మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

స్ర్తీత్త్వ వేదనలో ‘జ్వలిత కౌసల్య’

by Dr. Triveni June 14, 2022
written by Dr. Triveni

‘ఆధునిక రచనల్లో ప్రాచీన సాహిత్యంలో కన్నా స్త్రీ ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ విముక్తిని కోరే మహిళా చైతన్య భావాల వ్యాప్తి, పరిధి ఇటీవలి దశాబ్దాల్లో ఇంకా విస్తరించింది. స్త్రీ వాదోద్యమ ప్రభావం పురుషుల మీద, పురుషుల రచనల మీద పడడం ఆహ్వానించదగింది. స్త్రీవాదులు కోరే సాంఘిక న్యాయాన్ని ఇప్పుడిప్పుడే పురుషులు అర్థం చేసుకుంటున్నారు. అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో జరుగవలసిన అభివృద్ధి చాలా ఉన్నప్పటికీ, కనీసం ప్రథమ దశ ప్రారంభమయింది. భూమయ్య చిత్రించిన ‘జ్వలితకౌసల్య’ ను ఈ దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి. కావ్యనామమే కావ్య వస్తు స్ఫోరకంగా ఉంది. అయితే భూమయ్య కావ్యం స్త్రీవాద కావ్యం అని నేను ముద్ర వెయ్యటం లేదు. ఈ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి స్త్రీవాద పరిచయం ఉపయోగిస్తుందనే నా సూచన’ (పుట.2)

‘జ్వలిత కౌసల్య’ మొదటి ముద్రణ సందర్భంలో ‘లఘుటిప్పణి’ రచిస్తూ ఆచార్య చేకూరి రామారావు ప్రస్తావించిన అంశం ఇది. ఆచార్య అనుమాండ్ల భూమయ్య 1999 నాటికే ఈ పుస్తకాన్ని రచించి ప్రచురించారు. స్త్రీవాద భావజాలం తెలుగు సాహిత్యంలో  ప్రవేశించి విస్తృత ప్రయోజనాలు చేకూరుతున్న కాలమది. స్త్రీవాద పరివ్యాప్తిలోను, ఉద్యమ రూపంలో కార్యరూపం దాల్చడంలోను సాహిత్యం హితోధిక సాయం చేస్తున్న సమయమది. ఆ పరిమిత కాలంలోనే స్త్రీవాదం ప్రపంచ ప్రమాణాల మీద నిలబడుతూ వినూత్న భావజాలాన్ని ప్రకటించింది. స్త్రీలు వెలువరించిన సాహిత్యమే గాక, ఆచార్య చేకూరి రామారావు చెప్పినట్లు పురుషుల సాహిత్య మనోగతాలపై ప్రభావాన్ని చూపింది. సంప్రదాయక పౌరాణిక పాత్రల్లో గల స్త్రీల అభినివేశాన్ని  సాహిత్యబద్ధం చేస్తూ నూతన ఒరవడిని సృష్టించారు. ఆధునిక సాహిత్య ధోరణులకు అనుగుణంగా సావిత్రి, పురూరవ, సీత, జాబాలి, వరూధిని, ఊర్మిళ, కౌసల్య, కైకేయి, కచదేవయాని, గాంధారి, పూర్ణమ్మ, కన్యక పాత్రల భావైక స్ఫూర్తిని చిత్రించారు. స్త్రీ పౌరుష కాంక్షను, శక్తి సామర్థాలను, మనోఅభిష్టాన్ని, చింతనాత్మక వ్యధను వెలువరించారు. తద్వారా ఆధునిక సమాజానికి ఒక ఉపదేశాత్మక సందేశం అందించారు.

‘జ్వలిత కౌసల్య’ కావ్యాన్ని స్త్రీవాద కోణం నుండి అవగాహన చేసుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశం. సహృదయులు అవలోకిస్తారని ఆశిస్తున్నాను. ఆచార్య అనుమాండ్ల భూమయ్య దృక్పథం స్త్రీవాదం గాకపోయినాÑ వస్తు నిర్దేశం దృష్ట్యా ఈ అంశం నిర్ణయాత్మమైందని భావిస్తున్నాను. పూర్తి కథాంశం కౌసల్య గుండెలలో గూడు కట్టుకున్న అగ్నిజ్వాలను విచ్ఛేదం చేయడం. కౌసల్య మనోగతాన్ని ఆవిష్కరించడం. తద్వారా దీర్ఘకాలంగా ఉన్న మనోవ్యధ నుండి ఉపశమనం కోరుకోవడం. ఈ నేపథ్యంలోనే తన సంసారిక జీవితంలో తీరని కోరికలు, బహుభార్యత్వం వల్ల భర్త నుండి పొందిన ప్రేమానురాగాలు, తోటి సవతులతో పడిన అవమానాలు ఒకటేమి సగటు మహిళ పడే ఆవేదన కౌసల్యలో ఆవిష్కృతమవుతుంది. కౌసల్య మనోవేదన స్త్రీవాద లక్షణాలకు అన్వయింపదగినవే.

మరొక అంశం ‘జ్వలిత కౌసల్య’ ఒక విధంగా చేతనాత్మక కావ్యం. అంతర్గత మధనం, భావాల సంఘర్షణ, అనుభవాల సంచయం అన్ని కలిపి మనో విశ్లేషణ సూత్రాల్లోకి కౌసల్య ఇమిడిపోతుంది. మానసిక వ్యధను ప్రత్యక్షంగా ఈ కావ్యంలో చిత్రించారు కవి. ఎంతో కాలంగా మనస్సులో దాచుకున్న ఆవేశాన్ని, క్రోధాన్ని బయట పెట్టడం మనోవైజ్ఞానిక అంశాలకు అనువర్తించవచ్చు. అచేతనంలో దాగి ఉన్న మానసిక సంవేదనను చేతనత్వంలోకి తీసుకొని రావడం ఇందులోని ప్రధానాంశం. దు:ఖప్రోదిని చేధించడానికి కవి ఈ కావ్యాన్ని ఆలంబనగా చేసుకున్నారు. తనకు కలిగిన అన్యాయాన్ని మరొకరి విషయంలో కలుగకుండా ఉండడంలో కౌసల్య చేసిన ఉపదేశం సత్ప్రవర్తన దిశగా నడుస్తుంది. కథాగమనాన్ని, పాత్రల ప్రవర్తనా శైలిని కవి అత్యంత నేర్పుతో ప్రదర్శించారు.

ఉపదేశాత్మకంగా కావ్యాన్ని వెలువరిచడంలో కవి ప్రధాన శ్రద్ధ వహించారు. ఆధునిక సాహిత్యంలో ఇటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. స్వతంత్ర కథలను తీసుకొని పాత్రలపరంగా ధర్మప్రభోదం విస్తృతం చేశారు రచయితలు. అంతేగాక సంప్రదాయిక పాత కథల ప్రయోగం నేటి సమాజాన్ని సంస్కరించాయి. సందేశాత్మకమైన గాథలు వ్యవస్థ పునరుద్ధరణకు కృషిచేశాయి. సామాజిక ప్రయోజనానికి ప్రాచీన సాహిత్యంలోని గుణాత్మకమైన వస్తు నేపథ్యం కవులకు తోడ్పాటునందించాయి.

‘జ్వలిత కౌసల్య’ కావ్య స్వభావంలో స్త్రీవాద భావవ్యక్తీరణ మనోవైజ్ఞానికి విశ్లేషణ, ఉపదేశాత్మకం వంటి విభిన్నమైన మౌలికాంశాలను గుర్తించవచ్చు. కవి కావ్య నిర్మాణంలో ప్రకృష్టమైన వస్తువును సరళతరం చేశారు. పద్య రచనా సౌగంధంలో మేటి ఆచార్య అనుమాండ్ల భూమయ్య రామాయణ గాథలోని కౌసల్య మనోవేదనను వాల్మీకి రచనాపరంగా నినదించారు కవి. వాల్మీకి రామాయణంలోని ఆయోధ్య కాండలో 20వ సర్గలో కౌసల్య శ్రీరాముని ఎదుట తన వేదనను వ్యక్తపరిచిన ఘట్టం ఉంది. మొత్తం ఆరు సర్గలలో వ్యక్తపరిచిన ఆవేదన కవి కావ్యానికి ప్రధానాధారంగా నిలిచింది. ఆ ప్రేరణ వల్లనే ఈ కావ్యం రూపొందింది. శ్రీరాముడు ఈ జన్మకు ఏకపత్నీ వ్రతుడిగా ఉంటానని ప్రమాణం చేయడం ఇందులోని ముఖ్యాంశం. కథాంశాన్ని మొత్తం ఎనిమిది ఉప శీర్షికలలో విభజించారు. సంక్లిష్టమైన కథ ఉప శీర్షికలో ఒద్దికగా నిలిపారు భూమయ్య. కైకేయి వరం, జ్వలిత కౌసల్య, అనంత క్రోధం, మాతృ హృదయం, పితృ వాక్యం, పుత్ర వాత్సల్యం, ఏకపత్నీ వ్రతం, మంగళాశాసనం వంటివి ఈ కావ్యానికి ఒక క్రమణికను సూచించాయి. కథా గమనంలో కార్యోన్ముఖతను సాధించడం కవి కవితా ప్రక్రియలో ప్రదర్శించిన ప్రత్యేక నైపుణ్యం. 109 పద్యాలు కలిగిన ఈ కావ్యం నాలుగు ముద్రణలు సంతరించుకోవడం విశేషం. చేకూరి రామారావు, బేతవోలు రామబ్రహ్మం, పేర్వారం జగన్నాథం వంటి విమర్శకులు ఈ కావ్య ముద్రణలో ముందు మాటలు రాశారు. అబ్బూరి ఛాయాదేవి, మలయవాసిని, వాసా ప్రభావతి, వెంకమాంబ, గంగప్ప వంటి సాహితీవేత్తలు స్త్రీ సంవేదనా రూపంలో ‘జ్వలిత కౌసల్య’ను పరామర్శించారు.

తండ్రి ఆజ్ఞ మేరకు పినతల్లి ఇంటికి వెళ్ళిన శ్రీరాముడికి ఘోర ఉపద్రవం మీద పడుతుంది. పట్టాభిషిక్తం పొందే వేళలో అరణ్యానికి వెళ్ళాలనే కైక అనుజ్ఞను శ్రీరాముడు శిరసావహిస్తాడు. తన తల్లితో నివేదించి అనుమతి పొందడానికి కౌసల్య భవనానికి వచ్చినప్పటి నుండి కథా ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఆచార్య అనుమాండ్ల కౌసల్య మనో చింతనను ప్రత్యక్ష పెట్టడానికి ఆరంభ పద్యాన్ని ప్రయోగించారు. తల్లిదండ్రుల సాపేక్ష కైకేయి వరంలో ఉపేక్ష ప్రత్యక్ష కావ్య కథన ధారకు ఉత్కర్షగా నిలిచింది.

తల్లి కొడుకుల ఆప్యాయతా వాత్సల్యాలను అత్యంత మధురంగా భూమయ్య ప్రవేశపెట్టారు.

స్వాగతింప తన కెదురు వచ్చినట్టి

తల్లి పాదమ్ముల మ్రొక్కె ధర్మమూర్తి

రామచంద్రుండు, కౌసల్య రామునెత్తి

శిరము మూర్కొనె కౌగిట జేర్చి                            (పుట.15)

వర్తమాన కాలంలో తెలుగువారింటి వ్యవహార రూపంలో ఉన్న ఆచార సంప్రదాయాలను ప్రవేశపెట్టారు కవి. కౌసల్య రామచంద్రుల అనుబంధాన్ని చూపించారు. శ్రీరాముడు శిరస్సు వంచి గౌరవ వందనం చేయడం, కౌసల్య శ్రీరాముడిపై పుత్ర వాత్సల్యాన్ని ప్రకటించడం హృదయ మనోహరంగా భూమయ్య రచించారు.

గతంలో తన తండ్రి కైకకు ఇచ్చిన రెండు వరాలను ప్రస్తుతం తీర్చుకుంటున్నట్లు… తల్లితో నివేదిస్తాడు శ్రీరాముడు. ఒకటి భరతుడికి యువరాజ పట్టాభిషేకం, రెండవది పద్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యవాసం చేయడం. ఈ విషయాలు తెలిపి అడవులకు వెళ్ళడానికి తల్లి కౌసల్య అనుమతిని పొందడానికి వచ్చినట్లుగా తెలుపుతాడు. తండ్రి ఆజ్ఞను పాటించడం ఉత్తమ ధర్మంగా ప్రకటిస్తాడు. ఒక్కసారిగా రాముడి మాటలు విన్న కౌసల్య ‘స్వర్గమున నుండి పడిన దేవత వోలె నేల పడిపోయె’ అని కవి వర్ణిస్తాడు. శాపవశాన అప్పుడప్పుడు దేవ లోకం నుండి దేవ కన్యలు, కిన్నెరలు, గంధర్వులు, కింపురుషులు భూలోకం మీద ఉద్భవించడం చూస్తుంటాం. భూమయ్య ఈ ఉపమానం ప్రయోగించడంలో తన జన్మను కోల్పోయిన స్త్రీ ధైన్యస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కౌసల్య దు:ఖ వారధికి ఇది అనుసంధానింపబడిరది.

స్త్రీలు తమకు కలిగిన శోకానికి, విషాదానికి ప్రకృతిని ప్రమేయం చేయడం గమనిస్తుంటాం. కౌసల్య తన కుమారునికి కలిగిన విపత్తుకు చింతిస్తుంది. ‘ఇదేమి దినము కత్తులే కిరణములుగా కరకు గుండె దాల్చి సూర్యుడిదేలా ఉదయమునందె’ అంటూ తన విధికి, వ్యధకు విలపిస్తుంది. ఒక్కో దినం గడియను బట్టి శుభాలు, అశుభాలుగా పరిగణింపబడుతాయి. కాలం మీద, సూర్య చంద్రుల కాలగమనం మీద జనులకు కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు  ఉన్నాయి. ప్రకోపాలు కూడా లేకపోలేదు.

‘పుట్టినింట ఆనాడు నేపొందిన సుఖ

మేమో కాని, ఈ మీ తండ్రి ఇంట నేను

కాలు మోపిన పిదప సుఖము నెరుంగ

నిన్ను గన్నాను బ్రతుకు కన్నీరు తడిచె’

అంటూ కౌసల్య తన జీవిత గాధను వినిపిస్తున్న సందర్భంలో ఒక విషయం స్పష్టమవుతుంది. పుట్టింట్లో తానెంత సుఖం పొందిందో తెలియని తనంలోనే కౌసల్య వివాహం జరిగింది. బాల్యంలోనే దశరథ మహారాజుతో పరిణయం జరగడం కూడా ఆమె దు:ఖానికి ఒక హేతువు. బాల్య వివాహాల మీది దుష్ప్రభావాలు రామాయణ కాలం నుండి భారంగా మారాయని ‘జ్వలిత కౌసల్య’ ద్వారా ప్రత్యక్షంగా తెలుస్తుంది. చివరకు అంతపుర స్త్రీలు అయినా వైవాహిక జీవితంలో దు:ఖ సాగరాన్ని ఈదారనడానికి ఈ దృష్టాంతం తార్కాణంగా నిలుస్తుంది. తాను పుట్టి పెరిగి, ఆడి పాడి, ఆనందంగా గడిపిన రోజులు అనుభవంలో లేని పరిస్థితి ఆమెది. ఇక వివాహం అయిన తర్వాత అత్తవారింటిలో ఏనాడు సుఖం పొందినట్లు ఏ ఆనవాలు వ్యక్తపరచలేకపోవడం ఆమె విధిరాతను తలపోస్తాయి. దీనికి రెండు కారణాలను కవి భూమయ్య ప్రస్ఫుటం చేశాడు. ఒకటి కౌసల్య వివాహానంతరం భర్త నుండి సుఖం పొందలేకపోవడం. దీనికి కారణం దశరథుడి బహుభార్యత్వ ప్రాధాన్యం. కైకేయిపై మోజును పెంచుకోవడం. ఆమెకు దాసుడు కావడం. రెండవది సపత్నుల వ్యవహార ధోరణి. కౌసల్య పట్ట మహిషి అయినా ఆమెకు గౌరవాదరణలు దక్కలేకపోవడం. సపత్నుల పరుష వాక్కులు ఆమె హృదయాన్ని గాయపరచడం. అవమానాల జలధి ఉదృతంగా మారి గుండెలో సుళ్ళు తిరగడం.

న దృష్ట పూర్వం కళ్యాణం సుఖం నా పతి పౌరుషే

అపి ప్రత్యే2పి పశ్యేయ మితి రామాస్థితం మయా                              అయోధ్య : సర్గ : 20 : శ్లో : 38

అత్యంత నిగృహీతాస్మి భర్తుర్నిత్య మతంత్రితా

పరివారేణ కైకేయ్యా సమావాప్యధవా2వరా                                       అయోధ్య : సర్గ : 20 : శ్లో : 42

వాల్మీకి రామాయణంలో శ్లోకాలను అనుమాండ్ల భూమయ్య తన ముందు మాటలో ప్రస్తావించారు. భర్త వల్ల సుఖం లేకపోయిన విషయాన్ని వాల్మీకి రామాయణంలో పై శ్లోకాల్లో తెలుపబడిరది. ఈ కావ్యానికి రామాయణ శ్లోకాల్లో కౌసల్య హృదయ తప్త జ్వాలను కవి ప్రవేశపెట్టారు. ఈ శ్లోకాల ఆధారంగానే కరుణ రసాత్మక గాథగా ఈ కావ్యం రూపాంతరం చెందింది.

* వంధ్యత్వం :

కొడుకు మీద ఉన్న ప్రేమ, వాత్సల్యం కౌసల్య నోట అద్భుతంగా ప్రకటింపజేశారు భూమయ్య. శ్రీరామ చంద్రుడు రాజ్యానికి యువరాజు పట్టాభిషిక్తుడైనప్పుడే తాను సుఖపడే దశ వస్తుందని భావించింది. కౌసల్య తన కడుపు తీపి మేర రామచంద్రుని అల్లారు ముద్దుగా పెంచుతుంది. ఆ సమయంలో నిప్పులాంటి వార్త ఆమె అంతరంగాన్ని కల్లోలం చేసింది. పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో వనవాసం చేయటం అనే తండ్రి ఆజ్ఞను ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆ విషయం ముందుగా తెలిసి ఉంటే కొడుకుగా శ్రీరాముడిని కనకుండా ఉండేదానిని అని ఆమె బాధపడుతుంది. కన్నతీపిని కూడా వద్దనుకునే విషమ పరిస్థితి కౌసల్యకు ఎదురవడమనేది మాతృ హృదయం కలవరపడే విషయం.

నాడు నిన్నునే గనకున్న నష్టమేమి

కలిగెడిది? వంధ్యయను పేరొకటి యే తప్ప

సంతులేదన్న ఏకైక చింత తప్ప

వంధ్యకు మరొక్క చింత రవ్వంత లేదు                               (పుట.20)

ఏ ఇల్లాలు అయినా గొడ్రాలుగా ఉండడం అనే విషయాన్ని కలలోనైనా తలంచదు. కాని కౌసల్య తన నోటి ద్వారా ఆ పద్యాన్ని ఉచ్ఛరించడం అత్యంత వేదనాభరితమైంది. కొడుకును కని అడవుల పాలు చేయడం కంటే గొడ్రాలుగా మిగిలిపోవటమే ఉత్తమంగా భావించిన కౌసల్య కడుపుకోతను ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య పాత్రలో స్త్రీ దు:ఖ హేతువుకు పరాకాష్టగా వంధ్యత్వమనే శబ్దాన్ని ప్రయోగించడం గమనించవచ్చు.

* కడుపుకోత :

కౌసల్య పరి పరివిధాలుగా శ్రీరాముడి మీద ఉన్న తల్లి ప్రేమను వ్యక్తపరిచిన తీరు కవి తన నేర్పుతో ప్రదర్శించాడు. తన దు:ఖానికి అంతం లేదని వాపోతూ, తనకు ఇంత దు:ఖం అనుభవించే శక్తి లేదని తలపోస్తుంది కౌసల్య. తన మీద దయచూపే ఏ దైవం కనిపించడం లేదని దు:ఖిస్తుంది. ఏ దిక్కు చూసినా శూన్యమే కనిపిస్తుందని తన దురదృష్టానికి చింతిస్తుంది.

కౌసల్య బాల్యంలో తన రామచంద్రుడు ఆడిన ఆటలు, అల్లారు ముద్దుగా పెరిగిన జ్ఞాపకాలు, చిలిపి చేష్టలను కౌసల్య గుర్తుకు తెచ్చుకోవడం కథా సందర్భాన్ని బట్టి ప్రధానమైనది. వెన్నను కొంత తిని అంతకన్నా మన్నును రుచిగా తిన గోరే రాముడిని చూసి కౌసల్య ఆవేదన చెందేదట. తల్లి చేత తిట్లు తింటూ దెబ్బ తగలకుండా తిరిగేవాడట. ఆటలు ఆడి అలిసిపోయి అమ్మ ఒడిలో చేరి పాలు తాగుతూ, తన కోరిక తీరలేదని ఏడ్చే వాడట. ‘అమ్మ పిలిచె రారా! అన్నము తినిపోవవేగ’ అని కౌసల్య ఎంత పిలిచినా ఆట పాటలలో మునిగి పోయేవాడట. ఇటువంటి శ్రీరాముడి అల్లారు ముద్దు చేష్టలను మరకముందే అడవుల పాలు కావడం కౌసల్యకు తీరని దు:ఖాన్ని మిగిలించింది.

` జాలి చూప / గలుగు దైవ మొక్కరు గాని కానరారు / శూన్య గగనమే ఏ వైపు చూడనైన (పుట.21)

` దెబ్బ తగలకుండ తిరిగెడు పని చేష్ట / కనగ నింత నోచుకొననె లేదొ? (పుట.21)

` తలపు తీరుకున్న ఏడ్చు తీయని పసి ఏడ్పు / వినగనింత నోచుకొననొ నేను? (పుట.21)

` ఆడి పాడుచుండు అందాల రాశిని / కనగ వినగ నోచుకొనగ లేదొ? (పుట.21)

విధి తనతో ఆడుతున్న ఆటకు కౌసల్య ఎంతగా వ్యధ చెందిందో ఈ పద్యపాదాల్లో స్పష్టంగా కవి వ్యక్తపరిచాడు.

* సంతాన పరితాపం :

సంతానం కోసం ఎన్నో నోములు, వ్రతాలు నోచింది కౌసల్య. ఎంతో కాలంగా అవన్ని ‘ఎడారి నలికిన విత్తనములయ్యె’ నని ఒక శిలగా మారిపోయింది. ఎప్పుడైతే శ్రీరాముడు జన్మించాడో, అప్పుడు కౌసల్య పునర్జన్మ ఎత్తినట్లుగా భావించింది. ఒక తల్లిగా సార్థకం కాని స్త్రీ జన్మ ఊహించలేనిది. కౌసల్య సంతానప్రాప్తి కోసం పరితపించిన సన్నివేశాలు కవి సహజంగానే వర్ణించాడు. తాను సంతానం కోరుకుంటే తన ఇంటిలో సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే అవతరించినట్టుగా భావించింది.

పాల సంద్రమే మా ఇంట పరిమళించె

కల్పవృక్షమే నట్టింట కదలి యాడె

సత్య ధర్మమ్ములమృతమై జాలువారె

చలువ పందిళ్ళు వేసెను చందమామ                                                (పుట.22)

శ్రీరాముని పుట్టుక సందర్భాన్ని ఆనంద పరవశాన్ని కౌసల్య వదనంలో కవి అద్భుతంగా వర్ణించాడు. బాల్యం నుండి రామచంద్రుని చూచుకోవడమే తపంగా, అలంకరించడమే పూజగా కౌసల్యకు కాలం సాగింది. అంతలోనే యువరాజు పదవికి రాముడు చేరుకోవడం తల్లికి ఆశ్చర్యమే. ఇంతలోనే వనవాస ఆజ్ఞను తట్టుకోలేకపోయింది. ‘నా ఉరమ్ము పగుల ఏడ్చి ఏడ్చి శిలనైతినెపుడొ, ఇప్పుడేడ్చి ఏడ్చి నేనేమౌదు నింక తండ్రి!’ అంటూ రోదిస్తున్న తీరు కవి నైపుణ్యంలో కరుణను చిందించింది.

* భర్త ప్రేమ లేమి :

భర్తవల్ల సుఖం పొందలేకపోవడమనేవి దీర్ఘకాలంగా కౌసల్య తీరని దు:ఖానికి కారణంగా నిలిచింది. పేగుతెంచుకు పుట్టిన బిడ్డను వనవాసం పంపడం ధర్మమూర్తి అయిన మహారాజుకు తగునా అని నిలదీస్తుంది. శ్రీరామచంద్రుడు అడవులకు పయనమై వెళ్తుండగా ‘జీవముండునే? కూలీన చెట్టునైతి’ అని కౌసల్య రోదిస్తుంది. తన పెండ్లి అయినప్పటి నుండి శుభంగానీ, సుఖంగానీ అంతవరకు తాను చూడలేదంటూ శ్రీరాముడితో మొరపెట్టుకుంటుంది. తన భర్త ఒక రాజు అయి ఉండగా తాను మాత్రం కళ తప్పి ఉన్నానని బాధపడుతుంది. ఈ సందర్భంలో కవి అద్భుత పోలిక వర్ణించారు ‘సూర్యుని ముఖమొక్కింతైన చూడలేని కమలవనమట్లు’ భర్త ప్రేమనే కనలేని బ్రతుకిదేమి!’ అని తలరాతను నిందిస్తుంది.

నాణ్యమౌ ఏడువారాల నగలు కలవు

నను గొలువ దాస దాసీజనమ్ము కలదు

ఎన్ని ఉండి వీనిననుభవింపలేని

భాగ్యహీనను పతిప్రేమబడయలేక                      (పుట. 24)

సగటు స్త్రీ భర్తనుండి ఆశించేవి ప్రేమానురాగాలు మాత్రమే. కౌసల్యకు ఏడువారాల నగలు, చుట్టూ దాసదాసీ జనము ఉండి కూడా భాగ్యవిహీనురాలైన స్థితిని కవి తన కవితా ప్రతిభలో ప్రదర్శించారు.

* సపత్నుల హేళన :

ఏ ఇల్లాలు అయిన ఎంత కష్టమొచ్చినా భరిస్తుంది కాని సవితి పోరును భరింపగరాదు. కాని కౌసల్యకు అనునిత్యం సవతుల నుండి పరుష వాక్యాలు, దూషణలు ఎదురవుతూనే ఉంటాయి. సపత్నులతో సమానమైన గౌరవాన్ని పొందలేని తన చిన్నతనాన్ని శ్రీరాముడి ముందు విన్నవించుకుంటుంది. రాజుకు పెద్ద భార్య అయి ఉండి, ప్రజల దృష్టిలో మహారాణి అయి ఉండి కూడా సపత్నులతో పడుతున్న హింసను కౌసల్య విడమరిచి చెప్పింది.

సా బహూన్య మనోజ్ఞాని వాక్యాని హృదయచ్ఛిదాం

అహంత్రోప్యే సపత్నీ నామ వరాణాం వరా సతీ                   (అయోధ్య : సర్గ : 20, శ్లో : 39)

సవతులిందరిలో నాకు సాటివచ్చు

వారెవరు లేరు, నా కంటె వయసులోన

చిన్న వారయు వారు నన్నెన్ని మాట

లాడి కష్టపెట్టెదరొనే ననగరాదు                                                            (పుట.24)

వాల్మీకి రామాయణంలో కౌసల్య శ్రీరాముడితో తన సపత్నుల వల్ల పడిన పరుష వాక్కుల తీరు స్పష్టంగా చెప్పబడిరది. అనుమాండ్ల భూమయ్య ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తల్లి అనుభవించిన సపత్నుల వల్ల బాధ, తన సీతకు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఏకపత్నీ వ్రతుడిగా ప్రతిజ్ఞ చేశాడు. సపత్నుల హేవగింపు వల్ల పొందిన బాధ ఈ కావ్యానికి మూలాధారంగా నిలిచింది. తల్లి హితబోధ ద్వారా శ్రీరాముడిలో సంస్కరణ భావాన్ని పెంపొందింపజేసింది. కౌసల్య తన దు:ఖం రెట్టింపు కావడానికి రెండు కారణాలు గాక మూడిరటిని తెలుపుతుంది. ఒకటి పతి ప్రేమ లేకపోవడం, రెండు సపత్నుల పరుషవచనాలు, మూడవది శ్రీరాముడి వనగమనం.

* స్వేచ్ఛా, స్వాతంత్య్రాల లేమి :

యువరాజు పదవిని అలంకరించే కొడుకు ఉండగానే దూషణలకు గురవుతున్నానని కౌసల్య వ్యధ చెందుతుంది. ఇక శ్రీరాముడు అడవులకు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని బాధపడుతుంది. తన భర్త తనకు ఏ మాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదని రాముడితో మొరపెట్టుకుంటుంది కౌసల్య.

నేను రాణినే అయి కూడా కాను, మీ జ

నకుడు నను నిగ్రహించి ఇంతయును స్వేచ్ఛ

 నీయలేదు, ఆ తల్లి కైకేయి దాస

జనముతో సాటిగానైన సరకుగొనడు                                   (పుట.25)

అంటూ దశరథుడు ఎంతగా ఆమెను కట్టుదిట్టం చేసేవాడో తెలుపుతుంది. భార్యలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడమనేది పితృస్వామ్య వ్యవస్థలో మొదటిది. స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అవసరం లేదనే పురుషాధిపత్య సమాజం అనాదిగా కొనసాగుతూ వస్తున్న విషయం వాల్మీకి రామాయణంలోనే తెలుస్తుంది. తాను ఒక పట్టమహిషి కూడా. రాజు స్వేచ్ఛ ఇవ్వకపోవడాన్ని ధిక్కరిస్తుంది కౌసల్య. తన భర్త చులకన భావంతో చూడడం వల్ల దాసి జనంలో తన రాణితనం చెలామణి కావడం లేదని బాధ పడుతుంది. ఇప్పటికీ దాసీజనం ఈ రీతికి నడుచుకొంటున్న సందర్భంలో కైక కొడుకు రాజయిన తర్వాత భయంతో తనను చూడడానికి రారేమోనని కౌసల్య సందేహిస్తుంది. ఏకాంతాన్ని ఎలా భరించగలనని శ్రీరాముడితో నివేదిస్తుంది. ‘కాలమింక నా గళమున బడిన కాలనాగొ ఏమొ!’ అని కౌసల్య చిందిస్తుంది.

* కైకేయి పోరు :

కౌసల్య తన సవతులన్నింటిలో కైక సాధింపును తట్టుకోలేకపోతుంది. ఎల్లప్పుడు పరుష వాక్యాలతో దూషించే కైకేయి తన మీద ఎంతటి క్రోదాగ్నిని చల్లుతుందోననే కౌసల్య వాపోతుంది. కైక వ్యక్తిత్వాన్ని కౌసల్య ఆవేదనలో కవి అత్యంత సహజంగా చిత్రించారు. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన తర్వాత కౌసల్యను కైకేయి బ్రతుకనివ్వదనే మాటను కవి ప్రస్తావించడంలో ఆమె ఎంతటి నియంత స్వభావాన్ని కలిగిందో తెలుస్తుంది.

కాల సర్పమట్లు కడు వంకరగ నడుచు

నడత గల కైక కుబుసమ్ము విడిచె Ñ ఇపుడు

విషము చిమ్ముచు నను కాటు వేయునేమొ?

కన్నతండ్రి! నాయన! నిన్నె కాటువేసె.                               (పుట.26)

అంటూ కైకేయిని కాలసర్పంతో పోల్చుతూ కౌసల్య ఆక్రోశిస్తుంది. కాని తన కష్టాలను, బాధలను కౌసల్య తన ఇష్ట సఖులకు కూడా చెప్పుకోలేదట. కవి అనుమాండ్ల భూమయ్య కౌసల్య స్వభావాన్ని చిత్రిస్తూ ‘నా ముఖాన మట్టి విసిరినదని నేను / నట్లె కోపించి మట్టిని ఆమె మీద  / విసరలేను. దానిని తీసివేయమేలు’ అని తెలుపుతారు. కౌసల్య వ్యక్తిత్వంలో నీతి, ధర్మం, మంచితనం ప్రదర్శింపజేశారు కవి.

* సవతుల కలత :

కైకేయి మొదలైన సవతులలో ఎదురయ్యే కలతను ఎదలోనే దాచుకొని ఇంతకాలం సగమైపోయిన కౌసల్య ఈ ముసలితనంలో ఇంకా భరింపలేకపోయింది. పట్టమహీషి అయినందు వల్ల సవతులందరూ తనను అధికంగా బాధిస్తున్నట్లుగా కౌసల్య తెలుపుతుంది. మొదటి భార్యను అయిన నేరం వల్ల నేమో తనను మరింత సవతులు అవమానిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

* మాతృ ప్రేమ :

లక్ష్మణుడు ఆవేశంగా మాట్లాడిన మాటలు న్యాయమనిపించి భావించిన కౌసల్య శ్రీరాముడి వనవాసానికి అనుమతించడు. తండ్రి లాగా తల్లి కూడా పూజ్యురాలని చెబుతూ అడవులకు వెళ్ళకూడదని శ్రీరాముడిని ఆజ్ఞాపిస్తుంది. ఈ సందర్భంలోనే కవి భూమయ్య కౌసల్యలో పుత్రుడిపై ఉన్న ప్రేమను అనేక విధాలుగా వర్ణిస్తారు. చిన్నప్పటి నుండి కౌసల్యకు కలిగిన బాధనెల్లా రాముడు తన చిట్టి వ్రేళ్ళతో తుడిచిన సన్నివేశాలను గుర్తు చేసారు. ఆ వేదనతోనే రాముడు పసితనంలో ఆడిన ఆట వస్తువులే ఆయన అడవులకు వెళ్ళిన తర్వాత ఆమెకు బ్రతుకు వస్తువులవుతాయని సూచించారు.

క్రూర మృగముల నిలయమ్ము, కోయటన్న

పలుకు దిక్కులేని అడవి పదియునాలు

గేండ్లు పగలు గడచిన రేయియె గడవదు

ఇట్లివియె నాకిరువదెన్మిదేండ్లు తండ్రి!                                (పుట.41)

అడవులలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో కౌసల్య తలచుకొని బాధపడుతుంది. ఆ రాముడి పసితనం నుండి అల్లారు ముద్దుగా పెంచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. రాముడికి మెత్తని గుడ్డ ఒత్తుకొని పోయినా బాధపడే తల్లి మనస్సు అడవుల్లో కఱకురాళ్ళ మీద నిద్రించడం దుర్భరమైందని ఆవేదన చెందుతుంది.

కడుపులో ఉండగా రాముడు తన పాదాలతో తన్నుతుండగా కౌసల్య ఆ పాదాలు ఎంత కందిపోయెనో అని కలత చెందిందట. భూమయ్య వర్ణనలో తల్లి ప్రేమకు తార్కాణంగా కౌసల్యనే నిలుస్తుందని చెప్పవచ్చు. కాని అటువంటి పాదాలు రాయిరప్పలు తాకి రక్తం చిందిస్తాయని తలచుకొని బాధపడుతుంది. ‘తండ్రీ! నీ ముద్దు పాదమందారములకు నా యెదను తొడుగుదునయ్య!’ అంటూ కౌసల్య పేర్కొంటుంది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనం ఈ పద్య పాదం. కవి మాతృ స్పర్శకు గొప్ప చమత్కృతి. తనను కూడా అడవులకు తోలుకొని పొమ్మని కౌసల్య ప్రాధేయపడుతుంది. అడవుల్లోని భయానక పరిస్థితులను రాముడికి తెలియజేస్తుంది.

* లక్ష్మణుడి సేవ :

ఈ కావ్యంలో లక్ష్మణుడి మాటలు కౌసల్య దు:ఖానికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుత్ర శోకంతో కుమిలిపోతున్న కౌసల్యను చూసి తన తండ్రిపై ఉగ్రరూపమెత్తుతాడు. రాముడు అడవులకు వెళ్ళకూడదని వారిస్తాడు. తన అన్నకోసం ఏమైనా చేస్తానంటాడు   లక్ష్మణుడు. చివరికి తండ్రిని, కైకను, భరతుడిని బంధిస్తానని శపథం చేస్తాడు. రాముడిపై అచంచల భక్తిని ప్రదర్శిస్తాడు. లక్ష్మణుడి ఆక్రోశం కౌసల్య ఆవేదనను కొంత శాంతింపజేసింది. ‘అన్నకు ఆపద సంభవింపనే నగ్నిని దూకెద ముందుగనే’ అన్న లక్ష్మణుడి మాటల్లో అగ్రజుడి పైగల సోదరప్రేమ, సేవాతత్పరత కనిపిస్తుంది. కవి ఈ పాత్ర కల్పనలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

* రాముడి ఏకపత్నీ వ్రతం :

‘జ్వలిత కౌసల్య’గా రగిలిపోతున్న తల్లి దు:ఖాన్ని నివారింపజేస్తూ శ్రీరామచంద్రుడు చల్లగా స్వచ్ఛంగా ఏకపత్నీవ్రతం ప్రతిజ్ఞ చేస్తాడు. తల్లి నిరంతర శోకానికి కారణం తండ్రి ప్రేమ లేకపోవడం, తండ్రి బహుభార్యత్వాన్ని స్వీకరించడం అని గ్రహిస్తాడు. తన తల్లి లాగా సీత దు:ఖించకూడదని నిర్ణయించుకొని మాట ఇస్తాడు.

గడిచినట్టి కాలమ్మేదో గడిచిపోయె

తండ్రి తప్పొప్పులివియని తలపలేను

ఏ పరిస్థితులెట్లు రానిమ్ము నాకు

ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య.                     (పుట. 57)

అన్న శ్రీరాముడి ప్రతిజ్ఞకు కౌసల్య దు:ఖం తొలిగిపోయినట్లుగా కవి కల్పించారు. ‘ఏదో పరిమళామృత పుష్పమింత సాగివచ్చి కౌసల్య శిరస్సుపై విచ్చుకొనియె’ అని వర్ణిస్తారు. కౌసల్య తనకు జరిగిన పరాభవం తిరిగి తీసుకొని రాలేనిది. తన కాలం చెల్లిపోయింది. తన సీతకు ఇటువంటి దుర్గతి పట్టకూడదని కౌసల్య మనోభావం. ఈ ప్రతిజ్ఞతో కవి తన కావ్యానికి సద్గతిని ఏర్పరిచారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య స్త్రీత్వంలో కౌసల్యను చిత్రించి రాముడిని ధర్మ నిరతివైపు పయనింపజేశారు. మూర్తిమత్త్వ నిర్మాణంలో ‘జ్వలిత కౌసల్య’ను అపూర్వ సృష్టిగా నిలువరింపజేశారు. సంప్రదాయ స్త్రీవాద ధోరణికి ప్రతినిధిగా ఈ కావ్యాన్ని చిత్రించారు. సమకాలీన సామాజిక వీక్షణంలో అంతర్భాగంగా పౌరాణిక ఐతిహాసిక పాత్రల మనోగతాన్ని ఆవిష్కరించారు.

:: ఆధారగ్రంథాలు ::

1. కృష్ణకుమారి, నాయని, ఆచార్య, 2013, విమర్శ విద్యా సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

2. ప్రియదర్శిని, కె.,డా॥, (సం) 2015, ప్రతిభాత్రయి, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

3. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2004, అంతర్వీక్షణం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

4. భూమయ్య, అనుమాండ్ల, డా॥, 2011, (నాల్గవ ముద్రణ), జ్వలిత కౌసల్య, మనస్వినీ దేవి ప్రచురణలు,     హైదరాబాద్‌.

5. రామారావు, చేకూరి, ఆచార్య (సం) 2003, అంతర్వీక్షణ సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్‌.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

దురాక్రమణ (కథ)

by Nalimela Bhasker June 14, 2022
written by Nalimela Bhasker

కన్నడ మూలం : మధురా కర్ణమ్ తెలుగు అనువాదం : డా. నలిమెల భాస్కర్

మేఘాలు లేని నిర్మలమైన ఆకాశాన్ని మెత్తగా పత్తిలాంటి ఓ తెల్లని మబ్బు ఆక్రమించికొని వుంది. మొదట అత్యంత సుందరంగా కన్పించిన ఆ మబ్బు తునక కాస్త దగ్గరికొస్తూ కిందికి దిగుతుంటే నలుపు పెరిగి నైరూప్యమై పోయి చుట్టుపక్కల చీకట్లు ఆవరించినట్లు ఓ అనుభూతి. ఎక్కడ వర్షం వస్తుందో అనుకుంటూ పెరట్లోని నిమ్మపళ్ళు పట్టుకొని వేగంగా లోనికొచ్చాడు శేషాద్రి. ప్రశ్నార్థక దృష్టితో తనను చూసిన రమతో “మనకు సర్దుబాటు అవుతుందా బెంగుళూరు. ఇక్కడ సొంత ఇంట్లో హాయిగా వున్నాం” అని మెల్లగా అన్నాడు. రమ రెచ్చిపోయి “సర్దుబాటు కాదు అంటే ఎలా? సర్దుబాటు చేసుకోవాలి. మొదట్లో

కొన్నాడు. ‘ఇక్కడికే రండి‘ అని ఎన్నిసార్లో పిలిచాడు. మీరే అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఈసారి కోపంతో వెళ్ళిపోయాడు. అవునూ, మనమూ పిల్లలతో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండటం ఎప్పుడింక? సుఖపడటమూ, ఎంజాయ్ చేయటమూ ఎప్పుడు? ఓ అమ్మాయిని చూడాలి. వాళ్ళ పెళ్ళి గురించి ఆలోచించాలి. ఈ ఇల్లు అద్దెకు ఇచ్చి వెళదాం పదండి” అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడింది. పొయ్యి మీది వంట చిటపట చప్పుడు చేసింది. బయట మిడ్తూ చిలుక “అప్ప, అప్ప, అప్పు” అంది. ఈ నెపంతో శేషాద్రి బయటికి నడిచాడు.

తన ముద్దుల చిలక మిఠూకి పచ్చిమిరపకాయ తినిపిస్తూ శేషాద్రి ఆలోచించసాగాడు. రమ చెప్పినదాంట్లో తప్పేమీ లేదు.

పిల్లలు ‘మాతో రండి’ అని పిలవడమూ, చాలా బలవంతపెట్టడమూ నిజమే! కానీ, ఇక్కడ సర్దుకున్నట్లు అక్కడ సాధ్యమా? ఈ హళియాళ అనేది చిన్న ఊరైనా సొంతిల్లు ఉంది. ధార్వాడకు దగ్గర, ఉపాధ్యాయ వృత్తిలోంచి పదవీ విరమణ పొందినా ట్యూషన్లు చెబుతున్నాడు. ఐతే బెంగుళూరు, ముంబైల్లో ఉండే మజా మాత్రం ఇక్కడ లేదు. ఇదొక ప్రశాంతమైన నిర్మలమైన కొలను. అక్కడి దుమ్మూ, ట్రాఫిక్, కాలుష్యం, హడావుడి.. కష్టం కదా! ఇంతకుముందు అంటే వాళ్ళున్నది ఇరవై ఐదు ఏళ్ళ కిందట. యశ్వంతపురం సర్కారీ పాఠశాలలో పనిచేస్తున్న కాలం. అప్పుడప్పుడే కంప్యూటర్ కళ్ళు తెరుస్తున్న వేళ, రమ కూడా బేసిక్ కోర్సు నేర్చుకొని ఓ సంవత్సరం పాటు ఉద్యోగం కూడా చేసింది. తర్వాత మళ్ళీ ఉత్తర కర్ణాటక వైపు రావడం జరిగింది.

రమ, శేషాద్రుల చిన్న కుటుంబం గురించి తప్పక చెప్పాలి. రమ గృహిణి. శేషాద్రి ప్రారంభంలో ఎంత ఎగిరినా చివరికి భార్య చెప్పినట్లు వినే ‘జీ హుజూర్‘ భర్త. ఇద్దరు పిల్లలు… అతుల్, అమిత్. అతుల్ చక్కటి మార్కులతో ఇంజినీరింగ్ లో చేరాడు. అమిత్ కూడా మంచి మార్కుల్ని పొందినా పోటీ పరీక్షల గొడవే వద్దు అనుకుని కామర్సులో చేరాడు. ఇద్దరూ ఒకేసారి డిగ్రీ ముగించి బెంగుళూర్లో ఉద్యోగాలు దొరికించుకున్నారు.

అతుల్ పదో తరగతిలో ఉండగా థాండేలికి ఎక కర్షన్కు వెళ్ళినపుడు తెచ్చిన చిలుకే మిర్టూ.

తండ్రికి ఇష్టం లేకున్నా గొడవపడుతూ సాకాడు దాన్ని. అది కూడా “అన్న, అన్న” అంటూ అతని వెంటే తిరుగుతుంది. అతడు లేనప్పుడు మాత్రం అమిత్ వైపు చూస్తుంది. కానీ, దాని ముద్దు పలుకులకు శేషాద్రి ఇష్టపడి దాని ఆలనాపాలనా తనే చూస్తున్నాడు. ఆకలైనపుడు “అమ్మ, అమ్మ” అంటున్న చిలుక, దాని మలం బయట పారవేయాల్సి వచ్చినపుడు మాత్రం “అప్ప, అప్పు” అని పలుకుతున్నది. ఇంటి వాళ్ళకే కాదు, ఇరుగు పొరుగులకూ అది ఇష్టమై పోయి “మిడ్తూ మియా” అయ్యింది.

చివరికి రమ మాటే నెగ్గింది. ఇల్లు అద్దెకిచ్చి అవసరమైన సామాగ్రితో మిఠూ మియా పంజరాన్నీ తీసుకుని బెంగుళూర్లో దిగింది. అతుల్ రాజాజి నగరం భాష్యం సర్కిల్ దగ్గరనే ఇల్లు తీసుకున్నాడు. రెండు బెడ్రూములు, హాలు, కిచెన్లు ఉన్న చిన్న ఇంటికి పదిహేను వేల అద్దె, ఓ లక్ష డిపాజిట్ కట్టాడు. అరవై ఎనిమిదో క్రాసు మార్కెట్టుకు దగ్గరే! ఇరుగు పొరుగు పిల్లల్ని తప్పించడానికి మిఠూ పంజరాన్ని వెనకాల వేలాడదీసింది. అతుల్ పొద్దుట ఏడున్నరకు ఇల్లు వదిలితే తొమ్మిదింటికి తన కంపెనీలో ఉండేవాడు. అతనికన్నా ఓ సంవత్సరం చిన్నవాడైన అమిత్ ఎనిమిది గంటలకు బయలుదేరితే తొమ్మిదికి హ్యారిక్స్ కంపెనీకి చేరేవాడు. ఆ తర్వాత సాయంకాలం, రాత్రి దాకా ఆలుమగలదే సామ్రాజ్యం. ‘సాఫ్ట్ వేర్ ఇంజనియర్‘ అనే కారణం చేత అతుల్ మీద ప్రత్యేకమైన ప్రేమ, గర్వం రమకు. రోజూ తప్పకుండా “ఎన్ని గంటలకు వస్తావ్?” అనే అనే ప్రశ్న అతుల్ ని అడుగటమే ! “అమ్మా! సాఫ్ట్వేర్ వాళ్ళకు ఇంటినించి బయలుదేరే టైమే తెలుసు కరెక్టుగా. తిరిగి ఇంటికొచ్చే టైమ్ తెలీదు” అనేవాడు. ఆ జవాబుతో రమ నిరుత్తురురాలైంది.

కొత్త ఇంటితో సర్దుబాటు చేసుకునే ఆదుర్దాలో రోజులు గడిచిపోవడం తెలియనే లేదు. వారాంతాల్లో చుట్టుపక్కల ఉన్న విశేష స్థలాలు గొరవనపల్లి, మేలుకోటె, మేకదాటు మొదలైనవి చూడటమైంది. హోటల్ తిళ్ళు, సినిమా, షాపింగ్తో రమ ఉబ్బితబ్బిబ్బు అయ్యింది. కొత్తరకపు జీవిత పరిచయాన్ని కల్గించాయి రమకు. ఉత్తర కర్ణాటక వాళ్ళే ఎక్కువగా ఉంటున్న కాలనీలో చక్కగా ఈ ఆలుమగలిద్దరూ ఇరుగుపొరుగుతో కలిసిపోయారు. అన్నగారి సహవాసం రోజూ లభించడంతో మిడ్తూ మియా కూడా ఖుషీ ఖుషీగా ఉన్నాడు. దాన్ని మాట్లాడించనిదే అతుల్ కి ఏ రోజూ ప్రారంభం కాదు. మొబైల్ లో ఫోటో తీసి, వీడియో చేసి స్నేహితులకు చూపిస్తున్నాడు. అంతా బాగానే వున్నా విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ రమకు గాబరా కల్గిస్తున్నది. రోడ్డు దాటాలంటేనే భయంగా వుంది. చుట్టుపక్కల ఎక్కడెక్కణ్ణించో వలస వచ్చిన వివిధ భాషలు మాట్లాడే జనం. మార్వాడీల సంఖ్య ఎక్కువ. దేశంలోని అన్ని ప్రాంతాల నించి ఇతర భాషీయులు వచ్చి ఇక్కడే తిష్ఠ వేసుకొని ఇదే సొంతం అనుకునేంతవరకూ పాతుకుపోయారు. అచ్చమైన కన్నడం విన్పించడం చాలా అరుదు.

రమకు కాస్త తీరిక దొరికాక చిన్ననాటి స్నేహితురాలు సులక్షణకు ఫోన్ చేసింది. ఇద్దరూ తాము అనుకున్న దినం కలుసుకుని కౌగలించుకుని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. సులక్షణ అప్పటికే సాహిత్య రంగంలో పేరు తెచ్చుకుంది. అనేక కథాసంపుటులూ, కవిత్వం సంపుటులూ, నవలలూ ప్రచురించింది. నాలుగు అవార్డులు వచ్చాయి. తన భర్తగారి అకాల మరణంతో కల్గిన దుఃఖాన్ని కథల్లో మరచిపోవడం అబద్ధం కాదు. రమ కూడా సాహిత్య విద్యార్థినే! ఇప్పుడు తన ఫ్రెండుతో సాహిత్య వ్యవసాయం సాగించాలనే ఆశతో ఉంది. రమ ఆలోచన విన్న సులక్షణ చిన్నగా నవ్వి “ఆనాటి రోజులు కావు రమా! ఇప్పుడెక్కడ చూసినా సాఫ్ట్ వేర్ చూడు. బెంగళూరు అంటేనే సైబర్ ఊరు అన్నట్లు తయారైంది. దాంతో మంచే జరిగిందా? కులమతాల గొడవలేక మెరిట్ మీద నౌకరీ దొరికిన మధ్యతరగతి జనాలు బాగుపడ్డారు. విదేశాలు చూసారు.

డబ్బులు గడించారు. మన ఊరి పేరు ప్రపంచంలో ఫేమస్ అయ్యింది.

కానీ సాఫ్ట్ వేర్ల కథ ఎంతమందికి తెలుసు? ప్రెషర్ కుక్కర్ల గతి వాళ్ళది. పని ఒత్తిడి,

టార్గెట్ అనే వేలాడే కత్తి కిందనే బతుకులు. బయటికి హాయిగా ఉంటుంది. లోన… పొట్టవిప్పి చూస్తే అన్నీ పురుగులే! సాహిత్యంలోనూ సాఫ్ట్ వేర్ గురించి కథ రాస్తే చాలు, గరం గరం దోసెల్లా ఖర్చవుతాయి. సాఫ్ట్ వేర్ లో పనిచేసే వాళ్ళు అంటే చేతిలో ఓ బాటిల్, ఒకటి

రెండు బలహీనతలు, కొందరు అమ్మాయిలు, వాళ్ళతో అఫెయిర్సు సెటప్సు, విదేశీ ప్రయాణం… ఇవి ఉంటే చాలు… కథలూ, నవలలూ అన్నీ సక్సెస్. ఈ మధ్య మన బెంగుళూరంతా సైబర్ సాహిత్యమే ఆవరించుకుంది” అని నిట్టూర్చింది. రమ తలలో అనేకానేకమైన ఆలోచనలు. కర్ణాటకలోని మారుమూల పల్లెటూళ్ళలోనూ, పట్టణాలల్లోనూ పిల్లలు పెరిగి పెద్దవుతున్నారంటే ఇంజనీరింగ్ చదివే తమకం. డిగ్రీ రాగానే బెంగుళూరుకు వచ్చి సాఫ్ట్ వేర్ లో చేరే పరుగు. చేరగానే విదేశాలకు వెళ్ళాలనే కలలు. మిగిలిన మామూలు డిగ్రీలకు విలువే లేని పరిస్థితి. పెళ్ళి మార్కెట్టులోనూ ఈ డిగ్రీధారులను పట్టించుకోవడం తక్కువ. రమ మనస్సులో తాను ఇంతకుముందు చూసిన బెంగుళూరు బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా, బంగరు కలలాగా కనిపిస్తూ ఐస్ క్రీములా కరిగిపోతున్నది.

మూడోరోజు సీతా, ఆమె కూతురు విభా వీళ్ళకు కాస్త దగ్గరయ్యారు. వాళ్ళూ ధార్వాడ వాళ్లే!

చాలా ఇష్టమైంది. దినానికోమారు క్యారెట్టు,

జామ పండ్లు తెచ్చి దాన్ని మాట్లాడిస్తూ ఆనందిస్తున్నది. అయితే అమిత్ మాత్రం “అమ్మా! నీకు తెలీదు. ఆమె మిడ్తూ కొరకు కాదు, మిర్టూని సాకినవాడికోసం వస్తున్నది. అతుల్ ఉండే టైమ్ చూసే వస్తున్నది. కావాలంటే చూడు” అన్నాడు. రమ కూడా గమనించింది. అమిత్ చెప్పింది నిజమే! మళ్ళీ అలా రావడంలో తప్పు లేదు అనుకుంది. విభా అందగత్తె బి.కాం. చివరి సంవత్సరంలో ఉంది. మంచివాళ్ళే! కానీ అతుల్ “అమ్మా! నాకు బి.ఇ. చేసినావిడే కావాలి. ఎమ్.ఎన్.సి.లో నౌకరి చేయాలి, బెంగుళూరు ఎంత కాస్ట్లీ తెలుసు నీకు. ఆలుమగలిద్దరూ నౌకరి చేస్తేనే ఇల్లూ ముంగిలీ నడవటం సాధ్యం” అన్నాడు. ఇంతలోనే అతని ఉద్యోగం కథ చాలినంత చూసిన రమ గమ్మున తల పంకించింది. మనసులోనే “వీకెండ్ లోనే వీళ్ళ హుషారు. మిగిలిన రోజుల్లో ఒంటిమీద స్పృహ ఉండదు” అనుకుంది. ఐనా “ఇవాల్టి పిల్లలు తమకి పనికొచ్చే అమ్మాయిలనే ఎంచుకుంటున్నారు. కానివ్వండి… ఆ తర్వాత ఇబ్బందులు కావద్దు కదా” అంది. విభా సంబంధాన్ని ఇష్టపడిన శేషాద్రి “అలా మన ప్రమేయమూ, పాత్రా ఏవీ ఉండవు. మనం కేవలం నామ్ కే వాస్తే” అన్నాడు. కొడుకు పక్షం వహించిన రమ “అలా ఎందుకంటారు? ఈనాటి పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళ ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. మున్ముందు జీవితం గడపాల్సింది వాళ్ళే కదా! వాళ్ళే…..” అని వాదించింది కూడా. కానీ మనసులోని ఏదో మూలన కొడుకు తమ ఆశల్ని నేరుగా నిరాకరించినందుకు బాధా ఉంది.

సులక్షణ ఓరోజు భోజనానికి వచ్చింది. స్నేహితురాండ్రను మాట్లాడుకోవడానికి వదలి శేషాద్రి వెళ్ళి లైబ్రరీలో కూచున్నాడు. భోజనం చేసాక సులక్షణ “రమా! ఓ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఇవాళ పిలిచారు. నా నవల సీరియల్ గా తీయడం గురించి మాట్లాడుతారట! నువ్వు రా!! కలిసొద్దాం” అనడంతో రమ ఆనందాన్ని పట్ట పగ్గాల్లేవు. భర్తకు వడ్డించి బయల్దేరింది. ఇద్దరూ మల్లేశ్వరంలో ఉన్న ఆఫీసు చేరి హంసల చెక్కడపు పనితో ఉన్న తలుపులు తట్టి లోనికి వెళ్ళారు.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శిరస్త్రాణం

by Burra Vijayalaxmi Nagraj June 14, 2022
written by Burra Vijayalaxmi Nagraj

రహదారులన్నీ పచ్చి నెత్తురు పులుముకుంటున్నాయి…
పులుముకోవాల్సివస్తోందేమో
కొన్ని సార్లు బలవంతంగా కూడా!
కూడా శిరసుకు ఉండాల్సిన రక్షక శిరస్ర్తాణాలు …
శిరస్త్రాణాలే ద్విచక్ర వాహనాలకు అలంకారాలుగా మారుతుంటే
మారుతున్న తలరాతలను ఆపడం ఎవరితరం
తరం తరం నిరంతరం నిర్లక్ష్యం తలను మోస్తుంటే
మోస్తున్న బాధ్యతల భారం గుర్తుకురాదా మరి
మరి గుర్తుంచుకుని ప్రాణం పెట్టాల్సిన బంధాలకు నీవులేకపోతే భరోసా ఏది
ఏది ఆ క్షణం ఓ సారి మనసున మెదిలితే
మెదులుతున్నంత కాలం ఆ బాధ్యత నీ హృదయంలో
హృదయం శిరస్త్రాణాన్ని మరువదు
మరువదు తన తలపై ఉన్న బాధ్యతను…
బాధ్యతతో నడుచుకున్నంత కాలం నల్లటి రహదారి
రహదారే అవుతుంది నీ చిరునవ్వులకు
చిరునవ్వులతో కలకలలాడే నీ అనుబంధాలకు.

విజయలక్ష్మీనాగరాజ్
కరీంనగర్
8187010817

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సందేహ నివృత్తి

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, June 14, 2022
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

         గోపి చిన్న పిల్లాడు. అతడు తన పూల తోట లోనికి వెళ్ళాడు. అక్కడ చాలా పూల మొక్కలు  అందంగా రకరకాల రంగులతో ఉన్నాయి.ఇంతలో ఒక పూలమొక్క గాలికి అడ్డంగా అటూ,ఇటూ ఊగుతోంది.
గోపీకి ఒక సందేహం వచ్చింది.
       ఇంతలో అక్కడకు అతని తాతయ్య వచ్చాడు. అప్పుడు గోపి తాతయ్య తో” చూడు తాతయ్యా! ఈ మొక్క గాలికి  అడ్డంగా అటూ, ఇటూ ఊగుతుంది. దీని అర్థం ఏమిటి?” అని  ప్రశ్నించాడు?
       అప్పుడు తాతయ్య” ఇది  నీకు భయపడి తనను తొలగిస్తావనుకొని తొలగించవద్దని అడ్డంగా ఊగుతోంది రా! . అంతే గాకుండా నేను చాలా మంచి మొక్కను. మీకు పూలు  ఇస్తాను .నన్ను తొలగించవద్దని ప్రార్థిస్థున్నది ” అని  అన్నాడు.
       అప్పుడు గోపి “ఓహో! ఈ మొక్క ఇలా అడ్డంగా ఊగితే అర్థం ఇది  అన్న మాట “అని బిగ్గరగా అన్నాడు. ఆ తర్వాత  ” అయితే తాతయ్యా! దీనిని మనం తొలగించడం లేదు .అంతేకాదు. ఇలాంటి మొక్కలు ఇంకా కొన్ని కూడా తెచ్చి నాటుదాం” అని
అన్నాడు.గోపి అలా అనడమే కాకుండా  మరి కొన్ని మొక్కలు కూడా తెచ్చి ఆ తెల్లవారి  నాటాడు.గోపి చేసిన పనికి  తాతయ్య ఎంతో సంతోషించాడు.
       మరొక రోజు గోపి తోట లోకి వెళ్లి  తాతయ్యను పిలిచి  ” తాతయ్యా! ఈ మొక్క అడ్డంగా కాకుండా నిలువుగా ఊగుతుంది . మరి  దీని అర్థం ఏమిటి” అని ప్రశ్నించాడు? అందుకు తాతయ్య” గోపీ!  నిన్ను ఆ మొక్క  తన దగ్గరకు రమ్మని పిలుస్తోంది రా! తనను ఇక్కడనుండి తొలగించమని అది ప్రాధేయ పడుతోంది! “అని అన్నాడు.  అప్పుడు గోపి “తాతయ్యా ! మొక్కలను తొలగించవద్దని మీరే చెప్పారుగా” అని అన్నాడు. ” అవును గోపీ! నీవన్నది నిజమే! కానీ  ఇది కలుపు మొక్క. ఇతర మంచి మొక్కలకు  నీరు ,ఎరువు  అందకుండా ఇది చెరుపు  చేసేది. ఇది మంచిమొక్కలను ఎదగనీయదు.అందుకే తనను తీసేయమని ఇది  నీకు భయపడి నిన్ను ముందే  వేడుకొంటోంది .ఇలాంటి వాటిని మనం తీసేయాలి రా!” అని  అన్నాడు. ” అయితే దీనిని తొలగిద్దాం తాతయ్యా! ” అని అన్నాడు గోపి.” అవును !ఇలాంటి వాటిని తొలగిస్తే మంచి మొక్కలు ఎదిగి మన తోటలో చక్కని పూలు పూస్తాయి” అన్నాడు తాతయ్య.
        మళ్లీ గోపి “మరి పూవులను మొక్కలనుండి తెంప కూడదా తాతయ్యా! ”  అని ప్రశ్నించాడు ? “వద్దు. తెంపకూడదు. మనకు అత్యవసరమైనపుడు మాత్రమే ఒకటో, రెండో  తెంపుకోవాలి.ఆ రంగు రంగుల పూలు  మన కళ్ళకు ఎంతో అందంగా కనబడతాయి . వీటిని మనం  మొక్కల నుండి  వేరు చేయకూడదు. అవి  మనకు కమ్మని  సువాసనను, మంచి గాలిని ఇస్తాయి. మనం స్వార్ధం తో వీటి అన్నింటినీ ఒకేసారి  తెంపకూడదు “అని అన్నాడు తాతయ్య. గోపి” సరే తాతయ్యా! నా సందేహాలు నివృత్తి అయినాయి. మీకు కృతజ్ఞతలు.మీరు చెప్పినట్లే నేను చేస్తాను ” అని అన్నాడు.
     పిల్లలూ! అందుకే పూల మొక్కలను నాటి ప్రకృతి అందాలను కాపాడి పర్యావరణానికి తోడ్పడాలి.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వృథా చేయకు నీటిబొట్టు

by చంద్రకళ దీకొండ June 14, 2022
written by చంద్రకళ దీకొండ

జలము జీవులకు ప్రాణాధారం
జలమే జీవక్రియలకు ఆధారం
వృథా చేయకు నీటిబొట్టు
వర్షం నీటిని ఒడిసిపట్టు…!

నదుల వద్దనే నాగరికత
నీటితోనే మానవుల భవిత
నీరుంటేనే పంటలు పండు
నీరు లేకున్న గొంతులెండు…!

ఒకవైపు నీటి వృథా
మరోవైపు గొంతెండే వ్యధ
నీరుంటేనే మనును జీవులు
నీరుంటేనే సాగును బ్రతుకులు…!

శుద్ధిచేసిన మురికినీటితో
పంటలు పండించే
ఇజ్రాయెల్ దేశాన్ని చూడు
ఎడారిలోనూ కూరలు పండించే
శాస్త్రీయ విజ్ఞానాన్ని స్వంతం చేసుకో
ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే
ఆధునిక నైపుణ్యాన్ని అలవరచుకో
చుక్క చుక్కనూ ఒడిసిపట్టే
బిందుసేద్య పద్ధతులను ఆచరించు

ముందుతరాలకు తెలియజెప్పు
భూగోళంపై మూడు శాతం కన్నా
తక్కువున్న మంచినీటి ప్రాధాన్యతను
కన్నీటిపాలు కానీయకు
వారి సుందర భవితను…!!!


చంద్రకళ. దీకొండ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

తీపికలలు…

by ఏలూరు అశోక్ కుమార్ రావు June 14, 2022
written by ఏలూరు అశోక్ కుమార్ రావు

ఆచార్య ఆత్రేయ (కిళాంబి వేంకట నరసింహాచార్యులు)గారి ఈ గీతానికి ఎ.ఎం.రాజా మధురంగా బాణీ కూర్చితే జిక్కి మృదు మధురంగా గానం చేశారు.

పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు ||పులకించు||

సంగీతం, సాహిత్యం రెండు కూడా గానంతో మేళవిస్తే ఇక మానవ జీవితానికి కావలసింది ఏముంది? ఆ మూడు కళలకు మన మనసు పులకించి పోతుంది. మన మనసులో వుండే తీరని వ్యథలను, దుఃఖాలను మరపింప చేస్తాయి.

రాగ మందను రాగ మొలికి, రక్తి నొసగును గానం,

రేపు రేపను తీపి కలలకు, రూపమిచ్చును గానం,

చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం,

జీవమొసగును గానం, మది చింత బావును గానం    ||పులకించని||

గానంలోని రాగంలో అనురాగం నిండితే మానవ మనుగడలో రక్తి కలుగుతుంది. సంగీతం రాగాన్ని కూడా అనురాగమయం చేస్తుంది. జీవితంలో ఆసక్తిని, రక్తిని నింపుతుంది. మనకు గానం రాగాలాపనతో ఎంతో దూరాన వున్న కలలను, ఆశలను మన హృదయానికి చేరుస్తుంది. మన భావాలు చెల్లా చెదురుగ పడి వుంటే వాటినన్నింటినీ పూలను దండిగా మార్చే విధంగా ఒక దగ్గరికి చేర్చి అస్తిత్వాన్ని కలుగజేస్తుంది. మన మనసులో వుండే బాధలను తొలగించి, హాయిని కలుగజేస్తుంది.

వాడిపోయిన పైరులైనా, నీరుగని నర్తించును,

కూలిపోయిన తీగలైనా, కొమ్మనల మీ ప్రాకును,

కన్నెమనసు ఎన్నుకున్న తోడు దొరికిన మరియు

దోరవలపే మరియు, మది దోచుకొమ్మని పిలుచు ||పులకించని||

వర్షాలు లేకపోతే పైర్లు ఎండిపోతాయి. కాని వర్షం కురిసి నీరు వాటికి అందినచో, మానవ హృదయం గానానికి పరవశించినట్లు, పైర్లు కూడ, నాట్యం చేస్తాయని కవి భావన. ఆధారం లేకపోతే తీగ ప్రాకజాలదు. అలా కూలిపోయిన తీగలు కూడా వాటి ప్రక్కన గల కొమ్మలను ఆసరా చేసికొని వాటిలో పునరుజ్జీవం కలిగి మళ్ళీ ప్రాకుతాయి. అదేవిధంగా కన్నెమనసులో ఎన్నో ఆశలుంటాయి. కాని, తాను మనసులో కోరుకున్న తోడు (జీవిత భాగస్వామి) దొరకాలన్నదే ఆమె జీవితంలో పెద్ద ఆశ. ఆ తోడు దొరికిందంటే ఆమె మనసు మురుస్తుంది. ఆ తోడు దొరికిన వెంటనే ఆమె పులకించి, తన హృదయాన్ని, జీవితాన్ని ఆ భాగస్వామికి సమర్పించి, తన మనసును కూడా. దోచుకొమ్మని ఆహ్వానిస్తుంది. గానం అనే కళ మానవ జీవితాల్లో వుండే జఢత్వాన్ని తొలగింపచేసే ఒక ఔషధం లాంటిది. “శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణిః” అని ఆర్యోక్తి. పశువులను, శిశువులోనే కాకుండా, పాములను కూడా పరవశింపచేసేది గాన రసం.

పెళ్లి కానుక సినిమా 1960 సంవత్సరంలో విడుదలైనది. ఈ పాట నటి కృష్ణకుమారి పై చిత్రీకరించబడింది. 60 సం గడిచినప్పికి ఇప్పటికి మన తెలుగు నాట అందరి హృదయాలను కొల్లగొడుతూనే వుంది.

  • ఏలూరు అశోకుకుమార్ రావు
June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

సారంగ పక్షులు

by ఒద్దిరాజు మురళీధరంరావు June 14, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

మనం పిల్లలకు కథలు చెప్పేప్పుడు జంతువులు, పక్షి కథలు చెప్తుంటాము. ఉదాహరణకు ఐకమత్యమే మహాబలం అనే నీతి కథ నాల్గు ఎడ్లు, ఒక పులి, ఆపద వచ్చినపుడు ఉపాయంతో పులి నుండి రక్షించుకున్న వడ్రంగి, వలలో చిక్కుకున్న పావురాలు, ఇద్దరు కొట్లాడితే మూడవవానికి లాభం రెండు పిల్లులు, రొట్టెముక్క కోతి కథ మొదలగునవి పిల్లలు ఆసక్తిగా వింటూ నీతిమంతులు అవుతారు.

ఇదే మాదిరిగా పురాణ కథల్లో వచ్చే ప్రాణులకు పూర్వజన్మ వృత్తాంతాలు కల్పించి చూపడం పురాణాల్లో ఆచారం. ఒక జింక పూర్వజన్మలో ఒక ఋషి అనీ లేదా ఒక నక్క పూర్వజన్మలో ఒక రాజనీ, ఇలా చెప్పడం పురాణాల్లో వాడుక. అప్పుడు జింక జింకగానూ నడుచుకుంటుంది, ఋషి లాగాను మాట్లాడుతుంది. ఇలాంటి వాటివల్ల కథకు కమ్మదనం వస్తుంది. ఎన్నెన్నో గొప్ప గొప్ప సత్యాలు వెల్లడి అవుతాయి. అటువంటిదే ఒక కథ – సారంగ పక్షులు.          

  • సుధామూర్తి

పాండవులు ఖాండవవనం చేరేవరకు అది చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవిగా ఉండింది. మృగాలకు, పక్షులకూ నెలవుగా ఉంది. దొంగలు దోపిడీగాళ్ళు అక్కడ చేరి వచ్చిపోయేవారిని హింసిస్తుండేవారు. అటువంటి కీకారణ్యాన్ని తగులబెట్టి, అక్కడ ఒక చక్కని నగరం కట్టించాలని కృష్ణుడూ, అర్జునుడూ నిశ్చయించారు.

ఆ అరణ్యంలో ఒక చెట్టు మీద రెండు సారంగ పక్షులు గూడు కట్టుకొని నివసిస్తున్నాయి. అందులో ఒకటి మగపక్షి, ఇంకోటి ఆడపక్షి. వాటికి నాలుగు పిల్లలు. ఆ పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు. ఇది అలా ఉండగా మగపక్షి, తన భార్యనూ, పిల్లలనూ విడిచిపెట్టి వేరొక ఆడపక్షితో చేరి ఉల్లాసంగా తిరుగుతూ వచ్చింది. తల్లి పక్షి మటుకు తానే తంటాలు పడుతూ ఆహారం తెచ్చి పిల్లలను పోషిస్తూ ఉంది. సరిగ్గా అదే సమయానికి కృష్ణార్జునులు ఉత్తర్వు ప్రకారం అరణ్యానికి నిప్పు అంటుకుంది. క్షణాల్లో మంటలు నలుదిక్కులా వ్యాపించాయి. అడవి అంతా కాలిపోతున్నది. ఆ మంటలు సారంగపక్షుల చెట్టువైపు వస్తుండెను. అది చూసి తల్లిపక్షి తల్లడిల్లిపోయింది. కన్నీరు జలజల కారుస్తూ వాపోయింది. అడవినంతా భస్మంచేస్తూ మంటలు దగ్గరగా వస్తున్నాయి. ఇంకా కాసేపట్లో ఇక్కడికి చేరుతాయి. మనందరిని మసి చేస్తాయి. చెట్లు ఫెళఫెళ విరిగి పడుతున్న శబ్దం విని అడవి జంతువులు అల్లకల్లోలమై అల్లాడిపోతున్నాయి. నా కూనల్లారా! ఇంకా రెక్కలు, కాళ్ళు రాని మీరు మంటల్లో కాలిపోతారు! మీ నాయన మనల్ని విడిచిపెట్టి పోయాడు! అయ్యో! నేనిప్పుడు ఏం చేసేదిరా దేవుడా! ఈ పిల్లలను మోసుకొని ఎగిరిపోదమన్నా నాకు అంత శక్తి లేదాయె. ఎం చెయ్యను? అని ఇలా ఆడపక్షి అంగలారుస్తూ కూచుంది. తల్లి అవస్థ చూసి పిల్లలు ఇలా చెప్పాయి.

“అమ్మా! మా మీది ప్రేమ వలన నీవేమి అంతగా పరితపించవద్దు. మాకేం ఫరవా లేదు. ఈ నిప్పుల పాలయి మేము ఇక్కడే కాలిపోయినప్పటికి వచ్చే నష్టమేమి ఉండదమ్మా. మేము పుణ్యలోకాలకు పోతాం. మాకోసం నీవు కూడా ప్రాణం పోగొట్టుకుంటే కులం వృద్ధి అయ్యే అవకాశం లేకుండా పోతుంది. నీవు వెంటనే బయలుదేరి ఏదైనా నిప్పులేని చోటుకు పోయి క్షేమంగా ఉండమ్మా. మేమిక్కడ నిప్పుల పాలయినా నీకు మళ్ళీ పిల్లలు కలుగుతారు. నీవు బాగా ఆలోచించి మన కులానికి ఏది బాగో అది చెయ్యి.”

పిల్లలు ఇంతగా చెప్పినా తల్లిపక్షికి వాటిని విడిచిపెట్టి వెళ్లడానికి మనసు రాలేదు. “నా చిన్నారి బిడ్డలారా! మిమ్మల్ని విడిచి వెళ్ళడానికి నాకు కాళ్ళాడటం లేదు. మీతో పాటు నేను కూడా ఈ అగ్నికి ఆహుతి అయిపోతాను” అని చెప్పి అక్కడే తిష్ట వేసుకుని కూచుంది.

మందపాలుడు అనే ఒక ఋషి నియమం తప్పకుండా జీవితమంతా బ్రహ్మచర్యవ్రతం కాపాడుకుంటూ వచ్చి, చివరకు అందరిలాగానే తనువు చాలించి ఊర్ధ్వలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వారపాలకులు అతడ్ని చూసి “పుత్ర సంతానం పొందకుండా వచ్చినవారికి ఇచ్చడ చోటు లేదు, ఫో!” అని చెప్పి అతడ్ని తిప్పి పంపించారు. దానిపై ఆయన ఒక సారంగపక్షిగా పుట్టి ‘జరిత’ అనే ఆడపిట్టను కట్టుకున్నాడు. అది నాలుగు గ్రుడ్లు పెట్టగానే అతడు జరితను వదిలిపెట్టి ‘లపిత’ అనే వేరొక ఆడపిట్టతో స్నేహం చేశాడు.

కొన్నాళ్ళకు జరిత పెట్టిన నాల్గు గ్రుడ్లు పగిలి పిట్టలైనాయి. అవే ముందు చెప్పి అగ్నిప్రమాదం ముంచుకొని వచ్చిన సమయంలో, ఋషికి పుట్టిన పిల్లలమయి నందున మాకు ఏ ప్రమాదం రాదని తల్లికి ఆ విధంగా ధైర్యంగా చెప్పాయి.

తరువాత తల్లి పక్షి పిల్లలకు ఇలా చెప్పింది. “ఈ చెట్టు పక్కనే ఒక ఎలుక రంధ్రం ఉంది. మిమ్ములను దానిలో విడిచిపెడుతాను. అక్కడ అగ్నిభయం లేకుండా క్షేమంగా ఉండవచ్చు. ఆ కన్నానికి పైన మన్ను వేసి మూసేస్తాను. అప్పుడు మంటలు లోపలికి రావు. మంటలు చల్లారి పోగానే మన్ను తీసేసి మిమ్ముల్ని బయటికి తీస్తాను, సరేనా?”

తల్లి చెప్పిన మాటలు పిల్లలు ఒప్పుకోలేదు. ఆ కన్నంలో వుండే ఎలుకలు మమ్ముల చంపి తినేస్తాయి. ఎలుకల నోట్లో పడి చావడం కన్న ఈ మంటల్లో కాలిపోవడమే మేలు.

“ఆ కన్నంలోని ఎలుకను గద్ద తన్నుకపోయింది నేను చూశాను, ఇక అక్కడ మీకు ఏ అపాయం ఉండదు?” అని తల్లిపక్షి మళ్ళీ వాటిని ఒప్పించే ప్రయత్నం చేసింది.

అయినా పక్షిపిల్లలు ఒప్పుకోలేదు “ఒక్క ఎలుకను గ్రద్ద తన్నుకపోతే మాత్రం ఏం! ఇంకా కన్నంలో ఎన్ని ఎలుకలు ఉన్నాయోనమ్మా! కనుక జాగ్రత్త! ముందు నీ ప్రాణం కాపాడుకో. ఇక్కడి నుండి ఎగిరిపో, ఇక్కడికి మంటలు రాకముందే. మాపై భ్రమ పెట్టుకొని నీవు అనవసరంగా ప్రాణాలెందుకు పోగొట్టుకుంటావు? నీవెవరు? మేమెవరం? మేం నీకు ఏం సహాయం చేశాం? ఏమి లేదు, మేమే నీ కడుపున పుట్టి నీకు అష్టకష్టాలు కలిగించాం అమ్మా. అంటే! ఇక మమ్మల్ని వదిలి పెట్టిపో! నీదింకా చిన్నవయసు యవ్వనం తీరి పోలేదు. నీవు నీ భర్తతో కలిసి ఇంకా పదికాలాల పాటు సుఖించవమ్మా! మేము అగ్నిలో పడి చచ్చినా పుణ్యలోకాలకే పోతాం. మా గురించి విచారించకు! ముందు నీ ప్రాణాలు రక్షించుకో. అగ్ని చల్లారింతర్వాత ఒకవేళ మేం బ్రతికి ఉంటే మమ్ములను చూడవచ్చు” అని అవి తొందర పెట్టేవరకు, మరి లాభం లేదని తల్లి పక్షి తుర్రున ఎగిరిపోయింది.

అగ్నిజ్వాలలు వచ్చి చెట్టు చుట్టుముట్టాయి. పక్షి పిల్లలు ఏమాత్రం భయపడలేదు. చావుకు ఎదిరిచూస్తూ నిశ్చింతగా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి.

తెలిసినటువంటి వాళ్ళు ఆపదలు రానున్నపుడు ముందే తెలుసుకుంటారు, మరియు మనస్సు స్థిరపరుచుకొని ఉంటారు. అంతేకాని తీరా ఆపద ముంచుకొచ్చి నపుడు ఆందోళన చెందరు. ఆరాట పడరు! అంది, పక్షుల్లో పెద్దది.

“నీవెలాగయినా ధీరుడవు, మేధావివి. నీలా ధైర్యంగా ఉండే వాళ్ళు లోకంలో నూటికో కోటికో ఒకరుంటారు!” అన్నాయి తక్కిన పిల్లలు.

అగ్నిజ్వాలలు వచ్చి చెట్టు చుట్టుముట్టాయి. పక్షి పిల్లలన్నీ కలిసి నవ్వు ముఖాలతో అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేశాయి. “ఓ అగ్ని దేవుడా! మా తల్లి మమ్ము విడిచిపోయింది. మా తండ్రి ఎవరో మేం ఎరుగం. గ్రుడ్ల నుంచి బయట పడింతరువాత ఇంతవరకు ఆయన్ను చూడలేదు. ఓ ఆదిదేవుడా! మేమింకా రెక్కలు రాని పిల్లలం. ఇక మాకు నీవే గతి. మాకు వేరే ఆప్తులు లేరు. నిన్నే శరణు జొచ్చాం. మమ్మల్ని రక్షించు తండ్రీ!!” అంటూ వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణ బ్రహ్మచారుల్లాగా స్తోత్రం చేశాయి. దీనంగా ప్రార్థించాయి.

అప్పుడు చెట్టును చుట్టిన అగ్నిహోత్రుడు ఆ పక్షిపిల్లలను అంటలేదు. కార్చిచ్చు కారడవినంతా కాల్చి పారేసి చల్లారిపోయింది. ఆ పిల్లలు మాత్రం చావలేదు!

అగ్ని యావత్తు చల్లారిపోయింతరువాత తల్లిపక్షి వచ్చింది . తన పిల్లలు క్షేమంగా ఉండి మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యపడింది. అక్కడ తండ్రి పక్షి తన కొత్త ప్రియురాలితో “అయ్యో! నా పిల్లలు ఏమయిపోయారో కదా! అగ్నికి ఆహుతి అయిపోయారేమో!” అని కుమిలి కుమిలి దుఃఖించడం మొదలుపెట్టింది. అందుకు లపిత వెంటనే “అలాగా! నీ సమాచారం నాకు పూర్తిగా తెలిసింది. ఇప్పుడు నీకు జరిత మీదికి మనస్సు పోయినట్లుంది. నాపైన వెగటు పుట్టినట్లుంది. అందుకే అగ్నిప్రమాదమనీ, పిల్లలనీ చెప్పి, లేనిపోని వంకబెట్టి అబద్దాలాడుతున్నావు. ఎందుకీ అబద్ధాలు? నీవు ముందే చెప్పావుగా? జరిత పిల్లలను అగ్ని దహించదనీ, అగ్నిదేవుడు నీకు వరం ఇచ్చాడనీ. నీవు ఒకసారి నాతో చెప్పలేదూ? నన్ను విడిచిపెట్టి నీకు ప్రాణప్రియురాలైన జరిత వద్దకు వెళ్ళాలని నీకు ఉంటే ఆ సంగతి చెప్పి నిర్భయంగా వెళ్ళవచ్చుగా! ఎందుకీ లేనిపోని అబద్ధాలు? నమ్మకూడని మగవాళ్ళను నమ్మి మోసపోయిన ఆడవారిలో నేనూ ఒకతినయి ఆడవులు పట్టి, నా దారిన నేను పోతాను. నీవు మహారాజుగా పోవచ్చు” అని ఏడుస్తూ చెప్పింది.

 “నీ ఊహ సరికానే కాదు” అని వెంటనే అందుకుంది మందపాల పక్షి. “అసలు సంగతి విను. నేను పుత్ర సంతానం కోసమే, ఈ పక్షి జన్మ ఎత్తాను. నా బెంగంతా పిల్లల గురించే, వెళ్ళి చూసివస్తాను” అని ఎలాగైతేనేం, ఆ కొత్త ప్రియురాలిని సమాధానపరిచి తన భార్య జరిత ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు, మందపాలుడు.

జరిత తన భర్త వచ్చిన సంగతి గమనించనే లేదు. పిల్లలు గండం తప్పించుకొని బయట పడ్డారన్న ఆనందంలో ఇంకా అలాగానే మునిగి ఉంది. కాసేపటికి తిరిగి చూసింది. భర్త కనిపించాడు. ఏం? ఎందుకు వచ్చారు? అని అలక్ష్యంగా పలకరించింది.

“నా నాయినలు సుఖంగా వున్నారు కదా! ఇందులో ఎవరు పెద్దవాడు?” అంటూ ఆప్యాయంగా పక్కన వచ్చి నిలుచున్నాడు మందపాలుడు.

“ఎవరు పెద్దవారైతేనేమి? ఎవరు తరువాత వాడైతేనేం? ఏ తోడూ లేకుండా నన్ను వదిలేసి, ఎవతి కోసమైతే వెళ్ళారో దాని దగ్గరికే పోయి దానితోనే ఉండండి! వెళ్లండి” అని జరిత, కోపంగా భర్తను కసిరింది.

పిల్లలు పుట్టింతరువాత ఏ స్త్రీ అయినా పురుషుణ్ణి లెక్కపెట్టుడు. ఇది లోకంలో ఉన్నతీరే. ఏ పాపం ఎరుగని వసిష్ఠుణ్ణి కూడా అరుంధతి ఇలాగే అవమాన పరిచింది అన్నాడు, మగ పక్షి రూపంలో ఉన్న మందపాలుడు.

XXXXXX XXXX

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణకలనం – 8

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి June 14, 2022
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

ఆధారములు
^^^^^^^^^^^^

  1. లయవిన్యాసంలో ధిమి కి తోడు (2)
  2. నైజాం పాలనలో పెత్తనం చేసిన వారు (3)
  3. … టి బ్రతుకు నాటకం చాల (2)
  4. గాలి (4)
  5. ఇది కుట్టిందంటే కందిపోవటమే (4)
  6. పర్వతం చిమ్మే ఉష్ణద్రవం (2)
  7. ఆమనిని గుర్తు చేసే నాదవిహంగం (2)
  8. తిండికి సత్రం పంటకు … (2)
  9. భేదాలలో మొదటిది (2)
  10. చిన్నతనంతో మెరిసేది (3)
  11. ఉత్తీర్ణత కోరి వ్రాసేది (3)
  12. సాకు వాగు (2)
  13. ఆటకు ధ్వనుల వరుసల పాట (2)
  14. చెట్టు (2)
  15. ఏరు వైపు (2)
  16. అగ్ని వాంతి (2)
  17. వ్యాపారి లెక్కించే మొదటి అంకె (2)
  18. అసమాన (3)
  19. లాలించే తల్లి (3)
  20. కష్టం పడుట (2)
  21. వైయస్సార్ జిల్లా (3)
  22. ఉదారంగా పంచిపెట్టటం (3)
  23. వక్క రాకతోడు (2)
  24. కత్తి వైపు (2)
  25. కోటిలో నూటికి ఒకటి (2)
  26. చల్లని కిరణమాలి (4)
  27. నాయుడు కు ఎంకి (4)
  28. నిజం పోలిక (2)
  29. పాంచాలి (3)
  30. ద్రవ్యం (2)

నిలువు
**

  1. పిమ్మట (4)
  2. జంట (2)
  3. కంటిలో ఎఱ్ఱ గీత (2)
  4. వాద్యం నీది కాదు (2)
  5. ….. …. నడుమ మురారీ (4)
  6. …. ? నిజమా ? (2)
  7. బాస రూపు (2)
  8. నెమలి కిది నలుపు (2)
  9. ముళ్ళమండ (2)
  10. పొలంలో దున్నే చోటు (2)
  11. ధ్వని (2)
  12. కొప్పు (2)
  13. సతితో మరోసగం (2)
  14. అశాశ్వతం (5)
  15. నాగమాత (3)
  16. సైన్యం చేసే సాధన (3)
  17. జత (3)
  18. కంటి నొప్పులు (4)
  19. కుడివైపు దక్షిణం (4)
  20. ఆ వైపు (2)
  21. తాపసి చేసేది (2)
  22. వంటనష్టం (4)
  23. అర్జునశంఖం (4)
  24. వస్తే రానీ, పోతే …… (2)
  25. సరస్వతి మాట (2)
  26. ఓర్పు గల భూమి (2)
  27. వెలితి (2)
  28. ప్రక్క వైపు చోటు (2)
  29. గగనంలో పెద్ద దీపం (2)
June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi June 14, 2022
written by Chillara Bhavanidevi

2


చిన్నాదేవికి నిద్రపట్టడం లేదు. కళ్ళు మూసినా, తెరిచినా ప్రభువు సుందరరూపమే మెదులుతోంది. కదిలితే తల్లికి నిద్రాభంగం అవుతుందని అలాగే కళ్ళుమూసుకుని పడుకుంది.
వాతావరణం వసంత మనోహరంగా ఉంది. కిటికీలోంచి పిల్లగాలి అల్లరిపెడుతోంది. అది కొంత ఊరట కల్గిస్తున్నా మరింత నిట్టూర్పుకు కూడా కారణమవుతోంది. నిండు పేరోలగంలో కొలువు తీరిన రాయలమూర్తి గంభీర రాజసంతో ధీర విలసితంగా ఉంది. నాడు తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో తన నృత్యం చూసిన కృష్ణరాయని కళ్ళల్లో తొణికిసలాడిన ఆ భావం ఏమిటో పూర్తిగా అర్థం కావటం లేదు. అది ప్రేమా? ప్రశంసా? అనురాగమా? అభిమానమా?భగవానుని సన్నిధిలో ప్రభుదర్శనం వల్ల తన జీవితంలో ఎటువంటి మార్పు జరుగనున్నదో ఆ నాట్యమయూరికి అవగతం కాలేదు. ఏమో! చల్లనితల్లి అలివేలుమంగమ్మ అనుగ్రహంతో రాయలు తనను అంగీకరిస్తే ఈ జన్మకదే వరం. ఇదంతా శ్రీకృష్ణరాయలు ప్రభువు కాకముందు. కానీ ఇప్పుడు ఆయన విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఒక దేవదాసి చేయి పట్టుకుంటాడా? ఒకవేళ ప్రభువు అలా అనుకున్నా అప్పాజీ అంగీకరిస్తారా! అప్పాజీ మాటను ప్రభువు శిరసావహిస్తాడు కదా! ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలీదు.
చిన్నాదేవి పారవశ్యంతో నృత్యం చేస్తున్నది. దేవాలయ ప్రాంగణంలో పలువురు ప్రముఖులున్నారు. ఆమె దృష్టి మాత్రం మురళీమోహనుడి మీదే కేంద్రీకృతమై ఉంది. ఇదేమిటి! స్వామి స్థానంలో కృష్ణరాయలు చిరునవ్వులతో తనకేసి చూస్తున్నాడు? రారమ్మని చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు?
‘‘స్వామీ పూజా ప్రసూనమై నీ
పద పద్మముల వాలెదను
ఎన్ని జన్మలైన నిన్నెడ బాయను స్వామి!’’
చిన్నాదేవి నర్తిస్తూ మురళీమోహనుడి వైపే అడుగులేస్తోంది. అందరికీ ఆవేళ చిన్నాదేవి ధోరణి కొత్తగా ఉంది. సమ్మోహనకరంగా ఆరాధనానృత్యం చేస్తూ అటు స్వామిని, ఇటు దేవాలయ ప్రేక్షకులను అలరించే ఆ కళాతపస్విని ఇవ్వాళ పూర్తిగా స్వామి తప్ప మరో ప్రపంచం పట్టనట్లు ఏదో మైకం కమ్మినట్లు ప్రవర్తిస్తున్నది.
విగ్రహంలోంచి కృష్ణదేవరాయలు తనకేసి చేతులు చాపి వచ్చేశాడు. ఆమె అతని విశాల వక్షస్థలంపై వాలిపోయింది. పెదవులు పాటను గుసగుసలాడు తున్నాయి. స్వామి చేతుల్లో బందీఅవటం హాయిగా ఉంది. సిగ్గుతో తలెత్తి రాయల మొహంకేసి కూడా చూడలేకపోతున్నది. ఆమె అణువణువూ అతని వశమై మనసు పరవశమైంది. కళావతంసుడు రాయలు కళాకారిణి చిన్నాదేవి మనుసులు ఐక్యమైన అద్భుత అనుభూతి. చుట్టూ ఎందరున్నా ఎవ్వరూ లేని ఏకాంత భావనా ప్రపంచం అది.
కల చెదిరింది. ఆశ్చర్యపడి చుట్టూ చూసింది చిన్నాదేవి. పక్కన తల్లి గాఢనిద్రలో ఉంది. ఆమెకీ అనుభూతి కొత్తది. తాను ఎవరిబిడ్డో ఏమో ఈ తల్లి పెంచి నాట్యం నేర్పింది. చిన్నతనం నుంచి ‘నీజన్మ కృష్ణార్పణం’ అన్న అమ్మమాట తలదాల్చి జీవిస్తున్న చిన్నాదేవి మనసీనాడు చెదిరిపోతున్నది.
రాయలు ఎంత అందగాడు! అచ్చు కృష్ణునిలా… తప్పు తప్పు! కృష్ణుడు భగవంతుడు. మరి రాయలు కూడా భగవంతుని అంశే! ప్రభువు అంటే విష్ణువే కదా! తన పిచ్చిగాని ప్రభువు తనని స్వీకరిస్తాడా! తన జన్మ ఎలాంటిదో ఆయనకి తెలుసా? దేవదాసీ వ్యవస్థలో దేవాలయాలలో ప్రభువుల సమక్షంలో మాత్రం నాట్యం చేసే నర్తకిని ప్రభువు రాణిగా చేసుకుంటాడా! కలతగా నిద్రపట్టింది చిన్నాదేవికి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘ఏయ్‌ మంజరీ ఆగు!’’ చంద్రప్ప మంజరిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
మంజరి అతనికి చిక్కినట్లే చిక్కి జారిపోతోంది.
‘‘ఇలా అయితే నేను నీతో మాట్లాడను’’ అతను బుంగమూతి పెట్టుకొని ఓ చంద్రకాంతశిల మీద కూర్చుండిపోయాడు. దిగువుగా ఉన్న శిలమీద కూర్చుని అతని వడిలో తన్మయంగా తలవాల్చి కూర్చుంది మంజరి.
ఆ ఉద్యానవనంలో వెన్నెల్లో చెట్ల పూలు కొత్తగా మిలమిల్లాడుతున్నాయి. చంద్రప్ప వేణువును తీసి పాడటం మొదలుపెట్టాడు. అతనికి తెలుసు మంజరినెలా అలరించాలో! నాగస్వరానికి వివశురాలైన నాగినిలా ఆమె శరీరమంతా ప్రకంపనలే.
చంద్రప్ప సమక్షంలో… మంజరి నర్తనం ముందు ఇంద్రసభలో అప్సరల నృత్యాలు కూడా సరిచాలవు.
అతని వేణువు నింపుకుంటున్న ఊపిరి విన్పించే పాటను ఆమె కాలి అందెయలు నాట్యంగా అనువదించుకుంటున్నాయి. ఆ నాదానికి ఈ పాదంతోడై ఇరువురి శరీరాలు తన్మయంగా పరవశిస్తున్నాయి. అలా ఎంతసేపు గడిచిందో వాళ్ళకే తెలీదు. రెండు నాగుపాములు జంటగా పెనవేసుకున్నట్లు.
రాత్రి ఒక జాము దాటింది.
పహారా నగారా మోగింది. చంద్రప్ప ఒళ్ళో తలపెట్టి పడుకొన్న మంజరి ఉలిక్కిపడిరది.
‘‘చంద్రా! చాలా పొద్దుపోయింది. నీ దగ్గర ఉంటే కాలం ఆగిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అమ్మ నన్ను చంపేస్తుంది’’ అంది భయంగా.
‘‘భయమెందుకు? నువ్వు నా దానివి… నా నుండి నిన్నెవ్వరూ దూరం చేయలేరు. మంజరీ! నీ నృత్యం నా గానానికి ఊపిరి. మీ అమ్మకి చెప్పెయ్‌. మనం వివాహం చేసుకుందాం’’ చంద్రప్ప ఆమె ముంగురులు సవరిస్తూ వెన్నెల కాంతిలో తళతళలాడే ఆమె కనుపాపల్లో తన బింబాన్ని చూసుకుంటూ చిలిపిగా నవ్వాడు.
ఆ నవ్వు ఆమె మనసులో పులకింతలు రేపింది. పెళ్ళిమాట వింటూనే మంజరి నిటారుగా అయింది.
‘‘నీకు తెలీదు చంద్రా! చిన్నాదేవిగారిని ప్రభువు కోరుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి మా అమ్మకి కూడా అదే ఆశ పుట్టింది. నన్నే రాజ ప్రముఖుడెవరైనా చేసుకుంటే రాజవైభోగాలన్నీ దక్కుతాయని ఆమె ఆలోచన. నీలాంటి సంగీతకారుడికి నన్నిచ్చి పెళ్ళి చేయదుగాక చేయదు’’ నిరాశగా అంది మంజరి.
‘‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నేను నిన్ను వదులుకోలేను మంజూ! మనది జన్మజన్మల బంధం’’ ఆమెను కౌగిట చేర్చుకున్నాడు చంద్రప్ప.
మంజరి అతన్ని వదలలేక వదలలేక వెళ్ళింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అది దేవదాసీల వీధి. ఆ భవనాల్లోంచి అనుక్షణం నృత్యగానాలు విన్పిస్తూ
ఉంటాయి. మంజరి తల్లి కృష్ణసాని ఆ వీధిలోకెల్లా సంపన్నురాలు. మంజరికి చిన్నతనం నుంచి నృత్యం, గానం నేర్పింది. మంజరి భగవంతుని కైంకర్యంగా నర్తిస్తున్నా, కృష్ణసాని కళ్ళు మాత్రం ధనవంతుల కోసం వెదుకుతున్నాయి. ఈ మధ్య మంజరి చంద్రప్పతో పొద్దుపుచ్చటం కృష్ణసాని దృష్టికి రాకపోలేదు. సమయం సందర్భం చూసి కుమార్తెను హెచ్చరించాలనుకుంది.
తల్లి నుంచి ఎటువంటి పెడసరపు మాటలు వినాల్సి వస్తుందోనన్న భయంతో మంజరి మెల్లగా తన కక్ష్యవైపు నడిచింది. పర్యంకం మీద కృష్ణసాని అరుణ నేత్రాలతో కుమార్తెకేసి తీక్షణంగా చూసింది.
మంజరి భయభీత అయి కంపించింది.
‘‘అమ్మా! ఈ వేళప్పుడు…’’ అర్థోక్తిలో ఆగిపోయిందా బేల.
‘‘అదే అడుగుతున్నాను. ఈ వేళప్పుడు ఎవరితో తిరుగుళ్ళు? ఎక్కడ నించి?’’ కృష్ణసాని తీవ్రస్వరంతో అడిగింది.
మంజరి మాట్లాడలేదు. తలవంచుకుని నిలబడిరది.
‘‘ఆ చంద్రప్పదగ్గర్నుంచేనా’’ కరకుగా ఉందా స్వరం.
అవునన్నట్లు తలూపింది మంజరి.
‘‘నేను నీకు గతంలో ఒకసారి చెప్పాను. ఆ ఉన్మత్త గాయకుడితో తిరిగితే లాభం ఏముండదని. ఇదే నీకు ఆఖరుసారి చెప్తున్నాను. నువ్వు అతన్ని మర్చిపో! చిన్నాదేవిలా నీక్కూడా ఓ ప్రభువు లేదా ప్రభువంతటివాడు…’’ తల్లిమాటలు పూర్తికాకుండానే మంజరి ఆపింది.
‘‘నేను చంద్రాన్ని ఇష్టపడుతున్నానమ్మా! అతనే నా జీవితేశ్వరుడు’’ ఆమె స్వరం మెల్లగా ఉన్నా దృఢంగా ఉంది.
కృష్ణసాని తోకతొక్కిన కృష్ణతాచులా లేచింది.
‘‘కళ్ళు పైకెక్కినాయా! చిన్నాదేవి వైభోగం చూశావా! శ్రీకృష్ణదేవరాయ ప్రభువు కూడా రాజుకాకముందే ఆమెను కోరాడు. మాట ఇచ్చాడు. ప్రభువైతే కూడా ఆమెని మరువడు. పట్టాభిషేకం జరుపుకోబోతున్న రాయల మనసులో పట్టమహిషి చిన్నాదేవే! ఎంత అదృష్టవంతురాలామె! నేనెంత కలలు కంటే మాత్రం ఏం లాభం!’’ నిట్టూర్చింది నిస్సహాయంగా కృష్ణసాని.
‘‘అమ్మా! ఇతరులతో మనకెందుకు? అది ప్రభువు ఆదరం. నన్నూ, చంద్రాన్ని ఆశీర్వదించు. కళాపోషకుడైన ప్రభువు నీడలో మా జీవితాలు తరిస్తే నాకదే పదివేలు’’ మంజరి నచ్చచెప్పింది.
‘‘నీ మాట నీదేనా! ఇక పడుకో! రేపటినుంచి నేను చెప్పినదే జరగాలి. మరో ఆలోచనకు తావులేదు’’ విసవిసా బయటికి నడిచింది కృష్ణసాని.
మంజరి విశ్రమించిందేగానీ మనోహర వేణుగానం మదిలో ఆ గదిలో విన్పిస్తూనే ఉంది. ఆమెకదే ఏకాంత సేవాభాగ్యం.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
నర్సప్ప నాయకుని మరణకాలానికి కృష్ణరాయని పట్టాభిషేక కాలానికి విజయనగర సామ్రాజ్య రాజకీయ పరిస్థితులు అంత బాగా లేవు. సరిహద్దు రాజ్యభాగాలు కోల్పోయి రాజ్యం అంతఃబహిర్‌ శత్రువులతో, అంతఃకలహాలతో, బహ్మనీ గూఢచారులతో నిండి సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితులలో ప్రబల రాజాధిరాజు, రాజ పరమేశ్వర, వీర ప్రతాప శ్రీకృష్ణదేవరాయు తిమ్మరుసు ధీయుక్తితో చక్రవర్తిగా పట్టాభిషిక్తుడౌతున్నాడు.
ఆరోజు కృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్నది.
శ్రీజయంతి నాడు జరుగుతున్న ఉత్సవానికి కర్ణాటకాంధ్ర దేశాల ఏలికలకు ఆహ్వానాలు అందాయి.
ఆనాడు విజయనగరం వికసించిన వనవాటికలా సుగంధ పరిమళాలతో విలసిల్లుతున్నది. అనేకమంది రాజులు, పండితులు, కవులు, జ్యోతిష్కులు విచ్చేశారు. నగరాన్ని అరటిబోదెలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. బ్రాహ్మణ శ్రేష్టులు గ్రహశాంతి, హోమయజ్ఞాలు చేశారు. శుద్ధోదక స్నానం చేసిన రాయలు నూతన వస్త్రాలంకార భూషితుడై మరో విష్ణువులా భద్రాసనంపై శోభిల్లుతున్నాడు, వేదపండితుల మంత్రోచ్ఛాటనంతో బంగారు కలశంలోని సకల నదీజలాలతో రాయలకు సంప్రోక్షణ చేశారు. అందరి జయజయధ్వానాల మధ్య శ్రీకృష్ణదేవరాయల కిరీటధారణ జరిగింది.
రాజోద్యోగుల పరిచయం, రాజధానీ సందర్శనం అయినాక రాయలు తల్లికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. మహామంత్రి, పితృసమానులు అప్పాజీ, గురువు వ్యాసరాయల ఆశ్సీసులు పొందాడు. కవులు పద్యాలతో ఆశ్సీసులందించారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరిగాక అప్పాజీ మరోసారి రాయల్ని గౌరవించి కౌగిలించి ఆశీర్వదించాడు. ఈ ఉత్సవానికి గుర్తుగా విరూపాక్ష మందిరంలో ‘రంగనాథ మందిర గోపురం’ నిర్మించబడిరది.
ప్రజలంతా అప్పటికే కృష్ణరాయని గురించి విన్నారు. అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దక్షిణాపథాన మహత్తర గిరి దుర్గం విజయనగరం. ఆ పేరును సార్థకం చేయటానికి రాయలు అనేక చర్యలు తీసుకున్నాడు.
రాచకార్యాలతో వ్యస్తుడైన రాయలకు చిన్నాదేవి అనుక్షణం గుర్తు వస్తున్నది. ఆమెని పట్టమహిషిని చేస్తానన్న తన వాగ్ధానం పదే పదే ఆయన స్మృతిపథంలో మెదుల్తూ అది నెరవేర్చటానికి వేగిరపడుతోంది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘చిన్నా! ఏమిటి ఈ బేలతనం!’’ చిన్నాదేవికి చేరువగా వచ్చి ఆమె మునిగడ్డం పట్టి ఎత్తి కళ్ళలోకి చూసింది మంజరి.ఆ కళ్ళు తామర కొలనులా ఉన్నాయి.
‘‘అవును మంజరీ! నీవీవేళ బాగా గుర్తొస్తున్నావు సుమా! మనిద్దరం ఒకే గురువు దగ్గర నాట్యం నేర్చాం. నా పాదాలు నేడెందుకో మొరాయిస్తున్నాయి. మనం నేర్చుకున్న కృష్ణనృత్యాన్ని ఓసారి ప్రదర్శిస్తావని.’’
చిన్నాదేవి స్వరంలో తెలియని ఆవేదన, అలసట.
నిరంతరం రాయల గురించిన ఆలోచనలతో ఆమె మనసు వడిలిపోయింది. తన రాయలు ప్రభువైనాడు గదా! తననింక గుర్తుంచుకుంటాడా! మనసు నిండా సంతాప మేఘాలు కమ్ముకుంటున్నాయి. తనవల్ల రాయల కీర్తికి ఎటువంటి మచ్చ రాకూడదు. పట్టమహిషి పదవిమీద కూడా ఆమెకి ఆశలేదు. రాయలే ఆమెకి సర్వస్వం. ఆమె అతనికి ప్రియురాలు, భార్య, అర్థాంగి, రాణి కూడా.
మంజరి ముద్ర పట్టి ‘కృష్ణనృత్యం’ చేస్తున్నది. రాధ విరహంతో వేగిపోతూ కృష్ణుని రాకకోసం చెట్టునీ, పుట్టనీ, పులుగునీ, పున్నమినీ స్వామి జాడకోసం అభ్యర్థిస్తోంది.
‘‘రాడేలనే స్వామి రాడేలనే
నా వాడని నమ్ముకొంటి
ఇంతకింత రేయిమించె
రాడేలనే స్వామి రాడేలనే!’’
మంజరి విరహోత్కంఠిత రాధలా మారిపోయింది. ఆమె హృదయంలో అగ్ని బాణాలు గుచ్చుకుంటున్నాయి. నేటికి పది దినాల నుండి చంద్రప్ప జాడ లేదు. అతని సన్నిధి కోసం ఆమె బేలహృదయం పలవరిస్తోంది.
‘‘నే తాళ లేనే చెలియా
నే తాళ లేనే ఓ సఖియా’’
అంటూ ఉన్మత్త విరహిణిలా మంజరి నేలకొరిగింది. అప్పటివరకూ అదే స్థితిని అనుభవిస్తూ విపరీత వేదనకు గురవుతున్న చిన్నాదేవి మంజరి స్థితికి కంగారుపడిరది. ఆమె పరిచారికల సహాయంతో మంజరిని సేద తీర్చింది.
‘‘మంజరీ! ఏమిటిది! నీది నర్తనమా! నిజస్థితి ప్రదర్శనమా?’’
మంజరి బలహీనంగా నవ్వింది. ఆమె ఆహారం తీసుకొని కొన్ని దినాలయిందని గ్రహించింది చిన్నాదేవి. మంజరిని మంచం మీదికి చేర్పించింది. పానీయం ఇప్పించింది. ఆమె సేద తీరాక విషయం అడిగింది.
‘‘మంజరీ! చెప్పు. మనం చిన్నప్పట్నుంచీ నేస్తాలం. ఒకరి మనసు మరొకరు బాగా తెలిసినవాళ్ళం. నీవు చంద్రప్ప ఒకరికొకరుగా మెలగటం నాకూ తెలుసు. ఇప్పటి నీ పరిస్థితికి అతను కారణమా?’’ ప్రేమగా మంజరి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.
మంజరి తలదించుకోవటం వల్ల ఆమె మనసులో ఏముందో తెలీటం లేదు. సన్నగా కంపిస్తున్న ఆమె శరీరం మనోవ్యాకులతను తెలుపుతోంది. చిన్నాదేవి మంజరిని మరి ప్రశ్నించదలచలేదు.
‘‘కాసేపు విశ్రాంతి తీసుకో తర్వాత మాట్లాడుకుందాం’’ అని మంజరిని ఏకాంతంగా వదిలేసి బయటి కక్ష్యలోకి వచ్చింది.
అప్పటికే ఆమెకోసం ఒక వార్తాహరుడు ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయల ప్రేమకు పాత్రమైన ఆమెపట్ల అంతా గౌరవం, వినయాలనే ప్రదర్శిస్తున్నారు. ఏమో! ‘రాబోవు కాలంలో కాబోయే రాణి’ అని తలచి కాబోలు!
‘‘ఏమి వార్త తెచ్చావయ్యా!’’ చిన్నాదేవి రాజసాన్ని ఒలకబోస్తూ ఆసనంపై ఆసీనురాలయింది.
‘‘మహామంత్రి తిమ్మరుసులవారు మరో రెండు గడియల్లో మిమ్ములను కలవనున్నారు. ఇది అతి గోపనీయమని సెలవీయమన్నారు’’ వార్తాహరుడు అభివాదం చేసి నిష్క్రమించాడు.
దిగ్గున లేచింది చిన్నాదేవి. మనసు భయాందోళనలతో, ఆశ్చర్యానందాలతో నిండిపోయింది. ఏమి చేయటానికీ పాలుపోవటం లేదు. అంతటి మహామాత్యుడేమిటి… తమ ఇంటిని పావనం చేయటమేమిటి? విజయనగర సామ్రాజ్య యశస్సుకు మూలస్తంభంలాంటి అప్పాజీ తమబోటి వారింటికి రావటమా! సమయానికి తల్లికూడా ఇంట లేదే!
ఆలోచిస్తుండగానే తిమ్మరుసు మహామంత్రి ధీరగంభీర మూర్తిలా ఆ దేవదాసి ఎదుట నిలిచాడు. తొట్రుపడిరది చిన్నాదేవి.
‘‘మహామంత్రికి ప్రణామాలు!’’ పాదాభివందనం చేసింది. ఆయనను ఆసనం మీద కూర్చుండబెట్టి ఎదుట తలవంచి వినమ్రంగా నిలిచింది ‘ఏమి ఆజ్ఞ’ అన్నట్లు.
సర్వాలంకారభూషితjైు శ్వేతాంబర ధారిణిగా అపర సరస్వతిలా నిలుచున్న చిన్నాదేవి ముగ్ధమనోహర రూపాన్ని ఒక నిమిషం పరికించాడు అప్పాజీ.
‘ఈమె ఇంతటి సౌందర్య సౌశీల్యాలు కల్గిఉంది కాబట్టే రాయలు మనసిచ్చాడు. పట్టమహిషి కాదగిన సకల లక్షణ సముపేత’ అనుకున్నాడు అప్పాజీ.
నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ చిన్నాదేవి మెల్లగా అడిగింది. ‘‘పెద్దలకి నా మీద ఇంత అనుగ్రహానికి కారణమేమో తెలుసుకోవచ్చునా?’’
అప్పాజీ గంభీరముద్ర వహించాడు. మరుక్షణం చిన్న చిరునవ్వు ఆయన పెదవులపై చంద్రవంకలా మెరిసింది.
‘‘అమ్మా! విజ్ఞురాలివి. రాయలు ఏనాడో నీవాడైనాడు.రాజుకు భార్యలెందరున్నా దోషం కాదు. అయినా నీ స్థానం నీదే! ప్రభువుల వివాహానికి అనేక కారణాలుంటాయి. నీవల్ల ఒక సహాయం కోరి వచ్చాను.’’
ఉలిక్కిపడిరది చిన్నాదేవి.
‘‘నావల్లనా అప్పాజీ! విజయనగర సామ్రాజ్యమే మీకెంతో ఋణపడిరది చెప్పండి మహామాత్యా!’’
‘‘చిన్నాదేవీ! కృష్ణరాయలు రాజుకాకముందే వారి అభిమానం సంపాదించావు. నీకాయన ఖడ్గవిద్య నేర్పారు. నీ సహజ లలిత కళాకౌశలాన్ని ప్రభువు అభిమానించారు. ఇప్పుడు రాజయ్యాక పట్టమహిషి స్థానం కూడా నీకివ్వదలిచారు. అయినా రాయలు మరో వివాహం కూడా చేసుకోవాలి. దీనికి రాయల్ని నువ్వే అంగీకరింపచేయాలి’’ అభ్యర్థనగా అన్పిస్తున్నా ఆదేశం ధ్వనించిందా స్వరంలో.
‘‘నేనా’’ చిన్నాదేవి గొంతు జీరవోయింది. ఆమె హృదయవేగం పెరిగింది.
‘‘అవునమ్మా! శ్రీరంగ పట్టణానికి చెందిన వీర శ్యామల రాయల కుమార్తె తిరుమలదేవితో రాయల వివాహం చేయదలిచాను. ఇది ప్రభువుకు, రాజ్యానికి కల్యాణకారణం అవుతుంది. రాయలు నా మాట కాదనడు. కానీ నీ ప్రేమ రాజ్యశ్రేయస్సుకు ప్రతిబంధకం కాకూడదు కదా!’’ అర్థస్ఫురణతో అన్నాడు అమాత్యుడు.
‘‘అప్పాజీ! మీరు నాకు తండ్రిలాంటివారు. ప్రభువు ఉన్నతి కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు నిశ్చింతగా ఏర్పాట్లు జరుపుకోండి’’ చిన్నాదేవి మాటల్లోని గంభీరతకు తిమ్మరుసు మంత్రి ఆశ్చర్యపడ్డాడు. ఆమె మట్టిలో మాణిక్యమని గుర్తించాడు.
‘‘మేము నిన్ను కల్సిన సంగతి రహస్యం సుమా’’ అని హెచ్చరించి గడప దాటుతూ ‘‘మంజరి క్షేమమా’’ అడిగాడు. చిన్నాదేవి తలూపింది.
అప్పాజీ అటువెళ్ళగానే కూలబడిరది చిన్నాదేవి. అశ్రుధారలతో ఆమె
చెక్కిళ్ళు, చీర తడిసిపోయాయి.
‘ప్రభువు తనకు దూరమవుతాడా’ ఆలోచనకే ఆమె హృదయవేదన మిక్కుటమయింది. అన్నింటికీ ఆ విరూపాక్షుడే సాక్షి అనుకున్నది. మంజరి ఎప్పుడువచ్చిందో చిన్నాదేవి భుజంమీద చేయివేసి పిలిచేదాకా తెలీలేదు.
‘‘చిన్నాజీ! నేనంతా విన్నాను. నీ నిర్ణయంలో ఎంత త్యాగముందో రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి.’’
‘‘ఏమో! నా ప్రభువు లేని జీవితం మాత్రం నేనూహించలేను’’ చిన్నాదేవి మంజరిని కౌగలించుకుని రోదించింది.
‘‘అలా ఎన్నటికీ జరుగదు. ప్రభువులు అనేక కారణాలతో ఎందర్ని చేసుకున్నా వారు అనుమతిస్తేనే భార్యగా చెలామణి అవుతారు. ప్రభువు నిన్నేనాడో పట్టమహిషిని చేశారు. మరెందరు భార్యలుంటేనేం? దుఃఖించకు’’ అని ఓదార్చింది మంజరి. చిన్నాదేవి ఒకింత సాంత్వన పొందింది.
‘‘అవును మంజరీ! నువ్వు మహామంత్రికి ఎలా తెల్సు? నువ్విక్కడ ఉన్నట్లు వారికి ముందే తెలుసా?’’ ఈ లోకంలోకి వచ్చినట్లుగా ప్రశ్నించింది చిన్నాదేవి.
‘‘విజయనగర సామ్రాజ్యంలో చీమ కదిలినా కూడా మహామంత్రికి తెలియకపోదు. శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల పట్టాభిషేక మహోత్సవంలో జరిగిన నాట్యప్రదర్శనలో నీతోపాటు నేనూ నాట్యం చేశాను కదా! తిమ్మరుసు మంత్రివర్యులు ఆనాడే నన్ను పసిగట్టారు. మనలో మాట… చంద్రప్ప సంగతి అడిగావుగా! చంద్రాకు అప్పాజీగారు కొన్ని రాచకార్యాలు అప్పగిస్తుంటారు. ఈ పదిరోజులుగా అతను కన్పించలేదంటే అదే అనుకుంటున్నాను.’’
చిన్నాదేవి ఆదరంగా మంజరి చెక్కిళ్ళు నిమిరింది. మేనా తెప్పించి ఆమెను ఆదరంగా సాగనంపింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చిన్నాదేవి రాయలను ఎలా ఒప్పించిందోగానీ, రాయల వివాహం తిరుమలాంబతో వైభవంగా జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగాంబ కోడల్ని ప్రేమతో అంతఃపురానికి ఆహ్వానించింది.
ముత్యాల హారతులు
ముదితలంతా ఈరె
ముద్దుల సీతకు
మురిపాలు మీర ॥
పగడాల హారతులు
పడతులంతా ఈరె
పసిడి పళ్ళెమ్ములో
పూవు లక్షతలుంచి ॥
వజ్రాల హారతులు
వనితలంతా ఈరె
వైభోగములు వెలయ
వాణీశుడే బ్రోవ ॥
తిరుమలదేవికి సాహిత్యమంటే బహుప్రీతి. ఆమె చాలా అందగత్తె. వీణావాదనలో నిష్ణాతురాలు. రాజసం ఉన్న ధీరవనిత. అంతఃపురంలో నృత్యగాన వినోదాలతో పొద్దుపుచ్చుతున్నా తిరుమలదేవి మానసంలో ఏదో ముల్లులా ఒక బాధ. అది చిన్నాదేవి గురించి తెలియటమే!
ఆ రోజు సాయంత్రం తిరుమలదేవి అంతఃపురంలో ‘కృష్ణలీలలు’ నృత్యసన్నివేశం జరుగుతోంది.
‘‘ఈమె ఎవరు? ఇంత అద్భుత సౌందర్యంతో తన్మయపరుస్తున్న ఈ నర్తకి విజయనగర సామ్రాజ్యానికే మణిదీపంలా ఉంది’’ అని మంజరిని చూస్తూ తలపోసింది మహారాణి.
నాట్యప్రదర్శన ముగిశాక మంజరి గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఆమె చిన్నాదేవికి అత్యంత ప్రీతిపాత్రురాలని అవగతమైంది. మంజరి దేవదాసి అనీ, ఆమె నర్తనంలో అలౌకిక దివ్యత్వం ఉందనీ అర్థం చేసుకుంది. ఆమెను అనేక బహుమతులతో సత్కరించింది.
తిమ్మరుసు మహామంత్రికి తన మనసులోని ఆవేదన నివేదించిన తిరుమలదేవి చిన్నాదేవిని అంతఃపురానికి సకల లాంఛనాలతో రప్పించమని కోరింది.
తిరుమలాంబ ధీరత్వానికి అప్పాజీ లోలోపల సంతోషించాడు. సామ్రాజ్య పటిష్టతకు రాయల వ్యక్తిగత జీవన ప్రశాంతత కూడా చాలా అవసరం అని ఆయనకు తెలుసు.
చిన్నాదేవి రాజమందిరంలో చెలికత్తెలతో ప్రవేశించటం రాయలకు మహదానందంగా ఉంది. తిరుమలదేవి స్వయంగా ఎదురువెళ్ళి హారతిచ్చి చిన్నాదేవిని ఆహ్వానించింది. తిరుమలదేవికి ఆమెను చూస్తూంటే తన ప్రతిబింబాన్ని చూస్తున్నట్లే అన్పిస్తున్నా మనసులో స్త్రీ సహజమైన కలత తొంగిచూస్తున్నది.
మంజరి చిన్నాదేవితో బాటు రాజమందిరంలోకి వచ్చిందే కానీ మొహాన చిరునవ్వు మాయమైంది. ఎప్పుడూ అన్యమనస్కంగా ఉంటున్నది. నాట్యం చేసినా ఆత్మ పలకటం లేదు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అప్పాజీ రహస్య సమావేశ మందిరంలో దీర్ఘాలోచనలో నిమగ్నమై ఉన్నాడు. వార్తాహరుడు వచ్చి అందించిన సమాచారం వల్ల ఆయన మనస్సు చాలా అశాంతిగా ఉంది. ఇంతలో చంద్రప్ప వచ్చినట్లు కబురందింది. లోపలికి అనుమతించాడు మహామంత్రి. చంద్రప్ప వచ్చి వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
‘‘చంద్రప్పా! వెళ్ళిన పని ఏమయింది’’ ఆయన మామూలుగా అడిగినా అది ఉరుమంత గంభీరంగా ఉంది.
‘‘మహామాత్యా! మీ ఆనతి ప్రకారం ఉమ్మత్తూరు, శివసముద్రం ప్రాంతాలు పరిశీలించి వచ్చాను. అక్కడి మన వేగులతో సంప్రదించాను. ఆ పాలెగాళ్ళు మన విజయనగర ఆధిపత్యాన్ని లెక్కచేయటం లేదు. వాళ్ళు మనకి పన్నుకట్టరట. త్వరలోనే స్వతంత్రత ప్రకటించుకుంటారట అప్పాజీ!’’ నమ్రతగా చెప్పాడు.
‘‘ఆహా! ఎవ్వరికీ ఏమీ ఉప్పందించలేదు కదా!’’ అప్పాజీ లోతుగా ప్రశ్నించాడు.
‘‘లేదు అప్పాజీ! ఈ మాసం రోజులు నా వేణుగాన ప్రదర్శనలతో ప్రజల్లో ధారాళంగా సంచరించాను.’’
‘‘ప్రజలేమనుకుంటున్నారు?’’
‘‘ప్రజలంతా కృష్ణరాయలవారి పాలనే కోరుకుంటున్నారు అప్పాజీ!’’
‘‘మంచిది. ఇక నువ్వు వెళ్ళవచ్చు’’ తిమ్మరుసు ఆజ్ఞఅయినందుకు వినమ్రంగా నమస్కరించి నిష్క్రమించాడు చంద్రప్ప.
సేనానాయకుడు దండపాణి ప్రవేశించాడు. మహామాత్యులు ఆసీనుడైనాడు. సుదీర్ఘ మంతనాలు జరిపాడు.
‘‘మహామంత్రి! మనం అభివృద్ధిపరిచిన ప్రకారం మన సైన్యం ఏడులక్షల కాల్బలం, ఐదువందల యాభై గజబలం, ముప్ఫైరెండు వేల ఆరువందల అశ్వికదళం, ఇది కాక కామానాయకుడు, తిప్పన్న నాయకుడు, కొండమరెడ్డి, మధుర నాయకుడి ఆధీనంలో వేల కాల్బలం, గుర్రపుదళం, గజబలం కేంద్రీకృతమై యుద్ధసామాగ్రితో సిద్ధంగా ఉంది. రాయలవారు పట్టాభిషిక్తులైన ఈ సంవత్సరంలో మనసైన్యం బహుధా శిక్షణ పొంది ఉంది. ఇంకా కొద్దిరోజుల్లోనే బహుమనీ సుల్తాన్‌ రెండవ మహమ్మద్‌షా, బీజాపూర్‌ యూసఫ్‌ అదిల్‌ఖాన్‌ షాతో కలిసి మనమీద యుద్ధం ప్రకటించబోతున్నారని వేగులవల్ల తెలిసింది.’’
‘‘మంచిది. సైన్యాన్ని ఆయత్తపరచండి. వాళ్ళు సరిహద్దు చేరగానే మన సైన్యం ఆ మ్లేచ్ఛులను చీల్చి చెండాడగలదు’’ మహామంత్రి ఆజ్ఞకాగానే దండపాణి సమరోత్సాహంతో నిష్క్రమించాడు.
ఆ రాత్రి రెండుజాముల వరకు తిమ్మరుసు దీపం వెలుగులో పలు లేఖలు రచించి వేగులతో వర్తమానాలు పంపించాడు. అవి ఎవరికోసం రాశాడో మున్ముందు చరిత్రే చెప్తుంది.
చిన్నాదేవి మందిరంలో ప్రణయ సామ్రాజ్యంలో ఓలలాడి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాయలకీ విషయాలేవీ తెలియవు. మహామంత్రి తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యాన్ని కంటి రెప్పలా కాపాడుతున్నంత కాలం నిశ్చింతగా ఉండొచ్చని రాయల అచంచల విశ్వాసం.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అంతఃపుర సౌధాన్ని ఆనుకొని ఉన్న సుందర ఉద్యానవనంలో చాలాసేపటి నుంచి మంజరి వేచిఉంది. చంద్రాన్ని చూసి ఎంత కాలమైంది! తనను కలవలేనంత రాచకార్యాలేముంటాయి? తను అతనికోసం అంతగా వేదన చెందుతుంటే చంద్రాకి ఇదేవిూ పట్టదా! ఈ రోజు చంద్రుడు నడినెత్తి మీదికి వచ్చే సమయానికి ఈ వసంతవాటికలో కలుస్తానని కబురంపాడు. ఇంతవరకు జాడలేదు.
ఆకాశంకేసి చూసింది మంజరి. మబ్బులు అడ్డగించడం చల్ల చంద్రుడు ఎంతమీదికి వచ్చాడో తెలీటం లేదు. ఉస్సురని నిట్టూర్చింది. చిన్నాదేవిదే అదృష్టం. ప్రభువుకాకముందే కృష్ణరాయని ప్రేమకి పాత్రురాలయింది. ప్రభువయినా రాయలవారి మనసు ఇసుమంతయినా మారలేదుసరికదా తిరుమలాంబతో వివాహమైనా చిన్నాదేవి పట్ల మక్కువ పెరిగిందే కానీ తరగలేదు. ఓసారి నిట్టూర్చి పాలరాతి మండపంలో స్తంభానికి చేరగిలపడి చంద్రప్ప గురించి తలపోస్తున్నది మంజరి.
‘‘ఎదుట ఉన్నవారిని మరిచి ఎంతసేపా ధ్యానం మంజూ’’ చంద్రప్ప ప్రేమపూరితమైన స్వరం విని నిలువెల్లా పులకించింది.
‘‘చంద్రా!’’ ఉదుటన లేచి నిలువెల్లా అల్లుకుపోయింది.
‘‘ఇన్నాళ్ళకా చంద్రా! నేనేమైపోవాలి’’ ఆమె గొంతు మూగవోతున్నది.
‘‘మన్నించు మంజూ! అప్పాజీవారు అప్పగించిన స్వామికార్యంలో నిమగ్నమై నిన్ను కలవలేకపోయాను’’ బుజ్జగిస్తూ చెప్పాడు. ఆమె భుజంమీదుగా చేయివేసి లతామండపానికి తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు.
‘‘నువ్వు వినే ఉంటావు. మనకీ, బహుమనీ సుల్తాను, బీజాపూర్‌ సుల్తాన్‌లు కలిసి జరిపిన యుద్ధం గురించి’’
‘‘అవును… మనం సాధించిన విజయవార్త కూడా విన్నాను… విజయనగర సైన్యం శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడిరదనీ, మహ్మద్‌షాకు తీవ్రగాయాలైనాయనీ’’
‘‘ఆ! అంతేకాదు. పిరికితనంతో పలాయనం చిత్తగిస్తున్న మహ్మదీయ సైన్యాన్ని మనవాళ్ళు తరిమి తరిమి కొట్టారు. ఈ యుద్ధంలో బీజాపూర్‌ యూసఫ్‌ ఆదిల్‌షా మరణించాడు. అతని కుమారుడు పన్నెండేళ్ళ బాలుడైన ఇస్మాయిల్‌ ఆదిల్‌ఖాన్‌ సుల్తాన్‌ అయ్యాడు. ఇస్మాయిల్‌ బాలుడు కావటాన బీజాపూర్‌లో కామల్‌ఖాన్‌ సర్దారు అధికారం చేజిక్కించుకున్నాడు. బీదర్‌ ఆక్రమించి సుల్తాన్‌ మహమ్మద్‌ షాని బందీని చేశాడు. రాయచూర్‌ని జయించాక కామల్‌ఖాన్‌ హత్య తర్వాత రాయలు మహమ్మద్‌ షాని బంధవిముక్తుడ్ని చేసి మళ్ళీ సుల్తాన్‌ని చేశాడు’’ సంతోషంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘ఇవన్నీ విజయనగర పౌరులందరికీ తెల్సినవే! రాయలవారికి ‘యవనసామ్రాజ్య స్థాపకాచార్య’ బిరుదు ప్రదానం అందుకే కదా’’ నవ్వింది మంజరి ఉల్లాసంగా.
‘‘మంజరీ! అన్నీ శుభవార్తలే! ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత మళ్ళీ నీ సుందర వదనారవిందాన్ని చూసే అదృష్టం కలిగింది. నా దేశాంతరవాస శ్రమంతా నీ చిరునవ్వుతో, ఆలింగన స్పర్శతో తీరిపోయింది’’ చంద్రప్ప మంజరిని తన బాహువుల మధ్య మళ్ళీ చేర్చుకున్నాడు. మంజరి గువ్వలా అతని కౌగిట ఒదిగిపోయింది.
‘‘చంద్రా! మరో ముఖ్య విషయం. నేను నీ ఎడల అనురాగాసక్తనై ఉన్నట్లు చిన్నాజీకి తెల్సింది.’’
అతను కౌగిలి నుంచి విడివడి ఆమె కళ్ళల్లోకి చూశాడు.
‘‘నువ్వే చెప్పావా?’’
‘‘లేదు. ఆమె గ్రహించింది. రాయలవారి అనుంగు పట్టమహిషి ఆమె. ఆమె ప్రియసఖిని నేను. నా మనసు తెలుసుకోవటం అంత కష్టమేమీ కాదులే!’’ బుంగమూతి పెట్టింది మంజరి.
‘‘అప్పాజీవారు కూడా మనకి ఆశీస్సులందిస్తారు’’ నమ్మకంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘అప్పాజీవారా’’ ఆశ్చర్యంగా చూసింది మంజరి.
‘‘అవును. ఈ రాచకార్యం మీద నేను దేశాంతరం వెళ్ళేముందు వారు ‘కళ్యాణమస్తు’ అని కూడా ఆశీర్వదించారు.’’
‘‘అయితే అది మన కోరిక తీరే దీవెనే’’
‘‘అయినా కొంచెం ఆగాలి సుమా’’
‘‘ఇంకానా’’ ఆమె అతని భుజంపై తలవాల్చింది.
‘‘రాయలవారు దక్షిణ దిగ్విజయయాత్రకు బయలుదేరుతున్నారు. నీకు తెలుసుకదా! ప్రభువుతోబాటు సైన్యమే కాదు కళాకారులు, కవులు కూడా యుద్ధరంగానికి తరలి వెళ్తున్నాం’’ ఉత్సాహంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘మీరు కూడానా! యుద్ధరంగానికా! ఇదేమిటి చంద్రా! అక్కడ మీకేం పని? వేగు పనిచేయటం వేరు. వేణుగానంతో మనసుల్ని అలరించే లలిత హృదయుడివి. రక్తపుటేరులు పారే కదనభూమిలో నిలువగలవా?’’ భయాందోళనలతో అడిగింది మంజరి.
ఆమె చేతిమధ్య అతని చేతిని బిగించి పట్టుకోవటంలోనే అతనిపట్ల ఆమెకున్న ప్రేమానురాగాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రప్ప చిన్నగా నవ్వాడు. అతనికి తెలుసు ఆమె మనసులో చెలరేగే సంఘర్షణాజ్వాల.
‘‘రాయలవారు ఏ జైత్రయాత్రచేసినా కవులు, కళాకారులు సైన్యంతో పాటు బయలుదేరాల్సిందే. సాయంత్రం యుద్ధవిరమణానంతరం ప్రభువు కవిపండిత గోష్ఠితో మానసోల్లాసం పొందుతారు. అల్లసానిపెద్దన, నందితిమ్మన వంటి కవులు కూడా వస్తున్నారు. నా గానంతో ప్రభువు అలసట ఉపశమిస్తే అంతకంటే మనకు కావలసినదేముంటుంది మంజరీ!’’ ఆమె చుబుకం పట్టి చెప్పాడు చంద్రప్ప మృదువుగా.
కళ్ళల్లో నీళ్ళు కనపడకుండా తలదించుకుంది మంజరి.
‘‘నేనూ వస్తాను. నా నాట్యంతో ప్రభువుల్ని అలరిస్తాను’’ బింకంగా అంది.
‘‘స్త్రీలను తీసుకెళ్ళటంలేదు’’ చంద్రప్ప అర్థవంతంగా నవ్వాడు.
‘‘ఓహో! ప్రభువు స్త్రీలను తగురీతిగా గౌరవిస్తారని విన్నామే!’’
‘‘అది ఆస్థానంలో! శత్రువుల మాయోపాయాలతో ద్వేషం బుసలుకొట్టే రణరంగంలో కాదు.’’
ఆమె నిరుత్సాహపడిరది. చంద్రప్పతో వియోగం సహింపరానిదిగా ఉంది. అతనామె మనస్థితిని గ్రహించాడు.
మరుక్షణం మొదలైన అతని వేణుగాన మాధురీ తరంగాలు ఆమెను చుట్టుముట్టేశాయి.
ఆమె ఉన్మత్త నాగినిలా ఉంది. ఆ రాత్రి శరీరమంతా వేయినాగులు చుట్టుకున్నట్లు మంజరి నర్తించింది. కారణం ఆ ప్రకృతికి తెలుసు. చంద్రప్పకీ తెలుసు. రాత్రి రెండవరaాము నగారా మోగింది.
చిన్నాదేవి మందిరంలో ఆమెను వక్షస్థలానికి చేర్చుకుని నిద్రిస్తున్న శ్రీకృష్ణరాయలకి లీలగా మెలకువ వచ్చింది. చిన్నాదేవి ప్రభువు హృదయంపై తలవాల్చి ‘రాయలే లోకం’ అన్నట్లు నిద్రిస్తోంది.
దూరంగా గాలితరంగాలు భారంగా మోసుకొస్తున్న వేణుగానం వింటుంటే ఆ కళాకారుడు ఆనందపరవశంతో పాడుతున్నట్లు అన్పించదు. ఏదో హృదయ తాపాన్ని గానరూపంలో వెలిబుచ్చుతున్నట్లనిపిస్తుంది. ఎవ్వరో ఆ గాయకుడు? మున్నెన్నడూ విన్నట్లు లేదు. నడిజామున ఈ విరహగానాలాపన ఏంటి? కృష్ణరాయలకు నిద్రాభంగమైంది. కాపలావారిని పిల్చి ఆ గానాన్ని ఆపించుదామనుకున్నాడు. కానీ మనసొప్పలేదు. ఒకనాడు చిన్నదేవి కోసం తాను పడిన వేదనను గుర్తుచేస్తున్న గానం అది. ఆ వేణుగానం మెల్లగా మంద్రస్థాయికి దిగింది. క్రమంగా గాలిలో విలీనమైంది. ప్రభువుకు కలతగానే నిద్రపట్టింది.
‘‘ఇక నేను వెళ్ళివస్తాను మంజూ!’’
‘‘అప్పుడేనా’’ దిగాలుగా అందామె.
‘‘ఉదయానికే ప్రయాణానికి సన్నద్ధం కావాలి మరి’’ ఆమెను మరోసారి సందిట చేర్చి ముద్దాడి వీడ్కోలు పలికాడు చంద్రప్ప.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలకు దేవేరిలిద్దరూ హారతిచ్చి వీరతిలకం దిద్ది యుద్ధరంగానికి సాగనంపారు. రాయల దక్షిణ దిగ్విజయ యాత్ర మొదలైంది. కాలం నడక వేగం పుంజుకుంది.
అంతఃపురంలో చిన్నాదేవి దిగులుగా ఉంది. ఆభరణాలు, అలంకారాలు లేవు. మంజరి రావటం చూసింది.
‘‘రా మంజరీ!’’
‘‘ఏంటి చిన్నాజీ ఇంతటి వైరాగ్య వేదన! నిరాలంకరణ దేనికి?’’
‘‘ప్రభువు దగ్గరలేని అలంకరణ దేనికి మంజరీ! నేటికి పదినెలలు గడిచింది ప్రభువు యుద్ధానికి వెళ్ళి.’’
‘చంద్రప్ప వెళ్ళి’ మనసులో మంజరి అనుకుంది.
‘‘ఆ వార్తలు తెలుస్తున్నాయి గదమ్మా! అంతా జయమే’’ పైకి బింకంగా అంది.
‘‘కానీ నాకు మాత్రం క్షణమొక యుగంలా ఉందే!’’
‘‘పాద సంవాహన చేయించనా’’
‘‘వద్దు! ఓ పాట పాడు’’
మంజరి గొంతు సవరించుకుని ఓ గీతాన్ని ఆలపించింది.
‘‘మోహన మురళి ఊదవోయి కృష్ణా!
తేనెలొలికే పాట మధువు
ఓపలేదీ రాధ బ్రతుకు’’
‘‘మంజరీ! నా బాధ పెంచే పాటే పాడుతున్నావే’’ చిన్నాదేవి వారించింది.
‘‘మనిద్దరిదీ ఒకే బాధగదా చిన్నాజీ’’
‘‘అంటే చంద్రప్ప కూడా’’ ప్రశ్నార్థకంగా అడిగింది చిన్నాదేవి.
మంజరి అవునన్నట్లు తలాడిరచింది. నిట్టూర్చింది చిన్నాదేవి. మంజరిని పంపేసింది గానీ మనసు కుదుటపడలేదు. రాజులకి యుద్ధాలు తప్పవు. అలాగే వారి ప్రియసతులకీ వేదనా తప్పదనుకొంది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
యాభైవేల కాల్బలం, రెండువేల అశ్వికదళంతో గంగరాజు పాలిస్తున్న శత్రుదుర్భేధ్యమైన ఉమ్మత్తూర్‌ కోటను రాయలు ముట్టడిరచాడు. భీకర పోరాటం సాగుతున్నది.
యుద్ధశిబిరంలో కృష్ణరాయలకి నిద్రరావటం లేదు. శ్వేతాంబరధారిణి అయిన చిన్నాదేవి జ్ఞప్తికి వస్తోంది. ఆమె బాహువుల్లో ఒదిగి హాయిగా నిద్రించే రోజెన్నడో! ఏదైనా గానం వింటే మనసుకి కొంత ఊరట. చంద్రప్పకు కబురందింది.
అతని బాధాతప్తగానం రాయల హృదయానికి ఊపిరులూదుతోంది. ఇదివరలో రాత్రివేళ విన్న గానమిదే! ఇతనికీ ఓ ప్రేయసి ఉందేమో! లేదంటే ఎందుకింత విరహ వ్యధ? ఈ యుద్ధంవల్ల లాభమా! నష్టమా! హిందూ సామ్రాజ్య సంస్థాపన కోసం కంకణంగట్టుకున్న తాను ఇలాంటి ఆలోచన చేయొచ్చా?
ప్రభువు నిద్రించారని గ్రహించి ఆలాపన ఆపేశాడు చంద్రప్ప.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
సంవత్సరం పాటు జరిగిన పోరులో గంగరాజు మరణంతో ఉమ్మత్తూర్‌పై విజయం సిద్ధించింది. శ్రీరంగపట్నం జయించి విజయుడై వస్తున్న రాయలకు విజయనగర ప్రజలు హర్షధ్వానాలతో జేజేలు పలికారు.
మంజరి మనసు పాలసముద్రంలా ఎగసిపడుతోంది. వార్తాహరుని ద్వారా చిన్నాదేవి మందిరంలో అందరికీ తెల్సిన వార్త ఆమెలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. చిన్నాదేవి కూడా పరవళ్ళు తొక్కే నదిలా పూజామందిరంలో నృత్యం చేయటం చూసి మంజరి చాలా సంతోషించింది. ఎవరికైనా మనసు ప్రతిబింబించేది ఆరాధించే కళలోనే గదా!
తిరుమలదేవి, చిన్నాదేవిలతో కొలువుతీరిన ప్రభువు రుక్మిణీ సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణునిలా భాసించాడు. నాటి కొలువులో చంద్రప్ప గానానికి మంజరినాట్యం కళాకోవిదుల ప్రశంసలు పొందింది. తిమ్మరుసు మంత్రి వాళ్ళిద్దరికీ ఆశీఃపూర్వకంగా సంభావనలిచ్చాడు. రాయలు మహాదానాలు చేశాడు.
దక్షిణాపధాన విజయప్పనాయకుడి దండయాత్రవల్ల చేర, చోళ, పాండ్యరాజులు విజయనగరానికి సామంతులు కావటం రాయల కిరీటంలో మరిన్ని మణులు చేరినట్లయింది.
కృష్ణరాయల కోసం బంగారంతో రత్నాలు, వజ్రాలు తాపడం చేసిన కళాత్మక సింహాసనం ఏర్పాటయింది. చక్రవర్తి కోశాగారం నిండిరది. లక్షకిపైగా నివాస గృహాలున్న విజయనగరం లక్ష్మీశోభతో కళకళలాడుతోంది. బహుభాషా కోవిదులు, చాకచక్యంగల చారుల సేవలవల్ల విజయనగరం మరింత భద్రంగా శోభిల్లుతున్నది.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖల్లో కవిరాజు…

by Cheedella Seetha Lakshmi June 14, 2022
written by Cheedella Seetha Lakshmi

కవిరాజు బిరుదాంకితులు త్రిపురనేని రామస్వామి చౌదరి " మహా మేధావి,తాత్వికుడు,పండితుడు,విమర్శకుడు,సంఘసంస్కర్త,భావుకుడూను.అందుచేత వారి ఆలోచనలు,భావాలు,వాటిలో వచ్చిన పరిణామం తెలుసుకోవడం అవసరం" అంటారు ఆవుల సాంబశివరావు గారు ఆముఖంలో

సూతపురాణం,కురుక్షేత్ర సంగ్రామం,శంబుకవధ,ఖూనీ,వివాహనిధి,కుప్పుస్వామి శతకం,ధూర్తమానవా,సూతాశ్రమ గీతాలు,పల్నాటి గీత మొదలైనవి రచించిన త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాది,నాస్తికుడు.స్వాతంత్ర్య సమరయోధుడు, ఆ కాలంలో సంఘాన్ని ఎదిరించి పోరాడి మానవతా విలువలను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టిన గొప్ప సామాజిక కవి జనవరి 15 వ తేదీ 1887 వ సంవత్సరంలో కృష్ణాజిల్లాలోని అంగలూరు గ్రామంలో రామమాంబ,చలమయ్య దంపతులకు జన్మించాడు.

రైతు కుటుంబంలో పుట్టినా చిన్నప్పటినుండి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు.మెట్రిక్యులేషన్ చదివేటప్పుడే పల్నాటి యుద్ధము ఆధారంగా కారెంపూడి కథనం,మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అను రెండు నాటికలు 23 వ యేట రచించాడు.1911 సంవత్సరంలో బందరు లోని నోబుల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అవధానం చేసి ప్రతిభను చాటుకున్నాడు.

1914 సంవత్సరంలో న్యాయశాస్త్రం చదివేందుకు లండన్ లోని డబ్లిన్ కు వెళ్లి న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యం, ఆధునిక ఐరోపా సంస్కృతిని కూడా అధ్యయనం చేశాడు. 1914 సంవత్సరంలో అనిబిసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమానికి మద్దతు నివ్వాలంటూ భారతీయులకు విజ్ఞాపన చేస్తూ డబ్లిన్ నుండి కృష్ణాపత్రికకు తన రచనలు పంపించాడు.దేశభక్తి గీతాలు రాశాడు.
భారతదేశం తిరిగివచ్చాక మచిలీపట్నంలో న్యాయవా వృత్తిని చేపట్టాడు.సామాజిక అన్యాయాల మీద పోరాటాలు చేస్తూ తెనాలిలో స్థిరపడి 1925 సంవత్సరంలో జస్టిస్ పార్టీ తరఫున తెనాలి పురపాలక సంఘ అధ్యక్షునిగా ఎన్నికై గంగానమ్మ కొలువులో నిర్వహించే జంతుబలిని నిషేధించినందుకు అవిశ్వాసతీర్మానం పెట్టి పదవినుండి తొలగించినా వెంటనే జరిగిన ఎన్నికల్లో ఎన్నికై తిరిగి అధ్యక్షుడై 1938 వరకు ఆ పదవిలో ఉన్నంతకాలం జంతుబలిని నిషేధించాడు. ఈయన గృహానికి సూతాశ్రమం అని పేరు పెట్టుకున్నాడు.

1898 సంవత్సరంలో పున్నమ్మను పెళ్లి చేసుకున్నాక అసమర్థుని జీవయాత్ర రచించిన ప్రముఖ కవి గోపీచంద్ 1910 సంవత్సరంలో పెద్దకుమారునిగా జన్మించాడు.
భార్య చనిపోగా చంద్రమతిని ఆమె చనిపోగా అన్నపూర్ణను 1932 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు.గోపిచంద్ కుమారుడే సినీ నటుడైన సాయిచంద్..
త్రిపురనేని సాహిత్యకృషిని గుర్తించిన ఆంధ్ర మహాసభ వారు కవిరాజు బిరుదునిచ్చి సత్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతీయేడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. 1987 సంవత్సరంలో శత జయంతి సందర్బంగా భారతదేశ ప్రభుత్వం కవిరాజు స్మారక చిహ్నంగా ఒక తపాలాబిళ్ళను విడుదల చేసింది.హైదరాబాద్ ట్యాంకుబండ్ పై రామస్వామి విగ్రహం నెలకొల్పారు.

సంస్కృత భాషలో ఉన్న పెళ్లి మంత్రాలను తెలుగులో అనువాదం చేయడమే కాక ఎన్నో పెళ్లిళ్లకు స్వయంగా పౌరోహిత్యం చేసి అంటరానితనాన్ని వ్యతిరేకించిన సంఘ సంస్కర్త ,ఆదర్శవాది. ఈయన 1943 సంవత్సరం జనవరి 16 వ తేదీన తనువు చాలించాడు. పుట్టుక గిట్టుక రెండు జనవరి 15,16 కావడం విశేషమే.

కవిరాజు 1914 సంవత్సరంలో డబ్లిన్ నగరానికి వెళ్లి బారిస్టర్ పట్టా గ్రహించి 1917 సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చారు.ప్రయాణ సమయంలో కొలంబో,ప్యారిస్ నగరాల నుండి,తర్వాత డబ్లిన్ నగరం నుండి ముట్నూరి కృష్ణారావు గారికి రాసిన లేఖల్లో వ్యక్తిగతాభిప్రాయాలు,
ప్రయాణ విశేషాలు, అనుభవాలు,మన దేశ సంస్కృతి,సాహిత్య విషయాలు ఇమిడి ఉన్నాయి.

ముందు సింహళ ద్వీపానికి వెళ్ళాడు.కొలంబో నుండి వ్రాసిన ఉత్తరం మొదటిది.ఇది 31.10.1914 నాడు వ్రాయబడింది.దీనిలో సింహళ ద్వీప సౌందర్యం వర్ణింపబడింది." లంక యంతయు నేడొక యుద్యానవనముగా గన్పట్టుచున్నది.ఎచ్చట జూచినను పచ్చని పట్టుబట్టలను పరచినట్లు జొమ్పములచే నలంకరింపబడిన లతా సముచ్ఛాదితములైన వృక్షములు గన్పట్టును.ఎండిన వృక్షములను చూపరులకు నింపుబెంపమని తీవలు గుబురుగా నలముకొని యుండును.

నేను జూచినవరకింత ఫలవంతమగు ప్రదేశము వేరొండు కన్పట్టదు.సింహళమునకు నేడు కొలంబో ముఖ్యపట్టణము.పాశ్చాత్య నాగరికతయు,బూర్వ నాగరికతయు నిచ్చట గ్రుమ్ములాడుచున్నవి.తుదకు పాశ్చాత్య నాగరికతయే మేలు చేయి యైనది.” అంటూ దృశ్యానుభూతిని ఎంతో చక్కగా వివరించాడు.గ్రాంథిక భాషలోనే రాయడం విశేషం.

అదే లేఖలో ఒక దుకాణంలో తనకు కావలసిన వస్తువులు కొంటున్న సమయంలో ఒక బౌద్దుడు వచ్చాడు.బౌద్ధునికి కవిరాజుకు మధ్య జరిగిన సంభాషణలో ఇండియాలో బౌద్దమతం నశించింది.సింహళంలో కూడా నశించిపోతుందని విన్నానంటూ చౌదరి గారు అనగా బౌద్దుడు ముప్పాతిక భాగం బౌద్ధులే కానీ మతానికి పాటుపడేవారు లేరని చెప్తూ మేము కులభేదాలతో చచ్చిపోతున్నామన్నాడు.చౌదరి ఆశ్చర్యపోయి ” సర్వ జంతువులయందు సోదరభావముండవలయుననిహెచ్చు లొచ్చులులేవనియు,బోధించిన కరుణామయుడగు బుద్ధుడిది వినిన ఎంత దుఃఖించునో గదా!” అని అనేసరికి బౌద్దుడు కులభేదం నశిస్తేనే మనకు పురోభివృద్ధి అని చెప్పాడు.
ఆ బౌద్ధుని పేరు ఫెర్నినాండ్.తర్వాత కవిరాజు స్టీమరెక్కి ప్రయాణం కొనసాగించాడు.

డబ్లిన్ నుండి రాసిన లేఖలో అర్చకుల విషయం,దేవాలయ మాన్యాల విషయంపై అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.అర్చకులను మతప్రచారకులుగా చేసి దినవెచ్చాలకై ,ఉత్సవాలు జరపడానికి ,దేవాలయాలు శిథిలావస్థ పొందకుండా కాపాడడం కోసమే మాన్యములీయబడ్డాయని,
అయితే అర్చకుల పోషణభారమెప్పుడూ గ్రామస్థులపైనే ఉండేదని,అధికాదాయాన్ని వినియోగపరచేదెట్లాయని బుద్ధిమంతులాలోచించాల్సిన విషయమని అంటాడు.

అర్చకుల ధర్మాన్ని గూర్చి ,పెద్దల కర్తవ్యాన్ని గురించి చక్కగా వివరించాడు. అర్చకులచేత ఊడిగం చేయించడం కంటే అర్చకులకు వారి విద్యుక్తధర్మాలను తెలిపి వారిని విద్యావంతులుగా చేసి,మతగ్రంథాలను చదివించి,అర్చక సమాజమేర్పరచి మతప్రచారకులుగా నెందుకు ప్రయత్నం చేయరాదని ప్రశ్నిస్తాడు.
అర్చకులను కూలివాండ్రను చేసి దేవునిసేవ చేయించుట కన్న మతంపట్ల వారికాసక్తి కలిగించి,దేవాలయాలందు అభిమానం కుదిర్చి మతవ్యాప్తికి దోహదపడేట్లు చేయడం యుక్తమని భావించాడు.హిందువులమై యుండి కూడా హిందూమతమంటే ఏమిటో తెలియకుండా మాట్లాడేవాళ్ళం మనం అంటాడు.

మతాచార్యులంటే మానవులే కదా.గృహస్తు ఏ మతస్తుడో ఆ మతాచార్యుని కూడా భగవత్పూజ తర్వాత పూజించాలి కానీ త్రిమతాచార్యులనెందుకు పూజించాలి అని ప్రశ్నిస్తూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు లేఖలో..
సంఘాన్ని విమర్శించడం లేఖల్లో కనిపిస్తుంది.” హిందూదేశము స్వరాజ్యమును కాంక్షించుటలేదు”.అన్న వార్తను పత్రికలో చదివి బ్రాహ్మణేతరులు చేసిన ఈ తీర్మానాన్ని నిరసిస్తూ లేఖాముఖంగా తెలియచేశాడు.” ఈ చెన్నపట్టణమున బ్రోవైన యీ బ్రాహ్మణేతరులకు యావత్భారత దేశమునందున్న బ్రాహ్మణేతరుల పక్షమున నీగతి దీర్మానించుటకు నెవ్వరధికారమిచ్చిరి? కటా! స్వలాభపరులెవ్వరో యీ నీచకార్యమునకు దిగి యుందురు.కాని నీ తీర్మానము బ్రాహ్మణేతరులందరు నంగీకరించుటలేదనియు,బ్రిటిషువారి యధికారము క్రింద స్వరాజ్యమును ( హోమ్ రూల్) బొందుట మాకు బరమ సమ్మతమనియుం దెలియజేయుచున్నాను.” అని తన నిర్ణయాన్ని వెంటనే తెలియచేశాడు. మనము తాకితే స్నానము చేయడం,నీరు ముట్టుకుంటే త్రాగకపోవడం,దేవాలయాల్లోకి పోనీయక పోవడం మొదలగు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిగుట్టు విదేశీయులకు తెలిపి, బ్రాహ్మణులు మనకపకారం చేశారని హిందువుల కుత్తుకలను కత్తిరించడానికి కత్తిని ఇతరుల చేతిలో పెట్టడం అవివేకం అంటూ” బ్రాహ్మణులు నా కడనుండి యపహరించిన హక్కులను వారికడనుండి బలిమియై గుంజుకొనియెద గాని యీ కార్యమును జేయము.” అని తన మనో నిశ్చయాన్ని వ్యక్తపరచాడు.మనలో మనకు ఎన్ని విభేదాలున్నా ఉండొచ్చు కానీ బయట వారిముందు మనందరం ఒక్కటే .ఇతరుల ముందు మన లోటుపాట్లను బయటపెట్టడం మూర్ఖత్వం అని అనడంలో కలిసి మెలసి స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం వెలిబుచ్చాడు.

ప్యారిస్ నుండి రాసిన ఉత్తరంలో హిందూ స్త్రీ ఔన్నత్యాన్ని నిరూపిస్తూ వివరించాడు.ప్యారిస్ నగరానికి వెళ్ళడానికి రైలెక్కాడు కవిరాజు.రైలులో జరిగిన సంఘటనను తిలకించి ” ఫ్రెంచి మత్తకాశిని యోర్తు మా ప్రక్క గదిలో కూర్చుండెను.ఆ విలాసినికిని మా గదిలోనున్న ఇంగిలీషు యువకునికి ప్రసంగము గలసినది.ఆ యుత్తర క్షణముననే హృదయములు కలిసిపోయినవి.పదంపడి నా యెట్ట యెదుట,నా కట్టెదుట ,నా కన్నుల యెదుట జరిగిపోయినవి.మన దేశమున నిట్టి యకృత్యము వారాంగనయైనను సల్పదని నా నమ్మకము ” అని తన జుగుప్సాభావాన్ని వ్యక్తం చేస్తూ హిందూ స్త్రీల ఔన్నత్యాన్ని సమర్ధిస్తూనే పశ్చిమదేశాలనుండి ఎన్ని విషయాలను మనం నేర్చుకోవాల్సినవి వున్నా ఈ విషయంలో మాత్రం మనమే వారికి నేర్పాల్సిన అవసరం ఉంది అంటాడు.” హిందూదేశము యొక్క ఔన్నత్యమంతయు చిరకాలము నుండి స్త్రీల పాతివ్రత్యముపై నాధారపడి యున్నది. అది లేని నాడు హిందూదేశము సమూలముగా నధోలోకము పాలయినను మనము చింతింపవలసిన యగత్యము లేదు…మనమే సగర్వముగ,సానందముగ మన మహా పతివ్రతలను జూసి వాని చిత్త స్వాస్థ్యమును బొందగలుగుదము.మనకెట్టి ఔన్నత్యము కూర్చునవియైనను,దీనికి బ్రతిబంధకములగు మార్గములను వందనములతో ద్యజింపవలయును”. అని ఎంతో గొప్పగా హిందూ స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతూ ఏ.వారాంగన కూడా ఇంత నీచానికి పాల్పడదు అనడం వల్ల మన సంస్కృతి పట్ల ఉన్నతభావం కలిగిన వ్యక్తిగా కన్పిస్తాడు.విదేశాల్లో చదివినప్పటికి దేశం పట్ల అపారప్రేమను చాటుకున్నాడు లేఖల్లో.

“స్త్రీ స్వాతంత్య్రమే ఐరోపాఖండ సకలైశ్వర్యాలకు యాధారము” అంటూ వారి చిత్తశుద్ధి,కార్యదీక్ష,దయారసము,శౌర్యసాహసాలు చూసినట్లయితే వారు స్త్రీ ప్రపంచానికే కీర్తి తెచ్చిపెడుతున్నారని అజ్ఞానాంధకారములో మునిగిన భారత స్త్రీలు సంఘసేవ అనే ఉత్తమ ధర్మాన్ని పాశ్చాత్య స్త్రీల నుండి నేర్చుకోవాల్సింది అని అంటాడు ఆనాడు చౌదరి ఆశించిన ఆశయం నేడు మనం స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజ వేసి ఉన్నత శిఖరాలధిరోహించడంలో తిలకిస్తున్నాం.దేశానికి పేరుప్రతిష్టలు తెచ్చి వారి వంతు స్థానాన్ని ఆక్రమిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.

డబ్లిన్ నుండి వ్రాసిన ఉత్తరంలో ‘ధర్మసాధని’ పత్రికలో ” లవ్” శబ్దంపై తగిన నిర్వచనమివ్వలేదని సంతృప్తిచెందక ‘ లవ్’ శబ్దంపై సుదీర్ఘ లేఖ రాశాడు.ఒక పారశీక కవి వ్రాసిన శ్లోకంలో హిందూసతిని గురించి రాసిన వాక్యసారాంశం గమనింపవలసి వుంది ” హిందూ సాధ్వివలె సమరాగము నందు స్వార్థ త్యాగమును జూపించు జంతువును నీ జీవత్ప్రపంచమున నెచ్చటను గానము.వెలుగుచున్న దీపమునుండి వేలకొలది పురుగులు మ్రగ్గ గలవు గాని,మారిపోయిన రూపరహితమైన నిప్పునంబడి యొక్కటేని మ్రగ్గజాలదు…లవ్ నందు స్వార్థ త్యాగములని యెడల పవిత్ర భావ మెచ్చట నుండును” అంటూ ఆంధ్ర భాషలో లవ్ శబ్దానికి పర్యాయపదమే లేదని సీతారాముల పరస్పరానురాగం,సావిత్రీ సత్యవంతుల ప్రేమానుబంధం,కృష్ణునియందు లీనమయిన రాధ ఐక్యభావం మొదలైనవి లవ్ మూలధనం” యవ్వనంలో ఆవిర్భవించిన లవ్ క్షణికమైంది ఇది నేటి పాశ్చాత్యులలో కనిపిస్తుంది తాత్కాలిక కష్టాలకోర్వజాలని “లవ్” లవ్ ఎట్లా అవుతుందని ప్రశ్నిస్తాడు.
విషయ సుఖానుభూతితో కూడింది మృగలక్షణమని ఈసడించి ఇతర దేశాలనుండి మన దేశంలోకి దిగుమతి కాబడిన లవ్ ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉన్నాము.బ్రిటిష్ సామ్రాజ్యంలో ” సామాన్య జనుల యందు నూటికి పదిమంది కొఱకుడు చేతను,నిరువదిమంది సెగరోగము చేతను,నిరువది మంది యితర రోగముల చేతను బీడింపబడుచున్నారు.ఇక బ్రిటిషు సైన్యమునందు నూటికి నెనుబదిమంది యీ వ్యాధిగ్రస్తులై యున్నారు” అని సుఖవ్యాధుల గురించి వివరించాడు.” పాశ్చాత్యులనుండి గ్రహింపదగినవి యావగింజలో నరభాగమైన లేదు.రాజకీయవిషయముల మనము నేర్చుకొనదగినది పెక్కులున్నవి” అని అంటూ ధర్మసాధని ఇటువంటి నీతులుపదేశించి దేశీయులను మోసపుచ్చడం మంచిది కాదని సత్యం తెలుసుకొని హితోపదేశాలను ప్రచురించాలని హెచ్చరిస్తూ లవ్ పవిత్రతను తెలియచేశాడు.

వేరే లేఖలో మార్సెల్సు పట్టణం చేరుకున్న తర్వాత ప్యారిస్ పోవడానికి పాస్ పోర్ట్ కోసం 'బ్రిటిష్ కన్సల్' దగ్గరకు వెళ్లగా,ఆయన గదిలో భారతదేశ సంస్థానంలోని ప్రభువులు తమతమ సైన్యాలతో రణరంగంలో ఉరుకుతున్న చిత్రాలను చూసి ఆనందం కల్గిందని రాస్తూ పాస్ పోర్ట్ తీసుకొని ఫ్రెంచి గవర్నమెంట్ దగ్గర ' అధికార పత్రము' తీసుకోవడానికి వెళ్లగా ఫ్రెంచి పోలీసువాడు నవ్వుతూ చౌదరిగారి చేయిపట్టుకొని అధికారి దగ్గరకు తీసికెళ్లగా ఫ్రెంచి అధికారి" మీ ఇండియన్లు మా దేశంలో యుద్ధంబొనర్చు చుండిరి.కాన ఇండియనులైన నీకు నొక యధికారపత్ర మిచ్చుటకు నేనెంతయు సంతోషించుచుంటిని " అని రాశాడు భారతదేశ వీరుల ఘనత విదేశాల్లో ఏ విధంగా ప్రస్తుతింపబడిందో ఈ లేఖ నిరూపిస్తుంది.

చౌదరి గారు రాసిన ఉత్తరాల్లో సాహిత్య విషయం కూడా స్పృశింపబడింది.డబ్లిన్ నుండి 29-4-1916 నాడు రాసిన లేఖలో ఆంధ్ర నాటకాలను గురించిన విమర్శ గమనింపదగింది.పూర్వ కాలంలో గీర్వాణ కవులు వారి పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికి,

రాజానుగ్రహం పొందడానికి,విద్వాంసుల్లో అగ్రపీఠం సంపాదించుకోవడానికి ఒకే ఇతివృత్తాన్ని గ్రహించి వారి ప్రజ్ఞలు చూపిస్తూ రచనలు చేశారని”నేడన్ననో నాటక మూలమున ప్రజలు జ్ఞానవంతులుగను,నీతిమంతులుగను జేయవలసిన బాధ్యత వర్తమాన కవులందున్నది” అని నిస్సంశయంగా తెలిపి పూర్వగ్రంథాల్లోని ఇతివృత్తాన్ని తీసుకొని వారి వారి శక్తిసామర్థ్యం వ్యర్థపుచ్చుకోవడం కన్నా వేరే కథను గైకొని ప్రజలను జ్ఞానవంతులుగా చేయడం సమంజసం అంటాడు.ఒకే ఇతివృత్తం తీసికొని పలువురు నాటకాలు రచిస్తే దానివల్ల వచ్చే లాభమేంటి? అని ప్రశ్నిస్తాడు.” నాటకములు పెంచుట,క్లుప్తము చేయుటయందు మనము గీర్వాణ నాటకముల నతిక్రమింపరాదు.ఈ యభిప్రాయముతో నేనేకీభవింపజాలను.కవికి స్వాతంత్రముండవలెను.
లేనిచో అనర్థములు పెక్కులు వాటిల్లును.గీర్వాణ నాటక సంప్రదాయములని,ఆంగ్లేయ నాటక సంప్రదాయములని కవి చేతులు గట్టివేయుట భాషాలతను మొదలంట గోసివేయుటయే”.అని ఇతివృత్త స్వీకరణలో కొత్తదనాన్ని ,మార్పును ఆశించి కవికి స్వేచ్ఛ ఉండాలని,పూర్వ సంప్రదాయాలను అతిక్రమించి నాటకం రసపుష్టి గావించడమే పరమోత్తమమని వ్యక్తం చేశాడు.
అలాగే భాష విషయంలో కూడా తన అభిప్రాయాన్ని లేఖల్లో తేల్చేశాడు.నీచోక్తులు,నీచుల గ్రామ్య సంభాషణ విషయంలో విమర్శిస్తూ” నాటక పాత్రము రంగమున వివిధ గ్రామ్య భాషా సంభాషణ మొనరింపరాదను వాదమాదరణీయమని నా యాశయము” అంటూ మూడు భాషలు మాట్లాడే ముగ్గురు విదేశీ వాళ్ళు వివిధ గ్రామ్యము లైన ఇంగిలీషులో మాట్లాడక సలక్షమైన ఇంగిలీషులో మాట్లాడితే ఉచితంగా ఉంటుంది అంటాడు.అక్బర్ పాదుషా’ మాకీ ,మీకీ ‘ అని మాట్లాడినా,నీచ తురుష్క పాత్ర గ్రాంథిక భాషను మాట్లాడినా కూడా హాస్యాస్పదమంటాడు.గీర్వాణ భాషలో చెప్పబడ్డ నియమాలు గీర్వాణ నాటకాలకే అన్వయిస్తాయి కానీ ఆంధ్ర నాటకాలకు పనికి రావని నిస్సంకోచంగా చెప్పాడు.” ద్రావిడ భాషలు దేశభాషలుగా నున్నచోటుల నా భాషల నీచపాత్రములకే గ్రామ్య భాష గాని,మిశ్రమ భాష గాని యుపయోగింపబడవలయును,ఉచ్చ పాత్రముకు భిన్న జాతీయుడైన నేమి,భిన్న మతస్తుడైన నేమి గ్రాంథిక భాషనే యుపయోగించుట సమంజసం”. అంటూ పాత్రోచిత భాషా విషయంలో త్రిపురనేని తన నిర్ణయాన్ని లేఖలో నిక్షిప్రం చేశాడు

 రామస్వామి గారి లేఖల్లో ఆయన అలవాట్లు,వ్యక్తిగత విషయాలను తెలుసుకోవచ్చును.వ్యక్తిగతం అయినప్పటికీ ఆనాటి సమాజపరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఉత్తరాలు ఎంతగానో ఉపకరణాలు అని చెప్పొచ్చు.

తలకు బట్ట చుట్టుకోవడం అంటే తలరుమాలు ధరించే వాడని తెలుస్తుంది.కేవలం శాకాహారాన్నే భుజించేవాడు.
కొలంబో నుండి బయలు దేరెటప్పుడు స్టీమరెక్కాడు.స్టీమరులో ఒక సంఘటన జరిగింది.జపాను భాష తప్ప వేరే భాష తెలియని జపాను ఉద్యోగి చౌదరి ముందుకు వచ్చి” కసాయి దుకాణము బరచెను.కత్తి,గరిటె మాంసము,చేపలు చూడగానే నా శరీరము జలదరించెను. ఏమి చేయను? సేవకునితో వీనిని దీసికొనిపోయి శాకములను గొనిరమ్మని యింగ్లీషులో జెప్పితిని.అయినా వాడికర్థం కాలేదు.చివరికి మాంసం వైపు చూపించి ఇవి అక్కరలేదా అని అడిగితే పండ్లు కానీ శాకము కానీ గానీ తెచ్చివ్వమంటే కొన్ని పండ్లు,బంగాళాదుంప కూర తెచ్చి పెట్టాడు.పదార్థాల్లో ఏదో వాసన వచ్చి తిన్నదంతా వాంతి” చేసుకున్నాడట.ఇదీ ఆయన అవస్థ.ఆయనకే కాదు అలవాటు లేని వారికెవరికైనా ఇదే పరిస్థితి.ఏడు రోజులకు ఒక పక్షి గాని,చెట్టుగాని కన్పించలేదట.కవిరాజు సున్నిత మనస్తత్వం ,మాంసాహారం పట్ల గల వైముఖ్యం మొదలగు విషయాలను ఈ లేఖలో తెలుసుకోవచ్చును.

డబ్లిన్ నుండి రాసిన ఉత్తరంలో తనకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో తెలపమని అనేక ఉత్తారాలు వస్తున్నాయని పత్రికాముఖంగా తెలపడం సమంజసమని తనకు నెలకయ్యే ఖర్చును వివరంగా తెలియచేశాడు.ఆనాడు విదేశాల్లో ఖర్చు ఎలా ఉండేదో తెలుసుకోవడానికి యీ లేఖ పనికి వస్తుంది.

” ఈ వ్యయము సాధారణముగ విద్యార్థి స్థితిగతుల మీదను,సత్ప్రవర్తన మీదను నాధారపడి యుండును గాన ఎంత వ్యయమగునని నిశ్చయించుట దుర్లభమైనను,ప్రస్తుతము విద్యార్థులకగు వ్యయమును పరిశీలించిన కొంతవరకు తెల్లమగును.” సాధారణంగా చాలామంది విద్యార్థులకు సగటున 100 రూపాయలు ఖర్చు అవుతాయని, తాను 100 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలిపాడు.వారి వారి స్తోమతను బట్టి ఎంత పంపిస్తే అంత ఖర్చు పెడతారని చెప్తూ ఒక చిన్నగదిలో ఇద్దరు కలిసి ఒకే మంచముపై పడుకుని ఎట్లో కాలం గడిపే విద్యార్థుల్లో కూడా ఒక విద్యార్థి సంవత్సరానికి ఆరువేలు ఖర్చు చేసిన వాడున్నాడని తెలిపాడు.తుదకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ” దుర్వ్యయముల జోలికి బోక సర్వసుఖములనుభవించుచు ( నాటకములకు తరచు బోవుచున్నను) జాగ్రత్తగ సంచరించుచుండిన యెడల నూరు రూపాయలు చాలును “
అని వివరించాడు.దీన్ని బట్టి ఎంత జాగ్రత్తపరుడో,ఎంత పొదుపు పరుడో తెలుస్తుంది.నాటకాలు చూసే అలవాటుతప్ప అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టేవాడు కాదని తెలుస్తుంది.క్రమశిక్షణ కలిగిన వాడుగా,శాకాహారము మాత్రమే తీసుకునే వాడుగా తెలుస్తుంది.
ఈ రకంగా కవిరాజు లేఖలను పరిశీలించినట్లయితే ఆయన అలవాట్లు, మనస్తత్వం,వ్యక్తిత్వం,

కుండబద్దలు కొట్టినట్లు నిజాన్ని చెప్పడం,పాత్రోచిత భాష, నాటికేతివృత్తం గురించి ఆయన అభిప్రాయాలు ,ఆనాటి సాంఘిక పరిస్థితులు ,ప్రయాణ అనుభూతి మొదలైన విషయాలను తెలుసుకోవచ్చు.ఆయనకు గల స్వాతంత్ర్య కాంక్ష కూడా తెలుస్తుంది.ఈ విధంగా లేఖలు సమాజానికి దర్పణాలు అనడంలో ఎట్టి సందేహం లేదు..

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
ప్రభుత్వ విశ్రాంత సహాయాచార్యులు
హైదరాబాద్
చరవాణి:
949036738

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us