మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ధారావాహిక నవల

రుద్రమదేవి 9 &10 ప్రకరణములు

by రంగరాజు పద్మజ December 31, 2021
written by రంగరాజు పద్మజ

[ విఫలత ]

( నిరుపయోగం )

అపరాధః సదైవస్య
నపునర్మన్తిణా మయమ్ ;
కార్యం సఘటితం యత్నాత్, దైవయోగాద్వినశ్యతి ”
— హితోపదేశం.
భావం:-అనగా  నాకు కలిగిన వంచన మంత్రి యొక్క లోపం వల్ల కాదు. అది దైవకృతాపరాధం. ఏ హేతువు చేతనో బాగా ప్రయత్నం చేసిన పని దైవాధీనం వల్ల నశించింది. కాబట్టి మంత్రి యొక్క దోషం కాదు.
కథాభాగం:–  తెల్లవారుజాము చాలా అందంగా ఉంది.తూర్పుదిక్కున ఎరుపు రంగు కనపడుతోంది.కాకులు తమ గూళ్ళను వదిలి అరుస్తూ వెళుతున్నాయి. పశువుల కాపరులు కట్టి వేసిన ఆవుల దగ్గరకు దూడలను వదిలి, కొంచెం పాలు తాగనిచ్చి, తరువాత దూడలకు పాలు అందకుండా దూరంగా కట్టివేసి, పాలు పితికి, కుండలను నింపుతున్నారు. గృహిణిలు నిద్ర లేచి రోజువారీ పనులు చేయడానికి పూనుకున్నారు.కొందరు పశువులను తోలుకొని ఊరి బయలు ప్రదేశానికి మేపడానికి వెళుతున్నారు. తెల్లవారితే ఏవైనా చెడు శకునాలు ఎదురవుతాయని, వాటివల్ల పనులకు అడ్డంకులు కలుగుతాయని, ప్రయాణాలు చేసేవారు ఇండ్ల నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నారు.
ఊరివారు కొందరు రుద్రమదేవి నివసిస్తున్న ఇంటి దగ్గరకు వచ్చి, ఆ రాత్రి జరిగిన ఆ పనికి అందరూ బాధపడుతున్నారు. “ఇంత పని చేయడానికి ఎవరు సాహసించారు?” అని కొందరంటూంటే…ఇంకా కొంత మంది ” ఆ పని చేసేవాడికెంత గుండె ధైర్యం?” అని, ధర్మాత్మురాలైన రుద్రమదేవిని జైల్లో పెట్టారో? చంపేసారో? అయ్యో! అయ్యో!! అని కొందరు బాధపడుతున్నారు. కొందరు ఇంటి లోపలికి వెళ్లి చూసి వస్తున్నారు. కొందరు చుట్టుపక్కల చూస్తున్నారు. ఇలా ఇంటి చుట్టు వాతావరణం దీనంగా తయారయింది.
అక్కడ నుండి ముగ్గురు మగవారు ఒక మహిళ బయలుదేరి ఒకే తోవలో ఒకరి వెంట మరొకరు నడుస్తున్నారు. కొద్ది దూరం నడిచి వారు ఆ ఊరు దాటి చిక్కటి అడవిలోనికి వెళ్లారు. అలాగే కొంత దూరం నడిచి ఒక చోట కూర్చున్నారు.
ఆ ప్రదేశం ఎత్తుగా ఉన్న చెట్లు ఉండటం వల్ల, చిక్కటి పొదలు అల్లుకొని ఉండడం వల్ల రహస్య విషయాలు ఆలోచించు కోవడానికి తగినట్లుగా ఉన్నది. కాబట్టే ఆ నలుగురు ఆ స్థలానికి వచ్చారు. నేలంతా మొనతేలిన కంకర రాళ్ళు ఉండడం వల్ల గడ్డి ఏమంత ఎక్కువగా మొలువలేదు. అలా ఉండడం వాళ్ళకి ఆ స్థలం కూర్చోవడానికి వీలుగా ఉంది.
వారెవరో పాఠకులు ఆలోచించ అక్కరలేదు. ఒక్కడు మురారి దేవుడు, రెండవవాడు హరిహర దేవుడు, మూడవ వాడు ధర్మవర్తనుడు, ఆ మహిళ కమల. అక్కడ కూర్చొని ఇలా మాట్లాడు కుంటున్నారు.
ధర్మ:–  చూశారా? పని అంతా ఎలా అయిందో? రుద్రమదేవి మగవాళ్ళను చంపి పుట్టిన ఆడమనిషి. ఆమెకు తెలిసిన అన్ని మాయలు మంత్రాలు మగవాళ్ళకి కూడా తెలియవు. ఏమీ తెలియనట్లుండే రుద్రమదేవి మన ప్రయత్నాన్ని మంట కలిపింది. నాకెందుకో మొదటినుండి అనుమానం గానే ఉన్నది.
మురారి:–  నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇంట్లో కట్టు వేసిన వారు ఎలా తప్పించుకున్నారు? చుట్టూ కాపలా ఉన్న వారు కంటిమీద రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు. అదే కాకుండా ఆ ఊరు చుట్టూ ఉన్న మన సైనికుల కనుగప్పి ఎలా తప్పించుకొని పోనిచ్చారు? ఇదంతా గారడి విద్యవలె ఉన్నది.కమలా!  నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావు కదా!  వారు ఎక్కడికి వెళ్లారు నువ్వు చూడలేదా?
కమల:–  నాతో వారెప్పుడూ భయపడుతున్నట్లుగా మాట్లాడనేలేదు. రోజు ఎలా ఉన్నారో రాత్రి కూడా అలానే ఉన్నారు. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లావని కూడా నన్ను అడగలేదు ప్రయాణం ఉందని మాత్రం చెప్పింది. తర్వాత రోజుటివలనే నిద్రపోయాం.
ఇంకా నాకు ఆశ్చర్యం కలిగింది.  నేను చూస్తూనే ఉన్నాను. వెనుకనుంచి ఎవరో వచ్చే నా కళ్లను మూసి, నా నోట్లో గుడ్డలు కుక్కి నన్ను తాళ్ళతో కట్టి వేశారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు.
హరిహర దేవుడు:–  వాళ్ళు తగిన జాగ్రత్తలు ఉండి భయపడకుండా ఉన్నారు. కావలివాళ్లకు ధనమిచ్చి  కట్లు  విడిపించుకున్నారు కావచ్చును. లేకపోతే వీళ్లు కాకుండా లోపలికి వేరెవ్వరు రావడానికి కానీ పోవడానికి కానీ ఎలా వీలు చిక్కింది? మనం కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాం కదా!
కమల:–   మొదట వాళ్ళకు ఈ సంగతి ఎలా తెలిసింది?
ఆనాడు ధర్మవర్తనుడు గారు చెరువుకట్టపై కూర్చుని ఉన్నప్పుడు చూసింది గూఢచారై ఉంటాడు.అతను మన గుట్టు బయట పెట్టాడా?
అయ్యో!  అయ్యో!  మన పని అంతా వెల్లిపాయలో కలిపిన చింతపండు లాగా అయింది  కదా!
ధర్మ:–  మన ఆశలన్నీ వ్యర్థమైనవి. మహాదేవరాజువద్ద మనం చెప్పినవన్నీ అబద్ధాలు అయినవి కదా! అయ్యో! ఎలా కావలసిన పని ఎలా అయ్యింది?  ఆ నలుగురు మాట్లాడుకుంటు ఉండగా ఇద్దరు మగవారు వచ్చి నిలబడ్డారు. వారిని చూడగానే మురారి దేవుడు”  మీరేం వార్తలు తెచ్చారు? శుభమా? అశుభమా? శుభమని అనుకోవడానికి వీలు లేకపోతే అది ఎలా కలుగుతుంది? మీరంతా మీ మీ పనుల మీద శ్రద్ధతో ఉన్నా కూడా రుద్రమదేవి ఎలా తప్పించుకొని పోయింది? ఇలా తప్పించుకున్నారని   ఆలోచించడానికి అవకాశమే లేదని అన్నాడు.
అయ్యా!  మీ ఆజ్ఞ ప్రకారం మేమంతా జాగ్రత్తగా ఇంటి చుట్టూ ఉన్నాం. ఇంటి నుండి పిల్లి కూడా బయటకు పోలేదని మేము ఖచ్చితంగా చెప్పగలం. మాలో తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా “రుద్రమదేవి తప్పించుక పోయిందని మీరు చెప్పే దాకా మాకు తెలియదు. ఏమి చేయాలి? మాకు మాట దక్కని రోజు వచ్చిందని వచ్చిన ఇద్దరిలో ఒకడు అన్నాడు.
మరొక చిత్రమైన సంగతి జరిగింది. మీరు అడవిలో  కావలి ఉంచిన సైన్యమంతా చనిపోయారని రెండవవాడు చెప్పాడు.
ఆ మాటలకు వారంతా అవాక్కయ్యారు.
ఎలా? ఎలా?  సైన్యమంతా చనిపోయిందా? కటకటా!  ఆ సైన్యాన్ని చంపిందెవరు? అని హరిహర దేవుడు అన్నాడు.
అయ్యా!  ఏమని చెప్పేది? ఊరికే నాలుగువైపులా కావలి ఉన్న సైనికులను రెండు భాగాలుగా మారి ఓరుగల్లు తోవను కాపలా కాస్తూ ఒక సైనిక దళమూ, ఊరిని చుట్టుముట్టి మరొక దళమూ ఉన్నాం. అక్కడక్కడ ఇద్దరిద్దరినీ ఉంచాం. ఎప్పుడు కావాల్సి వస్తే సైగ చేయగానే తోడుగా రావాలని సైగలు ఏర్పాటు చేసుకుని ఎవరి పనుల మీద వారు ఉన్నాం. ఇంతలో గుర్రపు స్వారీ చేస్తూ ఎక్కడినుండో  వచ్చారు. మేము ఊరి దగ్గరగా ఉన్నాం కాబట్టి వారు తప్పించుకొని పోతున్న వారనుకొని, వారి మీద దాడి చేశాం , కానీ  వాళ్లు నలుగురు మగవారే! కటిక చీకటిలో వాళ్ళను మగవారిగా పోల్చుకోలేదు. పోల్చుకుంటే వారిని ఎదుర్కొనే వాళ్ళం కాదు. ఆ వీరుల శౌర్యం చెప్పనలవికాలేదు. నలుగురు నాలుగు వైపులా మమ్మలను అవతలికి పోనీయకుండా నరికి వేయడం మొదలుపెట్టారు. కొన్ని ఘడియలలో మా సైన్యం పావువంతు మాత్రమే మిగిలింది. చీకటిగా ఉన్నా  ఎలానో ఒకలాగ వారి నుండి తప్పించుకొని ఓరుగల్లు తోవను కాపలా కాస్తున్నవాళ్ళను పిలుచుకొని వచ్చేందుకు పోదామనుకునేసరికి  శస్త్రాల చప్పుడేదో వినపించింది. పరిగెత్తుకొని అటు వెళ్ళాం. అప్పుడు ఓరుగల్లు సైన్యంతో మనవాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఓరుగల్లు సేన తక్కువగా ఉండి, మన సేన ఎక్కువ మంది ఉండటం వల్ల శత్రువులను ముందుకు రానీయకుండా అరికట్టి నిలిపాం. దాదాపు విజయం మాసొంతమైందని చెప్పవచ్చు. దాదాపు ఇరవై మంది దాకా చంపాం. ఏమనాలి? ముందు మాతో యుద్ధం చేసి,  మమ్మల్ని తరిమిన ఆ నలుగురు వీరులు ప్రత్యక్షమై బాధించటం మొదలుపెట్టారు. వారు వచ్చి చాలా మందిని చంపారు. పది పదిహేను మందిమి మాత్రం మిగిలి, అటూ  ఇటూ చెల్లాచెదురు అయిపోయాం. మేము కూడా ఊరిలో ఆ ఇంటి చుట్టూ ఉన్న వారితో కలిసి ఏ ఊరుకైనా పోదాం అనుకుని వస్తున్నాం. ఇంతలో ఇతడు కలిసి మీ జాడ మాకు చెప్పాడు.  మేమిద్దరం ముందు నడిచి ఇలా వచ్చాం. వారు ఇప్పుడో, ఇంకాసేపటికో ఇక్కడికి వస్తారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తానని అందరూ వినేటట్లు గా బొంగురు గొంతుతో అన్నాడు.
పనంతా తలకిందులైంది. మనలను వారు గుర్తుపట్టారా ఏమో? అని కొంచెం అనుమానం వస్తున్నది. ఒక్క పని చెడిపోయి, ఎంత మందికి బాధ కలిగించిందో కదా! మహాదేవరాజుకు, మాకు, కొందరు మాండలికాలకు చెప్తే  కూడా తీరనంత ఆశాభంగం కలిగిందని  మురారి దేవుడన్నాడు.
వాళ్లు మనను ఎప్పటినుండో కనిపెట్టి తిరుగుతున్నట్టున్నారు లేకపోతే అవలీలగా తప్పించుకోవడం సాధ్యమా? మన కాపలా వారికి లంచం ఇచ్చి ఉంటారు. రెండో దారి లేదు అని కమల అన్నది.
ఇంతలో మరి కొంత మంది మనుషులు వచ్చి నమస్కరించి నిలబడ్డారు. వారు రాగానే మురారి దేవుడు వారిని చూసి, మీరు ఇంత మంది మాత్రమే బతుక గలిగారా? ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు.
సరిగ్గా చెప్పలేం పది పదిహేను మంది చెల్లాచెదరై పోయి ఉంటారు. వాళ్ళందరిని వెతికి రమ్మని మన వాళ్ళను ఇద్దరు ముగ్గురిని పంపాను. వెతికి మనలను కలుస్తారని వచ్చిన వారిలో ముఖ్యుడన్నాడు.
ఇంకా మనం ఆలస్యం చేయవద్దు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. మన రహస్యం తెలుసుకుంటున్నవారు మనం ఉన్న చోటు తెలుసుకుంటారనడం నిజం! వాళ్లకు దొరికిపోయి, ఇగిలిగించడం కన్నా పరిగెత్తి వెక్కిరించడం మంచిది. లేవండి! వెడదామని ధర్మవర్ధనుడు అన్నాడు.
వారంతా ప్రయాణమైనారు. కమల కూడా వారి వెంటే ఉన్నది. వారంతా అడవిలో పడి ఒక పక్కగా నడుస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు.నాలుగు వైపులా జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్నారు.అర కోసు దూరం నడిచే టప్పటికీ వాళ్లకు ఆడవిలో జనాలు నడుస్తున్నట్టు చప్పుళ్ళు వినబడ్డాయి.ముందుకు నడవకుండా  వాళ్ళు నిలిచి తమ చుట్టుపక్కల చూశారు. కొంతమంది బలిష్టులయిన వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తుండటం చూశారు.వచ్చినవాళ్లు క్షణంలో  చుట్టుముట్టారు. తప్పించుకుని పారిపోవడానికి అవకాశం చిక్కలేదు. అప్పటికి తగిన పని యుద్ధమే అనుకొని, ఒరల నుండి కత్తులను దూశారు. రెండు వైపుల వారికి పోరాటం జరిగింది. మురారి దేవుడు మొదలైనవారు కూడా మామూలు వ్యక్తులు కారు.యుక్తిగా యుద్ధం చేస్తున్నారు.  వారి అనుచరులు కూడా యుద్ధం చేస్తున్నారు. వచ్చి చుట్టూ మూగిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మురారి దేవుడు మొదలైన వారి శౌర్యంతో నిలువలేక గడ్డిపోచ మంటకు మాడిపోయినట్టు క్షణంలో నశించిపోయింది.
క్రమంగా మురారి దేవుడు, హరిహర దేవుడు, ధర్మవరధనుడు  నేల మీద కూలిపోయారు.కొందరు సైనికులు చచ్చారు. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. కమల ఒక్కతే వారికి చిక్కింది. ఆ స్త్రీ ఎంత మాయామర్మాలు నేర్చుకున్నా పౌరుషానికి చిక్కితే ఏం చేయగలదు? ఆమెను వారు బంధించారు
కమల ఏడుస్తూ ఏమేమో మొర పెట్టుకుంటున్నది. వీరులు ఆమె మాటలను పట్టించుకోకుండా, జాలి పడక, కట్టిన కట్లు విప్పకుండా ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు.

పదవ ప్రకరణ
[  వార్త నిర్దేశనం]
ఏతదాఖ్యాంతితే సర్వే
హరయోరయోరామ సన్నిధౌ
వైదేహీ మర్షతాం శ్రుత్వా
రామ స్తూత్తరమబ్రవీత్
సుందరకాండ..65 సర్గ 3వ శ్లోకం
ఉవాచ వాక్యం వాక్యఙ్ఞ
సీతాయాదర్శనం యథా
సముద్రం లంఘమిత్వాఽహం
శతయోజనమాయతమ్
సుందరకాండ..65 సర్గ 5వ శ్లోకం
భావం:– వానరులు శ్రీ రాముని దగ్గరకు వెళ్లి సీతమ్మ రావణుడి అంతఃపురంలో బంధింప బడి ఉండడం, రాక్షస స్త్రీలు ఆమెను బెదిరించడం మొదలైన సమాచారమంతా రామునికి చెప్పి మౌనంగా ఉన్నారు.
రాముడు సీతాదేవి నాశనం చెందక క్షేమంగా ఉన్నదని విని వానరులను చూచి ఇలా అన్నాడు. హనుమ సీత ఇచ్చిన మణిని రామునకు సమర్పించి, తాను సీతాదేవిని చూసిన విధం చెప్పెను.నేను నూరు యోజనముల విస్తీర్ణం కలిగిన సముద్రం దాటి సీతాదేవిని చూడడానికి వెతుకుతూ పోయాను.
వ్యాఖ్య:–రామాయణం లోని సుందరకాండలోని సీతాన్వేషణ ఘట్టంలోని హనుమ సీతను చూసినట్లు రామునికి చెప్పినట్టు…
రుద్రమదేవి నవలలో ప్రకరణౌచిత్య శ్లోకం…రుద్రమదేవిని గోనగన్నారెడ్డి చూసినట్లు చెప్తూ…రాబోవు కథాసూచిగా చెప్తూ… మంగళాంతంగా ముగియనున్నట్లు  గ్రంథకర్త ఇలా ఇతిహాసోపమానం ఇవ్వడం అనేక పురాణ, ఇతిహాసాల పఠనాసక్తి, పరిచయం ఉన్నట్లు తెలుస్తున్నది…
ఇది ఒక అపూర్వ ప్రక్రియ…ప్రకరణాలకు నామకరణం చేయడం పాఠ్యాంశంగా అభ్యాసానికి సులువైన పద్ధతి…
(రంగరాజు పద్మజ)
కథాభాగం:- ఓరుగల్లులో రుద్రమదేవి రాజదర్బార్ లో కూర్చుని ఉంది. ఆమెకు కుడివైపున ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య, అతని తర్వాత కాయస్థ కులంలో పుట్టిన వాడు” బ్రహ్మరాక్షసుడు” మొదలైన బిరుదులున్న వాడైన మంత్రి, సేనాపతి రెండు  పదవులను నిర్వహిస్తున్న జన్నిగదేవ సాహిణి, అతనికవతల కాయస్త వంశీకుడైన” ఏకంగా వీర, వీరావాతార” మొదలైన ఎన్నో బిరుదులున్న మంత్రి, సేనాధిపతి అయిన త్రిపురాంతక మహాదేవ రాజు, అతనికవితల వైపు ఇతని చిన్న తమ్ముడు “రాయ సహస్ర మల్ల”  బిరుదు పొందిన గండికోట, ములికి, నాడు, రేనాడు,పెందాడి , పెడకట్ల, సకిలియెరువ, పొత్తపినాడు మొదలైన ప్రాంతాలను రుద్రమదేవికి ప్రతినిధిగా పాలిస్తున్న అంబ దేవమహారాజు, కూర్చుని ఉన్నారు.ఎడమ వైపున నాగదేవరాజు, ఇతని పక్కన రుద్రమదేవి అల్లుండ్లు విక్రమాఢ్యులైన అన్నమ దేవరాజు, చాళుక్య వీరభధ్రరాజు కూర్చుని ఉన్నారు.  ఒకవైపు మిగిలిన సైన్యాధ్యక్షులు,  మరొకపక్కన ఆస్థాన పండితులు, ఇంకో వరుసలో విదేశీయులు, ఇంకొక చోట ఉన్నతోద్యోగులు, మరోచోట రాయబారులు కూర్చున్నారు.
రుద్రమదేవి పొగలేని నిప్పు వలె భగభగమండి పడుతున్నది. ఆ సభలో ఉన్న వారికి ఆమె మనసులో ఏమి ఆలోచిస్తున్నదో తెలియడం లేదు. ఆమెను అటువంటి వేషంలో ఎవరూ.. ఎప్పుడూ.. చూడలేదు.సభలోనే కొందరు ముఖ్యులకు అసలు ఏం జరిగిందనే కారణం తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారు. అయినా కానీ ప్రశ్నించడానికి ధైర్యం చేయలేదు.
శివదేవయ్య సభ్యుల మనసు తెలుసుకొని, తన ఆసనం నుండి లేచి, అందరూ వినేటట్లు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
” ఓ సభ్యులారా!  భారతీయులకు సత్యం వంటి ఆభరణం ఇంకొకటి లేదు… బాహాటంగా యుద్ధంలో ఖడ్గంతో ఖడ్గం పోరాడి శత్రువును గెలవడమో? లేక శత్రువుతో ఓడిపోవడమో  మాత్రమే ప్రజలు మెచ్చుకుంటారు.శాస్త్రం కూడా అదే ఒప్పుకుంటుంది  దుర్మార్గులు ఈ పద్ధతిని విమర్శిస్తారు. అంతేకాదు మరింత చెడుతోవ తొక్కుతారు. మనకు తల్లితో సమానమైనది, ధర్మానికి మారూపైన మన రాణి గారి యొక్క ఉత్తమమైన ఉదార గుణాలతో, సేవకుల మీది వాత్సల్యంతో ఉండడం మన అందరికీ తెలిసిందే.
” శరణని వచ్చిన వారికి తల్లివలె కాపాడే శ్రీమతి రుద్రమదేవికి  దేశంలో కొందరు దేశద్రోహులు కారణం లేకుండా పగబూని, ఈ కుట్ర పన్నారు. మనం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల మన రాణి చిక్కులలో పడిన కూడా శ్రమ పడకుండా బయటపడ్డారని చెప్పడానికి నాకూ, వినడానికి మీకు చాలా ఆనందంగా ఉన్నది. అయినా శ్రద్ధతో పనిచేస్తున్న శత్రువులకు పూర్తిగా దొరికిపోయి, ఎక్కువ శ్రమ లేకుండా తిరిగి రావడం అసంభవమని ఆ ద్రోహులను చూసి మీరు అనుకున్నారు కావచ్చు…..
ఇంతలో ఒకతను సభలోనికి త్వర త్వరగా వచ్చి, రుద్రమదేవికి నమస్కరించాడు. అతని వెంట ఒక మహిళ ఉన్నది. ఆమె తాళ్లతో కట్టి వేయబడి ఉన్నది. రాజభటులు ఆమెను కాపలా కాస్తూ వెంట నడుస్తూ వస్తున్నారు. మరి కొంతమంది కొన్ని పెట్టెలను తలపై పెట్టుకొని వచ్చి, రుద్రమదేవి ముందు దింపి,  నమస్కారం చేసి పక్కకు పక్కకు ఒదిగి నిలబడ్డారు.
వచ్చినతను గోనగన్నారెడ్డి. ఇతడు రుద్రమదేవికి నమ్మకమైన బంటు.తనకు అప్పచెప్పిన పనికి వెనకడుగు వేయడు. పేరున్న గొప్ప వీరుడు. గోనగన్నారెడ్డి తన వెంట తీసుకొని వచ్చిన స్త్రీని, ధనమున్న పెట్టెలను రుద్రమదేవికి, సభలోని వారికి చూపించి ఇలా అన్నాడు.
ఈమె శత్రువుతో కుట్ర చేయమని పంపినదే అయినా, కాకతీయ రాణివాసం కొలుస్తూ జీవిస్తున్న దాసి కులంలో పుట్టిందనీ,శ్రీ గణపతి రాజరాజ రాజేంద్రుని దేవికి సేవలు చేసిన లలిత కూతురు అని,  క్రీ.శ.1228 లో  శ్రీ చక్రవర్తి గారు అద్దంకి సేనపై దాడి చేసినప్పుడు తన తల్లి, తాను శ్రీవారి వెంట ఉన్నామని, ఆ కల్లోలంలో తన తల్లి ఎక్కడో తప్పిపోయిందని, మొదలైన ఏవేవో కట్టుకథలు చెప్పి, తన పేరు మదనమంజరి అని చెప్పింది. దీని పేరు కమల. కానీ మదనమంజరి కాదు. మాయలు పన్నే ఈమె చెప్పిన చరిత్ర తన తల్లి  గురించి కాకపోయినా, నిజమైన చరిత్ర కాబట్టి మన రాణిగారు నమ్మవలసి వచ్చింది. మన రాణి చాలా ఉపాయంగా ప్రశ్నలు వేసినా, మాయామర్మాలను బాగా వంట పట్టించుకున్న ఈవంచకురాలు  ఆ ప్రశ్నలకు చిక్కక సరైన సమాధానాలిచ్చి, రాణి గారు అనుమాన పడకుండా చేసింది. నాకు మాత్రం మొదటి నుండి దీని విషయం కొంచెం అనుమానంగానే ఉంది. అందుకే నేను ఈమె విషయంలో శ్రద్ధతో గమనిస్తున్నాను. కొన్ని రోజులకు రాణిగారు తమ కూతుళ్లతో బుద్ధగణపతిని పూజించాలని వడ్డేపల్లికి వస్తున్నారు. అప్పుడు ఈ దొంగ దాసీ మంతనాలతో మన రాణిగారి వెంట వీరులను లేకుండా చేసింది. మొదటి నుండి అనుమానం ఉన్న నేను మారువేషంలో రాణిగారి వెంట మొగిలిచర్లకు వెళ్లాను. నేనెప్పుడూ దాసిని కనిపెట్టుకొని ఉన్నా కూడా ఒకనాటి సాయంకాలం ఈ దాసి కనిపించకుండా ఉండటంతో భయం వేసి, అటు ఇటు కొంతసేపు వెతికి, ఈ దాసి దొరకక నిరాశతో ఎక్కడ పోయిందో చూద్దామని చెరువు కట్ట ఎక్కి నడుస్తూ పోతున్నాను. నేను కొంత దూరం నడిచేటప్పటికీ ఈ దాసి కట్టకింద ఉన్న మర్రిచెట్టు దగ్గర నుండి వస్తున్నది. అప్పుడు నా అనుమానం సరైనది అనుకొని, దానికి కనిపించకుండా దాక్కొని, అది వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఏమీ తెలియనట్లు కూర్చొని, నా ద్యాసంతా మర్రిచెట్టు మీదే నిలిపాను. ఎవరో ఆ చెట్టుకింద ఉన్నట్టు, గుసగుసలు పెట్టుకుంటున్నట్టనిపించింది. వాళ్ళ మాటలు స్పష్టంగా వినబడటం లేదు. ఇంతలో ఒకడు వాళ్ళ దగ్గర నుండి నా వైపు వస్తున్నాడు. అతను పైకి వస్తున్నప్పుడు”  ఇప్పుడే వెళ్లి త్వరత్వరగా కమలను కలుసుకోవాలి”  అనే మాటలు వినబడ్డాయి. చూసి చూడనట్టు వాళ్ళ వైపు చూసి వారి రూపాలను నా హృదయంలో ముద్ర వేసుకున్నాను. వాళ్ళు ముగ్గురు మగవారు, అందులో ఇద్దరు అక్కడ ఉన్నారు. ఒకతను గబగబా నడుస్తూ వచ్చి నన్ను చూసి” ఎవరు నువ్వు?”  అని అడిగాడు. నేను వినిపించుకోలేదు. వచ్చిన అతను అచ్చంగా బ్రాహ్మణుడు వలె ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు అడిగాడు. చెవిటి వాడి వలె నటించాను. అతను నన్ను ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు. మర్రిచెట్టు కింద ఉన్న ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు.నేను లేచి ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడించిన బ్రాహ్మణుని వెంట నడిచాను. అతడు అంతకుముందే చాలా దూరం వెళ్ళాడు.అయినా నాకు అతడు కనిపిస్తున్నాడు.అతన్ని చూస్తూ  పోతున్నాను. కాబట్టి అతడు తోవలో ఈ దుర్మార్గురాలుని పనికి పురమాయించడం చూశాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, ఏదో మోసం ఉన్నది అని అనుకొని, బుద్ధగణపతి ఆలయానికి వెళ్లి, నా వేశం మార్చుకుని, పరమభక్తుని వేషం వేసుకున్నాను. ఇంతలో ఆ బ్రాహ్మణుడు దేవుడు ఆవేశం అయినట్టు నటించి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. మర్రిచెట్టు కింద నేను చూసిన మరో ఇద్దరు కూడా వచ్చి అతనికి సేవలు చేశారు. ఇదంతా నా అనుమానాన్ని మరింత బలపరిచింది.నా అనుమానం సరైనదే అని తేలేదాక ఆ విషయం రాణిగారికి చెప్పడం సమంజసం కాదని, అప్పటికి చెప్పడం మానివేసి ఆ ముగ్గురి వెంటనే ఉన్నాను.
తెల్లవారకముందే రాణిగారు ఇద్దరు కూతుళ్లతో మాయ బ్రాహ్మణునికి దేవత ఆదేశించినప్పుడు అన్న మాటల ప్రకారం మొగిలిచర్లకు ప్రయాణం అయిపోయారు. నేనా ముగ్గురుతో పాటు వారికి తెలియకుండా మొగిలిచర్లకు వెళ్లాను. వాళ్లు నేరుగా ఆ ఊరికి రాకుండా అడవి నుండి రావడానికి నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచన మోసానికి సంబంధించిందని నేను అనుకొని, రుద్రమదేవి తెలుపాలని అనుకొని, రుద్రమదేవిగారున్న విడిది గృహానికి వెళ్లాను  కానీ, ఆ ఇంటి చుట్టూ కాపలా ఉన్న భటలు నన్ను లోపలికి  వెళ్లనియ్యలేదు. ఎన్ని విధాల చెప్పినా లోపలికి వెళ్లి వచ్చి,” ఇది సమయం కాదని రాణిగారు అన్నారు అని”   నాకు వచ్చి చెప్తున్నారు .
”  నా దగ్గరకు ఎవరూ రాలేదని”  రుద్రమదేవి అన్నది.
నాకు తెలుసు  వాళ్లు శత్రుపక్షం వారు.  కాబట్టి లోపలికి వచ్చి మీకు చెప్పలేదని తెలుసు. వాళ్ళని ఎదుర్కొందామంటే నేను ఒక్కడినే ఉన్నాను. అంతే కాదు నా దగ్గర నన్ను నేను రక్షించుకునేంత మాత్రమే ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి సాహసించే వీలు లేకపోయింది.
ఓరుగల్లుకు పోయి సైన్యంతో వద్దామంటే ఆ లోపలే ఇక్కడ ఏం జరుగుతుందో అని మనసొప్పలేదు. అప్పుడు ఆ ఊరికి పోయి దేనికైనా పనికి వస్తుందని నా వెంట తెచ్చిన ధనంతో  కొంతమంది మట్టి పని చేసే వారిని నా వెంట తీసుకొని, ఊరి బయట నుండి  చిన్న ఎడ కత్తులతో సొరంగం చేసి, దేవిగారు ఉన్న ఇంటి గదిలోనికి  సొరంగం తవ్వమని చెప్పి, నేను ఆ ఇంటిని కాపలా కాస్తున్నాను. మళ్లీ ఒకసారి అడవి మధ్యకు వచ్చాను.అప్పటికి ఈ దాసి, ఆ ముగ్గురు అడవిలో కూర్చొని ఏదో రహస్య ఆలోచన చేస్తున్నారు. నేను వచ్చిన సంగతి వాళ్లకు తెలియక, ఆనాటి రాత్రి రుద్రమదేవిని పట్టి బంధించాలనుకుంటున్నారని, పట్టణం చుట్టూ దారుల వెంట జనాలు కాపలా ఉండాలని అనుకుంటున్నారు. నేను అక్కడ నిలబడడం అంత మంచిది కాదనుకుని, ఊరికి వచ్చాను. కానీ ఇంతలోనే మరొక ఆపద ఎదురైంది. ఊరి బయట సొరంగం ఊరికి ఏమంత దూరంలో లేదు.ఆ సొరంగం నుండి  రుద్రమదేవి వస్తే,ఇవతల కాచుకొని ఉన్న వారిని  ఎదుర్కో లేము. అయినా పనికి విచారించక, గబగబా ఊరికి వెళ్లి, ఒక ఊరు అతని దగ్గరకు పోయి, రహస్యంగా  అతనికి కొంత ధనమిచ్చి, శ్రీ శివదేవయ్య మంత్రి పేరు మీద”  మోసం జరిగింది. జాము రాత్రి లోపల సైన్యం మొగిలిచర్లకు రావాలని”  ఒక ఉత్తరం రాసి పంపాను.
ఇంతలో సొరంగం తవ్వడం అయిందని  తెలిసింది. సాయంత్రం అయింది. నాలుగు ఘడియల రాత్రి దాటిన తర్వాత ఆ సొరంగం బయట చాటుగా నాలుగు గుర్రాలను, నాలుగు నిలువు కత్తులను సిద్ధంగా ఉంచి,  ఆ సొరంగం ద్వారా నడచి, శ్రీ రుద్రమదేవి దగ్గరకు చేరాను. నేను రావడం దేవికి ఆశ్చర్యం వేసింది. జరిగిన సంగతంతా సంక్షిప్తంగా చెప్పి, దాసిని కట్టేసి, కళ్ళకు గంతలు కట్టి, ఆ వచ్చిన తోవనే బయట పడ్డాము.
సొరంగం తవ్విన వారే వెంటనే దానిని సాధ్యమైనంత వరకు పూడ్చి వేశారు. దాసిని వెంట పెట్టుకొని వెడితే తోవలో రహస్యం దాచడం కష్టమని అక్కడనే కట్టి వేసాం. బయట పడి కొన్ని రాళ్ళు రప్పలు, సొరంగంలో వేసి నలుగురం గుర్రాలనెక్కాము. ఇద్దరు కూతుళ్లతో రాణిగారు కట్టుకున్న బట్టలనే మగవారు కట్టుకున్నట్టుగా సవరించుకున్నారు.  మేము నలుగురం నడుస్తూ వస్తుండగా ఊరు చుట్టూ కాపలా ఉన్న వారు మాపై దాడి చేశారు. వాళ్లని అవలీలగా చంపేసి,  ఓరుగల్లు తోవ వెంట వస్తుండగా బాటకు కొంచెం దూరంలో రెండు సైన్యాలు యుద్ధం చేస్తున్నట్టు తెలిసి అక్కడికి వెళ్ళాం. అందులో ఒక సైన్యం ఓరుగల్లు సైన్యమని, మేము అంచనాగా తెలుసుకొని, శత్రువులను వెళ్ళగొట్టాం. మేం ఎవరిమో? ఆ సైనికులకు తెలియదు. వాళ్లను వెంట తీసుకొని వచ్చి, కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంకొంత ఓరుగల్లు సైన్యం మాకు కలిసింది. కొత్త సైన్యాన్ని వెంటబెట్టుకుని నేను మళ్ళీ మొగిలిచర్లకు వెళ్లాను. కూతుళ్లు ఇద్దరు నీ వెంట తీసుకొని రాణిగారు జాగ్రత్తగా ఓరుగల్లు చేరారు. నేను మొగిలిచర్లకు వెళ్లి; నేరస్తుల కోసం వెతికాను కానీ వారు ఎక్కడా కనపడలేదు. ఆ రాత్రి అక్కడే గడిపి, తెల్లవారక ముందే చెట్లపై దాక్కొని, వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మేమున్నది తెలియక నడుస్తున్నారు. మేము వాళ్లను చుట్టుముట్టి సైనికులను, ఈ పనికి ముఖ్య కారకులైన మురారి, హరిహర దేవులను,  ధర్మవర్ధనుడుని చంపేసి, ఈ దుర్మార్గురాలిని కట్టేసాం. దీనిని అడిగి మురారి దేవుడికి ,హరిహర దేవుడికి సంబంధించిన ధనాన్ని కొల్లగొట్టు కొని తెచ్చాను.ఇక ముందు మీ ఇష్టప్రకారం ఈ ధనాన్ని, ఈ దాసీని ఏమి చేస్తారో చేయవచ్చు. అని చెప్పి గోనబుద్ధారెడ్డి తన ఆసనం మీద కూర్చొన్నాడు.
ఈ విషయం విన్న సభలోని సభ్యులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. కమల వంచిన తల ఎత్తలేదు. అందరూ గన్నారెడ్డి చేసిన సాహస కృత్యానికి , అతని రాజభక్తికి మెచ్చుకున్నారు.
రుద్రమదేవి తన సింహాసనం నుండి లేచి, ” నా ప్రాణాలను ,నా కూతుళ్ళ మాన, ప్రాణాలను ” రక్షించిన గోనగన్నారెడ్డికి నా మనస్ఫూర్తిగా నా చేతిలో ఎప్పుడూ ఉండే ముత్యాల బాకును బహుకరిస్తున్నానని అంటూ తన చేతిలో ఉన్న బాకు గన్నారెడ్డి కిచ్చారు.
రాణీగారు అన్నమాటలతో  సభ్యులందరికీ సంతోషంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
గోనగన్నారెడ్డి దిగ్గున లేచి రెండు చేతులతో ఆ కత్తిని తీసుకుని, కృతజ్ఞతగా నమస్కారం చేసాడు.
రుద్రమదేవి కమలను చూస్తూ ” నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?” అని అన్నది.కమల ఏమీ సమాధాన మీయకుండా తలవాల్చుకుని నిలబడింది.
మారుమాట్లాడకున్నంత మాత్రాన నువ్వు నిర్దోషివి కాదు ! నీ ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి.నిజం చెప్పి,నీకొచ్చే ముప్పు తప్పించుకో ! నిన్నెవరు పంపారో? చెప్పు! అని రుద్రమదేవి అడిగింది.
” నన్నేమి చేసినా సరే! నేను మీకేమీ చెప్పలేను.” అని కమల అన్నది.
ఎవరు పంపారన్న అనుమానం మీకక్కరలేదు. వీళ్ళ నందరినీ పంపింది మహాదేవరాజు. ఈ నలుగురు దుర్మార్గులు. మొగిలిచర్లకు చెందిన అడవిలో కూర్చుని మాట్లాడుకుంటుండగా నాకు తెలిసిందని అన్నాడు గోనగన్నారెడ్డి.
నువ్వు చెప్పకున్నా నిన్ను పంపింది మహాదేవరాజని తెలిసింది. నీ నోటితో చెప్పి ఇక్కడ నుండి వెళ్లి పో! అని అన్నది రుద్రమదేవి.
దాసి కొంచెం సేపు ఆలోచించి ” నేనిక్కడ నుండి పోకున్నా, నన్ను మీరు కఠినంగా శిక్షించినా నన్నెవరు పంపారో వారి పేరు చెప్పను. ” అని మొండికేసి నిలబడింది.
దాసి మొండితనానికి రుద్రమదేవికి చాలా కోపం వచ్చింది. ఆడది కావడం వల్ల చంపక వదిలాను.” నువ్వు ఈరోజే మా దేశాన్ని వదిలి వెళ్లిపో! మా ఎల్లలు విడిచే దాకా మా భటులు నిన్ను వెంటాడుతూ ఉంటారు.మళ్లీ మా రాజ్యంలో  నీ మొహం కనపడితే నీ ప్రాణాలు నీకు దక్కవు.ఆడుదానివైనందుకు బతికిపోయావు! నీ మహాదేవరాజు కూడా ఆడదాని వలె గాజులు తొడుక్కోవడం వల్లనే కదా! బహిరంగంగా యుద్ధంలో ఆడదానినైన నాతో ఎదుర్కోలేక కుట్ర చేసాడు.
సిగ్గు, బుద్ధి తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయవద్దని చెప్పు. రాజ్యం దక్కించుకోవాలంటే మాతో స్నేహంగా ఉండమనీ గర్వం, అహంకారం వదిలి పెట్టమని చెప్పు! మేము మంచిగా చెప్పిన మాటలు మరచిపోతే మా పదునైన బాణాల గుట్టలై చురచుర మని వచ్చి తగిలి , బుద్ధి చెబుతాయని చెప్పు! అని దాసికి చెప్పి, ” త్రిపురాంతక దేవా! దీన్ని ఈ రోజు మన రాజ్యం దాటించేందుకు నలుగురు భటులకు చెప్పి పంపుమని అన్నది.
త్రిపురాంతక దేవుడు వెంటనే లేచి నమస్కరించి, కమలను వెంటబెట్టుకొని అక్కడ నుండి వెళ్లి పోయాడు.
అంతలో సభలో నుండి ఒకతను లేచి, నిలబడి  “నేను వెనీసు వర్తకుడిని , నా పేరు మార్కోపోలో” అని అంటారు. నేను చాలా దేశాలు వ్యాపారంకోసం తిరుగుతుంటాను. పురుష పరిపాలన అజమాయిషీలో ఉన్న దేశాలు , స్త్రీ స్వభావమున్న పరిపాలనలో ఉన్న దేశాలను చూసాను. రాజులకుండాల్సిన ధర్మాలోచన, నీతి సమృద్ధిగా ఉండడం, సేవకుల పట్ల అభిమానం ఆదరణ , రాచకార్యాలు చేసేటప్పుడు చూపించే చతురత కలిగి ఉండడం మొదలైనవి ఈ రాణి దగ్గర చూసినట్లు ఎక్కడా చూడలేదు. రాజు పట్ల ఎంత భక్తి శ్రద్ధలుండాలో అవన్నీ ఈ రాణి సేవకుల దగ్గర మాత్రమే చూడగలిగాను. మిగిలిన దేశాలలో సేవకులకు ఇటువంటి వినయం లేదు.ఈ రాజ్యం కేవలం పురుష రాజశ్రేష్ఠులు పాలిస్తున్నట్టున్నది కానీ మహిళ చేత పరిపాలింప బడుతున్నట్టు లేదు. ఈమెను రాజు అనక తప్పదు.నాకు చాలా సంతోషంగాఉంది. మిగతా దేశాధినేతలు ,ఆ దేశాలలోని  సేవకులు ఇక్కడకు వచ్చి ఈ నీతిని  నేర్చుకోవాలని బిగ్గరగా అంటూ తన దగ్గర ఉన్న విలువైన విదేశీ వస్తువులను రుద్రమదేవి కి బహుమతిగా ఇచ్చాడు.
సభ్యులందరూ రుద్రమదేవి యొక్క చాకచక్యమైన పనులను పొగుడుతూ అవన్నీ మార్కోపోలోకు తెలిపారు.
సభ్యులారా! ఈనాటి ఈ అపూర్వమైన కార్యక్రమం వల్ల సభయొక్క ఉద్దేశ్యం మీరు ఇంకో తీరుగా అనుకున్నారు. కానీ ముఖ్యమైన అభిప్రాయం తెలుసుకునే అవకాశం చిక్కలేదు. రాయబారులెందరో వచ్చినట్టు తెలిసింది.వారి రాయబారాలను తెలుసుకునేందుకు సమయం చిక్కలేదు. దాడిలో పాల్గొని గెలిచిన వీరులైన సైనికులకు పారితోషికం ఇవ్వలేదు. కుట్రలో బలైనవారెందరో ? ఎంతమంది ఉన్నారో? తెలుసుకొని, వాళ్ల కుటుంబాలకు భరణం ఏర్పాటు చేయలేదు.
ఇప్పుడు సమయం చాలా గడిచి పోవడంవల్ల సభ ఇంతటితో చాలిస్తున్నాం. రేపటి కొలువులో అన్నీ జరుగుతాయని మంత్రి శివదేవయ్య తన ఆసనం నుండి లేచి చెప్పి మరలా కూర్చున్నాడు.
సభలోనివారందరూ  ఒప్పుకున్నారు
(కొలువుకూటమి ముగిసింది.)
(సశేషం)

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌ – 11

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు December 31, 2021
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు

లోకానీకావనౌకం సకల భువనభు క్సత్ర సంత్రాణ తంత్రం

కారుణ్యార్ణోధినాధం ఘనరవవిలస న్నూపురాసాదపాదం

తాటంకద్యోత కర్ణం విషగళసుషమా తాండవానంద కందం

వందే యాదక్షమాభృత్‌ కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: సమ్తలోకాలను సంరక్షించే ఆశ్రయముÑ సకల భువనా(లోకా)లను లయమొందించేవాడు, నిరంతరము పోషించి రక్షించేవాడుÑ కరుణ అనే సముద్రానికి ప్రభువైన (అధిపతిjైున) వాడుÑ విశేషమైన శబ్దాలను వెలువరించే ప్రకాశిస్తూన్న అందెలను అలంకరించుకున్న పాదము(లు) కలవాడుÑ తాటంకముల (చెవికమ్మల) చేత అందమును సంతరించుకుని ప్రకాశిస్తున్న చెవులు కలవాడుÑ శ్రీకంఠుని పరమశోభాకరమైన తాండవనాట్య సమయంలో కలిగే ఆనందానికి మూల(కారణ)మైనవాడు అయిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లోకం అంటే ఇంద్రియగోచరమైన ఈ సమస్త చరాచర స్థావర జంగ మాత్మకమైన, ఎనభై నాలుగు లక్షల జీవరాశికి నిలయమైన, సంపూర్ణ సృష్టి అని చెప్పవచ్చు. సాధారణ మానవుడికి ఇంద్రియ గోచరమైన ఈ లోకం అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా పిలవబడుతున్నది. ఋషివరేణ్యుల జ్ఞానచక్షువులకు ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు కనిపిస్తుంటాయి.  వాటినే అనేక కోటి బ్రహ్మాండాలని జ్ఞానులు చెప్తుంటారు. (లోకGఅనీకGఅవనGఓకంR) అటువంటి లోకానీకములను, అనేక కోటి బ్రహ్మాండాలను (అవనR) రక్షించటానికి (ఓకంR) చక్కని, ఏకైక ఆశ్రమైనవాడుÑ (సకలGభువనR) సమస్త లోకాలను (భుక్‌R) భుజించటం అంటే మహాప్రళయకాలంలో తనలో లీనం చేసుకునేవాడు విష్ణుమూర్తి! అంతేనా? (సత్రR) ఆ లోకాలన్నిటినీ పోషించి, శరణమిచ్చి, రక్షణ కల్పించి, వాటికి తానే ఆశ్రయంగా నిలిచినవాడు. సత్రం అంటే  తగిన దక్షిణ లిచ్చి సతతము అన్నదానం చేయటం అని కూడ అర్థం! పూర్వం ఋషులు సత్రయాగం చేశారని పురాణాల్లో పేర్కొన్న దీ యాగాన్నే!, ఇంకా (సంత్రాణR) చక్కగా రక్షించటం అనే (తంత్రంR) కుటుంబ భరణ వ్యాపారాన్ని, పనిని, చేసేవాడు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు.

సృష్టి, స్థితి, లయ కార్యాలకు మూలమైనవాడు విష్ణుమూర్తియే కదా!Ñ తనను ఆశ్రయించిన, ఆపన్నులైన భక్తజనులను, విపత్తుల నుండి కాపాడి (కారుణ్యGఅర్ణోధినాధంR) దయతో బ్రోచే కరుణాసముద్రానికి అధినాథుడుÑ (ఘనGరవGవిలసత్‌G నూపురGఆసాదGపాదంR) విశేషంగా మంజులనాదాన్ని వెలువరిస్తూ, మిక్కిలి సౌందర్యవంతములైన అందెలచేత (మంజీరాలచేత) అలంకరింపబడిన పాదాలు కలిగినవాడుÑ (తాటంకGద్యోతGకర్ణంR) శోభాయమానములైన చెవికమ్మలచేత ప్రకాశిస్తూన్న చెవులు కలిగినవాడుÑ (విషగళGసుషమాGతాండవGఆనందGకందంR) విషగళుడు శంకరుడు. సకలలోక శుభంకరుడైన శంకరుడు దివసావనాన సమయంలో అంటే సాయంసంధ్యా సమయంలో తాండవ నృత్యం చేస్తూ

ఉంటాడంటారు. (విషగళR) హాలాహల విషాన్ని తన కంఠసీమలో నిలుపుకుని శ్రీకంఠుడనే నామధేయాన్ని సార్థక పరచుకున్నవాడు శివుడు! అందుకే ఆయన శివుడు R మంగళకరుడైనాడు. శివుడు మనోజ్ఞమైన తాండవ నృత్యాన్ని చేస్తూంటే కలిగే ఆనందం ఇంతటిదని చెప్పడానికి వీలు కాదు! దాన్ని ఆనంద తాండవమంటారు. అదే బ్రహ్మానందం కంటే అతీతమైనది. అటువంటి ఆనందం కలగటానికీ, కలిగించటానికీ మూలమైనవాడు శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు. శ్రీ యాదగిరిపై నెలకొని తన పటుభుజబలంతో విక్రమిస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామిని కవి తన సుధామధుర కవితారస ధారాపూరంతో నమస్కరిస్తున్నాడు.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బోయి భీమన్న

by Dr. Kasarla Rangarao December 31, 2021
written by Dr. Kasarla Rangarao

బోయి భీమన్న (19 సెప్టెంబరు 1911-16 డిసెంబర్ 2005) మధ్య జీవించారు. సామాజిక మార్పు కు సామాజిక చైతన్యాన్నాశించి రచనలు చేశారు.అతిపేద దళిత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆశావహ దృక్పథంతో జీవించారు. వీరి “గుడిసెలు కాలిపోతున్నై” అనే రచన ఒక బలమైన సామాజిక సమస్యను చర్చకు పెట్టింది. వీరి సాహిత్యకృషికి ( “గుడిసెలు కాలిపోతున్నై” కి) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సామాజిక కృషికి ” పద్మభూషణ్” , రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు ,కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్ లు లభించాయి. “పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న” గ్రంథం హైమవతి గారు రచించారు. బోయి భీమన్న గారి బహుముఖీన సాహిత్య , సామాజిక దృక్పథానికి ఈ గ్రంథం చుక్కాని వంటిది. జాతీయతతో తాను పుట్టిపెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే ఆత్మగౌరవం తో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది. ఈ అనుగుణంగా ఉండటమంటే అస్పృశ్యతకు వ్యతిరేకంగా ,కులాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడటమే. ఈ వాస్తవికాల ద్వారానే ఎదిగి కులనిర్మూలన పంథా రావాలని ,వేయేళ్ళ బానిసత్వానికి కారణమైన మన యీ అనైక్యత పోవాలని బోయి భీమన్న , అంబేద్కర్ ల ఆశయం, ఆకాంక్ష. సామాజిక న్యాయం లభించిన తర్వాత ప్రతిభ ,ప్రజ్ఞ , జిజ్ఞాస కలవారిని మాత్రమే ఎన్నిక చేయాలని కులప్రాతిపదికగా చేయరాదని వారి పోరాటం. ఇదే వారి కులనిర్మూలనోద్యమానికి ప్రాతిపదిక. దాదాపు 15 వరకు కవిత్వ సంపుటులు, 13 నాటకాలు , 8 వచన రచనా సంపుటుల ద్వారా తన అభ్యుదయ , ప్రగతిశీల భావాల్ను బోయి భీమన్న గారు ప్రకటించారు. బోయి భీమన్న సాహిత్య పీఠం ద్వారా ప్రముఖులకు అవార్డు ప్రధానం జరుగుతుంది. ఇది శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వారి ద్వారానే నిర్వహించబడుతుంది. మన బోయి భీమన్న వర్థంతి 16 డిసెంబర్ సందర్భంగా అన్ని రకాల హింసను వ్యతిరేకించి ,సమన్వయ దృక్పథాన్ని ఆచరించిన ఆయన పరిణితిని , పోరాట శీలాన్ని స్మరించుకుంటూ ఆచరిద్దాం.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అతడే ఒక ఎదురుదెబ్బ

by Agumamidi Ayodhya reddy December 31, 2021
written by Agumamidi Ayodhya reddy

కుర్చీలోంచి విసురుగా లేచాడు రమణ.

“గాయత్రీ..! ఫర్ గాడ్స్ సేక్.. మళ్లీ  నీ ఎపిసోడ్ మొదలెట్టకు. వినీవినీ విసుగొచ్చింది. నువు ముందా ఏడుపు మానెయ్యి. ఐ కాంట్ టేక్ ఎనీమోర్ ఆఫ్ దిస్” చిరాకునంతా ముఖంలో ప్రదర్శిస్తూ అన్నాడు.

అతని అనవసర ఇరిటేషన్ నాకూ కోపం తెప్పించింది. కానీ సర్దుకున్నాను.

“నేను చెప్పేది ఎపిసోడ్ లా అనిపిస్తుందా నీకు?”

“కాదామరి,  మాట్లాడితే మన పెళ్లి ఎప్పుడంటావు. అసలా బాండింగ్ కోసం ఎందుకంత తొందర?”

“ తొందర కాదు, అవసరం. మనం కలిసుందామని డిసైడైనప్పుడు అది కొద్దిరోజులు మాత్రమే అనుకున్నాం. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఇప్పటికి  ఏడాదిన్నర దాటింది. నువ్వుగా ప్రస్తావన తేవు. నేను పెళ్లి మాటెత్తితే దాటేస్తావు. దీనివల్ల  మనమధ్య మనస్పర్థలు, దూరం పెరుగుతున్నయి. మన ప్రేమ మీద ఇష్టంతో, భవిష్యత్తు మీద నమ్మకంతో సహజీవనానికి ఒప్పుకున్నా. ఇప్పుడేమో నువు పెళ్ళిని తేలిగ్గా తీసుకుంటున్నావు. అసలు నీ మనసులో ఉన్నదేమిటో  స్పష్టం చెయ్యి. ఒక క్లారిటీ వస్తే మంచిది”

“జస్ట్ షటప్ ఐసే.. నీ సోది మళ్ళీమళ్ళీ వినే ఓపిక నాకు లేదని ముందే చెప్పాను. ఇంట్లో ఉంటే ఒక్కక్షణం మనశ్శాంతిగా ఉండనీవు. అందుకే వెళ్లిపోతున్నా” మాట పూర్తిచేస్తూనే విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనుకే పెద్దచప్పుడుతో తలుపు మూసుకుంది.

గత కొన్నిరోజులుగా జరుగుతున్నదే మళ్లా ఈరోజూ జరిగింది.

ఒక సందర్భానికి తనకు అనుకూలమైన విధంగా ముగింపు పలికి అతడు తప్పుకున్నాడు. చిక్కని నీడలాంటి మరో సాయంత్రం నాముందు పరుచుకుంది. ఇల్లంతా నిండిన నిశ్శబ్దం… నన్ను కావలించుకునే ఒంటరితనం. నిస్సహాయతతో ఏడుపొస్తుంది. కానీ ఇప్పడేడ్చి లాభమేమిటి?

అనుకోకుండా మొదలైన మా సహజీవనం మరొకలా రూపం మార్చుకుంది. అప్పటికి ఇద్దర ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. అంతకుమించి మంచి స్నేహితులం. మామీద ఆఫీసులో, బయటా ఏవేవో రూమర్స్ పుట్టేంత సన్నిహితులం.

ఒకరోజు లంచ్ టైములో కేంటీన్లో చెప్పాడు రమణ.

“ఇంకో వారంలో నేనుండే ఇల్లు వెకేట్ చేయాలి గాయత్రీ ..! ఎంత ప్రయత్నించినా నాకు సూటయ్యే మరో కొంప దొరకడం లేదు. ఈ నగరంలో సరైన ఇల్లు, అందులోనూ మన స్తోమతకు తగింది దొరకడం కష్టమని తేలిపోయింది”

“ఇల్లు కోసం వెతుకుతున్నావా ఏమిటి..?”

“అవును. ఇల్లు సౌకర్యంగా ఉందనిపిస్తే అద్దెలు ఎక్కువున్నయి. తక్కువలో కావాలనుకుంటే అసౌకర్యంగా, మన ఆఫీసుకు చాలా దూరంగా ట్రాన్స్ పోర్టుకు ఇబ్బంది అయ్యేలా ఉన్నాయి”

“ఇది అందరికీ ఎదురయ్యే సమస్యనే. ప్రత్యేకించి నీకొక్కడికే కాదు” నవ్వాను.

“అందుకే మరెవరినైనా కలుపుకొని షేరింగులో మంచి ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందనే యోచనలో ఉన్నా”

“నాదగ్గరో మంచి ఐడియా వుంది..చెప్పనా?”

“చెప్పు.. సందేహం ఎందుకు?”

“మరి నువు షేర్ చేసుకునే హౌస్ మేట్ నేనే అయితే ఎలా ఉంటుంది..?”

రమణ ఒక్కక్షణం అయోమయంగా నాముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు. ఇబ్బంది పడినట్టు కనిపించాడు.

“ ఇది మంచి ఐడియా యెలా అవుతుంది? అందరూ ఏమనుకుంటారు? ముఖ్యంగా మీ తల్లితండ్రులకు తెలిస్తే…”

“ఏమీ కాదు. నేనేం చేసినా అది నాయిష్టం. నాకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉంది. పైగా మనం ఒకర్నొకరు

బాగా సన్నిహితులం. మన భవిష్యత్తుకూ, పరస్పరం  సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకూ ఇదో అవకాశంగా భావించు.”

“నీతో కలిసివుండటం ఒక అద్భుతం, కానీ…”

“ఇంకేం ఆలోచించకు. నేను కూడా పీజీ నుంచి ఖాళీ చేయాల్సివుంది. ఇద్దరం కలిసి మంచి ఇల్లు వెతికి ఈ వీకెండుకే చేరిపోదాం”

“నువు నిజంగానే నాతో కలిసుండాలనుకుంటున్నావా?” అతనిలో ఏదో సంశయం.

రమణకు వివరంగా సర్దిచెప్పాను. అట్లా ఎక్కువకాలం ఉండాల్సిన అవసరం లేదన్నాను. త్వరలోనే మనకూ ఒక కుటుంబం ఏర్పడి అంతా సెటిలైపోతుందని చెప్పాను. ఆవిధంగా ఇద్దరం ఒకచోట వుండాలనుకున్నాం. నేనప్పటికే అతన్ని ఇష్టపడి ఉన్నాను. పైకి అనకపోయినా రమణ కూడా అంతేనని నాకు తెలుసు. అయితే ‘మనం వెంటనే పెళ్లి చేసుకుందామని’ మాత్రం చెప్పలేకపోయాను.

మేము కలిసివుండటం మా అమ్మా నాన్నలకు ఇష్టంలేకపోయింది.

“కలిసివుండటం ఎందుకు? ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లిచేసుకోవచ్చుగద. మిమ్మల్నెవరు కాదన్నారు?” అమ్మ అన్నది.

“ కొద్దిరోజులే మమ్మీ..! తొందర్లోనే మ్యారేజీ చేసుకుంటాం. రమణ చాలా మంచివాడు”

“ ఏ మాత్రం బెడిసికొట్టినా నష్టపోయేది స్త్రీ మాత్రమే. ఆ సంగతి గుర్తుంచుకో బేబీ”

నాన్న ఎందులోనూ లోతుగా జోక్యం చేసుకోడు. ఈ విషయంలో నన్ను సున్నితంగా హెచ్చరించాడు.

“అతను మంచివాడే కావొచ్చు బేబీ..! కానీ సహజీవనమంటే కాలక్రమంలో అతనికి నీమీద గౌరవం పోవొచ్చు. ఇప్పుడున్న ఆపేక్షలు ముందు ముందు ఉండకపోవచ్చు. నా సలహా ఏమంటే మీరు పెళ్లి చేసుకుంటేనే మంచిది.”

“ అదేం కాదులే నాన్నా. నేను అన్నీ ఆలోచించాను. నా నిర్ణయంలో మార్చులేదు”

“తప్పు చేస్తున్నావు బేబీ..! ఏదోరోజు బాధపడే స్థితి తెచ్చుకోకు. ఎదురుదెబ్బలు తినకుండా చూసుకో” అమ్మ చివరి హెచ్చరికగా అన్నది.

నేను వాళ్ళ జాగ్రత్తలు, హితవచనాలను పట్టించుకోలేదు. అమ్మానాన్న నన్ను సరిగా అర్థం చేసుకోలేదనిపించింది. నాజీవితాన్ని నేనే మలుచుకోవాలని భావించుకున్నాను. నేను రమణని ప్రేమించాను. అతనితో కలిసి నాకిష్టమైనట్టుగా బతకాలనుకున్నా. జీవితం రొటీన్ కావడం నాకు నచ్చదు. రమణతో సహజీవనంలో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లిచేసుకోవడం, నా సంసారం.. పిల్లలు.. ఇదే నాక్కావలిసింది.

గడియారం వంక చూశాను. పది గంటలు దాటింది. రమణ ఇంటికి రాలేదు. మరునాడు కూడా రాలేదు. ఆవేశమూ ఆవెనుకే నిస్సహాయతా నన్ను కుదిపివేశాయి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అతనిప్పుడు పనిచేసే కంపెనీకి కాల్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదు. పెళ్లి విషయంలో అతన్నుంచి పదేపదే తిరస్కార స్థితిని ఎదుర్కోవడం ఓటమిగా అనిపించి ఆవేదన పెరిగింది. మనసులో అలుముకున్న నా గోడు వెళ్లబోసుకుంటే తప్ప బరువు దిగదనిపించింది. నాన్నతో మాట్లాడే ధైర్యంలేక అమ్మకు కాల్ చేశాను. వెంటనే ఫోనెత్తింది.

“హలో మమ్మీ..!”

“హలో బేబీ..! ఎలా ఉన్నావు. బిజీ అనుకుంటా.. మొన్న ఫోన్ చేస్తే లిఫ్టు చేయలేదు”

“నేను బాగానే ఉన్నాను మమ్మీ”

“మరి నీ గొంతు అట్లా ధ్వనించడం లేదే”

అమ్మ మాటకు తెలియకుండానే ఏడుపొచ్చింది. దుఃఖం గొంతులోంచి జారకుండా సర్దుకున్నాను.

“అవును మమ్మీ..! మేము మళ్ళీ గొడవపడ్డాం. మొన్న ఇంట్లోంచి వెళ్ళిన రమణ ఇంకా రాలేదు”

తల్లికి ఏం అర్థమైందో, ఎలా ఫీలయిందో తెలియదు, కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది.

“చాలారోజులుగా నీకు అబద్ధం చెపుతూ వొచ్చాను. నిజానికి రమణ పెళ్ళికి సిద్ధంగా లేడు మమ్మీ. అడిగితే దాటేస్తున్నాడు.

లేదా ఘర్షణపడి బయటికి పోతాడు. అతనితో సహజీవనం విషయంలో మీరొద్దన్నా వినకుండా తొందరపాటు నిర్ణయం

తీసుకున్నాననిపిస్తుంది”

“పెళ్లి గురించి నువు ఖచ్చితంగా అడిగావా?”

“చాలాసార్లు అడిగాను. అతనిలో ఆ ధ్యాసే లేదు. పెళ్లి, పిల్లలు, ఒక కుటుంబం కోసం నేనెంత ఇష్టంగా ఆరాటంగా ఉన్నదీ చెప్పినా అతడు వినిపించుకోవడం లేదు. రమణ నేను ఊహించుకున్న వ్యక్తి కాదు. నన్నతడు వాడుకుంటున్నాడని అనిపిస్తుంది”

“మీరిలా గొడవలకుపోతే సమస్య తీవ్రమవుతుంది. ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి. అతని ఉద్దేశ్యమేమిటో తెలుస్తుంది. అంతేకాదు, నీ పరిస్థితేమిటో.. నువ్వెక్కడున్నావో కూడా నీకు అర్థమవుతుంది” అమ్మ చెప్పింది.

సహజీవనం తొలుత స్వర్గతుల్యం అనిపించింది. ఎంతో అన్యోన్యంగా గడిపాం. ఒకరిమీద ఒకరు ఎంతో ఆపేక్ష కనబరిచాం. రోజులెట్లా గడిచాయో తెలియలేదు. గంటలకొద్ది కబుర్లు, సినిమాలు, షికార్లు, వీకెండ్ విహారాలు, మోహాలు, తాపాలు, సుఖాలు. కానీ కాలక్రమంలో సహజీవన చిత్రం రంగు మారసాగింది. నెలలు గడిచినా రమణ ఏనాడూ పెళ్లి మాటెత్తలేదు.  భవిష్యత్ జీవితం, పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు విషయం దాటేస్తూ వొచ్చాడు. పెళ్లి.. సంసారం.. పిల్లలు అంటే అనాసక్తిగా ఉండేవాడు. నాకు అసహనం పెరగసాగింది. అసలు రమణ నన్ను ఇష్టపడ్డాడా అనే సందేహం చాలా  రోజులకుగానీ నాకు కలుగలేదు. అతన్ని గట్టిగా నిలదీసి అడుగలేకపోయాను.

అందుకు అతడు నాకు ద్రోహం చేస్తాడన్న ఊహ నాలో లేకపోవడమే. ఎంత వొత్తిడి చేస్తున్నా అతడు తేలిగ్గా తీసుకున్నాడు.

“పాతకాలపు ఆడపిల్లలా ఏమిటి నీ చాదస్తం..! మనకు పెళ్లి అవసరమేముంది.. ఇప్పుడు బాగానే ఉన్నాముగా”

అతని ధోరణిలో నాకు నిర్లక్ష్యం కనిపించి హృదయం విలవిలాడుతుంది. ఒక అభద్రతా భావన మొలకెత్తి బలపడసాగింది.

అతడు మరో అమ్మాయివేపు మొగ్గుతున్నాడా? వేరే పెళ్లిచేసుకోవాలని చూస్తున్నాడా అనే అనుమానం. ఆ ప్రభావం క్రమేపీ మా సహజీవనం మీద చూపుతున్నది. అతడు అనవసరంగా చిరాకుపడటం, కోపగించుకోవడం సాగించాడు. ఇంట్లో ఉండటం తగ్గించి ఎక్కువగా బయటకు వెళ్లి  వొస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదనిపించింది. అమ్మ చెప్పిన సలహా ప్రకారం అతన్ని నిలదీసి మనోగతం తెలుసుకోవాలి.

***

నాలో ఒక అభద్రతా భావం పెరుగుతున్నది. దానికితోడు నేనిప్పుడు గర్భవతిని.

“రమణా.. అట్లా కూర్చో. మనం సీరియస్ గా ఒక విషయం మాట్లాడుకోవాలి” అతన్ని నిలదీశాను.

కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి రెండ్రోజుల తర్వాత తిరిగొచ్చిన గిల్టీ గానీ, ఇబ్బంది పడుతున్న స్థితిగానీ అతనిలో  కనిపించలేదు. రమణ  అసహనంగా చూస్తూ “ఏంమాట్లాడాలి? పాత పాటేనా? నువు పెళ్లి.. పిల్లలు.. సంసారం అన్నావంటే సారీ..! నాకు వినే ఓపిక లేదు”

“నేను మళ్ళీమళ్ళీ అనేందుకు ఏముంది?  ఈ సమస్య కొత్తది కాదు. ఎన్నోరోజుల ముందే మొదలైంది.”

“ఇందులో సమస్య ఏముంది? మనకేం గొడవలు లేవు. హాయిగా ఉంటున్నాం. సగటు ఆడపిల్లలా ఆలోచించి సమస్యను నువ్వే సృష్టించుకుంటున్నావు”

“అయితే పెళ్లి వద్దంటావు. కలిసి కాపురం చేయగాలేంది పెళ్ళంటే అభ్యంతర మేమిటి? అసలు నీ మనసులో ఎమున్నదీ చెప్పు”

“నాకు ఎలాంటి బాదరబందీలు ఇష్టం లేదు గాయత్రీ ..! జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం నాది. నేను ఇంటరు చదువుతున్నప్పుడే మానాన్న పోయాడు. మా అమ్మే కష్టపడి నన్ను చదివించింది. ఉద్యోగంలో చేరిన తర్వాత కుటుంబం బరువులన్నీ నామీద వేసుకున్నాను. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిచేశాను. ఇందుకోసం చాలా సర్దుబాటుతో బతికాను. ఇప్పుడు అమ్మ కూడా పోయింది. ఒంటరిని. నాకే బంధనాలు లేకుండా హాయిగా గడపాలని అనుకున్నాను. అందులో భాగంగానే నీతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నా. మనం పరస్పర ఇష్టంతోనే సహజీవనానికి సిద్ధపడ్డాం. ప్రేమ, పెళ్లి, సంసారం, బంధాలు ఇవన్నీ నాకు నచ్చనివి. నువు ఏవేవో ఊహించుకొనివుంటే అందుకు నేను బాధ్యున్ని కాదు. ఇక పిల్లలంటావా.. దానికి ఏనాడూ అంగీకరించను. నాకే జంజాటాలు వొద్దు. జీవితంలో మొదటిసారి స్వేచ్ఛను అనుభవిస్తున్నా. నాకు దీన్ని కోల్పోవడం ఇష్టం లేదు. మళ్లా బరువులెత్తుకోవడం నావల్ల కాదు.”

“ఈ ఆలోచన ఉన్నవాడివి నాతో సహజీవం ఎందుకు? ఎంజాయ్మెంటులో ఇదీ భాగమేనా? పెళ్లి విషయంలో నీకిప్పుడే జ్ఞానోదయమైందా? అంటే… ఇంతకాలం నన్ను ఉద్దేశపూర్వకంగానే వాడుకొని..” మాట్లాడుతుంటే దుఃఖంతో నాకంఠం వొణికింది.

“ నన్ను మాత్రమే దోషిని చెయ్యాలని చూడకు. నీకిష్టం లేకనే నాతో సహజీవనం చేశావా? నాతోపాటు నువ్వూ ఎంజాయ్ చేశావు కదా. కొత్తగా ఈ పెళ్లి.. పిల్లలు అంటూ ఏళ్లతరబడి బాధ్యతలు మోయలేను..సారీ”

“నీ సంసారం, నీకుపుట్టే  పిల్లలు భారం ఎట్లా అవుతుంది? నిన్ను ప్రేమించినట్టే ఇల్లు, సంసారం, పిల్లలంటే నాకు ప్రేమ. రమణా.. అర్థం చేసుకో”

“అయాం సారీ..! ఈ విషయంలో నువు ఎప్పటికీ నిరాశచెందక తప్పదు”

ఒకరోజు అతనికి అసలు విషయం వెల్లడించాను.

“అయామ్ ప్రెగ్నెంట్ రమణా..” చిన్నగా చెప్పినా నాగొంతు స్పష్టంగా ఉంది.

విషయం తెలిసి సంతోషిస్తాడనుకున్నా. కానీ ఏదో వినకూడనిది విన్నట్టు నావైపు తీక్షణంగా చూశాడు. సోఫాలో కూర్చొని ఫోనులోకి చూస్తున్నవాడల్లా ఆపేసి పూర్తిగా నావైపు తిరిగాడు. కోపంగా తల విదిలించి “నో..! అలా జరగడానికి వీల్లేదు. ఈ విషయం ఇన్నిరోజులు ఎందుకు దాచావు? నాకెందుకు చెప్పలేదు?”

“ఇందులో రహస్యం ఏముంది.. సంతోషపడే సంగతే కద. నాకిప్పుడు మూడోనెల”

“కాదు, నువు కావాలనే దాచావు. దీన్నడ్డం పెట్టుకొని నువు అనుకున్నది సాధించాలనుకున్నావు. కానీ పెళ్ళీ, పిల్లలూ నాకెంతమాత్రం ఇష్టంలేదు. నేను టాలరేట్ చేయను అంతే..”

“రమణా.. ఏమిటి నీ ధోరణి? వాట్స్ రాంగ్ విత్ యూ?”

“నో.. ఐ కాంట్ డు దిస్. నువ్వెంత చెప్పినా అస్సలు ఒప్పుకోను. నేను ఒక భర్తగా, తండ్రిగా సెటిలయ్యే మనిషిని కాదు. నా కోరికలు వేరు, జీవితం వేరు. ఐనా ఇప్పుడేమైంది? ముందు కడుపు తీయించుకో. వెంటనే ఆస్పత్రికి పోతే అబార్షన్ చేస్తారు”

“ఇడియట్..!” గట్టిగా అరిచాను. “నీకు బుద్ధుందా? అసలు మనిషివేనా? గర్భం తొలగించుకోమంటావా? బిడ్డకు తండ్రిగా ఇదా నీ మాట? కనీస మానవత్వం కూడా లేదా? పుట్టబోయే బిడ్డలను చంపేస్తూ మనం మాత్రం హాయిగా ఎంజాయ్ చేద్దామంటావా? పశువులా బిహేవ్ చేయకు..” మాటలంటుంటే నన్ను నేను కంట్రోలు చేసుకోలేక ఏడిచాను.

“నువ్వెంత సెంటిమెంటలైనా, నీ ఫీలింగ్స్ ఏవైనా నాకు సంబంధం లేదు. ఏడ్చి గగ్గోలు పెట్టినా లాభంలేదు. నా మనసు మారదు. గుర్తుంచుకో”

దుఃఖం ఆపుకొని నార్మల్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ అన్నాను: “ నిజమే.. నువు మారవు. ఇదంతా నీ తప్పుకాదు, నాది. మొదటినుంచీ నీ మనసులో నిర్ణయాలు ఉన్నాయి. నన్ను నువు ప్రేమిస్తున్నావని నేనే తెలివితక్కువగా నమ్మి మోసపోయాను. జీవితంలో మనిద్దరం రెండు వేర్వేరు ఇష్టాలతో భిన్నమైన అంశాలను కోరుకున్నాం. నిజానికి నీకు నేనంటే ఏనాడూ ప్రేమ అనేదే లేదని నాకనిపిస్తుంది”

“అయితే ఏమిటిప్పుడు..? నన్ను వెళ్లిపొమ్మంటావా?”

“ నువ్వెందుకు.. నేనే వెళ్లిపోతాను. మనమిప్పుడు చేయగలిగేది అదొక్కటే. ఇంతజరిగి.. అసలు వాస్తవం తెలిశాక ఇక మనం ఒకే గూట్లో వుండటం అసందర్భం.. అసాధ్యం” కళ్లవెంట నీరు కారుతున్నా నాస్వరం కటువుగా పలికింది.

మరోమాట లేకుండా అతడు బయటికి వెళ్ళిపోయాడు. రెండ్రోజుల తర్వాత ఫోన్ చేసి తనకు బెంగళూరు బదిలీ అయిందని, వెళ్లిపోతున్నానని తెలిపాడు. శాశ్వతంగా గుడ్ బై అనికూడా చెప్పాడు.

నాకర్థమైపోయింది ఇక అతడు తిరిగిరాడని. ఏమీచేయలేని నిస్సహాయురాలిగా దుఃఖమొచ్చింది. కొంతసేపటికి తేరుకొని మామూలయ్యాను. చేయవలసిన దానిగురించి ఆలోచించాను. జీవితాంతం కలిసి బతకాలనుకున్న మనిషి అసలు రూపం బయటికొచ్చింది. ఒక సంకుచిత నిర్ణయాన్ని అతడు తీసుకున్నాడు. నాకు తోడు కాలేకపోయాడు. అతనికోసం దేబిరిస్తూ.. ఎదురుచూస్తూ ఎందుకుండాలి? బంధాలు వద్దనుకున్నవాడు పెళ్ళికి ఒప్పుకుంటాడా? అతన్ని ప్రేమించడం, నమ్ముకోవడం నాదే తప్పిదం. జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటూ నేనుగా ముందుకు సాగాలనుకున్నా. ప్రెగ్నెన్సీ నిలుపుకోవాలని, బిడ్డను కనాలనే నిర్ణయించుకున్నా. ఆఫీసుకి సెలవుపెట్టి పుట్టింటికి వెళ్లిపోయాను.

***

కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. నాకిప్పుడు ముద్దులు మూటగట్టే పాప ఉన్నది. రమణ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అతని గురించి గుర్తుచేసుకునే తీరికా.. ఇష్టమూ ఇప్పుడు నాలో లేవు. అతడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, నా బతుకులోంచి. కొత్తదారిలో చాలాదూరం వొచ్చేశాను. ఆశలు వెతుక్కుంటూ బతుకుబాటలో నాదైన రీతిలో సాగిపోతున్నాను.

కాలింగ్ బెల్ చప్పుడువిని వెళ్లి తలుపు తీశాను. అతడు నన్ను దాటుకొని లోపలికొచ్చాడు.

“బాగున్నావా గాయత్రీ..” అంటూ నా జవాబు కోసం చూడకుండా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.

గుర్తుపట్టాను.. రమణ. బాగా మారిపోయాడు. “ఇక్కడికెందుకొచ్చావు? ఎవరు చెప్పారు నేనిక్కడున్నట్టు” చిరాకుపడుతూ అన్నాను.

“మనసుంటే మార్గాలకేం? తెలుసుకోలేననుకున్నావా?”

“మళ్లీ ఎందుకొచ్చావు? ఇంకా ఏంచేద్దామని? నా బతుకేదో బతకనివ్వవా?”

“నీకు కీడు చేద్దామని రాలేదు డియర్. నేనిప్పుడు మారిపోయాను. నీకు మేలుచేద్దామనే వొచ్చాను”

“ఇప్పటివరకు నువు చేసిన మేలు చాలు. నన్నిట్లా వొదిలెయ్యి. బెంగళూరు నుంచి స్టేట్స్ వెళ్ళినట్టు నీ పాత కొలీగ్ అప్పుడెపుడో చెప్పాడు. మళ్లా ఎందుకొచ్చావు?”

“ అవును,  నెలరోజుల క్రితమే ఇండియా వొచ్చాను. ఇప్పుడేమో నీకోసం వొచ్చాను”

“ఏం.. ఇంకెవరూ ఆడవాళ్ళు దొరుకలేదా? నేను నీకోసం తయారుగా ఉంటాననుకున్నావా?”

“అంత కటువుగా మాట్లాడకు డియర్ ..! మీ ఊరువెళ్ళి మీ అమ్మ నాన్నను కలిసి నేను చేసిన తప్పు గురించి చెప్పాను. తప్పును

తెలుసుకున్నట్టు కూడా తెలిపాను. సరిదిద్దుకుంటానన్నాను. వాళ్లు నన్ను క్షమించారు. నువు కంపెనీ మారినట్టూ.. ఒంటరిగానే

ఉంటున్నట్టూ చెప్పారు. నీ అడ్రసు తెలుసుకొని నేరుగా వొచ్చాను”

నేను మాట్లాడకుండా అతనివైపు  చూశాను. రంగుతేలి బాగా లావయ్యాడు. డాలర్లు వొంటికి పట్టి దర్జా అలవడినట్టుంది. నన్ను వెతుక్కుంటూ వొచ్చిన అతనిపట్ల నాలో ఏమాత్రం స్పందన లేదు.

“ఎట్లా ఉండింది అమెరికా జీవితం..? ముఖ్యంగా నీ స్వేచ్ఛా జీవితం”

నామాటల్లోని వ్యంగ్యానికి అతడేమీ నొచ్చుకున్నట్టు కనిపించలేదు.

“మా పెద్ద చెల్లెలు న్యూజెర్సీలో వుంది. ఆమె దగ్గర కొన్నిరోజులు వున్నాను. తర్వాత మరో ఇద్దరితో కలిసి షేరింగ్ ఫ్లాట్ తీసుకొని వున్నాను. ఎక్కువ సంపాదన, కొత్త స్నేహాలు, అమ్మాయిలు.. బాగానే ఎంజాయ్ చేశాను”

“మరింకేం, అక్కడే హాయిగా ఉండకుండా ఇండియాకు ఎందుకొచ్చావు?”

“డబ్బు, స్వేచ్ఛ, ఇవేవీ జీవితంలో అసలైన ఆనందాలు కావని గ్రహించాను. చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా వాళ్ళెవరూ నావాళ్ళనిపించలేదు. వారిలో ప్రేమానురాగాలు, కన్సెర్న్ లేవు. పరిచయాలైనా, స్నేహాలైనా అన్నీ అవసరపూర్తివే. కొందరు నావెనుకున్న డబ్బునుచూసి కమిట్ అయ్యేందుకు సిద్ధపడితే, ఇంకొందరు నాకంటే మెరుగైనవాడి కోసం వెతుక్కున్నారు. ఎవరి స్నేహమైనా కొద్దిరోజులకన్నా మిగల్లేదు. ఒక బంధంలో ఇరుక్కోవడం ఎవరికీ ఇష్టంలేక పోయింది. నాకనిపించింది.. అంతపెద్ద దేశంలో మాచెల్లెలు ఒక్కరు తప్ప నాకోసం నిజాయితీగా  తలచేవారెవరూ కనిపించలేదు”

“ దాదాపు రెండేళ్లు అమెరికాలో వుండి వొచ్చావు. ఎవరినీ తోడు తెచ్చుకోలేదేం..? బాదరబందీ ఎందుకనుకున్నావా? బంధాలు, బాధ్యతలు నీకు సరిపడవు కదా”

నా ఎగతాళి, ఎత్తిపొడుపు రమణ గ్రహించినా పట్టించుకోనట్టు కనిపించాడు.

“ఈపాటికి నువు పెళ్లిచేసుకొని ఉంటావనుకున్నా. కానీ ఒక్కదానివే ఇలా. నీ తెగువను మెచ్చుకుంటున్నా. అన్నట్టు పాప పుట్టిందటగదా. ఏదీ మన పాప..? నాకు చూపించవా?”

“మన పాప కాదు.. నాపాప” నా మాటల్లో కఠినత్వం.

“అయాం సారీ గాయత్రీ ..! నీపట్ల నేను చేసిన ద్రోహానికి ఎంత చింతించానో నీకు తెలియదు. ఏ అమ్మాయితో వున్నా నువ్వే గుర్తొచ్చేదానివి. నేన్నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చేది. నిన్ను తలుచుకోకుండా, నీ ఫోటో చూస్తూ నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా లేను. అప్పుడు అర్థమైంది నీ ఉనికి.. నీ విలువ. అంతేకాదు, నిన్ను ఎంత ప్రేమించానో కూడా నాకు తెలిసింది. మనం సంతోషంగా వున్నప్పటి రోజులు పదేపదే జ్ఞాపకమొచ్చి బాధపడ్డాను. దయచేసి నన్ను క్షమించగలవా?”

“క్షమించడానికి నేనేవరు..?  నిన్ను ప్రేమించడం, అట్లాగే నీ మనోగతం తెలుసుకోకుండా, నువ్వూ నన్ను ఇష్టపడ్డావని నమ్మడం నాదే తప్పు. మనిద్దరం జీవితంలో వేర్వేరు అంశాలను కోరుకున్నాం. అది తెలుసుకోలేక చాలారోజులు భ్రమలో నీతో కలిసి బతికాను. అసలు వాస్తవం ఆలస్యంగా గ్రహించినందుకు సిగ్గనిపించింది. నువు కొట్టిన ఎదురుదెబ్బ పాఠం నేర్పింది. నీమీద నాకేం కోపం లేదు. నిన్ను మర్చిపోయాను కూడా. ఇక క్షమించడాలెందుకు? ఎవరి దారులు వారివి. ఎవరి జీవితాలు వాళ్లవి.”

“అట్లాఅనకు..! ప్లీజ్.. ఫర్ గివ్ మీ. నేను చేసిన తప్పును ఇప్పటికైనా  దిద్దుకోనీ. మనం మళ్లా కలిసివుందాం. కాదు, పెళ్లిచేసుకొని మనకంటూ ఒక ఇల్లు, పిల్లలు, కుటుంబంతో ఆనందంగా ఉందాం”

“ఇందులో తప్పు నీ ఒక్కడిదే కాదు. నేను కోరుకున్నదే నువ్వూ కోరుకుంటావని భావించి దెబ్బతిన్నాను. ఇది తెలుసుకునేసరికే నష్టం జరిగిపోయింది”

“నేను మారిపోయాను గాయత్రీ ..! మనం మళ్ళీ అన్యోన్యంగా ఉండగలం. నాకిప్పుడు భార్యా.. పిల్లలూ.. ఇల్లు అన్ని బంధాలు, బాధ్యతలు కావాలి. అన్నిటికంటే ముఖ్యం.. నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ సోమచ్. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే వుంటా. నన్ను ప్రేమించగలవా?” అంటూ అతడు నాచేరువగా వొచ్చి రెండు భుజాలపైన చేతులు వేశాడు.

“నువు స్వీకరిస్తావనే నమ్మకం వందశాతం వుంది. అందుకే మళ్లా వొచ్చాను” అన్నాడు.

అతని ధోరణికి దిగ్భ్రాంతి చెందాను. కొద్దిక్షణాలు బొమ్మలా వుండిపోయాను. అది తనకు సానుకూలంగా భావించినట్టున్నాడు రమణ. నా ముఖం మీదుగా వొంగి పెదాలను నోటితో అందుకున్నాడు. నాకు కడుపులో తిప్పినట్టయింది. అతనిమీద ఎంత విముఖత ఉందో నా శరీర ప్రతిస్పందన చెప్పింది. అతన్ని ఉన్నపాటున వెనక్కి తోసేశాను.

“బయటికి వెళ్లిపో రమణా..! ఇంకెప్పుడూ నాకు ముఖం చూపించకు” గట్టిగా అరిచాను.

బాధపడుతూ చూశాడు రమణ. అతని ముఖంలో  పశ్చాత్తాపం లాంటిది చూశాను. కానీ ఇప్పుడు నా బతుకును తప్ప దేన్నీ నమ్మలేని స్థితి. నాదారిలో నేను చాలాదూరం వచ్చేశాను.

***

గతమూ, వర్తమానమూ అలలుగా కదిలిపోతూ కళ్లు చెమ్మగిల్లాయి.

చేతుల్లో ముఖం కప్పుకున్నాను. నాకు తెలుసు భవిష్యతు పూలపాన్పు కాదని. దారిలో ఎన్నో ముల్లు.. చిక్కుముడులు. కానీ ఎవరి ఆసరా లేకుండా బతకడం నేర్చుకుంటున్నా. ఇప్పుడు నాకు తోడుగా నా ఏడేళ్ళ పాప. నాబిడ్డ నాకో వరంలా వొచ్చింది. నాకున్న ధైర్యంతో, నా చిన్నారి ప్రేమతో ముందుకు సాగుతాను. కష్టం కావొచ్చు. కానీ సాధిస్తాను.

———————–

 

December 31, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నచికేతుడు

by ఆచార్య మస‌న‌ December 31, 2021
written by ఆచార్య మస‌న‌

నచికేతుడు ఉపనిషత్ వాఙ్మయాకాశంలో వెలుగొందే ధ్రువతార. అతని చరిత్ర కఠోపనిషత్తుతో చోటు చేసుకున్నది.

నచికేతుడు ఉద్దాలకుని కుమారుడు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనగలవాడు. ఎలాంటివారినైనా, ఎలాంటి ప్రశ్ననైనా  వేసి సమాధానం పొందగలడు. అలాంటివాణ్ణి మనం వాఙ్మయంలో చాలా తక్కువగా చూస్తాం.

ఉద్దాలకుడు యశస్సుతోపాటు మోక్షాన్ని కోరి, ‘విశ్వజిత్తు’ అనే పేరు గల యజ్ఞాన్ని నిర్వహించాడు. సంపూర్ణంగా తన సంపదను అర్థులకు దానం చేశాడు. ఉద్దాలకుడు దానం చేసిన వాటిలో గోవులు కూడా ఉన్నాయి. అవి గడ్డి వేయలేనివి. నీళ్లు తాగలేనివి. పాలీయలేనివి. సంతానోత్పత్తికి పనికిరానివి. అటువంటి గోవులను దానంగా ఇస్తుంటే నచికేతుడు చూశాడు. దానంవల్ల కలిగే పుణ్యం కంటె ఉపయోగానికి రాని గోవులను దానం చేయడం వల్ల తన తండ్రికి పుణ్యానికి బదులు పాపమే వస్తుందని భయపడ్డాడు నచికేతుడు. అందుకే నిర్భయంగా ‘నాన్నా నన్నెవరికిస్తావు’ అని అడిగాడు. ఉద్దాలకుడు పరధ్యానంలో ఉండడంవల్ల పుత్రుని మాటలు వినలేదు. దానితో నచికేతుడు మరో రెండుసార్లడిగాడు. చివరి మాటకు స్పందించిన తండ్రి తన పనికి కుమారుడడ్డుతగులుతున్నాడని భావించి ‘నిన్ను మృత్యువు కిస్తున్నాను’ అన్నాడు.

‘మృత్యువు’ అంటే భయపడవలసిన పనిలేదు. ‘ఆచార్య మృత్యుః’ అని అధర్వణ వేదం చెబుతుంది. మృత్యువుకిస్తున్నావని తండ్రి పలికిన మాటలకు నచికేతుడు తనను గురువు కర్పిస్తున్నట్లు గ్రహించాడు.

తండ్రి మాటలకు నచికేతుడు బెదరలేదు. చకితుడుకానివాడే నచికేతుడు. కాని తెలివిగల్గినవాడు కనుక ఆలోచనలో పడ్డాడు. అతనంతకుపూర్వమే సమీప పాఠశాలలో చదివి ఉన్నాడు కనుక, చాలామంది విద్యార్థులలో తమ ఉత్తమ శ్రేణికి చెందిన విద్యార్థిగా ఉన్నాననే నమ్మకం ఉంది. తండ్రికి కూడా తాను తెలివిలేని బాలుడనే భావన లేదు. ఐనా తండ్రి గురువు దగ్గరికి పంపుతున్నాడంటే, అందులో ఏదో ప్రయోజనముందని గ్రహించాడు నచికేతుడు. అందుకే మృత్యువనే పేరు గల యమాచార్యుని ఆశ్రమానికి బయల్దేరాడు. తీరా గురుకులానికి వస్తే అక్కడ ఆచార్యుడు లేడు. అతడు మూడు రోజుల తర్వాత వచ్చాడు ఆశ్రమానికి. అప్పటి దాకా నచికేతుడు పచ్చినీళ్ళు కూడా ముట్టలేదు. పస్తులున్నాడు!

ఆశ్రమవాసుల ద్వారా నచికేతుని గూర్చి తెలుసుకున్న ఆచార్యుడు అతనిలో ‘ఓ జ్ఞానీ, నీవు మా అతిథివి. అయినా మూడు రోజులు ఉపవాసమున్నావు. అందుకు నన్ను క్షమించు. దినానికొకటి చొప్పున మూడు వరాలు కోరుకో అని’ సెలవిచ్చాడు.

తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు తన తండ్రి కోపపడకుండా ఉండేలా వరమిమ్మని మొదటి కోరిక కోరినాడు నచికేతుడు. ఆచార్యుడు ‘సరే’ అన్నాడు. స్వర్గప్రాప్తికి సాధనమైన అగ్ని విద్యను బోధించమని నచికేతుడు రెండవ వరాన్ని కోరగా ఆచార్యుడు దానికి అంగీకరించాడు.

మూడు ఆశ్రమాలలో చేసే అగ్నిహోత్రానికే అగ్ని విద్య అని పేరు. ఎవరైతే జీవో కాలంలో తప్పకుండా యజ్ఞ దీక్షను పొంది క్రమం తప్పకుండా అగ్ని విద్యనుపాసిస్తారో వారికి స్వర్గప్రాప్తి అనగా మరుసటి జన్మలో అత్యంత సుఖం కల్గుతుంది. ఇదే అగ్ని విద్య రహస్యం!

రెండు వరాలిచ్చిన ఆచార్యుడు మూడవ వరాన్ని కోరుకొమ్మని నచికేతుడు ప్రోత్సహించినాడు.

‘మనిషి చనిపోయిన తర్వాత అతడు ఉంటాడా? ఉండడా? ఈ సందేహాన్ని తీర్చిండి. ఇదే నా మూడవ తరం’ అన్నాడు నచికేతుడు.

నచికేతుడు కోరుకున్న మూడు వరాల్లో మొదటిది మనుజులోకానికి సంబంధించింది. రెండవ వరం పునర్జన్మకు సంబంధించింది. కాగా, ఈ మూడవ వరం పూర్తిగా ఆత్మకు సంబంధించింది.

“చనిపోయిన తర్వాత ఆత్మ ఉండదా? ఉండదా అనే విషయం సామాన్యులకర్థం కాదు. కాబట్టి ఈ ప్రశ్నకు బదులు మరొక వరాన్ని కోరుకో” అని ఆచార్యుడు తెలియజేశాడు. సామాన్యులకర్థం కాని విషయం ఆచార్యుని కంటె మరెవ్వరూ చెప్పలేరని నచికేతుడు పట్టుబట్టాడు. “ఇంత కఠినమైన విషయాన్ని మీరు దప్ప మరొకరు చెప్పలేనప్పుడు, ఇతరులను అడగడంవల్ల ప్రయోజనం ఉండదు. దయచేసి ఆత్మ అస్తిత్వాన్ని తెలియజేయండి” అని ప్రార్థించాడు.

ఆచార్యుడతనికితరమైన వరాలు కోరుకొమ్మని ఆశ చూపాడు. కాని అతడేమాత్రం వెనుకంజ వేయలేదు. తన సందేహాన్ని తీర్చవలసిందేనని అంతవరకు ఆశ్రమాన్ని విడిచిపెట్టవని భీష్మించుకొని కూర్చున్నాడు. ఆ ఆచార్యుని దర్శనం చేతనే అన్ని సంపదలు లభిస్తాయని, కనుక కోరదగిన సంపద లేవీ లేవని, ఆత్మజ్ఞానం అనే సఁపదనే అనుగ్రహించమని కోరిన నచికేతుడు సామాన్యుడు కాడని చెప్పవచ్చు.

యమాచార్యుడు చేసిన ఉపదేశం ఇలా ఉంది. “ఓ నచికేతా! లోకంలో మనిషి నడుచుకునే మార్గాలు రెండున్నాయి. ఒకటి శ్రేయోమార్గం, రెండవది ప్రేయోమర్గం. సామాన్యులకు వీటి భేదం తెలియదు. సాంసారిక సుఖానుభవమే ప్రేమోమార్గం. ఆధ్యాత్మిక సుఖానుభవమే శ్రేయోమార్గం. ప్రేయోమార్గంలో వెళ్ళినవారికి పునర్జన్మ ఉంటుంది. శ్రేయోమార్గంలో వెళ్లినవారికి మోక్షం లభిస్తుంది. ఐతే ఏ మార్గంలో ప్రయాణిఁచినా దేహమే నశిస్తుంది కాని ఆత్మ నశించదు. ఆత్మ శాశ్వతమైంది. ఆత్మజ్ఞానమే పరమాత్మ సాక్షాత్కారానికి కారమవుతుంది. పరమాత్మ ఓంకారవాచ్యుడు. అతడు పరమాణువులకంటే, జీవాత్మ కంటే సూక్ష్మమైనవాడు. అతడు లేని చోటు లేదు. అతడు మన హృదయకమలంలోను ఉన్నాడు కనుక, మనం అతన్ని అక్కడే ధ్యానించాలి. శరీరం రథం లాంటిది. జీవాత్మ రథస్వామి. బుద్ధి సారథి. మనస్సనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపులో పెట్టుకోవాలి. జీవుడు మట్టి నుంచి పుట్టిన కుండ లాంటివాడు కాడు. అతడు శాశ్వతుడు. ఐతే కర్మవశాన అతడు ఒక శరీరం నుండి మరొక శరీరం లోనికి ప్రయాణిస్తుంటాడు. అతడొక విధంగా ఈ శరీరానికి అతిథి. కర్మఫలాలు తీరగానే శరీరాన్ని విడిచిపెడతాడు. అంతేకాని జీవునికి చావులేదు. శరీరం నశించినా జీవుడు మాత్రం నశించడు. ఇదే నీవడిగిన మూడవ వరం”.

యమాచార్యుడు నచికేతుకీ విధంగా ఆత్మశాశ్వతమైందని, కర్మవశాన జన్మలెత్తుతుందని, పరమాత్మ మాత్రం జన్మలెత్తడని, అతనికి కర్మలుగాని, కర్మవాసనలుగాని అంటవని చెప్పగా అతడు సంతోషాంతరంగుడయ్యాడు. చిన్నవాడైనప్పటికీ, బ్రహ్మజ్ఞానంలో అతని ముఖం ఎంతో ప్రకాశమానమైంది.

కఠోపనిషత్తులోని నచికేతునికి యుద్ధ సమయంలో విషాద యోగంలో మునిగిన అర్జునునికి తేడా ఏమీ లేదు. యమాచార్యుని స్థానంలో శ్రీ కృష్ణుడన్నాడు. అటు యమాచార్యుడు, ఇటు కృష్ణుడు చేసిన ఆత్మబోధ సమానమే. అందుకే కఠోపనిషత్తు ప్రభావం భగవద్గీత మీద ఉందని విద్వాంసుల అభిప్రాయం.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సినీగేయాల పరామర్శ

by ఏలూరు అశోక్ కుమార్ రావు December 31, 2021
written by ఏలూరు అశోక్ కుమార్ రావు

విజయా సంస్థ నిర్మించిన “జగదేక వీరుని కథ” చిత్రం 1961లో విడుదలైనది. ఆ చిత్రంలోని ఒక పాట.

రారా కన రారా

కరుణ మానిరారా ప్రియతమ లారా ||రారా||

నాలో నాలుగు ప్రాణులనగా

నాలో నాలుగు దీపములనగా       ||నాలో||

కలిసిమెలిసి అలరించిన చెలులే     ||కలిసి||

నను విడనాడెదరా                   ||రారా|

మీ ప్రేమలతో మీ స్నేహముతో      ||మీ ప్రేమ||

అమరజీవిగా నను చేసితి రే

మీరు లేని నా బ్రతుకేలా             ||మీరు||

మరణమె శరణముగా

రారా కనరారా

కరుణ మానినారా ప్రియతమ లారా

ఈ పాటను గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు అద్భుతంగా ఆలపించగా ప్రతాప్ గా నటించిన నందమూరి తారక రామారావు అభినయించారు. మధ్య మధ్య సన్నివేశ ప్రాధాన్యంగా ఇంద్రకుమారి జయంతిగా నటించిన బి.సరోజాదేవి, నాగకుమారి నాగినిగా నటించిన యల్. విజయలక్ష్మి, వరుణకుమారి వారుణిగా నటించిన జయంతి, అగ్నికుమారి మరీచిగా నటించిన బాల కనిపిస్తారు. రసస్పర్శ అంటే ఏమిటో అవగాహనతో, అనుభూతితో ఘంటసాలగారి గళంలో పెండ్యాల నాగేశ్వరరావు తన సంగీత దర్శకత్వంలో “భాగీశ్వరి” రాగంలో మనకు అందించారు.

భూలోకంలోని రాకుమారుడైన ప్రతాప్, తన జీవిత లక్ష్యమైన, తన కలల రూపంలోని నలుగురు దేవకన్యలను వివాహమాడతాడు. కాని ఆ నలుగురు తనను విడిచి ఊహకందని లోకాలకు తిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో ఉద్దేశించి కథానాయకుడు పాడిన పాట ఇది.

ఇటువంటి శోకతప్త గీతాలకు సాధారణంగా సింధుభైరవి, ముఖారి, ముల్తానీ, అసావేరి, తోడి, ఘార్జరీ, భాగీశ్వరి రాగాలను వాడతారు. పెండ్యాలవారు ఈ పాటను భాగీశ్వరి రాగంలో ట్యూన్ ని దర్శకులు కె.వి.రెడ్డిగారికి వినిపించారు. ఈ ట్యూన్ లో ఆర్తి, ఆరాధనా భావం బాగా వచ్చాయని కె.వి.రెడ్డిగారు అభిప్రాయపడ్డారు. ఆ మరునాడు మరో రాగంలో ట్యూన్ చేసి కె.వి.రెడ్డిగారికి వినిపించారు పెండ్యాలవారు. ఆ ట్యూన్ కూడా బాగుందనిపించింది కె.వి.రెడ్డిగారికి. కె.వి.రెడ్డిగారు ఈ రెండు రాగాల్లో ఏ ట్యూన్ తో రికార్డింగ్ చేయించాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డారు. పాత్రధారి ఎన్టీఆర్ ను రమ్మని కబురు పంపించి, ఈ రెండు ట్యూన్ లలో ఏది బాగుందో తెలియజేయమని, ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసికొన్నా, కట్టుబడి వుంటానన్నారు కె.వి.రెడ్డిగారు. పెండ్యాలవారు చేసిన రెండు స్వర రచనలను రెండుసార్లు పాడి ఎన్టీఆర్ కు వినిపించారు. 5 నిమిషాలపాటు ఎన్టీఆర్ మనసులో తర్జనభర్జన చేసికొని, అరబిక్ మెలోడీలోని ట్యూన్ సాహిత్యాన్ని కొంచెం వెనుకకు నెట్టి ముందుకు దూకుతోంది. సంగీతమే ముందు చెవులను తాకుతుంది. కాని భాగీశ్వరి రాగంలో సంగీత సాహిత్యాలు రెండు కూడా ఒకేసారి మనసును తాకుతున్నాయి. సన్నివేశానికి భాగీశ్వరి రాగం ట్యూన్ నిండుదనం కలిగిస్తుందని ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ లోతైన సునిశిత పరిశీలన కె.వి.రెడ్డిగారికి నచ్చింది. భాగీశ్వరి రాగంలో ట్యూన్ చేయబడిన ఈ పాట ఈ రోజువరకు సజీవంగా ఉన్నది. తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నంలో, ఒక రాకుమారుడు చేసిన సాహస కార్యముల గాథ “జగదేక వీరుని కథ”.

గీత రచయిత పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా మాటల, పాటల రచయిత మాత్రమే కాకుండా, నాటక రచయిత, పాత్రికేయుడు.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

“పాడిపంటల సిరి “మకర సంక్రాంతి”

by రసస్రవంతి& కావ్యసుధ December 31, 2021
written by రసస్రవంతి& కావ్యసుధ

మన పండుగలు వ్యక్తిని లౌకిక జీవితాన్నుంచి ఆధ్యాత్మిక చింతనకు మార్గనిర్దేశకత్వం సూచిస్తాయి మకర సంక్రాంతి మనకు సంప్రదాయ సిద్ధమైన గొప్ప పండుగ ఈ సంక్రాంతి పండుగ ఆనందోత్సవాలతో మూడు రోజులూ గొప్పగా జరుపుకుంటారు ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపదకు భారతదేశం భారతీయ సంప్రదాయం సకల జనులకు ఆచరణ యోగ్యము.

“జననీత్వం హీవో కానాం సప్తమీ సప్త సప్తకే వ్యాహాతికే
వేది నమస్తే “…. అంటే సప్తాశ్వయలతో విరాజిల్లే ఓ సప్తమీ నీవు అన్ని లోకాలకూ మాతృకవి. సర్వ శక్తి సంపన్నుడైన ఈ లోకపు ప్రాణ ప్రదాత అయిన సూర్యభగవానుని ఈ లోకానికి అందించిన నీకివే వందనములు అంటూ “మకర సంక్రాంతి ” నాడు సూర్యు భగవానుని ఆరాధిస్తూ జనులు పూజలు నిర్వహిస్తారు.

“సంక్రాంతి “అంటే సూర్యాది గ్రహారాశుల అంతర గమనం అని చెప్పబడింది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని “సంక్రమణం ” అంటారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని “మకర సంక్రమణం ” లేదా “సంక్రాంతి” అంటారు.

‘సం ‘అంటే చక్కని,’ క్రాంతి’ అంటే ‘మార్పు’ కాబట్టి ‘సంక్రాంతి ‘ అంటే చక్కనైన మార్పు తో కూడిన చైతన్యం అని అర్థం. ‘మకరం’ మొసలి పట్టుకు సంకేతం. ‘సంక్రాంతి’ పండుగ పుష్య మాసంలో హేమంత ఋతువులో వచ్చే మకర సంక్రాంతికి ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది

సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంతవరకూ దక్షిణాయనంలో తిరుగుతున్నా సూర్యుడు ఉత్తరాయణంలో కి ప్రవేశిస్తాడు ఇది మహా పుణ్యకాలం. ఇది దేవతలకు ప్రీతికరమైన కాలంగా మన శాస్త్రాలు తెలుపుతున్నాయి ఆరోజు స్వర్గ ద్వారాలు తెరవడం ఉంటాయని ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని అందుకే భీష్మాచార్యులు ఉత్తరాయన పుణ్య కాలం వరకూ నిరీక్షించి పుణ్యకాలం మహాభారతంలో ఉంది . ఉత్తరాయణ కాలంలో మరణించిన వారి అంత్యక్రియలు సూర్యాస్తమయం లోగానే నిర్వహిస్తారు అదే దక్షిణాయానం సూర్యాస్తమయ కాలము లో మరణిస్తే ఆ ఆ మరుసటి రోజున సూర్యోదయమైన మొదటి కాలంలో అంత్యక్రియలు చేయడంలో గల అంతరార్థం ఉత్తరాయణం పుణ్యకాలం కావడమే.

ప్రతి సంక్రాంతి పర్వదినమున సంక్రాంతి పురుషుడు వాహనంపై అధిష్టించి వస్తాడనే విశ్వాసం వాహనాన్ని బట్టి ఆ ఏడాదిలో జరగబోయే సంఘటనలు ఊహిస్తారు

ఈ పండుగను నాలుగు రోజులు జరుపుకుంటున్నారు తొలి రోజున భోగి, మలి రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ గాను కూడా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతికి ముందున్న సంక్రాంతి ధనుస్సుంక్రాంతి.

మన హైందవ సంస్కృతి ప్రాభావానికి దర్పణం సంక్రాంతి పండుగ. సూర్య సంక్రమణం ప్రతినెలా జరుగుతూ ఉంటుంది కానీ పుష్య మాసంలో జరిగే మకర సంక్రమణానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అదే సంక్రాంతి గా ప్రసిద్ధి పొందింది.
“దక్షిణాయాణే….. పాపం మూర్తీ భవత్ సర్వమ్ బహి ర్యాత్యుభరాయలే ” దక్షిణాయానం లో ఉన్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించగానే మానవులు చేసిన పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.

మానవుడు ఐహిక విధి నిర్వర్తనం కోసం దైహికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. బుతు చక్రభ్రమణంలో మార్గశిర, పుష్య మాసాలు హేమంత సంకేతాలు, గ్రీష్మ,వర్ష శరదృతువులు ముగుస్తూ మానవ జీవితంలో క్రమక్రమంగా వణుకు మొదలవుతుంది. ‘పారమార్ధిక చింత భాస్కర తేజం’మవో మకరంలో ప్రవేశిస్తే చిత్తమ సంధాన సౌభాగ్యం’ లభిస్తుందని అంటారు. వణుకుని తగ్గించి, ఉల్లాసాన్ని పెంచి “భోగి” యోగి కాగల మార్గం ఈ మాసంలో గోచరిస్తుంది
మకర సంక్రమణం నాడు ఉపయోగించే నువ్వులు, జొన్నలు, సజ్జలు వంటి ధాన్యాలు. గుమ్మడి, బీర, పొట్ల వంటి కూరగాయలు బంతి, చేమంతులు ,మానవుని శారీరక ఆరోగ్యానికి ప్రసాదాలు.

” భోగి ” అంటే భోగము అని హేమాద్రి పండితుడు భోగి విశిష్టతను గురించి తెలిపాడు. భోగి నాడు ఉదయం భోగిమంటలు వేస్తే అశుభాలు తొలగి పోతాయి భోగి పండుగ రోజు భోగిమంటల వల్ల హేమంత ఋతువులో చలితో పాటు విజృంభించే క్రిములు కీటకాలు ప్రాణులకి అపకారం కలిగిస్తాయి మన ప్రాచీనులు తెల్లవారుజామున వేసుకునే భోగి మంటల వల్ల వచ్చే దాహక శక్తికి క్రిములు నశిస్తాయి అనే రహస్యం తెలిసి భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ భోగి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటే శుభ ఫలితాలు పొందుతారు దక్షిణాయనమున వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతించే ఈరోజు ఈ భోగిపండుగ. ఈ భోగిమంటల వల్ల హేమంత రుతువులో చలితో పాటు విజృంభించే క్రీములు ప్రాణులకి అపకారాన్ని కలిగిస్తాయి కనుక మన ప్రాచీనులు ఎక్కువ సంఖ్యలో వుండే తెల్లవారుజామున వల్ల వచ్చే దాహక శక్తికి క్రిములు నశిస్తాయి అనే భావనతో భోగి మంటలను ఏర్పాటు చేశారు పండుగ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాల బాల బాలికలకు రేగుపండ్లు చెరుకుగడలు చిల్లర నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. భోగి పండ్ల పేరిట పేరంటానికి వచ్చిన ముత్తయిదువులంతా పిల్లల తలపై రేగుపండ్లు పోయటం వల్ల పిల్లలకు తగిలిన దిష్టి పోతుందని ఆ సంవత్సరం అంతా శుభాలే కలుగుతాయని భావిస్తు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆశీర్వదిస్తారు. ఇలా చేయటం వలన ఎటువంటి దృష్టి దోషాలైనా నివారించేందుకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.

సంక్రాంతి రోజున ప్రాతఃకాలంలోనే అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చిన్నలు పెద్దలు ఆశీర్వాదాలు పొందుతారు ఆరోజు తెల్లవారగానే స్త్రీలు రంగవల్లికలతో ప్రతి ఇంటి ముందు శోభాయమానంగా అలంకరిస్తారు.కొత్తగా వచ్చిన ధాన్యంతో ఆవు పాలను కలిపి పొంగలి తయారుచేసి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని కి నివేదించిన తర్వాత ఇంట్లోని వారందరూ స్వీకరిస్తారు.ప్రతి సంవత్సరం పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుని కోరుకుంటారు.

మూడవ రోజు కనుమ. పరోపకారమే ద్యేయంగా గల ఈ మూగ జీవాలను గౌరవించడమే నికి పశువులను శుభ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మెడలో గజ్జెలు వేసి పూలమాలలు వేసి ప్రదక్షిణ చేయడం కనుమ. ఇది రైతులకు ప్రత్యేకమైన పర్వదినం సంవత్సరమంతా కష్టపడి నా శ్రమ ఫలితమైన ధాన్యరాశులు నిలుస్తాయి. ఇంటికి తెచ్చుకున్న కొత్త ధాన్యము తో పొంగలి చేసి సూర్యభగవానునికి నివేదిస్తారు మనకు ప్రత్యక్ష దైవమైన సూర్య దేవునికి సంబంధించిన పండుగ సంక్రాంతి ఈ మకర సంక్రాంతినాడు సూర్యోపాసన సూర్యారాధన విశిష్టమైనది సకల సృష్టి లోని ఏ ప్రాణీ సూర్య భగవానుని దివ్య శక్తి వల్లనే మనగలుగుతోంది ప్రాణదాత అయినా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి సూర్యుణ్ణి పూజించాలి అని శాస్త్రవచనం. ఈ కనుమ రోజున పశువులను అలంకరించి పూజించిన అనంతరం వాటికి భక్ష్యములను తినిపించి మూగజీవాల పట్ల తమ ప్రేమను ప్రకటించుకున్నారు.హరిదాసులు గంగిరెద్దుల వారు బుడబుక్కలవారు పల్లెల్లో తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ గ్రామాలకు కొత్త శోభను వాతావరణాన్ని తీసుకొస్తారు.

ఈనాటికి నిజమైన జానపదుల పండుగ కళ్ళల్లోనే కనబడుతుంది మారుతున్న కాలంలో నేటి ఆధునిక యుగంలో కనుమరుగవుతున్న జానపద కళలు అంతరించిపోకుండా సంప్రదాయ పండుగ ఆనవాయితీ గా చేసుకోవడం నేటికీ పల్లెల్లో కనబడుతుంది. హరిదాసులు తెల్లవారుజామునే హరిలో రంగ హరి అంటూ హరి రామ కీర్తనలు స్మరణ లు చేస్తూ గ్రామాలలో ప్రజలను మేల్కొలుపుతారు. హరిదాసుల తల పై గుమ్మడి ఆకారపు ఇత్తడి పాత్రలు ధరించి ఆ పాత్రకు కుదురు చుట్టుకుని హరి కీర్తనలు పాడుతూ అనుగుణంగా చిందులు వేస్తారు. భక్తులు ప్రీతితో ఇచ్చే బియ్యాన్ని దక్షిణలు తీసుకుని భిక్ష పెట్టిన వారిని ఆశీర్వదిస్తారు చొక్కా ధరించి దాని మీద నల్లకోటు వేసుకుని ఎర్ర తలపాగా చుట్టుకుని మీద ఎర్రని బొట్టు పెట్టుకుని ఇంటి యజమానుల భవిష్యత్తును పాటల రూపంలో చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతూ అంబ పలుకు జగదంబ పలుకు అంటూ ఆశీర్వదిస్తూ ధనం ధాన్యం భిక్ష స్వీకరించి దీవిస్తా రు. గంగిరెద్దుల వాళ్ళు పండుగ దినాలలో ప్రతి ఊరిలో దర్శనమిస్తారు. ఎద్దుల మెడలో గంటలు మువ్వలు గవ్వలతో అందంగా కొట్టిన వస్త్రాలు వృద్ధుడిపై సింహాద్రి అప్పన్న విగ్రహం కొమ్ములను వీపుపై రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ధనుర్మాసమంతా ఉదయాన్నే గంగిరెద్దులతో పాటు శృతి సన్నాయి డోలు వంటి వాయిద్యాలు పట్టుకొని పల్లెల్లో వాటిని ఆడిస్తారు. వాయిద్యాలకు అనుగుణంగా బసవన్న తో నృత్యాలు చేయిస్తూ అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ బల్లపై నాలుగు కాళ్లు పెట్టి మోకాళ్లపై నడిపించి ఒకే కాలుతో దండం పెట్టించి సంతోషపరిచే ఇచ్చే ధాన్యం వస్త్రం దక్షిణ కానుకలు స్వీకరించే సింహాద్రి అప్పన్న చల్లగా చూడాలని దీవిస్తారు. మన భారతీయ సంస్కృతికి అద్దంపట్టే సంక్రాంతి పండుగ పాలిచ్చే గోవులకు పసుపు కుంకుమ పనిచేసే బసవనికి పత్రీ పుష్పం లక్ష్మీ అనుగ్రహంతో పాడిపంటలు వృద్ధి చెందే పాడిపంటల సిరి మకర సంక్రాంతి.

ఈ సంక్రమణ కాలం లో ఎవరైతే దానధర్మాలు ఇతోధికంగా చేస్తారో అవన్నీ ఆ దానవ వీరులతో జన్మ జన్మ లోనూ లభిస్తాయని ధర్మసింధు తెలుపుతోంది మానవుడికి మోహన్ అనేది ముసలి పట్టుకుని వదలదు ఆ మోహన్ నుంచి తప్పించుకోవడానికి ఈ మకర సంక్రాంతి కాలంలో నువ్వులు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు విరివిగా దానధర్మాలు చేయాలి అని పురాణ వచనం.

బొమ్మల కొలువులు, కోడి పందాలు, జంగమ దేవరలు గంగిరెద్దు దాసర్లు పశు పూజలతో లక్ష్మికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ పద్ధతిగా జరుపుకునే మకరసంక్రాంతి వైభవ శోభకు పల్లె సీమలే సాక్ష్యం.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగులో చారిత్రక శతకాలు – సింహాద్రి నారసింహ శతకం (గోగులపాటి కూర్మనాధ కవి (1720-1795) )

by Chivukula Srilaxmi December 31, 2021
written by Chivukula Srilaxmi

సమాజ హితాన్ని ఆకాంక్షించడమే శతక సాహిత్య ప్రధాన లక్ష్యం. సంస్కృత, తమిళ, కన్నడ భాషా సాహిత్యాలలో ప్రారంభమైన శతక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 12వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథ కవి రాసిన శతకం మొదటి శతకం అని అనేకులు అన్నప్పటికీ తెలుగు సాహిత్యంలో అనేక మంది కవులు భక్తి, చారిత్రక, శృంగార, నీతి, వేదాంత, తాత్విక, దాస్యం, జీవితచరిత్రలు, స్వీయచరిత్రలు, స్థలమహాత్యం, నిందాస్తుతి శతకములు, కథా శతకాలు, సమస్యాత్మక శతకాలు, నిఘంటువు, అనువాద, అచ్చ తెలుగు, చాటువులు అని అనేక రకాల శతకాలు వెలువరించారు.
శతక లక్షణాలు:
లయాత్మకమైన ఛందస్సు, ప్రాణసమమైన శబ్ద సౌందర్యంతో ప్రతి పద్యం పాఠకులను అలరించాలి.
సంఖ్యాపరంగా వంద పద్యాలు కానీ కొందరు 100/108/116 పద్యాలు వ్రాస్తారు. ద్విశతి (200) త్రిశతి (300) పంచశతి (500) సప్తశతి (700) సహస్రం (1000) పద్యాలు రాసినా ఒకే మకుటంతో ఉంటే శతకం అనే పిలుస్తారు. శతకానికి మకుటం ఉండడం వలన ప్రతి పద్యాన్ని ఒకటి లేక రెండు వృత్తాలలో రాయాలి. శతకంలోని అన్ని పద్యాలు ఒకే రసంతో ప్రతిపాదించబడాలి.

చారిత్రక నేపథ్యంలో ఆధ్యాత్మికతను జోడించి సింహాచల నారసింహునిపై రాసిన “సింహాద్రి నారసింహ శతకం” కళింగాంధ్రను పాలించిన పూసపాటి విజయనగరరాజుల కాలం నాటిది.
క్రీ.శ.1720లో జన్మించిన గోగులపాటి కూర్మనాధ కవి ఇప్పటికి మూడు శతాబ్దములు పూర్తి అయిన ఈ శుభ సమయంలో శతక సాహిత్యానికి జరుగుతున్న ఈ సాహిత్య పట్టాభిషేకంలో అతని స్థానం సుస్థిరం. అతని రచనలలో మృత్యుంజయ విలాసము అను యక్షగానము; సింహాద్రి నారసింహ శతకము; లక్ష్మీనారాయణ సంవాదము; సుందరీమణి శతకము (అముద్రితము) ముఖ్యమైనవి‌.
శతక లక్షణాలైన
సంఖ్యాపరంగా నూట ఒక్క పద్యాలు మాత్రమే లభిస్తున్నాయి. .
మకుటం “వైరిహరిరంహ! సింహాద్రి నారసింహా!”
కవి గోగులపాటి కూర్మనాధ కవి
లేఖకుడు ఆదుర్తి హరిహర దాసు
108 పద్యాలకు ఇద్దరూ అవసరమైన పరిస్థితి చాలా విచిత్రమైనది.
గోగులపాటి కూర్మనాధ కవి (1720-1795)
గౌరమాంబా బుచ్చనామాత్యుల కుమారుడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. వీరికి వెంకన్న, కామన్న అనే ఇద్దరు సోదరులున్నారు. వీరు కాశీ, రామేశ్వర యాత్రలు చేశారు. రామతీర్థంలో ప్రాథమికవిద్య పూర్తిచేసుకుని సంకీర్తనాచార్యుడుగా ఉండేవారు. శ్రీ తిరుమల పెద్దింటి సంపత్కుమార్ వేంకటాచార్యులు వారి శిష్యుడు. ఈ విషయాలను కూర్మనాథ కవి తన ‘మృత్యుంజయ విలాసము’ అను యక్షగానమునందు వ్రాసుకొని ఉన్నాడు.
ద్విపద
“సలలిత పెద్దింటి సంపత్కుమార
శ్రీ వేంకటార్య దేశికుల శిష్యుండ
పావన గౌరమాంబ బుచ్చన్న మంత్రి
వర పుత్రుడను సూర వరుని పౌత్రుండ//”
ఇతడు విజయనగరసంస్థాన ఆస్థానకవిగా, దేవస్థాన ఉద్యోగిగా, ప్రభువుల నుండి అగ్రహారాలు పొందాడు. రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకాకుళంలో పనిచేశారు. అడిదము సూరకవి, లక్ష్మీ నృసింహకవి సమకాలికులు. ఆఖరి రోజులలో దేవుపల్లి గ్రామంలో ఉండేవారు. ఆ గ్రామంలో దేవాలయ సమీప స్థలము గోగులపాటి వారి నివేశనమని ఈ రోజుకీ పిలువబడుతోంది. సుమారు 1795సం:లోఇచ్చటనేపరమపదించినట్లుగాచెప్తారు.
సంస్కృత కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నా తెలుగు మధుర కవిత అంటే ఇష్టం.

గోగులపాటి కూర్మనాధకవి ఆశువుగా చెబుతుండగా ఆదుర్తి హరిహర దాసు తాళపత్రాలపై రాసిన సింహాద్రి నారసింహ శతకము అనేక ముద్రణలు పొందినది. 1930లో “శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ శతకము” పేరుతో విశాఖపట్టణంలో ముద్రించిరి. శ్రీ రామానుజ విలాస ముద్రాశాల యందు 1930లోనే విజయనగరంలో ముద్రింపబడింది. 1941లో విజయనగరంలో ఆంధ్ర విజ్ఞాన సమితి వారు కూర్మనాథ కృతులను ప్రకటించారు.
1962లో సాహిత్యాచార్య, కవితాశేఖర పంతుల లక్ష్మీనారాయణశాస్త్రిగారు ఆంధ్ర భాషా శాఖాధ్యక్షుడు, ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల వారిచే తిరిగి వ్రాయబడినది. 1963 లో సింహాచల దేవస్థానం ధర్మకర్త అయిన శ్రీ పూసపాటి ఆనంద గజపతిరాజు గారు దేవస్థానం వారిచే తిరిగి ముద్రింప చేశారు.1983 లో తిరిగి ముద్రింపబడింది.

సింహాద్రి నారసింహ శతకం
సింహాచలేశుని స్తుతిస్తూ గోగులపాటి కూర్మనాధ కవి రాసిన 108 సీస పద్యాలతో సింహాద్రి నారసింహ శతకము చారిత్రకంగా మిక్కిలి ప్రసిద్ధి పొందింది.
చారిత్రక ప్రాధాన్యత:
1753 సం:న దక్కను సుబేదారైన సలాబత్ జంగ్ ఉత్తరసర్కారులు బుస్సీకి కౌలునకొసంగెను. కౌలుకు తీసుకొనిన ఉత్తర సర్కారులు స్వాధీనపరచుకొనుటకు పరాసు బుస్సీ మచిలీపట్టణమునకు గవర్నర్ అయిన మారిసన్ అను అతనిని రాజమహేంద్రవరం శ్రీకాకుళం సర్కారులకు పంపెను. కానీ శ్రీకాకుళములో ఫౌజుదారుగా ఉన్న జాఫర్ అలీ ఖాన్ నకు ఈ విషయం ఇష్టం లేదు. అందుచే బలవంతుడైన మొదటి విజయరామ గజపతితో సంధి చేసుకుని ఆయన సహాయము వలన శ్రీకాకుళం, రాజమహేంద్రవరము స్వాధీనం చేసుకుని ఏకఛత్రాధిపత్యంగా సర్కారులను పాలించదలచెను.
మారిసన్ ఈ విషయం గ్రహించి తాను ముందుగానే విజయరామ గజపతితో సంధి చేసుకున్నాడు అన్న విషయం జాఫరల్లీ తెలుసుకుని శ్రీకాకుళం విడిచి పారిపోయెను. విజయరామగజపతి పైనను, ఫ్రెంచి వారి పైనను పగ సాధించదలచి ఫ్రెంచి వారితో యుద్ధం చేస్తున్న రఘోజీ భాంస్లే కుమారుని సైన్యముతో శ్రీకాకుళం సర్కార్ కు కొండల మీదుగా రమ్మనెను. ఆ కొండ మార్గమును చూపుటకు పాచిపెంట జమిందార్ అయిన వీరప్ప దొర వారికి తోడ్పడెను. మహారాష్ట్రులు గ్రామములను దోచుకొనుచుండగా, తురకలు దేవాలయములు పడగొట్టుచుండిరి. సింహాచలం వరకు వారు చేరిరి అని తెలుసుకుని దేవస్థాన ఉద్యోగులూ భక్తులూ అయిన ఆదుర్తి హరిహరదాసు మరియు గోగులపాటి కూర్మనాధకవి ఇరువురూ స్నానం చేసి దేవాలయం గర్భగుడి లోనికి ప్రవేశించి తలుపులు మూసుకుని శతక రచన చేసిరి. గోగులపాటి కూర్మనాధ ఆశువుగా శతకము చెప్పుచుండగా గంటముతో తాటి ఆకులపై హరిహర దాసు వ్రాసెను.

తురక దండు కొండపైకి ఎక్కి కట్టడములు పాడు చేయుచుండిరి. క్రమముగా దేవుని కళ్యాణ మండపం పాడు చేసి గుడి ఆవరణలో ప్రవేశించి అచ్చటి రాతి రథము నందు గల గుఱ్ఱములను పాడు చేసిరి. గర్భాలయం లోనికి ప్రవేశించుచుండగా కంచు తుమ్మెదలు ఉద్భవించి వారిని వెంటనే సంహరింప వారు వెనుతిరిగిరి. కానీ వారిని విశాఖపట్టణం సమీపమున గల తుమ్మెదల మెట్ట వరకు వెంటనంటి అంతర్ధానమైనవి.
విజయరామ గజపతి సైన్యమును సక్రమముగా సమకూర్చుకుని రఘూజీ సైన్యములను అనకాపల్లి వద్ద తుమ్మపాల వద్ద ఎదిరించి, ఓడించి సింహాచలము తిరిగి వచ్చెను. వచ్చినప్పుడు త్రోవలో కనబడిన అశ్వముల యొక్కయు అశ్వికుల యొక్కయు మృత కళేబరములను చూసి సింహాచలము చేరి విషయం అంతయు తెలుసుకుని శతకమును ఆశువుగా చెప్పినందుకు కూర్మనాథ కవికి రామతీర్థం దగ్గర ఒక అగ్రహారము, తిరిగి అడగకుండా వ్రాసినందుకు హరిహరదాసుకు కొత్తవలస దగ్గర నిమ్మలపాలెం అగ్రహారము ఇచ్చెను. నేటికినీ హరిహరదాసు కుటుంబీకులకు దేవుని కళ్యాణంలో నాలుగవ దినమున కొంత సొమ్ము ఇచ్చే రివాజు కలదు.
శతకము లోని విశేషములు
గోగులపాటి కూర్మనాధకవి శ్రీ సింహాద్రినాథునికి ఆంతరంగిక భక్తుడు. స్వామి వద్ద ఎంతో చనువు కలదు.
ఈ శతకము లోని కవిత్వం నిరర్గళ ధారా ప్రవాహ సదృశంగా సంస్కృతాంధ్రములందు కవికి గల అసమాన పాండిత్యము చాటుచున్నది. కవిత కదళీ పాకము నందు నడచినది.
ఇందులో జాతీయ పద ప్రయోగములు, పెక్కు సామెతలు, ఉర్దూ మాటలు కూడా కలవు.
తురక మాటలు తెలుగులో కలిపి సీసములందు చెప్పుట ఉదా: బేగ్ అరే అరబ్బీ పడోరే
లోకోక్తి ప్రదర్శన
వ్రతము చెడ్డా సుఖం దక్కదు
ఏండ్లెగసనైన, బుద్ధి దిగసన వచ్చెనో
తినగ తినగ గారెలైనను కనరువేయు
కందకు లేని దురద బచ్చలికి నేల గల్గు

ఈకవికిగల కవితానైపుణ్యం తెలియ జేయుచున్నది.
ఈ శతకము చదువుట వలన ఆనాటి రాజకీయ సాంఘిక ఆర్థిక విషయములు తెలుసుకొనుటయే కాక ఆనాటి సింహాచల దేవస్థానం ప్రాశస్త్యము ఆలయ నిర్మాణ కౌశలం గ్రహింపగలము. సింహాద్రి నారసింహ మహిమ వర్ణించు ఈ శతకము భక్తులకు శిరోధార్యం చారిత్రిక పరిశోధకులకు చైతన్య దీపిక.
కూర్మ దాసు కవి రచనా విశిష్టత:
“వైరిహరిరంహ! సింహాద్రి నారసింహా!” అను మకుటంతో రాసారు. వైరి అనగా శత్రువులను సంహరించుట యందు వేగము కలవాడైన సింహాచల నారసింహా! అని వేడుకున్నాడు. శత్రువులు సింహాచలమును ముట్టడించుటకు శరవేగంగా వచ్చుచుండిన ఆ సమయములో వేగము అత్యావశ్యకము కనుక ప్రతి పద్యంలోనూ సింహాచలం నారసింహుని ఆ విధమైన మకుటము తో సంబోధించెను.
సింహాచలం దేవాలయమునకు శత్రువుల వలన విపత్తులు సంభవించే సమయమున భయోద్వేగ, భావోద్వేగ, భక్తి ఉద్వేగంతో కూడిన ఈ కవితాధార ఆశుధారా రూపంలో వెలువడి శతక రూపమును ధరించినది. అందువలన ఈ శతకము మొదటి నుండి తుది వరకు అపూర్వమైనా ధారా విశిష్టతను కలిగి ఉన్నది.
సీ// శ్రీమద్రమారమణీ మణీ రమణీయ
సరస చిత్తాబ్జ బంభర! పరాకు
శంఖ చక్ర గదాసి శార్జ్ఞ చాపాలి భా
సుర దివ్య సాధనకర! పరాకు
ప్రహ్లాద నారద వ్యాస శుకాదిక
భక్త సంరక్షణ పర!పరాకు
బహుతర బ్రహ్మాండ భాండ పరం పరా
భరణ లీలా దురంధర! పరాకు
తే// నీకు సాష్టాంగ వినతు లనేక గతులఁ
జేసి విన్నపమొనరింతుఁ జిత్తగింపు
చెనఁటి వీఁడని మదిలోనఁ గినుక మాని
వైరి హర రంహ సింహాద్రి నారసింహ!

తొలి వాక్యమును ప్రభువును సుముఖుని చేసికొనుటకై మొదటి పద్యం మొదటి పాదములో
“శ్రీమద్రమా రమణీ మణీ రమణీయ సరస చిత్తాబ్జ బంభర!” అని సంబోధించి, విపద్దశను గుర్తింప చేయుటకు “పరాకు” అని నుడివెను.
రెండవ పాదములో “శంఖ చక్ర గదాసి….. దివ్య సాధనకర! “పరాకు” అను సంభోధనమున శత్రుసంహారమునకు ఉపయోగించు యుద్ధ సాధనములు నీ హస్తమున నెలకొని ఉన్నవనియు, మరియు అవి దివ్యములు కనుక శత్రువులను సంహరింపవలయుననియు చెప్పెను. మూడవ పాదమున ప్రహ్లాద నారద….. భక్త సంరక్షణ పర పరాకు అనగా నీవు భక్త సంరక్షణాసక్తుడవు కనుక ఈ మహా విపత్తు నీవే తొలగింప పూనుకొనుము. నాలుగవ పాదములో బహుతర బ్రహ్మాండ భాండ పరంపరాభరణ లీలా దురంధర! పరాకు అనుదానిచే ఒక్కొక్క బ్రహ్మాండమందు పదునాలుగు లోకములు గల ఈ లెక్కలేనన్ని బ్రహ్మాండములు నీకు భాండములుగా ఉన్నవి. అటువంటి నీకు ఈ శత్రువులను శిక్షించి, నీ ఆలయమును రక్షించు కొనుట అనునది అత్యల్ప కార్యము కావచ్చును అంటూ భక్తి భావధ్వని ప్రధానమైన కావ్యం. ఇందలి పద్యములన్నియు భక్తిభావమునే ధ్వనింప చేయుచున్నవి.
ఈ శతకంలో స్వామి వద్ద తనకు గల చనువుతో నిందలతో, నిష్టురములతో, అధిక్షేపములతో అవహేళనములతో స్వామిని హెచ్చరిస్తూ విపత్కర పరిస్థితుల్లో ధైర్యంతో, నిర్భీతితో, ఆశుధారా రూపమున తన నోట వెలువడిన ప్రతి పదమును, తిరిగి అడగకుండా లిఖించిన హరిహరదాసు ప్రశంసనీయులు.
7వ పద్యములో “పొట్నూరులోని కోదండరామ మూర్తి ఏ పొదలలో దాగెనో, భీమసింగిలోని గోపాల మూర్తి యెక్కడి కేగెనో, జామి లోని జనార్ధనస్వామి యెచ్చోటికి వెళ్ళెనో, చోడవరములోని కేశవ రామమూర్తి ఎన్ని పాట్లు పడుచున్నాడో” అను వాక్యముల చేత ఆయా ఆలయములను తురక సైన్యములు పాడుచేసెను అను విషయము స్ఫురింప చేయబడినది.
8వ పద్యములో యవనులూ, ఖానులూ, తురకలూ “నీకు వారి నమాజులు మున్నగు వానియందే ఇచ్చ పుట్టెనా” అని భగవానుని ఎత్తిపొడిచెను. వీరినందరినీ శీఘ్రముగా ఢిల్లీకి తొలగ ద్రోలుము” అని చెప్పుట చేత వీరిని విధ్వంసం చేయకుమని ప్రార్థించుటచేత భారతీయ సహజమైన కవీంద్రుని అహింసా దృష్టి వెల్లడగును.
ఈ శతకంలోని ప్రతి పద్యము అర్థవంతమైనది.
9వ పద్యంలో నీ కొండమీదికి ఈ దుష్టులు భక్తులను కొట్టుట, పవిత్రములగు మంటపములందు కల్లు త్రాగుట, నీ వంటశాలలో మాంసపు ముక్కలను వండుట, గుడిలో చొచ్చి పరసతుల భంగపరచుట మొదలగు దుష్కార్యము లను చేయకుండగనే వారిని పౌరుషంతో పారద్రోలు ము అని ప్రార్ధించెను.
11వ పద్యంలో ఒక్క భార్యగల గృహస్థులు ఇన్ని ఇడుములు పొందినప్పుడు అష్ట భార్యలు 16000 సతులు కల నీవు ఎక్కడికి వలస పోయెదవు? అని అధిక్షేపించెను.
యవనుల ముట్టడియు, శతక రచన ఏక కాలమున జరుగుచుండుట క్రమముగా పద్యములలో కనబడును.
మహమ్మదీయులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో వారి దృశ్యాలను చూసిన కవి నరసింహుని గేలి చేస్తూ
“జడ విప్పి జులపాలు సవరింపు మిరువంక
……. బీబీ నాంచారిని బిలిపింపు వేగమే
తుదకభ్యసింపు మీ తురక భాష” (32)

ఆత్మ కీర్తన చేయ హరి భక్తులేటికీ
కేకలు వేయగా ఫకీర్లె గలరు (41)

ఈ శతకం చెప్పారు. తురుష్కుల దుశ్చర్యలను నిశితంగా ఖండించి దేవుని సైతం మేలుకొలిపాడు.

“నీవు సింహాచల గుహలలో దాగిన నిన్ను పిరికివాడందురు” అని భగవానునికి నిందా భయమును కలిగించెను.

ఇంతలో శత్రు సైన్యములు సింహాచలం కొండ ఎక్కుతూ ఉన్నవి. ఈ విషయమును కవి

“అరి సైన్యధూళి సూర్యాక్రాంతమై మించె నింకేమి దయఁ జూచెదీవుమమ్ము ”

జాగరూకుడవై రిపు క్షయ మొనర్పు”

“నాకేమియు నిమ్మని నినుఁగోరుట లేదు
నీ పద సేవలు చేయు మాకు వేరు కోరికలెందులకు” అంటూ ప్రార్థించారు.

ప్రజలు గ్రామములను వదిలి వలస పోయిరి. దుష్టులు సర్వము దోచిరి. ప్రజలు పడరాని పాట్లు పడిరి. ఇప్పుడు తురక దండు మీ చెంతకే వచ్చింది.
“శీఘ్ర బుద్ధే పలాయనమ్” శీఘ్ర బుద్ధి కలవానికి పారిపోవుటయే కర్తవ్యము” అని లోకోక్తితో ఎత్తిపొడిచెను.

“నిఖిల విశ్వంబును నీయందణఁగియుండు
విశ్వంలో నీవు వెలసినావు”(59)
దుష్టుల శిక్షింప వేమి? అని ప్రార్ధించి

ఇంత బ్రతిమాల మాకేలా?
కందకు లేని దురద బచ్చలి కేల?
అది నిరుత్సాహం ప్రదర్శించెను.

భగవంతుని లీలా విశేషాలను శ్రీరామచంద్రుని ప్రసన్నతను ఇలా చెప్పారు
“నీ పాద రజమున నిముషంబు లోపల
బాపురే! సతి అయ్యే చాపరాయి!”
కానీ భగవంతుని పొగిడెను.

వెంటనే ఉక్కు మూతులు గల గండు తుమ్మెదలను పంపి ఆ దుష్ట సైన్యమును చీల్చి చెండాడగా, యవనుల గర్వము అణిగినది. ప్రజలు రక్షించబడిరి. ఆలయమునకు ప్రమాదం తప్పింది. (69)

గీత// అరుల బరిమార్చి, వైశాఖ పురసమీప
గిరి బిలంబున డాగె, బంభరములెల్ల
అది మొదలె తుమ్మెదల మెట్టయండ్రుదాని
వైరి హరి రంహ! సింహాద్రి నారసింహ!(70)

తరువాత ఈ మహాకవి భగవంతుడైన నరసింహుని తాను నిష్టురోక్తుల బలికి నిందించినందులకు పశ్చాత్తాపపడి “అపరాధిని నపరాధిని” అని 32 పర్యాయములు పలికి, దయ చూపుమని క్షమాపణ వేడుకొనెను.
వీరాధివీరుడువై విరాజిల్లు నిను
బిరికివాడంటిని భీతి లేక”

క్షమాపణ కోరుకున్న తరువాత అతని మనస్సు శాంతి పొంది భగవత్ మహత్యమును ప్రత్యక్షముగా సందర్శించి బ్రహ్మానంద పారవశ్యమును పొంది హృదయమున గల భక్తితో
“ప్రభూ! శత్రువులను మర్దించి అలసితివి
నా హృదయ శయ్యయందు పరుండుము
నేను నీ పదములొత్తెదను”
78 నుండి 98 వరకూ ప్రౌఢమైన రచనతో దశావతారములు వర్ణించెను.

మకుట కుండల కేయూర మహిత కంక
ణాంగుళీయక ముఖ్య భూషాంగ, విశ్వ
నిలయు, నారాయణ స్వామి నిన్నుఁ గొలుతు
వైరి హరి రంహ! సింహాద్రి నారసింహ!(101)

ఈ విధంగా
కూర్మనాథకవి ఆశువుగా శతకాన్ని చెపుతూంటే తన సహచరుడైన ఆదుర్తి హరిహరదాసు గంటం పట్టుకుని తాటి ఆకులపై వ్రాసారు. కవి మొర ఆలకించి స్వామి కొండ గుహల నుంచి తుమ్మెదల దండును పంపి మహమ్మదీయులను భయంకరంగా హింసించి విశాఖపట్టణం స్మశానం దాకా తరిమి వేసేటట్లు చేశాడు. నాటి నుండి ఆ ప్రాంతానికి తుమ్మెదల మెట్ట అని పేరు వచ్చింది.

విజయరామరాజు తుమ్మపాలెం వద్ద శత్రువులను ఓడించి తిరిగివస్తూ ఈ విషయాన్ని విని కూర్మనాథ కవికి రామతీర్థం సమీపాన ఒక అగ్రహారాన్ని, శతకాన్ని తాటి ఆకులపై వ్రాసిన హరిహర దాసుకు కొత్తవలస వద్ద నిమ్మ పాలెం అను అగ్రహారాన్ని ఈనాముగా ఇచ్చారు. నేటికీ సింహాచలంలో దేవుని కళ్యాణం రోజున వీరికి కొంత దక్షిణ ఇచ్చుకునే ఆచారం వుంది. ఈ శతకానికి తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉంది.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

పెన్నా శివరామకృష్ణ తో మాడిశెట్టి గోపాల్ ముఖాముఖి !!

by madishetti gopal November 8, 2021
written by madishetti gopal

తెలుగు భాష, సాహిత్య రంగాలలో విశేషకృషి చేసిన సాహితీవేత్తలకు 2015 నుంచి ఏటా ప్రభుత్వం ప్రదానం చేస్తున్న కాళోజీ పురస్కారం 2021 సంవత్సరానికి గాను పెన్నా శివరామకృష్ణ గారికి కాళోజీ జయంతి రోజున హైదరాబాదులోని రవీంద్ర భారతిలో 1,01,116 నగదు, శాలువా, జ్జాపిక తో అందజేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన పెన్నా శివరామకృష్ణ అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన అలల పడవల మీద, నిశ్శబ్దం నా మాతృక వంటి కవితా సంకలనాలను వెలువరించారు. గజల్ ప్రక్రియలో ఆయన విశేషమైన కృషి చేశారు.
సాహిత్య విమర్శలోనూ తనదైన ముద్ర వేశారు.నిత్య సాహిత్య కృషీవలుడిగా సంపుటాలు, సంకలనాలు ఎన్నో వెలువరించారు. 11 కవిత్వ సంకలనాలు, 8 సాహిత్య విమర్శ సంపుటాలు, పదుల సంఖ్యలో ఇతర రచనల సంపుటాలు వెలువరించారు. కవిత్వం, సాహిత్య విమర్శ, వచనం.. ఏది రాసినా అది సామాజిక ప్రయోజనం కోసం రాశారు. పలు సాహిత్య విమర్శనా గ్రంధాలను వెలువరించారు. మానవీయతను తన కలం లోకి ఒంపుకొని మానవీయ పరిమళాలను వెదజల్లుతున్న శివరామకృష్ణ ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఆయనతో మాడిశెట్టి గోపాల్ జరిపిన ముఖాముఖి.

మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలపండి?

నల్లగొండకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలోని దుగునవల్లి గ్రామం మా సొంత ఊరు. ఒకటి నుంఛి నాలుగవ తరగతి వరకు అక్కడే చదువుకున్నా. ఐదు నుంచి పదవ తరగతి వరకు, మాఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరులో. డి, ఓ. యల్. రెండేళ్ళు, బి. ఓ. యల్. మూడేళ్ళు, నల్లగొండలోని మా చిన తాతగారు మేడిపల్లి రాధాకృష్ణమూర్తి గారి ఇంట్లో ఉండి, గీతా విజ్ఞానాంధ్ర కళాశాలలో చదువుకున్నా. యం. ఏ. (తెలు

గు), యం. ఫిల్., పిహెచ్. డి. లు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో. శేషీంద్రశర్మ గారి “నా దేశం నా ప్రజలు” కావ్యం మీద యం. ఫిల్., “శేషేంద్ర కవిత్వానుశీలనం” అనే అంశం మీద పిహెచ్. డి. పూర్తి చేశా. “శేషేంద్ర కవిత్వానుశీలనం” అనే పుస్తకాన్ని 1993 లో ప్రచురించాను.

కవిత్వం, విమర్శ, గజల్స్ …..వీటిలో మీరు బాగా ఇష్టపడే ప్రక్రియ ఏది?

అన్ని ప్రక్రియలనూ అభిమానిస్తాను. కవిత్వంలోనైనా, విమర్శలోనైనా, తిరిగి చూసుకున్నప్పుడు, “నేనే మొదటిసారి చెప్పాను” అనిపించిన, “ఇది నేను మాత్రమే చెప్పగలిగినది” అనిపించిన ప్రతి వాక్యమూ నాకు ఇష్టమే.

విమర్శలో మీ ప్రత్యేక దృష్టికోణం ఏమిటి?

కొన్ని మంచి కవితలు, నాకు గొప్ప అనుభూతినో, కొత్త ఆలోచననో, నూతన చైతన్యాన్నో కలిగించినప్పుడో, వాటికి కారణాలను నాలో నేను ఆలోచించుకుంటూ, నా అభిప్రాయాలను తోటి సాహిత్యాభిమానులతో పంచుకోవడం కోసమే రాశాను. ఇలాంటివి రాసేటప్పుడు (రాసిన తర్వాత) నేనేదో సాహిత్యవిమర్శ రాస్తున్నాను అనే భావం నాకు లేదు. నేను చేసినది ఎక్కువగా కవిత్వ శిల్పవిశ్లేషణమే. విమర్శ పరిభాషలో “శిల్పానుశీలన విమర్శ” అనవచ్చునేమో!

గజల్ ప్రక్రియ గురించి వివరిస్తారా?

అరబ్బీ, పారసీ రెండు భాషలలోను ఆరంభమై, వికసించిన కవిత్వ ప్రక్రియ గజల్. కొన్ని అరబ్బీ, కొన్ని పారసీ సంప్రదాయాలు సమ్మిళితమై, పదవ శతాబ్ది ప్రాంతానికి గజల్ ఒక స్థిర రూపాన్ని సంతరించుకున్నది. ఇరాన్ సంస్కృతిలో భాగంగా, గజల్, రుబాయీలు  భారతదేశంలో ప్రవేశించాయి.  పారసీ ద్వారా ఉర్దూలోకి, ఉర్దూ నుంచి ఇతర భారతీయ భాషలలోకి ఈ ప్రక్రియలు వ్యాపించాయి. గజల్ లోని షేర్లను మొదటిసారిగా తెలుగులోకి అనువదించినవారు, గజల్, రుబాయీలను తెలుగులో తొలుత రాసినవారు దాశరథి గారు. తెలుగులో గజల్ కు వ్యాప్తి కలిగించిన వారు సి. నా. రె. గారు.  గజల్ అంటే ప్రియురాలితో సంభాషణ. గజల్ లోని ప్రేమించబడే వనిత లేదా ప్రియురాలు కఠిన హృదయ, శాశ్వత అప్రాప్య. ప్రియుడు లేదా ప్రేమించిన వ్యక్తి, ప్రియురాలితో పరోక్షంగా, ఏకపక్షంగా జరిపే సంభాషణే గజల్. ఇతర వస్తువులతో గజల్  రాసిన వారు కూడ ఉన్నారు. ఈ రెండూ చమత్కార ప్రధానమైన ప్రక్రియలు. శబ్దాలంకృతి, అర్థాలంకృతి పరస్పర పోషకంగా ఏకత్ర సమ్మిళితమై ఉండాలన్నది ఈ ప్రక్రియలలోని ప్రధాన నియమం. వస్తు, రూపాల పరంగా, అన్ని ప్రక్రియలకు ఉన్నట్లే, ఈ రెండు ప్రక్రియలకు కూడ కొన్ని ప్రత్యేకతలు, పరిమితులు ఉన్నాయి. అన్ని ప్రక్రియలలోనూ ఎప్పుడూ నాసిరకమైన రచనలు అధికంగా, ఉత్తమ రచనలు స్వల్పంగా వస్తూ ఉంటాయి. ఈ రెండు ప్రక్రియలలోనూ అదే జరుగుతున్నది.

ఇప్పటి వరకు ఎన్ని కవితాసంపుటులు ప్రచురించారు? మీకు నచ్చిన కవితాసంపుటి ఏది?

మూడు వచనకవితా సంపుటులు, మూడు హైకూ సంపుటులు, రెండు గజళ్ళ సంపుటులు, ఒక రుబాయీ సంపుటి ప్రచురించాను. నా లౌకిక జీవితానుభవాలకు, విషాదానందానుభూతులకు, సంఘర్షణలకు, వేదనలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలు “దీపఖడ్గం”లో ప్రతి ఫలించాయి; నా మానసిక స్థితిగతులలోని మరికొన్ని పార్శ్వాలు, వివిధ దశలలో “సల్లాపం”, “శిశిరవల్లకి” అనే గజళ్ళ సంపుటులలో, “అశ్రుధార” అనే రుబాయీ సంపుటిలో, (రాబోయే) “పెన్నాసరాలు”లో వ్యక్తమైనాయి. ఇవన్నీ నాకు ఇష్టమైనవే.

మీరు సాహిత్యేతర రచనలు కూడ ఎక్కువగానే రాశారు కదా! అవి ఎందుకు రాయాల్సివచ్చింది?

వివిధ సందర్భాలలో, వివిధ అవసరాల రీత్యా (ఆసక్తులలోని వైవిధ్యాన్ని అనుసరించి) సాహిత్యేతర రచనలను, కవులు, రచయితలు కూడ చదువుతూనే ఉంటారు. అటువంటప్పుడు సాహిత్యేతర పుస్తకాలను రాస్తే తప్పేమిటి? నా సాహిత్యేతర రచనలలో కొన్ని సమాచార ప్రధానమైనవి. విలువైన సమాచారాన్ని ఒకచోటికి చేర్చడంలోను నాకు ఆనందమే కలిగింది. సఫల, విఫల ప్రేమలు, ఎడబాటు, ముద్దు మానవజీవితంలో ఉన్నవే కదా! అవేమీ రచనలకు నిషిద్ధ వస్తువులు కావు కదా! ఎవరో, ఎదో అనుకుంటారని జంకకుండా, నా ఆసక్తులను తృప్తిపరచుకోవడం కోసమే కొన్ని సాహిత్యేతర పుస్తకాలను రూపొందించాను. అవేమీ మనుషులను చెడు దారి పట్టించేవి కావు, సమాజానికి హాని చేసేవి కావు.

మీ సంపాదకత్వంలో వైవిధ్యభరితమైన పుస్తకాలు వచ్చాయి కదా! వాటి గురించి చెప్పండి?

నేను సహసంపాదకత్వం వహించిన చాల సందర్భాలలో, నేనే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. దీనిని నేను సద్వినియోగం చేసికొన్నాను. వ్యక్తిగత రాగ ద్వేషాలకు అతీతంగా, నా దృష్టిలోని మంచి కవితలను ఎక్కువమంది సాహిత్యాభిమానుల వద్దకు చేర్చడానికి ప్రయత్నించాను. ఇందుకు సహకరించిన సహసంపాదకులకు అందరికీ కృతజ్ఞుడిని.

శివారెడ్డి గారికి సంబంధించిన మూడు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు కదా! శివారెడ్డి గారి గురించి, మీరు సహసంపాదకత్వం వహించిన పుస్తకాల గురించి చెప్పండి?

విప్లవకవిగా కొనసాగినా, మనిషి యొక్క సమస్త భౌతిక, ఆంతరిక పార్శ్వాలను స్పృశించిన కవి శివారెడ్డి. వస్తువైవిధ్యం ఎక్కువ. తాత్త్విక దృష్టి లేని వారు ఎవరూ గొప్ప కవి కాలేరు. శివారెడ్డి గారి కవిత్వమంతటా తాత్త్వికత ప్రధానంగా కనిపిస్తుంది. తన శైలిని తానే అనుకరించకుండా, ఎప్పటికప్పుడు తన శిలిని తానే మార్చుకుంటూ వచ్చారు. వారి వ్యక్తీకరణ రీతులు కాలానుగుణంగా పరిణతి చెందుతూ వచ్చాయి. కవి వ్యక్తిత్వం వలన (ముఖ్యంగా సమకాలంలో) అతని కవిత్వం కూడ సానుకూల, ప్రతికూల ప్రభావాలకు లోనవుతూ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కూడ శివారెడ్డి గారి కవిత్వాన్ని గమనించవలసి ఉంటుంది.

నాకు తెలిసినంత వరకు, ఆయన రాసినన్ని స్త్రీ ఇతివృత్త కవితలు మరెవరూ రాయలేదు. అవి కూడ వస్తు, వ్యక్తీకరణల పరంగా వైవిధ్యభరితమైనవి. అందుకే వారి స్త్రీ ఇతివృత్త కవితలను “ఆమె ఎవరైతే మాత్రం” (2009) అనే పేరుతో సంపుటిగా తెచ్చాము. నేను వారి కవిత్వం మీద విమర్శ పుస్తకం రాస్తున్నప్పుడు, వారి కవిత్వం మీద వచ్చిన విమర్శ వ్యాసాలను, సమీక్షలను చాల సేకరించాను. వాటితోపాటు ఆ తర్వాత వచ్చిన వాటిని కూడ సేకరించి “శివారెడ్డి కవిత్వం – విమర్శలు, విశ్లేషణలు” (2009) పుస్తకం తెచ్చాము. వారు ఇప్పటికి వందకు పైగా పుస్తకాలకు ముందుమాటలు రాశారు. 86 ముందుమాటలను సేకరించి “శివారెడ్డి పీఠికలు” (2013) అనే పుస్తకం తెచ్చాము. ఇది ఐదు వందల పేజీల గ్రంథం. ఈ మూడు పుస్తకాలను గుడిపాటి గారు నేను కలసి రూపొందించాము.

ఈమధ్యన వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో విస్తృతంగా కవిత్వం వస్తున్నది కదా దాని మీద మీ అభిప్రాయం ఏమిటి?

అచ్చు అయినది అంతా మంచి కవిత్వం కానట్లే, సోషల్ మీడియాలో లైకులను, ప్రశంసలను పొందేవి అన్నీ మంచి కవితలు కావు. తమ రచనలలోని గుణదోషాలను మమకార రహితంగా పరిశీలించుకునే శక్తి ప్రతి రచయితకు అవసరం. కవులలో అంతరాలు ఉన్నట్లే, చదువరులలోనూ స్థాయీ భేదాలు ఉంటాయి. ఎవరి ప్రశంసను, లేదా ఎవరి విమర్శను ప్రామాణికంగా తీసుకోవాలి అనేది నిర్ణయించుకునే వివేకం ఉండాలి. ఇలాంటివి  లేనప్పుడు, ఏ మీడియా అయినా పెద్దగా భేదం ఏదీ ఉండదు.

సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది చదువరులకు, రచనలు వేగంగా చేరే అవకాశం ఉంటుంది. ఆ మేరకు అది ఉపయోగకరమే. వ్యసనంగా మార్చుకోకుండా దుర్వినియోగం చేయకుండా ఉండడం అవసరం.

తెలంగాణ బిడ్డగా పరంపరలో మీరు అనుభూతి చెందిన గొప్ప అంశాలు….?

1969 లో నల్లగొండకు సమీపంలోని కట్టంగూరులో ఐదవ తరగతి చదువుతున్న రోజులు. అప్పటి ఉద్యమంలోనే, తెలిసీ తెలియని వయసులో, రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఒక రోజు నిరాహార దీక్ష చేశాను. విద్యార్థిగా, ఉద్యోగిగా వివిధ దశలలో ఆధిపత్య భావాలను, హేళనలను గమనించాను, అనుభవించాను. కనుక అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే గొప్ప ఆనందం. రాష్ట్ర అవతరణ అనంతరం, అవహేళన చేసిన వారే మన భాషా సంస్కృతులను అనుకరించే పరిస్థితి ఏర్పడడం మరింత ఆనందం.

మంచి సాహిత్యం వెలువడాలి అంటే, బాధ్యత రచయితలపై ఉంటుందా? పాఠకులపై ఉంటుందా?

హృదయంలోని బరువును దించుకోడానికో, బాధ్యతగానో, విషాద,  ఆనందానుభూతులను పంచుకోడానికో, మానసిక సంఘర్షణలనుంచి వేదనల నుంచి కొంత సాంత్వన పొందడానికో, చైతన్యపరచడానికో, రాయకుండా ఉండలేకనో, రచయితలు (కవులు) రచనలు చేస్తారనుకుంటా. సమకాలంలోని సానుకూల ప్రతిస్పందనలు, రచయితలకు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నది వాస్తవం. కాని ఒక రచయిత ఒక వస్తువును సాహిత్యంగా (కవిత్వంగా) మార్చే ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమైనప్పుడే ఉత్తమ రచన రూపొందుతుంది. ఆ స్థితిలో చదువరుల మీద దృష్టి ఉంటే నిమగ్నత భగ్నమవుతుంది. సమకాలికుల ప్రశంసలు మాత్రమే ఆశించే రచయిత ఎక్కువకాలం ఉత్తమ రచయితగా నిలువలేడని అనుకుంటాను. కనుక మంచి సాహిత్యం రావడానికి, చదువరుల కంటే రచయిత బాధ్యతే ఎక్కువ అని నా అభిప్రాయం. గతకాలపు మహా కవుల రచనలను నేటికీ చదువుతున్నాము కదా! ఆయా కవులు సమకాలిక చదువరుల మీదనే ఆధారపడితే, వారి రచనలు నేటి దాకా నిలిచి ఉండేవి కాదేమో?

సాహిత్యసృజన, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ…ఈ రెండింటి పైన మీ అభిప్రాయం..?

సాహిత్యసృజన ఆంతరంగిక వ్యవహారం. ఎవరేమనుకున్నా అది ఒక కళ. కార్యక్రమాల నిర్వహణ కూడ కళే, కాని అది లౌకిక వ్యవహారం. కొంతమేరకు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఒకరికే రెండూ చేయగల సామర్థ్యం ఉంటే మంచిదే. చాల మంది సాహిత్య స్రష్టలకు కార్యక్రమ నిర్వహణ సామర్థ్యం ఉండదని నాకు అనిపిస్తుంది.

కాళోజీ పురస్కారం పొందిన సందర్భంగా మీ అనుభూతి / ప్రతిస్పందన…..?

నా కంటే వయసులో పెద్ద వాళ్ళు, సాహిత్యరంగంలో నా కంటే ఎక్కువ కృషి చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అట్లా ఎంతో మంది ఉండగా కాళోజీ పురస్కారం నాకు రావడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.

*******************

November 8, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

‘మునిమడుగుల’ కవిత్వంతో కరచాలనం..!

by Senathipathi Dasyam November 8, 2021
written by Senathipathi Dasyam

గాఢమైన తాత్త్విక అభివ్యక్తికి చిరునామాగా భాసిల్లుతున్న కవి మునిమడుగుల రాజారావు గారు గత రెండు దశాబ్దాలకు పైగా కవిత్వ సృజన చేస్తూ.. తెలుగు పాఠక లోకానికి చేరువైనారు. తాత్విక చింతనతో సాహితీ యానం చేస్తున్న ఆయన ‘అనాగరిక గేయం’, ‘దుఃఖనది’ పేర్లతో గ్రంథాలను వెలువరించి.. అందరి దృష్టినాకర్షించారు. తాత్విక తిలకాన్ని అద్దుతూ “నేను ఎవరు?” దీర్ఘ కవితను రూపుదిద్దిన ఆయన… ప్రతి రచనలో మానవుని అస్తిత్వ పరివేదనను అక్షరాల్లో నిక్షిప్తం చేసిన అనుభవం ఆయనకు ఉంది. కవిత్వంలో వర్తమాన జీవితంలోని సత్యాలను ఆవిష్కరించడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం. శ్రమకి.. మనిషి దుఃఖానికి ఉన్న సంబంధాన్ని తాత్త్విక కోణంలో కవిత్వ సృజన చేయడంలో ఆయన సిద్ధహస్తులు. కవి మునిమడుగుల గారి కవిత్వంలో బహుళత్వాల్ని అడుగడుగున చూస్తాం.. అలతి అలతి పదాలతో అద్భుతమైన తాత్వికతతో ఆయన జ్ఞాపకాలను విలక్షణమైన అభివ్యక్తితో కవిత్వంలో నిక్షిప్తం చేయడం ప్రశంసనీయం.

‘అనాగరిక గేయం’, ‘దుఃఖ నది’, ‘నేను ఎవరు?’ గ్రంథాలతో పాటు మునిమడుగుల గారు ‘సత్యం వైపు పయనం’, ‘సత్యమంటే ఏమిటి?” తాత్త్విక వ్యాసాల సంపుటిని ప్రచురించారు. గత రెండు దశాబ్దాలకు పైగా ఆయన రాస్తున్న కవిత్వాన్ని సమగ్ర దర్శనం చేసేందుకు “మునిమడుగుల రాజారావు సమగ్ర కవిత్వం” పేరుతో పాలపిట్ట పబ్లికేషన్స్ ద్వారా ఓ గ్రంథం వెలువరించారు. ఈ గ్రంథంలో రాజారావు గారి కవిత్వాన్ని సమగ్రంగా వీక్షించగలం.. సామాజిక సంక్లిష్టతలకీ, జీవన సంవేదనలకీ గల మూలాలను ఆవిష్కరించేందుకు ఆయన కవిత్వాన్ని పండించిన తీరు ఈ గ్రంథం ద్వారా గ్రహించగలం.. ప్రతీ కవితలోనూ ఆయన తాత్విక కవితాధారను గమనించగలం.

“పాదముద్రలు” శీర్షికతో రాసిన కవితలో… ఎక్కడినుంచో వస్తోన్న / పాదాల పయనంలో / కుండల కొద్దీ నింపుకు

న్న / సామాజిక దుఃఖమంతా ఘనీభవించాక / ఇప్పుడు కన్నీటి బొట్లు / రాలడానికి నిరాకరిస్తున్నాయనీ..  కారణం.. / కన్నీళ్ల వర్షానికి | వసంతం వచ్చి | చిగురించిన చెట్టు కదా / జీవితమని.. జీవితాన్ని / తాత్త్విక కోణంలో అద్భుతంగా ఆవిష్కరించారు.

మరో కవితలో.. అసమాన శాసన విషపు కోరల్లో చిక్కి / విలవిలలాడిన పాదాలు.. | తలల ముందర నడవలేక.. / కాళ్లని చేతుల్ల పెట్టుకుని నడిచెల్లిన పాదాలు / బ్రతుక్కి అర్థమేంటో తెలీక అంటూ / రాసిన పంక్తులు ఆయన కలం బలాన్ని సూచించేలా కొలువుదీరాయి.

“అణచివేతకు అనేక రూపాలు” శీర్షికతో రాసిన కవితలో.. అణచివేతకు గల అనేక రూపాలను ఏకరువు పెట్టారు. కనురెప్పల ప్రకంపనాలకు శబ్దాలు ప్రసవించవని.. రాజ్యమేలే వెలుతురులో నక్షత్రాలు ప్రకాశించవని చక్కని ముగింపునిచ్చారు.

“శిల్పి తాకని రాయి కూడా శిల్పమే”

కవితలో.. కవి రాజారావు గారు చక్కని భావుకతను ప్రదర్శించారు. నువ్వులో నూనె వుందనీ.! పువ్వులో మకరందముందనీ.. పాలలో నెయ్యి వుందనీ.. వాటిని పిండుకుని గ్రోలిన మనిషి.. శిల్పి తాకని రాయి కూడా ఒక శిల్పమే అన్న ‘ఎరుక’ లేక మహా నిశ్శబ్ద అడుగు పొరల కింద అజేయమైన దాని అంతః సౌందర్య స్పృహ లేక.. గొంగళి పురుగును అనాకారి అన్నాడని వ్యాఖ్యానించడంలో కవి ఔచిత్యాన్ని ప్రశంసించి తీరుతాం.

కాలమంటే / నిన్న నుంచి రేపటికి / జీవిత సాగిన దూరమని తేల్చి చెబుతూ..

వర్తమానం.. కాలం నడిచే భూమిక’ కవితను రాశారు. కాలమంటే ఏమిటో విభిన్న కోణాల్లో కవి చిత్రించిన తీరు బాగుంది.

‘దుఃఖ నది’ కవితలో కవి యొక్క తాత్త్వికత ఆద్యంతం కానవస్తుంది. ఈ భూమ్మీద మనిషి పుట్టకముందే మరణం పుట్టిందని విడమరిచి చెప్పారు. కాలాన్ని మూడు ముక్కలుగా నరికి.. గత కాలపు దారాలకు వేలాడుతూ.. క్షణక్షణం మరణించనందుకే.. మనసు మరుక్షణం నూతనంగా జన్మించనందుకే.. మానవజాతి అంత క్షేత్రంలో దుఃఖపు ఊట బయలు దేరిందనీ.. ఆపై నదిలా నడక కొనసాగిందని మంచి సందేశాన్నందించారు.

‘నాగలి శవమైంది’ కవితను ఆరంగా తీర్చిదిద్దారు.

‘చివరి ఆత్మీయుడు’ కవితలో కాటికాపరిని ఉన్నతంగా ఆవిష్కరించారు. అనురాగ బంధపు వలలు.. ఒంటరిగా స్మశానంలో.. చివరి ఆత్మీయుడైన కాటికాపరి సేవలను ప్రస్తావించిన తీరు బాగుంది.

‘ప్రసవించని ఒక పురిటి నొప్పుల కల’ కవిత అర్థవంతంగా మలచబడింది.

నాగలితో / పొలాలను దువ్వీ దువ్వీ / పుండు పుండైన / ఎద్దుల కాలి డెక్కల సాక్షిగా… అంటూ పొట్టకొచ్చిన పొలంను అక్షరాల్లో బంధించారు. కోతకొచ్చిన పొలమంతా తెల్లదోమ కాటుకు తెల్ల బోయింది.. మట్టిని నమ్ముకున్నందుకు కాదు.. నమ్మించి వంచించే మనిషిని నమ్ముకున్నందుకు అంటూ.. నర్మగర్భంగా నకిలీ మందులు అమ్మే వ్యాపారులను ఎండగట్టారు. పశువుల కన్నీళ్ల సాక్షిగా.. శ్రమ జీవుల నాలుగు కాళ్ల సాక్షిగా.. కవి ఆర్ద్రమైన భావాలతో ఈ కవితను రాశారు.

“ప్రేమ కరువై బీడు” కవితను ప్రేమికుల ఆత్మహత్యలకు చలించి రాశారు.

ఎన్ని మార్లయినా సరే! | గాయాలకు గేయాలకు | దుఃఖమే | చివరి చరణమంటూ ‘దుఃఖ తీరాలు’ శీర్షికతో రాసిన కవితలో నవ్వులన్నీ ఆత్మల మెరుపులైనాక.. దుఃఖమొకటే వెచ్చని ఊపిరితో సేదదీర్చే తల్లిడొక్క అని వ్యాఖ్యానించారు.

కవితకే అనర్హం అని శ్రీశ్రీ గారన్నట్లు.. కవి రాజారావు గారు “ఆదిలాబాద్ రంజన్లు” శీర్షికతో మరో కవితను ఇందులో పొందుపరిచారు. ఎదులాపురంలోని ఎద్దుల్లా కష్టించే మట్టి జీవాల స్పర్శతో రూపుదిద్దుకునే రంజన్ల వెనుక ఉన్న శ్రమైక సౌందర్యాన్ని ఈ కవితలో ఆవిష్కరించారు.

అలికిడి లేని పరమాద్భుత ప్రకంపనాలతో / మూసుకుపోయిన అంతర్లోకాలకు / దారులు తెరిచే / నిశ్శబ్ద ప్రపంచంగా.. స్మశానాన్ని అభివర్ణిస్తూ మరో కవితను రాశారు.

‘నులక మంచం’ కవితలో చుట్టాల చూపులకు… మమతల మర్యాదలిచ్చీ | అనుబంధాల ఆత్మలను కలిపినవి / నులక మంచాలేనని తేల్చి చెప్పారు. ఎక్కడినుంచో వచ్చిన సింగిల్ కాట్, డబుల్ కాట్లకు కాల్లు విరిగిన నులక మంచం మూలన మూలుగుతున్నదని వాపోయారు.

కర్తవ్య పిడుగు చప్పుడు ఉలికిపడి లేచి.. నిద్ర దుప్పటిని నిలువునా తన్నేసి.. వేగుచుక్క కన్నా వేగంగా లేస్తాడంటూ “పాలవాడు” కవితలో పాలవాడిని ఉన్నతంగా దృశ్యమానం చేశారు.

“పొయిల కట్టెలు” కవితలో నెత్తిమీద బతుకు బరువును .. కాళ్ళతో జోక్కుంటూ.. పరుగులాంటి నడకతో.. ఆ పూట తిండి గింజల కోసం తిప్పలుపడే పొయిల కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని అమ్మకానికి బయలుదేరే బడుగు జీవుల కష్టాలను ఆర్బంగా అక్షరాల్లో నిక్షిప్తం చేశారు. సన్నగిల్లిన సుట్ట పేల్క అశక్తతతకు బరువును మోయలేక.. వాళ్లు బేరంలో ఓడిపోతారని కవి తమ ఆవేదనను వ్యక్తపరిచారు.

“అస్థిపంజరం ఆగని నవ్వు” కవితలో మనిషి నైజంకు అద్దం పట్టారు.

మనిషికి భ్రమలో జీవించడం గొప్ప హాయి అని వ్యాఖ్యానించారు. మనిషి తన జీవితమంతా ఏడుస్తాడు. లోపల అస్థిపంజరం పగలబడి నవ్వుతూ ఉంటుందని వివరించారు. ముగింపులో పెదాలు విచ్చుకుంటే నవ్వైంది.. పెదాలు రాలిపోతే భయమైంది అంటూ తాత్వికతతో కూడిన జీవన సత్యాన్ని ఆవిష్కరించారు.

“నీరెండ సౌందర్యం” కవితలో పల్లెతనాన్ని.. పల్లె జీవన సంస్కృతిని ప్రస్తావించిన తీరు బాగుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లెలు చిల్లంకల్లం అవుతున్న తీరుతెన్నులను తెలియజెబుతూ ముగింపులో.. పల్లె నాగరికతలను తరాలుగా మోసి మోసి.. నొనలు విరిగి కమ్ములూడి పల్లె సంస్కృతికి ప్రతీకగా మిగిలిన “కచ్చులం..” నీరెండలో పరమాద్భుత ప్రకటన అంటూ నర్మగర్భంగా నీరెండ ప్రాశస్త్యాన్ని వివరించారు.

“అమ్మ స్పర్శ కోసం…” కవితలో పదబంధాల కూర్పు చాలా బాగుంది. అనారోగ్యానికి గురైనప్పుడు.. తమ ఊరెళ్లడం.. అమ చేతి స్పర్శ ఓ దివ్య ఔషధంలా పనిచేయడం.. మళ్లీ మామూలు మనిషినైపోవడం అంటూ రాసిన పంక్తులు.. బాగున్నాయి.. పల్లె పట్ల.. పల్లె అందాల పట్ల.. ఉన్న మక్కువ.. మరియు అమ్మ పట్ల ఉన్న ప్రేమాభిమానాలను కవి ఈ కవితలో చక్కగా ప్రస్తావించారు.

“బంగారు బాల్యం” కవితలో కవి చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

“కవిత బిడ్డకు బారసాల” కవితలో.. పుస్తకావిష్కరణ శుభకార్యాన్ని ‘కవిత’ బిడ్డకు బారసాలగా అభివర్ణించారు. కవి రాజారావు గారు వృత్తిరీత్యా బీమా సంస్థలో ఉద్యోగి.. కనుక వృత్తి పట్ల గౌరవంతో “బీమా దీపం’ కవితను రాసి మెప్పించారు.

ఇంకా ఈ గ్రంథంలో “పిచ్చుక గూళ్లు”, “వలలోని పక్షులు”, “గుడిసె” కన్నీళ్లు, “చెట్లే నయం”, “చినుకు విత్తనాలు” కవితలు ఆలోచనాత్మకంగా తీర్చి దిద్దబడినాయి. “నా తలకాయ నాది కాదు”, “బతుక్కి అర్థం?”, “మానవతా చిరునామా” వంటి కవితలు గ్రంథానికి నిండుదనాన్ని కూర్చాయి.

“నేను ఎవరు?” దీర్ఘకవితలో పరిపూర్ణంగా జీవించడానికి వీలుగా.. తనపై తనకు స్పష్టతను యివ్వడానికి మానవీయ విలువలు కాపాడటానికి మనిషిగా ఎప్పుడో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుని.. హృదయ సంస్కారం చేసుకోవాలన్న గొప్ప సందేశాన్నిస్తూ కవి రాజారావు గారు తమ తాత్త్విక భావధారకు చోటు కల్పించారు. ‘ఎరుక’తో సముద్రంలోంచి సముద్రంలోకి” సత్యాన్వేషణకై చేసే ప్రయత్నం ఈ దీర్ఘ కావ్య లక్ష్యంగా మనకు కనబడుతుంది. అద్భుతమైన అభివ్యక్తితో… విలక్షణమైన చతురతతో.. చక్కని భావుకతతో ప్రతీ పంక్తిని కవితామయం చేశారు. లోతైన భావాలతో, తాత్త్విక చింతనతో ఈ దీర్ఘ కవితకు జీవంపోశారు. ఈ కవితలో జీవం ఉంది.. జీవితముంది. వర్ణనలు.. ఉపమానాలు.. పోలికలు.. సందర్భోచితంగా.. ఔచిత్యవంతంగా ప్రయోగించడంలో కవి సఫలీకృతు లైనారు. లోలోపలి ప్రేమ జగత్తును తట్టి లేపి.. లోలోపలి ఆత్మకు దారుల్ని చూపేలా కవితా రచనను కొనసాగించారు. ఉద్వేగ వైరుధ్యాలన్నీ దుఃఖ పునాదికి ధాతువులేనని తేల్చి చెప్పారు. చేజారిన ప్రతీది మళ్లీ చేతికి అదే రూపేణ ఇవ్వలేమనీ.. బంధాలన్నీ జ్ఞాపకాలేననీ.. అవి మనసు పరుపుపై కుంభకర్ణునిలా కునుకులేస్తుంటాయని పేర్కొన్నారు. ఆలోచనలు అంతా ఒక మనసు పెట్టేననీ.. అది గతం ఉత్పత్తి చేసిన తీయని జ్ఞాపకాల తేనె తుట్టె అని అభివర్ణించడం బాగుంది.

మనసంటే గతమేననీ.. అది అనేక అనుభవాల మూట అనీ… ఎన్నెన్నో జ్ఞాపకాల పూదోటగా వర్ణిస్తూ రాసిన పంక్తులు కవితలో చక్కగా ఒదిగిపోయాయి.

మనసంటే – మనిషి /మనిషంటే – మనసు/మనసే – నేను / (నేను ఎవరో తెలిసే దాకా)/కాని / ‘నేను’ అంటే అహం | అహంకారమంటే / మనసు ఉపరితల ఆకారమని.. మనసు కదే రూపొందించిన ఓ పెద్ద కారాగారమని తెలియజెప్పడంలో కవి రాజారావు గారి తాత్త్విక దృక్పథాన్ని అభినందించి తీరుతాం. “నేను ఎవరు?” ప్రశ్నకు.. “అంతిమ సత్యం” అని తేల్చి చెబుతూ.. ఈ కావ్యానికి ఆలోచనాత్మక ముగింపు నిచ్చారు. కవి రాజారావు గారి ఈ దీర్ఘకావ్యం ఓ కరదీపికలా పని చేస్తుంది. ఈ గ్రంథం చివరన అణచివేతకు అనేక రూపాలు శీర్షికన రాసిన కవితలన్నీ కవి యొక్క పరిశీలనా పటిమకు.. ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి… సున్నిత మనస్తత్వానికి అద్దం పట్టే విధంగా ఉన్నాయి.

జీవితమంటేనే కఠిన పార్శ్వాల్ని నిశ్శబ్దంగా మోస్తూ కొనసాగించాల్సిందన్న అర్థం ధ్వనించే విధంగా “పాత చెప్పులు కు(కొట్టువాడు” కవితను రూపుదిద్దారు. ఇంకా ఈ విభాగంలో “నిర్మల్ కోటలు”, “ఒక చెట్టు కథ”, “పాత సామాను కొంటాం”, “విధివంచితుడైన కండక్టర్”, “కదిలె” సెలయేరు, “లోపలి తలుపు తెరిచాక”, “రెండూ అయినప్పుడూ”, “పాములతోనే జీవితమైనప్పుడూ”, “బాలసంతోని పాట” వంటి శీర్షికలతో కవి రాజారావు గారు వస్తువైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు.

ఇలా రెండు దశాబ్దాలకు పైగా కవి రాజారావు గారు రాసిన కవిత్వంలోని ఆణిముత్యాలను ఒకే చోట లభ్యమయ్యేలా తాను రికార్డు చేసి “సమగ్ర కవిత్వం” రూపంలో పాఠక లోకానికి అందివ్వడం అభినందనీయం.

పేజీలు : 224, వెల: రూ.150/-

ప్రతులకు :

మునిమడుగుల రాజారావు

ఇ.నెం. 7-2-83/49/294,

ఇందిరానగర్, నిర్మల్ – 504106

9493430130

November 8, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us