మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

దిక్సూచి

by వారాల ఆనంద్ May 29, 2025
written by వారాల ఆనంద్

ఆత్మా ఇల్లూ ఒకటే

చూపునకు చిన్నగా వుంటాయి

లోన ఎంత విశాలమో

రెంటికీ చుట్టూ గోడలుంటాయి

గోడల్లో కిటికీలుంటాయి

బయటకు వెళ్ళడానికీ లోనికి రావడానికీ

దర్వాజాలుంటాయి

తలుపులు తలపులు

మూసుకుంటాయి తెరుచుకుంటాయి

గాలీ వేల్తురూ

కిటికీల గుండా ద్వారాల గుండా

వెంటిలేటర్ల ద్వారా

ఇంట్లోకి వస్తూ పోతూ వుంటాయి

సయ్యాటలాడతాయి సరసాలడతాయి

కొండకచో దాగుడుమూతలాడతాయి

నేనేమో ఇంట్లో కొంత బయట కొంత

కాలం గడిపేస్తూ వుంటాను

ఇల్లేమో స్థిరంగా నిలబడి

చోద్యం చూస్తుంది

ఆత్మే ఆలోచనల భారంతో

అనుభవాల వేదనలతో

నా అన్ని కదలికలకూ చేష్టలకూ

సాక్ష్యంగా బాసింపట్టు వేసుక్కూర్చుంటుంది

నేనేమో ఆత్మను దిక్సూచిగా

ప్రయాణం సాగిస్తూ వుంటాను

May 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వజ్రపు తునక

by A. Gajender Reddy May 29, 2025
written by A. Gajender Reddy

డిస్కో సంగీతం కన్న పల్లెలో వినిపించే కోయిల కంఠస్వరం తీయగా ఉంటుంది. నల్లా నుంచి వచ్చే నీటికన్న ఏటిలో చెలిమె తోడి నీళ్ళు తాగే అనుభూతి గొప్పది. ‘మాజా’కన్న మామిడిపండును స్వయంగా తీసుకొని రసాన్ని ఆస్వాదిస్తే ఎంత బాగుంటుంది! ఆనాడు ఒక్క పైసకే వచ్చే బెల్లాన్ని తింటే కలిగిన ఆనందం ఈనాటి చాక్లెట్‌ బిస్కట్లతో కలగడం లేదు. చెట్టు కింద కూర్చుని గాలి పీలుస్తుంటే కలిగే సౌఖ్యం ఏసిలతో రావడం లేదు. చిర్ర గోనె ముందు క్రికెట్‌ బలాదూర్‌. గుడ్డి దీపం ముందర పదవ తరగతి పరీక్షలకు చదివిన వజ్ర సంకల్పం ముందు భూరి భవనపు ట్యూబ్‌ కాంతిలో చదివే పట్టా విద్య దిగదుడుపే. వాన వెలిశాక మట్టి వాసన, ఆరుద్ర పురుగుల సర్కస్‌ ఫీట్లు, పిచ్చుకల మట్టి స్నానాలు, వెన్నెల్లో ఆడిన ఆటలు, ఎండాకాలం బావుల్లో ఈతలు ఈనాడేవి? మన చిన్నతనం మనకు చిన్నతనం కాదు. బాల్యం మళ్ళీ రమ్మంటే వస్తుందా? ‘‘అనుభూతుల్ని పోగొట్టుకున్న గుండె ఎడారి. అనుభూతుల్ని పదిలపరచుకున్న గుండె సతతహరితారణ్యం’’. ఇటువంటి మధురమైన భావాల సుమమాల డా॥నలిమెల భాస్కర్‌ ‘‘సుద్దముక్క’’.
మట్టిమీద నడవాల్సిన పాదాలు మార్బుల్‌ మీద నడుస్తున్నందుకు బాధగా ఉంది. మట్టినిలబెడుతుంది. మార్బుల్‌ పడగొడుతుంది. అమ్మ ఇల్లంతా పేడతో అలికితే, వారానికి సరిపడిన శీతల గంధస్పర్శ. ఆనాడు ఇల్లు, సమస్త కుటుంబ సభ్యులకు ఓ శీతలీకరణ కేంద్రం. అడుగున ఆలంబనగా మట్టినేల, చుట్టూ మట్టిగోడలు, కప్పుపైన మట్టి గూనపెంకులు. మట్టి పొయ్యి మీద మట్టికుండలో మట్టిమనుషులైన కాపు బిడ్డల చెమట చుక్కలు మెతుకుల రూపంలో. చేదబావి మట్టి ఫ్రిజ్‌. మట్టి వాకిలి, పేడ సాన్పు, సుద్దతో ముగ్గులు గృహ పుస్తకానికి ముచ్చటైన ముందుమాటలు. మట్టికీ ఇంటికీ మనిషికీ గల బంధం భాస్కర్‌ కవిత్వంలో ఆస్వాదిస్తాం.

భాస్కర్‌ మనిషిని రెండు కాళ్ళ గేహం అంటాడు. గృహానికీ దేహానికీ అద్భుతమైన పోలికలు చెప్తాడు. కాళ్ళు పిల్లర్లు. మోకాలిచిప్పలు ప్లింత్‌ బీములు. జీవకణాలు ఇటుకలు. బొక్కలు ఐరన్‌. మాంసం సిమెంట్‌. పై తోలు ప్లాస్టరింగ్‌. పుర్రె స్లాబ్‌. కళ్ళు కిటికీలు. ముక్కుపుటాలు శ్వాసకోశాలు, వెంటిలేటర్లు. నోరు ప్రధాన ద్వారం. పొట్ట సువిశాలమైన హాలు. గుండె వాటర్‌ ట్యాంక్‌. వీటిని కవిత్వీకరించిన తీరు భాస్కర్‌లాగా మరెవ్వరూ చేయలేరు.
ఇందులో శ్రామికజనజీవన చిత్రణం ఆర్ద్రంగా ఉంటుంది. శ్రామికుల ఋణం మనం తీర్చుకోవాలనిపించేలా చేస్తుంది. తమ బతుకుల్ని బండలకేసి బాదుకుంటూ మన బట్టల్ని గట్టున ఆరేస్తారు రజకులు. మన బట్టల్ని పిండీపిండీ వాళ్ళు తోలుబొమ్మలవుతారు. వాళ్ళు ఉతికిన దుస్తులతో మనం మన లోపలి ముఖాన్నీ మురికినీ చాటు చేసుకొని రోజూ నాగరికులమవుతాం. ఎవరి బట్టల్ని వారికి, తప్పిపోకుండా అందించే అమోఘమైన జ్ఞాపకశక్తి వారిది. ‘‘సమాజ కల్మషాన్ని కడిగివేయడానికి/ కంకణధారులైన వ్యక్తులు సంస్కర్తలయినప్పుడు/ తరతరాలుగా మైలబట్టల్ని/ మల్లెపూలు ఉల్లిపొరలూ చేసేందుకు/ కటి బద్ధులైన వీళ్ళూ సంస్కర్తలే’’.
చెప్పులు కుట్టేవాడురెక్కలూడి విలవిలా కొట్టుకుంటున్న మన పాదరక్షలను ఆప్యాయంగా సేదదీరుస్తాడు. ‘‘తెగిన మన వేళ్ళనీ/ ఊడిన మడమల్నీ/ ఏ సంజీవనితో అతుకుతాడో కాని/ మళ్ళీ మన కాళ్ళు క్షణంలో రెక్కలౌతాయి’’. మడిచిన తన మోకాలిమీద గడ్డం ఆనించి అతనలా తదేక దీక్షతో మన పాదరక్షల్ని కుడుతుంటే ఈ కవికి, బట్టలు తొడుక్కున్న వేమనయోగి భంగిమ గుర్తుకొస్తుంది. బ్రహ్మ కడిగిన పాదమైనా అతనికి బలాదూరే. మగ్గం ముందు చేనేత కార్మికుని ఆకారం ‘‘తన కాళ్ళూ చేతుల్ని/ లయబద్ధంగా కదుపుతూ/ కళ్ళల్లో వత్తులూ పత్తులతో పాటు/ దారాలు వేసుకొని/ వాటిని తన కన్నీళ్ళతో పిండి/ చెమటతో తడిపి/ నెత్తురులద్ది/ మన కళ్ళముందే పడుగూ పేకల్ని కలగలిపి/ ఒక వస్త్రాన్ని తయారు చేస్తుంది. అతని గుండెనిండా లబ్‌డబ్‌ శబ్దం బదులుగా లట్కురం పొట్కురం శబ్దమే వినిపిస్తుంది. చేనేత వాళ్ళయినా, చెప్పులు కుట్టేవాళ్ళయినా, రజకులైనా ఈ కవి వాళ్ళ జీవితాల లోతుల్లోకి వెళ్ళి కవిత్వం రాసినట్టుగా ఉంటుంది.
వాన గురించి ఇందులో ఉన్నది కమ్మని కవిత్వపు సోన. మొగులు మెత్తవడుతది. గాలి ఇసిరిసిరి కొడుతది. మొగులు మీద ఇసుర్రవుతులు తిరుగుతున్నట్టు గుడగుడ మొదలయితది. చినుకు పడుడు ఆలిశెంబూమిలకెల్లి బువ్వ వాసన వస్తది. మేఘాలు నేల మీద చేసే తొలి సంతకం వాన. పడిన ప్రతి చినుకూ కంచంలో మెతుకై పరిణమించడం అసలు సిసలైన వాన. ‘‘రైతులు శెమ్ట వడిపితే/ పొలంలకెల్లి సెంటత్తది పంటత్తది’’.
నలిమెల భాస్కర్‌కు ‘‘పుస్తకాల షాపులోనో/ పుస్తక ప్రదర్శనలోనో కాలు పెట్టడమంటే/ పూలతోటలో అలా హాయిగా విహరించి రావడం/ పుస్తకాన్ని ఎత్తిపట్టుకోవడమంటే/ రచయితను మన చేతి పొత్తిళ్ళలో/ ఒడుపుగా ఓలలాడిరచడం లాలించడం’’. అతనికి ప్రతిదీ కవిత్వమే. చెట్లకు నీళ్ళు పోసి వాటి దాహం తీరుస్తుంటే కవిత్వం రాసినంత సంతోషంగా ఉంటుంది. కాపు బిడ్డలు పొలంలో వంగి నాట్లు వేస్తుంటే సామూహిక కవి సమ్మేళనం గుర్తుకు వస్తుంది. పెరట్లో రకరకాల పూలు రంగులతో వికసిస్తుంటే తనకు మల్టీకలర్‌ పుస్తకం వేసుకున్నంత ఆనందంగా ఉంటుంది. ‘‘రైలు భూమ్మీద ఊయలలూగే నావ/ దేశం పెట్టెలు పెట్టెలుగా కనిపిస్తుంది/ అసలు సిసలు దేశం జనరల్‌ బోగీలోనే ప్రత్యక్షమవుతుంది/ పట్టాల పాదాలమీంచి దూసుకువస్తోన్న రైలు/ ఒక ద్విపద కావ్యంలా/ అద్భుతమైన దీర్ఘ కవితలా అనిపిస్తుంది’’.
డా॥నలిమెల భాస్కర్‌ బహుభాషా కోవిదుడు. అనువాదకుడు. ‘‘మా అనువాద కలాలతో ప్రపంచ సాహితీ పరిమళాల్ని మట్టి అంతటా పరుస్తాం. మాది అనువాద కులం/ మేం అనువాదకులం’’ అని సగర్వంగా ప్రకటిస్తాడు. ఈ కవి ఎన్ని ప్రదేశాల్ని తిరిగినా, ఎన్ని సాహిత్యాల్ని చదివినా స్థానికతను మరువడు. బహు భాషకరుల జిల్లా అయిన కరీంనగరంను ‘‘ఇది ఆదిమానవుని/ కాలితో క్యాలితో పునీతమైన పుడమి/ శాతవాహనుల ఏలుబడిలో/ చేవదేరిన శాగవారిన జాగ/ ఒక్క గాథాసప్తశతి చాలు/ ఇది హాలుని నేల/ కథాసరిత్సాగరాలకే కాదు/ కవితా నవలాది సకల సాహిత్య ప్రక్రియలకిది ఆలవాలం’’ అని ప్రశంసిస్తడు. ‘‘మానేరు కవులారా! మీరు కవిత్వం రాయడం మానేరు సుమా!’’ అని వెన్ను తడుతడు.
‘‘నలిమెల కవిత్వంలో కళ్ళు` ‘‘కదులుతున్న శరీరం తోటలో/ ఒకే తీరు సౌష్ఠవం కలిగి/ విరబూసిన సున్నితమైన కలువలు/ ఈ రెండు కళ్ళే ఈరేడు లోకాల వాకిళ్ళు/ ఈ రెండు కళ్ళే ఏడేడు పదునాల్గు భాషాసాహిత్యాల లోగిళ్ళు’’. చెట్లు పెడస్ట్రల్‌ ఫ్యాన్లు. మట్టికుండలు ఆదిలాబాద్‌ నుండి తరలివచ్చిన మట్టి గుండెలు. సహజ శుద్ధ శీతల రంజనిలు. ఉగాది కవితలో కొత్తకుండ తనను మట్టి నుండి సృష్టించిన కుమ్మరి గురించి కన్నీరు కుమ్మరిస్తుంది. నీరుమనస్సు నీరునీరౌతుంది. చింతపండు చింత పడుతుంది. బెల్లం ప్రశ్నిస్తుంది.
‘సుద్దముక్క’లో సామాజికత తక్కువేంలేదు. ‘‘ఈ తక్కెడకు/ ఎలానూ వ్యక్తిత్వం లేదు/ ఏ వైపున కొంత ద్రవ్యం పడ్డా/ అటు వేసే మొగ్గు చూపుతుంది/ గత్యంతరం లేక/ వ్యక్తిత్వం లేని తక్కెళ్ళ చేతనే/ అసంఖ్యాక జీవితాలు తూచబడుతున్నాయి’’ అన్నప్పుడు నేటి రాజకీయం, అధికారగణం, అవినీతి స్ఫురిస్తాయి. ‘‘కనీసం కొలిచే వ్యక్తైనా/ తక్కెడ కాకుండా ఉంటే చాలు’’ అనే దాంట్లో మనుషులు నిజాయితీపరులు కావాలనే ఆకాంక్ష ఉంది. ‘‘ముక్కు ఉక్కులా తయారవ్వనంతకాలం/ ఈకల్లో బాకులు మొలవనంతకాలం/ కోడి మెడ/ పిల్లికి సరదా’’ అనే పంక్తుల్లో బాధితులు సాయుధులు కావాలనే సందేశం ఉంది. ‘రూపాయిబిళ్ళ’ కవితలో మానవాళిని ‘మనీ’ గారడివాడు కోతిని ఆడిరచినట్లు ఆడిస్తున్నది. నాణెంలో బొమ్మాబొరుసుల స్థానంలో ప్రాణమున్న మనిషిని, మానవత్వాన్ని నిలబెడదాం రండి అని ఆహ్వానిస్తున్నాడు.
ఈ పుస్తకంలో ఇవన్నీ ఒక ఎత్తు. ఉపాధ్యాయుని గురించి, సుద్దముక్క గురించి రాసిన ఆరు కవితలు మరో ఎత్తు. ఆరు కవితలలో నలిమెల భాస్కర్‌ ఉపాధ్యాయున్ని ప్రపంచాన అగ్రభాగాన నిలిపాడు. అధ్యాపకునికి అక్షరాభిషేకం చేశాడు. ‘‘అతడు కాలు మోపడం తోటే అణువణువూ అక్షరమవుతుంది/ అతని మాటల రెక్కల మీద/ పిల్లలు అత్యంత సురక్షితంగా/ జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు’’ అని ఉపాధ్యాయుడి ఔన్నత్యాన్నీ, ‘‘క్లాసులో ప్రవేశిస్తున్న ప్రతిసారీ/ అతని కుడిచేతికి ఆరో వేలు/ అదనంగా మొలుస్తుంది/ అది ఖచ్చితంగా జ్ఞానం ఘనీభవించిన తెల్లని సుద్దముక్కే’’ అని చాక్‌పీస్‌ ప్రాధాన్యాన్ని వెల్లడిస్తాడు. అతడు పద్యం ఎత్తుకుంటే గాన కచేరీ. పాఠం చెబుతుంటే జ్ఞాన కచేరీ. పాఠం చెప్పీ చెప్పీ అతని ఊపిరితిత్తులు ఉత్త ఉలిపిరి తిత్తులవుతున్నా విద్యార్థులకు జ్ఞాన జ్యోతులు పంచుతాడు. విద్యార్థులకు అతడు బోధవృక్షం. సంచార బృహద్గ్రంథం. టీవీ పాఠాలు అతనికి ప్రత్యామ్నాయం కాదు. అతడు రక్తమాంసాలతో అపార ప్రేమాభిమానాలతో పిల్లల ముందు కదలాడుతున్న తల్లి, తండ్రి, మిత్రుడు, వేదాంతి. అతని దృష్టిలో పిల్లలకు పాఠాలు చెప్పడమంత పవిత్రమైన కార్యం మరొకటి లేదు. అతడొక కాంతి నక్షత్రం. ఈ దీపం వెలుతురులో ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తయారయ్యారు.
సుద్దముక్క సూర్యగోళం నుండి కోసుకొచ్చిన రశ్మి శకలం. చందమామ నుండి తీసుకొచ్చిన వెన్నెల గడ్డ, అన్నప్పుడు భాస్కర్‌ కవిత్వం తారాస్థాయికి చేరుతుంది. సౌందర్యోపేతం అవుతుంది. చాక్‌పీస్‌ విద్యార్థులకు ‘‘సమస్తమైన దిక్కుల్ని నిర్దేశించగల చుక్కాని/ తరగతికి వెళ్ళే ఉపాధ్యాయునికి ఊపిరి గుళిక/ ఉపన్యాసకులకు ఊతకర్ర’’.
సహజంగా, సులువుగా, ఆత్మీయంగా, త్యాగమయంగా ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నపుడు ఊగే పిల్లల ముఖాలు చూడాలి. పూవుకు తావిలా, పిల్లలకు చదువు సంస్కారాలు అబ్బినపుడే విద్యకు సార్థకత. పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పినప్పుడే సార్థకత. భాస్కర్‌ దృష్టిలో ‘‘ఈ భూమండలం మీద ఏకైక లోకైక దర్శనీయ స్థలం బడి’’.
‘సుద్దముక్క’ తెలుగు కవిత్వంలో ఓ వజ్రపు తునక. ఇందులో అడుగడుగునా కవిత్వం. అణువణువునా నవత్వం. ప్రతివాక్యం ఆస్వాదయోగ్యం. అనుభవైకవేద్యం. డా॥నలిమెల భాస్కర్‌ ఈ పుస్తకాన్ని చదివిన పాఠకులను జ్ఞానపీఠం మీద కూర్చోబెడతాడు.

ప్రతులకు :
డా॥నలిమెల భాస్కర్‌
97043 74081

May 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni May 29, 2025
written by Narendra Sandineni

బిట్ల అంజనీ దేవి మనసెందుకో సున్నితం కవిత
కవయిత్రి బిట్ల ఆంజనీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం.ఇప్పుడు కూడా ప్రతి రోజు మంచి పుస్తకాలు చదువుతారు. సమాజ అభ్యుదయం కాంక్షించే సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు.చదువు పట్ల మక్కువతో ఎంఏ. బీ.ఈడీ.పూర్తి చేశారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అప్పుడప్పుడు కవితలు,వ్యాసాలు రాయిస్తున్నారు.విద్యార్థుల్లో దాగి వున్న సృజన శక్తికి పదును పెట్టిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా సాహిత్య సృజన కొనసాగిస్తున్నారు. కవయిత్రి అంజనీ దేవి కలం నుండి జాలువారిన మనసెందుకో సున్నితం కవితా సంపుటిలోని మనసెందుకో సున్నితం కవిత పై విశ్లేషణా వ్యాసం. ఈ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఈ కవిత మనసు గురించి రాయడం జరిగింది.మనసు గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ఉంది.అందరు చదవాల్సిన కవిత.
“మొదటిసారి వేడి తగిలినపుడు
“వేళ్ళు చురుక్కుమన్నాయి/అని అంటున్నారు.
పొయ్యి మీద వంట చేస్తున్నపుడు గిన్నె వేడిగా ఉంటుంది.వంట పూర్తి అయిన తర్వాత పొయ్యి మీద ఉన్న గిన్నెను గుడ్డను రెండు చేతులతో పట్టుకొని భద్రంగా చేతులు కాలకుండా గిన్నెను జాగ్రత్తగా తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. మొదటిసారి చేతికి వేడి తగిలినప్పుడు వేడి గిన్నె చేతికి అంటుకుని వేళ్లకు బాధ కలిగింది అనే చక్కని భావాన్ని వ్యక్తీకరించిన తీరు బాగుంది.
“వయసు పెరిగే కొద్ధీ
“చర్మం ముదిరిందో
“అలవాటయిందో
“తట్టుకునే శక్తి పెరిగిందో
“ఇప్పుడు అమాంతం
“వేడి గిన్నెను దించగలదు/అని అంటున్నారు.
జీవితం నేర్పిన పాఠాలుగా తోస్తుంది.వయసు పెరిగింది.వయసుతో పాటు చర్మం ముదిరింది.ప్రతి రోజు వంట చేస్తున్నది.వంట చేయడం ఇప్పుడు అలవాటయింది.వేడిని తట్టుకునే శక్తి కూడా పెరిగింది.ఇప్పుడేమో అమాంతం చేతిలో బట్ట లేకుండా పొయ్యి మీద నుండి వేడి గిన్నెను దించుతుంది.వేడి గిన్నెను పొయ్యి మీదనుండి దింపినప్పటికీ చేతులు కాలడం లేదు.వేడి గిన్నెను దించితే చేతులు కాలుతాయని స్పృహ కూడా లేకుండా పోయింది.మనిషి యొక్క అనుభవాలు మనసు సున్నితత్వం నుండి కఠినత్వం వైపు ఎలా తీసుకెళ్లింది.మనిషి మనస్సు ఎంతగా మారి పోయింది.మనిషిలోని మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి అందించిన భావం అద్భుతంగా ఉంది.

“మొదటి అడుగు సున్నితంగా
” ముళ్ళు తగిలినా రాయి తగిలినా
“నొప్పితో తడబడింది/అని అంటున్నారు.
ఎవరికైనా,ఎప్పుడైనా,మొదటి అడుగు సున్నితంగా ఉంటుంది అని మన అందరికి తెలుసు.మొదటిసారి ముళ్ళు తగిలినా,రాయి తగిలినా నొప్పితో తడబడింది.బాధతో విలవిలలాడింది.ముళ్ళు తగిలిన చోట అవస్థను అనుభవించింది.ఎవరికైనా రాయి తగిలిన చోట నొప్పి ఉంటుంది.రాయి తగిలిన చోటనే మళ్లీ దెబ్బ తగిలి శరీరానికి కలిగిన బాధను ఓర్పుతో భరించింది.
“ఎముక ముదిరిందో
“అవసరాల అనివార్యతో
“ఇపుడు ముళ్ళపై నడవగలను
“కంకరపై పడుకోగలను/అని అంటున్నారు.
నిజమే.వయసు పెరిగిన కొద్ది ఎముక ముదిరింది. అవసరాలు మరియు అనివార్య పరిస్థితులు వల్ల ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలను అన్న ధైర్యం పెరిగింది.ముళ్ళపై నడవగలను అనే ధీమా పెరిగింది.ముళ్ల పై నడిస్తే ఏం జరుగుతుంది? కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి.కంకరపై పడుకోగలను అనే ఆత్మ విశ్వాసం సైతం పెరిగింది.కంకర పై పడుకుంటే శరీరానికి కంకర రాళ్లు ఒత్తుకొని ఏ కష్టాన్ని అయినా ఏ సమస్య నైనా ఓర్చుకునే లక్షణం అలవడింది.
“అనుభవం పెరిగే కొద్దీ
“అన్నీ తట్టుకున్న ఈ శరీరంలో
“మనసెందుకో అందుకు భిన్నం/అని అంటున్నారు.
జీవితం నేర్పే పాఠాల వల్ల అనుభవం పెరిగింది.ఈ శరీరం మాత్రం అనుభవం పెరిగిన కొద్ది అన్నిటిని తట్టుకుంది.మనలో భావోద్వేగాలు,అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు లేదా మనస్సు. మనసుకు రూపం లేదు.పేరు మాత్రమే ఉంది. దేవుడికి రూపం లేదు.మనసు ఎక్కడ ఉంది?మన లోపల మనసు దాగి ఉంది.మనసు అంటే ఆలోచన అని అర్థం.ఆలోచనల్లో కూడా తేడాలు ఉంటాయి. మనస్సు అనేది ఎవరికి వారి సొంతం.సంకల్పమే మన మనస్సు.ఇతరుల మనసును ఎవ్వరు తెలుసుకోలేరు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని సాధిస్తుంది.శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది మన మనసు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని కోరుకోవాలి.ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి.శరీరం స్వాధీనంలో లేదు.మనసు స్వాధీనంలో లేదు.మనస్సు అంటే అంతరంగం. మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు, విచక్షణ,మొదలైన అంశాలు.మనస్సు ఏదైనా వస్తువు లేదా జీవరాశి పై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం.ప్రతి మనిషి యొక్క భావాలు,అనుభూతులు,అభిప్రాయాలు,వారి వారి మనస్సు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది.అందుకే ఎవరి ఆలోచనలు వారివే. మనసు గతి యింతే,మనిషి బ్రతికింతే,మనసున్న మనిషికి సుఖం లేదంతే,చలనచిత్రంలోని పాటను మనం విని ఉన్నాం.మనిషి మనసు ఎవరికి అర్థం కాదు.మనసు అంటే నానార్థాలు హృదయం, మానసం,ఇష్టం,తలపు,వలపు,చిత్రం,మది.మనసు గురించి కవయిత్రి మనసెందుకో భిన్నమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

“అమ్మ తిట్టినపుడు
“ఏడ్చి మర్చిపోయా
“మళ్లీ అమ్మా అన్నాను/అంటున్నారు. మనం ఏమైనా తప్పు చేస్తే అమ్మ తిట్టుతుంది.అమ్మ తిట్టినప్పుడు మనకు దుఃఖం వచ్చి ఏడుస్తాం.అమ్మ కొట్టినా,తిట్టినా తిరిగి అమ్మ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది.అమ్మ ఆలనలో,లాలనలో అమ్మ కొట్టిన సంగతి,తిట్టిన సంగతి మర్చిపోయి మళ్లీ అమ్మ దగ్గరికి చేరుతాం.అమ్మ ఎవరు?అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మను మాతృదేవోభవ అని శాస్త్రాలు చెబుతున్నాయి.అమ్మ కనిపించే దైవం.అమ్మ కని పెంచే దైవం.అమ్మ గురించిన భావన అద్భుతం. కవయిత్రి అమ్మను గుర్తుచేసింది,అమ్మ లోకం గురించి,మనలను ఆలోచించేలా చేశారు.
“దోస్తు కొట్టినప్పుడు దెబ్బలాడి
“మరిచిపోయాను
“మళ్లీ ఆడుకున్నాను/అంటున్నారు.
స్నేహమేరా జీవితం.స్నేహమేరా శాశ్వతం.సినీ గీతం ఉంది.ఏవో చిలిపి చేష్టలు,ఏదో అల్లరి,దోస్త్ కొట్టినప్పుడు దెబ్బలాడి మరిచిపోయి మళ్లీ ఆడుకున్నాను.స్నేహితులు కొట్లాడుకుంటారు.అన్నీ మర్చిపోయి అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఆడుకుంటారు.స్నేహబంధం విలువైనదిగా చెప్పుకుంటారు.నిజమైన స్నేహితులు జీవితాంతం కలిసి మెలిసి ఉంటారు.స్నేహం యొక్క ఔన్నత్యాన్ని కవయిత్రి చక్కగా వివరించారు.
“సార్ కొట్టినపుడు
“వెక్కి వెక్కి ఏడ్చిన/అంటున్నారు.
సార్ అంటే ఎవరు?ఉపాధ్యాయుడు.ఆచార్య దేవోభవ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆచార్యుడు కూడా దేవునితో సమానం.సార్ ఏదైనా తప్పు పని,అల్లరి చేస్తే మరియు చదువుకోకుంటే మందలిస్తారు.సారు కొట్టినప్పుడు వెక్కివెక్కి ఏడ్చాను.పిల్లలు సారు కొడితే ఏడుస్తారు.పిల్లలను తల్లిలాగే సారు కూడా దగ్గరికి తీస్తాడు.సార్ చక్కగా చదువు చెప్పి మనలో జ్ఞాన దీపం వెలిగిస్తాడు.సార్ మనలను సన్మార్గంలో నడిపిస్తాడు.సార్ కొట్టినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం చక్కగా ఉంది.కవయిత్రి మనలను బాల్యపు జ్ఞాపకాలలోకి తీసుకెళ్లిన తీరు అద్భుతం.
“ఇప్పుడెందుకో
“గుట్టలుగా పేరుకున్న దుఃఖం
“ఉబికి రానే రాదు
“గుండెలో భారం తగ్గనే తగ్గదు/అంటున్నారు.
జీవితంలో మనిషి ఎన్నో కష్టాలను కడగండ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే కష్టాలు ఒక్కటొక్కటిగా మాయమై పోతాయి.కష్టాలను సహనంతో ఓర్చుకుంటే గుట్టలు గుట్టలుగా పేరుకున్న దుఃఖం ఆవిరి అయి పోతుంది. కష్టాల నావను ఈదుతున్నప్పుడు గుండెల్లో భారం ఎలా తగ్గుతుంది?కష్టాలు క్రమేణా తగ్గిపోతే గుండెల్లో భారం తగ్గుతుంది.కవయిత్రి కవితలో దుఃఖం గురించిన భావాన్ని చక్కగా పండించారు.
“మనసు చేతికి దొరికితే బాగుండు/అంటున్నారు.
మనసు చేతికి దొరికే వస్తువు కాదు.మనసు మన ఆలోచనల్లో నిండి నిబిడీకృతమై ఉంటుంది.మనసు చిక్కబట్టిన వాళ్లను మహర్షులు అంటారు.నిత్యం యోగా,ప్రాణాయామాలు చేయడం ద్వారా మనసు స్వాధీనంలోకి వస్తుంది.మనసు స్వాధీనంలోకి తెచ్చుకున్న వాళ్లను స్థితప్రజ్ఞులు అంటారు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుల గురించి వ్రాయబడింది.
“ముండ్లు గుచ్చో
“సెగ తగిలించో
“రాతితో బాదో
“గట్టి పడేసే దాన్ని/అంటున్నారు.
మనసు మనకి అందదు.మనసుకి ముళ్ళు గుచ్చలేం.మనసుకు సెగ తగిలించలేం.మనసును రాతితో బాధి గట్టి పడేయడం సాధ్యం కాదు. మనసును గురించి కవయిత్రి భావన మనలను ఆలోచింపజేస్తుంది.
“వయసు పెరిగే కొద్దీ
“ఈ మనసెందుకో
“మరింత సున్నితమవుతోంది/అంటున్నారు.
వయసు పెరిగే కొద్ది వయసుతోపాటు ఈ మనసు మరింత సున్నితమవుతోందనే భావం అద్భుతంగా ఉంది.మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి భావాల్లో వాస్తవం దాగి ఉంది.
చక్కటి కవిత అందించినందుకు కవయిత్రి బిట్ల అంజనీదేవిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

May 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మా పల్లె

by K. Krupa May 29, 2025
written by K. Krupa

మా పల్లె
మాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం
పొద్దు పొద్దున్నే
సుప్రభాతాల చప్పుడుకు లేచే సూర్యుడు
పిల్లల దాగుడుమూతలాటకు
సహకరించే చంద్రుడు

ఎటు చూసినా
పచ్చని పంటపొలాలు
ఏ ఇంట్లో చూసినా
పసందైన పిండి వంటలు

కోడి కూత వినగానే
రేగుపండ్ల కోసం పిల్లలు పరుగులు తీస్తారు
రైతులు పంటపొలాలకెళతారు

కోయిలమ్మ కూతలు
పచ్చని ఆకుల మధ్య విరబూసే పువ్వులు
ఎంత బాధనైనా తీర్చేస్తాయి
అందరి ముఖాల్లో నవ్వులు చిందించడానికి
రైతు చెమట చుక్కలు చిందిస్తాడు

కల్మషం లేకుండా
అందరినీ పలకరించే ప్రజలు
సరదాగా సంతోషంగా గడిపే జీవితాలు
చిన్న కష్టం వచ్చినా
నేనున్నా అని చెప్పే పెద్ద వాళ్ళ మాటలు

అందాలు చూడడానికి పట్టణం వాళ్ళు
ఎక్కడికో వెళ్తారు కదా!
ఒకసారి మా పల్లెటూరికి వచ్చి చూడండి
కమ్మనైన మా పల్లె
అందమైన మా సిరిమల్లె

May 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రక్తదానం

by Maji Bharathi May 29, 2025
written by Maji Bharathi

దానములన్నిటికన్న రక్తదానం మిన్న. ఎందుకంటే రక్తదానం వలన ఒక నిండుప్రాణం కాపాడవచ్చు. అట్లాగే అవయవ దానం నుండి కూడా. మిగిలిన ఏ దానములలోనైనా, ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశముండదు. అందుకని అన్ని దానములలో కన్నా ఈ రెండు దానములే శ్రేష్టం. ఈరోజు మనం రక్తదానం గురించి తెలుసుకుందాం.

అసలు రక్తం దేనితో తయారవుతుంది. ఇది ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అనే వాటి కలయికతో కూడి ఉంటుంది. ఎర్ర రక్తకణాలు శరీరావయవాలకు కావాల్సిన ప్రాణవాయువును అందిస్తే, తెల్ల రక్తకణాలు రోగ నిరోధకతను పెంపొందిస్తే, ప్లేట్ లెట్స్ రక్తాన్ని గడ్డ కట్టించి, రక్తస్రావం జరగకుండా కాపాడుతాయి. రక్త కణాలు ఎముక మూలుగు లేక మజ్జ (Bone marrow) నుండి తయారవుతాయి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులైతే, తెల్ల రక్తకణాలు- వాటి రకాన్ని బట్టి జీవితకాలం మారుతుంది. జీవితకాలం దాటిన రక్తకణాలు నాశనమై, కొత్త రక్తకణాలు రక్తంలో చేరుతుంటాయి.

ఏదైనా కారణము వలన శరీరంలో రక్తస్రావమైనా (ఉదాహరణకు స్త్రీలలో వచ్చే నెలసరి, ప్రసవము, పెద్ద ప్రేవుల క్యాన్సర్, కొన్ని రకాలైన నులిపురుగులు… మొదలగు సందర్భాలలో జరిగే రక్తస్రావము), శరీరంలోని రక్త పరిమాణం (5L) తగ్గకుండా శరీరం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్లాస్మా పరిమాణం తగ్గకుండా, కణాల నుండి నీరు రక్తంలో చేరుతుంది. అలాగే బోన్ మేరో ఎక్కువ పనిచేసి రక్తకణాలను అందిస్తుంది. ఆ రకంగా, రక్తం ద్వారా అవయవాలకు అందే ప్రాణవాయువు పరిమాణం తగ్గకుండా జాగ్రత్తపడుతుంది శరీరం. దీనికి కొంత సమయం పడుతుంది.

కాని కొన్ని సందర్భాలలో (రోడ్డు ప్రమాదాలు,శస్త్ర చికిత్సల్లో మరియు ప్రసవ సమయాల్లో కాంప్లికేషన్స్ తలెత్తితే), రక్త పరిమాణము పెంచే సమయం శరీరానికి తగినంత లేకుంటే, రోగి షాక్ లోకి వెళ్లి మరణించే అవకాశాలెక్కువ. అటువంటి సందర్భాలలో, రక్తమార్పిడి రోగి ప్రాణాలను కాపాడుతుంది. అలాగే రక్తకణాలు తొందరగా విచ్ఛిన్నమయ్యే తలసీమియా, హిమోఫిలిక్ రోగుల్లో, రక్త కణాలు సరిగ్గా తయారవ్వని ఎప్లాస్టిక్ ఎనీమియా రోగుల్లో మాటిమాటికీ రక్తాన్ని ఎక్కించవలసి ఉంటుంది.

అయితే ఈ రక్తదానం చెయ్యడానికి అర్హులెవరంటే… 18- 65 సంవత్సరాల మధ్య ఉన్న ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులు. హిమోగ్లోబిన్ శాతం స్త్రీలకు 12.5%, పురుషులకు 13% తగ్గకుండా వుండాలి. వారికి ఏ విధమైన వ్యాధులు ఉండకూడదు. (ముఖ్యంగా హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు కొన్ని రకాలైన సుఖ వ్యాధులు). దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, క్యాన్సర్ రోగులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 కేజీల కన్నా తక్కువ బరువు ఉన్నవారు, రక్తదానము చేయడానికి అనర్హులు. రక్తదానానికి, రక్తదానానికి మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలి.

రక్తదాత నుండి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి, హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు సిఫిలిస్ వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాక, ఆ రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో అలాగే (Whole blood), 4°C వద్ద ఏడు వారాల వరకు నిల్వ ఉంచవచ్చు. లేనిపక్షంలో ఆ రక్తాన్ని, ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ (ఏడు రోజుల వరకు), ప్లాస్మా (ఫ్రేజెన్ ప్లాస్మా: -20°C వద్ద కొన్ని సంవత్సరాలు)… యిలా వేరు చేసి దాయవచ్చు. రక్తహీనత ఉన్నవారికి ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నవారికి (ఉదాహరణకు డెంగ్యూ జ్వరం) వాటిని, ఆటోయిమ్యూన్ డిసీజ్ ఉన్నవారికి ప్లాస్మాను అందిస్తారు. రక్తాన్ని సంగ్రహించాక మాత్రమే పరీక్షలు చేస్తారు. ఒకవేళ పరీక్షల్లో ఏ వ్యాధి అయినా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ రక్తాన్ని ఉపయోగించరు.

రక్త మార్పిడి చేసేముందు, రోగికి ఆ రక్తం సరిపోతుందా లేదా అనేది బ్లడ్ గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్ అనే పరీక్షలు చేసి నిర్ధారించుకుంటారు వైద్యులు. O, A, B, AB అనే నాలుగు రకాల రక్త గ్రూపులు, వాటిలో Rh పాజిటివ్, నెగిటివ్ అని రెండు రకాలు ఉంటాయి. “O నెగిటివ్” రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ డోనార్స్” అంటారు. “AB పాజిటివ్” వ్యక్తులకు ఎవరి రక్తాన్నైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ రెసిపియంట్స్” అంటారు.

రక్తదానం చేసిన వారికి ఏ రకమైన ఇబ్బందీ, తలెత్తదు. ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నాక, మామూలుగా విధులు నిర్వర్తించుకోవచ్చు. ముందే చెప్పుకున్న ప్రకారం, దానం చేసిన రక్తాన్ని దాత శరీరం కొద్ది కాలంలోనే సమకూర్చుకుంటుంది.

ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నా, ఎప్పటికప్పుడు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహించి, రక్తాన్ని సేకరించి, అవసరమైన వారికి అందిస్తూ, మానవ సేవను చేస్తున్నారు. వారితో పాటు మనం కూడా ఆ సేవలో పాల్గొందాం రండి.

May 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సంబురం …?

by Madhu Jella May 29, 2025
written by Madhu Jella

పెళపెళలాడుతూ…
కొత్తనోటు
కళకళలాడుతున్న
కొత్తపెళ్ళి కూతురిలా

విచ్చిన కలువల్లా
విప్పార్చి చూసాయి
అబ్బురంగా
రెండుకళ్ళు
ఎన్నడూ చూసెరగనట్లు

చేతివేళ్ళు
పులకించిపోయాయి
కొత్తనోటు స్పర్శ
కొత్త అనుభూతిని
వింతగా అందిస్తూంటే

రంగురంగల
కొత్తనోట్లు…
తడిమి తడిమి చూసుకుంటుంటే
హరివిల్లు
చేతికొచ్చినట్లుంది

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు
కొంటెగ
గెంతులేస్తుంది
మనస్సు

చొక్కా జేబు….
నోరెళ్ళబెట్టి చూస్తోంది
ఎప్పటికైనా…
కొత్తనోట్లన్నీ తన అరలో
హాయిగా నిద్దరోతాయని
దానికి
గర్వం

తనువంతా
వేయేనుగుల బలం
ఆవహించినట్లు
పుంజుకొని
నిటారుగా తలెత్తుతుంది

అంతలోనే…
అవసరాలు..ఆశలు
రంకెలు వేస్తూంటే

గుండెలయ తప్పుతోంది
గతుకుల రోడ్డులో
ఆగాగి వెళుతున్న మరబండిలా

కళ్ళు మసకబారుతున్నాయి
పున్నమి రాత్రి
గ్రహణం పట్టినట్లు

కాళ్ళు..చేతులు వణికిపోతున్నాయి
ఏదో భయంకర దృశ్యాన్ని
అతిదగ్గర నుండి చూసినట్లు
ఏదో పాపం చేసినట్లు
ఏదో వినకూడనిది
విన్నట్లు

తనువు పట్టుదప్పుతోంది
ఓడే జట్టులో విశ్వాసం
సన్నగిల్లుతున్నట్లు
నీరసంగా నిట్టూరుస్తోంది

క్షణాలు గడవకముందే…
సంబురమంతా
కంచికి చేరింది

కొత్తనోట్లు
దారం తెగిన పతంగాల్లా..

రెక్కలొచ్చి
గూడునొదిలిన
విహంగాల్లా…
సంతలనట్టడవిలో
ఎక్కడకో
ఎగిరిపోతున్నాయి
ఎక్కడా.. నిలువలేక

జేబు
బిక్కమొహంతో
బేలగా
అలా చూస్తుండిపోయింది

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఉపయోగపడిన విద్య

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, May 29, 2025
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

నరసింహపురంలోని శరభయ్య మిక్కిలి ధనవంతుడు . అదే గ్రామంలో కాంతయ్య అను ఒక బలశాలి ఉండేవాడు. అతడు చక్కని కండల పుష్టితో ఉన్నవాడు. అంతేగాకుండా అతడు మల్లయుద్ద విద్యను కూడా నేర్చుకున్నాడు. ఒకసారి అతడిని చూసిన శరభయ్య అతనితో" ఈ మల్లయుద్ద విద్య నేర్చుకోవడం ఎందుకు? శుద్ధ దండగ. వ్యర్థంగా ఈ కండలు పెంచడం నాకైతే నచ్చలేదు ? "అని అన్నాడు. అది విని కాంతయ్య ఏమీ మాట్లాడలేదు . ఒకసారి శరభయ్యకు అత్యవసరంగా పొరుగూరు వెళ్లవలసిన అవసరం కలిగింది. అతడు తన వెంబడి చాలా డబ్బును తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు. అతడు ఆ పొరుగూరికి వెళ్లాలంటే అడవి మార్గం గుండానే నడచి వెళ్లాలి . అక్కడ ఖచ్చితంగా దొంగలు ఉంటారనీ, అందువల్ల ఒంటరిగా పోరాదని ఆ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. కానీ శరభయ్యకు ఇప్పుడు తోడు ఎవరూ లేరు. దేవునిపై భారం వేసిన శరభయ్య పొరుగూరుకు తన డబ్బు మూటగట్టుకొని ఒంటరిగా తన నడకను కొనసాగించాడు. కొద్ది దూరం పోగానే అతనికి తన ముందు వెళ్లుతున్న కాంతయ్య కలిశాడు . వెంటనే శరభయ్య కు ఒక ఉపాయం తోచింది. అతడు కాంతయ్యను కుశల ప్రశ్నలు వేసి తాను చాలా పిరికి వాడిననీ, తన డబ్బును ఒకవేళ దొంగలు అడ్డుకుంటే వారి బారి నుండి దానిని కాపాడమని అతడు వేడుకున్నాడు. కాంతయ్య సరేనని ఆ డబ్బును తీసుకొని తన వద్ద పెట్టుకున్నాడు. కొద్ది దూరం పోగానే శరభయ్య ఊహించినట్లుగానే దొంగలు శరభయ్యను అటకాయించారు. శరభయ్య తన వద్ద ఏమీ లేదని తెలిపాడు. అయినా దొంగలు అతనిని సోదా చేశారు. వారికి అతని వద్ద ఏమీ దొరకలేదు. తర్వాత వారు శరభయ్య ను వదిలిపెట్టి కాంతయ్య వద్దకు వెళ్లారు. అతనిని తన వద్ద ఉన్న డబ్బు అంతా ఇమ్మని బెదిరించారు. కాంతయ్య బలశాలి మాత్రమే కాకుండా మల్లయుద్ద వీరుడు కూడా కాబట్టి వారి పైన దాడి చేశాడు. అతని దెబ్బల బలానికి వారు భయపడి పారిపోయారు. ఆ తర్వాత శరభయ్య కాంతయ్యతో " నిన్ను గతంలో ఈ కండలు పెంచడం ఎందుకు? శుద్ద దండగని దెప్పిపొడిచాను. అందుకు నన్ను క్షమించు. వాటి అవసరం ఇప్పుడు నాకు తెలియవచ్చింది. నా డబ్బును నీ భుజ బలంతో కాపాడావు. నీ మేలు మరచిపోలేను. నీ ప్రాణాలకు త్యజించి వారితో పోట్లాడి నా డబ్బును కాపాడావు. నీకు ప్రతిఫలం గా ఈ వెయ్యి రూపాయలు ఇస్తున్నాను తీసుకో!" అని అన్నాడు. అప్పుడు కాంతయ్య ” చూడు మిత్రమా! నాకు నీ డబ్బు వద్దు. సాటి మనిషికి సాయం చేయడంలోనే ఎంతో ఆనందం ఉంది. నా విద్య ఇక్కడ ఉపయోగపడింది. నీవే కాకుండా మరికొందరు కూడా ఈ కండలు పెంచడం ఎందుకు అని నన్ను దెప్పిపొడిచారు. అది ఆత్మరక్షణకే కాకుండా నీలాంటి వారికి సాయపడుతుందని వారికి తెలియదు. నీ మీద నాకేం కోపం లేదు. ఏ విద్యనైనా నేర్చుకుంటే అది మన అవసరానికి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. నేను మనను కాపాడుకునెందుకే వారి పై దాడి చేశాను తప్ప నాకు వారిపై కూడా ఎలాంటి కోపం లేదు” అని అన్నాడు . అప్పుడు శరభయ్య ” నీవు నేర్చుకున్న విద్య ఆత్మ రక్షణకే అనుకున్నాను . కానీ ఇలా నాలాంటి వారికి సాయపడుతుందని కూడా నేను ఎన్నడూ అనుకోలేదు ” అని అన్నాడు . శరభయ్య అతనికి ధన్యవాదాలు తెలిపి తన డబ్బును తీసుకొని వెళ్లి పోయాడు.

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నీవేనట…..!

by Teegala Likhita May 29, 2025
written by Teegala Likhita

ఓ జననీ!
ఈ సృష్టికి మూలం నీవే,
ఈ పుట్టుక కి కారణం నీవే,
కర్తవు నీవే,
కర్మవు నీవే,
తొమిది నెలలు మోసి జన్మ ని ఇచ్చే అమ్మ వి నీవే,
చేయిపట్టుకుని నడిపించే తల్లివి
తప్పటడుగులు వేస్తే మంచి దారిలో నడిపించే మార్గం నీవే,

బడి చదువు ల పాఠాలు నేర్పితే
ప్రపంచాన్ని చూపించి జీవిత
పాఠాలను నేర్పించే గురువు వి నీవే,
ఓర్పులో అవని వీ నీవే,
విద్య లో వాణి వీ నీవే,
బాణివీ నీవే …

సహనం లో రుద్రునివి నీవే,
శక్తివీ నీవే
అక్కవీ నీవే ,చెల్లి వీ నీవే,తల్లి వీ నీవే,
బతుకుకో అర్థం చెప్పే చెలివీ నీవే నెచ్చెలి వీ నీవే…

అన్నీ  నీవే!
నీవు లేకుంటే సాగుతుందా ఈ ప్రపంచం ,
నీవు లేకుంటే ఉండేదా ఈ సృష్టి  
నీవే లేకుంటే ఉండేవా ఈ మనుషులు బంధాలు …
నీవే గా కష్టాల కడలి లో తోడు ఉండి నడిపించే చుక్కాని వి ,
నీవే గా  కనులు తెరిచిన తరుణం నుండి కనులు మూసే వరకు
బంధాల కోసం,బాధ్యత ల కోసం, కుటుంబం కోసం,
శ్రమిస్తావు
అనుక్షణం ఆరాటమవుతావు
ప్రపంచం తో పోరాడే యోధురాలివీ అవుతావు!

నీవే గా శత్రువులకి కాళి మాత వి ,
నీవే గా ఆకలికి అన్నమయ్యే అన్నపూర్ణా దేవి వి
నీవే గా చదువు నీ నేర్పంచి చక్కగ చేసే సరస్వతి వి,
నీవే గా ప్రతి ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీ దేవి వి….

కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ
అన్నిటిలో నీవే నట – ఈ సమస్తం నీవేనట
నీవేనట …
నీవే ఈ జనం గుర్తించని స్త్రీ మూర్తి వి!
నీవేగా ఈ లోకం గుర్తించలేని జగజ్జనని వి !!

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

విలువ

by Sushma Merugu May 29, 2025
written by Sushma Merugu

గీసందెందుకొ మాయింటి మీద జీవ్వడ్డది…
“మస్తు రొజులైతుంది ఒకపారి ఒచ్చిపొ అవ్వ’… అని మా అమ్మ….
ఇల్లంత శీకటి శీకటి ఐతుంది … ఎప్పుడొస్తవవ్వా … మా బాపు…
యేమన్నగాని… గీసారి ఇంటిక్వోవాలని తీర్కజెస్కొన్మరి వొయ్న.
గూటిక్వోతనన్న ముర్పెంల నిద్ర గూడవట్టలే సక్కగ…
ఎప్పట్లెక్కనే పొద్దుగల్లనే లేష్నా…. గిన్ని పాలబోట్లు దాగి బైలెల్లిన.
ఎర్రబసెక్కుడే ఎర్కలేదు మా బాపే తోల్కపోతుండే.. బండి మీద..
యేం శితం జనం….
ఉష్కెవోస్త రాల్నంత మంది..!!! యిండ్లల్ల ఓల్లుంటలేరా అన్పిచ్చింది….
గప్పట్ల చర్చికి వోయ్నప్పుడు జూష్నది యాదికోచ్చింది.
‌‌గీ ఫ్రీ బస్సు పుణ్యమేందో గానీ… ” స్త్రీలను గౌరవించాలి ” అన్నమాటకే కర్వైపోయింది…

యెట్లనో గట్ల తిప్పల్వడి మా పల్లెకు జెర్కున్న…. అమ్మయ్య…!!! పానమేంత నిమ్మలమైందో…
అచ్ఛేటప్పట్సంది బస్సు దిగకముందె మా బాపు ఫోన్ల మీద ఫోన్లు జేస్తుండు…. నేనెక్కిచ్కస్తనవ్వా….. ఏం నడుస్తవని…! నేన్జెప్పలే ఇగ,… మస్తు రొజులైంది గట్ల గట్ల శేన్లల్లకెంచి సూస్కుంటొద్దామని ఇక్మత్ జేశ్న…!
……గిది మావూరేనా….!!? పక్కూర్ల దిగిన్న…?!!
గిదేందీ గిట్లుంది…
బండి దిగంగనె శెట్లన్నీ ఆర్తిచ్చినట్లన్పిచ్చు….గిడ కాన్గ శెట్లు, బూర్గుబుడ్ల శెట్లు ఉంటుండే… ఎవ్వి గన్పిస్తలే… కొట్టేశ్నట్టున్రు…. గప్పట్ల ఉస్కుల్కెంచి ఒస్తుంటే గా బూర్గు బుడ్డెలు ఎర్కోని మంచిగ ఎండవెట్టి , ఎల్దుర్తి ల లచ్చింపతి దుకాన్ల అమ్ముతుంటిమి…. షేటాక్కు ఐదు రూపాలిస్తుండే… గవ్వే గల్లగుర్గిలల్ల ఎస్కోని పైసల్ జమాజేసుకుంటుట్టిమి.
…..మస్తెండ గొడుతుంది..బాపుకు జెప్పిన అయిపోవు అన్పిచ్చింది.
“నిండ మున్గినంక సలేంది’…. ఓచ్చిన ఒడ్షిపోయింది.. గీయింత దూరం నడ్వలేనా…
శిన్నగున్నప్పుడు నాకంటె బర్వుండే బ్యాగేస్కొని ఇస్కుల్కు గింత కంటె ఎక్వ దూరమే నడ్షి పోతుంటిమి గిదెంత…!!
గొర్ల కొట్టాలు దాటంగనె….మా మామొల్ల పొలము…,ఆడనే కోల్ల పారముంటుందే మాడి శెట్టుంటుండే….,
పారముంది గని మాడి శెట్టు లేదు.. అయ్య!!..గది గూడ కొట్టేశిన్రా….!!?
మాడితొక్కు ఎట్ల పెట్కుంటున్నరో యెమొమరి.. పిఠాన పిరమునయీడ్కె బైట!!
ఒక్క పిట్ట కానోస్తలే.. కాకులు గూడ లేవు… గూల్లల్ల వన్నయేమో తియ్ ఎండమస్తు కొడ్తుంది…
కుస్తోల్లిండ్లల్లకచ్చిన…. మా తాతోలిల్లొచ్చింది గాళ్లనట్కాంచి మా ఆడకట్టుకు జెర్కున్న ఇగ….
మా శిన్నమ్మ… మయింటిపొంటి అత్తమ్మ అందర్గుసోని బీడీలు జేస్తుండ్రు…
“గిప్పుడే ఆస్తున్నవా… ఎట్లున్నవు.. ” యేమమ్మ గట్ల ఒట్టిశాపోలయినవు… కూడు సక్కగ తింటలేవా’…?? అనుకుంట అడిగిన్రు .. ఇంకిత సేపుంటే మల్లేడ లగ్గం గిగ్గం అనంటరేమొనని జెల్ది ఇంట్లక్వొయ్న!!!!
” మావ్వ రానే ఓచ్చింది… మావ్వ మావ్వ…!!! ఎండలోచ్చినవు…. షెప్పొద్దావ్వా….?!!నేనస్తుంటి గదా….
“ఓచ్చిన గదనే…! నాక్మనూరు దెల్వకనా…
యేమ్మా …?!! అనిగ మామ్మను మా బాపు ను మస్తుగ్గగాలిచ్చకున్న…
యెప్పుడెల్లినవో… బుక్కేడు మెత్కులు ఎస్కున్నవొ లేదో… నీకిష్టమని పప్షార్వెట్టిన ‘
ఇగ ఇంట్లక్వోయి కాల్జెతులు గడ్కొని పప్షార్తొటి ఇన్ని మెత్కులల్లిన…
తిని గట్ల ఒర్గిన .. గప్పుడే నా సప్పుడిని మా పెద్దమ్మొచ్చింది… మా పెద్దయ్యకు… పెద్దమ్మకు..మస్తిష్టం నెను… పానం జేస్తరు నన్ను…
ఇగ సాయింత్రం ఆలు కల్లు తెచ్చుకుండ్రు తాగుతున్నరు సీరియల్ జూస్కుంటా…
“మా పెద్దమ్మంటుంది..
“గిప్పుడు గింత షానిగున్నవు గని.. నువ్వు శిన్నగన్నప్పుడు కప్పను పట్కొని పిస్కుతుంటివి.. బాపులతోనే కల్దుకాన్లకు పోతుంటివి..బజ్జీలు ఇప్పిచ్చేదాకా ఊకుంటుట్వ బిడ్డా….. ఆన్కుంట నౌతుండ్రు….!!

అంబటాళ్లకు లేష్న… మంచిగ… అమ్మగూడ లేపలే…
లేవంగనే బంగ్లమీద్కి వోయి తిర్గుకుంట పండ్లు తోముకుంటున్న …
మెట్లెక్కంగనే… సక్కగ సూస్తే.. మా మల్లన్న గుట్ట కన్పిస్తది… పక్కకే శేన్లు ఉంటయి…
మంచిగ పిట్టల సప్పుడ్కే లేస్తుండే…. గిప్పుడు ఒక్క పిట్టె కానొస్తలే…
బాపు పొలం కాడికి పొయ్యోస్తా అన్నడు…
నెంగూడ ఒస్తానే బాపు‌ అని పొయ్న…
మా బాయికాడికి పోతుంటే రెండు కొబ్బరిశెట్లుంటుండే ఒక్కొపారి గా బొండాలు కొట్కొని పోతుంటిమి… గాడా బీడుంటుండే గిప్పుడాడా నాట్లేశిన్రు…
మా బాయి పక్కకే మా శేను..మాది పొత్తుల బూమి…. మాగమామసకు ఒంటలక్వోతుంటిమి ఆడ్కే …
మాబర్రెలు గట్టేశే కాన్గ
శెట్టుకుయ్యాల కట్కున్నము…అదింక గట్లనే ఉంది….
మా శేన్లల్లకు పోతుంటే మస్తు శెట్లుంటుండే… గవన్నీ లేనేలేవ్…
గప్పట్ల పొలం కాడికి పోవాల్నంటె‌…మస్తు బుగులైతుండే …పాములు…ముంగీసలు పారం కాడ
కుక్కలుంటుండే… మస్తు పిట్టెలుంటుండే
యేమన్న ఒరిల శిన్న పుర్గు పుట్రున్నా గవ్వే తింటుండే…
గిప్పుడట్ల లేనట్లుంది… …గప్పుడే మా బాపొచ్చిండు…
” యేముందవ్వ మా నాయ్ననలందరున్నప్డే మంచిగుండే…
ఎవుసం నమ్ముకుంటే ఎమస్తుందని.. గందుకే అందర్వోయిండ్రు…
మనమే ఐదిండ్లోల్లమ్ మిగ్లినం…
ఔమరి…. గప్పుడే మంచిగుంటుండే…
మంచిగ సేంద్రియ ఎర్వులెస్కొని పండించుకున్నోళ్లే మంచిగుండే.. పంట మంచిగొస్తుండే…. గిప్పుడన్ని… గా మందు సంచులేనాయే…. ఏమేమో స్ప్రే లు కొట్టవట్టే…..దాన్కి తోడు గీ ఫైజీ నెట్వర్కులంట… అవ్విటి రెడియేషనూ… పిట్టెల పాణం దీశే… ఇగ పంటేడిది పక్కులేడియి…
” రాన్రానూ రాజు గుర్రం గాడ్దైదట ‘ మనం యేమ్ గావాల్నొ మర్శి యెంత ఇల్వైనయి పొడగొట్కుంటున్నమో మనకెర్కైతలే… మనముంగటోల్లు మనకెంత మంచిగ ఆరసత్వపు సొత్తుంచిండ్రో… మనమూ మన తర్వాత తరాన్కుంచుడు మరుస్తున్నం.
ఎంతకైనా ఓల్డ్ ఇస్ గోల్ద్ అన్నట్లు… గప్పుడే మంచిగుంటుండే…!!!

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni May 29, 2025
written by Narendra Sandineni

నాంపల్లి సుజాత మచ్చిక…! కవిత
ప్రముఖ కవయిత్రి,నాంపల్లి సుజాత కలం నుండి జాలువారిన హోమ్ మేకర్ కవితా సంపుటిలోని “మచ్చిక…! కవిత పై విశ్లేషణా వ్యాసం.మచ్చిక కవితను ఆసక్తితో చదివాను.నాకు చాలా నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.కుక్కను విశ్వాసం గల జంతువు అంటారు.పల్లెల్లో ప్రతి ఇంట కుక్క ఉంటుంది.ఊర కుక్క పిల్లలు పెడితే ప్రేమగా చూడడం తెచ్చి పెంచుకునే సంస్కారం,ఆనాటి పల్లె వాసుల్లో ఉండేది.ఇప్పుడు ఆ సంస్కారం తగ్గిందేమో అనిపిస్తుంది.పల్లెలోని జనాలు వాళ్ళు అన్నం తినేటప్పుడు ఓ ముద్ద కుక్కకు పెడతారు.కుక్కను కాలభైరవుడు,పరమేశ్వరునిగా భావిస్తారు.కాలం మారింది.ఇప్పుడు పట్టణాల్లో ప్రతి ఇంట తమ రక్షణ కోసం కుక్కను పెంచుతున్నారు.కుక్కను గొలుసు పెట్టి కట్టి ఉంచుతారు.కుక్కలు ఉన్న ఇంటికి వెళ్ళాలంటే ఎవ్వరైనా భయపడతారు.ఇంటి ముందు గేట్ పైన కుక్క ఉంది జాగ్రత్త,బివేర్ ఆఫ్ డాగ్ అని బోర్డ్ తగిలిస్తారు.కుక్క ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి రక్షణ కల్పిస్తుంది అని మనం చెప్ప వచ్చు. పోలీసులు దొంగలను,నేరస్థులను పట్టుకోవడానికి నేరం జరిగిన ప్రదేశానికి శునకంను తీసుకెళ్ళి వదులుతారు.శునకం వాసన చూసి నేరస్థులను పట్టగలదని నమ్మకం ఉంది.పోలీసులు రాత్రివేళలో నగరమంతా తిరుగుతూ పహారా కాయాలి. రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పహారా కాస్తూ ఆ నగరాన్ని కాపాడవలసిన బాధ్యత పోలీసులపై ఉంది.మారిన పరిస్థతులు పోలీసులు పహారా కాయడం లేదు.మనం విచారించాల్సిన విషయం.ఊర కుక్కలు రాత్రంతా మేల్కొని నగరంలో తిరుగుతూ వాడ వాడ తిరుగుతూ పహారా కాస్తూ నిర్విరామ సేవలు అందిస్తున్నాయి. కుక్కలు ఏ చిన్న అలికిడి అయిన బౌ బౌ మని మొరుగుతాయి.కుక్కల అరుపులకు దొంగలు పారి పోవాల్సిందే.నేరస్థుల పాలిట సింహా స్వప్నంలా కుక్క నిలుస్తుంది.అలాంటి కుక్కపై మచ్చిక పేరుతో చక్కని కవితను సుజాత మనకు అందించారు.ప్రతి ఒక్కరు ఆ మచ్చిక ఏమిటో దాని మతలబు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించేలా ఉంది.
“ఓ నాలుగు మిగిలిన/మెతుకులను విదిల్చి/ఇక నీ ప్రపంచమంతా/నా చెంతేనని శాసించడమే మచ్చిక…!/అని అంటున్నారు.కవయిత్రి సుజాత భావనలో ఎంతో నిజాయితీ ఉంది. ఇవ్వాళ లోకంలో కుక్కలు పెంచుతున్న తీరును నాలుగు వాక్యాల్లో భావగర్భితంగా తెలియ జేశారు.ఇక నీ ప్రపంచమంతా నా చెంతేనని శాసించడమే మచ్చిక అనే పదానికి అర్థం మరియు మచ్చిక లోని రహస్యాన్ని లోకానికి వెల్లడించారు.

“ఆది మానవుడి స్వార్థపూరిత పుర్రె లోంచి/ పుట్టుకొచ్చిన వ్యూహాత్మక కుట్రే అది…!/అనే దానిలో వాస్తవం దాగి ఉంది.ఆది మానవుడు తాను మనుగడ సాగించడానికి కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నాడు.అందులో కుక్క కూడా ఉంది.ఆది మానవుడు తన రక్షణ కోసం,తన బాగు కోసమే కుక్కను చేరదీశాడు.మచ్చిక చేసుకున్నాడు.ఆది మానవుడు అడవుల్లో తిరుగుతుంటే ఎన్నో క్రూర మృగాల నుండి రక్షణ కోసం కుక్కను పెంచుకున్నాడు.ఆది మానవుడు సంచార జీవితం గడిపే వాడు.ఆది మానవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కుక్కలు కూడా వెళ్ళేవి.ఆది మానవుడికి కుక్కలు తోడుగా ఉండి కాపాడాయి అని మనం చిన్నతనంలో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం.
“బొచ్చు కుక్కకి అంగీ తొడిగి/సంబుర పడుతున్నాడు/ అహ…ఎంతటి దయార్ధ హృదయుడో/నరనరానా జీవ కారుణ్యం/ అనుకుంటాం… కానీ/ఆ మచ్చిక వెనుక ప్రయోజనం/ఎవరికి తెలియదని/షాంపూలు వ్యాక్సిన్స్ బొమ్మ బొమికలు/అతని పరిరక్షణ కోసమే…!/అని అంటున్నారు.మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.నిజంగా జరుగుతున్న విషయాన్ని కవయిత్రి సుజాత మనకు కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తున్నారు.మనమందరం అంగీకరించాల్సిన విషయం.
“కాలకృత్యాలు కాలెత్తడాలు/కనురెప్పల కదలికలు/దాని ఇచ్చానుసారమనుకునేరు/వాడి ఆదేశానుగుణంగానే/అని అంటున్నారు.కుక్కను తీసుకొని వెళ్లి దాని కాలకృత్యాలు తీర్చడం, కాలెత్తడాలు కనురెప్ప కదలికలు దాని ఇచ్చానుసారం కాదు.వాడి ఆదేశానుగుణంగానే కుక్క మెదులుతుందని తెలియజేస్తున్నారు.
“ముందస్తు శిక్షణే కాదు/మూతికి శిక్కం కూడా మన ప్రమేయమే…! అని కవయిత్రి తెలియ జేస్తున్నారు.
“అరిచి ఘీ పెట్టి గింజుకున్న…/కుక్క ఎంత అరిచి బౌ బౌ మని మొరిగిన గింజుకున్న … గొలుసుతో కట్టబడి ఉంటుంది.కుక్క గొలుసుతో బంధింపబడి ఉంది.గొలుసు కట్టు దాటి ఆవలి గట్టు బందు వర్గాన్ని ముట్టరాదు అనే వాస్తవాన్ని కవయిత్రి సుజాత మనకు తెలియజేస్తున్నారు.

“గీసిన గిరి దాటి/అర ఇంచు స్వేచ్ఛ ఉండదు/ బంధించి ఉంచిన కుక్కకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది. గీసిన గిరి ఎలా దాటుతుంది.అర ఇంచు స్వేచ్ఛ ఉండదు అనే నిజాన్ని కవయిత్రి సుజాత తెలియజేస్తున్నారు.
“ఒక్కసారి…/గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో/
కలిసి జీవిస్తున్నట్టు/నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది…!/అని అంటున్నారు.కుక్కను ఒక్కసారి గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో, జీవిస్తున్న వాటికి స్వేచ్ఛ ఉంటుంది.గొర్రెల కాపరి, పశువుల కాపరి వాటిని చక్కగా మేపుతాడు. గొలుసుతో కట్టి వేయబడి ఉన్న కుక్కను నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది.నీ స్వేచ్ఛ ఏమిటో నీకు తెలుస్తుంది అనే నిజాన్ని కవయిత్రి సుజాత చక్కగా తెలియజేశారు.
“మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా/ మనం తప్ప వాటికి గతి లేదా/ ఆలోచించండి…!?/ అని అంటున్నారు.మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా ఆది మానవుడి చరిత్ర చదివితే తెలుస్తుంది.మన రక్షణ కోసమే కుక్కను మచ్చిక చేసుకున్నాం.కుక్కకు మనం తప్ప వాటికి గతి లేదా? ఆలోచించండి అని కవయిత్రి సుజాత మనలో ఆలోచన తరంగాలను రేకెత్తిస్తున్నారు.మనకే కుక్క అవసరం ఉంది.మనమే కుక్కను పెంచుకుంటున్నాం.కుక్క లేకుంటే మనకే గతి లేదు అని తెలియజేయడానికి మనలను కవయిత్రి సుజాత వాటి లోకంలోకి వెళ్లి ఆలోచించమని తెలియజేస్తున్నారు.భావం చక్కగా ఉంది.
“విడ్డూరమంటే ఇదే/సాటి మనిషిని చీదరించుకుని/ వీటిని ఆదరించడం వెనుక అంతర్యం/ఎవరికి తెలియనిది../ ముమ్మాటికిది/ముదిరిన స్వార్థ చింతన…!/అని అంటున్నారు.విడ్డూరం అంటే అర్థం మూర్ఖం.మనిషిని మనిషిగా చూడలేని వాళ్ళు,సాటి మనిషిని ఆదరించని వాళ్ళు,మనుషులేనా అని ప్రశ్నిస్తున్నారు.కుక్కల్ని ఆదరించడం వెనుక ఆంతర్యం తెలియనిది కాదు.ముదిరిన స్వార్థ చింతన అని చక్కగా తెలియజేస్తున్నారు.కుక్కల్ని ఆదరించినట్లే సాటి మనుషులను కూడా ఆదరించాలి.కుక్కల్ని ప్రేమించినట్లే సాటి మనుషుల్ని కూడా ప్రేమించాలి అని సందేశాత్మకంగా మచ్చిక కవిత ద్వారా నాంపల్లి సుజాత తెలియజేశారు.కవయిత్రి సుజాతను అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు
విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us