మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

డాక్టర్ నలిమెల భాస్కర్ విమోచనం కవిత పై విశ్లేషణా వ్యాసం.

by Narendra Sandineni January 29, 2026
written by Narendra Sandineni

ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,బహు భాషావేత్త, అనువాదకులు,తెలంగాణా పదకోశకర్త,
రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు,
ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,డాక్టర్ నలిమెల భాస్కర్ గారు సమకాలీన తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్వరం కలిగిన కవి.విద్యార్థులపై లోతైన ప్రభావాన్ని చూపిన ఉపాధ్యాయుడిగా,భాషా సౌందర్యాన్ని సూక్ష్మంగా ఆవిష్కరించిన అనువాదకుడిగా,అలాగే మానవ అనుభూతుల్ని,తాత్విక లోతులతో వ్యక్తపరిచిన కవిగా ఆయనకు విశేష గుర్తింపు ఉంది.జీవితం,ప్రకృతి మానసిక సంఘర్షణలు,విముక్తి వంటి భావాలు ఆయన కవిత్వంలో సహజంగా మేళవిస్తాయి.కవి భాస్కర్ కలం నుండి జాలువారిన విమోచనం కవిత కూడా ఆ అంతర్లీన తాత్విక దృష్టికి ప్రతిబింబంగా నిలుస్తుంది.విమోచనం కవితలో విముక్తియే ప్రధాన భావంగా ఆవిష్కృతమవుతుంది.కవి వివిధ స్థాయిల్లో ప్రకృతి,మానవ అనుభూతి,కళా సృజనల ద్వారా విమోచనం ఎలా సహజమైన ప్రక్రియగా,అవసరంగా మారుతుందో ప్రతీకల ద్వారా ఆవిష్కరిస్తాడు.ఇది కేవలం విముక్తిని కోరుకోవడం మాత్రమే కాదు ; తనలోని భారాన్ని విడిచిపెట్టి తన అసలైన స్వరూపాన్ని వెలికి తీయాలనే తపన.
సమకాలీన కవిత్వంలో విముక్తి అనే భావం విస్తృతమైన తాత్విక అర్థాన్ని సంతరించుకుంది.కవి భాస్కర్ రాసిన విమోచనం కవిత ఆ భావానికి లోతైన అంతర్ముఖ రూపాన్ని అందిస్తుంది.ఈ కవితలో విమోచనం అనేది బాహ్య బంధనాల నుంచి విడిపోవడమే కాక,అంతర్గతంగా మనసును భారాల నుంచి విడుదల చేసి ప్రక్రియగా ఆవిష్కృతమవుతుంది.ఈ కవితలో కవి జీవితం,ప్రకృతి, మానవ అనుభూతులను ప్రతీకల ద్వారా సమన్వయ పరుస్తాడు.విమోచనం అనేది ఒక్క క్షణంలో సాధించబడే స్థితి కాదు ; అది ఒక సహజమైన,నిరంతరమైన ఆత్మాన్వేషణ, తనలో పేరుకుపోయిన బాధలు,భయాలు,అపోహలు, అహంకారాలను వదిలిపెట్టి నిజస్వరూపాన్ని వెలికి తీయాలనే తపనగా ఈ విముక్తి రూపుదిద్దుతుంది.కవి ఉపయోగించిన ప్రతీకలు ఎంతో సున్నితంగా ఉంటాయి.బంధనాలను సూచించే సంకెళ్లు,భారాన్ని సూచించే మోపులు,వెలుగును సూచించే ఉదయాలు వంటి ప్రతీకలు మానసిక స్థితులను ప్రతిబింబిస్తాయి.ఇవి పాఠకుడిని అంతరంగంలోకి తొంగి చూడమని ఆహ్వానిస్తాయి.విమోచనం అనేది ఇతరులిచ్చే వరం కాదు.అది స్వయంకృత ప్రయత్నం ద్వారా సాధించాల్సిన అనుభూతి అనే ఈ సందేశం ఈ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది.భాషాపరంగా ఈ కవిత సరళమైనప్పటికీ భావగర్భితంగా ఉంటుంది.అలంకారాల ఆర్భాటం లేకుండా,సహజమైన పదాలతోనే గాడమైన తాత్విక భావాలను వ్యక్తపరచడం భాస్కర్ గారి కవిత్వ ప్రత్యేకత,ఉపన్యాసకుడిగా ఆయనకు ఉన్న భాషాపరమైన లోతు,అనువాదకుడిగా సంపాదించిన విశాల దృష్టి ఈ కవితలో ప్రతిఫలిస్తుంది.ఈ విమోచనం కవిత మానవ జీవన ప్రయాణంలో తప్పనిసరిగా ఎదురయ్యే అంతర్ముఖ సంఘర్షణలకు ఒక తాత్విక సమాధానాన్ని అందిస్తుంది. విమోచనం అనేది పారిపోవడం కాదు,ఎదుర్కొని,అర్థం చేసుకుని తనను తాను ఆవిష్కరించుకునే ప్రక్రియ అని ఈ కవిత బలంగా నొక్కి చెబుతుంది.అందుకే ఈ కవిత పాఠకుడిని కేవలం చదివించదు ; ఆలోచింపజేస్తుంది,ఆత్మ పరిశీలనకు దారితీస్తుంది.కవి భాస్కర్ విమోచనం కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారిద్దాం.కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.


“మేఘాలు/తమను తాము/విముక్తం చేసుకోవటానికి/వర్షమై కురుస్తాయి/ఈ కవితలో కవి ప్రకృతి రూపకాల ద్వారా జీవన తత్వాన్ని ఆవిష్కరిస్తాడు.మేఘాలు ఇక్కడ వాతావరణ అంశాలు కాకుండా మనసులో పేరుకుపోయిన భారాలు, బాధలు,అణిచివేసిన భావాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మేఘాలు తమలోని నీటిని దాచుకుంటూ ఉండలేవు.ఆ భారాన్ని మోస్తూ ఉండటం కన్నా వర్షంగా మారి కురవడం ద్వారా తాము తేలికపడతాయి.ఇదే ప్రక్రియను కవి భాస్కర్ విమోచనంగా చూస్తాడు.ఇది త్యాగం ద్వారా కలిగే విముక్తిని సూచిస్తుంది.ఈ కవితా పంక్తిలోని భావన మనిషి జీవితానికి అన్వయించబడుతుంది.మనిషి కూడా తనలోని బాధలను, కన్నీళ్లను,అణిచివేసిన భావాలను వెలిబుచ్చినప్పుడే విముక్తిని పొందగలడు.అందువల్ల వర్షం – కన్నీళ్లకు,మేఘాలు – మనస్సులో పేరుకున్న వేదనలకు ప్రతీకలుగా మారతాయి. కవితలో భాష అతి సరళమైనదైనా,భావం మాత్రం గంభీరమైనది.అలంకారాల కంటే తాత్వికతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.చిన్న కవితా పంక్తుల ద్వారా జీవిత సత్యాన్ని గట్టిగా చెప్పడం ఈ కవిత ప్రత్యేకత.విమోచనం కవిత బాధను దాచుకోవడం కాదు,విడిచిపెట్టడమే నిజమైన స్వేచ్ఛ అనే సందేశాన్ని ప్రకృతి ప్రతీకల సహాయంతో హృద్యంగా వ్యక్తం చేస్తుంది.ఆధునిక కవిత్వం అలంకారాల గజిబిజిలో కాదు – అనుభూతి సత్యంలో నడుస్తుంది. మేఘాలు తమను తాము విముక్తం చేసుకోవడానికి వర్షమై కురుస్తాయి అనే ఈ కవితా పంక్తులు ప్రకృతిని వర్ణించడం లేదు.కవి మనిషి అంతరంగాన్ని చదువుతున్నాడు.మేఘాలు పేరుకుపోయిన మౌనం,అణిచివేసిన కోపం,బయటకు రాని కన్నీళ్లు.ఆధునిక మనిషి కూడా అలానే బరువుగా, నిండిపోయి,కానీ కురవ లేక ఉంటాడు.వర్షం ఇక్కడ బలహీనత కాదు,ఓటమి కాదు – అది ధైర్యం,విడిచి పెట్టే శక్తి. ఈ కవితా పంక్తి చెబుతుంది – దాచుకోవడమే స్థైర్యం అన్న పాత నమ్మకాన్ని వదిలేయమని,కురవగలగడమే విమోచనం. కన్నీళ్లు కార్చగలగడమే మనిషిగా మిగలడం.అందుకే ఈ కవితా పంక్తి చిన్నదైనా దాని ప్రతిధ్వని పెద్దది – ఆధునిక మనిషి మనస్సులో కురుస్తూనే ఉంటుంది.ఇక్కడ మేఘాలు ఒక అంతర్భారాన్ని మోసే మనసుకు ప్రతీకలు.వర్షంగా కురవడం అనేది వాటి విముక్తి.అవి దాచుకున్న నీరు వర్షంగా మారినప్పుడు మేఘాలకు తేలిక కలుగుతుంది.మనసులో పేరుకుపోయిన బాధ,ప్రేమ,వ్యధ బయటికి వస్తేనే మనిషికి విమోచనం లభిస్తుందనే సంకేతం ఇందులో ఉంది.
“పొదుగులు/తమ విడుదల కోసం/ఆకలిగొన్న శిశువుల/ పెదాలపై ఒదుగుతాయి/ఈ కవితా పంక్తిలో భావ సాంద్రత ఎక్కువగా ఉంది.కవి అత్యంత సున్నితమైన ప్రకృతి మానవ సంబంధాన్ని ప్రతీకాత్మకంగా ఆవిష్కరిస్తాడు.కవి మాతృత్వం, దయ,విమోచనం అనే భావాలను ఒకే ప్రతీకలో మేళవించాడు.పొదుగులు తమ విడుదల కోసం అని చెప్పడం ద్వారా ఇది కేవలం శిశువు ఆకలిని తీర్చడం కాదు – తనలో నిండిపోయిన పాలను విడుదల చేయడం ద్వారా తల్లికి కలిగే విముక్తిని కవి సూచిస్తున్నాడు అంటే ఇవ్వడం ద్వారా పొందే తేలిక పాటుతనం,తృప్తి,విమోచనం. పొదుగులు ఇక్కడ కేవలం శరీర అవయవాలుగా కాక త్యాగానికి,మాతృత్వానికి,దయకు,జీవన పోషణకు ప్రతీకలుగా మారతాయి.తమ విడుదల కోసం అనే భావన అత్యంత లోతైనది.ఇది భౌతిక విడుదల కాదు – ఇది సహజ ప్రవృత్తి,ఇది కర్తవ్యబోధ,ఇది అంతర్లీనమైన ప్రేమ ప్రవాహం. పొదుగులు పాలు ఇవ్వడం ద్వారా తమలోని భారాన్ని వదులుకుంటాయి – ఇది శారీరక విమోచనం.అదే సమయంలో శిశువు ఆకలిని తీర్చడం ద్వారా జీవనాన్ని కొనసాగించే కార్యం జరుగుతుంది – ఇది జీవన విమోచనం. ఆకలి గొన్న శిశువులు ఇక్కడ కేవలం శిశువులు మాత్రమే కాదు – సహాయం,ప్రేమ,ఆదరణ కోసం ఎదురు చూస్తున్న సమాజంకు ప్రతీకలుగా చూడవచ్చు.పెదాలపై ఒదుగుతాయి అనే కవితా పంక్తి చాలా సున్నితంగా లయాత్మకంగా ఉంది. ఇది కవితలో మాతృ స్పర్శ యొక్క మృదుత్వాన్ని,అదే సమయంలో త్యాగంలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. మేఘాలు వర్షమై కురిసి విముక్తి పొందినట్లే,పొదుగులు కూడా పాలను ఇచ్చి విముక్తి పొందుతాయి.ఈ కవితా పంక్తులు విమోచనం అనే తాత్విక సమీకరణాన్ని స్థాపిస్తాయి.భాషలో ఎలాంటి అలంకారాల ఆర్భాటం లేకుండా అనుభూతి ప్రధానంగా ఉంది.ఇదే ఆధునిక కవిత్వ లక్షణం.విమోచనం అనేది స్వార్థ రహితంగా ఇవ్వడంలోనే ఉంది అని,మాతృత్వ ప్రతీక ద్వారా హృద్యంగా తెలియజేస్తాయి.ఇక్కడ జీవితం జీవనాన్ని తాకే క్షణాన్ని సూచిస్తుంది.ఇది కేవలం పాలిచ్చే దృశ్యం కాదు – ఇది జీవితం – జీవితాన్ని కాపాడుకునే సంధి స్థలం.ఇది జీవన తత్వాన్ని తెలిపే కవితా దృష్టి కోణం ఉంది. ఈ కవితా పంక్తి ద్వారా కవి చెప్పేది విమోచనం అనేది వేరుపడటం కాదు.విడిచిపెట్టడమే.దాచుకోవడం కాదు పంచుకోవడమే అంటే మేఘాలు వర్షంగా కురవడం ఎలా విమోచనమో,పొదుగులు పాలుగా మారి శిశువును చేరడం కూడా అలాగే విమోచనమే.ఈ కవితా పంక్తి త్యాగం ద్వారా విముక్తి.ప్రేమ ద్వారా స్వేచ్ఛ ఇచ్చే ప్రక్రియలోనే విడుదల అనే తత్వాన్ని హృద్యంగా వ్యక్తం చేస్తుంది.ఇది అత్యంత సున్నితమైన మానవీయ ప్రతీక.పొదుగులు పాలతో నిండినప్పుడు విడుదల కావాలనే తపన కలిగి ఉంటాయి.ఆ విడుదల ఆకలితో ఉన్న శిశువు పెదాలపై జరిగితేనే అది సార్ధకమైన విమోచనం అవుతుంది.ఇక్కడ విముక్తి స్వార్థపూరితంగా కాదు ; అది ఇతరుల అవసరంతో కలిసిన త్యాగం,ప్రేమలోని విమోచనం ఇదే.ఇక్కడ విముక్తి స్వార్థపూరితం కాదు ; అది ఇతరుల అవసరంతో కలిసిన త్యాగం, ప్రేమలోని విమోచనం ఇదే.
“స్వర పేటిక/తన విముక్తిని/చెవులారా వినేందుకు/రసప్లావిత హృదయాల్లోకి/ రవాణా చేస్తుంది/అత్యంత సృజనాత్మకమైన ప్రతీకలు ఉన్న కవితా పంక్తులు.కవి కళ,సంగీతం,భావోద్వేగం,
విముక్తి అనే అంశాలను ఒకే ప్రవాహంలో కలిపాడు.స్వర పేటిక ఇక్కడ కేవలం శరీర అవయవం కాదు – మనసులో దాచుకున్న భావాలను శబ్దంగా మార్చే సృజనాత్మక కేంద్రం.స్వరపేటిక తన విముక్తిని పొందాలంటే మౌనంగా ఉండకూడదు – పాట స్వరంగా బయటకు రావాలి.అంటే వ్యక్తిగత విమోచనం అనే భావన ఇక్కడ ప్రధానంగా నిలుస్తుంది.
చెవులారా వినేందుకు అనే పదబంధం సంగీతం సాగించే భౌతిక ప్రయాణాన్ని సూచిస్తే,రసప్లావిత హృదయాల్లోకి అనే పదాలు అది చేరుకునే అంతర్లీన గమ్యాన్ని సూచిస్తాయి. సంగీతం చెవుల దగ్గర ఆగదు ; అది హృదయంలోకి చేరాలి.అక్కడే రసం పుట్టుతుంది ; అక్కడే అనుభూతి సంపూర్ణమవుతుంది.
ఇందులో రవాణా చేస్తుంది అనే యాంత్రిక పద ప్రయోగం విముక్తి వంటి అంతర్లీన భావంతో కలిపిన తీరు ఈ కవిత ఆధునిక కవిత్వ లక్షణాన్ని బలంగా ప్రతిఫలింపజేస్తుంది.కవి తన అనుభూతి ప్రపంచాన్ని ఆధునిక దృష్టితో ఆవిష్కరిస్తాడు.ఈ కవితలో మేఘాలు,పొదుగులు ఎలా విమోచనం పొందాయో ఇక్కడ స్వర పేటిక కూడా తనలోని స్వరాన్ని పంచడం ద్వారా విముక్తి పొందుతుంది.అందు వల్ల ఈ కవితా పంక్తులు చెబుతున్న సారాంశం – కళకు విమోచనం వ్యక్తీకరణలో ఉంది.వినబడినప్పుడే స్వరం జీవిస్తుంది. భాషలో ఆర్భాటం లేదు.భావంలో లోతుంది.ప్రతీకల ద్వారా ఆధునిక అనుభూతి శాశ్వతం అవుతుంది.ఈ కవితా పంక్తులు విమోచనం కవితకు కళాత్మకమైన శిఖరాన్ని అందిస్తాయి.స్వరపేటికలోని స్వరం బయటకు రాకపోతే అది నిశ్శబ్దంగా నలిగిపోతుంది.స్వరం బయటకు వచ్చి శ్రోతల హృదయాల్లోకి ప్రవేశించినప్పుడే అది జీవం పొందుతుంది. ఇది కళ స్వభావాన్ని తెలియజేస్తుంది – కళ తన విమోచనాన్ని ఇతరుల అనుభూతుల ద్వారా పొందుతుంది.కళాకారుడి వ్యక్తిగత భావం సామూహిక రసానుభూతిగా మారడమే అసలైన విముక్తి అని కవి స్పష్టం చేసిన తీరు చక్కగా ఉంది.
“కవి/తన నుండి తను విడివడి/సర్వ స్వతంత్రుడయ్యేందుకు/ పడుతున్న పెనుగులాటే/చివరికి కవిత్వమై అలరారుతుంది/ చాలా లోతైన ఆత్మ పరిశీలనతో నిండిన కవితా పంక్తులు.ఈ పంక్తుల ద్వారా కవి తన కవిత్వ సృష్టి యొక్క అంతర్లీన సంఘర్షణను స్పష్టంగా ఆవిష్కరిస్తాడు.కవిత్వం ఇక్కడ సౌకర్యం నుంచి పుట్టిన ఫలితం కాదు ; తనతో తానే పోరాడి సాధించిన విముక్తి యొక్క రూపం.
తన నుండి తను విడివడి అనే పదబంధం
అంతరంగ విభజనను సూచిస్తుంది.ఒకవైపు వ్యక్తిగత బాధలు,భయాలు, పరిమితులు : మరోవైపు వాటిని అధిగమించాలనే సృజనాత్మకమైన తపన.
సర్వ స్వతంత్రుడయ్యేందుకు అనే లక్ష్యం సామాజిక బంధాల నుంచే కాక,ఆత్మలోని అహం,సంకుచిత మౌనాల నుంచి విముక్తిని కూడా సూచిస్తుంది.ఈ విముక్తి సులభంగా లభించదు.అందుకే కవి దీనిని పెనుగులాటగా వర్ణించాడు.అది మౌనంతో,భయంతో,అనిశ్చితితో సాగే అంతర్మథన యుద్ధం.ఆ పెనుగులాట చివరికి నాశనంగా కాక కవిత్వంగా అలరారుతుంది ; అశాంతి కళగా పరివర్తన చెందుతుంది.ఈ కవితా పంక్తులు విమోచనం కవితలోని మౌలిక,తాత్విక భావాన్ని హృద్యంగా వ్యక్తం చేస్తాయి. మేఘాలు వర్షమై,పొదుగులు పాలనిచ్చి విముక్తి పొందినట్లే,స్వర పేటిక స్వరమై విమోచనాన్ని అందుకున్నట్లే,కవి తనలోని తను ను విడిచిపెట్టి కవితగా మారినప్పుడే స్వేచ్ఛను పొందుతాడు.భాష ఆధునికం ; వ్యక్తీకరణ సూటిగా,తాత్వికత గాఢంగా ఉంది.ఈ కవితా పంక్తులు కవిత్వం అనేది ఫలితం కాదు – ఒక ప్రక్రియ అని స్పష్టం చేస్తాయి.విమోచనం అనేది సృష్టి ద్వారానే సాధ్యం అనే సందేశాన్ని బలంగా ప్రతిపాదిస్తాయి. కవి తన స్వార్థం,అహం,వ్యక్తిగత సంకుచితత్వం నుంచి విడివడి స్వతంత్రుడవ్వాలనే పోరాటమే కవిత్వం.ఇది సులభమైన ప్రయాణం కాదు – ఒక పెనుగులాట.ఆ అంతర్గత సంఘర్షణ నుంచే కవిత పుడుతుంది.ఈ కవిత ద్వారా కవికి విమోచనం లభిస్తే,పాఠకుడికి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.
ఈ కవితలో ప్రకృతిలో విమోచనం వర్షంగా, మాతృత్వంలోని ప్రేమగా,కళలో రసానుభూతిగా,కవిలో కవిత్వంగా ప్రకటితమవుతుంది.విమోచనం అనేది పారిపోవడం కాదు ; తనలోని నిండుదనాన్ని ఇతరులతో పంచుకోవడం.ఈ భావనను సులభమైన పదాలతో గాఢమైన ప్రతీకల ద్వారా వ్యక్తపరచడంలో ఈ కవిత సాహిత్య సౌందర్యాన్ని సంతరించుకుంది.అంతిమంగా ఈ కవిత మనకు చెప్పేది ఇదే – నిండినదంతా వెలువడితేనే తేలిక ; వెలువడినదంతా కవితగా మారినప్పుడే విమోచనం.కవి భాస్కర్ విమోచనం అనే చక్కటి కవితను అందించినందుకు మనసారా అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని కోరుకుంటున్నాను.

January 29, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సంగీత సరోవరంలో విరిసిన పద్మం – ఎన్. రాజం

by Padmasri Chennojwala January 29, 2026
written by Padmasri Chennojwala

సంగీత జలధిలో మునకలేస్తూ, స్వరాలను శ్వాసిస్తూ, రాగాలను పానంచేస్తూ, పంచప్రాణాలుగా అభిమానిస్తూ, ఆరోప్రాణంగా ఆరాధిస్తూ వన్నె తెచ్చిన స్వరకర్త లెందరో.
పలు చరణాలతో కూడిన స్వరకల్పనకి పల్లవి తిరగలి చక్రమై రాగానికి శోభ నిచ్చిన విధంగానే బాలభానుడి లేత కిరణాలైనా, సోముడి వెన్నెల జల్లులైనా ప్రకృతి సోయగమై మనసుకు హాయి గొలుపుతాయి.
సంగీత పరిభాషలో స్వరాల సమూహాన్ని ‘రాగం ‘ అంటారు. ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూర్చనను కలిగి ఉంటుంది. ప్రతీ మూర్చన తనవైన స్వరాలను కలిగి ఉంటుంది. స్వరాలేవైనప్పటికీ రాగభావం మాత్రం మాధుర్యభరితమే.
చుక్కలు పరిచిన నీలాల దుప్పటి కవులకు కవితావస్తువై, కావ్యాల్లో సైతం తనదైన ముద్ర వేసుకుంది.

ఎదఎదను రంజింపజేసే సంగీత సుధ దేశకాలాల్ని బట్టి ఏ రూపు సంతరించుకున్నా(కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య), ఏ చోట ప్రవహించినా అంతిమంగా దాని లక్ష్యం అలౌకికానందమే.
సంగీత వీచికతో కూడిన శబ్దాన్ని ‘నాదం ‘ అంటారు. అనంతరాగాల సమన్వితమైన సంగీతం నాదమయం. గుప్పెడు గుండెలో కోటి భావనలు దాగి ఉన్నట్టే, అసంఖ్యాక రాగాలలో ఇమిడి ఉన్న నాదమొక్కటే.

మధురమైన ఆ సుధాగానాన్ని గ్రోలుతూ, ఆ నాద జగత్తులో పరవశిస్తూ, సంగీత సరస్సులో వికసించిన పద్మాలెన్నో.

నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతుల తనయగా 08/04/1938 భారతదేశంలోని చెన్నై నగరంలో జన్మించి, సంగీత సరస్సులో ముచ్చటగా మూడోసారి{( పద్మశ్రీ-1984), (పద్మభూషణ్-2004), (పద్మ విభూషణ్-2026)}వికసించి, తన పూదేనియల వెదజల్లిన ఈ పద్మమే ఎన్. రాజం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన 2026వ సంవత్సరపు పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందిన ఐదుగురు సభ్యుల్లో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ వాయు లీన విద్వాంసురాలు వయొలిన్ వాద్యంలో (కళల విభాగంలో)సాధించిన ప్రతిభకుగాను ఈ అవార్డును పొందారు.

హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతురాలైన వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తమ ఉద్యోగ నిర్వహణలో సంబంధిత విభాగానికి అధిపతిగా, ప్రదర్శన కళల విశ్వవిద్యాలయ విభాగాధిపతిగా తమ సమర్థవంతమైన సేవలు అందించి, పలు పదవులకు వన్నె తెచ్చారు.

వీరంందించిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ (1990) అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమి అందించే అత్యున్నత గౌరవమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2012లో వీరిని వరించింది.

సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యురాలిగా సంగీతంపై పట్టు సాధించారు.

ఘర్(ఇల్లు) అనే హిందీ పదం నుండి ఉద్భవించిన’ ఘరానా ‘ అనే సంగీత ప్రక్రియలో నిష్ణాతులైన హిందుస్తానీ సంగీత గురువు ఓంకారనాథ్ ఠాగూర్ వద్ద రాగవికాసాన్ని నేర్చుకున్నారు.

ఘరానా అనే పదానికి సంగీత వారసత్వం, గురుశిష్య సంప్రదాయం అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట సంగీత శైలి. రాగ, గాత్ర వాద్య శైలులను అభ్యసించే విధానాన్ని సూచించే ప్రక్రియ(గ్వాలియర్ ఘరానా).
వారణాసిలో మహదేవ్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ఆ నగరం యొక్క ఠుమ్రీ సంప్రదాయాన్ని కూడా అభ్యసించారు. క్రమంగా వాద్య సంగీతంలోకి అడుగుపెట్టి చివరకు హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ విద్వాంసురాలిగా ఖ్యాతి గాంచారు.

తండ్రి మార్గదర్శకత్వం లో ‘గయాకి అంగ్ (గాత్ర శైలి)’ అనే ప్రక్రియను అభివృద్ధి పరిచారు. గయాకి అంటే హిందీ, అరబిక్ భాషలలో పాడటం అని అర్థం. ఖయాల్ అంటే హిందీ భాషలో ఆలోచన అనీ, పర్షియన్ భాషలో సాహిత్యం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఖయాల్ గయాకి అనేది నిర్దిష్ట శైలి, వేగం లేని వివరణాత్మక గానకళ. వీరు తమలోని సంగీత పరిజ్ఞానానికి సాధనను జోడించి వయొలిన్ వాద్యంపై మనుషుల స్వరాన్ని పోలిన విధంగా వాయించే విధానాన్ని కనిపెట్టారు.

వయొలిన్ భారతీయ సంగీత కచేరీలో, ముఖ్యంగా కర్ణాటక సంగీత కచేరీలో ఉపయోగింపబడే ప్రధాన సహకార తంత్రీవాద్యం. దీనికి ‘ ఫిడేలు ‘ అని మరో పేరు. గాంభీర్యంతో కూడిన మాధుర్యం దీని సొంతం. ఇది పాశ్చాత్య వాయిద్యమైనప్పటికీ, కర్ణాటక సంగీతంలోని అతి సూక్ష్మ గమక విశేషములను కూడా పలికించగల సామర్థ్యం ఉండటంచే ప్రధాన పక్క వాయిద్యంగా, తని వాయిద్యంగా భారతీయ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది.

కర్ణాటక సంగీత శైలిలో ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన T.N. శేషన్ తోబుట్టువు వీరు. చార్టెడ్ అకౌంటెంట్ ఐన T.S. సుబ్రహ్మణియన్ అనే వ్యక్తిని వివాహమాడి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆ శిశువుకు సంగీత శంకర్ అని నామకరణం చేశారు.
కూతురైన సంగీత శంకర్ గారికి, మనవరాళ్లైన (సంగీత శంకర్ గారి తనయలు) రాగిణి శంకర్, నందిని శంకర్ లను వయొలిన్ వాద్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.

మేనకోడలైన కళారాంనాథ్, డా. సత్యప్రకాష్ మెహంతీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఐన ప్రణవ్ కుమార్ వీరి శిష్యులు. కర్ణాటక సంగీత గాయని మరియు సామాజికవేత్త ఐన పద్మా స్వామినాథన్ వీరికి అత్తగారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నేపధ్య గాయని ఐన వాణీజయరాం వీరికి వదిన.
సంగీత కుటుంబంలో జన్మించి, ఆ సాగరాన్ని మథించి, అందుండి లభించిన రాగసుధల్ని వారసత్వంగా తనవారికి పంచడమే కాకుండా, స్వపర భేదాలెంచక అభిమానించి, ఆరాధించిన (సంగీతాన్ని) వారందరికీ వితరణ చేసి, అందులోనే తాదాత్మ్యం చెందిన ఈ సంగీత శిఖరానికి(రాజం గారికి) కైమోడ్పులర్పిస్తూ…..

January 29, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రుక్మిణీఆరుండేల్

by Radhika Suri January 26, 2026
written by Radhika Suri

భరతనాట్యంలో ప్రప్రథమ భారతీయ మహిళా నృత్య కళాకారిణియైన వీరు ఫిబ్రవరి
29 ,1904 లో మధురై, మద్రాస్ (ప్రెసిడెన్సి బ్రిటిష్ ఇండియా)లో జన్మించారు .తల్లిదండ్రులు నీలకంఠశాస్త్రి శేషమ్మాళ్ గార్లు. సంస్కృత పండితులు, చరిత్రకారులైన నీలకంఠ శాస్త్రిగారు “థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా “లో సభ్యులు .

నాటి సామాజిక పరిస్థితులను అనుసరించి బాల్యవివాహానికి పెద్దలు ప్రయత్నించినప్పుడు తిరస్కరించిన రుక్మిణి ,ఏడవ సంవత్సరంలో ఉన్నప్పుడే తండ్రితో పాటు ఆమె సొసైటీలో చేరారు. కర్ణాటక సంగీతము , భరతనాట్యం లో అభిననివేశం సంపాదించారు . విదేశీయులైన జార్జ్ ఆరుండేళ్ ను 1920లో తన పదహారవ ఏట వివాహం చేసుకున్నప్పుడు ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు కాగా, జార్జ్ ఆరుండేళ్ వయసు నలభై సంవత్సరాలు . తల్లిదండ్రులు విముఖత చూపినప్పటికీ అనిబిసెంట్ ఆధ్వర్యంలో వీరి వివాహం జరిగింది.

ఆధ్యాత్మికత పైనున్న ఆసక్తే ఆమెను,’ యంగ్ థియోసాఫిస్టిక్స్ ఫెడరేషన్’ అధ్యక్షురాలిని చేసింది. ‘థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం’లో జార్జ్ అరుండేల్ బోధకులు. వివాహానంతరం దంపతులిద్దరూ ఇరు సంప్రదాయాల్ని పరస్పరం గౌరవించుకుంటూ చక్కని జీవన యానం చేశారు. ఒకానొక సందర్భంలో భర్త గురించి చెప్తూ , “చతుర భాషణులు, జన సమూహంలోఉంటూ,అందరిని చైతన్య పరచడం వారి ప్రత్యేకత అంటారు .వీరి వివాహం సనాతన సాంప్రదాయ వర్గాలకు నచ్చక సంఘం నుండి కొత్తజంటను, ఆమె కుటుంబాన్ని బహిష్కరించినప్పటికీ వారి కలివిడితనం ప్రజల మద్దతుతో తిరిగి సమాజంలో కలిసిపోయారు.

మరోసందర్భంలో తమ కుటుంబ నేపథ్యం గురించి చెప్తూ మా ఇంట్లో ఆంక్షలు, కట్టుబాట్లు ఉండేవి కావని, సంస్కృతీసాంప్రదాయాల్ని తమవారిని చూస్తూనే నేర్చుకున్నానంటారు. కులమత భేదాలు, సంకుచిత స్వభావాలు ,జంతుబలులు లాంటి మూఢనమ్మకాలు ఉండేవి కావంటారు .

జార్జ్ అరుండేల్ వృత్తి ధర్మం లో భాగంగా వారు ఎన్నో దేశాలను చుట్టివచ్చే అవకాశం వారికి లభించింది .ఆ సందర్భంగా
అన్నాపావ్లోవా బావ్లే అనే రష్యన్ కళాకారిణి చేసిన బ్యాలెరీనా నృత్యాన్నిచూసి, పాశ్చాత్య బాలేట్ వైపు ఆకర్షితరాలైన ఈమె బావ్లే గురువు’ క్లియోనార్టి ‘వద్ద నృత్యాన్ని అభ్యసించారు. తరువాత బావ్లే సలహాతో
భరత నాట్యం నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం కేవలం దేవదాసీలు మాత్రమే చేసే ఆ నృత్యాన్ని సనాతన వర్గపు స్త్రీలు భరతనాట్యం నేర్చుకోవడం అవమానంగా భావించే సందర్భం. ఐనా అందరి విమర్శల్ని ,అభ్యంతరాలని పక్కకు నెట్టి ‘మీనాక్షి సుందరం పిళ్ళై ‘దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం పొందారు. ‘కేలూనాయర్’ వద్ద కూడా నాట్యం నేర్చుకున్నారు. ‘థియోసాఫికల్ సొసైటీ’ వజ్రోత్సవాల్లో భాగంగా ఇరవై వేల మంది ఆహుతుల మధ్య ప్రదర్శన ఇచ్చి రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ లాంటి ఎందరో ప్రముఖుల ప్రశంస పొందిన ప్రతిభాశాలి. ‘జేమ్స్ కజిన్’ అనే ఐర్లాండ్ కవిని ఆమె నాట్యం ఎంతగానో ఆకర్షించగా ,అతని ప్రోత్సాహంతో ‘ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ‘ పేరిట 1936 లో నృత్యాలయాన్ని ఏర్పాటు చేశారీదంపతులు .అదే అంచెలంచెలుగా ఎదుగుతూ ‘కళాక్షేత్రం’గా రూపం మార్చుకుంది. తన తొలి గురువైన సుందరం పిళ్ళై మరియు వారి అల్లుడు చొక్కలింగం పిళ్ళైలను తమ కళాక్షేత్రంలో గురువులుగా నియమించుకుని ,నలుగురు విద్యార్థులతో ప్రారంభించబడి అంచలంచెలుగా ఎదుగుతూ శిఖరాగ్రాన నిలిచిందీనాడు. నాట్యంతో పాటు సంగీతాన్ని కూడా చేర్చినేర్పిస్తున్నారు .తోటలు తామరకొలను సాంప్రదాయిక కట్టడాలతో తన అభిరుచికి తగ్గట్టు ఒక నాట్య దేవాలయంగా తీర్చిదిద్దారీ కళాక్షేత్రాన్ని.
కేవలం దేవదాసీలు మాత్రమే ఈ నృత్యం చేయాలన్న ముద్రను చెరిపేసి ఈ కళారూపాన్ని జన రంజకంగా తీర్చి దిద్దిన
లాస్య ప్రియ.

శ్రీ జార్జ్ అరుండేల్ 1945 లో మరణించేనాటికి రుక్మిణీఆరుండేల్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు .(ప్రముఖ తత్వవేత్త ఐన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు జార్జ్ అరుండేల్ గారి పూర్వ విద్యార్థి.)

1967లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ని కూడా పొందారీమె.
1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్ రాష్ట్రపతి అభ్యర్థిగా
శ్రీమతి ఆరుండేల్ ను ప్రతిపాదించినపుడు సున్నితంగా తిరస్కరించారట .రాష్ట్రపతి పదవి కన్నా నాట్యాన్ని ఇష్టపడ్డ వ్యక్తి అని , ‘2013 లో కళాక్షేత్రలో రుక్మిణీ దేవి స్మారకోపన్యాసం సందర్భంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
గుర్తు చేశారు ‘.

భరతనాట్యానికి మార్పులు చేర్పులు చేసి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ప్రపంచ ప్రాముఖ్యతను కలిగించారు. దేవదాసి సమాజంలోని టి. బాల సరస్వతి మరికొందరు నృత్య కళాకారుల సహాయ సహకారాలతో ఈ కళను గుడిమెట్లు దాటించి ప్రపంచ వేదిక పైకి తీసుకురావడంలో విశేష కృషి సల్పిన రుక్మిణి ఆరుండేల్ , భరతనాట్యంలో శృంగార అంశాలను తొలగించి భక్తి రసానికి ప్రాధాన్యతను కలిగించి పాఠ్యాంశాల్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారు. ఆహార్యంలో, ఆభరణాలకు, రంగస్థల దృశ్యాలకు కొత్తదనాన్ని జోడించి నృత్య , నాటక ఆకృతినిచ్చి రామాయణంలోని కొన్ని అంశాలను అత్యంత జనాదరణ పొందేలా రూపొందించారు.

1952 ఏప్రిల్ లో మొదటిసారి రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికైన తొలి నాట్య కళాకారిణిగా రికార్డు సాధించారు .రెండుసార్లు ఈ పదవినలంకరించిన వీరు జంతు సంక్షేమం కోసం “ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఆనిమల్ ఆక్ట్ “కోసం “జంతు క్రూరత్వ నిరోధక బిల్లు 1960 “తేవడంలోను,”జంతు సంక్షేమ బోర్డు “స్థాపనలో విశేషమైన కృషి చేశారు .ఈ బిల్లు ప్రవేశ పెడుతూ ఆమె చేసిన ప్రసంగానికి ప్రభావితులైన ప్రధాని నెహ్రూ చొరవతో త్వరితగతిన చట్టం రూపుదాల్చింది. ఎన్నో సంస్థలతో కలిసి జంతు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1956లో ‘పద్మభూషణ్’ తో సత్కరించగా , ‘దేశికోత్తమ’ బిరుదుతో ‘శాంతినికేతన్’ సన్మానించింది.

నాట్య రీతిలో భగవత్తత్వాన్ని జోడించి , వీరు భరతనాట్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందడమే కాక ,నాట్యాన్ని ఉన్నత శిఖరాన నిలిపిన ఘనత సాధించారు .
ఫిబ్రవరి 24 ,1986న శ్రీమతి రుక్మిణీఆరుండేళ్ హంసమంజీరమై నటరాజ పాదాల చెంత చేరారు .

January 26, 2026 6 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పల్లె ఒకటైన వేళ..

by Cheedella Seetha Lakshmi January 26, 2026
written by Cheedella Seetha Lakshmi

ఈరోజు మకరసంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం పర్వదినం సందర్బంగా నేను మా వారు సత్యమూర్తి,మాఇంట్లోవుండే సీను,రేణుక,దినేష్ తో కలసి కారులో నా జన్మభూమి పుట్టి పెరిగిన ఊరు ఏదులాబాద్ కు ప్రయాణం,
కన్న ఊరు,కన్నతల్లి గొప్పది కదా ఎన్నగా ఎవరికైనా..
ఘటకేశ్వర్ మండలంలో నెలకొన్న
గోదా రంగనాథస్వామి ఆలయంలో గోదా రంగనాథుల కల్యాణం సందర్బంగా పట్నం నుండి పల్లెకు బయలుదేరి ఉదయం 11.30.గంటలకు వెళ్ళాము.
మా ఊరికి వెళుతుంటే నాకు చెప్పలేని ఆనందం,ఉత్సాహం .ఊరికి చేరుకోగానే అభివృద్ధి చెందిన ఊరును, ఎత్తైన భవనాలను చూసి పరవశించిపియాను.

ప్రతి ఇంటిముందు పెండతో చల్లిన నీళ్లతో పచ్చదనం నింపుకున్న వాకిళ్ళు తెల్లని ముత్యాల ముగ్గులు సప్తవర్ణ శోభితమై,గొబ్బెమ్మలు వాకిలి కొప్పులో అలంకరించి పల్లె సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ ఆహ్లాదకర వాతావరణం చూస్తుంటే రెండు కన్నుల సరిపోవన్నది సత్యం.
ముందుగా నేను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చూచి ఆనందంతో గుర్తుగా ఒక ఫోటో తీసుకుని వెళుతూ పెద్ద చెరువు చూసి పరవశించి ఆనాడు బతుకమ్మ ఆట ఆడిన జ్ఞాపకాలను తలచి నెమరువేసుకుంటూ వెళుతున్నాము.
ఎన్నో కార్లు నిలబడి ఉన్నాయి.కిలోమీటరు దూరంలోనే ఆపేశారు పోలీసులు.చాలా మందితో నిండిపోయింది. నాకు వేరే దారి తెలుసు కాబట్టి దారి మళ్లించి
మా ఊరు కాబట్టి ప్రైమరీ బడి పక్కదారిలో నుండి గ్రామపంచాయతీ ఆఫీసు మీదుగా రామాలయం ( మా బాబాయి వాళ్ళది.మా పెదన్నయ్య అందులో పూజలు చేసేవాడు) వెళ్ళాము.చాలా మార్పులు చేస్తున్నట్లు గమనించాము.రామాలయం అంతా తిరిగి చూచి ఫోటోలు దిగాము.మా చిన్నపుడు శ్రీరామనవమి ఉత్సవాలు,సీతారామ కల్యాణం వైభవంగా జరిగేది.మా పెద్దన్నయ్య రాములు పంతులు ఆ గుడిలో చాలా యేండ్లు పని చేసాడు.అప్పుడు కూడా సీతారామ కళ్యాణ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి.మేము ప్రతి సంవత్సరం రామనవమికి ఊరికి వెళ్ళేవాళ్ళము.
ఇప్పుడు కూడా చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. కారును వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర పార్కింగ్ చేసి రంగనాథ ఆలయం వెళ్ళాము.
ఇసుక వేస్తే రాలనంత రద్దీ.పల్లె అంతా అక్కడే ఉన్నట్లు అనిపించింది.అంతేకాకుండా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలనుండి జనం తరలి వచ్చారు.మల్కాజిగిరి MLA మల్లారెడ్డి కుటుంబంతో ,పరివారం తో వచ్చాడు.
.ఆనందం,ఆశ్చర్యం..

లోపలికి వెళుతుంటే తెలిసిన వాళ్ళందరూ పలకరింపులతో పులకించిపోయాను. అక్కడ మేడ్చల్ మల్కాజిగిరి MLA మల్లారెడ్డి గారు కనిపించారు.పలకరించాను.
రంగనాథ గోదాదేవి
దైవ దర్శనం చేసుకున్నాక అమ్మవారిగాజులు ప్రసాదంగా ఇస్తే తీసుకుని కల్యాణం విందు .భోజనం చేస్తుంటే వడ్డన చేస్తున్నవారిలో నాతో కలిసి చదివిన సహాధ్యాయులు కనిపించి గుర్తుపట్టి నువ్వు సీతవేనా? అని అడిగారు.చాలా కాలమైంది చూసి .పాపయ్య,శ్రీరాములు.. ఎన్నో చిన్ననాటి ముచ్చట్లు గుర్తుచేసుకుని మాట్లాడుకున్నాము.అక్కడ నుండి బయటకు వచ్చి వైష్ణవుల యిండ్లు మా చిన్ననాటి స్నేహితులను కలిసి అనుభవాలు పంచుకున్నాము. అట్లా బయలుదేరి .నేను పుట్టిన మా ఊరి నేను పెరిగిన యిల్లు చూచి వారితో మాట్లాడి బయలుదేరి దిడ్డి ( నా చిన్నప్పుడు కూరగాయల మార్కెట్ అన్నమాట) నుండి తిరుమన్నారాయణుని బండ (ఏకశిలా.పెద్దబండ..కింద పెద్దగుహ,గోలకొండకిటకు సొరంగ మార్గం ఉంది అని అంటారు( అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది.ఇప్పుడు.బండపైకి ఎక్కి చిన్నపుడు ఆడుకున్న ఆటలు,తీరుతెన్నులు తలచుకొని బయకుదేరాము.మా ఇంటిపక్కన వుండే మా గురువు రామానుజం పంతులు యొక్క (కొడుకు సత్యం ఈ మధ్య మరణించాడు.బాధగా ఉంది.ఎప్పుడు కలిసినా ఆనందంతో పలకరిస్తాడు) వారిభార్య రాజేశ్వరి ఆమె లేదు.వాళ్ళ పక్కింటి వాళ్లు పెరికె వెంకటేశంకు నేను రచించిన మా అమ్మ గురించి మాతృశతకం జానకీ రాఘవీయం, సీతమాట *ద్విశతి రెండుపుస్తకాలు ఇచ్చాను.ద్విశతి మాగురువుకే అంకితం చేశాను. వాళ్లకు అందజేయమని చెప్పి ఒక ఫోటో తీసుకున్నాను గుర్తుగా.

మా అమ్మకు నాన్నకు,మాకు ఊరితో ఆత్మీయానుబంధం ఎక్కువే.
మర్చిపోయాను చెప్పడం వస్తుంటే తొంటలక్ష్మి కనబడి గట్టిగా పట్టుకుంది.ఎంతో సంతోషించింది.కుడిచెయ్యి గిర్నీలో పడి నలిగిపోయింది.ఎడమ చెయ్యి ఒక్కటే ఉంది.కానీ మా చిన్నప్పుడు ఒక్క చెయ్యితోనే పట్టుకుని తలమీద నీళ్లకుండ ఒకటికాదు కుండమీద కుండ రెండు కుండలు పెట్టుకుని చేద బావినుండి నీళ్లు తోడుకొని తెచ్చిన ఘనురాలు.

అలా ఊళ్ళో అందరిని కలుసుకుని ఎంతో అనుభూతిని ఆనందాన్ని మూటకట్టుకుని హైదరాబాద్ లో ఉన్న మా ఇంటికి ఉప్పల్ భగాయిత్ గుండా బయలు దేరి సాయంత్రం 5.30 కి క్షేమంగా చేరుకున్నాము.

January 26, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నా బాధ్యత

by Pocham Sujatha January 26, 2026
written by Pocham Sujatha


ఎనిమిదేళ్ల అమ్మాయికి
చాక్లెట్ ఆశ చూపి లైంగికంగా, అత్యాచారం చేయబోయిన పదిహేడేళ్ల అబ్బాయి.

ప్రేమించిన వ్యక్తిని
తన తల్లిదండ్రులు వద్దన్నారని,
కూతురు ఆత్మహత్య.

అబ్బా..పొద్దున లేచి పేపరు చూస్తే చాలు ప్రతిరోజు ఇలాంటి వార్తలే ఎక్కువయ్యాయి.
అనుకుంటున్న ధరణికి

ధరణీ…!
అన్న భర్త పిలుపుతో
ఏంటండీ..! అన్నది చికాకుగా ధరణి.

ఏందిరా! పొద్దున్నే వేడి వేడిగా కనిపిస్తున్నావు అన్నాడు భర్త మధుకర్.

ఏంటో..? చెప్పండి !
మీకు వేడివేడిగా టీ ఇవ్వాలి. అంతేగా.. వస్తున్నా అంటూ పేపర్ అక్కడ టీపాయ్ పై పడేసి కిచెన్ లోకి వెళ్లి భర్తకు అల్లం టీ ఇష్టం కాబట్టి అల్లం వేసి, టీ..కాచి తీసుకొనివచ్చి మధుకర్ కి ఇచ్చింది ధరణి.

నీ చేతితో చేసిన చాయ్ అమృతమోయ్ అన్నాడు మధుకర్.
అవును మరి అమృతం తాగుతూ వెయ్యిళ్లు బతుకుదాం ఈ కలియుగంలో జరిగే అరాచకాలను చూస్తూ అన్నది ధరణి చిరు కోపంతో..

నిజంగా నీవు పేరుకు తగ్గట్టే నా పాలిటి వరం ధరణి. భూదేవి అంత ఓర్పు, సహనం కలిగిన భార్యను నాకు అందించాడు ఆ దేవుడు. ఎన్నడూ లేనిది
ఎందుకో నా శ్రీమతి ఈరోజు చిటపటలాడుతుంది అన్నాడు ఓరకంట ధరణిని చూస్తూ మధుకర్.

ఏం లేదండి ! మీ అమృతం చల్లారిపోతుంది ఆస్వాదించండి అన్నది ధరణి.

టీవీ ఆన్ చేసి టీ తాగుతున్నాడు మధుకర్.
టీవీ లో కూడా పేపర్లో వచ్చిన న్యూస్ లే రిపీట్ గా వస్తున్నాయి.

టీవీ లో కూడా అవే న్యూస్ లు మనసుకు బాధగా ఉంది. చానెల్ మార్చండి అన్నది ధరణి.

ఏందిరా? ధరణీ!
ఈరోజు డిసప్పాయింట్ గా ఉన్నావ్ ఏంది సంగతి అన్నాడు మధుకర్.

ఏముందండీ…!
ఏ పేపర్ వార్తలు చూసినా, ఏ ఛానల్ న్యూస్ విన్నా, ఏమున్నది గర్వకారణం
నరజాతి సమస్తం
అత్యాచారాలు, ఆత్మహత్యలు.. మానవత్వాలను మరిచి
మనసును తొలిచే వార్తలు
అన్నది ధరణి.

వాహ్వ వాహ్వ సూపర్ రా!
వార్తలపై కూడా కవిత్వం
చెప్తున్నా ఓయ్ నువ్వు అన్నాడు ధరణిని నవ్వించాలని మధుకర్.

మీ పరిహాసం చాలు కానీ,
ఈరోజు నాకు శ్రీ శారద కళాశాల వాళ్ళ వార్షికోత్సవం ఇన్విటేషన్ ఉంది. త్వరగా వెళ్లాలి. మీరు కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేసి సచివాలయానికి వెళ్ళండి అన్నది ధరణి.

నీవు నీ కారు తీసుకుని రాముని తీసుకొని వెళ్ళు అన్నాడు మధుకర్.

ఎందుకండీ! మీరు వెళ్ళే దారిలోనే కదా ఆ కాలేజ్ వున్నది.ఇంధనం ఖర్చు దండగ చేయడం. రోడ్డుపైన మన రెండవ వెహికిల్ వల్ల ట్రాఫిక్ ,పొల్యూషన్ చేసుకుంటున్నాము.
అత్యవసరం లేకున్నా బయటికి వెళ్లడం వల్ల రోడ్డు పైన వాహనాలు ఎక్కువై, మనిషి నడిచే దారి కూడా లేకుండా వాహనాలు ఎక్కువగా ఉంటున్నాయి. అన్నది సామాజిక బాధ్యత గల ధరణి.

వచ్చేటప్పుడు ఎట్లా వస్తావు అన్నాడు మధుకర్.

ఏదో ఒక ఆటో లో వస్తాను.
నేనిచ్చే ఆటో డబ్బు వల్ల
ఆటో వాడి కుటుంబ అవసరాలకైనా
డబ్బు ఇచ్చినదాన్ని అవుతాను అన్నది.
నేను అందుకే చెప్పాను. ఇంట్లో ఒక కారు ఉంటే చాలు రెండవ కారు వద్దు అని.
ఒక ఇంట్లో రెండు మూడు కార్లు కొనుక్కొని, మన పర్యావరణాన్ని రోడ్లను, ఇంధనాన్ని పాడు చేసుకుంటున్నాము. వాయి కాలుష్యాన్ని మనకు మనమే పెంచుకుంటున్నాం అన్నది ధరణి.

అందరూ నీలాగే ఆలోచిస్తే బాగానే ఉంటది. కానీ, వాళ్ళ స్టేటస్లు
వాళ్ళ అవసరాలు, డబ్బుంది కదా అని కారు కొనడం జరుగుతుందేమో అన్నాడు మధుకర్.

ఇట్లానే ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లనే మన ఇండియాలో రోడ్లు చిన్నవిగా వాహనాలు ఎక్కువగా అయ్యాయి. రోడ్లు పాడైతే బాగుచేసే నాధుడే లేడు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా వాళ్లు బాగుపడడం తప్ప, మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది అన్నది ధరణి.

వాచ్ వైపు చూసి
అమ్మో టైం అవుతుంది. మనం వెళ్ళాలి పదండి.త్వరగా
రెడీ అవ్వండి అన్నది ధరణి.

మధుకర్ వెళ్లే దారిలో
శ్రీ శారద కళాశాలలో
ధరణిని డ్రాప్ చేసి వెళ్ళాడు మధుకర్.

శ్రీ శారద జూనియర్ కళాశాల ప్రోగ్రాం స్టార్ట్ అయింది.
ఆ కళాశాల మేనేజ్మెంట్ కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారు మాట్లాడుతూ
మా విద్యార్థిని, విద్యార్థులకు
మీ యొక్క అమూల్యమైన సలహాలు, వారి యొక్క భవిష్యత్తుకి మార్గదర్శకాలు ఇస్తారని ఆశిస్తూ ప్రముఖ సైక్రియాటిస్ట్
ఎన్నో అవార్డులను పొందిన
డాక్టర్ ధరణి మధుకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అన్నాడు కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారు.

డాక్టర్ ధరణి గారు లేవడంతో అక్కడ ప్రదేశమంతా, కరతాళధ్వనులతో స్వాగతం పలికారు.

డాక్టర్ ధరణి మాట్లాడుతూ
చదువులతల్లి, జ్ఞానజ్యోతి అయిన సరస్వతీ దేవి పేరు మీద శ్రీ శారద జూనియర్ కళాశాల వారు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వసంతానికి విచ్చేసిన శ్రీ శారద కళాశాల డైరెక్టర్ కరస్పాండెంట్ దిలీప్ కుమార్ గారికి,
గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ గారికి టీచింగ్ స్టాఫ్ అందరికీ
నా నమస్కారాలు.
శ్రీ శారద కళాశాలకి వన్నె తెస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు
నాయొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇక్కడి వేదిక అంతా చూసిన తర్వాత కొంతమంది ప్రసంగాలు ఇచ్చారు.
నేను అంత గొప్పగా మెసేజ్ లు ఇచ్చేదాన్ని కాదు అనుకుంటున్నాను.
నేను ఏడవ క్లాస్ నుండి మెడికల్ కాలేజ్ వరకు ఆర్టీసీ బస్సులో అన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారికి కేటాయించిన సీట్లను వారినే కూర్చొనిద్దాం.
అని బస్సులో రాసిన దానికి నేను ఇంప్రెస్ అయ్యేదాన్ని. ఇక్కడ కూడా అలాంటి
సత్ సంప్రదాయమే చూపించిన మగపిల్లల అందరికీ హ్యాట్సాఫ్ టు యు.
అప్పటినుండి మీ అందరిని చూస్తూనే ఉన్నాను. టూ అవర్స్ నుండి అబ్బాయిలు అందరు నిల్చున్నారు. అమ్మాయిలు అందరూ హ్యాపీగా కూర్చున్నారు.
స్టేజ్ పైన అబ్బాయిలు, అమ్మాయిలు ప్రదర్శించిన ప్రోగ్రామ్స్ ని,
పెద్దవాళ్లు ప్రసంగించిన ప్రసంగాలను వింటూ.. ఎలాంటి కామెంట్స్ లేకుండా ఎక్సలెంట్ డిసిప్లేన్ గా ఉన్న
శ్రీ శారద జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను.

“విద్య దదాతి వినయం” అంటారు.
ఆ వినయ విధేయతలు ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శిస్తే మన సమాజము చాలా బాగుపడుతుంది.
ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను.
మీ ముందుండే భవిష్యత్తుకి ఆలోచన చేయాలని ఈ స్టోరీ చెప్తున్నాను చెప్పమంటారా అన్నది ధరణి.

స్టేజి ముందు నుండి పిల్లలందరూ ఏకధాటిగా చెప్పండి మేడం అన్నారు.

ఒక ఊరు ఉందంట. అందులో చుట్టూ ప్రకృతి అందాలతో కూడిన చెట్లు
వాటి మధ్య నదులు, అన్ని వనరులతో కూడిన స్థలాలు ఉన్నాయి.
ఆ ఊరిలో భారతమ్మ అనే మహిళ ఉంది. ఆ భారతమ్మ స్థలాన్ని కబ్జా చేయాలన్న ఆలోచనతో ఒక దొర
ఆ భారతమ్మ దగ్గర ఉన్న ఆ వూరి మనుషులను తనవైపు తిప్పుకొని
స్వార్థంతో ఆ స్థలాన్ని కబ్జా చేశాడు.

కానీ, భారతమ్మ పట్టుదలగల మనిషి. తన పిల్లలను చూసుకోవాలి.
తాను పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకుంది.
తన ఆస్తిని కాపాడుకోవాలని, ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి ఎంతో ధైర్యంతో కష్టపడి పోరాడి మొత్తానికి ఆ కబ్జా చేసిన దొరని
బయటికి పంపింది. తన స్థలాన్ని తాను కాపాడుకోగలిగింది.

ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారంట. ఆ ఇద్దరు కూతుళ్ళని పెళ్లిళ్లు చేసి తన ఆస్తిని ఇచ్చి గొప్ప వాళ్ళను చేసింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు భారతమ్మ స్వర్గస్తురాలయింది.
పెద్ద కూతురు పిల్లలు పెద్ద కుటుంబంలో ఉంటూ.. మంచి సాంప్రదాయాలతో.. వినయవిధేయతలతో… భారతమ్మ కుటుంబానికి వన్నె తెచ్చే విధంగా
పెరిగి పెద్దవాళ్ళు అయ్యి బాగా చదువుకొని మానవత్వంతో.. మెదులుతూ.. గొప్పగా ఎదిగి భారతమ్మ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారు.
చిన్న కూతురు పిల్లలు మాత్రం కొత్త పోకడలకు అలవాటు పడి మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలై, కొత్తగా వచ్చే వింత రోగాలు తెచ్చుకొని మానవత్వపు విలువలను మరిచి అక్రమాలు, అత్యా చారాలు చేస్తూ భారతమ్మ కుటుంబానికి చెడ్డపేరు తీసుకొచ్చే దశలో ఉన్నారు.

పైనున్న భారతమ్మ ఆత్మకి
పెద్ద కూతురు పిల్లలను చూసి ఆనంద పడాలో… చిన్నకూతురు పిల్లలను చూసి బాధపడాలో..అర్థం కాలేదట.
ఎప్పుడు కూడా తల్లి తన పిల్లలు ఆనందంగా, సుఖంగా ఉన్న పిల్లలను చూసి సంతోష పడడం కన్నా..,చెడుదారిలో తిరిగి చెడ్డపేరు తెచ్చుకుంటున్న పిల్లలను చూసి బాధ పడడమే ఆ తల్లి యొక్క లక్షణం.

కాబట్టి పైనున్న భారతమ్మ ఆత్మకు పెద్దకూతురు పిల్లలు చేసిన మంచి పనులకన్నా..,
చిన్నకూతురు పిల్లలు చేస్తున్న చెడ్డ పనులకు.. ఆమె ఆత్మ ఎప్పుడు క్షోభిస్తుందంట.

ఆ భారతమ్మ మరెవరో కాదు. మన భారతమాత.
అని డాక్టర్ ధరణి గారు మాట్లాడుతూ వుంటే
వెంటనే అక్కడి వాళ్ళందరూ
తమ చేతులతో చప్పట్లు కొట్టారు.

విద్యార్థిని ,విద్యార్థులకు మిగతా సందేశాన్ని అందించాలని తిరిగి మళ్ళీ మాట్లాడింది ధరణి.

భరతమాత మొదటి పిల్లలు ఇంత కష్టపడి తెచ్చుకున్నదే స్వాతంత్ర్యం.
ఆ స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత చాలా మంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి భారతదేశానికి ఒక విశిష్టమైన స్థానాన్ని తీసుకువస్తే…
రెండో పిల్లల వారసులుగా ఉన్నటువంటి కొంతమంది కొత్త తరహా పోకడలకు బానిసలై భరతమాతని అవమానించేలా… అత్యాచారాలు ,హత్యలు అక్రమాలు చేస్తూ మానవ విలువలను మరిచి
ఆ తల్లిని బాధ పెడుతున్నారు.
ప్రతి విద్యార్థిని, విద్యార్థులు
ఆ భారతమ్మ పెద్ద కూతురు పిల్లలుగా ఉండి భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా ఉండాలి.
మీరు ఎంచుకున్న రంగంలో..
ఆ రంగం ఏదైనా కానివ్వండి…
పాలిటిక్స్ కావచ్చు.. స్పోర్ట్స్ కావచ్చు పోలీస్ ఆఫీసర్ కావచ్చు.. టీచర్స్ కావచ్చు…వాట్ ఎవర్..?
ఇట్ ఇస్.. మీరు ఎంచుకున్న రంగంలో ముందుగా..మీ కుటుంబానికి… సమాజానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకువచ్చేటటువంటి స్టేజీలో మీరందరూ ఉండాలి.
ఇంటర్మీడియట్ అంటేనే ముందువచ్చే మీ భవిష్యత్తుకి ఒక బ్రిడ్జి లాంటిది.
ఆ బ్రిడ్జికి ఖచ్చితంగా…
మంచి అనే గట్టి పునాదులు ఉండాలి.
అట్లా ఉన్నప్పుడే సమాజానికి
మీరు బంగారు బాటలు వేయగల దిశలో ఉంటారు .
ఇది ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే..
ఈ సమాజంలో జరిగే చెడు విషయాల పై ఒక తల్లి పడే ఆవేదన ఇది.
ఇండియా ఇస్ ఏ ల్యాండ్ విచ్ యాజ్ రిచ్ రిసోర్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
నాలెడ్జి లో మనం నెంబర్ వన్.రిసోర్స్ లో మనం నెంబర్ వన్. నేచురల్ రిసోర్స్ లే కాకుండా.. హ్యూమన్ రిసోర్స్ కూడా..
ఇండియా ఇస్ ది బెస్ట్ కంట్రీ.

ఆ హ్యూమన్ రిసోర్స్ లో పెద్ద స్థానం వహిస్తున్న వారెవరో.. కాదు.అది మీరే..
విద్యార్థినీ, విద్యార్థులు.
అందుకే మీకంటూ.. ఒక విశిష్టమైన స్థానం ఉంది.
ఈ స్టేజ్ లో మీరు నడిచే మంచి మార్గంలో.. రేపు మీ కుటుంబమే, కాకుండా మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా..
మీ పై ఆధారపడి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
విద్యార్థులు ఇప్పుడున్న పరిస్థితుల్లో సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ని సెల్ ఫోన్ ద్వారా మిస్ యూజ్ చేసుకుంటున్నారు.
ఒక రాయిని ఇద్దరికీ చెరోకటి ఇస్తే..
తెలివైన విజ్ఞత కలిగినవాడు దానిని శిల్పంలా చెక్కి.. అతని విజ్ఞానాన్ని ప్రూవ్ చేసుకుంటాడు.
అదే తెలివిలేనివాడు ఆ రాయిని
ఏం చేయాలో తెలియక ఎవరి తల పలగొట్టాలా..అని ఆలోచిస్తాడు.
అట్లా ఉంది ఇప్పుడున్న సైంటిఫిక్ టెక్నాలజీ.
మీ వయసు నుండి ఆ సెల్ఫోన్ అనే విప్లవాన్ని మంచి దారిలో పెట్టి
మీరు సమాజంలో మంచి బాటలో నడవాలి.
నేను చెప్పే ఈ సెల్ ఫోన్ మిస్ యుజ్ గురించి… మీరు.. నన్ను అడగొచ్చు.
ఏంటి..? మేడం..!
సైంటిఫిక్ అనే టెక్నాలజీనీ అందరూ.. మిస్ యూజ్ చేసుకుంటున్నారా..? అని…
అందుకే నేను ముందే చెప్పాను మీకు.

ప్రతి తల్లికి బాగుపడిన కొడుకు,కూతురు కంటే చెడిపోయిన వారి గురించే ఎక్కువగా.. ఆవేదన చెందుతుందని.

సాంకేతికంగా మన భారతదేశం
చాలా ముందడుగు వేస్తుంది.
మేము మా జనరేషన్ లో చూసిన దానికన్నా.. మీరు మీ జనరేషన్లో
చూసే సాంకేతిక పరిజ్ఞానాలు చాలా ఉన్నాయి.
నేను చిన్నప్పుడు ఒక ఎస్సై రైటింగ్ కాంపిటీషన్ కి ప్రిపేర్ కావాలంటే..
గ్రామం నుండి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్లి లైబ్రరీ బుక్స్ చదివి తెలుసుకునే వాళ్లం.

ఈరోజు మీరు గూగుల్ సెర్చ్ ఆన్ చేసి అందులోని ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఈజీగా వెళ్లగలిగే పరిస్థితి ఉంది.
అంటే మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నారో.. ఆలోచించండి.
మేము లైబ్రరీలో బుక్స్ అన్నీ చదివి
ఒక రోజంతా కష్టపడి ఒక పేజీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే వాళ్ళం.
అట్లాంటి పరిస్థితుల్లో మేము చదువుకుని వచ్చాం.

మీరు కేవలం ఒక క్లిక్కుతో…
మీ కళ్ళ ముందు పెట్టుకొనే, అద్భుతమైన పరిస్థితి ఉంది.
ఈ అద్భుతమైన స్థానాన్ని ఎంతవరకు మనము మంచికే.. ఉపయోగించాలి. అని మీరు మీ..మనోభావాలకు వేసుకునే ప్రశ్న…?
దాన్నే.. ఇంట్రాస్పెక్షన్ అంటారు.
అంటే అంతర్మధనం అన్న మాట.

మన ప్రకృతికాని సమాజంగాని
దేశంకానీ, తల్లిదండ్రులుకానీ,
అందరూ ఇచ్చినటువంటి అవకాశం మనం ఏవిధంగా సద్వినియోగం
చేసుకుంటున్నాము.
అనేది ఈ రోజు మీరంతా ఆలోచనచేసి దానికి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే మన సమాజంలో చెడు అనేది జరగకుండా ఉంటుంది అనేది
నా భావన.
నేను ఎందుకు మీకు..
ఇట్లా.. చెప్తున్నానంటే..

నా దగ్గరికి ఒక పేరెంట్స్ తన కూతుర్ని తీసుకొని వచ్చారు.
ఆ అమ్మాయి చిన్నప్పట్నుండి చాలా బాగా చదువుకున్న తెలివికల అమ్మాయి.
ప్రతి దాంట్లోనూ.. మెరిట్ గా
ఉండేదంటా..
అలాంటి అమ్మాయి యుక్తవయస్సు వచ్చినాక,..సాంప్రదాయాలను మరిచి విదేశీ స్టైల్లో… దాచుకోవలసిన శరీర భాగాలను దాచుకోకుండా..
డిగ్నిటీ అనే పదాన్ని మరిచి వస్త్రధారణ చేసుకుంటూ…
అదో ట్రెండ్ గా స్నేహితులతో
చెడు మార్గంలో పడింది. ఆ అమ్మాయి పరిస్థితి చూసి తల్లిదండ్రులు వద్దని వారించినా… వినకుండా..
నా రైట్స్ నాకు ఉన్నవి.
నా స్వేచ్ఛను, నా నిర్ణయాన్ని నేను తీసుకోగలను. అంటూ.. సెల్ ఫోన్ తోనే గడిపేదంటా.
సెల్ ఫోన్ తీసి ఆ అమ్మాయికి దూరంగా ఉంచితే..
నేను మేజర్ ని మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు.నాకు కొన్ని హక్కులు వున్నాయి. అంటూ తల్లిదండ్రుల్ని ఎదిరించి చెడుబాటలో పయనించింది.

పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న వాడితో ప్రేమ పేరుతో మోసపోయి డ్రగ్స్ కి బానిసై డిప్రెషన్లోకి వెళ్లి పోయింది.
ఆ పరిస్థితుల్లో ఉన్న కూతురిని చూస్తూ ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంమై వాళ్లు ఏడ్చుకుంటూ.. వచ్చారు.

ఇది ఎందుకు చెప్పానంటే..
ఈ రోజుల్లో వందకి యాభై శాతం మంది పిల్లలు వాళ్ళ బాధ్యతలను మరిచిపోయి హక్కులకోసం పోరాడుతున్నారు.
మీకు సోషల్ జస్టిస్,మోరల్ జస్టిస్
మీ దగ్గరే ఉంటాయి.
హక్కులకోసం ఎట్లా..? అయితే కొట్లాడుతున్నారో… అట్లాగే బాధ్యతలు కూడా ఉంటాయి అనేది గ్రహించాలి.

ఏ రాజ్యాంగం అయితే మనకు హక్కులు ఇచ్చిందో… అదే రాజ్యాంగం మనకు బాధ్యతలు కూడా ఇచ్చింది.
ఈ రోజు మీరు ఉండే విధానమే,
మీ ముందు తరానికి ఆదర్శం కావాలి.
తల్లిదండ్రుల పైన బాధ్యత,
సమాజం పైన బాధ్యత,
దేశం పైన బాధ్యత..
డిగ్నిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ…
మీరు చేస్తూ.. మంచి బాటలో పయనించాలి.
మన ఈ సమాజాన్ని మంచి దారిలో నడిపిస్తారని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను.
అని చెప్పింది డాక్టర్ ధరణి.

డాక్టర్ ధరణి గారు చెప్పిన అమూల్యమైన వాక్యాలకు
అక్కడ ఉన్న పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు వాళ్ల కరతాళధ్వనులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

January 26, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పసుపు పచ్చ

by Vijaya Kandala January 25, 2026
written by Vijaya Kandala

 ప్రకృతిలో సంస్కృతిలో కనిపించే  రంగులన్నీ ప్రతీకాత్మకమైనవి .ప్రత్యకమైనవి . భారతీయ ఆత్మకు అభివ్యక్తీకరణమే రంగుల సమ్మేళనం .రంగులు  మన జీవిత గమనంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి  . మతం  – రాజకీయం– పండుగలు – వేడుకలు అన్నింట్లోనూ  రంగుల ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. మానవ జీవితంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది . ప్రకృతిని  ,పరిసరాలను  రాగరంజితం  చేసే  రంగులు మన భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి .ఋతువులు మారగానే రంగుల కలయిక మారుతుంది .

ఈ రంగుల కథ మనం అనుకున్న దానికంటే క్లిష్టమైనది  .లోతైనది కూడా !మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని లోకానికి పరిచయం చేస్తుంది .

పసుపు రంగు ఆశావాదానికి ప్రతీక  .శుభకరీ ,శోభస్కరి  ,మంగళకరి అయిన పసుపు లేనిదే ఏ వంటిల్లు సమగ్రం కాదు మన దేశంలో  .హిందూమతంలో పసుపు పవిత్రతకు జ్ఞానానికి చిహ్నం .లక్ష్మీదేవికి సంబంధించిన రంగు. విష్ణుమూర్తి పీతాంబరుడు కదా!

 ఇంద్రధనస్సులో  మూడవ రంగుపసుపు . సూక్ష్మ బుద్ధికి  ,జ్ఞానానికి ప్రతీక చక్ర వ్యవస్థలో మణిపూర చక్రానికి సంబంధించినది . ఈ చక్రం మనిషి అహానికి  ,శక్తికి స్థానం.. చరిత్రకందని కాలంలో కనిపించే గుహల చిత్రలేఖనాలలో కనిపించే  ప్రధాన రంగుల్లో ఒకటిపసుపు రంగు . రోమ్ , ఈజిప్ట్ దేశాల్లో 17 వేల సంవత్సరాల పూర్వం ఉన్నగుహల్లోని  చిత్రలేఖనాల్లో ప్రస్ఫుటంగా కనిపించే రంగు పసుపు.  క్రైస్తవ ధర్మంలో  మోసం , వంచన అనే భావాలకు గుర్తుగా వాడేవారు ఒకప్పుడు .అదే ఈజిప్టులో బంగారు వర్ణమ్  శాశ్వత జీవితానికి ప్రతీక  .ఈజిప్షన్లు దేవతల చర్మం బంగారు పసుపు వర్ణంలో ఉంటుందని ఎముకలు పసుపు రంగులో ఉంటాయని నమ్మేవారు .

ఒకప్పుడు బౌద్ధ ధర్మం లో ఈ రంగు అణ కువకు వినయానికి గుర్తు  .బౌద్ధ శ్రమణులు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు . వారిలో జాగరుకతను స్థిరపరచడానికి ఈ పద్ధతినిబుద్ధుడు నిర్దేశించాడు .

చైనాలో ప్రాచీన కాలంలో పసుపు రంగు వస్త్రాలను కేవలం చక్రవర్తులే ధరించాలని నియమం ఉండేది . ఈ సంప్రదాయం ఒకప్పుడు రాజరికానికి  గౌరవానికి చిహ్నం  .

 జపాన్లో ధైర్యానికి చిహ్నం అయితే కొన్ని యూరోపియన్ దేశాలలో  అసూయ లేదా ద్రోహభుద్ధి కి సంకేతం  . మనదేశంలో ఈ రంగు జ్ఞానం అభ్యాసానికి చిహ్నం . ముఖ్యంగా వసంత పంచమి వేడుకల్లో సరస్వతి దేవి ఆశీస్సుల కోసం పసుపు రంగు దుస్తులు ధరించడం  ,అమ్మవారికి పసుపు రంగుతో చేసిన ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ .

కొన్ని ప్రాంతాలలో ఈ రంగుకు  వ్యతిరేకమైన అర్థాలు కూడా కనిపిస్తాయి . దీని వాడకంలో ఎల్లో బెల్లీ అంటే పిరికివాడు అని సూచించడానికి  ,ఎల్లో జర్నలిజం అంటే సత్య దూరమైన  ,అతిశయోక్తులతో నిండిన వార్తలని అర్థం  .చదువరుల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి రాతలు రాస్తారని , ప్రచారం చేస్తారని దీని భావం .

నూతన సంవత్సర వేడుకల్లో పసుపు రంగులో దుస్తులు ధరిస్తే ధనాన్ని సంతోషాన్ని అదృష్టాన్ని వ స్తుందని చాలామంది లాటిన్ అమెరికన్లు విశ్వసించేవారు ఒకప్పుడు .

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రంగుల పరిశోధకుడు హోవార్డ్ కెమ్ ప్రాసెసర్ ఆసుపత్రి గదులు ప్రశాంతతను ప్రతిబింబించాలని , రోగుల మనసులో ఆందోళనను తగ్గించడానికి కొన్ని సూచనలు చేశాడు . వాటి ప్రకారం గది పైకప్పుకు ఆకాశపు నీలం , నేలకు ఆకుపచ్చ  ,గోడలు ఉదయించే సూర్యుని  రంగు అయిన పసుపును వాడాలి .

Ketchup And  Mustard theory

ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ? బర్గర్ కింగ్  ,మెక్డోనాల్డ్ వారి లోగోలను గమనించారా ?ఇందులో ఎరుపు పసుపు రంగులు ప్రధానమైనవి .శాస్త్రబద్ధమైన ఆధారాలు దొరక్కున్న కొన్ని పరిశోధనలు ఎరుపు రంగు మనిషి ఆకలిని ప్రేరేపిస్తుందని  ,పసుపు రంగు సౌకర్యాన్ని సూచిస్తుందని అందుకని వీరు  రెండు రంగులను వాడారని అంటారు  .దీన్ని అద్భుతమైన కలయికని ఫ్రెంచ్ ఫ్రై లకు టమాటో కెచప్ గొప్ప జోడి అని అంటారు  .ఈ కాంబినేషన్ అత్యంత ప్రజాధరణ పొందిందని అందరికీ తెలుసు

పుష్యరాగం

నవరత్నాలలో పసుపు వన్నెతో ఉండేది పుష్యరాగం  .ఇది గురు గ్రహానికి చెందింది . కోరండం ఖనిజంతోనే పుష్యరాగాలు ఏర్పడతాయి . వీటిలో పారదర్శకమైన పసుపు రంగులో బంగారు వన్నెతో ధగధగలాడే రత్నాలను కనకపుష్యరాగాలని అంటారు . పురాతన కాలం నుండే ఇవి వాడుకలో ఉన్నాయి. ప్రాచీన గ్రీక్ , రోమన్  ,ఈజిప్షియన్  ,సింధులోయ నాగరికతల కాలంలో రాచ కుటుంబాల వారు ఆభరణాలలో వీటిని విరివిగా వాడేవారు .

ఆనందం ఆశావాదం

పసుపు రంగును చూడగానే మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది  .ఇది ఆనందాన్ని ఉల్లాసాన్ని  , ఉత్సాహాన్ని ,ఆశావాద దృక్పథాన్ని పెంచుతుంది  .

ఏ కాగ్రత మేధస్సు

ఇది మెదడును ఉత్తేజ పరుస్తుంది . జ్ఞాపకశక్తిని  ,ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది అందుకే స్టడీ రూము లో  పసుపు రంగు వాడడం మంచిదంటారు  .

ఆకలి

ఆకలిని ప్రేరేపించే రంగు . అందుకే రెస్టారెంట్లలో  ,డైనింగ్ రూములలో ఈ రంగుని ఎక్కువగా ఉపయోగిస్తారు  .

వాస్తు ఇంటి అలంకరణ

ఇంటి హాల్ లేదా డైనింగ్ రూమ్ లో పసుపు రంగు వేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం సంతోషం పెరుగుతాయని వాస్తు చెప్తోంది  .

పచ్చ కామెర్లు

మూత్రం పసుపు రంగులో రావడం అనేది దీని లక్షణం  .కాలేయ సంబంధిత సమస్య  .

పసుపు రంగు  వ్యక్తిలో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తుందని సైకాలజిస్ట్లు చెప్తుంటారు  .పసుపు మెదడు కార్యకలాపాలను పెంచుతుందని జ్ఞాపకశక్తిని మెరుగు  పరుస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు . అందుకే మార్కెటింగ్ నిపుణులు తమ వస్తువుల ప్యాకింగ్ లలో వాటి ప్రకటనల్లోనూ పసుపు రంగును ఎక్కువగా వాడుతుంటారు .

పసుపు రంగును మెచ్చేవారు

ఈ రంగును ఇష్టపడే వారి గురించి చెప్పడానికి చాలానే ఉంది   .ఆహ్లాదంగా చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు  .వ్యాపార దక్షత ఎక్కువ  .కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు . తాను ప్రత్యేకమైన వ్యక్తిని అనిపించుకోవడం వీ రికిష్టం  .ఎక్కువ మందితో స్నేహం చేస్తారు  .చూడడానికి మాడర్న్ గా కనిపించిన పాతకాలపు ట్రెండ్స్ అంటేనే ఎక్కువ మక్కువ  .

ఎం తటి క్లిష్ట పరిస్థితులైన తేలికగా హ్యాండిల్ చేయడం వీరి ప్రత్యేకత  .చాలా ఎమోషనల్  . కానీ ఏ ఫీలింగు బయటికి ప్రదర్శించరు. చాలా త్వరగా నిర్ణయాలు మార్చుకోవడం వీరి బలహీనత .

 త్వరగా  నిర్ణయాలను తీసుకుంటారు  .చురుకుగా పనిచేస్తారు  .సాధారణంగా ఎక్కువ  ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు . చాలా శక్తివంతులు  .

 ప్రతిభావంతులైన వ్యక్తులకు పసుపు రంగు పువ్వులు ఇవ్వడం ఆచారం. అతని ప్రతిభకు ప్రశంసలు ఈ రూపంలో అందిస్తున్నారని అర్థం. వీ రు ఎప్పుడు చుట్టుపక్కల వారికి ఆనందాన్ని పంచే స్వభావం కలిగి ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చెబుతారు ఉత్సాహంగా ఉంటారు ఎటువంటి పరిస్థితినైనా సానుకూల దృక్పథంతో స్వీకరించి ముందుకు సాగడం వీధి ప్రత్యేకత .

పసుపు గురించి మరి కాస్త

ఇది కంటికి అత్యంత ప్రకాశవంతంగా కనిపించే రంగు కనుక ట్రాఫిక్ లైట్స్ లో ఉపయోగిస్తారు .

బంగారం , ఉదయిస్తున్న సూర్యుడు   ,నిమ్మకాయ ఈ రంగు పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి  .

ఫోటోగ్రఫీలో గోల్డెన్ అవర్ అంటే సూర్యోదయం తర్వాత మొదటి గంట  ,సూర్యాస్తమయానికి ముందు చివరిగంట  .ఈ సమయంలో సూర్య కాంతి చాలా మృదువుగా  ,వెచ్చగా ఉంటూ అందమైన నీడలను ఇస్తుంది .ఫోటోలకు అద్భుతమైన రూపం ఇస్తుంది . పోర్ట్రైట్స్ , ల్యాండ్ స్కేప్  ,రొమాంటిక్ ఫోటోషూట్లకు సరైన సమయం .

మీకు తెలుసా పసుపు రంగును  చూసి భయపడే వారి భయాన్ని Xantophobia అంటారు .

 ఇది చాలా ప్రకాశ వం తమైంది . ప్రస్ఫుటంగా కనిపించే రంగు  .

పసుపు రంగుకు సంబంధించిన  సాంస్కృతిక చరిత్ర కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నది

 ట్రాఫిక్ లైట్లు మొట్టమొదటిసారిగా అమెరికాలో 1920 ప్రాంతాలలో ప్రవేశపెట్టారు  .తొలుత పసుపు నలుపు రెండు రంగులు మాత్రమే ఉండినవి .

రంగులు మన మెదడులో రకరకాలైన రసాయనాలను రిలీజ్ చేస్తాయి  .

 పసుపు రంగు మన మెదడులో  సెరటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది .ఈ సరటోనిన్  మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది  .

పొలాలలో కీటకాలను బారి నుంచి రక్షించడానికి పసుపు రంగు స్టిక్కీ ఉపయోగిస్తారు ఎందుకంటే కీటకాలు పసుపు రంగును త్వరగా ఆకర్షింపబడతాయి .

ఒకప్పుడు ఎల్లో ఫీవర్ అనేవ్యాధి  వ్యాప్తిలో ఉండేది  .ఇది దోమల ద్వారా  సోకుతుంది   .ఫ్లూ వంటి లక్షణాలతో తీవ్రమైన శారీరక బాధతో ఒకప్పుడు ప్రజలు బాధపడేవారు  .

మన దంతాలు పసుపు రంగులో మారడానికి కాఫీ టీ సో డాలాంటివి తాగడం ముఖ్యమైనకారణం . మన పంటి పైన ఉండేటువంటి ఎనామిల్ బలహీనం చేసి పసుపు రంగు పోరని ఏర్పరుస్తాయి

మరో వింతైన విషయం YELLO DAY అనేది కూడా ఉంది . సంవత్సరం మొత్తంలో చాలా సంతోషకరమైన రోజుగాదీన్ని  జరుపుకుంటారు . ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన జరుపుకుంటారు .

2016 ఫిబ్రవరిలో మలేషియన్ గవర్నమెంట్ పసుపు రంగు టీ షర్ట్ లను బ్యాన్ చేశారు  .ఎందువల్ల అంటే ఇది వేసుకున్న నిరసనకారులు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఉద్యమంలో లేవదీశారు .

John D. Hertz అనే  వ్యక్తి    Yellow Cab Company స్థాపించా .రు ఆయన కా రలన్నింటికీ   పసుపు రంగు పెయింట్తో ఉండేది  .ఆయన  పసుపు రంగు చాలా దూరం నుంచి కూడా త్వరగా గుర్తించడానికి వీలవుతుంది అని తెలుసుకున్నారు . అందువలన టాక్సీలు  అన్నిటికీ కూడా పసుపు రంగు వేయించి ఎల్లో క్యాబ్ కంపెనీ అనే పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు .

చివరిగా మరొక్క మాట

సమస్యలు ఎన్నున్నా  , సంఘర్షణలెన్నైనా మనసుంటే మార్గం అంటుంది  పసుపు రంగు .ఇదే జీవిత సత్యం .

విజయ కందాళ

9912842104

January 25, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

హిమజ తల్లులు – పిల్లలు కవిత పై విశ్లేషణా వ్యాసం.

by Narendra Sandineni January 25, 2026
written by Narendra Sandineni

ప్రముఖ కవయిత్రి,హిమజ కలం నుండి జాలువారిన తల్లులు – పిల్లలు కవిత పై విశ్లేషణా వ్యాసం.ఈ కవిత తల్లి – పిల్లల మధ్య ఉన్న బంధాన్ని అత్యంత సున్నితమైన మానసిక కోణంలో ఆవిష్కరిస్తుంది.సాధారణంగా పిల్లలు చిన్న వయసులో తల్లులపై ఎక్కువగా ఆధారపడుతారు.కానీ చూస్తుండగానే కాలచక్రం గిర్రున తిరుగుతుంది.పిల్లలు పెద్ద వాళ్ళుగా మారడం సహజం.పిల్లలు తమ తమ జీవితాలను నిర్మించుకుంటూ తల్లి ఇంటి నుంచి దూరం అవుతారు.ఆ దశలో తల్లి ఎదుర్కొనే అదృశ్య వేదనని ఈ కవిత హృద్యంగా చిత్రిస్తుంది.కవయిత్రి ఎదిగిన పిల్లల తల్లుల లోపలి నిశ్శబ్దాన్ని, వారి మౌన ప్రేమను చాలా నిజాయితీగా, హృదయాన్ని హత్తుకునేలా వ్యక్తీకరించిన తీరు వాస్తవికంగా ఉంది.తల్లులు – పిల్లలు కవితలోని భావాలు ఒక తాత్విక పరిపూర్ణతను,మాతృ ప్రేమ యొక్క మాధుర్యాన్ని, హృదయంలోని నిశ్శబ్దతత్వాన్ని చాలా లోతుగా ప్రతిబింబిస్తున్నాయి.ఇక తల్లులు – పిల్లలు కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారిద్దాం. కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.

“ ఎవరూ నేర్పరు.. /అనే కవితా పంక్తి తల్లుల అంతర్గత ప్రపంచాన్ని ప్రకటించే మౌన యంత్రం లాంటిది.తల్లులు – పిల్లల సంబంధం కేవలం పాఠ్య పుస్తకాల ద్వారా నేర్పే విషయం కాదు.ఇది ఎవరికి వారు సహజంగా నేర్చుకోవాలి.ఈ విద్యను ఎవరు నేర్పరు.ఇది అనుభవం,విరామాలు, విడిపోవడాలు వల్ల కలిగే సంఘర్షణలను అద్బుతంగా ఆవిష్కరిస్తుంది.పిల్లలను పెంచే దశలో తల్లి ఎన్నో ఆటంకాలను,అడ్డంకులను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతుంది.అయినప్పటికీ తల్లి తన పేగు పంచుకు పుట్టిన పిల్లలను ప్రేమించడం,వారికి రక్షణ కల్పించడం,వారు సరైన మార్గంలో పయనించేందుకు దోహదపడుతుంది.కానీ పిల్లలు ఎదిగే కొద్ది తల్లి పాత్రలో ఒక నిశ్శబ్దమైన మార్పు చోటు చేసుకుంటుంది.ఇక తల్లి పిల్లల ప్రపంచ కేంద్రం కాదు అని అంగీకరించాలి.వారి నిర్ణయాలను తాను వెనుక నిలబడి ఆశీర్వదించాలి – ఇవి ఎవరు నేర్పని పాఠాలు.ఈ కవితలో తల్లి ప్రేమ బిగ్గరగా మాట్లాడదు.తల్లి మౌనంతో పిల్లలకు వీడ్కోలు చెప్పడం నేర్చుకుంటుంది.పిల్లల జీవితంలో తల్లి జోక్యం తగ్గడం అనేది నిర్లక్ష్యం కాదు.అది పరిపక్వమైన తల్లి ప్రేమకు నిదర్శనం.తన అవసరాలను తల్లి పక్కన పెడుతుంది,కేవలం పిల్లల కోసమే బతుకుతుంది. పిల్లలు స్వేచ్ఛగా జీవించేందుకు త్యాగమూర్తి అయిన తల్లి సహకరిస్తుంది.తల్లి అందించే త్యాగం వర్ణనాతీతం.ఎలాంటి శిక్షణ,సూచనలు లేకుండానే తల్లి ఈ మార్గంలో నడుస్తుంది. తల్లికి ఎవరు నేర్పరు అనేది ఒక అంతర్లీన ఆవేదన.ఈ కవితా పంక్తిలో మౌనం ప్రధానమైనది.ఇక్కడ కనిపించకుండా తల్లి ప్రేమ ఒక నీడ వలె ఎప్పుడు తన వెంటనే ఉంటుంది.పిల్లలు ముందుకు నడుస్తుంటే ఆ నీడ వెనకే తల్లి నడుస్తుంది.ఇవి ఎవరు చెప్పని మాటలు,చూపునకు అందని కన్నీళ్లు,ఎవరు అడగని హక్కులు – తల్లితనపు మౌన స్వభావాన్ని తెలియజేస్తుంది.ఈ కవితలో తల్లితనాన్ని ఒక జీవన తత్వంగా ఆవిష్కరిస్తుంది.తల్లి ప్రేమతో పిల్లలను బంధించి ఉంచదు.అవసరమైన సమయంలో పిల్లలను వదిలి పెట్టి ఉండాలి అని తల్లికి ఎవరు నేర్పరు. ఇవి ఎవరి వల్ల తల్లికి రాదు.తల్లి హృదయం లోపల పిల్లల గురించి తెలుసుకునే జ్ఞానం ఉంటుంది,మరియు నిశ్శబ్దంగా,ఒక విశాలమైన జీవిత సత్యం దాగి ఉంది.తల్లికి ఇది ఎవరు నేర్పని బోధన.ఈ విద్య పాఠశాలలకు,పుస్తకాలకు,ఉపదేశాలకు అందని అనుభవ పాఠం.కొన్ని విషయాలు చెప్పి ఎవరికీ నేర్పించలేము.తల్లి తన అనుభవం,లోక పరిశీలన ద్వారా నేర్చుకుంటుంది.ఇవి తల్లికి ఎవరు నేర్పని జీవిత పాఠాలు.అవి తల్లి మనసులో పుట్టి కాలంతో పరిపక్వం అవుతాయి.ఇవి ప్రేమ,ఓర్పు,నిరీక్షణ, త్యాగం అని ఈ కవితలోని భావాలు సున్నితంగా తెలుపుతున్నాయి. ఎవరు నేర్పరు .. అనే విరామంతో కూడిన కవితా పంక్తిలో ఎవరూ అనే పదం సంపూర్ణ శూన్యతను సూచిస్తుంది.ఇవి ఎవరి సూచనలతో రాని గుణాలు.జీవితంలోని అనుభవాలతో మాత్రమే మనసు వాటిని నేర్చుకుంటుంది అని,ఒక నిస్సృహ లేదు,ఒక అంగీకారం ఉంది అని,ఇది బాధ్యతను బయటకి నెట్టడం కాదు,లోపలికి తీసుకోవడం అని,తల్లి తాను అనుభవించి తానే అవగాహనకు రావాల్సిన మార్గం అని.ఈ కవితా పంక్తి మౌనానికి ఇచ్చిన గౌరవాన్ని తెలుపుతున్నాయి.ఇవి తల్లికి ఎవరు చెప్పని పాఠాలు,పలకని గురువులే తన జీవితాన్ని మెల్లగా మలుస్తాయి అనే జీవిత సత్యం దాగి ఉంది.అందుకే ఎవరు నేర్పరు అనే అనుభవాత్మక అవగాహన పాఠకుని హృదయంలో ఎప్పటికి నిలిచిపోతుంది.తల్లులకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది.పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిపోయాక మిగిలే ఖాళీని ఎలా భరించాలో మాత్రం ఎవరు నేర్పరు అని కవయిత్రి చెబుతుంది.ఇది పిల్లల పట్ల గల తల్లుల అనుభవాన్ని గొప్ప అనుభూతిగా మారుస్తుంది.


“పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యాక/వాళ్ళు వెళ్ళి పోయే ఇంటి నిశ్శబ్దాన్ని/ఇందులో కాల ప్రవాహం స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నతనంలో పిల్లలు ముద్దు ముద్దు మాటలతో,ముచ్చటైన నవ్వులతో అలరిస్తారు.అలాంటి అల్లరితో నిండిన ఇల్లు ఇప్పుడేమో నిశ్శబ్దానికి ప్రతీకగా మారింది.అది ఖాళీ అయిన గది లోపలి నిశ్శబ్దం కాదు.ఖాళీ అయిన మనసు,తల్లితనంలో వచ్చే మార్పు కేవలం భౌతిక మార్పు కాదు.ఇది భావోద్వేగ సంబంధాన్ని బలంగా వ్యక్తీకరిస్తుంది.
“ఎలా భరించాలో,ఎలా తట్టుకోవాలో/అనేది తల్లి అంతర్మనస్సులో రగిలే పోరాటాన్ని తెలుపుతుంది.ఈ నిశ్శబ్దం తల్లులు భరించదగినదేనా?ఇది తల్లుల మనసును కుంగదీసే భారమా?అనే సందేహం స్పష్టంగా వ్యక్తం అవుతుంది.
“అది గోడల మధ్య నిశ్శబ్దం కాదు/మనసులోకి నెమ్మదిగా చేరే శూన్యం../అని కవయిత్రి చెప్పడం వల్ల ఒక గొప్ప భావ విప్లవానికి నాంది పలికింది.పిల్లలు ఇంట్లో లేకుంటే ఇల్లు బోసి పోయింది అంటుంటాం.సాధారణంగా పిల్లలు లేని ఇంటి గోడలు మౌనంగా ఉంటాయి.ఇది ఇంటి తలుపులు మూసిన తర్వాత ఏర్పడిన నిశ్శబ్దం కాదు.పిల్లలు లేని ఇంటిలో ఒక రకమైన శూన్యాన్ని చూస్తాం.ఆ ఇంటిలో మౌనం తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది అంటాం.ఇల్లు నిశ్శబ్దంగా ఉండడం ఒక విషయం అయితే, ఇక్కడ నిశ్శబ్దం భౌతిక స్థాయిని దాటి మానసిక స్థాయికి చేరుకుంటుంది.ఇది మనసులోకి నెమ్మదిగా చేరే శూన్యం.ఇక్కడ నిశ్శబ్దంగా మారిన శూన్యం ఒక్క సారిగా దాడి చేయదు.ఆ నిశ్శబ్దం నెమ్మదిగా రోజువారీ అలవాట్ల మధ్య ఏర్పడిన ఖాళీ.అది గదిలోని నిశ్శబ్దాన్ని,ఖాళీ కుర్చీలను,వాడిన పాత్రలను చూపిస్తూ,మనసులోకి నెమ్మదిగా చేరే శూన్యాన్ని సూచిస్తుంది.ఈ కవితకు ఇది గుండె వంటిది.ఇది ఆ తల్లుల మౌన పరిపక్వతను సూచిస్తాయి.పిల్లలు ఎదగడం ఒక ఘనత అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా తల్లి వాళ్ళ కోసం జీవించడం.అదే తల్లితనపు అత్యంత నిశ్శబ్దమైన రూపకం.ఇది తల్లి హృదయంలోని భావోద్వేగం కాదు.తల్లి తన అస్తిత్వాన్ని ప్రకటిస్తుంది.ఈ కవితలోని భావాలు హృదయ స్పర్శను కలిగిస్తాయి.పిల్లలు ఒక్కసారిగా తల్లికి దూరం కావడం కాదు.రోజురోజుకు పిల్లలు ఇంటిలో లేనితనం తల్లి మనసులో ఒక రకమైన శూన్యాన్ని పెంచుతుంది.ఈ శూన్యం శబ్దం లేకుండా,కంటికి కనిపించకుండా తల్లికి తీవ్రమైన వేదన కలిగిస్తుంది.తల్లులు – పిల్లలు కవితలో తల్లి ప్రేమ,త్యాగం,నిరీక్షణ,ఒంటరితనం,ఒక మౌన వేదనగా రూపుదిద్దుకున్నాయి.ఇది కేవలం ఒక తల్లి కథ కాదు.ఇది పిల్లలు ఉన్న ప్రతి తల్లి జీవితానికి ప్రతిబింబం.ఈ కవితా పంక్తిలోని సరళమైన భాష,లోతైన భావాలు మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి.
“ఎదిగిన పిల్లలు/తమ రెక్కలు విప్పి ఆకాశాన్ని తాకుతారు/ దూరాలు దాటుతారు../తల్లి ఒడిని మర్చిపోయినట్టే కనిపిస్తారు/ఈ కవితా పంక్తులు కవయిత్రి పిల్లల ఎదుగుదలతో పాటు తల్లి – పిల్లల బంధంలో వచ్చే సహజమైన దూరాన్ని ఎంతో సున్నితంగా ఆవిష్కరించింది. జీవితం అనే ప్రయాణంలో పిల్లలు ఎదగడం సంతోషంగా కనిపించినా,ఆ ఎదుగుదల వెనుక తల్లి హృదయంలో మిగిలేది మౌన వేదన అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“ఎదిగిన పిల్లలు అనేది వారి శారీరక,మానసిక వికాసానికే కాదు,వారి వ్యక్తిగత స్వాతంత్ర్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.తల్లి ప్రేమతో పెరిగిన పిల్లలు ఇప్పుడు తమకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకున్నారు అనే సహజమైన భావం ఇమిడి ఉంది.
“తమ రెక్కలు విప్పి ఆకాశాన్ని తాకుతారు అనేది రెక్కలు,ఆకాశం,స్వాతంత్ర్యం,స్వప్నాలు,స్వయం ప్రతిపత్తి అనే భావాలకు సంకేతం.పిల్లల ఎదుగుదల సానుకూలమైనదే అయినా తల్లి నుండి పిల్లలు విడిపోవడం,తల్లి హృదయానికి నొప్పిని కలిగిస్తుంది.కవయిత్రి పిల్లలను పక్షులుగా ఊహించడం,వారి ఆశలు,కలలు,ఆకాంక్షలను అద్భుతంగా వ్యక్తం చేసింది.పిల్లలు స్వేచ్ఛగా విహరించి ఆకాశాన్ని అందుకోవడం,విజయాన్ని సొంతం చేసుకోవడం,అంతర్లీనంగా తల్లి పెంపకం సార్థకం అయింది అని కవయిత్రి భావిస్తుంది.
“దూరాలు దాటుతారు../అనేది ఇది కేవలం భౌతిక దూరానికే కాక,భావోద్వేగానికి సంబంధించిన దూరం అని,పిల్లలు చదువు,ఉద్యోగం,జీవన ప్రయాణం పేరిట తల్లి నుంచి దూరం అవుతారు అని,ఈ దూరం తల్లి మనసుకు బాధాకరమే అవుతుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“తల్లి ఒడిని మర్చిపోయినట్టే కనిపిస్తారు/ఇక్కడ కవయిత్రి ఎంతో నొప్పిని కలిగించే నిజాన్ని ఎంతో మృదువుగా చెప్పింది. పిల్లలు నిజంగా తల్లిని మర్చిపోరు.పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పును తల్లి గ్రహిస్తుంది.ఇది తల్లి మనసు పడే ఆత్మీయ వేదనను సూచిస్తుంది.ఈ కవితా పంక్తిలో పిల్లల ఎదుగుదల వల్ల తల్లికి కలిగే ఆనందం – తల్లికి ఏర్పడే ఒంటరితనం అనే రెండు విరుద్ధ భావాలను ఒకే సందర్భంలో చూపిస్తాయి. పిల్లలు తమ రెక్కలు విప్పి ఎగిరిపోవడం సహజమే అయినా, ఆ ప్రయాణంలో తల్లి ఒడి మౌనంగా వెనకబడి పోతుంది.తల్లి ప్రేమ ఎంతో నిస్వార్ధమైనది,పిల్లల స్వాతంత్ర్యం ఎంతో అనివార్యమైనది అని గుర్తు చేస్తుంది.ఇది పాఠకుడి హృదయాన్ని ఆలోచింపజేస్తుంది.
“కన్న తల్లికి మాత్రం/వారి ప్రతి అడుగు గుర్తుంటుంది/ఈ కవితా పంక్తిలో తల్లితనపు మౌనాన్ని,అత్యంత సరళంగా, లోతైన భావాలతో కూడి ఉంది.ఇది కన్నతల్లి అనుభవం, త్యాగం,నిరంతర జ్ఞాపకాల సమాహారంగా నిలుస్తుంది.పిల్లలు ఎదుగుతూ తమ గతాన్ని మరచిపోతారు.కానీ తల్లి మాత్రం వారి ప్రతి అడుగును మనసులో దాచుకుంటుంది.ఈ కవితా పంక్తిలో భావ ప్రధానత స్పష్టం అవుతుంది.పిల్లలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే తల్లి వారి జ్ఞాపకాలతో జీవిస్తుంది.పిల్లల పట్ల గల అపారమైన ప్రేమతో తల్లి వారి జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోవడం,వారిని వదిలి ఉండలేని స్వభావం స్వార్థరహితమైనది,ప్రతిఫలాపేక్ష లేనిది,కాలంతో పాటు చెరగనిది.ఇందులో తల్లితనాన్ని ఒక జ్ఞాపకాల నిల్వగా కాక ప్రేమతో నడిచే మౌన చరిత్రగా చిత్రిస్తుంది.పిల్లల మొదటి అడుగు నుంచి జీవితంలోని కీలక నిర్ణయాలు అన్నిటిని తల్లి మనసులో దాచుకుంటుంది.ఇందులో తల్లి ప్రేమ ఎప్పటికీ తగ్గదు అనే సంకేతం వ్యక్తం అవుతుంది.
“వాళ్ళిక ‘అమ్మా’ ఇదెలా చేయాలి?/అని అడగకపోవడం/ఈ కవితా పంక్తులు తల్లితనంలోకి వచ్చిన నిశ్శబ్ద విరామాన్ని, కాలంతో వచ్చిన దూరాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తాయి. పిల్లలు తల్లిని అమ్మా ఇదెలా చేయాలి?అని అడగకపోవడం, ఇక్కడ నిర్లక్ష్యం కాదు.అది పిల్లల ఎదుగుదల స్వభావాన్ని సూచిస్తుంది.ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి తల్లిని ఆశ్రయించిన పిల్లలు,ఇప్పుడు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే స్థితిలోకి చేరుకున్నారు.పిల్లల్లో వచ్చిన ఈ మార్పు సహజమైనదే.అది తల్లి హృదయంలో మౌన వేదనగా మారుతుంది.అమ్మా అనే పిలుపులో ఆత్మీయత దాగి ఉంది. పిల్లల అమ్మా అనే పిలుపే తల్లికి అవధులు లేని సంతోషాన్ని కలిగిస్తోంది.తల్లికి పిల్లలే ప్రపంచం.పిల్లల అమ్మా అనే పిలుపు తగ్గిపోవడం,తల్లి అవసరం తగ్గింది అనే భావం కాదు.ఇక్కడ తల్లి పాత్ర మారింది అనే సంకేతం.పిల్లలకు మార్గదర్శిగా ఉండాల్సిన తల్లి ఇప్పుడు మౌనసాక్షిగా మిగులుతుంది.ఈ కవితా పంక్తుల్లో భావ వ్యతిరేకత ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది.పిల్లల స్వావలంబన తల్లికి ఆనందాన్ని ఇవ్వాలి. ఇక్కడ తల్లి హృదయంలో ఒక రకమైన వేదన కలుగుతుంది. పిల్లలు అమ్మా ఇదెలా చేయాలి?అని అడగకపోవడం ఒక విజయం.కానీ ఆ విజయానికి తల్లి హృదయం చెల్లించే మూల్యం నిశ్శబ్దమే అని తల్లితనంలో వచ్చే అత్యంత సున్నితమైన దశను చూపిస్తాయి.పిల్లలు బలపడిన క్షణంలోనే తల్లి ప్రేమ మాటల నుండి మౌనంగా మారిపోయే దశను చేరుకుంటుంది.ఇక్కడ పిల్లల ఎదుగుదల ఒక స్పష్టమైన మలుపుగా మారింది.ఒకప్పుడు పిల్లలు ప్రతి చిన్న విషయానికి అమ్మను ఆశ్రయించిన పరిస్థితి ఉండేది.ఎదిగిన పిల్లలు తల్లిని ఆశ్రయించకపోవడం సహజమే.ఇది తల్లి మనసులో ఒక రకమైన శూన్యాన్ని మరింత పెంచుతుంది.
“మీ సలహా లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం/ఈ కవితా పంక్తులు తల్లితనంలో చోటు చేసుకునే అత్యంత గాఢమైన మార్పును సూచిస్తాయి.ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం అనేది కేవలం బుద్ధి పరిపక్వతకు సూచిక కాదు.అది తల్లి పాత్ర నుంచి పిల్లలు క్రమంగా బయటకు నడిచే క్షణాన్ని తెలుపుతుంది.ఒకప్పుడు ప్రతి నిర్ణయానికి తల్లే ఆధారంగా ఉండేది.అలాంటిది ఇప్పుడు ఆ ఆధారం తగ్గింది.పిల్లలు అంతర్గతంగా మారి,వారికి తల్లి స్వయంగా అవసరంలేని స్థితి వస్తుంది.
“మీరు లేకుండానే జీవించడం/మొదలు పెట్టినప్పుడు/అనే కవితా పంక్తి అత్యంత బలమైన భావంతో కూడి ఉంది.ఇది పిల్లల తిరస్కారం కాదు.ఇది పిల్లల స్వావలంబన అయినా తల్లి హృదయంలో ఏర్పడిన శూన్యం.తల్లి ప్రేమ అవసరమైందా?కాదా? అనే పరిశీలనను అది ఒప్పుకోదు.తల్లి ప్రేమ ఉనికిపై ఆధారపడదు.ఈ మార్పు ఒక్క సారిగా జరగలేదు.ఇది ఒక దశ,ఒక ప్రక్రియ.ఇది నెమ్మదిగా మొదలయ్యే పిల్లల ప్రయాణం అని తెలియజేస్తుంది.తల్లి అవసరం లేకుండా పిల్లలు జీవించడం మొదలు పెట్టినప్పుడు, అప్పుడే తల్లి జీవితం కూడా ఆ క్షణం నుంచే కొత్త అర్థాన్ని వెతుక్కోవడం మొదలు పెడుతుంది.ఇది తల్లి సాధించిన విజయమే.ఆ విజయాన్ని కూడా మౌనంగా భరించే శక్తి కూడా తల్లిదే.ఈ కవితా పంక్తులు తల్లి జీవితంలో వచ్చిన మౌన నిర్ణయాన్ని కవయిత్రి అద్భుతంగా చూపిస్తుంది.పిల్లలు స్వతంత్రంగా జీవించడం సహజమే అయినా,అదే సమయంలో తల్లి పాత్ర మెల్లగా పక్కకు చేరింది అనే భావన ఆమెను లోలోపల గాయపరుస్తుంది అని చెప్పిన తీరు వాస్తవికంగా ఉంది.
“అప్పుడే ఆ మౌనం .. హృదయాన్ని కెలుకుతుంది/ఈ కవితా పంక్తి తల్లితనంలోకి అకస్మాత్తుగా ప్రవేశించే అంతర్గత వేదనను అత్యంత ప్రభావవంతంగా ప్రతిబింబిస్తుంది.ఇక్కడ మౌనం కేవలం శబ్దలేమి కాదు.అది మాటలు ఆగిపోయిన తర్వాత మిగిలే శూన్యం.పిల్లల నిర్ణయాలు,వారి స్వతంత్ర జీవితం మొదలైన క్షణంలో,బయటకు కనిపించేది శాంతి అయినా లోపల మాత్రం ఒక అలజడి ఏర్పడుతుంది.ఆ‌ అలజడిని ఇక్కడ మౌనం అనే భావంతో ఆవిష్కరిస్తుంది. పిల్లల మౌనం తీవ్రమైన వేదన కాదు.నిరంతరం హృదయాన్ని తాకుతూ ఉండే సూక్ష్మమైన నొప్పి.ఒక సూదిలాగా మెల్లగా గుచ్చుకుంటూ మరచిపోలేని బాధగా మారుతుంది.ఈ భావం అతిశయంగా కాకుండా మరింత నిజంగా నిలబెడుతుంది. అప్పుడే ఆ మౌనం అనే ఈ అనుభూతి ఆలస్యంగా కాక, వెంటనే కలుగుతుంది అని సూచిస్తుంది.పిల్లల మాటల్లో దూరమయ్యే క్షణానికి తల్లి హృదయం ఆ మార్పును గుర్తిస్తుంది.ఇది భావోద్వేగ స్పందనకు తల్లి హృదయం ఎంత సున్నితమో చూపిస్తుంది.శైలీ పరంగా ఇది చిన్న కవితా పంక్తి అయినా విరామ చిహ్నం ద్వారా భావ విస్తరణ కలుగుతుంది. తల్లి చెప్పలేని మాటలు,దాచుకున్న కన్నీళ్లు, అనిర్వచనీయమైన భావాల్ని సూచిస్తాయి.ఈ కవితా పంక్తి తల్లి ప్రేమలోని మౌన వేదనకు పరాకాష్ట.మాటలు లేనప్పుడు కూడా ప్రేమ ఎలా నొప్పిగా మారుతుందో చెప్పిన తీరు బాగుంది.ఇది కవితలో బలమైన భావ ప్రకటన.మౌనం ఇక్కడ శబ్దరహితంగా గుచ్చుకునే బాధగా మారుతుంది.తల్లి హృదయాన్ని కెలికే ఈ మౌనం బయటకు కనిపించదు.కానీ లోలోపల నిరంతరం క్షోభకు గురి అవుతుంది అనేది వాస్తవం.
“అయినా నవ్వుతారు../ఈ కవితా పంక్తిలో తల్లితనపు పరాకాష్టను,త్యాగానికి ఉన్న ఆత్మ గౌరవాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తాయి.ఇందులో నిజమైన తల్లి ప్రేమ అసలైన స్వరూపం దాగి ఉంది.తల్లి లోలోపల బాధను దాచుకుని పిల్లల ముందు చిరుదరహాసం కురిపిస్తుంది.ఇదే అమ్మల గొప్పతనం,సహజమైన ప్రేమకు అత్యున్నత రూపం.తల్లి హృదయం కెలుకుతున్నా లోపల మాత్రం మౌనం గూడు కట్టుకుని ఉంటుంది.బయటకు మాత్రం నవ్వుతున్న అమ్మ ముఖమే కనిపిస్తుంది.అది నటన కాదు.పిల్లల ఆనందం కోసం తల్లి తన ఎద లోపలి బాధను మరిచేపోయే సహజ స్వభావాన్ని తెలుపుతుంది.
“అదే కదా అమ్మలు/కోరింది/ఇందులో తల్లి ఆశ ఏమిటి? పిల్లలు తన చుట్టూ తిరగడం కాదు.తన నీడలో ఉండడం కాదు.పిల్లలు తమంత తాముగా నిలబడడం.పిల్లలు తమంత తాముగా నిర్ణయాలు తీసుకోవడం.ఈ అవగాహన తల్లి ప్రేమ, అధికారం కాదు.పిల్లల స్వేచ్ఛను అంగీకరించే తత్వం అని వ్యక్తం చేస్తున్నాయి.
“వాళ్ళంత వాళ్ళుగా ఎగరాలని/వారి స్వంత ఆకాశం వెతకాలనే కదా!/తల్లి తన బాధ కన్నా పిల్లల ఆనందాన్ని ముఖ్యంగా భావిస్తుంది.పిల్లలు స్వతంత్రంగా తమ స్వప్నాలను అనుసరించి జీవించాలన్నదే తల్లి కాంక్ష.ఇక్కడ తల్లి ప్రేమ,నిస్వార్థత పరాకాష్టను చేరుకోవడాన్ని సూచిస్తుంది. ఈ కవితా పంక్తులలో తల్లి ప్రేమ,త్యాగం,మౌనవేదన అన్నీ ఒకే భావ స్రవంతిలో ప్రవహిస్తాయి.పిల్లలు ఎదుగుదల తల్లికి గర్వాన్ని కలిగిస్తుంది.ఆ గర్వం వెనుక దాగి ఉన్న తల్లి ఒంటరితనాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తుంది.తల్లి హృదయం ఎప్పుడూ పిల్లల ఆకాశానికి రెక్కలు ఇస్తుంది అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది.ఇందులో ఎంతో సౌందర్యంతో కూడుకున్న రూపకాలు ఉన్నాయి.ఎగరడం – స్వేచ్ఛకు, స్వావలంబనకు ప్రతీక.స్వంత ఆకాశం – స్వప్నాలకు,స్వీయ గుర్తింపుకు సంకేతం.తల్లి పిల్లలకు ఇచ్చేది రెక్కలు ; ఆకాశం వాళ్లది కావాలనేది ఆమె కోరిక.తల్లి ప్రేమ అనేది పిల్లలను తన దగ్గరే కట్టిపడేయడం కాదు.వారిని తన హృదయం నుంచి విడిచిపెట్టి,ప్రపంచం వైపు ధైర్యంగా పంపగలగడం.నవ్వుతో విడిచిపెట్టడమే తల్లితనపు అత్యున్నత విజయము.కవయిత్రి తల్లి ప్రేమ యొక్క లోతును ఆమె మౌన త్యాగాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరిస్తుంది.ఈ కవితా పంక్తులు పిల్లలు ఎదిగి స్వతంత్రంగా మారే క్షణాల్లో తల్లి హృదయంలో చెలరేగే సంఘర్షణలను భావోద్వేగాల సంక్లిష్టతలను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. “ఆ నవ్వు వెనుక .. /అనేది మొదటి నుంచే ద్వంద్వ భావాన్ని సూచిస్తుంది.కవయిత్రి మానవ భావజాలంలోని సూక్ష్మతను ఎంతో సున్నితంగా ఆవిష్కరించింది.నవ్వు సాధారణంగా ఆనందాన్ని,తృప్తిని కలిగిస్తుంది.కానీ ఇక్కడ చెప్పిన నవ్వు నిజమైన ఆనందం కాదు.అది బయటకు కనిపించే ఒక కృత్రిమ ప్రకాశం మాత్రమే.లోపల నిగూఢంగా దాగిన భావాలను,మౌనంగా మరుగున పడేసే ఒక తెర..
“ఒక చిన్న విరుపుని దాచుకుంటుంది హృదయం/అనేది ఆ బాధ స్వభావాన్ని పూర్తిగా నిర్వచిస్తుంది.హృదయం తన లోపలి గాయాన్ని బహిరంగం చేయదు.నవ్వు ఆనందానికి ప్రతీకగా కనిపించినా,దాని వెనుక దాగి ఉన్న చిన్న విరుపు – తల్లి హృదయంలోని మౌన బాధను సూచిస్తుంది.అది తల్లి హృదయంలో పెద్దగా కనిపించని చిన్న గాయం అయినా లోపల నిత్యం నొప్పిని కలిగిస్తుంది.విరుపు చిన్నదిగా కనిపించినా అది హృదయంలోని నిగూఢమైన బాధను,తీరని లోపాన్ని సూచిస్తుంది.అది బయటికి స్పష్టంగా కనిపించదు. కానీ లోపల మాత్రం బాధ నిరంతరం రేపుతుంది‌.సమాజం ముందు బలంగా కనిపించడానికి నవ్వును ఆశ్రయిస్తుంది. హృదయం బాధను దాచుకోవడం బలహీనత కాదు.ఇది ఒక రకమైన ధైర్యం,సహనం,తన బాధను ఇతరులపై మోపకుండా తానే మౌనంగా మోసుకుపోవడమే ఇక్కడి భావ సారాంశం. బయట కనిపించే ఆనందం లోపల దాగి ఉన్న మౌన వేదన మధ్య ఉన్న అంతర్లీన విరుద్ధతను నవ్వు అనే సాధారణ ప్రతీక ద్వారా కవయిత్రి మనుషుల హృదయాల్లో దాగి ఉండే అనుభూతుల లోతును సున్నితంగా ఆవిష్కరించింది. “ఎదిగిన పిల్లల తల్లి అవ్వడం అంటే/ఇక్కడ ఆరంభమే తల్లి పాత్ర ఒక కొత్త నిర్వచనాన్ని పొందుతుంది.మాట్లాడకుండా ఉండడం,నేర్చుకోవడం,తన భావాలను తానే అణిచి వేయడం.ఈ మౌనం త్యాగానికి నిదర్శనం.కవయిత్రి ఇక్కడ చిన్నపిల్లల మరియు ఎదిగిన పిల్లల తల్లితనానికి మధ్య ఉన్న అంతరాన్ని సూచిస్తున్నది.ఎదిగిన పిల్లలు శారీరకంగా మాత్రమే కాదు,వారి మనసులో చెలరేగే భావోద్వేగాలు,వారు ఆలోచనలో స్వతంత్రులు అవుతారు.ఆ స్వతంత్రతను అంగీకరించడం తల్లితనానికి ఒక కొత్త పరీక్ష అవుతుంది. “మాటల్ని దిగమింగడం నేర్చుకోవడం – /అనే క్రియ అత్యంత బలమైనది.తల్లి చెప్పాలనుకున్న మాటలు ప్రేమతో వచ్చినవే.అయినా,అవి పిల్లల స్వేచ్ఛను హరించకూడదు. వారి స్వంత అనుభవాలను,అడ్డుకోకూడదు అనే అవగాహనతో తల్లి మౌనంగా మింగి వేయాల్సి వస్తుంది.అది భయంతో వచ్చిన మౌనం కాదు,ఆత్మ నిగ్రహం,పరిణతమైన ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.ఆత్మ నిగ్రహంతో ఏర్పడిన ఈ మౌనం తల్లిని చిన్నదిగా చేయదు,మరింత గొప్పదిగా చేస్తుంది.తల్లి తన అనుభవాల్ని,ఆదేశాల్ని పక్కన పెట్టుతుంది.పిల్లలు వారి జీవితాన్ని వారే తీర్చిదిద్దుకోవాలి. పిల్లలు తమ మార్గం తామే కనుగొనాలి అని తల్లి అనుమతించడమే ఇక్కడ చూస్తున్నాం.ఈ కవితా పంక్తులు మాటల నుంచి మౌనానికి మారిన ప్రేమను చిత్రిస్తాయి.ఎదిగిన పిల్లల తల్లి పిల్లలకు చెప్పడాన్ని తగ్గించాలి.పిల్లల మనసులోని భావాలను అర్థం చేసుకోవాలి అనే లోతైన సత్యాన్ని సున్నితంగా తెలియజేస్తుంది.
“వాళ్ళు తప్పు చేస్తున్నా చెప్పకుండా ఉండటం/అనేది తల్లి లోపలే ఒక నిశ్శబ్దమైన ప్రేమ తత్వం,ఒక అంతర్లీనమైన త్యాగ భావన దాగి ఉంది.ఇది మౌనానికి గొప్ప అర్థం ఇచ్చిన కవితా పంక్తి.సాధారణంగా తప్పు కనిపిస్తే సరిదిద్దాలి,అదే ప్రేమగా భావిస్తాం.అయితే ఇక్కడ కవయిత్రి సాంప్రదాయ భావనకు కొత్త అర్థాన్ని ఇస్తుంది.తప్పు కనిపిస్తున్నా చెప్పకుండా ఉండటం అనేది ఒక నిర్లక్ష్యం కాదు.అది ఒక అవగాహనతో కూడిన మౌనం.ఈ మౌనం వెనుక ఉన్న భావం ఏమిటి?పిల్లలు ఎదగాలి తమ తప్పులను తాము తెలుసుకోవాలి.పిల్లలు తాము చేసిన తప్పుల నుంచే ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి అనే విశ్వాసం ఉంది.నియంత్రించే ప్రేమను తల్లి అందించదు.పిల్లలకు స్వేచ్చను ఇచ్చే ప్రేమను తల్లి అందిస్తుంది.ఇది మాటలతో బోధించక, అనుభవాలతో నేర్పే మాతృ హృదయపు తత్వం.ఇక్కడ చెప్పకుండా ఉండటం అనేది బలహీనత కాదు.అది తన ఆందోళనను లోపలే మింగేసుకుని,ఎదుటివారి స్వతంత్రతను గౌరవించే ధైర్యం.తప్పు చెపితే పిల్లల మనసుకి గాయం అవుతుందేమో, వారి ప్రయాణాన్ని మధ్యలో ఆపేస్తారేమో అనే భయంతో,ప్రేమ మాటలుగా కాక మౌనంగా మారుతుంది.ఈ కవితా పంక్తిలో తల్లితనం,పరిపక్వ ప్రేమ,మానసిక విశాలతను సూచించే ఒక నిశ్శబ్ద స్వీకారం ఉంది.ఇందులో గట్టిగా నిలిచే మాటలు ఏవి లేకపోయినా భావం సున్నితమైనది.తల్లి ప్రేమలోని అత్యంత క్లిష్టమైన దశను చూపిస్తుంది.ఒకప్పుడు తప్పును సరిదిద్దే హక్కు ఉన్న తల్లి,ఇప్పుడు ఆ హక్కును కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.ఇది బాధతో కూడిన పరిపక్వతను సూచిస్తుంది.
“వారి సమాచారం అందకపోయినా/అనే కవితా పంక్తి పిల్లల గురించి తల్లి పడే ఆవేదనను అత్యంత మృదువుగా మౌనంగా వ్యక్త పరుస్తుంది.ఇది తల్లి హృదయానికి ఆందోళన కలిగించే విషయం.ఇక్కడ తల్లి ఆవేదన అరుపు వలె బయటపడదు.పిల్లల గురించిన సందేశం రాకపోవడంతో ఆమె హృదయం లోలోపలే ఉలిక్కిపడుతుంది.ఇది అనుమానంతో నిండిన భయం కాదు.అధికారంతో అడిగే ప్రశ్న కాదు – పిల్లలు బాగున్నారా?అనే అస్పష్టమైన ఆందోళన మాత్రమే.తల్లి ఆవేదన వారిని బంధించదు,వెంటాడదు.కానీ వారికి తెలియకుండానే ఆమె మనసు వారి హృదయాన్ని తాకుతూ ఉంటుంది.పిల్లల సమాచారం లేకపోయినా ఆమె ప్రేమ ఆగదు.ఆమె ప్రార్థన ఆగదు.మాట లేకుండా ఆమె ఎదురు చూపు కొనసాగుతుంది.అందుకే తల్లి ఆవేదన శబ్దం లేని బాధగా,నిశ్శబ్దాన్ని తెలిపే అమితమైన మమకారంగా చిత్రిస్తుంది.ఇక్కడ సమాచారం అనేది కేవలం వార్త కాదు – అది వారి శ్వాసకు ధ్రువీకరణ.వారి క్షేమానికి నిదర్శనం.ఇది హృదయానికి ఊరట కలిగించే చిన్న సంకేతం.వారి సమాచారం అందకపోయినా అనేది వేచి చూడటంలోని నిశ్శబ్దాన్ని సూచిస్తుంది.ఇది ఆందోళనతో కూడిన అరుపు కాదు.భయంతో ఉలిక్కిపడే ఉద్వేగం కాదు – అది ఆశను మనసులో అణిచిపెట్టుకొని మౌనంగా కూర్చునే ఓర్పు.ఈ కవితా పంక్తిలో వేదన బయటికి కనిపించదు.ఎవరిని నిలదీయదు.ప్రశ్నలు అడగదు.కేవలం కాలానికి తన మనసును అప్పగించి ఎదురుచూసే అంతర్లీన ప్రేమగా నిలుస్తుంది.ఇది పిల్లల పట్ల గల అనుబంధాన్ని మౌనంగా కొనసాగుతున్న మనసు సంబంధాన్ని సూచిస్తుంది.అది సమాధానం అడగకుండా ఉండే సంయమనం ఇక్కడ కనిపిస్తుంది.
“ఆతురతను అణుచుకోవడం/ఇక్కడ ఆతురత అనేది కేవలం సమాచారం కోసం తపన కాదు.అది లోపల ఉప్పొంగే భయం, ఆందోళన,అనిశ్చితి – అన్నిటి సమ్మేళనం.పిల్లల సమాచారం రాకపోవడం సహజంగా తల్లి మనసును కుదిపేస్తుంది. అలాంటి వేళ ఆతురత బయటకు వచ్చి అరవాలి అనుకుంటుంది.కానీ ఆతురతను అణుచుకోవడం అంటే ఆ భయాన్ని ఆ తొందరను ప్రేమతో లోపలే కట్టడి చేయడం.అది నిర్లక్ష్యం కాదు.నిరాకరణ కాదు.అది ఎదుటివారి స్వేచ్ఛను గౌరవిస్తూ తన మనసును నియంత్రించుకునే మౌన సాధన.ఈ కవితా పంక్తిలో పరిపక్వమైన ప్రేమ కనిపిస్తుంది.బయటికి కనిపించని లోపలి పోరాటం.సమాచారం రాకపోయినా ఆతురతని అణిచివేసి వేచి చూడటం,ఇది నేర్చుకునే భావ స్థితి.అందుకే ఈ కవితా పంక్తి మాటలతో కన్నా మౌనంతో ఎక్కువగా మాట్లాడుతుంది.అరవని ఆతురత,చూపించని కలత – ఇవే ఈ కవితా పంక్తికి ఉన్న గొప్ప బలం.అంటే ప్రేమ సహజంగా కోరుకునే సమీపాన్ని తెలుసుకోవాలి అనే తపనను తాను నిగ్రహించుకోవడం.ఇది ప్రేమను నియంత్రించడం కాదు; ప్రేమలోనే తనను తాను నియంత్రించుకోవడం.ఆతురతను అణచడం అంటే తన హృదయాన్ని వెనక్కి లాగడం కాదు – ఎదుటి వారి స్వేచ్ఛను ముందుకు నెట్టడం.పిల్లల గురించి వారు ఎక్కడికి వెళ్ళారో? వారు ఏం చేస్తున్నారో?వారి సమాచారం తెలియకపోవడం వల్ల తల్లి మనసులో ఆందోళన కలిగించినా,ఆతురతను బయటకు చూపకుండా అణిచివేయడం తల్లి మౌన ధైర్యానికి సంకేతం.
“దూరాన్నుంచే వారిని ప్రేమించడం/అనే కవితా పంక్తి తల్లి ప్రేమలోని అత్యంత మృదువైన కానీ లోతైన రూపాన్ని ఆవిష్కరిస్తుంది.ఇక్కడ దూరం భౌతిక విభజన మాత్రమే కాదు.అది ఎదిగిన పిల్లల జీవితాల్లోకి తల్లి వెనక్కి అడుగు వేసిన స్థానం.వారి సమాచారం అందకపోయినా,మనసులో ఆందోళనా అలలు ఎగసినా,ఆతురతను అణుచుకొని వారిని వారి ప్రపంచంలో ఉండనివ్వగలగడం – అదే ఈ ప్రేమ యొక్క అసలైన పరిపక్వత.దూరం నుంచే వారిని ప్రేమించడం అంటే వెంటాడని మమకారం,చూపించని ఆరాటం.తల్లి హృదయంలో చెలరేగే ఆరాటం తగ్గదు.కానీ అది అరవదు. మౌనంగా ఉంటుంది.కంటికి కనిపించని జాగ్రత్తగా మారుతుంది.ఈ కవితా పంక్తులు తల్లి ప్రేమ,పిల్లలపై ఉన్న ఆందోళన వారి స్వేచ్ఛపై భారం పడకుండా తనలోనే దాచుకుంటుంది.అందుకే ఈ ప్రేమ దగ్గరగా ఉండి కూడా దూరంగా నిలబడగలదు.దూరాన్నుంచే వారిని ప్రేమించడం అంటే వారిని విడిచి పెట్టడం కాదు.వదిలేయడం కాదు.వారి ఎదుగుదలకి తాను అడ్డు కాకుండా తన ఆరాటాన్ని నియంత్రించుకుంటూ ప్రేమించగలగడం.ఈ కవితా పంక్తి తల్లి ప్రేమ అరవదు అనే రూపాన్ని,ఆతురతను అణుచుకునే మౌన త్యాగాన్ని సున్నితంగా వ్యక్తం చేస్తుంది.ఈ కవితా పంక్తి ప్రేమకు భౌగోళిక పరిమితులు లేవు అని చెబుతుంది.దగ్గరగా ఉండడం ప్రేమకు ప్రమాణం కాదు అని,దూరం నుంచి కూడా వారిని అదే లోతుతో ప్రేమించవచ్చు అని కవయిత్రి నిరూపిస్తుంది.ఇక్కడ పిల్లలు దూరమైనా తల్లికి వారిపై అనురాగం తగ్గదు.
“జోక్యం లేకుండా కేవలం నిశ్శబ్దంగా ప్రేమించడం/ఇక్కడ జోక్యం లేకుండా అనడం అనాసక్తి కాదు.దూరంగా నెట్టి వేయడం కాదు.అది తెలిసి వెనక్కి తగ్గడం.పిల్లల జీవితాల్లోకి తల్లి తన ప్రేమను భారంగా మారనివ్వకుండా అడుగులు మెల్లగా వెనక్కి వేయడం.నిశ్శబ్దంగా ప్రేమించడం అంటే ప్రశ్నలు అడగకుండా.వారికి సలహాలు ఇవ్వకుండా,వారి విషయాల్లో తల దూర్చకుండా,భయాలను బహిర్గతం చేయకుండా,తన హృదయంలోనే ఆరాటాన్ని అణిచి పెట్టుకోవడం.అది అరవని ప్రేమ.చూపించని జాగ్రత్త.ఈ నిశ్శబ్దంలో తల్లి ప్రేమ తగ్గదు – మరింత లోతుగా మారుతుంది‌.దగ్గరగా ఉండే ప్రేమ నుంచి దూరంగా ఉండే ప్రేమగా రూపాంతరం చెందుతుంది.వారి జీవితాలకు నీడ కాకుండా దూరాన నిలిచే వెలుగుగా మారుతుంది.జోక్యం లేకుండా కేవలం నిశ్శబ్దంగా ప్రేమించడం అంటే తల్లి ప్రేమలోని పరిపక్వ స్థాయి.ఆమె పిల్లల స్వేచ్ఛను తన మమకారంతో కట్టిపడేయదు.వారి దారిలో అడ్డుకాకుండా వారికి దూరాన నుంచే అదృశ్యంగా కాపలా ఉంటుంది.ఈ కవితా పంక్తి తల్లి ప్రేమ మాట్లాడకుండానే మాట్లాడే రూపాన్ని,చేయి పట్టుకోకుండా బలాన్ని ఇచ్చే మౌనాన్ని సున్నితంగా వ్యక్తం చేస్తుంది.ఇదే ఈ భావ సమూహానికి హృదయం.జోక్యం లేని ప్రేమ అనేది స్వేచ్ఛను హరించని మమకారం – దగ్గరగా ఉండాలనే తపనను అదుపులో ఉంచి,వారి ప్రయాణాన్ని అడ్డుకోకుండా దూరం నుంచే తోడుగా నిలిచే ప్రేమ.నిశ్శబ్దం ఇక్కడ ఖాళీ కాదు.అది పూర్తి అయిన భావం.ఈ కవితా పంక్తులలో సౌందర్యం విస్తృత మౌనంలో ఉంది.ఇందులో ఎక్కడ ఆర్తనాదం లేదు.ఆదేశం లేదు,ఆక్రోశం లేదు.ఉన్నది ఒక్కటే – తన అవసరాలను పక్కనపెట్టి ఎదుటివారి స్వాతంత్ర్యాన్ని కాపాడే ప్రేమ.ఈ కవితా పంక్తులు సాధించిన ప్రేమ స్వరూపం.మాటలు తగ్గిన చోట,భావం లోతుగా మాట్లాడే ఒక సున్నితమైన అనుభూతి.ఇది తల్లి ప్రేమకు కొత్త రూపం.తల్లి దగ్గరగా ఉండి చూసుకోవడం కాదు.తల్లి దూరంగా ఉండి కూడా పిల్లవాడి గురించి ఆత్మీయంగా ఆలోచించడం,జోక్యం లేకుండా కేవలం నిశ్శబ్దంగా మమకారంతో మనసులోనే ప్రేమించడం.ఇది తల్లి పిల్లలకు స్వేచ్ఛ నిచ్చిన ప్రేమని అర్థం అవుతున్నది.ఇందులో ప్రేమలోని పరిమితి,గౌరవం,స్వేచ్ఛ స్పష్టంగా వ్యక్తం అవుతాయి.
“చేసేదేం లేక చేతులు ముడుచుకొని/అనే కవితా పంక్తి తల్లి జీవిత ప్రయాణంలో వచ్చిన ఒక మౌన మలుపును సూచిస్తుంది.ఇక్కడ చేసేదేం లేక అనడం అలసత్వం కాదు, నిర్లక్ష్యం కాదు.పిల్లల కోసం తల్లి తాను చేయగలిగినదంతా చేసింది,రాత్రిళ్ళు నిద్ర లేక తాను కాపలా కాసింది,వారి ఎదుగుదల కోసం తాను పాటుపడింది,వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది,ఇవన్నీ చేసిన తరువాత తనకు చివరికి అశక్తత మిగిలింది.చేతులు ముడుచుకోవడం అనేది చేతుల వద్ద శక్తి లేక పోవడమే కాదు.అది జోక్యం కూడదన్న స్వయంకృత నిర్ణయం.తల్లి ప్రేమ ఇంకా ఉప్పొంగుతునే ఉంది.కానీ ఆ ప్రేమను చేతుల ద్వారా కాదు,హృదయం ద్వారానే వ్యక్తం చేయాల్సిన దశకు చేరుకుంది.ఒకప్పుడు తల్లి తన చేతులతో పిల్లలకు తినిపించింది,వారిని ఆడించింది, వారు కిందపడితే లేపింది,వారికి అండగా నిలిచింది,వారు భయపడితే దగ్గరకు తీసుకుంది,వారి భయాన్ని పారద్రోలింది, ఇప్పుడు వారి కోసం చేయాల్సిన శక్తి ఉన్నా తావే చేతులు ముడుచుకుని మౌనంగా ఉండాల్సిన పరిస్థితి.ఈ కవితా పంక్తిలో విషాదం ఏమిటి?పిల్లలు దూరమయ్యారు అని కాదు.తల్లి చేయగలిగిన పనులు సకాలంలో పూర్తి చేసింది. కానీ,తల్లికి ఇప్పుడు కేవలం ప్రేమించడమే మిగిలిన స్థితి.ఇది అత్యంత బాధాకరమైనది.అదే అత్యంత పరిపక్వమైన ప్రేమ కూడా.చేసేదేం లేక చేతులు ముడుచుకొని అనే కవితా పంక్తి జోక్యం చేయగల శక్తి ఉన్నా చేయకుండా నిలబడే మౌనాన్ని గాఢంగా వ్యక్తం చేస్తుంది.ఇది తల్లి అశక్తతను కాదు, – అవస్థను గౌరవంగా భరించే స్థితిని సూచిస్తుంది చేయగలిగినదంతా చేసి తల్లి ఇప్పుడు జోక్యం చేసుకునే హక్కు కూడా లేక తన చేతులను తానే ఆపేసుకున్న పరిస్థితి ఇది.ఈ దృశ్యం తల్లి అసహాయతను స్పష్టంగా చూపిస్తుంది. చేయగలిగేది చాలా ఉన్నా చేయకూడదనే నిర్ణయమే తల్లిని స్థబ్దంగా నిలబెడుతుంది. “వణికే హృదయాన్ని అదుపులో పెట్టుకొంటూ/అనే కవితా పంక్తి చేసేదేం లేక చేతులు ముడుచుకొని అనే భావానికి లోపలి అర్థాన్ని,భావోద్వేగాల గుండెను అందిస్తుంది.చేతులు ముడుచుకోవడం బయట కనిపించే స్థితి అయితే,హృదయం
వణకడం లోపల జరుగుతున్న తుఫాను.చేయగలిగేదేమి లేక నిలబడిన తల్లి మనసులో మాత్రం నిశ్శబ్దంగా వణుకుతునే ఉంటుంది.వణికే హృదయం అంటే భయంతో కొట్టుకుంటున్న మనసు,అనిశ్చితితో కంపిస్తున్న భావాలు.పిల్లల క్షేమంపై ఉన్న అపారమైన ప్రేమే ఆ వణుకుకు కారణం.అది బలహీనత కాదు – మమకారానికి వచ్చిన సహజ స్పందన.అదుపులో పెట్టుకొనడమంటే ఆ వణుకును అణిచి వేయడం కాదు.పిల్లల మీద పడకూడదని తల్లి తనలోనే ఆ బాధను కట్టడి చేయడం.చేతులు కట్టుకున్నట్టే,హృదయాన్ని కట్టడి చేసుకున్న స్థితి ఇది.ఈ రెండు కవితా పంక్తులు కలిసినప్పుడు తల్లి ప్రేమలోని ద్వంద్వం స్పష్టం అవుతుంది.బయటికి శాంతంగా కనిపించే రూపం,లోపల మాత్రం నిరంతరం కదలాడే ఆరాటం,చేయలేని చేతులు,ఆగని హృదయం – ఇవే ప్రేమ యొక్క నిజమైన రూపం.అందుకే వణికే హృదయాన్ని అదుపులో పెట్టుకుంటూ అనే కవితా పంక్తి తల్లి ప్రేమలోని ఆరవని బాధను,నిశ్శబ్దంగా భరించే ధైర్యాన్ని సున్నితంగా లోతుగా వ్యక్తం చేస్తుంది.వణికిన హృదయాన్ని నియంత్రించుకోవడం.ఇది అవసరమైన అసహనం.ఇక్కడ హృదయం వణుకుతుంది.కానీ ఆ వణుకు బయటకి రావడానికి తల్లి అనుమతించదు.ఇది భావోద్వేగాన్ని నియంత్రించే పరిపక్వత.ప్రేమ బలహీనంగా కాక క్రమశిక్షణగా మారిన క్షణంను తెలుపుతుంది.ఇది లోపలి తుఫాను చిత్రణ. హృదయం వణుకుతోంది.కానీ ఆ వణుకును బయటికి రానివ్వదు. భయాన్ని,ఆరాటాన్ని,అనిశ్చితిని అమ్మలు తమతోనే కట్టడి చేసుకుంటారు.
“కొన్ని సార్లు అమ్మలు చెప్పుకుంటారు – / చాలా సార్లు పైకి చెప్పరు/ఇక్కడ తల్లి మౌన స్వభావం స్పష్టం అవుతుంది.తన బాధను బయటికి చెప్పడం వల్ల తల్లికి ఉపశమనం వస్తుంది, తన బాధను చెప్పితే పిల్లల మీద భారం పడుతుంది అనే భయంతో తల్లి మాటలను లోపలే మింగేస్తుంది.మాట కన్నా మౌనం మేలు అని భావిస్తుంది.ఈ ద్వంద్వతే తల్లితనానికి అసలైన రూపం.మాటలుగా చెప్పినప్పుడు అది స్వల్పం ; చెప్పని సమయంలోనే అసలు భారం అంతా దాచుకుని ఉంటుంది.చెప్పకపోవడమే తల్లి మోసే పెద్ద భారంగా మారుతుంది.ఈ కవితా పంక్తులు తల్లుల అంతర్గత ప్రపంచాన్ని బహిర్గతం చేస్తాయి.బాధను ఎవరితోనైనా పంచుకోకుండా,ఎక్కువగా దాన్ని లోలోపలే దాచుకుంటారు.
“సరే,పరవా లేదనుకున్నా/అనేది తల్లి నేర్చుకున్న ఆత్మ సాంత్వన.అదే నిజమైన ఒప్పుకోలు కాదు.తన హృదయాన్ని తానే నెమ్మది పెట్టుకునే ప్రయత్నం.బయటకి చెప్పే ధైర్యం లేక లోపల మాత్రం ఇంకా ప్రశ్నలే.ఇది తల్లి మనసుకే చెప్పుకుంటుంది.తల్లి పరిస్థితిని ఒప్పుకున్నట్టు సూచిస్తూ తన మనసును తానే సమాధానపరుచుకునే ప్రయత్నం చేస్తున్నది.
“లోపల మాత్రం కొంచెం దిగులు చీకటి/ పుడుతుంది/అనే కవితా పంక్తి ఈ కవితకు భావాత్మక గుండె.ఈ దిగులు అరవదు.పెద్దగా కనిపించదు.అది వెలుగు లేనిది కాదు – వెలుగు దూరంగా నిలబెట్టబడిన స్థితి.నిశ్శబ్దంగా,నెమ్మదిగా హృదయంలో చీకటిలా పుడుతుంది.తల్లి ప్రేమలోని అరవని బాధను,చూపించని వణుకును మాటల కన్నా లోతైన మౌనాన్ని అతి మృదువుగా చిత్రిస్తుంది.ఈ కవితా పంక్తి మొత్తం భావానికి లోతు ఇస్తుంది.దిగులు ఇక్కడ బయటకు పొంగదు.నిశ్శబ్దంగా చీకటిలా పుడుతుంది.అది వెలుగు లేకపోవడం కాదు – వెలుగు దూరంగా నిలబెట్టబడిన స్థితి.ఈ కవితా పంక్తులలో తల్లి బాధను నేరుగా చెప్పకుండా ఆ బాధ చుట్టూ ఏర్పడే మౌనాన్ని చూపించడం ద్వారా కవయిత్రి మనసును తాకుతుంది.ఇవి తల్లి తనంలోని అత్యంత సున్నితమైన క్షణాలు.మాటలకందని బాధను ప్రేమతోనే అదుపులో పెట్టుకున్న హృదయాన్ని ప్రతిబింబించే లోతైన ప్రకటన.ఈ కవితా పంక్తులు తల్లి హృదయంలో మిగిలే మసక వెలుతురును చూపిస్తుంది.పైకి సమాధానంగా కనిపించినా, లోపల మాత్రం చిన్న చీకటి పుట్టడం – అది తల్లి ప్రేమకు చెల్లించాల్సిన మౌన మూల్యం.ఈ కవితా పంక్తులలో ఎదిగిన పిల్లల తల్లి అనుభవాన్ని తెలుపుతాయి.ఇవి గొంతెత్తి చెప్పే బాధ కాదు.మౌనంగా భరించే వేదన.నవ్వులో దాచిన విరుపు.మాటల్లో లేని ప్రేమ,దూరంలో పెరిగే ఆత్మీయత – ఇవన్నీ కలిసి అమ్మ అనే అక్షరానికి లోతైన అర్థాన్ని ఇస్తాయి. ఈ కవితా పంక్తులలో కవయిత్రి అమ్మ అనే పాత్రను అత్యంత లోతైన మానసిక స్థాయిలో ఆవిష్కరిస్తుంది. బయటకు కనిపించే చిరునవ్వు వెనుక దాగి ఉన్న వేదనను ఈ కవితా పంక్తులు చక్కగా వ్యక్తం చేస్తాయి.ఇది మాటలతో చెప్పలేని అనుభూతి కవిత్వంగా నిలుస్తుంది.ఈ కవితా పంక్తులు అమ్మ హృదయంలోని మౌన తుఫానును అద్భుతంగా ఆవిష్కరిస్తాయి.బయటకు కనిపించే తల్లి మనసులో మాటల కందని ఆందోళన ఎలా కదలాడుతుందో గొప్పగా చూపిస్తాయి.
“ముందులా ప్రతిక్షణంలో/మీ భాగస్వామ్యం ఉండదిక/అనేది సంబంధాల్లో వచ్చే మౌన మార్పును లోతుగా వ్యక్తపరుస్తుంది. ఇది కాలం తీసుకు వచ్చే సహజమైన దూరం.ముందులా అనే పదం గతంలోని సమీపాన్ని గుర్తుకు తెస్తుంది – ప్రతిక్షణం పంచుకున్న మాటలు,చూపులు,నిర్ణయాలు.కానీ ఇప్పుడు ఆ నిరంతర భాగస్వామ్యం నెమ్మదిగా సడలిపోతుంది.ఇది ఒక్కసారిగా తెగిపోవడం కాదు.గమనించ లేనంత మెల్లగా జరిగే మార్పు.ఇక్కడ కవయిత్రి సంబంధం గురించి చెప్పడం లేదు,కేవలం స్వరూపం మారింది అని సూచిస్తుంది.ఇది ప్రేమ తగ్గిపోయిన స్థితి కాదు – ప్రేమ వ్యక్తమయ్యే విధానం మారిపోయిన దశ. ఇక్కడ ఒక స్వీకారం ఉంది – అతి చేరువ నుంచి కొంత దూరానికి చేరుకున్నా,ఆ దూరంలో కూడా అనుబంధం మౌనంగా కొనసాగుతూనే ఉంటుంది.ఈ కవితా పంక్తిలో ముఖ్యంగా తల్లితనం,భాగస్వామ్యం,ఇది ఏ లోతైన సంబంధానికైనా వర్తిస్తుంది.ఏదో ఒక దశలో ప్రతిక్షణం అనేది అవసరమైనప్పుడుగా మారుతుంది.అది వియోగం కాదు – పక్కకు వచ్చిన ప్రేమ యొక్క నిశ్శబ్ద రూపాంతరం.ఇందులో మనసుకు చెప్పేది ఇదే – నిజమైన అనుబంధం అనేది ప్రతిక్షణం కనిపించాల్సిన అవసరం లేదు ; అది కనిపించకపోయినా అంతర్లీనంగా ఉండగలిగినప్పుడే అది లోతైన ప్రేమగా నిలుస్తుంది.ఈ కవితా పంక్తులు తల్లికి ఎదురయ్యే వాస్తవాన్ని నిరాడంబరంగా అంగీకరిస్తాయి. ఒకప్పుడు పిల్లల జీవితాలలో కేంద్రంగా ఉన్న తల్లి కాలక్రమంలో ప్రక్కకు నెట్టబడుతుంది.ఇది నిరాకరణ కాదు. పిల్లల ఎదుగుదల సహజ పరిణామం.అయినా ఈ సత్యం హృదయానికి మృదువైన గాయం చేస్తుంది.ఈ కవితా పంక్తుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.ఒకప్పుడు ప్రతి క్షణంలో పిల్లల జీవితానికి కేంద్రంగా ఉన్న తల్లి,ఇప్పుడు ఆ స్థానం నుండి మెల్లగా పక్కకు జరుగుతుంది.ఇది సహజమైన విరామమే అయినా,భావోద్వేగపరంగా తల్లికి భారమే అవుతుంది.
“వారికి మీ అవసరం అంతగా ఉండదిక/అనే కవితా పంక్తి సంబంధాల్లో వచ్చే అత్యంత సున్నితమైన మలుపును మౌనంగా,కానీ లోతుగా సూచిస్తుంది.ఇందులో ఎటువంటి తిరస్కారం లేదు,ఎలాంటి నిర్లక్ష్యం లేదు.ఉన్నది ఒక్కటే అవసరం తగ్గిపోయిన దశ – ప్రేమ తగ్గిపోయిన దశ కాదు. అంతగా అనేది భావంలో మృదుత్వాన్ని తీసుకొస్తుంది. అవసరం పూర్తిగా లేనిది కాదు.అది కేవలం ముందులాగా తీవ్రంగా ప్రతి అడుగులో అవసరమైనది కాదు.ఇక్కడ అవసరం అనేది శారీరకమో,ఆర్థికమో మాత్రమే కాదు – మనసు అలవాటు పడిన తోడు,ప్రతిక్షణం తోడు కావాలనే మనసు స్థితి.ఆ స్థితి నుంచి వారు నెమ్మదిగా బయటకు వస్తున్నారు.ఇది ఎదుగుదల యొక్క సంకేతం.ఒకప్పుడు మీ ఉనికి లేకుండా వారి రోజు పూర్తి అయ్యేది కాదు.ఇప్పుడు మీ ఉనికి వారి లోపల నిశ్శబ్దంగా నిలిచి పోతుంది.అది బయటకు అడిగే అవసరంగా మారడం లేదు.ఇందులో తల్లి హృదయానికి వచ్చే మౌన వేదన దాగి ఉంది.కానీ అదే సమయంలో మీ ప్రేమ ఫలించి వారిని స్వతంత్రంగా నిలబెట్టిందన్న గర్వం కూడా దానిలో కలిసి ఉంటుంది.ఈ కవితా పంక్తులు విచ్ఛిన్నాన్ని కాదు,విడిచిపెట్టగలిగే ప్రేమను ప్రతిబింబిస్తుంది.అవసరం లేని చోట కూడా ఉండగలిగే అనుబంధమే,ఈ భావానికి అంతర్లీన హృదయం.తల్లి హృదయాన్ని మెల్లగా తాకే నిజాన్ని ఒప్పుకోవాలి.ఇక తల్లి అవసరం తగ్గిపోవడం,ప్రేమ తగ్గిందన్న అర్థం కాకపోయినా తల్లికి మాత్రం అది ఒంటరితనానికి సంకేతంగా అనిపిస్తుంది.
“అయినా అమ్మలు/వాళ్ళకి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేస్తూ/అనే కవితా పంక్తులు తల్లితనంలోని నిశ్శబ్దమైన నిరంతర ప్రేమను అత్యంత సహజంగా వ్యక్తపరుస్తాయి. అయినా అనే పదమే ఈ కవితా పంక్తికి ఆత్మ వంటిది. ముందుగా చెప్పబడిన దూరం అవసరం తగ్గిన వాస్తవం.ప్రతి క్షణం భాగస్వామ్యం లేకపోయినా ఖాళీ – అన్నిటిని అంగీకరించిన తర్వాత కూడా తల్లి ప్రేమ ఆగదని చెబుతుంది. ఇక్కడ ప్రేమ మాటలుగా కాదు,ప్రశ్నలుగా కాదు, ఫిర్యాదులుగా కాదు – వంటగా మారుతుంది.వాళ్ళకి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేయడం,తల్లి ప్రేమకు అత్యంత సహజమైనది.ఈ వంటకాలు కేవలం ఆకలి తీర్చడానికి కావు. వాటిలో జ్ఞాపకాలు ఉంటాయి.పెరిగిన సంవత్సరాల అలవాట్లు ఉంటాయి.నీకిష్టం అని గుర్తుంచుకునే హృదయ శ్రద్ధ ఉంటుంది.వాళ్ళ అవసరం తగ్గినా,వాళ్ళ ఇష్టం తల్లి మనసులో తగ్గదు.ఇక్కడ తల్లి తన ఉనికిని ప్రకటించదు, అడగదు,పిల్లలు ఏం తిన్నారో? ఏం తినలేదో?అనే సందేహం లేకుండా,కేవలం వంటలు సిద్ధం చేస్తూ ఉంటుంది.ఈ కవితా పంక్తులు చెబుతున్నది ఇదే.నిజమైన తల్లితనం అవసరంగా అడిగినప్పుడు మాత్రమే కాదు,అవసరం లేనప్పటికీ ప్రేమగా మిగిలే నిరంతర చర్య.అందుకే ఈ అయినా లోపల వేదన ఉంది.అంగీకారం ఉంది,అదే సమయంలో అడగని తల్లి ప్రేమ యొక్క మహిమ కూడా ఉంది.ఇదే ఇక్కడ గొప్ప మలుపు. ఇక్కడ తల్లి అవసరం తగ్గినా,భాగస్వామ్యం కనిపించకపోయినా తల్లితనం ఆగదని ఇది సూచిస్తుంది.ప్రేమ ప్రతిఫలంపై ఆధారపడదు అనే సత్యం ఇక్కడ నిలుస్తుంది. ఇది శారీరక సేవ కాదు,జ్ఞాపకాలలోకి చేసే ప్రయాణం.పిల్లలు తన వద్ద లేకున్నా వారి రుచులు తల్లి చేతుల్లో ఇంకా జీవిస్తూనే ఉంటాయి.ఇక్కడ తల్లి ప్రేమ చర్యల రూపంలో వ్యక్తం అవుతుంది.పిల్లలు తన వద్ద లేకున్నా,వాళ్ళ ఇష్టాఇష్టాలు తల్లి చేతుల్లో జీవిస్తూనే ఉంటాయి.తల్లి చేతి వంటకం ఒక స్మృతిగా, ప్రేమకు ప్రతీకగా మారుతుంది.
“వారి చిన్నప్పటి ఫోటోలను గుండెతో/తుడుస్తూ కాపాడుతూ/అనే కవితా పంక్తులు తల్లితనంలోని అత్యంత లోతైన మౌన భావాన్ని హృద్యంగా ప్రతిబింబిస్తాయి.ఇక్కడ ఫోటోలు కేవలం చిత్రాలు కావు.అవి కాలం ఆగిపోయిన క్షణాలు.పెరిగిన పిల్లల వెనుక చిన్న చిన్న నవ్వులు,చేతుల వెచ్చదనం,అప్పటి ఆధారపడిన ఉనికికి గుర్తులు.తుడుస్తూ అనే క్రియ ద్వారా భావం మౌనంగా ఆవిష్కృతమవుతుంది. అది దుమ్ము తుడవడమే కాదు – కాలం వేసిన మసకను దూరం తెచ్చిన మౌనాన్ని,కళ్ళలోకి వచ్చిన తడి గుర్తులను కూడా నెమ్మదిగా తుడిచే ప్రయత్నం చేస్తున్నది.
గుండెతో తుడవడం అంటే – చేతులతో కాదు,జ్ఞాపకాలతో, అనుభూతులతో,విడిచి పెట్టలేని మమకారంతో తాకడం.అది స్పర్శ కాదు.ఒక ప్రార్థనలా జరిగే చర్య.కాపాడుతూ అనే పదం ఈ కవితా పంక్తికి ఆత్మగా నిలుస్తుంది పిల్లలు ఇప్పుడు తమ జీవితాలను తామే కాపాడుకుంటున్నారు.కానీ తల్లి మాత్రం వారి గతాన్ని వారి చిన్నప్పటి రూపాన్ని తన హృదయంలో ఇంకా జాగ్రత్తగా కాపాడుకుంటుంది.ఈ కవితా పంక్తుల్లో వేదన అరవదు ; మౌనమే దాని వ్యక్తీకరణ.అవసరం తగ్గిన తర్వాత కూడా తల్లి ప్రేమ తగ్గదని అది జ్ఞాపకాల రూపంలోనైనా నిరంతరం కొనసాగుతుంది అని ఈ కవితా పంక్తులు సున్నితంగా వ్యక్తం చేస్తున్నాయి.అందుకే వారి చిన్నప్పటి ఫోటోలను గుండెతో తుడుస్తూ కాపాడుతూ అనేది తల్లి ప్రేమకు ఇచ్చిన అత్యంత నిశ్శబ్దమైన,చిరస్థాయిగా నిలిచిపోయే రూపకం.ఈ దృశ్యం అత్యంత భావ సూక్ష్మమైనది.వారి చిన్నప్పటి ఫోటోలను తుడవడం అనేది కేవలం ఫోటోల మీద పడిన దుమ్ము,ధూళిని తొలగించడం కాదు – కాలం వేసిన దూరాన్ని నెమ్మదిగా తుడిచే ప్రయత్నం చేస్తున్నది.గుండెలో అనే ఈ పదం ఈ చర్యను ఆత్మీయ ఆచారంగా మార్చుతుంది.ఈ కవితా పంక్తుల్లో లోతైన భావం,పిల్లల పట్ల గల స్మృతి,వారితో గల అత్యంత సాన్నిహిత్యాన్ని తెలుపుతాయి.తన పిల్లలు తన వద్ద ఇప్పుడు లేరు.వారు తనకు దూరంగా ఉన్నారు.తన పిల్లల ఫోటోలను తుడిచి వారు తన వద్ద ఉన్నట్లుగా తాను భావిస్తుంది.అది కేవలం ఫోటోలను శుభ్రపరిచే పని కాదు.అది తన పిల్లల జ్ఞాపకాలను ఎంతో ప్రేమతో సంరక్షించడమే.తన అపురూపమైన పిల్లల ఫోటోలను గుండెతో తుడవడం అనే ప్రయోగం తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తుంది.
“ప్రతి రాత్రీ వాళ్ళ క్షేమానికై ప్రార్థిస్తూ ../ఇక్కడ తల్లి ప్రేమ దైవ స్పర్శగా మారుతుంది.తల్లి చేతుల్లోంచి బాధ్యత దూరమైనా ప్రార్థన రూపంలో ఆ బాధ్యతను దేవుడికి అప్పగించబడుతుంది.ఇది తల్లితనపు మౌన ఆచారం.తల్లి పిల్లల బంధం విడదీయరానిది.తల్లి ఎప్పుడు పిల్లల క్షేమాన్ని కోరుకుంటుంది.పిల్లలు దైనందిన జీవితంలో లేకపోయినా ప్రార్థనలలో మాత్రం తల్లి వారి క్షేమానికై నిరంతరం ప్రార్థిస్తూ ఉంటుంది.
“ప్రపంచం వారి పట్ల మృదువుగా ఉండాలని/దేవుడిని కోరుకుంటూ .. /ఇది తల్లి చేసే అత్యున్నత ప్రార్థన.పిల్లలను కఠిన ప్రపంచం నుంచి కాపాడలేని స్థితిలో ప్రపంచమే వారికి మృదువుగా మారాలని కోరుకోవడం,ఇదే పరిపక్వమైన ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది.ఈ కవితా పంక్తుల్లో ప్రేమించే మనసు గల తల్లి యొక్క అంతర్లీన ప్రార్థన అత్యంత సౌమ్యంగా వ్యక్తపరుస్తుంది.ప్రపంచం అనేది కేవలం సమాజమే కాదు – అనుభవాలు,సంబంధాలు,విజయాలు, వైఫల్యాలు,గాయాలు అన్నింటిని కలుపుకున్న విస్తృత జీవన వేదిక.ప్రపంచం సహజంగా కఠినమైనదని తెలిసినా,అది తన పిల్లల పట్ల కాస్త మృదువుగా ఉండాలనే ఆకాంక్ష.ఇది తల్లి హృదయంలోని అపారమైన దయని సూచిస్తుంది.పిల్లలు ఎదిగిన తర్వాత తల్లి రక్షణ చేతులు వెనక్కి తగ్గినా,వారి జీవిత ప్రయాణం బాధలతో నిండి పోకూడదు అనే తపన ఇక్కడ దాగి ఉంది.
“దేవుడిని కోరుకుంటూ.. అనే కవితా పంక్తి తల్లి అశక్తతను, అదే సమయంలో ఆమె విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.ఇకపై ప్రతిదీ తన చేతుల్లో లేదని తెలిసినప్పుడు ఆమె ఆశలు ప్రార్థనగా మారతాయి.చేయగలిగినదంతా ప్రేమే, చెప్పగలిగినదంతా ఆశీర్వాదమే అనే భావన నిగూఢంగా నిండి ఉంది.ఇది గొంతెత్తి చేసేది కాదు – మౌనంగా నిరంతరంగా సాగే మనసు ప్రార్థన.ఈ కవితా పంక్తులు తల్లి ప్రేమ యొక్క పరిపక్వ దశను సూచిస్తాయి.కాపాడటం నుంచి విడిచి పెట్టడం వరకు వచ్చిన ప్రయాణాలు ఆమె ప్రేమ ఆజ్ఞగా కాదు – ప్రార్థనగా మారుతుంది.ఇది పిల్లల కోసం తల్లి చేసే అత్యున్నత కార్యం. ప్రపంచం మారకపోయినా,దేవుడి దయ అయినా వారి వెంట ఉండాలనే ఆకాంక్ష.ఈ కవితా పంక్తుల్లో తల్లి ప్రేమ యొక్క పరాకాష్టను చూపిస్తాయి.పిల్లలు బలంగా మారాలని కాదు – ప్రపంచమే వారి పట్ల మృదువుగా ఉండాలి అని కోరుకోవడం.తల్లి దృష్టి కోణం ఎంత సున్నితమో తెలియజేస్తుంది.
“తల్లితనం ఎప్పుడూ దాగదు/కేవలం రూపం మారుతుందంతే – /ఈ కవితా పంక్తులు తల్లితనం యొక్క శాశ్వతత్వాన్ని,దాని అంతర్గత ప్రవాహాన్ని గొప్పగా ఆవిష్కరిస్తాయి.తల్లితనం కనిపించక పోయినా అంతరించదు.అది కొత్త రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. తల్లితనం అనేది ఒక దశ,ఒక పాత్ర మాత్రమే కాదు.అది ఒక జీవన తత్వం.పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లితనం స్పష్టంగా కనిపిస్తుంది.పాలిచ్చే చేతులలో,నిద్రలేని కళ్ళలో,కాపాడే ఒడిలో,కానీ,కాలం గడిచే కొద్దీ,పిల్లలు తమ తమ ప్రపంచానికి వెళ్ళే వేళ ఆ తల్లితనం కనుమరుగు అవుతుంది అనిపించవచ్చు.ఈ కవితా పంక్తులు కవితకు తాత్విక కేంద్రం. తల్లితనం తగ్గదు,అదృశ్యం కాదు.అది కేవలం తన వ్యక్తీకరణ మార్గాన్ని మార్చుకుంటుంది అని స్పష్టంగా ప్రకటిస్తుంది. ఇక్కడ దాగదు అనేది పదం ముఖ్యమైనది.తల్లితనం అంతరించదు.తల్లితనం మాయం అవదు.అది కేవలం ప్రత్యక్షంగా కనిపించని రూపంలోకి మారుతుంది.చిన్నప్పుడు చేయి పట్టుకొని నడిపిన ప్రేమ తర్వాత నిశ్శబ్ద ప్రార్థనగా మారుతుంది.తల్లి ఆప్యాయంగా చెప్పిన సూచనలు మౌనంగా ఆలోచించే ఆశలుగా రూపాంతరం చెందుతాయి.ఇలా తల్లితనం తన వ్యక్తీకరణను మార్చుకుంటుంది. కానీ,తన అసలైన స్వభావాన్ని వదులుకోదు.
కేవలం రూపం మారుతుందంతే అనే కవితా పంక్తి తల్లితనానికి ఉన్న జీవన స్రవంతిని సూచిస్తుంది.ఇది నీటి వలె ఒకప్పుడు, ప్రవాహంగా మరొకప్పుడు,ఆవిరిగా ఇంకొకప్పుడు వర్షంగా మారినా నీటి స్వరూపం మారదు. అలాగే తల్లితనం కూడా పిల్లల వయసు,పరిస్థితులు, దూరాలు మారినా,ప్రేమగా,బాధ్యతగా,మమకారంగా నిరంతరం కొనసాగుతుంది.ఇది లోతైన తాత్వికతను కలిగి ఉంది.తల్లితనం శరీరానికే పరిమితం కాదని,అది మనసు – ఆత్మల స్థాయిలో కొనసాగేది అని తెలియజేస్తుంది.కనుక ఈ కవితా పంక్తులు తల్లిని మాత్రమే కాదు.ప్రతి తల్లితనాన్ని అనుభవించే హృదయాన్ని తాకుతాయి.తల్లితనాన్ని ఒక అజరామరమైన ప్రేమగా నిలబెడుతుంది.తల్లితనం ఎప్పుడూ దాగదు.అది జీవన ప్రవాహంలో మౌనంగా వెలుగుతూనే ఉంటుంది.
“నీడలా ఆవరించి ఒక వీడుకోలులోకి/మారిపోతుంది/ఇక్కడ తల్లితనం నీడగా మారుతుంది – తల్లి ముందుండి నడిపించదు,తల్లి వెనుకనుండి నీడలా కాపాడుతోంది.ఇక్కడ వీడికోలు అనేది కనిపించకుండా ఉండే సంరక్షణ.ఈ కవితా పంక్తి సున్నితమైన భావ ప్రకటనతో కూడినది.తల్లితనాన్ని నీడతో పోల్చడం అత్యంత సార్ధకమైన రూపకం.నీడ కనిపించకపోయినా వెన్నంటి ఉంటుంది.వీడుకోలు అనేది దూరమవడం కాదు,రక్షణతో కూడిన మౌన అనుసరణ. ఇక్కడ కవయిత్రి నీడని ప్రతీక ద్వారా అనిర్వచనీయమైన అనుభూతిని ఆవిష్కరిస్తుంది.నీడ అనేది ఎప్పుడు వెన్నంటి మాట లేకుండా తోడుగా ఉండే ఒక మౌన ఉనికి.అది ప్రేమ కావచ్చు,జ్ఞాపకం కావచ్చు,బాధ కావచ్చు-అది ఏది అయినా వ్యక్తిని పూర్తిగా కప్పి వేస్తూ అతని అస్తిత్వంలో కలిసిపోతుంది.ఇక్కడ ఆవరించిన అనే పదం ఆ భావం తాత్కాలికం కాదు.సంపూర్ణంగా మనసును ఆక్రమించేదని సూచిస్తుంది.ఒక వీడుకోలులోకి మారిపోతుంది అనేది అత్యంత వేదనాత్మకమైన మలుపు.నీడలా దగ్గరగా ఉన్న భావం.చివరికి వీడుకోలుగా మారడం అంటే ఉనికి నుంచి వియోగానికి,సమీపం నుంచి దూరానికి జరిగే మౌన పరిణామం.ఇది గట్టిగా ప్రకటించిన వీడికోలు కాదు.నెమ్మదిగా అనివార్యంగా జరిగే అంతరాయం.మన జీవితాల్లో కొన్ని సంబంధాలు,జ్ఞాపకాలు మొదట నీడలా వెన్నంటి తోడుగా ఉండి కాలక్రమంలో మాట లేకుండానే వీడికోలుగా మారిపోతాయి అనే జీవిత సత్యాన్ని సున్నితమైన రూపకంలో వ్యక్తం చేస్తుంది.శబ్దాల కంటే మౌనాలకే ఎక్కువ స్థానం ఇచ్చిన ఈ కవితా పంక్తి పాఠకుడి హృదయంలో దీర్ఘకాలం ప్రతిధ్వనిస్తుంది.
“ఇది ఎవరికి కనిపించని ప్రేమ ..!/ అనే ఈ భావానికి మౌనముద్ర వేస్తుంది.ఇది ప్రశంసలు కోరని ప్రేమ,ఇది గుర్తింపు ఆశించని ప్రేమ.అయినా కనిపించని ప్రేమ జీవనమంతా తోడుగా ఉండే ప్రేమ ఇది.ఈ కవితా పంక్తి అత్యంత సున్నితమైన నిర్వచనం ఇస్తుంది.ఇక్కడ ప్రేమ ప్రదర్శన కోసం కాదు,గుర్తింపు కోసం కాదు.ఇది ఎవరికి కనిపించని ప్రేమ.ఈ కవితా పంక్తులు తల్లి ప్రేమ కాలంతో పాటు మౌనంగా మారినా తగ్గదని బలంగా తాకుతాయి.చిన్నప్పటి సంరక్షణ నుంచి పెద్ద వాళ్ళైన అయిన తర్వాత ప్రార్థనల వరకు – తల్లితనం ఒక నిరంతర ప్రయాణం.కనిపించని చోటే ఎక్కువగా పని చేసే ప్రేమే అమ్మ ప్రేమ అనే సత్యాన్ని ఈ కవిత మనసులో నాటుతుంది.ఈ కవితలో కనిపించని ప్రేమ మౌన భావాలద్వారా వ్యక్తం అవుతుంది.తల్లితనాన్ని గొప్పగా నిశ్శబ్దంగా నిలబెట్టిన ఈ కవితా పంక్తులు పాఠకుడి హృదయంలో దీర్ఘకాలం ప్రతిధ్వనిస్తాయి.ఇది తల్లి ప్రేమ యొక్క అదృశ్య మహాకావ్యం – కనిపించని నీడలో జీవించే అత్యంత శక్తివంతమైన భావ ప్రకటన.ఈ కవితా పంక్తులు ఎదిగిన పిల్లల పట్ల తల్లితనం పొందే నిశ్శబ్ద రూపాంతరంను అత్యంత సున్నితంగా ఆవిష్కరిస్తాయి.తల్లితనం ఎక్కడ ముగియదో,ఎలా మౌనంగా మారుతుందో,ఈ భావ ప్రవాహం స్పష్టంగా చూపిస్తుంది.ఈ కవితా పంక్తులలో కవయిత్రి తల్లితనాన్ని ఒక స్థిరమైన భావంగా కాకుండా కాలానుగుణంగా రూపాంతరం చెందే శాశ్వత ప్రేమగా ఆవిష్కరిస్తుంది.పిల్లలు ఎదుగుదలతో తల్లి పాత్ర తగ్గిపోతుంది అనే భావనను ఖండిస్తూ తల్లితనం దాగిపోదు – కేవలం మౌనంగా మారుతుంది అనే సత్యాన్ని ఈ కవిత ప్రతిపాదిస్తుంది.
“ఎదిగిన పిల్లల తల్లి అవ్వడం అంటే/మీరిక వారి ప్రపంచ కేంద్రం కాదని/ఒప్పుకోవడం/ఈ కవితా పంక్తులు కవితకు తాత్విక పునాది.ఒకప్పుడు తమ చుట్టూ తరిగిన పిల్లల ప్రపంచం అనే సత్యాన్ని విడిచిపెట్టి ఇప్పుడు తాము ఆ ప్రపంచ అంచులకు జరగాల్సిన అవసరాన్ని తల్లి అంగీకరిస్తుంది.ఇది ఓటమి కాదు,తల్లితనంలో వచ్చిన ఉన్నత స్థాయి విజయం.ఈ కవితా పంక్తులు తల్లితనంలోని అత్యంత సూక్ష్మమైన కానీ అత్యున్నతమైన భావ పరిణామాన్ని ఆవిష్కరిస్తాయి.ఇక్కడ కేవలం పిల్లలు పెద్దవారు అవ్వడాన్ని చూడడం కాదు.తల్లితనం కూడా వారి ఎదుగుదలతో పాటు మరో దశకు మారుతుంది అనే సంకేతం. చిన్నప్పటి తల్లితనం,రక్షణ,మార్గ నిర్దేశం,నిర్ణయాల కేంద్రంగా ఉంటే – ఎదిగిన పిల్లల తల్లితనం మౌనంగా వెనుకబడి,దూరం నుంచే ఆశీర్వదించే స్థాయికి చేరుతుంది.ఇది తల్లికి కలిగే భావోద్వేగ పరిపక్వతను సూచిస్తుంది.
“మీరిక వారి ప్రపంచ కేంద్రం కాదని ఒప్పుకోవడం/ఈ కవితా పంక్తిలో తల్లికి ఎదురయ్యే అత్యంత కఠినమైన సత్యాన్ని స్పృశిస్తుంది.ఒకప్పుడు పిల్లల ప్రపంచం తల్లి చుట్టూ తిరిగేది,కాలక్రమేణా ఆ కేంద్రం మారిపోతుంది – వారి కలలు,స్నేహాలు,ఆలోచనలు,స్వతంత్ర నిర్ణయాలు,కొత్త కేంద్రాలుగా ఏర్పడతాయి.ఈ మార్పును నిరసించకుండా బాధతో కాకుండా అంగీకారంతో స్వీకరించడమే,ఇక్కడి అసలైన భావం.ఈ కవితా పంక్తులలో త్యాగం,విడిచి పెట్టే ప్రేమ,నిశ్శబ్ద గౌరవం వంటి విలువలను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ తల్లి ప్రేమ శబ్దంగా ప్రకటించబడదు.అది ఒప్పుకోవడంలో,వెనక్కి తగ్గడంలో,పిల్లల స్వేచ్ఛకు స్థలం ఇవ్వడంలో వ్యక్తం అవుతుంది.ఎదిగిన పిల్లల తల్లి అవ్వడం అంటే తమ స్థానాన్ని కోల్పోవడం కాదు. పిల్లల జీవితంలో తల్లి కేంద్రంగా కాకపోయినా వారి ప్రపంచాన్ని నిలబెట్టే మౌలిక శక్తిగా మారడం.ఈ కవితా పంక్తులు తల్లితనంలో వచ్చే అత్యంత కఠినమైన స్వీకరణను సూచిస్తాయి.ఒకప్పుడు పిల్లల ప్రపంచానికి కేంద్ర బిందువైన తల్లి,ఇప్పుడు ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సిన నిజాన్ని అంగీకరించడం – ఇదే పరిపక్వమైన తల్లితనం.
“అదే ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉండటం/తల్లి ముఖ్య కేంద్రం కాదని ఒప్పుకున్నా ప్రేమ తగ్గదు.ప్రేమ పరిమాణం మారదు. దాని వ్యక్తీకరణ మారుతుంది.ఇది షరతులు లేని ప్రేమకు ప్రతీక.ఈ కవితా పంక్తి తల్లి తనంలోని శాశ్వతత్వాన్ని ప్రేమ యొక్క రూపాంతర స్వభావాన్ని అత్యంత మృదువుగా వ్యక్తపరుస్తుంది.అదే ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉండటం అంటే ప్రేమ తగ్గడం కాదు.మారకపోవడం కూడా కాదు.కాలానికి అనుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకుంటూ కొనసాగడం. చిన్నప్పుడు పిల్లలపై చూపిన ప్రేమ,అధికారం,సంరక్షణ,దిశా నిర్దేశంగా కనిపిస్తే, వారు ఎదిగిన తరువాత అదే ప్రేమ నమ్మకంగా,గౌరవంగా,మౌనంగా మారుతుంది.ఇక్కడ అదే ప్రేమ అనేది తల్లి హృదయంలోని స్థిరత్వాన్ని సూచిస్తుంది. పరిస్థితులు మారినా,సంబంధాల దూరాలు పెరిగినా,తల్లి ప్రేమకు మాత్రం విరామం ఉండదు.అది ప్రశ్నించదు.హక్కుల కోసం అడగదు.పిల్లల స్వేచ్ఛను గౌరవిస్తూ కూడా వారి పట్ల తన ఉనికిని విడిచిపెట్టదు,అదే ప్రేమ అనే భావం నిశ్శబ్ద కాంతిలా ఉంటుంది.కనుక కనిపించకపోయినా,దారిని వెలిగించే ప్రేమ ఇక్కడ భావోద్వేగ ప్రదర్శన కాదు.అంతర్గత నిబద్ధతగా వ్యక్తం అవుతుంది.పిల్లలు తమ ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నా తల్లి ప్రేమ మాత్రం వారి జీవిత ప్రవాహానికి అడుగడుగునా తోడుగా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది.ఇక్కడ తల్లి ముఖ్య కేంద్రం కాకపోయినా తల్లి ప్రేమ తగ్గదు అని ఈ కవితా పంక్తి స్పష్టం చేస్తుంది.తల్లి పాత్ర మారినా భావం మారదు.ఇది స్వార్థరహితమైన తల్లి ప్రేమకు సంకేతం.
“కొన్ని ప్రేమలు ఎప్పటికీ వీడిపోవు – /అనే కవితా పంక్తి లోతైన భావంతో సాంద్రతతో కూడినది.అది ప్రేమను కాలానికి, దూరానికి,అతీతమైన శాశ్వత సత్యంగా ప్రతిష్టిస్తుంది.ఈ కవితా పంక్తి చెబుతున్నది – నిజమైన ప్రేమకు వీడుకోలు అనే భావమే ఉండదు అని,రూపాలు మారవచ్చు,సంబంధాల రూపకల్పన మారవచ్చు.అయినా భావపు మూలం చెదరదు. అది దేహాల అనుబంధం కాదు,స్మృతుల,అనుభూతుల, మౌనాల లోతైన బంధం.ఈ ప్రేమ కనిపించకపోవచ్చు, పలకరించకపోవచ్చు,రోజు గుర్తు చేయక పోవచ్చు,అయినా అది మన శ్వాసలా – గుర్తించకపోయినా,విడిచిపెట్టలేనిది. కాలం దాన్ని మసకబార్చదు.పరిస్థితులు దాన్ని చెరిపేయ లేవు.అది గాయాల్లో నిశ్శబ్దంగా నిద్ర పోతుంది.ఆనందాల్లో మౌనంగా నవ్వుతుంది.ఈ కవితా పంక్తి వియోగాన్ని నిరాకరించే తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.ప్రేమ అనేది కలిసుండడమే కాదు,విడిపోయిన తర్వాత కూడా మనలో కొనసాగడమేనని సూచిస్తుంది.అయినా ఇది తల్లులు – పిల్లల ప్రేమలకు సంబంధించిన ప్రత్యేకత.ఇది అన్ని ప్రేమల ప్రత్యేకత కాదు – కానీ నిజమైనవి మాత్రమే – ఎప్పటికీ వీడిపోవు.ఇది ఒక నిశ్శబ్దమైన అంగీకారం.ప్రేమ విడిచి వెళ్ళదు – మనమే దాని వద్ద నుంచి కాస్త దూరంగా పోతాం.వీడ్కోలు చెప్పని భావం అయినా అది మనలోనే ఉంటుంది.కాలం,దూరం, మౌనం – ఏదీ ఈ ప్రేమను విడదీయలేవు.తల్లి ప్రేమకు ఇది శాశ్వతత్వాన్ని అందిస్తుంది.
“వాడి పోయినా నిశ్శబ్దంగా మమకారంతో వేచి చూడ్డం నేర్చుకుంటాయి .. ❤️
ఇక్కడ ప్రేమకు మానవ లక్షణాలు ఆపాదించబడ్డాయి. వాడిపోయినట్టుగా కనిపించినా అది చనిపోదు.మమకారంతో వేచి చూడటం అనేది ఆశను అరవకుండా కాపాడుకోవడం, నిశ్శబ్దం ఇక్కడ బలహీనత కాదు స్థిరత్వం.ఇక్కడ హృదయం అనే చిహ్నం ఈ భావాల మధ్య ఒక మౌన హృదయ స్పందనలా పనిచేస్తుంది.ఈ కవితా పంక్తిలో త్యాగం, పరిపక్వత,నిశ్శబ్ద ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తుంది.
ఇక్కడ వాడిపోయిన అనే పదం శరీర అలసటను కాదు – మనసు ఎన్నో విరామాలు,నిరీక్షణలతో కొంచెం క్షీణించిన స్థితిని సూచిస్తుంది.వాడిన హృదయం అరవదు.మౌనంగా తట్టుకోవడం మాత్రం నేర్చుకుంటుంది.నిశ్శబ్దంగా మమకారంతో అనేది ప్రేమ యొక్క అత్యున్నత స్థాయిని తెలియజేస్తుంది.ఇది మాటల ప్రేమ కాదు.ఎదుటివాడు తిరిగి వస్తాడా? గుర్తుపెట్టుకుంటాడా?అనే ప్రశ్నల కంటే ముందుకు వెళ్లిన ప్రేమ ఇది.ఎదురుచూసే మనసు తన ఉనికిని ప్రకటించదు.కేవలం ఉండిపోతుంది.
“వేచి చూడ్డం నేర్చుకుంటాయి../అనేది ప్రేమ ఒక సహజ గుణం కాక కాలంతో,అనుభవంతో అలవడే విద్య అని చెబుతుంది.వేచి చూడడం ఇక్కడ బలహీనత కాదు ఓర్పు – ఆశను గట్టిగా పట్టుకొని మౌనంగా నిలబడే ధైర్యం ఓర్పు.
ఒక అంతర్లీన స్త్రీత్వం,తల్లితనపు ప్రతిధ్వని వినిపిస్తుంది. కాలం ఎంత తీసుకున్నా ప్రతిఫలం ఇవ్వకపోయినా ప్రేమ వదలని హృదయ స్వభావం.ఇది ప్రేమ పెరిగే విధానానికి సంబంధించిన ఒక నిశ్శబ్ద పాఠం.మాటలు తగ్గిన చోట మమకారం పెరిగే విధానం.ఇక్కడ ప్రేమను ఒక గొప్ప అనుభూతిగా చిత్రించారు.అది వాడిపోవచ్చు.అలసి పోవచ్చు.కానీ,ఆశను కోల్పోదు.వేచి చూడ్డం అనేది తల్లి ప్రేమ యొక్క అత్యున్నత రూపం.
“కానీ,అదే ప్రేమ తత్వం/వాళ్ళను నిలబెడుతుంది/ప్రపంచాన్ని నిలబెడుతుంది!!/ఈ కవితా పంక్తులలో తల్లి ప్రేమ వ్యక్తిగత స్థాయిని దాటి విశ్వస్థాయికి విస్తరిస్తుంది.పిల్లలను నిలబెట్టడమే కాదు మానవ సంబంధాల ద్వారా ప్రపంచాన్ని నిలబెట్టే శక్తిగా,ప్రేమను కవయిత్రి ప్రతిపాదిస్తుంది.ఈ కవిత ఎదిగిన పిల్లల తల్లితనాన్ని త్యాగం కాదు – తత్వంగా చూపిస్తుంది.కనిపించకుండా నిలిచే ప్రేమే ప్రపంచాన్ని నిలబెడుతుందన్న సత్యాన్ని హృదయానికి చేరువ చేసే ప్రకటన ఇది.ఇక్కడ హృదయ చిహ్నం భావ విరామంగా పని చేస్తుంది.ప్రేమ కేవలం భావం కాదు అని కవయిత్రి సూచిస్తుంది.ఈ కవితా పంక్తులు తల్లితనాన్ని వ్యక్తిగత అనుభూతి నుంచి విశ్వవ్యాప్త విలువగా మార్చేస్తాయి. పిల్లలను మాత్రమే కాదు – సమాజాన్ని,ప్రపంచాన్ని నిలబెట్టే మూలశక్తిగా కవయిత్రి ఆవిష్కరిస్తుంది.తల్లులు – పిల్లల కవిత ఒక తాత్విక పరిపక్వతకు చేరుతుంది.తల్లితనం అంటే ఆధిపత్యం కాదు.విడిచిపెట్టగలిగే ధైర్యం,మాటలు తగ్గిన చోట ప్రేమ లోతుగా మారుతుంది.వేచి చూసే మౌనమే తల్లి ప్రేమ యొక్క పరమార్థం అన్న సత్యాన్ని ఈ కవిత హృదయానికి చేరుస్తుంది.ఈ కవితా పంక్తులలో ప్రేమను ఒక తత్వంగా ప్రతిష్ఠించారు.ఇక్కడ ప్రేమ అనేది వ్యక్తిగత అనుభూతి స్థాయిని దాటి,జీవనాన్ని నిలబెట్టే శక్తిగా అవతరిస్తుంది.కానీ అనేది ముందున్న అలసట,నిరీక్షణ అన్నింటికీ విరుద్ధంగా నిలుస్తుంది.ఎంత వాడిపోయినా,ఎంత నిశ్శబ్దంగా వేచి చూసినా ఆ ప్రేమ తత్వం ఎప్పటికి నిలిచి ఉంటుంది.అది లోపల నుంచి మనిషిని నిలబెట్టే అంతర్గత స్వరం.వాళ్లను నిలబెడుతుంది అనేది వ్యక్తిగత స్థాయిలో ప్రేమ చేసే పని చెబుతుంది.ఆశ క్షీణించిన వేళ,గుర్తింపులేమి కలిగినప్పుడు ప్రేమే మనిషికి వెన్నెముకలా మారుతుంది.అది బలంగా ఉండమని ఆదేశించదు – నిలబడే శక్తిని మౌనంగా అందిస్తుంది.ప్రపంచాన్ని నిలబెడుతుంది అనే విస్తరణలో ఈ ప్రేమ వ్యక్తి హద్దులను దాటి సమిష్టి మానవత్వంగా మారుతుంది.తల్లితనం,మమకారం,కరుణ,ఓర్పు వంటి సుగుణాలన్నీ ఈ ప్రేమ తత్వం నుంచే జన్మిస్తాయి.అవే యుద్ధాల మధ్య శాంతిని,స్వార్థాల మధ్య సహజీవనాన్ని నిలబెట్టే అదృశ్య స్తంభాలు.ఇది ప్రేమకు ఇచ్చిన తాత్విక నిర్వచనం.ప్రేమ లేకపోతే జీవితం కదలికలతో ఉన్నా లోపల ఖాళీగా ఉంటుంది.ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనిషి నిలబడతాడు.మనిషి నిలబడినప్పుడే ప్రపంచం నిలబడుతుంది.అందుకే ఈ కవితా పంక్తులు ఒక ప్రకటనలా వినిపిస్తాయి.ప్రేమ బలహీనత కాదు ప్రేమే ఆధారం.ప్రేమే ప్రపంచం నిశ్శబ్ద వెన్నెముక.ఈ కవితా పంక్తులు ఎదిగిన పిల్లల తల్లితనానికి సంబంధించిన పరిపక్వ ప్రేమ తత్వాన్ని అత్యంత మౌనమైన గౌరవంతో ఆవిష్కరిస్తాయి.ఇక్కడ తల్లితనం అరవదు,ఆజ్ఞాపించదు.అది అంగీకరిస్తుంది.వేచి చూస్తుంది.నిలబెడుతుంది.ఈ కవితా పంక్తులలో ఎదిగిన పిల్లల తల్లి అనే భావానికి తాత్వికమైన సంపూర్ణత ఇస్తుంది. ఇది కేవలం తల్లి అనుభవం మాత్రమే కాదు – ప్రేమని శాశ్వత విలువకు ఇచ్చిన నిర్వచనం.కవయిత్రి హిమజ ఒక తల్లిగా తన అనుభవాలను,లోకరీతిని తన మాతృ హృదయంలో చెలరేగే సంఘర్షణలను తల్లులు – పిల్లలు కవితలో ఆవిష్కరించిన తీరు ఆశ్చర్యాన్ని,ఆనందాన్ని కలిగిస్తుంది.
తల్లులు – పిల్లలు మరియు అందరి హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే కవితను అందించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

January 25, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మన తెలుగు నాటకాలు

by Sammeta Vijaya January 25, 2026
written by Sammeta Vijaya

స్వేచ్ఛ నాటిక
విశ్వ శాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వెలువడిన నాటిక స్వేచ్ఛ. వివిధ ప్రదేశాలలో 35కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన నాటిక స్వేచ్ఛ. మూల కథ శ్రీ పి. ఎస్ నారాయణ, నాటకీకరణ శ్రీ పరమాత్ముని శివరాం, దర్శకత్వం శ్రీ బి.ఎం రెడ్డి .
పి .ఎస్ నారాయణ : పి.ఎస్.నారాయణ ప్రముఖ కథారచయిత. ఇతడు 230కు పైగా కథలు, 31 నవలలు, 10 రేడియో నాటికలు, 2 స్టేజి నాటకాలు, ఏన్నో విమర్శా వ్యాసాలు రచించాడు.

స్వేచ్ఛ అంటే మనసుకు నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు సాగించుకోవడం, ప్రవర్తించడం కాదు అంటారు రచయిత (మూల కథకులు) పిఎస్‌ నారాయణ.
బి.ఎం రెడ్డి : దర్శకునిగా రాణించిన బిఎంనరెడ్డి గారు స్వేచ్ఛ , ఆకెళ్ళ రచించిన కలనేత మొదలైన నాటికలకు దర్శకత్వం వహించారు. స్వేచ్ఛ అంటే నియంత్రణ, సంరక్షణతో కూడుకున్న స్వచ్ఛత ఉండాలని చాటింది విశ్వశాంతి కల్చరల్‌ హైదరాబాద్‌ బృందం. పరమాత్ముని శివరాం నాటకీకరణకు బి ఎం రెడ్డి దర్శకత్వంలో నటవర్గం జీవం పోసింది. ఈ నాటిక యొక్క దర్శకత్వం, నటన, సాంకేతికత ప్రేక్షకులను కట్టిపడేసింది. నాటికలో దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రేక్షకులకు విసుగు కలగకుండా ఒక దాని వెనుక మరో సీన్ విరామం లేకుండా ప్రదర్శిండం వలన నాటికకు అందరూ కనెక్టయ్యారు. కళాకారులు. లైట్స్‌ ఆఫ్‌, ఆన్‌ ఉన్నా… సీనులు, తెరలు మారుతున్నా, ఫ్లాష్‌ బ్యాక్‌ నడిచినా… అంతరాయం అన్న భావన కలగదు. ఇప్పటి ప్రేక్షకులు కోరుకుంటున్నది ఇదే. అందుకే ఈ నాటిక పలు అవార్డులు గెలుచుకున్నది.


విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ, ఇది ముఖ్యంగా నాటక రంగం మరియు సాహిత్యంలో చురుకుగా ఉంటుంది, ప్రముఖంగా “ఆకెళ్ళ నాటిక రచనల పోటీలు” వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు నాటక ప్రదర్శనలకు మద్దతు ఇస్తుంది, ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రచయితలను ప్రోత్సహిస్తుంది
విపరీతమైన స్వేచ్ఛ ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఉంటుంది. సరైన గమ్యమూ, గమనము దానికి ఉండదనే విషయాలను ‘స్వేచ్ఛ’ నాటిక రేఖామాత్రంగా చర్చిస్తుంది.
ఆధునిక సంపన్న కుటుంబ కథ ఇది. మహేశ్వరి ఇరవై ఏళ్ల క్రితమే భర్తతో తెగదెంపులు చేసుకుని అవినాశ్‌తో కలిసి జీవనం సాగిస్తున్నది. మహేశ్వరి కూతురు శ్వేత కూడా తల్లి దగ్గరే పెరుగుతుంటుంది. తల్లి ప్రవర్తన శ్వేతకు నచ్చదు. ఆమెకు దూరంగా, అమెరికా వెళ్లి చదువుకోవాలని అనుకుంటుంది. తల్లి అందుకు అంగీకరించదు. తల్లీ-కూతుళ్ల మధ్య ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. తన తండ్రి స్థానంలోకి వచ్చిన అవినాశ్‌ అంటే శ్వేతకు నచ్చదు.మహేశ్వరి కూడా మన మధ్య సంబంధం మనవరకే పరిమితమని, ఇతర ఏ వ్యక్తిగత విషయాల్లో కలుగ జేసుకోవద్దని అవినాశ్‌ను హెచ్చరిస్తుంది. కూతురు వరుసైన శ్వేతపై కాముక దృష్టి ఉన్న అవినాశ్‌ కన్నేస్తాడు.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే… మహేశ్వరి అవినాశ్‌ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.అతని సహాయంతో ప్రమోషన్ రావడంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది . అవినాష్ ను ఇంటికి ఆహ్వానించి విందు ఇస్తుంది. ఆ సందర్భంలో మద్యం తాగుతూ ఇద్దరూ శ్రుతిమించుతారు. ఆధునిక యుగంలో ఇవన్నీ సర్వసాధారణమని వాళ్ల భావన. ఇంటికి వచ్చిన భర్త మూర్తి మందలిస్తాడు. అతను చెప్పే మాటలు వినక ఎదురిస్తుంది. కోపం లో అవినాశ్‌పై చేయి చేసుకుంటాడు మూర్తి . మూర్తిని ఎదురించి అవమానించి తెగతెంపులు చేసుకుని కొడుకును తీసుకుని బయటకు వెళ్ళమంటుంది మహేశ్వరి . వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు ఆనంద్‌, కూతురు శ్వేత. ‘మగపిల్లవాడిని నీవు తీసుకెళ్లు, కూతుర్ని మాత్రం నా వద్దే ఉంచుకుంటాను’ అని పురుష ద్వేషంతో అంటుంది మహేశ్వరి. చేసేది లేక భార్యకు విడాకులు ఇచ్చేసి ఆనంద్‌ బాధ్యత తీసుకుంటాడు మూర్తి.

కొంతకాలం గడిచాక మూర్తి చేతుల్లో పెరిగిన ఆనంద్‌ పెద్దవాడవుతాడు. మూర్తి లాగే ఉంటాడు . మూర్తి మరణిస్తాడు.తల్లి కోసం చెల్లి కోసం ఆరాటపడి వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు . ఆ క్రమం లో శ్వేత పరీక్షకు డబ్బు కట్టడానికి పార్కు కు వచ్చిన విషయం తెలుసుకుని తెలియని వ్యక్తిగా వచ్చి కథ నడిపిస్తాడు.అన్నాచెల్లెళ్లు తల్లికి ఎలా బుద్ధి చెబుతారో చూడాలంటే స్వేచ్ఛ నాటిక చూడాల్సిందే!

మందుకు బానిసవడం స్వేచ్చా? అని మూర్తి సంధించిన ప్రశ్న మహేశ్వరి తో పాటు ఈ సమాజానికి వర్తిస్తుంది.

మితి మీరిన స్వేచ్ఛ తెడ్డు లేని పడవలా ఉండడమా?

స్వేచ్ఛ పేరుతో నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా? వంటి ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి.

పలు అవార్డులు అందుకున్న స్వేచ్ఛ నాటికలో మహేశ్వరి పాత్రలో సురభి లలిత , అవినాశ్ పాత్రలో శ్రీనివాస్ , మూర్తి,ఆనంద్ పాత్రల్లో డా . వెంకట్ గోవాడ, శ్వేత పాత్రలో మంజు , సాంకేతక సహకారం నాగరాజ్ , తేజ , ఫణీంద్ర , రోహిత్, భీం తదితరులు అందించారు. బి ఎం రెడ్డి గారి దర్శకత్వంలో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ సమర్పణలో స్వేచ్ఛ నాటిక తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది

January 25, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

జీవన స్రవంతి ( ట్రయాలజీ) ( Trayalaji )

by రంగరాజు పద్మజ January 25, 2026
written by రంగరాజు పద్మజ

నవలా సమీక్ష. జీవన స్రవంతినవల ఈ నవలా రచయిత అంధులైన శ్రీ టేకులపల్లి గోపాలరెడ్డిగారు.

దృష్టి లేక పోవడం ఒక శాపం కాదు!
తన లక్ష్యాన్ని సాధించే ఒక సహాయకారైన సామర్థ్యం అని నిరూపించారు! జీవన స్రవంతి నవలా రచయిత దివ్యాంగులైన శ్రీ టేకులపల్లి గోపాల రెడ్డి గారు.
వీరికి దృష్టిలోపం ఉన్నా దాన్ని అధిగమించి, చీకటి దారిని వెలుగులమయం చేసుకున్నారు.
చూపులేని జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు; ఆరాట- పోరాటాలు; మనసు లోపలి పొరల్లోని భావా వేషాలు; సంఘర్షణలు; పరిస్థితుల బేరీజులు; ఆత్మగత సందేశాలతో సాగిన ఆత్మకథ నవల జీవన స్రవంతి.
ఇటీవలే ఒక సాహిత్య సమూహంలో వారు పరిచయమైనప్పుడు…. వారు 1200 పేజీలలో మూడు భాగాలతో ట్రయాలజీ తమ జీవిత కథ ను రాశారని విన్నప్పుడు, అంగవైకల్యమున్న వ్యక్తిలో ఇంత నైపుణ్యమున్నదా? అని ఆశ్చర్యపోయాను.
ప్రపంచంలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన అంధ రచయితలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రాచీన గ్రీకు కవి హోమర్ గురించి విన్నాము.
మరో ఇంగ్లీష్ అంధ కవి జాన్ మిల్టన్ ఎన్నో రచనలు చేశాడని అందరికీ తెలిసిన విషయమే!
అలాగే హెలెన్ కిల్లర్ కూడా గొప్ప రచయిత్రి. ఈమెకూడా దివ్యాంగురాలే! జార్జ్ లూయిస్ బోర్డెస్ వంటి అంధ రచయితల సరసన నిలువ గలిగిన తెలంగాణ రచయిత శ్రీ గోపాల్ రెడ్డి గారు.
వీరు రాసిన జీవన స్రవంతి నవల చదువుతుంటే మనసు భారం అవడమే కాకుండా, కళ్ళు చెమర్చుతాయి. ధారగా సాగే ఆ పఠనంలో బాధాకెరటం వీచినా, కన్ను మసకబారినా, గొంతు గద్గదించినా ఆగకుండా సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే? పాత్రలు, కథా సంభాషణలు మాత్రమే కాదు! మనసులో భావోద్రేకాలతో సాగుతుందీ నవల.
అంతే కాదు ఇందులో తెలంగాణ ప్రాంతపు ఆచారాలు- సంప్రదాయాలు తెలుస్తాయి. నా మటుకు నాకు అనిపించేది ఆంగ్లంలో అంధుల రచనలు ఉంటే ఉండవచ్చు! కానీ తెలుగు సాహిత్యంలో ఇదే మొదటి నవల అనిపించింది.
దీన్ని బ్రెయిలీలిపిలో తాను రాసిన తర్వాత దాన్ని చెబుతుంటే విని, రచయిత్రి, సమీక్షకురాలైన అరుణా ధూళిపాళ గారు తెలుగు లిపిలో రాసారు.
రచయిత తన నవలను నదీ ప్రవాహంతో పోలుస్తూ రాసిన నవల. ఎందుకంటే జీవితంలో ఒక్కోసారి వేగంగా సంఘటనలు జరుగుతాయి! ఒక్కోసారి మందకొడిగా సాగవచ్చు అచ్చంగా నదీ ప్రవాహం వలె అని కాబోలు !
కంటి చూపు లేని వారిని నిరాశగా బతక వద్దు! ఉత్సాహంగా బతుకుతూ తాను అనుకున్న లక్ష్యాలను చేరాలని అన్యాపదేశ సందేశం ఈ నవల పొడుగునా మనకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. చూపు లేకుండా చేసిన భగవంతుడే జీవన గమ్యాలను చేరుస్తాడన్న విశ్వాసం కూడా కావచ్చు ! కానీ ఆద్యంతం ఆసాంతం చక్కగా చదివించే గుణమున్న ఈ నవల గురించి విహంగ వీక్షణం చేద్దాం!!!
సాధారణ మనుషుల జీవితాలే విచిత్రం… అంటే ఇంకా దివ్యాంగుల జీవితాలు మరీ విచిత్రాలు… జీవితంలో ఏమీ సాధించలేమని, ప్రపంచంలోని కష్టాలన్నీ తమకే ఉన్నాయనే నిరాశతో సాగుతాయి జీవితాలు మామూలు వారికి కూడా… కానీ అలా నిరాశగా ఉండొద్దని, మనోధైర్యంతో అంతర్నేత్రం ద్వారా దారిని సుగమం చేసుకోవాలని, చీకటి తెరలను తొలగించుకోవాలనీ వారి అనుభవాలు, జ్ఞాపకాలు, సంఘర్షణలు, సంతోషపుక్షణాలు, అంధుల జీవితాలలోని ప్రత్యేక లక్షణాలు, ఆలోచనలన్నిటినీ గుదిగుచ్చి .. రచయిత అక్షరీకరించారు.
ఆ అక్షరాల అందమైన ప్రవాహమే ఈ జీవన స్రవంతి.
ఈ నవలకు అందమైన ముఖచిత్రం వేసిన చిత్రకారుడు గౌరీభట్ల ప్రవీణ్ కుమార్ ముఖచిత్రం చూడగానే మనకు కనిపించే చిత్రంలో నదీ తీరంలో ఊతకఱ్ఱ సాయంతో ఒక పొడుగాటి మనిషి , సంధ్యా సమయపు కెంజాయ రంగులో వెలుగులీనుతున్న కాంతిలో ప్రవహిస్తున్న నది పైన ఒక కలం -పాళీ వెలుగుచిమ్మిన ఒక చిత్రం! చెప్పకనే లోపలి కథను రేఖామాత్రంగా తమ కుంచెతో రేఖలలో బంధించిన ప్రవీణ్ ప్రతిభ అమోఘం.
కథానాయకుడైన వేణుకు తాను ఊహించని అంధత్వం తననావరించినా, తట్టుకొని నిలబడి, ఆకటిక చీకటి కన్నులకే కానీ .. అంతర్ నేత్రానికి సూర్యకిరణాల్లాంటి వెలుగుల చూపుందని, తన శారీరక అందం ముఖ్యంకాదని, మానసిక అందంతో లోకాన్ని చూసి, కాలం కలిసి రాకపోయినా, పరిస్థితులు ఎదురు తిరిగినా, పట్టుదలతో కాలానికి ఎదురీది జీవన సాఫల్యం సాధించిన మహోన్నత వ్యక్తిత్వం వేణుది.
ఇక నవలా కథానాయకుడైన వేణు వ్యవసాయదారుల కుటుంబంలో పెద్ద కుమారుడుగా పుట్టి, అనుకోని పరిస్థితుల్లో వైద్యం వికటించి, పసి వయసులోనే కంటిచూపు పోగొట్టుకున్నా… తాను అందరివలెనే జీవించాలన్న ఆశయంతో కష్టాన్ని కౌగిలించుకొని, ఱంకెలు వేస్తూ మీదకు వచ్చే సమస్యలనే వన్యమృగాలను మచ్చిక చేసుకుని, తన దారికి మళ్ళించుకొనే మాట నైపుణ్యమున్న బతుకు వేటగాడు.
చదువుకునేందుకు ఎదురైన సమస్యలు, ఇంట్లో ఆధిపత్య ధోరణిలో నలిగిపోయిన వైనం, ఉద్యోగ ప్రయత్నం, ఇవన్నీ అసలే సహకారం లేని తన వారు, స్నేహితుల ఆలంబనతో ఎలా తాను అనుకున్న పని నెరవేర్చుకున్నారనేది ఈ నవల అంతా పరుచుకొని కనపడుతుంది.
ఒక్క చదువు, ఒక ఉద్యోగం లోనే కాదు తన ప్రేమ విఫలతను ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ, తన పెళ్ళికి పెద్దలుకుదిర్చిన అమ్మాయిని అర్థం చేసుకోవడంలోనూ విజేతనే వేణు!
ఒక విశిష్టమైనటువంటి నవల అని ఎందుకంటున్నానంటే ? ఒక అంధుడి జీవితంలోని చీకటి కోణాలను వివరించే అద్భుతమైన నవల! తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఈ చీకటి జీవితాలకు సంబంధించినటువంటి చీకటి కోణాల విషయాలు బహిర్గతం చేసే నవలలు వచ్చినట్టు మనకు తెలియవు.
మొట్టమొదటిసారి శ్రీ గోపాల్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన జీవన ప్రయాణంలో వారు ఎదుర్కొన్నవి, చూసినవి, విన్నవి, అనుభవించినవి, అనుభూతులుగా పొందినవన్నీ కూడా తన జీవన స్రవంతి నవల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎంతో కష్టపడి రాసిన నవల ఇది. దీన్నే ఆత్మ కథాత్మక నవల అని అంటాము. అంటే కొంత జీవిత చరిత్ర కు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పనాశక్తితో నవరసాత్మకమైన సన్నివేశాలను కల్పించి ఆత్మ కథాత్మక నవలగా తీర్చిదిద్దారు. ఇది ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి ట్రయాలజీ అనే సంప్రదాయాన్ననుసరించి, ఒక జీవితాన్ని- జీవితంలోని దశలను మూడు భాగాలుగా రాయబడిన కొత్త ప్రయోగం. తెలుగులో ఇంచుమించుగా ఇలాంటి నవల ఇంతకు ముందు శ్రీ అంపశయ్య నవీన్ గారు రాసారు. ఇటువంటి రచనలు తక్కువగా వచ్చాయనే చెప్పవచ్చు.
ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో కూడుకొని ఉన్నది ఈ జీవన స్రవంతి నవల. ప్రత్యేకత అంటే రచయిత, విమర్శకులు ఐన శ్రీ బెల్లంకొండ సంపత్ గారు చెప్పినట్టుగా దీంట్లో ఆంగ్ల సాహిత్య సంప్రదాయమైనటువంటి సమగ్రతాశైలి కనపడుతుంది. అంటే కేవలం ఒక విషయాన్ని మాత్రమే వర్ణించడం కాకుండా ఒక సామాజికాంశము, కుటుంబ సమస్యలు, ఆర్థికాంశాలు, వాటితో ఏర్పడిన చీకటి జీవితపు సంఘర్షణలు ఇలా వ్యక్తికి సంబంధించిన అంశాలే కాకుండా, సామాజిక సమస్యలను చిత్రించిన నవల కాబట్టి సమగ్ర సాహిత్యమంటారు.
తెలుగులో సమగ్రతా శైలితో రచించిన నవలలు చాలా తక్కువ. అందులో ఉదా॥ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు రాసిన మాలపల్లి, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు వంటి నవలలు చెప్పుకోతగ్గవి. ఎందుకంటే సుదీర్ఘమైన కాలం- నిర్ధిష్టమైన కాలంలో రాయబడిన సామాజిక పరిణామాలన్నింటినీ వర్ణిస్తేనే సమగ్రతా శైలి అని నిర్వచిస్తారు. ఇందులో ఒక కథాంశం వివరించడమే కాకుండా రచయిత బోధనారంగంలో ఉండడంవల్లనేమో? వారిలో సాహిత్యాభిలాష ఉండడం వల్ల రచనలో భావుకత ఉంటుంది. ఈ భావుకత వల్ల పాఠకులను ఆకర్శించిందీ నవల. అంతేకాకుండా అందులోని విషయాలను అవగాహన చేసుకోవాలనే అంశాలుగా మారుతాయి. కాబట్టి ఈ జీవన స్రవంతి చదివేవారికి ఉత్కంఠతో పాటు ఆసక్తిని కూడా కలిగిస్తుంది.
ఈ విధంగా ఎందరి మెప్పులు పొందిన ఈ నవలలో అనేక అంశాలను చర్చించిన కొంత జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పన శక్తితో నవరసాత్మకమైనటువంటి సన్నివేశాలు కల్పిస్తూ… దాంతో ఆత్మ కథాత్మక నవలగా తీర్చిదిద్దారు.
ముఖ్యంగా దీనిలో అంధుడు తమ సోమా జ్యోతిర్గమయా అన్న ఉపనిషత్తు వాక్య ప్రకారం చీకటినుండి వెలుగులోనికి ప్రయాణం చేయడం నవల యొక్క ముఖ్య లక్షణం అనిపిస్తుంది.
కనుచూపు లేని చీకట్లో ఉన్న వాళ్ళు ఆ చీకట్లోనే మగ్గిపోకుండా, చీకటి నుండి వెలుగులోనికి ఎట్లా ప్రయాణం చేయాలని? అలా ప్రయాణించినప్పుడు ఎన్నెన్ని ఆటంకాలు ఉంటాయో? వాటిని ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నాడనీ, ఆ అంశాలు ముఖ్యంగా వాటినన్నిటినీ ధైర్య-స్థైర్యాలతో , ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నారో అన్నీ వర్ణింపబడ్డాయి.
అంతేకాదు ఇందులో ఒక సిద్ధాంతం నవల నిండా కనబడుతుంది … అదేమిటంటే? అవయవ నష్టపరిహార సిద్ధాంతం అంటే శరీరంలో ఒక అవయవం లోపిస్తే… లోపించినటువంటి అవయవం ఏ పనులైతే చేస్తుందో… ఆ లోటు పూరించడానికి మిగిలిన అవయవాలు పనిచేస్తాయని ప్రధాన సిద్ధాంతం! కనుక ఇందులో ఒక చూపు లేకపోవడం వల్ల దాన్ని పూరించడానికి వినికిడిశక్తి, స్పర్శ, ఇతర అవయవాలకు సంబంధించిన పనులన్నీ క్రియాశీలకంగా మారి ఒక చూపులేని లోటును పూరించడం ఉంది… అని ప్రఖ్యాత వక్త వీక్షణం వేణుగోపాల్ గారన్నారు.
కనుక ఈ నవల నిండా కూడా ఆ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. ఇదో ప్రత్యేకత!
ఇంకొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే రచయిత తన రచనలు నదితో పోల్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నది యొక్క మలుపులు ఏ విధంగా ఉంటాయో జీవితపు మలుపులు కూడా అదే విధంగా ఉంటాయని ఉపమానంతో నిరూపించడం ఇందులో ముఖ్యమైన అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణిస్తేనే జీవితం ప్రవహిస్తేనే నది అని ప్రఖ్యాత తెలంగాణ రచయిత కవి అయిన శ్రీ నందిని సిధారెడ్డి గారు ఈ నవల ఆవిష్కరణ సమయంలో అన్నారు. ఆ మాట అక్షర సత్యం అనిపిస్తుంది. కనుక జీవితం కూడా ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. అలాగే నది కూడా నీటి ప్రవాహంతో ప్రవహించినప్పుడే నది అని అనుకుంటాం! వారన్నట్టుగా కూడా ఈ నవలను నిర్వచించుకోవచ్చు కూడా!
ఇలా అనేక ప్రత్యేకతలున్న నవలని కెనడా దేశంలోని టొరొంటో వేదికగా తెలుగు భాషకెంతో సేవలందించిన కీ.శే. నెల్లుట్ల నవీన్ చంద్ర గారు ఈ జీవన స్రవంతి ఒక ఎన్స్లైక్లో పీడియా (ENCYCLOPEDIA) అన్నారు.అంటే విజ్ఞాన సర్వస్వం అని. ఇది ఎలా అయితే అన్నివిషయాలను పొందుపరిచి మనకందిస్తుందో? ఈ జీవన స్రవంతి నవల కూడా అన్ని విషయాలలోనూ అవగాహన పెంచుతుందని అన్నారు. అలా ఉపయోగపడుతుంది.
రెండవ భాగం ఆవిష్కరణ సందర్భంలో N. వేణుగోపాల్ ఒకే ఒక్క మాటన్నారు.ఈ నవల మన జీవితాలలోని లోతుపాతులను చూసుకునేందుకుపయోగపడే దర్పణం వంటిది అని, అంటే అద్దంలో చూస్తూ మన ముఖంలోని లోపాలను ఎలా అయితే సవరించుకుంటామో, అలాగే ఈ జీవన స్రవంతి నవలను చదివితే కంటిచూపున్నవారు తమకు చూడగలిగే శక్తి ఉందనే గర్వాన్ని విడిచిపెట్టి తమలో ఏ యే లోపాలున్నాయో ఈ నవల చదివిన తర్వాత సరిదిద్దుకునే అవకావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మాట నవలను చదివాక యథార్థమనిపించింది. అందుకే ప్రత్యేక మైనదని అంటున్నాను. అలాగే ఈ నవలలో చర్చించని విషయం లేదు. బయటి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి.
బయట ప్రపంచ సమాజంలోని లోపాలు, కుటుంబంలోని లోపాలు, ఆర్థిక వ్యత్యాసాలు, బలహీనులను ఏ విధంగా సమాజం చిన్నచూపు చూస్తుందో చెప్తూ వారికి న్యూనతా భావం ఏర్పడ్డప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తారో, ఆ ప్రయత్నాల వల్ల ఎన్ని విజయాలు సాధిస్తారో? న్యూనతాభావం మనిషిని తక్కువ స్థాయికి దిగజార్చుతుంది. ఆ తక్కువ స్థాయి నుండి తాము కూడా అందరితో సమానమనే భావాన్ని వ్యక్తీకరించడానికి నవల చదివితే ఎంతో ఉపయోగపడుతుందని వేణుగోపాల్ గారు అన్నారు.
నందిని సిధా రెడ్డి గారు ఏమంటారంటే ఈ నవల కష్టాలను కన్నీళ్లను ఎదుర్కొనే వారికి ఒక దిక్సూచి వంటిదన్నారు. ఎందుకంటే జీవితమంటేనే చిన్నవో- పెద్దవో కష్టాలుంటూనే ఉంటాయి. దుఃఖమొచ్చినప్పుడు బాధ పడకుండా ఎదురించడానికి ఎలా ప్రయత్నించాలని, దాన్నుండి బయటపడే మార్గంచూపుతుందీ నవల.
అన్నింటికన్నా ముఖ్యం మానసిక సంఘర్షణ అనేది మనిషిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందుకే కురుక్షేత్ర యుద్ధానితో సమానం మనిషి హృదయం అని అంటారు. కురుక్షేత్ర యుద్ధంలో ఏవైతే మంచీ-చెడుల మధ్య సంఘర్షణ జరిగిందో అలానే జీవన స్రవంతి నవలలో కూడా రచయిత పాత్రల ద్వారా- కథానాయకుడైన వేణు ద్వారా మానసిక సంఘర్షణాత్మక అంశాలను వివరిస్తూ ఆ సంఘర్షణల వల్ల చెడును తొలగించి మంచి జయించడమనే ఒక తత్త్వాన్ని వివరిస్తుందీ నవల.
ఇంకా చెప్పాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో ఆశావాద తత్త్వం కనబడుతుంది. అదేమిటంటే మనం నైరాశ్యంలోకి వెళ్ళినప్పుడు నాకు ఇక ఏ దారీ లేదనుకున్నప్పుడు మనకనిపించేది ఏమిటంటే? ఒక చెట్టు మొత్తం ఆకులు రాలిపోయి మోడు వారినప్పుడు తనను తాను బతికించుకోవడానికి అలాగే నిలబడుతుంది. తిరిగి వసంత ఋతువు వస్తుంది అప్పుడు చిగురులు తొడిగి, పుష్పాలను పూస్తుంది ఫలాలను పండిస్తుంది అలాగే మనిషి జీవితం కూడా అలా పునర్నిర్మించుకోవాలనీ, మంచి రోజులు వస్తాయనీ, జీవన స్రవంతి నవల ఎప్పుడూ నైరాశ్య భావనను దగ్గరికి రానివ్వద్దని గొప్ప సందేశం నవల పొడుగునా అంతర్లీనంగా చెప్తూనే ఉంటుంది. కనుక ఎందరో మెచ్చుకున్న ఈ నవల చదవవలసిన అవసరం ఎంతో ఉంది!
వేణుకు వచ్చిన ఇన్ని కష్టాలలో ఒకే ఒక ఊరట రేడియో వినడం. రేడియో ద్వారానే ఎంతో విజ్ఞానాన్ని పొంది, తన వయసు వారికన్నా ఎక్కువ స్థాయిలో నిలబడడమే కాదు! ఆకాశవాణికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చించబడ్డాయి. ముఖ్యంగా ఒక రేడియో ఒక మనిషిని ఎలా బతికిస్తుందో ఒక
నిర్జీవమైనటువంటి ఆకాశవాణి మనిషి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో ? అతనిలో ఎన్ని ఆశా తత్త్వాలను మొలకెత్తించిందో వాటితో అతడు భవిష్యత్తు వైపు నడవడానికి ఎంత ఉపయోగపడిందోనన్న విషయాన్ని ఈ నవలలో ఎన్నోసార్లు చెప్పారు.
ప్రఖ్యాత నాటక నటి శారదా శ్రీనివాసన్ యొక్క ప్రస్తావన అడుగడుగునా కనిపిస్తుంది. ఆమె అందించినటువంటి మాటలు- ఆమె మధుర కంఠస్వరం యొక్క అమృతం ఒక అంధుడైన కథానాయకుని ఎలా బతికించిందో ఇందులో చిత్రీకరింపబడింది. కనుక రేడియోలో నవలాస్రవంతి ద్వారా – జీవనస్రవంతిని ప్రసారం చేస్తే ఈ నవల సార్ధకత చరితార్థం అవుతుందని ఈ జీవన స్రవంతి నవలపై సమీక్షా ప్రసంగం చేస్తున్నాను. జీవిత సత్యాలను సమగ్రంగా వివరించే ఈ నవలను ప్రతి ఒక్కరూ చదవాలి! ముఖ్యంగా అంధులు చదవాలని సూచిస్తూ.

January 25, 2026 0 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

“వివేకం”

by Maji Bharathi January 25, 2026
written by Maji Bharathi

“మీరెన్ని చెప్పండి. మీ అమ్మగారిని యిక్కడికి తీసుకురావడానికి నేనొప్పుకోను. అలవాటైన ఊరు. అలవాటైన పరిసరాలు. అయినా కాలు చెయ్యి బాగానే ఆడుతున్నాయి కదా! కాలు చెయ్యి పడిపోయినప్పుడు ఆలోచిద్దాంలెండి”.
“అదేమిటి సరసూ! అంత మాటన్నావు?”
“ఆవిడ అత్తగారి గురించి మీ అమ్మగారన్న మాటలే కదా! నేనేమైనా కొత్తగా అన్నానా ఏమిటి?” “ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు?”
“ఎందుకంటే, అది ఆవిడ చూపిన త్రోవే కదా! నేను అనుసరిస్తున్నానంతే!”
“అది తప్పని నీకు తెలియదా?” “మీకు తెలియదా?”
“తెలుసు కాబట్టే, అమ్మను యిక్కడకు తీసుకొద్దానుకుంటున్నాను”.
“కాలానుగుణంగా మనుషులను బట్టి మీ తప్పొప్పులు మారిపోతాయంటే నేను లెక్కచెయ్యను”
“సరసూ దయచేసి అర్థం చేసుకో! అప్పుడు మా అమ్మ చేసినది తప్పే. కాని ముప్పయ్యేళ్ళ క్రిందట జరిగిన దానికి యిప్పుడు నేనేం చెయ్యగలను?” నాన్న అమ్మను బ్రతిమలాడుతున్నారు.
“ఇప్పుడూ అలాగే అనుకొని ఊరుకోండి. మీకు అమ్మ అయితే అవ్వచ్చు. గాని ఆవిడ మా అమ్మమ్మకు చేసినదానికి, ఆవిడ క్షమించినా నేను క్షమించలేను. కొడుకుగా మీరేం చేసినా నేను అడ్డు చెప్పను. కానీ ఒక కోడలుగా ఆవిడ ఎంతవరకు చేశారో, నేనూ అంతవరకే చేస్తాను. నన్ను ఎక్కువగా బలవంత పెట్టవద్దు” అమ్మ నిష్కర్షగా చెప్తుంది నాన్నతో.
అమ్మానాన్నల సంభాషణను పక్కగదిలో ఉన్న నేను పూర్తిగా విన్నాను. నేను గదిలో లేననుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారో, ఉన్నా ఫరవాలేదు అనుకొని మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కానీ వారం రోజులనుండి అమ్మానాన్నల మధ్య ఈ ప్రచ్చన్న యుద్ధం జరుగుతూనే ఉంది నాన్నమ్మ విషయంలో. ఈరోజు ఇద్దరూ బయటపడ్డారు.
అమ్మ, నాన్నకు అత్త కూతురే. తాతమ్మ నాన్నకు నాన్నమ్మ అయితే అమ్మకు అమ్మమ్మ అవుతుంది. నాన్నమ్మ తాతమ్మను బాగా చూసుకోలేదని అమ్మకు కోపం. ముత్తాత చనిపోయాక, తాతయ్య వాళ్ల అమ్మ… అదే తాతమ్మను ఇంటికి తీసుకువస్తానంటే నాన్నమ్మ ఒప్పుకోలేదంట. చివరకు ఆ పల్లెటూరిలోనే తాతమ్మ చనిపోయిందంట. అప్పటికి నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా తాతమ్మ విషయంలో ఏమి చేయలేదని అమ్మకు కోపం. అందుకని ఇప్పుడు తాతగారు చనిపోయాక నాన్నమ్మను తీసుకువస్తానంటే ఒప్పుకోవడం లేదు.
దానికితోడు… మనలో మనమాట… నాన్నమ్మ ఎప్పుడూ అమ్మను కూడా బాగా చూసుకోలేదు. నాన్నమ్మకు ఇష్టం లేకుండా, తాతమ్మ బలవంతంతో అమ్మానాన్నల పెళ్లి జరిగిందని ఒక కారణం. ఏదైతేనేం నాన్నమ్మ, అమ్మల మధ్యలో సయోధ్య ఎప్పుడూ లేదు. నాన్నమ్మ అటు ఆవిడ అత్తగారి విషయంలోనూ, ఇటు కోడలి విషయంలోనూ తన మాటే నెగ్గేటట్లు చూసుకుంది. అధికారం చలాయించింది. ఆ విషయం జగమెరిగిన సత్యం.
ఒకప్రక్క తన అమ్మమ్మకు అన్యాయం చేసిందని, ఇంకొక ప్రక్క తనను ఏ రోజూ ప్రేమగా చూసుకోలేదని అమ్మకు, నాన్నమ్మ అంటే కోపం. ఆ కోపం ఇప్పటికీ అలానే ఉంది. అందరి విషయంలో మంచిగా ఆలోచించే అమ్మ, నాన్నమ్మ విషయంలో మాత్రం తన గతంనుండి బయటపడలేక పోతుంది. మధ్యలో నాన్న నలిగిపోతున్నారు.
ఇప్పుడు పరిస్థితి యిలా ఉంటే…. మరో పాతికేళ్ల తర్వాత…. ఇదే పరిస్థితి నేనూ ఎదుర్కోవలసి వస్తుందా? మీ నాన్నమ్మ గారిని మీ అమ్మగారు చూశారా, నేను మీ అమ్మగారిని చూడడానికి? అని నా భార్య అంటే నేనేమి చెయ్యాలి? నా భార్య మా అమ్మల మధ్య నలిగిపోవాలా! అమ్మో! నా వల్ల కాదు. ఆ పరిస్థితి నాకు ఎదురవ్వకూడదంటే ఇప్పుడే నేను సరైన దిశగా ఆలోచించాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చాను.
“అమ్మా! నీ బాధను, మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. గాని కొత్తవారికి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. పాతికేళ్ల తర్వాత ఇదే పరిస్థితిలో నేనూ వుంటానేమోనన్న ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఏం చేయమంటావు నన్ను?” ఆ రాత్రి అమ్మ చరవాణికి ఒక సందేశం పంపించాను.
*
“సరసూ! తలుపేసుకో” వేకువజామునే నాన్న మాటలు.
“రేపు పెందరాళే బయలుదేరండి. ఎండ పడ్డాక బయలుదేరవద్దు. మీ అమ్మగారి ఆరోగ్యం అసలే అంతంత మాత్రం” అమ్మ నాన్నకు చెప్తుంది.
నాన్నమ్మను తీసుకురావడానికి ఊరికి బయలుదేరినట్లున్నారు.
నాకు తెలుసు. మా అమ్మ వివేకవంతురాలు. అర్థం చేసుకోగలదు.

January 25, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us