మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కపిలవాయి లింగమూర్తి (కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు.)

by Sridevi Reddy Tangella December 31, 2021
written by Sridevi Reddy Tangella

కలం అతడిదే…. కాలం అతడిదే….
అక్షరం అతడిదే… అర్థం అతడిదే…
అనంతానంత విశ్వంలో రెపరెపలాడుతున్న
సాహితీ కేతన వర్ణమతడిదే
అతడు…..
పాలమూరు సాహితీ దిగ్గజం కపిలవాయి లింగమూర్తి !

▪️పరిచయం :
1928 మార్చి 31
ఉమ్మడి పాలమూరు జిల్లా, అచ్చంపేట తాలూకా, బల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో జన్మించారు.
మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులు వీరి తల్లిదండ్రులు. 1930- 31 ప్రాంతంలో వెంకటాచలం గారు మరణించారు. ఈ పరిస్థితిలో మేనమామ పెద లక్ష్మయ్యగారు కపిలవాయిని చేరదీసాడు.
ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కపిలవాయి పాఠశాల విద్య ఉర్దూ మాధ్యమంలో కొనసాగింది. కానీ ఒక వయసు, ఒక ఆలోచన, వచ్చాక గుండె నిండా తెలుగు భాషమీద అభిమానం అనివార్యంగా ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగు విశారద ప్రమాణ పత్రాన్ని పొందాడు.
తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. పట్టా పొందాడు.
సంస్కృతాంధ్ర నిఘంటువులు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలు, జ్యోతిషశ్రౌతాదిభాగాల్లో కపిలవాయి ఆరితేరారు.
▪️విధి నిర్వహణ :
వీరి ఉద్యోగ జీవితం 26 ఏండ్ల వయసు నుండి కొనసాగింది. 11.7.1954 న జాతీయోన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్‌ లో తెలుగు పండితునిగా చేరి సేవలు అందించాడు.
19.8.1972 న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, పాలెంలో ఉపన్యాసకులుగా చేరి చరిత్రోపన్యాసకులుగా సేవలు కొనసాగించారు.
28.2.1983 న ఉద్యోగ విరమణ పొందారు.
వృత్తిలో కొనసాగుతూనే ప్రవృత్తిని కొనసాగిస్తూ శతాధిక రచనలు చేశాడు.
▪️సాహితీ ప్రస్థానంలో
కపిలవాయి పద్య రచనతో తన ప్రస్థానం ప్రారంభించాడు. తర్వాత వచన సాహిత్యం,
కావ్యాలు, గీతాలు, శతకాలు, బాల సాహిత్యం,
స్థల చరిత్రలు,దేవాలయ చరిత్రలు, విమర్శ, జనపదం, తదితర సాహిత్య ప్రక్రియలను స్పృశించారు.
జిల్లా వ్యాప్తంగా శ్రమకోర్చి పర్యటించి మరుగున పడిన శాసనాలను పరిశీలించాడు. . చరిత్రను గ్రంధస్థం చేసాడు. జానపదుల నోళ్ళలో కదలాడే మౌఖిక సాహిత్యాన్ని సేకరించి రికార్డు చేసాడు. ఇవి వీరి జీవితంలో “వేయిపున్నమల వెలుగు “.
వీరి రచనలపై విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి రచనలు – జీవితం ఆధారంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం , తెలుగు విశ్వవిద్యాలయం , మధురై యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో ఆరు సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి.
1. డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ) కపిలవాయి శతకాలు – పరిశీలన
2. డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ) కపిలవాయి జీవితం – సాహిత్యం
3. యాదగిరిచారి (మధురై యూనివర్సిటీ) శ్రీమత్ప్రతాపగిరి ఖండం – పరిశీలన
4. రామాచారి (యస్‌.వి. యూనివర్సిటీ) చక్రతీర్థ మహాత్మ్యం – పరిశీలన
5. రామాచారి (తెలుగు యూనివర్సిటీ) కపిలవాయి జీవితం – సాహిత్యం
6. జి. వెంకటరాజం (ఉస్మానియా విశ్వవిద్యాలయం) కపిలవాయి లింగమూర్తి సాహిత్యంలో చరిత్ర – సంస్కృతి
వీరు మొత్తం 100కు పైగా రచనలు చేసారు. వాటిలో శతకాలు, ద్విపద కావ్యాలు, సంకీర్తనలు, చరిత్రలు, ఉదాహరణలు, ఆధ్యాత్మిక గ్రంధాలు, కథలు, సంకలనాలు – వ్యాఖ్యనాలు, సంపాదకాలు – పరిష్కృతాలు, అనువాదాలు మొదలగునవి ఉన్నాయి. కొన్ని అముద్రితాలు. వీరి కొన్ని ముఖ్యరచనలు, వాటి వివరాలు గమనిస్తే…
1)భాగవత కథాతత్వం
(భాగవతంలో 10 కథలకు వ్యాఖ్యానం )
2)సాలగ్రామ శాస్త్రం
(సాలగ్రామం దానిపుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర),
3) శ్రీ మత్ప్రతాపగిరి ఖండం
(అమరాబాదు స్థల చరిత్ర)
4)కుటుంబగీత (కుటుంబ నియంత్రణను చాటి చెప్పే ఏకైక కావ్యం)
5)మాంగళ్య శాస్త్రం
(మాంగళ్యం ధరించడంలోని గూడార్థాలు, విశేషాలు), 6)దుర్గా భర్గా శతకాలు
(అలంకార యతి లక్షణాలు)
7) ఆర్యా శతకం
(చిత్ర పద్యాల గారడి)
8) స్వర్ణశకలాలు
(90 కావ్యాలలోని స్వర్ణశిల్పి ప్రశస్తి)
9)గీతాచతుష్పథం
(భ్రమరగీత, భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవగీతల సారాంశము)
10)రుద్రాధ్యాయం
(సామాజిక చారిత్రక వ్యాఖ్యానం)
11)పాలమూరు జిల్లా మాండలికాలు (పామర సంస్కృతం)
వీరి ఆత్మకథ ” సాలగ్రామం ”
▪️భాగవతకథాతత్త్వం :
కపిలవాయి వారికి అభిమానమైన గ్రంధాలలో ఇది ఒకటి. కానీ వారి మరణం తర్వాత ఈ గ్రంధం ప్రథమ ముద్రణ వచ్చింది.. ఇందులో మొత్తం 10అధ్యాయాలు ఉన్నాయి.
01 ) కపిల దేవహూతి సంవాదం
ఈ కథ ఆంధ్ర భాగవతంలోని తృతీయ స్కంధంలో ఉంది . మూలంలో ఇది 21 నుండి 33 అధ్యాయాల వరకు గల సమగ్ర గ్రంథం . ఈ కథను పవిత్ర గంగాతీరంలో మైత్రేయుడు ‘ విదురునికి చెప్పాడు.. దీనిలో 310 గద్య పద్యాలున్నవి . ఈ కథలో వేదాంత విషయం ఎక్కువ కాబట్టి ఇది సంసారికేతి వృత్తం వలె సరసంగా ఉండదు .
02.) పురంజనోపాఖ్యానం
కళాపూర్ణోదయంలోని సరస్వతీ చతుర్ముఖుల శృంగారం వలె భాగవతంలో పురంజనోపాఖ్యానం
ఒక మార్మిక ప్రబంధం . ఇది అద్వైత ప్రతిపాదకమైన వృత్తాంతం . దీన్ని నారదుడు ప్రాచీన బర్షికి చెప్పినాడు . పూర్వం పురంజనుడనేరాజు ఉండేవాడు. అవిజ్ఞాతుడు అతడి మిత్రుడు.పురంజనుడు తనకు తగిన పట్టణాన్ని వెదకటానికి మిత్రునితో బయలుదేరి దేశదేశాలు తిరుగుతాడు. అనేక పట్టణాలు చూస్తాడు.కాని ఏదీ తనకు నచ్చలేదు . చివరకు హిమాలయ దక్షిణ సానువుల్లో నవద్వారపురం అనే పేరుగల
ఒక పట్టణం రాజవారిని ఆకర్షిస్తుంది . అదే క్రమంలో ఆ పట్టణం ముందున్న ఉద్యానంలో ఒక యువతి కనిపిస్తుంది. ఆమె ఆ పట్టణం రాకుమారి. పేరు ప్రమదోత్తమ.ఆమె వెంట పదిమంది అనుచరులు ఉంటారు. రాజుకు ఆమె పరిచయం అవుతుంది. “నేను తగిన వరునికై చూస్తున్నా -నాభాగ్య వశంగా నీవిక్కడికి వచ్చినావు ” అని వివరిస్తుంది. ఈ విధంగా కథ సాగుతుంది.
03) భరతోపాఖ్యానం
ఈ కథ భాగవతంలోని పంచమ స్కంధంలోగల ప్రథమాశ్వాసంలో ఉన్నది.మూలంలో 7 నుండి 14 అధ్యాయాలు గల గ్రంథం . ఇది ఏ భరతుడి కథ అని చెప్పడానికి వివరణ అవసరం. ఎందుకంటే పురాణాలలో భరతులు చాలానుంది ఉన్నారు.
మొదటివాడు నాట్యశాస్త్రకర్త.
రెండవవాడు కైకేయీ దశరథుల పుత్రుడు . మూడవవాడు శకుంతలా పుత్రుడు .ఈ మూడవ భరతుడి కారణంగా మనదేశానికి భారతదేశమనే పేరేర్పడిందని నమ్ముతారు. కాని ఇది నిజం కాదు . మనదేశానికా పేరు రావటానికి ఋషభ దేవుడి కుమారుడైన భరతుడు కారణం . అతడు కపిల మహర్షి సమకాలికుడు. ఈ భరతుడికి పూర్వం మన దేశానికి ” అజనాభం ‘ అని పేరు ఉండేది. మేరుదేవి , నాభి ప్రభువుల కుమారుడు ఋషభదేవుడు. ఇతడు
శ్రీమహావిష్ణువు అవతారం . జైనులు వీరిని తమ ప్రథమ తీర్థంకరుడుగా అంగీకరించినారు . ఋషభుని జీవితం నుండి గూడ నేర్చుకోవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవ్వన్ని కథాను సారంగా పొందుపరచబడ్డాయి.
04 ) అజామీళోపాఖ్యానం
ఇది భాగవతంలోని షష్ఠ స్కంధంలో ఉంది . తెలుగు భాగవతంలో వంద గద్యపద్యాలలో ఈ కథ చెప్పబడింది . తరువాత మరో 32 పద్యాల్లో విష్ణు సంకీర్తన ప్రభావం వివరించబడింది . తెలుగు భాగవతంలో షష్ఠస్కంధం మహాభారతంలోని విరాటపర్వం వంటిది. ఈ భాగంలో గుణనిధి,నిగమశర్మ, సుకుమారుడు, మదాలుసుడు, నిరంకుశుడు కథలను కపిలవాయి వార0పొందుపర్చారు.
05) నారాయణ కవచం
ఆంధ్ర భాగవతంలో పోతనగారు 19 గద్యపద్యాలతో ఈ భాగాన్ని వివరించారు.ఇది భాగవతంలోని షష్టస్కందంలో గల ఇతివృత్తం. దీనిలో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి. అవి – కవచానుష్టానా విధానం , కవచం , కవచఫలం. విశ్వరూపాచార్యుడు ఇంద్రునికి ఉపదేశించిన మంత్రరాజం నారాయణ కవచం.. ఇంద్రత్వం ఒక పదవి , దానిపై ప్రతి మన్వంతరానికి ఒకరు మారుతూ ఉంటారు . అందుచేత ఇంద్రులు చాలామంది గడిచినారు . ఈ పదవిని సృజించి మొదటిసారిగా అధిష్టించినవాడు సుయజ్ఞ అనే పేరుతో కాలం గడిపిన విష్ణువు. సుయజ్ఞ తర్వాత ఎందరో ఈ పదవిపైకి వచ్చినారు కాబట్టి వారిలో వారెవరో , అహల్యా జారుదేవరో నిర్ణయించి చెప్పటం కష్టం. ప్రస్తుతం ఉన్న ఇంద్రుని పేరు పురందరుడు . బ్రహ్మ పేరు ఆదిజుడు. ప్రస్తుతం ఈ కథ ఒకనాటి ఇంద్రుని విషయాన్ని తెలుపుతుంది .
06) ప్రహ్లాద చరిత్ర
ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు .
ఇది పద్యమయ నాటకం.ఈ నాటకం తృతీయ స్కంధం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననంతో ప్రారంభమైతుంది. విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుని వధించటం , అతనిపై హిరణ్యకశిపుడు పగ పెంచుకుని ప్రతీకారంతో రగిలిపోయే కథ ఉంటుంది. ఈ భాగంలోని చివరి వంద పద్యాలలో హిరణ్యాక్షుని వృత్తాంతం చెప్ప బడింది.
07) గజేంద్ర మోక్షం
ఈ కథ భాగవతంలోని అష్టమ స్కంధంలో ఉన్నది . మూలంలో ఈ కథ నాలుగాధ్యాయాల పరిమితమై ఉన్నది. కాని పోతనగారు తనదైన ప్రతిభతో నాలుగంతలు పెంచినాడని శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మగారు చెప్పినట్టుగా కపిలవాయి వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కథ నాలుగు మన్వంతరాల క్రింద క్షీరసాగరంలోని శ్వేతద్వీపంలో జరిగినట్టుగా కపిలవాయి తెలిపారు.
08)వామన చరిత్ర
ఈ కథ భాగవతంలోని అష్టమ స్కంధంలో 15 నుండి 23 అధ్యాయాలువరకు ఉంది . దీన్ని పోతనగారు 125 గద్య పద్యాల వరకు పెంచడం జరిగింది . ఋగ్వేద కాలం నాటికి ఇంద్ర త్రివిక్రములే ముఖ్య దేవతలు . అప్పటికి నేటిరాముడు కృష్ణుడు లేరు . పూర్వం వ్యవహార జయం కోరేవారు ప్రాతః కాలంలో వామన స్తుతి చేసేవారు . ఆదర్శ గృహస్థుడైన ప్రవరుడు ప్రతిదినం శ్రీ వామన స్తుతితో మేలుకొనేవాడు . బలి చక్రవర్తి అస్సలు పేరు ఇంద్రసేనుడు . ఇతడు ప్రహ్లాదుని మనుమడు . విరోచనుని కుమారుడు . రాక్షస లోకానికి రాజు . రాక్షసులకు దేవతలతో ఎపుడూ ఆటంకాలు కలుగుతూ ఉండేవి . అందుచేత వారు బలిని చేరి ఇంద్రుని జయించటానికి ప్రోత్సహించినారు . వంటి వివరాలు ఈ అధ్యయంలో కపిలవాయి పొందుపర్చారు.
09 )గోపికా గీతలు – భ్రమర గీతాలు
భాగవతం దశమ స్కంధంలో 31-32 అధ్యాయాలలోనూ, 47 వ అధ్యాయంలోనూ భ్రమర గీతాలు ఉన్నాయి. 36 పద్యాలలో పొందుపర్చడం జరిగింది.. భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాల సంపుటి . వాటికి ఆలంబనం శ్రీకృష్ణుడు . శ్రీకృష్ణుడు లీలా మానుష విగ్రహుడు కాబట్టి అతని జీవితానికి రెండు విధాల సమన్వయం ఉంది . అతనిని కన్నవారు దేవకీ వసుదేవులు . పెంచినవారు యశోదా నందులు . రెండు కుటుంబాలు పరస్పరం మిత్రులు . నందుడు ఆవుల మందలకు యజమాని.కాబట్టి శ్రీకృష్ణుడు బాల్యంలో కొంత కాలం గోవులను మేపాడు.గోవులను అనేకమైన ఆపదల నుండి కాపాడినాడు తరువాత సాందీపుని దగ్గర విద్యలు నేర్చుకున్నాడు . . కృష్ణుడు జంతు పోరాటంలో మంచి నేర్పరిగా కన్పిస్తాడు .ఈ వివరాలు మొత్తం ఈ అధ్యాయంలో పొందుపర్చబడ్డాయి.
కృష్ణుడు మంచివాడనుచు సంప్రీతిన్ ప్రశంసించెంది సంగీతంబున నేము సొక్కుదుమె తచ్చారిత్రముల్ వింతలే
అంగీకారముగావు మాకు పురకాంతాగ్ర ప్రదేశంబులన్ సంగీతం బొనరింపు వారిడుదు రోజన్నీకు నిష్టార్థముల్ .
సమదాళీశ్వర ! చూడుముజ్జ్వలిత హాసభ్రూ విజృంభంబులన్….
రమణీయుండగు శౌరిచే గరగరే రామల్ త్రిలోకంబులన్…
ప్రమదా రత్నము లక్ష్మియాతని పదాబ్జాతంబు సేవింప ని
క్కము మేమెవ్వరమా కృపా జలధికిన్ కారుణ్యముల్ జేయగన్….
వంటి పద్యాల విందు రమనీయముగా ఉన్నది.
10 ) రుక్మిణీ కల్యాణము
తే :
రూఢి నామాయ కామినీ రూపమునను
పురుషులకు నెల్ల మోహంబు బొందజేయు
గాన పురుషులు సతుల సంగంబు
మాని యోగవృత్తి చరించుచు నుండవలయు .
కం :
యోషిద్రూపంబున నను
నీషణముఖ గహ్వరమున నెగమ్రింగి కడున్ ద్వేషమున కోతి జేసిన
దోషదయగు నాత్మమాయ దొలగగ గంటిన్ .
వంటి పద్యాలతో కపిలవాయి గారు రుక్మిణి కళ్యాణం అధ్యయనాన్ని ప్రారంభించాడు.
▪️పాలమూరు జిల్లా దేవాలయాలు
“పాలమూరు జిల్లా దేవాలయాలు” పరిశోధనాత్మక రచన కపిలవాయి జీవన సాఫల్య గ్రంధం. జిల్లావాసులకు ఉపయుక్త గ్రంధం. తిరుమల తిరుపతి దేవస్థానములు – తిరుపతి వారు 2010 లో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకంలో మొత్తం 30 శీర్షికలతో జిల్లా దేవాలయాల సమాచారాన్ని పొందుపర్చారు.
1.పాలమూరు జిల్లా పుట్టుక
2.అచ్చంపేట తాలూకా ఆలయాలు
3.అచ్చంపేట మండలంలోని అరణ్యకాలు
4.అమరాబాదు పట్టీలోని ఆలయాలు
5.అమరాబాదు సీమలోని అరణ్యకాలు
6.ఆలంపురం సీమలోని ఆలయాలు
7.కలువకుర్తి తాలూకాలోని గుడులు
8.వెలిదండలో వెలసిన ఆలయాలు
9.కొల్లాపురం తాలూకా కోవెలలు
10.కోడంగల్ తాలూకాలోని గుడులు
11.నాగర్ కర్నూలు తాలూకాలోని గుడులు
12.వడ్డవాని సీమలో వర్ధిల్లిన ఆలయాలు
13.పాలమూరు తాలూకాలోని ఆలయాలు
14.మక్తల్ తాలూకాలోని మందిరాలు
15.లోకయ్యపల్లె దొరలు కట్టించిన గుడులు
16.వనపర్తి యిలాకా ఆలయాలు
17.నాయక్ వంశీయులు కట్టించిన గుడులు
18.గోపాలపేట యిలాకా కోవెలలు
19.ఈ జిల్లాలోని కొన్ని వెంకటేశ్వరాలయాలు
20.వాసవీ కన్యకాంబ ఆలయాలు
21.వీరబ్రహ్మేంద్రుని ఆలయాలు
22.మన గ్రామదేవతలు
23.ఇదమ్మ జాతరలు
24.ఎల్లమ్మ జాతరలు
25.మైసమ్మ జాతరలు
26.ఇతర దేవతలు జాతరలు
27.ఆశ్రమాలు – మఠాలు – సమాధులు
28.మఠాలు
29.సమాధులు
30.మా జిల్లాలో కొన్ని దర్శనీయ స్థలాలు
▪️నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానం
సాహిత్యరంగంలో వీరి కృషి, సంకల్పం, వెలకట్టలేనిది.
వీరి విశిష్ట రచనలు వీరికి పురస్కారాలతో విశిష్ట స్థానాన్ని ఆపాదించి పెట్టాయి. వాటిలో విశేషమైన వాటి వివరాలు చెప్పుకుంటే…….
1983లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు కపిలవాయి వారిని సన్మానించి గౌరవించారు.
నారాచంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖరరెడ్డిలు కూడా తమ పాలనాకాలంలో కపిలవాయిని సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సైతం వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక సాహిత్యకారుడుగా కపిలవాయి చరిత్ర విశిష్టమైనది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తిగా కపిలవాయి ఘనత దక్కించుకోవడం
విశేషం.
తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కారం –
బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం-
బ్రౌన్ సాహిత్య పురస్కారం –
నోరి నరసింహశాస్త్రి పురస్కారం –
కందుకూరి రుద్రకవి పురస్కారం –
పులికంటి సాహితీ పురస్కారం –
బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం –
1992లో కవితా కళానిధి, పరిశోధనా పంచానన
1996లో కవికేసరి
2005లో వేదాంత విశారద
2010లో గురు శిరోమణి
2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి
2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
▪️సంచికలు సంపాదకులు :
1. విశ్వజ్ఞ రామాచార్యులుగారి అభినందన సంచిక ( షాద్ నగర్ ) – 1990
2. ఎమ్ . నారాయణ గారి షష్టిపూర్తి సంచిక 1992 3.స్మృతివాణి ( కాకమాను లక్ష్మీశ్వరమ్మ స్మృతి ) 2001
4. కళా నీరాజనం – భైరోజు దామోదరాచారి షష్టిపూర్తి సంచిక –
వ్యక్తిత్వం :
కపిలవాయి !
మూర్తీభవించిన మహాతత్త్వం …
తెలుగు భాషను, తెలుగు ప్రజలను మనసారా ప్రేమించిన భాషా యోగి…….
తెలంగాణ ప్రాంతం తన గుండెకాయగా జీవించిన అభిమాన ధనుడు….
తాను నడిచే గ్రంధాలయం అయినప్పటికీ, వహించిన విజ్ఞానం అయినప్పటికీ అందరినీ కలుపుకు పోయిన నిగర్వి…..
కుటుంబం
వీరి జీవిత భాగస్వామిమీనాక్షమ్మ. ఈ పుణ్య దంపతులకు కిశోర్ బాబు, అశోక్ బాబు ఇద్దరు సంతానం.
శివైక్యం
కపిలవాయి నవంబర్ 6, 2018 న తన 90 ఏండ్ల వయసులో దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రి హైదరాబాదులో కాలధర్మం చెందారు.
ఎందరో మహానుభావులు
అందరికీ వందనాలు

December 31, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

సావిత్రి — యమ ధర్మరాజు ( హాస్య కథ)

by రంగరాజు పద్మజ December 31, 2021
written by రంగరాజు పద్మజ

సావిత్రికి చిన్నప్పటి నుండి ఒక అలవాటున్నది. తల్లి ఏదైనా వంటకము చేసి పెట్టి రుచి ఎలా వున్నది ? అని అడిగితే “ యమహా “ గా వున్నది … అనేది- తండ్రి కొత్త బట్టలు తెచ్చి అమ్మడూ!బాగున్నాయా? అనడిగితే నాన్న గారూ! “ యమహా “గా వున్నాయనేది. స్నేహితులు ఫలానా సినిమా చూసావా ? ఎలా వుంది ? అని అంటే “ యమహా “ గా ఉన్నదంటుంది.
సావిత్రి రేడియో జాకీగా పనిచేస్తుంది. మైకు పట్టుకుని … హలో !!! హైదరాబాద్ !!!గుడ్ మార్నింగ్ !! ఎలా వున్నారు? నేనైతే యమాహా గా వున్నాను.మీశ్రోతలందరికీ యమా యమాగా మీరు కోరుకున్న పాటలు విని పిస్తాను.ట్రింగ్ …ట్రింగ్ …హలో !! ముందుగా కాల్ చేస్తున్నారు యమాహాగా! M.ధర్మరాజు గారూ ! ఈ రోజు మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు.
హలో ! హలో ! సావిత్రి గారూ ! మీ వాయిస్ బాగుంటుంది .. అది వినాలనే చాలా సార్లు కాల్ చేసాను అదృష్ట వశాత్తూ ఈ రోజు కలిసింది. థాంక్సండీ మీకు ఏ పాట కావాలి ? అవతలి వైపునుండి .. ”యమహో ..యమా యమా అందం “ అనే పాట కావాలి.శ్రీదేవి గారు లేరు కదా ! మరొక్క సారి గుర్తు చేసుకుందామని …
ఓ ! సరే సరే యమ్ ధర్మరాజు గారూ వినిపిస్తాను …వినండి వినండి ఉల్లాసంగా ..ఉత్సాహంగా !!అలా తన డ్యూటీ ముగించుకుని సావిత్రి తన “యమహా “మోటారు సైకిల్ మీద యమా స్పీడుగ భర్త ఆఫీస్ కు వెళ్ళి, ఆయనను పికప్ చేసుకుని , వస్తుంటే… తోవలో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ యమ ధర్మ రాజులా కనపడి( ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు యమధర్మరాజు వేషము వేసుకుని … హెల్మెట్ పెట్టుకోకుంటే మీ ఇంటికి వస్తామని నటిస్తున్నారు జనాలు రూల్స్ పాటించడానికి కొత్త పద్ధతి) హెల్మెట్ లేదనిసఅడ్డగిస్తే …సర్ది చెప్పి బయట పడేసరికి ఆలస్యమయింది. తోవలో ఏదైనా తిని పిల్లలకు తీసుకుని పోదామని అటు చూసేసరికి…స్వర్గలోక్ రెస్టారెంటు కనపడింది. హోటల్ ముందు బోర్డ్ మీద రుచి గా చేసేందుకు ఐదు నక్షత్రాలహోటల్ చెఫ్ యమ్ ( అతని పూర్తి పేరు యామినేని మార్కండేయులు .పేరు పెద్దగా వున్నదని అలా యమ్ అని రాసుకుంటాడు.) చాలా రుచిగా శుచిగ చేస్తాడని, అతనికి సహాయకులుగా నల్,భీమ్ లున్నారని రాసి వున్నది. ఇద్దరూ నవ్వుకున్నారు. కొంప దీసివీడి హోటల్ లో పుఱ్ఱెలలో వడ్డిస్తారేమో అపిటైజర్ కు బదులు ఏ రక్తమో ఇవ్వరు కదా! అని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
భోజనమైన తరువాత వాళ్ళకు ఒక అలవాటు ఎప్పుడైన సరే లోపల కిచెన్ లోపలికి వెళ్ళి ఫలాన నంబరు గల టేబిల్ పై సర్వ్ చేసిన ,భోజనము తయారు చేసిన చెఫ్ ఎవరో తెలుసుకోవచ్చా? అని అడిగితే మాస్టర్ యమ్ (యామినేని మార్కండేయులు) వచ్చి నేనే చేసాను . మీకు నచ్చలేదా ? అనగానే , కాదు కాదు యమహా గా వున్నదని అభినందించి, అక్కడి విజిటర్స్ బుక్ లో రాసి వచ్చినారు.
ఇద్దరూ కూర్చుని మాట్లాడు కుంటూ ఒక మంచి యమహా ఇల్లు కట్టుకోవాలి… ఎన్ని రోజులు ఈ నరకంలో వుంటాము అనుకుంటూ టీవీ ఆన్ చేసినారు. కామెడీ సీన్స్ వస్తున్నాయి. ఇద్దరికీ కామెడీ ప్రోగ్రామ్ లు చాలా నచ్చుతాయి.ఇంతలో స్క్రీన్ మీద “ యమధర్మ రాజు” మీద తీసిన
సినిమా క్లిప్పింగ్ లు వస్తున్నాయి. చూస్తూ నాకు యమదొంగ అంటే ఇష్టం అన్నాడు భర్త, నాకు యమగోల అంటే ఇష్టము …ఏ సినిమా లో నైనా యమధర్మరాజు పాత్ర చాలా నచ్చుతుంది. పాత సినిమాలలోని. సత్యనారాయణ అయినా , ఈ మథ్య నటించిన మోహన్ బాబు యమహా గా అదరగొట్టే డైలాగులని అవే చెప్పుకుంటూ నిద్రలోకి ఒరిగినారు.
తెల్లవారు ఝామున సావిత్రికి మెలుకువ వచ్చింది.ఎదురుగా యమపాశం పట్టుకుని యమధర్మరాజు నిలబడి సావిత్రీ !!! నీకు భూలోకంలో నివసించే సమయము అయిపోయింది రా!! యమలోకం వెళ్ళాలి… అని పిలుస్తున్నాడు. సావిత్రి అనుకుంటున్నది కదా! … కల వచ్చిందని… పడుకునేముందు యమధర్మరాజు సినిమాల గురించి మాట్లాడుకున్నాము ..తను నేను.
ఓహ్! కలనా అని పైకే అన్నది సావిత్రి.కాదు కాదు నువ్వు కల కన లేదు… నిజంగానే నీకుమరణించే రోజు వచ్చింది అన్నాడు యముడు.
“అయ్యో ! అలానా ? అయినా నువ్వు చాలా స్ట్రిక్ట్ కదా ! సరే వస్తాను !! కాని నేను నాభర్తను పిల్లలను చాలా ప్రేమిస్తాను. గమ్మత్తుగా అనుకోకుండా … వాళ్ళిద్దరి పుట్టిన రోజు ఒకేరోజ వస్తాయి.
నాకు కొంచెము సేపు టైమ్ ఇవ్వు… ఈ ఒక్కరోజు నేను వాళ్ళకిష్టమైనవి చేసి సంతోష పెట్టి వస్తాను “అని బతిమిలాడింది. అంటే సరే నేను ఇలా ఎవరికీû టైమ్ ఇవ్వను.వారి మరణమా
సన్నమవగానే …పాశం వేసి , ప్రాణాలు తీస్తాను…ఇలా మాట్లాడుతూ సమయము గడపను. కానీ నీకు చిన్నప్పటి నుండి నన్ను ప్రతి నిమిషము”యమహా! యమహా “  అని తలుచు కుంటావు కాబట్టి… అందునా మానవ లోకంలో నన్ను స్తోత్రము చేసే వాళ్ళే లేరు. అందరూభయపడి మనసు లో కూడా యమ అనరు అటువంటిది అలా ప్రతి పని లో నన్ను మనస్పూర్తిగా తలుచుకుంటూంటావు …. కాబట్టి నేను ముందున్న డ్రాయింగ్ రూంలో కూర్చుంటాను త్వరగా పని ముగించుకొని రా…అన్నాడు యముడు.
ఇక నడుము కు కొంగు చెక్కుకుంది… ఏ పని తో మొదలు పెట్టాలా అను కుంటూ.. గబగబబాయిలర్ లో నీళ్ళు పోసి, చెక్క పేళ్ళతో అంటించి, నీళ్ళు వెచ్చ పడగానే… భర్తకు, కొడుకుకు తలంటుపోయాలి అనుకుంటూ .. వంటింట్లోకి వెళ్ళి చిక్కటి కాఫీ చేసి ఒక కొత్త గ్లాసు లో పోసి ముందు రూంలో వున్న యముడికిచ్చింది అహా ! సావిత్రీ నాకు ఇలా ద్రవ పదార్ధాలు తాగే అలవాటు లేదంటే …కాదు ఒక్క గుక్క తాగండి” యమహా “ గా ఉంటుందని చప్పున నాలుక కరుచుకుంది.
యముధర్మరాజు ఒక్క గుక్క వేసి నువ్వన్నట్టు యమహా గా వున్నదన్నాడు. మీరే కాదు స్వామీ! “నా భర్త స్నేహితులు, చుట్టాలు అందరూ అదే మాటంటారు.
సరే సరే వెళుదాం పద ! నాకు ఇవ్వాళ “ టర్కీ “ దేశంలో వరదలు రావాలని వరుణుడిని పంపాను. అక్కడ చాలా మంది ప్రాణాలు తీయాల్సివుంది” అన్నాడు.
సావిత్రి పనిలో పడింది. బ్రేక్ ఫాస్ట్ మంచిగా చేయాలి. రేపటి నుండి నేనుండను కదా!అని వడ అందరికీ ఇష్టమని వడా , చట్నీ, సాంబార్ చేస్తూ ..మధ్య మధ్య భర్తను , పిల్లలను నిద్ర లేపుతున్నది.అటునుండి , ఇటుతిరిగి పండుకుంటున్నారు.సావిత్రి అటు టిఫిన్లు చేస్తూనే కుక్కర్ లో పప్పు , అన్నం పెట్టి , కూరలు కట్ చేసి మరొక్కసారి అందరిని నిద్ర లేపి , ఇంతలో మునిసిపాలిటీ పంపు రావడంతో …బిందెల తో నీళ్ళు పట్టి , ఫిల్టర్ నింపింది.లంచ్ బాక్స్ లు సిధ్ధం చేసి, భర్త షర్ట్ ఇస్త్రీ చేసి , పిల్లల స్కూల్ బ్యాగ్ లు సర్ది, వాటర్ బాటిల్స్ నింపి , బూట్లు పాలిష్ చేసి , సాక్స్ , యూనిఫాం రెడీగా పెట్టి , దువ్వెన రిబ్బన లు పట్టుకొని మళ్ళీ పిల్లల రూం లోకి వచ్చి వాళ్ళను బలవంతంగా బాత్ రూంలోకి ఈడుస్తూ, బ్రష్ మీద పేస్ట్
పెట్టు తుండగానే యముడి పిలుపు “సావిత్రీ ! త్వరగా రా !” అని గంభీరంగా పలికాడు.
“స్వామీ ! మధ్య తరగతి మహిళలకు పొద్దున్నే యమ పని వుంటుంది. పనిలో పక్కనున్న వారితో అంటారు కూడా … చావ తీరుతులేదు … ఈ పని తో అని మీరే చూస్తున్నారు కదా ! అసలే ఈ రోజు కూరగాయల సంత – అక్కడ యమ రష్ గా వుంటుంది.నాకు కూరగాయలు కొని ఆ యమ రష్ నుండి పడేసరికి యమలోక దర్శనమే. అసలే కూరగాయలు యమ గిరాకీ … అంతేనా? కరెంట్ బిల్లు , వాటర్ బిల్లు చెల్లించడానికి ఈ సేవా సెంటర్ కు వెళితే అక్కడా యమ రష్. అక్కడి నుండి స్కూల్ లో పిల్లల ఫీజు పే చేసి పేరంట్స్ మీటింగు లో వాళ్ళడిగే యమ గందరగోళ ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ స్కూల్ కుయమక్రేజీ..వాళ్ళడిగే ప్రశ్నలు యమ ఈజీ అంటారు కొందరు.
సరే కుటుంబం బాగుండాలని ప్రార్ధిద్దామని కోవెలకు వెళ్ళి …రాముడిని దర్శనము చేసుకోవాలంటే ఆ క్యూలో జనాలు కాళ్ళు తొక్కి , నెట్టేస్తుంటే యమా ! నీవే గుర్తుకు వస్తావు. అంతేనా రేషన్ షాప్ కు వెళితే అదొక యమలోకం.అక్కడ సరుకులిచ్చే వాడు అచ్చంగా నీ వలె  (యముడు) కూర్చొని , తూకంలో మాత్రం నీ ధర్మం , నీ న్యాయం పాటించడు సుమా
అన్నీ తప్పుడు కొలతలే …చెడ్డ కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత విసిగి పోతామంటే రేషన్ డీలర్ ఇచ్చిన కిరోసిన్ వాడి మీద పోసి, అంటించి నీ( యమ ) లోకం పంపాలనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సరదాగా వెళ్ళే సినిమా హాలులో క్యూ కొట్లాటలు, బజారులో డేరాలు వేసి మహిళా సంఘాల న్యాయపోరాటాల మోతలతో యమ లోకం కనపడుతుంది….”అంటూండగానే…
ఈ రోజు మొత్తము నీ ఇంటిముందు పడిగాపులు పడ్డా …నీవు నా వెంట వచ్చేటట్ట లేవు , అంటే …అయ్యో! యమా ! ఇంకెక్కడ పని తీరింది…ఈ వంట పాత్రలు శుభ్రం చేసి, ఇల్లంత సర్ది , బట్టలుతికి , నేను ఆఫీసుకు పోయే సరికి , లేటయితే అక్కడ మరొక యముడుంటాడు. అదే మా బాస్ !ఇక ఆయన తిట్ల దండకము అందుకుంటే ఇంతకన్నా తానే నయమని… యమధర్మరాజా! నన్ను నీ లోకం తీసుకెళ్ల వయ్యా! అని అనుకుంటాము మా మధ్య తరగతి మహిళలము అని చెప్తూ అటు తిరిగి చూసేసరికి … యముడు స్పృహ తప్పి పడి, పక్కకు ఒరిగి పోయి వున్నాడు. ఎలా యముడిని లేపడం ? అనుకుంటూ – నాకు నా భర్తా , పిల్లలను లేపడమే యమ కష్ఠం … ఇవాళ యమహా గా యముడిని లేపడం… ఒక సమస్య తరువాత ఒకటి
నేను భరించ లేనయ్యా ! యముడా ! నన్ను తీసుకొన పోవయ్యా ! అని నాలుక కరుచుకొని , చూస్తుండగానే కళ్ళు తెరచి, సావిత్రీ ! వస్తావా లేదా ? ఈ మాయదారి దోమలు కుట్టి కుట్టి నేను వెళ్ళే ప్రయత్నము చేయకుండానే… యమ లోకం పంపేటట్టున్నాయి. అనగానే…
“అయ్యో ! యమా ! నిన్ను హాలులో కూర్చుండ బెడిత బాగుండును…ఈ డ్రాయింగ రూంలో యమ దోమలు అవి కుట్టాయంటే …యమ మంట పుడుతుంది”
అనగానే ఆ ఒక్క పని తక్క మరొకటి చేయ వీలులేదు పోదాం పద !అని గట్టిగా అన్నాడు యముడు. సరే స్వామీ మిగిలిన పని చేసి వస్తానని …ఒక్క గెంతు గెంతింది పెరట్లోకి అపర సావిత్రి యముడు తన చేతిలో పాశం చూస్తూ… భూలోకంలో సగటు మధ్య తరగతి మహిళలకు యమ పాశం అక్కరే లేదు …వాళ్ళ బంధనాలే పాశం , ఇలా పొద్దటి నుండి …సాయంత్రం దాకా పని చేసి చేసి …యమ నీరస పడి పోతారు. ఇక పూర్వ జన్మ పాపాలు పరిహారము చేయడానికే నేను యమలోకం తీసుకొని వెళ్ళేది. వాళ్ళు ఆ శిక్ష లేవో ఇక్కడే అనుభవిస్తున్నారు. ఇంకా నేను తీసుకొని పోయేసరికి … వాళ్ళ చిట్టాలు జమా- ఖర్చు సమానమవుతాయి ఎందుకులే ఈ అబల సావిత్రిని కీసుకొని వెళ్లడము అనుకొని …చెప్పా పెట్ట కుండా వెళ్ళిపోయాడు యమాగా “ సమవర్తి “.
*******************

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

మూగ జీవులు

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, December 31, 2021
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

చింటూ చిన్న పిల్లవాడు. అతడు ఆడుకోవడానికి వాళ్ళమ్మ చాలా బొమ్మలు తెచ్చి యిచ్చింది. వాటితో కొద్దిసేపు ఆడుకున్న  చింటూకు చిరాకు కలిగింది. అవి అన్ని తీసి బయట పడవేశాడు. వాళ్ళ అమ్మ అప్పుడు వంట ఇంట్లో ఉంది.
చింటూ ఇంటి ముందుకు వచ్చి పూల చెట్ల వద్దకు వెళ్ళాడు. అక్కడ చెట్లకు పూసిన పూలు చాలా అందంగా ఉన్నాయి. అక్కడ ఒక తూనీగ ఎగురుతున్నది .వెంటనే దాని రెక్కలను  అందుకొని భూమి పైన ఉన్న ఒక చిన్న రాయి పైన దానిని   ఉంచాడు. అది ఆ చిన్న రాయిని అమాంతంగా తన కాళ్లతో పట్టుకుంది. చింటూ దాన్ని పైకి లేపి ఆనందంతో కేక వేశాడు. ఇంతలోకే పక్కింటి పిన్ని అది చూసి” బాబూ! అలా తూనీగ రెక్కలు పట్టుకోకూడదు. వదిలిపెట్టు “అని అంది. ఆమెకు భయపడిన చింటూ దానిని వదిలి పెట్టాడు .అది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ తర్వాత మరొక రోజు చింటూ వారి పెరట్లోకి వెళ్ళాడు .అది వర్షాకాలం.  ఆ పెరట్లో అతనికి ఎర్రగా ఆరుద్ర పురుగు కనిపించింది. ఆ పురుగును చేతితో ముట్టాడు .అది తన కాళ్లను ముడుచుకుంది. మెత్తగా ఉన్న దానిపైన చేతితో  నిమిరి ఒక ఖాళీ అగ్గిపెట్టెలో దాన్ని బంధించాడు. ఆ తర్వాత మరి నాలుగు  ఆరుద్ర పురుగులను అలాగే అగ్గిపెట్టెలో వేసి బంధించి పక్కింటి పిన్నిగారికి చూపించాడు. ఆమె చింటూను కోప్పడి
” బాబూ! అలా వాటిని అగ్గిపెట్టెలో బంధించ కూడదు. వదిలిపెట్టు !”అని అంది .చింటూ తన అగ్గిపెట్టెలోని ఆ ఆరుద్ర పురుగులను కూడా వదిలి పెట్టాడు .
ఆ తర్వాత కొన్ని రోజులకు చింటూ ఒక సీతాకోక చిలుక రెక్కలను పట్టుకున్నాడు .అతడు దాని రెక్కల అందం చూసి” అమ్మా! ఈ సీతాకోకచిలుక అందంగా ఎంత బాగుందో” అని తల్లి వద్దకు పరిగెత్తాడు. ఆమె” అలా చేయకూడదురా! దాన్ని వదిలిపెట్టు.  అది దాని అమ్మ దగ్గరకు ఎగిరి వెళ్ళిపోతుంది” అని అంది .చింటూ అమ్మ యొక్క  మాటను వినలేదు .ఇంటి బయటకు వచ్చాడు. అప్పుడు పక్కింటి పిన్ని” చింటూ! దాన్ని వదిలి పెడతావా! లేదా!”అని గద్దించింది. వెంటనే చింటూ ఆ సీతాకోక చిలుకను కూడా వదలిపెట్టాడు.
మరొక రోజు చింటూ ఈగను పట్టుకోవాలని ప్రయత్నించాడు. అది దొరకకుండా తప్పించుకొని పోయింది. చింటూ వెంటనే అక్కడ పాకుతున్న  ఒక  ఎర్ర చీమను పట్టుకున్నాడు. అది చింటూను కుట్టింది. ” అమ్మా! చీమ కుట్టింది “అని ఏడుపు లంకించుకుంటూ తల్లి వద్దకు పరిగెత్తాడు. ఆమె “అయ్యో !మా బాబే ! ఎక్కడ కుట్టింది?” అని అంటూ అది కుట్టిన వ్రేలును బాగా మర్దన చేసింది. కొద్దిసేపటికి ఏడుపును ఆపిన చింటూతో వాళ్ళ అమ్మ ” చీమను పట్టుకోకూడదురా! చూసావా!అది నిన్ను కుట్టింది “అని అంది. “ఇకముందు దాని  జోలికి  పోనులే” అన్నాడు చింటూ. “అమ్మా! నాకు ఆటలు ఆడుకోవడానికి ఎవ్వరూ  లేరు.  పక్కింటి పిన్నిగారు ,నీవు ఆ  కీటకాలతో  ఆడుకోవద్దని అన్నారు.మరి నేను వేటితో ఆడుకోవాలి?”అని  ప్రశ్నించాడు?
ఇంతలోకే వారి ఇంటికి ఎదురుగా కొత్తగా వచ్చిన చిన్న పాప వారి ఇంటికి వచ్చింది.చింటూ ఆ పాపను  గట్టిగా కదలకుండా  పట్టుకున్నాడు.  ఆ పాప ఏడుపు లంకించుకుంది. వెంటనే చింటూ అమ్మ “ఆ పాపను వదలు బాబూ!” అని అంది .కానీ చింటూ ఆ పాపను అలాగే పట్టుకున్నాడు. వెంటనే పక్కింటి పిన్ని వచ్చి చింటూ చేతిలో నుండి ఆ పాపను విడదీసింది .ఆ పాపకు చింటూ అమ్మ ఒక బొమ్మను తెచ్చి ఇచ్చింది .ఆ పాప  వెంటనే ఏడుపును ఆపి నవ్వసాగింది. చింటూ” అది నా బొమ్మ ” అని అన్నాడు. అప్పుడు చింటూ అమ్మ
” ఇది నీ బొమ్మనే !ఈ చెల్లి నీ కన్నా చిన్నది కదూ!ఆడుకోనీ!” అని అంది .
ఇంతలోనే ఆ పాప అక్కడ మండుతున్న నిప్పు వద్దకు వెళ్ళబోయింది.  అది గమనించిన చింటూ యొక్క  అమ్మ ఆ పాపను గట్టిగా కదలకుండా పట్టుకుంది. ఆ పాప గట్టిగా ఏడవసాగింది. అది చూసిన చింటూ “అమ్మా! నేను ఆ పాపను పట్టుకుంటే వద్దని అన్నావు .మరి నీవు  కూడా ఆ పాపను ఎటూ  వెళ్లకుండా  పట్టుకున్నావుగా! “అని అడిగాడు.” ఆ పాపకు ఈ నిప్పు కాలుతుందని తెలియదురా! అందుకే పట్టుకున్నాను” అని అంది.
వెంటనే అక్కడకు వచ్చిన పక్కింటి పిన్ని గారు ఈ మాటలను విని ” ఒరేయ్ !ఈ పాపనూ, చిన్న ప్రాణులైన తూనీగ, ఆరుద్ర పురుగులు, సీతాకోకచిలుక, ఈగ ,చీమలను పట్టుకోగూడదురా!తెలిసిందా! ఎందుకంటే వాటి స్వేచ్ఛను మనం అరి కట్టరాదు. ఈ పాపకు నోరు ఉంది కాబట్టి అది ఏడ్చింది. కానీ అవి మూగజీవులు. అందుకే వాటి ఏడుపు నీకు వినిపించలేదు. వాటిని చూసి ఆనందించాలి తప్ప పట్టుకోకూడదు! అర్థమైందా!” అని అంది. చింటూకు అప్పుడు అర్థమైంది. “అయితే వాటిని ముట్టుకోకుండా ఆడుకోవచ్చు కదా !”అని అడిగాడు.”ఓ! భేషుగ్గా  ఆడుకో” అని అంది చింటూ అమ్మ .వెంటనే చింటూకు తనను నిన్న తన మిత్రుడు గోపి వదలకుండా, ఎక్కడికీ పోకుండా గట్టిగా పట్టుకున్నందుకు తాను కూడా బాధపడి ఏడ్చిన అనుభవం  సంగతి జ్ఞాపకం వచ్చింది.
” అవును పిన్ని గారూ! నన్ను కూడా గోపి నిన్న గట్టిగా పట్టుకుంటే నేను కూడా ఏడ్చాను” అని అన్నాడు.వాడి మాటలు విని చింటూ అమ్మ ,పక్కింటి పిన్ని నవ్వుకున్నారు.

December 31, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

 పెట్టుబడి

by Nandiraju padmalata December 31, 2021
written by Nandiraju padmalata

“తొమ్మిది దాటుతోంది ప్రణూ! భోజనానికి రామ్మా! నాన్న, తమ్ముడూ ఎదురుచూస్తున్నారు” కూతురి  గదిలోకి వచ్చిన రాధిక, తదేకంగా మొబైల్ ఫోను చూసుకుంటూ, కళ్ళు తుడుచుకుంటున్న  ప్రణతిని చూసి గతుక్కుమంది.

తల్లి మాటను వినిపించుకోలేదు ప్రణతి, వాట్సాప్ లో వచ్చిన వీడియో చూడడంలో మునిగిపోయి ఉంది. ఏం చూస్తోందో అనుకుంటూ కూతురి   వెనుక నుంచీ చూసింది రాధిక.

ఎవరో పెద్దాయన. ఎనభై దాకా ఉంటుంది వయసు. ఏదో చెప్తున్నారు. కూతురి చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండడం వలన ఆయనేం చెప్తున్నాడో తెలియలేదు. అందుకే, కూతురి భుజం మీద తట్టింది.

ఉలిక్కిపడింది ప్రణతి. మొబైల్ ఆఫ్ చేసి తల్లిని కౌగలించుకుని వెక్కివెక్కిఏడవసాగింది.

ఆకలితో బల్ల ముందు కూర్చున్న మురళి, వంశీ ఇద్దరూ, ఎంతకీ లోపల్నించీ ఊడిపడని తల్లీ కూతుళ్ళ కోసం గది లోకొచ్చి, ఆ దృశ్యం చూసి కంగారు పడిపోయారు.

“ఏమైంది రాధీ? ప్రణూ! ఎందుకలా ఏడుస్తున్నావ్? ఎవరేమన్నారమ్మా? కాలేజ్ లో ఏమైనా జరిగిందా?” అడిగాడు మోహన్.

“కాలేజీలెక్కడున్నాయి నాన్నా? ఆన్ లైనే గా అంతా? ఏమైందేప్రణూ?” అక్కని తల్లి భుజం మీది నుంచి విడదీశాడు వంశీ.

“నువ్వే చూడు నాన్నా!” కళ్ళు తుడుచుకుని, తన మొబైల్ ఫోనుని తండ్రికిచ్చింది ప్రణతి.

“అయ్యా! ఈ వీడియో చూస్తున్న పెద్దా చిన్నా, ఆడా మగా అందరికీ ఈ ముసలి చేతుల నమస్కారాలు.  మీ అందరితో నాలుగు ముక్కలు చెప్పాలన్న కోరికతో మీ ముందుకొచ్చాను.

నా పేరు సిరిపురపు సుబ్బరాజు.  వయసు ఎనభై రెండు. ఉన్నత స్థాయి  ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యి ఇరవై రెండేళ్ళు దాటింది. నా బ్రతుకు ప్రయాణంలో ఎన్నో కష్ట నష్టాలకోర్చాను. నా బిడ్డలిద్దరినీ  శక్తికి మించిన చదువులు చదివించాను. బంధు మిత్రులందరికీ నా తాహతుకు మించి సహాయాలు చేశాను. బాధ్యతల బరువుతో, నా ఆరోగ్యం క్షీణిస్తున్నా అహరహం కష్టించి బాధ్యతలన్నీ తీర్చాను. బ్రహ్మాండమైన ఇల్లు కట్టాను. ఏ లోటూ లేకుండా  పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళూ   చేశాను.  నా కొడుకు అమెరికాలో పెద్ద ఉద్యోగం లో ఉన్నాడు. అక్కడ ఏ స్టేట్ లో ఉన్నాడో మాత్రం నాకు తెలియదు.  నా కుమార్తె ప్రస్తుతం దేశంలో ఉందో, విదేశాల్లో ఉందో  కూడా తెలియదు.  వారు నాతో ఫోన్లో మాట్లాడి అయిదేళ్ళు.  వాళ్ళు నాకిచ్చిన ఆ పాత నంబర్లకే పదే పదేఫోన్లు చేసి చేసి, నా ఈ వేళ్ళు వంకర్లు పోతున్నాయి. వాళ్ళతో మాట్లాడి, ఒక్క సారైనా నా మనుమలను చూసి ప్రాణం వదలాలన్న నా ఆఖరి కోరిక ఎవరైనా తీరుస్తారా? వాళ్ళతో ఈ తండ్రి గురించి చెప్పి పంపిస్తారా? వాళ్ళ సొమ్ము నాకక్కర్లేదు. వాళ్ళు నా కంటికి కనిపిస్తే చాలు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడితే చాలు.  అయ్యలారా, అమ్మలారా! నన్ను మీ తండ్రి గా భావించండి.  రక్త పోటూ, మధు మేహం మాత్రమే కాక, ఇటీవల నాకు మూత్ర పిండాల సమస్య సైతం వచ్చింది. మనశ్శాంతి కరువై, నిద్ర కూడా దూరమైంది.  నా భార్య చాలా కాలం క్రితం కాలం చేసింది. సరైన తిండి లేక, ఇల్లూ వాకిలి ఉన్నా, పట్టించుకునే వాళ్ళు లేక ఇదిగో, ఈ వృద్ధాశ్రమం లో ఉంటున్నాను. ఎన్నాళ్ళుఉంటానో? ఎప్పుడు పోతానో?

నా వాళ్లకి నా గురించి తెలియడం కోసం, రేపు నేను పోతే, అనాధ శవం గా కాక, నా కన్నబిడ్డ చేత తల కొరివిపెట్టించుకోవాలనే ఆశతో ఈ వీడియో పంపుతున్నాను. దయామయులైన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.”

అక్కడక్కడా ఉద్వేగంతో తడబడుతూ, కన్నీళ్ళతో చెప్తున్న ఆ పెద్దాయన మాటలు నిజంగానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వృద్హాశ్రమం పేరున్న బోర్డు, భవనం, ఫోన్ నంబరు కూడా వీడియో లో చూపారు.

“మనుషులింత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తారమ్మా? కని పెంచిన అమ్మానాన్నల్ని ఎలా వదిలేస్తారు? ఆ తాతగారు అచ్చం మన తాతయ్యలాగేఉన్నారమ్మా!” కళ్ళు తుడుచుకుంటూ అంది ప్రణతి.

కూతుర్ని ఓదార్చి, భోజనం బల్ల దగ్గరకి తీసుకొచ్చారు మోహన్ దంపతులు. హృదయం బరువుగా అయిపోయింది అందరికీ. రెండు నెలల క్రితం చనిపోయిన తండ్రి గుర్తొచ్చాడు మోహన్ కి. ప్రణతిది చాలా సున్నితమైన మనసు. అన్నింటికీ   త్వరగా స్పందిస్తుంది. పైగా తాతయ్యతో అనుబంధం ఎక్కువ. ఆయననితలచుకున్నప్పుడల్లా  దిగులే.

“వంశీ…అమ్మా…నాన్నా… అందరికీ ఈ వీడియో ని పంపిస్తున్నా… మీరూ సాధ్యమైనంత ఎక్కువ మందికి పంపాలి. ఆ తాతగారి కొడుకూ కూతుళ్ళకి బుద్ధి రావాలి. ఎలా అయినా సరే, వాళ్ళు వచ్చి  ఆయననితీసుకెళ్ళాలి. ఆయన చివరి కోరిక తీర్చాలి.” పడుకోవడానికి గది లోకెళ్తూ ఆజ్ఞాపించింది ప్రణతి.

“నా మీద పెట్టేయవే భారం ప్రణూ!  నువ్వు హాయిగా నిద్రపో!” చెప్పాడు వంశీ.

“అవునే! రేపేదో ఆన్ లైన్ టెస్ట్ అన్నావు. చదువుకో!” తండ్రి మాటలకి తలూపింది ప్రణతి.

ఆ రాత్రీ, మర్నాడూ కూడా నలుగురూ  ఆ వీడియో ని తమ ఫోన్లలోఉన్న అన్ని కాంటాక్ట్స్ కీ పంపే పనిలో పడ్డారు.

***

సాయంత్రం ఇంటికి వస్తూనే నవ్వుతూ వచ్చాడు ఆఫీస్ నుంచి మోహన్.

యధాప్రకారం  లంచ్ బాగ్ వాకిట్లోనే పెట్టి, బయట బాత్ రూమ్ లోనే చేతులు శానిటైజ్ చేసుకుని, కాళ్లు, ముఖం కడుక్కుని, ముక్కున ఉన్న మాస్క్ తీసి సబ్బుతో రుద్ది జాడించి ఆరేసి ఇంట్లోకి వస్తూనే, ‘ప్రణూ……శుభవార్త’ అంటూ గట్టిగా పిలిచేసరికి ముగ్గురూ పరిగెత్తుకు వచ్చారు .

“యురేకా…..ఒరేయ్  ప్రణూ! శుభవార్త స్పెషల్ గా నీ కోసం…!”

“ ఏంటి నాన్నా…దానికొక్కదానికే అంటే…ఆ….అర్థమైంది, మైక్రోస్కోప్ ఆర్డర్ చేశావా?” వంశీ అడిగాడు. ప్రణతికి అంతరిక్ష విజ్ఞానం అంటే ఇష్టం.  చాలా రోజుల్నించి దాని కోసం అడుగుతోంది తండ్రిని.

“కాదురా! కనుక్కున్నా ఆ పెద్దాయన ఎవరో ఏంటో!”

“ఆ విషయం ఆయనే చెప్పాడుగా నాన్నా! మనకితెలియాల్సింది ఆయన పిల్లల గురించి” చెప్పింది ప్రణతి.

“అదేలే…. ఆయన వివరాలే ఇంకొంచెం ఎక్కువగా తెలిశాయి. నా ఫ్రెండ్ చలం లేడూ, సర్వీస్ లో ఉన్నప్పుడు వాడి నాన్నకి ఈయన కొలీగ్ ట.. చలం ఇలా ఆ వీడియోని  చూపించాడో లేదో, గుర్తు పట్టేశాడట. సో…. మన పని…. అదే  శ్రీమాన్ సుబ్బరాజుగారి పని అయిపోయినట్లే!”

“భలే చెప్తావు నాన్నా! ఆయనని పిల్లల దగ్గర చేర్చితే కదా, మనం సాయం చేసినట్లు.” నిష్టూరంగా అంది ప్రణతి.

“అవును. అంతేగా….!” వంత పాడింది రాధిక.

“మనకెందుకే తల్లీ ఇవన్నీ…?కాగల కార్యాలన్నీ వాట్సాప్ లూ, ఫేసుబుక్కులూ చూసుకుంటాయి. వదిలేయి.” చెప్పాడు మోహన్.

“ఏంటి నాన్నా నువ్వూ…మరీ దయా, జాలి లేకుండా మాట్లాడ్తావు? ఎలా అయినా ఆ కొడుకూ కూతుళ్ళ ఆచూకీ తీయకుండా ఊరుకోను. పెట్టాల్సిన గడ్డి పెట్టి, వాళ్ళని ఆ తాతగారి దగ్గరికితీసుకెళ్ళకపోతే నా పేరు ప్రణతి కాదు.” సీరియస్ గా అంది.

ప్రణతి పట్టిన మంకుపట్టుకు తలవంచక తప్పలేదు మోహన్ కి. ఆ రాత్రికే, తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ళాడామెని.

“తాతగారూ…మీకాయన క్లోజ్ కాకపోవచ్చు. కానీ, అప్పట్లో ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్లకి, సుబ్బరాజుగారి కుటుంబంతో పరిచయాలుండొచ్చుగా….ప్రయత్నిద్దాం ” మోహన్ స్నేహితుడు చలపతి తండ్రి రామదాసుగారిని అడిగింది ప్రణతి.

“ఏమోనమ్మా….ఎప్పుడో పాతికేళ్ళ నాటి సంగతి. అప్పట్లో  మాకు సుబ్బరాజుగారు ఆఫీసర్. గడగడ లాడించే వాడు. మహా గట్టి పిండం. ఆయన దగ్గరికి వెళ్ళిన ఒక్క ఫైలు కూడా కొర్రీ లేకుండా బయట పడేది కాదు. ఆయనతో నా అనుభవం ఒకటి విను. ఓ సారి బస్సుల సమ్మె. నా చేతక్ స్కూటర్ మీద ఆఫీసుకి వెళ్తూంటే, ఈయన బస్టాప్ లో కనిపించాడు. ఎంతయినా మనాఫీసేగాఅని ఆయన్ని ఎక్కించుకుని ఆఫీసుకి తీసుకొచ్చాను. మహానుభావుడు, నేను బండి పార్కింగ్ చేసి వచ్చేసరికి నాకు లేట్ మార్క్ వేసేశాడు. అదేంటి సార్ అంటే, రూలు రూలే అన్నాడు.” అంటూనవ్వేశాడాయన.

“వాళ్ళ కుటుంబం వివరాలు తెలుసా తాతగారూ?” అడిగింది ప్రణతి.

“ఆయనకి ఇద్దరు పిల్లలనీ, భార్య జబ్బు మనిషనీ తెలుసు మాకు. పని రాక్షసుడు. ఏకో నారాయణ. ఎవరితోనూ కలిసే మనిషి కాదు. ఎవరినయినాకనుక్కుందామన్నా,నా దగ్గర చాలా మంది ఫోన్ నంబర్లు లేవమ్మా. అప్పట్లో అన్నీ ల్యాండ్ లైన్లేగా…పైగా ఎంత మంది ఇంకా బ్రతికి ఉన్నారో తెలీదు.  ఆయన ఎదురు పడితే తప్పుకు తిరిగేవాళ్ళం. గాడిద వెనక్కి, బాసు ముందుకి వెళ్ళకూడదన్నది తెలుసుగా …”

“ఎందుకెళ్ళకూడదు?”

అమాయకంగా అడిగింది ప్రణతి.

“ఎప్పుడు లాగి పెట్టి ఈడ్చి  తంతారో తెలీదు కాబట్టి” ఆయన మాటలకి ఫక్కున నవ్వారందరూ.

“బాగా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ మనిషి అన్నమాట. పోన్లెండి తాతగారూ…ఒక పని చేయండి. మీ మీ  దగ్గరున్న నంబర్లు  నాకివ్వండి. ప్రయత్నిస్తాను. నాన్నా! మనం  సుబ్బరాజుగారిని కలవాలి ”

అసహనాన్ని కనిపించకుండా దాచుకున్నాడు మోహన్. ఫోన్ నంబర్లు రాసుకుంది ప్రణతి.

“చూడు ప్రణూ! మన పన్లుమనకున్నాయి. సోషల్ మీడియా వల్ల  ఈ సరికి విషయం ఆయన పిల్లలకి చేరే ఉంటుంది. ఈ కోవిడ్ కాలంలో ఎందుకొచ్చిన గొడవ? ఇంకఊరుకో!” ఇంటికొచ్చే దార్లో అన్నాడు మోహన్.

వినలేదు ప్రణతి.

“ఏంటి నాన్నా? రేపు మేం మిమ్మల్ని వదిలేస్తే…మీకూ ఇదే పరిస్థితి వస్తే…? చదివించి ప్రయోజకుల్ని చేసిన తండ్రిని నిర్లక్ష్యం చేసే ఇలాంటి పిల్లల గురించి అందరికీ తెలియాలి. అందుకే మరిన్ని వివరాలు సంపాదిద్దాం. కాదనద్దు. రేపే నేను విజయవాడ వెళ్తున్నా…కావాలంటే, నువ్వూ రా…”  పట్టుబట్టింది. తండ్రి తనకి కుదరదనడంతో, తెల్లారగానే తనే కారు డ్రైవ్ చేసుకుంటూ  విజయవాడ దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళింది.

సుబ్బరాజుగారు పెద్దవారే కానీ, ఆయనకి  జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంది. వీడియో లో చూసినట్లుగా కాక,   మాట స్పష్టంగా ఉంది. ధారాళమయిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. తన పిల్లల గురించి, బంధువుల గురించి చాలా విషయాలు చెప్పారు. ఇంటిపేర్లతో సహా అందరి పేర్లూ చెప్పి, వాళ్ళందరినీ కలవాలని ఉన్నదనీ, తన ఇంట్లో తానుండాలనుకుంటున్నానని చెప్పారు.  ఎంత మందికో సహాయం అందించినందుకు తనకు జరిగిన ఈ అన్యాయం తల్చుకుని బాధపడ్డారు.

“మీకేం కాదు తాతగారూ…తప్పకుండా మీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మన సంభాషణ మొత్తం వీడియో రికార్డు చేశాను. ఇందులో నా ఫోన్ నంబర్, మీ ఫోన్  నంబర్ రెండూ ఇస్తాను.ఇప్పుడే దీన్ని వైరల్ చేస్తాను. దిగులు పడకండి.” ధైర్యం చెప్పింది ప్రణతి.

వృద్ధాశ్రమంలో సుబ్బరాజుగారిదిఏ.సి గది. ప్రత్యేకంగా ఉంది. భోజనం, ఉపాహారం వగైరాలన్నీ  ఆయన గదికే తెచ్చిస్తున్నారు. అప్పుడు సాయంత్రం అయిదవుతోంది. ఆశ్రమ నివాసితులు కొంతమంది పురాణ పఠనం, కొంత మంది తోటపని, మరి కొంతమంది వాకింగ్  లాంటివి చేస్తున్నారు.

“నా వలన మీ రోజువారీ షెడ్యూల్ దెబ్బతిన్నట్లుంది కదూ!“ వీడ్కోలు తీసుకుంటూ అడిగింది ప్రణతి.

“నాటెటాల్! వాళ్ళందరూ గదుల్లోకి వెళ్ళిపోయాక నేను వాకింగ్ కి వెళ్తాను. వాళ్ళ రేంజ్ వేరు. నా హోదా వేరు కదా…ఓకే అమ్మా…వెళ్లి రా….”

‘రామదాసు తాతగారు చెప్పినట్లు ఈయన త్వరగా కలవరెవరితోనూ’ అనుకుని అక్కడి నుంచీ బయల్దేరింది ప్రణతి.

****

“హలో…. ఎవరండీ?” మొబైల్ ఫోన్ లో ఎవరిదో అపరిచిత నెంబర్.

“ప్రణతి గారే కదా?”

“అవును. మీరు?”

“హాయ్ ప్రణతి గారూ…నా పేరు శ్రీవత్స. సిరిపురపు సుబ్బరాజుగారి అబ్బాయిని. టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. మా నాన్నగారి వీడియో చూసి చేస్తున్నాను. మీతో మాట్లాడొచ్చా?”

ఎగిరి గంతేయాలనిపించింది ప్రణతికి.

“ తప్పకుండా….చాలా సంతోషంగా ఉంది. మీ నాన్నగారితో మాట్లాడారా? పాపం! ఆయన ఎంత బెంగ పడుతున్నారో! అనాధ లా బ్రతుకుతున్నారండీ! మీ కోసం కలవరిస్తున్నారు. మీ అక్క గారిని చూడాలని పలవరిస్తున్నారు. ఈ చివరి దశలో ఆయన్నలాఒంటరిని చేయడం న్యాయమేనా? డబ్బే సర్వస్వం కాదండీ.. కన్నవాళ్ళ కన్నా ఏదీ ఎక్కువ కాదు. చెప్పండి. ఎప్పుడొస్తున్నారు?” ఆవేశంగా అడిగింది  ప్రణతి .

“ మిస్ ప్రణతీ….చిన్నవారయినా చక్కగా చెప్పారు. చూడండి.మా అక్క పేరు సుభద్ర. తనూ మీతో మాట్లాడాలనుకుంటోంది. మీకు అభ్యంతరం లేకపోతే అక్క, మీరు, నేను కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుకుందామా?”

ప్రణతి సరే అన్న తర్వాత, జూమ్ కాల్ చేశాడు శ్రీ వత్స. అతని సోదరి, ప్రణతి కూడా వీడియోలో ఒకరికొకరు కనిపించారు. పరస్పర  పరిచయాలయ్యాయి. ప్రణతి ప్రక్కనే కూర్చున్నారు మోహన్, రాధిక కూడా.

“చెప్పండి. మీరిద్దరూఎప్పుడొస్తున్నారు? సుభద్ర గారూ! మీరుండేది భిలాయ్ లోనేగా! రెండు గంటల్లో రావచ్చు విజయవాడకి. ప్లీజ్ సుబ్బరాజు  తాతగారిని ఈ వయసులో బాధ పెట్టొద్దు.”

“చూడమ్మా ప్రణతీ….నాకన్నా చాలా చిన్నదానివి కానీ పెద్ద మనసు నీది. థాంక్సేలాట్. పరుల గురించి ఆలోచించేలా పెంచిన నీ తలిదండ్రులకి నా నమస్కారం.” సుభద్ర అంది.

“సుభద్రగారూ… థాంక్స్. మన ఈ కాల్ లో మీ నాన్నగారినీకలుపుకుందాం. ఆయనెంతసంతోషిస్తారో….”

“తప్పకుండా…కానీ, ముందు, మనం మాట్లాడుకుందాం.” చెప్పాడు శ్రీ వత్స.

వీళ్ళకి తనతో ఏం పని? వాళ్ళూవాళ్ళూ కలవడం కావాలి. అది జరిగేందుకు మార్గం దొరికింది కదా? అర్థం కాలేదు ప్రణతి కి.

“మా నాన్న ప్రపంచానికి పంపిన సమాచారం, ఆయన అనుకున్నట్లుగానే అందరికీ చేరింది. మీ అందరి దృష్టిలో మేమిద్దరం విజయవంతంగా  కృతఘ్నలంఅయ్యాం. అంతవరకూ ఆయన మిషన్ సక్సెస్. మా ఇద్దరికీ ఖర్చు లేకుండా పబ్లిసిటీ దొరికింది.” నవ్వాడు శ్రీవత్స.

“ఆయనను అన్యాయంగా, ఈ ఎనభై ఏళ్ల వయసులో, భార్య కూడా లేని ఆయన్ని ఒంటరిని చేయడమే కాక , పాపం, మీ మీదనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతూంటే, ఇదా మీరనేది?” కోపంగా అంది ప్రణతి. ఇంకా ఏదేదో అనబోయిన కూతుర్నాపాడు మోహన్.

“అననీయండి సర్….మా నాన్నకి కావాల్సింది అదే!” చెప్పింది సుభద్ర.

విడ్డూరంగా చూసారు ప్రణతి వాళ్ళు.

“అవును. నాన్న. ఆ మాటకి ఉన్న విలువను తీసేశాడాయన. వయసుని, అనారోగ్యాన్ని, ప్రస్తుత పరిస్థితినీ ఉపయోగించుకుని ఇన్నాళ్ళకివలెనే ఇప్పుడు కూడా మమ్మల్ని వేధిస్తున్నాడు. అందరి ముందూ మమ్మల్ని దోషులుగా నిల్చోబెట్టాడు.” బాధ, శ్రీవత్స కంఠం లో.

“క్షమించండి…మాకేం అర్థం కావడం లేదు.” చెప్పాడు మోహన్.

“ ఇప్పుడు   అమ్మే ఉండి ఉంటే, ఏమనేదోకదక్కా?” కన్నీళ్లు తుడుచుకున్నాడు శ్రీవత్స.

“ ఏమనేదిరా? అన్నం తినడానికి తప్ప అమ్మ నోరు తెరిచిందెప్పుడు కనుక? మా అమ్మ పోయిందని మేం విచారించడం లేదండీ…ఆవిడకి విముక్తి కలిగిందని ఆనందిస్తున్నాం. మోహన్ గారూ, నలభై సంవత్సరాల సాహచర్యంలో మా అమ్మ ఏడవని రోజు లేదంటే మీరు నమ్ముతారా? పాతికేళ్ళ వయసు దాకా ఆ ఇంట్లో ఆయన దగ్గర మేం నరకం అనుభవించాం. అందరూ ఆయనది  క్రమశిక్షణ అనుకుంటారు. కాదు, శిక్ష అది. అమ్మ గడప దాటితే అనుమానం. పుట్టింటికి వెళ్తే అనుమానం. అన్నదమ్ములతో మాట్లాడినా అనుమానం. ఆయన ముందు గొంతెత్తి మాట్లాడితే తప్పు. కట్టు బానిసలా పడి  ఉండేది. వెట్టిచాకిరి చేసి, చావు దెబ్బలు తినేది మా అమ్మ. ఆయన ఇచ్చిన కాస్త డబ్బుతో ఇల్లు గడపాలి. చిల్లర పైసలు కూడా లెక్క చెప్పాలి. అమ్మ పుట్టింటి వాళ్ళెవరూ రాకూడదు. పలకరించకుండా కట్టడి. ఆఖరికి అమ్మకి, తనకి వచ్చిన గర్భాశయ కాన్సర్ గురించి కూడా భర్తకి చెప్పుకోలేని అసహాయత. అప్పటికే పెళ్ళయి వెళ్ళిపోయిన నాకు తెలియలేదు. తమ్ముడికి తెలిసి, వాడు నాన్నకి ఎదురు తిరిగి అమ్మని చికిత్స కోసం తీసుకెళ్తే, అప్పటికే చేయి దాటి పోయింది. అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందన్న బాధ కన్నా, ఈ రాక్షసుడి బారి నుంచి తప్పించుకుందని ఆనందించాను.” వెక్కివెక్కి ఏడుస్తోంది సుభద్ర.

నిశ్శబ్దం. ఎవరూ ఏమీ అనలేదు. శ్రీ వత్స అందుకున్నాడు.

“ప్రణతీ…ఒక్క రోజు కూడా మమ్మల్ని ఆయన దగ్గరకి తీసుకున్న పాపాన పోలేదు తెలుసా! క్రమశిక్షణ పేరుతో ఆయన పెట్టే హింసకి వణికి పోయింది మా బాల్యం. ఆట, పాట , సినిమా, షికారు ఏవీ లేవు. ఆయన చెప్పిన చదువు చదువుకోవాలి. ఇష్టం లేకపోయినా తినాలి, త్రాగాలి. ఆయన కొనుక్కొచ్చిన బట్టలే కట్టాలి. పరీక్షల్లో ఆయన అనుకున్నన్ని మార్కులే రావాలి.  ఒక్క మార్క్ తక్కువొస్తే, మాతో పాటు అమ్మకి కూడా బెల్టు దెబ్బలు. నా ఇంజినీరింగ్ లో కూడా ఆయన చేతి దెబ్బలు తిన్నానంటే మీరు నమ్ముతారా? అంతెందుకు? మా అమ్మతో మేం ప్రేమగా మాట్లాడకూడదు. ఆవిడ మమ్మల్నిదగ్గరకి తీసుకుని ముద్దివ్వకూడదు. ఇప్పుడు నా కూతుర్నిచూసినప్పుడంతా, నాకు మా అమ్మే గుర్తొస్తుంది. ఆ దుర్మార్గుడిని అవతలకిత్రోసయినా మా అమ్మని నేను నాతో తీసుకెళ్ళి ఉంటే బ్రతికి ఉండేదన్న నిజం నా మనసుని చిద్రం చేస్తోంది ప్రణతీ! ” పసివాడిలాగా రోదిస్తున్నాడు శ్రీవత్స.

వాళ్ళతో పాటు ప్రణతీ, వంశీ కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఎలాగో తేరుకున్న రాధిక కల్పించుకుంది.

“మగాడి ఇగో అది. మా బంధువుల్లోనూ ఇలాంటి వాళ్ళ గురించి విన్నాను. కానీ, వయసుని మన్నించి, ఆయనని క్షమించండి. ఎంతైనా మీకు జన్మనిచ్చిన తండ్రి కదా! ఒకసారి కలిసి వెళ్ళండి. మీ కోసం ఆయన ఆర్జించి పెట్టిన ఆస్తి కోసమైనా, పశ్చాత్తాప పడుతున్న ఆయనని మన్నించండి.”

“హు…ఆయన…పశ్చాత్తాపం? అసంభవం.  మేమెక్కడున్నామో ఆయనకి తెలుసు. మా ఫోన్ నంబర్లూ తెలుసు. కానీ, తనంతట తాను మమ్మల్ని అడగడం ఆయనకు నామర్దా. మేమెటూ ఆయనకు సాదరంగా స్వాగతం పలకం అని తెలుసు. అందుకే, మీడియాని ఉపయోగించుకున్నాడాయన. ప్రపంచం ముందు మమ్మల్ని నమ్మక ద్రోహులుగా, విశ్వాస ఘాతుకులుగా ప్రెజెంట్ చేశాడు.

చూడండి సర్…మాకేమీ ఆయన ఆస్తి అక్కర్లేదు. ఆయన అంతకన్నా అక్కర్లేదు. ఎప్పుడయినా, ఎక్కడయినా,  పెట్టుబడి మీదే కదా  ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆయనే కనుక  మా మీద, మా అమ్మ మీద   ప్రేమ, ఆప్యాయత  అనే పెట్టుబడి పెట్టి  ఉంటే, ఈ రోజున మాతో  మాత్రమే కాదు మా పిల్లలతో కూడా మమతానుబంధమనే రిటర్న్స్ వచ్చి ఉండేవి. వస్తూనే ఉండేవి.” చెప్పింది సుభద్ర.

వాళ్ళిద్దరి మాటల్నీ ఖండించేందుకు ప్రణతి వద్ద మాటలూ లేవు. వయసూ లేదు.

“ఒక నాన్న ఎలా ఉండకూడదో చెప్పారు సుబ్బరాజు గారు. కదు నాన్నా!” తండ్రి భుజం మీద వాలింది ప్రణతి .

“ గుడ్ బై. నీ మంచి మనసును అలాగే కాపాడుకుంటూ జీవితంలో ముందుకు సాగు చెల్లాయ్!” నిష్క్రమించింది సుభద్ర. శ్రీ వత్స కూడా వీడ్కోలు పలికి మీటింగ్  నుండి వెళ్ళిపోయాడు.

*****

“ డియర్ ప్రణతి…  నువ్వన్నట్లే, మేం మా నాన్నలా ఉండకూడదని అనుకున్నాం. అందుకే, అక్కా, నేనూ మా నాన్నతో మాట్లాడాం. త్వరలో వస్తామని చెప్పాం. మా అమ్మే నీ రూపంలో వచ్చి నాన్ననుమన్నించమందేమోఅనిపిస్తోందమ్మా! గాడ్ బ్లెస్ యు!”  నిద్ర లేస్తూనే, శ్రీవత్స పంపిన మెసేజ్ చూసిన ప్రణతి కళ్ళు చిప్పిల్లాయి. మనస్పూర్తిగా నిట్టూర్చింది.

***

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అవసరం

by Rama Devi Nellutla December 31, 2021
written by Rama Devi Nellutla

ఆమె మళ్ళీ రావడం కనిపించింది .
ఎప్పట్లాగే భుజానికో బ్యాగు తగిలించుకుని , కుడి చేత్తో ఆ పెద్దావిడ చేయి పట్టుకుని నడిపిస్తూ నెమ్మదిగా లోపలికి వచ్చింది .చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఆ ముసలామెను కస్టమర్స్ లాంజ్ లోని కుర్చీలో కూర్చోబెట్టింది .
ఆవిడ కూర్చున్నాక తన భుజానికున్న బాగ్ లోనించి నీళ్ల సీసా బయటికి తీసి మూత తీసి పదిలంగా ఆమె నోటికి అందించింది . పెద్దావిడ వద్దన్నట్టుగా తల తిప్పింది . అయినా వదలకుండా బుజ్జగిస్తున్నట్టుగా ముసలామెతో కొన్ని మంచినీళ్లు తాగించింది .
ఆ తరువాత స్టాండ్ దగ్గరికి వెళ్లి ఒక విత్ డ్రా ఫామ్ తీసుకుని ఏదో రాసింది . పెద్దావిడ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పి ఆవిడతో పెన్ను పట్టించి చిన్న పిల్లలతో అక్షరాలు దిద్దించినట్టుగా జాగ్రత్తగా సంతకం చేయించింది . మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్లి పాస్ బుక్ తో బాటు వోచర్ ఇచ్చి పెద్దావిడను చూపిస్తూ ఏదో చెప్పింది .
వాళ్ళూ నవ్వుతూ పలకరించి ఏదో అంటున్నారు . టోకెన్ తీసుకుని కాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది . క్యాషియర్ నవ్వుతూ డబ్బులు లెక్కబెట్టి ఇచ్చాడు . ఆమె కూడా చిరునవ్వుతో మాట్లాడుతోంది .
నేను ఈ బ్రాంచ్ కి మేనేజర్ గా వచ్చిన గత అయిదు నెలలుగా చూస్తున్నాను , ప్రతీ నెలా ఆఖరి వారం లోనే ఆమె బ్యాంక్ కి వస్తుంది . అది కూడా ఉదయం బ్యాంకు తెరచిన అయిదు నిముషాల్లోపే వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తుంది . ఆ రోజుల్లో .. అందునా ఆ టైం లో అయితే రష్ ఉండదని కాబోలు !
ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది . ఎందుకో తెలీదు గానీ ఆమెను చూస్తూంటే ఎంతో ఆత్మీయురాలనిపిస్తుంది . సౌమ్యంగా , నెమ్మదిగా తన పని చేసుకువెళ్తుంది . ఆమె రాగానే మా స్టాఫ్ కూడా ఎంతో బాగా పలకరించడం , గబగబా ఆమెకు పనులు చేసి పెట్టడం నేను గమనించాను .’ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు ‘ , ఇదే కాబోలు !
ఇవాళ రిలీజ్ చేయాల్సిన ఒక లోన్ గురించి ఫీల్డ్ ఆఫీసర్ తో చెబుదామని నా కేబిన్ లోంచి బయటికి వస్తూంటే ఆమె తన చేత్తో ఆ ముసలావిడను పట్టుకుని నడిపించుకుని వెళ్తూ కనపడింది .
” నమస్తే మేడమ్ !” చక్కటి చిరునవ్వుతో కుడి అరచేయి ఛాతీకి ఆనించి తల కొద్దిగా వంచి విష్ చేసింది .
” నమస్తే ! మీ అమ్మగారా ?” పెద్దావిడ వైపు చూస్తూ అడిగాను . చిన్న పిల్లను పట్టుకుని నడిపించినట్టు ఆమె ఎంతో అపురూపంగా ఎడమ చేత్తో ఆమెను పొదివి పట్టుకుని తీసుకువెళ్తూంది .
” లేదండీ , మా అత్తగారు !” అంది ఆమె అదే వినయంతో .
ఆశ్చర్యపోవడం నా వంతయింది .
వాళ్ళు నెమ్మదిగా బయటికి వెళ్ళగానే , ఓ ఆటో వచ్చి ఆగింది . ముందే ఆటో అతన్ని పోనూ రానూ మాట్లాడుకున్నట్టున్నారు . ముందు జాగ్రత్తగా అత్తగారిని ఎక్కించి ఆ తరువాత తాను వెనకాల నుండి తిరిగి వచ్చి అటుపక్కనుండి ఎక్కిందామె . ఆటో కదిలింది . ‘ ఎంత జాగ్రత్త !’ అనుకుంటూ అటే చూస్తూ ఉండిపోయాను .
********
ఎట్టకేలకు ఆ ఇల్లు దొరకపట్టగలిగాను . అతని కోసం దాదాపు నెల రోజుల్నించి తిరుగుతున్నాను. కుమార్ అనే అతను వీడియో కెమెరాకు లోన్ తీసుకున్నాడు బ్యాంక్ నుండి . పెళ్లిళ్లకు, పుట్టిన్రోజులకు , ఇతర ఫంక్షన్లకు వెళ్తూ సంపాదించుకుని తక్కువ మొత్తంతో ఎక్కువ ఇన్ స్టాల్ మెంట్స్ లో మూడేళ్ళలో కట్టుకునేలాగా ఏర్పాటు చేశారు మా బ్యాంకు వాళ్ళు .
మొదట్లో ఒకట్రెండు నెలలు సరిగానే కట్టినట్టున్నాడు . ఆ తరువాత నుండీ ఏమీ చెల్లింపులు లేవు . నేను ఈ బ్రాంచ్ లో మేనేజర్ గా చేరిన కొద్ది రోజులకే అతని లోన్ ఖాతా మొండి బకాయిగా సిస్టమ్ లో కనపడుతోంది .
సహజంగా నేను చిన్నదైనా , పెద్దదైనా లోన్ రికవరీ కోసం ఒకట్రెండు సార్లు ఫోన్ చేసినా ఫలితం ఉండకపోతేనే ఇంటికో , పని చేసే చోటికో , షాపుకో వెళ్తాను . పైగా లోన్ ఇచ్చినప్పుడు మధ్య మధ్య యూనిట్ చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది .
ఈ కుమార్ అనే అతను అస్సలు దొరకలేదు . ఇప్పటికి మూడిళ్లు మార్చాడు . ఎలాగో ఆచూకీ తీసి దొరకపట్టాను . తీరా చూస్తే ఇంట్లో ఘోరమైన పరిస్థితి ! అతడు ఇంట్లో లేడు , ఏ రాత్రికో బాగా తాగి వస్తాడట . మొదట్లో ఎవరో వీడియో గ్రాఫర్స్ దగ్గర పనిచేసినప్పుడు బాగానే డబ్బులు వచ్చేవట . అయితే తాగుడు ఎక్కువై ఇంట్లోకి డబ్బులేమీ ఇవ్వకపోగా రెండు లక్షల విలువైన ఆ వీడియో కెమెరా కూడా కుదువబెట్టి మరీ తాగేవాడట .
ఇప్పుడు ఆ కెమెరా కూడా ఉందో అమ్మేశాడో తెలీదు , ఎక్కడా పెద్దగా షూటింగ్స్ కూడా ఉన్నట్టు లేదని అతని భార్య ఏడుస్తూ చెప్పింది . ఆమె షిఫ్ట్ పద్ధతిలో ఏదో మాల్ లో పని చేసి తెచ్చే డబ్బులే ఇంటికి ఆధారమట . తల్లికి వచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా బెదిరించి తీసుకుంటాడట . లోన్ కట్టమని అతని భార్యని అడగలేక పోయినా , అతను ఇంట్లో ఉండే టైంకు వస్తానని ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని బయటికి వచ్చాను .
” నమస్తే మేడమ్ ! ఏంటి ఇలా వచ్చారు ?” పలుకరింపుతో స్కూటీ స్టార్ట్ చేస్తున్న నేను అటు చూసాను . రెగ్యులర్ గా వాళ్ళ అత్తగారిని తీసుకుని బ్యాంక్ కి వచ్చే ఆమె నవ్వుతూ పలుకరిస్తోంది .
” ఓ ! మీ ఇల్లు ఇక్కడేనా ?” అడిగాను . కూరగాయల బండి దగ్గర కూరలు కొన్నట్టుంది , చేతిలోని బుట్టలో కూరగాయలున్నాయి .
” ఆ రెండో ఇల్లే , మీకు ..ఇక్కడ తెలిసినవాళ్లున్నారా ?”
” కస్టమర్లందరూ మా చుట్టాలూ , ఫ్రెండ్సే కదా ! ఒక లోన్ రికవరీ కోసం వచ్చా !” చెప్పాను .
” మీరు కూడా తిరగాల్సిందేనా మేడమ్ ! మీ ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళరా ?” అడిగిందామె .
” వెళ్తారు , నేను కూడా రావాల్సి ఉంటుంది ”
” ఇంత దూరం వచ్చారు కదా , మా ఇంటికి రండి మేడమ్ , ఆ కన్పించేదే ”
” అయ్యయ్యో , వద్దు లెండి ” అన్నానే కానీ .. ఆమె ద్వారా ఈ కుమార్ ఉన్నప్పుడు తెల్సుకుని రావచ్చనీ , ఈమెతో టచ్ లో ఉంటే మంచిదనీ వెళ్లాను .
చిన్న ఇల్లే కానీ శుభ్రంగా బావుంది . ” అత్తయ్యా ‘ ఇదిగో , మనింటికి బాంక్ మేనేజర్ గారొచ్చారు ” అంటూనే ముందు రూమ్ లో ఆగిపోయిన నన్ను చూసి ” లోపలికి రండి !” అంటూ తీసుకెళ్లింది . పెద్దావిడ అప్పటి దాకా టీవీ చూస్తున్నట్టుంది , నన్ను చూడగానే ఆఫ్ చేసింది .
“ మీ కోసం రెండు రకాల ఆకు కూరలు తీసుకున్నాను . మీకిష్టమని మునక్కాయలు కొన్నాను . ” అంటూనే ” అయ్యో , ఇదేంటీ , ఈ పళ్ళ ముక్కల్ని ఇలా వదిలేశారు ?” అంటూ అత్తగారిని అడిగిందామె .
” చాలా ఇచ్చావు , కొన్ని తిన్నానులే .. అవన్నీ నేను తినలేను ” అంది పెద్దావిడ .
” ఈ మాత్రం తినకపోతే ఎలా ? పళ్ళు బాగా తినాలని డాక్టర్ చెప్పలేదూ ! ” అంటూ ప్రేమగా మందలిస్తూనే కాస్త పైకి పోయిన పెద్దామె చీరను కిందికి జరిపి కాళ్ళు కన్పించకుండా సవరించడం నా దృష్టిని దాటి పోలేదు .
” నీ ఆరాటం గానీ , పోయిన వయసూ , ఆరోగ్యం మళ్ళీ వస్తాయా ? సరే గానీ వారికి కాఫీ ఇవ్వు !” అంది అత్తగారు .
” అయ్యయ్యో ! ఇప్పుడేమీ వద్దండీ ! నేను మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళాలి ” అన్నాను .
ఆమె అప్పటికే కిచెన్ లోకి వెళ్లనే వెళ్ళింది .
” మీ ఆరోగ్యం బాగుందా ?” అన్నాను నేను ఏం మాట్లాడాలో తెలీక .
” నా కోడలుండగా నాకేం లోటమ్మా ! నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది . నా కన్న తల్లి కన్నా ఎక్కువ . నా కూతురు కూడా ఇంత బాగా చూసుకునేదో లేదో ! అయినా వయసై పోయాక ఏముందమ్మా , ఆ పై వాడి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్లిపోవడమే !” అంది .
” అదిగో ! హాస్యానికైనా ఆ మాట అనొద్దన్నానా !” ఎప్పుడు వచ్చిందో కోడలు .. కాఫీ తీసుకొచ్చింది .
” మీకు కాఫీ ఇవ్వనా ?” అత్తగారిని అడిగింది .
” ఇప్పుడొద్దు లేమ్మా , ఇందాకేగా తాగాను ” అంది పెద్దావిడ .
కాఫీ బాగుంది , మంచి రిలీఫ్ ఇచ్చింది . దానికన్నా ముందు ఆ అత్తా కోడళ్ల అనుబంధం నచ్చింది .
ఏ మాత్రం తెచ్చిపెట్టుకున్నట్టుగా లేకుండా , చాలా సహజంగా .. నటనేమీ లేకుండా , ప్రేమగా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడ ముచ్చటగా ఉంది .
నేను బయల్దేరి వస్తుంటే ఆమె మర్యాద కోసం బయటి దాకా వచ్చింది .
” నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తూంటే ! నిజంగా ఈ రోజుల్లో ఇంత అన్యోన్యంగా ఉండే అత్తా కోడళ్ళు అరుదు . ముఖ్యంగా ఆవిడ్ని కన్న తల్లిలా చూసుకుంటున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి ” అన్నాను మనస్ఫూర్తిగా .
” చూసుకోవాలి , తప్పదు .. అవసరం !” అందామె అదో రకంగా .
” అదేంటీ ?” అన్నాను నేను ఆశ్చర్యపోతూ .
” అదంతే ! మా మామగారు స్వాతంత్ర్య సమర యోధులు , ఆయన పెన్షన్ ముప్పై వేలు మా అత్తయ్యకు వస్తుంది .”
” అది సహజమే కదా !” అన్నాను అయోమయంగా .
” అదే మాకు ఇల్లు గడవడానికి ఆధారం . ఆ పెన్షన్ ఆవిడ ఉన్నన్నాళ్ళేగా వచ్చేది . అందుకని ఆమె ఆరోగ్యంగా , ఆనందంగా చాలా ఏళ్ల పాటు ఉండడం మాకు తప్పనిసరి .”
” అది సరే ! బెదిరించో , బ్లాక్ మెయిల్ చేసో పెద్దవాళ్ళ పెన్షన్ లాక్కునే వాళ్ళున్న రోజుల్లో మీరు చాలా ప్రేమగా చూసుకోవడం గొప్ప విషయమే కదా !”
” నాకు మొదట్నుంచీ ఆవిడంటే గౌరవమే , ఇష్టమే ! అత్తయ్య కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు . రానురానూ నాక్కూడా ఆమెను వదిలి ఎటూ వెళ్లాలనిపించదు . నా అమ్మ కన్నా ఆమెనే ఎక్కువ ఇష్టపడ్తాను . కాకపోతే హైదరాబాద్ లో ఉన్న మా ఆడపడుచు అడపా దడపా తీసుకెళ్లి రెండు మూడు నెలలు ఉంచుకుని పంపిస్తూండేది . తను కూడా మా అత్తయ్యను బాగా చూసుకుంటుంది ”
” మరి .. సమస్యేమిటి ?” నాకు అవసరమా కాదా అని ఆలోచించకుండా కుతూహలంతో అడిగాను , మనుషులు ఇంత ప్రేమల్తో ఉన్నా ఇబ్బందేమిటో అనుకుంటూ .
” మధ్య తరగతి మనుషుల సంగతి మీకు తెలియనిదేముంది ? మా అత్తయ్య అక్కడున్నన్నాళ్ళూ పెన్షన్ డ్రా చేయడానికి కుదరదు . మేము వెళ్లి అడగలేము .ఆ డబ్బు లేకపోతే ఇల్లు గడవదు . అందుకే తాను అక్కడికి వెళ్లకుండా ..ఎప్పుడైనా కూతురే వచ్చి నాల్రోజులు ఉండి వెళ్తే సరి .. అని మా అత్తయ్యకే అనిపించేలా చూసుకుంటాను ” శుష్క హాసం ఆమె పెదవులపై !
” మరి మీ వారు ?” ఏం చేస్తారు అని అడగలేక సగం లో వదిలేసాను .
” డిగ్రీ దాకా చదివారు . ఏ పనీ స్థిరంగా చేయరు . కుదురు ఉండదు , బద్ధకం ఎక్కువ . గొప్పలకు పోయి అప్పులు చేస్తారు . ప్రైవేట్ జాబ్స్ ఎన్నో చేసి మానేశారు . దేంట్లోనూ మూడ్నెల్లకు మించి పని చేయరు . అసలు ఎప్పుడు మానేసింది కూడా ఇంట్లో చెప్పరు . పూర్తిగా చెడ్డవాడని కాదు కానీ .. ఆ మనిషి మీద ఆధారపడి బతకలేం ”
“మా మామగారికి ఫ్రీడమ్ ఫైటర్ కోటా లో ఐదెకరాల భూమి ఇచ్చారు . సిటీ శివార్లలో ఉన్న ఆ భూమికి ఇప్పుడైతే మంచి రేటు వచ్చేది . కానీ ఎనిమిదేళ్ల క్రితమే ఆ భూమిని అమ్మి అడ్వాన్స్ తీసుకున్నారు మా ఆయన . ఇక కొడుక్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ దగ్గర పరువు పోతుందని మా అత్తయ్య సంతకం పెట్టారు . నేనూ ఆవిడా కల్సి మిగతా డబ్బులు మేమే తీసుకుని ఆవిడ పేరుతో ఈ ఇల్లు కొన్నాం . మాకు ఒక్కర్తే అమ్మాయి. మిగిలిన డబ్బుల్తో మా అమ్మాయి పెళ్లి చేసాం . ”
” మరి ..మీరు …ఏదైనా చేయొచ్చు కదా !”
ఆమె ఓ క్షణం ఆగింది . ” నేను ఎమ్మే బీ ఎడ్ చేసి జాబ్ వెతుక్కుంటుండగా పెళ్లి అయి ఇక్కడికి వచ్చాను . చాలా ఏళ్ళు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేసాను . మా అమ్మాయి పెళ్లి ముందు నాకు కాన్సర్ వచ్చింది .మాస్ట్రక్టమీ చేశారు . ఆ తరువాత మా అత్తయ్య , మా ఆయనా ..నన్ను జాబ్ చేయనివ్వట్లేదు .”
” మీరు ప్రతి సారీ బ్యాంక్ కి వచ్చే బదులు ఏటీఎం కార్డు తీసుకోవచ్చుగా !”
” అదీ అయింది . మా అత్తయ్య కొచ్చే ముప్పై వేల పెన్షన్ లో పదిహేను వేలతో ఇల్లు గడుపుతాను . ఏవన్నా పండుగలూ , పబ్బాలో , చుట్టాలు రావడమో జరిగితే మరో అయిదు వేలు .అంతే ! మిగతా డబ్బులు అలా ఖాతాలోనే ఉన్నాయనుకునే వాళ్ళం . ఈయన ఏటీఎం కార్డు తో ఎప్పటికప్పుడు మొత్తం డ్రా చేసాడని ఓ సారి లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకు కు వెళితే తెలిసింది .ఇక కార్డ్ సరండర్ చేసి మేమే వెళ్లి తెచ్చుకుంటున్నాం . మిగతా డబ్బులు మూడు , నాలుగు నెలలు కాగానే మా అత్తయ్య పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేస్తాం . నామినేషన్ నా పేరిటే ఉంటుంది . ఆవిడ తదనంతరం మాకు కావాలిగా !” గొంతు వణికినట్లనిపించింది .
లోపలికి చూసాను , పెద్దావిడ ఏదో చదువుకుంటోంది . ఆమె ముఖంలో నిశ్చిoత , సంతృప్తి !
” ఏదేమైనా … మీరు ఆవిడ్ని ఇంత అపురూపంగా చూసుకోవడం చాలా సంతోషం ! మిమ్మల్ని మెచ్చుకోవాలి ” మనస్ఫూర్తిగా అన్నాను .
” మీరలా అనకండి . నాకు చాలా గిల్టీగా ఉంటుంది . నేను చేసేది త్యాగమూ కాదు , చూపేది అనురాగమూ కాదు . కేవలం స్వార్థం , అవసరం అనాలి ! ఆవిడ లేని రోజున మేము వీధిలో పడతాం . నా మందులకు కూడా డబ్బులుండవు . ఆవిడ జీవితం చాలా ఏళ్ళు పొడిగించాలి , అందుకోసం ఆవిడ ఆరోగ్యంగా , ఆనందంగా ఉండాలి . మా అత్తయ్యని కాపాడుకోవడమే నా ఉద్యోగం అని అర్థం చేసుకున్నాను గనకే ఆవిడని బాగా చూసుకుంటున్నాను . ప్రేమ , గౌరవం లేవని కాదు . ఈ డబ్బులే లేకపోతే మాకు ఎంత ప్రేముంటే ఏముంది చెప్పండి ?” నీటితో నిండిన ఆమె కళ్ళు మరెన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాయి .
“మీ ఆరోగ్యం జాగ్రత్త ! మీ అవసరం ఆవిడకు చాలా ఉంది .” అని వచ్చేసాను .

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పద్యమాయె నీకు పసిడి అందె . .

by రాఘవాచార్య‌ December 31, 2021
written by రాఘవాచార్య‌

ఆ.వె : శ్రీ సరస్వతి ఇల సింగార రూపమ్ము
వాసర స్థలి నది వాసమాయె
వ్యాస మునులు నిలుప వాసికెక్కెనుగా
పద్యమాయె నీకు పసిడి అందె         1

పశువు వెంట వెళ్లు పసివాడి చూసిన
పలక లేదు బతుకు పలక పలిగె
బాలలకు చదువు బహు బంగారమాయెనా
పద్యమాయె నీకు పసిడి అందె          2

నన్నయ మరి  తిక్కన ఎర్రన పోతన
కవుల కలము వెలసి కరుణ గాంచి
నట్లు నను కరుణించు నవ్య రీతిగ కళలు పొంగ
పద్యమాయె నీకు పసిడి అందె            3

వేదవాణి వినగ వెలసె రాయి ఒకటి
వాసరందు చిత్ర వాద్యముగను
రాయి కూడ గట్టి రాగ విధము నేర్వ
పద్యమాయె నీకు పసిడి అందె                4

గంగ అన్ననేమి గోదావరి అన్న
నేమి విద్యరూప నదియె చూడ
ఊరు ఊరు చదువు ఊరునట్లు పద్యమాయె నీకు పసిడి అందె                5

— కందాళై రాఘవాచార్య
8790593638

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

స్నేహం

by డా|| మృదుల నందవరం December 31, 2021
written by డా|| మృదుల నందవరం

ఈ సంచికలో మంచివాళ్ళ మధ్య స్నేహం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు ‘స్నేహం’ ఎలా ఉండాలో భర్తృహరి చెబుతారు.

శ్లో||     క్షీరేణాత్మగతోదకాయ హి గుణాదత్తాః పురాతే౭ఖిలాః

క్షీరోత్తాపమేక్ష్య తేన పయసాస్వాత్మా కృశానౌ హుతః

గన్తుం పావక మున్మన స్తదభవద్దృష్ట్వాతు మిత్రాపదం

యుక్తం తేన జలేన శామ్యతి, సతాం మైత్త్రీ పునస్వ్తీదృశా

సజ్జన పద్ధతిలోని ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణకవిగారి అనువాదం పరిశీలిద్దాం.

చ.       క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్

క్షీరము దప్తమౌటగని చిచ్చుఱికిన్ వెతచే జలంబు దు

ర్వారసుహృద్విపత్తిగని వహ్న జారంజనె దుగ్ధ, మంతలో

నీరము గూడి శాంతమగు, నిల్చు మహాత్ముల మైత్రి యీ గతిన్

పాలు తనలో కలిసిన నీటికి తన గుణాలను ఇస్తుంది. తనకు సహాయం చేసిన పాలు కాగిపోతూ అగ్నిలో పడబోతుండగా దానికి నీరు చేరువ కాగా అది శాంతిస్తుంది. సజ్జనుల మధ్య మైత్రీ భావం ఇలానే ఉంటుంది.

మిత్రులైన సజ్జనులు వారిలో ఎవరికి ఆపద వచ్చినా పరస్పరం సహాయం చేసుకొని ఆ ఆపద నుండి బయటపడతారని కవి చెబుతూ పాలు – నీరు దృష్టాంతంతో వివరిస్తున్నారు.

మొదట మనం పాలలో నీటిని కలుపుతాం. అప్పుడు పాలకు నీటితో స్నేహం ఏర్పడుతుంది. అందువల్ల పాలు, స్నేహ ధర్మంతో నీటికి తన మాధుర్యాది గుణాలనన్నింటినీ ఇస్తుంది. ఆ తరువాత వాటిని అగ్నితో వేడి చేసినప్పుడు ఆ వేడికి పాలు బాగా కాగిపోతుంటాయి. తమకు ఆశ్రయమివ్వడమేగాక మాధుర్యాదిగుణాలను కూడా ఇచ్చిన పాలు కాగిపోవడం చూచి, నీరు మైత్రీభావంతో, పాలు ఇంకిపోకుండా తాము ఇగిరిపోతుంటాయి. నీరంతా ఇగిరిపోగానే, ఇఁతసేపు తమతో కలిసి ఉన్న నీరు లేదనే భావనతో పాలు పొంగి నిప్పులో పడబోతూ ఉంటే మళ్ళీ చేరిన నీరు ఆ పాలను పొంగకుండా చేస్తుంది. ఈ నీరక్షీర విధానం మనం రోజూ వంటింట్లో చూచేదే. ఈ రెండింటి స్వాభావికమైన తీరును కవి, మంచివారి స్నేహానికి ఆపాదించి చెబుతున్నారు. పాలు తమ మాధుర్యాది గుణాలను నీటికిచ్చినట్లుగా సంపద ఉన్న మిత్రుడు తన మిత్రునికి సంపదనిస్తాడు. సంపద ఇచ్చిన మిత్రుడు ఆపదలో ఉన్నప్పుడు, పూర్వం సంశయం పొందిన మిత్రుడు ఆ మిత్రునికి సహాయం అందిస్తాడు. మంచి మిత్రులు ఎప్పుడూ ఇలాగే పరస్పరం చేసుకుంటారు.

ఈ విషయాన్నే అబ్దుల్ కలామ్ గారు – ఒక మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానమంటారు. ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానమని చెబుతారు. అంటే స్నేహితుడు జీవిత మార్గదర్శిగా నిలుస్తాడని, నిలవాలని వారి అభిప్రాయం. వీరే మరొక సందర్భంలో మంచి స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని, ఆత్మీయ స్నేహితులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారని, నిజమైన స్నేహితులు ఎల్లవేళలా , ఎల్లలు దాటినా, ఎల్లప్పుడూ ఉంటారని చెబుతూ స్నేహధర్మాన్నీ, స్నేహ మాధుర్యాన్ని తెలియజేశారు.

మనిషి సంఘజీవి. ఒకరి సహాయం లేనిదే అతని జీవితం, జీవిక సాగదు. అది స్నేహస్పదమైతే మరింత మధురంగా ఉంటుంది. దానికై మనం మనుగడ సాగించాలి. దానితో జీవనం కొనసాగించాలి.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సంక్రాంతి ముగ్గులు పడుచుల ఓపికకు ప్రతీకలు ,సంస్కృతి

by రసస్రవంతి& కావ్యసుధ December 31, 2021
written by రసస్రవంతి& కావ్యసుధ

భారతీయ మహిళలు కళాపిపాసకులు ఏ పనినైనా అందంగా తీర్చిదిద్దడం వారికి అలవాటు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రకరకాల ముగ్గులు వాకిట్లో వేయడం తెలుగు ఆచారం. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వాకిలిని ఆవుపేడతో అలికి లేదా కళ్ళాపి చల్లి ముగ్గులు వేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ ముగ్గులు ఇంటికి అందం కంటికి అందం.
సంక్రాంతి పర్వదినాల్లో ఆవుపేడతో చల్లినా – లేదా అలికిన ఇంట్లోకి క్రిములు కీటకాలు, సూక్ష్మక్రిములు చేరవని పల్లెవాసుల ఒక విశ్వాసం,ఇది సహజం పూర్వ కాలంలో ఉండేది, అక్షరాల సత్యం. ఈ ఆధునిక కాలంలో కృత్రిమమైన ముగ్గులకు అలవాటు పడిపోతున్నారు మహిళా మణులు. ఆనాటి ఆహ్లాదకరమైన వాతావరణం నేడు కనిపించడం లేదు. సహజత్వానికి దూరంగా మసలుతూ ఉన్నారు.

ముగ్గులను రంగవల్లులు, రంగవల్లికలు అని అంటారు. రంగం… వేదిక. ప్రపంచం. ‘ వల్లిక ‘ అంటే అందమైన అల్లిక. ప్రపంచానికి సంబంధించినవే జ్ఞానాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది. కనుక దీన్ని రంగవల్లిక అన్నారు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగకి ఇతర పండుగలకు లేని
విశిష్టత వుంది . హిందువుల పండుగలలో కేవలం సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది. మిగతా పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి.

పండుగలు వ్యక్తిని లౌకిక జీవితాన్నుంచి , ఆధ్యాత్మిక చింతనకు మార్గనిర్దేశికతను సూచిస్తాయి. భగవధ్యానానికి దోహదపడతాయి.

సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి సంక్రమణం చెందే పవిత్రమైన రోజున “మకర సంక్రాంతి” గా ఆనందోత్సవాలతో జరుపుకోవటం అనాదిగా వస్తున్నది. భోగి, మకర సంక్రాంతి,కనుమ, ముక్కనుమ కూడా, ఇది పాడి పంటల పెద్ద పండుగగా కూడా పెద్దలు చెబుతారు. ఈ మూడు, నాల్గు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. పట్టణాలలో కంటే, పల్లెల్లో సంక్రాంతి హడావుడి హరిదాసుల సందడి, కోడిపందాలు, గాలిపటాలు పండుగ సంబరాన్ని ప్రతి ముంగిటి లోనూ కనిపించే గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు సంక్రాంతి ప్రత్యేకత ను మరింత ఆనందంగా ప్రదర్శిస్తాయి.

ఈ సంక్రాంతి సూర్యుని సంక్రమణానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశములో జరిగే, గ్రహగతులను నేల మీద ముగ్గుల రూపంలో గమనించే ఏర్పాటు చేశారు మన ప్రాచీనులు. తొమ్మిది చుక్కల ముగ్గు ఇది నవగ్రహాలకు సంకేతం. ఆవుపేడతో అలికిన నేల, ఆ పైన కనిపించే ఆకాశానికి సంకేతం. నేల మీద పెట్టబడిన చుక్కలు నక్షత్రానికి సంకేతం .ఆ చుక్కలను ఏ తీరుగా కలుపుతూ ప్రతి చుక్క కూడా ఓ గడిలో పదిలంగా కూర్చునేలా చేసి , దాన్ని “ముగ్గు” అనే పేరిట పలికేలా చేసిన ఈ విధానమంతా ఏ గ్రహం ఎలా ప్రయాణిస్తుందో, ఖగోళంలోని ఏ గ్రహగతి నక్షత్ర స్థితి ఎలా ఉందో తెలియజేసే సంకేతం.

గ్రహగతి రంగవల్లిక ద్వారా ఏ గ్రహం దేనితో మైత్రి ఉంటుందో, ఏ గ్రహం దేనికి శత్రువువో,ఏ గడి దేనికి అనుకూలమో అనే జ్యోతిష్య పరిజ్ఞానంతో ముగ్గులను తీర్చి దిద్దేవారు. ముగ్గులలో మధ్య గడిలో ఉండే సూర్య గ్రహానికి ఎరుపు రంగు కుంకుమతో, సూర్యునికి ముందుగా ఉండేది శనిగ్రహం ఆ గడికి నల్లని రంగుతో లేదా నీలి రంగుతో నింపేవారు. ఏ గడిలో ఏ రంగు నింపాలో అదేవిధంగా ప్రతి ముగ్గు లోనూ అలంకరిస్తూ ఉండేవారు ప్రాచీనులు.

“దేవుడి ముగ్గు” ఇది కుండలినీ శక్తికి సంకేతం. రెండు త్రికోణాలు ఇందులో ఉంటాయి. మధ్యలో ఒక చుక్క ఉంటుంది దేవుడి గది ముందు వేస్తారు. మరోరకం ఆరు చుక్కల ముగ్గు.త్రికోణాలు ఇందులో ముగ్గు అని కూడా అంటారు.వేడుకగా దేవుని ముందు వేసేది అష్ట ఇందులో కోణాలని మలుపుల తీరుగా ఉంటాయి. దైవ మందిరం ముందు వేసే మరో ముగ్గు పద్మపు ముగ్గు. ఇది ఎనిమిది కోణాల ముగ్గు తూర్పు వైపున ఇంద్రుడు, తూర్పు దక్షిణానికి మధ్యన అగ్ని, దక్షిణ వైపు యముడు, దక్షిణ పశ్చిమానికి నడుమ నైరుతి, పశ్చిమానికి వరుణుడు పశ్చిమోత్తర వాయువు, ఉత్తరము కుబేరుడు, ఉత్తరానికి తూర్పు కు నడుమ ఈశానుడు ఉంటారు. ఇవన్నీ గ్రహ ఉపగ్రహ విధానానికి ప్రతీకలు.

సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా వేసేది స్వర్గద్వారం ముగ్గు. వైకుంఠ ఏకాదశి ముందు రోజు స్వర్గ ద్వారాలు మూసి ఉన్నట్టుగానే ముక్కోటినాడు తలుపులు తెరిచి ఉన్నట్టుగా ఈ ముగ్గులు వేస్తారు. అట్లాగే భోగినాడు స్వర్గ ద్వారాలు మూసి ఉన్నట్టుగా సంక్రాంతినాడు వైకుంఠ వాకిలి తెరిచి ఉన్నట్టుగా ముగ్గులు వేస్తారు. భోగినాడు వాకిలి బయట రథం ముగ్గు వేస్తారు.u సంక్రాంతి రోజు ఇంటి ముందుకు రథం వచ్చినట్లుగా వేసి రథాన్ని లాగే తాడు ఇంట్లోకి వచ్చే ఎలా వేస్తారు. కనుమనాడు ప్రధాని బయటికి వేస్తారు. ముక్కనుమ నాడు మన రథాన్ని పక్కింటి రథానికి తగిలేట్టుగా వేస్తారు. ఇలా ప్రతి ఇంటి ముందు నుంచి కదిలే రథం ఊరి చివరి దాకా సాగుతుంది. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు మా ఇంటికి వచ్చాడు ఆయనకు పూజ చేసి పరమాన్నం పెట్టి పంపించండి అన్నా మార్మిక సందేశాన్ని ముగ్గులు సంకేతంగా చెబుతాయి.
ఆనాటి సాంప్రదాయాన్ని అనుసరించి సంక్రాంతి పండుగ ముంగిట్లో ముగ్గులు ఇంటికి శోభని వ్వడమే కాదు లక్ష్మీప్రదం కూడా. ఎవరి ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు అలంకరించబడి ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుందనే విశ్వాసం . మనం రోజు తినే ఆహారం భూదేవి మనకు ఇచ్చిన వరం, అటువంటి భూమాతను అలంకరించడంమే ముగ్గులు వేయడంలోని ఆంతర్యం. మారేడు దళం ముగ్గు, తులసి కోట ముగ్గు. పద్మ బంధం నాగబంధం, గుమ్మడి పండు ముగ్గు ఇలా రకరకాల ముగ్గులు ఇంటి ముందు తీర్చిదిద్దడం ముగ్గు వ్యక్తి మనస్తత్వం చెబుతుంది. ముగ్గులు వేయడానికి ఓపిక కావాలి అభిరుచి ఏకాగ్రత ఎంతో అవసరం. తెల్లవారుజామున ముగ్గులు వేయడం స్త్రీ మూర్తుల శరీరాలకు వ్యాయామం లాంటిది. ముగ్గులు పెట్టడం మన భారతీయ సంప్రదాయం.

⚜️ ⚜️ ⚜️ ⚜️
⚜️⚜️
⚜️

* వరి పిండితో వేసిన ముగ్గులు చిన్న చిన్న కీటకాలకూ, పక్షులకూ ఆహారం అవుతాయి.
* భూత దయకు ఆలవాలంగా నిలుస్తాయి .
* ముగ్గులోని కాల్షియం క్రిమి కీటక సంహారానికి తోడ్పడుతుంది.
* వనితలు నడుము వంచి ముగ్గులు వేయడం మూలంగా కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు రాకుండా నిరోధిస్తాయి.
* ముగ్గులు వేసేటప్పుడు నడుము వంచి వేయటం వల్ల ఉదర కండరాలకి కలిగే ఒత్తిడి మసాజ్ లా పనిచేస్తుంది.
* నేటి ఆధునిక యుగంలో మహిళా మణులు రకరకాల రంగులతో వేయడం, స్త్రీలలోని సృజనాత్మకతకు అద్దం పడతాయి.
* ముగ్గులు దేవత ఆరాధనగా చెప్పవచ్చు.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జొన్న చేను ముందు నిలబడి

by Dharba Shyayanam Srinivasacharyulu December 31, 2021
written by Dharba Shyayanam Srinivasacharyulu

మరీ దూరం కాని దగ్గరలో పరుచుకున్న

ఆకుపచ్చ పుప్పొడి దాకా వెళ్ళాను
తీరా చూస్తే అది జొన్న చేను, మొన్న మొన్న మొలకెత్తింది

పసిపిల్లల్లాంటి మొక్కలు, ఒంటి నిండా మెత్తని చూపులు
చిట్టి ఆకులు నాజూకైన చేతులు, ఉత్సాహపు వుయ్యాలలు

ఆ పక్క నిల్చున్న పెద్ద చెట్టూ, ఇటు నేనూ
చేనునే చూస్తున్నాం  కానీ
నా కన్న చెట్టే చేనుకు చేరువ అనుకుంటా-

చేనునానుకున్న రహదారిమీద
వడివడిగా వాహనాల్లో  వెళ్తున్న కళ్ళలోకి
ఈ చేను మొత్తంగా ఎట్లా చేరుతుంది
కనుక వాళ్ళ ఇళ్లకు దీని సోయగం చేరదు

తానే  ఈ చేనుకు చోటిచ్చానని
నేల ఇక్కడ  ఏ హోర్డింగూ పెట్టుకోలేదు
తానే దున్ని విత్తానని చెప్పడానికి
రైతు ఇక్కడ ఏ ఫలకాన్నీ పెట్టి పోలేదు

తొలిసారి కాదేమో నేను ఈ చేనును దర్శించడం!
ఏ పూర్వ జన్మలోనో  నేనేమో చేను, ఇది మనిషి కాబోలు
మా ఇరువురి సంభాషణ అప్పుడు మొదలై
ఇప్పటికీ  కొనసాగుతున్నట్లున్నది

రైతు పాదముద్రలతో చేను పావనమైంది
అతని రోజూ తన నీడను ఇక్కడ వదిలి వెళ్తాడనుకుంటాను
దానితో మిళితమై ఈ మొక్కల నీడలు చిక్కబడ్డాయి

ఆ  సంగమ ఛాయల్తో  నా నీడ కలిసిపోయిన ఈ క్షణాలు
నా దేహమ్మీద కురుస్తున్న దయాపూరిత దీవెనలు!

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

యోగ ప్ర్రకియలు

by Bandi Usha December 31, 2021
written by Bandi Usha

అలసిన మనసుకు, బద్ధకించిన శరీరానికి ఔషథం యోగా. ఇది అందరూ అభ్యసించవలసిన ప్ర్రకియ.

శరరాన్ని, మనసును ఏకంచేసి అనేక రకాల శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారం చూపే యోగా “ఇహం నుండి పరం”కు తీసుకెళ్తుంది.

యోగా అంటే జ్ఞానం, మార్గం, చైతన్యం, గమ్యం. శాస్త్రబద్ధమైన జీవన విధానం. స్వీయ జ్ఞాన సాధన. సృష్టి రహస్యాలను ఛేదించే పరిణామంలో పొందిన ఆత్మజ్ఞానమే యోగా.

దుఃఖాన్ని అధిగమించి సత్యమైన జ్ఞానంతో పరమానందం పొందటమే మానవ జీవిత లక్ష్యం. వత్తిడి నుండి విముక్తి, శారీరక దృఢత్వమే కాకుండా “ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి”కి తీసుకెళ్ళే బంగారు బాట యోగా.

ఆలోచనలను, జీవనశైలిని ప్రభావితం చేయటానికి యోగాలో అనేక రకాల ప్ర్రకియలు కలవు. అందులో కొన్ని

  1. రాజయోగము, 2. హఠయోగము, 3. జ్ఞానయోగము, 4. కర్మయోగము, 5. భక్తియోగము, 6. మంత్రయోగము, 7. కుండలినీ యోగము, 8. లయయోగము.
  2. రాజయోగము : యోగములన్నిటిలో ఉత్తమమైనది ఏదంటే ఖచ్చితంగా రాజయోగమనే చెప్పవచ్చు. బుద్ధిని సంస్కరించుట, మానసిక సంస్కరణ, ఉన్నత జ్ఞానం అనుభవపూర్వంకంగా తెలియచేసేది రాజయోగము. ఇది పతంజలి యోగ సూత్రములపై ఆధారపడి ఉన్నది.
  3. హఠయోగము : ప్రస్థుత యోగా ప్ర్రకియలకు ఆధారము హఠయోగము. ఇందులో ఆసనాలు, ప్రాణాయామాలు ఉంటాయి. ఇది శ్రమతో కూడుకున్నది. దీని ద్వారా బుద్ధిని బాహ్య విషయాల నుంచి దూరంగా ఉంచవచ్చు. ‘హ’ సూర్యుడు, ‘ఠ’ అంటే చంద్రుడు. అనగా సూర్యచంద్రుల సాంగత్యాన్ని తెలుపుతుంది. హఠయోగంలో అష్టాంగ యోగం మరియు యోగ ముద్రలు అనుసరిస్తారు. దీనినే ప్రస్థుతం విస్తృతమైన అర్థంతో యోగా అని పిలువబడుతుంది. ఆలోచనలలో స్పష్టత, చక్కటి శరీర ఆకృతి. దీని ద్వారా సాధించవచ్చు.
  4. జ్ఞానయోగము: మనిషి వివేకవంతుడు కావాలంటే తత్వము తెలుసుకోవాలి. అప్పుడే ఏది సత్యము, ఏది అసత్యము సూక్ష్మబుద్ధితో తెలుసుకోగలుగుతారు. గత జన్మల ద్వారా, శ్రవణం, పఠనం మరియు సద్గురువుల ద్వారానే కాకుండా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఉత్తమ జ్ఞాని మాత్రమే ఆనందాన్ని పొందగలుగుతాడు.
  5. కర్మయోగము : కర్మ అనగా పని. కర్మ చేయకుండా ఏ జీవికి మనుగడలేదు. ఎవరి ధర్మము ననుసరించి వారు కర్మలనాచరించాలి. కర్మ చేయటమే మన కర్తవ్యము. కర్మ ఫలాన్ని ఆశించే అధికారం ఎవరికీ లేదు. ఇంద్రియ నిగ్రహంతో ప్రతిఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాలను నిర్వర్తించేవారే యోగి. జ్ఞానులు లోకకల్యాణం కోసం నిష్కామ కర్మలు ఆచరిస్తారు.

ఇంద్రియాల కన్నా మనసు, మనసుకన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ ఉన్నత స్థితిలో ఉంటుంది. కర్మలు చేయకుండా ఏ వ్యక్తి ముక్తి పొందలేడు. చర్యకు ప్రతి చర్యా ఉన్నట్టే కర్మలనుబట్టి ప్రతిఫలం ఉంది. జన్మరాహిత్యము కొరకు కర్మను నేర్పుతో చేస్తూ ముక్తి పొందటమే జీవన పరమార్థం.

  1. భక్తియోగము : ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానించుచూ ఉద్వేగాలను నియంత్రించుకోగలగటమే భక్తి యోగము. ఉద్వేగాల వలన కలిగే రుగ్మత తొలగించుకోవటానికి భక్తి యోగము ఒక వరము.
  2. మంత్రయోగము: మానవుడిని రక్షించేది మంత్రమని ఉపనిషత్తులు తెలియచేయుచున్నవి.

అష్టాక్షణ మంత్రము : “ఓం నమో నారాయణాయ”

పంచాక్షరీ మంత్రము : “ఓం నమశ్శివాయ”

గాయత్రీ మంత్రము – ఓఁ భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోయదయాత్

మృత్యుంజయ మంత్రము :         ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

మంత్రాలను జపించటం ద్వారా శరీర శుద్ధి అనగా నాడీ వ్యవస్థ పని తీరు సక్రమంగా పనిచేస్తుంది. ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి.

  1. కుండలినీ యోగము : మన వెన్నెముకలో అనిర్వచనీయమైన శక్తి ఉంటుంది. సుషుమ్మ నాడి నుండి సహస్రారం వరకు తీసుకెళ్ళే పద్ధతిని వివరించేది కుండలినీ యోగం. మనలో కుండలినిని జాగృతం చేయటానికి ముఖ్య మార్గము ప్రాణాయామ అపారమైన శక్తిని జాగృతం చేయటమే కుండలినీ యోగము. ముఖ్యంగా షట్చక్రాలలోని ఒక్కో చక్రాన్ని యోగక్రియల ద్వారా ఊర్థ్వముఖంగా దాటుతూ తలపై భాగంలో ఉన్న సహస్రార చక్రాన్ని చేరుతుంది. దీనినే సమాధి స్థితి అంటారు.
  2. లయ యోగము: లయము అంటే కలయిక. అందుకు నాదానుసంధానము జరగాలి. నాడీ శుద్ధి జరిగినప్పుడు ఇది సాధ్యం. ఇందుకు నిరంతరం ప్రాణాయామం చేయాలి. ఓంకారాన్ని శ్రద్ధతో జపించాలి. ఇలా నాదముపై మనసును లయం చేయటాన్ని నాదానుసంధానము అంటారు. అప్పుడే సమాధి స్థితిని పొందగలుగుతారు. అనిర్వచనీయమైన, అలౌకికమైన అనుభూతిని పొందటమే సమాధి స్థితి.

జీవన విధానంలో గొప్ప మార్పులు తెచ్చే యోగ ప్ర్రకియలు ఎన్ని రకాలయినా అవి అన్నీ పతంజలి క్రమపద్ధతిలో సూత్రబద్ధం చేసినే. తను రచించిన యోగదర్శనము నాలుగు పాదాలుగా విభజించి అన్ని సూత్రాలను వివరించం జరిగింది.

మానవుడిని అజ్ఞానం నుండి అనంతమైన జ్ఞానమార్గంకు నడిపించే పతంజలి అష్టాంగ యోగం గురించి మనమందరమూ తెలుసుకొని ఆచరిస్తేనే కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us