మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

కలం కనే కలలు

by mayuukha June 23, 2021
written by mayuukha

తెలుగు భాషపైన మక్కువ ఈ యువతరాన్ని ఏకం చేసింది . తెలుగు రాష్ట్రాల వెలుగులు వీళ్ళు . అన్ని ఊళ్ళ నుండి , హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ ఇలా ప్రాంతాలు వేరైనా నవతరం ప్రాబ్లమ్ ఒక్కటే తమవైన ఆలోచనలను పంచుకునే తెలుగుభాష స్నేహ బృందం కావాలి . కవిత్వ సొగసులద్దడానికి ఒక వేదిక కావాలి -ఇది వారి తొలి అడుగు గా Wattsap సంఘాన్ని ఏర్పరుచుకున్నారు . కథలు , కవితలు , గల్పకలు , గేయాలు ఇలా అన్ని ప్రక్రియలలో వారికి తోచినరీతిలో చక్కని తెలుగులో కవితాత్మకంగా రాస్తున్నారు . సమాజంలో కనిపించే వింతతత్వాలకు సెటైర్స్ లాగా రాయడమైనా , నిత్య జీవన విధానంలో గమనించే అంశాలను సున్నితంగా స్పృశించడమైనా ఇలాంటివి రచిస్తూ యవతరానికేకాదు మనతరానికీ స్ఫూర్తిదాయకంగా అడుగులేస్తున్నఈ”కలం కనే కలలు” కు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది ‘ మయూఖ’

ఇలా వాళ్ళను మయూఖ లో పరిచయం చేస్తున్నాను ‘ నవతరం ‘ గా

*********************************************************

పలకడానికి మనిషి లేనప్పుడు, బ్రతకడానికి తోడు లేనప్పుడు పదం పదం పేర్చి మనసు కట్టుకున్న బొమ్మరిల్లు కదా కవిత్వం. మా కలలను కలాలతో పంచుకుంటూ కవిత్వం అనే సముద్రంలో ఈదుతున్న కాలం అది.
రేపటి పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్థి ఒకడు, రాత్రి కంప్యూటర్ తో కుస్తీ పడుతున్న ఒక యువతి, తీవ్రమైన గాయాలకు చికిత్స చేస్తున్న వైద్యుడు, ఉద్యోగ అవకాశాల వేటలో నిద్ర రాక మరో నిరుద్యోగి, వెన్నెల వైపు చూస్తూ గతంలోకి పయనిస్తున్న ఓ అందమైన యువతి, పొద్దంతా తీరిక లేకుండా పని చేసి వచ్చి అలసిపోయిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఇలా ఇంకా కొందరు.. ఎక్కడెక్కడో ఎవరికీ ఎవరితో సంబంధం లేని కొందరు యువతీ యువకులు.. అనగనగా ఒక రోజు, అనుకోకుండా ఒక చోట కలిశారు ఒక వాట్సప్ గ్రూప్ లో.

కలం కాగితంతో కలిసే వరకు ఎన్నో కలలు కంటుంది. ఒక అందమైన కవి ఆలోచనలు ఆ కలానికి తోడైతే, అద్భుతమైన కవితలను సృష్టిస్తుంది. అందుకేనేమో మా వాట్సప్ గ్రూప్ కి “కలం కనే కలలు” అని పేరు పెట్టుకున్నాము. మా వాట్సప్ గ్రూప్ నింపిన స్ఫూర్తి తో, తెలుగు భాష పట్ల అభిమానంతో మాలో ఒకరికి అనుకోకుండా వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టి, ఎన్నో ఆటుపోట్లని ఓర్చుకుని, 44 మంది యువతీయువకులు కలిసి రాసిన పుస్తక సంకలనమే మా ‘కలం కనే కలలు’.
28 మే 2020 లో “శ్రీ నందమూరి తారక రామారావు” గారి జయంతి సందర్భంగా ప్రచురించడం జరిగింది.
అక్షరానికి అక్షరం కూర్చి
పదానికి పదం జోడించి
ఎద మోయలేని భావాలను సిరా లో నింపి కలం అంచునుంచి జాలువారిన
పదకుసుమాలను ఈ పుస్తకం లో పొందుపరిచాము.

అనుకోని ప్రమాదం లో మాకు దూరమైన మా సన్నిహితుడు హేమంత్ కు ఈ పుస్తకాన్ని అంకితం చేశాము. పది పదకొండు మందితో మొదలైన సమూహం ఇప్పుడు ఎనభై మంది యువ రచయితలకు స్థానం చేకూర్చింది. అన్న – తమ్ముళ్ళుగా, అక్కా – చెల్లెళ్ళుగా, మంచి స్నేహితులుగా మా ఈ పయనాన్ని కొనసాగిస్తున్నాము. చిన్నగా ఒక్క అడుగుతో మొదలైన మా ప్రయాణం ఇప్పటికి రెండు వార్షికోత్సవాలు జరుపుకుని, తన మూడవ వసంతం లోకి అడుగు పెట్టింది. ఒకరికి ఒకరం తెలియకుండానే పరిచయం అయ్యాము, అనుకోకుండానే ఆప్తులమయ్యాము.

“కలం కనే కలలు”
– మా కళలతో నిండిన కలలు

 

June 23, 2021 1 comment
5 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మన యాదాద్రి- 2 & 3

by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం June 23, 2021
written by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం

శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలయిన డా|| ఎస్. లక్ష్మణ మూర్తి

డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.

 

అభ్రాజ భ్రాజ దవ్యాజ నిరుపమ దయాసార ధారానుసారం

కోపాటోప ప్రదీప్త ప్రకటతర గరుద్వంద్వ భూమ ప్రతాపం

వ్యాక్షిప్త స్వర్గగంత ప్రథిత గుణగణారంభ వీటీమ్యవాహం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహం (2వ శ్లోకం)

తాత్పర్యం: ప్రకాశములేని వాటిని కూడ ప్రకాశింపజేసే, కపటములేని – కారణము నెంచని, దేనితోను ఉపమింపబడని – నిరుపమానమైన తన దయాసారము యొక్క అనుసరణమైనవాడు; కోపం వల్ల కలిగిన ప్రజ్వరిల్లుతున్న – అందరికీ తేటతెల్లనైన, గరుత్మంతునిపై వెలుగొందుతున్న గొప్ప ప్రతాపం కలిగినవాడు; స్వర్గము, దిగంతాలలో విస్తరించబడిన శ్రేష్ఠమైన గుణసమూహములచేత ఉత్తమము, రమ్యము అయినవాడు, గరుత్మంతుని వాహనముగా కలిగిన యాదాద్రిపైన తన పటుతరమైన భుజబలాన్నీ, వేగాన్ని చూపుతున్న శ్రీలక్ష్మీనృసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లోకంలో ఒక ఆర్యోక్తి ఉంది. “వస్తేణ వపుషా వాచా, విద్యయా వినయేన చ, వకారైః పంచభిరీనః, వాసవో పి న పూజ్యతే”. లోకంలో ఐదు వకారాలకు (వకారంతో మొదలయ్యే పదాలకు) అత్యంత గౌరవ స్థానం ఉంది. అవి – వస్త్రం, అందమైన చక్కని శరీరం, వాక్కు చదువు, వినయము – ఈ వకారంతో మొదలయ్యే వాటికే జనాలు విలువనిస్తారు, గౌరవిస్తారు. అంటే వస్త్రము మొదలైన ఈ ఐదు ఆడంబరాలు ఎవరికైతే ఉంటాయో వారికే లోకంలో గౌరవం! పూజింపబడతారు లేకపోతే ఇంద్రుడంతవాడికి కూడ గౌరవం లభించదు. కంలో ధర్మపరులు, నీతి-నిజాయితీ కలిగిన వాళ్ళు. న్యాయవర్తన కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళను ఆడంబరాలకు గౌరవాన్నిచ్చే ఈ లోకం గౌరవించదు. వాళ్ళు లోకం దృష్టిలో ప్రకాశహీనులే! ఆ విధంగా లోకంలో ప్రకాశించలేని తన భక్తుల్ని ప్రకాశించేవాడు (అబ్రాజభ్రాజత్) పరమాత్మ! ఏ విధంగా అంటే – తన స్వభావసిద్ధమైన, ఎటువంటి కారణములను అడగని తన యథార్థమైన కపటములేని దయాసారంతో! ఆ దయ కూడ ఎటువంటిది? నిరుపమానమైనది. ఆ దయకు ఉపమానంగా చెప్పగలిగినది ఈ సృష్టిలోనే లేదు! అటువంటి శ్రేష్ఠమైన (సార) దయను అఖండమైన, ఎడతెగని ధారగా కురిపించే పరమాత్మ (దయాసార ధారానుసారం) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ‘అనుసారం’ స్వారస్యాన్ని కొంచెం చెప్పుకోవాలి. అనుసారం అంటే అనుసరించేవాడని అర్థం. దేవుడు ఎవరిని అనుసరిస్తాడు? తన ‘దయాసారాన్ని కురిపిస్తూ! అంటే పరమాత్మ భక్తుల్ని ముందు తన దయాసారంతో అనుగ్రహిస్తాడు. భక్తుల పై తన దయను పంపిస్తాడు. దాని వెంట తాను అనుసరించి భక్తులకు దర్శనమిస్తాడు! అందుకే కవి లక్ష్మీనరసింహస్వామి వారిని “అవ్యాజ నిరుపమ దయాసారానుసారం” అంటూ అభివర్ణించారు.

నరసింహస్వామి దుష్ట సంహారం కోసం అవతరించినవాడు. భక్త పరిపాలన ఆయన నిత్యకృత్యం! రాక్షసుల్ని సంహరించే సందర్భంలో నరసింహుడు తన కోపాన్నీ, వేగిరపాటును (ఆటోపాన్నీ) ప్రదర్శిస్తాడు. అప్పుడు ఆయన కోపం ప్రజ్వరిల్లిపోతూ ప్రకటితమవుతుంది. అతి భయంకరమైన వేగమూ, పరాక్రమమూ కలిగిన గరుత్మంతునిపై వెలుగొందుతూ తన గొర్పు ప్రతాపాన్ని ప్రదర్శించి రాక్షస సంహారం చేస్తాడు. స్వర్గాది దివ్యలోకాలలోను, దిగంతాలలోను ఆయన శ్రేష్ఠమైన గుణగణాలు వ్యాపించాయి. అటువంటి గుణగణారంభము చేత శ్రేష్ఠుడైనవాడు! ఇంకా రమ్యమైన ఆకారం కలవాడు!! అటువంటి లక్ష్మీనరసింహస్వామి వేగ పరాక్రమాలు కల గరుత్మంతుని తన వాహనంగా చేసుకున్నాడు. యాదగిరిపై తన పటుతర భుజబలంతో ప్రకాశించే శ్రీలక్ష్మీనరసింహస్వామినీ నమస్కరిస్తున్నాను అంటాడు కవిశేఖరుడు!

: స్వస్తి :

కౌటల్యాట వ్యట త్కాంచన తను నయనభ్రాంతికృచ్ఛంబరఘ్నం

లాంగల్యబ్లాంకుశేంద్రాయుధ ఝష శుభరేఖోజ్జ్వలత్పన్నవాబ్దం

ఆపన్నా పన్నగేంద్రం శుచి నియమ గుణార్యాభివంద్యాభిధేయం

వందే యాదక్షమాభృత్కటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్

తాత్పర్యం: కుటిలత్వము, వంచన అనే అడవిలో తిరిగే, మనోహరమైన ఆకారాలతో చూచేవారి కళ్ళకు భ్రమను కలిగించే మాయను నశింపజేసేవాడు; నాగలి, పద్మము, అంకుశము, వజ్రము అనే ఇంద్రుని ఆయుధం, చేప (మత్స్యం) అనే శుభప్రదమైన రేఖలు కలిగి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న తామరతో పోల్చదగిన పాదము కలవాడు; తనను భక్తితో ఆశ్రయించిన వారి ఆపదలనే పర్వతాలకు ఇంద్రుని వంటివాడు; పరిశుద్ధమూ-పవిత్రమూ అయిన నియమము మొదలైన సద్గుణములచే ఉత్తములచే అభివందనములందుకునే చెప్పుకోదగిన రూపము కలవాడు అయిన – యాదగిరిపై నెలకొన్న – తన దృఢతరమైన భుజబలాన్నీ, వేగాన్ని చూపుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: కౌటిల్యము అనేది ఒక దట్టమైన అడవి. ఈ సంసారం కూడా దాటలేని ఒక మహారణ్యమే! సంసార మహారణ్యంలో మనిషిని ఎన్నో వ్యామోహాలు వెంటాడుతూ ఉంటాయి. వాటికి లొంగి మనిషి కష్టాల పాలౌతూ ఉన్నాడు. దీన్నే కౌటిల్యము (కుటిలత్వము, కపటము మొదలైన దుర్గుణములు) కల మహారణ్యమని, అందులో (అటత్) తిరుగుతూన్న (కాంచనతను) వ్యామోహాన్ని కలిగించే రకరకాల విశేషాలు మానవుని కళ్ళకు ఆకర్షణీయాలుగా కనిపించి భ్రమను (నయన భ్రాంతి కృత్) కలుగజేస్తూ ఉంటాయి – రామాయణంలో కాంచన మృగ రూపంలో మారీచుడు సీత కళ్ళకు భ్రమను కలుగజేసినట్లు! శంబరము అంటే ఒకజాతి లేడి అన్న అర్థమూ ఉంది, మాయ అన్న అర్థంతోపాటు. ‘శాంబరీవిద్య’, ‘శాంబరీ ‘మాయ’ అన్న వ్యవహారాలు ప్రసిద్ధాలే కదా! శంబరుడు అటువంటి మాయను ప్రయోగించడంలో నిపుణుడు. అటువంటి శంబరుణ్ణి (శంబరాసురుణ్ణి) మన్మథుడు సంహరించాడు. మరి ఈ సంసారమనే అరణ్యంలో వ్యామోహమనే లేడి శాంబరీ మాయవలె మానవుల్ని వ్యామోహంలో ముంచి వేస్తూ కష్టాల పాలు చేస్తున్నది. అటువంటి శాంబరీ మాయను నశింపజేసి (శంబరఘ్నం) తన భక్తులకు కలిగిన నయన భ్రాంతిని పోగొట్టి ముక్తిని ప్రసాదించేవాడు నరసింహస్వామి!

హస్తరేఖాశాస్త్రం ప్రత్యేక బహుళ ప్రచారం పొందింది. చేతిలో ఉన్న రేఖలను ఆ శాస్త్రాధారంగా గుర్తించి వ్యక్తి భవిష్యత్తును చెప్తుంటారు. చేతిలో ఉన్నట్లుగానే పాదాలలో కూడా రేఖల ద్వారా కొన్ని గుర్తులు (రూపాలు) ఏర్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి వారి ఉజ్జ్వలమైన జీవితం ముందుగానే తెలుస్తుందంటారు విజ్ఞులు! శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పాదాలలో లాంగల రేఖ దీన్నే హల రేఖ అంటారు. నాగలి ఆకారంలో ఉంటుంది. పద్మరేఖ, అంకుశరేఖ, వజ్రరేఖ, ఝష (మత్స్య) రేఖలు ఉన్నాయి. స్వామివారి పాదాలు, శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు, ఎక్కడ నెలకొని ఉంటే అక్కడ హలరేఖ చేత అన్న సమృద్ధి ఉంటుంది. పద్మరేఖ సంపదభివృద్ధిని ఇస్తుంది. అంకుశ రేఖ దుష్టుల్ని, దుర్గుణాల్ని అదుపు జేస్తుంది. వజ్రరేఖ శత్రు సంహార కారకం! మత్స్య రేఖ సర్వసమృద్ధిని చేకూరుస్తుంది. స్వామివారు స్థితి కారకులు! లోక రక్షణ దీక్షగా కలిగినవారు! అటువంటి శుభరేఖల చేత ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న నూతనాబ్దములవంటి పాదాలు కలవారు స్వామివారు! (శుభలేఖోజ్జ్వలత్ +పత్+నవాబ్దం). స్వామివారు తమ భక్తులకు సర్వసమర్ధినీ కలిగిస్తారని భావం! ఆపదలు కలిగినవాళ్ళు ఆపన్నులు. స్వామివారు తమ భక్తుల మానసిక సైర్యాన్ని పరీక్షించడం కోసం వారికి తరచూ ఆపదలను కలిగిస్తూ ఉంటారు. ఎన్ని ఆపదలు ఎదురైనా భక్తులు స్వామి వారిని విడువకుండా సేవిస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు కలిగిన ఆపదలనే పర్వతాల్ని ఖండించే ఇంద్రుడే శ్రీలక్ష్మీ నరసింహస్వామి! (ఆపన్న+ఆపద్(త్)+నగ+ఇంద్రం). పరిశుద్ధతను, పవిత్రతను కలిగించే నియమాది సద్గుణాల చేత ఉత్తములైన వారిచేత నమస్కరింపబడే నామధేయం కలిగినటువంటివారు (శుచి+నియమ+గుణ + ఆర్యా +అభివంద్య + అభిధేయం) శ్రీస్వామివారు! యాదాద్రి పై నెలకొని (వెలసి) తన పటుతరమైన భుజ బల విక్రమం చేత ప్రకాశించే శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు– “నైజం”

by కొరుప్రోలు హరనాథ్ June 23, 2021
written by కొరుప్రోలు హరనాథ్

నేనెప్పుడూ

అందరికంటే

ముందుంటాను

ఎందుకో తెలుసా ?

అప్పుడే

నాకు తెలుస్తుంది

నా వెనకాల

ఎంతమంది

ఉన్నారన్న సంగతి.‌

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చర్విత చర్వణం           

by Sudharshana Rao Pochampally June 23, 2021
written by Sudharshana Rao Pochampally

శ్రీ మహా విష్ణువు కాలమునుండి కూడా పరిపాలన, పదవులు, పదవుల కేటాయింపులు రాజ్యము, రాజధానులు పురాణాలు చదువుతే గోచరిస్తాయి- శ్రీ మహా విష్ణువు కాని పరమేశ్వరుడు కాని బ్రహ్మ దేవుడు కాని నేటి మన కాలపు పరిపాలనా విధానాన్నే పోలి అధికారాలు కలిగి ఉంటారు-

విష్ణువు వైకుంఠములో ఉంటు నేటి మన దేశ ప్రధానిగాను, శివుడు కైలాసములో ఉంటు రాష్ట్ర పతిగాను ఇక బ్రహ్మ దేవుడు సత్య లోకములో ఉంటు దేశములోని అతున్నత న్యాయ మూర్తిగాను కొలువులు నిర్వర్తిస్తున్నట్టులు ద్యోతక మైతున్నది  అట్లనే అష్ట దిక్పాలకులు వాళ్ళ రాష్ట్రములు రాజధానులు.

దిక్పాలకుడు — దిశ — రాజధాని

ఇంద్రుడు — తూర్పు — అమరావతి

అగ్ని — ఆగ్నేయం — తోజోవతి పట్టణం

యముడు — దక్షిణం — సంయమని పట్టణం

నైరుతి — నైరుతి — కృష్ణాంగన పట్టణం

వరుణుడు — పశ్చిమ — శ్రద్ధావతి పట్టణం

వాయువు — వాయువ్యం — గంధవతి పట్టణం

కుబేరుడు — ఉత్తరం — అలక పట్టణం

ఈశానుడు — ఈశాన్యం — యశోవతి (కైలాసం)

మానవులకే కాదు దేవతలు కూడా స్త్రీ లోరునటుటకు ఉదంతముగ తారా చంద్రుల వ్యవహారము చెప్పవచ్చును.దేవతల గురువైన బృహస్పతి స్త్రీ లోలుడై స్వంత భార్యయైన తారను నిర్లక్ష్యము చేయుటవలన ఆమె పరిస్థితి   గమనించిన చంద్రుడు ఆమెను వశపర్చుకొని శృంగారము జరుపుటచే బుధుడు జన్మించాడని అంటరు.(బుధుడు శాపవశమున నపుంసకుడుగా పుడుతాడు తరువాత మహా శక్తివంతుడు, జ్ఞానసంపన్నుడై జ్ఞానశక్తీ దేవిని పెళ్ళాడుతాడు)

 

దేవేంద్రుడు గూడా రసోన్మాదముతో మునుల భార్యలమీద మనసుపడ్డవాడై వేకువ ఝామున మునులు స్నానాదికాలకై కోడి కూత ఆధారముగా తెల్లవారు సమయమనెంచి బయలు దేరుట గమనించి తానే కోడికన్న ముందుగా స్వరవంచన చేసి మునులు బయలుదేరగానే మునిపత్నుల అనుభవించ పూనుకున్నట్టు పురాణాలలో చెబుతారు.

ఇక కులాల విషయానికొస్తె కృతయుగమునుండి కులాలు ఉన్నట్టు పురాణాల ద్వారా తెలుస్తున్నది ఉదాహరణకు-త్రేతా యుగములో రాముడు సీతను అగ్ని పరీక్షకు పెట్టడానికి కారణం ఒక రజకుడు చేసిన ఆరోపణ.

ద్వాపరలో శ్రీ కృష్ణుడు గొల్ల వారింట్ల పెరుగడము-అట్లనే విదురుడు శూద్ర స్త్రీ గర్భమున జనించడము -కలియుగమైతే సరేసరి.

హరిశ్చంద్రుని పరీక్షించినవాడు. త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు; శకుంతలకు తండ్రి.గాయత్రి మంత్ర సృష్తి కర్త శ్రీ రామునికి గురువు అయిన విశ్వామిత్రుడంతటివాడేకరువు కాలమున ఒక చండాలుడు ఎండబెట్టుకున్న కుక్క మాంసాన్నే దొంగిలించి తిన్నాడని పురాణాలు చెబుతాయి-

ఇక అగస్త్యమహాముని  రాక్షసుని మాంసము తిని జీర్ణించుకున్నాడని కూడా పురాణ కథనం అదెట్లంటె   ఇలలుడు-వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు   మానవ రూపము దాల్చి దారిన    పోయే వారిని ఆతిథ్యానికని పిలిచి ఇలలుడు తన తమ్ముడగు వాతాపిని మేకగా మార్చి ఆ మేక మాంసము అతిథులకు పెట్టి వాళ్ళు తిన్న తరువాత వాతాపీ అని ఇలలుడు పిలువగానే అతిథుల కడుపు చీల్చుకుంటు బయటికొచ్చేవాడు-అప్పుడు ఇద్దరన్నదమ్ములు ఆ అథితుల చంపి తినేవారు- ఇదే తీరు ఒక నాడు అగస్త్య మహామునిని కూడా ఆహ్వానించి తమ్ముడగు వాతాపిని  మేకగ మార్చి ఆ మాంసముతో విందు భోజనము పెట్టి  ఎప్పటిలాగే వాతాపీ అని పిలుస్తాడు ఇలలుడు అది గ్రహించి వాక్శుద్ధి గల అగస్త్యుడు జీర్ణం అంటాడు వాతాపి అగస్త్యుని కడుపులో జీర్ణమైపోతాడు-

2.

అందుకే పిల్లలకు మందు పోసినా ఉగ్గు పెట్టినా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అను అని అంటుంటారు –

పురాణాలలో అన్నీ సాధ్యమే మచ్చుకు  సూర్యుని వాహనము ఏడు గుర్రాల రథము-అందులో విచిత్ర మేమిటంటె ఆ రథానికి చక్రము ఒకటే -పగ్గాలు ఏడు బుసలుకొట్టే పాములు-రథ సారథి అనూరుడు అంటె తొడలు లేనివాడు-అకాశములో ఏ ఆలంబన లేని నిరంతర అనంతకాల పయనము-

భారత వంశీయులైన కౌరవ పాండవుల యుద్ధమును గురించి తెల్పు 100000 లక్ష శ్లోకముల మహా కావ్యము కౌరవ పాండవుల యుద్ధమును గురించియేకాక ధర్మార్థ,కామ మోక్షములను గురించియు తెల్పుచున్నది-హైందవులచే భగవదవతారముగ భాగింపబడు శ్రీ కృష్ణుడు ఈ కాలమునకు చెందిన వాడుగా భావింపబడుచున్నాడు- మహాభారత యుద్ధ సమయమందు శ్రీ కృష్ణుడు భారత వీరుడైన అర్జునునకు బోధించిన నీతి ధర్మము “భగవద్గీత” యను నామముతో మహా భారతములో అంతర్భాగముగా నున్నది-అందుచే మహా భారతము పుణ్యకావ్యముగ ఎంచబడుచున్నది- మహా భారతము వేదవ్యాసునిచే రచించబడినది -కాలక్రమమున ఎన్నొ విషయములందు చేర్చబడినవి- మహా భారతమును “పంచా వేదము “అని కూడ పిలుచుచున్నారు-

ఇప్పటి కాలములో ప్రభుత్వాలు వ్యవసాయ దారులకు గాని రక్షక భటులకు గాని యుధ సమయములో చని పోయిన సైనిక కుటుంబము నకుగాని రాయితీ,పరిహారము మున్నగు వసతులు ఆ నాడే అనగా ధర్మరాజు పరిపాలనా కాలములో కూడా కలిగించెడి వారు- ధర్మ రాజును నారదుడు అడిగినట్టి ప్రశ్నల ఆధారంగా మనకు తెలియుచున్నది-

నారదుడు ధర్మ రాజుకు రైతులకు చేయవలసిన సహాయము గురించి చెబుతూ

ధరణీ నాథ భవద్భుజ

పరిపాలిత యైన వసుధ బరిపూర్ణములై

కరమొప్పుచున్నె చెరువులు

ధరణికవగ్రహ భయంబు  దనుకక యుండన్-

 

హీనులకు కర్షకులకు ను

భూనుత ధాన్యంబు బీజములు వణిజులకున్

మానుగ శతైకవృద్ధి న

నూనముగా ఋణములిత్తె  యుత్తమ బుద్ధిన్

 

నారదుడు ధర్మరాజును అడింగిండేమిటంటెరైతులకు కరువు అనేది లేకుండా చెరువుల్లో నీళ్ళు నిండి ఉండి బాగుగా కనిపిస్తున్నాయా  పేదలైన బలహీనులైన కర్షకులకు ధాన్యాని ఇస్తున్నావా,వారికి విత్తనాలు ఇస్తున్నావా ,చిన్న వ్యాపారులకు ఋణాలు ఇస్తున్నావా అంతే కాదు శతైక వృద్ధితో అంటె నూటికి ఒక రూపాయి వడ్డీకి  ఇస్తున్నావా  దానితోనే సరియైన అభివృద్ధి అని చెబుతాడు.

రైతు సంక్షేమ పథకాలే కాకుండ నారదుడు పరిపాలనా సంబంధమైన విధానాలు కూడా చెబుతాడు –

తమ తమ కనియెడు తరి జీ

తము గానక నవయు భటుల దౌర్గత్య విషా

దములేని వానికవ

శ్యము నెగ్గొనరించు నతడు శకృండైనన్-

పరిపాలనలో ప్రభుత్వం కోసం పనిచేసే భటులకు సరైన సమయములో తగిన రీతిని జీతాలు ఇవ్వక పోతె అలాంటి వారు పరిపాలకులకు తప్పనిసరిగా నష్టం చేకూరుస్తారు- కాబట్టి చనిపోయిన వారినే కాదు బతికి ఉండి పాలనలో సేవ చేసే భటులకు మంచి జీత భత్యాలు ఇవ్వాలి ఇంకా చెబుతూ

చోర భయ వర్జితముగా

ధారుణీ బాలింతె యధిక ధన లోభమునన్

జోరులలక్షింపరుగా

వారలచో ధనము గొని భవితభ్యవరుల్

దొంగల భయము లేకుండా పాలిస్తున్నావా నీ దగ్గర పని చేసే సేవకులు అధిక ధన లోభము (లంచాలకు లొంగి)చోరులను కాపాడి వెనుకేసుకొని వచ్చే అవకాశం ఉంది ఇవన్ని అడుగుతు ఉద్యోగులను నియమించే విషయంలో

 

హెచ్చరిక చేస్తాడు-

ఉపధాశుద్ధులబాప

వ్యపగత బుద్ధుల వినీతవర్తుల సములన్

సుపరీక్ష వినియోగించితె

నిపుణుల నర్థార్జనాది నృపకార్యములన్-

 

ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత

బుద్ధి నెరింగిన వారిన

యుత్తమ మధ్యమాధమ నియోగములన్

నియమించితె నరెన్

ద్రోత్తమ భృత్యకోటికి సమానముగా

దగు జీతంబులా

యత్తమ సేసి యిత్తె దయ నయ్యయి

కాలము దప్పకుండగన్-

 

పన్నులు,డబ్బులు వసూలు చేసే సమయములో  నీతితో వర్తించే వారిని ఉత్తమ,మధ్యమ,అథమ స్థానాలలో వారి ప్రావీణ్యము బట్టి నియమిస్తున్నావా లేదా అని అడుగుతాడు-

దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే భారత కాలములో కూడా లంచగొండులు,దొంగలు,మోసగాండ్లు ,సమర్థులు,అసమర్థులు,లోభులు,రాజ ద్రోహులు మొదలైన వారు ఉన్నారని ద్యోతకముచున్నది .

గురుజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం.

అందులో ఒక పాత్రధారి అంటాడు అన్నీ వేదాలలో ఉన్నాయష అని-ఈ అనంత కాల గమనం లోనేటికి రూపుమార్చుకొని పునరావృతమయితున్న జీవన విధానాలు–అదే చర్విత చర్వణం.

 

                                                                                        

 

 

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణకలనం

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి June 23, 2021
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

ఆధారములు
************
ఏకాక్షరులు
*********
18. నిలువు 4 తో పూలమ్మేవాడు, హంతకుడు.
21. నిలువు 38 తో వర్తకుడు.
22. అడ్డం 23 తో వలె.
26. లేత లేదు లెగు.

అడ్డం
*****
01. మహానసం (4)
04. కానుకలు (4)
07. బుజ్జగింపు (3)
10. ప్రేక్షకుడు (2)
13. రథం తీసుకురారు (2)
14. అంభోధిలో అప్పు (3)
15. ‘వచ్చి యిద్ధర గల్గు …. సరిత్తీర్థ’ లో ప్రవరుని కడలి (3)
16. చీకటిలో తిమింగిలం మింగేది (2)
19. పొట్టు ఊడ్వను (2)
20. పాతకాలపు వంటకు వాడేది, దూసేరు తీగతో అల్లేది (2)
23. యతి వేగం (2)
24. కలుగమి (2)
28. గోదావరి పవిత్రజలం (2)
30. వడికి దారం తీసే తకిలీ (3)
31. నివాసం (3)
32. గుండెనిండా ప్రేమ (2)
34. వినేవారిని విసిగించే సంభాషణ, సొల్లు కబుర్లు, గోడు (2)
36. పాండవులు లెక్కకు (3)
39. గబ్బిలం కవిగారి పచ్చపిట్ట (4)
40. అడ్డం 16తో సూర్యుడు (4)

నిలువు
******
02. గుఱ్ఱం (2)
03. ‘ ….. పాపం తలా పిడికెడు’ (2)
04. కూతురు కొండనాలుక (2)
05. శ్వాస ధైర్యం బురద (2)
06. లోహితాస్యు మాత (4)
08. ప్రేమ వరుస (2)
09. రైతుల తొలిదుక్కి పండుగ (4)
11. తొలియేడు శ్రీశ్రీ గారి పద్యరచనలను వరుసగా ప్రచురించిన పత్రిక (3)
12. తరువాత (3)
17. ఎటునుండైనా మెరిసే అందం (3)
19. వెట్టిచాకిరి (3)
24. పాము (4)
25. చిన్న పెట్టె (3)
27. పరమౌషధం (3)
29. గోవులు, పశువులు మేసే కంచె (4)
33. చెట్టు (2)
35. యుద్ధం (2)
36. సంవత్సరం సంఖ్య (2)
37. చిరుతిండిలో సవ్వడి (2)
38. అనుబంధవాక్యం, మామూలే (2)

 

పదకిరణకలనం (April edition) విజేత!

మేధస్సును పదును పెడుతూ, మనసును ఉత్సాహపరిచే ఒకానొక సాహిత్య చిక్కుప్రశ్నల సరదా ! మీదే విజయం కావచ్చు !ఇదిగో-మయూఖ పదకిరణకలనం (puzzle) పరిష్కర్త నెల్లుట్ల ఉమానరసింహారావు కు అభినందనలు .

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

విజేత

by -  బి ఎస్ రాములు June 23, 2021
written by -  బి ఎస్ రాములు
Ilustration by Ahobhilam Prabhakar (9490868288)
  ” ఆశలు, లక్ష్యాలు ఎక్కువై,  అవి సాధ్యం కాక పోతే నిరాశ..దుఃఖం.. !   ఏమీ  సాధించలేక పోతిననే నైరాశ్యం నుండి ఆత్మ న్యూనతా భావం,!కోపం చిరాకు విసుగు , విరక్తి  కలుగుతుంది. . దాంతో  సాధించిన విజయాలను మరిచిపోతం. వాటిని చిన్న చూపు చూస్తం. .  దొరికినదాన్ని గౌరవించాలి. ఆ విజయాలను చూసి , గుర్తు చేసుకొని మనకు మనం సంతోషించాలి. నిరాశకు గురి చేసే వైఫల్యాలు,  ఆశలు ఆశయాలు , లక్ష్యాలను తగ్గించుకోవాలె. పరిస్థితులతోపాటు  , పదిమంది కలిసి సహకరిస్తే  గాని సాధ్యమయ్యే వాటిని నీవో నేనో ఒక్కల్లమే సాధించాలనుకుంటే  సాధ్యం అవుతయా? మనను ఎవడో నమ్మించి మోసం చేస్తే జీవితంలో కోలుకోలేని దెబ్బ. దాంతో జీవిత గమనమే మారి పోతుంది. ాదకులకు
అయినా తప్పు మనదే అని జీవితమంతా కుంగి పోవడంలో అర్థం లేదు.  మనం మోసపోయింది ఆశ వల్లనే కదా! . దుకఃఖానికి  మూలం ఆశలు, కోరికలే అన్నడు బుద్దుడు. నీ  నిరాశకు మూలం అత్యాశలే.  ” అన్నాడు సిధ్దార్థ.
            ”  డాక్టర్ కావాలనుకోవడం , డీలర్ షిప్ , తీసుకోవాలనుకోవడం , కాంట్రాక్టులు చేయాలనుకోవడం కోవడం అత్యాశా ? ” ఖంగున ఎదురు తిరిగాడు సూర్యం.
           ” అంత కోపం అక్కర లేదు సూర్యం.  డాక్టర్ కావాలనుకున్నది , కాంట్రాక్టులు చేయాలనుకున్నది, డీలర్ షిప్ తీసుకోవాలనుకున్నది నీ కోసమా. ప్రజలకు సేవ చేయడం కోసమా? సంపాదించడం కోసమా? కేవలం సోషల్ స్టేటస్ కోసమా.? సూటిగా చెప్పు”
 సూర్యానికి మరింత మండుకొచ్చింది.  సూటిగా కత్తితో పొడిచినట్టుందా ప్రశ్న. అందరిలో గొప్పగా ఉంటుందని, కాస్త సంపాదించుకోవచ్చనే అస్పష్ట భావమే ఆ కోరికలకు  మూలం. మరీ అంత సూటిగా అడిగే సరికి తట్టు కోలేక పోయాడు సూర్యం.
              ” ఇంత కాలం నుంచి నన్ను అర్థం చేసుకున్నది  ఇదేనా ? ఇంతేనా? ”  అంటూ అంతెత్తున ఎగిరాడు సూర్యం.
          సూర్యం ఆవేదన, ఆవేశం తగ్గే దాక  సిద్దార్థ అతన్నే చూస్తూ ఉండి పోయాడు. పక్కనున్న రేకుల షెడ్డు మీద డబ డబ వర్షం అకస్మాత్తుగ పడ్డట్టుంది.  పందిరికి పాకిన మల్లె తీగ అటూ ఇటూ ఊగుతూ కమ్మని సువాసన పంచుతోంది.
        ” హేమలత ఆలోచనలో తప్పు లేదు. అది ఆడవాల్లకుండే సహజమైన కోరిక. పైగా వాల్ల నాన్నకు హోల్ సేల్ బట్టల దుకాణం ఉండె. లారీలకొద్ది బట్టల గోదాములు . ఎందరో గుమస్తాలు  వచ్చిపోయే దుకాణాదారులు. సంపన్నకుటుంబంలో  పెరిగింది హేమలత.   మీ కష్టాలకు కారణం మోసపోవడం. మోసం చేసినోన్ని వదిలి ఆ కోపం బాధ ఆమె మీద చూపిస్తే ఏం ఉపయోగం? మాటలు పెంచుకోవడం తప్ప?”
            సూర్యం ముఖం ఎర్ర వడ్డది. . కాళ్లు చేతులు శరీరం ఆవేశంతో వణుకుతున్నాయి. గుండె పోటు హెచ్చినట్టు ఎగపోస్తున్నాడు .  సూర్యాన్ని ఏమనకుండా అలాగే చూస్తుండి పోయాడు సిద్దార్థ.
        ఎవరో వేడి వేడి  స్నాక్స్ చాయ్ టీ పాయ్ మీద పెట్టి వెళ్లి పోయారు. వర్షం చినుకులు, చల్లగాలికి  మల్లెల సువాసనకు వేడి వేడి పాప్ కార్న్ చాయ్ ఎంతో ఆహ్లాదం కలిగిస్తోంది.  సిద్దార్థ చాయ్ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు.  సూర్యం చేతిలోని కప్పు వణుకుతోంది. సూర్యం ఆవేశం శరీరం నిండా  పాకింది.  నవ్వితే బాగుండదని వేడి చాయ్ లో మల్లెల సువాసన .అంటూ మాట మార్చి నవ్వించే ప్రయత్నం చేశాడు సిద్దార్థ.
        ” అవును . చాలా బాగుంది ఈ మల్లెలు చాలా స్పెషల్  హేమలత సెలక్షన్.. “
         ” అకాల వర్షంలో మనం అడగక ముందే స్నాక్స్ చాయ్ పంపించడం బాగుంది కదా! “
          ” అవును “
            “ఆశించకుండా అందితే ఎంత ఆనందమో..,! “
            ” ఆశించి అరగంట దాకా రాకపోతే ఎంత కోపం చిరాకు కలుగుతుందో! అపుడు చాయ్ మాధుర్యాన్ని కూడా మరిచి పోతం.. “
            ” నిజమే. “
             ” ఆశించింది అందక పోయినా ఆలస్యంగా అందినా దాన్ని పూర్తి గా ఆస్వాదించలేం. ఎక్కడో కోపం అసంతృప్తి , అసహనం  రగులుతూనే ఉంటుంది. అయినా సహనం వీడద్దు. జో బైడెన్ జీవితంలో ఎన్ని విషాదాలు! ఎన్ని వైఫల్యాలు! అబ్రహాం లింకన్ ను తీసుకో! అంబేడ్కర్ ను తీసుకో! వాల్ల జీవితాల్లో ఎన్ని విషాదాలు? ఎన్ని వైఫల్యాలు? ఎన్ని ఎదురు దెబ్బలు? అందినట్టే అంది జారిపోయినవెన్నో! అయినా కుంగి పోలేదు. చివరకు విజయం వరించింది. అంత సంకల్ప బలం ఉండాలి. కుంగి పోతె ఎట్ల? ఉరకడం చాతగాకపోతే  సాధించిన దాంతో సంతృప్తిగ ఆనందంగ జీవించాలె.”
 ” అంతేనంటవ?”
               ”  అంతే.! అందుకే అంటున్న.  ఇంటికి పెద్ద కొడుకుగా నీకు అన్నీ అందినా సకాలంలో అందకపోవడం, ఆశించినవన్నీ అందక పోవడం వల్ల ,కొన్ని మోసాలు జరగడం వల్ల,అందినతృప్తికూడా మిగలకుండా పోయింది. ఇంటికి పెద్ద కొడుకు కావడం ఒక వరం ఒక శాపం. ఎట్ల చూస్తే అట్ల కనవడుతది.”
           ” నా కా? సుఖం తృప్తి ఈ జన్మలో రాదు. ఎందుకులే ఈ చర్చ. ఈ బతుకింతే. ఎంత చేసినా ఉమ్మడి కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు ! ఎన్ని కోరికలు వదులుకున్ననో  నీకు తెలియదు. చివరకు హేమకూడ నన్నే అంటది. “
            ” సూర్యం ! వాల్ల నుంచి అతిగా  ఆశించడం వల్ల నువు చేసిన త్యాగాల వల్ల కలిగిన పెద్దరికాన్ని,  దానివల్ల  కలిగే ఆనందాన్ని కూడ పొంద లేక పోతున్నవు.   నీ చెల్లెండ్లకు, తమ్ముల్లకు నువ్వంటే ఎంత గౌరవం! .  నిజానికి నీకేం తక్కువ. కొడుకు అమెరికాలో ఇంజనీర్. బిడ్డ డాక్టర్. వాల్లను ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలల్ల చదివిచ్చినవు. ఉన్న భూములు అమ్మినవు. అయితేంది? ఇపుడు నెలకు ఇరవై వేల  కిరాయ  వచ్చే ఇల్లు. స్కూటర్, కార్ , ఏ రోగాలు లేని చక్కని ఆరోగ్యం. ఇంతకన్నా ఏం కావాలి? మీ నాన్నను ఇంటికి పెద్ద కొడుకుగా కాపాడుకున్నావు. ఓర్వలేని తనంతో ఫ్యాక్షనిజంతో మీ నాన్న పై జరిగిన హత్యా ప్రయత్నం నుంచి ప్రాణాలకు  ఒడ్డి కాపాడుకున్నవు. అదొక్కటి చాలదా? అపుడే మరోసారి నీ జీవితం మలుపు తిరిగిందని నాకు తెలుసు. నాన్న కోసం నీ సుదూర ఆశలు లక్ష్యాలు వదులుకున్నవు. నాన్నకు తోడుండాలనుకున్నవు. దీన్నెవరు మర్చిపోరు.  మీ నాన్న పోయినంక  చెల్లె పెండ్లి చేసి తండ్రి లా కర్తవ్యం నెరవేర్చినవు. . అన్నదమ్ముల ఆస్తి పంపకాలు అమ్మ చెప్పినట్టు , తమ్ముల్లు కోరుకున్నట్టే పంచి ఇచ్చినవు. నీవు  ఇంటికి పెద్ద కొడుకుగా ఎన్నో త్యాగాలు చేసినవు. మీ తమ్ముల్లు గుర్తించక పోయినా మీ చెల్లెల్లకు తెలుసు. లోకానికి తెలుసు.  నాన్న సంపాదించిన ఆస్తి తరిగి పోయింది. పెద్ద పెద్ద దొరల ఆస్తులే చదువులకు , పెండ్లిల్లకు కరిగి పోయినయి. మధ్య తరగతి గా  మారిపోయిన్రు. అది నీ ఒక్కడి సమస్య కాదు. అయినా నువు ఇంటి గౌరవాన్ని నిలబెట్టినవు. పూర్తిగా నిలబెట్టి ఇంకా ఎదగాలనేది నీ ఆశ. అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండద్దా? ప్రధాన  మంత్రి కొడుకులు తమ తండ్రి అంత ఎదగడం సాధ్యమా? అసాధ్యం . అది వారి అసమర్థత కాదు. లక్ష్యాలు ఆశయాలు పరిస్థితులు, వ్యక్తిత్వాలు తరాలు  మారుతుంటాయి.  నీ క్లాస్ మేట్సు తో పోల్చుకో. అందరూ నీలాగే ఇదే స్థాయిలో హాయిగా బతుకుతున్నారు. సొంత ఇల్లు, చక్కని పిల్లలు, మంచి ఆరోగ్యం. పదిమందిలో గౌరవం. ఇంతకన్నా ఏంకావాలి? ఎపుడో చిన్నపుడు తెలిసీ తెలియని వయసులో పుస్తకాలు చదివి సినిమాలు చూసి నేను కూడా అలా ఉండాలె ఎదగాలె అన్నకున్న వన్నీ ఊహలు. వయసు పెరిగి అనుభవాలు కలిగినకొద్దీ మారడం రాజీ పడడం సహజం.”
          ” రాజీ పడక చేసేదేముంది. అమ్మ ఎపుడూ నువు పెద్ద కొడుకువు రా , తమ్ముల్లు చెల్లెండ్లు చిన్న పిలగాన్లు. ఏదైనా. నువు పెద్ద మనుసుతో ఓర్చుకోవాలె అని చెప్పేది. వాల్లను వెనుకేసుకచ్చేది. వాల్లకు ఎంత చేసినా ఒడిసేటిది కాదు.మీ కోసం నేను  ఎన్ని  త్యాగం చేసిన్నో తెలుసా అంటే ఏం చేసినవు? నాన్న సంపాయించినవన్ని అమ్మినవు
అని అంతెత్తు లేస్తరు. అపుడు అందరి నోల్లు పెద్దగైతయి.  ఉమ్మడి కుటుంబం కాపాడడం కోసం ఎన్ని వదులుకున్ననో తెలుసా? మంచి మంచి ఉద్యోగాలస్తే అమ్మ ఏడ్చె. నువ్వు దూరం ఎల్లి పోతె వీల్లంత ఎట్లరా? నీ  చెల్లె స్వాతి  పెండ్లి ఎట్ల? తమ్ముల్లకు ఏదో ఒక దారి చూపక పోతె ఎట్ల . నాన్న లేకపాయె. అన్నవు నువు పోతనంటే తమ్ముల్లు ఎవలబయం లేక ఏగి అయితరు. అని ఏడ్చె. ఆశలన్ని వదులుకొని ఇంటికి , ఊరికి దగ్గర ఉద్యోగం వెతుక్కుంటి. సిద్దూ! నీకు తెలువది. ఇంటికి పెద్ద కొడుకై పుట్టుడు ఎంత కష్టమో ! ఇపుడట్ల లేదనుకో,! కాని నా బతుకు నేను అనుకున్నట్టు బతికిన్నా? నా కిష్టం ఉన్నా లేకున్నా అందరికోసం బతికిన. నేను ఎట్ల బతుకాలనుకున్ననో నీకు తెలువది” సూర్యంలో తనను ఎవరు అర్థం చేసుకోలేదన్న బాధ , కోపం  వెల్లువై ప్రవహించింది.
           ” సూర్యం ! ఇపుడు అమ్మలేదు. నాన్న ఎపుడో పోయిండు. మోసం చేసినోల్లతోని మాటలు బందయినయి. అతడు పోయినా  మీ కుటుంబాలు మల్ల కలుసుకున్నది లేదు. అవన్ని గతం. ఇపుడు మీరందరు ఎక్కడోల్లక్కడ బతుకుతున్నరు.  పరిస్థితులు, వ్యక్తిత్వాలు తరా లు మారినై. మనం ఇంకా ఎదిగేదుండె అని మనం … ఏం సంపాదించ లేదు అని ఎవరైనా ఎన్నన్నా అనుకోనీ! అన్ని చూస్తనే ఉన్న హేమలత అనుకుంటే ఏం చేస్తవు చెప్పు? ఒక మాట అడుగుత! కోపం తెచ్చుకోకు. నువ్వు ఇన్ని త్యాగాలు చేసినా అనుకుంటున్నవు. ఆ త్యాగాలు హేమలత కూడా చేసింది కదా! నువ్వు ఇంటికి పెద్ద కొడుకుగా చేసిన త్యాగాలన్ని  ఇంటికి పెద్ద కోడలుగా  హేమ కూడా చేసినట్టే కదా! అట్ల ఆమెను , ఆమెలోని మంచి తనాన్ని , త్యాగాన్ని ఎందుకు గుర్తించవు? పిల్లలు ఎదిగినారంటే అదంత ఆమెదే క్రెడిట్! “
        “. సిద్దూ., నీకు తెలువది.
ఎవలెవలకో  చేసిన అంటవు! నాకేం చేసినవు? అంటది ఆమె! ఏంచెయ్యాలె చెప్పు. ఇన్ని బరువు బాధ్యతలల్ల ఆమెకు ఏంచేయ్యాలె? ఇన్ని సగవెట్టుకుంట కిలోల కొద్ది బంగారం కొనేదుండెనా? ఉమ్మడి కుటుంబంల ప్రత్యేకంగ హేమలతకు ఎట్ల చేస్తరు చెప్పు. ముందు చెల్లెండ్లను చూడక పోతె లోకం ఏమంటది? ఆలస్యంగ ఉద్యోగంల చేరితి. వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే చాలవాయె! పిల్లల చదువులకు నా వంతుకు వచ్చిన ఆస్తి అమ్మితి. అప్పుడన్నా నాకోసం అదీ ఇదీ కొనద్దా ? అని చెవిల జోరీగ తీరుగ అరిస్తే ఇంట్ల ఎట్ల మనసున వడ్తది.? “
          ” సూర్యం ఇది ఎవరికివారు అర్థం చేసుకోవాల్సిన విషయం. ముందు ఆమె ఆశలు , కోర్కెలు గుర్తించు. గౌరవించు.  హేమలోని మంచి తనాన్ని మెచ్చుకో! అందరికోసం మనం త్యాగం చేయక తప్పలేదు అని అర్థం చేయించు. అర్థం చేసుకుంటది.. హేమ ఏమైనా చిన్న పిల్లనా ? అర్థం కాకపోవడానికి? నీ త్యాగాన్ని గుర్తించ లేదని నువ్వెట్ల బాధపడుతున్నవో అంతకన్న ఎక్కువ బాధ పడుతున్నదని గుర్తించు. ఆమెకు నీకు పెండ్లి సంబంధం కుదిర్చినోడే గ్యాస్ డీలర్ షిప్ డిపాజిట్ కని ఇరవైయైదు వేలు ముంచింది ఆమెకు తెలువదా? అప్పటి ఇరవై అయిదు వేలు ఇప్పటి ఇరవై అయిదు లక్షల కన్నా ఎక్కువ. ఇట్ల సముదాయించి ఎవరో చెప్తే చెప్పిన వాల్లు దూరం అవడం తప్ప ఏం ఉపయోగం. అయినా ఇంకా చిననాటి కోర్కెలతో అసంతృప్తితో నిత్యం సంఘర్షించుకుంట బతికితే ఎట్ల? ఈ జీవితం మల్ల రాదు గదా?  సూర్యం!  ఆమె విషయం పక్కకు పెట్టు . నువ్వు తక్కువ తిన్నవా? ఇపుడైనా అవన్ని పక్కకు పెట్టి నువు నీ క్లాస్ మేట్సు తో పోల్చుకో. అందరూ నీలాగే ఇదే స్థాయిలో హాయిగా బతుకుతున్నరు. . సొంత ఇల్లు, చక్కని పిల్లలు, మంచి ఆరోగ్యం. పదిమందిలో గౌరవం. ఇంతకన్నా ఏంకావాలి? ఎపుడో చిన్నపుడు తెలిసీ తెలియని వయసులో పుస్తకాలు చదివి సినిమాలు చూసి నేను కూడా అలా ఉండాలె అనుకుంటె ఆ తప్పు ఎవరిది?”
     ఎక్కడో ఉరిమింది. రేకులు డబ డబ మనని కదిలాయి. మల్లెల సువాసన విసిరి కొట్టింది.
సూర్యం గుండెలో ఏదో అలజడి.
             ”  సూర్యం!  చిననాటి ఊహలు ఊరిస్తాయి. మంచి జరిగితే ఓకే. అనుకున్నది జరగక పోతే జానేదేవ్. ! ఉన్న బతుకులోనే ఆనందం తృప్తి వెతుక్కోవాలి. వేటగాడు వెంటాడిన దుప్పి తప్పించుకు పోయిందని కోపం తెచ్చుకుంటే దుప్పి అతని ఒడిలోకి వచ్చి వాలుతుందా.? కనీసం కుందేలునైనా వేసుకొని పోవాలనుకుంటాడు. కుందేలు కూరను తింటూ దుప్పి దొరకలేదని తిట్టుకుంటే కుందేలు రుచి ఆస్వాదించడం సాద్యమా?  కుందేలుకూర ఎంత బాగుందో ఆస్వాదించాలి. జీవితంలో ఇన్ని సాధించిన నీకు ఇంకా అసంతృప్తి ఎందుకు? ఎంత అందమైన జీవితం మనది. అందినదేదో అందినది. అది మనది. అందనిదేదో అందలేదు. అది మనది కాదు. మనకు బాకిలేదు అనుకోవాలి.  ఏమంటవు? “అ న్నాడు సిద్దార్థ.
            తాను చాలా విషయాల్లో ఇట్లనే సర్దుక పోయిండు. లైట్ గ తీసుకున్నడు. రాజీ పడ్డడు.  కాని కొన్ని మాత్రం మరిచి పోలేక పోతున్నడు. హేమలత నిత్య సంఘర్షణ ఎందుకో అర్థం కాదు అనుకున్నాడు సూర్యం.  ఆస్తి పంపకాల్లో తాను అన్ని సర్దుక  పోయిండు.  ఎన్నో ఖర్చులయినా వాటికి లెక్కలు చెప్పడం సాధ్యం కాదు…అడిగితే అన్ని ఖర్చులెట్లయితై అని తమ్ముల్లతో  అడిగించుకోవడం అవమానం అన్పించింది అనుకున్నాడు సూర్యం.  హేమకు అవి అర్థం కావు.
 ”  మగ పెత్తనం ఆలోచన వదిలి నువ్వు హేమ వైపు నుంచి కూడ ఆలోచించు. ” అంటూ చాలా సేపు అర్థం చేయిస్తూ పోయాడు సిద్దార్థ.
           ” నువ్వన్నది నిజమే సిద్దూ.! మనం సాదించిన వన్ని సహజం అనుకుంటున్నం. కాని ఇవన్ని ఎంతో కష్టపడి సాధించుకున్నవే అని మరిచి పోతున్నం. లేని దాన్ని రాని దాన్ని  సాధించలేదని బాధ పడడంలో సాధించిన వాటిని కూడ తేలిక గా చూడడం వల్ల నువ్వన్నట్టు అసంతృప్తి  వెంటాడుతున్నది. అందినది తక్కువేమీ కాదు. చేసిన త్యాగాలు తక్కువేమీ కాదు. గెలుచుకున్న జీవితం కూడ తక్కువేమీ కాదు.” అన్నాడు సూర్యం.
” ఎవరో గుర్తించాలనే  భావం వదిలేస్తే మనలో మనకు ఎంత సంతృప్తి కలుగుతుందో! ” అన్నాడు సిద్దార్థ.
         తనకా  దృష్టే లేనట్టు వాదించబోయాడు సూర్యం.
         “అదంతా వదిలెయ్!  ఆ గతం అంతా ఎందుకిపుడు? మనం సాధించింది తక్కువేమీ కాదు.  మన జీవితాలను గెలుచుకున్నం. మన పిల్లల జీవితాలను గెలిపించినం. మన తరం కర్తవ్యాలు పూర్తి చేసినం. ఇక చేసేదేమైనా ఉంటే అదంతా బోనసే. వైఫల్యాలను మరిచి పోదాం.
ఎవరైనా  విజయాలను గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్ని వైఫల్యాలెదురైనా , మనను ఎంత మంది ఎన్ని రకాలుగా ముంచినా , నిలదొక్కుకున్నం.  మనం  జీవితాలను గెలుచుకున్న విజేతలమే. “అన్నాడు  సిద్దార్థ.
           ” అంతే అంటవా? “
           ” ఔను ఇంత మంచి జీవితం ఎంత మందికుంది? మూడింట రెండు వంతుల మంది మనవంటి జీవితాలను గెలుచుకోవాలని ఎంత ఆరాట పడుతున్నరో.. తెలుసా? “
            ” సిద్దూ!  ువ్వన్నది  నిజమే. మనం సాదించింది తక్కువేమీ కాదు. మన వైఫల్యాలు,
మన అదనపు కోర్కెలు వదిలేస్తే .. మనం చిన్న ఉద్యోగాలతో చిన్న జీతాలతో  మన పిల్లలను
ఎక్కడెక్కడో చదివించినం. మన పిల్లల జీవితాలను గెలిపించినం.  మనకు ప్రమోషన్లు తక్కువైనా మనం మన జీవితాలను గెలుచుకున్నవాల్లమే ” అని చివరకు ఒప్పుకున్నాడు సూర్యం.
              హమ్మయ్య అనుకున్నాడు సిద్దార్థ.
                వాన వెలిసినట్టుంది.. రేకుల మీద వాన చప్పుడు ఆగి పోయింది.
 ఎవరో మల్లీ చాయ్ తెచ్చారు.  వారితో పాటు మల్లెల గాలి మల్లీ వీచింది.
 ” అడగక ముందే రెండు సార్లు చాయ్ పంపింది హేమలత.  హేమలత కూడ చాల మంచిదే “
అంటూ మెచ్చుకున్నాడు సిద్దార్థ.
               ”  హేమలత మర్యాదలకేం లోటు లేదులే ! ” అంటూ నవ్వాడు సూర్యం
              ” మరింకేం కావాలె?  ఆహా ,  అడగక ముందే మల్లీ చాయ్ పంపింది. గృహమే కదా స్వర్గ సీమ . నీ అంత అదృష్టవంతుడు లేడు సూర్యం !  ” అంటూ  కూని రాగం తీసాడు సిద్దార్థ.
         ఆమాటతో   ఏవేవో  తొలినాటి మధుర స్మృతులు గుర్తుకు వచ్చాయి  సూర్యానికి.
         కాసేపటికి   హృదయపు లోతులనుండి నవ్వాడు సూర్యం.
         మల్లెల వాసన గట్టిగా పీలుస్తూ ….
          ” అవును మనం జీవితాలను గెలుకున్న విజేతలమే! గట్టిగా ఆనందంగా అరిచాడు సూర్యం.
          తెరచాటు నుండి హేమలత అకస్మాత్తుగ ఊడి పడ్డంతో  సూర్యం కంగు తిన్నాడు. అన్నీ విన్నదా అని కించ పడి పోయాడు.
       ” అన్ని విన్నవా హేమా?” అంటూ నవ్వుతూ పలకరించాడు సిద్దార్థ.
            అవునన్నటు   ముసి ముసి నవ్వులు నవ్వింది హేమ.
         చాలా రోజుల తర్వాత సూర్యం హేమల కళ్లు కళ్లు కలిసాయి.
           క్షణంలో తేరుకుని సిద్ధార్థ వైపు చూస్తూ
             ” థాంక్స్ ” అంది హేమలత.
–  బి ఎస్ రాములు
June 23, 2021 3 comments
4 FacebookTwitterPinterestEmail
కథలు

ఒంటికి రెండు – రెంటికి ఐదు 

by వేణు నక్షత్రం June 23, 2021
written by వేణు నక్షత్రం

“అరే  ఓ కిషన్ భయ్యా.. చలేంగే  క్యా .. “ నెత్తికి రుమాలు చుట్టుకుంటూ బయటకు వచ్చాడు తన నివాసం నుండి పర్తాప్   అనబడే ప్రతాప్.

నివాసం అంటే పెద్ద ఇల్లు కానీ గుడిసె కానీ కాదు, ఒక మనిషి నిలబడి ఒక వైపు నుండి ఇంకో వైపుకి నడిచేంత  పెద్ద సిమెంట్ పైపు.   హైదరాబాద్ కి దూరంగా మేడ్చల్ ప్రాంతంలో నివాసాసాలకు దూరంగా , అడవి లాంటి ప్రదేశంలో నీటి సరఫరా కోసం ఉపయోగించే పెద్ద పెద్ద  సిమెంట్ పైపులు తయారు చేసే ఫ్యాక్టరీ కాంపౌండ్  అది.   టెస్టింగ్ లో ఫెయిల్ అయిన లేదా  కొంత దెబ్బ తిన్న సిమెంట్ పైపులకు  ఒక వైపు తడకో, గోడో లేదా టార్పాలినో కట్టుకుని, పైపు ఇంకో వైపు ద్వారంగా ఉపయోగించే పైపుల్లోనే  వందలాది  వలస కుటుంబాలు తమ జీవితాన్ని గడుపుతుంటారు.

“అచ్చా .. చలో, చలో పర్తాప్  భయ్యా ” అనుకుంటూ తన భుజాలను పట్టుకుని  ఆడుతున్న  అయిదేళ్ల కొడుకు పర్మోద్  అనబడే  ప్రమోద్ ని పక్కన దింపి,   బీడీ కట్టను రుమాళ్ లో జొప్పుతూ వంగుతూ  బయటకు వచ్చాడు  కిషన్.

ఇద్దరు  కలసి ఫ్యాక్టరీ వైపు నడుస్తుంటే వారు నడుస్తున్న వైపు చూస్తూ పాత  సైకిల్ టైరుతో  ఆడుతున్నాడు ప్రమోద్.  కిషన్ బీహార్ కి చెందిన కాంట్రాక్టు లేబర్, అతని భార్య అంజు, కొడుకు ప్రమోద్ తో  గత నాలుగు సంవత్సరాలు గా  సిమెంట్ పైపుల కంపెనీలో పనిచేస్తూ ఫైపులోనే కాపురం.  దాదాపు గా అన్నీ కుటుంబాల్లో  భార్య భర్తలిద్దరూ అక్కడే పనిచేస్తారు.

కిషన్  నివాసం ఉండే పైపు కి పక్క నే ఇంకో  పైపులో నివాసం ఉండే ప్రతాప్ అతని భార్య శివంతి  కూడా నాలుగు సంవత్సరాలు గా అక్కడే పని చేస్తున్నారు. పక్క పక్కనే ఉన్న రెండు పైపుల్లో కాపురం వల్ల  ఈ రెండు కుటుంబాల మధ్య  వచ్చిన కొద్ది రోజులకే  స్నేహం ఏర్పడింది.

నెలలో జీతం వచ్చే  ఆ రెండు రోజులు ఈ రెండు కుటుంబాలు  కలిసే బజారుకి వెళ్లి సరుకులు తెచ్చుకోవడం, అప్పుడప్పుడు సినిమాకి వెళ్లడం జరుగుతుంది.  కొన్ని వందల  కుటుంబాల్లో, కొందరు మహారాష్ట్ర నుండి, కొందరు బీహార్ నుండి, ఇంకొందరు పాలమూరు నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.  బీహారీలు మరాఠీల మధ్య  గొడవలు,  చంపుకోవడం   లాంటి విషయాలు వార్తల్లో  చూస్తుంటాం  కానీ, కడుపు చేత పట్టుకొని వచ్చిన వీళ్లు,  కలిసిమెలసి   ఉండటం చూస్తుంటే, కేవలం  రాజకీయ  నాయకులు వాళ్ళ  పబ్బం గడుపు కోవడం కోసమే ఆ  తేడాలు సృష్టిస్తున్నారని అర్థంచేసుకోవచ్చు.

అలుపెరుగకుండా రోజూ మూడు షిప్టులో మిషన్ లు తిరుగుతూనే ఉంటాయి. చాలా మంది ఆడవాళ్లు  ఇంటి పనులు, వంట పనులు చేసి, రెండవ షిఫ్ట్ లో పనికి వెళ్తారు. వచ్చిన కూలీ  తినడానికి సరిపోగా పెద్దగా  ఏమీ  మిగలదు. ప్రతి రోజు పనికి పోయి, గొడ్డు చాకిరి చేసొచ్చి రావడం తప్ప వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించే  అవకాశమేరాదు రాదు వారికి.

***

మూడు  పూటలు- ఆరు  పైపుల్లా  సాగుతున్న వందలాది సిమెంట్  పైపు నిర్మాణ కార్మికుల జీవితాల్లోకి  ప్రపంచాన్ని వణికించిన కరోనా  మహమ్మారి తొంగి చూసింది. మార్చి24,2020 కరోనా మూలంగా  దేశంలో సంపూర్ణ లాక్డౌన్  అమలు చేసిన రోజు.  గిరా గిరా తిరిగే   వందల మిషన్లు, అలుపు సోలుపు లేకుండా చకా చకా పనులు చేసే వేలాది చేతులు- కాళ్ళు ఎక్కడివక్కడ  ఒక్క సారిగా ఆగి పోయాయి.

Ilustration by Ahobhilam Prabhakar (9490868288)

అందరి బతుకులు ఆగి పోయినట్టే  కిషన్,  ప్రతాప్ జీవితాలు కూడా ఒక్కసారిగా స్తంభించాయి.  ఏదో ఇరవై ఒక్క రోజులే కదా .. ఎలాగో  బ్రతుకొచ్చులే అని కిషన్, ప్రతాప్ కుటుంబాలు ఒకరి కొకరు ధైర్యం చెప్పుకున్నారు.   వారి కాంట్రాక్టు యజమాని మహారాష్ట్ర కు చెందిన కిశోర్ బుండేలా,   కుటుంబంలో ఎవరిదో  పెళ్లి కోసమని మహారాష్ట్ర వెళ్లి  అక్కడే ఇరుక్కు పోయాడు లాక్డౌన్ వల్ల.

మిగుల్చు కున్న అరకొర డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి ఇద్దరి దగ్గర.  కంపెనీ నుండి రావలసిన జీతం వారి యజమాని కిశోర్  వస్తే కానీ ఇవ్వమని చెప్పిండ్రు కంపెనీ యాజమాన్యం.   కిషోర్ కి ఫోన్ చేస్తే ఎలా రావాలి అని  తిరిగి ప్రశ్నించాడు.  చేసేదేమీ లేక ఫోన్ కట్ చేసాడు నర్సింగ్.   మిగుల్చుకున్న కొన్ని డబ్బులు రోజుకు కొన్ని  ఖర్చు అవుతుంటే దిగులు మొదలయ్యింది కిషోర్ కి.

పిల్లవాడి కి అవసరం అయిన పాలు బిస్కట్ ల కోసం  బయటకు వెళ్ళిన కిషన్  ముడ్డి  పై  మూడు పోలీసు  లాఠీ మార్కులు పడ్డాయి కానీ కావాల్సిన దినుసులు ఏవీ దొరకలేదు.  క్రమంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో కరోనా మరణాలు ఎక్కువవుతున్నాయి.  రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా మరణాల వల్ల  ప్రపంచమంతా   భయం తో వణకి పోతుంది.

ఇరవై ఒక్క రోజులు మాత్రమే అనుకున్న లాక్డౌన్  క్రమంగా పెరుగుతుంది.  మళ్ళీ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. వారి యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు, కంపనీ నుండి రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు.  పరిస్థితి దిక్కు తోచకుండా ఉంది.  కనుచూపు మేరలో సమస్యకు పరిష్కారం కనపడటం లేదు.

రోజు రోజుకీ పెరుతున్న కరోనా వల్ల  అందరిలో తెలియని భయం పట్టుకుంది.  చూస్తుండగా  ఒక  పైపుల్లో కాపురం ఉంటున్న రెండు  ముసలి ప్రాణాలు  గాల్లో కలసి పోయాయి. అవి కరోనా మరణాలు అని కొందరు, కాదని కొందరు.  ఏది ఏమయినా కనీసం శవాలను చూడడానికి కూడా ఎవ్వరూ సాహసించలేదు. విషయం తెలిసి ఒక స్వచ్చంద సంస్థ వాళ్లు  శవాలను ఖననం చేశారు.  ఈ సంఘటనతో అందరిలోనూ భయం ఒక్కసారి పడగ విప్పింది, అందరి  ఆలోచనలు పదునెక్కాయి.  ఎట్లాగూ చావు  తప్పేట్లు లేదు, ఆ చచ్చేదేదో  మన ఊర్లోనే సద్దాం అని కొందరు  వలస కార్మికులు మూట ముల్లె సర్దుకుని వేల  కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వంత ఊరికి కాలి బాట పట్టారు.

ఎప్పుడు చేరుతారో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ తినాలో, ఎవరు తిండి  పెడతారో ఏదీ  ఆలోచించే స్థితిలో లేరు. ఉన్న ఆలోచనంతా  తమ స్వంత గూటికి చేరాలి, తమ కన్న  వాళ్ళ ను చూడాలి.  చావైనా , బ్రతుకైనా తమ వాళ్ళ మధ్యే!  అనుకున్నదే తడువు అందరూ కలసి కట్టుగా బయలు దేరారు, వారితో  పాటు కిషన్, ప్రతాప్ కుంటుంబాలు కూడా.

రోడ్డు పై నడవడానికి కూడా అనుమతి లేదు, హైవే ఎక్కితే పోలీసులు లాఠీలకు పని చెపుతున్నారు.   సందుల నుండి,  గొందుల నుండి , కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కొంత మంది, నెత్తి  మీద మూటలతో, సంకలో  పిల్లల్తో కొందరు –  నడక, నడక, నడక … ఆకలి దప్పులను కూడా మరచి నడక… అలుపెరుగని నడక …  సందులలో కూడా పోలీసు లాఠీ దెబ్బలు  తప్పట్లేదు కొందరికి.  మానవత్వం మచ్చుకైనా కనపడని కొందరు భక్షక భటులు, లంచాలు తినడంలో మరిగిన వారు వలస కార్మికులనూ వదల లేదు.  కొంగు ముడుల్లో దాచుకున్న పదీ  పరక కూడా లాక్కున్నారు.  పిల్లాడి పాలకోసం దాచుకున్నచిల్లర డబ్బులు కూడా దోచుకున్న పోలీసులు కొందరయితే, కరోనా కి భయపడక,  రోజుల తరబడి భార్యా పిల్లల కి దూరంగా ఉండి తమ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఇంకొందరు!

తమ స్వంత గూటికి చేరాలనుకుని ఇంటి దారి పట్టిన  వలస కార్మికులు , పలు ప్రాంతాల నుండి, ఎన్నో వేల సంఖ్యలో చేరడంతో, ఒకరికొకరు అండగా ఉండగా, మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది వారిలో.  ఈ ప్రయాణాలు  ఆపడానికి ప్రయత్నించిన  ప్రభుత్వం,  వలస కార్మికుల మొండి పట్టుదల, మెజారిటీ  ముందు ఓడిపోయింది.   అప్పటికే కొన్ని స్వచ్చంద సంస్థలు వీరికి కావాల్సిన ఆహరం, నీళ్లు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.

గుంపులు గుంపులుగా వేలాది మంది జనం  సమ్మక్క సారక్క జాతరలా  ప్రతీ రోడ్డుపై ఒక జాతర దృశ్యం ఆవిష్కృతమైంది.  అందరితో పాటు కిషన్,ప్రతాప్ కుటుంబాలు కూడా అప్పటికే పదిహేను రోజులకి పైగా అయ్యింది రోడ్డెక్కి.

కాళ్ళు రక్తాలు కారుతున్నాయి, ఒక నిండు గర్భవతి రోడ్డు పైనే ప్రసవం అయ్యింది, కళ్ళ ముందే ఒక స్త్రీ నడుస్తూ పడి పోయి క్షణాల్లో కన్ను మూసింది.  అలసి సొలసి,  రైలు పట్టాలపై  విశ్రమిస్తున్న ఇరవై కి పైగా వలస కార్మికుల పై నుండి వెళ్లిన రైలు, వారి శరీరాలను ఛిద్రం చేసింది.  దారి మధ్యలో ఎన్నో భయంకరమైన వార్తలు, సంఘటనలు తెలుస్తున్నాయి,   అయినా మొక్కవోని ధైర్యంతో కిషన్, ప్రతాప్ కుటుంబాలు  కష్టాలను ఓర్చుకుంటూ  వేలాది మంది తోటి వలస కార్మికులతో  పాటు  ముందుకి నడుస్తూనే ఉన్నారు.  ఎక్కడయినా గ్రామస్తులు పంచిన ఆహారం తినడం , లేదంటే పస్తులతో నడవడం.

దాదాపు తెచ్చుకున్న డబ్బులన్నీ  అయిపోయాయి రెండు కుటుంబాల్లో.   పిల్లవాడి కోసం ఒక వంద రూపాయల వరకు తన  చీర బొడ్లో దాచుకుంది అంజు.  ఆకలై ఏదన్న కొనుక్కోవాలనుకున్నా, కేవలం పిల్లవాడికి మాత్రం కొనిచ్చి దాచిన   ఆ డబ్బుని  మాత్రం ముట్టలేదు.

నీది నాది అని చూడకుండా  ప్రతాప్, నర్సింగ్ లు ఏ అవసరానికి వెనుకకి పోయే  వారు కాదు. ఇంత కష్ట కాలంలో కూడా ఉన్నంతలో అందరూ కలసి తింటున్నారు, లేనప్పుడు ఎండుతున్నారు.    కొన్ని సార్లు రెండు రోజుల వరకూ నీళ్లు మాత్రమే తాగుతూ నడచిన రోజులు ఉన్నాయి.  అయినా తమ స్వంత గూటికి చేరుకోవాలనే ఆశల మధ్య  నడక మాత్రం  ఆగట్లేదు.

ఎన్నో ప్రజా సంఘాల విన్నపాలు,  విజ్ఞప్తులు వలస కార్మికుల  కష్టాలు విన్న తర్వాత ప్రభుత్వం కూడా దిగి వచ్చి వారి వారి స్వంత ఊర్లకు పోవడానికి బస్సులు,రైళ్లు  సమకూర్చింది ప్రత్యేకంగా.   వేలాది మంది వలస కార్మికుల కష్టాలు తీరే సమయం ఆసన్నం అయింది.  వారి  ఆనందానికి హద్దు లేదు, అందరి ముఖాల్లో ఒక ఆశాజనికమయిన  చిరునవ్వు.

ఆ  సంతోషం ఎంతోసేపు నిలవలేదు ప్రతాప్, నర్సింగ్  కుటుంబాల్లో!  ఎందుకంటే తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి.  గత నెలలో చేసిన పని తాల్లూకు డబ్బులు, ఈ నెలలో చేసిన పని తాలూకు డబ్బులు కంట్రాక్టు   యజమాని వస్తే గానీ  ఇవ్వమని అనడం వల్ల , రావలసిన వేల  రూపాయలు వదిలేసి , ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడెక్కారు.

ఇప్పుడు బస్సెక్కి తమ ఊరికి  పోవాలంటే కనీసం అందరికీ వెయ్యి రూపాయలన్న కావాలి.  కానీ కొడుకు కోసం దాచిన వంద మినహా, ఎవ్వరి  చేతిలో చిల్లి గవ్వ లేదు.  కాళ్లు  బొబ్బలెక్కి రక్తాలు కారుతున్నాయి.   తమ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు, ఎప్పుడూ ఎవర్నీ చేయి చాపి అడిగింది లేదు.  ఉన్న దానిలో కలో, అంబలో  కాచుకుని సంసారాలు లాక్కొస్తున్న వీరి జీవితాల్లో ఎప్పుడూ రాని ఈ విపత్కర పరిస్థితికి మనసులోనే తిట్టుకుంటున్నారు.

ఇన్ని రోజులు  బస్సులు లేక తమ ఊరికి పోలేక పోయారు, ఇప్పుడు బస్సులు నడుస్తున్న సమయంలో చేతిలో చిల్లి గవ్వ లేదు.  ఇంత బాధను ఎప్పుడూ చూడని శివంతి కి దుఃఖం ఆగలేదు,  అంజు భుజం పై తల పెట్టి బావురు మంది.   శివంతి  బాధని చూసి అంజుకి కూడా  దుఃఖం ఆగలేదు., ఒకరినొకరు పట్టుకొని దుఃఖం తగ్గేవరకూ ఏడ్చారు.

ఈ గండం నుండి ఎలా గట్టెక్కడం?  ఊర్లో ఉన్న తన వృద్ధ తల్లి తండ్రులని ఎలా చేరుకోవడం? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు  కిషన్.  ఈ బస్సుల వెసులు పాటు కేవలం రోడ్ల మీదున్న వలస కార్మికుల్ని ఇండ్లకు చేర్చడం వరకే.  అంటే ఆలస్యం చేస్తే, ఈ బస్సులు వెళ్లి పొతే మళ్లీ  బస్సులు నడుస్తాయనే  గ్యారంటీ లేదు.  హాయిగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమ జీవితాలని బిక్షగాళ్ల కన్నా హీనంగా మార్చిన  ఈ కరోనా రేపిన కల్లోలం తలచుకుంటేనే దుఃఖం తో పాటు కనపడని ఆ శత్రువు పై  కోపం ఆగట్లేదు కిషన్ కి.

ఫోన్ రీచార్జ్ కి కూడా డబ్బులు లేక,ఫోన్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ లో పెట్టి  ఇద్దరూ ఒకటే ఫోన్ ని వాడుకుంటున్నారు చాలా పొదుపుగా అవసరం అయినప్పుడు మాత్రమే.    మరొక్క సారి తమ యజమాని  కిశోర్ బుండేలా తో మాట్లాడి చూద్దాం అని రింగ్ కలిపాడు కిషన్.  అవతల వైపు నుండి ఆయన భార్య ఫోన్ ఎత్తి, కిషోర్ వారం రోజుల క్రితమే కరోనా వల్ల  చనిపోయాడని ఏడుస్తూ చెప్పింది.

ఒక్క సారిగా కుప్పకూలి పోయాడు కిషన్. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు,  విషయం తెలిసి ప్రతాప్ కూడా నిశ్చేష్టుడయ్యాడు.   నేడు కాకపొతే రేపన్నా  డబ్బులు వస్తాయనే ఆశ ఉండేది, ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయింది అని కుమిలి కుమిలి ఏడ్చారు అందరూ.

ఏ మార్గం కనపడటం లేదు,   రేపొక్క రోజే బస్సులు నడుస్తాయని, బస్సులు  ఎప్పుడు ఎక్కడ నుండి బయలు దేరుతాయో టీవీల్లో, రేడియోలో ఆ  వివరాలు చెపుతున్నారు.  ప్రతాప్, శివంతి మహారాష్ట్ర వెళ్ళాలి,  కిషన్, అంజు  బీహార్ వెళ్లాలంటే  చాలా రాష్ట్రాలు  దాటి పోవాలి.  టికెట్ రేటు కూడా చాలా ఎక్కువే.  ఒంటి పై ఉన్న బంగారం అమ్ముకోవడం కన్నా వేరే మార్గం కనిపించలేదు వాళ్ళకి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వ్యాపార సంస్థలు మూసి వేయబడి ఉన్నాయి కాబట్టి ఎక్కడ అమ్మాలో కూడా తెలియడం లేదు.   వెదకగా,  వెదకగా ఒక గల్లీలో చిన్న దుకాణం అతను బంగారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దాదాపు సగం నష్టానికి.  ఎంతో  కష్టపడి సంపాదించుకున్న ఆ గొలుసుని సగం నష్టానికి అమ్మడానికి  ఎవ్వరికీ మనసొప్పలేదు.

చాలా మంది వలస కార్మికులకి   ఊర్లకు పోవడానికి కూడా డబ్బులు లేవు అనే విషయం తెలుసుకున్న ఒక జర్నలిస్టు, ఈ విషయాన్ని టివీల్లోనూ, సోషల్ మీడియాలోనూ చేసిన ప్రకటనకు కొన్ని స్వచ్ఛంద  సంస్థలు  ముందుకు వచ్చి కొందరికి టికెట్ డబ్బులు సమకూర్చారు, అందులో కిషన్, ప్రతాప్ రెండు కుటుంబాలకు పూర్తి టికెట్లను ఒక సంస్థ కొనిచ్చింది.   ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ బంగారాన్ని అమ్మకుండా సమస్య తీరినందుకు చాలా సంతోష పడ్డారు అందరూ.   గుంపులు  గుంపులుగా ఉన్న వలస కార్మికులు  తాము ఎక్కాల్సిన  బస్సుకోసం ఎదురుచూస్తున్నారు.

కరోనా   విపత్కర సమయంలో  ఎన్నో భయంకరమైన వార్తలు వింటూ , భవిష్యత్తును తలచుకుంటూ మరింత దగ్గరయ్యాయి ఈ రెండు కుటుంబాలు. ఊరు కాని  ఊరు,  బాష తెలియని ప్రాంతం, ప్రతి దానికి ఒకరికొకరు  చేదోడు వాదోడు  గా ఉండటం వల్ల ఇన్ని రోజులు  ఏ లోటు తెలియలేదు.

కీచు మని హారన్  కొడుతూ రివ్వున తీసుకొచ్చి  బస్సుని  రోడ్డు పై ఒక పక్కన ఆపాడు డ్రైవర్.

“ ఆ మహారాష్ట్రా..మహారాష్ట్రా – కొల్లాపూర్,రత్నగిరి ,సింధుదుర్గ్ “ కండక్టర్  అరుస్తున్నాడు బస్సులోనుండి దిగుతూ. ఒక  మొబైల్  మైక్ ని  భుజాన  వ్రేలాడదీసుకొని బస్సు పక్కన నిల్చొన్న ఇంకొక  సేవా సంస్థ ప్రతినిధి  గుంపులు, గుంపులుగా బస్సుల కోసం ఎదురు చూస్తున్న వలస కార్మికులకు వినబడేట్టు కండక్టరు చెప్పిన దాన్నే మళ్లీ మళ్ళీ   చెపుతున్నాడు  మైక్  లో అందరికీ వినబడేట్లు.

అప్పటి వరకు ఎక్కడెక్కడో కూర్చున్న మహారాష్ట్ర వలస కార్మికులు హడా విడిగా , వారి వారి మూట ముల్లె సర్దుకుని, చిన్న పిల్లలని ,  ఎత్తుకుని పరుగెడుతున్నారు బస్సు వైపు.  మహారాష్ట్ర కాకుండా  వేరే రాష్ట్రాలకు పోవాల్సిన వారిలో కొంత నిరాశ,  వాళ్ళ బస్సు ఎప్పుడు వస్తుందా అనే అసంతృప్తి వారి కళ్ళల్లో కనపడుతుంది.

గత నాలుగేళ్ళ నుండి మంచిలో  చెడులో అన్నదమ్ముల లాగా కలిసి ఉన్న రెండు  కుటుంబాలు  ఇప్పుడు విడిపోయే  సమయం వచ్చింది.  కొద్ది సేపట్లోనే మహారాష్ట్ర  పోయే బస్సు వచ్చి ఆగింది.  మహా రాష్ట్ర   బస్సు వచ్చిందని మైక్ లో అనౌన్స్  చేయగానే , ఇన్ని రోజుల  స్నేహానికి ఇక చరమగీతం పాడటం తప్పదని తెలిసి  అంజు, శివంతి ఒకరినొకరు పట్టుకుని బావురుమన్నారు.  వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో  తెలియని పసివాడు ప్రశార్థకంగా ఇద్దరినీ చూస్తున్నాడు.

ప్రతాప్, శివంతి  కి వారి స్వంత ఊరికి చేరుతున్నామనే సంతోషం ఉన్నా ఇన్ని రోజుల స్నేహాన్ని విడి పోతున్నామనే  బాధే ఎక్కువయింది.    ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్లడం సంతోషమే, కానీ బాధంతా  ఒకరికొకరు చెప్పుకోక పోయినా అందరి  మనస్సులను కలచి వేసేది ఒకటే “జీవితంలో మళ్ళీ కలుస్తామో లేదో! కరోనా మమ్మల్ని వదుల్తుందో లేదో, బతికి బట్టకడతామో లేదో!!” అనే దిగులు  మాత్రమే.  కిషన్ ప్రతాప్ లు గట్టిగా కౌగిలించుకున్నారు. ఇన్ని రోజుల స్నేహం ఒకవైపు కాగా,  ఈ నెలరోజుల ప్రయాణ జ్ఞాపకాలు రెండు కుటుంబాలని వదలట్లేదు.

నీళ్ల దగ్గరా , తిండి దగ్గరా  ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ సగం కడుపుతో పడుకున్న రోజులు, ఒకరికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకొకరు పడిన వేదన, మందుల కోసం తిరిగిన వీధులు అన్నీ గుర్తుకొచ్చాయి.  పిల్లోడికి ఆకలిగా ఉన్నప్పుడు, దారిలో జ్వరం  వచ్చినప్పుడు ఆడవాళ్లు ఇద్దరూ పడిన మథనం అంతా ఇంతా కాదు.   కష్టాల్లో ఏర్పడిన స్నేహమే  కలకాలం నిలుస్తుంది అనడానికి ఈ రెండు కుటుంబాల స్నేహమే ఒక ఉదాహరణ.   కష్టకాలంలో  వందల కిలోమీటర్లు నడచిన వారి స్నేహం, దగ్గరయిన ఆ హృదయాలు ఇప్పుడు విడిపోవడానికి ఎవ్వరూ  సిద్ధంగా లేరు.

అతి కష్టం మీద మూట ముల్లె పట్టుకుని అందరూ  బస్సువైపు భారంగా అడుగులేస్తున్నారు.  పిల్లవాడి కోసం పార్ధు , శివంతి చేసిన సేవలు,  తిండి దగ్గర నీళ్ల దగ్గర, వాడు నడవ లేనప్పుడు,ఎత్తుకొని నడిచిన సంగతులన్నీ గుర్తుకొచ్చాయి అంజు కి.  తాను  అలసిపోయి ఒళ్ళుతెలియకుండా పడుకున్నప్పుడు శివంతి ప్రమోద్ ముడ్డి కడిగిన  సంగతులు  గుర్తుకొచ్చి కండ్ల లో నీళ్లు తిరిగాయి. అంతటి ఆత్మీయతని చూపిన  పార్థు ,  అంజు లు తమ నుండి దూరంగా వెళ్లి పోవడం తట్టుకోలేక పోతుంది.

కండక్టర్ తొందర చేస్తున్నాడు త్వర త్వరగా ఎక్కు మని.  అప్పటికే బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది.    వాళ్ళ ఋణం ఏమిచ్చి తీర్చుకోవాలో అర్థం కాలేదు అంజుకి. రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు  వింటుంటే  ఇంకొక వైపు జీవితంలో మళ్ళీ కలుస్తామో లేదో అని దిగులు ఇంకోవైపు పెరిగింది అంజుకి.     పార్థు- శివంగిల  దగ్గర ఒక్కపైసా లేదనే విషయం తెలుసు అంజుకి.   దారి ఖర్చుల కోసం ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది, బొడ్లో దాచుకున్న డబ్బులు చూసింది ఎన్నున్నాయా అని? లెక్కపెట్టి చూస్తే యాభై రూపాయలు, అందులోంచి వెంటనే  ఇరవై అయిదు రూపాయలు తీసి శివంగి చేతిలో పెట్టింది.

“అందర్  చలో – అందర్  చలో !”  కండక్టర్ తొందర  చేస్తున్నాడు.  అసలు చేతిలో  ఏమి పెట్టిందో కూడా చూసుకునే వీలు లేదు శివంగికి.  మనసు తృప్తి గా ఉంది అంజుకి.   బస్సు కదులుతుంటే ఆ జనాల  మధ్య లోంచి చూస్తూ చేయి ఊపుతున్నారు  శివంతి, పార్థు.  ఎవ్వరి ముఖాలకీ మాస్కులు లేవు,   ఆరు ఫీట్ల దూరం పక్కకిపెడితే,, ఆరుఇంచుల దూరం కూడా లేదు ప్రయాణికుడికి, ప్రయాణికుడికి మధ్య.

చిన్న తొక్కిసలాటల మధ్య  వాళ్ళు  బస్సులోపలికి నడుస్తుంటే అలాగే నిలబడి భారంగా చూస్తున్నారు బస్సు లోపలికి.   అంతలోనే  బీహార్ .. బీహార్ అని  కండక్టర్ అరుస్తుండగా  ఇంకొక  బస్సు వచ్చి ఆగింది రోడ్డుకి ఇంకొక పక్కన.

మైక్ పట్టుకున్న  వాలంటీర్  మహారాష్ట్ర బస్సు దగ్గరి నుండి  బీహార్ వెళ్లే బస్సుదగ్గరికి వెళ్లి  “బీహార్ .. బీహార్ .. పాట్నా  ‘ అని అరుస్తున్నాడు చాలా దూరంగా  చెట్ల క్రింద,  షాపుల షెడ్డులకింద కూర్చున్న వందలాది వలస కార్మికులకు వినిపించేట్టు.  బీహార్ అని వినపడగానే, పరుగు పరుగున కదిలి వచ్చారు వందలాది మంది వలస కార్మికులు.

బస్సు రాగానే ఒక సీటు చూసుకొని కూర్చుంటే చాలు ఈ జన్మకి ఇంతకన్నా పెద్దకోరిక  ఏది ఉండబోదు అన్నట్టుగా అందరి ముఖాల్లో కొంత తృప్తి మాత్రం  కనిపిస్తుంది. ప్రమోద్ ని ఎత్తుకుని మూట ముల్లె తెచ్చుకోవడానికి పరుగెడుతున్నాడు కిషన్, అంజు కిషన్ వెంట పరుగు అందుకుంది.

మొత్తానికి  లగేజీ తెచ్చుకొని బస్సు ద్వారం వద్ద నిలుచున్నారు.  దాదాపు ముప్పై గంటల ప్రయాణం, తిండి ఎక్కడ దొరుకుకుతుందో  తెలియదు.   పెద్ద వాళ్ళు అయితే ఆకలికి తట్టుకోగలరు , మరి పిల్ల వాడి పరిస్థితి ఏంటి?   ఆలోచన వచ్చిందే తడువు  పిల్లవాణ్ణి కిషన్ పక్కన  సీటు లో కూర్చుండబెట్టి   బస్సు పక్కనే ఒకబండి పై బిస్కట్ లు, పాప్ కార్న్ లు అమ్ముతుంటే కొనడానికి దిగింది.  డబ్బులు చూసికుంది  , ఇరవై అయిదు రూపాయలు, బిస్కట్   పాకెట్  కి  పది రూపాయలు , పాప్ కార్ కి 5 రూపాయలు చెల్లించి పది  రూపాయలు మిగుల్చు కొని బస్సు ఎక్కింది.

ఒక స్వచ్చంద సంస్థ  వాటర్ బాటిల్స్ ఇస్తుంటే రెండు బాటిల్స్ తీసుకుని బస్సు ఎక్కింది. బస్సులో ఎక్కి కూర్చుని ఒక సారి కళ్లు మూసుకుంటే  గత నెలరోజుల తమ కష్టాలు, ఎండనకా , వాననకా, రోడ్డు పైనే నిద్రించిన రోజులు అన్ని కండ్లకు  కట్టి నట్టు గుర్తుకు వస్తుంటే,  తలుచుకుని లోలోపలే   కుమిలి పోయింది.  బస్సు కదులుతుంది.  తమ తల్లి తండ్రులని  కలసి నట్టు, వారితో మనస్పార్తిగా మాట్లాడుతున్నట్టు .. ఎన్నో  మధుర మైన ఊహలు ..బస్సు తో పాటు కిషన్ మనసు పరుగెడుతోంది.   ఎన్నో రోజుల నిద్ర లేని రాత్రుల తర్వాత, బస్సులో కూర్చునగానే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియ లేదు ఇద్దరికీ.

***

“మామా .. బస్స్టాండ్  దాకా పోయేద్దాం దాం ! వలస కార్మికులకు గవర్నమెంట్ బస్సులేసిందట ఒక స్టోరీ చేసుకు రావాలి, చాలా రోజుల తర్వాత నాకు ఒక పని దొరికింది”  తన ఇంటి ముందు కుర్చీ ఏసుకుని ఫోన్ లో పబ్జీ  ఆట ఆడుతున్న నరేందర్ తో అన్నాడు జర్నలిస్టు సురేష్ తన బైక్ ని బయటకు తీస్తూ.   సురేష్, నరేందర్ చిన్నప్పటి ఫ్రెండ్స్ పక్క పక్క ఇండ్లలో నివసిస్తారు.

“సరే మామ, నడువ్..అదే చూస్తున్న..  ఇంట్ల కూసుండి- కూసుండి  బోరు కొడుతుంది” అని బైక్ పై కూర్చున్నాడు. సురేష్ బైక్  స్టార్ట్ చేసి బస్టాండు వైపుకి తీసుకుపోతున్నాడు తన బైక్ ని.

“నెల రోజుల పైనే అయ్యింది  మామ జీతం  లేక, పని మాత్రం చెప్తున్నరు, ఎప్పుడిస్తారో ఏమో జీతం“  అన్నాడు కొంత దిగులుగా సురేష్.

“ గదేంది మామ,  నన్ను అడగద్దా  ఒక సారి?  వారం రోజుల కింద రైతుబంధు పథకం పైసలు పడ్డయి బ్యాంకుల. మందుకొడదాం అంటే బార్లు బందు అయినాయ్. నాలికంత ఎండి పోయింది మామ మందు లేక నెలరోజుల నుండి” అన్నాడు నరేందర్ అసహనంతో.

నరేందర్  గత నాలుగేళ్ళ నుండి రియల్ ఎస్టేట్,  కన్స్ట్రక్షన్  కాంట్రాక్టర్  గాచేస్తున్నాడు.    తండ్రి నుండి వచ్చిన ముప్పై ఎకరాలకుపైగా  వ్యవసాయ భూమి ఇంతకుముందు కౌలుకిఇచ్చేవాడు. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత కౌలుకివ్వడం కూడా మానేసి ప్రభుత్వం నుండి సంవత్సరానికి రెండుసార్లు వస్తున్న లక్షల రూపాయలతో కాలక్షేపం చేస్తున్నాడు.

“నీకేంది మామ , మస్తు ఎంజాయ్ చేస్తున్నావ్, మస్తుంది లైఫ్” అన్నాడు సురేష్ ఏదో ఒకటి మాట్లాడాలని.

“వద్దంటే పైసల్ ఇస్తుంటే తీసుకుకోకుంటే ఏం  చేస్తం మామ?” అన్నాడు లాజిక్ గా నరేందర్.

“కరెక్టే కదా. కొన్ని  సేవింగ్స్ ఉన్నాయి మామ,  లేనప్పుడు అడుగుతానులే”  అన్నాడు మామూలుగానే  సురేష్.  అనవసరంగా  అప్పుచేసే అలవాటు లేదు సురేష్ కి.

“ పంటలేసే వారికీ, వేయని  వారికి అందరికీ ఊరికే  డబ్బులిస్తుంటే ఎవరయినా ఎందుకు తీసుకోరు?  ఒకరికి ఊరికే వచ్చిన డబ్బులు ఎక్కువ అయి ఖర్చు పెట్టడానికి ఇబ్బంది, ఇంకొకరికి చేసిన శ్రమకి డబ్బులురాక ఇబ్బంది” మనసులో అనుకున్నాడు తన పరిస్థితి ని బయటకి చెప్పలేక సురేష్.

అంతలోనే  బస్స్టాండ్  చేరుకున్నారు. “ఆదిలాబాదు బస్సు స్టాండు “ అని పెద్దగా రాసి ఉన్న సైన్ బోర్డు క్రింద   ఒక పక్కన బైక్ ని పార్క్  చేశాడు  సురేష్.   నరేందర్ కి ఇంకెవరో కలిస్తే  మందు దొడ్డి దారిలో ఎక్కడ దొరుకుతుందో కనుక్కుంటున్నాడు.  నరేందర్ ని  అక్కడే  ఉండమని, బస్సు లు దిగుతున్న , ఎక్కుతున్న వందలాది  మంది వలస కార్మికుల్ని చూస్తూ బస్టాండు లోపలి వెళ్ళాడు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే   టాయ్లెట్ కనపడింది పక్కనే.

ఒక సిగరెట్ వెలిగించుకుని కొద్దిసేపు అక్కడే నిల్చున్నాడు.   ఆ తర్వాత టాయ్లెట్  లోపలికి వెళ్తుంటే  అక్కడ శుభ్రం చేసే స్త్రీ చేయి బయటకి పెట్టి “ ఒంటికి రెండు, రెంటికి అయిదు” అంది చాలా నిర్లక్షంగా.     ఓ.. ఇదోటి ఉంటుంది కదా బస్స్టాండులో అనుకుని పది నోటు ఇస్తే  అయిదు రూపాయల బిళ్ళ తిరిగి చేతిలో పెట్టింది ఆవిడ.

దాదాపు ఆరు గంటల  ప్రయాణం తర్వాత అంజు, కిషన్ లు ప్రయాణిస్తున్న  బస్సు అప్పుడే ఆదిలాబాదు   బస్టాపు లో ఆగింది. సమయం సాయంత్రం  ఏడు అవుతుంది.  రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా  చాలా  బస్సులు వచ్చి ఆగాయి.  ముప్పై నిముషాలు  బస్సు ఆగుతుందని, ఈ లోపల  అన్ని పనులు పూర్తి చేసుకుని రావాలి ఆదేశించాడు డ్రైవర్.   కొన్ని స్వచ్చంద సంస్థలు అక్కడ వలస కార్మికులకు కావలసిన పులిహోర ప్యాకెట్లు, మంచినీళ్లు ఇస్తున్నారు.   అప్పటికే అయిదు  గంటలకు పైగా కూర్చున్న  వారు   బాత్రూం కోసం చూస్తున్నారు.

అంజు కిషన్ , ప్రమోద్ తో పాటు బస్సు దిగారు, అప్పటికే పిల్లవాడు  ఒంటికి పోవడానికి  తొందర పెడుతున్నాడు. ఏమాత్రం   ఆలస్యం చేయకుండా   వెంటనే బస్సు దిగి  బస్స్టాండ్  పక్కనే   ఉన్న  చెట్ల పొదల్లో కి పోయి తండ్రీ  కొడుకులు ఇద్దరూ  కానిచ్చారు.  అప్పటికే  ఇద్దరు ముగ్గురు  గుర్రుగా చూసారు తండ్రి కొడుకులని.

ఈ ప్రత్యేక  బస్సుల వల్ల బస్టాండు మొత్తం చాలా రద్దీగా ఉంది.   ఎదురుగానే  టాయిలెట్ బోర్డు కనపడింది.  టాయిలెట్ లోకి వెళ్ళడానికి లోపల అడుగుపెట్టింది అంజు.    “ఒంటికి రెండు – రెంటికి ఐదు” ఎటో  చూస్తూ  చెపుతుంది లోపల ఒక టేబుల్ పై కూర్చున్న  ఆవిడ  నిర్లక్ష్యంగా .  ఆపుకోవడం చాలా కష్టముగా ఉంది  అంజుకి.  ఉన్నవే పది రూపాయలు, ఈ పది ఖర్చు అయితే మళ్లీ  పిల్లవాడికి ఏదన్న కొనాలంటే ఎలా? అని ఆలోచించుకొంది.  “లాక్ డౌన్  లో కూడా పైసలు వసూల్ చేస్తున్నారా?” అంది హిందీలో కొంత కోపంగా బయటకు వస్తూ.

“బస్సులు బందు అయినాక మాకు కూడా నెల రోజుల నుండి ఒక్క పైసా ఆందాని లేదు, మాదేమన్న సర్కారు నౌకరీనా? మేమేమి తిని బతికాలి? మాది మాత్రం కడుపు కాదా?”   అంది అంతే కోపంగా.    అది కూడా నిజమే కదా అని పించింది అంజుకి.   అప్పుడే పురుషుల టాయిలెట్  నుండి బయటకు వస్తున్న సురేష్ వారి సంభాషణ విన్నాడు.

కిషన్, ప్రమోద్ టాయ్లెట్ బయట నిలబడి ఉన్నారు.  “ఏమైంది వెళ్ళలేదు” అన్నాడు ప్రశార్థకంగా లోపలికి వెళ్లకుండా తిరిగి వచ్చిన అంజుని  చూసి.  మనదగ్గర ఉన్నయి మొత్తం పది రూపాయలు. ఈడ అయిదు రూపాయలు పెడితే బుడ్డోనికి  ఏమికొనియ్యాలి?  మనం ఇంకా ఇరవై గంటలకు పైగా ప్రయాణించాలి.  మీరు ఎక్కడ పోయిండ్రో చూపియ్యి, నేను కూడా అక్కడే పోతాను. నువ్వు నిలబడి చూస్తుండు అటు దిక్కు ఎవ్వరు రాకుండా “    అంది అయిదు రూపాయలు ఎలా పొదుపు చేయాలా అన్న విషయం ఆలోచిస్తూ.

హిందీలో  జరుగుతున్న  ఆ భార్య,  భర్తల  సంభాషణని  చాలా ఇంటరెస్టింగ్ గా వింటున్నాడు సురేష్.   వారి దయనీయ పరిస్థితి అర్థం అయ్యింది వారి మాటల ద్వారా.   ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే  జేబులో ఉన్న అయిదు రూపాయల బిళ్ళని టాయ్లెట్ అటెండెంట్  లేడీకి ఇచ్చి వచ్చాడు.

“నేను డబ్బులిచ్చాను నువ్వు వెళ్లొచ్చు” అని అంజు వైపు, కిషన్ వైపు చూసాడు జర్నలిస్టు.  అంజు భర్తవైపు చూసింది, సరేవెళ్ళు  అన్నట్టు కళ్ల తోటే సైగ చేసాడు.  ఇంకేమాత్రం ఆలోచించకుండా వెళ్ళింది కొంత ఇబ్బందిపడుతూ.

“ఈ ఊర్లో టాయ్లెట్ లో కాకుండా  బయట పొతే అయిదు వందల  రూపాయలు ఫైన్”  అంజు లోపలికి వెళ్ళాక చెప్పాడు కిషన్ కి పక్కనే రాసి ఉన్న బోర్డు చూపిస్తూ.   ఒక్కసారి జడుసుకున్నాడు కిషన్  ఆ మాటలు విని.

ఎక్కడి నుండి  వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని వివరాలు  కనుకున్నాడు సురేష్.  జరిగిన అన్ని వివరాలు చెప్పాడు కిషన్  బాధపడుతూ.   వారి దయనీయ  పరిస్థితికి  బాగా జాలేసింది సురేష్ కి.  జాలి పడితే అది కడుపు నింపదు  కదా ..? ఆలోచిస్తున్నాడు సురేష్ ఈకుటుంబానికి ఎలా సహాయపడనా అని. కరోనా కష్ట కాలంలో ఎవరినీ కదిలించినా  అన్నీ కన్నీటి కథలే!  ఉద్యోగం ఊడిన వారి కథలు ఒక విధంగా,  చిన్న చిన్న స్వంత వ్యాపారాల కథలు ఇంకోవిధంగా  అటు  కరెంటు బిల్లులు,  అద్దెలు  కట్ట లేక,  బ్యాంకులకు  ఇ.ఎం.ఐ లు కట్టలేక ఎన్నో అవస్థలు.   పర్సులో చూసాడు , ఒక అయిదు వందల నోటు ఉంది.

అంజు వెళ్లి  స్వచ్చంద సంస్థ  ఇస్తున్న పులిహోర ప్యాకెట్లు తెచ్చి కిషన్ కి, ప్రమోద్ కి ఒకటి ఇచ్చి తానూ ఒకటి తింటుంది. మనిషికి ఒకటి మాత్రమే ఇస్తున్నారు.   ఆవురావురుమని పులిహోర తింటున్న తీరు చూస్తే వారి ఆకలి ఎలాంటిదో అర్థం అయ్యింది సురేష్ కి.

 

పక్కనే ఉన్న షాపులో కొన్ని  బిస్కట్లు, కొన్ని పండ్లు కొని ఒక వంద తన దగ్గర పర్సులో పెట్టుకొని మిగతా  మూడు వందల రూపాయలని కిషన్ చేతిలో పెట్టాడు. ఇదంతా ఊహించని కిషన్ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.

“ భయ్యా”  అని  కళ్ళలో  నీరు సుడులు తిరుగుతుంటే సురేష్ రెండు చేతులని ఆప్యాయతతో తాకాడు ఇంకేమీ మాటాడలేక. అంజు క్రతఙ్ఞతగా రెండు చేతులు జోడిస్తూ  ఒక బిస్కెట్   పాకెట్ని  ప్రమోద్ చేతిలో పెట్టింది.  బిస్కట్ పాకెట్ ని చూడగానే  వాడి కళ్ళు సంతోషం తో మెరిసాయి.   డ్రైవర్ బస్సు హారన్  కొడుతున్నాడు అందరినీ లోపలికి రమ్మని.   కళ్ళలో నిండా కృతజ్ఞతతో బస్సు ఎక్కుతున్నారు కిషన్, అంజు, ప్రమోద్   సురేష్ వైపు చూస్తూ, చేతులు జోడిస్తూ !

బస్సులేశారని  వాళ్ళ సంతోషాన్ని కవర్ చేసుకునేందుకు వచ్చిన సురేష్ కి ఎక్కడా అలాంటి సంతోషం కనపడలేదు,  సరిగదా  శ్రమ చేసి సంపాదించడం మాత్రమే నేర్చిన లక్షలాది శ్రామికులు ఈ రోజు పైసాపైసాకు పడుతున్న తపన, బిక్షగాళ్లుగా మారి ఎవరి దయాదాక్షిణ్యాల పైననో  ఆధారపడటం కళ్ళముందు కనిపిస్తుంది. ప్రధాన మంత్రి చెప్పిన ఇరవై లక్షల కోట్లు ఎక్కడ ఎవరికి సహాయ పడుతున్నాయో తెలియదు.   వారి గమ్య స్థానాలకు చేరడానికి  వారు పడుతున్న  ఆవేదన,  దయనీయ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనపడుతుంది.  ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సురేష్ కి బాత్రూమ్ విషయం బాగా ఆలోచింపచేస్తుంది.

 

రెస్టారెంట్  తన కష్టమర్ల కు టాయ్లెట్ సౌకర్యం తప్పని సరిగా కల్పించాలి అని, టిక్కెట్టు పెట్టి సినిమా చూస్తున్న  ప్రేక్షకులకి థియేటర్లు విధిగా టాయ్లెట్ సౌకర్యం కల్పించాలి అని, అంతెందుకు ఒక నిమిషం  వెహికిల్ లో పెట్రోల్ కోసం ఆగే  కస్టమర్ల కోసం ప్రతి పెట్రోల్ బంక్ లో ఉచితంగా ఉపయోగించు మరుగుదొడ్లు  ఉండాలనీ నిబంధనలు పెడుతున్న ప్రభుత్వం, తమ నిర్వహణలో నడుస్తున్న ప్రభుత్వ బస్సుల్లో  టికెట్టు కొనుక్కొని  ప్రయాణిస్తున్న వారికోసం ఉచితంగా ఎందుకు టాయిలెట్లు నిర్వహించడం లేదు?  తమకో రూలు, పరులకో రూలు అన్నట్టు ఉంది ప్రభుత్వ నిర్వాకం.

రాయాలని వచ్చిన టాపిక్ ఒకటయితే, దానికన్నా ఇప్పుడు ఈ టాయ్లెట్ విషయమే  సురేష్ ని  మరింత గా ఆలోచింపచేస్తుంది.   రైతులని  ప్రభుత్వం  ఆదుకోవడం అవసరమే, అయితే వ్యవసాయం చేయని, ఎప్పుడూ నాగలి కూడా పట్టని భూస్వాముల  బ్యాంకు అక్కౌంట్ లో లక్షలు లక్షలు జమ చేయడం ఎంత వరకు అవసరం?  డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియని  జల్సా రాయుళ్ల కోసం  లక్షలు, కోట్ల  ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తుంటే,  మనిషి కనీస అవసరం అయిన  టాయ్లెట్ కోసం డబ్బులు చెల్లించి వెళ్లడం ఎంత దారుణం?

 

తనకు తోచిన మాటలన్నిటిని , మొబయిల్  ఫోన్లో ఆడియో రూపంలో రికార్డు చేసుకున్నాడు సురేష్.   బస్సు ముందుకు  వెళ్ళడానికి  డ్రైవర్ రివర్స్ గేరులో వెనుకకి వస్తుంటే , బస్సు గ్లాస్ విండో నుండి, అంత మంది మధ్యలోంచి కిషన్ కృతజ్ఞతతో తన వైపే చూస్తున్న చూపు, ఊపుతున్న చేయి  ఇప్పుడు తన కలానికి  ఒక కొత్త బాధ్యతని గుర్తుచేస్తున్నట్లనిపించింది సురేష్ కి, గుండె నిండా సంతృప్తి తో తాను రాయబోయే కథనాన్ని మనసులో ఊహిస్తూ తన బైక్ దగ్గరికి వెళ్తున్నాడు సురేష్.   నరేందర్  కళ్ళలో ఆనందం  పొంగి పొర్లుతుంటే  ఎదురు చూస్తున్నాడు సురేష్ కోసం చేతిలో రెండు ఫుల్ బాటిల్స్ తో!

-వేణు నక్షత్రం (U.S.A.)

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సహజ న్యాయం

by తడక మళ్ళ మురళీధర్ June 23, 2021
written by తడక మళ్ళ మురళీధర్

       “సూరీ, భోజనం చేస్తావా?” వంటింట్లోంచి తల్లి అనసూయమ్మ కేక.

         ” లేదమ్మా,   ఈ రోజు రాహుల్  బర్త్ డే, వెళ్ళాలి ” బెడ్రూం నుండి సూరి సమాధానం.

         “ఇంత రాత్రి టైములో  వెళ్తావా?”

       “ఫ్రెండ్స్ వస్తారు, నేనూ వెళ్ళాలి “.

       ” బర్త్ డే పార్టీ అయిపోగానే వెంటనే వచ్చేయ్.”  సలహా ఇచ్చింది అనసూయమ్మ.

*****

       “అక్కా,  రాహుల్ బర్త్ డే పార్టీకి వెళ్తున్నాను, అమ్మా నాన్న  మార్కెట్ నుండి రాగానే చెప్పు.” అంటూ సాయి శాండల్స్ తొడుక్కున్నాడు.

       “ఆల్రెడీ ఎనిమిది దాటింది.  మళ్లీ ఎప్పుడొస్తావు” అడిగింది స్నేహ.

       “డిన్నర్ చేసి వస్తాను.  సూరి  బైకు మీద రాహుల్ ఇంటికి వెళ్తాము.” అన్నాడు సాయి.

      “జాగ్రత్త”  స్నేహ తలుపు వేసుకుంటూ చెప్పింది.
*****

       సూరి  రెండున్నర లక్షల టీవీఎస్ అపాచీ బైకు వెనుక సీటు మీద సాయి కూర్చోగా  వాయువేగంతో జూబ్లీ హిల్స్  రోడ్ నెంబర్ 45 లో ఉన్న  రాహుల్ ఇంటికి బయలు దేరారు.   సూరి   ఖరీదైన మాంటేకార్లో టీ-షర్టు, లీవైస్ జీన్స్ ప్యాంటు వేసుకొని జులపాల జుట్టుతో ఉండగా, సాయి పోలో టీషర్ట్, మామూలు జీన్స్ ప్యాంటు, విరాట్ కోహ్లి హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. రాహుల్ ఇంటికి  చేరేసరికి  మనో,  రాహుల్ ఇంటి ఆవరణలో తన మొబైల్ ఫోనులో మాట్లాడుతున్నాడు.

       “ఏంట్రా మనో గాడు ముందే వచ్చిండు,  ఈ రోజు కుంభ వృష్టి పక్కా” , బైకు పార్క్ చేసుకుంటూ అన్నాడు సూరి.

         “అవున్రా, నేను స్టేడియం నుండి డైరెక్ట్ గ ఇక్కడికే వచ్చిన, మా అయ్య ఇప్పుడే క్లాసు పీకిండు, ఇవన్నీ మనకు కొత్త కాదుగా,  ఇన్ని సార్లు విన్నం” అంటూ తన జుట్టు వైపు చూపించాడు మనో.

        “అరేయ్, వీనికి జుట్టే లేదు, జుట్టు చూపిస్తుండు ” అని సాయి అనగానే ముగ్గురూ పెద్దగా నవ్వుకున్నారు.

                   ****
రాహుల్, సూరి, సాయి, మనో నలుగురు హైదరాబాద్ శివార్లోని   ఇంజనీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్నారు.   సాయి ది  మధ్య తరగతి కుటుంబం.  మిగతా ముగ్గురివి బాగా బలిసిన కుటుంబాలే.
****

       రాహుల్ విశాలమైన ఇంటి డ్రాయింగ్ హాలు మధ్యలో బల్ల మీద ఖరీదైన బర్త్ డే కేకు, ప్లాస్టిక్ కత్తి, క్యాండిల్ ఉన్నాయి.  ముప్పై లక్షల రూపాయల ‘ టొయోటా ఫార్చ్యూనర్’  కారు బర్త్ డే  బహుమతిగా ముందు రోజే  వచ్చింది.  డ్రైవర్ సాంబ,రాహుల్, ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేయించి తీసుక వచ్చారు.
****

       టైము తొమ్మిది కావస్తుంది.   రాహుల్ క్యాండిల్ ఆర్పి కేకు కట్ చేశాడు. రెండు నిమిషాలు కేకలతో, కేరింతలతో హాలు దద్దరిల్లింది.  రాహుల్ తల్లిదండ్రులు గ్రీటింగ్స్ చెప్పి పై అంతస్తుకు వెళ్ళారు.    స్నేహితులు రాహుల్ కి  బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు.  వాచ్ మన్ సత్తయ్య  కేకు కట్ చేసి తీసుక రాగా నలుగురు తిన్నారు.

       “కేకు తోటే సరిపెడ్తవ,  ముప్పై లక్షల రూపాయల కారు కొన్నవు, పార్టీ ఇయ్యవా?” అన్నాడు మనో.

        “కొత్త కారులో బంజారా హిల్స్ తబ్లా బార్ కెళ్లి  మూడు పెగ్గులు తాగి నెక్లెస్ రోడ్డుకు పోదాం” సలహా ఇచ్చాడు సూరి.

         “మా పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చిండ్రు రా డ్రైవర్ లేకుండ  కారు తీయొద్దని” అన్నాడు రాహుల్.

       ” నీకు డ్రైవింగ్ వస్తది కదా,  కారు కొన్నదే నీకోసం , వాండ్లు అట్లనే అంటరు, చలో పోదాం” అన్నాడు మనో.  నలుగురు లేచి బయటకు వచ్చారు.

      “సత్తయ్యా, మేము బయటకు పోతున్నం ” అంటూ కారు డోర్ తీశాడు రాహుల్.

        ” డ్రైవర్ సాంబకు ఫోను చెయ్యమంటారా” అడిగాడు సత్తయ్య.

        “వద్దు, మేమే పోతాం” అంటూ డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు.  ప్రక్క సీట్లో మనో కూర్చోగా, వెనుక  సూరి, సాయి కూర్చున్నారు.  కారు తబ్లా బార్ వైపు దూసుకు పోయింది.

       రాహుల్  బ్లాక్ లేబెల్ స్కాచ్,  సోడా, బుడ్వైజర్ బీరు,  తందూరి చికెన్, అపోలో ఫిష్  ఆర్డరిచ్చాడు.  సాయి బీరు తీసుకోగా  మిగతా ముగ్గురు స్కాచ్ తీసుకున్నారు.   నలుగురు మందు తాగుతూ వారి వారి మొబైల్లో లీనమైనారు. చలి కాలం మూలాన బార్ కిక్కిరిసి ఉంది. ఫ్యామిలీస్ తో వచ్చిన వారిలో కొందరు ఆడవారు కూడా బీరు సేవిస్తున్నారు.   రాహుల్, సూరి, మనో తలో మూడు పెగ్గులు లాగించగా, సాయి మరో బీరు తీసుకున్నాడు.  టైము పదకొండు కావస్తుండగా బిల్లు పే చేసి నలుగురు బయట పడ్డారు.

           “నెక్లెసు రోడ్డులో మంచి ఐస్క్రీమ్ దొరుకుద్ది.  అక్కడికి పోనియ్ కారు” ఆర్డరేశాడు సూరి.

        కారు పంజగుట్ట, ఖైరతాబాద్ మీదుగా  అక్కడికి చేరుకుంది.  కార్లు, మోటారు బైకులతో  ఆ ప్రాంతం రద్దీగా  ఉంది.  ఐస్క్రీమ్ పార్లర్లో  ఎవరికి కావలసినవి వారు తిన్నారు.  తాగిన మత్తు స్లోగా  పని చేయటం  మొదలైంది.  మనో పూర్తిగా అదుపు తప్పాడు.  సాయి భుజం మీద చెయ్యి వేసి భారంగా అడుగులు వేస్తున్నాడు.  సూరి మాట తడబడుతుంది.  రాహుల్ కళ్ళు ఎర్రబడ్డాయి. కష్టంగా  డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు.

            “రాహుల్, నువ్వు నడుపుతవ, నన్ను నడ్పమంటవ” అడిగాడు మనో .

          ” నేను పక్కా హోష్ లో ఉన్న.  నా కారు నీకిస్తే కుప్ప జేశి పెడ్తవు” అన్నాడు రాహుల్.

       ” ఓఆర్ఆర్ మీద నడిప్తే నీ దమ్మేందో తెలుస్తది” ఉడికించాడు మనో.

         “మనో, నువ్వెందుకు రెచ్చ గొడ్తున్నవు రాహుల్ ని.  ఇంటికి పోనియ్ రాహుల్” అన్నాడు సాయి.

          రాహుల్ ఇదేదీ వినిపించుకునే స్థితిలో లేడు.  120 కిలో మీటర్ల వేగంతో మొదలైన  కారు స్పీడో మీటర్ ఓఆర్ఆర్ మీద  160ని టచ్ చేసింది. సాయి భయంతో  మాట్లాడటం లేదు. ఏదైనా అంటే పిరికోడు అంటారు. సూరి వెనుక సీట్లో జారగిలబడి మత్తులో ఉన్నాడు.   మనో స్టీరియో ఆన్ చేసి ఫుల్ వాల్యూంలో సల్మాన్ ఖాన్ “సీటీమార్”  హిందీ పాట వింటూ అప్పుడప్పుడు రాహుల్ ని ఆట పట్టిస్తున్నాడు.

        స్ట్రీట్ లైట్లు వెలగనందున   రోడ్డు  చాలా వరకు చీకటిగా ఉంది.  ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుతురు, మత్తులో ఉన్న రాహుల్ కి చిరాకు కలిగిస్తున్నాయి.  ముందు వెళ్తున్న పెద్ద ట్రక్కును ఎడమ వైపు నుండి ఓవర్ టేక్ చెయ్యాలనే ఉద్దేశంతో కారును ఎడమ వైపుకు కట్ చేసే ప్రయత్నంలో ప్రక్క నుండి వెళ్తున్న  మారుతి ఆల్టోను ఢీ కొట్టడంతో  ఆల్టో కారు రెండు పల్టీలు కొట్టి రోడ్డు చివరగా ఉన్న రైలింగ్ కు గుద్దుకొని ఆగింది. రాహుల్ కారు ముందు వెళ్తున్న ట్రక్కును వెనక నుండి గుద్ది డివైడర్ మీదుగా అవతలి రోడ్డుపై పడింది. అదృష్ట వశాత్తూ  ఎయిర్ బ్యాగులు తెరుచు కోవటంతో పెద్ద గండం నుంచి బయట పడ్డారు. రాహుల్  రెండు కాళ్లు, మనో ఎడమ చేయి విరిగాయి.  సూరి, సాయి చిన్న గాయాలతో బయట పడ్డారు. ముప్పై లక్షల రూపాయల కొత్త కారు నుజ్జు నుజ్జయింది.

       ముందు వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ప్రక్కకు ఆపి, ఆల్టో కారు దగ్గరికి వెళ్లి చూసాడు.  నలభై సంవత్సరాల మనిషి డ్రైవర్ సీట్లో రక్త సిక్తమై ఉన్నాడు.  ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేసి విషయం చెప్పాడు.  పోలీసు జీపు, రెండు 108 వాహనాలు కొన్ని నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకున్నాయి. తదుపరి చర్యలకు రాహుల్  బృందాన్ని, ఆల్టో వాహనంలోని శవాన్ని  108 వాహనాల్లోకి  ఎక్కించారు.

******
పోలీసు వారు  రాహుల్, అతని తల్లి దండ్రులు, మనో, సూరి, సాయి  పై నమోదు చేసిన క్రిమినల్ కేసు కోర్టులో విచారణకు వచ్చింది.  సాక్షుల విచారణ, వాదోపవాదాల అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది.  మనో, సూరి, సాయి ప్రత్యక్షంగా నేరం చేయకున్నా పరోక్షంగా మద్యం సేవించిన రాహుల్ ని  ప్రేరేపించి కారు అజాగ్రత్తగా నడపటానికి  కారకులైనందున ఒక్కొక్కరికి ఆరు నెలల  కఠిన కారాగార శిక్ష విధించింది.  రాహుల్ మద్యం సేవించి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపి ఒకరి మరణానికి, ముగ్గురి గాయాలకు కారకుడైనందున అతనికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు మృతుని కుటుంబానికి నష్ట పరిహారంగా ఇరవై లక్షల రూపాయలు మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశాన్నిచింది.

         రాహుల్ తల్లిదండ్రులు  డ్రైవింగ్ లైసెన్స్ లేని కొడుక్కి కారు తాళాలు అందుబాటులో ఉంచి, పరోక్షంగా సంఘటనకు బాధ్యులై,  మృతుని కుటుంబం ఆసరా కోల్పోటానికి కారకులైనందున  అతని ఇద్దరు మైనర్ పిల్లలు  మేజర్లు అయ్యేంత వరకు వారి పోషణకై ప్రతి సంవత్సరం వారి తల్లి బ్యాంకు అక్కౌంట్ లో యాభై వేల రూపాయలు డిపాజిట్ చెయ్యాలి.   మృతుని కుటుంబానికి జరిగిన అన్యాయం  సరిదిద్దలేనిది కాబట్టి, కేవలం కారాగార శిక్షతో సరి పెట్టకుండా,  తమ పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తూ, తండ్రిని కోల్పోయిన  మైనర్ పిల్లల భవిష్యత్తు కోసం, చట్టం నిర్దేశించని సరి కొత్త సహజ న్యాయం కల్పించాల్సి  వచ్చిందని న్యాయమూర్తి తన చారిత్రాత్మక తీర్పులో పేర్కొన్నారు.

       రాహుల్ తల్లిదండ్రులు తమ కొడుక్కి  ఖరీదైన కారు కొనిచ్చి ఒక   కుటుంబానికి తీరని అన్యాయం చేసినందుకు పశ్చాత్తాప పడుతూ కోర్టు తమకు విధించిన శిక్ష సరైనదిగా భావించి నైతికతగా  మృతుని భార్యను ఓదారుస్తూ, అండగా ఉంటామని హామీ ఇస్తూ పిల్లలను అక్కున చేర్చుకున్నారు.

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

” కాల మహిమ ! ” కథ  

by గొర్రెపాటి శ్రీను June 23, 2021
written by గొర్రెపాటి శ్రీను

కొన్నిసార్లు అంతే..
కాలం మాత్రమే సమాధానాలు చెప్పగలిగే ప్రశ్నలకి మనం మౌనంగా తలొంచాలి తప్పితే ..

మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న ఫలితాలని పొందలేము !
మన మధ్య ఉత్పన్నమైన ప్రశ్నల తాలూకు సమాధానాలు ఎప్పుడో తెలుస్తుంటాయి !
అవి మదిని వెంటాడుతూ మనం కాలం మహిమ ని  తెలుసుకునేలా  చేస్తుంటాయి !
*                                  *                            *
నా స్నేహితుడు నాగేంద్ర ,నేను దాదాపుగా పద్నాలుగేళ్ల తరువాత కలిశాము.
మొదట వాడ్ని గుర్తించలేదు నేను.
తను నాగేంద్ర అని తనను తాను పరిచయం చేసుకుంటుంటే..
అప్పుడుగానీ గ్రహించలేదు నేను.
అంతగా మారిపోయాడు.!
ఇద్దరం కలిసి ఓ ఆఫీస్ లో ఐదేళ్ల పని చేశాము.
వాడ్ని అంత కాలం తరువాత చూడగానే  గతం లోని మా పరిచయం తాలూకు అనుభవాలు ఒక్కసారిగా నా కళ్ళ ముందు కదిలాయి.
వాడు కొత్త ఉద్యోగం లో చేరడానికి చెన్నై వెళ్ళడంతో మా మధ్య  దూరం ఏర్పడింది.
ఎప్పుడో ఒకసారి కాల్ చేసి మాట్లాడేవాడు.
*                           *                            *
నాగేంద్ర నాకు పరిచయమయ్యే నాటికే మా ఆఫీస్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు.
నేను వాడు ‘రేయ్ ‘ అని పిలుచుకునేంత చనువు ఉంది మా ఇద్దరి మధ్య.నాగేంద్ర ఓ రోజు నాతో..
“రెండు రోజులు నేను ఊరు వెళ్ళి వస్తాను రా.. ” అన్నాడు.
నేను పనేంటి అని అడిగే లోపుగా..”ఓ రెండెకరాల పొలం ఊరి దగ్గర కొంటున్నానురా!” అన్నాడు .”మొన్నెప్పుడో అన్నావు కదా .మీ నాన్న గారికి ఒంట్లో బాగోలేదని !

ఇప్పుడెలా వుందిరా..వూరు వెళిన్నప్పుడు మీ నాన్న గారిని,అమ్మగారిని అడిగానని చెప్పరా” అన్నాను.
“సరే ! చెప్తాను లే .కాని ఆయన ఆరోగ్యం ఇప్పుడు కూడా బాగాలేదు, మా నాన్న ఆరోగ్యం గా వుండగానే పొలం కొనాలని నా కోరిక రా.. “అన్నాడు వాడు.

ఆ సమయంలో వాడి మాటలను బట్టి ఒక సంగతి అర్థమయింది.
‘తన తండ్రి వుండ గానే తమ వూళ్ళో పొలం కొనాలని  వాడి ఆశ.
కాని తన తండ్రి కి ఆరోగ్యం బాగాలేదు..సిటీ కి తీసుకువచ్చి వైద్యం చేయించాలని వాడికి ఎంత మాత్రం ఆలోచన లేదని ‘ ఎందుకో నా మనసుకు అనిపించింది.అదే మాట అంటే వాడు బాధ పడతాడని తెలుసు.

అయినా మిత్రుడిగా వాడికి మంచి సలహా ఇవ్వాలని నా అభిలాష.!

స్నేహమంటే అదే కదా !

మాట మాత్రం గా నైనా వాడికి మంచి చెప్పాలని ప్రయత్నించాను.

“ప్రతాప్ !
ఊరుకోరా..నువ్వూ నీ చాదస్తం !
మా నాన్న ఎప్పుడైనా నా మాట విన్నాడని.చిన్నప్పుడు అంతా ఆయనకి భయపడుతూనే పెరిగాం. ఇప్పటికి ఆయనంటే మాకు భయం.ఆయన మాటే నెగ్గాలని ఎప్పుడూ తాపత్రయ పడుతుంటాడు.మన మాట విన్నట్లుగానే వుంటాడు కానీ ఆయన ధోరణి ఆయనదే.
నేను ఆ ఊరు వదిలి హైదరాబాద్ వచ్చేయమని ఎన్నోసార్లు చెప్పాను,ఉన్న ఊరిని వదిలి రావడం కష్టం అంటాడు.

నీకీ విషయం తెలుసా..నా పెళ్ళైన ఈ పదేళ్ల కాలంలో ఆయన ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాడో తెలుసా..కేవలం నాలుగు సార్లే ! అదీ మనవడు అడిగాడని.”

“అదంతా ఓ.కే నాగేంద్ర ! ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు కదా కనీసం వైద్యం చేపించుకోడానికైనా వస్తాడు .నువ్వు అడిగి చూడు .ఎలాగు నీ శ్రీమతి ఇ.ఎస్.ఐ లో సూపరెండెంట్ గా పని చేస్తుంది కదా .అలాగైతే తనకి మంచి వైద్యం సకాలంలో అందుతుంది. ” అన్నాను.

నవ్వాడు..”సర్లే రా చూద్దాం !” అన్నాడు.

రెండు రోజుల కోసం లీవ్ అప్లై చేసుకుని ఊరు వెళ్ళాడు.

పొలం బేరం కుదిరిందని సంబరంగా చెప్పాడు.

నా మనసులో  వాళ్ళ నాన్న గారికి ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆత్రుత.

నేను అడగకుండానే చెప్పాడు .

“నాన్న కి సీరియస్ గా వుంది రా.మరో రెండు రోజులు ఆగి వస్తాను. ” అంటూ చెబుతూ నేనింకేదో అడగబోతుంటే కాల్ కట్ చేశాడు.

వాడేమైనా ఫోన్ చేస్తాడేమో నని ఎదురు చూశాను.

రెండు రోజుల తరువాత వాడి నుండి మెసేజ్ వచ్చింది “నాన్నిక లేరు” అని.

ఆ మెసేజ్ చూడగానే చాలా బాధగా అనిపించింది.

వీడు కాస్త శ్రద్ధ తీసుకుని తండ్రి కి వైద్యం చేపించినట్లయితే ఆయన తప్పకుండా కోలుకునే వాడు.

ఆ పెద్దాయన రెండు మూడు సార్లు తాను హైదరాబాద్ వస్తానని వైద్యం చేయించుకుంటానని వీడితో అనడం విన్నాను నేను,కానీ వీడు ఆ అవకాశం వాళ్ళకి ఇస్తే కదా !?
పైగా తన తండ్రి ఊరు వదిలి రాడని ప్రచారం !ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకం లో అనుకున్నాను ఇంత కాలం.

కాని నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాను.

మా పరిచయం అయి నాలుగైదేళ్లు అవుతుంది.

మొదట్లో ఎంతో అభిమానంగా మాట్లాడాడు.
క్రమక్రమంగా వీడి మనస్తత్వం బోధ పడసాగింది.
కాని నేనెప్పుడు వాడికి మంచి సలహాలే ఇచ్చేవాడిని..
వాడు స్వార్థాన్ని వీడి మంచిగా మారాలని ,ఆ దిశగా వాడిని మరల్చాలని ప్రయత్నించే వాడిని !
*                                           *                                          *

పిడుగురాళ్ళ బస్టాండ్ లో బస్ కోసం ఎదురు చూస్తున్న నాకు వాడు హఠాత్తుగా ఎదురయ్యాడు.

కుశల ప్రశ్నలు వేశాను.

అన్యమనస్సుతో సమాధానాలు చెప్పాడు.

“ఏమయిందిరా!?” నా మనసేదో కీడు శంకిస్తుంటే సంశయంగానే అడిగాను.

“అది.అదీ..”

“చెప్పరా.మరేం పర్లేదు ” అన్నాను.

“నీకు తెలుసు కదా ఎంతో కష్టపడి ,రాత్రనక పగలనక శ్రమించి..

ఊళ్ళ వెంట తిరుగుతూ ఉద్యోగాలు చేసి ఆస్తులు కూడ బెట్టాను.
 ప్రతి రూపాయి పట్ల అప్రమత్తత తో వుంటూ చివరికి సరియిన బట్టలు కూడా కొనుక్కోకుండా వున్న వాటితోనే సర్దుకుంటూ బ్రతికాను.
నాతో పాటు నా భార్య కి  కూడా అలాగే అలవాటు చేశాను.
కాదు అలా ఒప్పించాను అనే చెప్పవచ్చు.
ఎదైనా.. ఎన్నో ఆస్తులు కూడ బెట్టాను.
కాని పిల్లలకి ఆస్తులు పంచడం కంటే..
ప్రేమ ఆప్యాయత ను పంచాలని,

వాళ్ళకి స్వతహాగా ధైర్యంగా బ్రతికే ఆత్మస్తైర్యాన్ని అందిచాలని గ్రహించలేక పోయాను.

మావాడు ..నా ఒక్కగానొక్క కొడుకు ని ఎంతో గారాబంగా పెంచాను.

వాడేం చేశాడో తెలుసా పెళ్లవగానే నా ఆస్తులన్ని కావాలని అడిగాడు.

ఇవ్వడం కుదరదని నేను నా భార్య తెగేసి చెప్పేశాము.

వాడి కి ..మా దగ్గర వున్న ఆస్తులన్ని ఊడ్చేసి ఇస్తే మేమెలా బ్రతకాలి.!?

అంతగా కావాలంటే బ్యాంకులో వున్న డబ్బులు ఇస్తామన్నాము.

వాడు,వాడి భార్య అందుకు ఒప్పుకోలేదు.

ఎప్పటి కైనా ఈ ఆస్తులన్ని తనవే అన్నాడు.

ఇవన్నీ అమ్మేసి వాడు సిటీ లో బిల్డింగ్ కట్టుకుంటాడట,

ఆ అమ్మాయి కూడా భర్త నే సమర్థిస్తూ మాట్లాడింది.

మాకు ఉండటానికి వాడే ఏదో ఒక ఇల్లు చూస్తాడట ..అదీ తాత్కాలికంగా !

తరువాత తన దగ్గర కే వచ్చేయాలంటూ ఒకటే గొడవ !

ప్రేమతో పిలిస్తే వెళతాం కాని ..

ఇలా ఆస్తులు అమ్ముకుని పూర్తిగా వాళ్ళ పైనే  ఆధారపడాలని ఎలా వెళతాం !? ”

అన్నాడు వస్తున్న కన్నీళ్ళని దిగమింగుకుంటూ !

“తప్పంతా నాదే ! చేసుకున్నవాళ్ళ కి చేసుకున్నాంత .
నేను నా తల్లిదండ్రుల విషయంలో ఇలాగే ప్రవర్తించాను.
నా పాపం ఊరికే పోతుందా?
ఇప్పుడు ఏమయ్యిందో తెలుసా..
మా రాకేష్ మమ్మల్ని అసలు పలకరించడం లేదు.
ఇంటికి వచ్చి ఎంతో కాలం అయ్యింది.
మేమిద్దరం కొడుకు ఉండి కూడా అనాధ ల్లా బ్రతుకుతున్నాం.
కనీసం మా చివరి చూపు కైనా వస్తాడో లేదో తెలీదు. “
కన్నీళ్ళ పర్యంతం అవుతూ అంటున్న నాగేంద్ర ని ఓదార్చడం నా వల్లకాలేదు.
                                                    – గొర్రెపాటి శ్రీను  
June 23, 2021 0 comment
11 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

రుద్రమదేవి – 2 & 3 ప్రకరణలు

by రంగరాజు పద్మజ June 23, 2021
written by రంగరాజు పద్మజ

గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్ర రాయశర్మ
సరళీకృతం :-రంగరాజు పద్మజ

1వ ప్రకరణ ( click this)

ఒద్దిరాజు సీతారామ చంద్ర రావు గారు

2వ ప్రకరణ

చర్చ
(ప్రకరణ శీర్షిక )

” గుణవదగుణవద్వా
కుర్వతాకార్య మాదౌ
పరిణతి రవధార్యా
యత్నతః పండితేన

అతిరభస కృతానాం
కర్మణా మావిపత్తే
ర్భవతి హృదయ దాహీ
శల్య తుల్య విపాకః ॥
(హితోపదేశం)

భావం:–  మంచిది కానీ చెడ్డది కానీ ఒక పని ప్రారంభించేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అని బుద్ధిమంతుడు ముందే ఆలోచించుకోవాలి. అలా ఆలోచన లేకుండా తొందరపడి చేసిన పనులకు బ్రతికినంత కాలం శల్యం లాగా హృదయాన్ని పీడించే దుష్పరిణామాలు కలుగుతాయని అర్థం.

కథాభాగం:–
దేవగిరి రాజ్యం చాలా పురాతనమైనది. దానిని దౌలతాబాద్ అని అంటారు. అది ఇప్పుడు నైజాం రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నది. ఢిల్లీ పట్టణానికి దాదాపు ఏడువందల మైళ్ళ దూరంలో ఉన్నది.
ఈ దేవగిరి పట్టణంలో చాలా అందమైన భవనాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుర్గం ఉన్నది. ఈ దుర్గం గురించి ప్రతి భారతీయుడికి తెలుసు.
దేవగిరి ప్రభువులు యాదవులు. వీరు శ్రీకృష్ణుని సంతతికి చెందినవారు. వీరి వంశంలో రెండు తెగలు ఉన్నాయి. ఒక తెగ వారికి ద్వారక సముద్రం రాజధాని. రెండో తెగవారికి దేవగిరి రాజధాని. ద్వారక సముద్రం రాజధానిగా ఉన్న యాదవకులాన్ని విడిచి, మన కథకు సంబంధించిన దేవగిరి ప్రభుత్వం వారి గురించి కొంచెం తెలుసుకోవడం అప్రస్తుతం ఏమీ కాదు.
మధురానగర నివాసి, యాదవుడైన సుబాహుడు, అతని సంతతివారు ధృఢప్రహారుడు, శౌణచంద్రుడు, ధాడియప్ప, భిల్లముడు, శ్రీరాజావడ్డిగ,ధాడియ నవవల్లభుడు, నేణచంద్రుడు, ఇలా వంశ పారంపర్యంగా రాజ్యాన్ని పాలిస్తూ వచ్చారు. వీరిలో కొంతమంది కొంతకాలం చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. కానీ ఐదవ భిల్లముడు చాళుక్యులను ఓడించి,  చాళుక్య సామంతులనే తమ పేరును తుడిచి వేసుకున్నారు.
ఇంతకుముందు పైన చెప్పిన రాజులు ధైర్య సాహసాల యందు అంతులేని శక్తివంతులు అనడానికి ఉదాహరణగా చాళుక్య వంశీయుడు జయసింహుని  కూతురును వివాహం చేసుకోవడం,చాళుక్య విక్రమాదిత్యుడికి  యుద్ధంలో సహాయం చేయడం, చాళుక్యులను గెలిచి సామంతులనే తమ పేరును తొలగించు కోవడం కీ.శ.1182 వ  సంవత్సరంలో ద్వార సముద్రంలో యాదవులను చాణుక్య క్షమావల్లభులను  గెలిచి, కళ్యాణపట్టణాన్ని, కృష్ణానదికి ఉత్తరాన ఉన్న రాజ్యాన్ని స్వాధీన పరచుకొనడమే ఇందుకు తార్కాణం.
భిల్లముడు  ఒక్కడు మాత్రం కృష్ణానదికి దక్షిణాన ఉన్న కుంతల దేశాధినేత వీరభల్లాణుని పైకి  క్రీస్తుశకం1182  సంవత్సరంలో పోయి, ధార్వాడ జిల్లాలో “నిలక్కుండి”   అనే స్థలంలో యుద్ధంచేసి, వీరమరణం పొందాడు. ఆ సమయంలో పృథ్వీరాజ్ కు మహమ్మద్ ఘోరికి యుద్ధం జరుగుతున్నది. మొత్తం మీద యాదవ వంశంలో ఒక చివరి భిల్లముడు తప్ప ఎవరూ ఓడిపోలేదు.

భిల్లముడి కుమారుడు జైత్రపాలుడు, అఖండమైన వైభవంతో వెలిగిపోతూ, శత్రువులను ఎదిరించి, రాజ్యసుఖాన్ని పొంది, కాకతీయ గణపతి రాజుతో యుద్ధం చేస్తూ కీ.శ.1247లో మరణించాడు.
జైత్ర పాలుని పెద్దకొడుకు శింగణమాధవుడు తండ్రి కన్నా ముందే మరణించాడు.రెండవ కుమారుడు కృష్ణ భూపుడు అతనికి తండ్రి పదవి ఇవ్వవద్దని  సోమ పాలుడు మరణించిన నాడే ఈ కృష్ణ భూపాలుని, ఇతని అక్క అయిన పద్మావతిని, దేశపు ఖజానాను దేవగిరి నుండి తరలించి, ఆ డబ్బుతో పాతాళ మందిరంలో జోడు లేని సుఖాల తేలియాడుతూ, రాజు సంతానాన్ని చెరపట్టినారు. కృష్ణ భూపాలుని తమ్ముడైన మహాదేవరాజును శంకర మంత్రి శత్రువుల నుండి రక్షించారు. స్వామి భక్తి పరాయణుడైన శంకర మంత్రి గణపతి దేవరాజు సహాయంతో శత్రువులను చంపి వేసి, కృష్ణ భూపాలునికి రాజ్యాభిషేకం చేశాడు.

కృష్ణ భూపాలుడు గణపతిరాజుకు అంకితుడై, స్నేహితుడై, దక్షతతో రాజ్యాన్ని పాలించి,కీ.శ. 1260లో కన్నుమూశాడు.

కృష్ణ భూపుని తమ్ముడు మహాదేవరాజు. ఈ మహాదేవరాజే ప్రస్తుతం దేవగిరి రాజు. మహాదేవరాజు విద్యావంతుడు. అంతేకాదు పరిపాలన న్యాయ మార్గంలో చేసేవాడు. అంతేకాదు గొప్ప దానగుణం కలవాడు. చాలా ధర్మకార్యాలు చేశాడు. విద్వాంసులను పోషించాడు.  ఇతనికి సంగీతంలోనూ  ప్రావీణ్యత ఉన్నది. పెదన్న అయిన సింగణ యాదవుడి కాలం నాటి మంత్రి అయిన సాధులుని కొడుకు శారంఙ్గధరుడు రచించిన సంగీతరత్నాకరం అనే గ్రంథాన్ని శారంఙ్గధరుని దగ్గర నేర్చుకున్నాడు. జ్యోతిష్యంలోనూ మంచి పాండిత్యం ఉన్నది. అన్నతో స్థాపించబడిన జ్యోతిష్య కళాశాలను ఇతడి ఇంకా నడుపుతూనే ఉన్నాడు. చాలామంది జ్యోతిష్యులు ఇతని కొలువులో పండితులుగా ఉన్నారు. వారంతా సింగణ యాదవుని  కాలంలో ఆస్థాన పండితులుగా ఉన్నవారే.
ఈ మహాదేవరాజు కొంకణాంధ్ర, ఘూర్జర  దేశాల రాజులను ఓడించి, నయానా భయానా చాలామంది రాజులను తన సామంతరాజులుగా చేసుకొని, చక్రవర్తి బిరుదు పొందాడు  కాశ్యపస గోత్రీకుడైన కేశవుని ఋత్విక్కుగా చేసుకుని,”  యాస్త్యా రామ” అనే యజ్ఞాన్ని చేశాడు.

ఒక్క కాకతీయులు మాత్రం సామంతులు కాలేదనే కొరత తప్ప,  మహాదేవరాజుకు ఎందులోనూ లోపం లేదు. కానీ అతనికి కాకతీయులను తన సామంత రాజులుగా చేసుకోవాలనే కోరిక ఉంది. మధ్యమధ్య సభలు ఏర్పాటు చేసి, రాజ్యాంగాన్ని విమర్శించేవాడు. ఆనాటి సభకు చాలా మంది ప్రజలు వచ్చి  సభాస్థలంలో వేసిన ఆసనాలపై కూర్చునేవారు.

మహాదేవరాజు సింహాసనం మాత్రం అతడింకా రాకపోవడంతో ఖాళీగా మిగిలి ఉంది ఆ రోజు. ఆ పీఠానికి దక్షిణంలో”  శ్రీ కరుణాధిప”  అనే బిరుదు పొందిన పోథలా మాత్యుడు, ఇతనికి అవతల ఇతని కుమారుడైన సంగీత విద్వాంసుడైన శారంఙ్గధరుడు, అతనికి అవతల భాస్కరాచార్యుని మనవడు ఛాంగదేవుడు , భాస్కరాచార్యుని  తమ్ముని మనుమడైన అనంత దేవుడు కూర్చుని ఉన్నారు. సింహాసనానికి ఉత్తరంలో గుజరాతి దేశ పాలకుడైన లవణ ప్రసాదుడు, అతని కుమారుడు వీరధవనుడు, వారికి అవతల కొంకణ దేశాధినేత మొదలైన సామంతరాజులు, వారికి అవతల ముద్గల  గోత్రీకుడు, భోళేశ్వరశర్మ, అతని కుమారులు రామశర్మ,బిచ్ఛణశర్మ, మొదలైన సేనా నాయకులు కూర్చుని ఉన్నారు. రాయబారులు తమ తమ గోడులను వినిపించేందుకు వచ్చిన వారు, వారి వారికి తగిన స్థానాలలో కూర్చున్నారు.

రాజు ఇంకా రాలేదు. సభ్యులు అందరూ ఎదురుచూస్తున్నారు.  సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో”  పృద్వీ వల్లభా!  శ్రీ విష్ణు వంశోద్భవా”  అనే చారుణుల స్తోత్రగానాలు వినపడ్డాయి. కొన్ని నిమిషాలలో కొద్దిమంది వెంటరాగా ఒక పురుషుడు ఆ సభలోనికి వచ్చినాడు.

అతడి శరీరం చాలా అందంగా ఉండి, తుమ్మెద రెక్కలకు సరిసమానమైన పట్టుకుచ్చులను ఎగతాళి చేసేట్టున్న తలవెంట్రుకలు, గడ్డం, మీసం, ఎర్రని సన్నని చారికలతో ఉన్న  తామర పూల రేకుల వంటి కండ్లు, మోకాలును తాకేంత  పొడవైన చేతులు, సౌందర్యానికి మారురూపా అన్నట్టున్న అతను  జలతారు తలపాగా చుట్టుకొని, మోకాళ్ళ వరకు ఉన్న పట్టు అంగి తొడుక్కుని, అదొక రకమైన చెప్పులను కాళ్లకు తొడుక్కుని ఉన్నాడు . అతనే శౌణదేశపు  చక్రవర్తి మహాదేవ రాజు.

మహాదేవ రాజును చూడగానే సభలోని సభ్యులందరూ లేచి, తమకున్న రాజు మీద భక్తిని చాటుకున్నారు. వారుమొక్కుతున్న వారి మొక్కలను అందుకుంటూ, తాను మొక్కగల  పెద్ద వారికి తాను మొక్కుతూ పోయి, మహాదేవరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత సభలో ఉన్న వారంతా కూర్చున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత మహాదేవరాజు తన కుడి వైపున పీఠం మీద కూర్చున్న మంత్రి సాధులుని చూశాడు.ఎదుటివారి భావాలను గ్రహించగలిగిన నేర్పున్న ఆ మంత్రి వెంటనే తను కూర్చున్న ఆసనం నుండి లేచి, సభలోని వారితో ఇలా చెప్పసాగాడు.

”  సభ్యులారా!  భారతీయ మహాజనులారా!  నేడు శ్రీ పృథ్వి వల్లభులును, శ్రీవిష్ణువంశోద్భవులు అయిన మహాదేవరాజు గారు మిమ్మల్ని ఇలా సమావేశపరచడానికి కారణం ఏమీ లేదని మీరు అనుకోరు. అయినా ఎందుకు పిలిచారో? ఆ కారణం మీకు తెలిసి ఉన్నదో, లేదో ? గట్టిగా చెప్పలేను!  కొందరికి తెలిస్తే తెలిసి ఉండవచ్చు! తెలియనివారికి తెలుపడం ముఖ్యం. రాజుగారి ఉప్పు పులుసు తినే సేవకులు, సామంతులు తమతమ ఉదార పరాక్రమాలు తెలపడం వల్లనే సామంతులు ఎక్కువయ్యారు; అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. చక్రవర్తి బిరుదు లభించినందుకు ఆ దేవదేవుడిని ఎప్పుడూ వారి హృదయంలో తలుచుకుంటూనే ఉంటారు.ఇంక ఒకటే కొరత ఉంది వారికిఅది ఏమిటంటే గుజరాతి, కొంకణ దేశాల వలె పూర్తి ఆంధ్రరాష్ట్రం తమ స్వంతం కాలేదనీ, కాకతీయులు పాలించు భాగం ఇంకా మిగిలే ఉన్నదని, దాన్ని జయిస్తే ఇక వారికి కొదవేలేదు అందు కోసమే ఈ సమావేశం ఇక్కడ జరిగింది. మంచిచెడ్డలు బాగా ఆలోచించుకుంటే తప్ప చేయవలసిన పని తేలదు. గౌరవ సభ్యులు అందరూ మీ మీ అభిప్రాయాలను తెలుపగలరు. ఎవరూ అనుమానించ అక్కరలేదు.

ఇలా చెప్పి మంత్రి తన పీఠం మీద కూర్చున్నాడు. ధర్మవర్తనుడు, హరిహర దేవుడు, మురారి దేవుడు వచ్చి ఆ సభలో కూర్చొని ఉన్నారు. మంత్రి చెప్పిన మాటలు మురారి, హరిహర దేవులకు ఎలా అనిపించాయో? తెలియదు కానీ, ధర్మవర్ధనునకు మాత్రం సంతోషంగా ఉన్నాయి. ఎలా అయినా మహాదేవరాజను ప్రార్ధించి, తన యొక్క  కుల స్థితిగతులను చెప్పుకొని, ఓరుగల్లు పై దండును తీసుకొని పోవడానికి  వచ్చాడు. అందుకే మంత్రి గారు సభలోని వారికి చెప్పిన మాటలు అతనికి ఆనందం కలిగించాయి. అనుకున్న పని ప్రయత్నం లేకుండానే కాబోవడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉండదు?

మంత్రి మాటలకు సమాధానం ఏమని చెప్పాలా? అని  సభ్యులు ఆలోచిస్తున్నారు.

ఇంతలో ఒకడు దిగ్గున లేచి శౌణదేశాధినేతకు ఎదురుగా నిలబడి,  రాజు తలచుకుంటే దెబ్బలకు తక్కువేమి ఉండదు. అందరు రాజుల వలే కాక శ్రీ ఏలినవారు అనుకున్నదే తడవు కార్యం చక్కగా నెరవేరుస్తారు మీరు జయించాలనుకున్నారు. జయించారు. అదే దానికి ఋజువు. తప్పనిసరిగా కాకతీయుల పాలనలో ఉన్న ఆంధ్రదేశం శ్రీవారి వశమయితే ఇక లోపం ఏమీ ఉండదు. ఇది  ఇదివరకెప్పుడో  కావలసిఉండే! కానీ కాలేదు. అయినా ఇప్పుడు మాత్రం ఏమిటి? సైన్యం సిద్ధ పరుచుకొని యుద్ధానికి మేము, సైన్యాధ్యక్షులు  అందరూ సిద్ధంగా ఉన్నాం. తమరి ఆజ్ఞ అనే పూమాలను మా తలదాల్చి రాజ్యభారం తీరుస్తున్న సామంతరాజులందరూ సిద్ధంగా ఉన్నారు.

సేనాధిపతి మాట నిజం!!  ఈ పని ఇంతకు ముందే జరగవలసి ఉండే!  అది అలా జరిగిపోయేది! ఒక్క కారణం వల్ల అది ఆగిపోయింది. బలవంతుడైన గణపతి రాజును జయించాలంటే కొంకణ, ఘూర్జర దేశాలలో యుద్ధం చేసిన శ్రీ వారి సైనిక శక్తులనుకున్నారు. ఇంతలో గణపతిరాజు అనారోగ్యం పాలవడం తెలిసినందు వల్ల  కొందరిని వారికి కాపలా ఉంచి, అతనిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని చెప్పినారు. ఏ కారణం వల్లనో ఏమో? తమకు అప్పజెప్పిన పని ఎంతో శ్రద్ధ చూపలేదు. గణపతిరాజు మరణించిన ఆదను తెలుసుకొని , రాజ్యాన్ని ఇతరులకు పట్టం కట్టకుండా అడ్డుకొని ఉంటే శ్రమ లేకుండా రాజ్యం చేతికి చిక్కి ఉండేది. గణపతిరాయ మంత్రి అయిన శివదేవయ్య చాలా తెలివికలవాడు. అతడికి ఈ సంగతి ఇలా జరుగుతుందని ముందే గ్రహించి, గణపతిరాజు మరణించిన సమాచారం బయట పడనీయకుండా అతని కూతురు అయిన రుద్రమదేవిని పీఠంపై కూర్చుండబెట్టి నాడు. శ్రీవారి వల్ల పంపబడిన వారు బహు జాగ్రత్తగా ప్రవర్తించినా ఇంతపని జరగక పోయేది. సూది కొరకు దూలం మోసినట్లయింది. ఎలా అయినా ఆ రాజ్యం స్వాధీనానికి తెచ్చుకోకుండా విడిచిపెట్టరని మంత్రి తన పీఠం నుండి లేచి చెప్పి మరలా కూర్చున్నాడు.

”  రాజుగారి కార్యం కోసం మా ప్రాణాలను వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆజ్ఞ ఇవ్వడమే ఆలస్యం…  సైన్యంతో సహా సిద్ధంగా ఉన్నామని గుజరాతి దేశపు రాజయిన లవణ ప్రసాదుడు చెప్పాడు.

సామంతులు అందరూ ఒప్పుకున్నారు. సభ్యులందరూ అంగీకారం తెలిపారు. ఒక గడియ సేపటివరకు  సభ సద్దుమణిగింది. తర్వాత మహాదేవరాజు సభ్యులతో ఇలా అన్నాడు.

”  మంత్రి మాటలను విన్న మీ మనుసులకు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే సంగతి తెలియదు. అది మీరు తప్పక నెరవేర్చాల్సిన పని. అది ఏమిటో చెబుతాను. మనం  ఇప్పుడే ప్రయాణించి ఓరుగల్లును ముట్టడించాల్సిన పనిలేదు. మనకు కాకతీయులు అంకితమవ్వాల్సి ఉన్నది. రాజ్యం మనవశం కావాల్సి ఉన్నది. కావలసిన పనులు అయినవి. యుద్ధం చేయకుండా చేతికి అందదని అనుకోవడం మూర్ఖుల పని. సామ, దాన, భేద దండోపాయాలు అని పూర్వం నాలుగు మాత్రమే చెప్పారు .బాగా ఆలోచిస్తే ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సహాయ శక్తుల మొదట ప్రయోగిస్తాను. దాంతో పని జరగకుంటే  తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి. కాబట్టి ప్రస్తుతం యుద్ధం మాట లేదనడం నిజం. కానీ యుద్ధం లేదనుకొని దానికోసం చేయాల్సిన ప్రయత్నం విరమించుకోవడం మంచిది కాదు. ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఉపాయం వల్ల కార్యం అవుతుందన్నదీ తెలియదు. సాధ్యమైన యుద్ధ ఏర్పాట్లు చేయనందుకు… మనకు అవసరం లేకపోవడం వల్ల అక్కడితో అది సరిపోతుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే యుద్ధమే కావాల్సి వస్తే దానికి సంబంధించిన ప్రయత్న విరమణ ఎలా విషమిస్తుందో  నేను మీకు చెప్పకపోయినా… అది మీకే తెలుస్తుంది!  అప్పుడు ప్రయత్నించడం ఎలా ఉంటుందంటే… ఇల్లు కాలుతున్నప్పుడు మంటలు చల్లార్చేందుకు నీటి కోసం బావి తవ్వినట్లుగా ఉంటుంది. మీరు ఇప్పటి నుండే యుద్ధ  ప్రయత్నాలు మొదలు పెట్టాలి !  మన సైన్యం మొత్తం రెండు మూడు లక్షలు ఉంటేనే కానీ కాకతీయులను ఎదుర్కొని పోరాడ లేము. కాకతీయ సైనికులు, సైన్యాధిపతులు యుద్ధం చేయడంలో ఎంతో అనుభవం ఉన్న వారు.గణపతి రాజు చేతి కింద పనిచేసిన ప్రతి ఒక్కడికీ
బుద్ధికుశలత కలగడం వింతేమీ కాదు. మా అన్నగారు బందీ అయినప్పుడు తన పేరు’ భద్రుడు’ అనీ, ప్రసాదాదిత్యుని  పేరు ‘పేరడు’ అని, తిరుమల దేవ నాయకుని పేరు’  తిమ్మడు’  అని పెట్టుకొని ముగ్గురు మాత్రమే వచ్చి ఎంత పని చేశారో ? అది కూడా అతని మంత్రి శివదేవయ్య మన కన్నుగప్పి రుద్రమదేవిని
”  మహారాణిగా” చేయడమే వారి యొక్క బుద్ధికుశలతకు తార్కాణం. కాబట్టి మీరందరు జాగ్రత్తగా ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధమై రావడానికి తగ్గినట్లు ఉండాలి”.

రాజు మాటలను కొందరు ఒప్పుకొని సరేనని అన్నారు. అంతటితో సభ ముగిసింది.

                   (సశేషం)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

మూడవ ప్రకరణ

(  మదన మంజరి)

…”  స్వశాభృశ మా దృతకజ్ఞత మతి రసోత్పాదనచణ

మధికశోభాటన పాటన మాశ్రిత గన్ధర్వకుల

మాకలిత గోత్రాన్తరం, వఞ్చాధారూపముదఞ్చయన్తి

………అనుయాతవతి.

— భారత చంపు.

 

శ్రీ మజ్జినేంద్ర పద పద్మ మశేష భవ్యమ్

నవ్యత్రిలోక నృపతీంద్ర మనీంన్ద్ర వన్ద్యమ్

నిశ్శేష దోష పరిఖండన చణ్డ కాణ్డమ్

రత్న త్రయ ప్రభన మద్యగుణైకతానమ్.

 

 

అను స్తోత్ర శ్లోకం అనుమకొండ పద్మాక్షి దేవాలయంలో ఉన్న శ్రీ కాకతి ప్రోలరాజు శాసనాలలో ఉండడం వల్ల కాకతి ప్రోలరాజు జిన మతస్థుడు అని,

 

” అన్యాచ్చానమకొండ నామ నగర్చీ సంవేష్ట్యయోయం

స్థితో నామమణ్డలి కాన్వితో భువిగద్దేవస్య ప్రభుస్తమ్భిత ఏవకార్యణీ రక్తాకషణానిర్గతః

శ్రీ మత్ప్రోల నృపస్య థస్య జయినః

కిం బ్రూమహే గౌరవమ్ ॥ ”

 

అని అనుమకొండ శాసనము వలన కాకతి ప్రోలరాజు బలవంతుడనీ,

 

”  శివ పాదపద్మ యుగళ  ధ్యానామృతా వన్దభూ

రుణ్ఠాకోరిపు సున్దరీ జప మహాసౌభాగ్య సమచ్ఛియ

ప్రోలరాజ ఇతి ప్రసిద్ధ మగమద్వైరీంద్ర దర్పహా

నిశ్శంజ్క ప్రథన ప్రనన మహాహజ్ఞ్కర లజ్ఞేశ్వరః

 

అనే  అనుమకొండ  శాసనంలోని శ్లోకం వల్ల జినమతంలో చేరిన కాకతి ప్రోలరాజు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత శైవ మతాన్ని అనుసరించాడు అని తెలుస్తున్నది.

 

”  దేవి ముప్పమనామ ధేయ సహితా యస్యా గుణ స్తారకాః

కీర్తి శ్శారద చంద్రికేవ విలసత్ కౌంతేనేస్తు నైవోపమా

కౌసల్యేవచ, జానకి వచ సతీ కుంతీచ పద్మా చ,సా

పౌలోమి,చణ్డీ కేవచ తథా తస్య భవద్భామినీ ॥

 

భావం :–  కౌసల్య, సీత, సతి, కుంతి, పద్మ, పౌలోమి, చండి మొదలగు త్రిమూర్తులు చంద్రుని కాంతి వంటి కీర్తి గలవారు. వారి వలనే ముప్పమ్మ కూడా గుణాలలో అంతటి కీర్తి కలది. ఆమె ప్రోలరాజు భార్యని ఈ అనుమకొండ శాసనం వల్ల కాకతి ప్రోలరాజు భార్య ముప్పమ్మ అని తెలుస్తున్నది.

 

”  తతో ముప్ప మామ్బాయా అధిగతజనూ రుద్రనృపతి

ర్జయత్యేక స్థానస్థిత ఇవ నృపాణాం గుణగణః

ధనీధీరోవీరశ్శుచి రుచిత కర్మానసుభగః

క్షమీదక్ష్య స్త్యాగీ మిత మధుర వాగార్ధ హృదయః ”

 

మానుకోట తాలూకా లోని ఇనుగుర్తి గ్రామ శాసనం మీద లిఖించబడిన ఈ శిలా శాసనం మీద ఉన్న ఈ శ్లోకం వల్ల ప్రోలరాజు కు ముప్పాంబికకు శ్రీమత్

ప్రతాపరుద్ర మహారాజు జన్మించినట్లు తెలుస్తున్నది.

 

”  నానావనీ నాధ కిరీట కోటి,  తాంశుభిశ్చుమ్బిత పాదపీఠే

నిర్దుష్టమమ్బోనిధి వేష్ఠితాం ,విశ్వమ్బరాంశానతి రుద్రదేవే ॥”

 

అనే  ఈ శాసనం సూర్యాపేట తాలూకా లోని పిల్లలమర్రి గ్రామం శాసన మీద ఉన్న ఈ శ్లోకం అరుద్ర మహాదేవ మహాదేవ రాజు సముద్రంతో చుట్టి ఉన్న భూభాగాన్ని పరిపాలించాడని తెలుస్తున్నది. అంతేకాదు

 

పరువడి నాటధ్రభాష గల బద్దైన నీతియు సంస్కృతం బుతో

బఱగ ప్రతాపరుద్రవర పాలునిచే రచియింపబడ్డ యా

నరవరు నీతిసారము వినం జదువం గడు మంచిదంచు జె

చ్చెర గలనీతి పద్ధతులు జేసె వినోదము బాల బోధకున్ ॥”

 

అనే పద్యంలో ప్రతాపరుద్ర మహారాజు సంస్కృత భాషలో గ్రంథం రాసినట్టు తెలుస్తున్నది.

 

యస్యాః కాకతి రాజవంశ తిలకం ప్రోల ప్రజేశాత్మజః

శ్రీ మద్ద్రుద్ర నృపానుజస్సహి మహాదేవోనృపాలః పితా

మాతా బయ్యమ నామధేయవనితా దేవీ భువో భూషణం

భ్రాతైకోదర సమద్భవో గణపతిర్భూపాల చూడామణిః

 

అనే ఇనుగుర్తిలోని శాసనంపైన ఉన్న శ్లోకం వల్ల  రుద్రమహారాజుకు  తమ్ముడైన మహాదేవరాజుకు బయ్యమాంబకు  గణపతి రాజు జన్మించినట్లు తెలుస్తున్నది . ఈ గణపతి రాజు శత్రువులకు గుండెలో గాలమై, ఆశ్రయించుకుని ఉన్నవాళ్లకు కల్పవృక్షం వలే ఉన్నాడు.

 

” కతికత వసంతి భూపాః కతికతి వాగుణ గుణా భరణాః

గణపతి నృపతి స్యైకో, నరపతి శతపోషకః క్షోణ్యాం”

 

అనే మంగళగిరి తాలూకాలోని మల్కాపురం అగ్రహారంలోని శాసన శ్లోకం గణపతి రాజు నరపతి శత పోషకుడు అని తెలుపుతున్నది. ఈ గణపతి రాజకుమార్తె రుద్రమదేవి. ఈ రుద్రమదేవిని గణపతి రాజు భార్య అని కొందరు అనుకున్నారు కానీ,

 

”  సర్వోర్వీశ కిరీటకుట్టిమ తటీవిన్యస్తపాదామ్భుజా

శాస్త్యేశా చతురమ్బురాశిరసానాం శ్రీ రుద్రదేవ భువమ్

యస్యా జన్మమహోత్సవో గణపతిక్ష్మాపాల చూడామణీః

విస్పూర్జిత్కలికాల కల్మషకథాధ్యాన్తేషు తేజోనిధిః ”

 

అనే మల్కాపురంలోని శిలాశాసనం వలన రుద్రమదేవి గణపతి రాజు కూతురు అయినట్టు తేటతెల్లమైంది.

 

(సీతారామ చంద్రరాయ):–  పాఠక మహాశయుల రా! కాకతీయుల వంశ పరంపర గురించి ఋజువులతో సహా తెలిపినాను. మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసి,  శ్లోకాలను చదువుటకు ఇష్టం లేకపోతే

(  చదవక పోయినా పర్వాలేదు) చదవకండి!

 

కాకతీయులు రెడ్డి వారు.”  కాకతి”  అనే శక్తిని పూజించడం చేత” కాకతీయుల”ని  వీరికి పేరు వచ్చింది. ఈ వంశంలో పుట్టిన  రుద్రమదేవి తండ్రి అయిన గణపతిరాజు మరణించిన తర్వాత శివదేవయ్య అనే మంత్రి సహాయంతో తండ్రి  సింహాసనమెక్కింది.

రుద్రమదేవి తండ్రికి ఏ మాత్రం తీసిపోనిది. రాజ్యాంగ తంత్రాలు చక్కగా తెలుసు. ఆలోచన చేయడంలో ఆమెకు ఆమే సాటి!  న్యాయ గుణం కలిగినది. దుఃఖితుల మీద ఆదరం, ప్రేమ కలిగి ఉంటుంది. శత్రువుల మీద క్రూర భావంతో ఉండడం ఆమెకు సహజగుణాలు.

రుద్రమకు మగసంతానం లేదు. ముమ్మడమ్మ, రుయ్యమ్మ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ముమ్మడమ్మ ను చాళుక్య వంశానికి చెందిన వీరభద్ర రాజుకు, రుయ్యమ్మను మైలారు భీమన ( మైళముభీమన)వంశీకుడైన ఇందులూరి అన్నమ్మ దేవరాజు కు ఇచ్చి వివాహము చేసి, అల్లుళ్లను ఇద్దరినీ తన రాజ్యంలోనే అట్టే పెట్టుకున్నది. ఇద్దరూ అల్లుళ్లు రుద్రమదేవి కుడిభుజం వంటివారు.

కూతుళ్లకు సంతానం లేదనే విచారము రుద్రమదేవికి ఎక్కువగా ఉండేది. బిడ్డల చేత చాలా వ్రతాలు, దానధర్మాలు చేయిస్తూ ఉండేది.

ఒకరోజు రుద్రమదేవి ఇద్దరు కూతుళ్లతో కూడి అనంతపురంలోని ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నది. వాళ్ళు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒక స్త్రీ మెట్లు ఎక్కుతూ వచ్చి, రుద్రమదేవిని చూసి, తలవంచి, నమస్కరించింది.

ఆ వచ్చిన స్త్రీ కూడా దాదాపు రుద్రమదేవి వయసంత  వయసే ఉన్నది. ఆమెను చూస్తే మంచి దానివల్ల కనపడుతున్నది.రాగానే నమస్కరించి చేతులు జోడించి తల వంచుకొని నిలబడింది.

ఆమె ఎందుకు వచ్చిందో? ఆమె ఎవరో? కూడా రుద్రమదేవికి తెలియదు. రుద్రమదేవి ఆమెను కూర్చోమని చెప్పింది. ఆమె కూర్చున్నది. తరువాత ఆమె, రుద్రమదేవి ఇలా మాట్లాడుతున్నారు.

”  నువ్వు ఎవరు?” ఎక్కడినుండి వస్తున్నావు?

”  తల్లీ! ఈ  సేవకురాలు మీకు తెలియదు. నేను నా దొరసానిని గుర్తుపట్టలేను. అయినా నా తల్లి  మీకుసేవ చేసే భాగ్యం కల్పించింది.

అలా అయితే నీ చరిత్ర వినాల్సిందే!  నీ తల్లి ఎవరు? నీ చరిత్ర ఏమిటి?

తల్లీ!  నాది రాచ వారికి సేవ చేసే సేవ కులం.

మా అమ్మ మీ అమ్మగారి దగ్గర చాలా కాలము సేవ చేసిందట శ్రీ గణపతి చక్రవర్తి గారు అద్దంకి సీమకు రాజైన శాలంకాయన గోత్రికుడైన మాధవ నాయకునిపైకి దండెత్తి వెళ్లారట. అప్పుడు శ్రీ రాజు గారు రాణిగారితో కలిసే వచ్చారట. నాకు అప్పుడు రెండు సంవత్సరాల వయసు అట. మీకు కూడా రెండు సంవత్సరాల వయసే ఉందని మా అమ్మ చెప్తూ ఉండేది. రాణి గారి వెంట మా అమ్మ, నేను వెళ్ళామట . శ్రీ గణపతి చక్రవర్తి గారు ఆ దాడిలో గెలిచారట.

ఇంతలో ఒక చిత్రమైన కథ జరిగిందట. ఒకతను నన్ను మా అమ్మ నుండి వేరు చేసి, ఆమెను ఎత్తుకొని పోయాడట. మా అమ్మ ఏదో విధంగా అతని నుండి తప్పించుకొని, ఒక్కొక్క ఊరిలో మారువేషంలో బిక్షం ఎత్తుకొని ఎలాగో జీవిస్తూ…  నన్ను వెతుకుతూ ఉండేదట !  రాజుగారు గెలిచి ప్రయాణమై పోవడానికి నిశ్చయించుకొని మా అమ్మ కోసం చాలా వెతికారట .

కానీ ఎక్కడో పోయిన అమ్మ వారికి దొరకలేదట. అందుకోసం ఆమెను వెతకటానికి తగిన ఏర్పాటు చేసి వెళ్లిపోయారట.

నన్ను ఒక కాపు అతను పోషించాడు. నాకు వివాహ వయసు వచ్చింది. నన్ను పోషిస్తున్న కాపు ఒక గృహస్థు కొడుకుకు  నన్ను ఇచ్చి వివాహం చేశాడు. నా దురదృష్టం కొద్దీ వివాహమైన 15 సంవత్సరాలలోనే అతను మరణించాడు. నా చరిత్రే నాకు తెలియదు. ఇలా ఉండగా కొంత కాలానికి నేను ఉన్న చోటునకు ఒక ముసలమ్మ వచ్చి, నన్ను చూసి చాలా ఏడ్చింది. ఆమె ఎందుకు నన్ను చూసి ఏడుస్తున్నదో నాకు అర్థం కాలేదు. ఆమెను చూస్తున్న కొద్దీ నాకు ఆమె మీద జాలి కలిగింది . చివరకు ఆమెను ఓదార్చి, అసలు సంగతి ఏమిటని? ఏమి జరిగిందని అడిగాను. ఆమె జరిగినదంతా చెప్పింది. అప్పుడు నేను ఆమె కూతురునని తెలుసుకున్నాను. ఆమె మా అమ్మ ని తెలియగానే చాలా సంతోషం అయింది. కానీ ఆమె అప్పటికే పూర్తిగా అనారోగ్యం పాలయింది. వైద్యుడిని పిలిపించుకొని వచ్చి ఆమెకు చికిత్స చేయించాను. ముసలిదవ్వడం వలన ఏ మందు ఆమెకు పని చెయ్యలేదు. వైద్యులు వైద్యం ఆపివేసినారు.రోజురోజుకు ఆమె వ్యాధి ముదిరిపోయి ప్రాణం పోయే స్థితికి వచ్చింది. చివరి సమయంలో మా అమ్మ నాతో “బిడ్డా !  మన వారంతా శ్రీ కాకతీయ వంశాన్ని కొలిచారు!  మనకు అదే జీవనోపాధి! నేను బ్రతికి ఉన్నంతకాలం దేవిని కొలువలేక పోయాను. నా ప్రాణాలు రుద్రమదేవి వద్ద విడువ లేకపోయాను. నా తలరాత ఇలా నన్ను విదేశాలకు వెళ్ళే చెట్టు చేసింది. నాకే కొరతా లేదు!  నువ్వు మళ్ళీ పోయి మన రాజవంశానికి సేవ చేస్తానని నాకు మాట ఇస్తూ ప్రమాణం చేస్తే… నా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఆశ్రితులను కాపాడడంలో మన ప్రభువులకు నా ప్రేమ లోకంలో ఏ వంశం లోనూ లేదు. నా దొరసానికి నీ వయసంత వయసే కలిగిన కూతురు ఉండేది. ఆమె పేరు రుద్రమదేవి.”  ఇంతలో ఆమె కంఠం ఒక్కసారిగా మూగ పోయింది.

”  తల్లీ!  ఏమని చెప్పను?  రాజుల సేవయే పరమ ధర్మంగా  తలచిన నా తల్లి ..మ..ర…ణిం..చిం..ది !!

ఆ దాసి కన్నులు కన్నీటితో నిండాయి. రుద్రమదేవికి జాలి కలిగింది. ముమ్మడమ్మ, రుయ్యమ్మలు కూడా కంటతడి పెట్టారు.

అంతలో రుద్రమదేవి” బాధపడకు!  విధిరాతను ఎవరు తప్పించగలరు? మీ అమ్మ గొప్ప హృదయం ఉన్న దయామయురాలు.  శరీరాలు ఎప్పుడైనా పడిపోయేవే… అయినా  మా అమ్మ కొద్ది రోజులైనా తమ రాజు లకు సేవచేసి జన్మ ఎత్తినందుకు సార్ధకత పొంది, మరణించింది. మా అమ్మ నన్ను విడిచి వెళ్ళినప్పుడు నేను రెండేళ్ళ వయస్సు ఉన్న దాన్ని. నేనెవరో నాకే తెలియదు. ఇక రాజ కుటుంబం ఎలా తెలుస్తుంది? నేను ఉన్నది విదేశంలో… నేను తెలియని వారికి నా రాజవంశం గురించి కూడా వారికి తెలియదు. నా అదృష్టవశాత్తు నా తల్లి మళ్లీ రావడం, నా రాజులను కొలవమని నాకు హితవు చెప్పడం, జరిగింది అలా కాకుంటే నేను ప్రభువుల సేవా చేయకపోయే దాన్ని కదా! అని విచారించే దాన్ని!

”  అది కూడా దైవాధీనమే!”

” నా భాగ్యం”

”  నీ పేరు ఏమిటి?”

”  దాసు రాలి పేరు మదన మంజరి”

మామ అప్పుడప్పుడు ఈ విషయాలన్నీ చెప్తూ ఎంతో విశ్వాసం ఉన్న ఆ దాసి ఏమైందో? అని అనుకొనేది.

నీ తల్లి పేరు ఏమిటి?శ్యా…మ…ల..కదా!  నాకు అలానే గుర్తున్నది.

”  అయ్యో! దొరసానీ !  దాసదాసీల పైన నీకు ఎంత ప్రేమ ఉన్నదో? లేకపోతే దాసి దాని గురించి అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నావా? తల్లీ!  ఎంత గొప్ప దొరసానివి? అని కన్నీళ్లు కార్చింది.

తల్లీ!  మీకు సరిగా జ్ఞాపకం లేనట్టు ఉన్నది. నా తల్లి పేరు శ్యామల కాదు.” లలిత”  అని చెప్పింది.

”  ఔనౌను!  శ్యామల కాదు! లలిత అని  ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని రుద్రమదేవి అన్నది.

రుద్రమదేవికి దాసీ దాని పేరు లలిత అని తెలుసు. అయినా మదనమంజరి ఏమని చెబుతుందో చూద్దామని నటించింది. తల్లి చెప్పిన సమాచారాన్ని తల్లి చెప్పిన పేరునే మదనమంజరి చెప్పడంతో రుద్రమదేవికి నమ్మకం కలిగింది.

”  మదన మంజరీ!  నీకు సంతానం లేదా?”

”  లేదు తల్లీ లేదు!”

”  సరే  ఇప్పుడు నీ ఉద్దేశ్యం ఏమిటి?”

“మా పూర్వీకులు , నా తల్లి  ఎలా జీవించారో.. నేను అలానే జీవించాలని కోరిక!”

“ఏమని?  నా దగ్గర ఉండాలను కుంటున్నావా?”

”  ఉండడమంటే.. “తిండికి తిమ్మరాజు- పనికి పోతరాజు”  అని జనాలు అన్నట్టుగా  కాదమ్మా! మీ సేవ చేస్తూ ఉంటాను.”

” సరే నీ ఇష్టం వచ్చినట్లు నా దగ్గర ఉండవచ్చు, పని చేయాలనే బాధలేదు.” ఒకవేళ నువ్వుపని చేయాలనుకుంటే చిన్న చిన్న పనులు చేయవచ్చు.!

నీవే మీ వయసులో ఉన్న దానివి కాదు! పెద్ద పెద్ద పనులు చేయడానికి.. ముసలితనం వచ్చేసింది “కొమ్ములు కోసినంత మాత్రాన కోడె కాజాలదు! నీకు పనిచేయాలని ఎంత ఆసక్తి ఉన్నా వయసు మీద పడిన దానివి కదా!

తల్లీ!  కొత్తగా వచ్చిన దాని మీద మీకు ఇంత ప్రేమ ఉంచినందుకు  నీకు సేవకుల పట్ల ఎంత దయ ఉన్నదో! అని నిన్ను మెచ్చుకోవచ్చు ను. నాకు అభయమిచ్చినావు! కాబట్టి నిర్భయంగా చెప్తున్నాను. మామ నన్ను మీ దగ్గరికి సేవ చేయడానికి వెళ్లమన్న అప్పటినుండి మీ దగ్గరికి ఎలా చేరుతానో? చేరినా నన్ను మీరు నమ్ముతారో? లేదో?   అనుకున్నాను. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి రాణీవాసపు స్త్రీలను చూడలేదు. చక్రవర్తినిలైన మిమ్మల్ని ఎలా సేవించు కుంటానో? అని భయం వేసింది. నన్ను చూసి మా అమ్మ రాణివాస స్త్రీలకు చేసే సేవ చేసింది కాబట్టి వారితో ఎలా మెలగాలో మొదలైన అన్ని విషయాలు చెప్పింది.

” మదన మంజరీ! నీ తల్లి చనిపోయి ఎన్ని రోజులైంది?”

”  ఒక సంవత్సరం మీద రెండు నెలలు.”

అంతకు ముందు నువ్వు నీ తల్లి తో కలిసి ఇక్కడికి ఎందుకు రాలేదు? నీ తల్లికి రాజ వైద్యులు, రాజ వైద్యం, సేవలు, ఔషధాలు ఇచ్చేవారు కదా!

అలా జరగలేదు. పాడు క్షయ వ్యాధి  దినదినగండంగా గడిచింది. చాతకాని ఆమెను తీసుకొని రావడం మంచిది కాదని అనుకున్నాను. మాకు తెలిసిన వారు కూడా అలానే ఉన్నారు మూర్ఖంగా ప్రవర్తించ వద్దని అనుకున్నాను. అంతే కాదు మా అమ్మ నడవలేకపోతున్నది. మాకు బండి ఇచ్చే వారు కూడా లేరు

”  నిన్ను పోషించిన వారు కానీ, నీ  అత్త వారింటి బంధువులు కానీ అంతమాత్రం సహాయం చేయలేక పోయారా?

”  అయ్యో !తల్లీ!  పోయినంత దూరం పొరక దండు”అన్నట్టు అంతా బాగానే ఉన్నది. నన్ను పెళ్లి చేసుకున్న వాడు తప్ప వారి కుటుంబ సభ్యులు ఎవరో నాకు తెలియదు. ఇంకా నన్ను సాదిన వాళ్ళు మా ఊరు విడిచిపెట్టి మరో ఊరికి వలసగా వెళ్లారు. కొంతకాలం నా భర్త సంపాదనతో ఇల్లు గడిపాను. మా అమ్మ వచ్చేందుకు ముందు రెండు సంవత్సరాల ముందే ఆ డబ్బు అయిపోవడం చేత బిక్షం ఎత్తుకొని జీవించాను.

”   నీ తల్లి చచ్చిపోయి పద్నాలుగు నెలలు అయింది కదా!  ఇంత కాలం ఒక్కదానివే కష్టపడుతూ ఎందుకున్నావు? ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే నేను ఆదరించినను కున్నావా? ఎంతో కాలం నుండి ఉన్న ఊరు వదిలి పెట్టడం ఇష్టం లేదా? నువ్వు మరొక విధంగా అనుకోకు నీ కష్టాలు విని జాలి కలిగింది నీ మీద.

”  అడిగితే తప్పేముంది తల్లీ! ?  ధర్మ స్వరూపిణులు కనుక జాలిపడి అడిగారు. నా తల్లి చనిపోయి 14 నెలలు అయినా వచ్చేందుకు వీలు కాలేదు. మీరు నన్ను మన్నిస్తారో?లేదో?అని  అనుకుంటే ఇప్పుడు ఎలా మీ దగ్గరకు వస్తాను? బిక్షం ఎత్తుకొని జీవించే దానికి పట్టణం వదిలి పెట్ట బుద్ధి కాదా?

”  అవును మొదట అనుకోవచ్చు  తరువాత ఎవరైనా చెబితే ఆశ్రయం ఇస్తారని రావచ్చు! లేదనకుండా బిచ్చం పెట్టిన ఊరును మాత్రం విడువవచ్చునా?

”  ప్రేమతో పెంచే వారు ఉన్నారని తెలిసి, బిచ్చమెత్తాలని అనుకుంటానా?  మీరు ఏది చెప్పినా అదే కదా! నా తల్లికి పితృకార్యం చేయాలంటే నేనొక్కదాన్నే కర్తను. కాబట్టి సంవత్సర శ్రాద్ధం అక్కడే పెట్టాలని అందరూ చెప్పటం వలన ఏదో ముళ్ల మీద ఉన్నట్టు ఉన్నాను. సంవత్సరం పూర్తి కాగానే నడుస్తూ వచ్చాను. నాకు ఈ పట్టడానికి తోవ తెలియదు. ఎక్కువ మంది ఏ ఊరికి వెళుతుంటే వారి వెంట ఆ ఊరికి వెళ్లి ఏ దయామయులో అన్నం పెట్టిన నాడు తింటూ… లేనినాడు ఉపవాసం ఉంటూ… చివరికి ఎలాగో మీ పాదాల దగ్గర చేరాను నా కష్టాలన్నీ గట్టెక్కినవని అనుకుంటున్నాను. ఇక మీ చిత్తం నా భాగ్యం !

దాసి చివరి మాటలను బొంగురుపోయిన గొంతుతో అంటూ రుద్రమదేవి పాదాల మీద పడింది.

రుద్రమదేవి ఆదరంగా మదనమంజరిని లేపి,  నీవు ఇక దిగులు చెందకు ! నా ఇంట్లో సుఖంగా కాలం గడుపుకొమ్మని ఇదివరకే చెప్పాను. కాకతీయ వంశంలో ఎవరు అబద్ధం ఆడారని గట్టిగా నమ్ము !. అని అన్నది.

 

( ఒక సేవిక రుద్రమదేవిని నమ్మించి కోటలో పాగా వేయుట… ఈ ప్రకరణంలోని కథ!  దేవగిరి కుట్ర మొదలవుతుంది.)

 

 (సశేషం)

●●●●●●●●●●●●●●●●●●

June 23, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us