మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ధారావాహిక నవల

రుద్రమదేవి (11,12,13 ప్రకరణములు) సమాప్తం

by రంగరాజు పద్మజ February 28, 2022
written by రంగరాజు పద్మజ

పదకొండవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామచంద్ర రాయశర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[  నేడు  తప్పినది;  రేపు తప్పదు.]
శ్లో ॥ ” అస్మిన్ దినేనిష్ఫలతా భవేచ్ఛేత్
శ్వః సమ్యగేవ రచయామి నహిత్యజామి.”
— నవీన తపశ్విని.

భావం :–ఈ రోజున ప్రయత్నించిన కార్యం నిష్ఫలమయినా కానీ ,రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాను కానీ ,దాన్ని వదిలి పెట్టను..మరల మరల..సఫలం అయ్యేదాక ప్రయత్నిస్తూనే  ఉంటాను.
వ్యాఖ్య:–
రుద్రమదేవి నవలలోని ఈ కథాభాగానికి సరిగ్గా సరిపోయే అంశాన్ని ” నవీన తపశ్విని ” నుండి ప్రకరణాంశంగా తీసుకోవడం గ్రంథకర్త ప్రతినాయక లక్షణాలను చక్కగా వ్యక్తీకరిస్తూ… కథాగమనానికి ఎంతగానో తోడ్పడింది.
ఇలా పూర్వ కావ్యాలు, సుభాషితాలు.  హితోపదేశం వంటివి ప్రకరణానికి పేర్లుగా ఉపయోగించడం వల్ల పాఠకులకు ఆ యా విశేషాలు ఏ గ్రంధంలో ఉన్నాయనే ఉత్సుకతతో వెతుకుతూ ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చదువరులను తయారు చేసే నూతన ఒరవడి .
రంగరాజు పద్మజ
కథాభాగం:-
మహాదేవరాజు దేవగిరిలో తన ఉద్యానవనంలో విచిత్ర మంటపంలో  ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. క్షణక్షణానికి అతని ముఖ కవళికలు రకరకాలుగా మారుతున్ననందు వల్ల అతడు ఒక విషయం కాకుండా, చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నాడని మనకు తెలుస్తుంది. కోపం, దుఃఖం మొదలైన ఎన్నో భావాలు అతని ముఖంలో  స్పష్టంగా కనపడుతూ మాయమవుతున్నాయి.
అప్పుడు సాయంకాలమైంది. ఇంకా చీకటి ముసురకున్నా  దీపాలు వెలిగించారు. చల్లటి గాలి వీస్తున్నది. నిర్మలమైన ఆకాశంలో ఎరుపురంగు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. సంతోషం కలిగించే ఆ సమయం రాజులకు వేడుకగా తిరిగే సమయం. అయినా మహాదేవరాజు ఇంకొక మనుషి లేకుండా ఒంటరిగా ఉండడానికి జరిగిన విఫలతయే  కారణమని తెలుస్తున్నది.
ఈ ఉద్యానవనం మహాదేవరాజు ఇంటి తోట. ఎన్నో రకాలైన పూలతో  ఎప్పుడు చాలా దూరం వరకు  సువాసనలను వ్యాపింపజేస్తూ మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. మిగుల మగ్గిన పండ్లున్న  చెట్లతో ఉన్న ఆ ఇంటి తోట ఈ మధ్యన నిండుగా ఉన్న నీటితో ఒక కొలను  ఒడ్డున అందమైన పర్ణశాల  ఉన్నది. దాన్నే ‘విచిత్ర మంటపం’ అని అంటారు. ఈ విచిత్ర మంటపంలోనే మహాదేవరాజు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు.
మహాదేవరాజు ఆలోచిస్తున్న సమయంలో ఒకతను వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. పది నిమిషాల దాకా రాజు ఏమి మాట్లాడలేదు. తరువాత అతనిని కూర్చోమన్నాడు. వచ్చినతను కూర్చున్నాడు.
అప్పుడు అతనితో ఇలా మాట్లాడాడు.
” ప్రహారేశ్వరా!”  ఏం విశేషాలు?
ప్రహరేశ్వరుడు దేవగిరికి చెందిన వాడు. బ్రాహ్మణుడు కాక ఇతర వర్ణంవాడు. మహాదేవరాజు అతను కలిసి  ఓకే గురుకులంలో చదువుకున్నారు. చిన్నతనం నుండి ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉన్నది. చూడడానికి రూపంలోనూ, వయసులోనూ ఇద్దరికీ అంత తేడా ఉండదు. వాళ్లకు చిన్నతనం నుండి ఉన్న వారి అభిప్రాయాలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. ఇద్దరి మధ్య ఉన్న చనువు అలా కొనసాగటానికే మహాదేవరాజు దగ్గర ప్రహారీశ్వరుడు  ఉద్యోగం చేయలేదు. మహాదేవరాజన్న మాటలకు అతను ఇలా బదులిచ్చాడు.
“అనుకున్న పనంతా ఇంకో తీరుగా జరిగింది”. అంతా అవమానం పాలే అయింది. అనుకున్నదొకటి జరిగిందొకటి.
రాజు గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. ఏమైంది? తొందరగా వివరంగా చెప్పు! నా మనసులో మొదలే ఒక అనుమానం వచ్చింది. నీ మాట మరింత భయం కలిగుతుంది. ఆలస్యం చేస్తే మనసులోని బాధ ఎక్కువ అవుతుంది.
” ఏమీ లేదు!  మన ముగ్గురు యోధులు మరణించారు”.
చెప్పవెందుకు?  కొంపముంచారే? ఎలా జరిగింది?
ప్రహరేశ్వరుడు జరిగిందంతా రాజుకు పూసగుచ్చినట్టు చెప్పాడు.  రాజు పదిహేను నిమిషాల దాకా కొయ్యబారిపోయి, ఏమీ మాట్లాడలేదు. తరువాత దీర్ఘంగా నిట్టూర్చాడు.
బాధపడి మనం ఏం చేయగలం? చేయాల్సిన పని చాలా  పకడ్బందీగా చేశాం. కాని దైవాజ్ఞ లేక ఫలించలేదు. అని ప్రహరేశ్వరుడు అన్నాడు.
నిజమే!  చేసేది ఏమీ లేదు! పని సులువుగా అవుతుందనుకున్నాం. ఏ కారణం లేకుండానే మన పేరు బయట పడింది. అయినా అయ్యేది కాక మానదు! అని మహాదేవరాజు అన్నాడు.
ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఒక భటుడు వచ్చి ఒక కాగితం తెచ్చి మహాదేవరాజుకిచ్చి నమస్కరించాడు.
మహాదేవరాజు ఆ ఉత్తరం తీసుకుని నెమ్మదిగా చూస్తున్నాడు. అందులో ఏమి రాసి ఉన్నదో? కానీ, మహాదేవ రాజు పొగలేని నిప్పువలె మండిపడుతున్నాడు. గడ్డం దువ్వుతూ, మీసం మెలివేస్తూ, పళ్ళు పటపట కొరుకుతూ, లోలోపల చదువుకుంటున్నాడు.
కారణమేమిటో తెలియక ప్రహరేశ్వరుడు అలా చూస్తున్నాడు. మహాదేవరాజును ఆ విధంగా చూసి  కారణం ఏమిటని అడిగే అవకాశం ప్రహరేశ్వరునికి ఇవ్వలేదు.
మహాదేవరాజు ఇలా కోపంతో ఊగిపోతూ, తరువాత  చూశావా? ప్రహారేశ్వరా!  ఆడవాళ్లకు కూడా కళ్ళు తలకెక్కాయి. నా దాసీదైన కమలనెంత అవమానించిందో  ఈ రుద్రమ్మ! ” వినాశ కాలే విపరీత బుద్ధి” (  నాశనం అయ్యే సమయానికి వింత బుద్ధి పుట్టింది) అన్నట్టు నన్ను, నా పరివారాన్ని చులకనగా చూడడం ఈ రుద్రమకు పోయేకాలం వచ్చిందేమో? ఈ ఉత్తరం చూడు! అని ఆ ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడికి ఇచ్చాడు.
అంతలోనే”  ప్రహారేశ్వరా” !  ఒకసారి ఆ ఉత్తరాన్ని  పెద్దగా చదువు!  నేను వింటాను.” అని మహాదేవరాజన్నాడు.
ప్రహరేశ్వరుడు ఆ  ఉత్తరాన్ని ఈ విధంగా చదవడం మొదలు పెట్టాడు.
”  నన్నేలుతున్న నా శౌణ దేశాధీశ్వరులైన మహాదేవరాజ రాజ చూడామణి గారి పాదపద్మాల వద్ద పాద దాసైన  కమల రోజూ మూడు కాలాల్లోనూ నా తలతో పాటు  సాష్టాంగ నమస్కారాలెన్నో  చేస్తూ రాసుకునే మనవి…..
అయ్యా!  తమ  ఆజ్ఞ తీసుకొని మురారి దేవుడు గారు, హరిహర దేవుడు గారు, ధర్మ వర్ధనుడు గారు, నేను….
సరే అదంతా వదిలేసి, ఉత్తరంలో ముందున్న  విషయం చదవమన్నాడు మహాదేవ రాజు.
ప్రహరేశ్వరుడు అలాగే ఉత్తరం కొంత భాగం తన లోలోపల చదువుకొని, తరువాత ఇలా పైకి చదవడం మొదలు పెట్టాడు”ప్రహరేశ్వరుడు.
నన్ను తీసుకొనిపోయి సభలో రుద్రమ్మ ముందు నిలబెట్టారు.
ఆ…. అక్కడ నుండి చదవమని అన్నాడు మహాదేవ రాజు.
రుద్రమదేవి ముందు నిలబెట్టారు. రుద్రమదేవి ఎన్నో విషయాలు అడిగి, చివరకు నావైపు చూసి నిన్ను ఎవరు పంపారు? అని అడిగింది. నేను సమాధానమివ్వలేదు.
ఎవరు పంపారన్నది తెలుస్తూనే ఉన్నది. మహాదేవుడు వంకరగా చూశాడు. మంచిది! చదవమన్నాడు మహాదేవ రాజు.
” సభలో ఎవడో మీ పేరు కూడా చెప్పాడు.” అని చదివాడు.
రుద్రమదేవి సభలో  నా పేరు పలికేంత మొనగాడున్నాడా?  సరే !మిగతా ఉత్తరాన్ని చదువు !
” తరువాత రుద్రమదేవి నన్ను చూసి ఇవాళే మా రాజ్యం వదిలి వెళ్ళి పో!  మా భటులు నిన్ను వెంబడిస్తారు.
నీకో రాజ్యం ఉన్నదా?  ఆ రాజ్యం ఎలా దక్కించుకుంటావో నేనూ చూస్తాను.ప్రహారేశ్వరా! చదువు! చివరనున్న ఆ నాలుగు మాటలు ఏమిటో చదువు!
సరే అని ప్రహరేశ్వరుడు చదవడం మొదలు పెట్టాడు.” మళ్లీ మా రాజ్యంలో నీ మొహం కనపడితే నీ ప్రాణాలు దక్కవు!”  ఆడదానివైనందున బ్రతికి పోయావు!”
వెంటనే మహాదేవరాజు ఇలా అన్నాడు. ఈ మాటలు విని, నేను తనని ఆడదని, జాలిపడి, విడిచి పెడతాననుకున్నది కావచ్చును…  ఇంత అహంకారమా?
మళ్లీ ప్రహరేశ్వరుడు ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు. నీ మహాదేవ రాజు ఆడదై  గాజులు తొడుక్కోవడం వల్ల కావచ్చు! బహిరంగ యుద్ధంలో ఆడదానినైన నన్ను ఎదుర్కోలేక, మోసానికి తలపడ్డాడు….
శత్రువులను తిరస్కరించడం మోసమా? సరే! ఇక బహిరంగ యుద్ధమే చేస్తాను. కాచుకో! అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ చదవడం మొదలు పెట్టాడు… సిగ్గు తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయాలనుకోవద్దని చెప్పు!
సిగ్గు తెచ్చుకోవాలా? నిన్ను సింహాసనం ఎక్కించి నందుకు సిగ్గు తెచ్చుకోవాల్సిందే! మళ్లీ ఇటువంటి పని చేయకుండా..  నేనే ఓరుగల్లు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాను. అహంకరించకు లెమ్మని  అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ ఉత్తరం ఇలా చదవడం మొదలుపెట్టాడు.
“రాజ్యం దక్కించు కోవాలంటే మాతో స్నేహంగా ఉండమని చెప్పు! ”
ఎలా? ఎలా? నీతో స్నేహం చేయాలా? నీకూ నాకూ మధ్య ఏమైనా బంధుత్వం ఉన్నదా?  లేక  నాకు వరసైన దానవా? పరాయి ఆడదానివి!  అందులోను వితంతువువు!  నీతో స్నేహం మాకు ఎలా మంచి జరుగుతుంది? నీతో స్నేహం ఒక యమభటులు మాత్రమే చేస్తారులే! గర్వపడకు! అన్నాడు మహాదేవరాజు.
”  గర్వం, అహంభావం,  వదులుకో”  అని చదివాడు ప్రహరేశ్వరుడు.
”  మంచేదో? చెడేదో తెలియని దానివి. మహా నాకు నీతులు చెప్ప వచ్చావా? అన్నాడు మహాదేవరాజు.
”  మేము చెప్పే మంచి మాటలను మరిచిపోతే, నీకు తెల్లవారితే మా పదునైన బాణాలు చురచురమని తగిలి బుద్ధి చెప్తాయని చెప్పు!  అని చదివాడు.
ఇంతటి పొడుగైన  బాణాలు ఎన్నడు చేయించుకున్నావే?  చురచుర తలగించు కోవాలనే బుద్ధి ఉంటే… అలాగే తగిలించుకుందువు గానిలే!  అన్నాడు మహాదేవరాజు.
”  అని కర్ణకఠోరాలైన మాటలని, ఆనాడే నన్ను భటుల నిచ్చి  వెళ్ళ కొట్టించింది. నేను మన దేశం వచ్చాను. కొద్ది రోజులలో మీ పాదసేవ చేసి, నా దుఃఖాన్ని అంతా చెప్తాను.
ఇట్లు పాద సేవకురాలు
కమల.
కమల ! పాపం ! కమలకు ఎంత అవమానం జరిగిందో కదా! దీనికి ప్రతీకారం మనం తీర్చుకోకుంటే రుద్రమదేవి గర్వం కానీ, దాసి దుఃఖం కానీ తగ్గదు అన్నాడు ప్రహరేశ్వరుడు.
నిజమే! అన్నాడు.
ఆలస్యం చేయకుండా రేపటి కొలువులో పౌరులు,  ఉద్యోగులు, మంత్రులు, సేనాపతులు మొదలైన వారందరిని పిలిపించండి. తగిన పనులు చేసి, ఆలస్యం చేయకుండా ఓరుగల్లు మీద దండెత్తి పోకుంటే మనం చేతగాని వారి వలె అవుతామన్నాడు  మహాదేవరాజు.
తప్పనిసరిగా అలాగే చేద్దాం అన్నాడు ప్రహరే శ్వరుడు .
ఇంటికి వెళుతూ నా మాటగా మంత్రికి చెప్పు రేపు దర్బారుకు అందరూ వచ్చేటట్టు చేయమని.
మంచిది అన్నాడు ప్రహారేశ్వరుడు.
రాత్రి కావడంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా మహాదేవ రాజుకు నిద్ర పట్టలేదు. మాటిమాటికి ఆ ఉత్తరాన్ని చూస్తున్నాడు. చిట్టచివరకు తెల్లవారుజామున శరీరం మంచం మీద వాల్చాడు.
మహాదేవరాజు  స్థిర చిత్తుడు కాబట్టి ఉలిక్కిపడి లేచి కళ్ళు విప్పి చూశాడు. తెల్లవారి రెండు ఘడియల పొద్దు ఎక్కింది.  తను అజాగ్రత్తగా ఉన్నందుకు విచారించి, పడక విడిచి,  కాలకృత్యాలు తీర్చుకొని కొలువు కూటమికి నడిచి వచ్చాడు.
మంత్రి  ఆజ్ఞ ప్రకారం సభ్యులందరూ ముందే వచ్చి ఎవరి తాహతుకు తగిన ఆసనాలలో వారు కూర్చుని ఉన్నారు. ఇంతలో మహాదేవరాజు సభా మంటపానికి వచ్చాడు. సభలోని వారంతా రాజును చూసి, తమతమ ఆసనాలలో నుండి లేచి నిలబడి రాజుకు నమస్కరించి,రాజుపట్ల తమకున్న ప్రభుభక్తిని చాటుకున్నారు. రాజు సభ్యులందరినీ వారికి తగినట్టుగా మర్యాదతో పలకరిస్తూ వచ్చి తన సింహాసనం మీద కూర్చున్నాడు. సభలోని వారంతా కూర్చున్నారు.
ఎప్పటివలె రోజువారీ కార్యక్రమాల సభ జరుగుతున్నా, ఈరోజు మంత్రి ఆజ్ఞతో సమావేశమైన ఈ సభకు కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు కానీ కారణం ఎవరికీ తెలియదు. ప్రహరేశ్వరుడికి మాత్రం తెలుసు .అతడు మంత్రికి చెప్పలేదు. తెల్లవారక ముందే కాలకృత్యాలు తీర్చుకొని రాజు గారి ఇంటికి వెళ్లి, రాజు కోసం ఎదురుచూస్తూ, రాజు నిద్ర లేవగానే  రాజుతో కలిసి సభకు వచ్చాడు. కాబట్టి అసలు విషయం తెలియని ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.
ఇంతలో రాజుసభలోని వారందరినీ చూసి, సభ్యులారా! కొన్ని రోజుల కింద ఒకనాడు ఓరుగల్లు మీద దండయాత్ర గురించి సభ జరిగింది. దానికి మీరు అందరూ ఒప్పుకున్నారు. ఇవాళ అది కలిసి వచ్చింది. రుద్రమదేవికి అహంకారంతో కళ్లు తలకెక్కాయ్. నాకుబుద్ధి చెప్పేంత మొనగత్తె అయింది.
నిన్న మా దాసీదైన కమల నాకు ఒక ఉత్తరం పంపింది. దానిని మీరంతా వినాలి!  అది వింటే మీకు రుద్రమ యొక్క గర్వం ఎంత ఉన్నదో తెలుస్తుంది. ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడు చదివి మీ అందరికీ చదివి వినిపిస్తాడు.
” ప్రహారేశ్వరా! ”  నన్ను గొనిపోయి సభలో రుద్రమదేవి ఎదుట”  అక్కడి నుండి ఉత్తరం చదువు అని అన్నాడు.
ప్రహారేశ్వరుడు కమల రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించాడు. ఆ ఉత్తరం విన్న సభ్యులందరూ” రుద్రమదేవి ఇలా చేయడం తప్పని ముక్త కంఠంతో అన్నారు .
సభలో నుండి ఒకడు లేచి”  రాజచంద్రా!  మీ శౌర్య ప్రతాపాలకు భయపడిన తమ రాజ్యాన్ని దక్కించుకోవాలనే  బలమైన కోరిక ఉండి, తెలుగు వారొక ఆడదానిని  మాళవులు  ఒక పిల్లవాడిని  సింహాసనంపై కూర్చుండబెట్టారు. దాని వల్ల స్త్రీ హింసకు,  శిశుహింసకు వెనుకంజ వేసే ప్రభువులైన మీరు వారి దేశాల పైకి దాడికి వెళ్లరని, వాళ్ల రాజ్యాలకు ఎటువంటి అంతరాయం, నష్టం రాదనుకొని, అలా చేశారు. అయినా రాజ్యగర్వం కళ్ళకు మంచేదో?చెడేదో? తెలుపనీయక  వాళ్ళమతులు పోగొట్టాయి. కాబట్టి తలచినంత మాత్రాన గుండెల్లో దిగులు పుట్టించే మీకు ద్రోహం చేయాలనుకోవడం  పెద్ద సాహసమే అవుతుంది.తమరు ఇప్పుడు ఇటువంటి మహిళలనీ, శిశువులనీ అనుకుని ఊరుకుంటే మీకు ముప్పు తప్పక కలుగుతుంది.
” దుర్జనం,  కాంచనం, భేరీమ్,దుష్టస్త్రీం,దుష్ట వాహనం, ఇక్షుఖండాన్, తిలాన్, మర్దనం- గుణ మర్దనం”  అని( నీచులను, బంగారాన్ని, నగారాలనే వాయిద్యాలను, చెడు స్త్రీలను, చెడు వాహనాన్ని, చెరుకు గడలను, నువ్వులను మర్దించాలి… వాటి గుణం మారేదాకా)  మర్దించాలని శాస్త్రం తప్పుగా చెప్పలేదు. మత్తెక్కి భూమ్యాకాశాల తేడా తెలియకుండా ఉన్న ఆడదాన్ని నరికినా పాపంలేదు.ఇది ఎన్ని సార్లూ చెప్పినా నిజం ! అని అన్నాడు.
ఇతను  గుజరాత్  దేశ పాలకుడైన లవణ ప్రసాదుడు .మహాదేవ రాజుకు సంతోషం కలిగించాలని అనుకొని , దేవగిరికి తన కుమారుడుతో పాటు కలిసి వచ్చి, కొంత కాలమైంది. కుమారుడైన వీరధవలుడిని తన సొంత రాజ్యానికి పంపి,తను ప్రతి దినం మహాదేవ రాజ్యసభకు వస్తూ… రాజ కార్యాలలో జోక్యం కలిగించుకొని, రాజుకు నచ్చేటట్లు మాట్లాడు తుంటాడు. రాజుకు కూడా ఇతనంటే కొంచెం ఇష్టమే. లవణ ప్రసాదుడు అలా అని ,తన ఆసనం మీద కూర్చున్నాడు.
లవణ ప్రసాదు గారు అన్న మాటలు మెచ్చుకునే  విధంగా ఉన్నాయి.  మనమిప్పుడు సైన్యసహితంగా ఓరుగల్లుకు వెళ్లి,  పొగరుతో గుడ్డిదైనా రుద్రమను, ఆమె సేనను యుద్ధంలో ఓడించి, రాజ్యాన్ని మనం చేజిక్కించు కోకపోతే మనకు ఆమె ఉత్తరంలో కలిగిన  అవమానం మాసిపోదు. కాబట్టి మనం ఓరుగల్లు పైకి దండెత్తి పోవడానికి ఆలస్యం చేయవద్దని మహాదేవరాజు అన్నాడు.
రాజుగారి ఆజ్ఞ రావడమే ఆలస్యం, సేనా నాయకుడు తమ సైన్యంతో యుద్ధ సామగ్రితో బయలుదేరడానికి ఆలస్యం చేయరని మంత్రి అయిన భోళేశ్వరుడన్నాడు.
నాతో పాటు సేనానాయకులందరూ యుద్ధానికి ఎదురు చూస్తున్నాం. సైనికులు యుద్ధ పరికరాలతో సిద్ధంగా ఉన్నారు మీ అనుమతి తప్ప కొరత ఏమీ లేనేలేదని సేనాపతులలో ముఖ్యుడైన రామశర్మ అన్నాడు.
మంత్రిగారూ!  మన విధేయులైన వారు, మిగతా వారైన మండలాధ్యక్షులకు ఉత్తరాలు రాసి పంపాలి. వారంతా వస్తే మనకి ఇంకా మంచిది. రుద్రమదేవి చాలా పెద్ద సైన్యం తయారుచేసింది. ఆమె తండ్రి అయిన గణపతిరాజు కూడబెట్టిన సైన్యాన్ని ఈమె రెండింతలు చేసిందన్నా తప్పు లేదు. కాబట్టి మన దగ్గర ఎంత ఎక్కువ సైన్యం ఉంటే అంత మంచిది. మనకు సహాయం చేసేవారు దేవగిరిలోనే మనతో కలవాలంటే అలా వీలు కాదు. కొంతమంది దేవగిరిలోనూ, కొందరు దారిలో మధ్యన, కొందరు పొలిమేర వరకు, తక్కినవారు ఓరుగల్లు వచ్చి చేరవచ్చును. మనం రాసి పంపే ఉత్తరాలలో ఇలా వివరంగా రాసి పంపాల్సి ఉంటుంది. మన సైన్యం సిద్ధంగా ఉంది కదా? ఇంకా బయలుదేరేందుకు నగారా మోగించేందుకు తగిన ముహూర్తం ఆలోచించాలి. ముహూర్తం అంటే చాలా రోజుల వ్యవధి ఉండకూడదు. జ్యోతిష్యులకు ఈ విషయం చెప్పి పది, పదిహేను రోజులలో మంచి ముహుర్తం నిర్ణయించుకుని వచ్చి నాకు తెలియ చేయాలి. ఆ రోజు మనం బయలుదేరి వెళ్లాలి. ముందుగా రాయబారి కానీ మరెవరినైనా పంపేందుకు నాకు ఇష్టం లేదు. మీరంతా దీనికి ఒప్పుకోవాలి. ఎందుకంటే మనతో సమానులయితే ఎటువంటి రాయబారినైనా పంపవచ్చు. కానీ, ఒక ఆడది,  అందునా మనను దూషించిన దాని దగ్గరకు రాయబారం పంపితే సిగ్గుచేటు. మన రాయబారం బాణాలతోనే పంపాలి. నా మాటలు శ్రద్ధగా విని అలా చేయండి! అని మహాదేవ రాజు మంత్రితో అన్నాడు.
చిత్తం! రాజుగారి ఆజ్ఞ! తెల్లారేసరికి మీకు శుభముహూర్తం నిర్ణయించి తెలియజేస్తాను. మిగిలిన సేన మొదలైనవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని మంత్రి చెప్పాడు.
సభలోని వారంతా యుద్ధోత్సాహాన్ని తెలిపారు.
కొంతసేపటికి సభ ముగిసింది. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

పన్నెండవ ప్రకరణ

[  యుద్ధ ప్రయత్నం]

శ్లోకం.    ప్రవిష్ట శత్రుసైన్యంహి ప్రాజ్ఞ శత్రురతర్కితః

నిహన్యాదన్తరం లబ్ధ్వాఉలూక ఇవ వాయసాన్

శ్రీమద్రామాయణం- యుద్ధకాండం. సర్గ-17

శ్లో.       వధ్యతా మేషతీవృణె  దణ్డేన సచివైస్సహ

రావణస్య నృశంసస్య భ్రాతాహ్యేష విభీషణః”

శ్రీమద్రామాయణం-యుద్ధకాండం- సర్గ-17

ఈ శ్లోకాలు విభీషణుడు రామ శరణాగతి కోరి తన మంత్రులతో సహా వచ్చినప్పుడు, సుగ్రీవుడు రామునితో అన్నమాటలు.

భావం :– తెలివైన మరియు జ్ఞానం కలిగిన శత్రువు, శత్రుసైన్యంలో ప్రవేశించి, తరువాతి కాలంలో అవకాశం చూసుకుని, రాత్రిపూట చీకటిలో గుడ్లగూబ కాకులను చంపినట్లుగా …

చంపి వేయగలరు. పైగా విభీషణుడు పర హింసా తత్పరుడైన రావణుడికి తమ్ముడు. కనుక ఇతనిని అనుచరులతో సహా తీవ్రమైన దండనతో వధించవలెను.

కథా భాగం:–  క్రీస్తుశకం 1285 వ సంవత్సరంలో రెండు ,మూడు నెలలు గడిచాయి.చలికాలం క్రమంగా పోయి ఎండాకాలం వేడి తగులుతున్నది. పగలు ఎక్కువగా, రాత్రిపూట తక్కువ సమయంగా మారింది. చలి బాధ వల్ల ఎండకు కూర్చోవడం, లేదా చలిమంటల దగ్గర కూర్చుని వేడి కాపులు పెట్టుకోవడం జనాలకు తగ్గింది. శుభకార్యాలు చేయాలనుకునేవారు ఆ పనికి వస్తువులను సేకరించుకోవడం కోసం తిరుగుతున్నారు. ఆధ్యాత్మిక చింతలలో ఉన్న వారు బ్రాహ్మణులు యజ్ఞ యాగాలు చేయాలనుకుని వాటికి కావలసిన వస్తువుల కొరకు భిక్షాటనకు వెళ్లారు. పురోహితులకు,జ్యోతిష్యులకు శుభాకార్యాలు చేయించడం వల్ల, శుభ ముహూర్తాలు నిర్ణయించడం వల్ల తీరిక లేకుండా ఉన్నారు. కొందరు యజమానులు పాత ఇండ్లను కూలగొట్టించి, కొత్త ఇండ్లు కట్టిస్తున్నారు. శ్రీమంతులు  కొందరు ఎత్తయిన ఇండ్లను చూసి అటువంటి ఇండ్లు తమకు కావాలని, తమ ఇండ్లు అందంగానూ, గట్టిగా ఉన్నా కూడా వాటిని కూల్చేసి, మళ్లీ కొత్తగా కట్టిస్తున్నారు.

ఓరుగల్లు పట్టణంలో రాతి పనులు, మట్టిపనులు ఎక్కువగా జరుగుతున్నవి. అయినా కారణం లేకుండా అవి జరగడం లేదు. కోటగోడలు అక్కడక్కడా కొద్దిగా కూలిపోయాయి. కూలిపోయిన చోట ముందటి కన్నా బలంగా బాగు చేయిస్తున్నారు. పట్టణం చుట్టూ కంప కోట కట్టిస్తున్నారు. కంప కోట అంటే పెద్ద పెద్ద ఇనుప ముళ్ళు ఉన్న ఇనుప తీగను చిక్కగా, దట్టంగా పట్టణానికి చుట్టూ గుండ్రంగా చుట్టడం. ఎందుకంటే వేగంగా వచ్చిన ఫిరంగి గుండ్లు కంపలో దూరితే అవతలికి గానీ, ఇవతలికి గాని వెళ్లదు. ఈ కంపకోటలో  పెద్ద కందకం తవ్విస్తున్నారు. ఆ కందకంలో తవ్వగా వచ్చిన మట్టితో ప్రహరీని ఆనుకుని లోపలి వైపు మట్టికోట కడుతున్నారు. మట్టి కోటకు లోపలివైపు రాతికోట ఒకటి కడుతున్నారు. ఈ రాతికోట సున్నంతో కానీ, మట్టితో కానీ కట్టకుండా బలమైన రాతితో కడుతున్నారు. ఈ రాతికోట మందంగా ఉండి, అష్ట కోణాకారంలో ఉన్నది. రాతితో కట్టినదైనా వెంట్రుక కూడా పట్టేంత సందు లేకుండా కట్టిన ఆ రాతి పనివాడి పని ఈ నాటికీ సందర్శకులకు కళ్ళ పండుగగా ఉంటుంది. ఈ రాతిప్రాకారం లోపల సున్నంతో, ఇటుకలతో మరొక ప్రాకారం కడుతున్నారు. దాన్ని ఇటుకకోటని, భూమి కోటని పిలుస్తారు.

మొదట శత్రువులు దూరరాని కంపకోట,  దాని తరువాత అగాధమైన కందకము, దాని వెనుక చాలా మందపాటి, చాలా ఎత్తయిన,పగలకొట్టి చొరబడరానిదైన మట్టికోట, తరువాత వంద వేల శతఘ్నుల పేల్చినా  ఏమాత్రం చెడిపోకుండా,  దాడికి లొంగని రాతికోట, దాని పక్కన దానికి ఏ మాత్రం తీసిపోని భూమి కోటలుండి ఏకశిలానగరమని తలిస్తే చాలు గుండె దిగులు పుట్టేలా ఉన్నది.

భూమి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు,  వాటి పక్కనే ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. రాతి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు, ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. పుట్ట కోటకు ఎనిమిది దుర్గ ద్వారాలు, 18 చిన్నవాకిళ్లున్నాయి. పనివాళ్ళు కూలి వాళ్ళు రాత్రింబగళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. కొంత మంది ఉదయం కొంత మంది రాత్రి వరుసగా అంచలంచలుగా ఎనిమిది సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. అందుకే ఈ కోటలు కందకాలు ఇప్పటికి సిద్ధమైనాయి. అప్పుడు ఇవన్నీ సిద్ధమైనట్టు రుద్రమదేవికి తెలిసింది. రుద్రమదేవి దర్బారులోనికి వచ్చినప్పుడు కట్టడాలను పర్యవేక్షిస్తున్నప్పుడు, గుఱ్ఱపుస్వారీ చేసేటప్పుడు పురుషుల వలె దుస్తులు ధరిస్తుంది. ఆరోజు సిద్ధమైన కోటలను చూసేందుకు రుద్రమదేవి మగవేషం వేసుకొని, వెంట కొంతమంది తోడురాగా బయలుదేరింది. వాళ్ళంతా వరుసగా ఒక్కొక్క కోటను, వాటికున్న బురుజు ద్వారాలు, చిన్న వాకిళ్ళను, కందకాలను, అన్నింటినీ జాగ్రత్తగా చూపారు. రుద్రమదేవికి చాలా సంతోషం కలిగింది. ఆ కట్టడాలను కట్టిన పనివాళ్లు, కూలి వాళ్లు రుద్రమదేవిని చూసి నమస్కరించారు. పని చేయించేందుకు నియమించిన పెద్దపనివాళ్ళు రుద్రమదేవి గుర్రం వెంట నడుస్తూ ఆయా ప్రదేశాలను, కట్టించే టప్పుడు కలిగిన శ్రమను, చాలా సన్నని స్వరంతో రుద్రమదేవికి చెప్పి చూపిస్తున్నారు. చిన్న వాకిళ్ళలో, బురుజు ద్వారాలలో  అమర్చిన తికమక దర్వాజలను చేతితో ముట్టి, కదిలించి రుద్రమదేవి స్వయంగా పరీక్షించి చాలా బలంగా ఉన్నాయనుకొని సంతృప్తి పడింది.

రుద్రమదేవి అన్ని చోట్ల భద్రంగా పరిశీలించి నగరానికి బయలుదేరింది. పనివాళ్ళు ఆమె వెంట నడిచారు. ఆమె అంతరంగికులు వెంట నడిచారు. కొన్ని ఘడియలలో వారంతా నగరం చేరారు. రుద్రమదేవి రాజదర్బారులోనికి వచ్చి, వజ్రాల సింహాసనం మీద కూర్చున్నది. ఎప్పటివలె సభ్యులంతా వారివారి స్థానాలలో  కూర్చున్నారు. లెక్కలు రాసే వారిని పిలిపించారు. రుద్రమదేవి ఆజ్ఞతో లెక్కలు వ్రాసేవారు, పనివాళ్ళ కూలి, వాళ్ళ జీతాలు మొత్తం లెక్క చేసి ఇచ్చిన డబ్బు తీసేసి , మిగిలిన డబ్బులు లెక్క చెప్పి రుద్రమదేవికి చూపించారు. రుద్రమదేవి కోశాధికారికి ఉత్తరం రాసి పని వాళ్లకు ఇవ్వవలసిన డబ్బును, మరి కొంత ధనాన్ని తెప్పించి వరుసగా అందరికీ లెక్క చొప్పున పంచి పెట్టింది. తరువాత ఒక్కొక్క పని వానికి వాడు చేసిన పని తెలుసుకొని కొంత బహుమతిని తన చేతితో పంచి, వారందరినీ పంపి వేసింది. పని వాళ్ళంతా చాలా సంతోషంతో దీవిస్తూ, పొగుడుతూ, సంతోషంతో కేకలు వేస్తూ రుద్రమదేవికి నమస్కరించి వెళ్లిపోయారు.

తరువాత రుద్రమ్మ కొలువులో ఉన్న తన సేనా నాయకుల పేర్లు పెట్టి పిలిచింది. వెంటనే వాళ్లంతా తమ ఆసనాల నుండి లేచి నిలబడ్డారు. అప్పుడు రుద్రమదేవి గంభీరమైన కంఠంతో ఇలా చెప్పటం మొదలు పెట్టింది.

సైన్యాధికారులారా!  ఈనాటికీ మన ఏకశిలా నగరానికి ప్రసిద్ధమైన కోటలుండే భాగ్యం కలిగింది. ఎన్ని కోటలు, ఎన్ని కందకాలున్నా వాటి రక్షణభారం వీర భటులు చేయకుంటే ప్రయోజనం ఉండదు.మనలను ఎదిరించ లేరనుకొని  ఊరికే ఉండటం మంచిది కాదని మా నాయన గారి హితవచనం.

అందుకు మనం పూర్తి శ్రద్ధ కలిగి కోటలను రక్షించడంలో ఏకశిలానగరం అందరికీ ఆదర్శంగా ముందుండాలి. దానికి నేను చెప్పేది ఏమిటంటే కోట గోడకు ఆధారంగా వేసిన కొరడు ( కోటకు అవతలివైపు ఉన్న మట్టి దిమ్మ) మీద రక్షణ బాధ్యత రాజ బంధువులలోని ముఖ్యులైన వీరుల ఆధీనంలోనూ, భూమి కోటలోని రక్షణ బాధ్యత మిగిలిన బంధు వీరుల ఆధీనంలో ఉంచాలి. జన్నిగ దేవసాహిణి తను చెప్పిన మాట వినే సేనలోని వారిని భూమి కోటలోని ఎనిమిది చిన్న వాకిళ్ళకు ఒక్కొక్క వాకిలికి ఐదు వందల మంది చొప్పున,18  చిన్న వాకిళ్ళకు ప్రతి ఒక్కొక్క వాకిలికి 100 మంది  వీరభటుల చొప్పున, బురుజు ఒక్కదానికి 500 మంది వీర భటులను నియమించి, రాతికోటలోని నాలుగు బురుజుల, ఎనిమిది చిన్న వాకిళ్ళను రక్షించాలి.

అంబయ్య దేవ మహారాజు ఆదేశాల ప్రకారం సైనికులను అక్కడ ఉంచి, మట్టి కోటను రక్షించాలి.

గోనగన్నారెడ్డి తన అధికారం కింద ఉన్న సైనికుల నుండి కోటకు రెండు వైపులా నుంచి కోటను రక్షించాలి.

దాదియ సోమయ సాహిణి తన సైన్యం నుండి బూడిద ఒకటికి యాబై మందిని నిలపాలి. రుద్రమ నాయుడు నాగచమూపతి ఇద్దరూ యుద్ధానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయించాలి. మిగిలిన సేనానులు కంప కోటను, కందకాలను కాపలా కాయాలి. మనకు ఇప్పుడు ఎటువైపు నుండి కానీ యుద్ధం జరుగుతుందనే అనుమానం లేదు. కానీ దుర్మార్గుడైన మహాదేవరాజు విషయంలో మాత్రం కొంచెం అనుమానం ఉన్నది. అతని దుష్టస్వభావంతో నిస్సహాయులైన మమ్మల్ని పట్టుకుని తీసుకొని పోవాలి అనుకున్నాడు. హఠాత్తుగా మన మీద దండెత్తి వస్తాడనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతను దండెత్తి వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. మనం జాగ్రత్తగా ఉంటే అంతా భద్రంగా ఉంటుంది.

రుద్రమదేవి చెప్తున్నప్పుడు సేనా నాయకులు తమకు అప్పగించిన పనులను, తమ రక్షణ కిందకు వచ్చిన కోటలను కాగితాల మీద రాసుకున్నారు.  రుద్రమదేవి తాను చెప్పగలిగిన మాటలను చెప్పి ముగించగానే సేనా నాయకులందరూ ఒక్కసారి సింహనాదాలు చేసి తమ చేతులలో ఉన్న బరికత్తులను తళతళమని మెరిసేటట్లు  ఊపారు. తర్వాత సభను ముగించారు.ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. సేనానాయకులు రాణిగారి ఆజ్ఞ ప్రకారం ఆయా చోట్లలో సైన్యాన్ని నియమించి, వారు శ్రద్ధగా ఉన్నట్టు గమనించి వచ్చి రాణికి తెలుపుతున్నారు.

కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు సభలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటివలె ఆ రోజు రాత్రి రుద్రమదేవి సభ తీర్చి ఉన్నది. రాజ దర్బారంతా సభ్యులతో కిక్కిరిసి నిండి ఉంది. రకరకాల విషయాలు చర్చిస్తున్నారు.

ఇంతలో ఒక యువభటుడు గబగబా వచ్చి, రాణీకి మొక్కి, సభలోని వారందరూ, రాణి గారు వినేటట్టుగా బిగ్గరగా ఇలా చెప్పాడు.” శౌణదేశాధీశ్వరుడైన  మహాదేవరాజు గొప్ప సైన్యంతో దేవగిరి నుండి వస్తున్నాడు” మన ప్రాంతానికి ఇంకా నాలుగైదు రోజులలో ఇక్కడికి చేరగలడు. ప్రభువు ఆజ్ఞతో ఇతర దేశాల నుండి వచ్చే రహదారులను మేము కాపలా కాస్తున్నాం. అక్కడి పరిస్థితి చూసి వచ్చిన సంగతి ఇది. తర్వాత ప్రభువులకు ఎలా అనిపిస్తే అలా జరుగుతుంది. మాకు అప్ప చెప్పిన పని చక్కగా చేసుకుని వచ్చాం.”

మంచిది!  నువ్వు వెళ్లిపొమ్మని రుద్రమదేవి అన్నది. గూఢచారి నమస్కరించి వెళ్ళిపోయాడు.  రుద్రమదేవి మంత్రి అయిన శివదేవయ్య వైపు చూసి ఏమో చెప్పబోయి, చెప్పదలుచుకున్న విషయం కాస్త రహస్యంగా ఉంచ తలుచుకొని, సేవకుడిని చూసి, ఓరీ! నువ్వు వెళ్లి ఇప్పుడు వచ్చిన గూఢచారిని పిలుచుకొని రా! అని చెప్పింది. సేవకుడు గబగబా నడిచివెళ్ళి ,వెళ్ళిన గూఢచారిని సభలోనికి పిలుచుకొని వచ్చాడు.

ఓరీ!  మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడని చెప్పావు కదా! అతని సైన్యం ఎంత ఉందో నువ్వు చెప్పగలవా? అని రుద్రమదేవి గూఢచారిని అని అడిగింది.

అయ్యా!  నేను నిజంగా అతని సైన్యం ఎంత ఉందో చెప్పలేను. కానీ ఎంత దూరం చూసిన సైన్యమే కనబడుతున్నది. గుర్రాలను ఏనుగులను ఒకటొకటి లెక్క పెట్ట గలమా? మా పని శత్రుసేన కొంత దూరంగా ఉండగా చెప్పడం వరకే! అదే చేశానని గూఢచారి జవాబిచ్చాడు.

సరే !నువ్వు వెళ్ళి, మీలో ఒకడినిఅక్కడికి పంపి, సైన్యం ఎంత ఉందో సంఖ్య తెలుసుకుని రమ్మని చెప్పు!  అని రాణి అన్నది. గూఢచారి వెళ్ళిపోయాడు. రుద్రమదేవి మంత్రితో ఇలా మాట్లాడింది.

చూశారా!  మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడట.పూర్తిగా కుటిల మనసున్న వాడైనాడని అనడానికి సందేహం లేదు.

తల్లీ!  కాల మారినట్లు గుణాలు మారుతాయి! అయినా వాళ్లు చేసిన దానికి తగిన ఫలితం అనుభవిస్తారు. కారణం లేకుండా మన మీద కోపం పెంచుకుని, మీకు అపకారం చేయదలచి, అందులో విఫలమవడంతో అసూయతో మనసులు నింపుకొని, ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు దండెత్తి రావడానికి అదే కారణం. నాకు ముందే అనుమానం వచ్చి, దేవగిరి తోవకు  గూఢచారులను కాపలా పెట్టాను.

దండెత్తి వస్తే రానివ్వు!  అతనికి ఎన్ని రోజుల నుండి యుద్ధం చేయాలనే ఆలోచన ఉన్నదో?  దానిమీద కాకతీయుల  పదునైన బల్లేల రుచి చూస్తాడు. కానివ్వు! అతని ఉద్ధతి ఎంత ఉందో? దాని ప్రకారం ప్రతీకారం జరగనీ! వెనుకటి వాళ్లు కాకతీయుల అగ్నివంటి ప్రతాపాన్ని చూశారు. కానీ రెండు తరాల నుండి వీరికి ఆ రుచి తెలియదు. ఇతడు కావాలను కోరి వస్తే అతనిని చిన్న పుచ్చడం ఎందుకు? మనం కోటలను మరమ్మతు చేయించడం, కొత్తకోటలు కట్టించడం, వాటి మీద గట్టి కాపలా పెట్టడం మంచి పని అయింది. ఒక్క మహాదేవరాజే కాదు వంద మంది మహాదేవ రాజులొచ్చినా  ఓరుగల్లుకు నష్టం లేదు.

కోటలే కాదు… మీ శౌర్య ప్రతాపాలు…నేనేమి చేయగలను? మరొకడు ఏమి చేయగలడు? రాజులకు ప్రాణం సైన్యం. ఉదారంగా పౌరుషవంతులైన శూరులు రాజ్యాన్ని దక్కించుకుంటే రాజ్యం దక్కుతుంది.

అందుకోసం మన సేవకులంతా సిద్ధంగా ఉన్నారు. కంఠనాళంలో రక్తప్రసారం జరుగుతున్నంతసేపు యుద్ధం చేసి, తమ ప్రభువును గెలిపించడమే వారి పనిగా మన సైనికులు యుద్ధం ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు.

వీరిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా ఒక్క గూఢచారి సభలోనికి వచ్చి, రుద్రమదేవికి నమస్కరించి, అయ్యా! మహాదేవరాజు దండెత్తి వస్తున్న విషయం ఇంతకు ముందే నా తోటి ఉద్యోగులు మీకు తెలిపి ఉన్నారు. నేను సేనా సంఖ్య ఎంత ఉందో తెలుసుకొని వచ్చాను. మహాదేవరాజు సైన్యం మొత్తం మూడు లక్షలు. యుద్ధ సామాగ్రి, వస్తు సామాగ్రి చాలా ఉన్నది. సైన్యం ఇక్కడికి రావడానికి నాలుగు రోజులు పడుతుందని చెప్పాడు.

మంచిది!  నువ్వు నీ పని మీద వెళ్ళు! అని రుద్రమదేవి అతనిని పంపి…

మంత్రిగారూ!  మన సైన్యం ఎంత ఉంది? మహాదేవ రాజు సైన్యం మూడు లక్షలట!  అని అన్నది.

తల్లీ!  అయితే ఏం? బురుజులపైనా, కందకాలపైనా, చెట్లకొమ్మలపైనా ద్వారాల దగ్గరా, చిన్న తలుపుల దగ్గరా ఉన్న సైన్యం కాకుండా… మిగిలిన సైన్యం రెండు లక్షల డెబై వేలని నిన్న మన సేనా నాయకులు లెక్క ఇచ్చారు. కాపలా కాసే వారి సంఖ్యతో కలిసి మూడు లక్షల కన్నా ఎక్కువే ఉంటుంది. వస్తుసామగ్రి కూడా చాలా ఎక్కువగానే ఉంది.  మూడు ,నాలుగు సంవత్సరాలు  విరామం లేకుండా యుద్ధం చేసినా తక్కువ పడదు.

మనం ఒక్కసారి సైన్యం చూసి వస్తే బాగుంటుంది కదా! నాగచమూ నాయకులు మన వెంట వస్తారు.

సరే!

రుద్రమదేవి లేచి నిలబడింది. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. రుద్రమదేవి భూమి కోట బురుజు ద్వారం దగ్గరకు నడిచింది. మంత్రి , సేనాధిపతులు వెంట నడిచారు.  తక్కిన సభ్యులు వారి వారి ఇళ్లకు వెళ్ళారు.

పదమూడవ ప్రకరణ

[ సంధి ]

శ్లో॥       అపనీత శిరఃస్త్రాణాః శేషాస్తుం శరణం యయౌ ;

ప్రణిపాత ప్రతీకారః సంరంభోహి మహాత్మనాం !

— (రఘువంశము)

భావం :– చచ్చిన వారు పోగా బ్రతికి ఉండే వారు  టోపీలు తీసివేసి, ఆ రఘువంశ మహారాజును శరణుజొచ్చారు. మహాత్ములు శత్రువుల గర్వం అణిచివేయడంలోనే దృష్టి ఉంచుతారు. కానీ వారు వినయంగా ఉండే వారిని, ముందటి వలె చంపాలనే కోపం ఉండదు కదా!

వ్యాఖ్య:–  ఈ రఘువంశంలోని శ్లోకం  ప్రకరణ మకుటంగా గ్రంధకర్త తీసుకోవడం, రుద్రమదేవి నవలలోని రుద్రమదేవి- మహాదేవరాజు మధ్య గల సంధిని  సూచిస్తూ, కథార్ధ సూచిగా ఎంతో చక్కగా అమర్చారు.

ఈ శ్లోకాన్ని చదువుతూనే కథలోని మలుపులు తెలుస్తునాయి.ఈ విశేషమైన ప్రక్రియ అరుదుగా కనిపిస్తుంది.

కథాభాగం:–  మహాదేవరాజు సైన్యం ఓరుగల్లు కోటను ముట్టడించింది. ఏనుగులు, గుర్రాలు వీరభటులు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనపడుతున్నారు. మహాదేవరాజు మూడు లక్షల సైన్యంతో ఓరుగల్లును ముట్టడించి, పదిహేను రోజులు అయింది. ప్రతిరోజు రుద్రమదేవి సైన్యానికి మహాదేవరాజు సైన్యానికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. రెండు వైపులా సైన్యంలో సైనికులు  చనిపోతున్నారు.

ఈరోజు పదిహేనవ రోజు యుద్ధం మొదలైంది. రుద్రమదేవి మగవేషంతో ఉత్తమజాతికి చెందిన గుర్రాన్నెక్కి  పౌరుషానికి మారురూపుగా వచ్చిందా? అన్నట్టుగా చూడ శక్యం గానంతగా యుద్ధభూమిలో తిరుగుతూ,  కనపడ్డ శత్రువులందరిని చంపి వేస్తున్నది. రుద్రమదేవి సేనానాయకులలో ముఖ్యులైన రుద్రమ నాయుడు వెలమ సైనికులకు, నాగచమూపతి కమ్మ సేనకు అధికారులై తమ సైన్యాన్ని ప్రోత్సహిస్తూ వీరవిహారం  చేస్తున్నారు.

జన్నిగదేవ సాహిణి, త్రిపురాంతక మహాదేవ రాజు, అంబయ్య దేవమహారాజు, గోనగన్నారెడ్డి, దాదియ  సోమన సాహిణి మొదలైన సేనానాయకులు ఎవరూ దగ్గరకు రావడానికి సాహసించ లేనంత భయంకరంగా యుద్ధం చేస్తున్నారు.

రుద్రమదేవి అల్లుండ్లైన ఇందులూరి అన్నమ రాజును, చాళుక్య వీరభధ్రుడు రాజును తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ,  యుద్ధభూమిలో తిరుగుతూ, శత్రుసైన్యం గుడారాలను, శత్రువులను కింద మీదలు చేస్తున్నారు. మల్యాల గుండాదీశ్వరుడు మహాదేవరాజుతో యుద్ధం చేస్తున్నాడు. రుద్రమదేవి ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య వయసురీత్యా ముసలివాడైనా యువకునివలె యుద్ధం చేస్తున్నాడు. గుండ ధరాధీశ్వరుని తమ్ములైన మల్లయ్య, బుద్ధయ, కోటయ్య, పిడుగు గుండయలు నాలుగు వైపులా తిరుగుతూ యుద్ధం చేస్తున్నారు. ప్రసాదాదిత్య నాయకులు మొదలైన సేవక వర్గం తమవెంట ఎవరైనా తోడుగా వస్తున్నారా? లేదా? అని చూడకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు.

మహాదేవరాజు మంత్రి అయిన సాధులుడు, సేనాపతులైన భోళేశ్వరడు, రామశర్మ, బిచ్ఛణుడు మొదలైన వారు, కొంకణ దేశపురాజు, ఘూర్జర దేశపు అధినేతైన లవణప్రసాదుడు మొదలైనవారు చెలరేగి యుధ్ధం చేస్తున్నారు. ఇంకా ఎందరో మహాదేవరాజుకు సహాయం కోసం వచ్చిన మాండలికులు వీరవిహారం చేస్తున్నారు. రెండు వైపుల వారు విజయం మాకే కావాలనే కోరికతో గుంపులతో దొమ్మి యుద్ధం  చేస్తున్నారు. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.

మధ్యాహ్నం రెండు జాములయింది. చెట్ల కొమ్మల మీద, బురుజుల మీద ఉన్న ఓరుగల్లు సేన మహాదేవరాజు సైనికుల మీద బాణాల వర్షం కురిపిస్తున్నది.

రుద్రమనాయుడు, నాగ చమూపతి తమ పరివార మైన వెలమ,కమ్మ వారిని వెంట తీసుకొని, దేవగిరి దళాన్ని ఎదుర్కొన్నారు. వారి పరాక్రమం చెప్పలేనంతగా ఉన్నది.

మల్యాల గుండదండధీశ్వరుడు శౌణ దేశాధీశ్వరులిద్దరూ కత్తి యుద్ధం చేస్తున్నారు.వారిద్దరి శరీరాలు రక్తంతో తడిసి, ఎర్రని పూలతో ఉన్న మోదుగ చెట్ల వలె కనపడుతున్నారు. యాదవరాజు పదునైన బల్లేన్ని తీసుకొని గుండ దండాధీశ్వరుని గుర్రాన్ని నరికి వేశాడు. అతడు కొంచెం కూడా తొట్రు పడకుండా పదునైన ఖడ్గం తీసుకొని మహాదేవరాజుపైకి ఉరికి అతనెక్కిన ఏనుగును కొట్టాడు.  తొండం తెగిపోవడంతో ఆ ఏనుగు గీ అంటూ అరుస్తూ నేలమీద కూలిపోతున్న ది. వెంటనే మావటిని తల నరికేసి, నేలమీదికి దుముకుతున్న శౌణదేశపు రాజును చంపాలని, గుండ దండాధీశ్వరుడు కత్తిగిరగిరా తిప్పి విసిరాడు.

మహాదేవరాజు అతని కత్తి వేటునుండి తప్పించుకొని, యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. దండాధీశ్వరుడు పరిశ అనే ఆయుధాన్ని మహాదేవరాజుపై విసిరాడు. ఆ దెబ్బకతను సొమ్మసిల్లి నేల మీద పడ్డాడు. గుండ దండాధీశ్వరుడు సింహనాదం చేశాడు. దేవగిరి సైనికులు భయపడ్డారు. మహాదేవరాజు వెంటనే తెప్పరిల్లి చీకటిని గిరగిరా తిప్పి దండాధీశ్వరుని పైకి విసిరాడు. ఆ కత్తివేటుకు కంఠానికి తాకినందున అతడు నేలపై పడి ప్రాణాలు విడిచాడు .

అన్న అలా నేల కూలాగానే తమ్ముళ్లు ఒక్కసారిగా యాదవరాజుపై కలియబడ్డారు. శౌణదేశాధిపతికి సహాయంగా లవణప్రసాదుడు,  మంత్రి అయిన సాధులుడు వచ్చి కలిశారు. రుద్రమదేవి సేనా నాయకులను చుట్టుముట్టినందు వల్ల  వాళ్లు రాజుకు సహాయం చేయలేకపోయారు.

గుండదండాధీశ్వరుని తమ్ముళ్లు ఐదుగురు ఎదురు నిలిచి యుద్ధం చేస్తూ మంత్రిని మూర్ఛ పోగొట్టారు. రుద్రమదేవి యాదవ రాజున్న దగ్గరికి దుర్గాదేవి ప్రత్యక్షమైందా అన్నట్లు భయంకర రూపంతో వస్తూ ఉండగా… తోవలో సేనా నాయకుడైన దాదియ సోమయ సాహిణి వీరమరణం పొందాడనే పిడుగు లాంటి ఆ వార్త విని మళ్లీ వచ్చిన చోటికి వెళ్ళి పోయింది రుద్రమదేవి.

గుండ దండాధీశ్వరుని తమ్ముడు శౌణదేశాధిపతిని  చుట్టుముట్టి, మూర్చ పోయిన అతనిని కోటలోనికి మోసుకొని పోతున్నారు. వెలమ, కమ్మ వీరులు పరాక్రమంతో శత్రువులను మట్టి కరిపిస్తున్నారు. సైన్యం ఉత్సాహంగా, బలంగా ఉన్నది. అయినా ఓరుగల్లు సైన్యం అలిసిపోయింది. కానీ బింకం తగ్గలేదు. ఇంతలో” ” శత్రువులను చుట్టు ముట్టండి!  వీరులకు వీరస్వర్గం కన్నా మించిన మంచి మార్గం లేదు!”  శూరులకు వీర విహారమే ఉత్సాహంగా ఉంటుంది.” పోరాడి పోరాడి విజయం సంపాదించినా, వీరమరణం పొందినా మీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది!” యుద్ధభూమిలో భయపడి,పారిపోయి  మీ ఇండ్లకు శరణార్థుల వెడితే మీ భార్యలు మిమ్మల్ని ఆడవారి కన్నా ఎక్కువ హీనంగా చూస్తారు.” మన పూర్వీకుల పౌరుష చరిత్రలు మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి!”  ధైర్యాన్ని మీ సొంతం చేసుకోండి!”  శత్రువులు పెచ్చుమీరుతున్నట్టున్నారు. వారి పొగరు అణచండి. అని గంభీరంగా అంటూ రుద్రమదేవి అక్కడికి వచ్చింది.

తమ రాణిని  దగ్గరగా చూడగానే  సైన్యంలో కొత్త ఉత్సాహం నిండి, ఏనుగంత బలం కలిగి,” హరహర ” అంటూ ఒక్కసారిగా శత్రువుల మీద పడ్డారు. అప్పటి ఆ యువ సైన్యాన్ని వర్ణించటం , దేనితో  పోల్చాలో  వర్ణించడానికి భాష చాలదు.

కోట బురుజుల మీద, కందకాల మీద, చెట్ల కొమ్మల మీద ఉన్న సైనికులు వచ్చి చేరారు. బురుజుల దగ్గర, చిన్న వాకిళ్ల దగ్గర కాపలా ఉన్న సైన్యంలో సగం సైన్యం వచ్చి, చేయూతనిచ్చింది. కోటలో ఉన్న మూలబలం కూడా కేకలు వేస్తూ వచ్చి చేరింది.

రుద్రమదేవి సైన్యం చాలా పెద్దదై శత్రువులను నరికి వేస్తున్నది. తళతళ మని కత్తులు మెరుస్తున్నాయి. తటతట మని తలలు తెగి కింద పడుతున్నాయి. ఇలా రెండు ఘడియల కాలం యుద్ధం చేసేసరికి వెలమనాయకుల, కమ్మ నాయకుల శౌర్యానికి తట్టుకోలేక అక్కడ ఉన్న శత్రువులు పారిపోయారు. రుద్రమదేవి సైన్యం వెంట పడగా…   శౌణదేశపు సైన్యం అటు ఇటు పారిపోయింది.

అప్పుడు రుద్రమదేవి అక్కడ సైన్యాన్ని పంపి వేసి, ఉత్తర దిక్కున పోరాడుతున్న వీరుల వైపు తన సైన్యంతో వెళ్లి వారితో యుద్ధం చేసింది.

గుండ దండాధీశ్వరుని తమ్ములైదుగురు  రాజును మూసుకొని పోయిన సమాచారం సేనాని అయిన బిచ్ఛణుడు విని, కోపంతో గబగబా వెళ్లి వారితో కలియబడ్డాడు. వాళ్ళు శౌణరాజును విడవకుండా సైన్యాన్ని ఎదుర్కొన్నారు. సైన్యాధిపతి కోపంతో వింటితో బాణాలు ఎక్కుపెట్టి పిడుగు గుండయ్య, విట్టల అయ్యను పడగొట్టాడు. మిగిలిన ముగ్గురు బిచ్చనుడితో యుద్ధం చేస్తున్నారు.

ఇంతలో శౌణరాజు  మూర్ఛ నుండి తేరుకున్నాడు. శౌణరాజు తననెవరో మోసుకొని పోతున్నట్టు తెలుసుకొని, కోపంతో మండిపడుతూ నేలమీదకు దుమికాడు. వెంట ఖడ్గాలు చేతిలో పట్టుకొని, మల్లయ్య, బుద్ధయ, కోటయ్యలపై కలియబడేంతలో బిచ్ఛనుడు ప్రాణాలు విడిచాడు. సేనాని పరిస్థితి చూసి, కోపంతో శౌణరాజు  ఖడ్గాన్ని తీసుకొని, ఆ ముగ్గురు వీరుల మీద పడి చాలా నొప్పించాడు. కొంతసేపటికి వాళ్ళు ముగ్గురు నిలువలేక పారిపోయారు.

శౌణదేశపు రాజు రుద్రమదేవి దగ్గరకు పోవాలనుకొని తలెత్తి చూశాడు. అప్పుడు అతనికి కలిగిన కలత  అంతా ఇంతా కాదు. తన సైన్యం దెబ్బతిని పారి పోతున్నట్లు, రుద్రమదేవి, ఆమె సైన్యం తన సైన్యాన్ని తరుముతున్నట్లు, అతడు చూశాడు.ఎంత ప్రోత్సహించినా తన సైన్యం యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నది అనుకోని, తన సైన్యం చాలా తక్కువ గానూ, రుద్రమదేవి సైన్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు, ఆమె సైన్యంతో ఎదుర్కొంటే ప్రాణాలు దక్కవని, అతడు తెలుసుకున్నాడు.కాలం కలిసి రానప్పుడు తాను మాత్రం ఏం చేయగలడు. రుద్రమదేవికి ఆమెకు సంబంధించిన వారికి కనిపించకుండా ఒదిగి ఒదిగి ఒక పక్కనుండి పారిపోయాడు.

రుద్రమదేవి శౌణసేనను  కొంతదూరం తరిమివేసి, మళ్లీ యుద్ధభూమికి వచ్చింది.దేవగిరి రాజును పట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ అతడు కనపడక పోవటంతో మరలి వచ్చింది. ఆమె చుట్టూ సేనా నాయకులు, మిగిలిన సైన్యం నిలబడ్డారు. రుద్రమదేవి తన చుట్టూ మూగిన సైనికులను చూసింది. పెద్ద మొత్తంలో చనిపోయిన సైనికుల గురించి బాధ పడింది. సేనానాయకుడైన దాదియ సోమయ సాహిణియొక్క, గుండదండాధీశ్వరుని యొక్క,అతని తమ్ములయొక్క, మరికొందరు ప్రసిద్ధులైన వీరుల మరణం, మంత్రి అయిన శివదేవయ్య చాలా గాయపడడం ఆమెకు చాలా బాధ కలిగించింది. అప్పుడు ఆమె ఇలా అన్నది.

” ఓ! రాజభక్తి కల సైనికులారా! ఈరోజు మీరు నాకు విజయం కలిగించినా, వీరమరణం పొందిన సైన్యం, సైన్యాధికారులు, వీరులను పోగొట్టుకోవడం నాకు బాధను కలిగించారు. కులదైవంతో సమానమైన ముఖ్యమంత్రి శివదేవయ్య గారు గాయాల పాలవడం చాలా విచారకరం!శౌణదేశపు రాజు మనకు చిక్కకుండా దొంగవలె పారిపోయాడు. అతని పట్టుకోకుండా ఇల్లు చేరవద్దు! నేను సైన్యానికి ఆధిపత్యం వహించి, అధికారిగా ముందుకు నడుస్తాను. మిగిలిన సైనికులు, గాయపడిన వారు నా వెంట  రావాలి!  అని పెద్దగా అన్నది. సైనికులు, సేనాపతులు సరేనన్నారు.

రుద్రమదేవి గాయపడ్డ సైనికుల కొరకు మంత్రిని కోటకు పంపించి,  గాయపడిన వారికి చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేయించింది. కోట నుండి భోజనం తెప్పించింది. వాళ్లంతా స్నానం చేసి , భోజనం చేసి, యుద్ధానికి సిద్ధమై శౌణదేశపు  సైన్యం వెంటపడి, మహాదేవ రాజును పట్టి తేవాలనే గట్టి పట్టుదలతో నడిచారు.

ముందు దేవగిరి సైన్యం, వెనుక రుద్రమదేవి పరివారం నడుస్తున్నది  ఓరుగల్లు సేన ఉన్న సంగతి శౌణ సైన్యానికి తెలియదు. గెలువలేక పోతిమనే విచారంతో, దేవగిరి రాజు పోయి పోయి రుద్రమదేవి రాజ్యం పొలిమేర దాటి,శౌణదేశపు ప్రాంతంలో ఒకచోట సైన్యాన్ని నిలిపి వేశాడు. అలసట తీరుతుందని, విడిపోయిన సైన్యం వచ్చి కలుస్తుందని రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆనాటి సాయంకాలమే విడిపోయినా కొంత సైన్యం, వస్తు సామాగ్రితో ఉన్న బండ్లు వచ్చి కలిశాయి. మూడు లక్షల సైన్యంతో వెళ్ళిన మహాదేవరాజు పదివేల కన్నా తక్కువ సైన్యంతో తన దేశపు పొలిమేర చేరి నిలిచాడు.

శౌణదేశపు  సైన్యం తెల్లవారిన తర్వాత మేలుకొని చూసేసరికి ఏమున్నది? వారి చుట్టూ ఓరుగల్లు సేన ఉన్నది. తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎదిరించి యుద్ధం చేయడానికి రుద్రమ సైన్యం ఎక్కువగా ఉన్నది. ఆలస్యంగా ఈ వార్త రాజుకు తెలిసింది విచారంతో మహాదేవరాజు మంత్రులను, ముఖ్యులను పిలిపించి చేయవలసిన పనులు విచారించాడు. వాళ్లు తమ అభిప్రాయాన్ని రకరకాలుగా చెప్పారు. ఎవరి అభిప్రాయం అయినా యుద్ధం చేయటానికి సైన్యం సుముఖంగా లేదని…

చివరకు వారంతా సంధి కుదుర్చుకోవడం మంచిదని నిశ్చయించుకున్నారు. దేవరాజు రాయబారం నడిపేందుకు భోళేశ్వర  సైన్యాధిపతి  నియమించి చెప్పవలసిన విషయాలన్నీ అతనికి చెప్పి, రుద్రమదేవి వద్దకు పంపాడు.

భోగేశ్వరుడు ఏ ఆయుధాలు వెంట తీసుకొని పోకుండా. రుద్రమదేవి సైనిక గుడారంలోనికి వచ్చాడు.సైన్యం అతనిని అడ్డగించ లేదు. రాయబారి రుద్రమదేవి గుడారం దగ్గరకు వచ్చి , ద్వారపాలకుడితో తను వచ్చినట్లు లోపలికి తెలియజేశాడు. ద్వారపాలకుడు తిరిగివచ్చి భోళేశ్వరునికి రాణి అనుమతి తెలిపాడు. భోళేశ్వరుడు గుడారం లోనికి వెళ్ళాడు.

రుద్రమదేవి ముఖ్యులతో అంతరంగిక సమావేశమై,భోళేశ్వరుడు  రావడం చూసింది.భోళేశ్వరుడు బ్రాహ్మణుడని తెలుసు కాబట్టి తన సింహాసనం నుండి లేచి నమస్కరించింది. భోళేశ్వరుడు యధావిధిగా బ్రాహ్మణ ఆచారపరంగా ఆశీర్వదించి, రాజు వేషంలో ఉన్న రాణి మీది గౌరవం తెలిపాడు. తరువాత తనకు కేటాయించిన ఆసనం మీద కూర్చున్నాడు.

అప్పుడు రుద్రమదేవి భోళేశ్వరునితో ఈ విధంగా మాట్లాడింది.

”  మీరు ఏ పని మీద వచ్చారు?”

దేవీ! మారాజు  రాయబారం పంపించాడు.

ఏమని?

ప్రస్తుత విషయం గురించి.

ఆ… అర్థమైంది… ముట్టడించడం ఆపివేసి వెళ్లిపొమ్మని కావచ్చును . మా పై పన్నిన కుట్ర…

ఆ విషయాలన్నిటినీ దయతో క్షమించండి!

మంచిది !మేము మూర్ఖపు పట్టుదలతో లేము! సంధిని ఒప్పుకుంటాం!  మాకు తలపెట్టిన కుట్ర క్షమార్పణ సరిపోయింది. ఇంకా రాయబారం మూడు మాటల్లో చెప్పనా? యుద్ధ ఖర్చుల కింద ఐదు కోట్లధనం, యాభై  ఏనుగులు, వంద గుర్రాలు… ఏమంటారు?  మీ రాజు ఒప్పుకుంటాడా?, లేక రాజునడిగి  చెప్తారా?

సంధిని  కుదుర్చుకుని, అపాయం లేకుండా తమ శౌణదేశపు సైన్యాన్ని తమ దేశానికి చేరవేసేందుకు భోళేశ్వరుడు మారుమాట్లాడకుండ ఒప్పుకున్నాడు.రుద్రమదేవి కూడా అంగీకరించింది.

రాయబారి సెలవు తీసుకొని వెళ్ళి,జరిగిన విషయమంతా రాజుకు తెలిపాడు.అతడు సంతోషించి, ఒప్పుకున్న ధనం,మొదలైన వాటిని రుద్రమదేవికి పంపించాడు.

రుద్రమదేవి జయశాసనాలను అక్కడ స్ధాపించి, సైనికులకు యాభై లక్షల హొన్నులను బహుమతిగా ఇచ్చి, దేవగిరిని ముట్టడించాలన్న ఆలోచన మానుకుని ఓరుగల్లు చేరింది.

(సమాప్తం)

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

నిరాతప  (గజళ్ళ కావ్యం)

by Jyothi Muvvala February 28, 2022
written by Jyothi Muvvala
రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు రచించిన నిరాతప తెలుగు గజళ్ళు పుస్తకం పైన కవర్ పేజి ఎంతో అందంగా ఉంది. దీనంగా చూస్తున్న రెండు కళ్ళ వెనుక దాగిన ఎన్నో అర్థాలు పరమార్థాలు. వెలుగు నీడల సమాహారాలు
అసలు నిరాతప అంటే ఏమిటో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు రాసిన తెలుగు గజల్ పుస్తకాన్ని చదివేంతవరకు నాకు తెలియదు. నిరాతప అంటే రాత్రి అని అర్థం. . పక్షాంతాల పక్షాలతో విహరిస్తుంది. నేత్ర వారి నేత్రీ అవుతుంది.అంటు ఈ పుస్తకంలో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు ఎంతో అందమైన డెఫినిషన్ అందించారు. పుస్తకం పేరులోనే ఇంత నీగూడార్థం ఉంటే పుస్తకంలో గజల్స్ ఎంత బావుకతతో అందంగా ఉంటాయో ఊహించవచ్చు. అసలు గజల్ ప్రక్రియ అంటే అది ఒక లిరికల్ పోయెట్రీ. పర్షియాలో పుట్టి ప్రపంచమంతటా పర్యాప్తం చెందిన అద్భుత కవితా గేయపక్రియే ఈ గజల్.
‌ తెలుగులో దాశరధితో ప్రారంభమైన గజల్ రచన సినారె తో పరుగులు తీసింది.నేడు చాలామంది గజల్స్ విరివిగా రాస్తున్నారు.ఈ పుస్తకానికి ముందుమాట రాసిన కళారత్న బిక్కి కృష్ణ గారు గజల్ కోసం ఒక మాట చెప్పారు.గజల్ అంటే ప్రియురాలితో సల్లాపం లేక ప్రియుడితో సల్లాపం కాదు.కవి, కవయిత్రి యొక్క ఉన్నతమైన భావావేశం.(imaginative intensity) గజల్ అంటే ఐదు నుండి 15 షేర్లు వరకు ఉంటే సరిపోదు కాఫియా, రధీప్లు తఖుల్లస్ బాహర్లు మెర్పిస్తే సరికాదు. గజల్ అంటే తాత్వికత, గజిలియెత్, భావుకత కవితాత్మ, అభివ్యక్తి, నవ్యత ఉండాలి. రూపం, భావం, గతి, భావుకత, రసాత్మకత, కళాత్మకత, నాణ్యత రసధ్వని, చమత్కారం ఇత్యాది రూపాభివ్యక్తి సంబంధిత సౌందర్య శిల్పమే గజలియత్. మల్లీశ్వరి లాంటి భావుకత, తాత్వికత ఉన్న కవయిత్రికి మాత్రమే సాధ్యం. అందుకే కవయిత్రిని కళారత్న బిక్కి కృష్ణ గారు గజల్ పగ్లి మల్లీశ్వరి! అని సబోధించారు.
‌ ఈ నిరాతప పుస్తకంలో మొత్తం యాభై గజల్స్ ఉన్నాయి. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి తెలుగు భాష మీద ఉన్న పట్టు అపూర్వం. రచయిత్రి యొక్క ఉన్నతమైన భావావేశం ఈ గజళ్ళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ సంపుటిలో ప్రతి గజల్ దేనికదే అద్భుతంగా ఉన్నాయి. మనసుపెట్టి చదవాలి గాని ప్రతి గజల్ లో అందమైన హృదయం ఆవిష్కరిస్తుంది.
‌ రాత్రిలో వెన్నెల ఉంటుంది. రాత్రిలో నిక్షిప్తమైన వెలుగు అందాన్ని తెలిపే ఈ నిరాతప గజల్ ఒకసారి పరిశీలిద్దాం
“మిణుగురుల ముసి నవ్వుల వన్నెలెన్ని మోసిందో ఈ నిరాతప
వెల్లువౌ వెలుగు విరి విలాసమెంత పూసిందో ఈ నిరాతప”
ఎంత అద్భుతంగా పోల్చారు కవయిత్రి. మిణుగురుల ముసి నవ్వుల వెలుగులే మోసింద అంట ఈ నిరాతప.
ఆ నవ్వుల వెలుగు వెల్లువై విరిసి విలాసంగా పూసింది ఈ రాత్రి…అంటే రాత్రిపూట ఆ మిణుగురుల కాంతి, వాటి నవ్వు ద్వారా వచ్చిందని కవయిత్రి యొక్క భావం.
కలికి కళ్ళనున్నది అరుపో ఎరుపో మైమరుపో తెలియ నీదు
బతుకునెంతగా అష్టా చమ్మాటగా చేసిందో ఈ నిరాతప
ఈ షేర్ని గమనిస్తే కలికి కళ్ళనున్నది… కలికి అంటే స్త్రీ ఆడది అని అర్థం. ఆడదాని కళ్ళల్లో అరుపో, ఎరుపో మైమరపో తెలియ నీదు… అంటే అది కోపమో బాధో లేక ప్రేమతత్వమో తెలియదు. బతుకంతా అష్టాచమ్మాటగా చేసిందో ఈ నిరాతప
జీవితమంతా ఎప్పుడు ఆనందంగా వెలుగుతూనే ఉండదు. చీకటిలో బాధతో కూడా కూడి ఉంటుంది. అందుకే రేయి పగలుకు సంకేతంగా అష్టా చమ్మాటతో పోల్చారు కవయిత్రి.
ఎదురు చూపుల నీడల ఊడల నిట్టూర్పులెంతగా అలి సాయో
ఖేదమోద వాదననే ఖాంతాల తోసిందో ఈ నిరాతప
ఎదురు చూపులు చూసి చూసి మర్రి చెట్టు ఊడల వలె చూపులు ఊడల పెరిగి నిట్టూర్పులే మిగిల్చి అలిసిన మనసును ఈ చీకటి రాత్రి శోకంలో తోసింది.
ఇలా మొత్తం ఈ గజల్ తీసుకుంటే ఏడు షేర్లతో ముగిసింది. అదే విధంగా పూసిందో, చేసిందో,తోసిందో వంటి కాఫియాలతో, ‘ఈ నిరాతప’ అనే రధీఫ్తో అందంగా భావుకతతో మలిచారు.
క్షణాలెన్నో వస్తూ పోతూ అనే గజల్ లో
“క్షణాలెన్నో వస్తూపోతూ మనిషిని తొలిచి సురంగం చేస్తాయి
స్వార్థం నిస్వార్థాంలు మనసును నిలకడ లేని పతంగం చేస్తాయి”
నిజమే జీవితంలో ఆనంద క్షణాలు భారమైన క్షణాలు ఎదను తొలిచి తొలిచి సొరంగం చేస్తాయి.
అంతు చిక్కని ఆ సొరంగంలో ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి.తవ్విన కొద్దీ బయట పడతాయి.
స్వార్థం, నిస్వార్థాంలు నాణెనిక బొమ్మ బొరుసులా మనిషిని నిలకడగా నిలవనియక పతంగం చేస్తాయి.
ఎంత చక్కటి పోలిక. పతంగం ఎలా రెపరెపలాడుతూ ఉంటుందో… మనసు అలాగే ఊగిసలాడుతుంది అని కవయిత్రి చెప్పకనే చెప్పారు.
“రేపేమో తెలియనీక కాల యవనిక ఆలోచనలలో మనిషిని
దారేమో ఎరుగనీక వలను చిక్కుకున్న కురంగం చేస్తాయి”
మనిషి జీవితంలో రేపన్నది ఏమో తెలియక కాలమనే రంగస్థలంపై నటుడిగా ఆలోచనలో మనిషిని పడవేస్తాయి. దిక్కులేక దారి తెలియక వలలో చిక్కుకున్న చాపల చేస్తాయి.
“పకృతి సిరులే మానవ మానస వికాస హేతువై మారి మనిషి
మనసులోన కళానుభూతి నింపి ఆనంద తరంగం చేస్తాయి “
ఇలా ఒకటి కాదు ప్రతి గజల్ మనిషిలోని అంతర్లీనంగా పడుతున్న వేదనను ఆవిష్కరిస్తూ తపోబలంతో భాషలోని క్లారిటీ భావంలోని ప్యూరిటీ హృదయంలోని రసజ్ఞ ప్రతీ షేర్లలోనూ శిల్పీకరించారు.
ఒంటరి మనసంటే ఏమిటో… మబ్బెంత మురిసిన
నీవిచ్చిన ఏకాంతంలోనే…ఇలా ఎన్నో అద్భుతమైన గజల్సు ఈ పుస్తకంలో ఉన్నాయి
 మనుగడ నిచ్చే మట్టి ఈ షేర్ లో….
“నీవు నేను మనం కాలేని మది రాగాల వివాదాల మనసులునొక్కటిగా చేసే సాహితీ సంధానం నేనే”
“దిశదిశల రుతువుల స్థితులెంతెంత మారినా కానీ
సదా గమనమే మార్చక గమ్యం చేరే సంచారం నేనే “
మనిషి మనుగడకు కారణం మట్టి. మనుషుల్లోనూ మనసులోని అంతరాలు…నువ్వు నేను మనం కాలేని మది రాగాల వివాదాలలో మనసులను ఒక్కటిగా చేసే సాహితీ సంధానం నేనే కదా!
నాలుగు దిశలలోను నాలుగు రుతువుల లోనూ కాలాలు ఎంత మారినా గమనాన్ని మార్చక గమ్యానికి చేర్చే సంచారం నేనే కదా అంటూ మట్టి స్వగతాన్ని మనకు అందించారు.
మనసు అశ్రువులను అడుగుతోంది ఈ గజల్ లో
“మనసు అశ్రువులను అడుగుతోంది నన్ను ఎందుకు వణికిస్తున్నావు అని
ఆయువు కాలాన్ని అడుగుతోంది నన్నెందుకు తరిగిస్తున్నావు అని”
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ప్రతి గజల్ చాలా బాగుంది. కళారత్న బిక్కికృష్ణ గారన్నట్టు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి గజల్స్ కి సాటి ఆమె గజల్స్ మాత్రమే.
చివరిషేర్లో కవినామముద్ర ఉండాలి దీనీనే *తఖల్లాస్* అంటారు. గజల్ లో ఒకసారి వాడిన పదం మరలా వాడకపోవడమే గజల్ కు సౌందర్యం. ఇందులో కవయిత్రి సఫలీకృతులయ్యారు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
 శుద్ధమైన తెలుగు భాషలో పరిశుద్ధమైన ప్రేమ తత్వంతో అద్భుతమైన భావుకతతో అనితరసాధ్యమైన శిల్ప నైపుణ్యంతో అరుదైన తెలుగు భాష పదాలతో చక్కని కాఫీయా, రధీఫ్ లతో కొత్త ప్రయోగాలతో తాత్వికతో పాటు నియమాలు పాటిస్తు చక్కటి గజల్ను మనకందించారు సుప్రసిద్ధ కవయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు. అదేవిధంగా ఈ పుస్తకాన్నికి గజల్స్ కి కూచి గారి చిత్రాలు మరింత అందాన్ని చేకూర్చాయి.ఈ నిరాతపలో మనస్సును స్పృశించే భావుకతను పుష్కలంగా జోడించిన మనోహర భావాలు అందుకు తగ్గ అద్భుతమైన చిత్రాలు కన్నుల విందు చేస్తున్నాయి. చదివిన ప్రతి ఒక్కరూ ఆ భావుకత సంద్రంలో తడిసి ముద్దై ఆనందడోలికల్లో మునిగి తేలుతారు. సాహితి పిపాసుల హృదయ స్వాంతన కాగలదు ఈ “నిరాతప “.
February 28, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

భయం భయం భయం

by Rasheed February 28, 2022
written by Rasheed

బతుకుబండి నడకంతా భయాల బాటలోనే
సెలబ్రిటీస్ లలో
అభద్రతా భయం
తల్లిదండ్రులలో
ఓల్డ్ ఏజ్
హౌస్ భయం
ఉద్యోగాలులేక
యువతలో
బతుకు భయం
నిజాయితీపరులకు
లంచం భయం
పేదవాడికి వడ్డీ భయం
ఆటో వాడికి
ఫైనాన్సర్ భయం
తాగుడు వల్ల
భార్యా పిల్లలకు
భయం
ప్రయాణీకుడికి
టిక్కెట్టు ధర
బాదుడు భయం
ఖాళీ జాగా వాడికి
భూ కబ్జాదారుల
భయం
ఓట్ల కోసం
హిందూ ముస్లింల
విభజన భయం
ధర్మ సంసద్ లో
తీవ్రవాద భయం
ప్రభుత్వానికి
ఉచితాల భయం
స్కూల్ ఫీజులవల్ల
పేరెంట్స్ కు భయం
చిన్నారులకు
మొబైల్ ఫోన్ ల
భయం
పార్టీలో
నిజాయితీపరులకు
గెంటివేత భయం
ప్రార్థనాల
యాలలో
నిర్వాహకుల భయం
కరోనా కోర్సుకు చిక్కుతామేమోనని
ప్రపంచ మానవాళికి
భయం
కోవిడ్ షీల్డ్
తీసుకున్నా భయం
Covid 19
తీసుకోకపోయినా
భయం
మారు పేరుతో
వచ్చిన వోవిుక్రోన్తో
భయం
చివరికి దేశ దేశాల ప్రధానరక్షకులకూ
ప్రాణ భయం
మరి సామాన్యుడికి ఇక
ఏది భద్రత సుఖం ?

అందరికీ
ఇక దైవమే అభయం.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పెదవులపై నవ్వు

by కుడికాల వంశీధర్ February 28, 2022
written by కుడికాల వంశీధర్

పెదవులపై నవ్వు
అందం
నవ్వుకి నాలుగక్షరాల పేరు
బ్రహ్మానందం

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

‘మహాప్రస్థానం’లో మహిళాభ్యుదయం

by Raprolu Sudarshan February 28, 2022
written by Raprolu Sudarshan

తెలుగు సాహిత్యంలో మహిళల జీవితాల్ని చిత్రిస్తూ ప్రత్యేక రచనలు వెలువడ్డాయి. మొదట్లో జగన్మాత, లక్ష్మీ, సరస్వతి మొదలైన స్త్రీ దేవతామూర్తుల ఔన్నత్యం, ఆ తర్వాత సావిత్రి, అరుంధతి, అనసూయ, దమయంతి ఇత్యాది మహిళామతల్లుల పాతివ్రత్య వైవిష్ట్యాన్ని తెలిపేవి గమనిస్తాం. ఆధునిక కాలంలో సామాజిక స్ప ృహతో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, చెలం, కొడవటిగంటి కుటుంగారావు, శ్రీశ్రీ వంటి రచయితలు స్త్రీల జీవితాల్ని తీసుకొని వాళ్ళు పడుతున్న కష్టాల్ని చూపుతూనే కొందరు బైటపడే మార్గాల్ని చూపారు. ఆతర్వాత 1980ల నుంచి మహిళా దృక్కోణం (Feministic)  నుంచి ప్రత్యేక రచనలు ఆరంభమై ఉద్యమ రూపం దాల్చినవి. దీనికి ఓల్గా, కొండేపూడి నిర్మల, జయప్రభ, సావిత్రి, శిలాలోలిత మొదలైన వారిని పేర్కొనవచ్చు. ఇలా మహిళా దృక్కోణం నుంచి నేటికీ వెలువడుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిలో మహాకవి శ్రీశ్రీ రచనల్లో మకుటాయమానమైన ‘మహాప్రస్థానం’లో మహిళాభ్యుదయం  ఉన్న తీరును విశదీకరించడమే ఈ వ్యాస పరిధి.

తెలుగు సాహిత్యం 1930ల వరకు తనను నడిపిస్తే, అప్పటి నుంచి దానిని తను నడిపినట్లు చెప్పుకున్న మహాకవి శ్రీశ్రీ రచనల్లో అక్కడక్కడ స్త్రీల దృకోణం నుంచి  రచించినట్లు మనం గమనిస్తాం. ‘ఒసే తువ్వాలందుకో’ అనే కథానికలో పురుషాధిక్య సమాజం లో ప్రతీక్షణం స్త్రీ ఎలా నలిగిపోతున్నదో తెలిపే ఇతివృత్తంతో రాశాడు శ్రీశ్రీ.  ‘హేమంతం’ అనే కథానికలో ‘భిక్షువర్షీయసీ’ కవితలోని అవ్వనే యౌవనంలో ఉన్న తీరును ఇతివృత్తంగా చేసుకొని శ్రీశ్రీ రచించాడు. ఇలాగే పురాణ పాత్ర అయిన శూర్పణఖను తీసుకొని ఆమెకు జరిగిన అన్యాయాన్ని కథానికగా ‘శూర్పణఖ మాన సంరక్షణ’ అనే కథానిక రాయడం జరిగింది. నాటక ప్రక్రియలో ఒంటరిబావి, భూతాల కొలిమి మొదలైనవి  స్త్రీ కోణం నుంచి రాసినవే. ఓ సినీ (దేవత) గేయంలో ‘‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి…’’ అంటూ స్త్రీ జాతి ఔన్నత్యాన్ని అక్షరీకరించాడు శ్రీశ్రీ.

‘‘క్రిష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు’’ అని ‘మహాప్రస్థానం’ పీఠికా కర్త చెలం చెప్పిన దానిలో ‘‘అందరి బాధనూ’’   అనడంలో స్త్రీలు కూడా ఉంటారని చెప్పకనే చెప్పినట్లైంది. మహాకవి శ్రీశ్రీ రచనల్లో అత్యధికంగా ప్రజాదరణ పొందిన ‘మహాప్రస్థానం’ కావ్యంలో పతితుల, భ్రష్టుల, బాధాసర్పద్రష్టులైన మహిళలకు ‘పరిపూర్ణపు బ్రదు’కొచ్చేందుకు ప్రస్తావించిన వాటిని పరిశీలిద్దాం.

నలభై కవితలతో 1950లో వెలువడిరది ‘మహాప్రస్థానం’ కవితా సంపుటి. ఇందులోని చాలా కవితలు 1933 నుంచి 1940 మధ్యలో రాయబడినవి, వివిధ పత్రికల్లో ముద్రితమై ఖ్యాతిని ఆర్జించినవి. ఈ కావ్య శక్తిని, ప్రభావాన్ని చెలం చెబుతూ ‘‘… పాత పద్ధతులు, విశ్వాసాలు, ధర్మాలు అన్నీ ఓ మూలనించి  కూలిపోతున్నాయని’’, ఈ కావ్యం    కూల్చుతుందనే ధోరణిలో చెప్పారు. ఇందులో స్త్రీల పట్ల ఉన్న పాత భావనలూ నశిస్తాయని అంతరార్థంగా భావించవచ్చు. సమసమాజాన్ని సాధించడమే ఈ కావ్య లక్ష్యంగా  పేర్కొంటాం. శ్రీశ్రీ కలలుకంటున్న ‘మరోప్రపంచం’లో సమసమాజమే ఉంటుంది. ఆ సమసమాజం కేవలం వర్గ వ్యవస్థకే గాక ‘స్త్రీ, పురుష సమానత్వం’ కూడా   చెప్పుకోవచ్చు. అటువంటి ఈ కావ్యంలోని కవితలను మహిళా దృక్కోణం నుంచి చూసినప్పుడు మూడు  రకాలుగా విభజించవచ్చు. అవి: 1. అచ్చంగా స్త్రీల గురించి రాసినవి, 2.   పార్శ్వంగా తరుణులను పేర్కొన్నవి, 3. లింగం (Gender)) చెప్పకుండా స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే విధంగా రాసిన కవితలు. ఈ వింగడిరపుతో వివరంగా చూద్దాం.

అచ్చంగా స్త్రీల గురించి రాసిన కవితలు:

మహాప్రస్థానంలోని మంచి కవితల్లో ఒకటి ‘భిక్షువర్షీయసి’. ఇది 13`8`1938 నాడు రాసిన కవిత. ఈ కవితలో బిచ్చగత్తె దీన, హీన స్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు    శ్రీశ్రీ. ఇందులో ఏడు స్టాంజాలు ఉన్నాయి. ‘‘దారిపక్క, చెట్టు కింద / ఆరిన కుంపటి విధాన / కూర్చున్నది ముసల్దకతె / మూలుగుతూ, ముసురుతున్న / ఈగలతో వేగలేక’’ అనే మొదటి స్టాంజాలో కలం కుంచెతో దారిని, పక్కనే ఓ చెట్టును, దాని కింద ఓ   ముదుసలి కూర్చున్నట్టు చిత్రాన్ని రూపుకట్టించాడు. ఇలా కెమెరాతో ఛాయాచిత్రాన్ని బంధించినట్టుగాక, వీడియో కెమెరాతో ఆమె చేష్టలనూ చిత్రించి ఆ ముసలావిడ మూలుగులను వినిపించాడు, తన మీద ముసురుతున్న ఈగలను తోలేంత శక్తిలేకపోయిన      తీరును ‘వేగలేక’ అనే పదంతో కళ్ళకు కట్టాడు శ్రీశ్రీ. ఇంకా ‘‘ఆరిన కుంపటి విధాన  కూర్చున్నది’’ అనడం వల్ల ఒకప్పుడు బాగా మండి, ఆ మంట ఎవరికి ఎలా కావాలో  అలా సహాయపడి, ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో పడి ఉందనే భావాన్ని ప్రదర్శించాడు  కవి.

ఆ బిచ్చగత్తె శరీర సౌష్టవాన్ని చెప్పబూనుకొని ఆమె తలను ప్రతిరోజు స్త్రీలు పొద్దున్నే  వాడే తెల్లటి ముగ్గు బుట్టలా ఉందని, ముదిమి వల్ల శరీరంలో ఏర్పడ్డ ముడతలు, ఆరోగ్యవంతులకు ఉండే శక్తివంతమైన కళ్ళు కాస్త కాంతి విహీనంగా మారడమేగాక ఆమె శరీరంకన్నా శవం నయమనిపించేంత ఘోరంగా ఉందన్నాడు కవి శ్రీశ్రీ. ఆమెకు     వయోభారం వల్ల ఒంట్లోని కీళ్ళు సడలి పోతున్నవి,  అనారోగ్యంతో పడిపోయింది, ఈ పడడం తన ప్రక్కనే ఉన్న జడ పదార్థమైన బండ రాతిలాగ పడి ఉంది, అడుక్కునే శక్తిలేదు, బతకాలనే కోర్కెలేదు, ఎవరూ దిక్కులేని దీనురాలైన ఆమెకు రాబోయే కాలంలో మరిన్ని కష్టాలు రాబోతున్నవని చెప్పడానికి నిత్యం బిచ్చమడుగుకొని బతుకుతున్న ఆమెకు శక్తి కూడా నశించింది, పైపెచ్చు రాబోయేది చలికాలం. ఇలా ఆ బిచ్చగత్తె స్థితిగతుల్ని నాలుగు స్టాంజాల్లో చూపాడు శ్రీశ్రీ. అనంతర మూడు స్టాంజాల్లో ఆమె పట్ల సమాజ  పోకడను, సమాజ బాధ్యతను తెల్పబూనుకొని ‘‘ఆ అవ్వే మరణిస్తే / ఆ పాపం ఎవ్వరి’’దని వెర్రిగాలి ప్రశ్నిస్తూ / వెళ్ళిపోయింది’’ అలా మనుషులు వెర్రిగాలిలా  మారిపోకూడదు సాటి మనిషి చావుబతుకుల మధ్య ఉంటే అని మన బాధ్యతని గుర్తెరిగేట్టు చేశాడు ఈ కవితలో శ్రీశ్రీ.

ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అవ్వ ప్రక్కనుంచి ఎముక తింటూ, కనీసం    పట్టించుకోకుండా ఓ కుక్క, ఇలాగే తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఓ తొండ. అంటే మన పరిసరాల్లో జీవిస్తున్న అన్య జీవుల్లానే, మన సమాజంలోని సాటి  మనుషులూ కుక్కల్లా, తొండల్లా సాగిపోతున్నారేగానీ పట్టించుకోవడంలేదనే భావాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపాడు శ్రీశ్రీ. అంతలోనే ఆ అవ్వ మీదకు ‘ఎంగిలాకు’ ఎగిరి వచ్చింది, కనీసం ఈ విస్తరికి అతుక్కొని ఉన్న మెతుకులైనా ఆవిడకు ఆందుబాటులోకి వచ్చాయా  అనుకుంటే ‘‘క్రమ్మె చిమ్మచీకట్లు’’ అనడంతో ఆమె ప్రాణాలు గాలిలో కల్సిపోయి ఆ నాటి   రోజుకి, ఆమె శరీరానికి చిమ్మచీకట్లు కమ్ముకున్నాయని తెల్పడంతో మరణ వార్తను చీకటితో పోల్చి చెప్పినట్లైంది. అంటే వ్యవస్థలో ఓ వ్యక్తి బిచ్చమెత్తుకునే స్థాయికి   దిగజారడం, కనీసం వయోభారం మోస్తున్న వారిపట్లనైనా వ్యవస్థ పట్టించుకోకపోవడాన్ని శ్రీశ్రీ సీరియస్‌గా తీసుకున్నాడనిపిస్తుంది. సమాజంపట్ల బాధ్యతగా ఉండని వారిని ఈ కవితాకరెంటు షాక్‌తో చైతన్య పరచాలనుకున్నాడు మహాకవి.

1936 ప్రాంతంలో రాసిన ‘అద్వైతం’ అనే కవితను రాశాడు శ్రీశ్రీ. ఈ కవిత రాసిన  సుమారు ఇరవై ఏళ్ళకు అంటే 1955లో వినోద పిక్చర్స్‌ వారితో నిర్మితమైన  ‘కన్యాశుల్కం’ చలనచిత్రంలో సగం వరకు పాటగా వాడుకున్నారు. ఈ పాటపై మధురవాణి   పాత్రధారిjైున సావిత్రి హావభావాలను ప్రదర్శిస్తూ అద్భుతంగా నాట్యం చేసింది. ఇక ఈ కవితలోని వైశిష్ట్యానికొస్తే ‘అద్వైతం’ అంటే జీవాత్మా, పరమాత్మ వేరుకావు, ఒకటే అనేది భావం. ఈ పదాన్నే తీసుకొని ప్రేయసీ, ప్రియులిద్దరూ వేరుకాదు ఒకటే అనే అర్థంతో శీర్షికను పెట్టి ప్రేమికుడివైను నుంచి ఈ కవితను అల్లాడు శ్రీశ్రీ. ఇందులో  ఆమెను ‘‘హసనానికి రాణివి నీవై… కుసుమించిన త్వదీయ మోదం… నా భావికి దేవివి నీవై…’’ ఇలా ప్రేయసిని వర్ణిస్తూ  మన ఆనందం సముద్రమైతే, మన అనురాగం    ఆకాశమంత అయితే ‘‘అనురాగపు టంచులు చూస్తాం / ఆనందపు లోతులు తీస్తాం’’      అంటూ ఇప్పటికి 86 సంవత్సరాల క్రితం రాశాడు శ్రీశ్రీ ఈ గేయాన్ని. దీన్ని ఎన్ని సార్లు విన్నా, చదివినా వన్నె తరగని పాట ఇది.

1940లో ‘జగన్నాథుని రథ చక్రాలు’ శీర్షికతో రాసిన కవిత ‘మహాప్రస్థానం’ కావ్యంలో చిట్టచివరిది. ఈ కవిత ‘‘పతితులారా! / భ్రష్టులారా! / బాధా సర్పదష్టులారా!’’ అంటూ ఆరంభమవుతుంది. వీళ్ళందరూ‘‘…శని దేవత రథ చక్రపు / టిరుసులలో పడి నలిగిన’’ బ్రతుకు వాళ్ళుగా చెప్పి, ‘‘సఖుల వలన పరిచ్యుతులు / జనుల వలన తిరస్క ృతులు / సంఘానికి బహిష్క ృతులు’’ అయినటువంటి వారిని గూర్చి ‘‘మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి’’ అని చెబుతూ ‘‘మీ రక్తం కలగి కలగి / మీ నాడులు కదలి కదలి / మీ పేవులు కనలి కనలి / ఏడవకండేడవకండి!’’ అని ఓదారుస్తూ ‘‘మీ కోసం కలం పట్టి’’నానంటూ ‘‘ఆకాశపు దారులంట / అడావుడిగ వెళ్ళిపోయే’’ జగన్నాథుని రథ చక్రాలను ‘‘భూమార్గం పట్టిస్తాను / భూకంపం పుట్టిస్తాను’’ అంటూ బరోసా ఇస్తూ   ‘‘ద్రోహులను తూలగొట్టి / దోషాలను తుడిచి పెట్టి / స్వాతంత్య్రం / సమభావం /    సౌభ్రాత్రం / సౌహార్దం / పునాదులై ఇళ్ళులేచి / జనావళికి శుభంపూచి / శాంతి,      శాంతి, కాంతి, కాంతి / జగమంతా జయిస్తుంది / ఈ స్వప్నం నిజమవుతుంది / ఈ స్వర్గం ఋజువవుతుంది’’ అని నిర్ధారణగా మహాకవి శ్రీశ్రీ ఈ కవిత ద్వారా సుమారు 82 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇలా వనితాలోకంపై ప్రత్యేకంగా కొన్ని కవితల్ని       రాశాడు మహాకవి శ్రీశ్రీ.

పార్శ్వంగా తరుణులను పేర్కొన్న కవితలు:

ప్రత్యేకంగా స్త్రీల గురించి రాసిన కవితలేగాక పార్వ ్శంగా స్త్రీ జన ఉద్ధరణకై రాసిన   కవితలూ ‘మహాప్రస్థానం’లో ఉన్నాయి. అవి బాటసారి, కవితా! ఓ కవితా! మొదలైనవి. వాటిని చూద్దాం.

‘బాటసారి’ కవితలో ‘‘కూటికోసం, కూలి కోసం, / పట్టణంలో బ్రదుకుదామని / తల్లి  మాటలు చెవిని పెట్టక …’’ అని చెబుతూనే, ఆ తల్లిని గూర్చి ఇంకా ‘‘కళ్ళు వాకిట నిలిపిచూచే / పల్లెటూళ్ళో తల్లి ఏమని / పలవరిస్తుందో…?’’ అని తల్లి గూర్చి చెబుతూ ఈ కవితాంతమున ‘‘బాటసారి కళేబరంతో / శీతవాయువు ఆడుకుంటోంది / పల్లెటూళ్ళో తల్లికేదో / పాడు కలలో పేగు కదిలింది’’ అంటూ ఆ తల్లి కాలిన కడుపును బాధాపూరితంగా తెలిపాడు శ్రీశ్రీ.

‘మహాప్రస్థానం’ కావ్యానికే మకుటాయమానమైంది ‘కవితా! ఓ కవితా!’ అనే కవిత. ఇందులో ‘‘అందని అందానివిగా…’’ అనీÑ ‘‘శతకోటి సముద్ర తరంగాల మ్రోతలు! విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను!…’’ అనీÑ ‘‘నను కరిగించిన కవన ఘృణీ! / రమణీ! / కవితా! ఓ కవితా!…’’ అంటూÑ ‘‘నన్ను పునీతుని కావించిన కవితా! / లలిత లలిత కరుణా మహితా!…’’ అనడమే గాకÑ చివరిలో ‘‘జననీ! ఓ కవితా! / కవితా! కవితా! ఓ కవితా!…’’ అంటూ ఈ కవితను ముగించాడు శ్రీశ్రీ. ఇందులో ‘కవిత’ను వనితగా తనను కరుణించిన దేవతగా, తల్లిగా భావించాడని గ్రహిస్తాం. ఇంకా ఈకవితలో ‘‘అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని / రుచిర స్వప్నాలను కాంచే / జవరాలి మన:  ప్రపంచపుటావర్తాలు’’ అనీÑ ‘‘కడుపు దహించుకుపోయే / పడుపు కత్తె రాక్షస రతిలో / అర్థ నిమీలిత నేత్రాల…’’ అనీÑ ‘‘నా జనని గర్భంలో / ఆకారం లేకుండా నిద్రిస్తూన్న / నా అహంకారానికి…’’ అంటూ మహిళలను ప్రస్తావించాడు శ్రీశ్రీ ‘కవితా! ఓ కవితా!’ అనే కవితలో. ఈ కవితను చూస్తే స్త్రీల పట్ల శ్రీశ్రీకి అపారమైన గౌరవం ఉన్నట్లు తెలుస్తుంది.

‘నవకవిత’అనే కవితలో ఆధునిక కవిత్వం ఎలా ఉండాలో పలు ఎర్రనివి చెబుతూ ‘‘కలకత్తా కాళిక నాలిక / కావాలోయ్‌ నవ కవనానికి’’ అంటూ కాళికా మాత ఎర్రని నాలుకలా ఆధునిక కవిత్వం ఉండాలని తెలిపాడు శ్రీశ్రీ.

‘అవతారం’ అనే కవితలో ‘‘కనకదుర్గా చండ సింహం / జూలు దులిపీ, /  ఆవులించింది’’ అంటూ జగన్మాత వాహనమూ తిరగబడుతున్నదని చెప్పాడు శ్రీశ్రీ. ఇంకా ఈ కవితను ‘‘పుడమి తల్లికి / పురిటి నొప్పులు / కొత్త సృష్టిని స్ఫురింపించాయి’’ అంటూ వ్యవస్థ మార్పును ‘భూమాత’తో పేర్కొంటూ ముగించాడు కవి. ఇలా కొన్ని కవితలను       పార్శ్వంగా స్త్రీల ప్రస్తావనతో చెప్పాడు కవి.

లింగ (Gender)  దృష్టితోగాక స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే కవితలు:

‘మహాప్రస్థానం’ కావ్యంలో స్త్రీల గురించి రాసిన, స్త్రీల ప్రస్తావన తెచ్చిన కవితలతో    పాటు స్త్రీ, పురుషులిరువురికీ వర్తించే విధంగా కొన్ని కవితల్ని రాశాడు శ్రీశ్రీ. అలాంటి వాటిలో అవతలిగట్టు, సాహసి, పరాజితులు, వ్యత్యాసం, ప్రతిజ్ఞ, చేదుపాట, నీడలు   మొదలైన కవితలు పేర్కొనవచ్చు. మచ్చుకి ఓ కవిత చూద్దాం.

‘‘ఔను నిజం, ఔను నిజం / ఔను నిజం నీ వన్నది! / నీ వన్నది, నీ వన్నది, / నీ వన్నది నిజం, నిజం!’’ అంటూ ఆరంభ మరియు ముగింపు స్టాంజాలుగా ఉన్న ‘చేదుపాట’ అనే కవితలో ‘‘మనదీ ఒక బ్రదుకేనా? /  కుక్కల వలె, నక్కల వలె! / మనదీ ఒక  బ్రదుకేనా? / సందులలో పందుల వలె!’’ అంటూ మన వ్యవస్థలోని ఈ జీవితం పురుషులదా, లేక స్త్రీలదా అని ప్రత్యేకంగా కవి తెల్పలేదు కాబట్టి ఇద్దరిదీ, లేక స్త్రీలదీగా కూడా   భావించనలవిగా ఉంది. ఇలా ‘మహాప్రస్థానం’ లో స్త్రీ, పురుషులిద్దరికీ వర్తించే విధంగా మరికొన్ని కవితలూ దృగ్గోచరమవుతాయి.

ఈ కావ్యం గూర్చి రావి శాస్త్రి ‘‘… కవితామతల్లి ఆదిశక్తి. ఆ శక్తిని అతను పతితుల భ్రష్టుల బాధాసర్పదష్టుల పక్షాన నిలబెట్టేడు. ఆమె చేతికి ఆయుధాలుగా ఇచ్చేడు తన కవితల్ని. శ్రీశ్రీ మహాకవి ధర్మపక్షాన నిలబడ్డాడు. ఆయన కవిత ధర్మంచేతి బాణం’’ (పుట`114, మహాప్రస్థానం, ముద్రణ: విరసం, జూన్‌ 1999) గా పేర్కొన్నాడు. ఇటువంటి కవితల ‘మహాప్రస్థానం’ కావ్యాన్ని స్త్రీ దృక్కోణం నుంచి పరికిస్తే ‘స్త్రీవాద ఉద్యమ సాహిత్యం’ అనేది తెలుగులో పొడసూపక పూర్వమే వ్యవస్థలో మహిళల స్థితిగతుల్ని  అభివర్ణిస్తూ రాసిన కవితలుగా మనకు దర్శనమిస్తాయి.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అపరిచితుడు…

by Dr. T Radhakrishnamacharyulu February 28, 2022
written by Dr. T Radhakrishnamacharyulu
ముఖం ఎప్పుడూ చూసినట్టు లేదు
మాట మాత్రం
తెలిసిందేనని మనసు చెప్తుంది
కనులకూ మనసుకూ మధ్యన
కొంత తేడా ఉన్నది
అభిప్రాయం భిన్నంగా ఉంది
ఒకవేళ నా చూపు మసకైందేమో
ఒకప్పుడులా చూస్తలేదేమో
మనసు అద్దం అందంగా ముస్తాబై
చురుగ్గా ఉందేమో
జ్ఞాపకాలను తొందరగా పసిగట్టొచ్చు
కానీ మనిషింకా తేరుకోలేదు
గందరగోళ అయోమయంలోంచి
ఆనవాళ్లు  వెతుకులాటలో
సవాళ్ళు ఎదురొచ్చాయి చూపుకు
పరిచితుడే అక్కడుంది
మరి అపరిచితుని ఎలా కనిపించె?
బహుశా మెదడు పొర మందమైందేమో
సున్నిత గుణం శూన్యమైందా
గుర్తుపట్టలేని యవ్వనం వెళ్ళంగనే
కాల మహిమ కాకపోతే
ఏందిది
దశాబ్దాల స్నేహ మాధుర్యం
అపరిచిత రూపంలోకి మారింది
కలిసి తిని తాగిన అన్నపానీయాలు
ఇంకా అరగనేలేదు మొత్తంగా
కడుపులో గొప్పగా మాట్లాడుతున్నై
ఐతే…ఇప్పుడైతే…
అక్కడున్నది అపరిచితుడు కాదు
మరి పరిచితుడేనని
మరిచిన మనిషి ఇదమిత్థంగా
నిజంగా ఏమీ చెప్పలేడు..
రుచి చూసిన జిహ్వ అనుభూతో
అనుభవించిన క్లేశంలోని
 సంతోషాల యాది నదియో
గతం గడిపిన బాటల్లోని
గుండె సడీ సప్పుడో
ఏ మాలిన్యం అంటుకోని
 మనసు పాదరసమో తప్ప…
February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనసిజ

by M.Umalaxmi February 28, 2022
written by M.Umalaxmi

ఎన్నో స్మృతులను దాచుకునేది
ఎన్నో రహస్యాలను గుప్తపరుచుకునేది
ఎన్నెన్నో ఆనందాలను గుర్తుచేసేది
మరెన్నో నిగూఢ మధనాలను నిరంతరం చవిచూపేది
ఇంకా ఎన్నో మరెన్నింటినో

తనలో దాచుకొని
నిరంతరం నాకు నన్ను గుర్తు చేసే
నా మనసిజ నా నేస్తం
నాకు మాత్రమే సొంతం
నా మనసిజ
నా దిశా నిర్దేషిణి
నా పూర్ణ స్వరూపిణి
నా మనసిజ

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అతిథిదేవోభవ

by Tirunagari Devaki Devi February 28, 2022
written by Tirunagari Devaki Devi

సుమన శుభలేఖ ఇచ్చిన మరునాటి నుండే వీడియో మెసేజ్ పదే పదే పెళ్ళికి రమ్మంటూ
ఆహ్వానం పలుకుతుంది.శుభలేకే వాళ్ళ ఆర్థిక హోదాను కొంత మోసుకొచ్చింది.ఇక వీడియో మెసేజ్ సంగతి చెప్పఖ్ఖర్లేదు.కాని సుమనలో ఆ ఆర్థిక డాంబికత్వం కనపడినే లేదు.”మనసుకు
తగ్గ పేరే ఆ అమ్మాయిది.” అనుకుంది వైశాలి.
కాలం నిరంతర వాహిని.ఏ అవరోధాలు దానిని ఆపలేవు.ఆ కాల గమనంలో ఎన్నో సంఘటనలు.మరెన్నో మార్పులు. అవి రాజకీయమో..సామాజికమో..భౌగోళికమో..మంచో చెడో ఆపత్తో..విపత్తో… వేటితో కాలానికి సంబంధం లేదు.దాని మానాన అది తన ప్రయాణాన్ని కొన సాగిస్తుంది తన కొలీగ్ సౌమ్య పదవీ విరమణ సందర్భంగా జరిగిన వీడ్కోలు సమావేశం నుండి ఇంటికి చేరుకునే సరికే ఆరు కావచ్చింది.ఆ రాత్రే వినోద్ కాంప్ ప్రయాణం.రోజువారి పనులతో పాటు ప్రతి ప్రయాణ సన్నాహం తన చేతులమీదుగా జరగాల్సిందే.”ఎంత మొత్తుకున్నా మానవుడిలో మార్పు లేదు. ఏమంటే ఆఫీసు పని ఒత్తిడి పోజు…తనేమొ ఏ ఉద్యోగం సద్యోగం లేకుండ ఇంటి పట్టునే ఉన్నట్టు.” తనలో తానే ఉడుక్కుంది వైశాలి. ఉడుక్కుని మాత్రం ఏం చేయగలదు పాపం ..మనసుకీ చేతలకూ సంఘర్షణ తప్ప.ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినా ఆడ వాళ్ళ ఇంటి చాకిరీకి విముక్తి లేదు.మగ వాళ్ళ ప్రయాణసన్నాహాలు భార్యామణుల చేతిమీదుగా జరిగి తీర్చాల్సిందే .తప్పదు సరే. మరి భార్యామణి కాలు బయట పెట్టాలంటే తన ప్రయాణ సన్నాహం తోపాటు ఇంట్లో పిల్లలకే కాదు పతిదేవుడికి అన్నీ అందుబాటులో ఉంచి కాలు కదుపాలి.”ఏవేవో రకరకాలుగా ఆలోచిస్తూ పెద్దగా నిట్టూర్చింది వైశాలి.ఏ నిట్టూర్పులు..సంఘర్షణలు..అలసటలు వినోద్ ప్రయాణాన్ని అడ్డుకోలేదు.టంచనుగా రాత్రి పదకొండు గంటలకు ముంబాయి ట్రేన్ కాచ్ చేసాడు.పనులకు ముక్తాయింపు పలికే సరికి గడియారంలో డేటు వారం మారిపోయినై.బెడ్ రూంలోకి నడచుకుంటూ పోతుండగా గోడమీది కాలెండరు పలకరించింది ఓ తేదీ దగ్గర రైట్ మార్క తో.దాన్ని చూస్తేగాని సుమన పెళ్ళి మరునాడే అని గుర్తు రాలేదు వైశాలికి.ఆ అమ్మాయి కోసం పెళ్ళికి అటెండెన్స్ వేసుకోక తప్పదు. ఇంకా ఏవేవో ఆలోచిస్తూనే బెడ్ పై వాలిపోయింది. ఆలోచనలను ఏవైనా వాటిని అలసట డామినేటు చేయడంతో నిద్రాదేవత ఆమెను ఆవహిం చింది.

                                                                                                      ****************
అదే పనిగా మోగుతూ నిద్రాభంగం కల్గించిన గడియారం నెత్తిన ఓ మొట్టికాయ మొట్టి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది వైశాలి ఓ అర గంట తర్వాత లేద్దామని.ఈ సారి ఆమెను పాల బ్బాయి కాలింగ్ బెల్ లేపింది .దానర్థం ఏడైందని.నాలిక్కరుచుకుంటూ లేచింది .వారం రోజులుగా పని మనిషి కూడా రావడం లేదు.అంతా భిన్నత్వంలో ఏకత్వమే.ఆమె పాచిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఈదుకొస్తుంది.భర్త మాత్రం పున్నమ అమాసకన్నట్లు కూలికి పోయి తాగి తందనా లాడుతూ కుటుంబానికి భారంగానే మిగిలిపోయాడు.పైగా వారం రోజుల కింద తాగిన మైకంలో ఓ మోరీలో పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. “మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం.మద్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి నష్టం.కానీ మద్యానిది మాత్రం ప్రభుత్వ ఆదాయం వైపే మొగ్గు .ఈ విషయాలన్నీ ఆమె ను ప్రతి రోజూ కలత పెడుతున్నవే. పెళ్ళి 8.45కే అని ఉంది. ఊడ్వడాలు తుడువడాలు పనికి నడుం బిగించి యమ స్పీడుగా పూర్తి చేసి స్నానం వగైరాలు ముగించి గోడ వైపు చూస్తే పది హేను నిమిషాలే ఉంది పెళ్ళి టైం సుమా అన్నట్లు గడియారం హెచ్చరించింది.కాఫీ తో తృప్తి పడ మని ఆత్మారాముడికి నచ్చ చెప్పి ఇంటి నుండి బయట పడింది వైశాలి.వెతుకుతున్న కళ్ళకు ఒక్క ఆటో కనపడి చావలేదు .మరో నాలుగడుగులు ముందుకు వేసింది.ఐనా ఆటోలు కనపడలేదు. కన పడ్డా రద్దీతో.చౌరస్తాలో దొరకవచ్చన్న ఆశతో కాళ్లకు పని చెప్పింది.సడెన్ గా పక్కనే ఓ కారు ఆగ డమే కాదు డోరూ తెరుచు కుంది .
“వైశాలీ ఎచటికోయి నీ పయనం” అంటూ కారులోంచి చిరునవ్వులు చిందిస్తూ వైశాలీ స్నేహితురాలు సరళ పలకరింపు.
“ఓ పాత విద్యార్థిని పెళ్ళికి” కొంచెం ఆరాటంగానే సమాధానమిచ్చింది వైశాలి.
“పెళ్ళెక్కడ?”
“లక్ష్మీ గార్డెన్స్. ఒక్క ఆటో దొరికి చాపడం లేదు.”అంది ఆతృతగా.
“నేనూ అటే. అమ్మ వాళ్ళింటికి.కారెక్కేసెయ్.”సరళ. బతుకు జీవుడా అనుకుంటూ కారెక్కింది వైశాలి
“మాఇంటి దారే మరిచిపోయినట్లున్నవ్?”వైశాలి
“మరిచిపోవడమా పాడా? టైం దొరికితే కదా! డిసెంబరంతా తేజస్వితోనే సరిపోయిం దనుకో. తునున్నన్ని రోజులూ చుట్టపక్కాలు ..తన స్నేహితులు….వంటా వార్పులు..షాపింగులు.. ఒకటా రెండా…సమస్తం నామీద దాడి చేసాయనుకో.ఫ్లైటెక్కే వరకు ఊపిరాడలేదనుకో.” సమా ధానం చెప్పింది సరళ.
“అదీ నిజమే. నాకు తెలియందేముంది. తరుణ్ వచ్చినప్పుడు నా కథ కూడా అంతే. ఏమరికానో ఏమో?పిల్లలు వచ్చే వరకు నిరీక్షణ. వచ్చింతర్వాత అదో ఒత్తిడి.తిరుగుముఖం పట్టిం
తర్వాత అదో రంది.”అంటూ వివరణ ఇచ్చింది వైశాలి
“ఆటో దొరకకపోవడం ఒకందుకు మంచిదే ఐంది కదూ!”అన్నది సరళ
“అదీ నిజమే..కాని ఎందుకు దొరకలేదంటవ్?” తన సందేహాన్ని వెలిబుచ్చ్ంది వైశాలి
” తర్వాత మూడాలు వస్తున్నాయట .రెండునెలల వరకు మళ్ళీ ముహూర్తాలు లేవట. అందుకే మంచి రోజంటూ ఇవాళ్ళ్టి ముహూర్తంపై అందరి దాడి.” సరళ
“ఏం ముహూర్తాలో ? ఏం మూడాలో? ఏం జాతకాలో? అన్నీ చూసి చేసినా ఎన్నో దురదృష్టాలు.” వైశాలి
“వాటికిచ్చే విలువను మనుషుల వ్యక్తిత్వాలకివ్వడం లేదు. ప్రపంచమంతా డబ్బు మయం ఐపోయింది.” సరళ
“అది సరేగాని మీ అమ్మదగ్గరినుండి వచ్చేప్పుడు మా యింటికి రాకూడదూ? మా ఆయన కూడా ఇంట్లో లేరు “అడిగింది వైశాలి .
” ఐతే మరీ మంచిది. కొంచెం ఫ్రీగా గడపొచ్చు.కానీ నేనొచ్చేవరకు నాలుగవుతుందేమో?” అంది సరళ
“ఐతే ఏంటట? బహుషా ఒంటిగంటకల్లా నేనింట్లో ఉంటాననుకుంట.”వైశాలి
“ఓకే డన్”అంటూ సరళ చెయ్యి కలిపింది.
వాళ్ళ మాటల్లోనే లక్ష్మీ గార్డెన్ వచ్చేసింది .బైబై చెప్తూ కారు దిగిన వైశాలి కాళ్ళు హాలు వైపుగా సరళ కారు వాళ్ళమ్మ ఉండే కృష్ణ కాలనీ దిశగా కదిలినై.వైశాలి లక్ష్మీగార్డెన్స్ ముఖద్వారం చేరుకుంది.పార్కింగ్ ఏరియా రకరకాల కార్లతో నిండిపోయిఉంది ఓ కార్ల ఎగ్స్ బిషన్ లా. ముహూ ర్తం దగ్గర పడుతుండటంతో కొంచెం ఆరాటంగానే అడుగులు వేసింది.ముఖద్వారానికి ఒకవైపు
వధూవరుల ఫొటోలు..మరో వైపు అమ్మాయి తల్లిదండ్రుల ఫొటోలు ఆహ్వానితులుగా. .అన్నిటినీ మించి పౌరాణిక సినిమాల్లో లాగా ఇద్దరు ద్వారపాలకులు అందమైన కట్టెలను ఇంటూ ఆకారంగా పట్టుకొని .ఇదేదో రాచ మర్యాదలా ఉందనుకొని మరో అడుగు ముందుకు వేసింది.కాని ఆ ఇంటూ ఆకారం భీష్మించుకుంది.పోవడానికి వీల్లేదంది.అది వి ఐ పి లద్వారమని తేల్చి చెప్తూ ఓ ద్వార పాలకుని చెయ్యి రెండో గేటుని సామాన్యుల దారిగా చూపిం చింది.వైశాలికి ఆ తీరు అసౌకర్యం గానే కాదు కొంత అవమానంగా కూడా ఫీలైంది. చేసేదేంలేక లోపలికి నడిచింది. పూలవాసనల గుబాళింపు నాసికారంధ్రాలను అదరగొడ్తుంది.తోరణాలు.. డేరాలు..నడిచే దారంతా ఎప్పటి తివాసీలు.. కళ్ళు జిగేల్మంటున్నైడెకరేషన్ అదిరి పోయింది.అది పోస్ట్ హోదాను అద్దం పడు తుంది.హాలంతా అతిథులతో నిండిపోయింది. సీటు ఖాళీగా ఉన్న దాఖలా కనపడలేదు.వైశాలి తన కళ్ళకు పని చెప్పింది సీటు వెతుకమని. ఈ లోగా ఆపద్బంధవిలా సుమన స్నేహితురాలు
మానస ” నమస్కారం” అంటూ పలకరించి ఓ సీటు చూపించింది. “బ్రతుకు జీవి ” అనుకుంటూ వైశాలి ఆ సీటుకు పాత్రత్వం కల్పించింది.
స్టేజ్ వైపు తిరిగిన వైశాలికి వధూవరుల జిలకర బెల్లం కార్యక్రమం కనిపించింది. సమయానికి చేరుకున్నందుకు హాయిగా ఊపిరి పీల్చుకుంది.అదేదో తను చేరకపోయుంటే ఆ కార్యక్రమానికి సార్థకత ఉండేది కాదేమో అన్నంత ఫీలింగ్ తో.ఆ ఆలోచన రాగానే తనలో తానే నవ్వుకుంది.ఒకసారి హాలంతా కలియ చూసింది.సీతాకోకచిలుకలు వచ్చి వాలాయేమో అన్నంతగా మహిళామణుల చీరా జాకెట్లు..గాగ్రాలు..లంగాలకంత ఓణీలు..ఒక దానిని మించి
మరోకటి.ఒళ్ళంతా తాపడం చేసుకున్నారేమో అనే బ్రమను కల్పించే కళ్ళకు మిరుమిట్లుగొలిపే
నగలు .ఒయ్యారాలు ఒలుకబోస్తూ చిరునవ్వులు చిందిస్తూ యువతరంగిణులు.”ఆ అలంకరణలో
అందం చందం సరే.కాని ఈ ఎండల్లో శరీరం వాటిని ఎట్లా తట్టుకుంటుందో పాపం.”వైశాలి తనలో తానే ప్రశ్నించుకుంది వైశాలి తనలో తాను.ఐనా పీత కష్టాలు పీతవి.కందకు లేని దురద
కత్తికెందుకట అని సమాధానమూ తానే చెప్పుకుంది.
మరోసారి వేదిక వైపు దృష్టిని సారించింది. దానికి దగ్గరగా క్రేన్ వంటిదేదో పైకి ..కిందికి…కుడి…ఎడమలుగా కదులుతూ కనిపించింది.కొంచెం గమనిస్తే అది ఫొటోలు తీస్తుందని అర్థమైంది. వేదిక మీదకు చేరి కార్యక్రమ నిర్వాహకులకు వాళ్ళ ఇబ్బంది కొంత తొలగిపోతుందని తృప్తి పడింది.
తెలిసిన తలకాయలేమైనా కనపడుతాయేమోనని హాలంతా కలియచూసింది.ప్చ్..లాభం లేకపోయింది.కాని ఆ కళ్ళకు హాల్లో ఐదారు చోట్ల ప్రొజెక్టర్లు కనిపించాయి.వాటిలో పెళ్ళి తంతును స్పష్టంగా చూడొచ్చన్నమాట.. “అంటే ఏంటన్నట్లు ” తనకు తానే ఓ ప్రశ్న వేసుకుంది.
“పెళ్ళికంటూ వచ్చి ఆ పెళ్లిని స్పష్టంగా చూడలేక ప్రొజెక్టర్ లో పెళ్ళి చూడట మన్నమాట. ”
అనుకుంటుండగానే ఆ ప్రొజెక్టర్ లలో పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు , పెళ్ళి కూతురు విభిన్న భంగి మలలో దిగిన రకరకాల ఫొటోలు కనపడుతున్నాయి.బహుషా దాన్నే ఫొటో షూటింగ్ అంటారేమొ . ఈ మధ్య పిల్లలు మాట్లాడుకుంటుంటె విన్నాను.కొత్త నాగరికతలు.. సరికొత్త సంప్రదాయాలు. ఎవరి ఆనందం వాళ్ళది.కాని ఈ డబ్బులున్న వాళ్ళు ఎన్ని తతంగాలైనా చేయొచ్చు. కాని పులిని చూసి నక్క వాత పెట్టు కున్నట్లు సాధారణ జనం సంగతేంటి?”లక్ష ఆలోచనలు వైశాలి మనస్సులో.
“.వైశాలి ఆలోచనలను భంగం చేస్తూ ధన్ ధన్ మంటూ బాండ్ మోత.ఆ గర్జనకు సమాంతరంగా పెళ్ళి కొడుకు సుమన మెడలో తాళి కడుతున్న దృశ్యం మెరుపులా.కాని వేదిక మెట్ల దగ్గర నల్ల సఫారీలతో బలిష్టమైన కండరాలతో కొందరి ఉనికి దాదాల్లా.
.”ఓహో! వీళ్ళనే బౌన్సర్లు అంటార”ని గుర్తుకొచ్చింది వైశాలికి.
“పెళ్లిలో రౌడీలు లేరే..మరి గొడవ చేసే వాళ్ళెవరు.అంతా అతిథులే కదా!”మళ్ళీ తనలో తనే ప్రశ్నించుకుంది వైశాలి.అమ్మాయి మెడలో మంగళసూత్రం పడిందో లేదో…కనీసం వధూవరులకు వేదిక మీద కుర్చీలను వేయనే లేదు. హాల్లో జనమంతా లేచి బిలబిలమంటూ వేదిక వైపు దండెత్తినంత పని చేసారు.వెంటనే బౌన్సర్లు రంగంలోకి దిగారు.కేవలం పదిమంది చొప్పున మాత్రమే వదలడం మొదలు పెట్టారు. కాని ఆ తతంగం ఓ పదినిమిషాలు కూడా సాగ లేదు. ఆ జన వాహినికి బదులుగా రాజకీయ వాహిని కనపడింది.వచ్చిన రాజకీయ ప్రముఖుడు
యం. యల్. ఏ అని అర్థమైంది. కాని వెనుక ఉన్న జనం..నాయకుల హోదాను చూపించడానికి వచ్చే జనమని జగమెరిగిన సత్యమే. “ఆ నాయకుల వెంట ఉన్నప్పుడు సంఖ్య పక్కన సున్నాలు. వాళ్ళే లేకపోతె కేవలం జీరోలు” తనలో తాను నవ్వుకుంది వైశాలి. బహుషా వాళ్ళు వస్తున్నట్టు సుమన తండ్రికి ముందే సమాచారముందేమొ…వేదిక దిగి వాళ్ళను ఎదుర్కొని వచ్చాడు. మందస్మిత ముఖారవిందాలతో అక్షతాశిస్సులు..కరచాలనాలు..ఆత్మీయ ఆలింగనాలు..ఫొటో దిగటాలు..అన్నీ కళ్ళు మూసి తెరిసే లోపె.ఆ వాహిని సుమ వాళ్ళన్నయ్య అసిస్టెన్స్ లో డైనింగ్
హాలు దిశగా సాగింది.మళ్ళీ జనవాహిని మంద్రంగా…బౌన్సర్ల అదుపాజ్ఞల్లో.
వైశాలి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి.బ్రేక్ ఫాస్ట్ చేయనందుకు తనను తానే తిట్టుకుంది.లేచి ఆ లైన్లో కలుద్దామనే అనుకుంది . కానీ చీమ కూడా దూరడానికి వీలు లేదన్నట్లు
ఆ లైను కదులుతుంది.” ఇంటి దారి పడితే…” మరో ఆలోచన.”ఉడికే దాక ఉన్న ఓపిక ఉమ్మొగిలే
దాక ఉండాలి కదా! పైగా సుమన ఫీలౌతుంది. లాభం లేదు. ఉండి తీర్చాల్సిందే . ఓపిక పట్టా ల్సిందే” నిర్ణయానికి వచ్చింది.ఆకలిని జయించడానికా అన్నట్లు తన చూపులను వేదిక వైపు తిప్పింది.దానికి కుడి వైపుగా యువతుల గుంపు దాండియా ఆడుతూ..నవ్వుతూ ..తుళ్ళుతూ..
ఆనంద డోలికల్లో. “సరదాకు అవకాశం కల్పంచిన పెళ్ళి సందడి.” అనుకుంది వైశాలి.ఆమె చూపులు వధూవరులను వెతికాయి.కాని ఆ చూపులకు భంగపాటు ఎదురైంది.ఎందుకిలా జరి గిందనుకుంటూ ఎడమ వైపుగా కదిలిన ఆ చూపులకు చప్పుళ్ళతో ఓపెన్ స్పేస్ వైపు పూజారితో సహా పోతున్నట్లు తెలిసింది.” పగలే వెన్నెలలో అబ్బాయి అమ్మాయికి అరుంధతీ (లేని)నక్షత్ర దర్శనం చేయిస్తాడేమొ.తప్పదు మరి ఈ అమ్మాయీ అరుంధంత పవిత్రంగా.. పతి వ్రతగా ఉంటేనే ఆ వరుడి జన్మ సార్థకం. !”గొణుక్కుంది తనలో తను. ఎంతకీ లైనుకు ముక్తాయింపు
కనపడక పోవడంతో కొందరు క్యూ ను క్విట్ చేసి భోజనాల దారి పట్టారు.దాంతో లైను కొంచెం పలుచ పడ్డది. ఒంటిగంటకా వస్తుంది. ఆకలి ఆగలేనంటుంది. వైశాలి లేచింది.లైన్లో కి చొచ్చుక పోయింది.ఆమె వెనుక మరికొందరాడవాళ్ళు.ఆ తర్వాత చాలామంది అచ్చంగా పరీక్ష హాల్లో విద్యార్థుల్లా. మొత్తానికి వైశాలి ఆడవాళ్ళకో దారి చూపించినామె ఐంది.వెనకాల ఉన్న మగ
మహారాజులు మొదట కొంత బిత్తర పోయినా ఆ తర్వాత తమ ఓపికను పరీక్షించే సత్తా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని నిరూపిస్తూ తమ చేతుల్లో ఉన్న అక్షతలను నిలబడిన చోటినుండే (ఉద్యమ కారులు బస్సులపై రాళ్ళు విసిరినంత స్పీడులో )వధూవరులపైకి విసిరి డైనింగ్ హాల్ దారి పట్టారు.
” పెళ్ళి కి వెళ్ళి రావడాన్ని మొత్తంగా ఐదు అధ్యాయాలుగా విభజించ వచ్చేమొ.వెళ్ళడం
మొదటి అధ్యాయం కాగా..పెళ్ళి తతంగం పూర్తయ్యే వరకు నిరీక్షించి వేదిక చేరుకొని వధూవరు లను కలవడాలు రెండు మూడు అధ్యాయాలు కాగా భోజన కార్యక్రమం నాలుగు తిరిగి వాహనం దొరికి ఇంటికి చేరుకోవడం ఏదో అధ్యాయం.దానితో పెళ్ళి తతంగం సమాప్తమన్న మాట.”అని తీర్మా నించుకున్న వైశాలి ఆరాటంతో కదిలి అక్షతలతో ఆశీర్వదించి సుమన చేతిలో తను తెచ్చిన
గంగు నవల ను కానుకగా ఇచ్చింది .తనను చూసిన సుమన సంతోషానికి అవధులు లేవు.ఉబ్బి తబ్బిబైపోయింది .ఉన్నఫళంగా పాదాభి వందనం చేసింది.ఆ అమ్మాయి ఆనందం చూడగానే అంతసేపు వైశాలి పడ్డ యాతన మటు మాయమైంది. పెళ్ళి కొడుకుతో పాటు తన తల్లితండ్రులకు తన టీచర్ ను సుమన పరిచయం చేసినా అవి మొక్కుబడి పలకరింపులే అయ్యాయి. భోజనం తప్పకుండా చేయమని ఆ అమ్మాయి అభ్యర్థన.తప్పదన్నట్లు వైశాలి డైనింగ్ హాలు వైపు దారి తీసింది.

                                                                                                    ****************

డైనింగ్ హాల్లోకి అడుగు పెడుతున్న వైశాలికి అక్కడే ఏదో పార్టీషియన్ కనిపించింది.దానిముందూ ధవళ వస్త్రముల వేత్రహస్తులు …వేత్రములను ఇంటూ ఆకారంగా పట్టుకొని.అటువైపు వెళ్లిన వాళ్ళందరిని ఓ ఖద్దరు శాల్తీ జనరల్ డైనింగ్ కు వెళ్ళాల్సిందిగా సూచిస .ఆ సూచన ఓ వృధ్ధదంపతులకూ చేరింది.హాలంతా దోస..పానీ పూరి.. సమోసా చాట్ ..ఐస్ క్రీం..స్వీట్స్ ..ఫ్రూట్స్ వంటి తిను బండారాలతో ముస్తాబై ఉంది .అన్నం..పప్పు ..కూరలు..వంటి కూరలు షరా మామూలే. వైశాలి మనసు భోజనం వైపే మొగ్గు చూపింది .అన్ని చోట్ల ఉన్నట్లు అక్కడా అంతే రద్ది.ఐనా తప్పదు.ఇంట్లో తిండి ఎట్లగూ సిద్ధంగా లేదు.ఇక్కడే
ఇంత ఎంగిలి పడుదామని ముందుకు కదిలింది.ప్లేట్ లో రెండు నాన్ ముక్కలు..ఓ కూర.. పప్పు ..కొంచెం అన్నం పెట్టుకొని పక్కకు జరిగి తినడానికి ఉపక్రమించింది .నాన్ నుండి ఓ చిన్న ముక్క
తీసుకుందామని ప్రయత్నం చేసింది. కాని దాని నుండి ముక్క భీష్మించుకుని చినగను గాక చినగనంది.మొత్తానికి వైశాలి విశ్వప్రయత్నంతో చేతిలోకి ఓ ముక్క చేరింది.కూరను చేర్చి నోట్లో పె
ట్టుకుంది.నోరంతా నూనె మాయమవటమే కాదు ఆ నాన్ ను పళ్ళు నమలలేమని తేల్చి చెప్పు తున్నాయి.తినడానికి మరి కొంత ప్రయత్నం చేసింది . అన్నమైనా తిందామనుకుంటే సరిగా ఉడుకనే లేదు.ఇక లాభం లేదనుకొని ప్లేటును టబ్ లో చేర్చింది.ఆ టబ్ ను చూసి వైశాలి మనసు జాలితో నిండి పోయింది.పాపం దాని నిండా తినకుండా మిగిలిన ఆహార పదార్థాలూ నిండి పోవ
డంతో మా దీనావస్థను చూడండని వేడుకుంటుంటున్నాయి.
చేతులు కడుక్కొని వస్తున్న వైశాలికి ఇందాక కనిపించిన పెద్దవాళ్ళు ప్లేట్ల భారంతో నిలబడక..తినలేక.” డబ్బు దర్పం ఉన్న వాళ్ళకేమొ టేబుల్ ముందు కూర్చొని తినే సౌకర్యవంత మైన ఏర్పాట్లా?ముసలి ముతుక..పిల్లా జెల్లా నానా అగచాట్లు పడాలా? “ఎవరినీ ప్రశ్నించలేక
తనలోతానే గొణుక్కుంది.ఇక ఇంటి దారికై ఎక్సిట్ వైపు పోతుండగా ఆ పెద్దాయన జారి పడబోగా
ఎవరో ఒకాయన గబుక్కున ఆసరా ఇచ్చాడు. లేదంటే పాపం ఏ కాలో చెయ్యో విరగ్గొట్టుకుని హాస్పిటల్ కు ఆదాయం పెంచేవాడు.అక్కడంతా నీళ్ళ రొచ్చుందని వైశాలి కళ్ళు గమనించాయి.
“పాపం ముసలాయనచస్తుండే . జర అసొంటిదెవతొ పొయ్యి చేతులు కడుగొచ్చు కదా”
ఓ గొంతు ప్రశ్న.
” సగం తాగిన గిలాసలు సుత ఏడంటె ఆణ్ణే పెట్టవట్టరి.మల్లంత సదివిన మారాజులే.”ఓ పనామె
“కూరనారలు సుత నిలబడ్డకాన్నే ఎయ్యవట్ట్రి. బగ్గ నగలు దిగేసుకొని షోకు షోకు బట్టలేసుకోంగనే సరిపోతాది?”ఇంకో పనామె
వాస్తవాలైన వాళ్ళ మాటలను వింటూ “చదువు వల్ల వివేకం కలిగే రోజులకు కాలం చెల్లి
పోయిందని తనకు తానే సమాధానం చెప్పుకొని అక్కడినుంచి నిష్క్రమించింది వైశాలి.

                                                                                                   ****************

వైశాలి ఇంటికి చేరుకుని కాళ్ళు చేతులు కడుక్కుందో లేదో మంచానికి తన శరీరాన్ని అప్పచెప్పింది. పెళ్ళి వాతావరణం కారణంగా ఆమె పై ఆకలి ..అలసట…అశాంతి ముప్పేటలా దాడి చేసాయి. కాని ఆ మూడింటిని నిద్రాదేవత జయించింది.నాలుగింటి వరకు ఆమెకు తోడుగా నిలిచి కాలింగ్ బెల్ చప్పుడు తో బై బై చెప్పి వెళ్ళిపోయింది. తలపు తీసిన వైశాలికి సరళ కనపడటంతో నాల్క కరచుకుంది.
“మంచి నిద్రలో ఉన్నట్టున్నవ్? డిస్టర్బ్ చేసానేమొ?”అంది సరళ
“అదేం లేదు.రెండు గంటలు మాంచి నిద్ర పోయాననుకో రా! రా! .”అంటూ డైరెక్ట్ గా వంటింట్లోకి దారి తీసింది.
“కాసేపు ఇక్కడే కూర్చొని ముచ్చట్లాడుదాం. ఎట్లాగూ మీ ఆయన కూడా లేరు కదా! ఇవాళైనా ఆ వంటింటి గొడవను మరిచిపోదాం. పైగా నువ్వేమొ పెళ్ళి భోజనం …నేనేమొ అమ్మ చేతి వంట.” సరళ.
“పెళ్ళి భోజనమా? మరేమన్నానా? “అంటూ తన ఆకలి ఘోషకు కారణాలన్నిటినీ పెళ్ళి
తతంగాలతో పాటు సరళ ముందు కుమ్మరించింది వైశాలి.
“నిజమే వైశాలీ ! ఈ మధ్య కాలంలో పెళ్ళి పిలుపులకు..కల్పించే సౌకర్యాలకు.. ఏమా త్రం పొంతన ఉండటం లేదు..హోదా ప్రదర్శనలకిచ్చే ఇంపార్టెన్స్ ఆతిథ్యానికి లేదు.”
“ఔననుకో. కాని చిన్న సవరణ. రాజకీయ నాయకులకు …డబ్బును మారాజులకు మంచి ఆతిథ్యమే ఇస్తారు.”సరళ
“అదే కదా! నేననేది.వాళ్ళకేమొ ప్రత్యేకమైన డైనింగ్ ఏరియా …టేబుళ్ళు.. కుర్చీలు.. వడ్డనలు…మర్యాదలు…సమస్తం.మిగిలిన వాళ్ళేమొ ప్లేట్లను అడుక్కునే చిప్పల్లాగ పట్టుకొని
అన్నం పప్పు ..కూరా ..చారంటూ లైన్లో.”బాధతో అంది వైశాలి.
“ఆ లైనైనా సరిగా ఏడ్చి చస్తుందా అంటే అదీ లేదు.నేను వడ్డించుకుని వెనక్కి తిరుగు తున్నానో లేదో ఓ వీర వనిత నా నెత్తి మీదుగా ప్లేటు పెట్టి కూర వేయించుకోవడంలో నా బ్లౌజు ను కూడా పావనం చేసింది.ఆ బ్లౌజిప్పుడు డ్రై క్లీనింగ్ దర్శనం చేసుకోక తప్పదు.”మళ్ళీ చెప్పుకొచ్చింది వైశాలి .
“జనాన్ని పిలిచి అవమానించడమంటే ఇదేనేమొ.”సరళ
“ఈ పెళ్ళిలో అతిథి దేవో భవ..గురు దేవో భవ..రెండు అభాసుపాలైనై. అఫ్ కోర్స్.. ఇందులో సుమన ప్రమేయం లేదనుకో.” సుమనకు మాట రాకూడదన్నట్లు మాట్లాడింది వైశాలి.
“శిష్యురాలంటే ఎంతభిమానమో..నాకూ ఈ అనుభవాలు చాలానే ఉన్నాయి.”నవ్వింది సరళ.
“అందరి అనుభవాలూ అవేనమ్మా! మార్గాన్వేషణ చేస్తే బాగుండు.”వైశాలి
” ఎవరో ఎందుకు .పిల్లి మెడలో గంట కట్టడంలా.మనింటి పెళ్ళిల్లే నాంది .”
” ఓకే డన్ “అంటూ ఇద్దరు చేతులు కలుపుకున్నారు.మాట్లాడుతూనే వైశాలి వెజిటేబుల్ కమ్ టమాటా బాత్ ను ఆరగించి టీ సేవించారు.ఆపై ఎన్నో సామాజికాంశాలూ వాళ్ళ చర్చలలో వచ్చాయి.గోడ గడియారం ఏడైందని హెచ్చరించడంతో “ఇక నాకు సెలవియ్యి తల్లీ”అనుకుంటూ ఉన్నఫళంగా లేచింది సరళ.
“ఇంకాసేపుడ్డొచ్చు కదా!”బతిమాలింపు ధోరణిలో.
“మా మానవుణ్ణి ఎంత సేపు నిరీక్షణలో పెట్టమంటావు.?”
“మనలాగా నిరీక్షణలు తట్టుకునే శక్తి వాళ్ళకెక్కడిదిలే. “అంటూ సరళను సాగనంపింది
వైశాలి.

****************

ఓ సంవత్సర కాలం గడిచింది.యాదృఛ్ఛికమో …ప్రణాళికో…డిసెంబరు నెలలో తరుణ్
తేజస్వి ఇండియాకు వచ్చేసారు.తామిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డామంటూ పెళ్ళి ప్రపోజల్ ను తల్లి కతండ్రుల ముందుంచారు.ఒప్పుకోకపోవడానికి వాళ్ళ కే కారణాలు కన్పించలేదు. ఒప్పేసు కున్నారు కూడా.రెండు కుటుంబాలు కూచుని రిజిస్టర్ మారేజ్ కమ్ రిసెప్షన్ అరేంజ్ చేసు కున్నా రు. అంటే రిసెప్షన్ హాల్లో నే రిజిస్టేషన్ జరిగేట్టు.మొత్తంగా ఆహ్వానితులను రెండు వందలకు పరిమితం చేసుకున్నారు. వేదికకు ఒకవైపు సుమధురగాన లహరిని ఏర్పాటు చేసారు. అతిథు లంతా హాయిగా టేబుళ్ళ ముందు కూచుని హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించగల్గిన వాతావరణం
కల్పించారు.హాలులో “అతిథి దేవో భవ”. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” “భోజనం న పరిత్యక్త
వంటి బానర్లను ఏర్పాటు చేసారు.వచ్చిన వాళ్ళందరిని పేరు పేరునా పలకరించారు.పసందైన విందునిచ్చి వీడ్కోలునిచ్చారు.ఈ బాట పదుగురికి ఆదర్షం మరేమున్నది.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అమ్మ

by dillep February 28, 2022
written by dillep

అమ్మ నవ్వితే…
గుత్తులు గుత్తులుగా పూసిన
శిక్కుడు పూల లెక్కుంటది

అమ్మ కోపం చేస్తే…
పడమటేల సూరీడు
సుర సుర కాలినట్టుంటది

అమ్మ ప్రేమ చూపితే…
తేనె జడి వానలో
నిలువునా తడిసినట్టుంటది

అమ్మ యెదకద్దుకుంటే…
ఏండ్ల నాటి భారమంతా
ఒక్కసారిగా తీరినట్టుంటది

అమ్మ నా నెత్తి నిమిరితే…
వెయ్యేనుగుల బలం
ఒంట్లో చేరినట్టుంటది

February 28, 2022 1 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్త్రీత్త్వ వేదనలో ‘జ్వలిత కౌసల్య’

by Dr. Triveni February 28, 2022
written by Dr. Triveni

‘ఆధునిక రచనల్లో ప్రాచీన సాహిత్యంలో కన్నా స్త్రీ ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ విముక్తిని కోరే మహిళా చైతన్య భావాల వ్యాప్తి, పరిధి ఇటీవలి దశాబ్దాల్లో ఇంకా విస్తరించింది. స్త్రీ వాదోద్యమ ప్రభావం పురుషుల మీద, పురుషుల రచనల మీద పడడం ఆహ్వానించదగింది. స్త్రీవాదులు కోరే సాంఘిక న్యాయాన్ని ఇప్పుడిప్పుడే పురుషులు అర్థం చేసుకుంటున్నారు. అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో జరుగవలసిన అభివృద్ధి చాలా ఉన్నప్పటికీ, కనీసం ప్రథమ దశ ప్రారంభమయింది. భూమయ్య చిత్రించిన ‘జ్వలితకౌసల్య’ ను ఈ దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి. కావ్యనామమే కావ్య వస్తు స్ఫోరకంగా ఉంది. అయితే భూమయ్య కావ్యం స్త్రీవాద కావ్యం అని నేను ముద్ర వెయ్యటం లేదు. ఈ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి స్త్రీవాద పరిచయం ఉపయోగిస్తుందనే నా సూచన’ (పుట.2)

‘జ్వలిత కౌసల్య’ మొదటి ముద్రణ సందర్భంలో ‘లఘుటిప్పణి’ రచిస్తూ ఆచార్య చేకూరి రామారావు ప్రస్తావించిన అంశం ఇది. ఆచార్య అనుమాండ్ల భూమయ్య 1999 నాటికే ఈ పుస్తకాన్ని రచించి ప్రచురించారు. స్త్రీవాద భావజాలం తెలుగు సాహిత్యంలో  ప్రవేశించి విస్తృత ప్రయోజనాలు చేకూరుతున్న కాలమది. స్త్రీవాద పరివ్యాప్తిలోను, ఉద్యమ రూపంలో కార్యరూపం దాల్చడంలోను సాహిత్యం హితోధిక సాయం చేస్తున్న సమయమది. ఆ పరిమిత కాలంలోనే స్త్రీవాదం ప్రపంచ ప్రమాణాల మీద నిలబడుతూ వినూత్న భావజాలాన్ని ప్రకటించింది. స్త్రీలు వెలువరించిన సాహిత్యమే గాక, ఆచార్య చేకూరి రామారావు చెప్పినట్లు పురుషుల సాహిత్య మనోగతాలపై ప్రభావాన్ని చూపింది. సంప్రదాయక పౌరాణిక పాత్రల్లో గల స్త్రీల అభినివేశాన్ని  సాహిత్యబద్ధం చేస్తూ నూతన ఒరవడిని సృష్టించారు. ఆధునిక సాహిత్య ధోరణులకు అనుగుణంగా సావిత్రి, పురూరవ, సీత, జాబాలి, వరూధిని, ఊర్మిళ, కౌసల్య, కైకేయి, కచదేవయాని, గాంధారి, పూర్ణమ్మ, కన్యక పాత్రల భావైక స్ఫూర్తిని చిత్రించారు. స్త్రీ పౌరుష కాంక్షను, శక్తి సామర్థాలను, మనోఅభిష్టాన్ని, చింతనాత్మక వ్యధను వెలువరించారు. తద్వారా ఆధునిక సమాజానికి ఒక ఉపదేశాత్మక సందేశం అందించారు.

‘జ్వలిత కౌసల్య’ కావ్యాన్ని స్త్రీవాద కోణం నుండి అవగాహన చేసుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశం. సహృదయులు అవలోకిస్తారని ఆశిస్తున్నాను. ఆచార్య అనుమాండ్ల భూమయ్య దృక్పథం స్త్రీవాదం గాకపోయినాÑ వస్తు నిర్దేశం దృష్ట్యా ఈ అంశం నిర్ణయాత్మమైందని భావిస్తున్నాను. పూర్తి కథాంశం కౌసల్య గుండెలలో గూడు కట్టుకున్న అగ్నిజ్వాలను విచ్ఛేదం చేయడం. కౌసల్య మనోగతాన్ని ఆవిష్కరించడం. తద్వారా దీర్ఘకాలంగా ఉన్న మనోవ్యధ నుండి ఉపశమనం కోరుకోవడం. ఈ నేపథ్యంలోనే తన సంసారిక జీవితంలో తీరని కోరికలు, బహుభార్యత్వం వల్ల భర్త నుండి పొందిన ప్రేమానురాగాలు, తోటి సవతులతో పడిన అవమానాలు ఒకటేమి సగటు మహిళ పడే ఆవేదన కౌసల్యలో ఆవిష్కృతమవుతుంది. కౌసల్య మనోవేదన స్త్రీవాద లక్షణాలకు అన్వయింపదగినవే.

మరొక అంశం ‘జ్వలిత కౌసల్య’ ఒక విధంగా చేతనాత్మక కావ్యం. అంతర్గత మధనం, భావాల సంఘర్షణ, అనుభవాల సంచయం అన్ని కలిపి మనో విశ్లేషణ సూత్రాల్లోకి కౌసల్య ఇమిడిపోతుంది. మానసిక వ్యధను ప్రత్యక్షంగా ఈ కావ్యంలో చిత్రించారు కవి. ఎంతో కాలంగా మనస్సులో దాచుకున్న ఆవేశాన్ని, క్రోధాన్ని బయట పెట్టడం మనోవైజ్ఞానిక అంశాలకు అనువర్తించవచ్చు. అచేతనంలో దాగి ఉన్న మానసిక సంవేదనను చేతనత్వంలోకి తీసుకొని రావడం ఇందులోని ప్రధానాంశం. దు:ఖప్రోదిని చేధించడానికి కవి ఈ కావ్యాన్ని ఆలంబనగా చేసుకున్నారు. తనకు కలిగిన అన్యాయాన్ని మరొకరి విషయంలో కలుగకుండా ఉండడంలో కౌసల్య చేసిన ఉపదేశం సత్ప్రవర్తన దిశగా నడుస్తుంది. కథాగమనాన్ని, పాత్రల ప్రవర్తనా శైలిని కవి అత్యంత నేర్పుతో ప్రదర్శించారు.

ఉపదేశాత్మకంగా కావ్యాన్ని వెలువరిచడంలో కవి ప్రధాన శ్రద్ధ వహించారు. ఆధునిక సాహిత్యంలో ఇటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. స్వతంత్ర కథలను తీసుకొని పాత్రలపరంగా ధర్మప్రభోదం విస్తృతం చేశారు రచయితలు. అంతేగాక సంప్రదాయిక పాత కథల ప్రయోగం నేటి సమాజాన్ని సంస్కరించాయి. సందేశాత్మకమైన గాథలు వ్యవస్థ పునరుద్ధరణకు కృషిచేశాయి. సామాజిక ప్రయోజనానికి ప్రాచీన సాహిత్యంలోని గుణాత్మకమైన వస్తు నేపథ్యం కవులకు తోడ్పాటునందించాయి.

‘జ్వలిత కౌసల్య’ కావ్య స్వభావంలో స్త్రీవాద భావవ్యక్తీరణ మనోవైజ్ఞానికి విశ్లేషణ, ఉపదేశాత్మకం వంటి విభిన్నమైన మౌలికాంశాలను గుర్తించవచ్చు. కవి కావ్య నిర్మాణంలో ప్రకృష్టమైన వస్తువును సరళతరం చేశారు. పద్య రచనా సౌగంధంలో మేటి ఆచార్య అనుమాండ్ల భూమయ్య రామాయణ గాథలోని కౌసల్య మనోవేదనను వాల్మీకి రచనాపరంగా నినదించారు కవి. వాల్మీకి రామాయణంలోని ఆయోధ్య కాండలో 20వ సర్గలో కౌసల్య శ్రీరాముని ఎదుట తన వేదనను వ్యక్తపరిచిన ఘట్టం ఉంది. మొత్తం ఆరు సర్గలలో వ్యక్తపరిచిన ఆవేదన కవి కావ్యానికి ప్రధానాధారంగా నిలిచింది. ఆ ప్రేరణ వల్లనే ఈ కావ్యం రూపొందింది. శ్రీరాముడు ఈ జన్మకు ఏకపత్నీ వ్రతుడిగా ఉంటానని ప్రమాణం చేయడం ఇందులోని ముఖ్యాంశం. కథాంశాన్ని మొత్తం ఎనిమిది ఉప శీర్షికలలో విభజించారు. సంక్లిష్టమైన కథ ఉప శీర్షికలో ఒద్దికగా నిలిపారు భూమయ్య. కైకేయి వరం, జ్వలిత కౌసల్య, అనంత క్రోధం, మాతృ హృదయం, పితృ వాక్యం, పుత్ర వాత్సల్యం, ఏకపత్నీ వ్రతం, మంగళాశాసనం వంటివి ఈ కావ్యానికి ఒక క్రమణికను సూచించాయి. కథా గమనంలో కార్యోన్ముఖతను సాధించడం కవి కవితా ప్రక్రియలో ప్రదర్శించిన ప్రత్యేక నైపుణ్యం. 109 పద్యాలు కలిగిన ఈ కావ్యం నాలుగు ముద్రణలు సంతరించుకోవడం విశేషం. చేకూరి రామారావు, బేతవోలు రామబ్రహ్మం, పేర్వారం జగన్నాథం వంటి విమర్శకులు ఈ కావ్య ముద్రణలో ముందు మాటలు రాశారు. అబ్బూరి ఛాయాదేవి, మలయవాసిని, వాసా ప్రభావతి, వెంకమాంబ, గంగప్ప వంటి సాహితీవేత్తలు స్త్రీ సంవేదనా రూపంలో ‘జ్వలిత కౌసల్య’ను పరామర్శించారు.

తండ్రి ఆజ్ఞ మేరకు పినతల్లి ఇంటికి వెళ్ళిన శ్రీరాముడికి ఘోర ఉపద్రవం మీద పడుతుంది. పట్టాభిషిక్తం పొందే వేళలో అరణ్యానికి వెళ్ళాలనే కైక అనుజ్ఞను శ్రీరాముడు శిరసావహిస్తాడు. తన తల్లితో నివేదించి అనుమతి పొందడానికి కౌసల్య భవనానికి వచ్చినప్పటి నుండి కథా ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఆచార్య అనుమాండ్ల కౌసల్య మనో చింతనను ప్రత్యక్ష పెట్టడానికి ఆరంభ పద్యాన్ని ప్రయోగించారు. తల్లిదండ్రుల సాపేక్ష కైకేయి వరంలో ఉపేక్ష ప్రత్యక్ష కావ్య కథన ధారకు ఉత్కర్షగా నిలిచింది.

తల్లి కొడుకుల ఆప్యాయతా వాత్సల్యాలను అత్యంత మధురంగా భూమయ్య ప్రవేశపెట్టారు.

స్వాగతింప తన కెదురు వచ్చినట్టి

తల్లి పాదమ్ముల మ్రొక్కె ధర్మమూర్తి

రామచంద్రుండు, కౌసల్య రామునెత్తి

శిరము మూర్కొనె కౌగిట జేర్చి                 (పుట.15)

వర్తమాన కాలంలో తెలుగువారింటి వ్యవహార రూపంలో ఉన్న ఆచార సంప్రదాయాలను ప్రవేశపెట్టారు కవి. కౌసల్య రామచంద్రుల అనుబంధాన్ని చూపించారు. శ్రీరాముడు శిరస్సు వంచి గౌరవ వందనం చేయడం, కౌసల్య శ్రీరాముడిపై పుత్ర వాత్సల్యాన్ని ప్రకటించడం హృదయ మనోహరంగా భూమయ్య రచించారు.

గతంలో తన తండ్రి కైకకు ఇచ్చిన రెండు వరాలను ప్రస్తుతం తీర్చుకుంటున్నట్లు… తల్లితో నివేదిస్తాడు శ్రీరాముడు. ఒకటి భరతుడికి యువరాజ పట్టాభిషేకం, రెండవది పద్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యవాసం చేయడం. ఈ విషయాలు తెలిపి అడవులకు వెళ్ళడానికి తల్లి కౌసల్య అనుమతిని పొందడానికి వచ్చినట్లుగా తెలుపుతాడు. తండ్రి ఆజ్ఞను పాటించడం ఉత్తమ ధర్మంగా ప్రకటిస్తాడు. ఒక్కసారిగా రాముడి మాటలు విన్న కౌసల్య ‘స్వర్గమున నుండి పడిన దేవత వోలె నేల పడిపోయె’ అని కవి వర్ణిస్తాడు. శాపవశాన అప్పుడప్పుడు దేవ లోకం నుండి దేవ కన్యలు, కిన్నెరలు, గంధర్వులు, కింపురుషులు భూలోకం మీద ఉద్భవించడం చూస్తుంటాం. భూమయ్య ఈ ఉపమానం ప్రయోగించడంలో తన జన్మను కోల్పోయిన స్త్రీ ధైన్యస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కౌసల్య దు:ఖ వారధికి ఇది అనుసంధానింపబడిరది.

స్త్రీలు తమకు కలిగిన శోకానికి, విషాదానికి ప్రకృతిని ప్రమేయం చేయడం గమనిస్తుంటాం. కౌసల్య తన కుమారునికి కలిగిన విపత్తుకు చింతిస్తుంది. ‘ఇదేమి దినము కత్తులే కిరణములుగా కరకు గుండె దాల్చి సూర్యుడిదేలా ఉదయమునందె’ అంటూ తన విధికి, వ్యధకు విలపిస్తుంది. ఒక్కో దినం గడియను బట్టి శుభాలు, అశుభాలుగా పరిగణింపబడుతాయి. కాలం మీద, సూర్య చంద్రుల కాలగమనం మీద జనులకు కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు  ఉన్నాయి. ప్రకోపాలు కూడా లేకపోలేదు.

‘పుట్టినింట ఆనాడు నేపొందిన సుఖ

మేమో కాని, ఈ మీ తండ్రి ఇంట నేను

కాలు మోపిన పిదప సుఖము నెరుంగ

నిన్ను గన్నాను బ్రతుకు కన్నీరు తడిచె’

అంటూ కౌసల్య తన జీవిత గాధను వినిపిస్తున్న సందర్భంలో ఒక విషయం స్పష్టమవుతుంది. పుట్టింట్లో తానెంత సుఖం పొందిందో తెలియని తనంలోనే కౌసల్య వివాహం జరిగింది. బాల్యంలోనే దశరథ మహారాజుతో పరిణయం జరగడం కూడా ఆమె దు:ఖానికి ఒక హేతువు. బాల్య వివాహాల మీది దుష్ప్రభావాలు రామాయణ కాలం నుండి భారంగా మారాయని ‘జ్వలిత కౌసల్య’ ద్వారా ప్రత్యక్షంగా తెలుస్తుంది. చివరకు అంతపుర స్త్రీలు అయినా వైవాహిక జీవితంలో దు:ఖ సాగరాన్ని ఈదారనడానికి ఈ దృష్టాంతం తార్కాణంగా నిలుస్తుంది. తాను పుట్టి పెరిగి, ఆడి పాడి, ఆనందంగా గడిపిన రోజులు అనుభవంలో లేని పరిస్థితి ఆమెది. ఇక వివాహం అయిన తర్వాత అత్తవారింటిలో ఏనాడు సుఖం పొందినట్లు ఏ ఆనవాలు వ్యక్తపరచలేకపోవడం ఆమె విధిరాతను తలపోస్తాయి. దీనికి రెండు కారణాలను కవి భూమయ్య ప్రస్ఫుటం చేశాడు. ఒకటి కౌసల్య వివాహానంతరం భర్త నుండి సుఖం పొందలేకపోవడం. దీనికి కారణం దశరథుడి బహుభార్యత్వ ప్రాధాన్యం. కైకేయిపై మోజును పెంచుకోవడం. ఆమెకు దాసుడు కావడం. రెండవది సపత్నుల వ్యవహార ధోరణి. కౌసల్య పట్ట మహిషి అయినా ఆమెకు గౌరవాదరణలు దక్కలేకపోవడం. సపత్నుల పరుష వాక్కులు ఆమె హృదయాన్ని గాయపరచడం. అవమానాల జలధి ఉదృతంగా మారి గుండెలో సుళ్ళు తిరగడం.

న దృష్ట పూర్వం కళ్యాణం సుఖం నా పతి పౌరుషే

అపి ప్రత్యే2పి పశ్యేయ మితి రామాస్థితం మయా                 అయోధ్య : సర్గ : 20 : శ్లో : 38

అత్యంత నిగృహీతాస్మి భర్తుర్నిత్య మతంత్రితా

పరివారేణ కైకేయ్యా సమావాప్యధవా2వరా                         అయోధ్య : సర్గ : 20 : శ్లో : 42

వాల్మీకి రామాయణంలో శ్లోకాలను అనుమాండ్ల భూమయ్య తన ముందు మాటలో ప్రస్తావించారు. భర్త వల్ల సుఖం లేకపోయిన విషయాన్ని వాల్మీకి రామాయణంలో పై శ్లోకాల్లో తెలుపబడిరది. ఈ కావ్యానికి రామాయణ శ్లోకాల్లో కౌసల్య హృదయ తప్త జ్వాలను కవి ప్రవేశపెట్టారు. ఈ శ్లోకాల ఆధారంగానే కరుణ రసాత్మక గాథగా ఈ కావ్యం రూపాంతరం చెందింది.

ఙ వంధ్యత్వం :

కొడుకు మీద ఉన్న ప్రేమ, వాత్సల్యం కౌసల్య నోట అద్భుతంగా ప్రకటింపజేశారు భూమయ్య. శ్రీరామ చంద్రుడు రాజ్యానికి యువరాజు పట్టాభిషిక్తుడైనప్పుడే తాను సుఖపడే దశ వస్తుందని భావించింది. కౌసల్య తన కడుపు తీపి మేర రామచంద్రుని అల్లారు ముద్దుగా పెంచుతుంది. ఆ సమయంలో నిప్పులాంటి వార్త ఆమె అంతరంగాన్ని కల్లోలం చేసింది. పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో వనవాసం చేయటం అనే తండ్రి ఆజ్ఞను ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆ విషయం ముందుగా తెలిసి ఉంటే కొడుకుగా శ్రీరాముడిని కనకుండా ఉండేదానిని అని ఆమె బాధపడుతుంది. కన్నతీపిని కూడా వద్దనుకునే విషమ పరిస్థితి కౌసల్యకు ఎదురవడమనేది మాతృ హృదయం కలవరపడే విషయం.

నాడు నిన్నునే గనకున్న నష్టమేమి

కలిగెడిది? వంధ్యయను పేరొకటి యే తప్ప

సంతులేదన్న ఏకైక చింత తప్ప

వంధ్యకు మరొక్క చింత రవ్వంత లేదు                  (పుట.20)

ఏ ఇల్లాలు అయినా గొడ్రాలుగా ఉండడం అనే విషయాన్ని కలలోనైనా తలంచదు. కాని కౌసల్య తన నోటి ద్వారా ఆ పద్యాన్ని ఉచ్ఛరించడం అత్యంత వేదనాభరితమైంది. కొడుకును కని అడవుల పాలు చేయడం కంటే గొడ్రాలుగా మిగిలిపోవటమే ఉత్తమంగా భావించిన కౌసల్య కడుపుకోతను ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య పాత్రలో స్త్రీ దు:ఖ హేతువుకు పరాకాష్టగా వంధ్యత్వమనే శబ్దాన్ని ప్రయోగించడం గమనించవచ్చు.

ఙ కడుపుకోత :

కౌసల్య పరి పరివిధాలుగా శ్రీరాముడి మీద ఉన్న తల్లి ప్రేమను వ్యక్తపరిచిన తీరు కవి తన నేర్పుతో ప్రదర్శించాడు. తన దు:ఖానికి అంతం లేదని వాపోతూ, తనకు ఇంత దు:ఖం అనుభవించే శక్తి లేదని తలపోస్తుంది కౌసల్య. తన మీద దయచూపే ఏ దైవం కనిపించడం లేదని దు:ఖిస్తుంది. ఏ దిక్కు చూసినా శూన్యమే కనిపిస్తుందని తన దురదృష్టానికి చింతిస్తుంది.

కౌసల్య బాల్యంలో తన రామచంద్రుడు ఆడిన ఆటలు, అల్లారు ముద్దుగా పెరిగిన జ్ఞాపకాలు, చిలిపి చేష్టలను కౌసల్య గుర్తుకు తెచ్చుకోవడం కథా సందర్భాన్ని బట్టి ప్రధానమైనది. వెన్నను కొంత తిని అంతకన్నా మన్నును రుచిగా తిన గోరే రాముడిని చూసి కౌసల్య ఆవేదన చెందేదట. తల్లి చేత తిట్లు తింటూ దెబ్బ తగలకుండా తిరిగేవాడట. ఆటలు ఆడి అలిసిపోయి అమ్మ ఒడిలో చేరి పాలు తాగుతూ, తన కోరిక తీరలేదని ఏడ్చే వాడట. ‘అమ్మ పిలిచె రారా! అన్నము తినిపోవవేగ’ అని కౌసల్య ఎంత పిలిచినా ఆట పాటలలో మునిగి పోయేవాడట. ఇటువంటి శ్రీరాముడి అల్లారు ముద్దు చేష్టలను మరకముందే అడవుల పాలు కావడం కౌసల్యకు తీరని దు:ఖాన్ని మిగిలించింది.

` జాలి చూప / గలుగు దైవ మొక్కరు గాని కానరారు / శూన్య గగనమే ఏ వైపు చూడనైన (పుట.21)

` దెబ్బ తగలకుండ తిరిగెడు పని చేష్ట / కనగ నింత నోచుకొననె లేదొ? (పుట.21)

` తలపు తీరుకున్న ఏడ్చు తీయని పసి ఏడ్పు / వినగనింత నోచుకొననొ నేను? (పుట.21)

` ఆడి పాడుచుండు అందాల రాశిని / కనగ వినగ నోచుకొనగ లేదొ? (పుట.21)

విధి తనతో ఆడుతున్న ఆటకు కౌసల్య ఎంతగా వ్యధ చెందిందో ఈ పద్యపాదాల్లో స్పష్టంగా కవి వ్యక్తపరిచాడు.

ఙ సంతాన పరితాపం :

సంతానం కోసం ఎన్నో నోములు, వ్రతాలు నోచింది కౌసల్య. ఎంతో కాలంగా అవన్ని ‘ఎడారి నలికిన విత్తనములయ్యె’ నని ఒక శిలగా మారిపోయింది. ఎప్పుడైతే శ్రీరాముడు జన్మించాడో, అప్పుడు కౌసల్య పునర్జన్మ ఎత్తినట్లుగా భావించింది. ఒక తల్లిగా సార్థకం కాని స్త్రీ జన్మ ఊహించలేనిది. కౌసల్య సంతానప్రాప్తి కోసం పరితపించిన సన్నివేశాలు కవి సహజంగానే వర్ణించాడు. తాను సంతానం కోరుకుంటే తన ఇంటిలో సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే అవతరించినట్టుగా భావించింది.

పాల సంద్రమే మా ఇంట పరిమళించె

కల్పవృక్షమే నట్టింట కదలి యాడె

సత్య ధర్మమ్ములమృతమై జాలువారె

చలువ పందిళ్ళు వేసెను చందమామ                               (పుట.22)

శ్రీరాముని పుట్టుక సందర్భాన్ని ఆనంద పరవశాన్ని కౌసల్య వదనంలో కవి అద్భుతంగా వర్ణించాడు. బాల్యం నుండి రామచంద్రుని చూచుకోవడమే తపంగా, అలంకరించడమే పూజగా కౌసల్యకు కాలం సాగింది. అంతలోనే యువరాజు పదవికి రాముడు చేరుకోవడం తల్లికి ఆశ్చర్యమే. ఇంతలోనే వనవాస ఆజ్ఞను తట్టుకోలేకపోయింది. ‘నా ఉరమ్ము పగుల ఏడ్చి ఏడ్చి శిలనైతినెపుడొ, ఇప్పుడేడ్చి ఏడ్చి నేనేమౌదు నింక తండ్రి!’ అంటూ రోదిస్తున్న తీరు కవి నైపుణ్యంలో కరుణను చిందించింది.

ఙ భర్త ప్రేమ లేమి :

భర్తవల్ల సుఖం పొందలేకపోవడమనేవి దీర్ఘకాలంగా కౌసల్య తీరని దు:ఖానికి కారణంగా నిలిచింది. పేగుతెంచుకు పుట్టిన బిడ్డను వనవాసం పంపడం ధర్మమూర్తి అయిన మహారాజుకు తగునా అని నిలదీస్తుంది. శ్రీరామచంద్రుడు అడవులకు పయనమై వెళ్తుండగా ‘జీవముండునే? కూలీన చెట్టునైతి’ అని కౌసల్య రోదిస్తుంది. తన పెండ్లి అయినప్పటి నుండి శుభంగానీ, సుఖంగానీ అంతవరకు తాను చూడలేదంటూ శ్రీరాముడితో మొరపెట్టుకుంటుంది. తన భర్త ఒక రాజు అయి ఉండగా తాను మాత్రం కళ తప్పి ఉన్నానని బాధపడుతుంది. ఈ సందర్భంలో కవి అద్భుత పోలిక వర్ణించారు ‘సూర్యుని ముఖమొక్కింతైన చూడలేని కమలవనమట్లు’ భర్త ప్రేమనే కనలేని బ్రతుకిదేమి!’ అని తలరాతను నిందిస్తుంది.

నాణ్యమౌ ఏడువారాల నగలు కలవు

నను గొలువ దాస దాసీజనమ్ము కలదు

ఎన్ని ఉండి వీనిననుభవింపలేని

భాగ్యహీనను పతిప్రేమబడయలేక                        (పుట. 24)

సగటు స్త్రీ భర్తనుండి ఆశించేవి ప్రేమానురాగాలు మాత్రమే. కౌసల్యకు ఏడువారాల నగలు, చుట్టూ దాసదాసీ జనము ఉండి కూడా భాగ్యవిహీనురాలైన స్థితిని కవి తన కవితా ప్రతిభలో ప్రదర్శించారు.

ఙ సపత్నుల హేళన :

ఏ ఇల్లాలు అయిన ఎంత కష్టమొచ్చినా భరిస్తుంది కాని సవితి పోరును భరింపగరాదు. కాని కౌసల్యకు అనునిత్యం సవతుల నుండి పరుష వాక్యాలు, దూషణలు ఎదురవుతూనే ఉంటాయి. సపత్నులతో సమానమైన గౌరవాన్ని పొందలేని తన చిన్నతనాన్ని శ్రీరాముడి ముందు విన్నవించుకుంటుంది. రాజుకు పెద్ద భార్య అయి ఉండి, ప్రజల దృష్టిలో మహారాణి అయి ఉండి కూడా సపత్నులతో పడుతున్న హింసను కౌసల్య విడమరిచి చెప్పింది.

సా బహూన్య మనోజ్ఞాని వాక్యాని హృదయచ్ఛిదాం

అహంత్రోప్యే సపత్నీ నామ వరాణాం వరా సతీ                    (అయోధ్య : సర్గ : 20, శ్లో : 39)

సవతులిందరిలో నాకు సాటివచ్చు

వారెవరు లేరు, నా కంటె వయసులోన

చిన్న వారయు వారు నన్నెన్ని మాట

లాడి కష్టపెట్టెదరొనే ననగరాదు                                         (పుట.24)

వాల్మీకి రామాయణంలో కౌసల్య శ్రీరాముడితో తన సపత్నుల వల్ల పడిన పరుష వాక్కుల తీరు స్పష్టంగా చెప్పబడిరది. అనుమాండ్ల భూమయ్య ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తల్లి అనుభవించిన సపత్నుల వల్ల బాధ, తన సీతకు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఏకపత్నీ వ్రతుడిగా ప్రతిజ్ఞ చేశాడు. సపత్నుల హేవగింపు వల్ల పొందిన బాధ ఈ కావ్యానికి మూలాధారంగా నిలిచింది. తల్లి హితబోధ ద్వారా శ్రీరాముడిలో సంస్కరణ భావాన్ని పెంపొందింపజేసింది. కౌసల్య తన దు:ఖం రెట్టింపు కావడానికి రెండు కారణాలు గాక మూడిరటిని తెలుపుతుంది. ఒకటి పతి ప్రేమ లేకపోవడం, రెండు సపత్నుల పరుషవచనాలు, మూడవది శ్రీరాముడి వనగమనం.

ఙ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల లేమి :

యువరాజు పదవిని అలంకరించే కొడుకు ఉండగానే దూషణలకు గురవుతున్నానని కౌసల్య వ్యధ చెందుతుంది. ఇక శ్రీరాముడు అడవులకు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని బాధపడుతుంది. తన భర్త తనకు ఏ మాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదని రాముడితో మొరపెట్టుకుంటుంది కౌసల్య.

నేను రాణినే అయి కూడా కాను, మీ జ

నకుడు నను నిగ్రహించి ఇంతయును స్వేచ్ఛ

నీయలేదు, ఆ తల్లి కైకేయి దాస

జనముతో సాటిగానైన సరకుగొనడు                     (పుట.25)

అంటూ దశరథుడు ఎంతగా ఆమెను కట్టుదిట్టం చేసేవాడో తెలుపుతుంది. భార్యలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడమనేది పితృస్వామ్య వ్యవస్థలో మొదటిది. స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అవసరం లేదనే పురుషాధిపత్య సమాజం అనాదిగా కొనసాగుతూ వస్తున్న విషయం వాల్మీకి రామాయణంలోనే తెలుస్తుంది. తాను ఒక పట్టమహిషి కూడా. రాజు స్వేచ్ఛ ఇవ్వకపోవడాన్ని ధిక్కరిస్తుంది కౌసల్య. తన భర్త చులకన భావంతో చూడడం వల్ల దాసి జనంలో తన రాణితనం చెలామణి కావడం లేదని బాధ పడుతుంది. ఇప్పటికీ దాసీజనం ఈ రీతికి నడుచుకొంటున్న సందర్భంలో కైక కొడుకు రాజయిన తర్వాత భయంతో తనను చూడడానికి రారేమోనని కౌసల్య సందేహిస్తుంది. ఏకాంతాన్ని ఎలా భరించగలనని శ్రీరాముడితో నివేదిస్తుంది. ‘కాలమింక నా గళమున బడిన కాలనాగొ ఏమొ!’ అని కౌసల్య చిందిస్తుంది.

ఙ కైకేయి పోరు :

కౌసల్య తన సవతులన్నింటిలో కైక సాధింపును తట్టుకోలేకపోతుంది. ఎల్లప్పుడు పరుష వాక్యాలతో దూషించే కైకేయి తన మీద ఎంతటి క్రోదాగ్నిని చల్లుతుందోననే కౌసల్య వాపోతుంది. కైక వ్యక్తిత్వాన్ని కౌసల్య ఆవేదనలో కవి అత్యంత సహజంగా చిత్రించారు. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన తర్వాత కౌసల్యను కైకేయి బ్రతుకనివ్వదనే మాటను కవి ప్రస్తావించడంలో ఆమె ఎంతటి నియంత స్వభావాన్ని కలిగిందో తెలుస్తుంది.

కాల సర్పమట్లు కడు వంకరగ నడుచు

నడత గల కైక కుబుసమ్ము విడిచె Ñ ఇపుడు

విషము చిమ్ముచు నను కాటు వేయునేమొ?

కన్నతండ్రి! నాయన! నిన్నె కాటువేసె.                  (పుట.26)

అంటూ కైకేయిని కాలసర్పంతో పోల్చుతూ కౌసల్య ఆక్రోశిస్తుంది. కాని తన కష్టాలను, బాధలను కౌసల్య తన ఇష్ట సఖులకు కూడా చెప్పుకోలేదట. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య స్వభావాన్ని చిత్రిస్తూ ‘నా ముఖాన మట్టి విసిరినదని నేను / నట్లె కోపించి మట్టిని ఆమె మీద  / విసరలేను. దానిని తీసివేయమేలు’ అని తెలుపుతారు. కౌసల్య వ్యక్తిత్వంలో నీతి, ధర్మం, మంచితనం ప్రదర్శింపజేశారు కవి.

ఙ సవతుల కలత :

కైకేయి మొదలైన సవతులలో ఎదురయ్యే కలతను ఎదలోనే దాచుకొని ఇంతకాలం సగమైపోయిన కౌసల్య ఈ ముసలితనంలో ఇంకా భరింపలేకపోయింది. పట్టమహీషి అయినందు వల్ల సవతులందరూ తనను అధికంగా బాధిస్తున్నట్లుగా కౌసల్య తెలుపుతుంది. మొదటి భార్యను అయిన నేరం వల్ల నేమో తనను మరింత సవతులు అవమానిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఙ మాతృ ప్రేమ :

లక్ష్మణుడు ఆవేశంగా మాట్లాడిన మాటలు న్యాయమనిపించి భావించిన కౌసల్య శ్రీరాముడి వనవాసానికి అనుమతించడు. తండ్రి లాగా తల్లి కూడా పూజ్యురాలని చెబుతూ అడవులకు వెళ్ళకూడదని శ్రీరాముడిని ఆజ్ఞాపిస్తుంది. ఈ సందర్భంలోనే కవి భూమయ్య కౌసల్యలో పుత్రుడిపై ఉన్న ప్రేమను అనేక విధాలుగా వర్ణిస్తారు. చిన్నప్పటి నుండి కౌసల్యకు కలిగిన బాధనెల్లా రాముడు తన చిట్టి వ్రేళ్ళతో తుడిచిన సన్నివేశాలను గుర్తు చేసారు. ఆ వేదనతోనే రాముడు పసితనంలో ఆడిన ఆట వస్తువులే ఆయన అడవులకు వెళ్ళిన తర్వాత ఆమెకు బ్రతుకు వస్తువులవుతాయని సూచించారు.

క్రూర మృగముల నిలయమ్ము, కోయటన్న

పలుకు దిక్కులేని అడవి పదియునాలు

గేండ్లు పగలు గడచిన రేయియె గడవదు

ఇట్లివియె నాకిరువదెన్మిదేండ్లు తండ్రి!                   (పుట.41)

అడవులలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో కౌసల్య తలచుకొని బాధపడుతుంది. ఆ రాముడి పసితనం నుండి అల్లారు ముద్దుగా పెంచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. రాముడికి మెత్తని గుడ్డ ఒత్తుకొని పోయినా బాధపడే తల్లి మనస్సు అడవుల్లో కఱకురాళ్ళ మీద నిద్రించడం దుర్భరమైందని ఆవేదన చెందుతుంది.

కడుపులో ఉండగా రాముడు తన పాదాలతో తన్నుతుండగా కౌసల్య ఆ పాదాలు ఎంత కందిపోయెనో అని కలత చెందిందట. భూమయ్య వర్ణనలో తల్లి ప్రేమకు తార్కాణంగా కౌసల్యనే నిలుస్తుందని చెప్పవచ్చు. కాని అటువంటి పాదాలు రాయిరప్పలు తాకి రక్తం చిందిస్తాయని తలచుకొని బాధపడుతుంది. ‘తండ్రీ! నీ ముద్దు పాదమందారములకు నా యెదను తొడుగుదునయ్య!’ అంటూ కౌసల్య పేర్కొంటుంది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనం ఈ పద్య పాదం. కవి మాతృ స్పర్శకు గొప్ప చమత్కృతి. తనను కూడా అడవులకు తోలుకొని పొమ్మని కౌసల్య ప్రాధేయపడుతుంది. అడవుల్లోని భయానక పరిస్థితులను రాముడికి తెలియజేస్తుంది.

ఙ లక్ష్మణుడి సేవ :

ఈ కావ్యంలో లక్ష్మణుడి మాటలు కౌసల్య దు:ఖానికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుత్ర శోకంతో కుమిలిపోతున్న కౌసల్యను చూసి తన తండ్రిపై ఉగ్రరూపమెత్తుతాడు. రాముడు అడవులకు వెళ్ళకూడదని వారిస్తాడు. తన అన్నకోసం ఏమైనా చేస్తానంటాడు   లక్ష్మణుడు. చివరికి తండ్రిని, కైకను, భరతుడిని బంధిస్తానని శపథం చేస్తాడు. రాముడిపై అచంచల భక్తిని ప్రదర్శిస్తాడు. లక్ష్మణుడి ఆక్రోశం కౌసల్య ఆవేదనను కొంత శాంతింపజేసింది. ‘అన్నకు ఆపద సంభవింపనే నగ్నిని దూకెద ముందుగనే’ అన్న లక్ష్మణుడి మాటల్లో అగ్రజుడి పైగల సోదరప్రేమ, సేవాతత్పరత కనిపిస్తుంది. కవి ఈ పాత్ర కల్పనలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

ఙ రాముడి ఏకపత్నీ వ్రతం :

‘జ్వలిత కౌసల్య’గా రగిలిపోతున్న తల్లి దు:ఖాన్ని నివారింపజేస్తూ శ్రీరామచంద్రుడు చల్లగా స్వచ్ఛంగా ఏకపత్నీవ్రతం ప్రతిజ్ఞ చేస్తాడు. తల్లి నిరంతర శోకానికి కారణం తండ్రి ప్రేమ లేకపోవడం, తండ్రి బహుభార్యత్వాన్ని స్వీకరించడం అని గ్రహిస్తాడు. తన తల్లి లాగా సీత దు:ఖించకూడదని నిర్ణయించుకొని మాట ఇస్తాడు.

గడిచినట్టి కాలమ్మేదో గడిచిపోయె

తండ్రి తప్పొప్పులివియని తలపలేను

ఏ పరిస్థితులెట్లు రానిమ్ము నాకు

ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య.                       (పుట. 57)

అన్న శ్రీరాముడి ప్రతిజ్ఞకు కౌసల్య దు:ఖం తొలిగిపోయినట్లుగా కవి కల్పించారు. ‘ఏదో పరిమళామృత పుష్పమింత సాగివచ్చి కౌసల్య శిరస్సుపై విచ్చుకొనియె’ అని వర్ణిస్తారు. కౌసల్య తనకు జరిగిన పరాభవం తిరిగి తీసుకొని రాలేనిది. తన కాలం చెల్లిపోయింది. తన సీతకు ఇటువంటి దుర్గతి పట్టకూడదని కౌసల్య మనోభావం. ఈ ప్రతిజ్ఞతో కవి తన కావ్యానికి సద్గతిని ఏర్పరిచారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య స్త్రీత్వంలో కౌసల్యను చిత్రించి రాముడిని ధర్మ నిరతివైపు పయనింపజేశారు. మూర్తిమత్త్వ నిర్మాణంలో ‘జ్వలిత కౌసల్య’ను అపూర్వ సృష్టిగా నిలువరింపజేశారు. సంప్రదాయ స్త్రీవాద ధోరణికి ప్రతినిధిగా ఈ కావ్యాన్ని చిత్రించారు. సమకాలీన సామాజిక వీక్షణంలో అంతర్భాగంగా పౌరాణిక ఐతిహాసిక పాత్రల మనోగతాన్ని ఆవిష్కరించారు.

 

:: ఆధారగ్రంథాలు ::

  1. కృష్ణకుమారి, నాయని, ఆచార్య, 2013, విమర్శ విద్యా సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.
  2. ప్రియదర్శిని, కె.,డా॥, (సం) 2015, ప్రతిభాత్రయి, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.
  3. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2004, అంతర్వీక్షణం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.
  4. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2011, (నాల్గవ ముద్రణ), జ్వలిత కౌసల్య, మనస్వినీ దేవి ప్రచురణలు,    హైదరాబాద్‌.
  5. రామారావు, చేకూరి, ఆచార్య (సం) 2003, అంతర్వీక్షణ సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

 

 

ఙ ఙ ఙ

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us