ప్రముఖ రచయిత్రి , సాహిత్య విమర్శకురాలు డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి గారిని రంగరాజు పద్మజ గారు తీసుకున్న ఇంటర్వ్యూను పాఠకుల కోసం మళ్లీ ప్రచురిస్తున్నాం . 2026 జూలై 25 నాడు ముదిగంటి సుజాత రెడ్డి గారికి సన్మానం జరిగే ఈ సందర్భంలో ఈ ఇంటర్వ్యూ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. తరుణి పత్రిక ఎడిటర్ డాక్టర్ కొండపల్లి నీహారిణి రచించిన ముదిగంటి సుజాత రెడ్డి గారి కథల సమగ్ర విశ్లేషణ చేసిన “కథా సుజాతం” పుస్తకాన్ని ఈ సన్మాన వేదిక పైన ఆవిష్కరిస్తున్న సందర్భంలో రచయిత్రులందరికీ ప్రేరణాత్మకంగా ఉంటుంది.
ముదిగంటి సుజాత రెడ్డి గారు కలం చేత పట్టి రచయిత్రి అయినప్పటినుండి వెనుతిరిగింది లేదు . వారి జీవిత ప్రస్థానాన్ని ,వారి రచనల విశేషాల నూ ఈ ముఖాముఖి ద్వారా తెలుసుకోవచ్చు.
– సంపాదకులు
సంస్కృత చరిత్రలు రాసి సాహితీ లోకాన చరిత్ర కెక్కిన విదుషీ మణి శ్రీమతి ముదిగంటి సుజాతా రెడ్డి గారితో రంగరాజు పద్మజ పరిపృచ్ఛ….
జగమెరిగిన రచయిత్రి ముదిగంటి సుజాత రెడ్డి గారు. ఆమె శ్వాస- ధ్యాస రెండూ తెలుగు సాహిత్యసేవ- సాహిత్య పఠనంగా జీవనం గడుపుతూ ఈ ముదిమి వయసులోనూ సాహిత్యపరమైన సంభాషణలలో చిరునవ్వులు చిందిస్తూ… పసిపాపవలె అడిగిన వాటికి అడగని (అంటే నాకు వారి రచనలన్నీ పూర్తిగా చదవక తెలవకపోవడంతో) వాటికీ చక్కని సమాధానాలు ఇస్తూ… సమయమే తెలియకుండా చక్కగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ ముఖాముఖిని ఫలవంతం చేసిన విదుషీమణి శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డిగారి కలమనే హలంతో మేధస్సు మాగాణిలో తెలుగు భాషా పంటను పండించిన పంటకామె సాహిత్యాభిమానుల గరిసెలను నింపారు.
ఒక్కొక్క ప్రక్రియా వంగడం గురించి, ఆ పంట దిగుబడిలో వారి కృషిని గురించి వారి మాటల్లోనే తెలుసుకొని, తెలుగు భాషా పంటను పండించిన రైతు ఒక్కొక్క వంగడం గురించి ఆ పంట దిగుబడిలో వారి కృషిని గురించి వారి మాటల్లోనే తెలుసుకొని, మనమూ మన మన మేథో గాబులలో నింపుకుందాం రండి! సాహిత్య సుక్షేత్రంలో అలా విహరిద్దాం! కలుపు మొక్కలే లేని మేలిమి పొలంలోని నాణ్యమైన భాషా ధాన్యపు రాశులను మన మన స్వంతం చేసుకుందాము రండి! మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది మరో కృషీవలి రంగరాజు పద్మజ.
రంగరాజు పద్మజ :— అమ్మా! నమస్కారము!
ముదిగంటి సుజాతా రెడ్డి:- నమస్కారం!
పద్మజ:– మీ నేపథ్యం చెప్పండి
సుజాతారెడ్డి:– మా తల్లి – తండ్రులు వెంకటమ్మ, రాంరెడ్డి . నేను పుట్టింది నల్లగొండ జిల్లా ఆకారం అనే గ్రామంలో. ఆకారం అనే పేరు మా ఊరికి ఎలా వచ్చిందంటే? అర్కవరం ప్రజల పలుకుబడులలో అక్కవరంగా మారింది. అర్క అంటే సూర్యుడు అని అర్ధం. మా ఊరి చెరువు గట్టున కాకతీయుల త్రికూటాలయం ఉంది. ఇందులో విష్ణువు సూర్యుడు శివుడు ఉంటారు. మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఎక్కువ ప్రాధాన్యత సూర్యుడిదే! ఇలా సూర్యుని ఆలయం ఉంది కాబట్టి అర్కవరం అనే పేరు వచ్చింది.
మా నాన్న భూస్వామి. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. స్త్రీలకు ఆ కాలంలో బుర్ఖా పద్ధతి ఉండేది. మా చిన్నప్పుడు అంటే 1947 వరకూ బుర్ఖా పద్ధతి పాటించారు. ముఖ్యంగా ఇంటి నుండి బయటకు రావడం లేదు. అటువంటి వాతావరణం లో 1942 లో పుట్టాను నేను. తర్వాత వెంటనే కమ్యూనిస్టు ఉద్యమం వచ్చింది. దాంతో మా ఊర్లో నాకు చదువుకోడానికి అవకాశం లేకపోయింది. చిన్న స్కూల్లో అక్షరాభ్యాసం చేసి పంపే అవకాశం ఉన్న బుర్ఖా పద్ధతి ఆపింది.
మా చిన్నప్పుడు చెక్క పలకల మీదనే అక్షరాభ్యాసం చేశారు. ఆ పలక మీద రాయాలంటే చాలా శ్రమ పడవలసి వచ్చేది. బీరాకులను బొగ్గును కలిపి దంచి ఆ పసరు దానికి పూస్తేనే అక్షరం దిద్దగలిగే వాళ్ళం.
కమ్యూనిష్టులు మా ఇల్లు కూలగొట్టారు. ఆ నాయకులు మా ఊరివారే! కమ్యూనిస్టు ఆగడాలకు భయపడి మా కుటుంబం ఆంధ్రప్రాంతానికి నరసారావు పేటకు వలస పోయాము. అక్కడే 2 సంవత్సరాలు ఉన్నాము. అక్కడ వీధి బడిలోనే నా చదువు సాగింది. వారు మంచిగానే చెప్పేవారు, కానీ ఆర్థిక ఇబ్బందులుండేవి. భూస్వాములని పేరే కానీ నల్లగొండ జిల్లాలో వర్షాలు పడక పంటలు పండక పోయేవి. సాగు నీటి వసతి లేకపోయేది. చుట్టుపక్కల వర్షం పడినా మా గ్రామంలో పడకపోయేది. అలా డబ్బు కష్టాలు ఉండేవి. ఒక్కొక్కసారి భోజనానికి కూడా కష్టమయ్యేది. మా నాన్న , నాయనమ్మ ఊళ్ళో ఉండేవారు ఊర్లో ఉండి ఆమె వ్యవసాయం చేయించేది.
ఆమె నన్ను చాలా గారాబంగా చూసుకునేది.. ఎంతలా అంటే నరసరావుపేటలో నాకు మశూచి వస్తే నన్ను చూడడానికి ఇంత దూరం నుండి శ్రమపడి వచ్చింది.
అక్కడ మమ్మల్ని నైజాము వాళ్లు అనేవారు. మేము మూకీ సినిమాలు చూసే వాళ్ళము. స్టేజికి రెండు వైపులా ఇద్దరు మనుషులు నిలబడి కథను సంభాషణలను చెప్పేవారు అటువంటి సినిమా చంద్రలేఖను చూశాను. మన నిజాం సంస్థానం విలీనం అయిన తర్వాత మా ఊరికి రావాలని బయలుదేరాము కానీ, మా ఊర్లో రావి నారాయణ రెడ్డి, నర్సింహారెడ్డి మొదలైన వారు చాలామంది నాయకులు ఉండేవారు. అప్పుడే చాకలి ఐలమ్మ సంఘటన కూడా జరిగింది .అంటే ఇంకా కమ్యూనిస్టు ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకని నరసరావుపేట నుండి మా అమ్మమ్మ ఊరుకు అంటే వరంగల్ జిల్లా వెంకటాద్రి

పేటలోని 2సంవత్సరాలు ఉన్నాము అంటే 1950 వరకు అక్కడే ఉన్నాము.
మా ఊరికి పోయి వస్తుండే వారు అక్కడే వీధి బడిలో చదువుకున్నాను. కొంత కాలానికి నల్లగొండకు వచ్చాము. ఊర్లో మా ఇల్లు కూలగొట్టారు కనుక ఉండే వీలు లేకపోవడం, అలాగే మా చదువుల కోసం నల్లగొండలోనే ఉన్నాము. పిల్లలను చదివించాలనే అవగాహన అప్పుడప్పుడే కాస్త వచ్చింది. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివాను. నేను చదువులో చురుకుగానే ఉండేదాన్ని. ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మృగశిర అనే మా ప్రధానోపాధ్యాయురాలు ఉండేవారు. ఆమె అక్క చెల్లెళ్ళందరూ ఉపాధ్యాయినులే! వారికి వాళ్ళ నాన్న నక్షత్రాల పేర్లు పెట్టారు. మా ప్రధాన ఉపాధ్యాయురాలు మృగశిర మమల్ని ప్రేమగా చూసేవారు. ఆమెకు విద్యార్థులు పుస్తకాలను చదవాలనే ఆకాంక్షతో చాలా పుస్తకాలు కొనిపెట్టింది. రెండు అల్మారాలలో నీటుగా సర్ది పెట్టే వారు.
నేను ఎనిమిదో తరగతిలో ఉన్నాను కాబట్టి పుస్తకాలను విద్యార్థులకు ఇవ్వడం, వారి పేర్లు రిజిస్టర్లో రాయడం, ఏయే పుస్తకాలు ఉన్నాయో వాటిని వరుస క్రమంలో సర్దడం, అన్ని చేసే దాన్ని! ఆ పనులు చేస్తున్నప్పుడు ఆసక్తిగా అందులో ఏముందని? అవి వేటికి సంబంధించిన పుస్తకాలని? వాటిని పేర్లతో గుర్తించడం ఎలా అనీ, పరిశీలించడంతో పుస్తకాల మీద ఇష్టం ఏర్పడింది. అయితే అందులో మొగలాయి దర్బారు, బంకించందర్ నవలలు, శరత్ చంద్ర, ప్రేమ చంద్ర ,వీరి అనువాదాలన్నీ చదివాను. అలా చదవడం అలవాటైంది. సాహిత్యంతో సంబంధం ఏర్పడింది.
పదవ తరగతి పాస్ అయిన తర్వాత మా అమ్మ నాన్నలు పెళ్లి చేయాలనుకున్నారు. సరైన సంబంధం కలిసి రాలేదు. అప్పుడు నల్లగొండలో జూనియర్ కాలేజీ లేదు. అందుకని హైదరాబాద్ లో వెంకట్రామారెడ్డి కాలేజీలో చేర్పించారు. ఆ హాస్టల్ లోనే ఉండి చదువుకున్నాను. అక్కడ కూడా కాలేజీ లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చుకొని చదవడం, మ్యాగజైన్ లో కథలు రాయడం ప్రారంభమైంది. అలా నా మొదటి కథ లావణ్య రాసాను. అలా నా చదువు M A phd.
పద్మజ:— కథ ఎందుకు రాయాలనిపించింది?
సుజాతారెడ్డి:– మా బంధువుల అమ్మాయి ఒక ఆమె ఉండేది. ఆమె భర్త మంచి వైద్యుడు, సౌమ్యుడు. పేదలకు ఉచితంగా సేవచేసేవారు. అక్కడ పేద ముస్లిమ్ కుటుంబాలు ఎక్కువ ఉండేవి. వారికి ఎనలేని సేవ చేసేవారు. ఐనా రెడ్డికులం అనే ఒకే ఒక కారణంతో రజాకార్లు ఆ డాక్టర్ ను చంపేశారు.
అతను చనిపోయాక ఆమె వితంతువుగా ఎనలేని కష్టాలు పడింది. ఆ కష్టాలు చూసి కథ రాయాలనిపించింది. అందుకే నా కథలో వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవాలని, పెద్దలు ఆ దిశగా ఆలోచించాలని రాశాను.
మేముండే హాస్టల్ కు గోల్కొండ పత్రిక వచ్చేది. అది చదువుతుంటే అందులో వచ్చే కథలు, కవితలు, చూసి నాకూ రాయాలనిపించి రాశాను. అలా జీవన్మృతుడు అనేది ఒక కథ అచ్చయింది.
పి యు సి అయిన తర్వాత మళ్లీ మా ఊరికి వెళ్ళిపోయాను. నల్లగొండలో డిగ్రీ కాలేజీ స్థాపించారు. నేను దాంట్లో జాయిన్ అయినాను. అప్పటికి ఇంకా సంబంధాలు కుదరలేదు.
నేను మా తమ్ముడు ఇద్దరం మాత్రమే ఉండి మెస్ లో భోజనం చేసే వాళ్ళం మా బాపు వచ్చి పోతుండేవారు. నేను బిఏ మొదటి సంవత్సరం తెలుగుతో చదివాను. అలా తెలుగు భాష మీద అభిమానం ఏర్పడింది. మా వాళ్లకేమో నన్ను డాక్టర్ చదివించాలని ఉండేది! ఆ కాలంలో ఆడపిల్లలు వైద్య విద్యనే చదవాలనుకునేవారు.
నాకు సాహిత్యం మీద అభిమానం ఏర్పడింది. అక్కడ కూడా మా గురువుగారు వెంకట నరసింహం గారు తెలుగు చాలా బాగా చెప్పేవారు. ఆముక్తమాల్యద ఇప్పటికి గుర్తున్నదంటే మా గురువుగారి బోధనే కారణం. ఒక పద్యాన్ని ఒక పీరియడ్ మొత్తం చెప్పేవారు. అలా తెలుగు భాష పైన ఆసక్తి ఏర్పడింది.
బి ఏ మొదటి సంవత్సరం పూర్తి కాగానే నాకు పెళ్లయింది. నా భర్త సంస్కృతంలో పండితులు. ఆయన సంస్కృతంలో ఎమ్మే చేశారు. మా మామగారు ఆర్య సమాజ సిద్ధాంతానికి ప్రభావితమయ్యారు. ఆయన తన కుమారులను సంస్కృతం చదివించాలని హిమాలయాలలో ఉన్న ( ) గురుకులంలో చేర్పించారు.
మాకుటుంబ స్నేహితులు విద్యాలంకార్ అనే గొప్ప నాయకుడు ఉండేవారు. ఆయన కూడా అక్కడే చదివారు. అలా వారి పరిచయంతో మా వారి గురించి తెలిసింది. మా వారి పేరు ముదిగంటి గోపాల్ రెడ్డి గారు. మొత్తం సంస్కృతంలోనే చదివి వేదాలంకార్ పట్టా పుచ్చుకున్నారు. మా వారి తమ్ముడు విద్యాలంకార పట్టా పొందారు. వేదాలంకార్ అంటే వేదాధ్యయనమే ఉండేది. విద్యాలంకార్లో మాత్రం సంస్కృతంతో పాటు హిందీ, ఇతర సబ్జెక్టులు నేర్పించేవారు.
వేదాలంకార్ పూర్తయిన తర్వాత ఎమ్మే కోసం హైదరాబాద్ వచ్చారు. ఉస్మానియాలో ఎమ్ ఎ చేశారు. మా పెళ్లి 1959 లో అయింది. యూనివర్సిటీలో తార్నాక అవతల మాకు ఒక క్వార్టర్ దొరికింది.అక్కడే కొత్త కాపురం పెట్టాము. ఉత్తర భారతదేశానికి తను చదువుకున్న గురుకులం చూపించాలని నన్ను తీసుకొని వెళ్లారు. కురుక్షేత్రం, గురుకులం, హరిద్వార్ అవతల గంగానది తీరంలో గోపాల్ రెడ్డి గారు చదివిన గురుకులం ఉన్నది. దాన్ని చూపించారు. అక్కడ సాత్వికాహారం ఇచ్చేవారు. మా వివాహం కూడా ఆర్య సమాజ పద్ధతిలో జరిగింది. ఆ పద్ధతిలో తాళి కట్టరు. కానీ మా అమ్మ నాన్న కోరడంతో ఓం అనే పథకం కట్టారు. మా వారు సంస్కృత శ్లోకాలు చక్కగా చదివేవారు. కాదంబరి చదివేవారు. దాంతో నాకు సంస్కృత భాషతో పరిచయమైంది. 1963లో పాప, 65లో బాబు పుట్టాడు.
మా వారు ఉస్మానియాలో సంస్కృతం భాషా అధ్యాపకులుగా ఉండడంతో 65లో జర్మన్ భాషా శాఖను ప్రారంభించారు. మా వారికి భాషలు నేర్చుకోవడం అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఆయనకు చాలా భాషలు వచ్చు! అలా జర్మన్ భాష నేర్చుకున్నారు. మన సంస్కృత వ్యాకరణము- జర్మన్ వ్యాకరణం ఒకే తీరుగా ఉండేది. అందుకే ఆ భాషలో చక్కగా మాట్లాడేవారు. జర్మన్ ప్రొఫెసర్లు మా వారి భాషను మెచ్చుకొని, ఆయనకు ఒక స్కాలర్షిప్ ఇచ్చారు. జర్మన్ లో M A చేయడానికి అనుమతి కూడా ఇచ్చారు. ఆయన అలా వెళ్ళిన ఒక సంవత్సరం తర్వాత నేను కూడా జర్మనీ వెళ్లాను. అక్కడ టుబింగన్ యూనివర్సిటీలోని గ్రంథాలయంలో ఓరియంటల్ విభాగంలో భారతాధ్యయనం గ్రంథాలను* సబ్జెక్ట్ క్యాటలాగ్* చేయడంలో పనిచేసాను.
సంస్కృత శాఖలో ఇండాలజీ అంటే ఇండియాకు సంబంధించిన భాషలు విజ్ఞానం శాఖలో సంస్కృత భాషా బోధకులుగా ఆయన చేరారు. అభిలాష ఉన్నవారికి హిందీ కూడా చెప్పేవారు. అలా బోధకులుగా పనిచేశారు అక్కడ హెడ్ 1940 ప్రాంతంలోనే కాశి వచ్చి సంస్కృతం నేర్చుకున్నారట. పాణిని వ్యాకరణం మరియు సంస్కృతం మాట్లాడటం బాగా వచ్చు.
అక్కడ భారత దేశ సంబంధ భాషా శాఖలో నన్ను నియమించారు. గ్రంథాలయంలో విషయపరంగా మూడు భాషలకు సంబంధించిన పుస్తకాలను జాబితా చేయడం నా పని. అక్కడ ఇరానీ భాష కూడా ఉండేది. జర్మన్ మహిళ ఉండేది. ఈజిప్టాలజీ అంటే ఈ ప్రాచీన ఈజిప్టు భాష ఉండేది. అందులో ఒక విద్యార్థి ఉండేవాడు. నన్ను సంస్కృత భాషకు నియమించారు. అలా సంస్కృత పుస్తకాలను తిరిగేసి చదవడం వల్ల ఆ పుస్తకం ఏ విషయానికి సంబంధించినదని, వివరాలన్నీ రాసేదాన్ని! అలా సంస్కృత భాషతో పరిచయం ఏర్పడింది. మనకు ఇష్టం ఉంటే లైబ్రరీకి వెళ్లి చదువుకోవచ్చు కూడా! అలా అక్కడ సంస్కృత పుస్తకాలను చదివేదాన్ని. సంస్కృత సాహిత్య చరిత్రల అనువాదాలు ( ఇంగ్లీష్,జర్మన్, ఫ్రెంచ్ వాళ్ళు అనువదించినవి) అక్కడ ఉంటే చదివే దాన్ని. వాటి మీద నోట్స్ తయారు చేసేదాన్ని. అక్కడ ఉన్న మూడు సంవత్సరాలు అలానే చాలా చదివాను. భారతదేశం వచ్చిన తర్వాత మా వారు ఉస్మానియాలో చేరారు. నేను 1970లో రెడ్డి కాలేజీలో అధ్యాపకురాలిగా చేరాను. 2000 సం.లో పదవి విరమణ పొందాను. అధ్యాపకురాలుగా పనిచేస్తున్నప్పుడే సంస్కృత సాహిత్య చరిత్ర రాయాలని అభిలాష ఉండేది.
పద్మజ :—– మీరు రచించిన రచనల వివరాలు ఏంటో చెప్పండమ్మా!
సుజాతారెడ్డి:– నేను రాసిన వాటిలో అచ్చైనవి.
సాహిత్య విమర్శ గ్రంధాలు.
1 – మను- వసు చరిత్రల తులినాత్మక పరిశీలనం : 1981
2 – శ్రీనాధుని కవితా సౌందర్యం : 1982
3 – తెలుగు నవలానుశీలనం : 1991
4 – వేమన- నాథ సంప్రదాయం : 1993
5 – రస చర్చ – ఆధునికత : 2010
6 – అద్యతన దృష్టి : 2014
నవలలు
7 – మలుపు తిరిగిన రథచక్రాలు : 1994
8 – సంకెళ్లు తెగాయి : 1994
9 – ఆకాశంలో విభజన రేఖ ల్లేవు : 1995
కథా సంపుటాలు
10 – విస్సుర్రాయి : 1998
11 – మింగుతున్న పట్నం : 2001
12 – వ్యాపార మృగం : 2005
13 – మరో మార్క్స్ పుట్టాలి : 2010
* సాహిత్య చరిత్రలు*
14 – ఆంధ్రుల సంస్కృతి- సాహిత్య చరిత్ర
( బిఏ తెలుగు సాహిత్య విద్యార్థులకు)
(పాఠ్యపుస్తకం) తెలుగు అకాడమీ ప్రచరణ
1989
15 – చారిత్రక, సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర : 1996 రెండవ ముద్రణ : 2004 16 – సంస్కృత సాహిత్య చరిత్ర భర్త ఆచార్య గోపాల్ రెడ్డితో కలిసి రచించింది.
తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ 1986 17 : (ఇంతవరకు ఆరు ముద్రణలందుకొని చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథం)
18 – తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర
19 – నైలునది నాగరికత : 2006 (ఈజిప్ట్ యాత్ర
కథనం) అనుబంధం లద్దాక్ యాత్ర కథనం
20 – అద్భుత చైనా యాత్రా కథనం
21 – వ్యాపార సంస్కృతిలో స్త్రీ చైతన్యం : 2002
అనుబంధం తెలుగు సాహిత్యం మానవ
సంబంధాలు పౌరాణిక నేపథ్యం
వ్యాస సంకలనం :— ముద్దెర ( 2005 )
( తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్య
విమర్శ వ్యాసాలు)
ఆత్మకథ : ముసురు — 2010 (అనుభవాలు జ్ఞాపకాలు ఆలోచనలు) సంపాదకత్వం : తెలంగాణ తొలి తరం కథలు
2002
తొలినాటి కథలు, 2005 ( తెలంగాణ తొలితరం కథలో రెండో భాగం)
జైలు లోపల (వట్టికోట ఆళ్వారు స్వామి కథలు)
2009
నూరేళ్ల తెలుగు కథలు: 2011
( తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ ) తెలంగాణలో 1912 నుంచి 56 మధ్యకాలంలో రచింపపబడిన విస్తృతమైన కథలను సేకరించి పరిశోధనాత్మకమైన పీఠికతో
తెలంగాణ తొలి తరం కథలు 2002లో ప్రచురించారు. ఎన్నో వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, కథలు పత్రికల్లో ప్రచురింపబడినాయి.

