మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

‘గాయపడిన గుండె’ కు కవితా ఉపశమనం.

by N Lahari November 30, 2025
written by N Lahari

మానవాళిని పీడిస్తున్న ప్రమాదకరమైన జబ్బులలో ప్రధానమైనది క్యాన్సర్. మారిన ఆధునిక జీవన శైలుల వల్ల క్యాన్సర్ అధికంగా వచ్చే అవకాశాలు వున్నాయని నిపుణులు చెపుతున్నారు. పూర్వకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. వైద్య సదుపాయాలూ తక్కువే. కానీ నేడు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో క్యాన్సర్ చికిత్స సులభతరమౌతోంది. అయినా క్యాన్సర్ అని నిర్థారణ అయితే ఇక జీవితం ముగిసిపోయినట్టేననే భావనలో చాలా మంది క్యాన్సర్ బాధితులు వున్నారు. అవగాహనా లేమి వల్లా, కుటుంబ సభ్యుల అనాదరణ వల్ల కూడా ఈ పరిస్థితి వస్తోంది.
ఈ పరిస్థితి నివారించడానికి, క్యాన్సర్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఒక పక్క మెరుగైన వైద్యం అందిస్తూనే, మరోపక్క క్యాన్సర్ బాధితులకు మానసికఅండగా, ధైర్యంగా వుండడానికి సాంత్వన వచనాలు, ఆత్మీయ స్పర్శ, బంధుమిత్రుల సహకార సాంగత్యం చాలా అవసరం.

క్యాన్సర్ అనేది కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ఇవి నియంత్రణ లేకుండా విభజన చెంది, కణితిలాగ పెరిగి, శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపిస్తాయి. వీటిలో కొన్ని సాధారణమైనవి. మరికొన్ని ప్రాణాంతకమైనవి. వీటిని ప్రాధమిక దశలోనే గుర్తించి, సరైన వైద్య చికిత్స అందించకపోతే, మనిషి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చు. మారుతున్న ఆధునిక జీవన విధానాలు, అసమతుల్య పర్యావరణం, ప్రమాదకర రసాయనాలు, అనారోగ్యకర ఫైబర్ లేని జంక్ & ఫాస్ట్ ఫుడ్ ఆహారపు అలవాట్లు, జన్యు సమస్యలు మొదలైన అనేక కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఈ రోజుల్లో మెండుగా వుంది. అందులోనూ ప్రత్యేకంగా మన దేశంలో స్త్రీలకు వచ్చే రొమ్ము క్యాన్సర్ కేసులే ఎక్కువ.

అయితే క్యాన్సర్ కి సంబంధించి అవగాహన కల్పించి, బాధితుల్లో ధైర్యం కల్పించిన రచనలు వచన రూపంలో ఎన్నో వచ్చి వుండవచ్చు. ఇటీవల సమ్మెట విజయగారు‘ ఆశే శ్వాసగా’ అనే పుస్తకంలో (ఫిబ్రవరి,2025) 21 మంది క్యాన్సర్ బాధితుల విజయగాధలను నమోదు చేసింది. కానీ, ప్రత్యేకించి రొమ్ము క్యాన్సర్ వస్తువుగా ఒక దీర్ఘకవితను ‘Monologue of a వూండెడ్ హార్ట్ ‘ (అక్టోబర్,2013) వెలువరించడం ఇదే ప్రధమం. ఇటువంటి పుస్తకాల లక్ష్యం బాధితులకు అండగా నిలబడి, ఆత్మస్థైర్యం ప్రోది చేసే సాంత్వన వాక్యాలు పలికి, వారిని ఆ జబ్బు నుండి బయట పడేయడమే..! ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆధునిక పరికరాలు వున్నా, మనసుకు హాయి నిచ్చే ఒక మంచిమాట జబ్బు నివారణలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఆ రకంగా చూస్తే ఇటువంటి పుస్తకం క్యాన్సర్ నిరోధకతలో ఇతోధిక పాత్ర నిర్వహిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ ఈ పుస్తక కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి గారు ఒక నిర్దేశిత లక్ష్యంతో ఈ పుస్తక రచనకు పూనుకున్నారు. ఒక ప్రణాళికాబద్ద రచనను తన మనసులో ప్రణాళిక వేసుకున్నారు. తన చుట్టూ వున్న తన బంధుమిత్రుల అనుభవాలను (సహానుభూతి) తనవిగా (స్వయం అనుభూతి) చేసుకొని, ఆ స్తనాతీత తీవ్ర అనుభూతిలోకి పరకాయప్రవేశం చేసి ఈ కవిత్వం రాసారా అనిపిస్తుంది.

ముందుగా ఈ వస్తువు (Subject) ను దీర్ఘకవితగా ఎన్నుకోవడంలోనే మెలకువ ప్రదర్శించారు కవయిత్రి శ్రీలక్ష్మి గారు. క్యాన్సర్ లోని వివిధ దశలను చెప్పడానికి విడివిడి కవితల కంటే ఎక్కడా బిగి సడలని కవితా భావధార అవసరం. అందుకే ఈ దీర్ఘకవితను ప్రోలోగ్, ఇంట్రో, స్టేజ్- 1, స్టేజ్- 2,
స్టేజ్ -3, ఇన్ ది వార్డ్, ప్లాష్ బ్యాక్, ఫ్లాష్ ప్రెజెంట్, ఇన్ ద థియేటర్, పింక్ హోప్ విభాగాలుగా విభజించి, ఒక్కొక్క విభాగంలో దశల వారీగా ఒక క్యాన్సర్ బాధిత స్థితిని వివరించే ప్రయత్నం చేసారు.

ప్రోలోగ్ (నాంది)లో ‘ ఇప్పటిదాకా మనం/ దేహం గురించి/ చర్చోపచర్చలు చేసాం./ ఇప్పుడు-/ దాని ఆదిమ / కణం గురించి డిసెక్షన్ చేద్దాం.’ అనడం ద్వారా ‘కణం’ గురించి మనం చర్చించబోతున్నాం అని తెలుస్తుంది. తర్వాత ఇంట్రో (పరిచయం) లో ‘అణు విస్ఫోటనం తెల్సు / కానీ – / కణ విస్ఫోటనం మాత్రం / కొత్తదే కదా’ అని మెల్లగా మనకు కణ విస్ఫోటనం వల్ల క్యాన్సర్ వస్తుందని చెపుతూ ‘ మహా సంక్షోభానికి…/ ఒక్క కణం కన్నెర్ర చాలు’ అని అసలు కారణాన్ని ముక్తాయించారు.

స్టేజ్ -1 లో ప్రతి ఇంట్లో సాధారణ గృహిణి దినచర్యను తనకు ఆపాదించుకొని..
‘ నేను మంచం పైనుంచి లేచినపుడే నా ఇంటికి వేకువ వస్తుంది’ అన్నప్పుడు ‘ A house remain in silence, Until the Mother wakes up’ అనే వాక్యం చాటాలున గుర్తుకు వస్తుంది. ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు దేహంలో, అందులోనూ గుండెల మీద గూడు కట్టుకుంటున్న ఈ కణితి నొప్పిని అడుగడుగునా భరిస్తూ, గుర్తిస్తూ వుంటుంది. తనలో రేగుతున్న బాధను డాక్టర్ ముందు వెల్లడించడానికి
భయవిహ్వలయై, చివరికి ఉద్విగ్నవిహ్వలగా మెటామార్ఫసిస్ చెందుతుంది. అంటే తనలో ఒక కణం కన్నెర్ర చేసిందన్న విషయం గ్రహించి, దాని చికిత్స కోసం మానసిక విచికిత్స పడుతుంది. ఇక్కడ కవయిత్రి స్తనద్వయం భార్యాభర్తల బాంధవ్యంలో నెరిపే పాత్రను శషబిషలు లేకుండా పరిధుల మేరకు వర్ణించడం గొప్పగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రస్తావనలు తెలుగు సాహిత్యంలో ( ప్రబంధ కవులను మినహాయిస్తే) తక్కువగా వచ్చాయి.

స్టేజ్ -2 లో తన కుటుంబంలో వచ్చిన అనారోగ్యాలకు తాను ఎలా తల్లడిల్లిపోయిందో, ఎంతగా తనవారి కోసం తాపత్రయపడిందో చెపుతూ సగటు గృహిణిలా తన ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి తనకు ఏమీ కాదనే ధీమాతో I’m Rock Study కదా అనే భ్రమలో వుంటుంది. ఎంత పాజిటివ్ థింకింగ్ లో వున్నా కూడా తన జబ్బు నెగెటివ్ రావాలని కోరుకుంటుంది.

స్టేజ్ -3 లో డాక్టర్ తనకి క్యాన్సర్ అని నిర్థారిస్తూ చెప్పినప్పుడు తన మానసిక భయాందోళన స్థితిని ఇందులో వర్ణిస్తుంది. ‘ కళ్ళ ముందున్న రంగులకల / ముక్కలవుతుంది./ కన్నీళ్ళ మధ్య రేపటి దృశ్యం/ మసక బారిపోతుంది.’ అని బెంబేలెత్తుతుంది. అంతేగాక తన కుటుంబసభ్యులు ఏమైపోతారా అనే బెంగ తీవ్రతరం దాల్చి కుంగిపోతుంది. ఇక్కడ ఒక స్త్రీకి జబ్బు చేస్తే, కుటుంబానికంతటికీ జబ్బు చేసినట్టే అని, అంతగా కుటుంబం ఆ స్త్రీ మీద ఆధారపడి వుంటుందని, సాధారణ కుటుంబాలలో వాస్తవ పరిస్థితిని అన్యాపదేశంగా కళ్ళకు కట్టారు.

ఇన్ ది వార్డ్ లో ఆసుపత్రి ప్రాంగణంలో వరండాలలో గదులలో ఒక క్యాన్సర్ బాధిత ఆలోచనలను, ఆ కొత్త పరిసరాలను అలవాటు చేసుకోవడాన్ని, ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవడాన్ని చిత్రించింది. కవయిత్రి నిజంగా తానే ఆ స్థితిని అనుభవిస్తున్నట్టు కవితను దృశ్యమానం చేయడం ఇందులో కనిపిస్తుంది. కవి సూక్ష్మదృష్టిని కూడా ఈ వ్యక్తీకరణ పట్టిస్తుంది. ‘కొంగుచాటు చంద్రుళ్ళు చేసే అలజడులు’ వినడం చెవులున్న మనసుకే సాధ్యం.

ఫ్లాష్‌బ్యాక్ విభాగం చాలా సున్నితంగా చెప్పుకొచ్చిన విభాగం. ఎక్కడైతే తనకు క్యాన్సర్ పొడచూపిందో అదే రొమ్ముల గురించి గతంలోకి ప్రయాణించి నెమరు వేసుకోవడం ఈ విభాగంలో కనిపిస్తుంది. తన స్త్రీత్వానికి అస్తిత్వానికి అవి గుర్తులని చెపుతూ, గుండెలపై నిండు చంద్రుళ్ళు, ఆత్మగౌరవ ప్రతీకలు, పూర్ణ కలశాలు, హృదయ సౌందర్య బింబాలు, అమృత భాండాలు, జీవ ధార పాలవెల్లువలు అంటూ ఆ స్తనద్వయాలు తన జీవిత వివిధ దశల గురించి తలపోస్తుంది. చివరిగా ఈ వ్యక్తీకరణలు ‘ నా గుండె వైకుంఠానికి / ఇరువైపులా- / రక్షణగా నిలుచున్న / జయవిజయులు కదా..!’ అనే ఒక అద్భుత వ్యక్తీకరణతో ఉచ్ఛస్థితికి చేరుకుంటుంది. ఇంతవరకు స్తనద్వయాన్ని వర్ణించడం ఎలా అనే ఆత్మన్యూనత నుండి అవి తన ఆత్మగౌరవ ప్రతీకలు అని కవయిత్రి నిస్సంకోచంగా ప్రకటించడం కూడా కవులు/ కవయిత్రులకు ఒకింత ఊతమిచ్చేదే. ఈ రకంగా ఆ విషయం పట్ల చదువరుల దృష్టికోణం మార్చడం కూడా కవయిత్రి సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇది ఇంతకు ముందు తెలుగు సాహిత్యంలో జరగలేదు.

ఫ్లాష్ ప్రెజెంట్ లో క్యాన్సర్ బాధితురాలిగా ఎన్ని చికిత్సామార్గాలు వున్నాయి..లేబొరేటరీ లో ఎలా తానొక గినియా పిగ్ లాగ పరీక్షలకు గురయింది రాసారు.

ఇన్ ది థియేటర్ లో ఆపరేషన్ థియేటర్‌ని ఒక బోధివృక్షంలా తలుస్తూ తాత్విక చర్చ చేస్తారు. జబ్బుకు గురయిన తన స్తనద్వయాన్ని ఆపరేషన్ చేసి రక్తపుముద్దలుగా తీసి పళ్ళెంలో వేసినపుడు ‘ భూమి గుండ్రంగా వుందని/ గుండెలపై చెయ్యేసుకొని / ధైర్యంగా చెప్పేదాన్ని / ఇప్పుడు – / బల్లపరుపుగా వుందని / చెప్పాలేమో’ అన్న కవయిత్రి వ్యక్తీకరణకు ఒక్క క్షణం పాఠకుని గుండె రసార్ద్రమవుతుంది. వస్తువు పట్ల కవి మగ్నతకు ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక వస్తువు స్థానంలో మరో వస్తువును భావతీవ్రతను పెంపుచేస్తూ ప్రతిక్షేపించడం కవయిత్రి నిపుణతకు నిదర్శనం.

పింక్ హోప్ లో తన రెండు జడలకు కట్టుకోవాలనుకునే గులాబీ రిబ్బన్లు ఇప్పుడు ఈ విధంగా ఆ కోరికను పింక్ హోప్ ద్వారా తీర్చుకుంటున్నాని కవయిత్రి ఊహ చేయడం ఆశ్చర్యమనిపిస్తుంది. ఇక్కడ పింక్ హోప్ అంటే రొమ్ము క్యాన్సర్ బాధితులకు బాసటగా వారిలో నమ్మకాన్ని, దైర్యాన్ని పాదుకొల్పడానికి ఉపయోగించే చిహ్నం. సాధారణంగా ఇది పింక్ రిబ్బన్ ఆకారంలో వుంటుంది. కాబట్టి దీన్ని పింక్ హోప్ అన్నారు. కవయిత్రి ఈ విభాగాన్ని బాధితులలో తిరిగి జీవనేచ్ఛను నెలకొల్పాడానికే బలంగా వాడుకున్నారు. ఎంతగా తన స్తనద్వయాన్ని ఆత్మగౌరవ ప్రతీక అన్నారో..అవి క్యాన్సర్ వల్ల కోల్పోవాల్సి వచ్చినా నిబ్బరం కోల్పోకుండా బాధితుల్లో ఒక నమ్మకాన్ని ఎలా కలిగిస్తున్నారో చదవండి..

‘ఆకులు రాలడమంటే
వసంతం ఆగిపోవడం కాదు కదా!

కొమ్మలు విరగడం అంటే
చెట్టు నేలకూలడం కాదు కదా!…అంటూ అనేక ఉపమానాలు చెపుతూ చెపుతూ..

‘ఈ స్తనాతీత దశని
మహిళా ప్రస్థానంలో
నవయుగోదయం అని చాటి చెపుదాం’ అంటూ ఒక నిరాశ నిస్పృహ స్థానే ఒక వెలుగు నిండిన ఆశను ప్రవేశపెట్టడం చేస్తుంది కవయిత్రి. అంతే కాదు..
‘పింక్ రిబ్బన్ తో
నాలాంటి కోట్లాది స్త్రీల గుండెల్లో
జీవనేచ్ఛను నింపడానికి
నేను కదం తొక్కాను’ అని తన కవిత్వ పరమార్థాన్ని చెప్పడమే కాకుండా ‘ జెండర్ యే కాదు / జెండా యై నిలుద్దాం’ అని దిశానిర్దేశం కూడా చేసారు. పింక్ హోప్ కవితా విభాగం నిజంగానే బాధితులలో ఒక నమ్మకం కలిగిస్తూ వుంది. మామిడి హరికృష్ణ గారు పేర్కొన్న Placibo
Effect ‘ విధిలేని పరిస్థితులలో రోగి మనసులో పాదుకున్న పాజిటివ్ థాట్స్ – సానుకూల సంకల్ప శరీరాన్ని, భౌతిక స్థితిని దానికి అనుకూలంగా సమాయాత్తం చేసి, ఆ వ్యక్తిని ప్రమాదం నుండి తప్పించగలిగే మానసిక స్థితి – ఈ Placibo Effect, ఈ కవిత్వానికి సరిపోతుంది. ఈ కవిత్వం ఇస్తున్న సాంత్వన, నమ్మకం, జీవనేచ్ఛ బాధితుల పట్ల Poetry Therapy కూడా.

మామిడి హరికృష్ణ గారు ఈ పుస్తకానికి సవివరమైన ముందుమాట రాసారు. అంతర్జాతీయ సాహిత్యంలో క్యాన్సర్ మీద వచ్చిన సాహిత్యాన్ని పరిశోధనాత్మకంగా తెలియజేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా కవిత్వం ఎలా సాంత్వన పరుస్తుందో చెపుతూ, విదేశాలలో ఉపయోగిస్తున్న ‘పొయెట్రీ థెరపీ’( Poetry Therapy) ఎలా రోగనివారణకు ఉపయోగపడుతుందో.. ఈ సందర్భంలో ఈ పుస్తకం ఎలా క్యాన్సర్ బాధితులకు ఊరట ఇస్తుందో చాలా బాగా అన్వయించి చెప్పారు. Ted Hughes అనే బ్రిటీష్ కవి ‘ సాహిత్యం వంటి కళాత్మక సృజనలు మానసిక సాంత్వనను మాత్రమే కాదు, రోగనివారణను కూడా వాక్యాల వెంట తీసుకువస్తాయని, కవిత్వం ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేస్తుందని చెపుతూ ఆయన అన్న ఒక మాట ఇలా ఉదహరిస్తారు..“Prose, narratives etcetera, can carry healing Poetry does it more intensely “ అని.
చదివి తీరవలసిన ముందుమాట ఇది. రొమ్ము క్యాన్సర్ గురించిన కవితలు వెతికి పట్టుకొని ఇక్కడ పాఠకులకు అందివ్వడం, క్యాన్సర్ గురించిన ప్రపంచ సాహిత్యం విషయ పరంగానూ, వివరాల పరంగానూ, విషయాన్ని విశదీకరించడం గురించి దీనిని ది బెస్ట్ అని చెప్పాలి. శ్రీలక్ష్మి గారు ఆయన్ని ‘నడిచే గూగుల్’ అనడం అతిశయోక్తి ఏ మాత్రం కాదు.

సి.శోభ- పార్థసారథి గార్ల ఆత్మీయ వాక్యం ‘ వ్యాధిగ్రస్తులకు కావలసినది మందులు కాదు – ఆత్మీయత, ఆలంబన, ఆసరా’ అన్నది ఎప్పటికీ ఆచరణ యోగ్యం.

శ్రీలక్ష్మి గారు రాసిన ‘ఒకింత’ ఎన్నో విషయాలు చెప్పింది. తన చుట్టూ వున్న తనవాళ్ళూ, ఇతరుల క్యాన్సర్ కష్టాలు చూసి చలించిపోయి ఆమె ఈ దీర్ఘకవితా రచనకు పూనుకున్నారు. జీవితం పట్ల ఒక దృక్పథం లేనివాళ్ళకి ఈ క్యాన్సర్ వార్డుని చూయిస్తే జీవితం ఎంత అమూల్యమయిందో తెలిసి వస్తుంది అంటారు. ప్రతి స్త్రీ బాధ్యతగా తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, క్రమం తప్పకుండా ఆరోగ్యం చూసుకోవాలంటారు.

ఈ దీర్ఘకవిత వస్తు ప్రధానంగా రాయబడిందే గానీ శిల్ప ప్రధానంగా కాదు. ఈ కవిత్వం సాహిత్యం పట్ల అంతగా పరిచయం లేని క్యాన్సర్ బాధితులను ఉద్దేశించి రాయబడింది కనుక చిక్కని కవిత్వం వారికి అర్థం కాకపోయే అవకాశం వుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో వుంచుకొని శ్రీలక్ష్మి గారు సులభశైలిలో అందరూ అర్థం చేసుకోగలిగే విధంగా ఈ దీర్ఘకవితను రచించడం ఆమె ముందుచూపుకి నిదర్శనం. ఎక్కడా సంక్లిష్ట సమాసాలు, క్లిష్ట పదాలు లేని సరళ సలిలంగా ఈ కవిత సాగిపోయింది. క్యాన్సర్ స్థానంలో ఏ మరో ప్రాణాంతక వ్యాధి వున్నా ఈ కవిత్వం అన్నిటికీ నప్పుతుంది.

పుస్తకంలో ఆంగ్ల పదాల వినియోగం తగ్గించవచ్చు అనిపించింది. రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుందో, దాని లక్షణాలు ఏమిటో సంక్షిప్తంగా వివరిస్తే చదువరులకు ఉపయోగంగా వుండేది.

‘ధైర్యంతో ఆత్మస్థైర్యంతో/ బ్రెస్ట్ క్యాన్సర్‌ని/ ఎదురొడ్డి పోరాడి గెలిచిన/ మహిళలకు మానవిలకు’
ఈ పుస్తకం అంకితమివ్వడం సముచితంగా వుంది. అలాగే క్యాన్సర్ తో చివరికంటా పోరాడిన తన నాయనమ్మ నారాయణమ్మకు నివాళి ప్రకటించడం ఆర్ద్రంగా వుంది.

శ్రీ హరిచంద్ర క్రియేషన్స్ సమర్పణలో, సరోజనీ శ్యాంసుందర్ వృద్ధాశ్రమ సేవాసంఘం, హైదరాబాదు ప్రచురణలో వచ్చిన ఈ దీర్ఘ కవితను చదవడం క్యాన్సర్ బాధితులకే కాక, ఒక సాధారణ పాఠకునికి కూడా ఒక మంచి పుస్తకం చదివిన అనుభవం.

November 30, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

చాయ గిన్నె కష్టాలు

by Laxmi Madan November 30, 2025
written by Laxmi Madan


ప్రతీ రోజూ నరకమే నాకు..పొద్దు లేదు మాపు లేదు…దుక్కమొస్తుంది…

ఎందో పడి పోయినట్టు గా ఇంటామే 5 గొట్టంగ లేస్తది…లేసుడు తోనే పండ్లు తోమి వంటింట్ల కొచ్చి నా కోసం ఎతుకుతది…. ముద్దుగ కోపెడు చిక్కగ చాయ వెట్కొనీ కుర్షి ల గుసోని బుర్ర బుర్ర తాగుతది….

ఇగ తానాని కి వొయ్యి వచ్చే వరకు వాళ్ళాయన లేషి పేపరు సదువు కుంట ” ఇగో గింత శాయ వెట్టు” అంటడు.

” ఆ ! గట్లే పెడ్తున్న..అని మల్ల నన్ను పీసు వెట్టి తోమి చాయ్ వెట్టి.. కోపేడు ఆయనకు..మిగిలింది మల్ల తాగుతది గుట్ట గుట్ట….

ఇగ గా పోరగాండ్లు లేశీ…” అమ్మా ! చాయ్ వెట్టినవా ” అంటరు…

” పెడ్తున్న ” అని మల్ల తోముతది నన్ను….

” అమ్మయ్య ! ఇగ రెస్ట్ దీసుకుంట అని అనుకునే వరకు…

” అమ్మ గారు! గింత శా వట్టు వొయ్య రాదు నెత్తి బాగ నొ స్తంది” అనే…పని మనిషి..

నీ పాడు గాను నన్ను బత్క నియ్యరా ఉల్లో!

మల్ల నన్ను పొయ్యి మీద వెట్టుడే…

ఇగ ఇంట్ల అందరు ఏటోల్లు అటు వోయింరు…. గూట్లే వోయ్యి పంట..

” ట్రింగ్..ట్రింగ్…”

ఎవలో ఫోన్ జేశిరి…

ఇంటామె” అలో! ఎవలు….కిందింటి పంకజమా! వొస్తావు..దా! గట్ల అడుగుడు ఎందుకు! రావాలే బాజాప్తగ…చాయ వెట్కోని తాగుదాము”..

వామ్మో! నన్ను చంపుతావే! నీ చాయ్ పాడు గాను..

రానే వచ్చే గామే! ముద్దుగ సోపాల గుసొని ఇక ఇకలు..పక పకలు…ఎల్లి మీద బల్లి వడే..బల్లి మీద ఎల్లి వడే అని…నన్ను గుంజుకొచ్చి పొయ్యి మీద వెట్టి చాయ్ వెట్కోనీ తాగిరి…

గిట్ల నన్ను తోమి తోమి సంపుతున్నరు…బ్రమ్మ తానికి వొయిన కష్టం జెప్పుకో నీకి…

అయ్యా! అనంగనే….

ఎవరక్కడ ఇగో చాయ గిన్నె వొచ్చింది..నాలుగు తలకాయలు నొస్తున్నయి…పెద్ద కోపెడు చాయ వేట్టుం డి అన్నడు….ఇగ ఎవలకూ జెప్పాలే…
సంతోష మొచ్చినా దుక్క మొచ్ఛినా చాయ నే నట..పొర గాండ్లకు పరిచ్చలు వొస్తే నిద్ర రాకుం ట చాయ నే…

గీతలు వడ్డయి పెయ్యంత…పొయ్యి మీద పెట్టి పెట్టీ.. ముడ్డి మండుతుంది….
జెర్ర న్యాయం జెప్పుర్రి !

November 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగు జాతీయాల సొగసు

by చంద్రకళ దీకొండ November 30, 2025
written by చంద్రకళ దీకొండ

తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైనవి పద్యం,అవధానాలు.అలాగే అన్ని భాషల కంటే అత్యధిక సంఖ్యలోనున్న సామెతలు.పొడుపు కథలు కూడా తెలుగు భాషకే స్వంతం.

ఏ భాషలోనైనా అసంఖ్యాకంగా ఉండే మాటలు నామవాచకాలు.వ్యక్తుల,స్థలాల,పశుపక్ష్యాదుల పేర్లన్నీ నామవాచకాలేననునది తెలిసిన సంగతే.విద్యావంతుల సంభాషణల్లో,రచనల్లో ఈ రకం నామవాచకాల వాడుకలో కొన్ని ప్రత్యేకార్థాలూ, ఒడుపులూ కనిపిస్తాయి.కొన్ని సందర్భాల్లో ఇటువంటి మాటలకు నిశ్చితమైన అర్థం వుంటే, కొన్ని సమయాల్లో విరుద్దార్థమో, విపరీతార్థమో ఉండవచ్చు.కొన్ని సరదాకు సృష్టించుకున్నవైతే, కొన్ని ప్రయోజనదృష్టితో పుట్టినవి.

పై విధమైన నామవాచకాలను కొందరు జాతీయాలని వ్యవహరిస్తారు.కొన్ని తెలుగు సాహిత్యంలో తెలుగువాళ్ళ వాడకంలో పుట్టి,వ్యాప్తిలోకి వచ్చినవైతే,మరికొన్ని సంస్కృత వాఙ్మయంలో పుట్టినా,తెలుగువాళ్ళు స్వంతం చేసుకున్నవి.ఈ మాటల్లో వ్యక్తి నామాల మీద పుట్టినవి,ఇతర సాధారణ విశేష్యాల్లాగా సహజమైనవి కావు-విద్యావంతుల విశ్వామిత్ర సృష్టిలో ఉద్భవించినవి.

మనం తరచుగా వినే, వాడే కొన్ని జాతీయాల గురించి ముచ్చటించుకుందాం..

అక్షింతలు
ఈ తెలుగు మాటకు సరైన సంస్కృత రూపం అక్షతలు
క్షతం అంటే దెబ్బ,ప్రమాదం.అవేవీ లేకుండా మంత్రపూతంగా వేసే బియ్యపు గింజలు అక్షతలు.శుభకార్యాలలో తెల్లగా ఉన్న బియ్యాన్ని అక్షతలుగా వాడుతారు.ఆశీర్వదించటానికి,దీవించటానికి తలమీద అక్షతలు చల్లటం పరిపాటి.అలాగే దైవపూజలో కూడా అక్షింతలు చల్లుతాం.అయితే- చల్లు కు బదులు వేయు అనే పదాన్ని వాడినప్పుడు తిట్టు,దూషించు,విమర్శించు అనే అర్థాలు వస్తాయి.భూత,ప్రేత పిశాచాదులను పారద్రోలటానికి ఉచ్ఛాటన మంత్రాలు చదువుతూ,అక్షింతలను నాలుగు మూలలా విసురుతారు.భిన్న విధాల వాడుక ఉన్నందున విడిగా అక్షింతలు అనే మాట వాడినప్పుడు సందర్భాన్ని పురస్కరించుకుని అర్థం చేసుకోవలసివుంటుంది.

ఆటవిడుపు
ఇది పాతకాలపు వీధిబడుల సాంప్రదాయంలో ఒక భాగం.ఆనాటి బోధన పూర్తయ్యి,పిల్లలు ఇళ్లకు వెళ్లేముందు ఒక పద్యం చెప్పేవారు.మరునాడుదయం దానిని గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయుడికి ఒప్పచెప్పాలి.తప్పు చెపితే,ఒకటికి పదిసార్లు పలకపై దాన్ని సరిగా వ్రాసి,చూపాలి.పిల్లలు ఆడుకోవడానికి పోబోతుండగా బడి విడుపు సమయంలో నేర్పిన పద్యాన్ని ఆటవిడుపు పద్యమనేవారు.ఈ విధమైన చదువు ఇప్పుడు లేకపోయినా,ఆటవిడుపు అనే మాట మాత్రం అర్థవిశేషం సంపాదించుకుని, పనిలేకపోవటం అనే భావంలో వ్యవహృతమవుతున్నది.

గాడిదగుడ్డు
గాడిద నాలుగుకాళ్ళ జంతువు.అది పిల్లల్ని కంటుందే కానీ,గుడ్లు పెట్టదు. కాబట్టి,గాడిదగుడ్డనేది కుందేటికొమ్ములాగా లేనిదానితో సమానం.గాడిదగుడ్డంటే శూన్యం.ఈ మాటను విసుగుతో,నిందార్థకంగా మాత్రమే వాడుతారు.

November 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

భార్య–భర్తల బంధం

by Dr. Aruna Parandhamulu November 30, 2025
written by Dr. Aruna Parandhamulu


జీవిత ప్రయాణం ఇద్దరి కలయిక,
ఆ కలయికలో ప్రేమే ఆధారశిల.
అనురాగం తో అల్లిన మమతా దారం,
భార్య–భర్తల బంధం ఆత్మల సారం.

ఆనందం పంచుకునే హృదయాల రాగం,
బాధల్లో నిలిచే విశ్వాసం దాగం,
ఒకరి కన్నీరు మరొకరికి తుడిపే హక్కు,
అదే ఈ బంధానికి శాశ్వత సాక్ష్యం.

కోపం వస్తే మాటలు మౌనమవుతాయి,
ప్రేమ తాకితే మేఘాలు చినుకవుతాయి,
చిన్న చిన్న తగవులు తీయని జ్ఞాపకాలు,
కలసి నవ్విన క్షణాలే నిజమైన కవితలు.

కాలం మారినా, మనసు మారదు,
వయసు పెరిగినా ప్రేమ తరుగదు,
ఒకరి ఊపిరి మరొకరికి ఆధారం,
అదే భార్య–భర్తల బంధం – జీవన ధారం.

November 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నామమహిమ

by Thata Kameshwari November 29, 2025
written by Thata Kameshwari


        చాలా రోజులుగా ఋష్యమూక పర్వతంపై సీతమ్మ ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న శ్రీరాముడికి హనుమంతుడు తీసుకొచ్చిన వార్త ఉపశమనాన్ని కలిగించింది. హనుమంతుడు సీతమ్మవారు ఇచ్చిన చూడామణిని అందించి ఆమె క్షేమ సమాచారమును తెలియజేశాడు. చూడామణిని చూసిన శ్రీరాముడు కంటతడి పెట్టుకుని, వెంటనే సుగ్రీవునితో లంకపై దండయాత్రకు సైన్యాన్ని సిద్ధం చేయమనడంతో, కోట్ల సంఖ్యలో వానరులు రామ కార్యం నెరవేర్చడానికి సిద్ధమయ్యారు. శ్రీరాముడు ఆ విశాలమైన వానర సైన్యమును తీసుకొని లంకా నగరంపై దండయాత్రకు బయలుదేరి సముద్రతీరానికి చేరుకున్నాడు.

విశాలమైన సముద్ర తీరానికి చేరుకున్న రాముని సైన్యం, సముద్రాన్ని ఎలా దాటాలనే సమస్య ఎదురైంది. శ్రీరాముడు వరుణుడైన సముద్ర దేవత సహాయం పొందాలని నిర్ణయించుకుని, మూడు రోజులు ప్రార్థించినా సముద్రం నిశ్శబ్దంగా ఉండటంతో, ఆ కరుణామూర్తి అయిన రామచంద్రుడు ఉగ్రరూపుడై సముద్రాన్ని ఆవిరి చేయాలని విల్లుపై బాణాన్ని ఎక్కు పెట్టగానే, వరుణుడు భయంతో కంపించి క్షమించమని ప్రార్థించాడు. తన స్వభావాన్ని మార్చలేనని, కానీ ఒక పరిష్కారాన్ని సూచించగలనని చెప్పి, వారి సైన్యంలో వంతెనను నిర్మించే సామర్థ్యం కలిగిన నలుడి సహాయంతో సముద్రంపై వంతెనను నిర్మించమని చెప్పాడు.

వానరులు అత్యంత ఉత్సాహంతో పరుగు పరుగున సముద్రం మీదకు పెద్ద పెద్ద రాళ్ళను విసరడం ప్రారంభించారు. అయితే, ఆ రాళ్ళు సముద్రంలో వేయగానే మునిగిపోవడంతో వానరులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అది గమనించిన హనుమంతుడు మనస్సులో శ్రీరాముడిని ధ్యానించి, ఒక రాయిపై ‘జై శ్రీరామ్’ అని వ్రాసి సముద్రంలో వేయగానే అది అద్భుతంగా తేలసాగింది. అది చూసిన వానరులు రెట్టింపు ఉత్సాహంతో రాళ్లపై ‘జై శ్రీరామ్’ అని రాయడం, సముద్రంపై వేయగానే అవి తేలడం ప్రారంభించడంతో ఆ సముద్ర తీరాన ‘రామ్ నామ ధ్వని’ వినిపించసాగింది.

 రామలక్ష్మణులు వారిని మరింత ఉత్సాహపరుస్తూ, “వానరులారా, మనం లంకా నగరం చేరడానికి ఎక్కువ సమయం లేదు. రావణుని వధించి మీ సీతమ్మ ను  తెచ్చుకోవాలి” అంటూ ఆ వానరులను ప్రోత్సహిస్తుంటే, వారు రెట్టింపు వేగంతో వారధిని కట్టసాగారు.

అతి వేగంగా వానరులు సముద్రంపై నిర్మిస్తున్న వారధిని చూసిన రావణుడి గూఢచారులు, అత్యంత వేగంగా రావణుడి వద్దకు ఆందోళనగా వచ్చి ఇలా విన్నవించారు: “ప్రభూ! మీరు అనుకున్నదంతా తారుమారు అయింది. వానర సైన్యం విశాలమైన సముద్రాన్ని దాటి లంకకు చేరడం అసంభవం అని మీరు భావించారు. కానీ వారు బండరాళ్ళతో వారధిని నిర్మిస్తున్నారు.”

అది విన్న రావణుడు నిర్ఘాంతపోయి, కోపంతో ఊగిపోతూ ఇలా అన్నాడు: “అసంభవం! రాళ్ళతో వారధిని కట్టడమా? అది అసాధ్యం. మీరు మైకంలో ఏదో చూసి నాకు అసత్యం చెబుతున్నారు.”

అందుకు గూఢచారులు, “లేదు ప్రభూ, మేము అసత్యం చెప్పడం లేదు. నిజంగానే అక్కడ వానరులు రాళ్ళ మీద ‘జై శ్రీరామ్’ అని రాసి సముద్రంలో వేయగానే అవి తేలుతున్నాయి. దాదాపుగా వారధి నిర్మాణం పూర్తయింది” అని విన్నవించగా, రావణుడి హృదయం భయంతో కంపించింది.

ఆ వార్త కార్చిచ్చులా లంక వాసులలో వ్యాపించడంతో, వారు భయభ్రాంతులకు గురై వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. “రామ నామం లిఖించిన రాళ్ళు సముద్రంలో వేయగానే తేలుతున్నాయట! శ్రీరాముడు సామాన్యమైన నరుడు కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన నామంలోనే అంతటి మహిమ ఉంటే, ఆయన సామర్థ్యాన్ని ఊహించవచ్చు. ఇక ఆ శ్రీరాముడు లంకను చేరి దశగ్రీవుడిని ఓడించడం తథ్యం. బ్రహ్మ ఆయనకు ఇచ్చిన వరం ప్రకారం, తుచ్ఛమైన మానవుల చేత తప్ప మరెవరి చేతనూ అతనికి మృత్యువు సంభవించదు అనేది నిజం కానుంది. కాబట్టి, మనతో పాటు ఈ స్వర్ణ లంక యొక్క వినాశనాన్ని ఎవరూ తప్పించలేరు,” అంటూ విలపించారు.

లంక ప్రజలు చర్చించుకుంటున్నది తెలుసుకున్న దశకంఠుడు, వారికి తనపై విశ్వాసము పునరుద్ధరించడానికి మరియు తన సామర్థ్యమును నిరూపించడానికి మరుసటి రోజు అందరినీ సముద్ర తీరానికి రమ్మని చాటింపు వేయించాడు. తెల్లవారేసరికి ప్రజలంతా సముద్ర తీరానికి చేరుకున్నారు. రావణుడు కూడా గర్వంగా సముద్ర తీరానికి వచ్చి ఒక రాయి మీద “జై రావణ” అని రాసి, దానికి ఏదో మెల్లగా చెప్పి, సముద్రంలోకి విసిరాడు. రాక్షసులు చూస్తూ ఉండగా మహా అద్భుతం జరిగింది. “జై రావణ” అని రాసిన రాయి నీటిలో తేలింది. రావణుని సామర్థ్యం చూసిన ప్రజలు అత్యంత ఆనందం పొంది “జై రావణ” అని జయఘోష చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

రావణుని భార్య, పట్టమహిషి అయిన మండోదరి తన భవన గవాక్షం నుండి జరుగుతున్న సంఘటనను చూసి, చెలికత్తెల ద్వారా విషయం తెలుసుకొని ఆశ్చర్యానికి లోనయ్యింది. రావణుడు ఆమె అంతఃపురానికి రాగానే, ఆమె వినయంగా “స్వామి, మీరు అన్యథా భావించకుంటే ఒక విషయం అడుగుతాను”. దానికి రావణుడు “మండోదరి, నీవు లంకకు మహారాణివి, నిస్సంకోచంగా అడుగు” అనడంతో ఆమె “నేను విన్నది, చూసింది నిజమేనా? మీ నామం లిఖించిన రాయి సముద్రంలో తేలటం నిజమా? అది మీ రాక్షస మాయా లేక నామ మహిమా? నాకు తెలుసుకోవాలని ఉంది, చెప్పండి” అని ఆతృతగా అడిగింది.

దానికి రావణుడు బిగ్గరగా నవ్వి, “మండోదరి, నీవు చూసింది నిజమే. అది మాయ కాదు, నామ మహిమ, అది కూడా శ్రీరామ నామ మహిమ” అని ఆశ్చర్యంగా చూస్తున్న మండోదరితో రావణుడు ఇలా అన్నాడు, “నా పేరు రాసి సముద్రంలో వేస్తే అది మునిగిపోతుందని ఖచ్చితంగా తెలుసు. అందుకే రాయి మీద నా పేరు లిఖించి సముద్రంలో వేసే ముందు దానితో మెల్లగా ఇలా అన్నాను, ‘నీవు కానీ తేలకపోతే రామునిపై ఆన’ అంటూ రామునిపై ఒట్టు వేసి సముద్రంలోకి విసిరాను. అందువలన ఆ రాయి కట్టుబడి తేలక తప్పలేదు. ఈ విధంగా నేను ప్రజల విశ్వాసం తిరిగి పొందగలిగాను” అని గర్వంగా పలికాడు.

దానికి మండోదరి, రామ నామంలోనే ఇంతటి మహత్యం ఉంటే రాముని సామర్థ్యం ఊహించ శక్యం కానిదని గ్రహించింది. రావణుని మూర్ఖత్వానికి ఆమె మనస్సులో నవ్వుకుని, శ్రీరాముని రూపంలో ఉన్న వైకుంఠనాథుడికి మనసులోనే నమస్కరించి, తన భర్తకు సన్మార్గం చూపమని ప్రార్థించింది.

రావణుడు ఇంత జరిగినా, అతనికి రాముని సామర్థ్యము తెలిసినా, అహంకారముతో, బల గర్వముతో, మూర్ఖత్వము వదలక రాముని చేతిలో వధింపబడి రాక్షస కుల వినాశకుడయ్యాడు.

***

November 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

జీవన మాధుర్యం

by Laxmi Madan November 29, 2025
written by Laxmi Madan


ఆరవ భాగం

అపర్ణ తను పుట్టి పెరిగిన ఇంటికి వచ్చి తన బాల్యం గుర్తు చేసుకుంటుంది.ఆ మధుర జ్ఞాపకాలతో మురిసి పోతుంది. సుధ పిలుపుతో ఊహల నుండి బయట పడి పడుకుంటుంది

ఇక మిగతా భాగం చూద్దాం!

తెల్లవారి తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని తయారైంది సుధ. అపర్ణ మాత్రం అలాగే పడుకొని ఉంది.

” అప్పూ! లేవ్వవే! మీ ఫ్రెండు ఇంటికి వెళ్ళాలి కదా! నేను లేచి తయారయ్యాను కూడా” అని లేపింది సుధ.

” అత్తా! అప్పుడే లేచావా!నేను కూడా లేచి తయారవుతాను. అయ్యో! నేను బట్టలేమీ తెచ్చుకోలేదు. నేను స్నానం అక్కడికి వెళ్లాకే చేస్తానులే” అన్నది అపర్ణ.

” ఈ పాచి ముఖంతో అక్కడికి వెళ్తావా? నా చీర ఏదైనా కట్టుకో! కొత్త చీరలు కూడా ఉన్నాయి. బ్లౌజులు నావి సరిపోతాయిలే !లేచి తొందరగా స్నానం చేయి” అన్నది సుధ.

” అదిగో అక్కడ కొత్త బ్రష్ పెట్టాను తీసుకో! బ్రష్ చేసుకుని స్నానం చేసి రా! ఈ ఇంటి బాత్రూం లో గీజర్ పెట్టడానికి లేదు. కాబట్టి స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టి ఉంచాను బకెట్లో పోసుకొని స్నానం చేసేయ్” అని చెప్పింది సుధ.

అలా బ్రష్ తీసుకొని పెరట్లోకి వెళ్లిన అపర్ణకి ఆ పెరడంతా ఎంతో ఆహ్లాదంగా కనిపించింది. తన చిన్నప్పుడు ఆ మొక్కల మధ్య ఆడుకునేది. కాంపౌండ్ వాల్ చుట్టూ అన్ని గులాబీ చెట్లు ఉండేవి. మధ్యలో మల్లెపందిరి, మరోపక్క బొండు మల్లె చెట్టు ఇంకా ముందుకు చేమంతి పూల పొదలు, దవనంపాదు మరోవైపు వంకాయ బెండకాయ టమాట ఇలా అన్నీ కూరగాయ చెట్లు ఎంత బాగుండేది.ఇప్పుడు కూడా సుధ త్త బాగానే మెయింటైన్ చేస్తుంది. ఇలా ఒక్కసారి తనకు తాను పసిపిల్లల మారినట్లు అనిపించింది అపర్ణకి.

కొబ్బరి చెట్టు మొదట్లో కూర్చొని బ్రష్ చేసుకుంటుంటే, అక్కడే పని చేస్తున్న ఒక ఆడ మనిషి ప్రశ్నార్థకంగా అపర్ణ వైపు చూసింది.

అపర్ణ కూడా ఆమెను ’ఎప్పుడో చూసినట్లు ఉంది. కానీ పేరు గుర్తు రావడం లేదు’ అనుకుంది.

బయటకు వచ్చిన సుధ

” ఈమె అప్పుడు మన ఇంట్లో పనిచేసే బాలవ్వ మనవరాలు. పరిస్థితులు బాగా లేక ఇక్కడ అన్నల దగ్గరికి వచ్చి ఉంటుంది. చిన్నప్పుడు అంతా మన ఇంట్లోనే ఆడుకునేది కదా! అందుకే మన ఇంట్లో పని చేస్తానని వచ్చింది.గుర్తుందా? ఆమె పేరు అంజి. ఇంచుమించు నీ వయసే ఉంటుందేమో” అన్నది సుధ.

” ఆ! గుర్తొచ్చింది. ఒకరోజు బంతిపూలు కోసిందని ఆమె వెనకాల పరిగెత్తుకొని వెళ్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోయాను కొడతానని,అప్పుడు వాళ్ళ అమ్మ భయపడి పోయి, ఈమెను తీసుకెళ్లి వాళ్ళ దేవుడి గదిలో దాచి పెట్టింది. నేను దేవుడి గదిలోకి కూడా వెళ్లి కొడతానని చెప్పాను. కానీ అలా “దేవుడు గదిలోకి వెళ్ళకూడదమ్మా”! అని ఆమె భయం చెప్పింది. అప్పుడు ఇంక మాట్లాడకుండా వచ్చేసాను. నేను ఎన్నో రోజులుగా నీళ్లు పోసి పెంచిన బంతిపూలన్నీ కోసేసింది. నాకు ఎంత కోపం రావాలి అసలు? అంజి నీకు గుర్తున్నానా నేను” అని అడిగింది నవ్వుతూ..

” ఓ అప్పమ్మనా! నాకెందుకు యాది లేదు. మస్తు యాది ఉంది. నాతోని ఎంత మంచిగా ఉండేదానో, కోపం వస్తే అంత భయం చూపే దానివి. వామ్మో నన్ను కొట్టనీకి ఉరుక్కుంట వచ్చినవు” అన్నది అంజి..

కాసేపు ముగ్గురు నవ్వుకున్నారు..

“నువ్వు కలుస్తావని అనుకోలేదు అంజి! నేను నీకోసం ఏమి తీసుకొని రాలేదు” అని లోపలికి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఒక ఐదు వందలు రూపాయల నోటు తీసుకుని వచ్చి అంజి చేతిలో పెట్టింది.

అంజి సంతోషంగా తీసుకొని “నీ ఫోన్ నెంబర్ ఇయ్యమ్మ! అప్పుడప్పుడు మాట్లాడతా” అన్నది అంజి.

తన ఫోన్ నెంబర్ రాసి ఇచ్చింది అంజికి. తర్వాత స్నానం చేయడం కోసం బకెట్ లోపలికి తీసుకుని వెళుతుంటే, అంజి వచ్చి నేను పెడతానమ్మా! అని బకెట్ లోపల పెట్టి అందులో వేడి నీళ్లు చల్ల నీళ్లు కలిపేసి “ఇంకా తానం చేయమ్మా” అన్నది.

అపర్ణ స్నానం చేసుకొని సుధ ఇచ్చిన పట్టు చీర కట్టుకుంది. అందులో తనకు సరిపోయిన బ్లౌజ్ వేసుకుని అద్దంలో చూసుకుంది.

“అత్తా! నాకు బాగా సరిపోయింది నీ బ్లౌజ్” అని చెప్పింది అపర్ణ.

ఇంతలో బయట కార్ చప్పుడు వినబడింది. కారు దిగి డ్రైవర్ లోపలికి వచ్చి “వసంతమ్మ మిమ్మల్ని తొందరగా రమ్మన్నది” అని చెప్పాడు.

ఇద్దరూ ఇంటికి తాళం వేసి కార్ ఎక్కి కూర్చున్నారు. చీకట్లో గమనించలేదు కానీ ఊరంతా మారిపోయింది. ఆ పక్కన వరుసగా ఇళ్ళు ఉండేవి. అందులో తన స్నేహితులు ఉండేవాళ్లుm ఇటుపక్కన ఒక కిరాణా షాపు ఉండేది. సమయంగాని సమయంలో వాళ్ళ తలుపు దబా దబాదితే ఒకసారి ఆ దుకాణం ఓనరు గట్టిగా బుగ్గ గిల్లింది. అది గుర్తొచ్చి నవ్వుకుంది.

చుట్టాలు ఎవరు వచ్చినా, ఐదు పైసలు పది పైసలు ఇస్తే, వెళ్లి పిప్పర్మెంట్లు కొనుక్కునేది గుర్తుకొచ్చింది. ఒక్కొక్కసారి డబ్బులు ఎక్కువగా లేకుంటే దాన్నే కాకెంగిలి చేసు పంచుకునేవాళ్లు. ఆ ముందుకు వెళితే చెరువు. ఎప్పుడు చెరువు నిండిన ఆ మత్తడి మీద నుండి స్నేహితురాలు సువర్ణతో అటు ఇటుగా నడిచేది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఎంత తిట్టేదో .”అలా మత్తడి పైనుండి నడవకూడదు. జలదేవతకి కోపం వస్తుంది” అని చెప్పేది. ఇలా అవన్నీ గుర్తు చేసుకుంటూ సుధతో చెప్తూ బయలుదేరింది.

ఇంకా ముందుకు వెళుతుంటే గాజుల షాప్ కనిపించింది. అది మూసివేసి ఉంది. కానీ ఆ గాజుల షాపు చరిత్ర గుర్తొచ్చింది. ఊళ్లో రెండు షాపులు మాత్రమే ఉండేవి. ఒకటి గాజుల లింగయ్య ఒకటి గాజుల రాజయ్య .ఇద్దరూ అన్నదమ్ములు. రాజయ్య షాపు చాలా దూరంగా ఉండేది. లింగయ్య షాపు దగ్గరలో ఉండేది. కానీ ఎప్పుడు రాజయ్య షాపు మూసి ఉండేది. ఆయన దగ్గర ఎక్కువ డిజైన్స్ ఉండేవి. లింగయ్య షాపులో తక్కువ డిజైన్స్ ఉండేది. అతను ఇల్లు షాపు ఒకచోటే ఉండేది అపర్ణ తల్లి గాజులు వేసుకోవాలంటే వెళ్లి..

” లింగయ్య తాతా! అమ్మ రమ్మంటుంది గాజులు వేసుకోవాలట” అని పిలవగానే పెద్ద గాజుల పెట్టే భుజానికి తగిలించుకొని ఇంటికి వచ్చేవాడు.

అమ్మ పెద్ద చాపపరిచి అతని కూర్చోమనేది. ఆయన దగ్గర ఉన్న గాజుల పొట్లాలు అన్ని తీసి బయట పెట్టేవాడు.

” ఏమి కావాలి బిడ్డ! నీ ఇష్టం ఉన్న గాజులు చూసుకో ! మంచిగా చూసుకో” అంటుండే లింగయ్య తాత.

అటు ఇటు చూసి అమ్మ రెండు రంగుల గాజులు సెలెక్ట్ చేసుకుని, ఈ గాజులు బాగున్నాయి వేయమని అడిగేది.

చేతి నుండి పాత గాజులు తీయాలంటే పెద్ద ప్రహసనమే. చాలా చిన్న సైజు వేసుకునే వాళ్ళు. దానిని కష్టపడి నొప్పి తెలియకుండా ఏదో ముచ్చట పెడుతూ గాజులన్నీ తీసేవాడు లింగయ్య తాత. అందులో సెంటిమెంటు పాత గాజులు రెండు చేతులకి ఒక్కొక్కటి ఉంచుకొని, మిగతావి తీసేయమనేది అమ్మ. ఆ తర్వాత కొత్త గాజులను మెల్లగా చేయి నొక్కుతూ మాట్లాడుతూ వేసేవాడు. ఆ రంగు రంగుల గాజులను చూసుకొని మురిసిపోయి గాజులకు దండం పెట్టుకునేది అమ్మ..

ముచ్చట పడి చిన్న సీసం గాజులు పిల్లలకందరికీ వేయించేది అపర్ణ తల్లి. అపర్ణకు కూడా ఇలాంటి గాజులు అంటే ఎంతో ఇష్టం చేతినిండా వేసుకునేది.

ఇలా అన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళసాగింది అపర్ణ. ఆ గాజుల షాపు దాటగానే వీళ్ళు వెళ్లే స్కూల్ గుర్తొచ్చింది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో ఊరికే అల్లరి చేస్తారని, అపర్ణ తల్లి ఇంటి పక్కన వైష్ణవుల ఇంటికి స్కూలుకి పంపించేది.

ఆ స్కూల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుని నవ్వుకుంది అపర్ణ.

అపర్ణ పెదవులు అప్రయత్నంగా విచ్చుకున్నాయి.

ఒక్కసారి ఆ స్కూలు తాలూకు జ్ఞాపకాలను తలుచుకుంది..

గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లల్ని జాయిన్ చేసుకునే వాళ్ళు కాదు. అందుకని ఇలా చిన్నచిన్న బళ్ళల్లోకి పిల్లల్ని పంపించేవారు. బడికి వెళ్లే లోపల ఓనమాలు, ఒంట్లు నేర్చుకుంటారని పెద్ద వాళ్ళ కోరిక.

అలా అపర్ణ తల్లి పిల్లలందరినీ దగ్గర్లో ఉన్న వైష్ణవుల ఇంటికి చదువుకోవడానికి పంపించేది.

అదొక చిన్న ఇల్లు. ముందర చిన్న వసారా. పక్కన ఒక చిన్న హాలు, ఒక వంటిల్లు. అందులో ఒక ఉయ్యాల ఉండేది. కొబ్బరి తాడు కట్టి కూర్చోవడానికి గోనెసంచితో జోలెలాగా తయారు చేసేవాళ్ళు.

ఇక ఇల్లంతా మట్టి నేల. కాబట్టి స్కూలుకు వచ్చేటప్పుడు ఒక గోనెసంచి తెచ్చుకోవాలి. అది వేసుకొని కూర్చోవాలి. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కొంతమంది తీసుకెళ్లేవాళ్లు. కానీ కొంతమంది అక్కడే ఉన్న గోడమీద మడత పెట్టి పెట్టుకునేవాళ్ళు.

అపర్ణ అన్న అప్పటికే పెద్ద బడిలో చదువుకుంటున్నాడు. సుధ కూడా హై స్కూల్ లోనే ఉంది. ఇక అపర్ణ అక్కా,చెల్లె తమ్ముడు తో కలిసి స్కూల్ కి వచ్చేది.

అపర్ణకు విపరీతమైన భయం ఉండేది. టీచర్ ని ఏది అడగాలన్న వాళ్ళ అక్కనే అడగాలి.

” టీచర్! టీచర్! మా చెల్లె మంచినీళ్లు తాగి వస్తుందట. ఇంటికి పంపిస్తారా! టీచర్ మా చెల్లి ఒంటేలు వెళ్లాలట పంపిస్తారా” ఇలా అన్నిటికీ అపర్ణ అక్కనే అడగాల్సి వచ్చేది. ఒక్కొక్క రోజు వాళ్ళ అక్కకి చిరాకు వచ్చి “నువ్వే అడుక్కో పో! ఎన్నిసార్లు నేను అడగాలి” అని తిట్టేది.

ఇక టీచరు స్కూల్ కి వెళ్ళగానే పలకల మీద వాళ్లకు వచ్చినవి రాయమనేది. ఆ తర్వాత పలక మీద అక్షరాలు పెట్టించి దిద్ద మని చెప్పేది. ఎంత బాగా దిద్దితే అంత మంచిది అని చెప్పేది. కానీ పిల్లలకు ఓపిక ఉంటుందా! బలపం అడ్డంగా పెట్టి అక్షరాలు లావు అయ్యేలా చేసి, ఆ తర్వాత దిక్కులు చూస్తూ కూర్చునేవాళ్లు.లేదా అల్లరి చేసే వారు.టీచర్ మడికట్టుకొని వంటింట్లో వంట చేసేది. మధ్య మధ్యలో బయటకు వచ్చి తిట్టేది. ఆ తర్వాత ఇసుక రాళ్ళ బియ్యాన్ని పలకల మీద పోసి, రాళ్ళను వేరుచెయ్యమనేది. రోజంతా చదువుకునేది ఏముంటుందని! పిల్లలకు కూడా కాలక్షేపం ఉంటుందని అలా బియ్యం ఏరించేది. పిల్లలకు భలే సరదాగా ఉండేది.

ఆ స్కూల్లో ప్రమీల అని ఒక అమ్మాయి ఉండేది. అసలు ఈ రోజుల్లో ఎంబీఏ చేసే వాళ్ళు కూడా పనికిరారేమో! అప్పట్లో అందరికీ చింత చెట్లు ఉండేవి .ఇళ్లల్లో బోలెడు చింతపండు, చింతకాయ. ఈ అమ్మాయి ఒక బాక్స్ లో చింతపండు తీసుకొని వచ్చేది.

టీచర్ లోపలికి వెళ్ళగానే, తాను చింతపండు చప్పరిస్తూ…

” కావాలా? చాలా బాగుంది తింటారా?” అంటూ వూరించేది.

చింతకాయలో చింతపండునో చూపిస్తే పిల్లలకు సహజంగా తినాలని అనిపిస్తుంది. అందరూ “నాకు కావాలి నాకు కావాలి” అని ఆ అమ్మాయి చుట్టూ చేరే వాళ్ళు.

అప్పుడు ఓ ఫిట్టింగ్ పెట్టేది. మీ దగ్గర ఉన్న బలపాలు ఇస్తే నేను చింతపండు ఇస్తా అని చెప్పేది.

చేసేదేమీ లేక అందరూ వాళ్ళ దగ్గర ఉన్న బలపాలు ఇచ్చేవాళ్ళు.బలపం సైజును బట్టి చింతపండు ముక్క చేతిలో పెట్టేది.

ఇలా ఈ తంతు కొన్నాళ్లుగా జరుగుతుంది.

ఒకరోజు ఇంట్లో పిల్లలు రోజు బలపాలు కొనడం చూసి అపర్ణ తల్లి అడిగింది..

” ఏంటి ఈ మధ్య రోజు కొత్త బలపాలు తీసుకెళ్తున్నారు? అంతకుముందు నాలుగైదు రోజులు రాసుకునే వాళ్ళు కదా! తింటున్నారా బలపాలను”? అని గట్టిగా అడిగింది.

పిల్లలు ఎవరూ ఏమీ చెప్పలేక నీళ్లు నములుతున్నారు.

అప్పుడు అపర్ణ ధైర్యం తెచ్చుకొని..

” అమ్మా! మరీ మరీ… ప్రమీల రోజు చింతపండు తీసుకొని వచ్చి, బలపాలు తీసుకొని మాకు చింతపండు ఇస్తుంది. అందుకని రోజు బలపాలు అయిపోతున్నాయి” అని చెప్పింది నసుగుతు..

” ఏంటి! ప్రమీల బలపాలకు చింతపండు అమ్ముతుందా? మీరు కొంటున్నారా? అసలు ఏమైనా బుద్ధి ఉందా మీకు…

ఇలా రండి! అంటూ ముగ్గురిని తీసుకెళ్లి ఇంట్లో ఉన్న ఘర్షఅర్ర లోకి తొంగి చూడమని చెప్పింది..

ఆ గది నిండా బోలెడు చింతపండు ఉంది..

” ఇదిగో ఈ చింతపండును ఎంత తింటారో అంత తినండి. బలపాలు ఇచ్చి చింతపండు కొనుక్కో నక్కర్లేదు. ఈ గదిలో కూర్చోబెట్టి తాళం వేస్తాను. ఈరోజు తినండి చింతపండు మొత్తం” అని గట్టిగా అరిచేసింది..

అప్పుడు అపర్ణ వాళ్లకి ఆశ్చర్యం వేసింది. “ఇంత చింతపండు ఇంట్లో ఉంది. మేము పిచ్చి వాళ్ళలాగా బలపాలు ఇచ్చి చింత పండు కొన్నాము. ఛీ ఆ ప్రమీల ఎంత మోసం చేసింది” అని తిట్టుకున్నారు..

తర్వాత అపర్ణ తల్లి స్కూలుకు వెళ్లి ఇలా జరిగింది అని చెప్తే, అప్పుడు ఆ టీచర్ ప్రమీలను బెదిరించింది కూడా…

ఇక మగ పిల్లలు బాగా అల్లరి చేసేవాళ్లు. వాళ్ళింట్లో టీచర్ గారి అబ్బాయి కూడా ఉండేవాడు. అతను జాబ్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మధ్య మధ్యలో అతను కూడా అజమాయిషీ చేసేవాడు..

మగ పిల్లలు అల్లరి చేస్తే కోదండం కూడా వేసేవాడు. లేదా బింగిళ్ళు తీయించడం అదేనండి గుంజీలు అంటారే! ఇలా ఆ బడిలో చదువుకున్న పిల్లలు ఎక్కువ జీవితం అంటే ఏంటో తెలుసుకునే వాళ్ళు. పిల్లలు అలాగే పనులు కూడా నేర్చుకునే వాళ్ళు…

టీచరు భోజనం చేసి మడి విడిచి బయటకు వచ్చి, “మీరు కూడా ఇంటికి పోయి తిని రండి” అని చెప్పి అక్కడే ఉన్న పీటబల్ల మీద పడుకునేది…

ఇంటికి వెళ్లిన పిల్లలు మెల్లగా ఆడుతూ.. పాడుతూ ఆలస్యంగానే స్కూలుకు చేరు కునేవారు..

ఇలా ఈ స్కూలు జీవితము ఒకసారి విసుగనిపించింది అపర్ణకు మరియు తన సహోదరులకు.

ఒకసారి వీళ్ళ వయసే ఉన్న ఒక చుట్టం చూపుగా వచ్చిన అబ్బాయి, వీళ్ళతో పాటు స్కూలుకు వచ్చేవాడు. అతనేం చేశాడంటే..

బడి అంటే మీకు విసుగు వస్తుంది కదా! నేను మిమ్మల్ని దాచి పెడతాను స్కూలుకు వెళ్లి మీరు ఊరికి వెళ్లారని చెప్తాను. అని చెప్పి ఒక ఇంటి ముందు దాచి పెట్టాడు.

కాసేపు కూర్చున్న పిల్లలకు..

“బడే బాగుంది.ఇక్కడ వద్దు,ఇంటికి పోదాం” అని ఇంటికి వెళ్ళారు.

తల్లి అడిగింది..

“అప్పుడే వచ్చారు”? అని..

“టీచర్ ఊరికి వెళ్ళిందమ్మా!” అని చెప్పారు.

అక్కడే ఉన్న వాళ్ళ అన్న..

“వీళ్లు అబద్ధం చెపుతున్నారు”అని అనుకుని బడికి వెళ్ళాడు.

“టీచర్ గారు మీరు ఊరికి వెళ్లారు అని మా తమ్ముడు చెల్లెలు చెప్పారు”అన్నాడు.

“అవునా మీరంతా ఊరికి వెళ్లారని మీ చుట్టాలబ్బాయి వచ్చి చెప్పి వెళ్ళాడు”అల్లరి పంతులమ్మ.

ఇంటికి వచ్చి అతను వీళ్లను బాగా తిట్టాడు.

అలా స్కూల్ జ్ఞాపకాలలో తేలిపోయిన అపర్ణ సుధ పలకరించే వరకు ఈ లోకంలోకి రాలేదు.

సుధా, అపర్ణ వసంత ఇంటికి చేరుకున్నారు.

పెళ్లి ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఆరోజు సాయంత్రమే ఫంక్షన్ హాల్ కు చేరుకోవాలి.

రెండవ రోజు కూడా దగ్గర బంధువులందరూ, వసంత కూతుర్ని పెళ్లి కూతురుగా చేశారు. మేనత్తలు ,చిన్నమ్మలు బాబాయిలు, పెద్దనాన్నలు ఇలా దగ్గర బంధువులందరూ పెళ్లికూతుర్ని చేసి వాళ్లకు తోచినది కట్నంగా ఇవ్వడం ఆనవాయితీ.

సుధా అపర్ణ లోపలికి అడుగుపెట్టగానే, వీళ్ళని చూసిన వసంత…

” సుధత్తా! బాగున్నారా? ఎన్నోసార్లు మీ ఇంటికి రావాలనుకున్నాను. ఏవో పనుల వల్ల కుదరలేదు. చిన్నప్పుడు అపర్ణ తో పాటు నాకు కూడా జడలు వేసే దానివి. స్కూల్లో అయితే అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు. ఆ రోజుల్లోనే ఎంతో ధైర్యంగా ఉండే దానివని మా ఇంట్లో కూడా అందరూ మెచ్చుకునేవారు” అంటూ సుధను గట్టిగా కౌగిలించుకుంది వసంత.

” ఏంటే నన్ను పలకరించడం లేదు? అత్తను చూడగానే నన్ను మర్చిపోయావా” అన్నది అపర్ణ నవ్వుతూ..

” నీ మొహం! నిన్ను స్పెషల్గా పలకరించాలా? వెళ్లి అలేఖ్యకు పెళ్లిబొట్టు పెట్టి ,చీర సరి చేయి అక్కడ పర్ఫెక్ట్ గా తయారు చేసే వాళ్ళు ఎవరూ లేక బిక్క ముఖం వేసింది. వెళ్ళు తొందరగా” అన్నది వసంత అపర్ణ చూస్తూ..

” ఇలా చెప్పావు బాగుంది. వెళ్తున్న మా బంగారు తల్లిని నేను తయారు చేయకుంటే ఇంకెవరు తయారు చేస్తారు” అంటూ లోపలికి వెళ్ళింది అపర్ణ..

అప్పటికే చీర కట్టుకొని అద్దం ముందు కూర్చుంది అలేఖ్య…

” అత్తా! వచ్చారా నాకు చీర సరిగా కుదరడం లేదు. మామూలు చీరయితే పరవాలేదు కట్టుకుంటాను. పట్టుచీర కదా కుర్చీలు సరిగ్గా రావడం లేదు. కొంచెం మీరు సరి చేస్తారా”? అని అడిగింది అలేఖ్య అపర్ణను చూస్తూ..

” అందుకే వచ్చాను రా! నేను తయారు చేస్తాను కదా! నువ్వు ఇలా రా” అంటూ చీరను సరిచేసి, చక్కగా పూలజడవేసి, పెళ్లి బొట్టు పెట్టి, బుగ్గన చుక్క కళ్ళకు కాటుక, కాళ్లకు పారాణి తీర్చిదిద్దింది .

” నా దృష్టి తగిలేలా ఉంది నీకు” అంటూ అలేఖ్యను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంది..

వసంత లోపలికి వచ్చి కూతురిని తీసుకొని దేవుడి గదిలోకి తీసుకెళ్లి హారతి ఇచ్చి బొట్టు పెట్టింది.

అందరూ భోజనాలు చేసి సాయంత్రం అయ్యాక అందరూ తయారయ్యారు. పెళ్లి మండపంకు అవసరమైన సామాగ్రిని అంతా ముందే పంపించారు.

చిన్న పట్టణమే కాబట్టి ఫంక్షన్ హాల్ కూడా పెద్ద దూరంగా లేదు.

ఫంక్షన్ హాల్ కి వెళ్ళిన తర్వాత కారు దిగి లోపలికి వెళ్లిన అపర్ణకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో ఉన్నట్టుగానే ఫంక్షన్ హాల్ ఉంటుంది అనుకుంది. కానీ చాలా సాంప్రదాయంగా, పాత పద్ధతిలో ఉంది ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ అనడం కన్నా పెళ్లి పందిరి అంటే బాగుంటుందేమో! అనిపించింది.

ఓపెన్ ప్లేస్ లో చక్కగా పచ్చని ఆకు పందిళ్లు. అటు ఇటు బెదురు తడికలతో నిర్మించి దాని వైపున అంతా పూలు ఆకులతో అలంకరించారు.

వెనుక భాగంలో అన్ని గదులు ఉన్నాయి. అవి అందరికీ ఏర్పాటు చేసినవి..

ఇంకా పెళ్లి మంటపము తయారు కాలేదు. పెళ్లి తెల్లవారి ఉదయం కాబట్టి ఆ ఏర్పాట్లు చూస్తున్నారు పనివాళ్ళు…

ఇంట్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పెళ్లి పందిరిలో కూడా అలాగే ఉన్నాయి.

ఎదుర్కోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

పెళ్ళివారికి ప్రత్యేకమైన కారుతో పాటు బస్సులు పంపించారు.

పెళ్లి వారికి ముందుగా విడిది ఏర్పాటు చేసి, వారు దిగగానే అక్కడికి వెళ్లి తయారు అయ్యి పెళ్లి మంటపానికి వచ్చేలాగా ఏర్పరిచారు.

మేళ తాళాలతో మగ పెళ్లి వారిని స్వాగతించారు ఆడపిల్ల వారు. అందరినీ ఆప్యాయంగా ఎదుర్కొని పెళ్ళికొడుకుకు పూలదండ వేసి వియ్యాలవారికి పుష్ప గుచ్చాలు అందించి చక్కని మేళతాళాలతో పెళ్లి మండపం వరకు పిల్లలంతా అందంగా నృత్యాలు చేస్తుంటే తీసుకొని వెళ్లారు. దాదాపు ఆ వేడుక గంటసేపు జరిగింది.

పందిట్లో కూర్చున్న తర్వాత ముందుగా ఆడ పిల్లవాళ్ళు వరపూజ చేసి పెళ్ళికొడుకుకు బట్టలు పెట్టి, వారి తరపు వారందరికీ తాంబూలాలిచ్చి వరుసైన వారందరూ రంగులు చల్లుకొని స్వీట్లు పంచుకున్నారు. తర్వాత మగ పెళ్లి వాళ్ళు కన్యా నిశ్చయం చేసి పట్టు బట్టలు నగలు బహుకరించి, అందరూ ఆడ పెళ్ళి వాళ్ళు ఇచ్చిన పానకం తాగి ఆసీనులయ్యారు.

అందరూ భోజనాలు చేసి పడుకున్నారు.

తెల్లవారి పెళ్ళిలో..

సశేషం

November 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

అధునాతన -సనాతన- సింగాణం

by రంగరాజు పద్మజ November 29, 2025
written by రంగరాజు పద్మజ

భేరి సునీతా రాంమ్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి

సనాతనమే… సునీతీయం
సనాతనం అనేది ఇది ఎప్పుడూ మారక నిత్యనూతనంగా ఉండేది. న్యాయం, సత్యం, నడవడిక ఈ విలువలు మారనివి. సమాజానికి ఎంతో ఉపయోగపడేవి. మనిషి సమాజానికి ఎలా సేవలందించాలి? నైతిక విలువలు ఎలా? కాపాడాలనేది చెప్తుంది సనాతనం. మొత్తంగా సనాతనం జీవితాన్ని ఎలా జీవించాలని దిశానిర్దేశం చేస్తుంది. అలా ఒక క్రమ పద్ధతి మనుషులకు అలవాటైతే సమాజంలో ప్రజలకు శాంతి భద్రతలకు లోటుండదు! అప్పుడు చక్కని సమాజం తయారవుతుంది. అప్పుడు ప్రపంచం మొత్తం హింస అనేది లేకుండా, సాటివారి పట్ల దయతో, ఓపికతో ఉండి, పారదర్శక జీవనం సాగుతుంది. ఇదేదో మతానికి సంబంధించింది కాదు! కేవలం మనిషి మనిషి వలె జీవించడానికి దిశా నిర్దేశమే!
ఏ మతానికైనా ఈ విలులవలు తప్పనిసరి!
అటువంటి మంచి విలువలు అందించే తోవన తాను నడవడమే కాకుండా, తన పరిధి మేరకు తను స్థాపించిన దివ్యజ్ఞాన పాఠశాలలో విద్యార్థుల చేత పాటింపజేస్తూ ఎప్పటికప్పుడు ఒక నూతన తరాన్ని సమాజానికి అందిస్తున్న అధునాతన- సనాతన- సింగాణి శ్రీమతి భేరి సునీత గారితో తరుణీ తరుణలతో ముఖాముఖి!
ఇంకా ఎందుకు ఆలస్యం? చదువుల సరస్వతికి మన సందేహాల సింగాణీలులు ఎక్కు పెడదాం! వారు చక్కని విలువైన సమాధానాలు విసురుతారు! మరేమంటారు? రండి!!
తల్లిదండ్రులు ఆమెకు సునీత అని పేరు పెట్టారు. పేరుకు తగినట్టుగా విశ్వహిందూ సంస్థ ద్వారా సదాచారాన్ని ప్రచారం చేస్తున్న సునీతా రామ్మోహన్ రెడ్డి గారు తమ సంస్థ లక్ష్యాన్ని ఇలా గర్వంగా చెప్పారు.
హిందూ సమాజాన్ని నిర్వహించడం, సంఘటితం చేయడం, అంతేకాదు హిందూ ధర్మ సేవ చేయడం, దాని రక్షించడమే ధ్యేయంగా కొనసాగే విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర స్థాయి మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి సునీత రెడ్డి గారు దేవాలయాల నిర్మాణంలోనూ, వాటిని పరిరక్షించడంలోనూ, సక్రమంగా భగవంతునికి అన్ని సేవలు జరుగుతున్నాయా? లేదా? అని పర్యవేక్షించడంలోనూ వారి బాధ్యత ఉంటుంది. కోవెల సంప్రదాయాన్ని కాపాడుతూ…. తను శ్రద్ధగా పూజలు అర్చనలు చేయడమే కాదు! తన పాఠశాలలోనూ ఆచార- సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న శ్రీమతి భేరి సునీతా రెడ్డి గారు హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం, గోసంరక్షణ, మతమార్పిడుల వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించి స్త్రీ శక్తి అంటే ఏమిటో తెలుగు ప్రజలకు చాటి చెప్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కనుకనే సాహిత్య సభల్లోనూ, ధార్మిక సభల్లోను చక్కగా ప్రసంగిస్తారు. మంచి నిర్వాహకురాలిగా దివ్యజ్ఞాని నికేతన్ పాఠశాలను ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలా పలు రంగాలలో నిష్ణాతురాలైన శ్రీమతి భేరి సునీతా రామ్మోహన్ రెడ్డి గారు మన మయూఖ పత్రికకు నేటి అతిథి. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం!

రంగరాజు పద్మజ :– నమస్కారమండి సునీతా రెడ్డి గారూ!

సునీతారెడ్డి గారు:– పద్మజ గారూ! నమస్కారమండీ!

పద్మజ :—- మీ నేపథ్యం చెప్తారా?

సునీతా రెడ్డి :– నేను మట్టి బిడ్డను అంటే రైతు బిడ్డను. జనగామ దగ్గర గానుగు పహాడ్ అనే చిన్న గ్రామంలో తాతగారు సమాజ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం కోసం, ధర్మం కోసం, పాటుపడిన వ్యక్తి. అంతెందుకు ఊళ్లో బస్ చెడిపోతే అందులోని ప్రయాణికులకు అందరికీ ఆ పూట వంట వండించి బస్ దగ్గరకు పంపేవారు. చలికాలం వస్తే చాలు 10, 15 శాలువాలు కొని వృద్ధులకు కప్పేవారు. అలాంటి ఇంట్లో పుట్టాను.
తర్వాత కాలంలో కూడా సమరయోధుడుగా తనకు ఇచ్చిన పింఛన్తో నెలకు కావలసిన మందులు, ఊరి వారికి ఎవరికైనా పామో, తేలో కాటు వేస్తే ప్రథమ చికిత్స కోసం వేసే మందులు, ఆయన దగ్గర పనిచేసే వారికి ఎవరికైనా దెబ్బ తగిలితే కట్టు కట్టేందుకు గ్లాస్ క్లాత్ ( కట్టుకట్టే గాజుగుడ్డ) టించర్ , కాటన్, పొటాషియం పర్మాంగనేట్, మొదలైనవి కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టి ప్రధమ చికిత్స చేసేవారు.
నాకెందుకు గుర్తున్నదంటే ఆ వచ్చిన రోగికి మనుమరాండ్లు; మనుమలతోనే మందులు ఇప్పించేవాడు, మందు రాయించేవాడు. ఆ రోజుల్లో అలా ఉండడం వేరు, అప్పుడు అందరి ఇళ్లల్లో అసమానతలు (అస్పృశ్యత) ఎక్కువ! మా తాతగారు పట్టించుకునే వారు కాదు! ఎవరైనా ముళ్ళు విరిగి; చీము పట్టి మందు కోసం వస్తే మా చేత ముళ్ళు తీయించేవాడు. మా నాయనమ్మ కోపం చేసేది ముట్టుకోవద్దని.
ఇంట్లో పెద్ద కుండ నిండా మజ్జిగ చేసి పెట్టేవారు. నౌకర్లకు, ఇంటి చాకలి, మంగలి వారికి చెంబు నిండా మజ్జిగ ఉచితంగా పోసేవారు. సామాజికంగా సమస్థానమే ఉండేది. దేశం మీద ప్రగాఢమైన భక్తి, నాదేశం దీనికోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. అలా నాకు అనువంశికంగానో, వారసత్వంగానో , దైవభక్తి, సేవాభావం మా నాన్న గారి వల్లనే వచ్చాయి. నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ఒకరికింద పనిచెయ్యడమేమిటని మన వ్యవసాయం చూసుకొమ్మని ఉద్యోగానికి రెండు సార్లు రాజీనామా ఇప్పించారు తాతయ్య.

పద్మజ:– మీ విద్య- ఉద్యోగం గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?

సునీతారెడ్డి:– మా వాళ్ళు నన్ను స్కూల్లో జాయిన్ చేసినపుడు నా డేట్ ఆఫ్ బర్త్ కూడా సరిగా రాయించలేదు. మా వాళ్ళు దొరలు కనుక స్కూల్ కు నన్ను నౌకరుతో బడిలో చేర్చమని పంపారు. జాయిన్ చేసుకున్న టీచర్ మొదటి తరగతిలో జాయిన్ అయినాను కనుక ఆరు సంవత్సరాలుంటుందని అందాజాగా రాసారు. కానీ నాకు నాలుగు ఏండ్లే! అలా నావయసు రికార్డ్ లో ఎక్కువ పడింది
నాకు తెలుగులో చక్కని భాష రావడానికి కారణం మా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన అనంతయ్య సార్ బోధనా పద్ధతే! రామాయణ, భారత, భాగవతాలలోని కథలు చెప్పుతూ వినే కుతూహలం కలిగించి తర్వాత ఒత్తులు దీర్ఘాల వంటి పాఠాలు చెప్పేవారు. అలా మాకు మా చిన్నప్పుడే పురాణ పురుషుల- స్త్రీల పేర్లు పరిచయమయ్యాయి.
పదవతరగతి మరియు ఇంటర్ వరకూ మా జనగామ తాలూఖాలోనే చదివాను.
M B B S చదవడం కోసం గుంటూరులోని రవీస్ కాలేజీలో బైపీసి తీసుకొని చదివాను. మెడికల్ ఎంట్రన్స్ రాసాను.సీటు రాలేదు.ఆ కాలంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 25000/ రూ.లు డొనేషన్ కడితే MBBS లో సీట్ ఇచ్చేవారు. కానీ దానికి మరికొంత డబ్బు కలిపితే పెళ్ళి ఔతుందని వారి ఆలోచన! నేను చదువుకుంటానన్నా కూడా సంబంధం కుదిరించారు. అలా పరీక్షలైన వెంటనే నాకు పెళ్ళి చేయాలని తలపెట్టారు. ఎందుకంటే మా తాతయ్యకు ఆరోగ్యం బాగాలేక ఆయన కళ్ళముందు పెళ్ళి చేయాలని దాదాపు బాల్య వివాహమనే చెప్పవచ్చు. ఆ కాలంలో చుట్టూ నక్సలైట్ విప్లవానికి సంబంధించిన గొడవలు జరుగుతుండేవి. అవి చూసి, చదువుకొని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పిల్లవాణికే అమ్మాయినివ్వాలని, పట్టు పట్టి, వెతికి శ్రీ సాయి రాంమ్మోహన్ రెడ్డి గారితో వివాహం జరిపించారు. వారు రైల్వే ఉద్యోగి.
మా వారికి చదువంటే ఇష్టం కాబట్టి చదవుకో అన్నారు. కానీ మాది ఉమ్మడి కుటుంబం. కాబట్టి కాలేజీకి వెళ్ళి చదవలేను ! అందుకే ఉస్మానియా దూరవిద్య లో B. A చదవడానికి దరఖాస్తుతెచ్చారు. బాగానే ఉంది కానీ నేను సైన్స్ విద్యార్ధిని. నాకు సోషల్ స్టడీస్ కానీ,ఎకనామిక్స్ కానీ రావు! చదవలేనంటే పరవాలేదు కాస్త కృషి చేస్తే వస్తుందని, మొదటి గురువుగా మా వారే ఎకనామిక్స్ అర్ధం అయ్యేలా చెప్పారు. అలా డిగ్రీలో మంచి మార్కులతో పాసయ్యాను. మావారి క్రమ శిక్షణలో చదవాలన్న తపన ఉన్న నాకు చదువు బాగానే అబ్బింది. అలా నాకు తెలుగంటే ఇష్టమని, M A తెలుగుతో రాయమని పట్టు పట్టారు. అలా MA తెలుగు పూర్తి చేసాను.
తర్వాత ఉస్మానియాలో దూరవిద్య వారి ప్రకటన ఒకటి వచ్చింది. అదేమిటంటే B. A లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 60% మార్కులు వస్తే వారు నేరుగా M. A చేయవచ్చని నోటిఫికేషన్ వచ్చింది. అలా M. A కుఫీజు చెల్లించాను. అలా M A ఇంగ్లీష్ లో చదివాను. ఎందుకంటే నేను స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ లేకపోవడంతో నేను చెప్పాల్సి వచ్చింది. అందుకే చదివాను. డిగ్రీకి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ లో ఉన్న ఆ పాత్రల గురించి చదివినప్పుడు కొత్తగా అనిపించలేదు. తెలుగు భాష మీద ఇష్టం ఏర్పడింది. అంటే బాల్యంలో చదువుకున్న చదువు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలా తెలుగు M A చదివిన తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలంటే సంస్కృతం రావాలి! అని సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష కలిగింది. అందుకే సంస్కృతం M. A కు ఫీజు కట్టి చదివి, పరీక్ష పాస్ అయ్యాను. ఒక సర్టిఫికెట్ రాగానే మరో పరీక్ష కు సిద్ధపడడం అలవాటైంది.

పద్మజ:– మీ రచనల వివరాలు, విశేషాలు చెప్పండమ్మా!

సునీతారెడ్డి:– నేను మొత్తం 14 పుస్తకాలు రాసాను. రెండు వచన కవిత్వం, రెండు వ్యాస సంకలనాలు, ఆధ్యాత్మిక రచనలు, కృష్ణా పుష్కరాల సందర్భంగా దీర్ఘ కవిత , మరికొన్ని వ్యాసాలు రాసాను. దేవానంద స్వామీజీ జీవిత చరిత్ర రాసాను. మా ఊళ్లో రాజేశ్వర దేవస్థానం
స్థల పురాణం మా ముత్తాతగారు సంస్కృతంలో రాయించారట ! ఆ చిన్న పుస్తకాన్ని మా నాన్న సంపాదించి, సంస్కృతంలో ఉన్నందున అది అందరికీ అర్ధం కాదని, ఎలాగైనా తెలుగులో అందరికీ అర్థం అయ్యేలా అనువదించమని అంటే సరేనని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించాను. రాజేశ్వర చరిత్రను స్థలపురాణం రాసాను , రెండు పద్య కావ్యాలు, మిగతావి వచనాలు రాసాను.
కసిరెడ్డిగారు నాలుగు పత్రికలకు సంపాదకత్వం వహించేవారు. నాతో వ్యాసాలు రాయించేవారు. వారు సవరించి పంపేవారు. అలా ఒకానొక సమయంలో వారు తిరుపతి వెళ్ళినప్పుడు శివానంద భారతిలో రెండు సంవత్సరాలు ఎడిటర్ గా ఎడిటోరియల్స్ రాసాను. తర్వాత గీతాజ్ఞాన్ సమాచార్ వారు నడిపే పత్రికలో నాలుగు సంవత్సరాలు వ్యాసాలు రాసాను. అలా దైవభక్తి, దేశభక్తికి సంబంధించిన వ్యాసాలను రాసాను. చిన్న చిన్న కవితలతో సంకలనం వేయిస్తే ఆ పుస్తకాలకు కసిరెడ్డిగారే పేర్లు పెట్టారు. ఆయనే ముందు మాటలు రాసారు. అలా 14 పుస్తకాలను వెలువరించాను.

పద్మజ :– మీరు అంతర్జాతీయ వేదికల మీద పత్ర సమర్పణలు చేసినట్టు విన్నాను. ఆ సందర్భం ఎలా వచ్చిందిది?

సునీతారెడ్డి:– చెప్పాలంటే అన్నింటికీ మూలం నా గురువుగారైన కసిరెడ్డి గారి పరిచయ భాగ్యమే! అప్పటికే వారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం, తర్వాత తెలిసీ- తెలియని తనం అయినా సాహిత్యంలో ఉండడం వల్ల వచ్చే లాభాలు అంటారు కదా!, అలా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే వారు వారి స్నేహితులు కావడం, వేంకటేశ్వర యూనివర్సిటీ గానీ, పద్మావతి యూనివర్సిటీ గానీ, బనారస్ యూనివర్సిటీ గానీ (రామాయణాన్ని హిందీలో పత్ర సమర్పణ చేశాను.) అవన్నీ తెలిసిన వారి ద్వారా అవకాశాలొచ్చాయి. సురభారతిలో కూడా సెమినార్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అలా జాతీయ- అంతర్జాతీయ సెమినార్లలో 16 చోట్ల నేను పత్ర సమర్పణ చేసి పాల్గొనడం జరిగింది. సాహిత్యకారులంతా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావడం, యూనివర్సిటీతో నాకు సంబంధం లేకపోయినా… గురువుగారి శిష్యురాలుగా అన్ని కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. ఇష్టాగోష్ఠిలలో పాల్గొనడం జరిగింది. ప్రింట్ మీడియాలోనే కాదు ఎలక్ట్రానిక్ మీడియాలలోను దాదాపుగా వందల ఆధ్యాత్మిక, దేశభక్తి, దైవభక్తికి సంబంధించిన చర్చ కార్యక్రమాలు కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి T V chanels పాల్గొన్నాను.
హిందూ ధర్మం- సనాతన ధర్మం ఛానల్ వారు, భక్తి టీవీ, ఈనాడులో పరకాల ప్రభాకర్ రావు గారి సభా సమన్వయంలో ఎన్నో కార్యక్రమాలు చేసాను. ఏదైనా పండగ వస్తే పెద్ద కార్యక్రమం చేసే వారు. నారీ – భేరీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. సఖీ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఉదయం ఐదు గంటలకు తమసోమా జ్యోతిర్గమయ అనే ఒక కార్యక్రమం వచ్చేది. అందులోనూ ఎన్నోసార్లు పాల్గొన్నాను. దీనికంతటికి మూల కారణం… మా గురువుగారైన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. శివానంద ఆశ్రమంలో సత్యవ్రతానంద స్వామీజీ ఉపన్యసించమని ఆదేశించడంతో అక్కడ భాగవత సప్తాహం చేసాను. రామాయణ పారాయణం, ప్రవచనం చేసాను. అలా కాలానుగుణంగా ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆ కళ అలవడింది. ఈనాడులో పాల్గొనడం వల్ల ఈటీవీలో పనిచేసే ప్రొడ్యూసర్సు వేరే ఛానల్ లోకి వెళ్లడం వల్ల వారు అందులోనూ నన్ను పిలవడం వల్ల అలా నా సాహిత్యం వ్యాపించింది. అన్ని చానల్స్ లో మాట్లాడే భాగ్యం కలిగింది.
ఒకసారి జగిత్యాలలో ఒక రెడ్డి సంఘం వారు ఫంక్షన్ హాల్ ప్రారంభం చేస్తున్నారు. వారి లక్ష్యం ఏమిటంటే? ఎవరైనా బీద రెడ్డి పిల్లలు ఉంటే వారికి సహాయం చేయాలని అనుకున్నారు. అందుకోసం ఆ మ్యారేజీ హాలు నిర్మించారు. దానిపై వచ్చే ఆదాయంతో స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే కసిరెడ్డి గారికి ఫోన్ కాల్ చేసి, వారిని ప్రసంగించడానికి ఆహ్వానించారు. వారు అంతకుముందే ఒక కార్యక్రమానికి వస్తానని మాట ఇచ్చారట!
రెడ్డివారినే పిలవాలని నిర్వాహకులు అనుకున్నారట! నాకు వీలు కాదు కానీ సరే నేను ఎవరినైనా పంపిస్తాను! అని వారితో చెప్పి “నాతో అమ్మా! నువ్వు వెళ్ళు!” అని అన్నారు. నాకు మొదటిసారి సువర్ణావకాశం లభించిందనే చెప్పాలి ! నాకు ఏమీ తెలియదు! రెడ్డి సంఘం అన్నారు, రెడ్డి వక్త కావాలన్నారు, ఆ అంశం మీదనే గంట సేపు మాట్లాడాలి. అందుకే నేను మొత్తం రెడ్డి రాజుల పుస్తకాలు చదివాను. రెడ్డియుగం, రెడ్డి అని ఆ పేరు ఎందుకు వచ్చింది? రెడ్ల పుట్టుపూర్వోత్తరాలు, వేమన గురించి, నేటి కాలపు రెడ్ల వరకు సమాచారం సేకరించుకున్నాను.
రెడ్లకు క్షాత్ర గుణం ఎందుకు తగ్గింది? ఇప్పటి తరంలో కూడా చినిగిన చొక్కా వేసుకున్నా పైనుండి శాలువా కప్పుకొనే డాంభికం ఎందుకు ఉంది? క్షాత్రత్వం ఎక్కడ ఉంది? ఇవన్నీ చెబుతూ వచ్చాను.
ప్రేక్షకుల్లో 2500 మంది కూర్చొని ఉన్నారు. సగం ఉపన్యాసం అయ్యేసరికి కసిరెడ్డి గారికి ఫోన్ కాల్ చేసి సార్ “మంచి వక్తను పంపించారండీ! అని అన్నారట! ఉపన్యాసం చివరలో ఇలా అన్నాను. ఇంతమందిలో ఒక్క స్త్రీ మూర్తి కూడా లేకపోవడం అవమానం! మన సంప్రదాయం ఇందుకే క్షీణించి పోయింది. అమ్మ చదువుకొని ఉంటే ఇంత దౌర్భాగ్యం మనకు వచ్చేది కాదు! మన అమ్మల్ని చదువుకోవ్వలేదా? లేదా బయటకు రానివ్వ లేదా, అమ్మ చదువుకొని ఉంటే ఇంత దౌర్భాగ్యం కలగక పోయేది!అని చురక వేసాను.
రెడ్డి బిడ్డగా గర్వపడుతున్నాను! కానీ నాతోటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలన్నాను. ఆ మాటతో సంతోష పడ్డారు. అది మొదలు వెయ్యి మందికి పైన శ్రోతలు వస్తారని అంచనా కనుక ఉంటే మా గురువుగారికి వీలు కాకుంటే నన్ను ఉపన్యసించమని పంపించడం అలవాటయింది. ముందు నుండి నేను జాతీయ సాహిత్య పరిషత్తులో అవకాశాలు రావడానికి కారణం గురువుగారే ! అధ్యక్షులుగా ఉండడంతో అలా అవకాశాలు వచ్చాయి. తర్వాత మల్కాజిగిరి శాఖకు కూడా కొన్ని రోజులు అధ్యక్షులుగా ఉండడం, రాష్ట్ర కోశాధికారిగా పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ఆ సమయంలోనే ఓ 16 సంవత్సరాల క్రితం నా ఉపన్యాసాలు విని, విశ్వ హిందూ పరిషత్ వాళ్లు సేవికా సమితి వాళ్ళు నన్ను గమనించడం, మా ఉపన్యాసాలకు రావడం, నచ్చడం విశ్వహిందూ పరిషత్తు వారు, సార్ ను వారు అడిగితే అమ్మాయి బిజీగా ఉంది! అటు స్కూలు, ఇటు ఇంటి నిర్వహణ కష్టం కదా! అంటే వారు నాలుగు సార్లు ఇంటికి వచ్చి మరీ అడిగితే కాదనలేక వెళ్లాను. అక్కడ రాష్ట్ర బాధ్యత గత 16 సంవత్సరాలుగా విశ్వహిందూ పరిషత్తు ప్రాంతం ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

పద్మజ:– ఇప్పుడు ఈ సమాజం ఇంత కలుషితమైంది కదా! అరాచకాలు జరుగుతున్నప్పుడు ఈ జాతీయ వాదం కానీ, మన దేశభక్తి ప్రచోదనలు ఎంతవరకు పని చేస్తున్నాయి? ఇంకా దాని అవసరం పెంచాలంటారా? ఈ జాతీయ భావం పెంపొందించేందుకు చేసే కృషి ఎలా ఉండాలి?

సునీతారెడ్డి:– నిజం చెప్పాలంటే మనకి ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఒక దేశభక్తి- జాతీయతా భావం పుష్కలంగా ఉన్న ఒక తరం అంతరించిపోయింది. ఇలా అనొచ్చో? అనకూడదో తెలియదు! ఎందుకంటే అందరికీ చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనే భావం వచ్చేసింది. నా బిడ్డ బాగుండాలి! నా బిడ్డ బాగా సంపాదిస్తే బాగుండు! నా దేశంలో లేకున్నా పరవాలేదు! ఏ దేశంలోనైనా సరే! ఇలా తెలియకుండానే అందరి ఆలోచనలు ఆ దిశగా మళ్ళాయి.
స్వాతంత్ర్య సమాజంలో ఎంత మంది యోధాను యోధులు సమసి పోయినా కూడా ఆ ఇంటి నుండి దేశభక్తి గల పౌరులు త్యాగానికి సిద్ధపడిన వారున్నారు. నెమ్మదిగా వారి సంఖ్య తగ్గుతూ దాని వలన మిగిలేది లేదనుకునే స్థాయికి చేరుకుంటున్నారు. మనలో పాశ్చాత్య భావాలను బాగా నింపుకున్నాము. సంస్కృతి- సంప్రదాయాలను కాలరాసాము. అందరూ బాగా సంపాదించుకుంటూ సుఖంగా ఉన్నప్పుడు మనమెందుకు కష్టపడాలి, ఇలా ఎందుకు ఉండాలి ? నలుగురితో పాటు నారాయణా అని ఉండక అని ఇట్లాంటి మెట్ట వేదాంతం చెబుతూ దేశ భక్తిని మనం తెలియకుండానే అధోగతికి తీసుకొచ్చాము. మరిఇప్పుడు అందరూ ఎదురీత అవసరమా, అని అంటారు! కానీ ఎవరైనా ఏమైనా ప్రయత్నం చేయకపోతే ఏది సాధించలేం! కాబట్టి రెట్టవాదులు చాలా మంది ఉన్నారు. పిచ్చి వేదాంతం, ఫెమినిస్టులు, కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు మన జాతీయవాదాన్ని చంపాలని, ఎక్కడికక్కడ అడ్డు పుల్లలు వేస్తూనే ఉన్నారు. ఈ రెట్ట వేదాంతంలో తులసి చెట్టుకు నువ్వు నీరు పోస్తేనే బతుకుతుందా? లేకపోతే లేదా? అని అడ్డంగా వాగే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఒక పవిత్రమైన నమ్మకం ఉంది. మనకున్న జాతీయ భావాల్లో మంచి గురువు లభిస్తే, ప్రాణాపాయ స్థితిలో ప్రాణం నిలవడానికి మంచి డాక్టర్ లభించినట్టే… మంచి శిష్యులు గానే కాదు! దేశం కోసం, సమాజం కోసం అవసరమైన వ్యక్తిగా కావాలంటే మంచి గురువు ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి.

దేవుని దయవల్ల నాకు మంచి గురువులు- మార్గదర్శకులు కసిరెడ్డిగారు కాబట్టి ఆయనకు ఏ శిష్యులు దొరికినా దేశభక్తి , దైవభక్తి ఉపదేశించి, వారిలో ఆయా గుణాలు పెంపొందేలా చేస్తారు. ఆయన మార్గంలో నడుస్తారు!
వారి వలనే నేను కూడా ఒక శిష్యురాలిని అని చెప్పుకోవడం గర్వంగా భావిస్తాను! నాకు ఇష్టం కూడా కాబట్టి ఆదారిలోనే వెళుతున్నా… మనకి ఇవన్నీ ఎంతవరకు సాధిస్తాం ? అనే సందేహంతో అనుకునే బదులు నా వంతు నేను చేస్తాను. సమాజంలో పౌరురాలిగా నా కర్తవ్యం ఇది.
నేను చెప్పేది ఏమిటంటే నాకు ఆత్మగౌరవం కూడా ఎక్కువే! కాబట్టి నాకు ఎలా ఉంటుందంటే? తప్పనిసరిగా నాకు చేతనైనంత పని నేను చేస్తాను! ఎంతో కొంత సాధిస్తాను! అనుకొని ఎవరు విన్నా- వినకపోయినా నేను ఎక్కడికి వెళ్ళినా దేశభక్తి, దైవభక్తి సంబంధించి, నా ధర్మం, నా సంస్కృతి, నా సంస్కారం ఈ దేశంలో ఉన్నా, ఏ క్రతువైనా సరే దాంట్లో కొంత శాస్త్రీయత ఉందని నొక్కి వక్కాణించి చెప్తాను. శాస్త్రీయత లేని క్రతువే నాకు లేదు. ఎవరైనా వితండ వాదన చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలి! కాబట్టి పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, శాస్త్రాలు కాని చదవాలి! నేను అందరికీ చెప్పేది అదే! రాబోయే గురుపౌర్ణమి వచ్చిందంటే గురు పౌర్ణమి రోజు చప్పట్లు కొట్టి బొమ్మ పెట్టడం కాదు! ఆ గురువు యొక్క ఆశయాలు ఫలింపజేయాలి! ఆశలు- ఆశయాలంటే నా సంస్కృతిని కాపాడాలి! అని ఆనాడు వ్యాసుల వారు చెప్పినా, ఈ రోజు గురువులు చెప్పినా అదే విషయం… కాబట్టి ఆ సంస్కృతి తరువాతి తరాలకు అందాలంటే మనమేం చేయాలి? మొట్టమొదట ప్రాచీన వాఙ్మయం చదవాలి! పనికిమాలినవాడు వచ్చి అడుగుతాడు. మతవ్యాప్తి కోసమో? ఇంకోదానికో లేనిపోని అడ్డంకులు పెడుతూ ఉంటాడు. మీ మతంలో చెట్టుకు, పుట్టకు, గుట్టకు, పాముకు, పక్షికి పూజ చేస్తే ఫలితం దక్కుతుందా? అని హేళనగా అంటాడు. ఔను! నేను చెట్టును- పుట్టను- గుట్టను పూజిస్తున్నానంటే ప్రకృతిని పరిరక్షిస్తున్నానన్నమాటే కదా? ప్రకృతిలో ఒక శక్తి ఉందని శాస్త్రీయంగా నిరూపణ చేస్తూ అది బలాత్మకమని చెప్తుంటే ఆ ఎనర్జీ ఈరోజు కాదు అందులో ఆ శక్తి ఉందని ఎప్పుడో ప్రాచీన కాలంలోనే మన ఋషులు గ్రహించారు. భారతీయ సనాతన ధర్మంలో ఉన్నదని గట్టిగా చెప్తాను. మరి ఇది చెప్పడానికి మన వాఙ్మయం చదవాలి అని ప్రేరణ కలిగిస్తాము.
నేను ఎక్కడ ఉన్నా చుట్టూ ఉన్న పిల్లలతో జాతీయ భావాలు చెప్తాను. బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా ఎక్కడ వీలైతే అక్కడ చెప్తాను! చెప్పకుంటే చెడిపోయిన వారు చాలామందే ఉన్నారు. ఒకసారి నేను అనుకోకుండా కాలేజీ పిల్లలతో ఎక్కడికి వెళుతున్నారు? అనడిగాను.
వారంతా షిరిడికి వెళుతున్నామన్నారు. ఆడ మగ అంతా యువతి యువకులే! కలిసి వెళుతున్నారు. నేను వాళ్లతో మీరంతా ఇంత భక్తిగా వెళుతున్నారు! భలే బాగుంది అన్నాను.
వెంటనే వాళ్ళు జస్ట్ ఏ హాలిడే ట్రిప్ మేడం! అని అన్నారు. హాలీడే ట్రిప్ కు ఆధ్యాత్మిక మైన స్థలానికి వెళ్లడం ఏమిటి? మీకు అక్కడ సుందర దృశ్యాలు ఏవి కనపడకపోవచ్చు కదా! అన్నాను. ఎందుకంటే? పిల్లలకు చెప్పక చెడిపోయారన్నదే నా భావన! కాబట్టి చెప్పి చూద్దామని ట్రైన్లో గంటా రెండు గంటలు మాట్లాడాను. ఎలాగూ 10 గంటల ప్రయాణం కాబట్టి సమయం దొరికింది.
అంతా విని ఆ పిల్లలు ఆంటీ అందరూ ఇలా చెప్తే బాగుంటుంది కదా! అని అన్నారు. అంటే పిల్లలు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడెక్కడ జాతీయ లేదాసంస్కృతీ లేదా భక్తి భావాలు చెప్పడం లేదంటే? ఈనాడు
అమ్మ చెప్పడం లేదు బడిలో టీచర్ చెప్పడం లేదు ఇంట్లో అందరికీ మమ్మీ అని పిలిపించుకుంటేనే ఆనందం! అమ్మా! అని నోరార పిలిస్తే లాగే లెంపకాయ వేస్తున్నారు. నువ్వేమన్నా తెలుగు మీడియంలో చదువుతున్నావా? అని అడిగే అమ్మలు ఉన్నారు. తెలుగు మీడియం చదవడం కాదా!
అంబా అని పిలిచే ఆవుకు- అమ్మా! అని పిలిచే మనకు ఎంత అనుసంధానం ఉంది కదా ! అమ్మ అని పిలవడం నచ్చడం లేదు… మమ్మీ కావాలి కాబట్టి దుస్తులు కూడా అదే వేషం… ఇంకా దరిద్రం భావ దాస్యంతో పాటు మనకున్న దరిద్రాల్లో మనకు వచ్చిన దరిద్రం ఏమిటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జనాభాలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఇంకేదో అనుకొని ఒక పిల్లవాడే ముద్దు! ఇద్దరు హద్దు! మూడు వద్దు! అని ఇలా రకరకాల స్లోగన్స్ పుణ్యమా అని కేవలం హిందూ ధర్మంలో ఉన్న వారు మాత్రమే పోటీపడి ఒకడిని మాత్రమే కని మన సంఖ్య తగ్గిస్తున్నారు. రేపటి మన పరిస్థితి ఏమిటి మనకు తెలియదు! ధర్మం పట్ల ఎవరికీ అవగాహన లేదు. ఒకడైనా ఉన్నాడు కదా! అని తృప్తి పడదామంటే ఒక్క ఆడపిల్లతో సరిపెట్టుకుంటున్నారు. మరి ఆడపిల్లైనా చాలు అన్నప్పుడు ఆడపిల్ల నా ఇంటి లక్ష్మి అని లక్ష్మీ దేవత వలె అలంకరిస్తున్నారా? అంటే అదీ లేదు! ఆడ పిల్లలకు మగ డ్రెస్సులు వేసి, ఆడైనా- మగైనా ఇదే అంటారు. మరి మగ పిల్లవాడు పుడితే ఆడపిల్లల డ్రస్సులు వేస్తున్నారా? వేసి పంపరు కదా? ఎందుకలా చేయడం? ఆడపిల్ల ఇష్టం ఉంటే ఒక ఆడ పిల్లతో పాటు మరో మగ పిల్ల వాడిని కంటే ఏమవుతుంది?
అలాగే ఆడపిల్లను ఆడపిల్లగా పెంచాలి కదా! ఆడపిల్లల్లో అమ్మతనం ఉండాలి కదా? అది అమ్మైతేనే సమాజం నిలిచేది మాత సమాజ నిర్మాత అనేది మరిచిపోతే ఎలా? ఇవన్నీ తెలియనటువంటి ఒక రకమైన మాయ పొరలు కమ్మాయి. మనకు ఈ పొరల నుండి బయటకు రావాలంటే ఎంతో కొంత చైతన్యం కావాలి. ఈ చైతన్యం ఎలా వస్తుందంటే? మనకు తెలిసిన విషయాలు చెప్పాలి! మనం ఎంత చెప్పినా వింటారా? అనే నిరాశ- నిస్పృహ వద్దు! కొంతైనా ప్రయత్నం చేయాలి! నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో కొంత మన జాతీయ భావాల గురించి చెప్తాను. మనమెవరమైనా సరే ఈ సమాజం నాది! ఈ దేశం నాది! ఈ ధర్మం నాది! ఈ సంస్కృతి నాది! అనుకున్న ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత తెలిసిన వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు తప్పకుండా చెప్పాలి! పెద్దవారంటారు కదా! చెడు చెప్పకపోయినా పర్వాలేదు కానీ, మంచి తెలిసి చెప్పకుంటే పాపం అవుతుంది. నాకెందుకు అనుకుంటే ఆ మంచి అనేది తెలియక వచ్చే నష్టాలు చాలా ఉంటాయి.
మీ దేవుడేమిటి? అన్ని ఆయుధాలు పట్టుకున్నాడు అంటాడొకడు. చెడు పనులు చేసే శత్రు సంహారానికి ఆయుధం అవసరం అని చెప్పగలగాలి! ఇంకొకడంటాడు నీ కృష్ణుడంత భోగలాలసుడు మరొకడు లేడు! అని అంత మంది భార్యలు అవసరమా?మమ్మల్నంటారు కానీ వాళ్ళ ఇంట్లో వారో? ఇతనో? పుస్తకాలు చదివి నేర్చుకుంటే ఔను కదా! సమాజంలో ఉన్న ఒక దుష్టచర్యను ఆపడం కోసం దేవుడు అలా చేశాడు కదా! అని అనుకునేవారు.
ఏ స్త్రీ మూర్తులైతే బయట పరాభవింపబడి, సమాజంలో ఒక రక్షణ లేకుండా, విలువ ఇవ్వకుండా ఒక సమాజం ఉంటుంది… అదే కృష్ణుడు భార్యకు విలువ ఇస్తాడు. వాళ్లు సమాజంలో విలువ లేని వాళ్లు గా ఉండ కుండా చేసే ఒక కట్టుబాటుగా చేసిన ఒక ప్రక్రియను ర*** అంటగట్టే రాక్షస గుణాలు ఉన్నటువంటి వారికి ఎవరు చెప్తారు?మీరనుకున్నట్టు ఇలా కాదు అని చెప్పడానికి మన ప్రాచీన సాహిత్యాన్ని చదవాలి! లేదా సాహిత్య చర్చలు, ప్రసంగాలు జరిగే చోటుకు వెళ్లాలి! సాహిత్య చరిత్రను వినాలి! పనికిరాని పబ్జీలు వాడేటువంటి పిల్లలను మనం పెంచుతున్నాం! వాడికి ఒక సంప్రదాయ పద్యమో? పాటనో? నేర్పించడం లేదు. ఇది మనం చేసే నష్టం కాబట్టి సాహిత్యానికి ఎదురీదుతున్నామా? అంటే ఎదురీదాలి! కొన్నిసార్లు తప్పదు. అయినా ఎప్పుడూ ఇలాగే ఉండదు. వేల మైళ్ళ దూరమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది కదా! ఒకళ్ళం మొదలుపెడదాము! మనవెంట పదిమంది ఔతారు. నిరాశ ఎందుకు? మనం ఆశాజీవులం. భారతీయులం సనాత ధర్మాన్ని పాటించే వాళ్ళం ఆశాజీవులు గానే ఉండాలి! ఎదురీదుతున్నామని అనుకోకూడదు!

పద్మజ:—- మీకు జ్యోతిష్యంలో ప్రవేశం ఉందని విన్నాను! అది ఎలా హస్తగతం చేసుకున్నారు?

సునీతా రెడ్డి :—- ఉస్మానియాలో M A జ్యోతిష్యం కోర్సు చదివాను. జ్యోతిష్యం చేయడానికి ముందు మా అబ్బాయికి పెళ్లి చేయాలని నేను ఎన్నో సంబంధాలు చూసాను. కానీ కుదరలేదు జాతకరీత్యా వీడికి ఏమైనా లోపం ఉందా? ఎందుకు పెళ్లి కావడం లేదు? మనకు తెలిసిన మహా పండితులు ఎవరున్నారు ? అని వెతికితే సాగి కమలాకర్ శర్మ గారితో మంచి పరిచయం ఉండడం వల్ల ఊరికే అడిగేదాన్ని! అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జ్యోతిష్యంలో M A చేయవచ్చు అని చెప్పారు. నేను ఎమ్మె చేద్దామని చేరాను. అక్కడ చేరిన తర్వాత తెలిసింది జ్యోతిష్యం అంటే మనం అనుకున్నంత సులువు ఏమీ కాదని, రెండు సంవత్సరాలు MA జ్యోతిష్యం చదివిన తర్వాత నాకు ముందు టేబుల్ (చక్రం) మాత్రం వేయడం వచ్చిందో ఏమో? భావం అంటే ఏమిటి, రాశులు ఏమిటి? నక్షత్రాలు తెలిసాయేమో? అంతే తప్ప ఎంత చదివినా జ్యోతిష్యం పట్ల పట్టు వచ్చినట్టు నాకు అనిపించలేదు అప్పుడు మాకు జ్యోతిర్ విద్యార్ధి అనే పేరుతోనారాయణగూడలోమా గురువులు, పూర్వ విద్యార్థులు పాఠాలు
చెప్పేవారు. అక్కడికి వెళ్లి ప్రవేశిక నుండి జ్యోతిష్యం వాస్తు కూడా నేర్చుకోవడం జరిగింది. అందుకే అక్కడ జరిగిన సెమినార్లు బాగా ఉపయోగపడ్డాయి. యూనివర్సిటీలో చదివిన రెండు సంవత్సరాల చదువుతో పాటు అదనంగా ఆరేడు సంవత్సరాలు అదనపు చదువు వల్ల జ్యోతిష్యం వచ్చింది. జాతకాలు పరిశీలిస్తాను! అవసరం ఉంటే చెప్తాను! ఇప్పుడు సంపూర్ణంగా వచ్చిందని చెప్పగలను. తర్వాత వాస్తు శాస్త్రం నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగింది. ప్రవేశిక అడ్వాన్స్ వాస్తు, రెండు కోర్సులు చేసిన తర్వాత అక్కడ పిహెచ్డి (phd ) చేయాలని ఆశ కలిగింది. వాస్తుగురువుగారైన వరప్రసాద్ రావు గారిని అడిగితే రాజా గారని వాస్తు శాస్త్ర నిపుణులున్నారు. వారి దగ్గర వారి గైడెన్స్ లో మీరు పిహెచ్డి చేయవచ్చు అని అంటే ఆగ్నేయ దోషాలు అనే టాపిక్ మీద సిద్ధాంత గ్రంథం రాసాను. అలా రెండవ (పీహెచ్డీ) phd పూర్తి చేసాను.

పద్మజ:— అమ్మా! సునీత గారూ! మీరు ఈ దివ్యజ్ఞాన హైస్కూలు స్థాపనకు కారణమేమిటి? దీని నిర్వహణలో మీ పాత్ర ఏమిటి?

సునీతా రెడ్డి :– దివ్యజ్ఞాన హైస్కూలు స్థాపనకే కాదు! ఈరోజు ఈ పాఠశాలలో ఇలా కూర్చున్నారంటే కారణం దేవుడి నిర్ణయమే! ఒక దైవీ సంభూతమైన యోగం వలె ఒక కూతురును నాకు ఇచ్చాడు భగవంతుడు. అప్పుడప్పుడు ఆయన పరీక్షలు పెడుతుంటాడు. పాప పుట్టింది. నా జీవితంలో విషాదమేమిటంటే మా వారు రైల్వే ఉద్యోగి కనుక రైల్వే ఆసుపత్రికి వెళ్ళాము .కాన్పు కావడం కష్టమై ఆసుపత్రిక వెడితే ఆపరేషన్ కొరకు అనెస్తీషియా ఇచ్చిన తర్వాత ఆక్సిజన్ లేదని ఆపరేషన్ ఆపారు. ఆ మందు ప్రభావం పాపకు మజిల్ సిస్టంపై పడింది.పాప చాలా బలహీనంగా ఉండేది. బిడ్డేమో చాలా తెలివైంది! కానీ శారీరకంగా బలహీనురాలు. పద్నాలుగు సంవత్సరాలు నా ఒళ్లోనే పెట్టుకొని పెంచుకున్నాను. ఎన్నో రకాల సమస్యలు అక్కడ ప్రారంభమైనవి. పసిపిల్ల మంచి తెలివి కలది చదివించాలని ఆశ! పాపేమో అన్న వలె చదువుతానని చెప్తున్నది. పాపను స్కూల్లో జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే? నడవరాదు కానీ చదివించాలనీ ఇంటికి దగ్గరగా ఉన్న ఒక కొత్త స్కూలుకు పోయి, పాప పరిస్థితి చెప్పి, పాపను జాయిన్ చేసుకుంటే నేనూ తనతో పాటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తాను అని అడిగాను.
అప్పటికే నేను ఎమ్మే చేసాను. కాబట్టి స్కూల్ చిన్నది కాబట్టి నన్ను హెడ్మాస్టర్ గా నియమించారు. కేవలం నా బిడ్డ కోసమే! ఉద్యోగం. డబ్బుకు ప్రాధాన్యత లేదు! అందుకే జీతం అడగలేదు ! అలా పాప 5వ తరగతి వరకు వచ్చింది.

అనుకోని పరిస్థితుల వల్ల ఎందుకో నేను అక్కడ ఇమడలేకపోయాను. నా కూతురు కోసం ఒక పాఠశాల పెట్టాలనుకున్నాను నా ఇంట్లోనే పాఠశాల ప్రారంభించాను. మొదట్లో కొద్దిగా ఇబ్బంది అయింది. అయినా అలాగే ఆరవ తరగతి వరకు తరగతులు నడపాలని, నాకు ఐదారు సంవత్సరాల బోధనానుభవం ఉండడం వల్ల ఈ కాలనీలో తెలిసిన వారు ఉండడం వల్ల నా మీద నమ్మకంతో ఇంత చిన్న స్కూల్లో 180 మంది పిల్లలు చేరారు. అలా ఒక్కో సంవత్సరం తరగతులు పెంచుతూ నడిపాను. కేవలం పాప కోసమే కానీ పదవ తరగతికి వచ్చిన తర్వాత పాప చనిపోయింది. అప్పుడు మళ్ళీ స్కూల్ మూసేయాలి ఎందుకంటే? పాప కోసం పాఠశాల ఏర్పాటు చేసాను. ఇక పాపే లేనప్పుడు ఈ స్కూల్ ఎందుకు? అని అనిపించింది.
అప్పుడు మా గురువుగారు కసిరెడ్డి గారు ఏమన్నారంటే “అమ్మా స్కూల్ ప్రారంభించింది పాప కోసం కానీ, పాఠశాలకు పాప పేరు పెట్టావు కదా! దివ్యజ్ఞాన ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఉండనీ! ” అని అన్నారు.
ఏమో సార్ నాకట్లా ఆ పేరు చూస్తే చాలా బాధ కలుగుతుంది! నేను నడపలేను అన్నాను. ఈ పాఠశాల వల్ల మనకు ఉపయోగం ఉంది అని అన్నారు.
ఏమి ఉపయోగం సార్? అనడిగాను ” మన దగ్గర చదువుకున్న పిల్లలు బయటకు వెళ్ళి సంఘవిద్రోహులు కాకుండా, జాతీయ భావాలు, ఈ సంస్కారాలు అందించాలంటే ఈ పాఠశాల ఉంటేనే సాధ్యం… ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు ఈ పాఠశాలను నడిపించాలి” అని అన్నారు.
సరే అని కొనసాగిస్తే ఈరోజు నా పాఠశాలలో సంస్కృతి- సంప్రదాయాలు పాటించేలా చేస్తాను. అందుకోసం పాఠశాల ముందు చదువుల తల్లి విగ్రహం పెట్టించాను. సరస్వతి ప్రార్థన చేస్తారు పిల్లలు, టీచర్లు. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు భగవద్గీతలోని బ్రహ్మార్పణం అనే భోజన మంత్రం సాయంత్రం పఠిస్తారు. ఎవరిదైనా ఆ పిల్లల పుట్టిన రోజు వస్తే ఆ పిలల్లలకు వేద ఆశీర్వచనం చేయిస్తాము. సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు నాలుగు భాషల్లో ప్రతిజ్ఞ చేయిస్తాను. రెండు రోజులకు ఒకటి చొప్పున. చిన్న పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా సంస్కృతంలో ఉన్న కౌసల్యా సుప్రజా రామా అనే వెంకటేశ్వర సుప్రభాతం లోని శ్లోకాలు ఎల్కేజీ (Lkg) యూకేజీ ( Ukg )పిల్లలకు నేర్పిస్తాము. ఎందుకంటే భాష ఉచ్చారణ చక్కగా వస్తుంది. భగవద్గీత శ్లోకాలు ప్రతి సంవత్సరం మూడు చొప్పున క్లాసు పెరిగినా కొద్దీ సంఖ్య పెంచుతూ… పదవ తరగతి వరకు సంవత్సరానికి ఒక అధ్యాయం నేర్పిస్తాము.
గీతా జయంతి రోజు భగవద్గీత పఠన పోటీలు ఉంటాయి.
అలాగే విశ్వహిందూ పరిషత్తుతో సంబంధం ఉంది కాబట్టి పరిషత్ లో జరిపించే గీతా పఠనం ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పాఠశాలలకు నేనే పోటీలు నిర్వహిస్తాను. రాష్ట్రస్థాయికి పంపించడం బాధ్యత కూడా నేనే తీసుకొని స్కూల్ పిల్లలకు ఫలానా రోజు ఉంటుంది మీరు నేర్పించండి పోటీలలో పాల్గొనేందుకు పంపించండి ! అని తల్లిదండ్రులకు చెప్తాను. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నాని చెప్పి, మా స్కూల్లోనే పోటీలకు సిద్ధం చేయించి పాల్గొనేలా ప్రోత్సహిస్తాను. అలాగే మాతృ- పితృ వందన కార్యక్రమం నడిపిస్తాను. ప్రతిరోజు ప్రార్ధన కాగానే పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని నైతిక విలువలు చెప్తాను. అలా సంస్కారాలు నేర్పిస్తూ, మాతృభాషను మరిచిపోకుండా వారికి ముందు ముందు పనికి వచ్చేందుకు చక్కని ఇంగ్లీష్ బోధనలో మిగతా అన్ని సబ్జెక్టులు చెప్పిస్తాను.(ట్రెడిషనల్ టు టెక్నికల్ విద్య) Tredishional to Technicallన Education ఉండాలని ప్రణాళిక రాసుకొని దాని ప్రకారం అలా 28 సంవత్సరాలుగా బోధిస్తూ స్కూలు నడుపుతున్నాము.

పద్మజ:– నేటి సమాజానికి పత్రికల ఆవశ్యకత, పత్రికలు నిర్వహించాల్సిన విషయం, పత్రికాధిపతుల పాత్ర ఎలా ఉండాలంటారు?

సునీతారెడ్డి:– పత్రిక నడవాలంటే ముందుగా చదివే వారు ఉండాలి. ప్రస్తుత కాలంలో బుక్ కల్చర్ లేదు! అంతా లుక్ కల్చర్ అంటే యూట్యూబ్ చూస్తున్న పరిస్థితే ఉంది. అయినా సరే! సంపాదకులు అనగానే మనకేం ఉంటుందంటే సంపాదకీయం విలువైనదిగా ఉండాలనిపిస్తుంది. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అంటే దార్షనికత ఉండాలి !
అది కూడా నిర్మొహమాటంగా వీళ్ళు ఏమనుకుంటారో? వాళ్ళు ఏమనుకుంటారోనని వాళ్ళ- వీళ్ళ మెప్పుకోసం కాకుండా జాతికి, సమాజానికి, ఉపయోగపడేలా పత్రికలో రచనలుండాలి. అక్షరం విలువైనది. సమాజానికి ఆయుధం వంటిది. పత్రిక ఏదో నడుస్తున్నదిలే! నడవనీ అని అనుకోకుండా ప్రతి ఎడిషన్ కొత్తగా ఆ రోజే ప్రారంభమైంది పత్రిక అన్నట్టుగా రాయాలి! పెద్దలు అనే మాట ఒక సిరా చుక్క వెయ్యి మెదడులను కదిలించాలని అలాంటి అక్షరంతో స్వాతంత్రం సాధించడంలోనూ ఎదురొడ్డిపోరాడాయి. ఎన్నో ఉద్యమాలలో కవితలు, పాటలు, మాటలు, ప్రసంగాలు, వ్యాసాలు ఇలా ఏదైనా అక్షరాల కూర్పే కదా !కలాలను కదిపితే కావలసిన ఫలితం వస్తుంది. కాబట్టి సామాజిక, దేశం కోసం, ధర్మం కోసం ఉపయోగపడే విధంగా అందులోని రచనలు రావాలి! అలా పాఠకులు పత్రికను వినియోగించుకోవాలి. ఈ రోజు యువత రచనలు నచ్చితే తప్పక చదువుతారు! కానీ తెలుగు భాష చదివే వారు తక్కువైనారు. కాకపోతే కొంతవరకు మనకున్న భావదాస్యాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఇంట్లో తెలుగు మాట్లాడవద్దు! ఇలాంటివి వాటి విలువలు తెలిపే విధంగా రచనలుంటే తల్లులు చదువుతారు .అది నిజమే అనిపించే విధంగా ఉంటే ఆచరణలో పెడతారు. అలా ఊరికే ఉదాసీనంగా మనం రాస్తే ఎవరు చదువుతున్నారు లే! అని మానేయకుండా మనం వంతు ప్రయత్నంగా పత్రికను నడుపుతూనే, సమాజానికి అందవలసినటువంటివి ఏవైతే విలువలున్నాయో వాటిని అందిస్తే… వాటిని ఒక్కరు చదివినా పత్రిక లక్ష్యం నెరవేరుతుంది. ఇక్కడ ఒక చిన్నమాట చెప్తాను!
శివానందుల వారు ఎప్పుడూ పుస్తకాలు రాస్తూ ఉండేవారట. అలా చాలా రాశారు. ఆయన రాస్తున్నప్పుడు పూర్వకాలం కదా! ప్రతిరోజు వచ్చే భక్తులకు పంచేవారట. ఆయన దగ్గర ఉన్న శిష్యులు అడిగేవారట! అయ్యా! స్వామీ! ఇన్ని పుస్తకాలు రాస్తున్నారు, పంచుతున్నారు. ఎవరైనా చదువుతున్నారా? ఏమన్నానా? అని అడిగారట. శివానందుల వారన్నారట చదవకపోతే ఏం చేస్తారు?
శిష్యుడన్నాడట కదా! చదవకపోతే పుస్తకాలన్నీ పాత పుస్తకాలు వాడికి అమ్ముతారట!
మరి వాడు ఏం చేస్తాడు? అని అడిగారు స్వామి! వాడు కిరాణా కొట్టుకు అమ్ముతాడు అన్నాడు. కొట్టువాడు ఏం చేస్తాడు? అని అడిగాడు స్వామి. అంటే అప్పుడు ప్లాస్టిక్ లేవు కనుక కిరాణా కొట్టు వాడు సామాను పొట్లాలు కడతారు అన్నాడట శిష్యుడు.
ఒరేయ్ ఆ పొట్లాలు కట్టిన తర్వాత ఈ పొట్లం ఎవరి ఇంటికి పోతుందో… ఆ ఇంట్లో ఉన్న ఒక్క అమ్మ ఒక్క వ్యాసం చదివితే ఆ వ్యాసానికి ఉపయోగం లేదారా? ఆ పుస్తకానికి విలువ రాదా? అన్నాడట. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను!

నేను ముందే చెప్పినట్టు ఎంతో ఓపికతో మన సందేహాలన్నిటికి ఎంతో ఓపికగా సమాధానమిచ్చిన భేరి సునీత గారి సమాధానాల్లో మనకు కావలసినవి మనం తీసుకోవచ్చు! ఏదైనా సాధించాలనుకుంటే ఏదీ అడ్డంకి కాదని, చదువుకోవాలని ఉంటే వయసూ అడ్డు కాదని, ధైర్యం ఉంటే మనమనుకున్నది సాధించవచ్చని, తనకు వచ్చిన విద్యను సద్వినియోగం చేసుకుంటూ.. అటు చక్కని ఉపన్యాసాలతో సాటివారికి ఎరుక కలిగిస్తూ… ఇటు విద్యా బోధనతో తరువాతి తరాలను చక్కని పౌరులను చేయవచ్చని నిరూపిస్తూ… కేవలం అక్షరాలతో పుస్తకాలు నింపిన రచయిత్రే కాదు! ఆచరణలో పెట్టిన ధీశాలి! మనసు కుంగిపోయిన సమయంలోనూ కూడగట్టుకొని, ఒక కంట కన్నీరు, మరోకంట విద్యార్థులకు పన్నీరు పంచిన మానవతా మూర్తి! శ్రీమతి భేరి సునీత గారి ముఖాముఖితో మనమూ మారడానికి ప్రయత్నిద్దాం!

దారులను రహదారులుగా మలుచుకుందాం!!

November 29, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సప్తపదులు! శుకసారికలు!

by Achyutuni Rajasri November 28, 2025
written by Achyutuni Rajasri

విశ్వమంతా త్రిమూర్తి స్వరూపం.అలాగే శ్రీ సుధామ గారి సృష్టి సప్తపదులకి శ్రీవిహారిగారు హితవరిగా మంచిముత్యాలని ఏరితే,శ్రీశాంతమూర్తిగారు 5అక్టోబర్ 2023లో సప్తపదుల వాట్సప్ గ్రూప్ నెలకొల్పి చేయూత నిచ్చారు.

బడి పిల్లలు కూడా చురుగ్గా పాల్గొని అచ్చులో చూసుకుని ఆనందించటం గొప్ప విషయం.
సప్తపదీయులకు ప్రోత్సాహమిస్తూ 100రూపాయల చొప్పున బహూకరించటం,ప్రోత్సహించటం సృజనకర్తకి ఆత్మ తృప్తి ,కవులకు గొప్ప అనుభూతి.3 వ సప్తపదుల పంచశతిమేలిమి ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ఆకట్టుకుంది.20అక్టోబర్ 2025న అన్నమాట ప్రకారం ప్రచురణ ,కవులకి సకాలంలో అందడం వారు ఫోటోతో సహా తమ ఆనందాన్ని గ్రూప్ లో పంచుకోటం ఓకొత్త అనుభవం.ఇక సప్తపదుల ఉద్దేశం జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం.నేటికీ 700పైగా సభ్యులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ముదావహం.సచిత్రంగా ఎన్నికైన సప్తపదులు రావటం ప్రత్యేక ఆకర్షణ. విద్యార్థులను ప్రోత్సాహించిన అధ్యాపకులని అభినందించితీరాలి.

సప్తపది నిర్మాణం:-
సప్తపది నిర్మాణ పద్ధతిని శ్రీసుధామ గారు వివరించటంతో ఆసక్తి కుతూహలం పెరిగింది అందరికీ.అనుభూతి సామాజిక అంశం తో మూడులైన్లతో కవిత రాయాలి.అంత్యప్రాసతో కూడిన పదాలు మొదటి రెండో లైన్లలో ఉండాలి.మూడోలైన్ లో ఆరెండుపదాలు సమన్వయంచేస్తూ ఐదవ చివరిపదం అంత్యప్రాసతోనే ముగించాలి. ఒకసారి వాడిన పదం మళ్లీ వాడరాదు.అన్యభాషాపదాలు వాడరాదు.అసమాపక క్రియాపదాలు వద్దు.
ఉదాహరణకు కాటేగారుపాండురంగవిఠల్ గారు రాసిన సప్తపది
ఊగడం
తూగడం
జీవితమంటే ఊయలలా సాగటం
తుదకు ఆగడం” జీవితసత్యం చెప్పారు.మూడో తరగతి సాయి అకిరా ఇలా అంది” ఇచ్చుకో పుచ్చుకో
ఒకరికొకరని సాయంచేస్తూ మంచి పేరు తెచ్చుకో” అంది.అలాగే ఏడవక్లాస్ టి.ధరణి భావం లో సమాజం ని చూపింది.
స్థలాలు పొలాలు
పెళ్లికి తప్పక చూస్తున్నారు వధూవరుల జాతక ఫలాలు”
తెలుగుకి వెలుగుబాట పర్చిన సప్తపదులు వాట్సప్ గ్రూపులలో మేలిమిగా నిలిచింది.అందరూ పాల్గొనేలా కొత్త పదాలు నేర్చుకునేలా ఆసక్తికరమైన అంశాలతో గంగాప్రవాహంలా సాగిపోతూ కొత్త ఒరవడిని సృష్టించింది.ఇది తెలుగుసాహిత్యంలో మైలురాయి.కవులు తమకవితవరకే చూస్తారు.కానీ శ్రీసుధామగారు శ్రీవిహారిగారు సామాన్య జనాలకి పదాలపై కూర్పు పై ఆసక్తి కలిగించి రాయించారు.సప్తపది వాట్సప్ గ్రూప్ అడ్మిన్ గా శ్రీశాంతమూర్తిగారు నిర్వహించారు.ఈత్రివేణీసంగమంఇలా సాగిపోతూనే సాహితీసేవలో తరించాలని,తెలుగుసాహిత్యంలో శాశ్వతంగా నిలుస్తుంది అని అందరి నమ్మకం అభిప్రాయం.

ముందడుగు:-
సప్తపదీయులకు ప్రోత్సాహమిస్తూ 100రూపాయల చొప్పున బహూకరించటం,ప్రోత్సహించటం సృజనకర్తకి ఆత్మ తృప్తి ,కవులకు గొప్ప అనుభూతి.3 వ సప్తపదుల పంచశతిమేలిమి ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ఆకట్టుకుంది.20అక్టోబర్ 2025న అన్నమాట ప్రకారం ప్రచురణ ,కవులకి సకాలంలో అందడం వారు ఫోటోతో సహా తమ ఆనందాన్ని గ్రూప్ లో పంచుకోటం ఓకొత్త అనుభవం.ఇక సప్తపదుల ఉద్దేశం జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం.నేటికీ 700పైగా సభ్యులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ముదావహం.సచిత్రంగా ఎన్నికైన సప్తపదులు రావటం ప్రత్యేక ఆకర్షణ. విద్యార్థులను ప్రోత్సాహించిన అధ్యాపకులని అభినందించితీరాలి.

పుస్తకాలుగా :-
సప్తపది పేరులోనే పెన్నిధి విశిష్టత కలది.ఏడడుగులబంధం రెండు జీవితాలను కల్పితే వాట్సప్ సప్తపది విశ్వవ్యాప్తమై నలుమూలల ఉన్న తెలుగువారిని కొత్త గా కలంపట్టినవారిని వెన్నుతట్టి ప్రోత్సహించింది. పది సప్తపది పదే పదే పిలిచే,కలాలు కదిలి స్పందించే! మొదటిపుస్తకంనవీన 5 డిసెంబర్2023లో విడుదలైంది.331మంది కవుల పేర్లు ఫోన్ నెంబర్లు పుస్తకంచివర ప్రచురించటం ఇంకో విశేషం.218పేజీల్తో అనుకున్న టైంకి ప్రచురణ ఆవిష్కరణ, చేతికి అందడం చకచకా జరిగాయి.నిబంధనలు పెట్టినా కొత్త కలాలకు ఊతమిస్తూ ఆలోచనలను తట్టిలేపాయి.ఊహలకు రెక్కలొచ్చాయి.మూడో పుస్తకంకి చిన్న పిల్లల బడిబుడతల సప్తపదులు చోటుచేసుకోటం శుభ పరిణామం.మినీ కవిత లాగా అనిపించే పద్యకవిత్వ నియమనిబంధనలతో బుర్రలకు పదును పెట్టాయి.తక్కువ మాటలు గూఢార్ధం, గాఢంగా కదిలించేదే సప్తపది.పైకి సులువు లోన బరువుగా ఉండే ఈప్రక్రియ సుధామ గారి మానసిక పుత్రిక. తథాస్తు అంటూ పెద్దలు శ్రీవిహారిగారు నిష్కర్షగా సలహాసూచనలిస్తూ తీర్చిదిద్దారు.అలాగే శ్రీ శాంతమూర్తిగారు శ్రద్ధగా నిర్వహణబాధ్యత పంచుకుంటున్నారు. వీరికి అండదండ గా నిల్చిన వారు గంధకుటి డా.బి.ఎస్.ఆర్.ఎస్.ఆంజనేయ శర్మగారు.7పదాల్ని3 పాదాల్లో ఇమిడ్చే ప్రక్రియ కి ఆధారం సుధామ గారు ఇచ్చిన “మచ్చు”ని ఆధారంగా చేసుకుని కొత్త కలాలు హెచ్చుగా స్పందించి మెచ్చుకునే రీతిలో రాశారు లయతో ఆహా ఓహో అనేలా!నవీన నవీనతను ప్రవేశపెట్టింది.సమయపాలన కు పెట్టింది పేరుఅయిన పెద్దలు5 డిసెంబర్ 2023లో జనాల చేతికందించటం ఇంకో విశేషం.17 ఏప్రిల్ 2023లో మొలకెత్తిన ఈప్రక్రియకి 24గంటల్లో 600కవితలు రావటం విశేషం.శ్రీవిహారిగారి సప్తపదుల సంపుటి నీరుపోస్తే,ఆర్థోపిడీషియన్ డా.రమణయశస్వి గారి”యశస్వీయ సప్తపదులు” చిగురించింది. వాట్సప్ ప్రసార సంచికలో విశేష అంశంగా ప్రసారమైన ఈప్రక్రియ కుతొలి న్యాయ నిర్ణేత .వై.రామకృష్ణారావుగారు.బహుమతులకు యోగ్యమైన వాటిని ఎన్నిక చేశారు.శ్రీవిహారిగారు ఓర్పు నేర్పుతో 10సప్తపదులకు 100రూపాయలచొప్పున బహుమతులివ్వటం జరిగింది.ఇక రెండవ సప్తశతి కవితాసంకలనంలో2024 నవంబర్ వరకు పది వివిధ పత్రికల్లో ప్రచురితమైన వాటినుంచి ఎంపిక చేసిన 700సప్తపదులు పుస్తకంగా రావటం ఇంకో సంచలనం.డా.నిర్ణేత నాళేశ్వరం శంకరంగారు ఇలా అన్నారు – “కవిత్వం 18పర్వాల్నించి 18పాదాలు ఆపై3పాదాలతో అవక్రత్రివిక్రమునిగా ఎదిగింది అన్నారు.సర్వశ్రీ సుధామ విహారిగార్లు నన్నయ్య నారాయణ భట్టులాగా సహకరించుకుంటూ 219పేజీలతో 206మంది కవులతో ఎదిగింది.” అని!
ఈ సప్తపది పై వచ్చిన పుస్తకాలు అందరూ చదవవలసిన పుస్తకాలు.

November 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

డాక్టర్ లింగం నేని మహేష్ కుమార్ డాన్సర్

by Achyutuni Rajasri November 28, 2025
written by Achyutuni Rajasri

డా: లింగంనేని మహేష్ కుమార్ ఎం.ఇ.,పిహెచ్.డి., 27-10-1966 న కృష్ణాజిల్లా, గుడివాడ లో జన్మించారు.
తల్లి: లింగంనేని సుజాత. రచయిత్రి.
తండ్రి: డా: లింగంనేని బసవ శంకర రావు ఎం.ఏ.,పిహెచ్.డి., తెలుగు విశ్రాంతాచార్యులు, రాజధాని కళాశాల, చెన్నై.

మహేష్ కుమార్ తండ్రి లింగంనేని బసవ శంకర రావు 1968 జూలై ఒకటవ తేదీన మద్రాసు రాజధాని కళాశాలలో, తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం లో చేరారు. అప్పటికి మహేష్ కుమార్ కి మాటలు రావు.

మహేష్ కుమార్ కి ఇంట్లో అమ్మ నాన్నలు తెలుగు మాట్లాడడం నేర్పించారు. వాళ్లింట్లోనే ఉన్న తమిళ పిల్లలతో ఆడుకుంటూ మహేష్ కుమార్ తమిళం కూడా నేర్చుకున్నాడు.
మహేష్ కుమార్, ఎల్.కె.జి, యు.కె.జి.లలో ఇంగ్లీష్, తమిళం,హిందీ మూడు భాషలు నేర్చుకున్నాడు.

హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే విద్యార్థుల విభాగంలో డైరెక్టర్ అయ్యాడు.
రామ కృష్ణ మఠం వాళ్ళు స్కూలు పిల్లలకు నడిపిన వక్తృత్వపు పోటీలో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాడు.

మహేష్ కుమార్ తండ్రికి స్నేహితుడైన వి.ఏ.కె.రంగారావు గారి సాన్నిహిత్యంలో, ధనంజయన్ దంపతుల వద్ద భరత నాట్యం అభ్యసించాడు.

మహేష్ కుమార్ హిందూ హైయ్యర్ సెకండరీ స్కూల్ లో చదువు ముగించాడు. 1984 లో బెంగళూరు రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరి, చదివి, 1989 లో పాసయ్యారు.

మెటల్ కాస్టింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ,విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరు యూనివర్సిటీలో 1991 లో పొందారు.

1994 లో గుంటూరు వాస్తవ్యులైన డా: జ్యోతి, డా: చల్లపల్లి కామప్రసాదు గారల కుమార్తె స్రవంతితో వివాహం జరిగింది. స్రవంతి ఎం.ఏ. మాస్ కమ్యూనికేషన్ చదివి,సీనియర్ డిప్యూటీ ఎడిటర్ గా, బిజినెస్ లైన్ చెన్నైలో ఉద్యోగించారు. ప్రస్తుతం రైటర్ & ఎడిటర్ గా ఉన్నారు.

మహేష్ కుమార్ అన్నా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో డీప్ డ్రాయింగ్ లో పిహెచ్.డి. సాధించారు.

మహేష్ కుమార్ బెంగుళూరు, హోసూరులో ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా చేసి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 1995 నుండి 2007 వరకు అసిస్టెంట్ ప్రొఫెసరు తర్వాత, ప్రొఫెసరు &,హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉద్యోగం చేశారు.

2007 నుండి 2010వరకు మహేష్ కుమార్ FOMRA ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రిన్సిపాల్ గా పని చేశారు. అన్నా యూనివర్సిటీ లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఒక సెమిస్టర్ విజిటింగ్ ప్రొఫెసరుగా ఉన్నారు.

ప్రస్తుతం మహేష్ కుమార్ సెయింట్ పీటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ లో 2011 వ సంవత్సరం నుండి డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ గా,రిజిస్ట్రార్ గా ఉన్నారు.

మహేష్ కుమార్ రీసెర్చ్ విభాగంలో పని చేస్తూ 25 పేపర్లు సబ్మిట్ చేశారు. ఆయన పిహెచ్.డి. స్కాలర్స్ కు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహేష్ కుమార్ దగ్గర ఒకరు పిహెచ్.డి. పట్టా కూడా పొందారు.

మహేష్ కుమార్ ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో సభ్యులుగా ఉన్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజనీర్స్, తమిళ నాడు సెంటర్ కు సెక్రెటరీగా ఉన్నారు.
F I C C I ఎడ్యుకేషన్ ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు. వీరు STEP and Business incubator పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారు.

మహేష్ కుమార్ కు విద్యతో పాటు ఫైన్ ఆర్ట్స్ లో కూడా ఆసక్తి మెండు. అందులో ముఖ్యంగా భరత నాట్యం అంటే చాలా ఇష్టం. చెన్నై లో జరిగే భరత నాట్యం ప్రోగ్రాంలకు వెళ్ళి, చూసి వాటిని గురించి ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్ లో రివ్యూలు వ్రాసేవారు.

తిరుపతి పక్కనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో, మహేష్ కుమార్, వాళ్ళ మామ వి.ఏ. కె. రంగారావు గారి తో కలిసి గత 21 సంవత్సరాలు, ఆషాఢ శుద్ధ సప్తమి నాడు, నృత్య నివేదన చేశారు. వార్ధక్య కారణంగా వి. ఏ. కె. రంగారావుగారు, నృత్యనివేదన చేయడం నిలిపివేశారు. గత పది సంవత్సరాలుగా
మహేష్ కుమార్ ఒక్కరే నృత్యనివేదన చేస్తున్నారు.

అంతే కాదు. కార్వేటి నగరం వేణు గోపాలస్వామి దేవాలయంలో, మామ వి.ఏ.కె.రంగారావుతో కలిసి కృష్ణ జయంతి నాడు 20 సంవత్సరాలు నృత్య నివేదన చేశారు. గత పది సంవత్సరాలుగా మహేష్ కుమార్ ఒక్కరే నృత్యనివేదన చేస్తున్నారు.

ఈ నెల పదహారో తేదీన జరిగిన నృత్య నివేదన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ లో రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రసారం చేశారు.

November 28, 2025 3 comments
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పిల్లల పొరపాట్లు

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, November 28, 2025
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

నరసింహపురం అనే గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు బాలురు ఉండేవారు. వారిద్దరూ మంచి మిత్రులు. వారు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు.
ఒకసారి వారిద్దరికి పొరుగూరుకు వెళ్లవలసిన అవసరం కలిగింది. వెంటనే వారు ఇంటిలో చెప్పకుండా కాలినడకన అక్కడికి ప్రయాణం ప్రారంభించారు. వారు ఎన్నడూ ఆ దారిలో అంత దూరం నడిచి ఎరుగరు . వారికి చాలా ఆకలి అయింది . దారిలో వారికి దోసకాయలు కనిపించాయి. వారు ఆకలితో ఆ రెండు దోసకాయలు తెంపుకొని తిని తిరిగి బయలుదేరారు. మరికొద్ది దూరం వెళ్లేసరికి వారికి మళ్ళీ ఆకలైంది . వెంటనే వారు దారిలో కనిపించిన మొక్కలకు ఉన్న టమాటాలను తీసుకొని తిన్నారు . ఆ తర్వాత వారు తిరిగి ప్రయాణం సాగించారు.
ఇంకా కొంత దూరం వెళ్లేసరికి వారికి తిరిగి ఆకలి అయింది. ఒక గ్రామ సమీపంలో వారు మళ్ళీ ఒక తీగకున్న రెండు కాయలను చూసి వాటిని కోసుకొని తిన్నారు. ఆ తర్వాత వారు వాంతులు చేసుకున్నారు. వెంటనే ఒక బాటసారి వారిని చూసి ఆ గ్రామంలో గల వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళాడు . ఆ వైద్యుడు వారిని ఏమి తిన్నారని ప్రశ్నించాడు . వారు దోసకాయలు, టమాటాల పేర్లు చెప్పారు. తర్వాత వైద్యుడు వారిని ఇంకా ఏమి తిన్నారని ప్రశ్నించాడు. అప్పుడు వారు మూడవసారి తిన్న కాయల పేర్లు తమకు తెలియదని అన్నారు.
అప్పుడు వైద్యుడు వారిని మందలించి “ఓ పిల్లలూ! మీరు ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పకుండా రావడం మీ మొదటి తప్పు. మీరు ఎవరిని అడగకుండా దొంగతనంగా ఆ కాయలను తినడం మీ రెండవ తప్పు. ఆ కాయలు విషతుల్యమైనవి. సమయానికి మీ అదృష్టం కొద్దీ ఈ బాటసారి తీసుకొని రావడం వల్ల మీకు మంచి జరిగింది. అంతేకాకుండా సమయానికి నేను చికిత్స చేయడం వల్ల మీరు బ్రతికారు. మీరు ఎవరిని అడగకుండా ఆ విషపు కాయల మంచి చెడులు తెలుసుకోకుండా తినడం మీ మూడవ తప్పు. నేను ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోకండి. మీ మంచి కోరే నేను ఈ మాటలను అంటున్నాను. మరొకసారి ఇలా దొంగతనంగా ఆ విషపు కాయలను తెంపి తినకండి. అది మీకే నష్టం”అని మందలించాడు.
వారు సరేనని అప్పటినుండి తాము తినబోయే కాయల గురించి ఇతరులను అడిగి తెలుసుకుని అవి కోసుకొని తినడం ప్రారంభించారు. అందుకే పిల్లలూ! మనకు కనబడిన ప్రతి కాయను, పండును తినకూడదు. ఆ తెలియని కాయలను, పండ్ల గురించి ఇతరులను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు.

    November 28, 2025 9 comments
    0 FacebookTwitterPinterestEmail
    Newer Posts
    Older Posts

    Recent Posts

    • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
    • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
    • ఎన్నికలు- యువతరం
    • మార్పు కోసం నా అక్షరాలు
    • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

    @2021 - All Right Reserved to Mayuukha The Magazine


    Back To Top
    మయూఖ
    • హోమ్
    • కవితలు
    • కథలు
    • ధారావాహిక నవల
    • వ్యాసాలు
    • బాల‌సాహిత్యం
    • ఇంద్రధనుస్సు
    • ఇంట‌ర్వ్యూలు
    • పుస్త‌క స‌మీక్ష‌
    • అనువాద సాహిత్యం
    • About Us