మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

పశుపక్ష్యాదులు వేదన

by సుదర్శనం వేణుశ్రీ. June 23, 2021
written by సుదర్శనం వేణుశ్రీ.

సీ. మననుండివిడిపోయి మైదానమందుండె
వనపర్వతములందె వసతి మాది
మనజాతిగుణములు మానవులమదిలో
ఒదిగిమనలమించి ఒకరొకరును
మనలక్షణములను మసులుకొనుచునుండి
మనలతిట్టుకొనగ మనుజులేమొ
మనవాసములనెల్ల మాయముచేయుచు
మనుషులెందులకిల మనలచంపి
తే. విందుభోజనములుచేయు వికృతమైన
జాతివారలుగున్నట్టి జనములైరి
దయనుమరచినవారలై భయముగొల్పుచు
కోప తాపాలకొందరు కుజనులైరి.

సీ. జంతువులైనట్టి జాతిమాదైనను
ఆహారముకొరకు అదనుచూసి
వేటాడితినెదము వివిధరుచికికాదు
దాచుకొనువిధాలు తలచబోము
ఆత్మరక్షణకోరి అడవులందుండేము
అన్యాయములునుమాకసలురావు
కొండగుహలనుండి కూటికై వేటాడి
తినుచుండుమమ్ముల తరుముటేల
తే. మానవులికనుద్వేషాల మర్వరైరి
మీకుమీరైమనుషులుగ మెదలుకొనుచు
ఆస్థియంతస్థులకొరకు అల్పులౌచు
పలుచనౌదురుమాజాతి పసులముందు.

సీ. అడవి మైదానాల హాయిగాతిరుగాడు
పక్షులానందము పంచుచుండి
విహరించుగగనాన వివిధభంగిమలలొ
స్వీయనిర్మాణాల చిత్రముగను
గూళ్ళనునిర్మించి కునుకునుదీయుచు
ఆహారములతిని అనవరతము
పలుశబ్ధరావమ్ము పంచేటి పక్షులు
పాలనిచ్చియుపెంచు పక్షికలదు
తే. పక్షులాహారములతిను పలురకాల
మాంసమాహారమేతిను మరియు కొన్ని
ధాన్యములుతినుపిట్టలు దరికిచేరు
మానవులిలమానవతను మర్వనేల.

 

-సుదర్శనం వేణుశ్రీ.

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సాఫ్ట్‌వేర్ నానీలు

by కుడికాల వంశీధర్ June 23, 2021
written by కుడికాల వంశీధర్

మగతలో
కీప్యాడ్‌పై చెయ్యి పడింది
అల్లుకున్న
అక్షరాలు కవిత్వమైనై

హ్యాకరైనా
కంప్యూటర్లని చేధించగలడు
కాని
అంతరంగాన్ని కాదు

తిరిగిన దేశాలు
పాస్‌పోర్ట్ చూపింది
దేశానికెంత దూరమో
గుట్టు విప్పింది

హార్డ్‌వేర్ అంటే
పైన ఉండే తొడుగు
సాఫ్ట్‌వేర్ ప్రాణం
దానిదే అసలు అడుగు

హార్డ్‌వేర్ అంటే
కనిపించే దేహం
సాఫ్ట్‌వేర్ అంటే
పనిచేసే మంత్రం

ట్విట్టర్‌లో
పిచ్చికూతలు కనిపెట్టిందేమో
పిచ్చుక
అలిగి వెళ్ళిపోయింది!

కొన్ని పరిచయాలు
దూరమవుతాయి
వాడని
పాస్‌వర్డ్ మరచిపోయినట్టు

కన్నీళ్ళు
కాసేపట్లో ఆరిపోతాయి
జ్ఞాపకాలు
గుండెలో ఆర్కైవ్ అవుతాయి

గుండెల్లో
గుబాళించాలి ప్రేమ
అది గూగుల్లో
దొరకదు సుమా!

లెక్కలకే అయితే
క్యాలిక్యులేటర్ చాలు
ఎకసెక్కానికా
కంప్యూటర్?

లెక్కలు నేర్పింది
క్యాలిక్యులేటర్
లెక్కలేనితనం చూపింది
కంప్యూటర్

ఆశలకు కళ్ళెం
లేని మనిషి
అవుట్ ఆఫ్ మెమొరీ
ప్రోగ్రాం అవుతాడు

గూగుల్‌లో
అన్నీ దొరుకుతాయి
ఆమె దుఃఖానికి
కారణం తప్ప

నానా జంక్‌ను
నింపకు
చెత్తకుండీకి కూడా
సహనముంటుంది

నిన్న పనిజేసింది
నేడు బెడిసికొట్టింది
సాఫ్ట్‌వేర్ కూడా
బంధాల మాదిరే!

యంత్రాలకు
మాటలు నేర్పుతారు
ఇంట్లోవారితో
మౌనవ్రతం

రాసింది ప్రింట్ తీసావా?
ఫాంటు మారకపోతే
అందరి చేతిరాత
ఒకటే

రోజు కూలీకి ఎక్కువ
వెట్టి చాకిరీకి తక్కువ
ఇదండీ
సాఫ్ట్‌వేర్ ప్రపంచం

వర్షం కురిస్తే
పంట నవ్వుతుంది
వర్షన్‌తో సాఫ్ట్‌వేర్
మెరుగవుతుంది

సాఫ్ట్‌వేర్ పరిమళం
ఎంత గొప్పదో!
మొగ్గలు కాదు
అవి బగ్గులు

కుడికాల వంశీధర్

June 23, 2021 4 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

Last Night

by Vani Devulapalli June 23, 2021
written by Vani Devulapalli

ప్రముఖ కవి బాల గంగాధర్ తిలక్ ‘ నిన్న రాత్రి’ కవితను ఇంగ్లీషు లోకి అనువదించిన కవిత

Last Night
-Dr. Vani Devulapalli

Tell me a word
Whether I said anything
Whether I told God anything
When He came to me last night
Sat on my bed and looked at me piteously
Keeping His eyes downcast!

Did I ask Him about the boy
Who had committed suicide
Aspiring to fulfil his hunger in futility

Did I tell Him the pathetic story
About the prostitute who sold her youth
She, being frustrated in the
Twilight of her life
Ended her tired life by hanging

Did I show Him the crumbled heart of
An extremely old woman
Who jumped into the river
After hearing the sad news of
Her son’s tragic death in the war against China
Did I explain the dreadful story of
Charred human corpses and human misery
In fuming fire in Congo, Cuba, Cyprus and Laos

Tell me the truth
Tell me the truth
Did I ask Him
Did I accuse Him
Did I arrest Him
To tell me about
You and myself
And about the entirety of the whole creation
About the quiet bowl of heart
Brimmed with poison

I know it, I know
The secret underlying it all
I know the tears rolling down
The cheeks of God pathetically
In the light of the lamp
I saw it all
I stood up with pity
Hugged Him
Consoled Him wiping His tears
I sent Him off at the end of the street

I know it all
I know Him pretty well
When man turns into a monster
And revolts against Him
He can’t harm such a man
Thinking that he is His child
Such a gentleman is He !

June 23, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

రేపెక్కడికెళ్తావ్..! – కథ

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ June 23, 2021
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్

మూలకథ : డోగ్రీ (కల్  కహాఁ  జాహోగి )

                                                                                        మూల రచయిత్రి, హిందీ అనువాదం : పద్మా సచ్ దేవ్

తెలుగు అనువాదం : డా. రూప్ కుమార్ డబ్బీకార్

రేపెక్కడికెళ్తావ్..! 

ఉదయపు తోలి కిరణంలా  నా వాకిట్లోకి  సుస్వరమై వాలింది.  వాలిన మరుక్షణమే చెదిరిన కాంతిపుంజమై నలుదిశలా పాకింది.  స్వర్ణ కాంతులు వెలిగి  వాకిలి  మూలమూలకు వ్యాపించాయి.  విచ్చుకున్న కాంతిపుంజం  తుళ్లిపడుతూ ఎప్పుడైతే ఒద్దికగా  ఒదిగిపోయిందో, ఒక గాఢమైన కాంతి బిందువు  వాకిలి మధ్యలో అల్లరి చేస్తూ  నిలిచి పోయింది.  ఇంకా తన నిష్కల్మషపు  నవ్వు  వాకిలి  మల్లెతోటలో విరిసిన పూల  పరిమళమై నలువైపులా వ్యాపించింది. తన పేరు ప్రీత్.  నేను ప్రీతో అని ముద్దుగా పిలిచేదాన్ని.

అసలు జరిగిందేమంటే  నా పాత  స్నేహితురాలొకరు తన ఇంటికి పోతూ ఒక ప్రస్తావన ముందుకు తీసుకు వచ్చింది.  ప్రీతోను కొన్ని రోజులకు నా ఇంట్లో ఉండనివ్వమని  కోరింది. అందుకు  నేను వెంటనే సరేనన్నాను.  ఎలాగూ నా భర్త  వేరే దేశం లో వున్నాడు.  ఇల్లు ఒంటరితనంతో చికాకు కలిగించేది .  నా  స్నేహితురాలికి కుడిభుజంలా వుండేది  ప్రీతో.   ఆ విషయం  నాకు బాగా తెలుసు.  కిండర్ గార్డెన్  స్కూల్  పిల్లలు ఆమెను  ‘తీతో ‘ అని పలకరిస్తూ  లోనికి  ప్రవేశిస్తారు. దాంతో  ప్రీతో వాళ్లకు ఆంటీగా,  ఆరిందాలా మారిపోతుంది.

ప్రీతోకు  ప్రీత్ అని పిలిపించుకోవాలనే సరదా వుండేది.  స్కూల్ నుండి  దిండు గిలాఫ వరకు ఏ పనైనా ప్రీతో అజమాయిషీలోనే.  ఎప్పుడైతే మేడమ్  సెలవుల్లో ఇంటికెళ్ళడం  జరిగేదో  ప్రీతోను వెంట తీసుకెళ్లక పోవడంతో  మేడమ్  పిసినిగొట్టు తనానికి   విసుక్కునేది .  ఈ నా స్నేహితురాలు  చిన్నప్పట్నుంచి  తెగింపుగలది. ఎలాంటి భయం లేదు. ఒకసారి  ‘ గోల్ గప్పా’ వాడితో జగడం జరిగింది. అప్పుడు మేడం గారి  చెప్పు దెబ్బలతో వాడు పరుగుతీసాడు.  వెంటనే మేమంతా ‘ గోల్ గప్పా ‘ బండి మీద ఒక్కుమ్మడిగా పడిపోయే వాళ్ళమే, కానీ, మేడం గారు బండి మీద అతడి స్థానంలో కూర్చొని  ప్లేట్లలో మరీ సర్ది  అందరికీ ఇవ్వసాగింది . ఈ సందడిలో గోల్ గప్పాలు  గాలిలో ఎగిరిపోయాయి. అప్పుడు తాను చింతపండు నీటిని ఎంతో ఇష్టంగా  స్,  స్,  అంటూ శబ్దం చేస్తూ, చూపిస్తూ చెప్పింది,  ” ముహా  నన్ను ఒంటరిగా వుండటం చూసి కన్ను గీటసాగాడు. నేను నాటు చెప్పు తీసుకొని వీపు చింతపండు చేస్తే  ఒకటే పరుగు లంకించుకున్నాడు.” అప్పట్నుంచి ఆమెను  మేము మేడమ్ అనే పిలుస్తున్నాము.  అసలు  పేరే మర్చిపోయాము.  కానీ, మేడమ్ ను ఎవరూ మర్చిపోలేదు.  ఆ  ప్రస్తావన  నాకేమి సంతోషం కలిగించలేదు.  కానీ,  ప్రీతో రావడం వలన కాస్త ఇంటికి కళ  వుంటుందని  ఆలోచించాను.  రెండు రోజుల క్రితమే  మేడమ్  ప్రీతోను తీసుకొని నా ఇంటికి వచ్చింది.  ఎన్నో విధాలుగా నచ్చజెబితే గాని మేడమ్  రైలు ఎక్కి కూర్చోలేదు .  ప్రీతో, దాని సామాన్లు  ప్రతి ఒక్కటీ జాగ్రత్తగా అందిస్తూ అలిసి కుప్పయిపోయింది .

ఇంటికి రాగానే రెండు సారిడాన్ మాత్రలు వేసుకొని పడుకుంటే, నేను కూడా  ఏమీ అడగడం సరికాదనివూరుకున్నాను.  మరుసటి రోజు  ఇంకా తెల్లవారనే లేదు. కానీ ,ఇంట్లో ఎవరో అపరిచిత వ్యక్తి నడక, హడావుడి , ధ్వని రావడం మొదలయ్యింది.  ఈ  అపశబ్దాలను ఎలాగో సహిస్తాను గాని బాత్ రూమ్ లో  ఆగకుండా నీరు ఏకధాటిగా ప్రవహిస్తూ వుండటం చూసి ఇక ఆగలేక అడిగే ధైర్యం చేసాను. ఇనుప బకెట్లో నల్లా పూర్తిగా వదిలి వేస్తే పడే నీళ్ల చప్పుడు కలిగించే అసౌకర్యం  బహుశా మరే దాని ద్వారా కలగదనుకుంటాను. పక్కలోనే  పడుకొని కళ్ళు మూస్తూ, తెరుస్తూ  గట్టిగా అరిచాను –  ” ప్రీ.. తో ..”

” ఆఁ , మేడమ్ ”  అంది . తలకెక్కి కూర్చున్నట్లు  అనిపించసాగింది . “ఖబడ్దార్, నన్ను మేడమ్  అంటే, ”  నేను కోపంతో,  ఆవేశంతో ఆమె మీద అరవగానే అమాయకంగా చెప్పింది –  “మరి ఏమని పిలవను మేడమ్  గారు !”

“ ముందు ఆ నల్లా బంద్ చెయ్!  ఇక నుండి  నువ్వు నన్ను దీదీ అని పిలవ్వచ్చు.”  అన్నాను.  ఎప్పుడొచ్చి నన్నల్లుకుందో నాకే తెలిసిరాలేదు, ” దీదీ , దీదీ”  అంటూ ఇల్లంతా ఒకటి చేసింది.  నా ఉదార స్వభావం మీదనే నాకు కించిత్  గర్వం కలిగి ఉప్పొంగిపోయాను .

మళ్లీ  ఆమె  గతం  జ్ఞాపకాల మూటలు కొన్ని నా ముందు పరుచుకున్నాయి .

ప్రీతో ఒక్కగానొక్క కూతురు వారికి.  ముగ్గురు , నలుగురు  అన్నదమ్ముల మధ్య  ఒక్క సోదరి.  కానీ, ఆమె తండ్రి ‘వడ్రంగి తక్కువ , తాగుబోతు ఎక్కువ’ అనే తీరులో వుంటాడు . ఈమెకు కాస్త వయసు రాగానే  నంబర్ దార్ (వడ్డీలు నడిపేవాడు)  కొడుక్కిచ్చి పెళ్లి జరిపించేసాడు.  అతను  చాలా కాలం నుంచి దమ్మా , ఆస్త్మా రోగంతో బాధపడుతూవున్నాడు.  ఈ అన్యాయాన్ని ఎదిరించి ఎవరు ఎదురు నిలబడతారు.  ఆమె సోదరులు  తాగుబోతు తండ్రి  చేతిలో దెబ్బలు తిని తిని,  రెక్కలు  రాగానే ఎగిరిపోయారు.  ఇక తల్లి ఇంటిగోడల  మాదిరి తానూ ఓ గోడలా వుండిపోయింది .

శోభనపు రాత్రే సప్తపది సమయంలో  హోమం నుండి వచ్చిన  పొగ పీల్చి పీల్చి పెళ్ళికొడుకు  మహాశయుడికి దమ్ముతోటి  ఫిట్స్ వచ్చినంత పనయి ఆస్పత్రి పాలయ్యాడు . ఇది కర్మ ఫలం.  శోభనపు శయ్య పైన కూర్చొని  ప్రీతో నిద్ర పోయింది. ఎవ్వరూ  అటువైపు తొంగి కూడా చూడలేదు. తెల్లవారగానే అందరూ గుసగుసలు పోయారు. “నష్ట జాతకురాలు, వచ్చీ రాగానే మొగుడి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది.  నంబర్ దార్ కు దీని వల్ల ఏం  చెడు జరుగుతుందో  అర్ధం కావడం లేదు.  దీని అడుగు పడగానే ప్రాణాంతకమైంది.”

అప్పుడే మా మేడమ్  అక్కడికి చేరుకుంది. ఇంకా మొగుడు చావకముందే  ప్రీతోను ఇంటికి తీసుకొని  వచ్చేసింది . వూరు మొత్తంలో ఒంటరిదై పోయింది ప్రీతో.  కానీ ఆమె చొరవ, దుందుడుకుతనం  చూసి నంబర్ దార్  హుక్కా వదిలేసి లేచి నిలబడేవాడు. ఆమె తెగింపు,  నిర్లక్ష్య వైఖరి చూసి ఆమెను వివాహమాడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆమె ప్రతిష్ట ఎంతగా పెరిగిపోయిందంటే  చివరికి పురోహితుడు కూడా ఆమె జన్మపత్రీ  తీసుకొని పోవడానికి నిరాకరించేవాడు. ఫలితంగా కుమారి గానే వుండిపోయింది .  ప్రీతో కళ్ళలో ఈదులాడే కలలను మేడమ్  సులువుగానే తుడిచేసి, నగరానికి వచ్చి పిల్లలకోసం కిండర్ గార్డెన్  ప్రారంభించింది .  దీంతో ప్రీతోకు అండ దొరికినట్లయి పూర్తిగా తన మనసును పిల్లలమీద లగ్నం చేసింది.  మేడమ్  ఆమెను ప్రేమగానే చూసుకుంటుంది.  కానీ ఆ  ప్రేమ ఎవ్వరికీ తెలిసేది కాదు.

ఏ ప్రీత్  పెళ్లి పేరుతో ఏడడుగులు నడిచి దాంపత్య జీవితంలోకి  సిగ్గుపడుతూ అడుగుపెట్టిందో , ప్రీత్  ప్రమాణాల సమయంలో అగ్నిసాక్షిగా,  తాపానికి కరిగిపోయిందో ఆ ప్రీత్ ఎంతకాలం  అదుపు ఆజ్ఞలో బందీగా వుంటుందో నన్న  భయం నాలో ఆనాడే  ఖచ్చితంగా  కలిగిందని చెప్పాలి.  నా ఇంట్లోకి రాగానే లభించిన  కొద్ది  సానుభూతి తోనే  తిరిగి ఆమె కళ్ళలో కలల  సంకేతాలు అల్లుకోసాగాయి.  ప్రతి పనీ నవ్వుతూ తుళ్ళుతూ పూర్తి చేస్తుంది.  రోజు మొత్తంలో ఐదారుసార్లు తల దువ్వుకుంటూ జాగ్రత్తగా  హెయిర్ స్టైల్  చేస్తూ వుంటుంది.  బొట్టు బిళ్ళలు దిద్దుకునే గొప్ప షోకు వుంది.  నేనొక రోజు అడిగాను – ” ప్రీతో, నువ్వు బొట్టు దిద్దుకొని మళ్ళీ చెరిపేస్తావు ఎందుకని ?”

ఉదాసీనంగా జవాబిచ్చింది ” అతను చచ్చిపోయాడు గదా! కానీ  దీదీ, నా మనసు బొట్టు పెట్టుకోవాలని తహ తహ లాడుతూవుంటుంది ”  అని.

” అతనితో నీకేమిసంబంధం  ? దాన్నేమైనా పెళ్లంటారా ?”   నేనన్నాను.

ఉత్సాహంతో  అన్నది ” అదే నేనంటున్నాను, కానీ మేడమ్  ఎప్పుడూ ఎత్తిపొడుపు మాటలతో  అడ్డు చెబుతూ వుంటుంది.  ఎర్రబొట్టు ఎప్పుడూ ముత్తై దువలే  పెట్టుకోవాలి  అని హెచ్చరిస్తుంది .”

“నువ్వు నల్లరంగు బొట్టు బిళ్ళ పెట్టుకో ! ”

” ఔను దీదీ, నల్లరంగు బొట్టు బిళ్లనైతే  పెట్టుకోవచ్చు .  అతను  చచ్చిపోయి ఎలాగూ ఏడాది గడిచిపోయింది . ఇప్పుడతని  ప్రేతాత్మ నన్ను ఇబ్బంది పెట్టలేదు”  ఇలా చెప్పి పగలబడి నవ్వసాగింది.  ఎంతలా నవ్విందంటే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి.

కారుతున్న ముక్కు చీదుకుంటూ,  కళ్ళ నీళ్లను తుడుచుకుంటూ  చెప్పసాగింది  – ” దీదీ, ఒక వేళ అతను  బతికే వుంటే నేను అస్సలు వూరు వదిలిపెట్టక పోదును.  పెళ్ళికి ముందు ఒకసారి అతను  దారిలో నా చేయి పట్టుకొని చెప్పాడు, ” ప్రమాణం చెయ్యి ప్రీతి, నన్నువదిలిపెట్టి ఎన్నటికీ పోవుకదా “యని .

“ప్రీతో, నీకు ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా నిండలేదు” అని గుర్తు చేశా . ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతావు?  ఏ విధంగా చూసినా నీ పెళ్లి కాలేదు  అనిపిస్తుంది.  నీ పెళ్లి నిర్ణయం మేడమ్  తెలిసి తెలిసి తీసుకున్నది. ఇక దీన్ని ఇక్కడితో  వదిలెయ్యాల్సిందే!”

“దీదీ , భర్త విషయంలో నేనేవైతే కలలు అల్లుకున్నానో  ఆ కలల  రాకుమారుడైతే ఇతను కాలేదు.  విధి, ఆ కలల్ని  ఎంతో నిర్దయగా నా కళ్ళ నుండి తుడిచిపెట్టేసింది. ఇప్పుడు ఆ కొత్త పలక  మీద ఎవరో ఒకరు ప్రతిరోజూ వచ్చి అస్పష్టంగానే  ఏవో రేఖలు  అద్ది కదిలిపోతారు. వాటికి ఏ రూపం  ఆపాదించబడదు!”

నేను ఎంతో  ప్రేమగా అడిగాను – ” నీ దృష్టిలో ఎవరైనా వున్నారా ప్రీతో !”

“లేదు, కానీ మనసు కోరుకుంటుంది,  నేనెవరికో  ఒకరికి నచ్చితే బాగుండును అని ”

“కాళ్ళు చేతులకు గోరింటాకు, పాపిటలో సింధూరం, ఎరుపు రంగులో పెళ్లి జోడా,  కాటుక దిద్దిన కళ్ళు , ఇలా  సింగారించుకుని శోభనం జరగాలంటే  అది నాతొ కూడా జరిగిపోయింది.  కానీ శోభనం భర్త సహవాసంలో జరుగుతుంది . కానీ  నేనతన్ని చూడనే లేదు.”

“ప్రీతో, మేడమ్  కిండర్ గార్డెన్  నీ అజమాయిషీ లోనే  కదా నడిచేది. ఒకవేళ  నీకెవరైనా నచ్చితే, అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతావా?”

“తెలియదు దీదీ!”

“కానీ, మేడమ్  ఈ విషయాన్ని ఎప్పటికైనా సహించగలదా?”

” అదే కదా, మేడమ్ కు నా మీద  చాలా విశ్వాసం వుంది. అందుకే నాకు  భయమేస్తుంటుంది. ఎక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు పుట్టుకొస్తాయోనని.  మేడమ్ కే కాదు స్కూల్ పిల్లల  తల్లిదండ్రులకు కూడా నా మీదనే భరోసా. మేడమ్  కైతే అందరి పేర్లు కూడా తెలియవు. అంతేకాదు, ఒక్క రోజు కూడా నా చేతివంట లేకపోతె భోజనమే చేయదు . అప్పుడప్పుడు మనసు బాగులేకున్నా వంట  చేయక తప్పదు. ఎవరినైనా కానీ ఆకలి మీద ఉంచడం పాపం కదా దీదీ!”

“నేనామెవైపు చూసా, నువ్వు కూడా ఆకలితోనే వున్నావు కదా ప్రీతో ”  అని చెప్పాలనుకున్నాను.  కానీ అంతలోనే మేడమ్  రావడంతో నా నోటి మాట నోటిలోనే వుండిపోయి  మౌనం దాల్చాను.

రెండు నెలలు ఎలా గడిచిపోయాయో  తెలిసిరాలేదు.  ఒకరోజు మేడమ్  వచ్చి ప్రీతోను తీసుకొని వెళ్ళిపోయింది . వెళ్లే సమయంలో ప్రీతో రహస్యంగా నాతొ చెప్పింది,  “దీదీ, నన్ను మర్చిపోవద్దు. నేను రాలేను. కానీ నువ్వు రావాలి. నన్ను పిలుస్తావు కదూ దీదీ.”  అయోమయ స్థితిలో పడిపోయా.  నేను ఆమె చేతులను నా చేతిలోకి తీసుకొని  నా కన్నీళ్లను ఎలాగోలా దాచుకొని ఆమెకు ధైర్యం చెప్పాను. ఆ తర్వాత ఇంటి వ్యవహారాల్లో మునిగిపోయి ప్రీతో సంగతే మర్చిపోయాను .

ఒకరోజు మిట్ట మధ్యాహ్నం,  మగతగా వుంటే  పడుకుందామనుకున్న సమయంలో మేడమ్  ఊడి పడింది . వస్తూ వస్తూనే ఆయాసం తీర్చుకోకుండా, “ఇక్కడికి  ప్రీతో వచ్చిందా ?” అని అడిగింది .

నేను ఆశ్చర్యంతో స్థాణువులా  నిలబడిపోయా.  ఏం  సమాధానమివ్వాలో పాలుపోలేదు. వయసులోవున్న పిల్ల ఎక్కడికి  పోయివుంటుంది.  నేను మౌనంగా ఉండిపోవడం చూసి మేడమ్  అన్నది , ” దానికి  పొగరెక్కింది.  నాతో ఒక్కటే తప్పు జరిగిపోయింది.  నేను చేసిందల్లా కూరగాయలకు,  దాన్ని ఒంటరిగా పంపుతూ వచ్చాను. కూరగాయల గంపలో  దొంగ చాటుగా బొట్టు బిళ్ళలు పెట్టుకొని  పోతూవుంటేనే,  ఈ విషయం నాకప్పుడే అర్ధమయిపోయింది .”

“ఆ సచ్చినోడి దగ్గరికి  వెళ్లి పెట్టుకునేది. అంత  పిచ్చి ఎందుకో  ఆ బొట్టు పెట్టుకోవడానికి. ఎప్పుడొచ్చినా  ఆ దరిద్రపుది  ఆలస్యంగానే వచ్చేది. బట్టలు ఇస్త్రీ చేసే సమయంలో, కూరగాయలు తరిగే సమయంలో గాని , రొట్టెలు కాల్చేటప్పుడు గాని ఎట్లా సిగ్గుపడుతూ, ముసిముసి నవ్వులు నవ్వుతూ  వగలు పోయేది పోరి.  నాకేం తెలుసు, దీని చావు ఇట్లుంటదని , తెలిస్తే ఎగిరిపోయే ముందే దాని రెక్కలు కత్తిరించి పారేసేదాన్ని. ఎక్కడైనా ఇది పిచ్చిదై  పోదు గదా అన్న భయం పట్టుకుంది.  లక్షణాలన్నీ అవే వుండే.  కొన్ని రోజులముందు స్కూల్ పిల్లల తల్లి ఒకామె  చెప్పకపోతే నాకూ తెలిసేది కాదు. ఎవడో దర్జీవాడు. కూరగాయల  దుకాణం దగ్గర వుంటాడు.  వాడితోటే  లేచిపోయి వుంటుంది ముందు!  వాడి వైపే దొంగచూపులు  చూస్తూ వయ్యారాలు పోయేది .  ఒక్కసారి చేతికి చిక్కితే పోలీసులకు అప్పజెప్పి అంతుచూడనూ ! ఇనస్పెక్టర్  తివారి పిల్లలు నా స్కూల్లోనే  చదువుతున్నారు.”

మురికి కంపులా ప్రవహించే ఆమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ,  “మేడమ్,  నువ్వా – మోడువారిన చెట్టు కట్టెలాంటి దానివి.  ప్రీతో ఎదుగుతున్న తీగ లాంటిది. ఆధారం వెతుక్కుంటూ  పోయింది.  పోనీ, తన ఆనందాన్ని, సుఖాన్ని వెతుక్కోనీ !”

కోపంతో  మేడమ్  అరిచింది – ” ఒహో, ఐతే ఈ యవ్వారం , ఈ అగ్గి  నువ్వుంటించిందేనా? నా శిక్షణలో ఎక్కడ  తప్పు జరిగిందో నేను ముందే అర్ధం చేసుకునేదుండే .  దాన్ని మీ ఇంట్లో వుంచకపోతే , నాకు ఈ రోజు ఈ దరిద్రం చూడాల్సి రాకపోయేది .”

దాంతో నాలో కూడా ఆవేశం రెచ్చిపోయింది.  నేనూ అరుస్తూ చెప్పాను – ” ఈ అగ్గి నేను పెట్టింది కాదు . కానీ, నిజానికి  ఈ మంట నేనే అంటించాల్సింది. నువ్వు నాకు స్నేహితురాలివి కదా!  నీ  పాపాలకు ప్రాయశ్చిత్తం నేను కాకపొతే ఇంకెవరు చేస్తారు.  నీకేం తెలుసు, మగాడి ప్రేమ లేకుండా జీవితం ఎడారిలా ఎలా మారిపోతుందో!  దురదృష్టవంతురాలు , జీవితంలో మోసపోయింది.  క్రమశిక్షణ  పేరుతొ దాని కాళ్ళు కట్టేసావు. దుర్మార్గురాలవు  తోషీ ,  మనిషివి కావు.  ప్రేమ జీవితాన్ని చవిచూడని దానివి.  ఎప్పుడైనా, ఎవరినైనా  ప్రేమిస్తే తెలిసేది ఇప్పటివరకు నువ్వేమి కోల్పోయావో?”

కోపంగా మేడమ్  చెప్పింది – ” నీ జ్ఞానబోధ నా కక్కరలేదు మిసెస్ ఆదిత్య వర్మ.  ఇంట్లో పెట్టుకొని చూడు తెలుస్తుంది. నీ అడుగులకు  మడుగులొత్తే  ఆదిత్యకు కూడా ఒక ‘ఝట్ కా ‘ ఇవ్వకపోతే నా పేరు తొషియే కాదు. రాత్రి ,పగలు లేకుండా దాని వెకిలిచేష్టలు నా దృష్టికి  రాకుండా పోలేదు.  ఒకవేళ ఈ స్కూల్ అనే దరిద్రమే లేకుంటే దాన్ని అదే వూరు ఎక్కడినుంచైతే  కసాయివాళ్ళ చేతుల్లోనుండి విడిపించుకొని వచ్చానో అక్కడికే పంపించేసే  దాన్ని.

“పెళ్లి చేసెయ్యి దానికి ,”  నేను చెప్పాను.

” అవును, ఇదే కారణం కావలిసి వచ్చింది .  మరి, నువ్వు కూడా చేయించవచ్చు కదా !”

నేనన్నాను ” అది నీ బాధ్యత తోషీ , నేను కేవలం పెళ్ళికి రాగలను.  సరే,  టీ  తాగుదువు గాని  రా, నీళ్లు మసిలిపోతుండొచ్చు .”

తోషీ అన్నది – ” నా కడుపు మండిపోతూవుంటే  ఇంకా దాని పైన నిప్పులు చేరగాలని చూస్తున్నావు.”

నేను ప్రేమతో ఆమె చెయ్యి పట్టుకొని, “చలో మేడమ్ , నీకు ‘రూహ్ ఆఫ్ జా’ తాగిస్తాను” అన్నాను.  దాని తర్వాత ఆమె మనసు కాస్త తేలిక పడింది.  ” మేడమ్, ఆమె పెళ్లి చేసెయ్యి. అమ్మాయి వయసులో వుంది.  తోడు కోసం  తపించి పోతుంది. ఆమె స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకొని ఆలోచించు ఒక్కసారి .”

మేడమ్  అంది, ” నేను ఒక మంచి కుర్రాణ్ణి చూసి ఏదో నిర్ణయం తీసుకుంటాను.  కానీ, అంతకు ముందే అది ఎవరితోనో  లేచిపోయినట్లనిపిస్తుంది. ఈ రోజు రెండవ రోజు .  రామ, రామ , ఇప్పుడు సాయంకాలం  క్లాసులకు పెద్ద పిల్లలు వస్తూ వుండవచ్చు. నేను వెళ్తాను”  అంటూ వెళ్ళిపోయింది .

మేడమ్  వెళ్లి రోజులు గడిచిపోయాయి.  ఆమెతో  ప్రీతో గురించి అడిగే ధైర్యం చేయలేక పోయాను. తర్వాత  అంతా మర్చిపోయాను. ఒక రోజు సాయంకాలం తలుపు తెరిచి చూస్తే  ప్రీతో ఎదురుగా నిల్చొని వుంది.  వెనకాల ఒడ్డు పొడుగు వుండి  అందంగానే వున్న యువకుడు .

సారా తాగి,  వీర బాహు కళ్ళతో వున్న అతన్ని చూడగానే నా లోపల  సన్నని వణుకు పుట్టింది.  చెదిరిన జుట్టు, ఇంకా  అతని ముఖంలో డాంబికం , నిజాయతీ లేనితనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.  ఎందుకో అతనిపై నాకు నమ్మకం గాని, విశ్వాసం గాని కలగలేదు.  అతనితో  ప్రీతో చెప్పింది, ” నా దీదీ”  అని .

స్నేహపూర్వకంగా ఇద్దరినీ  లోపలికి తీసుకెళ్ళాను. సన్నగా నవ్వుతూ  గదిలో కూర్చోబెట్టాను.  టీ  నీళ్లు పెట్టడానికి ఎలాగైతే వంటింట్లోకి  దూరగానే  ప్రీతో వెనకాలే వచ్చింది. నవ్వుతూ అడిగింది –  “ఎలా వున్నాడు? ”

“బాగున్నాడు ” అన్నాను

నవ్వి మళ్ళీ చెప్పింది – “సారా రాత్రికే  తాగుతాడు. కళ్ళు ఎప్పుడూ ఎర్రగానే వుంటాయి. పెదవుల మీద నవ్వు బలవంతంగా తెచ్చుకొని నవ్వసాగింది .  నవ్వుతూ నవ్వుతూ నీళ్లు నిండిన ఆమె కళ్ళను చూడనట్లు నటించి ” మేడమ్  ను కలిసావా?”  అని అడిగాను.

ప్రీతో కళ్ళను నేలకు వాల్చి “వెళ్లాను,  కానీ వెళ్లగొట్టి మళ్ళీ ఇక్కడికి రాకు” అంది .   ప్రకాష్, ఇతనే చాలా కోపానికి గురయ్యాడు.  కాస్త ఆగి, “దీదీ , నాకు పాత ధోతులివ్వవా! ఒక్క ధోతియే వుంది. మేడమ్ ది !”

నేను ధోతులతో పాటు ‘ శగున్ ‘  రూపంలో కొంత డబ్బు కూడా ఇచ్చి ప్రేమతో  ” ప్రీతో,  నేనున్నాను.  ఎప్పుడైనా, ఏదైనా కష్టమొస్తే  నన్ను మర్చిపోకు” అని ధైర్యం చెప్పాను.  ప్రీతో నన్నల్లుకొని ఏడవసాగింది.  నాకు తెలుసు తాను తప్పు చేసింది. ఈ మనిషి ఒక భర్తలా కనబడటం లేదు. అతనికి కూడా ‘శగున్’ రూపంలో కొంత డబ్బు చేతిలో పెట్టాను. ఏమనుకున్నాడో తెలియదు కానీ, అతను  నా కాళ్లకు  మొక్కాడు.  అప్పుడు నాకనిపించింది ఆడకూతుళ్ళను ఇలాగే సాగనంపుతారు కాబోలు అని.

కొన్ని రోజుల తర్వాత మేడమ్  ఫోన్ వచ్చింది.  ఎలాంటి భూమిక  లేకుండా నే  ” స్నేహాన్ని ఎంత బాగా నిలుపు కుంటున్నావ్  మిసెస్ ఆదిత్య వర్మ.   నిన్న.. అదే .. నీ చీర తొడిగి  ప్రీతో కలిసింది. ఆ చీరని కాలేజీ మేళ లో మనం ఇద్దరం కలిసి కొన్నాము.  ఎంత ఘనకార్యం చేసావు నువ్వు.  చీర ఇచ్చావ్,  కానీ  ప్రీతో వచ్చినట్లు నాతొ మాట మాత్రం కూడా చెప్పలేదు.  చీర ద్వారా ఆదిత్యకు పిలుపు అందకుండా జాగ్రత్త పడు,”  ఈ మాటలు చెప్పి టక్కున  ఫోన్ పెట్టేసింది .

ఆదిత్య – నేను ఆశ్చర్యపోయాను. ఈ మేడమ్  ఎంత కఠిన హృదయం గలది. ఫోన్ వచ్చిన మరుసటి రోజే  ప్రీతో మళ్ళీ వచ్చింది.  కానీ ఒంటరిగా,  వస్తూనే నా వెనకాల వంటింట్లోకి  వచ్చి, ” నాకు వంకాయల పకోడీ చేసి పెట్టగలవా?” అని అడిగింది.  నేను ఆమెను ఎగాదిగా చూసాను.  సిగ్గుతో  “ఇప్పుడు మూడు – నాలుగో నెల నడుస్తుంది ” అంది . ఈ రోజు అతను నాసిక్ వెళ్ళాడు.  అందుకే  రాగలిగాను. నాకు కొంత డబ్బు కూడా కావాలి, ఇస్తావ్ కదూ! అతను కేవలం రేషన్  తెచ్చి పెట్టేస్తాడు. ఒక్క పైసా కూడా చేతికివ్వడు.  బయటి నుండి తాళం వేసుకొని దుకాణానికి వెళ్తాడు . అప్పుడప్పుడు వేపిన శనగలు తినాలనిపిస్తుంది .  రాత్రికి అతని ప్యాంటు నుండి కొన్ని పైసలు జారిపడిపోతాయి, అవి తీసుకుంటాను . తిరిగి వెంటనే ఆనందం తో అంది – అక్కడ ఒక కిటికీ వుంది.  అందులో నుంచి దూకి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి పోతాను.  కానీ ఒక రోజు పొరుగింటావిడ ఈ విషయం అతనికి చెప్పేసింది. ఆ రాత్రి అతను  నన్ను బాగా చితక్కొట్టాడు .

నేను ఆమె వైపు చూడకుండానే అడిగాను,  ” పెళ్ళైన పత్రాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర ?”

“లేదు,  పెళ్లి గుళ్లో జరిగింది !”

పైసలు తీసుకొని  ప్రీతో వెళ్ళిపోయింది.  మూడు , నాలుగు సంవత్సరాల వరకు  ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదు.  ఒక రోజు మేడమ్  స్వయంగా వార్త పట్టుకొచ్చింది —  ప్రీతో భర్త ఎప్పుడూ ఆమెను చావబాదుతాడు అని. ఒక రోజు ఆమె మరిది విడిపించడానికి వస్తే అతన్ని కూడా చావబాది ప్రీతోని ఇంటినుంచి  వెళ్ళగొట్టాడు అని .  ఇరుగు పొరుగు కల్పించుకొని సర్ది చెప్పారట. నాకు బాధ కలిగింది .  తిరిగి ఆలోచించా.  పిల్లలున్నారు – పిల్లల ఆసరాతో ఆడది రావణుడితోనైనా  సర్దుకుపోతుంది.  రేపటి రోజు పిల్లలు పెరిగి పెద్దవారౌతారు.  వారితో పాటు ప్రీతో కూడా పెద్దదైపోతుంది .

కాలం సాగిపోతుంది.   ఎప్పటిలాగే  రోజూ తెల్లారుతోంది , సంధ్య వాలుతోంది. పిల్లలు  స్కూలుకు  వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు.  ఆదిత్య,  నేను కూడా జీవితంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయాము . ఏ రోజు పని ఆ రోజే  అయిపోవాలి.  ఏ మాత్రం ఆలస్యం జరిగినా మనసు కంగారు పడేది.  మా చిన్ని ప్రపంచంలో మొత్తం విశ్వం ఇమిడిపోయింది .  ఆ ప్రపంచంలో  ప్రీతో ఉండదు. ఆమె జగడాల మారి మొగుడు వుండడు.

ప్రతిరోజూ లానే సాయంకాలం అయింది. వస్తూ వస్తూ  వెంట అతిధులను వెంటేసుకొచ్చింది . ఆదిత్య సామాన్లు తేవడానికి  బజారుకెళ్ళాడు. అప్పుడే దర్వాజా దగ్గర బెల్ మోగింది . తలుపు తెరిస్తే  ఎదురుగా ఒక అపరిచిత మహిళ  తన పువ్వుల్లాంటి ఇద్దరు పిల్లలను తీసుకొని నిలబడివుంది .  ఎవరిదైనా అడ్రస్  అడగాలనుకుంటుందేమో అని నేననుకున్నాను. ప్రశ్నార్థకంగా  ఆమెవైపు చూసాను.  ఆమె నవ్వింది.  పెదాలు ముడుచుకు పోయివున్నా ఆనవ్వును గుర్తు పట్టడానికి  నాకంత సమయం పట్టలేదు.  ” ప్రీతో ” అన్నాను.  వెంటనే తాను పిల్లల చేతిని వదిలించుకొని ఈ ప్రపంచంలో నేను తప్ప తనకు మరెవ్వరూ లేరన్న  విశ్వాసంతో గట్టిగా అల్లుకుంది.

ఆమెను వదిలించుకుంటూ – ” ప్రీతో, ఇంట్లో బంధువులున్నారు. రా, లోపలికి  నడు” అన్నాను .

ఆమెను కూర్చోబెట్టి  పిల్లలకు పాలు, బిస్కట్లు ఇచ్చాను.  వాళ్ళు తింటూవుంటే , పిల్లల్ని వదిలి  ప్రీతో నా వెనకాలే వచ్చి ఏ విషయం చెప్పకుండానే – ” దీదీ , అతను వెళ్ళిపోయాడు. దుబాయ్.  ఇల్లు కూడా  ఎవరికో  వేరే వారికి ఇచ్చేసాడు. కేవలం ఈ రాత్రికి ఇక్కడ వుండనివ్వు” అంది .

“ప్రీతో, ఈ బంధువులు  ఈ రోజే వచ్చారు.  నిన్నెక్కడ  పడుకోబెట్టను. వెంట పిల్లలు కూడా ఉన్నారు” అన్నాను .

ప్రీతో – ” పిల్లల్ని తీసుకొని నేను వరండాలో పడుకుంటాను. రేపు ఉదయం  ఇక్కడే ఒకరిని కలవాలి.  వారు ఏదో ఒక ఏర్పాటు  చేస్తారు.  మేడమ్ నన్ను  ఒక ఆశ్రమానికి పంపాలని ఆలోచిస్తుంది,  కొన్ని రోజుల మాట మాత్రమే”  అంది . నా బుర్ర మొద్దుబారిపోయింది. “నువ్వు మేడమ్  ఇంటికి ఎందుకెళ్ళలేదు.”

“తాను ఇంట్లో ఎప్పటికీ ఉండనివ్వదు , దీదీ.  నాకు ఆశ్రమానికి వెళ్లాలని లేదు .”

“కానీ ఎందుకు ?”

“ఒకవేళ ఎప్పుడైనా వీళ్ళ తండ్రి వస్తే?”

“వచ్చేవాడైతే,  ఎందుకెళ్ళిపోతాడు?”

“కొన్ని రోజులు  ఎదురు చూస్తాను. కొన్ని రోజుల మాటే !”

నా కళ్ళ ముందు ఆదిత్య  ముఖం కదలాడింది.  మేడమ్  చెప్పిన మాటలు కూడా గుర్తుకు వచ్చాయి.  తాను చెప్పిన  హెచ్చరిక కూడా ఇంకా జ్ఞాపకమే.  ఒక్క రాత్రి అతని ఇష్టం లేకుండా కూడా ఉంచగలను, కానీ ప్రీతోకు “ రేపెక్కడికెళ్తావు?“ అని అడిగే  సాహసం ఆమెలో లేదు.  నాకు తెలుసు మేడమ్  తప్ప మరెవ్వరు కూడా ఆమెను ఆశ్రమానికి వెళ్ళడానికి  ఒప్పించలేరు.  ఈ క్షణమే ఒక అవకాశం. ఒక వేళ ఇప్పుడు నేను బలహీనపడిపోతే,  ప్రీతో  వెళ్లే  ‘రేపు’ మళ్ళీ ఎప్పుడొస్తుందో”.  నా లోపల వున్న  మానవత్వం గొంతు పిసికి  చెప్పాను,  ” లేదు ప్రీతో, ఇక్కడ వుండటం సాధ్యపడదు . వీళ్ళు నా బావగారి కూతుర్ని చూడటానికి వచ్చారు.  అమ్మాయి రేపు ఢిల్లీ నుండి వస్తుంది .  ఇలాంటి  సందర్భంలో నాజూకు  బందుత్వం  మధ్య నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను.  జరగరానిది  జరగటం వూహించలేను.  డబ్బులు తీసుకో . ఒకవేళ ఇక్కడే ఎవరినో కలవాలి అనుకుంటే టాక్సీ తీసుకొని  రా ! ఇప్పుడు మాత్రం వెళ్ళిపో ”  అని చెప్పి ఆమె ఇద్దరు పిల్లల చేతులను ఆమె చేతిలో పెట్టేసాను. ఇంటి తలుపులు దాటి చౌకీదార్ ను  పిలిచి టాక్సీని  తెప్పించాను.  పిల్లలతో సహా  ప్రీతో కూర్చోవడం చూసా.  చెమటతో తడిసి ముద్దయిన ఆమె చేతిలో కొన్ని నోట్లు పెట్టేసాను. టాక్సీ వెళ్ళే వరకూ వేచి వుండకుండా ఇంట్లోకి వచ్చి తలుపులు మూసేశాను .

ఈ తలుపులు నేను ప్రీతో కోసం మూసేసానా?!  లేక నా కోసమా !?  నాకే అర్ధం కాలేదు.  రాత్రంతా  నాకు పీడకలలు రా సాగాయి.  ఎన్నో రోజులు గోడలను  ప్రశ్నిస్తూ వుండిపోయాను  – ” రేపెక్కడి కెళ్తావు ..? ”

 

***

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

అనువాద కుసుమాలు – 1

by Jwalitha June 23, 2021
written by Jwalitha

జీవిత సాహసయాత్రకు సాహిత్యాన్ని చుక్కానిగా ఎంచుకున్న కవయిత్రి, ప్రాణభయాన్ని దేశబహిష్కరణను కవిత్వీకరించిన యోధురాలి పరిచయం….

1966లో నోబుల్ బహుమతి గ్రహీత జర్మన్- స్వీడిష్ కవయిత్రి, నాటకరచయిత, అనువాదకురాలు “నెల్లీసాచ్స్” కవిత్వ పరిచయం

(తెలుగు సేత – జ్వలిత)

” ప్రేమికులు రక్షించబడతారు”

ఎత్తైన గోడల ఆకాశం కింద
ప్రేమికులు రక్షించబడతారు

వారికి
ఒక మర్మపదార్థం ఊపిరినందిస్తుంది
రాళ్ళు ఆశీర్వాదాలుగా దక్కుతాయి

అవన్నీ కాలచక్రంలో
వారితో పాటు మాత్రమే
జన్మభూమిగా అవతరిస్తాయి.

**

ప్రేమికులు రక్షించబడతారు
కేవలం వారికోసమే కోకిలలు రాగాలాపన చేస్తాయి
బధిరత మరణించకుండా
జింకలు, అడవుల్లోని మృదు ఇతిహాసాలు
వారికోసం సౌమ్యంగా దుఃఖిస్తాయి

**

ప్రేమికులు రక్షించబడతారు
అస్తమిస్తున్న సూర్యునిలోని బాధను
నెత్తురోడుతున్న విల్లా చెట్టుకొమ్మలను
వారు కనుగొంటారు

నిశీధిలో, నిశ్శబ్దంగా చిరునవ్వులతో మరణించడం వారు అభ్యాసం చేస్తారు.

వారి కోరికల ఊరేగింపులు అన్నివసంతాల్లో కొనసాగుతూనే ఉంటాయి

**

మూలం – నెల్లీ సాచ్స్
ఆంగ్లానువాదం- రూతండ్ మాథ్యూ మెడ్

“The lovers are protected”

The lovers are protected beneath the walled-up sky.
A secret element gives them breath and they bear the stones into the blessing and all that grows has a homeland only with them.
The lovers are protected and only for them the nightingales sing and have not died out in deafness and the deer, soft legends of the forest, suffer in meekness for them.
The lovers are protected they find the hidden pain in the evening sun bleeding on a willow branch and smilingly in the nights they practice dyin the quiet death with all springs which run in longing.
*(((()))))**

“అప్పుడు వేసవి ప్రారంభంలో”

అప్పుడు వేసవి ప్రారంభంలో వెన్నెల రహస్య సందేశాలను పంపింది, స్వర్గం నుండి లిల్లీపూల అత్తరు పాత్రలతో…

కొన్ని చెవులు వినేందుకు విప్పారాయి
కీచురాళ్ళ కింద భూమి కదలికలతో
తన భాషను మార్చుకుంటుంది ఆత్మల స్వేచ్ఛకోసం

కానీ స్వప్నసీమలో చేపలు గాలిలోఎగురుతున్నాయి
అడవులు హృదిగదిలో తమ వేళ్ళను పాదుకుంటున్నాయి

అయినా మధ్యలో వ్యామోహపు మాటల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది విస్మయంగా

ప్రపంచమా… వంచన చేసే సమయంలో
నీ ఆటలు ఎలా సాగిస్తావు

ప్రపంచమా… మంటల్లో రెక్కలు కొట్టుకుంటున్న సీతాకోకచిలుకల వలె చిన్న పిల్లలు విసరివేయ బడుతున్నారు

మరి, నీ భూమి కనీసం మురిగిన యాపిల్ పండు వలె భయంగొలిపే నరకంలోకి విసరబడ లేదు

ఎప్పటి వలెనే సూర్య చంద్రులు వాహ్యాళికి వెళ్లారు ఏమీచూడని మెల్ల-కన్నుల జంట సాక్ష్యమిస్తున్నది
**

మూలం – నెల్లీ సాచ్స్
ఆంగ్లానువాదం: రూతండ్ మాథ్యూ మెడ్

“When in early summer”
When in early summer the moon sends out secret signs, the chalices of lilies scent of heaven,
some ear opens to listen beneath the chirp of the cricket to earth turning and the language of spirits set free.
But in dreams fish fiy in the air and a forest takes ficm root in the floor of the room.
But in the midst of enchantment a voice speaks clear
amazed:
World, how can you go on playing your games and cheating time-
World, the little children were thrown like butterflies,
wings beating into the flames
and your earth has not been thrown like a rotten apple into the terror-roused abyss-
And sun and moon have gone on walking- two cross-eyed witnesses who have seen nothing.
*(((())))**

కవయిత్రి గురించి:—–

నెల్లీ సాచ్స్ డిసెంబర్ 10, 1891 న బెర్లిన్‌లో జన్మించింది. ఆమె సంపన్నమైన టైర్‌గార్టెన్ విభాగంలో పెరిగింది.
1970 లో 78 సంవత్సరాల వయసులో పెద్దప్రేగు క్యాన్సర్‌తో మరణించింది. నెల్లీ సాచ్స్ చిన్నతనంలో నృత్యం మరియు సాహిత్యాన్ని అభ్యసించింది. ఆమె తన 17 సంవత్సరాల వయస్సులోనే శృంగార కవితలు రాయడం ప్రారంభించింది.
ఆమె జీవితం దాదాపు కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ముగిసింది. సాచ్స్ తండ్రి 1930 లో మరణించారు, కానీ ఆమె మరియు ఆమె తల్లి మార్గరెట్ బెర్లిన్‌లో ఉన్నారు. 1940 లో నిర్బంధ శిబిరానికి నివేదించడానికి వారానికి సమయం ఉందని వారికి తెలిసింది, దానితో వారు దేశం నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. స్వీడన్ నవలా రచయిత సెల్మా లాగెర్లాఫ్ తో నెల్లీకి ఉన్న పరిచయం కారణంగా, సెల్మా స్వీడన్ రాజకుటుంబాన్ని ఒప్పించి  స్వీడన్ నుండి తప్పించుకోవడానికి సహాయం చేశాడు.
నెల్లీ మరియు ఆమె తల్లి స్టాక్‌హోమ్‌కు చేరుకున్న తర్వాత, సాచ్స్ స్వీడిష్ నేర్చుకున్నది. చివరికి అనువాదకురాలిగా పనిని చేసింది.. ఆమె కవిత్వాన్ని స్వీడిష్ నుండి జర్మన్ చట్టానికి విరుద్ధంగా అనువదించింది.

నెల్లీ సాచ్స్ స్వీడిష్, జర్మన్ కవయిత్రి, నాటక రచయిత, అనువాదకురాలు. సాహిత్యంలో ’66 నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆమె కవితలలో “ఇన్ ది హౌస్ ఆఫ్ డెత్”, “ఎలి” ముఖ్యమైనవి.

నెల్లీ జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతిని అందుకుంది , ఆమె 75 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె సాహిత్యానికి నోబెల్ బహుమతి లభించింది.
జర్మన్-స్వీడిష్ కవి, నాటక రచయిత అయిన నెల్లీ భయానక కాన్సంట్రేషన్ క్యాంపు గురించి హృదయం కదిలించేట్టు హోలోకాస్ట్ రాశారు. ఆమె తన ఇంటి నుండి పారిపోయి విదేశంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడం ద్వారా మరణాన్ని తృటిలో తప్పించుకుంది.

1947లో ఆమె తనకు 60 సంవత్సరాల  వయసులో మొదటి కవితా పుస్తకాన్ని ప్రచురించింది.
నెల్లీసాచ్స్  మొదటి కవితా సంపుటి పేరు ‘డెన్ వోహ్నున్గెన్ డెస్ టోడ్స్ లో’ (మరణం యొక్క నివాసాలలో),  ఈ సంకలనంలో మరియు తరువాతి కవితలలో యూదు ప్రజల బాధలను వివరించింది.

1965లో ఆమె జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతిని గెలుచుకుంది..
ఆమె 75 వ పుట్టినరోజు సందర్భంగా సాహిత్యానికి నోబెల్ బహుమతి గెలుచుకుంది.
సాచ్స్ మరియు ఇజ్రాయెల్ రచయిత ష్ముయెల్ యోసేఫ్ ఆగ్నాన్ సంయుక్తంగా సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందారు. నోబెల్ బహుమతి వెబ్‌సైట్ ప్రకారం, సాచ్స్ కు “ఆమె అద్భుతమైన సాహిత్య మరియు నాటక రచనకు లభించింది”
**

June 23, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

డా . అమృతలత గారితో ముఖాముఖి 

by Rama Devi Nellutla June 23, 2021
written by Rama Devi Nellutla

డాక్టర్ అమృతలత ఒక మంచి రచయిత్రిగా తెలుగు పాఠకులకి తెలుసు . నాణ్యమైన విద్య నందించేపాఠశాలల , కళాశాలల స్థాపకురాలిగా నిజామాబాద్ జిల్లావాసులకు తెలుసు . ఒక మంచి సంపాదకురాలిగా, ప్రచురణకర్తగా ‘ అమృత కిరణ్ ‘ పక్ష పత్రిక పాఠకులకూ , తెలంగాణా ఉద్యమ సమయంలో అక్షర సేనానిగా ‘ గాయాలే గేయాలై ‘ , ‘ వెతలే కథలై ‘ కవితా , కథా సంకలనాల సంపాదకురాలిగా తెలంగాణా అభిమానులకుతెలుసు . వివిధ రంగాలలో విశిష్ట మహిళలకు ఇచ్చే ‘ అపురూప అవార్డుల వ్యవస్థాపకురాలిగా , నిజామాబాద్ సాహిత్య కళా రంగ ప్రసిద్ధులకు బహూకరించే ‘ ఇందూరు అపురూప అవార్డుల ‘ ద్వారాసాహిత్య కళాభిమానులకు తెలుసు . ప్రశాంతమైన పరిసరాల్లో ఒక అందమైన ఆలయాన్ని నిర్మించి ఇచ్చిననిరాడంబర వ్యక్తిగా సామాన్య భక్తులకు తెలుసు .  వీటన్నిటికీ మించి స్నేహశీలి , నిగర్వి , మృదుభాషి , దానశీలి , కర్తవ్య నిర్వహణ లో , క్రమ శిక్షణ లో రాజీ పడని వ్యక్తిగా ఎందరికో తెలిసిన డా . అమృతలత గారి తోముఖాముఖి మయూఖ కోసం :

1 .ప్రశ్న : మీకు సాహిత్యం పట్ల ఇష్టం ఎలా మొదలయింది ? మీ బాల్యం లో సాహిత్యానికి దోహదపడినఅంశాలేవైనా ఉన్నాయా?

జ : చిన్న తనంలో మా పెద్దన్నయ్య దగ్గర ఉండి చదువుకుంటున్నప్పుడు అన్నయ్య ఇంటికి చందమామ , బాలమిత్ర , ప్రజామత , కృష్ణా పత్రిక ,జాగృతి , ఆంధ్ర పత్రిక , ఆంధ్ర ప్రభ ..ఇలా బోలెడు పుస్తకాలుతెచ్చేవాడు . అవన్నీ చదివే దాన్ని . అన్నయ్య ఇచ్చే పాకెట్ మనీ తో నిజామాబాద్ లోని ‘అరుణా బుక్ హౌస్ ‘ లో బాలల బొమ్మల రామాయణం , భట్టి విక్రమార్క కథలు , వేయి శిరస్సులు ఖండించిన అపూర్వచింతామణి పుస్తకాలు కొనుక్కొని చదివేదాన్ని . సెలవుల్లో జక్రాన్ పల్లికి వెళ్ళినప్పుడు మా క్లాస్ మేట్స్ కొందరుడిటెక్టీవ్ నవలల్ని అద్దెకు తెచ్చి ఇచ్చేవారు . మేముండే గడీ ఎదురుగా ఉన్న గ్రామ పంచాయతీకి ‘ ఆంధ్రభూమి ‘ దినపత్రిక వచ్చేది . సభ్యులందరూ చదివాక నేను తెచ్చుకుని చదివి మళ్ళీ జాగ్రత్తగా ఇచ్చేసేదాన్ని . తరువాతి రోజుల్లో వార పత్రికలూ , పక్ష , మాస పత్రికలూ చదివితే  కుటుంబ సమస్యలూ , సామాజికజీవితమూ , మనుష్యుల మనస్తత్వాలూ తెలుస్తాయని తెలియజెప్పింది మా మేన వదిన కూతురు సరోజక్క . ఇవన్నీ కలిసి నాకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా చేశాయి .

2 .ప్రశ్న : మీ పాఠశాల విద్యాభ్యాసం గురించి చెప్పండి . అప్పటికీ ఇప్పటికీ విద్యా వ్యవస్థలో మీరు గమనించినమార్పులు ఏమైనా ఉన్నాయా ? ముఖ్యంగా విద్యార్థులకూ , సాహిత్యానికీ ఉండే సంబంధం ఎలా ఉంది ?

జ : అరవై ఏళ్ల క్రితం తెలంగాణాలో ఆడపిల్లలు చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో అవన్నీ నేనూపడ్డాను . అయితే నా చదువుకు మా ఇంటి వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది . ఊరు దాటాక , నేను మాపెద్దన్నయ్య ఇంట్లోనూ , చిన్నక్క ఇంట్లోనూ ఉండి చదువుకున్నాను .అప్పట్లో ప్రతి క్లాస్ లోనూ నలుగురో , అయిదుగురో ఎగువ మధ్య తరగతి కి చెందిన ఆడ పిల్లలుండేవారు . మిగతా అమ్మాయిలకు చదువుఅందని పండే !  పడకల్ , జక్రాన్ పల్లి , అర్గుల్  గ్రామాల్లోనూ , జిల్లా కేంద్రమైన నిజామాబాద్ లోనూ , కరీంనగర్ జిల్లా లోని హుజురాబాద్ లోనూ నా స్కూల్ విద్య కొనసాగింది . నా మూడో తరగతి లోనే నేను రోజామూడు కిలోమీటర్లు , ఎనిమిదో తరగతిలో అయిదు కిలోమీటర్లు నడిచి స్కూల్ కి  వెళ్లాల్సి వచ్చేది .

అప్పట్లో గురువులు విద్యార్థుల పట్ల తల్లిదండ్రులుగా , బాధ్యతగా ఉంటే , విద్యార్థులు గురువుల పట్ల భయభక్తులతో , గౌరవంతో ఉండేవారు . ఆనాటి పాఠశాల విద్య బలమైన సంస్కారపు పునాది ఏర్పరచేది . ఇప్పుడు ఎవరైనా విద్యార్థిని మందలిస్తే పేరెంట్స్ ఆ టీచర్ పైకి యుద్ధానికి వస్తారు .అప్పట్లో మా పిల్లలనుకొట్టినా సరే , మంచి చదువు చెప్పమని కోరేవారు .

ఇక సాహిత్యం అంటారా … అప్పటి పిల్లలు ఇంత ఒత్తిడిలో చదువుకోలేదు .చదువుతో బాటు ఆటపాటలకీసమయముండేది .తెలుగు , హిందీ , ఇంగ్లీష్ భాషా ఉపాధ్యాయులు ఆయా పాఠాలు చెప్పేటప్పుడుఅనుబంధ పుస్తకాలను సూచించి చదవమనే వారు . కొనుక్కునే వాళ్ళు కొనుక్కోగా లేని వాళ్ళు లైబ్రరీ కి వెళ్లిచదువుకునే వారు . వాళ్ళల్లో ఎందరో సాహిత్యకారులుగా రూపుదిద్దుకునేవారు . ప్రముఖ రచయితలూ , కవులూ అప్పట్లో పాఠశాల రోజుల్లో రచనలు చేసిన వారే . పైగా మాతృభాషలో రచన చేయడం సులువు . ఇప్పటి విద్యార్థులు సాహిత్యమే కాదు  , కనీసం దిన పత్రికలని కూడా చదవడం లేదు . తడబడకుండాతెలుగు చదివే వాళ్ళే తగ్గిపోతున్నారు .

3 .ప్రశ్న :సమాజాన్ని బాగా చదివినవారే సాహిత్య సృజన చేయగలుగుతారని అంటారు కదా ? మీరుసమాజాన్ని అధ్యయనం చేయడం ఏ వయసులో మొదలయింది ? మీకు స్ఫూర్తి నిచ్చిన గురువులు ఎవరు ?

జ : ఊహ తెలిసిన నాటి నుండీ ఎవరైనా సమాజాన్ని చూస్తూ , చుట్టూ ఉన్న వ్యక్తుల్ని గమనిస్తూనేపెరుగుతారు . అయితే , కొందరికి తల్లిదండ్రుల గైడెన్స్ , గురువుల మార్గదర్శకత్వం విపరీతంగాదొరుకుతుంది . అది సంఘటనల్నీ , సందర్భాల్నీ , మనుషుల మనస్తత్వాల్నీ సరిగా అంచనా వేసి అవగాహనచేసుకోవడానికి ఉపయోగపడుతుంది . దానికి మంచి సాహిత్య పఠన తోడయితే , అలాంటి వారే రచనలుచేయగలుగుతారు . నా మట్టుకు నాకు చిన్నప్పుడు బాగా చదివిన పుస్తకాలే సాహిత్య సృజనకు తోడ్పడ్డాయి .

4 .ప్రశ్న : మీరు చిన్నప్పుడు పుస్తకాలు బాగా చదివేవారన్నారు . మీకు నచ్చిన రచయితలెవరు ? వారిలో  ఎవరిప్రభావం మీపై ఎక్కువగా ఉంది ?

జ : నచ్చిన రచయితలు ఒకరిద్దరని చెప్పలేను . రంగనాయకమ్మ గారి రచనలు బాగా నచ్చేవి . చందమామకథల్లోని సరళత , అంతర్లీనంగా ఒక నీతినీ , సంస్కారాన్నీ బోధించే విధానమూ , డిటెక్టీవ్ కథల్లోని సస్పెన్స్ , చివరికి దుర్మార్గులని పట్టుకోవడం బాగా నచ్చేవి . సున్నిత హాస్యం , కొసమెరుపూ ఉన్న కథలని ఎక్కువగాఇష్టపడతాను .

5 .ప్రశ్న : తెలంగాణాలో యాభై ఏళ్ల క్రితం స్త్రీ విద్య అంతగా కొనసాగే వాతావరణం లేదు . మరి మీరు ఇంతఉన్నత విద్య ఎలా అభ్యసించగలిగారు ?

జ : నన్ను డాక్టర్ గా చూడాలని మా బాపు ఎంతో ఆశించారు . కానీ , నా చిన్నతనంలో ఆక్సిడెంట్ లో చేతివేళ్ళు పోగొట్టుకున్నాను గనుక తరువాతి రోజుల్లో వైద్య విద్య  చదవలేకపోయానే బాధ ఉండేది . చదువు పట్లవిపరీతమైన ఇష్టం చిన్నప్పటి నుండీ ఉండేది . నా నాలుగేళ్ల వయస్సులో అమ్మా , నేను తొమ్మిదో తరగతిలోఉన్నప్పుడు మా బాపు చనిపోయారు . హై స్కూల్ విద్య వరకూ ఫరవా లేదు గానీ ఉన్నత విద్యకు ఆటంకంఏర్పడుతుందేమో అని చాలా భయపడ్డాను .ఆ సమయంలో మా బాపు నా కోసం ఒక ఎకరం పొలం తీసిపెట్టారని తెలిసి ఎంతో పొంగి పోయి అది అమ్ముకుని బి ఏ ,బి ఎడ్ చేసాను . ఆ తరువాత ఉద్యోగం చేస్తూఎమ్మే , ఎమ్మెడ్ చేసాను . మెడికల్ డాక్టర్ ని  కాలేక పోయినా పీ హెచ్డీ చేసి డాక్టరేట్ తీసుకోవాలని నా అరవైఅయిదవ ఏట శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నుండి పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాను .

6 ప్రశ్న : చిన్నప్పటినుండీ మీరు పెరిగిన కుటుంబ వాతావరణం గానీ , మీ చుట్టూ ఉన్న సామాజికవాతావరణం గానీ మీ రచనకు తోడ్పడిందా ? మీ పూర్వీకులలో రచనలు చేసిన వారున్నారా ?

జ : మా పూర్వీకుల్లో కవులూ , రచయితలూ లేరు .మా కుటుంబంలో గానీ , నా చుట్టూ ఉన్న బంధువులు , స్నేహితుల్లో గానీ చాలా మంది దిగువ మధ్య తరగతికి చెందిన వారే . కడుపు నిండా భోజనం , ఏడాదికి ఒకసారి కొత్త బట్టలూ , అప్పుడప్పుడూ పట్నం వెళ్లడమే గొప్ప జీవితం మాకు ! నాలాంటి కొద్ది మందికి  తప్పమిగతా అమ్మాయిలకు పై చదువులు చదివే అవకాశమే లేదు . పదో తరగతిలోనో  అంతకు ముందో పెళ్లి , ఆతరువాత సంసారం , పిల్లలూ , బాధ్యతలు … వీటిల్లో పడి వచ్చిన చదువు మర్చిపోయిన వారే ! ఆ నేపధ్యంతప్పకుండా మనసులో ఉంటుంది , దాని గురించి రాయాలనీ ఉండేది . అయితే .. అప్పుడు దాదాపు అన్నిపత్రికలూ తెలంగాణా కంటే చదువు లోనూ , అభివృద్ధి లోనూ ముందున్న ఆంధ్రా ప్రాంతపు ప్రచురణకర్తలచేతుల్లో ఉండేవి . వాళ్ళు తెలంగాణా రచయితలను గానీ , ఇక్కడి వాతావరణం ప్రతిబింబించే రచనలనుగానీ పెద్దగా ప్రోత్సహించలేదు .మన రచన ప్రచురింపబడాలంటే మనది

7 ప్రశ్న :తెలంగాణలో కవిత్వం రాసేవాళ్ళు ఎక్కువ. మీరు స్కూల్ రోజుల్లోనే కవిత్వం రాశారు . మరి తరువాతిరోజుల్లో దాన్ని కొనసాగించకుండా , ఇతర సాహిత్య ప్రక్రియల వైపు వెళ్ళడానికి కారణం ఏమిటి ?

జ : నేను మొదట రాసింది కవితనే అయినా .. మొత్తంగా నాలుగయిదు కవితలకు మించి రాయలేదు . కవిత్వం రాయడానికి కావలసిన భాష , సాంద్రత ,అభివ్యక్తి  నాకు లేవు గనుకనే కవిత్వం జోలికి వెళ్ళలేదు . అయితే ..మంచి కవిత్వం ఎవరు రాసినా చదివి ఆనందిస్తాను . ఇక పోతే .. తరువాతి రోజుల్లో ఏది రాసినామా పాఠశాలల విద్యార్థులు వేదికపై పాల్గొనేందుకు వీలుగా చిన్న నాటికలు , గేయాలూ రాసాను . ఒక రకంగాగేయ రచన కూడా లయకు ఒదిగే కవిత్వమే కదా !

8 ప్రశ్న : కాలేజీ జీవితపు మాధుర్యం తో ‘ సృష్టిలో తీయనిది ‘ నవల రాశారు కదా ! ఆ తరువాత నవలలురాయక పోవడానికి ఏదైనా కారణం ఉందా ?

జ : చదువులో వెనుకబడిన మా నిజామాబాదు జిల్లాలో ..విద్యార్థుల ముంగిట్లోకి నాణ్యమైన విద్యను తీసుకురావాలన్న తపనతో ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి , వాటి నిర్మాణ ,నిర్వహణ , అభివృద్ధి పనులలోరేయింబవళ్లు తలమునకలయ్యే స్థితిలో మరే రచనలూ చేయలేకపోయాను .

9 ప్రశ్న : మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారన్నారు కదా ! వ్యవసాయమంటేనే కష్టాలు .. అందునాతెలంగాణా లో ! ఆ కష్టాలు మిమ్మల్ని తీర్చిదిద్దాయా ?

జ : కష్టాల్ని కొందరు సవాలుగా తీసుకుని ఆ అనుభవాలతో జీవితాన్ని తీర్చి దిద్దుకుంటే ఇంకొందరునిరాశావాదులై జీవితం పై విరక్తి పెంచుకుంటే , మరి కొందరు ఏ మార్గం లోనైనా డబ్బు సంపాదించేమోసగాళ్ళుగానో , లేక సమాజం పై కసితో తీవ్ర వాదులుగానో  మారుతారు . కష్టాలను నిందిస్తూ కూర్చునేబదులు ఆత్మ విశ్వాసం తో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తామనేది నా భావన , అనుభవం కూడా ! మనంఏదో కొంత సాధించగానే కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించకుండా తోచినంత సాటి వారికి సాయపడడం , వారు పైకిరావడానికి కావాల్సిన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం కనీస బాధ్యత అని భావిస్తాను . పోతే .. వ్యవసాయదారులకష్టాలు మటుకు ఇప్పటికీ అలాగే ఉండడం శోచనీయం

10 ప్రశ్న : మిగతా ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే మీ పాఠశాలల ప్రత్యేకత ఏమిటి ? మీ విద్యార్థులు కథలూ , కవిత్వం రాస్తారు , ఆటలూ , పాటలూ నేర్చుకుంటారు .. చదువు వెనక బడుతుందని తల్లిదండ్రులు ఏమీఅనరా ?

జవాబు : నిజమే , ఒక సాహిత్యమనే కాదు , మా విద్యార్థులు యోగా , సంప్రదాయ నృత్యాలూ , సంగీతం , మార్షల్ ఆర్ట్స్ , క్రీడలూ … ఇలా అన్నింటిలోనూ రాష్ట్ర ,జాతీయ , అంతర్జాతీయ స్థాయిల్లో బహుమతులుగెల్చుకుంటూనే చదువులో అత్యున్నతంగా రాణిస్తారు . వారిలో దేశ విదేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నకలెక్టర్లూ , డాక్టర్లూ , ఇంజినీర్లూ , అడ్వొకేట్లూ , ఇతర ఉద్యోగులూ ఎందరో ఉన్నారు .ఇక తల్లిదండ్రులకుఅభ్యంతరమేముంటుంది ? నిజానికి లలిత కళలు మనో వికాసానికీ , చదువుపై శ్రద్ధ పెరగడానికీ దోహదంచేస్తాయి కూడా . మా విద్యార్థుల్లో పాతిక మందికి పైగా పీజీ డాక్టర్లు ఇక్కడే .. మా నిజామాబాద్ జిల్లా లోనేవైద్య సేవలు అందిస్తున్నారు అంటే ఆనందమే కదా ! ఇటీవల విక్టోరియా మహారాణి చేతుల మీదుగాలండన్ లో తన వైద్య సేవలకు గాను అవార్డు తీసుకున్న డా . శ్రీధర్ మా విద్యార్ధి అవడం మాకు గర్వకారణం . మా దగ్గర చదువుకున్న ముప్పై అయిదు వేల మంది విద్యార్థుల్లో అలాంటి వాళ్ళు ఎందరో !

11 ప్రశ్న :‘ అమృతలత -అపురూప అవార్డ్స్ ప్రారంభించడానికి ఆలోచన ఎలా వచ్చింది ? పదేళ్లలోమరపురాని సంఘటనలు ఉన్నాయా ? ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా నిర్వహించగల్గుతున్నారు ?

జవాబు : చాలా ఏళ్లుగా  నా పరిశీలనలో ఉన్న విషయం ఏమిటంటే లలిత కళల్లో చాలా వాటికి మూలంసాహిత్యమే .రామాయణ , మహాభారత కథల నుంచీ … చరిత్రలో అనేక సంఘటనలూ , యుద్ధాలూ , సామాజిక పరిణామాలనూ అక్షరబద్దం చేసేదీ , యుగాల తరబడి నిలిపేదీ సాహిత్యమే ! ఆటల్లో క్రికెట్ కితప్ప మిగతా వాటికి గుర్తింపు లేనట్టుగా సినిమాలు , టీవీలకున్న ప్రాధాన్యత సాహిత్యానికివాళ లేదు . నిజానికి వాటికి కావాల్సిన కథలూ , మాటలూ , పాటలూ వంటి ముడి సరుకునందించేది సాహిత్యమే . అందులోనూ స్త్రీలు ఏ కళలోనైనా ప్రావీణ్యత సంపాదించాలంటే వారి వ్యక్తిగత జీవితాన్నీ , సమయాన్నీ చాలాఅడ్జస్ట్ చేసుకోవాల్సి , త్యాగం చేయాల్సి ఉంటుంది . అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ కళల్నినిలుపుకుని సమాజానికి అందిస్తున్న మహిళల్ని గుర్తించి , గౌరవించాలని ఒక ఆలోచనకు రూపమేఅపురూప అవార్డులు . ఇక తెలంగాణా కథయిత్రుల ‘ వెతలే కథలై ‘ ఆవిష్కరణ సభలో డా . ముదిగంటిసుజాతా రెడ్డి గారికి అమృతలత జీవన సాఫల్య పురస్కార ప్రదానం తో మొదలైన అవార్డులు గత పదేళ్లుగాకొనసాగుతూ ఉండడం మీకు తెలిసిందే ! అన్ని కళా విభాగాల్లోనూ ఇచ్చే అవార్డుల్లో సింహ భాగంసాహిత్యానికీ .. అందునా సగానికి పైగా తెలంగాణా మహిళలకు చెందాలనేది మా అభిలాష . అవార్డుగ్రహీతలు దీన్ని అపురూపంగా , గౌరవంగా భావించడం …, రెండు వందలకు పైగా సాహితీ వేత్తలు పాల్గొనితమ ఇంటి పండుగలాగా ఈ పురస్కార సభను విజయవంతం చేయడం చూసి మా లక్ష్యం నెరవేరిందనిభావించాం . ఈ సందర్భంగా అవార్డు గ్రహీతల , అతిథుల జీవిత విశేషాలతో కూడిన ‘అభినందన ‘ ప్రత్యేకసంచిక ‘ కు కూడా మంచి పేరు వచ్చింది . విశిష్ట మహిళలకు అవార్డులివ్వాలనుకునే వారికి , పరిశోధకవిద్యార్థులకూ ఈ సావనీర్స్ ఉపయోగపడుతున్నాయి . పోతే ..బంధు మిత్రుల సహకారంతోనే ఈ కార్యక్రమందిగ్విజయంగా జరుగుతోంది . అందులోనూ సింహ భాగం నెల్లుట్ల రమాదేవి , కిరణ్ బాల గార్ల పాత్ర ఉంది .

12 .ప్రశ్న :మీరు ముందు రచయిత్రి , తరువాత టీచర్ .. ఆ తరువాత విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు . వీటిల్లో మీకు ఏ పాత్ర ఇష్టం ? ఎందుకని ?

జ : నాకు అన్నిటి కన్నా టీచర్ పాత్రే చాలా ఇష్టం . విద్యార్థికీ , టీచర్ కీ ప్రత్యక్ష సంబంధం , అపురూపఅనుబంధం ఉంటుంది . టీచర్ తన విద్యార్థిని ప్రభావితం చేసి , ఉత్తమ పౌరుడిగా తీర్చి దిద్దగలడు .  రచయిత రచనల ద్వారా కొద్ది మంది ప్రభావితులయ్యే అవకాశం ఉందేమో గానీ , అది పాఠకుల మేధోస్థాయిని బట్టీ , వాళ్ళు ఆ రచనను చూసే కోణాన్ని బట్టీ ఉంటుంది . ఇక విద్యాసంస్థల నిర్వాహకులకైతేపాలసీ డెసిషన్స్ , టీచర్ల పని తీరు, అడ్మినిస్ట్రేషన్ వంటివి తప్పితే పిల్లలతో ప్రత్యక్ష సంబంధమే ఉండదు . నేను స్కూల్ పెట్టి టీచింగ్ కి దూరమయ్యాననే బాధ నన్ను అప్పుడప్పుడూ వేధిస్తూ ఉండడంతో కొన్ని సార్లుక్లాసులు తీసుకుంటుంటాను .

13 .ప్రశ్న :మీరు ‘ అమృత కిరణ్ ‘ అనే పక్ష పత్రిక పెట్టి రెండేళ్ల పాటు నడిపారు . పత్రిక పెట్టాలని ఎందుకుఅన్పించింది ? ఎందుకు ఆపేశారు ?

జ : నాకు ఇవాళ కొద్దో గొప్పో సాహిత్యంతో పరిచయం , అందులో ప్రవేశం ఉందంటే నేను చిన్నతనంలోచదివిన పత్రికలూ , పుస్తకాల వల్లే . అయితే చాలా పత్రికలు ఓ మాదిరి పేరున్న వాళ్ళ రచనలే వేసేవారు . దానితో ఒక పక్ష పత్రిక ప్రారంభించి ఎందరో వర్ధమాన రచయితలకు , కవులకు అవకాశం ఇవ్వాలని ‘ అమృతకిరణ్ ‘ స్థాపించి అనుకున్నట్లుగానే చాలా మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చాం . లబ్ద ప్రతిష్టులూ రాశారు. జిల్లా లోనే మొట్టమొదటి ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రారంభించింది మేమే ! అయితే … మార్కెటింగ్ లో మెళకువలుతెలియక , సరిగా మార్కెటింగ్ , అడ్వర్టైజింగ్ చూసే వాళ్లు లేక దాన్ని మూసేయాల్సి వచ్చింది .

14 ప్రశ్న :‘ అమృతలత -అపురూప అవార్డ్స్ ప్రారంభించడానికి ఆలోచన ఎలా వచ్చింది ? పదేళ్లలోమరపురాని సంఘటనలు ఉన్నాయా ? ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా నిర్వహించగల్గుతున్నారు ?

జవాబు : చాలా ఏళ్లుగా  నా పరిశీలనలో ఉన్న విషయం ఏమిటంటే లలిత కళల్లో చాలా వాటికి మూలంసాహిత్యమే .రామాయణ , మహాభారత కథల నుంచీ … చరిత్రలో అనేక సంఘటనలూ , యుద్ధాలూ , సామాజిక పరిణామాలనూ అక్షరబద్దం చేసేదీ , యుగాల తరబడి నిలిపేదీ సాహిత్యమే ! ఆటల్లో క్రికెట్ కితప్ప మిగతా వాటికి గుర్తింపు లేనట్టుగా సినిమాలు , టీవీలకున్న ప్రాధాన్యత సాహిత్యానికివాళ లేదు . నిజానికి వాటికి కావాల్సిన కథలూ , మాటలూ , పాటలూ వంటి ముడి సరుకునందించేది సాహిత్యమే . అందులోనూ స్త్రీలు ఏ కళలోనైనా ప్రావీణ్యత సంపాదించాలంటే వారి వ్యక్తిగత జీవితాన్నీ , సమయాన్నీ చాలాఅడ్జస్ట్ చేసుకోవాల్సి , త్యాగం చేయాల్సి ఉంటుంది . అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ కళల్నినిలుపుకుని సమాజానికి అందిస్తున్న మహిళల్ని గుర్తించి , గౌరవించాలని ఒక ఆలోచనకు రూపమేఅపురూప అవార్డులు . ఇక తెలంగాణా కథయిత్రుల ‘ వెతలే కథలై ‘ ఆవిష్కరణ సభలో డా . ముదిగంటిసుజాతా రెడ్డి గారికి అమృతలత జీవన సాఫల్య పురస్కార ప్రదానం తో మొదలైన అవార్డులు గత పదేళ్లుగాకొనసాగుతూ ఉండడం మీకు తెలిసిందే ! అన్ని కళా విభాగాల్లోనూ ఇచ్చే అవార్డుల్లో సింహ భాగంసాహిత్యానికీ .. అందునా సగానికి పైగా తెలంగాణా మహిళలకు చెందాలనేది మా అభిలాష . అవార్డుగ్రహీతలు దీన్ని అపురూపంగా , గౌరవంగా భావించడం …, రెండు వందలకు పైగా సాహితీ వేత్తలు పాల్గొనితమ ఇంటి పండుగలాగా ఈ పురస్కార సభను విజయవంతం చేయడం చూసి మా లక్ష్యం నెరవేరిందనిభావించాం . ఈ సందర్భంగా అవార్డు గ్రహీతల , అతిథుల జీవిత విశేషాలతో కూడిన ‘అభినందన ‘ ప్రత్యేకసంచిక ‘ కు కూడా మంచి పేరు వచ్చింది . విశిష్ట మహిళలకు అవార్డులివ్వాలనుకునే వారికి , పరిశోధకవిద్యార్థులకూ ఈ సావనీర్స్ ఉపయోగపడుతున్నాయి . పోతే ..బంధు మిత్రుల సహకారంతోనే ఈ కార్యక్రమందిగ్విజయంగా జరుగుతోంది . అందులోనూ సింహ భాగం నెల్లుట్ల రమాదేవి , కిరణ్ బాల గార్ల పాత్ర ఉంది .

15 ప్రశ్న :మిగతా ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే మీ పాఠశాలల ప్రత్యేకత ఏమిటి ? మీ విద్యార్థులు కథలూ , కవిత్వం రాస్తారు , ఆటలూ , పాటలూ నేర్చుకుంటారు .. చదువు వెనక బడుతుందని తల్లిదండ్రులు ఏమీఅనరా ?

 జవాబు : నిజమే , ఒక సాహిత్యమనే కాదు , మా విద్యార్థులు యోగా , సంప్రదాయ నృత్యాలూ , సంగీతం , మార్షల్ ఆర్ట్స్ , క్రీడలూ … ఇలా అన్నింటిలోనూ రాష్ట్ర ,జాతీయ , అంతర్జాతీయ స్థాయిల్లో బహుమతులుగెల్చుకుంటూనే చదువులో అత్యున్నతంగా రాణిస్తారు . ఇక తల్లిదండ్రులకు అభ్యంతరమేముంటుంది ? నిజానికి లలిత కళలు మనో వికాసానికీ , చదువుపై శ్రద్ధ పెరగడానికీ దోహదం చేస్తాయి కూడా . మావిద్యార్థుల్లో పాతిక మందికి పైగా పీజీ డాక్టర్లు ఇక్కడే .. మా నిజామాబాద్ జిల్లా లోనే వైద్య సేవలుఅందిస్తున్నారు అంటే ఆనందమే కదా ! ఇటీవల విక్టోరియా మహారాణి చేతుల మీదుగా లండన్ లో తనవైద్య సేవలకు గాను అవార్డు తీసుకున్న డా . శ్రీధర్ మా విద్యార్ధి అవడం మాకు గర్వకారణం . మా దగ్గరచదువుకున్న ముప్పై అయిదు వేల మంది విద్యార్థుల్లో అలాంటి వాళ్ళు ఎందరో !

16 ప్రశ్న :‘ ఇచ్చుటలో ఉన్న హాయి ‘ మీకు బాగా తెలుసు .బాధల్లో ఉన్నవారికి సహాయం చేయడం , కొన్ని సార్లుఆశ్రయం, ఉపాధి కల్పించడం , విద్యార్థులకు , అనాథ స్త్రీలకు తోడ్పడడం , పుస్తకాలు వేసుకోలేనిరచయితలకు చేయూతనివ్వడం …. ఇలా చాలా గుప్త దానాలు చేస్తూంటారు . కానీ ఎక్కడా చెప్పుకోరు . ఎందుకని ? జనం క్యూ కడతారనా ?

జవాబు : మన జీవితం చాలా చిన్నది , విలువైంది కూడా ! ఇందులో మనం ఏ కాస్తయినా ఇతరులకుసహాయపడడం మనుషులుగా మన బాధ్యత , అంతే ! దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం ఎందుకు ? అదిసహాయం పొందిన వాళ్ళను న్యూనతకు గురి చేయడం , అవమానించడం కూడా ! ఇకపోతే తరతరాలకుసరిపోయేంత కూడబెట్టాలని నాకు కోరిక లేదు . నేను ఇతరులపై ఆధార పడకుండా జీవితం గడిచిపోతేచాలు . బద్దకస్తులకూ , నిజాయితీ లేని వారికీ నా దగ్గర చోటుండదు . అలాంటి వారికి నేనేమీ సహాయంచేయలేను .

17 ప్రశ్న . తెలంగాణా తొలి ఉద్యమం లో విద్యార్థిగా , మలి ఉద్యమంలో విద్యా సంస్థల ముందు టెంట్ వేసివిద్యార్థులను నడిపించిన వారుగా మీరు పాల్గొన్నారు . పోరాట సమయం లో అందరూ మహిళలే రచించిన’గాయాలే గేయాలై ‘ కవిత్వాన్నీ , ‘ వెతలే కథలై ‘ కథలనూ పుస్తక రూపంలో వెలువరించారు . ఒక తెలంగాణాప్రేమికురాలిగా ఇప్పుడేమంటారు ?

జ : మనం ఆశించిన తెలంగాణా వచ్చింది . మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్న ఈ రోజుల్లో నేటితరం యువతులు రాజకీయాల్లోకి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వచ్ఛమైన సుపరిపాలన అందించాలి . ఆ రోజుతొందర్లో రావాలని ఎదురు చూద్దాం .

June 23, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శతజయంతుల పి.వీ. నరసింహారావుగారికి అక్షర నివాళి

by mayuukha June 23, 2021
written by mayuukha

అష్టభాషా ప్రావీణ్యులు కవి – రచయిత మన దేశ పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారిని తలచుకుందాం.

మాతృభాష తెలుగు, రాష్ట్ర భాష హిందీ ప్రపంచ భాష ఇంగ్లీష్ లతోబాటు కన్నడం, మరాఠీ, ఉర్దూ, అరబ్బీ, పార్సీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం సాధించారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషలూ నేర్చారు.

గొప్ప వక్త. 14 భాషల్లో మాట్లడగలరు. మితభాషి అని పేరు వచ్చినా సభను రంజింప చేసేటప్పుడు తమ సహజగుణాన్ని అధిగమిస్తారు. ఇది ఒక కళ! కళాత్మక హృదయులకే సాధ్యమయ్యే అద్భతకళ పి.వి.గారి సొంతం!

1921 జూన్ నెలలో జన్మించారు. జూన్ 28న ఇప్పటికి సరిగ్గా వందేళ్ళు! మనం శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం.  2004 డిసెంబర్ 9న పరమపదించారు. మనకు ఎన్నో ఆదర్శాలను నేర్పి వెళ్ళారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ గణనీయమైన మార్పులను తీసుకువచ్చిన మేధావి! అపర చాణుక్యుడని పేరుగాంచిన రాజకీయ దురంధరుడు. బుద్ధికి బృహస్పతి! కులబలం, ధనబలం లేకున్నా పల్లె నుండి ఢిల్లీవరకు ప్రతిభావంతమైన వ్యక్తిగా కీర్తి సంపాదించారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ వారి తొలి, తుది పార్టీ! భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో మంచి మార్పులను తీసుకువచ్చి, ఒకానొక సందర్భంలో దేశం ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే స్థాయికి చేరుకున్నప్పుడు గొప్ప సంస్కరణలకు బీజం వేసి పునరుజ్జీవం కల్పించారు.

సహస్రఫణ్ అనే పేరుతో విశ్వనాథసత్యనారాయణగారి వేయి పడగలను హిందీలోకి అనువదించారు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. అబలా జీవితం – అనే పేరుతో పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని హరినారాయణ్ ఆప్టే రచనను అనువదించారు. ఇన్ సైడర్ – రచించారు. వీరి ఆత్మకథా రచన . ఇది ‘లోపలి మనిషి’ పెరుతో తెలుగులోకి అనువదించారు. మాగ్నమ్ ఓపస్ Magnam Opus అనదగిన autobiographical novel స్వీయ చరిత్రాత్మక కాల్పనిక కథన పద్ధతిలో ఉన్నట్లు అర్థం అవుతుంది. Strait Forword narrative తో మొదలైన అద్భుత నవల. పీ.వీ.గారు రాజకీయాల్లో రాకుంటే గొప్ప కవి, రచయిత  అయ్యేవారు.  జ్ఞానపీఠమూ, ఓ నోబుల్ బహుమతి వచ్చి ఉండేవి.

పి.వీ.గారు ప్రఖ్యాత రచయిత్రి జయప్రభగారి కవిత్వాన్ని తెలుగులోంచి ఇంగ్లీషులోకి అనువదించారు.

ఆనాడు పాములపర్తి సదాశివరావుగారితో కలిసి ‘కాకతీయ’ ప్రతికకు సంపాదకత్వం వహించినా వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని ఉపయోగించినా పి.వీ.గారి పట్టుదలకు, నిబద్ధతకు నిదర్శనం.

కాళోజీగారు దగ్గరి మిత్రులు. ఈ మిత్రుల ఆత్మీయత సాహితీలోకానికెరుక.

కవివరేణ్యులు వానమామలై వరదాచార్యులకు గండపిండేరం తొడిగిన పీవీ స్వయంగా కవి పండితుడు.

1940 పి.వి.రచించిన గొల్ల రామవ్వ కథ తెలంగాణ జీవన చిత్రాన్ని చిత్రికపట్టి ఆనాటి స్వాతంత్ర్య పోరాటాలకు వెలుగుదివ్వె అయ్యింది.

నీలిరంగు పట్టుచీర, మానావమానాలు వంటి కథలు పి.వీ.గారి ఆదర్శ భావజాలాన్ని పట్టిస్తాయి.

మంగయ్య అదృష్టం, నవలిక వంటిది ద మినిస్టర్ Secret of the ballot, forgotten suitcase the guest, The reshuffle వంటి కథానికలు రచించారు.

దేశభక్తి పివిగారి ఒడనెల్లా ప్రవహించేది కాబట్టే ఓ గొల్లరామప్పలో దేశమాతను దర్శించుకున్నారు. “అవ్వా నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్ భారతమాతవే” అనగలిగారు.  స్త్రీ పురుషులెవరికైనా శీలం గొప్ప సంపద అని చెప్పిన ‘నీలిరంగు పట్టుచీర’ కథనూ వ్రాయగలిగారు. ఇది మన దేశ సంస్కృతి! ఒక సందర్భం పి.వి.వంటి కవిని రాజకీయవేత్తను చేసుకుని రాజ్యానికి ఇటువంటి వ్యక్తి కావాలి అనుకున్నది. కాలం ఇందుకు తన శక్తిని ధారబోసింది. ఎట్లయితే పి.వి.గారు తమ శక్తి దేశం కోసం ధారబోసారో అట్లే! అవును. మనసుపెట్టి, మంచి మనసుపెట్టి దీక్షగా పి.వి.గారిని పరిశీలిస్తే ఇవన్నీ బోధపడ్తాయి. ఆయన ప్రత్యక్ష ప్రయత్నాలు లేకున్నా కొన్ని విషయాలలో అవినీతి ఆరోపణలు అంటగట్టి, ఎక్కడ మహాశక్తిగా ఇంకా ఎత్తుకెదుగుతాడోనని కుట్రలు పన్ని అంతటి గొప్ప వ్యక్తి నిస్వార్థ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఎవరు అని నిజాయితీగా చర్చించుకోవాలి ఈ సభ్య సమాజం.

భారతీయ ఫిలాసఫీ అంటే, భారతీయ ఫిలాసఫర్స్ అంటే పీవీగారికి ఇష్టం. ప్రపంచంలోనే ఇంత గొప్ప తత్త్వవేత్తలు లేరు. ప్రపంచంలోనే ఇంత గొప్పసంస్కృతి లేదు.

అది 1972 ఆగష్టు 15. స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం. అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాసనసభ భవనంలో కవితాత్మక సందేశాన్ని అందించారు పి.వీ.

“నవరసా ర్థ జీవితాల, నవోన్మేష మానసాల

నవ పల్లవ తరుశాఖల రవళించెడు జనాల

నవవిధ భక్తుల, రక్తుల, నవశక్తుల మేళవించి,

నవ నిర్మిత జాతి సంతరించినాడ విప్లవ తపస్వి’ అంటారు.

విప్లవమంటే ఏమిటి? విప్లవమంటే మార్పు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అధినేతగా తాముచేయదలుచుకున్న సంస్కరణలకు రూపశిల్పి తానే అయిన వారు కవిరాజు పి.వి. కాని కొందరు కుటిలులు ఉంటారు గదా!

“భువి దానవగ్రహమై పోవ రోదసిని మధించి

మానవతా వాహనకై పూనుకున్న రాజ్యేందిర

జయదుందుభి విని ఉత్తేజనము పొందునా పౌరుడు!

మోదమలరని చెర అరలో మూల్గిన భావకిశోరికి

విహారయ స్వేచ్ఛాంతరిక్ష వీధిని లభ్యమవునా?’’ ఎంతటి నిశ్చలత?

ఎంతటి నిర్భీతత్వం. తమ ఆలోచనలకు రూపమిస్తే ఎందరు వ్యతిరేకిస్తారో తెలుసు పి.విగారికి. అయినా ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు. అందుకే అంటారు –

“విహంగమున లాకసంపు కొలతలేల?

చిన్న అలకు ఒడ్డు దూరమున్నదన్న చింత ఏల?

దీపము పెనుగాలికి బీతిల్లనేల?

జీవితాత్మకు ఎన్నడు బ్రహ్మము చేరుదునన్న సందియ మ్మదేల?”

అంటారు. ఎంత గొప్ప పోలికలు? తమ నిర్ణయాలకు ఎందరి వ్యతిరేకత ఉన్నా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా దేనికీ భయపడవద్దనుకున్నారు.

నేనొక చైతన్మోర్మిని

నిస్తుల ప్రగతి శకలమును

ఇది నా సంతత కర్మ

మరే హక్కులు లేవు నాకు

ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ

వెలుగుటయే నా తపస్సు.

వెలిగించుట నా ప్రతిజ్ఞ”.

ఇంతటి ప్రసంగం గతంలో ఎవరూ చేయలేదు! Creating is the act of turning new and imaginative idias into reality. ప్రపంచమే ఒక సృజన. పి.వి.గారి సృజన ఇది!

కొత్త ఆలోచనలను, ఊహలను ఆచరణలోకి అమలు చేయడం. ప్రధానంగా చెప్పాల్సిందేంటంటే ఒక రాజకీయ వేత్తగా ఇంత గొప్ప కవితను రాసారు పి.వి.గారు. అందుకే అంత గొప్ప ప్రతిజ్ఞను చేసినందుకే, ఆచరించినందుకే ముఖ్యమంత్రి పదవికి ఎంతటి నష్టం వాటిల్లిందో ప్రపంచానికి తెలుసు! అయినా చెదరలేదు, బెదరలేదు. దేశమే పి.వీగారిని ప్రధానిగా ఎంచుకున్నది. సాహిత్యకాశానికి ధృవతార! రాజకీయ జ్ఞానాకాశానికీ ధృవతార!

మా నాన్నగారు పెండ్యాల రాఘవరావు గారు ఆనాటి సాయుధ పోరాట వీరుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్ట్ నాయకునిగ రెండు MLA , ఒక MP మొత్తం మూడు స్థానాలలో అత్యధిక మెజారిటీ తో గెలిచిన వారు . MP గా ఢిల్లీ లో వరంగల్ ప్రాంతానికి చెందిన తెలంగాణ కేతనాన్ని ఎగురవేసి,ప్రజాసేవ చేసినవారు . పి వీ గారికి గురుతుల్యులు . ఇక మా మామగారు తెలంగాణ కు చెందిన సుప్రసిద్ధ చిత్రకారులు డా౹౹ కొండపల్లి శేషగిరి రావుగారికి కూడా పివి గారు అత్యంత సన్నిహితులు. పివి గారు ప్రత్యేక శ్రద్ధతో పాల్గొన్న పోతన పంచశతి ఉత్సవాలలో పోతన చిత్రాన్ని చిత్రించినందుకు గాను మరియు తెలంగాణ సారస్వత పరిషత్ స్వర్ణోత్సవాలో దేవులపల్లి రామానుజారారావు గారి పోట్రయిట్ చిత్రించినందుకు గానూ పివిగారు శేషగిరిరావు గారిని ఘనంగా సన్మానించారు. ఇవి మహనీయులు పివి గారికి సంబంధించిన మా జ్ఞాపకాల పూబుట్ట లోని కొన్ని పరిమళాలు .

సముద్రమంత గొప్ప వ్యక్తి పి.వి.గారు. అందులో నుండి దోసెడు నీళ్లను హత్తకున్నట్టు ఈ నాలుగు మాటలు. భావితరాలకు స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడించిన స్వచ్ఛమైన భారతీయుడైన పి.విగారు ప్రపంచానికే మార్గదర్శులు. మయూఖ పత్రిక వినమ్రంగా అక్షర నివాళులు అర్పిస్తున్నది.

— మయూఖ సంపాదకురాలు

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సినీ గేయాల సాహిత్య పరామర్శ — పాట విశ్లేషణ

by ఏలూరు అశోక్ కుమార్ రావు June 23, 2021
written by ఏలూరు అశోక్ కుమార్ రావు

‘వాగ్ధానం’ సినిమాలోని పాట

1961 సం||లో విడుదలైన వాగ్ధానం చిత్రాన్ని నిర్మించిన ఆచార్య ఆత్రేయ దర్శకత్వం కూడా వహించారు. దాశరథి కృష్ణమాచార్య గారు వ్రాసిన తొలి సినీ గీతం “నా కంటి పాపలో నిలిచిపోరా”. ఇందులోనిదే. ఈ పాట కొరకు ఆత్రేయగారు, దాశరథిని ప్రత్యేకంగా పిలిపించుకొని వ్రాయించుకున్నారు.

నా కంటి పాపలో నిలిచిపోరా

నీ వెంట లోకాల గెలువ నీరా

తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమికుడు ఎక్కడో దూరంగా వుండకుండా తన కంటి పాపలోని ఉంటేనే తనకు సంపూర్ణ రక్షణ. ఆత్మబంధాన్ని హృదయం కళ్ళలోకి తీసికుంటుంది. కనుపాపలలో పొదుగుకుంటుంది. కాని కంటి పాపలో ప్రేమికుడు ఉండడమేమిటని మనకు అనిపించవచ్చు. మనిషి (మనో లోకం) ఏమోమో కావాలనుకుంటుంది. దానికి హద్దులు అంటు ఏవీ వుండవు, ప్రేయసి తన కళ్ళలోని పాపలో తన రక్షణ కొరకు తన ఇష్టసఖుడిని నిలుపుకొని 14 లోకాలను గెలుచుకొని రావచ్చును. అందుకే తన ప్రియుడు ఎటూ పోకుండ తన కంటి పాపలోనే వుండి పొమ్మని ఇక్కడి  కథా నాయిక ఆకాంక్షిస్తున్నది.

ఈనాటి పున్నమి ఏ నాటి పున్నెమో

జాబిలి వెలిగేను మన కోసమే

నెయ్యాలలో తలుపుటుయ్యాలలో

అందుకుందాము అందని ఆకాశమే  || నా కంటి ||

ప్రేయసీ ప్రియులు భావోద్వేగానికి లోనై తమ భావనా లోకంలో సృష్టిలో వున్న, ప్రతి వస్తువు తమకు స్వంతం కావాలనుకుంటే, సమస్త మానవాళి కొరకు సృష్టించబడిన అపురూపమైన వస్తువులన్నీ తమ కొరకే వున్నాయని భావించుకుంటే, ఇతర మానవులకు కాని, ప్రాణికోటికి కాని నష్టం ఏమీ లేదు. అందుకే ఆకాశాన్ని తాము తమ చేతిలోనికి తీసుకొని, చందమామ కేవలం తమ ఇద్దరి కొరకే వెలిసింది అనుకుంటున్నారు. ఆ సమయంలో వారిద్దరి హృదయాలు పారవశ్యంలో తేలిపోతుంది.

ఆ చందమామతో ఆనందసీమలో

వెన్నెల స్నానాలు చేయుదమా

మేఘాలలో వలపు రాగాలలో

దూర దూరాల స్వర్గాలు చేరుదమా  || నా కంటి ||

ప్రేమికులు తమ ఆనంద సీమను చేరుకోవాలనుకుంటే

పున్నమి నాటి చందమామ వెలుగులో వెన్నెల స్నానాలు

చేయడానికి సిద్ధపడ్డారు. ఎవరైనా పన్నీటి స్నానాలు చేస్తారు.

కాని వీరి పరిస్థితి భిన్నం. ఆ భావనా లోకంలో వారిద్దరు

ఆకాశంలో విహరిస్తూ, తమ చుట్టూరా ఆవరించి వున్న

మేఘాలపైన నడుస్తూ, తాము బ్రతికి వుండగనే, ఎవరు కూడా చూడలేనటువంటి స్వర్గాన్ని చేరుకోవాలని కలలు కంటున్నారు.

ఈ పూలదారులూ, ఈ నీలి తారలూ

తీయని స్వప్నాల తేలించగా

అందాలను, తీపి బంధాలను

అల్లుకుందాము డెందాలు పాలించగా   || నా కంటి ||

తాము భావనా లోకంలో ఆకాశంలో పూలదారులను ఏర్పరచుకొని, ఇద్దరూ నక్షత్రాలలో చేరి తమ బంధాలను దృఢంగా చేసికొని, తమ హృదయాలు తమ భావనాలోకాలలో ఎవరి అధికారం లేకుండా పరిపాలించుకొనవచ్చని ప్రేమికులు కలలలో తేలియాడుతున్నారు.

తన తొలి పాటతో తెలుగు సినీ సాహిత్యంలో ప్రేక్షకులను, శ్రోతలను సుకురమైన మనఃప్రసన్నకరమైన రసోద్వేగానికి గురిచేసిన దాశరథిగారు చిరస్మరణీయులు. సాహిత్యం – సంగీతం పోటీపడి, ఘంటసాల, సుశీలగారల గాత్రాలు సంగీత ప్రియులతో రసఝరులు నింపిన ఈ గీతం 60 సంవత్సరాలైనప్పటికి, ఇప్పటికే కాదు, చిరస్థాయిగా అందరి హరృదయాలలో నిలిచిపోతుంది.

దాశరథిగారు వ్రాసిన ఈ గీతం గల చిత్రం ‘వాగ్ధానం’ తేది 05.10.1961న విడుదలైంది. అంటే ఇప్పుడీ పాటకు షష్టిపూర్తి సంవత్సరమన్న మాట


అమరశిల్పి జక్కన్న (1964) సినిమాలోని

 ఈ నల్లని రాళ్ళలో……… పాట గురించి

ఈ పాటను డా|| సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు తాను రచించిన “రామప్ప” సంగీత రూపకం కొరకు వ్రాసినారు. వారి అనుమతితో అమరశిల్పి జక్కన సినిమా కొరకు నిర్మాత, దర్శకులు బి.ఎసం.రంగా ఈ పాటను వాడుకున్నారు.

సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాలగారు ఈ పాటను అద్భుతంగా గానం చేశారు.

ఒక శిల్పి ఉలిని చేత పట్టుకొని, శిలవద్దకు చేరగనే, ఆ శిలల మాటున దాగిన శిల్పాలన్నీ మన కళ్ళకు గోచరమవుతాయి.

ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నుల దాగెనో

ఈ బఁడల మాటున ఏ గుండెలు మోగెనో

అంతకుముందు రాయి లాగ పడి వున్న వస్తువులో దాగిన కళ్ళ కాంతి పుంజాలు మనకు గోచరిస్తాయి. ఆ రాయి చాటున దాగిన గుండె చప్పుళ్ళు మన మనస్సును తాకి మనం పరవశమగునట్లు వినిపిస్తాయి.

పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి

మునులవోలె కారడవుల మూలలందు పడి ఉన్నవి ||ఈ నల్లని||

అడవులల్లో తపస్సు చేసికొనే ఋషులవలె పర్వతాలు కూడ (పర్వతాలలో వుండే శిలలు) మానవ జాతికి దూరంగా పాపాలకు, తాపాలకు దూరంగా కారడవులలో ఎక్కడో ఎవరికీ కనపడకుండ వుంటాయి.

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు

ఉలియలికిడి విన్ననంతనే జల జలమని పొంగి పొరలు   ||ఈ నల్లని||

శిలలు ప్రకృతి సహజంగా ఎక్కడ వున్నవి అక్కడే కదలకుండా వుంటాయి. కాని శిల్పి ఉలిని ఆడించగనే ఆ శబ్ధం వినబడగానే సెలయేర్లు ఉప్పొంగినట్లు సజీవ శిల్పాలు ఏర్పడతాయి.

పైన కటిన మనిపించును, లోన వెన్న కనిపించును

జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును ||ఈ నల్లని||

మనుషులుపైకి మంచివాళ్ళలాగా కనపడతారు. కాని లోపల క్రూరమైన తలంపులుంటాయి. శిలలు పైకి కఠినంగా కనపడతాయి. కాని శిల్పి ఉలితో వాటిని తాకితే ఒక ఆకారం వచ్చి, వాటిలో వెన్నలాగా మృదుత్వం మనకు సాక్షాత్కారమవుతుంది. అయినప్పటికీ అవి ప్రపంచంలోని ఏ వస్తువుకు కూడా హాని చేయవు. ప్రాణమున్న మనిషికంటే శిల్పాలైన శిలలే ఎన్నోరెట్లు బాగనిపిస్తాయి.

శిల్పకళ ప్రవీణుడు జక్కన పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు జీవించారు. ముఖ్యంగా “ఈ నల్లని రాళ్ళలో” గీతం సన్ని వేశంలో ANR నటన అద్భుతం.

ఇక సాహిత్యానికి వస్తే అలతి పొలతి పదాలలో, మనం మాట్లాడే భాషా పదాలను ఉపయోగించి, సినారెగారు సినిమాకు కాకుండ, తాను రచించిన “రామప్ప” రూపకానికి లిఖిస్తే, రాజేశ్వరరావుగారి మధుర బాణికి ఘంటసాలవారు తన గాన మాధుర్యంతో శ్లోతలను తన్మయంలో ముంచారు.

-ఏలూరు అశోక్ కుమార్ రావు

June 23, 2021 0 comment
3 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

‘ధన్య’కవీంద్రుడు దాశరథి—-‘మాన్య’ కవీంద్రుడు ‘సినారె’

by గురిజాల రామశేషయ్య June 23, 2021
written by గురిజాల రామశేషయ్య

‘ధన్య’కవీంద్రుడు దాశరథి

తెలంగాణ ప్రజావళికి ప్రాతఃస్మరణీయుడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. తక్కువ శీర్షికలతో తన కవిత్వంలో ఎంతటి కవిత్వ సాంద్రతను దట్టించినాడో కవితావిశారదులంతా గమనించినవారే ! “జయపత్రముల”వంటి ప్రశంసావాక్యములందించినవారే!!
సార్థకమైన బిరుదులను ప్రదానం చేసినవారే !!!


మహాకావ్య స్థాయి అభివ్యక్తీకరణ శిల్పరచనను ప్రకటించే కవులు ప్రపంచంలో అరుదుగా జన్మిస్తారు.ఎదుగుతారు.జాతికీర్తిని నిలబెడతారు.సమకాలీన దుష్టతనూ ౼ దౌర్జన్యాన్నీ చీల్చిచెండాడుతారు. తమ కనుల ముందే తమ ప్రధాన శుభసంకల్పం ఫలిస్తే ఆకాశమెత్తు తన జాతి ప్రగతి ఎదగాలని పొంగిపోతారు. *_మహాకవి దాశరథి ప్రధాన శుభసంకల్పం : నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణ విముక్తం కావటమే_* అన్న సత్యశివసుందర’సూక్తిని ఎవరూ ఏవిధంగానూ ఆక్షేపించలేరు. తదనంతర పరిణామాలు తనదృష్టి కోణంలోనికి అందనంత ప్రతారణనూ అప్పటి పరిస్థితుల దృష్ట్యా అందరిలాగే గమనించలేని సజ్జనకవి దాశరథి. *కాలం తనకు కావలసినంత’కాలం తన మనుషులను తానే ఎన్నుకుంటుంది( _రాశే_ )* అనే వాక్యం సమర్థనీయం అనుకుంటే కాలం తెలంగాణ విముక్తి కోసం కవి’దాశరథిని కూడా తానే ఎన్నుకుంది అంటాను నేను. సమకాలీన ప్రముఖులు దాశరథిని _యుగకవి_ అని కీర్తించటం ఇందువల్లనే ! ఆత్మవిశ్వాసం ఆత్మబలం లేకుండా ఆత్మగౌరవం అనే మాట వ్యర్థం. దాశరథి తెలంగాణ జాతి ఆత్మగౌరవ ప్రజారథి.సారథి.ప్రతినిధి. కవితావాక్య”శర”ధి.తన కనులముందే తన మనోరథం ఈడేరి ఆనందించిన కవిని తదనంతర కాలంలో పట్టించుకోవలసినంతగా పట్టించుకోకున్నా ఆత్మగౌరవంతో
*అరుగుచున్నాడు. దాశరథి అమరపురికి* … అన్నట్లు జీవితాన్ని తృప్తిగా _బాగానే బతికాను_ అన్నట్లుగా నిష్క్రమించిన *మహాపురుషుడు దాశరథి* . నిలువెల్లా స్పందించి
*నా తెలంగాణ కోటిరత్నాల వీణ* అనే నినాద’నిక్వాణస్వరాన్ని నిరంతర ప్రేరక విజయశంఖం గా విడిచి వెళ్లిన మహాదార్శనికుడు.
ఇటీవలి కాలఃలో సొంత’ఊపిరిని గెలుచుకొని మరింతగా పెంచుకుని సువర్ణప్రగతి(బంగారు తెలంగాణ) పథంలో పురోగమిస్తూన్న
ఆధునిక తెలంగాణకు *నా తెలంగాణ కోటి రత్నాలవీణ* నిజమైన జీవనోజ్జీవన శంఖధ్వానం.
మహాకవి దాశరథి జయంతి 22,జులై సందర్భంగా ఆ మహాకవికి ఇది నా అక్షరనీరాజనం.
Poets are the unacknowledged legislators of the world ౼ P.B.Shelly

౼ గురిజాల రామశేషయ్య


‘మాన్య’ కవీంద్రుడు ‘సినారె’

ఆధునిక తెలంగాణ సుస్పష్టమైన హద్దులతో ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటి. తెలుగు భాష ప్రాచీన హోదాను పొందిన భారతీయ భాషలలో ఒకటి. మాధుర్యమునకు పేరు పొందిన భాషలలో తెలుగు మొదటిది. సాహిత్యపరంగా తెలుగు పద్యం విశిష్టమైన భావ వాహిక. మందార మకరంద మాధుర్యమునకు పోతన భాగవత తెలుగు పద్యం దృష్టాంత సాక్ష్యం. అటువంటి పోతనను ఉద్దేశించి “ఎందుకాతడుగ పుట్టకైతిని హరీ!” అని తన “భూమిక’’ కావ్యంలో పలువరించి ‘కల’వరించి ఆ కల ‘వరించి’ తన కవన గళ సహపది కాగా మాన్యుడైన మహాకవి సింగిరెడ్డి నారాయణరెడ్డి. ‘సినారె’ సంక్షిప్త నామంతో సుప్రసిద్ధుడైనాడు.
‘సినారె’ అగణ్యమాన్యతామకుటాలు రెండు. ఒకటి, భారతీయ జ్ఞానపీఠ పురస్కార స్వీకృతి, రెండు, ‘రాజ్యసభ’ సభ్యత్వం.
పల్లె నుండి ఢిల్లీవరకు ఎదిగిన తెలంగాణ కవులలో ఒకరు ‘సినారె’. మూడుతరాల యువకవులను ప్రభావితం చేసిన మహాకవి తాతయ్య ‘సినారె’. ఎందరికో శబ్దభిక్ష పెట్టిన ధన్యుడు. ఎందరికో ‘లయ’ను పరిచయం చేసిన సం‘గీత’జ్ఞుడు. ఖండాంతరాలలోని తెలుగు డెందాలను తన పలుకుబడితో పులకరింపజేసిన సుమధుర కవి ‘సినారె’.
విశ్వవిద్యాలయ ఆచార్యునిగా, ఉపకులపతిగా రాణించిన ‘సినారె’ నిజంగా కవి కులపతి. కవి కవిత్వం వరకే పరిమితుడుకాడని నిరూపించిన అధికార భాషా సంఘాధ్యక్షుడు. నిత్య శోభిత సాహిత్య సభాధ్యక్షుడు, ముఖ్యాతిథి. తిథిరీత్యా నిత్యకవన రచనా పిపాసి. కవితాభ్యాసి. కవితా ‘కళాప్రపూర్ణుడు’. కవి పద్మ భూషణుడ. రణం మరణంపైనే అని సగర్వంగా ప్రకటన చేసిన కవి యశస్వి ‘సినారె’.
తన పేర తెలంగాణ రాజధానిలో సారస్వత నిలయం ఏర్పడే అంతగా ఘనత పొందిన మాన్య కవీంద్రుడు ‘సినారె’.
మధ్య తరగతి మందహాసాన్ని తన పరిధిలో వివేచించి ఉన్నతి గతి మీది చిరకాంక్షతో ‘విశ్వంభర’ మానవుని వరకు తరగెత్తిన కావ్య సమీక్షణం ‘సినారె’ స్వీయ నిర్ణయ కావ్యకళా పథం కావ్యకళా.
అందుకే ఒక సందర్భంలో : గర్జించే గళం నాది! నిర్జించే కలం నాది! స్వీయానుభవగర్వ దీప్తిని అక్షరీకరించినాడు.
ప్రతిష్ఠాత్మక కవితా పీఠాధిష్ఠుడైన తాను ‘పీఠిక’ రచనలతో యువ కవుల నుండి మహాకవుల వరకు అందరిలోని ప్రతిభా వ్యుత్పన్నతలను కల కలిచే తన పద సంపుటితో సప్రమానంగా అభినందించినాడు.
తెలుగు సాహిత్యంలో పద్యం గద్యం ద్విపద కీర్తన వచనం గేయం వచన కవిత మినీ కవిత ఇలా ఇలా అలల్లాంటి ఎన్నెన్నో ప్ర్రకియలు తలలెత్తి కవుల తలపైన కీర్తికిరీటాలను సుస్థిరం చేసినాయి. ఈ క్రమంలో 20వ శతాబ్ధం 30వ దశకంలో 29 జులై 1931 రోజున ఆషాఢ పూర్ణిమ (గురుపూర్ణిమ)నాడు జన్మించిన ‘సినారె’ మాత్రాచ్ఛందస్సుల్లో గేయ కావ్యాలను రచించి ఒడుపుగా పద్య గంధిలతను – సమాసకల్పనల పొందికతో అక్షర రమ్యంగా సముచిత రీతిలో ఔచిత్య భాసురంగా గంగాతరంగచారిమతో భారత స్వాతంత్ర్యానంతర కవిస్వాతంత్ర్యానుకూల గేయం దేశచ్ఛందస్సులలోనికి తెలుగు పలుకు ఒరవడికి మడులు తీర్చి కవిత్వపు పంటను పండించే చొరవను పాదు కొల్పినారు. ఇది ‘సినారె’ పైకి చెప్పకుండా అఖిలాంధ్ర సాహిత్య చరిత్రకు చేసిన మేలు. దీనివల్ల అంటే మాత్రాచ్ఛందో కావ్యాలవల్ల పద్య పఠన శక్తి ఒనగూడి ప్రాచీన కావ్యధోరణుల సమవగాహన శక్తిని పొందటానికి అప్పటి యువతరానికి సాధ్యమైంది. అంతేకాక గహనమైన కావ్యశిల్ప సంప్రదాయములను యథాశక్తి గ్రహించి తమ రచనలలో పాటించగలిగే నేర్పు ఇంతో అంతో ఒనగూడింది. ముఖ్యంగా భాషా పరంగా నిర్దుష్ట భాష పట్ల ఆసక్తి పెరిగింది. అంతేనా! ‘సినారె’ రుచి చూపించిన అంత్యప్రాస, అంతఃప్రాస (సినారె మాటే ఇది), అనుప్రాస, యమకాది అలంకారాలను గమనించి ఆనందించటంలోనూ; తమ రచనలలో ప్రయోగించి మెప్పుపొందటంలోనూ కవులను మార్గదర్శనం చేసినట్లయింది. జనరంజకమైన సినీ గీతాలలోనూ ఈ సాంప్రదాయిక సాహిత్యరీతి విధానాలను చవి చూపించినాడు. కలవరించి – కల- వరించి సభంగ శ్లేషాత్మక యమకం. “శివరంజని” సినిమాలోని పాటలో “నా దానివి – నా –దానివి” ఇలాంటిదే! పాలవెలుగై –మణదీ “పాల” వెలుగై ఇలాంటివెన్నెన్నో! తనకంటె ముందు తరంలోని పెద్దల సరసన ఇటు శిష్ట సాహిత్యంలోనూ అటు సినీ సాహిత్యంలోనూ నెగిలిన ప్రతిభాశాలి ‘సినారె’. ఇక తన తర్వాతి తరం చేత అభిమానింపబడిన, సన్మానింపబడిన పెద్ద “సినారె”. తరం మారుతున్నది….. స్వరం మారుతున్నదని గమనించిన దార్శనికుడు. “సరిలేరు. నీకెవ్వరు” అని జేజేలు పొందిన అదృష్టవంతుడు. ఇంతగా సినీ సాహిత్యపరంగా చెప్పటమెందుకంటే “సినారె” కీర్తి కిరీటంలో ఒకటి ఆచార్య పదవి – దాని ఉన్నత ఉప కులపతి పదవి ఒక తురాయి. శిష్ట సాహిత్యంలో భారతీయ జ్ఞానపీఠ పురస్కృతి మరో కలికితురాయి. సినీగీతావళి కీర్తి కలిమితురాయి. శ్రోతలకేమో సరళీ స్వరాల పంట. ఒక వ్యక్తి కవిగా ఇంత ఉన్నత స్థాయి కీర్తి స్థితులను అందుకోవటం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతటి సంయమన శీలంతో – మరెంతటి కళాసేవా “శ్రమ” కర్తృత్వంతో ఇంకెంతటి ఉల్లాస భరిత స్వరచాలన హృదయంతో ఉజ్జీవిస్తూ రోజు రోజూ కాలాన్ని కర్పూరంగా మండించుకోవాలో కదా! అప్పుడే కదా ఇంతటి మాన్యచరితకు దీప్తి!
ప్రభుత్వ కళాసాహిత్య సేవా సలహాదారుగా పనిచేసిన “సినారె” ఎన్నో ప్రసిద్ధ కళాసాహిత్య సేవా సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచినాడు. తెలంగాణ సారస్వత పరిషత్తును చెదరకుండా నిలిపిన వ్యవహారజ్ఞుడు.
సమష్టిపై ‘సినారె’ ఆధునికతలో అడుగులు వేసిన ధీశాలి. ప్రాచీన వైభవ సంస్కృతిని (Heritage) ఆధునిక స్పృహతో సమీక్షించిన సామాజిక కళామేధావి.
“సురభిళ శబ్దమ్మొక్కటి
తరగెత్తిన చాలు – నా
గుండె సందులందు కోట్లి
నందనాలు గుబాళించు”
అని తన శబ్ద ప్రీతిని అభివ్యక్తీకరించుకున్న ‘సినారె’ అస్మదాదులకు “శబ్ద గురువు”.
“అంత కడివెడు పాలపై – ఒ
క్కింత మీగడ పేరినట్లుగ మనకు
మిగులును గతము లోపలి మంచి
అదిమె సంప్రదాయము”
అని సంప్రదాయములోని మంచిని ఆధునికతలోని ప్రయోగ ప్రయోజన శీలతను మేళవించుకని ‘ఒళ్ళంతా లయ’గా అడుగులు వేసి – “చూపంతా ప్రగతిశీలత” నుడుగులు పలికి తెలుగుజాతికి మాన్యకవీంద్రునిగా ఆదర్శనీయుడై తరించిన స్వరధుని “సినారె”! మానవీయ విశ్వంభరుడు “సినారె”.
శ్రీ గురుభ్యోనమః

– గురజాల రామశేషయ్య

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పద్య సుగంధం

by డా|| మృదుల నందవరం June 23, 2021
written by డా|| మృదుల నందవరం

విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం,
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః,
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం
విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః.

మానవులకు విద్యయే సౌందర్యము; అదియే గుప్తధనము; చదువే కీర్తిని,
సుఖమును,భోగమును కలిగించును; విద్యయే గురువులకు గురువైనది;విదేశములకు పోయినపుడు విద్యయే బంధువు; అదియే మరొక కన్నువంటిది; రాజ్యసభలలో పూజార్హత విద్యకే గాని ధనమునకు గాదు.ఇంతటి శ్రేష్ఠమైన విద్య లేని నరుడు వింతపశువు మాత్రమే.

సూక్తి ముక్తావళి – సంకలన కర్త మహీధర జగన్మోహన రావు -ప్రాచీ పబ్లికేషన్స్-మొదటి ముద్రణ1963,ఏడవ ముద్రణ 2015 నవోదయ బుక్ హౌస్-హైదరాబాద్.

 

విద్య మాత్రమే మానవులకు అందాన్నిస్తుంది.అంతేకాదు గుప్తధనం వంటిది.ఈ విద్యే మానవులకుకీర్తిని,సుఖాన్ని, సౌఖ్యాలను అందిస్తుంది.విద్య-గురువులకు గురువు వంటిది;విదేశాలలో బంధువులా సహాయం చేస్తుంది;మరో నేత్రం వలె ప్రపంచపు లోగుట్టును తెలియ జేస్తుంది.అంతమాత్రమే కాదు,రాజ సభలలో విద్యావంతుడు మాత్రమే గౌరవాన్ని పొందుతాడు.విద్యా విహీనుడు చులకనగా చూడబడతాడు.అని భర్తృహరి నీతి శతకం లో చెబుతాడు.

విద్య ఒక్కటే, మానవునికి విలువను పెంచుతుంది,అన్న విషయాన్ని ఆధునిక కాలంలో నిరూపించిన వారిలో ప్రథమంగా చెప్పుకోదగిన వ్యక్తి-ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.కాస్మాలజి,జనరల్ రిలెటివిటి పై అతడు చేసిన పరిశోధనలు ప్రపంచానికి కొత్త చూపును ఇచ్చాయి.మోటార్ న్యూరాన్ వ్యాధి తో బాధపడుతూ, ప్రత్యేక మైన వీల్ చైర్ కి పరిమితమై ఆయన చేసిన కృషి సమస్త మానవాళికి స్ఫూర్తి దాయకం.జ్ఞానానికి దక్కిన గౌరవం అది.

విద్యను గూర్చి విశిష్టంగా తెలిపిన స్వామి వివేకానంద గారి బోధలను మనం పరిశీలిస్తే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.’విద్య’ ప్రతి మానవుని యందు ఉంటుందని,పాత్రకు మకిలి పట్టినట్లుగా,ఆ విద్య చుట్టూ అజ్ఞానం అలుముకొని ఉంటుందని,గురువు ఆ అజ్ఞానాన్ని తొలగించినపుడు అతడు విద్యావంతుడు కాగలడని అంటారు.మఱ్ఱి విత్తనంలో చెట్టుకు ఉండవలసిన సమస్త భాగాల కణాలు ఉంటాయి. భౌతిక పరిస్థితులు అనుకూలించి నప్పుడు ఆ విత్తనం చెట్టుగా ఎదిగినట్లే, వ్యక్తి కి సరైన సుఖం హితగురువు లభించినప్పుడే అతడు విద్యావంతుడు గా పరిఢవిల్లుతాడు అని వివేకానందుల వారు చెప్పిన వాక్యాలు సమస్త మానవాళికి హితవాక్యాలు.ఆ పాత్ర వంటకు యోగ్యమైనట్లుగా ,ఆ మఱ్ఱి చెట్టు పక్షులకు ఆశ్రయమిచ్చి నట్లుగా,బాటసారులకు నీడనిచ్చినట్లుగా విద్యావంతుడు సమాజాన్ని తన అక్కున చేర్చుకుని కావలసిన రక్షణనిస్తాడు.అతడు ఆ సమాజం చేత ప్రేమించబడతాడు-అని మనం గుర్తించాలి.

విద్య ఒక్కటే, మానవునికి విలువను పెంచుతుంది,అన్న విషయాన్ని ఆధునిక కాలంలో నిరూపించిన వారిలో ప్రథమంగా చెప్పుకోదగిన వ్యక్తి-ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.కాస్మాలజి,జనరల్ రిలెటివిటి పై అతడు చేసిన పరిశోధనలు ప్రపంచానికి కొత్త చూపును ఇచ్చాయి.మోటార్ న్యూరాన్ వ్యాధి తో బాధపడుతూ, ప్రత్యేక మైన వీల్ చైర్ కి పరిమితమై ఆయన చేసిన కృషి సమస్త మానవాళికి స్ఫూర్తి దాయకం.జ్ఞానానికి దక్కిన గౌరవం అది.

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us