మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

ఇంద్రసేన

by Sudharshan Chintapatla April 17, 2022
written by Sudharshan Chintapatla

                   మూలం: కలైగ్నర్ ఎం.కరుణానిధి                   అనువాదం : చింతపట్ల సుదర్శన్

అద్భుతమైన అందం ఆమెది. ఆమె ముఖంలో కాంతి ఆమె సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్నది. ఆమె ధరించిన ధవళ వ్రస్తం ఆమె నడకలోని హొయల్ని ప్రదర్శిస్తున్నది. తెల్లని ఆమె కంఠాన్ని నలుపురంగు పూసల కంఠాభరణం అలంకరించి వుంది. ఆమె తన అందమైన కేశాలను చుట్టగా చుట్టింది. ఆమె తలమీద ఒక బుట్ట ఉన్నది. తల మీద బుట్టటను మోస్తూ వీధి వెంట ఆమె నడుస్తుంటే ఒక అసమానమైన సౌందర్యరాశి కదిలిపోతున్నట్టుంది. చీకటిగా ఉన్న ఆ వీధిలో ఆమెను చూసిన వారెవరైనా ఆమె దివి నుండి భుమికి దిగివచ్చిన నక్షత్రమా అనుకుంటారు.

బంగారు వర్ణంలో ఉన్న ఆ సౌందర్య రాశి తలమీద ఉన్న బుట్టలో నుంచి భయంకరమైన దుర్వాసన వస్తున్నది. ఆ బుట్టలో ఒక కుళ్ళిన ఆకారం వుంది. బుట్టను మోయడం భారంగా ఉన్నందున ఆమె చేతులు కొంచెం వణుకుతున్నవి. అయినా ఆ అందగత్తె విశ్రమించకుండా నడుస్తూనే ఉంది. ఆమె అద్భుతమైన అవయవ సౌష్ఠవం కవులకు విషాదంలో కూడా అందం సహజత్వం కోల్పోదని ఋజువు చేస్తుంది.  బుట్టలో ఉన్న కుళ్ళిన దేహం ఉన్న ఆకారం తను అనుభవించబోతున్న ఆనందాన్ని ఊహించుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నది. ఆ ఆకారం ఒక పురుషుడిది!

వికారంగా ఉన్న ఈ మనిషి తన దేహంలోని పావుభాగాన్ని ఇదివరకే పోగొట్టుకున్నాడు. ఆయన మామూలు మనిషేం కాదు. గొప్ప మహర్షి. విద్య, సంపద, బలం మనిషిని మార్చేసినట్టుగానే అనారోగ్యం కూడా మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ మనిషి కుష్టురోగి. ఈయన తన భార్య తల మీద ఉన్న బుట్టలో ప్రయాణిస్తున్నాడు.

“ఏయ్! ఏమిటానడక! తొందరగా నడవలేవా?” అన్నాడు పతి.

‘స్వామీ నా జీవన సహచరుడా నేను వేగంగానే నడుస్తున్నాను’ అంది సతి.

‘త్వరగా త్వరత్వరగా పద ఇంద్రసేనా నువ్వు కింద పడాల్సి వచ్చినా నన్ను మాత్రం క్రిందపడవేయకు సుమా!’

‘అలా అనకండి స్వామీ!’ నా కంఠం నుంచి ప్రాణం పోయినా సరే మిమ్ములను క్రింద పడనీయను. నా తలమీద బుట్టలో ఉన్నది అమ్మకానికి సరుకు కాదు. మీరు నాకు అమూల్యమైన రత్నం. మిమ్మల్ని ఎలా కింద పడేస్తాను?’

కుష్టురోగి అయిన భర్తను తలపై బుట్టలో మోస్తున దేవసేన అందమైన ముఖాన్ని దుఃఖం కమ్మసేంది. ఆమె తన భర్తను ఎక్కడికి తీసుకువెళ్తున్నది? ఆమె భర్త ఏదైనా పవిత్ర తీర్థంలో స్నానమాడి దైవదర్శనం చేసుకోవాలనుకుంటున్నాడా? కాదు… కాదు, ఆ మనిషి తన భార్యను వాహనంగా ఉపయోగిస్తూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ ప్రయాణం ఏ దేవాలయానికీ కాదు, ఏ దేవుని సేవకూ కాదు.

ఈ ప్రయాణం ఒక వైశ్య గృహానికి. దేని కోసం? ఆమెను తన వృత్తి మాని భగవధ్యానంవైపు దృష్టి మళ్లించమని చెప్పడానికా? ఆ కుష్టురోగి ఉద్దేశ్యం ఆ వేశ్యా గృహాన్ని ఒక పవిత్రస్థలంగా మార్చేయడమా? కాదు.

ఆ ఋషి ప్రయాణం వేశ్య దగ్గరికి ఆ ఋషి ఉద్దేశ్యం ఆ వేశ్యంలో సుఖించడమే. ముక్కంటి అయిన శివుడ్ని ఆయన చూడాలనుకోవడం లేదు. తన రెండు కళ్ళను వేశ్య జతకళ్ళతో కలిపి ఆమెను కౌగలించుకోవాలనుకుంటున్నాడు.

తన భర్తకు ధనంతో సుఖాన్ని అందించడానికి ఆయనను తలమీద మోసుకుపోతున్న స్త్రీ పూర్తిగా వికసించిన గులాబీ పువ్వులా వుంది. ఈ గులాబీనే కుళ్ళిపోయిన తేనెటీగను ఒక ఎండిపోయిన పుష్పం దగ్గరికి మోసుకుపోతున్నది.

వాళ్ళిద్దరూ సుఖాన్ని అందించే వనిత ఇంటిని సమీపించారు. ఇంద్రసేన కష్టం తీరబోతున్నది. గమ్యం చేరడంతో బుట్టలో ఉన్న భర్త ఆందోళన తగ్గింది. ఇంద్రసేన బుట్టను దించి నేలమీద పెట్టింది. ఆమె అలసిపోయిన శరీరాన్ని నొప్పిగా ఉన్న ఎముకలను సరిచేసుకోవడానికి ఒళ్ళు విరుచుకుంటూ అన్ని వైపులకూ తిరిగింది.

అక్కడ కవి ఎవరైనా ఉండి ఉంటే ఆమెను ఇంద్రధనుస్సుతో పోల్చి ఉండేవాడు. చిత్రకారుడు ఎవరైనా ఉండి ఉంటే ఆమె చిత్రాన్ని గీసి ఉండేవాడు. ఇంతటి సౌందర్యవతి భర్త సుఖం కోసం సమాజం అంగీకరించని స్త్రీ ఇంటికి ఆయనను తలమీద బుట్టలో మోస్తూ తీసుకువచ్చింది.

ఇంద్రసేన సున్నితమైన చేతిలో ఆ ఇంటి తలుపు తట్టింది. తలుపు పూర్తిగా తెరవడానికి ముందు ఒక ముఖం బయటకు తొంగి చూసింది. ముడతలు పడ్డ ముఖంలో రక్తం స్రవిస్తున్న చెంపలతో ఉన్న ఆ ఋషి తీవ్రమైన కామవాంఛతో సుఖం… నిజమైన సుఖం అని అరవసాగాడు. నొప్పిగా ఉన్న ఎముకలను సరిచేసుకోవడానికి ఒళ్ళు విరుచుకుంటూ అన్ని వైపులకూ తిరిగింది.

అక్కడ కవి ఎవరైనా ఉండి ఉంటే ఆమెను ఇంద్రధనుస్సుతో పోల్చి ఉండేవాడు. చిత్రకారుడు ఎవరైనా ఉండి ఉంటే ఆమె చిత్రాన్ని గీసి ఉండవాడు. ఇంతటి సౌందర్యవతి భర్త సుఖం కోసం సమాజం అంగీకరించని స్త్రీ ఇంటికి ఆయనను తలమీద బుట్టలో మోస్తూ తీసుకు వచ్చింది.

ఇంద్రసేన సున్నితమైన చేతితో ఆ ఇంటి తలుపు తట్టింది. తలుపు పూర్తిగా తెరవడానికి ముందు ఒక ముఖం బయటకు తొంగి చూసింది. ముడతలు పడ్డ ముఖంలో రక్తం స్రవిస్తున్న చెంపలతో ఉన్న ఆ ఋషి తీవ్రమైన కామవాంఛతో సుఖం.. నిజమైన సుఖం అని అరవసాగాడు.

బయటకు వచ్చిన వేశ్య తల మీద చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఆ చేతికి వేళ్ళు లేవు.

ఇంద్రసేన అంది, ‘ఓ స్త్రీ నేను చెప్పేది విను. ఈయన నా భర్త. నువ్వు కావాలని కోరుకుంటే తీసుకువచ్చాను. ఆయనను సంతోషపెట్టు.

వేశ్యకు ఆశ్చర్యంతో మాట పెగలలేదు. ఒక భార్య తన భర్తను వేశ్య ఇంటికి తీసుకురావడం జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నాను అని అనుకుంటూ బుట్టలో ఉన్న కుష్టురోగివైపు ఈసడింపుగా చూసింది. ఆయన  బుట్టలో నుంచి బయటకు రావడానికి ముందు ఇంద్రసేన వేశ్యకు బంగారు నాణాల సంచీ అందించింది. వేశ్య కళ్లు మెరిశాయి. ఆమె కుష్టురోగిని కావలించుకుని స్వర్గసుఖాలు అందించడానికి తన పడకగదికి తీసుకుపోయింది.

ఇంద్రసేన భారంగా నిట్టూర్చింది. ఇంటి తలుపుముందు బుట్టను ఉంచి కాపలా వాడితో ‘నేను ఉదయాన్నే తిరిగి వస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయింది.

ధూళి కప్పిన పుష్పగుచ్ఛంలా ఉన్న ఇంద్రసేన ఎవరో వెనుక నుంచి ‘ప్రియమైన ఇంద్రసేనా క్షణం ఆగు’ అనడంతో నడక ఆపింది. తమ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉండే మరో ఆశ్రమపు స్త్రీ పరుగెత్తుకు వచ్చింది.

‘నువ్వా! ఉలగా! నువ్వు ఈ వీధికి ఎందుకు వచ్చావు’ అని అడిగింది. బుగ్గలమీది నుంచి కారుతున్న కన్నీటిని తుడిచేస్తూ ‘ఉద్యానవనానికి వెళ్తున్న నేను నిన్నూ చూసి వచ్చాను. ఏమీ అనుకోనంటే ఒక విషయం అడగనా’ అంది ఉలగ. ‘ఏమిటో అడుగు’ అంది ఇంద్రసేన నవ్వడానికి ప్రయత్నిస్తూ,

‘నీకు నీ భర్త అంటే ఎంతో ప్రేమ అని నాకు తెలుసు. కానీ ఆయనను నువ్వొక వేశ్య ఇంటికి తీసుకురావడాన్ని నా మనస్సు అంగీకరించడం లేదు.’

‘మాట్లాడకు ఉలగా! స్త్రీకి భర్తే దైవం. భర్త కోరికలు తీర్చడమే భార్య కర్తవ్యం. అనారోగ్యం కారణంగా నా భర్త ఆకారం ఇతరులకు నచ్చకపోవచ్చు. కానీ నా కంటికి మాత్రం ఆయన అందగాడే. నా భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు సలహా ఇవ్వకు.’

‘క్షమించు ఇంద్రసేనా. నేను నీ ప్రేమను భక్తిని అపార్థం చేసుకున్నాను. నీలా భర్తను అర్థం చేసుకునే స్త్రీ పధ్నాలు లోకాల్లో ఎక్కడా ఉండదు.’

‘నన్ను అర్థం చేసుకుంటే చాలు ఉలగా నేను నిన్ను క్షమించాల్సిన పనిలేదు. నువ్వు కూడా నాలా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించు. నా లాంటి పతివ్రత అడుగుజాడల్ని అనుసరించు’ అంటూ ఇంద్రసేన తమ ఆశ్రమంవైపు నడిచింది. ఉలగకు తన తప్పు తెల్సి వచ్చింది. మహా పతివ్రత అయిన ఇంద్రసేన మాటలను పునశ్చరణ చేసుకుంటూ వెళ్తుంటే ఒక యువకుడు వచ్చి తన చేతులతో ఆమె కళ్ళు మూశాడు. తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ ఉద్యానవనానికి వెళ్ళారు.

దారి పొడవునా దుఃఖపడుతూ ఇంద్రసేన ఆశ్రమం చేరుకుంది. కిందపడి పెద్ద పెట్టున శోకించింది. ఆమె నీలికళ్ళ నుంచి కన్నీరు కాలువ కట్టింది. పున్నమి చంద్రుడ్ని మబ్బులు దాచేసినట్టు చిందరవందరగా ఉన్న నల్లని జుట్టు ఆమె ముఖాన్ని కప్పేసింది.

తోటలో నుంచి ఒక పాట గాలిలో తేలుతూ వచ్చింది. ఇంద్రసేన నీళ్ళు నిండిన కళ్ళతో ఆ పాట విన్నది. ఇది ఉలగ కంఠమే అనుకుంది. ఒక పురుష కంఠం కూడా వినిపించింది. ఇంద్రసేనను పవిత్రమైన స్త్రీగా అంగీకరించిన ఉలగ తన ప్రియుడితో యుగళగీతం ఆలపిస్తున్నది. ఉలగ వయస్సు నా వయస్సు ఒకటే. నేను ఆమె కంటే అందగత్తెను కానీ నన్ను ప్రేమించే వాడు లేని దాన్ని. ఆమె ప్రియుడు ఆమె చెవిలో గుసగుసలాడుతుండి ఉంటాడు అనుకుంది ఇంద్రసేన.

ఇంద్రసేన తమ ఇదివరకు ఎన్నడూ ఊహించనిది ఊహించసాగింది. ఆమె ముఖం మళ్ళీ కన్నీటితో తడిసింది కాని ఆమె కన్నీటిని తుడవలేదు. ఇంద్రసేన లాగానే ఉన్న మరో యువతి గదిలో ప్రవేశించింది. ఇద్దరూ పక్కపక్కనే ఉంటే ఎవరు ఎవరో కనుక్కోవడం కష్టమే. ఆ స్త్రీ వచ్చి ఇంద్రసేన పక్కనే కూచుంది. ఇంద్రసేన ‘రా! రా! నా హృదయమా! నా అంతరాత్మా’ అంటూ ఏడుస్తూనే స్వాగతం పలికింది.

‘ఇంద్రసేనా! ఎందుకు దుఃఖిస్తున్నావు? అంది అంతరాత్మ.

‘నీకు తెలియదా నా హృదయమా? నేను ఎడారి ఇసుకలో క్రిమిగా మారానని, తోటలో నుంచి ప్రేమపక్షులపాట వినిపిస్తున్నది కదా. కోరికకు సంబంధించిన అలాంటిపాట వింటే నా వంటి వయసులో ఉన్న స్త్రీకి ఎలాంటి భావాలు కలుగుతాయో నీకు తెలుసని నాకు తెల్సుకానీ నువ్వు నన్ను శాంతపరచడానికి మౌనంగా ఉంటావు.’

‘నువ్వన్నది అక్షరాలా నిజం ఇంద్రసేనా. ఉలగ కూడా నువ్వు పతివ్రతావని అన్నది. ఆ కీర్తికాంతిలో నువ్వు తృప్తిగా ఉండవచ్చు కదా!’

‘నువ్వు చెప్పు నా హృదయమా! నిజం చెప్పు నేను పతివ్రతనా ఎలా? ఎలా?’

‘నువ్వు కుష్ఠురోగి అయిన నీ భర్తను ఒక వేశ్య దగ్గర దించి వచ్చావు. ఖచ్చితంగా నువ్వు పతివ్రతవే.’

‘వేళాకోళం ఆడకు హృదయమా. నేను ఒక కుష్టురోగితో కోరికలు తీర్చుకోలేను. కానీ ఆయన నన్ను సుఖం యివ్వమని కోరుతాడు. ఆయనను కనీసం కౌగలించుకోవడానికి నా చేతులు వణుకుతాయి. అందుకే వేశ్య ఇంటికి పంపివచ్చాను. తన కామదాహాన్ని తీర్చుకుంటడని. నా అందానికి హాని కలగదని. అర్థం అయిందా నా హృదయం’

‘ఉలగ మాత్రం నీకు నీ భర్త పట్ల ఉన్న ప్రేమను నమ్ముతున్నది. తన తల మీద కుష్టురోగి భర్తను తలమీద మోసుకుని వేశ్య దగ్గరికి తీసుకెళ్లిన పతివ్రత అనుకుంటున్నది.’

‘నేను నా భర్తను తలమీద మోసుకు వెళ్ళిన మాట నిజం. నేను నా తలమీద బుట్టను మాత్రమే మోసుకువెళ్తాను. ఆయన గంపలో ఉన్నాడు. ఒక కుష్టు రోగిని చేతులతో ముట్టుకోవడానికి తలమీద మోయడానికి నేనేం పిచ్చిదాన్నా!’

‘నిన్ను కూడా ఉలగ ఉన్నది. నీ భర్త నిన్ను కఠినంగా దూషించినా నువ్వు ఒక్కమాట కూడా మారు మాట్లాడవని?

‘కుష్టురోగి అయిన భర్త మాటలు నేను పట్టించుకోను. నేను తిరిగి మాట్లాడాలంటే ఆయన పక్కనే నిలబడి మాట్లాడాల్సి వస్తుంది. అది నాకు అసహ్యం. అందుకే నేను ఆ కుష్టురోగిని అలా మొరగనిస్తాను.’

‘అలాగా! ఏదయితే యేంలే. ఇప్పుడు నువ్వు భర్తకు అంకితమయిన భార్యగా పేరు తెచ్చుకున్నావు. పాతివ్రత్యానికి నువ్వు ప్రతిరూపం అని ప్రపంచం మెచ్చుకుంటుంది’.

‘నాలో సజీవంగా ఉన్న అగ్నిపర్వతం గురించి ఎవరికి తెలుసు? ఈ కీర్తివల్ల యవ్వనాన్ని వృధా చేస్తున్న నాకు ఏమి లాభం? నాకు కావల్సింది దాంపత్య సుఖం. దాంపత్య సుఖాన్ని అనుభవించే మార్గం చెప్పు అంతరాత్మా!’

‘ఇంద్రసేనా నీ అంతరాత్మగా నిన్ను ఆశీర్వదిస్తాను. వీలయినంత త్వరగా ఈ జన్మను ముగించు. మరుజన్మలో నువ్వు ద్రౌపదిగా జన్మిస్తావు. భర్త ఉండీ నువ్వు ఏ ఆనందాన్ని పొందలేకపోయావు. నీ జీవితం నిరుత్సాహంగా నిరాశాజనకంగా గడిచిపోయింది నీ మనస్సుకు ప్రశాంతత అన్నది ఎప్పుడూ లేదు. మరు జన్మలో నువ్వు ఐదుగురు భర్తలతో జీవిస్తావని నేను గట్టిగా నమ్మతున్నాను.’

‘ఐదుగురు పతులా? నువ్వు చెప్పేది నిజమేనా?’

‘నిజమే. నీ కోసం కొత్త జీవితం రెండూ ఒకటే అర్థం చేసుకో నా ప్రియసఖీ’.

ఇంద్రసేన ఆనందానికి అవధుల్లేవిప్పుడు. అంతరాత్మను గాఢంగా ఆలింగనం చేసుకుంది. ఆమె దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులుగా మారాయి. ఆ రోజు ఆశ్రమమంతా ఒక మధురమైన గానం ప్రతిధ్వనించింది.

కలైగ్నర్ కరుణానిధి ప్రసిద్ధ భారతీయ రచయిత, రాజకీయ నాయకుడు. రెండు దశాబా్దల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన కరుణానిధి 1924లో జన్మించి 2018లో అస్తమించారు. ్రదవిడ మున్నేట్ర కజగమ్ పార్టీ నాయకుడైన కరుణానిధి కుమారుడు స్టాలిన్ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి. కరుణానిధి తమిళభాషలో కథలు, నాటకాలు, నవలలు రాశారు. సంస్కరణ, వ్యంగ్యం, అధిక్షేపం ఆయనకు కథలో ప్రత్యేకత. పురాణకథల ఆధునిక రూపం కల్పించిన కరుణానిధి కథల్లో ‘ఇంద్రసేన’ ఒకటి.

ఇంద్రసేన నలదమయంతుల కుమార్తె. ఆమె భర్త మౌదల్యుడు స్త్రీ మనస్తత్వాన్ని ఈ కథలో ఆధునికంగా చిత్రించాడు కరుణానిధి. హిందూ పురాణాల ప్రకారం ఇంద్రసేన మరుజన్మలో ద్రౌపదిగా జన్మించింది.

April 17, 2022 2 comments
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

నవకవులకు కరదీపిక-‘దాస్యం దిక్సూచి’

by Burra Vijayalaxmi Nagraj April 15, 2022
written by Burra Vijayalaxmi Nagraj

హృదయ స్పందనకి, మస్తిష్కపు మథనానికి వెల్లువైసాగే భావోద్వేగాల పరంపరకి అక్షరరూపమే కవిత్వం.అయితే… రాసేది అంతా కవిత్వమేనా? కవిత్వం రాయాలని సంకల్పించిన ప్రతి మదిని తొలిచే ప్రశ్న….

తుప్పల్ తెప్పల్ మాటల్ రాల్చి కవిత్వమని మొరాయించకు
కవిత్వాన్ని వంచించకు
వచనమై సోలిపోతావ్

అంటారు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ గారు తమ రహస్యోద్యమం గ్రంథంలో.

మరి పది కాలాల పాటు సాహితీ ప్రపంచంలో నిలిచి పోవాలి అంటే ఏ విధంగా కవిత్వం రాయాలి? కవిత్వం రాయాలి అని నిర్ణయించుకున్న ప్రతి కవి మదిలో మెదిలే ఆలోచనలు ఇవి. ఏం చేయాలి ?ఎలా రాయాలి రాసేదంతా కవిత్వమేనా? అంటూ ఎన్నో సందేహాలతో సతమతమవుతూ వుంటారు. అలాంటి నవ కవులకు కరదీపిక లాంటిది దాస్యం సేనాధిపతి గారు రచించిన దిక్సూచి .

కథ, కవిత్వం, సమీక్షకులుగా, విమర్శకులుగా …అంశం ఏదైనా ఆధునిక సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు దాస్యం సేనాధిపతి గారు. వారు ఇప్పటికే వివిధ ప్రక్రియల్లో 14 అమూల్యమైన గ్రంధాలను వెలువరించారు. వారి కలం నుండి వెలువడిన పదిహేనవ గ్రంథం ఇది. సీనియర్ కవి ,రచయిత శ్రీ దాస్యం లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నేటికవిత అంతర్జాల సమూహంలో సలహాదారులుగా ఉంటూ… 80 వారాలపాటు నిర్విఘ్నంగా దాస్యం సేనాధిపతి గారు “మనలో మనం” శీర్షిక పేరుతో నిర్వహించిన కవిత్వ కార్యశాలకు అక్షర రూపం… అందులో నుండి మరింత మంది కొత్త కవులకు ఉపయుక్తంగా ఉండే విధంగా వ్యాసాల రూపంలో అందించబడిన మార్గదర్శి …ఈ “దిక్సూచి”.

ఈ గ్రంథంలో కవిత్వమంటే ఉబుసుపోక చేసే వ్యాపారమో… కాలక్షేప వ్యాపకమో కాదు… కవిత్వమంటే కవి చేసే సామాజిక చింతనకు కళారూపం ,సామాజిక పరిస్థితుల మీద కవి ప్రకటించే తీర్పు కవిత్వం అని ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి వాక్యాలను సందర్భోచితంగా దాస్యం గారు ఉదహరించిన తీరు బాగుంది.

ఉత్తమ కవిత్వానికి ఉండవలసిన లక్షణాలను గురించి చెబుతూ… మంచి భావన, హత్తుకునే భాష, మనసును మురిపించే శిల్పం… మూడింటి మేళవింపు మంచి కవిత అని ప్రసిద్ధ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి అభిప్రాయాలను ప్రస్తావించారు .కవితా వస్తువుకు కాదేది అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు కవితా వస్తువును ఈ ఎంపిక చేసుకోవడానికి వస్తువు ఏదైనా సరే…కవితా వస్తువు ఎంపికలో వైవిధ్యం చూపాలని , సమకాలీన అంశాలను కవితా వస్తువుగా తీసుకుంటూ… పాఠకుల్లో ఆలోచన పెంచే విధంగా ఉండాలి అంటారు దాస్యం గారు.

కవిత శీర్షిక అంశానికి లోబడి ఉంటూ,ఆసక్తిని పెంచేలా , సూక్ష్మంలో మోక్షం అన్నట్లు శీర్షిక మొత్తం కవితా వస్తువును ప్రతిబింబించేలా ఉండాలి అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఎత్తుగడ అంటే కవితకు స్వాగత తోరణంలా ఉండాలి …పాటకు పల్లవి ఎంత ముఖ్యమో వచన కవితకు ఎత్తుగడ అంత ముఖ్యం అని… ఎత్తుగడ యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు. ఎత్తుగడ ఏవిధంగా ఉండాలో విపులంగా చర్చిస్తూ డాక్టర్. రాధేయ గారి రెప్పలు మోయలేని దుఃఖం కవిత లోని ఎత్తుగడ

“నేనీ మధ్యనే
మందహాసాన్ని జారవిడిచుకొని
ప్రశ్నార్ధకాన్ని మోస్తున్నాను”.

ని ఉదహరిస్తూ…ఎంత ఆర్ద్రంగా పాఠకున్ని ఎత్తుగడతో ఆకట్టుకోవచ్చో వివరించారు.

కవిత్వ నిర్వహణ మరియు నిర్మాణ క్రమం గురించి తెలియజేస్తూ ఎంత ప్రయోజనకరమైన వస్తువును ఎంచుకున్నా అది ఎక్కువమంది పాఠకులను చదివించ లేనప్పుడు ఆ రచన వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి కవితకు ఎత్తుగడ ప్రారంభ పంక్తులు ఎంత ముఖ్యమో , నిర్వహణ నిర్మాణ క్రమంలో అభివ్యక్తి విశ్లేషించడానికి వినియోగించబడే భాష, పదబంధాల ప్రయోగంలో ఔచిత్యం మరియు కవితను గాఢంగా మలచడానికి ప్రతీకలు, ఉపమానాలు, వర్ణనలు, పోలికలు విషయంలో కవి అంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అని… కవితను అందంగా ,ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా, కవితాత్మకంగా గాఢంగా మలచడానికి శిల్పం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కవిత్వంలో అలంకారాల ప్రయోగం గురించి చెబుతూ మంచి కవితకి అలంకారాలు ఆభరణాలు అని చక్కగా పోల్చారు. ప్రతి అలంకారాన్ని ఉదాహరణలతో విశ్లేషిస్తూ ఒక్కో అలంకారాన్ని విడమర్చి వివరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది.

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన” మరణం నా చివరి చరణం కాదు” అనే కవితలో

మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రు కణం కాదు …
నిర్విరామంగా నిత్య నూతనంగా
కాలం కలం అంచున చిగురించే నెత్తుటి…
ఊహను నేను
కవితలో ఉపమానాలు కవి యొక్క అభ్యుదయ భావాలకు అద్దం పట్టాయి అని చెబుతూ కవితలో ప్రయోగించబడిన ప్రతి పదబంధాలను ఎంతైనా విశ్లేషించుకోవచ్చు అంటారు.

కవి చెప్పదలచుకున్న భావాన్ని స్వీకరించబడిన వస్తూ ఆధారం చేసుకుని ఒక్కో పంక్తిలో ఎన్ని అక్షరాలు ఉండాలో నిర్ణయించుకుంటూ… భావవ్యక్తీకరణకు భావధార ననుసరించి ఒక్కో భావాన్ని ఆయా భాగాల్లో ఆవిష్కరించుకుంటూ భావ గణాలను విభజించుకోవాలన్నారు. కవిత్వం నిర్వహణలో క్లుప్తత గుప్తతకు పెద్దపీట వేస్తూ పునరుక్తి దోషం రాకుండా కవితని ఆకర్షణీయంగా మార్చుకోవాలన్నారు ప్రముఖ కవి కోటం చంద్రశేఖర్ గారు తమ ఇష్టపది కవితా సంపుటి లో సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి గురించి రాసిన ఆయన కవితని ఈ అంశానికి ఉదహరించడం సందర్భోచితంగా ఉంది.

ఆయన కంచు
కరిగే మంచు కూడా
ఆయన ఉరుము,చినుకయ్యే మేఘం కూడా

అంటూ రాసిన ప్రతి పాదం ప్రతి పద బంధం లో అద్భుతంగా సిద్ధారెడ్డి గారి మూర్తిమత్వాన్ని సంక్షిప్త పదాలతో క్లుప్తంగా గుప్తంగా ఏ విధంగా రాయాలో నమూనీకరించారు .

కవిత్వం పఠితుల హృదయాలను కదిలించేలా సమాజంలో మృగ్యమై పోతున్న విలువల గురించి ఆవిష్కరించే క్రమంలోవచన కవిత్వ సృజనలో వక్రోక్తి, ఆర్ద్రతలను ప్రతిబింబిస్తూ మనసులను కదిలించేదిగా ఉండాలి. అలాగే కవిత్వం నిర్మాణంలో ధ్వని, ప్రాస, విసురు, లయ, భావలయ, మెటానమీ, ప్రతీకాత్మక అభివ్యక్తిలు కవితను గాఢంగా మార్చడానికి ఉపయోగపడతాయని తెలియజేస్తూ కవయిత్రి కే రాధిక గారు అన్నదాత శీర్షికతో రాసిన కవితలోని చక్కని ఎత్తుగడ ఉదహరించారు.

చినుకమ్మ పలకరించనిదే
నేలమ్మ నవ్వదు…
నేలమ్మ నవ్వనిదే… చిగురాకు వేయదు…
చిగురాకు వేసి… గింజ చేతికి వస్తే గానీ …
రైతన్న కడుపు నిండదు.

అంటూ అలతి అలతి పదాలలో చిక్కనైన భావాన్ని నిక్షిప్తం చేశారు.

ఎంపిక చేసుకున్న కవితా వస్తువును శక్తివంతంగా సంగ్రహంగా ధ్వని యుక్తంగా చెప్పడానికి ఉపకరించే భావచిత్రాల గురించి తెలియజేస్తూ.. ఒక భావ చిత్రాన్ని కవితలో దృశ్యం మానం చేసే క్రమంలో అది అనుభూతిని పెంచే అంశంగా ఉంటూ ..పాఠకులకు ఉత్తేజ పరిచే విధంగా పదబంధాల ప్రయోగం ఉండాలి. ఎందుకంటే భావ చిత్రం కంటికి కనిపించక పోయినప్పటికీ పాఠకుడు తన పంచేంద్రియాల ద్వారా అనుభూతి చెందుతాడు . కవితా వస్తువులు సమర్థంగా అభి వ్యక్తీకరించేందుకు ఔచిత్యమైన ఉపమానాలు వర్ణనలు చేయడానికి భావచిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి .ఈ అంశాన్ని గురించి విశదీకరించడానికి సినారే మరియు అహ్మద్ ఫైజ్ ,జున్ను లక్ష్మి గార్ల కవిత్వాన్ని ఉదహరణగా తీసుకోవడం సందర్భానికి తగినదిగా ఉంది.

కవిత్వంలో విరామ చిహ్నాలు గురించి తెలియజేస్తూ కవితలో పాదాన్ని ఎక్కడ విరవాలో తెలుసుకోవడం ఒక కవిత్వ నిర్మాణాత్మక కళ. కవితలో ఒక పంక్తి/ వాక్యం/ పాదం అంత మైనప్పుడు ఒక క్షణం విరామం తీసుకుంటాం. తర్వాతి పాదాన్ని చదివే ముందు ఆలోచిస్తాం… కాబట్టి కవితలు పదాన్ని సరైన చోట ముగించడం వల్ల గొప్ప అర్థాన్ని ఇవ్వగలిగిన వాళ్లమవుతాం అంటారు. ఫుల్ స్టాప్, కామ, సెమీ కోలన్, కోలన్ , హైఫన్ ,బ్రాకెట్ వంటి విరామ చిహ్నాలు కవితా పాదాల్లో సరైన విధంగా ఔచిత్యరీతిలో… ప్రయోగించడం వల్ల కవితలు మరింత ప్రభావవంతంగా శక్తివంతంగా మలచవచ్చు అంటారు విరామ చిహ్నాలకు కవితల్లో సముచిత స్థానం కల్పిద్దాం అంటూ సూచించారు ఇలా విరామ చిహ్నాలతో పదబంధాలు బలంగా ప్రయోగిస్తూ… కోటం చంద్రశేఖర్ గారు రాసిన ఒక గులాబి కథ అనే కవితని ఉటంకించారు.

మానవతే మాయం, అత్యంత హేయం
కుళ్ళిన చర్య, దారి మళ్లిన చర్య-
మగాడైతే గర్వమా, మృగాడై కీచకపర్వమా
పదే పదే ఆవిష్కృతం
పదే పదే పునరావృతం
ఇది “అణకువ అణచివేత” లో గాయపడ్డ ఒక గులాబీ కథ
” ఆత్మాభిమానం గుండెకోతలో” రాలిపడ్డ ఒక గులాబీ కథ

అవసరం ఉన్న చోట అవసరమైనవే సందర్భోచితంగా భావ గణం కవితా వస్తువుకు పుష్టిని ఇచ్చే విధంగా చిహ్నాల ప్రయోగం ఉండాలి అని అభిప్రాయపడ్డారు. కవిత్వంలో పదబంధాల ప్రయోగం ఔచిత్యం గురించి వివరిస్తూ…

నిన్ను నువ్వు వెతుక్కోవటం ప్రారంభిస్తే
లోకాన్ని దూషించవు…
జీవితం గుండెల్లో చిత్రశాల నువ్వే…!
దరహాసానివీ నువ్వే!

అంటూ కవి ఏటూరి నాగేంద్రరావు గారు రచించిన చిత్రశాల కవితలోని నర్మగర్భంగా అద్భుత భావాలకు అక్షరాకృతి ఇచ్చిన కవి గారిని ప్రశంసిస్తూ పద బంధ ప్రయోగంలో ఔచిత్యాన్ని పాటించారు అంటారు.

మరొక అంశం “స్వగతం” గురించి ప్రస్తావిస్తూ సాధారణంగా వేదన భరితమైన అంశాలను, నివేదన రూపమైన అంశాలను, అంతరంగం లోని ఆలోచన తరంగాలను వస్తువుగా స్వగతం రూపంలో నిక్షిప్తం చేస్తాము. వీటిని ఆర్తిని జోడించి అభ్యర్థన రూపంలో ఆవిష్కరించవచ్చు లేదా ఆకాంక్షలను అక్షరాల్లో సంబంధిత పదబంధాల్లో జొప్పించవచ్చు. స్వగతంలో కవి నేరుగా వస్తువు పక్షాన నిలిచి తన భావ ప్రకటన చేయడం సహజం. చాలా సందర్భాల్లో మనకు చెట్టు గురించి అంతర్వేదన …ఇల్లు గురించిన స్వగతం…ఇల్లాలి గురించిన అంతరంగం… అమ్మ గురించి, నాన్న గురించి స్వగతాలు చదువుతూ ఉంటాం.స్వగతం గురించి స్వయంగా దాస్యం సేనాధిపతి గారి మొదటి కవితా సంపుటి నుంచి తీసుకున్న ఒక కవితను పరిశీలిస్తే…

ఎవ్వరూ పట్టించుకోరు
పర్యావరణం అంటూ…
పెద్ద పెద్ద మాటలు!
ట్రీ గార్డులో ట్రిమ్ముగా
నేను షోకేస్ బొమ్మను!
మున్ముందు ఫలాలను ఇస్తానని కాబోలు
నాతో ఫోటోగ్రాఫులు
గుక్కెడు నీళ్లే
బుక్కెడు బువ్వ నాకు !
అయినా ఎవడూ
ఓ చుక్క విదల్చడు
పర్యావరణం
ప్రతి వాడికీ ఓ ఫేషన్!
అంటూ ఒక మొక్క యొక్క అంతర్వేదనను ఆర్థ్రంగా ఆవిష్కరించారు.

మనిషి అంతరంగంలో భావ తీవ్రత ఉన్నప్పుడు మాత్రమే కవిత్వం రాయగలడు అయితే వస్తువుని విశ్లేషించే క్రమంలో… వస్తువుని బలంగా వ్యక్తీకరించే సందర్భంలో కవికి ఆసరాగా నిలిచేది… కవిని కవిగా నిలబెట్టేది…భాషే! చక్కని భాషతోనే కవిత్వం నిలబడ గలుగుతుంది. కవిత్వం సృజన చేసే క్రమంలో… కవికి భాష గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అంటారు. అంతేకాకుండా కవిత్వ రచనలో ఎక్కడ సంక్లిష్టతకు , సందిగ్ధతకు తావు ఇవ్వకుండా భాషను ప్రయోగించాలనీ… సరళంగా వ్యక్తీకరించినప్పటికీ… అలతి అలతి పదాలను ఎంపిక చేసుకున్నప్పటికీ …కవితాత్మకంగా రాయడం మాత్రం మరువకూడదు. చేతి రాతలోనే కానీ… టైపు లో కానీ అక్షర దోషాలు దొర్లకుండా చూసుకోవాలి అని సూచించారు.

కవిత్వ నిర్మాణం- ముగింపు విషయం గురించి చర్చిస్తూ… కవి ఎంపిక చేసుకున్న కవితా వస్తువును బట్టి ,కవి యొక్క అభివ్యక్తి పటిమను అనుసరించి, కవి యొక్క భాషా సంపత్తిని బట్టి, అన్నింటికీ మించి… కవిత ద్వారా కవి ఏం చెప్పదలచుకున్నాడో దాన్నిబట్టి కవితకు ముగింపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముగింపు మరింత కవితాత్మకంగా ఉండాలి .కవిత్వం ముగింపు విషయంలో కవులు మరింత శ్రద్ధ పెట్టి…
కవిత చివరలో అంశాన్ని బట్టి వ్యంగ్యంగా/ ఓ మెరుపు/ఓ చరుపు/ఓ విరుపులతో స్పష్టంగా ముగించాలి అంటారు.

కవిత్వంలో అభ్యుదయ భావాల ప్రకటన, ధిక్కార స్వరం, భావ కవిత్వంలో ప్రణయ సంకీర్తనం, కవిత్వంలో మానవతావాదం…వంటి అంశాలను గురించి కూలంకషంగా సోదాహరణంగా ప్రముఖుల మరియు వర్ధమాన కవులు యొక్క రచనలు తీసుకొని చక్కగా విశ్లేషించారు.

కవిత్వానికి పెద్దబాలశిక్షవంటి ఈ పుస్తకంలో… కవయిత్రి పాటిబండ్ల రజని , కొండేపూడి నిర్మల ,విమల ,వాసా ప్రభావతి , ముక్తేవి భారతి , శైలజా మిత్ర , కె శివారెడ్డి , నన్నపు వెంకట రామి రెడ్డి ,దాస్యం సేనాధిపతి వంటి ప్రముఖులు రాసిన కవితలే కాకుండా… రమాదేవి బాల బోయిన ,అనుశ్రీ ,గోస్కుల శ్రీలత రమేష్ ,రమాదేవి కులకర్ణి ,బండారు సుజాత ,చీదెళ్ళ సీతాలక్ష్మి , లక్ష్మీ మదన్, రంగరాజు పద్మ , ఉదయశ్రీ ప్రభాకర్ , వకుళవాసు ,అరుణ కీర్తి పతాక ,బుర్ర విజయలక్ష్మీనాగరాజ్ , జయంతి సుధాకర్, వేల్ముల జైపాల్ రెడ్డి ,స్వప్నకృష్ణ ,శ్రీదాస్యం లక్ష్మయ్య, కాసర్ల లక్ష్మీ సరోజ రెడ్డి, చిందం సునీత, విజయ దుర్గ, హసీనా బేగం, లింగుట్ల వెంకటేశ్వర్లు, నవీన్ హోతా ,ఆది విజయలక్ష్మి శ్రీనివాస్, భాస్కర బాలభారతి,అప్సర్వలీషా, వెగ్గళం ఉషశ్రీ ,కొమురవెల్లి అంజయ్య, భాను శ్రీ వంటి వర్ధమాన కవుల రచనలు కూడా ఉదహరించడం ముదావహం. పలువురు వర్ధమాన కవుల కవితలను పరిశీలిస్తూ వాటిలోని గుణదోషాలు తెలియజేస్తూ రాయబడిన ఈ గ్రంథం వారిలో ఆత్మ విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంపొందిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

కవిత్వ రచనలోని ప్రతి అంశాన్ని కూడా సోదాహరణంగా వివరిస్తూ… విపులంగా వ్యాఖ్యానిస్తూ… సీనియర్ రచయితల యొక్క కవితలను అంశాలకు అనుగుణంగా ఉటంకిస్తూ …కవిత్వ రచనలో మెలకువలను గురించి దాస్యం సేనాధిపతి గారిచే రచించబడిన ఈ గ్రంథం వర్ధమాన కవులకు కరదీపిక అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
-బుర్ర విజయలక్ష్మీనాగరాజ్
9966559567

పేజీలు:198
వెల :200రూ.
ప్రతులకు :దాస్యం సేనాధిపతి
9440525544

April 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వేములవాడ రాజన్న క్షేత్ర వైభవాన్ని పద్యాల్లో అభిషేకించిన చొప్పకట్ల భాను!

by సంకేపల్లి నాగేంద్ర శర్మ April 15, 2022
written by సంకేపల్లి నాగేంద్ర శర్మ

పుస్తకం పేరు: వేములవాడ వైభవం పద్యకావ్యం. రచన: చొప్పకట్ల భాను, వేములవాడ. పుటలు:156. వెల: 116 రూపాయలు.
వేములవాడ క్షేత్రేశ్వరుడైన రాజరాజేశ్వర స్వామి వారిపై ఈ వంద సంవత్సరాలలో ఎంతోమంది కవులు, పండితులు వివిధ ప్రక్రియల్లో విలువైన రచనలు చేశారు. కీ.శే. మామిడిపల్లి సాంబకవి, వేదాంతం కాశీనాథం, కేశన్నగారి రాజశర్మ, వజ్జల సాంబశివశర్మ, బ్రహ్మనగారి నరహరి శర్మ మొదలగు పద్యకవులు స్వామి వారిపై కావ్యాలు రాశారు. దండకాలు రాశారు. స్తుతులు, సంకీర్తనలు, భజన పాటలు రాశారు. 150 సంవత్సరాల క్రితం యోగులైన బ్రహ్మశ్రీ సీతారామ యోగీంద్రులు, సంకేపల్లి రామశాస్త్రులు వంటి వారు స్వామి వారి పై సంకీర్తనలు రాశారు. కర్ణాటక సంగీత విద్వాంసులైన చౌటి భాస్కర్ లాంటి సంగీత కళాకారులు కూడా శాస్త్రియ సంగీతంలో తేనీయల్లాంటి కీర్తనలు రాశారు. ఇవన్నీ చతుష్కాల పూజల్లో అర్చకులు చదువుతున్నారు. కరీంనగర్ లో 1958-60 ప్రాంతాలలో నివసించిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా వేములవాడ రాజేశున్ని దర్శించి, స్వామి వారి మహిమను కొనియాడుతూ, మధ్యాక్కరలో పద్యాలు రాసి తన మొక్కు చెల్లించుకొన్నాడు. డా. వడ్డేపల్లి కృష్ణ, మిద్దెరాములు తదితరులు జానపదాల పాటలు, ఒగ్గు కథలు రాశారు. ధర్మపురి శేషప్ప, తిరుమలలో అన్నమాచార్యుడు, తెలుగు వాజ్మయ ప్రథమాచార్యులైన శ్రీ కృష్ణమాచార్యులు సింహగిరి వచనాలు రాసి ఇలా ఎంతో మంది వారి వారి భక్తి మార్గాలలో ఆ పరమేశ్వరున్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ తరించారు. తమ రచనల్లో భక్తి తత్వాన్ని ప్రాతిపదికగా తీసుకొన్నారు. అలాంటి కోవలో హృద్యమైన శివభక్తితో వృత్తాలలో పద్యాలు రాసి తన జన్మను సార్థకం చేసుకొన్నారు, సంస్కృత, తెలుగు పండితులు చొప్పకట్ల భాను గారు. కవి చక్కటి గాయకులు, చక్కగా పాడి వీటిని వాట్సాప్ గ్రూఫుల్లో పోస్టింగ్ లు చేయడంతో ఈ పద్యాలకు ఔచిత్యమేర్పడిందని చెప్పవచ్చును. ఈ పుస్తక ప్రచురణలో వెన్నుముకగా నిలిచిన రచయిత, న్యాయవాది వాసాలమర్రి నాగరాజు గారు ధన్యులు. వేములవాడ బ్రాహ్మణ్యం లో కొత్త నీరు రావడానికి ఇలాంటి రచనలు ఉపకరిస్తాయని చెప్పవచ్చును.

దక్షిణ కాశీగా ప్రసిద్దమైన వేములవాడ క్షేత్ర్రాన్ని, విరాట్ మూర్తులను, అమ్మవారు, గణపతి, నందీశ్వరుడు, దేవాలయ అవరణలోని వివిధ ఉపాలయాలైన భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, బద్ది పోచమ్మ, కేదారేశ్వరుడు, మహలక్ష్మీదేవి ఆలయాలను చక్కగా కవి వర్ణీస్తాడు. ప్రధాన ఆలయంలో కొలువైన దేవతలు, కోటి లింగాలు, పంచాయతనాలు, ధర్మకుండ పుష్కరిణి, ఇక్కడి పండితులు, వేదమూర్తులు, సంస్కృత విద్యాలయ ఆచార్యులు, అర్చకుల పై ఆధ్యాత్మిక, తాత్విక దోరణీలో 140 పుటల్లో 124 పద్యాలతో వేములవాడ క్షేత్ర వైభవాన్ని పండించడంలో కృతకృత్యులయ్యారు. కొన్ని పద్యాలలో సామాజిక చింతనను రంగరిస్తూ దేవదేవున్ని ప్రశ్నిస్తుంటారు. లోకంలోని అనుచితమైన పోకడలపై దండెత్తుతారు. వీరు రాసిన పద్యాలు సరళంగా ఉండి, సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఇంపుగా ఉన్నాయి. ప్రతి పద్యంలో ఒక కొస మెరుపుతో శివభక్తి అక్షరమక్షరంలో తాండవిస్తూ కనబడుతుంటుంటుంది. ఈ పద్యాలకు అనుబంధంగా మరో 14పేజీల్లో ఆరు రచనలు చేసి భేషనిపించుకొన్నారు. తాను రాసిన పద్యాల కిందటే భావాన్ని కూడా జతచేసి పఠితులకు ఆహ్లాదం కల్గిస్తాడు.

రచయిత భాను గారు వేములవాడ క్షేత్ర ఆనువంశిక అర్చక సంతతికి చెందిన వారు, తెలుగు, సంస్కృతాలలో పిజీ చేసి, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, వన భూమి యైన ఆదిలాబాద్ జిల్లాలో మూడు దశాభ్దాలకు పైగా, తెలుగు పండితునిగా ఉద్యోగించి, తన శేష జీవితాన్ని సార్థకం చేసుకోవాడానికై వేములవాడ వైభవం పేరుతో పద్యకృతిని తన ఇష్టదైవమైన రాజన్నకు రాసి సమర్పించుకొన్నారు. గుడి వైభవం పై అలవోకగా పద్యాలు అల్లి తనలోని శివభక్తిని పద్య పుష్పాలుగా, బిల్వ దళాలుగా మలిచి అభిషేకిస్తూ, కైమూడ్పులర్పించుకొన్నారు. ఈ కావ్యంలోని పద్యాలు మోక్ష రసగంగై, సుబోధకమైన రీతిలో అర్థవంతమైన పద బంధాలతో అలరారి, పాటకున్ని ప్రభావితం, ప్రసన్నం చేస్తాయి. ఇందులోని పద్యాలు స్వతంత్ర ప్రతి పత్తిని కల్గి యుండి, దార్శనికునికి వేములవాడ క్షేత్ర సందర్శనను పునీతం చేస్తాయని కవే తన ముందు మాటగా చెప్పుకొన్నారు. మానవున్ని భక్తి మార్గంలో నడిపించడానికి ఇందులోని పద్యాలు మందార మకరంధాలై భాసిల్లాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో. క్షేత్రేశ్వరుడైన మహదేవున్ని పరిపరి రకాలుగా స్తుతిస్తూ, తాత్విక చింతనతో ప్రశ్నిస్తూ, పద్యాలలో కవితా సౌందర్యాన్ని ఇనుమడింపజేశాడు. శివనామ స్మరణమ్ము సేయ మదిలో సిద్దుల్ ప్రవేశించిరో, శివ భావంబు రగిల్చిరో?శివ సుధారసమ్ము త్రాగించిరో అంటూ, శివ ధామమ్ము మహాధ్బుతమ్ము జన సంసేవ్యమ్ము నీ ధాత్రిలోన్! అంటూ దేవదేవున్ని స్తుతిస్తారు. వేములవాడ వైభవము వేడుకగా రచియింప బూని నీ/ నామము నే స్మరింప కవనామృత శైక కృతుల్ జనించె నా/ కోమల పద్యబిల్వములు కోరిక శివార్పణమ్ముగా/ నామది మొక్కి నీకు నిట అంకితమిచ్చితి శీ మహేశ్వరా!!అంటూ తన పద్యాలతో వైభవోపేతంగా కావ్యాన్ని అంకితమిస్తూ శివార్చన చేశాడు.

మా ఊరే ఒక ఈశ్వరార్చన పదమ్మూ వూరు కైలాసమే/ మా వూరందలి ధర్మకుండ జలముల్ మందాకినీ తీర్థముల్/ మా వూరినంతకు గాలి వెల్గు నతడే మా ఊరి రాజన్నయే/ మా ఊరంగల గోపురాల వితతుల్ మాహేశ్వర స్థానముల్!! అంటూ వేములవాడ క్షేత్ర ప్రాధాన్యతను కళ్ళకు కడుతాడు. మా ఊరి రాజన్న గోపురాలన్నీ మహేశ్వరుని స్థానాలేనని కవిసమయాన్ని వెల్లడిస్తాడు. ధర్మకుండ పుష్కరిణి ప్రాశస్త్యాన్ని గూర్చి రాస్తూ, ఇవి మందాకినీ(పవిత్ర గంగానది) జలములని, ఆ దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొన్నాడని, మోక్షాత్ముండయి తానమాడె తమితో మోక్షార్థియై నిచ్చటన్!! అని చెబుతాడు. ధర్మకుండ జలాన్ని పవిత్రంగా దూడాలని, అపవిత్రం కాకుండా కాపాడుకోవాలని నివేదిస్తూ, ఆందోళన చెందుతాడు. అతి కాలుష్యపు భాండమయ్యే నికటా, స్థితి తప్పి కాసారమై పోయిందని అంటూ, గతి నీవే సర్వ కల్మష హరా గంగాధరా శంకరా అంటూ వేడుకొంటాడు. అరు, ఏడు పద్యాలలో దేవాలయంలోని ప్రాచీనమైన చరిత్ర కనుమరుగై పోయిందని, బౌద్ద, జైన మూర్తుల కళాఖండాలు, కోమలుల విగ్రహాలు వంటివి శిల్పవిధంసములై మాయమై పోయాయని, మౌనంగా ఉండటం నీకిది ధర్మమేనాని నిందాస్తుతిలో ప్రశ్నిస్తాడు. లేరే అర్థ నిమిలితాక్షులు శీలా లీలా కళా ఖండముల్ /వారేరయ్యా తదీయ ధర్మ నిరతుల్ వాక్సత్య సంశోధితుల్ అంటూ ఆరవ పద్యంలో ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు.

రాజన్న రాజగోపురాలను పరమేశ్వర స్థానంగా, సుమహోహరంగా వర్ణించడంలో కవి తన నేర్పరి తనాన్ని, స్థానీయతను ప్రదర్శిస్తాడు. అదిగో చూడు మహోర్ధ్వ లోక మదిగో, ఆనంద సంధాయక/మదిగో, వేదమహర్షి దర్శిత మహామంత్ర ప్రభావమ్మదే/ అధిగో బ్రహ్మ మురారి ముఖ్య సురులే యాశించు భవ్య స్థల/ మదిగో చూడుము రాజగోపుర మదే, మాహేశ్వర స్థానమిదే|| పూర్తిగా దేవాలయ వైభవాన్ని ఇలా చెబుతాడు. ఆ దేవాలయ శిల్పముల్ శిఖరముల్, కోడెమొక్కుల విధం, ధర్మకుండపు జలం, భవ్య గర్భాలయ ఆ దివ్యోజ్జ్వల రాజలింగని మదిన్ తలుతున్ అని చక్కటి దైవీభావ అనుభూతికి లోనై చెబుతాడు. ఆలయంలోని ఒక పక్కగా పేర్చి యున్న కోటిలింగాలను 19వ పద్యంలో ఇలా చెబుతాడు. ఏ రాజన్యులు పేర్చిరో, ఏ రుష్యాదుల ఊహయో నిల్పిరి దివ్య లింగ వితతిన్ అంటూ కవితాధారలో అభిషేకిస్తాడు. క్షేత్ర స్థలపురాణాన్ని, వేములవాడ చాళుక్యుల చారిత్రక పాలనను సమ్మీళితం చేస్తూ పద్యాలు భావబందురతో రాయడం కనిపించింది. తొలి చాళుక్యపు రాజరాజు ఇచటనే తోయంబునన్ స్నాతుడై గనినట్టి రాజమూర్తియని దక్షిణామూర్తి లింగ వర్ణనలో 28, 83వ పద్యాలలో చెబుతాడు. విరాన్మూర్తి రాజలింగాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలలో, పంచభూత లింగాలతో మయమైన లింగంగా పోలుస్తూ వర్ణించి చెప్పే విధానం, కవి జ్నాన సంపన్నుడై, ఎంతగా శివభక్తిలో తాదాత్యం చెందాడో అర్థమవుతుంది. కాశీనాథ విశ్వేశుడై వెలిశాడని, శివ గోకర్ణ, కాళహస్తీశ్వరుడై, భువి రామేశ్వరుడై, చిదంబర పురీ వాసుడై,హేమాద్రి పురాన వెలసిన కేదారేశ్వరుడై ఇట అమరనాథేశ్వరుడు భాసిల్లుతున్నాడని స్తుతిస్తాడు. పదమొక పద్యమయ్యె శివపాదపు పీఠిక నాశ్రయించి సొంపెదిగిన వాక్యముల్ విమల బిల్వ దళంబుల రూపమెత్తగా పదపద భావముల్ చెలగి పారినాయని 54 వ పద్యంలో కవి తన్మయుడై పోతాడు. అమ్మవారైన తల్లి శ్రీరాజరాజేశ్వరీ దేవి గూర్చి 74,75,77,79 పద్యాలలో రసరమ్యంగా స్తుతించారు. కల్లోలముల్ బాపు నట్టి భవ లోకానంద స్తోత్రముల్/ ఉల్లమ్మంతయు నిండె విశ్వజననీ, ఉద్యప్రభా రూపిణీ అని కీర్తిస్తాడు. ఇది ఒక రాజపీఠ మనే శక్తి పీఠమని, ఇందుకు గ్రంథాల్లో ఆనవాళ్ళు లేకున్నా తల్లి పాదముల వద్దే కాసేపు నిలిచినట్లయితే నిజం తెలిసి పోతుందని తన్మయుడవుతాడు. శ్రీ రాజేశ్వరి పాద పద్మ యుగమా, శ్రీ చక్ర స్థానమేనని, ఒక మణీద్వీపమని శక్తి స్వరూపాన్నిసుందరంగా ఆవిష్కరిస్తాడు. చల్లని తల్లివమ్మ హరిచందన చర్చిత చారుగాత్రివే, చల్లని చూపులున్న సిరి జల్లుల వెల్లి వరాల తల్లివే||అని ప్రార్థిస్తాడు.

లోకవిదితమైన బాధలను పేర్కొంటూ, కక్షలు శిక్షలు శివుని కాలిగోటిని తాకగలవా ప్రశ్నిస్తూ కోపతాపాల శివశివా అని 62వ పద్యంలో చెబుతాడు. సదముల భక్తి భావనయు, సంచిత పుణ్య ఫలార్ధ సంపదన్/ శైవ వైభవ రసామృత పానపరాయణత్వమున్/ధర్మ తత్పరతలు, సద్గుణ శీలతలు, సత్యనిష్టతలు శివ సన్నిధిని చేరే యోగ్యతలని 63వ పద్యంలో యదార్థత భక్తి చింతనను అరటి పండు ఒలిచి పెట్టినట్లు చెబుతాడు. బ్రాహ్మణార్చకుల గూర్చి 91వ పద్యంలో జట ఘన చెప్పగల్గెదరు, చారు మనోజ్న సువర్ణ సంపుటముల వోసినట్లే ఇక్కడి వేదభూమిలో శ్రుతులు వినిపిస్తాయని కడు రమ్యంగా చెబుతాడు. 123లో బ్రాహ్మణుల అగ్రహారంగా మహాగ్రపురమై వేములవాడ భాసిల్లిందని చెబుతాడు. దేవాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్కృత విద్యాలయం గూర్చి 116,117, 118 పద్యాలలో జిజ్నాసతో వర్ణిస్తాడు. ఘన సంస్కృతాలయము, నచ్చట నేర్చిన విశేష పూర్వ పుణ్య ఫలములేనని, ఇది ఒక శిపప్రసాదమేనని, వేద ప్రాజ్నుల బోధనల వల్ల అవధానులు, కవులు, కళాకారులెందరో తయారయ్యారని వర్ణిస్తాడు. నాదోపాసకులర్థ శాస్త్ర విభుధుల్, నాట్య ప్రవీణుల్, వాచక చతురులు వర్థిల్లినారని అంటాడు. ఒక శివ సుప్రభాత, ఒక శతక కావ్యంగా కూడా ఈ రచనా శైలి శివభక్తితో నిండిపోయిందని చెప్పవచ్చును. రాజన్న ఆలయంలో ప్రత్యేకంగా విశిష్ట శివమహా లింగార్చన గూర్చి 76లో చెబుతాడు. మన్నును సంస్కరించి పరమాధ్బుతమౌ శివలింగ విగ్రహా/లన్నియు పేర్చి నొక్కసుకళాకృతి తీర్చి మహేశ లింగమున్ అని వర్ణీస్తాడు. పర్యావరణ విహితమైన రావి చెట్టు, అశ్వత్థ వృక్షాల వర్ణనలు 8.9 పద్యాలలో కానవస్తావి. ఇవి గత కాలపు తీఫి గుర్తులని, చాళుక్యరాజుల సంపదలకు ప్రతీకలుగా నిలిచాయని అంటాడు. 16,17 పద్యాలలో దేవాలయంలోని గండాదీపాన్ని స్తుతిస్తూ, కవి తాత్విక చింతనలు అద్ది చీకటి లోకంలో ఉన్న జనజీవనులకు, ఆకలి చీకట్లు నిండిన లోకానికి, దినదిన గండంగా బతుకుతున్న ప్రజలను పవిత్ర జీవనులుగా మార్చడానికి వెలుగు రేఖలను ప్రసరింపజేయాలని కోరుతాడు. . అనుబంధ రచనల్లో రాజరాజేశ్వర కరావలంబ స్తోత్రం, దండకం, అక్షరార్చన, స్తుతి పంచకంతో సహా శ్రీరామచంద్ర కరావలంబ స్త్రోత్రాన్ని చేర్చి తన భక్తి ప్రపత్తులను వేములవాడ వైభవంలో పొదిగి పునీతుడయ్యారు. ఉపయుక్తమైన ఫోటోలు చేర్చి పద్యాలకు సొగసులు చేర్చారు.

April 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మను నెల్లుట్ల “జన్య భారత” సరికొత్త ఆలోచనల నవల

by mayuukha April 15, 2022
written by mayuukha

మను నెల్లట్లు
            నవతరానికి ప్రతీకగా  నవలా సాహిత్యంలోకి మరో కొత్త గొంతుక వచ్చింది, మను నెల్లుట్ల పేరుతో “ జన్య భారతం” అంటూ . కాలం ఎంత వేగంగా పరుగెడుతుంటే యువకుల ఆలోచనలూ అంత వేగంగా పరుగెడుతున్నాయి అనడానికి ఈ “ జన్య భారత” నవల   ఒక  ఉదాహరణగా నిలిచింది. ఈ నవలను రచించింది మను నెల్లుట్ల , కెనడా దేశంలో నివసిస్తున్నారు.

“జన్య” అనే సంస్కృత శబ్దానికి యుద్ధం , సాధారణ జనులు అనే అర్థాలున్నవి .”మహా “ కాదు ఇది “మామూలు” కూడా ఉంటుందనే భావంతో ఇది జనుల భారతం అనే ఉద్దేశంతో రాసినట్టున్నది నవల. ఈ నవలారచయిత మనోభిరామ్ నెల్లుట్ల ( మను నెల్లుట్ల) నవల పేరు Janya Bharata , క్రింద The War అని రాయడం వలన తెలుస్తున్నది. “ జన్య భారత” నవల ఇంగ్లీష్ భాష లో రాసిన నవల.
మరలనిదేల భారత యుద్ధ కథ అని అనుకోవద్దు . మహాభారత యుద్ధం మొత్తం రాజుల , రాణుల గురించి కురుక్షేత్ర సమరం గురించి ఉంటే ఈ జన్య భారత కథమొత్తం సామాన్యుడు, సామాన్యురాలి గురించి వారి జీవన సమరం గురించి ఉన్నది.
మహాభారత యుద్ధం జరిగింది అని మనమంతా నమ్ముతున్నాం . ఆ యుద్ధంలో కేవలం రాజులే ఉన్నారా? వేరే సాధారణ ప్రజలు లేరా ?అంటే, ఉన్నారు . ఆనాటి ఆ యుద్ధం లో ఎందరో పాల్గొన్నారు.వారిలో ఉస్త్రకర్ణిక అనే పేరుతో పిలువబడే గిరిజనులు ఆ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన నిలుచుని యుద్ధం చేశారు.
కల్పనాచాతుర్యంతో రచయిత ఈ గిరిజనుల ప్రతినిధిగా మిత్రాజిత్ అనే అతను భారత యుద్ధానికి వెళ్ళినట్లు, వెళ్ళేముందు వెళ్ళిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు, అతని కుటుంబము వారి జీవన విధానమూ చిత్రీకరిస్తూ కథను అల్లడం చూస్తాం. ఈ నవల లో యుద్ధం మొదటి
రోజు ఏమైంది?రెండో రోజు ఏమైంది?ఈ సైనికుల పరిస్థి ఏమిటి? ఖడ్గ విద్యలో నిష్ణాతుడైన ఈ కథానాయకుడు మిత్రాజిత్ కు ఏం జరుగుతుంది? అతని కుటుంబమేమయ్యిందనేది ఈ నవల చదివితే తెలుస్తుంది.ఈ “జన్య భారత” నవల అమెజాన్ లో దొరుకుతుంది. భారత దేశంలో ఉన్నవాళ్ళు e Book , కిండిల్ ఎడిషన్ గా తీసుకోవచ్చు.
e Book , పేపర్బాక్, హార్డ్కవర్ వంటి వాటిద్వారా అమెరికా,కెనెడా,ఆస్ట్రేలియా ,ఇంగ్లాండ్ దేశాలవారు కొంటున్నారు.
మను నెల్లుట్ల MPT , MA(Edu), MBA చేసాడు. ఇండియా , రువాండా( సెంట్రల్ ఆఫ్రికా) లో 13 ఏళ్ళు ఫిజియోథెరఫీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసాడు.ప్రస్తుతం అమెజాన్ లో job చేస్తున్నాడు.అమెజాన్ లో చేరడానికి ముందు కెనెడా లో Actsafe Safety Association కు CEO గా జాబ్ చేసాడు. మను నెల్లుట్ల ఒక మంచి గాయకుడు. సింగర్. ప్రాడ్ కాస్ట్ హోస్ట్ podcast host (Manu Tho Muchatlu) కూడా! Facebook lo సింగర్ మను N గా వెతికితే కనిపిస్తాడు.
270 పేజీలలో 65000 పదాలతో సులభంగా చదవగలిగే ఇంగ్లీష్ తో ఉన్న నవల “జన్య భారత” నవల. ఈ నవల ముఖచిత్రాన్ని అంజన చేపూరి , USA చిత్రించారు.
ఎక్కడెక్కడైతే సంస్కృత శబ్దాలు ప్రయోగాలు చేసాడో ఆ కఠిన పదాలకు అర్థాలను ఇచ్చారు.
“ జన్యభారత ద డెల్యూజ్” అనే పేరుతో దీని కంటిన్యూయేషన్ కూడా రాస్తున్నారు మను .
మహాభారతం చదివిన వారికి ‘ ఔనుకదా వీళ్ళను గురించి ఈ సామాన్యులను ఎవరూ పట్టించుకొని రాయలేదుకదా అని ఈ నవలలోని పల్లెజనుల బ్రతుకు గాథ లను చదివి తప్పకుండా మన మనసులో అనుకొనితీరుతాం.
మను నెల్లుట్ల కు శుభాకాంక్షలు .
ఈ పుస్తకం—
https://lnkd.in/gKi_A99b (Amazon Canada)
https://lnkd.in/gE8FT_HK (Amazon US)
https://lnkd.in/gTC-YFzS (Amazon India) (Ebook version only)
ఈ లింక్ లలో లభిస్తుంది. మనమంతా చదువుదాము!!

April 15, 2022 1 comment
3 FacebookTwitterPinterestEmail
కవితలు

జన సముద్రం

by డా|| నాళేశ్వరం శంకరం April 10, 2022
written by డా|| నాళేశ్వరం శంకరం

నిరంజనుడి ప్రభంజనం నీటి మనసుకు తెలుసు

పాలమూరు పాల సముద్రమన్నా

అస్తిత్వాకాశంలో

వెలుగుతున్న ధృవతార అన్నా నిజమే మరి!

నేనైతే ఆయన వెంట

నాలుగడుగులు నడిచిన పాపాన పోలేదు గానీ

నా ఆదర్శ దాంపత్యానికి ఆత్మబంధువతనే!

ఆయనదంతా

ప్రజాదివ్వెల్ని వెలిగించడానికి

చమురుగానో వత్తిగానో

యేదోవొకటి కావడానికేగా ఆయన జీవనయాణం

పాలిచ్చే పొదుగుల్ని

పితుక్కునే శ్రద్దెంకు లేదో తెలియదుగానీ

పల్లెకు పాలుపోసే పశువుల మీది ప్రేమకొద్ది

బతుకును పచ్చి గడ్డిలా పునీతం చేసుకున్న దేశభక్తుడతడు

రాజహంస రెక్కల్ని ముడుచుకున్నట్లు

సేద్యగాళ్ళ సోయగాలను

పంచకట్టు మడతల్లో దాచిదాచి చూపగలడు

ఆయన నగువు ముందు

ఎన్ని తగువులైనా అదృశ్యమైపోతాయంతే!

కరువులోయలో పుట్టిన బిడ్డ కావడంవల్లే అనుకుంట

వంచకుల రెక్కల్నితుంచే

ఉప్పొంగిన ఉద్యమ ఉషస్సుకు ఊపిరి ఊదడంవల్లే

మన జాతి పాలపిట్ల విజయదుందుభి మ్రోగించ గలిగింది!

ఔను

సమర శంఖస్వరంలో

ప్రతిధ్వనించిన ముక్తస్వరం ఆయనదే!

నిబద్ధతకు నీడనిచ్చే చెట్టేగా ఆయన ఆదర్శం

ప్లీడరా లీడరా అని కాదు

ఆయనకున్న రెండు చేతులు అవే!

నిరంజనా! నిరంజనా!

నీవు జలసముద్రానివే కాదు జనసముద్రానివి కూడా!

ఓ కృషీవలుడా!

మా కాంక్ష ఆకాంక్ష వొక్కటే

అడుగు తీసి అడుగేసినప్పుడల్లా

ఆ అడుగుల అస్త్రవిద్యను మట్టి పాదాలకు నేర్పుతూనే ఉండు

నీ వెనక నడిచే పంటపొలం ఆడుతూ పాడుతూ అవనికి అన్నం పెట్టగలదు.

April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాల

by డా॥ సంగనభట్ల నరసయ్య April 10, 2022
written by డా॥ సంగనభట్ల నరసయ్య

లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు మం

జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరో

జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై

వెలయున్ భాగవతాఖ్య కల్పతర్వురిన్ సద్ద్విజశ్రేయమై –భాగవతంలో పోతన

బమ్మెర పోతనామాత్యుని శ్రీ మదాంధ్ర మహాభాగవతంలోని అవతారికాపద్యమిది. మూలంలో గల సంస్కృత భాగవత వైశిష్ట్యాన్ని తెలిపే ఈ పద్యం తెలుగులోకి మహాకవి పోతనచే అనూదితం. భాగవతాఖ్య కల్పతరువనే మాటతో భాగవతం కల్పతరువు (వృక్షం)తో పోల్చబడి ద్వ్యర్థిలో రచించబడింది.

భాగవతార్థంలో పరిశీలిస్తే లలితాదేవి కాండంగా, శ్రీకృష్ణుడు తల్లివేరుగా, శుకమహర్షి ప్రవచించగా మనోహరత్వంతో శోభిస్తూ, దేవతలను తృప్తిపరుస్తూ, మిక్కిలి అందమైన కథతో, గొప్ప భక్తి ఫలాన్ని ఇస్తూ, స్వచ్ఛమైన కథకుడు వ్యాసమహర్షికి ఆలంబనై మంచివారికి (పుణ్యాత్ములకు) ఆశ్రయమిస్తున్నది. భాగవతమనే వృక్షార్థంలో పరిశీలిస్తే చిన్న చిన్న కొమ్మలతో, నల్లని మూలంతో కొమ్మపై వాలిన చిలుకుల పలుకులతో, చక్కని లతలు తనకాధారమై పైకి పాకగా, మంచి ఆకులు, పుష్పాలతో, గుండ్రని కాండంతో, చక్కటి పండ్లనిస్తూ, విశాలమైన మొదలుతో, అనేక పక్షుల కాశ్రయమైన చెట్టు భాగవతంలా శోభిస్తున్నది.

ఈ పద్యం శ్లేషసొబగుల్లో లలితాదేవి కాండంగా ఉండటమేగాక లలితమైన (కోమలమైన) అనే అర్థం వచ్చింది. “మూగురమ్మల మూలపుటమ్మ”ను పోతన విశేషంగా స్మరించినాడు. కృష్ణ శబ్దానికి శ్రీ కృష్ణపరమాత్మ, నల్లనైన కాండం అనే అర్థంతోబాటు “నల్లనివాడు పద్మనయనంబులవాడన్న మహాకవి వాక్యం స్మరణీయం. కృష్ణుడు నల్లనయ్య కదా! శుకమహర్షి భాగవతం పరీక్షిత్తుకు చెప్పినట్టుగా విశదమైన ఈ పురాణం చిలుక పలుకులవంటి మధురవాక్య శోభితమని అర్థం. “మంజులత” మంజులత్వమనే అర్థంలోనూ, మంజు – లత అనగా మనోహరమైన తీగలతో అల్లుకొన్నదని ద్వ్యర్థి జోడించబడింది. సువర్ణు లంటే దేవతలని, సుమనః అంటే మంచివారని, సుజ్ఞేయమంటే చక్కగా తెలుసుకొనబడవలసినదని భాగవత శోభను, తత్త్వాన్ని తెలిపి, మంచి ఆకులు, పువ్వులతో చక్కని వృక్షంగా తెలుసుకోవాలని సూచించబడింది.

వ్యాసమనే మాటకు వృక్షవ్యాసమనీ, జోడించబడి భాగవతంలో సంబంధం గల లలిత, కృష్ణ, శుక, వ్యాసులను, స్మరించి వృక్షార్థంలో శ్లేష సాధించడంలోనే ఈ పద్యం రాబడింది.

వృత్త శబ్దానికి కావ్యేతివృత్తం అనగా భాగవత కథ అని, చెట్టు చుట్టూ గల గుండ్రని తనం, ఫల శబ్దానికి పురాణశ్రవణ జనిత మోక్ష ఫలం, చెట్టు పండు అని, ద్విజ శబ్దానికి పండితుల శ్రేయస్సును, పక్షులకు ఆశ్రయమని ఇలా పది అంశాలు భాగవత వృక్షార్థాల్లో రెండర్థాల్లో శోభించడం ఈ పద్య విశిష్టత.

భాగవతం ఎంత లోతుగా తెలిస్తే ఈ పద్యం అంత అందంగా అర్థమవుతుంది. వృక్షం లక్షణం అందరికీ తెల్సిందే గదా!ఉత్తమ వృక్షంలా భాగవతం, భాగవతం వలె ఉత్తమ వృక్షం ఈ భూమిపై ప్రకాశిస్తోంది.

April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ యాదాద్రీశ వైభవమ్-16

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు April 10, 2022
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు

దీనత్రాణైక నామం దినదినశుభ సంధాయ కామేయ నామం ధ్వస్తాఘామోఘ నామం మునిజనదమన స్తోమ నిర్భిన్న నామం కామక్రోధమ్న నామం కరివరవరదానంత సుస్వాంత నామం

వందే యాదక్షమాభృత్కటక వటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ || తాత్పర్యం : శ్రీహరినామస్మరణ ఎంత మహిమాన్వితమైనదో ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. ఆపన్నులైన దీనజనుల్ని ఉద్ధరించగల ఏకైక నామం! ప్రతినిత్యమూ శుభాలను చేకూర్చే మితిలేని మహిమాన్వితమైన నామం! నీతిమాలిన ఘోరపాపాలను సైతం నశింపజేయగల నామం! మునులను, ఋషులను హింసించే రాక్షస సమూహాలను భేదించగల నామం! కామక్రోధాది అరిషడ్వర్గాన్ని మట్టుపెట్టగల నామం! మొసలిచేత పట్టుబడిన గజరాజును విముక్తుణ్ణి చేసి, వరప్రసాదం చేత, అనంతమైన సాంత్వనము చేకూర్చిన నామం! అటువంటి శక్తివంతమైన తన నామస్మరణతో భక్తులను అనుగ్రహిస్తూ శ్రీ యాదాద్రిపై వెలసి, తన పటుతరమైన భుజబలపరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని నమస్కరిస్తున్నాను. విశేషాలు : విష్ణు భక్తులు తమకున్న పదవీ, అధికార, జన, ధన బలాలు దేనిపైనా నమ్మకం ఉంచరు. ఓర్వలేని బాధలు చుట్టుముట్టిన సందర్భంలో కూడ హరినామస్మరణ ఒక్కటే తరణోపాయంగా భావిస్తారు. ప్రహ్లాదాది భక్తవర్యుల చరిత్రే ఇందుకు ఉదాహరణ. దీనులైన భక్తులను ఆపదల నుండి రక్షించే (దీన+త్రాజైక+నామం=) ఏకైక మార్గం హరినామస్మరణ మాత్రమే! “శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం” ఈ తొమ్మిదీ భక్తి మార్గాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పేర్కొన్న మార్గాలన్నీ నామస్మరణ పూర్వకాలే! మహర్షులు అందుకే భగవన్నామ స్మరణకు ప్రథమ స్థానం కల్పించారు.

(దినదిన+శుభ సంధాయక+అమేయ+నామం=) ప్రతి నిత్యమూ హరినామస్మరణ చేసే భక్తులకు సకల శుభాలనూ కలిగించే అపరిమిత శక్తి కలిగిందీ హరినామం! ప్రతి జీవి జన్మ ఎత్తిన తరువాత క్షణకాలమైనా కర్మనాచరించకుండ ఉండలేదు. ఆచరించిన కర్మకు, అది పాపమైనా పుణ్యమైనా, దానికి తగిన ఫలితం తప్పక జీవి అనుభవించవలసిందే! తెలిసి కాని, తెలియక కాని చేసిన పాపకర్మల నుండి విముక్తి పొందాలంటే హరినామస్మరణ తప్ప మరొక్క మార్గం లేదు! (ధ్వస్త+అఘ+అమోఘ+నామం=) హరినామస్మరణ చేసే భక్తుల పాపాలను నశింపజేయగల గొప్ప నామం హరినామం!

దుష్కర్మల్ని, మహాపాపాల్ని ఆచరించిన వారూ, శాపగ్రస్తులూ రాక్షసులు మొదలైన దుష్టజన్మల్ని ఎత్తుతూ ఉంటారు. మళ్ళీ వారు (మునిజన+దమన+నోమ+నిర్భిన్న నామం=) ఋషులు, మునులు, సాధువులు మొదలైన వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అటువంటి దుష్టుల సమూహాలను నశింపజేయగల శక్తి కలది హరినామం!

ఏనుగు శారీరక బలానికే కాకుండా మదానికి కూడ ప్రతీక, గజేంద్రమోక్ష ఉపాఖ్యానం దుర్మదాంధులకు ఎటువంటి స్థితి కలుగుతుందో చక్కగా వివరిస్తుంది. గజేంద్రుడికి ఆ జన్మ రావటానికి కారణం దాని మదోన్మత్త ప్రవర్తనా – తత్ఫలితంగా మునిశాపం కలగటమే కదా! (కరివర+వరద+అనంత+సుస్వాంతనామం =) మొసలి చేత పట్టుకోబడ్డ గజేంద్రుడు ఎంతో కాలం తన బలాన్ని మాత్రమే నమ్ముకొని పోరాడాడు. చివరికి కృశించి, నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. అప్పుడు భగవంతుణ్ణి శరణుపొందటం తప్ప మరో మార్గం లేదని అతను గ్రహించాడు. హరిని మొరపెట్టుకున్నాడు. అప్పుడు (కరివర +వరద +అనంత+సుస్వాంత + నామం =) మొసలిని తన చక్రంతో ఖండించి, గజేంద్రుణ్ణి రక్షించి, తన ‘వరద’, ‘అనంత’ నామాల నామౌచిత్యాన్ని మరొక్కసారి నిరూపించుకుని, గజరాజుకు మోక్షాన్ని కలిగించి, అతని మనస్సుకు ఊరట కలిగించిన నామం హరినామమే కదా!

శ్రీ యాదాద్రిపై వెలసి, తన పటుతర భుజబలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని తన మృదుమధుర పద సుమాలచే అర్చించి, స్వామి నామం యొక్క అనంత బలాన్ని స్మరిస్తూ నమస్కరిస్తున్నాడు కవి.

April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పలవరింత…

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ April 10, 2022
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్

ప్రతిమలుపులో

దుఃఖాలను ఒంపుకున్న మనసు….

జీవితం సరళ రేఖయని ఎలా చెప్పను!

భ్రమలతో నిండుకున్న బతుకు

ముఖంపై ఆనందపు తెరలను ఎలా కప్పుకోను!

నిర్దయతో నిండుకున్న సమాజం

గాయాల సమూహాలను ఎలా విప్పుకోను!

ఎండిన గులాబీ రేకులతో ఈ తోట

వసంతాలనెలా పరిచయం చేయను!

శిథిలమైన పాత గోడలాంటి దేహం కప్పుకున్న శిశిరపు నీడలకు

చంద్రుడి వెన్నెల తప్ప ఇంకేమి చూపించగలను

April 10, 2022 1 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బహుముఖ ప్రజ్ఞాశాలి సర్ సి.ఆర్ రెడ్డి

by Cheedella Seetha Lakshmi April 10, 2022
written by Cheedella Seetha Lakshmi

సర్ సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన  కవి,విమర్శకుడు, రాజకీయవేత్త, వక్త, హేతువాది, ఆదర్శవంతుడు. మైసూరు మహారాజా కళాశాల ఆచార్యులుగా,ప్రిన్సిపాల్ గా,తర్వాత సంస్థాన విద్యాశాఖాధికారిగా,ఆంధ్ర విశ్వకళా పరిషత్ అంటే నేటి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక ఉపకులపతిగా(వి.సి) తన బాధ్యతను నిర్వహించడమే కాకుండా రాజకీయాలలో కూడా పాల్గొని ఎం. ఎల్.సి.గా ఎన్నికై ప్రముఖ రాజకేయవేత్తలతో కూడా సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు.

    అన్ని రంగాలలో తన ప్రతిభను చాటుకున్న  ఆచార్య సి.ఆర్.రెడ్డి గారు డిసెంబర్ 10 వ తేదీ 1880 సంవత్సరంలో  చిత్తూరు జిల్లా కట్టమంచిలో సుబ్రహ్మణ్య రెడ్డి,నారాయణమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు.ఐదో ఏటనే వీధిబడిలో విద్యను ప్రారంభించి చిన్నవయసులోనే భారతం,అమరకోశం,రామాయణాన్ని చదివాడు.ప్రతి పరీక్షలో ఉన్నతశ్రేణిలో పాసయ్యాడు.మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఉన్నతవిద్యను పూర్తిచేశాడు.1902 లో బి.ఏ.పరీక్ష లో చరిత్ర,తత్వ శాస్త్రంలో అత్యధిక మార్కులతో బంగారు పతకాలను సాధించాడు.

1899 సంవత్సరంలో నవ్య కావ్యరచన పోటీలో తన 19వ ఏటనే “ముసలమ్మ మరణం” లఘుకావ్యానికి బహుమతి లభించింది. డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించిన కారణంగా భారతప్రభుత్వపు విద్యార్థి వేతనంతో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి   అనుబంధంగా ఉన్న సెయింట్ జాన్స్ కళాశాలలో ప్రవేశం పొంది తెలివితేటలతో సమర్థతను చాటుకుని అనేక పురస్కారాలు అందుకున్నాడు. 1903 సంవత్సరంలో ఇతని ప్రతిభకు, సామర్ధ్యానికి గుర్తింపుగా “రైట్ బహుమతి” లభించింది. ఆంగ్లేయుల మన్ననలు పొందాడు.1905 లో కేంబ్రిడ్జి లిటరరీ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై తన ఉపన్యాసాలతో అందరి మనసులు చూరగొన్నాడు.1906 సంవత్సరంలో ఎమ్.ఏ.పరీక్షలో ప్రథమశ్రేణిలో ప్యాసయ్యాడు.

ఇతని ప్రతిభను గుర్తించి బరోడా సంస్థానాధీశుడు శాయాజీ రావు గైక్వాడ్ తన సంస్థానంలో ఉద్యోగం ఇవ్వదలచి, దానికొరకు వివిధ విశ్వవిద్యాలయాలు సందర్శిచడానికి అమెరికాకు పంపించాడు.పర్యటన పూర్తయ్యాక 1908 సంవత్సరంలో స్వదేశానికి వచ్చి బరోడా కళాశాలలో ఆచార్యునిగా,ఉపాధ్యక్షునిగా ఉద్యోగం చేశాడు కట్టమంచి. తర్వాత మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్యునిగా,ప్రిన్సిపాల్ గా, విశ్వవిద్యాలయ రూపకర్తగా,విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక్కడ పనిచేసిన 12 సంవత్సరాలలో హరిజనులకు పాఠశాలలో ప్రవేశం కల్పించడానికి  చాలా కృషి చేశాడు.విద్యాశాఖాధికారిగా ఉండి “ప్రతి ఊరికి ఒక పాఠశాల” అనే ఉద్యమం ప్రారంభించాడు.1921లో ఆకస్మాత్తుగా పదవికి రాజీనామా చేసి రాజకీయాలలో పాలుపంచుకున్నాడు.

1922 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుండి అత్యధిక మెజార్టీతో శాసనసభకు ఎన్నికైనాడు.కొంతకాలం చిత్తూరు జిల్లా బోర్డ్ చైర్మన్ గా సేవ చేశాడు. తర్వాత ఆంధ్రవిశ్వకళాపరిషత్ మొట్టమొదటి కులపతిగా,తిరిగి అదే విశ్వవిద్యాలయానికి రెండవసారి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టాడు. ఇలా సి.ఆర్.రెడ్డి అనేక రంగాల్లో సేవలు చేసి తన ప్రతిభను చాటుకున్న మేధావి.

 సర్ సి.ఆర్.రెడ్డి వేదం వెంకట రాయశాస్త్రి గారి శిష్యుడు.విశ్వకళా పరిషత్ అధ్యక్షునిగా వున్నప్పుడు గురుదక్షిణగా వేదం వారికి  “కళాప్రపూర్ణ” బిరుదును ఇవ్వమని యూనివర్సిటీ వారికి సూచించాడు.సి.ఆర్.రెడ్డి రాసిన గొప్ప విమర్శ గ్రంథం “కవిత్వ తత్త్వ విచారము”.

    కట్టమంచి లేఖలు రాయడంలో నేర్పరి.అయితే ఈయన లేఖలు ఎన్నో ఉన్నప్పటికీ ముద్రితమైనవి తక్కువే అని చెప్పాలి. సాహిత్య మిత్రులకు,రాజకీయవేత్తలకు,సన్నిహితులకు ఎన్నో లేఖలు రాశారు కానీ లభ్యమైనవాటిలో,అందులో ముద్రితమైన వాటిలో ఎక్కువ లేఖలు రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మకు రాసినవే అవి కూడా ఆంగ్లభాషలో ఉన్నాయి.

  ఈ లేఖల్లో ఆరోగ్యవిషయాలు,కుటుంబ విషయాలు, సి. ఆర్.రెడ్డి ఆలోచనలు మొదలగునవెన్నో  చోటుచేసుకున్నాయి.ఒక  విషయం గురించి ఆచూకీ తెలుసుకున్నప్పుడు పరిపూర్ణ అవగాహనతో సూచనలు సలహాలు  ఇవ్వడం రామలింగారెడ్డి  గారి లేఖల్లో కనిపించే ప్రత్యేకలక్షణం.ఆయన వేమనకు సంబంధించి  అనేక ఉషయాలను  సూచిస్తూ  రాళ్లపల్లికి లేఖలు రాశారు.

సి.ఆర్.రెడ్డి రాళ్లపల్లికి రాసిన లేఖలో  ఆంధ్ర విశ్వకళాపరిషత్  వారు ఏర్పాటు చేసిన  వేమన ప్రత్యేకోపన్యాసాల గురించి ఎందుకు అప్లై చేయలేదని ప్రశ్నించాడు.  రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ చేత ఉపన్యాసాలు ఇప్పించాలని ఆయన కోరికగా కనిపిస్తుంది. అందువల్లనే లేఖ రాసి   ప్రత్యేకంగా ఉపన్యాసాల కోసం ఎందుకు అప్లై చేసుకోలేదని సూటిగా ప్రశ్నించాడు. ఇదే  వి.వి.శర్మ దగ్గర వేమన  గురించిన  సమాచారం చాలా  ఉన్నదని  ఎన్నికైన ఉపన్యాసకునికి  ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు కూడా శర్మ  అంగీకరించాడని తెలిపాడు.

సి.ఆర్.రెడ్డి  రాళ్లపల్లికి ఒక  సుదీర్ఘమైన రహస్యలేఖను రాశాడు. ఇది చాలా విలువైనది.దీనిలో వేమనకు సంబంధించిన సమాచార సేకరణ ఉంది.

వి.వి.శర్మ. దగ్గర ఉన్న వేమనకు సంబంధించిన విషయాలను   తెప్పించుకోమని సలహా ఇచ్చాడు.

  బ్రౌన్ ముద్రణలో వేమనకు  సంబంధించిన  వంగూరి సుబ్బారావు రచనలు,క్రిస్టియన్ కాలేజీ  మ్యాగజైన్ లో వచ్చిన వ్యాసం చూడవలసిందని సూచిస్తూ  హాస్యగాడు అన్న పదం వేమనకు వాడవద్దని సూచించాడు.

పరిహాసరసం గురించి అధ్యయనం చేయాలని,సాహిత్యంలో పరిహాసరసం ఆవశ్యకత,అవసరం ఎంత వరకున్నదో లోతుగా పరిశీలించాలని  రాస్తూ, కాళ్లకూరి గోపాలరావు రచించిన ఆపూర్వ సంఘ సంస్కార గ్రంథపీఠికలో ఈ విషయాన్ని  తాను రాసినట్లు సి.ఆర్.రెడ్డి లేఖలో తెలిపారు.

    “కవిత్వ తత్వ విచారం” లో సి.ఆర్.రెడ్డి  పరిహాసరసం అంటే ఏమిటో రాస్తూ  వేమన పద్యాలలో పరిహాసరసం ఉన్నదని రాస్తూనే  “మరుగు  మరియాదలు  లేని మోటు విధముగా దిట్టడు. నొప్పిచెందువారు సైతం ఇతరులతో

కలిసి నవ్వునట్లు చేయ సమర్థుడు” అని వేమనను కొనియాడాడు.

     వావిళ్ళ వారు ముద్రించిన గ్రంథంలో  రాళ్లపల్లి రాసిన పీఠికను విమర్శిస్తూ

 సి.ఆర్.రెడ్డి తన లేఖల్లో ఇలా అంటాడు”  నీవు రాసిన పీఠిక  బాగున్నప్పటికీ కొద్దిపాటి న్యాయమే

జరిగిందనీ, ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని,

వేమన రచనారహస్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉన్నదని  విమర్శనాత్మకంగా  సూచిస్తూనే

సి.ఆర్.రెడ్డి  వేమనపై తనకుగల

అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఇలా చెప్పాడు. “తెలుగు రచయితలలో

వేమన చాలా గొప్ప పండితుడని

వేమన ఒకరిని అనుకరించడు, వేమనను ఇంకొకరు అనుకరించలేరని,వేమన పద్యాలు సహజధోరణిలో  సుకుమారమైన శైలి కలిగి  సహజత్వాన్ని   కలిగి ఉన్నాయని”  రాశాడు.   

     ఈవిధంగా ఈ లేఖలో వేమన గురించి సమగ్ర సమాచారం అందిస్తూనే  తనకు అనారోగ్యంగా  ఉన్నదని,బెంగళూరుకు ప్రయాణమవుతున్నట్లు తెలుపుతూ,  తన ప్రయాణ విషయాన్ని గోప్యంగా ఉంచమని

రాశాడు.ఈ లేఖలో వేమన ఉపన్యాసాలకు రాళ్లపల్లి ఎన్నికైనట్లు కూడా తెలిపాడు. వేమన పద్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో వేమనపై రాసే గ్రంథం కూడా  అంత గొప్పగా ఉండాలని  వేమన రచించాడా   అన్న అనుభూతి పొందేటట్లు రాస్తావని తన ఆశాభావం వ్యక్తం చేశాడు. రాళ్లపల్లికి రాసిన ఇంకో లేఖలో వేమన గురించి రాస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని

హితవు  పలికాడు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పువాటిని పుక్కిటి పురాణాలను గుడ్డిగా నమ్మక  నిజాన్ని పరిశోధించాలి అంటాడు.  ‘కటారుపల్లి’ లో  వేమన సమాధి ఎదుట లభించే  కథలను నమ్మక, మీకు సమ్మతమని తోస్తే  “వేమన గాథలు” పేర అనుబంధంలో చేర్చాలని సూచించాడు.

          విగ్రహారాధనను,కర్మకాండలను,ఆచారాలను నిరసించిన వేమన సమాధి ఎదుటనే  దున్నపోతులను బలి ఇవ్వడమనేది  వేమన పట్ల  ఇంతకన్నా ఘోర అపచారమేముంటుందని  రెడ్డిగారు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.హిందూ సమాజం దిగజారి కుళ్ళిన అంగంలా తయారైందన్న  ఏహ్య భావాన్ని వ్యక్తం చేశాడు.

    రాళ్లపల్లికి రాసిన ఇంకో లేఖలో వేమన గురించి తనకు తెలిసిన  ఇంకాస్త సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. వంగూరి సుబ్బారావు రాసిన గ్రంథం అత్యంత విలువైనదని సూచించాడు.పోతన వేమనలను పోలుస్తూ లేఖలో ఇలా వివరించాడు. “పోతన బోధకుడుగా నీతిని మాత్రమే బోధించాడని,వేమన అలాకాక సంఘాన్ని,సమాజపరిస్థితులను,

మతాచారాలను, జీవితాలను ఆకళింపు చేసుకుని  తన నీతి సూత్రాలను తన రచనలో

నిబంధించి  పోతన కంటే ఒక మెట్టెక్కి అసలుసిసలైన నీతిబోధకుడుగా  అవతరించాడని రాశాడు. దీన్నిబట్టి

సి.ఆర్.రెడ్డి గారికి వేమన పట్ల ఉన్న గౌరవం,అనురాగం వ్యక్తమౌతుంది.

     తంజావూరు  లైబ్రరీలో  ఉన్న వేమన చిత్రపటమే వంగూరి సుబ్బారావు  పుస్తకంలో ఉంది కాబట్టి  లైబ్రరీ కార్యదర్శిని  సంప్రదించాల్సిన అవసరం లేదని రాశాడు.

     ఈ మధ్య కాలంలో జపాన్ భౌతిక శాస్త్రవేత్త పాదరసంలోని  ఒక అణువును  బంగారం అణువుగా మార్చాడు. శాస్త్రీయాధారమన్నది కాదు సమస్య, నిజంగా   దొంగసన్యాసులు “హేమ తారక విద్య”   చేయగలుగుతారా లేదా  అన్నది సమస్య అని రాశాడు. వేమన రసవాదంపై  నీవే నిర్ణయాలు తీసుకోమని చెప్పాడు.

వేమన తెలుగు ప్రజలకే పరిమితం కాలేదన్న విషయం తమిళ  కన్నడ ప్రాంత ప్రజలు  వేమన  చెప్పిన  నానుడులు,

సామెతలను వాడుతుండడం బట్టి తెలుస్తుందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యయనం కొనసాగించాలని సూచించాడు.” వేమన తంజావూరులో చాలా ప్రఖ్యాతి గడించడానికి గల కారణం ” హేమతారక విద్య” పట్ల ప్రజలలో ఉన్న విశ్వాసమేనంటాడు.అయితే వేమన తనకీ విద్య వచ్చునని ఎక్కడా తెల్పనప్పటికీ ప్రజలే వేమనలాంటి యోగులకు కూడా ఈ విద్యనంటగట్టారంటాడు.

    సర్ కట్టమంచి ఇంకా ఇలా వివరించాడు.” భూమిపై సంతోషంగా జీవించాలంటే డబ్బు ఎంతో అవసరం” వేమన రచనలో కూడా పేర్కొన్నాడని వ్రాశాడు.

వేమన సమకాలీన సాంఘిక పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకోవాలని సలహానిస్తూ ఆనాటి సమాజంలో స్త్రీని ఏవిధంగా చూసేవారో దృష్టిలో పెట్టుకుని స్త్రీ విషయంలో వేమన తీర్పును,వేమన దృష్టిని అధ్యయనం చేయాలని సూచనలిచ్చాడు.నిజంగా ఆనాడు సంఘంలో స్త్రీని చిన్నచూపు చూసేవారని, గ్రంథాల్లో కూడా స్త్రీ పట్ల చిన్నచూపున్నట్లే కనిపిస్తుందని,చారిత్రక దృష్టి కూడా అవసరమని రాశాడు. ఈ లేఖలో  వేమన గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వేమన సమకాలీన సాంఘిక పరిస్థితులు,చారిత్రకనేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సమగ్ర పరిశీలన చేసి చక్కని గ్రంథం వ్రాయాలన్న ఆకాంక్ష కలవాడుగా కనిపిస్తాడు.రాళ్ళపల్లికి రాసిన వేరే లేఖలో వేమనపై రాసిన ఉపన్యాస గ్రంథం పూర్తికావస్తున్నట్లుగా భావిస్తున్నానని రాస్తూ ఆ వ్యాసాలను సాధ్యమైనంత త్వరలో కాకినాడను వేదికగా చేసుకొని ఉపన్యాసాలిప్పించాలన్న కోరికను వ్యక్తం చేశాడు.

    ఇంకో లేఖలో” ఉపన్యాస పరంపర గ్రంథం వెలువడడంలో మీరు కృతకృత్యులయ్యారని అభినందనలు తెలుపుతూనే ఇది నాకంత ఆశ్చర్యాన్ని కలిగించలేదంటాడు.దీన్ని బట్టి ఎప్పటికప్పుడు రాళ్ళపల్లి చేసే శ్రమను ,పరిస్థితిని తెలుసుకోవడం వలన, రాళ్ళపల్లి ఈ విషయంలో పూర్తిగా కృతకృత్యుడౌతాడన్న విశ్వాసం ఉండడం వల్ల గ్రంథరూపంలోకి వచ్చాక రామలింగారెడ్డికి పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు.రాళ్ళపల్లి రాసిన “మానిస్క్రిప్టు” లను విశ్వవిద్యాలయానికి బహూకరించమని తన ఉత్తరంలో కట్టమంచి కోరుతాడు.

     రాళ్ళపల్లికి రాసిన ఇంకో లేఖలో రాళ్ళపల్లి ” శాలివాహన సప్తశతి” అనువాదాన్ని మెచ్చుకుంటూ భావయుక్తంగా ఉన్నదని,సరళంగా వున్నదని,సుందరంగా వున్నదని,ఆకర్షణీయంగా వున్నదని ప్రస్తుతిస్తూ దాని మూలగ్రంథ రచయిత కాలం,ఇతర వివరాలు తనకు తెలియపరిస్తే పీఠికను వ్రాయడానికి ఇష్టపడుతున్నట్లుగా వ్రాశాడు.అయితే కేవలం 400 పద్యాలే వ్రాసి సంతృప్తిపడక పూర్తి గ్రంథాన్ని )అనువాదం చేయమని కోరాడు.” ఇది సమీక్షాత్మక లేఖ అనవచ్చు.

   ఇంకో లేఖలో తన ” కవిత్వ తత్త్వ విచారము” రెండో ముద్రణకు నోచుకుంటున్నట్లు తనకిది ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపాడు.” శాలివాహన సప్తశతి ” పీఠికకోసం రాళ్ళపల్లి సహాయాన్ని అర్థించాడు.

     సారస్వత లేఖలతో పాటు కుటుంబ విషయాలకు సంబంధించిన లేఖలున్నాయి.తన కూతురు తన డ్రైవరు భార్యను చూడాలని కుతూహల పడుతున్నట్లుగా తెలపడం వలన సామాన్యులను సైతం గౌరవించే ఉన్నత వ్యక్తిత్వం ,రామలింగారెడ్డి మనస్తత్వం ద్యోతకమౌతుందని తెలుస్తుంది.

   “స్వయంవరం” గురించి ప్రత్యేకంగా లేఖలో వివరించాడు.” స్వయంవరం” వల్ల యుద్ధాలు పరిణమిస్తాయని ,ఈ స్వయంవరంలో రాజులు వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు వధువు తండ్రి కేవలం ప్రేక్షకునిగా మిగిలిపోతాడని ,స్వయంవరానికి అన్ని రకాల వయసు వాళ్ళు ,బ్రహ్మచారులు,బహుభార్యలు కలిగినవారు పాల్గొని ఆ పెళ్లికుమార్తె తమలో ఎవరిని వరిస్తుందోనని ఉవ్విళ్లూరుతుంటారని,తమను వరిస్తుందో లేదో అన్న అనుమానం కూడా వారికి కలదని రాశాడు.

తాను స్వయంవరం సిద్ధాంతాన్ని ప్రాథమికంగా ప్రాచీన “ఇండో ఇరానియన్ మ్యారేజ్ మార్కెట్” పద్ధతి ననుసరించి రూపొందించామని రాశాడు.ఈ మార్కెట్ లో  అందమైన అమ్మాయిలను అమ్మకానికి నిలబెట్టేవారు.దానికి సంబంధించి మన వైదిక సాహిత్యంలో కూడా ఆధారాలు కనిపిస్తున్నాయని రాశాడు.

  ” స్వయంవరం” గురించి గ్రంథరూపంలో వెలువడితే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ విధంగా సామాజిక లేఖలు కూడా రాశాడు.

    కట్టమంచి రామలింగారెడ్డి కాలంలో కన్యాశుల్కం ఉండేది.ఆడపిల్లలను వేదించడం,స్త్రీలపట్ల అగౌరవంగా వుండటమనేది మనకు పూర్వంనుండి వస్తున్న ఆచారమే.ఈ కాలంలో కూడా అందమైన ఆడపిల్ల వెళుతుంటే ఈలలు వేసి గోలలు చేసి ఏడిపించడం చూస్తున్నాం.అందం అనేది కూడా స్త్రీ జీవితానికి ఆటంకమేనని తెలుస్తుంది.

   ఈ విధంగా కట్టమంచి లేఖలను పరిశీలించినట్లయితే వేమనపై సమగ్ర అవగాహన,సరియైన ఆధారాలు కనుగొని సమగ్రంగా వేమనపై గ్రంథం వెలువరింప చేయాలన్న ఆయన ఆసక్తి,మనస్తత్వం,సామాజిక అవగాహన,మొదలైన విషయాలు తెలుస్తాయి.

    వేమన అంటే తన కిష్టం కావడం వల్ల వేమనపై గ్రంథం తెలిసినంతవరకు విషయ సేకరణలో సహాయం చేసి ప్రోత్సహించే వాడుగా కనిపిస్తాడు.

     కట్టమంచి రామలింగారెడ్డి మద్రాసు గవర్నరుకు లేఖ రాస్తూ,ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు.అంతేకాక ఈ ఉత్తరం హృదయవేదనతోను,బాధతోను,విచారంతోను రాస్తున్నట్లు తెలియజేశాడు.

       స్వాతంత్య్రం,ప్రజానీకం యొక్కఆర్థికాభివృద్ధి ,బ్రిటిష్ ప్రభుత్వంలో శాశ్వతంగా లభించవన్న విశ్వాసంతోను,స్వజాతీయులు ఆబాలగోపాలం చేస్తున్న త్యాగాలు సి ఆర్.రెడ్డికి మనస్తాపం కలిగించి,ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుటకు ఇష్టం లేక రాజకీయాల్లో చేరాలన్న ఆసక్తితో రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపాడు.

     ఈ విధంగా రామలింగారెడ్డి లేఖల ద్వారా ఆయన మనస్తత్వం ,ఆలోచనా పద్ధతి తెలుసుకునే అవకాశం ఉంది సాహితీవేత్తలలో రామలింగారెడ్డి లేఖలకు కూడా ప్రముఖ స్థానముందని గమనించవచ్చు.

       బహుముఖ ప్రజ్ఞాశాలి ,ఆజన్మ బ్రహ్మచారి ,సద్గుణవంతుడు, సాహితీవేత్త,విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు రాజకీయ దురంధరుడైన  సర్ సి.ఆర్ రెడ్డి 1951వ సంవత్సరం ఫిబ్రవరి 24 వతేదీ తన 70వ ఏట మద్రాసులో అనారోగ్యంతో తనువు చాలించాడు.

April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వ్యంగ్య చిత్రాలు (కార్టూన్స్)

by Suvarna Bhargavi April 10, 2022
written by Suvarna Bhargavi
April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us