మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

తెలుగు సులభ వ్యాకరణం

by కూకట్ల తిరుపతి April 9, 2022
written by కూకట్ల తిరుపతి

పురాతనం నుండి అధునాతనం వరకు తెలుగుభాషను ఎందరో మహానుభావులు సుసంపన్నం చేశారు. ప్రతినిత్యం తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి మరెందరో మహనీయులు పలు విధాలుగా పాటుపడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా “తెలుగు వ్యాకరణం” మీద ఎన్నో పుస్తకాలను వెలువరిస్తున్నారు. ప్రత్యేకించి పాఠశాల దశ విద్యార్థుల కోసం తేలికపాటి పదాలతో, వ్యాకరణ సూత్రాలను సరళంగా అందించడానికి తెలుగు పండితులు కుంట వేంకటేశం గారు పూనుకోవడం ప్రశంసనీయం. తెలుగు పాఠ్యాంశాల బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగంగా వచ్చే భాషా వ్యాకరణాంశాలను, ఛందో అలంకారాలను అలతి అలతి పదాలతో లలితమైన రీతిలో లక్ష్యాలక్షణం చేశారు. కమ్మనైన అమ్మభాషకు మరింత కమ్మదనాన్ని అద్దారనడంలో అతిశయోక్తి లేదు.

తేట తెలుగు భాషకు చెందిన వర్ణములు, అందలి భేదముల వివరణతో “విద్యార్థి వ్యాకరణ కిరణం” భాషా పునాదుల్లోకి ప్రసరించింది. పద విభాగములు, భాషా భాగములు, వాచకములు, వచనములు, విభక్తి ప్రత్యయములను విడమరచి చెప్పిన తీరు తేజోవంతంగా ఉంది. వాక్య భేదములు, విరామ చిహ్నములను సోదాహరణంగా విశ్లేషించిన విధం సహజాతిసహజంగా ఉంది. తెలుగు సంధులు, సంస్కృత సంధుల పరిచయం అరటిపండును ఒలిచి నోట్లో పెట్టినట్టే ఉన్నది. సమాసములు, అలంకారములు, ఛందస్సులను అలవోకగా అభ్యసించేటట్టుగా అక్షరాల ఆసువోశారు.

పెద్దపల్లి జిల్లా, కమాన్ పూర్ మండలం, జూలపల్లి వాస్తవ్యులు కుంట వేంకటేశం గారు. ఆయన పుట్టినూరులోనే 1989లో పాఠశాలను నెలకొల్పి, విద్యాగంధాలను పంచిన విద్యాభిమాని. 2006లో తెలుగు భాషోపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించారు. ఆ వెనువెంటనే 2008లో తెలుగు భాష సహోపాధ్యాయులుగా ఎంపికవడం ఆయన పట్టుదలకు నిదర్శనం. పిల్లలకు మాతృభాషా మాధుర్యాన్ని పంచుతూ, వారిలో విలువలను జీవన నైపుణ్యాలను పెంచుతున్న ఆదర్శ ఉపాధ్యాయులు కుంట వేంకటేశం గారు. “అనంతవరం మాణిక్యలింగం, శతక సాహిత్యం – పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేసి, కాకతీయ విశ్వవిద్యాలయం ద్వారా ఎం.ఫిల్. పట్టాను పొందిన గొప్ప పరిశోధకులు. దశాబ్దాల బోధనానుభవం, పరిశోధనలో పటుత్వం కుంట వేంకటేశం గారి సొంతం. తెలుగు వ్యాకరణం గొట్టు కాదు. తేలికైనది తెలుగు భాష. పిల్లలు తెలుగును సులువుగా నేర్చుకోవచ్చని, ఈ పొత్తం ద్వారా రచయిత నిరూపించారు.

బాల వ్యాకరణ పీఠికలో చిన్నయసూరి స్వయంగా “పెక్కు లక్ష్యములు సావధానముగా పరిశీలించి, రచనా ప్రణాళిక నిర్ణయించుకొని” తానొక లక్షణ గ్రంథమును రచించినట్లు పేర్కొన్నారు. వ్యాకరణం పాఠకుల్లో సాధు, అసాధు శబ్ద వివేకాన్ని కలిగిస్తుంది. భాష యొక్క కీలక స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. కవి ప్రయుక్తములైన శబ్దాలకే లక్షణం చేస్తుంది. లక్ష్యం లేకుండా లక్షణం పుట్టుట అసంభవం కదా! కాబట్టి వ్యాకరణం ప్రయోగశరణమైనది. విద్యార్థులు భాషను సులువుగా నేర్చుకోవడానికి వ్యాకరణం దోహదపడుతుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి, వ్యాకరణ అధ్యయనం తోడ్పడుతుంది. పిల్లలు ఉత్తమ పాఠకులుగా, లేఖకులుగా ఎదగడానికి ఈ చిరు పొత్తం చంద్రునికో నూలు పోగులాగా సహకరిస్తుందని భావిస్తున్నాను.

ఈ పుస్తకంలో రచయిత కుంట వెంకటేశం గారు తనకున్న భాషా పరిజ్ఞానంతో, బోధనానుభవసారంతో, ఎన్నో విషయాలను సముచిత వివరణలతో, చక్కని ఉదాహరణలతో తెలియజేశారు. దీనిప్రతి ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండదగినది. బడిపిల్లలందరికీ అందుబాటులోకి తీసుకురాదగినది. ఉపాధ్యాయులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని, విద్యార్థులకు చేరువ చేయాల్సిన అవసరముంది. తెలుగు వ్యాకరణాన్ని సులభరీతిలో, బొత్తిగా వివరంగా, విపులంగా విడమరచి చెప్పిన ఈ గ్రంథాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. విద్యార్థుల మదిలో చెరగని ముద్రవేసే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. తెలుగుభాషా బోధకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన కుంట వేంకటేశం గారికి హృదయ పూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో పుస్తకాలు ఆయన కలం నుండి జాలువారాలని ఆకాంక్షిస్తూ…

సెలవిప్పటికీ… స్నేహమెప్పటికీ…

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ April 9, 2022
written by కొరుప్రోలు హరనాథ్

టేక్స్

కేవలం
జీతానికే
టే్క్స్ కదా అని
చంకలెగరెయ్యకు-
జీవితానికి కూడా
టేక్స పడే రోజొకటి
వస్తందున్న
విషయం మరిచిపోకు

ఆస్తి – నాస్తి
ఎయిర్ కండిషన్ గదులూ
త్రీ యేసెస్ బార్ లు
లెక్సెస్ – యన్ – యక్సీ కార్లు
మఖ్ మల్ కుషన్ పరుపులు
బొచ్చుకుక్కలు
ఆస్తికుని ఆస్తికత్వం-
మురికివాడలూ
కూలన గోడలు
పేవ్ మెంట్లు
మెట్లోషల్టర్లు
గజ్జికుక్కలు
నాస్తికుని ఆస్తికత్వం

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ప్రియజ్ఞాపిక

by Konduri KashiVishveshwara Rao April 9, 2022
written by Konduri KashiVishveshwara Rao

ఆడిటోరియంలో ‘‘కాలేజీ వార్షికోత్సవ సభ’’ దేదీప్య కళాకాంతులతో ప్రారంభం అయ్యింది. కాలేజీ సెక్రటరీ పోడియం మైక్లో ఒక్కొక్క విద్యార్థినీ పరిచయంచేసి, వారిని వేదికపైకి ఆహ్వానిస్తోంది. బహుముఖ ప్రజ్ఞాశాలియైన సెక్రటరీ పద్మావతి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటంలో ఆమెకు ఆమే సాటి.
కవిత్వం, నాటకం, సంగీతం ఇంకా వివిధ రంగాల విద్యార్థులు వేదికపైకి వచ్చి ముఖ్యఅతిథి, ప్రిన్స్పల్ చేతుల మీదుగా తమ బహుమతులను జ్ఞాపికలతోపాటు అందుకుంటున్నారు. ఇప్పుడు చిత్రకళలో మన కాలేజీకి గర్వకారణమైన ఇంద్రవర్మను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం! విజయ కరతాళ ధ్వనులతో ఆడిటోరియం దద్దరిల్లింది.
కానీ ఇంద్రవర్మ మాత్రం ఎందుకో నిదానంగా వస్తున్నాడు. అతడు ప్రియ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ తన చిత్రకళను ప్రోత్సహించింది. తను వేసిన ప్రతి చిత్రానికీ రంగులు, మెరుగులు దిద్దించిన తోటి సహ విద్యార్థిని ప్రియను కూడా వేదికపైకి పిలవమని సెక్రటరీకి చెప్పాడు.
కానీ ప్రియ రాకపోవటంతో, పెయింటింగ్ పోటీలో మొదటి బహుమతి, జ్ఞాపికనూ అందుకున్నాడు ఇంద్రవర్మ.
అదే సమయంలో ఇంద్రవర్మ స్నేహితులు అందంగా ప్యాక్చేసిన ఒక పెద్ద ఫోట్ పోట్రైట్ను వేదికపైకి తీసుకొచ్చారు. ముఖ్యఅతిథి, ప్రిన్స్పల్ సంయుక్తంగా ఆ పోట్రైట్ను ఆవిష్కరించారు.
అది ఒక స్త్రీ మూర్తి కళాఖండం. ఆమెలో ఒక అమ్మ ఉంది. ఆ చిత్రంలో ఓ చిన్నారి, అక్క, చెల్లెలు, వదిన, భార్య అందరూ కన్పిస్తున్నారు. ఆమెలో ప్రత్యేకంగా ఒక స్నేహితురాలు కన్పిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన సృష్టి అంతా స్త్రీ మూర్తిలోనే అంతర్లీనంగా ఉందన్న ఇంద్రవర్మ నిర్వచనం రసజ్ఞులను ఆకట్టుకొంది.
ఈ పెయింటింగు నేను నా తోటి విద్యార్థిని ప్రియతో కలసి చిత్రించాను. అందుకే ఈ బహుమతి మా ఇద్దరికీ చెందుతుందని ప్రియను కూడా వేదికపైకి ఆహ్వానించాను. నాకు రంగులు వేయటం నేర్పిన మన కళాశాలకి గుర్తుగా, దీనిని ‘‘ప్రియజ్ఞాపిక’’గా సమర్పిస్తున్నాను అని ఇంద్రవర్మ ఆనంద భాష్పాలతో కూడిన ఉద్వేగ చిరుప్రసంగంతో మళ్ళీ ఆహుతులంతా కరతాళ ధ్వనులతో, స్టాండిరగ్ ఒవేషన్ ఇచ్చారు.
చూస్తూ చూస్తూండగానే కాలేజీ జీవితం తెలియకుండా హాయిగా సాగిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు, చదువుల తల్లి దేవాలయ ప్రాంగణంలో నేర్పుతుంది.
మీరు కూడా స్వయంగా పెన్సిల్ గీతలతో బొమ్మలు వేయాలి. బాపుని గుర్తు చేసుకోండి. బొమ్మలు వేయగలరు. వేసిన బొమ్మలకు వాటర్ కలర్స్ వేయండి. అప్పుడు మీకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. వేసిన చిత్రాలు మీకు నచ్చాయి అంటే మీరు కళాకారులే! వాటిని చూచిన స్నేహితులు, కుటుంబసభ్యులు మీకు ఇచ్చే కాంప్లిమెంట్లు ఎన్నో ఉంటాయి సుమా! అవి ఆనాడు పాఠాలు చెప్పిన గురువుగారి మాటలు, ఇంకా జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి ఇంద్రవర్మకు.
కాలేజీలో విద్యార్థులందరూ…. నువు ఇంద్రవర్మవు కావు ` రవివర్మవే అనే వాళ్ళు. ‘‘ఏనాటికైనా మన ఇంద్రవర్మ ప్రపంచ ప్రఖ్యాత పికాసో వంటి గొప్ప చిత్రకారుడు అవుతాడని’’ ప్రసంసించాడు ప్రిన్సిపల్.
అసలు ఈ అభినందల, ప్రసంశల వెల్లువకు సూత్రధారి ప్రియ. ఇవన్నీ అందుకోవటానికి ఆమెకే అర్హత ఉందని ఆవేదన చెందాడు. ప్రియను చూడటానికి అతని హృదయం పరితపిస్తోంది. కేవలం పెయింటింగ్ మీదే కాకుండా, చదువు మీద కూడా శ్రద్ధ పెట్టాలని తనకు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియ.
ప్రియ స్ఫూర్తితోనే డిగ్రీలో ర్యాంకు సాధించాడు. ఆమె చెప్పకపోతే నిజంగానే తన చదువు అటకెక్కి కూర్చునేది అని తెలుసుకున్నాడు.
డిగ్రీ రెండో సంవత్సరంలో కూడా ఇంద్రవర్మకు అత్తీసరు మార్కులే వచ్చాయి. దాన్ని అలుసుగా తీసుకొన్నాడు హరిప్రసాద్. ఇంద్రవర్మను అవమానించాడు. ఒరేయ్! నీకు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకు. హాయిగా రోడ్డు పక్కన దేవుడు బొమ్మలు గీసుకున్నావనకో! ఏకంగా కాసుల వర్షమే కురుస్తుందన్నాడు. బాబు రవివర్మ! నీకు చదువెందుకు? మాకు లాగా మార్కులతో పనేంటి? అసలు రంగులు లేకపోయినా, బొగ్గులతో కూడా బొమ్మలేసి డబ్బు సంపాదిస్తావ్! అని కించపర్చాడు ఉదయ్కుమార్. వీరిద్దరికీ ప్రవీణ్, శేఖర్లు తోడై అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు. వాళ్ళు మారరు! ర్యాగింగ్ చేసి చేసి నెగిటీవ్గా తయారైపోయారు.
ఇంద్రవర్మకు ఉద్యోగం వచ్చింది. అయినా అంత సంతోషంగా లేదు. ప్రతీ క్షణం ప్రియా ఆలోచనలే. అసలు ప్రియ ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మనసు బాగోపోయినా, మనశ్శాంతి కోసం పెయింటింగ్ వేస్తున్నాడు. అది గ్రహించిన కంపెనీలోని సహ ఉద్యోగులు ‘‘ఆర్ట్ పెయింటింగ్ గ్యాలరీ’’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది.
ఇప్పుడు ఇంద్రవర్మ వేసిన పోట్రైట్లకు ఇతర దేశాలలో గిరాకీ పెరిగింది. ఇంద్రవర్మ భారతదేశంలో ప్రముఖ చిత్రకారునిగా అవార్డును అందుకున్నాడు. గౌతమబుద్ధుడు చెప్పినట్లు ‘‘నీవు ఏది ఆలోచిస్తే, అదే అవుతావు’’ ఔను! నేను ఇప్పుడు గొప్ప కళాకారుణ్ణి అయ్యాను అని గౌతమబుద్ధుని బొమ్మకు నమస్కరించాడు.
కానీ ఇంద్రవర్మ మనసులో మాత్రం ఏదో వెలితి, అశాంతి గూడుకట్టుకున్నాయి. హాలులో కూర్చుని టి.వి. చూస్తుండగా కొరియర్ వచ్చింది. ఆతృతతో కవర్ తెరిచాడు. అందులో ప్రియ వ్రాసిన ఉత్తరం, అంతే! వెంటనే ఒక్కసారిగా ఎగిరి గంతేసి…. యా! హూ… అంటూ గట్టిగా కేకవేశాడు.
కొడుకు వేసిన కేకకి వంటింట్లోంచి వచ్చిన తల్లి ‘‘అదేమిటిరా అంత గట్టిగా అరిచావ్! అని అడిగింది. అసలు తల్లిని పట్టించుకుంటేగా!
హలో ఇంద్రవర్మ! నేను అమెరికాలో నువ్వు వేసిన అపూర్వ కళాఖండాలు చూసి ఎంతో ఆనందించాను. నా సంతోషాన్ని వెంటనే ఫోన్ చేసి నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఎందుకో నాకు అప్పుడు హిందీ సినిమా హీరోయిన్ కరీనా కపూర్ మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ‘‘నేను ఉత్తరాలకే ఎక్కువ ప్రాముఖ్యత నిస్తాను. నా స్నేహితులకూ, బంధువులకూ ఉత్తరాలే వ్రాస్తుంటాను.’’ ` కరీనాకపూర్.
మనకున్న ప్రేమ, బాధ, ఆనందాలను ఉత్తరాల ద్వారా అయితే బాగా వివరంగా తెలియజేస్తాం. అలాంటి అమూల్యమైన ఉత్తరాలను జీవితాంతం పదిలంగా దాచుకుంటాం. అలాగే అప్పుడప్పుడూ చదువుకుంటాం కూడా. అందుకే నేను స్వీటు తిన్న తరువాత హాట్ తినను. ఎందుకంటే మనసారా మాధుర్యాన్ని ఆస్వాదించాలి కాబట్టి.
ఇంద్రవర్మ! నువ్వు నేను కలలు కన్నట్టు గొప్ప పెయింటర్ అయినందుకు నాకు చెప్పలేనంత గర్వంగా ఉంది. కంగ్రాట్యులేషన్స్ ఇంద్రా.
‘‘ఇంద్రవర్మ! నువ్వంటే నాకు చాలా ఇష్టం.’’ మన ప్రేమను జీవితాంతం అనుభవించాలంటే మనం పెళ్ళి చేసుకోకూడదు. ఈ విషయంలో నన్ను క్షమించు. శ్రీ కృష్ణుడు ఆరువేల భామలకు మధుర ప్రేమికుడు. వారి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. మన ప్రేమ కూడా జీవితాంతం మధురతరంగిణిలా ప్రవహించాలి. రెండు రోజుల్లో నేను ఇండియాకి వస్తున్నాను. మిగిలిన అన్ని విషయాలు అక్కడ నెమరేసుకుందాం!
` నీ ప్రియ స్నేహితురాలు
ఉత్తరం చదివిన ఇంద్రవర్మ దృష్టి టి.వి. చానల్లో కన్పిస్తున్న బ్రేకింగ్ న్యూస్పై పడిరది, ‘‘బోయింగ్ విమానం సముద్రంలో కూలిపోయింది” చూపిస్తున్న ఫోటోలలో ప్రియ ఫోటో, పేరునూ స్పష్టంగా చదివి సోఫాలో కూలబడిపోయాడు ఇంద్రవర్మ.

April 9, 2022 4 comments
1 FacebookTwitterPinterestEmail
కథలు

రంగులు

by Divakarla Rajeshwari April 9, 2022
written by Divakarla Rajeshwari

అలారం మోగింది . నేత్రిక కళ్ళు నులుపుకుంటూ లేచింది . మొహం మీద నీళ్ళు జల్లుకొని పుస్తకం తెరవబోతుంటే పావని వచ్చింది. గుడ్ లేచావా! ఓ గంట సేపు చదువుకో. ఆరుగంటల కల్లా కారు డ్రైవింగ్ కోచ్ వస్తానన్నాడు. . కిందకెళ్ళు , అటు తరువాత ..అని పావని ఇంకా ఇంకా చెప్పబోతుంటే, నేత్రిక అందుకుంటూ, స్నానం చేసి 402 ఫ్లాట్ లో ఉన్న శారదమ్మగారి దగ్గర సంగీతం క్లాస్ కు వెళ్ళాలి, కాలేజ్ కు వెళ్ళాలి …అంతేగా! అమ్మా! విసుగ్గా అంది.
కాలేజ్ నుంచి డేడీ నిన్ను పిక్ చేసుకుని బేడ్మెంటెన్ గ్రౌండ్స్ దగ్గర దింపుతారు .అక్కడ ప్రాక్టీస్ కాగానే కాల్ చేయి . నేనొచ్చి తీసుకొస్తాను తరువాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని చదువు కుందువుగాని అంటూ, ఆ రోజు చేయ వలసిన దాన్నంతా చెప్పింది పావని
నేత్రిక దుఖం, కోపం రెండూ మిళితమైన స్వరంతో,
అమ్మా!…
ఇంకో నెలలో నాకు పరీక్షలు, బాగా చదువుకోవాలి. పరీక్షలయ్యేవరకూ చదువుతప్ప అన్నీ మానేస్తానమ్మా. మా స్నేహితు లందరూ తరగతి లో మంచి పర్సెంటేజ్ రావాలని కొచింగ్ కు వెళ్తున్నారు. నువ్వేమో కోచింగ్ క్లాసులు వద్దంటావు. ముఖ్యమైనది వదిలిపెట్టి తక్కినవన్నీ చేయమంటావు. .అని గట్టిగా ఇంకా ఏదో అనబోతుంటే
అందుకుని ..నిన్ను మంచి స్కూల్ లో చేర్పించాము . అక్కడ బెస్ట్ టీచర్లు ఉన్నారుకదా ! మళ్ళీ ప్రత్యేకంగా పాఠాలు ఎందుకు చెప్పు? తరగతిలో శ్రద్ధగా వింటే చాలు, చదువే జీవితంకాదు, అన్నింటినీ నేర్చుకోవాలి. ఆ క్లాసులకు వెళ్ళే టైములో ఏ యోగా క్లాస్ కో వెళ్ళావనుకో , ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యంబాగుంటుంది, ..నాతో వాదించకు, చెప్పినట్టు చెయ్యి అంటూ గదిలోంచి బయటకు వెళ్ళింది పావని.
చేసేది లేక ఇక పుస్తకం మూసేసి, దుస్తులు మార్చుకుని కిందకు వెళ్ళింది నేత్రిక . లిఫ్ట్ లో తనతో పాటు చదువుకుంటున్న పిల్లలు కోచింగ్ క్లాసులకు వెళ్తూ పలకరించారు. ఓ డ్రై వింగ్ నేర్చుకోడా నికి వెళ్తున్నావా? కొచింగ్ క్లాస్ లో రుద్ది రుద్ది పడేస్తున్నారనుకో , నీకేం , తెలివైన దానివి.. .వాళ్ళు అలా అంటుండ గానే
లిఫ్ట్ కిందకు దిగింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
అమ్మ చెప్పినవన్నీ ముగించుకుని ఇంటికి చేరేసరికి తమ ఫ్లాట్లో ఉండే స్త్రీలు కొంతమంది కూచుని మాట్లాడుతూ ఉన్నారు . వాళ్ళు నేత్రికను చూడగానే, పావని తో
మీ నేత్రిక చాలా తెలివైంది. చక్కగా మీరు నేర్చుకోమన్నవన్నీ నేర్చుకుంటుంది. చదువులో కూడా ముందుంటుంది. అంటూ ప్రశంసించారు.
తరువాత వాళ్ళ సంభాషణ కొనసాగిస్తూ, పావని గారూ. మీరిక్కడకు వచ్చినప్పటినుంచీ మాకందరికీ ఎంతో బాగుందండీ, మీరు మాకు కుట్లూ అల్లికలూ నేర్పుతున్నారు,అంటుంటే, . మీరు నేర్పించిన తెలుగు “అచార్” ను మాఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు అంది నార్త్ నుండి వచ్చిన లీలా బహెన్.
అది సరేకాని రేపు హోళీ పండుగ కదా! మీరు చెప్పినట్టే రంగు రంగుల పూలన్నింటినీ ఏరి పూలపొడి తో రంగులను తయారు చేసాంకదా! ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా హాయిగా హోలీ ఆడుకుందాం! సాయంత్రం అందరం కలసి కమ్యునిటీ హాల్ లో భోంచేద్దాం. ఒక్కొక్కరం ఒక్కో వంటకం చేసి మన వంట రుచులను పంచుకుందాం. మన పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది, అంది పరిణీత బెంగాలీ యువతి. పిల్లలకు రేపెలగూ సెలవేకదా,! వాళ్ళ తో కలసి రోజంతా హాయిగా గడుపుదాం అంది పావని.
హోలీ గురించిన కథలను పిల్లలకు నేను చెప్తాను అంది, పురాణ కథలను చదివిన కస్తూరి.
అదే ప్రహ్లాదుడు ఆతని సోదరి హోలిక, శివుని తపో భంగాని కొచ్చిన కాముని దహనం ..ఈకథలేనా? మంచిది …..సంక్షిప్తంగా చెప్పు అంది పావని.
హోలీ పున్నమ స్వచ్ఛతను ప్రసరించే పండుగ. ఈ పండుగ రోజున, వెన్నెల వెలుగు లోని వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది , వాతావరణం లో ధాతువు సంపూర్ణ ధర్మాన్ని పొందుతుంది. వసంత కాలంలో వాతావరణములో మార్పులు జరగటం వల్ల వైరల్ వ్యాధులు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధాలుగా పనిచేస్తాయి. సంప్రదాయంగా రంగులను నిమ్మ, కుంకుమ, పసుపు,బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్య విధానం లో, తయారు చేస్తారు.
తడిగా రంగుల కొరకు, మోదుగ పుష్పాలను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగు లోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. కొన్నిసార్లు బట్టి పట్టి ముఖ్యమైన పానీయాన్ని తండై లేదా భంగు ను తయారుచేస్తారు …తనకు తెలిసిన విషయాలను చెప్పింది జ్ఞాన ప్రభ.
నొ ,నొ, పిల్లలను సమయం వేస్ట్ చేయ నీయరు. మాఅయన ఒప్పుకోరు. పరీక్షల రోజులు కదా! చదువుకోవాలంటారు… అంది కనక మహాలక్ష్మి
ఒక్క రోజు సరదాగా గడిపితే ఏమీ కాదు. పెరుగుతున్న పిల్లలకు, అందరితో కలిసిమె లిసి ఉండటం అలవాటు చెయ్యాలి….అంది పావని.
అందరూ రేపటి సన్నా హా లను గురించి ముచ్చటించుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.
రాత్రి 11 పదకొండు గం టలయింది నేత్రిక గదిలో లైటు వెలుగుతోంది. నేత్రికా పడుకో .మళ్ళీ రేపు చదువు కోవాలంటూ పొద్దున్నే లేస్తావు, అంటూ గదిలో కొచ్చి నేత్రిక తలను నిమురుతూ ముద్దుపెట్టుకుంది పావని. పడుకో అంటూ మరోసారి హెచ్చరించింది బయ టికెళ్తూ . …
పావని భర్త ఈశ్వర్ “పావని ధోరణి తనకలవాటే కనుక “ఏమిటో అందరూ పిల్లల్ని చదువుకొమని పోరు పెడుతుంటే నువ్వు చదివింది చాలు పడుకో అంటావు ,”అన్నాడు అర్థం కానట్టు.
అదికాదండీ, నేత్రిక చదువులో వెనుకబడిందే మీ కాదు, అది తెలివైంది. చదువుకోవాలి నిజమే . చదువు జీవితానికి వెలుగు ,కాని ఆవెలుగు చుట్టూ ఉన్న అనేక రంగులను మనం గుర్తించాలి. ఆరంగులన్నింటినీ అనుభవాలుగా వెదజల్లుకోవాలి .ఒకరు మనపై వేసిన రంగును ఆనందంగా స్వీకరించి, రక రకాల రంగులతో వాళ్ళను మురిపించాలి. అన్ని రంగుల కలయికతో సంతృప్తిగా సాగిపోవాలి . అయినా మీకు తెలియని దేముంది. రేపు హోలీ కదా!
ఆమనీ సుమడోలగా, రాసలీలగా, వసంతోత్సవ హేలగా, అలలారే ‘హోలీ’ మానవాళిలో సమైక్యతనీ, సంఘటిత శక్తినీ, సమాజ చైతన్య స్పృహనీ కలిగిస్తుంది. అందరిలో కొత్త ఉత్సాహం నింపడానికి దోహదం చేస్తుంది.
ముఖ్యంగా విశ్వకవి రవీంధ్రనాధ్‌ టాగూర్‌కి వసంతాగమన సమయానికి సుస్వాగతం పలికే హోలీ పండుగ అంటే ఎంతో ఇష్టం.శాంతి నికేతన్ లో చదువు కున్నారు. “ఒరె భాయి ఫగూన్ లగచె బొనె బోనె …దాలె దాలె ఫులె ఫులె, పతే, పతే రె,
ఆరలె ఆరలె కొనె కొనె” అని పాడే వారు కదా… రంగులు చల్లుకోడానికి సిద్ధ పడండి అంది నవ్వుతూ పావని.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

యుముడు పిలిచినపుడు

by ఒద్దిరాజు మురళీధరంరావు April 9, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో తరుణ్ అనే ఒక మనిషి ఉండెను. అతను ఒక వ్యాపారి, ఎక్కువ ధనికుడు కానప్పటికి అతను చాలా సుఖంగా జీవించాడు. అతనిది పెద్ద కుటుంబం, సోదరులు, సోదరీమణులు, భార్య మరియు పిల్లలు. అతను వారిని మంచిగా చూసుకున్నాడు. మరియు గ్రామంలోని బీదలకు కూడా చేతనయినంత సహాయం చేసేవాడు. అతను బాటసారుల కొరకు విశ్రాంతి ఇండ్లు కట్టించాడు, మరియు వాటిలో భోజన శాలలు ఉండెను. వాటిలో ఎవరైన వచ్చి మంచి భోజనం చాలా కొద్ది డబ్బుకే తినే వీలుండెను.
ఒకనాడు తన పని నుండి తిరిగి ఇంటికి వస్తున్నపుడు ఒకతను దారిలో ఒక విశ్రాంతి ఇల్లు చూచాడు. దానిలో ఒక వరండా ఉండెను, దానిలో మనుషులు ఆగి విశ్రాంతి తీసుకునేవారు. అక్కడ కూర్చొని, బాగా అలసి పోయినట్లు కల్పించి ఆకలిగా ఉన్న ఒక కొత్తతను ఉండెను. అతను పొడుగాటి మనిషి అతని దుస్తులు ప్రయాణం వలన మాసిపోయినట్లు మరియు అతను చాలా దూరం నుండి వస్తున్నట్లు కనిపించాయి. ఆయన వెంట ఒక గుఱ్ఱం ఉండెను. అది కూడా తన యజమానివలె అలసిపోయి ఆకలిగా కన్పించింది.
వారిని చూడటంతో తరుణ్ హృదయం ధ్రవించిపోయెను, మరియు అతను వారితో మాట్లాడుటకు ముందుకుపోయెను.
ఓ నా సోదరా, నీవు ఎక్కడి నుండి వచ్చావు? అతను అడిగాడు. వేడి భోజనం మరియు కొంత విశ్రాంతి కొరకు లోనికి ఎందుకు రావు?
ఆ మనిషి తనవైపు చూస్తూ చిరునవ్వుతో తిన్నాడు, ఆ విశ్రాంతి ఇల్లు చాలా పేరు గాంచినది. దాంట్లో నాకు రూమ్ లేదు, మరియు భోజనశాల నిండుగా ఉంది. నేను ఇక్కడ కొద్దిసేపు ఎదిరి చూస్తాను. అప్పుడు నేను బయలుదేరుతాను. నాకు రోజు చివరిలో తప్పక భోజనం దొరికే స్థలం దొరుకుతుంది.
తరుణ్ ఆ మాట పట్టించుకోలేదు. ఒకతను అక్కడ భోజనం చేయక, విశ్రాంతి తీసుకోక వెళ్ళిపోవటం అతని మనసుకు బాధేసింది. అతను ఆ బాటసారిని బలవంతపెట్టి తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ తన కుటుంబంతోపాటు బాటసారిని భోజనానికి ఆహ్వానించాడు. ఆ మనిషికి ప్రేమతో వడ్డించారు, అతను కడుపునిండా భోం చేశారు.
అతను భోజనం చేస్తున్నపుడు తరుణ్ మతిమరుపు మనిషని గ్రహించాడు. అతని మనసులో ఏదో వుండి ఆరాటపడుతుండెను. వారి భోజనం అయిన తరువాత చేతులు కడుగుకని బాటసారి బయలుదేరుటకు లేచాడు. అతను తరుణ్ దయాగుణం కొరకు కృతజ్ఞతలు చెప్పాడు. మరియు అన్నాడు, నేను ఒకటి అడుగుతున్నందుకు ఏమనుకోకండి, మీరు భోజనం చేస్తున్నపుడు ఏదో విచారిస్తున్నట్లు నేను గమనించాను. నాకు తెలుసు, నేను మీకు కొత్తవాడినని, అనుకోకుండా నాతో ఆ సమస్య చెబితే మీ బాధలు కొంతవరకు తగ్గిపోవచ్చు.
కాని తరుణ్ కేవలం ఒక నవ్వు నవ్వాడు మరియు తన తల ఊపాడు.
అప్పుడు ఆ మనిషి అన్నాడు, బహుషా నేను ఎవరినో తెలుపుతే నీ రహస్యాలు నాతో చెప్పుతారు?
మరియు కొన్ని క్షణాల్లోనే అతను మారిపోయాడు. అతను ఇక ముందు అలసిపోయిన బాటసారి కాదు, కాని ఓ దేవుడు, మెరుస్తున్న ప్రకాశవంతమైన దుస్తుల్లో తలపై ఒక కిరీటంతో ఉన్నారు. అతని గుఱ్ఱం దున్నపోతుగా మారింది, మరియు ఆ మనిషి తన పరిచయం చేశాడు, నేను యముడను, మరణాలకు యజమానిని. నీ సమస్య ఏంటో ఇప్పుడు చెప్పగలవా?
ఇది చూసి తరుణ్ దాదాపు మూర్ఛిల్లింది. కొద్దిసేపటికిందనే యముడు అతనితో భోజనం చేశాడు! మి మి మీరు భూమిమీద ఏం చేస్తున్నారు రాజా? తనని రొప్పుతూ అడిగాడు, తడబడుతూ.
యముడు నవ్వాడు మరియు అన్నాడు, ఓహ్ నేను ఎప్పుడో ఒకప్పుడు రావటందుకు ఇష్టపడుతాను, మరియు ప్రతివారు ఏం చేస్తుంటారో చూస్తాను. అందువలన నీకేం బాధ?
తరుణ్ జవాబు ఇచ్చాడు. “మీరు చూడండి, నా వ్యాపారాన్ని పెంచదలచాను, కాని ఈ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు. ఒకవేళ నాకు ఏమన్నవుతె ఎవరు నా పెద్ద కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు?
యముడు తీవ్రంగా తల ఊపాడు. విచారించకు అబ్బాయి’ అని ఓదార్చాడు.
“నీవు చాలా కష్టబోతువు. మరియు దయగల వాడవుగా నిన్ను నేను చూశాను. నీవు నన్ను ఆహ్వానించావు మరియు నీతో భోజనం చేయించావు. కేవలం నన్ను ఒక అలసట చెందిన బాటసరని, నేను ఒకటి చేస్తాను. నీవు భూమి వదలి, అందరివలె ఒకనాడు నాతో వచ్చే సమయాన, నేను హఠాత్తుగా రాను. నేను నీకు ఎన్నో రోజుల ముందు తెలుపుతాను. దాన్నిబట్టి నీవు నాతో వచ్చేముందు వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగలవు!
తరుణ్ అది విని కృతజ్ఞతా పూర్వకంగా తలవంచాడు, యముడు మాయ మయినాడు.
సంవత్సరాలు గడిచాయి. తరుణ్ ఒక ముసలతను అయినాడు. అతని వ్యాపారం చాలా వృద్ధి చెందింది. అతని పిల్లలు, సోదరులు, సోదరీమణులు (అన్నా తమ్ములు, అక్కా చెల్లెండ్రు) అందరు హాయిగా వున్నారు దేవుని దయవలన. అతనికి ఏ విధమైన చింతలు మిగిలి లేకుండెను.
ఒక రాత్రి అతను నిద్రపోయాడు. నిద్రలో ఓ కలగన్నాడు. అతని ముందు యముడు నిలబడియున్నాడు. యముడు తనవైపు చేయి చూపుతూ సమయం ఆసన్నమైంది, నీవు నాతో వచ్చేందుకు రా, అన్నాడు.
తరుణ్ భయపడిపోయాడు. కాని రాజా, నీవు నా చావుకు కొన్ని రోజులముందు తెలుపుతానని వాగ్దానం చేసియుంటివి గదా! నేను ఇప్పుడే ఎట్లు రాగలవా అకస్మాత్తుగా?
యముని పెదాలమీద చిరునవ్వు కనిపించింది. కాని అబ్బాయి, నేను నీకు హెచ్చరికలు ఇచ్చాను. నేను నీ వెంట్రుకలను తెలుపుగా మార్చాను. నీ వయసును ఒట్టి నీ వెన్నెముక వంగేట్లు చేశాను, నీ పండ్లు ఒకటి తరువాత ఒకటి ఊడిపోయేట్లు చేశాను. వీపు భూమి మీద వుండేకాలం దగ్గర బడుతుందనే సూచన్లు ఇవ్వన్ని.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వాసంత వైభవం

by Dr. Chintoju Mallikarjuna Chary April 9, 2022
written by Dr. Chintoju Mallikarjuna Chary

చైత్ర వసంత సుధాంబుధి
నేత్రములకు పర్వ మగుచు నిండెను మదిలో
స్తోత్రము లయ్యెను కోయిల
గాత్రమునందుద్భవించు గానామృతముల్!
🍀🍀
తెల్లారెన్గద నేడుగాది శుభమై తీండ్రించు సౌదామినై
ఉల్లాసంబుగ లోకమంత మురియన్ ఉప్పొంగు వాసంతమై
సల్లాపంబులు చేసిరందరెదతో సౌహార్ద సంతుష్టులై
కల్లోలంబగు మాన వాళికిది యే
కాస్తంత యాహ్లాద మౌ!
🍀🍀
ఆకుపచ్చని చీర ఆమని అందాల
వనకాంత మురిసెను వలపు సిరిగ
మధుపానవిందులో మత్తిల్లి ఝమ్మని
భ్రమరమ్ము నిలువెల్ల పరవశించె
గాన కచేరీలగంధర్వ లోకమై
పికరాగ మాలికల్ ప్రేమ పంచె
నల్ల మబ్బుల నీడ నాట్య మయూరము
పురివిప్పి పుడమిపై పులకరించె
మనసు మధుమాస ధ్యాసలోమరులు నిండి
కలిసె క్రొంగొత్త జంటలు కలలు పండి
తెలిపె రతిరాజు వారికి తెలుగు వేడ్క
వెలిసె వాసంత శుభకృతు విమల కీర్తి!
🍀🍀
మందార గన్నేరు మమతా నురాగాలు
చేమంతి బంతుల చిందులాట
పారిజాత కలువ ప్రణ యాతి శయములు!
కమల గులాబీల కనుల పంట
కస్తూరి విరజాజిఘన పరీమళ ములు
పున్నాగమోదుగు పూల సొగసు
మల్లె సంపంగుల మన్మధ బాణాలు
నంది వర్ధనముల నాట్య కేళి!
సకల కుసుమాలు కొలువైన సంబరమున
పికము శుకముల పలుకులు ప్రియము గొల్ప
మామిడాకుల తోరణమయము గాగ
వచ్చె వాసంత విభవమ్ము వసుధ మెచ్చ!
🍀🍀
కాముడు సంతసించు శుభకాల వసంత లతాంత కాంతిలో
కోమల పుష్పసౌరు యెలకోయిల పాటల పల్ల కీలలో
నామది యూయలూగినది నవ్య సుధాంశు మయూఖ వాహినీ
భామల సోయగమ్మువలె భావ సరాగప్రశాంత చిత్తమై!

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స‌జీవ‌త‌కు ప్ర‌తిరూపం సినారె క‌విత్వం…

by తిరునగరి శ్రీనివాస్ April 9, 2022
written by తిరునగరి శ్రీనివాస్

సృష్టికి అదిమూలం
మ‌థ‌న‌మైతే
సునిశిత దృష్టికి ఆల‌వాలం
మ‌న‌నం
ఆద్యంతాలు లేని శూన్య మ‌థ‌నం వ‌ల్ల‌నే స‌మ‌స్త సృష్టి ఆవిర్భవించింద‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ మ‌థ‌నం అన్న క‌విత‌లో అన్నారు డా, సి. నారాయ‌ణ‌రెడ్డి. తిరుగు లేని పురోగ‌మ‌న‌ శీలానికి స‌జీవ ప్ర‌తీక‌లుగా నిలిచే క‌విత‌ల‌ను ఆయ‌న లేఖిని వెలువ‌రించింది.
చినుకును ర‌మ్మ‌ని చిటికేశాను
అది జ‌ల్లై వ‌చ్చి కురిసిపోయింది
చిగురును చేత్తో నిమిరి చూశాను
అది నూరు రేకుల పువ్వై విచ్చుకుంది
తార‌ను ధ‌గధ‌గ వెలిగిపో అన్నాను
అది మ‌ధ్యాహ్న సూర్య‌బింబంలా
ఉజ్వ‌లించింది
అని స‌ముచిత స‌మ‌యంలో వ్యాప్తి పొందిన‌ప్పుడే వాటి అస్తిత్వం ప్రస్ఫుటిస్తుంద‌ని చెప్పారు. విశ్వ‌వ్యాప్తంగా జ‌రిగే అద్భుత పరిణామాల మూలాలు చిన్న‌వే అని చెప్పారు. మానవుల మెద‌ళ్ల మొద‌ళ్ల స్త‌బ్ధ‌త పేరుకుపోకూడ‌ద‌ని అన్నారు. చూపుల‌తో కొల‌వ‌లేని ఎత్తుకు ఎదిగిన మ‌నిషి స‌మున్న‌త వ్య‌క్తిత్వానికి నిదర్శ‌నంగా మారుతాడ‌ని అంటారు. ఏకాంతానికి, సామూహిక జీవితానికి తీరాల‌ను గ‌మ‌నించి ప‌రిస్థితుల‌ను బట్టి కుదించుకొని, విస్త‌రించుకొని పోవాల‌ని సూచిస్తారు. ప‌ర‌స్ప‌రం ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకుంటూ సాగిపోతే శ్వాస‌లు అల‌లెత్తిన‌ట్టు, అడుగుల‌కు రెక్క‌లొచ్చిన‌ట్టు ఉంటుంద‌ని తెలిపారు. మ‌న‌సు మీద పేరుకున్న నిరాశ తాత్కాలిక‌మ‌ని అది ఉత్తేజంగా మారుతుంద‌ని ధీమా వెలిబుచ్చారు. గ‌తం ఇంకిపోయిన బావి వంటిద‌ని అన్నారు. పూలు అదృశ్యం అవ్వ‌డం ఫ‌లాలై అంత‌రించ‌డానికేన‌ని చెప్పారు.
జీవిస్తున్నాను
మృత్యువుకు జోల పాడ‌డానికి
పోగొట్టుకుంటున్నాను
న‌న్ను నేను పొంద‌డానికి
అని ఎదుట పూల‌దారి ఎదురు చూడ‌ద‌ని తెలిసి భ‌విష్య‌త్తును ప‌ట్టితేవ‌డానికి ముళ్ల‌మీద న‌డిచిపోతున్నానని తెలిపారు. నిరీక్షించ‌డమంటే అక్ష‌క్త‌త కాదు అది ఆరిపోని ఆశ‌ల కొల‌మానమై మ‌నుగ‌డలు సంతృప్తితో ఊపిరిలు పీల్చుకోవాల‌ని చెప్పారు. కాల క‌ల్లోలానికి ఎదురీదుతూ క‌డ ఊపిరి వ‌ర‌కు పోరాడాల‌ని సూచించారు. ఉద‌యించిన స‌త్య‌మే ఆశ‌యంగా మారాల‌ని అన్నారు. జాగృత చైత‌న్యంతో విజ‌యం అందివ‌స్తుంద‌ని అన్నారు. ఆకు మీద రాలిన మంచు బిందువు త‌ల‌త‌ల‌ మెరిసి పోవాల‌ని ఆరాట‌ప‌డుతుంద‌ని తెలిపారు. నేల‌మీదే స‌రిగ్గా నిల‌బ‌డ‌లేని మ‌నిషి క‌న్న ఎగిరే ప‌క్షి న‌య‌మ‌నిపిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌యోగ శీలం ప‌దను త‌గ్గితే ప్ర‌సంగ‌మ‌వుతుంద‌ని, ప్ర‌వాహ పాదం స‌డ‌లిపోతే ప‌డియలోకి దూరిపోతుంద‌ని హెచ్చ‌రించారు. సూర్య‌కాంతిలో మౌళిక చింత‌న తెలుస్తుంద‌ని అన్నారు. స‌హ‌జ‌త్వం స‌మ‌స్య‌ల‌ను మ‌నిషి ద‌రిచేర‌నీవ‌వ‌ని అంటారు. ఎంత‌వేగంగా ఈదుతూ పోతే అంతే త్వ‌ర‌గా తీరం ఎదుట నిలుస్తుంద‌ని, వెనుదిర‌గ‌ని సంక‌ల్పానికి అది స‌జీవ ఉదాహర‌ణ అని అన్నారు. ఆత్మీయ సంభాష‌ణంతో స్ఫూర్తిని పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు.
అవ్య‌క్త‌త లోకి
వ్య‌క్త‌త చొర‌బ‌డి
వ్య‌క్తావ్య‌క్త స్థితిలో
నా మ‌స‌నును
వేలాడ‌దీస్తున్న‌ది
అన్న నారాయ‌ణ‌రెడ్డి నిశ్చల స్థితిలో క‌లిగే అనుభూతిని మ‌న‌సుతో నిర్వ‌చించ‌మ‌న్నారు. వ‌క్ర‌గ‌తి స‌మాజాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని చెప్పారు. అక్ష‌రావ‌నిలో సృజ‌న యాత్ర నిరంత‌రంగా విక్ర‌మిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. నైరాశ్యాన్ని కొనగోటితో చిమ్మేసి జీవితం ప‌ట్ల స‌రికొత్త ఆశ‌ల‌ను అంకురింపజేసుకోవాల‌ని చెప్పారు. స‌రికొత్త జీవ‌ధాతువుల‌తో చైత‌న్య‌మాధ్య‌మంగా జీవితం ప‌రిణామ‌శీల‌త‌ను అందుకోవాల‌ని నారాయ‌ణ‌రెడ్డి ఆకాంక్షించారు.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తప్యాల చెక్క

by Vani Devulapalli April 9, 2022
written by Vani Devulapalli

అప్పటివరకు కుమ్ముల బెట్టినట్టున్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డది. నీలాకాశం అంతా నల్లమబ్బులను కమ్ముకున్నది. హఠాత్తుగా చూస్తుండగానే ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. పశువుల కొట్టంలో గుంజకు కట్టేసిన ఆవు ఆందోళనగా ‘అంబా’ అని అరిచి తన లేగదూడ తలను నాలుకతో ప్రేమగా తడిమింది.

హాల్లో టీవి చూస్తున్న రామచంద్ర గబుక్కున లేచి కొట్టంవైపు నడిచాడు. అక్కడే గోలెం దగ్గర కుడిది కలుపుతున్న పాలేరు వెంకన్నతో “వెంకన్నా… వర్షం ఎక్కువయ్యేట్టుంది. ఈ లేగదూడను, ఆవును లోపల సాయబానుల గుంజకు కట్టేసి వెళ్ళు…” వెంకన్నను పురమాయించాడు. ” ఆ.. అట్లనే బాబు… అమ్మ సర్వపిండి చేస్తాన్నరు. పోయిల కట్టెలు గావాల్నాట. అమ్మ కిచ్చొచ్చి ఆవును గట్టేస్త బాబు..” అని అన్నాడు వెంకన్న.

“ఓ.. తప్యాల చెక్క చేస్తున్నదా అమ్మ” చిత్రంగా కళ్ళు ఎగరేస్తూ వంటింట్లోకి తొంగి చూసాడు రామచంద్ర. తల్లి కట్టెల పొయ్యి ముందాు కూర్చుని తప్యాల చెక్క చేస్తొంది. కమ్మటి నువ్వులతో కూడిన తప్యాల చెక్క వాసన ఆ వాతావరణంలో ఒక్కసారిగా గుప్పుమంటూ కమ్ముకొని నోరూరించింది. “అమ్మా… చాతగాక ఇప్పుడెందుకు ఈ పని పెట్టుకున్నట్టు? పైగా ఆ కట్టెల పొయ్యి పొగతో సతమతమవుతూ…! గ్యాస్ స్టవ్ వాడుకోవచ్చు కదా “వాతావరణం ఇట్లుంటే నీకు తప్యాల చెక్క ఇష్టం కదా చంద్రా…. ఇవ్వాళా అక్కకు నాకు గూడా ఉపవాసం. అందరికీ పనికొస్తుంది గదా అని చేస్తున్నా…. అయినా ఈ తప్యాల చెక్క కట్టెల పొయ్యి మీద సన్నని సెగమీద చేస్తేనే రుచిరా నాన్నా…” కొడుకు మాటలకు సమాధానమిస్తూ, మళ్ళీ “ఇదిగో… ఇది తీసుకో…” ఓ పళ్లెంలో వేడి వేడి తప్యాల చెక్కను బెట్టి కొడుకు చేతికిచ్చింది అనసూయమ్మ.

పళ్లెం అందుకొని ఒక ముక్క తుంచి నోట్లో వేసుకున్న రామచంద్ర ‘అబ్బా… అమృతమమ్మా… నీ చేతి తప్యాల చెక్క,  ‘కళ్ళెగరేస్తూ ప్రశంసాపూర్వకంగా తల్లివైపు చూశాడు రామచంద్ర. “ఊ. చాల్లే పొగడ్తలు, మురిపెంగా నవ్వుకూ అంటున్నా అనసూయమ్మ మొహంలో కించిత్ గర్వం తొణికిసలాడింది. “అందుకే అమ్మా నువ్వు చేసే ఈ తప్యాల చెక్కంటే మీనాకు ప్రాణం అనుకో….. తనెఁత బాగా చేసినా ఈ రుచి రాదు అంటుంది. పైగా అత్తయ్య చేతిలో ఏదో మంత్రదండముందండీ అంటుంది” తనను పొగడుతూనే భార్య గూర్చి మురిపెంగా చెబుతున్న కొడుకు మాటలు రుచించలేదు అనసూయమ్మకు. అప్పటివరకూ గల గలా మాట్లాడిన తల్లి మీనా ప్రస్తావన రాగానే ముభావంగా మారటం రామచంద్రను బాధించింది. “మామయ్య అత్త పిలుస్తోంది నిన్ను” అక్క కొడుకు పదేళ్ళ టీంకూ వచ్చి చెప్పగానే సగం తిన్న పళ్ళెం అక్కడే వదిలేసి వెళ్తున్న కొడుకుతో ‘అదేంటి చంద్రా… పూర్తిగా తిని వెళ్ళు” అంటున్న తల్లితో ‘చాలమ్మా’ అంటూ ముస్తసరిగా సమాధానమిచ్చి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు రామచంద్ర.

* * *

మీనా పట్ల అమ్మ కోపానికి కారణం వుంది. కట్న కానుకలేమీ ఇవ్వలేని దూరపు బంధువు రాజు మామయ్య కూతురుపై తను మనసు పారేసుకోవటం, ఆ అమ్మయానే పెళ్ళి చేసుకుంటాననటం అమ్మకు సుతరామూ ఇష్టం లేదు. చివరకు, తను మీనానే పెళ్ళి చేసుకుంటా అని పట్టుబట్టడంతో, అన్నయ్యల బలవంతం కూడా తోడై తప్పనిసరై ఒప్పుకుంది అమ్మ పెళ్ళికి. అయితే, మీనాను మాత్రం మనస్ఫూర్తిగా కోడలిగా అంగీకరించలేకపోతుంది ఇప్పటికీ. అమ్మ కోపం, అయిష్టం తాత్కాలికమేనని తరువాత పరిస్థితులు వాటంతటవే చక్కబడతాయని ఆశించాడు తను. అట్లని అమ్మ పట్టుదల తనకు తెలియంది కాదు. అమ్మ పట్టుదల ముందు నాన్నగారే తలవంచేవారు. అయితే, ఆయనకు అమ్మమీద వున్న ప్రేమ, అనురాగం కూడా ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. నాన్నగారు అమ్మను ఎత్తెత్తు మాణిక్యంలా చూసుకునేవారు. ఆయన సాహచర్యంలో హాయిగా సాగిపోతున్న అమ్మ జీవితం నాన్నగారి హఠాతం మరణంతో నడిసంద్రంలో నావలా అయింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి మేనమామలుచ ేసిన పెళ్ళితో పన్నెండేళ్ళకే నాన్న చెయ్యి పట్టుకుని వచ్చిన అమ్మ, ఆయనే తన సర్వస్వంగా పిల్లలే తన లోకంగా మలుచుకుంది జీవితాన్ని. ఇదిలా వుంటే “ఉరువు ఉరిమి మంగళం మీద పడ్డట్టు” నాన్నగారు పోయిన సంవత్సరానికే అక్క పంకజం భర్తను పోగొట్టుకొని పిల్లాడితో పుట్టిల్లు చేరడం అమ్మను మానసికంగా కృంగదీసింది. నాన్నగారున్నప్పుడే తెల్సిన సంబంధం అంటూ హడావిడిగా పెళ్ళి చేసిన చెల్లెలు మంజు అత్తింటి వారితో సరిపడక మాట మాటికి అలిగి పుట్టింటికి రావడం, వచ్చినప్పుడల్లా నెలలకొద్ది ఇక్కడే వుండిపోవడం కూడా అమ్మ అశాంతికి మరో కారణం. కొడుకులు చదువుల పేరిట దూరంగా వుండడం వల్లనేమో, పెద్దగా చదువులబ్బని కూతుళ్ళు ఇంటి పట్టునే వుండడంవల్ల వాళ్లను కంటికి రెప్పలా గారాబంగా సాదుకుంది అమ్మ. కానీ ఇద్దరి కూతుళ్ళ జీవితాలు ఇలా సవ్యంగా లేకపోవడంతో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టయింది అమ్మ జీవితం. అట్లని వాళ్ళను తను ఏమీ అనలేని స్థితి. తానే తన రెక్కల కింద వాళ్ళని సురక్షితంగా పొదుపు కోవలసిన పరిస్థితి రా చంద్రా అంటుంది కన్నీళ్ళతో అమ్మ. సమస్యంతా ఇక్కడే మొదలైంది. వీళ్ళిద్దరి ఆడపిల్లల రాకతో ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. మునుపటి ప్రశాంత వాతావరణం మచ్చుకైనా లేదు. ఇంట్లో అన్ని విషయాల్లో పంకజం అక్క, మంజుల పెత్తనం వదినెలకు వాళ్ళకు మధ్య మనస్పర్థలకు, గొడవలకు దారితీసిఁది. తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ మంచి చెప్పాల్సిన ఇంట్లో పెద్ద దిక్కు కూతుళ్ళను గుడ్డిగా వెనకేసుకురావడం వదినెలనే కాదు అన్నయ్యలనూ బాధించింది. అట్లని అన్నయ్య అమ్మను గట్టిగా ఏమీ అనలేని అసహాయత, అశక్తత, అనునిత్యం ఇట్లాంటి యుద్ధపూరిత వాతావరణంలో ఇమడలేక వదినెలను, పిల్లల్ని తీసుకుని బదిలీ పేరుతో ఇంటికి దూరంగా వెళ్ళిపోయారు, ఇద్దరన్నయ్యలూ, పీజి చదివి అప్పటికింకా పెళ్ళికాని తను కూడా ఏ ఉద్యోగమో, వ్యాపారమో చూసుకుని వెళ్ళిపోయే అవకాశమున్నప్పటికీ అమ్మను, కుటుంబాన్ని వీధిన పడవేయలేని సంస్కారం కుటుంబ బాధ్యత నెత్తిన వేసుకొని ఉన్న ఊళ్ళోనే వ్యవసాయం చెయ్యడానికి పురికొల్పింది. సహజంగానే ఇంట్లో చిన్నకొడుకుగా అమ్మ ఆప్యాయత, ప్రేమ కుటుంబ సభ్యులందరి గారాబంతో పెరిగాడు తను. అమ్మ, తోబుట్టువుల బాధ్యత చేపట్టి కుటుంబాన్ని నిలబెట్టి బంధువుల్లో తలెత్తుకునేలా చేసిన తనంటే అమ్మకు, అక్క, చెల్లెలికి ఎంతో ప్రేమ. అయితే, తన పట్ల వాళ్ళు కన్పరచే ఈ ప్రేమ తన భార్య పట్ల కూడా చూపుతారని ఆశించాడు తను. కానీ మీనా వీళ్ళ ప్రేమరాహిత్యానికి, అకారణ ద్వేషానికి అడుగడుగునా బాధపడ్తూనే వుంది అనే విషయం తెలిసినప్పుడు హతాశుడయ్యాడు. ముఖ్యంగా అక్క పంకజం, చెల్లెలు మంజు అహర్నిశలూ చిన్న చిన్న విషయాలను కూడా సూటీపోటీ మాటలతో అమ్మను కూడా మాటలనేట్టు రెచ్చగొడ్తూ మీనాను ఏడిపిస్తున్నారని టింకూ ద్వారా తెల్సినప్పుడు మనసు బాధతో పిండేసినట్టయింది. ఎవరి కోసమైతే తన జీవితాన్ని పణంగా పెట్టాడో వారే తన బాగోగుల గూర్చి ఆలోచించక, తన ఆనందాన్ని హరించాలని చూడటం అతన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆలోచిస్తున్న రామచంద్ర మనసు మనసులో లేదు.

* * *

ఒక్క ఉదుటున గదిలో కొచ్చి దబాల్న తలుపేసుకుని విసురుగా మంచం మీద వాలిపోయింది మీనా. బలవంతంగా కన్నీళ్ళు ఆపుకోవడం వల్లనేమో ఆమె కళ్ళు ఎర్రటి జీరలు పులుముకున్నాయి. ఇంక ఆమెవల్ల కాలేదు. దిండులో తలదాచుకొని బావురుమన్నది ఒక్కసారిగా! ఆమె కళ్ళు ఉధృతంగా ఎగిసిపడ్తున్న జలపాతాలయ్యాయి. అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. కాస్సేపటికి లేచి మొహం కడుక్కుని వచ్చింది. ఏంటీ మనుషులు? ఎందుకు తనని ఏదో ఒక వంకతో అనరాని మాటలతో చిత్రవధ చేస్తారు? అసలిప్పుడు తను చేసిందాంట్లో తప్పేముంది? ఇంటెనక సాయబాను దగ్గర గచ్చు అంతా ఊడ్చి తను శుభ్రం చెయ్యాలనుకోవడమే నేరమా? తను చీపురు పట్టుకుని ఊడుస్తుంటనే పంకజం వదిన ‘అమ్మా….ఈ మహాతల్లి నీ మడిచీర అంట్లుచేసిందే’ అంటూ అరిచింది. తనకేం అర్థం కాలేదు. తనెక్కడో ఊడుస్తోంది. అత్తయ్య మడిచీర అల్లంత దూరాన గుమ్ములర్రకు వేళ్ళాడుతూ వుంది. తను దాన్ని తాకే అవకాశమే లేదు. ఇంతలో అత్తయ్య రానే వచ్చింది ఆదరాబాదరగా. తనవైపు ఈసడింపుగా చూస్తూ నీ శుభ్రం తగలేసినట్టే వుంది.  నీకెన్నిసార్లు చెప్పాలి ఇటువైపు రావద్దని. నీకిక్కడేం పని…. వద్దని చెప్పినా పదే పదే మొండిగా ప్రవర్తిస్తావెందుకు. “మనిషికో మాట గొడ్డుకోదెబ్బ” అని వూరికే అనలేదు పెద్దలు.  ఇంతలో అక్కడికొచ్చన మంజు అందుకుంది. “అసలావిడ గారికి ఈ పెత్తనాలెందుకు? తన గదిలో తను పడుండి వేళకి నువ్వింత పెడితే తిని వుండలేక….” తను మంజు మాటల్ని పట్టించుకోదల్చుకోలేదు. “ఇప్పుడు నేనేం చెయ్యకూడని పనిచేశానత్తయ్యా. మీ మడిచీర నేను తగలనే లేదు. నేనక్కడికి రాను కూడా లేదు… “తను సంజాయిషీ ఇచ్చుకోబోయింది.” అంటే నువ్వు తగలందే నా కూతురు అబద్ధం చెప్పిందంటావా? అబద్ధాలాడటం మీ ఇంటా వంటా వున్నాయేమో… నా పిల్లలకయితే లేవు. అయినా మీ తల్లిగారింట్లో మీకు మడి, దడి, ఆచారం పద్ధతులు తెల్సి ఏడిస్తే గద… అయినా నా బంగారం మంచిది గాక అవుసలిని అనడం దేనికిలే… నా కొడుకుకు చిలకకు చెప్పినట్లు చెప్పి… ఓ ఆచారం వ్యవహారంలేని కుటుంబంలా వుంది… వద్దురా… అని… వాడు వింటే గదా… నువ్వేమో చిన్న నా పొట్టకు శ్రీ రామరక్ష అని చాటుకు మాటుకు ఏ చిరుతుండో తింటావు పొద్దున్నే. నేను మళ్ళీ మడిబట్ట పిండుకునేదెప్పుడు… అందరికీ వండి నేను తినేదెప్పుడు… ఛీ…. ఛీ… ఇదంతా నా ఖర్మ….” గుమ్ములర్రకు వేలాడుతున్న చీరను లాగి విసురుగా నల్లాకింద పడేస్తూ అంటున్న అత్తయ్య మాటలకు ఏడుపొస్తున్నా బలవంతంగా ఆపుకుంది మీనా. ఇంక అక్కడ వుండలేక తన గదిలోకి పరిగెత్తుకొచ్చింది. అసలు వీళ్ళ సమస్య ఏంటి? ఆలోచిస్తే ఎంతకూ అంతుపట్టదు తనకు. అత్తయ్యకు కూతుళ్ళంటే ఆరోప్రాణం. వాళ్ళెన్ని తప్పులు చేసినా సరే వాళ్ళమీద ఈగ కూడా వాలనివ్వదు. కానీ నిస్వార్థంగా తన సుఖం చూసుకోకుండా వీళ్ళ బాగోగులు పట్టించుకుంటున్న బావ పట్ల, బావ ఇల్లాలి పట్ల వీళ్లు ప్రవర్తించాల్సిన తీరేనా ఇది? తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఇంత విద్వేషం విరజిమ్ముతారా ఎవరైనా? అసలేంటి వీళ్ళ స్వభావం? వీళ్ళ  స్వేచ్ఛకూ, సామ్రాజ్యానికి తనను ఓ అడ్డంకిగా భావించడమే తన పట్ల వీళ్ళకున్న కోపానికి, విద్వేషానికి కారణమా?

పెళ్ళయిన మొదటిరోజు నుండి తను అత్తయ్య మనసు గెల్చుకోవడాన్కి చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఆమె చూపులతోనే అల్లంత దూరాన నిలువరిస్తుంది తనను. దానికి తోడు తనకు అత్తయ్యకు మధ్య పంకజం వదిన, మంజుల ప్రమేయం కొరకరాని కొయ్యలా మారింది. తన పట్ల ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూ అత్తయ్యను ప్రభావితం చేస్తున్నారిద్దరూ. అత్తయ్యకు కూతుళ్ళ మాట వేదవాక్కు కావటం,  పరిస్థితులు రోజు రోజుకు చేయి దాటిపోతుండడం మీనాను కలవరపరుస్తున్న అంశం. చరిత్ర చెప్పినట్లుగా ధర్మరాజు జూద వ్యసనం, దుర్యోధనుడి దురభిమానం, ధృతరాష్ర్టుడి మితిమీరిన పుత్రవ్యామోహం, దక్షప్రజాపతి దురహంకారం, రావణుడి కాముకత, కీచకుడి మూర్ఖత్వం విశ్వామిత్రుడి ద్వేషం, అశ్వత్థామ పగ, కుమార్తె దేవయానిపై శుక్రాచార్యుడి వల్లమాలిన మమకారం… ఇలా మనిషిలోని ఎన్నో స్వభావాలు మానవత్వ పతనానికి కారణమవుతున్నాయి. మానవ జీవన ఔన్నత్యాన్ని చివరికి మానవ మనుగడనే ప్రశ్నించే స్థితికి తీసుకెళ్ళాయి. ఈ స్వభావాల్లో ఏది మితిమీరినా అది మానవ సంబంధాలను, బాంధవ్యాలనూ విధ్వంసం చేస్తుంది. అత్తయ్యకు కూతుళ్లపట్ల వున్న అలవికాని ప్రేమ కూడా అట్లాంటిదేనా? ఆలోచిస్తున్న మీనా ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే వుంది. పెళ్ళికి ముందు ఎంతో చలాకీగా, ఉత్సాహంగా, ఉరుకుల పరుగుల నదిలా వున్న తను పెళ్లితో ఓ కల్లోల సముద్రంలా మారిపోయింది.  మనిషిలోని ఇదివరకటి కళ లేదు. కళ్ల క్రింద నల్లని చారలు వయసును అమాంతం ఓ పదేళ్ళు పెంచేసాయి. పెళ్ళికి ముందు పాలరాతి బొమ్మలా వున్న తను ఇప్పుడు జీవనం కోల్పోయిన నల్లరాతి బొమ్మలా మారింది. రోజు రోజుకు ఏ పరిస్థితులలో మార్పు లేకపోగా, మానసికంగా తను చాలా చిత్రవధ ననుభవిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తను నిరాశావాదంలో కూరుకుపోయి బ్రతుకుమీదే విరక్తి కలిగినా ఆశ్చర్యం లేదు… లేదు… లేదు… అలా జరగడాన్కి వీల్లేదు. ఇంటి పరిస్థితులను తను చక్కదిద్దలేకపోతే, పరిస్థితుల నుండి తప్పుకొని అయినా తనను తాను కాపాడుకోవాలి. ఇప్పుడు తన ముందున్న సవాల్‌ అదే! ఇక లాభం లేదు పరిస్థితి బావకు చెప్పాలి. ఇంతకాలం చెప్పకపోవడమూ తాను చేసిన తప్పేనేమో… వీళ్ళ మీద పితూరీలు చెప్పినట్టవుతుందేమో అని, బావ మనసు విరుగుతుందో ఏమో అన్న సందిగ్ధంతో తనలో తనే మధనపడుతూ ఇంత కాలం నటించింది. చాలు… ఇక చాలు… ఈ రోజు దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. ఆలోచిస్తూ పడుకున్న మీనాకు కడుపులో వికారంగా అన్పించింది. నీరసంగా కూడ అన్పించింది. నాల్రోజులుగా ఎందుకో నలతగా ఉంటోంది ఒంట్లో. డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూనే అలాగే నిద్రలోకి జారుకుంది మీనా.

* * *

రాజ్యం పిన్నిని తీసుకుని ఊళ్ళో డాక్టర్‌ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్షలు చేసి ‘మీరు తల్లికాబోతున్నారు’ డాక్టర్‌ చెప్పిన విషయం. ప్రతి స్త్రీ జీవితంలో అత్యంత మధురమైన, ముఖ్యమైన ఈ విషయం తనకెందుకో సంతోషాన్ని పంచలేదు సరికదా మరింత ఆందోళనకు గురిచేసింది. నిన్నటి సంఘటన కళ్ళ ముందు మెదిలింది.

అత్తయ్య ధిక్కార స్వరం, ఈసడింపు చూపు, కూతుళ్లతో కలిసి ఆమె సూటీ పోటీ మాటలు… మనసును మెలిపెడ్తున్నాయి. మనుషుల్లో ఈర్ష్యాసుయాలు, క్రోధ విద్వేషాలు సహజాతాలు అని తెలుసు. కానీ, అవసరానుగతంగా ఏర్పరచుకున్న ప్రవర్తనారీతులు మనిషి స్వార్థపరత్వాన్నీ, ప్రేమరాహిత్యాన్ని ప్రతిబింబిస్తూ మనిషి అసలు నైజాన్ని బట్టబయలు చేస్తున్నాయా? ముఖ్యంగా సాంకేతికత, యాంత్రికతతో నిండిపోయిన ఆధునిక జీవన విధానం సాక్షిగా మానవ సహజ లక్షణాలయిన ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత, స్నేహం లాంటి మధురిమలను సమాధి చేస్తూ కుటుంబ బంధాలు కూడా ఈ ‘ప్రేమ రాహిత్య మనే వరదలో కొట్టుకు పోతున్నాయా? తన కల్లోల హృదయ స్పందనలు తెలియని రాజ్యం పిన్ని ప్రేమగా హత్తుకుని అభినందించి, ఇప్పటి నుండే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ గల గల మాట్లాడుతూనే వుంది ఇల్లొచ్చేదాకా.

* * *

తను తండ్రి కాబోతున్నానన్న శుభవార్త విని సంతోషంతో తబ్బిబ్బయాడు రామచంద్ర. ”ఈ దెబ్బతో అమ్మ నిన్ను నెత్తిలో పెట్టుకుంటుంది మీనా” అంటూ మీనాను ప్రేమలో ముంచెత్తాడు. కానీ, అతని మాటలు నమ్మాలన్పించలేదు మీనాకు. ఇంట్లో జరిగే విషయాల తీవ్రత అతనికి తెలియదు. తను నిన్న చెప్పాలనుకుంది కానీ ఇంతలో డాక్టర్‌ దగ్గరికి వెళ్ళటం మూలాన కుదర్లేదు. ”మీనా ఈ సమయంలో ఏవేవో తినాలని కోరికలుంటాయట గదా…. నీకేదైనా తినాలన్పిస్తే నాకు చెప్పు” భర్త మాటలకు నవ్వింది మీనా. మీనా మొహంలో ఆనందం లేకపోవడం రామచంద్ర దృష్టిని దాటి పోలేదు. అయితే అది నీరసం వల్లేమో అనుకున్నాడు.

* * *

స్వాతి మెటర్నిటీ హాస్పిటల్‌ వెయింటింగ్‌ హాల్‌లో అసహనంగా కూర్చున్న రామచంద్ర ఆపాదమస్తకం కంపిస్తోంది. లోపలకు తీసికెళ్ళిన మీనాకు ఎలా వుందో? ఆలోచనలతో నరాలు తెగిపడ్తాయన్న టెన్షన్‌కు గురవుతున్నాడు. అసలు తప్పంతా తనదే! మీనాకు అమ్మ చేతి తప్యాల చెక్క ఇష్టం కదా అని మీనాకు తెలియకుండా అమ్మతో చేయించాలనుకున్నాడు. పాపం అమ్మ కూడా చాత గాకున్నా, మీనా కోసం రెండు మూకుళ్ళు పెట్టి బాక్స్‌లో పెట్టి ఇచ్చింది. మీనాకు ఎప్పుడు తినాలన్పిస్తే అప్పుడు తినొచ్చని. ఏమైందో ఏమో తెలియదు కానీ అది తినగానే మీనా అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలతో పరిస్థితి తీవ్రమై ఇదిలో ఇలా హాస్పిటల్‌లో అడ్మిట్‌ చెయ్యాల్సి వచ్చింది. ‘ఫుడ్‌పాయిజనింగ్‌’ అన్నారు డాక్టరు ఎందుకిలా జరిగిందో తనకంతు పట్టడం లేదు. ‘రామచంద్ర మీరేనా?’ అన్న మాటకు తలతిప్పి చూశాడు. నర్స్‌! తలుపాడు అవునన్నట్టు. ”పేషంట్‌కి ఈ బ్లడ్‌ గ్రూప్‌ రక్తం అర్జంటుగా అవసరం. హాస్పిటల్‌లో ఈ బ్లడ్‌ గ్రూప్‌ రక్తం అందుబాటులో లేదు” ఒక్కసారిగా ఆమె ఏం చెప్తుందో తనేం వింటున్నాడో అర్థం కాలేదతనికి. అదే అడిగాడు.

”అవును ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల బ్లడ్‌ వామిటింగ్స్‌తో చాలా రక్తం పోయింది. పెషెంట్‌ అనిమిక్‌ అయింది.

వెంటనే బ్లడ్‌ ఎక్కించాలి” ఆ మాటలు వింటూనే స్థాణువుగా మారాడు ఒక్క క్షణం. కానీ వెంటనే తేరుకొని, బైక్‌ తీశాడు, ఫ్రెండ్స్‌ అందరినీ ఫోన్‌లో అలర్ట్‌ చేస్తూ విషయం వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టమని చెప్పాడు రామచంద్ర.

‘బి’ నెగెటివ్‌ చాలా అరుదైన బ్లడ్‌ గ్రూప్‌! ఎంత ప్రయత్నించినా రామచంద్రకు ఈ గ్రూప్‌ బ్లడ్‌ కానీ, డోనర్స్‌ కానీ దొరకలేదు. ఊసూరుమంటూ హాస్పిటల్‌ చేరుకున్నాడు. ఎదురుగా వస్తున్న రాజ్యం పిన్నితో ‘పిన్నీ…’ బేలగా మారాడు రామచంద్ర. ”రక్తం ఎక్కించారు. కోలుకుంటోంది. ఇంకో గంట తర్వాత చూడొచ్చన్నారు రా చంద్రా… అంతా ఆ భగవంతుడి దయ… కాకపోతే అబార్షన్‌ అయిందట…. పెద్ద ప్రాణం బాగుంది చాలురా… అంటున్న రాజ్యం పిన్నితో ”ఎంత వెదకినా రక్తం దాతలుదొరకలేదు పిన్నీ… అయితే వీళ్ళే అరేంజ్‌ చేశారన్నమాట… నా మీనా బావుంటే చాలు పిన్నీ… మనసులోనే భగవంతుడికి శతకోటి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రామచంద్ర.

* * *

హాస్పిటల్‌ నుండి రామచంద్ర ఇంటికొచ్చే వరకు అనసూయమ్మ పెద్ద గొంతుతో ఆవేశంగా మాట్లాడడం విన్పించి ఏం జరిగిందోనని ఆందోళన చెందాడు. రాజ్యం పిన్నితో అంటోంది అమ్మ ”వాళ్ళింక ఈ ఇంట్లో ఒక్క క్షణం వుండటానికి వీల్లేదు రాజ్యం… నా మీదనే అనుమానపడ్డక ఇక ఈ ఇంట్లో నా కొడుకైనా సరే… వుండటానికి వీల్లేదు వెళ్ళిపొమ్మను. ఈ క్షణమే పట్నం వెళ్ళి వేరు కాపురం పెట్టుకొమ్మను. అప్పటిదాకా నేను పచ్చి మంచినీళ్ళయినా ముట్టను ఆఁ…అంతే… ఈ అనసూయమ్మ మాటకు తిరుగులేదని చెప్పు…” రాజ్యం పిన్ని అమ్మను సముదాయిస్తోంది. ఊరుకో అక్కయ్య… సర్లే … బాధపడకు. అలాగే వెళ్తాడులే… వాడి ప్రాణాలన్నీ నీ మీదే. నిన్నొదిలి వెళ్లటం అంటే వాడెంత బాధపడ్తడో ఆలోచించు. బావగారు పోయినప్పటి నుండి నిన్నూ, కుటుంబాన్ని పట్టించుకుని మీరే లోకంగా బతుకుతున్నాడు… ఉన్న ఫళంగా వెళ్ళిపోమంటే…” ”అందుకే వెళ్ళి పోమంటున్నా.. మా బాగోగులు మేం చూసుకోగలం.. అయినా పట్నమెంత దూరమని. ఎప్పుడు రావాలన్పించినా వచ్చి పోవచ్చు. పొలం వ్యవహారాలు చూసుకోవచ్చు. కానీ ఈ ఇంట్లో వుండడనికి మాత్రం వీల్లేదు. అంతే….” తనకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది అమ్మ మాటలకు. తనకు… అమ్మ మీద అనుమానమా? ఛ… అమ్మ తనను అపార్థం చేసుకుంది. అమ్మను అనుమానిస్తే తనను తను అనుమానించుకున్నట్టే…! తను అమ్మతో మాట్లాడ్డనికన్నట్టు నాలుగడుగులేశాడో లేదో రాజ్యం పిన్ని వచ్చి తనను పక్కకు తీసుకెళ్ళింది. అమ్మ మనసేం బాగా లేదని, బాగా కోపంగా వుందని, కోపం చల్లారాక వచ్చి కలవచ్చనీ సర్ది చెప్పి పట్నంలో వాళ్ళ తమ్ముడి అపార్ట్‌మెంట్‌ ఖాళీగా వుందని అందులో వుండోచ్చాని చెప్పింది. అమ్మ మాటకు ఎదురుచెప్పకు అంది. ఇంకా ఏమోమో అంది పిన్ని. తన బుర్ర పనిచేయడం మానేసింది. ఏం జరుగుతుందో, ఎందుకో అనేది తెలియలేదు.

ట్రాలీ ఆటో రావడం, గ్యాస్‌ స్టవ్‌, బియ్యం, పప్పులు, సామాన్లన్నీ అందులో సర్దేయించటం, మరో ఆటోలో ఇల్లు సర్ది పెట్టి వస్తానంటూ రాజ్యం పిన్ని తనతో రావడం ఒక పీడకలలా చక-చకా జరిగిపోయాయి. అమ్మ ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకుందో ఎందుకంత నిషౖసరంగా మాట్లాడిందో ఎంత ఆలోచించినా రామచంద్రకర్థం కాలేదు. ఉబికి వస్తున్న కన్నీళ్ళను పంటి బిగువున ఆపడం సాధ్యం కాలేదతనికి. ఆటో కదుల్తుంటే, ఆశగా తల బయటపెట్టి తొంగి చూసిన తనకు కన్నీళ్ళ మసకలో పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మంలో నిలబడి చూస్తున్న అమ్మరూపం అస్పష్టంగా కన్పించింది.

* * *

అప్పుడే పదిహేను రోజులైంది.పట్నంలో మకాం పెట్టి. మీనా కోలుకుంటోంది నెమ్మదిగా. ఆ రోజు వచ్చి ఇల్లు సర్దిపోయిన రాజ్యం పిన్ని మీనాను చూసి పోదామని వచ్చింది మళ్ళీ. చదువు కోసం హాస్టల్‌లో వున్నప్పుడు తప్ప, పుట్టి బుద్దెరిగినప్పటి నుండు అమ్మను చూడక, మాట్లాడక పదిహేను రోజులుండటం తనకిదే మొదటిసారి. బాధగా అన్పించింది. అసలేం జరిగిందో తెలియక అయోమయానికి గురవుతుంది మీనా.

కానీ, ఈ రోజు రాజ్యం పిన్ని చెప్పిన విషయం విన్నప్పట్నించీ మనసు అమ్మ మీదికే వెళ్తోంది పదే…

పదే! అమ్మ ఇదంతా రాజ్యం పిన్నితో కల్సి తన సుఖం కోసమే తన సంతోషం కోసమే చేసిందని… ఇంట్లో వున్న అసహన పరిస్థితుల నుండి తాను, మీనా దూరంగా వెళ్ళి ఆనందంగా జీవించాలని తాపత్రయ పడిందనీ, ఊరికే తనను పట్నం వెళ్ళి వేరు కాపురం పెట్టమంటే తనొప్పుకోడనీ, ఆమె కోపంతో వెళ్ళిపొమ్మన్నట్లు నాటకమాడిందనీ తెలిసినప్పటి నుండు హృదయం బరువెక్కింది. తనకు తెలిసిన మరో కొత్త విషయం మీనాకు రక్తం అమ్మనే ఇచ్చిందని! ఈవిషయం ఎవరికీ తెలియనీయవద్దని డక్టర్లను కోరిందట.’అమ్మా…’ రామచంద్ర మనసు తల్లి పట్ల కృతజ్ఞతతో నిండిపోయి, మూగగా రోదించింది.

‘నేను మీనా సుఖంగా వుండటం కోసం ఇదంతా చేశావా అమ్మా…. నేను లేకుండ నువ్వెలా ఉండగలుగుతున్నావమ్మా… ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్ళను తుడుచుకునే ప్రయత్నం కూడ చెయ్యలేదు రామచంద్ర. చాలా సేపటికి తేరుకొని ‘మీనా లేచి తయారవు…అమ్మను చూసొద్దాం’ మీనాకు చెప్పి ఫోన్‌ తీశాడు క్యాబ్‌ బుక్‌ చేయ్యడానికి.

* * *

సాయబానులో పట్టెమంచంపై నీరసంగా పడుకొని వుంది అనసూయమ్మ. కళ్ళు మూసినా, తెరచినా కొడుకు చంద్ర బేల చూపులే కదలాడుతున్నాయి కళ్ళముందు. తాను తీసుకున్న ఈ అతి పెద్ద నిర్ణయం వెనక ఆమెకు, పంకజంకు తప్ప ఎవ్వరికీ తెలియని రహస్యం ఒకటుంది. కోడలుకు తప్యాల చెక్క చెయ్యమని కొడుకు అడిగినప్పుడు తనకు చాత కాక, పంకజం సహాయం తీసుకున్న అనసూయమ్మ, పంకజం మీనా పట్ల కోపంతో, ద్వేషంతో లోగడ ఫలహారాలు చేసి వాడి పక్కకు పెట్టిన ముతక నూనెతో తప్యాల చెక్క చేసిచ్చిందని, దానివల్లే ఇంత ఉపద్రవం జరిగిందనీ తెలుసుకున్న అనసూయమ్మ హతాశురాలైంది. అయితే, తాను చేసిన పనివల్ల పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందని తాను అనుకోలేదని బావురమంది పంకజం తనను క్షమించమని తల్లిని వేడుకుంది. ధారాపాతంగా ప్రవహిస్తున్న పంకజం కన్నీళ్లలో మీనా పట్ల కోపం కొట్టుకుపోయింది. ఆమె కళ్లలో పశ్చాతాపం కనిపించింది. మీనా పట్ల కూతుళ్ళ అసహనం రోజు రోజుకూ హద్దులు దాటుతోందని గ్రహించిన అనసూయమ్మ బాధ్యతలు గుర్తెరిగిన బంగారు మనసున్న రామచంద్ర కాపురం సుఖంగా సంతోషంగా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంది. అంతులేని ఆవేదన ఆవహించినా, కొడుకును, కోడలును, ఆ పరిస్థితుల నుండి దూరంగా పంపడనికే నిశ్చయించుకుంది. తన నిర్ణయం వల్ల కొడుకు సంసారం సాఫీగా సాగుతుందని తలచి, వాళ్ళు ఆనందంగా పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని కోరుకుంది. తన మనసు ఇప్పుడు తృప్తిగా వుంది. మూసుకున్న ఆమె కళ్ళల్లోంచి రెండు కన్నీటి బొట్లు జల జలా రాలాయి. ఇంతలో అమ్మా అంటూ పిలుపు! సందేహం లేదు… అది తన చంద్రదే…

గబుక్కున లేచి కూర్చుంది మంచంలో. అనసూయమ్మ మనసు ఆనందంతో పురివిప్పింది.

(సమాప్తం)

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సమ్మక్క సారక్క జాతర

by ShailajaMitra April 9, 2022
written by ShailajaMitra

సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు జిల్లా కంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారత దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. ‘‘దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర’’గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌,ఒడిషా,చత్తీస్‌గఢ్‌,జార్కండ్‌ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఎవరీ సమ్మక్క-సారక్కలు
నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్‌ మండల ప్రాంతములోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులూ, సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి పెళ్ళి చేసాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు ‘‘పగిడిద్దరాజు’’ కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు, అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.జాతర విశేషాల
జాతరలో మరొక దృశ్యం.జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు.మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళె కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర, ఈ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర.
తెలంగాణా కుంభమేళా
జంపన వాగులో స్నానం చేసే భక్తులు తెలంగాణాలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర, ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణేలను తీసుకు వస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్‌, చెత్తీస్‌ ఘడ్‌, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
ఈ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా. ఇది విగ్రహాలు లేని జాతర. సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. హన్మకొండ బస్టాండ్‌ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.45 లు బస్‌ చార్జి ఉంటుంది. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. కుంభమేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలాది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించు కుంటారు. కోయ గిరిజనుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ.శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి.
ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించే వారు. ఇతను కాకతీయుల సామంతరాజు. అప్పటి కరీంనగరాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పడిగిద్ద రాజు సతీమణి సమ్మక్క. ఆమెకు పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు. పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు.ఓసారి మూడు, నాలుగేళ్ళ పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడిరది. దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సైన్యం వంటి ములుగు జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకొని యుద్ధం ప్రకటించారు. పడిగిద్దరాజు అతని కుమార్తెలు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడిరది. ఈటెలు, బళ్ళాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది.తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు. మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకు వస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు పది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతాపూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసుకు వస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తారు. భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

అసలైన అందం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, April 9, 2022
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

అడవిలోని పక్షులన్నీ సమావేశమై తమ తమ శారీరక అందాన్ని గురించి మాట్లాడుకుంటున్నాయి. ఒక తెల్లని కొంగ “నేను తెల్లగా చాలా అందంగా ఉంటాను. మీరు ఎవరూ కూడా నా అందానికి సాటి రారు .మల్లె పూవులా ఉన్న నా శరీరం చూడండి ” అని అంది.ఆ తర్వాత రామచిలుక “నేనూ అందమైన దానినే. నా ఎర్రని ముక్కు, ఆకుపచ్చని శరీరం అంటే అందరూ ఇష్టపడతారు!” అని అంది . “నేను కూడా అందమైన దానినే “అంది మైనా.ఇలా అన్నీ పక్షులు తమ తమ శారీరక అందాన్ని పొగడుకున్నాయి. కానీ కాకి ,కోయిల మొదలైనవి మాత్రం “అయ్యో! మనం నల్లగా అందవికారంగా ఉన్నాము కదా ” అని తమ మనసులోనే బాధపడ్డాయి.
ఇంతలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులలో ఒకడు ఈ పక్షులను అన్నింటినీ చూసి ” ఆహా! ఈ కోకిల ఎంత మధురంగా పాడుతుంది ” అని అన్నాడు. మరొకడు ” అవును. ఈ నెమలి ఎంత అద్భుతంగా నాట్యం చేస్తుంది” అని అన్నాడు.ఇంకొకడు ” ఈ కాకులు కూడా గుంపులు గుంపులుగా ఎంత మంచిగా కలసి ఉంటాయిరా!” అని అన్నాడు.
అవి అన్నీ విన్న కొలనులోని హంస మిగతా పక్షులతో” చూశారా!మీరు మీ అందాన్ని చూసి తెగ మురిసి పోతున్నారు.మీరు వారిచే కీర్తింపబడినారా! ఈ మనుష్యులచే కోయిల,నెమలి, కాకి ప్రశంసించబడినాయి. అవి వాటి గొప్పతనం వలననే కీర్తింపబడ్డాయి తప్ప శారీరక అందంతో కాదు. మనం ఇతరులకు చేసే మంచి పనుల వలననే మన అసలైన అందం పెరుగుతుంది!” అని అంది
ఇంతలో అక్కడకు ఒక కొంగ వచ్చి “అయ్యో! అనుకోకుండా తెల్లగా ఉన్న నాపై ఒక గోడపై నున్న నల్లరంగు పడి నేను నల్లగా అందవికారంగా మారిపోయాను. ఈ రంగు పోయేలా లేదు.నా అందం అశాశ్వతం అని తేలిపోయింది “అని బావురుమంది.అది విన్న హంస “చూశారా పక్షులారా! ఒక్క క్షణంలోనే దీని అందం మాయమైంది. ఇకనైనా మంచి పనులు చేసి మీరు అసలైన అందాన్ని పెంచుకోండి. ఆ అందం చెరిగిపోనిది “అని అంది.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us