మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
Uncategorized

మయూఖ ఫిబ్రవరి శిశిర సంచిక సంపాదకీయం

by mayuukha February 28, 2022
written by mayuukha

ప్రకృతి ఎంతో విచిత్రమైంది. మానవ ప్రకృతి కూడా అంతే విచిత్రమైంది. భూమి గుండ్రంగా ఉంటుందని నిరూపించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఏనాడో ఒడిసిపట్టుకుని కష్టాలను, బాధలను అధిగమించి ఉన్నత స్థాయికి పోయే ప్రయత్నాలు నిరంతరం చేసే చరిత్ర మనిషిది.

ఎరుక పిడికెడు ధనము అని అంటారు. ఎంత ఎక్కువ విషయాలు తెలిస్తే అంత అభివృద్ధి సోపానాలు అవుతాయి అనే అర్థం ఉన్న మాట ఇది. అటు కొత్త సంవత్సరం 2022 వచ్చింది, ఇప్పుడు శిశిర ఋతువులోకి అడుగుపెడ్తున్నాం. ఇటు శోభకృత్ నామంతో వసంత ఋతువును మళ్ళీ తొందరలోనే చూడబోతున్నాం. తెలుగు, ఇంగ్లీషం క్యాలెండర్ల ప్రస్తావన కాదు. ఇక్కడ ఓ రెండు నెలల కాలం మనకు ఇచ్చిన జ్ఞాపకాలను స్పృశించుకోవడం. ఏడాదిలో కొన్ని రోజులకు కొన్ని ప్రత్యేకమైన పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాం. ఇది ఎందుకు అంటే ముందు అనుకున్నట్లు ఒక ‘ఎరుక’ కోసం.

స్వాతంత్ర్యం సాధించుకున్నప్పటి నుండి సమాజానికి చేరువ కావాల్సిన ముఖ్యాంశాలపై నిర్వహించే‘దినోత్సవాలు‘ ప్రజలకు చేరువవుతూనే ఉన్నవి. మానవ హక్కుల దినోత్సవం, మానవ ఐక్యతా దినోత్సవం , కార్మిక దినోత్సవం వంటివి. హక్కుల ప్రాముఖ్యత తెలుపడానికీ, సంఘటిత శక్తిని తెలుపడానికీ ఏర్పరుచుకున్నవి. అట్లాగే దేశస్థితిని తెలియజేసే స్వాతంత్ర్య దినోత్సవం , గణతంత్ర దినోత్సవం కూడా మనవే ! మనిషి కి గృహానికీ గల సంబంధబాంధవ్యాలు తెలియాలని, కుటుంబ , జీవన సావకాశాలు తెలియాలని, మాతృదినోత్సవం, గురుపూజ దినోత్సవం వంటివీ మనకోసమే . భాష మన సంపద అని చెప్పే గుర్తుగా మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 22ను జరుపుకోవడమూ ఒక ఎరుక కోసమే. అదేవిధంగా కాన్సర్ అనే జబ్బును తెలిసేలా ‘కాన్సర్’ డే లూ ఏర్పరచుకున్నాం.
సమాజంలో ఏదైనా చెడు విస్తరిస్తుంటే, దాష్టీకాలు ఎక్కువుతుంటే ‘కాన్సర్ లా ప్రాకుతున్నది’ అని వ్యాఖ్యానించే అలవాటున్నది. ఒక జబ్బును చెడుకు పోలుస్తూ చెప్పడం ఇది. కాన్సర్ వల్ల మనుషులు మరణం వరకూ పోవడమో , బ్రతికున్నన్నాళ్లూ చికిత్స చేసుకోవాల్సి రావడమో జరుగుతున్నది. రకరకాల కాన్సర్లకు రకరకాల పేర్లు. శరీరంలోని జీవకణాలు కొన్ని అసాధారణంగా పెరుగుతుండటం కొందరిలో జరుగుతుంది. ఇదే ప్రాణాంతకమవుతుంది.
శరీర కణ విభజనలు ఒక క్రమపద్ధతిలో, నియంత్రణలో ఉంటాయి. ఒక్కోసారి కణాల పెరుగుదల ఉండాల్సిన నియంత్రణలో ఉండక అతివేగంగా పెరిగి ఒక కంతిలాగా అవడాన్నే కాన్సర్ వ్యాధి అంటారు. ఆంకాలజీ, Oncology ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ భయంకరమైన వ్యాధిని పరీక్షలు, అధ్యయనాలు చేసి, ప్రారంభదశలోనే గుర్తిస్తే, తగ్గించే అవకాశాన్ని చేజిక్కించుకొని, ఆరోగ్యవంతులు అవ్వవచ్చు.

ఆహారపు అలవాట్లు కావచ్చు, పనిచేసే వాతావరణం కావచ్చు, వ్యసనాల వలన ముఖ్యంగా దూమపానం, అతి మద్యపానం వల్లనూ రావచ్చు. చెడు అలవాట్ల తో నిర్లక్ష్య ధోరణి కూడా కారణం కావచ్చు. అయితే ఈ అన్నీ కూడా నివారణకు వీలైనవే. కాని వీటితో పాటు వంశపారంపర్యంగా హెరిడిటీగా వచ్చే జబ్బులు ఉంటాయి . అవి మినహాయిస్తే మిగతా కారణాలన్నీ మనిషిపై వ్యాపార మాఫియాలు చేస్తున్న కనబడని దాడిగా ఏం అనుమానం పడకుండా చెప్పవచ్చు. వ్యసనాలను వీడని మానవ నైజాన్ని పెద్ద కారణం గా చెప్పవచ్చు. ఇక్కడ కారణాల కంటే దోపిడి వర్గాల దుశ్చర్యలే ఎక్కువ ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ ఇనుప గుప్పిళ్లనుండి బయటపడేలా ప్రయత్నపూర్వకంగా జీవిస్తే తప్ప ఇటువంటి కాన్సర్ల నుండి బయటపడగలదు మానవ సమాజం.
అయితే రేపు మార్చి 8న జరుపుకోబోయే మహిళాదినోత్సవాన్ని ఒకసారి స్మరణకు తెచ్చుకున్నప్పుడు మొన్ననే, ఫిబ్రవరి 4న విన్నటువంటి కాన్సర్ డేను గుర్తుకు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా సభ్య సమాజంపైన ఉన్నది. ప్రతి ఇంట్లో స్త్రీలు అమ్మగానో, అక్కగానో, చెల్లిగానో, భార్యగానో, బిడ్డగానో ఉండే ఉంటారు. కాబట్టి ఈ సమస్య స్త్రీల ఒక్కరిదే కాదు పురుష ప్రపంచానిది కూడా! ఇంట్లో ఆడవాళ్ళకు అనారోగ్యంగా ఉంటే ఆర్థిక, హార్థిక ఇబ్బందులు వచ్చేది మొత్తం కుటుంబానికి కూడా! కుటుంబం అంటేనే స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యంలో ఉండేది కాబట్టి ఇది సభ్య సమాజం బాధ్యత అనడం. ఇదంతా ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకు ఈ కాన్సర్ గురించి ఎవేర్ నెస్, తెలివిడిని కలిగించాలి అని! నిర్లక్ష్యమో, తెలివి తక్కువతనమో, తెలియనితనమో, మొండితనమో, అమాయకతనో, ఆర్థిక ఇబ్బందులో, ఇంట్లోవాళ్ళకు చెప్పే ధైర్యం లేకపోవడమో, బిడియమో, ఆర్థికస్వేచ్ఛ, స్వీయ ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడమో ఒక్కటేమిటి ఎన్నో కారణాలు రణాలై స్త్రీలను బాధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వీటిని గమనించాల్సిన ధర్మం ఎవరిది?
ఒకే చూరుక్రింద మసిలే అందరిదీ! అందుకే ఇంట్లో ఆడవాళ్ళను తరచూ వారి ఆరోగ్యాన్ని గురించి కనుక్కోవాలి. అవసరమైన పరీక్షలు, ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదో లేదో తెలియజేసే మోమోగ్రామ్ అనే పరీక్షను చేయించుకొమ్మని, ఇది ముందు జాగ్రత్తనేగాని, అనుమానపడి భయానికి గురికావద్దని నెమ్మదిగా నచ్చచెప్పి హాస్పటల్ కి తీసుకెళ్ళి దగ్గరుండి పరీక్షలు చేయించాలి. వాళ్ళంతట వాళ్ళు హాస్పిటల్ కు వెళ్ళి పరీక్ష చేయించుకోలేని స్త్రీలే అధికశాతం ఉంటారు. తండ్రి గా , భర్తగా, అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా మామగారిగా మగవారి బాధ్యత అందరి బాధ్యత అనుకున్నప్పుడే ఈ జబ్బు నుండి బయటపడడం, భయం దీర్చుకోవడం జరుగుతుంది. ఆలోచించాలి, ఆచరించాలి. అప్పుడే మదర్స్ డేలు, మహిళా దినోత్సవాలు ఎందుకు చేస్తున్నాం అనే సోయి వస్తుంది.
సర్వకాల సర్వావస్థలలో తెలివైన జీవిగా మనిషి నిలబడాలి అంటే ఎరుకతో ఉండాలి. ఏడేడు తరాలకూ ఆదర్శంగా ఉండాలి. అసలే ‘కోవిడ్ 19 ‘ వచ్చి ప్రపంచాన్ని క్రిందమీద చేసింది. కరోనా కంటే ముందు , కరోనా తరువాత అని ఏదో శకాల గురించి చెప్పుకున్నట్టు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కరోనా కొంత తగ్గు ముఖం పట్టింది అనుకుంటుంటే డిఫరెంట్ వెరియంట్స్ తో మిమ్మల్ని వదలను అని హెచ్చరిస్తున్నట్టు ‘ఒమిక్రాన్’ అనేదీ దాడి చేసింది. ఇంకా ఏం వస్తాయో, ఎట్లా వస్తాయో తెలియక, అగమ్య గోచరంగా ఉన్నది. అయినా చింతించాల్సిన పనిలేదు. ఎదురీదాలి. గెలవాలి. ఇదే కదా చేయాల్సింది.
ఆర్థిక మాంద్యము, ద్రవ్యోల్బణమూ వంటి పెద్ద పెద్ద పదాల అర్థాలూ, ప్రభావాలూ తెలియని అతి సామాన్యులు మన చుట్టూ ఉంటారు. వాళ్లను గమనింపు లోకి తీసుకోవాలి. ఈదురుగాలులకు నిలువగలవు చిన్న చిన్న చెట్లు . కాని తుఫాను భీభత్సాలకు నిలువగలవా! ప్రజలు… ప్రజలు…ఎక్కడ చూసినా ప్రజలు సామాన్య ప్రజలు ఉన్నారు, పేద ప్రజలూ ఉన్నారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషీ ఒక సిఐడీ ఆఫీసర్ లాగా, ఒక సిన్సియర్ పోలీస్ లాగా, ఒక వీర జవాన్ లాగా ఒక నిఘా యంత్రపు కన్నులా ఉండాలి, చూడాలి. ఏదైనా తెలిస్తే చెప్పాలి , తగిన సలహా లు ఇవ్వాలి , సహాయాలూ చేయాలి . అప్పుడే కాన్సర్ ను జయించగలం, కాన్సర్ లా వ్యాపిస్తున్న అన్యాయాలనూ ఎదిరించగలం. అడ్డుకొనగలం – ఆరోగ్యవంతులం కాగలం.

అదిగో యుద్ధాలు – ఒక దేశంపై మరో దేశం యుద్ధం చేయడం చూస్తున్నాం. ఇది ఏ ఆటవిక దృశ్యమూ కాదు. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక అతి విజ్ఞానపు దుశ్చర్యల దురాక్రమణల పర్యవసానం . ఈ పసిగట్టలేని అన్యాయం ఎంతో ఉన్నది. ఇలా సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుకోవలసిందే . విజ్ఞులందరికీ ఇవి తెలియనివా ? అన్నీ తెలుసు కాని మౌనం ప్రధానపాత్ర వహిస్తుంది. హెచ్చరిక ఇవ్వచూస్తుంటుందీ లోకం!

ప్రకృతి విచిత్రమైందనుకున్నట్టే, ప్రకృతి సమయపాలనలో దిట్ట! అదిగో శిశిరం పోయి వసంతమూ వస్తుంది. మార్చి పోయి ఏప్రిల్ కూడా వస్తుంది. క్యాలెండర్ లో డేట్స్ మారకుండా ఉండవు, కాలంలో ఋతువులు మారకుండా ఉండవు, మరి మనుషులుగా వయసు మారుతున్నప్పుడు బుద్ధి జీవులు గానూ మనం మారకుంటే ఎట్లా? మారుదాం, మారుద్దాం! కాస్తంత ముందుచూపు, కాస్తంత ఎరుక ఇంతే చాలు. కొత్త సంవత్సరంలో సంతోషకర విశేషాలు పంచుకుందాం అని మంచి ని ఆశిద్దాం!!
__ కొండపల్లి నీహారిణి

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

దిక్సూచి

by వారాల ఆనంద్ February 28, 2022
written by వారాల ఆనంద్

బయట
ఆకాశం తేటగా నిర్మలంగా వుంది
గాలి స్వచ్చంగా మంద్రంగా వీస్తోంది
వెన్నెల చల్లగా కురుస్తోంది

లోపల
గది ప్రశాంతంగా వుంది

కవే
తన అసంపూర్ణ కవితను ముందేసుకుని
దుఖంగా వేదనగా కోపంగా
చిన్న పిల్లాడిలా
కాళ్ళూ చేతులూ ముడుచుకుని
నిద్రలోకి జారుకున్నాడు

అసంపూర్ణ కవితలోని పదాలు
హార్మోనియం మెట్ల లాగా
ఒక్కోటీ లయబద్దంగా కదులుతున్నాయి
సవ్య రాగాన్ని పలుకుతున్నాయి
నవ్య భావాల్ని ధ్వనిస్తున్నాయి

అన్ని పరిధులూ దాటి
కాలం స్థబ్దతలోకి
అన్ని పరిమితులూ దాటి
మనుషులు స్వార్థం లోకి
దిగజారి పోయినా

ఒక్క కవే తన
అసంపూర్ణ అసమగ్ర కవితకు తోడుగా
మరిన్ని తెల్లకాగితాల్ని ముందేసుకుని
కొత్త మాటల్ని చెక్కుతాడు

నిద్దట్లోంచి మెలకువలోకి
చీకట్లోంచి వెలుతురులోకి
సరికొత్త దారులు తీస్తాడు

కవి దివిటీ అయితే
కవిత దిక్సూచి

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పొగమంచు భూతలం ( గేయం)

by Krishna Vaddepalli February 28, 2022
written by Krishna Vaddepalli

పొగమంచు తో భూతలం
ఆయెను అతి శీతలం
॥ పొగ..॥
ఉపతరిలపు ద్రోణియో
చలి గాలుల శ్రేణియో
ఉరుమనెంచు ప్రకృతి యో
ఉనికి నెల్ల వణికించెను !…
॥ పొగ..॥
విమల ధవళ వస్త్రంతో
విధిగా అగుపించునట్లు
దేశమెల్ల పొగమంచను
తెలిముసుగుతొ పలకరించె!
॥ పొగ..॥
హేమంతానికి ప్రేమగా
సీమంతం జరుపసాగె
“శిశిర” శిశువునే కనగా
ఋతుచక్రం తిరగ సాగె !

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తరాల తరుణి

by Palleru Swamy February 28, 2022
written by Palleru Swamy

కలిసి నడిచే మనం-కాదులే చెరిసగం
పతిదేవుణ్ణి నేను-చరణదాసివి నువ్వు
ఆధిపత్యం నాది : నాదే పైచేయి
ధర్మపత్నివి నీవు- నీవే నీతల కొంత దించు
నిన్ను వీధిలో అమ్మే దృశ్యాల తాలూకు కమురు వాసన
నిన్ను జనారణ్యంలోనెట్టిన వెగటుదనం
జూదంలో ఒడ్డిన పురాణ మై తోస్తున్నది

పాతివ్రత్యం పరమ భూషణమనే పాత కథ విన్న చెవులు
కొత్త చరిత్రలేమి వింటాయి ?

అన్యమైనవో అనన్య సామాన్యమైన వో
నిను ఏం తీరున చూపెడతాయి
వంశాన్ని నిలబెట్టడమె
కదా నీ వంతు-మాంగల్యం తంతు
నటి గా సఖి గా దాసిగా దాదిగా నీకెన్నో రూపాలు
అయినా దూతికగా
నీజాతి తోనే నిను తార్చాలనుకుంటున్న
మాయాప్రపంచం లో నీవు

తననుగని పెంచేటి సామర్థ్యం నీకు
ఎంతున్నా
అబలవే అంటాడు
అపహాస్యం చేస్తాడు

శీల సంస్కారమే
తగునమ్మ నీకసలు అంటాడు తరుణీ అవే నీ నగలని నమ్మిస్తాడు
తన పనులు వికటించే దాకా
నిన్ను గుర్తింపు గుచ్ఛాలలో విరిసే
“ముగ్ధ”వే నీవంటు ముచ్చటగా పిలుస్తాడు

నీవు మరణిస్తే వేరొకతె నాకు సతి నేను చనిపోతేను సతి నీవంటు నీకు “బ్రతుకు చితి ” అనీ తీర్మానిస్తాడు

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక అందమైన కల…

by Butam Mutyalu February 28, 2022
written by Butam Mutyalu

ఒక అందమైన కల…

తుషార స్నాత ప్రభాత వేళ ఆత్మ యొక్క సుగుణం ఇంద్రజాల కిరణంలా శోభిల్లుతోంది

రేయంతా వెన్నెల కాంతులు వెదజల్లే దివిటీ యై నిరీక్షిస్తూ వీక్షిస్తూ కాలుతున్న హృదయం నుండి కరిగి కరిగి సుగంధాలు విడుదల అవుతోంది

మరియు ఆమె శీతల శిశీరంలో అవని దశదిశలా వసంతమై ప్రకాశిస్తూ మరులు గొలుపుతుంది

ఎద సముద్రమంత లోతు గలదై ఆకాశమంత విశాలమైనది ఇది ప్రేమ కు శక్తి కలుగ చేస్తుంది

జీవిత పరమార్ధం గ్రహించటానికి ఇంకేం కావాలి ఆమె ముఖారవిందం నిండు పున్నమి లా విరియగా
ఆమె చెలిమి తరం తరం నిరంతరం ఒక అందమైన కలగా మిగిలే వుంటుంది

ఆమె ప్రేమ అనునిత్యం వెన్నంటి మేల్కొలుపు తుంది

మది ఊయలలూపుతుంది. అదర మధుసేవనంలో మదురసాలను ఒలుకుతుంది…

February 28, 2022 0 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

విద్వత్తు

by డా|| మృదుల నందవరం February 28, 2022
written by డా|| మృదుల నందవరం

ఈ సంచికలో మనం విద్వాంసుల తీరు ఏ విధంగా ఉంటుందో భర్తృహరి నీతి శతకం ద్వారా తెలుసుకుందాం.

శ్లో|| దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, శాఠ్యం సదా దుర్జనే

ప్రీతిః సాధుజనే, నయో నృపజనే, విద్వజ్జనే చార్జవమ్

శౌర్యం శ్రతుజనే, క్షమాగురుజనే, కాన్తాజనే ధృష్టతా

యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోకస్థితిః

విద్వత్ పద్ధతిలోని ఈ శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవిగారు ఎలా అనువదించారో చూద్దాం.

చ. వరకృప భత్యులందు, నిజవర్గమునందనుకూలవృత్తి, కా

పురుషులయందు శాఠ్యము, సుబుదు్ధలయందనురక్తి, దాల్మి

ద్గురువులయందు, గౌరవము కోవిదులందు, నయంబురాజుల

దరిజనులందు శౌర్యము, మృగాక్షులయందు బ్రగల్భభావవీ

వరుసగళా ప్రవీణులగు వారలయందు వసించులోకముల్

సేవకాజనము యందు అపారమైన ప్రేమ, బంధువుల యందు అనుకూలమైన ప్రవర్తనము, దుష్టజనుల యందు కాఠిన్యము, సజ్జనులయందు ఇష్టము, పెద్దలయందు సహనభావము, పండితుల పట్ల గౌరవము, రాజుల విషయంలో నిబద్ధతను, శ్రతువులయందు పరాక్రమము, స్త్రీలయందు నిగ్రహశక్తి – మొదలైన గుణములు ప్రదర్శించే కళల్లో ఎవరు నిపుణులో వారివల్లనే లోకము పురోగమిస్తుందని పై పద్యానికి భావము.

మానవుడు సమాజాన్ని విడిచి దూరంగా మనలేడు. జీవనం సాదదు కూడా. అందువల్ల పరిస్థితులనుబట్టి, వ్యక్తులనుబట్టి తన వ్యవహారశైలిని మలుచుకోవలసి ఉంటుంది. తన సేవకాజనము పట్ల దయాగుము కలిగి వారి అవసరములను గుర్తించవలసి ఉంటుంది. బంధువులను తగిన రీతిలో మన్నిస్తూ మసలుకోవాలి. చెడ్డవారితో కఠినంగా వ్యవహరిస్తేనే మరోసారి వారు దుర్మార్గంగా ప్రవర్తించకుండా ఉంటారు. వయసు మీద పడిన వారితో చాలా సమానంగా, వారికి వలసిన విధంగా మసలుకోవలసి ఉంటుంది. పండితుల యందు గౌరవభావాన్ని కలిగి ఉంటేనే మన సంస్కారభావం వెలికి వస్తుంది. అంతేకాక కొద్దొ గొప్పో మనకూ పాండిత్యం అబ్బుతుంది. రాజుల ఆజ్ఞలను శిరసావహిస్తూ, శ్రతువుల యందు పరాక్రమాన్ని ప్రదర్శించాలి. స్ర్తీలయందు ఇంద్రియ నిగ్రహము (పురుషుల యందు స్త్రీల) పురుషులు కలిగి ఉండాలి. ఇటువంటి నేర్పరితనము ఎవరిలో ఉంటుందో వారివల్లనే దేశాలు (లోకాలు) వృద్ధిలోకి వస్తాయి.

కవి మాటల వలన మనకు తెలుస్తున్న విషయాలు ఏమిటంటే – ఏ దేశమైనా విద్వత్తు కలిగిన వారివల్లే వృద్ధిలోకి వస్తుంది. చదవు వేరు విద్వత్తు వేరు. చదువు ఉండి, విద్వత్తు ప్రవర్తించలేనివారివల్ల దేశాభివృద్ధి, నాగరికత ఛిన్నాభిన్నమౌతాయి. కాబట్టి సదసతం వివేక చతురత కలిగినవారివల్లే పరిపాలన సుగమమవుతుంది. క్రింది నుండి ఉన్నత వర్గము వరకు ఎవరివట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసినవారే అసలైన విద్వాంసులు. వారితోనే మన సంస్కృతి, మన ప్రగతి ముడిపడి ఉంటుందన్నది వాస్తవం.

గౌతమబుద్ధుడు, స్వామి వివేకానందుని బోధనల్లోనూ అబ్దుల్ కలామ్ గారి ప్రసంగాల్లోనూ పై పద్యం యొక్క భావాలు మనం గుర్తించవచ్చు. సాటివారిపట్ల మిక్కిలిదయ, తమను ఆశ్రయించుకని ఉన్నవారి పట్ల ప్రేమ, దుర్మార్గులపట్ల జాగరూకత, అశక్తులైన పెద్దవారిపట్ల మన చేయూత, గురువులపట్ల గౌరవభావము, బ్మహ్మచర్యము, ఏ సమాజమైతే కలిగి ఉంటుందో, మానవసేవే మాధవసేవగా ఎవరు భావిస్తారో ఆ సమాజమే ముందుకు సాగుతుందని, వారే మహాత్ములుగా కీర్తింపబడతారని, వారు మన దేశానికి ఎంతో అవసరమైన వ్యక్తులని కలామ్ గారు అంటారు. ఆచరించి చూపారు కూడా.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణ రుబాయిలలో మరణ తాత్వికత

by Sambaraju Raviprakash February 28, 2022
written by Sambaraju Raviprakash
మరణం ఏ కాలంలోనైనా ఎంతటి ధీరోదాత్తుడినైనా చలింప చేస్తుందనడానికి మన ప్రాచీన సాహిత్యంలో అనేక ఆధారాలున్నాయి. మరణానికి సమీపమవుతున్నామన్న భావన పండు ముసలి నైనా రోదనకు గురి చేస్తుంది. ఎంతటి తాత్వికుని హృదయమైనా వేదనకు లోనవుతుంది. స్మశాన వైరాగ్యాన్ని నిండా నింపుకున్న వాడు కూడా మరణం మాట వింటే నాలుగు కన్నీటి బొట్లను రాల్చకుండా ఉండలేడు.
“సంసారం జనన మరణ రూపమైనది .పూర్వకర్మవశాన జీవుడు శరీరాన్ని ధరించి దానిని విసర్జించే వరకు కర్మ చేస్తూనే ఉంటాడు .ఆ కర్మ ఫలితంగానే అతడు మరో శరీరాన్ని పొందుతాడు. ఇట్లా జీవుని యాత్ర నిరంతరమైంది . చక్రాకార మైంది.”వంటి ఎన్ని మాటలను చదివినా, జీర్ణించుకున్నా తన వరకు వచ్చేసరికి భయపడి పోవడం మనిషి సహజ నైజం. ఋగ్వేదం, భగవద్గీత ,కఠోపనిషత్తు, భారతం ,భాగవతం, రామాయణం, మరియు అనేక ప్రాచీన, ఆధునిక కావ్యాలతో పాటు సాహిత్యంలోని అనేక ప్రక్రియలలో జనన మరణాల గురించి కవులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మానవజాతికి ధైర్యం చెబుతూనే ఉన్నారు.
ప్రసిద్ధ కవి, అనువాదకులు, విమర్శకులు ఏనుగు నరసింహా రెడ్డి రచించిన “తెలంగాణ రుబాయిల”లోని మరణ తాత్వికత నన్ను ఎంతగానో ఆకర్షించింది .
536 రుబాయిల ఈ బృహత్ గ్రంథంలో  మరణాన్ని ఎంతో తాత్వికంగా చెప్పడం కనిపించింది. ఈ రుబాయిల ద్వారా  పుట్టుక ఎంత సహజమో మరణము అంతేనన్న ఎరుకను కవి మనకు కలిగించాడు. ఏనుగు నరసింహారెడ్డి తన రుబాయిలలో మరణాన్ని గానంచేస్తూ మన అందరిలో ధైర్యాన్ని నింపాడు. పుట్టుకకు చావుకు మధ్య ఉన్న నాలుగు క్షణాలలో సాధించవలసిన కార్యాలపై దృష్టి పెట్టమని బోధ చేసాడు. సామాన్యుడైనా, ఎంతటి మనగాడైనా,లేక ప్రతిభావంతుడైనా మరణానికి తలవంచక తప్పదని తెలిపాడు. “బలమే జీవనం- బలహీనతే మరణం” అంటూ వివేకానందునిలా మనలను జాగృత పరిచాడు. గహనమైన మృత్యు అంశాన్ని సులభమైన శైలిలో వ్రాసిన నరసింహారెడ్డి రుబాయిలు అందరము చదవదగినవి.
“పుట్టిన ఊరును వదలి పోతం
పెరిగిన పట్నము వదిలి పోతం
ముందు వెనకాల ముచ్చటేగాని
నడిచిన నేలను వదిలిపోతం”(155)
పై రుబాయిలో మనకు అర్థం కానిది ఏముంది. పుట్టిన చోటనే మనిషి గిట్టాలని లేదు. పెరిగిన చోట తరగడం కూడా ఉంటుంది ఏనాటికైనా నడిచిన చోటు విడిచిన చోటు కాక తప్పదు. కాకపోతే ఒకరి వంతు ఈరోజు అయితే మరొకరి వంతు రేపు. రేపో మాపో దేహం రూపు మాయక తప్పదనే భావన పై రుబాయిలో కనబడుతుంది.
“రాల చెక్కీ పోతడొకడు  బొమ్మ గీసి పోతడొకడు
పుడమి గర్భపు పూలనేరి
కావ్యమల్లీ పోతడొకడు”(178)
పై రుబాయిని చదవగానే నాతో పాటు మీకు కూడా ‘సత్య హరిశ్చంద్ర’నాటకం లోని ‘కాటిసీను’లో ఉన్న “ఇచ్చోటనే” అనే జాషువా ప్రసిద్ధ పద్యం గుర్తుకు రావడం సహజం. శిల్పికి ,చిత్రకారునికి, కవికే కాదు సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు మృత్యువు దృష్టిలో అందరూ సమానులే . అందుకే యముడిని ‘సమవర్తి’ అని అంటారు. శిల్పి, చిత్రకారుడు, కవి తమ శిల్పాల, చిత్రాల, కావ్యాల ద్వారా శాశ్వతంగా నిలిచిపోతారు. అశాశ్వతమైన దేహం నశించినా శాశ్వతమైన చిరునామాతో వారు లోకంలో నిలిచిపోతారు. అలా నిలవడమే కదా కావాల్సింది.పై రుబాయి నిర్మాణంలో ఏనుగు చూపిన కౌశలం నన్ను ముగ్ధమనోహరున్ని చేసింది.”పుడమి గర్భపు పూలనేరి” అన్న మూడవ వాక్యం 1,2,4 వాక్యాలకు అన్వయం కావడం విశేషం. ‘పోతడొకడు’పద ప్రయోగం ఈ రుబాయిలో అద్భుతంగా కుదిరింది. ‘ఎప్పటికైనా పోయేదే’అనిt మరణం గురించి  సాధారణ జనం మాట్లాడుకునే సంగతి  అందరికీ తెలిసిందే. జనం నాడిని పట్టుకున్న కవి ‘పోతడొకడు’ అని నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించాడు. ఇది ఎంతో సహజ సుందరంగా ఇమిడిపోయింది. సీస పద్యంలో జాషువాకున్న సౌలభ్యం రుబాయి ప్రక్రియలో నరసింహారెడ్డికి లేదు. అయినా ప్రక్రియపై పట్టున్న రచయిత కావడం మూలాన తాను అనుకున్న భావాన్ని తక్కువంటే తక్కువ పదాలలో ఇమిడించగలిగాడు. ఒక ప్రక్రియ మరో ప్రక్రియ లోకి మారడం మన సాహిత్యానికి కొత్తేమీకాదు. పురాణాలు కావ్యాలయ్యాయి.కావ్యాలు నాటకాలైనాయి. నాటకాలు కథలైనాయి.కథలు గేయాలైనాయి. ఇక్కడ పద్యం “రుబాయి” రూపం పొందింది. అద్భుత జనాదరణ పొందిన ఒక పద్యం అత్యాధునిక కవి చేతిలో  అంతే జనాదరణ పొందిన   మరో రూపంలోకి మారడం ఇక్కడ గమనార్హం.
“కోరుకొని ఇటకొచ్చినామా? మనకు తెలియదు
కోరినంతనే వెళ్ళగలమా? మనకు తెలియదు
నటన బాగా చేయవోయీ! పాత్రధారి
ఎపుడు వేదిక ఎటుల
దిగుదుమొ మనకు తెలియదు”(8)
జీవన రంగస్థలంలో మనం నటీనటులమే. మనకు ఇచ్చిన పాత్రను సరిగ్గా నిర్వహిస్తే అదే పదివేలు. సంచిత పుణ్య పాపకర్మలు మన తదుపరి జన్మకు కారణం అవుతాయని పెద్దలు చెప్తారు. కోరుకున్న జన్మను పొందుతామా… లేదా అనేది మనకు తెలియదు. పోతన కైవల్య పదాన్ని కోరుకున్నాడు. మరుజన్మ లేకుండా చూడమని చాలామంది భగవంతుని ప్రార్థిస్తారు. “మరణం అంటే పునర్జన్మకు సిద్ధం కావడం ” అని అరవిందులు చెప్పాడు. పై రెండు పరస్పర భిన్న అంశాలు.అయినా అవన్నీ మనకెందుకు?. జన్మించాము. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన చేతుల్లో ఉంది. “రాకపోకలు” మన ఆధీనంలో లేవు.
“మట్టి బొమ్మిది నమ్మ బోకండి  ఓ మనుజులారా! మాయమైపోతుంది చూడండి” అన్న గేయంలోని తాత్వికత మనకు అర్థం కావాలి. ఏ రూపంలో ఏ దిక్కు నుండి ఎప్పుడు ఎక్కడ  మృత్యువు మనలను కబళిస్తుందో  తెలియదు. తెలియని దానికి భయపడుతూ రోజూ చావును తలుచుకుని భీతిల్లడం అవివేకమని పై రుబాయి స్పష్టం చేస్తున్నది.
“కొండకు జ్ఞాపకం లేదు లావా జన్మ
మర్రికీ గుర్తుకు రాదు విత్తన జన్మ
మునుపు ఎక్కడో దాగిందో ఈ అంతరాత్మ
అసలు పసిగట్టలేనిదీ పూర్వజన్మ” (26)
“జన్మించిన వారికి మరణం, మరణించిన వానికి జన్మము తప్పదు. కాబట్టి మరణించిన వారి కోసం దుఃఖించకూడదు” అని భగవద్గీత చెప్తుంది. ఇలా చెప్పడంలో పునర్జన్మ ,పూర్వజన్మ అనే భావన ఉంది. లావా పూర్వజన్మ. కొండ ప్రస్తుత జన్మ. విత్తనం పూర్వ జన్మ. మర్రి ప్రస్తుత జన్మ. వాటికి పూర్వజన్మ జ్ఞానం లేదు .వాటికే కాదు. పూర్వజన్మ జ్ఞానం ప్రకృతిలో ఏ జీవజాలానికి లేదు .ఈ సందర్భంగా అరవిందుల వారి మాటలను గుర్తుకు తెచ్చుకుందాం. “మరణమన్నది లేనట్లయితే ప్రాణి ఎల్లప్పుడూ ఒక రూపంలో ఉంటుంది. అందువల్ల ఆ ప్రాణి జీవితం అసమగ్రమవుతుంది. మరణం వల్లనే ప్రాణి జీవితం సమగ్రమవుతుంది”. దీని ప్రకారం లావా కొండ కావడం, విత్తనం మర్రి కావడం సమగ్రం. సమగ్రమైనప్పుడే కదా జన్మ ధన్యం. ప్రాచీన సాహిత్యంలో పూర్వజన్మ వాసనలు కొందరికి ఉన్నట్లు రాశారు. ఈ కలికాలంలో మానవమాత్రులకు అది సాధ్యం కాదు. భూతకాల చింతన విడిచి వర్తమానంలో జీవించడమే మనకు ఇప్పుడు కావాల్సింది. “ఎన్నెన్నో జన్మల బంధం”అన్న పదబంధం ఎంత  ప్రసిద్ధమైందో మీకు తెలుసు కదా! దానిని చదివినప్పుడు పూర్వజన్మ ఏకవచనం కాదని, బహువచనమని తెలుస్తున్నది.
“ఇంటి నిండా బంధువర్గము ఒక్కరాపరు
ఊరినిండా మిత్ర వర్గము ఒక్కరాపరు
ప్రాణ దీపం శిథిలకాయము వీడిపోగా
జగతి నిండా ప్రేమ మూర్తులు ఒక్కరాపరు”
(43)
మనలోని ప్రాణాన్ని జ్యోతి రూపంగా భావిస్తాము. అది ఆత్మ యొక్క రూపం. ప్రాణాన్ని విడవడమంటే ఆత్మ జ్యోతి  దేహాన్ని వీడటమే. పై రుబాయిలోని సౌందర్యమంతా నాలుగో పాదంలో ఉంది.నాలుగో వాక్యం  చదివేసరికి మనం గొప్ప అనుభూతికి లోనవుతాం. ఒక కృష్ణుడు, ఒక క్రీస్తు, ఒక అల్లా ,ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు, ఒక గురు గోవిందుడు, ఒక శిరిడీసాయి లేక అందరూ ప్రత్యక్షంగా  పక్కనే ఉన్నా పోయే ప్రాణాన్ని ఆపలేరని అర్థం చేసుకుంటే ఈ రుబాయి గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది.ఎంతటి536 కరుణాహృదయుడైనా మరణం విషయంలో నిస్సహాయుడే కదా!.
“ఎన్నో  సందళ్ల నడుమ రోజు జారిపోతుంది
ఏ అలజడి లేకుండా శతాబ్ది దొర్లి పోతుంది
ఊదకుండానే ఆరిపోయే దీపం మనిషి
ఏ సడీ లేకుండా ఊపిరి ఆగిపోతుంది”. (74)
కాలం గడవడం అంటే జీవితం  కూడా గడవడమే కదా! జీవితం వెలుగుతున్న దీపం.ఏదో ఒకనాటికి ఆ దీపం ఆరిపోక తప్పదు.
దీప ప్రమిదలోని తైలం అయిపోయాక దానిని ఎవరు ఊదవలసిన అవసరం లేదు. చమురు నిండుకున్న తర్వాత దీపం ఎంత నిశ్శబ్దంగా ఆగిపోతుందో, జీవశక్తి నశించిన దేహంలోని ఆత్మ జ్యోతి అంతే నిశ్శబ్దంగా దేహాన్ని వీడుతుంది. చుట్టూ ఎంత మంది ఉన్నా  పోయే ప్రాణాన్ని ఆపలేరు.  పై రుబాయి లోని ‘రోజు’,’శతాబ్ది’ కాల వాచకాలు. కాలానిది కరిగిపోయే లక్షణం. పుట్టిన మనిషి కాలంతోపాటు కొంత దూరం నడిచి అస్తమిస్తాడు. కాలాన్ని ఎవరు ఆపలేనట్లుగానే మరణాన్ని ఎవరూ ఆపలేరు. మనిషి చనిపోవడాన్ని “కాలం చేశాడు” అని కూడా అంటారనే విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను.
“శ్వాస తీసినన్నినాళ్ళు సౌఖ్యంగా ఉండాలి ఊపిరున్నన్నాళ్ళూ ఉత్సాహముండాలి
కాయలన్నీ చెట్టు వీడుననితెలుసు
పండు రాలేదాక పుండు రాకుండాలి”. (31)
పుట్టుక ,చావుల మధ్య క్షణభంగురమైన జీవితం ఎలా ఉండాలనే ప్రశ్నకు కవి జవాబులా కనబడుతుంది ఈ రుబాయి. ఇందులోని మూడవ వాక్యం తాత్వికతతో నిండి ఉంది. “పండు రాలేదాకా పుండు రాకుండా ఉండాలి” అన్న కవి ఆకాంక్ష ఆయన స్వీయ వేదనలోంచి పుట్టింది. తెలంగాణ రుబాయిలు రాస్తున్న  సమయంలోనే నరసింహా రెడ్డి గారి బావమరిది క్యాన్సర్ మహమ్మారితో మరణించాడు. క్యాన్సర్ పుండుతో తన బావమరిది తల్లడిల్లి పోయిన నరక క్షణాలను కళ్ళారా చూశాడు కవి. అందుకే శత్రువుకు కూడా
ఇటువంటి బాధ రావద్దని కోరుకున్నాడు.
‘చిలుక ఈ చెట్టు నుండి ఎగిరి పోతుంది'(147), ‘ప్రతి వస్తువు మృత్యు దిశన  పరుగులిడును కాదె'(241), ‘సమయమెళ్ళిపోతుంది ఎలా ఎలా ఆపను’ (87), ‘వికసించిన ప్రతీ మొగ్గ వాడిపోవును ‘(80), ‘ఎట్ల నైనా కాడి ఎత్తేయవచ్చు'(58) మొదలైన  రుబాయిలలో కూడా మరణ తాత్వికత మనకు కనబడుతుంది. “తెలంగాణ రుబాయి”ల లోని వస్తువైవిధ్యంలో మరణ భావన చోటు చేసుకోవడం, తాత్వికంగా అది అభివ్యక్తం కావడం, సులభశైలిలో క్లిష్టమైన భావనలను పాఠకులకు అందించడం కవి రచనా శక్తిని ,పరిశీలనాసక్తిని తెలుపుతున్నవి. అందుకే పాఠకుల విశేష ఆదరణను అవి పొందుతున్నవి.
“జీవమన శరీరమున నేమో వచింతు
విసురు గాలిది ఇటు దూరి వెడలెనటుల”
పాలమూరు ప్రసిద్ధ కవి కీర్తిశేషులు వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి గజల్ అనువాదమైన “ముక్త గీతికల”లోని ఒక గజల్ తో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.
February 28, 2022 3 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక శీతకాలపు సాయంత్రం

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు February 28, 2022
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

తుఫాను గాలికి కొట్టుకుపోతున్న కారు మేఘాలు,

వడిగాలుల్లో సుడులు తిరుగుతున్న మంచుతునకలు…

విను, తోడేళ్ల భీషణమైన ఊళ వినిపిస్తోంది

విను, ఇప్పుడది పిల్లవాడి ఏడ్పులా ఉంది

గుడిసె కప్పు మీద గలగలమనే

ఎండుగడ్డి లోంచి దూసూకుపోతూ

కాంక్రీటు గోడల మీద దడదడ శబ్దం చేస్తూ

అలసిన దేశద్రిమ్మరి తలుపు మీద బాదినట్టు ఆ శబ్దం

 

వంటగదిలో భయంకరమైన చీకటి,

ఎలమి లేక ఏకాంతంగా మన వెనకడుగు…

ప్రియమైన, మనోజ్ఞమైన అమ్మా!

మాట నుడివి మౌనాన్ని ఛేదించు

తుఫాను రోదన నీ కనురెప్పల్ని

భారంగా మూసేసిందా?

రాట్నపు మృవైన రొద

నీకోసం జోలపాట పాడిందా?

 

నా యౌవన వసంతపు ప్రియురాలా!

నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!

మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం

మద్యం మనలో మోదాన్ని నింపుతుంది

దవ్వులలోని గువ్వలలాగా స్వేచ్ఛగా

అన్నీ మరచి గానం చెయ్

వేకువన వెలదులు తేటనీటి నదీతీరంలో

ఆలపించే పాటను పాడవా?

 

తుఫాను గాలికి కొట్టుకుపోతున్న నల్లని మేఘాలు,

వడిగాలుల్లో సుళ్ళు తిరుగుతున్న మంచుతునకలు…

విను, తోడేళ్ల భీకరమైన ఊళ వినిపిస్తోంది

విను, ఇప్పుడది పసివాడి ఏడుపులా ఉంది

నా యౌవన వసంతపు ప్రియురాలా!

నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!

మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం

మద్యం మనలో మోదాన్ని నింపుతుంది

 

రష్యన్ మూలం: అలెగ్జాండర్ పుష్కిన్

ఆంగ్లం: మార్తా డికిన్సన్ బియాంచి

తెలుగు సేత: ఎలనాగ

 

***

 

 

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

‘అనువాద కుసుమాలు..’

by Jwalitha February 28, 2022
written by Jwalitha

1930లో జన్మించి తన పద్దెనిమిదవ ఏట కవిత్వం ప్రారంభించి 1993లో నోబుల్ బహుమతిని పొందిన డెరెక్ వాల్కాట్ కవితలు ఈ ఫిబ్రవరి 2022 ‘అనువాద కుసుమాలు..’

మరణశాసనం

మనోవేదనంతా రెండు పద్ధతులతో మెలితిప్పుతోంది

ఒకటి అద్దెగుర్రాలను అనుసందానించిన గద్యం ,

నేను సంపాదించిన నా బహిష్కరణ.

మసకవెన్నెల ప్రకాశంలో సుదీర్ఘ సముద్రతీరాన ప్రయాసతో ప్రయాణం

కమిలి, కాలిన

చర్మాన్ని విడిచి

ఈ సముద్రపు ప్రేమ – అదే స్వీయ ప్రేమ.

మీ మాటలను మార్చుకోవాలంటే.. మీ జీవితాన్ని మార్చుకోక తప్పదు.

పాత తప్పిదాలను సరిదిద్దలేను నేను

అలలు దిగంతాలను అలంకరించి తిరిగి వస్తున్నాయి

సముద్రపు కాకులు అరుస్తున్నాయి ఛాందసపు మాటలతో

ఎగువ రేవులో కుళ్ళిపోతున్న దోనెలు

విషపుముక్కుల పక్షులగుంపులతో ఆ ద్వీపాంతరం నిండిపోయింది..

ఒకప్పుడు దేశం పట్ల ప్రేమ ఉంటే చాలు అనుకున్నాను, ఇప్పుడు, నేను వేరే మార్గం ఎంచుకున్నా, స్థలమే లేదు ఆ దోనెలో

నేను ఎదురు చూశాను కుక్కల వంటి ఉత్తమ మేధావుల

రవ్వంత సహాయం కోసం

నాకు వయసు మీద పడుతుండగా, కాలిన చర్మం

కాగితం వలె నా చేతి నుండి రాలుతుంది,

సన్నని ఉల్లిపొరలా

*పీర్ జింట్ చెప్పే పొడుపు కథల వలె

హృదయంలో ఏమీ లేదు,

చావును గురించి భయం కాదది.

ఎందరో చనిపోయారని నాకు తెలుసు.

వారందరూ సుపరిచితులే, అన్ని పాత్రల్లో ఉన్నారు,

కానీ.. అగ్నిలో వారు ఎలా మరణించారు..,

ఆ దేహాలకు ఇక పై ఏ భయాలుండవు

కొలిమిలా మండే భూమి వలన

ఆ సూర్యుని బట్టీ వంటి బూడిదకుప్ప,

ఈ మేఘావృతమైన, మేఘరహితమైన నెలవంక ప్రకాశంతో

ఈ రేవు మళ్లీ ఖాళీ పేజీలాగా తెల్లగా మారుతుంది

దాని సమానత్వమంతా  అసమాన ఆగ్రహమే.

(*పీర్ జెంట్ నార్వేకి చెందిన కవి, నాటకకర్త)

***

ఆంగ్ల మూలం: డెరెక్ వాల్కాట్ట్ (Derek walcott)

తెలుగు సేత : జ్వలిత

Codicil

Schizophrenie, wrenched by two styles, one a hack’s hired prose, I earn my exile. I trudge this sickle, moonlit beach for miles,

tan, burn

to slough off

this love of ocean that’s self-love.

To change your language you must change your life.

I cannot right old wrongs.

Waves tire of horizon and return.

Gulls screech with rusty tongues

Above the beached, rotting pirogues,

they were a venomous beaked cloud at Charlotteville.

Once I thought love of country was enough, now, even if I chose, there’s no room at the trough.

I watch the best minds root like dogs

for scraps of favour.

I am nearing middle

age, burnt skin

peels from my hand like paper, onion-thin

Peer Gynt’s riddle.

At heart there’s nothing, not the dread

of death. I know many dead.

They’re all familiar, all in character,

even how they died. On fire,

the flesh no longer fears that furnace mouth

of earth,

that kiln or ashpit of the sun

nor this clouding, unclouding sickle moon

whitening this beach again like a blank page.

All its indifference is a different rage.

***

ముగించబోతున్నాం

నేను నీటిపై జీవిస్తున్నాను,

ఒంటరిగా.. భార్యా పిల్లలు లేకుండా..

నేను ఈ స్థితికి రావడానికి చుట్టుముట్టిన ఎన్నో కారణాలు

చుట్టూ బూడిద నీరున్న చిన్న ఇల్లు,

పాత సముద్రపు దిశగా ఎల్లప్పుడూ తెరిచుండే కిటికీలు, అలాంటి వాటిని మనమెప్పుడూ కోరుకోము,

కాని మనంతట మనమే తయారు చేసుకున్నవవి.

మేము బాధపడుతున్నాము..,

సంవత్సరాలు గడుస్తున్నాయి,  సరుకులు దింపుతుంటాం,

కానీ మన అవసరానికి కాదు

సమస్యలలో… ప్రేమ అనేది పాలిన నీటికింద సముద్రగర్భంలో స్థిరపడిన రాయి.

ఇప్పుడు, నాకు ఏమీ అవసరం లేదు

కవిత్వం నుండి నిజమైన అనుభూతి కానీ,

జాలి లేదు, కీర్తి లేదు, చికిత్స లేదు. నిశ్శబ్దంగా భార్య,

మేము బూడిద నీటిని చూస్తూ కూర్చుంటాము,

మరిక అతి మామూలుగా జీవితంలో కొట్టుకు పోతూ చెత్తతో నిండిపోయి శిలల్లా జీవిస్తూ..

నేను అనుభూతిని మరచిపోవాలి,

నా బహుమతిని మరచిపోవాలి,

అది నాకు జీవితంలో అన్నిటి కంటే పెద్ద కష్టం..

***

ఆంగ్ల మూలం: Derek Walcott

తెలుగు సేత: జ్వలిత

Winding Up

I live on the water,

alone. Without wife and children.

I have circled every possibility

to come to this:

a low house by grey water,

with windows always open

to the stale sea. We do not choose such things,

but we are what we have made.

We suffer, the years pass,

we shed freight but not our need

for encumbrances. Love is a stone

that settled on the seabed

under grey water. Now, I require nothing

from poetry but true feeling,

no pity, no fame, no healing. Silent wife,

we can sit watching grey water,

and in a life awash

with mediocrity and trash

live rock-like.

I shall unlearn feeling,

unlearn my gift. That is greater

and harder than what passes there for life.

****

డెరెక్ వాల్కాట్ ఇరవయ్యవ శతాబ్దపు కవి, అతను జనవరి 23, 1930న లెస్సర్ యాంటిల్లెస్‌లోని సెయింట్ లూసియా ద్వీపంలో జన్మించాడు. అతను కవలశిశువుగా జన్మించాడు. అతని తండ్రి, పెయింటింగ్ చేసేవాడు కవిత్వం రాసేవాడు, డెరెక్ మరియు అతని కవల సోదరుడు ఒక సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు అతడు మరణించాడు.

అందువల్ల, కుటుంబం సభ్యులు  చెప్పిన కథలు తప్ప వాల్‌కాట్‌కు తన తండ్రి గురించి ఏమీ తెలియదు. అతని తల్లి కళలను ఇష్టపడే ఉపాధ్యాయురాలు. ఆమె తన పిల్లలకు కవిత్వం చెబుతుండేది. తన జీవితంలోని ప్రారంభ దశల్లో, వాల్కాట్ తన కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు మరియు కొన్నింటిని స్వయంగా ఎదుర్కొన్నాడు. ఈ కష్టాలలో కొన్ని ఎంపిక చేయబడినవే అతని కొన్ని కవితలకు ప్రేరణగా మారాయి. ప్రత్యేకించి, వాల్కాట్ యొక్క నానమ్మ అమ్మమ్మ బానిసత్వ యుగంలో జీవించారు.  బానిసత్వం గురించి అతను తన రచనలలో చాలాసార్లు ప్రస్థావించాడు. అతని తల్లి స్థానిక మెథడిస్ట్ చర్చిని నడిపించడంలో నిమగ్నమై ఉంది, అయితే అక్కడి ప్రధానమైన కాథలిక్ సంస్కృతితో కుటుంబం మసకబారినట్లు భావించింది.  అతను రాయబోయే కవిత్వంపై కూడా గణనీయమైన ప్రభావం చూపింది, అలాగే సాధారణంగా వాల్‌కాట్ విద్యాభ్యాసం సెయింట్ మేరీస్ కళాశాలలో గడిపిన సమయం, అతను వెస్ట్ ఇండీస్ విశ్వవిద్యాలయం కళాకారుడిగా అతనికి స్ఫూర్తిదాయకంగా నిరూపించబడింది. కళ పట్ల ఉన్న ఈ అభిరుచి అతన్ని థియేటర్, ఆర్ట్ క్రిటిక్‌గా ఉద్యోగం చేయడానికి 1953లో ట్రినిడాడ్‌కు వెళ్లేలా చేసింది. అతని మొదటి ప్రధాన సాహిత్య విజయం 18 సంవత్సరాల వయస్సులో వచ్చింది, అతను తన తల్లి నుండి డబ్బు తీసుకున్నాడు మరియు యంగ్ XII కాంటోస్ (1949) కోసం 25 కవితలు (1948) మరియు ఎపిటాఫ్‌ను స్వయంగా ప్రచురించాడు. సుమారు ఆరు సంవత్సరాలు ట్రినిడాడ్‌లో నివసించిన తర్వాత, వాల్‌కాట్ ట్రినిడాడ్ థియేటర్ వర్క్‌షాప్‌ను స్థాపించాడు.  అతని నాటకాలలో ఎక్కువ భాగాన్ని తయారు చేస్తుంది, దీని తరువాత, వాల్కాట్ తన సమయాన్ని చాలావరకు ప్రయాణాలలో గడిపాడు.

ఆ తర్వాత అతడు ప్రపంచం మరియు కరేబియన్ సాహిత్యానికి ఒక సాంస్కృతికవేత్తగా మారాడు. అతను బోస్టన్ యూనివర్శిటీలో సాహిత్యం యొక్క ప్రొఫెసర్‌గా బోధిస్తూ గడిపాడు. 1992లో అతని సాహిత్యానికి నోబెల్ బహుమతిని అందుకోవడమే ఇప్పటి వరకు ఆయన సాధించిన గొప్ప విజయం.

***

ఇష్మెంట్ టు డా 1992లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.

కవిత్వం

డెరెక్ వాల్కాట్ రచనలలోని సాధారణ ఇతివృత్తాలు కరేబియన్ సంస్కృతి మరియు చరిత్రపై దృష్టి కేంద్రీకరించబడింది, వలసవాదం యొక్క ప్రభావాలు, భాషతో సంబంధం తెలుస్తోంది. అతను కొన్నిసార్లు ఇంగ్లీష్ నుండి కరేబియన్, పాటోయిస్ నుండి ఫ్రెంచ్ వరకు మిక్స్ భాషలను ఉపయోగించాడు. అదనంగా, వాల్‌కాట్ యొక్క కవిత్వం వివిధ కాలాల ప్రదేశాలలో విస్తరించి ఉంటుంది మరియు కరేబియన్‌లోని సంస్కృతులు మరియు ప్రజల మధ్య సంక్లిష్టమైన సంబంధాలను చూపే సంఘటనలుంటాయి.

“ది సీ ఈజ్ హిస్టరీ” అనే కవితలో వాల్కాట్ నాటి భయానక పరిస్థితులను పరిశోధించడం ద్వారా ఆఫ్రికన్ చరిత్రకు సంబంధించి కరేబియన్ చరిత్రను వివరించగలిగాడు.

ఈ కాలపు చరిత్ర చాలా వరకు సముద్రంలో బంధించబడిందని, “ఆ గ్రే వాల్ట్‌లో” మరణించిన ఆఫ్రికన్ ప్రజల జీవితాలలో: బానిస ఓడలు  మిడిల్ పాసేజ్ లో మునిగిపోయాయని ఆయన సూచించారు. వాగ్దాన భూమిని వెతుకుతూ బైబిల్ (నిర్గమకాండము)లో యూదుల పారిపోవడానికి బలమైన పోలికలను కూడా తన కవిత్వం లో చెప్పాడు.

***

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

జాబులో అడుగుల జాడ

by Cheedella Seetha Lakshmi February 28, 2022
written by Cheedella Seetha Lakshmi

గురజాడ అడుగుజాడ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.లేఖల్లో వెతుకుదాం.

ప్రముఖ కవి,నాటక కర్త,కథా రచయిత,సంఘసంస్కర్త,
వ్యావహారిక భాషా ప్రచారకులు, ముత్యాలసరం అనే పేరుతో కొత్తదైన మాత్రాఛందస్సును సృష్టించి తరువాతి కవులకు మార్గదర్శకుడై తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని గురజాడ- అడుగుజాడ అని కీర్తి గడించి నాది ప్రజల ఉద్యమం అని చాటి చెప్పిన ప్రజానాయకుడు,అభ్యుదయ కవి,ఆధునిక సాహిత్య యుగకర్త గురజాడ వెంకట అప్పారావు పంతులు.

దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ అని నినదించి దేశాన్ని ప్రేమించమని చెప్తూ దేశభక్తిని చాటిన గురజాడ 1862వ సంత్సరం సెప్టెంబర్ 21వ తేదీన యెస్ రాయవరం గ్రామం విశాఖపట్టణం జిల్లాలో వెంకటరామదాసు,కౌసల్యమ్మ దంపతులకు జన్మించాడు.

తండ్రి విజయనగరం సంస్థానంలో ఉద్యోగ జీవితం నిర్వహించి కన్నుమూశాక అప్పారావు గారు విజయనగరం వచ్చి వారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుండగా అక్కడ ఎం.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర శాస్త్రి చేరదీశారు. 1882లో మెట్రిక్కులేషన్,1884లో ఎఫ్.ఏ.చేసి అదే కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరిన తర్వాత బి.ఏ చదువుతుండగా సహాధ్యాయి గిడుగు రామమూర్తితో స్నేహం కొనసాగి ప్రాణస్నేహితులయ్యారు. వివిధ ఉద్యోగాల్లో తనదైన ముద్రవేసి,రచనా వ్యాసంగం కొనసాగించి ,అభ్యదయకవిగా సంఘసంస్కరణే ప్రధాన భూమికగా రచనలు చేసిన మహాకవి గురజాడ 1915 వ సంవత్సరంలో తన 53 వ యేట తనువును చాలించినా ఆయన రచనలు మన అందరిని ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

అప్పారావు గారికి సమకాలికులు వ్రాసిన లేఖల వల్ల, అప్పారావుగారే స్వయంగా సమకాలికులకు,మిత్రులకు,సన్నిహితులకు వ్రాసిన లేఖల వల్ల వ్యక్తిగత విషయాలు,అభిప్రాయాలు,
వివేచనాశక్తి,విమర్శనా పద్ధతులు,రచనా విశేషాలు నాటి సమాజపరిస్థితులు,ఆయన ఖచ్చితమైన దృక్పథం మొదలైన అనేక విషయాలు తెలుసుకోవచ్చు.పంతులు గారి స్వభావం లేఖల వల్ల విదితమౌతుంది.

పాఠ్యపుస్తక నిర్ణయంలో కానీ, రచనలో వ్యావహారిక భాషను ప్రయోగించడంలోగాని అనేక నూతన సంస్కరణలను చేపట్టాడు గురజాడ.

మిత్రునికి వ్రాసిన లేఖవల్ల గురజాడ ఉద్యోగ జీవితం,సాహిత్యకృషి తెలుస్తుంది.మీ కృషిని గురించి వివరించండి అని మిత్రుడు రాసిన లేఖకు సమాధానంగా లేఖ రాస్తూ “ఎవరి కృషిని వారు చెప్పుకోవడం బాగుండదు.బాగుండని పని మీరు నా చేత చేయిస్తున్నారు” అని సవినయంగా చెప్పుకున్నప్పటికీ ఆయన నిర్వహించిన పాత్ర ఎంత సమగ్రమైనదో తన మాటల్లోనే వ్యక్తం చేశాడు. “సిండికేటు సభ్యులందరికీ నేను తెలుసు. నా కృషి ఏమిటో తెలుసు.నా సాహిత్య కృషి ఎందుకు అడగడం” అని ప్రశ్నిస్తాడు.ఒక వాక్యం వ్రాయనివారు, ఒక పుస్తకం కూడా ప్రచురించని పండితులు మనలో చాలామంది వున్నారు.” సృజనాత్మక శక్తికి పాండిత్యానికి భేదం చాలా ఉంది.ఒక కళాశాలలోనో,పాఠశాలలోనో పండితునిగా వున్నంత మాత్రాన తానొక కవిననుకోవడం ఎవరికీ భావ్యం కాదు” అని అంటూనే ” ప్రతి పండితుడు తానొక వచన రచయితననో,కవిననో భావించడం మన దేశ దౌర్భాగ్యం…. పనికిమాలిన పాండిత్యంతో కవిత్వం మీద విరుచుకుపదుతున్నారు.” అని విమర్శిస్తాడు.నాటి సమాజంలో కొద్దిగా తెలిసినవారైనా సరే పండితుడైనా సరే కవినని చెప్పుకుని తిరిగేవారు.ఏదో కవిత్వం రాసి మిడిసిపాటు పడే వారిని చూసి సహించని గురజాడ పనికిమాలిన పాండిత్యంతో కవిత్వంపై విరుచుకు పడుతున్నారని దెప్పిపొడిచాడు.పండితులపై ఒక విసురు విసిరి నిరసిస్తూనే తన గురించి గొప్పచెప్పడం మంచిది కాదనే చెప్తూ మీరు అడుగుతున్నారు కనుక చెప్తున్నానని తన ఉద్యోగ వివరాలను తెలియపరచాడు. విజయనగరం మహారాజా వారి కళాశాలలో కొన్ని సంవత్సరాలు ఉపన్యాసకుడుగా పని చేసినప్పుడు అక్కడ విద్యార్థులకు ఇంగ్లీషు,హిస్టరీ,సంస్కృతం బోధించేవాడు.తర్వాత విజయనగరం సంస్థానంలో శాసన పరిశోధకునిగా కొంతకాలం కృషి చేశాడు.విజయనగరంలో ” ప్రకాశిక” అనే పత్రికను నెలకొల్పి సంపాదకునిగా వున్నాడు.
ఈ లేఖలోనే తన సాహిత్యకృషిని కూడా వివరిస్తూ కన్యాశుల్కం,బిల్హణీయం నాటకాలు,నీలగిరి పాటలు,ముత్యాలసరములు,డామన్ పిథియస్,లవణరాజు కల,కాసులు మొదలగు గేయాలు,ఆంధ్ర భాషా సాహిత్యంపై కొన్ని వ్యాసాలు,విమర్శలు “ఆంధ్రపత్రిక,కృష్ణాపత్రిక,కేసరి,
శశిలేఖ,ఆంధ్ర ప్రకాశిక ” మొదలగు పత్రికల్లో ప్రచురించినట్లు తెలిపాడు. ఉత్తరాలవల్ల గురజాడ వ్యక్తిత్వం నిర్మొహమాటంగా ,ముక్కుసూటిగా వుండేవాడని తెలుస్తుంది.

విజయనగరం మహారాజా వారి సంస్థానంలో శాసన పరిశోధకునిగా వుండి చేసిన సేవ కొనియాడదగింది.గురజాడ స్వయంగా వ్రాసిన లేఖలో శాసనాల వల్ల భాషా స్థితి,లిపి స్వభావం ,అనేక రాజుల చరిత్ర తెలుస్తుందని,శాసనాలను ప్రకటించేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించాడు.భారతదేశంలో భాషా పరిశోధనా రంగం మరుగున పడిపోయిందనే బాధను వ్యక్తం చేశాడు.” ప్రాచీన భాషను మాండలిక భాషను పరిశీలించడం ఎంత ఉపయోగమో తెలుగు రచయితలు గుర్తించడం లేదు.దురదృష్టవశాత్తు ఈ కృషికి సి.పి.బ్రౌన్ మొదటివాడు.ఆఖరివాడు కూడా. తమిళమున అలాగ కాదనుకుంటాను” అని పరిశోధనా రంగంలో,భాషా పరిశోధనలో తెలుగువారి చాతగానితనాన్ని దుయ్యబట్టాడు.సి.పి బ్రౌన్ ను శ్లాఘించాడు.

శాసన పరిశోధనలో కష్టనష్టాలను ,చేసిన శ్రమను,అనుసరించాల్సిన పద్ధతులను లేఖల్లో సూచించాడు.తరువాతి తరం వారికి ఉపయోగపడే రీతిలో భద్రపరచాలని సూచనలిస్తూ పరిశోధనా రంగంలో అభివృద్ధి పొందాలని ఆకాంక్షించాడు. “జయవూరు చరిత్ర” గురించి పరిశోధిస్తూ మహారాజా వారు ఆమోదించినట్లయితే ఒక వ్యాసం రాస్తానని ఆసక్తిని వెలిబుచ్చుతూ ఆయన పరిశీలనలో తేలిన అంశాలను లేఖలో వివరిస్తూ” పల్లవులది భరద్వాజస గోత్రము.వివాహ సంబంధము వలన పల్లవులకు చాళుక్యులకు బాంధవ్యము కల్గినది.ఈ సిద్ధాంతము రాజా వారికి అంగీకారమయితే నేను వ్యాసము వ్రాస్తాను” అని రాజావారి అనుమతి కోరాడు.

మద్రాసు విశ్వవిద్యాలయంలో సిండికేట్ మెంబర్ గా నామినేట్ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గురజాడకు లేఖ రాస్తూ E.W.మిడిల్ మాస్ట్ ” ఇందులో ఏ రాజకేయ కారణాలు లేవు.కేవలం మీ పాండిత్యాన్ని ప్రతిభను పురస్కరించుకొని నామినేటయ్యారు” అనడం వల్ల ఆనాడు విశ్వవిద్యాలయం కూడా గురజాడ ప్రతిభా పాండిత్యాన్ని గుర్తించి ఉన్నత స్థానం ఇచ్చిన విషయం విదితమౌతుంది. సిండికేట్ మెంబర్ గా,పాఠ్యపుస్తక నిర్ణయాధికారిగా ఉండి గురజాడ చేసిన కృషి,తీసుకున్న నిర్ణయాలు,ఖచ్చితమైన అభిప్రాయాలు,సూచనలు,ఆయన తీసుకొన్న చొరవ,ఉద్యోగనిర్వహణ బాధ్యత,వ్యావహారిక భాషావశ్యకతను గుర్తించి ప్రచారం చేయడం మొదలైనవి మిత్రులు గురజాడకు రాసిన ఉత్తరాల వల్ల తెలుస్తాయి.

పాఠ్య గ్రంథాల్లో గ్రాంథిక భాషలో ఉన్న వాచకాలను పెట్టడానికి ప్రోత్సహించిన వారిని విమర్శించాడు.గున్నయ్య శాస్త్రికి రాసిన లేఖలో ” బడిలో వేసినప్పటినుండి చదువు పూర్తయ్యేవరకు కృతక గ్రాంథిక భాషలో ఉన్న వాచకాలను,పాఠ్యపుస్తకాలను చదవడం వల్ల మీరు పడికట్టు రాళ్లవంటి పదాలకు అలవాటు పడిపోయారు అంటూనే ” మీరు వ్రాస్తున్న దోషభూయిష్ట వచన గ్రంథాలను పఠించడం వల్ల యెస్ .యెస్.యల్.సి, ఇంటర్మీడియట్,బి.ఏ., ఎం.ఏ., విద్యార్థులు కూడా దోషభూయిష్టమైన భాషను అలవర్చుకుంటున్నారు.దృతముపై యడాగమాన్ని యథేచ్ఛగా వాడుతున్నారు.విసంధిని పాటించిన వచన గ్రంథాలను చదవడం వల్ల విద్యార్థులకు కావ్యశైలి అబ్బుతుందని మీ ఉద్దేశ్యమా? గ్రాంథిక వ్యాకరణం నేర్చుకోవడానికి అటువంటి పుస్తకాలు చదవాలి కదూ!” అని వ్యంగాస్త్రాన్ని ప్రయోగించారు.” గ్రాంథిక వ్యాకరణ యుక్త పదాలపై,వ్యవహారాల్లో నశించిన శబ్దాలపై రచయితకు మోజు వుంటే పద్యాలలో వాటిని ప్రయోగించి ఆనందించమనండి.కానీ వచనమైన వాడుకభాషలో వ్రాయవద్దా,వ్రాసి తీరాలి” అంటూ విద్యార్థుల పట్ల సానుభూతిని,వ్యవహార భాష పట్ల తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు గురజాడ. ఆనాడే వ్యావహారిక భాషలొనే పాఠ్య గ్రంథాలు,బోధన,పరీక్షాపత్రాలు వ్రాయడానికి అనుకూలంగా స్పందించిన విషయం సెనేట్ మెంబర్ గా తన బాధ్యతను ఎలా చక్కగా నిర్వర్తించాడో ఉత్తరాల వల్ల తెలుసుకోవచ్చు.

ఇంకో లేఖలో విద్యార్థుల పక్షపాతిగా కనిపిస్తాడు.సమాధానపత్రాలు దిద్దడంలో పొరపాట్లు పడి దిద్దితే విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశముంటుందన్న అభిప్రాయాన్ని వెల్లడించిన తీరు చూస్తే గురజాడ నిశితదృష్టి వ్యక్తమౌతుంది.” క్లాసికల్ తెలుగు పత్రాలను దిద్దిన సహాయ పరీక్షకులు శిష్ట వ్యావహారిక పదాలను వ్యాకరణ విరుద్ధప్రయోగాలుగా అపార్థం చేసుకుని,విద్యార్థులకు రావాల్సిన మార్కులను తగ్గించివేశారు” అని, వేదం వెంకటరాయశాస్త్రి గారికి రాసిన లేఖలో వ్రాస్తూ అభ్యర్థనలను ప్రోత్సహించాలన్న దృక్పథం కనిపిస్తుంది.మలయాళంలో ఎం.ఏ.లో కూచున్న అభ్యర్థు లేడుగురు ఉత్తీర్ణులయ్యారు.మనం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని అంటూ “సర్క్యులేషన్ పద్ధతి” లో అభ్యర్థుల ఫలితాలను ప్రకటిస్తే బాగుంటుందని అన్నాడు.” సర్క్యులేషన్ పద్ధతి” అంటే ఒకరు వేసిన మార్కులు తమ అభిప్రాయాలతో పాటు ఇంకొకరికి పంపించి వారి సూచనలు తాము తెలుసుకోవాలి.మాట వరసకి నేను సమావేశానికి రాలేకపోతాను.మీరు, రామయ్యగారు నేను వేసిన మార్కులు మార్చితే బాగుండుననుకుంటారు.నా పరోక్షంలో నాతో సంప్రదించనిదే మార్కులు మార్చకూడదు.నాకు సూచన చేసే అవకాశం ఉండి తీరాలి” అని వివరించాడు.విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాస్ అవాలన్న ఆకాంక్షతో పాటు విద్యార్థుల శ్రేయస్సును ఆశించాడు.ఎం.ఏ.లో ఇద్దరు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని,మనం వారిని పాస్ చేయాలని కోరుతూ జయంతి రామయ్య పంతులుకు రాసిన లేఖలో ” రామయ్య గారికి ఇవాళ నేను ఫైనల్ లిస్ట్ పంపిస్తున్నాను.వాళ్ళకి చెరొక మార్కు వేస్తే ప్యాసవుతారు.అది వీరిద్దరి ఇష్టం” అని రాయడం వల్ల విద్యార్థుల పట్ల గురజాడ చూపిన ఔదార్యం,ఆదరభావం వ్యక్తమౌతుంది. జయంతి రామయ్య గారికి రాసిన లేఖలో మలయాళ భాషలో పరీక్షకు వెళ్లిన ఏడుగురు ప్యాసయ్యారని,” ఎం.ఏ.పరీక్షకు ఇది ఆఖరు సంవత్సరం కనక మనం విద్యార్థుల పట్ల సాధువుగా ఉండాలి” అని విద్యార్థులు ఫెయిల్ అవుతున్నందుకు విచారాన్ని వ్యక్రం చేస్తూ ” నేను దిద్దిన టెస్ట్ పేపర్లు మళ్ళా జాగ్రత్తగా చూశాను.కొన్ని మార్కులు కలపాలనిపించింది కలిపాను.కానీ టెక్ట్స్ పేపర్లో రావాల్సిన కనీస మార్కులకు ఒకొక్కమార్కు తక్కువ వచ్చింది. మీరు మీ పేపర్లలో రావాల్సిన కనీస మార్కులకు ఒకొక్క మార్కు తక్కువ వచ్బింది.మీ పేపర్లలో మీరు ఆ మార్కు ఇద్దరికీ అవకాశం ఉంటే కలిపి పుణ్యం కట్టుకోండి….నాతో మీరు,వేదం వేంకటరాయ శాస్త్రి గారు ఏకీభవిస్తే తప్పక మరిద్దరు అభ్యర్థులు ఉత్తీర్ణులౌతారు.అప్పుడు వారి సంఖ్య ఆరు అనడం వల్ల గురజాడకు విద్యార్థులపట్ల ఉన్న సహృదయ భావం అర్థం చేసుకోవచ్చు.విద్యార్థులు గట్టెక్కడానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మేలు ఏ విధంగా చేశాడో తెలుసుకోవచ్చు.

పాఠ్యపుస్తకాలను నిర్ణయించడంలో కూడా చొరవ తీసికొని తన అభిప్రాయాలను లేఖా ముఖంగా వ్యక్తం చేశాడు. “ద్రవిడభాషల బోర్డాఫ్ స్టడీస్ చైర్మన్ రామకృష్ణ పిళ్ళై” కి రాసిన లేఖలో పాఠ్య పుస్తకాల జాబితాను తయారు చేయడానికి తొందరపడి సమావేశాలలో నిర్ణయాలు చేయడం మంచిది కాదని సలహా ఇస్తూ బోర్డు వారు ముఖ్య విషయం గమనించాలని కోరుతూ “మెట్రిక్యులేషన్ పరీక్షకు వేసే పుస్తకాలు ప్రధానంగా ఆధునిక వచనంలో ఉండితీరాలి” అంటూ ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘ ఫిలిప్స్’ రాసిన లేఖలో ఇంటర్మీడియట్లో పాఠ్యపుస్తకాలు నిర్ణయించడంలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ “పిల్లలపై మోపలేని భారాన్ని మోపకూడదు.ఒక ప్రాచీన కావ్యం,ఒక ఆధునిక గ్రంథం చెప్తే చాలును…తిక్కన విరాటపర్వ భాగాన్ని సూచించాను…బ్రౌన్ పరిష్కరించిన “వార్స్ ఆఫ్ ది రాజాస్ ” పఠనీయ గ్రంథంగా సూచిస్తూ ..వాస్తవిక జీవితంలో సంబంధం ఉన్న తెలుగు పుస్తకాలు చాలా తక్కువ.అందులో ఇది ఒకటి. బ్రౌన్ అతి నేర్పుతో ఈ పుస్తకాన్ని పరిష్కరించారు.” అనడం వల్ల విద్యార్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకున్న వాడుగా కనిపిస్తాడు గురజాడ..’ ఎస్.ఎస్.ఎల్.సి బోర్డు కార్యదర్శి మేడాక్స్ కు వ్రాసిన లేఖలో ” శాస్త్రీయమైన దృక్పథంతో భాషాతత్వాన్ని అవగతం చేసుకునే పండితులు దేశంలో లేరని” వాపోతూ ఇలా తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పారు. “థామ్సన్” గురజాడకు రాసిన లేఖలో “సంసారులు ,విద్యావంతులు మాట్లాడుకునే శిష్ట వ్యావహారిక భాషలో వచన గ్రంథములు వ్రాయవలెననే మీ వాదము న్యాయమైనది,సశాస్త్రీయమైనది” అంటూ గురజాడ వాదాన్ని ఆమోదించారు. పాఠశాలలో విద్యాబోధన పద్ధతులు విధిగా మారాలని ,అప్పుడే విద్యార్థుల స్థాయి పెరుగుతుందని,పాఠ్యపుస్తకాల్లో అశ్లీల శృంగారం ఉండరాదని విశ్వవిద్యాలయం నిర్దేశించిందని,వికృతమైన తెలుగు అపభ్రంశపు సంస్కృతం కలగాపులగం చేసి కొందరు రాసిన పుస్తకాలను విద్యార్థుల నెత్తిమీద మనం రుద్దకూడదు” అంటూ వేదం వేంకటరాయ శాస్త్రికి రాసిన లేఖలో తెలిపాడు.

విద్యార్థులను దృష్జిలో పెట్టుకుని పాఠ్యపుస్తకాల నిర్ణయంలో గురజాడ ఎన్నో సూచనలు,సలహాలను ఇచ్చాడు.స్పష్టమైన అవగాహన కలిగినవాడు.వ్యావహారిక భాషపట్ల ఎక్కువ మొగ్గు చూపాడు .అందరిని ఒప్పించిన ధీశాలి.

విజయనగర సంస్థానంలో కూడా వ్యవహార దక్షునిగా సలహాలనందించి ఖ్యాతి గడించినట్లు ,మంచి పలుకుబడి,గౌరవం ఉన్న వ్యక్తి అనడానికి లేఖలే నిదర్శనం. రాజకుటుంబాల దావా విషయంలో సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు విషయాలన్నీ తెలుసుకుని జాగ్రత్తగా ఆలోచించి సాక్ష్యం చెప్పడం వలన కలెక్టర్ ‘ పౌలర్ దొర’ గురజాడకు స్వయంగా రాసిన ఉత్తరంలో ” సంస్థానానికి అతి నమ్మకంతో మీరు చేసిన సేవ,మేలు మరువరానిది.తంత్రాలకు మీరు ఆమడ దూరం.మీది కేవలం ఋజుమార్గం.మీరు కావించిన సేవకు ప్రతిఫలం అందించే మహద్భాగ్యం నాకు పట్టింది” అని రాయడం వల్ల గురజాడ వ్యక్తిత్వం,ముక్కుసూటిగా పోయే చక్కని శీలసంపన్నుడు అని తెలుస్తుంది.

మహారాణి లలితా కుమారికి గురజాడ పట్ల గౌరవం,వాత్సల్యం,అభిమానం,చిత్తశుద్ధి,ఔదార్యం మొదలైనవి ఉన్నాయని విశాఖపట్నం పెద్దాసుపత్రి సర్జన్ కు ఆమె స్వయంగా రాసిన లేఖ వల్ల తెలుసుకోవచ్చు.అప్పారావు గారి ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆందోళన చెంది ” మా ఆంతరంగిక కార్యదర్శి శ్రీ గురజాడ అప్పారావు గారు కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన ఇప్పుడే విశాఖపట్నం బయలుదేరారు.ఇక్కడకంటే అక్కడ వాతావరణం బాగుంటుందని,తగిన వైద్య చికిత్స లభిస్తుందని ఆశ. పి.టి.శ్రీనివాసయ్యంగారింట దిగుతారు. మీరు వెంటనే అక్కడికొకమారు వెళ్లి వారి శరీరస్థితి జాగ్రత్తగా పరీక్షించి కావాల్సిన ఔషధములు వాడుతూ కంటికి రెప్పవలె కాపాడుతారని నమ్ముతున్నాను.ఆయన ఆరోగ్యము ఎలా వుంటున్నది ఎప్పటికప్పుడు నాకు తెలియ చేస్తూ ‘ బిల్లు’ నాకు పంపండి.బిల్లు ఎంతయినా సరే మీకు నేను చెల్లిస్తాను” అనడం వల్ల రాణిగారికి గురజాడ పట్ల ఉన్న ఆప్యాయత, శ్రద్ధ ,గురజాడకు ఉన్న స్థానం స్పష్టమౌతుంది.

వ్యావహారిక భాష కోసం గురజాడ పడిన తపన, శ్రమ, రచనాపధ్ధతి,
ఆశించిన మార్పు లేఖలద్వారా ద్యోతకమవుతుంది.” జ్ఞానేంద్ర మోహన్ దాస్” లేఖలో గురజాడ ఆశయం ” నిఘంటువులు,పండితుల,వైయాకరణుల సహాయం,అవసరం లేకుండా చదవగానే అందరికీ అర్ధమయ్యే విధంగా,భాషను సంస్కరించవలెనని మీ ఆశయం.
అదే నేటి సమస్య. మనమంతా భాషాసంస్కరణను కోరుతున్నాము.మన దేశంలో ఋజువర్తనగల మీవంటి ధీశాలురు,భాషా సంస్కరణ సమస్యను తరచి తరచి అవలోకిస్తున్నారు” అని రాయడం వల్ల వ్యావహారిక భాష కోసం గురజాడ తపన గోచరిస్తుంది.

జ్ఞానేంద్ర మోహన్ దాస్ ,జె.వి.యేట్స్ వ్రాసిన లేఖల ద్వారా గురజాడ వ్యావహారిక భాషోద్యమానికి ప్రోత్సాహమిచ్చినట్లు తెలుస్తుంది.”థామన్స్” లేఖలో “సంస్కారులు ,విద్యావంతులు మాటలాడుకునే శిష్ట వ్యావహారిక భాషలో గ్రంథములు వ్రాయవలెననే మీ వాదము న్యాయమైనది,సశాస్త్రీయమైనది” అని అభిప్రాయపడ్డాడు.
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వ్రాసిన లేఖలో ” రాబోవు నంచికకు నూతన అభిప్రాయములతో మీరు ఏమైనా సూచనలు కావింపవేడుతున్నాను” అని వ్రాస్తూ ” భాష సజీవమైంది,సంఘం అభివృద్ధి చెందాలంటే భాషాసంస్కరణ కూడా జరగాలి.భాషా వికాసానికి ఏపద్ధతులు అమలు చేయాలో,ఉత్సాహవంతులైన వారిని చర్చలో పాల్గొనేలా చేయాలని ఉంటే మీ వలే క్షుణ్ణంగా నిశితంగా తరచి పరిశీలించే వారు అట్టే మంది లేరని నా అనుమానం” అని వ్రాస్తూనే సిద్ధాంతం కోసం పదప్రయోగం చేయొద్దని,వ్యావహారిక భాష పట్ల పక్షపాత వైఖరిని విడనాడి సహజ శైలిలో రచన చేయమని సూచిస్తూనే విమర్శించాడు,వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు .
గున్నయ్య శాస్త్రికి రాసిన లేఖలో తన రచన పట్ల ఎంతో ధీమాను,విశ్వాసాన్ని,ప్రతిభను చాటుకున్నాడు గురజాడ.” తెలుగులో నవ్యరీతులకు,నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే.నా కావ్యకళ నవీనం,కావ్య యితివృత్తాలు భారతీయం.కవితలో నేను ఉత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను.జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథా,కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను.నాకా కళల పట్ల, జీవితం పట్ల కొన్ని ఆదర్శాలు ఉన్నాయి ” అంటూ తన రచనా ప్రణాళికను,రచనా పద్ధతిని చెప్పుకున్నాడు గురజాడ.
ఇంకో ఉత్తరంలో ఆంగ్ల భాషాధిక్యం వల్ల ఇద్దరు మిత్రులు కలిస్తే ఆంగ్ల భాషలో మాట్లాడుకోవడం వల్ల ఇంగ్లీష్ లోనే ఉత్తరాలు వ్రాయడం వల్ల బహుభాషా సంకీర్ణమైన మన రాష్ట్రంలో “వాడుక భాషల సాహిత్యం పెంపొందడం లేదు” అని వాపోతాడు.

ముని సుబ్రహ్మణ్యంకు వ్రాసిన లేఖలో గురజాడ నా ఉద్యమం ప్రజల ఉద్యమం సంస్కృతీ పరుల భావ సంపద నాకు అండగా ఉంది.అసలు విషయాన్ని అర్థం చేసుకోజాలని ఎవరో కొందరు వ్యక్తులు నాకు వ్యతిరేకంగా వ్యూహాలను పన్నినా లక్ష్యపెట్టక వాడుక భాషోద్యమాన్ని కొనసాగిస్తానని శపథం చేస్తూ గ్రాంథిక భాష వ్రాయడం కూడా ఓక వ్యసనమే” అంటాడు. “లలితమైన,సుందరమైన వాడుక భాషలో గ్రంథరచన కొనసాగించే సంప్రదాయమొకటి తలెత్తాలంటే నీవంటి యువకులు నాకవసరం” అంటూ యువతరాన్ని మేల్కొల్పాడు.వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఎంతో మంది విమర్శలకు సమాధానాలిచ్చాక “ఇన్నాళ్లకు వాళ్ళు నన్ను గౌరవించడం నేర్చుకున్నారనుకుంటాను” అని తన లక్ష్యసాధన పట్ల ఎంతో విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రాచీన “గ్రాంథిక భాషను వ్రాస్తామని దర్పానికి పోతూ వాడుక భాషను కృతకం చేసే రచయితలు నాకవసరం లేదు” అని గంట భజాయించి మరీ చెప్పాడు. కలెక్టర్ పౌలరు దొర వ్రాసిన జాబులో ” అందుకోదలచిన ఆదర్శాలు మీరు అందుకుంటారు.మీ కలలు నిజమౌతాయి” అన్న మాటలు వృధా పోలేదు.గురజాడ ఆశయాలు (సాహిత్య,భాషా విషయాల్లో )మార్పు నెరవేరి నేడు వ్యావహారిక భాషా స్థిరత్వం పొంది గురజాడ కన్న కలలు నిజమయ్యాయి.వాడుక భాషకు పట్టం కట్టడం జరిగింది.

గురజాడ మిత్రులకు ,సన్నిహితులకు వ్రాసిన లేఖలొకయెత్తు. మునిసుబ్రహ్మణ్యం గారికి వ్రాసిన లేఖలొక ఎత్తు. దీనిలో ఆయన హృదయం విప్పి విషయాలన్నింటిని కూలంకషంగా వివరించాడు.” రానున్న తరంలో యువకులు మాకన్నా సాహిత్య కృషి చేయగలరన్న” విశ్వాసాన్ని కనబర్చాడు.

ఇంకో లేఖలో ” కవితా న్యాయం నిన్నమొన్నటిలాగా నేడు లేదు.మానవ జీవితాన్ని నేను చిత్రిస్తాను…..అయినా మానవ సమాజం పట్ల నాకొక మహత్తరమైన బాధ్యత ఉంది.” అంటూనే ” తోటి మానవుణ్ణి హృదయమిచ్చి ప్రేమించు.నిజమైన, ఆరాధించ తగిన ప్రేమ ఏది? ” అని విశ్వప్రేమను చాటాడు.ఇతరులను ప్రేమించడం వల్ల నిరవధికానందం సిద్ధిస్తుందని అంటాడు.మనం ఒకరికి ఇచ్చే ప్రేమ మళ్లీ మనకు ప్రేమను కొని తెస్తుంది”.మానవ ప్రేమ గురించి ఎంతో గొప్పగా వివరించాడు గురజాడ.

భారతదేశంలో సాహిత్య గ్రంథాలు కొనేవాళ్ళు తక్కువ.” పుస్తకాల చెల్లుబడి మందంగా ఉంది.ఒకరు ఒక పుస్తకాన్ని కొంటే దాన్ని ఎరువు తెచ్చుకొని చదివేవాళ్ళు ఇరవై మంది.మనది పేద దేశం” అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తూనే ఒక చురక అంటించాడు.నేటి పరిస్థితి అదే.ఒట్టిగా ఇచ్చినా చదవరు.
గురజాడ తన రచనల ఉద్దేశ్యాన్ని లేఖల్లో వివరించాడు.విజయనగరం మహారాజా వారికి వ్రాసిన జాబులో ” అనేక సంఘటనలతో నిండి ఉన్న ఎంతో గాంభీర్యమూ,వైవిధ్యమూ గల నేటి జీవితాన్ని వీక్షించక ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ప్రాచీన కాల్పనిక కథలనుంచి రచయితలు ఇతివృత్తాలను ఎందుకు స్వీకరిస్తారో అర్థం కాక నాకు ఆశ్చర్యం వేస్తుంది.ఈ కారణాల వల్ల నేను వాస్తవిక జీవితం నుంచి సమకాలిక ఇతివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగు వాడుకభాషలో నాటకంగా రూపొందించాను” అంటూ ఆదిభట్ల నారాయణదాసు గారికి రాసిన లేఖలో తన కన్యాశుల్క నాటక గొప్పతనాన్ని చాటుకున్నాడు.
” ఇతివృత్త స్వీకరణలో,నిర్వహణలో,హాస్యరస పోషణలో,పాత్రోన్మీలనంలో తెలుగు సాహిత్యంలో ఇది అత్యుత్తమ నాటకమనే విషయాన్ని మరువకండి” అంటూ తన రచనా ఔన్నత్యం పట్ల విశ్వాసాన్ని ప్రకటించాడు.
మధురవాణి పాత్రను సమర్థిస్తూ మునిసుబ్రహ్మణ్యం కు వ్రాసిన లేఖలో గురజాడ సానిపిల్లల్లో కూడా మానవత్వం ఉంటుందని,సానుభూతిని ప్రకటిస్తూ ఆ పాత్రను ఎంతో ఔన్నత్యంగా తీర్చి దిద్దిన విషయంలో తీసుకున్న శ్రద్ధ ,సమాజాన్ని అవగాహన చేసుకున్న తీరును మనం కూడా గురజాడ నాటి సమాజ స్థితే కాదు నేటికాలంలో కూడా రచయితలకు ,కవులకు సమాజం పట్ల పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.సమాజాన్ని చదవాలన్న హితబోధ చేశాడు గురజాడ.

“ఆమె సైతం ఒక మానవవ్యక్తి అనే మాటను విస్మరించకు.ఆమె విచారం,కన్నీళ్లు,సంతోషం,ఆనంద బాష్పాలూ నీ నా సుఖదుఃఖాల వంటివే.మన అనుభూతుల
వలె అని గణుతింపదగినవే,గంభీరమైనవే.వ్యభిచారమే తన వృత్తిగా ” లేబిల్ వేయబడ్డ భోగపడచు సమాజాన్ని మోసగించడం లేదు.ఆమెకు ఉన్న లేబిల్ దృష్ట్యా ఆమె జీవితం సరియైన త్రోవనే సాగుచున్నది.ఆమె ఏ వివాహ బంధనాలను,వైవాహిక సూత్రాలను ఉల్లంఘించడం లేదు” అని సానుభూతిని వ్యక్తం చేస్తూనే స్త్రీ పురుష శారీరక వాంఛలను గురించి,కామ ప్రవృత్తిని గురించి కావ్యేతివృత్తాలలో మార్పు కనిపిస్తున్నప్పటికీ సాహిత్యం కేవలం వీటితోనే ఎందుకు నిండి ఉండాలని ప్రశ్నిస్తాడు.మానవజీవితం కాని,సారస్వతంలో కానీ స్త్రీ పురుష శారీరకానుభవాలు ,వాటి వర్ణనలూ ఉచిత స్థానంలో ఉండాలని సూచించాడు.
” ఉదాత్త గంభీరభావాల అనుభూతులు ,అభివ్యక్తీకరణకు వాడుక భాష అన్ని విధాలా యోగ్యమైనదని చూడడానికి బిల్హణుని కథను నాటకంగా రచిస్తున్నాను.” అంటూ వాడుక భాష వలన ప్రయోజనం ఆవశ్యకతను నొక్కి వక్కాణించాడు.ప్రజలకు అర్థమయ్యేవిధంగా ఉండాలని,అప్పుడు వారి హృదయంలో హత్తుకు పోతుందని,చదవడానికి అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుందని గురజాడ అభిప్రాయం కావచ్చు.ఆర్భాటాలకు,
పటా టోపాలకు చాలా దూరం గురజాడ. వాస్తవికతకు ప్రాధాన్యతనిచ్చాడు.

‘ డామన్ పిథియస్ ‘ గురజాడ రచనను ప్రాచీన సంప్రదాయాలకు కట్టుబడిన పత్రికల వాళ్ళు సైతం ఎంతో మెచ్చుకుంటున్నారని వ్రాశాడు.

గురజాడ రచనలు నీలగిరి పాటలు,ముత్యాలసరములు,డామన్ పిథియస్,లవణరాజు కల,కాసులు ఇవన్నీ ఆంధ్రభారతి పత్రికలో ప్రకటితమయ్యాయని తెలిపాడు.
ఆయన సాహిత్యకృషి కూడా మునిసుబ్రహ్మణ్యం కు రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది. ” నెల్లూరు జిల్లా వ్యావహారిక భాషా వ్యాకరణం నాకు అవసరం.నెల్లూరు జిల్లా వాడుకపదాలు,ముఖ్యంగా క్రియలు,క్రియాభేదాలు,విశిష్యములోని రూపభేదాలు తెలిపే ఒక పట్టికను తయారు చేసి పంపమని” వ్రాశాడు.మహాభారతంలో వ్యాకరణ విరుద్దప్రయోగాలను పంపించమని రాశాడు.
గురజాడ తన 21 వ ఏట ఆంగ్లంలో రాసిన సారంగధర పద్యాలను ” రీన్ అండ్ రయత్” పత్రికలో ప్రకటించగా చూసి చదివిన పత్రికాధిపతి ముఖర్జీ స్వయంగా గురజాడకు వ్రాసిన ఉత్తరం వల్ల యువకుడైన గురజాడలో మార్పువచ్చింది.

గురజాడ రచయితగా ఎదగడానికి,ఆత్మవిశ్వాసం పెరగడానికి యువకునిగా వున్నప్పుడు చక్కని సలహానిస్తూ 14/8/ 1883 సంవత్సరంలో వ్రాసిన ఉత్తరం అత్యంత కీలకమైంది. జలపాతాలను,ప్రవహించే సెలయేళ్ళను వీక్షించండి.మానవరూపంలో అరుదుగా అందంగా గోచరించే దైవాంశమును చూడడం మరువకండి.మీ హృదయాన్ని ఇతరుల హృదయాలను పరిశీలించండి.వాటి బలాన్ని,దౌర్బల్యాన్ని పరీక్షించండి.ఇతరులు సాధించిన గొప్పతనాన్ని తెలుసుకోండి కానీ ఇతరుల మీద ఆధారపడవద్దు.మీ ఆత్మశక్తి మీద మీరు విశ్వాసం ఉంచి అన్ని విధాలా దాని వికాసానికి కృషి చేయండి.”
” నిరంతర పఠనం అవసరం.మీరు అన్యభాషలో వ్రాస్తున్నారు కనుక
ఆ భాషపై సంపూర్ణ అధికారం మీకు సిద్ధించాలి. గొప్పగొప్ప కవులు తమ భావాలను ఎలా అభివ్యక్తి చేశారో ఆకళింపచేసుకోండి.భావవ్యక్తీకరణకు తగినంత శబ్దశక్తిని సాధించేవరకు మీ జీనియస్ కు సరిపడే నూతన మార్గాన్ని అన్వేషించేవరకు మీరు ఇతరులను అనుకరించవల్సిఉంటుంది ”
అంటూ ముఖర్జీ రాసిన మాటలు యువకుడైన గురజాడపై చెరగని ముద్రవేసి బాగా ప్రభావితుడు కావడానికి,యుగకవిగా రాణించడానికి,గురజాడ నూతన దృక్పథానికి తోడ్పడ్డాయని నిస్సంకోచంగా చెప్పొచ్చు. మహామనీషి కావాలంటే పెద్దల మాటల చద్దిమూటలే మరి. ఆమాటలు గురజాడకే కాదు ఎప్పటి వారికైనా ఆమోదయోగ్యాలే.
ఏ రచయితకైనా శిరోధార్యమే.

కన్యాశుల్కం నాటకం ఆనాటి మహామహుల అభిప్రాయాలు

రెంటాల సుబ్బారావు గారి ఉత్తరంలో ” మీరు ప్రేమికులు.మీరు ప్రేమించడం ఎరుగుదురు.మీ నాటకంలో కొన్నిచోట్ల షాక్ లు వున్నా అవి చురకలు మాత్రమే” అంటారు.
వేటూరి ప్రభాకరశాస్త్రి గారు
” మీ కన్యాశుల్కంలోని గిరీశం గూర్చిన కొంత భాగం ఆడినారు.పొట్ట చెక్కలగునట్లు నవ్వని వారు లేరు.అద్భుతముగా నున్నది.” అని వ్రాసారు.
కలకత్తా నుండి గురుదాస్ బెనర్జీ వ్రాసిన లేఖలో ” కన్యాశుల్క పీఠిక చదివి ఆనందించాను.నాకు తెలుగు భాష వచ్చిఉంటే మీ నాటకాన్ని చదివి ఉత్తేజితుడనై వుందును.నాకు మీ భాష రానందుకు విచారిస్తున్నాను.భావ ప్రేరణాత్మకముగా,ప్రతిభావంతముగా మీరు ఆంగ్లమున రచించిన నాటక పీఠికను చదివి ఆనందించాను.అనేక అమూల్య విషయములు గ్రహించగలిగాను.కన్యలను శుల్కములకు అమ్మజూపే దురాచారాన్ని మీరు ఖండించినందుకు సంతోషం.
ఈ దురాచారాన్ని మనువు సైతం నిరసించాడు.” అని వ్రాయడం వలన ఆనాడు కన్యాశుల్కం సమాజంలో ఎంతగా ప్రభావితం చేసిందో తెలుసుకోవచ్చు.

విమర్శ ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా గురజాడ లేఖల్లో పేర్కొన్నాడు.మునిసుబ్రహ్మణ్యంకు రాసిన ఉత్తరంలో ” విమర్శించేటప్పుడు నీ అభిప్రాయాలు నిష్కర్షగా ఉండాలి.మొగమాటం వద్దు.నిష్కర్షగా వ్రాయకపోతే అది పాక్షికమే అవుతుంది.పాక్షికవిమర్శలకు విలువలేదు.నీ అంతట నీవే నిర్ధారించుకుని ముందుకు సాగాలి.మనకు అభిప్రాయ భేదం వస్తే రానీ.కొంప మునిగి పోదు.రచయిత తాను ఏది వ్రాసినా అందుకు ఒక సమర్థన వుందనుకుంటాడు.సబబైనది కానీ దానితో మీకు నిమిత్తం లేదు.
” ఒక కావ్యాన్ని చదివి దానిని సునిశితంగా పరిశీలించి తూచినట్టు విలువకట్టే విమర్శకులు మనలో బహు అరుదు.ఇప్పుడు పత్రికలలో వెలువడుతున్న విమర్శలకు
నేనేమీ విలువ ఇవ్వను.నాగరికత,సంస్కారం,విజ్ఞానం గల నీ బోటి వ్యక్తుల అభిప్రాయమంటే నాకు విలువ హెచ్చు” అంటూ విమర్శ గురించి స్పష్టంగా వివరించాడు.
వేదం వేంకటరాయ శాస్త్రి గారి ప్రతారుద్రీయ నాటకాన్ని విమర్శిస్తూ ముని సుబ్రహ్మణ్యంకు రాసిన లేఖలో ” ఈ కాలంలో కొన్ని నాటకాల్లో కవితా ప్రౌఢిమ కల్పనా చాతుర్యము లోపించకపోయినా ప్రస్తుతం తెలుగులో వెలువడుతున్న నాటకాలన్ని ఒట్టి డొల్ల సరుకులు.చివరకు ప్రతాపరుద్రీయంలో సైతం పేజీలకు పేజీలు ఎన్ని తిప్పినా అవి నాటక కథాగమన విస్తరణకు, పాత్రల పెరుగుదలకు ఉపకరించవు.అయితే నాకు బాగా నచ్చిన ఒక లక్షణం మాత్రం ఉంది.మన దేశ చరిత్రలో గుండెలను కదిలించే వృత్తాంతాన్నొకదాన్ని తీసికొని దానిని నాటకంగా మలిచేటప్పుడు ఈ కవి సాహిత్యాత్మక దేశభక్తి పూరిత కాల్పనిక వాతావరణాన్ని సృష్టించుకుని దానిని నేర్పుతో జయప్రదం చేశాడు.కాని నాటకంలో చారిత్రక చిత్రీకరణ మటుకు కేవలం అభూతకల్పన అసంభావిత విషయాలు సారస్వత కట్టుబాట్లను లైసెన్సును అతిక్రమిస్తున్నాయి.” అంటూ తన అభిప్రాయాన్ని ఉన్నదున్నట్లు వ్యక్తం చేశాడు.

గురజాడ నిరంతరం శ్రమ పడడం వల్ల ఆరోగ్యం క్షీణించిందని జె.ఎ యేట్స్ ( 4/11/1915 ) నాడు రాసిన లేఖలో ” జబ్బుతో మంచాన పడ్డందుకు దుఃఖం వస్తోంది.అతి శీఘ్రంగా కోలుకొని మీరు ఆశిస్తున్నట్లు మీ ఆయుధాన్ని మళ్లీ మీరు చేత బుచ్చుకుంటారు.మీ ఆరోగ్యం ఎలా వున్నదో ఎప్పటికప్పుడు దయవుంచి నాకు తెలుపుతూ ఉండండి.మీ కృషి అనన్య సామాన్యమైనది.” అంటూ బాధను వ్యక్తం చేశాడు.. ఆనాడు కలెక్టర్,రాణిగారు లాంటి గొప్పవాళ్లకు కూడా గురజాడపై గల ప్రేమాభిమానాలు,గౌరవం ఎంత వుందో అందరి హృదయాలను అట్లా చూరగొన్న ఆ మహాకవి నవంబర్ 30 వ తేదీ 1915 సంవత్సరంలో తుదిశ్వాస విడిచాడు.

గురజాడ లేఖలను పరిశీలించినట్లయితే ఆయనొక సమర్థుడు,ఉత్తమఅధ్యాపకుడు,విద్యార్థులను ,సమాజాన్ని ప్రేమించేస్వభావం కలవాడు,నిరంతర కృషి,పట్టుదల,ఋజువర్తన,నిష్కళంకమైన వ్యక్తిత్వం కలవాడుగా కనిపిస్తాడు. తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం గురజాడ మనమధ్యలో చిరంజీవిగానే ఉంటాడు. ఇట్లా సాహిత్యంలో గురజాడ లేఖలకు ఒక ప్రత్యేక స్థానముందని చెప్పవచ్చు.

February 28, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us