మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

” కాల మహిమ ! ” కథ  

by గొర్రెపాటి శ్రీను June 23, 2021
written by గొర్రెపాటి శ్రీను

కొన్నిసార్లు అంతే..
కాలం మాత్రమే సమాధానాలు చెప్పగలిగే ప్రశ్నలకి మనం మౌనంగా తలొంచాలి తప్పితే ..

మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న ఫలితాలని పొందలేము !
మన మధ్య ఉత్పన్నమైన ప్రశ్నల తాలూకు సమాధానాలు ఎప్పుడో తెలుస్తుంటాయి !
అవి మదిని వెంటాడుతూ మనం కాలం మహిమ ని  తెలుసుకునేలా  చేస్తుంటాయి !
*                                  *                            *
నా స్నేహితుడు నాగేంద్ర ,నేను దాదాపుగా పద్నాలుగేళ్ల తరువాత కలిశాము.
మొదట వాడ్ని గుర్తించలేదు నేను.
తను నాగేంద్ర అని తనను తాను పరిచయం చేసుకుంటుంటే..
అప్పుడుగానీ గ్రహించలేదు నేను.
అంతగా మారిపోయాడు.!
ఇద్దరం కలిసి ఓ ఆఫీస్ లో ఐదేళ్ల పని చేశాము.
వాడ్ని అంత కాలం తరువాత చూడగానే  గతం లోని మా పరిచయం తాలూకు అనుభవాలు ఒక్కసారిగా నా కళ్ళ ముందు కదిలాయి.
వాడు కొత్త ఉద్యోగం లో చేరడానికి చెన్నై వెళ్ళడంతో మా మధ్య  దూరం ఏర్పడింది.
ఎప్పుడో ఒకసారి కాల్ చేసి మాట్లాడేవాడు.
*                           *                            *
నాగేంద్ర నాకు పరిచయమయ్యే నాటికే మా ఆఫీస్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు.
నేను వాడు ‘రేయ్ ‘ అని పిలుచుకునేంత చనువు ఉంది మా ఇద్దరి మధ్య.నాగేంద్ర ఓ రోజు నాతో..
“రెండు రోజులు నేను ఊరు వెళ్ళి వస్తాను రా.. ” అన్నాడు.
నేను పనేంటి అని అడిగే లోపుగా..”ఓ రెండెకరాల పొలం ఊరి దగ్గర కొంటున్నానురా!” అన్నాడు .”మొన్నెప్పుడో అన్నావు కదా .మీ నాన్న గారికి ఒంట్లో బాగోలేదని !

ఇప్పుడెలా వుందిరా..వూరు వెళిన్నప్పుడు మీ నాన్న గారిని,అమ్మగారిని అడిగానని చెప్పరా” అన్నాను.
“సరే ! చెప్తాను లే .కాని ఆయన ఆరోగ్యం ఇప్పుడు కూడా బాగాలేదు, మా నాన్న ఆరోగ్యం గా వుండగానే పొలం కొనాలని నా కోరిక రా.. “అన్నాడు వాడు.

ఆ సమయంలో వాడి మాటలను బట్టి ఒక సంగతి అర్థమయింది.
‘తన తండ్రి వుండ గానే తమ వూళ్ళో పొలం కొనాలని  వాడి ఆశ.
కాని తన తండ్రి కి ఆరోగ్యం బాగాలేదు..సిటీ కి తీసుకువచ్చి వైద్యం చేయించాలని వాడికి ఎంత మాత్రం ఆలోచన లేదని ‘ ఎందుకో నా మనసుకు అనిపించింది.అదే మాట అంటే వాడు బాధ పడతాడని తెలుసు.

అయినా మిత్రుడిగా వాడికి మంచి సలహా ఇవ్వాలని నా అభిలాష.!

స్నేహమంటే అదే కదా !

మాట మాత్రం గా నైనా వాడికి మంచి చెప్పాలని ప్రయత్నించాను.

“ప్రతాప్ !
ఊరుకోరా..నువ్వూ నీ చాదస్తం !
మా నాన్న ఎప్పుడైనా నా మాట విన్నాడని.చిన్నప్పుడు అంతా ఆయనకి భయపడుతూనే పెరిగాం. ఇప్పటికి ఆయనంటే మాకు భయం.ఆయన మాటే నెగ్గాలని ఎప్పుడూ తాపత్రయ పడుతుంటాడు.మన మాట విన్నట్లుగానే వుంటాడు కానీ ఆయన ధోరణి ఆయనదే.
నేను ఆ ఊరు వదిలి హైదరాబాద్ వచ్చేయమని ఎన్నోసార్లు చెప్పాను,ఉన్న ఊరిని వదిలి రావడం కష్టం అంటాడు.

నీకీ విషయం తెలుసా..నా పెళ్ళైన ఈ పదేళ్ల కాలంలో ఆయన ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాడో తెలుసా..కేవలం నాలుగు సార్లే ! అదీ మనవడు అడిగాడని.”

“అదంతా ఓ.కే నాగేంద్ర ! ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు కదా కనీసం వైద్యం చేపించుకోడానికైనా వస్తాడు .నువ్వు అడిగి చూడు .ఎలాగు నీ శ్రీమతి ఇ.ఎస్.ఐ లో సూపరెండెంట్ గా పని చేస్తుంది కదా .అలాగైతే తనకి మంచి వైద్యం సకాలంలో అందుతుంది. ” అన్నాను.

నవ్వాడు..”సర్లే రా చూద్దాం !” అన్నాడు.

రెండు రోజుల కోసం లీవ్ అప్లై చేసుకుని ఊరు వెళ్ళాడు.

పొలం బేరం కుదిరిందని సంబరంగా చెప్పాడు.

నా మనసులో  వాళ్ళ నాన్న గారికి ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆత్రుత.

నేను అడగకుండానే చెప్పాడు .

“నాన్న కి సీరియస్ గా వుంది రా.మరో రెండు రోజులు ఆగి వస్తాను. ” అంటూ చెబుతూ నేనింకేదో అడగబోతుంటే కాల్ కట్ చేశాడు.

వాడేమైనా ఫోన్ చేస్తాడేమో నని ఎదురు చూశాను.

రెండు రోజుల తరువాత వాడి నుండి మెసేజ్ వచ్చింది “నాన్నిక లేరు” అని.

ఆ మెసేజ్ చూడగానే చాలా బాధగా అనిపించింది.

వీడు కాస్త శ్రద్ధ తీసుకుని తండ్రి కి వైద్యం చేపించినట్లయితే ఆయన తప్పకుండా కోలుకునే వాడు.

ఆ పెద్దాయన రెండు మూడు సార్లు తాను హైదరాబాద్ వస్తానని వైద్యం చేయించుకుంటానని వీడితో అనడం విన్నాను నేను,కానీ వీడు ఆ అవకాశం వాళ్ళకి ఇస్తే కదా !?
పైగా తన తండ్రి ఊరు వదిలి రాడని ప్రచారం !ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకం లో అనుకున్నాను ఇంత కాలం.

కాని నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాను.

మా పరిచయం అయి నాలుగైదేళ్లు అవుతుంది.

మొదట్లో ఎంతో అభిమానంగా మాట్లాడాడు.
క్రమక్రమంగా వీడి మనస్తత్వం బోధ పడసాగింది.
కాని నేనెప్పుడు వాడికి మంచి సలహాలే ఇచ్చేవాడిని..
వాడు స్వార్థాన్ని వీడి మంచిగా మారాలని ,ఆ దిశగా వాడిని మరల్చాలని ప్రయత్నించే వాడిని !
*                                           *                                          *

పిడుగురాళ్ళ బస్టాండ్ లో బస్ కోసం ఎదురు చూస్తున్న నాకు వాడు హఠాత్తుగా ఎదురయ్యాడు.

కుశల ప్రశ్నలు వేశాను.

అన్యమనస్సుతో సమాధానాలు చెప్పాడు.

“ఏమయిందిరా!?” నా మనసేదో కీడు శంకిస్తుంటే సంశయంగానే అడిగాను.

“అది.అదీ..”

“చెప్పరా.మరేం పర్లేదు ” అన్నాను.

“నీకు తెలుసు కదా ఎంతో కష్టపడి ,రాత్రనక పగలనక శ్రమించి..

ఊళ్ళ వెంట తిరుగుతూ ఉద్యోగాలు చేసి ఆస్తులు కూడ బెట్టాను.
 ప్రతి రూపాయి పట్ల అప్రమత్తత తో వుంటూ చివరికి సరియిన బట్టలు కూడా కొనుక్కోకుండా వున్న వాటితోనే సర్దుకుంటూ బ్రతికాను.
నాతో పాటు నా భార్య కి  కూడా అలాగే అలవాటు చేశాను.
కాదు అలా ఒప్పించాను అనే చెప్పవచ్చు.
ఎదైనా.. ఎన్నో ఆస్తులు కూడ బెట్టాను.
కాని పిల్లలకి ఆస్తులు పంచడం కంటే..
ప్రేమ ఆప్యాయత ను పంచాలని,

వాళ్ళకి స్వతహాగా ధైర్యంగా బ్రతికే ఆత్మస్తైర్యాన్ని అందిచాలని గ్రహించలేక పోయాను.

మావాడు ..నా ఒక్కగానొక్క కొడుకు ని ఎంతో గారాబంగా పెంచాను.

వాడేం చేశాడో తెలుసా పెళ్లవగానే నా ఆస్తులన్ని కావాలని అడిగాడు.

ఇవ్వడం కుదరదని నేను నా భార్య తెగేసి చెప్పేశాము.

వాడి కి ..మా దగ్గర వున్న ఆస్తులన్ని ఊడ్చేసి ఇస్తే మేమెలా బ్రతకాలి.!?

అంతగా కావాలంటే బ్యాంకులో వున్న డబ్బులు ఇస్తామన్నాము.

వాడు,వాడి భార్య అందుకు ఒప్పుకోలేదు.

ఎప్పటి కైనా ఈ ఆస్తులన్ని తనవే అన్నాడు.

ఇవన్నీ అమ్మేసి వాడు సిటీ లో బిల్డింగ్ కట్టుకుంటాడట,

ఆ అమ్మాయి కూడా భర్త నే సమర్థిస్తూ మాట్లాడింది.

మాకు ఉండటానికి వాడే ఏదో ఒక ఇల్లు చూస్తాడట ..అదీ తాత్కాలికంగా !

తరువాత తన దగ్గర కే వచ్చేయాలంటూ ఒకటే గొడవ !

ప్రేమతో పిలిస్తే వెళతాం కాని ..

ఇలా ఆస్తులు అమ్ముకుని పూర్తిగా వాళ్ళ పైనే  ఆధారపడాలని ఎలా వెళతాం !? ”

అన్నాడు వస్తున్న కన్నీళ్ళని దిగమింగుకుంటూ !

“తప్పంతా నాదే ! చేసుకున్నవాళ్ళ కి చేసుకున్నాంత .
నేను నా తల్లిదండ్రుల విషయంలో ఇలాగే ప్రవర్తించాను.
నా పాపం ఊరికే పోతుందా?
ఇప్పుడు ఏమయ్యిందో తెలుసా..
మా రాకేష్ మమ్మల్ని అసలు పలకరించడం లేదు.
ఇంటికి వచ్చి ఎంతో కాలం అయ్యింది.
మేమిద్దరం కొడుకు ఉండి కూడా అనాధ ల్లా బ్రతుకుతున్నాం.
కనీసం మా చివరి చూపు కైనా వస్తాడో లేదో తెలీదు. “
కన్నీళ్ళ పర్యంతం అవుతూ అంటున్న నాగేంద్ర ని ఓదార్చడం నా వల్లకాలేదు.
                                                    – గొర్రెపాటి శ్రీను  
June 23, 2021 0 comment
11 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

రుద్రమదేవి – 2 & 3 ప్రకరణలు

by రంగరాజు పద్మజ June 23, 2021
written by రంగరాజు పద్మజ

గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్ర రాయశర్మ
సరళీకృతం :-రంగరాజు పద్మజ

1వ ప్రకరణ ( click this)

ఒద్దిరాజు సీతారామ చంద్ర రావు గారు

2వ ప్రకరణ

చర్చ
(ప్రకరణ శీర్షిక )

” గుణవదగుణవద్వా
కుర్వతాకార్య మాదౌ
పరిణతి రవధార్యా
యత్నతః పండితేన

అతిరభస కృతానాం
కర్మణా మావిపత్తే
ర్భవతి హృదయ దాహీ
శల్య తుల్య విపాకః ॥
(హితోపదేశం)

భావం:–  మంచిది కానీ చెడ్డది కానీ ఒక పని ప్రారంభించేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అని బుద్ధిమంతుడు ముందే ఆలోచించుకోవాలి. అలా ఆలోచన లేకుండా తొందరపడి చేసిన పనులకు బ్రతికినంత కాలం శల్యం లాగా హృదయాన్ని పీడించే దుష్పరిణామాలు కలుగుతాయని అర్థం.

కథాభాగం:–
దేవగిరి రాజ్యం చాలా పురాతనమైనది. దానిని దౌలతాబాద్ అని అంటారు. అది ఇప్పుడు నైజాం రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నది. ఢిల్లీ పట్టణానికి దాదాపు ఏడువందల మైళ్ళ దూరంలో ఉన్నది.
ఈ దేవగిరి పట్టణంలో చాలా అందమైన భవనాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుర్గం ఉన్నది. ఈ దుర్గం గురించి ప్రతి భారతీయుడికి తెలుసు.
దేవగిరి ప్రభువులు యాదవులు. వీరు శ్రీకృష్ణుని సంతతికి చెందినవారు. వీరి వంశంలో రెండు తెగలు ఉన్నాయి. ఒక తెగ వారికి ద్వారక సముద్రం రాజధాని. రెండో తెగవారికి దేవగిరి రాజధాని. ద్వారక సముద్రం రాజధానిగా ఉన్న యాదవకులాన్ని విడిచి, మన కథకు సంబంధించిన దేవగిరి ప్రభుత్వం వారి గురించి కొంచెం తెలుసుకోవడం అప్రస్తుతం ఏమీ కాదు.
మధురానగర నివాసి, యాదవుడైన సుబాహుడు, అతని సంతతివారు ధృఢప్రహారుడు, శౌణచంద్రుడు, ధాడియప్ప, భిల్లముడు, శ్రీరాజావడ్డిగ,ధాడియ నవవల్లభుడు, నేణచంద్రుడు, ఇలా వంశ పారంపర్యంగా రాజ్యాన్ని పాలిస్తూ వచ్చారు. వీరిలో కొంతమంది కొంతకాలం చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. కానీ ఐదవ భిల్లముడు చాళుక్యులను ఓడించి,  చాళుక్య సామంతులనే తమ పేరును తుడిచి వేసుకున్నారు.
ఇంతకుముందు పైన చెప్పిన రాజులు ధైర్య సాహసాల యందు అంతులేని శక్తివంతులు అనడానికి ఉదాహరణగా చాళుక్య వంశీయుడు జయసింహుని  కూతురును వివాహం చేసుకోవడం,చాళుక్య విక్రమాదిత్యుడికి  యుద్ధంలో సహాయం చేయడం, చాళుక్యులను గెలిచి సామంతులనే తమ పేరును తొలగించు కోవడం కీ.శ.1182 వ  సంవత్సరంలో ద్వార సముద్రంలో యాదవులను చాణుక్య క్షమావల్లభులను  గెలిచి, కళ్యాణపట్టణాన్ని, కృష్ణానదికి ఉత్తరాన ఉన్న రాజ్యాన్ని స్వాధీన పరచుకొనడమే ఇందుకు తార్కాణం.
భిల్లముడు  ఒక్కడు మాత్రం కృష్ణానదికి దక్షిణాన ఉన్న కుంతల దేశాధినేత వీరభల్లాణుని పైకి  క్రీస్తుశకం1182  సంవత్సరంలో పోయి, ధార్వాడ జిల్లాలో “నిలక్కుండి”   అనే స్థలంలో యుద్ధంచేసి, వీరమరణం పొందాడు. ఆ సమయంలో పృథ్వీరాజ్ కు మహమ్మద్ ఘోరికి యుద్ధం జరుగుతున్నది. మొత్తం మీద యాదవ వంశంలో ఒక చివరి భిల్లముడు తప్ప ఎవరూ ఓడిపోలేదు.

భిల్లముడి కుమారుడు జైత్రపాలుడు, అఖండమైన వైభవంతో వెలిగిపోతూ, శత్రువులను ఎదిరించి, రాజ్యసుఖాన్ని పొంది, కాకతీయ గణపతి రాజుతో యుద్ధం చేస్తూ కీ.శ.1247లో మరణించాడు.
జైత్ర పాలుని పెద్దకొడుకు శింగణమాధవుడు తండ్రి కన్నా ముందే మరణించాడు.రెండవ కుమారుడు కృష్ణ భూపుడు అతనికి తండ్రి పదవి ఇవ్వవద్దని  సోమ పాలుడు మరణించిన నాడే ఈ కృష్ణ భూపాలుని, ఇతని అక్క అయిన పద్మావతిని, దేశపు ఖజానాను దేవగిరి నుండి తరలించి, ఆ డబ్బుతో పాతాళ మందిరంలో జోడు లేని సుఖాల తేలియాడుతూ, రాజు సంతానాన్ని చెరపట్టినారు. కృష్ణ భూపాలుని తమ్ముడైన మహాదేవరాజును శంకర మంత్రి శత్రువుల నుండి రక్షించారు. స్వామి భక్తి పరాయణుడైన శంకర మంత్రి గణపతి దేవరాజు సహాయంతో శత్రువులను చంపి వేసి, కృష్ణ భూపాలునికి రాజ్యాభిషేకం చేశాడు.

కృష్ణ భూపాలుడు గణపతిరాజుకు అంకితుడై, స్నేహితుడై, దక్షతతో రాజ్యాన్ని పాలించి,కీ.శ. 1260లో కన్నుమూశాడు.

కృష్ణ భూపుని తమ్ముడు మహాదేవరాజు. ఈ మహాదేవరాజే ప్రస్తుతం దేవగిరి రాజు. మహాదేవరాజు విద్యావంతుడు. అంతేకాదు పరిపాలన న్యాయ మార్గంలో చేసేవాడు. అంతేకాదు గొప్ప దానగుణం కలవాడు. చాలా ధర్మకార్యాలు చేశాడు. విద్వాంసులను పోషించాడు.  ఇతనికి సంగీతంలోనూ  ప్రావీణ్యత ఉన్నది. పెదన్న అయిన సింగణ యాదవుడి కాలం నాటి మంత్రి అయిన సాధులుని కొడుకు శారంఙ్గధరుడు రచించిన సంగీతరత్నాకరం అనే గ్రంథాన్ని శారంఙ్గధరుని దగ్గర నేర్చుకున్నాడు. జ్యోతిష్యంలోనూ మంచి పాండిత్యం ఉన్నది. అన్నతో స్థాపించబడిన జ్యోతిష్య కళాశాలను ఇతడి ఇంకా నడుపుతూనే ఉన్నాడు. చాలామంది జ్యోతిష్యులు ఇతని కొలువులో పండితులుగా ఉన్నారు. వారంతా సింగణ యాదవుని  కాలంలో ఆస్థాన పండితులుగా ఉన్నవారే.
ఈ మహాదేవరాజు కొంకణాంధ్ర, ఘూర్జర  దేశాల రాజులను ఓడించి, నయానా భయానా చాలామంది రాజులను తన సామంతరాజులుగా చేసుకొని, చక్రవర్తి బిరుదు పొందాడు  కాశ్యపస గోత్రీకుడైన కేశవుని ఋత్విక్కుగా చేసుకుని,”  యాస్త్యా రామ” అనే యజ్ఞాన్ని చేశాడు.

ఒక్క కాకతీయులు మాత్రం సామంతులు కాలేదనే కొరత తప్ప,  మహాదేవరాజుకు ఎందులోనూ లోపం లేదు. కానీ అతనికి కాకతీయులను తన సామంత రాజులుగా చేసుకోవాలనే కోరిక ఉంది. మధ్యమధ్య సభలు ఏర్పాటు చేసి, రాజ్యాంగాన్ని విమర్శించేవాడు. ఆనాటి సభకు చాలా మంది ప్రజలు వచ్చి  సభాస్థలంలో వేసిన ఆసనాలపై కూర్చునేవారు.

మహాదేవరాజు సింహాసనం మాత్రం అతడింకా రాకపోవడంతో ఖాళీగా మిగిలి ఉంది ఆ రోజు. ఆ పీఠానికి దక్షిణంలో”  శ్రీ కరుణాధిప”  అనే బిరుదు పొందిన పోథలా మాత్యుడు, ఇతనికి అవతల ఇతని కుమారుడైన సంగీత విద్వాంసుడైన శారంఙ్గధరుడు, అతనికి అవతల భాస్కరాచార్యుని మనవడు ఛాంగదేవుడు , భాస్కరాచార్యుని  తమ్ముని మనుమడైన అనంత దేవుడు కూర్చుని ఉన్నారు. సింహాసనానికి ఉత్తరంలో గుజరాతి దేశ పాలకుడైన లవణ ప్రసాదుడు, అతని కుమారుడు వీరధవనుడు, వారికి అవతల కొంకణ దేశాధినేత మొదలైన సామంతరాజులు, వారికి అవతల ముద్గల  గోత్రీకుడు, భోళేశ్వరశర్మ, అతని కుమారులు రామశర్మ,బిచ్ఛణశర్మ, మొదలైన సేనా నాయకులు కూర్చుని ఉన్నారు. రాయబారులు తమ తమ గోడులను వినిపించేందుకు వచ్చిన వారు, వారి వారికి తగిన స్థానాలలో కూర్చున్నారు.

రాజు ఇంకా రాలేదు. సభ్యులు అందరూ ఎదురుచూస్తున్నారు.  సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో”  పృద్వీ వల్లభా!  శ్రీ విష్ణు వంశోద్భవా”  అనే చారుణుల స్తోత్రగానాలు వినపడ్డాయి. కొన్ని నిమిషాలలో కొద్దిమంది వెంటరాగా ఒక పురుషుడు ఆ సభలోనికి వచ్చినాడు.

అతడి శరీరం చాలా అందంగా ఉండి, తుమ్మెద రెక్కలకు సరిసమానమైన పట్టుకుచ్చులను ఎగతాళి చేసేట్టున్న తలవెంట్రుకలు, గడ్డం, మీసం, ఎర్రని సన్నని చారికలతో ఉన్న  తామర పూల రేకుల వంటి కండ్లు, మోకాలును తాకేంత  పొడవైన చేతులు, సౌందర్యానికి మారురూపా అన్నట్టున్న అతను  జలతారు తలపాగా చుట్టుకొని, మోకాళ్ళ వరకు ఉన్న పట్టు అంగి తొడుక్కుని, అదొక రకమైన చెప్పులను కాళ్లకు తొడుక్కుని ఉన్నాడు . అతనే శౌణదేశపు  చక్రవర్తి మహాదేవ రాజు.

మహాదేవ రాజును చూడగానే సభలోని సభ్యులందరూ లేచి, తమకున్న రాజు మీద భక్తిని చాటుకున్నారు. వారుమొక్కుతున్న వారి మొక్కలను అందుకుంటూ, తాను మొక్కగల  పెద్ద వారికి తాను మొక్కుతూ పోయి, మహాదేవరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత సభలో ఉన్న వారంతా కూర్చున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత మహాదేవరాజు తన కుడి వైపున పీఠం మీద కూర్చున్న మంత్రి సాధులుని చూశాడు.ఎదుటివారి భావాలను గ్రహించగలిగిన నేర్పున్న ఆ మంత్రి వెంటనే తను కూర్చున్న ఆసనం నుండి లేచి, సభలోని వారితో ఇలా చెప్పసాగాడు.

”  సభ్యులారా!  భారతీయ మహాజనులారా!  నేడు శ్రీ పృథ్వి వల్లభులును, శ్రీవిష్ణువంశోద్భవులు అయిన మహాదేవరాజు గారు మిమ్మల్ని ఇలా సమావేశపరచడానికి కారణం ఏమీ లేదని మీరు అనుకోరు. అయినా ఎందుకు పిలిచారో? ఆ కారణం మీకు తెలిసి ఉన్నదో, లేదో ? గట్టిగా చెప్పలేను!  కొందరికి తెలిస్తే తెలిసి ఉండవచ్చు! తెలియనివారికి తెలుపడం ముఖ్యం. రాజుగారి ఉప్పు పులుసు తినే సేవకులు, సామంతులు తమతమ ఉదార పరాక్రమాలు తెలపడం వల్లనే సామంతులు ఎక్కువయ్యారు; అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. చక్రవర్తి బిరుదు లభించినందుకు ఆ దేవదేవుడిని ఎప్పుడూ వారి హృదయంలో తలుచుకుంటూనే ఉంటారు.ఇంక ఒకటే కొరత ఉంది వారికిఅది ఏమిటంటే గుజరాతి, కొంకణ దేశాల వలె పూర్తి ఆంధ్రరాష్ట్రం తమ స్వంతం కాలేదనీ, కాకతీయులు పాలించు భాగం ఇంకా మిగిలే ఉన్నదని, దాన్ని జయిస్తే ఇక వారికి కొదవేలేదు అందు కోసమే ఈ సమావేశం ఇక్కడ జరిగింది. మంచిచెడ్డలు బాగా ఆలోచించుకుంటే తప్ప చేయవలసిన పని తేలదు. గౌరవ సభ్యులు అందరూ మీ మీ అభిప్రాయాలను తెలుపగలరు. ఎవరూ అనుమానించ అక్కరలేదు.

ఇలా చెప్పి మంత్రి తన పీఠం మీద కూర్చున్నాడు. ధర్మవర్తనుడు, హరిహర దేవుడు, మురారి దేవుడు వచ్చి ఆ సభలో కూర్చొని ఉన్నారు. మంత్రి చెప్పిన మాటలు మురారి, హరిహర దేవులకు ఎలా అనిపించాయో? తెలియదు కానీ, ధర్మవర్ధనునకు మాత్రం సంతోషంగా ఉన్నాయి. ఎలా అయినా మహాదేవరాజను ప్రార్ధించి, తన యొక్క  కుల స్థితిగతులను చెప్పుకొని, ఓరుగల్లు పై దండును తీసుకొని పోవడానికి  వచ్చాడు. అందుకే మంత్రి గారు సభలోని వారికి చెప్పిన మాటలు అతనికి ఆనందం కలిగించాయి. అనుకున్న పని ప్రయత్నం లేకుండానే కాబోవడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉండదు?

మంత్రి మాటలకు సమాధానం ఏమని చెప్పాలా? అని  సభ్యులు ఆలోచిస్తున్నారు.

ఇంతలో ఒకడు దిగ్గున లేచి శౌణదేశాధినేతకు ఎదురుగా నిలబడి,  రాజు తలచుకుంటే దెబ్బలకు తక్కువేమి ఉండదు. అందరు రాజుల వలే కాక శ్రీ ఏలినవారు అనుకున్నదే తడవు కార్యం చక్కగా నెరవేరుస్తారు మీరు జయించాలనుకున్నారు. జయించారు. అదే దానికి ఋజువు. తప్పనిసరిగా కాకతీయుల పాలనలో ఉన్న ఆంధ్రదేశం శ్రీవారి వశమయితే ఇక లోపం ఏమీ ఉండదు. ఇది  ఇదివరకెప్పుడో  కావలసిఉండే! కానీ కాలేదు. అయినా ఇప్పుడు మాత్రం ఏమిటి? సైన్యం సిద్ధ పరుచుకొని యుద్ధానికి మేము, సైన్యాధ్యక్షులు  అందరూ సిద్ధంగా ఉన్నాం. తమరి ఆజ్ఞ అనే పూమాలను మా తలదాల్చి రాజ్యభారం తీరుస్తున్న సామంతరాజులందరూ సిద్ధంగా ఉన్నారు.

సేనాధిపతి మాట నిజం!!  ఈ పని ఇంతకు ముందే జరగవలసి ఉండే!  అది అలా జరిగిపోయేది! ఒక్క కారణం వల్ల అది ఆగిపోయింది. బలవంతుడైన గణపతి రాజును జయించాలంటే కొంకణ, ఘూర్జర దేశాలలో యుద్ధం చేసిన శ్రీ వారి సైనిక శక్తులనుకున్నారు. ఇంతలో గణపతిరాజు అనారోగ్యం పాలవడం తెలిసినందు వల్ల  కొందరిని వారికి కాపలా ఉంచి, అతనిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని చెప్పినారు. ఏ కారణం వల్లనో ఏమో? తమకు అప్పజెప్పిన పని ఎంతో శ్రద్ధ చూపలేదు. గణపతిరాజు మరణించిన ఆదను తెలుసుకొని , రాజ్యాన్ని ఇతరులకు పట్టం కట్టకుండా అడ్డుకొని ఉంటే శ్రమ లేకుండా రాజ్యం చేతికి చిక్కి ఉండేది. గణపతిరాయ మంత్రి అయిన శివదేవయ్య చాలా తెలివికలవాడు. అతడికి ఈ సంగతి ఇలా జరుగుతుందని ముందే గ్రహించి, గణపతిరాజు మరణించిన సమాచారం బయట పడనీయకుండా అతని కూతురు అయిన రుద్రమదేవిని పీఠంపై కూర్చుండబెట్టి నాడు. శ్రీవారి వల్ల పంపబడిన వారు బహు జాగ్రత్తగా ప్రవర్తించినా ఇంతపని జరగక పోయేది. సూది కొరకు దూలం మోసినట్లయింది. ఎలా అయినా ఆ రాజ్యం స్వాధీనానికి తెచ్చుకోకుండా విడిచిపెట్టరని మంత్రి తన పీఠం నుండి లేచి చెప్పి మరలా కూర్చున్నాడు.

”  రాజుగారి కార్యం కోసం మా ప్రాణాలను వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆజ్ఞ ఇవ్వడమే ఆలస్యం…  సైన్యంతో సహా సిద్ధంగా ఉన్నామని గుజరాతి దేశపు రాజయిన లవణ ప్రసాదుడు చెప్పాడు.

సామంతులు అందరూ ఒప్పుకున్నారు. సభ్యులందరూ అంగీకారం తెలిపారు. ఒక గడియ సేపటివరకు  సభ సద్దుమణిగింది. తర్వాత మహాదేవరాజు సభ్యులతో ఇలా అన్నాడు.

”  మంత్రి మాటలను విన్న మీ మనుసులకు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే సంగతి తెలియదు. అది మీరు తప్పక నెరవేర్చాల్సిన పని. అది ఏమిటో చెబుతాను. మనం  ఇప్పుడే ప్రయాణించి ఓరుగల్లును ముట్టడించాల్సిన పనిలేదు. మనకు కాకతీయులు అంకితమవ్వాల్సి ఉన్నది. రాజ్యం మనవశం కావాల్సి ఉన్నది. కావలసిన పనులు అయినవి. యుద్ధం చేయకుండా చేతికి అందదని అనుకోవడం మూర్ఖుల పని. సామ, దాన, భేద దండోపాయాలు అని పూర్వం నాలుగు మాత్రమే చెప్పారు .బాగా ఆలోచిస్తే ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సహాయ శక్తుల మొదట ప్రయోగిస్తాను. దాంతో పని జరగకుంటే  తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి. కాబట్టి ప్రస్తుతం యుద్ధం మాట లేదనడం నిజం. కానీ యుద్ధం లేదనుకొని దానికోసం చేయాల్సిన ప్రయత్నం విరమించుకోవడం మంచిది కాదు. ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఉపాయం వల్ల కార్యం అవుతుందన్నదీ తెలియదు. సాధ్యమైన యుద్ధ ఏర్పాట్లు చేయనందుకు… మనకు అవసరం లేకపోవడం వల్ల అక్కడితో అది సరిపోతుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే యుద్ధమే కావాల్సి వస్తే దానికి సంబంధించిన ప్రయత్న విరమణ ఎలా విషమిస్తుందో  నేను మీకు చెప్పకపోయినా… అది మీకే తెలుస్తుంది!  అప్పుడు ప్రయత్నించడం ఎలా ఉంటుందంటే… ఇల్లు కాలుతున్నప్పుడు మంటలు చల్లార్చేందుకు నీటి కోసం బావి తవ్వినట్లుగా ఉంటుంది. మీరు ఇప్పటి నుండే యుద్ధ  ప్రయత్నాలు మొదలు పెట్టాలి !  మన సైన్యం మొత్తం రెండు మూడు లక్షలు ఉంటేనే కానీ కాకతీయులను ఎదుర్కొని పోరాడ లేము. కాకతీయ సైనికులు, సైన్యాధిపతులు యుద్ధం చేయడంలో ఎంతో అనుభవం ఉన్న వారు.గణపతి రాజు చేతి కింద పనిచేసిన ప్రతి ఒక్కడికీ
బుద్ధికుశలత కలగడం వింతేమీ కాదు. మా అన్నగారు బందీ అయినప్పుడు తన పేరు’ భద్రుడు’ అనీ, ప్రసాదాదిత్యుని  పేరు ‘పేరడు’ అని, తిరుమల దేవ నాయకుని పేరు’  తిమ్మడు’  అని పెట్టుకొని ముగ్గురు మాత్రమే వచ్చి ఎంత పని చేశారో ? అది కూడా అతని మంత్రి శివదేవయ్య మన కన్నుగప్పి రుద్రమదేవిని
”  మహారాణిగా” చేయడమే వారి యొక్క బుద్ధికుశలతకు తార్కాణం. కాబట్టి మీరందరు జాగ్రత్తగా ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధమై రావడానికి తగ్గినట్లు ఉండాలి”.

రాజు మాటలను కొందరు ఒప్పుకొని సరేనని అన్నారు. అంతటితో సభ ముగిసింది.

                   (సశేషం)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

మూడవ ప్రకరణ

(  మదన మంజరి)

…”  స్వశాభృశ మా దృతకజ్ఞత మతి రసోత్పాదనచణ

మధికశోభాటన పాటన మాశ్రిత గన్ధర్వకుల

మాకలిత గోత్రాన్తరం, వఞ్చాధారూపముదఞ్చయన్తి

………అనుయాతవతి.

— భారత చంపు.

 

శ్రీ మజ్జినేంద్ర పద పద్మ మశేష భవ్యమ్

నవ్యత్రిలోక నృపతీంద్ర మనీంన్ద్ర వన్ద్యమ్

నిశ్శేష దోష పరిఖండన చణ్డ కాణ్డమ్

రత్న త్రయ ప్రభన మద్యగుణైకతానమ్.

 

 

అను స్తోత్ర శ్లోకం అనుమకొండ పద్మాక్షి దేవాలయంలో ఉన్న శ్రీ కాకతి ప్రోలరాజు శాసనాలలో ఉండడం వల్ల కాకతి ప్రోలరాజు జిన మతస్థుడు అని,

 

” అన్యాచ్చానమకొండ నామ నగర్చీ సంవేష్ట్యయోయం

స్థితో నామమణ్డలి కాన్వితో భువిగద్దేవస్య ప్రభుస్తమ్భిత ఏవకార్యణీ రక్తాకషణానిర్గతః

శ్రీ మత్ప్రోల నృపస్య థస్య జయినః

కిం బ్రూమహే గౌరవమ్ ॥ ”

 

అని అనుమకొండ శాసనము వలన కాకతి ప్రోలరాజు బలవంతుడనీ,

 

”  శివ పాదపద్మ యుగళ  ధ్యానామృతా వన్దభూ

రుణ్ఠాకోరిపు సున్దరీ జప మహాసౌభాగ్య సమచ్ఛియ

ప్రోలరాజ ఇతి ప్రసిద్ధ మగమద్వైరీంద్ర దర్పహా

నిశ్శంజ్క ప్రథన ప్రనన మహాహజ్ఞ్కర లజ్ఞేశ్వరః

 

అనే  అనుమకొండ  శాసనంలోని శ్లోకం వల్ల జినమతంలో చేరిన కాకతి ప్రోలరాజు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత శైవ మతాన్ని అనుసరించాడు అని తెలుస్తున్నది.

 

”  దేవి ముప్పమనామ ధేయ సహితా యస్యా గుణ స్తారకాః

కీర్తి శ్శారద చంద్రికేవ విలసత్ కౌంతేనేస్తు నైవోపమా

కౌసల్యేవచ, జానకి వచ సతీ కుంతీచ పద్మా చ,సా

పౌలోమి,చణ్డీ కేవచ తథా తస్య భవద్భామినీ ॥

 

భావం :–  కౌసల్య, సీత, సతి, కుంతి, పద్మ, పౌలోమి, చండి మొదలగు త్రిమూర్తులు చంద్రుని కాంతి వంటి కీర్తి గలవారు. వారి వలనే ముప్పమ్మ కూడా గుణాలలో అంతటి కీర్తి కలది. ఆమె ప్రోలరాజు భార్యని ఈ అనుమకొండ శాసనం వల్ల కాకతి ప్రోలరాజు భార్య ముప్పమ్మ అని తెలుస్తున్నది.

 

”  తతో ముప్ప మామ్బాయా అధిగతజనూ రుద్రనృపతి

ర్జయత్యేక స్థానస్థిత ఇవ నృపాణాం గుణగణః

ధనీధీరోవీరశ్శుచి రుచిత కర్మానసుభగః

క్షమీదక్ష్య స్త్యాగీ మిత మధుర వాగార్ధ హృదయః ”

 

మానుకోట తాలూకా లోని ఇనుగుర్తి గ్రామ శాసనం మీద లిఖించబడిన ఈ శిలా శాసనం మీద ఉన్న ఈ శ్లోకం వల్ల ప్రోలరాజు కు ముప్పాంబికకు శ్రీమత్

ప్రతాపరుద్ర మహారాజు జన్మించినట్లు తెలుస్తున్నది.

 

”  నానావనీ నాధ కిరీట కోటి,  తాంశుభిశ్చుమ్బిత పాదపీఠే

నిర్దుష్టమమ్బోనిధి వేష్ఠితాం ,విశ్వమ్బరాంశానతి రుద్రదేవే ॥”

 

అనే  ఈ శాసనం సూర్యాపేట తాలూకా లోని పిల్లలమర్రి గ్రామం శాసన మీద ఉన్న ఈ శ్లోకం అరుద్ర మహాదేవ మహాదేవ రాజు సముద్రంతో చుట్టి ఉన్న భూభాగాన్ని పరిపాలించాడని తెలుస్తున్నది. అంతేకాదు

 

పరువడి నాటధ్రభాష గల బద్దైన నీతియు సంస్కృతం బుతో

బఱగ ప్రతాపరుద్రవర పాలునిచే రచియింపబడ్డ యా

నరవరు నీతిసారము వినం జదువం గడు మంచిదంచు జె

చ్చెర గలనీతి పద్ధతులు జేసె వినోదము బాల బోధకున్ ॥”

 

అనే పద్యంలో ప్రతాపరుద్ర మహారాజు సంస్కృత భాషలో గ్రంథం రాసినట్టు తెలుస్తున్నది.

 

యస్యాః కాకతి రాజవంశ తిలకం ప్రోల ప్రజేశాత్మజః

శ్రీ మద్ద్రుద్ర నృపానుజస్సహి మహాదేవోనృపాలః పితా

మాతా బయ్యమ నామధేయవనితా దేవీ భువో భూషణం

భ్రాతైకోదర సమద్భవో గణపతిర్భూపాల చూడామణిః

 

అనే ఇనుగుర్తిలోని శాసనంపైన ఉన్న శ్లోకం వల్ల  రుద్రమహారాజుకు  తమ్ముడైన మహాదేవరాజుకు బయ్యమాంబకు  గణపతి రాజు జన్మించినట్లు తెలుస్తున్నది . ఈ గణపతి రాజు శత్రువులకు గుండెలో గాలమై, ఆశ్రయించుకుని ఉన్నవాళ్లకు కల్పవృక్షం వలే ఉన్నాడు.

 

” కతికత వసంతి భూపాః కతికతి వాగుణ గుణా భరణాః

గణపతి నృపతి స్యైకో, నరపతి శతపోషకః క్షోణ్యాం”

 

అనే మంగళగిరి తాలూకాలోని మల్కాపురం అగ్రహారంలోని శాసన శ్లోకం గణపతి రాజు నరపతి శత పోషకుడు అని తెలుపుతున్నది. ఈ గణపతి రాజకుమార్తె రుద్రమదేవి. ఈ రుద్రమదేవిని గణపతి రాజు భార్య అని కొందరు అనుకున్నారు కానీ,

 

”  సర్వోర్వీశ కిరీటకుట్టిమ తటీవిన్యస్తపాదామ్భుజా

శాస్త్యేశా చతురమ్బురాశిరసానాం శ్రీ రుద్రదేవ భువమ్

యస్యా జన్మమహోత్సవో గణపతిక్ష్మాపాల చూడామణీః

విస్పూర్జిత్కలికాల కల్మషకథాధ్యాన్తేషు తేజోనిధిః ”

 

అనే మల్కాపురంలోని శిలాశాసనం వలన రుద్రమదేవి గణపతి రాజు కూతురు అయినట్టు తేటతెల్లమైంది.

 

(సీతారామ చంద్రరాయ):–  పాఠక మహాశయుల రా! కాకతీయుల వంశ పరంపర గురించి ఋజువులతో సహా తెలిపినాను. మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసి,  శ్లోకాలను చదువుటకు ఇష్టం లేకపోతే

(  చదవక పోయినా పర్వాలేదు) చదవకండి!

 

కాకతీయులు రెడ్డి వారు.”  కాకతి”  అనే శక్తిని పూజించడం చేత” కాకతీయుల”ని  వీరికి పేరు వచ్చింది. ఈ వంశంలో పుట్టిన  రుద్రమదేవి తండ్రి అయిన గణపతిరాజు మరణించిన తర్వాత శివదేవయ్య అనే మంత్రి సహాయంతో తండ్రి  సింహాసనమెక్కింది.

రుద్రమదేవి తండ్రికి ఏ మాత్రం తీసిపోనిది. రాజ్యాంగ తంత్రాలు చక్కగా తెలుసు. ఆలోచన చేయడంలో ఆమెకు ఆమే సాటి!  న్యాయ గుణం కలిగినది. దుఃఖితుల మీద ఆదరం, ప్రేమ కలిగి ఉంటుంది. శత్రువుల మీద క్రూర భావంతో ఉండడం ఆమెకు సహజగుణాలు.

రుద్రమకు మగసంతానం లేదు. ముమ్మడమ్మ, రుయ్యమ్మ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ముమ్మడమ్మ ను చాళుక్య వంశానికి చెందిన వీరభద్ర రాజుకు, రుయ్యమ్మను మైలారు భీమన ( మైళముభీమన)వంశీకుడైన ఇందులూరి అన్నమ్మ దేవరాజు కు ఇచ్చి వివాహము చేసి, అల్లుళ్లను ఇద్దరినీ తన రాజ్యంలోనే అట్టే పెట్టుకున్నది. ఇద్దరూ అల్లుళ్లు రుద్రమదేవి కుడిభుజం వంటివారు.

కూతుళ్లకు సంతానం లేదనే విచారము రుద్రమదేవికి ఎక్కువగా ఉండేది. బిడ్డల చేత చాలా వ్రతాలు, దానధర్మాలు చేయిస్తూ ఉండేది.

ఒకరోజు రుద్రమదేవి ఇద్దరు కూతుళ్లతో కూడి అనంతపురంలోని ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నది. వాళ్ళు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒక స్త్రీ మెట్లు ఎక్కుతూ వచ్చి, రుద్రమదేవిని చూసి, తలవంచి, నమస్కరించింది.

ఆ వచ్చిన స్త్రీ కూడా దాదాపు రుద్రమదేవి వయసంత  వయసే ఉన్నది. ఆమెను చూస్తే మంచి దానివల్ల కనపడుతున్నది.రాగానే నమస్కరించి చేతులు జోడించి తల వంచుకొని నిలబడింది.

ఆమె ఎందుకు వచ్చిందో? ఆమె ఎవరో? కూడా రుద్రమదేవికి తెలియదు. రుద్రమదేవి ఆమెను కూర్చోమని చెప్పింది. ఆమె కూర్చున్నది. తరువాత ఆమె, రుద్రమదేవి ఇలా మాట్లాడుతున్నారు.

”  నువ్వు ఎవరు?” ఎక్కడినుండి వస్తున్నావు?

”  తల్లీ! ఈ  సేవకురాలు మీకు తెలియదు. నేను నా దొరసానిని గుర్తుపట్టలేను. అయినా నా తల్లి  మీకుసేవ చేసే భాగ్యం కల్పించింది.

అలా అయితే నీ చరిత్ర వినాల్సిందే!  నీ తల్లి ఎవరు? నీ చరిత్ర ఏమిటి?

తల్లీ!  నాది రాచ వారికి సేవ చేసే సేవ కులం.

మా అమ్మ మీ అమ్మగారి దగ్గర చాలా కాలము సేవ చేసిందట శ్రీ గణపతి చక్రవర్తి గారు అద్దంకి సీమకు రాజైన శాలంకాయన గోత్రికుడైన మాధవ నాయకునిపైకి దండెత్తి వెళ్లారట. అప్పుడు శ్రీ రాజు గారు రాణిగారితో కలిసే వచ్చారట. నాకు అప్పుడు రెండు సంవత్సరాల వయసు అట. మీకు కూడా రెండు సంవత్సరాల వయసే ఉందని మా అమ్మ చెప్తూ ఉండేది. రాణి గారి వెంట మా అమ్మ, నేను వెళ్ళామట . శ్రీ గణపతి చక్రవర్తి గారు ఆ దాడిలో గెలిచారట.

ఇంతలో ఒక చిత్రమైన కథ జరిగిందట. ఒకతను నన్ను మా అమ్మ నుండి వేరు చేసి, ఆమెను ఎత్తుకొని పోయాడట. మా అమ్మ ఏదో విధంగా అతని నుండి తప్పించుకొని, ఒక్కొక్క ఊరిలో మారువేషంలో బిక్షం ఎత్తుకొని ఎలాగో జీవిస్తూ…  నన్ను వెతుకుతూ ఉండేదట !  రాజుగారు గెలిచి ప్రయాణమై పోవడానికి నిశ్చయించుకొని మా అమ్మ కోసం చాలా వెతికారట .

కానీ ఎక్కడో పోయిన అమ్మ వారికి దొరకలేదట. అందుకోసం ఆమెను వెతకటానికి తగిన ఏర్పాటు చేసి వెళ్లిపోయారట.

నన్ను ఒక కాపు అతను పోషించాడు. నాకు వివాహ వయసు వచ్చింది. నన్ను పోషిస్తున్న కాపు ఒక గృహస్థు కొడుకుకు  నన్ను ఇచ్చి వివాహం చేశాడు. నా దురదృష్టం కొద్దీ వివాహమైన 15 సంవత్సరాలలోనే అతను మరణించాడు. నా చరిత్రే నాకు తెలియదు. ఇలా ఉండగా కొంత కాలానికి నేను ఉన్న చోటునకు ఒక ముసలమ్మ వచ్చి, నన్ను చూసి చాలా ఏడ్చింది. ఆమె ఎందుకు నన్ను చూసి ఏడుస్తున్నదో నాకు అర్థం కాలేదు. ఆమెను చూస్తున్న కొద్దీ నాకు ఆమె మీద జాలి కలిగింది . చివరకు ఆమెను ఓదార్చి, అసలు సంగతి ఏమిటని? ఏమి జరిగిందని అడిగాను. ఆమె జరిగినదంతా చెప్పింది. అప్పుడు నేను ఆమె కూతురునని తెలుసుకున్నాను. ఆమె మా అమ్మ ని తెలియగానే చాలా సంతోషం అయింది. కానీ ఆమె అప్పటికే పూర్తిగా అనారోగ్యం పాలయింది. వైద్యుడిని పిలిపించుకొని వచ్చి ఆమెకు చికిత్స చేయించాను. ముసలిదవ్వడం వలన ఏ మందు ఆమెకు పని చెయ్యలేదు. వైద్యులు వైద్యం ఆపివేసినారు.రోజురోజుకు ఆమె వ్యాధి ముదిరిపోయి ప్రాణం పోయే స్థితికి వచ్చింది. చివరి సమయంలో మా అమ్మ నాతో “బిడ్డా !  మన వారంతా శ్రీ కాకతీయ వంశాన్ని కొలిచారు!  మనకు అదే జీవనోపాధి! నేను బ్రతికి ఉన్నంతకాలం దేవిని కొలువలేక పోయాను. నా ప్రాణాలు రుద్రమదేవి వద్ద విడువ లేకపోయాను. నా తలరాత ఇలా నన్ను విదేశాలకు వెళ్ళే చెట్టు చేసింది. నాకే కొరతా లేదు!  నువ్వు మళ్ళీ పోయి మన రాజవంశానికి సేవ చేస్తానని నాకు మాట ఇస్తూ ప్రమాణం చేస్తే… నా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఆశ్రితులను కాపాడడంలో మన ప్రభువులకు నా ప్రేమ లోకంలో ఏ వంశం లోనూ లేదు. నా దొరసానికి నీ వయసంత వయసే కలిగిన కూతురు ఉండేది. ఆమె పేరు రుద్రమదేవి.”  ఇంతలో ఆమె కంఠం ఒక్కసారిగా మూగ పోయింది.

”  తల్లీ!  ఏమని చెప్పను?  రాజుల సేవయే పరమ ధర్మంగా  తలచిన నా తల్లి ..మ..ర…ణిం..చిం..ది !!

ఆ దాసి కన్నులు కన్నీటితో నిండాయి. రుద్రమదేవికి జాలి కలిగింది. ముమ్మడమ్మ, రుయ్యమ్మలు కూడా కంటతడి పెట్టారు.

అంతలో రుద్రమదేవి” బాధపడకు!  విధిరాతను ఎవరు తప్పించగలరు? మీ అమ్మ గొప్ప హృదయం ఉన్న దయామయురాలు.  శరీరాలు ఎప్పుడైనా పడిపోయేవే… అయినా  మా అమ్మ కొద్ది రోజులైనా తమ రాజు లకు సేవచేసి జన్మ ఎత్తినందుకు సార్ధకత పొంది, మరణించింది. మా అమ్మ నన్ను విడిచి వెళ్ళినప్పుడు నేను రెండేళ్ళ వయస్సు ఉన్న దాన్ని. నేనెవరో నాకే తెలియదు. ఇక రాజ కుటుంబం ఎలా తెలుస్తుంది? నేను ఉన్నది విదేశంలో… నేను తెలియని వారికి నా రాజవంశం గురించి కూడా వారికి తెలియదు. నా అదృష్టవశాత్తు నా తల్లి మళ్లీ రావడం, నా రాజులను కొలవమని నాకు హితవు చెప్పడం, జరిగింది అలా కాకుంటే నేను ప్రభువుల సేవా చేయకపోయే దాన్ని కదా! అని విచారించే దాన్ని!

”  అది కూడా దైవాధీనమే!”

” నా భాగ్యం”

”  నీ పేరు ఏమిటి?”

”  దాసు రాలి పేరు మదన మంజరి”

మామ అప్పుడప్పుడు ఈ విషయాలన్నీ చెప్తూ ఎంతో విశ్వాసం ఉన్న ఆ దాసి ఏమైందో? అని అనుకొనేది.

నీ తల్లి పేరు ఏమిటి?శ్యా…మ…ల..కదా!  నాకు అలానే గుర్తున్నది.

”  అయ్యో! దొరసానీ !  దాసదాసీల పైన నీకు ఎంత ప్రేమ ఉన్నదో? లేకపోతే దాసి దాని గురించి అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నావా? తల్లీ!  ఎంత గొప్ప దొరసానివి? అని కన్నీళ్లు కార్చింది.

తల్లీ!  మీకు సరిగా జ్ఞాపకం లేనట్టు ఉన్నది. నా తల్లి పేరు శ్యామల కాదు.” లలిత”  అని చెప్పింది.

”  ఔనౌను!  శ్యామల కాదు! లలిత అని  ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని రుద్రమదేవి అన్నది.

రుద్రమదేవికి దాసీ దాని పేరు లలిత అని తెలుసు. అయినా మదనమంజరి ఏమని చెబుతుందో చూద్దామని నటించింది. తల్లి చెప్పిన సమాచారాన్ని తల్లి చెప్పిన పేరునే మదనమంజరి చెప్పడంతో రుద్రమదేవికి నమ్మకం కలిగింది.

”  మదన మంజరీ!  నీకు సంతానం లేదా?”

”  లేదు తల్లీ లేదు!”

”  సరే  ఇప్పుడు నీ ఉద్దేశ్యం ఏమిటి?”

“మా పూర్వీకులు , నా తల్లి  ఎలా జీవించారో.. నేను అలానే జీవించాలని కోరిక!”

“ఏమని?  నా దగ్గర ఉండాలను కుంటున్నావా?”

”  ఉండడమంటే.. “తిండికి తిమ్మరాజు- పనికి పోతరాజు”  అని జనాలు అన్నట్టుగా  కాదమ్మా! మీ సేవ చేస్తూ ఉంటాను.”

” సరే నీ ఇష్టం వచ్చినట్లు నా దగ్గర ఉండవచ్చు, పని చేయాలనే బాధలేదు.” ఒకవేళ నువ్వుపని చేయాలనుకుంటే చిన్న చిన్న పనులు చేయవచ్చు.!

నీవే మీ వయసులో ఉన్న దానివి కాదు! పెద్ద పెద్ద పనులు చేయడానికి.. ముసలితనం వచ్చేసింది “కొమ్ములు కోసినంత మాత్రాన కోడె కాజాలదు! నీకు పనిచేయాలని ఎంత ఆసక్తి ఉన్నా వయసు మీద పడిన దానివి కదా!

తల్లీ!  కొత్తగా వచ్చిన దాని మీద మీకు ఇంత ప్రేమ ఉంచినందుకు  నీకు సేవకుల పట్ల ఎంత దయ ఉన్నదో! అని నిన్ను మెచ్చుకోవచ్చు ను. నాకు అభయమిచ్చినావు! కాబట్టి నిర్భయంగా చెప్తున్నాను. మామ నన్ను మీ దగ్గరికి సేవ చేయడానికి వెళ్లమన్న అప్పటినుండి మీ దగ్గరికి ఎలా చేరుతానో? చేరినా నన్ను మీరు నమ్ముతారో? లేదో?   అనుకున్నాను. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి రాణీవాసపు స్త్రీలను చూడలేదు. చక్రవర్తినిలైన మిమ్మల్ని ఎలా సేవించు కుంటానో? అని భయం వేసింది. నన్ను చూసి మా అమ్మ రాణివాస స్త్రీలకు చేసే సేవ చేసింది కాబట్టి వారితో ఎలా మెలగాలో మొదలైన అన్ని విషయాలు చెప్పింది.

” మదన మంజరీ! నీ తల్లి చనిపోయి ఎన్ని రోజులైంది?”

”  ఒక సంవత్సరం మీద రెండు నెలలు.”

అంతకు ముందు నువ్వు నీ తల్లి తో కలిసి ఇక్కడికి ఎందుకు రాలేదు? నీ తల్లికి రాజ వైద్యులు, రాజ వైద్యం, సేవలు, ఔషధాలు ఇచ్చేవారు కదా!

అలా జరగలేదు. పాడు క్షయ వ్యాధి  దినదినగండంగా గడిచింది. చాతకాని ఆమెను తీసుకొని రావడం మంచిది కాదని అనుకున్నాను. మాకు తెలిసిన వారు కూడా అలానే ఉన్నారు మూర్ఖంగా ప్రవర్తించ వద్దని అనుకున్నాను. అంతే కాదు మా అమ్మ నడవలేకపోతున్నది. మాకు బండి ఇచ్చే వారు కూడా లేరు

”  నిన్ను పోషించిన వారు కానీ, నీ  అత్త వారింటి బంధువులు కానీ అంతమాత్రం సహాయం చేయలేక పోయారా?

”  అయ్యో !తల్లీ!  పోయినంత దూరం పొరక దండు”అన్నట్టు అంతా బాగానే ఉన్నది. నన్ను పెళ్లి చేసుకున్న వాడు తప్ప వారి కుటుంబ సభ్యులు ఎవరో నాకు తెలియదు. ఇంకా నన్ను సాదిన వాళ్ళు మా ఊరు విడిచిపెట్టి మరో ఊరికి వలసగా వెళ్లారు. కొంతకాలం నా భర్త సంపాదనతో ఇల్లు గడిపాను. మా అమ్మ వచ్చేందుకు ముందు రెండు సంవత్సరాల ముందే ఆ డబ్బు అయిపోవడం చేత బిక్షం ఎత్తుకొని జీవించాను.

”   నీ తల్లి చచ్చిపోయి పద్నాలుగు నెలలు అయింది కదా!  ఇంత కాలం ఒక్కదానివే కష్టపడుతూ ఎందుకున్నావు? ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే నేను ఆదరించినను కున్నావా? ఎంతో కాలం నుండి ఉన్న ఊరు వదిలి పెట్టడం ఇష్టం లేదా? నువ్వు మరొక విధంగా అనుకోకు నీ కష్టాలు విని జాలి కలిగింది నీ మీద.

”  అడిగితే తప్పేముంది తల్లీ! ?  ధర్మ స్వరూపిణులు కనుక జాలిపడి అడిగారు. నా తల్లి చనిపోయి 14 నెలలు అయినా వచ్చేందుకు వీలు కాలేదు. మీరు నన్ను మన్నిస్తారో?లేదో?అని  అనుకుంటే ఇప్పుడు ఎలా మీ దగ్గరకు వస్తాను? బిక్షం ఎత్తుకొని జీవించే దానికి పట్టణం వదిలి పెట్ట బుద్ధి కాదా?

”  అవును మొదట అనుకోవచ్చు  తరువాత ఎవరైనా చెబితే ఆశ్రయం ఇస్తారని రావచ్చు! లేదనకుండా బిచ్చం పెట్టిన ఊరును మాత్రం విడువవచ్చునా?

”  ప్రేమతో పెంచే వారు ఉన్నారని తెలిసి, బిచ్చమెత్తాలని అనుకుంటానా?  మీరు ఏది చెప్పినా అదే కదా! నా తల్లికి పితృకార్యం చేయాలంటే నేనొక్కదాన్నే కర్తను. కాబట్టి సంవత్సర శ్రాద్ధం అక్కడే పెట్టాలని అందరూ చెప్పటం వలన ఏదో ముళ్ల మీద ఉన్నట్టు ఉన్నాను. సంవత్సరం పూర్తి కాగానే నడుస్తూ వచ్చాను. నాకు ఈ పట్టడానికి తోవ తెలియదు. ఎక్కువ మంది ఏ ఊరికి వెళుతుంటే వారి వెంట ఆ ఊరికి వెళ్లి ఏ దయామయులో అన్నం పెట్టిన నాడు తింటూ… లేనినాడు ఉపవాసం ఉంటూ… చివరికి ఎలాగో మీ పాదాల దగ్గర చేరాను నా కష్టాలన్నీ గట్టెక్కినవని అనుకుంటున్నాను. ఇక మీ చిత్తం నా భాగ్యం !

దాసి చివరి మాటలను బొంగురుపోయిన గొంతుతో అంటూ రుద్రమదేవి పాదాల మీద పడింది.

రుద్రమదేవి ఆదరంగా మదనమంజరిని లేపి,  నీవు ఇక దిగులు చెందకు ! నా ఇంట్లో సుఖంగా కాలం గడుపుకొమ్మని ఇదివరకే చెప్పాను. కాకతీయ వంశంలో ఎవరు అబద్ధం ఆడారని గట్టిగా నమ్ము !. అని అన్నది.

 

( ఒక సేవిక రుద్రమదేవిని నమ్మించి కోటలో పాగా వేయుట… ఈ ప్రకరణంలోని కథ!  దేవగిరి కుట్ర మొదలవుతుంది.)

 

 (సశేషం)

●●●●●●●●●●●●●●●●●●

June 23, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

బహుస్ఫూర్తిదాయకం ఈ లేఖావలోకనం.!

by నాంపల్లి సుజాత June 23, 2021
written by నాంపల్లి సుజాత

లేఖలు అంటుంటేనే..
మనసు గతంలోని జ్ఞాపకాల్లోకి పరుగులు పెడుతుంది. ఇవి సమాచార మాధ్యమాలే కాదు, ఇరు మనసుల భావోద్వేగాలను మోసుకుపోయే పావురాలు కూడా! ఇతర ప్రక్రియల్లాగే సాహిత్యంలో లేఖారచనా ప్రాశస్త్యం కూడా అనన్య మైందే.! కమ్యూనికేషన్లు పెద్దగా విస్తరించని కాలంలో లేఖలే మనుషుల మధ్య వారధులు.
ఇవి మనసులను కలిపే రహదారులు.
ఒక మనిషి అంతరంగాన్ని లోలోపలి ఉద్వేగాల్ని మరో మనిషికిఅందజేసే వాహికలు.
ఉత్తరం రాయటం ప్రత్యుత్తరం కోసం ఎదురుచూడటం అదీ ఓ త్రిల్లింగ్..! ఉభయకుశలోపరి అంటూ మా నాన్న రాసిన ఉత్తరం నా కళ్ళముందిప్పుడు రెపరెపలాడుతోంది నాన్న దూరమైనా ఆ ఉత్తరాలు మాట్లాడుతూ భరోసానిస్తూనే ఉంటాయి. మాటలు గాలిలో కలిసి పోతాయి గానీ, రాతలు మిగిలిపోతాయి. కాలం గడుస్తున్న కొద్దీ మధురానుభూతులను పెంపొందిస్తాయి. ఆర్కైవ్ లోంచి పాత ఉత్తరాలను చదువుతుంటే.. ఓహో! అప్పటి పరిస్థితులు ఇవ్వా.! అప్పటి ఆలోచనలు ఇట్లా ఉండేవా అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా… అనిపిస్తుంది కదా..!
ఇంతటి ప్రాధాన్యత గల లేఖలు కాలక్రమంలో అంతరిస్తున్నాయంటేనే అదో రకమైన వేదన. నేడు లేఖల స్థానంలో సోషల్ మీడియా వచ్చి చేరడంతో లేఖలు రాసుకునే మంచి అలవాటు తగ్గిపోయిందనే చెప్పవచ్చు. అలాంటి ఈ సమయంలో వెలువడిన ‘లేఖావలోకనం’ డెబ్భై లేఖలతో కూడిన ఉత్తరాల పొత్తం తెలుగులో మొదటిది. ఈ గ్రంధానికి సంపాదకత్వం వహించిన
సాహితీవేత్త ప్రముఖ కవియిత్రి, కథయిత్రి నిత్యమూ అక్షరాలతో జ్వలించే జ్వలిత అభినందనీయులు..!
దీంట్లోని ఒక్కొక్క లేఖా గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చిన కన్నీటి చుక్క..! ఇవి మనసు విప్పి మాట్లాడుతాయి భావోద్వేగాలను కురిపిస్తాయి. దీంట్లొని కొన్ని లేఖలు ఆవేశంతో రగిలిపోతే మరికొన్ని ఒళ్ళు జలదరింప చేస్తాయి.
అనిశెట్టి రజితగారి లేఖ “స్త్రీ బలిపశువూ, భోగవస్తువూ ఏకకాలంలో అయిపోయింది.. కావున స్త్రీలకు వేరే ఆకాశం వేరే నేలా కావాలంటే దాంట్లో తప్పేముంది!? స్త్రీల రక్షణకు ప్రత్యేక సామాజిక సూత్రాలేమైనా రూపొందించారా, తుప్పు పట్టిన చట్టాలతో ఆడపిల్లలను ఎలా రక్షితంగా చూడగలం..!?” అంటూ వారి ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. నిజమే ఆకాశంలో సగం ఉన్న స్త్రీలకు చట్టాల్లో, చట్టసభల్లో ప్రాధాన్యత కరువైపోయింది నేటికీ..
ఆచార్య సూర్యాధనంజయగారి లేఖలో స్త్రీల వెనకబాటు తనం పోవాలంటే..”ప్రతీ మహిళ ఒక రాణి రుద్రమ, సమ్మక్క సారక్క, ఇందిరాగాంధీ, సరోజినీనాయుడు, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, కిరణ్బేడీలా తమను తాము మార్చుకోవాలి అంటారు.” అందుకుగాను మరేం చేయాలి వారు!? ఏముందీ ముందుగా విద్యనభ్యసించి తమ కాళ్లపై తాము నిలబడి ఆత్మనిబ్బరంతో అడుగు ముందుకెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


కట్టా శ్రీనివాస్ గారి లేఖ వాళ్ళ అమ్మాయికి ఎన్నో మంచి మాటలు చెప్తూ రేపు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో.. ఏమి మానాలో ఏమి మానకూడదో జీవితానికీ కవిత్వానికీ వర్తించేలా సున్నితంగా స్ఫూర్తి దాయకంగా చెప్తారు. ఇలాంటి తండ్రులు సమాజంలో ఉన్నంతకాలం, ఏ అమ్మాయీ అబలా కాదు అనుకున్నది సాధించే తీరుతుంది.
కుప్పిలి పద్మ గారి లేఖ “స్త్రీల జీవితాల్లో బై చాయస్ పెళ్లి చేసుకోవడం చదువుకోవడం నచ్చిన పని చేయడం ఆమెకే ఉండాలంటారు. లైంగిక దాడులకు ప్రధాన కారణం పురుషాధిక్య ఆలోచనా ధోరణే.. దీన్ని అడ్డుకోవడానికి చట్టాలే కాదు సాంస్కృతిక విప్లవం అత్యంత అవసరమే” అంటారు.
నిజమే.. జరుగుతున్న పరిణామాలను బట్టి ఆలోచిస్తే.. స్త్రీ తనను తాను తిరిగి తీర్చి దిద్దుకోవలసిన ఆవశ్యకత ఆసన్నమైంది. లేదంటే వాడిపారేసే కరివేపాకో.. తొక్కి నడిచిపోయే బండ లాగే చూస్తారు.!
తిరునగరి దేవకీ దేవి గారి లేఖలో “స్త్రీల మీద చిన్న చూపు వేధింపులు రూపుమాపబడాలి అంటే ప్రభుత్వ విధి విధానాలలో మీడియాలో కోర్టు తీరుతెన్నులలో విద్య విధానాలలో సమూలంగా మార్పు వస్తే తప్ప హత్యాచారాలకు ముగింపు పలుకలేమని “ఘంటాపథంగా తెలియజేశారు. వ్యక్తుల్లో వ్యవస్థల్లో ఇప్పటికైనా మార్పులు రావాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.
ఈ ‘లేఖావలోకనం’లో అధ్యాపకులు ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువే.. వారు వారి వారి విద్యార్థులకు.. లేఖల ద్వారా హితోపదేశం చేశారు.. నాంపల్లి సుజాత తన విద్యార్థికి లేఖ రాస్తూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాలు సూచనప్రాయంగా తెలియచేస్తూ తదనుగుణంగా “ఆడపిల్లలు క్రమశిక్షణ నియమనిబంధనలు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి” అన్నారు.
కొండపల్లి నీహారిణీగారిది సందేశాత్మక లేఖాసారాంశం..” అమ్మాయిల మీద హింస రూపుమాపాలంటే బళ్లను వేదికలుగా చేసుకొని, పాఠ్య పుస్తకాల్లో స్థాయీలవారీగా, విలువలనూ, ఆత్మస్థైర్యాన్నీ మిళితం చెయ్యాలంటారు”..అవును
మొక్కప్పటినుంచే విలువలతో కూడిన విద్య నేర్పినట్లైతే తప్పక ఫలితాలుంటాయి.
శిలాలోలితగారు వారి లేఖలో ఇలా అంటారు “తప్పు జరిగాక విచారించే కంటే మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించుకుంటే బాగుంటుందని” కొన్ని కారణాలను కూడా తెలియజేశారు. “తలుపులేని గుడిసె బతుకులో తప్పనిసరిగా చూసే అమ్మానాన్నల లైంగిక చర్యలు, తాగిన తండ్రి ప్రేలాపనలు, కుటుంబంలో దొరకని ప్రేమ, స్నేహం, కరుణ వల్లే యువత దారి తప్పవచ్చు అంటారు”.
మూలాలకు చికిత్స చెయ్యాలి గానీ.. పుండెక్కడో ఉంటే మందింకో కాడా అయితే..ఎలా..!? శైలజామిత్రగారు ఎవరిని ఏమీ నిందించలేక కాలానికో లేఖ రాశారు. దేశంలో ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట స్త్రీ మానభంగానికి, అవమానానికి, హింసకు గురవుతుంది. “భయం పోగొట్టే చట్టం బాధను పోగొట్టే చుట్టం “ఉండాలంటారు. కనీస ఓదార్పూ బాధిత మహిళలకూ అవసరమే..!
చదువుల తల్లి సావిత్రిబాయి గారికి విన్నవిస్తూ జ్వలిత గారిలేఖ ఇప్పటి సమాజ పోకడలు, జరుగుతున్న అత్యాచారాలకు కారణాలతో పాటు పరిష్కారాలు సూచిస్తూ.. “ఆడపిల్లలకు అక్షరజ్ఞానమూ రక్షణ నైపుణ్యాలను ఆత్మస్థైర్యం పెంపొందించాలంటూ.. మనుష్యులను ప్రేమించే విలువలను పిల్లలకు నేర్పాలంటూ” వారి లేఖా సారాంశం.
ఎవరో వస్తారని.. ఏదో మారుస్తారనీ ఎదురు
చూడకుండా ఎవరికి వారే మారాల్సిన
అవసరం ఇప్పుడత్యంతావశ్యకం..!

ఇంత అమూల్యమైన ఈ పుస్తకంలో మరిన్ని పరిమళాన్ని జోడించినట్లు ప్రముఖుల లేఖలు ప్రచురించడం ముదావహం..! సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలేకు వ్రాసిన ప్రేమ లేఖలు, సావిత్రిబాయి శిష్యురాలు ముక్తాబాయి పత్రికకు రాసిన తిరుగుబాటు లేఖ,
ఔరంగజేబు తన గురువుగారికి రాసిన అమూల్యమైన లేఖ, అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ వారి అబ్బాయి గురించి ఉపాధ్యాయులకు వ్రాసిన లేఖ, బోయి భీమన్న గారి లేఖ..
ఆ అమూల్యమైన లేఖలని చదువుతూ ఆ కాలానికెళ్లి పులకించిపోతాం..! పుస్తకానికి ముందుమాటలు ఆచార్య సూర్యాధనుంజయ్ యశస్వి సతీష్ శీలా సుభద్రాదేవి గారల మాటలు పుస్తకానికి మరింత శోభనిచ్చాయి.. ఇక శేషబ్రహ్మం గారి కవర్ పేజీ అందంగా, అర్ధవంతగా అదనపు ఆకర్షణగా అమరింది..!

ఈ పుస్తకం ద్వారా జ్వలితగారు ఆశించిన మార్పు తప్పకుండా రావచ్చనీ.. వస్తుందని కోరుకుంటూ వారికి హార్థికాభినందనలతో…!

ప్రతులు..
జ్వలిత,సాహితీవనం.
15-21-130/బాలాజీ నగర్
కూకట్పల్లి..72
హైద్రాబాద్..
మొబైల్..9989198943
మెయిల్..jwalitha2020@gmail.com.

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

A Review on “EM and the BIG HOOM”

by - మూర్తి కెవివిఎస్ June 23, 2021
written by - మూర్తి కెవివిఎస్

మనం అనేక రచనలు చదువుతుంటాము. వాటిల్లోని ఆ కథ ఎక్కడో ఓ ప్రదేశం లో జరుగుతూంటుంది.అది నగరమో,పట్టణమో,పల్లెనో…కానీ ఒకసారి చదివేసి అవతల పెట్టేసిన తరువాత కూడా ఆయా ప్రదేశాలు మనల్ని అంత త్వరగా వదలవు. మనం మానసికంగా అక్కడికి ప్రయాణం చేస్తూనే ఉంటాము.రచయిత ఎంతో మమేకమై రాస్తే తప్పా దాన్ని మనం అంతగా అనుభూతి చెందలేము. ఈ కళ అందరి లోనూ సమానంగా ఉండదేమో..!వారి పరిశీలనాశక్తి ఇంకా దాన్ని అక్షరాల్లోకి మార్చే వారి మంత్రజాలం లో ఉంటుందేమో.

ఉదాహరణకి చార్లెస్ డికెన్స్ ని చదివితే లండన్ లోకి,థామస్ హార్డీ ని చదివితే వెసెక్స్ లోనికి,మార్క్ ట్వైన్ ని చదివితే మిసిసిపి లోకి, విలియం ఫాల్క్నర్ ని చదివితే అమెరికా దక్షిణ భాగం లోని లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాము.ఇక పారిస్ ప్రయాణం చేయాలంటే గై డి మపాసా ని ,పీటర్స్ బర్గ్ లోకి వెళ్ళాలంటే దోస్తోవిస్కీ ని చదవవలసిందే. జేన్ ఆస్టిన్ ఆవిడ తన జీవితమంతా ఓ పల్లె ప్రాంతం లోనే ఉన్నది,ఆ అందాలన్నీ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ వంటి నవలల్లో చూడవచ్చు.

అసలు ఆ అందమంతా ఎక్కడనుంచి వస్తుంది.ఏ ప్రదేశమైనా గానీ దానికి ఓ రంగు ,రుచి ఉంటుంది.అది అక్కడి పరిసరాల్లోనూ,మనుషుల్లోనూ,వాతావరణం లోనూ గూడు కట్టుకుని ఉంటుంది.దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా చిత్రించినపుడు ఒక నిజాయితీ ఉట్టిపడుతుంది.సరైన మాటలు పడాలి.అవి పఠిత కి దృశ్యాన్ని చూపించాలి.అలా అన్ని సార్లు జరుగుతుందా కష్టమే.కాని కొంతమంది లో ఆ నేర్పు పిసరంత ఎక్కువగా ఉంటుంది.

అలాగే జోసెఫ్ కోన్రాడ్ ని చదివితే మనం సముద్రం మీద తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.ఎందుకంటే తను అలానే జీవించాడు కాబట్టి.అలా అని సముద్రం మీద తిరిగినవాళ్ళు అందరూ అలా రాశారా అంటే లేదనే చెప్పాలి.ఒక భావాన్ని ఎంతో నేర్పుగా దృశ్యమానం చేసే కళ ఇలాంటి వారి లో చాలా ఎక్కువ గా ఉన్నదని అనిపిస్తుంది.ఇది నాకోసం,నేను నా హృదయభారాన్ని ఆపుకోలేక రాసుకున్నది …మీకు నచ్చిందా సరి లేదా మంచిది అన్నట్లుగా ఉంటాయి కొన్నిసార్లు వారి రాతలు.అక్కడే వస్తుంది ఓ నిజాయితీ తో కూడిన అందం.

సోమర్సెట్ మామ్ ,గ్రాహం గ్రీన్ కథలు వాళ్ళ పర్యటనా ప్రభావం అనుకుంటాను,వివిధ ప్రదేశాల్లో ఆయా పాత్రలు జవ జీవాలతో ఉంటాయి. ఇక మన దేశం లోని ముస్సోరి లో నివసించే రస్కిన్ బాండ్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఆయన రచనలు చదువుతుంటే హిమాలయ సానువుల్లోని గుట్టలు,మిట్టలు,చెట్లు చేమలు,జంతువులు,కీటకాలు,అక్కడి శిధిల నిర్మాణాలు ఒక్కటేమిటి ఆ ప్రాంతం లోకి వెళ్ళి విహరించినట్లుగా ఉంటుంది.


EM and the big HOOM అనే ఈ ఆంగ్ల నవల ని చదవడం పూర్తి చేసిన తర్వాత అనేక భావాలు ముప్పిరిగొన్నాయి.అసలు టైటిల్ పెట్టడం లోనే ఓ తికమక ఉంది అనిపించింది.అయితే చదివిన తర్వాత ఇదే సరైన టైటిల్ అనిపించింది.ప్రస్తుతం మన దేశం లో ఆంగ్లం లో రాసేవారి సంఖ్య బాగా పెరుగుతోంది.ఇది భారతీయ ఆంగ్లం…భారతీయ వాస్తవికతని మోసుకువచ్చే వాహకం.సగర్వం గా తనదైన ఘుమ ఘుమలతో ప్రపంచవేదిక పైన తన పరిమళాల్ని వెదజల్లుతున్నది.

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇమెల్డ  తీవ్రమైన మానసిక సమస్యలకి గురి అయి పేరానాయిడ్ గా మారుతుంది.ఉదాహరణకి మున్సిపాలిటి వాళ్ళు రోడ్డు పక్కన గోతులు తవ్వితే అది తన మీద కుట్ర చేయడానికే అన్నట్లు భావిస్తుంది.అలా అనేక పరిస్థితుల గుండా  నలుగురు ఉన్న కుటుంబం తమ జీవనాన్ని కొనసాగిస్తుంది.ఆమె చేసే పనులు ,మాట్లాడే మాటలు చదువరులకి కొన్నిసార్లు జాలి కొన్నిసార్లు కోపం పుట్టిస్తాయి.EM అనేది ఇమెల్డ కి,BIG HOOM అనేది అగస్టస్ కి పెట్టిన ముద్దు పేర్లు వంటివి.అదే ఈ పుస్తకానికి టైటిల్ అయ్యింది. ఊహించని ట్విస్ట్ లు అలాంటివి ఏమీ ఉండవు గాని, ఒక  మానసిక సంతులనం కోల్పోయిన వ్యక్తి తో అందరూ దయగలిగి ప్రవర్తించాలనే సందేశం అంతర్లీనం గా దీనిలో ఇవ్వడం జరిగింది.రచయిత ఓ చోట చెప్పినదాని ప్రకారం 72000 పదాలు (ఇంచుమించు వార్ అండ్ పీస్ నవల సైజు) తాను ఒరిజినల్ గా రాస్తే దాన్ని ఆ తర్వాత 235 పేజీలకి కుదించడం జరిగిందట.

సరే…రచయిత విషయానికి వస్తే వీరి పేరు జెర్రీ పింటో. గోవా కి చెందిన రోమన్ కేథలిక్ కుటుంబం నుంచి వచ్చారు.ఒకప్పుడు గోవా ప్రాంతాన్ని పోర్చ్ గీస్ వారు పాలించిన విషయం మనకు తెలుసు.ప్రస్తుతం వాళ్ళు లేరు,కాని వారి సంస్కృతి తో ముడిపడిన ప్రజలు మిగిలిపోయారు.డిసూజా,పెరీరా,డికోస్టా ఇలాంటి వారి ఇంటి పేర్లతో మిగిలిపోయిన సంతతి వాళ్ళ కథలు మన తెలుగు వారికి తెలిసింది బహు తక్కువ అని భావిస్తున్నాను.అక్కడి నుంచి తగినన్ని అనువాదాలు మన భాషలోకి వచ్చినవి స్వల్పమేనని చెప్పాలి.

ఈ నవల ఇతివృత్తం గూర్చి చెప్పాలంటే మానసికంగా దెబ్బతిన్న ఒక మాతృమూర్తి కథ.ఆమె పేరు ఇమెల్డ. ఆమె భర్త పేరు ఆగస్టస్.కూతురి పేరు సుసాన్.కొడుకు పేరు ఏమీలేదు.ఆ కొడుకు తన గొంతు తో ఈ కథ ని మొత్తం వినిపిస్తుంటాడు.అంటే కొడుకు చివరి దాకా పేరు చెప్పడు.రచయితనే మనం ఆ కుమారుని గా భావించవచ్చు. కథ చెప్పే పద్ధతి లో ఒక విన్నూత్నమైన విధానాన్ని అనుసరించాడు. దానివల్ల కొంతమంది పాఠకులు గజిబిజి పడినా ఆశ్చర్యం లేదు.అయితే భాష సరళతరమైన శైలి లో సాగుతుంది.

ఉదాహరణకి ఇమెల్డ అనే తన తల్లికి ఎప్పుడు ఏ కారణం చేత ఈ పిచ్చి అనేది వచ్చింది అనేది తెలుసుకోవడానికి కొడుకు అనేకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు.బై పోలార్ డిజార్డర్,పేరానోయా ఇలాంటి మానసిక సమస్యలచేత ఆమె బాధపడుతూంటుంది.ఆమె మాత్రం ఇతరుల దృష్టిలో మెంటల్ లేదా పిచ్చిది.అంతే.కాని ఈ కొడుకు చాలా ఓపిక గా ఉంటూ ఆమె ని మాటల్లో పెట్టి సమాధానాలు రప్పించడం ద్వారా,ఆమె రాసిన ఉత్తరాలు,డైరీలు పరిశీలించడం ద్వారా కొంత విషయాన్ని తెలుసుకుంటూంటాడు.

వీరి కుటుంబం పేరు మెండిస్ ,కొన్ని ఏళ్ళ క్రితం జీవనోపాధి వెదుక్కుంటూ గోవా ప్రాంతం నుంచి బర్మా వెళ్ళి మళ్ళీ ముంబాయి వచ్చి మహీం అనే ఏరియా లో స్థిరపడతారు.అక్కడ ఒక చిన్న అపార్ట్మెంట్ లో నివసిస్తూంటారు.మధ్య తరగతి కుటుంబం అని చెప్పాలి.ఇమెల్డ తాను యవ్వనం లో ఉన్నప్పుడు ఎలా చదువుకున్నది,ఉద్యోగ జీవితం గడిపింది,ఎలా ఆగస్టస్ తో ప్రేమ లో పడింది,ఏ విధంగా ఆమె తల్లిదండ్రుల తో గోవా ప్రాంతం లో గడిపింది ఇంకా ఇలాంటివి సమస్తం మనకి ఇమెల్డ చెబుతుంది.అంటే కొడుకు మాటల్లో పెట్టి అడిగినప్పుడు పేజీలు పేజీలు గా ఆమె చెప్పుకుపోతుంది.అలా కథ నడుస్తుంది.

కూతురు సుసాన్ గాని,భర్త అగస్టస్ గాని ఎంతో ఓపికతో ఈమె ని చూసుకుంటూంటారు. ఎందుకంటే ఉన్నంతసేపు బాగానే ఉంటూ ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేస్తుంది.కొన్నిసార్లు రోడ్డు కి అడ్డం గా వెళ్ళి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది.ఇంట్లో ఉన్నంతసేపు బాగా టీ తాగుతుంది లేదా బీడీలు కాలుస్తుంది.ఇంకా కూతురు లేదా కొడుకు తో మాట్లాడేటప్పుడు కూడా సెన్సార్ అనేది ఏమీ ఉండదు.మనసు లో వచ్చినదంతా మాటాడేస్తుంది.నిజం చెప్పాలంటే నవల అంతా పిచ్చి వచ్చిన వారి ప్రవర్తన మీద కేంద్రీకరించి రాసినట్లుగా అనిపిస్తుంది.చివరకి ఆమె ఒక హాస్పిటల్ లో మరణిస్తుంది.ఆమె జీవించిఉన్నప్పుడు జరిగిన సంగతులు తలుచుకుంటూ మిగతా ముగ్గురు బాధపడుతుండగా నవల ముగుస్తుంది.235 పేజీలు ఉన్న ఈ నవల ని అలీఫ్ బుక్ కంపెనీ వారు ప్రచురించారు.

ఈ నవల కి 2016 లో సాహిత్య అకాడెమీ అవార్డ్, వింధాం కాం బెల్ అవార్డ్ వచ్చింది.2012 లో హిందూ లిటరరీ పురస్కారం వరించింది.సాల్మన్ రష్దీ,అమితావ్ ఘోష్,కిరణ్ దేశాయ్ వంటి ప్రముఖులు ఇచ్చిన కితాబులు ఈ పుస్తకం లో ప్రచురించారు.ప్రస్తుతం జెర్రీ పింటో, మెల్ జోల్ అనే స్వచ్చంధ సంస్థ తో కలిసి పని చేస్తున్నారు.కాలమిస్ట్ గా కొన్ని పత్రికల్లో రాస్తుంటారు.అంతేగాక ఔత్సాహిక రచయితల కోసం వివిధ  నగరాల్లో తరగతులు కూడా నిర్వహిస్తుంటారు.

– మూర్తి కెవివిఎస్ (ఫ్రీ లాన్సర్, ఖమ్మం)

       ఫోన్:  7893541003

June 23, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

రుగ్మతలను ఎత్తి చూపిన’ సృష్టికర్త శతకం

by యడవల్లి శైలజ June 23, 2021
written by యడవల్లి శైలజ

“సిస్టర్ అనసూయ ” సమాజ సమస్యలను శతక
పద్యాల్లో ఇమిడ్చి రాసినందుకు ముందుగా అభినందనీ యురాలు .
పున్నామ నరకం నుంచి తప్పించేది కొడుకనే లోతైన భావన యుగాల తరబడి పాతుకుని పోయింది. ఆడపిల్ల
కు జన్ననిచ్చిందని తాళికట్టిన బార్యను వదిలి మగ పిల్లాడి కోసం మరొక ఆడదాన్ని పెండ్లి చేసుకొని సంసారం
చేసే మగాళ్ళు ఎంతమందో. ఈ శతకంలో…
సుతుడు లేకపోతె స్వర్గంబు లేదని
ఆడ పిల్లలాని ఆడ వదిలి
మరల పెండ్లి యాడె మగపిల్లల కొరకు
శుద్ధి చేయు తండ్రి! సృష్టికర్త!!
బంధాలు, అనుబంధాలను మరిచిపోయి అనుక్షణం ధన
వ్యామోహంలో పడి ఎటువంటి ప్రేమకు నోచుకోనివాడే
నిజమైన నిరుపేద. సంపాదన కోసం ఎటువంటి పని చేయడానికి వెనుకాడడు. అందుకే కవయిత్రి ” బహు
ధనంబు ఉన్న భాగ్యవంతుడైన ప్రేమ లేనివాడు పెంట బోలు ” అంటున్నారు.
ఆడపిల్ల పుట్టిందనగానే చెత్త కుప్పమీద పడవేసేవారు
కొందరు, కడుపులోనే నులిమేసేవారు కొందరు, పుట్టగానే
అమ్మేవారు మరికొందరు ఇన్ని సమస్యలను ఎదుర్కొంటు న్న ఆడపిల్ల. భూమిపైన మనుగడ సాగిస్తున్న తరుణంలో
పాపపు కళ్ళు పడుతున్నయి. బడిలో, గుడిలో, రైళ్ళలో,
రెస్టారెంట్లో, బస్సులో , ఆఫీసుల్లో ఎక్కడా ఆమెకు రక్షణ
లేకుండా పోతుంది. ఇటువంటి విపత్తులను చూసి చలించిన ” సిస్టర్ అనసూయ ” తన శతక పద్యాల్లో తోటి
మహిళల పట్ల సానుభుతి తెలుపుతూ తన స్పందన
కనబరిచారు . ” చిన్న బాలికయని చూడకుండా వాడు పాడు చేసినాడు పాపమనక/ పశువులకును తెలుసు
పరిపక్వత వయస్సు/
దీనికి కారణం మద్యపానం అంటూ…..
కల్లు సార తాగి కండ్లు మూసుకపోయి తల్లి బిడ్డ యాని
తేడ లేక/ పశువులాగ నరులు పాపంబు జేస్తుండ్రు/
అని తన ఆవేదన వ్యక్తపరిచారు.

విముక్తి నవలా రచయిత్రి–సిస్టర్ అనసూయ ఎం.ఎ సోషియాలజీ ఉపాధ్యాయురాలు (ప్రవేట్),  anasuya344@gmail.com

” కవి క్రాంతదర్శి, మార్గదర్శి అటువంటి కవులకు కూడా ఈ మధ్య కవితలు రాసేవారిని నిందిస్తూ, పద్యం రాసేవా రిని దూషిస్తూ చిన్నచూపు చూడడం ఒక ఎత్తు అయితే
ఒకరిపై మరొకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం , విచ్చ
లవిడిగా సమూహలు పెడుతూ సాహిత్య వేదికలు మాట
ఏమో గాని కలహలు పెట్టుకుంటూ అసలైన తమ బాధ్య తను విస్మరిస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల స్పందించి
వారికి చేదోడువాదోడుగా ఉండాల్సిన కవులు, రచయిత లు తగువులు పెట్టుకుంటూ పోతే సమాజం లోని సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుంది ఇది తరతరాల కు ఆదర్శంగా నిలిచే కవులు, రచయితలు అందరూ కూడ ఆలోచించాల్సిన విషయం. కవయిత్రి మాటల్లో…

” కవుల మధ్య ఎన్నొ కలహములున్నవి
ఎవరి తిక్క వారికెక్కువాయె
మల్లెలోలె వారి మనసు ఉండుటకును
శుద్ధి చేయు తండ్రి! సృష్టికర్త!!”

మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల పక్కన
నిలబడాలని ప్రయత్నిస్తున్న కాని కుల మత, ప్రాంతీయ,
వర్గ, లింగ వివక్షత, ఆర్థిక విభేదాలు అడ్డుగోడలవుతు న్నాయి .

” ఆడ – మగ కులములె అంతట నుండగా
భరత దేశమందె బహుకులముల?
ఆర్యులొచ్చి చేసె అన్ని కులములను
శుద్ధిచేయు తండ్రి! సృష్టికర్త!!”

” సిస్టర్ అనసూయ సృష్టికర్త శతకంలో ” సంప్రదాయాలు,
సామాజిక స్పృహ కలిగిన ఆర్థిక, రాజకీయ, న్యాయ వ్యవస్థ పనితీరును ప్రశ్నించిన శతకాలు, పేదరిక బాధలు,
సాంస్కృతిక, సాంఘిక, అసమానతలు గురించిన ఎన్నో
ప్రేరణాత్మక, స్పూర్తిధాయకమైన శతకాలు ఉన్నాయి. ”
ఈ ఆటవెలది పద్యాలను చదవాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. ఇంత మంచి పుస్తకాన్ని మనకు అందించి న కవయిత్రికి హృదయపూర్వక అభినందనలు.

ప్రతులకు:
సిస్టర్ అనసూయ
ఇంటి నెం. 5 – 12 – 409/3
బి .టి. యస్, నల్లగొండ – 508001
చరవాణి: 9492728122, 8074573716

 

-సమీక్షకురాలు: యడవల్లి శైలజ ( ప్రేమ్)

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

“రెండు కళ్ళు ” – కథ

by Shanthi Prabodha Valluripalli June 23, 2021
written by Shanthi Prabodha Valluripalli
అమ్మా ..
“అటుచూడు . రెండు పిచ్చుక పిల్లలు ఎలా పోట్లాడుకుంటున్నాయో .. ” అన్నాడు చింటూ
అమ్మ చింటూ చూపించిన వైపుకి ఒకసారి చూసింది .
మళ్ళీ తన చేతిలో ఉన్న పుస్తకం చదువుకుంటూ కూర్చున్నది.
చింటూ కి ఆ పిచ్చుక పిల్లలు చూడడం చాలా ఆసక్తిగా ఉంది.  వాటిని  పరిశీలనగా చూస్తున్నాడు.
అవి రెండూ పోట్లాడుకుంటూనే ఉన్నాయి.  ఒకదానిమీద ఒకటి పడి కొట్టుకుంటున్నాయి.  ఒకదాన్ని ఒకటి తిట్టుకుంటున్నాయి.
అంతలో ఎక్కడికో వెళ్లిన వాళ్ళ అమ్మ పిచ్చుక రివ్వున వచ్చి గూటి పై వాలింది.
పిల్ల పిచ్చుకలు పోట్లాట ఆపి అమ్మ వద్దకు చేరాయి.
ఒకదానిమీద ఒకటి అమ్మకు ఫిర్యాదు చేస్తున్నాయి.
“చూడమ్మా .. నువ్వు నా కోసం ఉంచిన అన్నమంతా తమ్ముడు తినేశాడు ” ఏడుస్తూ చెప్పింది బుజ్జి పిచ్చుక
“కాదమ్మా .. ” పక్క చూపులు చూస్తూ చెప్పింది బుల్లి పిచ్చుక .
” అమ్మా .. అటు చూడు, అది నా బట్టలు వేసుకుంది ” అరిచింది బుల్లి పిచ్చుక
“ఒరేయ్ .. ఆపండి మీ గోల . ” అమ్మ ఇద్దరినీ మందలించింది
ఇద్దరూ ఆపలేదు .  ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పాటు బుల్లి చెయ్యి లేపింది
అమ్మ అది గమనించింది . అక్క మీద చెయ్యెత్తిన బుల్లి చేతిని పట్టుకొని ఆపింది . మరో పక్కకు లాగింది .
బుజ్జి ని చూస్తూ .. “పెద్ద దానివి. నీకైనా బుద్ది ఉండక్కర్లా .” కోపంగా అన్నది అమ్మ పిచ్చుక .
Ilustration by Ahobhilam Prabhakar (9490868288)
“హూ .. అమ్మ ఎప్పుడూ ఇంతే..
బుల్లి అంటేనే తనకిష్టం.  ఊ .. ఊ .. నన్నే తిడుతుంది.
నేనంటే తనకసలు ఇష్టం లేదు.  అందరు నన్నే తిడతారు ” అంటూ బుజ్జి గట్టిగా అంటూ ఏడుస్తున్నది .
“హూ .. అమ్మ ఎప్పుడూ అక్కకే సపోర్ట్ చేస్తుంది .
తనని ఏమనదు .
నన్ను చూడు .. ఎలా లాగేసిందో .. ” అని ఎప్పటి సంగతులో తలచుకొని ఏడుస్తున్నది బుల్లి
బుజ్జి , బుల్లి ల కొట్లాట చూస్తే అమ్మకు చాలా కోపం వస్తున్నది.   కానీ వాళ్ళని కొడితే లాభం లేదు.  అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని ఆలోచించింది.
ఇద్దరినీ పిలిచింది . తనకి కుడి పక్క ఒకరిని, ఎడమ పక్క ఒకరిని కూర్చోమంది . ఇద్దరూ మౌనంగా వచ్చి కూర్చున్నారు.
కానీ వాళ్ళ కళ్ళు కోపంగానే  చూసుకుంటున్నాయి .
“మీ ఇద్దరికీ కళ్లున్నాయా ..” అడిగింది అమ్మ పిచ్చుక.
“ఇదేం ప్రశ్న .. “అమ్మకేసి వింతగా చూశాయి పిల్ల పిచ్చుకలు
ఆ తర్వాత ఉన్నాయన్నట్లు తలూపారు .
“ఎన్ని కళ్లున్నాయి ?”అడిగింది అమ్మ పిచుక .
“రెండు” అని టక్కున సమాధానం ఇచ్చారు ఇద్దరూ ..
అమ్మ ఇద్దరినీ చూసింది.
బుజ్జి , బుల్లి ఇద్దరూ పోట్లాట మరచిపోయారు . ఏడుపు పోయింది . కోపం పోయింది .
అమ్మ ఏమి చెప్పబోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు .
అప్పుడు “ఏ కన్ను అంటే మీకిష్టం ” అని అడిగింది అమ్మ .
బుల్లి , బుజ్జి అమ్మ మొహంలోకి చూశాయి. అమ్మ కేమయింది ఇలా అడుగుతుంది అని మనసులో అనుకున్నాయి .
“రెండు కళ్ళూ .. ” అన్నాయి ఒకేసారి
అప్పుడు అమ్మ బుజ్జిని , బుల్లిని తన దగ్గరకు తీసుకుంది. గుండెకు హత్తుకుంది.
“మీరిద్దరూ నా కళ్ళు. మరి, నాకు ఎవరంటే ఇష్టం? ” అని అడిగింది .
“ఇద్దరం ” అని ఒకే సారి చెప్పారు బుజ్జి , బుల్లి
“కదా .. ” అమ్మ ఇద్దరికీ చెరొక ముద్దు ఇచ్చింది. హాయిగా నవ్వేసింది.
బుజ్జి , బుల్లి కూడా నవ్వేశాయి . అమ్మకు చెరో వైపు ముద్దులిచ్చాయి.
అప్పుడు అమ్మ ఇలా చెప్పింది .
మీరిద్దరూ అక్క తమ్ముళ్లు కదా .. పోట్లాడుకోకూడదు .  ఒకరినొకరు తిట్టుకో కూడదు . కొట్టుకో కూడదు .  తక్కువ చేసుకో కూడదు .  ఒకరికొకరు తోడుండాలి .
కోపం తగ్గించుకొని శాంతంగా ఆలోచించుకోవాలి .
ఒకరిపై ఒకరు నిందలు వేయడం, ఫిర్యాదు చేయడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం అలవాటయితే బుర్రంతా వాటితో నిండిపోతుంది. అదే ఆలోచిస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తారు .
మన అక్కే కదా .. మన తమ్ముడే కదా అనుకుంటే హాయిగా ఉంటారు .  గొడవలు ఉండవు.
అవునమ్మా.., ఇక మేం పోట్లాడుకోము బుజ్జి, బుల్లి పిచ్చుకలు అమ్మ మెడ చుట్టూ చేతులేసి చెప్పాయి.
చింటూకి ఆ దృశ్యం అపురూపంగా అనిపించింది.
అన్న , తనూ స్కెచ్చెస్ కోసం జుట్టు పట్టి కొట్టుకున్నారు.
ఎంత చెప్పినా వినకుండా కొట్టుకుంటున్నారు. మీతో మాట్లాడను అని అమ్మ చెప్పింది.  పిచ్చుక పిల్లల్ని చూస్తుంటే ఆ విషయం గుర్తొచ్చింది.
అమ్మ దగ్గరకు వెళ్లాడు. అమ్మ చేయి పట్టుకుని చేతిలో చేయి వేశాడు.
సారీ అమ్మా. నేను, అన్న అసలు ఎప్పుడు పొట్లాడుకోము అని చెప్పాడు.
చింటూ ఎందుకు అలా చెప్పాడో అమ్మకి అర్ధం కాలేదు.
తనకోపమే తన శత్రువు అనే పద్యం చదువుతున్నాడు చింటూ అన్న బంటీ.
June 23, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

చిన్ని మొక్క-చిట్టితల్లి

by Padma Tripurari June 23, 2021
written by Padma Tripurari

******
బాల గేయము
********
చిట్టితల్లి పెంచింది
చిన్ని మొక్కను
కబురులెన్నొ చెప్పింది
చిన్నిమొక్కతో.

మొక్కతల్లి నిమిరింది
చిట్టి బుగ్గను.
చిట్టితల్లి నవ్వింది
చిగురు తాకగా.

మొక్కతల్లి నువ్వే
నా ప్రాణమన్నది.
చిన్నిమొక్క, చిట్టితల్లి
నేస్తమయినవి.

చిన్ని కడవతో వచ్చి
చిట్టితల్లి
నీరు పోసి పెంచింది
చిన్ని మొక్కను

మొక్కతల్లి వేసింది
మారాకులు
మొగ్గలేసి నవ్వింది
పూల గుత్తిగా

చిట్టితల్లి అది చూసి
గంతులేసింది.
చిన్ని మొక్క కానుకగా
పువ్వులిచ్చింది.

చిట్టితల్లి సంతోషం
సంద్రమైనది.
చిన్ని మొక్క ఆనందం
ఊపిరయినది.
చిట్టితల్లి ఊపిరైనది.

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వం – దర్శనం – దృక్పథం

by నందిని సిధారెడ్డి June 23, 2021
written by నందిని సిధారెడ్డి

నందిని సిధారెడ్డిగారు మంజీరా రచయితల సంఘం అంతర్జాల వేదికపై నిర్వహించిన ప్రసంగపాఠాల పరంపర, ‘కవిత్వ రచన – కవిత్వ నైపుణ్యాలు’ అంశంపై పదిహేను భాగాలుగా ప్రసంగించారు. ఆ వరుస ప్రసంగాల్ని సిధారెడ్డిగారు మాట్లాడింది మాట్లాడినట్టుగా రికార్డు చేస్తున్నాను. మొదటి ప్రసంగ పాఠం ‘కవిత్వ కళ – నిర్వచనాలు – ప్రత్యేకతలు’ (click this) గత సంచికలో ప్రకటించినాము.  ఈ సంచికలో రెండవ అంశం ‘కవిత్వం – దర్శనం – దృక్పథం’ ప్రసంగ పాఠం.

దర్శనం దృక్పథం అనే అంశాలపై ఈ రోజు మాట్లాడుకుందాం. దాశరథిగారు ఎప్పుడో అన్న మాట : “కవులు అందరూ ఒక్కచోట చాపకూడు కూడ్చే ప్రాంగణం కవిత్వం” అని కవిత్వాన్ని నిర్వచించారు.                 కవిత్వమనేది లైఫ్ లాంగ్ క్రాఫ్ట్. జీవితమంతా మెరుగుపర్చు కోవాల్సిన కళ. ఒకరోజు చదివి వదిలిస్తే అయిపోదు. ప్రతిరోజు చదివితే తప్ప సజీవంగా ఉండదు. కవిత్వ రచనా నైపుణ్యాలు నిరంతరం ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటే తప్ప ఎక్కువగా రాణించే అవకాశం ఉండదు. అధ్యయనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.

కవిత్వం అంటే దర్శించినదాన్ని వర్ణించడం దర్శనాత్ వర్ణనాత్ లొకేరూఢా కవిః అని  సంస్కృత ఉక్తి ఉన్నది. దాని ఆధారంగా చూసినపుడు దర్శించడంలో కవికి ప్రత్యేక స్థానం ఉన్నది. రవి గాంచనిచోటు కవిగాంచును అని మనం చాలాసార్లు విని ఉన్నాం.  సూర్యుడు కూడా చూడలేని ప్రాంతాలను కవి చూస్తాడు. రవి కిరణాలు ప్రవేశించని చోటు, పోలేని చోటును కూడా కవి దర్శిస్తాడు. దర్శించడమంటే చూడడమే కదా. అందరూ చూసేది చూపే కదా. అంటే అందరికంటే వేరుగా కవి చూస్తాడు అని. అంతర్ దృష్టితో లోపలికి పరిశీలించి చూడడం. లో చూపు, చూపు ఎంత లోతైనదైతే పరిశీలన అంత లోతుగా ఉంటుంది. అందుకే కవయః క్రాంత దర్శినః  అన్నారు. ఒక యాభై ఏళ్ల ముందు వంద ఏళ్ళముందు, ఉండబోయేది కవి ఊహించి రచిస్తాడు. దాన్ని దార్శనికత అంటాం. అందుకే వాల్మీకిని ఇప్పటికి స్మరించుకుంటాం చెప్పుకుంటాం ఈ దార్శనికత కీలకమైనది. ఇదే సాహిత్యంలో  ప్రత్యేకం. ఒక కొత్తకోణంలో  చూడడం. ఏది దర్శించాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, జీవితాన్ని దర్శించాలి. ఒక మామూలు వ్యక్తి చూసే చూపుకు, ఒక కవి, ఒక కళాకారుడు చూసే చూపుకు తేడా ఉంటుంది. ముఖ్య లక్షణం ఏమిటంటే అనుభవం ద్వారా చూడడం. కవి దృష్టి కోణం వేరుగా ఉంటుంది. జీవితాన్ని అనుభవంతో కొందరు, జ్ఞానంతో కొందరు చూస్తారు. జ్ఞానం ద్వారా చూడడం యోగదృష్టి, తత్త్వ దృష్టి, దివ్యదృష్టి అని మూడు విధాలుగా చెప్పవచ్చు. దివ్యదృష్టి అంటే అక్కడ లేనిది చూడడం. కవికి అంతర్ దృష్టితో చూడడమనే దాంట్లో కవికి ఒక అంతర్ నేత్రమనేది ఉంటుంది. రెండు నేత్రాలే కాకుండా కవికి మనోనేత్రం కూడా ఉంటుంది. మనోనేత్రాలతో చూసి కవిత్వ వస్తువును ఎంచుకోవడమే సగం కవిత్వం. సామాన్య మానవుని ఆకర్షించని విషయాలు కవిని ఆకర్షిస్తాయి.

పక్షిని అందరూ చూస్తారు. వేటగాడికి దాన్ని కొట్టాలని అనిపిస్తుంది.  వాల్మీకి క్రౌంచ పక్షి జంటను చూసినపుడు ఒక క్రౌంచ పక్షి వియోగంతో ఎట్లా బాధపడింది, క్రౌంచ పక్షి పొందిన వియోగాన్ని చూసాడు. పడిపోయిన పక్షి కంటే పడిపోని పక్షిని మనోనేత్రంతో చూశాడు. అట్లా అంతర్ నేత్రంతో ఒంటరి పక్షిని ఊహించి భావించి కథ రాశాడు. ఆ పక్షి దుఃఖాన్ని రాశాడు. ఆ దుఃఖం నుండే రామాయణం మహాకావ్యంగా ఉద్భవించింది. దాన్ని దివ్యదృష్టి అనండి, మనో దృష్టి అనండి, అది అంతర్ దృష్టి అనదగినది. ప్రత్యేకమైనది.  అందుకే నానృషిః కురుతే కావ్యం అనే మాట వచ్చింది. ఋషి కాని వాడు కావ్యం రాయలేడని అన్నారు.  ఋషికి ఒక ప్రత్యేక మైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టితో కొత్తగా దర్శించి రాస్తాడు. రోడిన్ అనే పాశ్చాత్య తత్త్వవేత్త లుక్ ఎట్ ద థింగ్ అన్నాడు. వస్తువువైపు చూడు, ఎంతవరకంటే అంటిల్ యు గాట్ ఏ పోయమ్ నువ్వు కవిత్వమయ్యేదాకా దాన్ని చూస్తూ ఉండు అంటాడు. శేషేంద్రశర్మ ఏమన్నాడంటే పుష్పాన్ని చూస్తూనే కొ్న్ని యుగాలు గడుపుతాను అంటాడు. భౌతిక విషయాలైన ఆకలి దప్పులు ఉంటాయి. ఇవన్నీ చూడను. కానీ ఇవన్నీ దాటి సౌందర్య దృష్టి అనేది ఉంటుంది. కవికి ఉండే సౌందర్య దృష్టి వీటన్నింటినీ, భౌతిక విషయాలన్నింటినీ దాటేసి చూడాలి. సౌందర్య దృష్టితో చూస్తేనే ముడిసరుకు దొరుకుతుంది. ఆ ముడిసరుకే కవిని కవిగా నిలబెడుతుంది. పుష్పాన్ని మనమందరం చూసినా మన చూపు వేరు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు చూసిన చూపు వేరు. కొమ్మ నుండి పువ్వును తెంపినపుడు తల్లి నుండి దూరమైనట్టు, పుష్పాన్ని తెంపివేసిన తరువాత ఆ పువ్వు దుఃఖాన్ని, వియోగాన్ని పుష్పవిలాపంగా రాశాడు. కొమ్మ నుండి విడిపోయిన పువ్వులో ఏడుపును దర్శించాడు. అందుకే దర్శనం ముఖ్యం కవికి. దర్శనం చాలా కీలకమైనది. చుట్టూ ఉండే వస్తువుల్ని చూసేప్పుడు తప్పనిసరిగా మూడు రకాలైన దర్శనాలుంటాయి. ఒక అంచనాకు గనుక వస్తే 1. భౌతిక ఆకారాన్ని చూసేటువంటి వస్తు దృష్టి, ఇది ప్రాథమికంగా మనకు కనబడేది, అది పుస్తకమా, పెన్నా, టేబులా ప్రాథమికంగా చూసేది. మన ఇంద్రియాలతో మన కనులతో చూసేది. తత్వదృష్టి రెండోది. ఆ భౌతిక ఆకారం పుస్తకమైతే, దాన్ని తత్త్వాన్ని చూసే దృష్టి వేరు. ఆ పుస్తకం నవలనా, కథనా, ఏమిటనేది, ఆ పుస్తకంలోని సారమేమి అనేది. పుస్తకాన్ని చూడగానే దాని రంగు, రూపు, వాసన కాకుండా తత్త్వాన్ని, సారాన్ని తెలుసుకోవడమన్న మాట.

మూడో దృష్టి కవితా దృష్టి. పోయెటిక్ విజన్. కవి తనదైనటువంటి కవితా దృష్టి కలిగి, దర్శన శక్తి కలిగి ఉన్నప్పుడే అది కవితగా అవుతుంది. ఇదే ప్రధానమైనది, అంటే ఆ రచనకు శక్తినిచ్చే దృష్టి ప్రధానమైనది. భావుక దృష్టితో చూడడం. కవికి ఉండాల్సింది పోయెటిక్ విజన్. దానితో వస్తు, తత్త్వ, కవితా దృష్టి అనే వాటిలో మూడోదృష్టికి కావలసింది భావుకత సార్త్రే అనే అస్తిత్వవాద తత్త్వవేత్త నువ్వు ‘వస్తువును చూసేటపుడు నువ్వు ఏ యాంగిల్ లో చూసినా అది సమగ్ర దర్శనం కాదు’ అన్నారు. ఒక్కోవైపు నుండి అంటే కుడివైపు నుండి చూస్తే ఎడమవైపు కనిపించదు, ఎడమ వైపు నుంచి చూస్తే కుడివైపు కనిపించదు. ఒక టేబుల్ ను చూసినా పుస్తకాన్నిచూసినా తత్త్వాన్ని చూసే దృష్టి ప్రధానం భావనాత్మక దృష్టితో తత్త్వాన్ని అర్థం చేసుకోవడం కవి దృష్టి.

ఇంకొక ఉదాహరణ తీసుకొంటే చెట్టు ఉంటుంది. చెట్టుకు పండు కాయలు ఉంటాయి.  ఒక ఆకలితో ఉన్నవాడికి ఆ పండును చూస్తే ఆకలిని తీర్చేది అనుకుంటాడు. అది భౌతిక దృష్టి, ఒక సాధారణ దృష్టితో చూస్తే భౌతికవాది అనవచ్చు.  అంటే పండును తింటే ఆకలి తీరుతుంది అనుకుంటాడు కనుక. అదే ఒక తాత్త్వికుడు (ఫిలాసఫర్) అయితే ఏమంటాడు, ఏదైనా కోయక తప్పదు, పండి రాలిపోక తప్పదు. జీవితం కూడా అంతే. మానవుడైనా రాలిపోక తప్పదు. జీవితం ముగించక తప్పదు. పండు వంటిదే ఈ జీవితం, ఈ మానవ జన్మ. ఒక వయస్సు వచ్చాక అది రాలుతుంది. భూమిలో కలిసిపోతుంది. ఎలాగైతే పండు భూమిమీద పడి మట్టిలో కలిసిపోతుందో అట్లే ఒక మనిషి కూడా అంతే. ఒక తాత్త్వికుడు, ఒక వేదాంతి అట్లా చూస్తూ జీవితాన్ని ఒక తత్త్వంతో ముడివేసి చూస్తాడు. పండును మనిషి జీవనంతో ముడివేసి చెప్తాడు. అతన్ని తత్త్వవేత్త అంటారు. అదే ఒక శాస్త్రవేత్త ఈ దృష్టిని గమనిస్తే :  న్యూటన్ చూశాడు ఒక పండు రాలడాన్ని, అది చూసి భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉన్నదని, పండు భూమి మీదనే ఎందుకు రాలింది? పైకి ఎందుకు పోలేదు అని ఆలోచించి భూమ్యాకర్షణ శక్తిని కనిపెట్టిన దృష్టి శాస్ర్తవేత్త దృష్టి. శాస్త్రవేత్త దృష్టితో చూస్తే ఎంతటి వస్తువైనా కిందనే పడుతుంది. శాస్త్రవేత్తగా నిరూపించుకోగలిగాడు అతడు. ఒక బంతిని పైకి వేస్తే అది కిందనే పడుతుంది. శాస్త్రవేత్త భూమి ఆకర్షణ శక్తిని ఇట్లా నిరూపిస్తాడు.  కవి దృష్టిలో వేరు. ఒక పండును చూసినపుడు పండు సౌందర్యాన్నిగొప్పగా వర్ణించడం జరగవచ్చు. చెట్టు సౌందర్యాన్ని వర్ణించవచ్చు. పండు రాలక ముందు చెట్టును, పండు రాలిన తర్వాత చెట్టును భావోద్వేగంతో వర్ణించవచ్చు. ఇది కవి దృష్టి. చెట్టుతో ఉన్న బంధాన్నిభావోద్వేగంతో వర్ణించి వ్రాస్తాడు. తల్లి బిడ్డ అనే భావనతో చూస్తాడు. చెట్టు వొడి నుండి అంటే అమ్మ వొడి నుండి మట్టిని చేరుకున్నది అనే భావనతో రాయవచ్చు. సౌందర్య దృష్టే కాకుండా ఈ మూడు భౌతిక, తాత్త్విక, శాస్త్ర దృష్టి కంటే కూడా కవి యొక్క భావనాత్మక దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. భావుక దృష్టితో చూడడం, చెట్టు తల్లిగా చెప్పడం, కింద భూమిని మళ్ళా భూమి తల్లి వొడిలో పడిపోయింది బిడ్డ అనేది చెప్పడం, ఇవన్నీ కూడా. శాస్త్రవేత్త, తత్త్వవేత్త ఇద్దరు కూడా సత్యాన్నే చెప్పారు. ఇంకో సత్యాన్ని చెప్తాడు కవి. శాస్త్రవేత్త దృష్టిలో, తత్త్వవేత్తల దృష్టిలో ఉన్నదానికంటే కూడా కవికి భావనాత్మక దృష్టితో చెప్పగలిగే దృష్టి ఎక్కువ ప్రాధాన్యతతో ఉంటుంది. తత్త్వవేత్త తర్కాన్ని చెప్తాడు, శాస్త్రవేత్త సత్యాన్ని నిరూపిస్తాడు. ఈ ఇద్దరికన్నా కూడా కవి తన పదాల చాతుర్యంతో వాక్యాల  చాతుర్యాన్ని జోడించి నవీనంగా దృష్టీకరించి చూపిస్తాడు. పండు మట్టిలో కలిసిపోయింది నిజం. ఆ పండు యొక్క భౌతికతను, దాని అంతర్ భావ సౌందర్యాన్ని దృశ్యమానం చేసి వర్ణించి చెప్తాడు. అంటే భూమి చేతులతో స్వీకరించినట్టు, చెట్టుకు పండు దూరమైనట్టు వర్ణించి చెప్పడం. అట్లా దృశ్యమానం చేస్తాడు కాబట్టే కవికి ప్రత్యేక దృష్టి ఉన్నదని అంటాం. ఈ దృష్టిని రెండు విధాలుగా చెప్పవచ్చు. సూక్ష్మదృష్టి, స్థూలదృష్టి. ఆంతరమైన విషయాలదాక పోయి కవి వర్ణిస్తాడు.  ఆంతరమైన విషయాలకు వెళ్లిన కవి ఏ విషయాన్ని, ఏ వస్తువును ఎట్లా స్వీకరిస్తాడనేది ముఖ్యం. నన్నయ్యగారు లోనారసి అన్నాడు. భారతం రాసేటప్పుడు, భారత కథను చెప్పేటప్పుడు ఇతరులు అక్షర రమ్యతను ఆదరించగా అంతకంటె ఎక్కువ స్థాయి విమర్శకుడు  ‘లోనారసి మేలు’ అన్నాడు. చాలామంది కవిత్వమనేది సౌందర్యంవల్ల, శబ్దగుణంవల్ల, లయగుణం ఉండడంవల్ల వినగానే ఆకర్షితులవుతుంటారని అంటారు. కాని నిజానికి ఇతరులు అక్షరరమ్యతను ఆదరించినప్పుడు అందులో మేలుగా ఉన్న అంశం ‘లోనారసిన’ వాళ్ళకే తెలుస్తుంది.

లోనారసి అంటే లోన్ లోపలిదాకా హృదయం లోపలిదాకావెళ్ళి చూసి రాయడం కవి రాస్తాడు కనుక కవి ప్రత్యేకమైనవాడు. నన్నయ్య చెప్పినదాన్ని ఇంకొంచెం లోపలిగా చెప్తూ, విస్తృత అర్థాన్ని చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ ఏమన్నారంటే ‘చిత్తానన్ చూచి అన్నాడు. కళ్ళతో చూస్తారు అందరూ, కానీ కవి

హృదయంతో చూడాలి, ఒక వస్తువు తత్త్వాన్ని, ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని, గుణాల్ని గుణాల లోపలి అనేక అంశాలను  హృదయంతో చూడాలి. అప్పుడే భావోద్వేగం కలుగుతుంది. కవి హృదయంలో పుట్టేది భావోద్వేగం. ఇది కవితాశక్తి.

దేనితో చూడాలి, హృదయంతో చూడాలి. మనందరికి తెలిసిన మాటలే. శ్రీ శ్రీ ఏమన్నాడంటే కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, దేన్ని హీనంగా చూడకు. అంతా కవితామయమేనోయ్ అన్నాడు. హీనంగా చూడకు దేన్ని అని ఎందుకు అన్నాడంటే అంతకుముందు ప్రాచీన అలంకారికవేత్తలు, ప్రాచీన తాత్త్వికులు, ప్రాచీన కవులు

ఏమన్నారంటే కవిత్వం కొన్ని విషయాలలోనే ఉంటుందనీ, కొన్నిచోట్లనే ఉంటుందనీ అన్నారు. కవిత్వానికి గొప్ప నాయకుడు కావాలి, సౌందర్యవంతమైన స్తీ ఉండాలి, భగవంతుడు లేక ప్రభువు లేదా అందమైన స్త్రీ వర్ణనలలోనే కవిత్వం ఉంటుందని ప్రాచీన కవులు భావించారు. వాటిల్లోనే కవిత్వాన్ని చూడాలి అన్నారు. అదే శ్రీ శ్రీ దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు కుక్కపిల్ల, అగ్గిపుల్ల దేన్నైనా తక్కువగా హీనంగా చూడవద్దు, అంతా కవితామయమే అన్నాడు. బల్లచెక్క, అరటి తొక్క వీటన్నిటిని కూడా కళ్ళంటూ ఉంటే చూసి, వాక్కంటూ అంటూ ఉంటే రాసి అని అన్నాడు. మళ్లీ ఎందుకు అన్నానంటే, కళ్ళతో చూడడం కళ్ళు ఉన్నా అందరూ చూడరు, కళ్లున్న కబోదులు అని కూడా అన్నారు. దర్శించడానికి హృదయం అనేది ఉండాలి.  కళ్లు, హృదయం రెండూ ఉండాలి. అపుడే తెలుస్తుంది. కాళిదాసు విషయానికి వస్తే కూడా కాళిదాసు ప్రత్యేకంగా మేఘాన్ని చూసి కవిత్వం రాశాడు. ఆయనకు ఏం కనబడింది? మనమూ చూస్తాం, మేఘాలు వస్తాయి పోతాయి. వర్షం కురుస్తుంది. మనకు తెలుసు. రైతు మేఘాలను చూస్తే వాన పడుతుంది అని చెప్తాడు. రైతు దగ్గర అంత సైన్స్ కూడా ఉంటుంది. రైతు దగ్గర అంత జ్ఞానం ఉంటుంది. వానపడితే చాలు రైతుకు. కానీ కాళిదాసు చూసినపుడు వేరుగా కనిపించింది. ఒక వియోగంలో ఉన్న భర్త తన ప్రియురాలు భార్యకు తన వియోగాన్ని ఈ మేఘం ద్వారా చెప్పడం. అదీ రామగిరి నుండి అలకాపురికే వెళ్తుంది ఆ మేఘం అనుకొని, ఓ మేఘమా నా భార్య, నా ప్రియురాలు అలకాపురిలో ఉన్నది, ఆమెకు  ఈ సందేశాన్ని తెలుపుమని, మేఘాన్ని ఒక దూతగా ఊహించడం, భావించడం కల్పన చేశాడు. కాళిదాసు గొప్ప తనానికి ఇది కారణం. ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే దూత, రాయబారం దృష్టినుండి వచ్చింది. కదిలే మేఘమనేది దూతగా రాయబారాన్ని తీసుకెళ్ళడమనే భావన దృష్టి కవి దృష్టి నుండి వచ్చింది.

అదే జాషువా వరకు వచ్చేసరికి శివుడికి చేరువగా భగవంతునికి దగ్గరగా వెళ్ళి చెప్పుకునే అవకాశం లేదు కనుక ఆయన దళితుడు కనుక భగవంతుని ఆలయంలోకి ప్రవేశం లేదు కనుక ఒక శివాలయాన్ని ఎంచుకుని ఆ శివాలయంలోని గబ్బిలాన్ని దూతగా ఎంచుకున్నాడు. పూజారి ఆలయానికి రానిస్తాడో లేదోనని గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. కాళిదాసు మేఘాన్ని భావించినట్టు జాషువా గబ్బిలాన్ని దూతగా భావించాడు. శివునికి చేరువగా ఉన్నావు కాబట్టి నా మాటను శివునికి విన్నవించు. అక్కడ మేఘం చేరవేయదు, ఇక్కడ గబ్బిలం చేరవేయదు.  పావురం చేరవేయదు. నలుడు దమయంతిల రాయబారం హంసతో చేశాడు. హంస కూడా చేరవేయదు. కవి వియోగం పొందే ప్రియుని బాధను గుడి నుంచి దూరం చేసిన దళితుని బాధను తన బాధగా స్వీకరించాడు. ఈ దృష్టి నుండే, ఈ దర్శనం నుండే కవి అవతరిస్తాడు. ఈ ఆలోచన రావడం, ఈ దర్శనం కలగడం అనేది చాలా కీలకం.

దర్శనంవల్లనే ఉత్తమ కవి కావడానికి అవకాశమున్నది. ఈ దర్శనానికి కూడా కొన్ని అంశాలు ఉన్నవి. ఆ కాలంలో అంటే ప్రతీకాలంలోనూ మనం ఔనన్నా కాదన్నాఒక తాత్వికత ఉంటుంది. 20 ఏళ్లకు కావచ్చు, 30 ఏళ్ళకు కావచ్చు  దర్శనానికి సంబంధించిన భావనలు, సూత్రాలు మారుతుంది. ఈ చూడడమనేది, దర్శనమనేది కాలాన్నిబట్టి ఉంటాయి. ఆ సూత్రాలు ఒకే కాలానికి వేరుగా కూడా ఉంటాయి. అందుకే  మనకు తెలిసిన కవులే, చాలా కరుణామయమైన కవులే వర్ణాశ్రమ ధర్మాన్ని ఉపయోగించి రాసిన కవులు ఉన్నారు. నాలుగు వర్ణాలు – ముఖంలోనుంచి బ్రాహ్మణున్ని, భుజాల్లో నుంచి క్షత్రియున్ని, ఊరువుల్లో (తొడల) నుంచి వైశ్యున్ని, పాదాల్లో నుంచి శూద్రులను సృష్టించాడని భగవంతుని రూపాలుగా చెప్పారు. ప్రతీ సమాజంలో మన మీద ఆ ప్రభావం ఉంటుంది. ఆ కాలంలో వర్ణాశ్రమ ధర్మాలు, శిక్షలు చాలా జాలిగొలిపే విధంగా ఉండేవి.  పొలం దున్నుకొని జీవించిన పోతన కూడా వర్ణాశ్రమ ధర్మాలను బట్టే అనుకూలమైన కవిత్వం రాశాడు.  ఎందుకంటే ఆ కాలంలో ఆ ధర్మం ఉన్నది. ఈ అంశాలన్నీ కవిని ప్రభావితం చేస్తూ ఉంటాయి.  అట్లానే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చూసే దర్శనాన్నిబట్టి, దానికి సహాయకారులుగా ఉండటానికి కొన్ని సూత్రాలు ఈ తాత్త్విక యోగులైనవారు, వేదాంతు లైనవారు ఏర్పరిచారు, తయారుచేశారు. అట్లాంటి దర్శనంలో వేదాంతం దర్శనమనేది ఒకటి ఉంది. చూడడం మొదలు పెట్టిన తరువాత ఈ జీవితాన్ని దర్శించాలంటే ఏమేమి దర్శనాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక వస్తువును, ఒక పువ్వును దర్శించాలన్నా, ప్రకృతిని దర్శించాలన్నా, జీవితాన్ని దర్శించాలన్నా, లోకాన్ని దర్శించాలన్నా మనం కొన్ని సూత్రాలు, నియమాలు కాలానికి అనుగుణంగా ఉంటాయి. ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉంటాయి. ఆ తరువాత కాలంలో కొన్ని ప్రశ్నలు వేస్తారు. కొన్నింటికి సమాధానాలు దొరుకుతాయి. ఈ విధమైన చర్చ కాలమాత్రంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాలం చాలా కీలకం. ఈ కాలాన్ని కవి దృష్టిలో పెట్టుకోవాలి. కవి ప్రత్యేకత ఏమిటంటే త్రికాలదర్శనం చేయటం. గతాన్ని దర్శించగలడు, వర్తమానాన్ని దర్శించగలడు, భవిష్యత్తును దర్శించగలడు. గత వర్తమాన భవిష్యత్తు కాలాలను దర్శించడం. ఎప్పుడనుకుంటే అప్పుడు గతంలోకి వెనుకకు వెళ్ళగలడు, ఎప్పుడనుకుంటే అప్పుడు వర్తమానంలో ఉండగలడు, ఎప్పుడనుకుంటే అప్పుడు ముందుకు, మునుముందుకు కూడా పోగలడు. ఈ శక్తి ఎవరికి ఉంటుందంటే ఒక కవికి మాత్రమే ఉంటుంది. వెనుకకు వెళ్ళి ‘అప్పుడు పుట్టి ఉంటే’ అని ఒక వ్యాసాన్ని రాశాడు కృష్ణశాస్త్రి. ఇందుకిదొక ఉదాహరణ.

శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నేను పుట్టి ఉంటే నేను ఎట్లా ఉండేది అని రాశాడు. వెనక్కు వెళ్ళి దర్శించి రాశాడు.  అట్లాగే శ్రీశ్రీ చాలా ముందుకు వెళ్ళి మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని రాశాడు. ఈ కవి కాలాన్ని ముందుకు తీసుకెళ్ళాడు.  వర్తమానంలో ఉంటాడా? ఆనాటి లోకంలో ఉంటాడా? అన్న అభిప్రాయాలనుబట్టి విషయాలను వర్ణిస్తాడు. ఇవి కవి ఇష్టాన్ని, ఆసక్తిని బట్టి ఉంటాయి. వస్తువును దర్శించడం, జీవితాలను దర్శించడం, కాలాన్ని దర్శించడం, సమాజాన్ని దర్శించడం, ఇవన్నింటిలోనుంచి వస్తువును తీసుకోవాలి. వస్తువు అనేది ఎక్కడ ఉంటుందీ అంటే ఎవరెన్ని చెప్పినా వస్తువు ఎక్కడ నుండి తీసుకోవాలంటే ఎవరైనా జీవితంలో నుండే తీసుకోవాలి. వాల్మీకి రామాయణంను జీవితంలో నుంచే తీసుకున్నాడు. వ్యాసుడు భారతం జీవితంలో నుంచే తీసుకున్నాడు. భారతం భూమికోసం వచ్చిన కొట్లాట, తగాదా. రామాయణం తల్లిదండ్రులకు ఇచ్చిన మాటలోంచి వచ్చిన గాధ. మాట నిలబెట్టుకోవటానికి పొందిన కష్టాలకు సంబంధించిన గాధ. ఇవన్నీ జీవితానికి సంబంధించినవి. ఇప్పటికీ బ్రతికి ఉన్నవి. జీవితంతోని సంబంధం ఉన్నవే ఉంటాయి. ఏ వస్తువు జీవితంతో సంబంధం లేకుండా ఉండదు. స్వర్గమైనా సరే, నరకమైనా సరే, ఈ జీవితం బాగు లేదనుకుని సృష్టించుకున్నారు. దర్శించుకున్నారు. చావు లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది, ఎప్పటికీ సంగీతాన్నివింటూ నృత్యం చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించుకున్నదే, ప్రతిదీ మన జీవితం నుండే దర్శించాలి. అది  ప్రాథమికమైన అంశం. జీవితం నుంచి కాలం నుంచి తీసుకున్న అంశం. ఇక రెండవ అంశం దృక్పథం.  దృక్పథం అనే మాట దర్శనం నుండి వచ్చింది. దృక్పథం చూసే విధానం ఒక పద్ధతి ప్రకారం చూడడం.   ఈ చూడడాన్ని ఒక సూత్రం అనుకుంటే అది క్రమానుగుణంగా ఉంటుంది అనుకుంటే, ఒక పద్ధతి ప్రకారంగా చూస్తే అది దృక్పథం. జీవితాలని దర్శించడానికి మనకు ఏర్పడిన దృక్పథం. అందులో భౌతిక దృక్పథం, భావవాద దృక్పథం అని  రెండు రకాల దృక్పథాలను ఏర్పర్చుకొని, నిర్వచించుకొని చెప్తారు.  మార్క్సిస్టుల ప్రకారం చెప్పేటప్పుడు దృక్పథాలు రెండు ఉన్నాయి. 1. భావవాద దృక్పథం, 2. భౌతికవాద దృక్పథం.  ఇలా ఐడియలిస్టిక్ అవుట్ లుక్, మెటీరియలిస్టిక్ అవుట్ లుక్ అనే రెండు దృక్పథాలు ఉన్నాయి. దర్శనాల దగ్గరికి వచ్చేసరికి వేదాంత దర్శనం ఉంది మనకు. సంస్కృతంలో దర్శనం ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. భారతీయ తత్త్వవేత్తలలో దర్శనం అనే మాట ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. ఇటువంటివి నాలుగైదు పైన దర్శనాలు మనకు కనపడతాయి. ఆ సూత్రాలకు అనుగుణంగా అందులో ఉండే ధర్మాలను తీసుకోవడం. అందుకే మనకు మొదటిది వైదిక దర్శనం, రెండవది బౌద్ధ దర్శనం, మూడవది చార్వాక దర్శనం. ఏమిటి ఈ వైదిక దర్శనం అంటే వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పబడిన అంశాలను ఆ నియమాలకు అనుగుణంగా, ఆ సూత్రాలకు అనుగుణంగా అందులో ఉండే ధర్మాలను తీసుకోవడం, చూడడం. వేదాలు, ఉపనిషత్తులలో చెప్పినదానినిబట్టి జీవితాన్నిఅర్థం చేసుకోవడం. ఈ జీవితాన్ని అర్థం చేసుకునేటపుడు జీవితానికి పునర్జన్మ ఉంటుంది. ఎవరైనా చనిపోతారు, ఎవరికైనా పునర్జన్మ ఉంటుంది. ఇది ఒక సిద్ధాంతం. దీన్ని ఏమన్నారు? కర్మసిద్ధాంతం అన్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసే కర్మవల్లనే నీకు మానవ జన్మ వస్తుందా, ఇంకో జన్మ వస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి పాపం, పుణ్యం అనేవి కర్మలు వాటి కర్మ దేన్నిబట్టి ఆధారపడి ఉంటుందంటే ధర్మాన్నిబట్టి. పాప పుణ్యాలనుబట్టి నీకు జన్మ వస్తుంది అని చెప్పేది కర్మ సిద్ధాంతం. పుణ్య కర్మలు చెయ్యమని చెప్పేది వైదిక ధర్మం, ఇది వైదికదర్శనం లేదా వేదాంత దర్శనం. హిందువులు భారతీయులు ఎక్కువగా నమ్మే సిద్ధాంతం. ఈ జీవితమనేది అంతరించదు. ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మ ఇంకో శరీరాన్ని వెతుక్కుంటుంది. రాబోయే కాలంలో ఇంకో జన్మ ఎత్తుతావు, కాబట్టి పునర్జన్మ వస్తుంది.  ప్రతిదీ జీవితం నుండే ఆలోచించాలి. ఈ జీవితం అంతరించదు. ఈ జన్మలో చేసే పాప పుణ్యాలనుబట్టి జీవితం వస్తుంది. నువ్వు పాపం చేస్తే ఫలానా అయి పుడతావు, పుణ్యం చేస్తే ఫలానా అయి పుడతావు అని వైదిక భావాల్లో కీలకమైనవి. వర్ణాశ్రమ ధర్మాలలో 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, కత్రియ, వైశ్య, శూద్ర. తరువాత పంచములు. పంచమ జాతి, పంచమవర్ణం. కాబట్టి ఈ నాలుగు వర్ణాలకు, ధర్మాలు నిర్ణయించారు. వాటికి అనుగుణంగానే ఉండాలి అనే చెప్పే తత్త్వం,  సిద్ధాంతం ఏదైనా ఉంటే అది వైదిక దర్శనం. ఇందులో ఆధిక్య వర్ణాలు , తక్కువ వర్ణాలు అనేవి ఉంటాయి. కర్మసిద్ధాంతం, వైదిక మతం. వర్ణాశ్రమ ధర్మం. వీటి ప్రకారంగా జీవితాన్ని దర్శించడం.  రెండవది బౌద్ధ ధర్మం. వీళ్ళు కొంచెం దీన్ని ఖండించారు.  పునర్జన్మ ఉండదు. విగ్రహారాధన ఉండదు. జీవితంలో మంచి చెడు ఉంటుంది. నీవు ఉన్నంత కాలం ధర్మమయంగా సహప్రాణుల పట్ల దయగలిగి ఉండాలి. ధర్మంగా ఉండాలి. అదే నీకు ఆత్మ తృప్తిని ఇస్తుంది.  అత్యాశకు పోతే నష్టపోతావు. కాబట్టి నీవు ఎంత కోరికలు తగ్గించుకొంటే అంత మంచిది. కోరిక దుఃఖానికి కారణం- సంతృప్తికరంగా జీవిస్తే మంచిది.  చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని నువ్వు అర్థం చేసుకోవడం చాలా కీలకం అన్నారు. ప్రకృతిని అర్థం చేసుకోవడం  జీవితాన్ని అర్థం చేసుకోవడం, ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం. లుక్ అట్ ది థింగ్స్ వాట్ దే ఆర్. ఇది విపశ్యన దృష్టి.  వస్తువు ఎలా ఉందో అలాగే ఉంటుంది.  ప్రకృతి అనేది బౌద్ధ దర్శనలో కీలకమైనది. ప్రకృతి ఎట్లా నడుస్తుందో అట్లా నడిస్తే శాంతిని పొందుతావు. ప్రకృతిని   దర్శించి, అర్థం చేసుకున్నదే జ్ఞానం. దానితో సఖ్యత పెంచుకోవడం ద్వారానే జీవితానికి శాంతి, సార్థకత చేకూరుతుంది ఇది బౌద్ధ దర్శనం మూడోది హేతువాద దృష్టితో ఉండేది చారువాక దర్శనం – జీవితాన్ని ప్రత్యక్ష అనుభవం నుంచి దర్శించడం. ఏ పదార్థం శాశ్వతంగా ఉండదు. నశించక తప్పదు. అన్నీ నశిస్తాయి. ప్రపంచాన్ని సత్యప్రమాణాల నుంచి అర్థం చేసుకోవాలి. జీవితం జీవించటానికే. ఉన్నన్ని రోజులు ఆనందంగా జీవించాలి. హేతుబద్ధంగా ఉండేదే చార్వాక దర్శనం. తరువాత ఆధునికకాలంలో ఆధునిక దృష్టితో వచ్చింది స్వభావ వాదం పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది.  ప్రకృతిని అర్థంచేసుకొని ప్రకృతితో సఖ్యతతో జీవించడం. నీవు అర్థం చేసుకోవడంలోనూ,  నీదైన ప్రయత్నంతోనూ ఉండాలి. నాచురల్ ఫిలాసఫి ఏదైతో ఉందో దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం – ప్రకృతి తత్వాన్ని దర్శించడం. జీవితానికి అన్వయించుకోవడం.  జీవిత తత్త్వాన్ని స్వీకరించే సిద్ధాంతం.  అది ఏ పదార్థం ఏదీ శాశ్వతంగా ఉండదు. తరువాత వచ్చిన సిద్ధాంతం మార్క్సిస్టు సిద్ధాంతం. ప్రపంచంమంతా విస్తరించిన  సిద్ధాంతం.

అందరూ ఒకేరకంగా లేరు.  అంతరాలు, అసమానతలు మనం సృష్టించుకున్నవే. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భావం సరైంది కాదు.  ఈ లోకంలో ఏ వస్తువు కూడా అంతరించదు. అది రూపం మారుతుంది. మరణించిన తరువాత శరీరం కాలుతుంది. బూడిదవుతుంది. మట్టిలో మట్టిగా మారుతుంది. పరిణామమే శాశ్వతం.  కాలిపోవచ్చు. పదార్థం మారుతుంది తప్పా అంతరించదు. పరిణామక్రమంలో మారుతుందే తప్పా నశించదు అంటుంది మార్క్సిస్టు సిద్ధాంతం.  ఇది సైన్సుకు సంబంధించిన చలన సూత్రాలమీద నిర్మించబడింది. గతి తర్కం మీద ఆధారపడి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం గతి తార్కిక భౌతికవాదం.  రెండోది చారిత్రక భౌతిక వాదం.  చారిత్రక దృక్పథంతో చెప్పింది.  కొందరు రాజులుంటారు. కొందరు పనిసేవారుంటారు. పనిచేసే వారి శ్రమమీదనే రాజులు బతుకుతారు, పనిచేయకుండా బతుకుతారు. రెండే తెగలు ఉంటాయి.  ఒకటి ధనిక తరగతి, రెండవది శ్రామిక తరగతి. దీనికి వర్గం అని పేరు.  క్లాస్ – వర్ణం కాకుండా వర్గం అనడం. వర్గ దృక్పథం. అన్ని దృక్పథాలను సమూలంగా మార్చివేసింది ఈ మార్క్సిస్టు తత్త్వం. మార్క్సిస్టు భావజాలంతో అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించాయి. మార్క్సిస్టు దృక్పథంలోంచే సాహిత్యాన్ని, కవిత్వాన్ని సృష్టించడం మొదలైంది. సమాజంలో  వర్గాలుంటాయి, ఒక వర్గం పని చేస్తుంది. మరో వర్గం పనిని దోచుకుంటుంది. పని ద్వారా వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తుంది. సంపదగా మార్చుకుంటుంది. అసమానతలు సృష్టిస్తుంది. శ్రమదోపిడీ, అసమానతలు లేని సమ సమాజాన్ని స్థాపించడం మార్క్సిస్టు సిద్ధాంతం.  సమాజంలోని వ్యత్యాసాలను పోరాటం ద్వారానే పోగొట్టగలం అని విశ్వసిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్క్సిస్టు దృక్పథానికి ఆదరణ ఏర్పడింది. ఈ దృక్పథం కవులకు ఇన్ స్పైరింగ్ గా ఉండేది. కాబట్టే కవిత్వం అట్లా వచ్చింది. ఈ సమసమాజ దృక్పథం ప్రపంచ  భాషల్లో గొప్ప సాహిత్యం సృష్టించింది.

తర్వాత అంబేద్కర్ దృక్పథం అనేది వచ్చింది. అంబేద్కర్ వచ్చిన తర్వాత స్పష్టంగా ఏం చెప్పాడంటే వర్గం, వర్ణం వేరువేరు.  కులం భారతదేశంలో కీలకమైంది. కులం పొమ్మంటే పోదు.  కులం, వర్ణం అనేది సత్యం. ఈ సామాజిక వర్గీకరణ ఏదైతే ఉందో అది లోతుగా వేళ్లూనుకుని ఉన్నది.  సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, దీనిద్వారా వెళ్ళినపుడు మనకు స్పష్టంగా అంతరాలు అర్థం అవుతాయి.  భావోద్వేగాలు ఈ అంతరాలను అర్థం చేసుకొనేదాన్నిబట్టి ఏర్పడుతాయ. కుల వర్ణ దృక్పథం నుంచి సమాజాన్ని చూడటమే అంబేడ్కర్ దృక్పథం. ఈ అంబేడ్కర్ దృక్పథాన్ని తెలుగు సాహిత్యంలో, భారతీయ సాహిత్యంలో దళితవాద దృక్పథం అంటారు. ఈ దళితవాదంలో కులం ప్రధాన పాత్ర

వహిస్తుంది.  కులం నేపథ్యంలో విషయాలూ అర్థం చేసుకోవడం, శ్రమను అర్థం చేసుకోవడం, శ్రమదోపిడీని అర్థం చేసుకోవడం, వివక్షను అర్థం చేసుకోవడం అంబేడ్కర్ తీసుకొచ్చిన ఆలోచన. అంబేడ్కర్ దృష్టికోణంలో వివక్ష అనేది చాలా కీలకం. ఈ అగ్రవర్ణాలు ఎప్పడూ  వివక్ష పాటిస్తారు.  వివక్ష, అణచివేత, ఈ అంతరాలు వీటన్నింటినీ చర్చించిన దృక్పథం. ఇది అంబేడ్కర్ ఆలోచనా విధానం. ఇది దళిత దృక్పథం. అట్లానే తదనంతర కాలంలో తెలుగు సాహిత్యంలో వచ్చినది జెండర్ ఔట్లుక్. జెండర్ దృక్పథం.  కేవలం వర్గంతో చూసినంత మాత్రాన అర్థం కాదు, కులంతో చూసినంత మాత్రానా అర్థం కాదు. జెండర్ అనేది కూడా ఉన్నది.  కులం, వర్గం, వర్ణం ఈ మూడు కాక లోకంలో ఏముందంటే లింగ (జెండర్) వివక్ష. స్త్రీ పురుషుల మధ్యన అన్ని భేదాలతోపాటు ఈ జెండర్ వివక్ష కూడా ఉంది. దీన్ని జెండర్ సిద్ధాంతం, జెండర్ థియరీ అన్నారు.  స్త్రీలు వర్గము వివక్షకు గురవుతున్నారు. స్త్రీలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు.  సమాజాన్ని జెండర్లోంచి చూసేదే  స్త్రీ వాదం అన్నారు. సార్త్రే ఏ వస్తువును సమగ్రంగా చూడడం సాధ్యం కాదు అని అన్నారు కదా. ఆ వస్తువును చూస్తున్నపుడు వ్యూ పాయింట్ అవసరం. ఏ పాయింట్ దగ్గర నుంచి చూసినపుడు ఆ వస్తువు అదే కోణంలో కనబడుతుంది. దాని అవతలి కోణం అర్థం కాదు.  స్త్రీల అస్తిత్వ

వేదనను వారి కోణంలోంచే చూడాలి. అట్లా జెండర్ దృష్టికోణం నుంచి స్త్రీవాద కవిత్వం వచ్చింది.  స్త్రీ ల బాధను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు స్త్రీ అయితే తప్ప అర్థం కాదు, స్త్రీ అయితే తప్ప రాయలేరు. దళితులైతే తప్ప దళితుల బాధ అర్థం కాదు, దళితులయితేనే ఆ బాధ రాయగలరు  అనే వాదం వచ్చింది.

ఇక మైనారిటీ దృక్పథం – మైనారిటీ వాదం

తక్కువ మతస్తులైన వారి దృష్టి నుండి చూస్తే తప్ప మెజారిటీ మతం మైనారిటీవారిని అణచివేస్తున్న తీరు, దానిలో ఉన్న సమస్యలు తెలుసుకోలేము. ముస్లింలు అనుభవిస్తున్న వివక్ష నుంచి మైనారిటీ దృక్పథం వచ్చింది. ముస్లింల అస్తిత్వ సమస్యలను మైనారిటీ మతం చర్చిస్తుంది. ఇప్పటికీ సమాజం సమగ్రంగా అర్థమైందా అంటే ఇప్పటికీ సమగ్రంగా అర్థం అయినట్టు కాదు.  తెలుగు సాహిత్యం పరిశీలించినట్లయితే మరో దృక్పథం ప్రాంతీయత, రీజనల్ ఔటులుక్, ప్రాంతీయ దృక్పథం.  వర్ణము ఒక కోణం మాత్రమే చూపింది. వర్గం ఇంకో కోణం మాత్రమే అర్థం చేయించింది.  కులం ఇంకో ఒక కోణాన్ని అర్థం చేయించింది. జెండర్ ఒక కోణాన్ని అర్థం చేయించింది. ఈ మైనారిటీ మెజారిటీ కూడా మరో కోణాన్నేఅర్థం చేయించింది. ప్రాంతీయ ఆధిపత్యం ప్రాంతీయ దృక్పథం తో చూసినపుడే అర్థం అవుతుంది. తెలంగాణవాదం ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యాన్ని సృష్టించింది.

రీజనల్ దృష్టితో చూసినప్పుడే అభిృద్ధి అసమానతలు, వివక్ష ఆత్మగౌరవం అర్థమ వుతుంది. ముఖ్యంగా తెలంగాణవాదం, తెలంగాణ దృక్పథం ప్రాంతీయ  అస్తిత్వ నిర్మాణంలో చాలా కీలకంగా పనిచేసింది. అక్కడి ప్రజలు వేరు, ఇక్కడి ప్రజలు వేరు. అక్కడి పాలకులు ఇక్కడి పాలకులు వేరు వేరు. ఆధిపత్యం అనేది అనేక రూపాల్లో ఉంటుందని అర్థమయింది. ఈ ఇద్దరి మధ్య అంతరాలు ఉంటాయని తెలిసింది. వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధి చెందిన ప్రాంతం తేడాలుంటాయి. రెండు ప్రాంతాల అగ్రవర్ణాల నడుమ, రెండు ప్రాంతాల దళితుల నడుమ అంతరాలు ఉన్నాయని నిరూపణ అయింది. ఉదాహరణకు తెలుగు భాష. ఒకే భాష అయినా ఆధిపత్య ప్రాంతాలవారు మాట్లాడే భాష ఎక్కువ అని, ఈ వెనుకబడిన ప్రాంతంలోవారు మాట్లడే భాష తక్కువ అనే భావన వుంది. అది ఎక్కడిదాకా వచ్చిందంటే, ఇక్కడి ప్రజల భాషను అవమానించేదాకా పోయింది. అది తెలుగే కాదన్నారు. ప్రాంతీయ కవిత్వాన్ని ఆధిపత్య ప్రాంతంవారు శిల్పం లేదని కొట్టి పారేశారు.  అంటే ఒక దృక్పథంతో ఉంటే తప్ప ఇన్ని కోణాల నుంచి చూస్తే తప్ప, సమగ్రంగా అర్థం కాదు. సార్త్రే అన్నట్టు కుడి నుంచి చూస్తే ఒక రకంగా కనపడుతుంది, ఎడమ నుంచి చూస్తే ఒక రకంగా కనబడుతుంది. పై నుండి చూస్తే ఒక తీరు. నేరుగా చూస్తే మరో తీరు. ఎట్లా చూసిన వస్తు సమగ్ర దర్శనం కాదు అనేది ఏదైతే ఉన్నదో దర్శన పద్ధతుల్లోకి ఇంకో కొత్తకోణం వచ్చింది. అదే ప్రాంతీయత. రకరకాల వివక్షలనేవి ఉన్నవి. మనం చూసే చూపులో ఉంటుంది.  ఎందుకు చూడాలి అంటే లోకం అనేటువంటిది ప్రశాంతంగా సౌందర్యంగా ఉండాలంటే వివక్షలు, అసమానతలు, అణచివేతలు పోయిప్పుడే సాధ్యమవుతుంది. ఒక ఫోటోగ్రాఫర్ దృష్టి అయినా ఒక కళాత్మక దృష్టి అయినా సాపేక్షకు, అందంగా ఉన్నదని నువ్వు చూసేది, దృష్టిని బట్టే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఫోటోగ్రాఫర్ కనుక కళాత్మకంగా తీయకపోతే ఆ కోణం మనకు ఆవిష్కారం కాదు. ఒక ఫోటోగ్రాఫర్ ఒక గ్రామీణుడైతే అక్కడ గోడకు వేసిన జాజు రంగులో ఉన్న అందాన్ని చూడగలడు. నా చిన్నప్పుడు జాజు రంగును మట్టి గోడలకు వేసేవారు. ఈ జాజు రంగు కూడా అందాన్ని ఇస్తుందని ఎప్పడు తెలుస్తుంది అంటే, ఆ ప్రాంత గ్రామీణుడైతేనే ఇది తెలుస్తుంది. ఒక ప్రాంతీయ దృక్పథం, ఒక దళిత దృక్పథం. కిందిదాకా పోయి చూడగలిగినపుడు మాత్రమే, కింది దాకా సాహిత్యం వెళ్ళినపుడు మాత్రమే తెలుస్తుంది. అద్భుతమైన ఒక పువ్వునో,  ఒక ఇంద్ర ధనస్సునో అందంగా భావిస్తారుగానీ మన తెలంగాణ గ్రామంలో ఉండేటువంటి జాజురంగు గోడ కూడా అందంగా ఉంటుందని ఆ ప్రాంతీయ ఫోటోగ్రాఫర్ అయినపుడు, భరత్ భూషణ్ వంటివాడు తీసినపుడు ఈ సాంస్కృతిక సౌందర్యం అర్థమవుతుంది.

బతుకమ్మ పండుగను ఒక పండుగనే కాదు అని అన్నవారు ఉన్నారు. అందులో ఏం సౌందర్యం ఉన్నదని అన్నవారు కూడా ఉన్నారు. తంగేడుపువ్వు అందంగా ఉంటుందా? గునుగు పువ్వు అందంగా ఉంటుందా? అందులో ఏ కళ ఉన్నదని అన్నారు. కానీ గునుగు పువ్వు, తంగేడు పువ్వులను కూడా అందంగా పేర్చవచ్చు, కళాత్మకంగా పేర్చవచ్చు అని చెప్పేదే ప్రాంతీయత.  ప్రాంతీయ దృక్పథంతో  సాంస్కృతిక భావోద్వేగంతో చూసినపుడు తంగేడు పువ్వు అందంగా కనిపిస్తుంది. అందుకే కళాకారుడు లోతుగా చూడాలన్నప్పుడు ఈ అన్ని దృక్పథాలను తెలుసుకొని ఉండాలి. ఈ కళాత్మకత ఏదైతే ఉన్నదో, ఈ సౌందర్య దృష్టి ఏదైతే ఉన్నదో చూసే దృష్టినిబట్టి మారిపోతుంటుంది. ఈ సౌందర్య దృష్టి లోతు గ్రహించగలిగి నప్పుడే ఆవిష్కారంచేసే శక్తి కవికి ఒనగూడుతుంది. కవితాత్మక కోణం నుండి ఆవిష్కరించాలి. కవికి కవితాత్మక దృష్టి ఉన్నప్పుడే ఇది వస్తుంది. అందుకే ఏది అందం అన్నప్పుడు, అందానికి ప్రమాణం ఏమిటి అన్నప్పుడు  ఒక పెద్దాయన ఏమని నిర్వచించాడంటే ప్రమాణం అన్నప్పుడు  మాటిమాటికి ఏదైతే చూడాలనిపిస్తుందో అది అందం అన్నాడు. అది పుష్పమే కావచ్చు, మాటి మాటికి నిన్ను ఆకర్షిస్తుందంటే, నువ్వు మరిచిపోలేనిది, నిన్ను వెంబడించేది ఏదైతే ఉన్నదో అదే అందం. నేను అందంగా లేనా అని అంటే అది అందం కావచ్చు,  కాక పోవచ్చు. ఇప్పుడు అందానికి కూడా కొలతలు వచ్చినవి.  ప్రపంచంలోనే ఇవాళ అందానికి కొలతలు వచ్చింది మనం చూస్తున్నాం. కొలతలతో అందాన్ని నిర్వచిస్తున్న పద్ధతి వచ్చింది. కానీ నిజమైన కళాకారుడు కొలతలతో అందాన్ని నిర్దేశించడు, చూడడు, కొలతలతో చెక్కిన శిల్పం అతిలోక సౌందర్యమే, అది మాట్లాడకపోతే, నవ్వకపోతే నిజమైన అందాన్ని చూడలేము. నిజమైన భావోద్వేగం కలగదు. నిజమే. శిల్పము అందమైనదే. శిల్పి గొప్పవాడే. జీవకళ లేకపోతే అది ఆకర్షించదు. రంభను మనం చూడలేదు. ఊర్వశిని మనం చూడలేదు. ఊర్వశిని, రంభను అందంగా చిత్రీకరించారు. ఈ చిత్రీకరణలతో మనకు తెలిసింది వారు అందంగా ఉన్నారని. అందానికి ప్రతీకగా ఉన్నారు. నవ్వకపోతే, ఏడ్వకపోతే, భావోద్వేగాలు లేకపోతే,ఈ రసాత్మకత, ఔచిత్య గుణాది పద్ధతులు లేకపోతే శిల్పం కంటే మనిషి గొప్ప అని ఒప్పించలేము. గురజాడ కొయ్యబొమ్మను మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా అన్నాడు. నిజమైన కళాత్మకత ఎక్కడ ఉంటుందంటే జీవితంలో ఉంటుంది ప్రాణంలో ఉంటుంది.

శిల్పం యొక్క గొప్పతనం ఎంత కాలం రాస్తారు, ఎంత రాసినా తరగిపోని జీవన సౌందర్యం బతుకులో ఉన్నది. ఒకరిని పోలి ఇంకొకరు ఉండరు. ఒకరు నవ్వినట్టు ఇంకొకరు నవ్వరు. కవి ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. ఆ వస్తువును దర్శిస్తాడు అప్పుడే వర్ణిస్తాడు. కవి దృష్టి బలమైందా కాదా అనే చర్చా మళ్ళీ కాలం మీద ఆధారపడి ఉంటుంది. పాత ఉపమానాలతో అందం బోధపడే అవకాశం లేదు. ప్రాచీన కవిసమయాలు అందాన్ని వర్ణించలేకపోవచ్చు. కవిత్వం ఎప్పటికప్పుడు నిత్యనూతనం అన్నారు. పర్వతాలు ఎత్తైన ఆకాశాన్ని ముద్దుపెట్టుకుంటున్నవని అన్నారు.  ఈ మాట మనకు చాలా పాతది. ఇదే విషయాన్ని కాళిదాసు  ఎప్పుడో చెప్పాడు. అలకాపురి పట్టణంలో ఉండేటటువంటి సౌధాలు ఎత్తయినవి అ సౌధాలు ఆకాశాన్ని ముద్దు పెట్టుకొంటున్నాయని కవి వర్ణించాడు. ఎత్తులో ఉంటాయి. అంటే ఇక్కడ ప్రేమను చెప్పడం. రెండవది అంత ఎత్తుగా ఉన్నవని చెప్పడం చెప్పవచ్చు. అట్లాగే పర్వతాన్ని మరొక వ్యక్తి వర్ణించేప్పుడు ఊహ మారిపోవచ్చు. ఒక సంస్కృత అలంకారికుడు  పర్వతాలు దుఃఖిస్తున్నాయి. ఎందుకు దుఃఖిస్తున్నాయని వర్ణించాడు. భూమిలాగా పరుచుకొని లేనందుకు, ఆకాశంలాగా ఎత్తుగా లేనందుకు దుఃఖిస్తున్నాయి.  అంటే పర్వతాన్ని చూశాడు. గొప్పగా ఆవిష్కరించాడు. శ్రీశ్రీ పర్వతాన్ని వర్ణించవలసి వస్తే, విశాఖపట్టణంలోని పర్వతాన్ని వర్ణించినపుడు కరికళేబరంవలె కదలకుండా ఉన్నది కొండ అన్నాడు. ఏనుగు చనిపోతే కళేబరం పడిపోతే ఎట్లా ఉంటుందో పర్వతం అట్లా ఉన్నది అనడం. చూడడమే, దర్శనమే. పోయెటిక్ విజన్.  ఇది అందరిలో ఉంటుంది.  ఇన్నిరకాల తేడాలు ఉండే అవకాశం ఉన్నది.  కాబట్టి వీటిని దర్శించగలగడం. ప్రతి వస్తువును ఆ కాలానికి అనుగుణంగా, మన దృక్పథానికి అనుగుణంగా స్వీకరించి, దర్శించినపుడు వ్యక్తీకరించినప్పుడు అది ఎక్కువ రాణించడానికి ఇతరులను ఆకర్షించడానికి అవకాశమున్నది. కవికి తప్పనిసరిగా ఊహా దృష్టి ఉండాలి. ఏ కవైనా గొప్ప కవి కాదలచు కున్నప్పుడు తప్పనిసరిగా గొప్ప దృష్టి ఉండాలి.  ఈ విధమైన గొప్ప దృష్టి లేకపోతే, ఒక మహత్తరమైన దృష్టి లేకపోతే గొప్ప కవిగా అతను వెలుగలేడు. గొప్ప తత్వ దర్శనం ఉన్నప్పుడు మాత్రమే, భౌతిక దర్శనంతో తత్వ దర్శనం, కళా దర్శనం  జోడించి చూసినప్పుడే  ఆ వస్తువు తత్త్వాన్ని, స్వభావాన్ని మొత్తం గుర్తించగలుగుతాడు. కళాత్మకంగా ఆవిష్కరించగలుగుతాడు. ఆ ఉత్తమోత్తమమైన దర్శనం ఉత్తమ సాహిత్యం సృష్టించ గలుగుతుంది.

కరోనా మీద వేల కవితలు వచ్చినవి. ప్రపంచ వ్యాప్తంగా లక్షలలో వచ్చినవి. కానీ కరోనామీద ఎవరి ప్రత్యేకతతో వారు రాశారు. దర్శనం ఎట్లా ఉంటుందో, ఎట్లా చూడగలమో అట్లా రాశారు. ఎంత గొప్పగా, లోతుగా, భిన్నంగా, కొత్తగా చూడగలమో అట్లా కావ్యాన్ని రచించాలంటే గొప్పతత్త్వదర్శనం ఉండాలి, దర్శనం, దృక్పథం రెండూ ఉన్నప్పుడు కవిత్వానికి ఎక్కువ సొగసు, శక్తి, బలం రావటానికి అవకాశమున్నది,  ఈ ఆలోచనలు కొన్ని నావి, కొన్ని ఇతరులవి కలిపి ఈ విషయాలన్నీ ఒక్క దగ్గరగా చేర్చి మీ ముందు ఉంచడానికి నాకు ఒక అవకాశం కలిగింది.  దీనిమూలంగా నేను ఇపుడు ప్రత్యేకంగా చాలా చదివాను. ఇది చాలా కీలకమైన అంశమే గాని చాలా తక్కువ మ్యాటర్ ఉన్నది. అట్లా చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న అంశంగా భావిస్తున్నాను. కవులు ఈ భావుకత్వ దృష్టిని కళాత్మక దృష్టిని అలవరచుకుంటారని కోరుకుంటున్నాను.

-నందిని సిధారెడ్డి

June 23, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ కవయిత్రులు

by Dr. Sujatha Reddy Mudiganti June 23, 2021
written by Dr. Sujatha Reddy Mudiganti
తెలంగాణ కవయిత్రులు

` డా॥ ముదిగంటి సుజాతారెడ్డి

తెలంగాణ నేలలో ఎందరో వీరవనితలు, విదుషీమణులు జన్మించారు. సమ్మక్క సారలమ్మలు తమ భూములను గుంజుకునే కాకతీయుల సైన్యాన్ని కదనరంగంలో ఎదిరించి పోరాడారు. రాణి రుద్రమ శత్రువులనెదిరించి కత్తిసాములు చేసి శత్రువులను పారద్రోలింది. తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ స్త్రీలు కొడవళ్ళు, రోకళ్ళు కారంపొడులతో దుండగులనెదరించి ధైర్యసాహసాలు చూపించారు. ఇక కవిత్వం అల్లడంలో ఏమీ వెనుకబడిలేమని తమ పదాలు పాటలతో నిరూపించారు. పలకా బలపం చేతికి రాని కాలంలో చదువు విజ్ఞానానికి దూరమైన దూరంగా వుంచబడిన స్త్రీలు తమ సృజనాత్మకతను చావనియ్యలేదు. ఏ పని చేస్తే ఆ పనికాడ కవిత్వం కట్టారు. తమ భావోద్వేగాన్ని వెల్లగక్కుతూ తమ కథన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ మౌఖికమైన కవిత్వాన్ని సృష్టించారు.

నాట్లు పెడ్తున్నా, కలుపు తీస్తున్నా తమ కవితా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పాటలు కట్టారు. విసుర్రాయి విసురుతూ, ధాన్యం దంచుతూ పదాలు రచించారు. భక్తిపాటలు పాడారు. మంగళారతులు, జోల పాటలు పాడారు. పెండ్లిపాటలు సృష్టించి కమ్మని గొంతులతో పాడారు. బొడ్డెమ్మ పాటలు బతుకమ్మ పాటల సృష్టికి అంతే లేకుండా రచించారు. రామాయణం పురాణాల కథలను మంచి కథనాత్మకంతో పాటల కావ్యాలు రచించారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకున్నా  రాజాస్థానాలు వాళ్ళను గౌరవించకున్నా సన్మానాలు చేయకున్నా స్త్రీలు తమ కవితాశక్తిని పదాలు పాటలు రూపంలో రచించి అనంతమైన సాహిత్యాన్ని సృష్టించారు. మౌఖికమైన ఆ సాహిత్యం ఆధునిక కాలంలో కొంత నశించినా పరిశోధకులు సేకరించిన స్త్రీల పాటలు పదాలు కొన్నయినా మనకు లభిస్తున్నాయి. తెలంగాణ స్త్రీల సృజనాత్మక శక్తిని కవితా రచనా ప్రావీణ్యాన్ని తెలియచేస్తున్నాయి. వేదాలూ మౌఖికంగానే నిలిచిన సాహిత్యం. స్త్రీల కవిత్వం కూడా ఆ విధంగా మౌఖికంగానే నిలచిన సాహిత్యం.

ఇక తాటాకులు ఘంటాలు రావటం అక్షర రచన కొనసాగినప్పుడు కూడా స్త్రీలు తమకు దొరికిన అవకాశాలను విడిచిపెట్టుకోకుండా రచనలు చేసారు. కావ్యాలు రచించారు. అట్లా తెలుగులో మొదటి పద్య రచన చేసిన కవయిత్రి విరియాల కామసాని కన్పిస్తున్నది. క్రీ.శ.1000లో అంటే నన్నయ మహాభారత రచనకు 50 సంవత్సరాలు పూర్వం గూడూరు శాసనాన్ని విరియాల కామసాని వేయించింది. ఈ శాసనకాలం గురించి అభిప్రాయ భేదాలున్నాయి. కాని క్రీ.శ.1000 అని ఎక్కువమంది అంగీకరించారు.

తన భర్త ఎర్రభూపతి వీరమరణం పొందగా తాను ముందుకువచ్చిన రాక తప్పని కారణంగా చిన్న పిల్లవాన్ని కాకతి సింహాసనం మీద కూర్చోబెట్టి కాకతీయ వంశాన్ని నిలిపిన ధీరవనిత, పాలనాధ్యక్షురాలు, రాజనీతి తెలిసిన స్త్రీ మూర్తి విరియాల కామసాని. ఆ విషయాన్ని కామసాని ఈ శాసనంలో చెప్పింది. మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలలో వున్న ఈ శాసనాన్ని ఆమె రచించిందని చెప్పాలె. రూపకోత్ప్రేక్షాలంకారాలతో చక్కని పదాల కూర్పుతో వున్న ఈ పద్యాలు కామసాని కవితా రచనా సామర్థ్యానికి నిదర్శనాలుగా  నిలిచివున్నాయి.

అద్దంకి శాసనం బెజవాడ శాసనాలను తూర్పు చాళక్యుల సేనాని పండరంగు వేయించాడు. శాసనం వ్రాసినవాళ్ల పేర్లు లేవు కాబట్టి ఆ శాసనాలను పండరంగుయే రచించాడని నిడదవోలు వేంకటరావుగారన్నారు. అదే విధంగా కవి పేరు లేని గూడురు శాసనాన్ని విరియాల కామసాని రచించిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనాలి.

రంగనాథ రామాయణం రచించిన గోనబుద్ధారెడ్డి కూతురు. కాకతీయ రాజుల సామంతులైన మల్యాల వారి కోడలు కుప్పాంబిక బూదపుర శాసనం వేయించింది. అయ్యలరాజు తన పద్య సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాన్ని ఒకటి ఇచ్చాడు ` ఆమె కాలం క్రీ.శ.1230`1300.

వనజాతాంబకుడేయు సాయకములన్‌ వర్ణింపగా రాదు నూ

తన బాల్యాధిక యవ్వనంబు మదికిన్‌ ధైర్యంబు రానీయద

త్యనురక్తిన్‌ మిము బోంట్లకున్‌ దెలుప నాలో సిగుమై కోదు పా

వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్‌ తుదల్ముట్టునే

నేర్పుగల కవి వ్రాసిన పద్యం కన్నా తక్కువేం లేదు కుప్పాంబిక పద్యం. ఇది కావ్యంలోని నాయికా విరహతాపాన్ని  వర్ణించే పద్యం. దీన్ని బట్టి కుప్పాంబిక ఏదైనా కావ్యం రచించింది కాబోలు.

కాకతీయ రెండో ప్రతాపరుద్రుని ప్రియురాలు మాచల్దేవి విదుషీమణి అని క్రీడాభిరామంను బట్టి తెలుస్తున్నది. ఆమె తప్పక కవిత్వం వ్రాసి వుంటుంది. కవయిత్రి మొల్ల ఓరుగల్లు నివాసి. రెండో ప్రతాపరుద్రుని  ఆస్థానంలో వున్నదని ‘‘ప్రతాప చరిత్ర’’ చారిత్రక కావ్యం చెప్తున్నది. మొల్ల పోతనకు సమకాలికురాలు, లేదా కొంచెం తర్వాత వున్నదిగ చెప్పవచ్చును. ఆమె తన తండ్రి ‘‘గురులింగజంగమార్చన పరుడు ‘‘శివభక్తి నిరతుడ’’ని చెప్పుకున్న దాన్ని బట్టి ఆమె వీరశైవ కుటుంబంలో జన్మించిందని తెలుస్తున్నది. వీరశైవం తెలంగాణలో ముఖ్యంగా ఓరుగల్లులో విస్తరించి వుండిరది. వీరశైవురాలు కాబట్టే మొల్ల నిమ్నకులం కుమ్మరి కులంలో జన్మించినా పాండిత్యం సంపాదించగలిగింది. స్త్రీకి గౌరవం వుండే వీరశైవ కుటుంబంలో జన్మించడం వల్లనే ఆమె చదువుకోగలిగింది. పోతనకు, మొల్లకు కొన్ని పోలికలు కన్పిస్తున్నాయి. ఇద్దరు వీరశైవ కుటుంబంలో పుట్టి రామభక్తులైనారు. పోతన ` ‘‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట, ఇక నే పలికిన భవహరమగు…’’ నని చెప్పుకున్నట్లుగానే మొల్ల ` ‘‘చెప్పమని రామచంద్రుడు సెప్పించిన పలుకు మీద చెప్పెద, నేనెల్లప్పుడు నిహపర సాధనమిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్‌’’ ` అని నివేదించుకుంది. పోతనలాగానే ` ‘‘రామ నర పాలకుని కంఠోక్తిగా స్తుతి సేయు జిహ్వకున్‌ చిల్లర రాజలోకమును జేకొని మెచ్చగనిచ్చబుట్టునే…’’ అని పలికింది. ‘చిల్లర’ దేశ్యపదం తెలంగాణలోనే ప్రయోగంలో వుంది. ఉర్దూలోకి ప్రవేశించింది. ఒక్క రంగనాథ రామాయణంలో ఈ పద ప్రయోగం కన్పిస్తున్నది. పోతన ‘మనుజేశ్వరాథముల…’ అని ప్రయోగిస్తే మొల్ల ‘‘చిల్లర రాజలోకము..’’ అని అన్నది. గ్రంథాంకితం దృష్ట్యా ఇది గమనింపదగిన అంశం.

మొల్ల కన్న ముందు తెలంగాణలో రెండు రామాయణాలు రచింపబడినాయి. కాని మొల్ల మాత్రమే రామభక్తురాలుగా ప్రసద్ధి చెందింది. శ్రీకంఠమల్లేశుని వరం చేత కవిత్వం చెప్పగలిగానని మొల్ల చెప్పుకుంది. మొల్ల రామాయణం సంగ్రహంగా వుంది. అయినా కాలం తాకిడులకు నిలిచిందంటె ఆమె ప్రతిభ సహజ కవిత్వ నైపుణ్యం కారణాలని చెప్పాలె.

మొల్ల తన రామాయణాన్ని అయోధ్యాపుర వర్ణనతో ఆరంభించి కావ్య స్వరూపాన్ని ఇచ్చింది. మొల్ల భావాలు సరళ సుందరంగా వుంటాయి. సీత హనుమంతునితో రామునికి సందేశం పంపే ఘట్టాన్ని ఎంతో విజ్ఞతతో రమ్యంగా రచించింది. గుహుడు రాముని పాదధూళి సోకి తన పడవ ఏమౌతుందో అని భయంతో కూడిన మూఢభక్తిని మొల్ల చక్కని పద్యంలో చెప్పింది `

సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయియే

ర్పడనొక కాంతయయ్యేనట పన్నుగ నీతిని పాదరేణువి

య్యెడ వడి నోడ సోక నిదియేమగునోయని సంశయాత్ముడై

కడిగె గుహుడు రామపదకంజయుగంబు భయంబు పెంపునన్‌.

మొల్ల సరళమైన కవిత్వం సరళ స్వభావం ఈ పద్యంలో ప్రతిబించించాయి.

‘‘మధురా విజయం’’ రచించిన గంగాదేవి తెలంగాణ కవయిత్రి. ఈమె ఓరుగల్లు నివాసి. అగస్త్య పండితుని మేనల్లుడు విశ్వనాథుని శిష్యురాలు. సంస్కృతంలో మధురమైన దృఢమైన కవిత్వంతో కావ్యం రచించిన కవయిత్రి. బుక్కరాయల కొడుకు వీరకంపరాయలను వివాహమాడి విజయనగరం చేరుకున్న కవయిత్రి.  విశాలమైన సంస్కృత సాహిత్యంలో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి గంగాదేవి. ఆ తర్వాత విజయనగరం తంజావూరు ఆస్థానంలో వున్న మహిళలు రామాయణాది కావ్యాలు సంస్కృతంలో రచించారు.

తెలంగాణలో ప్రాచీన కాలంలో మౌఖికమైన సాహిత్య సృజన చేసిన పామర కవయిత్రులతో పాటు కావ్యాలు రచించిన పద్యరచన చేసిన కవయిత్రులున్నారు. 1940 దశకంలో తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో స్త్రీలు చైతన్యవంతులై అయిలమ్మ, ఆరుట్ల కమలాదేవి లలితాదేవి మల్లు స్వరాజ్యం, ప్రియంవద వంటి ఎందరో స్త్రీలు తుపాకి పట్టారు, పోరాటాలు చేసారు. గళమెత్తి పాటలు కట్టి పాడారు. బుర్రకథలు చెప్పారు. నిజాం సర్కారుని ఎదిరించారు.

నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యం అన్నప్పుడు దాన్ని సవాలుగా తీసుకొని ఆత్మగౌరవానికి పరీక్షగా భావించి తెలంగాణ వైతాళికులలో సుప్రసిద్ధులు సురవరం ప్రతాపరెడ్డి గారు ‘‘గోలకొండ కవుల సంచిక’’తో తెలంగాణ కవుల కవిత్వం ప్రచురించి కృతార్థులైనారు. ఆ సంపుటం 354 కవుల్లో దాదాపు 10 మంది కవయిత్రులున్నారు. వీరివి అన్నీ పద్య కవితలే. చదువు శూన్యమైన వాతావరణంలో పదిమంది స్త్రీలు కవిత్వం వ్రాయటం, అదీ ఉత్తమమైన ఛందోబద్ధ కవిత్వం వ్రాయటం చెప్పుకోదగిన విషయం. వాళ్ళల్లో రూస్థాన్‌పేట రత్నమ్మ, పునిగోటి ఆనందమాంబ, ఆండాలమ్మ, జ్ఞానమాంబ, సోమరాజు ఇందుమతీబాయి మొ॥న వాళ్ళున్నారు. భక్తి, దేశభక్తి, స్త్రీ విద్యకు సంబంధించిన కవిత్వం వ్రాసారు. లక్ష్మీబాయి అనే కవయిత్రి తన తండ్రి మరణ దుఃఖంతో ‘‘ఎలిజీ’’ పద్యాలతో స్మృతి కవిత్వం రచించింది. ఇదొక విశేషం. సోమరాజు ఇందుమతీబాయి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ రచించిన ‘‘ఆంధ్ర రచయిత్రులు’’ గ్రంథంలో ` ‘‘దక్కను సారస్వతరంగంలో కల్పన బాగుగా ప్రసిద్ధురాలయిన’’ కవయిత్రిగా చెప్పబడిరది. ఇందుమతి బాయి ‘గౌరి’ అనే కావ్యాన్ని రచించింది.

తెలంగాణలో 1910లో ఆరంభమైన గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభలు, కాంగ్రెసు, ఆర్య సమాజోద్యమం, కమ్యూనిస్టుల పోరాటం ఆధునికతను తెచ్చాయి. ప్రజల్లో చైతన్యాన్ని జాగృతిని తెచ్చాయి. నాలుగు శాతం అక్షరాస్యత అందులో స్త్రీల అక్షరాస్యత శూన్యమనే చెప్పాలె. అటువంటి పరిస్థితులో పునరుజ్జీవనోద్యమంతో స్త్రీలల్లోను జాగృతి ప్రవేశించింది. స్వాతంత్య్రానంతరం స్త్రీ విద్య పెరిగింది. 1960లో స్త్రీలు నవలలు కథలు అధికసంఖ్యలో వ్రాస్తున్న కాలం. తెలంగాణ నుండి కూడా  యశోదారెడ్డి, నందగిరి ఇందిరాదేవి, మాదిరెడ్డి సులోచన, బొమ్మా హైమాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి కథలు, నవలలు వ్రాసి సాహిత్య  సృజన చేసారు. అప్పుడు స్త్రీలు కవిత్వం జోలికి పోలేదు. 1980, 90ల్లో స్త్రీవాదం ముమ్మరంగా సాగింది. అరసం, విరసం కాలంలోను తెలుగులో స్త్రీలు కవిత్వం వ్రాయలేదు. అస్తిత్వ ఉద్యమాలతోనే స్త్రీలు విరివిగా కవిత్వం వ్రాయటం ఆరంభమైంది. స్త్రీవాదం, దళితవాదం, ముస్లింవాదం, ప్రాంతీయ అస్తిత్వవాదం కాలంలో తెలంగాణ నుంచి చాలామంది స్త్రీలు కవిత్వం రచించారు. పురుష కవుల కవిత్వానికి తీసిపోని కవితాశిల్పం వీరి రచనలకు విశేష వ్యాప్తినీ కీర్తిని కలిగించింది. ఉత్తమమైన కవిత్వం రచించారు. మగవాళ్ళతో దీటుగా కవిత్వం రచించారని మరో వాక్యంతో సమర్థించవచ్చును.  స్త్రీవాదం ప్రతినిధిత్వం కవితాసంపుటి ‘‘నీలిమేఘాలు’’ ప్రచురింపబడిరది. దానిలో విమల తెలంగాణ కవయిత్రి ‘‘వంటిల్లు’’ కవిత అందరి ప్రశంసలను పొందింది. ఈ కవితలో ప్రతీకాత్మకత, అన్యాపదేశం వున్నటువంటి ఉత్తమ కవిత ‘‘వంటిల్లు’’. స్త్రీ అణచివేతకూ పురుషాధిక్యతకు ప్రతీకగా తీసుకోబడిరది.

‘‘మెల్లగా బాల్యపు ఛాయలు వదిలిపెడుతుండగానే

ఇక్కడే నన్ను తీర్చిదిద్దడం మొదలైంది

‘‘వంటింటితనాన్ని’’ ఇక్కడే నేర్పారు నాకు ’’

‘‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి

అయినా చివరకు వంటింటి గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే!’’

వంటింటి సంస్కృతి, వంటింటి ముచ్చట్లు

వంటలక్కలమైన మనం

మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం

గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను

ధ్వంసం చేద్దాం రండి! ’’ `

అంటుంది కవయిత్రి విమల. వంటిల్లు స్త్రీ ఇంటి చాకిరికి ప్రతీక. బయటి ప్రపంచం తెలియనితనానికి ప్రతీక. ఇంటికి బానిస బందీ అయిన దానికి ప్రతీక. ఆఖరికి స్త్రీ సంప్రదాయం పురుషాధిపత్యానికి గురయిన దానికి ప్రతీక. వంటిల్లును ఒక ప్రతీకగా చేసి స్త్రీ తరతరాల దాస్యాన్ని కవయిత్రి చాల గాఢంగా భావ తీవ్రతతో వ్యక్తం చేసింది. ఈ ఒక్క ‘‘వంటింటి’’ కవితతో విమల తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకున్నది.

అరసం విరసం కాలల నుంచే వచన కవిత్వం ఆరంభమైంది. మొదట్లో వచన కవిత్వం అంటే వచనాన్ని వ్రాసి వాక్యాలుగా వ్రాసి పాదాలుగా పేర్చటం పలుచన అయిన రచనలు చేసారు చాలామంది. తర్వాత కొంత ప్రాస అంత్యానుప్రాస చేర్చారు. ఆ తర్వాత కొంత తూగు వచ్చేట్లుగా పాదాలను పేర్చారు. కాని రానురాను వచన కవిత్వం ప్రతీకలు, భావవైచిత్రులు, భావచిత్రాలు, పదచిత్రాలు, మార్శికతలతో ఎదిగింది. ఇప్పుడు వచన కవితవో కేవలం వచనం లేదు. అర్థం చేసుకోవటానికి ఆలోచన, విషయావగాహన శక్తి అవసరం కవయిత్రులు కూడా అటువంటి భావ వైచిత్రులతో వచన కవిత్వం వ్రాస్తున్నారు. ‘‘వంటిల్లు’’ కవితతోనే తెలంగాణ కవయిత్రులు వచన కవిత్వాన్ని చిక్కగా చెప్పటం నేర్చుకున్నారు. మేమెవరికి తీసిపోము అన్నట్లుగా కవిత్వం వ్రాస్తున్నారు.

అప్పుడు స్త్రీ మీద జరిగే హింస అత్యాచారాలను గురించి ‘‘సిద్ధార్థి’’ కవితలో షాజహానా ఇలా అంటుంది `

‘‘నేనో చెట్టు కోసం చూశాను

అక్కడి కొమ్మలు నన్ను అత్యాచారం చేశాయి’’

స్త్రీల ఆంక్షలు ఇంటికి పరిమితం చేయటం కట్టుబాట్లను గురించి షాజహానా ఇట్లా అంటుంది `

‘‘ఊహ తెలియని వయస్సులో

గుమ్మానికి పరదా కడితే

రంగురంగుల కుచ్చులు చూసి మురిసిపోయేదాన్ని

అప్పుడే స్వేచ్ఛకు మొదటి బేడీ అని తెలుసుకో లేకపోయినదాన్ని `

ఎవరెస్టులాంటి చండ్రుడ్ని సైతం తాకొస్తున్న స్త్రీలను

సంసారాలనేంటి ఇంగ్లీషు ఛానల్‌ చూస్తూ ఈదుతున్న

ఈతరం స్త్రీలను చూస్తూ ఇంకా ఇంకా మౌనంగా ఉండడం నావల్ల కాదు!’’

ముస్లిం స్త్రీల సంప్రదాయపు పర్దాలను, ముసుగులను ఎదిరించడాన్ని వాళ్ళ ఆశయాలను, ఆశలను ఈ కొద్దిమాటల్లోనే షాజహానా బలంగా చాటి చెప్పింది.

సీనియర్‌ కవయిత్రుల్లో అనిశెట్టి రజిత చెప్పుకోదగిన కవయిత్రి. ‘‘గులాబీలు జ్వలిస్తున్నాయి’’ వంటి నాలుగు వరకు కవితా సంపుటాలను ప్రచురించింది. బహుజనుల స్త్రీల అస్తిత్వ వాదనను వ్యక్తీకరించిన కవయిత్రి ‘‘లచ్చవ్వ’’ అనే దీర్ఘకవితను నానీలను వ్రాసింది. తెలంగాణ కవయిత్రులు నానీలను కూడా చేపట్టి రచించారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమకాలంలో అమృతలత సంపాదకత్వంలో ‘‘గాయాలే గాయాలై’’ అనే కవితా సంకలనం వచ్చింది. దీనిలో కవయిత్రులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో కవిత్వం వ్రాసారు. దీనిలో కవయిత్రులు వ్రాసిన కవితలు భావ వైచిత్రిలో వున్నాయి. ఆమె ఇంకా కవిత్వం వ్రాసి కవితా సంపుటాలు తేవాలని ఆశిస్తున్నారు. అదే విధంగా అనిశెట్టి రజిత, డా॥ లావణ్య సంపాదకత్వంలో ‘‘జిగర్‌’’ పేరుతో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద కవితల సంకలనం వచ్చింది. ఈ విధంగా తెలంగాణ కవయిత్రులు మంచి కవితా సంకలనాలనీ తేవటం విశేషం.

డా. కొండపల్లి నీహారిణి మంచి ప్రతిభ గల కవయిత్రి. ఈమె భావవ్యక్తీకరణ కవితా శిల్పం స్వీయానుభవ పద చిత్రాలతో పదబంధాలతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఎన్నెన్నో కవి సమ్మేళనాలలో పాల్గొని విశేష ప్రాచుర్యం పొందుతున్న కవయిత్రులలో నీహారిణి ఒకరు. ‘హమ్‌ దర్దీ’ అనే కవితలో ఒక ముస్లిం స్త్రీ,  కూతురును కన్నదని ఆమె భర్త హింసించిన సంఘటనకు స్పందించి ఈ కవిత రాసినట్టు, తెలుస్తున్నది.

‘‘భూమాత ఓర్పు తడి ‘నఖాబ్‌’ వెనుక

నీ మోహపు భారాన్నిమోసి, ఆడపిల్ల రూపునిచ్చే

ఏ నిజ నిర్ధారణ లోతుల్లోనో మనసును స్కానింగ్‌ చేస్తే,

మనువాడకముందే, మనిషివని తెలిస్తే బావుండేది!

ఆనాటి ‘ఖబూల్‌ నామా’ విచ్చుకత్తుల ముళ్లుదింపె.

అబ్బాజాన్‌ అన్యాయపు తత్వానికి అమ్మీజాన్‌

అసహాయత్వానికి రుజువులేవి?

‘కూతురు నా వారసురాల’ని కన్న తండ్రిగ ఎలుగెత్తితే,

షాది ముబారక్‌ స్వరజతుల్లో ‘షాన్‌ ఎ మర్ద్‌’ నీవవుతావు.

ఆమె దర్దీ నీవై, నీ హృదయార్తి ఆమెదైతే

హమ్‌ దర్దీలున్న తల్లిదండ్రులకు నీవు పుట్టిన

‘‘ సోయి నీ కొస్తది! ’’ 2017 ఏప్రిల్‌ ‘చెలిమి’లో వచ్చిన ఈ కవిత నీహారిణి దృష్టి కోణంలో సమాజం పట్ల ఉన్న హమ్‌ దర్దీ కూడా తెలుస్తుంది. మంచి అభివ్యక్తి, మంచి ఆలోచనల మేళవింపు ఈ కవిత. నిత్య వ్యవహార భాషను అలవోకగా ఒడిసిపట్టిన కలం నీహారిణిది.

2008లో తాజ్‌ దుర్ఘటనలో చనిపోయిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (ుఱఎవం శీట Iఅసఱa) కన్సల్టింగ్‌ ఎడిటర్‌ సబీనా సెహగలం (జశీఅంaశ్ర్‌ీఱఅస్త్ర జుసఱ్‌శీతీ ూaపవవఅa ూవష్ట్రaస్త్రaశ్రీ) చనిపోయిన విషయానికి స్పందించి రాసిన కవిత, ఆనాటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ‘‘సబీనా! ఓ సబీనా!’’ అనే కవితలో ఓ సబీనా! నీ చెవుల మార్మోగిన తుపాకుల పేలుళ్ల శబ్దాలు మరిపించే… మము మురిపించే గాక కోకిలవైరా! ఫెళఫెళ ధ్వనులతో రుధిర జ్వాలల్లో నుంచి, వీణానాదానివైరా! సబీనా! సబీనా! ‘స్టిల్‌ వుయ్‌ లవ్యూ!’ అంటూ రాసిన కవిత ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఇట్లా కవిత్వంలో మలిచి ఆ ఉద్యోగిని తిరిగి రమ్మని పిలిచే నేపథ్యంలో ఆమె వీరోచిత లక్షణాలను వెల్లడిరపచేసింది నీహారిణి.

‘విలక్షణ కవి’గా జాషువాను వర్ణిస్తూ ‘‘స్వగత పరగత / భావగాంభీర్య ప్రాధాన్యతలకు / తలవొగ్గక / నీ సాహిత్య సువాసనలతో / మతులు పోగొట్టిన విశారదునివి!’’ అని అనడమైనా! ‘దార్శనికుడు’ అని కాళోజీని వర్ణిస్తూ ‘’తెలుగు తేనియలకు ప్రాంతీయ సొగసులద్ది / తెలంగాణ కొరకు తీరు తీరుగ జీవితాంతం తపియించే/ కవి అంటే ఎవరు మన కాళోజికాక ? / భావి కవులకు ఏమగునతడు దార్శనికుడు కాక?’’ అనడం మహావ్యక్తి జీవిత పరిశీలనకు పూనుకున్న కవయిత్రి అని తెలుపుతుంది.  ఈమె తన తండ్రిగారి, మామగారి జీవిత చరిత్రలను రచించిన రచయిత్రి.  ఒకరు ప్రజాసేవా రంగంలోని వ్యక్తి కాగా మరొకరు చిత్ర కళాకారులు. నీహారిణి విస్త ృత పఠనాభిలాష గల కవయిత్రిగా తెలుస్తుంది. ‘సంసారం ఓ వృక్ష రాజం’ ‘నవ నిరసనోపాఖ్యానం’ ‘గొంగట్ల మెతుకులు’, ‘ఖేల్‌ ఖతమ్‌ దుకుణమ్‌ బంద్‌’ వంటి వైవిధ్యమైన కవితలెన్నో రాసింది.

  1. అర్ర తలుపులు 2. నిర్ణిద్ర గానం, 3. ఎనిమిదో అడుగు అనే కవితా సంపుటులను వెలువరించింది.

ఈ మధ్య తెలంగాణ కవయిత్రులు మేర్స్‌ మార్గరెట్‌ కవిత్వానికి కొత్త వ్యాకరణాన్ని రచిస్తున్నది. కొత్త పదాలు మనకు తెలిసిన పదాలనే కొత్త అర్థంలో వాడటం, కొంత ప్రతీకలు, భావవ్యక్తీకరణలో నూతనత్వం కొత్త పదబంధాలతో వ్రాస్తున్నది. వివక్షకు హింసకు గురయిన సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘‘ఉలిక్కిపడుతున్న ఊరి తలుపులు’’ కవితలో ఇట్లా వ్రాసింది.

అక్కడ ప్రజాస్వామ్యం

పేరుకి కుర్చీ వేసుకొని

కులం సినిమా టికెట్లులు అమ్ముకుంటుంటే కులగజ్జికి చికిత్స

ప్రభుత్వాసుపత్రులలో కూడా దొరక్కపోగా

చూసి అయ్యో అన్నవారి మీదకే ఎగబడే

ఈ అశుద్ధ యంత్రాంగ వ్యవస్థ నిర్మాణాన్ని

మాటల్ని వ్యర్థం చేసుకోవడం దండుగే

గాయమయ్యి ఇన్ని రోజులైనా ఏది చికిత్స!!

స్రవిస్తున్న రక్తానికి ఏది ఆనకట్ట

రక్తంలో రంగు రుచి చిక్కదనం

వాసన చూసే శునకాలే చెప్పాలి!

అన్నీ సమస్యలు వివక్షలు సమూహాలు వర్ణాలు మధ్య చీకటి! ‘‘చీకటి దీపం’’ కవితలో మెర్సీ ఇట్లా అంటుంది `

చూట్టూ చీకటి / అడుగు తీసి అడుగు వేస్తే

ఇసుకలా తగిలే చీకటి

ఆ చీకట్లో గుజ్జనగూళ్ళు కట్టుకుందాం రా అని

ఆహ్వానిస్తుంది చీకటి.

చీకటంటే భయం కదా

చీకటంటే నిశ్శబ్దాన్ని నిలువునా నింపుకోవడం కదా

చీకటంటె మనసు తలుపులకు గొళ్ళెం పెట్టి

ఎగిసివచ్చే జ్ఞాపకాలతో గెలవడానికి చేసే యుద్ధం కదా

కాని ఈ చీకటేంటి ఇసుక రేణువులై వంటికంటుకుంది.

పాదాలను వేవేల చేతులై మర్దన చేస్తుంది…

సమాజంలో చీకటిలాగానే ప్రశ్నలు

చిక్కులు చిక్కులుగా ఉండలు చుట్టి పడేసిన

ఊలుదారాల్లాంటి ప్రశ్నలు…

జీవాన్ని ఆవిరి చేసుకుంటూ

శ్వాస పీల్చుకోలేక వేలాడుతున్న

క్యాలెండరు లాంటి ప్రశ్నలు…

తెచ్చిపెట్టుకుని తినలేక వదిలేస్తే

కుళ్ళిపోయి కంపుకొడుతున్న ప్రశ్నలు…

` మరో కవితలో ఇట్లా అంటుంది `

‘‘తడిమే ప్రతి చూపులో

వినే ప్రతి మాటలో నూత్న వెలుగుతో

నన్ను నేను కాల్చుకోవాలి ’’

‘‘కాల్చుకోవాలి’’ అంటె నన్ను నేను దహించుకోవాలని అర్థం. కులం, రంగు, జెండరు వీటన్నింటిని వివక్షలను ఎదుర్కుంటున్న మెర్సీ మార్గెరెట్‌ అస్తిత్వ వేదనను ఆమె కవిత్వంలో కన్పిస్తుంది. కొత్త భాషలో కొత్త పదాలలో కొత్త వ్యక్తీకరణలతో వైచిత్రులతో ప్రతీకలతో వ్యక్తమౌతున్నది. తెలంగాణ కవయిత్రి కొత్త గొంతు విచ్చుకున్నది. ‘‘మాటల మడుగు’’ అనే కవితా సంపుటిని ప్రచురించింది. తన సమూహాల వేదనను ఆమె ఇంకా వ్యక్తీకరించేది చాల వున్నది. ఇంకా వ్రాస్తూనే వున్నది.

తెలంగాణ నుంచి కవయిత్రులు ఎందరో కవిత్వం వ్రాస్తున్నారు. కవితా సంపుటాలు ప్రచురిస్తున్నారు. నెల్లుట్ల రమాదేవి, కందాళ శోభాదేవి, కొలిపాక శోభారాణి షంషాద్‌ బేగం, రజియా బేగం, సూరేపల్లి సుజాత, కిరణ్‌బాల, తుర్లపాటి లక్ష్మి, ఎన్‌.అరుణ, భండారు విజయ, హన్మాండు శారద, అడవాల సుజాత, జ్వలిత, హిమజ, సూర్యధనంజయ్‌, గోగుశ్యామల, జాజుల గౌరి, జూపాక సుభద్ర, దేవులపల్లి వాణి ఇంకా ఎందరెందరో కవిత్వం వ్రాస్తున్నారు, ప్రచురిస్తున్నారు. నిజంగా నేటి తెలంగాణ కవయిత్రుల కవితా కంఠాలతో మేటి రత్నాల వీణ.

June 23, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చిత్ర భారత కావ్యము

by డా॥ సంగనభట్ల నరసయ్య June 23, 2021
written by డా॥ సంగనభట్ల నరసయ్య

తెలంగాణ ప్రబంధాలు – పరిచయ మాలిక

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

Photo: గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ 

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి

తొలి ప్రబంధం ‘ చిత్ర భారతం ‘ గురించిన ఉపోద్ఘాతం మయూఖ ప్రథమ సంచిక (click this)లో ఉన్నది ,గమనించగలరు


చిత్ర భారత కావ్యము

ఈ చిత్ర భారత కావ్యము, బహుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోయింది. అవతరణకాలంలో అద్భుతంగా, సర్వప్రబంధకవులకు అనుసంధాయకంగా, ఆదరణీయంగా ఉండింది. దీని కర్త చరికొండ ధర్మన్న, కౌండిన్యస గోత్రుడు, ఆపస్తంభసూత్రుడు. తల్లిదండ్రులు చరిగొండ తిమ్మనామాత్యుడు, మాదమ్మలు. నారాయణ ధ్యానతత్పరుడు. భట్టపరాశరుని శిష్యుడు. ‘శతలేఖినీ’ సురత్రాణ బిరుదాంకితుడు.

చరిగొండ మహబూనగర్ జిల్లా గ్రామం. ఈ గ్రామ నామం ఇంటి పేరై ఈతడు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో నివాసమేర్పరచుకొన్న వంశము వారింటివాడైనాడు. ధర్మన్న పూర్వీకులు ధర్మపురి నివాసుని (శ్రీ లక్ష్మీనారసింహుని) భక్తలైనందున ఆ వంశమున వ్యక్తుల పేర్లకు ధర్మపురి లేదా ధర్మన్న పేర్లు పెట్టికొని ఉండవచ్చును. ధర్మపురి గ్రామ నామము వ్యక్తి నామముగా క్రీ.. 13వ శతాబ్ధం నాటికే ప్రసిద్ధము. (మాచర్ల ధర్మపురి అనే చారిత్రక వ్యక్తి – ఇనుగుర్తి (వరంగల్ మండలం) నివాసి ఒకడున్నాడు. ఇతడు ఇనుగుర్తిలో నరసింహాలయ నిర్మాత ధర్మపురి లక్ష్మీనారసింహుని వృద్ధాప్యమున సందర్శించలేక తన గ్రామమునందు నెలకొల్పుకొన్నాడు. స్వామియే దీనికి ప్రేరణ.)

ఈ గ్రంథము తొలుత వీరేశలింగము పంతులుగారు అచ్చువేసినాడు. తన చింతామణి మాసప్రతిక యందు ప్రచురించి, 1898లో తిరిగి పుస్తకంగా తెచ్చినాడు. బహుజనపల్లి సీతారామాచార్యుల శబ్ద రత్నాకరంలో ఇది ఉదాహృతం. పంతులుగారికి పోలవరపు జమీందారంగారు శ్రీ రాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావుగారిచ్చినారు.  దీనిని పరిష్కరించి శిథిల భాగములు పూరించి వాటిని వలయితములు చేసి (కుండలీకరణములలో ఇచ్చి) ధారావాహికముగా ప్రచురించి, గ్రంథరూపంగా తెచ్చామని, శుద్ధ్రపతి మరొక్కటి ఉంటే పంపమని వేడుకొంటూ, ఎంతో వినయంగా, ప్రమాణబుద్ధితో, సాహిత్యోద్ధారణా కంకణబద్ధులై పంతులుగారు పీఠికలో పై అంశాలు పేర్కొన్నారు.

దీనికి 36 స. తరువాత ఓలేటి వేంకటరామశాస్త్రిగారు 1934లో వావిళ్లవారి కొరకు పరిష్కరించవలసి వచ్చినది. వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారు కోరగా, తమ వద్ద గల సంపూర్ణ చిత్రభారత ప్రతిని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము నుండి అందించారు. దానితో తైపారువేసి మరింత శుద్ధమైన ప్రతినిది తీర్చిదిద్ది ఓలేటివారు ప్రచురణార్థం వావిళ్ళ వారికిచ్చినారు.

వీరేశలింగం పంతులుగారు కృతిభర్తను ఇనుములపల్లి వారని, ప్రభువుపేరు మానభూనాథుడని పేర్కొన్నారు. కాని వేటూరి వారిచ్చిన ప్రతినాధారంగా ఇది వెనుముల పల్లిగా, ‘మానభూపాల చిత్తాంబుఖానఘనుడు’ అని పాఠమును స్వీకరించి నావిళ్ళ ప్రతిలో సవరించబడినది.

వీరేశలింగం పంతులుగారు తనకు పూర్తి పాఠం లభించక కావచ్చు, రాజు పేరు మానభూపాలుడని, ఈ కవికాలము శ్రీ రంగరాయల కాలమని, అతని కాలపు ఒక మాండలిక ప్రభువని తన ఆంధ్రకవుల చరిత్రలో ఊహించినారు. దానికి శ్రీ రంగరాజ సేవాపారంగత హృదయ (VIII-1) అన్న అష్టమాశ్వాస ప్రథమ పద్యమును ఉదాహరించినారు. ఓలేటివారు దీనినే గ్రహిఁచినారు. మొదటి రెండవ శ్రీ రంగరాయ ప్రభువుల (విజయనగర రాజులు) కాలముగ భావించి, కృతి నాయక వంశవర్ణనములోని కందాళ అప్పలాచార్యులను స్వీకరించి, తెనాలి రామకృష్ణుని కాలముగ భావించినారు. పై ఇరువురి అభిప్రాయములు సరియైనవి కావు. మాన భూపాలుడన్నది చిత్తాపఖానుని విశషణము. “శ్రీ రంగరాజ” అన్నది రాజు పేరు కాదు, శ్రీ రంగేశుని పేరు. శ్రీ రంగధామ సదృశ భట్ట ఫరాశర ప్రభు అని 17వ పద్యములో మరొకమారు ఇదే అర్థములో ప్రయోగించినాడు. చిత్తాపఖానుడు నాటికి చారిత్రక వ్యక్తిగా వీరికి తెలియదు. చిత్తాపఖానుని శాసనం నాటికి లభించలేదు. అయినా అతడు ఓరుగల్లు పాలకుడన్న సంగతిని వివరించిన కృత్యావతారికా పద్యములను వారు పట్టించుకొనలేదు. స్వీకరించినచో  ‘ఒక మండలేశ్వరుడ’ని ఓలేటివారు చెప్పేవారు కాదు. పైగా వారే పీఠికలో ఉట్టంకించిన కృతికర్తృ పరిచయ పద్యములో (సీ. కౌండిన్యస గోత్ర….. అన్న పద్యములో) మూడవ పాదాంతములో “శ్రీ రంగధామసదృశ” ఇత్యాది అంశములలో (శ్రీ రంగ రాయలు అన్న ఊహ) సరికాదని తెల్పుచున్నది.  కందాళ అప్పగురుడు తెనాలి రామకృష్ణుని కాలమునకే కాదు, గురుస్థానముగా, విస్తృత విశిష్టాద్వైత కుటుంబీకుల నామముగా ముందు తరములలో కూడా ఉండుటకు అవకాశమున్నది. శాసనస్థాధారములను బట్టి కాల నిర్ణయము ఈ వ్యాసంలో ముందు ముందు నిర్ణయిస్తాను.

శ్రీ వీరేశలింగంపంతులుగారు ఈ పరిష్కరణలో ఒక విశేషమైన మార్పును సూచించినాడు. చిత్తాంబుఖాన విభుడన్న రాజు పేరును ‘చిత్తాబ్జభాను’డని మార్చినాడు. అలా ఎందుకు మార్చినాడో తెలియదు. చిత్తాంబుఖానుడన్నది అర్థము సరిగా కుదరక మార్చినాడా? అర్థము కుదరకున్నను మార్చకూడదన్నది,  భవిష్యత్పరిష్కర్తలకు వదిలివేయాలన్నది పరిష్కర్త ప్రాథమిక నియమం కదా! పంతులుగారికిది తెలియదా? ఖాను / భానుల మధ్య అక్షర లేఖనం గురి్తంచలేనివారు కూడా కాదు, ఎందుకో మార్చారో కాని తరువాత శివతత్త్వసార పరిష్కరణ పీఠికలో శ్రీ కొమర్రాజువారు దీనిని నిర్మొహమాటంగా ఖండించి పంతులుగారిని తప్పుబట్టినారు. 13,14,67,72 సంఖ్య గల పద్యాల్లో 20వ సంఖ్య గల వచనంలో చిత్తాంబుఖానుడు (మూడుసార్లు పేర్కొనబడటం) పంతులుగారు గమనించలేదనేలేం.  కాని ఈ చిత్తాంబుఖానుడన్నది తురకరాజన్న సంగతి అంత సులభంగా గుర్తుపట్టలేం. హిందూ మతోద్ధారకునికంటే మిన్నగా హిందూ ధర్మమును ప్రతిష్ఠించినాడాతడు.

‘అనువత్సరంబు బ్రాహ్మణులకు గోసహస్రములిచ్చు, దేవభూదేవ తార్థిశ్రేణి కగ్రహారములిచ్చు, ఇందు శేఖర పాదారవింద యుగళ భావనాపరుడు (13వ పద్యం) మొదలైన విషయములు పంతులుగారు స్వీకరించి ఇతడు ఖాన్ అని భావింపక హిందూ రాజుగా ‘భాను’డని దిద్దినాడేమో!

కవికాలం :  చరిగొండ ధర్మన్న కాలం క్రీ.శ. 15వ శతాబ్ధి అంతం. చిత్రభారతం తొలి ముద్రణ 1934లో వావిళ్ళవారు ఓలేటి వేంకటరామశాస్త్రిగారి పరిష్కరణంలో ధర్మన్న మొదటి శ్రీ రంగరాయల కాలం (క్రీ.శ.1574-1585) వాడని భావించారు. కాని ఈ కాల నిర్ణయంలో ప్రామాణికత లేదు. సరియైంది కాదు. ధర్మన్న ఎక్కడివాడో వారికి తెలియదు. చిత్తాపుఖానుని గూర్చి నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆనాటికి వనరులు లభ్యమానంగా లేవు. చరిగొండ ధర్మన్న కృతినంకితం చేసిన ఎనుములపల్లి పెద్దన్న చిత్తపుఖానుని మంత్రి.  ఈ రాజుకు షితాబుఖాన్ అని మరో పేరు. ఈతడు తొలుత హిందువే. సీతాపతిరాజు. చిత్తాంబుఖానుడని చిత్రభారతం తెల్పింది. ఈతనిని ఓరుగంటి ప్రభువుగా పేర్కొంది. వరంగల్ కోటలో షితాబ్ ఖాన్ సభామందిరం ఖుష్ మహల్ పేరుతో ఉంది. ఈ సుల్తాన్ శాసనం క్రీ.శ. 1504 నాటిది ఓరుగల్లు కోటలో ఉంది.

ఆ శాసనంలో

శాకాట్టే తత్త్వదేవ ప్రజి విభుగణితే రక్తసంవామి వర్షే

మాఘే పక్షా సితాఖ్యే…..

భోగే చిత్తా పఖాన క్షితిపతి….

ప్రాస్కందద్రాజధానీం….. రమ్యమేకోలపలఖ్యాం

  • వరంగల్ జిల్లా శాసనాలు, పే. 291, 111 శాసనం,

ఆర్కియాలజీ, ఆం.ప్ర. ప్రభుత్వ ప్రచురణ.

ఏకోపలాఖ్యాం = ఏకశిల అను పేరు గల, రాజధానీం = రాజధానిని

తత్త్వ = 25, దేవప్రజ విభు = 14, గణితే = లెక్కించగా = 1425 శ.సం. + 78 = 1504 క్రీ.శ.

రక్త సంవామి = రుధిర + ఉద్గారం

రుధిరోద్గాదరి మాఘశు. పంచమి 21 జనవరి, 1504 శాసనం. (ఈ శాసనం పూర్తి పాఠం, దానిలోని విశేషాలు వ్యాసం తరువాత అనుబంధంగా ఇచ్చాను.)

షితాబుఖానం రాజ్యకాలం క్రీ.శ. 1503-12 మధ్యలో ఉంది. పేరు మార్పిడికి కారణం తెలియదు కాని ఓరుగంటి నేలినప్పుడు హిందూ మతాభిమాని. ఆలయ నిర్మాత. ధర్మపురి ఆలయాన్ని ధ్వంసం చేసిన తురకలను శిక్షించిన పెద్దనను మంత్రిగా నియమించుకొన్నాడు. కుతుబ్ షాహీ ప్రభువులకు శ్రతువుగా మసలినాడు. ఓఢ్రగజపతి ప్రభువులకు విధేయుడు, సామంతుడు. వారి పక్షాన శ్రీకృష్ణదేవరాయలతో ధనుర్బలంతో పోరాడినాడని రాయవాచకం తెలిపింది. షితాబుఖాన్ ధనుర్విద్యాపారంగతుడు. (శాసనంలో ఈ వివరాలున్నాయి.) క్రీ.శ. 1500-1505 నడుమ చిత్రభారత రచన నడిచింది. కాలాన్ని ఇలా నిర్ధరించడానికి గల కారణం చరిగొండ ధర్మన్న తన కావ్యావతారికలో చిత్తాపఖానుడు ఓరుగల్లు నేలుతున్నాడని వర్తమాన కాలాన్ని సూచించాడు.

సీ.      అనువత్సరంబు బ్రాహ్మణులకు గో సహ

స్రములిచ్చు నృగ నరేశ్వరుని రీతి

గంధులకెనగ పాకాల చెర్వాదిగా

చెఱువులు నిలుపు సగరుని కరణి

దీవ్యత్పృతాపుడై దిగ్విజయంబుగా

వించు మాంధాతృభూ విభూనిలీల

దేవభూదేవతార్థి శ్రేణి కగ్రహా

రములిచ్చు భార్గవ రాము పగిది

తే.      నిందు శేఖర పాదార వింద యుగళ

భావనాపరుడంగనా పంచ బాణు

డతుల ధైర్యాభిభూత హిమాచలుండు

మన భూపాల చిత్తాంబు ఖానఘనుడు

– చిత్రభా – అవతా – 13

ముస్లింల ఏలుబడిలో పలు తెలంగాణా దుర్గములను పరిహృతంచేసి (జయించి) ఏలుతున్న చిత్తనభానుడు ఒక గొప్ప వీరుడైన రాజు, అతని మంత్రిగా ఏనుములపల్లి పెద్దన.

“ఆ రాజేంద్ర శిఖాపతంస నిజ బాహాయత్త విశ్వంభరాధేరేయుండు

ఎమ్ములపల్లి మాదవిభు పెద్దామాత్యుడు” (పీఠిక – 15వ వ.) అని చిత్రభారతము పేర్కొన్నది. “నిజ బాహా…..” అనడంలో పెద్దన కత్తి పట్టిన వీరుడని తెలుస్తోంది.

పెద్దనామాత్యుడే కాదు అతని వంశంలోని పూర్వులు కూడా యోధులే.  ఈతని పెత్తండ్రి కుమారుడు నరసింగ “సంగర స్థల విధారిత శాత్రపుడు” అని పేర్కొనబడ్డాడు. పెద్దన స్వంత తమ్ముడు సింగ కూడా మంత్రే.

చిత్తాపఖానుని వద్దే పని చేశాడు. రెండో తమ్ముడు ఓరుగల్లులో పాంచలీశ్వర దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీదేవికి మందిరం కట్టినాడు. పెద్దనాన్న నారయ రెండో కుమారుడు రంగనాథుడు కూడా సైన్యాధిపతే. అతడు “దండనాథకుల శేఖరుడు…..” ఇతడు కొరవి నగరంలో నరసింహాలయం కట్టించాడు. కుటుంబం అంతా యోధులే. ఓరుగల్లు తురుష్కా కాలాంతం అయినాక తెలంగాణలో హిందూ మతస్థులకు రక్షణ కరువైంది. అనేక దేవాలయాలు పాడు చేశారు. హిందూ మతానికి పట్టిన దుర్గతి గూర్చి మిసతామ్ర శాసనం, మధురా విజయం అని తల్లి కలువచెరు శాసనం, వేదాంత దేశికుల అభీతిస్తవం మొదలగు గ్రంథాలు వేదాంత దేశికుల అభితిస్తవం మొదలగు గ్రంథాలు వివరంగా రాశాయి.

ముస్లిం సైన్యాలు క్రీ.శ. 1425లో ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి స్వామి యొక్క అపురూపమైన విగ్రహం పాడు చేయడం ‘స్వామి ద్రోహం’గా పేర్కొనబడింది. ఈ విగ్రహం గోదావరిలో పారవేయగా, 2010లో నది ఎండిపోయిన తర్వాత దొరికింది.  శిల్పం అద్భుతంగా అసిత చంద్రకాంత శిల పై చెక్కి ఉంది. షడ్భుజ నారసింహుడు హిరణ్యకపుని పొట్ట చీల్చిన పేగులను రెండు చేతులతో పైకెత్తినపుడు అవి హారాలుగా శిల్పి మలిచాడు. ఈ 1000 సం. ఈనాటి విగ్రహం తరువాతి విజయనగర రాజుల కాలపు ఆలయాల్లో కూడా శిల్పీకరించబడి మెరిసింది. హంపి విఠలాలయంలో, ఒంటిమిట్ట రామాలయంలో దీని ప్రతికృతులున్నాయి. ఈ ధర్మపురి లక్ష్మీనరసింహాలయాన్ని శిథిలంగా మార్చినాక ఒక 200 సం. పిదప క్రీ.శ.1693లో రుస్తుం దిల్ ఖాన్ మసీదుగా (మధ్యకాలంలో మారినదానికి) నిర్వహణ విధానాన్ని నిర్ధేశిస్తూ ఒక మౌజమ్ (మసీదు నిర్వాహకుణ్ణి)ను నియమించి వంద భీగాల భూమిని ఏర్పాటుచేసి దానపత్రం రాయించినాడు.

ఈ గ్రంథంలోని ఇతర అశ్వాసాది పద్యాల్లో ధర్మపురి నరసింహస్వామి ఆశీస్సులను వాంఛించి వర్ణించినారు.  ఎనుములపల్లి పెద్దన పూర్వీకులు కూడా స్థానిక దైవాన్ని కొలిచినవారే. స్వామివారి అనుగ్రంహంతో పుట్టినవారేనని పేర్కొనబడ్డారు. తాత సింగన నరసింహుని వరం చేత పుట్టినాడట. లతాయిలో అయి అనేది అమ్మ శబ్దం. ఇది మరాఠీ పదం. ధర్మపురిలో బ్రాహ్మణ స్త్రీలకు పేరు పక్కన ఉంటుంది. లక్ష్మింబాయి, అమృతాబాయి, రుక్కాబాయి, రాధాబాయి వంటి పేర్లు నేటికీ ఉన్నాయి. స్త్రీలకు సింగమ్మ, సింగపాని వంటి పేర్లున్నాయి.  స్వయంగా పెద్దన భార్య పేరు సింగసానే. పెద్దన వంశంవారు కుందాళ వంశీకుడైన గురువునను (కండాళప్పను) దీక్షాగురునిగా స్వీకరించారు. పెద్దన పెద్దనాన్న, తండ్రి అయిన నారయ, మాదయులు కందాళప్ప శిష్యులని చరిగొండ ధర్మన్న పేర్కొన్నాడు. ఈ కందాళ వంశీకులు నేటికీ లక్ష్మీనరసింహాలయంలో ఆస్థాన పురోహితులుగా కొనసాగుతున్నారు.

తాత నరసింగన్న కొరవిలో నరసింహాలయం కట్టించాడు. ఇది క్రీ.శ.14వ శ. ఉత్తరార్థంలో చివరి దశకంలో జరిగింది. ఈతని మనుమడుగా పెద్దన్న 1410 ప్రాంతాన పుట్టి ఉంటాడు. ధర్మపురి ఆలయ ధ్వంసం నాటికి 25 సం. కుర్రవాడు. అనేక యుద్ధాలు చేసిన ఈ పరాక్రమశాలికి గల బిరుదులు చిత్రభారతంలో పేర్కొనబడ్డాయి. 50 సం. వయస్సులో బహుశ షితాబ్ ఖాన్ కు మంత్రి అయినాడు. క్రీ.శ. 1475 ప్రాంతానికి ఓరుగంటి ప్రభువుకు మంత్రిగా, దండనాథునిగా ఉన్నాడు. ధర్మన్న చిత్రభారతాన్ని ఇదే సమయంలో రాసినాడు. షితాబ్ ఖాన్ కి ఓరుగల్లును అద్భుత వైభవోపేత రాజధాని నగరంగా వర్ణించినాడు. ఈ కావ్యకాలం నాటికి పెద్దన వృద్ధుడైనాడు. ఆ విషయం ఎలా తెల్సిందంటే ఈ పెద్దన ‘తత్పూర్వ రాజుల వద్ద పనిచేసి ప్రశంసలు పొందినాడట’ అని చిత్రభారతంలో పనిచేసి (ఎ-1) పేర్కొనబడ్డది. పెద్దన సైన్యాధిపతిగా శూరునిగా పేరుగాంచిన అనుభవంతో చిత్తాపఖాన్ మద్దతు చేరినాడు.

చిత్తాప్ ఖానుడు హిందూరాజు. ఖాన్ శబ్దం బహమనీల సైన్యంలో ప్రదర్శించిన పరాక్రమానికి లభించిన బిరుదు. అతడు ఓరుగల్లులో స్వయంభూ దేవాలయం. అలాగే పాంచల రామాలయం ‘కుజన తురుష్కులు ’ పాడు చేసిన వాటిని పునరుద్ధరించినట్లు వరంగల్ శాసనంలో పేర్కోబడ్డాడు. తురకల ఆలయమత విధ్వంసాలను ఇష్టపడని వీరిద్దరి రాజు, సైన్యాధిపతులుగా ఓరుగంటినేలి, హిందూ ధర్మాన్ని ఆలయాలను పునరుద్ధరించారు. షితాబ్ ఖాన్ పాకాల చెరువును బాగు చేసినట్లు శాసనంలో ఉంది.

పెద్దన మహారాజ వైభవంతో ఉన్నాడు. అతని వైభవం ఈ కావ్యంలో వర్ణించబడింది. ఈ వైభవం అంతా యుద్ధాల్లో విజేత కావడంవల్ల వచ్చింది. ఆ విషయం “సంగ్రామోపార్జిత భూరి భూవర సమగ్ర ప్రాభవా!” అని చిత్ర భారతంలో కృతికర్త చరిగొండ ధర్మన ఎనుముల పల్లి పెద్దనామాత్యుని (కృతిభర్తను) ప్రశంసించడం ధృవపరుస్తోంది. ఈ ప్రాభవం అంతా సంగ్రామాల్లో (యుద్ధాల్లో) ఉపార్జితం (సంపాదించినది)గా పేర్కొనడంబట్టి తెలుస్తుంది. పెద్దనామాత్యుని తమ్ముడు సింగన కూడా అన్నగారివలెనే, తాతగారివలెనే యోధుడై షితాబ్ ఖాన్కు విజయాలు చేకూర్చి, ఛత్ర చామరాందోళికాది సత్కారాలు పొందినాడని ఈ కావ్యంలో రాసి ఉంది.

పంపమహాకవికి వేములవాడనేలిన చాళుక్య ప్రభువు ఇమ్మడి అరికేసరి చేత ధారా-దత్తం ఐన గోదావరి తీరస్థ ధర్మపురి గ్రామం నేటికి గొప్ప చారిత్రక సాంస్కృతిక కేంద్రం. పింగళి సూరన తన కళాపూర్ణోదయంలో నాలుగు వేదాలు నలుగురు బ్రాహ్మణ కుమారులుగా ఈ గ్రామంలో పుట్టినట్టు రాసినాడు. ఈ ఊరిలోనే పుట్టిన చతుర్వేదులు నరసింహ భట్టు విజయనగర సామ్రాజ్యంలో చక్రవర్తి సదాశివరాయలచే మంత్రి అళియ రామరాయల చేత పల్లకీ మోయించుకున్న వేద స్పర్థా విజేత. ఇలాంటి పోతుగడ్డపై పుట్టిన బ్రాహ్మణుడు ఎనుములపల్లి పెద్దనామాత్యుడు యోధునిగా, ఖడ్గవీరునిగా, యుద్ధవిజేతగా, మహామంత్రిగా మనోహర కావ్యకృతి భర్తగా, పదిహేనవ శతాబ్దిలో మెరిసి శాశ్వత యశస్సంపన్నుడైనాడు.

కృతి భర్త పెద్దన గ్రంథం అంకితం స్వీకరించేనాటికి వయసులో చాలా పెద్దవాడు. ఆ సంగతి చిత్రభారతంలో ఓ పద్యంలో అంతస్సాక్ష్యం ఉంది. షితాబుఖాన్ కు మంత్రి అయ్యేనాటికే ఇతర పూర్వ ప్రభువులకు మంత్రిత్వము నెరసి ప్రశంసలు పొందినాడని “పూర్వక్ష్మానాయక వినుత చరిత! మాదయ పెద్దా!” (చతుర్థా-1) అని ధర్మన్న సంభోదించినాడు. అంతేకాదు ఎనుములపల్లి పెద్దనామాత్యుడు కేవలము బ్రాహ్మణుడైన అమాత్యుడు మాత్రమేగాక ఖడ్గము పట్టిన శూరుడు. “సంగ్రామోపార్జిత భూరి భూవర సమగ్ర ప్రాభవా” అని చి.భా.(VIII-142) అని ప్రశంసింపబడినవాడు. సుమారు 15 బిరుదములున్నవాడు. ఎనుములపల్లి పెద్దన తండ్రి మాదన, అన్న నారనలు కందాళప్ప గురుని వద్ద శుశ్రూష చేసినారు.

శా. వందారు వ్రజదోష మేఘపవనున్ వారాశి గంభీరున్ నా

నందాత్మున్ హరిపాదభక్తు నిఖిలామ్నాయజ్ఞు విశ్వంభరా

వందార క్షితిజాతమున్ నిగమ సన్మార్గ ప్రతిష్ఠా పరున్

కందాళప్ప గురున్ వివేకనిధి లోక ఖ్యాతు వర్ణించుచున్

కం. ఆదేశిక పద కమలము…. 1-36, 37ప.

అని కావించిన గురు ప్రశంసలోని కందాళప్ప గురువు తెనాలి రామకృష్ణుని కాలపు కందాళప్ప అని ప్రథమ సంపాదకులు పొరపడినారు. దానితో కాలనిర్ణయం తలకిందులై మొదటి శ్రీ రంగరాయల కాలానికి పోయింది. అంటే క్రీ.శ.1574-85 కాలము నాటికి కృతిభర్త పెద్దన తండ్రి మాదయామాత్యుడు తరలించబడినాడు. 1503 నాటి షితాబుఖాను మంత్రి పెద్దన ఓరుగల్లు నగరానికి మహామంత్రిగా ఉన్న విషయం నాటి కాల నిర్ణయములో పరిష్కర్తలకు తెలియదు. నాటికి పెద్దవాడైన పెద్దన 1425 ప్రాంతాల్లో పుట్టినాడు. ఆయన తండ్రి 1400 ప్రాంతంవాడు. అతని గురువు కందాళప్ప ఆ కాలమువాడే. ఈ కందాళప్ప సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన ధర్మపురిలో స్థిరనివాసమేర్పరచుకుని దేవాలయ విధులలో స్వామికి నిత్యకళ్యాణాదులు నిర్వహించు పురోహిత కుటుంబమునకు మూలపురుషుడైన గురువు.  ఈయన కుటుంబీకులు నేటికి కందాళవారు దేవాలయ పౌరోహిత్యమును నిర్వహించుతున్నారు. కన్నడ మహాకవి పంపనికి ధారాదత్తమైన ఈ ధర్మపురి గ్రామము వేములవాడ చాళుక్యుల కాలమునుండే కన్నడ ప్రభావము ఎక్కువగా ఉన్న ప్రాంతం. కరీంనగర్ జిల్లాలో లభించిన శాసనములలో సగం కన్నడ శాసనాలే. దీనికి కారణం ఉత్తర తెలంగాణములోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు కళ్యాణి చాళుక్యుల పాలిత ప్రాంతాలు. ధర్మపురికి 20 కి.మీ. దూరంలోని పొలవాస రాజధాని మేడెరాజు నుండి కాకతి రుద్రుడు గెలిచిన తరువాత (కాకతిరుద్రుని హనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనము.) ఈ నేలపై తెలుగు శాసనములు కన్పట్టుచున్నవి. అందువల్ల ధర్మపురిపై కన్నడ ప్రభావం అధికమే. అప్పశబ్దవాచ్యులు కందాళప్ప మాత్రమే గాక, ధర్మపురి నారసింహునిపై నరసింహ శతకము రాసిన శేషప్ప కూడా అప్పశబ్దవాచ్యుడే. శేషప్పలోని అప్పశబ్దమునుబట్టి ఈతడు కన్నడ ప్రభావము గల రాయలసీమ ప్రాంతీయుడని కొందరు భావించుట తప్పు. అతడు క్రీ.శ.1735లో జన్మించి, 1825వరకు జీవించి ధర్మపురిలోని నివసించి, స్వామి కోవెలలో దీపరక్షకునిగా 3 రూ. వేతనముతో ఉద్యోగించిన మహాభక్తుడు. (శ్రీ ధర్మపురి చరిత్ర  –పే. 94) పెద్దనకు సమకాలికుడు లేదా కొంచెం చిన్నవాడైన చరిగొండ ధర్మన 1450-1500 ప్రాంతం వాడు. శ్రీ కృష్ణరాయల పట్టాభిషేక వత్సరము (1509)నకు ఇంచుమించు ఒక దశాబ్ది ముందు చిత్రభారతమును రాసినాడు.

చరిగొండ ధర్మన శతావధాని. వేదంలో అవధానం చరిత్రలో ఉంది. కాని సాహిత్యంలో తానొక శతావధానినని ప్రాచీన కాలంలో చెప్పుకొన్న కవి ఈతడే.

“శతాలేఖిన్య వదాన పద్య రచనా సంధా సురత్రాణ చిహ్నిత నామా!” అని కృతికర్త, మిత్రుడు, సహగ్రామవాసియైన పెద్దన నోరారా పిల్చినట్లు రాసికొన్నాడు. శతావధాని మాత్రమే కాదు, శతావధానులలో సురత్రాణు (సులతాను)డట. అంటే ఆనాడు తెలంగాణలో శతావధానులనేకులున్నారని తెలుస్తోంది. ఈయనకు ముందువాడైన రెండో ప్రతాపరుద్రుని ఓరుగల్లు నగరంలో ఆతని ఆశ్రయంలో మూడువందల మంది కవి పండితులుండేవారని తెలుస్తోంది. వారిలో వ్యాఖ్యాతృ చక్రవర్తి కోలాచలమల్లినాథుని తాత కోలాచల మల్లినాథయ్య రుద్రునిచేత స్వర్ణాభిషేకం చేయించుకున్నాడు.

శ్లో. కొలి చెల్మాన్వయాబ్దీందుః

మల్లినాథో మహాయశః

శతావధాన విఖ్యాతో

వీరరుద్రాభి వర్షితః

అన్న శ్లోకం సాక్ష్యమిస్తోంది. అతనికి మల్లినాథ ‘శతావధాని’ అన్నది పేరు.

ఇతన్ని చూసి భట్టుమూర్తి (రామరాజు భూషణుడు) ధర్మన వాడిన నాలుగు పదాలు వాడుతూ –

“శతలేఖినీ పద్య సంధాన ధేరేయు” అని రాసికొన్నాడు. ధర్మన అయితే బాహాటంగా “అవధాన” శబ్దమే వాడినాడు. అంతేకాదు ధర్మన “ప్రతిపద్య చమత్కృతి”తో ఒక శతావధానివలె ఎన్నో పద్యాలు గ్రంథం నిండా రాసినవి సాక్ష్యాలున్నాయి.

తెలుగునాట చిత్రభారతం తొలి ప్రబంధం అనువాద కావ్య ఫక్కి నుండి కవిత్రయమాదిగా శ్రీనాథుని వరకు గల పురాణాలు, శ్రీనాథాదుల కావ్యాలు ఒక్కసారిగా శిల్ప వైవిధ్యంతో ప్రబంధాలుగా మారినవి. ఈ మార్పుకు ఒక రకంగా సంస్కృతంలో ఉత్తమ కావ్యమైన శ్రీ హర్షుని ‘నైషధీయ చరితా’న్ని ఇష్టపడిన తెలుగు కవులు శ్రీనాథుని తదనువాదంతో ఉత్తమకావ్య శైలిని ఇష్టపడినారు. అదే ఆధునిక కాలపు ప్రబంధవాచ్య“ ప్రాచీనకావ్యము. తద్ జ్ఞులు ఈ రకమైన కావ్యములు రాయలయుగమువనిరి. ఎఱ్ఱనతో ప్రారంభమైన ప్రాథమిక లక్షణములతో సెలయేరువలె పారి, జీవనది ఐనదనిరి. కాని ఈ అభిప్రాయాలతోవారు చెప్పిన ప్రబంధాలే అవ్యాప్తి, అతివ్యాప్తి దోషాలతో లక్షణములు సరిపడనివైనవి. కాని చరిగొండ ధర్మన చిత్రభారతము మాత్రము ప్రబంధ లక్షణాలు మెండుగా, నిండుగా నిండిన తొలి కావ్యమై నిలిచినది.

శ్రీకృష్ణుని విజయగాథ ఏక వస్తుకంగా (వస్త్వైక్యం), వీరశృంగార రసాలు కావ్యగత కథాంశములలో నిర్భరమైనవి. ఇది కార్ణ్ష్య ప్రబంధము. అనగా కృష్ణుని వీరగాథ. శ్రీ కృష్ణుడే నాయకుడు (ఏక నాయకాశ్రితం), ఉపకథలు కేంద్రకథకు ఉపబలకంగా (పారిజాతాపహరణాదులు) ఉన్నాయి. అష్టాదశ వర్ణనలు రాజు, యుద్ధం, నది, ఋతువులు, వనం (కాననం), మ్నగయ, యాత్రలు, కథాసందర్భంగా వర్ణించబడ్డాయి. శబ్దాలంకారాలు, భావ చిత్రాలు ఎడనెడా ఉన్నాయి. సంవాద శైలి గురించి చెప్పే పనే లేదు. శ్రీకృష్ణార్జున యుద్ధం, తుల్య రంభాసంవాదాలు, కౌరవపాండవ సంవాదాలు నాటకీయతతో నిండినవి. రాజనీతి వర్ణన, నాయిక ఏడ్పు తొలుత ప్రవేశపెట్టినది ధర్మన్నే. ఇవన్నీ ప్రబంధ కవులకు ఒజ్జబంతుయ్యాయి. కృష్ణరాయలు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, రామరాజభూషణుడు, పింగళి నూతన ఇతనిని అనుకరించారు. అనుసరిఁచారన్నచో ఇంకా చెప్పే పనే లేదు.

తెలుగు సాహిత్యంలో తొలి కల్పిత కథా కావ్యం చిత్ర భారతమే. ఇది బ్రహ్మాండ పురాణోక్తమని ధర్మన (1-11) చెప్పినా అది ఔపచారికమే. పురాణాల్లో ఇది ఎక్కడా లేదు. తెలంగాణ కల్పిత పురాణగాథలకు గుడి వంటిది. బుద్ధారెడ్డి తన రామాయణంలో అనేక అవాల్మీకి గాథలను కల్పిత స్థానిక గాథలను చేర్చినాడు. కొరవిగోపరాజు మూలభిన్నంగా కథల్లో మార్పు చేసినాడు. సుప్రసిద్ధ కల్పిత కథా కావ్య నిర్మాత పింగళి సూరన మూలాలు తెలంగాణవే. చివరి ఇద్దరు, ఏకంగా తమ గాథల్లో ధర్మపురిని పేర్కొన్నారు. వీరి కఁటే ముందు ఈ గ్రామంపై అభిమానం ప్రకటించిన వీరిద్దరికి ఆదర్శమైన పూర్వజుడైన ధర్మపురివాసి ధర్మన ఏకంగా కావ్యమే విచిత్ర భారతంగా కల్పనగా రాసినాడు.  “కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు” అని ఈసడించిన రామరాజభూషణుడు పింగళి సూరనను కాక ధర్మనను దృష్టిలో పెట్టుకొనే అని ఉంటాడు. ధర్మన, భట్టుమూర్తులు శతావధానులు.

రావిపాటి త్రిపురాంతకుడు రాసిన ధనాభిరామాన్ని తెనిగించిన నూతన కవి పేరయ. తొలి కల్పిత కథా కావ్య నిర్మాత అని సాహిత్యజ్ఞులు చెప్పినది తప్పు. అతడు అనువాదకుడు మాత్రమే. పైగా ధర్మనకు ముందు వాడని కాల నిర్ధారణ చేయలేం.

ఐతే చిత్ర భారతమే తొలి కల్పిత గాథ అనరాదు. వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని ఒక కల్పిత (అబద్ధాల) భారతాన్ని సృష్టించి, గురువుకు అపచారమని భావించి, నదిలో గ్రంథాన్ని నిల్పగా వ్యాసుడే ప్రోత్సహించి వెలికి తీస్తే అశ్వమేధపర్వం మాత్రం మిగిలిందని అదే జైమిని భారతమని చెబుతారు. జైమినీ భారతమంతా కల్పితగాధ. అలాగే హరివంశపురాణంలో బాణాసుర గాథ, పౌండ్రకవామ దేవగాధ, శివకేశవ యుద్ధం (శివుని ఓటమి) వంటివి కాల్పనికాలు.

ధర్మనకు తరువాత ఈ చిత్ర భారత గాథను (శ్రీకృష్ణార్జున యుద్ధాన్ని నాదెండ్ల గోపమంత్రి శ్రీ కృష్ణార్జున సంవాదం అనే).

 

 

­­­­­­చరిగొండ ధర్మన్న రాసిన ఈ ‘చిత్రభారత’ కృతి నిజంగా విచిత్ర భారతమే. వ్యాస మహర్షి రాసిన మహాభారతానికి ప్రతికృతిగా జైమిని మహర్షి రాసిన అబద్ధాల చిత్ర విచిత్ర కథలతో భారతం రాసినాడు. దాన్ని తానే తిరిగి గంగానదీ సమర్పణం చేసి, గురువు ఆజ్ఞతో వెదకగా నదిలో ఒక అశ్వమేధ పర్వం మాత్రం దొరికిందని, దాన్నే జైమినీ భారతం అంటారని లోకగాథ. ఇది అబద్ధాల భారతమే. వ్యాసప్రోక్తం కాదు. ఈ జైమినీ భారతాశ్వమేధ పర్వం ధర్మనకు ప్రేరణ కావచ్చు. అశ్వమేధ పర్వంలోని అర్జున – ఉలూచిలకు పుట్టిన ఇలావంతుణ్ణి శ్రోతను చేసి పాతాళంలో శుకమహర్షి ఈ చిత్ర భారతాన్ని చెప్పినట్టు రాసినాడు. “పాక్తన రాజావళీ విశేష చరిత్రములలోన మిగుల నాశ్చర్యహేతువయిన కథ” (చి.భా.I-38) అని ధర్మనే పేర్కొన్నాడు. ఈ కథకు ఛాయాగాథలు ఇతఃపూర్వ పురాణములలో లేకపోలేదు.

తుల్యుడనే ముని తపస్సు చేసుకొంటూ ఉండగా, అతని తపస్సుకు తన సింహాసనం పోతుందని ఇంద్రుడు రంభాద్యప్పరసలను తపోభంగానికి పంపినాడు. రంభ తపోభంగ యత్నంలో తాను భంగపడి, తుల్యునిచేత శప్తురాలై గుఱ్ఱమైపోతుంది. క్షమించమని ప్రార్థించిన రంభకు, తుల్యుడు శాపవిమోచనం అనుగ్రహిస్తూ కుండినపురం ఏలే చతుర్ధన మహారాజుకు అశ్వమై, ముల్లోకాలు తిప్పితే పూర్వరూపం వస్తుందని చెపుతాడు. రంభ చతుర్ధన మహారాజుకు తర్వాతి కాలంలో వేటకు వెళ్ళినప్పుడు లభించి, అశ్వమై ముల్లోకాలు తిప్పుతూ, అలసటతో ఆకాశమార్గాన నురగ కక్కుతుంది. ఆ నురగ ద్వారకలో రాజ్యమేలే కృష్ణుడు ఓ ప్రభాతవేళ సూర్యునికి అర్ఘ్యమిస్తుండగా అతని దోసిట పడుతుంది. (నీ హయోత్తమంబు నెమ్మొగంబున బుట్టి ఫేనఖండమనిల వేగవశము; నందదంబు తర్పణము సేయు కృష్ణుని; హస్తయుగళ జలము లందుబడియె అని చిత్రభారతం, పంచ (162). కృష్ణుడు కోపించి చతుర్ధనుణ్ణి చంపడానికి శపథం చేస్తాడు. రంభ ఇచ్చిన మంత్రబలంతో వివిధ దేవతలనాకర్షించి శరణు అడుగుతాడు. ఇంద్రుడు కృష్ణునితో యుద్ధమునకు అశక్తత తెలిపి గతంలో తాను పారిజాతాపహరణ గాథ ప్రసక్తం తెస్తాడు. శివుని శరణు కోరగా తానూ తన అశక్తతను తెలిపి, గతంలో ఉషా పరిణయ సందర్భమున బాణాసుర రక్షణలో యుద్ధము చేసి విఫలుణ్ణయ్యానని చెపుతాడు. (107-106 ప. చిత్రభారతం, ఉషాపరిణయ గాథ), బ్రహ్మను శరణు కోరగా గోహరణగాథను (173-179 ప.) శ్రీ కృష్ణుని బాల్యంలో తను విఫలుణ్ణయ్యానని (గోవర్ధనగిరి కథ – భాగవతం) తన అశక్తతను తెలుపుతాడు. చతుర్ధనుడు ఒక భిల్లుని వలన తన రాజ్యానికి వచ్చిన అర్జునుని గూర్చి విని, అర్జునుని శరణు కోరుతాడు. అభయమిచ్చి, ఆ వెనుక విషయం తెలిసి, కృష్ణునితో వైరానికి ఇష్టం లేకున్నా, అర్జునుడు తన శరణాగత వత్సల బిరుదు వ్యర్థమవుతుందని భావించి, పాండవ కౌరవ సమేతంగా కృష్ణునితో యుద్ధం చేస్తాడు. యాదవ పాండవ రణంలో కృష్ణుడు అందరినీ వధిస్తాడు. ఒక్క ధర్మరాజును చంపడు. ధర్మజ ప్రార్థనతో తిరిగి అందరూ పునర్జీవితులై కథ సుఖాంతం అవుతుంది.

ఆశ్చర్య హేతువైన కథా నిర్మాణం : ధర్మన్న చెప్పినట్టే ఇది “మిగుల ఆశ్చర్యహేతువైన” కథ. తెలుగువారికి ప్రసిద్ధులైన వ్యక్తులు జగడమాడితే చాలా ఇష్టం. అర్జునుడు, కృష్ణుడు ఇందులో జగడమాడినారు. కృష్ణార్జునులే కాదు. కృష్ణాంజనేయులు, రామాంజనేయులు, రామలవకుశులు యుద్ధాలు చేయడం ఈ కథలన్ని సృష్టించి, కావ్యాలుగా, నాటకాలుగా, యక్షగానాలుగా తెలుగువారు మలచుకొన్నారు.

ఈ చిత్ర భారత కల్పిత కథ పింగళి సూరనకు మరో కల్పిత కావ్యం (కళాపూర్ణోదయం) రాయడానికి ప్రేరణ అయింది. అల్లసాని పెద్దన ప్రబంధాల్లో వేట వర్ణనకు, కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో రాజనీతి రాయడానికి, నంది తిమ్మనకు పారిజాత పహరణ గాథ రాయడానికి, కనపర్తి అబ్బయామాత్యుడు అనిరుద్ధ చరిత్ర రాయడానికి, ఇంకా ఎందరికో కథాభిక్ష, వర్ణనాభిక్ష ప్రసాదించిన ఘనకావ్యం ఇది. నురుగు దోసిట్లో పడిందని ధర్మన్న రాయగా, ఉమ్మిపైనుంచి పడిందని చిలకమర్తి రాశారు. చతుర్ధన మహారాజుకు బదులు, గయుడు దోషి ఇక్కడ. యక్షగానంలో మరో పేరు. ఈ విధంగా కథలో చిన్న చిన్న మార్పులు జరిగాయి. దైవమైన కృష్ణుని చేతిలో గయుడు ఉమ్మివేయడం కంటే, పై లోకాల్లో విహరించే గుర్రం అలసి, నురగలు కక్కి, గాలికి జారి, కృష్ణుని చేతిలో పడిందన్న ధర్మన్న కథే ఔచిత్యవంతంగా ఉంది. చిలకమర్తి కాలానికి కృష్ణార్జునులు విరగ దిట్టుకున్నారు. ధర్మన్న కాలానికి పాత్రల ఔచిత్యానికి భంగం కలుగలేదు. ధర్మన్న ఔచిత్యాన్ని పాటించే సుకవి. రాను రాను తెలుగువారికి దూషణయుద్ధాలే రుచించాయి. కాలప్రభావమది.

ఇది చిత్రభారతం . కథ విచిత్రం. భారత పాత్రలే కాని, వ్యాసుని భారత పాత్రల లక్షణాలున్నవే కావి, భారతంలో లేని వింత సంఘటనలుంటాయి. చతుర్ధనుణ్ణి ముందుగా తెలియక అతనికి అభయమిచ్చి తత్కారణంగా ప్రాణసఖుడు, బావ, పాండవ రక్షకుడైన శ్రీ కృష్ణునితో యుద్ధ సన్నద్ధుడు కావడం ఓ వింత కథ. దీని వెంబడి అనేక చిత్రాలు.

ఆధునిక కథ (చిలుకమర్తి వారిది) లోని ప్రతి నాయకుడు గయుడు అన్ని లోకాలు తిరుగుతాడు శరణుకోసం. ధర్మన్న కథలోని ఈ గయుని స్థానములో ఉన్న చతుర్ధనుడు భూలోక ప్రభువు. అతనికి రంభ ఇచ్చిన మంత్రం వల్ల అందరూ దేవతలను తన వద్దకే రప్పించుకుంటాడు. అర్జునుడు కూడా కుండిన రాజ్యహద్దుల్లోకే వస్తాడు. భిల్లుని వల్ల సమాచారం తెలిసి రాజైన చతుర్ధనుడు అర్జునుని శరణు వేడుతాడు.

ఘోషా యాత్రలో మూలభారతంలో చిత్ర రథుడు దుర్యోధనాదులను బంధించి పట్టుకుపోయినప్పుడు ధర్మరాజు తమ్ములతో “వయం పంచాధికశతం” (మనం నూట ఐదుగురం) అని శ్రతువు నిర్జించేందుకు కౌరవులు పాండవులు ఏకం కావాలంటాడు. ఇక్కడ చిత్రభారతంలో నిజంగా కృష్ణునితో యుద్ధానికి ఏకం అయినారు.  దుర్యోధనులు పాండవ పక్షాన పోరాడుతారు. ధర్మజార్జునులు భీష్మునితో యుద్ధం గూర్చి అనుమతి, సంప్రదింపులు చేస్తారు. అర్జునుడు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉంటాడు. భీష్మాదులు మామూలు యోధులు. కర్ణుడు అర్జునుని పరాక్రమాన్ని ప్రశంసిస్తాడు. ఇది భారతంలో మనం చూడని అంశం. “నిర్జర కోటులెత్తి వచ్చినా గెలవలేరీ అర్జునుని, కృష్ణుడెంతపాటి” అంటాడు. భారత యుద్ధంలో లాగే వ్యూహాలు, మానుషవ్యూహం, సూచీవ్యూహం, శకట వ్యూహం, పద్మవ్యూహం- ఇలా ధర్మన్న కొన్ని కొత్త వ్యూహాలు సూచించినాడు.

కృష్ణుడు అక్రూరుని రాయబారంకు పంపితే, ధర్మరాజు సహదేవుణ్ణి రాయబారానికి పంపుతాడు. మహాభారతంలో కృష్ణుడు పాండవుల పక్షాన రాయబారానికి వెళ్ళి వైరిపక్షస్తుతిలో దుర్యోధనాదులకు కోపం తెప్పించి సంధి చెడగొట్టినట్టే సహదేవుడు సంధి చెడగొట్టుతాడు. కృష్ణుడు యుద్ధంలో అందరినీ చంపినాడు. ఒక్క ధర్మరాజును చంపలేదు. భీష్ముని కూడా చంపినాడు. ధర్మరాజు అందరు తమ్ములు చనిపోయాక హృదయ విచారకంగా ఏడుస్తాడు. తాత భీష్ముని పట్టుకొని నీ ఇచ్ఛామరణం కూడా మొక్కపోయెనని బాధపడతాడు. కృష్ణునికే జాలివేసి, ధర్మరాజును అనుగ్రహించి, ఒక్కరిని బ్రతికిస్తానని కోరుకొమ్మంటే ధర్మరాజు ఒక్క చతుర్ధనుణ్ణి బతికించమంటాడు. ధర్మరాజు ధర్మానికి మెచ్చి, కృష్ణుడు అందరినీ బ్రతికిస్తాడు. ‘పోరి దైవోపహతుండు పోవు కడకుం బోవుంగదా యాపదల్’ అన్నట్టు తుల్యుని వల్ల ఇంద్రునికి ముప్పు, ఇంద్రుని వల్ల రంభకు ముప్పు, రంభ (గుఱ్ఱం) వల్ల

చతుర్ధనునికి, అతనివల్ల అర్జునునికి, అర్జునునివల్ల భీష్మాదులకు ముప్పువాటిల్లింది. చతుర్ధనుడు నిజంగా దైవో (కృష్ణో) పహతుడే. ఇలా కథలో ఎన్నో విచిత్రాలు.

నోరూరించే కవిత్వం :

తరువాత ప్రబంధ కవులందరికీ నోరూరించిన ధర్మన కవనం, సుమనోహరం. ‘తెనె సోక నోరు తీయన అగురీతి’ ఉంటుంది. శైలి, శిల్పం, సంవిధానం, ఎత్తుగడలు, అలంకారాలు,భావాలు చాలా మధురంగా ఉంటాయి. కవిత్వ శైలి గుఱ్ఱంలా ఉండాలని, గుఱ్ఱం (రంభ) సత్ర్పబంధంలా ఉందని చెపుతాడు.

కం||   పదముల చొప్పున వడి యొ

ప్పిదము నలంకార లక్ష్మి పేర్మియు ధారా

స్పద భావము గల్గి శుభ

ప్రదమై హయమమరె సత్ర్పబంధము రీతిన్ (III-160)

శ్లేషచమత్మృతులు కొల్లలు

కం||   వినుడానది శ్రుతి బాహ్యులు

అనవరతము కుటిలగతులు నగు భోగివరుల్

తనవారిలోన మెలగిన

తనవారిగ జేసి హరుని తల యెక్కించెన్

శ్రుతిబాహ్యులు = వేదనిందకులు, చెవులు లేని పాములని

కుటిల గతులు = సత్ర్పవర్తనా హీనులు, వంకరగా పాకే పాములు

భోగివరులు = భోగలాలసులు, పడగలు గల పాములు

తన వారిలోన = తన నీళ్ళలో, తనవైపు వారుగా

(వారి = తెలుగులో వారు, సంస్కృతంలో నీరు) అని చాలా సరళం ద్వ్యర్థి సాధించాడు.

అనుప్రాస సౌందర్యం కావ్యమంతటా ప్రదర్శించినాడు. పోతనకు సమకాలికుడైన ఈ కవి పోతన భాగవతం చూసాడో లేదో కాని ‘పోతన శైలి’ని ప్రదర్శించినాడు.

హరి పెకిలించి తెచ్చి వివాహగాధిపుపై నిడియెన్ముందంబునన్

స్మరహరమౌళి చంద్ర సహజాతము, బంధుర గంధలుబ్ధ ష

ట్చరణ పరీతమున్, సతత సత్ఫల పోషిత దేవజాతమున్,

తరుణ పలాశ పుష్ప సముదాయ సమేతము, పారిజాతమున్ (చి.భా.V-98)

 

మలయము నేలి, పద్మినుల మంజుల సౌరభములగ్రోలి, పు

ప్వుల గనుపట్టు మేలి తరువుల్ముదమందగవ్రాలి, కైతకం

బుల బొడకట్టు ధూళి దివిబోవగద్రోలి, మృదుతశీలియై

కలయజరించె చల్లనగు గాలి సదాను సరన్మదాలియై      (చి.భా.V-109)

 

ప్రతి సీస పద్యం చివరలో యమకాన్ని ప్రదర్శించినాడు.

సీ||    కొలది మీరిన యట్టి కొమ్ములు నెమ్ముల

తోరంబులైతోచు తొడలు మెడలు

గరమమై చూపట్టు శిరములు సురములు

పలు తెరంగుల మించు పండ్లు రొండ్లు

ఇంకో విశేషమేమంటే మొత్తం సీసం 8 అర్థాల్లోని శరీరాంగాలే. ఔరా అనిపించేలా ఉందీ పద్యం.

పోతన్న ప్రసిద్ధ పద్యం జ్యావల్లీ ధ్వని గర్జనంబుగ, సురల్ సారంగ యూధంబుగా’ అన్న సత్యభామాయుద్ధ ఘట్టంలో యుద్ధాన్ని వర్షంతో పోల్చినది ధర్మన్న భారతంలోనూ ఉంది.

 

ము|| రమణీయంబగు పాంచజన్య జనితారవంబు గర్జా విశే

షముగా, ఖడ్గమరీచీజాలము తటిత్సంఘంబుగా, నుగ్రచా

పముగా, ఖడ్గమరీచీజాలము తటిత్సంఘంబుగా, నుగ్రచా

పము దేవేంద్ర శరాసనంబుగను, శుంభత్కృష్ణ మేఘంబు పా

ర్థ మహాగ్నిచ్చట మీది కేగ శరధారా ఖేలనోన్మాదియై                 (VII-55)

రంభ అశ్వంగా మారినాక వర్ణిస్తూ….

సీ||    ప్రియుని కెమ్మోని చుంబింప నోపని లేమ

కఠిన ఖలీన మేగతి వహించు                  (కళ్ళెం)

హారంబు బరువని అలయు లతాతవ్వి

వాగ్ల నెట్టికైవడి ధరించు                         (జీను)

అని రాసిన ఈ పద్యం

‘వీణె చక్కగ బట్టు వెరవెరులగని కొమ్మ

బాణాసంసంబెట్లు పట్ట నేర్చు…’

అన్న పోతన పద్యాన్ని తలపిస్తోంది.

వర్ణనలు అతి వేలంగా వర్ణించడు. సందర్భం వస్తే వదలడు. ఔచిత్యానికి పెద్ద పీట. స్త్రీ అంగాంగ వర్ణనలు, అతివేల శృఁగారాలు ఇష్టపడడు. తుల్యుని తపోభంగం చేయడాన్కి వచ్చిన వేశ్యులు అతనిని లోబర్చుకోవడానికి ఎన్నో శృంగారాంశాలు పలికినారు. కాని వాటిని ధర్మన వర్ణించడు. “వ్రాయగారాని పలుకులు పలికెనపుడు (III-30)” అని ఔచిత్యవంతంగా ముగించాడు.

సమకాలీనాంశాలు కావ్యాల్లో పొదిగే లక్షణం ఉంది. నాటి సామాజికాంశాలైన అప్పులు, వడ్డీలు, అప్పుపత్రాలు, అర్జంటు పద్దులు, మొండి బాకీలు ఈ క్రింది రెండు పద్యాల్లో శ్లేషతో వర్ణించాడు.

కరములు చాపి వడ్డిడుటకై బుధశుక్రుల సాక్షివెట్టి య

యయ్యరుణుడు భూమిచేత తగ నప్పులు గైకొని యియ్యికున్నచో

ధర తనమూల వృద్ధులకు దక్కక సాగిన వారి గూర్చి “య

క్క ఱగుడి” వ్రాసియాగె ననగా పరిశేషము చుట్టెనాతనిన్  చి.భా. II-16

బుధుడు = పండితుడు; శుక్రుడు = నీతివేత్త వీళ్ళిద్దరు సాక్ష్యంగా భూమి అరుణునికి అప్పు (నీరు) ఇచ్చింది. ఇవ్వక అరుణుడు పారిపోయినాడు. సూర్యుని సారధి ఉంటాడా మరి! చెయ్యి చాపి తీసికొన్నాడు. వడ్డీ ఇస్తానన్నాడు. ఎండాకాలంలో తీసికొన్న నీటికి మరిన్ని జలాలు (వర్షకాలంలో) భూమికి అందాలి. ధరకు (భూమికి) తన మూలవృద్ధులు అసలూ వడ్డీ (వృద్ధి ప్రకృతి, వడ్డి వికృతి పదాలు) రెండు పొయ్యాయి. ఉన్న నీళ్ళన్నీ భూమి మీద ఎండిపొయ్యాయి. అరుణుడు ‘అర్జంటు పద్దు’ ఐనాడు. అందుకని వాడి పేరును చిట్టాలో గుండం (అక్కర గుడి) పెట్టిందట. సూర్యునిచుట్టు గూడు కట్టడాన్ని ఇక్కడ వర్ణించినాడు. (కరములు = చేతులు, కిరణాలు; బుధ = పండితుడు; బుధ శుక్రులు సాక్షి = బుధ శుక్రవారాల్లో మూలవృద్ధులు = అసలు + వంశమూలాలైన ముసలివారికి తాగడానికి నీరు లేక అని).

పంటలకు అప్పులు, పత్రాలు మరో చోట వర్ణించాడు.

తరుపులకు మేఘడప్పులు దానొసగి

యవి వసంతునికిమ్మని యప్పగింప

దానికి ఫలములియ్య పత్రంబులిచ్చె

ననగ దరువుల పత్రంబులవని రాలె           (చి.భా.II-102)

చరిగొండ ధర్మన్న తన భారతంలో అంతకుపూర్వం భారతాదుల్లో చెప్పినట్టు రాజనీతులు, సంఘనీతులు, రాజసేవక లక్షణాలు నారదుడు చతుర్ధన మహారాజుకు చెప్పినట్లు రాసినాడు. రాయబారి లక్షణాలు ఇలా ఉండాలట.

వినయ వివేక భూషణు, ప్రవీణు, కులీను, పరేంగితజ్ఞు, స

త్యనిరతు, బుద్ధిమంతు, నుచితప్రదు, గార్యధురంధరున్, కృపా

త్ము, నతి గుణాకరున్, పతిహితున్ జననాథుడు రాయబారి జే

సిన నతడెట్టులైన ఫలసిద్ధిగ జేయు సమస్తకృత్యముల్              చి.భా.VI-92

భూపాలుడు ప్రజల  నుంచి భూఫల సాయం (ధాన్యరూపంలో పన్ను = కోరు) తీసికునేటప్పుడు ప్రజలను బాధపెట్టక తుమ్మెద పూల తేనెను పూల నుండి స్వీకరించినట్టు స్వీకరించాలన్నాడు.

అరి కోరు గొనెడుతరి భూ

వరుడు ప్రజల మనసు నలపవలదు దలపన్

ధరణి కుసుమముల గలిగిన

పరిమళములు గొనెడు తేటి బాగున నధిపా!                 V-52

ధర్మన్న కవితా భిక్ష :

అనంతర ప్రబంధ కవులకు అనుకరణీయంగా ధర్మన రచన సాగింది. ధర్మన చతుర్థనమహారాజు తన తప్పిదానికి వగచే ఘట్టం, అల్లసాని ప్రవరుని వగపు ఘట్టంతో, చతుర్ధనుని వేట, స్వరోచివేటతో సంవదిస్తాయి. నంది తిమ్మన పారిజాతాపహరణ ఘట్టం – ధర్మన పారిజాతాపహరణ ఘట్టం నుండి చాలా అనుకరించిందే.

ఎ)              ఈసున గోపమున నన్మదివహించి పులోమజ వేడి మాటకై

గాసిలి మేన సొమ్ముడిపి కన్నుల గ్రమ్మెడు నీట చందనం

బోసరిలంగ జేసి శిరమొయ్యెన వంచి కపోల  పాళిపై

చేసమకొల్పి యొక్క యెడ చింతిలుచుండె నంతలోపలన్

ఈసునబుట్టి డెందమున…..

గాసిలియెడ్చె…. అని తిమ్మన రాసినాడీ పద్యభావమును. సొమ్ముడిపి అని ధర్మన అంటే నిరస్తభూషయై అని తిమ్మన రాసినాడు.

బి)              ఆరమి శిరోమి బ్రియంబున గౌగిట జేర్చి, కంటినీ

రారిచి, చిక్కువడ్డ కురులల్లన కొప్పున దోపి, యక్కునం

బేరులు చక్కదిద్ది, వలిపెంబు చనుంగవ గేలగొల్పి, యం

భోరుహ పత్రలోచనుడు మోము గరంబున నెత్తి, యిట్లనున్

అని ధర్మన రాయగా దీనిని తిమ్మన పారిజాతాపహరణంలో

ఆరమణీలాలామ మదినంటిన కోపభరంబున నిల్పగా

నేరక నెవ్వగం బొగుల నీరజనాభుడు నిండు గౌగిటం

జేరిచి బుజ్జగించి నునుజెక్కుల జాలుకొనంగ జారు క

న్నీరు కరంబు నందుడిచి నెయ్యము దియ్యము దోపనిట్లనున్

రెండూ ఉత్పలమాలలే, ఆద్యంత శబ్దాలు సమానం. ప్రాసాక్షరం సమానం. కౌగిట చేర్చడం, కన్నీరార్చడం వగైరాలు సమానం. ధర్మన యొక్క కృష్ణుని బుజ్జగింపులు అధికంగా (ఆరువిధాలుగా) ఉన్నాయి.

సి) “పారిజాతంబె నీ యుద్యాన వీధి బెట్టెద ననుచున్” అని ధర్మన్న అంటే, “పెరటి చెట్టుగ నాటింతు పెంపుగనుము” అని తిమ్మన అన్నాడు.

డి) ప్రబంధ నాయకల ఏడ్పు ధర్మన్నతో ప్రారంభమైంది.

ఏమిటి కింతవంత తరళేక్షణ చెప్పుమటన్నలేచి య

బ్భామిని చన్నుదోయిపై పయ్యెద కొంగు దలంగి జాఱ, నె

మ్మోమరవాల్చి, యూరుపుల ముంగర ముత్యము గంద, నేడిచెన్

గోమల నూతన స్వరము గ్రోలుచు కోయిల పిల్లయో యనన్       V-94

ఏమిటి కింతవంత అని ధర్మన అనగా

ఇంతవంత నీకేల అని తిమ్మన రాసినాడు.

ఇ) కోయిల పిల్ల ఏడ్చినట్టని ధర్మన అంటే ఆడకోయిల (కలకంఠ వధువు) అని తిమ్మన రాసినాడు. నాయిక అందంగా ఏడ్చే విధానం ధర్మన్నే తొలుత ప్రవేశపెట్టినాడు. ధర్మన పారిజాతపహరణ గాథ (సంక్షిప్తంగా చిత్ర భారతంలో రాసిన దానిని), తిమ్మన పారిజాతపహరణ గాథగా మలచుకొని సంబోధనలు, ఎత్తుగడలు, భావాలు, పాత్రల అంగచాలనాలు మొ|| వాటిలో అనుసరించడం జరిగిందనేది దాచేసే దాగని సత్యం.

మహాభారత యుద్ధం మిగతా యుద్ధాలకంటే భిన్నంగా అన్నదమ్ముల మధ్య యుద్ధం. చిత్రభారత యుద్ధం బావ బావమరదుల మధ్య. అందువల్ల రాయబారాలు, రాయబారుల మధ్య బాంధవ్య మర్యాదలు క్షేమ సమాచారాలు, కుశల ప్రశ్నలు, ఆ తరువాతే యుద్ధ రాయబారాలు, సందిమాటలూ, చరిగొండ ధర్మన్న చిత్ర భారత రాయబారాలూ రెండూ (అక్రూర, సహదేవ రాయబారాలు) ఇలాగే నడిచాయి. ఈ మర్యాదలను కృష్ణరాయబారంలో తిరుపతి వేంకటకవులు (పాండవోద్యోగ నాటకం), అక్రూర రాయబారంలో చిలకమర్తి లక్ష్మీనరసంహం (గయోపాఖ్యానం) వాడుకున్నారు.

హరికిన్ సేమమె, సీరికిన్ ముదమె సాత్యక్యాది తత్సోదరుల్

పరిణామంబున నున్నవారె, శుకుడున్ ప్రద్యుమ్నుడున్, సాంబుడున్

తరుడున్ మోదముతో జెలంగుదురే, యోధ శ్రేణికిన్ లెస్సయే

తరుణీ సంఘము సంతసంబొదవ నిత్యశ్రీల వర్తిల్లునే                చి.భా. VI-53.

ఈ పద్యం ‘బావా ఎప్పడు వచ్చితీవు’లో తొంగి చూస్తుంది.

ముదమేయత్తకు, ధర్మరాజునకు సమ్మోదంటె, భీముండు స

మ్మద లీలన్ విహరించునే, కుశలమ మత్ర్పాణమై, పొల్చునా

త్రిదశాధీశ్వర సూతికిన్, నకులుడుం బ్రీతాత్ముడే, సౌఖ్య సం

పదబాంచాలి మెలంగునే, పరిజనుల్ భవ్యాత్ములే యెప్పుడున్   చి.భా. VI-102

అన్న పద్యం

ధర్మపరావతారుడగు ధర్మజుడున్నె ప్రమోదియై, గదా

మర్మ విదుండు భీమునకు మంగలమే కదా, సేమమౌనె స

త్కార్ముకపాణి పార్థునకు, ధన్యసురూప విలాసులాకవల్

నిర్మల సౌఖ్యపాత్రులే, నీరజలోచన కృష్ణకేరునే!

అన్న చిలకమర్తి వారి (గయోపాఖ్యాన) పద్యాన్ని జ్ఞాపకం చేస్తోంది. సహదేవుడు ఎదురుగా ఉన్నాడు, కనుక నకులుని మాత్రము సేమమడిగినాడు. పైగా అత్త కుంతి కుశలం అధికంగా ధర్మన్నలో కనబడుతుంది. “కౌరవ బలము నుగ్రత – 1-18 అన్న ధర్మన్న పద్యము “ధార్త రాష్ట్రులు వృకోదరు నీసుమై జంప విషబోఝనంబు పెట్టునాడు…” అన్న చిలకమర్తి వారి పద్యము ఒకే ఎత్తుగడ, ఒకే ఛందము (సీసము) ఒకే భావముతో (కృష్ణాధిక్యతను గుర్తుచేస్తూ) సాగుతాయి. “మనుజాధీశుల జెప్పనేల…. (V-191), ఏమి చేయువాడనిట్టి …. (V-200), నిటలాక్షుండిపుడెత్తి వచ్చినను రానీ వంటి గయోపాఖ్యాన పద్యాలతో సంవదిస్తాయి. ఘట్టాలకు ఘట్టాలు సంవదించడం విశేషం.

మధ్యయుగాల్లో విఖ్యాతుడై, కవిత్వ విశేషాలతో, ప్రతిభాయుత ప్రయోగాలతో ధన్యుడైన ధర్మనకు తెలుగు సాహిత్య చరిత్రలో రావల్సినంత ఖ్యాతి రాలేదన్నది వాస్తవం.

శతలేఖిన్యవధాన పద్య రచనా సంధా సురత్రాణ చి

హ్నితనామా! చరిగొండ ధర్మసుకవీ! నీ వాగ్విలాసంబులా

శితికంఠోజ్జ్వల జూటకోటరకుటీ శీతాంశురేఖ సుధా

న్విత గంగా కనకాబ్జ నిర్భర రసావిర్భూత మాధుర్యముల్!

  • డా|| సంగనభట్ల నర్సయ్య
June 23, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us