మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

మిత్రుని కాలం

by Ramesh July 29, 2024
written by Ramesh

ఆనందమంటే
తారల్లా దూరతీరాల్లో ఉన్న మిత్రుడు
తళుక్కుమని చెంతన మెరవడం
రెండుమనసులు ముఖాముఖవ్వడం
కష్టసుఖాల కరచాలనమవ్వడం

ఎదురు చూపులంటే
క్రొత్తజంట కలయిక కోసం కలగనడమే కానక్కర్లేదు
ఇన్నాళ్లు నేను మోసింది
ప్రేయసీ ప్రియుల విరహానికి
ఏ మాత్రం తీసిపోనిదని నేను భావిస్తాను

దీన్ని స్నేహవిరహమని
అనురాగ విరామని అంటాన్నేను

నీళ్లులేక ఎండలకు వలవల
వాడిన పూలచెట్టు
చిరుజల్లులకే
కొమ్మ కొమ్మల పూలై పూచిన చెట్టూ ఆకాశం
పువ్వై నవ్వడమే కదా అందమంటే

ఎన్నాళ్లుగా ఎదురు చూసిన
స్నేహితుని ముఖము
నాకు కేవలంగా కళ్లు ముక్కులు కానేకాదు
అది వేలకొమ్మలు పూచిన మహాపూలమాను

ఎండిన గుండైన చెరువు
వానాకాలం చెరవుగట్టు దాకా
నీళ్లతో నిండిన చందం
చిరకాల మిత్రుడు కలసిన ఆనందం
మమతల మాటలన్నీ అలలు అలలై
మనసునే తాకుతాయి
ఆ సమయమే
ఆ సమయమే మరుపురానిది
ఆ కాలం మిత్రునికాలం.

చందమామను మబ్బులు దాచినట్టు
మిత్రుణ్ణి వేసవి సెలవులు దాచాయి

జీవితాలకే చావుపుట్టుకలు
స్నేహమెపుడూ శాశ్వతమే
మనసున మనసైన
చెలిమి తోడుంటే అదికదా స్వర్గము.

మిత్రుని చెంత ఆనందం ఉంటే
ఆ ఆనందం
వేసవి సెలవులవెంటే ఉందనుకుంటా బహుశా
వేసవి సెలవులు వస్తే
ఉపాధ్యాయులకు,బడి పిల్లలకు సంబరమైతే
అల్లరిపిడుగుల అమ్మానాన్నల్ని,నన్నూ
ఒకింత భరించరానితనం అల్లుకుంటుంది

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వేణు నక్షత్రం కథలు సమకాలీన జీవన చిత్రాలు

by రంగరాజు పద్మజ July 29, 2024
written by రంగరాజు పద్మజ

వేణు నక్షతం కవి, కథా రచయిత. అమెరికా లో నివసిస్తున్నా భారత దేశాన్ని అను క్షణం మననం చేసుకుంటూ ఉంటారని వీరి కథలను చదివినప్పుడు కలిగిన అభిప్రాయం. “మౌనసాక్షి” “అరుగు “అనే రెండు కథా సంపుటాలు వెలువరించారు.

రైల్వే సత్యం ,అరుగు, బిడ్డా నువ్వు గెలవాలి! ధీమా పార్ట్ 1, ధీమా పార్ట్-2,వేకప్, మరియు ముద్రణా రూపంలో మృగాల మధ్య, నాతిచరామి, అశృవొక్కటి,
కౌముది నాటకం మరియు కథ, పర్యవసానం మొదలైన కథలు సమీక్ష కోసం ఎన్నుకున్న కథలు.

” ఏయది హృద్య మపూర్వం బే
యది యెద్ధాని వినిన యెరుక సమగ్రం బై యుండు అఘ నిబర్వణ మే యది యక్కథయే వినగ నిష్టము మాకున్॥”
అంటే కథ హృద్యంగా ఉండాలి !అంటే మనసును ఆకట్టుకునేలా… అపూర్వంగా అంటే అంతకుముందు చెప్పబడని కథ, లేదా ఇంత గొప్ప కథ నేనెప్పుడు వినలేదే? అని అనిపించాలి అని భావము.

సూతుడిని శౌనకాది మునులు అడిగిన ప్రశ్న ఇది!

ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంచి కథ వినదలచుకుంటే అడగాల్సిన ప్రశ్న ఇది. అఘము అంటే పాపమనే కాకుండా అలసట అని కూడా అర్థం ఉన్నది అలసట తీరే కథ చెప్పమని అడుగుతారు మునులు. అలసట అనేది ఒక శరీరానికే కాదు మనసుకు ఉంటుంది ఆ మనసు అలసట తీరేలా కథ చెప్పాలని ఇక్కడ ఒక హృద్యమే సరిపోదు!

కథ అంటే నీతి ప్రబోధమని…,
కథంటే ఆ కాలంలో నివసించే రీతులు చెబుతుందనీ….
కథ అంటే నిజాయితీ నేర్పిస్తుందనీ,
జీవన ప్రమాణాలు పెంచుతాయని విమర్శకుల ఉద్దేశ్యం…
పిల్లలకు- పెద్దలకు మానసిక వికాసం కలిగించేవి కథలు,
కథలు కళాత్మకమైన ఆలోచనలు కలిగించాలి!
రచయిత కథ చెప్పేటప్పుడు ఆ కథలలోని రేఖా మాత్రపు తన ఆలోచనను, బుద్ధి కుశలతను తన శిల్పంతో పాఠకులకు అందించాలి.

ఇక వేణు నక్షత్రం అశ్రువొక్కటి కథ చదివినప్పుడు… మా అన్నయ్య చాలా కాలం కింద మాకు చదివి వినిపించిన అనా ఫ్రాంక్ డైరీ నవల గుర్తొచ్చింది. ఇందులో 14 సంవత్సరాల అమ్మాయి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనలను తన డైరీలో రాసుకుంటుంది.
హిట్లర్ సాగించిన మారణకాండలో అనా ఫ్రాంక్ చనిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అటక మీద మూడు నెలలు దాక్కొంటారు. అప్పటి యదార్థ సంఘటనలు అన్నీ పూసగుచ్చినట్టు రాస్తుంది. అదే నవలగా వచ్చింది.
ఈ కథ నన్ను ఓ 45-50 సంవత్సరాల వెనక్కు తీసుకెళ్ళింది.
అన్నలు అని పిలిచే ఉద్యమకారుల గురించి, వాళ్లు సాధిద్దాం అనుకునే ఆశయం గురించి, వారు ఎన్నో కష్టాలు పడడం, అడవుల్లో వారి జీవితాలను గడిపేయడం, వారి ఆచూకీ తెలుపమని వేధించే పోలీసుల గురించి మా ఊళ్లో కథలు..కథలుగా చెప్పుకునేవారు.
కాబోయే పరిస్థితి ఏంటో తెలియనందున వారెందుకు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం వల్ల ఏం సాధిస్తున్నారో తెలియదు అది సరే దాన్ని పక్కన పెడితే ఎంతో కష్టపడి పార్టీ నడపడానికి వారి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడానికి కూడా పెట్టిన డబ్బులు ఆ సైద్ధాంతిక విలువలు తెలియని వారు వాటికి విలువనివ్వక దుర్వినియోగం చేసి వారి గురించి ఆ కార్యకర్తల అవగాహన లేని తన గురించి చర్చించబడిన సంఘటనల సమాహారకథ ఈ అశృవొక్కటి.
కాల మధ్య కథ కూడా ఇలాగే నడిచింది… ఈ కథ నడక చాలా బాగుంది.
ఏ సమస్యైతే మనసును బాధ పెడుతున్నదో? ఆ బాధ తొలగించేలా అంటే ఆయా.. సమస్యలకు ఉపశమనమో? పరిష్కారమో సూచించే కథలు చెప్పితే యువత వారి జీవిత లక్ష్యాలను సాధించుకుంటారని కథా రచయిత ఉద్దేశం.
చెప్ప ప్రభావంతో కథ రూపురేఖ విలాసాలు మారిపోయాయి… ఇప్పటి సమీక్షలకు అవి అందవు.
కాలంతో పాటు మనము మారాలి!
మరి కథలు దేని గురించి చెప్పాయి అని అడిగితే… వెంటనే నాకు సమాధానం చెప్పడంరాదు కానీ కథలు మాత్రం ఏదో ఒక విషయం గురించి చెప్తూనే ఉన్నాయి.
అయినా కథా నియమాలను అనుసరించి సామాజిక పరిస్థితులు గానీ, సమకాలీన సమస్యలు కానీ కథా వస్తువులు అవుతాయి!
కానీ దాని చుట్టూ కథ అల్లడం అంత సులువేం కాదు! చెప్పాల్సిన విషయానికి తగిన పాత్రలను సృష్టించి, సన్నివేశాలు కల్పించి, పాత్రల అనుభవాలనుండి- ప్రవర్తన నుండి తన ఆశించిన భావం పాఠకులకు చేరేలా చేయడం కథారచన నియమం మరియు శైలి!
వేణు నక్షత్రం దాదాపు కథ నియమాలు పాటిస్తూనే రీడబులిటీ ఉన్న కథలనే రాసారు.
రీడబులిటీ ఉన్న కథలు చదువరుల పఠనం సాఫీగా సాగించడమే కాకుండా…ఆకర్షించాయి.అవగాహననూ పెంచాయి, ఆలోచనలను రేకెత్తించాయి. అందుకృ గాను రచయితను అభినందిస్తూ…
ఒక్కొక్క కథను చదివినప్పుడు నాకు కలిగిన భావాలు ఇలా ఉన్నాయి….
ఈ మృగాల మధ్య కథ దిగువ మధ్యతరగతిలోని ఆదాయమంతగా లేని కుటుంబా నేపద్య కథ కొంతవరకు అన్ని కథల వలనే నడిచి , బాబ్రీ మసీదు సమస్య వైపు మలుపు తిరిగింది.
అందునా కాంతమ్మ కులం గురించి చెబుతూ… “గరీబోళ్ల కులము” అని సమాజాన్ని ప్రశ్నించింది అని రచయిత అన్నారు.
తనకు జ్ఞానోదయం అయింది అని రాశారు. అలా రాయడంతో రచయిత హృదయంఅవగతం అవుతుంది పాఠకులకు….
ముష్కర ముఖ కాంతం మను విచక్షణారహితంగా పొడవడం ఆమెకు వైద్యం చేయించడం మానవత్వం ఇంకా బతికి ఉందనీ, ఉండాలనీ చక్కటి సందేశం ఇచ్చారు.
అధికార దాహానికి “మృగాలు వేటాడినా…
అమ్మా! అన్న మూలుగు అతనిక ఆనందాన్ని ఇవ్వడం, దానికోసం అన్ని మతాలవారూ ఆమె ప్రాణాన్ని నిలబెట్టారని చెప్పడం మతసామరస్యాన్ని చెబుతున్నదీ కథ!
నాతిచరామి
ఈ నాతిచరామీ కథ అమెరికా అబ్బాయితో ఇండియా అమ్మాయి పెళ్లి కథాంశం.
T.V నీ మోసాలు జరుగుతున్నాయని, బాధపడడం …కొంత కాలం ఏవేవో ఊహించుకోవడంతో చికాకులు కలిగినా, కొంతకాలం తర్వాత చక్కగా సాగినా.. కడుపులో Sisto రూపంగా వేదన మొదలై, పిల్లలు పుట్టరన్న విషయం కుంగ తీస్తుందా జంటను.
పిల్లల కోసం రమేష్ నురెండో పెళ్లి చేసుకోమని తల్లిదండ్రుల దగ్గర నుండి ఒత్తిడి రావడం నాతిచరామి అర్థం ప్రసక్తి రావడం, దానికి అర్థమే లేదని అనడం పావని మానసిక స్థితిని తెలుపుతున్నది…రచయిత నూతన థృక్పథం తెలుస్తున్నది.
విడాకులు ఇమ్మని అడిగినప్పుడు “విడాకులు నువ్విచ్చేదేముంది”? నేనే ఇస్తాను! అనే మాట ఆడవారికి స్వాభిమానం, స్వతంత్రత ఉండాలని చక్కని సందేశం ఇచ్చిన కథ .
ఇలా వేణు నక్షత్రం గారి రచన ఇటు ఆధునికతను అటు ప్రాచీనతను సంతరించుకున్నవి.
కౌముది
గుఱ్ఱపు స్వారీ చేస్తూ వర్తకం చేసే యువకుడి వలె రాకుమారుడు రావడం, అందమైన అమ్మాయిని చూసి ఆకర్షితుడవడం, ఆ అమ్మాయి సాహసాన్ని చూసి ఆశ్చర్య పోవడం, మిథిలా నగరానికి తోవ ఎటువైపు అని అడగడం… అది అక్కడికి కనపడుతుండడంతో…
కళ్ళు కనపడటం లేదా? అని ఆ అమ్మాయి ఆ రాకుమారుడిని వెక్కిరించడం…ఈ సంభాషణ చదువుతుంటే కాస్త జానపద పౌరాణిక కథను పోలి ఉన్నది కథ ధైర్యం తెలివి చూసి ఆశ్చర్యపోతూ నేను యువరాజునని నీకు ఎలా తెలుసు అని అడిగితే ఆ అమ్మాయి తన నాయనమ్మ గుర్రం మీద రాకుమారుడు వచ్చి తనను తీసుకుపోతాడు అని చెప్పిన మాటకు తమరే యువరాజు అనుకున్నానని అమాయకంగానూ చమత్కారంగాను అనడం..
అయినా ఈ దేశంలో ఆడపిల్లలతో మాట్లాడే సాహసం ఎవరికీ లేదనడం ఆ రాజు చక్కని పాలనతెలియ చెప్పినట్టైంది.
దేశ పౌరులకు నీతి- నిజాయితీ ఉండాలనే సందేశం చక్కగా కథ సాగుతూనే… కథలోనే ఇమిడిపోయింది.
కౌముదికి ప్రేమించానని,పెళ్లి చేసుకుంటానని మాట అయితే ఇచ్చి వచ్చాడు కానీ తండ్రి ఒప్పుకుంటాడా? లేదా? అనే సందేహం అలాగే ఉంది .
ఎందుకంటే తన ఒక్కగానొక్క అక్క తండ్రి తెచ్చిన సంబంధం కాకుండా… మంత్రి కొడుకును వివాహం చేసుకున్నందుకు కొత్త పెళ్ళి జంటకు మరణ దండన విధించడం గుర్తుకు వచ్చి, బాధ భయం రెండూ కలిసి, తండ్రికి తన విషయం ఎలా చెప్పాలో తెలియక, ఆయన పట్టింపులు నచ్చక తాను కోరిన కౌముదినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవడం అది తాననుకున్నంత సులువు కాదని అనుకున్నా గట్టి పట్టుదల కలవాడు కనుక తనకు లేని జబ్బు ఉన్నట్టు ప్రాణాపాయం ఉందని పుకారు పుట్టించాడు రాకుమారుడు.
పుకారులు నమ్మికుంటల రాజు తన కూతురు వివాహం రాకుమారుడుతో రద్దు చేస్తున్నట్లు కబురు చేయడం మరింత బాధపడిన రాజు కూతురు పట్ల చూపిన మండివైఖరితో ఆమె చనిపోవడం కొడుకు కూడా చనిపోతే తన గతి తన రాజ్యాంగము ఏమవుతుందని తన కొడుకుకు సేవలు వ్యాధి నయం చేస్తే అర్ధరాజ్యం ఇస్తాననడం ఎవ్వరూ రాకపోవడం తరువాత కౌముది తాను వైద్యం చేస్తానని యువరాజు దగ్గరికి వెళ్లిన కౌముదికి అసలు విషయం తెలిసి ఇద్దరు సంతోషంగా ఉండడం వ్యాధి తగ్గిందని సంబరాలు చేయడం ముందు ప్రకటించిన అర్ధరాజ్యం తీసుకోమని కౌముదిని అనడం..హ ఆమె తిరస్కరించడం
వ్యాధి వచ్చిన వారికి ఆదరణ ముఖ్యమనే
మరో సందేశాన్ని చక్కగా కథకు కనుగుణంగా రాశారు రచయిత.
ఈ ఆస్తి అంతస్తులు ముఖ్యం కావని, ప్రేమ ముఖ్యమనే మరో సందేశం ఇవ్వబడిందీ కథలో…
ఇక్కడ కాస్త ఉత్కంఠ అంటే సస్పెన్స్ కథను చదివించేలా తోడ్పడింది.
పూల మాలలతో వివాహం జరిపి, తెలిసి తప్పు చేయవద్దని… అలాగే తప్పు చేస్తున్న వ్యక్తిని సమర్ధించవద్దని రాసి,ఒక నినాదాన్ని గుర్తుచేశారు రచయిత.
ఏకపక్షంగా రాజే నిర్ణయాలు తీసుకోవద్దనీ… సభలోని వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని రాసి, ఈనాటి ప్రభుత్వాలకో హెచ్చరిక చేశారు వేణు నక్షత్రం .
ఈ కథ చదివినప్పుడు ఫీల్ గుడ్( Feel good)కథా కోవలోకి వస్తుంది అనిపించింది.
గుర్రం మీద రాకుమారుడు వచ్చి సామాన్యురాలు వివాహమాడనే కాన్సెప్ట్ తో ఉన్న కథలు వినక చాలా సంవత్సరాలు గడిచింది.
ప్రముఖ చలన చిత్ర దర్శకుడు విఠలాచార్య గారు సినిమాలు తీయడం మానేశాక ఈ గుర్రాల మీద రాకుమారులు వచ్చేసి సినిమాలు చూడనే లేదు.
కాబట్టి మనసుకు ఉల్లాసం, ఉత్సాహం కలిగి
వెనుకటి తరం కోరుకునే సుఖాంతం టైటిల్ పడింది.
సంతోషంతో కొనసాగుతున్న కుటుంబ కథలను చదివినప్పుడు మనపై ఆ సంతోష ప్రసారాలు మన మీద పడతాయనీ, అలాగే ఇలాంటి స్త్రీ- పురుష వర్ణనలున్న కథలను చదివితే భావుకత కలుగుతుంది. ఇలా కథ రకరకాల రసాస్వాదన చేస్తుంది.
కథ చిన్న పిల్లలకే కాదు పెద్దవారికి మానసిక వికాసం కలుగుతుంది. అటువంటి కథలే ఈ వేణు నక్షత్రం కథలు.
ఇవాళ మనమున్న సమాజానికి మానవత్వం మేలుకొలుపే కథలు మానవ సంబంధాలు మెరుగుపరుచుకునే కథల అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.
అదే కాకుండా ఎలా చెప్తున్నారు అన్నది కూడా ముఖ్యం. ఈ రెండూ కథ నిండుగా ఉండాలని మా నాన్నగారు అనేవారు..
వేణు నక్షత్రంకథలలో అలాగే ఆ రెండూ ఉన్నాయి. మొదట కథలు ఎలా ఉండాలని ఆకాంక్షించానో దాదాపుగా అలానే ఉన్నాయి.
కథా సమీక్షలు కొత్తగా కథలు రాసే వారికి ఎంతో ఉపయోగం. రచయితకూ ఉపయోగమే!
వేణూనక్షత్ర కలం మరిన్ని కథలను అల్లాలని..చదువరులను- వినుకరులనూ అలరించాలని శుభకామనలతో…

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వచన కవితాకన్య రూప లావణ్యం – దాస్యం సేనాధిపతి ‘దిక్సూచి’

by Aruna Dhulipala July 29, 2024
written by Aruna Dhulipala

          కాలక్రమానుగతంగా అన్ని రంగాల్లోనూ మార్పు అనివార్యం. అందులో దేనికీ మినహాయింపు ఉండదు. అలాగే సాహిత్యంలోనూ ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు సామాజిక పరిస్థితులకు, మనుష్యుల భావాలకు అనుగుణంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఛందో బద్ధమైన పద్యకవిత్వం నుండి, మాత్రా ఛందస్సులతో కూడిన గేయకవిత్వంతో పాటు అనేక కవితాప్రక్రియలు సాహిత్య పూదోటలో వికసించి లతలుగా పెనవేసుకున్నాయి. అటువంటి వాటిలో వచనకవిత్వానికి నేటికాలంలో ఎంతోమంది కవులు తమ హస్తాక్షరాలతో అలంకారాలు తొడిగి ప్రకాశింప జేస్తున్నారు.

        కవుల భావనా తరంగమై ప్రవహించి కవిత్వం ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. అలాగని అది ఎటువంటి నియమాలకు లోబడి ఉండక పూర్తి స్వేచ్ఛా కాంక్షతో రూపు దిద్దుకున్నప్పుడు కొంత లోప భూయిష్టంగాను, మరికొంత పొరపాట్లతోను, ఇంకొంత పాఠకులకు అనాసక్తిగా పరిణమించే అవకాశం లేకపోలేదు. జీవన మనుగడ నియంత్రణ అవసరమైనట్లే దేనికైనా ఒక నియమం, ఒక నియంత్రణ అత్యవసరం.

        ‘వచన కవితా పితామహుడు’ గా కుందుర్తి ఆంజనేయులు గారు ఆధునిక కాలంలో వచన కవిత్వ ఆవశ్యకతను గుర్తించి 1958 లో ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ ను స్థాపించారు. వచన కవిత్వ లక్షణాలతో ‘నగరంలో వాన’ కావ్యాన్ని రచించారు. ‘ఫ్రీవర్స్’ అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా తెలుగులో వచనకవిత చెప్పబడుతోంది. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్యులు, డా. సి.నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ మొదలైన వారు వచన కవిత్వాన్ని ఆదరించారు. రచించారు. తరువాతి తరాలకు మార్గదర్శకులయ్యారు.

         ప్రజలకు సన్నిహితంగా ఉండేందుకు, వాడుక భాషలో, అలతి పదాలతో, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వచన కవితకు ప్రధాన లక్షణం. దీన్ని రాసేటప్పుడు కవులు ఏ విధమైన నియమాలను, లక్షణాలను పాటించాలో, సమాజంలో ఏ విధంగా చైతన్యాన్ని వికసింపజేయాలో తెలుపుతూ దాస్యం సేనాధిపతి గారు ‘దిక్సూచి’ అనే పుస్తకాన్ని వెలువరించారు. దీనిని వచన కవితకు కరదీపికగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి ఈ పేరు పెట్టడం లోనే ఆయన అంతరార్థం ప్రస్ఫుటమవుతోంది. శక్తివంతమైన రచనా నైపుణ్యతను సాధించే దిశగా ప్రస్తుత కవులకు సుబోధకంగా, సులభసాధ్యంగా ఆయన ఈ పుస్తకాన్ని వెలువరించారు.
           ‘కవిత్వమంటే’ …అని ప్రారంభిస్తూ, అనేకమైన మౌలిక లక్షణాలను క్రోడీకరిస్తూ ‘కవిత్వంలో మానవతావాదం’ వరకు ఉన్న విభాగాలు  వచనకవిత్వ ప్రాధాన్యత, దాని నియమావళిని తెలుపుతాయి.

ఈ భాగాలలో దాదాపు 320 మందికి పైగా ప్రాచీన కవుల నుండి నేటి కవులవరకు వారి రచనలలోని పాదాలను దశలవారీగా ఉటంకించడం, స్వరూప సామ్యాలను తెలపడం సేనాధిపతి గారి తులనాత్మక పరిశీలనను ప్రతిబింబిస్తుంది.

          “కవిత్వమంటే హృదయాలను కదిలించే అనుభూతినివ్వాలి. వస్తువును దాచడం కాదు. పొరలు పొరలుగా విప్పుతూ పద బంధాలతో, భావచిత్రాలతో పాఠకుడిని తన్మయుడిని చేసేది కవిత్వం, కవిత్వం హృదయాన్ని మీట గలగాలి” ఈ మాటలు చాలు కవిత్వం రాసే కవుల కర్తవ్యాన్ని బోధించడానికి. దీనికి ఉపపత్తిగా ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ గారు రచించిన ‘కవిత్వం కావాలి కవిత్వం’ అనే కవితను మనముందు నిలుపుతారు.

         అలంకారాల గుబాళింపు, పద చిత్రాలు, ప్రతీకలు, విరుపులు, మెరుపులు, ఎత్తుగడ, ముగింపు ఎంతవరకు అమరాలో, ఒదగాలో అది మంచి కవిత్వమని నందిని సిధారెడ్డి గారు చెప్పిన భావాల విశ్లేషణతో సేనాధిపతి గారు ఉత్తమ కవిత్వానికి ఉండాల్సిన ఎన్నో లక్షణాలను విశదీకరిస్తారు.

డా. సి నారాయణ రెడ్డిగారు రాసిన ‘మనోదృశ్యం’ కవిత

ఎత్తుగడ….

“ఆ దృశ్యాన్ని ఎన్నాళ్లుగా చూస్తూ ఉన్నానో/
దాని అందాలను ఎన్నిసార్లు తాగి చూస్తున్నానో/
దాహం తీరలేదు”….ఇలా మొదలవుతుంది. అది పాఠకుని అవ్యక్తభావనలో ముంచుతుంది. అందుకే కవిత్వ నిర్మాణానికి ఎత్తుగడ చాలా ముఖ్యమైనది.
           అలాగే కవితా వస్తువును విశ్లేషించడానికి వినియోగించబడే భాష, పదబంధ ప్రయోగంలో ఔచిత్యం, శైలి, శిల్పం ఇవి ప్రధాన భూమికను పోషించడంతో పాటు నర్మ గర్భత, సంక్షిప్తీకరణలు, కవితా నిర్మాణంలో శబ్ద, అర్థాలంకార ప్రయోగాలు కవిత్వాన్ని పరిపుష్టం చేస్తాయంటారు సేనాధిపతి గారు.

ప్రముఖ కవి యాకూబ్ గారు…

“నిన్ను కలిసాకే
నా మనో ఉద్యానవనంలో పూలు పూచాయి
అక్షరాల కలువలు విప్పారాయి…..” అన్నప్పుడు

మరో ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి…

“ముక్కారు
పచ్చని వరెన్నుల్ని ప్రసాదించే
బంగారు బాతు మా వాగు..” అని చెప్పినప్పుడు
ఆ అలంకార ప్రయోగాలు ఎదలను హత్తుకుంటాయి.

            కవిత్వాన్ని నిర్వహించేటప్పుడు భావాలను గణాలుగా, భావవ్యక్తీకరణకు అనువుగా విభజించుకోవడం ఒక పద్ధతి. కవి ప్రతిభను వెల్లడించడానికి, కవిత్వ సౌందర్యానికి, పాఠకులలో ఆసక్తిని పెంచి, క్రమంగా కవిత్వంతో నడవడానికి, సులభంగా అవగాహన చేసుకోవడానికి ఈ గణాలు ఉపయోగపడతాయి.

‘కాలం కాలం చేసింది’ కవితలో సినారె గారు…

మొదటి పేరాలో మూడు పంక్తులు, రెండవ పేరాలో నాలుగు పంక్తులు, మూడవ పేరాలో మూడు, నాలుగవ పేరాలో రెండు…ఇట్లా స్వేచ్ఛా భావనకనుగుణంగా కవితను రూపొందించారు.

అదే విధంగా దాశరథి గారు ‘తమ పునర్నవం’ లో కావ్యంలో ‘రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందట’

అన్న శీర్షికతో రాసిన కవిత నిన్న, ఇవాళ, రేపు పేరాలుగా క్రాంత దర్శనం చేయిస్తుంది. ఈ భావగణాల్లో అక్షరాలు, పాదాల విషయంలో ఎటువంటి నియతి ఉండదు. భావమే ప్రధానం.

           ‘వక్రోక్తి’ వచన కవిత్వానికి ఉండే ప్రధాన లక్షణాల్లో మరొకటి. పాఠకుల హృదయంలో ఆలోచన రేకెత్తించి, స్తబ్ద మనస్తత్వాన్ని నిరసించడం కోసం వక్రోక్తి కొంతవరకు ఉపయోగపడుతుంది. వ్యంగ్యం, చమత్కారం వక్రోక్తికి ఆభరణాలు. కానీ అది వస్తువు యొక్క పరిధి దాటకూడదు. పదబంధ ఔచిత్యానికి భంగం వాటిల్లకూడదు.

శ్రీశ్రీ నిరసన గళంలో…
“మనదీ ఒక బ్రతుకేనా?
కుక్కలవలె నక్కల వలె
సందులలో పందుల వలె…..” అనే వక్రోక్తులు తమను
తాము ప్రశ్నించుకునేలా చేస్తాయి.

కవి డా. ఎన్. గోపి ‘ఫ్రీడం ఫైటర్’ కవితలో…
“అతడు నాకు రోజూ కనిపిస్తాడు
లక్షల్తో త్యాగాన్ని వెలిగించి
ఇంట్లో ఎండిన డొక్కల కోసం
ఇల్లిల్లూ తిరుగుతుంటాడు…” లాంటి పాదాలు ఆకలి పేగులను దృశ్యమానం చేస్తాయి.

          కవిత్వ నిర్మాణంలో ‘భావచిత్రాలు’ ఒక ప్రత్యేక లక్షణం. వీటిని ఇంగ్లీషులో ‘ఇమేజరీ’ అంటారు. భావచిత్రాలు కవి భావావేశాన్ని, భావధారను స్పష్టీకరిస్తాయి. భావచిత్రం కంటికి కనిపించేది కాదు. అనుభూతి ప్రధానమైనది.

దాశరథి గారి ‘అగ్నిధార’ లో
“లోకపు చీకటి చీరకు/ ఆకాశం రైక మీది/ చిన్ని చుక్కల పువ్వులు/ తళుక్కుబెట్ట గలిగేనా/ జరి అంచు మెరిసేనా?…..” లాంటి పాదాల భావ చిత్రాలు దృశ్యాలను కట్టెదుట నిలుపుతాయి.

అహ్మద్ ఫైజ్ రాసిన కవిత్వాన్ని వి.జి. కిర్నన్ ఆంగ్లంలోకి అనువదిస్తే దానిని జం జం సత్యనారాయణ అనే మహబూబ్ నగర్ కు చెందిన కవి తెలుగులోకి అనువాదం చేసారు. అందులో ‘నేటి రాత్రి’ కవితలో “ఈ రాత్రి వీణపై విషాద రాగాలకు/ గతం బాధలన్నీ దూరమైనాయి…..” వంటి పాదాలు కవిత్వ సౌందర్యాన్ని ఇనుమడింపజేసాయి.
సినారె గారు ‘రెక్కలు’ కవితా సంపుటిలో కొవ్వొత్తులు తాగుతాయి/తనమీద దాడి చేసిన/ పురుగుల రెక్కలను….. ” అంటూ అద్భుత భావచిత్ర పద మాధుర్యాన్ని అందించారు.

         కవిత్వంలో వస్తువు ప్రధానమన్నది అందరికీ తెలిసినదే. దాన్ని అందంగా, పొందికగా నిర్మించడంలోనే కవి సృజనాత్మకత ఆవిష్కారమవుతుంది. అయితే కవిత్వంలో విరుపులు, పాదాంతాలు వీటి దగ్గర ఉపయోగించే విరామచిహ్నాలు కూడా కవిత్వంలో ప్రాధాన్యతను సంతరించుకున్న అంశమే. వీటిని కూడా సందర్భోచితంగా, అవసరమైనంత మేరకే ఉపయోగించుకోవాలి.

       కవిత్వంలో ‘ఔచిత్య పద బంధ ప్రయోగం’ చాలా ముఖ్యమైనది. కవిత్వం మనిషి అంతరాత్మతో సంభాషణవంటిదంటారు సేనాధిపతి గారు. కవి తన భావావేశాన్ని కొన్నిసార్లు అగ్నిపర్వతంలా వెడల గక్కుతాడు. ఒక్కోసారి ఆర్ద్రతతో నల్లని మబ్బులా వర్షిస్తాడు. అయితే సంయమనం కోల్పోయే పరిస్థితుల్లో పద ఔచిత్య విస్మరణకు గురయ్యే ప్రమాదం ఉంది. పాఠకులలో అన్ని రకాల వాళ్ళుంటారు కాబట్టి సభ్యత, సంస్కారయుతమైన పదాలు కవికి గౌరవాన్ని ఆపాదిస్తాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరమని సేనాధిపతిగారు చెప్పిన విషయాలు కవులు తప్పక పాటించి తీరాలి.

        చాలా సందర్భాల్లో కవి ‘స్వగతం’ కవితారూపాన్ని పొందుతుంది. ఆనందం, విషాదం రకరకాల పాత్రలుగా దృగ్గోచరమవుతుంది. ఈ స్వగతాన్ని బహిర్గతం చేసేటప్పుడు చమక్కులు, వ్యంగ్యం, మెరుపులు, చురకలు చోటు చేసుకోవచ్చు. వస్తువు స్వగత రూపంలో అంతర్వేదన వాహిని అవుతుంది.

        కవిత్వ నిర్మాణంలో భాష చాలా కీలకమైనది. కవి తన హృదయంతో కవిత్వం రాస్తాడు. ఏ భాషలో నైనా కవులు విశ్వజనీన భాషకే పట్టం కడతారు. వస్తు రూపాలు, శిల్పం, అభివ్యక్తి వీటన్నింటికీ మూలాధారం భాష. కవిని కవిగా నిలబెట్టేది భాష. భాషకు కావలసింది పాండిత్యం కాదు వస్తువును ప్రతిభావంతంగా,

సందర్భోచితంగా, ఔచితీవంతంగా ప్రకటించడానికి మామూలు పదాలు అయినా ఉండవచ్చు అని తమ అభిప్రాయ ప్రకటన చేస్తారు సేనాధిపతి గారు. మాండలికంలో కవిత రాసేటప్పుడు మొదటి నుండి చివరిదాకా ఆ పదాలనే ఉపయోగించాలి. కవిత్వ పదాల్లో సంక్లిష్టత, సందిగ్ధతలకు తావు ఉండకుండా జాగ్రత్త పడాలి. అక్షరదోషాలు ఉండకుండా చూసుకోవాలి.

         ఇక ‘ముగింపు’ అనేది కవితను మొత్తంగా ఆలోచింపజేస్తుంది. ఇది కవి రచనా నైపుణ్యాన్ని వ్యక్తీకరిస్తుంది. కవి శైలి,ముద్ర ఇందులో కనిపించాలి. ఇది ఆలోచనాత్మకంగా, సందేశాత్మకంగా ఒక వ్యంగ్యం, ఒక మెరుపు, ఒక చురుకు, ఒక చరుపులతో ఉండాలి. కొత్త ఆలోచనకు తెరతీయాలి. కవితాత్మకమైన స్పష్టత కనిపించాలి. ఇవన్నీ రావాలంటే కవికి అధ్యయన శీలత్వం, ప్రముఖుల రచనల పరిశీలన, వాటి తీరుతెన్నులను గ్రహించే నేర్పు ఉండాలని కవులకు పథ నిర్దేశం చేస్తారు దాస్యం సేనాధిపతి గారు. ఇంకా ఇలాంటి అనేకమైన విషయాలు ఈ పుస్తకంలో పొందు పరచబడ్డాయి.

         నేటి కాలంలో కవులు, కవయిత్రులు అనేక మాధ్యమాల ద్వారా వారి కలాలను, గళాలను కదిలిస్తున్నారు. కొంతవరకు వాటిని పరిశీలిస్తే  ఆత్మవిమర్శకు తావు లేకుండా, రాయడమే ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాంటి వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం దిక్సూచి. రాయడం ప్రారంభించాలనుకున్నవారికైనా, రాస్తున్న వారికైనా ఆత్మ పరిశీలన చేసుకొని మంచి కవిత్వాన్ని రాయగలిగే మెళకువలను బోధించే ఉత్తమ గ్రంథమిది. దీనికోసం ఆయన చేసిన కృషి అనితరసాధ్యం. ఎవ్వరైనా చేతి ఊతంగా దీన్ని పట్టుకొని వచన కవితా సాగరతీరాన్ని సులభంగా చేరుకోవచ్చు.  తరతరాలు నిలిచివుండేలా ప్రామాణికమైన కవిత్వ లక్షణాలతో ఒక గొప్ప పుస్తకాన్ని అందించిన సేనాధిపతిగారు అభినందనీయులు.

July 29, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

పిచ్చుక

by Gaddam sulochana July 29, 2024
written by Gaddam sulochana

ఊర పిచ్చుక ఊరు వదిలిందా? ఊరు పొమ్మందా?
చేలల్లో ,చేలకల్లో, వాకిళ్లలో నీ సందడి లేక చిన్న పోతుంది.

వాడదాటి, ఊరు వదిలి, చూరు విడిచి పోయావెక్కడికి?
నీ కిచ కిచల పాటలు
ఓర చూపులు
చిలిపి గంతులు
నీటి ఆటల చిందులు చూస్తుంటే మాకెంత ఆనందమో! తెలుసా?
చిన్ని రెక్కలతో తుర్రుమని ఎత్తులకు ఎగిరిపోతావు.

చూరులో నీవు గూడు కడితే మురిసిపోయాము.
ఇప్పుడేమో
కనపడవు
వినపడవు..
బుర్రుపిట్ట పాటలు
పిట్ట కథలు
పిచ్చుక గుళ్ళు
ఇక కట్టు కథలు అంటే తట్టుకోలేము.

బుజ్జి పిట్ట బాధ ఎవరికి
పట్టదు..
మనిషి మారిపోయాడు..
స్వార్థంతో ప్రకృతి
వినాశనం..
ఎండవేడి భూతాపం కాలుష్యాలు..
తాళలేని చిన్ని ప్రాణి..
తిండి లేక,నీరు లేక, తలదాచుకోలేక తల్లడిల్లుతున్నది. రెక్కలు ఉడిగి పిట్టలు పిట్టల్లా రాలిపోతున్నాయి..
పిల్లల బంగారు
బాల్యంలో బంగారు
పిచ్చుక సందడే
లేదు.

చిన్ని ప్రాణులను
చరిత్రలోకి తోయొద్దు
నిలుపుకుందాం..

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శవ యాత్ర “పాఠం !”

by రాఘవాచార్య‌ July 29, 2024
written by రాఘవాచార్య‌

పటాటోపంగా ప్రచారంగా
పైన కాషాయం గుర్తులు లేకుంటేనేం
శవం నిజంగా త్రికరణ శుద్దిగా సన్యాసి !
కండ్లు మూసుకుని జపంలోనే ఉంటుంది
దొంగజపం కాదు సుమా!
గిచ్చినా లేవదు

ఆశగా వెంట దాచుకుని ఏమీ తెచ్చుకోదు !
బహిరంగంగా ఊరందరి ముందే నిష్క్రమణ !
చివరకు తన పైన చల్లిన రుచికర కరకర పేలాలను
కాకులకే వదిలేస్తుంది !

వెంట వచ్చిన వారిని తనను మరిచి పొమ్మంటుంది 
ఉన్నవన్నీ వదిలేసిన
వఠ్ఠి వఠ్ఠి చేతులు !
కనీసం కాళ్లకు చెప్పులైనా లేవు

ఖాళీ ఖాళీ చేతులుగా
శవం ఎంతో విశ్వాసంగా విశ్వజనీన సత్యం !
 ఎవరైనా శవ యాత్రలో పాల్గొంటే పరిణతి చెందుడే !!
శవం బతికున్న వారికి మార్గదర్శనంగా లెజెండ్ !
“ప్రజా నాయకులై ఎంత దోచుకు తిన్నా
చివరకు ప్రజలకు వదిలేసి పోవాల్సిందేనని !!”
ఎంత గొప్పది  “శవం పాఠం”

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

The Learned

by Rudrakhala Matam Prabhu linga Shastri July 29, 2024
written by Rudrakhala Matam Prabhu linga Shastri

“I” could be understood
No doubt be in this regard.

He could understand “I”
As same “I” in any context?

If He could go on doing So
Chance would be there surely.

Is certainty possible there?
When Sincerity is in going on.

“I” would be understood means?
“HE” merges into “I” forevermore.

Without merging, Couldn’t He?
Understanding means Learning “I”
Who would be The Learned in Each.

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనసు – మాట

by Aruna Dhulipala July 29, 2024
written by Aruna Dhulipala

వాళ్లిద్దరూ….
ఎంతో ఆత్మీయులు
అప్పుడప్పుడు
విడదీయలేని శత్రువులు

అంతరంగ జగత్తుకు
ఒకరు సాధికారులు
శబ్దాశ్రయంగా
బహిరంగ స్వరాధికారులు
వేరొకరు

లోతుల్లోని భావాల
మర్మం ఒకరైతే
భావ వినిమయ ప్రసారాల
చతురులు మరొకరు

ఆలోచనల సూక్ష్మత
ఒకరిదైతే
పెదవుల వాహకంగా
పరుగులు తీసే
ధ్వని తరంగాలు ఇంకొకరివి

మనసు చెప్పినా
మాట పలుకదు ఒక్కోసారి
వద్దంటున్నా
పలుకక ఉండదు మరోసారి
వీటి మధ్య మౌనం
మింగుతుంది కాలాన్ని
అనేకసార్లు

మనసు, మాటకు నడుమ
కావాలి మేలనం
అదే కరువైతే
వ్యక్తిత్వపు చిరునామాకు
తప్పవు అవమానాలు
అనుభవం ఎంతటిదైనా-!!

దాచుకోవాల్సినవి కొన్ని
దాపరికం ఉండకూడనివి మరిన్ని
ఏది తగునో?
ఏది తగువో?
పెదవి దాటడమంటే
మనసు స్వచ్ఛమై వికసించడమే !!

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆషాఢం – విశిష్ఠత

by Vijaya Goli July 29, 2024
written by Vijaya Goli

భారతీయ హిందూ సంస్కృతి లో ప్రతి పురాతన సాంప్రదాయానికి శాస్త్రీయ కారణం ఉంటుంది . అలాగే మన తెలుగు నెలలు ఛైత్రము నుండి ఫాల్గుణం వరకు ప్రతి మాసం ప్రత్యేకమైనదే.ప్రతి మాసానికి ఆ సమయపు వాతావరణాన్ని బట్టి ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ,శాస్త్రీయ బద్ధంగా ఉంటాయి.ఇపుడు మనం ఆషాఢ మాసం గురించి విశ్లేషించుకుందాము.
ఈ సంవత్సరం జూన్ 24ఆదివారము నుండి మొదలుగా జులై 21 వరకు ఆషాఢ మాసం వుంది .
ఆషాఢమాసం అనగానే అందరికీ ముందుగా గుర్తు కొచ్చేది వానలు .
తెలుగు నెలలలో ఛైత్రం తర్వాత ఆషాఢం నాల్గవ నెలగా వస్తుంది .ఆషాఢ పౌర్ణమి ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ కానీ నక్షత్రాలతో కలిసి వస్తుంది కాబట్టి ఆషాఢ మాసంగా పరిగణించారు .
ఈ నెల నుండే వర్షాకాలం మొదలవుతుంది. అప్పటి వరకు వున్న వేసవి తాపాన్ని చల్ల బరుస్తూ ..చిరు జల్లులతో వాతావరణం చాలా ఆహ్లాద కరంగామారుతుంది .
ప్రకృతి ఆకుపచ్చని చీర కట్టిన పెద్ద ముత్తైదువలా ఉంటుంది . వర్షంలో తడిచి …పచ్చగా కొత్త చిగురులతో నిగారింపు తేలుతుంది .ఆకాశమంతా ఒక్క సారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చి …ఆమబ్బుల మధ్య మెరుపు తీగల నాట్యం కనుల విందుగాకనిపిస్తుంది .అదేసమయంలో ఒక్కోసారి దేవ దానవ యుద్ధాన్ని స్పురణకు తెస్తూ భయపెడుతూ ఉరుములు ..ఒక్కోసారి శుభకార్యాలను గుర్తు చేస్తూ మంగళ వాద్యాలుగా వీనుల విందు చేస్తాయి .నదులు ,చెరువులు పొంగి పొర్లుతూ వుంటాయి. అంతలోనె మబ్బులన్నీ చెదిరిపోయి వెండి వెలుగులతో సూర్యుడు వేడుక చేస్తాడు. అప్పడప్పుడు హరివిల్లులు దాగుడు మూతలాడుతూ అల్లరి చేస్తాయి.వ్యవసాయానికి కూడా చాలా అనువైన సమయం .
శుభకార్యాలు చేయక పోయినా ఆధ్యాత్మికతను అంతరించుకున్న మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం అంతా విష్ణు చింతన మంచిదంటారు .
ఏకాదశి నుండి విష్ణుమూర్తి క్షీర సముద్రంలో యోగ నిద్రలో శయనిస్తాడని ,ఆరోజును శయన ఏకాదశిగా ,తొలి ఏకాదశిగా ఉపవాస వ్రతాలు ,సముద్ర స్నానాలు చేస్తారు . దక్షిణాయనం ప్రారంభ దినంగా కూడా శాస్త్రం చెపుతుంది .సాధు సన్యాసులు చేసే చాతుర్మాస దీక్షలు కూడా ఈ రోజు నుండే మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి తో ముగుస్తాయి .అలాగే భాను సప్తమి ఆ రోజు పగలు ,రాత్రి సమంగా ఉంటాయి.
ఈ మాసం లోనే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతాయి .ఆడవారికి విశిష్ఠమైన బోనాల పండుగ కూడా ఆషాఢం లోనే ఆరంభ మవుతుంది. ప్రకృతి ప్రసాదించే పచ్చని కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ఆరాధిస్తారు.మొదటి పంటగా అమ్మ వారికి నైవేద్యం పెడతారు.
ఆషాఢమంతా కూడా ఆధ్యాత్మిక పరిమళాలతో భక్తులు పరవశం చెందుతారు .ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి గురు పూర్ణిమగా ,వ్యాసపూర్ణిమగా పిలువబడుతుంది . గురుపూజ ఉత్సవాలు జరుగుతాయి .పితృ తర్పణాలకు ప్రత్యేకమైన మాసంగా కూడా పరిగణిస్తారు .
ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా చెప్పారు .వేసవి వల్ల వేడెక్కిన భూమి ఒక్క సారిగా వర్షాలతో చల్ల పడటం వలన వాతావరణం లో వచ్చే మార్పులతో
ప్రజల్లో రుగ్మతలు పెరుగుతాయి . అధిక వర్షాల వలన కాలువలు నదులలో కాలుష్యం చేరటం వలన అంటు రోగాలు ప్రబలుతాయి . చిత్తడి నేలల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందుతాయి .ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతారు . ఆషాఢం ఆడవారు గోరింట తప్పక పెట్టు కోవాలని వారి ఐదోతనానికి ముడి పెడతారు .అసలు శాస్త్రీయ కారణం …వర్షం వలన తడి ఆరక గోళ్ళు ,కాలి వేళ్ళు పుండ్లుగా మారుతాయి .గోరింట ఔషధ గుణాలు ఉన్న
మొక్క . చర్మ రక్షణగా పనిచేస్తుంది. అందువలన ఆడవారిని తప్పక గోరింటపెట్టుకోవాలని చెపుతారు .
కొత్తగా వివాహమైన జంటలు కలిసి ఉండ కూడదనే ఒక సాంప్రదాయం కూడా ఉంది .ఆషాఢ మాసం నెల రోజులు ఆడపిల్లను పుట్టింటికి పంపి.ఆషాఢం వెళ్ళగానే ఆషాఢ పట్టీ అనే వేడుకతో అల్లుడిని స్వాగతిస్తారు .వారి ప్రాంతీయ సాంప్రదాయాలను బట్టి వేడుకలు చేసుకుంటారు .కానీ..
నిజానికి శాస్త్రీయంగా …ఆషాఢంలో ఆడపిల్ల గర్భం దాలిస్తే …ప్రసవం నిండు వేసవిలో అంటే ఏప్రిల్ మే నెలల్లో వస్తుంది .ఆ సమయం ప్రసవానికి అనువైనది కాదు కాబట్టి ఈ నియమాన్ని పెట్టి ఉండవచ్చు .
ఇలా ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని శాస్త్రీయ కోణం లో ఆలోచిస్తే మన పండుగలు ,వేడుకల్లో ఎంత విలువైన సందేశాలున్నాయో అర్ధ మవుతుంది .ఆషాఢ మాసం ప్రతి రోజూ కూడ ఆధ్యాత్మికతను సంతరించుకుని వుంటుందనటానికి ఎలాంటి సందేహం లేదు .

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

లక్ష్మయ్య గారి కవిత్వంతో కరచాలనం…

by Senathipathi Dasyam July 29, 2024
written by Senathipathi Dasyam

ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు శ్రీదాస్యం లక్ష్మయ్యగారు 1979లోనే మంచిర్యాల నుండి వెలువడిన ‘మంచిరాల వెలుగు’ పత్రికలో తమ మొదటి కవితను అచ్చులో చూసుకున్నారు. అదే సంవత్సరం మంచిర్యాల కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న సందర్భంలో కళాశాల వార్షికోత్సవ కవితల పోటీలో ప్రథమ బహుమతిని పొందడం విశేషం! అలా మొదలైంది లక్ష్మయ్యగారి కవితాయానం.. తొలినాళ్ళలో.. డిగ్రీ చదివే రోజుల్లో జమ్మికుంట నుండి వెలువడే ”రచ్చబండ” వారపత్రికలో ఆయన తన రెండో కవితను అచ్చులో చూసుకుని.. మురిసిపోవడమే గాక వివిధ పత్రికలకు తమ రచనలను కవితల రూపంలో పంపడం, అవి ప్రచురింపబడటం.. కవిగా కొనసాగాలన్న కాంక్ష బలపడి.. ఇక వెనుదిరిగి చూసుకోకుండా నిరంతరం కవిత్వ సృజన చేస్తూ.. ముందుకు సాగడం ముదావహం.. ‘ప్రసారిక’ మాసపత్రిక సంపాదకులు నమిలికొండ బాలకిషన్‌ రావు, సాహితీవేత్త డా|| టి.శ్రీరంగస్వామి గారల ప్రోత్సాహంతో లక్ష్మయ్యగారు తమ కలానికి పదును పెట్టుకుంటూ.. క్రమబద్ధంగా కవిత్వరచనలో పరిణతి సాధిస్తూ.. ఉదయసాహితి సాహిత్య సంస్థను ప్రారంభించి.. తాను కవిత్వం రాయడంతో పాటు అనేకమంది వర్ధమాన, ప్రవర్ధమాన కవుల రచనలను ఏర్చికూర్చి కవితా సంకలనాలను వెలువరించి.. సాహితీ వికాసానికై కృషి చేయడం అభినందనీయం. ఉదయ సాహితీ ఆధ్వర్యంలో ‘నేటికవిత’ అంతర్జాల సమూహాన్ని ఏర్పాటుచేసి వందలాది మంది రెండు తెలుగు రాష్ట్రాలలోని కవులు, రచయితలకు అండగా నిలిచి, పలు వైవిధ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సాహితీ సేవలో తరిస్తున్నారు. చిన్ననాటి నుండే సామాజిక అంశాల పట్ల స్పందించడం.. అభ్యుదయ భావాలను పుణికి పుచ్చుకోవడం వల్ల కవిత్వ సృజన పట్ల లక్ష్మయ్యగారు ఆకర్షితులై.. నిరాటంకంగా తమ సాహితీయానం కొనసాగిస్తూ.. నేడు ఓ కవిగా, రచయితగా, విమర్శకునిగా అందరి మన్ననలు పొందడం అభినందనీయం.. పాత్రికేయునిగా పనిచేసిన కాలంలోనూ.. లక్ష్మయ్య గారు వార్తా రచనతో పాటు కవిత్వ సృజన పట్ల మక్కువను పెంచుకోవడం విశేషం.. ఇక ఆయన నాలుగు థాబ్దాలుగా రాస్తున్న కవిత్వం గురించి పరిశీలిస్తే.. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ రెండో సం|| చదువుతున్నప్పుడే 1982లో తమ తొలి కవితా సంపుటి ”భావచిత్రాలు” పేరుతో వెలువరించి అందరి దృష్టిని ఆకర్షించారు.. సమాజం గురించి ఇంకా పూర్తి అవగాహన పొందకముందే.. సమాజంలోని లోపాలను ఎత్తి చూపిన ఘనత ఆయనకు ఉంది.

మినీ కవితల సమాహారంగా రూపుదిద్దుకున్న ‘భావచిత్రాలు’ కవితా సంపుటిలోని కవితల్లో లక్ష్మయ్యగారి కవితా పటిమను చూసి అందరు ఆశ్చర్యపోయేవారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన మినీ కవితల రూపంలో ప్రకటించిన భావాలు.. సామాజిక చైతన్యానికి దోహద పడేలా కొలువుదీరాయి.. ప్రభువుల పాలనను ఎండగడుతూ.. లోకంలోని అసమానతలపై ధ్వజమెత్తుతూ.. సూటిగా.. ఘాటుగా.. పదునుగా ఆయన రాసిన మినీ కవితలు కవిగా సాహితీలోకంలో నిలదొక్కుకోవడానికి మార్గాన్ని సుగమం చేశాయి. ‘భావచిత్రాలు’లోని కవితల్లో భావతీవ్రతను, చక్కని భాషతో భావాలకు మెరుగులద్దడం.. వంటి అంశాలను చూస్తాం.. ‘బ్రహ్మరాక్షసి’ శీర్షికతో రాసిన మినీ కవితలో లక్ష్మయ్యగారు నిరుద్యోగంపై రాసిన భావాలు ఇలా ఉన్నాయి.

నిరుద్యోగం ఒక పీడ
దేశ ప్రగతికిది అడ్డుగోడ
అరాచకాలకు జాడ
పడకూడదు సుమా ఈ నీడ! అంటూ దేశప్రగతికి అడ్డుగోడైన నిరుద్యోగ నిర్మూలనకై పాలకులు శ్రద్ధ చూపాలన్న అర్థం ధ్వనించే విధంగా రాయడం విశేషం !
”భావచిత్రాలు” పుస్తకంలోనే ”కలికాలం” శీర్షికతో రాసిన కవితలో మనిషి స్వభావంపై ధ్వజమెత్తారు.
మనిషిని
సాటి మనిషే
నమ్మని ఈ కాలంలో
ఇక…
ఈ మనిషి బతికుంటేనేం?
చస్తేనేం? అని వ్యాఖ్యానించారు.
మానవత్వం చూడని మనిషి మనుగడ నిరర్థకమని చెప్పకనే చెప్పారు. ”అసలు విషయం” కవితలోనూ లక్ష్మయ్యగారు ఆలోచనాత్మక భావాలకు చోటు కల్పించారు.
పచ్చని ఆకు
రాలి పోతుంటేనే
‘అయ్యో’ అనని జనం
పండుటాకు
రాలిపోతుంటే మాత్రం
‘పాపం’ అంటుందా? అని ప్రశ్నించారు.
‘నిజం’ మినీ కవితలో ఉద్యోగం లేక.. నిరుద్యోగి పడే వ్యథలను మూడు ముక్కల్లో చెప్పారు. అంత్య ప్రాసలతో సాగే ఈ కవిత అందరినీ ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంది.
నిరుద్యోగి
ప్రారంభిస్తే ఉద్యోగాల వేట
ఖాళీగా
లేవంటారడిగిన చోట
టిది
ప్రతి ఆఫీసులో పాడే పాట
నిజం కాదంటారా ఈ మాట అంటూ రాయడం బాగుంది.
”భావచిత్రాలు” కవితా సంపుటి తర్వాత లక్ష్మయ్యగారు చాలాకాలం పాత్రికేయ వృత్తిలో బిజీగా ఉండటం వల్ల తమ రచనలను గ్రంథరూపంలో తీసుకరావడానికి సమయం చిక్కలేదు.. 2002లో ఆయన ”తండ్లాట” పేరుతో తమ రెండో కవితా సంపుటిని సాహితీలోకానికి అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో వెలువరించిన గ్రంథమిది! ఈ సంపుటిని వరంగల్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక రెండో రాష్ట్ర మహాసభల్లో.. పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావుగారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడటం విశేషం. ఇందులోని కవితల్లో పేగుబంధం విలువనే కాదు, బతుకు బందీఖానాలో బలిపీఠమెక్కి కూర్చున్న దగాపడ్డ జీవితపు జ్ఞాపకాలు, నీవెన్ని గుసగుసలు చేసినా.. మా రుసరుసల్ని చల్లార్చలేవంటూ చేసే ధిక్కార స్వరాలు.. అడుగడుగునా కానవస్తాయి. ఇంకా చిరునవ్వుల బేరాలను.. మాతృభాషా సుగంధ పరిమళాలను, బద్ధలైన బంగారు కలలను ”తండ్లాట” కవితల్లో మనం గమనిస్తాం.. ఇంకా..

”మనస్సులో ఆలోచన తళుక్కుమన్నప్పుడు
భావం భళ్ళున కక్కేస్తుందంటూ”
”ఆనవాళ్ళు” కవితను రూపుదిద్దారు.
”బంగారు పంటల పల్లెసీమల్లో
మేడల మిద్దెల నగర వీధిలో
హుషారు మత్తుకు, నిషా జగత్తుకు
వృథాగా కాలం విడవకండి” అంటూ
”నీతికి ప్రాణం పోయండి” కవిత ద్వారా హితవు పలికారు.
”పేగుబంధం” కవిత ఆద్యంతం ఆర్ద్రంగా మలచబడింది.
ఉసిల్ల పుట్టలా సమస్యలదండు తరుముకొస్తుంటే..
అవస్థలతో ఆపసోపాలు పడుతూ ప్రాణం సగం చచ్చిపోయింది.
అంటూ ఈ కవితను ఎత్తుకున్న తీరు బాగుంది. బాధల సుడిగుండంలో నుండి బయటపడే మార్గంలేక విలవిలలాడుతోందని వాపోయారు. సత్తువలేని ఎముకలగూడు.. కాడెక్కెందుకు కళ్లింతలు చేసుకొని చూస్తోందనీ.. పేగు పంచిన జీవాలు- పేదరికమే నీ కర్మ అని.. అన్ని బంధాలు తెంచుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాయని అంటూ కొనసాగించి అందరి హృదయాలను కదిలించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తూ.. ”తొవ్వ జూసుకోండ్రి!” కవితను రూపుదిద్దారు.

మేం తలుసుకుంటే
మీకంటే మా దండిగనే మాట్లాడుతం
మాకు శాని రాదు గాని సక్కటిభాషే మాది
అంటూ స్వాభిమానాన్ని చాటారు.
దాచుకోవడం మా తెలంగాణలో లేదనీ దోచుకోవడం తెల్వనే తెల్వదని తేల్చిచెప్పారు.
చెప్పాలనుకున్నవి సూటిగానే జెప్పుతం..
ఎవ్వలకు తలొగ్గాల్లో- ఎక్కడ తగులాన్నో
గక్కడనే తగిలేటట్లు జేస్తం..
మా నాల్కలు తాడిమట్టలు కావు
మనుషుల్లెక్క మసలుతాం
మనసుపెట్టి మాట్లాడుతాం అంటూ కొనసాగించారు.
మాకెవ్వల సొమ్ము అక్కర్లేదు
మాయి మాకు దక్కితే సాలు…
అణగి మణిగి పడ్డది సాలు
మాకు సోయి లేదనుకోకుండ్రి
అనుభవాలు మాకు అన్ని నేర్పినయి
లొల్లిని షురువు జేత్తాన్నం..
తొవ్వ జూసుకోండ్రి
తోక ముడుసుకోండ్రి అంటూ నినదించారు.
తెలంగాణ ఉద్యమానికి ఉడుతాభక్తిగా లక్ష్మయ్యగారు తమ భావాలను అక్షరాల్లో నిక్షిప్తం చేసి.. ఈ కవితకు జీవం పోశారు. ”తండ్లాట” కవితా సంపుటి తర్వాత కొంత విరామం తో మళ్ళీ 2006లో ”బుర్కపిట్టలు” పేరుతో నానీల సంపుటిని వెలువరించారు. డాక్టర్‌ ఎన్‌.గోపిగారు సృష్టించిన నాలుగు పాదాల నానీల కవితా రూపాన్ని సుసంపన్నం చేస్తూ కవిగా తమ భావాలను నానీల్లో ప్రకటించి సామాజిక చైతన్యానికి కృషి చేశారు.

మట్టి లోపల గింజ
గింజుకుంటేనే కదా
మట్టిపై
పొట్టకొచ్చేది అంటూ లక్ష్మయ్యగారు బలమైన నానీకి జీవం పోశారు. విత్తనం గురించి పైకి చెప్పినప్పటికీ మనిషికీ వర్తించేలా నర్మగర్భంగా చక్కని సందేశాన్ని అందజేశారు.
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని గుర్తు చేశారు. దేన్నైనా సాధించాలంటే పట్టుదల, కృషి అవసరమని తెలియజేశారు.
లక్ష్మయ్యగారు స్వయాన ఉపాధ్యాయుడు కనుక.. ప్రతినిత్యం తాను ఉపయోగించే సుద్దముక్కను సైతం కవితామయం చేసి అర్థవంతమైన నానీని సృష్టించారు.

వేళ్ళ మధ్య
చాక్‌పీస్‌ అరిగింది
పిల్లల మెదళ్ళలో
విజ్ఞానం పెరిగింది అంటారు. నిజమే కదా!
మరో నానీలో…
వలసలు
ఆకలి చావులు
తెగిన పోగులు
నేతన్నల బతుకులు .. అంటూ నేతన్నల వ్యథాభరిత జీవితానికి అద్దం పట్టారు.

ధిక్కారమే
నీ స్వరం
కాళన్నా
నువ్వు తెలంగాణకే వరం అంటూ కాళోజీ పట్ల కవిగా తమ గౌరవాన్ని చాటుకున్నారు.

ఇలా నాలుగు పాదాల్లో ఇరవై నుండి ఇరవై ఐదు అక్షరాల్లో కవితాత్మకంగా నానీలను రాసి అందరినీ మెప్పించారు.

ఆ తర్వాత 2017లో ‘గునుక పువ్వు’ కవితా సంపుటిని వెలువరించారు. ఈ సంపుటిలో 75 కవితలు వైవిధ్యమైన కవితా వస్తువులతో కొలువుదీరాయి. అభివ్యక్తిలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ లక్ష్మయ్యగారు రాసిన కవితలన్నీ బాగున్నాయి..

ఆటలలో ఆటనై
కోలాటపు పాటనై
అమ్మలక్కల గొంతులోన
స్తుతియించెడి గీతీనై అంటూ
‘గునుక పువ్వు’ అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించారు.

అమ్మ ఒడిని మించింది
అవనిలోనే లేదు…
అమ్మ ఋణం తీర్చువారు
భువిలోనే లేరంటూ…

”అమ్మంటే” కవిత ద్వారా అమ్మ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పారు.
కవిత్వానికి కాదేదీ అనర్హం అని శ్రీశ్రీ నుడివినట్లు.. లక్ష్మయ్యగారు చీపురుపై కవితరాసి మెప్పించారు.

చిందర వందర చేసిన
చెత్తనంత పోగు చేసి
చీదరించుకోకుండా
చికాకు పడకుండా
చక్కని శోభను కూర్చే
చీపురూ.. నీకు వందనం అంటూ రాసిన తీరు బాగుంది.

అలాగే ”చిలుక్కొయ్య”, ”అలుకు పిడచ”పై కూడా కవితలను రాయడం విశేషం.

మనిషితనమంటే మనిషిని మనిషిగా చూడటమే.. మనిషితనమంటే మనిషి మంచితనంగా మసలుకోవడమే. మనిషి మనిషిగా, మనిషి మనీషిగా మారకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకమే అంటూ ”మంచితనం-మనిషితనం” కవితను రాశారు.

”వేకువ” కవితలో వేకువ కువకువలు విశాల ప్రపంచానికి.. వెచ్చని ఊపిరిని ఊదుతూ, కొత్త యుగానికి, యుగాదికి.. కొంగ్రొత్త స్వాగత గీతికను పాడుతూ… నవ పల్లవాలకు నాందీ పలుకుతున్నాయంటూ దుర్ముఖి నామ సంవత్సరానికి స్వాగతం పలికారు.

”రైతు ఎతలు పోవాలి” కవితలో ఓదార్పుమాటలు కాదు.. ఓట్ల రాజకీయాలసలే కాదు.. రైతు బతుకులు ఆగం కాకముందే రైతు జీవితాలలో వెలుగులు నింపే నిఖార్సయిన ఆలోచనలతో పాలకులు ముందుకు రావాలని కాంక్షించారు.

‘సర్వం సహచరిమయం’లో కవి లక్ష్మయ్యగారు తమ జీవిత భాగస్వామి గోదాదేవి గారి గురించి రాసిన పంక్తులు వారి అన్యోన్య దాంపత్యానికి అద్దం పట్టాయి.
సహచర్యం సంకలనమై
సమధర్మం సమ్మిళితమై
సమన్యాయం సంసేవితమై
సమదృష్టి సంవీక్షణమైతే
సర్వం సహచరి మయమే… అంటూ ప్రారంభించి
అక్షరించలేని ఆప్యాయత
విపులీకరించలేని వినయం
సంప్రదింపుల సలహా మణిహారం
సంతృప్త జీవనచిత్రం
అది సహచరి సమాదరత్వం అంటూ తమ శ్రీమతితో పెనవేసుకున్న బంధాన్ని తెలియజేశారు.

ఇల్లు ఇల్లాలుకు భాష్యం పలికి
కంటికి వెలుగైన నేస్తం
గోదాదేవి నా ప్రియనేస్తం
నా సర్వం నా సహచరి మయం అంటూ ముగించారు.

”ఆలోచన” కవితలో… ఆలోచన.. మనసుకో సులోచనమవ్వాలనీ.. మంచికి మార్గదర్శనం చేయాలని మనోనేత్రానికి ప్రతీక కావాలనీ కాంక్షించడం బాగుంది.
‘కవిత్వం-ఒక జీవన స్పర్శ’ కవితలో కవి లక్ష్మయ్యగారికి కవిత్వం పట్ల ఉన్న భావనలను చక్కగా విశ్లేషించారు. మనసు పొరల్లో చిక్కిన.. మర్మ భావనలను తొలగించేది.. తరిగిపోని అనుభూతుల స్మరణీయం చేసేదని వివరించారు. కవిత్వం- జీవధార కవిత్వం- ఒక హృదయ శ్వాస అంటూ కొనసాగించారు. కవిత్వం- ఒక ఆలాపన, కవిత్వం – ఒక జీవన స్పర్శ అని తేల్చిచెప్పారు. కవిత్వం ఒక వాహిని అనీ.. అదే నా ఊపిరి అని మంచి ముగింపునిచ్చారు. మరో కవితలోనూ.. కవిత్వం అమృతధారలను రుచి చూపిస్తుందనీ.. అమ్మలాలనను మరిపిస్తుందని ఆత్మీయతను అందిస్తుందని తెలియజేశారు.

2020లో ‘కనురెప్పల సవ్వడి’ కవితా సంపుటిలో 65 కవితలను పొందుపరిచారు. కవిత్వం మనిషి అంతరాత్మతతో సంభాషణ వంటిది.. ఈ సంభాషణ కవిలోనే ఉన్న కవితాత్మక ధ్యానంలో కొనసాగుతుంది. ఈ సంభాషణం ఫలితమే కవితగా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే లక్ష్మయ్యగారు ”కనురెప్ప సవ్వడి”లో చోటు కల్పించిన కవితల్లో ఆయన ఉత్తమ వ్యక్తిత్వాన్ని.. సున్నిత మనస్తత్వాన్ని.. సామాజిక దృక్పథాన్ని అడుగడుగునా గమనిస్తాం.

ప్రకృతి యొక్క ప్రాశస్త్యాన్ని ప్రస్తావిస్తూ… ”సంతృప్తగానం” కవితను రాశారు. సంతృప్తి.. మనిషి స్వరమైతే.. సంతోషాలు వెన్నంటే ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రకృతి మించిన పరిపూర్ణతకై పరుగు ఎండమావి వంటిదని పేర్కొన్నారు. మమతల మాధుర్యమే నీ సొంతం.. అదే కదా జీవిత మకరందం అంటూ కవితను ముగించడం బాగుంది.
భార్యాభర్తల బంధాన్ని ప్రతిఫలింపజేస్తూ ”సంసార గీతం” కవితను రమణీయ భావాలతో తీర్చిదిద్దారు.

సప్తపదుల సరిగమలు
సరాగాల మాధుర్యంలో
సరససల్లాపాల క్రీడాంగనం
అలుపేలేని జీవన యానానికి
ఆదరువయ్యే ఇంధనమంటూ
కవితను చక్కగా ఎత్తుకున్నారు.
ఆలుమగల యుగళగీతం అనురాగార్ణవాలకు ఆనంద హేతువులనీ.. మనసులు కలబోసుకొని.. మమతలు ముడి వేసుకుని.. కలిమిలేముల కాలాన్ని.. అనువుగా మలచుకునే ఇష్టపదుల గీతం అని తేల్చి చెప్పారు.

పెద్దలెన్ని సుద్దులు చెప్పినా
ఆలుమగలు అణకువతో
ఒద్దికగా దిద్దుకునే కాపురమే
అనురాగ గోపురం

అంటూ చక్కని భావాలకు అక్షరాకృతినిచ్చారు.

మంచు కురిసే వేళలో
మదిని దోచే భావ సమీరాలు
హేమంత గీతికల కచేరీలో
రాగ రంజితమౌ ఖజానాలు అంటూ ”భావవీచికలు” కవితను రూపుదిద్దారు.

”మనోహర దృశ్యం” కవితలో లక్ష్మయ్యగారు చక్కని భావుకతతో చిక్కని కవిత్వాన్ని రాశారు. అరుణ కిరణాల నులివెచ్చని స్పర్శకు అమలిన ఆహార్యపు తుషార బిందువులు.. ముగ్ధమనోహర ప్రకృతి వీడి.. నీరుగారి పోతున్న తీరు

ధరిత్రి ఒడిలో
తుషార బిందువులను జల్లి
తడి తడి తమకంతో తళుకులీని
శ్వేతవర్ణపు యవనికలను
తెరలు తెరలుగా పంపిస్తూ
మంచు దుప్పటిలా
మనోహర దృశ్యాన్ని ఆవిష్కరించింది అని రాయడం ఆయన కలం బలాన్ని సూచిస్తుంది.

లక్ష్మయ్యగారు తాను స్థాపించి నిర్వహిస్తున్న ‘నేటికవిత’ సమూహంపై రాసిన ‘500 సుమగంధాలు’ కవిత అందరినీ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

నేటి కవితతో
సహజీవనం చేస్తూ పరిమళాలు
సాహితీ సౌరభాలు పంచుతున్న
సమస్త సాహితీ దురంధరులు అంటూ కవితను ప్రారంభించిన తీరు బాగుంది.
నేటి కవితే శ్వాసగా
సమూహమే బాసటగా
అక్షర నైవేద్యాలతో
అయిదు వందల రోజులుగా
నన్ను నడిపిస్తున్న
నాతో నడిచివస్తున్న
నేస్తాలందరితో
అల్లుకున్న పరిమళాలను
ఆనందంతో ఆస్వాదిస్తున్నానంటూ చక్కగా ముగించారు.

”ఆలుమగల ఆల్బం” కవితలో…
కంటికి ఇంపైన కానుక
ఒంటరితనపు నిగళానన్ని చెరిపేసి
జంటగా వెంటవచ్చిన నేస్తం
మనసుతో పలికే మౌనగీతమే
మనోహర దృశ్యకావ్యం అని వ్యాఖ్యానించారు.

చెట్టాపట్టాలేసుకుంటూ
అలుపూ సొలుపూ ఎరుగక కడకు
అన్యోన్యతనే నిలుపుకు సాగే
మధుర భావనల మంజుల సర్వమే
ఆవిష్కృతమౌ ఇలలోనా… అంటూ రాసి ఆలుమగల బంధాన్ని అక్షరాల్లో నిక్షిప్తం చేశారు.

‘కనుపాపకే తెలిసేది’ కవితలో…
కాటుక చాటున దాగిన
కమనీయ కెమెరాలకు
చలువదనం చెమరించే
సుతిమెత్తని పార్శ్వం
చెప్పే ఊసులు, బహిర్గతం చేసే రహస్యాలు
మరో కంటికి కనబడనీయని
కనురెప్పల సవ్వడి.. కంటి పాపకే కదా తెలిసేది అంటూ రాయడం బాగుంది.

2021లో ”హృదయనది” పేరుతో తమ ఆరో కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకంలో 96 కవితలు భిన్నమైన కవితా వస్తువులతో ముస్తాబై రావడం విశేషం.

కలకు ఇలకు సౌమ్యం కుదరని
అందీ అందని అందలాలనూ గుర్తించని
అసమర్థుని ఆవేదనా సవ్వడి
అపరిపక్వ చేష్టల గారడి అంటూ
‘హెచ్చరిక’ కవితను తీర్చిదిద్దారు.

బతుకెంత విచిత్రం…
నింగినీ నేలనూ ఎదురెదురు దిక్కులని
దిక్కుతోచని సమాధానాల సుడిలో నేలరాలిన వసంతం..
అసంతృప్తిలోనే ముగిసిన జీవనయాత్ర..
గతి తప్పని సూరీడు గమనాన్ని
మననం చేసుకోని మసలు తీరు
చరిత్రలో ఒక పేజీగా
గుణపాఠం మూటవుతుంది
చక్రభ్రమణమై గోచరిస్తుంది
మనిషి మనిషికీ హెచ్చరికవుతుంది

అంటూ గొప్ప సందేశాన్ని అందించారు.
”పసిడి మనసు” కవితలో అన్నెం పున్నెం.. కల్లాకపటం.. ఈర్ష్యా ద్వేషం.. అహంభావం.. దరి చేరనీయని బాల్యం గురించి చక్కగా ఆవిష్కరించారు.

బోసినవ్వుల ఆరాటం
చెలిమి కలిమికై ఉబలాటం
ఆనంద డోలికలో సహవాసం
పసిడి పాపల సర్వస్వం అంటూ నవ్వుల పువ్వులు పంచే చిన్నారులను అందంగా ఆవిష్కరించారు.
”ఎంత హాయి” కవితలో రమణీయ భావాలకు చోటు కల్పించారు.

తెల్లని పిండార బోసిన
వెండి వెలుగుల జిలుగుల్లో
ఇంటి డాబాపై మల్లెల సౌరభాలను
మోసుకొస్తూ వీచిన గాలులు
మేనును తాకినపుడు
మనసు పరవశంతో
మధురగానం పాడదా? అంటూ లక్ష్మయ్యగారు చక్కని భావుకతను ప్రదర్శించారు.

ప్రవహించే నదిలా
రుధిర సంగమాల వేణిలా
మలినాల మాటల్ని తేటపరిచి
వర్ణాలు వేరైనా రక్తవర్ణమొక్కటనే
సందేశాన్ని సమాజానికి ప్రసరింపజేద్దాం
అంటూ ”హృదయ నది” కవిత ద్వారా పిలుపునిచ్చారు.

ఒక నీవు – ఒక నేను
తీరాలు – దేహాలు వేరైనా
వెన్నుదన్నుగా నిలిచిన మనోస్థైర్యంతో
చిత్రంగా మన ఇరువురి గుండెలయ
ఒకే గీతం ఆలపిస్తున్నాయంటూ నువ్వు నేనూ ఒక్కటేనన్న సమైక్య వాదాన్ని ప్రకటించడం ప్రశంసనీయం.
”స్వప్న జగత్తుకు నీరాజనాలు” కవితలో.. అస్తిత్వ భావనలు.. అంకురించి.. థాబ్దాల కలగా ప్రత్యేక రాష్ట్రం.. సాకారమై ఆవిర్భవించిన సందర్భం.. కలలకు హారతి పట్టిన నేపథ్యం.. చేతనత్వ ప్రతిబింబాలుగా ప్రతిఫలించి – స్వప్న జగత్తుకు నీరాజనాలు పలుకుదాం అంటూ పిలుపునిచ్చారు.
”కమనీయ చిత్రం” కవిత ద్వారా ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
అనురాగ బంధాలతో… ఆత్మీయతల కలబోతతో.. ఆప్యాయతా పలకరింపులతో.. వరసైన పిలుపులతో అలరారే ఆనందాల హరివిల్లు ఉమ్మడి కుటుంబాల లోగిళ్ళు సమాజంలో మళ్లీ చిగురు తొడగాలని కాంక్షించారు. వృద్ధాశ్రమాలను దృశ్యమానం చేస్తూ ”మమతల కూడలి” కవితను రూపుదిద్దారు.

ఆ నేలనేలంతా అనుభవాల సారవంతం
మమతల మాధుర్యాలు కురిపించి
బ్రతుకు పండించుకున్న పండుటాకులు
ముదిమి తోడై మురిపాలకు దూరమై
వృద్ధాశ్రమాలకు చేరువైన ఊడలు
ఆప్యాయతానురాగాలు కరువై
ఆశగా నిత్యం గేటువైపు చూసే కళ్ళు అంటూ
కవి లక్ష్మయ్యగారు ఆర్ద్రమైన భావాలకు చోటు కల్పించారు.

జీవన్నాటక ప్రయాణంలో
ఆత్మీయ బంధాల మైలురాళ్ళను దాటి
అనుబంధ సుగంధాల రాదారిలో
మజిలీలన్నీ మమతల కూడలులేనని
వ్యాఖ్యానించారు. నిజమే కదా!

”అద్దం’ కవితలో.. అద్దం.. నా అందచందాలకు చెలికత్తె.. వీలు చిక్కినప్పుడల్లా.. చూస్తూ.. మురిసి పోయే సమయాలు.. నేను యాది మరువని క్షణాలు అని కవితను ఎత్తుకున్న తీరు బాగుంది.
”మా ఇంటి వాలు కుర్చీ” కవితలో చిన్నప్పుడు మడత కుర్చీతో తమ నాన్నకున్న అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించారు.

మా ఇంటి మడత కుర్చీ
అదే తట్టు కుర్చీ
పేరేదైనా మా యింటి దర్పం మా వాలు కుర్చీ…
మా నాన్నకది సుఖాసనం
వాలుకుర్చీకి జనుపవస్త్రం తొడుగు
పొడవాటి చేతులు
పక్కనే ముక్కాలు పీట
దానిపైన పాన్‌ దానా అంటూ
వాలుకుర్చీతో ముడిపడి ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
పై ఆరు కవితా సంబంధ గ్రంథాలే కాక.. లక్ష్మయ్యగారు ఉదయసాహితి పక్షాన.. తమ సంపాదకత్వంలో బ్యాలెట్‌ బ్యాలెట్‌, బాల్యం-బతుకమ్మా, ఉదయకిరణాలు, తెలుగు వెలుగు, ఆకాశంలో సగం, చెలిమి, వసంత రాగాలు, గురువు, సహచరి, ముదిమి, వివాహబంధం వంటి కవితా సంకలనాలను వెలువరించారు. ”నేటి కవిత” అంతర్జాతీయ సమూహానికి సారథ్యం వహిస్తూ లక్ష్మయ్యగారు తమ సంపాదకత్వంలో కవిత్వం, కథలు, గేయాలు, చిత్రకవితలు వంటి అంశాలకు సంబంధించిన గ్రంథాలనూ ప్రకటించడం ప్రశంసనీయం – ఇలా శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్యగారు తమ కవితాయానం కొనసాగిస్తున్నారు. సామాజిక చైతన్యం కోసం అనేక సందేశాత్మక, కవితాత్మక కవిత్వాన్ని సృజన చేసి సాహితీ క్షేత్రాన కవిగా తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకోవడం ప్రశంసనీయం.
లక్ష్మయ్యగారి జీవితం, వ్యక్తిత్వం, వ్యవస్థా ప్రియత్వం అందరికీ ఆదర్శప్రాయం – జూలై 31, 2024న ఉపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

July 29, 2024 2 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.

by Narendra Sandineni July 29, 2024
written by Narendra Sandineni

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (1).
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
గుల్జార్ రాసిన షాయరీ కవితల్లో దాగిన అంతర్లీనమైన భావాలు ఒక్క సారిగా పాఠకుల హృదంతరాలను తట్టి లేపుతుంది.ఏదో తెలియని లోకంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది.కవి గుల్జార్ కు సమాజంలోని సాటి మనుషుల పట్ల అనన్య సామాన్యమైన ప్రేమ ఉంది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు హృదయాన్ని కదిలిస్తాయి. గుల్జార్ షాయరీ కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? షాయరీ కవితాచరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.సరి కొత్త అనుభూతులను సొంతం చేసుకోండి.
“నిన్ను చందమామతో పోల్చడం
“నాకెందుకు ఇష్టం కాదు కానీ …
“ఈ జనం ఉన్నారే … రేయంతా నిన్ను
“చూడడమే నాకు అభ్యంతరం మరి !
చందమామను ఆంగ్లంలో Moon అని అంటారు. రాత్రి పూట ఆకాశంలో నక్షత్రాలతో పాటు కనిపించేది చందమామ.ఒక గ్రహానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఉపగ్రహం చందమామ.భూమి చుట్టూ తిరిగే ఒక గ్రహం చందమామ.చంద్రుడు సూర్యుని ప్రకాశం వల్ల వెలుగుని ఇస్తున్నాడు.చిన్నతనంలో అమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ చందమామ రావె,జాబిల్లి రావె,కొండెక్కి రావె,గోగి పూలు తేవె అని పాడుతూ చందమామను చూపించడం మనం ఎరిగిన కథ. ప్రేయసిని నీవు అందంగా ఆకాశంలోని చంద్రబింబంలా ముగ్ధ మనోహరంగా మెరిసిపోతున్నావు అని అలనాటి ప్రబంధ కావ్యాల్లో చదివాం.జనం అనే పదం సాధారణ ప్రజానీకాన్ని, జాతీయ సమూహం,సమిష్టి లేదా సంఘాన్ని సూచిస్తున్నది.ఒకరి కన్నా ఎక్కువ మంది గల సమూహమును జనం అని కూడా అంటారు. సమాజంలో నివసించే వారిని జనం అంటారు. సూర్యుడు అస్తమించిన సమయం రేయి అంటారు. రేయి అనగా ఒక దినంలో విభాగం,సాయం సంధ్య వేళ నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలం. అతను తన ప్రేయసితో మాట్లాడుతూ ఆప్యాయతతో అనురాగం పల్లవించి దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు.నీవు ఎంతో అందంగా, అపురూపంగా కనిపిస్తున్నావు.అసలు దివి నుండి భువికి దిగి వచ్చిన మేలిమి బంగారు రంగు ఛాయతో అప్సరస వలె అగుపిస్తున్నావు.నిన్ను ఆకాశంలోని జాబిలితో పోల్చడం సరైనదిగా అనిపిస్తుంది.ఎందుకో తెలియదు కాని నీవంటే నాకు మరీ మరీ ఇష్టం.నీ అందచందాలకు సొగసు, సౌందర్యానికి దాసోహం అయ్యాను.ప్రేయసీ నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నాకు గడవదు.నిన్ను విడిచి ఉండ లేని మోహం కమ్ముకుంది.అది నీ పట్ల గల గాడమైన బంధం అంటారో,కామం అంటారో, అనిర్వచనీయమైన ప్రేమ అంటారో నాకైతే తెలియదు.కానీ ఈ లోకంలోని జనులు స్వార్థపరులు,విశాల దృక్పథం కొరవడిన చాలా చెడ్డ వారు.రేయంతా జనులు ఆకాశంలోని చందమామను చూస్తారు.అలాగే చందమామను చూసినట్లు నా ప్రేయసివి అయిన నిన్ను జనులు కామంతో కళ్ళు మూసుకుపోయి అదే పనిగా చూడడం నాకు అసలు ఇష్టం ఉండదు.నాకు అభ్యంతరంగా తోస్తుంది.ఇంద్ర సభలోని దేవ కన్యలను తలపించే అందంతో అలరిస్తున్నావు. నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దానివి.నీవు నన్ను గాఢంగా ప్రేమించే అందమైన ప్రేయసివి. ప్రేయసిగా నా గుండెలో నీకు మాత్రమే చోటు ఉంది. నా గుండెలో నివాసం ఏర్పరచుకొన్నావు.నా హృదయం విప్పి చూస్తే అందులో నీవే రూప లావణ్యాలతో మెరుస్తూ కనిపిస్తావు.నిన్ను చందమామతో పోలుద్దామని ఉంది కానీ ఈ చెడ్డ జనులు ఆకాశంలోని చందమామను అదో రకమైన కామ భావనతో చూడడం నాకు నచ్చలేదు.అందుకే నిన్ను చందమామతో పోల్చడం నాకు నచ్చడం లేదు.ఈనాటి జనులు పర స్త్రీల జోలికి వెళ్ళకూడదు.పర స్త్రీలను కన్నతల్లి వలె భావించాలి అనే సుగుణాలను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఏది సత్యం,ఏది అసత్యం,ఏది చేయాలి,ఏది చేయ కూడదు అనే ఇంగిత జ్ఞానంను జనులు ఎందుకో మర్చిపోయినారు.ఈనాటి జనులకు ఏ క్షణంలో ఎలా ప్రవర్తించాలి అనే వివేకం కొరవడింది.తల్లి పిల్లలకు సుగుణాలను ఉగ్గుపాలతో రంగరించి నేర్పిస్తుంది.తల్లి నేర్పిన సుగుణాలను మర్చిపోవడం వల్లనే లేని పోని అనర్థాలు,ఘోరాలు సంభవిస్తున్నాయి.గుల్జార్ కు జనుల విపరీత వింత స్వభావం మరియు అనైతిక చర్యల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది.జనుల అసభ్య ప్రవర్తన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం తగినది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావం అద్భుతంగా ఉంది. గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (2).
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి).

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ గొప్ప కవి,షాయరీ కవితల ద్వారా అద్భుతమైన భావాలను పండించాడు.గుల్జార్ షాయరీ కవితల్లోని పద సంపద,శిల్పం,పాఠకుల హృదయాలను అలరిస్తుంది.కవి గుల్జార్ కు హిందీ మరియు ఉర్దూ భాషలపై అద్భుతమైన అధికారం ఉన్నట్లుగా తోస్తోంది.గుల్జార్ రాసిన షాయరీ కవితల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? గుల్జార్ షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. సహజత్వం ఉట్టి పడే షాయరీ కవిత్వం యొక్క అనుభూతిని సొంతం చేసుకోండి.
“నా కన్నీళ్ళకి నువు లెక్క
“కట్టైతే చూడు !
“కొన్ని కోట్లు ఉండకపోతే చెప్పు !
కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి వాటిని తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని కన్నీరు అంటారు.కన్నీరు స్రవించే ప్రక్రియను ఏడవటం అనే చర్యను సూచిస్తుంది.దుఃఖం,సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినప్పుడు కన్నీరు ఉబికి వస్తుంది.ఏడవటం వలన కన్నీరు వస్తుంది.బలమైన భావోద్వేగాలు,నొప్పి,తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు స్రవిస్తుంది.కన్నీరు వ్యక్తుల మధ్య మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది. మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి.ఏడుపు మనిషిలోని ఒత్తిడిని తగ్గిస్తుంది.ఏదైనా బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు కార్చుతూ కుమిలిపోతూ చేసే క్రియ దుఃఖం.దుఃఖం వల్ల ఏదైనా పనిలో మనసు నిమగ్నం చేయ లేక పోవటం జరుగుతుంది. అనుకున్నది జరగనప్పుడు మనకు కలిగేది దుఃఖం. మనసు కలత చెందడం వల్ల దుఃఖం వస్తుంది.బాధ కలిగినప్పుడు దుఃఖం పొర్లుకు వస్తుంది.దుఃఖం వల్ల మనిషి హృదయం విలవిలలాడుతుంది.కంటి నుండి వచ్చేవి కన్నీళ్లు అంటారు.ఆమె కన్నీళ్ళతో తన గుండెలోని బాధను తెలియజేస్తున్నది.ఒక్క సారిగా మనసులో కలిగిన బాధను తల్చుకుని దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది.అనంత లోకాలకు వెళ్లిన అతను లేడు అనే విషయం తలుచుకొని గుర్తుకు వచ్చి ఆమెకు కన్నీళ్ల ధారలు ఆగవు.మనిషి దుఃఖముతో కన్నీళ్లు కార్చడం అనేది బాధల నుండి కోలుకునే ప్రక్రియలో ఒక భాగం.ఆత్మీయులను కోల్పోయిన ఆమె కళ్ళనుండి కన్నీళ్లు కాలువలై ప్రవహిస్తున్నాయి.కన్నుకు దెబ్బ తగిలి బాధకు గురి అయినచో వెంటనే కన్నీళ్లు వస్తాయి.మనిషి భావోద్రేకమైన కన్నీళ్లతో విలపించుట మనం ఎరిగినదే.కన్నీళ్లు ఎందుకు వస్తాయో అనే భావన అంతగా తెలియదు.ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు దుఃఖముతో కన్నీళ్లు కారుస్తాం. కన్నీళ్లు మన కన్నులని తేమగా ఉంచి కంటికి కనురెప్పలకు నడుమ రాపిడి లేకుండా చేస్తాయి. కన్నీళ్లు కూడా సహజమని దుఃఖించడం ద్వారా మనిషి యొక్క మనసు స్వాంతన పొందుతుంది. విచారం,దుఃఖం,కలతలతో కన్నీరుకు సంబంధం ఉంది.ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కన్నీళ్లు కాలువలై పారిన సంగతులు చూసిన దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి.ప్రజల గుండెలను పిండి చేస్తున్న సంఘటనలతో కన్నీళ్లు కార్చడం,హృదయాన్ని ద్రవింప జేస్తుంది.దుఃఖం ఒక సహజమైన మరియు సంక్లిష్టమైన ప్రక్రియ.ఇది ప్రియమైన వ్యక్తి మరణము సంభవించినప్పుడు వ్యక్తుల జీవితంలో మార్పులు ఏర్పడతాయి.మనిషి జీవితంలో దుఃఖం విడదీయ లేని ఒక భాగంగా మారింది.దుఃఖంతో విలపించడం కూడా ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటుంది.దుఃఖం బాధాకరమైనదిగా చెబుతారు.జననం దుఃఖం. వృద్ధాప్యం దుఃఖం.అనారోగ్యం దుఃఖం.మరణం దుఃఖం.ముఖ్యంగా ఎవరినైనా ఆత్మీయుని కోల్పోయినప్పుడు విచారం,దుఃఖం మనిషిని నీడలా వెంటాడుతాయి.యుద్ధం వలన దుఃఖం కలుగుతుంది.యుద్ధం మొత్తం మానవాళిని ప్రభావితం చేస్తుంది.మనం ఇష్టపడే వ్యక్తి చనిపోయినప్పుడు కలిగే దుఃఖం ఉంటుంది. వైఫల్యం వల్ల నిరాశ వల్ల కూడా దుఃఖం కలుగుతుంది.తీవ్రమైన దుఃఖముతో నా కళ్ళ నుండి ప్రవాహంలా కారుతున్న నీటి ధారలు మామూలుగా వచ్చే కన్నీళ్లు కావు.అవి బతుకు వేదన నుండి వచ్చిన కన్నీళ్లు.ఎంతో విలువైనవి.నేను కార్చిన కన్నీళ్లు హృదయపు లోతుల్లో నుండి వచ్చినవి.నా జీవితంలో నేను కార్చిన కన్నీళ్ళకు నువ్వు లెక్క కట్టి చూడు.మనిషి జీవితం అనేకమైన కష్టాలతో కూడుకుని ఉన్నది.జీవితంలో తాను అనుభవించిన కష్టాలతో పాటు లెక్కలేనన్నీ కన్నీళ్లు కూడా ప్రవాహమై పారినాయి.కన్నీళ్ళ విలువ లెక్క కట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.కన్నీళ్ల విలువ అసాధారణమైనదిగా చెప్పవచ్చు.కన్నీళ్లను లెక్క కట్టడానికి ఇంత వరకు ఏ తూకం కనిపెట్టబడ లేదు. కన్నీళ్లు మనిషి జీవితంలో ఎంతో విలువైనవి.మనిషి జీవితంలో కన్నీళ్లు అమూల్యమైనవి.అనంతమైన ఆకాశంలోని చుక్కలను లెక్క పెట్టడం సాధ్యం అయ్యే పని కాదు.అదే విధంగా మనిషి జీవితంలో కార్చిన కన్నీళ్ల విలువ కోటాను కోట్లు ఉంటుంది అనేది వాస్తవమని తోస్తోంది.నా కన్నీళ్ళు కొన్ని కోట్లు ఉండక పోతే చెప్పు అని కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి అను సృజన చేసిన కవయిత్రి డాక్టర్ గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(3)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలుగులోకి గీతాంజలి (డాక్టర్ భారతి) అను సృజన చేశారు.గుల్జార్ సమాజాన్ని ఔపోషణ పట్టిన వాడు.షాయరీ కవితలోని భావాలు ఒక్క సారిగా మనసును తట్టి లేపుతాయి.షాయరీ కవిత చదవగానే ఒళ్ళు పులకరిస్తుంది.మనలను ఆలోచింపజేస్తుంది. గొప్ప అనుభూతిని కలిగింపజేస్తుంది.గుల్జార్ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతుల సౌందర్యాన్ని ఆస్వాదించండి.
“బతకడానికి ముక్తసరిగా ఉండడం
“కూడా అవసరమే దోస్త్ … అది నీ
“పొగరనుకుంటే అనుకోనీ !
“ఎక్కువ వొంగి
“నడుచుకున్నావనుకో … ఈ లోకం నీ
“వీపుని కూడా ముక్కాలి పీట వేసి
“ఎక్కి తొక్కుతుంది !
ముక్తసరిగా అంటే టూకీగా అని ఆంగ్లంలో Briefly అని అర్థం.ఈ లోకంలో మనిషి ఎలా జీవిస్తున్నాడు? అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు.కొందరు బతకడం కొరకు జీవిస్తున్నాడు అంటారు.మరి కొందరు మరో రకంగా చెబుతారు.
ఎవరు ఎలా చెప్పినా కూటి కొరకు కోటి విద్యలు అనే సామెత నిజం అనిపిస్తుంది.మనిషి తన ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నెన్నో పనులు చేయవలసి ఉంటుంది.మనిషి కుటుంబ పోషణ కొరకు కష్టపడి పని చేయాలి.మనిషి బ్రతకడం కొరకు ఎక్కువగా కష్టపడి పనులు చేయనవసరం లేదు. మనిషి మితిమీరి కష్ట పడితే అనారోగ్యం పాలవుతాడు.మనిషి తనకు ఉన్న దానిలో తృప్తిగా బతకాలి.ఇతరులతో తన బ్రతుకును పోల్చడం వల్ల నిరాశ కలుగుతుంది.ఈ నిరాశ వల్ల మనిషి జీవితం వెతల పాలవుతుంది.ఈ లోకంలో ఎవరి బ్రతుకు వారిదే.ఈ లోకంలో ఎవరి జీవితం వారిదే.మనిషి ఇతరులు బ్రతకడానికి చేతనైనంత సహాయం చేయాలి.మనిషి ధర్మం ప్రకారం నడుచుకోవాలి. మనిషి తాను చేయవలసిన పని చేయడం ధర్మం అంటారు.ప్రతిరోజు మనిషి తాను చేయవలసిన విద్యుక్త కర్మలు నిర్వర్తించాలి.జీవితమంటే తమాషా కాదు. మనిషి జీవితంలో అది చేయాలి,ఇది చేయాలి అని అనుకుంటూ కాలాన్ని వృధా చేయ కూడదు.జీవితంలో మనిషి అనుకున్నది అనుకున్నట్లు అన్ని పనులు అప్పుడే జరగవు.మనిషి జీవితం గురించి గొప్పగా ఊహించుకోవడం వద్దు.మనిషి జీవితాన్ని సాధారణంగా భావించాలి.మనిషి తామరాకు మీది నీటి బొట్టులా జీవించాలి.మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు సహనం వహించడం నేర్చుకోవాలి.మనిషి జీవితంలో మంచి రోజులు తప్పకుండా వస్తాయి అనే ఆశాభావ దృక్పథంతో జీవించాలి.మనిషి జీవితంలోని కష్టాలు ఆకాశంలోని మబ్బుల వలె తేలిపోతాయి అనే భావన కలిగి ఉండాలి.మనిషికి జీవితంలో ఎందరో తారసపడతారు.ఎందరో తనకు తారసపడ్డారని మనిషి బెంబేలు పడి పోకూడదు.మనిషి అందరితో సౌమ్యంగా సంభాషించాలి.ఇతరులు మనిషి ఓపికను పరీక్షించాలని చూస్తారు.ఏవేవో మనకు సంబంధం లేని విషయాల గురించి అడుగుతూ చిక్కుల్లోకిలాగాలని చూస్తారు.ఇతరులు అడిగిన ఏవేవో విషయాలు వాటి అన్నిటికి విపులంగా జవాబు చెప్పవలసిన అవసరమైతే లేదు.ఇతరులు అడిగిన వాటికి ముక్తసరిగా సమాధానం చెప్పాలి.మనం జీవిస్తున్న సమాజంలో మనిషి మనుగడ సాగించడానికి ముక్తసరిగా మాట్లాడాలి. ముక్తసరిగా సమాధానం ఇవ్వడం అవసరం స్నేహితుడా అని చెబుతున్నాడు.నీవు ఇతరులు అడుగుతున్న విషయాల గురించి వాటి అన్నిటికీ సరే చూద్దాం అంటూ ముక్తసరిగా సమాధానం ఇవ్వడం సరైనదే స్నేహితుడా.నీవు ఇతరులకు ముక్తసరిగా సమాధానం ఇవ్వడం చూసి ఇతరులు నిన్ను పొగరు గల వాడు అనుకుంటారు.ఇతరులు పొగరు కల వాడు అనుకుంటే అది వారి తప్పు. ఇతరులు పొగరు కల వాడు అన్నంత మాత్రాన వారి ప్రవర్తన గురించి పట్టించుకోవద్దు.నిన్ను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో అలా మాట్లాడి ఉండవచ్చు.వాక్కుని నియంత్రించడం,మాట్లాడడం తగ్గించడం వల్ల మౌనం వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవడం జరగదు.వాక్కు అపూర్వమైన కళ,తపస్సు.వాక్కుని దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా సంభాషించడం సర్వదా శ్రేయస్కరం. అహంకారంతో కూడుకున్నది పొగరు.నేనే గొప్ప వాడిని అనే భావం పొగరు.అహంకారం కలిగి ఉన్నందుకు చూపించే వైఖరి పొగరు.జీవరాశులకు సహాయం చేసేవాడు స్నేహితుడు.మైత్రి కలవాడు స్నేహితుడు.ఎవరైనా మనలో భాగం అయ్యే వాడు స్నేహితుడు.స్నేహితులు స్నేహంతో కలిసిమెలిసి ఉంటారు.ఆపద సమయంలో స్నేహితులు సహాయం చేస్తారు.నీవు ఎక్కువగా వంగి ఉంటే నీ వీపుపై కూర్చుండి సవారు చేస్తారు.లోకం అంటే ప్రపంచం.లోకం విశాల విశ్వంలో ఒక భాగం.జీవులు నివసించే ప్రదేశం లోకం.ముక్కాలి పీట అంటే మూడు కాళ్ళ పీట.మనిషి ఎలా జీవించాలి? మనిషి జీవితంలో ఎలా ఉండకూడదు? అనే విషయాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి.మనిషి నిటారుగా నిలిచి ఉన్నట్లుగా నడుచుకోవాలి.మనిషి ఇతరులు చెప్పినట్లు విని ఎక్కువగా వంగి నడుచుకొనకూడదు.మనిషి ఇతరులు చెప్పిన దానిలో నిజం ఏమిటో గుర్తించి నడుచుకోవాలి. మనిషి ఇతరులకు భయపడి వారు చెప్పినట్లుగా నడుచుకుంటే లోకంలోని జనులు అతనిని ముక్కాలి పీటగా చేసి ఎక్కి తొక్కుతారు అనే జీవన సత్యాన్ని కవి గుల్జార్ తెలియజేసిన తీరు చక్కగా ఉంది. చక్కటి అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (4)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి గీతాంజలి (డాక్టర్ భారతి) అను సృజన చేసింది. షాయరీ కవితలోని భావాలు నాకు నచ్చాయి. షాయరీ కవిత నన్ను ఆలోచింపజేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలను గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“ఓస్ …ఖుదా !
“ఈ మెహబ్బత్ ని ఎంత వింతైన
“పదార్థంతో తయారు చేశావు ?
“నువ్వు సృష్టించిన మనిషి నీ ముందు
“నిలబడి ఇంకెవరి కోసమో విల
“విలల్లాడుతూ దుఃఖిస్తుంటాడు !
ఖుదా ఉర్దూ భాషకు సంబంధించిన పదం.ఖుదాను తెలుగులో దేవుడు అని అంటారు.ఖుదా అనే పదం అరబిక్ మరియు పర్షియన్ భాషకు సంబంధించిన మూల పదం.ఉర్దూ మరియు హిందీలో కూడా సర్వాంతర్యామి అయిన దేవుని ఖుదా అని అంటారు.తెలుగులో ఖుదాను దేవుడు, భగవంతుడు,పరమేశ్వరుడు అని అంటారు.దేవుడు అనగా సృష్టికర్త.సృష్టికర్త ఎవరు అంటే సృష్టిని సృష్టించిన వాడు.దేవుడు సర్వాంతర్యామి.దేవుడు నిష్కలంకుడు.దేవుడు మానవుల పాపాలను క్షమించే వాడు.దేవుడు నిజమైన మార్గాన్ని చూపించే వాడు.దేవుడు పాపాలను క్షమించి స్వర్గాన్ని ఇచ్చే వాడు.దేవుడు జగతిని నడిపే వాడు.దేవుడు ఒక్కడే.దేవుడు ఆది అంతము లేని వాడు.దేవుడు పవిత్రుడు.దేవుడు ఎటు వంటి పాపము చేయని వాడు.దేవుడు సృష్టి కర్త.దేవుడు జగమంతా వ్యాపించి ఉన్న వాడు.మొహబ్బత్ అనే ఉర్దూ పదం తెలుగులో ప్రేమ,అభిమానమును తెలియజేస్తుంది. మొహబ్బత్ అనే పదానికి తెలుగులో ప్రేమ, గాఢమైన అభిమానం,ఆదరణ,వాత్సల్యం అను అర్థాలు ఉన్నాయి.ఓ దేవుడా ! సృష్టిలోని వింత వింత అద్భుతాలను చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.ప్రభూ సృష్టి రచనను చేసినది నీవే కదా ! ప్రభూ నీవు చేసిన అద్భుతాలలో మొహబ్బత్ ప్రేమ కూడా ఉంది. ప్రభూ ఈ ప్రేమని ఎంత వింతైన పదార్థంతో తయారు చేసావు? అని ప్రశ్నిస్తున్నాడు.ప్రభూ‌ నీవు సృష్టించిన వాటిలో మనిషి కూడా ఉన్నాడు.ప్రభూ నీవు సృష్టించిన మనిషి మీ ముందు చేతులు కట్టుకొని నిలబడి వినయంగా మోకరిల్లినప్పటికి కూడా ఇంకా అతని మదిలో వేరే ఎవరి కోసమో మనసు నిలిపి ఆమె కొరకు విలవిలలాడుతూ దుఃఖిస్తుంటాడు.వేరే ఎవరి పైనో గాఢమైన ప్రేమ, అభిమానం ఉన్నట్లుగా తోస్తుంది.మనిషిలో పేరుకు పోయిన ద్వంద నీతి ప్రభూ నీకు అర్థం అయి ఉండాలి.ప్రభూ మీ ముందు నిలబడి మనిషి చేస్తున్నది ఏమిటి?లోకంలోని మనుషుల రీతి రివాజు ఎలా ఉంది?మనిషి చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటిగా ఉంటున్నది.మనిషి ఆచరణలో
తేడా కొట్ట వచ్చినట్లు కనిపిస్తున్నది.మనిషి లోకంలోని పద్ధతిని మీరి నడకలు సాగిస్తున్నాడు. మనిషి తనలోని విలువలని మరిచిపోయినాడు. మనిషి పద్ధతి ప్రకారం నడుచుకోవడం లేదు.మనిషి నీతి నియమాలు,పరంపరగా వస్తున్న ధర్మాన్ని ఏ నాడో వదిలి వేసినాడు.ప్రభూ నీవు రాత రాసి లిఖించిన మనిషి చేస్తున్నది ఏమిటి? ప్రభూ నిజంగా అతను నీ ముందు నిలబడి ఉన్నాడు.అతని దృష్టి ఎవరి పైన ఉండాలి? సృష్టి చేసిన బ్రహ్మ ముందే నిలబడి కూడా మనిషి మనసులో నిలకడ లేదు. మనిషి ఎందుకిలా ఇంతగా మారి పోయాడు? మనిషి వింతగా విపరీతంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.సృష్టి కర్తవైన నీ మీద అతను దృష్టిని సారించాలి.అతని దృష్టి నీ మీద ఉన్నట్లు కనిపించడం లేదు.ప్రభూ నీ ముందు నిలబడి కూడా నీ మీద దృష్టిని సారిస్తున్నట్లు నటిస్తున్నాడు.ఇంకా ఎవరి కోసమో ఆరాటంతో మనసు పెట్టి విలవిల్లాడుతూ దుఃఖిస్తుంటాడు అనేది సత్యంగా తోస్తుంది.గుల్జార్ సమాజంలో గల మనుషుల నడవడిని మానసిక స్థితిని అవగాహన చేసుకుని లోకంలోని మనుషుల తీరును సరిగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తున్నది.గుల్జార్ షాయరీ కవిత లోకంలోని మనుషుల తీరుతెన్నుల గురించి తెలియజేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి. షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (5)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన
చేసింది.గుల్జార్ కు లోకానుభవం మెండుగా ఉన్నట్లు షాయరీ కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి. గుల్జార్ షాయరీ కవితలోని భావాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే మనసు పెట్టి ఒక్క సారి గుల్జార్ షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల
లోకంలో విహరించండి.
“నా హృదయంపై
“సంతకం చేయడానికి ఎవరు
“బయలుదేరారు ?
“ఈ ఎడారిలో …. ఎవరో నడిచిన
“అడుగుల సవ్వడి వినిపిస్తోంది !
గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం.గుండెలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పని చేసి మనిషిని బతికిస్తున్నాయి.గుండె చాతి మధ్యలో కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది.హృదయం అనేది ప్రేమకు గుర్తుగా చెబుతుంటారు.హనుమంతుడి హృదయం చీల్చితే అందులో రాముడు కనిపిస్తాడు అంటారు.హనుమంతుడు నిరంతరం రామ నామ స్మరణం చేసే వాడు అంటారు.ప్రేమికులు తమ హృదయంలో ప్రియురాలు నిండి ఉంటుందని చెబుతారు.ప్రేమికుల ధ్యాస ఎప్పుడు ప్రియురాలు పైనే నిలిచి ఉంటుంది.అతను తన మనసులో కలుగుతున్న సంఘర్షణల గురించి చెబుతు నా హృదయం పై సంతకం చేయడానికి ఎవరు బయలుదేరారు? అని ప్రశ్నిస్తున్నాడు.అతని హృదయం పై సంతకం చేయ గల అధికారం ఎవరికి ఉంటుంది? అనే సందేహాలు మనలో పొడసూప వచ్చు.అతని హృదయానికి ఆమె నచ్చిన వ్యక్తి అయి ఉంటుంది.హృదయానికి నచ్చిన వ్యక్తిని గురించి ఎవరు బయలుదేరారు? అని ప్రశ్నించడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.అతని హృదయాన్ని ఆకర్షించిన వ్యక్తి ఆమెనే అయి ఉండవచ్చు అని మనకు తోస్తుంది.హృదయం యొక్క ఆలోచనను దాని రూపక లేదా సంకేత అర్థంలో ఉపయోగించే ఒక హృదయ చిహ్నం.ప్రేమ ముఖ్యంగా శృంగార ప్రేమతో సహా భావోద్వేగ కేంద్రాన్ని సూచించడానికి హృదయ చిహ్నం తరచుగా ఉపయోగపడుతుంది.గాయపడిన గుండె,విరిగిన హృదయం,బాణముతో గుచ్చబడిన హృదయ చిహ్నం.ఇది ప్రేమకు వేదనను సూచిస్తుంది.తెలుపు రంగు హృదయం అంతులేని ప్రేమను సూచిస్తుంది.ఎరుపు రంగు హృదయం నిజమైన ప్రేమను సూచిస్తుంది.నలుపు రంగు హృదయం దుఃఖానికి ప్రతీకగా ఉపయోగించబడుతుంది.పసుపు రంగు హృదయం స్నేహం ఆనందం కోసం ఉపయోగిస్తారు.ఆకుపచ్చ హృదయం ఆరోగ్యకరమైన జీవనం కోసం ఉపయోగిస్తారు.పర్పుల్ కలర్ హృదయం సున్నితమైన ప్రేమకు,సంపద కోసం ఉపయోగించబడుతుంది.ప్రేమ అంటే ఇద్దరి హృదయాల కలయిక.ఇద్దరి ఆలోచనల కలయిక. స్నేహం,చెలిమి అని అర్థాల్లో వాడుతారు.ప్రేమ అనేది అత్యంత ఉత్కృష్టమైన సద్గుణము లేదా మంచి అలవాటు.ప్రేమ లోతైన వ్యక్తుల మధ్య అనురాగం,సరళమైన ఆనందం,బలమైన మరియు సానుకూల భావోద్వేగం,మానసిక స్థితిని కలిగి ఉంటుంది.సర్వ సాధారణంగా ప్రేమ బలమైన ఆకర్షణ,భావోద్వేగ సంబంధాన్ని సూచిస్తుంది.ఇద్దరి మధ్య గల అనుబంధం,ఇద్దరి మనసుల మధ్య గల పరస్పర ప్రేమను సూచిస్తుంది.ఎడారి అనగా ఎటువంటి వృక్ష సంపద నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం. భూమిపై ⅓ వంతు వైశాల్యాన్ని ఎడారులు ఆక్రమించి ఉన్నాయి.ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఒయాసిస్సు ప్రాంతం సారవంతమై నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది.ఎడారులు అంటే ఇసుకతో నిండి ఉన్న ప్రాంతాలు అంటారు.మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు ఉన్నాయి.ఎడారి అనేది ప్రకృతి దృశ్యం.వాతావరణ ప్రక్రియల ద్వారా ఎడారులు ఏర్పడతాయి.ఎందుకంటే పగలు మరియు రాత్రి మధ్య ఉష్ణోగ్రతలు పెద్ద వ్యత్యాసాలు కలిగి ఎడారులపై ఒత్తిడిని కలిగిస్తాయి.ఫలితంగా రాళ్లు ముక్కలుగా విరిగిపోతాయి.ఎడారులలో వర్షాలు అరుదుగా కురుస్తాయి.ఈ ఎడారిలో అతనికి ఎవరో నడిచిన అడుగుల సవ్వడి వినిపిస్తుంది.ఈ ఎడారిలో అతనికి ఆమె ఎవరో తెలియదు.కాని అతనికి ఎడారిలో ఆమె నడిచిన అడుగుల సవ్వడి వినిపిస్తుంది అంటే అతనికి ఆమె పట్ల అనురాగంతో కూడిన ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది.అతనికి ఆమె ఎవరో తెలియనప్పటికీ ఆమె నడిచిన అడుగుల సవ్వడి వినిపించడం ఆమె పట్ల గల ప్రేమ,అనురాగం ఉన్నట్లు తోస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.గుల్జార్ కు మనుషుల హృదయాలను ఇట్టే పసిగట్ట గల నేర్పు ఉంది.గుల్జార్ లో మానవత్వం పొంగి పొరలుతుంది మరియు మనుషుల హృదయాలను అర్థం చేసుకునే సహృదయం ఉంది అని షాయరీ కవితలోని భావాలు వెల్లడి చేస్తున్నాయి.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గీతాంజలి (డాాక్టర్ భారతి)

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(6)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి ( డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.గుల్జార్ రచించిన షాయరీ కవితను తెలుగులోకి గీతాంజలి (డాక్టర్ భారతి) అను సృజన చేసింది.గుల్జార్ లోకానుభవంతో వైవిధ్యమైన షాయరీ కవితలు పండించారు.గుల్జార్ షాయరీ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.షాయరీ కవిత నన్ను ఆలోచింపజేసింది.గుల్జార్ షాయరీ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? షాయరీ కవితా చరణాలపై దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“కన్నీరు కార్చేటప్పుడు …ఎవరూ
“తోడు ఉండరని కాబోలు ….
“కన్నీళ్ళకి ఏ రంగు ఉండదు !
కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి వాటిని తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని ఆశ్రువులు లేదా
కన్నీరు అంటారు.సాధారణ పదజాలంగా కన్నీరు ఏడవటం అనే చర్యను సూచిస్తుంది.దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినప్పుడు కన్నీరు ఉబికి వస్తుంది.భావోద్వేగాల కారణంగా కన్నీరు కార్చే వ్యక్తి మానవుడు అని భావిస్తున్నారు.కంటిని శుభ్రం చేసే కన్నీరు కార్నియాను తడిగా శుభ్రంగా ఉంచుతుంది.కంటిలో దుమ్ము ఉండకుండా నివారించుతుంది.కంటికి పోషక పదార్థాలు అందించడానికి కళ్ళు నిరంతరం స్రవిస్తాయి.కలక లేదా ఏదైనా ధూళి వంటివి కంటికి
తగిలినప్పుడు కన్నీరు స్రవిస్తుంది.ఏడవడం వలన
కన్నీరు వస్తుంది.బలమైన భావోద్వేగాలు,నొప్పి తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు వెలువడుతుంది.మనుషులలో దుఃఖం వలన ముఖం ఎర్రబడడం,గొంతులో గద్గదత,శరీరం కంపించడం కూడా జరుగుతుంది.ఏడిస్తే అనారోగ్యం వల్ల కలిగే బాధ కొంత దూరం అవుతుంది మరియు ప్రశాంతత చేకూరుతుంది.ఉద్వేగాలను అణచుకొని బాధపడటం కంటే వెక్కి వెక్కి ఏడవడం మంచిది అంటారు.కన్నీళ్ళలో ప్రోటీన్,మాంగనీస్, పొటాషియం,హార్మోన్లు,ప్రోలాక్టిన్ ఉంటాయి. ఏడవడం వల్ల శరీరంలో నొప్పి,ఒత్తిడి తగ్గుతాయి. కన్నీరు మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది కన్నీరు శారీరకమైన కుంగుబాటును సూచించే సంకేతం.మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.బాధ,దుఃఖం, కన్నీరు ఎదుటివారిని తృప్తి పరుస్తుంది.కన్నీరు శత్రువుల నుంచి సానుభూతిని సంపాదిస్తుంది. కన్నీరు బంధాన్ని,స్నేహాన్ని పెంచుతుంది.ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి.ఏడుపు ఒత్తిడిని తగ్గిస్తుంది.కన్నీరు కార్చడం వలన ఇరువురి మధ్య విభేదాలు తొలగి బంధం మరింత బలపడే అవకాశం ఉంది.ఏడుపు అనేది చెంపల మీదుగా కారుతున్న కన్నీళ్ళతో ముడిపడి ఉంటుంది.కన్నీరు విలక్షణమైన ఏడుపు శబ్దాలతో కూడి ఉంటుంది.చాలా తరచుగా విచారం మరియు దుఃఖం,ఏడుపు,కోపం,నవ్వు లేదా హాస్యం,నిరాశ,పశ్చాత్తాపం లేదా తీవ్రమైన భావోద్వేగాల ద్వారా కన్నీళ్లు ప్రేరేపించబడతాయి. నిజాయితీ లేని పశ్చాత్తాపం యొక్క కపటమైన ప్రదర్శనను మొసలి కన్నీరు అని పిలుస్తారు.మనిషి మనసులో తీవ్రమైన బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీరు కార్చడం జరుగుతుంది. దుఃఖంతో కళ్ళ నుండి కన్నీరు కార్చేటప్పుడు అతను ఒక్కడే ఉంటాడు.కన్నీరు కార్చిన సమయంలో అతని వెంట ఎవరూ లేరు.అతని లోపల కలిగే దుఃఖాన్ని దిగమింగుకొని ఒక్కడే అనుభవిస్తాడు.అతని దుఃఖంలో తోడుగా ఎవరు ఉండరు అనే వాస్తవం తెలియజేయడం,కళ్ళనుండి కురిసే కన్నీళ్ళకు ఏ రంగు ఉండదు కాబోలు అని ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.నిజంగానే కళ్ళ
నుండి కార్చే కన్నీళ్లకు ఏ రంగు ఉండదు.మనిషి
ఎందుకు కన్నీళ్లు కారుస్తాడు? మనిషి దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు అతనితో పాటు తోడుగా ఎవరు ఉండరు.కన్నీళ్ళకు ఏ రంగు ఉండదు అని
భావోద్వేగంతో కూడిన కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.తెలుగులోకి షాయరీ కవితను చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(7)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి.గుల్జార్ షాయరీ కవితను గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“నేను తన వాడిని … ఈ రహస్యం
“ఆమెకి తెలిసిపోయింది !
“కానీ …ఆమె ఎవరిదో ….
“ఈ సవాలు నన్ను నిద్ర
“పొనివ్వట్లేదు !
నేను అనేది తెలుగు భాషలో ఒక మూల పదం.నేను అనే పదం సర్వ నామంగా వాడుతారు.ఒక మనిషి తన గురించి తాను చెప్పే సందర్భంలో నేను అనే పదాన్ని ఉపయోగిస్తాడు.తన వాడిని అనగా తనకు స్వంతం అనే అర్థం వస్తుంది.అతను తనకు సంబంధించిన వాడు అని అర్థం.ఎవరికి తెలియకుండా దాచబడినది రహస్యం.మనకు తెలిసిన ఒక విషయాన్ని ఎవరితోను చెప్పకుండా ఉంచటం రహస్యం.ఇతరులు ఎవరికి తెలియని విషయం రహస్యం.గుప్తంగా ఉండిన విషయం రహస్యం.ఆమె అనే తెలుగు పదం ఒక ఆడ మనిషిని గురించి వేరొకరికి చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు.ఆమె ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామం.జవాబుకు వ్యతిరేకమైనది సవాలు.ప్రత్యుత్తరాన్ని కోరే వాక్యం సవాలు. ప్రశ్నకు జవాబు ఇవ్వ లేక పోవడం సవాలు.శత్రువు యొక్క సవాలును తోసి పుచ్చి వెళ్ళడం సవాలు.నిద్ర లేదా నిదుర ఆంగ్లంలో Sleep అని అర్థం.శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి నిద్ర.మనుషుల దైనందిన జీవితంలో నిద్రకు ముఖ్య భాగం ఉంది.మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం. శారీరకపరంగా నిద్ర అత్యంత ముఖ్యమైనది.నిద్ర పౌరుల ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో రాయబడి ఉంది. ఆరోగ్యకరమైన జీవనానికి నిద్ర చాలా అవసరమైనది.నిద్ర, విశ్రాంతి,ఆరోగ్యరీత్యా మానవులకు తప్పనిసరి అవసరం ఉంది.నేను తన వాడిని అని ఆమె మనసులో అనుకుంటున్నది. అతను తనకే స్వంతం అని మరియు అతను తనకు సంబంధించిన వాడు అని ఆమె మనసులోనే ఆరాధిస్తున్నది. ఆమె నన్ను అమితంగా ప్రేమిస్తున్నది.ఆమె నాపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నది.ఆమె అనురాగంతో చూపుల బాణాలు వేస్తున్నది. ఆమెను చూడగానే నా మనసు వశం తప్పినది.ఆమెకు నా మనసు అంకితం అయిపోయినది.ఆమె తెలివైనది.నేను నా మనసులో దాచి పెట్టిన రహస్యం ఆమెకు తెలిసిపోయింది. ఆందాలు చిందే రూప లావణ్యాలతో ఆమె మెరిసిపోతున్నది. సౌందర్యవతి అయిన ఆమె ఎవరిదో అనే విషయం నాకు నా జీవితంలో ఒక సవాలుగా మారింది.జీవితంలో సవాలు వేయడం అనేది మామూలు విషయం కాదు.అలనాడు శ్రీరామచంద్రుడు జనక మహారాజు పెట్టిన పరీక్షలో శివధనస్సును అవలీలగా విరిచినాడు.శ్రీరాముడు ఆ పరీక్షలో నెగ్గాడు. సీతమ్మను వివాహం ఆడినాడు.నా ఆలోచనల్లో ఆమె నిండి ఉన్నది.ఆమె గురించిన ఆలోచనలు తనను నీడలా వెంటాడుతున్నాయి.అందాలరాశి అయిన ఆమె తనకి చెందాలని మనసులో తీరని కోరికగా ఉంది.కానీ ఆమె తనకు దక్కుతుందా? ఎవరికి దక్కుతుంది? ఎవరిదో ఈ సవాలు ? ఎవరు నెగ్గుతారు ? అనే విషయంలో నిద్ర కూడా పోవటం లేదు అని కవి గుల్జార్ వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.షాయరీ కవితలోని భావాలు పాఠకులను ఆలోచింప జేస్తాయి.షాయరీ కవిత పాఠకులను ఏదో తెలియని లోకంలోకి విహరింప చేస్తుంది.గుల్జార్ షాయరీ కవితను చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(8).
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి).

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.మానవ జీవితంలోని సంఘర్షణలను భావస్ఫోరకంగా కవితాత్మకం చేయడంలో కవి గుల్జార్ దిట్ట అని చెప్పవచ్చు.గుల్జార్ షాయరీ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“ నేనెంత వెర్రి వాడినో చూడు !
“ఎక్కడైతే …. కనీసం ప్రేమ అన్న పదం కూడా
“అలవాటుగా లేదో … అలాంటి నగరంలో
“కూడా ప్రియా నీ కోసం నిరీక్షించాను !
ఒక మనిషి తన గురించి తాను చెప్పే సందర్భంలో
నేను అనే పదాన్ని ఉపయోగిస్తాడు.ఎంత అనేది పరిమాణాన్ని తెలిపే పదం.వెర్రి వాడు అంటే మానసిక అనారోగ్యం కలవాడిగా,మూర్ఖుడిగా ఉన్న వాడు.అసహజమైన వింత కోరికలు కోరడం వెర్రివాని చేష్టగా అనిపిస్తుంది.ఎక్కడ అనేది ఒక ప్రదేశాన్ని సూచించడానికి ఉపయోగించే పదం.
కనీసం ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం పొందవలసి ఉంటుంది.ప్రేమ అనేది ఉన్నతమైన ప్రేమ స్థాయిని సూచిస్తుంది.ప్రేమ అంగట్లో దొరికే వస్తువు కాదు.అది స్వతహాగా మనసులో నుండి పుట్టుకు రావాలి. ప్రేమించడానికి హృదయం ఉండాలి. ప్రేమించబడడానికి వ్యక్తిత్వం ఉండాలి.జీవితం పువ్వు లాంటిది.పువ్వులోని మకరందమే ప్రేమ. శరీరంలో చోటు చేసుకునే రసాయనిక మార్పుల ప్రభావమే ప్రేమ.ఒక వ్యక్తిని క్షణం కూడా విడిచి ఉండ లేక పోవటం ప్రేమ.ఎంత చూసినా,ఎంత మాట్లాడినా,తనివి తీరకపోవడం ప్రేమ.పదే పదే ఆ వ్యక్తి గురించి ఆలోచించడం,గుండె వేగంతో కొట్టుకోవడం,ఇలా ఒక్కో చర్యకు ఒక్కో హార్మోన్ ప్రభావం ఉంటుంది.వ్యామోహం అంటే కామం. కామం శారీరక వాంఛలు తీర్చుకునే వరకు మాత్రమే ఉంటుంది.అమ్మాయి అందంగా ఉంటే ప్రేమించడం అన్నది ఒక రకంగా ఆకర్షణ కిందకు వస్తుంది. అనుబంధం ఉన్నప్పుడు ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ ఎక్కువ కాలం నిలుస్తుంది.ఎన్నో రకాల ప్రేమలు ప్రకృతిలో అగుపిస్తాయి.కాలానికి కరగని కొవ్వొత్తి ప్రేమ.మనసుకు నచ్చిన మధురానుభూతి ప్రేమ. ప్రేమంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం.స్త్రీ పురుషుల మధ్య ఉండే అభిమానం ప్రేమ.ప్రేమికుల మధ్య నడిచే వ్యవహారం ప్రేమ.ప్రేమ ఏదేని వస్తువు కొరకు లేదా మాట కోసం పడిగాపులుగాయడం నిరీక్షణ.ఆమె కొరకు ఆతను ఎదురు చూడటం నిరీక్షణ అని చెప్పవచ్చు.నేను ఎంత వెర్రి వాడిని చూడు అని తన గురించి తాను చెప్పుకోవడంలో ఆశ్చర్యంతో కూడిన ప్రేమ,అనురాగం అతనిలో దాగి ఉందేమో అనిపిస్తుంది.అతను తనలో తానే మధన పడడం బాధను కలిగించే విషయంగా పరిగణించాలి.అతను ఎందుకు అలా మాట్లాడ వలసి వచ్చింది? అనేది ఆలోచించాల్సిన విషయంగా తోస్తుంది.ఇందులో ఏదో మతలబు ఉంటుంది.ఏదో అతని హృదయానికి తగిలిన బాధ అయి ఉంటుంది.అందుకే అలా అతను తనకు తానే వెర్రివాడిగా చెప్పుకోవడం జరిగింది.ఎక్కడ అయితే? అని ఆ ప్రదేశం గురించి తెలుపక పోవడం,ఖాళీని పూరించక పోవడం,ఎవరికైనా సందేహాలు పొడ చూపుతాయి.ఎక్కడ? ఏ ప్రదేశం? అనేది ఉంటుంది.అది ఇక్కడ కనిపించడం లేదు.అతడు ఆమెను ప్రేమిస్తున్నాడు అనే భావన ఎదుటి వారికి కలుగుతుంది.కనీసం ప్రేమ అనే పదం కూడా ఉచ్చరించని చోటు ఉంటుందా? ప్రేమ కోసం పరితపించని చోటు ఉంటుందా? అని సందేహాలు ముప్పిరిగొంటాయి.ఏదైనా మళ్లీ మళ్లీ చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన ప్రేమికునిలో అలవాటుగా కనబడుతుంది.అతను ప్రేమికుడిగా ఆమె గురించి మనసులో ఆవేదన చెందుతున్నాడు.అలాంటి ప్రేమ తెలియని నగరంలో కూడా ఆమె రాక కోసం, మృదువైన మాట కోసం,చల్లని పిలుపు కోసం పడిగాపులు పడ్డాడు.తాను ప్రేమించిన ఆమె కొరకు నిరీక్షించడం ఎంత బాధాకరమో,అనుభవించిన వ్యక్తికే తెలుస్తుంది. ఆమె కొరకు నిరీక్షించిన తనకు అది ఒక స్వీయ శిక్షలా ఉంది.నిన్ను ప్రేమించినందుకు ప్రేమ లేని నగరంలో నీ రాక కొరకు నా సమయం వెచ్చించి వెర్రివాడిలా నిరీక్షించాను అని వ్యక్తం చేసిన కవి గుల్జార్ భావం అద్భుతంగా ఉంది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకులను ఆలోచింపజేస్తుంది.షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(9)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవిత జీవంతో తొణికిసలాడుతుంది.గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? మనసు పెట్టి షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అపారమైన అనుభూతులను ఆస్వాదించండి.
“ఈ కళ్ళున్నాయే అవి చెరువులో … కొలనులో
“కావు.కానీ నీళ్ళతో నిండిపోతాయి !
“హృదయం కూడా గాజు ముక్క కాదు
“అయినా విరిగి ముక్కలై పోతుంది
“కానీ ఈ మనిషున్నాడు చూడండి … తాను
“ఋతువు కానే కాడు
“కానీ అన్ని కాలాల్లో మారిపోతూనే ఉంటాడు !
కన్ను కాంతిని కంటి నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం.కన్ను మానవులలో ముఖ్యమైన జ్ఞానేంద్రియం.కండ్లు మానవుని ముఖానికి రెండు వైపులా అమర్చబడి ఉంటాయి.కళ్ళు మనుషులకు కెమెరా వలె పని చేసి బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నవి ఉన్నట్టుగా మెదడుకు పంపుతాయి.కళ్ళు మనిషికి చాలా ప్రధానమైనవి.కళ్ళు లేని జీవితాన్ని ఊహించడానికి కూడా ఎవ్వరు సాహసించరు. మనిషి కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.నదుల నుండి వచ్చే వరదల ద్వారా చెరువులు నీటితో నిండుకుంటాయి. చెరువులు సాధారణంగా మంచి నీటితో కళకళలాడుతుంటాయి.చెరువులు తరచుగా మానవ నిర్మితములైనవిగా ఉంటాయి.చెరువులు అత్యంత జీవవైవిధ్యం కలిగి ఉంటాయి.చెరువులు వ్యవసాయానికి,పశువులకు మరియు మానవులకు నీరు అందించడంలో అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి.చాలా వరకు చెరువులు వర్షం మీద ఆధారపడి ఉంటాయి.అనేక గ్రామాలలో చెరువు నీటిని త్రాగడానికి ఉపయోగిస్తారు. కొలనులు కూడా నీటికీ నిలయాలుగా ఉంటాయి. గుల్జార్ లోకంలోని మనుషుల కళ్ళ గురించి చెబుతున్నాడు.మనుషుల కళ్ళున్నాయే అవి నీటితో కళకళలాడే జలాశయాల వంటి చెరువులు, కొలనులు కావు అని చెబుతున్నాడు.కానీ మనుషుల కళ్ళు నీళ్లతో నిండిపోతాయి అని వ్యక్తం చేసినాడు.మనుషుల కళ్ళు నీళ్లతో నిండిపోవడం ఏమిటి?అని మనలో సవాలక్ష సందేహాలు పొడ చూప వచ్చు.ఏదైనా బాధ కలిగినప్పుడు మనుషుల కళ్ళు కన్నీళ్ళతో నిండిపోతాయి అనేది ఎవ్వరు కాదనలేని వాస్తవం.గుండె లేదా హృదయం మానవ శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం.హృదయంలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరాయంగా పని చేసి మనిషిని బతికిస్తున్నాయి.హృదయం చాతీకి ఎడమ వైపు ఉంటుంది.గాజు అనేది స్పటికాకారం కాని ఘనం. గాజు పారదర్శకంగా మరియు రసాయనికంగా జడత్వంతో ఉంటుంది.మనిషిలో నిండి ఉన్న హృదయం కూడా గాజు ముక్క కాదు.అయినా విరిగి ముక్కలు అయిపోతుంది అన్నాడు.మనిషి హృదయానికి గాయం అయ్యేంత వరకు తెలియదు. నిజంగానే మనిషి హృదయం గాజు వస్తువు కానప్పటికీ ఏదో తెలియని బాధకు గురి అయి మనసు గాజు వస్తువు వలె విరిగి ముక్కలై పోతుంది అనేది వాస్తవం.తెలుగు సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి ఆరు ఋతువులుగా పేర్కొన్నారు.1) వసంత ఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం.ఈ కాలంలో చెట్లు చిగురించి పువ్వులు పూస్తాయి.2) గ్రీస్మ ఋతువు :జ్యేష్ఠ మాసం,ఆషాడ మాసం.ఈ కాలంలో ఎండలు మెండుగా ఉంటాయి.3) వర్ష ఋతువు : శ్రావణ మాసం,భాద్రపద మాసం.ఈ కాలంలో విరివిగా వర్షాలు కురుస్తాయి.4) శరదృతువు : ఆశ్వయుజ మాసం,కార్తీక మాసం.ఈ కాలంలో వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.5) హేమంత ఋతువు: మార్గశిర మాసం,పుష్యమాసం.ఈ కాలంలో మంచు కురుస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది.6) శిశిర ఋతువు : మాఘమాసం,ఫాల్గుణ మాసం.ఈ కాలంలో చెట్లు ఆకులు రాల్చుతాయి.భూగోళంపై నున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మానవులు చాలా పురోగతిని సాధించారు అని చెప్పడంలో సందేహం లేదు.మానవునిలో వివేకం,ఆలోచన,భాష వంటి విషయాలు మెదడు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడినాయి.కానీ ఈ మనిషున్నాడు చూడండి… తాను ఋతువు కానే కాడు.కానీ అన్ని కాలాలలో మారిపోతూనే ఉంటాడు అని చెబుతున్నాడు.మనుషులలో పేరుకొని పోయిన విచ్చలవిడితనం,విశృంఖలత్వం,వింత ప్రవర్తనను పరిశీలించి కవి గుల్జార్ చెప్పినట్లుగా తోస్తోంది.మనిషి అన్ని కాలాలలో ఒకే రీతిగా ఉండక మారిపోవడం ఏమిటి?అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.మనుషుల ప్రవర్తన ఋతువుల కాలాలకు కూడా అందకుండా మార్పు పొందడం సహజం అనిపిస్తుంది. మనుషులకు ఏమైంది? మనుషుల్లో మానవత్వం మృగ్యం అయి పోయింది.మానవత్వం లేని స్వార్థంతో కూడిన మనుషుల ప్రవర్తనను చూసి కలిగిన ఆవేదన షాయరీ కవితగా రూపు దిద్దుకొన్నట్లుగా తోస్తోంది.మనుషులలోని విశాల భావాలు మానవతకు దోహదం చేస్తాయి.మనుషుల్లో విశాల భావాలు కొరవడడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది.గుల్జార్ మనుషుల వింత ప్రవర్తనను నిశితంగా పరిశీలించి చెప్పినట్లుగా ఉంది.మనిషి ఎందుకు విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు.మనిషిలో కలిగిన మార్పుకు కారణం ఏమిటి? అనేది అంతు పట్టకుండా ఉంది.మనిషిలో కలిగిన వినూతన మార్పు ఋతువులకు కూడా అందకుండా ఉంది అని వ్యక్తం చేసిన భావం పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తుంది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us