మానవాళిని పీడిస్తున్న ప్రమాదకరమైన జబ్బులలో ప్రధానమైనది క్యాన్సర్. మారిన ఆధునిక జీవన శైలుల వల్ల క్యాన్సర్ అధికంగా వచ్చే అవకాశాలు వున్నాయని నిపుణులు చెపుతున్నారు. పూర్వకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. వైద్య సదుపాయాలూ తక్కువే. కానీ నేడు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో క్యాన్సర్ చికిత్స సులభతరమౌతోంది. అయినా క్యాన్సర్ అని నిర్థారణ అయితే ఇక జీవితం ముగిసిపోయినట్టేననే భావనలో చాలా మంది క్యాన్సర్ బాధితులు వున్నారు. అవగాహనా లేమి వల్లా, కుటుంబ సభ్యుల అనాదరణ వల్ల కూడా ఈ పరిస్థితి వస్తోంది.
ఈ పరిస్థితి నివారించడానికి, క్యాన్సర్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఒక పక్క మెరుగైన వైద్యం అందిస్తూనే, మరోపక్క క్యాన్సర్ బాధితులకు మానసికఅండగా, ధైర్యంగా వుండడానికి సాంత్వన వచనాలు, ఆత్మీయ స్పర్శ, బంధుమిత్రుల సహకార సాంగత్యం చాలా అవసరం.
క్యాన్సర్ అనేది కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ఇవి నియంత్రణ లేకుండా విభజన చెంది, కణితిలాగ పెరిగి, శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపిస్తాయి. వీటిలో కొన్ని సాధారణమైనవి. మరికొన్ని ప్రాణాంతకమైనవి. వీటిని ప్రాధమిక దశలోనే గుర్తించి, సరైన వైద్య చికిత్స అందించకపోతే, మనిషి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చు. మారుతున్న ఆధునిక జీవన విధానాలు, అసమతుల్య పర్యావరణం, ప్రమాదకర రసాయనాలు, అనారోగ్యకర ఫైబర్ లేని జంక్ & ఫాస్ట్ ఫుడ్ ఆహారపు అలవాట్లు, జన్యు సమస్యలు మొదలైన అనేక కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఈ రోజుల్లో మెండుగా వుంది. అందులోనూ ప్రత్యేకంగా మన దేశంలో స్త్రీలకు వచ్చే రొమ్ము క్యాన్సర్ కేసులే ఎక్కువ.
అయితే క్యాన్సర్ కి సంబంధించి అవగాహన కల్పించి, బాధితుల్లో ధైర్యం కల్పించిన రచనలు వచన రూపంలో ఎన్నో వచ్చి వుండవచ్చు. ఇటీవల సమ్మెట విజయగారు‘ ఆశే శ్వాసగా’ అనే పుస్తకంలో (ఫిబ్రవరి,2025) 21 మంది క్యాన్సర్ బాధితుల విజయగాధలను నమోదు చేసింది. కానీ, ప్రత్యేకించి రొమ్ము క్యాన్సర్ వస్తువుగా ఒక దీర్ఘకవితను ‘Monologue of a వూండెడ్ హార్ట్ ‘ (అక్టోబర్,2013) వెలువరించడం ఇదే ప్రధమం. ఇటువంటి పుస్తకాల లక్ష్యం బాధితులకు అండగా నిలబడి, ఆత్మస్థైర్యం ప్రోది చేసే సాంత్వన వాక్యాలు పలికి, వారిని ఆ జబ్బు నుండి బయట పడేయడమే..! ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆధునిక పరికరాలు వున్నా, మనసుకు హాయి నిచ్చే ఒక మంచిమాట జబ్బు నివారణలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఆ రకంగా చూస్తే ఇటువంటి పుస్తకం క్యాన్సర్ నిరోధకతలో ఇతోధిక పాత్ర నిర్వహిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ ఈ పుస్తక కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి గారు ఒక నిర్దేశిత లక్ష్యంతో ఈ పుస్తక రచనకు పూనుకున్నారు. ఒక ప్రణాళికాబద్ద రచనను తన మనసులో ప్రణాళిక వేసుకున్నారు. తన చుట్టూ వున్న తన బంధుమిత్రుల అనుభవాలను (సహానుభూతి) తనవిగా (స్వయం అనుభూతి) చేసుకొని, ఆ స్తనాతీత తీవ్ర అనుభూతిలోకి పరకాయప్రవేశం చేసి ఈ కవిత్వం రాసారా అనిపిస్తుంది.

ముందుగా ఈ వస్తువు (Subject) ను దీర్ఘకవితగా ఎన్నుకోవడంలోనే మెలకువ ప్రదర్శించారు కవయిత్రి శ్రీలక్ష్మి గారు. క్యాన్సర్ లోని వివిధ దశలను చెప్పడానికి విడివిడి కవితల కంటే ఎక్కడా బిగి సడలని కవితా భావధార అవసరం. అందుకే ఈ దీర్ఘకవితను ప్రోలోగ్, ఇంట్రో, స్టేజ్- 1, స్టేజ్- 2,
స్టేజ్ -3, ఇన్ ది వార్డ్, ప్లాష్ బ్యాక్, ఫ్లాష్ ప్రెజెంట్, ఇన్ ద థియేటర్, పింక్ హోప్ విభాగాలుగా విభజించి, ఒక్కొక్క విభాగంలో దశల వారీగా ఒక క్యాన్సర్ బాధిత స్థితిని వివరించే ప్రయత్నం చేసారు.
ప్రోలోగ్ (నాంది)లో ‘ ఇప్పటిదాకా మనం/ దేహం గురించి/ చర్చోపచర్చలు చేసాం./ ఇప్పుడు-/ దాని ఆదిమ / కణం గురించి డిసెక్షన్ చేద్దాం.’ అనడం ద్వారా ‘కణం’ గురించి మనం చర్చించబోతున్నాం అని తెలుస్తుంది. తర్వాత ఇంట్రో (పరిచయం) లో ‘అణు విస్ఫోటనం తెల్సు / కానీ – / కణ విస్ఫోటనం మాత్రం / కొత్తదే కదా’ అని మెల్లగా మనకు కణ విస్ఫోటనం వల్ల క్యాన్సర్ వస్తుందని చెపుతూ ‘ మహా సంక్షోభానికి…/ ఒక్క కణం కన్నెర్ర చాలు’ అని అసలు కారణాన్ని ముక్తాయించారు.
స్టేజ్ -1 లో ప్రతి ఇంట్లో సాధారణ గృహిణి దినచర్యను తనకు ఆపాదించుకొని..
‘ నేను మంచం పైనుంచి లేచినపుడే నా ఇంటికి వేకువ వస్తుంది’ అన్నప్పుడు ‘ A house remain in silence, Until the Mother wakes up’ అనే వాక్యం చాటాలున గుర్తుకు వస్తుంది. ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు దేహంలో, అందులోనూ గుండెల మీద గూడు కట్టుకుంటున్న ఈ కణితి నొప్పిని అడుగడుగునా భరిస్తూ, గుర్తిస్తూ వుంటుంది. తనలో రేగుతున్న బాధను డాక్టర్ ముందు వెల్లడించడానికి
భయవిహ్వలయై, చివరికి ఉద్విగ్నవిహ్వలగా మెటామార్ఫసిస్ చెందుతుంది. అంటే తనలో ఒక కణం కన్నెర్ర చేసిందన్న విషయం గ్రహించి, దాని చికిత్స కోసం మానసిక విచికిత్స పడుతుంది. ఇక్కడ కవయిత్రి స్తనద్వయం భార్యాభర్తల బాంధవ్యంలో నెరిపే పాత్రను శషబిషలు లేకుండా పరిధుల మేరకు వర్ణించడం గొప్పగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రస్తావనలు తెలుగు సాహిత్యంలో ( ప్రబంధ కవులను మినహాయిస్తే) తక్కువగా వచ్చాయి.
స్టేజ్ -2 లో తన కుటుంబంలో వచ్చిన అనారోగ్యాలకు తాను ఎలా తల్లడిల్లిపోయిందో, ఎంతగా తనవారి కోసం తాపత్రయపడిందో చెపుతూ సగటు గృహిణిలా తన ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి తనకు ఏమీ కాదనే ధీమాతో I’m Rock Study కదా అనే భ్రమలో వుంటుంది. ఎంత పాజిటివ్ థింకింగ్ లో వున్నా కూడా తన జబ్బు నెగెటివ్ రావాలని కోరుకుంటుంది.
స్టేజ్ -3 లో డాక్టర్ తనకి క్యాన్సర్ అని నిర్థారిస్తూ చెప్పినప్పుడు తన మానసిక భయాందోళన స్థితిని ఇందులో వర్ణిస్తుంది. ‘ కళ్ళ ముందున్న రంగులకల / ముక్కలవుతుంది./ కన్నీళ్ళ మధ్య రేపటి దృశ్యం/ మసక బారిపోతుంది.’ అని బెంబేలెత్తుతుంది. అంతేగాక తన కుటుంబసభ్యులు ఏమైపోతారా అనే బెంగ తీవ్రతరం దాల్చి కుంగిపోతుంది. ఇక్కడ ఒక స్త్రీకి జబ్బు చేస్తే, కుటుంబానికంతటికీ జబ్బు చేసినట్టే అని, అంతగా కుటుంబం ఆ స్త్రీ మీద ఆధారపడి వుంటుందని, సాధారణ కుటుంబాలలో వాస్తవ పరిస్థితిని అన్యాపదేశంగా కళ్ళకు కట్టారు.
ఇన్ ది వార్డ్ లో ఆసుపత్రి ప్రాంగణంలో వరండాలలో గదులలో ఒక క్యాన్సర్ బాధిత ఆలోచనలను, ఆ కొత్త పరిసరాలను అలవాటు చేసుకోవడాన్ని, ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవడాన్ని చిత్రించింది. కవయిత్రి నిజంగా తానే ఆ స్థితిని అనుభవిస్తున్నట్టు కవితను దృశ్యమానం చేయడం ఇందులో కనిపిస్తుంది. కవి సూక్ష్మదృష్టిని కూడా ఈ వ్యక్తీకరణ పట్టిస్తుంది. ‘కొంగుచాటు చంద్రుళ్ళు చేసే అలజడులు’ వినడం చెవులున్న మనసుకే సాధ్యం.
ఫ్లాష్బ్యాక్ విభాగం చాలా సున్నితంగా చెప్పుకొచ్చిన విభాగం. ఎక్కడైతే తనకు క్యాన్సర్ పొడచూపిందో అదే రొమ్ముల గురించి గతంలోకి ప్రయాణించి నెమరు వేసుకోవడం ఈ విభాగంలో కనిపిస్తుంది. తన స్త్రీత్వానికి అస్తిత్వానికి అవి గుర్తులని చెపుతూ, గుండెలపై నిండు చంద్రుళ్ళు, ఆత్మగౌరవ ప్రతీకలు, పూర్ణ కలశాలు, హృదయ సౌందర్య బింబాలు, అమృత భాండాలు, జీవ ధార పాలవెల్లువలు అంటూ ఆ స్తనద్వయాలు తన జీవిత వివిధ దశల గురించి తలపోస్తుంది. చివరిగా ఈ వ్యక్తీకరణలు ‘ నా గుండె వైకుంఠానికి / ఇరువైపులా- / రక్షణగా నిలుచున్న / జయవిజయులు కదా..!’ అనే ఒక అద్భుత వ్యక్తీకరణతో ఉచ్ఛస్థితికి చేరుకుంటుంది. ఇంతవరకు స్తనద్వయాన్ని వర్ణించడం ఎలా అనే ఆత్మన్యూనత నుండి అవి తన ఆత్మగౌరవ ప్రతీకలు అని కవయిత్రి నిస్సంకోచంగా ప్రకటించడం కూడా కవులు/ కవయిత్రులకు ఒకింత ఊతమిచ్చేదే. ఈ రకంగా ఆ విషయం పట్ల చదువరుల దృష్టికోణం మార్చడం కూడా కవయిత్రి సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇది ఇంతకు ముందు తెలుగు సాహిత్యంలో జరగలేదు.

ఫ్లాష్ ప్రెజెంట్ లో క్యాన్సర్ బాధితురాలిగా ఎన్ని చికిత్సామార్గాలు వున్నాయి..లేబొరేటరీ లో ఎలా తానొక గినియా పిగ్ లాగ పరీక్షలకు గురయింది రాసారు.
ఇన్ ది థియేటర్ లో ఆపరేషన్ థియేటర్ని ఒక బోధివృక్షంలా తలుస్తూ తాత్విక చర్చ చేస్తారు. జబ్బుకు గురయిన తన స్తనద్వయాన్ని ఆపరేషన్ చేసి రక్తపుముద్దలుగా తీసి పళ్ళెంలో వేసినపుడు ‘ భూమి గుండ్రంగా వుందని/ గుండెలపై చెయ్యేసుకొని / ధైర్యంగా చెప్పేదాన్ని / ఇప్పుడు – / బల్లపరుపుగా వుందని / చెప్పాలేమో’ అన్న కవయిత్రి వ్యక్తీకరణకు ఒక్క క్షణం పాఠకుని గుండె రసార్ద్రమవుతుంది. వస్తువు పట్ల కవి మగ్నతకు ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక వస్తువు స్థానంలో మరో వస్తువును భావతీవ్రతను పెంపుచేస్తూ ప్రతిక్షేపించడం కవయిత్రి నిపుణతకు నిదర్శనం.
పింక్ హోప్ లో తన రెండు జడలకు కట్టుకోవాలనుకునే గులాబీ రిబ్బన్లు ఇప్పుడు ఈ విధంగా ఆ కోరికను పింక్ హోప్ ద్వారా తీర్చుకుంటున్నాని కవయిత్రి ఊహ చేయడం ఆశ్చర్యమనిపిస్తుంది. ఇక్కడ పింక్ హోప్ అంటే రొమ్ము క్యాన్సర్ బాధితులకు బాసటగా వారిలో నమ్మకాన్ని, దైర్యాన్ని పాదుకొల్పడానికి ఉపయోగించే చిహ్నం. సాధారణంగా ఇది పింక్ రిబ్బన్ ఆకారంలో వుంటుంది. కాబట్టి దీన్ని పింక్ హోప్ అన్నారు. కవయిత్రి ఈ విభాగాన్ని బాధితులలో తిరిగి జీవనేచ్ఛను నెలకొల్పాడానికే బలంగా వాడుకున్నారు. ఎంతగా తన స్తనద్వయాన్ని ఆత్మగౌరవ ప్రతీక అన్నారో..అవి క్యాన్సర్ వల్ల కోల్పోవాల్సి వచ్చినా నిబ్బరం కోల్పోకుండా బాధితుల్లో ఒక నమ్మకాన్ని ఎలా కలిగిస్తున్నారో చదవండి..
‘ఆకులు రాలడమంటే
వసంతం ఆగిపోవడం కాదు కదా!
కొమ్మలు విరగడం అంటే
చెట్టు నేలకూలడం కాదు కదా!…అంటూ అనేక ఉపమానాలు చెపుతూ చెపుతూ..
‘ఈ స్తనాతీత దశని
మహిళా ప్రస్థానంలో
నవయుగోదయం అని చాటి చెపుదాం’ అంటూ ఒక నిరాశ నిస్పృహ స్థానే ఒక వెలుగు నిండిన ఆశను ప్రవేశపెట్టడం చేస్తుంది కవయిత్రి. అంతే కాదు..
‘పింక్ రిబ్బన్ తో
నాలాంటి కోట్లాది స్త్రీల గుండెల్లో
జీవనేచ్ఛను నింపడానికి
నేను కదం తొక్కాను’ అని తన కవిత్వ పరమార్థాన్ని చెప్పడమే కాకుండా ‘ జెండర్ యే కాదు / జెండా యై నిలుద్దాం’ అని దిశానిర్దేశం కూడా చేసారు. పింక్ హోప్ కవితా విభాగం నిజంగానే బాధితులలో ఒక నమ్మకం కలిగిస్తూ వుంది. మామిడి హరికృష్ణ గారు పేర్కొన్న Placibo
Effect ‘ విధిలేని పరిస్థితులలో రోగి మనసులో పాదుకున్న పాజిటివ్ థాట్స్ – సానుకూల సంకల్ప శరీరాన్ని, భౌతిక స్థితిని దానికి అనుకూలంగా సమాయాత్తం చేసి, ఆ వ్యక్తిని ప్రమాదం నుండి తప్పించగలిగే మానసిక స్థితి – ఈ Placibo Effect, ఈ కవిత్వానికి సరిపోతుంది. ఈ కవిత్వం ఇస్తున్న సాంత్వన, నమ్మకం, జీవనేచ్ఛ బాధితుల పట్ల Poetry Therapy కూడా.
మామిడి హరికృష్ణ గారు ఈ పుస్తకానికి సవివరమైన ముందుమాట రాసారు. అంతర్జాతీయ సాహిత్యంలో క్యాన్సర్ మీద వచ్చిన సాహిత్యాన్ని పరిశోధనాత్మకంగా తెలియజేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా కవిత్వం ఎలా సాంత్వన పరుస్తుందో చెపుతూ, విదేశాలలో ఉపయోగిస్తున్న ‘పొయెట్రీ థెరపీ’( Poetry Therapy) ఎలా రోగనివారణకు ఉపయోగపడుతుందో.. ఈ సందర్భంలో ఈ పుస్తకం ఎలా క్యాన్సర్ బాధితులకు ఊరట ఇస్తుందో చాలా బాగా అన్వయించి చెప్పారు. Ted Hughes అనే బ్రిటీష్ కవి ‘ సాహిత్యం వంటి కళాత్మక సృజనలు మానసిక సాంత్వనను మాత్రమే కాదు, రోగనివారణను కూడా వాక్యాల వెంట తీసుకువస్తాయని, కవిత్వం ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేస్తుందని చెపుతూ ఆయన అన్న ఒక మాట ఇలా ఉదహరిస్తారు..“Prose, narratives etcetera, can carry healing Poetry does it more intensely “ అని.
చదివి తీరవలసిన ముందుమాట ఇది. రొమ్ము క్యాన్సర్ గురించిన కవితలు వెతికి పట్టుకొని ఇక్కడ పాఠకులకు అందివ్వడం, క్యాన్సర్ గురించిన ప్రపంచ సాహిత్యం విషయ పరంగానూ, వివరాల పరంగానూ, విషయాన్ని విశదీకరించడం గురించి దీనిని ది బెస్ట్ అని చెప్పాలి. శ్రీలక్ష్మి గారు ఆయన్ని ‘నడిచే గూగుల్’ అనడం అతిశయోక్తి ఏ మాత్రం కాదు.
సి.శోభ- పార్థసారథి గార్ల ఆత్మీయ వాక్యం ‘ వ్యాధిగ్రస్తులకు కావలసినది మందులు కాదు – ఆత్మీయత, ఆలంబన, ఆసరా’ అన్నది ఎప్పటికీ ఆచరణ యోగ్యం.
శ్రీలక్ష్మి గారు రాసిన ‘ఒకింత’ ఎన్నో విషయాలు చెప్పింది. తన చుట్టూ వున్న తనవాళ్ళూ, ఇతరుల క్యాన్సర్ కష్టాలు చూసి చలించిపోయి ఆమె ఈ దీర్ఘకవితా రచనకు పూనుకున్నారు. జీవితం పట్ల ఒక దృక్పథం లేనివాళ్ళకి ఈ క్యాన్సర్ వార్డుని చూయిస్తే జీవితం ఎంత అమూల్యమయిందో తెలిసి వస్తుంది అంటారు. ప్రతి స్త్రీ బాధ్యతగా తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, క్రమం తప్పకుండా ఆరోగ్యం చూసుకోవాలంటారు.
ఈ దీర్ఘకవిత వస్తు ప్రధానంగా రాయబడిందే గానీ శిల్ప ప్రధానంగా కాదు. ఈ కవిత్వం సాహిత్యం పట్ల అంతగా పరిచయం లేని క్యాన్సర్ బాధితులను ఉద్దేశించి రాయబడింది కనుక చిక్కని కవిత్వం వారికి అర్థం కాకపోయే అవకాశం వుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో వుంచుకొని శ్రీలక్ష్మి గారు సులభశైలిలో అందరూ అర్థం చేసుకోగలిగే విధంగా ఈ దీర్ఘకవితను రచించడం ఆమె ముందుచూపుకి నిదర్శనం. ఎక్కడా సంక్లిష్ట సమాసాలు, క్లిష్ట పదాలు లేని సరళ సలిలంగా ఈ కవిత సాగిపోయింది. క్యాన్సర్ స్థానంలో ఏ మరో ప్రాణాంతక వ్యాధి వున్నా ఈ కవిత్వం అన్నిటికీ నప్పుతుంది.
పుస్తకంలో ఆంగ్ల పదాల వినియోగం తగ్గించవచ్చు అనిపించింది. రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుందో, దాని లక్షణాలు ఏమిటో సంక్షిప్తంగా వివరిస్తే చదువరులకు ఉపయోగంగా వుండేది.
‘ధైర్యంతో ఆత్మస్థైర్యంతో/ బ్రెస్ట్ క్యాన్సర్ని/ ఎదురొడ్డి పోరాడి గెలిచిన/ మహిళలకు మానవిలకు’
ఈ పుస్తకం అంకితమివ్వడం సముచితంగా వుంది. అలాగే క్యాన్సర్ తో చివరికంటా పోరాడిన తన నాయనమ్మ నారాయణమ్మకు నివాళి ప్రకటించడం ఆర్ద్రంగా వుంది.
శ్రీ హరిచంద్ర క్రియేషన్స్ సమర్పణలో, సరోజనీ శ్యాంసుందర్ వృద్ధాశ్రమ సేవాసంఘం, హైదరాబాదు ప్రచురణలో వచ్చిన ఈ దీర్ఘ కవితను చదవడం క్యాన్సర్ బాధితులకే కాక, ఒక సాధారణ పాఠకునికి కూడా ఒక మంచి పుస్తకం చదివిన అనుభవం.










