మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

స్వరాంజలి-1

by Krishna Kumari Yagnambhatt June 23, 2021
written by Krishna Kumari Yagnambhatt

తొలి నాళ్లలో ఆటవిక నేపధ్యంగా వెలుగు చూసిన సంగీతం వేదాల ఆధారంగా దేవాలయాల కారణంగా సమాజంలో కొత్త రూపులో అడుగు పెట్టింది. ఈ సందర్భంగా మతంగ మహర్షి పేరు తప్పక స్మరించాలి. నేడు మనం వింటున్న అనేక రాగాల నేపధ్యం ఈ మహర్షి తనరచన అయిన బృహత్ దేశి ఆన్న గ్రంధంలో వివరించారు. వాటిని ఆయా స్థానిక పేర్లతోనే స్థిరపరచారు. ఉదాహరణకి ఆంధీ, కాంభోజ,మలహార్ ,సారంగ,మార్వ, సౌరాష్ట్ర, ఘుర్జరీ, గౌడ మొదలైన రాష్ట్రాల పేర్లు రాగాలుగా దర్శన మిస్తాయి.

 

కాలక్రమేణా సంగీతం అనేక మార్పులు, చేర్పులు చేసుకొని ఒక శాస్త్రంగా రూపు దిద్దుకుంది. క్రమంగా సంగీత శాస్త్రంలో గాయకులకు,వాగ్గేయ కారులకు , లక్షణ కారులకు ఒక ముఖ్య స్థానం ఏర్పడింది. అందునా ముఖ్యంగా వాగ్గేయ కారులకు వారికి గల అత్యంత విలక్షణ మైన ప్రతిభ కారణంగా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సంగీత రత్నాకర కర్త సారంగ దేవుడు వాగ్గేయకార లక్షణాలను చాలా విపులంగా చెప్పాడు. ఈ లక్షణాలన్నీ ప్రాచీన వాగ్గేయకారులలో కనిపిస్తాయి. వీరు తమ రచనలలో ఈ లక్షణాలను ఏ రకంగా ప్రదర్శించారు అన్నది గమనిస్తే వారి అపూర్వ పాండిత్యం మనని అబ్బురపరుస్తుంది. అయితే వీరు తమ పాండిత్యాన్ని ప్రజల మీద రుద్దలేదు . భావం ఎంత జటిలమైనా జనానికి అర్థం అయ్యే విధంగానే సామాన్యమైన భాషను ఉపయోగించి వారికి వేదాంతాన్ని సులువుగా అందించారు. ఇన్ని వందల సంవత్సరాల తరవాత కూడా ఆ కీర్తనలు నిలిచి ఉన్నాయంటే వారి భాష ఒకకారణం. కీర్తనలలో వారు చెప్పిన భావాలు భక్తి ప్రపూరితమైనవి. ఇది రెండవ కారణం.ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చోకుండా ప్రజల మధ్య తిరుగుతూ తమ కీర్తనలను గానం చేయడం వలన అవి జన సామాన్యానికి అందుబాటలో ఉండేవి. ఈ మౌఖిక ప్రచారం మూడవ కారణం. తమ రచనలలో వీరు ఉపయోగించిన పదబంధాలు, సామెతలు, నానుడులు, ఉపమానాలు నాటి నుంచి నేటి వరకు ప్రజల నోళ్లలో నిత్యం నానుతున్నవే . ఉదాహరణకి: ఎందరో మహాను భావులు.., నిధి చాలా సుఖమా … పలుకే బంగారమాయెనా…ఏ తీరుగా నన్ను దయ చూసేదవో.., బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే.., శాంతము లేక సౌఖ్యము లేదు వంటివి చెప్పుకుంటూ పోతే జీవితం సరిపోదు.

వాగ్గేయకారులకు గల ప్రత్యేక లక్షణాల కారణంగానే నేటికీ ఈ కీర్తనలు పదిలంగా ఉండడానికి దోహదప డ్డాయి.

 

‘శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం”

ఆనే తొమ్మిది భక్తి మార్గాలలో వీరు తమ రచనలను చేసి సమాజంలో ఒక కొత్త వరవడిని సృష్టించారు. కృష్ణమాచార్యులు, అన్నమయ్య, సారంగపాణి, క్షేత్రయ్య, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ,సదాశివ బ్రహ్మేంద్రులు మొదలైన వారు మాత్రమే గాక అనేక ఇతర వాగ్గేయకారుల గురించి, వారి రచనలలోని ప్రత్యేక అంశాల గురించి సోదాహరణ పూర్వకంగా ఈ వ్యాస పరంపరలో వరుసగా తెలుసుకొందాం. 13 వ శతాబ్దికి చెందిన కృష్ణమాచార్యుల వారు చరిత్ర కందినంత వరకు తొలి వాగ్గేయ కారుడు. అక్షరబద్ధమైన సాహిత్యం మనకు వీరితోనే మొదలైంది. సింహాచల నరసింహా స్వామికి అంకితంగా వీరు రచించిన “సింహగిరి వచనములు’ చాలా ప్రసిద్ధమైనవి. తెలుగు దేశంలో వచన రచనకు, భజన సంకీర్తన పద్ధతులకు వీరే ఆద్యులు. ఇందులో కొన్ని వచనాలు తాళానికి లొంగవు.

కానీ కాకువులో వచన కవిత్వం చదివే పద్ధతి ఉపయోగిస్తే ఆ వచనాలు బాగుంటాయి.అయితే పైన చెప్పినట్లు నవవిధ భక్తి మార్గాలలో వీరి రచనలు దొరకలేదు. కానీ వందనం, దాస్యం అనే భావాలు విరివిగా కనివిస్తాయి. ముఖ్యంగా వైష్ణవ భక్తి వీరి రచనలలో బాగా కనివిస్తుంది. కేవలం భక్తి వచనాలు చెప్పి ఊరుకోలేదు, సంఘంలో సాధారణంగా జరిగే అన్యాయాలు, అక్రమాల ను ఎత్తి చూపుతూ వీరు రాసిన వచనాలు సహజ సుందరాలు.దేవదేవునికి విన్నవించినట్లున్న ఈ వచనాలు చదువుతే వారి రచనలలో గల ఉత్తమ వాగ్గేయకారత్వం అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చూడండి.

 

“దేవా!ద్వయమునకు అధికారి ఎంతటి వాడు?

కోపము, శాంతము, నిర్లజ, ఇంద్రియ జయాపరుండు కావాలెం గాక

ద్వయాధి కారి తన్ను తానెరుగక దూషించు

కపటాచార డాంబిక పరుండు ద్వయాధి కారి యవునే?

ఇందులో కృష్ణమాచార్యుల వారి సామాజిక స్పృహ అర్థమవుతుంది కదా!

 

ఆ తర్వాత దాదాపు వంద సంవత్సరాల వరకు అక్షర బద్ధమైన ఎవరి కీర్తనలు లభించ లేదు. తొలి వాగ్గేయకారుడైన కృష్ణమాచార్యులకు ,పద కవితా పితామహుడైన అన్నమయ్యకి చాలా పెద్ద అగాధం ఉంది. ప్రతిభా వంతులైన వాగ్గేయకారులు లేరని చెప్పలేము కదా! మనకు వారి రచనలు లభించలేదు.కారణాలు మాత్రం మృగ్యం.

 

అన్నమయ్య రంగ ప్రవేశం చేసిన తర్వాత సంగీతం, సాహిత్యం ,భక్తి కట్టలు తెంచుకొని ప్రవహించింది. అంతవరకు సుషుప్తిలో ఉన్న పదాలను , భావాలను విరివిగా ప్రయోగించాడు అన్నమయ్య. దేశీ కవితను మళ్ళీ ప్రజల మధ్యన నిలిపాడు. నభూతో నభవిష్యతి అన్నట్లు తన కవితను అజరామరం చేశాడు అన్నమయ్య. తర్వాతి కాలంలో అన్నమయ్య ప్రభావం లేని కవితలు గాని వాగ్గేయ కారులు గాని లేరంటే అతిశయోక్తి లేదు. తర్వాతి కాలంలో ప్రసిద్ధులైన సారంగపాణి , క్షేత్రయ్య, త్యాగరాజు -అన్నమయ్య ప్రభావంలో మునిగిన వారే. కవితను సంగీతంలో సమాసం చేసి అతి మనోహరమైన వాగ్గేయకార సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన అన్నమయ్య పదాల అనంత రూపాన్ని తన రచనల ద్వారా సమాజానికి అందించడం మాత్రమే కాదు, భక్తి, సంగీతం, సాహిత్యం అనే త్రివేణి సంగమంలో ప్రజలను మునకలు వేయించాడు. పద లక్షణాలను వివరించడంతో పాటు లక్షణ గ్రంధాలను కూడా రచించాడు. ఎన్నింటికో ఉదాహరణలుగా రచనలు చేశాడు.

 

ఈ ఉదాహరణ చూడండి. రాగం- పాడి, ఆది తాళం లోని ఈ కీర్తన గమనించండి.

పల్లవి:          పాప పుణ్యముల పక్వ మిదెరుగరు

నా పాలిట హరి నమో నమో!

చరణం :        మానస వాచక కర్మంబుల

తానకముగా నీ దాసుడను

పూని త్రి సంధ్యల భోగ భాగ్యముల

నానా గతులను నమోనమో!

ఇందులో నవవిధ భక్తి మార్గాలలోని దాసత్వం గోచరిస్తుంది. ఇందులో కొన్ని పదాలు మనకీనాడు అర్థం కావు.

 

కానీ ఆ కాలంలో ఇవి సామాన్యులు మాట్లాడే పదాలే . సమాజం గాని, భాష గాని, జీవన విధానం గాని మార్పులకు లోను గావడం సహజం కదా ! అదే విధంగా వందనం అన్న భావనకు ఈ ఉదాహరణ చూడండి. రాగం: సామంతం, ఝంప తాళం.

 

పల్లవి:          నీ యంత వాడనా నేను నేరము లేమెంచెవు

యీ యెడ నిరుహేతుక కృప జూడు నన్నును

చరణం:         నిరతి నిన్నెరుగను నీవు నన్నెరుగుదువు

ధర యాచకుడ నేను దాతవు నీవు

వరుస యాచకుడ నేను వైకుంఠ పతివి నీవ

నరుడ నేను నీవు నారాయనుండవు.

 

అతి సులువు అయిన భావజాలం అన్నమయ్య సొంతం. అన్నమయ్య ప్రతీ పదం అత్యంత మనోహరమైన భావాలతో ఉంటాయి. వచ్చే సంచికలో మరి కొన్ని ఉదాహరణ లతో అన్నమయ్య పాండిత్యం తో బాటు భక్తి ప్రపత్తులు, వారి సామాజిక దృక్పథం విశ్లేషించుదాం. ప్రతిభావంతుడైన కవి విశ్వరూపం వీక్షించుదాం.

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తొలి తెలుగు సినీ కవి- శ్రీ చందాల కేశవదాసు వ్యక్తిత్వం

by Dr. Purshothamacharya M June 23, 2021
written by Dr. Purshothamacharya M

నిరంతర విశ్వకల్యాణ యజ్ఞభూమి అయిన మన భారతదేశఁలోకి ఇంగ్లీషువారే కాదు, వారికంటె ముందుగానే ప్రవేశించిన పోర్చుగీసు, ఫ్రెంచి, ఆఫ్ఘనిస్తాన్ దేశాలవారు కూడా మన దేశ సంస్కృతిని సాధ్యమైనంత ఎక్కువగా విచ్ఛిన్నం చేశారని చెప్పవచ్చు. దాని ఫలితంగా మన దేశ రాజకీయ రంగంలో విపరీత పరిణామాలు చోటు చేసుకొని సామాజిక వ్యవస్థపై దుష్ర్పభావాన్ని చూపడం మనకు తెలుసు. ఆ ప్రభావాన్ని తొలగించి, తిరిగి మన సంస్కృతి విలువల్ని పరిరక్షించడానికి జన్మించినవారిలో కవులు, కళాకారులు ఉన్నారు. ఎంతో బాధ్యతగా వ్యవహరించి పరోపకారం, త్యాగం వంటి లక్షణాలతో మానవత్వపు విలువలకు తిరిగి ఊపిరి పోశారు. అటువంటివారిలో ‘తెలంగాణ మునీశ్వరుడు’ అనదగిన శ్రీ చందాల కేశవదాసు చాలా ప్రముఖులు. ఆ మహనీయుడు తన నిర్మోహత్వంతో, కళావైదుష్యంతో, సేవా పరాయణతతో, తాత్త్విక చింతనతో తెలుగువారిని మేలుకొలిపి సత్యపరిశోధనా కరదీపికలను ముందుతరాలవారికి అందించారు.

Chandala Keshava Dasu

కేశవదాసు 1876 జూన్ 20న ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో పాపమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు చిన్న కుమారునిగా జన్మించారు. తండ్రి మరణించాక అన్నగారైన వెంకట్రామయ్య అన్నీ తానై తమ్ముడిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఉపాసనా విద్యను, రామమంత్రాన్ని ఉపదేశించాడు. తనవలె బ్రహ్మచర్యాన్ని పాటించవద్దని, చక్కని గృహస్థజీవితం గడుపుతూ ధార్మకి ప్రవర్తనను అలవరచుకొమ్మని బోధించి తపస్సుకు వెళ్ళిపోయాడు. కేశవదాసు అన్నగారి ఉపదేశాన్ని ఆదేశంగా స్వీకరించారు. సిరిపురం జమీందారు పిల్లలకు చదువు చెబుతూనే వారిని పృచ్ఛకులుగా చేసి అష్టావధానవిద్యను సాధన చేశారు. తిరువూరు ‘కాబోలు రామయ్య’ కూతురు చిట్టెమ్మను వివాహం చేసుకుని జక్కేపల్లిలో పొలాలు చూసుకుంటూ స్థిరపడ్డారు. కృష్ణాజిల్లా వత్సవాయి దగ్గరున్న దబ్బాకు పల్లిలోని సందడి నాగదాసు దగ్గర ఆధ్యాత్మిక విద్యను అభ్యసించారు. 1899లో నాగదాసు చేసిన భాగవత సప్తాహ స్ఫూర్తితో తాను కూడా భాగవత సప్తాహాన్ని 1907లో తమ్మరలో ప్రారంభించారు. కోదాడుకు దగ్గరగా ఉన్న తమ్మర గ్రామానికి వెళ్ళి నరహరి నరసింహాచార్యులుగారిని కలిసి ఆయన సహకారంతో సప్తాహం, అన్నదానం కార్యక్రమాలను విరివిగా చేపట్టారు. కేశవదాసులోని పాండితీప్రకర్షను, వాక్శుద్ధిని, భక్తి ప్రపత్తులను గమనించిన ఆచార్యులవారు కేశవదాసును కవిగా తీర్చిదిద్దారు. “సప్తమాలిక” అనే రచనలో కేశవదాసు కవితారంగంలోకి ప్రవేశించారు. ఆచార్యులవారి నుండి కేశవదాసు శ్రీ వైష్ణవ తత్త్వ రహస్యాలను, కవితా నిర్మాణ విశేషాలను, పౌరాణికరచనా లక్షణాలను క్షుణ్ణంగా అభ్యసించారు. దాసుగారు తన జీవితకాలంలో తమ్మరలోనే కాక దబ్బాకుపల్లి, తిరువూరు, భ్రదాచలం, బూర్గంపాడు, జగ్గయ్యపేట మొదలైన ప్రాంతాలలో మొత్తం 108 భాగవత సప్తాహాలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని జరిపి ప్రజలలో భక్తితత్త్వాన్ని, ధార్మిక గుణాన్ని, పరోపకారాభావాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. అందుకు తనలోని కళాప్రావీణ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించారు.

తమ్మరలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శిథిలమవుతున్న విషయాన్ని గమనించి దాని ఉద్ధరణకు కేశవదాసు నడుము బిగించారు. రాజగోపుర నిర్మాణం, రథశాల, వాహనాలు, నిత్యార్చనాసామగ్రి మొదలైనవాటి కోసం ఆయన నిరంతరం శ్రమించారు. “లవకుశ” హరికథాగానం కోసం కేశవదాసు జగ్గయ్యపేట వెళ్లినపుడు అప్పటి ప్రముఖ సంగీత విద్వాంసులు పాపట్ల లక్ష్మీకాంతయ్యగారితో పరిచయం ఏర్పడింది. దాసుగారు ఆయన్ని తన సంగీత గురువుగా ఎంచుకుని ఎన్నో సంగీతపు మెలకువలను నేర్చుకున్నారు. 1910లో ఇద్దరు కలిసి యాదగిరి గుట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు వెళ్ళి ధార్మిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలకు పునాది వేశారు. అక్కడే పాపట్లవారి సలహాతో కేశవదాసు ‘పరబ్రహ్మ పరమేశ్వర’ గీతాన్ని వ్రాయగా పాపట్లవారు దానికి కల్యాణి రాగంలో, రూపకతాళంలో బాణీ వేశారు.  పాపట్లవారు ఆ గీతాన్ని నాటక సంస్థల ప్రార్థనాగీతంగా మలచారు.

ధర్మప్రతిష్ఠాపనా మార్గ నిర్దేశం కేశవదాసు 1911లో నెల్లుట్ల జమీందారు రామనరసింహారావు సహకారంతో ‘కనక్తార” నాటకం రచించి వేలాది ప్రదర్శనలతో సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చారు. మైలవరం బాలభారతి నాటక సమాజంలో ‘ప్రాంపర్టు’గా చేరి రచయితగా ఎదిగి ప్రజాదరణ పొందారు. తన ఆధ్యాత్మిక గురువైన సందడి నాగదాసు జీవిత చరిత్రను హరికథగా వ్రాసి ఎన్నోసార్లు కథాగానం చేసి వచ్చిన ఆదాయాన్ని నాగదాసు కుటుంబానికే సమర్పించారు. ఒకవైపు హరికథలు, నాటక ప్రదర్శనలు సాగుతూండగానే ఆయన సూర్యాపేట, హుజూర్ నగర్, బేతవోలు, కందిబండ, జగ్గయ్యపేట మొదలైన చోట్లలో అవధానాలు చేయడం ప్రారంభించారు. నాటక ప్రదర్శనలు, కథాగానాలు, అవధానాలు, రచనల ముద్రణలు మొదలైన అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా లభించిన సొమ్మును అన్నదానాలకు, తమ్మర ఆలయ జీర్ణోద్ధరణ పనులకు వినియోగించారే కాని తన కోసం పైసా కూడా మిగుల్చుకోలేదు. బొంబాయి, మద్రాసు, కలకతా్త, బర్మా, రంగూను మొదలైన చోట్ల కనక్తార నాటక ప్రదర్శనలకు వెళ్ళి సమయోచితంగా ధార్మిక ఉపన్యాసాలు కూడా చేసేవారు. ఆయన చేస్తున్న కృషిని గమనించిన తమ్మర గ్రామవాసులు ఆయనను ‘తమ్మర రామదాసు’ అని సగౌరవంగా పిలిచారు.

1931లో కేశవదాసు జగ్గయ్యపేటలో ‘విరాటపర్వం” హరికథాగానం చేశారు. అప్పుడాయనకు శ్రీ ఎం.సీతారామానుజాచార్యులు వయొలిన్ తోను, శ్రీ అన్నావజ్జల రామమోహనశర్మ తబలాతోను సహకరించారు. కథాగానాన్ని శ్రద్ధగా విన్న సుప్రసిద్ధ కథారచయిత శ్రీ పాదకృష్ణమూర్తిగారు లేచి ఇప్పటికప్పుడే ‘అభినవ సూత’ అనే బిరుదును దాసుగారికి ప్రదానం చేశారు. ఆ సందర్భంలో నిర్వాహకులు దాసుగారికి అమూల్యమైన వజ్రపుటుంగరాన్ని తొడిగారు. ఆ ఉంగరంతో సహా డబ్బును, వెండి, వస్తువులను, విలువైన బట్టలను అమ్మి తమ్మర దేవాలయానికి పంపించారు. మరునాడు ఇంటికి వెళ్ళిన దాసుగారితో ఆయన భార్య ఎంతో ముచ్చటపడి రాత్రి ఇచ్చిన ఉంగరాన్ని చూస్తానన్నది. దాసుగారు విషయం చెప్పారు. ఆమె నిరాశపడి ‘అయ్యో! ఒక్కసారి కళ్ళారా చూసుకోనైతి గదా’ అనే బాధపడింది. అప్పుడు కేశవదాసు ‘పిచ్చిదానా! చూస్తే ఇంకా వ్యామోహం పెరుగుతుంది. ఎవరి సొమ్మో వారికే చేరింది. చూడకపోతేనే నిశ్చింత’ అన్నారు. ఎంతటి నిర్మోహం!

అప్పుడే సినిమా రంగంలోని చిత్రదర్శకులు హెచ్.ఎం.రెడ్డిగారి నుండి కేశవదాసుకు పిలుపు రాగా మద్రాసు వెళ్ళి ‘భక్తప్రహ్లాద’కు మూడు పాటలు రచించారు. ఇది విన్న దాసరి కోటి రత్నం అనే నటవిదుషీమణి 1935లో కేశవదాసును కలకత్తాకు పిలిపించుకుని తాను తీసే ‘సతీ అనసూయ’ సినిమాకు ఆయన చేత మాటలు, పాటలు రాయించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆయన అందుకున్న ఆరువందల రూపాయలను వెచ్చించి తమ్మర స్వామివారి కోసం రెండు చామరాలు, ఒక భూచక్ర గొడుకు కొని తెచ్చి స్వామివారికి సమర్పించారు.

దబ్బాకు పల్లి సమీపంలో ఉన్న‘పోలంపల్లి’కి కేశవదాసు వెళ్లి కళాభిమానులను కూడగట్టి ఒక నాటక సమాజాన్ని తయారుచేశారు. 1941లో అక్కడే ఆరునెలలపాటు ఉండి ‘కనక్తార’ నాటకాన్ని శిక్షణ యిచ్చి మూడుసార్లు టిక్కెట్లు పెట్టి ప్రదర్శింపజేసి వచ్చిన డబ్బును అక్కడి గ్రంథాలయానికి సమర్పించారు.

క్రమక్రమంగా కేశవదాసుగారికి కుటుంబ భారం పెరగసాగింది. సమస్యలు చుట్టుముట్టాయి. ఆదాయం సన్నగిల్లింది. ఇంతలో రజాకార్ల ఆగడాలు మితిమీరిపోయాయి. ఎవరి ఆస్తులకూ భద్రత లేకపోయింది. జక్కేపల్లిలోని దాసుగారి ఇంటివి, వస్తువులను, పుస్తకాలను దుండగులు దగ్ధం చేశారు. అయినా ధైర్యం వహించిన కేశవదాసు సకుటుంబంగా ఖమ్మం చేరుకున్నారు. పెద్ద కొడుకు కృష్ణమూర్తి సలహాతో ఆయన కుటుంబాన్ని తీసుకుని నాయకుల గూడెంలో స్థిరపడ్డారు. అప్పటి నుంచి కేశవదాసు పర్యటనలను తగ్గించినా ధ్యానం, వైద్యం, కథాగానం మానలేదు. కృష్ణమూర్తి అల్లోపతి వైద్యునిగా పనిచేయసాగాడు.

తిరువూరులో ఉన్నప్పుడు భద్రాచలం వెళ్ళే భక్తులు నీటికోసం పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ ఊరిలో ప్రత్యేకంగా ఒక బావి త్రవ్వించి, అక్కడే పందిళ్ళు వేయించి, నీళ్ళే కాకుండా భోజనవసతి కూడా ఏర్పాటుచేసిన కేశవదాసు ఔదార్యాన్ని ఇప్పటికీ అక్కడివారు గుర్తు చేసుకుంటారు. ఆయన త్రవ్వించిన బావిని ‘కేశవదాసుబావి’ అని పిలిచేవారు. ఇప్పుడది చారిత్రక చిహ్నంగా తిరువూరు బస్టాండు దగ్గర ఉన్నది. తిరువూరులో కేశవదాసు ఎంతోమందికి వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఆ సఁదర్భంగా ‘సర్వరోగ నివారిణి’ పేరుతో ఒక ఆయుర్వేదపు ఔషధాన్ని తయారుచేసి రోగులందరికీ ఉచితంగా ఇచ్చేవారు. అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఔషధాన్ని సామ్రాజ్యం అనే నర్సుకు అప్పజెప్పి వచ్చారు. అయితే ఆమె దాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టింది. ఈ సంగతి తెలిసి కేశవదాసు అక్కడికి వెళ్ళి ఆమెను ఏమీ కోప్పడకుండా పేదల బాధలను వివరించి చెప్పగా ఆమె పశ్చాత్తాపపడి తన వైఖరిని మార్చుకుని ఉచిత వైద్యంతో సాగిపోయింది. ఆయనలో అంతటి క్షమాగుణం,  పేదలపై ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి.

ఒకసారి కేశవదాసు బేతవోలు సంస్థానానికి వెళ్ళి ‘లవకుశ’ హరికథాగానం చేస్తూండగా ముడుంబై వేంకటాచార్యులు అనే వారితో పరిచయమైంది. కేశవదాసుగారి పెద్ద కొడుకైన కృష్ణమూర్తి దగ్గర కాంపౌండర్గా తాను చేరాలనుకుంటున్నట్లు ఆ ఆచార్యులు దాసుగారితో అన్నాడు. దాసుగారు ఆనందించి అతన్ని నాయకన్ గూడెంకు తీసుకువచ్చారు. ఆ విధంగా వేంకటాచార్యలు కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. ఒకసారి వేంకటాచార్యులు పొరపాటున ద్రాక్షారసం అనుకుని ‘హైడ్రోక్లోరైడ్’ త్రాగారు. అది విషద్రవం కనుక వెంటనే వికటించింది. తక్షణమే కేశవదాసు ఆయన్ని తీసుకుని సూర్యాపేటకు బయలుదేరారు. సూర్యపేట నుంచి ఖమ్మానికి వెళుతున్న చిట్టచివరి బస్సును ఆపి వెనక్కు మళ్ళించారు దాసుగారు. సూర్యాపేటలో తాను స్వయంగా దగ్గరుండి డా|| శర్మగారి చేత వైద్యం చేయించారు. ప్రత్యేకంగా ‘ప్రోసట్’ అనే ఇంజక్షన్ ను మద్రాసు నుంచి తెప్పించి చికిత్స చేసి ఆచార్యులవారికి ప్రాణదానం చేశారు. అదీ ఆయనలోని మానవత్వ లక్షణం.

సాధారణంగా కళాకారులు తాము సంపాదించే డబ్బుతో సంసార యాత్ర సాగించాలనుకుంటారు. కొంతమంది ఆస్తులు కూడబెట్టి మనవల కోసం దాచిపెతారు. క్రమక్రమంగా సంపాదించడం కోసమే కళాప్రదర్శనకు అలవాటుపడతారు. కాని ఇవేవీ కేశవదాసులో కనిపించవు. ఆదిశంకరాచార్యులు చెప్పినట్లుగా “దేయమ్ దీనజనాయ చ విత్తమ్’ వాక్యాన్ని చక్కగా సార్థకం చేసినవారు కేశవదాసుగారు. జక్కేపల్లిలో సొంత యింటి కోసం తెచ్చుకున్న కలపను, ఇతర సామగ్రిని సైతం దేవాలయానికి వినియోగించిన సుకృతి ఆయన. దేవాలయ రాజగోపురం పనులు డబ్బు లేక ఆగిపోతే తన భార్య చిట్టెమ్మగారి బంగారు గాజులను అమ్మించడానికి కూడా వెనుకాడలేదు. ఎలాంటి గడ్డు పరిస్థితులలో కూడా ఆయన ఎవరినీ చేయిచాచి యాచించలేదు. కళాప్రదర్సనతో మాత్రమే సంపాదించి దాన్ని సద్వనియోగం చేశారు. ఆయనలోని ఔదార్యానికి నిరాడంబరత తోడై ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ప్రకాశింపజేసింది. అందుకే ఆయన ద్రవ్యాభిలాషి, భోగాభిలాషీ కాలేదు.

కేశవదాసు దరహాసప్రియులు, సరస సంభాషణాచతురులు, చతురోక్తిలంపటులు. ఆయనకు కులమత విచక్షణ ఏ మాత్రమూ లేదు. హెచ్చుతగ్గులనేవి చిత్తసంస్కారాన్నిబట్టి ఏర్పడినవే కాని, కులాన్ని బట్టి, వృత్తినిబట్టి కాదని ఆయన భావన. అందుకే ఎప్పుడూ ఎక్కడా వివాదాలతో ఘర్షణ పడేవారు కాదు. జక్కేపల్లి దగ్గరున్న రాజుపేటకు చెందిన వెంకయ్య అనే హరిజనుడి బీదరికాన్ని చూసి ఆయన అతన్ని తన యింటికి తీసుకువచ్చి భోజనం పెట్టి సేవలు చేశారు. అష్టావధానాలలో అసూయాపరుల అలజడిని తన శాఁతవచనాలతో తొలగించగలిగే యుక్తిని పాటించేవారు. ఆయన మృదుభాషణతో ఎంతోమఁదిని ఆకర్షించేవారు. ఆయన మాట్లాడే విధానంలో తెలంగాణ పలుకుబడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కనుక కళాసాహిత్యరంగాల కృషిలో భాగంగా సామాజిక సేవాసక్తితో అన్నిప్రాంతాలను పర్యటించి వివిధ ప్రాంత భాషా సంప్రదాయాలను ఆకళింపు చేసుకుని సందర్భోచితంగా తన రచనల్లో వినియోగించేవారు. ఆయన సామాజిక కళారంగాలలో ఎంత చొరవగా, స్మితంగా వ్యవహరిస్తారో సభా కార్యక్రమాల్లో, పండిత సభల్లో అంత గంభీరముద్రను వహించేవారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్ని కష్టాలు పడినా ఎన్నడూ, ఎవరితోనూ చెప్పుకోలేదు. వాటి ఛాయను తన పిల్లలమీద పడనివ్వలేదు. అంతేకాదు, ఆయన ఏ సంస్థానాధీశుడినీ ఆ్రశయించలేదు. ప్రజలతోనే సాన్నిహిత్యాన్ని ఎక్కువగా ఏర్పరచుకున్నారు.

కవిత్వం, అష్టావధానం, హరికథాగానం, నాటక రచన, భక్తి కార్యక్రమ నిర్వహణ, వైద్యం, అన్నదానం, బీదలకు ఉపకారం, ఇవన్నీ ఆయన ఎంచుకున్న ఆదర్శమార్గాలు. ఏ ప్రక్రియయైనా పరుల కోసమే తప్ప స్వముఖాన్ని ఆశించి చేయలేదు. సృజనాత్మకత ప్రధాన లక్షణంగా కలిగిన సంగీత సాహిత్యాలను ఆయన ధన సంపాదన కోసం, వినోద కాలక్షేపాల కోసం వినియోగిఁచుకోలేదు. ప్రజాచైతన్య లక్షణానికి ప్రాధాన్యతనిస్తూ నూతన ప్రయోగాలు చేసి వాటికి నిండుదనం సమకూర్చారు. ధ్యానం, ఉపాసన, తపస్సులకు సేవాగుణాన్ని జోడించి జాతీయతాభావ పరిపుష్టికి అద్భుతమైన కృషిచేశారు. సప్తాహ నిర్వహణతో సమాజంని అన్ని వర్గాలవారిని ఒక్కచోటికి చేర్చగలిగారు. భక్తితత్త్వాన్ని, ధర్మప్రచారాన్ని ప్రస్థావించడానికి కవిత్వం ఒక బలమైన సాధనమని భావించి ఎన్నో భక్తి రచనలు చేశారు. ఆయనలోని భక్తితత్త్వానికి, తాత్త్విక చింతనకు బలమైన ఉదాహరణ ‘శ్రీకృష్ణతులాభారం’ నాటకం కోసం ఆయన వ్రాసిన ‘బలేమంచి చౌకబేరము’ పాట ఒక్కటి చాలు. ఈ పాట నాటకంలోనే కాక సినిమాల్లోనూ ప్రసిద్ధిని పొందింది. ఆయన రచనల్లో ఈ పాట ఒక్కటే ‘ఘంటసాల మాస్టారు’ పాడి దాన్ని అజరామరం చేశారు. కవి, గాయకులు పునీతులయ్యారు.

కేశవదాసుగారు ప్రతిదినం నిద్రలేచాక ధ్యానం, పూజాదికాలు అయ్యాకనే ఆహారాన్ని స్వీకరించేవారు. అన్ని కాలాలలోనూ చన్నీటితోనే స్నానం చేసేవారు. త్రికాలాలలో ధ్యానం, సంధ్య ఆరించేవారు. నియమనిష్ఠలతో పూజను జరిపేవారు. మధుమాంసాలను దరిజేరనీయలేదు. నశ్యం, ధూమపానం లాంటి ఏ అలవాట్లనూ దగ్గరికి రానివ్వలేదు. ‘పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః’ వలెనే ఆయన జీవితమంతా పరోపకారంలోనే గడిచిపోయింది. సంపూర్ణధన్యజీవితాన్ని అనుభవించి 14.05.1956 నాడు ఆయన తన ఇష్టదైవమైన సీతారామచంద్రస్వామివారిలో లీనమైనారు.

 

(20.6.2021 నాడు శ్రీ చందాల కేశవదాసుగారి 145వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఇది.)

రచన

డా. ఎం. పురుషోత్తమాచార్య

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖా స్వరూపం

by Cheedella Seetha Lakshmi June 23, 2021
written by Cheedella Seetha Lakshmi

లేఖా స్వరూపం
————————–
‘లిఖ్’ ధాతువునుండి లేఖ ఉద్భవించింది అనుకుంటే ‘లిఖ్’ అంటే వ్రాయడం అని అర్థం.ఏది రాసినా లేఖ అవుతుందా? ఎట్లా రాసిన లేఖ అవుతుందా? అంటే కాదు. దానికి కొన్ని నియమ నిబంధనలున్నాయి.

పూర్వకాలంలో ఒక విషయాన్ని ఇతరులకు తెలియజేయాలంటే మనిషి చేత కబురు పంపేవారు.అప్పుడు ఈ తపాలా సౌకర్యం గాని,వాహన సౌకర్యం గాని లేవు.కాబట్టి వారికి నమ్మకమైన మనిషితోనే సమాచారాన్ని తెలియనంపేవారు.ఒకరి అభిప్రాయం మరొకరికి తెలియజేయడానికి కేవలం మానవులే కాక రాయబారం నడపడానికి హంసలు,చిలుకలు,
పావురాలు కూడా వాటివంతు కార్యాన్ని నిర్వహించాయని చెప్పడానికి గ్రంథాలే సాక్ష్యం. కాలక్రమంలో అనేక సదుపాయాలు, 1954 సంవత్సరంలో మన దేశంలో పోస్టల్ వ్యవస్థ
సమకూరాక ఉత్తర ప్రత్యుత్తరాలు విరివిగా
కొనసాగుతున్నాయి.

లేఖ నిర్వచనం

లేఖ అనగా “ప్రత్యక్షంగా లేని మనిషికి పరోక్షంగా
తన మనోగత అభిప్రాయాన్ని వ్రాసి పంపడం లేదా తెల్పడం” అని నిర్వచనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా లేఖ ఆత్మకథా రచనకు సంబంధించిందే అని చెప్పాలి.

చారిత్రిక ఆధారాలు పరిశీలిస్తే రాజ్యాంగపరమైన లేఖలను శాసనాలు తయారు చేయడంలోని విధానాలను తెలియచెప్పే అంశంలో
చాణుక్యుడు తన అర్థశాస్త్ర గ్రంధంలో
లేఖా లక్షణాన్ని విపులంగా వివరించాడు
” రాజుగారి ఆజ్ఞను జాగ్రత్తగా విని ఆ ఆజ్ఞ లోతుపాతులను, పూర్వాపరాలను,లక్ష్యాన్ని చక్కగా గ్రహించి సంక్షిప్తంగా రాయడానికి పూనుకొనవలెను. అన్య దేశపు రాజునకు ఉత్తరం వ్రాయునప్పుడు మర్యాదకరమైన భాషచే అతని రాజ్యమును,అతని సంపదను,వంశ క్రమమును,అతని పేరు ప్రస్తావించవలెను. లేఖను సర్వసామాన్యము,గౌరవనీయుడయిన
వ్యక్తికి వ్రాయునప్పుడు
అతని దేశమును,
పేరును మర్యాద వాచకములతో జోడించవలెను.
ఎవరికి ఆజ్ఞ జారీ చేయబడునో,అతని వంశము,కులము,
సంఘంలో అతని స్థానము,వయస్సు,
విద్యాప్రమాణం, వృత్తి
ఆస్తిపాస్తులు,
గుణగణాలు,
రక్తసంబంధం మొదలగువన్ని లేఖ ప్రారంభంలో సంబోధనా పద్ధతిలో వ్రాసి,కాలాన్ని,స్థలాన్ని తెలియపరుస్తూ ఆజ్ఞ
లేక ఉత్తరం ఎవరికి వ్రాయబడుచున్నదో
అతని హుందాకు తగిన స్వరూపములో
రాజుగారి భావము స్ఫుటముగా అవగాహన అగునట్లు లేఖకుడు లిఖించవలెను.
ఉన్నత స్థాయిలో గంభీరమైన సులభశైలిలో ,
స్వచ్ఛంగా,
అరమరికలు లేకుండా రాజుగారి అభిలాషను,ఎదుటి
వారి కర్తవ్యమును ఖచ్చితంగా ప్రదర్శించెడి మృదువైన భాషను ,పదజాలాన్ని ప్రయోగించి లిఖించడమే రాజ శాసనాల్లోని ప్రత్యేకతలు. విషయాలను,సమస్యలను వాటి అవసరాన్ని బట్టి ఒక క్రమ పద్ధతిలో రచింపవలెను.అభిప్రాయమును సూటిగా ఎదుటివాని హృదయమునకు తగులునట్లు సమస్యలకు సంబంధించిన కారణాలు,
ఉదాహరణలు అవసరమైతే చిత్ర పటాలతో సహా స్పుటమైన పలుచని గానటువంటి పదములను అవసరమైన చోట వాడవలెను. తృప్తికరమైన ఫలితాన్ని లభించునట్లు మిక్కిలి సొగసైన విధంగా భావమునకు తగిన పదములనుపయోగింపవలెను.”
రాజ్యాంగపరమైన అంశానికి సంబంధించినదైనా లేఖా లక్షణాన్ని ఎంతో చక్కగా వివరించాడు కౌటిల్యుడు.
ఉత్తరం రాసేటప్పుడు సంబోధన,స్థలము,
కాలము మొదలైనవి సూచించాలని చెప్తూ అభిప్రాయాన్ని సూటిగా ఎదుటివాని హృదయానికి తగిలేట్లుగా వ్యక్తం చేయాలని చెప్పాడు.
లేఖా స్వరూపాన్ని వివరిస్తూ లేఖల్లో వ్రాసే
భాష కూడా భావానికి తగిన పదాలను వాడి
సులువుగా అర్థం చేసుకునే విధంగా వుండాలన్నాడు. విషయాన్ని బట్టి పేరా విభాగాన్ని కూడా సూచించడం ఈ లేఖలో వివరింపబడింది. ఈ లక్షణాలన్ని నేటి లేఖా స్వరూపాన్ని వివరించడం చూస్తున్నాం.

మడికి సింగన్న తన”సకలనీతి సమ్మతం” లో లేఖ గురించి చెబుతూ “ఎవరిదగ్గరి నుండి వచ్చినా సరే అనాదరణ చేయక లేఖను పరిశీలించినట్లయితే సకల విషయాలు తెలుసుకోవచ్చునంటాడు.అంటే లేఖ వలన రహస్యాలు తెలిసే అవకాశం ఉంది.

ఏ నిఘంటువులో కూడా లేఖకు సరి అయిన నిర్వచనం ఇవ్వలేదు.”ఆంధ్ర వాచస్పత్యము” నిఘంటువులో లేఖ అనగా “రేఖ,లిపి,వ్రాత,కమ్మ,చీటి,జాబు,లెటరు, ఇచ్చిపుచ్చుకోలు పత్రము,ఉత్తరము అనే అర్థాలున్నాయి.

బ్రౌన్ ఇలా చెప్పాడు.

A letter of correspondence. Also a post mail of a letter bag – a Reply – అని నిర్వచించాడు.

‘బ్రిటానియా ఎన్ సైక్లోపీడియా’ లో లెటర్ ” A written or printed communication from one person to another. especially
a message longer than a note, an epistle”
అని నిర్వచించబడింది.
ఎన్ సైక్లోపీడియా-USAలో
letter గురించి నిర్వచిస్తూ “A communication in
writing or printing
addressed to a person or no.of
persons” అని వుంది.

“లేఖ ఒక హృదయం నుండి సుఖదుఃఖాలను రెండో
హృదయానికి అందించే అనాసక్త దూత” అని దోనేపూడి రాజారావు అన్నారు.

ఒక ప్రసిద్ధ ఉర్దూకవి లెటర్ గురించి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఈ విధంగా అన్నాడు.
” ఆద్మీ పెహచానా జాతాహై
సియాఫా దేఖ్ కర్
ఖద్ కా మజ్మూ
భాక్ లేతేహై లిఫాఫా దేఖ్ కర్”
మనిషి ముఖం చూడగానే వాడి తత్వాన్ని తెలుసుకున్నట్లు ఉత్తరాన్ని చూడగానే ఎవరు ఎక్కడి నుండి
వ్రాశారు అన్న విషయాన్ని
తెలుసుకోవచ్చును.
సంజీవదేవ్” ఉత్తరాలు కేవలం పాఠ్యగ్రంథాల్లోని పాఠాలలాగా భోగట్టా ప్రధానంగా మాత్రమే ఉంటే ఎండుగా,నీరసంగా వుంటవి.వ్యక్తిగత విశేషాలుంటేనే అపరోక్షంగా కాక పరోక్షంగా ఇన్ఫర్మేషన్ అందజేయబడుతూండాలి కదూ! వినోదం కూడా విజ్ఞానం” అని అంటాడు.
ఉత్తరం ఎట్లుండాలో చలం రాసిన “ప్రేమ లేఖలు” లో ఇలా” చక్కని లేఖలు రాయాలంటే,అందులో వాజ్మయంలో విలువగల లేఖ రాయాలంటే ఎంత సంస్కారం,ఎంత విశాలమైన విద్య,జ్ఞానం,ఆత్మ ఔన్నత్యం వుండాలి” అనడంలో ఉత్తరం ఎట్లా ఉంటే బాగుంటుందో చక్కగా వివరించాడు.

లేఖకు చాలా పేర్లున్నాయి. ఉత్తరం,కమ్మ,లెటర్,
చీటీ,జాబు,కబురు.
పూర్వకాలంలో తాటాకు పైన రాసేవారు కాబట్టి కమ్మ అన్నారు.కమ్మ అంటే తాటాకు అని అర్థం. ఉత్తరం దక్షిణానికి వ్యతిరేకం.శ్రేష్టమైనది అని అర్థం.బదులివ్వడం అనే అర్థంలో ఉత్తరం,జవాబు,జాబు అని వాడారు.కబురందిందా,జాబు రాశాడా అని వాడుతుంటాం.అడిగిన విషయానికి సమాచారం వ్రాసి పంపడం,జవాబు వ్రాయడం కాబట్టి జవాబే జాబు గా మారింది.ఖబర్ అనేది ఉర్దూ పదం.ఖబర్ అంటే వార్త ఉర్దూ ప్రభావంచేత ఖబరే కబురుగా మారింది. కవర్ లోపల రహస్య విషయాలుండడం వల్ల కవర్ అందిందా అనే మాటను వాడుతారు. లెటర్ ఆంగ్ల పదం ఈ రకంగా వ్యవహారంలో లేఖ పలు నామాలతో వున్నప్పటికీ ఇవన్నీ లేఖకు పర్యాయ పదాలే అనొచ్చు.

పలువురు విజ్ఞుల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తేలిన అంశమేమిటంటే లేఖ అంటే వార్త పంపడం లేదా ఒక విషయాన్ని అభివ్యక్తం చేయడం,మనసులో ఉన్న అభిప్రాయాన్ని రెండో హృదయానికి అందించే అనాసక్త దూత అని తెలుస్తుంది.దాపరికం లేకుండా ఎదుటివారికి తన మనసులో అంశాలను స్వేచ్ఛగా వెల్లడించేవి లేఖలు. ప్రత్యక్షంగా లేని మనిషికి పరోక్షంగా మనోగత అభిప్రాయాన్ని రాసి పంపడమే లేఖ.

లేఖా పద్ధతులు

లేఖ రాయడంలో కొన్ని పద్ధతులున్నాయి.
పూర్వకాలంలో రాజులకు వ్రాసేటప్పుడు శ్రీ మన్మహారాజ,
గండభేరుండ అంటూ వారి బిరుదులతో సంబోధించేవారు.
పెద్దలకు వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి,బ్రాహ్మణులకు గోత్రం,వంశం మొదలైన వాటితో సంబోధించి వ్రాసేవారు.పురుషులకు బ్రహ్మశ్రీ,వేద మూర్తులయిన అని పునిస్త్రీలకు శ్రీ మహాలక్ష్మీ సమానులైన అని విధవలకు గంగా భాగీరథీ సమానులైన అని సంబోధించేవారు.
నాడు,నేడు చిన్నవారిని ‘చిరంజీవి’ అని సంబోధించడం పరిపాటి. పెద్దలకు వారి వారి బిరుదనామాలతో
వరుసతో గౌరవంగా పాదపద్మాలకు నమస్కారమని ఎంతో మర్యాదగా ఉత్తరాలు వ్రాసేవారు.

అధునాతన కాలంలో ఎన్నో కొత్త పద్ధతులతో కొత్త సంప్రదాయ రీతిలో నూతనత్వాన్ని సంతరించుకుని విరాజిల్లుతోంది నేటి లేఖ.
ఇప్పుడు సామాన్యంగా ఒకే విధమైన లేఖలు వస్తున్నాయి.సంబోధన అప్పటి వలె దీర్ఘంగా, బిరుదనామాలతో లేకుండా చిన్న చిన్న సంబోధనలతో లేఖలు వ్రాయడం జరుగుతుంది.
ఆ కాలంలో ఉత్తరం చివర తేదీ రాసేవారు.ఇప్పుడు కుడి చేతి వైపు తేదీ, వ్రాసేవారి చిరునామా, ఎడమ వైపు ఎవరికి వ్రాస్తారో వారిని సంబోధిస్తూ ఉత్తరాలు వ్రాస్తున్నారు.ఇది పాశ్చాత్య పద్ధతి.
అంటే లెటర్ చూడగానే ఎవరు ఎవరికి,ఏ రోజు రాసారో తెలియచెప్పడం నేటి పద్ధతి.తరువాత విషయవివరణ,చివరికి ముగింపు ఉంటుంది.

ఈ శతాబ్ద ప్రారంభం లో సాహిత్య పత్రికలలో లేఖాసాహిత్యం బాగా సాగింది.
పత్రికలలో అనేక విషయాలుంటాయి.
వాటికి సంబంధించిన ఉత్తరాలు కూడా పాఠకులు వారి అభిప్రాయాలను సంపాదకులకు తెలియచేస్తారు.
ఆ కాలంలో లేఖలు లేని పత్రికలు లేవనడం నిర్వివాదాంశం.పత్రికలే కాక రేడియో లోనూ,టీవీ లోనూ కూడా ఉత్తరాలకు ప్రత్యేక స్థానముంది.
వ్యాసము,కథానిక,
నవల మొదలైన వివిధ ప్రక్రియలపై పాశ్చాత్య ప్రభావమున్నట్లే లేఖా రచనలో కూడా పాశ్చాత్య ప్రభావం కనిపిస్తుంది.జాతీయ,అంతర్జాతీయ రీతిలో ఎన్నో లేఖలు ఇప్పటికీ వస్తున్నాయి.
ఏ విషయం తెల్పడానికైనా లెటర్ అత్యవసర సాధనంగా,మనిషి జీవితంలో ఒక అంతర్భాగంగా స్థానమేర్పరుచుకుంది.
విషయాలు తెలుసుకోవడం,తెలియ చెప్పడం లేఖల పరమ ఉద్దేశ్యం.
క్షేమ సమాచారాలు మొదలుకుని నిత్యజీవితంలో ఎన్నో విషయాలకు సంబంధించిన అంశాలకే కాక రాజకీయంగానూ,
సాంఘికంగా పలు కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లోనూ లేఖలు ప్రముఖ ప్రయోజనాన్నే
అందిస్తున్నాయి.
కొందరు దినచర్యలో ఒక భాగంగా లేఖలు వ్రాయడం,చదవడం
కూడా చేస్తారు.ఈ విధంగా లేఖలకున్న విలువ అపారం.

లేఖల్లో సాంఘీక,రాజకీయ,
ఆర్ధిక,తాత్విక మొదలైన ఎన్నో విషయాలు వారి వారి అభిప్రాయాలు ప్రస్ఫుటమవుతాయి.కొందరు బయటికి బాహాటంగా చెప్పలేని విషయాలను వారి ప్రియమిత్రులకో,లేక వారి ముఖ్యులకో అనేక విషయాలను వెల్లడిస్తారు.దీని వలన
వారి వివేచనాశక్తిని తెలుసుకోవచ్చును.
అంతేకాక లేఖల్లో ఎన్నో సాహిత్యాంశాలు కన్పిస్తాయి.అందు
వలన సాహిత్యములో లేఖలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చును.
భాషా విషయకంగా గానీ,వస్తు విషయకంగా గానీ,లేఖలు కొన్ని ప్రపంచ సాహిత్యంలో అగ్రశ్రేణి
నాక్రమించాయి.

“టెలిఫోన్ పుట్టకముందు సమాచార వాహికలు లేఖలే.ఆ లేఖల్లో వ్యక్తి గతాంశాలుండొచ్చు.
సమకాలీన,సామాజిక,సాంస్కృతిక,సాహిత్య సంబంధి వివిధ విషయాలుండొచ్చు.
విద్వాంసులు,
రచయితలు,
కళాకారులు పరస్పరం రాసుకునే లేఖావళి సాహిత్య శ్రేణుల్లోకే వస్తుంది.అయితే ఆయా లేఖల అర్హతను బట్టి అంచనా వేసుకోవాలి”అని అంటారు ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు.

లేఖాసాహిత్యం పూర్వరంగం
————————

మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో వెలువడిన మొట్టమొదటి లేఖ ఆచార్య నాగార్జునుడు రాసిన”సుహృల్లేఖ” తన మిత్రుడైన యజ్ఞశ్రీ శాతకర్ణికి ప్రాకృతభాషలో రాయబడింది.
సంస్కృత సాహిత్యంలో కూడా అక్కడక్కడా లేఖలు కన్పిస్తాయి.మహాకవి కాళిదాసు రాసిన “అభిజ్ఞాన శాకుంతలం”లో తామరాకుపై గోటితో శకుంతల తన భర్తకు లేఖ రాసినట్లు తెలుస్తుంది. సంస్కృత ప్రబోధచంద్రోదయంలో ద్వితీయాంకంలో మహామోహునికి మదనుడు పంపిన లేఖ వచనంలో ఉంది.
ప్రాచీన తెలుగు సాహిత్యంలో కూడా లేఖలు కన్పిస్తాయి. పింగళి సూరన “ప్రభావతీ
ప్రద్యుమ్నమ్” కావ్యంలో తృతీయాశ్వాసంలో ప్రద్యుముని ఉత్తరం వుంది.
ప్రాచీన కావ్యాల్లో అక్కడక్కడా లేఖలు దర్శనమిచ్చినప్పటికీ ఆధునిక తెలుగు సాహిత్యంలో లేఖలకు ప్రముఖ స్థానముంది.
కావ్య గమనానికి దారితీయడానికి లేఖలు మంచి ఉపయోగకారి.ఆధునిక సాహిత్యంలో నవల,కథల్లో ఉత్తరాలను బాగానే ఉపయోగించుకున్నారుకేవలం లేఖాత్మకమైన సాహిత్యం వెలువడడం విశేషం.

గోపీచంద్ రచించిన “పోస్టు చేయని ఉత్తరాలు” “ఉభయ కుశలోపరి” ,తిరుపతి వెంకటేశ్వరకవి రచించిన” గీరతం” తెలంగాణా తీరు తెన్నులు’,బోయిభీమన్న రాసిన” జానపదుని జాబులు” ,మిత్తింటి మందేశ్వరరావు గారి “లేఖా ప్రబంధం”,
చలం “ప్రేమ లేఖలు”,కె.యల్.
నరసింహారావు రాసిన”నాన్నకు జాబులు”, గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన “ప్రేమ లేఖలు”,మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ‘దూరం” మొదలైన రచనలు లేఖాత్మకమైనవిగా వెలువడ్డాయంటే సాహిత్యంలో లేఖకు గల ప్రాధానత తెలుస్తుంది.

ప్రముఖ సాహితీ వేత్తలకు సంబంధించిన ఉత్తరాలు పుస్తక రూపంలో వెలువడడం విశేషం.లేఖల్లో మనోగతాభిప్రాయలే కాక ప్రముఖ సాహితీవేత్తల వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు.

” వ్యక్తిగత పరిధిని దాటినప్పుడు లేఖలకు సామాజిక విలువలు ఏర్పడి ఆ లేఖలు మొత్తం సమాజంలోని వ్యక్తులందరికీ చెందుతాయి.అందుకే ఇటువంటి లేఖలను ప్రచురించడం జరుగుతుంది.
ఈ లేఖలకున్న చారిత్రక,రాజకీయ,
సాంఘిక,సాంస్కృతిక విలువలు వాటిని వ్యక్తిగతం నుండి సాధారణం చేస్తాయి.అవి మనందరి సొత్తు అవుతుంది” అంటారు డా.డి.చంద్రశేఖర రెడ్డి.

ఒక్క మాటలో చెప్పాలంటే లేఖల్లో స్పృశించని,ప్రస్తావించని అంశాలే లేవు.సాంఘికోద్యమాలు,సాంప్రదాయ విలువల పునరుద్ధరణ,రాజకీయఆర్థిక విషయాల ప్రస్తావన,పరదేశీయుల సాహిత్యం,వారి విమర్శలు మొదలైన విషయాలెన్నో చోటు చేసుకున్నాయి.
అన్ని రంగాలను తనలో కలుపుకున్నా సాహిత్య పరంగా ప్రాధాన్యత కలిగిన లేఖలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను చాటుకున్నాయి.
విమర్శ రంగానికి కూడా లేఖలు దోహదం చేశాయంటే అతిశయోక్తి కాదు.

ఆంగ్ల సాహిత్యంలో లేఖారచనమొక ప్రక్రియ.కవులు రాసిన లేఖలను సేకరించి గ్రంథంగా ప్రకటించడమనే పద్ధతి ఆ భాషలో ఉంది.

నేటి ఆధునిక కాలంలో మారిన లేఖల స్థితి

మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించి ప్రపంచాన్నంతా “గ్లోబాల్ విలేజ్’ గా మార్చేశాడు.కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఆధునిక జీవన విధానాన్నే అనూహ్యంగా మార్చి వేశాయి.ప్రపంచంలో ఏ మూలకున్నా ఒకటి,రెండు క్షణాల్లో మాట్లాడుకోగలుగుతున్నాం.
ఇది హర్షించదగిన పరిణామమే అయినా ఒకప్పటి మధుర భావాలు,గతస్మృతులుఅనుబంధాలు,ఆత్మీయతలు,ఇవాళ మనిషి కోల్పోతున్నాడు.
మానవ సంబంధాలు కృత్రిమంగా,స్వార్థంగా మారిపోతున్నాయి.ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మనిషి ఎంతో అభివృద్ధి పథంలో పయనించినా మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి.ఎదుటి వ్యక్తితో మాట్లాడే తీరుబాటు లేకుండా పోతుంది. ఒకప్పుడు ఒక లేఖ కోసం ఒక మిత్రునిదో,ప్రియునిదో,ప్రియురాలిదో,అన్నదో,చెల్లిదో,తండ్రిదో – ఇలా రకరకాలుగా మనవాళ్ళు రాసే ఉత్తరం కోసం ఎదురుచూస్తూ వుండేవాళ్ళం.ఆ ఎదురు చూపుల్లో ఎంతటి మధురానుభూతి,ఎంత తీయని ఆత్మీయత,అనుబంధాలు దాగి ఉన్నాయో మాటల్లో చెప్పలేం.
ఒక లేఖ మనిషికి మనిషికి మధ్య మానసిక బంధాన్ని పెంచుతుంది.అందు
లోని తీయని మాటలు మనిషికి ఊరటనిస్తాయి.
ఆ మనిషి మన గురించి ఆలోచిస్తున్న తీరును భద్రంగా మనసుల్లో అలాగే పట్టి ఉంచుతాయి.ఇదంతా లేఖల గొప్పతనం.చరవాణి,అంతర్జాలం మహిమ వల్ల నేడు వ్యక్తిగత లేఖలు,సాహిత్యపరమైన లేఖలు బాగా తగ్గిపోయాయి అని చెప్పవచ్చు. అయితే వ్యక్తిగత ఉత్తరాలు పోస్ట్ చేయడం తగ్గిపోయినా దూరదర్శన్,
ఆకాశవాణి, సామాజిక మాధ్యమాలలో మరియూ పత్రికా రంగంలో అభిప్రాయమాలికలుగా ఉత్తరాలు నేటికీ
కొనసాగుతూనే ఉన్నాయి.
చరవాణిలో ఎప్పటికప్పుడే మెసేజ్ లు అంటే మనోగతాభిప్రాయాలు తెలియజేస్తూనే వున్నారు.

—1916 లో త్రిపురనేని రాసిన లేఖ.—

స్వగతం

ప్రముఖ సాహితీ వేత్తలు “చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, కందుకూరి వీరేశలింగం పంతులు,వేదం వేంకటరాయ శాస్త్రి,గురజాడ అప్పారావు,కట్టమంచి రామలింగారెడ్డి,త్రిపురనేని రామస్వామి చౌదరి,గుడిపాటి వేంకట చలం,దువ్వూరి రామిరెడ్డి,నార్ల వేంకటేశ్వర రావు,సంజీవదేవ్,దేవరకొండ బాలగంగాధర తిలక్,రాచమల్లు రామచంద్రారెడ్డి,
గుంటూరు శేషేంద్రశర్మ” గార్ల లేఖలను పరిశీలించి “తెలుగులో లేఖా సాహిత్యం” అనే అంశం పై ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పి.హెచ్.డి., చేశాను. గ్రంథ రూపంలో కాక వివిధ సంచికల్లోనూ,వ్యక్తుల సేకరణలోను మరెన్నో లేఖలున్నాయి.వాటి నన్నింటిని సేకరించి ప్రచురించాల్సిన అవసరముంది.
సాహిత్య కళాపరమైన లేఖలే కాక ఇతరంశాలతో కూడిన లేఖలపై కూడా పరిశోధన జరగాల్సిన అవసరముంది.
ఆనాటి భాష ,సంస్కృతి,వారి ఉద్దేశ్యం,వారి భావాలు లేఖల ద్వారా తెలుసుకునే అవకాశం వుంది.

గురజాడ అప్పారావు “నాది ప్రజల ఉద్యమం” అని చెప్పుకున్నాడు తన లేఖలోనే.
ఒక రకంగా చెప్పాలంటే లేఖా సాహిత్యం సామాజిక,సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతుంది. తెలుగు సాహిత్య విమర్శకు ఒక ప్రాథమిక అవస్థను కల్పించింది.ఆధునిక యుగంలో భాగంగా ఎన్నో ప్రక్రియలు పుట్టుకొచ్చాయి.
ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులొచ్చాయి.
ఇలాంటి మార్పులు ఒకరినొకరు స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి,
సాహిత్య విలువలు,సాంఘిక విషయాలు ప్రచారం చేసుకోవడానికే 20వ శతాబ్ది ఆరంభ దశలో ఈ లేఖా సాహిత్యం గణనీయమైన పాత్రను పోషించింది.చర్చలు,వాదోపవాదాలకు తెరతీసింది.
విమర్శనాత్మకత,సృజనాత్మకత అనే రెండు లక్షణాలను సంతరించుకుని లేఖాసాహిత్యం ఒక ప్రత్యేక ప్రక్రియగా తెలుగు సాహిత్యంలో విరాజిల్లుతోంది.
————————–

June 23, 2021 6 comments
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కథానిలయం ‘కారా’తో

by డా. టి. సంపత్ కుమార్ June 23, 2021
written by డా. టి. సంపత్ కుమార్

ఉపోద్ఘాతం

శ్రీకాకుళం నుండి ఓ సాహితీ మిత్రుడు శుక్రవారం, జూన్ 4, 2021 ఉదయం పదకొండు గంటలకి నాకో సంక్షిప్త సందేశాన్ని సెల్ ఫోన్లో పంపించాడు. అక్షరాలే కొన్నే అయినా బాధాకరమైన బరువైన అక్షరాలవి. “శ్రీ కాళీపట్నం రామరావు గారు ఈ ఉదయం ఎనిమిది గంటలకు స్వర్గస్తులయ్యారు”. ఐదు నిమిషాలు అలాగే కూచుండిపోయాను. ఎన్నో విషయాలు ఒక్కసారే గుర్తుకొచ్చాయి. నేను మొదటిసారి కారా గారిని దిల్లీలో కలవడం, ముచ్చటించడం, తరువాత సాహితీ సమావేశాల్లో మళ్ళీ దిల్లీలోనే కలవడంతో కొంత పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పటికి నాకు పరిచయంలేని కారా గారి కథల్ని చదవడం మొదలుపెట్టాను. కథా నిలయం ఆలోచనల గురించి దిల్లీలో నివశిస్తున్న సాహితిప్రియుల చెవుల్లో పడింది.

నా మొదటి కథా సంకలనం “లియో సా” కి విశాఖపట్నంలో ఉన్న జ్యేష్ట లిటరరీ ట్రస్ట్ వారు 2001 లో పురస్కారాన్ని ప్రకటించారు. తీసుకోడానికి వైజాగ్ వెళ్ళినప్పుడు నేనూ నా జీవిత బాగస్వామి శ్రీకాకుళం వెళ్ళి మాష్టారిగారితో కథానిలయం కప్పుకిందే ఓ దినం గడపడం మాకు తియ్యటి అనుభూతి. వందల లభ్దప్రతిష్థులైన రచయితల వేలకథల్ని చదవకుంటేనేం. ఆ కథలని, పాత సంచికలని, సంకలనాలని  స్పృశిస్తూ మా చుట్టూ ఆవరించే ఉన్న గాలిని పీలుస్తూ కారా గారి ఆత్మీయత జల్లుల్లో తడిసిపోతు గడిపిన ఆ ఘడియలు ఇంకా మాకు తాజాగానే ఉన్నాయి.

దిల్లీ చేరుకొన్నాక కథా నిలయం అనుభవాన్ని మాకే పరిమితం చేసుకోకుండా నలుగురితో పంచుకోవాలని ఆంధ్రా అసోసియేషన్ అప్పట్లో ప్రచురించే తెలుగు వాణి అనే త్రైమాస పత్రికకి వ్యాసం రాసాను. సరిగ్గా ఇరవై ఏళ్ల తరువాత, కారాగారి మరణాంతరం ఆ వ్యాసాన్ని (తెలుగు వాణి, ఆగష్ఠు – అక్టోబర్ 2001) మయూఖా అంతర్జాల పత్రికవారు పునర్ముద్రించడానికి ఒప్పుకోవడంతో ఈ వ్యాసం పాఠకులకి కథా నిలయానికి ఒక బేస్ లైన్ (2001) గా తోడ్పడి, (కింది ETV లింక్  క్లిక్ చేస్తే కథా నిలయం ప్రస్తుతం ఎంత ముందుకెళ్లిపోయిందో తెలుస్తుంది.) గత ఇరవై ఏళ్లల్లో నిలయం ఎంత పురోగతి సాధించిందో బాగా అర్ధమవుతుంది. కారాగారి ఉచ్చ్వాస-నిశ్వాస గాలి తరంగాలని అక్షరీకరిస్తే కథా..కథా…కథా… అని కనబడతాయేమో? అంతిమ శ్వాసలో కూడా కథా… కథా… అనే చిరుద్వనులే వచ్చిఉంటాయి!


వయస్సు 77 సంవత్సరాలు. పిల్లలంతా చీకూ చింతా లేకుండా చక్కగా సెటిలయ్యారు. ఆడుకోడానికి మనవలు ` మనవరాండ్రూ ఉన్నారు. పెన్షన్‌ వస్తుంది. రాయడానికి కాగితము`కలమూ ఉన్నాయి. కథావస్తువులు కూడా ఉండి ఉంటాయి. ఆయన కథలు రాస్తే పత్రికలు కళ్ళు మూసుకొని వేసుకుంటాయి. అయినా ఆ మనిషి అలాంటివేమీ చేయడు. నిరంతరం ‘మనసున్న మషీన్‌’లా మరో పని చేస్తుంటాడు. అదో యజ్ఞం. తొందరలో పూర్తికాని యజ్ఞం. అనారోగ్యం అపుడపుడు తానున్నానంటూ అతనిలో మకాం చేస్తూ పోతూంటుంది. అయినా ఖాతరు చేయడు. ఆయనెవరో కాదు. ‘యజ్ఞం’ రచయిత శ్రీ కాళీపట్నం రామారావు. మరో యజ్ఞంలో మునిగిపోయిన కా.రా.గారు. తెలుగు కథలన్నింటికి పుట్టిల్లను తయారు చేస్తున్న మాస్టారుగారు.

కారా గారు స్థాపించిన కథానిలయం (శ్రీకాకుళం) గురించి మిత్రుల ద్వారా విన్నాను. పత్రికల్లో చదివాను. చూడాలన్న కోరిక చివరకు గత జూలైలో తీరింది. ఓ ఐదు గంటలు కథా నిలయంలో కారా గారితో గడిపే అవకాశం కలిగింది. సాహితీ ప్రియునిగా నాకు మరచిపోని రోజది.

కథా నిలయం వెనకున్న కథతో మొదలైంది మా దీర్ఘ సంభాషణ.

‘‘కథా నిలయం ఆవిష్కరణ 22 ఫిబ్రవరి 1997న జరిగింది. ఇది అనేక ఇతర గ్రంథాలయాల్లాంటి మరో గ్రంథాలయం కాదు. తెలుగు కథకి ఇది రిఫరెన్స్‌ లైబ్రరీ. 1910కి ముందూ వెనకా ఉండిన పెక్కు కథలూ, కథానికలూ పాత పత్రికల్లోనూ కథల పుస్తకాలతోనూ అంతరిస్తూ వస్తున్నాయి. పోయినవి పోగా మిగిలిన వాటినన్నింటిని సేకరిస్తూ ఇక ముందు రాగల ప్రతీ కథతో పాటు పై వాటిని పదిల పరచడం ఒక కర్తవ్యంగా తోచి కొందరు కథాభిమానులు ఈ కథానిలయాన్ని సంకల్పించారు’’ అని కథానిలయం కరపత్రం చెబుతుంది. ఆవిర్భవించిన నాలుగు సంవత్సరాలే అయినా గణనీయమైన ప్రగతిని సాధించింది. మచ్చుకు కొన్ని :

  • రెండంతస్తుల స్వంత భవనం.
  • ముప్పైమంది రచయితా ` రచయిత్రుల పూర్తి రచనలు (564 పుస్తకాలు) చేరాయి. మరో ఇరవై రచయిత / రచయిత్రుల పూర్తి రచనలు త్వరలో చేరబోతున్నాయి.
  • 108 సాహితీ సంస్థలు వెలువరించిన 216 సంకలనాలున్నాయి.
  • 623 రచయిత / రచయిత్రుల 1,235 కథా సంపుటాలున్నాయి.
  • 75 సిద్ధాంత గ్రంథాలు, పుస్తకాలు, విమర్శలు చేరాయి.
  • అనువాదాలు, అలనాటి కథలు 310 పుస్తకాలు ఉన్నాయి.
  • 74 రచయిత / రచయిత్రుల ఫోటోలు చేరాయి.
  • ఇప్పటి వరకు 70 మంది  పోస్టు ద్వారా, కథానిలయం నుంచి సేవలను కోరారు.
  • రచయితలు, పాఠకులు, సాహిత్యాభిమానులు, కథాప్రియులు, ప్రభుత్వాధికార్లు, మంత్రులు సందర్శించి కథానిలయాన్ని, దాని రూపకల్పనని మెచ్చుకొన్నారు.
  • శాశ్వత నిధి కోసం ప్రయాస మొదలైంది.

ఈ ప్రగతిని చూస్తే కథానిలయం, ఆంధ్ర రాజధానికి ఏడువందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొన్నది. నాలుగు సంవత్సరాల ప్రగతిని చూస్తే ముందు ముందు మరింత వేగంతో అభివృద్ధి చెందుతూ కథానిలయం పేరు ఆంధ్రానుంచి ఆలిండియాకే కాకుండా తెలుగు సాహిత్యాభిమానులున్న ఇతర దేశాలకి కూడా చేరుతుందనడంలో అతిశయోక్తి లేదు.

అయితే కారా గారికి ఈ ప్రగతి సంతృప్తిని కలిగించడం లేదు. ‘‘ఇంకా ఎంతో జరగాలి, అదీ వేగంగా జరగాలి’’ అంటారు. భవిష్యత్తు ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అనుకున్న సమయానికి జరగాలి. అందులో ఒక భాగంగా 1998లో ట్రస్టును ఏర్పరచి రిజిస్ట్రేషన్‌ చేసి ‘‘కథానిలయం ట్రస్టు బోర్డు’’ ఏర్పడిరది. వ్యవస్థాపకులైన కారా కథానిలయం తాలూకు చర`స్థిర ఆస్తులన్నింటిని రిజిస్టరీ వీలునామా ద్వారా ట్రస్టు బోర్డుకు దఖలు పరచారు. అప్పటినుంచి కథానిలయం నిర్వహణ బాధ్యతలను ట్రస్టు బోర్డు నిర్వహిస్తోంది. కారాగారం ఫౌండర్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

గతంలో కొందరు సుప్రసిద్ధ రచయితలకు ఇలాంటి ఆలోచనలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదని మా సంభాషణల్లో తెలిసింది. అయితే ఇలాంటి సంస్థలు తమ ఆశయాలను నెరవేర్చాలంటే, సాఫీగా పని చేయాలంటే రచయితల సహాయ సహకారాలు చాలా అవసరం అని వారు చెప్పారు. కొందరు లబ్దప్రతిష్టులైన రచయితలు ఉత్తరాలు, రిమైండర్లు పంపినా తమ తమ రచనల్ని, సంకలనాలని, ఫోటోలని పంపడం లేదని వాపోయారు. ‘‘తెలుగు రచయితలకు కథానిలయం తమదన్న భావన కలగాలి. దాని పురోగమనానికి తమకు తోచిన రీతిలో చేయూత అందించాలి. ఇందులో ప్రజల డబ్బు ఉంది. కొందరు రచయితలు, శ్రేయోభిలాషులు విలువైన పుస్తకాలను, పాత పత్రికల్ని పంపించారు. ఇంకా ఎన్నో పాత పుస్తకాలని, పత్రికల్ని సంపాదించాలి. అవి ఎవరి దగ్గర, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. ఇలాంటి విషయాల్లో రచయితలు, పాఠకులు సహకారం అందించాలి. అది లేకపోతే కథానిలయాన్ని పెంచలేం. ప్రతి తెలుగు కథ కథానిలయంలో ఉండాలి’’ అని తమ సాధక బాధకాల్ని వివరించారు. కథలను సెలక్టు చేస్తారా అన్న ప్రశ్నకి ‘‘అన్ని కథల్ని ఉంచుతాం. ఈ రోజు పేలవంగా అనిపించిన కథ, దాని రచయిత ముందు ముందు గొప్ప కథకుడు కావచ్చు కదా! అందువల్ల అన్ని తెలుగు కథల్ని ఉంచుతున్నాం’’ అని వివరించారు.

ఇక చివరన మా సంభాషణంతా ఆర్థిక వనరులపై సాగింది. ఆశయాలు ఎంత బలమైనవైనా, ఎందరో శ్రేయోభిలాషులున్నా, మరెందరివో ఆశీర్వచనాలు వెనకున్నా, ఒక సంస్థ సాఫీగా నడవాలంటే కనీస ఆర్థిక వనరులు తప్పనిసరి. కారాగారు చెప్పినట్టుగా కథా నిలయ రూపకల్పనలో ప్రజాధనం ఉంది. అది ఎన్నో రూపాల్లో ఉంది. ఐదు రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు విరాళాలిచ్చిన సాహిత్యాభిమానులున్నారు. జిల్లా కలెక్టరు భవన నిర్మాణానికి (మొదటి అంతస్తు) అందించిన రొక్కముంది. స్థానికులతోపాటు శ్రీకాకుళం సాహితీ సమితి జోడిరచిన డబ్బు ఉంది. తన (కారా) రచనలపై వచ్చిన రాయల్టీ ఉంది. అవార్డుల రూపాల్లో వచ్చిన అమౌంటూ ఉంది. తోటి రచయితలు, మాస్టారుగారి శిష్యులు, అభిమానులు పోగు చేసిన కాసులున్నాయి, ఇలా సుమారుగా ఆరున్నర లక్షల రూపాయల వరకు పోగయిన డబ్బు కథా నిలయం నిలబడడానికి తోడ్పడిరది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రోజువారీ ఖర్చులకు, సంస్థ ఉద్దేశించిన కార్యక్రమాల నిర్వహణకు (సాహితీ సమావేశాలు, సభలు, వర్క్‌షాప్‌లు, రెఫరెన్స్‌ సేవలు, కార్యాలయాన్ని నడిపే ఖర్చులు మొదలగునవి) డబ్బు కావాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని కథా నిలయ నిర్వహణ ఒడిదుడుకులకు గురి కాకూడదని కార్పస్‌ (శాశ్వత నిధి) నెలకొల్పారు. ఈ నిధిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఉంచారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతోనే కథానిలయాన్ని నడపాలన్న ఆలోచన. వడ్డీ రెట్లు తగ్గుతున్న ఈ రోజుల్లో శాశ్వతనిధి మొదట అనుకున్న దానికంటే ఎక్కువ పెంచాల్సి వస్తుందని, ఇది వారికి ముందు ముందు ఒక పెద్ద ఛాలెంజ్‌గా ఉంటుందని వారి మాటల్లో గ్రహించాను. కార్పస్‌ పుష్కలంగా పెరిగిన రోజు కథానిలయం ఆర్థిక వనరుల గురించి ఆలోచించడం మాని సాహిత్య దృష్టిని కేంద్రీకరించి కథానిలయం ఆశయాలను సంపూర్ణంగా పది కాలాల పాటు కొనసాగించవచ్చు. ఉడతాభక్తిగా మనం చేయాల్సిన పనులు :

  • కథానిలయం గురించి నలుగురికీ సగర్వంగా తెలపడం.
  • ఎక్కడైనా పాత కథలు, సంకలనాలు, పత్రికలు మొదలగు విలువైన రెఫరెన్సు సామాగ్రి ఉన్నట్టుగా తెలిస్తే వివరాలతో కథా నిలయానికి తెలియజేయడం.
  • తగిన రీతిలో ముఖ్యంగా శాశ్వతనిధిని పెంపొందించడానికి, విరాళాలు ఇవ్వడం, మీతో నలుగురూ ఇచ్చేట్టుగా ప్రయత్నించడం.

 

 

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కాకతీయ యుగ తెలుగు సాహిత్యం

by Jyothi Pakanati June 23, 2021
written by Jyothi Pakanati

మనదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించింది కాకతీయ యుగం. శాతవాహనుల తరువాత విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించి సుస్థిరమైన పాలన చేసిన ఘనత కాకతీయులదే. నన్నయకు పూర్వం నన్నయకు తరువాత కూడ తెలుగు దేశంలో మనకు తెలిసిన కొద్దిపాటి విషయాలు తెలియని వాటితో సమానమేనని కొంత వరకు తెలిసిన భాగం కాకతీయుల కాలమేనని సురవరం ప్రతాపరెడ్డి గారు అన్న మాటలు యథార్థాలు1. కాకతీయ సాంస్కృతిక, సాహిత్య చరిత్ర నిర్మాణానికి శాసనాలు, కైఫీయత్తులు(స్థానిక చరిత్రలు) సమకాలీన రచనలు, లక్షణ గ్రంథాలు, సంకలన గ్రంథాలు, వాస్తుకళ, చిత్రకళ, నృత్యకళారూపాలు మొదలైనవి ముఖ్య ఆధారాలుగా నిలిచాయి. ఇటువంటి అంశాలు ప్రాతిపదికగా చేసుకొని కాకతీయ యుగంలో వెలువడిన సాహిత్యాన్ని పరిశీలించటం ఈ వ్యాస ఉద్దేశం. ముందుగా కాకతీయులు అన్న పేరు వీరి కెందుకు వచ్చిందన్న విషయంలో పలువురు చరిత్రకారులు పలురకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాకతి అనే నామాంతరం గల దుర్గను పూజించటం వల్ల కాకతీయులైనట్లు ప్రతాపరుద్ర యశోభూషణం తెలుపుతున్నది. కాకతీయుల మూల పురుషుడు గుమ్మడి తీగకు పుట్టాడని ఖాజీపేట శాసనంలో  ఉంది. కాకతమ్మ అనుగ్రహం వల్ల గుమ్మడి తీగకు ఒక పుత్రుడు జన్మించాడని, అతని సంతతి వారే కాకతీయులైనారని ‘అనితల్లి’ కలువచేరు శాసనం2 తెలుపుతుంది. కూష్మాండిని జైన దేవత. కూష్మాండం అంటే గుమ్మడి. కూష్మాండినికి మరొక పేరు కాకతి. మొదట కాకతీయులు జైనులు కనుక ఆ సంప్రదాయానికి సంబంధించిన వారిగా శాసనంలో పేర్కొనబడినట్లు ఊహించవచ్చు.

కాకతీయ వంశచరిత్రను తెలిపే శాసనంలో క్రీ.శ 956 నాటి మాంగల్లు శాసనం ప్రధానంగా పేర్కొనదగింది. ఈ శాసనంలో కాకర్త్యగుండన అనే పదం ఉందని అది క్రమంగా కాకత్య, కాకత, కాకతిగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. అంతేకాక గుండన రాష్ట్రకూటరాజైన కృష్ణుని అభ్యర్ధన మేరకు అమ్మరాజును జయించాడు. వేంగీ రాజ్యాన్ని దానార్ణవునికి అప్పగించాడు. గుండన మాంగల్లు శాసనంలో రాష్ట్రకూటునిగానే వ్యవహరింపబడ్డాడు. ‘రాష్ట్రకూటు’ అంటే గ్రామాధికారి అనే అర్ధం నాడు వ్యవహారంలో ఉంది. స్థానికంగా ఆ పదం రట్టడిగా ఆ తరువాత రెడ్డిగా మారింది. కాబట్టి రాష్ట్రకూటుడు అనే శబ్దం అధికార పదవినే సూచిస్తుందని తెలుస్తున్నది.

కాకతీయులు దుర్జయ వంశస్థులని బయ్యారం శాసనం తెలుపుతున్నది. ఖాజీపేట శాసనంలో కూడ బేతరాజు చలమర్తి గండ బిరుదాంచితుడని, దుర్జయ కులమనే సముద్రానికి చంద్రుని వంటి వాడని వర్ణింపబడింది.3 (దుజ్జన్‌య కుళాబ్ది చంద్ర)  మరికొన్ని శాసనాలు 4 వీరు విష్టి కులస్థులని తెలుపుతున్నాయి. దుర్జయులు అంటే జయింపనలవి కాని వారని అర్ధం. విష్టి అంటే నిస్వార్ధంగా చేసే సేవ అని అర్ధం. కాబట్టి వీరి శక్తి సామర్ధ్యాలు, పరోపకార బుద్ధి ఆయా శాసనాల్లో ప్రతీకాత్మకంగా వ్యక్తమైనాయి. అంతే కాదు ఆయా శాసనాలు వారి రాజకీయ సాంస్కృతిక జీవన చైతన్యాన్ని పట్టి చూపుతున్నాయి.

కాకతీయులు చంద్రవంశం వారని, మాధవవర్మ సంతతి వారని స్థానిక చరిత్రలో, కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రలో పేర్కొనబడింది. గణపతి దేవుని కాలం నాటి మోటుపల్లి, పాఖాల, కాంచీపురంలోని శాసనాలలో వీరు సూర్యవంశీయులుగా, క్షత్రియులుగా పేర్కొనబడినా వారు క్షత్రియులు కారని చరిత్రకారుల అభిప్రాయం. విద్యానాధుడు వీరి వంశం సూర్య, చంద్ర క్షత్రియ వంశాల కంటే గొప్పదని ప్రతాపరుద్రీయంలో వర్ణించాడు. బూదపుర శాసనం సమాజంలో నాలుగు వర్గాలుంటాయని వాటిలో నాలుగవ వర్గానికి సంబంధించిన వంశం జగత్ప్రసిద్ధమైందని ఆ వంశంలో కాకతీయులు ఉద్భవించారని తెలుపటం వల్ల వీరు చతుర్ధాన్వయులుగా పరిగణింపబడుతున్నారు. వీరి సంబంధ బాంధవ్యాలు కూడ చతుర్ధ వంశం వారితో ముడివడి ఉండటం ఈ విషయాన్ని నిరూపిస్తున్నది. మొదట కాకతీయులు రాష్ట్ర కూట సేనానులుగా ఉన్నారు. వారి పతనానంతరం నేటి తెలంగాణ ప్రాంతమంతా పశ్చిమ చాళుక్యుల వశం కాగా కాకతీయ గుండయ ఎవరివైపు పోరాడక స్వతంత్రునిగానే ఉండిపోయాడు ఈలోగా ముదిగొండ చాళుక్యులు విజృంభించి కొరివిసీమను ఆక్రమించుకొని గుండయ్యను సంహరించారు. గుండయ సోదరి కామసానమ్మ మేనల్లుడైన బేతరాజును చేరదీసి పశ్చిమ చాళుక్యులతో దౌత్యం నెరపి కొరివిసీమ నుండి హనుమకొండ వరకున్న రాజ్యాన్ని అతనికి ఇప్పించినట్లుగా గూడూరు శాసనం వల్ల తెలుస్తున్నది.5 కాకతీయ రాజ్యపాలనం మొదటి బేతరాజుతో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు నిర్ణయించారు. క్రీ.శ 992 నుండి 1052 వరకు ఇతడు పరిపాలించాడు.

తరువాత అతని కుమారుడు మొదటి ప్రోలరాజు క్రీ.శ 1052 నుండి 1075 వరకు పరిపాలించాడు. పశ్చిమ చాళుక్యరాజైన మొదటి సోమేశ్వరుని వల్ల ‘అనుమకొండ విషయము’ను లిఖిత పూర్వకంగా పొందాడు. రెండవ బేతరాజు తరువాత దుర్గరాజు క్రీ.శ 1108 నుండి 1116 వరకు పాలించాడు. తరువాత బేతరాజు రెండవ కుమారుడు రెండవ ప్రోలరాజు క్రీ.శ 1116 – 1155 వరకు పరిపాలించాడు. ఇతని కాలంలోనే కాకతీయ రాజ్యం విస్తరించింది. పశ్చిమ చాళుక్యులకు సామంతునిగా ఉన్నప్పటికి వారి బలం క్షీణించినపుడు ప్రోలరాజు విజృంభించి, వారి అధికారాన్ని త్రోసి రాజని స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని మహా మండలేశ్వర బిరుదాన్ని పొందాడు.

రెండవ ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు క్రీ.శ 1158 నుండి 1195 వరకు పాలించాడు. సంస్కృతంలో నీతి సారమనే గ్రంథాన్ని రచించి విద్యాభూషణ బిరుదాన్ని వహించాడు. దేవగిరి యాదవరాజైన జైతుగితో జరిగిన యుద్ధంలో మరణించాడు. రుద్రదేవుడు మరణించిన తరువాత అతని సోదరుడు మహదేవుడు (1196 – 1198 వరకు) పరిపాలించాడు. కాని జైతుగి మహదేవుని సంహరించి ఇతని కుమారుడైన చిన్న వయస్సులో ఉన్న గణపతి దేవుని చెరపట్టాడు. 11 నెలలు చెరలో ఉంచిన తరువాత ఏ కారణం వల్లనో గణపతి దేవుని విడిచిపెట్టాడు. అంతవరకు రేచెర్ల రుద్రసేనాని కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించి గణపతిదేవునికి అప్పగించాడు. గణపతి దేవుడు క్రీ.శ 1199 నుండి 1262 వరకు పరిపాలించాడు. రాజనీతి దురంధరుడైన గణపతిదేవుని పరిపాలనలో కాకతీయ సామ్రాజ్యం విస్తరించి రాజకీయ ఐక్యతను సాధించింది. దానిని పెంపొందించింది రుద్రమదేవి. గణపతిదేవుని తరువాత క్రీ.శ 1289 వరకు పాలించిన రుద్రమదేవి త్రిపురాంతకం వద్ద అంబదేవునితో జరిగిన యుద్ధంలో అసువులు కోల్పోయింది. రుద్రమ తరువాత ఆమె దత్తపుత్రుడు(దౌహిత్రుడు ముమ్మడమ్మ కొడుకు) ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చాడు. క్రీ.శ 1289 నుండి 1323 వరకు పరిపాలించాడు. ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ కుమారుడైన ఉలుఘ్ ఖాన్  ఓరుగల్లును ముట్టడించి ప్రతాపరుద్రుని బందీగా ఢిల్లీకి తీసుకొని వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో నర్మదా నదీ తీరంలో ప్రతాపరుద్రుడు మరణించినట్లుగా చరిత్ర తెలుపుతున్నది. నాటితో తెలుగు దేశాన్నంతటిని ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు దెచ్చిన కాకతీయ సామ్రాజ్యం అంతరించింది.

కాకతీయుల కాలం నాటి సాహిత్యం :

సాహిత్యచరిత్ర అధ్యయనంలో గ్రంథాలకే కాక శాసనాలకు ఎంతో ప్రాధాన్యముంది. వీటి పరిశీలన వల్ల సాహిత్యాంశాలకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక వ్యవస్థల అవగాహన కలుగుతుంది. కాకతీయుల కాలంలో రాజాస్థానాల నాశ్రయించి వెలువడిన సాహిత్యమే కాక సమకాలీన సాహిత్యం విస్తృతంగా వచ్చింది. తెలుగు భాష, సంస్కృత భాష సమానంగా ఆదరించబడింది. కాకతీయుల పాలన అనంతరం కూడ దాదాపు రెండు, మూడు శతాబ్దాల తరువాత వచ్చిన ఏకామ్రనాధుని ‘ప్రతాపరుద్ర చరిత్రము’ కాసె సర్వప్ప ‘సిద్ధేశ్వర చరిత్రము’ కూసుమంచి తిమ్మకవి ‘సోమదేవ రాజీయము’ వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామము’ మొదలైన గ్రంథాలు కూడ కాకతీయుల సాంస్కృతిక వైభవాన్ని తెలుపుతున్నాయి.

శాసన సాహిత్యం :

శాసన రచయితలు కూడ కావ్య రచనాధురీణుగా తెలిపే శాసనాలు చరిత్రలో కనిపిస్తాయి. ఆనాటి శాసన రచయితల దృష్టిలో శాసన రచన కావ్యరచన వంటిది. నన్నయ్య భట్టారకుడు నందంపూడి శాసనంలో తనను ‘‘కావ్యానాం కర్తా నన్నిభట్ట’’ అని పరిచయం చేసుకున్నాడు. అప్పటికి నన్నయభట్టు మహాభారతాన్ని రచించలేదు. అట్లే అప్పటికి ఇతడు రచించిన ఇతర కావ్యాలేవీ కనిపించవు. అందువల్ల నన్నయ తాను రచించిన శాసనాలనే కావ్యాలుగా పేర్కొన్నట్లు స్పష్టమౌతున్నది. ద్రాక్షారామంలోని భీమేశ్వరాయంలో ఉన్న రెండు శాసనాలు ప్రకాశ భారతీయోగి కావ్యాలుగా అందే పేర్కొనబడ్డాయి. అట్లే కాకతీయ దుర్గ నృపతి ఖాజీపేట శాసనంలో తద్రచయిత దేవన భట్టు దాన్ని ‘ఒడికొణ్డ ప్రభోర్దేవణ భట్టస్య మహకవే: కావ్య మిదం’ అని పేర్కొన్నాడు.6

కాకతీయుల శాసనాల్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూల మత్తేభ వృత్తాలు, కందము, సీసము, ఆటవెలది, తేటగీతి పద్యాలు కనిపిస్తాయి. పాల్కురికి సోమనాధుడు, గోనబుద్ధారెడ్డి మొదలైన కవులతో ఆదరింపబడిన ద్విపద సమకాలీన శాసనాల్లో కనిపించదు. మాత్రాఛందస్సుకు చెందిన కందపద్యం ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కాక చూర్ణమనదగిన వచనాలు కూడ ఈనాటి శాసనాల్లో చూడవచ్చు. కేవలం విషయమే కాక చక్కటి వర్ణనలతో కూడుకున్న సాహిత్య గౌరవం అందుకున్న శాసనాలు కూడ ఉన్నాయి. వీటిలో ఈ క్రింది కరీంనగర్‌ జిల్లా శాసనం ప్రధానమైంది.

‘శ్రీమదపార పారావార పరివృత మహీతలంబున సకల

            జన వినుతంబగు నంధ్రదేశమునకు విభూషణంబైన

            యనుమకొండ యను పురవరంబు నిజ రాజధానిగా

            నొప్పుచున్న కాకతె భూపాలక్రమంబున’ 7………………

శాసన సాహిత్యంలో అచింతేంద్రవరుడు రచించిన వేయిస్తంభాల గుడి శాసనం పేర్కొనదగినది. పురవర్ణన, స్త్రీలవర్ణన మొదలైనవి ఇందులో కనిపిస్తాయి. బెక్కల్లు శాసన రచయిత నాగదేవకవి, కుందారం శాసనం రచించిన బాలభారతి సత్కవి, ఎల్కుర్తి శాసన రచయిత హరిహరార్యుడు కరీంనగర్‌ శాసనకర్త గంగాధరుడు మొదలైన వారే కాక ఉర్సుగుట్టపై ఉన్న శాసనాన్ని రచించిన విశ్వేశ్వర శివాచార్యుని కొడుకైన నరసింహకవి  పేర్కొనదగినవారు. ఉర్సుగుట్టపై సంస్కృతంలో ఉన్న ఈ శాసనం చారిత్రకంగా సాహిత్య పరంగా ఎన్నదగింది. ఈ శాసనస్థ శిల్పకావ్యాన్ని ‘సిద్ధోద్వాహం’ అంటారు. సిద్ధదంపతుల ప్రేమ, వివాహం, పెళ్లి అనే మొదలైన అంశాలతో పాటు ఏకశిలా నగర వర్ణనలు ఈ శాసన కావ్యంలో కనిపిస్తాయి. ఈ రచయిత 10 రూపకాలను, మలయవతి అనే కావ్యాన్ని, ఋగ్వేద వ్యాఖ్యను వ్రాశాడు. అంతే కాక ఒక్క రోజులో 8 సర్గలున్న కాకతీయ చరిత్రను వ్రాశాడని చెపుతారు. కాని ఈ గ్రంథం అలభ్యం. ఈ విధంగా శాసన రచయితలు తమ పాండిత్యాన్ని శాసనాల్లో ప్రతిఫలింపచేసినా దానాది వివరణ సమయాల్లో సామాన్య ప్రజల భాషనే ప్రయోగించటం వల్ల నాటి సాహిత్య చరిత్రేకాక బహుముఖీనమైన ప్రజల సజీవ సంస్కృతిని కూడ తెలుసుకునే అవకాశం కలిగింది.

 

కైఫీయతులు :

‘కైఫీయత్‌’ అనే అరబ్బీ పదానికి గ్రామ లేదా దేశ సమాచారాన్ని తెలిపే వృత్తాంతమని అర్ధం. విలేజ్‌ లోకల్‌ రికార్డ్స్‌ అని కూడ చెప్పవచ్చు.

కాకతీయుల గురించిన చరిత్ర కైఫీయతుల వల్ల కూడ తెలుసుకునే అవకాశం ఉంది. వీటిలో కొన్ని కల్పిత వృత్తాంతాలుండటం వల్ల ప్రామాణికంగా వీటిని పరిగణించే అవకాశం తక్కువ. అయినప్పటికి ఒక్కొక్క సారి చరిత్ర నిర్మాణానికి ఎంతో దోహదం చేసినట్టుగా సితాబ్‌ఖాన్‌ కైఫీయత్‌ నిరూపిస్తున్నది. కొమిరపూడి, వంగిపురం, ముట్నూరు మొదలైన కైఫియతుల ఆధారంగా గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుని చరిత్ర, సామాన్యజన వ్యవహారంలో ఉన్న ఎన్నో కథలు, ఆచార వ్యవహారాలు, సృష్టిసంబంధి గాథలు, క్షేత్ర మాహాత్మ్యాలు, పేరంటాండ్ల కథలు, గ్రామదేవతల కథలు, జానపదుల ఆటపాటలు మొదలైనవి తెలుస్తున్నాయి. ఆ కాలపు సమాజాల భిన్న సంస్కృతులను కూడ అవగాహన చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణా రాజకీయ, ఆర్థిక సామాజిక స్థితిగతుల చారిత్రకతను నిర్ధారించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఆనాటి శాసనాలు, కైఫీయతులు.

కాకతీయ యుగంలో తెలుగు, సంస్కృత భాషలకు రెండింటికి రాజాశ్రయం లభించి ఆయా భాషలలో ఎన్నో ఉత్తమ గ్రంథాలు వెలువడినాయి. రాజులే కాక రాజోద్యోగులు, ఇతరులు సాహిత్య కృషి చేసి సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో రెండు వందల మంది కవులున్నట్లుగా స్థానిక చరిత్రలు తెలుపుతున్నాయి. 12 వ శతాబ్దపు ఉత్తరార్ధంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రుద్రదేవ మహారాజుకు ‘విద్యాభూషణుడు’ అనే బిరుదున్నట్లు దాక్షారామ శాసనం వల్ల తెలుస్తున్నది. సంస్కృతంలో  ‘‘నీతిసారము’’ అనే గ్రంథాన్ని రచించినట్లు బద్దెన తన ‘నీతి శాస్త్ర ముక్తావళి’ లో పేర్కొన్నాడు. తెలుగులో కూడ ‘‘నీతి సారమును’’ రచించినట్లు  బద్దెన మానవల్లి రామకృష్ణ కవి తెలిపారు. ఆంధ్రకవుల చరిత్రలో ఆ గ్రంథంలోని ఐదు పద్యాలు ఉదాహరింపబడినాయి.

ప్రతాపరుద్రుడు ఉషారాగోదయము (నాటిక), యయాతి చరిత్రము (ఏడంకాల నాటకం), ప్రతాపమార్తాండము, రాజరుద్రీయము (పాణినీయానికి వ్యాఖ్య అయిన కాశికకు వ్యాఖ్య), అమరుశతక వ్యాఖ్యలను రచించాడు. అచింతేద్రయతి, అప్పయార్యుడు, గంగాధరకవి, జాయపసేనాపతి, త్రిపురాంతకుడు, నరసింహకవి, విద్యానాధుడు, విశ్వనాధకవి, వీరభల్లట దేశికుడు, శాకల్య మల్లన మొదలైన వారు ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న ప్రసిద్ధ విద్వాంసులు.

జాయపసేనాపతి కాకతీయ శిల్పానికి లక్షణ గ్రంథమని చెప్పదగే ‘నృత్త రత్నావళి’ ని రచించాడు. విద్యానాధుడు అగస్త్య నిఘంటువు (అగస్త్యుడు విద్యానాధుడు వేరు వేరు కారని ఒకే వ్యక్తి అని చరిత్రకారుల అభిప్రాయం) కృష్ణ చరిత్రము, నలకీర్తికౌముది, ప్రతాపరుద్ర యశోభూషణము, బాల భారతము అనే గ్రంథాలు రచించి సంస్కృత భాషలో సాహిత్య గ్రంథాలు రచించిన వారిలో ప్రథమునిగా కీర్తి పొందాడు. ప్రతాపరుద్ర యశోభూషణము అలంకార శాస్త్ర ప్రకరణ గ్రంథంగానే కాక గొప్ప ఐతిహాసికగ్రంథంగా కూడ ప్రసిద్ధి చెందింది.

కాకతీయు కాంలో ఎందరో తెలుగు కవులు కవితా సృష్టి చేసి తమ అసమాన ప్రతిభను కనబరిచారు. రాజు, రాజవంశాలను బట్టి సాహిత్య చరిత్ర నిర్మాణానికి పూనుకొన్న ఆరుద్ర వంటి వారు తమ సమగ్ర ఆంధ్ర సాహిత్య (మనవి మాటలు) గ్రంథాల్లో చాళుక్యయుగం, కాకతీయ యుగమని వరుసగా సాహిత్య చరిత్రలో యుగ విభజన చేశారు. పాశ్చాత్య చరిత్రలో ఎలిజబెతీయన్‌, జాకోబియన్‌, ఎడ్వర్డియన్‌ మొదలైన రాజవంశాల పేరు మీదుగా యుగ విభజన జరుగడమనేది ఆనవాయితీగా వస్తున్నదని తన పద్ధతిని సమర్థించుకున్నారు. పింగళి లక్ష్మీకాంతంగారు కవుల పేరు మీద యుగ విభజన చేయగా మరి కొందరు సాహిత్యంలో మార్పులాధారంగా పురాణేతిహాసయుగం, ప్రబంధయుగం ఇత్యాదిగా విభజించారు. మరికొందరు సామాజిక భూమిక మీద యుగ విభజన చేయాలని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా దేశచరిత్రలో సాహిత్యం ప్రధానాంశం. ప్రజాజీవిత సంబంధాలను, సమకాలపు రాజకీయ సాంస్కృతికాంశాలను సమర్ధవంతంగా వ్యక్తం చేయటంలో సాహిత్యానికి మించిన శక్తివంతమైన సాధనం మరొకటి లేదు.

తిక్కన :

గణపతిదేవుని కాలంలో రాజ్యం కోల్పోయిన మనుమసిద్ధికి తిక్కన మహాకవి గణపతిదేవుని సహాయంతో రాజ్యం ఇప్పించినట్టుగా ప్రతీతి. సామ్రాజ్య సుస్థిరత కోసం గణపతిదేవుడు మనుమసిద్ధికి తోడ్పడ్డాడు. మనుమసిద్ధి పట్టాభిషేక సందర్భంగా తిక్కన చెప్పిన ఆశీర్వచన శ్లోకమే అనంతర కాలంలో తిక్కన నిర్వచనోత్తర రామాయణానికి ఆరంభ పద్యంగా కుదురుకున్నదని పాటిబండ మాధవ శర్మగారు (భార. ఆర.పీఠిక.9 అకాడమీ ప్రతి) అభిప్రాయపడ్డారు. కాకతీయుల ఆడపడుచు కంపరాయని భార్య అయిన గంగాదేవి తన ‘‘మధురావిజయమ’’నే సంస్కృత చారిత్రక కావ్యంలో ‘తిక్కయజ్వ కవిసూక్తి’ దప్పిగొన్న చకోరాలతో  కళానిధి (చంద్రుని) యొక్క వెన్నెల లాగా కవుల చేత స్వేఛ్ఛగా సేవింపబడుతున్నదని పేర్కొన్నది. తిక్కన కేవలం ‘యజ్వేకాదు మహాభారత రచన చేసి ‘‘సోమయాజి’’ అయినాడు. వేదవేదాంగపురాణేతిహాస కావ్యశాస్త్రాలను గాఢంగా అధ్యయనం చేసిన గొప్ప పండితుడు. రాజకీయ వేత్త కూడా. ‘‘అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్‌ బారగుడన్‌, కళావిదుడ’’నని’ తిక్కన తన గురించి చెప్పుకొన్నట్లు కనిపించినా ఒక మహేతిహాసాన్ని రచించే కవికి ఉండవలసిన అర్హతలను గురించి చెప్పినట్లే భావించవలసి ఉంటుందని ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు గారు తమ ‘‘పూర్వ కవుల కావ్య దృక్పధాలు’’ గ్రంథంలో అభిప్రాయపడ్డారు.  మహాభారతంలో మొదటి మూడు పర్వములు తప్ప మిగిలిన పదిహేను పర్వములను తిక్కన ఆంధ్రీకరించాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి, మహాభారతాన్ని హరిహరనాధునికి అంకితం చేశాడు. హరిహరనాధునికి అంకితం చేయటం కేవలం శైవ వైష్ణవ మతాల మధ్య వైమనస్యాన్ని తొలగించటం కోసమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాని వైష్ణవం, నాటి కాలంలో అంతగా వ్యాపించలేదు. కన్నడ దేశం నుండి వీరశైవం వచ్చినట్టు వైష్ణవం రాలేదు. నిజానికి జైన శైవాల మధ్యనే ఆ రోజుల్లో మత వైమనస్యం ఉంది. తిక్కన హరిహర తత్త్వాన్ని సగుణ నిర్గుణ తత్త్వాల సమన్విత రూపంగా భావించాడు. కనుకనే తన భారతావతారికలో ‘‘శ్రీయన గౌరి నాబరగు చెల్వకు చిత్తము పల్లవింప’’ పద్యంలో ‘విష్ణురూపాయ నమశ్శివాయ’ అన్నప్పుడు సగుణ రూపం విష్ణువని, శివుడు రూపాది రహిత నిర్గుణ తత్వ్తమని తాత్పర్యం. అందుకే హరిహరనాథుని గొల్చెద అనకుండా పరతత్త్వము గొల్చెద నన్నాడు తిక్కన. ఈ దృష్టితో గమనిస్తే తిక్కన సగుణ నిర్గుణ సమన్విత పరబ్రహ్మ తత్త్వోపాసనా లక్షణం వ్యక్తమవుతుంది. నిర్వచనోత్తర రామాయణ అవతారికలో ‘‘జాత్యము గామి నొప్పయిన సంస్కృతమెయ్యెడ జొన్ప’ 8 నని భాషా ప్రయోగాల గురించి తిక్కన చెప్పిన మాటలు ఆనాడు ప్రచారంలో ఉన్న శివకవుల భాషా ప్రయోగాదులకు నిరసనగా ప్రస్తావించినట్లు విమర్శకులు భావిస్తున్నారు.

లలిత పద హృద్య పద్యం

            బుహ కథార్ధంబు ఘటిత పూర్వాపరమై

            యలతి యలతి తునియలఁ గా

            హల సంధించిన విధంబు నమరగ జేతున్‌ (నిర్వ – రామా 1 – ప-16)

లలిత లలిత పదాలతో మహార్ధాన్ని స్ఫురింప చేయటమేకాదు శ్రవ్యకావ్యంలో దృశ్యకావ్యం తీరును అనువర్తింపచేసే ‘నాటకీయత’ను కూడ తన రచనలో నిక్షిప్తం చేసి తనదైన ఒక విలక్షణ కావ్య దృక్పధాన్ని ప్రకటించాడు.

మారన :

ప్రతాపరుద్రుని సమకాలికాంధ్ర రచయితలలో మారన పేర్కొనదగినవాడు. తిక్కన శిష్యుడైన మారన తన మార్కండేయ పురాణాన్ని ప్రతాపరుద్రుని సేనాని నాగయ గన్నయకు అంకితమిచ్చాడు. ఇది ప్రధమాంధ్ర పురాణంగా ప్రసిద్ధికెక్కింది. ఈ గ్రంథంలో హరిశ్చంద్ర వృత్తాంతం, వరూధినీ ప్రవరుల గాథ, మదాలసా కువలయాశ్వుల కథ, రుచి ప్రజాపతికథ, మరుత్తు వృత్తాంతం మొదలైన ఉపాఖ్యానాలెన్నో ఉన్నాయి. ఇందులోని వరూధిని ప్రవరుల గాధ అల్లసాని పెద్దన మనుచరిత్ర కథకు మూలమైంది. శంకర కవి, గౌరన మొదలైన కవులు రచించిన హరిశ్చంద్రోపాఖ్యానానికి ఈ గ్రంథమే మాతృకగా నిలిచింది. నన్నయ కథాకథన శిల్పాన్ని, తిక్కన రసవత్కావ్య కళాశిల్పాన్ని సమన్వయించుకొని పుట్టిన విశిష్ట రసవత్కావ్యమిదని డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారు తన ‘ప్రథమాంధ్ర మహాపురాణం’ గ్రంథంలో పేర్కొన్నారు.

తిక్క భూపతి :

మనుమసిద్ధి కుమారుడైన తిక్క భూపతి సకల విద్యా విశారదుడని, కవి సార్వభౌమునిగా పేరు గాంచినవాడని తిక్కన తన నిర్వచనోత్తర రామాయణ అవతారికలో పేర్కొన్నాడు. ఇతని ఆస్థానంలోనే పెద్దయామాత్యుడనే కవి ఉన్నాడని, ఆశు, మధుర, చిత్ర, విస్తరములనే చతుర్విధ కవితా మార్గాలలో నిష్ణాతుడని జక్కన తన విక్రమార్క చరిత్రలో తెలిపాడు.

బద్దెన :

బద్దెన కవి గణపతి చక్రవర్తి సామంతులలో ఒకడు. భద్రభూపాలుడని ఇతనికి మరొక పేరు. నీతి శాస్త్ర ముక్తావళి, సుమతి శతకం, నీతి కృతులు ఈ కవి రచనలు. సుమతి శతక ప్రాశస్త్యం ఎనలేనిది.

రావిపాటి త్రిపురాంతకుడు :

‘‘త్రిపురాంతకోదాహరణము’’ను రచించిన రావిపాటి త్రిపురాంతకుడు ప్రతాపరుద్రుని సమకాలికుడు. ఆయన రచనలు అలభ్యం. సంస్కృతంలో ఇతడు రచించిన ప్రేమాభిరామం గ్రంథం కూడ లభించకపోయినా వినుకొండ వల్లభరాయడు ఈ గ్రంథాన్ని అనుసరించే తెలుగులో క్రీడాభిరామాన్ని రచించాడు. కాకతీయుల సామాజిక జీవనానికి ఈ రచన అద్దం పట్టింది.

భాస్కరుడు :

భాస్కర రామాయణం కాకతీయుల కాలంలో వచ్చిన మరొక గ్రంథం. రెండవ ప్రతాపరుద్రుని అశ్వసైన్యాధ్యక్షుడైన సాహిణిమారునికి అంకితమివ్వబడింది. చంపూ కావ్య రూపంలో వచ్చిన తెలుగు రామాయణాల్లో మొట్టమొదటిది భాస్కర రామాయణం. ఈ రామాయణంలోని బాల కిష్కింధాసుందర కాండలను భాస్కరుని శిష్యుడైన కుమార రుద్రదేవుడు, అరణ్య యుద్ధకాండ పూర్వభాగాలను భాస్కరుడు, యుద్ధకాండ శేషాన్ని భాస్కరుని మిత్రుడైన అయ్యలార్యుడు రచించారు. నలుగురు కవులు వాల్మీకి రామాయణాన్ని అనుసరించినప్పటికి కొన్ని కల్పితాంశాలు ఈ రచనలో కనిపిస్తాయి. కవితా శిల్పంలో, శాబ్దిక చమత్కృతిలో ఒకరికొకరు సాటి అన్నట్లుగా రచించబడిన భాస్కర రామాయణం తెలుగు సాహిత్య చరిత్రలో అపురూపమైనది.

గోనబుద్ధారెడ్డి :

గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణం ద్విపద సంప్రదాయంలో వచ్చింది. తెలుగులో ద్విపదలో వచ్చిన రామాయణాల్లో ఇది మొదటిది. గ్రంథారంభంలో గోనబుద్ధారెడ్డి తన తండ్రి అయిన విఠ్ఠలుని పేర రచించినట్లుగా ఉంది. గ్రంథ కర్తృత్వానికి సంబంధించిన విషయంలో వాద వివాదాలున్నాయి. గోనబుద్ధారెడ్డే ఈ రామాయణ కర్త అని పలువురి అభిప్రాయం. వాల్మీకి రామాయణమే రంగనాధ రామాయణానికి మూలమైనా, వాల్మీకంలో లేనివి, ప్రజాసామాన్యంలో వ్యాపించి ఉన్న ఎన్నో కథాంశాలు తన రచనలో చేర్చాడు. గ్రంథారంభంలో

పదములర్ధంబులు భావముల్‌ కలుగ

            పదశయ్యలర్థ సౌభాగ్యముల్‌ యతులు

            రసములు కల్పనల్‌ ప్రాస సంగతులు

            అసమాన రీతులు నన్నియు గలుగ’

రామాయణాన్ని రచిస్తానని చెప్పినట్లుగానే సమర్ధవంతంగా రచించాడు. వర్ణనలతో పాటు కథను సరళంగా చెప్పి భావోల్బణం కలిగించడం కవి ప్రజ్ఞకు, కథనరీతికి ఉదాహరణగా చెప్పవచ్చు. రాముడు వనవాసానికి బయలుదేరుతున్నపుడు దశరధుడు పుత్ర వియోగం భరించలేక సుమంత్రునితో రథమాపుమని చెపుతాడు. రథ మాగకనే వెళ్లిపోతుందని అతడు చెప్పినప్పుడు దశరధుని దు:ఖం, మనోవ్యాకులత ఈ సందర్భంలో అద్భుతంగా వర్ణించబడింది.

అనవుడు దశరధుడటు పోక నిలిచి

            తన సూను రథమును తప్పక చూచి

            అదియును గానక ధూళినటు చూచి చూచి

            అదియును గానక బయలటు చూచి చూచి

            హాయని యెలుగెత్తి హా రామ రామ

            హాయని మూర్ఛిల్లె…….

‘అదియును గానక’ అనే మాటను, ‘అటు చూచి చూచి’ అనే మాటలను రెండు సార్లు ప్రయోగించటం వల్ల దశరథుని దు:ఖావేశం అభివ్యక్తమైంది. రధగమనం సూచింపబడింది. పాల్కురికి సోమనాధుడు తెలుగులో ద్విపద రచనా సంప్రదాయాల్ని పాటించినా సోమనాధుని కావ్యాల్లో ప్రతికూల లక్షణం అధికంగా కనిపిస్తుంది. శైవమతాభిమానులకే పరిమితమై పోయింది. కాని రంగనాధ రామాయణం అనుకూల లక్షణం కలది. కాబట్టి అందరికీ అంగీకారమే కాక ప్రబంధ కవుల పద బంధాలకు దూరంగా ఉండటం, ప్రజాసామాన్యంలో వ్యాపించి ఉన్న కథాంశాలను స్వీకరించటం జన భావనలకు సన్నిహితమై ఉండటమనే గుణాలు రంగనాధ రామాయణానికి గొప్ప ప్రశస్తిని తెచ్చిపెట్టాయి.

విశ్వేశ్వర శివదేశికవి :

విశ్వేశ్వర శివదేశికవి గణపతి దేవునికి దీక్షా గురువు. గోళకీ మఠాధిపతి, ఇతడు రచించిన ‘శివ తత్త్వ రసాయన’ మనే గ్రంథం లభించలేదు.

శివదేవవిద్వత్కవి : 

గణపతిదేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల దగ్గర ఇతడు మంత్రిగా ఉన్నాడు. పురుషార్ధసారము, శివదేవ ధీమణి శతకము మొదలైన గ్రంథాలు రచించినట్లు ‘సకనీతి సమ్మతము’ పీఠికలో మానవల్లి రామకృష్ణకవిగారు తెలిపారు.

ఇంకా తెలుగు రచయితలలో విద్యానాధుని సమకాలికులలో కేతన, అధర్వణాచార్యుడు, మంచన, అప్పనమంత్రి, పావులూరి మల్లన, ఎఱ్ఱన మొదలైన వారు పేర్కొనదగినవారు.

 

శ్రీపతి పండితుడు :

శ్రీపతి పండితుడు కాకతీయ సామ్రాజ్య తెలుగు కవులలో శైవ పండిత త్రయంలో మొదటివాడు. రెండవ ప్రోలరాజుకు సమకాలికుడు. శైవులు ఆ కాలంలో తమ మతవ్యాపనం కోసం తెలుగులో రచనలు చేశారు. ఇతడు ‘శివదీపిక’ అనే గ్రంధాన్ని రచించినట్లు తెలుస్తున్నది. అదిప్పుడు అలభ్యం. శివుడొక్కడే దైవమని నిరూపించటానికి కొంగున నిప్పులు మూటకట్టిన మహానీయుడని శివతత్త్వసార గ్రంథంలో పండితారాధ్యులు ప్రశంసించారు.

శివలెంక మంచన :

శివలెంక మంచన శైవ పండిత త్రయంలో రెండవవాడు. రెండవ ప్రోలరాజు కాలంలో ఉన్నట్లు చెపుతారు. ఇతడు రచించిన తెలుగు గ్రంథాలు అలభ్యం. ‘యత్సంవిత్‌’ అనే వాక్యానికి నాలుగు వేల గూఢార్ధాలు (మునుయత్సంవిత్తను వాక్కునకు జెప్పె నాల్గువేల గూఢార్థములన్‌) చెప్పినట్లు శివకవి కంఠాభరణం తెలుపుతున్నది.

మల్లికార్జున పండితారాధ్యుడు :

మల్లికార్జున పండితారాధ్యుడు శైవ పండితత్రయంలో తృతీయుడు. ఆరాధ్యశైవ సంప్రదాయానికి మూలపురుషుడు. కాకతీయ రుద్రదేవుని సమకాలికుడు. పాశుపత శైవ సంప్రదాయానికి చెందినట్లుగా ఇతని ‘శివతత్త్వసారం’ వల్ల తెలుస్తున్నది. దక్షాధ్వరము, వ్యాసాష్టకము, గణాడంబరము, శారభము, పంచగద్యములు, శివతత్వ్తసారము, తుమ్మెద పదాలు, ప్రభాతపదాలు మొదలైనవి పండితుని రచనలుగా తెలుస్తున్నాయి. వీటిలో శివతత్త్వ సారం పేరుతో అయిదువందల కంద పద్యాలు తప్ప మరే ఇతర రచనలు లభించలేదు.

నన్నెచోడుడు :

నన్నె చోడ మహాకవి పన్నెండవ శతాబ్దం కంటే పూర్వుడని కాకతీయ రాజుల ఆరంభ కాలంలో ఉన్నాడని విమర్శకుల అభిప్రాయం. కుమార సంభవమే కాక, కళా విలాసమనే కావ్యాన్ని కూడా రచించినట్లు కుమార సంభవ ప్రథమ భాగ పీఠికలో మానవల్లి రామకృష్ణ కవి తెలిపారు. మార్గదేశి భేదాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసి ‘కుమార సంభవం’ అవతారికలో ఈ విధంగా ప్రస్తావించాడు.

 

మును మార్గ కవిత లోకం

            బున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం

            గున నిల్పి రంధ్ర విషయం

            బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్‌

అంతేకాక నన్నె చోడుడు ‘సరళముగాగ భావములు జాను తెనుంగున నింపు పెంపుతో’ అన్న పద్యంలో తన కవిత్వ లక్షణాలుగా వస్తు కవిత, జాను తెనుగు, వర్ణనా నైపుణ్యం, అర్ధపుష్టి, రసదృష్టి మొదలైనవి పేర్కొన్నాడు. వస్తు కవిత అంటే ఆయన కావ్యంలో చేసిన వస్తు ప్రయోగ సందర్భాలను సమన్వయిస్తే కావ్యానికి అవసరమైన ‘సూక్తులు, వర్ణనలు, గుణములు రసములు’ మొదలైన సామగ్రిని ఆయన వస్తువుగా భావించినట్లు స్పష్టపడుతుంది.9

నన్నెచోడుడు తన కావ్యాన్ని గురువైన జంగమ మల్లికార్జునికి అంకిత మిచ్చాడు. కావ్యమంతటా శివపారమ్యమే చిత్రింపబడింది. పరమత నిందకనిపించదు. కోవెల సంపత్కుమారాచార్యులు గారు అభిప్రాయపడినట్లుగా కుమార సంభవంలో భక్తి సంప్రదాయం కన్న జ్ఞాన సంప్రదాయమే పుష్కలంగా కనిపిస్తుందన్నది నిజం. ‘జ్ఞాన దీపంబు హృత్సదనంబులో దాన, దీవియగా నెత్త దివురువారు… వెలయ మత్కృతి సదువుడు, వినుడు, వ్రాయుడీశ్వరాంబికాగుహులిత్తురీప్సితము’ .. (12`225) అన్న పద్యమే దీనికి తార్కాణంగా చెప్పవచ్చు.

కేతన :

కాకతీయుల కాలం నాటి వాడైన కేతన తన ‘దశకుమార చరిత్ర’ను తిక్కనకు అంకితమిచ్చాడు. దండి సంస్కృతంలో రచించిన ‘దశకుమార చరిత్ర’ వచన కావ్యాన్ని తెలుగులో పరివర్తింపచేశాడు. ఒక కవికి మరొక కవి కావ్యాన్ని అంకిత మివ్వటం కేతన నుండే ప్రారంభమైంది. విజ్ఞానేశ్వరీయం అనే ధర్మ శాస్త్రగ్రంథాన్ని, ఆంధ్ర భాషా భూషణం అనే వ్యాకరణ గ్రంధాన్ని రచించాడు. వ్యాకరణ శాస్త్ర వికాసంలో, భాషాశాస్త్ర దృష్ట్యా కేతన రచించిన వ్యాకరణ గ్రంథానికి ఎంతో ప్రాముఖ్యమున్నది. దశకుమార చరిత్రలో సామాన్య జనుల విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, అధికార వర్గాల్లో  ఉండే మోసాలు మొదలైన నాటి సామాజికాంశాలు వర్ణింపబడ్డాయి. కాకతీయ యుగంలో బయ్యన, వేములవాడ భీమకవి, యధావాక్కుల అన్నమయ్య ఉన్నట్లు తెలుస్తున్నది. కొందరి కాల నిర్ణయంలో అభిప్రాయ భేదాలున్నాయి. కాకతీయుల సమకాలంలో ఉన్న పాపులూరి మల్లన్న రచించిన ‘‘గణితసారము’’ అన్న గ్రంథం పేర్కొనదగింది. ఇందులో ఆనాటి తూనికలు –  కొలతలు మొదలైన విషయాల వివరణ ఉంది.

పాల్కురికి సోమనాధుడు :

కాకతీయుల సమకాలంలో వెలసిన మహాకవి పాల్కురికి సోమనాధుడు మొదటి ప్రతాపరుద్రుని ఆశ్రయం పొందాడని బండారు తమ్మయ్యగారు అభిప్రాయపడ్డారు.10 కాలం విషయంలో అభిప్రాయ భేదాలున్నప్పటికి కాకతీయరాజుల ఆశ్రయంలో ఉన్నాలేకపోయినా వారి సమకాలంలో సోమన ఉన్నట్లు సర్వులు అంగీకరించిన విషయమే. మత ప్రచారానికి సాహిత్యాన్ని సాధనంగా ఉపయోగించుకున్న సోమన తెలుగు సాహిత్య చరిత్రలో తొలి ఉద్యమకారుడు. క్రీ.శ 1168 వ సంవత్సరానికి ఇంచుక ముందో తరువాతనో జన్మించి క్రీ.శ 1240 ప్రాంతం వరకు జీవించాడని బండారు తమ్మయ్యగారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సోమన సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో ఎన్నో రచనలు చేసిన గొప్ప సాహిత్య వేత్త. ‘దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావుగారు సోమనాధుని రచనలను ఈ విధంగా పేర్కొన్నారు.  1. అనుభవసారము 2. బసవ పురాణము 3. వృషాధిపశతకము 4. అక్షరాంక గద్య 5. అక్షరాంక పద్యములు  6. పంచప్రకారగద్య 7. శరణుబసవ గద్య (కన్నడం, తెలుగు) 8. అష్టోత్తర శతనామ గద్య (సంస్కృతం) 9. సద్గురు రగడ (తెలుగు, కన్నడం) 10. గంగోత్పత్తి రగడ (అలభ్యం) 11. బసవోదాహరణము (తెలుగు, సంస్కృతము) 12.చతుర్వేదసారము (బసవలింగ శతకము) 13.  సోమనాధ భాష్యము (సంస్కృతం) 14. రుద్రభాష్యము (అలభ్యము) 15. వృషభాష్టకము (సంస్కృతం) 16. చెన్నమల్లు సీసములు 17. సోమనాధ స్తవము 18. మల్లమదేవి పురాణము (అలభ్యం) 19. పండితారాధ్య చరిత్ర మొదలైనవి.

సంస్కృత భూయిష్ఠ రచన సర్వసామాన్యం కాదని, ప్రాచీన పురాణాలను వదలి తేట తెనుగు మాటలతో సోమన తన సమకాలికులైన బసవని, పండితారాధ్యుల జీవితాలనే పురాణాలుగా రచించాడు. సంస్కృత వృత్తాలను వదలి ద్విపదలలో రచన చేసినాడు.

ఉరుతర గద్య పద్యోక్తుల కంటె

            సరసమై పరగిన జాను తెనుంగు

            కూర్చెద ద్విపదల కోర్కెదైవార

            ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ

            పూరిత సంస్కృత భూయిష్ఠ రచన

            మానుగా సర్వసామాన్యంబుగామి’ అని

పలికి ‘జాను తెనుగు విశేషము ప్రసన్నతకు’ అని స్పష్టం చేసి భాషా విషయంలో సంస్కృత భూయిష్ఠ రచనకు ప్రతిగా జాను తెనుగును స్వీకరించాడు. మత విషయంలో సాహితీ రీతుల విషయంలో సాహిత్య వస్తువు విషయంలో ఒక విలక్షణ మార్గాన్ని అనుసరించాడు. ఆ కాలంలో ప్రచలితమై ఉన్న మార్గపద్ధతిని కాదని,సంస్కృత కావ్య సంప్రదాయాలకు స్వస్తి చెప్పి, ప్రజల నిత్య జీవితంలో వినబడే దేశీ ఛందస్సంప్రదాయాలను స్వీకరించి వాటికొక ఉత్తమ స్ధానాన్ని కలిగించి విభిన్న దేశి కావ్య పద్ధతులకు శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా ద్విపద, శతక, ఉదాహరణ, గేయాది కృతులకు ఇతడే ప్రవర్తకుడైనాడు. కన్నడ దేశంలో బసవేశ్వరుడు ఉజ్జీవింపచేసిన వీరశైవ మతం సోమన కవితాశక్తికి ఆలంబనంగా నిలిచింది. ఇతడు ప్రచారం చేసిన శైవ మతంలో భక్తియే జీవనాడి, జాతికుల భేదాలు కాని స్త్రీ, పురుష విభేదాలు కాని లేవు.

బసవ పురాణంలో ఒక్కొక్క భక్తుని కథ ఒక్కొక్క మణిపూస, బల్లేశుమల్ల, కాట కోటయ్య, ముగ్ధ సంగయ్య, రుద్రపశుపతి, బెజ్జమహాదేవి, గొడగూచి, దీపద కళియారు నాట్య నమిత్తండి, కన్నప్ప, మడివాలు మాచయ్య, నిమ్మవ్వ, సిరియాలుడు మొదలైన భక్తుల కథల నెన్నింటినో వర్ణించి వాయార భక్తుల వర్ణింపగంటి పాయక నా జిహ్వ పావనంబయ్యె’ అని భావించినాడు.

ద్విపద సాహిత్యంలోనే మకుటాయమైనది పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్ర గ్రంథం. ఇందులో అతడు స్పృశించని అంశమే లేదంటే అతిశయోక్తికాదు. ఆనాటి ఆటలు, పాటలు, విద్యలు, వినోదాలు మొదలుకొని వస్త్రాలు, వీణలు, రాగాలు, ఆభరణాలు, నేత్ర వ్యాధులు, చికిత్సలు మొదలైన వెన్నో చెప్పాడు. కాకతీయుల కాలం నాటి స్థితిగతులకు ఈ రచన అద్దం పట్టింది. విషయ విన్యాసంలోను, దేశీయతను ప్రదర్శించటంలోను తూగులో, ధారలో, నడకలో, ఔద్ధత్యంలో పండితారాధ్య చరిత్రను మించిన గ్రంథం లేదని తెలుగు సాహిత్యంలో మహాభారతం ఎటువంటిదో, శివకవుల రచనలలో సోమనాధుడు రచించిన ఈ గ్రంథం అటువంటిదని విమర్శకుల అభిప్రాయం. అది ఒక విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చు. తన కవితా ప్రవాహానికి అవరోధాలనిపించినపుడు భాషా సంప్రదాయాలను, వ్యాకరణ నిబంధనలను నిరాటంకంగా త్రోసి పుచ్చుతాడు. చౌర్యం, ద్యూతం, విటత్వం, రసవాదం, సంగీత శాస్త్రం, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, నానా విధాహార విహార వేష వైఖరులు మొదలైన ఎన్నో అంశాలను సోమనాధుడు సందర్భోచితంగా తన రచనలలో వర్ణించాడు. సోమనాధుని వైదుష్యానికి అతనికి రచనలే ప్రమాణం.

జనసామాన్యం వాడుకలో ఉన్న పలుకు బడులను, జాతీయాలను, సామెతలను విరివిగా ప్రయోగించి ఈ సాహిత్యం తమదే అన్న భావం కలిగించాడు. పునరుక్తులు ప్రయోగించటం, ఒకే అంశాన్ని ఒకేవిధంగా వరుసగా చెప్పుకు పోవటం వంటి బుర్రకథలలోని లక్షణాలను సోమనాధుడు తన కావ్యాలలో స్వీకరించాడు. కథకుడు, శ్రోత ఉభయులు దాదాపు ఒకటిగా మారేస్థితి జానపద కథాగేయాల్లో కనిపిస్తుంది. ఆ లక్షణం తన సాహిత్యంలో ప్రవేశ పెట్టాడు. పండితులకు, జనసామాన్యానికి ఆమోద యోగ్యంగా నన్నయ మార్గానికి ప్రతిగా దేశీ సాహిత్యోద్యమ్యాన్ని ఆరంభించి తుదముట్ట కొనసాగించాడు. తన రచనలో ప్రధాన జీవన సంస్కృతితో పాటు భిన్న భిన్న ప్రజా సమూహాల సంస్కృతిని అభివ్యక్తీకరించటంలో సోమనాధుని మించిన వారులేరు. సోమనాధుని మత పాక్షికత రుచించక పోవటం వల్ల శైవేతర కవులు అతని కావ్యాలను ఉపేక్ష చేసినట్లు కనిపిస్తుంది. ఎవరు ఉపేక్షించినప్పటికి అతని రచనలలోని సాహిత్యపు విలువలు, దేశి ఉద్యమం, తరువాతి కాలపు సాహిత్యాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఆనాటి తెలంగాణా జన జీవితాన్ని మన కళ్ళ ముందుంచింది.

వినుకొండ వల్లభరాయడు :

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వచ్చిన ప్రతాపరుద్ర చరిత్రము, సిద్ధేశ్వర చరిత్రము, సోమదేవ రాజీయము, క్రీడాభిరామము గ్రంథాలు కాకతీయ వైభవాన్ని తెలుపుతున్నాయి. ముఖ్యంగా వినుకొండ వల్లభరాయడు రచించిన క్రీడాభిరామం కాకతీయుల జన సామాన్య జీవన విధానాన్ని ప్రతిబింబింపచేసింది. రావిపాటి త్రిపురాంతకుని సంస్కృత ప్రేమాభిరామానికి ఆంధ్రానుసరణం ఇది.

ఈ త్రిపురాంతకుడు, రావిపాటి తిప్పన ఒక్కరే అని ఇతడు ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నాడని విమర్శకుల అభిప్రాయం. కనుకనే తెలుగులోకి అనువర్తింపబడిన క్రీడాభిరామంలో ఏకశిలా నగర వర్ణన ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాకతీయ కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితుకు అద్దం పట్టింది ఈ రచన. క్రీడాభిరామం ‘‘సిటీమ్యాప్‌’’ లాంటిదని అంటారు. నగర నిర్మాణ తీరుతెన్నులు, నాటి వృత్తులు, కులాలు, ఆటలు, పూటకూళ్ల భోజనాలు, సామాన్య ప్రజల ఆచారాలు, విశ్వాసాలు మొదలైన వెన్నో ఈ గ్రంథంలో మనోజ్ఞంగా చిత్రింపబడ్డాయి. ఏకవీర, మైలారుదేవుడు, భైరవుడు, చమడేశ్వరి, మూసానమ్మ, వీరభద్రుడు, పాండవులు, మాచెర్ల చెన్నడు మొదలైన దేవతల ప్రస్తావనలు ఇందులో చోటుచేసుకున్నాయి. రాజప్రసాదంలో గడియారమున్నట్లు తెలుస్తున్నది. నాడు దేవాలయాలలో కూడా గడియారాలున్నట్లు శాసనాలు తెలుపుతున్నాయి. పూట కూటిండ్లు, వేశ్యావాటికలు, మేషయుద్ధాలు, పాములాటలు, కోళ్ళపోరు మొదలైనవి కూడ వీధి ప్రక్రియకు చెందిన ఈ క్రీడాభిరామంలో ప్రస్తావించబడినాయి. మాచల్దేవి అనే వారాంగన ఇంట్లో ఉన్న చిత్రశాల కూడ వర్ణించబడటం వల్ల కాకతీయుల కాలంలో ఉన్న వాస్తు కళతోపాటు చిత్రకళ ప్రాధాన్యం తెలుస్తున్నది. ఓరుగల్లు మహావైభవాన్ని తెలిపే ఈ గ్రంథం తెలుగు సాంస్కృతిక సాహిత్య చరిత్రలో అపురూపమైంది.

కాకతీయుల కాలంలో వెలసిన తెలుగు సాహిత్యానికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఎందరో కవులు, తమ రచనలతో తెలంగాణా నేలను సుసంపన్నం చేశారు. అవకాశాన్ననుసరించి ఆయా కవుల రచనల్లోని అంతస్తత్త్వాన్ని, సామాజిక చైతన్యాన్ని అందించే ప్రయత్నమే ఈ వ్యాసం. సాహిత్యానికి సంస్కృతికి  పరస్పర సంబంధముంది. సామాజిక యుగధర్మాలు ఆయా కాలాల్లో వెలువడిన సాహిత్యంలో అనివార్యంగా చోటు చేసుకుంటాయి. కనుక తద్వారా సామాజిక, సాంస్కృతిక పరిణామాలను కూడ అవగతం చేసుకునే వీలున్నది.

పాదసూచికలు :

  1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి, సాహిత్య వైజయంతి ప్రచురణ, 1982

2,4. Inscriptions of Andhra Pradesh, Warangal District no. 15.

  1. కాకతీయ సంచిక –  సంపాదకుడు డా. మారేమండ రామారావు –  పుట. 363
  2. తెలంగాణా శాసనములు – లక్ష్మణరాయ పరిశోధక మండలి.

6,7.  కాకతీయ శాసనాలు –  ఆంధ్రభాషాపరిశీలన. పుట. 53, 78. డా. ఎన్‌. ఎల్‌. ఎన్‌. ఆచార్య

  1. తెలుగు సాహిత్య చరిత్ర (SDCLCE), Kakathiya University, Warangal.
  2. పూర్వ కవుల కావ్య దృక్పధాలు –  కోవెల సంపత్కుమారాచార్య.
  3. కాకతీయ సంచిక – పాలకురికి సోమనాథకవి – శ్రీ బండారు తమ్మయ్యగారు. పుట. 207

ఉపయుక్త గ్రంథ సూచిక :

  1. ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము – చెలమచెర్ల రంగాచార్యులు శ్రీనివాస పబ్లికేషన్స్‌ – 2005
  2. కాకతీయ శాసనాలు – ఆంధ్ర భాషా పరీశీలన – డా. ఎన్‌.ఎల్‌. ఎన్‌ ఆచార్య – తెలుగు పరిశోధన ప్రచురణలు – 1987
  3. తెలుగు సాహిత్య సమీక్ష – డా. జి. నాగయ్య, నవ్య పరిశోధక ప్రచురణలు – తిరుపతి
  4. ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సురవరము ప్రతాపరెడ్డి – సాహిత్య వైజయంతి ప్రచురణ – 1982
  5. కాకతీయ సంచిక – సంపాదకులు – డా. మారేమండ రామారావు – పురావస్తు ప్రదర్శన శాలలశాఖ – హైదరాబాద్‌ – 1991
  6. కాకతీయ వైభవ తోరణాలు – డా. పోలవరపు హైమవతి – భార్గవ పబ్లిషర్స్‌ – వరంగల్‌ – 2003
  7. కైఫియత్తు – చారిత్రక పౌరాణికాంశాలు – డా. ఎస్‌. వాణీకుమారి (సిద్ధాంత గ్రంథం) –   1993
  8. కాకతీయ వైభవము – సాహిత్యము – కళలు – శిల్పము – ఆచార్య హరిశివకుమార్‌ –   శ్రీకృష్ణ ప్రచురణలు, వరంగల్‌ – 2000
  9. తెలంగాణా శాసనములు – 1 – లక్ష్మణరాయ పరిశోధక మండలి
  10. తెలంగాణా శాసనములు – 2 – గడియారం రామకృష్ణ శర్మ
  11. పాల్కురికి సోమనాథుని కృతులు – పరిశీలన డా.వే.న. రెడ్డి – జాతీయ సాహిత్య  పరిషత్‌ –  వే.న. రెడ్డి పరిశోధన గ్రంథ ప్రచురణ సంఘం.
  12. ప్రతాపరుద్ర చరిత్ర – ఏకామ్రనాధుడు.
  13. బసవపురాణము – పాల్కురికి సోమనాథుడు.
  14. ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సంస్కృతి – డా. బిఎన్‌. శాస్త్రి
  15. విజ్ఞాన సర్వస్వము – 3,4, సంపుటాలు – తెలుగు భాషా సమితి – మద్రాసు
  16. తెలుగు సాహిత్య చరిత్ర SDLCE (Course Material) Kakaatiya University
  17. పూర్వ కవుల కావ్య దృక్పథాలు – కోవెల సంపత్కుమారాచార్య.
  18. Inscriptions of Andhra Pradesh Warangal District – No. 15.
June 23, 2021 4 comments
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహితీగిరి – డా:తిరునగిరి

by డా: అమ్మిన శ్రీనివాస రాజు June 23, 2021
written by డా: అమ్మిన శ్రీనివాస రాజు

ఆధునిక తెలుగు సాహిత్యంలో అద్వితీయమైన రచయిత, “తిరునగరి” గా అందరికీ సుపరిచితుడైన “తిరునగరి రామానుజయ్య” పద్యం, వచనం, గేయం, సమీక్ష, ప్రక్రియ ఏదైనా సరే తనదైన ప్రామాణికతతో సంబంధిత రచనకు రమణీయత తీసుకురావడంలో సిద్ధహస్తుడు.
చక్కని రచయితగానే కాక, ఎంతో చక్కని వక్తగా, కూడా వాసికెక్కిన తిరునగరి తెలుగు మాస్టారు కావడం “పసిడికి పన్నీరు పూసిన” చందమే!! మూడు దశాబ్దాలపాటు ఆయన చేసిన తెలుగు బోధన వ్యాసంగం ద్వారా వేలాది మంది విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాల బోధనతో పాటు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి పెంచి ప్రేరణగా నిలిచారు, అనేకమంది కవులు వికసించడానికి కారకుడయ్యారు,
ఈ తెలుగు సాహితీ కృషి వలుడు 1945 సెప్టెంబర్ 24న జానకిరామక్క- మనోహర్, దంపతులకు భువనగిరి సమీపంలోని రాజపేట వద్ద గల బేగంపేట ప్రాంతంలో జన్మించారు, ఉద్యోగరీత్యా ఎక్కువకాలం ఆలేరులో నివసించారు.


“కవిత్వం రాయందే కాలం గడవదు” అని చెప్పుకునే తిరునగరి రోజు ఒక్క కవిత, రచన, చేయందే నిద్రపోయేవారు కాదు,
ఆయన పద్యం ఎంత దారణగా ఉంటుందో, వారి వచనం కూడా అంతే సుందరంగా కనిపిస్తుంది, అంతే కాదు ఆయన మాటల ప్రవాహం కూడా అంతే ఆకర్షణీయంగా సాగుతుంది, అదే ఆయన్ని మంచి వక్తగా మలిచింది, కమ్మనైన వారి ప్రసంగాల పాల బువ్వ నిండా మధురమైన జీడిపప్పు లాంటి సూక్తులు ఎన్నో!! ఏరుకున్న వారికి ఏరుకున్నన్ని.
ఈయన సందర్భోచితంగా పాడే పద్యాల జావళి ఎంతో మనోహరంగా ఉంటుంది, “దాశరథి” అంటే ఆయనకు అంతులేని అభిమానం, అంతేకాదు “దాశరథి కృష్ణమాచార్య” రాసిన కవిత్వం, పద్యాలు, ఆసాంతం కంఠతా పట్టిన నిజమైన కవితామూర్తి మంతుడు తిరునగరి,
“బాలవీరశతకం” తో ప్రారంభమైన ఆయన సాహితీ ప్రస్థానం, ఐదు దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాగింది, ప్రతీ రచనకూ తనదైన ముద్రతో నిండిన పరిణితి పులిమే వారు,
తిరునగరి కవిత్వంలోని సరళత, సౌకుమార్యత, ఎంత హృద్యంగా ఉంటాయో ఆయన వ్రాసిన “చెమట నా కవిత్వం” అద్దం పడుతుంది.
అతి సున్నితమైన వస్తువును అత్యంత అద్భుతంగా కవిత్వీకరించిడం ఒక్క తిరునగరికే సొంతం, చెమటకు సమాజానికి దాని ఉన్నతికి గల అవినాభావ సంబంధం ఎంత చక్కగా చెప్పార అంటే….!
“ఈ చెమట తోనే/ బీళ్లు వరి మళ్ళయ్యాయి /ఈ చెమట తోనే పట్టణాల్లో ఫ్యాక్టరీలు వెలిశాయి/……. చెమట తోనే/ ఈ ప్రపంచ మనుగడ/చెమ టోడిస్తేనే /కడుపునిండా తిండి కదా/… అంటారు ఆయన,
కవిత్వంలో నిండి ఉండే ఉత్తేజం, ప్రేరణలను, ఆకళిoపు చేసుకున్న తిరునగరి కవితా అక్షరాలన్నీ ఆదిశగానే అడుగులు వేశాయి,…….. మనిషి ఉన్నతుడు కావాలంటే/ ఉన్నతాశయం ఉండాలి/ ఉన్నతికి చేరాలంటే/ ఉద్యమ స్ఫూర్తి ఉండాలి…..
అంటూనే కార్యసాధనలో విజేత కావాలి అంటే కష్టం అనే “మట్టి” అంటకుండా ఉండదు అనే సందేశం హెచ్చరికను ఎంతో చక్కగా అందిస్తారు.
శృంగార నాయకులు, కొవ్వొత్తి, వసంతం కోసం, అక్షర ధార, తిరునగరీయం, మాపల్లె, ఉషోగీతం, నీరాజనం, యాత్ర, చెమట నాకవిత్వం, ఆయన వ్రాసిన పుస్తకాలలో ప్రధానంగా చెప్పవచ్చు,
ఆలోచన, తిరునగరీయం, పద్య సౌరభం, లోకాభిరామాయణం, లోకాలోకనం, వంటి శీర్షికల పేర్లతో పలు ప్రముఖ సాహితీ పత్రికల్లో ధారావాహికంగా వెయ్యికి పైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు.
మాతృభాష తెలుగుతోపాటు ఆంగ్లం, సంస్కృతం, హిందీ, భాషలపట్ల కూడా సాధికారత సాధించిన తిరునగరి, కొన్ని ఆంగ్ల, హిందీ, కవితలను తెలుగులోకి అనువదించారు, ఈయన వ్రాసిన కవితలు, గేయాలు, దేశభక్తి గీతాలు, లలితగీతాలు, వందకు పైగా ఆకాశవాణి, దూరదర్శన్, కేంద్రం నుండి ప్రసారం అయ్యాయి.
తిరునగరి రచనలపై విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు సైతం జరిగాయంటే వారి రచనల్లోని ప్రామాణికత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు, ఆయన ఏ ప్రక్రియలను స్పృశించిన అది “మాననీయత”అనే చేయితోనే !!
తన కవితా వస్తువు “మానవవేదనకు” ప్రతిబింబమై కనిపిస్తుంది, ఆయన రచనా శైలి అతి సరళమై ప్రతి వారిని పలకరిస్తుంది పరవశింప చేస్తుంది.
నిత్య కవిత్వ చైతన్య శీలి తిరునగరి యొక్క భాష సాధికారతను మెచ్చిన భోపాల్ లోని “అఖిలభారత భాషా సాహిత్య సమ్మేళన్” వారు 2003 సంవత్సరపు “భారత్ భాషా భూషణ్” పేరున “గౌరవ డాక్టరేట్”ను అందించారు.
తిరునగరి యొక్క విశేష సాహితీ కృషిని స్థానిక విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలు, కూడా గుర్తించి గౌరవించాయి, అందులో భాగంగానే తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, “ఆట వారి” సత్కారంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే “దాశరధి పురస్కారం” ఇది తన వజ్రోత్సవ పుట్టిన సంవత్సరం 2020లో అందుకోవడం కాకతాళీయమే అయినా అది ఆయనకు లభించిన సత్కారాలు అన్నిటికీ మకుటాయమానంగా నిలుస్తుంది.
నిత్యం అధ్యయనం, భాషణం, రచన, అనే త్రివేణి పథంలో పయనించిన తిరునగరి సాహితీ ప్రయాణంలో మాతృ సాహిత్యాన్ని ఎంత అవగాహన చేసుకున్నారో! పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను, అంతే ఆకళింపు చేసుకున్న సాహితిపిపాసి తనం ఆయనలో అడుగడుగునా కనిపిస్తుంది, “మనిషే జెండా మానవత్వమే ఎజెండా”గాసాగిన తిరునగరి కలం ఏవాదానికి చిక్కని మానవత్వపు అక్షరమై నిలిచింది.
దాశరధి అన్నట్టు తిరునగరి కవితలు” తేజ స్వంతాలు ఓజ స్వంతాలు” “అభ్యుదయ”అంగీకరించిన తిరునగరి నిండా మాననీయ రక్తం ప్రవహిస్తుంది,
చివరిదాకా తనదైన విజన్ తో కలం సేద్యం చేసిన ఈ అక్షర కృషివలుడు హృదయ సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోనే 25 ఏప్రిల్ 2021 న “ఆచార్య తిరువడిగలళి”కి చేరినారు, ఆయన భౌతిక రూపం కనుమరుగైన తన కనువిందైన కవనం ద్వారా మన కళ్ళల్లో సదా కదలాడుతూనే ఉంటారు.

••••••••••••••••••••••• {నివాళి} డా:అమ్మిన శ్రీనివాసరాజు,

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చేజారిన జ్ఞాపకం

by డా౹౹నెమ్మికంటి సంధ్యారాణి June 22, 2021
written by డా౹౹నెమ్మికంటి సంధ్యారాణి

బాల్యాన్ని బంధించాలని తెలియనే
లేదు
వేళ్ల సందుల్లోంచి జారిపోయింది
పోతూ పోతూ ఇన్ని ఆనందానుభూతుల్ని
వెదజల్లింది

ఆ తరువాత వసంతంలా వచ్చిన యవ్వనాన్ని పట్టుకోవాలని చూస్తే
అదీ పుస్తకం లో దాచిన
నెమలి కన్నులా
నాకు తెలియకుండానే
ఎక్కడో పడిపోయింది
పోతూ పోతూ
కొన్ని మధురానుభూతులను
వెదజల్లి వెళ్ళింది

ఇక ఇప్పుడు ……

బాధ్యతలకు బందీ అయిన
బరువైన జీవితం ౼
బాల్యం బాదం చెట్టు చుట్టూ
తిరిగి కాయలను ఏరుకుంటుంటే
యవ్వనం మధురానుభూతుల్ని
మనసారా ఆహ్వానిస్తుంటే

నేనున్నాను అంటూ వర్తమానం !

వర్తమానం బాధ్యతల బంధాల చుట్టూ తిరుగుతూ
బరువులను ఎత్తు కుంటున్నది

యవ్వనం ఊహల చుట్టూ తిరిగే
ఉత్సాహాన్ని ఇస్తే

ఉద్యోగం జీతం చుట్టూ తిరిగే
నీరసాన్ని స్తున్నది

ఏమంత్రగాడోవచ్చి
చేజారిన బాల్యాన్నో
చెప్పకుండా పోయిన యవ్వనాన్నో
తిరిగి ఇస్తే బాగుండు…

౼డా౹౹నెమ్మికంటి సంధ్యారాణి

June 22, 2021 0 comment
6 FacebookTwitterPinterestEmail
కవితలు

సృష్టి ఎవ్వరి స్వంతం

by -మారంరాజు శ్రీనివారావు June 22, 2021
written by -మారంరాజు శ్రీనివారావు
సృష్టి ఎవ్వరి స్వంతం
మైల పడి పోయింది అసాంతం
ఎక్కడో అల పైన
భువన భోనాంతరాలలో కూర్చున్న
ఆ బ్రహ్మ పీఠానికే ఎసరు పెట్టింది
ఈ మానవ ప్రపంచం
తన పీఠానికే ఎసరు వచ్చుచువున్నా
ఏ మాత్రం గ్రహించకనే ఉన్నది
ఈ మానవ ప్రపంచం
రాళ్లు పగల గొడుతున్నారు
రత్నాల కోసమని
దేవుని విగ్రహాలు పగల గొట్టుచున్నారు
నిధి నిక్షేపాల కోసమని
స్నేహ హస్తమిచ్చి
రోగమొకటి అంట గడుతున్నారు
ఈ విశాల భూ ప్రపంచములో
తానొక్కడే ఉండాలని ఆశపడుతున్నాడు
కాని తాము తీసిన గోతిలో తామె పడుతున్నారు
ఈ మానవ ప్రపంచం
ఎక్కడో అడవుల్లో రాతి గుహల్లో
పుట్టిన మనిషి
ఆకులు అలాలూ తింటూ
ఎంతో పరిణామం చెంది
పాలకడలి నంతా గాలిస్తూ వున్నాడు
మొదట వాసుకి కనిపించితే
ఆపై విష్ణు మూర్తియే మనకు చిక్కితే
లక్ష్మి దేవి బంగారు నగలకై ఎసరు పెట్టవచ్చు
విష్ణు నాభి దొరికితే బ్రహ్మ పదార్ధాన్ని కనిపెట్టవచ్చు
మనిషి పుట్టుకనే విడమరిచి చెప్పవచ్చు
కాని అటుదిటై ఇటు దటయితే
కాలు జారీ భూమ్మీద పడితే
రెండు ముక్కలవ్వ వచ్చు
మళ్ళీ “” జర”” కోసమై ఎదురు చూడావచ్చు
జర చేతనే సంధింప బడను వచ్చు
మేం నమ్మమంటే మనుషుని బతుకు
కొంప పూర్తిగా మునగ వచ్చు
మనిషి మళ్ళీ తిరోగమనమై పోవచ్చు
ఇప్పుడు జరుగుతున్న దదేనని
అర్ధం చేసుకున్న వారికి అగుపడనువచ్చు.
-మారంరాజు శ్రీనివారావు
June 22, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

మా ఏడ్పు మమ్మేడ్వనిండు!!

by -డా.ఆచార్య ఫణీంద్ర June 22, 2021
written by -డా.ఆచార్య ఫణీంద్ర
ఏడుపన్న నేల ఏవగింపు కలుగు?
ఏడ్పు నందు ముదము నేల గనరు?
ఏడ్పులందు మంచి ఏడ్పులున్నవి గదా!
ఏడ్పు గొప్ప దనము నెరుగ రేల?
అప్పుడ పుట్టు బిడ్డ తన అమ్మ శరీరము వీడి, తానుగా
నిప్పుడమిన్ స్వతంత్రమగు నింద్రియముల్ గల రూపమందునన్
ఎప్పుడు చేరు, నప్పుడిక ఏడుపు తోడనె ఆగమించడే?
గుప్పున వాని ఆప్తు లట గూడి ముదంబున తేలియాడగాన్!
క్రొత్తగ పెండ్లియై మదిని  కోరిక లూరు పడంతి శోభనం
పత్తరు వాసనల్ నడుమ, హాయిగ తా తొలిసారి భర్తనే
హత్తుకొనంగ, నాతడు రసార్ద్రతతో రమియింప, సౌఖ్యమున్
ఎత్తుగ కొండ నెక్కినటు లేర్పడ, కంటను నీరు గారదే?
నవమాసంబులు గర్భ ధారణమునన్ నానా విధుల్ కష్టము
ల్లవి యెన్నో భరియించి, నొప్పులను తాళం జాల కేడ్పేడ్చియున్,
భువిపై బిడ్డకు జన్మ నిచ్చి, పిదపా పుట్టుం గనన్, మోదమే
స్రవియించున్ కనులందు నొక్కపరి బాష్పాలౌచు సంవేదనన్!
దిక్కు దివాణమున్ గనక దీనుడునైన అభాగ్యు డొక్కడున్
ఎక్కడ లేని ఓర్పు గొని, ఎంతయొ కష్టపడంగ, చేరి తా
నెక్కుచు మెట్టుపైన మరి యింకొక మె ట్టటు లగ్ర పీఠమున్ –
ఒక్కపరిన్ గతంబు గన, నొల్కవె చుక్కలు కంటి కొల్కులన్?
తాను గన్న సుతుడు తన కళ్ళ ముందరే
ఇంచు కించు కిటుల యెదిగి తుదకు,
అందనంత యెత్తు నగుపించుచున్నచో
తండ్రి కనులు నీట తడిసిపోవె?
ఏడ్పు గొప్పదనం బెవ్వ రెరుగకుండ –
హీనముగ జూతు; రది గాంచి ఏడ్పు వచ్చు!
ఏడ్పుకే ఏడ్పు దెప్పింతు రీ హీన జనులు!
ఏడ్పును, నను, మా ఏడ్పు మమ్మేడ్వనిండు!!
-డా.ఆచార్య ఫణీంద్ర
June 22, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సంస్కృత భాషా పరిమళం శ్రీ భాష్యం

by Ananthaacharaya K.S. June 22, 2021
written by Ananthaacharaya K.S.

సంస్కృత భాషతో మూర్తీభవించిన పుంభావ సరస్వతి శ్రీ భాష్యం విజయసారథిగారు. అద్భుతమైన భాషా పాండిత్యంతోపాటు మధుర, మంజుల మనోహరంగా కవిత్వం చెప్పగల పద్మశ్రీ, మహాకవి, మహామహోపాధ్యాయ వాచస్పతి – కులపతి, యుగకర్త, యుగోద్ధర్తా, యుగచక్రవర్తి, సరస్వతీ సంతోత్తంసులు శ్రీ శ్రీ భాష్యం విజయసారథిగారు. వీరు గోపమాంబ – నరసింహాచార్య పుణ్యదంపతులకు – కరీంనగర్ జిల్లా చేగూర్తి గ్రామంలో తేదీ 10.3.1936లో జన్మించినారు. చిన్ననాటి నుండే వీరిలో మానేరు నీటి గలగలలా కవిత్వం ప్రవహించింది. పదకొండవయేటనే ‘శారద పద కింకిణి’ బాసర అమ్మవారిని నుతియించినారు. ఆనాటి నుండి మొదలైన కవిత్వం పాయలు పాయలుగా విస్తరించి 150కి పైగా గ్రంథరచనలు చేసి యావతం భారత్ ప్రజానీకం మన్ననలు అందుకన్న మందాకిని కవి. వీరి రచనలు నాగరి లిపిలోనూ కొన్నింటిని తెలుగు లిపిలోనూ అందించినారు. ఈ మహాకవి గ్రంథాల్లో తాత్త్విక చింతన , సర్వమత సమన్వయం వంటివి విషయపరంగానూ, ఛందో అలంకార వైవిద్యం వంటివి రచనాపరంగానూ అనేక అంశాలు గోచరిస్తాయి. వారి గ్రంథాల్లో ప్రధాన విషయం సమాజం. పైకి వీరి రచనలన్నీ దైవభక్తి ప్రపూరితాలైనా కనిపించినా అంతఃసూత్రంగా సమాజ చిత్రీకరణ ఉంటుంది. వివిధ దేవతాస్తతులలోను, చివరికి భక్తికి పరాకాష్ఠగా చెప్పబడే సుప్రభాతాలలోను దైవభక్తి – మోక్షసాధన పైకి కనిపించినా దేశభక్తి, స్వాతంత్ర్య సమర భావనలు అంతర్లీనంగా ఉంటాయి.

ఈనాటి ప్రపంచమంతా డబ్బుకు లోకం దాసోహం అంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకని శ్రీ భాష్యం వారు రూపాయి మహిమను ‘రూపసూక్తం’లో వ్యంగ్యంగా రాశారు. మనిషి చేత సృజింపబడి మనిషిని ఏ విధంగా రూపాయి ఆడిస్తుందో తెల్పారు. రూపాయి తెల్సుకోవటానికి ఎవరికి సాధ్యమవుతుందంటూ ఆరంభించిన సూక్తంలో అద్భుతంగా రూపాయి మహిమను తెల్పారు.

శ్రీ భాష్యం వారు ఎంత సనాతన సంప్రదాయ విషయ అవగాహన దార్శనికులు. లోతులు కలిగినవారో అంతే ఆధునికతను జీర్ణించుకున్న విద్వత్ కవి, ఈ విషయంలో మనం లోపలికి వెళ్ళి ‘సృష్టి దర్శనం’ చూస్తే అందరికీ అవగతమవుతుంది. ఈ కవి ఆత్మను పట్టుకోవాలంటే సంపూర్ణ అవగాహన లోతైన పరశోధన అవసరఁ. వీరి గ్రంథాల మీద రచనలలో అంతర్గతాంశముల మీద వివిధ విశ్వవిద్యాలయాల నుండి పరిశోధనలు జరుగుతున్నాయి. వీరి రచనలు వివిధ ప్రక్రియలలో మనకు అగుపిస్తాయి. దాదాపు అన్ని సాహితీ ప్ర్రకియలను వీరు స్పృశించినారు. సుప్రభాతాలు, స్తోత్రాలు, భక్తి రచనలు, అధిక్షేప కవితలు, విమర్శ, ఆప్తలేఖలు (లేఖా సాహిత్యం) ఖండ కావ్యాలు, నవలలు, ప్రహేళికలు, విమర్శ, వర్ణనాకావ్యాలు, అనువాదాలు.

ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా కరోనా విషూచికతో బాధపడుతుంది. దీనిని దృష్టియందు ఉంచుకొని గురువుగారు ‘కరోనా మూలతో జహి’ రాసి అందులో కరోనా సోకకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చాలా విషయాలు రాసి జనాలను అప్రమత్తం చేసినారు.

ఎంత అద్భుతమైన కవియో అంతే అద్భుతమైన విద్యారు్థల గుండెలలో చోటు సంపాదించుకున్న అధ్యాపకులు. చక్కటి స్వ రూపంతోపాటుగా సుస్వరంతో వారి బోధనలో విద్యార్థులు మైమరచిపోయారన్నది వాస్తవం.

రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందినారు. కళాశాల అభ్యుదయానికి, అస్థిత్వానికి వెన్నెముకగా నిల్చిన అనుపాలన దక్షత వీరిది. లెక్కకు మిక్కిలి బిరుదులు, సత్కారాలు, సన్మానాలు పొందినా సాదాసీదా వ్యక్తిత్వం కలిగిన మహోన్నతులు. ఏ కార్యం చేపట్టినా విజయవంతం చేసేదాకా నిద్రపోని కర్తవ్య పరాయులు శ్రీ భాష్యం విజయసారథిగారు. ఏ పురస్కారమైనా వీరిని వెతుక్కుంటూ వచ్చిందే తప్ప వాటి కొరకు ఎప్పుడూ ప్రయత్నించలేదు.  సర్వ వైదిక సంస్థానమ్ కరీంనగరంలో స్థాపించినారు. ప్రస్తుత సమాజ అవకతవకల సవరించడానికి, వైదిక ధర్మంవైపు మళ్ళించడానికి దీనిని వేదికగా చేసినారు. వీటి ద్వారా పుస్తక ప్రచురణలు, సంస్కృత భాషా పరివ్యాప్తి, ధర్మ నిరతి పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మనిధిని ఏర్పాటుచేసి ప్రతీసంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద పండితులను, కవులను, కళాకారులను సత్కరించే ఒక బృహత్ యజ్ఞం కొనసాగిస్తున్నారు. స్వయంగా శ్రీ భాష్యం వారు ఒక సంస్కృత పండితులకు ప్రతీ సంవత్సరం ఇరువది ఐదువేల నగదు విలువతో గత మూడు సంవత్సరాలుగా పురస్కారం అందిస్తున్నారు.  యజ్ఞవరాహ క్షేత్రం కేంద్రంగా ఒకవైపు ఆధ్యాత్మికతతోపాటుగా సాహితీ కార్యక్రమాలు, చర్చాగోష్టులు, అవధానాలు, సంగీత కచేరీలు నృత్యోపహారాలు ఎన్నింటినో నిర్వహింప జేస్తున్న ఘనత వీరిది. వీరి సమగ్ర వ్యక్తిత్వము, రచనలు, అధ్యాపకత్వం, విశేష కృషిని ఒకచోట చేర్చి డా. మాదిరాజు బ్రహ్మానందరావుగారు జీవన సారిణి పేరిట ఒక గ్రంథం వెలువరించినారు.

కాళిదాసు అంతటి ఈ మహానభావులున్న సమయంలో వారితోపాటు మనం ఉండటం గొప్పతనంగా మనం భావించవచ్చును. ఇటీవలె వీరికి అజో – విభో – కందాళం – 2021 ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని శ్రీ భాష్యం విజయసారథిగారికి హైదరాబాదులో అందించి సగౌరవంగా సన్మానం అందించింది. వీరిని గురించి రాసే ప్రతి అక్షరం అందరినీ కదిలిస్తుంది. సర్వ వైదిక సంస్థానమ్ అదొక ఆధ్యాత్మిక ప్రకారం అడుగులు వేయాలనిపిస్తుంది. భక్తిభావ తరంగిణిలో ఓలలాడాలనిపిస్తుంది. అదొక సాహిత్య క్షేత్రం. అక్కడి నుండి వచ్చే ప్రతి అక్షర పంటను అనుభవించాలనిపిస్తుంది. అదొక సంగీత ధామం. అందులో ఓలలాడాలనిపిస్తుంది. సాహితీ శిఖరం శ్రీ భాష్యం విజయసారథిగారిని ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు కలిగినందుకు మిక్కిలి సంతోషిస్తూ ఇంటర్వ్యూలోకి….

జాతీయ భావాన్ని నేపథ్యంగా, భారతీయ ధర్మాన్ని ఆదర్శంగా స్వీకరించి ఆధునిక సామాజికాంశాలను వస్తువుగా తమ రచనల ద్వారా జాతిని మేల్కొల్పిన మహాకవి, మహా మహోపాధ్యాయ పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారధిగారిని కలిసి మయూఖ కోసం సల్పిన ముఖాముఖి.

మీ సంస్కృత అభ్యసనానికి ప్రేరణ ఏమిటి?

తర్క పండితులు మాతామహులు లక్ష్మణశాస్త్రిగారు సంస్కృత సాహిత్యాన్ని సంగీతశాస్త్రాల మర్మాలు ఎరిగిన మాతామహి లలితమ్మగారి ప్రభావం ఎంతైనా ఉంది. మాతృమూర్తి గోపమాంబ, మాతామహిగారల ప్రోత్సాహం సంస్కృత భాషాధ్యయనం వైపుకు అడుగులు పడినాయి. అన్నగారు వెంకటాచార్యుల గారి చలువ అధ్యయనానికి దోహదం చేసినాయి. మాతామహుల దగ్గరికి వచ్చే ఉత్తరభారత సంస్కృత పండితుల కవిత్వం వెరసి సంస్కృత భాషాభ్యసనానికి ప్రేరణలుగా నిలిచినాయి.

మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది?

వరంగల్లు జిల్లాలోని పాలకుర్తిలో శ్రీ సోమనారసింహ వేదపాఠశాలలో సంస్కృత విద్యార్థిగా చేరినాను. అంతకుపూర్వమే మాతామహుల వద్ద న్యాయబోధినీ సహిత తర్క సంగ్రహం, న్యాయమీమాంసాది షట్ శాస్త్రాలను నేర్చుకొనడం, బాసర అమ్మవారి మీద ‘శారద పదకింకణ్” పదకొండవ ఏటనే వచ్చిన రచన. అక్కడ మహా విద్వాంసులైన బ్రహ్మశ్రీ బొడ్డుపల్లి నరసింహశాస్త్రులు శ్రీమాన్ మరింగంటి విజయసారధిగారల సహకారంతో ‘కాదంబరి’ క్షుణ్ణంగ అధ్యయనం చేశాను. దీని ప్రభావంతోనే ‘మనోరమ’ వెయిపుటల సముద్ర గుప్తుని కాలానికి సంబంధించిన రాజకీయ, సాంఘిక పరిస్థితులను తెలిపీ నవల రాయటం జరిగింది. 1948లో నైజాం వ్యతిరేక కార్యకలాపాలతో రజాకార్లు పాలకుర్తి పాఠశాలను మూసివేశారు. ఆ బాధతో ‘విషాదలహరి’ కావ్యం పూర్తి చేయటం జరిగింది. 1953లో వరంగల్లులోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో అన్నగారు గోపాలాచార్యులు చేర్పించారు. మేఘదూతం, కిరాతార్జునీయం శృంగార నైషధం, కాదంబరి లాంటివి పూర్తి చేసుకొని, తదుపరి మద్రాసు విశ్వవిద్యాలయం ద్వారా ‘విద్యాప్రవీణ’ పరీక్ష ఉత్తీర్ణులయ్యాను. ప్రతిభను గుర్తించి పాలకమండలి వారు అదే కళాశాలలో అధ్యాపకునిగా నియమింపబడటం జరిగింది.

మీ రచనలకు ప్రేరణ ఏమిటి?

గృహ వాతావరణం, ఆనాటి సమాజ స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, నైజాం ప్రభుత్వంపై వ్యతిరేకత, వెరసి నా కవిత్వానికి ఊనికలుగా నిల్చినాయి. ఏడేళ్ళ వయసులోనే అమ్మగారి ప్తోత్సాహం మొదటి కవిత్వం బయల్పడింది. చిన్ననాడు పాలలో నీళ్ళు కలిపి పోసే మల్లక్క సరిజేసే కవిత్వం రాసి మార్గాన్ని మళ్ళించినాను. అనేక సంఘటనలు కూడా రచనలకు శీర్షికలుగా నిలిచినాయి.

మీ అభిమాన కవులు ఎవరు? వారి ప్రభావం మీపై ఎలా ఉంది?

భవభూతి, జగన్నాథ పండితరాయలు, బాణభట్టు, కుంతకుని వక్రోక్షి జీవితం అనే గ్రంథంలో ఆయన పదప్రయోగానికి ముగ్దుడినై బాసర సరస్వతీ దేవి స్తుతిలో ఈ పద్ధతిలో కవితా నిర్మాణం జరిగింది. ప్రాచీన కవుల నుండి వచ్చిన సంప్రదాయాలు, ప్రయోగాలు జీర్ణించుకొని నా రచనలో తాత్త్విక చింతన, సర్వమత సమన్వయం వంటివి విషయపరంగా అనేక అంశాలు కన్పిస్తాయి. రచనలు అన్నీ దైవభక్తి ప్రపూరితాలైనా అంతసూత్రంగా సమాజ చిత్రీకరణ ఉంటుంది. దేవతా స్తుతుల్లోనూ దైవభక్తి – మోక్షసాధన పైకి కన్పించినా దేశభక్తి, స్వాతంత్ర్య సమరభావనలు అంతర్లీనంగా ఉంటాయి.

వర్తమాన సామాజిక అంశాల్ని చెప్పడానికి వైదికమైన సూక్త ప్రక్రియను ఎంచుకోవడానికి విశేష కారణం ఏదైనా ఉందా?

సంస్కృత భాష పురాణేతిహాసాల కథలకు, స్తోత్రాలకు మాత్రమే పరిమతమైతావనే అపప్రథమ తొలగించడానికి, నూతనత్వాన్ని, వాటి రూపాన్ని విషయాన్ని మార్చి ఆధునిక సమాజ చిత్రీకరణకు వినియోగించినాను. ఉదాహరణ లేఖా, మాలికా ప్రక్రియలకు సైతం నవీనత్వాన్ని చేకూరుస్తూ సంస్కృత సాహిత్యానికి పరిచయం చేశాను. ప్రస్తుతం అంతః బహిశ్శత్రువులనేకులు దేశ వినాశనానికి కాచుకొని కూర్చున్న పరిస్థితుల ప్రబోధిస్తూ రాసింది ఉషస్సూక్తమ్ అన్నారు. రూపాయికి ధర్మం వదులుకోవద్దని రూపసూక్తమ్ ద్వారా తెల్సడేసాను. సూక్తాలలోని అంతరార్థం గ్రహించడమే ప్రస్తుతం అవసరంగా భావించి ఈ ప్ర్రకియను ముందుకు తీసుకొని వెళ్ళాను.

భారత జాతి యొక్క ముఖ్యోద్దేశ్యం ఏమిటి?

ప్రతీ భారతీయుడు కులమతాలకతీతంగా తన దేశాన్ని, దేశ సంపదను సంస్కృతినీ పరిరక్షించాలని, ప్రాచీనవైభవ పునరుద్ధరణకు పూనుకోవాలని అరువది శ్లోకాలతో సాగిందీ ఖండకావ్యం, జాతీయత, జాతీయ సమైక్యత దేశభక్తి. ఈ కావ్యంలోని మూల అంశాలు, భారతీయత అనే భావన ప్రజల నిండా నిండుకొని, దేశ పురోగతి సాధించాలంటే స్వధర్మ కౌశలం, స్వశక్తి యుక్తి తో అందరూ తోడ్పడాలన్నదే దీని సారాంశం. ఈ కావ్యంలో భారతభూమి ఔన్నత్యం ప్రస్తుతించినారు.

రాసకేళి గురించి చెప్పండి.

రాధాకృష్ణులు నాయకులుగా శృంగార పరంగా మాత్రా ఛందస్సులో సాగుతుది రాసకేళి కావ్యం. సంగీత నృత్య రూపకంగా ఆయా ఖండలకు ……. నిర్ణయం చేస్తూ రాయటం జరిగింది. శ్రీ కృష్ణుని యందు గోపికల ప్రేమకు లక్ష్యల క్షణంగా మానవ రూపంలో ఉన్న పరమేశ్వరుని యందు ఐక్యం కావటం ఈ కావ్య పరమార్థం. 108 ఖండికలతో రాసకేళి సాగింది. ప్రతీ ఖండిక యందు ఒక్కొక్క భంగిమను, ఒక్కొక్క లీలను వర్ణించి ప్రదర్శన యోగ్యంగా ఉంచడం జరిగింది. వేణుగాన విశ్వాసాలను తెల్పి సంగీత నాట్య యోగ తాత్త్విక శాస్త్ర సమ్మేళనం కావ్యం. జయదేవుని అష్టపదుల్లాగా అగుపిస్తాయి. అలాగే సంగీత ప్రధానంగా సాగింది సంగీత మాధవమం.

ప్రహేళికలపై చాలా కృషి చేశారు కదా కారణం ఏమిటి?

నేటితరం పిల్లలకు పజిల్స్ అంటే చాలా ఇష్టపడుతారు. అలాగే సంస్కృత భాషలోని పొడుపు కథలు ప్రహేళికలను సేకరించి సంస్కృతభాష చమక్కులను గమ్మత్తులను తెల్సుకొని జీవితానికి అన్వయించుకుంటూ, మేధోశక్తిని పదను పెట్టుకోవడానికి చాలా ఉపకరిస్తాయి. రెండువేల ప్రహేళికలు సేకరించి ఎనిమిది గ్రంథాలుగా ప్రకటించి రెండు భాగాలు మాత్రమే అచ్చులో దొరుకుతాయి. యక్ష ప్రశ్నలలాంటి ప్రహేళికల సేకరించి వాటికి జవాబులు అందజేశాం.

రవీంద్రుని గీతాంజలి అనువాదం చేయటానికి కారణం ఏమిటి?

1954-55 ప్రాంతంలో బెంగాలు నుండి శ్రీ సురేంద్రమోహన్ గారు వరంగల్ కు కాకతీయ శిల్పంపై పరిశోధనకు విచ్చేశారు. వారి ప్రోత్సాహంతోనే బెంగాలులోని విశ్వకవి రవీంద్రనాథ ఠాగోర్ రాసిన గీతాంజలి అనువదించాను. గొప్ప రచనను సంస్కృతీకరించటం ఆనందంగా ఉంది. అయితే ఇది రాసి పక్కన పెడితే అమ్మవారు పాడవకుండా గుళ్ళలో కట్టి జీడి గింజలను వేసి కాపాడిన తల్లి. ఇటీవల చెత్తలోంచి దొరికిన మాణిక్యం ఇది. దీనిని సంస్కృతభాషా నిర్దేశకులు ఆచార్య నీలకంఠంగారి ఆధ్వర్యంలో దీనిని ఇటీవలే ముద్రించాము.

పద్మశ్రీ, మహామహోపాధ్యాయ, బిర్లా ఫౌండేషన్ అవార్డు ఇటీవల అభో – విభో కందాళం పురస్కారం అందుకున్నారు కదా. మీకు ఎలా అనిపించింది?

పురస్కారాలు, ప్రేరణలు. అయితే వీటి కోసం ఎదిరి చూడకుండా పరిశ్రమ చేసుకుంటూ వెళ్ళాను. ఇటీవల అభో-విభో కందాళం పురస్కారంలో ప్రత్యేక సంచికను రచనల విశ్లేషణ రాయించి వీటితోపాటు జీవన సాఫల్య పురస్కారం అందించటఁ వలన ఆనందం కలిగింది. ప్రముఖులు పూర్వ ప్రధానమంత్రి పి.వి.నర్సింహారావుగారు, నాటి గవర్నరు శ్రీ కృష్ణకాంతంగారు నాటి వ్యవసాయ శాఖామాత్యుల శ్రీ జువ్వాడి చొక్కారావుగారి నుండి నేటి తెలంగాణా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరంరావుగారు, ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడుగారలు ప్రోత్సాహాన్నిస్తూ, గ్రంథావిష్కరణలు, సత్కారాలు అందించిన విషయం మరిచిపోలేని అనుభవం. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు అందిఁచి ప్రోత్సాహం అందించడం చాలా సంతోషం.

సర్వవైదిక సంస్థానమ్ స్థాపనలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

వేద వాఙ్మయాన్ని తరాలకు అందజేస్తూ, ధర్మాన్ని నిలబెట్టి, సంస్కృతభాషా వికాసానికి దోహదం చేయడం ముఖ్యోద్దేశ్యం. యజ్ఞవరాహ క్షేత్రం కేంద్రంలో ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మనిధిని ఏర్పాటుచేసి వేదపండితులు కవులు, కళాకరులను ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎంపిక చేసి ప్రతీ సంవత్సరం గత 30 ఏళ్ళుగా పురస్కారాలు అందించటం జరుగుతుంది. అలాగే ఒక సంస్కృతి పండితునికి ప్రతీ సంవత్సరం నా స్వంత ఖర్చులతో 25000/- రూ.లు శాలువా, జ్ఞాపికాతో పురస్కారాలు అందజేస్తున్నాం. గత మూడు వత్సరాలుగా ఇది కొనసాగుతుంది.

కె.ఎస్.అనంతచార్య, కరీంనగర్

9441195765

June 22, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us