుంటే మన్మథుడేమి సంధాన కర్త? ఏమి విలుకాడు?? అతనికి వసంతుడేం స్నేహితుడు? అని ప్రశ్నించింది చిలుక. పద్యంలోని సొగసులను (విరుపులను) చూసి, పాఠకుడు ఓహో! అని మెచ్చుకోవలసిందే.

“వనరుహనేత్ర తోడుత నవశ్యమునిన్నిట గూర్చెనేని న

మ్మనసిజుడే ధనుర్ధరుడు, మాధవుడే చెలికాడు వానికిన్

వనరుహ నేత్ర తోడు నవశ్యమునిన్నిట గూర్పకుండినన్

మనసిజుడే ధనుర్ధరుడు? మాధవుడే చెలికాడు వానికిన్?

పాత్రోచితముగానే కాక సందర్భోచితముగా సంభాషణలను రచించినప్పుడు మాత్రమే కవి ప్రతిభ వెల్లడియగును. ఈ ప్రతిభ పద్య నిర్మాణ వ్యుత్పన్నతతో అనుసంధింపబడుట కవి సమగ్ర రచనా శక్తికి తూనికయని చెప్పక తప్పదు. అద్దంకి గంగాధరుడు ప్రామాణిక ప్రబంధ పద్యరచనా ధురంధరుడు.

సంవరణుడు విరహవేదనను అనభవించినపుడు అతని పరిచారకులు అతనికి శిశిరోపచారాలు చేశారు. శిశిరోపచారానికి పరిచారకులు ఉపయోగించిన ద్రవ్యాలన్నీ తపతి అవయవాలకు ప్రతిబింబాలు కావడంవల్ల రాజుకు కొంత ఉపశాంతి లభించి ఉంటుంది. కవి భావనా చమత్కృతిని దర్శించండి.

వెలదినవ్వుల చాయ వెలది వెన్నెల గాయ

గపురంపు ధూళిమై గప్పెనొకడు

చెలువ కౌగిలి పాటి చెలువైన పన్నీట

నొకడు సర్వాంగంబు లోలలార్చె

బద్మాక్షి ముఖ సామ్యజాలంబుల

నురమున నిండార నునిచెనొకడు

పల్లవాధర హస్త పల్లవంబుల బోలు

పల్లవంబు లొకండు పాన్పుపఱచె

సాత్త్వికోదయ వేళ నా పతికి నొడల

దోడవెడజారు చెమరు బిందువుల వంటి

లలిత మకరంద బిందువుల చిలికె నొక్క

డంగ నా మన్మథునకు బ్రత్యంగకముల

ఇలాంటి అద్భుతమైన పద్యాలెన్నో నాయికా నాయకుల విరహ వర్ణనలో దర్శనమిస్తాయి. “కొమ్మ యల్లాడిన – కొమ్మయలదెయని, తరువనానంతరముల తగిలి తగిలి….” (4-76) లాంటి అనేక పద్యాలను ఇందుకు నిదర్శనముగా చూపించవచ్చును.

భాషా ప్రయోగ నైపుణ్యం : పద్రపయోగంలో, సమాన ఘటనలో, ఆలంకారిక పద ప్రయోగంలో, న్యాయాలు, నానుడులు, లోకోక్తులు, జాతీయాలు ప్రయోగించడంలో గొప్ప కౌశలాన్ని కనబరిచాడు గంగాధర కవి. చిలుక సంవరణునితో తన వృత్తాంతాన్ని చెబుతూ, తపతికి తగిన వరుని అన్వేషిస్తూ తిరిగి తిరిగి అలసిపోయి, ఆకాశంలో దాహంతో ఉండగా “అంధునకు దివ్యదృష్టి గలిగిన విధంబున నయాచితోపనతంబయిన యీ సహకార భూజంబు సంజీవ నౌషధంబైయవతరించినన్”  ` (2-45)  అనే గద్యంలోని “అంధునకు దివ్యదృష్టి గలిగిన విధంబున” – అనే ఉపమానం భావనారమ్యంబని పాటిబండవారే సెలవిచ్చారు. “ఈయెల మావికతంబున….” (2-47) అనే పద్యంలోని “తోయధిగంభీర మనసు” అనే సమాస ప్రయోగం కూడా కవిభావుకతకు, ప్రయోగ నైపుణ్యానికి ఉదాహరణ.

చిలుకల  పలుకులు రసములు

చిలుకును భువినెట్టివారి చెవులకుఁ జవులై

చిలుకల కొలికి ప్రసంగము

చిలుక ప్రశంసించెనేనిఁ జెప్పగనేలా?

అనే పద్యంలోని అర్థాపత్త్యలంకారంతోడి పద ప్రయోగం, ఔచిత్యవంతంగా ఉంది. అసలే చొక్కపు బంగారం…. అదనంగా పరిమళం…అన్నట్లుందీ అలంకార సన్నివేశం. మహా కవిత్వమన్న యిది కదా! అలాగే పోతన లాగా వ్యత్త్యనుప్రాసతో కూడిన పదప్రయోగంలోనూ ఈ కవి మేటి –
“మలయాచల నిలయానిల

వలయాలస గతుల రాలె వనకుసుమంబుల్

వెలిచాగ విలుతుడవ్విభు

చెలువున వెలుగంది వదలు చేదూపులనన్ – (1-89)

పీఠిక ఉపసంహారంలో కొన్ని పదాలు శబ్దారత్నాకరంలో లేవని పాటిబండవారు సెలవిచ్చారు. వీటిలో కొన్ని పదాలు – కోరికె, లండరి, పటారము, వతారుపట్టు – లాంటివి నాటి తెలంగాణ ప్రాంతంలో జనులు వాడేవి అయ్యుంటాయని నా భావన. లండరి – పదం లండు + అరి అని విడదీస్తే మనకు పద స్వరూపం, ప్రత్యయం తెలుస్తాయి. చిన్న పిల్లలను పెద్దవాళ్లను ఆ పిల్లల ప్రవర్తనను గూర్చి చెప్పేటప్పుడు ‘వాడుత్తలండు’ అనే వారు.  పనికిమాలినవాడు, గలీజుగాడు అనే అర్థంలో వాడడం, మా బాల్యంలో నల్లగొండ జిల్లాలో నేను విన్నాను. ఆ ‘లండు’ అనే పదం మీద మతుబర్థంలో (జాలరి) లాగా ‘అరి’ ప్రత్యయం చేరి ‘లండరి’ అవుతుంది. “లండరి కుకవులు కొందరు….” (1-9) అనే పద్యంలో లండుతనం కలిగిన, పనికిమాలిన కుకవులు అనే అర్థంలోనే కవి దీన్ని వాడినట్లు కనిపిస్తుంది. అలాగే తక్కిన పదాలు తెలంగాణలో నాడు వినవచ్చేవి ఎన్నో ఉంటాయని నా అభిప్రాయం. బంగారు సలాక (5-46)లోని సలాక – తీగ కూడా తెలంగాణ ప్రాంతపదమే.

పశ్చిమబుద్ధులు గారె బ్రాహ్మణుల్ (2-11), తోక లెగబట్టుదు రేమనవచ్చు…. (2-12), పైనిపటారమెకాక వానికిలోన లొటారమౌట (2-23), దుఃఖ మిహపంచభిస్సహ – (2-25) పులుగడిగిన ముత్తియంబు (2-35), కరతలామలకంబుగా (2-38), బొమ్మ వెట్టెదన్ (2-40), అంధునకు దివ్యదృష్టి కలిగిన విధంబు (2-45), అందని మ్రాని పంటి పయినాసలు చేయుట (2-58), విధియోగము (2-64), ఉష్ణముష్ణేన శీతలమ’ను (2-67), పూవును దావియు గూడిన కైవడి (2-69), గాలిమాట, పలు గాకులు (2-80), కడుపు చల్లన (2-84), ‘నానృతాత్పాతకంపరంబు (2-86), పిలువని పేరంటము (2-91), కాయొపండో (2-97), పవన విరహిత నిభృతదీపంబు (3-10), సుఖము దుఃఖంబు కార్యార్థి చూడడెందు (3-13), దుఃఖితే మనసి సర్వమసహ్యం (3-47), కొంగు బంగారు (3-51), పూసగ్రుచ్చిన రీతి (3-63), నీట గలసె (3-89), బూడిదెలోని హోమమయిపోయె (3-96), కొసరు మాటలు (4-13), గోరుచుట్టుపై రోకటి పోటుకైవడి (4-49), ఆవద్రావినట్లు (4-76), ఉఱ్ఱూతలూగ (4-79), ఆకుమఱుగుపిందె (4-88), లోకలోచనుకనుమూయ గలేక (4-89), గోటనైన పనికిగొడ్డలేల? (5-12), పేద పెన్నిధిగనినక్రియన్ (5-21) – ఇలాంటి సంస్కృతాంధ్ర ప్రయోగాలవల్ల తన పద్య రచనకు వన్నె తెచ్చాడు కవి. పై వాటిలో లోకోక్తులు, న్యాయాలు, నానుడులు, జాతీయాలు, సంస్కృతాంధ్ర సూక్తులు మొదలైనవన్నీ ఉన్నాయి. వాటిని విశ్లేషించి చూపడానికి వ్యాసపరిధి సరిపోదు.

మొత్తంమీద గంగాధర కవి ‘తపతీ సంవరణము’ అనే గ్రంథము ప్రబంధ లక్షణాలతో కూడి ఉందని, కవి కల్పనా చమత్కృతి ఇతివృత్తంలోనూ, వర్ణనలలోనూ కనిపిస్తుందని, సన్నివేశ చిత్రణంలో ఈ కవి అందెవేసిన చేయి అని, విభావాను భావసంచారీ భావయుక్తంగా శృంగార రసాన్ని చక్కగా పోషించాడని, వర్ణనల్లో ఆయన భావుకత చాలా ఉన్నతంగా, ఉత్తమంగా ఉందనీ; పాత్రలను చిత్రించడం, వాటిని ప్రవేశపెట్టడంలో ఔచిత్యం పాటించాడని; గంగాధర కవి కవితాశిల్పం, భాషా ప్రయోగ నైపుణ్యం అత్యంత విశిష్టమైనవని చాలా కొద్ది ఉదాహరణలతో వివరించడం జరిగింది.

ఆరుద్ర, గంగాధర కవి గురించి వ్రాస్తూ, “కృతిపతి ఇభరాముడు సంగీత రసైకలోలుడు (1-99) కనుక అద్దంకి గంగాధరుడు కూడా తన నైపుణ్యం ఇలా వెల్లడిస్తున్నాడు –

“భాస్వరంబైన మదకోకిల స్వరంబు

పంచమంబని పెద్దలు వల్క విందు

మీ మధుర భాషికీ మధ్యమంబౌట

యాశ్చర్య మహిమ యెపుడు (4-6)

గంగాధరుని నాయక విషయంలోనే కాదు, కవిత్వంలో కూడా ‘మధ్యమం’ అనువైన మాటేమో!” అని అనుమానాస్పదంగా తమ సమగ్రాంధ్ర సాహిత్యం రెండవ సంపుటిలో వ్రాశారు. కాని లోతుగా పరిశీలిస్తే, గంగాధర కవి నాయకుడుగాని, గంగాధర కవి కవిత్వంగాని “ఉత్తమం”గానే ఉన్నవని పరిశీలకులు గ్రహిస్తారు. ఆరుద్ర గడుసుగా పరిభాష సంగీత పదమైన “మధ్యమం” అనే దాన్ని ఉపయోగించుకొని చమత్కారంగా చెప్పినా, గంగాధర కవి కవిత్వం “ఉత్తమం” ఆయన స్థానం “ఉన్నతం” అని నా అభిప్రాయం.

అద్దంకి అలంకార ప్రయోగ శిల్పం : తపతీ సంవరణంలో గంగాధర కవి కేవలం అలంకారాల కోసమే అలంకారాలను ప్రయోగించలేదు. సన్నివేశం, సందర్భం, పాత్ర, భావం, రసం మొదలైనవాటిని చక్కగా అభివ్యక్తం చేయడానికి, అలంకారాలను మనోహరంగా ప్రయోగించాడు. అసలు గంగాధర కవే స్వయంగా తన ప్రబంధ నిర్మాణ విధానం గురించి ప్రారంభంలోనే – “…నవరసాలంకార భావానుబంధ బంధురంబుగా నొక్క ప్రబంధంబు నిర్మింప సమకట్టి” నాడు (1-10). అందువల్ల ఆయన ప్రబంధంలో అలంకారాలు రసభావానుబంధ బంధురంగా ఉంటాయని విడిగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని అలంకారాలను స్థాలీవులక న్యాయంగా పరిశీలిద్దాం-

ప్రథమాశ్వాసంలోని 72వ పద్యం “సారవిభూతి రెండవ వృషధ్వజ….. కల్పవృక్షమున నన్నర పాలుడు మించెగీర్తులన్” ఈ పద్యంలో ఐశ్వర్యంలో రెండో శివునిగా, ఆకారంలో మూడో దేవవైద్యునిగా, శుచిలో నాలుగో అగ్నిగా, భూభారవహనంలో అయిదో దిక్పాలకుడుగా, దాతృత్వంలో ఆరో కల్పవృక్షంగా సంవరణుని ఊహించడంవల్ల అద్భుతమైన ఉత్ర్పేక్షాలంకారం చక్కగా కుదిరింది.

రెండో అశ్వాసంలోని “సారస సంభవుండఖిల….. పశ్చిమ బుద్ధులుగారె బ్రాహ్మణుల్’’ (2-11) అనే పద్యంలో సృష్టిలోని శృంగార రసమంతా తపతి నిర్మాణానికే వాడి తర్వాతి స్త్రీ నిర్మాణానికి ఏమీ లేకపోవడంతో బ్రహ్మచేతులు బార్లా చాపాడు – అనేది విశేష విషయం. దాన్ని లోకంలోని సామాన్య విషయమైన ‘పశ్చిమ బుద్ధులుగారె బ్రాహ్మణుల్’ అనే దానితో చెప్పడంవల్ల అర్థాంతర న్యాసం సహజాతి సహజంగానే అమరింది – అలాగే,

“ఆరంగములతోడ బారంగతంబుగా

నిగమముల్ సరహస్యముగను జదివి….

…………………………………………

…………………………………………

శుక మహాద్విజముఖ్యుతో సూడువట్టి

యున్న నాకిక నితరాంధ్రయుక్తి యెంత?

హస్తిపదమున నడగవే యడుగులెల్ల’ (2-38)

అనే పద్యంలోనూ చక్కటి అర్ధాంతర న్యాసం చక్కగా ఇమిడిపోయింది.

“చికిబికి వెండ్రుకల్ వలెను జిన్న చిగుళ్ళు…. డెన్నగన్” (2-95) అనే పద్యంలో అద్భుతమైన ఉపమానాలతో చూతం భూతంవలె కన్పించిందని చెప్పడంవల్ల ఉపమాలంకారం అత్యంత చమత్కార విచ్ఛిత్తి పూర్వకంగా మనోహరంగా ప్రయోగింపబడింది.

“ఘన వితత స్ఫురత్పదవి గైకొని రాజు తమఃకదంబకం

బనుకుజన వ్రజంబు దెగటార్చి, దిశాచయ సాధుమండలం

బొనర వెలుగజేసె, నదియుక్తమె కాదె నృపాల ధర్మ వ

ర్తునునకు శిష్టదుష్ట పరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్ (3-80)

ఈ పద్యంలోని బహు అలంకార ప్రయోగ శిల్ప ప్రౌఢి గంగాధర కవిని సర్వ ప్రౌఢకవి మూర్ధన్యునిగా నిలబెట్టింది. ఈ ఒక్క పద్యంలోనే శ్లేష, రూపకం, అర్ధాంతరన్యాసం, వృత్త్యనుప్రాస; వృత్త్యనుప్రాస గర్భిత క్రమలంకారం అనే అయిదు అలంకారాలు ప్రయోగించబడి, కవి అలంకార ప్రయోగ శిల్పచాతురిని వేనోళ్ళ చాటుతున్నాయి. పద్యరచనా పరమైన శ్రద్ధయందిది కవి వ్యక్తిత్వమును ప్రకాశింపజేసే సులక్షణ సారమే కదా! విలక్షణ ప్రతిభా చాతుర్యమే కదా!!

శ్లేష : ‘రాజు’ అనే పదానికి చంద్రుడు, పాలకుడు అని అర్థాలు, చీకటిని తొలగించి వెలుగునివ్వడం చంద్రుని ధర్మం. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం రాజు (పాలకుడి) పని. రాజుకున్న రెండు అర్థాలను గ్రహించి చక్కటి శ్లేషాలంకారాన్ని ప్రయోగించాడు కవి.

రూపకం : తమః కదంబకంబను కుజన వ్రజంబు చీకటి సమూహం అనెడి చెడ్డవారు. చీకటి అజ్ఞానానికి చిహ్నం.  అజ్ఞానులే చెడ్డవారుగా మారుతారు. తమః కదంబకంపై కుజన వ్రజ లక్షణాన్ని ఆరోపించడం దీనిలో కనిపిస్తుంది. అందుకే (ఆరోపాత్తు రూపకం) ఇది రూపకం.

అర్థాంతరన్యాసం : రాజు (చంద్రుడు) చీకటిని లేకుండా చేసి వెలుగునిస్తున్నాడు; రాజు (పాలకుడు) దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడుతున్నాడు. ఈ ఇద్దరు చేసే పని విశిష్టమైంది. దీన్ని ‘అదియుక్తమెకాదె’ అంటూ  ‘నృపాలధర్మవర్తనునకు శిష్ట దుష్ట పరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్’ అనే సామాన్య వాక్యం ద్వారా చెప్పడం వలన అర్ధాంతరన్యాసం.

వృత్త్యనుప్రాస: “శిష్ట దుష్ట పరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్” ఈ పాదంలో ‘ష్ట’ కార, ‘క్ష’ కార ఆ వృత్తివల్ల మనోహరమైన వృత్త్యనుప్రాసను ప్రయోగించాడు కవివర్యుడు.

వృత్త్యనుప్రాస గర్భిత క్రమాలంకారం : ఈ వృత్త్యనుప్రాస పాదంలో  “శిష్టపరిరక్షణ దుష్ట శిక్షణ క్రియల్” అనే పద్ధతితో కాక “శిష్ట  దుష్టః పరిరక్షణశిక్షణ” అనే క్రమాన్ని పాటించి, వృత్త్యనుప్రాస గర్భిత క్రమలంకారాన్ని అద్భుతంగా ప్రయోగించాడు అద్దంకి గంగాధరుడు. ఈ కవి అలంకార ప్రయోగ శిల్ప నైపుణ్యానికి ఈ ఒక్క పద్యం చాలు. ఇంకా “అటజనికాంచె…” (4-91) అనే పద్యంలో అంత్యప్రాస, వృత్త్యనుప్రాసలు; “నెమ్మదికుందనేమిటి?….” (5-14) అనే పద్యంలో ఉపమాలంకారం మనోహరంగా నిర్వహించాడు కవి గంగాధరుడు.

ఇంకా అనేక పద్యాల్లో శబ్దార్థాలంకార ప్రయోగాలవల్ల భావస్ఫూర్తి రసదీప్తి కలిగింది. ఇలా ఏ అంశం గ్రహించినా, ఏ కోణం నుంచి చూసినా, ఏ పార్శ్వతలాన్ని పరిశీలించినా ఏ విధంగా తపతీ సంవరణాన్ని అనుశీలిఁచినా గంగాధర కవి ప్రతిభను, ఆయన కవనశక్తిని, కథాకథన రీతిని, ప్రబంధ లక్షణ బద్ధ నిర్మగ్న మనస్కతను, రచనా, వ్యగ్రతను, రసపోషణ విధానాన్ని, అలంకార ప్రయోగ శిల్పాన్ని దర్శించి ఆనందించవచ్చును. కవిని అభినందించవచ్చును. ఎంతటివారైనా గంగాధరుని ‘మధ్యమ’ స్థాయికి చెందిన కవి అంటే మొహమాటం లేకుండా ఖండించి, ఆయన ఉత్తమ ప్రబంధ కవి అని తెలంగాణ ప్రాంతంలోనే కాదు, తెలుగు సాహిత్యంలోనే ఉత్తమ కవుల సరసన నిలవదగిన శక్తియుక్తులు కలవాడని ఘంటాపథంగా చెప్పవచ్చును. తెలంగాణ ప్రబంధ సరస్వతికి జయము జయము.

  • డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు

సుప్రసిద్ధ విమర్శకులు, ప్రవచన కర్తలు                     

 

 

 

 

 

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వ నైపుణ్యాలు: కవిత్వము-వస్తువు

by నందిని సిధారెడ్డి August 25, 2021
written by నందిని సిధారెడ్డి

కవిత్వానికి సంబంధించిన నిర్మాణమెలకువలు, లేదా శిల్ప రహస్యాలు, కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించుకునే వేదికగా దీన్ని రూపొందించాము. మూడవ అంశం – కవిత్వము – వస్తువు.

కవిత్వం అనగానే వస్తువు, రూపము రెండు అంశాలు మిళితమై ఉండేటటువంటిది కవిత్వం అని అంటాము. కవిత్వానికే గాదు, ఏ వస్తువుకైనా గూడా ఈ రెండు అనివార్యమైనవి. ఈ రెండు రూపాలు ప్రతిదాంట్లో గూడా ఒకటి వస్తువు ఉంటుంది ఒకటి రూపము ఉంటుంది. ప్రతి పదార్థానికి ఈ రెండు అనివార్యంగా ఉంటాయి. మనం ఏ వస్తువునైనా తీసుకున్నా రెండు ప్రధానమైనవి ఒకటి రూపము, రెండవది అది వస్తువు ఉంటాయి. రెండూ ప్రధానమైనవే.

కవిత్వం అనేది కళ గనుక, ఆ కళ అనేది ప్రత్యేకంగా నైపుణ్యంతో, పనితనంతో ప్రత్యేకతతో కూడుకున్నది కనుక, ఈ పనితనమూ, నైపుణ్యమూ దేనికి వస్తుంది? దేనివల్ల వస్తుంది? అని తెలుసుకునేటటువంటి ఒక క్రమంలో మనం ఈ చర్చలన్నీ ప్రారంభించుకోవటం జరిగింది. దాంట్లో శిల్పం సంగతి రెండవ విషయంగా మనం అనుకుంటే దానిని  ‘పర్సీవ్ డ్’ లేదా ‘డిస్కవరీ’ అంటాము.

ఏదైతే సృష్టిలో ఉండేటువంటి లేదా జీవితంలో ఉండేటువంటి ఒక అంశాన్ని ఏదైతే తెలుసుకున్నారో ఇతరులకు తెలుపాలని అనుకున్నారో అది వస్తువు. అందుకని సమ్ థింగ్ ఎట్, దిస్ కంటైన్ అన్నారు. ఏదో ఒక విషయాన్ని చేరవేసేది. అందులో ఏంజేస్తుంది అని అంటే, మీకు కలిగిన అనుభవాలను లేదా ఒక పరిచయాన్ని పాఠకులకు, లేదా సహృదయులకు చేరవేసేటువంటి అంశం. దీన్ని ఒక వస్తువు అని ఒక నిర్ణయానికి రావచ్చు. అంటే మనం చెప్పదలచుకున్నటువంటి, లేదా సహృదయానికి చేర్చాలనుకున్నటు వంటి విషయాన్ని వస్తువు అంటాం. దీనికి భారతీయ సాహిత్య ఆలంకారికులు కూడా చాలా విలువ ఇచ్చారు. కవిత్వంలో ఇదే కీలకమనీ చాలాసార్లు అన్నారు. ఎందువల్లనంటే “ఇతివృత్తంతు కావ్యేనశరీరం పరికీర్తితమ్” అని భరతుడు అన్నాడు.  ఈ ఇతివృత్తమనేది వస్తువు. ఇది కావ్యానికి శరీరంతో సమానం. కావ్యం అనే దానికి ఒకటి శరీరం, ఒకటి ఆత్మ అనేది ఉన్నాయి అనుకుంటే, ఈ శరీరమనేటువంటిది వస్తువు. ఇతివృత్తము అని అన్నారు. అందుకని కథలోకి వెళ్లడమే కాదు ఒక నవల రాయండి, ఒక కవిత రాయండి, ఏదైనా రాయండి, ఏమైనా చేయండి చేసేప్పుడు దానికి తప్పని సరిగా శరీరమనేది ప్రధానం.  ఈ శరీరము ఉంటేనే, అలంకరణ ఉంటుంది. శరీరము లేకపోతే అలంకరణ ఉండదు. దానికి విషయమేదీ ఉండదు, ప్రాతిపదిక ఏమీ ఉండదు. అందుకే మొదట ఉండవలసింది శరీరం. ఆ శరీరాన్ని అలంకరించేటువంటి పద్ధతి వచ్చినప్పుడు అది తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు శరీరం అనేది ఉండాలి.   శరీరం కవిత్వంలో, సాహిత్యంలో శరీరం అంటే ఇతివృత్తం. “ఇతివృత్తం” అంటే ఇదీ విషయం అని చెప్పేటువంటిది.  వృత్తం అంటే మనం తిరుగదలుచుకున్న ఒక పరిధి. చెప్పదలుచుకున్నటువంటి ఒక పరిధి. పరిధి ఇదీ అని చెప్పేటువంటిది ఇతివృత్తం. ఇది కథ! లేదా ఇది అంశం, ఇది చెప్పదల్చుకున్నటువంటి విషయం, అని చెప్పదలుచుకున్నది ఒక పద్ధతి ఇతివృత్తం. ఈ ఇతివృత్తం అనేది కావ్యానికి శరీరంతో సమానమైనది అని చెప్పడం జరిగింది.  అట్లానే “పోయెట్రీ ఈజ్ ఎ జర్నీ ఇన్ టు ది కంటెంట్?” (Poetry is a Journey in to the content.)  Rilke  అనే ఒక కవి. విమర్శకుడు ఏమన్నాడు అంటే శరీరం అంటే వస్తువు అని. ఈ వస్తువులోకి ప్రయాణించడమే కవిత్వం అన్నారు. అంటే వస్తువులోకి ప్రయాణించడం. అంటే, ప్రయాణించడానికి వస్తువు అనేది ఉండాలి. వస్తువు ఉంటే కథలోకి పోయేది. అందుకని చుట్టూ ఉండేటువంటి వాతావరణంలోంచి, ప్రకృతిలోంచి, లేదా జీవితంలోంచి, లేదా సమాజంలోంచి ఈ వస్తువును ఎంపిక చేసుకొని రాసే అవసరమున్నది. కాబట్టి మనం ఏదైతే దర్శించినామో, విశదీకరించినామో ఏదైతే గ్రహించినామో, ఏదైతే పరిశీలించినామో  అదే వస్తువు. అయితే ఏ వస్తువును స్వీకరించినా  ఒక ప్రశ్న వస్తుంది. వస్తువును ఎట్లా స్వీకరించాలి అనే ప్రశ్న వస్తుంది.

మన చుట్టూ అనేక వస్తువులుంటాయి. ;ఎవరు ఏ కవి రాసినా కూడా ఎక్కడి నుండి తీసుకుంటాడు? చుట్టూ ఉండే వాతావరణంలో నించి లేదా సమాజంలోంచి ఎంపిక అయితే సృష్టి అంటే ప్రకృతి లేదా, జీవితం లేదా సమాజం, చరిత్ర, సంస్కృతి లేదా మనిషి. ఇది తప్ప కవికి ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు. సృష్టి, ప్రకృతి, మనిషి, సమాజం, ఊడి పడ్తుందా? ఎక్కడో ఆకాశం నుండి రాలిపడదు. చాలామంది అంటుంటారు. నాకు వస్తువు దొరకడం లేదు, ఏ వస్తువు మీద రాయాలి అని. సబ్జెక్ట్ దొరకడం లేదు అని అంటుంటారు. అది సరైనటువంటిది కాదు. సబ్జెక్ట్ ను మనం స్వీకరించాలి, వెతుక్కోవాలి. వెతకాలి అంటే ఎక్కడి నుండి తీసుకోవాలనేముంది? ప్రకృతి నుంచి తీసుకోవచ్చు. రవీంద్రనాథ్ టాగూర్ ఉన్నాడు, కృష్ణశాస్త్రి ఉన్నాడు. వీరంతా కూడా ప్రకృతిలోంచి వస్తువును స్వీకరించారు. శ్రీ శ్రీ ఉన్నాడు. ఆయన సమాజంలోంచి, చరిత్రలోంచి వస్తువును స్వీకరించాడు. ఒక చారిత్రక నేపథ్యం నుంచి కవిత్వం తీసుకొని రాసాడు. అట్లా మనిషినే కేంద్రంగా చేసుకొని నారాయణరెడ్డిగారు రాయడం జరిగింది. ‘విశ్వంభర’ కావ్యంలో రాయడం జరిగింది. సృష్టినుంచి ప్రకృతి నుంచి, సమాజం నుంచి, మనిషి నుంచి వస్తువును తీసుకోవాలి. ఇంతకుమించి, వస్తువు ఇంకోటి ఉండదు. వీటికి సంబంధించిన వాటి నుంచే మన చుట్టూ ఉండే వాతావరణం ఏదైతే ఉంటుందో దానినే వస్తువుగా తీసుకోవాలి. తీసుకునే అవకాశం ఉన్నది. అందులో మనకు ఏది నచ్చితే అది వస్తువుగా స్వీకరించాలి. మనకు ఒక మంచి జర్మనీ సామెత (సెయింగ్) ఒకటి ఉన్నది. మన చుట్టూ ప్రతి వస్తువులో ఒక పాట నిద్రిస్తూ ఉంటుంది. ఆ ప్రతి వస్తువు ఆ పాటను స్వప్నిస్తూ  ఉంటుంది. కవి గుర్తించి పాడతాడు. ఆ తదనంతరం లోకం గుర్తిస్తుంది అని ప్రతి వస్తువులో ఒక పాట ఉంటుందని, అది పాటను స్వప్నస్తుందని. కాదేదీ కవితకనర్హం. కవిత్వానికి అనర్హమైనదేదీ లేదు అని గతంలోనూ తెలుసుకున్నాం. ప్రతిదీ కవిత్వానికి అర్హమైనదే అని అన్నారు.

అందుకే ప్రతి వస్తువులో ఒక పాట కలిసి ఉంటుందనీ, ఆ వస్తువు పాట గురించి స్వప్నిస్తూ ఉంటుందని. ఆ వస్తువును కవి గుర్తించాలి. కవి గుర్తించి, తను మొదటగా పాడితే తర్వాత లోకమంతా పాడుతుంది. ఇదీ కవి ఈ గుర్తించి స్వీకరించడమనేది, దాని యొక్క దర్శనం పైన ఆధారపడి ఉన్నది. ఏది దర్శిద్దాం? ఏది చూద్దాం? దేన్ని స్వీకరిస్తాం? అని అన్నప్పుడు మన జీవితంలో ఉండేటువంటి అత్యంత కీలకమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవచ్చు. అయితే, దీన్ని తీసుకోదలచుకున్నప్పుడు వస్తువును ఎంపిక చేసుకోదలుచుకున్నపుడు, మనకు ఏమేమి ఉండాలి? ప్రకృతి నుండి తీసుకోండి, సృష్టి నుండి తీసుకోండి, సమాజం నుండి తీసుకోండి, ఎంపిక చేసుకోవలసిన నాలుగు అంశాలు ఉన్నవి. ఈ నాలుగు అంశాలు కీలకమైనవి. ఒక అంశం మీద పరిచయం లేనటువంటి వస్తువుమీద చాలామంది రాయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసినప్పుడు మనకు పరిచయం లేని వస్తువును ఎంపిక చేసుకుంటే కొంత తేలిపోయే ప్రమాదమున్నది. అందుకే మనకు అత్యంత సమీపమైన, తెలిసిన వస్తువు తీసుకోవాలి. మనకు బాగా తెలిసి ఉన్నవారు తెలిసిన వస్తువును తీసుకున్నప్పుడు మనం అన్ని కోణాలను పరిశీలించి, విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. కనుక వస్తువు ఎంపికలో మనం జాగ్రత్త తీసుకొనే మనకున్న నేర్పరితనానికి సులువవుతున్నది. మొట్టమొదటిది ఏ పరిచిత వస్తువుకైనా తీసుకోవాలి. పరిచయం లేని వస్తువు జోలికి పోవద్దు. తేలిపోయినట్లు ఉంటుంది. దాంట్లోనే రెండవ లక్షణం, అంశం, రెండవ జాగ్రత్త ఏంటంటే, అది కొత్తగా ఉండాలి. ఇంతకుముందు తీసుకున్నప్పుడు ఆయనే రాసాడు గదా, మళ్ళీ ఈయనేం రాసాడు అని కవిని తక్కువ చేసే ప్రమాదమున్నది. అప్పుడు అలాంటి వస్తువును తీసుకున్నప్పుడు శిల్పంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శిల్పంతో నెట్టుకురావాల్సి ఉంటుంది. వస్తువే ముఖ్యం అనుకున్నప్పుడు శిల్పం కంటే ముందు వస్తువే వినూత్నమైనపుడు ఇక శిల్పం సంగతేంటి? అందుకే రెండవ అంశంగా కొత్తది తీసుకోవాలి. మూడోది ఆ అంశం ఆ కాలానికి పరిచయం ఉన్న సమకాలీనమైనదై ఏ కాలంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు కాలాన్ని చేరుకుంటారు. అంటే వాళ్ళ అభిరుచులకు దగ్గరగా ఉండాలి. వర్తమానంలో ఏ పాఠకులైతే, ఏ సహృదయులైతే కవిత్వాన్ని చదువుతూ ఉన్నారో వాళ్ళ అభిరుచులకు దగ్గరగా, అనుగుణంగా ఉండాలి మనం ఎంచుకున్నది. అంటే దాని అర్థం ఏంటంటే, సమకాలీనత ఉండాలి. మనం ఎంచుకునే వస్తువుకు మూడవ లక్షణం సమకాలీనత. నాలుగవ లక్షణం మానవీయత. లేదా అర్హత కలిగి ఉండాలి. మానవీయత అంటే మానవులకు ఉన్న భావోద్వేగాలను స్పృశించడం. కనెక్ట్ చేయడం. లేకపోతే అతను మనకు కనెక్ట్ కాడు. మానవుడు అనుభవించిన దానిని మనం కనెక్ట్ చేయడం. ఆయన అనుభవించిన దాంట్లోని అంశాన్ని మనం టచ్ చేయడం. అటువంటి అంశాన్ని మనం స్వీకరించగలిగితే కవిత్వంతో చేరుకోగలిగితే తప్పకుండా మానవుని చేరుకోగలుగుతాడు కవి. అందుకని నాలుగంశాలని ప్రథమంగా చెప్తాం. 1. పరిచయమైనటువంటి వస్తువును ఎంపిక చేసుకోవాలి.   2. కొత్త వస్తువును నవీనమైనది తీసుకోవాలి. 3. సమకాలీనమై ఉండాలి. 4. మానవీయమై ఉండాలి. స్పందనలకు, భావోద్వేగాలకు దగ్గరగా ఉండేది కావాలి. అప్పుడే మానవుడు స్పందించగలుగుతాడు. లేకుంటే స్పందించలేడు. లేదంటే స్పందించే అవకాశం లేదు. కనుక ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని, చుట్టూ ఉండే వాతావరణంలోంచి కవిత వస్తువును తీసుకోవాలి. అప్పుడే అనుకుంటాం మనం. ఎక్కడినుండి తీసుకుంటాం అంటే ప్రకృతి నుంచి. ఎక్కణ్ణించి తీసుకుంటామంటే జీవితంలోంచి, ఎక్కణ్ణించి తీసుకుంటామంటే మనిషి నుంచి, ఎక్కణ్ణించి తీసుకుంటామంటే కాలం నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ వస్తువును ఎన్నుకునేటప్పుడు ముందు ఇంకొక అంశం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగంశాలు తెలిసినటువంటివి తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఏం చూసుకోవాలి? అని అన్నప్పుడు, మనం మాట్లాడినప్పుడు దర్శనం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎన్ని కోణాల్లోంచి మనం పరిశీలిస్తే దాని యొక్క సారం దాని యొక్క తత్త్వం మనకు బోధపడ్తుందో ఆ కోణాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. పరిశీలించాలి. మొత్తం కోణాన్ని పరిశీలించడం సాధ్యపడదు. కనుక వర్ణింపదలిచిన  వస్తువును ఎంపిక చేసుకున్న తర్వాత, దాని యొక్క కోణం ఎక్కడినుండి ఎట్లా చూసే దాని కోణం కనిపిస్తుందో ఏ కోణంలోంచి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ దగ్గరి నుండి చూస్తే దాని యొక్క సారం తెలుస్తుందో దాన్ని మనం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవలసినటువంటిదవి. అందుకని కోణంకూ దృష్టికి ముఖ్యమైనది. వస్తుకోణం, దృష్టికోణం అనేటు వంటివి కూడా చాలా కీలకమైనవి. అందుకని ఆ కోణాన్ని మనం ఎంచుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోటోగ్రాఫర్ కూడా ఫోటో తీయదలుచుకున్నప్పుడు కొందరేమో ఎదురుగా, ఫ్రంట్ గా నిలబెట్టి తల పైకెత్తు కిందికి పెట్టు అని రకరకాలుగా మనని తీస్తాడు. తర్వాత చూస్తే మనది మనకే చూడబుద్ది కాకుండా తీస్తాడు. ఎందుకంటే ఆయనకు కళాత్మక దృష్టి ఉండాలి. ఈ వ్యక్తిలో ఏ కోణంలోంచి ఫోటో తీస్తే బాగుంటుందో అట్లా తీయాలి.  వ్యక్తి యొక్క తత్వం లేకుంటే ఆయన ముఖంలో ఉండే కళ, తేజస్సు కనబడుతుందో అర్థం కానివాడు తీస్తే వృథా. కళాత్మకమైనటువంటి కోణం తెలిసినటువంటి ఫోటోగ్రాఫర్ తీస్తే ఒకరకంగా బాగా ఉంటుంది. అందుకని కళాకారులు – అంటే ఇక్కడ కవి గనుక, ఈ కవి ఏం చేయాలంటే పాయింట్ ఆఫ్ వ్యూ, దృష్టి కోణాన్ని మనం నిర్వహించుకోవాలి. నాలుగు అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటూనే, ఈ నాలుగు అంశాలతో పాటు మొదట ఎంపిక చేసుకునేప్పుడు, స్వీకరించేపుడు దాని దృష్టికోణం కూడా చాలా కీలకమైనది అని అర్థం చేసుకోవాలి. అందుకని మనం మొదటి అంశం వస్తువును దర్శిస్తాం, స్వీకరిస్తాం. వస్తువును స్వీకరించేపుడు ఇక్కడ దృష్టికోణం కీలకమైంది. ఎందుకు కీలకమైంది అన్నప్పుడు వస్తువును, రూపాన్ని విడదీయలేము. చాలాసార్లు ఏం జరుగుతుందీ అంటే, వస్తువునూ రూపాన్ని విడదీయలేము కానీ ఒక్కోసారి వస్తువే రూపాన్ని విడదీసే అవసరమొస్తుంది. అవకాశమొస్తుంది. అందుకే వస్తువు ఎంపిక దగ్గరి నుండి జాగ్రత్త వహించాలి. అంటే వస్తువును ఎనుకున్నప్పుడే దాని రూపము నిర్ధారణ అయిపోయే అవకాశముంటుంది. కృష్ణశాస్త్రి గారు “బాక్ టు ద నేచర్” ( Back to the Nature). ఆయన “ఒక కొమ్మలో కొమ్మనై ఆకులో ఆకునై” అనే అంశాన్ని స్వీకరించడంతో అనుకున్నపుడు దానితో కలిసిపోవాలనుకున్నప్పుడు అప్పుడు ఉన్నదాంట్లో ఇక రాసుకుంటా పోయాడు. “ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై.. నునులేత రెమ్మనై” అంటూ అట్లా రాసుకుంటూ పోవడం. కనుక ఈ ఎంపిక చేసుకోవడం అనేది చాలా కీలకం. ప్రకృతి నుంచి రాయాలి అనేటువంటి అంశాన్ని ఎక్కడ మొదలు పెట్టి ఎట్లా ఏ కోణంలోంచి రాయాలి అనేది, ఎట్లా చిత్రించాలి అనేది రెండో అంశంగా చెప్పేది వస్తువు. ఈ అంశాన్ని తీసుకున్నప్పుడు ఈ వస్తువునే తీసుకున్నప్పుడు మానవీయ స్పందనలు ఉండేటువంటి దానిలో ఏదైనా విశేషత ఉండాలి. చెప్పడానికి అనువైనటువంటి ఏదో ఒక విశేషము ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ‘స్నేహం మీద’ కవిత రాయాలి అని అన్నప్పుడు.. అందరూ ఏం రాస్తారు? “సృష్టిలో తీయనిది స్నేహమే” అని రాస్తారు. అట్లా ప్రాచుర్యంలో ఉండేటువంటి ఆ కోటేషన్ నే చెప్పుకుంటూ రాస్తారు. మధురత్వము అనేది లేకుండా, తీపి లేకుండా స్నేహం ఇంత గొప్పది, అంత గొప్పది అని తప్పించి వేరేదెవరూ రాయరు. కానీ, దానివలన ఏమవుతుంది? ఈ మొత్తం ఒకటే వస్తువు ఉండటం వల్ల అదే వస్తువు ఉండటం వల్ల, రాయడంలో ఏ నైపుణ్యం ప్రకటించకపోవడం వల్ల అది మూసగా నిలిచిపోయే ప్రమాదమున్నది. కొత్తదనం లేకపోవడం వల్ల అంటే మోనాటమీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ప్రమాదం ఏర్పడుతుంది. రూపం కూడా పాతది అయిపోతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైన ఒక వస్తువు ద్వారా ఏదైనా ఒక విశేషాన్ని చెప్ప దల్చుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువును స్వీకరించగలగాలి. దాని ద్వారా మనం ఒక విశేషాన్ని, సందేశాన్ని అనుభవంతో అందించాలి. అప్పుడే ప్రతిదీ, మనం అవతలి వ్యక్తికి ఇవ్వగలం. అదే కీలకం. ఈ వస్తువును, ఎదుటి వ్యక్తి ఆకట్టుకునే వస్తువు అయి ఉండాలి అన్నారు. మనమనుకున్నట్లు మానవీయ స్పందనలో భాగమైనటువంటిది ఉండాలి. మానవ భావోద్వేగాలతో సంబంధం లేనిది ఆకట్టుకోదు కనుక మానవ సంబంధ భావనతో స్పందనలతో, అందులోంచే వస్తువును తీసుకోవాలి. లేనిదే ఆకట్టుకునే అవకాశం లేదు గనుక తప్పకుండా మానవ అనుభవాలను తీసుకొనే రాయాలి. చాలాసార్లు ప్రకృతిని ప్రకృతి, ప్రకృతి లాగా రాయం. ఇవన్నీ మానవునికి అన్వయిస్తూ రాస్తాం. ఇవన్నీ టెక్నిక్స్.

కానీ, ప్రకృతిని కూడా మానవరూపంలోకి, మానవ స్వభావంలోకి ఆరోపించుకొని రాయడం ఏదైతే ఉన్నదో ఇక్కడే ఈ తెలివితేలటన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అని తెలుస్తుంది. అందుకని మనం ఈ వస్తువు ఎంపిక దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆ కవిత్వం అంత బాగా పండేటువంటి అవకాశమున్నది . ఒక్కోసారి మనం రాయడంలో కొంత నైపుణ్యత తగ్గినా కూడా అందులో విశేషత  ఉంటే అది ఆకట్టుకుంటుంది. అందుకని చాలాసార్లు కొత్తది స్వీకరించాలంటే ఒప్పుకుంటారో, ఒప్పుకోరో అనే భయం అనేది ఒకటుంటుంది. ఇది మనకే కాదు కాళిదాసు నాటికే కాళిదాసుకే వచ్చిందని ఆయనొక మాటన్నాడు. పాతదే తీసుకోవాలి అని, ఇప్పటివరకు చెప్పినటువంటి అలంకారికుల వల్ల ఆయన వాళ్ళకు సంజాయిషీనివ్వడం, అలంకారికులు ఏమన్నారంటే ప్రఖ్యాత వస్తు విషయం “ప్రఖ్యాత వస్తువిషయం ప్రఖ్యాతోదాత్తనాయకం చైవ – రాజర్షి వంశచరితం తదైవ దివ్యాశ్రయోపేతమ్” భరతుడు అన్నాడు. వస్తువును తీసుకోవాలన్నప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి భారతీయ లాక్షణికులు ఏం చెప్పినారంటే విషయం కొత్తది తీసుకోవద్దన్నారు. ప్రఖ్యాతమైన వస్తువును తీసుకోమన్నారు. అందుచేత మనకు ప్రాచీన కాలంలోని ఆ భారతానికో రామాయణానికో, భాగవతానికో సంబంధించిన వస్తువులే మిళితమై ఉంటాయి. అంటే విషయం, వస్తువు ప్రఖ్యాతమైనదై, ఎప్పటికీ ప్రాచుర్యమైనదై ఉండాలి. దాని వలన మనం ఎక్కువ కష్టపడకుండానే సమాజానికి చేరే అవకాశముంటుంది అని చెప్పడం.

ఇక్కడనే రెండవది ఆ వస్తువుతో పాటు అందులో నాయకుడెవరుండాలి అంటే ఉదాత్తుడైన నాయకుడై ఉండి ఉండాలి. ప్రఖ్యాత నాయకుడై ఉండి ఉండాలి అని. అయితే కాళిదాసు వరకు వచ్చేటప్పటికి, ఒక సమస్య ఏర్పడ్డది. ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తము అని అన్నప్పుడు ఉన్నదాంట్లో నించే తీసుకోవాలి. నాయకుడు బాగా ప్రఖ్యాతుడై ఉండాలి అంటే, అయితే దేవుడు కావాలి లేకపోతే రాజు కావాలి అని. భరతుడు వంటి ఆలంకారికులు చెప్పిన విషయాలను గమనిస్తే, ఆ విషయాల ప్రకారమైతే ఒకనాటికి బాగానే ఉండవచ్చు గాని, తదనంతర కాలానికి లేదు అని. అందువల్ల కాళిదాసు కొత్తదనాన్ని ప్రయోగించదలుచుకున్నప్పుడు, ఆ కాళిదాసులాంటి వాళ్ళే కాదు ఇవ్వాళటి వరకు కూడా కొత్తదనాన్ని మనం తీసుకున్నప్పుడు, కొత్త వస్తువును తీసుకురావాలనుకున్నప్పుడు, ఒక విశేషమైన వస్తువును తీసుకురావాలనుకున్నప్పుడు కొత్తదే స్వీకరించాలి. కొత్తది స్వీకరించినప్పుడు, ఆయనే, కాళిదాసే స్వయంగా చెప్పుకున్నదేమంటే “పురాణమిత్యేవ నసాధుసర్వం, నచాపికావ్యం నవమిత్యవద్యం” కాళిదాసు అన్నాడు. అంటే పురాణమైనదంతా కూడా గొప్పదని చెప్పడానికి వీల్లేదు. ప్రాచీన కాలంలోని దంతా కూడా గొప్పదని చెప్పడానికి వీల్లేదు. పాతదంతా గొప్ప అని చెప్పడానికి వీల్లేదు. పాతది కూడా కొన్నిసార్లు ప్రక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. వస్తువు ఏదైనా సరే పాతదైపోతే తప్పనిసరిగా అది ఎంతగా మనకు ఇష్టమైన వస్తువు ఏదైనా, ఉదాహరణకు ఒక గులాబి పువ్వున్నది, నిన్న పూసిన పువ్వు, మొన్న పూసిన పువ్వు వాడిపోయింది, ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత రాలిపోతుంది. ఇంకా నాకిష్టమైంది అని ఇంట్లో పెట్టుకుంటామా? రాలిపోయి ఎండిపోయినప్పుడు దాని పరిమళము పోయినప్పుడు దాని రంగు కూడా పోయినప్పుడు, దాని రిక్కలు కూడా రాలిపోతున్నప్పుడు, ఇన్నిబోతున్నప్పుడూ అది నేను అదే పెట్టుకుంటానంటే కాదు. ప్రతిరోజు పుష్పం కొత్తది వస్తుంది. కొత్తగా పుడ్తుంది. అది చాలా శుభ్రంగా ఉంటుంది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. చాలా కొత్తదనంతో ఉంటుంది. చాలా సొగసులతో ఉంటుంది. దాన్ని స్వీకరించాలి. అని చెప్తూ ఆయనేమన్నాడు పురాణమైనదంతా కొత్తగాదు, కొత్తదైనంతమాత్రాన దానిని స్వీకరించడానికి అంతా యోగ్యమైనది కాదు అన్నాడు. ఇది ప్రక్కనబెట్టుకో అన్నాడు.

అందుకనే కాళిదాసు మేఘాన్ని దూతగా తీసుకున్నాడు. శ్రీశ్రీ కొత్తదనం కోసమే ‘నవ కవనం’ అనే కొత్త పేరుతో తమ కవిత్వంలో ఏమేమి కావాలో అవి రాసాడు.

“కదిలేది కదిలించేది మునుముందుకు నడిపించేదీ, పాడేదీ పాడించేదీ పెనునిద్దుర వదిలించేది పరిపూర్ణపు బతుకిచ్చేది కావాలోయ్ నవకవనానికి” రాసేది కొత్త కవిత్వం. ఈ కొత్త కవిత్వానికి ఏం కావాలి అంటే అది పాడాలి పాడించాలి. అది కదలాలి కదిలించాలి. పెనునిద్దుర నొదిలించాలి. ఇంతకుమందు నిద్రబోయే సాహిత్యం వచ్చింది. నిద్రబుచ్చే సాహిత్యం వచ్చింది. ఇది నిద్రను మేల్కొలిపేటువంటి సాహిత్యం. అని చెప్తూ ఆయన కొత్తదనాన్ని స్వీకరించాడు. గురజాడ అప్పారావు గారు అప్పటివరకు ఉన్నటువంటి ఒకరకమైన సాహిత్యం ఉంటే ఆయన కూడా కొత్తదనాన్ని స్వీకరించాడు. తర్వాత తర్వాత అట్లా మనం తప్పనిసరిగ కొత్తదనాన్ని స్వీకరించాలి అనే భావం ఏర్పడింది. ఎంతో కొంత ప్రత్యేకతను ప్రదర్శించకపోతే మనం అక్కడ ఉండడానికి అవకాశం లేదు. అందుకని వస్తువు ఎన్నిక దగ్గర కొత్తదనంతో కూడినటువంటి వస్తువును ఇంతకుముందు ఎవరూ స్వీకరించనటువంటి వస్తువును స్వీకరిస్తే, తీసుకుంటే అది రాణిస్తుంది. రాణించే అవకాశం ఉంటుంది. అయితే వస్తువు కొత్తదా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది? అదొక ప్రశ్న మళ్ళీ. ఇది అధ్యయనం ద్వారానే తెలుస్తుంది తప్ప, మళ్ళీ మనం చదవకపోతే తెలియదు. ఎప్పుడో చాలా రోజుల క్రింద, ఏ ముప్పై ఏళ్ళ క్రిందనో పుస్తకంలో దాచుకున్న నెమలీకను “నా జ్ఞాపకం” అని నేను ఏదో రాసాను. అది ముప్పై ఏళ్ళ కింద రాసిందైతే, అది ఆ తర్వాత ఎంత ప్రచారమైందంటే రాసుకున్న నెమలీక, దాచుకున్న నెమలికన్ను అని రాసారు. చాలామంది దాదాపు ఒక ఇరవైమంది రాసుంటారు. ఈ ఇరవై ఒకటో ఆయనకు అది ముప్పై ఏళ్ళ క్రింద రాసిన కవిత అని తెలియదు. తెలియకపోవడం వల్ల ఏమవుతది. అది పాతది అనుకోడు, నేనే రాసిన అనుకుంటాడు. ముప్పై ఏండ్ల క్రింద రాసిందనుకోడు. ఇది ఎవరు పట్టుకుంటారు మళ్ళీ ? దీన్ని ఒక విమర్శకుడు పట్టుకుంటాడు. ఓ ముప్పై ఏళ్ళ క్రింద రాసింది, ఫలానాయన రాసినాయన, తర్వాత ఇంకో ఇరవైమంది వరకు రాసినారని, ఆ తర్వాత ఇరవై ఒకటవ వ్యక్తి కూడా రాసాడు అని అంటాడు. అందువల్ల కొత్తదనం లేదని అంటాడు. అందుకని తప్పనిసరి మనం విస్తృతంగా అధ్యయనం చేయడం ద్వారానే విశేషత్వం ఏంటిది, కొత్తదనం ఏంటిదని, ఇప్పుడు నువ్వు రాసిందేంటిది? రాయాల్సిందేంటిది? అనేది తెలుస్తుంది. బోధపడే అవకాశం ఉంటుంది. కనుక ఇది ఒకటి తప్పనిసరిగా గుర్తుకు పెట్టు కోవాల్సినటువంటిది. ఇంకొక అంశం కూడా ఈ వస్తువు ఎంపిక విషయంలో ఇంకో సమస్య ఉంటది. ఇంకో సమస్యేంటిదీ అనంటే, ఎప్పుడైనా సమకాలీనమైన వస్తువును స్వీకరించాలి అని అనుకుంటే, చుట్టూ ఉండేటువంటి ఒక వాతావరణం ఆ వస్తువును నిర్ణయిస్తూ ఉంటుంది. మన స్వేచ్ఛతో సంబంధం లేకుండా, మన ఇష్టంతో సంబంధం లేకుండా మన చుట్టూ ఒక సమన్వయం, ఒక సమస్య ఉంటుంది. ఒక సాహిత్య వాతావరణం ఉంటుంది. ఈ సాహిత్య వాతావరణం చాలాసార్లు ఇందాక అనుకున్నట్టు, ఒక సబ్జెక్ట్ ఇచ్చి రాయమంటుంది. ఒక టాపిక్ ఇచ్చి రాయమంటుంది. కొన్ని సార్లు ఏం జేస్తది అంటే ఎక్కడో బార్డర్ లో సైనికుడు పోరాడుతుంటాడు. దాని గురించి రాయవలసిన సందర్భం ఏర్పడుతది. ఇటువంటి సమకాలీన విషయాలు రాసేప్పుడు, అది అందరినీ ప్రేరేపించేలాగా, అందరినీ ప్రభావితం చేసేట్లుగా రాయాలి. అట్లనే ఇప్పటి పరిస్థితికి సమన్వయం చేయ దలుచుకుంటే, ఇప్పటి సాహిత్యానికి, కవిత్వానికి సమన్వయం చేయదలుచుకుంటే మనం ‘కరోనా’ కాలంలో ఉన్నాం. ఈ కరోనా కాలంలో ఉన్నప్పుడు, మనతో సంబంధం లేకుండ, మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, చుట్టూ ఉన్న సమాజంలో వాతావరణంలో ఈ కరోనా ఉంటుంది కనుక అందరికీ కరోనా గురించి రాయాలని ఉంటుంది. అందరమూ రాస్తాం. ఈ కరోనా ప్రభావం బాగా ఉన్నదని ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు. నేను రాస్తున్నదే బాగున్నది అని అనుకుంటాం. ఎవరికి వాళ్ళు అనుకోవడం తప్పులేదు. కానీ, కరోనా అనే ఒక అంశంమీద, ఒక వస్తువు మీద కవిత్వం రాసేటప్పుడు అనివార్యంగా ఇంతకుముందు కవులు రాసినటువంటి కవితలను చదవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా వాళ్ళు వదిలి పెట్టిన అంశాలేవైనా ఉన్నాయా అనేటువంటిది తెలుస్తుంది. వస్తువే గొప్పది అని మనం రాసేప్పుడు దాన్ని వీలైనంతవరకు ఆ కరోనా ఏమిటి? ఆ కరోనా యొక్క స్థితిని, దాని లోతుల్ని మనం పట్టుకున్నప్పుడు అటువంటి వస్తువును చూడాలి. కనుక పైపైన చూడడం ఒక అంశం, దాని లోతుల్ని చూడడం ఒక అంశం. దాని హృదయాన్ని ఆవిష్కరించటం. దాని హృదయం అంటే, దాని కాలం, కరోనా కాలంలో ఉండేటువంటి స్థితియొక్క ఉపద్రవ స్థితిని మనిషి యొక్క ఆర్ధమైనటువంటి స్థితిని చిత్రించాలి అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆర్ధమైనటువంటి వస్తువును కవి పట్టుకోవాలి. ఇదే మన దృష్టి కోణమైతే అనివార్యంగా వచ్చినటువంటిది ఈ కరోనా. అనివార్యంగా వచ్చిన వస్తువు ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది చెప్పడం. అందుకని మనం అనివార్యంగా ఈ భౌతిక పరిస్థితులను, ఈ చుట్టూ ఉన్న పరిస్థితులనూ మనం మభ్య పెట్టడానికి వీలుకాదు. కాబట్టి అలాంటివాటిలోంచి మనం కవిత్వాన్ని వస్తువుగా ఎంపిక చేసుకునే పరిస్థితి, అవసరముంటుంది. అందుకే ఇక్కడ ఎంతో మెలకువగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమున్నది. అందుకని ఇవన్నీ మనం ఎట్లా జేసుకుంటాం అనేది మన అనుభవం ద్వారా, మన పరిణతి ద్వారానే తెలుసుకునే అవసరముంటుంది. మొదలు చూడం. అక్కడినుంచే వెళ్తుంటాయి, ప్రక్కనుంచే వెళ్తుంటాయి మనం చూడం. జంధ్యాల పాపయ్య శాస్త్రికి ‘పుష్పవిలాపం’, పువ్వు ఏడుస్తున్న దుఃఖం కనబడి ఉండొచ్చు. వాల్మీకికి మనిషి యొక్క దుఃఖం కనబడి ఉండొచ్చు. శ్రీశ్రీకి బాటసారి యొక్క దుఃఖం కనబడి ఉండొచ్చు. చాలా ఆశ్చర్యంగా ఈ కరోనాతో వలసజీవులు కాలిబాటలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరికి ఇంకే మార్గాలు లేకుంటే ఏం లేకుండా, పాదాలకు ఏమీ లేకుండా నడి ఎండలో పోతూఉంటే వాళ్ళ కష్టాలెవరూ అందుకోనప్పుడు కవులెవరూ దాన్ని అందుకోనప్పుడు శ్రీ శ్రీ ఎలాగైతే బాటసారిని

“కూలి కోసం, కూటి కోసం, పట్టణంలో బతుకుదామని

తల్లిమాటను చెవిన పెట్టక, వెళ్ళినట్టి బాటసారికి

ఎంత కష్టం ఎంత కష్టం చలివేస్తే, జ్వరం వస్తే..

ఎండ వస్తే ఎంత కష్టం ఎంత కష్టం” అని శ్రీ శ్రీ బాటసారిలో ఏ కవితనైతే రాసాడో ఆ కవితనే టీవీలలో తిరిగి తిరిగి వేయాల్సి వచ్చింది. కారణం ఏంటిది? అంటే అప్పటికి వలస సమస్యను కరోనా సమస్యను పట్టుకుని ఉండవచ్చు గాని, కరోనా వల్ల బాధపడున్న వలస జీవుల యొక్క కష్టాన్ని అందుకోలేని స్థితి ఉంది. వాళ్ళ జీవితానికి ఆసరాగా రానిస్థితి ఉంది. కవులు దాన్ని పట్టుకున్న తర్వాత చాలా కవిత్వం వ్రాశారు. దార్శనికతతో పట్టుకున్నది చాలా కీలకం. అలా పట్టుకున్నవాళ్ళు గొప్ప కవులు అవుతారు. చాలా కవిత్వం వచ్చింది. ‘వలస దుఃఖం’ అనే పుస్తకం వచ్చింది. ఆదిలాబాద్ నుంచి కూడా ఇంకో పుస్తకం వచ్చిందట.  ఏదో పేరుతోని అందుకని ఇవన్నీ తరువాత ఇంకా వచ్చి ఉండవచ్చు. కానీ ఇవన్నీ కూడా మనం, కవిగా దార్శనికతతోని ఉండాలి. ముందు పట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. అట్లా పట్టుకున్నటివాళ్ళు తప్పనిసరిగా చాలా మంచి కవులు అయ్యేందుకు అవకాశమున్నదనేది చెప్పవచ్చు. కాబట్టి ఒకే వస్తువు కొన్ని కొన్నిసార్లు ఎట్లా మారుతూ ఉంటుందంటే, ఒకే వస్తువు దృష్టికోణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఎమ్. ఫిల్. లో నా పరిశోధనాంశంగా ‘సూర్యుడు’ అనే టాపికను తీసుకున్నా. నాకిష్టంతోటి తీసుకున్న ‘సూర్యుడు’ అనే వస్తువు ప్రకృతిలో ఉన్న వస్తువు. అది భిన్నకాలాలలో భిన్న రూపాలలో వచ్చింది. వేదకాలంలో వచ్చేసరికి సూర్యుడు ఒక సూర్యభగవంతుడుగా, ఒక దేవుడుగా తీసుకున్నారు. పౌరాణిక దృష్టితో చూసినప్పుడు వైదిక దృష్టితో చూసినప్పుడు సూర్యుణ్ణి ఒక భగవంతునిగా చూడడం, కొనియాడడం జరిగింది. లేదా సృష్టికి ప్రాణం పోసేటువంటి వ్యక్తిగా చూడడం జరిగింది. తదనంతర కాలంలో మధ్యయుగాల వరకు వచ్చేసరికి, రాతి యుగం అంతరించి, మధ్యయుగ కాలంలోకి వచ్చేసరికీ, ప్రబంధ యుగంలోకి వచ్చేసరికి ప్రాచీన కవుల యొక్క దృష్టి శృంగార దృష్టి ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గరికొచ్చేసరికి అదే సూర్యుడేమయి పోయాడు? అదే సూర్యుడు ప్రియుడైపోయాడు. కమలం ప్రేయసి అయిపోయింది. సూర్యుణ్ణేమన్నారు?  కమల బాంధవుడు అన్నారు. కమలమనేటువంటి ప్రేయసి, ప్రియురాలు అయినట్లయితే, ఆ ప్రియురాలిని ప్రభావితం చేసేటువంటి వాడు సూర్యుడు అని. అంటే సూర్యునికి కమలానికి మధ్య హృదయాన్ని, ప్రణయాన్ని చిత్రించడమనేటువంటిది మనకు కావ్యయుగంలో, మనకు ప్రబంధ యుగంలోని కావ్యాల్లో ఎక్కువగా కనబడుతుంది. అంతకుముందు లేదు. భగవంతుడుగా ఉండిన సూర్యుడు అకస్మాత్తుగా ప్రియుడవుతాడు. ఈ ప్రియుడైనటువంటి సూర్యుని నుంచి మరికొంతకాలం ముందుకు వచ్చిన తర్వాత భావకవిత్వం దగ్గరికొచ్చేసరికి, భావకవిత్వంలో ప్రియుడు తక్కువ, ప్రేయసి ఎక్కువ. అంటే స్త్రీని అంతకుముందు ఏదైతే అంగాంగ సౌందర్య వర్ణన చేస్తుండేదో, శృంగార దృష్టితో బాహ్య సౌందర్యాన్నే చూస్తుండేవారో, అదే భావకవిత్వం దగ్గరికొచ్చాక అంతస్సౌందర్యం గురించి చెప్పారు, మొదలుబెట్టారు. అంటే భావకవిత్వం కొచ్చేసరికి ఆత్మసౌందర్యంతో చూసే ప్రేయసిని చాలా ఉదాత్తమైనదిగా చెప్పారు. ఆ ఉదాత్త రూపం దాల్చినపుడు సూర్యుణ్ణి ప్రేయసితో సమానంగా సరోజను “వికసింపజేయు సూర్యుణి ప్రియురాలివి నీవు” అనే అర్థం ఒక కవి వాడాడు. అంటే ఇక్కడ కవి ప్రియుడైతే కమలం ప్రియురాలు. ఆ ముఖ సౌందర్యాన్ని వికసింపజేసేటువంటివి ప్రియునివి నీవు అని సూర్యుని వర్ణించారు. భావ కవుల దృష్టిలో సూర్యుడు ప్రియుడైండు.. మళ్ళీ అభ్యుదయ కవుల దగ్గరికి వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే, తెల్లవారుతున్నది. ఒక మార్పుకు సంకేతంతో చూడడం జరిగింది. ఒక ప్రబోధానికి, ఒక ప్రగతిశీలతకు ఒక పురోగమనానికి ఒక ఉదయానికి, ఒక సరికొత్త మానసిక పరివర్తనకు చెప్పారు. ఆ తర్వాత తర్వాత వరకు విప్లవ కవిత్వం వచ్చేసరికి “సూర్యుని అరచేతబట్టి రైతు దుక్కిదున్నును” అన్నాడు శివసాగర్. సూర్యుని అరచేతబట్టి అంటే సూర్యుణ్ణి తన చేతిలో పట్టుకొని భూమిని దున్నుతాడని అన్నారు. విప్లవ కవిత్వంలో సూర్యుడు ఒక తిరుగుబాటు పతాకగా, తిరుగుబాటు జెండాగా చెప్పినారు. అదే తదనంతర కాలంలో, ఆశ్చర్యకరమైనటువంటి అంశమిది. దళిత కవిత్వం వచ్చింది. దళిత కవిత్వం వచ్చాక అదే సూర్యుణ్ణి, భగవంతుడు లేడు, ప్రియుడు లేడు, ప్రేయసి లేదు, తిరుగుబాటుదారుడు లేడు, విప్లవకారుడు లేడు అంటే సూర్యుడంటే ఒక రచయితేం చెప్పాడు – “నల్లా సూర్యుడు నల్లనల్లా సూర్యుడు” ఒక నల్లని సంకేతానికి వాడుకున్నారు. దళిత కవిత్వానికి ప్రతీకగా వాళ్ళు వాడడం జరిగింది. అంటే “నల్లటి సూర్యుడు” అని వర్ణించేటప్పుడు ఇందులో మళ్ళీ ఒక్క సూర్యుడే ఇన్ని విధాలుగా మారాడు. అంటే కవి యొక్క దృష్టికోణం మారింది. కాలం మారినప్పుడు భావజాలం మారింది. వస్తువును చూసే కోణం కూడా మారింది. మారుతుంది అని చెప్పవచ్చు. దీనితో మనకు అట్లానే, ప్రాచీనకాలంలో వస్తువును స్వీకరించడానికి నియమాలు పెట్టారు. భరతుడు అన్నదాని ప్రకారం ప్రఖ్యాతమైన వస్తువును తీసుకోవాలి. ప్రఖ్యాతమైన వస్తువు అంటే అనివార్యంగా ఉపనిషత్తుల్లోనో, లేదా పురాణాల్లోనే ఉండేటువంటి వస్తువును మాత్రమే తీసుకోవాలి. అదే పద్ధతిలో ప్రఖ్యాత, ఉదాత్త నాయకుణ్ణి తీసుకోవాలి అన్నారు. ప్రఖ్యాతుడైన, ఉదాత్తుడైన నాయకుణ్ణి మాత్రమే తీసుకోవాలి. అందుచేత నాయకుణ్ణి నాలుగు వర్గాలుగా చెప్పారు. నిర్ణయించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పరిణామం ఎట్లా వచ్చింది అని చెప్తున్నాను. నాలుగు రకాల నాయకున్ని నిర్ణయించారు, వివరించారు. దీని గురించే రాయమన్నారు. 1.ధీరోదాత్తుడు, 2. దీరోద్ధతుడు, 2. ధీరలలితుడు, 4. ధీరశాంతుడు. అని నాలుగు భాగాలుచేసి, ఈ ధీరుల గురించే కావ్యం వ్రాయమన్నారు. ఈ ధీర అనేది మాత్రం నాలుగు రీతుల్లో ఉన్నది. ఎవరు ధీరుడు? అంటే అనివార్యంగా దేవుడే అయి ఉండాలి. తర్వాత వచ్చేసి ప్రభువు. ప్రభువంటే రాజు, వీళ్ళ గురించే రాయాలి అనేటువంటి ఒక ఆలంకారికలు చెప్పింది, పరిణతి ఒక రోజున్నది. ఆ ఒకరోజు ఉండేదానిని గురించి తదనంతర కాలంలో ఎప్పుడైతే దృక్పథం మారిందో, దర్శనం మారిందో నాయకుడు కూడా మారాడు. నాయకునికి ఉండవల్సిన లక్షణాలు మారినవి. ఉదాత్తుడైన, ధీరుడైన నాయకుని నుంచి అభ్యుదయ కవిత్వం కాలం నాటికొచ్చేసరికి బాటసారి కూడా నాయకుడయ్యాడు. శ్రీశ్రీ కవిత్వానికి నాయకుడెవరు? బాటసారి. గురజాడ కవిత్వానికి నాయకుడెవరు? నాయిక ఎవరు? ఇంతకుముందు నాయకురాలుకు ఏం నియమాలు పెట్టారు? ఒక కావ్యంలో నాయిక కావడానికి మూడు నియమాలు పెట్టారు. ధీరురాలైన నాయిక, ధీరోదాత్తమైన నాయిక అంటే సగం ధీర, సగం అధీర నాయిక ఉండొచ్చు. అంటే ధైర్యం లేనటువంటి, అధీర అయినటువంటి ఏమాత్రం ధైర్యం లేనటువంటి నాయిక కావచ్చు అని చెప్పారు. వీటి కంటే ఎక్కువ అష్టవిధ శృంగార నాయికలు అని. ఎనిమిది రకాల ప్రణయ నాయకురాళ్ళను చెప్పారు. ఇది ఇక్కడ అవసరం లేదు. అయితే ఈ ప్రణయ నాయికను అందంగానైనా ఉండాలి. ధైర్యంగా వీరురాలైన నాయికగానైనా ఉండాలి. అటువంటి వాళ్ళను పెట్టి రాయాలన్నప్పుడు గురజాడ వరకు వచ్చేసరికి ‘పూర్ణమ్మ’ను నాయకురాలుగా చెప్పారు. కాని పూర్ణమ్మ ధీరురాలు గాదు, శృంగార నాయిక గాదు, ఆమె నాయిక అయ్యింది. ఎందుకు? ఎందుకంటే కాలం మారింది గనుక, ఆధునిక భావాలు, కొత్త భావాలూ వచ్చినవి గనుక, కొత్త చైతన్యం వచ్చింది గనుక, ఆంగ్ల కవిత్వంతో సంపర్క మేర్పడింది కనుక, సామాజిక విషయాన్ని కవిత్వంలోకి తీసుకురావలసిన అవసరం ఏర్పడింది గనుక, సాంఘిక ఆచారమైన బాల్య వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్ణమ్మను నాయికను చేశారు. అందుకని పూర్ణమ్మ నాయిక ఎప్పుడైందీ అంటే మొత్తం నీ భావజాలం అంతా మారింది కాబట్టి నాయిక అయ్యింది. అప్పుడే పూర్ణమ్మ నాయకి అవడానికి వీలైంది. “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, విన్నారమ్మా ఈ కథను” అని “మేలిమి బంగరు మెలతల్లారా, నెలతల్లారా” అని ఆయన రాసి, ఆయన శైలినీ మార్చాడు, వస్తువునూ మార్చాడు. అప్పటికి పూర్ణమ్మ నాయిక కావడానికి వీల్లేదు. మధురవాణి నాయిక కావడానికి వీల్లేదు. అలాంటి పూర్ణమ్మను నాయికగా మార్చే స్థితి గురజాడ కాలంలో వచ్చింది. ఇట్లా మనకు కాలం సాహిత్య సూత్రాన్ని మార్చేస్తుంది. సహించే సూత్రాన్నిస్తుంది. మనస్సు వస్తువు ఎంపికకు మారి అందుకు ముందున్న సూత్రాన్ని మార్చేస్తుంది. అందుకనే వస్తువును ఎంచుకునే కాలమని మనం పెట్టుకున్నాం. సమకాలీనమైన వస్తువును స్వీకరించాలి అని ఎందుకన్నామంటే, అందరినీ ఒకప్పుడు ఆకర్షించవచ్చు గాని, ఇప్పటి మనుషుల అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు మారుతున్నవి కనుక నచ్చకపోవచ్చు. కాబట్టి వాటికి దగ్గరగా ఉండేట్టు రాయాల్సిన అవసరం ఉన్నది అన్నదే ఇక్కడ కీలకమైనది. అక్కడ వస్తువుకు దగ్గరగా ఉన్న ప్రఖ్యాతుడై, ధీరుడై, ఉదాత్తుడై, ధీరురాలై ఉన్నటువంటి వాళ్ళ దగ్గరినుంచి, ఒక సామాన్యుడు గూడా కావ్యనాయకుడయ్యే ఒక పరిణామమంతా కూడా అభ్యుదయ కవిత్వం కాలంనాటికి వచ్చింది. ఎందుకంటే ఒక బాటసారి నాయకుడయ్యాడు. అభ్యుదయ కవిత్వంలో వస్తువును తీసుకున్నట్లయితే ఒక కార్మికుడు నాయకుడు. ఒక కర్షకుడు నాయకుడు. అట్లనే ఒక బాటసారి నాయకుడైనాడు, ఒక నిరుద్యోగి నాయకుడైనాడు. ఒక గుమాస్తా నాయకుడైనాడు, మధ్యతరగతివాడు, కింది మధ్యతరగతివాడు, ‘సినీవాలీ’ అనే పేరుతో ఆరుద్రగారు ఒక కావ్యాన్ని రాసాడు. ఆ సినీవాలి అనే కావ్యం ఒక గుమాస్తా, సూర్యారావు ఒక క్లర్క్ క్లర్క్ గురించి ఒక కథ. అంతకుముందు ఒక క్లర్క్ నాయకుడు కాదు. రానున్న కాలంలో భటుల గురించి రాసేదే తెలియదు మనకు. ఆ కాలం నాటికి ఆ దృష్టి లేదు. తరువాత కాలంనాటికి ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళను గురించి రాయడం అనేది కవిత్వంలో వస్తువైంది. అందుకే, “ప్రభువెత్తిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవరోయ్” అన్నాడు శ్రీశ్రీ. అంతకుముందు ప్రభువెక్కినటువంటి పల్లకిలో గూర్చునట్లవంటి ప్రభువు గురించి రాసిండు. కానీ తదనంతరం ఆ ప్రభువు గొప్పదనమేముంది? ఆ ప్రభువు ఉట్టిగ కూర్చున్నాడు. అది, ఆ పల్లకిని మోసినటువంటి వారి గురించి రాయాలిగాని అని, మోసినవాండ్ల గురించి, బోయిల గురించి రాశాడు శ్రీశ్రీ.

ఇక నిన్న యస్.పి. బాలసుబ్రహ్మణం గురించి చదువుతున్నప్పుడు నాకు ఆర్థంగా అనిపించిన అంశమేంటిదీ అంటే, ఆయన శబరిమలైకి వెళ్ళాడు. అందరు కూడా వెళ్లారు కావచ్చు. నడకలో ఆ గుట్ట ఎక్కడానికి ఎక్కలేనివారు డోలాల్లో పోతరు. ఆయనగూడా డోలా ఎక్కి పోయాడు. నడువలేడు కనుక డోలా ఎక్కి పోయాడు. దిగిన తర్వాత ఆయన తనకు ఎక్కడైతే కూర్చోబెట్టి సన్మానం చేస్తారో ఆ కుర్చీలో డోలాలో తీసుకొచ్చిన వాళ్ళను కూర్చోబెట్టి, వాళ్ళ పాదాలకు నమస్కరించాడు. దీన్ని పాతకాలంలోకి వెళ్ళి ఊహించలేము. ఆధునిక కాలంలో మాత్రమే ఊహించగలుగుతాం. ఒక డోలా మోసినటువంటి బోయీలకు, మోసినవాళ్ళకి కాళ్ళు మ్రొక్కడమనేది వచ్చింది. ఉత్తమ సంస్కారం అది. ఆధునిక కాలానికే సాధ్యం. బాలసుబ్రహ్మణ్యం లాంటి గొప్ప వ్యక్తి, గాయకుడు అక్కడ డోలా ఎత్తిన బోయీలకు వాళ్ళ కాళ్ళకు మొక్కాడు. నమస్కారం బెట్టడమనేది ఆయన యొక్క సంస్కారానికి నిదర్శనం అంటే, వస్తువు కాలాన్ని బట్టి మారుతుంది అని చెప్పడం. అందుకని ఈ వస్తువులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఒక బిచ్చగత్తె గురించి, ఒక సాధారణమైన వృత్తి గురించి, తర్వాత కాలంలో రాసారు. అలిశెట్టి ప్రభాకర్ అయితే, వేశ్యల గురించి రాసాడు. అంతకుముందు వేశ్యల గురించి రాయవచ్చు. కాని వాళ్ళ దృష్టికోణం వేరు. స్త్రీని సుఖసాధనంగా, సౌఖ్య సాధనంగా మాత్రమే రాసారు. కాని ఇక్కడ వాళ్ళ బాధని, దుఃఖాన్ని రాసాడు. తదనంతర కాలంలో ఆమె బాధను, ఆమె దుఃఖాన్ని పట్టించుకున్నారు. అట్లాంటి స్థితి తదనంతర కాలంలో ఉంటుంది.

అదే వస్తువును మనం చూసేటువంటి దృష్టికోణం నుండి కూడా ఆ వస్తువును ఎంపిక చేసుకొని, దాన్ని దర్శించినది రాయడం అనేది ఉంటుంది. అట్లా మనం చూసుకుంటూ వచ్చినప్పుడున్నది ఏది? వస్తు స్వీకరణలో మొదటిది, కవి యొక్క దృక్పథం అందులో ఉంటుంది. రెండోది కవి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కవి వ్యక్తిత్వం, కవి దృక్పథం, కవి సంస్కారం ఉంటుంది. వీటితో మాత్రమే కొత్త వస్తువును, అవసరమైన వస్తువును తీసుకుంటాడు. ఈ సంస్కారం అనేటువంటిది పరిణత రూపంతో గనుక లేకపోతే వస్తువు కవిత్వ వస్తువుగా సరితూగదు. ఇప్పుడందరు కూడా రాస్తున్నారు. ఈ ప్రపంచీకరణ వచ్చింతర్వాత మనందరికి తెలిసిందే. ప్రపంచీకరణ వచ్చాక మానవ సంబంధాలపైన ఎక్కువ కవిత్వం రాస్తున్నాం. ఇంతకు ముందు కనిపించదిది. వర్తమాన కవిత్వంలో అది కనబడుతుంది. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అని అందెశ్రీ రాస్తాడు, “పల్లె కన్నీరు బెడుతున్నదని” గోరెటి ఎంకన్న రాస్తాడు. అట్లా “ఎట్లున్నవే ఓ పల్లె” అని నేనాల కిశోర్ రాస్తాడు. “ముఖమో, పుస్తకమో కాని చోట మనం కలుసుకుంటున్నాం” అంటాడు నారాయణస్వామి. ఫేస్ బుక్ అనేదానికి ఆయన, ఫేస్ అంటే ముఖము, బుక్ అంటే పుస్తకము అని, ఇవి మనం కలుసుకునేచోట ముఖమూ ఉండదు పుస్తకము లేనిచోట, కానిచోట మనం కలుస్తున్నాం. అంటే ఈ ఫేస్ బుక్అంటారు. కాని ఫేస్ ఉండని, బుక్ ఉండని చోట కలుసుకుంటున్న అట్లాంటి ఒక స్థితిని వర్ణిస్తున్నారు. ఎక్కడైతే కవి ఆలోచన, దృక్కోణం మారుతుందో అక్కడ వస్తువూ మారుతుంది. ఇప్పుడు కవులు నాస్టాల్జియా అనేటువంటిది, ఇటీవల కాలంలో చాలామంది రాస్తున్నారు. మనందరికీ తెలిసిందే.

ముఖ్యంగా ప్రపంచీకరణ వచ్చాక అందరూ మారిపోయారు, ముఖ్యంగా యూజ్ అండ్ త్రో ఫిలాసఫీ వచ్చిన తర్వాత ఉపయోగించుకోవటం, పడేయటం, ఇలాంటివి వచ్చిన తర్వాత, గతంలో సిరంజీని వేన్నీళ్ళలో వేడి చేసి తిరిగి వాడేది, ఇంజక్షన్ చేసేవారు. స్టెరిలైజ్ చేసి వాడేవారు. ఇప్పుడు స్టెరిలైజ్ చేసే అవసరం లేదు. వేడినీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు యూజ్ అండ్ త్రో ఇంజక్షన్లు దొరుకుతున్నవి. అవి ఏసేస్తరు పడేస్తారు. ఇవి దొరుకుతున్నవి కనుక కొంటం తీసుకుంటం పడేస్తాం. ఇలాంటి ధోరణి వచ్చింతర్వాత మనకు నాస్టాల్జియా, బాల్యము – జ్ఞాపకాలు రాయటమనేది బాగా ఎక్కువవుతున్నది. దండెం మీద, మంచం మీద, టేబుల్ మీద వీటన్నింటి మీద కవిత్వం రాసేటువంటి పద్ధతి కూడా వచ్చింది. కనుక వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కవిత్వ వస్తువును ఎంపిక చేసుకోవటంలో ఒక అంశంగా చెప్తే, ఈ వస్తువులకు సంబంధించి మంచి పద్యం ఒకటున్నది. రామరాజ భూషణుడు తన ‘వసుచరిత్ర’లో ఒక పద్యం రాసాడు.

“కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నముల్

ఆద్యత్కథల్ వావిరి పుట్టు రత్నముల్

అవారిత సత్కవి కల్పనా విభూషావహ పూర్వ వృత్తములు

సానలు దీరిన జాతిరత్నముల్” -రామరాజు భూషణుడు

ఒక రత్నాన్ని వస్తువుగా తీసుకొని కల్పన చేసేప్పుడు అవి కృత్రిమ రత్నాలు కనుక ఆర్టిఫిషియల్ రత్నాలు అయితే, కేవలం వాటినే వర్ణిస్తే అవి కృత్రిమ ఆర్టిఫిషియల్ కనుక ఈ కృత్రిమ రత్నాలకు తేజం రాదు, కాంతి రాదు, శోభ రాదు, వెలుగు రాదు, సొగసు రాదు. కనుక కృత్రిమరత్నం, ఆర్ట్ ఫిషియల్ ఆర్ట్ ఫిషియలే గనుక. ఇది కల్పనా కథ. ఆయనన్నదాని ప్రకారమే “ఆద్య సత్కథల్…” పురాణాల్లో, ఉపనిషత్ లలో ఉండేటువంటి గొప్ప మంచి కథలు ఈ కథలు ఏవైతే ఉన్నవో అవి అన్నీ “పుట్టు రత్నాలు”. అంటే ముడిరత్నాలు. సానబెట్టనటువంటివి వాటికి కూడా సమస్యలు ఉంటాయి.  సానబెట్టినవి కూడా ఉంటాయి, సొగసుగా ఉంటాయి. మరి ఏవి తీసుకోవాలన్నా ఇవి కృత్రిమ రత్నాలైతే ఏమిటి? అవేమో ముడిరత్నాలైతే ఏమిటి? భూమిలోంచి తవ్వి తీసిన రత్నాలైతే ఏంటి? అంటే ఎవరైనా ఇష్టపడేది సానబెట్టినటువంటి జాతిరత్నాలనే తీసుకోవాలి. అవేంటివంటే “తత్కవి కల్పనా… పూర్వరూము” అవి జీవితంలో ఉండాలి, ఆ జీవితంలో ఉండేటువంటి కల్పనను, దానికి జోడించాలి, పూర్వవృత్తమై ఉండాలి. అంటే మానవ వృత్తమై ఉండాలి. దానియొక్క సంబంధాలలో ఉండేటువంటివి, మనిషి జీవితంలో ఉండాలి. పూర్వరూపంతో ఉండాలి. ఇవి కవి యొక్క కల్పనలు. ఇవి రెండూ జోడించినప్పుడు అవి జాతిరత్నాలుగా మారుతాయని వివరించాడు. మరి జాతి రత్నాలుగా భావించేవి, అటువంటి వస్తువును తీసుకుని, సానబట్టిన రత్నాలను తీసుకోవాలి. మనం జాతిరత్నాలు అనేవి ఎటువంటివో జాతిరత్నాల్లాంటివేవో అవి తీసుకోవాలన్నప్పుడు అనేటువంటిది కొంచెం ఈ పద్యాన్ని సరిబెట్టుకుంటే ఇది మనకు సమకాలీనమైన ఈ ముడిరత్నాన్ని మనం సానబెట్టుకోవచ్చు. మనం సానబెట్టుకోవడానికి దానికి కోణాల్ని కూడా తయారు చేసుకోవచ్చు. అంటే దానికి పార్శ్వాలు, దాని మూలాలు చెక్కినప్పుడు చేసే శోభ పెరుగుతుంది. దాని వెలుగు పెరుగుతుంది. కాబట్టి పార్శ్వాలూ, మూలాలు, కోణాలు తయారు చేసుకునేటువంటి పరిస్థితులలో మనం చైతన్యంతో ఉంటాము, అనేటు వంటిది వస్తుంది. అది మన మానసిక చైతన్యాన్ని బట్టి, పరివర్తనను బట్టి మానవ పరిమితిని బట్టి అది వస్తుంది. అందుకని మనం వస్తువు ఎంపికలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ఒక సామెత కూడా ఉన్నది. వెంట్రుకలున్న కొప్పు ఎట్లున్నా బాగుంటుందని. కొప్పు ముడిచినా బాగానే నైపుణ్యంతో చేస్తే బాగానే ఉంటది, జడేసుకున్నా బాగనే ఉంటది. ముందు మనకు సమృద్ధిగా వస్తువు ఉండాలి. ఉంటే ఆ వస్తువును ఎక్కడ చెక్కుకోవాలో తెలుస్తుంది. మనం తర్వాత మన యొక్క శిల్పనైపుణ్యాన్ని బట్టి చెక్కుతం. కాబట్టి ఈ వెంట్రుకల్లాంటి శిల్పం, వస్తువును ఎంపిక చేసుకోవడం అన్నట్టు.

ఇంకొక పోలిక కూడా చెప్పుకుందాం. వస్త్రం (క్లాత్) ఉన్నది. వస్త్రం అనేది మనం వస్తువు అనుకోవచ్చు. నేసినటువంటి వస్త్రం ఏదైతే ఉన్నదో దానిని వస్తువు అనుకుంటే, దాని ద్వారా మనం ధరించేటువంటి అంగీ లేదా షర్ట్ ను నిర్మించడమనేటువంటిది దాని యొక్క రూపం. వస్త్రం ఉంటేగదా మనం షర్టు కుట్టించుకోవటం అనేది, లేదా షర్ట్ ను తయారు చేసుకోవటమనేది జరుగుతుంది. అసలు వస్త్రమనేదే లేకుంటే షర్ట్ రూపం రాదు. కాబట్టి రూపానికి మలచాలనుకున్నప్పుడు వస్త్రమనేది ఉండాల్సిందే. మెరిసేటట్టు చేయాలనుకుంటే వజ్రాన్ని లేదా రత్నాన్ని అని అనుకుంటే ముందు ఆ ముడి సరుకు ఉండాలి .వస్త్రం అనేది ఉంటే దాన్ని షర్ట్ గా మార్చుకోవచ్చు.

ఒక మాట ఉన్నది నీ షర్ట్ గా కుట్టుమన్నాక కూడా మనమింకా దానికి ఏం జేస్తమంటే టెక్నిక్, షర్ట్ అనేటువంటిది దాని ఫామ్ అనుకుంటే, వస్త్రము దాని కంటెంట్, షర్ట్ అనేది దాని యొక్క ఫామ్. దాన్ని టెక్నిక్ లోకి మార్చి దాన్ని ఇంక కొంచెము టెక్నిక్ ను జోడించి డ్రస్ తయారు చేసుకోవడమూ అన్నమాట. డ్రస్ కు ఐరన్ చేసుకోవడమన్నమాట! మనకు ఫామ్ ఒకటి అవసరము. మనకు ఉతికినా, శుభ్రమైన వస్త్రమే కావచ్చు. ‘మనం’ వెంటనే వేసుకుంటామా అనేది, నచ్చకుంటే అలిగైనా సరే దాన్ని వేసుకోము. ఇస్త్రీ చేసేప్పుడు దానికి మరింత శోభ. అందుకని ఐరన్ చేయడమనేది టెక్నిక్ తో సమానం. ఐరన్ చేసి వేసుకుంటాం కదా అట్లా మనం దీనికి రకరకాల స్థాయిల్లో రకరకాల రూపాల్లోకి మార్చుకొని దానికి పదును బెట్టుకొని, సొగసును దెచ్చుకొని దాన్ని అందంగా తయారు చేసుకొని, అందరికీ ఆకర్షణీయంగా, ఎదుటి వ్యక్తిని ఆకర్షించేలా తయారు కావడమనేది ఉంటుంది. ఉంది, అని. అందు కొరకు అన్నింటి యొక్క లక్షణమేంటని అన్నప్పుడు, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలి. ఇది నచ్చటం అనేది. మనం ఎదుటి వ్యక్తికి ఎందుకు నచ్చాలి అనేదాన్ని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన చుట్టూ ఉంటారు. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటాను అని, నేను మార్చాల్సిన అవసరమే ముందీ అని కూడా అనుకుంటారు. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళలో స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది గాని, వాళ్ళను చూసి ఎదుటి వ్యక్తికి చేర్చాలి అని అనుకునేందుక్కూడా అవకాశమున్నది. ఎదుటి వ్యక్తి హృదయానికి ఒక విషయాన్ని చేర్చాలి అని అనుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని స్పందించాల్సిన అవసరమున్నది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం వస్తువు ఎన్నిక లోపల ఎన్ని రకాల అంశాలు, పాత్రలు వచ్చాయో చూడాలి. స్త్రీవాదం వచ్చినప్పుడు ఏ రకమైన వస్తువులు ఎన్నుకోవడం జరిగింది, దళితవాదం వచ్చినప్పుడు ఏ వస్తు స్వీకరణ జరిగింది. దర్శనంలో కూడా ఇదే చర్చ వస్తుంది. మనం అంతకుముందు చూసిందానికి తర్వాత చూసేదానికి దృష్టికోణం మారింది కనుక వస్తువు మారినది. అట్లా మనకు ఆ ‘చంద్రుణ్ణి’ అనే అంశాన్ని తీసుకొని, వాల్మీకి అందించాడు. రామాయణంలో వర్ణిస్తూ ఏమన్నాడు అంటే “యాగశాలలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఆంబోతులా ఉన్నాడు చంద్రుడు” అని అన్నాడు, వర్ణించాడు. ఈ యాగశాల అని ఎందుకు అన్నాడు అంటే ఆ రోజుల్లో ఈ యాగశాలలు ఉండేవి కాబట్టి అదే వాతావరణం ఉండేది. కాబట్టి అందులో తిరుగుతున్నట్టు అని వ్రాశాడు. ఇదే చంద్రుడు మళ్ళీ కలువుపువ్వును పుష్పింపజేసేటువంటి ప్రియుడిగా మారాడు. చంద్రుడు కలువరేడు, కలువలకు రాజు, కలువలకు ప్రియుడు అయినాడు. ఇదే చంద్రుడు శ్రీశ్రీ దగ్గరికి వచ్చేసరికి “కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగున్నాడు చంద్రుడు” అన్నాడు. అదే ప్రపంచీకరణ వచ్చిన తర్వాత చంద్రుణ్ణి ఒక కవి, తైదల అంజయ్య అనే కవి వర్ణించాడు. ఏమని అంటే చంద్రుడు ఒక ‘డాలరు’గా కనబడుతున్నాడు అని. అంటే ప్రపంచీకరణకు ముందు చంద్రుడు డాలరులాగా కనిపించ లేదు. రూపాయి నాణెంగా కనిపిస్తాడు. కానీ ప్రపంచీకరణ తర్వాత డాలరు రూపాయికి ప్రత్యామ్నాయంగా వచ్చినట్టు చూస్తాం. రూపాయి విలువ తగ్గింది గనుక డాలరు విలువ పెరిగింది కనుక, డాలరు అందరినీ ఆకర్షించింది గనుక, కవిని కూడా ఆకర్షించి, చంద్రుడు నాకెట్లా కనబడుతున్నాడంటే డాలరులాగా కనబడుతున్నాడని అన్నాడు. అట్లా ఎప్పటికప్పుడు చంద్రుణ్ణి చూసినటు వంటి దృష్టికోణంలో కూడా మార్పు వచ్చింది. పఠాభి అనే ఒక కవి ‘ఫిడేలు రాగాలు డజన్’ అనే కవితలో “చైనా బజారులో తగిలించబడిన ఒక పుష్పంలాగా ఉంది చంద్రుడు’. చైనాబజారులో తగిలించిన ఒక వస్తువులాగా ఉన్నాడు చంద్రుడు. జీవితంలోంచి ఆ వస్తువు యొక్క దర్శనం మారి పోతుంది. కవి వర్ణించడంలో ఈ ప్రత్యేకతలన్నీ వచ్చేసినవని చెప్పవచ్చు. వస్తువు స్వీకరణలో నాలుగు అంశాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 1. పరిచయమైన వస్తువై ఉండాలి, 2. సమకాలీన వస్తువై ఉండాలి, 3. మానవ భావోద్వేగాలను ప్రేరేపించేవాటిగా స్పందింపచేసేటువంటిదిగా ఉండాలి అని కవిత్వంలో వస్తువు చాలా కీలకమైనది అని మరోసారి చెప్తూ వస్తు ఎంపిక దగ్గర మన యొక్క ప్రత్యేకత, కవి యొక్క ముద్ర ఉందాలి. కవి యొక్క ప్రత్యేకత ఎంపిక దగ్గరనే కనబడాలి. ఎంపిక దగ్గర తన కవి ముద్ర నిరూపించుకోవాల్సి ఉంటుంది అనీ కవులంతా కూడా గుర్తించాలి. మంచి వస్తువును తీసుకొని మంచి కవిత్వం రాయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

August 25, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రైక్వుని కథ

by ఆచార్య మస‌న‌ August 25, 2021
written by ఆచార్య మస‌న‌

ఈ కథ ఛాందోగ్యోపనిషత్తులో ప్రసిద్ధమైంది. నిరుపేద ఐన రైక్వుడు ధనవంతుడైన జాన్రపతికి బ్రహ్మాపదేశం చేయడం  ఈ కథలోని ప్రత్యేకత.

పూర్వకాలంలో జాన్రశుతి గొప్ప దాతగా పేరొందినాడు. అతడు నెలకొల్పిన సత్రాలకు లెక్కే లేదు. అడిగినవారికెల్ల దాన ధర్మాలు చేస్తూ, తల్లిదండ్రులను సేవిస్తూ, అతిథి అభ్యాగతులను సత్కరిస్తూ హాయిగా ఉన్నాడు. తానే కీర్తిమంతుడనని భావించాడు.

ఆయన నెలకొల్పిన అన్న స్కూల్లో జనులు అన్నపానీయాలు స్వీకరిస్తూ, అతని గురించి, వేనోళ్ళ చెప్పుకుంటున్నారు. అందువల్ల అతని కీర్తి దశదిశలా వ్యాపించింది.

జాన్రశుతివల్ల ఆయన కాలంలో ఒక్కడు కూడా ఆకలితో అలమటించినవాడు లేడు. అన్న సంతర్పం మహాభాగ్యంగా భావిస్తూ, జానశ్రుతి తనకంటే పుణ్యాత్ముడెవడూ లేడని ఇంచుక గర్వపడుతూ ఉండేవాడు.

ఇట్లుండగా ఒక సత్రానికి ఇద్దరు పరమహంసలు వచ్చారు. వారిని జానశ్రుతి గమనించ లేదు. కాని వారి మాటలు వినే అవకాశం అతనికి లభించింది. తానంత గొప్ప అన్నదాత కనుక అతణ్ణి ఎవరే విధంగా కీర్తిస్తున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఆయనలో ఉంది. ఆ కారణం వారి మాటల్ని కూడా విన్నాడు.

ఒక పరమహంస మరొక పరమహంసతో దాతృత్వంవల్ల జానశ్రుతి తేజస్సు సూర్యునిలో సమానమై లోకమంతటా వ్యాపించింది. దాన్ని ఎవరైనా తాకితే వారి నది దహించి వేస్తుంది” అని పలికాడు. అప్పుడు రెండవ పరమహంస “జానశ్రుతి రైక్వుని ముందెంతటివాడు? బ్రహ్మజ్ఞానియైన అతనికి ఎవ్వరూ సాటి రారు. జానశ్రుతికి గల ధనబలం కన్న రైక్వుని జ్ఞానబలమే గొప్పది. జానశ్రూతికంటె రైక్వుడే పుణ్యవంతుడు” అని బదులు చెప్పాడు, బ్రహ్మవేత్త అని కీర్తించాడు కూడా.

ఈ మాటలు విన్న జానశ్రుతికి కోపం రాలేదుగాని, ఆ రైక్వుడెట్లుంటాడో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలన్న కోరిక కల్గింది. అనుకున్నదే తడవుగా తన సారథిని పిలిచి రైక్వుడెక్కడున్నాడో తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించినాడు. సారథి వెదకని చోటు లేదు. రైక్వుడనేవాడు గొప్పవాడై ఉంటాడనుకొని గొప్ప వాళ్లను మాత్రమే చూడసాగినాడు. యోగులు సామాన్యలుగా ఉంటారని, భగవంతునితో అన్ని ప్రాణులను చూసినట్లే, అన్ని ప్రాణుల్లో భగవంతుడు చూస్తారని పాపం సారథికి తెలియదు. అందుకే అతడు రైక్వుణ్ణి చూడలేకపోయాడు. నిష్ఫలుడై అరిగి వచ్చిన సారథిని సామాన్యులలో వెదకమని జానశ్రుతి ఆజ్ఞాపించాడు.

సారథి ఈ సారి మూలమూలన వెదికాడు. ఒక కుగ్రామంలో చిరిగిన బట్టలతో పెరిగిన గడ్డంతో, గోక్కుంటున్న దురద దేహంతో రైక్వుడు కనిపించాడు. అదే విషయం జానశ్రుతికి చెప్పాడు సారథి.

బ్రహ్మవేత్త ఐన రైక్వుని జాడ తెలిసిన జానశ్రుతి రైక్వుణ్ణి పేదతనం నుంచి విముక్తుణ్ణిచేసి, అతనివల్ల బ్రహ్మవిద్య సంపాదించాలనుకున్నాడు. ఒక బంగారు రథాన్ని సిద్ధపరిచి దానిమీద ఒక బంగారు పళ్ళెలో బంగారు నాణాలు నింపి బయల్దేరాడు. రథంతోపాటు మంచి పాలిచ్చే గోవుల్ని కూడా తీసుకొని వెళ్ళాడు.

అయితే ఆ సమయఁలో అతని కూతురు తండ్రి వెంట బయల్దేరింది. జానశ్రుతి చిన్న పిల్ల కదా అని వద్దన లేదు.

జానశ్రుతి రైక్వుని దగ్గరికి వచ్చి తాను తెచ్చిన కాన్కలను అతని ముందుంచాడు. తన మనస్సు తొందరపెట్టగా ‘ఓ స్వామీ నా కు మీరు ఉపాసించే దేవుణ్ణి గూర్చి ఉపదేశించండి” అని అర్థించాడు.

రైక్వుడు జానశ్రుతి అభిప్రాయం తెలుసుకున్నాడు. ధనం ఇచ్చి బ్రహ్మోపదేశాన్ని పొందాలనుకున్న జానశ్రుతిని ‘ఓ మూర్ఖుడా బ్రహ్మవిద్యను దేనితో కొనజాలరు. అది సమస్త సంపదలలో శ్రేష్ఠమైంది. నీ కాన్కలను తీసుకొని తిరిగి వెళ్ళిపో! అని ఆజ్ఞాపించాడు.  జానశ్రుతికి తాను ఆనాటి కాలంలో గొప్ప ధనవంతుడిననే అహంకారం ఉంది. ఎప్పుడైతే రైక్వుడు ఆ మాటలాడినాడో ధన గర్వాన్ని విడిచిపెట్టిన వాడయ్యాడు. క్షమించమని వేడుకున్నాడు. రైక్వుడు దయగలవాడై జానశ్రుతిలో ఇట్లన్నాడు. “ఇదిగో నీ అవస్థను నీ కూతురు చూస్తున్నది. ఆమె ముఖము చిన్నబోయింది. నేను అమ్మాయి ముఖం చూసి నీకు ఉపదేశం చేస్తానని చెప్పగా జానశ్రుతి ఎంతో ఆనందించాడు.

రైక్వుడు జానశ్రుతికి బ్రహ్మొ         పదేశం చేశాడు. ‘దానికే సంసర్గ విద్య’ అని పేరు.

“ప్రాణం దేన్నైనా తనలో కలుపుకుంటుంది. అగ్ని, సూర్యచంద్రులు బ్రహ్మాండంతో ప్రకాశక లోకాలన్నీ ప్రాణమే తనలో కలుపుకొని ఉంటుంది. అట్లే మన శరీరంలో వాక్కు, నేత్రం, శ్రోత్రం, మనస్సు దానిలోని చెక్కు చెదరక ఉంటాయి.

లోకంలోని ప్రాణశక్తి గొప్పిది. దానికి రెండు స్థానాలున్నాయి. ఒకటి, శరీరగత ప్రాణం, రెండు బ్రహ్మాండాంతర్గత ప్రాణం. నిజానికి ఈ ప్రాణశక్తి పరమాత్మ మహిమ చేతనే శరీరంలోనూ, బ్రహ్మాండంలోను పనిచేస్తుంది. పరమాత్మ ఆజ్ఞను శిరసావహించి ప్రపంచంలోని పదార్థాలను తనలో లీనం చేసుకుంటుంది. ఈ విషయం మానవాళికి తెలియదు. అందుకే వారు ప్రాణానికి ప్రాణమైన పరమాత్మను గుర్తించలేకపోతున్నారు” అంటూ రైక్వుడు ఒక కథ చెప్పాడు.

“ఒక బ్రహ్మచారి అతిథిగా ఒక ఇద్దరు మిత్రులు ఉన్న ఇంటికి వచ్చాడు. వారప్పుడు అన్నం తినడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మచారి తనను కూడా అన్నం పెట్టమని కోరాడు. కాని వారు తిరస్కరించాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి వారితో “మీరు నాకు కాదు అన్నం పెట్టేది. ప్రాణదేవత తృప్తి పడడానికే నేను మిమ్మల్ని అన్నం అడుగుతున్నాను. నిజానికి ఈ ప్రాణమే బ్రహ్మాండంతో అన్నాన్ని సృష్టించడానికి కారణమవుతుంది. అట్లే మన శరీరంలో ఉండి శరీరం నడవడానికి, ముఖ్యంగా ఇంద్రియాలు బలంగా ఉండడానికి అదే అన్నాన్ని స్వీకరిస్తుంది. ఈ విధంగా అన్నాన్ని సృష్టించిన ప్రాణమే ఆకలిగొని తింటుంది. అంతేకాని మనం కాదు, దీన్నిబట్టి తెలుస్తున్నదేమనగా ప్రాణశక్తి ఏ విధంగా అన్నాన్ని గ్రహిస్తుందో, అట్లే సమస్త లోకాలను పరమాత్మనే తనలోకి గ్రహిస్తాడు. అనగా లయం చేస్తాడు. అన్నం ఒకరిది కాదు. అది పరమాత్మచే ఈయబడింది. తినేది ప్రాణమేగాని, మనం (అనగా జీవులం) అజ్ఞానం చేత తింటున్నామనుకుంటున్నాం. ఇది సత్యం కాదు. కనుక నాకు అన్నం పెట్టడం పుణ్యమేగాని పాపం కాదు” అని వివరించాడు.

బ్రహ్మచారి మాటల్లో సత్యాన్ని గ్రహించి ఆ మిత్రులు అతని కన్నం వడ్చించారు. బ్రహ్మచారి తృప్తిగా ఆరగించి వెళ్ళిపోయాడు. పరమాత్మ సృష్టికర్తయే కాదు, సృష్టి కర్త కూడా.” అన్నసత్రాల్లో నీవిచ్చే అన్నం పరమాత్మ సృష్టించిందేగాని ఓ జానశ్రుతీ! నీవు సృష్టించింది కాదు. అట్లే ఆ పరమాత్మ సృష్టించిన ప్రాణమే అన్న వృద్ధికి తడ్పడుతూ, పిండగతమై ఆకలి తీర్చుకుంటుంది. అన్నం ఒకరిది కాదని, దానిమీద మానవునికధికారం లేదని, అన్నం అందరిదని, ప్రాణాన్ని తృప్తిపరచడానికి అన్నాన్ని స్వీకరిస్తున్నట్లు గ్రహించాలి తప్ప తనదనే భావన సరైంది కాదు. ఇదే నీకిచ్చే బ్రహ్మోపదేశం” అని రైక్వుడు పలకగా జానశ్రుతి ఎంతో ఆనందించాడు. తాను తెచ్చిన కాన్కలను అతనికి సమర్పించాడు.

ధనాశలేనివాడై, ఇంద్రియాలను జయించినవాడై, బండినడుపుతూ నిరుపేదగా జీవితాన్ని గడుపుతున్న రైక్వుడు నివసించే గ్రామం ‘రైక్వవర్ణం’ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి అతని కీర్తి దశదశిలా వ్యాపించింది.

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్వరాంజలి-2 అన్నమయ్య

by Krishna Kumari Yagnambhatt August 25, 2021
written by Krishna Kumari Yagnambhatt

అన్నమయ్య కేవలం వాగ్గేయకారుడు మాత్రమే కాదు. పదానికి లక్షణాలను వివరిస్తూ గ్రంథాలు రచించాడు. వాటికి లక్ష్యాలుగా వందలాది పదాలను రచించాడు. తాను రచించిన పదాలను భక్తి, శృంగార రచనలుగా ఆయన విభజించినప్పటికి పద్యం అంటే ఆ కాలానికి భక్తి రచన అన్న అర్థంలోనే వ్యవహరింపబడింది. శృంగాలు పదాలు క్షేత్రయ్య నాటికి వాడుకలోకి వచ్చాయి.  అవే పదాలు త్యాగరాజ స్వామి కాలం నాటికి ఆధ్యాత్మిక కీర్తనలుగా పేరు పొందాయి. ఈ వివరాలు ముందు వ్యాసాలలో తెలుసుకుందాం. పదాల అనంత స్వరూపాన్ని అన్నమయ్య అతి మనోహరంగా ప్రదర్శించారు. వైష్ణవ భక్తిని, సంగీతాన్ని, సాహిత్యాన్ని కలిపి త్రివేణి సంగమం చేశారు. తర్వాత ఈ సంప్రదాయాన్ని వీరి వంశస్థులు అంటే అన్నమయ్య పత్ని తిమ్మక్కతో బాటు వారి కుమారులు పెద తిరుమలాచార్యులు, మనుమడు చిన తిరుమలాచార్యులు కొనసాగించారు. అన్నమయ్య కేవలం తన కుటుంబంలోని వారిని మాత్రమే ప్రభావితం చేయలేదు, తర్వాతి కాలంలో వచ్చిన ప్రతీ వాగ్గేయకారుడు వీరి ప్రభావానికి లోనయినవారే. అందుకే పదం అన్నా, సంకీర్తనం అన్నా అన్నమయ్య మొదటగా గుర్తుకొస్తారు. 12 సంవత్సరాల వయస్సులో శ్రీ వేంకటేశ్ర స్వామిని ప్రత్యక్షం చేసుకున్న వీరు తన జీవిత కాలంలో 32 వేల సంకీర్తనలను రచించారు. ప్రస్తతం అన్నీ కాకపోయినా రాగి ఫలాకాల మీద దొరికిన సంకీర్తనల నాధారంగా పరిశీలించినట్లయితే అన్నమయ్య కవితా వైభవం అర్థమవుతుంది. అన్నమయ్య రచనలలో నవవిధ భక్తి మార్గాలు కనిపిస్తాయి.

తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా

ర్ఛనముల్ సేవయు నాత్మలో నెరుకయన్ సంకీర్తనల్ చింతనం

బను నీ తొమ్మీది భక్తి మార్గముల సర్వాట్మున్ హరిన్ నమ్మిస

జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్….. అన్న ప్రహ్లాదుని ఈ భక్తి ప్రకటనలో మనకు ఈ తొమ్మది భక్తి మార్గాలు తెలుస్తున్నాయి. భక్తికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఇంకొకటి లేదు. అన్నమయ్య రచనలలో ఈ భావాలన్నీ గోచరమవుతాయి. ఉదాహరణకి చూడండి,

సఖ్యము :

పల్లవి : కూరిమి గలిగితే చాలు కోపించినా మేలువో

అరయ నో రమణుడ అంతాను మేలువో

చరణం : మనసున నీవు నన్ను మరవకున్న జాలు

యేనసి నీ వేడ నున్నా వియ్యకలే పో

ననువు వలపు నీవు నాపై జల్లితే చాలు

వెనుక నీవేమన్నా వేడుకనే పో.

శ్రవణం :

పల్లవి : ఇందు నుండి మీ కెడ లేదు

సందడి చేయక చనరో మీరు

చరణం : నాలుక శ్రీహరి నామంబున్నది

తూలుచు బారరో దురితములు

చాలి భుజంబున చ్రకంబున

తారిమి భవబంధములటు దలవో,

దాసత్వము :

పల్లవి : పాప పుణ్యముల పక్వమీదెరుగను

నా పాలిటి హరి నమో నమో

చరణం : మానస వాచక కర్మంబుల

తానకముగా నీ దాసుడను

పూని త్రీ సంధ్యల భోగ భాగ్యముల

నానా గతులను నమోనమో

వందనం :

పల్లవి : నీ యంత వాడనా నేను నేరము లేమెంచేవు

యీ యెడ నిరుహేతుక కృప జూడు నన్నును.

చరణం : నిరతి నిన్నెరుగను నీవు నన్నెరుగుదువు

ధర యాచకుడ నేను దాతవు నీవు

వరస యాచకుడ నేను వైకుంట పాటివి నీవు

నరుడ నేను నీవు నారాయణుడవు

అర్చనం :

పల్లవి : భావించి తెలుసుకుంటే భాగ్య పలము

ఆవలీవలి ఫలములంగజ జనకుడే

చరణం : దానములలో ఫలము తపములలో ఫలము

మోసములలో ఫలము ముకుందుడే

జ్ఞానములలో ఫలము జపములలో ఫలము

ఆత్మలో ఎరుక :

పల్లవి : హరి శరణాగతి యాతు మది

సరుస నిదియే పో సతమయ్యేడది.

చరణం : దిన దిన రుచులివి దేహముది

చెనకేటీ కోరిక చిత్తముది

యెనసేటి కాంతలు యింద్రీయంబులు లవి

పనివి యాత్మ కవి పని లేదయ్యా.

సంకీర్తన : వినుడిదే రఘుపతి విజయములు

పనుపడి రాక్షస బాధలుడిగేను.

చరణం : కుల గిరు లదిరెను కుంభిని వడకెను

ఇల రాముడు రథ మెక్కినను

కలగె వారధులు కంపించె జగములు

బలు విలునమ్ములు పట్టినను.

చింతనం :

పల్లవి : వెరపులు నొరవులు వృథా వృథా

ధరపై మరి యంతయును వృథా,

చరణం : తడయక చేసిన దానంబులు వృథా

యెడ యెడ నెరిగిన యెరుక వృథా

ఒడలిలోన హరి నొనరగ మతిలో

దడవని జీవమ తనకు వృథా.

అన్నమయ్య పదాలు లేదా సంకీర్తనలలోని సంగీతం మనకు పూర్తిగా లభించలేదు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి అపార కృషివలన సంగీతబద్ధమైన సాహిత్యంతో కూడిన రాగిరేకులు లభించినప్పటికీ వాటి గురించి సంపూర్ణమైన సమాచారం ఇంకా వెలుగులోకి రాలేదు. అంతవరకు అన్నమయ్య సంగీతపు పోకడల గురించి ఒక అభిప్రాయానికి రాలేము. సాహిత్యానికి సంబంధించినంత వరకు అన్నమయ్య రచనలు ఎంతో లలితమైనవి, సుకుమారమైనవి. అందరికీ అందుబాటులో ఉన్న ప్రజాభాష ఇది. సామాన్యమైన భాషను ఉపయోగించినప్పటికీ ఈ కీర్తనలు అన్నమయ్యను పదకవితా పితామహునిగా చేసినాయి. వచ్చే వ్యాసంలో ఇంకొక వాగ్గేయకారుని గురించి తెలుసుకుందాం.

 

డా. కృష్ణ కుమారి 9885451014

 

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సైఫీ కథనరీతి

by బి.వి.ఎన్.స్వామి August 25, 2021
written by బి.వి.ఎన్.స్వామి

ఫిక్షన్‌ అంటే కల్పన. ఊహ ఆధారంగా కల్పన జరుగుతుంది. వాస్తవాధీన కల్పన కావచ్చు వాస్తవ దూర కల్పన కావచ్చు మరింకే విధమైన కాల్పనిక సాహిత్యమైన కావచ్చు అదంతా ఫిక్షన్‌ అనబడుతుంది. ప్రయోగపూర్వకంగా నిరూపితమైనదే (Tested and proved)  సైన్స్‌. ఇందులో కల్పనకు తావులేదు. ప్రయోగం ద్వారా నిరూపించబడి, ఫలితం కనపడడం సైన్స్‌కు ప్రమాణం. ఖచ్చితము, నిర్దిష్టము అయిన సూత్రాల సమాహారం సైన్స్‌. శాస్త్రవిజ్ఞానము, ప్రయోగశాస్త్రము పేర్లేమైనా కాని సైన్స్‌కు ఆధారం ప్రయోగం. ప్రయోగ క్రమం కూడా ముఖ్యమే. వీటన్నిటి సమ్మేళనంగా శాస్త్రవిజ్ఞాన సూత్రాల ఆవిర్భావం జరుగుతుంది. తద్భిన్నంగా ఊహాజనితమైన కల్పన కనపడుతుంది. కల్పనా సాహిత్యాన్ని ఫిక్షన్‌ అంటారు. సైన్స్‌కు ఫిక్షన్‌కు పొంతన కుదరదు. పొంతన కుదిర్చే, రెంటిని మేళవించే సాహిత్యాన్ని సైన్స్‌ ఫిక్షన్‌ అంటారు. దీన్ని వైజ్ఞానిక కల్పనా సాహిత్యం అని కూడా అనవచ్చు. ముచ్చటగా ముద్దుగా ”సైఫీ సాహిత్యం” అని పిలుచుకోవచ్చు.

ఖగోళ, పాతాళ రహస్యాల్ని ఛేదించపూనుకున్న మనిషికి సైన్స్‌ చేయూతనిస్తుంది. సుఖవంతమైన, అభివృద్దికరమైన జీవితానికి బాటలు పరుస్తుంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో పరుగులతో పురోగమిస్తున్న మానవుడు ప్రతిసృష్టి చేస్తున్నాడు. రోబోలకు జన్మనిచ్చాడు. కృత్రిమ మేధను సృష్టిస్తున్నాడు. ఇవన్ని కూడా మనిషి భౌతిక, నైతిక దృష్టిలో అపూర్వమైన మార్పును తెచ్చాయి. ఆ మార్పు తెచ్చిన ఫలితాన్ని, మానవ జీవితాలపై దాని ప్రభావాన్ని సైన్స్‌ఫిక్షన్‌ చిత్రిస్తుంది. విజ్ఞాన శాస్త్రం అందించిన జ్ఞానం, వెర్రితలలు వేయకుండా ఎలా కాపాడుకోవాలో చెపుతుంది. సైంటిఫిక్‌ దృక్ఫథాన్ని ఎలా అలవరుచుకోవాలో, దాన్ని జీవితానికి ఎలా వర్తింప చేయాలో నేర్పుతుంది. టెక్నాలజీ ఆధారంగా భవిష్యత్తులో జరిగే మార్పుల్ని, అది సమస్త విశ్వంపై అనగా జీవ, నిర్జీవాలపై చూపే ప్రభావాల్ని, మార్పుల్ని సహేతుకంగా విడమరుస్తుంది. అంతరిక్షయానం, గ్రహాంతర జీవులు గ్రహాంతర యుద్ధాలు సమాంతర విశ్వం, గతంలోకి, భవిష్యత్‌లోకి కాలప్రయాణం కంప్యూటర్లు, ఖగోళవింతలు, పాతాళరహస్యాలు, భూగోళమర్మాలు ఇవన్ని ఈ సాహిత్యపు ముడిసరుకులు. సైన్స్‌ ఆధారంగా భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఊహించి కూడా సైన్స్‌ ఫిక్షన్‌ చెబుతుంది. ‘ఒక వేళ అలా జరిగితే’, ‘అలా ఎందుకు జరిగింది’ అనే అనుమాన ప్రమాణాలు సైన్స్‌ ఫిక్షన్‌కు ఆధారభూతాలు.

సైన్స్‌ ఫిక్షన్‌ 21వ శతాబ్దానికి ఆనవాలుగా నిలుస్తుంది. ఇది కొత్త ప్రపంచాన్ని కొత్త విలువలను ఆవిష్కరిస్తుంది. సైన్స్‌ ఛురకత్తి లాంటిది. స్వార్థానికి వాడుకుంటే నాశనం, ప్రగతికి వాడుకుంటే కళ్యాణం. సైన్స్‌ ప్రయోగాలు తప్పుదారి పడితే భయంకర పరిణామాలు, పర్యావరణ సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. సైన్స్‌ను ఊతంగా చేసుకొని అనైతిక చర్యలు, అసంబద్ధ పనులు జరుగుతున్నాయి. వీటివల్ల మానవ సంబంధాల్లో వస్తున్న మార్పును, భవిష్యత్‌లో జరుగబోయే పరిణామాలను సైన్స్‌ ఫిక్షన్‌ చెబుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు సమాజాన్ని సిద్దం చేస్తుంది. సైన్స్‌ ప్రళయాన్ని ప్రశాంతతను సృష్టిస్తుంది.  ఈ స్థితి గతుల పట్ల సమాజానికి జాగరూకత నేర్పుతుంది. భవిష్యత్‌లో సాధ్యపడగల ఘటనలను మనం చూడగల సన్నివేశాలను హేతుబద్ద ఆధారాలతో, రుజువులతో ఊహలతో కూడిన సాహిత్యాన్ని సైన్స్‌ ఫిక్షన్‌ అందిస్తుంది. ఇక్కడే ఉత్సాహవంతులైన రచయితలు, ఎన్నడూ సాధ్యపడని జరగబోని ఘటనలను, ఉనికిలో లేని లోకాలను ఊహించి ఫాంటసీలను సృష్టిస్తున్నారు. వాటిని సైన్స్‌ ఫిక్షన్‌లో చొప్పిస్తున్నారు. ఫాంటసీకీ సైన్స్‌ ఫిక్షన్‌కు అభేదాన్ని చూపుతున్నారు. సైన్స్‌కు విరుద్దమైన ఫిక్షన్‌, మరియు ఫాంటసీలు క్రమంగా సైన్స్‌తో జతకలిసి సాహిత్యాన్ని సృష్టించాయి. అందుకే సైన్స్‌ ఫిక్షన్‌, సైన్స్‌ ఫాంటసీ అనే పదాలు వాడుకలోకి వచ్చాయి. ఈ రెండు భావనలను ఒకేచోట చేకూర్చగల ”స్పెక్యులేటివ్‌ ఫిక్షన్‌” అనే మాటకు నేడు ఆమోదం దొరికింది. ఆ విధంగా సైన్స్‌ ఫిక్షన్‌ సాహిత్యానికి ఒక విశాల భూమిక ఏర్పడింది.

తెలుగు కథా సాహిత్యంలో సై.ఫి. కథలు చాలా తక్కువగా వచ్చాయి. సామాజిక పరిణామాలకు, సంఘ జీవితానికి పెద్దపీట వేసే ధోరణి వల్ల కావచ్చు, ఆధ్యాత్మిక వైఖరుల వల్ల కావచ్చు. క్లిష్టమైన పని కావడం వల్ల కావచ్చు. కొత్త ప్రయోగాలను ఆహ్వానించలేని దృష్టి కావచ్చు, ఇంకా ఇతర కారణాలేవైనా కావచ్చు తెలుగులో ఇలాంటి కథలు రాలేదు. తెలుగు సాహిత్యంలో ”సైన్స్‌ఫిక్షన్‌” ప్రాచుర్యం పొందడానికి కారణమైన వారిలో కె. సదాశివరావు ఒకరు. గ్రహాంతర యానాలను, నూతన మానవ జీవన శైలిని చిత్రించిన వీరి ”ఆత్మాఫాక్టర్‌” ”మానవ ఫాక్టర్‌” రెండు సీక్వెల్‌ కథలు. ఇలాంటి కథలు రాసిన అతి కొద్దిమందిలో డా|| మధుచిత్తర్వు ఒకరు. వీరి కథలను సైన్స్‌ ఫిక్షన్‌, మెడికల్‌ ఫిక్షన్‌ అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. ఎక్కువ క్లిష్టమైన సాంకేతిక వివరాలతో ఉంటే ”హార్డ్‌కోర్‌ సైన్స్‌ఫిక్షన్‌” అనీ సరళమైన వివరాలతో ఉంటే ”సాఫ్ట్‌కోర్‌ సైన్స్‌ ఫిక్షన్‌” అని పిలువచ్చని డా|| మధు అభిప్రాయపడ్డారు.

డా|| మధు చిత్తర్వు రాసిన కథ ”అంగారకం”

”ఏస్ట్రోనాట్‌ శరభ శర్మ!

కెప్టెన్‌ శరభశర్మ

”స్పేస్‌ సూట్‌లోనికి ఏదో పదునైన వస్తువు గుచ్చుకుపోయింది. అతను వేసుకున్న స్పేస్‌ సూటులో ఒత్తిడి క్రమంగా తగ్గిపోసాగింది. అంగారకుడి తక్కువ పీడనం ఉన్న వాతావరణం అతని శరీరాన్ని నొక్కివేయసాగింది. సూటుని గుచ్చుకున్న వస్తువు ఏమిటో! విరిగిపోయిన ఏ డిష్‌ ఏంటెన్నా రాడ్‌ ఏమో! లేక మరేదైనా పదునైన వస్తువు కావచ్చు! ఏదయి వుంటుంది? శరభశర్మ స్పేస్‌ సూటులోని ”సెన్సర్‌”లు వెంటనే రంద్రాన్ని పూడ్చివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆటోమాటిక్‌గా ఎక్కువ ఆక్సిజన్‌ వదిలాయి. సూటులోని ఒత్తిడి తగ్గిపోతుందని సూచించే అలారం చేతుల్లో మోగసాగింది”.

”కింద పడిన వెంటనే శరభశర్మకి కొంచెం కొంచెంగా స్పృహ తప్పసాగింది.

అతని చుట్టూ కుజుడిలోని భీకరమైన దుమ్ము తుఫాను చప్పుడు లేకుండా రేగుతూనేవుంది.”

పాఠకుడిని ఆకర్షించే సైన్స్‌ ఫిక్షన్‌ ఎత్తుగడ ఇది.

”కుజుడులో జీవమే లేదు. ఉండే అవకాశం కూడా లేదు. ఆక్సిజన్‌ లేదు. నీళ్ళు లేవు. వాతావరణం లేదు. సముద్రాలు మిలియన్‌ సంవత్సరాల క్రితమే ఎండిపోయాయి. గాలినిండా కార్బన్‌ డయాక్సైడ్‌, ఆర్గాన్‌ అనే నోబుల్‌ గ్యాస్‌లు మాత్రమే వున్నాయి. ఎప్పుడూ ఎర్రటి ధూళి, ఇసుక, దుమ్ము, గాలి, పెద్ద ఎర్రరాళ్ళు, లోతైన క్రెటర్స్‌ అనబడే గోతులు! ఇవి తప్ప ఇక్కడ ఏమి లేదు. ఇది రోమాంటిక్‌గా లేని వాస్తవం”.

కుజగ్రహం పైన ఉన్న పరిస్థితి అది. అలాంటి గ్రహం పైకి పరిశోధనల నిమిత్తం వ్యోమగాములు వెళ్ళారు. అందులో శరభశర్మ ఒకడు. పైన స్పేస్‌వాక్‌ చేసే సమయంలో కుజ తుఫాన్‌ బారిన పడతాడు శర్మ. తన సహచరులు అతనిని వదిలి కుజగామినిలో వెళ్ళిపోతారు. ఇప్పుడు కుజగ్రహంపై అతనొక్కడే మిగిలాడు. ”ఇక్కడి నుంచి సమాచారం మాతృనౌకకి ఇవ్వాలి. షార్‌ కేంద్రానికి ఇవ్వాలి. ఎలా?” శరభశర్మ వ్యోమగామి అయినా దేవుడిని నమ్ముతాడు. హిందువు, తెలుగువాడు కాబట్టి ”ఏడుకొండలవాడా! ఈ ఉపద్రవం నుంచి కాపాడు” అనుకున్నాడు. నంబియార్‌, లతీఫ్‌, అశ్విన్‌, ఎక్కడరా మీరు? నన్నొదిలిపోతార్రా బాస్టర్డ్స్‌! నిశ్శబ్దంగా అరిచాడు. ఇలా సాగుతుంది కథ.

ఈ పరిస్థితుల్లో అతని ఆలోచనలు కుటుంబం చుట్టూ తిరుగుతాయి. ఇక్కడ మానవ సంబంధాల విషయాలు, తదనంతర పరిణామాల్ని రచయిత చర్చించాడు. సైన్స్‌నుండి సమాజం వైపు కథ తిరిగింది. సైన్స్‌ఫిక్షన్‌ లో కేవలం సైన్స్‌ మాత్రమే కాకుండా మిగిలిన మానవీయ అనుభూతులను కూడా పొందుపరచవచ్చు. తప్పిపోయిన శర్మ గురించి ఇండియాలోని శ్రీహరి కోట నుండి గాలింపు మొదలయింది. బతికున్నాడో లేడో అనే ఆదుర్ధా, అతని భార్యకు ఏమి చెప్పాలో తెలియని అవస్థ అధికారుల్లో తలెత్తింది. ”నోనోసర్‌! మొత్తం మూడు వందల ఇమేజస్‌ క్లోజ్‌గా ఎనలైజ్‌ చేశాను. ఇకడౌట్‌లేదు. మనరోవర్‌ క్రాఫ్ట్‌ కార్గోషిప్‌కి ఏడు కిలోమీటర్ల దూరంలో కదుల్తోంది. డబుల్‌చెక్‌ చేసాను. రష్యన్లు, అమెరికన్లు కూడా ”కన్‌ఫర్మ్‌” చేశారు అంది శాటిలైట్‌ ఇమేజ్‌ ఎనలిస్ట్‌”. ఇది భూమి పై జరుగుతున్న పని.

శరభ శర్మ, కుజగ్రహంపై ఉండి భూమిపై ఉన్నవారితో ఎలా సంబంధాలు పెట్టుకోవాలో ఆలోచిస్తున్నాడు. 1800 కిలోమీటర్ల దూరంలోని మౌంట్‌ ఒలంపస్‌ ప్రాంతానికి ప్రయాణించాలి. అక్కడ దిగబోయే అమెరికన్‌ అంతరిక్ష నౌక కోసం ఎదురుచూడాలి. అంతవరకు బతకాలి అనుకున్నాడు.

షార్‌కేంద్రం శ్రీహరి కోటలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. వీడియోకాన్ఫరెన్స్‌లో అమెరికా నాసా, చైనా అంతరిక్ష కేంద్ర అధికారులు ఉన్నారు. వనజామూర్తి, కేంద్ర మంత్రి కూడా మీటింగ్‌ లో ఉన్నారు.

సుబ్రావ్‌ చెప్పసాగాడు. ”సర్‌! అన్ని శాటిలైట్‌ ఫోటోల విశ్లేషణల అనుసారంగా ఒకటే స్పష్టం అవుతుంది. ఎస్ట్రోనాట్‌ శరభశర్మ బతికే ఉన్నాడు. రోజూరోవర్‌క్రాఫ్ట్‌లో ఉదయం పది గంటలనుంచి సాయంత్రం ఐదువరకు తిరిగి వెళ్తున్నాడు. ఇదే పని నెలరోజులుగా  చేస్తున్నాడు. అతని వద్దనుంచి కమ్యూనికేషన్‌ లేదు.”

”రెండు రోజులలో అతను రెండు రోవర్‌ క్రాఫ్ట్‌ వాహనాలని కలిపి బిగించాడు అనిపిస్తుంది. ఇప్పుడు రెండు రోవర్లు ఒకదాని వెంట ఒకటి కదుల్తూ కనిపిస్తున్నాయి. బహుశ అతని ఉద్దేశ్యం ఒక రోవర్‌లో ఆహారం, నీరు సప్లయిలు పెట్టుకొని మరొక దాంట్లో సుదూర ప్రయాణం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడేమో! అది బహుశ భూమినుంచి వెళ్ళే మరొక మిషన్‌ నౌక దిగే చోటికి అయివుండొచ్చు” అన్నాడు షార్‌ డైరెక్టర్‌.

కేంద్రమంత్రి గంభీరంగా అన్నారు. ”త్వరగా ఏదో చేయాలి. మిష్టర్‌ సుబ్రావ్‌! ఈ రక్షణ కార్యక్రమం ఇన్‌చార్జ్‌గా బాధ్యత మీకిస్తున్నాను. మీరు డైరెక్ట్‌ చేయండి. వివరాలు రెండ్రోజుల కొకసారి తెలియజేయండి. ప్రెస్‌ వారికి కూడా ఇదే తెలియజేయండి. తప్పక సక్సెస్‌ కావాలి! ఇది దేశ ప్రతిష్టకి సంబంధించిన విషయం! అని లేచాడు.

అలా శరభశర్మను రక్షించటానికి అనేక ఆలోచనలు చేయసాగారు.

శరభశర్మ రోవర్‌లో ప్రయాణిస్తున్నాడు. ఉత్తరం వైపు రెండు వేల కిలోమీటర్లు దూరం ఇలా ప్రయాణించగలడా? ఆహారం సరిపోదు. కమ్యూనికేషన్స్‌ లేవు. మరణం తథ్యం అనిపిస్తుంది. మధ్యలో తనకున్న పరిజ్ఞానం ఉపయోగించి కమ్యూనికేషన్స్‌ వ్యవస్థ బాగు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ఎర్రని నేల, నల్లటి ఆకాశంలో రాత్రుళ్ళు మెరిసే చుక్కల మధ్య కుజుని చంద్రుళ్ళు డిమోస్‌, ఫోబియస్‌లు ఉదయించడం, అస్తమించడం, పల్చని వెన్నెల చిమ్మడం, ”కార్గోషిప్‌”లో సీడీలు టీవీలా చూడటం ఎండిపోయిన రొట్టెలు, పళ్ళు డబ్బాలోని పళ్ళ రసాలు, పాలతో కడుపునింపడం ఈ నిశ్శబ్దంలో దేవుడు కనిపించాడు శర్మకి. ఆదేవుడు విశ్వరూపుడు. అనంతుడు. కానీ తనని ఇప్పుడు రక్షించలేడు. ప్రార్థిస్తున్నా సరే! రోజు గంట ప్రార్థన చేసేవాడు…. నెల రోజుల తర్వాత ఓ రోజు నిజంగా అతని ప్రార్థన ఫలించింది.

ఈ రోజు ఉదయమే లేచి మళ్ళీ సిగ్నల్‌ యూనిట్‌కి, స్పీకర్‌ యూనిట్‌ వైర్లు కలిపి సోలార్‌ పవర్‌ కనెక్ట్‌ చేసి, డిష్‌ యాంటెనా వైరు కలిపి, వైరుని బయట షిప్‌ రూఫ్‌ మీద వేసి బటన్‌ నొక్కాడు.

ఆశ్చర్యం! రిసీవర్‌లో స్టాటిక్‌ చప్పుడు, శబ్దాలు!

”ఓ దేవదేవా! వెంకటేశ్వరా! తెలుగు దేవుడిని తల్చుకుని ”థాంక్యు” అని అరిచాడు శరభశర్మ. వెంటనే హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకొని మైక్‌ తగిలించుకొని చకచకా ఫ్రీక్వెన్సీలు మార్చి బటన్స్‌ నొక్కసాగాడు.

”మే డే! మే డే! (ఎమర్జెన్సీని సూచించే పిలుపు) శర్మా హియర్‌, శర్మా హియర్‌, మార్స్‌ బేస్‌ క్యాంప్‌, మేడే మేడే” సందేశం ఇవ్వసాగారు. ఇరవై నిమిషాలు గడిచాక ఒక అద్బుతం. ”రోజర్‌! రోజర్‌! శర్మా! నేను అంగారకాయాన్‌ కమాండర్‌ అశ్విన్‌ మాట్లాడుతున్నా! నీ మెసేజ్‌ అందింది! నిన్ను తీసుకపోవడానికి ఖచ్చితంగా వస్తున్నాం. మళ్ళీ వినబడిందా చెప్పు!

అతనికి జీవితం మళ్ళీ తిరిగివచ్చి వేయి చేతులతో ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. ”రోజర్‌! రోజర్‌! నీ వాయిస్‌ క్లియర్‌!” ”మళ్ళీ కోపంగా” అన్యాయం కెప్టెన్‌! నన్నొదిలి అందరూ వెళ్ళి పోయారా? యూ బాస్టర్డ్స్‌! నన్ను చనిపోయాడని వదిలిపోయారా, యూపిగ్స్‌!”

కెప్టెన్‌ అశ్విన్‌కి కోపంగా లేదు. కూల్‌గా అన్నాడు. ”థాంక్స్‌! నీ మాటలు అన్ని క్లియర్‌గా వినిపిస్తున్నాయి. నాకే కాదు, మొత్తం భూమిలో అందరికీ, షార్‌లో, ఢిల్లీలో అమెరికాలో! సారీ శర్మా! నువ్వు బతుకుతావు అనుకోలే! సారీ రియల్లీ వుయర్‌ పిగ్స్‌! కానీ రియల్లీ రియల్లీ నీ కోసం రిస్క్‌ తీసుకొని మళ్ళీ వస్తున్నాం. నీ కోసం దిగుతున్నాం. ఇండియాకీ మాకూ ఎంత రిస్క్‌ అయినా, ఖర్చు అయినా తిరిగి దిగుతున్నాం. నిన్ను రక్షించి తీసుకుపోతాం! వెయిట్‌! 12 గంటలు అంతే ! కీప్‌ టాకింగ్‌!”

ఆ తర్వాత తెరమీద శరభశర్మ ప్రపంచానికి అందరికీ నమస్కరించాడు. అంగారక యాన్‌ నౌకలో తేలుతూ ఎగురుతూ పండగ జరుపుకుంటున్న అంతరిక్ష నావికులూ కనిపించారు.

పై కథలో సైన్స్‌, భక్తి, సంఘర్షణ, బాధ, కుటుంబ సంబంధాలు, బాధ్యత, మానవీయత, ఆత్మీయత, పరిశోధన, పట్టుదల, ధైర్యం, మొక్కవోని విశ్వాసం ఇలా సమస్తం కలిసి ఉన్నాయి. స్థలము కాలము రెండూ కూడా కుజగ్రహానికి చెందినవే.

సింహ భాగం సైన్స్‌దే కనుక ఇది సైన్స్‌ ఫిక్షన్‌ కథ.

August 25, 2021 2 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us