
ఆధునికత అంటే అన్నీ ఉండటం, సకల సౌకర్యాలు అనుభవించడం, యాస భాషల్లో హుందాగా ఉండటం, ఖరీదైన బట్టలు కట్టుకోవడం అనుకుంటాం. కానీ ఆధుకత అంటే ఇవేవీ కావు అనేది ప్రకృతిని దగ్గరి నుంచి గమనిస్తూ, వాటిని అనుభూతి చెందితే తప్ప అర్థమే కాదు. వాస్తవానికి ఇప్పటికీ ఆ్రఫికా ఖండంలోని నల్లవాళ్ళను చూస్తే వాళ్ళు ఇంక ఆధునికతకు అందిపుచ్చుకోలేదు. చాలా వెనుకబడి ఉన్నారు అనుకుంటాం. కానీ అదేమీ నిజం కాదు. నిజానికి ప్రకృతిలోని సకల జీవరాశుల్లో మనిషి మాత్రమే అన్నింటికి దూరంగా నివసిస్తూ ఆధునికత పేరుతో గదుల్లో బంధించుకొని కూర్చున్నాడు. మిగతా ఏ జీవరాశి ప్రకృతికి దూరంగా బంధించుకొని కూర్చొలేదు. పశుపక్షాదులు అన్ని కలిసిపోయి, ఆనందిస్తూ, ప్రకృతిని అనుభూతి చెందుతూ స్వేచ్ఛగా విహరిస్తున్నాయి ఒక్క మనం తప్ప. ఇది ప్రకృతికి ఎంత విరుద్ధం కదా…?
నిజానికి నాగరికతలు అన్నీ నదుల వెంట విలసిల్లాయి అని చరిత్ర చెబుతుంది కానీ ఇవాళ ఆ నదుల వెంట మనం ఎక్కడున్నాం…. మనం లేము కానీ మిగతా జీవకోటి అంతటా అక్కడ కొలువు తీరింది. మనం గమనిస్తున్నామో లేదో కానీ మనిషి పుట్టుక నదుల దగ్గరే మొదలై చివరకు నదుల దగ్గరే ముగుస్తుంది, ఒక్క మధ్య జీవితం తప్ప. అందుకే ప్రకృతికి దూరంగా బతుకుతున్న మనం కనీసం అప్పుడప్పుడైనా ఆ నదుల దగ్గరకు వెళ్ళి ఆ జీవితాన్ని అనుభూతి చెందాలి. అందుకే ప్రపంచంలోని వివిధ దేశాలలోని నదీ తీరాలలో పర్యటించాలనే మా కోరికను ఈసారి కెన్యావైపు మళ్ళించాం. నైల్ నది ప్రవహించే దేశాలలో కెన్యా కూడా ఒకటి. నైల్ నదీ తీరంలో నడవాలనే కోరికతో హైదరాబాద్ నుండి కెన్యాకు బయలుదేరాం.
మేం ముంబాయి నుండి కెన్యా రాజధాని నైరోబీకి తక్కువ రేట్లలో టికెట్లు బుక్ చేసుకున్నాం. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూతురు నైరోబీలో నివసిస్తుంది. ఆమె మాకు చాలా తక్కువ ఖర్చులో కెన్యా అందాలన్నీంటిని చూసేలా ఒక ఓపెనం టాపం జీపం మాట్లాడి మమ్మల్ని కెన్యాకు ఆహ్వానించారు. మాతోపాటు ఇంకే జంట, ఒక లేడీ డాక్టరు, మరో మహిళా వ్యాపారవేత్త మొత్తం ఆరుగురం కలిసి ఓపెన్ టాప్ జీప్లో మా ప్రయాణం మొదలెట్టాం.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను కెన్యా పర్యటనకంటే ముందు వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్ కు వెళ్ళి వచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే స్లిప్ అయి కిందపడ్డాను. అప్పటి నుండి కొద్దిగా నడుం నొప్పి స్టార్ట్ అయింది. అందువల్ల కెన్యా పర్యటనలో జీపులో ముందు సీట్లో కూర్చున్నాను.
మొదట మేము నకూర్ సరస్సుకు వెళ్ళాం. ఇది భూమధ్య రేఖకి దగ్గరగా ఉంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూడాలంటే రెండు కండ్లు చాలవు. వర్ణిస్తే ఒక దృశ్యకావ్యంగా అవుతుంది. ఈ సరస్సు చుట్టూ యోఫోర్బియా చెట్లు ఉన్నాయి. ఇదొక ఔషధ మొక్క. ఈ పేరు బొంతజెముడు. దాని శాస్త్రీయ నామం యుఫోర్బియా. సహజంగా చెట్లనగానే ఒకలాంటి భావన కలుగుతుంది. దాని తెలుసుకోవాలనే తపన నాలో పెరిగి. ఈ మొక్కలు ఎక్కువగా కొండ దిగువ ప్రాంతాలైన గలస మట్టి నేలల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్టును గీరినప్పుడు, లేదా గిల్లినప్పుడు తెల్లని పాల లాంటి ద్రావం కారుతుంది. ఈ చెట్లు కొమ్మలు… కొమ్మలుగా పైకి ఎగబాకుతాయి. చెట్లు పైకి ఎదిగే కొద్ది కింది కొమ్మలు రాలిపోతాయి. ఇంకా యుఫోర్బియా చెట్లతోపాటు ఎల్లో ఫీవరం చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి.
అత్యంత అందమైన నకురు సరస్సు….
దూరంగా కొండలు… పక్కనే ఉన్న ‘నకురు సరస్సు’ అందాల్ని చూడాలని వెళ్ళాం. కెన్యాలో నకూరు నేషనల్ పార్క్ కు దగ్గరలో ఉండటంవల్ల దీనికి నకూరు సరస్సు అని పిలుస్తారు. ఇది తూర్పు ఆఫ్రికన్ ఫాల్ట్ జోన్ వెంట ఉన్న సహజ జలాశయాలలో ఇదొకటి. ఈ సరస్సు సముద్రమట్టానికి 1759 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఎత్తయిన పర్వత జలాశయాలలో ఒకటి. నకూరు సరస్సులో ఫ్లెమంగోలు గూడు కట్టుకోవడంవల్ల ఈ సరస్సు అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ పక్ష్లు సంఖ్య చాలా తక్కువ. ఫ్లెమింగోలతోపాటు పెలికాన్లు ఇక్కడ ఎక్కువగా నివసిస్తాయి. ఇంకా వీటితోపాటు లేకం నకూరులో పెద్ద సంఖ్యలో జంతు జాతులు నివశిస్తున్నాయి. ఖడ్గమృగాలు, ఇంపాలా జింక, ఉగాండా జిరాఫీ, నీటిమేక, ఆఫ్రికన్ గేదె, క్షీరదాలు, వివిధ రకాల సరీసృపాలు ఉన్నాయి. వీటిని చూడటానికి ఎక్కడెక్కడి నుండో పర్యాటకుల వేలసంఖ్యలో అక్కడికి వస్తారు.
ఫెలికాన్ పక్షుల సందడి….
సరస్సు నిండా ఫెలికాన్ పక్షులు వేలసంఖ్యలో విహారిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఫెలికాన్ పక్షుల గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా… ఈ పక్షులకు పొడవాటి ముక్కు, పొట్టితోక, చిన్నకాళ్ళు, పెద్ద రెక్కలు, గోధుమ లేదా తెలుపు రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా భారతదేశం, ఆఫ్రికా, ఇరాక్ దేశాలకు వలస వెళ్తుంటాయి. మన దేశంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొల్లేరు సరస్సుకు ఇతర దేశాల నుండి ఫెలికాన్లు వస్తాయి. ఫెలికాన్ రంగునుబట్టి అవి ఏ దేశానికి చెందినవో గుర్తించవచ్చు. స్పాట్ బిల్ట్, డాల్మెషియ్, పింక్ బ్యాక్డ్, ఆస్ట్రేలియాన్, పెరువియన్ ఇలా బోలెడు ఉన్నాయి. సైబీరియా, ఆస్ట్రేలియా, అమెరికన్ వైట్ ఫెలికాన్లు అక్కడ వేసవిని భరించలేక వేల కిలోమీటర్లు దాటి వచ్చి…. ఇక్కడ శీతాకాలాన్ని ఆస్వాధిస్తాయి. అయితే మేం చూసిన నకూర్ సరస్సులో మాత్రం గోధుమ రంగు ఫెలికాన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవి బాగా ఎత్తు నుండి నీటిలోకి మునిగి లోతుగా డైవ్ చేసి చేపల్ని పడతాయి. ఫెలికాన్ల గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నంటే ఇవి మన దేశంలోని కోల్లెరు సరస్సుకు ప్రతి ఏటా డిసెంబర్ లేదా నవంబర్ మాసంలో మన దేశానికి వలస వచ్చి సందడి చేసి వెళ్తాయి కాబట్టి.
ఇలే మేం రెండు గంటలపాటు సరస్సు వెంట అటూ… ఇటూ తిరుగుతూ…. పక్షులతో ఫోటోలు దిగాం. ఒక విధంగా మేం నకూరు సరస్సును వదిలి వెళ్ళలేకపోయాం. ‘ఇంకొంచెం టైం ఇక్కడే స్పెడ్ చేస్తే బాగండు కదా’ అనిపించింది. ‘ఇక చాలు, ఇక్కడి నుండి బయలుదేరండి’ అన్నట్టుగా అప్పుడే వర్షం మొదలైంది. దాంతో మేం పరుగో పరుగో అనుకుంటూ జీప్ లోకి వెళ్ళి కూర్చోన్నాం.
నైవాషా సరస్సు….
నకూరు సరస్సు నుండి నేరుగా నైవాషా సరస్సుకు వెళ్ళాం. ఇదొక స్వర్గధామమనే చెప్పవచ్చు. ఇక్కడ నైవాషా సరస్సు సముద్రమట్టానికి 1886 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది రాజధాని నైరోబికి వ్యాయవ్యంగా ఉన్నటువంటి మంచి నీటి సరస్సు. ఈ సరస్సులో దాదాపుగా 400 పైగా పక్షులు ఉన్నాయి. ఈ సరస్సులో మరొక అద్భుతం తెల్లటి కొంగల సందడి. ఇవి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సరస్సులోని తెల్లటి కొంగలు మరో రకమైన అందంగా చెప్పొచ్చు. వాటిని చూసి చాలాసేపు ఎంజాయ్ చేశాం.
మాసాయి మారా నేషనల్ పార్క్….
ఇది కెన్యాలో ప్రధాన వన్యప్రాణుల పార్క్ల్లో ఒకటి. ఇది టాంజానియా సరిహద్దుల్లో నైరుతి కెన్యాలో ఉంది. ఇక్కడంతా నేల గడ్డిభూములతో నిండుకొని ఉంటుంది. ఇదొక అద్భుతమైన దృశ్యం. రంగురంగుల సంస్కృతి, వన్యప్రాణుల విన్యాసాలు పర్యాటకులను ఆనందింపజేస్తాయి. దీనిలోకి ప్రవేశించాలంటే ఇతర దేశీయులకు 80 డాలర్ల వరకూ చార్జ్ చేస్తారు. మేము టికెట్ ఒక సఫారిలో లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్లగానే మాకు మసాయి మారా గిరిజనులు స్వాగతం పలికారు. అక్కడే మాకు వారు భోజనం ఏర్పాటు చేశారు. భోజనానికి మాకు లావు బియ్యంతో అన్నం, మటన్ క్రరీ వండారు. దాంతోపాటు బ్రెడ్, వెన్న, జామ్ పెట్టారు. భోజనం చేసిన వెంటనే అందరం కలిసి మాసాయి మారా నేషనల్ పార్క్ చూడటానికి వెళ్ళాం. మారాయి మారా నేషనల్ పార్క్ చూడటానికి వెళ్ళాం. మాసాయి మారా నేషనల్ పార్క్లో చాలా రకాల పక్షులు నిరంతరం గాల్లో విహరిస్తుంటాయి. రాబందులు, క్రెస్టెడ్ ఈగల్స్, మరబౌ కొంగలు, గినియా కోళ్ళు, సోమాలి ఉష్ణపక్షి, కిరీటం కలిగిన క్రేన్లు, పిగ్మీ ఫాల్కన్లు ఇంకా చాలా ఉన్నాయి. మావో ప్రజల (మాసాయి) భాషలో ‘మారా’ అనే పదానికి అర్థం ‘మచ్చలు’ అని. నిజానికి దూరం నుండి చూస్తే ఈ ప్రాంతంలోని మైదానం మొత్తం చిన్న చిన్న చెట్లతో మచ్చలుగా కనిపిస్తుంది. మారా మైదానాలు నల్లటి చారలతో పెయింట్ వేసినట్లు కనిపిస్తాయి. నిజంగా ఇదొక అరుదైన దృశ్యం. కెన్యా అంతటా సుమారు రెండు మిలియన్ల అడవి దున్నలు, సుమారు రెండు లక్షల జీబ్రాలు, అర మిలియన్ గజెల్లు ఇంకా ఇతర శాఖాహార జంతువులున్నాయి. చిరుతపులి, సింహాలు, హైనాయిడ్ కుక్కలు, అలాగే నక్కలు, రాబందులు, మరబౌ వంటి మాంసాహారులు కూడా ఉన్నారు.
ఇక మేం వెళ్ళిన రోజు జరిగిన సంఘటన గురించి ఈ సందర్భంగా చెప్పాలి. మేం చేరుకునేసరికి అక్కడ మైగ్రేషన్ మొదలైంది. మైగ్రేషన్ అంటే ఏమిటి అనే సందేహం రావొచ్చు. మైగ్రేన్ అంటే ఏం లేదు జంతువులు గుంపులుగా ఒక ప్రాంతం నండి మరొక ప్రాంతానికి వలస వెళ్లడం. తరచూ మన దగ్గర కూడా చూస్తుంటాం. ఆఫ్రికా, దక్షిణ అమెరికా నుండి కొన్ని కొంగలు, పక్షులు వలస వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మేం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇదే సంఘటన జరుగుతుంది. కొన్ని లక్షల సంఖ్యలో అక్కడ అడవి దున్నలు కనిపించాయి. అవి చూడటానికి పెద్ద పెద్ద బ్రరెల్లా ఉండి జుట్టు కూడా ఉంటుంది. అన్నీ కలిసి లక్షల సంఖ్యలో ఒక దగ్గర గుమ్మి గూడతాయి. అవి నడిచే దార్లు చూస్తే ఎక్కడో పేరంటానికి పిలిచినట్టుగా వెళ్తుంటాయి. ఒకదాన్ని మరొకటి పిలిచినట్లుగా ఒకదాని మరొకటి పరిగెత్తుకుంటూ వెళ్తాయి.
ఇవన్నీ ఒకే వరుస క్రమంలో ఎక్కడెక్కడి నుండో వందల కిలోమీటర్లు నడిచి అన్ని ఒకచోటకి చేరతాయి. ఈ అడవి దున్నలు (వైల్ బిట్స్) అన్నీ ఒక చోటకి చేరాక…. మాసాయి కాలువ అవతలివైపు ఉండే గట్టులోకి చేరతాయి. అవతలివైపు మొత్తం పచ్చగడ్డితో నిండి ఉంటుంది. ‘మనం అక్కడికి వెళ్తాం’ అని ఆ జంతువులు మాట్లాడుకుంటాయట అని స్థానికులు చెబితే ఆశ్చర్యపోయాను. నిజంగా అలాగే అనిపించింది ఆ అడవి దున్నలు పరుగులు చూస్తే…
అవి ఎప్పుడైతే ఈ మాసాయి నది దగ్గరీ వస్తాయో…. వాటిల్లోంచి ఐదు లేదా ఆరు అడవి దున్నలు నీటిలోకి తొంగి చూస్తాయి. అలా రోజంతా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటలవరకు నీటిలోకి తొంగి చూస్తూ, వాటిల్లో అవి మాట్లాడుకున్నట్లు అన్నీ ఒకే చోటకు చేరుతాయి. ఎప్పుడైతే మొసళ్ళు తక్కువగా ఉన్నాయో, అవి కనిపించడం లేదా అని వాటికి అనిపిస్తుందో అప్పుడు అన్నీ కలిసి ఒక దాని వెనుక ఒకటిగా నదిలోకి దూకుతాయి. అవతలివైపు ఒడ్డు చేరడానికి ఇదొక మార్గం. దీనినే మైగ్రేషన్ అంటారు. మేం మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్ళి నాలుగు గంటలవరకు ఈ మైగ్రేషన్ దగ్గర ఉన్నాం. ఆ క్షణం ఎంత ఉద్విగ్నంగా ఉందో చెప్పలేను. ఈ మైగ్రేషన్ దృశ్యాన్ని చూడటానికి చాలామంది కొన్ని నెలల తరబడి ఎదురుచూస్తారు. మేం వెళ్ళిన గంటలో ఇది చూడటం మా అదృష్టం అనీ, చాలా సంతోషంగా అనిపించింది.
అక్కడి నుండి వెళ్తూ ఉంటే వందల ఏనుగులు, జీ్బ్రాలు, సింహాలు, పులులు, అడవి దున్నులు అన్నీ కలిసి ఒకేచోట ఆహారం తినడం చూశాం. మాకు ఒక అడుగు దూరంలో ఒక పెద్ద సింహం తిరుగుతూ ఉంటే దానినే చూస్తూ ఒక గంట సమయం గడిపాం. ఆ రోజు ఒక 60 సింహాలవరకూ చూశాం. అవి కూడా 4 నుండి 5 సింహాలు గుంపులు… గుంపులుగా కలిసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాం.
ఈ మైగ్రేషన్ అప్పుడు మొసళ్ళు కూడా ఎక్కడో దాక్కుని, అవి నది దాటుతున్నప్పుడు వాటిని చంపి తింటాయని చెప్పారు అక్కడి స్థానికులు. అవి తినడం మొదలవగానే మిగతా జంతువులు ఆగిపోతాయని చెప్పారు మాతో వచ్చిన గైడ్. ఇలా జంతువ అంత గ్రహింపును కలిగి ఉండటం చాలా ఆనందంగా అనిపించింది. ప్రాణరక్షణ గురించి ఆలోచించడం ఎంత విడ్డూరం. లక్ష జంతువులు గుమిగూడటమేమిటి? అవి అన్నీ ఎవరో చెప్పినట్లుగా బార్డర్ దాటడమేంటి? అని చాలాసేపు ఆలోచించాను. జంతువులకు కూడా అద్బుతమైన తెలివితేటలు ఉంటాయి. కాకపోతే మనలా మాటలు రావు అంతే తేడా. అన్ని సింహాలు ఉన్నా, వందలమంది యాత్రికులు చూడటానికి వచ్చినా, సింహాలు ఏమీ అనడం లేదు. స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అవి అన్నీ చూసి మేం రాత్రి కావడంతో భోజనం కానిచ్చేశాం. మసాయి మారా గిరిజనులు మా గుడారాలకు వచ్చారు. ఆ రాత్రి వారి డ్యాన్స్ చూశాం. వారు స్వయంగా వండిన అన్నం, కూరలు తిని అక్కడే ఉన్న మా గుడారంలో పడుకున్నాం.
కిలి మాంజారో….
ఈ మధ్యకాలంలో తరచూ మనం వింటున్న పేరు. ఒకటి శంకర్ దర్శకత్వం వహించిన రోబో సినిమాలో ‘కిలో మంజారో భలా భల్లి మంజారో యారో యారో’….. అంటూ ప్రస్థావన వస్తే, రెండోది ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రల్లోని సోషల్ వెల్ఫేర్ హోటల్లో చదువుతున్న పిల్లలు ఆ్రఫికాలో అతి ఎత్తయిన ఈ పర్వతాన్ని అధిరోహించినట్టు మనం వార్తల్లో చూస్తున్నాం. కేవలం 13 ఏండ్ల చిన్న వయసులోనే పూర్ణ మాలవత్ కిలి మంజారోని కూడా ఎక్కి రికార్డు సృష్టిఁచడం ఒకటైతే అనంతపురం జిల్లా అగ్రహారానికి చెందిన తొమ్మిదేండ్ల అమ్మాయి కిలి మంజారోని అధిరోహించిన వార్తను కూడా మనం చూశాం. అంటే ఇంత చిన్న పిల్లలు కూడా వెళ్ళిన వార్తలు మనం చూశాం. చిన్న పిల్లలు కూడా ఈ కిలిమంజారో పర్వతాన్ని చాలా సునాయాసంగా ఎక్కడం అధిరోహించడం చూసిన నేను. కెన్యా వెళ్ళినప్పుడు నేనెందుకు చూడలేను అని అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది.
మర్నాడు మేం మసాయి మారా నేషనల్ పార్క్ నుండి ఉదయం కిలి మంజారో చూడటానికి బయలుదేరాం. కిలిమంజారో పర్వతం టాంజానియా రాష్ట్రంలో ఉంది. కానీ కెన్యా సరిహద్దుకు దగ్గరలో ఉందని తెలిసి చూడటానికి వెళ్ళాం. పర్యాటకుల సందడితో కిలిమంజారో నిండిపోయి ఉంది మేం వెళ్ళేసరికీ. ప్రముఖ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే కిలిమంజారో పర్వతం గురించి ఒక కథ కూడా రాశారు. అది ‘కిలి మంజారో స్నో’ ఇది మొదటిసారి ఎస్కైర్ పత్రికలో 1936లో ప్రచురించబడింది. ఈ కథ ఆధారంగా సినిమాలు కూడా తీశారు. దీన్నిబట్ఠి అర్థం చేసుకోవచ్చు ఈ పర్వతం ప్రాముఖ్యతను.
ఇది రెండు మిలియన్ సంవత్సరాల పురాతనమైన అగ్నిపర్వతం. ఆ్రఫికాలోనే ఎత్తయిన అగ్నిపర్వతం. ఇక్కడ సినిమా షూటింగంలు నిరంతరం జరుగుతునే ఉంటాయి.
కిలిమంజారో అంటే అర్థం ‘ప్రకాశించే పర్వతం’ అని. ఈ పర్వతం పై భాగం మొత్తం తెలుగురంగులో ఉండటంవల్ల ఈ పేరు పెట్టారు. కిలిమంజారో చుట్టూ, పరిసరా ప్రాంతాల్లో ఎలాంటి పర్వతాలు లేవు. మొత్తం చదునుగా ఉండే మైదాన ప్రాంతం. ఇది ఉష్ణమండల మైదాన ప్రదేశం. ప్రముఖంగా కెన్యాలో మొక్కలు, జంతువులు, ఎత్తయిన పర్వతాలు పర్యాటకులను ముగ్ధమనోహరులను చేస్తుంది. ఈ పర్వతం కింది భాగంలో పంట పొలాలు, గడి్డతో నిండి పచ్చని తివాచీల కనిపిస్తుంది. ప్రపంచ నలుమూలల నుండి కిలిమంజారోని చూడటానికి వస్తుంటారు. ఇది టాంజానియా దేశానికి ప్రధాన పర్యాటక ఆధాయ వనరుగా చెప్తుంటారు.
కిలిమంజారో నుండి నేరుగా ‘హెల్స్ గేట్ నేషనల్ పార్క్’కు వెళ్ళాం. అక్కడి నుండి ఒక గుట్టపైకి ఎక్కి దిగాం. తర్వాత ఒక జలపాతం దగ్గరకు వెళ్లడానికి బయలుదేరాం. ఎన్నో కొండల మధ్య ఒక్కొక్కరం దాటాలంటే, అంతా పాచిగా ఉంది. జాగ్రత్తగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ కొండకి ఆనుకొని ఒక్కొక్క అడుగూ జరుగుతూ ఎంతో కష్టంగా ఆ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళి, మరలా తిరిగి వచ్చాం. దీనికి హెల్స్ గేట్ అనే పేరు నిజంగా సార్థకమే.
అక్కడి నుండి ఎలిఫెంట్స్ ఆర్ఫనేజ్ కి వెళ్ళాం. అక్కడ చాలా పిల్ల ఏనుగులు ఉన్నాయి. వాటికి స్నానం చేయించడం, వాటితో చిన్న చిన్న ఫీట్స్ చేయించడం అన్నీ చూసి మేం తిరిగి వచ్చేశాం. కెన్యాలో నైలునదీ ప్రవాహం చూశాం. పరీవాహాక ప్రాంతంలో నడక సాగించాం. కెన్యా లేకం నుండి తెల్లటి మంచులా నీరు ప్రవహిస్తుంది.
లేక్ విక్టోరియా…
దీనిని ‘సోర్చ్ ఆఫ్ నైలు’ అంటారు. విక్టోరియా లేకంలో పుట్టి బురుండి, రువాండా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, కెన్యా, ఉగాండా, ఇథియోపియా, సూడాన్, సౌత్ సుడాన్, ఇంకా ఈజిప్టులలో ప్రవహిస్తుంది.
ముచేబిసన్ జలపాతం…
దీన్ని కబలేగా జలపాతం అని కూడా అంటారు. ఉగాండాలో ఉన్న ఈ జలపాతం నైలునదీ ప్రవాహంతో ఏర్పడింది. నైలునది ప్రవహిస్తున్న అన్ని ప్రాంతాలలోనూ జంతువులు, నీటి జంతువులు, చింపాంజీలు, బర్రెలు, ఏనుగులు ఉంటాయి. వీటిని మూర్ఛపోన్ ఫాల్స్ వద్ద కూడా చూడొచ్చు. ఈ ప్రాంతమంతా ఒక నేషనల్ పార్క్. నైలు నదిలో ప్రయాణించడానికి క్రూజెసం, వైట్ వాటర్ రాఫ్టింగ్ వంటివి ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ నైలునది వెంట ఆఫ్రికా క్రూజర్ పార్క్, కెన్యా సఫారీ ఉన్నాయి. ఈ నైలు నది ‘ఫాదర్ ఆఫ్ ఆఫ్రికన్ రివర్స్’ అనే పేరుతో ప్రసిద్ధి అంటారు.
ఈక్వేటర్ ప్రాంతమైన ఉగాండాలో మొదలుపెడితే, వైట్ నైల్, బ్లాక్ నైల్ గా మారుతుంది. ఈజిప్టులో నైలునది మట్టి నల్లగా ఉండి, ‘కెమ్ ఆర్ కెమి’ అనే పేరుతో ప్రసిద్ధి నొందింది. కెమ్ ఆర్ కెమి అంటే బ్లాక్ అని అర్థం. అంటే ఎప్పుడైతే వరదలు వస్తాయో ఈ ప్రాంతమంతా నల్లటి మట్టితో నిండిపోతుంది, అందుకే బ్లాక్ అంటారు.
7వ శతాబ్దికి చెందిన ప్రఖ్యాత గ్రీసు రచయిత హోమర్ రచన ‘ఒడిస్సీ’లో నైలునదిని నల్లటి దృఢమైన పురుషునిగాను, ఈజిప్టును స్త్రీ గాను తను అభివర్ణించాడు. ఇది అద్భుతమైన కల్పన.
నాకు ఈ నైలునది గురించి కొత్తగా వర్ణించాలని అనిపించింది. బ్లూ నైల్, వైట్ నైల్ ని చూసినప్పుడు ఈ బ్లాక్ నైల్ని చూసినప్పుడు ఇంద్రధనస్సులోని ఏడు రంగులతో ప్రతిబింబిస్తాయి. ఎలాగంటే అది అథియోపియాలో బ్లూ నైల్, కెన్యాలో వైట్ నైల్, ఈజిప్టులో బ్లాక్ నైల్. ఈ జలపాతం గుండా ఈ నది పారి ఇంద్రధనుస్సులు ఏర్పడి ఏడురంగులతో అందరినీ మురిపిస్తుంది. ఇన్ని రంగులమయంతో అలరారే నది ప్రపంచంలో ఇది ఒక్కటేనేమో… నైలు నది హంగులు, పొంగులు అందాలు, నేషనల్ పార్కులు అన్నీ చూసి సంతోషంగా తిరిగి వచ్చాం.
భూ మధ్య రేఖ (ఈక్వేటర్)
మేము కెన్యా పర్యటనల్లో చూసిన వాటిల్లో తప్పక చెప్పుకోవాలసింది భూ మధ్య రేఖ ప్రాంతం. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు భూ మధ్య రేఖ గురించి చదవడం తప్ప అక్కడ ఎలా ఉంటుందో అనేది అనుభవంలోకి రాలేదు. మేుము ఉన్న కెన్యాలో భూ మధ్య రేఖ ప్రాంతం ఉందని తెలియగానే దాన్ని ఎటైనా చూద్దామని బయలుదేరాం. ఈ భూమధ్య రేఖ అనేది 11 దేశాల గుండా పోతుంది. అందులో ఒకటి కెన్యా. ఈ భూమధ్య రేఖ ఉన్న ప్రాంతంలో మార్చ్ 20 నుండి సెప్టెంబర్ 20 మధ్య కాలంలో పగలు, రాత్రి సమానంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడగున వాతావరణం ఒకటే ఉంటుంది. భూ మధ్య రేఖలు దూరం పోయిన కొలది వాతావరణంలో హెచ్చుతగ్గులు వస్తాయి.
మేము ఉన్న ప్రాంతం నుండి ఒక మూడు గంటల ప్రయాణంలో భూ మధ్య రేఖ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ విలేజ్ లాంటివి, ఇల్లు లాంటివి లేవు కానీ రోడ్డుమీద ఒక దగ్గర ఇది భూమధ్య రేఖ ప్రాంతం అని సూచించేలా ఒక బోర్డు పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యాత్రికులు అక్కడి ఫోటోలు దిగుతూ ఆనందిస్తున్నారు. మేము ఆ ప్రాంతంలో దిగి కాసేపు చుట్టు పక్కల గమనించి వెనక్కి వచ్చాము.
తెలుగు భాషపైన మక్కువ ఈ యువతరాన్ని ఏకం చేసింది . తెలుగు రాష్ట్రాల వెలుగులు వీళ్ళు . అన్ని ఊళ్ళ నుండి , హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ ఇలా ప్రాంతాలు వేరైనా నవతరం ప్రాబ్లమ్ ఒక్కటే తమవైన ఆలోచనలను పంచుకునే తెలుగుభాష స్నేహ బృందం కావాలి . కవిత్వ సొగసులద్దడానికి ఒక వేదిక కావాలి -ఇది వారి తొలి అడుగు గా Wattsap సంఘాన్ని ఏర్పరుచుకున్నారు . కథలు , కవితలు , గల్పకలు , గేయాలు ఇలా అన్ని ప్రక్రియలలో వారికి తోచినరీతిలో చక్కని తెలుగులో కవితాత్మకంగా రాస్తున్నారు . సమాజంలో కనిపించే వింతతత్వాలకు సెటైర్స్ లాగా రాయడమైనా , నిత్య జీవన విధానంలో గమనించే అంశాలను సున్నితంగా స్పృశించడమైనా ఇలాంటివి రచిస్తూ యవతరానికేకాదు మనతరానికీ స్ఫూర్తిదాయకంగా అడుగులేస్తున్నఈ”కలం కనే కలలు” కు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది ‘ మయూఖ’
ఇలా వాళ్ళను మయూఖ లో పరిచయం చేస్తున్నాను ‘ నవతరం ‘ గా
*********************************************************

పలకడానికి మనిషి లేనప్పుడు, బ్రతకడానికి తోడు లేనప్పుడు పదం పదం పేర్చి మనసు కట్టుకున్న బొమ్మరిల్లు కదా కవిత్వం. మా కలలను కలాలతో పంచుకుంటూ కవిత్వం అనే సముద్రంలో ఈదుతున్న కాలం అది.
రేపటి పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్థి ఒకడు, రాత్రి కంప్యూటర్ తో కుస్తీ పడుతున్న ఒక యువతి, తీవ్రమైన గాయాలకు చికిత్స చేస్తున్న వైద్యుడు, ఉద్యోగ అవకాశాల వేటలో నిద్ర రాక మరో నిరుద్యోగి, వెన్నెల వైపు చూస్తూ గతంలోకి పయనిస్తున్న ఓ అందమైన యువతి, పొద్దంతా తీరిక లేకుండా పని చేసి వచ్చి అలసిపోయిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఇలా ఇంకా కొందరు.. ఎక్కడెక్కడో ఎవరికీ ఎవరితో సంబంధం లేని కొందరు యువతీ యువకులు.. అనగనగా ఒక రోజు, అనుకోకుండా ఒక చోట కలిశారు ఒక వాట్సప్ గ్రూప్ లో.
కలం కాగితంతో కలిసే వరకు ఎన్నో కలలు కంటుంది. ఒక అందమైన కవి ఆలోచనలు ఆ కలానికి తోడైతే, అద్భుతమైన కవితలను సృష్టిస్తుంది. అందుకేనేమో మా వాట్సప్ గ్రూప్ కి “కలం కనే కలలు” అని పేరు పెట్టుకున్నాము. మా వాట్సప్ గ్రూప్ నింపిన స్ఫూర్తి తో, తెలుగు భాష పట్ల అభిమానంతో మాలో ఒకరికి అనుకోకుండా వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టి, ఎన్నో ఆటుపోట్లని ఓర్చుకుని, 44 మంది యువతీయువకులు కలిసి రాసిన పుస్తక సంకలనమే మా ‘కలం కనే కలలు’.
28 మే 2020 లో “శ్రీ నందమూరి తారక రామారావు” గారి జయంతి సందర్భంగా ప్రచురించడం జరిగింది.
అక్షరానికి అక్షరం కూర్చి
పదానికి పదం జోడించి
ఎద మోయలేని భావాలను సిరా లో నింపి కలం అంచునుంచి జాలువారిన
పదకుసుమాలను ఈ పుస్తకం లో పొందుపరిచాము.
అనుకోని ప్రమాదం లో మాకు దూరమైన మా సన్నిహితుడు హేమంత్ కు ఈ పుస్తకాన్ని అంకితం చేశాము. పది పదకొండు మందితో మొదలైన సమూహం ఇప్పుడు ఎనభై మంది యువ రచయితలకు స్థానం చేకూర్చింది. అన్న – తమ్ముళ్ళుగా, అక్కా – చెల్లెళ్ళుగా, మంచి స్నేహితులుగా మా ఈ పయనాన్ని కొనసాగిస్తున్నాము. చిన్నగా ఒక్క అడుగుతో మొదలైన మా ప్రయాణం ఇప్పటికి రెండు వార్షికోత్సవాలు జరుపుకుని, తన మూడవ వసంతం లోకి అడుగు పెట్టింది. ఒకరికి ఒకరం తెలియకుండానే పరిచయం అయ్యాము, అనుకోకుండానే ఆప్తులమయ్యాము.
“కలం కనే కలలు”
– మా కళలతో నిండిన కలలు

శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలయిన డా|| ఎస్. లక్ష్మణ మూర్తి
డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.
అభ్రాజ భ్రాజ దవ్యాజ నిరుపమ దయాసార ధారానుసారం
కోపాటోప ప్రదీప్త ప్రకటతర గరుద్వంద్వ భూమ ప్రతాపం
వ్యాక్షిప్త స్వర్గగంత ప్రథిత గుణగణారంభ వీటీమ్యవాహం
వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహం (2వ శ్లోకం)
తాత్పర్యం: ప్రకాశములేని వాటిని కూడ ప్రకాశింపజేసే, కపటములేని – కారణము నెంచని, దేనితోను ఉపమింపబడని – నిరుపమానమైన తన దయాసారము యొక్క అనుసరణమైనవాడు; కోపం వల్ల కలిగిన ప్రజ్వరిల్లుతున్న – అందరికీ తేటతెల్లనైన, గరుత్మంతునిపై వెలుగొందుతున్న గొప్ప ప్రతాపం కలిగినవాడు; స్వర్గము, దిగంతాలలో విస్తరించబడిన శ్రేష్ఠమైన గుణసమూహములచేత ఉత్తమము, రమ్యము అయినవాడు, గరుత్మంతుని వాహనముగా కలిగిన యాదాద్రిపైన తన పటుతరమైన భుజబలాన్నీ, వేగాన్ని చూపుతున్న శ్రీలక్ష్మీనృసింహస్వామిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: లోకంలో ఒక ఆర్యోక్తి ఉంది. “వస్తేణ వపుషా వాచా, విద్యయా వినయేన చ, వకారైః పంచభిరీనః, వాసవో పి న పూజ్యతే”. లోకంలో ఐదు వకారాలకు (వకారంతో మొదలయ్యే పదాలకు) అత్యంత గౌరవ స్థానం ఉంది. అవి – వస్త్రం, అందమైన చక్కని శరీరం, వాక్కు చదువు, వినయము – ఈ వకారంతో మొదలయ్యే వాటికే జనాలు విలువనిస్తారు, గౌరవిస్తారు. అంటే వస్త్రము మొదలైన ఈ ఐదు ఆడంబరాలు ఎవరికైతే ఉంటాయో వారికే లోకంలో గౌరవం! పూజింపబడతారు లేకపోతే ఇంద్రుడంతవాడికి కూడ గౌరవం లభించదు. కంలో ధర్మపరులు, నీతి-నిజాయితీ కలిగిన వాళ్ళు. న్యాయవర్తన కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళను ఆడంబరాలకు గౌరవాన్నిచ్చే ఈ లోకం గౌరవించదు. వాళ్ళు లోకం దృష్టిలో ప్రకాశహీనులే! ఆ విధంగా లోకంలో ప్రకాశించలేని తన భక్తుల్ని ప్రకాశించేవాడు (అబ్రాజభ్రాజత్) పరమాత్మ! ఏ విధంగా అంటే – తన స్వభావసిద్ధమైన, ఎటువంటి కారణములను అడగని తన యథార్థమైన కపటములేని దయాసారంతో! ఆ దయ కూడ ఎటువంటిది? నిరుపమానమైనది. ఆ దయకు ఉపమానంగా చెప్పగలిగినది ఈ సృష్టిలోనే లేదు! అటువంటి శ్రేష్ఠమైన (సార) దయను అఖండమైన, ఎడతెగని ధారగా కురిపించే పరమాత్మ (దయాసార ధారానుసారం) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ‘అనుసారం’ స్వారస్యాన్ని కొంచెం చెప్పుకోవాలి. అనుసారం అంటే అనుసరించేవాడని అర్థం. దేవుడు ఎవరిని అనుసరిస్తాడు? తన ‘దయాసారాన్ని కురిపిస్తూ! అంటే పరమాత్మ భక్తుల్ని ముందు తన దయాసారంతో అనుగ్రహిస్తాడు. భక్తుల పై తన దయను పంపిస్తాడు. దాని వెంట తాను అనుసరించి భక్తులకు దర్శనమిస్తాడు! అందుకే కవి లక్ష్మీనరసింహస్వామి వారిని “అవ్యాజ నిరుపమ దయాసారానుసారం” అంటూ అభివర్ణించారు.
నరసింహస్వామి దుష్ట సంహారం కోసం అవతరించినవాడు. భక్త పరిపాలన ఆయన నిత్యకృత్యం! రాక్షసుల్ని సంహరించే సందర్భంలో నరసింహుడు తన కోపాన్నీ, వేగిరపాటును (ఆటోపాన్నీ) ప్రదర్శిస్తాడు. అప్పుడు ఆయన కోపం ప్రజ్వరిల్లిపోతూ ప్రకటితమవుతుంది. అతి భయంకరమైన వేగమూ, పరాక్రమమూ కలిగిన గరుత్మంతునిపై వెలుగొందుతూ తన గొర్పు ప్రతాపాన్ని ప్రదర్శించి రాక్షస సంహారం చేస్తాడు. స్వర్గాది దివ్యలోకాలలోను, దిగంతాలలోను ఆయన శ్రేష్ఠమైన గుణగణాలు వ్యాపించాయి. అటువంటి గుణగణారంభము చేత శ్రేష్ఠుడైనవాడు! ఇంకా రమ్యమైన ఆకారం కలవాడు!! అటువంటి లక్ష్మీనరసింహస్వామి వేగ పరాక్రమాలు కల గరుత్మంతుని తన వాహనంగా చేసుకున్నాడు. యాదగిరిపై తన పటుతర భుజబలంతో ప్రకాశించే శ్రీలక్ష్మీనరసింహస్వామినీ నమస్కరిస్తున్నాను అంటాడు కవిశేఖరుడు!
: స్వస్తి :
కౌటల్యాట వ్యట త్కాంచన తను నయనభ్రాంతికృచ్ఛంబరఘ్నం
లాంగల్యబ్లాంకుశేంద్రాయుధ ఝష శుభరేఖోజ్జ్వలత్పన్నవాబ్దం
ఆపన్నా పన్నగేంద్రం శుచి నియమ గుణార్యాభివంద్యాభిధేయం
వందే యాదక్షమాభృత్కటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్
తాత్పర్యం: కుటిలత్వము, వంచన అనే అడవిలో తిరిగే, మనోహరమైన ఆకారాలతో చూచేవారి కళ్ళకు భ్రమను కలిగించే మాయను నశింపజేసేవాడు; నాగలి, పద్మము, అంకుశము, వజ్రము అనే ఇంద్రుని ఆయుధం, చేప (మత్స్యం) అనే శుభప్రదమైన రేఖలు కలిగి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న తామరతో పోల్చదగిన పాదము కలవాడు; తనను భక్తితో ఆశ్రయించిన వారి ఆపదలనే పర్వతాలకు ఇంద్రుని వంటివాడు; పరిశుద్ధమూ-పవిత్రమూ అయిన నియమము మొదలైన సద్గుణములచే ఉత్తములచే అభివందనములందుకునే చెప్పుకోదగిన రూపము కలవాడు అయిన – యాదగిరిపై నెలకొన్న – తన దృఢతరమైన భుజబలాన్నీ, వేగాన్ని చూపుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: కౌటిల్యము అనేది ఒక దట్టమైన అడవి. ఈ సంసారం కూడా దాటలేని ఒక మహారణ్యమే! సంసార మహారణ్యంలో మనిషిని ఎన్నో వ్యామోహాలు వెంటాడుతూ ఉంటాయి. వాటికి లొంగి మనిషి కష్టాల పాలౌతూ ఉన్నాడు. దీన్నే కౌటిల్యము (కుటిలత్వము, కపటము మొదలైన దుర్గుణములు) కల మహారణ్యమని, అందులో (అటత్) తిరుగుతూన్న (కాంచనతను) వ్యామోహాన్ని కలిగించే రకరకాల విశేషాలు మానవుని కళ్ళకు ఆకర్షణీయాలుగా కనిపించి భ్రమను (నయన భ్రాంతి కృత్) కలుగజేస్తూ ఉంటాయి – రామాయణంలో కాంచన మృగ రూపంలో మారీచుడు సీత కళ్ళకు భ్రమను కలుగజేసినట్లు! శంబరము అంటే ఒకజాతి లేడి అన్న అర్థమూ ఉంది, మాయ అన్న అర్థంతోపాటు. ‘శాంబరీవిద్య’, ‘శాంబరీ ‘మాయ’ అన్న వ్యవహారాలు ప్రసిద్ధాలే కదా! శంబరుడు అటువంటి మాయను ప్రయోగించడంలో నిపుణుడు. అటువంటి శంబరుణ్ణి (శంబరాసురుణ్ణి) మన్మథుడు సంహరించాడు. మరి ఈ సంసారమనే అరణ్యంలో వ్యామోహమనే లేడి శాంబరీ మాయవలె మానవుల్ని వ్యామోహంలో ముంచి వేస్తూ కష్టాల పాలు చేస్తున్నది. అటువంటి శాంబరీ మాయను నశింపజేసి (శంబరఘ్నం) తన భక్తులకు కలిగిన నయన భ్రాంతిని పోగొట్టి ముక్తిని ప్రసాదించేవాడు నరసింహస్వామి!
హస్తరేఖాశాస్త్రం ప్రత్యేక బహుళ ప్రచారం పొందింది. చేతిలో ఉన్న రేఖలను ఆ శాస్త్రాధారంగా గుర్తించి వ్యక్తి భవిష్యత్తును చెప్తుంటారు. చేతిలో ఉన్నట్లుగానే పాదాలలో కూడా రేఖల ద్వారా కొన్ని గుర్తులు (రూపాలు) ఏర్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి వారి ఉజ్జ్వలమైన జీవితం ముందుగానే తెలుస్తుందంటారు విజ్ఞులు! శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పాదాలలో లాంగల రేఖ దీన్నే హల రేఖ అంటారు. నాగలి ఆకారంలో ఉంటుంది. పద్మరేఖ, అంకుశరేఖ, వజ్రరేఖ, ఝష (మత్స్య) రేఖలు ఉన్నాయి. స్వామివారి పాదాలు, శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు, ఎక్కడ నెలకొని ఉంటే అక్కడ హలరేఖ చేత అన్న సమృద్ధి ఉంటుంది. పద్మరేఖ సంపదభివృద్ధిని ఇస్తుంది. అంకుశ రేఖ దుష్టుల్ని, దుర్గుణాల్ని అదుపు జేస్తుంది. వజ్రరేఖ శత్రు సంహార కారకం! మత్స్య రేఖ సర్వసమృద్ధిని చేకూరుస్తుంది. స్వామివారు స్థితి కారకులు! లోక రక్షణ దీక్షగా కలిగినవారు! అటువంటి శుభరేఖల చేత ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న నూతనాబ్దములవంటి పాదాలు కలవారు స్వామివారు! (శుభలేఖోజ్జ్వలత్ +పత్+నవాబ్దం). స్వామివారు తమ భక్తులకు సర్వసమర్ధినీ కలిగిస్తారని భావం! ఆపదలు కలిగినవాళ్ళు ఆపన్నులు. స్వామివారు తమ భక్తుల మానసిక సైర్యాన్ని పరీక్షించడం కోసం వారికి తరచూ ఆపదలను కలిగిస్తూ ఉంటారు. ఎన్ని ఆపదలు ఎదురైనా భక్తులు స్వామి వారిని విడువకుండా సేవిస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు కలిగిన ఆపదలనే పర్వతాల్ని ఖండించే ఇంద్రుడే శ్రీలక్ష్మీ నరసింహస్వామి! (ఆపన్న+ఆపద్(త్)+నగ+ఇంద్రం). పరిశుద్ధతను, పవిత్రతను కలిగించే నియమాది సద్గుణాల చేత ఉత్తములైన వారిచేత నమస్కరింపబడే నామధేయం కలిగినటువంటివారు (శుచి+నియమ+గుణ + ఆర్యా +అభివంద్య + అభిధేయం) శ్రీస్వామివారు! యాదాద్రి పై నెలకొని (వెలసి) తన పటుతరమైన భుజ బల విక్రమం చేత ప్రకాశించే శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.
శ్రీ మహా విష్ణువు కాలమునుండి కూడా పరిపాలన, పదవులు, పదవుల కేటాయింపులు రాజ్యము, రాజధానులు పురాణాలు చదువుతే గోచరిస్తాయి- శ్రీ మహా విష్ణువు కాని పరమేశ్వరుడు కాని బ్రహ్మ దేవుడు కాని నేటి మన కాలపు పరిపాలనా విధానాన్నే పోలి అధికారాలు కలిగి ఉంటారు-
విష్ణువు వైకుంఠములో ఉంటు నేటి మన దేశ ప్రధానిగాను, శివుడు కైలాసములో ఉంటు రాష్ట్ర పతిగాను ఇక బ్రహ్మ దేవుడు సత్య లోకములో ఉంటు దేశములోని అతున్నత న్యాయ మూర్తిగాను కొలువులు నిర్వర్తిస్తున్నట్టులు ద్యోతక మైతున్నది అట్లనే అష్ట దిక్పాలకులు వాళ్ళ రాష్ట్రములు రాజధానులు.
దిక్పాలకుడు — దిశ — రాజధాని
ఇంద్రుడు — తూర్పు — అమరావతి
అగ్ని — ఆగ్నేయం — తోజోవతి పట్టణం
యముడు — దక్షిణం — సంయమని పట్టణం
నైరుతి — నైరుతి — కృష్ణాంగన పట్టణం
వరుణుడు — పశ్చిమ — శ్రద్ధావతి పట్టణం
వాయువు — వాయువ్యం — గంధవతి పట్టణం
కుబేరుడు — ఉత్తరం — అలక పట్టణం
ఈశానుడు — ఈశాన్యం — యశోవతి (కైలాసం)
మానవులకే కాదు దేవతలు కూడా స్త్రీ లోరునటుటకు ఉదంతముగ తారా చంద్రుల వ్యవహారము చెప్పవచ్చును.దేవతల గురువైన బృహస్పతి స్త్రీ లోలుడై స్వంత భార్యయైన తారను నిర్లక్ష్యము చేయుటవలన ఆమె పరిస్థితి గమనించిన చంద్రుడు ఆమెను వశపర్చుకొని శృంగారము జరుపుటచే బుధుడు జన్మించాడని అంటరు.(బుధుడు శాపవశమున నపుంసకుడుగా పుడుతాడు తరువాత మహా శక్తివంతుడు, జ్ఞానసంపన్నుడై జ్ఞానశక్తీ దేవిని పెళ్ళాడుతాడు)
దేవేంద్రుడు గూడా రసోన్మాదముతో మునుల భార్యలమీద మనసుపడ్డవాడై వేకువ ఝామున మునులు స్నానాదికాలకై కోడి కూత ఆధారముగా తెల్లవారు సమయమనెంచి బయలు దేరుట గమనించి తానే కోడికన్న ముందుగా స్వరవంచన చేసి మునులు బయలుదేరగానే మునిపత్నుల అనుభవించ పూనుకున్నట్టు పురాణాలలో చెబుతారు.
ఇక కులాల విషయానికొస్తె కృతయుగమునుండి కులాలు ఉన్నట్టు పురాణాల ద్వారా తెలుస్తున్నది ఉదాహరణకు-త్రేతా యుగములో రాముడు సీతను అగ్ని పరీక్షకు పెట్టడానికి కారణం ఒక రజకుడు చేసిన ఆరోపణ.
ద్వాపరలో శ్రీ కృష్ణుడు గొల్ల వారింట్ల పెరుగడము-అట్లనే విదురుడు శూద్ర స్త్రీ గర్భమున జనించడము -కలియుగమైతే సరేసరి.
హరిశ్చంద్రుని పరీక్షించినవాడు. త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు; శకుంతలకు తండ్రి.గాయత్రి మంత్ర సృష్తి కర్త శ్రీ రామునికి గురువు అయిన విశ్వామిత్రుడంతటివాడేకరువు కాలమున ఒక చండాలుడు ఎండబెట్టుకున్న కుక్క మాంసాన్నే దొంగిలించి తిన్నాడని పురాణాలు చెబుతాయి-
ఇక అగస్త్యమహాముని రాక్షసుని మాంసము తిని జీర్ణించుకున్నాడని కూడా పురాణ కథనం అదెట్లంటె ఇలలుడు-వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు మానవ రూపము దాల్చి దారిన పోయే వారిని ఆతిథ్యానికని పిలిచి ఇలలుడు తన తమ్ముడగు వాతాపిని మేకగా మార్చి ఆ మేక మాంసము అతిథులకు పెట్టి వాళ్ళు తిన్న తరువాత వాతాపీ అని ఇలలుడు పిలువగానే అతిథుల కడుపు చీల్చుకుంటు బయటికొచ్చేవాడు-అప్పుడు ఇద్దరన్నదమ్ములు ఆ అథితుల చంపి తినేవారు- ఇదే తీరు ఒక నాడు అగస్త్య మహామునిని కూడా ఆహ్వానించి తమ్ముడగు వాతాపిని మేకగ మార్చి ఆ మాంసముతో విందు భోజనము పెట్టి ఎప్పటిలాగే వాతాపీ అని పిలుస్తాడు ఇలలుడు అది గ్రహించి వాక్శుద్ధి గల అగస్త్యుడు జీర్ణం అంటాడు వాతాపి అగస్త్యుని కడుపులో జీర్ణమైపోతాడు-
2.
అందుకే పిల్లలకు మందు పోసినా ఉగ్గు పెట్టినా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అను అని అంటుంటారు –
పురాణాలలో అన్నీ సాధ్యమే మచ్చుకు సూర్యుని వాహనము ఏడు గుర్రాల రథము-అందులో విచిత్ర మేమిటంటె ఆ రథానికి చక్రము ఒకటే -పగ్గాలు ఏడు బుసలుకొట్టే పాములు-రథ సారథి అనూరుడు అంటె తొడలు లేనివాడు-అకాశములో ఏ ఆలంబన లేని నిరంతర అనంతకాల పయనము-
భారత వంశీయులైన కౌరవ పాండవుల యుద్ధమును గురించి తెల్పు 100000 లక్ష శ్లోకముల మహా కావ్యము కౌరవ పాండవుల యుద్ధమును గురించియేకాక ధర్మార్థ,కామ మోక్షములను గురించియు తెల్పుచున్నది-హైందవులచే భగవదవతారముగ భాగింపబడు శ్రీ కృష్ణుడు ఈ కాలమునకు చెందిన వాడుగా భావింపబడుచున్నాడు- మహాభారత యుద్ధ సమయమందు శ్రీ కృష్ణుడు భారత వీరుడైన అర్జునునకు బోధించిన నీతి ధర్మము “భగవద్గీత” యను నామముతో మహా భారతములో అంతర్భాగముగా నున్నది-అందుచే మహా భారతము పుణ్యకావ్యముగ ఎంచబడుచున్నది- మహా భారతము వేదవ్యాసునిచే రచించబడినది -కాలక్రమమున ఎన్నొ విషయములందు చేర్చబడినవి- మహా భారతమును “పంచా వేదము “అని కూడ పిలుచుచున్నారు-
ఇప్పటి కాలములో ప్రభుత్వాలు వ్యవసాయ దారులకు గాని రక్షక భటులకు గాని యుధ సమయములో చని పోయిన సైనిక కుటుంబము నకుగాని రాయితీ,పరిహారము మున్నగు వసతులు ఆ నాడే అనగా ధర్మరాజు పరిపాలనా కాలములో కూడా కలిగించెడి వారు- ధర్మ రాజును నారదుడు అడిగినట్టి ప్రశ్నల ఆధారంగా మనకు తెలియుచున్నది-
నారదుడు ధర్మ రాజుకు రైతులకు చేయవలసిన సహాయము గురించి చెబుతూ
ధరణీ నాథ భవద్భుజ
పరిపాలిత యైన వసుధ బరిపూర్ణములై
కరమొప్పుచున్నె చెరువులు
ధరణికవగ్రహ భయంబు దనుకక యుండన్-
హీనులకు కర్షకులకు ను
భూనుత ధాన్యంబు బీజములు వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న
నూనముగా ఋణములిత్తె యుత్తమ బుద్ధిన్
నారదుడు ధర్మరాజును అడింగిండేమిటంటెరైతులకు కరువు అనేది లేకుండా చెరువుల్లో నీళ్ళు నిండి ఉండి బాగుగా కనిపిస్తున్నాయా పేదలైన బలహీనులైన కర్షకులకు ధాన్యాని ఇస్తున్నావా,వారికి విత్తనాలు ఇస్తున్నావా ,చిన్న వ్యాపారులకు ఋణాలు ఇస్తున్నావా అంతే కాదు శతైక వృద్ధితో అంటె నూటికి ఒక రూపాయి వడ్డీకి ఇస్తున్నావా దానితోనే సరియైన అభివృద్ధి అని చెబుతాడు.
రైతు సంక్షేమ పథకాలే కాకుండ నారదుడు పరిపాలనా సంబంధమైన విధానాలు కూడా చెబుతాడు –
తమ తమ కనియెడు తరి జీ
తము గానక నవయు భటుల దౌర్గత్య విషా
దములేని వానికవ
శ్యము నెగ్గొనరించు నతడు శకృండైనన్-
పరిపాలనలో ప్రభుత్వం కోసం పనిచేసే భటులకు సరైన సమయములో తగిన రీతిని జీతాలు ఇవ్వక పోతె అలాంటి వారు పరిపాలకులకు తప్పనిసరిగా నష్టం చేకూరుస్తారు- కాబట్టి చనిపోయిన వారినే కాదు బతికి ఉండి పాలనలో సేవ చేసే భటులకు మంచి జీత భత్యాలు ఇవ్వాలి ఇంకా చెబుతూ
చోర భయ వర్జితముగా
ధారుణీ బాలింతె యధిక ధన లోభమునన్
జోరులలక్షింపరుగా
వారలచో ధనము గొని భవితభ్యవరుల్
దొంగల భయము లేకుండా పాలిస్తున్నావా నీ దగ్గర పని చేసే సేవకులు అధిక ధన లోభము (లంచాలకు లొంగి)చోరులను కాపాడి వెనుకేసుకొని వచ్చే అవకాశం ఉంది ఇవన్ని అడుగుతు ఉద్యోగులను నియమించే విషయంలో
హెచ్చరిక చేస్తాడు-
ఉపధాశుద్ధులబాప
వ్యపగత బుద్ధుల వినీతవర్తుల సములన్
సుపరీక్ష వినియోగించితె
నిపుణుల నర్థార్జనాది నృపకార్యములన్-
ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత
బుద్ధి నెరింగిన వారిన
యుత్తమ మధ్యమాధమ నియోగములన్
నియమించితె నరెన్
ద్రోత్తమ భృత్యకోటికి సమానముగా
దగు జీతంబులా
యత్తమ సేసి యిత్తె దయ నయ్యయి
కాలము దప్పకుండగన్-
పన్నులు,డబ్బులు వసూలు చేసే సమయములో నీతితో వర్తించే వారిని ఉత్తమ,మధ్యమ,అథమ స్థానాలలో వారి ప్రావీణ్యము బట్టి నియమిస్తున్నావా లేదా అని అడుగుతాడు-
దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే భారత కాలములో కూడా లంచగొండులు,దొంగలు,మోసగాండ్లు ,సమర్థులు,అసమర్థులు,లోభులు,రాజ ద్రోహులు మొదలైన వారు ఉన్నారని ద్యోతకముచున్నది .
గురుజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం.
అందులో ఒక పాత్రధారి అంటాడు అన్నీ వేదాలలో ఉన్నాయష అని-ఈ అనంత కాల గమనం లోనేటికి రూపుమార్చుకొని పునరావృతమయితున్న జీవన విధానాలు–అదే చర్విత చర్వణం.

ఆధారములు
************
ఏకాక్షరులు
*********
18. నిలువు 4 తో పూలమ్మేవాడు, హంతకుడు.
21. నిలువు 38 తో వర్తకుడు.
22. అడ్డం 23 తో వలె.
26. లేత లేదు లెగు.
అడ్డం
*****
01. మహానసం (4)
04. కానుకలు (4)
07. బుజ్జగింపు (3)
10. ప్రేక్షకుడు (2)
13. రథం తీసుకురారు (2)
14. అంభోధిలో అప్పు (3)
15. ‘వచ్చి యిద్ధర గల్గు …. సరిత్తీర్థ’ లో ప్రవరుని కడలి (3)
16. చీకటిలో తిమింగిలం మింగేది (2)
19. పొట్టు ఊడ్వను (2)
20. పాతకాలపు వంటకు వాడేది, దూసేరు తీగతో అల్లేది (2)
23. యతి వేగం (2)
24. కలుగమి (2)
28. గోదావరి పవిత్రజలం (2)
30. వడికి దారం తీసే తకిలీ (3)
31. నివాసం (3)
32. గుండెనిండా ప్రేమ (2)
34. వినేవారిని విసిగించే సంభాషణ, సొల్లు కబుర్లు, గోడు (2)
36. పాండవులు లెక్కకు (3)
39. గబ్బిలం కవిగారి పచ్చపిట్ట (4)
40. అడ్డం 16తో సూర్యుడు (4)
నిలువు
******
02. గుఱ్ఱం (2)
03. ‘ ….. పాపం తలా పిడికెడు’ (2)
04. కూతురు కొండనాలుక (2)
05. శ్వాస ధైర్యం బురద (2)
06. లోహితాస్యు మాత (4)
08. ప్రేమ వరుస (2)
09. రైతుల తొలిదుక్కి పండుగ (4)
11. తొలియేడు శ్రీశ్రీ గారి పద్యరచనలను వరుసగా ప్రచురించిన పత్రిక (3)
12. తరువాత (3)
17. ఎటునుండైనా మెరిసే అందం (3)
19. వెట్టిచాకిరి (3)
24. పాము (4)
25. చిన్న పెట్టె (3)
27. పరమౌషధం (3)
29. గోవులు, పశువులు మేసే కంచె (4)
33. చెట్టు (2)
35. యుద్ధం (2)
36. సంవత్సరం సంఖ్య (2)
37. చిరుతిండిలో సవ్వడి (2)
38. అనుబంధవాక్యం, మామూలే (2)
పదకిరణకలనం (April edition) విజేత!

మేధస్సును పదును పెడుతూ, మనసును ఉత్సాహపరిచే ఒకానొక సాహిత్య చిక్కుప్రశ్నల సరదా ! మీదే విజయం కావచ్చు !ఇదిగో-మయూఖ పదకిరణకలనం (puzzle) పరిష్కర్త నెల్లుట్ల ఉమానరసింహారావు కు అభినందనలు .

“అరే ఓ కిషన్ భయ్యా.. చలేంగే క్యా .. “ నెత్తికి రుమాలు చుట్టుకుంటూ బయటకు వచ్చాడు తన నివాసం నుండి పర్తాప్ అనబడే ప్రతాప్.
నివాసం అంటే పెద్ద ఇల్లు కానీ గుడిసె కానీ కాదు, ఒక మనిషి నిలబడి ఒక వైపు నుండి ఇంకో వైపుకి నడిచేంత పెద్ద సిమెంట్ పైపు. హైదరాబాద్ కి దూరంగా మేడ్చల్ ప్రాంతంలో నివాసాసాలకు దూరంగా , అడవి లాంటి ప్రదేశంలో నీటి సరఫరా కోసం ఉపయోగించే పెద్ద పెద్ద సిమెంట్ పైపులు తయారు చేసే ఫ్యాక్టరీ కాంపౌండ్ అది. టెస్టింగ్ లో ఫెయిల్ అయిన లేదా కొంత దెబ్బ తిన్న సిమెంట్ పైపులకు ఒక వైపు తడకో, గోడో లేదా టార్పాలినో కట్టుకుని, పైపు ఇంకో వైపు ద్వారంగా ఉపయోగించే పైపుల్లోనే వందలాది వలస కుటుంబాలు తమ జీవితాన్ని గడుపుతుంటారు.
“అచ్చా .. చలో, చలో పర్తాప్ భయ్యా ” అనుకుంటూ తన భుజాలను పట్టుకుని ఆడుతున్న అయిదేళ్ల కొడుకు పర్మోద్ అనబడే ప్రమోద్ ని పక్కన దింపి, బీడీ కట్టను రుమాళ్ లో జొప్పుతూ వంగుతూ బయటకు వచ్చాడు కిషన్.
ఇద్దరు కలసి ఫ్యాక్టరీ వైపు నడుస్తుంటే వారు నడుస్తున్న వైపు చూస్తూ పాత సైకిల్ టైరుతో ఆడుతున్నాడు ప్రమోద్. కిషన్ బీహార్ కి చెందిన కాంట్రాక్టు లేబర్, అతని భార్య అంజు, కొడుకు ప్రమోద్ తో గత నాలుగు సంవత్సరాలు గా సిమెంట్ పైపుల కంపెనీలో పనిచేస్తూ ఫైపులోనే కాపురం. దాదాపు గా అన్నీ కుటుంబాల్లో భార్య భర్తలిద్దరూ అక్కడే పనిచేస్తారు.
కిషన్ నివాసం ఉండే పైపు కి పక్క నే ఇంకో పైపులో నివాసం ఉండే ప్రతాప్ అతని భార్య శివంతి కూడా నాలుగు సంవత్సరాలు గా అక్కడే పని చేస్తున్నారు. పక్క పక్కనే ఉన్న రెండు పైపుల్లో కాపురం వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య వచ్చిన కొద్ది రోజులకే స్నేహం ఏర్పడింది.
నెలలో జీతం వచ్చే ఆ రెండు రోజులు ఈ రెండు కుటుంబాలు కలిసే బజారుకి వెళ్లి సరుకులు తెచ్చుకోవడం, అప్పుడప్పుడు సినిమాకి వెళ్లడం జరుగుతుంది. కొన్ని వందల కుటుంబాల్లో, కొందరు మహారాష్ట్ర నుండి, కొందరు బీహార్ నుండి, ఇంకొందరు పాలమూరు నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బీహారీలు మరాఠీల మధ్య గొడవలు, చంపుకోవడం లాంటి విషయాలు వార్తల్లో చూస్తుంటాం కానీ, కడుపు చేత పట్టుకొని వచ్చిన వీళ్లు, కలిసిమెలసి ఉండటం చూస్తుంటే, కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపు కోవడం కోసమే ఆ తేడాలు సృష్టిస్తున్నారని అర్థంచేసుకోవచ్చు.
అలుపెరుగకుండా రోజూ మూడు షిప్టులో మిషన్ లు తిరుగుతూనే ఉంటాయి. చాలా మంది ఆడవాళ్లు ఇంటి పనులు, వంట పనులు చేసి, రెండవ షిఫ్ట్ లో పనికి వెళ్తారు. వచ్చిన కూలీ తినడానికి సరిపోగా పెద్దగా ఏమీ మిగలదు. ప్రతి రోజు పనికి పోయి, గొడ్డు చాకిరి చేసొచ్చి రావడం తప్ప వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశమేరాదు రాదు వారికి.
***
మూడు పూటలు- ఆరు పైపుల్లా సాగుతున్న వందలాది సిమెంట్ పైపు నిర్మాణ కార్మికుల జీవితాల్లోకి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తొంగి చూసింది. మార్చి24,2020 కరోనా మూలంగా దేశంలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేసిన రోజు. గిరా గిరా తిరిగే వందల మిషన్లు, అలుపు సోలుపు లేకుండా చకా చకా పనులు చేసే వేలాది చేతులు- కాళ్ళు ఎక్కడివక్కడ ఒక్క సారిగా ఆగి పోయాయి.

అందరి బతుకులు ఆగి పోయినట్టే కిషన్, ప్రతాప్ జీవితాలు కూడా ఒక్కసారిగా స్తంభించాయి. ఏదో ఇరవై ఒక్క రోజులే కదా .. ఎలాగో బ్రతుకొచ్చులే అని కిషన్, ప్రతాప్ కుటుంబాలు ఒకరి కొకరు ధైర్యం చెప్పుకున్నారు. వారి కాంట్రాక్టు యజమాని మహారాష్ట్ర కు చెందిన కిశోర్ బుండేలా, కుటుంబంలో ఎవరిదో పెళ్లి కోసమని మహారాష్ట్ర వెళ్లి అక్కడే ఇరుక్కు పోయాడు లాక్డౌన్ వల్ల.
మిగుల్చు కున్న అరకొర డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి ఇద్దరి దగ్గర. కంపెనీ నుండి రావలసిన జీతం వారి యజమాని కిశోర్ వస్తే కానీ ఇవ్వమని చెప్పిండ్రు కంపెనీ యాజమాన్యం. కిషోర్ కి ఫోన్ చేస్తే ఎలా రావాలి అని తిరిగి ప్రశ్నించాడు. చేసేదేమీ లేక ఫోన్ కట్ చేసాడు నర్సింగ్. మిగుల్చుకున్న కొన్ని డబ్బులు రోజుకు కొన్ని ఖర్చు అవుతుంటే దిగులు మొదలయ్యింది కిషోర్ కి.
పిల్లవాడి కి అవసరం అయిన పాలు బిస్కట్ ల కోసం బయటకు వెళ్ళిన కిషన్ ముడ్డి పై మూడు పోలీసు లాఠీ మార్కులు పడ్డాయి కానీ కావాల్సిన దినుసులు ఏవీ దొరకలేదు. క్రమంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో కరోనా మరణాలు ఎక్కువవుతున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా మరణాల వల్ల ప్రపంచమంతా భయం తో వణకి పోతుంది.
ఇరవై ఒక్క రోజులు మాత్రమే అనుకున్న లాక్డౌన్ క్రమంగా పెరుగుతుంది. మళ్ళీ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. వారి యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు, కంపనీ నుండి రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. పరిస్థితి దిక్కు తోచకుండా ఉంది. కనుచూపు మేరలో సమస్యకు పరిష్కారం కనపడటం లేదు.
రోజు రోజుకీ పెరుతున్న కరోనా వల్ల అందరిలో తెలియని భయం పట్టుకుంది. చూస్తుండగా ఒక పైపుల్లో కాపురం ఉంటున్న రెండు ముసలి ప్రాణాలు గాల్లో కలసి పోయాయి. అవి కరోనా మరణాలు అని కొందరు, కాదని కొందరు. ఏది ఏమయినా కనీసం శవాలను చూడడానికి కూడా ఎవ్వరూ సాహసించలేదు. విషయం తెలిసి ఒక స్వచ్చంద సంస్థ వాళ్లు శవాలను ఖననం చేశారు. ఈ సంఘటనతో అందరిలోనూ భయం ఒక్కసారి పడగ విప్పింది, అందరి ఆలోచనలు పదునెక్కాయి. ఎట్లాగూ చావు తప్పేట్లు లేదు, ఆ చచ్చేదేదో మన ఊర్లోనే సద్దాం అని కొందరు వలస కార్మికులు మూట ముల్లె సర్దుకుని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వంత ఊరికి కాలి బాట పట్టారు.
ఎప్పుడు చేరుతారో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ తినాలో, ఎవరు తిండి పెడతారో ఏదీ ఆలోచించే స్థితిలో లేరు. ఉన్న ఆలోచనంతా తమ స్వంత గూటికి చేరాలి, తమ కన్న వాళ్ళ ను చూడాలి. చావైనా , బ్రతుకైనా తమ వాళ్ళ మధ్యే! అనుకున్నదే తడువు అందరూ కలసి కట్టుగా బయలు దేరారు, వారితో పాటు కిషన్, ప్రతాప్ కుంటుంబాలు కూడా.
రోడ్డు పై నడవడానికి కూడా అనుమతి లేదు, హైవే ఎక్కితే పోలీసులు లాఠీలకు పని చెపుతున్నారు. సందుల నుండి, గొందుల నుండి , కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కొంత మంది, నెత్తి మీద మూటలతో, సంకలో పిల్లల్తో కొందరు – నడక, నడక, నడక … ఆకలి దప్పులను కూడా మరచి నడక… అలుపెరుగని నడక … సందులలో కూడా పోలీసు లాఠీ దెబ్బలు తప్పట్లేదు కొందరికి. మానవత్వం మచ్చుకైనా కనపడని కొందరు భక్షక భటులు, లంచాలు తినడంలో మరిగిన వారు వలస కార్మికులనూ వదల లేదు. కొంగు ముడుల్లో దాచుకున్న పదీ పరక కూడా లాక్కున్నారు. పిల్లాడి పాలకోసం దాచుకున్నచిల్లర డబ్బులు కూడా దోచుకున్న పోలీసులు కొందరయితే, కరోనా కి భయపడక, రోజుల తరబడి భార్యా పిల్లల కి దూరంగా ఉండి తమ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఇంకొందరు!
తమ స్వంత గూటికి చేరాలనుకుని ఇంటి దారి పట్టిన వలస కార్మికులు , పలు ప్రాంతాల నుండి, ఎన్నో వేల సంఖ్యలో చేరడంతో, ఒకరికొకరు అండగా ఉండగా, మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది వారిలో. ఈ ప్రయాణాలు ఆపడానికి ప్రయత్నించిన ప్రభుత్వం, వలస కార్మికుల మొండి పట్టుదల, మెజారిటీ ముందు ఓడిపోయింది. అప్పటికే కొన్ని స్వచ్చంద సంస్థలు వీరికి కావాల్సిన ఆహరం, నీళ్లు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.
గుంపులు గుంపులుగా వేలాది మంది జనం సమ్మక్క సారక్క జాతరలా ప్రతీ రోడ్డుపై ఒక జాతర దృశ్యం ఆవిష్కృతమైంది. అందరితో పాటు కిషన్,ప్రతాప్ కుటుంబాలు కూడా అప్పటికే పదిహేను రోజులకి పైగా అయ్యింది రోడ్డెక్కి.
కాళ్ళు రక్తాలు కారుతున్నాయి, ఒక నిండు గర్భవతి రోడ్డు పైనే ప్రసవం అయ్యింది, కళ్ళ ముందే ఒక స్త్రీ నడుస్తూ పడి పోయి క్షణాల్లో కన్ను మూసింది. అలసి సొలసి, రైలు పట్టాలపై విశ్రమిస్తున్న ఇరవై కి పైగా వలస కార్మికుల పై నుండి వెళ్లిన రైలు, వారి శరీరాలను ఛిద్రం చేసింది. దారి మధ్యలో ఎన్నో భయంకరమైన వార్తలు, సంఘటనలు తెలుస్తున్నాయి, అయినా మొక్కవోని ధైర్యంతో కిషన్, ప్రతాప్ కుటుంబాలు కష్టాలను ఓర్చుకుంటూ వేలాది మంది తోటి వలస కార్మికులతో పాటు ముందుకి నడుస్తూనే ఉన్నారు. ఎక్కడయినా గ్రామస్తులు పంచిన ఆహారం తినడం , లేదంటే పస్తులతో నడవడం.
దాదాపు తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి రెండు కుటుంబాల్లో. పిల్లవాడి కోసం ఒక వంద రూపాయల వరకు తన చీర బొడ్లో దాచుకుంది అంజు. ఆకలై ఏదన్న కొనుక్కోవాలనుకున్నా, కేవలం పిల్లవాడికి మాత్రం కొనిచ్చి దాచిన ఆ డబ్బుని మాత్రం ముట్టలేదు.
నీది నాది అని చూడకుండా ప్రతాప్, నర్సింగ్ లు ఏ అవసరానికి వెనుకకి పోయే వారు కాదు. ఇంత కష్ట కాలంలో కూడా ఉన్నంతలో అందరూ కలసి తింటున్నారు, లేనప్పుడు ఎండుతున్నారు. కొన్ని సార్లు రెండు రోజుల వరకూ నీళ్లు మాత్రమే తాగుతూ నడచిన రోజులు ఉన్నాయి. అయినా తమ స్వంత గూటికి చేరుకోవాలనే ఆశల మధ్య నడక మాత్రం ఆగట్లేదు.
ఎన్నో ప్రజా సంఘాల విన్నపాలు, విజ్ఞప్తులు వలస కార్మికుల కష్టాలు విన్న తర్వాత ప్రభుత్వం కూడా దిగి వచ్చి వారి వారి స్వంత ఊర్లకు పోవడానికి బస్సులు,రైళ్లు సమకూర్చింది ప్రత్యేకంగా. వేలాది మంది వలస కార్మికుల కష్టాలు తీరే సమయం ఆసన్నం అయింది. వారి ఆనందానికి హద్దు లేదు, అందరి ముఖాల్లో ఒక ఆశాజనికమయిన చిరునవ్వు.
ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు ప్రతాప్, నర్సింగ్ కుటుంబాల్లో! ఎందుకంటే తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. గత నెలలో చేసిన పని తాల్లూకు డబ్బులు, ఈ నెలలో చేసిన పని తాలూకు డబ్బులు కంట్రాక్టు యజమాని వస్తే గానీ ఇవ్వమని అనడం వల్ల , రావలసిన వేల రూపాయలు వదిలేసి , ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడెక్కారు.
ఇప్పుడు బస్సెక్కి తమ ఊరికి పోవాలంటే కనీసం అందరికీ వెయ్యి రూపాయలన్న కావాలి. కానీ కొడుకు కోసం దాచిన వంద మినహా, ఎవ్వరి చేతిలో చిల్లి గవ్వ లేదు. కాళ్లు బొబ్బలెక్కి రక్తాలు కారుతున్నాయి. తమ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు, ఎప్పుడూ ఎవర్నీ చేయి చాపి అడిగింది లేదు. ఉన్న దానిలో కలో, అంబలో కాచుకుని సంసారాలు లాక్కొస్తున్న వీరి జీవితాల్లో ఎప్పుడూ రాని ఈ విపత్కర పరిస్థితికి మనసులోనే తిట్టుకుంటున్నారు.
ఇన్ని రోజులు బస్సులు లేక తమ ఊరికి పోలేక పోయారు, ఇప్పుడు బస్సులు నడుస్తున్న సమయంలో చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇంత బాధను ఎప్పుడూ చూడని శివంతి కి దుఃఖం ఆగలేదు, అంజు భుజం పై తల పెట్టి బావురు మంది. శివంతి బాధని చూసి అంజుకి కూడా దుఃఖం ఆగలేదు., ఒకరినొకరు పట్టుకొని దుఃఖం తగ్గేవరకూ ఏడ్చారు.
ఈ గండం నుండి ఎలా గట్టెక్కడం? ఊర్లో ఉన్న తన వృద్ధ తల్లి తండ్రులని ఎలా చేరుకోవడం? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కిషన్. ఈ బస్సుల వెసులు పాటు కేవలం రోడ్ల మీదున్న వలస కార్మికుల్ని ఇండ్లకు చేర్చడం వరకే. అంటే ఆలస్యం చేస్తే, ఈ బస్సులు వెళ్లి పొతే మళ్లీ బస్సులు నడుస్తాయనే గ్యారంటీ లేదు. హాయిగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమ జీవితాలని బిక్షగాళ్ల కన్నా హీనంగా మార్చిన ఈ కరోనా రేపిన కల్లోలం తలచుకుంటేనే దుఃఖం తో పాటు కనపడని ఆ శత్రువు పై కోపం ఆగట్లేదు కిషన్ కి.
ఫోన్ రీచార్జ్ కి కూడా డబ్బులు లేక,ఫోన్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ లో పెట్టి ఇద్దరూ ఒకటే ఫోన్ ని వాడుకుంటున్నారు చాలా పొదుపుగా అవసరం అయినప్పుడు మాత్రమే. మరొక్క సారి తమ యజమాని కిశోర్ బుండేలా తో మాట్లాడి చూద్దాం అని రింగ్ కలిపాడు కిషన్. అవతల వైపు నుండి ఆయన భార్య ఫోన్ ఎత్తి, కిషోర్ వారం రోజుల క్రితమే కరోనా వల్ల చనిపోయాడని ఏడుస్తూ చెప్పింది.
ఒక్క సారిగా కుప్పకూలి పోయాడు కిషన్. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు, విషయం తెలిసి ప్రతాప్ కూడా నిశ్చేష్టుడయ్యాడు. నేడు కాకపొతే రేపన్నా డబ్బులు వస్తాయనే ఆశ ఉండేది, ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయింది అని కుమిలి కుమిలి ఏడ్చారు అందరూ.
ఏ మార్గం కనపడటం లేదు, రేపొక్క రోజే బస్సులు నడుస్తాయని, బస్సులు ఎప్పుడు ఎక్కడ నుండి బయలు దేరుతాయో టీవీల్లో, రేడియోలో ఆ వివరాలు చెపుతున్నారు. ప్రతాప్, శివంతి మహారాష్ట్ర వెళ్ళాలి, కిషన్, అంజు బీహార్ వెళ్లాలంటే చాలా రాష్ట్రాలు దాటి పోవాలి. టికెట్ రేటు కూడా చాలా ఎక్కువే. ఒంటి పై ఉన్న బంగారం అమ్ముకోవడం కన్నా వేరే మార్గం కనిపించలేదు వాళ్ళకి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వ్యాపార సంస్థలు మూసి వేయబడి ఉన్నాయి కాబట్టి ఎక్కడ అమ్మాలో కూడా తెలియడం లేదు. వెదకగా, వెదకగా ఒక గల్లీలో చిన్న దుకాణం అతను బంగారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దాదాపు సగం నష్టానికి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ గొలుసుని సగం నష్టానికి అమ్మడానికి ఎవ్వరికీ మనసొప్పలేదు.
చాలా మంది వలస కార్మికులకి ఊర్లకు పోవడానికి కూడా డబ్బులు లేవు అనే విషయం తెలుసుకున్న ఒక జర్నలిస్టు, ఈ విషయాన్ని టివీల్లోనూ, సోషల్ మీడియాలోనూ చేసిన ప్రకటనకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కొందరికి టికెట్ డబ్బులు సమకూర్చారు, అందులో కిషన్, ప్రతాప్ రెండు కుటుంబాలకు పూర్తి టికెట్లను ఒక సంస్థ కొనిచ్చింది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ బంగారాన్ని అమ్మకుండా సమస్య తీరినందుకు చాలా సంతోష పడ్డారు అందరూ. గుంపులు గుంపులుగా ఉన్న వలస కార్మికులు తాము ఎక్కాల్సిన బస్సుకోసం ఎదురుచూస్తున్నారు.
కరోనా విపత్కర సమయంలో ఎన్నో భయంకరమైన వార్తలు వింటూ , భవిష్యత్తును తలచుకుంటూ మరింత దగ్గరయ్యాయి ఈ రెండు కుటుంబాలు. ఊరు కాని ఊరు, బాష తెలియని ప్రాంతం, ప్రతి దానికి ఒకరికొకరు చేదోడు వాదోడు గా ఉండటం వల్ల ఇన్ని రోజులు ఏ లోటు తెలియలేదు.
కీచు మని హారన్ కొడుతూ రివ్వున తీసుకొచ్చి బస్సుని రోడ్డు పై ఒక పక్కన ఆపాడు డ్రైవర్.
“ ఆ మహారాష్ట్రా..మహారాష్ట్రా – కొల్లాపూర్,రత్నగిరి ,సింధుదుర్గ్ “ కండక్టర్ అరుస్తున్నాడు బస్సులోనుండి దిగుతూ. ఒక మొబైల్ మైక్ ని భుజాన వ్రేలాడదీసుకొని బస్సు పక్కన నిల్చొన్న ఇంకొక సేవా సంస్థ ప్రతినిధి గుంపులు, గుంపులుగా బస్సుల కోసం ఎదురు చూస్తున్న వలస కార్మికులకు వినబడేట్టు కండక్టరు చెప్పిన దాన్నే మళ్లీ మళ్ళీ చెపుతున్నాడు మైక్ లో అందరికీ వినబడేట్లు.
అప్పటి వరకు ఎక్కడెక్కడో కూర్చున్న మహారాష్ట్ర వలస కార్మికులు హడా విడిగా , వారి వారి మూట ముల్లె సర్దుకుని, చిన్న పిల్లలని , ఎత్తుకుని పరుగెడుతున్నారు బస్సు వైపు. మహారాష్ట్ర కాకుండా వేరే రాష్ట్రాలకు పోవాల్సిన వారిలో కొంత నిరాశ, వాళ్ళ బస్సు ఎప్పుడు వస్తుందా అనే అసంతృప్తి వారి కళ్ళల్లో కనపడుతుంది.
గత నాలుగేళ్ళ నుండి మంచిలో చెడులో అన్నదమ్ముల లాగా కలిసి ఉన్న రెండు కుటుంబాలు ఇప్పుడు విడిపోయే సమయం వచ్చింది. కొద్ది సేపట్లోనే మహారాష్ట్ర పోయే బస్సు వచ్చి ఆగింది. మహా రాష్ట్ర బస్సు వచ్చిందని మైక్ లో అనౌన్స్ చేయగానే , ఇన్ని రోజుల స్నేహానికి ఇక చరమగీతం పాడటం తప్పదని తెలిసి అంజు, శివంతి ఒకరినొకరు పట్టుకుని బావురుమన్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియని పసివాడు ప్రశార్థకంగా ఇద్దరినీ చూస్తున్నాడు.
ప్రతాప్, శివంతి కి వారి స్వంత ఊరికి చేరుతున్నామనే సంతోషం ఉన్నా ఇన్ని రోజుల స్నేహాన్ని విడి పోతున్నామనే బాధే ఎక్కువయింది. ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్లడం సంతోషమే, కానీ బాధంతా ఒకరికొకరు చెప్పుకోక పోయినా అందరి మనస్సులను కలచి వేసేది ఒకటే “జీవితంలో మళ్ళీ కలుస్తామో లేదో! కరోనా మమ్మల్ని వదుల్తుందో లేదో, బతికి బట్టకడతామో లేదో!!” అనే దిగులు మాత్రమే. కిషన్ ప్రతాప్ లు గట్టిగా కౌగిలించుకున్నారు. ఇన్ని రోజుల స్నేహం ఒకవైపు కాగా, ఈ నెలరోజుల ప్రయాణ జ్ఞాపకాలు రెండు కుటుంబాలని వదలట్లేదు.
నీళ్ల దగ్గరా , తిండి దగ్గరా ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ సగం కడుపుతో పడుకున్న రోజులు, ఒకరికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకొకరు పడిన వేదన, మందుల కోసం తిరిగిన వీధులు అన్నీ గుర్తుకొచ్చాయి. పిల్లోడికి ఆకలిగా ఉన్నప్పుడు, దారిలో జ్వరం వచ్చినప్పుడు ఆడవాళ్లు ఇద్దరూ పడిన మథనం అంతా ఇంతా కాదు. కష్టాల్లో ఏర్పడిన స్నేహమే కలకాలం నిలుస్తుంది అనడానికి ఈ రెండు కుటుంబాల స్నేహమే ఒక ఉదాహరణ. కష్టకాలంలో వందల కిలోమీటర్లు నడచిన వారి స్నేహం, దగ్గరయిన ఆ హృదయాలు ఇప్పుడు విడిపోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.
అతి కష్టం మీద మూట ముల్లె పట్టుకుని అందరూ బస్సువైపు భారంగా అడుగులేస్తున్నారు. పిల్లవాడి కోసం పార్ధు , శివంతి చేసిన సేవలు, తిండి దగ్గర నీళ్ల దగ్గర, వాడు నడవ లేనప్పుడు,ఎత్తుకొని నడిచిన సంగతులన్నీ గుర్తుకొచ్చాయి అంజు కి. తాను అలసిపోయి ఒళ్ళుతెలియకుండా పడుకున్నప్పుడు శివంతి ప్రమోద్ ముడ్డి కడిగిన సంగతులు గుర్తుకొచ్చి కండ్ల లో నీళ్లు తిరిగాయి. అంతటి ఆత్మీయతని చూపిన పార్థు , అంజు లు తమ నుండి దూరంగా వెళ్లి పోవడం తట్టుకోలేక పోతుంది.
కండక్టర్ తొందర చేస్తున్నాడు త్వర త్వరగా ఎక్కు మని. అప్పటికే బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ ఋణం ఏమిచ్చి తీర్చుకోవాలో అర్థం కాలేదు అంజుకి. రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు వింటుంటే ఇంకొక వైపు జీవితంలో మళ్ళీ కలుస్తామో లేదో అని దిగులు ఇంకోవైపు పెరిగింది అంజుకి. పార్థు- శివంగిల దగ్గర ఒక్కపైసా లేదనే విషయం తెలుసు అంజుకి. దారి ఖర్చుల కోసం ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది, బొడ్లో దాచుకున్న డబ్బులు చూసింది ఎన్నున్నాయా అని? లెక్కపెట్టి చూస్తే యాభై రూపాయలు, అందులోంచి వెంటనే ఇరవై అయిదు రూపాయలు తీసి శివంగి చేతిలో పెట్టింది.
“అందర్ చలో – అందర్ చలో !” కండక్టర్ తొందర చేస్తున్నాడు. అసలు చేతిలో ఏమి పెట్టిందో కూడా చూసుకునే వీలు లేదు శివంగికి. మనసు తృప్తి గా ఉంది అంజుకి. బస్సు కదులుతుంటే ఆ జనాల మధ్య లోంచి చూస్తూ చేయి ఊపుతున్నారు శివంతి, పార్థు. ఎవ్వరి ముఖాలకీ మాస్కులు లేవు, ఆరు ఫీట్ల దూరం పక్కకిపెడితే,, ఆరుఇంచుల దూరం కూడా లేదు ప్రయాణికుడికి, ప్రయాణికుడికి మధ్య.
చిన్న తొక్కిసలాటల మధ్య వాళ్ళు బస్సులోపలికి నడుస్తుంటే అలాగే నిలబడి భారంగా చూస్తున్నారు బస్సు లోపలికి. అంతలోనే బీహార్ .. బీహార్ అని కండక్టర్ అరుస్తుండగా ఇంకొక బస్సు వచ్చి ఆగింది రోడ్డుకి ఇంకొక పక్కన.
మైక్ పట్టుకున్న వాలంటీర్ మహారాష్ట్ర బస్సు దగ్గరి నుండి బీహార్ వెళ్లే బస్సుదగ్గరికి వెళ్లి “బీహార్ .. బీహార్ .. పాట్నా ‘ అని అరుస్తున్నాడు చాలా దూరంగా చెట్ల క్రింద, షాపుల షెడ్డులకింద కూర్చున్న వందలాది వలస కార్మికులకు వినిపించేట్టు. బీహార్ అని వినపడగానే, పరుగు పరుగున కదిలి వచ్చారు వందలాది మంది వలస కార్మికులు.
బస్సు రాగానే ఒక సీటు చూసుకొని కూర్చుంటే చాలు ఈ జన్మకి ఇంతకన్నా పెద్దకోరిక ఏది ఉండబోదు అన్నట్టుగా అందరి ముఖాల్లో కొంత తృప్తి మాత్రం కనిపిస్తుంది. ప్రమోద్ ని ఎత్తుకుని మూట ముల్లె తెచ్చుకోవడానికి పరుగెడుతున్నాడు కిషన్, అంజు కిషన్ వెంట పరుగు అందుకుంది.
మొత్తానికి లగేజీ తెచ్చుకొని బస్సు ద్వారం వద్ద నిలుచున్నారు. దాదాపు ముప్పై గంటల ప్రయాణం, తిండి ఎక్కడ దొరుకుకుతుందో తెలియదు. పెద్ద వాళ్ళు అయితే ఆకలికి తట్టుకోగలరు , మరి పిల్ల వాడి పరిస్థితి ఏంటి? ఆలోచన వచ్చిందే తడువు పిల్లవాణ్ణి కిషన్ పక్కన సీటు లో కూర్చుండబెట్టి బస్సు పక్కనే ఒకబండి పై బిస్కట్ లు, పాప్ కార్న్ లు అమ్ముతుంటే కొనడానికి దిగింది. డబ్బులు చూసికుంది , ఇరవై అయిదు రూపాయలు, బిస్కట్ పాకెట్ కి పది రూపాయలు , పాప్ కార్ కి 5 రూపాయలు చెల్లించి పది రూపాయలు మిగుల్చు కొని బస్సు ఎక్కింది.
ఒక స్వచ్చంద సంస్థ వాటర్ బాటిల్స్ ఇస్తుంటే రెండు బాటిల్స్ తీసుకుని బస్సు ఎక్కింది. బస్సులో ఎక్కి కూర్చుని ఒక సారి కళ్లు మూసుకుంటే గత నెలరోజుల తమ కష్టాలు, ఎండనకా , వాననకా, రోడ్డు పైనే నిద్రించిన రోజులు అన్ని కండ్లకు కట్టి నట్టు గుర్తుకు వస్తుంటే, తలుచుకుని లోలోపలే కుమిలి పోయింది. బస్సు కదులుతుంది. తమ తల్లి తండ్రులని కలసి నట్టు, వారితో మనస్పార్తిగా మాట్లాడుతున్నట్టు .. ఎన్నో మధుర మైన ఊహలు ..బస్సు తో పాటు కిషన్ మనసు పరుగెడుతోంది. ఎన్నో రోజుల నిద్ర లేని రాత్రుల తర్వాత, బస్సులో కూర్చునగానే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియ లేదు ఇద్దరికీ.
***
“మామా .. బస్స్టాండ్ దాకా పోయేద్దాం దాం ! వలస కార్మికులకు గవర్నమెంట్ బస్సులేసిందట ఒక స్టోరీ చేసుకు రావాలి, చాలా రోజుల తర్వాత నాకు ఒక పని దొరికింది” తన ఇంటి ముందు కుర్చీ ఏసుకుని ఫోన్ లో పబ్జీ ఆట ఆడుతున్న నరేందర్ తో అన్నాడు జర్నలిస్టు సురేష్ తన బైక్ ని బయటకు తీస్తూ. సురేష్, నరేందర్ చిన్నప్పటి ఫ్రెండ్స్ పక్క పక్క ఇండ్లలో నివసిస్తారు.
“సరే మామ, నడువ్..అదే చూస్తున్న.. ఇంట్ల కూసుండి- కూసుండి బోరు కొడుతుంది” అని బైక్ పై కూర్చున్నాడు. సురేష్ బైక్ స్టార్ట్ చేసి బస్టాండు వైపుకి తీసుకుపోతున్నాడు తన బైక్ ని.
“నెల రోజుల పైనే అయ్యింది మామ జీతం లేక, పని మాత్రం చెప్తున్నరు, ఎప్పుడిస్తారో ఏమో జీతం“ అన్నాడు కొంత దిగులుగా సురేష్.
“ గదేంది మామ, నన్ను అడగద్దా ఒక సారి? వారం రోజుల కింద రైతుబంధు పథకం పైసలు పడ్డయి బ్యాంకుల. మందుకొడదాం అంటే బార్లు బందు అయినాయ్. నాలికంత ఎండి పోయింది మామ మందు లేక నెలరోజుల నుండి” అన్నాడు నరేందర్ అసహనంతో.
నరేందర్ గత నాలుగేళ్ళ నుండి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ గాచేస్తున్నాడు. తండ్రి నుండి వచ్చిన ముప్పై ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఇంతకుముందు కౌలుకిఇచ్చేవాడు. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత కౌలుకివ్వడం కూడా మానేసి ప్రభుత్వం నుండి సంవత్సరానికి రెండుసార్లు వస్తున్న లక్షల రూపాయలతో కాలక్షేపం చేస్తున్నాడు.
“నీకేంది మామ , మస్తు ఎంజాయ్ చేస్తున్నావ్, మస్తుంది లైఫ్” అన్నాడు సురేష్ ఏదో ఒకటి మాట్లాడాలని.
“వద్దంటే పైసల్ ఇస్తుంటే తీసుకుకోకుంటే ఏం చేస్తం మామ?” అన్నాడు లాజిక్ గా నరేందర్.
“కరెక్టే కదా. కొన్ని సేవింగ్స్ ఉన్నాయి మామ, లేనప్పుడు అడుగుతానులే” అన్నాడు మామూలుగానే సురేష్. అనవసరంగా అప్పుచేసే అలవాటు లేదు సురేష్ కి.
“ పంటలేసే వారికీ, వేయని వారికి అందరికీ ఊరికే డబ్బులిస్తుంటే ఎవరయినా ఎందుకు తీసుకోరు? ఒకరికి ఊరికే వచ్చిన డబ్బులు ఎక్కువ అయి ఖర్చు పెట్టడానికి ఇబ్బంది, ఇంకొకరికి చేసిన శ్రమకి డబ్బులురాక ఇబ్బంది” మనసులో అనుకున్నాడు తన పరిస్థితి ని బయటకి చెప్పలేక సురేష్.
అంతలోనే బస్స్టాండ్ చేరుకున్నారు. “ఆదిలాబాదు బస్సు స్టాండు “ అని పెద్దగా రాసి ఉన్న సైన్ బోర్డు క్రింద ఒక పక్కన బైక్ ని పార్క్ చేశాడు సురేష్. నరేందర్ కి ఇంకెవరో కలిస్తే మందు దొడ్డి దారిలో ఎక్కడ దొరుకుతుందో కనుక్కుంటున్నాడు. నరేందర్ ని అక్కడే ఉండమని, బస్సు లు దిగుతున్న , ఎక్కుతున్న వందలాది మంది వలస కార్మికుల్ని చూస్తూ బస్టాండు లోపలి వెళ్ళాడు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే టాయ్లెట్ కనపడింది పక్కనే.
ఒక సిగరెట్ వెలిగించుకుని కొద్దిసేపు అక్కడే నిల్చున్నాడు. ఆ తర్వాత టాయ్లెట్ లోపలికి వెళ్తుంటే అక్కడ శుభ్రం చేసే స్త్రీ చేయి బయటకి పెట్టి “ ఒంటికి రెండు, రెంటికి అయిదు” అంది చాలా నిర్లక్షంగా. ఓ.. ఇదోటి ఉంటుంది కదా బస్స్టాండులో అనుకుని పది నోటు ఇస్తే అయిదు రూపాయల బిళ్ళ తిరిగి చేతిలో పెట్టింది ఆవిడ.
దాదాపు ఆరు గంటల ప్రయాణం తర్వాత అంజు, కిషన్ లు ప్రయాణిస్తున్న బస్సు అప్పుడే ఆదిలాబాదు బస్టాపు లో ఆగింది. సమయం సాయంత్రం ఏడు అవుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా చాలా బస్సులు వచ్చి ఆగాయి. ముప్పై నిముషాలు బస్సు ఆగుతుందని, ఈ లోపల అన్ని పనులు పూర్తి చేసుకుని రావాలి ఆదేశించాడు డ్రైవర్. కొన్ని స్వచ్చంద సంస్థలు అక్కడ వలస కార్మికులకు కావలసిన పులిహోర ప్యాకెట్లు, మంచినీళ్లు ఇస్తున్నారు. అప్పటికే అయిదు గంటలకు పైగా కూర్చున్న వారు బాత్రూం కోసం చూస్తున్నారు.
అంజు కిషన్ , ప్రమోద్ తో పాటు బస్సు దిగారు, అప్పటికే పిల్లవాడు ఒంటికి పోవడానికి తొందర పెడుతున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సు దిగి బస్స్టాండ్ పక్కనే ఉన్న చెట్ల పొదల్లో కి పోయి తండ్రీ కొడుకులు ఇద్దరూ కానిచ్చారు. అప్పటికే ఇద్దరు ముగ్గురు గుర్రుగా చూసారు తండ్రి కొడుకులని.
ఈ ప్రత్యేక బస్సుల వల్ల బస్టాండు మొత్తం చాలా రద్దీగా ఉంది. ఎదురుగానే టాయిలెట్ బోర్డు కనపడింది. టాయిలెట్ లోకి వెళ్ళడానికి లోపల అడుగుపెట్టింది అంజు. “ఒంటికి రెండు – రెంటికి ఐదు” ఎటో చూస్తూ చెపుతుంది లోపల ఒక టేబుల్ పై కూర్చున్న ఆవిడ నిర్లక్ష్యంగా . ఆపుకోవడం చాలా కష్టముగా ఉంది అంజుకి. ఉన్నవే పది రూపాయలు, ఈ పది ఖర్చు అయితే మళ్లీ పిల్లవాడికి ఏదన్న కొనాలంటే ఎలా? అని ఆలోచించుకొంది. “లాక్ డౌన్ లో కూడా పైసలు వసూల్ చేస్తున్నారా?” అంది హిందీలో కొంత కోపంగా బయటకు వస్తూ.
“బస్సులు బందు అయినాక మాకు కూడా నెల రోజుల నుండి ఒక్క పైసా ఆందాని లేదు, మాదేమన్న సర్కారు నౌకరీనా? మేమేమి తిని బతికాలి? మాది మాత్రం కడుపు కాదా?” అంది అంతే కోపంగా. అది కూడా నిజమే కదా అని పించింది అంజుకి. అప్పుడే పురుషుల టాయిలెట్ నుండి బయటకు వస్తున్న సురేష్ వారి సంభాషణ విన్నాడు.
కిషన్, ప్రమోద్ టాయ్లెట్ బయట నిలబడి ఉన్నారు. “ఏమైంది వెళ్ళలేదు” అన్నాడు ప్రశార్థకంగా లోపలికి వెళ్లకుండా తిరిగి వచ్చిన అంజుని చూసి. మనదగ్గర ఉన్నయి మొత్తం పది రూపాయలు. ఈడ అయిదు రూపాయలు పెడితే బుడ్డోనికి ఏమికొనియ్యాలి? మనం ఇంకా ఇరవై గంటలకు పైగా ప్రయాణించాలి. మీరు ఎక్కడ పోయిండ్రో చూపియ్యి, నేను కూడా అక్కడే పోతాను. నువ్వు నిలబడి చూస్తుండు అటు దిక్కు ఎవ్వరు రాకుండా “ అంది అయిదు రూపాయలు ఎలా పొదుపు చేయాలా అన్న విషయం ఆలోచిస్తూ.
హిందీలో జరుగుతున్న ఆ భార్య, భర్తల సంభాషణని చాలా ఇంటరెస్టింగ్ గా వింటున్నాడు సురేష్. వారి దయనీయ పరిస్థితి అర్థం అయ్యింది వారి మాటల ద్వారా. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే జేబులో ఉన్న అయిదు రూపాయల బిళ్ళని టాయ్లెట్ అటెండెంట్ లేడీకి ఇచ్చి వచ్చాడు.
“నేను డబ్బులిచ్చాను నువ్వు వెళ్లొచ్చు” అని అంజు వైపు, కిషన్ వైపు చూసాడు జర్నలిస్టు. అంజు భర్తవైపు చూసింది, సరేవెళ్ళు అన్నట్టు కళ్ల తోటే సైగ చేసాడు. ఇంకేమాత్రం ఆలోచించకుండా వెళ్ళింది కొంత ఇబ్బందిపడుతూ.
“ఈ ఊర్లో టాయ్లెట్ లో కాకుండా బయట పొతే అయిదు వందల రూపాయలు ఫైన్” అంజు లోపలికి వెళ్ళాక చెప్పాడు కిషన్ కి పక్కనే రాసి ఉన్న బోర్డు చూపిస్తూ. ఒక్కసారి జడుసుకున్నాడు కిషన్ ఆ మాటలు విని.
ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని వివరాలు కనుకున్నాడు సురేష్. జరిగిన అన్ని వివరాలు చెప్పాడు కిషన్ బాధపడుతూ. వారి దయనీయ పరిస్థితికి బాగా జాలేసింది సురేష్ కి. జాలి పడితే అది కడుపు నింపదు కదా ..? ఆలోచిస్తున్నాడు సురేష్ ఈకుటుంబానికి ఎలా సహాయపడనా అని. కరోనా కష్ట కాలంలో ఎవరినీ కదిలించినా అన్నీ కన్నీటి కథలే! ఉద్యోగం ఊడిన వారి కథలు ఒక విధంగా, చిన్న చిన్న స్వంత వ్యాపారాల కథలు ఇంకోవిధంగా అటు కరెంటు బిల్లులు, అద్దెలు కట్ట లేక, బ్యాంకులకు ఇ.ఎం.ఐ లు కట్టలేక ఎన్నో అవస్థలు. పర్సులో చూసాడు , ఒక అయిదు వందల నోటు ఉంది.
అంజు వెళ్లి స్వచ్చంద సంస్థ ఇస్తున్న పులిహోర ప్యాకెట్లు తెచ్చి కిషన్ కి, ప్రమోద్ కి ఒకటి ఇచ్చి తానూ ఒకటి తింటుంది. మనిషికి ఒకటి మాత్రమే ఇస్తున్నారు. ఆవురావురుమని పులిహోర తింటున్న తీరు చూస్తే వారి ఆకలి ఎలాంటిదో అర్థం అయ్యింది సురేష్ కి.
పక్కనే ఉన్న షాపులో కొన్ని బిస్కట్లు, కొన్ని పండ్లు కొని ఒక వంద తన దగ్గర పర్సులో పెట్టుకొని మిగతా మూడు వందల రూపాయలని కిషన్ చేతిలో పెట్టాడు. ఇదంతా ఊహించని కిషన్ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.
“ భయ్యా” అని కళ్ళలో నీరు సుడులు తిరుగుతుంటే సురేష్ రెండు చేతులని ఆప్యాయతతో తాకాడు ఇంకేమీ మాటాడలేక. అంజు క్రతఙ్ఞతగా రెండు చేతులు జోడిస్తూ ఒక బిస్కెట్ పాకెట్ని ప్రమోద్ చేతిలో పెట్టింది. బిస్కట్ పాకెట్ ని చూడగానే వాడి కళ్ళు సంతోషం తో మెరిసాయి. డ్రైవర్ బస్సు హారన్ కొడుతున్నాడు అందరినీ లోపలికి రమ్మని. కళ్ళలో నిండా కృతజ్ఞతతో బస్సు ఎక్కుతున్నారు కిషన్, అంజు, ప్రమోద్ సురేష్ వైపు చూస్తూ, చేతులు జోడిస్తూ !
బస్సులేశారని వాళ్ళ సంతోషాన్ని కవర్ చేసుకునేందుకు వచ్చిన సురేష్ కి ఎక్కడా అలాంటి సంతోషం కనపడలేదు, సరిగదా శ్రమ చేసి సంపాదించడం మాత్రమే నేర్చిన లక్షలాది శ్రామికులు ఈ రోజు పైసాపైసాకు పడుతున్న తపన, బిక్షగాళ్లుగా మారి ఎవరి దయాదాక్షిణ్యాల పైననో ఆధారపడటం కళ్ళముందు కనిపిస్తుంది. ప్రధాన మంత్రి చెప్పిన ఇరవై లక్షల కోట్లు ఎక్కడ ఎవరికి సహాయ పడుతున్నాయో తెలియదు. వారి గమ్య స్థానాలకు చేరడానికి వారు పడుతున్న ఆవేదన, దయనీయ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సురేష్ కి బాత్రూమ్ విషయం బాగా ఆలోచింపచేస్తుంది.
రెస్టారెంట్ తన కష్టమర్ల కు టాయ్లెట్ సౌకర్యం తప్పని సరిగా కల్పించాలి అని, టిక్కెట్టు పెట్టి సినిమా చూస్తున్న ప్రేక్షకులకి థియేటర్లు విధిగా టాయ్లెట్ సౌకర్యం కల్పించాలి అని, అంతెందుకు ఒక నిమిషం వెహికిల్ లో పెట్రోల్ కోసం ఆగే కస్టమర్ల కోసం ప్రతి పెట్రోల్ బంక్ లో ఉచితంగా ఉపయోగించు మరుగుదొడ్లు ఉండాలనీ నిబంధనలు పెడుతున్న ప్రభుత్వం, తమ నిర్వహణలో నడుస్తున్న ప్రభుత్వ బస్సుల్లో టికెట్టు కొనుక్కొని ప్రయాణిస్తున్న వారికోసం ఉచితంగా ఎందుకు టాయిలెట్లు నిర్వహించడం లేదు? తమకో రూలు, పరులకో రూలు అన్నట్టు ఉంది ప్రభుత్వ నిర్వాకం.
రాయాలని వచ్చిన టాపిక్ ఒకటయితే, దానికన్నా ఇప్పుడు ఈ టాయ్లెట్ విషయమే సురేష్ ని మరింత గా ఆలోచింపచేస్తుంది. రైతులని ప్రభుత్వం ఆదుకోవడం అవసరమే, అయితే వ్యవసాయం చేయని, ఎప్పుడూ నాగలి కూడా పట్టని భూస్వాముల బ్యాంకు అక్కౌంట్ లో లక్షలు లక్షలు జమ చేయడం ఎంత వరకు అవసరం? డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియని జల్సా రాయుళ్ల కోసం లక్షలు, కోట్ల ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తుంటే, మనిషి కనీస అవసరం అయిన టాయ్లెట్ కోసం డబ్బులు చెల్లించి వెళ్లడం ఎంత దారుణం?
తనకు తోచిన మాటలన్నిటిని , మొబయిల్ ఫోన్లో ఆడియో రూపంలో రికార్డు చేసుకున్నాడు సురేష్. బస్సు ముందుకు వెళ్ళడానికి డ్రైవర్ రివర్స్ గేరులో వెనుకకి వస్తుంటే , బస్సు గ్లాస్ విండో నుండి, అంత మంది మధ్యలోంచి కిషన్ కృతజ్ఞతతో తన వైపే చూస్తున్న చూపు, ఊపుతున్న చేయి ఇప్పుడు తన కలానికి ఒక కొత్త బాధ్యతని గుర్తుచేస్తున్నట్లనిపించింది సురేష్ కి, గుండె నిండా సంతృప్తి తో తాను రాయబోయే కథనాన్ని మనసులో ఊహిస్తూ తన బైక్ దగ్గరికి వెళ్తున్నాడు సురేష్. నరేందర్ కళ్ళలో ఆనందం పొంగి పొర్లుతుంటే ఎదురు చూస్తున్నాడు సురేష్ కోసం చేతిలో రెండు ఫుల్ బాటిల్స్ తో!
-వేణు నక్షత్రం (U.S.A.)
“సూరీ, భోజనం చేస్తావా?” వంటింట్లోంచి తల్లి అనసూయమ్మ కేక.
” లేదమ్మా, ఈ రోజు రాహుల్ బర్త్ డే, వెళ్ళాలి ” బెడ్రూం నుండి సూరి సమాధానం.
“ఇంత రాత్రి టైములో వెళ్తావా?”
“ఫ్రెండ్స్ వస్తారు, నేనూ వెళ్ళాలి “.
” బర్త్ డే పార్టీ అయిపోగానే వెంటనే వచ్చేయ్.” సలహా ఇచ్చింది అనసూయమ్మ.
*****
“అక్కా, రాహుల్ బర్త్ డే పార్టీకి వెళ్తున్నాను, అమ్మా నాన్న మార్కెట్ నుండి రాగానే చెప్పు.” అంటూ సాయి శాండల్స్ తొడుక్కున్నాడు.
“ఆల్రెడీ ఎనిమిది దాటింది. మళ్లీ ఎప్పుడొస్తావు” అడిగింది స్నేహ.
“డిన్నర్ చేసి వస్తాను. సూరి బైకు మీద రాహుల్ ఇంటికి వెళ్తాము.” అన్నాడు సాయి.
“జాగ్రత్త” స్నేహ తలుపు వేసుకుంటూ చెప్పింది.
*****
సూరి రెండున్నర లక్షల టీవీఎస్ అపాచీ బైకు వెనుక సీటు మీద సాయి కూర్చోగా వాయువేగంతో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న రాహుల్ ఇంటికి బయలు దేరారు. సూరి ఖరీదైన మాంటేకార్లో టీ-షర్టు, లీవైస్ జీన్స్ ప్యాంటు వేసుకొని జులపాల జుట్టుతో ఉండగా, సాయి పోలో టీషర్ట్, మామూలు జీన్స్ ప్యాంటు, విరాట్ కోహ్లి హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. రాహుల్ ఇంటికి చేరేసరికి మనో, రాహుల్ ఇంటి ఆవరణలో తన మొబైల్ ఫోనులో మాట్లాడుతున్నాడు.
“ఏంట్రా మనో గాడు ముందే వచ్చిండు, ఈ రోజు కుంభ వృష్టి పక్కా” , బైకు పార్క్ చేసుకుంటూ అన్నాడు సూరి.
“అవున్రా, నేను స్టేడియం నుండి డైరెక్ట్ గ ఇక్కడికే వచ్చిన, మా అయ్య ఇప్పుడే క్లాసు పీకిండు, ఇవన్నీ మనకు కొత్త కాదుగా, ఇన్ని సార్లు విన్నం” అంటూ తన జుట్టు వైపు చూపించాడు మనో.
“అరేయ్, వీనికి జుట్టే లేదు, జుట్టు చూపిస్తుండు ” అని సాయి అనగానే ముగ్గురూ పెద్దగా నవ్వుకున్నారు.
****
రాహుల్, సూరి, సాయి, మనో నలుగురు హైదరాబాద్ శివార్లోని ఇంజనీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్నారు. సాయి ది మధ్య తరగతి కుటుంబం. మిగతా ముగ్గురివి బాగా బలిసిన కుటుంబాలే.
****
రాహుల్ విశాలమైన ఇంటి డ్రాయింగ్ హాలు మధ్యలో బల్ల మీద ఖరీదైన బర్త్ డే కేకు, ప్లాస్టిక్ కత్తి, క్యాండిల్ ఉన్నాయి. ముప్పై లక్షల రూపాయల ‘ టొయోటా ఫార్చ్యూనర్’ కారు బర్త్ డే బహుమతిగా ముందు రోజే వచ్చింది. డ్రైవర్ సాంబ,రాహుల్, ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేయించి తీసుక వచ్చారు.
****
టైము తొమ్మిది కావస్తుంది. రాహుల్ క్యాండిల్ ఆర్పి కేకు కట్ చేశాడు. రెండు నిమిషాలు కేకలతో, కేరింతలతో హాలు దద్దరిల్లింది. రాహుల్ తల్లిదండ్రులు గ్రీటింగ్స్ చెప్పి పై అంతస్తుకు వెళ్ళారు. స్నేహితులు రాహుల్ కి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. వాచ్ మన్ సత్తయ్య కేకు కట్ చేసి తీసుక రాగా నలుగురు తిన్నారు.
“కేకు తోటే సరిపెడ్తవ, ముప్పై లక్షల రూపాయల కారు కొన్నవు, పార్టీ ఇయ్యవా?” అన్నాడు మనో.
“కొత్త కారులో బంజారా హిల్స్ తబ్లా బార్ కెళ్లి మూడు పెగ్గులు తాగి నెక్లెస్ రోడ్డుకు పోదాం” సలహా ఇచ్చాడు సూరి.
“మా పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చిండ్రు రా డ్రైవర్ లేకుండ కారు తీయొద్దని” అన్నాడు రాహుల్.
” నీకు డ్రైవింగ్ వస్తది కదా, కారు కొన్నదే నీకోసం , వాండ్లు అట్లనే అంటరు, చలో పోదాం” అన్నాడు మనో. నలుగురు లేచి బయటకు వచ్చారు.
“సత్తయ్యా, మేము బయటకు పోతున్నం ” అంటూ కారు డోర్ తీశాడు రాహుల్.
” డ్రైవర్ సాంబకు ఫోను చెయ్యమంటారా” అడిగాడు సత్తయ్య.
“వద్దు, మేమే పోతాం” అంటూ డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు. ప్రక్క సీట్లో మనో కూర్చోగా, వెనుక సూరి, సాయి కూర్చున్నారు. కారు తబ్లా బార్ వైపు దూసుకు పోయింది.
రాహుల్ బ్లాక్ లేబెల్ స్కాచ్, సోడా, బుడ్వైజర్ బీరు, తందూరి చికెన్, అపోలో ఫిష్ ఆర్డరిచ్చాడు. సాయి బీరు తీసుకోగా మిగతా ముగ్గురు స్కాచ్ తీసుకున్నారు. నలుగురు మందు తాగుతూ వారి వారి మొబైల్లో లీనమైనారు. చలి కాలం మూలాన బార్ కిక్కిరిసి ఉంది. ఫ్యామిలీస్ తో వచ్చిన వారిలో కొందరు ఆడవారు కూడా బీరు సేవిస్తున్నారు. రాహుల్, సూరి, మనో తలో మూడు పెగ్గులు లాగించగా, సాయి మరో బీరు తీసుకున్నాడు. టైము పదకొండు కావస్తుండగా బిల్లు పే చేసి నలుగురు బయట పడ్డారు.
“నెక్లెసు రోడ్డులో మంచి ఐస్క్రీమ్ దొరుకుద్ది. అక్కడికి పోనియ్ కారు” ఆర్డరేశాడు సూరి.
కారు పంజగుట్ట, ఖైరతాబాద్ మీదుగా అక్కడికి చేరుకుంది. కార్లు, మోటారు బైకులతో ఆ ప్రాంతం రద్దీగా ఉంది. ఐస్క్రీమ్ పార్లర్లో ఎవరికి కావలసినవి వారు తిన్నారు. తాగిన మత్తు స్లోగా పని చేయటం మొదలైంది. మనో పూర్తిగా అదుపు తప్పాడు. సాయి భుజం మీద చెయ్యి వేసి భారంగా అడుగులు వేస్తున్నాడు. సూరి మాట తడబడుతుంది. రాహుల్ కళ్ళు ఎర్రబడ్డాయి. కష్టంగా డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు.
“రాహుల్, నువ్వు నడుపుతవ, నన్ను నడ్పమంటవ” అడిగాడు మనో .
” నేను పక్కా హోష్ లో ఉన్న. నా కారు నీకిస్తే కుప్ప జేశి పెడ్తవు” అన్నాడు రాహుల్.
” ఓఆర్ఆర్ మీద నడిప్తే నీ దమ్మేందో తెలుస్తది” ఉడికించాడు మనో.
“మనో, నువ్వెందుకు రెచ్చ గొడ్తున్నవు రాహుల్ ని. ఇంటికి పోనియ్ రాహుల్” అన్నాడు సాయి.
రాహుల్ ఇదేదీ వినిపించుకునే స్థితిలో లేడు. 120 కిలో మీటర్ల వేగంతో మొదలైన కారు స్పీడో మీటర్ ఓఆర్ఆర్ మీద 160ని టచ్ చేసింది. సాయి భయంతో మాట్లాడటం లేదు. ఏదైనా అంటే పిరికోడు అంటారు. సూరి వెనుక సీట్లో జారగిలబడి మత్తులో ఉన్నాడు. మనో స్టీరియో ఆన్ చేసి ఫుల్ వాల్యూంలో సల్మాన్ ఖాన్ “సీటీమార్” హిందీ పాట వింటూ అప్పుడప్పుడు రాహుల్ ని ఆట పట్టిస్తున్నాడు.
స్ట్రీట్ లైట్లు వెలగనందున రోడ్డు చాలా వరకు చీకటిగా ఉంది. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుతురు, మత్తులో ఉన్న రాహుల్ కి చిరాకు కలిగిస్తున్నాయి. ముందు వెళ్తున్న పెద్ద ట్రక్కును ఎడమ వైపు నుండి ఓవర్ టేక్ చెయ్యాలనే ఉద్దేశంతో కారును ఎడమ వైపుకు కట్ చేసే ప్రయత్నంలో ప్రక్క నుండి వెళ్తున్న మారుతి ఆల్టోను ఢీ కొట్టడంతో ఆల్టో కారు రెండు పల్టీలు కొట్టి రోడ్డు చివరగా ఉన్న రైలింగ్ కు గుద్దుకొని ఆగింది. రాహుల్ కారు ముందు వెళ్తున్న ట్రక్కును వెనక నుండి గుద్ది డివైడర్ మీదుగా అవతలి రోడ్డుపై పడింది. అదృష్ట వశాత్తూ ఎయిర్ బ్యాగులు తెరుచు కోవటంతో పెద్ద గండం నుంచి బయట పడ్డారు. రాహుల్ రెండు కాళ్లు, మనో ఎడమ చేయి విరిగాయి. సూరి, సాయి చిన్న గాయాలతో బయట పడ్డారు. ముప్పై లక్షల రూపాయల కొత్త కారు నుజ్జు నుజ్జయింది.
ముందు వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ప్రక్కకు ఆపి, ఆల్టో కారు దగ్గరికి వెళ్లి చూసాడు. నలభై సంవత్సరాల మనిషి డ్రైవర్ సీట్లో రక్త సిక్తమై ఉన్నాడు. ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేసి విషయం చెప్పాడు. పోలీసు జీపు, రెండు 108 వాహనాలు కొన్ని నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకున్నాయి. తదుపరి చర్యలకు రాహుల్ బృందాన్ని, ఆల్టో వాహనంలోని శవాన్ని 108 వాహనాల్లోకి ఎక్కించారు.
******
పోలీసు వారు రాహుల్, అతని తల్లి దండ్రులు, మనో, సూరి, సాయి పై నమోదు చేసిన క్రిమినల్ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. సాక్షుల విచారణ, వాదోపవాదాల అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. మనో, సూరి, సాయి ప్రత్యక్షంగా నేరం చేయకున్నా పరోక్షంగా మద్యం సేవించిన రాహుల్ ని ప్రేరేపించి కారు అజాగ్రత్తగా నడపటానికి కారకులైనందున ఒక్కొక్కరికి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. రాహుల్ మద్యం సేవించి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపి ఒకరి మరణానికి, ముగ్గురి గాయాలకు కారకుడైనందున అతనికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు మృతుని కుటుంబానికి నష్ట పరిహారంగా ఇరవై లక్షల రూపాయలు మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశాన్నిచింది.
రాహుల్ తల్లిదండ్రులు డ్రైవింగ్ లైసెన్స్ లేని కొడుక్కి కారు తాళాలు అందుబాటులో ఉంచి, పరోక్షంగా సంఘటనకు బాధ్యులై, మృతుని కుటుంబం ఆసరా కోల్పోటానికి కారకులైనందున అతని ఇద్దరు మైనర్ పిల్లలు మేజర్లు అయ్యేంత వరకు వారి పోషణకై ప్రతి సంవత్సరం వారి తల్లి బ్యాంకు అక్కౌంట్ లో యాభై వేల రూపాయలు డిపాజిట్ చెయ్యాలి. మృతుని కుటుంబానికి జరిగిన అన్యాయం సరిదిద్దలేనిది కాబట్టి, కేవలం కారాగార శిక్షతో సరి పెట్టకుండా, తమ పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తూ, తండ్రిని కోల్పోయిన మైనర్ పిల్లల భవిష్యత్తు కోసం, చట్టం నిర్దేశించని సరి కొత్త సహజ న్యాయం కల్పించాల్సి వచ్చిందని న్యాయమూర్తి తన చారిత్రాత్మక తీర్పులో పేర్కొన్నారు.
రాహుల్ తల్లిదండ్రులు తమ కొడుక్కి ఖరీదైన కారు కొనిచ్చి ఒక కుటుంబానికి తీరని అన్యాయం చేసినందుకు పశ్చాత్తాప పడుతూ కోర్టు తమకు విధించిన శిక్ష సరైనదిగా భావించి నైతికతగా మృతుని భార్యను ఓదారుస్తూ, అండగా ఉంటామని హామీ ఇస్తూ పిల్లలను అక్కున చేర్చుకున్నారు.
