మహిళా పత్రిక సంపాదకులు 100 సంవత్సరాల క్రితమే వారి పత్రిక లో ఏంచెప్పాలనుకుంటున్నారో ఒక నిర్దిష్ట అంశాన్ని లేదా వారు లేవనెత్త బోయే సమస్య గురించిన చక్కని అవగాహన ఉందనడానికి నిదర్శనము అప్పటి సావిత్రి పత్రిక.
1904 లో స్థాపించిన ఈ పత్రిక విదుషీమణి శ్రీమతి పులుగుర్తి లక్ష్మీ నరసమాంబగారు, సంపాదకురాలు.
స్వాతంత్ర్యం రాక మునుపు మహిళల పరిస్థితి చాలా దుర్భరంగాను, అధ్వాన్నంగా ఉండేది. అయితే వారికి తమ ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చాలామందికి తెలియకపోయేది.చదువులేకపోవడం ఒకటైతే, ఇంట్లోనూ- దేశంలోనూ స్వతంత్రత లేకపోవడం మరో కారణం. ఇంకా శోచనీయమైన విషయం ఏమిటంటే ఆయా కష్టాలు ఆ బాధలు తమకు వచ్చిన సమస్యలుగా గుర్తించక, నిశ్శబ్దంగా జీవితంలో ఒక అవీ భాగం అనుకొని, అవన్నీ భరించాలి కాబోలు అనుకునే అమాయకులే ఆనాడు ఎక్కువ!
అటువంటి ఆడవారి బాధలు చూడలేక, వారిలో ధైర్యాన్ని పెంచాలని, చైతన్యం తీసుకురావాలని, భాషా -సాహిత్యాల పట్ల వారికి అభిరుచి ఏర్పరిచి, వాటి ద్వారా జీవితమంటే ఇది కాదు! మరోలా ఉంటుందనీ, ఉండేలా ప్రయత్నించాలని ఎరుక కలిగిస్తూ, వారి అస్తిత్వ ఆత్మ గౌరవం నిలుపుకొనే దిశగా ఈ పత్రిక నిర్వహించబడింది.
ఎందుకంటే మహమ్మదీయుల పాలనలో ఉర్దూ భాషకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. తెలుగులో ఏ రచనా ప్రక్రియనైనా వస్తే పాలకుల( నైజాము) ఆక్షేపణలకు గురయ్యేవి.
తెలంగాణ నడిబొడ్డులో ప్రజల భాషను ఆక్షేపించడం,మగవారిని కూడా ఆఫీసులకు వారు కట్టుకునే పద్ధతిలోనే వస్త్రధారణ ఉండాలని షరతు పెట్టడం ఇవన్నీ భరించలేక,మహిళలుగా తమకంటూ ఒక పత్రిక ఉండాలని, దాని ద్వారా తమ మనోభావాలు సమాజానికి ఎరుక చేయాలని,
సావిత్రి పత్రిక యజమానురాలు, సంపాదకురాలు పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారు మహిళల కంటూ ఒక పత్రిక ఉండాలని భావించారు.
మగవారు స్వేచ్ఛగా పత్రికలకు ఉత్తరాలు రాసుకుంటారు. అదే వారికి చెందిన మహిళలు మాత్రం వారి మనోభావాలు ఎందుకు తెలుపుకోకూడదు? అని గృహిణులుగా ఉన్న ఉద్యోగస్తులైన వారిని రచించమని ప్రోత్సహించేది. ఎందుకంటే కొన్ని విషయాలు అనుభవించే కొందరికే తెలుస్తాయి! మరికొన్ని విషయాలు మరికొందరికి తెలుసు… ఇలా వారు- వీరు; వారికి తెలిసిన విషయాలను తెలిపినా మహిళలకు అన్ని విషయాలు తెలుసే అవకాశముంటుంది అనేది ఆమె ఆంతర్యం. అదే ఆమె పత్రికను స్థాపించడానికి కారణం అని కూడా చెప్పారు.
ఆమె ఎందరో రచయిత్రుల రచనలను వెలుగులోనికి తీసుకొని వచ్చారు. 1904లో తాను స్వయంగా ఎన్నో రచించి, తమ పత్రికలో ప్రచురించారు. అలా అని కేవలం మహిళల రచనలే కాదు! మగవారి రచనలు కూడా తమ పత్రికలో అచ్చు వేశారు. కాకపోతే ఈ పత్రికలో ఎక్కువ పాతివ్రత్యం గురించే ఎక్కువ రచనలు వచ్చాయి. ఈ పాతివ్రత్య ప్రబోధాలు పద్య రూపకంగా ఉండేవి.
నీతి పదములు –ఏప్రిల్ 1904;
సత్య ధర్మములు ఫిబ్రవరి ఏప్రిల్ 1904 ;
స్త్రీ నీతి దీపిక 1904 ఆగస్టు;
స్త్రీ నీతి గీతముల ఫిబ్రవరి 1904;
నీతి పదములు ఫిబ్రవరి ,మార్చి, ఏప్రిల్ 1912. ఇలా ఎన్నో రచనలు చేయగా వాటిని తమ పత్రిక లో ముద్రించారు.
ఈ రచనలు స్త్రీలకు సత్యధర్మం చాటు చెప్పాయి.
సంపాదకూరాలి దృష్టిలో స్త్రీ విద్యావంతురాలైతే ఆకుటుంబం అందరూ నీతినియమాలతో ఒక కట్టుబాటులో నడుస్తారని అనుకుని, ఆమె మంచి సంపాదకీయాలు రాసేవారు.
అలాగే ఇంటి పనులు కూడా తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటారని, అలానే పిల్లలు సత్ప్రవర్తనతో మెలగాలంటే మహిళలు చదువుకోవాలని,తెలుపుతూ… కాలాన్ని వృధా చేసుకోవద్దని, ఉబుసుకుపోక మాటలు, ఇల్లామల్లి ముచ్చట్లు మాట్లాడవద్దని రాసేవారు.
ఈ పత్రికలో స్త్రీ విద్యా పంచరత్నాలు 1910లో ఉప్పల నరసమాంబ, ర్యాలీ జానకీరామాయమ్మ,ఆత్మూరి అన్నపూర్ణమ్మ,మొదలైన రచయిత్రులు విద్యకు ప్రాధాన్యతనిస్తూ…. వనితలు చదువుకోవాలని తమకు తెలిసినవి రాసి పత్రికలకు పంపాలని కోరుతూ సంపాదకీయం రాయడం ఎంతో అభినందించదగ్గ విషయము.
అంతేకాదు స్త్రీల పట్ల మగవారి ప్రవర్తన కూడా బాగుండాలని అప్పుడే స్త్రీ తన విద్యతో వచ్చిన ఆలోచనలతో చక్కని ప్రణాళికలతో ఆ కుటుంబాలు రాణిస్తాయని, అలా పురుషులు సకల సద్గుణాలు ఆచరిస్తూ, వారింటి మహిళలు ఆచరించాలని విన్నపము అనే శీర్షికతో సెప్టంబర్ (1910) లో రాసారు.
ఆ కాలంలోనే ఆడవారు చదువుకొని ఉద్యోగాలు చేయాలని దామెర్ల సీతమ్మ అన్నారు.
బొంబాయిలో ఇలా చదివి ఉద్యోగం చేస్తున్న వారెందరో ఉన్నారని, రఖమాబాయి, డాక్టర్ కృష్ణాబాయి,డాక్టర్ కమలాకర్ బాయి, మొదలైన ఎందరో మహిళలు బాగా చదువుకొని ఇటు ఉద్యమం చేస్తూనే, అటు ఇంటిని చక్కదిద్దుకుంటున్నారని రాసారు.
ముఖ్యంగా వితంతువులు చదువుకుంటే వారు ఎలా జీవించాలో తెలుసుకొని,తమ కాళ్ళ మీద తాము నిలబడుతూనే, సమాజానికి కూడా అసరాగా నిలబడతారని రాసారు.
కొందరుకుని అపవాదులేసినట్టు చదువుకున్న మహిళలు వారి ఇష్టా రాజ్యంగా ప్రవర్తించి చెడునడ త అలవర్చుకుంటున్నారనేది అబద్ధమని చెప్పింది. అలా అన్నప్పుడు మగవారు మాత్రం చదువుకొని ఉద్యోగం చేయడం లేదా? వాళ్ళు దుర్మార్గులు అయినారా? అని సమాజాన్ని ప్రశ్నించింది.
ప్రవర్తన అనేది వారి గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది కానీ, చదువుకోవడం వల్ల చెడిపోయారని అనడం మూర్ఖత్వం అని రాసింది. ఇంకా చదువుకుంటే సంస్కారం అబ్బి సూఖశాంతులు నెలకొంటాయని రాసారు.
అలా అంటే మనం విదుషీమణులుగా చెప్పుకుంటున్న వారు గానీ, పురాణ స్త్రీలు కానీ పాతివ్రత్యాన్ని పాటించింది బాగా చదువుకోవడం వల్లనే కానీ… మరో విధంగా కాదు!
మైత్రేయి, సులభ మొదలైన వారంతా చదువుకోవడం వల్ల బ్రహ్మజ్ఞానం పొందగలిగారని, వాళ్ల కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందని, కాబట్టి మంచి విద్య వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, శ్రీమతి పులిగుర్తి లక్ష్మీ నరసమాంబగారు తన సంపాదకీయంలో వివరించారు. ఆమె దార్శనికత కలిగిన మహిళ.ఎప్పుడూ 20 సంవత్సరాల ముందు ఆలోచించి పరిస్థితులను ముటదే పసికట్టి, ముందే హెచ్చరికలు చేసేవారు.
ఎన్నో అభ్యుదయ భావాలతో నిర్వహించిన ఈ పత్రిక మీద కొన్ని అపవాదులొచ్చాయి. బాల్యవివాహాలను వ్యతిరేకించిందీ పత్రిక. అంతే కాదు ఎన్నో సమావేశాలలో ఆ బాల్య విహాలు చేస్తే వచ్చే సమస్యల మీద ప్రసంగించింది.
స్త్రీల కోసం గ్రంథాలయాలు ఏర్పరచి, వితంతువులకు ఆసరాగా నిలిచింది. ఇలా తన పత్రిక ద్వారా మహిళలకు సహాయ సహకారాలు అందించమని 1911 లోనే కోరిందంటే ఎంత ముందు చూపు ఉన్న పత్రికాధిపతో కదా?
1910 స్త్రీల సనాతన మండలి గుంటూరులో మొదటి మహిళా సభ రాష్ట్రస్థాయిలో జరిగింది. విద్యార్థిని సమాజం ఆధ్వర్యంలో రెండవ సభ జరిగింది. ఈ సందర్భాన్ని గురించి తన పత్రికలో పులుగుర్తి నరసమాంబ
ఆంధ్ర మహిళ కార్యదర్శిని పేరుతోఎనిమిది పేజీలలో సంపాదకీయం వివరించింది.
చిన్న పెద్ద తేడా లేకుండా కులాలకు అతీతంగా వారందరినీ ఆ సభకు ఆహ్వానించింది. ఇందులో విద్య గురించి చర్చించడానికి ఒక సభ, సమాజంలోని లోటుపాట్లు గురించి మాట్లాడడానికి ఒక సభ, ఇంటికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి మరోసభలు ఉపశీర్షికలు పెట్టి ఇరవైరెండు రకాలైన సమస్యలను చర్చించారు.
చర్చలలో ఒకరి మధ్య మరొకరికి బేధాభిప్రాయాలు వచ్చి కొంతకాలం పత్రిక నిలిచిపోయినా మహిళల గురించి మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలు వెతకడం అనే గొప్ప కార్యక్రమానికి నాంది పలికింది మాత్రం 1904 లోనే… ఆ నాటి నుండే మొదలైంది ఈ పరంపర.
పందిటి వీర రాఘవమ్మ గారు ఆంధ్ర సోదరీ సమాజం స్థాపించి, పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారి అధ్యక్షతన అత్యద్భుతంగా తన ప్రతిభా పాటవాలతో మహిళలను చైతన్యవంతులుగా చేయడానికి ఎంతో కృషి చేసింది.
అలా చైతన్య వంతులైన మహిళలు, స్వాతంత్య్రం కోసం ప్రజలను మేలుకొలిపారు.
ఇవాళ మనం రాజకీయ,ఆర్థిక, సాంకేతిక,నిర్వహణలలో ఇలా నిలదొక్కుకొని రాణించడానికి ఆనాటి నరసమాంబ వంటి మహిళల ప్రోద్బలం, ప్రోత్సాహం ఎంతోఉంది.
ఎందుకంటే గృహహింస ఎంత ఉన్నా ఇదిలానే ఉంటుందని, దాన్ని భరించాలకునే మనస్తత్త్వం నుండి ఎదురించి, ఆత్మాభిమానంతో బతకాలని నేర్పిన ఆనాటి పత్రికలు ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండానే నడిపారు.
మరో కారణం రవాణా సౌకర్యాల వసతి అంతగా లేక ఒక విషయం సామాన్యులకు చేరడం వ్యక్తిగతంగా సభలు ఏర్పాటు చేసి, ప్రసంగాల వల్ల కష్టమైయ్యేది. ఆర్థిక వనరులు అడ్డు తగిలేవి. తమకంటూ ఆదాయంలేని మహిళలకు సభా నిర్వహణ తలకు మించిన భారమయ్యేది.
పత్రికలైతే ఇంటింటా చేరి, విషయం అందరికీ చేరుతుందని ఆలోచన చేయడం మరో కోణం.
ఏదేతైనేమి ? సామాజిక స్పృహ ఉండి, అణచబడిన మహిళలలు తలెత్తుకుని జీవించాలన్న వారి ధ్యేయానికి, పత్రిక ప్రజలకూ – ప్రభుత్వానికి నడుమ వంతెనవలె పనిచేయాలనే ఆశయంతో… శాంతి సుస్థిర సమాజాన్ని కాంక్షించే పత్రికలకెప్పటికైనా ఋణపడే ఉంటాం! ఆ నారీ మణులందరికీ
నమోవాకములర్పిస్తూ…
వ్యాసాలు
బిట్ల అంజనీ దేవి మనసెందుకో సున్నితం కవిత
కవయిత్రి బిట్ల ఆంజనీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం.ఇప్పుడు కూడా ప్రతి రోజు మంచి పుస్తకాలు చదువుతారు. సమాజ అభ్యుదయం కాంక్షించే సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు.చదువు పట్ల మక్కువతో ఎంఏ. బీ.ఈడీ.పూర్తి చేశారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అప్పుడప్పుడు కవితలు,వ్యాసాలు రాయిస్తున్నారు.విద్యార్థుల్లో దాగి వున్న సృజన శక్తికి పదును పెట్టిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా సాహిత్య సృజన కొనసాగిస్తున్నారు. కవయిత్రి అంజనీ దేవి కలం నుండి జాలువారిన మనసెందుకో సున్నితం కవితా సంపుటిలోని మనసెందుకో సున్నితం కవిత పై విశ్లేషణా వ్యాసం. ఈ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఈ కవిత మనసు గురించి రాయడం జరిగింది.మనసు గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ఉంది.అందరు చదవాల్సిన కవిత.
“మొదటిసారి వేడి తగిలినపుడు
“వేళ్ళు చురుక్కుమన్నాయి/అని అంటున్నారు.
పొయ్యి మీద వంట చేస్తున్నపుడు గిన్నె వేడిగా ఉంటుంది.వంట పూర్తి అయిన తర్వాత పొయ్యి మీద ఉన్న గిన్నెను గుడ్డను రెండు చేతులతో పట్టుకొని భద్రంగా చేతులు కాలకుండా గిన్నెను జాగ్రత్తగా తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. మొదటిసారి చేతికి వేడి తగిలినప్పుడు వేడి గిన్నె చేతికి అంటుకుని వేళ్లకు బాధ కలిగింది అనే చక్కని భావాన్ని వ్యక్తీకరించిన తీరు బాగుంది.
“వయసు పెరిగే కొద్ధీ
“చర్మం ముదిరిందో
“అలవాటయిందో
“తట్టుకునే శక్తి పెరిగిందో
“ఇప్పుడు అమాంతం
“వేడి గిన్నెను దించగలదు/అని అంటున్నారు.
జీవితం నేర్పిన పాఠాలుగా తోస్తుంది.వయసు పెరిగింది.వయసుతో పాటు చర్మం ముదిరింది.ప్రతి రోజు వంట చేస్తున్నది.వంట చేయడం ఇప్పుడు అలవాటయింది.వేడిని తట్టుకునే శక్తి కూడా పెరిగింది.ఇప్పుడేమో అమాంతం చేతిలో బట్ట లేకుండా పొయ్యి మీద నుండి వేడి గిన్నెను దించుతుంది.వేడి గిన్నెను పొయ్యి మీదనుండి దింపినప్పటికీ చేతులు కాలడం లేదు.వేడి గిన్నెను దించితే చేతులు కాలుతాయని స్పృహ కూడా లేకుండా పోయింది.మనిషి యొక్క అనుభవాలు మనసు సున్నితత్వం నుండి కఠినత్వం వైపు ఎలా తీసుకెళ్లింది.మనిషి మనస్సు ఎంతగా మారి పోయింది.మనిషిలోని మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి అందించిన భావం అద్భుతంగా ఉంది.

“మొదటి అడుగు సున్నితంగా
” ముళ్ళు తగిలినా రాయి తగిలినా
“నొప్పితో తడబడింది/అని అంటున్నారు.
ఎవరికైనా,ఎప్పుడైనా,మొదటి అడుగు సున్నితంగా ఉంటుంది అని మన అందరికి తెలుసు.మొదటిసారి ముళ్ళు తగిలినా,రాయి తగిలినా నొప్పితో తడబడింది.బాధతో విలవిలలాడింది.ముళ్ళు తగిలిన చోట అవస్థను అనుభవించింది.ఎవరికైనా రాయి తగిలిన చోట నొప్పి ఉంటుంది.రాయి తగిలిన చోటనే మళ్లీ దెబ్బ తగిలి శరీరానికి కలిగిన బాధను ఓర్పుతో భరించింది.
“ఎముక ముదిరిందో
“అవసరాల అనివార్యతో
“ఇపుడు ముళ్ళపై నడవగలను
“కంకరపై పడుకోగలను/అని అంటున్నారు.
నిజమే.వయసు పెరిగిన కొద్ది ఎముక ముదిరింది. అవసరాలు మరియు అనివార్య పరిస్థితులు వల్ల ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలను అన్న ధైర్యం పెరిగింది.ముళ్ళపై నడవగలను అనే ధీమా పెరిగింది.ముళ్ల పై నడిస్తే ఏం జరుగుతుంది? కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి.కంకరపై పడుకోగలను అనే ఆత్మ విశ్వాసం సైతం పెరిగింది.కంకర పై పడుకుంటే శరీరానికి కంకర రాళ్లు ఒత్తుకొని ఏ కష్టాన్ని అయినా ఏ సమస్య నైనా ఓర్చుకునే లక్షణం అలవడింది.
“అనుభవం పెరిగే కొద్దీ
“అన్నీ తట్టుకున్న ఈ శరీరంలో
“మనసెందుకో అందుకు భిన్నం/అని అంటున్నారు.
జీవితం నేర్పే పాఠాల వల్ల అనుభవం పెరిగింది.ఈ శరీరం మాత్రం అనుభవం పెరిగిన కొద్ది అన్నిటిని తట్టుకుంది.మనలో భావోద్వేగాలు,అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు లేదా మనస్సు. మనసుకు రూపం లేదు.పేరు మాత్రమే ఉంది. దేవుడికి రూపం లేదు.మనసు ఎక్కడ ఉంది?మన లోపల మనసు దాగి ఉంది.మనసు అంటే ఆలోచన అని అర్థం.ఆలోచనల్లో కూడా తేడాలు ఉంటాయి. మనస్సు అనేది ఎవరికి వారి సొంతం.సంకల్పమే మన మనస్సు.ఇతరుల మనసును ఎవ్వరు తెలుసుకోలేరు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని సాధిస్తుంది.శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది మన మనసు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని కోరుకోవాలి.ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి.శరీరం స్వాధీనంలో లేదు.మనసు స్వాధీనంలో లేదు.మనస్సు అంటే అంతరంగం. మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు, విచక్షణ,మొదలైన అంశాలు.మనస్సు ఏదైనా వస్తువు లేదా జీవరాశి పై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం.ప్రతి మనిషి యొక్క భావాలు,అనుభూతులు,అభిప్రాయాలు,వారి వారి మనస్సు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది.అందుకే ఎవరి ఆలోచనలు వారివే. మనసు గతి యింతే,మనిషి బ్రతికింతే,మనసున్న మనిషికి సుఖం లేదంతే,చలనచిత్రంలోని పాటను మనం విని ఉన్నాం.మనిషి మనసు ఎవరికి అర్థం కాదు.మనసు అంటే నానార్థాలు హృదయం, మానసం,ఇష్టం,తలపు,వలపు,చిత్రం,మది.మనసు గురించి కవయిత్రి మనసెందుకో భిన్నమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

“అమ్మ తిట్టినపుడు
“ఏడ్చి మర్చిపోయా
“మళ్లీ అమ్మా అన్నాను/అంటున్నారు. మనం ఏమైనా తప్పు చేస్తే అమ్మ తిట్టుతుంది.అమ్మ తిట్టినప్పుడు మనకు దుఃఖం వచ్చి ఏడుస్తాం.అమ్మ కొట్టినా,తిట్టినా తిరిగి అమ్మ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది.అమ్మ ఆలనలో,లాలనలో అమ్మ కొట్టిన సంగతి,తిట్టిన సంగతి మర్చిపోయి మళ్లీ అమ్మ దగ్గరికి చేరుతాం.అమ్మ ఎవరు?అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మను మాతృదేవోభవ అని శాస్త్రాలు చెబుతున్నాయి.అమ్మ కనిపించే దైవం.అమ్మ కని పెంచే దైవం.అమ్మ గురించిన భావన అద్భుతం. కవయిత్రి అమ్మను గుర్తుచేసింది,అమ్మ లోకం గురించి,మనలను ఆలోచించేలా చేశారు.
“దోస్తు కొట్టినప్పుడు దెబ్బలాడి
“మరిచిపోయాను
“మళ్లీ ఆడుకున్నాను/అంటున్నారు.
స్నేహమేరా జీవితం.స్నేహమేరా శాశ్వతం.సినీ గీతం ఉంది.ఏవో చిలిపి చేష్టలు,ఏదో అల్లరి,దోస్త్ కొట్టినప్పుడు దెబ్బలాడి మరిచిపోయి మళ్లీ ఆడుకున్నాను.స్నేహితులు కొట్లాడుకుంటారు.అన్నీ మర్చిపోయి అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఆడుకుంటారు.స్నేహబంధం విలువైనదిగా చెప్పుకుంటారు.నిజమైన స్నేహితులు జీవితాంతం కలిసి మెలిసి ఉంటారు.స్నేహం యొక్క ఔన్నత్యాన్ని కవయిత్రి చక్కగా వివరించారు.
“సార్ కొట్టినపుడు
“వెక్కి వెక్కి ఏడ్చిన/అంటున్నారు.
సార్ అంటే ఎవరు?ఉపాధ్యాయుడు.ఆచార్య దేవోభవ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆచార్యుడు కూడా దేవునితో సమానం.సార్ ఏదైనా తప్పు పని,అల్లరి చేస్తే మరియు చదువుకోకుంటే మందలిస్తారు.సారు కొట్టినప్పుడు వెక్కివెక్కి ఏడ్చాను.పిల్లలు సారు కొడితే ఏడుస్తారు.పిల్లలను తల్లిలాగే సారు కూడా దగ్గరికి తీస్తాడు.సార్ చక్కగా చదువు చెప్పి మనలో జ్ఞాన దీపం వెలిగిస్తాడు.సార్ మనలను సన్మార్గంలో నడిపిస్తాడు.సార్ కొట్టినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం చక్కగా ఉంది.కవయిత్రి మనలను బాల్యపు జ్ఞాపకాలలోకి తీసుకెళ్లిన తీరు అద్భుతం.
“ఇప్పుడెందుకో
“గుట్టలుగా పేరుకున్న దుఃఖం
“ఉబికి రానే రాదు
“గుండెలో భారం తగ్గనే తగ్గదు/అంటున్నారు.
జీవితంలో మనిషి ఎన్నో కష్టాలను కడగండ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే కష్టాలు ఒక్కటొక్కటిగా మాయమై పోతాయి.కష్టాలను సహనంతో ఓర్చుకుంటే గుట్టలు గుట్టలుగా పేరుకున్న దుఃఖం ఆవిరి అయి పోతుంది. కష్టాల నావను ఈదుతున్నప్పుడు గుండెల్లో భారం ఎలా తగ్గుతుంది?కష్టాలు క్రమేణా తగ్గిపోతే గుండెల్లో భారం తగ్గుతుంది.కవయిత్రి కవితలో దుఃఖం గురించిన భావాన్ని చక్కగా పండించారు.
“మనసు చేతికి దొరికితే బాగుండు/అంటున్నారు.
మనసు చేతికి దొరికే వస్తువు కాదు.మనసు మన ఆలోచనల్లో నిండి నిబిడీకృతమై ఉంటుంది.మనసు చిక్కబట్టిన వాళ్లను మహర్షులు అంటారు.నిత్యం యోగా,ప్రాణాయామాలు చేయడం ద్వారా మనసు స్వాధీనంలోకి వస్తుంది.మనసు స్వాధీనంలోకి తెచ్చుకున్న వాళ్లను స్థితప్రజ్ఞులు అంటారు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుల గురించి వ్రాయబడింది.
“ముండ్లు గుచ్చో
“సెగ తగిలించో
“రాతితో బాదో
“గట్టి పడేసే దాన్ని/అంటున్నారు.
మనసు మనకి అందదు.మనసుకి ముళ్ళు గుచ్చలేం.మనసుకు సెగ తగిలించలేం.మనసును రాతితో బాధి గట్టి పడేయడం సాధ్యం కాదు. మనసును గురించి కవయిత్రి భావన మనలను ఆలోచింపజేస్తుంది.
“వయసు పెరిగే కొద్దీ
“ఈ మనసెందుకో
“మరింత సున్నితమవుతోంది/అంటున్నారు.
వయసు పెరిగే కొద్ది వయసుతోపాటు ఈ మనసు మరింత సున్నితమవుతోందనే భావం అద్భుతంగా ఉంది.మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి భావాల్లో వాస్తవం దాగి ఉంది.
చక్కటి కవిత అందించినందుకు కవయిత్రి బిట్ల అంజనీదేవిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
దానములన్నిటికన్న రక్తదానం మిన్న. ఎందుకంటే రక్తదానం వలన ఒక నిండుప్రాణం కాపాడవచ్చు. అట్లాగే అవయవ దానం నుండి కూడా. మిగిలిన ఏ దానములలోనైనా, ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశముండదు. అందుకని అన్ని దానములలో కన్నా ఈ రెండు దానములే శ్రేష్టం. ఈరోజు మనం రక్తదానం గురించి తెలుసుకుందాం.
అసలు రక్తం దేనితో తయారవుతుంది. ఇది ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అనే వాటి కలయికతో కూడి ఉంటుంది. ఎర్ర రక్తకణాలు శరీరావయవాలకు కావాల్సిన ప్రాణవాయువును అందిస్తే, తెల్ల రక్తకణాలు రోగ నిరోధకతను పెంపొందిస్తే, ప్లేట్ లెట్స్ రక్తాన్ని గడ్డ కట్టించి, రక్తస్రావం జరగకుండా కాపాడుతాయి. రక్త కణాలు ఎముక మూలుగు లేక మజ్జ (Bone marrow) నుండి తయారవుతాయి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులైతే, తెల్ల రక్తకణాలు- వాటి రకాన్ని బట్టి జీవితకాలం మారుతుంది. జీవితకాలం దాటిన రక్తకణాలు నాశనమై, కొత్త రక్తకణాలు రక్తంలో చేరుతుంటాయి.
ఏదైనా కారణము వలన శరీరంలో రక్తస్రావమైనా (ఉదాహరణకు స్త్రీలలో వచ్చే నెలసరి, ప్రసవము, పెద్ద ప్రేవుల క్యాన్సర్, కొన్ని రకాలైన నులిపురుగులు… మొదలగు సందర్భాలలో జరిగే రక్తస్రావము), శరీరంలోని రక్త పరిమాణం (5L) తగ్గకుండా శరీరం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్లాస్మా పరిమాణం తగ్గకుండా, కణాల నుండి నీరు రక్తంలో చేరుతుంది. అలాగే బోన్ మేరో ఎక్కువ పనిచేసి రక్తకణాలను అందిస్తుంది. ఆ రకంగా, రక్తం ద్వారా అవయవాలకు అందే ప్రాణవాయువు పరిమాణం తగ్గకుండా జాగ్రత్తపడుతుంది శరీరం. దీనికి కొంత సమయం పడుతుంది.
కాని కొన్ని సందర్భాలలో (రోడ్డు ప్రమాదాలు,శస్త్ర చికిత్సల్లో మరియు ప్రసవ సమయాల్లో కాంప్లికేషన్స్ తలెత్తితే), రక్త పరిమాణము పెంచే సమయం శరీరానికి తగినంత లేకుంటే, రోగి షాక్ లోకి వెళ్లి మరణించే అవకాశాలెక్కువ. అటువంటి సందర్భాలలో, రక్తమార్పిడి రోగి ప్రాణాలను కాపాడుతుంది. అలాగే రక్తకణాలు తొందరగా విచ్ఛిన్నమయ్యే తలసీమియా, హిమోఫిలిక్ రోగుల్లో, రక్త కణాలు సరిగ్గా తయారవ్వని ఎప్లాస్టిక్ ఎనీమియా రోగుల్లో మాటిమాటికీ రక్తాన్ని ఎక్కించవలసి ఉంటుంది.
అయితే ఈ రక్తదానం చెయ్యడానికి అర్హులెవరంటే… 18- 65 సంవత్సరాల మధ్య ఉన్న ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులు. హిమోగ్లోబిన్ శాతం స్త్రీలకు 12.5%, పురుషులకు 13% తగ్గకుండా వుండాలి. వారికి ఏ విధమైన వ్యాధులు ఉండకూడదు. (ముఖ్యంగా హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు కొన్ని రకాలైన సుఖ వ్యాధులు). దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, క్యాన్సర్ రోగులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 కేజీల కన్నా తక్కువ బరువు ఉన్నవారు, రక్తదానము చేయడానికి అనర్హులు. రక్తదానానికి, రక్తదానానికి మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలి.
రక్తదాత నుండి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి, హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు సిఫిలిస్ వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాక, ఆ రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో అలాగే (Whole blood), 4°C వద్ద ఏడు వారాల వరకు నిల్వ ఉంచవచ్చు. లేనిపక్షంలో ఆ రక్తాన్ని, ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ (ఏడు రోజుల వరకు), ప్లాస్మా (ఫ్రేజెన్ ప్లాస్మా: -20°C వద్ద కొన్ని సంవత్సరాలు)… యిలా వేరు చేసి దాయవచ్చు. రక్తహీనత ఉన్నవారికి ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నవారికి (ఉదాహరణకు డెంగ్యూ జ్వరం) వాటిని, ఆటోయిమ్యూన్ డిసీజ్ ఉన్నవారికి ప్లాస్మాను అందిస్తారు. రక్తాన్ని సంగ్రహించాక మాత్రమే పరీక్షలు చేస్తారు. ఒకవేళ పరీక్షల్లో ఏ వ్యాధి అయినా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ రక్తాన్ని ఉపయోగించరు.
రక్త మార్పిడి చేసేముందు, రోగికి ఆ రక్తం సరిపోతుందా లేదా అనేది బ్లడ్ గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్ అనే పరీక్షలు చేసి నిర్ధారించుకుంటారు వైద్యులు. O, A, B, AB అనే నాలుగు రకాల రక్త గ్రూపులు, వాటిలో Rh పాజిటివ్, నెగిటివ్ అని రెండు రకాలు ఉంటాయి. “O నెగిటివ్” రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ డోనార్స్” అంటారు. “AB పాజిటివ్” వ్యక్తులకు ఎవరి రక్తాన్నైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ రెసిపియంట్స్” అంటారు.
రక్తదానం చేసిన వారికి ఏ రకమైన ఇబ్బందీ, తలెత్తదు. ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నాక, మామూలుగా విధులు నిర్వర్తించుకోవచ్చు. ముందే చెప్పుకున్న ప్రకారం, దానం చేసిన రక్తాన్ని దాత శరీరం కొద్ది కాలంలోనే సమకూర్చుకుంటుంది.
ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నా, ఎప్పటికప్పుడు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహించి, రక్తాన్ని సేకరించి, అవసరమైన వారికి అందిస్తూ, మానవ సేవను చేస్తున్నారు. వారితో పాటు మనం కూడా ఆ సేవలో పాల్గొందాం రండి.
గీసందెందుకొ మాయింటి మీద జీవ్వడ్డది…
“మస్తు రొజులైతుంది ఒకపారి ఒచ్చిపొ అవ్వ’… అని మా అమ్మ….
ఇల్లంత శీకటి శీకటి ఐతుంది … ఎప్పుడొస్తవవ్వా … మా బాపు…
యేమన్నగాని… గీసారి ఇంటిక్వోవాలని తీర్కజెస్కొన్మరి వొయ్న.
గూటిక్వోతనన్న ముర్పెంల నిద్ర గూడవట్టలే సక్కగ…
ఎప్పట్లెక్కనే పొద్దుగల్లనే లేష్నా…. గిన్ని పాలబోట్లు దాగి బైలెల్లిన.
ఎర్రబసెక్కుడే ఎర్కలేదు మా బాపే తోల్కపోతుండే.. బండి మీద..
యేం శితం జనం….
ఉష్కెవోస్త రాల్నంత మంది..!!! యిండ్లల్ల ఓల్లుంటలేరా అన్పిచ్చింది….
గప్పట్ల చర్చికి వోయ్నప్పుడు జూష్నది యాదికోచ్చింది.
గీ ఫ్రీ బస్సు పుణ్యమేందో గానీ… ” స్త్రీలను గౌరవించాలి ” అన్నమాటకే కర్వైపోయింది…
యెట్లనో గట్ల తిప్పల్వడి మా పల్లెకు జెర్కున్న…. అమ్మయ్య…!!! పానమేంత నిమ్మలమైందో…
అచ్ఛేటప్పట్సంది బస్సు దిగకముందె మా బాపు ఫోన్ల మీద ఫోన్లు జేస్తుండు…. నేనెక్కిచ్కస్తనవ్వా….. ఏం నడుస్తవని…! నేన్జెప్పలే ఇగ,… మస్తు రొజులైంది గట్ల గట్ల శేన్లల్లకెంచి సూస్కుంటొద్దామని ఇక్మత్ జేశ్న…!
……గిది మావూరేనా….!!? పక్కూర్ల దిగిన్న…?!!
గిదేందీ గిట్లుంది…
బండి దిగంగనె శెట్లన్నీ ఆర్తిచ్చినట్లన్పిచ్చు….గిడ కాన్గ శెట్లు, బూర్గుబుడ్ల శెట్లు ఉంటుండే… ఎవ్వి గన్పిస్తలే… కొట్టేశ్నట్టున్రు…. గప్పట్ల ఉస్కుల్కెంచి ఒస్తుంటే గా బూర్గు బుడ్డెలు ఎర్కోని మంచిగ ఎండవెట్టి , ఎల్దుర్తి ల లచ్చింపతి దుకాన్ల అమ్ముతుంటిమి…. షేటాక్కు ఐదు రూపాలిస్తుండే… గవ్వే గల్లగుర్గిలల్ల ఎస్కోని పైసల్ జమాజేసుకుంటుట్టిమి.
…..మస్తెండ గొడుతుంది..బాపుకు జెప్పిన అయిపోవు అన్పిచ్చింది.
“నిండ మున్గినంక సలేంది’…. ఓచ్చిన ఒడ్షిపోయింది.. గీయింత దూరం నడ్వలేనా…
శిన్నగున్నప్పుడు నాకంటె బర్వుండే బ్యాగేస్కొని ఇస్కుల్కు గింత కంటె ఎక్వ దూరమే నడ్షి పోతుంటిమి గిదెంత…!!
గొర్ల కొట్టాలు దాటంగనె….మా మామొల్ల పొలము…,ఆడనే కోల్ల పారముంటుందే మాడి శెట్టుంటుండే….,
పారముంది గని మాడి శెట్టు లేదు.. అయ్య!!..గది గూడ కొట్టేశిన్రా….!!?
మాడితొక్కు ఎట్ల పెట్కుంటున్నరో యెమొమరి.. పిఠాన పిరమునయీడ్కె బైట!!
ఒక్క పిట్ట కానోస్తలే.. కాకులు గూడ లేవు… గూల్లల్ల వన్నయేమో తియ్ ఎండమస్తు కొడ్తుంది…
కుస్తోల్లిండ్లల్లకచ్చిన…. మా తాతోలిల్లొచ్చింది గాళ్లనట్కాంచి మా ఆడకట్టుకు జెర్కున్న ఇగ….
మా శిన్నమ్మ… మయింటిపొంటి అత్తమ్మ అందర్గుసోని బీడీలు జేస్తుండ్రు…
“గిప్పుడే ఆస్తున్నవా… ఎట్లున్నవు.. ” యేమమ్మ గట్ల ఒట్టిశాపోలయినవు… కూడు సక్కగ తింటలేవా’…?? అనుకుంట అడిగిన్రు .. ఇంకిత సేపుంటే మల్లేడ లగ్గం గిగ్గం అనంటరేమొనని జెల్ది ఇంట్లక్వొయ్న!!!!
” మావ్వ రానే ఓచ్చింది… మావ్వ మావ్వ…!!! ఎండలోచ్చినవు…. షెప్పొద్దావ్వా….?!!నేనస్తుంటి గదా….
“ఓచ్చిన గదనే…! నాక్మనూరు దెల్వకనా…
యేమ్మా …?!! అనిగ మామ్మను మా బాపు ను మస్తుగ్గగాలిచ్చకున్న…
యెప్పుడెల్లినవో… బుక్కేడు మెత్కులు ఎస్కున్నవొ లేదో… నీకిష్టమని పప్షార్వెట్టిన ‘
ఇగ ఇంట్లక్వోయి కాల్జెతులు గడ్కొని పప్షార్తొటి ఇన్ని మెత్కులల్లిన…
తిని గట్ల ఒర్గిన .. గప్పుడే నా సప్పుడిని మా పెద్దమ్మొచ్చింది… మా పెద్దయ్యకు… పెద్దమ్మకు..మస్తిష్టం నెను… పానం జేస్తరు నన్ను…
ఇగ సాయింత్రం ఆలు కల్లు తెచ్చుకుండ్రు తాగుతున్నరు సీరియల్ జూస్కుంటా…
“మా పెద్దమ్మంటుంది..
“గిప్పుడు గింత షానిగున్నవు గని.. నువ్వు శిన్నగన్నప్పుడు కప్పను పట్కొని పిస్కుతుంటివి.. బాపులతోనే కల్దుకాన్లకు పోతుంటివి..బజ్జీలు ఇప్పిచ్చేదాకా ఊకుంటుట్వ బిడ్డా….. ఆన్కుంట నౌతుండ్రు….!!
అంబటాళ్లకు లేష్న… మంచిగ… అమ్మగూడ లేపలే…
లేవంగనే బంగ్లమీద్కి వోయి తిర్గుకుంట పండ్లు తోముకుంటున్న …
మెట్లెక్కంగనే… సక్కగ సూస్తే.. మా మల్లన్న గుట్ట కన్పిస్తది… పక్కకే శేన్లు ఉంటయి…
మంచిగ పిట్టల సప్పుడ్కే లేస్తుండే…. గిప్పుడు ఒక్క పిట్టె కానొస్తలే…
బాపు పొలం కాడికి పొయ్యోస్తా అన్నడు…
నెంగూడ ఒస్తానే బాపు అని పొయ్న…
మా బాయికాడికి పోతుంటే రెండు కొబ్బరిశెట్లుంటుండే ఒక్కొపారి గా బొండాలు కొట్కొని పోతుంటిమి… గాడా బీడుంటుండే గిప్పుడాడా నాట్లేశిన్రు…
మా బాయి పక్కకే మా శేను..మాది పొత్తుల బూమి…. మాగమామసకు ఒంటలక్వోతుంటిమి ఆడ్కే …
మాబర్రెలు గట్టేశే కాన్గ
శెట్టుకుయ్యాల కట్కున్నము…అదింక గట్లనే ఉంది….
మా శేన్లల్లకు పోతుంటే మస్తు శెట్లుంటుండే… గవన్నీ లేనేలేవ్…
గప్పట్ల పొలం కాడికి పోవాల్నంటె…మస్తు బుగులైతుండే …పాములు…ముంగీసలు పారం కాడ
కుక్కలుంటుండే… మస్తు పిట్టెలుంటుండే
యేమన్న ఒరిల శిన్న పుర్గు పుట్రున్నా గవ్వే తింటుండే…
గిప్పుడట్ల లేనట్లుంది… …గప్పుడే మా బాపొచ్చిండు…
” యేముందవ్వ మా నాయ్ననలందరున్నప్డే మంచిగుండే…
ఎవుసం నమ్ముకుంటే ఎమస్తుందని.. గందుకే అందర్వోయిండ్రు…
మనమే ఐదిండ్లోల్లమ్ మిగ్లినం…
ఔమరి…. గప్పుడే మంచిగుంటుండే…
మంచిగ సేంద్రియ ఎర్వులెస్కొని పండించుకున్నోళ్లే మంచిగుండే.. పంట మంచిగొస్తుండే…. గిప్పుడన్ని… గా మందు సంచులేనాయే…. ఏమేమో స్ప్రే లు కొట్టవట్టే…..దాన్కి తోడు గీ ఫైజీ నెట్వర్కులంట… అవ్విటి రెడియేషనూ… పిట్టెల పాణం దీశే… ఇగ పంటేడిది పక్కులేడియి…
” రాన్రానూ రాజు గుర్రం గాడ్దైదట ‘ మనం యేమ్ గావాల్నొ మర్శి యెంత ఇల్వైనయి పొడగొట్కుంటున్నమో మనకెర్కైతలే… మనముంగటోల్లు మనకెంత మంచిగ ఆరసత్వపు సొత్తుంచిండ్రో… మనమూ మన తర్వాత తరాన్కుంచుడు మరుస్తున్నం.
ఎంతకైనా ఓల్డ్ ఇస్ గోల్ద్ అన్నట్లు… గప్పుడే మంచిగుంటుండే…!!!
నాంపల్లి సుజాత మచ్చిక…! కవిత
ప్రముఖ కవయిత్రి,నాంపల్లి సుజాత కలం నుండి జాలువారిన హోమ్ మేకర్ కవితా సంపుటిలోని “మచ్చిక…! కవిత పై విశ్లేషణా వ్యాసం.మచ్చిక కవితను ఆసక్తితో చదివాను.నాకు చాలా నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.కుక్కను విశ్వాసం గల జంతువు అంటారు.పల్లెల్లో ప్రతి ఇంట కుక్క ఉంటుంది.ఊర కుక్క పిల్లలు పెడితే ప్రేమగా చూడడం తెచ్చి పెంచుకునే సంస్కారం,ఆనాటి పల్లె వాసుల్లో ఉండేది.ఇప్పుడు ఆ సంస్కారం తగ్గిందేమో అనిపిస్తుంది.పల్లెలోని జనాలు వాళ్ళు అన్నం తినేటప్పుడు ఓ ముద్ద కుక్కకు పెడతారు.కుక్కను కాలభైరవుడు,పరమేశ్వరునిగా భావిస్తారు.కాలం మారింది.ఇప్పుడు పట్టణాల్లో ప్రతి ఇంట తమ రక్షణ కోసం కుక్కను పెంచుతున్నారు.కుక్కను గొలుసు పెట్టి కట్టి ఉంచుతారు.కుక్కలు ఉన్న ఇంటికి వెళ్ళాలంటే ఎవ్వరైనా భయపడతారు.ఇంటి ముందు గేట్ పైన కుక్క ఉంది జాగ్రత్త,బివేర్ ఆఫ్ డాగ్ అని బోర్డ్ తగిలిస్తారు.కుక్క ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి రక్షణ కల్పిస్తుంది అని మనం చెప్ప వచ్చు. పోలీసులు దొంగలను,నేరస్థులను పట్టుకోవడానికి నేరం జరిగిన ప్రదేశానికి శునకంను తీసుకెళ్ళి వదులుతారు.శునకం వాసన చూసి నేరస్థులను పట్టగలదని నమ్మకం ఉంది.పోలీసులు రాత్రివేళలో నగరమంతా తిరుగుతూ పహారా కాయాలి. రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పహారా కాస్తూ ఆ నగరాన్ని కాపాడవలసిన బాధ్యత పోలీసులపై ఉంది.మారిన పరిస్థతులు పోలీసులు పహారా కాయడం లేదు.మనం విచారించాల్సిన విషయం.ఊర కుక్కలు రాత్రంతా మేల్కొని నగరంలో తిరుగుతూ వాడ వాడ తిరుగుతూ పహారా కాస్తూ నిర్విరామ సేవలు అందిస్తున్నాయి. కుక్కలు ఏ చిన్న అలికిడి అయిన బౌ బౌ మని మొరుగుతాయి.కుక్కల అరుపులకు దొంగలు పారి పోవాల్సిందే.నేరస్థుల పాలిట సింహా స్వప్నంలా కుక్క నిలుస్తుంది.అలాంటి కుక్కపై మచ్చిక పేరుతో చక్కని కవితను సుజాత మనకు అందించారు.ప్రతి ఒక్కరు ఆ మచ్చిక ఏమిటో దాని మతలబు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించేలా ఉంది.
“ఓ నాలుగు మిగిలిన/మెతుకులను విదిల్చి/ఇక నీ ప్రపంచమంతా/నా చెంతేనని శాసించడమే మచ్చిక…!/అని అంటున్నారు.కవయిత్రి సుజాత భావనలో ఎంతో నిజాయితీ ఉంది. ఇవ్వాళ లోకంలో కుక్కలు పెంచుతున్న తీరును నాలుగు వాక్యాల్లో భావగర్భితంగా తెలియ జేశారు.ఇక నీ ప్రపంచమంతా నా చెంతేనని శాసించడమే మచ్చిక అనే పదానికి అర్థం మరియు మచ్చిక లోని రహస్యాన్ని లోకానికి వెల్లడించారు.

“ఆది మానవుడి స్వార్థపూరిత పుర్రె లోంచి/ పుట్టుకొచ్చిన వ్యూహాత్మక కుట్రే అది…!/అనే దానిలో వాస్తవం దాగి ఉంది.ఆది మానవుడు తాను మనుగడ సాగించడానికి కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నాడు.అందులో కుక్క కూడా ఉంది.ఆది మానవుడు తన రక్షణ కోసం,తన బాగు కోసమే కుక్కను చేరదీశాడు.మచ్చిక చేసుకున్నాడు.ఆది మానవుడు అడవుల్లో తిరుగుతుంటే ఎన్నో క్రూర మృగాల నుండి రక్షణ కోసం కుక్కను పెంచుకున్నాడు.ఆది మానవుడు సంచార జీవితం గడిపే వాడు.ఆది మానవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కుక్కలు కూడా వెళ్ళేవి.ఆది మానవుడికి కుక్కలు తోడుగా ఉండి కాపాడాయి అని మనం చిన్నతనంలో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం.
“బొచ్చు కుక్కకి అంగీ తొడిగి/సంబుర పడుతున్నాడు/ అహ…ఎంతటి దయార్ధ హృదయుడో/నరనరానా జీవ కారుణ్యం/ అనుకుంటాం… కానీ/ఆ మచ్చిక వెనుక ప్రయోజనం/ఎవరికి తెలియదని/షాంపూలు వ్యాక్సిన్స్ బొమ్మ బొమికలు/అతని పరిరక్షణ కోసమే…!/అని అంటున్నారు.మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.నిజంగా జరుగుతున్న విషయాన్ని కవయిత్రి సుజాత మనకు కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తున్నారు.మనమందరం అంగీకరించాల్సిన విషయం.
“కాలకృత్యాలు కాలెత్తడాలు/కనురెప్పల కదలికలు/దాని ఇచ్చానుసారమనుకునేరు/వాడి ఆదేశానుగుణంగానే/అని అంటున్నారు.కుక్కను తీసుకొని వెళ్లి దాని కాలకృత్యాలు తీర్చడం, కాలెత్తడాలు కనురెప్ప కదలికలు దాని ఇచ్చానుసారం కాదు.వాడి ఆదేశానుగుణంగానే కుక్క మెదులుతుందని తెలియజేస్తున్నారు.
“ముందస్తు శిక్షణే కాదు/మూతికి శిక్కం కూడా మన ప్రమేయమే…! అని కవయిత్రి తెలియ జేస్తున్నారు.
“అరిచి ఘీ పెట్టి గింజుకున్న…/కుక్క ఎంత అరిచి బౌ బౌ మని మొరిగిన గింజుకున్న … గొలుసుతో కట్టబడి ఉంటుంది.కుక్క గొలుసుతో బంధింపబడి ఉంది.గొలుసు కట్టు దాటి ఆవలి గట్టు బందు వర్గాన్ని ముట్టరాదు అనే వాస్తవాన్ని కవయిత్రి సుజాత మనకు తెలియజేస్తున్నారు.

“గీసిన గిరి దాటి/అర ఇంచు స్వేచ్ఛ ఉండదు/ బంధించి ఉంచిన కుక్కకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది. గీసిన గిరి ఎలా దాటుతుంది.అర ఇంచు స్వేచ్ఛ ఉండదు అనే నిజాన్ని కవయిత్రి సుజాత తెలియజేస్తున్నారు.
“ఒక్కసారి…/గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో/
కలిసి జీవిస్తున్నట్టు/నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది…!/అని అంటున్నారు.కుక్కను ఒక్కసారి గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో, జీవిస్తున్న వాటికి స్వేచ్ఛ ఉంటుంది.గొర్రెల కాపరి, పశువుల కాపరి వాటిని చక్కగా మేపుతాడు. గొలుసుతో కట్టి వేయబడి ఉన్న కుక్కను నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది.నీ స్వేచ్ఛ ఏమిటో నీకు తెలుస్తుంది అనే నిజాన్ని కవయిత్రి సుజాత చక్కగా తెలియజేశారు.
“మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా/ మనం తప్ప వాటికి గతి లేదా/ ఆలోచించండి…!?/ అని అంటున్నారు.మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా ఆది మానవుడి చరిత్ర చదివితే తెలుస్తుంది.మన రక్షణ కోసమే కుక్కను మచ్చిక చేసుకున్నాం.కుక్కకు మనం తప్ప వాటికి గతి లేదా? ఆలోచించండి అని కవయిత్రి సుజాత మనలో ఆలోచన తరంగాలను రేకెత్తిస్తున్నారు.మనకే కుక్క అవసరం ఉంది.మనమే కుక్కను పెంచుకుంటున్నాం.కుక్క లేకుంటే మనకే గతి లేదు అని తెలియజేయడానికి మనలను కవయిత్రి సుజాత వాటి లోకంలోకి వెళ్లి ఆలోచించమని తెలియజేస్తున్నారు.భావం చక్కగా ఉంది.
“విడ్డూరమంటే ఇదే/సాటి మనిషిని చీదరించుకుని/ వీటిని ఆదరించడం వెనుక అంతర్యం/ఎవరికి తెలియనిది../ ముమ్మాటికిది/ముదిరిన స్వార్థ చింతన…!/అని అంటున్నారు.విడ్డూరం అంటే అర్థం మూర్ఖం.మనిషిని మనిషిగా చూడలేని వాళ్ళు,సాటి మనిషిని ఆదరించని వాళ్ళు,మనుషులేనా అని ప్రశ్నిస్తున్నారు.కుక్కల్ని ఆదరించడం వెనుక ఆంతర్యం తెలియనిది కాదు.ముదిరిన స్వార్థ చింతన అని చక్కగా తెలియజేస్తున్నారు.కుక్కల్ని ఆదరించినట్లే సాటి మనుషులను కూడా ఆదరించాలి.కుక్కల్ని ప్రేమించినట్లే సాటి మనుషుల్ని కూడా ప్రేమించాలి అని సందేశాత్మకంగా మచ్చిక కవిత ద్వారా నాంపల్లి సుజాత తెలియజేశారు.కవయిత్రి సుజాతను అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు
విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
ప్రతినిత్యం రహదారులు రక్తంతో ఓలలాడుతున్నాయిఅనేక దుర్ఘటనలలో 4.80మంది ప్రాణాలు కోల్పోయారు 4.62లక్షల మంది గాయాల పాలైనారు.రహదారి భద్రతపై ప్రభుత్వాలు అంతబాధ్యతారాహిత్యంగానే ఉన్నాయి. 4.62లక్షల మందిని గాయాల పాలుఅయ్యారు. 2022 తో పోలిస్తే మృతులు 2.6 క్షతగాత్రులు 4.4 %పెరుగుదల జరిగింది.మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత నడివయస్కులే రోడ్లపై రక్త దాహానికి ఎక్కువగా గురవుతున్నారు.దానివలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి.అతివేగానికి తోడు రోడ్ల నిర్మాణంలో లోపాలు లైసెన్సులజారీలో అక్రమాలు వాహన చోదకులబాధ్యతారాహిత్యం భద్రతాప్రమాణాల అమలులో నిర్లక్ష్యం తదితరాలతో రహదారులపై నిత్యం నెత్తుటేల్లుపారుతున్నాయి.
ఈ మధ్యకాలంలో అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలుఏయిర్ బెలూన్ వంటిసౌకర్యాలుఅందుబాటులోకి వచ్చాయి.అయినా ప్రమాదాల్లో మృత్యువు పాలు అవుతున్నారు.మనదేశంలో జాతీయ రహదారులు2% అయినామరణాల్లో అధిక వాటా వాటిదే.ఇతర దేశాల్లో సైకిళ్ళుమోటార్ వాహనాలు పాదాచారులకువేరు వేరు మార్గాలున్నాయి.రోడ్ల నిర్మాణంలో మేలిమిప్రమాణాలుపాటించడం ట్రాఫిక్ నిబంధనలుఅక్కడ అమలు చేయడం ఒక కారణం. మన రవాణ చూసినట్టు అయితే పుట్ పాత్ లపైనాద్విచక్ర వాహనాలు నడపడం ట్రాఫిక్ పోలీసులు చలానాల విషయంపైశ్రద్ధ వహించడం బ్లాక్ స్పాట్ల సరి చేతలు. డ్రైవర్లు పని వత్తిడితోమద్యం మత్తులో బండితోలడంతో రక్తం చిందినరహదారులు అవుతున్నాయి.

ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే బాధితుల ఊపిరి నిలపవచ్చు. 108 పోను చేసి అంబులెన్సులు వచ్చేసరికిఆలస్యమై ఎందరో నిస్సహాయంగా ప్రాణాలు వదులుతున్నారు.రోడ్డు ప్రమాద బాధితుల అపన్న హస్తంఅందించడంపైప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలి.ట్రాఫిక్ ఉల్లంఘనపైతగు చర్యలు తీసుకోని బ్లాక్ స్పాట్లను తక్షణం సరిదిద్దాలి.డ్రైవింగ్ పాఠశాలలువిరివిగా ఏర్పాటు చేయాలి.
మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్నిఢీ కొట్టి కారుపై పడిన మృతదేహంతో 18 కీ.మీ.ప్రయాణించిన వైనంచక్కగా చదువుకొని వృద్ధిలోకి రావలసినచిన్నపిల్లలు సైతం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం వల్ల వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు బలిగొంటున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడుతున్నారు.జాతీయ నేరగణాంకసంస్థలెక్కల ప్రకారం 2022 లో మద్యం డ్రగ్స్ మత్తులో వాహనాలు నడిపిన వారి కారణంగా దాదాపు మూడువేల ప్రాణ దీపాలు ఆరిపోయాయి ఆరు వేల మంది క్షతగాత్రులయ్యారు.హైదరాబాద్ లోని డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో లక్షల మందికి పైగా కేసులునమోదయ్యాయి. వారిని 5 వేల మందికి జైలుకు పంపారు. ఆ దండనకు ఏ మాత్రం వెరవనిచాలా మందిమళ్లీ మళ్లీ తప్పులుచేస్తున్నారు.ఢిల్లీలో ఒక స్వచ్ఛంద సంస్థ ముప్ఫై వేల మందివాహనదారులతో ఒక సర్వే చేస్తే తాగి బండ్లు నడిపినట్లు 81%ఒప్పుకున్నారు. బయటకు వెల్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు.జాతీయ రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో లిక్కర్ విక్రయాలను నిషేదించాలన్నసుప్రీం కోర్ట్ రోడ్లపైనరమేధం ఆగాలంటే తాగి బండి నడిపే ప్రతి ఒక్కరికి సరి అయిన శిక్షలు విధించాలి. మధ్యం మత్తులో అనేక మంది అమానుష నేరాలకు పాల్పడుతున్నారు. ఆరోగ్యాలను గుల్ల చేయడం సామాజిక అశాంతికి కారణమవుతున్న మద్యం తాగి వాహనం నడపడమే కారణమవుతుంది.
రహదారిపై మరణమృదంగంజాతి గుండెల విసేలా అనునిత్యం మార్మోగుతుంది.దేశవ్యాప్తంగా ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు 19 మంది మృత్యువాత పడుతున్నారు. క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదలతో తీవ్రతకళ్ళకు కట్టినట్టుకనబడుతుంది. మృతుల్లో 18-45 ఏళ్ళ మధ్య వారే 69%. వరకు వున్నారు.
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగమైన రహదారిభద్రతపై దృష్టి పెట్టి 2030 నాటికల్లారోడ్డు ప్రమాదాల్నిమృతుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంకల్పించింది. 2030నాటికి రోడ్ల నిర్మాణం వేగ నియంత్రణ కచ్చితంగా నిబంధనలు అమలుకుప్రాధాన్యం వేగ నియంత్రణణుతగ్గించే ప్రయత్నంలో చైనాఅద్భుత ఫలితాలు సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకతగ్గితే అంతకుమించి భారతదేశంలో పెరిగి నిశ్చేష్ట పరుస్తోంది.వాహన వేగాన్ని 51%తగ్గించగలిగిన ప్రమాద మరణాలు 30% దాక నియంత్రించగల వీలుందని తెలిసినా ఎడెనమిదిసెకండ్లలోనేవందల కిలోమీటర్ల వేగంఅందుకనే శకటాలు రోడ్డు ఎక్కుతున్నాయి. ఎయిర్ బ్యాగ్ ల్ని తప్పక వాడాలి. అమెరికాలో 98% జర్మనీ 89% చైనా 65%భారతదేశంలో 12 నుండి 13 మాత్రం వాడుతున్నారు. రహా దారి భద్రంగాఉండాలంటే వచ్చే పది సంవత్సరాలలో 10,900కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని దాని వలన స్థూల దేశీయుత్పత్తి 3.7 %ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందని ప్రపంచ బ్యాంక్ సూచిస్తుంది. రహాదారిపై మేట వేసిన నెత్తుటి సంక్షోభాన్నిరూపుమాపినపుడేసంక్షేమ రాజ్యా ప్రాణ ప్రతిష్టల భావన కలుగుతుంది.
2016లో దేశవ్యాప్తంగా రహదారులు రక్తదాహానికి 16 వేలమంది పాదాచారులు 2022లో 32 వేలకు పైగా బలి అయ్యారు. 90% పాదాచారులు గాయాలపాలు అయ్యారు అత్యధికులు పేద మధ్యతరగతి ప్రజలే ఆర్థిక ఇక్కట్లలోకి నెట్టేస్తున్నాయి 9వేల కి.మీ పైగా రహాదారులు విస్తరించి వుంటే 10% బాటలపైనే పుట్ పాత్ లు వున్నాయి. పుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు స్కై వాక్ లు ఏర్పాటు చేయాలి భద్రత అవగాహన చేయాలి రోడ్ల నాణ్యతనుమెరుగుపరచాలి
ప్రముఖ తెలుగు కవి ,రచయిత, సంగీతజ్ఞుడు, ఆంధ్ర ప్రదేశ్ ‘రాష్ట్ర గీత’ కర్త ఐన శ్రీ శంకరం బాడి సుందరాచారి గారు తిరుపతిలో ఆగస్టు 10న,1914లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కమలమ్మ, రాజగోపాలా చారి గార్లు.
వీరి సహధర్మచారిణి శ్రీమతి వేదమ్మాళ్ గారు.
తమిళులైనా తెలుగు భాషపై మక్కువతో ఎన్నో రచనలు చేశారు. థియోసాఫికల్ సొసైటీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ,చిన్నచితకా ఉద్యోగాలు చేసిన వీరు ఉద్యోగార్థమై మద్రాస్ ‘ఆంధ్ర పత్రిక’ ఆఫీసుకు వెళ్ళినప్పుడు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు ‘మీకు తెలుగు వచ్చా’? అని అడిగినప్పుడు ‘మీకు తెలుగు రాదా’ అని ఎదురు ప్రశ్న వేయడంతో పంతులుగారు అవాక్కయ్యారట .ఈ పత్రికలో ఉన్నప్పుడు ఒక ప్రముఖునిపై పద్యం రాయమన్నపుడు తాను వ్యక్తులపై రాయలేనని ఉద్యోగం వదులుకున్న ఆత్మాభిమాని.
ప్రేమ వివాహం చేసుకున్న వీరి శ్రీమతి వేదమ్మాళ్ గారు
మనోవ్యాధితో గతించడం, ఐదేండ్ల కూతురు కూడా మరణించడం వారి జీవితంలో బాధించే అంశాలు. పద్య కవిత్వం అంటే ఎంతో ఇష్టం వీరికి ,అందులోను ఛందోబద్ధమైన తేటగీతి పద్యాలు మరీఇష్టమంటారు.
ఒక సందర్భంలో, నా పేరు కూడా తేటగీతిలో ఇమిడిపోయిందంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ కూడా తేటగీతిలోనే రాసారాయన.
మహాత్మా గాంధీ హత్యోదంతం పై కలతచెంది’ బలిదానం’ కావ్యం రాశారు. ‘సుందర రామాయణం’ ‘సుందర భారతం’ పేరుతో రెండు కావ్యాల్ని, తిరుపతి వేంటేశ్వర స్వామి మకుటంతో ‘ శ్రీనివాస శతకాన్ని’ , ‘బుద్దగీతి’ పేరుతో బుద్ధుని చరిత్రను, ఠాగూర్ ‘గీతాంజలి’ లోని మూలభావాన్ని తీసుకొని చేసిన స్వతంత్రానువాదం ఎన్నో ప్రశంసలు పొందింది. భావగీతాలు, జానపద గీతాలు, సినిమా పాటలు రాశారు. 1942లో ‘దీనబంధు’ సినిమా కోసం రాసిన పాట ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ కారణాంతరాల వల్ల సినిమాలో చేర్చలేదట.
ఈ పాట శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన తర్వాత అత్యంత ప్రజాదరణ పొందింది అంటారు. ‘బుద్ధ చరిత్ర’ లోని కొన్ని పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి నెహ్రూ గారి మన్ననలు పొందారట .
ఈ కవి శ్రేష్ఠునిపై కొందరు ప్రముఖ కవి దిగ్గజాల అభిప్రాయాలు :
శ్రీపాద కృష్ణమూర్తి గారు: మృదువైన పదాల శైలి, కల్పనాచాతుర్యంతో కవిత్వాన్ని అత్యంత ఆదరణీయంగా మలిచారంటారు.
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు :
సంస్కృత పదాలను వీడి , సరళమైన తెలుగులో పలుకుబడులు, కవితాత్మలకు సౌకుమార్యం కలగలిసి వీరి కవిత్వం
ఆదరణ పొందింది అంటారు.
గడియారం వేంకట శాస్త్రి గారు : ఎత్తుగడలు ,అలంకార, చమత్కారాల మేళవింపులతో సరళ భాషలో ,సహజ
భావ శృతులలో సాగే కవితాధార అంటారు .
రాయప్రోలు సుబ్బారావు గారు : వీరిశైలి తేటతెలుగులో సాగుతూ సుదూరంగా ధ్వనిస్తుంటుంది అంటారు .
రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు : తెలుగుదనపు తీపి రుచుల ఊట వీరి తేటగీతి కవిత్వం అంటూ శ్లాఘిస్తూనే, ఒకానొక సందర్భంలో భయంకర రూపంలో ఉండే ‘తాటకి’ మీ తేటగీతిలో ఇముడుతుందా అని ప్రశ్నిస్తే ,
నల్లకొండల నుగ్గుగా నలగ కొట్టి నడుగులు పిడుగులగుచు… అరుదెంచె అంటూ తాటకిని తేటతెలుగలో వర్ణించినపుడు శర్మగారు అచ్చెరువొందారట.
ఇలా చెప్తూపోతే వారి సాహితీ స్రవంతి గలగలలై పారుతూ సాహితీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న సందర్భాలు కోకొల్లలు.
1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది .చారిగారిని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు’ ప్రసన్న కవి’ బిరుదుతో గౌరవించారు.
ఆయనకు జనబాహుళ్యంలో ‘భావకవి ‘ ‘సుకవి’ ‘ అహంభావకవి’ అని కూడా పేర్లు.
అచ్చ తెలుగులో , తెలుగువారి జీవన విధానాల్లోని సమస్త ఘట్టాలను,సాంప్రదాయాలను
భావసౌందర్య స్ఫోరకంగా, అతి రసవత్తరంగా, మాటలు ,పాటల రూపంలో వివరించి అందరినీ ఆకట్టుకోవడంలో అత్యంత ఘనులు .
నిరాడంబరత ,అసమానతలు ఎరుగని నిక్కచ్చితనం, ఆధ్యాత్మిక చింతన కలిగి ,అనన్య ప్రతిభాపాటవాలుగల ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పేరు కోసం ఎప్పుడూ పాకులాడలేదట .
ఎంత మేధావులైనా మనసు ముందు మోకరిల్లే వారేనని, కష్టాలు కడగండ్లకు అతీతులు కారనడానికి వీరే సాక్ష్యం . చరమాంకంలో ఐనవారు లేక ఒంటరితనంతో నిస్తేజంగా మారిన ఈ సాహితీదిగ్గజానికి ‘ప్రపంచ సాహితీపొత్తం’లో సరైన పుటలేదనే భావన ఎంతోమందిలోఉంది.
సాహితీ సేవలో అలసిసోలిన ఈ కవికోకిల ఏప్రిల్ 8,1977న, తిరుపతిలో ఇష్టదైమైన వెంకన్న పాదాల చెంత శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగు తల్లి మెడలో మల్లెపూదండను అతిఅందంగా కూర్చి అలంకరించిన ఘనుడిగా తెలుగుచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ అసామాన్య కవిశ్రేష్ఠుడికి అక్షర నిరాజనాలతో…
(శంకరంబాడి సుందరాచారి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ…)
సునీత గంగవరపు బ్రతుకు పుస్తకం కవిత
ప్రముఖ కవయిత్రి,సునీత గంగవరపు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.కవితలు,కథలు,రాస్తున్నారు.వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులతో కూడా అప్పుడప్పుడు కథలు, కవితలు రాయిస్తూ సాహిత్య సృజన పట్ల మెళుకువలు నేర్పిస్తున్నారు.సునీత గంగవరపు కలం నుండి జాలువారిన “బ్రతుకు పుస్తకం’ కవితపై విశ్లేషణా వ్యాసం.ఈ కవితను ఆసక్తితో చదివాను. నాకు చాలా నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.బ్రతుకు పుస్తకం ఏదైనా పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం.పుస్తకాలకి రెక్కలు ఉండవు.కాని వాటిని చదివితే మనకు ఎన్నెన్నో రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది.ఆ రెక్కలు జ్ఞానాన్ని,ఆలోచనా శక్తిని,సృజనాత్మకతా నైపుణ్యాన్ని,లోక పరిశీలనా దృష్టిని కలిగిస్తాయి. ఏది మంచి పుస్తకం.ఏ పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం.
“బ్రతుకు పుస్తక పుటల నుండి/ఎన్ని అనుభూతుల రంగులో…/ఎన్నెన్ని అనుభవాల పరంపరలో…!/ అంటున్నారు.బ్రతుకు అంటే జీవితపు కొనసాగింపు. బ్రతుకు అంటే జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.పుట అనగా పుస్తకంలోని కాగితమునకు ఒకవైపు భాగం.పుట అంటే కాగితం, పేజీ,అర్థాలు.అనుభూతి అంటే స్పర్శ చేత తెలుసుకొను,తాకి తెలుసుకొను,అనుభవం ద్వారా తెలుసుకొనడం..
“ఎన్ని అనుభూతుల రంగులో…/అంటున్నారు.
బ్రతుకు పుస్తకం పుటల్లో అనుభూతులు,బాధ, దుఃఖం,ఆలోచన,ఆవేదన,ప్రేమ,అభిమానం, అనుమానం,స్నేహం లాంటి ఎన్నో రంగులు పులుముకుంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు.
“ఎన్నెన్ని అనుభవాల పరంపరలో…/అంటున్నారు.
బ్రతుకు పుస్తకపు పుటల్లో అనుభవాల పరంపర అంటే అనుభవాల అంతరాయం లేని,కొనసాగింపు అని అర్థమవుతుంది.
“కలలతోనే… కన్నీళ్ళతోనే/నిండిన పేజీలు/ అంటున్నారు.బ్రతుకు పుస్తకపు పుటల్లో కలలతో నిండిన పేజీలు ఉంటాయి.కలలను సాకారం చేసుకునేది ఎందరు అంటే ఇదమిద్దంగా చెప్పలేము. కలలు కల్లలు అయిన వాళ్లు కూడా ఉంటారు. బ్రతుకు పుస్తకం పుటల్లో కన్నీళ్ళతో నిండిన పేజీలు ఉంటాయి.కన్నీళ్లు కావాలని ఎవరు కోరుకోరు. తనకు తాను తెలియక ఆగాధంలో కూరుకు పోవడంతో కన్నీళ్లు వస్తాయి.తెలిసి అగాధంలో పడిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. స్వయంకృతాపరాధాలతో చేసిన కొన్ని పనులు, మనిషిని కన్నీళ్ళకు గురిచేస్తాయి. .

“అక్షరాల కందని దుఃఖ సంకేతాలు/అంటున్నారు.
కొన్ని ఉద్విగ్న క్షణాల్లో తెలిసి తెలియక మోసపోయిన అభాగ్యులు కూడా కొందరు ఉంటారు.జీవితంలో అక్షరాల కందని దుఃఖ సంకేతాలు ఉంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు. “పేజీలన్నీ ఒకేలా ఉండవు/అంటున్నారు. నిజమే…బ్రతుకు పుస్తకం చాలా పెద్దది.బ్రతుకు పుస్తకం పుటల్లో ఎన్నో పేజీలు ఉంటాయి.పుస్తకం లోని పేజీలన్నీ ఒకేలా ఉండవు,వేరు వేరుగా ఉంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు.
“వేటికవి సొంత రంగుల్ని పులుముకుంటాయి/ అంటున్నారు.జీవితం భిన్న స్వభావాల పార్శ్వం. బతుకు పుస్తకపు పుటలు సొంతరంగులని అద్దుకుంటాయి అనడంలో వాస్తవం దాగి ఉంది.
“నిగూఢతను ఆర్ద్రంగా పొదువుకుంటాయి/ అంటున్నారు.నిగూఢత అంటే రహస్యం.ఆర్ద్రం అంటే మెత్తదనం.బ్రతుకు పుస్తకం పుటల్లో రహస్యాలు కూడా మెత్తదనంతో దాచుకుంటాయి అని తెలియజేస్తున్నారు.
“కొన్ని పేజీల్లో మెరుపులు ఉంటాయి/అంటున్నారు.
నిజంగానే బ్రతుకు పుస్తకం పేజీల్లో మెరుపులు ఉండి ప్రకాశిస్తుంటాయి.వర్షించే ముందు ఉరుములు, మెరుపులు,గాలి దుమ్ము, దుమారం,వీస్తుంటాయి. మెరుపు ఒక వాతావరణంలోని విద్యుత్ ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం.విద్యుత్తు ఉన్నదని నిరూపించేది.ఇవి ఎక్కువ ఉరుములతో కూడిన వర్షంలో పడే సమయంలో కనిపిస్తాయి.మెరుపులు అత్యంత వేగంగా పయనిస్తాయి.మెరుపు రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు వచ్చే ప్రకాశవంతమైన మెరుపు.
“అవి దిగులు మేఘాలను కరిగించి/పారవశ్యాన్ని వశీకరించుకుంటాయి/అంటున్నారు.జీవితంలో మెరుపులు ఉండాలి.మెరుపులు ఉంటేనే అవి దిగులు మేఘాలను కరిగించి పారవశ్యాన్ని వశీకరించుకుంటాయి.పారవశ్యము అంటే ఆత్మ ద్వారా ఒకరి శరీరాన్ని స్వాధీనం చేసుకోవడం, దైవత్వం ద్వారా మానవుని స్వాధీనం చేసుకోవడం. మట్టిని గురించి మనం మాట్లాడుతాం.మట్టిని చూడగానే ఏదో పులకరింత,మరేదో పారవశ్యం అంటాం.జీవితంలో సుఖదుఃఖాలు,శీతోష్ణాలు ఉంటాయి.బ్రతుకు పుస్తకం పుటల్లో వాటిని సమం చేసుకుంటేనే దిగులు మేఘాలను కరిగించి పారవశ్యాన్ని చేరుకుంటాయి.
“అక్కడక్కడ సునామీలు ఉంటాయి/రాయక తప్పని చేదు సారాంశాలుంటాయి/అంటున్నారు.
బ్రతుకు పుస్తకం పుటల్లో అక్కడక్కడ సునామీలు తుఫానులు కూడా ఉంటాయి.సునామీ తుఫాను 2004 డిసెంబర్ 26 న హిందూ మహాసముద్రం, సుమత్ర, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామి 14 దేశాల్లో సుమారు
2,30,000 మందిని పొట్టన పెట్టుకుంది.అక్కడక్కడ
ఎదిరింప శక్యం కాని కష్టాలు,కడగండ్లు,సునామీలు
ఉంటాయి.రాయకుండా ఉండలేని,ఆత్మీయులకైన చెప్పుకోలేని,చేదైన సంఘటనల వివరాలుంటాయి. జీవితమన్నప్పుడు ఎలాంటి వారికైనా ఇవి అనుభవానికి రాక తప్పదు.
“ఒక్కో చోట/సూర్యకిరణాల ప్రసరణలుంటాయి/
అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో ఒక్కోచోట సూర్యకిరణాల ప్రసరణలు ఉండి జీవితంలో కాంతిని,క్రాంతిని తెస్తాయి అని కవయిత్రి చక్కగా వివరించారు.
“ఆకాశమంత ఆక్రమించిన/నక్షత్రాల సన్నని గుసగుసలు కొన్ని/పుస్తకాన్ని నిండారా పరిమళభరితం చేస్తుంటాయి/అంటున్నారు.
అనంతమైన ఆకాశం నక్షత్రాలతో కూడి ఉంటుంది. బ్రతుకు పుస్తకం పుటల్లో కూడా ఆకాశమంత ఆక్రమించిన నక్షత్రాల గుసగుసలు కొన్ని పుస్తకాన్ని పరిమళభరితం చేస్తుంటాయని తెలియజేస్తున్నారు.
“ఇంకొన్ని పేజీలు ఏమిటో/ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి/అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో కొన్ని పేజీలు రాయకుండా ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి.నిజంగానే…. బ్రతుకులో శూన్యత, స్తబ్దత ఆవరించినప్పుడు ఎవరికి చెప్పుకోలేని ఖాళీతనం మనసును ఆక్రమించుకుంటుంది.
“ఏమి రాసినా…ఎంత రాసినా/కాగితపు గుండెలపై యిమడలేని/నిర్లిప్తతలోంచి దిగాలుగా జారి పోతుంటాయి/అంటున్నారు.
ఏమి రాశాము…, ఎంత రాశాము అన్నది ముఖ్యం కాదు.మన భావోద్వేగాలను పంచుకోవడానికి ఆప్యాయతలు పెన వేసుకోవడానికి తగిన వాతావరణం లేనపుడు జీవితం నిర్లిప్తతలోకి జారిపోతుందని కవయిత్రి సునీత చక్కగా వ్యక్తీకరించారు.
“ప్రేమ స్పర్శ లేని ప్రేమ లేఖలా/అస్పష్టతను అలుముకుని/దిక్కుతోచక దిక్కులు చూస్తుంటాయి/
అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో ప్రేమ తాలూకు స్పర్శ లాంటి అనుభూతి లేని ప్రేమ లేఖల్లో ఏం ఉంటుంది?ప్రేమలేఖల్లో అస్పష్టతతో నిండి ఉంటుంది.అస్పష్టతతో నిండి ఉన్న జీవితాలు గడిపే వారు ఎల్లప్పుడూ నిరాశ నిస్పృహలతో దిక్కుతోచక దిక్కులు చూస్తుంటారు.జీవన యానంలో అనేకమైన అనుభవాలు ఎదురవుతాయి.దుఃఖం కలిగినప్పుడు దాని ఛాయా నలుపు రంగు.సుఖసంతోషాలతో కూడిన పచ్చదనం.అన్యాయం,అత్యాచారం ఎదుర్కొన్నప్పుడు కలిగిన కోపపు ఎరుపు రంగు. అద్భుతమైన విచిత్ర దృశ్యం కనిపిస్తే విరగబడి నవ్విన తెలుపు రంగు.ఈ విధంగా బ్రతుకు పుస్తకం పేజీల నిండా అనుభవాల రంగులు దర్శనమిస్తాయని కవయిత్రి సునీత వివరించడం చక్కగా ఉంది.సునీత కలం నుండి మరిన్ని మంచి కవితా సుమాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను..
ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వలసలు పోయి జీవించడం వాటివల్ల ఆయా ప్రదేశాల స్థానిక ప్రజలు, విద్య- ఉద్యోగావకాశాలు కోల్పోయి, భాష -ఆచార వ్యవహారాల అస్తిత్వం కోల్పోయి, అవమానింపబడి ఎంతో హీనమైన జీవితం గడుపుతూ… మళ్ళీ ఆ అవకాశాలు తమ స్వంతం చేసుకుని మెరుగైన జీవితం జీవించాలన్న కోరిక ఉండడం సహజమే కదా!
ఆ కోవలోనే మహిళలు వారి ప్రతిభలను ఎక్కడా ప్రదర్శించుకునే అవకాశాలే లేక వివక్షకు గురైన సంఘటనలెన్నెన్నో… అవకాశాలు లేవు కానీ ప్రతిభకు లోటులేదని చెప్పడానికి ఆ కాలంలోనే పత్రికలలో మహిళలకు ప్రత్యేక కాలమ్స్ నడిపారు.
ఇటీవల ఒక మహిళ తమ సంతానం అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్న వారి ఆశలు అక్కడి ప్రభుత్వ పాలనా విధానాలు అడియాసలుచేస్తే.. తమ పిల్లలు తిరిగి మన దేశం
రావడం చాలా బాధాకరమని చెప్పి బాధపడింది.
ఈ సంఘటన విన్నాక మా నాన్నగారు చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. “ఎప్పుడైనా అవసరం ఒక మార్గాన్ని ఎన్నుకుంటుందని అది అణచివేతలో తమ ఉనికిని చాటుకునేందుకు చేసే చర్య రచనా రూపంలో కానీ, తిరుగుబాటు రూపంలోనైనా కానీ వారిలోని అసహనం వెళ్లగక్కవచ్చు, సాధించవచ్చు” అని, ఒక పత్రిక స్థాపనకు దారితీసిన వైనం చెప్పారు.
1901 లో మద్రాసులో కమలా సత్యనాథన్ అనే ఒక మహిళ *ఇండియన్ లేడీస్ మ్యాగ్జిన్* అనే ఆంగ్ల పత్రికను స్థాపించి సంపాదకీయం చేసిన మొట్టమొదటి భారతీయ మహిళా పాత్రికేయురాలు అనీ, ఈ పత్రికలో ఆమె చర్చించని విషయం అంటూ లేదనీ, మా సోదరి దయామతీ దేవి కూడా చెప్పేవారు.
ఉత్తేజపూరితమైన సంపాదకీయాలు రాస్తూ, స్త్రీలకు ప్రేరణ కలిగించేదనీ, అంతవరకూ వారు ఇల్లే సర్వస్వం అనుకున్నవారు ఓహో! ఇలా కూడా తమ ప్రతిభను చాటుకోవచ్చా? అనే
ఆలోచన కలిగించే విధంగా ఆయా సంపాదకీయాలుండేవట. అంటే మహిళల అస్తిత్వం కోసం, సంస్కృతి సంప్రదాయాలను రక్షించడం కోసం మహిళలకు ఆ పత్రికలో పెద్దపీటనే వేసింది కమలా సత్యనాథన్.
ఎందుకంటే? తరతరాలుగా సంస్కృతీ వారధులు మహిళలే కనుక ముఖ్యంగా ఆనాడు వలసరాజ్య నిబంధనల వల్ల ఎక్కువ నష్టపోయింది కూడా స్త్రీలే కావడం! పితృ స్వామ్య వ్యవస్థలో అణగారి పోతున్న అతివల పక్షాన వారి హక్కులు- బాధ్యతలు తెలుపుతూ సమాజంలో ఎదగాలన్న ఆశను కలిగించింది ఆ పత్రిక.
అందుకోసం స్త్రీలకు విద్య యొక్క ఆవశ్యకతను తెలుపుతూ, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ, తోటల పెంపకం, కుటీర పరిశ్రమలు, కుట్లు- అల్లికలు, ఇలా స్త్రీ సంబంధమైన అన్ని అంశాల్లో నిష్ణాతులను పరిచయం చేస్తూ, ప్రేరణా మూర్తులను సామాన్య గృహిణులకు పరిచయం చేస్తూ జ్ఞాన ప్రసరణలు చేసిన మాన్వి కమలా
సత్యనాథన్.
ఆ కాలంలో ఆడవారు మంచి భావకులై రచనలు చేసే సత్తా ఉన్నా… ఏ పత్రికలోనైనా ప్రచురించుకోవాలంటే… ఎవరేమనుకుంటారో?? అని సంఘంలో ఒక బెరుకు- బిడియంతో ఉన్న కాలంలో మహిళలతో నాటకాలు, కథలు, పనులలో శ్రమను మరచిపోయే పాటలను, సీరియళ్లు రాయించి, ప్రచురించి సంపాదకత్వం వహించిన కమలా సత్యనాథన్ అభినందనీయురాలు.
ఆ కాలంలోనే కాదు! ఏ కాలంలో నైనా కుటుంబాలు యావత్తు ఆడవారి సేవల మీద ఆధారపడి నడిచేవే… కనుక సక్రమంగా పనులు చేయాలంటే ఆడవారికి ఆరోగ్యం ముఖ్యమని భావించి, ఆరోగ్య సంబంధ రచనలు అచ్చు వేసేవారు.
పత్రికలో ఒకటి రెండు కాలమ్స్ కేవలం మానవీయ విలువల ప్రచురణకే కేటాయించేవారు. ఆ కాలంలో సాధికారత సాధించిన మహిళామణులు రమాబాయి,
సొరాబ్జీ, జోసెఫ్ లాంటి గొప్ప మహిళలు చేపట్టిన పనులను- అందులో వారు సాధించిన విజయాలను వరుసగా ఆ పత్రికలో ప్రచురించేవారు.
అయితే పత్రిక ఆర్థిక ఇబ్బందులతో పాటు ఎన్నో కారణాలు వల్ల కొంతకాలం పత్రికను ఆపాల్సి వచ్చింది. ఇంకొందరు ఏమంటారంటే? అప్పుడప్పుడే జాతీయ ఉద్యమాలు ఊపందుకుంటున్న ఆ తరుణంలో ఆ ఉద్యమాలను ప్రోత్సహిస్తూ పత్రికలో ఏ రచనలు రాలేదనీ, అందుకే పాఠకులు ఆదరణ చూపలేదని అంటారు. కానీ దేనికైనా ఒక పరిధి ఉంటుంది కదా? ఆ కాలంలో రాజకీయాల జోలికి వెళ్లేంత సాహసం స్త్రీలకు లేదేమో? అని నేను అనుకుంటాను.
అంతే కాదు రాజకీయాలలో ప్రవేశించమని మహిళలకు పిలుపు ఇవ్వలేదని ఒక అపవాదు కూడా ఉన్నది. ఆమె మహిళలను కుటుంబ పరిధి దాటిపోనివ్వని సనాతన వాదురాలనే ఒక అపప్రథను ఎదుర్కొంది. అందుకు ఆమె
సంపాదకీయాలు అలానే ఉండేవని మా సోదరి చెప్పేది.
ఏదేమైనా ఆర్థిక ఒడి దొడుకులతో పాటు ఇతర కారణాలతో కష్టమైనప్పుడు ఆమె వ్యాపార ప్రకటనలు ఆయా పారిశ్రామిక వేత్తల దగ్గర సేకరించి పత్రికలో ప్రచురించి ఆ విధంగా ఆర్థికంగా ఆసరా తీసుకున్నారు.
1901 లో స్థాపించిన పత్రిక 1918 వరకు మాసపత్రికగాను, 1927 నుండి 1938 వరకు ద్వైమాసిక పత్రిక గాను నడిపారు. తర్వాత ఆమె కూతురు పద్మినీ సత్యనాథన్ పత్రిక పగ్గాలు చేతబట్టి, సహసంపాదకురాలిగా సేన్ గుప్తాను నియమించి; తాను ప్రచురణ నిర్వహణ చేస్తూ పత్రిక ను నడిపింది.
ఇక్కడ పత్రిక ఎందుకు ఆగిపోయిందన్న ప్రస్తావన కాదు ముఖ్యం… వలసవాదుల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడల్లా ప్రజల పక్షాన పత్రికలు గొంతెత్తేవి అనేది ముఖ్య విషయం. అలా వెనక్కి వెనక్కి పయనిస్తే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.
గుజరాత్ లోనూ జాతీయోద్యమం ( అప్పటికా పేరు లేదు ) కానీ వలసవాదుల అణచివేతను తట్టుకోలేక స్త్రీలను చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో *స్త్రీ బోధ్* మహిళా పత్రిక 1857లో స్థాపించటం జరిగింది.
అలాగే కేరళలోనూ మలయాళ పత్రిక
*కేరళ సుగుణ బోధిని* అని తిరువనంతపురం నుండి మరో పత్రిక వెలువడింది.
1992 లో *తూర్పు పనోరమా* అనే పత్రిక మహిళాసారధ్యంలో స్థాపించబడింది. ఇది మొట్టమొదటి ఈశాన్య భారతదేశం నుండి వెలువడిన ఆంగ్ల పత్రిక. ఆ కాలంలో ఆ ప్రాంతంలో విధి వంచితులైన , క్రూర వైధవ్య దుఃఖ పీడితులైన, వారిని తొక్కివేసే సామాజిక నిర్బంధాలు, ఇక్కడ పేదనా, బడుగు వర్గాలా? అనే తేడాలేదు… వివిధ వర్గాలలోని స్త్రీలు జీవితపు సుడిగుండంలో చిక్కుకుని, అర్ధాంతరంగా అసువులు బాసిన అతివల యధార్థ గాథలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వారి ఆక్రోశమూ, తీరని కోరికల నేపథ్యమూ, ఆస్తి
హక్కులు లేక దీనావస్థలో పడిన వైనమూ, ఇలా ఎన్నెన్నో సమస్యలను చర్చించిందా పత్రిక.
ఎవరు ఏ పత్రిక స్థాపించినా స్త్రీలను సంతోషంగా ఉంచడమని, సమాన హక్కులతో జీవించమని చెప్పడమే…. ధ్యేయం… అలాగే అదే సమయంలో వారిని ఉత్తమ గృహిణులుగా ఉండాలనే సమాజ దృష్టి… ఎవరైనా కాస్త వారి హక్కుల కోసం పోరాడితే వారిని తెగించిన ఆడవారిగానే ఆ కాలంలో పరిగణించారు. అది దాదాపు 1930 వరకు నడిచింది. స్త్రీలకు బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నదని తెలియకుండా పురుష సంపాదకత్వంలో వచ్చిన పత్రికలు కొంచెం జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చు. అందుకే ఈ మహిళా పత్రికల స్థాపన జరిగిందేమో?
తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు మహిళల పక్షాన నిలిచిన పత్రికలు మహిళా సంపాదకీయం చేస్తూ విలువైన సందేశాలను ఇచ్చి, ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా… స్వతంత్రంగా మన భావాలు వెలిబుచ్చుకొనే తోవ చూపిన మహిళ పత్రిక స్థాపకులకు, మహిళా సంపాదకులకు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ…
వాసి జ్యోత్స్న రచించిన నువ్వూ – నేను కవిత
కవయిత్రి,వాసి జ్యోత్స్న కలం నుండి జాలువారిన నువ్వూ – నేను కవిత పై విశ్లేషణా వ్యాసం.ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు నువ్వు – నేను అనే మాటలు సంభాషణలో తరచుగా వాడుతారు. వ్యక్తిగతంగా తన గురించి చెప్పడానికి నేను అనే పదాన్ని ఉపయోగిస్తారు.నువ్వు మరియు నేను,ఇది సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని సూచిస్తుంది.అత్యంత ఆత్మీయులు కలిసినప్పుడు ఎలా పలకరిస్తారో చూడండి.నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను?నువ్వు చెప్పు నేను వినాలని ఉంది.ఇది ఒకరికొకరు పలకరించుకునే విధానాన్ని తెలుపుతుంది.కవయిత్రి జ్యోత్స్న రాసిన నువ్వూ – నేను కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతుల లోకంలోకి వెళ్లి విహరించండి.
“నీ దగ్గరున్నంతవరకే/ఏ విషయమైనా రహస్యం/అంటున్నారు.గుప్పిట దాచి ఉంచినది రహస్యం.ఎవరికి తెలియకుండా గుప్తంగా ఉంచిన విషయం రహస్యం.ఒకరి విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా ఉండటం రహస్యం.ఎవరికీ తెలియని విషయం రహస్యం.నువ్వు – నేను ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గల సంబంధాన్ని సూచిస్తుంది.ఒకరు చెప్పిన విషయం మరొకరు గోప్యంగా ఉంచితేనే అది రహస్యంగా ఉంటుంది.
“నీ పెదవి దాటి మరో/చెవిన చేరిన తక్షణం/ప్రతి పదం హాస్యమే../అంటున్నారు.ఈ కవితా పంక్తులలో
ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి. ఒకరి పెదవి దాటి మరొకరి చెవికి వెళ్లిన వెంటనే రహస్యం రట్టు అవుతుంది.అసలు రహస్యం యొక్క గౌరవం,విలువ తగ్గిపోతుంది.ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాల్సిన విషయం బయటపడితే అది హాస్యాస్పదంగా మారిపోతుంది అనే భావన కవితలో వ్యక్తం అవుతున్నది.రహస్యం విషయం యొక్క గోప్యతను నొక్కి చెబుతుంది.మనం ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి.అట్టి విషయం వారు ఇంకొకరికి చెబితే ఆ రహస్యానికి విలువ ఉండదు.మన ఇద్దరి మధ్యన ఉండాల్సిన రహస్యం.దానిని ఇతరులు సాధారణ విషయంగా తీసుకుంటారు.ఈ కవిత రహస్యాన్ని ఇతరులకు తెలియకుండా కాపాడాలనే సందేశాన్ని ఇస్తుంది.
“నీ.. నా .. జీవితాలలో/ప్రతి క్షణం విలువైనది/ వలువల్లా చీల్చుకు తినే/బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/ అంటున్నారు.నీ జీవితం,నా జీవితం మరియు ఎవరి జీవితం అయినప్పటికీ ప్రతి క్షణం విలువైనది.మన జీవితాల్లో ప్రతి క్షణం అమూల్యమైనది.గడిచి పోయిన సమయం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు.కాబట్టి సమయం విలువను గుర్తించాలి. సమాజంలో లేదా వ్యక్తిగత జీవితంలో మనుషులు ఉత్తమమైన విలువలను కోల్పోతున్నారు. ఆత్మీయత, నమ్మకం,నైతికత వంటి విలువలు తగ్గిపోయాయి.పైకి కనిపించే మాయాజాలం వల్ల మనుషులు వలపుల ఆకర్షణలకులోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
“బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/మన గుండె భావోద్వేగాలకు స్పందించాలి.కానీ,ఇప్పుడు సున్నితంగా ఉండాల్సిన గుండె కఠినంగా బండరాయిలా మారిపోయింది. మనిషి తాను అనుభవించే బాధలు,గాయాలు తట్టుకోలేకపోతున్నాడు.జీవిత పోరాటాల వల్ల మనిషి మనసు కఠినంగా మారింది.ఇవ్వాళ మనిషి బ్రతుకు ఒక విధమైన భారంగా మారింది.మనిషి జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని కవిత ఎత్తి చూపుతుంది.విలువలు కోల్పోయిన సమాజంలో జీవిస్తున్నాం.మనుషులు బాహ్య ఆకర్షణల వలలో చిక్కినారు.మనుషులు నిజమైన అనుబంధాలను మర్చిపోయారు.సున్నితంగా ఉండాల్సిన మనిషి హృదయం బండరాయిలా మారిపోయింది.మనిషి లోపల తీవ్రమైన ఒత్తిడి,శూన్యతను ప్రతిబింబిస్తుంది.ఇందులోని భావం సమకాలీన జీవన శైలికి అద్దం పడుతుంది.మనిషి హృదయం బండబారిపోయినప్పటికీ తాను బ్రతకడానికి ప్రయత్నిస్తూ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
“నువ్వూ – నేను నవ్వుకుంటూ/నమ్మకంగా సాగిపోవాలే తప్ప/నువ్వెంతంటే నేనెంతని/నిత్యం ఘర్షణలతో ప్రాముఖ్యమైన/సమయాన్ని సామర్థ్యాన్ని/వృథా చేసుకోకూడదు/అంటున్నారు. నువ్వు నేను నవ్వుకుంటూ నమ్మకంగా సాగిపోవాలి. మన మధ్య స్నేహం,ప్రేమ,అనుబంధం కొనసాగాలి. మనం ఒకరి పట్ల ఒకరు నమ్మకంతోనే ఉండాలి. ఆత్మీయతతో మెలగాలి.ఆనందంగా ఉండాలి.మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా అవి మన బంధాన్ని ప్రభావితం చేయకూడదు.మనం ఇద్దరం నువ్వెంతంటే నువ్వెంతని నిత్యం ఘర్షణలకు తావు ఇవ్వరాదు.గర్వం వల్ల వచ్చే సమస్యలను గురించి చెబుతుంది.అహంకారం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.నువ్వు గొప్ప,నేను గొప్ప అనే భావనతో మెలగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన జీవితంలో సమయం అమూల్యమైనది.మన సామర్థ్యాన్ని,శక్తిని అనవసరమైన గొడవలకు వినియోగించ రాదు.అందు వల్ల మన విలువైన సమయం వృథా అవుతుంది.మనం ఇరువురం పరస్పరం అర్థం చేసుకుని కలిసి మెలిసి పురోగమించాలి.మనలో నెలకొన్న అనవసరమైన అహంభావాన్ని వదిలి పెట్టాలి.ఇరువురు నమ్మకంతో కలిసిమెలిసి అన్యోన్యతలతో జీవించాలని సూచిస్తుంది.మనలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే పోటీ తత్వం వద్దు.మన ఇద్దరం గర్వాన్ని విడిచి పెట్టాలి.మన ఇద్దరం గర్వంతో ఉంటే కీడు సంభవిస్తుంది.గర్వం వల్ల మేలు జరగదు.మన జీవితంలో విలువైన సమయాన్ని అప్రయోజనమైన విభేదాలతో,వివాదాలతో వృథా చేసుకోకూడదు. మనం ఒకరినొకరం అర్థం చేసుకొని కలిసి మెలిసి ఉండాలి.మనం నవ్వుతూ ఆనందంగా ముందుకు సాగాలి అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.
“వికృత చేష్టలతో/ప్రకృతి ప్రకోపించేలా/ఆకృత్యాలకు పాల్పడుతూ/అనునిత్యం నలిగిపోతూ/ఆవేదనలతో కుంగిపోతూ/మానవత్వాన్ని మింగేయొద్దు/ అంటున్నారు.వికృత చేష్టలు అంటే మనిషి చేస్తున్న అనైతిక పనులు,హింస మరియు పర్యావరణాన్ని హానికరంగా మార్చే చర్యలు.మనుషుల తప్పిదాల వల్ల ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. భూకంపాలు,వరదలు,వాతావరణ మార్పులు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మనుషులు చేస్తున్న ఆకృత్యాలకు అందరు అనునిత్యం నలిగిపోతున్నారు.మనుషులు దుష్టమైన పనులు చేసి ఇతరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.మనుషులు తప్పు దోవలో నడిచి తోటి వారిని ఆవేదనలకు గురి చేస్తున్నారు.మనిషి మనస్సు నిరాశగా మారి పోయింది.మానవులు సృష్టించిన దుష్ప్రభావాల వల్ల చివరికి మనమే బాధపడుతున్నాం.ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మానవత్వాన్ని మర్చిపోవద్దు.ప్రేమ, సహాయము,నైతికత వంటి విలువలను కోల్పోకూడదు.మనలో మానవత్వం వెల్లి విరియాలి.స్వార్థపూరితుడై మనిషి మనిషిని మింగి వేయకూడదు.సమాజంలోని అనైతికతను, ప్రకృతి వినాశనాన్ని మరియు మానవ సంబంధాల్లో పెరుగుతున్న అసహనాన్ని,అశాంతిని కవిత ఎత్తిచూపుతుంది.మనలోని అహంకారం, స్వార్థపూరిత వికృత చర్యలు చివరికి మనకే నష్టం తెచ్చిపెడతాయి.కాబట్టి మానవత్వానికి పెద్ద పీట వేసి సమాజానికి మేలు చేసే విధంగా నడుచుకోవాలి అని కవయిత్రి జ్యోత్స్న ఈ కవితలో సందేశాన్ని అందిస్తున్నారు.కవయిత్రి జ్యోత్స్న మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.