మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

కథా పంచకం (చిన్న కథలు)

by Dr. Lakshmanacharyulu M June 22, 2021
written by Dr. Lakshmanacharyulu M

అనువాద కథలు

 

మూలం : నరేంద్ర లాహ (హిందీ)                                                  అనువాదం : డా॥ లక్ష్మణాచార్యులు, మరింగంటి

 

  1. దొరికితేనే దొంగలు

ఓ పెద్ద మనిషి తన కొడుకుని పిలచి ‘హితోపదేశం’ చేస్తూ ` ఒరేయ్‌! జీవితంలో ఏదైనా సాధించి గొప్పవాడివి కావడానికి ప్రయత్నించు. అవిగో! ఆ భవనాలు చూసావా? వాటి యజమానుల్లా నువ్వు కూడా ఏదో ఒకటి చేసి గొప్పవాడివి అవ్వు. సరేనా?’’ అని అడిగాడు.

ఆ కొడుకు తన జులపాల జుట్టు పైకెగరేస్తూ ` ఏం చేయమంటావ్‌?’’ అని అడిగాడు మెల్లగా.

ఆ పెద్దమనిషి వేదాంత ధోరణిలో ` ‘‘కష్టపడు. వీళ్ళంతా రేయింబవళ్ళు కష్టపడ్డారు. ఆఖరి చెమట చుక్కనూ కార్చి, శ్రమచేయడం వల్లనే అంత పెద్ద పెద్ద భవనాలు నిర్మించగలిగారు. నువ్వూ అలాగే కష్టించి పనిచేసి, పెద్ద ఇల్లు ఒకటి నిర్మించు. దానిలో నివసిస్తున్నట్టుగా కలకంటూ ఉండు’’ అని అన్నాడు.

ఆ కొడుకు ఏదో ఆలోచిస్తూ దృఢస్వరంతో ` ‘‘అలాగే నాన్నా!’’ అని అన్నాడు.

అదే రాత్రి ఆ కుర్రాడు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. పోలీసులు వాణ్ణి పట్టుకొని జైల్లో పెట్టారు.

ఈ సంగతి తెలిసి, ఆ పెద్ద మనిషి కంగారుగా వచ్చి పలకరించాడు. ‘‘నాన్నా! నేనైతే సరైన మార్గమే ఎంచుకున్నా కాని నాటైం బాగా లేదు. పట్టుబడి పోయా పెద్ద పెద్ద భవనాల్లో ఉండే బడా బాబులు కూడా ఇదే మార్గం పడతారు. దొరకనివాళ్ళు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటే, దొరికినవాళ్లిలా ఊచల వెనక ఉంటారు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర! అంతే!!

  1. మసాలా

శ్రీ బాబూలాల్‌గారు నగరానికి చెందిన పెద్ద విమర్శకుల్లో ఒకరు. ఏ అంశమైనా, ఏ సమస్య ఎదురైనా దాన్ని విమర్శిచడంలో వెనుకాడడు. తప్పులు పట్టడంలో ఎవరైనా సరే, ఆయన తర్వాతే.

ఈ మధ్యనే జరిగిన ఒక సంగతి తీసుకుందాం. ఓ రోజు బాబూలాల్‌గారు తన ఇంటివరండాలో కూర్చుని తీరికగా ‘టీ’ త్రాగుతూ ఉన్నారు. వారితోబాటుగా ఇంకొంతమంది ఇలాంటి విమర్శకులు అక్కడ కూర్చొని ఉన్నారు.

ఇంతలో పక్కింటి హరిగారు అటుగా వచ్చారు పాపం! ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా ఆందోళనగా, విచారంగా ఉన్నారు. మన బాబుగారు ఆయన్ని గమనించి ` ‘ఏమైంది! హరిగారూ? ఏంటలా ఉన్నారు?’ అడిగారు ఆదుర్దాగా.

హరిగారు ఒక్క క్షణం ఆగి, ఆయన ఆదుర్దా పడుతూనే ` ‘ఏం చెప్పమంటారు బాబుగారూ! ఇందాక అలా బజారుకు వెళ్ళా. అక్కడ నా సైకిల్‌ని దొంగలెత్తుకుపోయారు’’ అని అన్నారు.

ఇంకేముంది? మన బాబుగారికి ‘మసాలా’ దొరికింది. ఆయనలోని విమర్శకుడు నిద్రలేచాడు ` ‘‘ఏమిటో! ఈ మధ్య మనుషుల్లో హడావుడి, నిర్లక్ష్యం, అజాగ్రత్తలు ఎక్కువైపోయినయ్‌. అసలు బజార్లో సైకిల్‌ ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టగూడదో తెలీదు. పైగా సైకిల్‌కి తాళం కూడా వేయరు’’ అని అక్షింతల జల్లు కురిపించాడు. ఆయనేమన్నా అనుకుంటాడేమోనని హరిగారు అలాగే తలొంచుకుని నిలబడ్డాడు.

ఇంతలో ఆ దేవుడు ఆయన బాధ గమనించినట్టున్నాడు.  ఇంట్లోంచి బాబుగారి శ్రీమతి గట్టిగా అరిచింది `

‘‘ఇదిగో! అలా బజారుకెళ్ళి కొంచెం కూరగాయలు తీసుకురండి’’ అని అన్నది.

బాబుగారు తన సుపుత్రుణ్ణి చూచి ` అరే! బాబూ! కొంచెం వెళ్ళి నా సైకిల్‌ తీసుకురా!’’ అని అన్నారు.

ఐదు నిముషాలు గడిచాక, ఆయన కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి, కంగారుగా ` ‘‘నాన్నగారూ! మన సైకిల్‌ ఇంట్లో కనబడడం లేదు. మీరు సరిగ్గా తాళం వేసినట్టు లేదు. ఎవడో దొంగ వచ్చి ఎత్తుకపోయాడు.’’

 

  1. పాపం! బ్రహ్మానందం!

బ్రహ్మానందానికి చాలాకాలం తర్వాత బస్సు ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. పాపం! దురదృష్టవశాత్తూ మళ్ళీ మధ్యలోనే సీటు దొరికింది. కిటికీ ప్రక్క రెండు సీట్లు మాత్రమే ఉండే అదృష్టం మాత్రం ఎప్పట్నించో  దొరకడం లేదు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ తన సీట్లో కెళ్ళి కూర్చున్నాడాయన.

‘‘హు! ఏమిటీ! ఆ దేవుడికెందుకో నా మీద కోపం. బెండకాయలా తాను ముదిరిపోతున్నా జీవితయాత్రలో తనకెలాగూ ఒకతోడు ఇవ్వలేదు. ఇక బస్సులోనూ ‘మంచితోడు’ ప్రక్కనే కూర్చునే అదృష్టమూ కలిగించడం లేదు’’ అని అనుకున్నాడు దిగులుగా, దిగాలుగా బ్రహ్మానందం అలా గొణుక్కుంటూనే ఉండగా… ఎప్పుడు పట్టిందో…. అలా నిద్రపట్టింది. పూర్తిగా నిద్రలో కూరుకుపోకముందే….

‘‘నేనిక్కడ కూర్చోవచ్చా?’’ అన్న ఓ మధురమైన స్వరం వినబడగానే దిగ్గున లేచి కూర్చున్నాడు బ్రహ్మానందం.

తనేదో అప్సరసల లోకంలో ఉన్నట్టుగా అనిపించిందతనికి చప్పన కళ్ళు తెరచి చూచాడు.అలా అతన్ని అడిగిన మహిళ గొప్ప అందగత్తె అయితే కాకపోయినా బ్రహ్మానందానికైతే ఎంతో అందంగా కనబడిరది. జీవిత సహచరి కోసం తన అన్వేషణ ఈ బస్సు ప్రయాణంవల్ల పూర్తి అయినట్టనిపించింది. ఉబ్బితబ్బిబ్బై….

అరె… ఎందుక్కూచోకూడదు? ఇది మీ కోసమే…. రండి…. తప్పక కూర్చోండి’’ అని అన్నాడు.

బ్రహ్మానందం ప్రక్కన సీటు ఖాళీగా ఉంది. ఏ కారణంచేతనో దాన్ని రిజర్వ్‌ చేసుకున్నవాడు రాలేదు.

ఆ మహిళ ఆ సీట్లో కూర్చుని ‘హమ్మయ్య’ అని అనుకుంది.

‘అవునూ! ఎక్కడిదాకా మీ ప్రయాణం మేడం?’ అడిగాడు మన బ్రహ్మానందం.

‘గుంటూరు’ సర్‌!’’

‘అరె, ఎంత ఆశ్చర్యం!! నేనూ గుంటూరుకే వెళ్తున్నా!!’

నిజానికి బ్రహ్మానందం వెళ్ళాల్సింది అక్కడికి కాదు, ఇంకా పై ఊరికి.

మెల్లమెల్లగా మనవాడు ఆమెను మాటల్లోకి దింపి, తనను పరిచయం చేసుకుంటూ… ‘‘నా పేరు ఆనందం, బ్రహ్మానందం. మీరు నన్ను బ్రహ్మ లేదా ఆనంద్‌ అని కూడా పిలవవచ్చు.

‘బై ద బై మీ పేరు?’ అడిగాడు బ్రహ్మానందం.

‘సార్‌! నా పేరు మోహిని. కాని మీ పేరులా రెండు ముక్కలు చేసి, ఏదో ఒక ముక్కతో మాత్రం పిలవకండి’’.

బ్రహ్మానందం బ్రహ్మాండంగా నవ్వాడు, పడి పడి నవ్వాడు. పరిచయం పెరిగింది. ఆమె చనువుతో మాటలు కొనసాగించింది. బ్రహ్మానందం మనసు గాలిలో తేలిపోసాగింది. తన జీవన సహచరి ఇక ఈమేనని అనిపించింది. అంతే, గాల్లో తేలిపోసాగాడు. తనకో చిన్న, అందమైన ఇల్లు, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు…ఇలా, ఇలా…నా పేరు ప్రక్క ఆమె పేరు ఎంతో ‘మ్యాచ్‌’ కూడా అయింది.

బస్సు ఒక్క ఉదుటున ఆగింది.  మనవాడి ఊహల దారం పుటుక్కున తెగింది.

శ్రీమతి మోహిని తీయని స్వరంతో `

‘గుంటూరు వచ్చేసిందన్నయ్యా! మీరేంటి? దిగదల్చుకోలేదా? నేనైతే దిగిపోతున్నా. ‘మా వారు’ క్రింద నా కోసం వెయిట్‌ చేస్తున్నారు. బై బై…’’

  1. దయచేసి వెళ్ళిపోండి!

ఆ దుర్ఘటన అందరి గుండెల్నీ పిండేసింది. అలాంటి ప్రమాదాన్ని బహుశా ఎవ్వరూ ఇంతకముందు చూసి ఉండరు. ఒక అరవై సంవత్సరాల మహిళ కారు ప్రమాదంలో తన ప్రాణాలు కోల్పోయింది.

మల్లయ్య సేఠ్‌గారి పుత్ర రత్నం దుందుడుకు స్వభావి. తన కారు అత్యంత వేగంగా నడుపుతాడని పేరు. ఆ రోజు కూడా అలాగే జరిగింది. వాడి వేగానికి ఆ వృద్ధ మహిళ బలైపోయింది.

ఆ సమయంలో అక్కడికి చేరినవారిలో ఆవేశం కట్టలు తెంచుకున్నా, సేఠ్‌గారి కుమారుడి కారుని ఎవరూ ఆపలేకపోయారు. వాడు కారు ఆపకుండా అలాగే వెళ్ళిపోయాడు. వాళ్ళందరికీ వాడిల్లు తెలుసు కాబట్టి అంతా వెళ్ళి ఆ ఇంటి బయట గుమికూడి సేఠ్‌ కొడుక్కి వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు.

అక్కడ వరండాలో సేఠ్‌గారు తన గుమాస్తాతో ఏవో లెక్క పద్దుల గురించి చర్చిస్తున్నారు. ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. అందరికన్నా ముందున్న యువకుడి రెండు చేతుల్లో ఆ వృద్ధురాలి శవం ఉంది.

‘‘చూడండి సేఠ్‌! మీ కొడుకు నిర్వాకం! అతి వేగంగా వచ్చి ఈ వృద్ధురాలిని పొట్టన పెట్టుకున్నాడు’’ అని అన్నాడతను.

ఆ గొడవేదో చూడమని సేఠ్‌ ఇంట్లోకి గబగబా వెళ్ళిపోగా, ఆ గుమాస్తా బయటకొచ్చి, ఆ వృద్దురాలి శవాన్ని చూసాడు. చూసి అవాక్కైపోయాడు. ఇంతకీ ఆమె అతని భార్యే. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు. ఏమనుకున్నాడో ఏమో… ఆ గుంపులోని వారిని చూస్తూ `

‘‘చూడండి! ఈ విషయంలో మీరెవరూ సేఠ్‌ని ఏమీ అనొద్దు. ఏమన్నా అన్నారో నా మీదొట్టే. ఎందుకంటే మీరు గట్టిగా పోట్లాడిన మరుక్షణమే నా ఉద్యోగం కాస్తా ఊడిపోతుంది. ఈ ముసలితనంలో నేను తిండిలేక మలమల మాడిపోతాను.  పైగా నాకు పెళ్లికాని ముగ్గురమ్మాయిలున్నారు. ప్రమాదంలో చనిపోయినామె నా భార్యే. కాని ఈ విషయంలో నేను ఈ వయసులో సేఠ్‌తో గొడవపడి, నన్ను, నా కుటుంబ సభ్యుల్ని ఎందుకు బాధ పెట్టాలి? మీ అందరికీ ఓ నమస్కారం. దయచేసి వెళ్ళిపోండి.’’

 

  1. అవసరార్థం

డాక్టర్‌ రఘుకి ఇవాళ తప్పనిసరై కార్లో రాంగ్‌సైడ్‌లో వెళ్ళాల్సి వచ్చింది. కారణం ఒకరోగి పరిస్థితి చాలా విషమించింది. ఆ రోగి ఇల్లు రోడ్‌కి అటు ప్రక్కన ఉంది. సరైన దారిలో వెళ్తే గనక అరగంట కన్నా ఎక్కువ సమయమే పడుతుంది.

ఇంతలో ఆయన్ని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆపేసాడు. కాని అంత తేలికగా కూడా వెంటనే వదిలేసాడు ఓ శాల్యూట్‌ కొట్టి. పైగా, అతన్ని ఎందుకలా వదిలేసావ్‌? అని అడిగిన వ్యక్తితో ` ‘‘చూడు! డాక్టర్‌ అంటే నడిచే దేవుడు’’ అని డాక్టరు రఘుతో కూడా ‘‘మీరు దైవ స్వరూపం సార్‌! మీరు చెప్పే కారణం తప్పక నిజమే అయి ఉంటుంది’’ అని ఆయనకూ విష్‌ చేసాడు.

తర్వాత డాక్టర్‌ రఘుకి దగ్గరగా వచ్చి మెల్లగా ` ‘‘డాక్టర్‌! మా అబ్బాయికి ట్రీట్‌మెంట్‌ మీ హాస్పిటల్‌లోనే మీ పర్యవేక్షణలోనే జరుగుతున్నది. కొంచెం వాడిమీద శ్రద్ధ పెట్టండి’’! అని అన్నాడు.

ఇది జరిగిన ఏడు రోజుల తర్వాత కూడా తిరిగి ఇలాగే జరిగింది. డాక్టర్‌ రఘు మళ్ళీ రాంగ్‌సైడ్‌లో డ్రైవ్‌ చేస్తూ వెళ్తున్నాడు. అదే ట్రాఫిక్‌ పోలీసు ఆయన్ని మళ్ళీ పట్టుకున్నాడు. అయితే ఈసారి మాత్రం ఆయన డాక్టర్‌గారిని వదల్లేదు. డాక్టర్‌గారిపై చలానా వేసాడు.

‘‘ఆ రోజు సంగతి వేరు. మా అబాయి మీ ‘కేర్‌’లో ఉన్నాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మావాడు వేరొక డాక్టర్‌గారి ‘కేర్‌’లో ఉన్నాడు. ఇప్పుడిక మీతో నాకేంటి అవసరం? నేను మీకెందుకు సేవ చేస్తాను సార్‌!’’ అని లౌక్యంగా అన్నాడు.

 

June 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

శతక సాహిత్యంలో… ఓ కొత్త ఒరవడికి శ్రీకారం!

by Senathipathi Dasyam June 22, 2021
written by Senathipathi Dasyam

<—-Burra Venkatesham(I.A.S.)

 

మకుటధారియై తెలుగు సాహిత్యంలోకి.. శతకం ఎప్పుడు వచ్చిందో సాహితీవేత్తలకు తెలుసు.. అప్పటి నుండి ఇప్పటివరకు మెరుగులు దిద్దుకుంటూ వస్తూనే ఉంది. మకుటం తలపై ఉంటుంది. కాని శతకంలో సర్వసాధారణంగా క్రిందనే ఉంటుంది. క్రింద ఉండేవి పాదాలు.. శతకం నిండా పాదాలే ఉంటాయి.. అందులో క్రింది పాదం కాని, ఆ పాదంలో కొంత భాగం కాని మకుటంగా ఉంటుంది. శతకంలో జీవితమ్ ఆవిష్కరింప బడుతుంది. ఎందరో మహానుభావులు తమ జీవితానుభవాన్ని రంగరించి.. శతకాలను మనకు అందించారు. జీవన సత్యాలను అద్భుతమైన రీతిలో ఛందోబద్ధంగా పద్యాలను రూపుదిద్దిన వారున్నారు. ఛందస్సనే సంకెళ్లలో బంధించబడటం వల్ల… నేటి ఆధునిక ప్రపంచానికి తగిన విధంగా శతకాలు రావడం లేదు.. నేటి తరానికి ముఖ్యంగా యువతీ యువకులకు సులభంగా పద్యాల్లోని సారం.. సందేశం అర్థమయ్యే రీతిలో.. ఛందస్సును కాస్త ప్రక్కన పెట్టి… నిఘంటువు సహాయం లేకుండా.. చదవగానే మనసుకు హత్తుకునేలా శతకాలు రావలసి ఉంది.

ఈ క్రమంలోనే… సీనియర్ ఐఏఎస్ అధికారి.. సాహిత్యమంటే మక్కువ చూపే తెలుగు భాషా ప్రేమికులు శ్రీ బుర్రా వెంకటేశం గారు తమ అంతరంగంలో గుట్టుగా, గుట్టగా గూడుకట్టుకున్న భావాలను.. జీవన సత్యాలను.. అక్షరబద్ధం చేస్తూ “జీవన ధన్య శతకం” పేరుతో ఓ గ్రంథాన్ని వెలుగులోకి తేవడం ఆహ్వానింపదగింది.. ఛందస్సుతో పని లేకుండా.. సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ శతకంలో వెంటేశంగారు పద్యాలను పొందుపరిచారు. సదా పరిపాలనలో క్షణం తీరిక లేకుండా ఉండే ఆయన.. లోకహితం కోసం.. సామాజిక చైతన్యం కోసం.. జన జాగృతికై.. తమ జీవితానుభవాలను ఏర్చి కూర్చి చక్కని పదబంధాలతో పద్యాలను అల్లడం ప్రశంసనీయం.. సార్వజనీన అంశాలకు పెద్దపీట వేస్తూ.. ఓ దార్శనికునిగా ఇప్పటి తరానికే కాదు.. రాబోయే తరాలకు సైతం.. మార్గదర్శకంగా ఉండేందుకు వీలుగా.. తమ లోక పరిశీలనను జోడించి.. మేధస్సును మేళవించి ఇందలి పద్యాలకు జీవం పోశారు. యువతీ యువకులకే కాక అన్ని వయసుల వారికి ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దారు.

తెలంగాణ ప్రభుత్వం ద్వారా 2017లో నిర్వహింపబడిన ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా క్రియాశీలకంగా నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించిన ఆయనకు స్వయంగా తెలుగులో ఆంగ్లంలో గ్రంథాలను వెలువరించిన అనుభవమూ ఉంది. “సెల్ఫీ ఆఫ్ సక్సెస్” అను విజయం మరియు విజేతల గాథల పుస్తకం… అందరి మన్ననలు పొందింది. ఆ పుస్తకాన్నే “గెలుపు పిలుపు”పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ గ్రంథం తెలుగులో.. ఆంగ్లంలోనూ బహుళ ప్రాచుర్యాన్ని పొందటం విశేషం.. తెలుగు భాష పట్ల అమిత ఆసక్తిని చూపే కవి వెంకటేశం గారు సహజమైన రీతిలో “జీవన ధన్య” శతకాన్ని వెలుగులోకి తెచ్చారు. “సత్యమిదే తెలుసుకో మిత్రమా” మకుటంతో తమ రచనను కొనసాగించారు. నాలుగు పాదాల్లో.. మొదటి రెండు పాదాల్లో కవిగా తాము చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పుతూ.. మూడవ పాదంలో నిర్దేశిత లక్ష్యాన్ని సూటిగా ప్రకటించే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. ఛందస్సు లేకుండానే సహజ శతకానికి తెర లేపారు.

శతక సాహిత్యంలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కవి వెంకటేశం గారి మనోఫలకంపై ఎప్పటి నుండో నర్తిస్తున్న ఆ జీవన సత్యాలను ఇందలి పద్యాల్లో నిక్షిప్తం చేశారు. ‘సత్యమిదే తెలుసుకో మిత్రమా’ అనే మకుటంతో…

ఈ శతకంలో నాలుగు భాగాలుగా వివిధ అంశాలపై దృష్టి సారిస్తూ పద్యరచన చేయడం విశేషం..

మొదటి భాగంలో జీవన సత్యాలను.. ఆవిష్కరించారు. రెండో భాగంలో “గెలుపు/ ఆత్మవిశ్వాసం”వంటి అంశాలకు చోటు కల్పించారు. మూడో భాగంలో “జీవన బంధాలు.. జీవన దశలను”, నాల్గో భాగంలో “తాత్విక చింతన దైవ చింతన” వంటి అంశాలను పద్యాల్లో నిక్షిప్తం చేశారు. కవి వెంకటేశం గారి పద్యాల్లో ఆయన ఉత్తమ వ్యక్తిత్వం.. సామాజిక చింతనం.. సున్నిత మనస్తత్వం అడుగడుగున మనకు కానవస్తాయి. నాలుగు భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ శతకం మరో విశేషమేమిటంటే… ప్రతి భాగం చివరన ప్రతి పద్యంలోని ఆణిముత్యాల్లాంటి నిర్దేశిత లక్ష్యాలను పొందుపరిచి శతకానికి మరింత శోభను కలిగించారు.

అంతేగాక ప్రతి భాగం చివరన “మీ మదిలోని మీ మాట” శీర్షికను పొందుపరిచి.. పాఠకులు శతక పద్యాలను మరింత ఆసక్తిగా చదవడం కోసం.. చదివిన పద్యాల్లోని సారాన్ని మరొక్కసారి మననం చేసుకుని స్వీయ స్పందనకు అవకాశం కల్పించడం ఓ కొత్త ప్రయోగం.. ‘సత్యమిదే తెలుసుకో మిత్రమా!’ మకుటుంతో సాగే ఇందలి పద్యాలను పరిశీలిద్దాం.

“జీవన సత్యాలు” విభాగంలో కవి యొక్క ఉత్తమ సంస్కారాన్ని వీక్షించగలం.. సామాజిక చైతన్యం కోసం ఆయన పడే ఆరాటాన్ని చూడగలం.. యువతీ యువకులకే కాదు అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా పద్యాలకు జీవం పోశారు.

పుచ్చుకొనడం కోసం పోటీ ఏంటి? ఇవ్వటంలో ఉండాలి కాని? అంటూ పుచ్చుకొనటం దైన్యం.. ఇవ్వటం ధన్యమని మొదటి పద్యంలోనే తేల్చి చెప్పారు. ఇంకా ఇందలి పద్యాల్లో…

లొంగుబాటు లేని ధైర్యం కొరత లేని ధనం వంటిదని… నగుబాటు లేని జీవితం ధన్యమని హితవు పలికారు. శాశ్వత సుఖం ఎంతో ధన్యమైనదని తెలియజెప్పారు.

ఎన్నో భాషలు తెలిసిన పండితుడైనా ఇంటి ఇల్లాలు కంటి భాష చదువలేడని.. లిపి లేని కంటి భాష చదువగల నేర్పు ధన్యమని నిగూఢంగా… బలంగా కవి వెంకటేశం గారు తమ భావ ప్రకటన చేయడంలో సఫలీకృతులైనారు.

రాశి-వాసిల జ్ఞానం ధన్యమని.. పదవికున్న విలువ పద్ధతికి లేదు.. వెదికి మరీ వచ్చి గౌరవిస్తారు పదవిలో.. అయితే.. గౌరవం ఉందని గర్వం పెరగకుంటేనే ధన్యమని విడమరిచి చెప్పారు. విలువలు శాశ్వతమని.. వేషభూషణాలు అశాశ్వతమనే విచక్షణ ధన్యమంటూ మరో పద్యాన్ని రాశారు. చకచక మారే పడతి అంతరంగం మధురిమ ధన్యమంటూ రాసిన పద్యంలో పడతి అంతరంగం సాంతం ఎరుగుట అసాధ్యమని నొక్కి వక్కాణించారు.

ఇంకో పద్యం ద్వారా అందరి నవ్వులో నీ భాగముండాలని హితవు పలికారు. ఎదుగుతూ ఒదుగుతూ గెలుచుటయే ధన్యమనే జీవన సత్యాన్ని మరో పద్యం ద్వారా తెలియజెప్పారు.

ఇలా జీవన సత్యాలను అలతి అలతి పదాలతో మొదటి విభాగంలో సందేశాత్మకంగా ఆవిష్కరించారు.

“గెలుపు | ఆత్మవిశ్వాసం” శీర్షికతో రెండో భాగాన్ని తీర్చిదిద్దారు.

ఓ పద్యంలో…

శక్తివంతమైన సంతకం ఏది?

పెద్ద పదవిదా? గొప్ప పనిదా? లాభాలు తెచ్చేదా?

చరిత్ర సృష్టించేదా? అని ప్రశ్నించుకుంటూ.. కవి వెంకటేశం గారు.. గెలుపు ఫలాల పంపకం చేసే సంతకం ధన్యమని తేల్చి చెప్పారు.

నీలోనే నేనున్నానని పిలుస్తుంది గెలుపు… ఆ పిలుపు వైపు మలుపు నీ చూపు.. ఆ దిశగా పయనించే జీవితం ధన్యమని హితవు పలికారు.

ఇంకొక పద్యంలో మలుపు లేని దారి ఉండదని.. వియోగం లేని సహయోగం లేదని గెలుపు ఓటముల సంయోగ జీవనం ధన్యమని అభిప్రాయపడ్డారు.

యువతీ యువకులకు చక్కని మార్గదర్శనం చేస్తూ ఈ విభాగంలో పొందుపరచబడిన పద్యాలు ప్రేరణ దాయకంగా కొలువుదీరాయి.

భయం.. నీలోని బలహీనత.. అభయం నీవు ప్రకటించే బలమని సూచించిన తీరు బాగుంది.

ఇలా రెండో విభాగంలోని పద్యాల ద్వారా నిరంతర శ్రమతో.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆశావహ దృక్పథంతో ముందుకు సాగి గెలుపు సాధించాలని సూచించారు.

ధనమే జీవనం కాదని.. జీవితంలో భాగమని, ప్రేమ లేని ధనం విలువ శూన్యమని విడమరిచి చెబుతూ.. మూడో విభాగంలో “జీవన సంబంధాలు జీవన దశలు” శీర్షికతో పద్యాలను రాసి బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు ఎలా పదిల పరుచుకోవాలో వివరించారు.

తల్లిదండ్రుల పట్ల.. స్నేహితుల పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించాలన్న అర్థం ధ్వనించేలా.. ఇందలి పద్యాలకు జీవం పోశారు. మలి సంధ్యలో ధనం ముఖ్యం కాదని.. స్థిరపడిన సంతానం.., బాధించని అనారోగ్యం.. మనస్సుకిష్టమైన పని ధన్యమని అభిప్రాయపడ్డారు.

జీవన దశల్లోని అనుభూతులను అనుభవాలను అక్షరాల్లో నిక్షిప్తం చేస్తూ.. పసితనమున తప్పటడుగులు అద్భుతమని.. పడుచుతనమున జీవన యానపు తడబాటులు.. ముసలితనమున స్థిరచిత్తం.. నిశ్చలత్వం ధన్యమని సూచించారు. మాతృత్వపు మధురిమలో బాల్యం.. రూపసుల మోహంలో యౌవనం.. కాసుల వేటలో మిగతా జీవితం.. అంటూ జీవన సరిగమలను మరో పద్యంలో ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇంకా ఈ మూడో విభాగంలో పసిపాపల నవ్వుల పువ్వులను, జవనుల చిరునవ్వులను – మలి వయసులోని బోసి నవ్వులను వివరిస్తూ.. కోపతాపాలను కరిగించుట శ్రేయస్కరమని తెలిపారు.

గడచిన గతం బాల్యం….

నేటి జీవన సౌధ పునాది కూడా బాల్యమని..

రేపటి మలిసంధ్య జ్ఞాపకం బాల్యం అదే ధన్యమని విడమరిచి వివరించారు.

కవి వెంకటేశం గారు ఇంకా ఈ విభాగంలో ప్రాణమున్నంతవరకు తరగని మాతృప్రేమను.. ఊపిరున్నంత వరకు సరిహద్దులో దేశ ప్రేమను ప్రస్తావిస్తూ ప్రేమ స్వరూపాలు ఎన్నైనా, ప్రేమ శాశ్వతం ధన్యమని తెలియ జెప్పారు. ఇలా జీవన యానంలోని వివిధ దశలను కవి తమ అనుభవాలను జోడించి జీవన సత్యాలను ఆవిష్కరించి స్ఫూర్తిని నింపేలా మూడో విభాగంలో పద్యాలకు జీవం పోశారు.

ఇక చివరి నాలుగో విభాగంలో “తాత్విక చింతన / దైవ చింతన” శీర్షికతో పద్యాలను పొందుపరిచి.. ఆనందం మన సహజ స్వభావమని.. దుఃఖం మనం తెచ్చి పెట్టుకున్న అనుభవమని..  కలిమి లేముల విచక్షణ మరిస్తే ధన్యమని అభిప్రాయపడ్డారు.

నదీ ప్రవాహంలా.. సాగే జీవన పయనమే ధన్యమని.. మరో పద్యంలో పేర్కొన్నారు.

కాలం – జ్ఞాపకాన్ని ఇచ్చిందా? జ్ఞాపకం కాలాన్నీ గుర్తుకు తెచ్చిందా? అంటూ ప్రశ్నించుకుంటూనే కవి కాలం కొన్ని జ్ఞాపకాలను దాచేస్తుందని….. జ్ఞాపకం కొంతసేపు కాలాన్ని బంధించేస్తుంది… అదే జీవన ధన్యమని పేర్కొన్నారు.

మరికొన్ని పద్యాల్లో.. భిన్నత్వంలో ఏకత్వం.. ఆద్యంతం లేని ప్రేమ… అంతుచిక్కని జీవన సంక్లిష్టత.. భ్రాంతి జీవన వైరుధ్యాలను కవి వెంకటేశం గారు తాత్త్వికతతో సందేశాత్మకంగా ఆవిష్కరించారు.

ఇంకా.. భావనా శక్తి విస్తరణ గురించి.. మనకు మనం చిత్రించే కళాఖండం గురించి.. కవి ప్రకటించిన భావాలు ప్రేరణదాయకంగా ఉన్నాయి.. ఇంకో పద్యం ద్వారా కావాలన్న కోరిక.. ఇంతేనా అన్న నిరాశ అంతా నాదే అన్నీ నాకే అన్న అత్యాశ.. పరులదీ తనకే అన్న దురాశ వదులుకోవాలని సూచించారు.

ఇంద్రియాలకతీతంగా మనోనేత్ర సందర్శన భాగ్యమని.. పరమాత్మ అలౌకిక సౌందర్యం ధన్యమని మరొక పద్యంలో వివరించిన తీరు బాగుంది. ప్రకృతి దైవ చింతన తుదకు శరణ్యం అనుటే ధన్యమని తేల్చి చెప్పారు.

ఇలా ఈ పుస్తకంలోని అనేక పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. ప్రతి పద్యం ఓ ఆణిముత్యంలా రూపుదిద్దుకుంది. జీవన సత్యాన్ని ప్రకటించేలా కొలువుదీరింది. కవి వెంకటేశం గారు ప్రకటించిన భావాలన్నీ గొప్ప సందేశాలను మోసుకొచ్చాయి. సామాజిక చైతన్యానికి మధుర గుళికలుగా ఉపయోగపడేలా ఉన్నాయి. ఈ సందర్భంగా కవి వెంకటేశం గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.

– దాస్యం సేనాధిపతి

June 22, 2021 2 comments
2 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

 రామాయణం మీద చిన్నారులచే ఉపన్యాస పోటీలు.

by Krishna Kumari Yagnambhatt June 22, 2021
written by Krishna Kumari Yagnambhatt

నిర్వహణ : డా.వై.కృష్ణ కుమారి       

             తొలిసారిగా తెలుగు రాష్ట్రాలలో  బాల బాలిక లకు జరిగిన రామాయణం మీద ఉపన్యాస పోటీలు అత్యంత విలక్షణమైనవి అని సాహిత్య వేత్తలచే కొనియాడబడిన ఈ  కార్య క్రమం గురించి ఒక మాట.

చిన్నారులలో భారత దేశం ,సంస్కృతి, చరిత్ర, సంస్కారాలు, పండుగలు, ఉత్సవాలు, దేవాలయాలు, సామాజిక వ్యవస్థ మొదలైన వాటి గురించి అవగాహన కల్పించాలి అన్న సంకల్పంతో ప్రారంభించిన పోటీలు ఇవి. నేటి చదువుల వల్ల చిన్నారులలో అటు చదువు పట్ల గాని, ఇటు  దేశం పట్ల గాని ఏ రకమైన ఆసక్తి కల్గడం లేదు. మార్కుల మీద ఉన్న దృష్టి  చదువుల లోని మర్మం మీద ఉండడం లేదు. మొక్కుబడిగా మారింది నేటి విద్యా విధానం.

పెద్దలకి క్షణం తీరిక లేని ఉద్యోగాలు.ఉమ్మడి కుటుంబాలు కరవైన ఈ కాలంలో చిన్నారులకు దేశ సంస్కృతి వివరించడం, వాళ్ళను సంస్కారంగల దేశభక్తులుగా చేయగల వాతావరణం ఇంటిలో కల్పించడం దాదాపుగా మృగమై  పోయింది. ప్రతీ వారు వారిదైన పరిధిలో  ఆగమ్యంగా ముందుకు వెళ్లిపోతున్నారు. చిన్నారుల బాల్యం ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి గడ్డ కట్టుకొని పోతున్నది.శారీరిక మానసిక ఎదుగుదల పోషణ రహితమై ప్రకటనలకు పరిమితమైంది . చిన్నారుల  జీవితాన్ని తప్పు దారిలో నడిపించడానికి  సిద్ధంగా ఉన్నటి. వి లు, సినిమాలు, విచక్షణ రహిత యాంత్రిక మయ ఆటలు   మాత్రం  తమ పాత్రను ఇతోధికంగా పోషిస్తున్నాయి. ఈ పరిస్థితి నాకు చాలా ఆందోళన కలిగించింది. విజ్ఞానవంతులు, సాహితీ వేత్తలు, పండితులు, అవధానులు , ప్రవచన కారులు మొదలైన  ఎందరో మహానుభావులు సాహితీ వ్యవసాయం చేస్తున్నారు భారతంలో ,విదేశంలో కూడా. కానీ, ఆ విజ్ఞానం చిన్నారులకి అందుతున్నదా ? వీరి ఉపన్యాసాలు  చిన్నారులను ప్రభావితం చేస్తున్నాయా? ఒకవేళ లేదు అన్న సమాధానం వస్తే మాత్రం దానికి  మనమందరం బాధ్యత వహించాలి. మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండా పిల్లలకి దేశం పట్ల, సంస్కృతి పట్ల  అవగాహన లేదు అని అనే నైతికత మనకు లేదు. ఈ మేధోమధనమే నేటి ఈ పోటీలకు పునాది అయింది. ఉగ్గుపాలతో  నేర్పించే వయస్సులో చేయని పనిని కనీసం ఇప్పుడైనా మొదలు పెడదామని  చేసిన  ప్రయత్నం ఇది. చిన్నారుల భవిష్యత్తు ఆగమ్యంగా మారుతున్న ఈ తరుణంలో వచ్చిన ఒక ఆశాకిరణం ఈ ఆలోచన. మంచికో చెడుకో గాని అనుకోకుండా దొరికిన ఈ మహమ్మారి కాలాన్ని సద్వినియోగ పరుద్దామని , బాలలలో  దేశం గురించి,సంస్కృతి గురించి సరియైన కోణంలో ఆలోచింప చేసే ప్రయత్నం చేద్దామని ఈ ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేసాను.  మొదలు పెట్టినప్పుడు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు.తొలి ప్రయత్నంగా  ఉగాది సందర్భంగా వారం రోజుల పాటు  బాలలకు కవి సమ్మేళనం నిర్వహించాను.. అనూహ్యంగా వందకు పైగా బాలలు వచ్చారు.  ఆ వయస్సు చిన్నారులు కవిత్వం చెప్పగలరని  అసలు ఊహించలేదు. ఆ  కార్యక్రమం  చాలా విజయవంతం అయ్యింది. కొంత వెన్నుదన్నుగా ఉంటే  బాలలు అద్భుతాలు చేయగలరు అన్న స్పూర్తి తో రామాయణంలో నాకు నచ్చిన పాత్ర  అన్న శీర్షికతో  6-10 తరగతి విద్యార్థుల కి  ఉపన్యాస పోటీ పెట్టాను.. దాదాపుగా 400 మంది చిన్నారులు వచ్చారు. కేవలం రావడమే గాదు, వారికి నచ్చిన పాత్ర పై వారి విశ్లేషణను  అత్యంత ఆసక్తికరంగా వివరించారు. ఇతిహాసాలలో వారికి గల ప్రవేశానికి చాలా సంతోషమనిపించింది. చిన్నారులకు ప్రస్తుతం కావలసినది చేయూత. దానిని అందిస్తే ఆ చిన్నారులు అడుగు ముందుకు వేయడానికి  సిద్ధంగా ఉన్నారని అర్థమై, ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకు వేయవచ్చునని అనిపించింది.  మిత్రులు సహకరించారు. సలహాలు ఇచ్చారు. పెద్దలు దిశానిర్దేశం చేశారు.

ఈ పోటీల వలన చిన్నారులకు మన దేశం గురించి, ఇతిహాసాల గురించి, చరిత్ర గురించి తెలిసే అవకాశం ఉంది. అంతే  కాదు, వక్తృత్వ కళలో ఆరితేర  గలరు కూడా.  మాతృ భాషలో చక్కని ,చిక్కని పద సంపద వారి స్వంత మవుతుంది.  మే  నెలలో ప్రతీ శనివారం ,ఆదివారం ఈ పోటీలు జరిగాయి. పాల్గొన్న చిన్నారులందరికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. విజేతల చేత మరొక్కసారి అదే అంశం చెప్పించి వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టడం జరిగింది. తరంగిణి ఆనే ఛానల్  లో  వీరి చిరు ఉపన్యాసాలు వినవచ్చును.   వచ్చేనెల మహాభారతం మీద ఇదే విధంగా పోటీలు జరుగుతాయి. పోటీలు తిలకించిన పలువురు  సాహిత్య వేత్తలు  ఇదొక  ఉద్యమం లాగా ముందుకు వెళ్లాలని ఆశీర్వదించారు.

అమెరికా  వాస్తవ్యులు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్యమణ్యం గారు ఈ  కార్యక్రమం గురించి  వినగానే వెంటనే  తమ తరపున  విజేతలైన  చిన్నారులకు నగదు బహుమతిని ప్రకటించారు.వారి సూచన మేరకు విజేతలకు నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది కూడా. సుబ్రహ్మణ్యం గారి సహృదయానికి  వినమ్ర ప్రణమాలు. బాలలను ఉత్సాహ పరచాలన్న ఉద్దేశ్యంతో ప్రధమ, ద్వీతీయ. తృతీయ నగదు బహుమతులే  కాక ప్రోత్సాహక నగదు బహుమతులు కూడా చిన్నారులకు ఇవ్వడం జరిగింది. శ్రీ  సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహం  చిన్నారులలోనే గాక కార్యకర్తలలో కూడా ఉత్సాహాన్ని నింపింది. వారికి మరొకసారి  కృతజ్ఞతలు.

యువభారతి తమ ప్రచురణలలోచిన్నారులకు ఉపయోగపడే  కొన్ని పుస్తకాలను విజేతలైన  చిన్నారులకు బహుకరించింది.  రాబోయే కాలంలో ఆయా పుస్తకాలు వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతాయి.

మయూఖ సంపాదకురాలు శ్రీమతి కొండపల్లి నీహారిణి  గారు ఈ కార్యక్రమం గురించి వినగానే ఆ చిన్నారులచే వ్యాసాలు రాయించి ఇస్తే తమ పత్రికలో వేసుకుంటామని హామీ ఇచ్చారు. విజేతలచే చిన్న వ్యాసం రాయించి వారికి పంపడం జరిగింది. వినూతన మైన ఈ ఆలోచన మా విద్యార్థులలో చాలాఉత్సాహాన్ని నింపింది. ఈ నూతన వరవడికి  శ్రీకారం చుట్టిన కొండపల్లి నీహారిణి గారికి మా సాహిత్య కుటుంబం  ఎంతో ఋణ పడి ఉంది. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.   మా చిన్నారుల వ్యాసాలు చదివి ,ఆ వయస్సులో వారికి రామాయణం పట్ల గల ఆసక్తిని, అవగాహనను  ఆశీర్వదించండి.

మీ ముందు చిన్నారుల వ్యాసాలు ఉన్నాయి . న్యాయ నిర్ణేతలు మీరే.

******************************************************************

పేరు : మౌక్తిక తటపర్తి 

తరగతి  : 10

పాఠశాల : సారథి స్కూల్

నగరం : హైదరాబాద్

పాత్ర : మంథర

చరిత్రలో కొందరి జీవితాలను నిశితంగా పరిశీలిస్తే పైకి కనిపించే వారి స్వభావ స్వరూపాలు, ఆంతరంగిక ఆలోచనలు విభిన్నమై అర్థంకాని వ్యత్యాసంతో ఉంటాయి. రామాయణంలో అటువంటి గుణగాలు కలిగిన వ్యక్తి మంథర. తాను నిలువెత్తు చెడుకు ప్రతిరూపంగా నిలిచి లోక కళ్యాణానికి ముఖ్య హేతువయ్యింది.

దశరథుని భార్య అయిన కైకేయితో పుట్టింటినించి వచ్చిన అరణపుదాసి మంథర. కైకేయికి మంథర అంటే వల్లమాలిన అభిమానం. మంథర కైకేయిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. వృద్ధురాలయిన మంథర కైకేయితో చనువుగా ఉంటూ, ఆమెకు అవసరమైనప్పుడు సలహాలిస్తూ, తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. దుర్బోధలు చేయడానికి రామాయణంలో మంథర పాత్ర గొప్పగా రాణించింది. ఆమె గూనిదైనా గొప్ప మాటకారి. కాబట్టే తాను ప్రాణప్రదంగా పెంచుకున్న శ్రీరాముణ్ణి అడవులపాలు చేసే విధంగా కైకేయికి నూరిపోసింది.

శ్రీరాముని పట్టాభిషేకం జరగబోతున్నదన్న వార్త విని అయోధ్యా నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంథర కైకేయి దగ్గరకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పింది. ఆ శుభవార్త వింటూనే కైకేయి దగ్గరకు వెళ్ళి ఆ విషయాన్ని చెప్పింది. ఆ శుభవార్త వింటూనే కైకేయి ఎంతో ఆనందించింది. తన మెడలోని ముత్యాలహారాన్ని మంథరకి బహూకరించింది.  భరతునికన్నామిన్నగా తాను ఎంతో ప్రేమించే రామయ్యకు పట్టాభిషేకం జరుగుతున్నదన్న వార్తకి ఎంతో మురిసిపోయింది. అప్పుడు మంథర, రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతోపాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముని సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుందికానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దీనికి మంథర ఒక ఉపాయం చెప్పింది. గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర. మొదటివరంగా భరతుని పట్టాభిషేకం, రెండవ వరంగా శ్రీరాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపమని కోరమన్నది.

ఇలా మంథర శ్రీరామ వనవాసానికి దోహదకారి అయ్యింది. మంథర దుర్భోదలు రామావతార ప్రయోజనం కలిగించాయి. రావణవధకు ఉపకరించాయి. ఋషులను సేవించడానికి అనేకమంది రాక్షసులను సంహరించడానికి రామునికి తోడ్పడ్డాయి. చాలా సంఘటనల్లో అల్ప పాత్రల సృష్టి ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయన్న దానికి మంథర వృత్తాంతమే నిదర్శనం. అయోధ్య కాండలో ఒక చిన్న పాత్రలో కనిపించే మంథర, రామాయణ కథను నడిపించే సంపూర్ణ పాత్ర అయ్యింది.

******************************************************************

పేరు : బి. చైతన్య కృష్ణా

తరగతి  : 10

పాఠశాల : కేంద్రీయ విద్యాలయ

నగరం : తెనాలి

పాత్ర : విశ్వామిత్ర

విశ్వామిత్రులవారి పేరు తెలియనివారు ఉండరు. రామాయణంలో కూడా వీరు మహత్తరమైన పాత్రను పోషించారు. రామాయణంలో విశ్వామిత్రులవారు అయోధ్యకు రాకుమారులైన రామ – లక్ష్మణులను యజ్ఞరక్షణకై తీసుకని వెళ్ళారు. అక్కడ రాకుమారులకు తమ సంపూర్ణ జ్ఞానాన్ని దేవాస్త్రాలను గురించి చక్కగా వివరించి బల – అతిబల వంటి పవిత్రమైన మంత్రాలను కూడా బోధించారు. అంతేకాక అసురులైన తాటకి మారీచ సుబాహు వంటి రాక్షసులను ఎలా సంహరించాలో కూడా నేర్పారు. అంతేకాకుండా శివ ధనుస్సు గురించి తెలిపి సీతాదేవి స్వయంవరానికి తీసుకొని వెళ్ళి సీతారాముల కళ్యాణం జరగడానికి ప్రధానపాత్ర వహించారు.

అసలు విశ్వామిత్రులవారు మహర్షి కాక ముందు ఒక రాజు అప్పుడు ఆయన పేరు కౌశికుడు. అయితే వశిష్ఠులవారితో జరిగిన చిన్న యుద్ధం వలన అస్త్రబలం కంటే దైవబలం చాలా గొప్పదని తెలుసుకొని అలాంటి దైవానుగ్రహం తపస్సును ఆచరించినప్పుడు లభ్యం అవుతుందని గ్రహించి కొన్ని సంవత్సరాల తరపడి తపస్సు చేసి చివరకు బ్రహ్మర్షిగా మారారు.

ఇంకా చెప్పాలంటే బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారికి కోపం చాలా ఎక్కువ, ఎప్పుడూ వారికి ముక్కు మీద కోపం ఉండేది. అందరూ వారి కోపానికి భయపడేవారు. కానీ మహర్షి ఎంత కోమి ఉన్నావారు పేరుకి తగ్గట్లు విశ్వానికి మిత్రునివలే విశ్వ –శాంతి కి ప్రపంచ శ్రేయస్సుకు పరితపించెవారు. అంతేకాకుండా వారు బాగా ఆలోచిఁచి కలియుగంలో మనుష్యులు యజ్ఞ – యాగాలు చేయలేరని తలచి మనందరి శ్రేయస్సు కోసం గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు.

“ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్”

****************************************************************************************************************

పేరు : గిరి ఋతిక

తరగతి  : 10

పాఠశాల : సారథి పాఠశాల

పాత్ర : మహా పతివ్రత అహల్య

పెద్దలందరికీ నా నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు నా నమస్సుమాంజలులు – నా పేరు గిరి ఋతిక. నేను పదవతరగతి సారథి పాఠశాలలో చదువుతున్నాను. రామాయణంలోని ముఖ్యపాత్రల్లో ఒకరైన అహల్యను గురించి చెప్పాను.

అహల్య అనే పేరు వినగానే గౌతమ ముని శాపంతో ఆమె రాయిగా మారి, రాముడి పాద ధూళి సోకగానే తిరిగి స్త్రీగా మారిందనే విషయమే స్ఫూరణకు వస్తుంది. కానీ అహల్య వృత్తాంతం భిన్నమైనది.

అహల్య బ్రహ్మ మానస పుత్రిక – అహల్య అంటే అత్యంత సౌందర్యవతి, ఎలాంటి వంకరలేని స్త్రీ అని అర్థం. దేవతలందరూ ఆమెను పరియమాడాలనుకుంటారు. అప్పుడు బ్మహ్మ, త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోవడానికి అర్హులని ప్రకటించాడు. దీంతో తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చిన ఇంద్రుడు అహల్యను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని కోరుతాడు. అదే సమయంలో నారుదుడు వచ్చి, ఇంద్రుడికంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టివచ్చాడని చెబుతాడు. అదెలాగా అని ఆశ్చర్యపోతున్న ఇంద్రుడితో  – గౌతముడు తన దైనందిన పూజలో బాగముగా గోవుచుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడని అలా ఒకరోజు ప్రదక్షిణలు చేస్తుండగా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో గోప్రదక్షిణ చేయడం ముల్లోకాలను చుట్టడంతో సమానమని అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని చెబుతాడు. కాబట్టి అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి బ్రహ్మ వివాహం చేసాడు.

అపార తపశ్శక్తి, మేధాశక్తితో ఇంద్రపదవికి కావాల్సిన సర్వవిజ్ఞానం గౌతముడు పొందాక, ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఒక పథకం వేసాడు. అందుకు గౌతమ మహర్షి రూపంలో ఇంద్రుడు అహల్య చెందకు వస్తాడు. అలా వచ్చింది ఇంద్రుడేనని తన పాతివ్రత్య బలంతో అహల్య గ్రహించింది. అప్పుడు సత్యం బోధపడిన మునిపత్ని ఇంద్రుణ్ణి వెంటనే అక్కడ నుండి వెళ్ళి పొమ్మని వేడుకుంటుంది. కానీ ఈ లోగ అక్కడకు వచ్చిన గౌతముడు పొరబడి, ఆవేశంలో ఇద్దరినీ శపించాడు. ఇంద్రుడికి దూరం చేశాడు మరియు శరీరమంతా కళ్ళు మొలుచునట్లుగా శపించాడు. “వేలాది సంవత్సరాలు నీవు అన్న పానాదులు లేకుండా వాయుభక్షణతో తపిస్తూ ఈ ఆశ్రమం నందే ఉంటావు. భస్మశాయినిపై ఎవరికీ కనపడకుండా నీలో నీవు కుమిలిపోతూ ఉంటావు. దశరథ నందనుడైన శ్రీరాముడు ఇక్కడకు వచ్చినప్పుడు ఆయన పవిత్రమైన పాదధూళి సోకినంతనే నీవు పవిత్రురాలివవుతావు. ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తరువాత తిరిగి నీవు నన్ను చేరుకుంటావు” అని అహల్యను గౌతముడు శపించి హిమాలయాలకు వెళ్ళపోతాడు. గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన విశ్వామిత్రుడు, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి తాటకను సంహరించిన తరువాత మిథిలా నాగరాధీశుడైన జనక మహారాజుని సందర్శించడానికి వెళ్ళే సందర్భంలో, మిథిలకు సమీపంలో ఉన్న ఒక పురాతన ఆశ్రమాన్ని చూస్తాడు రాముడు. ఈ ఆశ్రమం ఎవరిదీ ఇక్కడ ఎవరుంటారు? అని విశ్వామిత్రుణ్ణి ఆసక్తిగా అడిగాడు రాముడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అహల్య ఉదంతాన్ని చెపుతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి గౌతమముని ఆ్రశమంలోకి ప్రవేశిస్తాడు.  శ్రీరాముని పాదదర్శనమైనంతేనే అహల్యకు శాపవిముక్తి కలిగింది. ఆమె తన భర్త చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ రామలక్ష్మణుల పాదాలకు నమస్కరిస్తుంది. అతిథి మర్యాదలు అయినా తరువాత రాముడి రాకను గ్రహించిన గౌతముడు అక్కడకు చేరుకొని అహల్యా సమేతుడై శ్రీరాముణ్ణి సేవిస్తాడు. “అహల్యా , ద్రౌపదీ సీతా తారా మండోదరి తథా పంచకన్యా స్మరేన్నిత్యం మహా పాతక నాశనం”. అంటే అహల్య, ద్రౌపదీ, సీత, తార మరియు మండోదరి జీవితంలో ఎన్నో కష్టాల కోర్చి పంచకన్యలుగా మారారని మరియు ఈ అయిదు మహాపాతి వ్రతులను రోజూ తలుచుకుంటే మన పాపాలు తొలగిపోతాయని అర్థం. ఈ శ్లోకంలో ద్రౌపది తప్ప తక్కిన నలుగురు రామాయంకు చెందినవారే! అహల్య తన పాతివ్రత్యంతో, పవిత్రతతో పంచకన్యల్లో మూడవ స్థానం సంపాదించుకోగలిగింది. వాల్మీకీ రామాయణం, రంగనాథ రామాయణం మరియు అనేక రామాయణాలలో అహల్య వృత్తాంతం వేరుగా ఉన్నప్పటికీ, వాటి సారాంశం అహల్య పాతివ్రత్యం గురించి, పవిత్రతను గురించే చెపుతాయి.

******************************************************************************************************************

పేరు : సుధాత్రి వాల్మీకం

తరగతి  : 10

పాఠశాల : గీతాంజలి దేవాశ్రయ్ పాఠశాల

పాత్ర : సుమిత్ర

నా పేరు సుధాత్రి వాల్మీకం. నేను గీతాంజలి దేవాశ్రయ్ పాఠశాల, సికింద్రాబాదంలో పదవ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారి పేరు వి.సునీల్ కుమార్ మరియు మా అమ్మగారి పేరు వి.స్రవంతి.

జాతీయ సాహితీ పరిషత్తు నిర్వహించిన వక్తృత్వ కార్యక్రమంలో  “రామాయణం – వ్యక్తుల పాత్రలు” అనే అంశంపై రామాయణములో నేను ఎంచుకున్న పాత్ర సుమిత్ర మాత….

సుమిత్ర చలించని దీపకాంతి లాంటిది. తను కాశీ రాజ్య రాకుమారి… దశరథుని రెండవ భార్య. లక్ష్మణ, శతృఘ్నల తల్లిగారు.

విన్రమత, శ్రద్ధ, దృఢత్వం, నిష్టత, ఓర్పు, నిశ్చల స్వభావం ఇవన్నీ సుమిత్ర మాత సుగుణాలు… ఇంకా చెప్పాలంటే తన పేరులోనే వ్యక్తిత్వం అంతా మనకు అవగతం అవుతుంది. సు + మిత్ర అంటే మంచి స్వభావం కలది. తను అందరికీ మంచి బోధించేది తోడికోడళ్ళ పట్ల సమభావంతో మెలగి ఎల్లవేళలా మౌనంగా ఉండేది. కౌసల్య చెప్పిన మాట తనకు వేదం…. లా భావించేది. బాల్యం నుంచే అలవరచుకున్న మంచి గుణములు, మౌనంగా ఉండి చురుగ్గా ఉండటం. తన పిల్లల మీదే కాకుండా రాముడు, భరతునిపై కూడా సమ వాత్సల్యం చూపేది. ఆ కుటుంబంలో అందరినీ కలుపుకుంటూ, చక్రాల మధ్య ఇరుసు లాగా ఒక ముఖ్యపాత్ర వహించేది. దశరథుడు ఎంత కిష్టమైన సమస్య వచ్చినా సుమిత్రను సంప్రదించేవారు. సుమిత్ర మంచి గ్రహణశీలి ఇంకనూ చాలాముందు చూపు గలది. రామలక్ష్మణ భరత శతృఘ్నలు లోక కల్యాణం కొరకై జన్మించారని ముందే గ్రహించింది. నొప్పించక తానొవ్వక ఉండే మనస్తత్వం ఆమె వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉండేది. రాముడు వనవాసానికి వెళ్తున్నాడని తెలిసి కౌసల్యా దేవి బాధలో ఉన్నప్పుడు ఓదార్చి ధైర్యం చెప్పింది. లక్ష్మణుడు తాను కూడా రాముని వెంట వనవాసానికి వెళ్తాను అన్నప్పుడు, సౌమిత్రిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నది.

‘రామ మశరథం విది, మామ్ విది జనకాత్మజా

అయోధ్య అటవిం విద్ధి, గచ్చ తాత యధా సుఖం’

అంటే రాముడిని తండ్రిలా, సీతమ్మను తల్లి లా, అడవిని అయోధ్య లా భావించి అన్నా వదినలకు సేవ చేయాలని చెప్పింది. ఇంతటి సుగుణవతి, త్యాగనిరతి కలిగిన సుమిత్ర మాతకు నా వందనములు. ఇన్ని మంచి గుణములు ఉండి, సౌమ్యానికి మారుపేరుగా ఉండే సుమిత్ర ఆదర్శ మాతగా, పత్నిగా నిలిచింది.

చివరిగా సుమిత్ర జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మొదటిది సాధ్యమైనంత మౌనంగా ఉండడం… ఇది మనకు తెలిసిందే. అవసరమైనంత వరకే మాట్లాడటం, మిగతాది చేతల్లో చూపించడం అనే లక్షణం చాలా మంచిది. అదే అవసరం కూడాను. రెండవది ఓర్పు కలిగి ఉండటం. ఓపిక అనేది ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణం. ఓపికతో చేసే ప్రతి పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇదే కాకుండా రామాయణంలోని ప్రతి ఒక్కరి పాత్ర మన జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో నేర్పుతుంది. రామాయణంలో సుమిత్రదేవి వంటి పుణ్యమూర్తి గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు… శుభం భూయాత్…!!!

******************************************************************************************************************

పేరు : రొంపిచర్ల ఖ్యాతి శ్రీ

తరగతి : పదవతరగతి

పాఠశాల : ఏ.ఏ.ఎన్.ఎం.అండ్ వి.వి.ఆర్.ఎస్.ఇంగ్లీష్, మీడియం, హైస్కూల్, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్

పాత్ర పేరు : తార

శ్రీ గురుభ్యోన్నమః సభకు నమస్కారం. నా పేరు రొంపిచర్ల ఖ్యాతిశ్రీ. నేను ఏ.ఏ.ఎం. అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్.స్కూల్ గుడ్లవలేరు. విన్నకోట గ్రామం కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. నేనిప్పుడు రామాయణంలోని తార పాత్రను గురించి చెప్పదలుచుకున్నాను.

మనిషి ఎక్కడ ఎలా ప్రవర్తిఁచాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో ధర్మాన్ని పట్టుకున్నవారు ఎంత గొప్పవారు అవుతారో యుగాలు మారినా శ్రీరామచంద్రమూర్తి జీవిత వృత్తాంతం నేటికి పసిపిల్లలు కూడా తమ తల్లుల చేత రామాయణ కథగా వినిపించబడుతోంది. అందులోని పాత్రలు స్వభావాలు నేటి మానవాళికి మచ్చుతునకలు. రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అనగా రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యత్.

కిష్కింధకు వానర రాజైన మహాబలవంతుని వాలి భార్య తార. బృహస్పతి కుమారుడైన తారూడి కుమార్తె తార. రామాయణంలో అన్నదమ్ముల అనబంధం గురించి రాముని గొప్పతనం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుందో ఎందుకు పెట్టారో మహర్షి ఆ పేరు తార అంటే నక్షత్రం. తళుక్కుమంటుంది. రామాయణంలో నిజంగానే తళుక్కుమంటుంది.

తారపాత్రలో నాకు నచ్చిన అంశాలు :

  1. వెలుగులాంటి తార, గ్రహణం నాడు సూర్యుడు తన కాంతిని ఎలాగైతే కోల్పోతాడో అలా కోల్పోబడుతున్న కాంతిని తన ఎదురుగా నిలబడి ఉన్న తన భర్తయందు చూస్తుంది.
  2. సుగ్రీవుడు తొందరపడి ఏ తప్పు నిర్ణయం తీసుకోడని గమనించకుండా ఎవరితోనూ స్నేహం చేయడనీ దృఢసంకల్పం కలిగి ఉంది.
  3. నినాదస్య నసం బ్రహ్మోనైవదలపం వికారణం. ఏ కారణం లేకుండా తన తమ్ముడు యుద్ధానికి మళ్ళీ రాడని నెత్తురోడుతు వచ్చిన సుగ్రీవుడు తన భర్త అయిన వాలిని యుద్ధానికి ఆహ్వానించినప్పుడు అతని కంఠం నండి వచ్చిన సింహనాదాన్ని, అతని ముఖంలోని ఉత్సహాన్ని ఉద్యమం లాంటి తొందరని ముందుగానే గ్రహించి తన భర్త వాలిని ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవద్దని హెచ్చరించింది.
  4. తము్మడితో యుద్ధం వద్దని హితబోధ చేసింది.

లాలనియోహితే భ్రాత అదియాయసనవనరహ అనగా తమ్ముడు నీ కంటే చిన్నవాడు నీకు కొడుకులాంటివాడు పైగా వానరుడు తప్పు చేస్తే చేసాడో అనుకో మందలించు, లాలించు అయినా వినకుండా నీ నుండి దూరంగా వెళితే అది వాడి కర్మ.

  1. తన మెరుపులాంటి బుద్ధిబలంతో శ్రీరామచంద్రుని ఆశ్రయించిన వారిని నిగ్రహించే శక్తి తన భర్తకు లేదని ముందే గ్రహించిన ప్రజ్ఞావంతురాలు.
  2. గత జన్మలో ఎంతో పుణ్యం చేసి ఈశ్వరుని అనుగ్రహం పొందినవారికే ఈశ్వరుని స్వరూప జ్ఞానం భాసిస్తుంది. రాముని గొప్పతనం గురించి ఒక్క శ్లోకం చెప్పడంవల్ల తార రామాయణంలోని కిష్కింద కాండలో జాజ్వల్యమానమైన స్థానాన్ని పొందింది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నా నం పరాగతి హే ఆర్ తానం సముశ్రేచెయ్ వా ఎస్ సై క భాజనం. ఆహా! ఎంత గొప్పగా చెప్పింది. ఆ తల్లి! శ్రీరామచంద్రుడు నమ్మకున్నవారి పాలిట మహావృక్షం వంటివాడు. ఎవరైతే ఆ మహావృక్షం మూలాలను చేరుకుంటారో అనగా శ్రీరామచంద్రుని పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఉత్తమ కీర్తులను పొందుతారు. ఒక మహావృక్షం అది నీడనిచ్చేటప్పుడు నువ్వు నేను, ధనిక పేద, మంచి చెడు, స్త్రీ పురుష, తారతమ్యాలను చూపకుండా నీడనిస్తుంది. అలాంటి మహావృక్షం ఈ లోకంలో మరొకటి ఉంది అని అనుకుంటున్నావ్ ఏమో! లేదు . నీ తమ్ముడైన సుగ్రీవుడు శ్రీరామచంద్రుడు అనే కీర్తిని పెంపొదిస్తుంది అని చెప్పిన హితబోధ నాకు బాగా నచ్చింది. తార జీవితం నుండి మనం నేర్చుకున్న సందేశం : ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ పాత్ర ఉంటుందనన్న విషయం మనందరికీ ఇనుమడించబడుతుంది. ఇలా చెయ్యని వారి కీర్తి నశించి పతనం అవుతారు.

ధన్యవాదాలు

******************************************************************************************************************

పేరు: S.Rimi chaturya

తరగతి : పదవతరగతి

పాఠశాల : Pioneer Concept School

పాత్ర పేరు : మేఘనాథుడు

ఎవ్వరికీ తెలియని ఒక వీరుడి కథను నేను మీకు తెలియజేయబోతున్నాను. ఇక కథలోకి వెళితే రావణాసురుడు”మేఘనాథుడు దేవతలను ఓడించాలంటే సర్వశక్తి సంపన్నుడవ్వాలి. ఒంటిచేతితో లక్షలాది సైన్యాన్ని మట్టికర్పించాలి.” దానికి తగిన సమయం ఇదేనని భావించి మేఘనాథుడిని పంనెండేళ్ళ వయసులో శుక్రాచార్యుడి వద్దకు శిష్యుడిగా పంపుతాడు. మేఘనాథుడు ఇరవై ఐదేళ్ళ వయసొచ్చేసరికి ఎవ్వరికీ సాధ్యంకాని అస్త్ర విద్యలను, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారామైన పరశురామ ప్రభుకే సాధ్యం కాని ఆయుధాలను, ఎవ్వరికీ కనబడకుండా యుద్ధం చేయగలిగే మాయా విద్యలను అవలీలగా సాధించి ఎప్పుడేప్పుడు దేవతల మీదికి యుద్ధానికి వెళ్ళదామా అన్నట్టు ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో రావణుడు దేవతల మీద యుద్ధం ప్రకటిస్తాడు. ముందుగా ఎవరైనా శత్రువులు దేవలోకంలోకి ప్రవేశించాలంటే నాలుగు దశాలను దాటవలసి ఉంటుంది. మొదటగా “కోటచుట్టూ ఏడు కిలోమీటర్ల మేర భయంకరమైన మొసళ్ళతో నిండిన నీళ్ళు ఉంటాయి.” రెండవది “ఎనిమిది వందల అడుగుల ఎతైన గోడలు ఉంటాయి”. తృతీయది” మూడు వందల అడుగుల గోడలకి అక్కడక్కడ నూనె పోసి నిప్పు పెట్టి ఉంచుతారు.” మూడు దశలను దాటితే “ఇక అప్పుడు దేవతలతో యుద్ధం చేయవచ్చు.”ఇంతటి చిక్కుదట్టమైన భద్రతలను అసురులు ఎన్నటికి శ్చేధించలేరని ఇంద్రుడు కాలుమీద కాలు వేసుకొని కూర్చున్నాడు.అప్పుడు మహేంద్రుడి సేనాధిపతి వచ్చి “ప్రభు! అసురులు మనపైకి దండెత్తి వస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే రెండు దేశలను దాటేసారు.” అని చెప్పగానే ఇంద్రుడు ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆ! ఇది అసంభవం. వాళ్ళు ఎలా వచ్చారు? అయినా వాళ్ళు రెండు దేశలను చాటేస్తుంటే మన సైన్యం అంతా ఏం చేస్తున్నారు.అని బయటికి వచ్చి చూస్తాడు. అసురులు త్రిపుర విమానంపై వస్తుంటారు. అది చూసిన ఇంద్రుడు మళ్ళీ ఆశ్చర్యానికి లోనవుతాడు. ఇక చేసెదేమీ లేక యుద్ధాన్ని కొనసాగించమని ఆజ్ఞాపిస్తాడు. ఇక ఇంద్రుడి ఆజ్ఞ మేరకు ఇంద్రుడి సేన కనిపించిన అసురులందరిని క్షణాల్లో మట్టికర్పిస్తారు.కొందరు ఎతైన గోడల మీది నుండి అసురులపైకి బాణాల వర్షం కుర్పిస్తారు. మరికొందరు మూడవ దశను దాటనివ్వరు. కొద్ది క్షణాలలో  లక్షలాది సైన్యాన్ని మట్టికర్పిస్తారు.ఏం చేయాలో దిక్కుతోచక అసురులు మలమలా మాడిపోతారు.అప్పుడు అసురులు లంకేశునితో ఇలా అంటారు.”ప్రభూ!మా కోసమే జన్మించిన వీరుడెక్కడ? మమ్మల్ని రక్షించే మా దేవుడెక్కడ?”అని అడుగుతారు. అప్పుడు దశకంఠుడితో సహా అసురులందరి నోట ఒకే మాట “మేఘనాథా” అని. మేఘనాథుడు వచ్చీ రాగానే ఎతైన గోడల మీద అసురులపైకి బాణాల వర్షం కురిపిస్తున్న సైనికులను చంపేస్తాడు.దేవతలపై ఒకేసారి పంనెండు బాణాలను సంధిస్తూ దేవతలకు ముచ్చెమటలు పట్టిస్తాడు.రెప్పపాటు సమయంలో ఇంద్రుడి సేనను ముక్కలుముక్కలుగా  చీల్చిచెండాడుతాడు.ఇంద్రుడు ” మేఘనాథా! పిరికివానిలా దాక్కోని నా సేనను దెబ్బతీయడం కాదు.నీకు దుమ్ముంటే నా ముందుకు వచ్చి నాతో యుద్ధంచేయి” అని అంటాడు. అప్పుడు మేఘనాథుడు “ఇంద్రా! నేను నీ ముందే ఉన్నాను. పైకి చూడు అని బాణంతో ఇంద్రుడి కిరీటాన్ని కొడతాడు.అది సరిగ్గా మేఘనాథుడి కాలి కింద పడుతుంది.మేఘనాథుడు”ఇంద్రా! బుక్కెడునువ్వింకా నా మొఖం కూడా చూడలేదు. కానీ, అప్పుడే నీ మకుటం నా కాళ్ళ కింద కొట్టువిట్టాడుతుంది.ఇక నువ్వేంనాతో యుద్ధం చేయగలవ్. సరే, నువ్వు నీ మకుటాన్ని నీ సిరస్సుపై పెట్టుకుంటే నేను ఈ అమరావతినే వదిలి వేళ్ళిపోతా” అని సవాల్ విసురుతాడు. కొపంతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయొగిస్తాడు. అది రావణుడికి తగులుతుంది. రావణుడు స్ప్రూహ కోల్పోతాడు.మేఘనాథుడు కోపంతో ఇంద్రుడిని ఒక్క దెబ్బ కొట్టగా ఇంద్రుడు ఎనిమిది కీలోమీటర్ల దూరంలో పోయి పడతాడు. యుద్ధం ముగిసిన తర్వాత ఇంద్రుడిని బంధించి లంకకు తీసుకుని వెళ్తడు. బ్రహ్మ వచ్చి ఇంద్రుడిని విడిచి పెట్టు, దానికి బదులుగా నువ్వు ఎదైన వరం కోరుకో.అప్పుడు మేఘనాథుడు తనకు ఛావులేని వరం కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మేఘనాథా ఇది సృష్టి విరుద్ధం. ఈ భూమి పై జన్మించిన ప్రతి ఒక్కరూ మరనించక తప్పదు. కాని నీవు అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక వారాన్ని ప్రసాదిస్తున్నాను. “నీవు ఏ రోజైతే యుద్ధానికి వెళ్తావో ఆ రోజు సూర్యోదయానికి ముందే నీకు ప్రీతిబద్దమైన నికుంబలాదేవికి యాగం చేసి వేళితే ఆ రోజు నీవు అమరుడవు. నిన్ను ఎవరు ఓడించలేరు.కాని యాగం భజ్ఞం కాకూడదు. అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని భహుకరించి , నీవు ఇంద్రుడిని ఓడించావు కాబట్టి నీవు ఇకనుండి ఇంద్రజిత్తుగా ప్రసిద్ధి చెందుతావు.అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోతాడు. ఇక ఈ కాథను బట్టి మనం అర్థం చేసుకోవాలి మేఘనాథుడు ఎంతటి వీరుడని. యుద్ధరంగంలోకి దిగిన ఒక నిమిషం ముపైఏడు క్షణాల్లో యుద్ధాన్ని ముగించాడంటే ఎంతటి శూరుడో అని.

                   ధన్యవాదాలు.
***************************************************************************************************************

పేరు : శ్రీ కౌస్తుభ

తరగతి  : 9

పాఠశాల : KT.School, Pargi

నగరం : Vikarbad Dist.

పాత్ర : కవికోకిల వాల్మీకి

కవిత్వమనే అరణ్యంలో వాల్మీకి అనే సింహం సంచరిస్తుంది. ఆ సింహం రామగాథను గర్జిస్తుంది. ఆ సింహంలో కోకిల సుస్వరం కూడా వుంది. వాల్మీకికి సింహంలాగా గాంభీరంగ చెప్పడమే కాకా కోకిలలా మధురంగా చెప్పడం కూడా అలవడింది. శారద కల పండింది, మన జన్మతరించింది.

బ్రహ్మశాపంవలన వాల్మీకి ప్రాచేతసుని కుమారుడైన బోయగా జన్మించారు. రామనామ స్మరణవలన శాపవిమోచనం కలుగుతుందని చెప్పారు బ్రహ్మ. ఆ బోయ పేరు “రత్నాకరుడు”. ఎన్నో పాపాలు చేస్తూ ఒక బోయ స్త్రీని వివాహం చేసుకున్నాడు. వచ్చే ప్రయాణీకులని అడ్డగించి వారిని హింసిస్తూ వారి ధనాన్నిఅపహరిస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు రత్నాకరుడు సప్తఋషులను కూడా ఆపటానికి వెళ్ళాడు. అంతలో వారు అతణ్ణి ఆపి ఇలా అన్నారు, ‘ఓ బోయవాడా నీవు నీ కుటుంబం కోసం ఇన్ని పాపాలు చేస్తున్నవే మరి వారు నీ పాపాలలో భాగాన్ని తీసుకుంటారా? నీవు కనుక్కుని రా మేము నీ కోసం ప్రతిక్షిస్తాము’ అనగానే రత్నాకరుడు తన యింటికి బయలుదేరాడు.

ఇంటికి చేరుకున్నాక అతని భార్యతో ఇలా అన్నాడు ‘నేను నా పాప రాశులను పంచదలచాను నీవు భాగాన్ని తీసుకుంటావా?’ అని అడిగాడు. వెంటనే అతని భార్య ‘మమ్మల్ని పోషించడం మీ కర్తవ్యం, కనుక నేను ఎలాంటి భాగాన్నీ తీసుకోలేను’ అని నిర్మొహమాటంగా చెప్పడంతో విరక్తి చెందిన రత్నాకరుడు సప్తఋషులను తరుణోపాయం అడిగాడు.

సప్తఋషులు అతనికి రామతారక మంత్రాన్ని బోధించారు. రత్నాకరుడు ఎన్నో సంవత్సరాలు రామనామాన్ని స్మరిస్తూ తపస్సులో లీనమై ఉన్నాడు. అతనిపై వృక్షాలు, పుట్టలు మొలిచాయి.

ఒకరోజు నారాయణుడు అతని భక్తుడైన నారదునికి రామావతరం గురించి చెప్పారు. ఆ వార్తని గుప్తంగా ఉంచమని ఆదేశించారు. కానీ వార్తను పట్టలేకపోయాడు నారదుడు. దారిలో వెళ్తూ ఉండగా అక్కడ కనిపించే పుట్టపక్కన ఉన్న వృక్షాలకు రామకథను వివరించాడు. ఆ కథ పుట్టలో ఉన్న రత్నాకరుని మనసులోకి ప్రవేశించింది. “వాల్మీకం” అనగా పుట్ట అని అర్థం అలా పుట్టలో ఉండి రామగాథని హృదయంలో స్థాపించుకున్నందుకు రత్నాకరుడు “వాల్మీకి మహర్షి”గా మారిపోయాడు.

శ్రీరాముని పాత్రను లోకోత్తర పురుషునిగా, ధర్మమూర్తిగా వాల్మీకి మహర్షి తీర్చిదిద్దారు. లోకంలో ధర్మస్థపానకై రామాయణాన్ని మాధ్యమంగా ఉపయోగించేవారు. రాముని మహోన్నత గుణాలను కళ్ళకు కట్టినట్టు రచించి ఎన్నో ఆదర్శాలను స్థాపించారు. భారత సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.

పితృవాఖ్యా పరిపాలన, రాజధర్మాలు, ధర్మరక్షణ, దుష్టశిక్షణ, సాధురక్షణ లాంటి ధర్మాలన్ని రామాయణం ద్వారా మనకి వాల్మీకి ప్రసాదించినవే. అంతేకాక స్వయంగా వాల్మీకి రామాయణంలో ఒక భాగం. సీతమాత తన వనవాస సమయంలో వాల్మీకి ఆశ్రమంలో నివసించేది. వాల్మీకి సీతమ్మను కూతురిలా చూసుకున్నాడు.    ఒక పుత్రునిలా సేవించాడు.

సత్వగుణ ప్రవృద్ధి కోసం వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఈనాటికి రామరాజ్యం అనే మాట ఒక ఆదర్శ రాజ్యంలా నిలిచిపోయింది. హనుమంతుడు, శబరి, జాంబవంతుడు, జటాయు, సుగ్రీవుడు వంటి పాత్రలను అద్భుతంగా చిత్రీకరించి వాటికి శాశ్వతత్వాన్ని అందించారు. ఇలాంటి ఆదర్శ కావ్యానికి కారణం క్రూర రత్నాకరుడి నుండి పరివర్తన చెందిన ఆదికవి వాల్మీకి మహర్షి మాత్రమే.

“బోయవాని కులం నుండి జాలువారిన రామకథ ఈనాటికి భారతీయుల హృదయాలో ఆరని జ్యోతిలా వెలుగుతూనే ఉంది”. రామాయణాన్ని రచించి నిజమైన ధర్మాన్ని చూయించిన వాల్మీకి నీకు వేవేల వందనాలు. ఆ గాథను ఆదరించి పూజించిన భారతీయులందరికీ వందన శ్రీ చందనాలు.

జై శ్రీరామ్.

June 22, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సత్యకాముని కథ

by ఆచార్య మస‌న‌ June 21, 2021
written by ఆచార్య మస‌న‌

చాలామందికి వేదం గురించి తెలియదు. దాన్ని బ్రహ్మపదార్థంగా భావిస్తారు. కాని వేదం అందరిది. విశ్వజనీనమైంది, సార్వత్రికమైంది, సార్వకాలికమైంది. సృష్టి రచన ఒక మనిషి చేత జరగలేదు. పదిమఁది మనుషులు కలిసి చేసిన పని కూడా కాదు. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ మూలంగానే సృష్టి రచన జరిగింది. సృష్టి ఆవిర్భావానికి ముందే పరబ్రహ్మ మానవాళికి ఉపయోగకరంగా వేదాన్ని సృష్టించాడు. నల్గురు రుషులకు వేదోపదేశం చేశాడు. వారు వేదాన్నిఒకరి ద్వారా మరొకరికి వినిపించే ప్రయత్నం చేశారు. వేదానికి ‘బ్రహ్మ’ అని పేరు. వేదంలో ఏముందో తెలిసినవారే బ్రాహ్మణులు. వేదాలలో విషయాలను తెలుసుకొని మానవులను క్రమశిక్షణలో ఉంచే ప్రయత్నం పూర్వకాలంలో జరిగింది. ఆనాడు వేదపాఠశాలలే ఉండేవి. సాధారణంగా గురుకులాలలో వేదాలను బోధిఁచేవారు. వేదమంటే జ్ఞానం. ప్రతిమనిషి జ్ఞాని కావలసిఁదే. అందుకు వేదం ఉపకరించినట్లు మరే గ్రంథం ఉపయోగపడదు.

“యథేమాం వాచం కళ్యాణీమావగాని జనేభ్యః” (యజుర్వేదం 26-2)

వేదం కళ్యాణప్రదమైంది. అది జనులందరికి అందవలసి ఉంది – అని వేదంలోనే చెప్పబడింది.

ఇట్టి వేదోపదేశం ప్రాచీన కాలంలో అందరికి అందేదని చెప్పడానికి బృహదారణ్యకోపనిషత్తులోని ‘సత్యకాముని కథ’ ఆధారం. ఈ కథ అందరికీ వేదజ్ఞానం అందాలని తెలుపుతుంది.

సత్యకాముని కథ వేదాల ఉద్దేశానికి, ఉపనిషత్తుల దృక్పథానికి సంధానంగా కనిపిస్తున్నది. ఈనాటి వలె ఆనాడు కులమత వర్గ భేదాలు లేవు. సామర్థ్యాన్నిబట్టి ఆయా వర్గస్థులుగా గుర్తింపబడినారు. గురుకులాల్లో ఈ ఏర్పాటు ఆనాడుండింది.

సత్యకాముడు ఎనిమిది సంవత్సరాల కుర్రవాడు. సత్యసంధుడు, సుగుణశీలుడు. ఆడుతూ, పాడుతూ బాల్యాన్ని గడుపుతున్న అతడు బ్రహ్మచర్యాశ్రమంలో చేరి గురూపదేశం పొందాలనుకున్నాడు. అలాంటి కోరిక కలగగానే ఆట పాటలకు స్వస్తి చెప్పి వేదాన్ని బోధించే గురువును వెదుకసాగాడు.

పూర్వకాలంలో ఎంతోమందికి బ్రహ్మచర్య దీక్ష నిచ్చిన హారిద్రుమతుడు గొప్ప ఆచార్యునిగా పేరుగాంచినాడు. అతడు గౌతముడనే పేరుతో ప్రసిద్ధి పొందినాడు. వేదవేదాంగాలు తెలిసిన పండితునిగా, గాయత్రీ మంత్ర రహస్యం తెలిసిన విజ్ఞానిగా, శిష్యలంటే ప్రేమగలవానిగా హారిద్రుమతునికి లోకంలో మంచి పేరుంది. అతడొకనాడు తన ఆశ్రమంలో బాలబాలికలకు ఉపనయన సంస్కారం చేస్తుండగా సత్యకాముడు చూశాడు. వెంటనే గురువుగారి సముఖానికి వచి్చ వినయంగా నమస్కరించాడు. తనకు బ్రహ్మచర్య దీక్షనివ్వవలసిందిగా కోరాడు. సత్యకాముని అయ్యని పలుకులకు, వినయానికి మురిసిపోయిన హారి్రదుమతుడు ‘నీ గోత్రం పేరు చెప్పవయ్యా!’ అని అడిగాడు.

సత్యకామునికి అంతవరకు తన గోత్రమేమిటో తెలియదు. తండ్రి నుంచి వచ్చేదే గోత్రనామం. నిజానికి అతడు తన తండ్రిని అంతవరకు చూడనే లేదు. ఒకరు తనను గోత్రం నామం చెప్పమని అడుగుతారని కూడా తానెరుగడు. అయినప్పటికీ తన తల్లి మాత్రమే గోత్రనామం చెప్పగలదని భావించి ఆమె దగ్గరికి వచ్చి కాళ్ళమీద పడ్డాడు. ఆమె ‘ఏమిటి నాయనా?’ అని అడిగింది.

“అమ్మా నా గోత్రనామం ఏమిటో చెప్పు, నేను బ్రహ్మచర్య దీక్షను పొందాలనుకుంటున్నాను” అని సమాధానమిచ్చాడు.

అప్పుడా తల్లి ఇటువంటి ప్రశ్న ఎదురౌతుందని తానూ భావించలేదు. అయినప్పటికీ తన మనస్సును దిట్టపరుచుకొని కుమారునితో  “ఓయి పుత్రక! నీ గోత్రం నాకు తెలియదు, గోత్ర నామం తెలియనందుకు నాకు కూడా బాధగానే ఉంది. తండ్రివల్లనే గోత్రనామం వస్తుంది. కాని తండ్రి ఎవ్వరో తెలియనప్పుడు గోత్రం ఎట్లా తెలుస్తుంది? ఎన్నాళ్ళ నుంచో నా గుండెలో దాచుకున్న రహస్యాన్ని నీకు చెప్తున్నాను. జాగ్రత్తగా విను. నీవు పుట్టక ముందు నేనొకరి ఇంటిలో పరిచారికగా ఉన్నాను. యౌవనంలో ఉన్నాను. ఆ యింటికి వచ్చిన ఒకానొక అతిథివల్ల నిన్ను కాలవశాన కన్నాను. జరిగినది ఎవరికీ చెప్పజాలని నిస్సహాయురాలిని, పైగా పేదరాలిని. ఐనా నాకు న్యాయం చేసేవాళ్ళుండాలి కదా చెప్పినప్పుడు. పాప పుణ్యాలను విధికే విడిచిపెట్టి తొమ్మిది మాసాలు నిన్ను మోసి కన్నాను, ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఏ గంగాపాలో చేయక, ప్రేమతో నిన్ను పెంచాను. అందరూ బాబూ! నీ సత్ ప్రవర్తనకు నిన్ను మురిసిపోయి సత్యకాముడని పిలిచారు. నేను నీ తల్లి జబాలను, నీవు నా కుమారుడవు సత్యకాముడవు. ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే జబాలసుతుడను. సత్యకాముడను అని సమాధానం ఇవ్వు” అని చెప్పగా విని సత్యకాముడు ఎంత మాత్రం సంకోచం లేకుండా పరుగు పరుగున హారిద్రుమతుని దగ్గరికి వచ్చినాడు. గురువుగారు ‘నీ గోత్రనామం తెలుసుకొంటివా?’ అని అడిగాడు. సత్యకాముడు అమ్మ చెప్పిన విషయాన్ని పొల్లు పోకుండా తెలియజేసినాడు.

సత్య సంపూర్ణములైన సత్యకాముని పలుకులను విన్న హారిద్రుమతుడు సంతుష్ఠాంతరంగుడై ‘గోత్రనామము తెలియవలెనా? గుణము తెలిసిన చాలదా?’ అని తన మనసులో అనుకొని సత్యకామున్ని తన దగ్గరికి తీసికొని చేతిలో శిరస్సును తాకినాడు. “సత్యకామా! వెంటనే సమిధను తీసుకొని రా! నీకు ఉపనయనం చేస్తాను.” అని ఆదేశించాడు.

సత్యకాముడు హారిద్రుమతుని శిష్యకోటిలో అగ్రేసరుడయ్యాడు. వేదవేదాంగాలలోని రహస్యాలు తెలుసుకున్నాడు. హారిద్రుమతుని అనంతరం గురుకులానికి అధిపతి అయ్యాడు. వేలాదిమంది శిష్యులను సంపాదించుకున్నాడు.

సత్యకాముని కథ నిజంగా వట్టి కథ కాదు. ప్రతి వ్యక్తికి జ్ఞానాన్ని కల్గింే కథ. ఎవరెలాంటి జన్మ ఎత్తినా, గోత్రనామంతో సంబంధం లేకుండా వేదాధ్యయనం చేయవచ్చునని సత్యకాముని కథ వెల్లడిస్తున్నది.

వేదం సర్వమానవులది. వేద రహస్యాలు అందరికి తెలియదగినవి. అట్లే వేదజ్ఞానాన్ని ఉపనిషత్తుల ద్వారా మానవాళి  పొందడానికి మన ఋషులు ప్రయత్నించారు. వారు అభినందనీయులు.

-ఆచార్య మసన చెన్నప్ప 

June 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సవ్వడి

by -డాక్టర్ కాసర్ల రంగారావు June 21, 2021
written by -డాక్టర్ కాసర్ల రంగారావు
ఆలోచనలు లో లోపలికి తెరలు తెరలుగా
గుడిలో ఓనమాలు
అయ్యగారి బడిలో అఆలు
అంతా కలిసి కొంతే
మందారపువ్వు సౌభాగ్యవతిగా నిష్క్రమణ
నిర్మలదీ అదేదారి పల్లెటూళ్ళలో అంతేమరి
అంబటాలకెళ్ళినజనం .
ఆజంజాహి సైరన్ తో తిరుగు ప్రయాణం
ప్యాటకా బిడ్డా! సీటీ కొట్టిందా
నూనె దీపాల తొందర సాయంత్రాలు
తొలివేకువలు; కావలసినంత పేడ
దారి కనిపించని దుమ్ము దుమ్ము
గై కర్రలతో కావలసినన్ని సీమచింతలు రేగులు
పతంగి గోళీలతో ఎండలో ఆటలు
నాటి సిర్రగోనెలే నేటి క్రికెట్
మోటబావులు ;స్నానాలు ఉన్నంతలో పచ్చదనం పరిశుభ్రం
గొల్లసుద్దులు చిందుభాగోతాలు హౌస్ ఫుల్
ఊరు మున్సిపాలిటైంది
గోకె ఉభయచరమైంది
తారురోడ్డుపై అభివృద్ధి తన్నుకొని వచ్చింది
అందం సుకుమారం చిక్కిచితికి పొయ్యాయి
దసరా రోజున చివరి దొరతనం సమాప్తం
వ్యవసాయం హమాలీగా మారింది
మున్సిపల్ నల్లాగా మారింది
ప్రశ్నలకు బెదిరి సాగుభూమి ఇండ్లప్లాట్లుగా
మారింది
మామూలు నారాయణ వీరాస్వాములు కోటీశ్వరులయ్యారు.
భూస్వంతదారులు ఉద్యోగపు పిందెలయ్యారు
ఉద్యమ భీభత్సం సారావ్యాపారంగా మారింది
అంత్యజుడే ఉద్యోగాల్లో అగ్రజుడయ్యాడు
కాలువలో పోయిన వట్టి భూములు
దశ దిశ మారిన యువజీరలు
సంఘనాథుడు దండనాథుడు సఫలీకృతులయ్యారు
సోమరాజోని బావి చామకూరపంపు గడ్డి పొలం చెరిగిన గుర్తులయ్యాయి
కాంక్రీటు ఆవాసాలుగా వ్యవసాయం మెటామార్ఫోసిస్
 మెజెస్టీ ఛార్మ్ కో‍ల్పోయిన సికెయమ్ నెహ్రూ మెమోరియల్
కాన్వెంట్ పోటీలు అలారం గడబిడలు
అంతా పోష్ పాష్ హుష్ హష్
ఒయాసిస్ గా పరంజ్యోతి అవతారం
సానుభూతిని సత్వరం క్యాష్ చేసుకున్న సుతారం
-పేరు:డాక్టర్ కాసర్ల రంగారావు
June 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చెరువు

by శ్రీధర్ చౌడారపు June 21, 2021
written by శ్రీధర్ చౌడారపు
చెరువు అమ్మలాగే నిండుకుండలాగుంది
అలలెన్నో రేగుతోన్నా…
అంతరంగాన మాత్రం ప్రశాంతంగా
‘కట్ట’మగాడిని కట్టుకున్న నాటినుండి
కలిసే ఉంది… కౌగిలించుకునే ఉంది
ఒళ్ళంతా ఒక్కటిగా పెనవేసుకునే ఉంది
ఎంతటి  అనురాగమో… ఎంతటి ఆప్యాయతో
మేఘాల రథాలెక్కి
గాలి అలల దారులవెంట పరుగులెడుతూ
నేలతల్లి పిలించిందనీ కిందికి జారి
పాయలై పారుతోన్న నీటిపాపల్ని
ఆప్యాయంగా పిలిచి అక్కున చేర్చుకుంది
భద్రంగా తన కడుపులో దాచుకుంది
పంటపొలాల పసికూనలకు లాలపోసి,
కడుపునిండా కమ్మని నీరు తాగించి
పచ్చదనపు పట్టుపరికిణీ కట్టి
ఎదగనిచ్చి… ఎదిగి ఒదగనిచ్చి
పల్లె ముత్తైదువకు పంటల వాయినాలిచ్చింది
లెక్కతప్పిన ఆకాశం అప్పుడప్పుడు
హద్దుదాటేంత నీటిని పంపకమేస్తే
అదుపు తప్పుతోన్న
తన అంత’రంగం’లోని అలలజడికి వెరిసి
పల్లె మేలుకోరి
తన ‘కట్ట’ మగని ఒంటిని గండికొట్టించి
నిండు గర్భాన తానే చిచ్చుబెట్టుకుంటుంది
అలిగిన మేఘమాలికలు ఎప్పుడైనా
పలకరించకుండా వెళ్ళిపోతే
వర్షపు చినుకులు చిలకరించకుండా పోతే
తన వంటి నిండా ఉండిన నీళ్ళు
అడుగంటిపోయి
అసలు అగుపించకుండాపోతే
ఆశల కళ్ళేసుకుని ఆకాశాన్ని చూస్తూనే ఉంటుంది
తన కడుపునిం(పం)డే ఘడియ
త్వరలోనే ఉందా అని అడుగుతూనే ఉంటుంది
వట్టిపోయినా, చెరువెన్నడూ వెరువదు
మంచిరోజులు ముందుంటాయన్న మాట మరువదు
చెరువు
ఆకలెరిగిన అమ్మ… అన్నఫూర్ణమ్మ
-శ్రీధర్ చౌడారపు
June 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

అపరిచిత – కథ

by Sudharshan Chintapatla June 17, 2021
written by Sudharshan Chintapatla

మూలం : రవీంద్రనాథ్ టాగూర్,    అనువాదం : చింతపట్ల సుదర్శన్

నా వయస్సు ఇరవైయేడేళ్లు. ఇప్పటివరకూ జీవితంలో చెప్పుకోదగ్గట్టుగా ఏమీ సాధించకలేకపోయినా, నా కంటూ ఒక స్వంత జీవితం ఉందని దానికి ఓ విలువ ఉందని ఇప్పుడే తెలిసింది. ఈ విషయానికి సంబంధించి మరువలేని సంఘటలను వివరంగ చెప్తాను.

మా నాన్నగారు ఒకప్పుడు చాలా పేదరికం అనుభవించారు. కాని ప్లీడరు వృత్తి బాగా కలిసివచ్చి చాలా డబ్బు సంపాదించారు. సంపాదించిన దాంతో సుఖపడే తీరిక మాత్రం ఆయనకు ఉండేది కాదు. చివరిశ్వాస తర్వాతే ఆయనకు విశ్రాంతి లభించింది. మా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె మేం ధనవంతులం అనే ఆలోచన నాలో కల్పించింది. ఆమె అతిగారాబంగా పెంచడంవల్ల నేను అసలు ఎదగనే లేదు.

మా అమ్మ సోదరుడు నాకు సంరక్షకుడుగా ఉండేవాడు. మా మేనమామ నాకంటే ఆరేళ్ళు పెద్దవాడు. కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలపై అజమాయిషీ చేసేవాడు. ఆయన కారణంగా నేను ఏ బాధ్యతా తెలియని వాడినయ్యాను. పెండ్లి కావలసిన కుమార్తెలు, ఉన్న తల్లిదండ్రులకు నేను అన్ని అర్హతలు ఉండి ఉన్నత కుటుంబానికి చెందిన బ్మహ్మచారిని. పొగ త్రాగడం వంటి చెడు అలవాట్లేమీ లేవు. నేను చాలా విధేయుడినైన కొడుకుని. అవిధేయత చూపే శక్తి నాకు లేదు. ఒక స్త్రీ కనుసన్నల్లో పెరిగిన వాణ్ణి కాబట్టి ఏ స్త్రీకయినా మంచి భర్తను కాగలను.

సంపన్న కుటుంబాలవారు నా సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారు. కాని నా విధిని నిర్ణయించే మేనమామ సంపన్నుల కుమార్తెల పట్ల వ్యతిరేకి. మా ఇంటికి వచ్చే వధువు వినయ విధేయతలే ఆయనకు ముఖ్యం. నాకు పిల్లనివ్వ వచ్చే వధువు తండ్రి ధనవంతుడై ఉండకూడదు కాని కట్నం క్రింద కొంత ధనం వెచ్చించగలిగి ఉండాలి.

కాన్పూర్ లో ఉద్యోగం చేసే నా స్నేహితుడు హరీష్ కలకత్తా నించి వచ్చాడు. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నాకు తెల్సిన ఓ అందమైన అమ్మాయి ఉందని చెప్పి నా మనశ్శాంతిని హరించాడు.

నేను మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం వెదుక్కోవలసిన అవసరం లేదు, చెయ్యనక్కర్లేదు. ఊరికే గోళ్లు గిల్లుతూ కూర్చోవడానికి కావలసినంత సమయం ఉంది. కుటుంబ విషయాలు చూసుకునే సమర్థత లేదు. నా ప్రపంచం అంతా అమ్మ మా మేనమామ మాత్రమే. ఇలా నిస్సార జీవితం గడుపుతున్న నా దగ్గర హరీష్ అమ్మాయి ప్రస్తావన తెచ్చాడు. నాలో కుతూహలం పెంచాడు. నన్ను రెచ్చగొట్టాడు.

హరీష్ తో నేను ఈ విషయాన్ని మామకు చెప్పమన్నాను. హరీష్ కు వ్యవహారం నడిపే యుక్తి ఉన్నది. మామకు నచ్చే విధంగా అమ్మాయి తండ్రి వివరణ యిచ్చాడు హరీష్. ఆ కుటుంబం గతంలో సంపదతో తులతూగినదేకాని ప్రస్తుతం సంపద దాదాపు ఖాళీ అయినా అమ్మాయి పెళ్లికి తగినంత మిగిలే ఉన్నది. ఇదివరలోలా జీవితం గడిపే పరిస్థితి లేనందువల్ల ఆయన స్వస్థలం వదిలి పడమరవైపు వచ్చి కాన్పూర్ లో సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడని చెప్పాడు.

ఇవన్నీ కలిసొచ్చే విషయాలే. ఒక్కతే కూతురు కనుక ఆమె తండ్రి తను దాచి వుంచిన డబ్బును అణాపైసలతో సహా ఖర్చు పెడ్తాడు. కాని అమ్మాయి వయస్సు పదిహేను దాటడానికి కారణమేమిటని అడిగాడు మామ. అర్హులైన వరుల ఖరీదు ఎక్కువని వారి అంచనాలు తారా స్థాయిలో ఉంటున్నవని అందువల్ల, సరైన సంబంధం కోసం వధువు తండ్రి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండడంవల్ల అమ్మాయికి ఆ వయస్సు వచ్చిందన్న యిచ్చిన జవాబు మామకు సంతృప్తి కలిగించింది.

మామకు కలకత్తా తప్ప మరే ప్రాంతమైనా అండమాన్ నికోబార్ లాంటిదే. ఒకవేళ తనే గనక ధర్మశాస్త్రం లిఖించిన మనువు అయి వుంటే హౌరాబ్రిడ్జి దాటి పోవడాన్ని కూడా నిషేధించి ఉండేవాడు. అందువల్ల నేను కాన్పూర్ కు వెళ్ళి అమ్మాయిని చూస్తాననే సాహసం చెయ్యలేకపోయాను.

మా తరఫున పెళ్ళి సంప్రదింపులు జరపడానికి కాన్పూర్ వెళ్ళాడు మా పెదనాన్న కొడుకు బిన్ను. మామూలుగా అయితే బిను అన్నయ్య ఏ విషయాన్నైనా తేలిక చేసి మాట్లాడే రకం. మనం అద్భుతంగా ఉంది. అంటే ఆఁ ఓ మోస్తరుగా ఉంది అనే మనిషి. కాన్పూర్ వెళ్ళి వచ్చిన అన్నయ్య ‘ఏ వంకా పెట్టడానికి వీల్లేదు. అమ్మాయి స్వచ్ఛమైన బంగారం అనుకో’ అన్నాడు.

2

పెళ్లి జరిపించడానికి వధువు తరఫువాళ్ళే కలకత్తాకు రావల్సి వచ్చిందని నేను వేరే చెప్పనక్కర్లేదు కదా. అమ్మాయి తండ్రి శంభునాథ్ బాబు హరీష్ ను పూర్తిగా విశ్వసించినట్టుంది. అందువల్ల పెళ్ళికి మూడురోజుల ముందు ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు మాత్రమే నన్ను చూశాడు. నలబై సంవత్సరాల వయస్సులో ఉన్నా ఆయన స్ఫురద్రూపి. మీసాలు తెల్లబడుతున్నవిగాని తలవెంట్రుకలు మాత్రం ఇంకా నల్లగానే ఉన్నవి. నన్ను చూసి ఆయన సంతృప్తి చెందాడనే అనుకుంటాను. అయితే ఆ సంగతి ఆయన స్పష్టంగా తెలియనివ్వలేదు. మితభాషేకాని మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడ్తాడు. మామ సందర్భం దొరికినప్పుడల్లా నగరంలోని ధనికుల కుటుంబాలలోమా కుటుంబమే ఉత్తమమైనదని చెప్పినప్పటికీ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. కనీసం అలాగా అన్నట్టు తల కూడా ఆడించలేదు. మామ ఎవరినీ తేలిగ్గా వదిలేవాడు కాదు కానీ శంబునాథ్ బాబులో చురుకుదనం లేదని సరి పెట్టుకున్నాడు. ఇది ఒక రకంగా ఆయనకు నచ్చింది. అమ్మాయి తండ్రి నోరు మెదపకుండా ఉండడం ఆయనకు ఇష్టమైన విషయమే.  శంబునాథ్ బాబు సెలవు తీసుకుంటాను అన్నప్పుడు బయటవేచి ఉన్న బండివరకు వెళ్లి ఆయనకు వీడ్కోలు చెప్పలేదు.

కట్నం కింద యివ్వాల్సిన మొత్తం నిర్ణయింపబడింది. ఆర్థిక విషయాలలో ఎలాంటి నసుగుడూ మామకు ఇష్టం వుండదు. అందువ ల్ల డబ్బుతోపాటు యివ్వవలసిన బంగారం నాణ్యత బరువు కూడా ఖచ్చితంగా నిర్ణయించాడు. ఈ లావాదేవీలలో నేను తలదూర్చలేదు.  అనుకున్న దానిలో చిన్నమెత్తు తేడా వచ్చినా మామ ఒప్పుకునే మనిషి కాదని నాకు తెలుసు. మాకు డబ్బు అవసరం లేకపోయినా, అవతలివాళ్ళు అడిగినంత యివ్వ లేకపోయినా ఎట్టి పరిస్థితిలోనూ మా కుటుంబ ప్రతిష్ఠే గెలిచితీరాలని మామ పట్టుదల.

పెళ్ళిలో పసుపుకు సంబంధించిన వేడుక వైభవంగా జరిగింది. లెక్కవేయడానికి ఒక గుమాస్తాను పెట్టుకోవలసినంత మంది మా బంధువులు వధువుకు బహుమమతులు యిచ్చారు.

బ్యాండు మేళంతో బ్రహ్మాండమైన ఊరేగింపు పెళ్ళి మండపానికి చేరింది. బంగారు జలతారు చొక్కాతో మెడనిండా బంగారు గొలుసులతో వేళ్ళకు ఉంగరాలతో ధరల చీటీ అంటించబడి షోకేసులో ఉండే వస్తువులా వెళ్ళాను.  మా మామ పెళ్ళి జరిగే ప్రదేశం చూడగానే ఎంతో నిరాశకు గురయ్యాడు. మా వాళ్లకు ఆ స్థలం సౌకర్యవంతంగా లేదని ఏర్పాట్లు ఘనంగా లేవని చిరాకు పడ్డాడు. శంబునాథ్ బాబు ఆహ్వానించిన విధానం కూడా ఆయనకు నచ్చలేదు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో గొడవ మొదలవుతుంది అనుకున్నా, కానీ నల్లగా లావుగా ఉన్న బట్టతల మనిషి శంబునాథ్ బాబు లాయర్ మిత్రుడు నడుముకి శాలువా చుట్టుకుని మా మధ్యకు వచ్చి తలవంచి చిరునవ్వు నవ్వుతూ చేతులు జోడించి అందరికీ నమస్కరించి దాన్ని నివారించాడు.

నేను మండపంలో కూర్చోగానే మా మామ శంబునాథ్ బాబును పక్కకు తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య యేం జరిగిందో తెలియదుకాని శంబునాథ్ బాబు వచ్చి ‘బాబూ! ఓసారి నా వెంట వస్తావా’ అన్నాడు. మామకు వధువుకు యిచ్చే బంగారం నాణ్యత విషయంలో మోసం జరగవచ్చునని భయం. అందుకే బంగారం నాణ్యతను చూడటానికి, తూచడానికి కంసాలిని వెంట తీసుకువచ్చాడు.

నేను శంబూనాథ్ బాబు వెంట గదిలోకి ప్రవేశించేప్పటికి మంచం మీద మామ ఆ పక్కన నేలమీద త్రాసు, తూకపురాళ్ళతో కంసాలి కనిపించారు.

శంబునాథ్ బాబు నావైపు తిరిగి ‘పెళ్ళి జరగడానికి ముందే బంగారం అంతా పరీక్షించాలంటున్నారు. మరి మీరేమంటారు?’ అన్నాడు.

నేను తలదించుకుని మౌనంగా ఉన్నాను. ‘వాడి ముఖం వాడేం చెప్తాడు. నేను ఏది చెప్తే అదే!’ అన్నాడు మామ. ‘ఇది నిజమేనా? ఆయన చెప్పిందే వేదవాక్కా, తమరు నోరు విప్పరా?’ అన్నాడు శంబునాథ్ బాబు. నేను విషయం నా పరిధిలో లేదు అన్నట్టు తల ఊపాను.

‘అలాగయితే కాస్సేపు ఆగండి. నేను వెళ్ళి అమ్మాయి మీద ఉన్న నగలన్నీ తీయించి తెస్తాను’ అన్నాడు శంబునాథ్ బాబు.

‘అనుపమ్’ ఇక్కడ ఉండి చేసేది ఏమీ లేదు. వాణ్ణి మండపానికి వెళ్లనివ్వండి’ అన్నాడు మామ.

‘వీల్లేదు. అతనూ ఇక్కడే ఉండాలి’ అంటూ వెళ్లిన శంభునాథ్ బాబు ఒక ఉత్తరీయంలో బంగారు నగలు మూటకట్టి తెచ్చి మామ కూచుని ఉన్న మంచం మీద విప్పి పోశాడు.

‘నగలలో ఒకటి చేతిలోకి తీసుకుని ‘పరీక్షించే అవసరం లేదు అన్ని నగలూ కల్తీలేని బంగారంతో చేసినవే. ఈ రోజుల్లో ఇంత స్వచ్ఛమైన బంగారం కనిపించదు’ అన్నాడు కంసాలి. తర్వాత ఒక నోటు పుస్తకంలో వివిధ నగల జాబితా రాశాడు. చివరికి అమ్మాయికి యిస్తామన్నదాని కంటే శంబునాథ్ బాబు తెచ్చిన బంగారం కాస్త ఎక్కువగా ఉందని తేలింది.

ఆ నగలలో ఒ క జత చెవిరింగులు ఉన్నాయి. కంసాలి వాటిని పరిశీలించి వీటిలో బంగారం చాలా తక్కువగా ఉంది అన్నాడు. ‘అవి మీ బంధువుల్లో ఎవరో మా అమ్మాయికి బహుమతిగా యిచ్చినవి’ అంటూ శంబునాథ్ బాబు ఆ చెవి రింగులు మామ చేతిలో పెట్టి ‘ఇవి మీ దగ్గరే ఉంచండి’ అన్నాడు.

మామ ముఖం అవమానంతో ఎర్రబడ్డది. ఏం మాట్లాడాలో తెలియక నావైపు తిరిగి ‘అనుపమ్ ఇక నువ్వు మండపానికి వెళ్ళి కూర్చో’ అన్నాడు.

శంబునాథ్ బాబు నన్ను వారించాడు. ‘అవసరం లేదు, ముందు భోజనాలు కానివ్వండి’ అన్నాడు. ‘భోజనమా? పెళ్ళి కాక ముందే భోజనమా? ఈ మాట ఇదివరకెన్నడూ విన్లేదు’ అన్నాడు మామ.

శంబునాథ్ బాబుపైకి కనిపించేటంత సాత్వికుడు కాదు. లోపల చాలా గట్టివాడు. మా వాళ్ళను ముందు భోజనం చెయ్యమని ఒత్తిడి చేశాడు. మామను భోజనం చెయ్యడానికి ఒప్పించాడు. వరుని వెంట వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేశారు. భోజనం మామూలుగానే వుంది కానీ రుచికరంగా ఉండి మర్యాదగా వడ్డించబడటం వల్ల అందరికీ తృప్తి కలిగింది.  అంతా తిన్నాక శంబునాథ్ బాబు నన్ను కూడా తినమన్నాడు. ‘అదెలా కుదురుతుంది. పెళ్ళి కాకుండానే వరుడు ఎలా భోం చేస్తాడు’ అన్నాడు మామ.

మామ మాటలు పట్టించుకోకుండా ఆయన నాతో ‘మీరు భోజనం చేస్తే ఏ ప్రమాదమూ ముంచుకురాదు’ అన్నాడు.

నేను మామ మాటకి ఎదురు చెప్పింది లేదు. అది మా అమ్మ ఆజ్ఞతో సమానం నాకు. అందువల్ల భోజనం చెయ్యడానికి ఒప్పుకోలేదు.

శంభునాథ్ బాబు మామవైపు తిరిగి ‘మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. మేం సంపన్నులం కాము. మీ స్థాయికి తగిన ఏర్పాట్లు చేయలేకపోయాం. ఆలస్యం అవుతున్నది. ఇంక ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోను. అందువల్ల…..’

మధ్యలో అందుకుని మామ ‘అవునవును ఇక మనం మండపానికి వెళ్దాం’ అన్నాడు.

శంభునాథ్ బాబు ‘మీ తిరుగు ప్రయాణానికి బండ్లను పిలిపించనా?’అన్నాడు.

అదిరిపడ్డాడు మామ. ‘వేళాకోళానికి యిది సమయమా?’ అన్నాడు.

శంబునాథ్ బాబు ‘పరిహాసం ఆడటం మీకు మాత్రమే తెలుసు. నేను దానిని కొనసాగించదల్చుకోలేదు’ అన్నాడు.

మామ నిశ్చేష్టుడై నిలబడ్డాడు.

‘నా బిడ్డకు యివ్వాల్సిన బంగారం విషయంలో మోసం చేస్తానని భావించిన కుటుంబానికి నా కూతురుని యివ్వలేను’ అన్నాడు శంబునాథ్ బాబు. ఈసారి ఆయన నావైపు చూడలేదు. ఏ రకంగానూ విలువలేని మనిషినైన నాతో మాట్లాడ్డం అనవసరం అనుకున్నట్టున్నాడు.

ఆ తర్వాత యేం జరిగిందీ చెప్పడానికి నోరు రావడం లేదు. మా వాళ్ళు అక్కడ్నించి బయటకు వెళ్ళడానికి ముందు అక్కడ ఉన్న  కుర్చీలను విరగ్గొట్టారు. మండపాన్ని ధ్వంసం చేశారు.

మేం తిరిగి వచ్చేప్పుడు బ్యాండు మేళం లేదు. దీపాలు పట్టుకునే వాళ్ళు లేరు. ఆకాశంలోని చుక్కల వెలుతురులో నిశ్సబ్దంగా వెనక్కు వచ్చేశాం.

3

బహుశా బెంగాల్ లో యిలా పెళ్లివారి ఇంటి నుంచి తరిమివేయబడ్డ ఏకైక పెళ్ళి కొడుకును నేనేనేమో! మా కుటుంబంలో అందరూ ఆగ్రహంతో ఊగిపోయారు. వాడు కూతురి పెళ్లి ఎలా చేస్తాడో చూద్దాం అన్నారు. మామ వధువు తండ్రి మీద పరువు నష్టం దావా వేస్తానన్నాడు కానీ బంధువులు అది మనకే అప్రతిష్ట అనడంతో ఊరుకున్నాడు.

నాకు బాగా కోపం వచ్చింది. ఏదో ఒకనాడు శంబునాథ్ బాబు నా కాళ్లమీద పడి క్షమాపణ అడిగి తన కూతురును నాకు యివ్వడానికి రావాలని కోరుకున్నాను. నా ఈ కోపానికి మరొక బాధ కూడా జత కూడింది. నేను వెళ్ళడానికి వీల్లేని గోడ వెనుక, సిగ్గుతో, గంధం రాసుకున్న ముఖంతో, ఎర్రటి పెండ్లి చీరలో నిలబడి ఉన్న ఆమె నా ఊహా లోకంలో వసంత కాలంలో వికసించే పుష్పాలతో నిండి ఉన్న తీగలా కనిపించేది. గాలిలో ఆ తీగ పరిమళాన్నిఆస్వాదించేవాణ్ణి. ఆ తీగ ఆకుల సవ్వడి వినేవాణ్ణి. నాకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్న ఆమె హఠాత్తుగా అందనంత దూరం వెళ్ళిపోయింది.

ఆమెను చూసి వచ్చి బినూ అన్నయ్య  చెప్పినదాన్నిబట్టి ఆమె అసాధారణమైన అందగత్తె అని ఊహించుకున్నాను. కనీసం ఆమె ఫోటో కూడా చూడలేదు. ఆమె రూపం నా మనసులో అస్పష్టంగా ఉండిపోయింది. ఆమె నా ఫోటో చూసిందని హరీష్ చెప్పాడు. బహుశా నచ్చే ఉంటాను. ఆమె నా ఫోటోను దాచుకుని రహస్యంగా చూస్తూ ఉండి ఉంటుందని, ఆమె నా ఫోటో పైకి వంగి చూస్తున్నప్పుడు ఆమె తల వెంట్రుకలు దాన్ని కప్పేస్తుంటాయని, ఆమె నా ఫోటో చూస్తున్నప్పుడు ఎవరైనా వస్తే దాన్ని తన చీరమడతలో దాచేస్తుంటుందని రకరకాలుగా ఊహించుకునే వాణ్ణి.

సంవత్సరం గడచిపోయింది. నా పెళ్ళి గురించి మాట్లాడటానికి మామ ఇబ్బంది పడితే అమ్మ జరిగిన అవమానాన్ని మరచిపోయే వరకూ పెళ్ళి మాట తలపెట్టకూడదనుకుంది.

ఆ అమ్మాయికి ఒకమంచి సంబంధం వచ్చినా ఒప్పుకోలేదని తను యింక పెళ్ళి చేసుకోనని ఒట్టు పెట్టుకుందని తెలిసింది. ఆమె నా కోసం పరితపిస్తుందనుకున్నాను. ఆమె దుఃఖాన్ని చూసి భరించలేక మామ మా ఇంటి గుమ్మం ముందు నిలబడతాడని ఊహించుకున్నా. మళ్ళి పెళ్ళి యేర్పాట్లు జరిగితే జరిగిన అవమానానికి ఆ పెళ్ళిని రసాభాస చేసి బదులు తీర్చుకోవాలని కూడా అనిపించేది.

కానీ నా ఊహాలేవీ నిజం కాలేదు. కథలో నేననుకున్నదేమీ జరగలేదు.

అమ్మకు తోడుగా తీర్థయాత్రకు బయలుదేరాను. మామ ఎలాగూ హౌరాబ్రిడ్జి దాటి రాడు కనుక నాకా అవకాశం వచ్చింది. రైల్లో దాని లయబద్ధమైన కదలికకు ఒకదానికొకటి పొంతనలేని కలలు కంటూ నిద్రపోయాను. రైలు ఒక స్టేషన్లో ఆగింది. అది కూడా కలేనేమో అనుకున్నా. స్టేషన్లో దీపాల మసకవెలుతురు ఉన్నది. అమ్మ తన బెర్తుమీద నిద్రపోతున్నది. మా బ్యాగులు చుట్టుపక్కల అస్తవ్యస్తంగా పడున్నవి.

హఠాత్తుగా ‘తొందరగారా ఇక్కడ ఈ కంపార్టుమెంట్ లో ఖాళీ ఉన్నది’ అన్న శబ్దం వినపడింది. నా చెవులకు అది సుమధుర సంగీతంలా వినిపించింది. ఈ అర్ధరాత్రివేళ ఎక్కడ ఉన్నానో తెలియని చోట ఒక అమ్మాయి బెంగాలీ భాషలో మాట్లాడటం వింటుంటే బెంగాలీ భాష ఎంత తియ్యనిదో అనిపించింది. అది కేవలం ఒక స్త్రీ గొంతుక మాత్రమే కాదు నేను ఎప్పుడూ విని ఉండని సుస్వర సంగీతం.

భౌతికంగా కనిపించే రూపం కంటే మనుషుల కంఠధ్వని నాకు ఆసక్తికరంగా అనిపించేది. నేను కిటికీ తెరిచి చూశాను. ఆ చీకట్లో గార్డు తన ఒంటికన్ను లాంతరు పైకి ఎత్తి పట్టుకోవడంతో రైలు కదిలింది. లేచి కిటికీ పక్కనే కూర్చున్నా, నక్షత్రాలు వెలుగుతున్న ఆకాశంలో ఒక వ్యక్తి రూపం లీలగా నన్ను కమ్మేసింది. ఆ అపరిచిత కంఠధ్వని నా హృదయంలోకి చొరబడి అత్యంత సమీప వ్యక్తి కోసం దాచిన చోటును ఆక్రమించేసింది. లయబద్ధంగా విన వస్తున్న రైలు శబ్దంలో ఒక పాట పల్లవి పదే పదే నా చెవులకు వినిపించసాగింది. ‘ఇక్కడ ఈ కంపార్టుమెంటులో ఖాళీ ఉన్నది’.  ఓ నా సంగీత స్వరమా ఇక్కడ కావలసినంత ఖాళీ ఉన్నది. నేనింక క్షణం ఆగలేను అనుకున్నా.

ఆ రాత్రి నిద్రపట్టలేదు. నేను చూడని ఆ స్వరం ఉన్న మనిషి తెల్లవారకముందే ఎక్కడ దిగిపోతుందోనన్న భయంతో రైలు ఆగిన ప్రతిస్టేషన్లో కిటికీలోంచి బయటకు తొంగి చూశాను.

మర్నాడు ఒక జంక్షన్లో రైలు ఆగింది. మేము రైలు మారాలి. మా దగ్గర ఫస్టుక్లాసు టికెట్ ఉండటంవల్ల సమస్యే ఉండదు అనుకున్నా. కాని ఓ బ్రిటిష్ సైనికాధికారి తన సహాయకులతో ప్లాట్ ఫాం మీద ఉన్నాడు. ఇక ఫస్టు క్లాస్ లో స్థలం దొరుకుతుందన్న ఆశ వదులుకున్నాను. విపరీతమైన జనం ఉన్నారు. అమ్మకు సౌకర్యంగా ఉండేచోటు ఎలా సంపాదించాలో అర్థం కాలేదు. ఒక్కో కంపార్టుమెంటు లోకి తొంగి చూస్తూ వెళ్తున్న నాకు సెకండ్ క్లాస్ బోగీలో నుంచి ఓ స్త్రీ స్వరం వినవచ్చింది. ఆమె అమ్మతో ‘ఈ కంపార్టుమెంటులోకి రండి ఇక్కడ ఖాళీ ఉన్నది’ అంది.

ఉలిక్కిపడ్డాను. రాత్రంతా నన్ను వెంటాడిన కంఠధ్వని యిదే! పల్లవి కూడా అదే ఇక్కడ

ఈ కంపార్టుమెటులో ఖాళీ ఉన్నది. నేను క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆ కంపార్టుమెంట్ లోకి వెళ్ళాను. లగేజీ తేవడానికి సరిపోయే టైం లేదు.  ఆ అమ్మాయి సూట్ కేసులు పరుపు చుట్టలు కదుల్తున్న రైల్లోకి తేవడానికి సాయం చేసింది.

ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని వివరించడం చాలా కష్టం. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో తెలియడం లేదు. ఇప్పటి దాకా నా మనసులో ప్రతిధ్వనించిన స్వరం ఒక వ్యక్తి రూపంలో నా ముందు ఉన్నది. అమ్మ కూడా ఆ అమ్మాయి నుంచి చూపు తిప్పుకోలేకపోయింది. ఆమెకు పదహారు పదిహేడేళ్ళ వయస్సుండవచ్చు. ఆమె కదలికలు, ముఖ కవళికలు చాలా సహజంగా ఉన్నాయి. ఆమె అందంలోని స్వచ్ఛతకు సాటిలేదు. చుట్టు పక్కల ఉన్న మనుషుల మధ్య ఆమె ప్రత్యేకంగా కనిపిస్తుంది.  తను పెరిగే కొమ్మమీద పొడుగాటి కాడపై వికసించే తెల్లని లిల్లీ పువ్వులా ఉన్న ఆమె చుట్టూ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళంతా నవ్వుతూ మాట్లాడుకుంటుంటే నేను పుస్తకం చదువుతున్నట్టు నటిస్తూ వారి మాటలు వినడానికి చెవులు రిక్కించాను. తన కంటే చిన్న వయస్సు వాళ్ళ మధ్య ఉన్న ఆమె కూడా చిన్న పిల్లలాగే కనిపించింది. ఆ అమ్మాయిలు ఒక కథల పుస్తకంలోని కథలను ఆమె చేత పదే పదే చదివించుకుంటున్నారు. ఆమె స్వరంలోని మాధుర్యమే అందుకు కారణం అనుకుంటాను. ఆ అమ్మాయితో మాట్లాడాలని అమ్మకు కూడా ఆసక్తి కలిగినట్టు నా కనిపించింది. అయితే ఎప్పుడూ ఒంటరిగా ఉండే ఆమెకు కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి మొహమాటం. అందువల్ల మాట్లాడ లేకపోయింది.

రైలు మరొక జంక్షన్లో ఆగింది. కొంతమంది బ్రిటీష్ వాళ్ళు బహుశా సైనికాధికారికి సంబంధించిన వాళ్లు రైల్లో ఎక్కడానికి ప్రయత్నించసాగారు. వాళ్లు మా కంపార్టుమెంటు ముందు చాలాసార్లు అటూ ఇటూ నడిచారు. అమ్మ భయంతో బిగుసుకుపోయింది. నిజం చెప్పాలంటే నాకూ భయంగానే ఉంది.

రైలు కదల్డానికి కొద్దిసేపటి ముందు ఒక రైల్వే అధికారి లోపలికి వచ్చి పేర్లు ఉన్న రెండు చీటీలను మా రెండు బెర్తులకు అంటించి ‘దొ       రలు ఈ బెర్తులను ముందే రిజర్వు చేసు కున్నారు మీరు ఖాళీ చేసి మరెక్కడయినా స్థలం వెదుక్కోండి’ అన్నాడు. నేను వెంటనే లేచి నిలబడ్డాను. కానీ ఆ అమ్మాయి హిందీలో ‘లేదు లేదు ఇక్కణ్ణించి ఎవరూ కదలరు’ అంది. ఆ మనిషి ‘ఖాళీ చెయ్యాల్సిందే’నన్నాడు గట్టిగా. ఆ అమ్మాయి కదలకపోవడంతో బ్రిటీష్ వ్యక్తి అయిన స్టేషన్ మాస్టర్ ను పిలిచాడు. స్టేషన్ మాస్టర్ వచ్చి ‘క్షమించాలి’ అంటూ పోర్టర్ను పిలిచాడు. లగేజీ తీసెయ్యడానికి, ఆ అమ్మాయి కళ్లు ఎర్రబడ్డాయి. నావైపు చూస్తూ ‘కదలవద్దు. కూచున్న చోటు నుంచి లేవకండి’ అంటూ స్టేషన్ మాస్టర్తో ఇంగ్లీషులో ‘అబద్ధం ఈ బెర్తులు రిజర్వు చేయబడ్డవి కాదు’ అంటూ పేర్లు ఉన్న ఆ చీటీలని చించి ప్లాట్ ఫాంపైకి విసిరేసింది. అప్పుడే యూనిఫాంలో ఉన్న ఇంగ్లీషు వ్యక్తి లోపలికి రాబోతూ ఆమె మాటలు విన్నాడు. ఆమె చేసిన పనిని గమనించాడు. ఏమీ మాట్లాడకుండా  స్టేషన్ మాస్టర్ భుజం మీద చేత్తో తడుతూ పక్కకు తీసుకువెళ్లాడు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు కానీ ఒ        క అదనపు బోగీని తగిలించుకుని రైలు ఆలస్యంగా బయలుదేరింది. అవమానాన్ని దాచుకోవడానికి నేను కిటికీ లోంచి బయటకు చూస్తున్నట్టు నటించాను.

రైలు కాన్పూర్ లో ఆగింది. అమ్మాయి తన సామాను సర్దిపెట్టుకుంది. ఆమెకు సాయం చెయ్యడానికి వచ్చిన నౌకరు సామాను దించుతుంటే దిగిపోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయితో ఇగ ఆగలేక అడిగింది అమ్మ.

‘నీ పేరేమిటమ్మా?’ ఆ అమ్మాయి ‘కళ్యాణి’ అంది.

నేను అమ్మా ఉలిక్కి పడ్డాం. ‘మీ నాన్నగారు’ అంది అమ్మ. ఆయన ఇక్కడ వైద్యుడు. పేరు శంబునాథ్ బాబు అంటూ ఆమె రైలు దిగి వెళ్ళిపోయింది.

ఉపసంహారం

మేనమామ ఆంక్షలను ధిక్కరించి, అమ్మ అభ్యంతరాలను లెక్కచేయకుండా నేను కాన్పూరుకు వెళ్ళాను. కళ్యాణిని ఆమె తండ్రినీ కలిశాను. చేతులు జోడించి నమస్కరించాను. నా మాటలు శంబునాథ్ బాబును కదిలించాయి కాని కళ్యాణి మాత్రం పెళ్ళి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. నేను ఎందుకు అని అడిగితే మాతృసేవ అన్నది. మా పెళ్ళి విఫలం అయిన తర్వాత ఆమె తన జీవితాన్ని ఆడపిల్లలకు చదువు చెప్పడానికి అంకితం చెయ్యాలని నిర్ణయించుకుందని అదే ఆమె మాతృభూమికి చెయ్యాలనుకుంటున్న సేవ అని తర్వాత నాకు తెలిసింది.

నేను ఆశ వదులుకోలేదు. నా హృదయాన్ని ఆక్రమించిన సంగీతం ఎప్పటికీ అలాగే నిలిచిపోయింది. తెలియని అలౌకిక ప్రపంచం నుంచి వచ్చే వేణునాదంలా అది నన్ను తన వెంట లాక్కుపోతున్నది. ఆ రాత్రి చీకట్లో ‘ఇక్కడి ఈ కంపార్టుమెంటంలో ఖాళీ ఉన్నది’ అన్న ధ్వని నా జీవితానికి పల్లవిగా మారింది. అప్పుడు నా వయస్సు ఇరవై మూడు. ఇప్పుడు ఇరవై యేడు. అయినా నేను నా ఆశను వదులుకోలేదు. కానీ మేనమామని వదిలేసు కున్నాను. ఏకైక సంతానాన్ని అయినందువల్ల అమ్మ నన్ను వదిలేసుకోలేకపోయింది. నేనామెకోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాను. ఓ అపరిచిత యువతీ నా హృదయం చెప్తున్నది నేను నీ వాణ్ణి మాత్రమే అని, నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. చేసుకోలేను. కానీ ఇప్పుడు నా లక్ష్యం ఏమిటో తెలుసుకున్న అదృష్టవంతుడిని.

 

 

అపరిచిత

బెంగాలీమూలం : రవీంద్రనాథ్ టాగూరు, తెలుగు : చింతపట్ల సుదర్శన్

1916లో టాగూర్ రాసిన ‘అపరిచిత’ ఆధునిక స్త్రీ ఆలోచనా విధానాన్ని, స్వాభిమానాన్ని తెలియజేస్తుంది. పురుష దురహంకారాన్ని, నిరసించే ఈ కథలో అనేక కొత్త కోణాల్ని ఆవిష్కరించాడు టాగూర్.

వివాహ సమయంలో వధువు తండ్రి శంబునాథ్ తను యిచ్చే బంగారాన్ని వరుని మేనమామ తూకం వేయించడం అవమానంగా భావించి, వివాహాన్ని రద్దుచేసి మగపెళ్ళివారిని వెళ్ళిపొమ్మనడం విప్లవాత్మకమైన సంఘటన.

వివాహం రద్దయిన తర్వాత వరుడు అనుపమ్, వధువు కళ్యాణి రైల్లో కలుస్తారు. అనుపమ్ ఆమెను చూసి ఉండలేదు కాబట్టి గుర్తుపట్టడు. రైల్లో రిజర్వేషన్ లేని సీట్లకు చీటీలు తగిలించడం సహించ లేని కళ్యాణి వాటిని చంపి ముక్కలు చేసి విసిరేస్తుంది. బ్రిటీష్ ఇండియాలో ఒక భారతీయ స్త్రీ సాహసం ఇది.

ఆమె ఎవరో తెలిసిన తర్వాత అనుపమ్ తమ తప్పు ఒప్పుకుని పెళ్ళి చేసుకుంటానంటాడు కాని కళ్యాణి స్త్రీ విద్యకు, స్త్రీల ఉద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేస్తానని తిరస్కరిస్తుంది.

వంద సంవత్సరాల క్రిందటిదైనా ఈ కథాంశం అత్యంత ఆధునికం. దేశభక్తికి, ధైర్యానికి, ఉదాత్తతకు, స్త్రీ స్వేచ్ఛకు ఉదాహరణ ఈ అపరిచిత.

June 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

‘ధన్య’కవీంద్రుడు దాశరథి — ‘మాన్య’ కవీంద్రుడు ‘సినారె’

by గురిజాల రామశేషయ్య June 17, 2021
written by గురిజాల రామశేషయ్య

‘ధన్య’కవీంద్రుడు దాశరథి

తెలంగాణ ప్రజావళికి ప్రాతఃస్మరణీయుడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. తక్కువ శీర్షికలతో తన కవిత్వంలో ఎంతటి కవిత్వ సాంద్రతను దట్టించినాడో కవితావిశారదులంతా గమనించినవారే ! “జయపత్రముల”వంటి ప్రశంసావాక్యములందించినవారే!!
సార్థకమైన బిరుదులను ప్రదానం చేసినవారే !!!


మహాకావ్య స్థాయి అభివ్యక్తీకరణ శిల్పరచనను ప్రకటించే కవులు ప్రపంచంలో అరుదుగా జన్మిస్తారు.ఎదుగుతారు.జాతికీర్తిని నిలబెడతారు.సమకాలీన దుష్టతనూ ౼ దౌర్జన్యాన్నీ చీల్చిచెండాడుతారు. తమ కనుల ముందే తమ ప్రధాన శుభసంకల్పం ఫలిస్తే ఆకాశమెత్తు తన జాతి ప్రగతి ఎదగాలని పొంగిపోతారు. *_మహాకవి దాశరథి ప్రధాన శుభసంకల్పం : నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణ విముక్తం కావటమే_* అన్న సత్యశివసుందర’సూక్తిని ఎవరూ ఏవిధంగానూ ఆక్షేపించలేరు. తదనంతర పరిణామాలు తనదృష్టి కోణంలోనికి అందనంత ప్రతారణనూ అప్పటి పరిస్థితుల దృష్ట్యా అందరిలాగే గమనించలేని సజ్జనకవి దాశరథి. *కాలం తనకు కావలసినంత’కాలం తన మనుషులను తానే ఎన్నుకుంటుంది( _రాశే_ )* అనే వాక్యం సమర్థనీయం అనుకుంటే కాలం తెలంగాణ విముక్తి కోసం కవి’దాశరథిని కూడా తానే ఎన్నుకుంది అంటాను నేను. సమకాలీన ప్రముఖులు దాశరథిని _యుగకవి_ అని కీర్తించటం ఇందువల్లనే ! ఆత్మవిశ్వాసం ఆత్మబలం లేకుండా ఆత్మగౌరవం అనే మాట వ్యర్థం. దాశరథి తెలంగాణ జాతి ఆత్మగౌరవ ప్రజారథి.సారథి.ప్రతినిధి. కవితావాక్య”శర”ధి.తన కనులముందే తన మనోరథం ఈడేరి ఆనందించిన కవిని తదనంతర కాలంలో పట్టించుకోవలసినంతగా పట్టించుకోకున్నా ఆత్మగౌరవంతో
*అరుగుచున్నాడు. దాశరథి అమరపురికి* … అన్నట్లు జీవితాన్ని తృప్తిగా _బాగానే బతికాను_ అన్నట్లుగా నిష్క్రమించిన *మహాపురుషుడు దాశరథి* . నిలువెల్లా స్పందించి
*నా తెలంగాణ కోటిరత్నాల వీణ* అనే నినాద’నిక్వాణస్వరాన్ని నిరంతర ప్రేరక విజయశంఖం గా విడిచి వెళ్లిన మహాదార్శనికుడు.
ఇటీవలి కాలఃలో సొంత’ఊపిరిని గెలుచుకొని మరింతగా పెంచుకుని సువర్ణప్రగతి(బంగారు తెలంగాణ) పథంలో పురోగమిస్తూన్న
ఆధునిక తెలంగాణకు *నా తెలంగాణ కోటి రత్నాలవీణ* నిజమైన జీవనోజ్జీవన శంఖధ్వానం.
మహాకవి దాశరథి జయంతి 22,జులై సందర్భంగా ఆ మహాకవికి ఇది నా అక్షరనీరాజనం.
Poets are the unacknowledged legislators of the world ౼ P.B.Shelly

౼ గురిజాల రామశేషయ్య


‘మాన్య’ కవీంద్రుడు ‘సినారె’

ఆధునిక తెలంగాణ సుస్పష్టమైన హద్దులతో ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటి. తెలుగు భాష ప్రాచీన హోదాను పొందిన భారతీయ భాషలలో ఒకటి. మాధుర్యమునకు పేరు పొందిన భాషలలో తెలుగు మొదటిది. సాహిత్యపరంగా తెలుగు పద్యం విశిష్టమైన భావ వాహిక. మందార మకరంద మాధుర్యమునకు పోతన భాగవత తెలుగు పద్యం దృష్టాంత సాక్ష్యం. అటువంటి పోతనను ఉద్దేశించి “ఎందుకాతడుగ పుట్టకైతిని హరీ!” అని తన “భూమిక’’ కావ్యంలో పలువరించి ‘కల’వరించి ఆ కల ‘వరించి’ తన కవన గళ సహపది కాగా మాన్యుడైన మహాకవి సింగిరెడ్డి నారాయణరెడ్డి. ‘సినారె’ సంక్షిప్త నామంతో సుప్రసిద్ధుడైనాడు.
‘సినారె’ అగణ్యమాన్యతామకుటాలు రెండు. ఒకటి, భారతీయ జ్ఞానపీఠ పురస్కార స్వీకృతి, రెండు, ‘రాజ్యసభ’ సభ్యత్వం.
పల్లె నుండి ఢిల్లీవరకు ఎదిగిన తెలంగాణ కవులలో ఒకరు ‘సినారె’. మూడుతరాల యువకవులను ప్రభావితం చేసిన మహాకవి తాతయ్య ‘సినారె’. ఎందరికో శబ్దభిక్ష పెట్టిన ధన్యుడు. ఎందరికో ‘లయ’ను పరిచయం చేసిన సం‘గీత’జ్ఞుడు. ఖండాంతరాలలోని తెలుగు డెందాలను తన పలుకుబడితో పులకరింపజేసిన సుమధుర కవి ‘సినారె’.
విశ్వవిద్యాలయ ఆచార్యునిగా, ఉపకులపతిగా రాణించిన ‘సినారె’ నిజంగా కవి కులపతి. కవి కవిత్వం వరకే పరిమితుడుకాడని నిరూపించిన అధికార భాషా సంఘాధ్యక్షుడు. నిత్య శోభిత సాహిత్య సభాధ్యక్షుడు, ముఖ్యాతిథి. తిథిరీత్యా నిత్యకవన రచనా పిపాసి. కవితాభ్యాసి. కవితా ‘కళాప్రపూర్ణుడు’. కవి పద్మ భూషణుడ. రణం మరణంపైనే అని సగర్వంగా ప్రకటన చేసిన కవి యశస్వి ‘సినారె’.
తన పేర తెలంగాణ రాజధానిలో సారస్వత నిలయం ఏర్పడే అంతగా ఘనత పొందిన మాన్య కవీంద్రుడు ‘సినారె’.
మధ్య తరగతి మందహాసాన్ని తన పరిధిలో వివేచించి ఉన్నతి గతి మీది చిరకాంక్షతో ‘విశ్వంభర’ మానవుని వరకు తరగెత్తిన కావ్య సమీక్షణం ‘సినారె’ స్వీయ నిర్ణయ కావ్యకళా పథం కావ్యకళా.
అందుకే ఒక సందర్భంలో : గర్జించే గళం నాది! నిర్జించే కలం నాది! స్వీయానుభవగర్వ దీప్తిని అక్షరీకరించినాడు.
ప్రతిష్ఠాత్మక కవితా పీఠాధిష్ఠుడైన తాను ‘పీఠిక’ రచనలతో యువ కవుల నుండి మహాకవుల వరకు అందరిలోని ప్రతిభా వ్యుత్పన్నతలను కల కలిచే తన పద సంపుటితో సప్రమానంగా అభినందించినాడు.
తెలుగు సాహిత్యంలో పద్యం గద్యం ద్విపద కీర్తన వచనం గేయం వచన కవిత మినీ కవిత ఇలా ఇలా అలల్లాంటి ఎన్నెన్నో ప్ర్రకియలు తలలెత్తి కవుల తలపైన కీర్తికిరీటాలను సుస్థిరం చేసినాయి. ఈ క్రమంలో 20వ శతాబ్ధం 30వ దశకంలో 29 జులై 1931 రోజున ఆషాఢ పూర్ణిమ (గురుపూర్ణిమ)నాడు జన్మించిన ‘సినారె’ మాత్రాచ్ఛందస్సుల్లో గేయ కావ్యాలను రచించి ఒడుపుగా పద్య గంధిలతను – సమాసకల్పనల పొందికతో అక్షర రమ్యంగా సముచిత రీతిలో ఔచిత్య భాసురంగా గంగాతరంగచారిమతో భారత స్వాతంత్ర్యానంతర కవిస్వాతంత్ర్యానుకూల గేయం దేశచ్ఛందస్సులలోనికి తెలుగు పలుకు ఒరవడికి మడులు తీర్చి కవిత్వపు పంటను పండించే చొరవను పాదు కొల్పినారు. ఇది ‘సినారె’ పైకి చెప్పకుండా అఖిలాంధ్ర సాహిత్య చరిత్రకు చేసిన మేలు. దీనివల్ల అంటే మాత్రాచ్ఛందో కావ్యాలవల్ల పద్య పఠన శక్తి ఒనగూడి ప్రాచీన కావ్యధోరణుల సమవగాహన శక్తిని పొందటానికి అప్పటి యువతరానికి సాధ్యమైంది. అంతేకాక గహనమైన కావ్యశిల్ప సంప్రదాయములను యథాశక్తి గ్రహించి తమ రచనలలో పాటించగలిగే నేర్పు ఇంతో అంతో ఒనగూడింది. ముఖ్యంగా భాషా పరంగా నిర్దుష్ట భాష పట్ల ఆసక్తి పెరిగింది. అంతేనా! ‘సినారె’ రుచి చూపించిన అంత్యప్రాస, అంతఃప్రాస (సినారె మాటే ఇది), అనుప్రాస, యమకాది అలంకారాలను గమనించి ఆనందించటంలోనూ; తమ రచనలలో ప్రయోగించి మెప్పుపొందటంలోనూ కవులను మార్గదర్శనం చేసినట్లయింది. జనరంజకమైన సినీ గీతాలలోనూ ఈ సాంప్రదాయిక సాహిత్యరీతి విధానాలను చవి చూపించినాడు. కలవరించి – కల- వరించి సభంగ శ్లేషాత్మక యమకం. “శివరంజని” సినిమాలోని పాటలో “నా దానివి – నా –దానివి” ఇలాంటిదే! పాలవెలుగై –మణదీ “పాల” వెలుగై ఇలాంటివెన్నెన్నో! తనకంటె ముందు తరంలోని పెద్దల సరసన ఇటు శిష్ట సాహిత్యంలోనూ అటు సినీ సాహిత్యంలోనూ నెగిలిన ప్రతిభాశాలి ‘సినారె’. ఇక తన తర్వాతి తరం చేత అభిమానింపబడిన, సన్మానింపబడిన పెద్ద “సినారె”. తరం మారుతున్నది….. స్వరం మారుతున్నదని గమనించిన దార్శనికుడు. “సరిలేరు. నీకెవ్వరు” అని జేజేలు పొందిన అదృష్టవంతుడు. ఇంతగా సినీ సాహిత్యపరంగా చెప్పటమెందుకంటే “సినారె” కీర్తి కిరీటంలో ఒకటి ఆచార్య పదవి – దాని ఉన్నత ఉప కులపతి పదవి ఒక తురాయి. శిష్ట సాహిత్యంలో భారతీయ జ్ఞానపీఠ పురస్కృతి మరో కలికితురాయి. సినీగీతావళి కీర్తి కలిమితురాయి. శ్రోతలకేమో సరళీ స్వరాల పంట. ఒక వ్యక్తి కవిగా ఇంత ఉన్నత స్థాయి కీర్తి స్థితులను అందుకోవటం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతటి సంయమన శీలంతో – మరెంతటి కళాసేవా “శ్రమ” కర్తృత్వంతో ఇంకెంతటి ఉల్లాస భరిత స్వరచాలన హృదయంతో ఉజ్జీవిస్తూ రోజు రోజూ కాలాన్ని కర్పూరంగా మండించుకోవాలో కదా! అప్పుడే కదా ఇంతటి మాన్యచరితకు దీప్తి!
ప్రభుత్వ కళాసాహిత్య సేవా సలహాదారుగా పనిచేసిన “సినారె” ఎన్నో ప్రసిద్ధ కళాసాహిత్య సేవా సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచినాడు. తెలంగాణ సారస్వత పరిషత్తును చెదరకుండా నిలిపిన వ్యవహారజ్ఞుడు.
సమష్టిపై ‘సినారె’ ఆధునికతలో అడుగులు వేసిన ధీశాలి. ప్రాచీన వైభవ సంస్కృతిని (Heritage) ఆధునిక స్పృహతో సమీక్షించిన సామాజిక కళామేధావి.
“సురభిళ శబ్దమ్మొక్కటి
తరగెత్తిన చాలు – నా
గుండె సందులందు కోట్లి
నందనాలు గుబాళించు”
అని తన శబ్ద ప్రీతిని అభివ్యక్తీకరించుకున్న ‘సినారె’ అస్మదాదులకు “శబ్ద గురువు”.
“అంత కడివెడు పాలపై – ఒ
క్కింత మీగడ పేరినట్లుగ మనకు
మిగులును గతము లోపలి మంచి
అదిమె సంప్రదాయము”
అని సంప్రదాయములోని మంచిని ఆధునికతలోని ప్రయోగ ప్రయోజన శీలతను మేళవించుకని ‘ఒళ్ళంతా లయ’గా అడుగులు వేసి – “చూపంతా ప్రగతిశీలత” నుడుగులు పలికి తెలుగుజాతికి మాన్యకవీంద్రునిగా ఆదర్శనీయుడై తరించిన స్వరధుని “సినారె”! మానవీయ విశ్వంభరుడు “సినారె”.
శ్రీ గురుభ్యోనమః

– గురజాల రామశేషయ్య

 

June 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కాల మయూఖ

by డా॥ గండ్ర లక్ష్మణరావు June 4, 2021
written by డా॥ గండ్ర లక్ష్మణరావు
వేపలు నవ్వుపూల కనువిందుల జేయగ, మావిగున్నలున్

కాపుకు వచ్చెనంచును పికమ్ములు కమ్మగ కూయుచుండగా
మాపున మల్లెపువ్వులకు మాటున మన్మథు డాడుచుండగా
తీపివసంతమై ప్రకృతి దిక్కుల చక్కిలి వెట్టె లక్ష్మణా!

ఆకాశంబను తండ్రి కోపమున యంగారంబు చిందించె, భూ
లోకంబంతయు గుండె వ్రయ్యలయికల్లోలమ్ముతోనుండ, చీ
కాకుంబొందెను జీవసంతతులకున్ కాయంబులున్ వాడగా
యీ కాలమ్మిది గ్రీష్మతాపమయి మండించెగా లక్ష్మణా!

ఆకసమందు మేఘముల యాత్ర, మయూరి విలాసగాత్ర, నీ
రాకర పాత్రయై వసుధ, ప్రాణవికాసమనోహరుల్ తరుల్
భేకములెల్ల వేదమంత్రముల ప్రీతిపఠించెడు విప్రవర్యులై
ఆకలి దీర్చువర్షమని హాలికు సీరము సాగె లక్ష్మణా!

వాహినులెల్ల తేటపడె వారిదముల్ మటుమాయమై చనెన్
కాహళమూదెగాలి, బతుకమ్మలు గౌరిసరస్వతీ సిరుల్
గేహినులాడిపాడి వెలిగించిన పున్నమి దీపమట్లు, స
మ్మోహనమై శరత్తు జగముల్లము పొంగగ వచ్చె లక్ష్మణా!

పగలా! తగ్గెను, ప్రేమదంపతులకున్ బంధమ్ము లౌరాత్రులా
మిగులున్ దీర్ఘములయ్యె, మంచుముసుగై మేల్దుప్పటుల్ గప్పగా
రగిలెన్ మంటలు వేడిగాచుకొనగా ప్రాభాతముల్ గ్రాలగా
యిగ మంచుంజనులెల్లరున్ వణకగా హేమంతమై లక్ష్మణా!

పచ్చని కోక పాతబడి పండిన యాకులవోలె జారగా
చచ్చినవారికై వడిని సాముదిగంబరలై విశీర్ణలై
పిచ్చుకలైన కానక తపించెను చెట్లు చేమలున్
వచ్చె విరాగమౌ శిశిర వాసరముల్ పరికించ లక్ష్మణా!

పచ్చ కిరీటమున్ పసిడి పచ్చ శరీరముదాల్చి యెప్పుడున్
స్వచ్ఛ పరీమళమ్ములతో శాంత విలాసమయూఖ మాలికా
గుచ్ఛపు వెల్గలన్ పరిచి కూడుట వీడుట జీవసారమన్
ముచ్చట దెల్పు నీ ప్రకృతి మోదము విప్లవమౌచు రావలెన్

June 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శైలారోహణ

by ఆచార్య ఎన్. గోపి June 4, 2021
written by ఆచార్య ఎన్. గోపి
అనువాద కవిత

*అమండా గోర్‌మన్*
స్వేచ్ఛానువాదం *డా౹౹ ఎన్. గోపి*

రానే వచ్చిందా రోజు
మనలోకి మనం
ప్రశ్నల్ని సంధించుకునే రోజు.
అంతులేని తిమిరావరణంలో
వెలుగురేఖలను అందిపుచ్చుకునే రోజు.

అవును
ఇప్పటి దాకా వాటిల్లిన
నష్టాన్ని మోసుకుంటూ
ఒక సముద్రాన్ని దాటడానికి
సంకల్పం చెప్పుకునే రోజు.

ఇప్పుడే మనం ధైర్యంగా
ఒక మృగం పొట్టను పగులగొట్టాం.
అన్ని వేళలా
నిశ్శబ్దాన్ని నిర్విరామ శాంతిగా
భ్రమించరాదని గ్రహించాం.

న్యాయంలోని సంప్రదాయం గురించీ
ధృక్పథంలోని బలాన్ని తెలుసుకున్నాం.
అవి కేవలం మంచులా
కరిగేవి కావని తెలుసుకున్నాం.

ఐనా తెలుసుకునే లోపల్నే
ఉదయం మన సొంతమయ్యింది.
చీకటిని అధిగమించి
కాంతి తీరాన్ని సాధించాం.
ముక్కలు కాకుండా
దేశాన్ని కాపాడుకున్నాం.
కాని ఇది సంపూర్ణం కాదు.

దేశకాలాలకు
వారసులమైన మనం
ఓ నల్లపిల్ల
బానిసల నుంచి వచ్చిన
ఓ ఒంటరి తల్లి నోములపంట
అధ్యక్షురాలయ్యే కలలు కనొచ్చని గ్రహించాం.

మనం నాజూగ్గా లేకపోవచ్చు
శుభ్రంగా కనపడక పోవచ్చు
కాని మనం శ్రమించి దక్కించుకున్న
ఐక్యతకు ఓ లక్ష్యం వుంది,
విస్తృత ప్రయోజనం వుంది.

సకల వర్ణాల సమ్మేళనంతో
ఒకే జాతిని ఆవిష్కరిస్తున్నాం
అసమానతల కొలబద్దలను
కలిసి తొలగించుకుందాం.
అన్ని సంస్కృతులకూ
అందమైన వేదిక నిర్మిద్దాం.
విభజన బీటలను అతికిద్దాం,
విభేదాలు పక్కన పెడదాం
ఆయుధాలు త్యజించి
భుజం భుజం కలిపి పనిచేద్దాం.
ఇదే సత్యమని
జగం నిండా చాటుదాం
ఎన్నో దుఃఖాలు సహించి
ఇంత దూరం ఎదిగాం
గాయపడ్డా
ఆత్మస్థైర్యాన్ని ఎగరేస్తున్నాం.

అలిసినా సొలిసినా
సమిష్టి ప్రయత్నాన్ని ఆపలేదు
గెలిచాం కూడా.
ఇప్పుడిక మరోసారి
వేర్పాటును నాటొద్దు మనం.
మేడి చెట్టుకింద కూర్చొని
ఆనందించే క్షణాలుంటాయని
బైబిల్ ఎప్పుడో
భవిష్యద్దర్శనం చేసింది.

సమకాలంలో జీవించే వారికే విజయం
అది తృణప్రాయుల
పదఘట్టనల కింద అణిగిపోదు.
మనం కట్టే పలు వంతెనలు
కొత్త దారులకు వాగ్దానం చేస్తున్నాయి.
అవును! మనం మొక్కవోని సాహసంతో
శైలారోహణ చెయ్యక తప్పదు.
అమెరికన్ కావటమే మన ఆదర్శం
విఘాతమిప్పుడు గతం
మరమ్మత్తులకు నడుంబిగిద్దాం.
విచ్ఛిన్నశక్తులు తోకముడిచాయి
ప్రజాస్వామ్యం ఆలస్యమైనా
విషం కాకుండా చూశాం.

ఇది సత్యం
ఇది మన నమ్మకం
రేపటి పైనే మన చూపు
చరిత్ర కళ్లన్నీ మన వైపు
ఇదొక న్యాయ శకం.
మన శక్తి ఏమిటో తెలిసొచ్చింది.

కొత్త అధ్యాయాన్ని రచిద్దాం.
అనుకోని ప్రమాదం
ప్రమోదంగా ముగిసింది.
దేశం గాయపడినా
తిరోగమనం లేదు మనకు
ప్రేమా స్వేచ్ఛా తీవ్రతల నుంచి
పక్కకు వైదొలగం మనం.

భయపెడితే లొంగుతామా
ఉదాసీనత నిన్నటి కథ
కరుణా శక్తీ కలిసిన వెత మనది.
ప్రేమ మన ప్రస్తుత పథం
మార్పు మన పిల్లల జన్మహక్కు
దాని కోసం మంచి దేశాన్ని నిర్మిద్దాం.
ఉక్కులాంటి నా వక్షస్థలంలో
కదలాడే శ్వాసలోంచి
గాయపడిన దేశాన్ని పైకి లేపుదాం.

బంగారు కాంతుల
పశ్చిమ పర్వతాల్లోంచి లేద్దాం
మన పూర్వులు విప్లవాన్ని కలగన్న
సుడిగాడ్పుల వాయవ్య దిశ నుంచి లేద్దాం
మధ్య ప్రాచ్యంలోని సరస్సుల
అంచున మొలిచిన నగరాల్లోంచి లేద్దాం
దక్షిణప్రాంత సూర్యతాపంలోంచి లేద్దాం
శిథిలాలను మళ్ళీ కడదాం
కుదుట పడి ఎదుట పడదాం.

మూల మూలల్లోంచి
విభిన్న సంస్కృతుల్లోంచి
అతి సుందర దేశం ఆవిర్భవిస్తుంది
దెబ్బతిన్నదే కావచ్చు, అబ్బో! అందమైంది
రానే వచ్చిందా రోజు
చీకట్లోంచి బయటపడదాం
జ్వలిద్దాం
నిర్భయంగా చలిద్దాం
రోచిస్సులకు ముగింపు వుండదు
సాహసం కావాలి మనకు
మనమే సాహసం కావాలిప్పుడు.

[జనవరి 20న అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఓ నల్ల యువతి (22) ‘The Hill We Climb’ అంటూ రాసి, చదివిన కవిత] *

June 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us