మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

 ధర్మ సందేహం

by తడక మళ్ళ మురళీధర్ February 28, 2022
written by తడక మళ్ళ మురళీధర్

రేఖ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో పేరున్న కార్పొరేట్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా బాగానే  సంపాదిస్తుంది.  రేఖ తండ్రి సూర్య ప్రకాశ్ సిండికేట్ బ్యాంకు చీఫ్ మేనేజర్ కాగా తల్లి సరిత గృహిణి.  రేఖ ఇద్దరు తమ్ములు కాలేజి చదువు కొనసాగిస్తున్నారు. సూర్య ప్రకాశ్, సరితలు ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిర నివాసం.  ముగ్గురు పిల్లల చదువు  హైదరాబాదులోనే జరిగింది.  గత రెండు సంవత్సరాలుగా సూర్య ప్రకాశ్, సరితలు రేఖ వివాహ విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు మాట్రిమొనీలో కూడా రేఖ వివరాలు పొందు పరిచారు.  కాకపోతే రెండు నెలలుగా సూర్య ప్రకాశ్ తల్లి ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల ప్రయత్నాలకు  కొంత విరామం ఏర్పడింది.  వృద్ధాప్యరీత్యా వచ్చిన జబ్బుల మూలంగా సూర్య ప్రకాశ్ తల్లిని ఆసుపత్రిలో చేర్పించ వలసి వచ్చింది.  ఆవిడ వయస్సు తొంభై కి దగ్గరగా ఉంది.  పదిహేను రోజుల పాటు వైద్యం చేసి,  దాదాపు రెండు లక్షల రూపాయలు పిండుకొని తమతో కాదని ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కార్పొరేటు ఆసుపత్రి వారు సలహా ఇచ్చారు. ఒకటి రెండు రోజులు మించి బ్రతకడం కష్టమేనంటూ డాక్టర్లు వెల్లడించి ఇప్పటికీ నెల పదిహేను రోజులైంది.  ఆవిడ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. కోమా నుండి తేరుకోలేదు. తల్లి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి సూర్యప్రకాశ్ బాగా కుంగిపోయాడు.  తండ్రి చిన్నప్పుడే  చని పోవటంతో అన్నీ తానై సూర్య ప్రకాశ్ ను తల్లి బాగా చదివించింది.
********

       భరణి నాలుగేళ్లుగా కాలిఫోర్నియాలో సాఫ్టువేర్ ఉద్యోగిగా ఐదంకెల  జీతం సంపాదిస్తున్నాడు. హెచ్ వన్ బి వీసా ఉంది.  అతడి  చెల్లెలు స్మిత  పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని ఇంగ్లాండులో స్థిర పడింది.  తండ్రి కృపాకర్  పోలీసు శాఖలో గెజిటెడ్ హోదా ఉద్యోగం, తల్లి రవళి హైదరాబాదు రేడియో కేంద్రంలో మంచి పదవిలో ఉంది. తల్లిదండ్రుల పోరు భరించలేక   పెళ్ళి చేసుకోవడానికి అమెరికా నుండి  వారం రోజుల క్రితం హైదరాబాదు వచ్చాడు భరణి.
*******

        మాట్రిమొనీలో  రేఖ వివరాలు తెలుసుకొని సూర్యప్రకాశ్ కు  ఫోను చేశాడు కృపాకర్.  తనను తాను పరిచయం చేసుకొని భరణి వివరాలు,  తమ కుటుంబ నేపథ్యం వివరించి, “అమ్మాయికి, అబ్బాయికి జాతక రీత్యా   తగినన్ని పాయింట్లు కలిశాయని సిద్ధాంతి గారు చెప్పారు ,  అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపుల కార్యక్రమం  ఏర్పాటు చేయగలరా” అంటూ కృపాకర్   అడిగాడు.  సూర్య ప్రకాశ్ కి ఏమి చెప్పాలో తోచక కాసేపు సందిగ్ధంలో పడ్డాడు.  తన తల్లి  కోమాలో ఉండి కొన ఊపిరితో ఉందనే విషయం, తాము కొంత కాలం పాటు అమ్మాయి వివాహం వాయిదా వేసుకున్నట్టు చెప్పకుండా  “ప్రస్తుతానికి మేము  ఊళ్ళో లేమండి, రావటానికి వారం రోజులు పడుతుంది” అని దాట వేశాడు.

“వారం రోజుల తర్వాత మళ్లీ  కాల్ చేస్తానండి” అంటూ ఫోను కట్ చేశాడు కృపాకర్. ఇదే విషయం కృపాకర్ తన భార్య రవళికి చెప్పాడు.
“నెల రోజుల్లో పెళ్లి చేసుకొని భరణి అమెరికాకు వెళ్లాలి కాబట్టి మనకు ఉండే తొందర వారికెందుకు ఉంటుంది” అంటూ నిట్టూర్చింది రవళి.
******

     వారం రోజుల  పిదప కృపాకర్  సూర్య ప్రకాశ్ కి ఫోను చేశాడు. “నేను కృపాకర్ ను మాట్లాడు తున్నాను.  పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేయగలరా” అని అడిగాడు. మరో సారి అబద్దం చెప్పలేక ఏమైతే అయిందిలే అనే ధీమాతో “మంచిరోజు చూసి పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేస్తాను” అంటూ అయిష్టంగానే సంసిద్ధత తెలిపాడు  సూర్య ప్రకాశ్.

        “ఆ విషయంలో మీకు శ్రమ అక్కర్లేదు. నేను సిద్ధాంతి గారిని విచారించాను.  ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది, వర్జ్యం కూడా లేదు .  అదే రోజు ఖాయం చేయండి.  ఎందుకంటే మా వాడికి ఎక్కువ సమయం కూడా లేదండి” బ్రతిమిలాడే ధోరణి లో అంటూ సూర్య ప్రకాశ్ కి   మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా  పెళ్లి చూపుల తేదీ నిర్ణయం చేశాడు కృపాకర్.   పెళ్ళి చూపుల కార్య క్రమం యదావిధిగా అనుకున్న సమయానికి సూర్య ప్రకాశ్ ఇంట్లో జరిగింది.  రెండో రోజు కల్లా  అమ్మాయి, అబ్బాయి తమ అంగీకారం పెద్దలకు తెలియ జేశారు.   ఇక మిగిలింది పెళ్ళి ముహూర్తం నిర్ణయించటమే.  ఓ ప్రక్క సూర్య ప్రకాశ్ తల్లి చావు బతుకుల్లో ఉంది. మరో వైపు భరణి పెళ్లి చేసుకొని  కొద్ది రోజుల్లో  కాలిఫోర్నియా వెళ్లాల్సి ఉంది.  కృపాకర్ సిద్ధాంతి గారిని సంప్రదించి వివాహ ముహూర్తం తేదీ  నిర్ణయించి సూర్య ప్రకాశ్ కు ఫోను చేశాడు.  ” సూర్య ప్రకాశ్ గారూ, అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్ట పడ్డారు. వచ్చే ఆదివారం ఉదయం 10.32 నిమిషాలకు మంచి ముహూర్తం ఉన్నట్టు సిద్ధాంతి గారు చెప్పారు.  ఆ ముహూర్తానికి పెళ్లి కానిద్దామా” ప్రశ్నించాడు కృపాకర్.

       “సుముహూర్తానికి  కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో ఈ మహా నగరంలో కన్వెన్షన్ హాలు, ఇతర పెళ్లి ఏర్పాట్లు అసాధ్యమేమో” సందేహం వెలిబుచ్చాడు సూర్య ప్రకాశ్.

      “మీకు నచ్చిన కన్వెన్షన్ హాలు  చూడండి. నేనున్నాను కదా బావ గారూ.   అవసరమనిపిస్తే నిర్మొహమాటంగా నా సహాయం తీసుకోండి” ధైర్యం చెప్తున్నట్లుగా సమాధాన మిచ్చాడు కృపాకర్.

వీటన్నిటి కంటే ముఖ్యంగా తన తల్లి ఆరోగ్యం విషమించి మరణిస్తే పెళ్లి ఆగి పోతుందేమో అనే శంక సూర్య ప్రకాశ్ కి  ఎక్కువగా ఉంది.   భార్య సరిత, కూతురు రేఖను సంప్రదించి పెళ్లి సింహాచల క్షేత్రంలో జరపాలని నిర్ణయించుకున్నాడు.  మంచానికే పరిమితమైన తల్లిని హైదరాబాదులోనే పని మనుషుల సంరక్షణలో ఉంచి మిగతా బంధువులతో సింహాచలం వెళ్తే ఎటువంటి టెన్షన్ ఉండదని తన ఆలోచన. అనుకున్నదే తడవుగా ఆలోచన అమలు పెట్టాలను కున్నాడు.    కృపాకర్ కు ఫోను కలిపాడు .

“బావ గారూ, మీకో విషయం చెప్పడం మరిచాను. మా ఆవిడ గుర్తు చేసేంత దాకా నాకు ఆలోచన రాలేదు.  మా  అమ్మాయి సంబంధం నిశ్చయమైతే  వివాహం  సింహాచల క్షేత్రంలో చేయాలని ఎప్పుడో   మొక్కు కున్నాం. మరి ఈ ప్రతిపాదన మీకు సమ్మతమేనా నిదానంగా ఆలోచించి తెలపండి”  అంటూ ఫోను పెట్టేశాడు  సూర్య ప్రకాశ్.

భరణికి ఈ ప్రతిపాదన  నచ్చలేదు.   కృపాకర్, రవళి కూడ ఈ విషయంలో ఆసక్తి కనపరచలేదు. అయినా సరే దేవుడి సన్నిధిలో లగ్నం అనేటప్పటికి  వ్యతిరేకించ లేని పరిస్థితి  వారిది.   కేవలం దేవుడి సన్నిధిలో పెళ్లి చేస్తారనే నెపం చేత ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవడం సుతరామూ వారికి ఇష్టం లేదు. పైగా భరణి మరో పదిహేను రోజుల పాటు మాత్రమే ఇండియాలో ఉండేది, ఇప్పుడు కాలిఫోర్నియా వెళ్తే మరో రెండేళ్ల దాకా తను ఇండియా వచ్చే అవకాశం  లేదు.  పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా వేసే ప్రసక్తి లేదు. సూర్య ప్రకాశ్ ప్రతిపాదనకు కృపాకర్ కుటుంబ సభ్యులు కాదనలేక పోయారు. “బావ గారూ మీరు దేవుడి సన్నిధిలో పెళ్లి చేయాలని తీసుకున్న నిర్ణయం మాకు సమ్మతమే.  త్వరగా ఏర్పాట్లు చేయండి”  చెప్పాడు కృపాకర్.
*****
సింహాచలం లోని తన బంధువుకు ముహూర్తం తేదీ తెలియజేసి కావలసిన ఏర్పాట్లు చేయించుకున్నాడు సూర్య ప్రకాశ్. ముహూర్తం తేదీకి మూడు రోజులు ముందుగానే  బంధు మిత్ర బృందంతో బయలు దేరడానికి  ప్రైవేటు టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడుకున్నాడు.  ముహూర్తం సమయానికి చేరుకునే విధంగా పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు మరో టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడి ఆ వివరాలు కృపాకర్ కు   అంద జేశాడు. రెండు కుటుంబాల వారు వాయువేగంతో అన్ని పనులు పూర్తి చేసుకున్నారు.  సూర్య ప్రకాశ్ తల్లిని తన ఇంట్లో   కొన్నేళ్ల నుండి నమ్మకంగా పని చేస్తున్న శాంతమ్మ, ఆమె భర్త రాగయ్య సంరక్షణలో ఉండే విధంగా శాంతమ్మకు అన్ని జాగ్రత్తలు తెలిపారు.  తల్లి ఆరోగ్యం విషమించి కన్ను మూస్తే ఆ విషయం తొందరపడి ఎవరికీ తెలియజేయ వద్దని, కేవలం సూర్య ప్రకాశ్ కు మాత్రమే ఫోను ద్వారా చెప్పాలని శాంతమ్మకు  హితవు పలికారు.  తమ ఫ్యామిలీ డాక్టరుకు కూడా ముందు జాగ్రత్త గా తల్లిని తన ఇంట్లోనే ఉంచి తాము సింహాచలం వెళ్తున్నట్లు తెలిపాడు.  “ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకో సారి ఆవిడ ఆరోగ్యం చూసుకుంటాను. మీరు అధైర్య పడవద్దు.  నిశ్చింతగా మీ పనులు పూర్తి చేసుకోండి” అంటూ  హామీ ఇచ్చాడు డాక్టరు.

తల్లికి చెప్పకుండా  ఎన్నడూ  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదు సూర్య ప్రకాశ్.  ఇప్పుడు తల్లి కోమాలో ఉంది.  అనుకోని  పరిస్థితుల్లో తల్లికి తెలియకుండానే రేఖ వివాహ ముహూర్తం  నిర్ణయమైంది. బయలుదేరే ముందు బరువెక్కిన గుండెతో తల్లి కాళ్ళకు మొక్కిన సూర్య ప్రకాశ్ కుటుంబ సభ్యులను, బంధువులను హడావిడి చేసి ముహూర్తానికి మూడు రోజుల ముందుగానే సాయంత్రం నాలుగు గంటలకు సింహాచల క్షేత్రానికి టూరిస్ట్ బస్సులో బయలుదేర దీశాడు.

                 *****
సూర్య ప్రకాశ్ తల్లిని తన పర్యవేక్షణలో ఉంచడంతో శాంతమ్మది ఎటూ కదలలేని పరిస్థితి.  శాంతమ్మ, రాగయ్యలు మొదటి నుండి సూర్య ప్రకాశ్ కుటుంబానికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్నారు.
“మేము  తిరిగి వచ్చే దాకా ఇక్కడే ఉండి వంట చేసుకొని తినండి ” వెళ్ళే ముందు  సరిత తన ఇంటిని శాంతమ్మకు  అప్పజెప్తూ సలహా ఇచ్చింది.

          అదేమిటో గాని  గత రెండు నెలలుగా  నోటి మాట లేని సూర్య ప్రకాశ్ తల్లిలో పెళ్లివారి బృందం బయలు దేరిన మరుసటి రోజే కదలిక వచ్చింది. “ఒసేయ్ శాంతా ” అంటూ  పిలిచింది. అదే గదిలో అమర్చిన టీవీ చూస్తున్న శాంతమ్మ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. “ఎవరబ్బా నన్ను పిలిచింది” అని స్వగతం లోనే అనుకుంటూ  కూర్చున్నదల్లా లేచి బయటికొచ్చి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని గదిలోకి తిరిగి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంది.

     “ఏమే శాంతా, నేనేనే  నిన్ను పిలిచింది” అంది మరోసారి సూర్య ప్రకాశ్ తల్లి. టీవీ లోకం నుండి బయట పడిన శాంతమ్మ మంచం దగ్గరికి వెళ్ళి సూర్య ప్రకాశ్ తల్లిని నివ్వెరపోయి చూస్తూ నిలుచుంది.
“అమ్మా ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు మాట్లాడే శక్తి వచ్చిందమ్మా మీకు” అంది శాంతమ్మ.
“అబ్బాయి ప్రకాశాన్ని పిలువు” అంటూ హుకుం జారీ చేసింది సూర్య ప్రకాశ్ తల్లి.
“అయ్యగారు వాళ్లు సింహాచలం ఎళ్లారమ్మా, మన రేఖమ్మది  లగ్నం ఆడే చేస్తున్నారు, ఇంకో మూడు దినాలే ఉందమ్మా” జవాబిచ్చింది శాంతమ్మ.

“అదేమిటి ప్రకాశం నాకు ఈ విషయం చెప్పలేదే.  ఒక సారి ప్రకాశానికి ఫోను కలుపు నేను మాట్లాడతా” అంటూ మంచం మీద నుండి లేవటానికి ప్రయత్నం చేసింది.  సూర్య ప్రకాశ్ తల్లి  శాంతమ్మ సహాయంతో లేచి కూర్చుంది.  శాంతమ్మ సూర్య ప్రకాశ్ కి ఫోను కలిపింది.
“అయ్యా, పెద్దమ్మ మాట్లాడుతున్నారు, లేచి కూర్సున్నారు. మీతో మాట్లాడుతరంట” అంటూ ఫోను సూర్య ప్రకాశ్ తల్లికి ఇచ్చింది.
సూర్య ప్రకాశ్ తన తల్లి మాట్లాడు తుందన్న విషయం తెలియగానే కొద్ది క్షణాలు నివ్వెర పోయి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. “హలో” అన్నాడు.
“అరేయ్ ప్రకాశం, నాకు చెప్పకుండానే మనవరాలి కళ్యాణం చేస్తున్నావా, నాకు దాని కళ్యాణం చూసే యోగం లేదా” అంటూ ప్రశ్నించింది.
“అమ్మా, సింహాద్రి అప్పన్న చలవ వల్ల  కోలుకున్నావు.  చాలా సంతోషం. ఇన్నాళ్లు నీవు కోమాలో ఉండటం మూలాన రేఖ పెళ్లి విషయం నీకు చెప్పలేక పోయాను. అంతా అనుకోని పరిస్థితుల్లో జరిగింది.  ఎక్కువగా మాట్లాడకు నీరసించి పోతావు,  అన్ని విషయాలు మేము తిరిగి వచ్చినాక  మాట్లాడుకుందాం. నీ ఆరోగ్యం జాగ్రత్త” అంటూ ఫోను కట్ చేశాడు.  అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఆయనే కరుణించి చావుకు దగ్గరగా వెళ్లిన తల్లికి ఎవరూ ఊహించని విధంగా మాట్లాడే శక్తి నిచ్చాడని సూర్య ప్రకాశ్, సరితలు తమ సంతోషాన్ని తమతో పాటు ఉన్న బంధువర్గంతో  పంచుకున్నారు.
*****
కృపాకర్ దంపతులు కుటుంబ సభ్యుల సహితంగా ముహూర్తం  రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా చేరుకునే విధంగా  హైదరాబాదు నుండి సూర్య ప్రకాశ్ నియమించిన టూరిస్ట్ బస్సులో బయలు దేరారు.  పెళ్లికొడుకు తరపు వారికి బస్సు సరిపోనందున అప్పటి కప్పుడు ఒక కారు ఎంగేజ్ చేసుకున్నారు. కారులో కృపాకర్ ఇద్దరు బాబాయిలు, మేనమామ టూరిస్ట్ బస్సు వెనకాలే  బయలుదేరారు. కృపాకర్ తల్లిదండ్రులు పది సంవత్సరాల క్రితమే కాలం చేశారు.

      “బావ గారూ, ఇక్కడ అన్ని పనులు పూర్తయినాయి.  ముహూర్తానికి అన్ని సిద్ధం చేశాము” అంటూ  సింహాచలం నుండి సూర్యప్రకాశ్ కృపాకర్ కు ఫోను ద్వారా తెలియ జేశాడు. “థాంక్యూ బావ గారూ, ముహూర్త సమయానికి రెండు మూడు  గంటలు ముందుగానే మేము అక్కడికి చేరుకుంటాము” అంటూ కృపాకర్ బదులిచ్చాడు.

          పెళ్లికొడుకు బృందం బస్సు  కేరింతలతో, అంత్యాక్షరి ఆటలతో సాగుతుంది.  టూరిస్ట్ వెనకాల కారు భారంగా వెళ్తుంది. విజయవాడ కు పదిహేను కిలో మీటర్ల దూరంలో ఉండగా  బహుశా నిద్ర లేనందువల్ల నేమో అలసిపోయిన  కారు డ్రైవర్ కళ్ళు ఒక్క క్షణం మూసుకోవటంతో కారు గతి తప్పి రోడ్డు డివైడర్ కు గుద్దుకుని ఎగిరి రోడ్డుకు మరో వైపు బోల్తా పడింది. కొద్ది దూరంలో వెళ్తున్న టూరిస్ట్ బస్సు డ్రైవర్ వ్యూ మిర్రర్ లో ఘటన చూసి బస్సును రోడ్డు ప్రక్కన  ఆపాడు.  డ్రైవరు, కొంత మంది పెళ్ళి వారు పరిగెత్తు కుంటూ ఘటనా స్థలికి చేరుకున్నారు. సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో చూడగా అప్పటికే వెనుక సీట్లో కూర్చున్న కృపాకర్ ఇద్దరు  బాబాయిలు తీవ్ర రక్త గాయాలతో మరణించారు. సీటు బెల్టులు ధరించిన  కారు డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న కృపాకర్ మేన మామ ఎయిర్ బలూన్లు విచ్చుకోవటంతో రక్త గాయాలతో బయటపడ్డారు. పెళ్లి బృందంలోని ఒక సభ్యుడు 108 కి డయల్ చేసి ఘటన విషయం తెలియజేశాడు.   పోలీసు వారు కొద్ది సేపట్లో అక్కడకు చేరుకొని వారు చేయ వలసిన విధులను నిర్వర్తించారు.  ఘటనాస్థలి పెళ్లి వారి ఏడుపులతో నిండిపోయింది.
కృపాకర్ కాసేపటికి తేరుకొని  సూర్య ప్రకాశ్ కు ఫోను కలిపాడు. “బావ గారూ అనుకోని దురదృష్ట కర మైన సంఘటన జరిగింది. మా బస్సు వెనకాలే వస్తున్న కారు ఆక్సిడెంట్ కు గురైంది.  అందులో కూర్చున్న మా ఇద్దరు బాబాయిలు మరణించారు. కారు  డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న మా మేన మామ  గాయాలతో బయట పడ్డారు. ఈ పరిస్థితుల్లో మనం పెళ్లి కార్య క్రమం పెట్టుకోలేము కదా. పైగా మాకు  సూతకం ఉంటుంది. సూతకం తర్వాత మిగతా విషయాలు మాట్లాడు కుందాం” అంటూ ఫోను కట్ చేశాడు.
పోలీసు శాఖలో అధికారి కావటం మూలాన కృపాకర్ తన పరపతిని ఉపయోగించి  మరణించిన వారి మృత దేహాలు, గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపజేశాడు.
సూర్య ప్రకాశ్ ప్రక్కనే ఉన్న సరిత భర్త ఆందోళన గమనించి “ఏం జరిగింది” అని అడిగింది.  విషయం చెప్పిన సూర్య ప్రకాశ్ “సరితా, మా అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి మనం ఆందోళనలో ఉంటే ఇప్పుడేమో  ఇలా జరిగింది”.
*****
కర్మ కాండలు సంజీవరెడ్డి నగర్ లోని కృపాకర్ ఇంట్లో జరిగాయి. బాబాయిలకు వారసులు లేనందున తానే ముందుండి వారి  కర్మ కాండలు జరిపించాడు.  మాశికం కార్య క్రమంతో కృపాకర్ కుటుంబానికి మైల తొలగిపోయింది. ద్వాదశ దిన కర్మ రోజు  బంధుమిత్రులు బాగానే తరలి వచ్చారు.  బంధుత్వం కలిసింది కాబట్టి సూర్య ప్రకాశ్, సరితలు కూడా  హాజరయ్యారు. అనుకోని సంఘటన వల్ల భరణి తన అమెరికా ప్రయాణాన్ని మరో నెల  రోజుల పాటు వాయిదా వేసు కున్నాడు.  సాయంత్రానికి దూరపు బంధువులంతా వెళ్ళిపోయారు.  సూర్య ప్రకాశ్ అవకాశం కల్పించు కొని  పెళ్లి విషయం కృపాకర్ తో ప్రస్తావించాడు. అయితే ఒకే ఇంటి పేరు గల వారు మరణించారు కాబట్టి  సంవత్సరం లోపు భరణి  పెళ్లి చేయవచ్చునా అనే విషయం ప్రస్తావనకు వచ్చింది.  అదే విషయం అక్కడే ఉన్న సిద్ధాంతి గారిని అడిగాడు కృపాకర్.

“అయ్యా, మన సందేహాలు తీర్చటానికేమో  సమయానికి ధర్మ సందేహాలు కార్య క్రమం టివి లో ప్రసార మవుతుంది.  సర్వదమనశాస్త్రి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు చెప్తున్నారు. మీ సందేహానికి కూడా సమాధానం దొరక వచ్చు. వినండి.” అన్నాడు సిద్ధాంతి గారు.

       “శాస్త్రి గారూ, నల్గొండ నుండి సురేష్ అనే శ్రోత ఈ విధంగా అడిగాడు, తాత  చనిపోతే మనవడికి సూతకం ఎంత కాలం ఉంటుంది,  వివాహం ఎంత కాలం దాకా చేసుకోగూడదు” ప్రశ్న సంధించింది సంధాన కర్త .

“ఇంటి పేరు గల వారు మరణిస్తే సూతకం లేదా మైల 12 రోజులు, 13 రోజులు,15 రోజులు ఇలా ఒక్కొక్కరి ఇంట్లో వారి వారి ఆచారం  ప్రకారం ఒక్కో రకంగా ఉంటుంది.  తండ్రి మరణిస్తే సంవత్సరం పాటు, తల్లి మరణిస్తే ఆరు నెలల పాటు కుమారుడు వివాహం చేసుకోగూడదు.  నిత్య పూజలు మాత్రం సూతకం అయిపోయిన తర్వాత నిర్విఘ్నంగా చేసుకోవచ్చు.  కాకపోతే వ్రతాలు, పండుగలు ఏడాది పాటు ఉండవు.  అయితే తాత లేదా ఒకే ఇంటి పేరు గల వారు చనిపోతే సూతకం ముగిసిన అనంతరం మనవడి పెళ్లికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు. నిరభ్యంతరంగా చేసుకోవచ్చు” అంటూ సమాధాన మిచ్చాడు శాస్త్రి గారు.

“కృపాకర్ గారూ, సర్వదమన శాస్త్రి గారు అంత పెద్ద వారు చెప్పింది విన్నారు కదా, ఇంక మీరు నిరభ్యంతరంగా ప్రొసీడ్ అవ్వండి” అంటూ శలవిచ్చాడు పంతులుగారు.

సూర్య ప్రకాశ్, కృపాకర్ లు తమ రెండు కుటుంబాల  సంబంధం బలపరచుకోవడానికి సిద్ధాంతి గారు నిర్ణయించిన పెళ్లి సుముహుర్తానికి ఓకే చెప్పారు.

                      ******
తడకమళ్ళ మురళీధర్,
విశ్రాంత జిల్లా జడ్జి,
F306 HNo 13-10-95,
Vaishnavi Dvivedi Apartments,
Gaddiannaram,
Hyderabad-500060
Ph.9848545970.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వంశం

by vijayakanthi February 28, 2022
written by vijayakanthi

మొక్క
వంశవృక్షం
పువ్వు
రాసింది సంక్షిప్తం

తరతరాల పరంపర
రూపురేఖల చరితం!

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

మయూఖ ఫిబ్రవరి శిశిర సంచిక సంపాదకీయం

by mayuukha February 28, 2022
written by mayuukha

ప్రకృతి ఎంతో విచిత్రమైంది. మానవ ప్రకృతి కూడా అంతే విచిత్రమైంది. భూమి గుండ్రంగా ఉంటుందని నిరూపించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఏనాడో ఒడిసిపట్టుకుని కష్టాలను, బాధలను అధిగమించి ఉన్నత స్థాయికి పోయే ప్రయత్నాలు నిరంతరం చేసే చరిత్ర మనిషిది.

ఎరుక పిడికెడు ధనము అని అంటారు. ఎంత ఎక్కువ విషయాలు తెలిస్తే అంత అభివృద్ధి సోపానాలు అవుతాయి అనే అర్థం ఉన్న మాట ఇది. అటు కొత్త సంవత్సరం 2022 వచ్చింది, ఇప్పుడు శిశిర ఋతువులోకి అడుగుపెడ్తున్నాం. ఇటు శోభకృత్ నామంతో వసంత ఋతువును మళ్ళీ తొందరలోనే చూడబోతున్నాం. తెలుగు, ఇంగ్లీషం క్యాలెండర్ల ప్రస్తావన కాదు. ఇక్కడ ఓ రెండు నెలల కాలం మనకు ఇచ్చిన జ్ఞాపకాలను స్పృశించుకోవడం. ఏడాదిలో కొన్ని రోజులకు కొన్ని ప్రత్యేకమైన పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాం. ఇది ఎందుకు అంటే ముందు అనుకున్నట్లు ఒక ‘ఎరుక’ కోసం.

స్వాతంత్ర్యం సాధించుకున్నప్పటి నుండి సమాజానికి చేరువ కావాల్సిన ముఖ్యాంశాలపై నిర్వహించే‘దినోత్సవాలు‘ ప్రజలకు చేరువవుతూనే ఉన్నవి. మానవ హక్కుల దినోత్సవం, మానవ ఐక్యతా దినోత్సవం , కార్మిక దినోత్సవం వంటివి. హక్కుల ప్రాముఖ్యత తెలుపడానికీ, సంఘటిత శక్తిని తెలుపడానికీ ఏర్పరుచుకున్నవి. అట్లాగే దేశస్థితిని తెలియజేసే స్వాతంత్ర్య దినోత్సవం , గణతంత్ర దినోత్సవం కూడా మనవే ! మనిషి కి గృహానికీ గల సంబంధబాంధవ్యాలు తెలియాలని, కుటుంబ , జీవన సావకాశాలు తెలియాలని, మాతృదినోత్సవం, గురుపూజ దినోత్సవం వంటివీ మనకోసమే . భాష మన సంపద అని చెప్పే గుర్తుగా మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 22ను జరుపుకోవడమూ ఒక ఎరుక కోసమే. అదేవిధంగా కాన్సర్ అనే జబ్బును తెలిసేలా ‘కాన్సర్’ డే లూ ఏర్పరచుకున్నాం.
సమాజంలో ఏదైనా చెడు విస్తరిస్తుంటే, దాష్టీకాలు ఎక్కువుతుంటే ‘కాన్సర్ లా ప్రాకుతున్నది’ అని వ్యాఖ్యానించే అలవాటున్నది. ఒక జబ్బును చెడుకు పోలుస్తూ చెప్పడం ఇది. కాన్సర్ వల్ల మనుషులు మరణం వరకూ పోవడమో , బ్రతికున్నన్నాళ్లూ చికిత్స చేసుకోవాల్సి రావడమో జరుగుతున్నది. రకరకాల కాన్సర్లకు రకరకాల పేర్లు. శరీరంలోని జీవకణాలు కొన్ని అసాధారణంగా పెరుగుతుండటం కొందరిలో జరుగుతుంది. ఇదే ప్రాణాంతకమవుతుంది.
శరీర కణ విభజనలు ఒక క్రమపద్ధతిలో, నియంత్రణలో ఉంటాయి. ఒక్కోసారి కణాల పెరుగుదల ఉండాల్సిన నియంత్రణలో ఉండక అతివేగంగా పెరిగి ఒక కంతిలాగా అవడాన్నే కాన్సర్ వ్యాధి అంటారు. ఆంకాలజీ, Oncology ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ భయంకరమైన వ్యాధిని పరీక్షలు, అధ్యయనాలు చేసి, ప్రారంభదశలోనే గుర్తిస్తే, తగ్గించే అవకాశాన్ని చేజిక్కించుకొని, ఆరోగ్యవంతులు అవ్వవచ్చు.

ఆహారపు అలవాట్లు కావచ్చు, పనిచేసే వాతావరణం కావచ్చు, వ్యసనాల వలన ముఖ్యంగా దూమపానం, అతి మద్యపానం వల్లనూ రావచ్చు. చెడు అలవాట్ల తో నిర్లక్ష్య ధోరణి కూడా కారణం కావచ్చు. అయితే ఈ అన్నీ కూడా నివారణకు వీలైనవే. కాని వీటితో పాటు వంశపారంపర్యంగా హెరిడిటీగా వచ్చే జబ్బులు ఉంటాయి . అవి మినహాయిస్తే మిగతా కారణాలన్నీ మనిషిపై వ్యాపార మాఫియాలు చేస్తున్న కనబడని దాడిగా ఏం అనుమానం పడకుండా చెప్పవచ్చు. వ్యసనాలను వీడని మానవ నైజాన్ని పెద్ద కారణం గా చెప్పవచ్చు. ఇక్కడ కారణాల కంటే దోపిడి వర్గాల దుశ్చర్యలే ఎక్కువ ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ ఇనుప గుప్పిళ్లనుండి బయటపడేలా ప్రయత్నపూర్వకంగా జీవిస్తే తప్ప ఇటువంటి కాన్సర్ల నుండి బయటపడగలదు మానవ సమాజం.
అయితే రేపు మార్చి 8న జరుపుకోబోయే మహిళాదినోత్సవాన్ని ఒకసారి స్మరణకు తెచ్చుకున్నప్పుడు మొన్ననే, ఫిబ్రవరి 4న విన్నటువంటి కాన్సర్ డేను గుర్తుకు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా సభ్య సమాజంపైన ఉన్నది. ప్రతి ఇంట్లో స్త్రీలు అమ్మగానో, అక్కగానో, చెల్లిగానో, భార్యగానో, బిడ్డగానో ఉండే ఉంటారు. కాబట్టి ఈ సమస్య స్త్రీల ఒక్కరిదే కాదు పురుష ప్రపంచానిది కూడా! ఇంట్లో ఆడవాళ్ళకు అనారోగ్యంగా ఉంటే ఆర్థిక, హార్థిక ఇబ్బందులు వచ్చేది మొత్తం కుటుంబానికి కూడా! కుటుంబం అంటేనే స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యంలో ఉండేది కాబట్టి ఇది సభ్య సమాజం బాధ్యత అనడం. ఇదంతా ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకు ఈ కాన్సర్ గురించి ఎవేర్ నెస్, తెలివిడిని కలిగించాలి అని! నిర్లక్ష్యమో, తెలివి తక్కువతనమో, తెలియనితనమో, మొండితనమో, అమాయకతనో, ఆర్థిక ఇబ్బందులో, ఇంట్లోవాళ్ళకు చెప్పే ధైర్యం లేకపోవడమో, బిడియమో, ఆర్థికస్వేచ్ఛ, స్వీయ ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడమో ఒక్కటేమిటి ఎన్నో కారణాలు రణాలై స్త్రీలను బాధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వీటిని గమనించాల్సిన ధర్మం ఎవరిది?
ఒకే చూరుక్రింద మసిలే అందరిదీ! అందుకే ఇంట్లో ఆడవాళ్ళను తరచూ వారి ఆరోగ్యాన్ని గురించి కనుక్కోవాలి. అవసరమైన పరీక్షలు, ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదో లేదో తెలియజేసే మోమోగ్రామ్ అనే పరీక్షను చేయించుకొమ్మని, ఇది ముందు జాగ్రత్తనేగాని, అనుమానపడి భయానికి గురికావద్దని నెమ్మదిగా నచ్చచెప్పి హాస్పటల్ కి తీసుకెళ్ళి దగ్గరుండి పరీక్షలు చేయించాలి. వాళ్ళంతట వాళ్ళు హాస్పిటల్ కు వెళ్ళి పరీక్ష చేయించుకోలేని స్త్రీలే అధికశాతం ఉంటారు. తండ్రి గా , భర్తగా, అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా మామగారిగా మగవారి బాధ్యత అందరి బాధ్యత అనుకున్నప్పుడే ఈ జబ్బు నుండి బయటపడడం, భయం దీర్చుకోవడం జరుగుతుంది. ఆలోచించాలి, ఆచరించాలి. అప్పుడే మదర్స్ డేలు, మహిళా దినోత్సవాలు ఎందుకు చేస్తున్నాం అనే సోయి వస్తుంది.
సర్వకాల సర్వావస్థలలో తెలివైన జీవిగా మనిషి నిలబడాలి అంటే ఎరుకతో ఉండాలి. ఏడేడు తరాలకూ ఆదర్శంగా ఉండాలి. అసలే ‘కోవిడ్ 19 ‘ వచ్చి ప్రపంచాన్ని క్రిందమీద చేసింది. కరోనా కంటే ముందు , కరోనా తరువాత అని ఏదో శకాల గురించి చెప్పుకున్నట్టు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కరోనా కొంత తగ్గు ముఖం పట్టింది అనుకుంటుంటే డిఫరెంట్ వెరియంట్స్ తో మిమ్మల్ని వదలను అని హెచ్చరిస్తున్నట్టు ‘ఒమిక్రాన్’ అనేదీ దాడి చేసింది. ఇంకా ఏం వస్తాయో, ఎట్లా వస్తాయో తెలియక, అగమ్య గోచరంగా ఉన్నది. అయినా చింతించాల్సిన పనిలేదు. ఎదురీదాలి. గెలవాలి. ఇదే కదా చేయాల్సింది.
ఆర్థిక మాంద్యము, ద్రవ్యోల్బణమూ వంటి పెద్ద పెద్ద పదాల అర్థాలూ, ప్రభావాలూ తెలియని అతి సామాన్యులు మన చుట్టూ ఉంటారు. వాళ్లను గమనింపు లోకి తీసుకోవాలి. ఈదురుగాలులకు నిలువగలవు చిన్న చిన్న చెట్లు . కాని తుఫాను భీభత్సాలకు నిలువగలవా! ప్రజలు… ప్రజలు…ఎక్కడ చూసినా ప్రజలు సామాన్య ప్రజలు ఉన్నారు, పేద ప్రజలూ ఉన్నారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషీ ఒక సిఐడీ ఆఫీసర్ లాగా, ఒక సిన్సియర్ పోలీస్ లాగా, ఒక వీర జవాన్ లాగా ఒక నిఘా యంత్రపు కన్నులా ఉండాలి, చూడాలి. ఏదైనా తెలిస్తే చెప్పాలి , తగిన సలహా లు ఇవ్వాలి , సహాయాలూ చేయాలి . అప్పుడే కాన్సర్ ను జయించగలం, కాన్సర్ లా వ్యాపిస్తున్న అన్యాయాలనూ ఎదిరించగలం. అడ్డుకొనగలం – ఆరోగ్యవంతులం కాగలం.

అదిగో యుద్ధాలు – ఒక దేశంపై మరో దేశం యుద్ధం చేయడం చూస్తున్నాం. ఇది ఏ ఆటవిక దృశ్యమూ కాదు. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక అతి విజ్ఞానపు దుశ్చర్యల దురాక్రమణల పర్యవసానం . ఈ పసిగట్టలేని అన్యాయం ఎంతో ఉన్నది. ఇలా సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుకోవలసిందే . విజ్ఞులందరికీ ఇవి తెలియనివా ? అన్నీ తెలుసు కాని మౌనం ప్రధానపాత్ర వహిస్తుంది. హెచ్చరిక ఇవ్వచూస్తుంటుందీ లోకం!

ప్రకృతి విచిత్రమైందనుకున్నట్టే, ప్రకృతి సమయపాలనలో దిట్ట! అదిగో శిశిరం పోయి వసంతమూ వస్తుంది. మార్చి పోయి ఏప్రిల్ కూడా వస్తుంది. క్యాలెండర్ లో డేట్స్ మారకుండా ఉండవు, కాలంలో ఋతువులు మారకుండా ఉండవు, మరి మనుషులుగా వయసు మారుతున్నప్పుడు బుద్ధి జీవులు గానూ మనం మారకుంటే ఎట్లా? మారుదాం, మారుద్దాం! కాస్తంత ముందుచూపు, కాస్తంత ఎరుక ఇంతే చాలు. కొత్త సంవత్సరంలో సంతోషకర విశేషాలు పంచుకుందాం అని మంచి ని ఆశిద్దాం!!
__ కొండపల్లి నీహారిణి

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

దిక్సూచి

by వారాల ఆనంద్ February 28, 2022
written by వారాల ఆనంద్

బయట
ఆకాశం తేటగా నిర్మలంగా వుంది
గాలి స్వచ్చంగా మంద్రంగా వీస్తోంది
వెన్నెల చల్లగా కురుస్తోంది

లోపల
గది ప్రశాంతంగా వుంది

కవే
తన అసంపూర్ణ కవితను ముందేసుకుని
దుఖంగా వేదనగా కోపంగా
చిన్న పిల్లాడిలా
కాళ్ళూ చేతులూ ముడుచుకుని
నిద్రలోకి జారుకున్నాడు

అసంపూర్ణ కవితలోని పదాలు
హార్మోనియం మెట్ల లాగా
ఒక్కోటీ లయబద్దంగా కదులుతున్నాయి
సవ్య రాగాన్ని పలుకుతున్నాయి
నవ్య భావాల్ని ధ్వనిస్తున్నాయి

అన్ని పరిధులూ దాటి
కాలం స్థబ్దతలోకి
అన్ని పరిమితులూ దాటి
మనుషులు స్వార్థం లోకి
దిగజారి పోయినా

ఒక్క కవే తన
అసంపూర్ణ అసమగ్ర కవితకు తోడుగా
మరిన్ని తెల్లకాగితాల్ని ముందేసుకుని
కొత్త మాటల్ని చెక్కుతాడు

నిద్దట్లోంచి మెలకువలోకి
చీకట్లోంచి వెలుతురులోకి
సరికొత్త దారులు తీస్తాడు

కవి దివిటీ అయితే
కవిత దిక్సూచి

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పొగమంచు భూతలం ( గేయం)

by Krishna Vaddepalli February 28, 2022
written by Krishna Vaddepalli

పొగమంచు తో భూతలం
ఆయెను అతి శీతలం
॥ పొగ..॥
ఉపతరిలపు ద్రోణియో
చలి గాలుల శ్రేణియో
ఉరుమనెంచు ప్రకృతి యో
ఉనికి నెల్ల వణికించెను !…
॥ పొగ..॥
విమల ధవళ వస్త్రంతో
విధిగా అగుపించునట్లు
దేశమెల్ల పొగమంచను
తెలిముసుగుతొ పలకరించె!
॥ పొగ..॥
హేమంతానికి ప్రేమగా
సీమంతం జరుపసాగె
“శిశిర” శిశువునే కనగా
ఋతుచక్రం తిరగ సాగె !

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తరాల తరుణి

by Palleru Swamy February 28, 2022
written by Palleru Swamy

కలిసి నడిచే మనం-కాదులే చెరిసగం
పతిదేవుణ్ణి నేను-చరణదాసివి నువ్వు
ఆధిపత్యం నాది : నాదే పైచేయి
ధర్మపత్నివి నీవు- నీవే నీతల కొంత దించు
నిన్ను వీధిలో అమ్మే దృశ్యాల తాలూకు కమురు వాసన
నిన్ను జనారణ్యంలోనెట్టిన వెగటుదనం
జూదంలో ఒడ్డిన పురాణ మై తోస్తున్నది

పాతివ్రత్యం పరమ భూషణమనే పాత కథ విన్న చెవులు
కొత్త చరిత్రలేమి వింటాయి ?

అన్యమైనవో అనన్య సామాన్యమైన వో
నిను ఏం తీరున చూపెడతాయి
వంశాన్ని నిలబెట్టడమె
కదా నీ వంతు-మాంగల్యం తంతు
నటి గా సఖి గా దాసిగా దాదిగా నీకెన్నో రూపాలు
అయినా దూతికగా
నీజాతి తోనే నిను తార్చాలనుకుంటున్న
మాయాప్రపంచం లో నీవు

తననుగని పెంచేటి సామర్థ్యం నీకు
ఎంతున్నా
అబలవే అంటాడు
అపహాస్యం చేస్తాడు

శీల సంస్కారమే
తగునమ్మ నీకసలు అంటాడు తరుణీ అవే నీ నగలని నమ్మిస్తాడు
తన పనులు వికటించే దాకా
నిన్ను గుర్తింపు గుచ్ఛాలలో విరిసే
“ముగ్ధ”వే నీవంటు ముచ్చటగా పిలుస్తాడు

నీవు మరణిస్తే వేరొకతె నాకు సతి నేను చనిపోతేను సతి నీవంటు నీకు “బ్రతుకు చితి ” అనీ తీర్మానిస్తాడు

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక అందమైన కల…

by Butam Mutyalu February 28, 2022
written by Butam Mutyalu

ఒక అందమైన కల…

తుషార స్నాత ప్రభాత వేళ ఆత్మ యొక్క సుగుణం ఇంద్రజాల కిరణంలా శోభిల్లుతోంది

రేయంతా వెన్నెల కాంతులు వెదజల్లే దివిటీ యై నిరీక్షిస్తూ వీక్షిస్తూ కాలుతున్న హృదయం నుండి కరిగి కరిగి సుగంధాలు విడుదల అవుతోంది

మరియు ఆమె శీతల శిశీరంలో అవని దశదిశలా వసంతమై ప్రకాశిస్తూ మరులు గొలుపుతుంది

ఎద సముద్రమంత లోతు గలదై ఆకాశమంత విశాలమైనది ఇది ప్రేమ కు శక్తి కలుగ చేస్తుంది

జీవిత పరమార్ధం గ్రహించటానికి ఇంకేం కావాలి ఆమె ముఖారవిందం నిండు పున్నమి లా విరియగా
ఆమె చెలిమి తరం తరం నిరంతరం ఒక అందమైన కలగా మిగిలే వుంటుంది

ఆమె ప్రేమ అనునిత్యం వెన్నంటి మేల్కొలుపు తుంది

మది ఊయలలూపుతుంది. అదర మధుసేవనంలో మదురసాలను ఒలుకుతుంది…

February 28, 2022 0 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

విద్వత్తు

by డా|| మృదుల నందవరం February 28, 2022
written by డా|| మృదుల నందవరం

ఈ సంచికలో మనం విద్వాంసుల తీరు ఏ విధంగా ఉంటుందో భర్తృహరి నీతి శతకం ద్వారా తెలుసుకుందాం.

శ్లో|| దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, శాఠ్యం సదా దుర్జనే

ప్రీతిః సాధుజనే, నయో నృపజనే, విద్వజ్జనే చార్జవమ్

శౌర్యం శ్రతుజనే, క్షమాగురుజనే, కాన్తాజనే ధృష్టతా

యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోకస్థితిః

విద్వత్ పద్ధతిలోని ఈ శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవిగారు ఎలా అనువదించారో చూద్దాం.

చ. వరకృప భత్యులందు, నిజవర్గమునందనుకూలవృత్తి, కా

పురుషులయందు శాఠ్యము, సుబుదు్ధలయందనురక్తి, దాల్మి

ద్గురువులయందు, గౌరవము కోవిదులందు, నయంబురాజుల

దరిజనులందు శౌర్యము, మృగాక్షులయందు బ్రగల్భభావవీ

వరుసగళా ప్రవీణులగు వారలయందు వసించులోకముల్

సేవకాజనము యందు అపారమైన ప్రేమ, బంధువుల యందు అనుకూలమైన ప్రవర్తనము, దుష్టజనుల యందు కాఠిన్యము, సజ్జనులయందు ఇష్టము, పెద్దలయందు సహనభావము, పండితుల పట్ల గౌరవము, రాజుల విషయంలో నిబద్ధతను, శ్రతువులయందు పరాక్రమము, స్త్రీలయందు నిగ్రహశక్తి – మొదలైన గుణములు ప్రదర్శించే కళల్లో ఎవరు నిపుణులో వారివల్లనే లోకము పురోగమిస్తుందని పై పద్యానికి భావము.

మానవుడు సమాజాన్ని విడిచి దూరంగా మనలేడు. జీవనం సాదదు కూడా. అందువల్ల పరిస్థితులనుబట్టి, వ్యక్తులనుబట్టి తన వ్యవహారశైలిని మలుచుకోవలసి ఉంటుంది. తన సేవకాజనము పట్ల దయాగుము కలిగి వారి అవసరములను గుర్తించవలసి ఉంటుంది. బంధువులను తగిన రీతిలో మన్నిస్తూ మసలుకోవాలి. చెడ్డవారితో కఠినంగా వ్యవహరిస్తేనే మరోసారి వారు దుర్మార్గంగా ప్రవర్తించకుండా ఉంటారు. వయసు మీద పడిన వారితో చాలా సమానంగా, వారికి వలసిన విధంగా మసలుకోవలసి ఉంటుంది. పండితుల యందు గౌరవభావాన్ని కలిగి ఉంటేనే మన సంస్కారభావం వెలికి వస్తుంది. అంతేకాక కొద్దొ గొప్పో మనకూ పాండిత్యం అబ్బుతుంది. రాజుల ఆజ్ఞలను శిరసావహిస్తూ, శ్రతువుల యందు పరాక్రమాన్ని ప్రదర్శించాలి. స్ర్తీలయందు ఇంద్రియ నిగ్రహము (పురుషుల యందు స్త్రీల) పురుషులు కలిగి ఉండాలి. ఇటువంటి నేర్పరితనము ఎవరిలో ఉంటుందో వారివల్లనే దేశాలు (లోకాలు) వృద్ధిలోకి వస్తాయి.

కవి మాటల వలన మనకు తెలుస్తున్న విషయాలు ఏమిటంటే – ఏ దేశమైనా విద్వత్తు కలిగిన వారివల్లే వృద్ధిలోకి వస్తుంది. చదవు వేరు విద్వత్తు వేరు. చదువు ఉండి, విద్వత్తు ప్రవర్తించలేనివారివల్ల దేశాభివృద్ధి, నాగరికత ఛిన్నాభిన్నమౌతాయి. కాబట్టి సదసతం వివేక చతురత కలిగినవారివల్లే పరిపాలన సుగమమవుతుంది. క్రింది నుండి ఉన్నత వర్గము వరకు ఎవరివట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసినవారే అసలైన విద్వాంసులు. వారితోనే మన సంస్కృతి, మన ప్రగతి ముడిపడి ఉంటుందన్నది వాస్తవం.

గౌతమబుద్ధుడు, స్వామి వివేకానందుని బోధనల్లోనూ అబ్దుల్ కలామ్ గారి ప్రసంగాల్లోనూ పై పద్యం యొక్క భావాలు మనం గుర్తించవచ్చు. సాటివారిపట్ల మిక్కిలిదయ, తమను ఆశ్రయించుకని ఉన్నవారి పట్ల ప్రేమ, దుర్మార్గులపట్ల జాగరూకత, అశక్తులైన పెద్దవారిపట్ల మన చేయూత, గురువులపట్ల గౌరవభావము, బ్మహ్మచర్యము, ఏ సమాజమైతే కలిగి ఉంటుందో, మానవసేవే మాధవసేవగా ఎవరు భావిస్తారో ఆ సమాజమే ముందుకు సాగుతుందని, వారే మహాత్ములుగా కీర్తింపబడతారని, వారు మన దేశానికి ఎంతో అవసరమైన వ్యక్తులని కలామ్ గారు అంటారు. ఆచరించి చూపారు కూడా.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణ రుబాయిలలో మరణ తాత్వికత

by Sambaraju Raviprakash February 28, 2022
written by Sambaraju Raviprakash
మరణం ఏ కాలంలోనైనా ఎంతటి ధీరోదాత్తుడినైనా చలింప చేస్తుందనడానికి మన ప్రాచీన సాహిత్యంలో అనేక ఆధారాలున్నాయి. మరణానికి సమీపమవుతున్నామన్న భావన పండు ముసలి నైనా రోదనకు గురి చేస్తుంది. ఎంతటి తాత్వికుని హృదయమైనా వేదనకు లోనవుతుంది. స్మశాన వైరాగ్యాన్ని నిండా నింపుకున్న వాడు కూడా మరణం మాట వింటే నాలుగు కన్నీటి బొట్లను రాల్చకుండా ఉండలేడు.
“సంసారం జనన మరణ రూపమైనది .పూర్వకర్మవశాన జీవుడు శరీరాన్ని ధరించి దానిని విసర్జించే వరకు కర్మ చేస్తూనే ఉంటాడు .ఆ కర్మ ఫలితంగానే అతడు మరో శరీరాన్ని పొందుతాడు. ఇట్లా జీవుని యాత్ర నిరంతరమైంది . చక్రాకార మైంది.”వంటి ఎన్ని మాటలను చదివినా, జీర్ణించుకున్నా తన వరకు వచ్చేసరికి భయపడి పోవడం మనిషి సహజ నైజం. ఋగ్వేదం, భగవద్గీత ,కఠోపనిషత్తు, భారతం ,భాగవతం, రామాయణం, మరియు అనేక ప్రాచీన, ఆధునిక కావ్యాలతో పాటు సాహిత్యంలోని అనేక ప్రక్రియలలో జనన మరణాల గురించి కవులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మానవజాతికి ధైర్యం చెబుతూనే ఉన్నారు.
ప్రసిద్ధ కవి, అనువాదకులు, విమర్శకులు ఏనుగు నరసింహా రెడ్డి రచించిన “తెలంగాణ రుబాయిల”లోని మరణ తాత్వికత నన్ను ఎంతగానో ఆకర్షించింది .
536 రుబాయిల ఈ బృహత్ గ్రంథంలో  మరణాన్ని ఎంతో తాత్వికంగా చెప్పడం కనిపించింది. ఈ రుబాయిల ద్వారా  పుట్టుక ఎంత సహజమో మరణము అంతేనన్న ఎరుకను కవి మనకు కలిగించాడు. ఏనుగు నరసింహారెడ్డి తన రుబాయిలలో మరణాన్ని గానంచేస్తూ మన అందరిలో ధైర్యాన్ని నింపాడు. పుట్టుకకు చావుకు మధ్య ఉన్న నాలుగు క్షణాలలో సాధించవలసిన కార్యాలపై దృష్టి పెట్టమని బోధ చేసాడు. సామాన్యుడైనా, ఎంతటి మనగాడైనా,లేక ప్రతిభావంతుడైనా మరణానికి తలవంచక తప్పదని తెలిపాడు. “బలమే జీవనం- బలహీనతే మరణం” అంటూ వివేకానందునిలా మనలను జాగృత పరిచాడు. గహనమైన మృత్యు అంశాన్ని సులభమైన శైలిలో వ్రాసిన నరసింహారెడ్డి రుబాయిలు అందరము చదవదగినవి.
“పుట్టిన ఊరును వదలి పోతం
పెరిగిన పట్నము వదిలి పోతం
ముందు వెనకాల ముచ్చటేగాని
నడిచిన నేలను వదిలిపోతం”(155)
పై రుబాయిలో మనకు అర్థం కానిది ఏముంది. పుట్టిన చోటనే మనిషి గిట్టాలని లేదు. పెరిగిన చోట తరగడం కూడా ఉంటుంది ఏనాటికైనా నడిచిన చోటు విడిచిన చోటు కాక తప్పదు. కాకపోతే ఒకరి వంతు ఈరోజు అయితే మరొకరి వంతు రేపు. రేపో మాపో దేహం రూపు మాయక తప్పదనే భావన పై రుబాయిలో కనబడుతుంది.
“రాల చెక్కీ పోతడొకడు  బొమ్మ గీసి పోతడొకడు
పుడమి గర్భపు పూలనేరి
కావ్యమల్లీ పోతడొకడు”(178)
పై రుబాయిని చదవగానే నాతో పాటు మీకు కూడా ‘సత్య హరిశ్చంద్ర’నాటకం లోని ‘కాటిసీను’లో ఉన్న “ఇచ్చోటనే” అనే జాషువా ప్రసిద్ధ పద్యం గుర్తుకు రావడం సహజం. శిల్పికి ,చిత్రకారునికి, కవికే కాదు సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు మృత్యువు దృష్టిలో అందరూ సమానులే . అందుకే యముడిని ‘సమవర్తి’ అని అంటారు. శిల్పి, చిత్రకారుడు, కవి తమ శిల్పాల, చిత్రాల, కావ్యాల ద్వారా శాశ్వతంగా నిలిచిపోతారు. అశాశ్వతమైన దేహం నశించినా శాశ్వతమైన చిరునామాతో వారు లోకంలో నిలిచిపోతారు. అలా నిలవడమే కదా కావాల్సింది.పై రుబాయి నిర్మాణంలో ఏనుగు చూపిన కౌశలం నన్ను ముగ్ధమనోహరున్ని చేసింది.”పుడమి గర్భపు పూలనేరి” అన్న మూడవ వాక్యం 1,2,4 వాక్యాలకు అన్వయం కావడం విశేషం. ‘పోతడొకడు’పద ప్రయోగం ఈ రుబాయిలో అద్భుతంగా కుదిరింది. ‘ఎప్పటికైనా పోయేదే’అనిt మరణం గురించి  సాధారణ జనం మాట్లాడుకునే సంగతి  అందరికీ తెలిసిందే. జనం నాడిని పట్టుకున్న కవి ‘పోతడొకడు’ అని నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించాడు. ఇది ఎంతో సహజ సుందరంగా ఇమిడిపోయింది. సీస పద్యంలో జాషువాకున్న సౌలభ్యం రుబాయి ప్రక్రియలో నరసింహారెడ్డికి లేదు. అయినా ప్రక్రియపై పట్టున్న రచయిత కావడం మూలాన తాను అనుకున్న భావాన్ని తక్కువంటే తక్కువ పదాలలో ఇమిడించగలిగాడు. ఒక ప్రక్రియ మరో ప్రక్రియ లోకి మారడం మన సాహిత్యానికి కొత్తేమీకాదు. పురాణాలు కావ్యాలయ్యాయి.కావ్యాలు నాటకాలైనాయి. నాటకాలు కథలైనాయి.కథలు గేయాలైనాయి. ఇక్కడ పద్యం “రుబాయి” రూపం పొందింది. అద్భుత జనాదరణ పొందిన ఒక పద్యం అత్యాధునిక కవి చేతిలో  అంతే జనాదరణ పొందిన   మరో రూపంలోకి మారడం ఇక్కడ గమనార్హం.
“కోరుకొని ఇటకొచ్చినామా? మనకు తెలియదు
కోరినంతనే వెళ్ళగలమా? మనకు తెలియదు
నటన బాగా చేయవోయీ! పాత్రధారి
ఎపుడు వేదిక ఎటుల
దిగుదుమొ మనకు తెలియదు”(8)
జీవన రంగస్థలంలో మనం నటీనటులమే. మనకు ఇచ్చిన పాత్రను సరిగ్గా నిర్వహిస్తే అదే పదివేలు. సంచిత పుణ్య పాపకర్మలు మన తదుపరి జన్మకు కారణం అవుతాయని పెద్దలు చెప్తారు. కోరుకున్న జన్మను పొందుతామా… లేదా అనేది మనకు తెలియదు. పోతన కైవల్య పదాన్ని కోరుకున్నాడు. మరుజన్మ లేకుండా చూడమని చాలామంది భగవంతుని ప్రార్థిస్తారు. “మరణం అంటే పునర్జన్మకు సిద్ధం కావడం ” అని అరవిందులు చెప్పాడు. పై రెండు పరస్పర భిన్న అంశాలు.అయినా అవన్నీ మనకెందుకు?. జన్మించాము. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన చేతుల్లో ఉంది. “రాకపోకలు” మన ఆధీనంలో లేవు.
“మట్టి బొమ్మిది నమ్మ బోకండి  ఓ మనుజులారా! మాయమైపోతుంది చూడండి” అన్న గేయంలోని తాత్వికత మనకు అర్థం కావాలి. ఏ రూపంలో ఏ దిక్కు నుండి ఎప్పుడు ఎక్కడ  మృత్యువు మనలను కబళిస్తుందో  తెలియదు. తెలియని దానికి భయపడుతూ రోజూ చావును తలుచుకుని భీతిల్లడం అవివేకమని పై రుబాయి స్పష్టం చేస్తున్నది.
“కొండకు జ్ఞాపకం లేదు లావా జన్మ
మర్రికీ గుర్తుకు రాదు విత్తన జన్మ
మునుపు ఎక్కడో దాగిందో ఈ అంతరాత్మ
అసలు పసిగట్టలేనిదీ పూర్వజన్మ” (26)
“జన్మించిన వారికి మరణం, మరణించిన వానికి జన్మము తప్పదు. కాబట్టి మరణించిన వారి కోసం దుఃఖించకూడదు” అని భగవద్గీత చెప్తుంది. ఇలా చెప్పడంలో పునర్జన్మ ,పూర్వజన్మ అనే భావన ఉంది. లావా పూర్వజన్మ. కొండ ప్రస్తుత జన్మ. విత్తనం పూర్వ జన్మ. మర్రి ప్రస్తుత జన్మ. వాటికి పూర్వజన్మ జ్ఞానం లేదు .వాటికే కాదు. పూర్వజన్మ జ్ఞానం ప్రకృతిలో ఏ జీవజాలానికి లేదు .ఈ సందర్భంగా అరవిందుల వారి మాటలను గుర్తుకు తెచ్చుకుందాం. “మరణమన్నది లేనట్లయితే ప్రాణి ఎల్లప్పుడూ ఒక రూపంలో ఉంటుంది. అందువల్ల ఆ ప్రాణి జీవితం అసమగ్రమవుతుంది. మరణం వల్లనే ప్రాణి జీవితం సమగ్రమవుతుంది”. దీని ప్రకారం లావా కొండ కావడం, విత్తనం మర్రి కావడం సమగ్రం. సమగ్రమైనప్పుడే కదా జన్మ ధన్యం. ప్రాచీన సాహిత్యంలో పూర్వజన్మ వాసనలు కొందరికి ఉన్నట్లు రాశారు. ఈ కలికాలంలో మానవమాత్రులకు అది సాధ్యం కాదు. భూతకాల చింతన విడిచి వర్తమానంలో జీవించడమే మనకు ఇప్పుడు కావాల్సింది. “ఎన్నెన్నో జన్మల బంధం”అన్న పదబంధం ఎంత  ప్రసిద్ధమైందో మీకు తెలుసు కదా! దానిని చదివినప్పుడు పూర్వజన్మ ఏకవచనం కాదని, బహువచనమని తెలుస్తున్నది.
“ఇంటి నిండా బంధువర్గము ఒక్కరాపరు
ఊరినిండా మిత్ర వర్గము ఒక్కరాపరు
ప్రాణ దీపం శిథిలకాయము వీడిపోగా
జగతి నిండా ప్రేమ మూర్తులు ఒక్కరాపరు”
(43)
మనలోని ప్రాణాన్ని జ్యోతి రూపంగా భావిస్తాము. అది ఆత్మ యొక్క రూపం. ప్రాణాన్ని విడవడమంటే ఆత్మ జ్యోతి  దేహాన్ని వీడటమే. పై రుబాయిలోని సౌందర్యమంతా నాలుగో పాదంలో ఉంది.నాలుగో వాక్యం  చదివేసరికి మనం గొప్ప అనుభూతికి లోనవుతాం. ఒక కృష్ణుడు, ఒక క్రీస్తు, ఒక అల్లా ,ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు, ఒక గురు గోవిందుడు, ఒక శిరిడీసాయి లేక అందరూ ప్రత్యక్షంగా  పక్కనే ఉన్నా పోయే ప్రాణాన్ని ఆపలేరని అర్థం చేసుకుంటే ఈ రుబాయి గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది.ఎంతటి536 కరుణాహృదయుడైనా మరణం విషయంలో నిస్సహాయుడే కదా!.
“ఎన్నో  సందళ్ల నడుమ రోజు జారిపోతుంది
ఏ అలజడి లేకుండా శతాబ్ది దొర్లి పోతుంది
ఊదకుండానే ఆరిపోయే దీపం మనిషి
ఏ సడీ లేకుండా ఊపిరి ఆగిపోతుంది”. (74)
కాలం గడవడం అంటే జీవితం  కూడా గడవడమే కదా! జీవితం వెలుగుతున్న దీపం.ఏదో ఒకనాటికి ఆ దీపం ఆరిపోక తప్పదు.
దీప ప్రమిదలోని తైలం అయిపోయాక దానిని ఎవరు ఊదవలసిన అవసరం లేదు. చమురు నిండుకున్న తర్వాత దీపం ఎంత నిశ్శబ్దంగా ఆగిపోతుందో, జీవశక్తి నశించిన దేహంలోని ఆత్మ జ్యోతి అంతే నిశ్శబ్దంగా దేహాన్ని వీడుతుంది. చుట్టూ ఎంత మంది ఉన్నా  పోయే ప్రాణాన్ని ఆపలేరు.  పై రుబాయి లోని ‘రోజు’,’శతాబ్ది’ కాల వాచకాలు. కాలానిది కరిగిపోయే లక్షణం. పుట్టిన మనిషి కాలంతోపాటు కొంత దూరం నడిచి అస్తమిస్తాడు. కాలాన్ని ఎవరు ఆపలేనట్లుగానే మరణాన్ని ఎవరూ ఆపలేరు. మనిషి చనిపోవడాన్ని “కాలం చేశాడు” అని కూడా అంటారనే విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను.
“శ్వాస తీసినన్నినాళ్ళు సౌఖ్యంగా ఉండాలి ఊపిరున్నన్నాళ్ళూ ఉత్సాహముండాలి
కాయలన్నీ చెట్టు వీడుననితెలుసు
పండు రాలేదాక పుండు రాకుండాలి”. (31)
పుట్టుక ,చావుల మధ్య క్షణభంగురమైన జీవితం ఎలా ఉండాలనే ప్రశ్నకు కవి జవాబులా కనబడుతుంది ఈ రుబాయి. ఇందులోని మూడవ వాక్యం తాత్వికతతో నిండి ఉంది. “పండు రాలేదాకా పుండు రాకుండా ఉండాలి” అన్న కవి ఆకాంక్ష ఆయన స్వీయ వేదనలోంచి పుట్టింది. తెలంగాణ రుబాయిలు రాస్తున్న  సమయంలోనే నరసింహా రెడ్డి గారి బావమరిది క్యాన్సర్ మహమ్మారితో మరణించాడు. క్యాన్సర్ పుండుతో తన బావమరిది తల్లడిల్లి పోయిన నరక క్షణాలను కళ్ళారా చూశాడు కవి. అందుకే శత్రువుకు కూడా
ఇటువంటి బాధ రావద్దని కోరుకున్నాడు.
‘చిలుక ఈ చెట్టు నుండి ఎగిరి పోతుంది'(147), ‘ప్రతి వస్తువు మృత్యు దిశన  పరుగులిడును కాదె'(241), ‘సమయమెళ్ళిపోతుంది ఎలా ఎలా ఆపను’ (87), ‘వికసించిన ప్రతీ మొగ్గ వాడిపోవును ‘(80), ‘ఎట్ల నైనా కాడి ఎత్తేయవచ్చు'(58) మొదలైన  రుబాయిలలో కూడా మరణ తాత్వికత మనకు కనబడుతుంది. “తెలంగాణ రుబాయి”ల లోని వస్తువైవిధ్యంలో మరణ భావన చోటు చేసుకోవడం, తాత్వికంగా అది అభివ్యక్తం కావడం, సులభశైలిలో క్లిష్టమైన భావనలను పాఠకులకు అందించడం కవి రచనా శక్తిని ,పరిశీలనాసక్తిని తెలుపుతున్నవి. అందుకే పాఠకుల విశేష ఆదరణను అవి పొందుతున్నవి.
“జీవమన శరీరమున నేమో వచింతు
విసురు గాలిది ఇటు దూరి వెడలెనటుల”
పాలమూరు ప్రసిద్ధ కవి కీర్తిశేషులు వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి గజల్ అనువాదమైన “ముక్త గీతికల”లోని ఒక గజల్ తో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.
February 28, 2022 3 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక శీతకాలపు సాయంత్రం

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు February 28, 2022
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

తుఫాను గాలికి కొట్టుకుపోతున్న కారు మేఘాలు,

వడిగాలుల్లో సుడులు తిరుగుతున్న మంచుతునకలు…

విను, తోడేళ్ల భీషణమైన ఊళ వినిపిస్తోంది

విను, ఇప్పుడది పిల్లవాడి ఏడ్పులా ఉంది

గుడిసె కప్పు మీద గలగలమనే

ఎండుగడ్డి లోంచి దూసూకుపోతూ

కాంక్రీటు గోడల మీద దడదడ శబ్దం చేస్తూ

అలసిన దేశద్రిమ్మరి తలుపు మీద బాదినట్టు ఆ శబ్దం

 

వంటగదిలో భయంకరమైన చీకటి,

ఎలమి లేక ఏకాంతంగా మన వెనకడుగు…

ప్రియమైన, మనోజ్ఞమైన అమ్మా!

మాట నుడివి మౌనాన్ని ఛేదించు

తుఫాను రోదన నీ కనురెప్పల్ని

భారంగా మూసేసిందా?

రాట్నపు మృవైన రొద

నీకోసం జోలపాట పాడిందా?

 

నా యౌవన వసంతపు ప్రియురాలా!

నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!

మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం

మద్యం మనలో మోదాన్ని నింపుతుంది

దవ్వులలోని గువ్వలలాగా స్వేచ్ఛగా

అన్నీ మరచి గానం చెయ్

వేకువన వెలదులు తేటనీటి నదీతీరంలో

ఆలపించే పాటను పాడవా?

 

తుఫాను గాలికి కొట్టుకుపోతున్న నల్లని మేఘాలు,

వడిగాలుల్లో సుళ్ళు తిరుగుతున్న మంచుతునకలు…

విను, తోడేళ్ల భీకరమైన ఊళ వినిపిస్తోంది

విను, ఇప్పుడది పసివాడి ఏడుపులా ఉంది

నా యౌవన వసంతపు ప్రియురాలా!

నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!

మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం

మద్యం మనలో మోదాన్ని నింపుతుంది

 

రష్యన్ మూలం: అలెగ్జాండర్ పుష్కిన్

ఆంగ్లం: మార్తా డికిన్సన్ బియాంచి

తెలుగు సేత: ఎలనాగ

 

***

 

 

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us