మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

పాటకు చిరునామా మన సుద్దాల

by SriRamoju Haragopal November 30, 2024
written by SriRamoju Haragopal

ప్రజా వాగ్గేయకారుడు,
తెలంగాణా రైతాంగ పోరాటయోధుడు,
ప్రేమాస్పదవ్యక్తి
సుద్దాల హనుమంతు వర్ధంతి( అక్టోబరు 10) సందర్భంగా….

ఒక్క ‘పల్లెటూరి పిల్లగాడా’ పాటతోని తెలంగాణే కాదు తెలుగువారందరి నోటిపాటయినవాడు సుద్దాల హనుమంతు. జానపద, నాగరిక కళాకారులైన కుటుంబం నుంచి వచ్చిన హనుమంతు పాటలు పాడేవాడు. తన తండ్రితో 5గురు సోదరులు 30యేండ్లపాటు వీధినాటకాలు ప్రదర్శించిన వాళ్ళే. తాను కూడా యక్షగానాలు, పద్యనాటకాలు వేసిన రంగస్థల కళాకారుడే. తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఆడి, పాడి అలరించే హరికథ తెలిసినవాడే. తను పుట్టి పెరిగిన పాలడుగు గ్రామానికి వచ్చిన హరికథ కళాకారుడు, ఆధ్యాత్మికవేత్త అయిన అంజన్ దాసు శిష్యుడై, రంగస్థల కళేకాదు, ఆధ్యాత్మిక విద్య కూడా గురుముఖాన నేర్చుకున్నడు సుద్దాల. గురువు డ్రామాకంపెనీ సభ్యుడిగా రెండేండ్లు ఎన్నో గ్రామాలలో ప్రదర్శనలిచ్చిండు. అద్భుతమైన గాత్రం, సాటిలేని నటనా వైదుష్యం అబ్బినయి. అంతేకాదు స్వయంగా పాటలు కూడా రాసేవాడు.
సుద్దాల హనుమంతు తల్లిదండ్రులు లక్ష్మీనర్సమ్మ, బుచ్చిరాములు. 70 ఊర్లు తిరిగి ఆయుర్వేద వైద్యం చేసేవాడు బుచ్చిరాములు. హనుమంతు తోడబుట్టినవారు ఒక అన్న, ఇద్దరు అక్కలు. చిన్నపుడు తన చదువు కానిగిబడిలో సాగింది. అక్కడ పంతులు వేసే శిక్షలకు భయపడి చదువే వద్దనుకున్నడు. గుర్రం స్వారీ, ఈతలంటే ఇష్టం. ఆ రోజుల్లో దొరల దౌర్జన్యాలకు అంతులేకుండేది. పల్లికాయ దొంగతనానికి కూడా పిల్లల ప్రాణం దీసేటోల్లు. నిజాం ప్రభుత్వం మీద, దొరల మీద తనకు కసి, కోపం కలిగేవి. వాళ్ళ గ్రామానికి టీచరుగా వచ్చిన లక్ష్మీనారాయణ సార్ గురించి గొప్పగా విని మళ్ళీ చదువుకోవడానికి బడికి పోయిండు సుద్దాల హనుమంతు. రెండో తరగతి సగం వరకు చదివేలోపల్నే లక్ష్మీనారాయణ సార్ కు తబాదిలైంది. మరోసార్ వచ్చిండు. పాత శిక్షలు చూసి మొత్తానికే బడి మానిండు. ఆ తర్వాత పాలడుగులో హరికథ చెప్పడానికి వచ్చిన ఆత్మకూరు అంజయ్యగారి డ్రామా కంపెనీలో చేరిండు. తన చదువు నాటకాలతోనే సాగిపోయింది.

ఊరిలో దొరతనాల హుకుంలు చూసి రగిలిపోతుండే హనుమంతు ఊరిలో ఉండలేక, హైద్రాబాద్ చేరి వ్యవసాయశాఖలో గుమస్తాగ చేరిండు. నిజాం మీద తిరుగుబాటు చేస్తున్న సంస్థగా భావించి తాను ఆర్యసమాజంలో కార్యకర్తగ వున్నడు. ఈ సంగతి తెలిసిన ఆఫీసర్ తనను దూషించడంతో, ఉద్యోగానికి రాజీనామా చేసిండు. బతుకుతెరువు కోసం దర్జీపని నేర్చుకున్నడు.
1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభలో రావి నారాయణరెడ్డి ఉపన్యాసం విన్న హనుమంతు కమ్యూనిస్టయ్యిండు. ఈ సమయంలో తాను వర్ణాంతర వివాహం చేసుకున్నడు. తాను కమ్యూనిస్టుగా మారడం, తన తీవ్రతలు ఆమెకు నచ్చలేదు. తను వెళ్ళిపోయింది. దానితో తన ఆదర్శవివాహం విఫలమైందని చెప్పుకున్నడు సుద్దాల. తాను సుద్దాలగ్రామం చేరి, అక్కడే స్థిరపడిపోవడంతో తన ఇంటిపేరు గుర్రం బదులు సుద్దాలగా మారిపోయింది. అపుడే జానకమ్మను పెండ్లి చేసుకున్నడు. ఆమె హనుమంతుతో సమవుజ్జీగా కమ్యూనిస్టు ఉద్యమాలన్నింటిలో పాల్గొన్నది. సుద్దాల హన్మంతు తెలంగాణా సాయుధపోరాటంలో సాంస్కృతిక ఉద్యమాన్ని బాధ్యతగా స్వీకరించిండు.
ఉద్యమం నిలిచిపోయింది. అమరవీరుల త్యాగాలు వృధా అయిపోయినయి. ఆశించిన ప్రజారాజ్యం రాలేదు. విముక్తి చేసిన ప్రాంతాలన్నీ మళ్ళీ పాత అధికారాల కిందికే పోయినయి. నిజాం పాలన మాత్రం పోయింది.
తాను తండ్రిలెక్కనె వైద్యం చేసిండు. ఆర్.ఎం.పి. పరీక్ష పాసైండు. సీపీఐపార్టీ కార్యకర్తగా సుద్దాలలో గ్రామకమిటీ కార్యదర్శిగా పనిచేసిండు. పాటలు రాసిండు. 1982 అక్టోబర్ 10వ తేదీన మరణించిండు హనుమంతు.
హైద్రాబాద్ లో ఉద్యోగం చేస్తున్నపుడు సుద్దాల హనుమంతు ఆధ్యాత్మిక భావజాలంతో ‘యథార్థ భజనమాల’ అనే భజన కీర్తనల పుస్తకం రాసిండు. బంగారానికి తావి అబ్బినట్లు పాటలు పాడే సుద్దాల హనుమంతుకు పాటలు రాయడం కూడా వచ్చింది. ఆర్ద్రంగా గీతాలు పాడేవాడు. మనిషి మనసు కూడా ఆర్ద్రమే. సుకుమారమైన భావాలకు కరిగిపోయేటోడు. హృదయోద్వేగం ఆపుకోలేక జల,జలా కన్నీరు కార్చేటోడు. కరుణాకాతరుడు సుద్దాల హనుమంతు. ఆ కరుణాతత్వమే, ఆ ప్రేమగుణమే హనుమంతు పాటల్లో వుంది. తాను ప్రేమించే తన సాటిమనుషులపై దౌర్జన్యాలను చూసి, తట్టుకోలేకనే ఆనాటి తెలంగాణా సాయుధపోరాటంలో కార్యకర్తగా చేరిన హనుమంతు సాయుధదళంలో తుపాకీ ధరించి తిరిగిండు. ఉద్యమంలో సాంస్కృతిక సేనానిగా ఎన్నో కళాప్రదర్శనలు ఇచ్చిండు. ప్రదర్శనల కొరకు స్వయంగా తాను రచించిన కళారూపాలెన్నో వున్నయి. బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టలదొర, సాధు వేషం,అల్లాకేనాం వంటి వెన్నో తన రచనలు.
సుద్దాల హనుమంతు పాటలు కవితాత్మకంగా వుంటయి. అద్భుతమైన ఊహతో పాట రాయడంలో మొనగాడు సుద్దాల.
‘పల్లెటూరి పిల్లగాడా, పసులగాచే మొనగాడా
పాలుమరిచి ఎన్నాళ్ళయిందో
ఓ పాలబుగ్గల జీతగాడా
కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో…’ ఈ పాటలో సుద్దాల హనుమంతు వాయించే హార్మోనియం నిర్భర శ్రుతి వుంది. రాగ, లయలున్నాయి. In this song we could find, a Harmonious Rhythm, a True life is documented, filmed in words. పల్లెటూరి పిల్లగాడు సాధారణ పదమే, పసులగాచే ‘మొనగాడు’ విశేషణం…దానిని వేయింతలు చేసే మాట ‘పాలుమరిచి ఎన్నాళ్ళయింద’నేది. వాడు ‘పాలబుగ్గల జీతగాడు’. ఈ సమాసమే ఒక అద్భుత కవిత. పిల్లగాడే మొనగాడు కాని, పాలుమరువని జీతగాడు… ఒక వీరుని గురించి రాస్తే రాసే విశేషణాల కన్నా ఈ ఆలంకారిక రచన గొప్పది. పాటలో అంత్యప్రాసలున్నాయి. యతి, ప్రాసలుండే పద్యంవంటి పాట. అలతి పదాలతో అనల్పభావసాధన సుద్దాల హనుమంతు ప్రతిభ. పాట విన్నా, చదువుకున్నా దృశ్యం సాక్షాత్కరిస్తుంది.
పాటను సమీక్షిస్తే చాలు ఈ గేయంలో ఎంత కవిత్వం వుందో…
చాలీచాలని చింపులంగి, సగము ఖాళీ, చల్లగాలి… పసులగాచే పోరగాడు వేసుకున్నది వంటికి చాలని చింపులంగి, అది వేసుకుంటే సగం దేహం ఖాళీ…దాని మీద చల్లగాలి.. ఒక గోనె చింపే కొప్పెర పెట్టుకున్నడు. దానికి కూడా చిల్లులే. ఒక నిరుపేద సహజజీవితాన్ని కలంతో చిత్రించిండు కవి సుద్దాల. పిల్లవాడి పేదరికాన్ని చూపించడానికి ఏ కవితావస్తువులు కావాలి? వాడు కాళ్ళకు తొడిగింది తాటిజెగ్గలకు తాళ్ళు కట్టి కాళ్ళకు కట్టుకున్న జోడు. తాటిజెగ్గల కాలిజోడు. ‘పసుల గుంపు తరలిపోయే వంపు పక్కన గుండు మీద కాపలా’. అందుల దొంగగొడ్లతో గోస. ఈ చాకిరికి నెలకు జీతం కుంచెడు ధాన్యం, తాలు, వొల్పిడిలున్న ఆ గ్రాసం కొలువంగ శేరు తక్కువ.. ఎంత అద్భుత చిత్రణ. వాస్తవ జీవితకథనే…హనుమంతు పాటలో వరుస కట్టుకున్న ముచ్చట్లు.
1946 ప్రాంతంలో ప్రతిరోజు సుద్దాల నుంచి తాను తేరాలకు పోయి, వచ్చే దారిలో గుండుమీద కూసుని ఏడుస్తు కనిపించిన బత్తుల అబ్బయ్య అనే పసులకాడి పోరని నిజమైన, దుఃఖభర జీవితాన్నే పాటను చేసి విశ్వజనీనం చేసిండు సుద్దాలకవి.
ఈ పాట తర్వాత అంతే దయార్ద్రమైన పాట ‘వెట్టి చాకిరి విధానమో రైతన్న, ఎంత చెప్పిన తీరదో కూలన్న’. ఈ పాటలో నాటి దొరలు గ్రామప్రజలు, వృత్తికులాల వారితో చేయించుకునే వెట్టిచాకిరి గురించి రాసిండు సుద్దాల హనుమంతు. దొరలున్న వూరిలో ప్రతి కులవృత్తివారి నెవరినైనా వెట్టిచాకిరికి వాడుకోవచ్చు. ఎదురుచేప్పేదే లేదు. దినాం దొర పనులకు వంతులేసుకుని అందరు గడికి పోయి పనిచేయాల్సిందే. వెట్టిచేసే ప్రజల లిస్టు పెద్దదే.
‘మాదిగన్న, మంగలన్న, మాలన్న, చాకలన్న
వడ్రంగి, వడ్డెరన్న, వసిమాలిన బేగరన్న
కుమ్మరన్న కమ్మరన్న కూలన్న రైతన్న
అన్నిపనులు వాళ్ళతొ దొరలందరు చేయించుకునెడి… ‘వెట్టి చాకిరి విధానమో రైతన్న, ఎంత చెప్పిన తీరదో కూలన్న’ అని రాసిండు సుద్దాల కవి.
‘చాకలన్న వెట్టి చేత(చాకిరి) చాలగలదురోరన్న…వేకువనే(మబ్బుల) లేవాలె, దొరగడీల వాకిలి ఊడ్చి, (సానుపు) చల్లాలి, మేడ అంతా కడగాలె, తడినంతా తుడువాలె, పిండి, పసుపు విసిరి వరుగులు పొడిగొట్టి పెట్టాలె, కోళ్ళు,గొర్రెలు కోసి (ప్రతి)దినం కూరతరిగి పెట్టాలె, గిన్నెలు తోమాలె, వలువలు ఉతుకాలె, కల్లు, ఎన్నె మోసుకుని తేవాలె.. చిట్టి(ఉత్తరాలు) ప్రయాణాలు, ఇంకా చిల్లర పనులు చెయ్యాలె…
మంగలన్న వెట్టిచేతలో దున్నలకు, బర్రెలకు క్షౌరం, దొరలకు తల, మొలక్షౌరం చెయ్యాలె. తలకంటి స్నానం చేయించాలె. మునిమాపుల దీపాలు పెట్టి, దొరలకు పడకలు పరువాలె, కాళ్ళు పిసికి, ఏ రాత్రికో ఇంటికి పోవాలె.
కుమ్మరన్న వెట్టిచేతలో వందలకొద్ది కుండలు చేసియ్యాలె, గడిలో వాళ్ళకు కావలసినన్ని నీళ్ళు బావుల నుంచి చేది పెట్టాలె, వచ్చిపోయేటోల్లకు వండిపెటాలె.
మాదిగన్న వెట్టిచేత మరపురాని ఘట్టమట. గుండె తల్లడిల్లిపోతుందట తలచుకుంటేనే. కావలి మాదిగతనం దొర ఇంటి ముంగల రాత్రింబగలు కాపలా కాయాలె. పుట్లకు పుట్లు ధాన్యం దంచి ‘పోటు తెల్లగెయ్యా’ల్నట. వంటకు కట్టెలు గుట్టలకొద్ది కొట్టిపెట్టాలె. అడివి తిరిగి విస్తరాకులు ఏరుక రావాలె. దొరల బండ్ల ముందర ఉరుకాలె. పొద్దీకితె దినాం దొరకు డప్పు మీద ‘దివిటీసలాం’ లియ్యాలె. పరాయి ఊర్లకు వంతులవారి బరువులు మొయ్యాలె.
ఇదంతా పాటలోనే చెప్పిండు సుద్దాల హనుమంతు. ఒకనాటి నిజాం కాలంలోని దేశ్ ముఖ్ లు. దేశ్ పాండ్యాలు, జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములు దొరలని పిలిపించుకునేవాండ్లు. వాళ్ళ దొరతనాలు సాగడానికి వాళ్ళ ఏలుబడిల వున్న పనోల్లందరు దొర హుకుం చేసినట్టు ‘వెట్టిచాకిరి’ చేసి తీరాల్సిందే.
తన చిన్ననాడు… జ్వరంతో నడువలేకున్న బరువొంతుల వీరయ్య తనవంతు బరువులు మోసే పని చేయలేనని అన్నందుకు వచ్చిన అధికారి బూట్లతో తన్ని కొరడా కొట్టి హింసించడం చూసిన హనుమంతు మనసులోని బాధే ఈ పాటైంది. నిజజీవితంలోని సంఘటనలను పాటలుగా రాసుకున్నడు సుద్దాల. ఆయన పాటలో చెప్పిన వెట్టిచాకిరుల వరుస, ఆ వెట్టిలోని వెతలు, కులాలవారీగా దొరలకు ఎట్లాంటెట్లాంటి పనులు చేయవలసి వచ్చేదో అవన్నీ పదాలైనవి. దొరలకు తల క్షౌరం, మొలక్షౌరం ఎంత జులుం? దొరల కచ్చురాల ముందర పసురాల కంటె ముందు ఉరుకుడు ఏం గోస? ఇవన్నీ ఆ దొరతనాల అమానుష, పెత్తందారీతనాల సంస్కృతి. ఈ దుర్మార్గాలను తన పాటలో రికార్డు చేసిండు హనుమంతు.
ఈ పాట విన్న వారి గుండె తడిసిపోతుంది. కరుణాగ్ని రగులుతుంది. అదే పోరాటానికి ప్రేరణ.
తన తండ్రి ‘ప్రజాకవి సుద్దాల హనుమంతు చేసిన చారిత్రక రచన ఉపరితల వర్గాలకు సంబంధించింది కాదు. పేదల, ఉత్పత్తి వర్గాలకు చెందిన ప్రజల చారిత్రక రచన………నాన్న కూడా అణగారిన, అణచివేయబడిన సబ్బండ జాతుల, కులాల, మతాల, వర్గాల ప్రజల దృక్కోణం నుంచి పాడుకునే రూపంలో ఆ కాలపు చరిత్రను రికార్డు చేసిండు.’ అంటడు సుద్దాల అశోక్ తేజ.
మరొకపాట ‘అమరవీరులకు జోహార్లు’.
ఈ పాటలో సుద్దాల హనుమంతు తెలంగాణా సాయుధపోరాటంలో అమరులైన వీరులకు జోహార్లర్పించిన విధం నూతనం. ఈ పాటలో బుర్రకథ దరువును మేళవించాడు. పదాలను గుర్రాలలెక్క పరుగెత్తించిండు.
‘‘ స్వాతంత్ర్య రథమ్మునెక్కి
సమరవీధులందు దోలి
అతివాద శరముల గురిపి
అసువులపై నాస వదలి
సై సై రా భళి సై’’…… తెలంగాణా సాయుధపోరాటం ఒక స్వాతంత్ర్య సమరం. నిజాం నిరంకుశ రాజ్యం నుంచి విముక్తాన్ని కోరి చేసిన ప్రజాయుద్ధం. అందుకే కవి సుద్దాల ఆ పోరులో నిలువడం అంటే స్వాతంత్ర్యరథం ఎక్కడమని భావించిండు. ఆ పోరాటంలో సమరవీధుల్లో వీరులు రథమెక్కి రణరంగంలో అతివాద శరములు కురిపించిండ్రట. ఈ బాణాలు కమ్యూనిస్టుపార్టీ చేసిన సాయుధ పోరాట తీర్మానాలే. అవి అతివాదశరాలే. యుద్ధంలో ప్రాణాలపై ఆశ కల్ల.
నాటి సాయుధపోరాటవీరులు చేసిన పోరును హనుమంతు గొప్పపాటగా మలిచిండు. పాడితే ఉద్రేకం, చదువుకుంటే ఉద్వేగం కలుగుతయి. రూపకాలంకారాలు ఈ గేయకవిత నిండా.
‘‘పగతుర శిరములను తమకు
పక్కదిండ్లుగా జేసుక
దీర్ఘనిద్ర చెందినట్టి
తెలంగాణ బిడ్డలకు’’… ఎంత ఆవేశం.. సాయుధపోరాటంలో దీర్ఘనిద్ర, మరణం పొందిన వీరులు శత్రువుల శిరస్సుల్ని తలదిండులు చేసుకుని నిద్రపోతున్నారనడం…ఇది యుద్ధకవిత్వం.
‘‘ముగింపకుడి విప్లవమని
మిగిలిన పని మీ వంతని
అంతిమ విజయం మనదని
అమరవీరులైనోల్లకు’’…. అమరులతోనే విప్లవించడం ఆగిపోవద్దని, పోరాటయోధులు తమ వారసత్వాన్ని మనకు అందించిపోయిండ్రని…ఆఖరున గెలుపు మనదేనని భరోసాయిస్తున్నరని…వారికి జోహార్లర్పించిన తీరు అనుపమానం.
ఎందరో త్యాగపురుషులు దేశస్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేసిండ్రు. కాని, ఏమైంది.
‘ఆంగ్రేజు పాలనను అంతమొందించగా
కాంగ్రేసు పెద్దలే కామందులయ్యారు’,
‘అసమర్థపాలకుల వశమయ్యి దినదినం
అవినీతికే నిలయమయ్యిందయా’,
‘కోట్లాది ప్రజల నోట్లో మన్నుపోశారు
గొప్ప కోటీశ్వరుల కొమ్ముగాస్తున్నారు’,
‘పండించినా రైతు ఎండిపోతున్నాడు
బేరగాళ్ళంత కుబేరులౌతున్నారు’,
‘బలహీనవర్గాల ప్రజలకు మహిళలకు
ప్రాణ,ధన,మానాల పరిరక్షణే లేదు’,…ఈ పాట సుద్దాల హనుమంతు రాసుకున్న ‘సాధువేషం’ లోనిది. ‘శివగోవింద గోవింద బ్రహ్మం, భజగోవింద,గోవింద అనే పల్లవితో మొదలౌతుంది. ఈ పాట వర్తమానానికి వర్తించే గీతం. ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ నినాదమిచ్చిన నాటి చారిత్రక సందర్భం ఈ పాటది. ఈ పాటలోని అంశాలు ఇప్పుడున్నవే. ప్రభుత్వాలు అవినీతికి పట్టం కట్టినయి, కోటీశ్వరుల కొమ్ముకాయడం జరుగుతున్నదే, రైతు దళారుల చేతిలో ఉరిపోసుకుంటున్నది కరెక్టే, దళితులకు, మహిళలకు నేటికీ రక్షణే లేనిది సత్యమే… కవి సుద్దాల హనుమంతు రాసిన ఈ గీతం ‘కాలజ్ఞానం’ లెక్కనే వినిపిస్తున్నది. తన కవిత్వంలో రాగ, తాళ, భావాలు ఎక్కడా జారిపోవు. వాడిన మాటలు, ఎన్నుకున్న సందర్భాలను ఉద్దీపింపజేసేవే. కాన్షియస్ గా రాసిండు హనుమంతు.
సుద్దాల హనుమంతు రాసిన వందకు పైగా వున్న పాటల్లో సేకరించబడినవి కొన్నే. అందులో వివిధ కళారూపాల రచనలు. తన రచనలను సేకరించిన సమగ్ర సంపుటం సుద్దాల అశోక్ తేజ సంకలించిన ‘పల్లెటూరి పిల్లగాడా’ అనే పుస్తకం. దీనిలో సుద్దాల హనుమంతు రాసిన పాటలు, భజన కీర్తనలు, గొల్లసుద్దులు, సాధువేషం, యక్షగానం వున్నాయి. ఒక్క భజన కీర్తనలలో తప్ప మిగతా అన్నీ ప్రజలకోసం కైగట్టిన పాటలే, ప్రజాజీవితం వస్తువుగా రచించినవే.
సుద్దాల హనుమంతుకు ఇష్టమైన పాటలలో ‘ఆకలి మంటలు’ ఒకటి. ‘మంటలు, మంటలు, మంటలు… దేశమంతట ఆకలి మంటలు’ అని మొదలైతుంది.
‘‘నిజమాడితె బందీఖానాలు
అన్నమడిగితె తుపాకి కాల్పులు
పాలకవర్గము కివి లీలలు, ప్రజ
లాకలి బాధలు, చావులు…
మాకడుపుల పేగుల అరుపులు
వెలువడి రూపొందెను సమ్మెలు
చెలరేగిన యవి నలుమూలలు
కొనసాగును విప్లవజ్వాలలు’’… ఇవన్నీ అక్షరసత్యాలు. ప్రభుత్వాలు మారినా రాజ్యస్వభావం మారలేదు. ప్రజలు ఆకలితో చస్తుంటే, గోదాములలో తిండి గింజలు ముక్కిపోతుంటయి. అడుగడుగునా ప్రజలకు అన్యాయమే జరుగుతున్నపుడు, తిరుగబడే గొంతులుంటయి. జైలయినా, కాల్పులైనా ఉద్యమిస్తునే వుంటరు. ఇంకా ఈ స్థితి మారనే లేదు. దేశం మారనే లేదు.
‘‘లేరా జాగేలా’’ అనే పాటలో సుద్దాల హనుమంతు తన సదాశయాన్ని ప్రకటించిండు. ‘సకల జనులందరిలో సద్విద్యలెల్ల, సామ్యభావమున పెంపొంది శోభిల్ల, నీ ప్రతిభ నీ పురోగమనంబులెల్ల, నిఖిల ప్రపంచంబు గని సంతసిల్ల’ అంటడు. దేశప్రజలంతా చదువుకుని, సర్వసమానత్వాన్ని సాధించి, ప్రతి ఒక్కరి ప్రతిభ ప్రపంచం సంతోషించే టట్లుండాలని కోరుతున్నడు.
మరొక పాట ‘ఎందుకు భయం’లో…‘‘ధనస్వామ్యము, భూస్వామ్యవిధానము, ధ్వంసీకృతమై పోవునులే, దోపిడి, దొరతనముండదులె, దొంగల అంగడి సాగదులే’’ అని ఆశంసిస్తడు కవి సుద్దాల.
ఈ పాటలను చదివినపుడు
‘Let America be the dream the dreamers dreamed—
Let it be that great strong land of love
Where never kings connive nor tyrants scheme
That any man be crushed by one above.
O, let my land be a land where Liberty
Is crowned with no false patriotic wreath,
But opportunity is real, and life is free,
Equality is in the air we breathe.’ –Langston Hughes రాసిన కవిత స్మరణకు వస్తుంది. టాగోర్ ‘వేరీజ్ ది మైండ్ వితౌట్ ఫియర్’ గుర్తుకొస్తుంది.
సుద్దాల హనుమంతు ‘వీర తెలంగాణ’ అనే యక్షగానం రాయడం మొదలు పెట్టిండు కాని, అనారోగ్యం వల్ల పూర్తి చెయ్య లేకపోయిండు. హనుమంతు కుమారుడు సుద్దాల అశోక తేజ తండ్రి శైలిలో 54 సన్నివేశాలు చేర్చి ఆ యక్షగానాన్ని పూర్తిచేసిండు.
ఆ యక్షగానంలో… సూత్రధారి అన్నపూర్ణ అనే పాత్ర పరిచయం..
‘‘రైతువనిత వచ్చెను తెరలోపలికి
రైతువనిత వచ్చెను
అతులిత సౌందర్యవతి, సత్త్వగుణశీల
హితగాత్రి, సుచరిత్రి, ఇందీవర నేత్రి… రైతు వనిత వచ్చెను…
తలకంటి స్నానమాడి, మేన పసుపు
కలయబూసియు స్వదేశి
చలువ వలువను గట్టి, జరి రవికయును తొడిగి
అలరారు ఇల్లాలు ఆదర్శమున వేగ….రైతు వనిత వచ్చెను…’’
తానెన్నుకున్న రచనాప్రక్రియ ఏదైనా దానికి సముచితమైన రచనావిధానాన్ని ఎన్నుకుని రాసిండు. యక్షగానాలలో తనకున్న నటనానుభవం ఈ రచనకు తోడ్పడింది. పాత్ర ప్రవేశపెట్టిన తీరు, పాత్రను చిత్రించిన వైనం, పదాల కూర్పు, అర్థసాధన సాధారణమనిపించే అసాధారణ రచన. తన రచనలలోని పాత్రలు, స్వభావాలు, ఆహార్యాలు అన్నీ ప్రజల నుంచి గ్రహించినవే. ఎక్కడ కృతకత్వముండదు. స్వభావోక్తులతో రచిస్తడు. రూపకాలంకారాలతో పాత్రలను అలంకరిస్తడు. కవిత్వమంటే శుద్ధవచనకవితే కాదు. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న సూత్రమే గీటురాయి. అది ఎన్ని రూపాలలో వున్న కవి ప్రతిభ, ఊహావైభవానికి కట్టిన అక్షరాల మిద్దె. సుద్దాల హనుమంతును లొల్లాయి పాటల రచయితగా అనుకుంటే పొరపాటు. ఒక దార్శనికతతో జీవితానుభవసారాన్ని అక్షరాలలో పండించిన కవి సుద్దాల. అనంతమైన ప్రేమతో మనుషుల్ని ప్రేమించిన కవి సుద్దాల హనుమంతు.
ప్రజావాగ్గేయకారుడు హనుమంతు జీవితం ఎటువంటిది. ‘‘ఆ ముంగిటి రాగాలు శ్రమక్షేత్రపు రక్తనాళాలు. ఆ వాకిట్లో పాడిన పాట ప్రతిసారి కొత్తబాణీయై పల్లవిస్తుంది. పొయిలో కాలే కర్రలు చిటపటల సంగీతధ్వనులవుతాయి. లయబద్ధంగా పొంగే ఎసరు టుమ్రీలై వినబడుతాయి. ఆ ఇంట గంజివార్చని రోజు పాటలే వాళ్ళకు పండుగ తిండ్లు. చిన్నబుచ్చుకు ముడుచుకుపోతుంది పేదరికం అక్కడ. ఐనా సమాజం సమంగా ఉండాలనే సంస్కృతి సజీవంగా తాండవిస్తుంది.’’ అంటాడు జయధీర్ తిరుమలరావు ‘సుద్దాల శతపుష్ప జీవితం’ అనే వ్యాసంలో.
హనుమంతు జీవితంలో పెద్దవంతు తెలంగాణా సాయుధపోరాటంతోనే గడిచిపోయింది. పోరాటకాలంలో పోరాటవీరులకు స్ఫూర్తినిచ్చిన పాటలనదిగా వారి మధ్య ప్రవహించిండు. బాంచెన్ నీ కాల్మొక్త అన్న బడుగుప్రజలతో బడితెలు, తుపాకులు పట్టించి పోరుబాట నడిపించిన గీతాలల్లిన పాటలనేత సుద్దాల హనుమంతు. పెన్నూ, గన్నూ ధరించిన ప్రజోద్యమ గీతకారుడు, సమసమాజాన్ని స్వప్నిస్తూ, జీవితాంతం పోరాటస్ఫూర్తిని వదలని అగ్నిధార హనుమంతు. ఆయన పాటల్లో ప్రజాజీవితం ప్రతిబింబిస్తుంది. పోరాటమార్గం దర్శనమిస్తుంది. కొత్త ప్రపంచం దార్శనికత వినిపిస్తుంది. ప్రజల భాషలో, ప్రజల శైలిలో, ప్రజల రాగ,లయల్లో సుద్దాల హనుమంతు చిరస్థాయిగా నిలిచిపోయిండు.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గౌతమ బుద్ధుడి…

by Dr. Aruna Parandhamulu November 30, 2024
written by Dr. Aruna Parandhamulu

గౌతమబుద్ధుడి తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి వారిది రాజకుటుంబం. గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. తల్లి మహామాయ కోలియన్ దేశపు రాకుమారి. ఆషాఢ మాసం వేసవి కాలంలో సాంప్రదాయఆ బద్ధమైన పండుగ జరిగేది. శాక్య వంశీయులందరితోబాటు శుద్దోదనుని కుటుంబం కూడ యీ పండుగను అత్యంత వైభవంగ జరుపుకొనేవారు వారం రోజుల పాటు. ఈ పండుగను అత్యంత వైభవంగ జరుపాలన్న వుద్దేశ్యం మహారాణి మహామాయ కూడ ఉండేది.
పండగ రోజు పూవ్వులతో, పచ్చనిఆకులతో తోరణలకు అలంకరించేవారు పండ్లు సుగంధ ద్రవ్యాలు ప్రజలకు పండగ రోజు పంచేది.
పండుగ ఏడవరోజున మహామాయ ఉదయాన్నే నిద్రలేచి, పన్నీట స్నానం చేసి నాలుగు లక్షల బంగారు రూకలు దానం చేసేది. అమూల్యమైన ఆభరణాల అలంకరించుకొని, రుచికరమైన భోజనంజేసి, ఉపవాసకాలంనాటి మ్రొక్కుబడులన్నీ పూర్తిచేసి రాజభవనంలోని తన శయనమందిరంలోకి వెళ్లింది
రాజభవనంలోనిద్రిస్తున్నప్పుడు రాణికి స్పష్టమైన కల వచ్చింది. ఆ కలలో ప్రపంచ పరిరక్షకులైన నలుగురు నిద్రాలోవున్న తనను అలాగే ఎత్తుకొని హిమాలయ పర్వత శ్రేణుల్లోగల సమతల ప్రదేశంలో ఒక సాల వృక్షం క్రింద దింపి ప్రక్కన నిలుచున్నారట.
ఈ నలుగురి పరిరక్షకుల భార్యలు వచ్చి ఆమెను మానససరోవరతీరానికి తీసుకెళ్లారు. మానస సరోవరంలో మహామాయకు స్నానం చేయించి, పరిమళ పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో అలంకరించారట
భోధిసత్వుడు ఆమెకు ప్రత్యక్షమై “నేను నీ కుమారుని గా జన్మించాలని అనుకుంటున్నాను నీవునాకు తల్లివయ్యేందు కంగీకరిస్తావా? అని అడుగగా ఆమె “ఎంతో సంతోషంతో “అంగీకరిస్తానన్నది”.
అంతలోనే ఆమె నిద్ర నుండి మేల్కొంది.
తెల్లవారగ తన కల వృత్తాంతాన్ని శుద్దోదనునికీ చెప్పింది. ఆ కల ఫలితం ఏమిటో! ఊహించలేను అని శుద్దోదనుడు అన్నాడు.
కలల గురించి పాండిత్యంలో సిద్దహస్తులైన ఎనిమిదిమంది బ్రాహ్మణులను పిలిపించాడు.
నేలమీద పూలుపరించి ఆపై వారికి ఎత్తైన ఆసనాలు ఏర్పాటు చేయించాడు
శ్రేష్టమైన బియ్యాన్ని, స్వచ్ఛమైన నేతితో వండించి, తేనె, పంచదార, పాలు సిద్ధంచేసి వారికి వడ్డించారు. వారిపాత్రలను బంగారు, వెండినాణాలతో నింపి, నూతన వస్త్రాలను, పాడి ఆవులను బహుకరించాడు.
బ్రాహ్మణులనావిధంగ సంతుష్ట పరిచిన తరువాత మహామాయ కల వృత్తాంతాన్ని వారికి వివరించి “దాని పర్యవసానo ఏమిటో వివరించండ”ని కోరాడు.
కల గురించి విన్న బ్రాహ్మణులు ” రాజా శంకించనవసరం లేదు. నీకు పుత్రుడు జన్మించబోతున్నాడు. తాను (పుట్టబోయే బిడ్డ) గృహస్త జీవనాన్నే కోరుకొన్నట్లయితే సమస్త ప్రపంచాన్ని జయించగలుగుతాడు. తాను గృహస్తజీవితాన్ని తిరస్కరించి నట్లయితే సన్యాస జీవనాన్నే కోరుకుంటే ప్రపంచంలో పేరుకు పోయివున్న భ్రమలన్నింటినీ పటాపంచలు, చేయగల సమర్థుడైన బుద్ధుడు కాగలడని, వివరించారు.
మహామాయ గర్భంలో పది నెలలు బోధిసత్వుడు పెరిగాడు. ప్రసవకాలము సమీపిస్తుండగా కాన్పు
కోసం తన పుట్టింటికి(దేవదాహకు )వెళ్తానని భర్తతో చెప్పింది. శుద్దోధనుడు మహామాయ
కోరిన కోరికను తప్పక తీరుస్తాడు శుద్ధోధనుడు బంగారు పల్లకీని తయారు చేయించి జాగ్రత్తగా తీసుకుపోవటానికి బోయీల ఏర్పాటుచేసాడు.
వారి వెంట కొందరు పనివాళ్ళను కూడా ఆమె పుట్టింటికి పంపాడు.
దేవదహకు ప్రయాణమైన మహామాయ మార్గమధ్యంలో తేజస్సుతో విరాజిల్లుతున్న సాలవృక్షాల లుంబినీవనం చే రుకొన్నది. స్వర్గలోకంలోని సుందర మార్గంలో సాగిపోతున్న పల్లకి సర్వశక్తి సంపన్నుడైన రాజాధిరాజునాహ్వానించేందు ఏర్పాటు చేయబడ్డ పూలమంటపం చెట్ల మొదళ్లనుండి కొమ్మల కొసలవరకు పుష్పించిన పలురకాల చెట్లు రంగు రంగుల పూవుల మకరందాన్ని
ఆస్వాదించేందుకు గుంపులుగ చేరిన తుమ్మెదలు, తేనెటీగలు, వాటి మధురధ్వని, పలురకాల పక్షుల కిలకిలా రాగలు వీనులకు విందుగా కనులకు యింపుగాను కనిపించాయి.
అంత్యంతసుందరమైన ఆ వాతవరణం మహామాయను పరవశంతో పల్లకిదిగి కొంతకాలము ఆ వనం మధ్య విహరించాలని కోరింది. పల్లకిని సాలవృక్షం క్రింద దింపించి వారినక్కడే వుంచింది.
పల్లకి దిగిన మహామాయ ఆ ప్రక్కనేవున్న సాలవృక్షరాజం వద్దకు నడిచి వెళ్ళింది. హాయిని గొల్పించే గాలులు మెల్లమెల్లన వీస్తుండగ ఆగాలికి పైకి క్రిందికి వూగుతున్న ఒకసాలవృక్షపు కొమ్మను పట్టుకొనబోయింది.
అదృష్టం కలసివచ్చినట్టు క్రిందికి వంగిన ఒక కొమ్మను మునికాళ్లపై లేచి అందుకొన్నది. ఇంతలో వీచిన గాలికా కొమ్మ పైకిఎగసిపోతుండగా అకొమ్మతోపాటు తాను పైకి లేచిపోతున్న తరుణంలో ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమైనవి. ఆ కొమ్మనలాగే పట్టుకొని నిలుచునివున్న దశలో ఆమె ప్రసవించింది. క్రీస్తు పూర్వం 563వ ఏట వైశాఖ పౌర్ణమి రోజున మహామాయ ఆ శిశువుకు జన్మనిచ్చింది.
శుద్ధోదన మహామాయలకు వివాహమైన చాలా ఏళ్ల వరకు వారికి సంతానం కలుగలేదు. లేక లేక కలిగిన సంతానం కావడంతో వారి ఆనందానికవధుల్లేవు అత్యంత వైభవంగా జన్మదిన మహోత్సవాన్ని జరుపుకొన్నారు. వారితో పాటు శాక్య కుటుంబాలన్నీ ఆ దినాన్ని పర్వదినంగ జరుపుకొన్నారు.
శిశువు జన్మించేనాటికి శాక్యరాజ్యానికి శుద్ధోధనుడే రాజు, ఆ కారణంగా రాజలాంఛనాలతో ఆ శిశువు జన్మదిన వేడుకలు జరిగాయి. తన తండ్రి అపుడు రాజు కనుక తాను రాకుమారుడైనాడు.
మహామాయ మరణం
సిద్ధార్థుడు జన్మించిన పదవరోజున బాలునికి నామకరణోత్సవం జరిపారు. ఆబాలునికి సిద్ధార్ధుడని పేరుబెట్టారు. తను గౌతమ వంశీయుడైన కారణంగా తాను సిద్ధార్థ గౌతమునిగా పిలువబడి జనరంజకుడైనాడు. ఒకవైపు నామకరణోత్సవం వైభవంగ జరుగుతుండగ మాతృమూర్తి మహామాయ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు
తనకుఅంతిమఘడియలు
ఆసన్నమైనవని గ్రహించిన మహామాయ తన భర్తను, సోదరియైన ప్రజాపతిని తన వద్దకు పిలిచి నా కొడుకు యింతలోనే తల్లిలేనివాడు కాబోతున్నాడు. అతనిని పెంచి పెద్దజేసి తన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీరు ఏలాంటిలోటు రానివ్వరని నాకు తెలుసు. తన భర్తతో చెప్పినా చివరి మాటలు.

“ ప్రజాపతీ! నా కుమారుని నీకప్పగిస్తున్నాను. నీవు అతనిని పెంచటంలో కన్న తల్లిని మరిపించగలవని నాకు తెలుసు.”
“ఇకనాకు చింతలేదు. నాకు సెలవివ్వండి. పై నుండి నాకు పిలుపు వచ్చింది.తన ప్రతినిధులు నన్ను తీసుకొని పోవుటకై వేచియున్నారు” అని పల్కి మహామాయ తుదిశ్వాస విడిచింది. శుద్ధోదనుడు, ప్రజాపతి కన్నీరుమున్నీరైయారు.

మహామాయచనిపోయేనాటికి సిద్ధార్థునికి ఏడు రోజుల పసిపిల్లాడు. ఆ సోదర పరివారంలో సిద్దార్థుడు పెరిగాడు.
సిద్ధార్థుడు నడకనేర్చి మాటలాడగల వయసుకు రాగానే శాక్యవంశ పెద్దలు శుద్ధోదనునితో సమావేశమై బాలుణ్ణి గ్రామదేవతయైన అభయ వద్దకు తీసుకొని రావలసిందిగ కోరారు.
శుద్దోదనుడందు అంగీకరించి బాలునికి వస్త్రాలంకరణ చేయవలసిందిగ మహాప్రజాపతికి తెలిపాడు. బాలుని సమాయత్తపరుస్తూండగ మృదు మధుర స్వరంతో తననెక్కడకు తీసుకుపోనున్నారని సిద్ధార్థుడు తన పెద్దమ్మనడిగాడు. తనను గ్రామదేవత వద్దకు తీసుకెళ్లనున్నారని విన్న సిద్ధార్థుడు మందహాసం చేశాడు. అయితే శాక్యుల సాంప్రదాయాన్ని మన్నించి బయలుదేరాడు. సిద్ధార్ధుని ఎనిమిదవ ఏట తనవిద్యాభ్యాసం మొదలైంది. మహామాయ స్వప్నవృత్తాంతంపై జ్యోతిష్యం చెప్పిన ఎనిమిదిమంది బ్రాహ్మణులనే సిద్ధార్థుని తొలిగురువులుగ శుద్దోదనుడు నియమించాడు.
గౌతముడు తనతండ్రి వ్యవసాయ క్షేత్రంలో సైతం పనిచేస్తు తీరికవేళల్లో ఏకాంతంగ ధ్యానయోగం సాధనజేసేవాడు. ఒకవైపు మేధోపరిపక్వతకు కృషి చేస్తున్నపటికిని మరోవైపు క్షత్రియ ధర్మంగ యుద్ధశాస్త్రాన్ని సైతం తన తండ్రి సాధన చేయించేవాడు.
ఎందుకంటే తనకుమారుడు మేధోశక్తి సాధనకే పరిమితమై పౌరుషవంతునిగ తయారు కాలేకపోయే ప్రమాదమేర్పడరాదని శుద్దోదనుడు భావించేవాడు.
సిద్ధార్థుడు స్వభావసిద్ధంగ కరుణామయుడు. ఒకవ్యక్తిని మరోవ్యక్తిదోపిడి చేయడం ఏమాత్రం యిష్టపడేవాడు కాదు.
ఒకనాడు సిద్ధార్థుడు తన సహచరులతోబాటు వ్యవసాయక్షేత్రమునకు పోయి అక్కడ మండుటెండలో కొందరు వ్యవసాయకూలీలు ఒంటినిండా బట్టలైనా లేకుండ కొందరు పొలాలను దున్నుతుండడం, మరికొందరు గట్లు వేస్తూండడం, మరి కొందరు చెట్లు నరుకుతుండడం చూశాడు.
ఆ దృశ్యం అతనినెంతో కలత పరచింది.
ఒక వ్యక్తిని మరోవ్యక్తి ఆవిధంగ దోచుకోవడం న్యాయంకాదని సిద్దార్థుడు తన మిత్రులతో చెప్పాడు. శ్రామికుని శ్రమఫలితాలననుభవించడం న్యాయమెలా అవుతుందని వారిని ప్రశ్నించాడు.అయితే ఆ ప్రశ్నకు ఎలా సమాధానమివ్వాలో తన మిత్రులకు తెలియలేదు. ఎందుకంటే శ్రామికుడు తన యజమానికొరకై శ్రమించడమే తన ధర్మమనే సనాతన సిద్ధాంతమే వాళ్లకుతెలుసు.
శాక్యులు ఏరువాక పండగను ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. ఇది విత్తనాలు విత్తు సందర్భంలో విధిగా గ్రామీణులు జరుపుకునే పండుగ ఆ పండగ రోజున ప్రతిశాక్యుడు నాగలి పట్టి పొలం దున్నలనే సాంప్రదాయం కలదు.
సిద్ధార్థ కూడా ఈ సాంప్రదాయాన్ని తప్పకుండా పాటించేవాడు. నాగలి పట్టి తాను కూడా దున్నేవాడు.
చదువుకున్నంత మాత్రాన తాను నాగలి పుట్టరాదని అనుకోలేదు సిద్ధార్థుడు.
క్షాత్ర ధర్మ ప్రకారం సకల యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అనవసరంగా మరొకరిని గాయపరచడం సిద్ధార్థుడికి ఇష్టం లేదు.
మృగాలను వేటాడేటప్పుడు సిద్ధార్థుడు వేటాడే వాడు కాడు నీకు పులులు అంటే భయమా! ఏంటి? అని మిత్రులు ప్రశ్నించేవారు.
తన మిత్రులతో మీరు పులులను చంపటం లేదు ఎవరికి ఎలాంటి హాని చేయని జింకల్ని, కుందేళ్ళను మీరు చంపుతున్నారు అని సమాధానం చెప్పేవాడు.
సిద్ధార్థ ప్రవర్తనకు పెద్దమ్మ ప్రజాపతి ఎంతో బాధపడేది.
నీవు క్షత్రియుడవు యుద్ధం చేయడం నీ విద్యుక్త ధర్మమని మర్చిపోతున్నావు కదా! యుద్ధ ప్రావీణ్యం కోసం వేటల్లో పాల్గొనక తప్పదు. గురు చూసి బాణం వేయాలంటే ఈ వేట బాగా అవసరం అవుతుంది అని ప్రజాపతి వాదించేది.
క్షత్రియుడు యుద్ధం ఎందుకు చేయాలి?
అని గౌతముడు ప్రశ్నిస్తే?
అందుకు యుద్ధం మీ ధర్మం నాయన అని ప్రజాపతి జవాబి చ్చేది. మనిషిని మరో మనిషి చంపడం ధర్మమేలా అవుతుంది? ని ఆమెను అని ప్రశ్నించేవాడు.
యుద్ధం చేయకపోవడం సన్నాసులకే చెల్లుతుంది నీవు క్షత్రియుడవు నీవు యుద్ధం చేయకపోతే రాజ్యాన్ని ఎవరు కాపాడుతారు అని ఆమె ప్రశ్నించింది.
సరేనమ్మా! క్షత్రియులు ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు కదా అప్పుడు యుద్ధము అవసరం లేదు ఎవరి రాజ్యాలు వారు కాపాడుకోవచ్చు కదా అని ఎదురు ప్రశ్నా వేసేవాడు సిద్ధార్థుడు.
గౌతమి సమాధానం చెప్పలేక తన ఇష్టానికి తనను వదిలేసేది.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నిర్ణయం

by Madhu Jella November 30, 2024
written by Madhu Jella

ఆదివారం.. పిల్లలు..ఆయనా బయటికెళ్ళారు.పనులన్నీ తీరినాక టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తూ కూర్చున్నా. అంతలో ఫోన్ మ్రోగింది..ఆయనదే.ఇంట్లోనే మరిచిపోయినట్లున్నాడు.పట్టించుకోలేదు.
నాలుగైదుసార్లు అదే పనిగా ఫోన్ రింగవుతూంటే .. నేనే వెళ్ళి లిఫ్ట్ చేసా. “హలో సార్..’ ఓ స్వీట్ వాయిస్ పలకరించింది. ‘హెలో..ఎవరు’ అన్నాను.’సార్ .. సార్ లేరా అండీ’ అంది. ‘లేరు.. ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటికెళ్ళారు’.ముక్తసరిగా అనేసరికి కాల్ కట్ చేసింది. కొద్దిసేపటికి
మళ్ళీ అదే నంబరు నుండి కాల్.కట్ చేసా. మళ్ళీ కాల్ చేస్తున్నారెందుకో..చిరాకేసింది.
మళ్ళీ కాల్ వస్తోంది.ఇప్పుడు.. కాల్ లిఫ్ట్ చేయగానే ‘హలో..’ అదే గొంతు.తీయగా పలకరిస్తోంది.’ఎవరు?’ .. కొద్దిగా గట్టిగా అనగానే కాల్ కట్ చేసింది.
బయటికెళ్ళి ఇంకా ఈయన రానేలేదు. ఈ ఫోన్ల గోలొకటీ..వెంటతీస్కెళ్ళొచ్చుగా..
ఉన్నట్టుండి ఏదో ఆలోచన మనసులో మెదిలి కళుక్కుమంది. ఏదో అనుమానపు తెర మనస్సును కమ్మేయబోతుంది .ఆ ఊహే భయం కలుగజేసింది.. ఎంత కంట్రోల్ చేసుకున్న..ఆ ఫోన్ కాల్.. తీయని గొంతు.. గుర్తుకొస్తున్నాయి..ఈయనేమైనా….అంతటితో బలవంతంగా ఆ ఆలోచనను మానుకుందామని ప్రయత్నిస్తున్నా..
ఇంతలో అదే నెంబరు నుండి మళ్ళీ కాల్ వస్తోంది.
కాల్ లిఫ్ట్ చేసి ‘హలో..ఎవరు మీరు. కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడకుండా కట్ చేస్తున్నారు.విషయం ఏమిటో చెప్పండి ‘ గట్టిగా అన్నాను. ‘హలో.. అమ్మ..సార్ లేరా?.. ఇప్పుడు మధ్య వయస్సు ఆవిడ మాట్లాడుతోంది.’అమ్మా.. సార్ గారికి చాలా థాంక్సమ్మా.. నిన్న సార్ గనుక సాయం చేయకుంటే నా కొడుకు ప్రాణాలతో బయటపడేవాడే కాదు. మా చిన్నబ్బాయి నిన్న బైక్ ఆక్సిడెంట్ అయి పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూంటే అక్కడే ఉన్న సార్ హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేసి అవసరమైన సాయం చేసాడు.మా వాడి ఫోను,పర్సులో ఉన్న అడ్రస్ తో మాకు సమాచారమిచ్చాడు తల్లి. గాబరాగా..అందరం షాక్ తోనే హాస్పిటల్ కి వెళ్ళాం.మమ్మల్ని సారే గుర్తించి మా అబ్బాయిని ఉంచిన వార్డు కు తీసికెళ్ళాడు.డాక్టర్లతో మాట్లాడించి, మాకు ధైర్యం చెప్పాడు. ఇంతకు ముందు కాల్ చేసింది మా అమ్మాయేనమ్మా..ఆ సార్ కి ఫోన్ చేయమని నేనే చెప్పాను. బాధలో,కంగారులో సార్ పేరు కూడా కనుక్కోలేదు. సార్, మాకు ఫోన్ చేసిన నెంబరు గుర్తించి ఫోన్ చేస్తున్నాము తల్లీ.. దేవుడిలా వచ్చి నా కొడుకుని రక్షించాడమ్మా.. అందరిలా ఆయనా వదిలేసి వెళ్ళుంటే..”’ ఆమే గొంతు గద్గదమైంది.వెక్కి ఏడుస్తోంది..తనే ‘ నా కొడుకు ప్రాణాలు నిలబెట్టాడు.. ఆయనకు చాలా ఋణపడి ఉంటామమ్మా.. సార్.. మీరందరూ చల్లగా ఉండాలి తల్లి.. సార్ తో చెప్పమ్మా..మా వాడు బాగానే ఉన్నాడు..” కృతజ్ఞతతో నిండిన గొంతుతో చెబుతూ ఆమె ఫోన్ పెట్టేసింది.
కొద్ది సేపు నన్ను మౌనం ఆవహించింది. చాలా గిల్టీగా అనిపించింది. క్షణంలో మనసు చేసిన మాయలోపడి మా ఆయనని అపార్థం చేసుకొనే స్థాయికి వెళ్ళినందుకు. ఇప్పుడు మనసు తేలికైంది.ఆ పెద్దావిడ మాటల్లో వినిపించిన కృతజ్ఞతాభావం నాలో మా ఆయనపట్ల ఉన్న ప్రేమా, నమ్మకమూ మరింత బలపడ్డాయి.. తాత్కాలికంగా నా మనసును ముసిరిన అనుమానం మబ్బు తెరలు ఒక్కసారిగా తొలగిపోయాయి. అపోహపడినందుకు మనసులోనే క్షమాపణలు కోరుకున్నా. ఎవరూ కూడా పూర్తిగా విషయం తెలుసుకోకుండానే ఎవరినీ.. మనవారినీ..అయినవారినీ అపార్థం చేసుకోవద్దని నిర్ణయించుకున్నా. అలికిడైతే ఈ లోకంలోకొచ్చి..గేటుతీసుకుని ఇంట్లోకి వస్తున్న మా ఆయనవైపు కన్నార్పకుండా ఆరాధనభావంతో చూస్తున్నా…
– మధు జెల్లా
30/12/22.
ఇది నా స్వీయ రచన.. మధు జెల్లా

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఎక్కడ నీ నెలవు

by Madhu Jella November 30, 2024
written by Madhu Jella


ఎప్పుడేం చేయాలో
ఎవరికేం జరగాలో నీకె తెలుసు
ఎక్కడో నువ్వుంటావు
తలరాతలు రాస్తుంటావు
తలరాతలు మారుస్తుంటావు
అందలాలు ఎక్కిస్తావూ
అంతలోనే పడదోస్తావూ
ఎక్కడుంటావో….
ఎలా ఉంటావో…
ఏమై ఉంటావో…..
ఎవరో నువ్వు…
నీకు దేవుడని పేరా….
ఊహాతీత శక్తివో…
ఎరుగలేము కదా…..

ఆనందలోకాల్లో విహరింపజేస్తావు
కల్లోల దుఃఖసాగరంలో ముంచేస్తావు

అనుబంధాల బంధాలలో
స్వేచ్చ నీదేనంటావు
బాధ్యతల జాడలలో బందీని చేస్తావు

ఒకే మనిషిలో….
మానవతను..దానవతను
ఒకే నాణేనికి బొమ్మా బొరుసుల్లా
ఎలా చిత్రిస్తావో

తరాలు మారుస్తావు
అంతరాల చింత పేర్చుతావు
‘నేను’ అనే
అహంకారం రగిలిస్తావు
అధికుడనని శాసించేలా
గర్వాన్ని ఎగదోస్తావు
క్షణంలో…
అహాన్ని… గర్వాన్ని అణగద్రొక్కుతావు….
నిన్ను మించిన ‘నియంత’ ఎవరు?
నియంత్రకుడెవరు?

అందాల నందనవనాలు…
మురికికూపాలు
అందమైన ఆకాశాన్నంటే కోటలు
విలాసాల మునిగితేలే జీవితాలు
బిత్తరచూపులు చూసె పూరిగుడిసెల బతుకులు
పక్కపక్కనే ఉండేలా అమరుస్తావు
నువ్వెంత ‘నిర్మాణచతురడవో’

కొన ఊపిరితో కొట్టుమిట్టాడే మనిషిని బతికిస్తావ్
అన్నీ బాగున్నా…అంతా బాగున్నా
మరో మనిషి ఉసురులు అర్థాంతరంగా
ఎక్కడకో కానరాని లోకాలకు తరలిస్తావు

నీవెంత గొప్ప దర్శకుడివో….
అందరితో..అన్ని పాత్రలతో
నీకు నచ్చినట్లు ఆడిస్తావు .. ఆడుకుంటావు
జీవితరంగస్థలిలో…
ప్రతి ఒక్కరూ
నీ చేతిలో కీలుబొమ్మలు
మరబొమ్మలు

ఎవరు నువ్వు?
ఏమై ఉంటావు?
ఎక్కడుంటావు?
ఎప్పుడూ కనిపించలేదు?
మందిరంలో ఉంటావా?
మసీదులో ఉంటావా?
ప్రార్థనాలయంలోనా?
ఆరామాల్లోనా?
ఎక్కడ నీ నెలవు?

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అమ్మాయి నవ్వింది…

by Madhu Jella November 30, 2024
written by Madhu Jella


అప్పుడే బావురుపల్లి స్టేజి వద్ద బస్సు దిగింది ఓ పట్నంపిల్ల లగేజితో పాటు. అక్కడి నుండి ఆ ఊరు దాదాపు 3 కి.మీ. దూరం. మట్టి రోడ్డు.నడుస్తూగానీ, టూవీలర్, ఆటోల్లో గానీ వెళ్ళాల్సిందే.వాళ్ళమ్మమ్మ ఊరు.చాలా సం.ల తర్వాత ఆ ఊరొస్తుంది. పట్నంవాసనలు,పోకడలు ఇంకా పూర్తిగా ఆ ఊరు దరిచేరలేదు.వాళ్ళ తాతయ్యకు చాలాసార్లు కాల్ చేసినా కలవట్లేదు.చేసేదేమీలేక దారెంట నడవడం ప్రారంభించింది.మోడ్రన్ డ్రస్సులో అందంగా ఉంది. అలా కొద్ది దూరం వెళ్ళాక దారిలో ఓ కుర్రాడు సైకిలు మీద ఇటువైపు వస్తూ ఈ అమ్మాయిని చూసాడు. ఆ అమ్మాయి అతన్ని చూసినట్లు అనిపించి తలతిప్పి చూశాడు.అమ్మాయి నవ్వుతూ ఏదో మాట్లడుతూ వెళుతోంది.అతడు ఆలాగే ఆమె వంకే చూస్తూ సైకిలు నడుపుతూ నడుపుతూ రోడ్డు పక్కన గుంతలో పడిపోయి..’అబ్బో..’ అంటూ గావుకేకేశాడు. అమ్మాయి తన దారిన తాను వెళుతోంది.మరికొంత దూరం వెళ్ళాక మరొకతను బైక్ మీద వస్తూ ఈ అమ్మాయిని చూసి…ఆమె తన్ను చూసిందని..నవ్వింది .. ఆమె వంకే చూసుకుంటూ..ఎదురుగా ఉన్న చెట్టుకు గుద్దేసి ”బాబోయ్ ‘.. అంటూ పడిపోయాడు.తర్వాతేంటో అతగాడి పరిస్థితి.ఆమె దారెంట నడుస్తూనే ఉంది.
కొద్ది దూరం వెళ్ళాక పశువులను తోలుకుంటూ మరొకడు ఎదురుపడి ఆ అమ్మాయి ని వింతగా చూస్తూ.. అప్పుడూ ఆమే నవ్వుతూ ఏదో మాట్లాడుతూ చూసింది.అంతే ఆతడు ఆమెనే చూస్తూ నిలుచుండి పోయాడు.ఆమె నడుస్తోంది. పశువులన్నీ పక్కచేలో పడి పొలమంతా పాడుచేస్తోంటే..యజమాని తిడుతూ గట్టిగా కేకలేస్తూంటేగానీ ఆ పశువుల కాపరి ఈ లోకంలోకి రాలేదు.
మరికొంత దూరంలో చెట్టెక్కి కల్లుగీస్తూన్నాయన ఎందుకోగానీ కిందకూ చూస్తూ అమ్మాయి వంక చూసాడు.ఆమె నవ్వుతూ మాట్లాడుతూ తలెత్తి అతని వంక చూసింది. అతడు తన పని మరిచి అలాగే బిగుసుకు పోయాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ ముసలావిడ తలపై నీళ్ళకుండ నెత్తినెట్టుకుని నడుస్తూ ఈ అమ్మాయిని చూసింది.తాను నవ్వుతూ ముందకెళ్ళింది.ఆ వంకే చూస్తూ ముసలావిడ ఆశ్చర్యపోతూ.. ముక్కున వేలేసుకుని నడుస్తూంటే నెత్తిన కుండ జారి నేలబడింది.అయ్యయ్యో…అనుకుందావిడ‌.
కొద్ది దూరం నడిస్తే ఊరొస్తుందనగా ఓ ముసలితాతొకడు ఈ అమ్మాయిని గమనించి ఎవరాయని చూస్తూంటే అమ్మాయి ఓ నవ్వు నవ్వింది.ఎందుకు నవ్విందో అర్థంకాక పోయినా ముసలోడు సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు…
ఆఖరికి ఆ అమ్మాయి’ బై బై..’ అంటూ మాట్లడ్డం మాని, చెవుల్లో పెట్టుకున్న ‘ఇయర్ బడ్స్ ‘ తీసి దగ్గరలో కనిపిస్తున్న తన అమ్మమ్మ ఇంటివైపు అడుగులేసింది.
కొంతసేపటికి ఊళ్ళో కలకలం బయలుదేరింది.ఊరిపోరగాళ్ళు రోడ్డు పక్కన పడి దెబ్బలు తగిలి విలవిల్లాడుతున్నారని.. తెలిసీ బావురుమన్నారు. వాళ్ళని చూడ్డానికి..హాస్పిటల్ కు చేర్చడానికి కొంతమంది బయలుదేరారు.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చైనా మహాకుడ్యం

by డా.కందేపి రాణీప్రసాద్ November 30, 2024
written by డా.కందేపి రాణీప్రసాద్


పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజధాని అయినటు వంటి బీజింగ్ ను దర్శించటానికి మేమంతా అంటే సుమారు 70 మంది డాక్టర్లు కుటుంబాలతో సహా బయల్దేరి వెళ్ళాము. నేను మావారు, మా చిన్నబ్బాయి స్వాప్నిక్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరాము. అందరూ అక్కడే కలుసుకొని చైనా బయల్దేరతారు. చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో రాత్రి 9:25 ని॥లకు ఢిల్లీలోని టెర్మినల్ 3 నుండి షాంఘై బయల్దేరింది. షాంఘై నుండి బీజింగ్ కు మరొక విమానమెక్కాలి. విమానం పైకెగరగానే పై నుంచి ఢిల్లీ నగరం పాపిడి బొట్టు, వడ్డాణం, మెడనిండా హారాలు, కాళ్ళకు మువ్వలతో సహా సకల ఆభరణాలనూ ధరించిన నవ యవ్వనవతిలా ఉంది. ఢిల్లీ నగర సోయగాలను ఆస్వాదిస్తూ విమానంలో కిటికీ పక్కన సీట్లో కూర్చున్నాను. విమానం పెద్దదిగా 2-4-2 సీటింగ్ ఎరేంజ్మెంట్ తో ఉన్నది. చైనీస్ ఎయిర్ లైన్స్ కాబట్టి ఎయిర్ హోస్టస్ లు చైనీయులే ఉన్నారు. టీవీలో చైనీస్ లాంగ్వేజ్ వినిపిస్తున్నది. వారణాసి, ఢాకా నగరాలను దాటుకుంటూ ఉదయం 5-30కు షాంఘైలోని ‘పుడాంగ్ ఎయిర్పోర్టు’కు చేరుకున్నాం. విమానం నుంచి షాంఘై నగర లైట్లను చూసినప్పుడు ఢిల్లీ కన్నా భిన్నంగా కనిపించింది. అన్నీ ఒకే రంగుతో పసుపు రంగు లైట్లు కనిపిస్తున్నాయి. దాంతో కొన్ని ఎకరాల మేర బంగారం పంట పండినట్లుగా కనపడుతున్నది. ఢిల్లీ నగరమేమో నవరత్నాలతో సర్వాలంకార భూషితంగా ఉంటే షాంఘై నగరం మాత్రం కేవలం బంగారం పంట పండించినట్లుగా ఉన్నది. షాంఘై నుండి బీజింగ్ చేరే సరికి ఉదయం 10-30 అయింది.
బీజింగ్ కేవలం చైనాకు రాజధాని మాత్రమే కాదు. నేషనల్ పొలిటికల్ మరియు కల్చరల్ సెంటర్, మన హైదరాబాదు లాగానే దీనికి కూడా ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అని రెండు ఉన్నాయి. ఓల్డ్ సిటీ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఈ శతాబ్దంలోనే చైనా బాగా అభివృద్ధి చెందింది. చైనా దేశం జనాభాలో మొదటిస్థానం, భూ భాగంలో మూడవ స్థానాన్ని ఆక్రమించియున్నది. ఇక్కడి కరెన్సీని ‘యువాన్లు’ అంటారు. మేము వెళ్ళిన రోజు ఒక యువాన్ కు 72 భారతదేశ రూపాయలు. ఇక్కడ ఉష్ణోగ్రత ఈ కాలంలో మైనస్ డిగ్రీలలో ఉంటుంది. అలాగే ఎండాకాలంలో ఎండ కూడా చాలా తక్కువగా ఉంటుందట. రకరకాల నేలలు, పెద్దదైన భూభాగం వల్ల వాతావరణం ఎప్పుడూ నిలకడగా ఉండకపోవడం వల్ల సందర్శనకు ఇది అనువైన సమయమని చెప్పేందుకు లేదు.
యాంగ్జీనది చైనాను ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విడగొడుతుంది. చైనా భూభాగంలో మూడింట రెండు వంతులు పర్వతాలే ఉన్నాయి. దీని భూభాగ వైశాల్యం 9.6 మిలియన్ చ.కి. యాంగ్జీనది చైనాలో అతిపెద్దనది. ప్రపంచంలోని అతిపెద్ద నదులైన నైల్, అమెజాన్ల తర్వాతి స్థానం దీనిదే. చైనాలో నాగరికత వెల్లివిరియటానికి దేశంలోని రెండవ అతిపెద్ద నదైన పసుపునది కారణమని చెపుతారు. ప్రపంచంలోని అతి ప్రాచీన భాషల్లో ఒకటైన చైనీస్ భాషకు వర్ణమాల వ్యవస్థలేదు. ఇది చిత్రలేఖనం రూపంలో ఉంటుంది. ఈ భాష స్వర సంబంధిగా ఉండటం వల్ల మనకు అన్ని మాటలూ ఒకే రకంగా వినబడతాయి. చైనా అధికార భాషను ఇంగ్లీషులో ‘మాండరిన్’ అంటారు. చైనా వెళ్ళబోయే ముందే ట్రావెల్స్ వాళ్ళు సాధారణంగా మనకవసరమయ్యే మాటల్ని చైనా భాషలో ఏమనాలో పేపర్ ప్రింటవుట్లు ఇచ్చారు. వాటిని ఎంతసేపు చదివినా పేపర్ దగ్గరుంటే తప్ప ఏదీ గుర్తుండేలా లేదు. బాగా చదివి ‘థ్యాంక్ యూ’ అనే పదానికి ‘జీజీనీ’ అనాలని గుర్తుపెట్టుకున్నాం. ప్రతి చోటా అందరికీ ‘జీజీనీ’ అని చెప్తుంటే వాళ్ళు సన్నగా నవ్వుకుంటున్నారు. ‘ఎలా ఉన్నారు’ అని అడగాలంటే ‘ని హావో మా’ అనాలి. ఏదైనా వస్తువు కొనాలంటే ‘రేటెంత’ అని అడగాలి కదా దానికి ‘డుమో షావో కియాన్?’ అని అడగాలి. ఇలా వాళ్ళ భాష గురించి వివరాలు తెలుసుకున్నాం.
బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగి ఊర్లోకి వస్తుంటే ఆకాశాన్నంటే భవనాలు, అద్భుతమైన రోడ్లు కనువిందు చేశాయి. అన్ని ప్లైవోవర్లే. మేం ఎయిర్ పోర్టు నుంచి హెూటల్ కు చేరే వరకూ ఎక్కడా ట్రాఫిక్ సమస్య లేనే లేదు. ఏ బిల్డింగ్ చూసినా పది అంతస్థులకు తక్కువ కనిపించలేదు. మేము దిగిన ‘ఫీటియాన్’ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఇరవై అంతస్థుల భవనం. మా రూమ్ నంబరు 805 బీజింగ్ నగరంలో 16,000 కి.మీ మేర ఆరు రింగురోడ్డులు విస్తరించి ఉన్నాయని గైడ్ వివరించింది. అక్కడి పంటపొలాలు కొనుక్కోవటం గానీ, కొనుక్కున్నాక అవి మరల నా పిల్లలకు అని రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవట భూమి ఏదైనా ప్రభుత్వానిదే కావాలంటే 30 లేదా 40 సంవత్సరాలు కిరాయికి ప్రభుత్వం నుంచి తీసుకొని ఆ తరువాత మరల ప్రభుత్వానికే అప్పజెప్పాలి. వాళ్ళ పిల్లలకు ఇవ్వడానికి వీలు లేదు. పిల్లలు పెద్దవాళ్ళయి వ్యవసాయం చేసుకుంటానంటే మరల ప్రభుత్వం నుంచి కిరాయికి పొలం తీసుకోవాల్సిందే. ఎయిర్ పోర్టు నుండి హెూటల్ కు చేరేదాకా గైడు ఈ విషయాలన్నీ చెపుతూ కూర్చున్నది. బస్సులో ఓ మైకు ఉంటుంది. ఆ మైకు ద్వారా ఆమె ఇవన్నీ మాట్లాడింది. ఆ గైడు పేరు ‘అమీ’. తాను నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ జోకులు వేస్తూ విషయాలన్నీ చెప్పింది.
సాయంత్రం 6-30కు జనోషా థియేటర్ లో ‘ఆక్రో బాటిక్ షో’ చూపించారు. ఇది చాలా అద్భుతంగా ఉన్నదిద. దీంట్లో చైనా వాళ్ళ సాంప్రదాయక నృత్యంతో పాటు సర్కస్ ఫీట్లన్నీ ఉన్నాయి. ఒక ఇనుప గోళంలో మోటరు సైకిళ్ళతో స్పీడుగా నడపడం అంటే ఎంత కష్టం. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా చాలా ప్రమాదం. చూడటానికి చాలా ఆనందాన్నీ, సంభ్రమాశ్చర్యాల్నీ కలగజేసినా వాళ్ళ జీవితాలు ఎంత రిస్క్ కూడుకున్నవో తెలిస్తే, ఆ ఆనందమంతా ఆవిరై పోతున్నది. దాదాపు పది బంతుల్ని తెలిస్తే, ఆ ఆనందమంతా ఆవిరై పోతున్నది. దాదాపు చేతులతో పట్టుకుంటూ ఉండటం, తల మీద టోపీలను పైకెగరవేసి ఒకరిని మరొకరు పట్టుకోవటం వంటివి వారి హస్త నూపుణ్యానికి, ఏకాగ్రతకు నిదర్శనం. కొంతమంది రాజులుగా, జోకర్లుగా వేషాలు వేసుకొనీ, మరికొంతమంది అమ్మాయిలు అందంగా అలంకరించుకొని డాన్స్ చేయటం వారి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఇంకొందరు కుర్చీలను కింది నుంచి పైకి వంకరటింకరగా ఒకదానిపై మరొకటి పేర్చుకొని దానిపైకి ఎక్కుతూ, తల మాత్రమే వాటికి ఆన్చి శరీరమంతా గాల్లో తేలేలా చెయ్యటం చూస్తుంటే వాళ్ళు పడిపోతారేమో, పడిపోతారేమో అని మనకు టెన్షన్ అనిపిస్తుంది. ఇలా కుర్చీలపైకెక్కటం, రింగుల్లోంచి దూరి ఒకరిపై మరొకరు పడటం, మోటారు సైకిళ్ళు విన్యాసం- ఈ సర్కస్ ఫీట్లన్నీ ఎంత ప్రాణాంతకమో తెలిస్తే చాలా బాధనిపించింది. ఇలా ఒకసారి కాదు కదా! ప్రతి రోజూ రెండు మూడు షోలు ఇవ్వాలి. స్టేజి షో కాబట్టి తప్పు జరగడానికి లేదు. ఇలా జీవిత కాలం ప్రమాద పరిస్థితితో ఉండటమనే విషయాన్ని ఆలోచిస్తేనే విషాదం అనిపించింది. ఏది ఏమైనా పిల్లలూ, పెద్దలూ ఈ ప్రదర్శన చూసి ఆశ్చర్యంతో నోరు తెరవని వారు లేరు. ఇంకా కుంగ్ ఫూ ప్రదర్శన కూడా ఉంటుందట గానీ మాకు చూడటానికి టైమ్ దొరకలేదు.
ఆ మరునాడు ఫర్ బిడెన్ సిటీ టియాన్మన్ స్క్వేర్ చూడటానికి వెళ్ళాం. ఇవి రెండూ ఎదురెదురుగానే ఉంటాయి. ఫర్ బిన్ సిటీని 1407లో కట్టారు. దీని నిర్మాణంలో ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది పనివాళ్ళు పాల్గొన్నారు. దీన్లో మింగ్, కింగ్ రాజవంశాలు 500 సం॥ల పాటు నివసించాయి. ఈ భవనం లోపల ఒక రకమైన పసుపు రంగుతో లెక్కకు మిక్కిలిగా అలంకరణలు చేయబడ్డాయి. పసుపురంగు చైనా వారి సాంప్రదాయమైన రంగట. ఈ భవనాలన్నీ వారి వస్తు ప్రకారం కట్టబడినాయట.
టియాన్మన్ స్క్వేర్ యాభై హెక్టార్ల స్థలంలో వ్యాపించబడి ప్రపంచంలోని అతిపెద్ద ఖాళీ ప్రదేశాలలో ఒకటిగా పేరు పొందింది. దీనిని 1417లో మింగ్ రాజవంశం స్థాపించింది. సామాన్య ప్రజలంతా తమ రాజులు, రాణుల ఎదుట ఉత్సవాలను జరుపుకోవడానికి వీలుగా ఈ స్క్వేర్ ను ‘ఫర్ బిడెన్ సిటీ’ ఎదురుగా నిర్మించారు. ప్రస్తుతం ఇంకా విశాలం చేసి దాంట్లో ఎక్కువ మంది ప్రజలు పట్టే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు టియాన్మన్ స్క్వేర్ వద్ద ప్రతిరోజూ జెండా వందనం అద్భుతంగా జరుగుతుంది. దీనిని తిలకించటానికి ప్రతిరోజూ వేల మంది ప్రజలు హజరవుతారు. ఇది చూడాలంటే సూర్యోదయం కాకముందే లేచి అక్కడకు చేరుకోవాలి. ఐదు నక్షత్రాలున్న ఎర్రని చైనా జాతీయ జెండా ఈ స్క్వేర్ వద్ద ఆకాశంలోకి ఎగిరే దృశ్యం ప్రతి టూరిస్టు తప్పక చూడవలసినది. మలేసియా, చైనా, హంగ్ కాంగ్ వాసులు ఈ టియాన్మన్ స్క్వేర్ వద్ద మాతో ఫొటోలు తీయించుకున్నారు. హిందూ, హిందూ అంటూ నమస్కారాలు చేశారు. మేం చైనాలో ఉన్నపుడు ఆ దేశ అధ్యక్షుడు ‘హూ జింటావో” భారతదేశ పర్యటనలో ఉన్నారు.
ఆ మరుసటి రోజు బీజింగ్ నుండి బాడాలింగ్ హైవేలో గ్రేట్వాల్ ఆఫ్ చైనాకు బయల్దేరాం. దారిలో జేడ్ ఫ్యాక్టరీ చూపించారు. అవి పెద్ద పెద్ద గ్రానైటు బండల్లా ఉన్నాయి. వాటి నుంచి శిల్పాలు, ఫ్లవర్ వేజ్ లు అలంకారానికి ఉపయోగపడే ఎన్నో వస్తువులు తయారు చేయబడి ఉన్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గరవుతుంటే అందరిలోనూ ఒకటే ఉద్విగ్నత, ఈరోజు మనం ప్రపంచ వింతను చూడబోతున్నాం అని బస్సు దిగగానే పైకి చూస్తే మంచు తెరల్లోంచి చైనా మహాకుడ్యం ఒక కొండ మీద నుండి మరొక కొండ మీదకు వంకలు తిరుగుతూ పాక్కుంటూ వెళ్తున్న కొండ చిలువలా కన్పించింది. ఈ గోడ 25.6 ఫీట్ల ఎత్తుతోనూ, 16.4 ఫీట్ల వెడల్పుతోనూ కట్టబడింది. ‘క్విన్ షి హుయాంగ్’ అనే రాజు 220 బిసి నుంచి 200 మధ్యలో ఈ గోడను కట్టారు. మింగ్ రాజవంశం దీన్ని పునరుద్ధరించి 5వ శతాబ్దంలో బండ రాళ్ళతో కట్టారు. ఈ గోడనే మనం ఇప్పుడు చూస్తున్నది. ఈ గోడ పొడవు 6,400 కి.మీ.లు. 2,3 మిలియన్ల మంది సైనికులు వారి జీవిత కాలమంతా ఈ గోడను కడుతూనే ఉన్నారు. మంచూరియన్ల, మంగోలియన్ల దాడిని నివారించేందుకు, వారు చైనాలోకి చొరబడకుండా ఉండేందుకు కట్టారు. ఈ మహాకుడ్య శిఖరాగ్రాన ఒక మిలియన్ సైనికులు కాపలా కాసేవారంట. అక్కడ చాలా షాపులు ఉన్నాయి. ఓ షాపులో ఇత్తడి ప్లేట్ మీద మన పేరు చెక్కి ఈరోజు చైనా గోడను ఎక్కినట్లుగా చెక్కి ఇస్తారు. మేం కూడా దాన్ని చెక్కించుకున్నాం. ఇది మేం చూసిన రెండవ ప్రపంచ వింత. మొదటిది తాజ్ మహల్. రెండవది ఇది. ఇంకొక షాపు దగ్గర చైనా రాజ వంశీయుల దుస్తులు వేసి ఫొటోలు తీస్తున్నారు. మేం కూడా ఆ ఫొటోలను తీయించుకున్నాం. మనం ఈ మానవ నిర్మితమైన ప్రపంచ వింతను దర్శించినట్లు ఒక సర్టిఫికెట్తో పాటు మన ఫొటోనూ, మహాకుడ్యం యొక్క రకరకాల భంగిమల ఫొటోలనూ ఇస్తారు. దీనికి మనం వంద యువాన్లు చెల్లించాలి. ఇలా చైనా మహాకుడ్య విశేషాలను భద్రపరచుకొని తిరిగి ఇండియా ప్రయాణమయ్యాం.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నమ్రత

by chittiprolu Subbarao November 30, 2024
written by chittiprolu Subbarao

హోటల్ అశోకా. నగరం నడిబొడ్డు లాంటి లక్డీ కా పూల్ లోని ఒక మోస్తరు హోటల్. పాతతరం వారికి బాగా తెలిసిన హోటల్. కొత్తగా బిల్డింగులు వచ్చీ రోడ్డు మధ్యలో ఎత్తైన మెట్రో కట్టీ ఇప్పుడు అంతగా బయటకు కనిపించని హోటల్. అయినా కొంతమందికి ఇప్పటికీ హైదరాబాద్ లో విడిది అంటే అశోకా హోటలే.

ఖద్దరులాల్చీ తొడుక్కుని నూలుపంచె కట్టుకున్న ఆ పెద్దమనిషి హోటల్ నుండి బయటకొచ్చాడో లేదో అప్పుడే సన్నగా మొదలైంది వర్షం. ఆలస్యమవుతుందనిపించినా ఎందుకైనా మంచిదని వెనక్కిమళ్ళి హోటల్ లాంజ్ లోకి వెళ్లారు. ఆయన్ని చూసి విషయం గ్రహించింది రిసెప్షనిస్టు కుశాగ్ర. తమ హోటల్ అతిథుల సౌకర్యం కోసం అలమరాలో సిద్ధపరచిన గొడుగుల్లోంచి ఒకటి తీసిచ్చింది. ఇటువంటి చిన్న విషయాలను కూడా పట్టించుకుంటున్న యాజమాన్యం శ్రద్ధ వల్లనే ఈ హోటల్ ఇప్పటికీ రాణిస్తుందనుకుంటూ పంచెకట్టుమనిషి మళ్ళీ బయటకు నడిచాడు.

సాయంకాలం ఆరుగంటలవుతోంది. అందరూ ఆఫీసుల నుండి ఇళ్ళకెళ్ళే సమయం. ఇళ్ల నుండి పార్కులకూ సినిమాలకూ వెళ్లే సమయం కూడా. అందువల్ల కార్లతో ఆటోలతో రద్దీ ఎక్కువగానే ఉంది. వర్షం వల్లనేమో స్కూటర్లూ మోటార్ సైకిళ్ళూ కొంచెం తక్కువగా ఉన్నాయి.

రోడ్డుకు బాగా ఎడమ ప్రక్కగా అడుగులేస్తూ వర్షానికి తడవకుండా గొడుగు పట్టుకుని రవీంద్రభారతి వైపు వడివడిగా నడుస్తున్నాడు అరగంట ముందే గమ్యం చేరుకునే అలవాటున్న ఆ పంచెకట్టుమనిషి. తనను హైదరాబాద్ కి ఆహ్వానించినవాళ్ళు కారు పంపిస్తామని చెప్పినా ఇంత తక్కువ దూరం కోసం వృధాఖర్చని తనే వద్దన్నాడు.

ఇంకో నాలుగడుగులు వేసేసరికి అంత ట్రాఫిక్ లోనూ రోడ్డుకు ఒక వారగా ఆగిపోయిన పెద్దకారొకటి కనిపించింది. తల మీద టోపీ పెట్టుకుని తెల్లటి యూనిఫామ్ ధరించిన డ్రైవర్ వానలో తడుస్తూ తెరిచిపెట్టిన బోనెట్ లో ఏవో వైర్లు సరిచేస్తున్నాడు.

కారు బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన సూటూబూటుమనిషితో కళ్ళూకళ్ళూ కలిశాయి పంచెకట్టు మనిషికి. క్షణం సేపట్లోనే అర్థమైంది సూటూబూటుమనిషి భావం ‘గొడుగులో నాకూ కాస్త చోటిస్తారా’ అని.

“ఇక్కడే రవీంద్రభారతిలో అర్జెంట్ ప్రోగ్రాముంది. నన్నక్కడిదాకా తడవకుండా మీ గొడుగునీడలో తీసుకెళ్తారా! ప్లీజ్!”

“ఈరోజే కొట్టించుకున్న కోటు. మీరేమీ అనుకోకపోతే …”

విషయం గ్రహించిన పంచెకట్టుమనిషి గొడుగు నుండి కొంచెం బయటకొచ్చి తన దుస్తులు ఒక భాగం తడుపుకుంటూ నడుస్తున్నాడు. అంతలో వెనుక నుండి ఆ పెద్దకారు వచ్చి సూటూబూటుమనిషి ప్రక్కన ఆగింది. అతడు వేగంగా డోర్ తీసి అంతకంటే వేగంగా ‘థాంక్స్’ చెప్పి కారులో కూర్చుని రయ్యిమన్నాడు.

“పోనీలే పాపం. కారు స్టార్టయ్యింది. లేదంటే ఆ డ్రైవర్ కి ఇంకెన్ని తిట్లు పడేవో” అనుకుంటూ ఇక ఏమాత్రం తడవకుండా నడక సాగించాడు పంచెకట్టుమనిషి, కళాభవన్ ప్రాంగణం దాటుకుంటూ.

తన కొత్తకోటు తడవనందుకు చాలా సంతోషంగా ఉంది కారులో పోతున్న సూటూబూటుమనిషికి. ముంబైలో రేమాండ్స్ షాపుకు తనే స్వయంగా వెళ్లి తనకు నచ్చిన ఒకలాంటి బ్లూ కలర్ క్లాత్ కొనుక్కుని హైదరాబాద్ లోని ఖరీదైన టైలర్ తో మనసుపడి కొట్టించుకున్న కోటు మరి. “ఈ రోజు ప్రోగ్రాం కోసమే కుట్టించుకున్న కోటు తడిసిపోయుంటే … ?” తడవనందుకు చాలా రిలీఫ్ ఫీలై టై నాట్ మరికొంచెం క్రిందికి లాక్కున్నాడు.

రవీంద్రభారతి ఆవరణ లోకి అడుగుపెడుతుండగా గేటుకు ఒకప్రక్కన కట్టిన ప్లాస్టిక్ బ్యానర్ కనిపించింది పంచెకట్టుమనిషికి. నగరంలో పెద్దపేరున్న ‘చంద్రవంక కళావాహిని’ సంస్థ వారు ఒక సంగీతవిద్వాంసుడికి ఒక పెద్ద ఆఫీసర్ చేతుల మీదుగా చేస్తున్న సన్మానం. అదీ ఆ బ్యానర్ సారాంశం.

రవీంద్రభారతి హాల్లో ముందువరుస సీట్ల వైపు వెళ్ళబోయి స్టేజి మీద సూటూబూటుమనిషిని చూసి లిప్తపాటు ఏదో ఆలోచించుకుని సన్నగా నవ్వుకుంటూ తల మీద ఉత్తరీయం కప్పుకుంటూ వెళ్ళి హాల్లోని చివరివరుస సీట్లో కూర్చున్నాడు.

“ఈనాటి సభకు కథానాయకులైన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ప్రాచీనమూర్తి గారు సభకు ఏ క్షణమైనా రావచ్చు. ముఖ్య అతిథీ సన్మానకర్తా ప్రభుత్వ సాంస్కృతికశాఖ అధ్యక్షులూ శ్రీ అధునాతన్, ఐ.ఏ.ఎస్. గారు సభకు ఇప్పటికే విచ్చేశారు. వేదిక మీదే మీ ముందున్నారు. మీ కరతాళధ్వనుల మధ్య వారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ … వారికి ముఖ్యమైన మరో ప్రోగ్రాం ఉన్నందువలనా సమయాభావం వలనా ప్రకటించిన సమయానికి ముందుగానే ఇప్పుడే తమ ప్రసంగం వినిపించి వెళ్ళిపోతారు. …” సభానిర్వాహక కార్యదర్శి పరిచయవాక్యాలు పలికి మైకును శ్రీ అధునాతన్ గారికి అందజేశారు.

“సభాసరస్వతికి నమస్సులు. నేను తెలుగువాణ్ణే. ఇంట్లో మాతృభాషే మాట్లాడాలన్న నియమం పెట్టుకున్న కుటుంబం నుండి వచ్చాను. కానీ పుట్టిందీ పెరిగిందీ మొన్నటిదాకా ఉద్యోగం చేసిందీ ఇతర రాష్ట్రాల్లో కాబట్టేమో నాకు తెలుగు సంగీతవిద్వాంసుల గురించి పెద్దగా తెలియదు. సాంస్కృతిక శాఖ అధ్యక్షుడిగా ఈరోజే బాధ్యతలు తీసుకున్న నేను శ్రీ ప్రాచీనమూర్తి గారి ప్రాభవం గురించి విన్నాను గానీ వారి పాండిత్యం గురించి ఇంకా తెలుసుకోవలసి ఉంది. ఈ సాయంత్రం మనం సన్మానించుకోనున్న ఆ మహనీయుణ్ణి నేనిప్పటిదాకా చూడనే లేదు. వారెక్కడన్నా తారసపడ్డా గుర్తుపట్టలేని అశక్తుణ్ణి నేను. తాము బసచేసిన హోటల్ నుండి బయలుదేరారట. ఏ క్షణమైనా ఇక్కడకు రావచ్చట. వస్తూవస్తూ దారిలో వారు అమృతవర్షిణి రాగం ఆలపిస్తున్నారేమో. అందువల్లనే ఇక్కడ వర్షం కురుస్తోందేమో. రాగానే వారితో దీపక్ రాగం పాడించుకోవాలి. వాతావరణం వెచ్చబడుతుంది. …” ప్రసంగం ముగించి ప్రేక్షకుల చప్పట్లతో ప్రతిధ్వనిస్తున్న సభామందిరాన్ని నలువైపులా తిలకిస్తూ కోటుజేబుల్లో చేతులుపెట్టుకున్నారు శ్రీ అధునాతన్ గారు గర్వంగా.

రిస్ట్ వాచ్ లో టైం చూసుకుని తల మీది ఉత్తరీయం తీసి వేదిక వైపు నడిచాడు పంచెకట్టుమనిషి. అల్లంత దూరం నుండే ఆయన్ను చూసిన సభానిర్వాహకులు పరుగుపరుగున వచ్చి పంచెకట్టుమనిషిని సాదరంగా వేదిక మీదికి తోడ్కొనివెళ్ళారు.

పంచెకట్టుమనిషీ సూటూబూటుమనిషీ వేదిక మీద పక్కపక్కనే కూర్చున్నారు. మరోసారి కలుసుకున్న ఆ రెండుజతల కళ్ళు ఏం మాట్లాడుకున్నాయో తెలియదుగానీ ఎవరిలోనూ తొట్రుపాటు లేదు. ఇంతకుముందొకసారి కలుసుకున్నామన్న భావనే లేదు ఇద్దరి ముఖాల్లో.

మరో ప్రోగ్రాం కోసం త్వరగా వెళ్ళిపోవాలన్న శ్రీ అధునాతన్ గారు సభ ఆసాంతం ముందువరుస కుర్చీలో కూర్చుని ప్రాచీనమూర్తి గారి రాగాలన్నీ వింటూ మైమరచిపోయారు. పాటపాటకూ మధ్య వచ్చే కొద్ది క్షణాల విరామంలో తననెవరూ గమనించకుండా తన కోటును తానే పదేపదే ప్రశ్నార్థకంగా చూసుకున్నారు.

చివరగా పాడిన దీపక్ రాగం తరువాత సన్మానకార్యక్రమం మొదలైంది.

మళ్ళీ వేదిక మీదికి వచ్చిన శ్రీ అధునాతన్ గారు సరాసరి వేదిక ప్రక్కనున్న గదిలోకి వెళ్లి రెండు నిమిషాల తరువాత తిరిగివచ్చారు. ఇప్పుడతడి శరీరం కొంత తేలికపడింది. మనసు బాగా తేటపడింది.

శ్రీ అధునాతన్ గారు శ్రీ ప్రాచీనమూర్తి గారికి పూలమాల వేసి శాలువా కప్పి సన్మానపత్రం సమర్పిస్తున్నప్పడు వారిద్దరి చూపులు మళ్ళీ నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాయి.

ఇంటికొచ్చిన భర్త అధునాతన్ ను మురిపెంగా చూసుకుంది అతడి అర్థాంగి. అతడి ప్రసంగాన్నీ సన్మానకార్యక్రమాన్నీ టీవీలో కళ్ళార్పకుండా చూశానంది. స్వంత రాష్ట్రం లోకి వచ్చిన మొదటి రోజే అధునాతన్ ఇంత గొప్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గోవటం మనసుకు తృప్తినిచ్చిందనీ, ఆ సభను తాను ప్రత్యక్షంగా తిలకించలేకపోవటం తన దురదృష్టమనీ కళ్ళు తిప్పుకుంటూ భర్తతో చెప్పుకుంది.

అంతగా మనసుపడి కుట్టించుకున్న కోటును సన్మానం చేసే సమయంలో వేసుకోలేదేంటని అడిగింది. జరిగిన విషయం ముచ్చటించుకుని ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.

ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా, టైనీ కోటునూ ఏమాత్రం విడవని దర్పం భర్తది. తనెన్నో సార్లు చెప్పి చూసింది అవసరం లేని సందర్భాల్లోనూ ఈ డాబుసరి వేషమెందుకని. కానీ ఫలితం లేకపోయింది. అదృష్టవశాత్తు ఈరోజు తన కోరిక తీరింది.

దొడ్డతనానికి దుస్తుల కంటే వ్యక్తిత్వమే నిజమైన గీటురాయని తన భర్తకు కనువిప్పు కలిగించిన వర్షానికీ పంచెకట్టుమనిషికీ మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంది శ్రీమతి నమ్రత.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఎల్లమ్మ జాతర

by M.Sahana Sri November 30, 2024
written by M.Sahana Sri

అనగ గనగా ఒక ఊరు ఉండేది.ఆ ఊరి పేరు ఇబ్రహీంనగర్ అక్కడ తేదీ 4-4-2024 న రాత్రి 7.30.ని.షా.లకు ఎల్లమ్మ జాతర మొదలైంది.
ఎల్ల-అమ్మ అంటే ప్రపంచానికి తల్లి కాబట్టి. ఆమె బిడ్డలుగా అన్నం పెట్టే బాధ్యత ఆమె పిల్లలుగా మనందరి బాధ్యత అని బోనం పట్టుకుని…పోతారు. అలా
అప్పుడు మేము ఆ ఊరికి వెళ్లాము. మేము ఉదయమే లేచి తయారై బోనం తలపైన పెట్టుకొని హారతులు పట్టుకొని డప్పులు చాటింపులతో ఎల్లమ్మ గూడికి పోయినం. ఎందుకంటే ? నీటినుండి-ధూళి నుండి పుట్టిన ఎల్లమ్మ ఆరెండింటి తోనే పంటలు పండి మన ఆకలి తీరుస్తుందని, అంటురోగాలు రాకుండా కాపాడు తుందని,కృతజ్ఞతగా బోనాల పండగ చేస్తాము.
అక్కడ చాలా జనాలు ఉన్నారు. మేము గుడికి పోగానే కొద్దిసేపు నిలుచున్నాం. ఆ తర్వాత మాకు కూర్చోవడానికి స్థలం దొరికింది. అప్పటికే అయ్యగారు అక్కడ పూజ మొదలు పెట్టారు అక్కడ తిరునాళ్లు కదా చాలా బొమ్మలు అమ్మడానికి వచ్చినవి, మా తమ్ముడు చూచి బొమ్మలు కావాలని ఏడ్చినాడు. అప్పుడు మా అమ్మ వెళ్లి వాడికి కావలసిన బొమ్మలు కొనిచ్చింది. ఆ తరువాత కొద్దిసేపు కూర్చున్నాం. కొద్దిసేపటికి పోతరాజు వచ్చాడు ఆయన మేకను కొరికి ఆ మేక యొక్క రక్తం తాగాడు. ఎందుకలా చేస్తారంటే ఇంటి పనులలో ఏవో కొన్ని చేయలేదనే కోపంలో ఎల్లమ్మ భర్త అయిన జమదగ్ని కొడుకు పరుశురాముడి తో అమ్మ ను చంపేయమని అంటాడు. పరుశురాముడు తండ్రి మాటతో ( ఎల్లమ్మ) నరికేస్తాడు. ఆ కథ అందరికీ తెలిసేందుకు ఈనాటికీ దాన్ని ఒక ఆచారంగా చేస్తున్నారు.
ఆ తర్వాత గుడి చుట్టూ తిరిగి ఇంకా అక్కడ ఉన్న భక్తుల మీదికి ఉరికాడు.అప్పుడు నాకు చాలా భయమేసింది.బాధ కూడా కలిగింది. అలా ఆచారాల పేరుతో మూగ జీవాలను హింసించడం నాకు నచ్చలేదు.ఈ ఆచారాలను ఆపితే బాగుండనిపించింది.ఆ గుడి పక్కనే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది మేము ఆ హాల్లోకి పోయి అక్కడి నుంచి పోతరాజును చూసినం కానీ కొంతమంది అదే ఫంక్షన్ హాల్ లో కూర్చున్నారు. ఆ తర్వాత మా అక్క పెద్దమ్మ అన్న పెద్ద బాపు అక్కడే ఉన్నారు మేము ఇంటికి వచ్చి అన్నం తిని పడుకున్నాము. అప్పటికే సమయం ఒకటి అయింది. కొద్దిసేపటి తరువాత మా వాళ్లు కూడా ఇంటికి వచ్చి తిని పడుకున్నారు. మళ్లీ పొద్దున లేచి ఆటో కి ఫోన్ చేసి మా ఇంటి పక్కన ఉన్న పెద్దమ్మ వాళ్లతో కలిసి ఇంటికి వచ్చాము.

నీతి:- ఏ కుటుంబంలోనైనా వెనుకటి నుండి వచ్చిన ఆచారాలు సంతోషకరమైనవైతే పాటించాలి…అలా కాకుండా ప్రాణులను హింసించేవైతే కొంచెం మార్పులు చేసుకొని పండగను ఆనందంగా జరుపుకోవాలి.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

Restore Harmony

by Kattekola Vidyullata November 30, 2024
written by Kattekola Vidyullata

“Hey,why have you closed the doors?  My friends are still on the way,” Ravi eagerly spoke to the waiter at the cafe he had been waiting at for his friends.
As usual,the monkeys arrived in a large group and they would enter every door open. Now a days it has become the biggest problem not only for us but also the neighborhood community. Don’t know why these animals left the forests and are roaming around in the city,” the waiter answered impatiently.
By that time Ravi’s friends entered, cautiously escaping the attack from the monkeys.
The sun hung low over the city, casting long shadows across the concrete jungle as four friends – Ravi, a passionate environmentalist, Suma, a wildlife enthusiast, Arun, an urban planner, and Kavitha, a journalist – sat at a small café. They had met to discuss a growing problem that had captured everyone’s attention in recent weeks: wild animals, displaced by rampant deforestation, were making their way into the cities.
“Did you hear about the monkey attack yesterday?” Suma began, shaking her head in disbelief. “A group of them entered a school and snatched food from the kids. It’s getting worse every day.”
Ravi, ever the advocate for nature, leaned forward. “It’s not just the monkeys, Suma. I read that a cheetah was spotted near the highway last night. It’s no surprise, really. We’ve destroyed their homes. What else can they do?”
Arun sighed. “We’ve pushed them into a corner. Every time I approve a new urban plan, I see forests disappearing on the map. Green spaces are shrinking, and we’re leaving these animals nowhere to go.”
Kavitha, who had been quietly observing, spoke up. “It’s ironic. We’ve got Haritha Haram initiatives going on across the state – planting saplings to make up for deforestation. But, Ravi, you’ve been saying this for years. They’re not planting the right kinds of trees.”
“Exactly!” Ravi’s voice was filled with frustration. “It’s all ornamental. Sure, they plant saplings, but where are the fruit-bearing trees? Trees that actually provide food and shelter for wildlife. Instead, they’re planting decorative species that do nothing for the animals or even the ecosystem.”
Suma nodded in agreement. “I’ve seen this too. Animals aren’t coming to the city because they want to. They’re starving. With no fruits in the forests, they’re turning to human settlements for food. It’s tragic.”
Kavitha, ever the investigator, took out her notebook. “I’ve been covering stories on this for a while now. The government’s intention behind Haritha Haram is good, but there’s no long-term vision. If we don’t start planting fruit-bearing trees, if we don’t restore natural habitats, this is just going to keep getting worse.”
Arun leaned back, a look of deep concern on his face. “It’s not just about the animals. We’re seeing more floods, more droughts, even temperatures are rising. We’ve paved over wetlands, cut down forests, and dammed rivers. We’re so focused on building our cities that we forget nature is our lifeline. And yet, even when we harm it, nature still tries to help us.”
“What do you mean?” Suma asked, curious.
“Think about it,” Arun continued. “Trees absorb carbon dioxide, cool down cities, and prevent flooding. Wetlands filter water. Even the smallest creatures, like bees, are responsible for pollinating the plants that give us food. Nature keeps trying to balance things out, no matter how much damage we do. But it has its limits.”
Ravi chimed in, “Exactly. We take so much from nature, but give so little back. We build our roads and factories, thinking only of progress, but when floods wash away our homes or heatwaves kill crops, we act surprised. It’s like we’re blind to the fact that everything we need – clean air, food, water – comes from the very ecosystems we’re destroying.”
Suma sighed. “It’s human negligence, plain and simple. We’ve grown disconnected from the natural world, thinking it’s something to conquer or manage. But nature’s not an enemy. It’s been trying to support us all along.”
Kavitha nodded slowly, scribbling in her notebook. “That’s the story we need to tell, isn’t it? People need to see that by neglecting nature, we’re only hurting ourselves. And even though we’ve been careless, nature hasn’t given up on us. It’s still trying to help us survive, whether it’s through trees absorbing pollution or bees pollinating crops. But for how long?”
Arun looked thoughtful. “We need to rethink how we live. Urban planning can’t just be about expanding cities. It has to be about restoring balance. Imagine cities filled with green corridors, fruit-bearing trees, and wetlands that help manage floods. It’s possible, but only if we stop neglecting the natural world.”
Suma’s face lit up with a spark of hope. “Maybe we should start something ourselves. A campaign to make sure future afforestation efforts focus on the right kinds of trees. We can get the public involved. I’m sure people will support us if we show them how much better things can be.”
Kavitha jotted down notes quickly. “I can cover this in the paper, write about how critical it is. We could reach out to the government, local leaders, and citizens. Together, we might be able to create some awareness.”
Arun smiled. “I’ll make sure the urban planning council hears about this. I’ll push for fruit-bearing trees and better integration of green spaces. We’ve ignored this for too long.”
As they left the café that evening, they felt a renewed sense of urgency. The challenges were immense, but they knew that by restoring harmony between humans and nature, there was still hope. Nature, after all, had been patient for so long – it was time they started listening.
As they walked through the bustling streets, a lone monkey leapt from a building onto a nearby tree, looking for something that wasn’t there – a sign of the growing disconnect between nature and man, but also a reminder that nature, despite all it endured, still sought to help. It was now up to them to make sure that help wasn’t in vain.
We read in the history books that Ashoka has planted trees on both sides in the road. That gave not only fruits,but also shade to the travellers and animals. Taking a leaf from that, these four friends have started campaign on reforestation that too of useful trees, ecosystem protection, regenerative agriculture..etc . They could get both media and government’s help and support.
They have formed a group named  ‘Go Green’ and created awareness among people about reduce, re-use and recycle. They have also started educating people towards reduction in plastic usage, wastage of food and usage of fossil fuels. They were also successful in making the farmers turn to cow based agriculture. A meagre attempt from a small group of friends has grown multifold and started to give tremendous results.
The ‘Go Green’ group received the Indira Gandhi Paryavaran puraskar for their efforts. The four friends have decided to use that cash prize also for the same purpose. They visited colleges and schools and educated the NextGen the various ways to protect the environment. They propogated one slogan ‘Restore Harmony’.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కాలమే అనుకూలిస్తే..

by Madhu Jella November 30, 2024
written by Madhu Jella

కాలమే అనుకూలిస్తే….
దూరమైన బంధాలు అనుబంధాలు చేరువవుతాయి
లక్ష్యం చేరేందుకు దారులన్నీ సిద్ధంగా ఉంటాయి

ఆశలూ ఆశయాలు నెరవేరి జీవితమే
నందనవనమై పరిమళిస్తుంది

‘మార్పు’ ఏదైనా మంచిఫలితాన్నే ఇస్తుంది
ఎండమావులలోనూ నీరు ఊటలా ఉబికి వస్తుంది
బీడువారిన నేలలోనూ ఫలవంతమైన సస్యములే పండుతాయి

బలహీనుడనుకున్నవాడే
బరిలో గెలవవచ్చును
గరికపోచయైనా బ్రహ్మాస్త్రమే గావచ్చును
కుందేటిపిల్లయైన
కౄరసింహముపైకి లంఘించవచ్చును

కాలమే కలిసొస్తే…
ఒట్టిపోయిన బావులలో జలధార ఉబికి వస్తుంది
వ్యర్థమని తలచినదే అక్కరకొస్తుంది

దైవమే అనుకూలించి
తలచినదే జరుగుతుంది
అదృష్టమే తలుపు తట్టి విజయమే ముంగిటకు తెస్తుంది

కాలమే అనుకూలిస్తే ..
శిశిరంలోనైనా మోడులన్నీ చివురాకుల చిరునవ్వులు చిందిస్తాయి
మండువేసవైనా
పిల్లసమీరాల చల్లదనమే ఇస్తుంది

కాలమే కనికరిస్తే
అగ్నికీలలబడినా
పూలపానుపుబడిన రీతి
ప్రాణాలు నిలువవచ్చ
యమపాశమైనా
పూలహారమై హాయినీయవచ్చు

బండ్లన్నీ ఓడలై
ఘనమైన సంపదలతో తులతూగే చరితలే చూడవచ్చు
పామరుడే పండితుడై మహాకవి గావచ్చును
కుచేలుడే కుబేరుడై జగతిలో వెలుగొందవచ్ఛు

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us