మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

చెనేత మగ్గాన

by NS Reddy (USA) July 30, 2024
written by NS Reddy (USA)

ఆ సప్త వర్ణాల వస్త్రాలు నేసేటి వైనమ్
మనల మానాల కాపాడె దారాలు అల్లుతావు
అందుకో మా వందనమ్
నీ చేత పుట్టిన నేత బట్టల గట్టి మెరిసేను మానవ సోయగమ్
పొగడలేంత ఘనత …
చెరిగిపోని చరిత…
చేనేత కార్మికా నీ సొంతం……. చేనేత కార్మికా నీ సొంతం.

సృష్టి అందాలన్ని చీరలోన మలచి నక్షత్రాలు తెచ్చి నగిశీల దిద్దేవు
పసిడి కాంతుల్లోన వజ్రాలనద్దేవు

పొదుగూకుల పట్టు బట్టలు నేసి ప్రతిభనే చాటావు
పత్తికన్నా మెత్త మనసున్న నేతన్న……
పత్తికన్నా మెత్త మనసున్న నేతన్న
కొవ్వొతి వెలుగయ్యి కాలేవు దారాన. || చెనేత మగ్గానా ॥

చాలు చాలని పథము సాల మగ్గము రథము
శాలోల్ల యుద్ధాన సాగే సైన్యమవుతాడు
దారం పోగుల దరువు,
తనువు వంచిన ధనువు
వస్త్రాలె అస్త్రాలు పోరాడి గెలిచేడు.
నిండు ఆకాశాన గర్వంగ ఎగిరేటి — జాతీయ జెండయ్యి జేజేలు పొందేడు(వు)

మర మగ్గాల నడుమ మానవ యంత్రమయ్యి
నీ రక్త మాంసాలు ఇంధనంగ చేసి
నీ కండ కరిగించి చేత వస్త్రం నేసి కూడు లేక కోటి తిప్పలే పడతావు

నీ కష్టమే నిలిచి కన్నీళ్లు తుడిచేటి నీ కష్టమే నిలిచి కన్నీల్లు తుడిచేటి
కాలమేదో వస్తుందంటు
కలలెన్నో కంటావు……।
చెనేత మగ్గానా ||

పండగల పబ్బాల, పెళ్లి పేరంటాల రంగు హంగుల వస్త్ర సింగ్గారమయ్యేవు

ఎండా వానల నన్ను సల్లంగ చూసేటి స్నేహితుడవయ్యేవు తనువూ తల్లివి నీవు
ప్రాణమిడిచీ మనిషి మట్టిలో కలువంగ….
ప్రాణమిడిచీ మనిషి మట్టిలో కలువంగ…..
విడివడని బంధమై భూమి ఒడిని చేరేవు || చెనేత మగ్గానా నేతన్నా ॥ ||

నువ్వు నేసే తాడు చేయొద్దు ఉరి తాడు తీసుకోకు ప్రాణం
ఆ ఉరితాళ్లనే తీసి
చిత్రాలుగా చేసి
చేరుకోర గమ్యమ్
తెలిసేను విజయ మార్గమ్

చేనేత మగ్గాన నేతన్నా
నేనున్నానని అనవన్నా నేతన్నా!!
_**

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చెట్టు – మనిషి

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ July 30, 2024
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్

ఆకులన్నీ రాల్చేసి
నా కళ్లను నక్షత్రాలుగా
అద్దుకుంది చెట్టు!
ఇక –
పచ్చదనాన్ని నింపుకుని
ప్రపంచానికి నీడనివ్వటం
నా వంతయింది!

July 30, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

ఆదర్శం

by Rama Devi Nellutla July 30, 2024
written by Rama Devi Nellutla

బైకును స్లో చేసి చెట్టు క్రింద ఆపి అటువైపు చూసాడు కార్తీక్. సందేహం లేదు…  సమీరే!
రోడ్డు కవతల కోట గుమ్మం లాంటి జైలు తలుపులకు వున్న చిన్న డోర్ లోంచి బయటికి వచ్చి, సెక్యూరిటీ గార్డ్ తో ఏదో మాట్లాడుతోంది.
అతడు నవ్వుతూ ఏదో అంటున్నాడు. అంతలోనే భుజానికి వేసుకున్న బ్యాగ్ సర్దుకుంటూ వచ్చి బైక్ పార్క్ చేసుకున్న స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది.
హెల్మెట్ పెట్టుకుని వున్న తనను గమనించలేదేమో అనుకున్నాడు కార్తీక్.
ఇది మూడో ఆదివారం సమీరను అలా… జైల్లోంచి బయటకు వస్తూండగా చూడడం. యాదృచ్ఛికమే ఐనా తను జిమ్కు వెళ్ళి వచ్చే టైమ్లోనే ఆమె జైలులోంచి బయటకు రావడం జరుగుతోంది.
కారణం ఏమిటో అడుగుదామని మొబైల్ మీదకు చెయ్యి పోనిచ్చిన వాడల్లా, ఒక్క, క్షణం ఆగాడు.
‘ఏం చెబుతుంది? అసలు… నిజం చెబుతుందా? తను కలిసింది నేరస్థుడినో, తీవ్రవాదినో, హంతకుడినో అని చెపుతుందా? లేకపోతే డిగ్రీ చదివే రోజుల్లోనే అతన్ని ప్రేమించాననీ, ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్లనే, నీతో పెళ్ళికి ఒప్పుకున్నాననీ చెబితే తను భరించగలడా?
తల్లిదండ్రులకు తను ఒక్కడినే కొడుకుననీ, ఎమ్.టెక్. చదివి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిజేసే తనకు ఉమ్మడి కుటుంబంలో వుండి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే అమ్మాయి కావాలనీ అడిగినప్పుడు సమీర సంతోషంగా ఒప్పుకుందే! తను కూడా ఏదో కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేరొచ్చునందే! ఇదేమిటి మరి? వాళ్ళ పేరెంట్స్కు తెలుసో… లేదో!
ఆలోచనలతో అసహనంగా మారడు కార్తీక్. వడివడిగా జైలువైపు నడిచాడు. వెళ్ళిన ఐదునిమిషాల్లోనే బయటికి వచ్చాడు.
‘క్షమించు సమీరా! జైలులో డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఖైదీలకు వాలంటరీగా ఇంగ్లీషు టీచ్ చేయడానికి వెళ్తున్న నిన్ను అనుమానించి మగాడిననిపించాను. నీకు అంతా విడమర్చి సారీ చెప్తేగానీ, నా మనస్సు తేరుకోదు!’ అనుకున్నాక అతని హృదయం తేలికైంది.

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన —- ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు.

by Narendra Sandineni July 30, 2024
written by Narendra Sandineni

డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి *అమ్మంటే” కవిత.
*సంబరాల సంతకం
ఆత్మీయత, అనురాగం వ్యక్తం చేసే కవిత్వము ఓ విశ్లేషణ.
కవయిత్రి,సామాజిక కార్యకర్త,రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్,ఏ.ఎస్.యమ్.మహిళా డిగ్రీ & పి.జి.కళాశాల,వరంగల్,డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి కలం నుండి జాలువారిన స్నేహ గానం కవితా సంపుటిలోని అమ్మంటే కవిత పై విశ్లేషణా వ్యాసం. స్నేహ గానం కవితా సంపుటిని శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్,హైదరాబాద్ వారు బహుమతిగా ఎంపిక చేసి ప్రచురించడం ముదావహం.అమ్మంటే కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవయిత్రి రామలక్ష్మి తన తల్లిని గురించి అమ్మంటే కవితను రాసినట్లుగా తోస్తుంది. కవయిత్రి రామలక్ష్మి అంతు లేని అమ్మ ప్రేమను,అనురాగాన్ని ఇప్పటికీ పొందుతున్నది. సమాజంలో స్త్రీని తల్లి,మాత,జనని మరియు అవ్వ,అమ్మ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ.అమ్మ బిడ్డని నవ మాసాలు కడుపులో మోసి జన్మను ప్రసాదిస్తుంది.అమ్మ తన బిడ్డకు పాలు త్రాగించి, ఆహారం తినిపించి ప్రేమతో పెంచుతుంది. తల్లిని మించిన దైవం ఈ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు..ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎక్కడా లభించదు.అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. మాతృదేవోభవ అని శాస్త్రాలు చెబుతున్నాయి. అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.అమ్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? కవయిత్రి రామలక్ష్మి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అమ్మ గురించిన గొప్ప అనుభూతుల లోకంలో విహరించండి.

“బతుకు బడిలో
“ఓనమాలు దిద్దించేది.
జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన బతుకు అని అంటారు.బడి అనగా విద్యాలయం.బడిలో పిల్లలకు ఉపాధ్యాయులు విద్యను బోధిస్తారు. బడిలో పిల్లలకు ఉపాధ్యాయుడు అ నుంచి హ వరకు తెలుగు అక్షరాలు పలక మీద నేర్పి దగ్గర ఉండి ఓనమాలు దిద్దిస్తాడు.అమ్మ తన పిల్లలకు జీవితం అనే పాఠశాలలో ఓనమాలు నేర్పుతుంది. ఈ లోకమనే ప్రపంచంలో ఎలా గడపాలి అనే సంగతులను అక్షరాలు అవసరం లేకుండానే అమ్మ బతుకు పాఠాలను అరటి పండు ఒలిచినట్లుగా విడమర్చి చెబుతుంది.అమ్మ నేర్పిన ఓనమాల వల్లనే ఒడిదొడుకులు లేకుండా పిల్లవాడి జీవితం సాఫీగా సాగుతుంది.జీవితం అనే పాఠశాలలో అమ్మ ఓనమాలు నేర్పి పిల్లల జీవితాన్ని చక్కదిద్దుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అనుభవాల్లోంచి
“జీవిత పాఠాలను నేర్పించేది.
అనుభవంను ఆంగ్లంలో Experience అని అంటారు.ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు.ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు.ఒక పనిలో అనుభవం ద్వారా నైపుణ్యాన్ని సాధించిన వారిని అనుభవజ్ఞులు అంటారు.మనిషి నేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం అనుభవం.మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల పనులు చేయడం ద్వారా అనుభవం వస్తుంది. మనిషి పని చేయడం వల్ల కలిగే అనుభవం ద్వారా జీవిత పాఠాలు నేర్చుకుంటాడు. మనిషి తన చుట్టూ నివసిస్తున్న వారి జీవితాలను నిశితంగా పరిశీలించినట్లయితే అవి గుణ పాఠాలుగా గుర్తుండిపోతుంది.పిల్లలకు తొలి గురువు ఎవరు? అంటే అమ్మ అని సమాధానం వస్తుంది.పిల్లలు బతుకు బాటలో సవ్యంగా నడుచుకునేలా అమ్మ జీవిత సారాన్ని అనుభవాల రూపంలో తెలియజేస్తుంది.రామాయణం,భారతం వంటి ఇతిహాసాలు,పురాణాలు చదివితే మనం ఎలా జీవించాలి? అనే విషయాలు తెలుస్తాయి. జీవితం వడ్డించిన విస్తరి కాదు.జీవితం మనకు విలువైన పాఠాలు నేర్పుతుంది.రంగులతో కూడిన జీవితం నేర్పే ప్రతి పాఠం మనల్ని మరింత తెలివైన,బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. అమ్మ తన అనుభవాల ద్వారా పిల్లవాడికి జీవిత పాఠాలను నేర్పిస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆత్మీయతానుభూతులను
“అందించేది.
దగ్గర బంధువుల నుండి ఆత్మీయత మనకు లభిస్తుంది. ఆత్మీయత అనేది వ్యక్తిగత సంపద. ఆత్మీయత అనే గుణం పెంపొందించుకోవడానికి ప్రతి మనిషి జీవితంలో ప్రయత్నం చేయాలి.ఆత్మీయత మన బలమునకు కీలకంగా చెప్పవచ్చు.ఈనాడు సమాజంలో గల వ్యక్తుల్లో నైతికత లేకపోవడం వల్ల విశ్వాసం లేకపోవడం వల్ల ఆత్మీయతతో కలిసిమెలిసి ఉండడం లేదు.ఈనాడు మనిషి ఆత్మీయతకు దూరం అవుతున్నాడు.అనుభూతి అనేది భావోద్వేగం యొక్క చేతన ఆత్మాశ్రయ అనుభవాన్ని సూచిస్తుంది.ఏదైనా విషయం గురించి తెలుసుకునే భావన అనుభూతి.ఏదైనా పని చేసి ఉన్న జ్ఞానముతో వచ్చినది అనుభూతి.అనుభూతి ఒక మానసికమైన ఆనంద భావన.అనుభవంతో కూడిన భావన అనుభూతి. పిల్లలకు తల్లి ఆత్మీయత గురించి ఉగ్గుపాలతో రంగరించి నేర్పుతుంది.అమ్మ కంటే మించిన దగ్గరి వాళ్లు ఎవ్వరు ఉండరు.తల్లికి పిల్లల పట్ల ఉండే ప్రేమ ఆత్మీయత.అమ్మ తన పిల్లల పట్ల మమతానురాగాలను కలిగి ఉంటుంది.అమ్మ వల్ల పిల్లలకు ఆత్మీయత మరియు గొప్ప అనుభూతి లభిస్తుంది అని కవయిత్రి రామలక్ష్మి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనురాగామృతాన్ని
“కురిపించేది.
బలమైన అభిమానంను అనురాగం అంటారు. అనురాగంను ప్రేమకు పర్యాయపదంగా వాడతారు. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం.అమ్మలో అనురాగం,ఆప్యాయత అన్నీ కలబోసి ఉంటాయి. హిందూ పురాణాలలో అమృతం అనగా అమరత్వాన్ని ప్రసాదించే పానీయం అంటారు.అమ్మ వల్ల పిల్లవాడికి ప్రేమ,అనురాగాలతో అమృతం సేవించకుండానే ఆయుష్షు పెరుగుతుంది. అనురాగం,అమృతం కురిపించేది అమ్మ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“బిడ్డల మనసును గ్రహించేది
“వారిని మనసారా ఆశీర్వదించేది.
తల్లికి పిల్లలు మనసులో ఏమనుకుంటున్నది? తల్లికి పిల్లల మనసులోని భావాలు ఎలా తెలుస్తాయి? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.తల్లికి పిల్లల మనసులోని భావాన్ని గ్రహించే అపూర్వమైన శక్తి ఉంది.పిల్లలు అడగకుండానే తల్లి వారికి కావాల్సినవి అన్ని ప్రేమతో చేసి పెడుతుంది.తల్లి పిల్లలను ప్రేమతో మనసారా ఆశీర్వదిస్తుంది.ఇవ్వాళ పిల్లలను మనసారా ఆశీర్వదించే వాళ్లలో తల్లికి మొదటి స్థానం ఉంటుంది.దేవుడు మనం కోరితేనే ఆశీర్వదిస్తాడు అంటారు.పిల్లలు కోరకుండానే తల్లి ఆశీర్వాదాలు అందిస్తుంది.అమ్మ బిడ్డల మనసును గ్రహిస్తుంది.అమ్మ బిడ్డలను మనసారా ఆశీర్వదిస్తుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“తాను కరుగుతూ
“కుటుంబానికి వెలుగు నిచ్చేది.
మైనముతో చేసిన దీపాన్ని కొవ్వొత్తి అంటారు. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు మైనము కరుగుతూ దానికి అమర్చిన వొత్తి మండటం ద్వారా వెలుగును ప్రసరింపజేస్తుంది.అమ్మ కుటుంబం కొరకు రోజంతా శ్రమిస్తూ గడుపుతుంది.అమ్మ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పని చేస్తూ కుటుంబంలో వెలుగులు నింపుతుంది.పిల్లలు పని మీద బయటకు వెళ్లి తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం అమ్మ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది.అమ్మ తాను కొవ్వొత్తి వలె కరుగుతూ కుటుంబానికి వెలుగును ఇస్తుంది అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“ప్రయోజకులైన బిడ్డలను చూసి
“సంతసించేది.
తల్లి బిడ్డ చదువుకొని విజయాలు సాధించినప్పుడు చూసి ఆనందంతో పొంగిపోతుంది.ప్రయోజకులైన బిడ్డలను చూసి పరవశురాలు అవుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆశయ సాధనకు
“ఆధారమై నిలిచేది.
ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరిక కలిగి ఉండడం ఆశయం.ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి పిల్లవాడు నిరంతరం శ్రమించేలా అమ్మ తోడ్పడుతుంది.అమ్మ పిల్లలను మీరు ఇంకా జీవితంలో ఎంతో సాధించాల్సినది ఉంది అని గుర్తు చేస్తుంది.అమ్మ వల్లనే జీవితానికి ఆశయం,అర్థం ఉన్నాయి.ఆశయ సాధనకు అమ్మ ఆధారమై నిలిచింది అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“పిల్లల తప్పులెన్నింటినో సహించేది
“ గొప్ప మనసుతో క్షమించేది.
పిల్లలు తెలిసి తెలియని వయసులో ఎన్నో తప్పులు చేస్తారు.పిల్లలు చేసిన తప్పులను చూసి అమ్మ సహనంతో మెలుగుతుంది.పిల్లలు చేసిన తప్పులను అమ్మ గొప్ప మనసుతో క్షమిస్తుంది.పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్లు దండిస్తారు.అమ్మ మాత్రం పిల్లలను దండించదు.అమ్మ ప్రేమతో వారు చేసిన తప్పులను చెబుతుంది.అమ్మ పిల్లలు చేసిన తప్పులు సరిదిద్దుకునేటట్లు చేస్తుంది.ఇక ముందు పొరపాటున కూడా పిల్లలు అలాంటి తప్పులు చేయకూడదు అని అమ్మ ప్రమాణం చేయిస్తుంది. పిల్లల తప్పులను అమ్మ సహిస్తుంది.పిల్లల తప్పులను గొప్ప మనసుతో అమ్మ క్షమిస్తుంది అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“ఎప్పటికప్పుడు
“సంయమనం పాటించేది
“సంక్లిష్టతల ముడి విప్పేది.
సంయమనం అనే పదం వివిధ కారణాలవల్ల కొన్ని విషయాలను త్యజించడం మరియు నివారించడం అనే ఆలోచనను కలిగి ఉంటుంది.మనస్సును ఆధీనంలో పెట్టుకోవడం సంయమనం అంటారు. జీవితంలోని వివిధ అంశాలలో సంయమనం పాటించాలనే వ్యక్తి యొక్క ఎంపిక వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం మరియు గౌరవించడం చాలా ముఖ్యం.సంయమనం ఇది తరచుగా వ్యక్తిగత నమ్మకాలు,సాంస్కృతిక నిబంధనలు లేదా ఆరోగ్య పరిగణనలను ప్రతిబింబిస్తుంది.కాలక్రమేణా జీవితం క్లిష్టంగా మార వచ్చు.అమ్మ అవసరమైనప్పుడు ఆవేశానికి గురి కాకుండా సంయమనం పాటిస్తుంది.జీవితంలో ఎలాంటి చిక్కు పరిస్థితులు ఎదురైనప్పటికీ అమ్మ తెలివితో మరియు అనుభవంతో పరిష్కరిస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.కవయిత్రి రామలక్ష్మి అమ్మంటే కవిత ద్వారా అమ్మ పట్ల గల అవ్యాజమైన ప్రేమను మరియు అనురాగాన్ని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.కవయిత్రి రామలక్ష్మి మరిన్ని కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి ‘సంబరాల సంతకం’ కవిత పై విశ్లేషణా వ్యాసం.

కవయిత్రి,డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి కలం నుండి జాలువారిన స్నేహ గానం కవితా సంపుటిలోని సంబరాల సంతకం కవిత పై విశ్లేషణా వ్యాసం. సంబరాల సంతకం కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నన్ను ఆలోచింపజేసింది.సంబరాల సంతకం కవితను తన తండ్రిని గురించి కవయిత్రి రాసినట్లుగా తోస్తుంది.సంబరాల సంతకం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.సంబరం అంటే అది ఒక శుభకార్యం.సంబరాన్ని వేడుక వలె ఘనంగా జరుపుకుంటారు.మనిషి మనస్సు ఉత్సాహంగా ఉండేటప్పుడు కలిగే భావన సంబరం. ఒక నిర్దిష్ట సందర్భంలో సంబరాలు జరుపుకోవడం, సంబరాలు చేసుకోవడం,ఆనందించే కార్యక్రమాలలో పండుగలు,వేడుకలు,జాతరలు అన్ని కలిసి ఉంటాయి.ఒక వ్యక్తి సంతకం చేయడం అంటే ఆ వ్యక్తి దేని పైన సంతకం చేసాడో దానిని సృష్టించాడని గాని లేదా దాన్ని ఆమోదించాడని గాని ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని గాని భావన జనిస్తుంది.కవయిత్రి కవిత శీర్షిక సంబరాల సంతకం అని పేరు పెట్టింది.నాన్నతో గల అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ అధికారంతో కూడిన సంబరాల సంతకం నాన్న అని గుర్తు చేసుకుంటున్నట్లు తోస్తుంది.నాన్నతో గడిపిన తీపి క్షణాలను సంబరాల సంతకం అని అంటున్నది. కుటుంబంలో సంతానానికి కారకులు తల్లిదండ్రులు.వీరిలో పురుషున్ని తండ్రి,అయ్య,నాన్న ఆంగ్లంలో Father అని అంటారు.మన సంఘంలో పిల్లలను కని పెంచే బాధ్యత తల్లిది,పిల్లలను పోషించే బాధ్యత తండ్రిది అని భావిస్తారు.తండ్రి మూలంగా పిల్లలకు సమాజంలో గుర్తింపు,గౌరవం,ఆస్తి హక్కులు లభిస్తాయి.మన సమాజంలో తల్లిని భూదేవి, తండ్రిని ఆకాశం అంటారు.నాన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడే వాడు.నాన్నను జీవిత చుక్కాని అంటారు.నాన్న అంటే ప్రత్యక్ష దైవం.కనిపించే దేవుడు నాన్న.సంబరాల సంతకం కవితకు సంబంధించిన కథా కమామీషు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉందా? కవయిత్రి రామలక్ష్మి రాసిన కవితా చరణాల్లోకి వెళ్లి ఒక్కసారి మనసు పెట్టి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతి తరంగాలలో తేలియాడండి.
“నాన్న ప్రేమ
“సృష్టిలో అమూల్యం.
అమూల్యమైనది అంటే చాలా విలువైనది అంటారు.ఎవరు దానిని విక్రయించడానికి లేదా కొనడానికి ఇష్టపడరు.అమూల్యమైన వస్తువులు, ద్రవ్య విలువ లేని వస్తువులు అంటే స్నేహం, ప్రేమ,గౌరవం మొదలైనవి.తల్లిదండ్రులు తమ పిల్లలను అమూల్యమైన వారిగా భావించి ప్రేమిస్తారు.లెక్కించలేని ద్రవ్య విలువను కలిగి ఉండటం అమూల్యం అంటే విలువ కట్టలేనటువంటిది.
.అమూల్యమైనది అనే పదం తరచుగా చాలా విలువైన దానిని వివరించడానికి ఉపయోగపడుతుంది.అమూల్యమైన దాని విలువను సాధారణ ద్రవ్య విలువతో నిర్వచింపలేం.ఏదైనా ధరకు మించిన విలువను కలిగి ఉండటం అమూల్యమైనది.నాన్న అందించే ప్రేమ సృష్టిలో ఎక్కడా లభ్యం కాదు. పిల్లల పట్ల నాన్నకు గల ప్రేమ,అనిర్వచనీయమైనది మరియు అమూల్యమైనది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“నాన్న మనసు “ఉప్పొంగే సముద్రం.
మనసు అంటే అంతరంగం.మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు,విచక్షణ మొదలైన అంశాల ప్రతిరూపం.మనలో భావోద్వేగాలు,అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు.ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరంగం.మన మనసు ఆలోచిస్తుంది.మన మనసు అనుభూతి చెందుతుంది.మన మనసు గ్రహిస్తుంది.మన మనసు ఊహిస్తుంది.మన మనసు గుర్తు చేస్తుంది.భూమి పైన పెద్ద పెద్ద జల రాశుల గురించి చెప్పడానికి వాడే పదం సముద్రం. విస్తారంగా నీరు కలది సముద్రం.నీళ్లు నిండుగా ఉండే ప్రదేశం సముద్రం.ఉప్పు నీటితో విశాలమైన భూభాగాన్ని ఆక్రమించినది సముద్రం.నీటి పరిమాణం,లోతు చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశం సముద్రం.నాన్న మనసు ఉప్పొంగే సముద్రం. ఉప్పొంగే సముద్రమును చూసినట్లయితే చాలా సంతోషం కలుగుతుంది నాన్నను చూస్తే ఉప్పొంగే సముద్రాన్ని చూసినట్లుగా అనిపిస్తుంది.నాన్న మనసు వెన్నలాంటిది.నిర్మలమైన నాన్న మనసు ఉప్పొంగే సముద్రం వలె ఉంటుంది అని కవయిత్రి వ్యక్తపరిచిన భావం చక్కగా ఉంది.
“కష్ట సుఖాల కలబోత నాన్న.
నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు,వేదనలు అనుభవించాడు.నాన్న జీవితంలో సుఖాలను కష్టాలను అనుభవించాడు.నాన్న కష్టాలకు బెదిరి పోలేదు సుఖాలకు పొంగి పోలేదు.కష్టం వెంట సుఖం,సుఖం వెంట కష్టం ఉంటాయి.కష్ట సుఖాలు జీవిత చక్రంలో ఒక భాగం అని చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు.కష్ట సుఖాల కలబోత నాన్న అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“కలిమిలేముల కలనేత మా నాన్న.
కలిమి అంటే ఉండుట,కలుగుట సంపద అని అర్థం.లేమి అంటే లేకుండుట,దారిద్ర్యం అని అర్థం.మంచి,చెడు లాగే సంపద ఉండటం,సంపద లేకపోవడం అనేది కావడికి ఉన్న రెండు కుండల వంటివి.కావడి కుండలు సమానమైన బరువు కలిగి ఉంటేనే ఆ కావడి మోసే మనిషికి ఆహ్లాదకరంగా ఉంటుంది.కావడి సరిగా లేకపోతే మనిషి పడిపోతాడు.మనిషి జీవితంలో మంచి,చెడు, కష్టం,సుఖం రెండు ఉంటాయి.అప్పుడే మనిషికి మంచి ఏమిటి?చెడ్డ ఏమిటి?కష్టం ఏమిటి?సుఖం ఏమిటి? అనే దాని విలువ అవగతం అవుతుంది. ఐశ్వర్యం,పేదరికం అనేవి మానవ జీవితంలో తారసపడుతుంటాయి.అప్పుడే మనకు మంచి విలువ,సంపద విలువ తెలుస్తుంది.కలనేత అంటే రెండు రంగులు కలిపి నేయడం..కలనేత చూడ్డానికి చాలా బాగుంటుంది.పట్టు, కాటన్, సిల్క్ మిక్స్ చేసి కలనేతతో తయారు చేస్తారు.రెండు రంగులు అవటం వలన కలనేత అంటారు.సంపద,దారిద్ర్యం రెండు కలనేత వలె నాన్న జీవితంలో కలిసి ఉన్నాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

కొమర్రాజు రామ లక్ష్మి తండ్రి కృష్ణా రావు,తల్లి శకుంతల.


“బతుకు బాటన పయనించే బాటసారి.
నాన్న బతుకు కొరకు బాటసారి వలె ఎక్కడా ఆగకుండా పయనం కొనసాగించాడు.బాటసారి ప్రయాణం నిరంతరంగా కొనసాగుతుంది.ఏ ప్రయోజనం ఆశించి వెళుతున్నాడో ఆ ప్రయోజనం నెరవేరే వరకు బాటసారి పయనం కొనసాగుతుంది. బాటసారిది నిర్విఘ్నమైన ప్రయాణం.బాటసారికి ఎక్కడ అలసట కలిగినప్పుడు కొంత సేపు ఎక్కడో ఒకచోట సేద తీరి ప్రయాణం కొనసాగిస్తాడు. బాటసారి తన మానాన తాను బతుకు కొరకు సాగిపోతాడు.ఎన్ని ఆటుపోటులు ఎదురైనా బాటసారి తన పయనం ఆపడు.నాన్న గురించి కవయిత్రి బతుకుబాటన పయనించే బాటసారి అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“బరువు బాధ్యతలను వెరవని శ్రమజీవి.శ్రమ చేసేటటువంటి వ్యక్తిని శ్రమజీవి అంటారు.శ్రమజీవి ఎప్పటికైనా విజయం పొందుతాడు. ఇతరుల కొరకు శారీరక శ్రమ చేసేవాడు శ్రమజీవి.నాన్న అలుపు ఎరుగని శ్రమజీవి.నాన్న బరువు బాధ్యతలను నెత్తి మీద వేసుకొని కుటుంబ భారం మోసిన శ్రమజీవి. నాన్న కుటుంబం కొరకు బరువు బాధ్యతలను మోసి కుటుంబాన్ని గట్టెక్కించిన శ్రమజీవి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“కష్టాన్ని చెప్పుకోని కర్మ జీవి.
మనిషి రోజు చేసే కార్యక్రమాలను కర్మలు అంటారు.కర్మను ఒక యోగం లాగా చేయడాన్ని కర్మయోగం అంటారు.కర్మ చేసే మనిషిని కర్మయోగి అంటారు.మనిషి చేసే ప్రతి చర్యకు ప్రతిఫలం అనుభవించి తీరాలి.మనిషి చేసే మంచి కర్మలకు మంచి ప్రతిఫలం లభిస్తుంది.మనిషి చేసే చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.కర్మ అంటే మనిషి మానసికంగా గాని శారీరకంగా గాని చేసిన కార్యకలాపాలు.సర్వ సామాన్యమైన పనులు చేసి ఆ పనుల నుండి సుఖ సంతోషాలను విశ్రాంతిని,ప్రశాంతతను పొందగలిగితే అతనిని కర్మ యోగి అంటారు.ఒక పని చేసినప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుందో అని దాని ఫలితం కోసం ఆలోచించకుండా పని చేయాలి.నాన్న తనకు జీవితంలో ఎదురైనా కష్టాలను గురించి ఎవరి వద్దకు వెళ్లి చెప్పుకోలేదు.కష్టాలను ధైర్యంతో అధిగమించాడు.ఒక కర్మ జీవిలా కష్టాలను అనుభవించాడు.కష్టాలను గురించి ఎవరికీ చెప్పుకోని కర్మజీవి నాన్న అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“సమస్యలను ఛేదించే మహా జ్ఞాని.
సమస్యల పరిష్కారం అనేది చాలా కార్యకలాపాలను తరచుగా భాగమయ్యే అడ్డంకులను అధిగమించడం ద్వారా లక్ష్యాలను సాధించే ప్రక్రియ.జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను తెలివిగా పరిష్కరించగలడు.సాధారణ సామర్థ్యానికి మించిన జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను గుర్తించడం,విశ్లేషించడం మరియు పరిష్కరించడం జరుగుతుంది.సమస్య పరిష్కారం అనేది జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కారాలను కనుక్కునే ప్రక్రియను సూచిస్తుంది.మనం వ్యక్తిగత జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తాం.కొన్ని సమస్యలు చిన్నవి.వాటిని మనం త్వరగా పరిష్కరించుకోవచ్చు.సంక్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడానికి సహకారం,సృజనాత్మకత అవసరం ఉంటుంది.కవయిత్రి నాన్న గురించి చెబుతూ సమస్యలను ఛేదించే మహా జ్ఞాని నాన్న అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
క్రమశిక్షణను నేర్పే
“ఆది గురువు.
క్రమశిక్షణ అనే పదాన్ని జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని అందించడం మరియు బోధించడం అని నిర్వచింపబడింది.క్రమశిక్షణ అనేది శిష్యుడికి ఇవ్వబడిన క్రమబద్ధమైన సూచనలను తెలియజేస్తుంది.ఒక నిర్దిష్టమైన ప్రవర్తన నియమావళిని అనుసరించమని ఒక వ్యక్తికి సూచించడం క్రమశిక్షణ.క్రమశిక్షణ అనేది నియమాలు లేదా ఆదేశాలను పాటించాల్సిన అవసరము మరియు కష్టమైన పనిని కొనసాగించగల సామర్థ్యం ద్వారా పొందే స్వీయ నియంత్రణ.క్రమశిక్షణ అంటే బోధించడం,సరిదిద్దడం అని చెప్పవచ్చు.పిల్లలకు క్రమశిక్షణ తండ్రి వద్ద నుండి అలవడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అంచనాలు, మార్గదర్శకాలు మరియు సూత్రాల గురించి బోధించడానికి క్రమశిక్షణను ఉపయోగిస్తారు.క్రమశిక్షణ పిల్లలకు చిన్నతనం నుండి అలవాటు చేయాలి.ప్రపంచమంతా ఒక క్రమమైన పరిణామం కనిపిస్తుంది.రాత్రి,పగలు, నెలలు,రుతువులు,సంవత్సరాలు ఇలా ఒక క్రమ పద్ధతిలో వస్తాయి.అలాగే గ్రహాల గతి కూడా క్రమానుగతంగా తన విధులను నిర్వహిస్తుంది.అదే విధంగా మానవులు తమ విధులను నిర్వహించాలి. ప్రతి వ్యక్తి తనకు తానే స్వయంగా క్రమశిక్షణకు పాటుపడాలి.దీనిని అంతర్గత క్రమశిక్షణ అంటారు. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ఏదైనా సాధించగలడు.పిల్లల క్రమశిక్షణకు సజీవ రూపాలు.చక్కని క్రమశిక్షణతోనే దేశ ప్రగతికి పునాదులు వేయబడ్డాయి.గురువు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే వ్యక్తిగా చూడబడతాడు.మన భౌతిక ఆది గురువులు తల్లిదండ్రులు.మనను కన్న తల్లిదండ్రులను గౌరవించాలి,ఆదరించాలి,సేవించాలి.క్రమశిక్షణ నేర్పిన ఆది గురువు తండ్రి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మరెవ్వరితోని పోల్చలేని
“ఆత్మబంధువు.
హృదయానికి చాలా దగ్గరగా ఉండే బంధువు లేదా సంబంధం ఉన్న వారిని ఆత్మ బంధువు అని అంటారు.ఆత్మకు బంధువు నాన్న.పిల్లలకు ఆత్మబంధువు నాన్న.మరెవ్వరితోని పోల్చలేని ఆత్మబంధువు నాన్న అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“పిల్లల
“గెలుపు సాధనం నాన్న.
పోటీలో నెగ్గుట గెలుపు అంటారు.నాన్న పిల్లలను విద్య నేర్పించడం కొరకు పాఠశాలలో చేర్పిస్తాడు. నాన్న ఎన్నో పనులు చేస్తూ తాను పడ్డ కష్టాలను మర్చిపోతాడు.పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే అతడి ఆనందానికి అవధులు ఉండవు.పిల్లలు చదువులో ఉద్యోగంలో రాణించడానికి ఎంతో తోడ్పడుతాడు.పిల్లల గెలుపు సాధనం నాన్న అని కవయిత్రి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఓటమితో ఊరటనిచ్చే
“ధైర్యం నాన్న.
గెలుపుకు వ్యతిరేకం ఓటమి.పోటీలో ఒకరిపై ఓడిపోవడం ఓటమి.గెలువకపోవడం ఓటమి.ఓటమి అంటే పోరాటాన్ని విడిచి స్తబ్దంగా ఉండడం.ధైర్యం అంటే వేదన,నొప్పి,ప్రమాదం,అనిశ్ఛితి లేదా బెదిరింపులను ఎదుర్కొనే ఎంపిక మరియు సుముఖత.ధైర్యం అంటే కష్టాలను ఆపదలను ఇష్టపూర్వకంగా ఎదుర్కోవడం.ఊరట అంటే బాధా నివారణ.ఓడిపోయినప్పుడు పిల్లవాడికి మనో ధైర్యం ఇచ్చి ఓటమిని ఎదుర్కొనే ధైర్యం తండ్రి ద్వారా కలుగుతుంది.ఓటమితో ఊరట నిచ్చే ధైర్యం నాన్న అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“కరుణ చూపే ఆ కళ్ళు
“అలసి సొలసిన ఆ కాళ్లు
“ఆయన వాత్సల్యానికి ఆనవాళ్ళు.
కరుణ అంటే కనికరము,దయ,జాలి అనే అర్థాలు ఉన్నాయి.వాత్సల్యం అంటే ప్రేమ,ఆప్యాయత, అనురాగం.బిడ్డల మీద తండ్రి చూపే ప్రేమ, ఆప్యాయత,అనురాగం.తల్లి ఆవు తన దూడపై చూపే ఆప్యాయత.ప్రేమ పూర్వక ప్రవర్తన అనేది తల్లిదండ్రుల పోషణ మరియు ప్రవర్తన నుండి వస్తుంది.నాన్న కళ్ళల్లో పిల్లల పట్ల కరుణ తొణికిసలాడుతుంది.నాన్న కుటుంబం కొరకు మరియు అందరి ఆనందం కోసం శ్రమించడం ద్వారా ఆ కాళ్లు అలసి సొలసిపోయినాయి.పిల్లల పట్ల నాన్న చూపించిన ప్రేమ,అనురాగం,ఆప్యాయత గుర్తులుగా నిలుస్తున్నాయి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“కుటుంబమే నాన్నకు ప్రాణం
“దాని క్షేమానికి ఆయన
“జీవితం అంకితం.
కుటుంబం అనగా ఒక ఇంటిలో నివసించే కొంత మంది మనుషుల సమూహం.కుటుంబ సభ్యులు పుట్టుకతో లేదా వివాహంతో సంబంధం ఉన్న వారు. కుటుంబంలో సంబంధాలు అనుభవాలు, అనుభూతులు,కాలానుగుణంగా మారుతూ ఉంటాయితల్లిదండ్రులు పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం,సంస్కృతిని వారికి అందజేయడం జరుగుతుంది.పిల్లలు చిన్న వయసులో తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. కుటుంబం అంటే నాన్నకు ప్రాణంతో సమానం. కుటుంబ సభ్యుల క్షేమానికి నాన్న జీవితం అంకితం చేశారు.తాను కరుగుతూ తన బిడ్డల ఎదుగుదలకు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నాన్న చేసిన త్యాగం మాటల్లో చెప్పలేనిది వెలకట్టలేనిది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“నాన్నంటే కురిసే వెన్నెల
“విరిసే నవ్వుల వాన వెన్నెలను చంద్రకాంతి అని కూడా అంటారు.ఆంగ్లంలో Moon Light అని అర్థం. చంద్రుడు రాత్రులందు కురిపించే కాంతిని వెన్నెల అంటారు.వర్షం లేదా వానను ఆంగ్లంలో Rain అని అర్థం.ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన ఆవపాతం వాన.రాత్రి పూట ఆకాశంలో కురిసే వెన్నెల రాత్రి ఎంతో హాయిగా ఉంటుంది.నాన్న ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మోములో సంతోషాలు విరబూస్తాయి.నాన్న కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సరదాగా గడపితే అందరి ముఖారవిందాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. నాన్నంటే కురిసే వెన్నెల విరిసే నవ్వుల వాన అని చెప్పిన భావం అద్భుతంగా ఉంది.
“ఇంటి సంబరాల సంతకం నాన్న
“కంటి వెలుగులకు
“చిరునామా నాన్న.
ఇంటిలో నెలకొన్న సంతోషాలకు,సంబరాలకు నాన్న అధికారంతో కూడిన సంతకం వలె ప్రేమ, ఆప్యాయత,అనురాగం నెలకొంటాయి.ఇంటి కుటుంబ సభ్యుల కళ్ళలో వెలుగులు విరజిమ్మడానికి చిరునామా నాన్న అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మనిషి తనానికి
“ఆ నిలువెత్తు సాక్ష్యానికి
“ప్రేమతో వందనాలు !
భూగోళం పై నున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మనుషులు చాలా పురోగతి సాధించారు. మానవులలో వివేకం,ఆలోచన,భాష వంటి విషయాలు మెదడు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందడం వల్ల సాధ్యపడినాయి.మానవులు భావవ్యక్తీకరణ,సమాచార పద్ధతులను వాడడంతో పాటు అత్యంత నిపుణతను కలిగి ఉన్నారు.ప్రతి మనిషి జీవితానికి అర్థం ఉండాలని కోరుకుంటాడు. నాన్న న్యాయమైన అర్జన చేశాడు.నాన్న ఎలాంటి అవినీతి,అవకతవకలకు పాల్పడ లేదు.నాన్న ఎవరికి ఏ కోశాన హని తలపెట్ట లేదు.నాన్న ఉన్నంతలో ఇతరులకు సహాయం చేశాడు.నాన్న కుటుంబ నావను మునిగి‌ పోకుండా గట్టెక్కించాడు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం నాన్నది. మంచితనానికి,మనిషి తనానికి నిలువెత్తు సాక్ష్యం అయిన నాన్నకు ప్రేమతో వందనాలు చెప్పడం ద్వారా తండ్రిని దేవుడిగా తలచిన తీరు మనస్సులో మెదులుతుంది.కవయిత్రి రామలక్ష్మి కి నాన్న పట్ల గల అపార ప్రేమకు నిదర్శనంగా సంబరాల సంతకం కవిత నిలుస్తుంది.కవయిత్రి రామలక్ష్మి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

దశ -దిశ

by Devulapalli Vijayalaxmi July 30, 2024
written by Devulapalli Vijayalaxmi

“రత్తాలూ!ఓ రత్తాలక్కా !సీరలేమైనా.ఉన్నాయేందే” అంటూ గుడిసె ముందున్న సిమెంటు తొట్టి లో నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటూ కేకేసింది పోచమ్మ.

“అవు వున్నయిగనీ మూట ఇప్పలేదు అక్కా!ఉతకలే,ఇస్తిరీ సేయలా!రెండు రోజులసందె జొరం.”
అంటూ మూలిగింది రత్తాలు.

“అయ్యో సెప్పకపోతీవి.జరంతలోమంచిగా పప్పుసారు బువ్వ తెస్తా.కుసింతబువ్వతిని డోలో ఏసుకో తగ్గుద్ది. పొద్దుగాలే రోడ్లట్టకు తిరగాలాయే.ఛీ! రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాయెపో!” ఆప్యాయంగా అంటూ తన రేకుల షెడ్డు వైపు వడివడిగా అడుగులువేసింది పోచమ్మ.

ఆ బస్తీలో అన్నీ రేకులషెడ్డులే కాలవకి ఆనుకొని.అక్కడ ఆడమగా అందరూ ఏదో చిన్నాచితకా కూలిపనులు చేసుకుని పొట్ట పోసుకునే వారే.అందరూ ఒకరి కష్టం ఒకరు తెలుసుకుని ఒకరికొకరు ఆదుకునేవారే.అదే ఆ బస్తీ ప్రత్యేకత.
★★★

రత్తాలు చాలా తెలివైనది.కొడుకు రెండేళ్ళవాడని కనికరం లేకుండా యాదయ్య రత్తాలుని వదిలేసి ఓటక్కులాడిని చేసుకొని పోయాడు.ఇదంతా సర్వసాధారణం ఆ బస్తీలో.

యాదయ్య వెళ్లి పోతానన్నప్పుడు గుండెలు బాదుకొని ఏడవలేదు, గొడవపడలేదు రత్తాలు. పంచాయితీ అన్నారు బస్తీలో కొందరు.వద్దన్నది రత్తాలు.తనంటే ఇష్టం లేని మొగోనితొ కాపరం చేసినా చేయకపోనా ఒక్కటే అని మౌనంగా ఉంది.

“రెండేళ్ళపిల్లోడిని సదివించాల.మంచికొలువులో ఎట్టాల.ఈ మురికికాలవకి దూరం పోవాల”ఇదే పగలూరాత్రి నల్లపోచమ్మ గుడిలో కూచొని ఆ తల్లికళ్ళలోకి చూస్తూ మౌనంగా మాట్లాడేది రత్తాలు.

ఆసంకల్పంతో భర్త వెళ్ళాక ఇల్లంతా వెతికి అక్కడ ఇక్కడ దాచిన ఒక వెయ్యి పోగేసింది.పోచమ్మని తీసుకుని స్టీలు ఫేక్టరీకి పోయి స్టీలుసామాన్లు కొంది.మరుసటిరోజు ఒక గంపలో స్టీలు సామాన్లు సర్దుకొని.పిల్లవాడిని జోలెలో కూర్చోపెట్టుకొని,”పాత సీరలకు స్టీలు సామాన్లు ఇస్తామమ్మా”, అని అరచుకుంటూ అంటూ వీధి వీధి ఎండనక వాననక తిరిగేది.
మొదట్లో ఎవరోపిలిచి పాతచీరలిస్తే దానికి తగ్గ సామానిచ్చేది.రాను రాను గృహిణులకి రత్తాలు బాగా. అలవాటైంది.జోలెలోని పిల్లడు కూడా కొంత కారణం.పాతచీరలు నాలుగైదుండగానే రత్తాలు దగ్గిర సామాన్లు కొనే వాళ్ళు.కొంతమంది అయితే “ఒసే! రత్తాలు ఈసారి పులిహార పళ్ళెంతేవే అనో లేకపోతే బియ్యం పోసుకునే డబ్బా తెచ్చిపెట్టు” అంటూ డిమాండ్ చేసేవారు.వాళ్ళ డిమాండ్ కి తగ్గట్టు స్టీలు సామాన్లు తెచ్చేది.ఆ ఇళ్ళవాళ్ళు వాళ్ళ పాతబట్టలకి ఏదో ఒకటి వస్తోందని పెద్ద పట్టించుకునేవాళ్ళుకాదు.పైపెచ్చు రత్తమ్మ డిమాండ్ చేసినంత క్యాష్ పెద్దవస్తువులకి ముట్టచెప్పేవారు. అంతేకాదు నువ్వే ఏదో ఒకటి చేసుకో అంటూ బిగుతైన ప్యాంట్లు, చిన్నపిల్లల బట్టలు పడేసేవారు.
“ఓ!అమ్మో! సీరలకైతేనే సామానిత్తా. ఈ పాంటులకి,పిల్లోళ్ళ బట్టలకి నేనేమివ్వా.” అంటూ ఖరాఖండిగా చెప్పేది రత్తాలు .
” ఏదోఒకటి చేసుకోవే!ఇవన్నీ పెట్టే స్థళంలేదుఅన్నీ బిగుతైనవే మా వాళ్ళకి” అంటూ పడేసేవారు రత్తాలుకి.

అప్పడప్పుడూ షెడ్మీద సొరతీగకి కాసిన సొరకాయలు,తొట్టిదగ్గర మల్లెచెట్టుకి పూసిన మల్లెలు ఆఇళ్ళవాళ్ళకి బహుమానంగా ఇచ్చి,వాళ్ళపనిమనిషి రాకపోతె బాసాన్లు తోమి ఆ ఇళ్ళవాళ్ళకి సన్నిహితురాలయిందిరత్తాలు.

సామాన్ల బదులు వచ్చిన చీరలన్నీ తీసి అందులో ఫాల్ ఊడినవి,జరీ చీరలు,కొంచెం చిరిగిన చీరలు విడి విడిగా చేసి బస్తీలో మిషను కుట్టే సీతమ్మ చేత రిపేరు చేయించి వాటిని ఉతికి ఇస్త్రీ చేయించేది.ఆ చీరలు అమ్మకానికి పెట్టేది రత్తాలు.పిల్లల బట్టలు బస్తీలో పిల్లలకి ఉచితంగా ఇచ్చేది. జీన్స్ ప్యాంట్లు కుర్రకారుకి చవకగా ఇచ్చేది.ఈ విధంగా రత్తమ్మ బస్తీలో మంచిపేరు తెచ్చుకుంది. చీరలమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులకి కొంత ఉంచుకుని మిగిలిన దంతా స్టీలు సామాన్లు కని ఖర్చు పెట్టేది.
. ★★★

ఇలా రెండు సంవత్సరాలు కాలంలో కలసి పోయాయి.రత్తాలు కొడుకు సురేసు నాలుగేళ్ళ వాడయ్యాడు.రత్తమ్మకి అసలు కష్టం ఇప్పుడు మొదలైంది.పిల్లవాణ్ణి ఇంట్లో వదలలేదు తను ముందు లాగా పిల్లవాణ్ణి జోలెలో కూర్చోపెట్టుకొని నెత్తి మీద బుట్ట, బట్టల మూటతో మోయాలంటే చేతకావటంలేదు.పోచమ్మ గుడి ముందు కూర్చొని మౌనంగా కష్టం విన్నవించుకునేది.

ఒకరోజు ఒక పెద్ద. గేటుముందాగి “పాతబట్టలకి స్టీలు సామాన్లు ఇస్తా “అంటు గట్టిగా అరచింది రత్తాలు.

లోపలనించీ ఒక నడివయసు ఆయన వచ్చి.” ఇది అనాధాశ్రమం.మేమే వాళ్ళూవీళ్ళు ఇచ్చిన డబ్బు బట్టలు గిన్నెలు తీసుకుంటాం”అంటూ గేటు మూసేసాడు.
మరొకసారి రత్తాలు తిరిగి వస్తుంటే అదే గేటు నుండి చాలామంది పిల్లల సందడి వినిపించి నెమ్మదిగా గేటు తీసుకొని వెళ్ళింది.అక్కడ ఒక ఆజాను బాహుడయిన నలభై ఏళ్ళ వ్యక్తి ముప్పైఐదేళ్ళ స్త్రీ ఆరుబయట పిల్లలని చుట్టూర కూర్చోపెట్టుకునిచదువు చెప్పటం చూసింది.

“అమ్మా ‘అంటూ పిలిచిందిరత్తాలు నెత్తిమీద గంపనేలమీద పెడుతూ.
“ఎవరమ్మా!చెప్పు. ఏంకావాలి? అంటూ ఆప్యాయంగా అడిగింది ఆ స్త్రీ.
“అమ్మా ఈడ అమ్మా అయ్యా లేనోళ్ళేనా నాబోటోళ్ళ పిల్లలుకూడా ఉన్నారా?”అని అడిగింది రత్తాలు.
“నీకు భర్త ఉన్నాడా?ఉంటే ఏం చేస్తున్నాడు”అంటూ అడిగింది ఆస్త్రీ.
‘”లేడమ్మా!ఈ పిల్లగాడు రెండేళ్ళ సందె వదిలేసి ఏరే ఆమెను కట్టుకున్నాడు. ఈపిల్లగాని జోలెలో ఏసుకొని ఈ గంపనెత్తినెట్టుకొని గల్లీలంట తిరుగాడతూ స్టీలుసామాన్ల యాపారం సేసుకుంటున్నా.పోరడు నాలుగేండ్లు అయినాయి. ఎత్తుకోలేను.ఈడా నడసలేడు.మీరు దయెట్టి నా పోరడ్నికూడా ఈపిల్లగాళ్ళతో ఉంచుకుంటే నే సాయంమాపు పిల్లగాన్ని తోలుకు పోతా”అంటూ ఆశగా చూసింది రత్తాలు.

“రత్తాలు!నాపేరు శాంతి.ఈ సార్ నా భర్త.ఈ ఆశ్రమం కేవలం అనాధలకే కాదు. పిల్లలని పోషించుకోలేని ఆశ్రయం లేని మీలాంటి పేదలకి కూడా.ఇక్కడ రైల్వే స్టేషన్లలోనూ వీధుల్లో దిక్కులేక అడుక్కునే పిల్లలని పోలీసులు మాదగ్గర వదిలి పెడతారు.మేము వారికి భోజనం పెట్టి గవర్ననమెంటు స్కూలులో చదివిస్తాము. వాళ్ళు 12వక్లాసు కాగానే ఏదో ఉద్యోగం చూసుకుని బయటకు వెళ్ళిపోవాల్సిందే”. అంటూ చెప్పింది శాంతి.
అమ్మా శాంతమ్మా! నా బుడ్డోడిని జరంత పయోజకుణ్ణి సేయమ్మా బాంచను మీ కాళ్ళుమొక్కుతా” అంటూ ఎంతో దీనంగా శాంతి శాంతి భర్తకాళ్ళు పట్టుకుంది రత్తాలు.
“లే లే రత్తాలు మేమున్నది మీలాంటి వారిని ఆదుకోవటానికే.” అంటూ మేము గవర్నమెంటు వారి సహకారంతో పిల్లలని చదివిస్తాము.అందుకని కొన్ని వివరాలు నీ వేలి ముద్ర కావాలంటూ ఫారమ్ లు తెచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసింది శాంతి.

గుండెలమీద భారం తీరినట్టయింది రత్తాలుకి.
“రేపు తీసుకొచ్చి వదులుతానమ్మా!” అంటూ కాళ్ళకి మొక్కి బుట్టా, మూటా నెత్తిన పెట్టుకుని పిల్లాడిని నడిపించుకుంటూ ఇంటి బాట పట్టింది రత్తాలు. మధ్యలో పోచమ్మ గుడి దగ్గర కాస్సేపు కళ్ళనీళ్ళ”పోచమ్మ తల్లీ నీవే దిక్కు”అంటూ బాధ వెళ్ళపోసుకుంది.

“గేం రత్తాలు!ఇయాల గింత ఆలీసమైనాది?”అంటూ రావులమ్మ పలకరింపుతో ఆలోచనలతో నడుస్తున్న రత్తాలు కి ఇంటికి చేరువయ్యానని గ్రహించింది.

“గౌ అక్కా”అంటున్న రత్తలుని చూసి అమ్మా ఇద్దరొస్తోంందే,ఆకలౌతోందే అంటూ ఏడుపు లంకించుకున్నాడు.”సురేసు ఎక్కడ తల్లి రావులమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటుందో అని.
“ఉండయ్యా బుక్కెడు బువ్వతిని పండదుగాని” అంటూ వంట కుపక్రమించింది.
★★★
అమావాస్య చీకటిని పారద్రోలుతూ సూరీడు అరుణ కిరణాలు నీలిరంగు ప్లాస్టిక్ పరదాలగుండా రత్తాలు ముఖాన్ని తాకాయి.
“అమ్మో తెల్లారిందే!” అనుకుంటూ రాత్రి చద్ది పిల్లవానికి తినిపించి తానింతతిని బుట్ట సర్దుకొని పిల్లవాని చంకనవేసుకుని ఆశ్రమం బాట పట్టింది.

తోవలో కొడుకుని ప్రేమతో “సురేసా నీకు మంచి రోజులొచ్చినాయి పోచమ్మ తల్లి దయవల్ల.నిన్న పోయినాం సూడు ఆ ఆంటీ తావున ఉండు.నేను సామాన్లు అమ్ముకొని సందేళ వచ్చేటప్పుడు నిన్ను కొండుపోతా!”అంటూ రత్తమ్మ పిల్లవానికి సంజాయించింది.
వాడి చిన్న ప్రాణానికి వీధి వీధి ఎండనక వాననక తిరగాలంటే కాళ్ళు నొప్పులు.”అమ్మ అన్న తావున మస్తుమంది దోస్తులున్నారు.” అనుకున్నాడు సురేసు.
ఒక్కటే సురేసుకు అర్ధం అయింది.తల్లి తో నడవక్కరలేదు..
పెద్ద పేచీ లేకుండానే శాంతి దగ్గరున్నాడు సురేసు (సురేష్)
★★★
పిల్లవాడి భారం తగ్గటంతో రత్తాలుకి కొత్త కొత్త ఆలోచనలు ఉత్సాహం పెరిగింది.పక్కనే బండి మీద గాజులు, క్లిప్పులు అమ్ముకునే రాజయ్యని పిలిచింది ఒక చక్క మీద “చీరలు అమ్మబడును.”SAREES FoR SALE “అని రాయించిందితెల్ల పైంట్ మీద నల్లపైంట్ తో 7వక్లాసు వరకూ గవర్నమెంటు స్కూలులో చదివి చదువాపేసిన రాజయ్యతో.చాలా ఏళ్ళుగా రాయటం అలవాటు లేక బ్రష్ పెయింట్ తో రాయటం చాతకాక ఏదో కొక్కిరిగా రాసాడు.రత్తాలు తెలుగులో రాయమంటే తన ఆంగ్ల పాండిత్యం అంతా చూపించి పాపం sarees for sale అని కూడా రాసితన చదువు అక్కరకి వచ్చినందుకు తెగ మురిసి పోయాడు రాజయ్య.
రెండు కఱ్ఱలు పాతి ఆ కఱ్ఱలకు పెయింట్ చేసిన చక్కను మేకులతో కొట్టించింది. ఆ పని చేసినందుకు వద్దంటున్నా రాజయ్య చేతిలో 100 రూపాయలు పెట్టింది ఎవరి కష్టం ఉంచుకోవడం ఇష్టం లేని రత్తాలు.రాజయ్య పిల్లలకి తన దగ్గరున్న బట్టలు ఇచ్చింది.
శుక్రవారం నాడు ఆ కఱ్ఱలకు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరి కాయ కొట్టింది.
ఇంటిముందు తొట్టిలో నీళ్ళునింపింది.
గుడిసె లో మంచి చాప పరచింది.ఒక అట్టపెట్టెలో ఇస్త్రీ చేసిన మంచి చీరలుపెట్టింది.
పిల్లల బట్టలు ఉతికి మడత పెట్టింది.
అమ్ముకోవడానికి వేళ్ళేటప్పుడు ఆశ్రమానికి వెళ్ళి ఆ బట్టలన్నీ శాంతికి ఇచ్చి”అమ్మా నేను పేదదానిని కానీ నాకూ మనసుండాది.అయ్య,,అమ్మ లేని ఈ పోరలని సూత్తాఉంటే మనసు. నొచ్చుకుంటోంది. మీరేమనుకోనంటే ఈ డెస్సులన్నీ వ ఓరికి సరిపోతే ఆరికివ్వండమ్మా!” అంటూ చక్కగా మడతపెట్టిన బట్టల అట్టపెట్టె ఇచ్చింది రత్తాలు.

అన్నీ మంచి రెడీమేడ్ డ్రెస్సులు. ఒక్కటీ చినగలేదు.అన్నీ బిగుతై రత్తాలుకి ఇచ్చి నటువంటివి..శాంతి అభ్యంతరం చెప్పకుండా తీసుకుంది.
బీదరికంలోకూడా సహాయం చేయాలనే మానవతా ధృక్పదానికి శాంతి కళ్ళు చెమరించాయి.

మానవత్వం శాంతి రత్తాలుని మంచి స్నేహితుల్ని చేసాయి.సురేష్ శాంతి పర్యవేక్షణలో మంచి భాష,నడవడిక,తెలుగు ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకుంటున్నాడు.
ఒక్కొక్క రోజు శాంతి “సురేష్ ఇవాళ ఇక్కడే పడుకుంటాడని”ఉంచేసేది.
రత్తాలుది పల్లెటూరి అందం.పెద్దపెద్ద కాటుక కళ్ళు సూటైన ముక్కుకి ముక్కెర.మొరటుగా ఉన్నా తీర్చి దిద్దినపెదాలు.మంచి ఎత్తు ఎత్తుకు దగ్గబలమైన శరీరసౌష్టవం.తిన్నా తినకపోయినా మనిషిలో నీరసం ఉండేదికాదు.తల్లి పోలికలు పుణికి పుచ్చుకున్నాడు సురేష్.
రత్తాలు బోర్డు పెట్టిన వేళా విశేషం పాతచీరల అమ్మకం జోరుగా సాగింది.తొట్టె దగ్గర కాళ్ళు కడుక్కుని గాని ఎవరూ లోనికి రాకూడదు.వచ్చిన వాళ్ళు కూర్చున్నాక అట్టపెట్టెలో చీరలు చూపించేది.
రఫ్చేసిన చీరలు మాత్రం బేరమాడనిచ్చేది.యాభై నించీ వంద వరకూ.
మంచి చీరలు రెండువందలు నించీ రెండువందలయాభై.అన్నీ గార్డెన్సిల్క్ లేకపోతే ఫాన్సీ జరీచీరలు.షాపులో పదిహేను రెండువేలు పలికేవి.నూటయాభైకి షాపులో కొత్తచీరదొరికినా పలచగా ఉండటం ఒకనాలుగు ఉతుకులకి జాలీలయ్యేవి.అందుకని బస్తీలో అందరూ రత్తాలు దగ్గిర చీరలు కొనటానికి ఇష్టపడేవారు.అదీకాక డబ్బులు రెండునెలల్లో తీరిస్తేచాలు.

సాయంత్రాలు పెందలాడే వచ్చి చీరల వ్యాపారం చేసేది.

      నెమ్మది నెమ్మదిగా సురేష్ శాంతి దగ్గర మాలిమయ్యాడు.ఇప్పుడు టెంత్ కి వచ్చాడు.ఎయిత్ నించీ తల్లితో  బస్తీలోకి వెళ్ళటం మానేసాడు ఎప్పుడో తప్పించి.చదువు వాడికి ప్రాణం.తనకు తల్లి ఉంది.అక్కడ తల్లీ తండ్రి లేని వారంటే వాడికి ఎనలేని ప్రేమ.చిన్న పిల్లలకి  స్నానం చేయించటం,అన్నం తినిపించటంతోపాటు వాళ్ళచేత హోంవర్క్ చేయించటం లాంటి పనుల్లో శాంతికి శాంతి భర్త ప్రకాష్ కి తలలలో నాలుకయ్యాడు.
                   ★★★

ఒకరోజు శాంతి రత్తాలు వ్యాపారం గురించి తెలుసుకుంది.
“రత్తాలు! ఎన్నాళ్ళిలా రోడ్లు పట్టుకు తిరుగుతావు ఎండనక వాననక ఇంటిదగ్గిరే ఉండి వ్యాపారం చూసుకోకూడదు.”అందిశాంతి.
శాంతి మాటలు వినంగానే రత్తాలు పడీపడీ నవ్వటం
నవ్వుఎంతకీ ఆపక పోయేసరికి ఉక్రోషంతో శాంతికి కోపం వచ్చింది.
“ఎందుకు నవ్వుతావు? నేను నీవైపు ఆలోచిస్తుంటే.” అందికోపంగా శాంతి.
“అమ్మా!నేను చీరల వ్యాపారం చేయట్లేదు పాతబట్టలకి స్టీలు సామాన్ల వ్యాపారం. అలా అని స్టీలుసామాన్ల వ్యాపారం కాదు.స్టీలుసామాన్లు లేకపోతే బట్టలు రావు.బట్టలు అమ్మకపోతే పైసలు రావు.పైసలు రాకపోతే స్టీలుసామాన్లు గెట్లాకొనేది.ఇంట్లో కూర్చునే యాపారం కాదమ్మానాది.”అంటూ శాంతికి కోపం వచ్చిందని గ్రహించి విడమరచి చెప్పింది రత్తాలు.

ఇప్పుడు శాంతివంతైంది పడీపడీనవ్వటం. తలకొట్టుకుని”ఇంత చిన్న లాజిక్ తనేలా మిస్సయింది. అందుకేనేమో చదువుకున్నవానికంటే చాకలివాడు మేలంటారు”అనుకుందిశాంతి.
★★★
ఒకరోజు సాయంత్రం రెండు శుభవార్తలు వినిపించింది శాంతి రత్తాలుకి.
మొదటిది సురేష్ మంచి పర్సెంటేజ్ తో టెన్త్ పాసయ్యాడు.
రెండవది ఒక పెద్ద అట్టపెట్టె నిండా కొత్తచీరలు.అన్నీ 100,150 రూపాయలకి.హోల్సేల్ లో మంచి చీరలు అతి తక్కువ ధరలో శాంతి ఫ్రెండ్ సూరత్ నించీ తెప్పించుకుంటుంటే రత్తాలుకని శాంతి తెప్పించింది.
“రత్తాలు ఇక మీదట పాతబట్టలకు స్టీలు సామాన్లోయ్అంటూ గల్లీ గల్లీ తిరగద్దు.ఇందులో నాస్వార్ధం కొంచెం ఉంది.ప్రొద్దునే ఆశ్రమానికి వచ్చి బాసాన్లుతోమి ఆశ్రమం ఊడ్చి తుడిచి వాషింగ్ మషీన్లో పిల్లల బట్టలుతికి ఆరవేయి.మధ్యాహ్నం వెళ్ళి నీ వ్యాపారం చూసుకో.నీకు ఆరువేలు జీతం.” ఇప్పుడిచ్చిన బట్టలు ఎడ్వాన్స్ అనుకో”అంటూ ఆ బట్టల పెట్టె అందించింది.
“ఏమంటావు రత్తాలు?నీకు ఇష్టమేనా?అడిగింది శాంతి.
“ఏమంటానమ్మా! అడగకుండా వొరాలిస్తున్న దుర్గమ్మతల్లివి.”అంటూ కాళ్ళమీద పడింది.
★★★
బళ్ళు ఓడలు ఓడలు బళ్ళూ. అవుతాయన్నట్లు రత్తాలు రాత మారిపోయింది. పిల్లవాడు స్కాలర్షిప్ తో ఇంటర్ చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు.ఆశ్రమానికే ఆదర్శం అయ్యాడు. శాంతి వాడి పర్శనాలిటీకి పోలీసు ఉఉద్యోగం అయితే బాగుంటుందని రత్తాలుని అడిగింది.
“నాబిడ్డ కాడు వాడు మీ బిడ్డ.వాడి కి ఏది మంచిదైతే అది చేయండి.”అంది రత్తాలు.
“ఏమంటావు సురేష్?”అంటూ ప్రకాష్ సురేష్ ని అడిగేడు.
“అది చాలా కష్టం కద అంకల్.” అన్నాడు సురేష్.
“నువ్వేమీ ఆలోచించకు.నిన్ను పోలీస్ రిక్రూట్మెంటుకి ప్రిపేర్ చేసే బాధ్యత నాది.నేను ఎక్స్ సర్వీస్ మెన్ ని ” గర్వంగా అన్నాడు ప్రకాష్.
పట్టుదల ,సాధన ఉంటే సాధించలేనిది లేదంటూ ప్రకాష్ గైడేన్స్ లో రిక్రూట్మెంటు లో సెలక్ట్ అయి ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తిచేసుకుని కానిస్టేబుల్ అయ్యాడు సురేష్.
తల్లి కి చీరల వ్యాపారమంటే ఇష్టమని సామాన్యులుండే చోట ముందుషాపు వెనుక ఒకగది కిచెన్ అద్దెకు తీసుకొని చీరల షాపు ఓపెన్ చేయించాడు.
“బోర్డ్ నేనే రాస్తా రత్తాలక్కా!”అన్నాడు రాజయ్య.
“మామా!నీకోదండం.నీబోర్డువంకరటింకర ఒ వానితమ్మడు సొ లా ఉంటుంది”అంటూ ఎక్కిరించాడు సురేష్.
“ఆఁ ! మా సెప్పొచ్చినావు.నేరాసిన బోర్డుతోనే అమ్మ సీరల యాపారం సేసింది.నువ్వుబుడ్డోడుగా ఉన్న సందెనించీ”అంటూ అలిగాడు రాజయ్య.
షాపు ఓపెనింగ్ కి శాంతి ప్రకాష్ దంపతులు వచ్చారు.
రత్తాలు వారికి సురేష్ చేత పూలదండ వేయించింది వారికి బట్టలు పెట్టి కొడుకును “మొక్కరా సురేసు”అంది.
“అమ్మా!సురేసు కాదే సురేష్ అను.గింతమంచి పేరెట్టి గట్ల పిలుస్తవేంటి?”అంటూ తల్లిని కసిరి ముద్దుపెట్టుకున్నాడు.
రత్తాలు షాపుకి
“పోచమ్మ టెక్స్టైల్స్POCHAMMA TEXTILES”
అని పేరు పెట్టింది.
బస్తీని వదిలి షాపులోనే కాపరం పెట్టింది రత్తమ్మ.

పూర్వం రాజుల వైభవ చిహ్నంగా మిగిలిన శిధిలావస్తలో ఉన్నకోటలులా
“చీరలు అమ్మబడును.”SAREES FOR SALE” బోర్డ్ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రత్తాలు ఘన విజయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.

ఏడాది కొకసారి. బస్తీకెళ్ళి మునుపు తన దగ్గిరకొనే దోస్తులకి పసుపు కుంకం కొత్తచీరలిచ్చి తృప్తి చెందుతుంది .బోనాలెత్తి నల్లపోచమ్మకి కొత్తచీర కట్టిస్తుంది.తను చేసేది పెద్దవ్యాపారం కాకపోయినా గొడ్డుఖారం ఉల్లిపాయ నంజుకుని సద్దన్నంతిన్నరోజులు మరువలేదు.ఈ నాడు ఉడుకుడుకు బువ్వతినగలుగుతోంది.కొడుకుని కొలువులో చూడగలగటం అన్నది పోచమ్మదీవెనని గట్టి నమ్మకం రత్తాలుకి.
“దశ మారినా దిశ మరువలేదు “రత్తాలు, సురేష్.వారిచేతనైనంత సేవ ఆశ్రమానికి అందిస్తూ ఆశ్రమం నడిపించడంలో వారూ సభ్యులయ్యారు.
ఓం శాంతి

                      దెవులపల్లి విజయలక్ష్మి.
July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తిరిగి వచ్చిన వసంతం

by Maji Bharathi July 30, 2024
written by Maji Bharathi

చెయ్యి వెయ్యగానే ముడుచుకుపోయిన ఆమెను జూసి “నేనంటే యిష్టం లేదా?” అడిగాడతను.

“అబ్బే అటువంటిదేమీ లేదు” సర్దుకొని అతని భుజం మీద చెయ్యవేసిందామె. ఎందుకంటే కస్టమరు తన గురించి నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే జరగబోయే పరిణామాలు ఆమెలోని అణువణువుకూ తెలుసు. నెత్తురొలికే గాయాలు తనువునీ, మనసునీ కబలించేస్తాయి. తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానికితోడు మనసుకయ్యే గాయాలు కప్పిపుచ్చుకోవచ్చు. కాని తనువుకయ్యే గాయాలు అలా కాదు కదా! నొప్పితో విలవిల్లాడుతూ, మేమున్నామంటూ గుర్తుచేస్తూనే ఉంటాయి. దాని బదులు ఇప్పుడిది భరించడమే సులువనుకొని, అయిష్టంగా ముడుచుకుపోబోతున్న కండరాలను మందలించి, మనసుకు సర్దిచెప్పి, అతనికనుగుణంగా కదిలించింది తనువును. తన స్పర్శకు స్పందిస్తున్న ఆమెను అల్లుకుపోతున్నాడతను.

మధ్యలో చేస్తున్న పనినాపి హఠాత్తుగా “నేనందుకు పనికొస్తానా?” ప్రశ్నించాడతను.

కస్టమరుకి ఏది కావాలో అది అందించి, వాళ్లని సంతృప్తి పరిచి పంపించాలిక్కడ. అందుకే “ఎందుకలా అనుకుంటున్నారు? మీకేమి తక్కువ?” అని లేని ఉత్సాహాన్ని గొంతులో నింపుకొని అడిగింది.

“నిజంగానా! నువ్వబద్దం చెప్పడం లేదు కదా!” అని అంటూ, “పర్వాలేదా! నీకేమీ ఇబ్బంది కలగడం లేదు కదా! ఉంటే చెప్పంటూ” ఆమెను పెనవేసుకుంటున్నాడు.

ఇదో కొత్త అనుభవమామెకు. తన తనువుతో ఆడుకునేవాళ్లే గాని, “నీకేమీ ఇబ్బంది లేదు కదా!” అని అడిగిన కష్టమరుని ఇంతవరకు తన సర్వీసులో చూడలేదామె. తొలిసారిగా ఆమె మనసు స్పందిస్తోంది పరస్పర్శకు. ఆమె తనువును తీగగా చేసి మీటుతున్నాడు. తీగ మీటితే నాదము పలికినట్టు, ఆమె మనసు ఆనందనాదాన్ని పలుకుతోంది.  పారవశ్యం ఉత్తుంగ తరంగంలా ఇద్దరినీ అల్లుకుపోతుంది.

అలసి, సేదదీరిన అతను “నాలో ఏమీ లోపం లేదు కదా?” ఆమె చెవిలో గుసగుసలాడాడు. అలసి అతని చేతుల్లో సేదతీరుతున్న ఆమె “మీకా అనుమానమెందుకొచ్చిందంది ఆశ్చర్యంగా.

ఆమె స్వరంలోని మాధుర్యమో, మార్దవమో కదిలించిందతనిని. “నేనందుకు పనికిరాని వాడినంటున్నారంతా!” చిన్నపిల్లాడిలా చెప్పాడతను.

“మీమీద మీకా నమ్మకం లేదా?” అని అడిగిన ఆమెతో “ఏమో! నా మీద నాకే నమ్మకం పోయింది” నిట్టూర్చాడతను.

“ఎందుకలా?” అని అడిగిన ఆమెతో  “తానిష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకుంటానని, ఇంటినుండి వెళ్లిపోయిన నా మరదలిని తీసుకొచ్చి, పరువుమర్యాదల కోసం నన్ను పెళ్లి చేసుకోమంటే ఆనందంగానే చేసుకున్నాను. ఎందుకంటే తనంటే చిన్నప్పటినుండి నాకిష్టం కనక. మొదటిరాత్రి  ‘యింతకుముందు జరిగిందంతా మర్చిపోదాం. ఇకనుండి ఒకరికొకరమవుదాం’ అని తనను దగ్గరకు తీసుకుంటున్న నాతో, ‘ఛీ! నువ్వసలు మగాడివేనా? చీమూ నెత్తురూ లేదా!’ అని ఛీత్కరించుకొని గదిలోనుండి వెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా, నేను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ప్రేమించాననుకున్నవాడు దక్కలేదన్న బాధతో అలా అందేమోనని సరి పెట్టుకున్నాను. కాని, ఎప్పుడు తనకి దగ్గరవుదామని చూసినా ఆమె ముఖంలో ఒక రకమైన చీదరింపు… ‘నువ్వు మగాడివి కావంటూ….’

నేను మగాడిని కానా అని నామీద నాకే అపనమ్మకమేస్తుంటే …. నాలోనే ఏదో లోపం ఉందేమోనని నామనసుకే అనుమానం వేస్తుంటే…  అవునో కాదో తెలుసుకోవడానికి రహస్యంగా యిలా అప్పుడప్పుడూ ఎక్కడెక్కడికో వెళ్ళినా… వాళ్లు నా మీద చెయ్యి వెయ్యగానే నేను చేస్తున్నది తప్పని నా మనసు నన్నే మందలిస్తుంటే… ముడుచుకుపోయి, ఏమి చెయ్యని నన్ను, జాలిగా చూస్తూ… ‘మగతనం లేనప్పుడు ఎవరి దగ్గరైనా అంతే!’ అనేవాళ్లే గాని నీలా మృదువుగా నన్ను దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. అందుకే ఆ అనుమానం” యేమి గుర్తొచ్చిందో కాసేపాగిపోయి….

తాను ప్రేమించిన వాడికి దగ్గరవ్వాలని…. నేను సంసారానికి పనికి రానని, విడాకులు కావాలని నా మరదలు కోర్టుకెక్కితే… వీడు మగవాడు కాదని కొంతమంది జాలిగా… కొంతమంది హేళనగా చూస్తుంటే… కట్టుకున్న భార్యే అవమానాన్ని మిగిల్చి వెళ్లిపోతే ఎందుకీ జీవితమని… బ్రతికి ఎవరినుద్ధరించాలని… ఇంకొకవైపు నా తప్పూ లేదు, నాలో యే లోపమూ లేదు, నేను మగవాడినే… అని అరిచి చెప్పాలని… ఇటువంటి విరుద్ధ భావాలతో, పోయేముందు ఒక్కసారైనా నేను మగవాడినేనని నిరూపించుకోవాలని…. యిదిగో యిప్పుడిలా నీ ముందు…. నీలా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. నువ్వైనా నిజం చెప్పు” అన్న అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా “నీకేమి? నువ్వు బంగారు కొండవి. నిన్ను వద్దనుకున్నవాళ్లే దురదృష్టవంతులు” అతని పెదవులను తన పెదవులతో సన్నగా స్పర్శిస్తూ అందామె.

“నిజంగానా?” అతని మాటల్లో చిన్నపిల్లవాడిలోని ఉత్సుకత.  “కాక?” సమాధానాన్ని అతనికే వదిలేసిందామె. తృప్తిగా ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు.

“నన్ను పెళ్లి చేసుకుంటావా?” కౌగిట ఆమెను బంధించి అడిగాడతను. దూరంగా జరిగిందామె.

“చూసావా! పెళ్లి విషయమొచ్చేసరికి నువ్వూ దూరంగా జరిగావు. అంటే నిజంగానే నాలో ఏదో లోపముండి, నా మరదలు నన్ను విడిచి వెళ్లిందన్నమాట” విచారంగా అన్నాడతను.

“ఆమె  మిమ్మల్ని విడిచి యెందుకు వెళ్లిందో తెలియదు గాని, మీలో యే లోపమూ లేదు” అతని చెయ్యిమీద చెయ్యివేసి చెప్పిందామె.

“నన్ను పెళ్లి చేసుకోమంటే, దూరంగా జరిగావెందుకు?” సూటిగా చూస్తూ ఆమెనడిగాడతను.

“నా సంగతి తెలిసే అడుగుతున్నారా?” దిగులుగా అడిగిందామె.

“నీకేమి? నీలాంటి మంచిమనిషిని నేనింతవరకూ చూడలేదు.”

“నా మంచితనాన్ని మీరేమీ చూసారు?” అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందామె.

“ఇంకొకరి బలహీనతను అలుసుగా తీసుకోకపోవడమే అసలైన మంచితనం.  చావు అంచుల దగ్గర వేల్లాడుతున్న నన్ను, వొడ్డున పడేసావు. మోడైపోయిన చెట్టు వసంతంలో విరబూసినట్టు, మగవాడినేనన్న ధైర్యాన్ని నాలో విరబూయించావు. ఒక రకంగా నాకు పునర్జన్మనిచ్చిన నీ రుణమెలా తీర్చుకోగలను? నిన్ను పువ్వుల్లో పెట్టి నీ రుణం తీర్చుకోవాలని వుంది. నన్ను పెళ్లి చేసుకొని, నా జీవితానికొక అర్ధాన్ని కల్పించవా?” అభ్యర్థించాడతను.

ముసుగు వేసుకున్న ఆమె మనసు, లోపలి పొరలను తాకుతున్నాయతని మాటలు. కాని ఆ మాటలు నమ్మొచ్చా! లేదా! ఆమె మనసు తేల్చుకోలేక పోతుంది. నాలుగేళ్ల క్రింద ఇటువంటి మాటలే విని గడప దాటింది. ఏమైంది? జీవితమే చిధ్రమైపోయింది. ఎన్ని కలలో… ఎన్ని ఆశలో…. అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు. నిజమేనని నమ్మింది. తనలాంటి వాళ్ళను మోసం చెయ్యడమే అతని వృత్తని తెలుసుకోలేకపోయింది. తెలిశాక ఏమి చెయ్యగలిగింది? కొన్నాళ్లు పోరాడింది బయటపడాలని. కానీ వోడిపోయింది. ప్రాణం తీసుకునే ధైర్యం చెయ్యలేక, ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతుంది. అలాగని యిప్పుడితని మాటలు అబద్ధమని నమ్మడానికి మనసు అంగీకరించడం లేదు.  ఒకవేళ యితని మనసే నిజమైతే…? జీవితంలో కోల్పోయిన వసంతమే తిరిగి వస్తానంటుంటే…   కాని, మరొక్కసారి మోసపోవడానికి మనసు అంగీకరించడం లేదు. ఆశపడి, భంగపడడానికి మనసు సిద్ధపడడం లేదు. అయినా భంగపడడానికి ఏమి మిగిలిందని తనకు జీవితంలో?

కాదంటే, జీవితంలో మరల ఇటువంటి అవకాశం తనకొస్తుందా?  ఒకవేళ ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటే…. అది తనకూ పునర్జన్మే అవుతుంది. కానీ తానతనిని పెళ్లి చేసుకుంటే అతని పరిస్థితెలా ఉంటుంది? ఇప్పటికే అతనెన్నో అవమానాలను మూట కట్టుకున్నాడు. ఇప్పుడు తనను పెళ్లి చేసుకుంటే, మరింత అవమానించి, అవహేళన చెయ్యదా లోకం? తన నుండి ఆయన మరిన్ని అవహేళనలకు గురికావాలా? ఒప్పుకుంటే… ఏమవుతుంది? ఒప్పుకోకపోతే అతనెలా స్పందిస్తాడు? ఏమి చెయ్యాలో తోచడం లేదు. విరుద్ధ భావాల మధ్య ఊగిసలాడుతుంది ఆమె మనసు.

***

“రమణగాడు పెళ్లి చేసుకున్నాడట”.

“వాడి సంగతి తెలిసి ముందుకొచ్చిన అభాగ్యురాలెవ్వరో?”

“నీకీ సంగతి తెలుసా! వాడు చేసుకున్న ఆడది ఆ టైపట”

“అంతేలే! లేకపోతే వీడి సంగతి తెలిసి ఎవరు ముందుకొస్తారు? వాడికున్న ఆస్తి పీల్చేశాక, ఛీ! నువ్వు మగాడివే కాదు పొమ్మంటుంది”

“మగవాడిననిపించు కోవడానికి బజారుదాన్ని పెళ్లి చేసుకోవాలా? ఛీ! ఇంతకన్నా చావే మేలు”

“వీడి చాటుగా దుకాణం తెరుస్తుందంటావా?” అది అనుమానమో! లేక అలా అవ్వాలన్న కోరికో!

“రామ! రామ! ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడో! పదిమందికి పక్క వేసిన దానిని పెళ్ళాడాడా? దాని బదులు కొజ్జా అనిపించుకోవడమే మేలు”

“మమ్మల్నడిగితే మేము మంచి సంబంధం కుదర్చమా! లోకంలో ఆడపిల్లలే గొడ్డు పోయారా? ఇదేమి పనని, లేని పెద్దరికాన్ని నెత్తినేసుకొని మందలిస్తూ కొందరు…

“అదెన్నాళ్ళుంటుందిలే?  ఆరునెలల్లో వీడిని తన్నితగిలెయ్యకపోతే, మీసం గొరిగించుకుంటానని ఒకడి శపథం. మనిషి ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నట్టుంది.  వీడెలాగూ అందుకు పనికిరాడు. ఎన్నాళ్ళు మడికట్టుక్కూర్చుంటుంది. ట్రై చేస్తే పడిపోతుందని ఇంకొకడి దురాలోచన.

రకరకాల వ్యాఖ్యానాలు. మనసును తూట్లు పొడిసేలా మాటల తూటాలు. గుండె గాయమయ్యేలా అసహ్యకరమైన చూపులు…… కుతూహలం ఆపుకోలేక కొందరు… దురుద్దేశాలు మనసుల్లో పెట్టుకొని కొందరు…. రకరకాల ఉద్దేశాలతో రమణ ఇంటి గడప తొక్కుతూనే వున్నారు.

వేటినీ లెక్కించలేదు రమణ. చాలా నిబ్బరంగా ఉన్నాడు. పూర్వాశ్రమంలో ఆమె పేరేమిటో? అడగనే లేదు. వసంత అని పిలుస్తున్నాడు. ఎందుకా పేరని ఆమె అడిగితే నా జీవితంలో తిరిగి వచ్చిన వసంతానివి నువ్వన్నాడు. ఆమె రమణ నమ్మకాన్ని నిలబెడుతూ, యెవరు యెటువంటి వ్యాఖ్యానాలు చేసినా చలించకుండా, రాయిలా రమణ వెన్నంటే  స్థిరంగా నిలబడింది.

***

రమణ పెళ్ళై యెన్నాళ్ళో గడవలేదు. రమణ పెళ్ళాం నెల తప్పిందని యిరుగుపొరుగుల గుసగుసలు.

“కారణం రమణేనంటావా?” ఒకమ్మ అనుమానం. “ఆవిడికే తెలియాలి” ఒకరి సమాధానం.

“ఆవిడకైనా తెలుసంటావా?” ఇంకొకరి సందేహం.  “నిజమేలే! ఎంతమందో!” ఇంకొకరి కనుబొమ్మల ఎగురవేత.

“ఛీ! ఊరుకోండే. కడుపుతో వున్న పిల్లని గురించి అవేం మాటలు” మందలించింది ఒక పెద్దామె.

“మనకెరుక లేని ఆ పిల్ల గతం గురించి మనమెందుకు మాట్లాడుకోవడం? నాలుగునెలల నుండీ చూస్తూనే వున్నాం కదా! వంక పెట్టడానికి వీల్లేని పిల్ల. మీరేమంటే అనండి గాని, ఆ పిల్లని పెళ్లి చేసుకొని రమణ మంచిపనే చేశాడు” వత్తాసు పలికింది ఒకామె.

“మనకెందుకులేమ్మా! ఆవిడ గురించిన తగువులు” ఒకరి నిష్టూరపు మాటలు. నీలాటిరేవు దగ్గర మాటలిలా వుంటే, రచ్చబండ దగ్గర మాటలెలా వున్నాయంటే….

“ఆవిడ నెల తప్పిందట కదా!” కళ్లెగరేసాడొకడు.

“మనోడి ప్రతాపమేనంటావా?” అదోరకంగా చూస్తూ ఒకడు.

“ఏమో! ఎవడికి తెలుసు? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక” పెదవి విరిచాడొకడు.

“మీరేమంటే అనండి గాని, మనందరిలోకెల్లా అదృష్టవంతుడు వాడే” అన్నాడొకడు.

“నిజమేరా! ఈ పిల్లను పెళ్లి చేసుకొని సుఖపడ్డాడు. గతానిదేముంది? ఇప్పుడెలా వుందో చూడాలి గాని!” వత్తాసు పలికాడు ఇంకో స్నేహితుడు.

“ఏరా! మీకేమైనా మత్తు జల్లిందా! వెనకేసుకొస్తున్నారు” ఒకడి వెటకారం. “చూస్తుంటే తెలుస్తోంది కదా!” ఇంకొకడి వేళాకోళం.

“ఛీ! మీరు మారరురా!” ఛీత్కరించి అక్కడ నుండి లేచిపోయారు, రమణ అదృష్టాన్ని పొగిడిన ఆ ఇద్దరు స్నేహితులు.

“రమణను వాళ్ళావిడ గౌరవించినట్టు, మీ భార్యలు మిమ్మల్ని గౌరవిస్తున్నారా? గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పండిరా! పోకిరి కబుర్లు చెప్పడం కాదు. ఆవిడ గురించి ఇంకొక్క మాట మాట్లాడితే, మీ అందరి జాతకాలూ బయట పెట్టీగలను” భుజంమీద తువ్వాలు దులిపి వార్నింగిచ్చాడు, అక్కడ కూర్చున్నవాళ్ళలో ఒకడు.

అక్కడున్న ఎంతోమందికి అనుభవమే. రమణ భార్య నిప్పులాంటి మనిషని, ముట్టుకోబోతే కాలుతుందని. దానికి తోడు రమణను ఆమె యెంత అపురూపంగా చూసుకుంటుందో, అక్కడ వున్న అందరూ చూస్తూనే వున్నారు. అందుకే నోరు మెదపలేదు యే ఒక్కడూ.

***

అప్పటినుండీ చర్చల్లో అగ్రస్థానం రమణ గురించే, పుట్టబోయే బిడ్డ గురించే… ఎవరి పోలికలొస్తాయా అని. వీళ్లందరి చర్చలకు తెరదించుతూ అచ్చు గుద్ధినట్టు రమణ పోలికలతో పుట్టి, రమణ లలితలను ఆనంద డోలికలలో ముంచేస్తూ, వాళ్ల జీవితాల్లో వచ్చిన వసంతాన్ని మరింత వర్ణమయం చేశాడు రమణ, లలితలకు పుట్టిన మగబిడ్డ.

***

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మహాకవి దాశరథి శత జయంతి మహోత్సవం

by Nellutla Madhava Srinivas July 30, 2024
written by Nellutla Madhava Srinivas

కాకతీయ ప్రభల కాణాచికోటలో
గూడూరునందుదయించె సూర్యుడు!
తెలగాణతెగువకు తేజోవిరాజితుడు
నైజాముప్రభువుకు నిత్యాగ్నిహోత్రుడు!
రాచరికవ్యతిరేక రామబాణమ్మతడు
ప్రజలగుండెల్లోన మరఫిరంగేయతడు!
భూస్వామ్యపద్ధతిని భూస్థాపితముచేసి
సామ్రాజ్యవాదాన్ని చెత్తబుట్టలో వేసే!
సంస్కృతాంధ్రపద్య ధారలను పారించి
ప్రతిఘటించునటుల ప్రజలనుమేల్కొల్పె!
కవనపాండిత్యాన కవచకుండలధారి
విప్లవాగ్నినిరాల్చ విస్ఫొటక ఝరీ!
విశ్వవేదికనందు శాంతికాముక గాంధి
సమరమునుసాగించ శంఖమూదిన క్రాంతి!
నా తెలంగాణ కోటిరత్నాలవీణంటూ
తిమిరములు బాపగ సమరమెంచిన కాంతి!
ఏరులై పారేటి అగ్నిధారలజూసి పారిపోయిరి
దొంగ బూర్జువా దొరలంతా!
ముసలినక్కకుయేల నైజామురాజ్య?మని
నైజామురాజాల పైజామాలనడిగే!
నిగ్గుతీసెడి నల్లబొగ్గురాతలతోడ
పదఘట్టనల పద్యగద్యాలమేల్కొలిపే!
రుద్రవీణను మీటి ఉక్కుగొలుసులు తెంచి
గాలీబూగీతాలప్రేమసారము పంచె!
సినీ యాకసమున కవిరవిలాగ పేరొంది
అలుగునేనన్నాడు పులుగునేనన్నాడు
వెలుగునేనన్నాడు తెలుగునేనన్నాడు!
సాహిత్యలోకాన శశికాంతుడయ్యాడు
తెలగాణమేథకు తెలివితానైనాడు!
అందుకో మాచేత దాశరథి మా జోత
అందుకో వందనము మా కృష్ణమాచార్యా!

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆంగ్లం బోధించిన ఉపాధ్యాయుడు వారాల అంజయ్య.

by Narendra Sandineni July 30, 2024
written by Narendra Sandineni

వారాల అంజయ్య తేది 28 – 05 – 1935 రోజున పెద్ద గడియారం వీధి కరీంనగర్ లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు నరసమ్మ,నరసయ్య.వారాల నరసయ్య,నరసమ్మ దంపతులకు నలుగురు సంతానం.1) వారాల వెంకటస్వామి భార్య శారద.వెంకటస్వామి వ్యాపారం చేసి జీవనం సాగించాడు.2) వారాల జగన్నాథం భార్య సత్యమ్మ.జగన్నాథం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.3) వారాల సత్యనారాయణ భార్య ఊర్మిళ. సత్యనారాయణ ఫారెస్ట్ గార్డ్ గా పని చేసి రిటైర్ అయ్యాడు.4) వారాల అంజయ్య భార్య రాధ. అంజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.మిఠాయి సత్తమ్మ స్వీట్ హౌస్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడింది.అది కరీంనగర్ పట్టణంలో మొదటి మిఠాయి సత్తమ్మ స్వీట్ హౌస్ గా పేరు గాంచింది.మిఠాయి సత్తమ్మ వారాల అంజయ్యకు పెద్దమ్మ.సత్తమ్మకు పిల్లలు లేరు.మిఠాయి సత్తమ్మ మరిది నరసయ్య తోటి కోడలు నరసమ్మ పిల్లలను తన పిల్లలుగా చూసుకునేది.మిఠాయి సత్తమ్మది సంపన్న కుటుంబం.సత్తమ్మకు స్వీట్ హౌస్ తో పాటు గాజుల దుకాణం కూడా ఉండేది.సత్తమ్మ స్వీట్ హౌస్ మరియు గాజుల దుకాణంలో 30 మంది వర్కర్లు పని చేసే వారు.మిఠాయి సత్తమ్మ నిజాం కాలంలో గుర్రం ఎక్కి ప్రయాణం చేసేది.

అంజయ్య గడియారం వద్ద గల కానిగి బడిలో 1,2,3 వ తరగతులు చదువుకున్నాడు.ఆ రోజుల్లో కానిగి బడి పంతులుగా యెంబెరు స్వామి 35 మంది పిల్లలకు అత్యుత్తమమైన విద్యను బోధించే వాడు.యెంబెరు స్వామి పిల్లలకు విద్య,వినయం నేర్పించే వారు.కానిగి బడి పంతులు గారి పేరు 40 సంవత్సరాల తర్వాత యెంబెరు స్వామి అని తెలిసింది.ఆ రోజుల్లో టీచర్లు అంటే అంత గౌరవం ఉండేది.మా సారు అని గౌరవంగా చెప్పే వాళ్ళం.కానీ సారు పేరు మాత్రం తెలియదు.అంజయ్య తాహతీయ గంజి స్కూల్ పాఠశాలలో 4 వ తరగతి వరకు చదువుకున్నాడు.గంజి పాఠశాలలో హసన్ అలీ ఉర్దూ చక్కగా బోధించే వాడు.అంజయ్య 5 వ తరగతి నుండి 10 వ తరగతి మెట్రిక్ వరకు గవర్నమెంట్ హై స్కూల్ (పురాణ) కరీంనగర్ లో ఉర్దూ మీడియంలో చదివాడు.ఆ రోజుల్లో గవర్నమెంట్ హైస్కూల్ లో ఆర్.వి.రావు ఇంగ్లీష్ చక్కగా బోధించేవాడు.అంజయ్య ప్రైవేట్ గా చదువుకొని బి.ఏ విద్యను పూర్తి చేశాడు.అంజయ్య బీఈడీ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వరంగల్ లో చదివాడు.అంజయ్య మెట్రిక్ 1952వ సంవత్సరంలో ఉత్తీర్ణులు అయ్యాడు.ఆ రోజుల్లో 10వ తరగతిని మెట్రిక్ అని పిలిచే వారు.మెట్రిక్ విద్య పూర్తి కాగానే అంజయ్య 1952 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల వీణవంకలో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు.వీణవంక పాఠశాలలో పని చేస్తున్న రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉండేది. ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు.

ఆ రోజుల్లో టీచర్లకు జీతం తక్కువగా ఉండేది.అంజయ్య ఉద్యోగ జీవితం ప్రారంభించినప్పుడు 56 రూపాయల నెల జీతం లభించేది.అంజయ్య గొప్ప గొప్ప హెడ్మాస్టర్ల కింద పని చేశాడు.హెడ్మాస్టర్లకు అంజయ్య పై సదభిప్రాయం ఉండేది.ఆంగ్లము చక్కగా బోధిస్తాడు అనే పేరును అంజయ్య సంపాదించుకున్నాడు.నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు.అంజయ్య పాఠశాలలో పని చేస్తున్న రోజుల్లో వీణవంక గ్రామంలో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడే ఉండే వాడు.వారానికి ఒక రోజు ఇంటికి వస్తూ ఉండే వాడు.అంజయ్యకు 1953 సంవత్సరంలో రాధతో వివాహం వేములవాడలో జరిగింది.అంజయ్య మామగారు మంగారి సుబ్రహ్మణ్యం వేములవాడ దేవస్థానంలో ఆయుర్వేద డాక్టర్ గా పని చేశాడు.సుబ్రహ్మణ్యం వేములవాడలో గొప్ప డాక్టర్ గా ప్రసిద్ధి పొందాడు. అంజయ్య రాధ దంపతులకు ఐదుగురు సంతానం. ప్రథమ సంతానం : వారాల ఆనంద్ భార్య ఇందిరా రాణి.ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్ లో లైబ్రేరియన్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు.ఆనంద్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత,ప్రముఖ కవి,సినిమా విశ్లేషకులు,అనేక కవితా సంపుటి పుస్తకాలు, అనువాద సాహిత్యం,సినిమా సమీక్షలు,పుస్తకాలు రాసి ప్రసిద్ధి పొందాడు.ఆనంద్ ఇందిరా రాణి దంపతులకు ఇద్దరు సంతానం.ప్రథమ సంతానం కూతురు రేల భర్త వేణుమాధవ్.రేల,వేణుమాధవ్ దంపతులకు ఒక్కరే సంతానం.పేరు ప్రద్యుమ్న. ఆనంద్,ఇందిరా రాణి దంపతుల ద్వితీయ సంతానం. కుమారుడు అన్వేష్. అంజయ్య ద్వితీయ సంతానం : పసుపునూటి మంజుల భర్త శ్యాంసుందర్.శ్యాంసుందర్ వ్యాపారంలో కొనసాగుతున్నాడు.మంజుల శ్యాంసుందర్ దంపతులకు ఇద్దరు సంతానం.1) కూతురు అఖిల భర్త విజయ్.విజయ్ వ్యాపారం చేస్తున్నాడు.2) కుమారుడు నిఖిల్ బాబు ప్రైవేట్ ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు. అంజయ్య తృతీయ సంతానం : సాయిని అనురాధ భర్త వెంకటేశ్వర్లు.వెంకటేశ్వర్లు రేకొండ గ్రామానికి చెందినవాడు.ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.అనురాధ వెంకటేశ్వర్లు దంపతులకు ఒక్కతే పాప.పేరు కీరవాణి. అంజయ్య చతుర్ధ సంతానం : వారాల అర్జున్ భార్య ఉషారాణి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అర్జున్ హైదరాబాదులో పని చేస్తున్నాడు.అర్జున్ ఉషారాణి దంపతులకు ఇద్దరు సంతానం :1) కూతురు చరిష్మా 2) కుమారుడు ఆరుష్.ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు.
అంజయ్య పంచమ సంతానం : వారాల అమర్ భార్య శ్రీలత.అమర్ ఫోటో డిజైనర్ గా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.అమర్ కరీంనగర్ లో నివాసం ఉంటున్నాడు.అంజయ్య యు.పి.ఎస్. ధనగర్వాడి పాఠశాలలో హెడ్మాస్టర్ గా పని చేశాడు.అంజయ్య యు.పి.ఎస్. ప్రభుత్వ పాఠశాల,సావరాన్ స్ట్రీట్ లో హెడ్మాస్టర్ గా పని చేశాడు. తర్వాత కార్ఖానా గడ్డ హై స్కూల్,ధన్గర్ వాడి హై స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా పని చేశాడు. అంజయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల గవర్నమెంట్ హై స్కూల్ నుండి 1993 వ సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాడు.అంజయ్య 1983 వ సంవత్సరంలో కరీంనగర్,మంకమ్మ తోట వీధిలో స్వగృహం నిర్మించుకున్నాడు.అంజయ్య భార్య రాధ 1987 వ సంవత్సరంలో అనారోగ్యంతో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.అంజయ్యను భార్య గురించి అడిగితే కళ్ళల్లో నీళ్లు తీసుకున్నాడు.ఎందుకు అన్ని విషయాలు గుర్తు చేస్తున్నావు?బాధగా ఉంది అన్నాడు.మీ భార్య ఉన్నప్పుడు ఎలా ఉండే వారు? అని అడిగితే ఆమె ఉన్నప్పుడు ప్రశాంత జీవనం ఉండేది అని తెలియజేశాడు.జీవితంలో కలయికలు, ప్రేమ,దుఃఖం అన్నీ ఉండేవి.అంజయ్య ఉపాధ్యాయుడిగా బాధ్యతగా పని చేశాడు. అంజయ్యకు పాఠశాలలో బోధన తప్ప మరే వ్యాపకం ఉండేది కాదు.అంజయ్య రిటైర్ అయిన తర్వాత ఎక్కడా పని చేయలేదు.1969 సంవత్సరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి అడిగితే చదువుకున్న వాళ్లలో మాత్రమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉండేది.మామూలు జనాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి వారికి అంతగా తెలియదు.

2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం చాలా సంతోషకరమైన విషయం.టీచర్లు ప్రశాంతంగా ఉన్నారు.టీచర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలియజేశాడు.మీకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చిందా? అని అడిగితే ఎలాంటి అవార్డు రాలేదు.అవార్డు రావాలని కూడా ఏనాడు కోరుకోలేదు.ఉపాధ్యాయుడిగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను.అంతే అదే నాకు సంతోషం.అది చాలు అన్నాడు.చిన్నప్పటినుండి అంజయ్య సైకిల్ నడిపేవాడు 88 సంవత్సరాల వయసు వరకు సైకిల్ నడిపాడు.ఈ మధ్యనే ఇంట్లో జారి పడ్డాను.కాలు విరిగింది.కాలు విరిగిన తర్వాత ఎక్కడికి పోవడం లేదు.ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పాడు.సైకిల్ ను ఈ మధ్యనే అమ్మేశాను అని చెప్పాడు. మీ దినచర్య ఎలా ప్రారంభమవుతుంది అని అడిగితే పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుంటాను.ఏ దేవునికి పూజ చేయను.సూర్య నమస్కారం చేయను.దేవుని మనసులోనే తలుచుకోవాలి అని చెప్పాడు.ప్రశాంత జీవనం ఉండేది.చిన్నప్పటినుండి హిందీ పాటలు వినడం అలవాటయింది హిందీ సినిమాలు చూసేవాన్ని అని చెప్పాడు రచయిత నరేంద్ర సందినేని 1978 – 1981 సంవత్సరంలో మంకమ్మ తోటలో గల ధన్గర్ వాడి హైస్కూల్ లో చదువుతున్నప్పుడు అంజయ్య సారు నాకు పదవ తరగతిలో ఇంగ్లీష్ బోధించే వాడు. క్లాసులోని విద్యార్థులు అందరికీ గ్రామర్ చక్కగా నేర్పించారు.నేను పాఠశాలలో చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయులు బెత్తం తీసుకుని క్లాసులోకి వచ్చే వారు.సరిగా నేర్చుకోని విద్యార్థులకు బెత్తం దెబ్బలు పడేవి.ఆనాటి ఉపాధ్యాయులు విద్యార్థుల శ్రేయస్సు కొరకు పాటుపడేవారు.నాకు విద్య నేర్పిన గురువు అంజయ్య సారు గురించి ఆర్టికల్ రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది.అంజయ్య సారును ఇంటికి వెళ్లి కలిశాను.అంజయ్య సారు కుమారుడు అమర్ నా వెంట ఉండి సహకరించాడు.

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చీరలోని గొప్పతనం.. 14

by Ramakrishna Manimadde July 29, 2024
written by Ramakrishna Manimadde

చీరకట్టులో సౌశీల్యం ప్రతిబింబిస్తుంది..
సౌందర్యం ఇనుమడిస్తుంది..
భౌగోళిక అస్తిత్వం భాసిల్లుతుంది..
సంప్రదాయం ఉరకలేస్తుంది..

అంతేనా..?
మరెంతో ఉంది అంటున్నారు కవి ‘చంద్రబోస్.’
‘చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ
‘పల్లకిలో పెళ్ళికూతురు ‘ సినిమా కోసం
ఆడపిల్లకు చీరను ఆయనంగా ఇస్తున్న ఆ వైనాన్ని తెలుసుకుందాం..!

చీరలోని గొప్పతనం తెలుసుకో… ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర. ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

సహజ వారసత్వంగా.. సంప్రదాయంగా
మనకు తరతరాలుగా అందుతున్న
అస్తిత్వ సంపద చీరను ఈ తరం అమ్మాయిలు విస్మరిస్తున్నారు.. పక్కన పెట్టేస్తున్నారు.

ఈ చీర కట్టును ఆధునికత కనుమరుగు చేస్తుంది.
దాని గొప్పతనాన్ని కమ్మేస్తుంది..
అందుకే చీరలోని గొప్పతనం తెలుసుకో..!
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటున్నారు గీతరచయిత చంద్రబోస్.

చీర అల్లిక వెనుక సింగారం అనే దారం ఉంది..
అది అందాన్ని రెట్టింపు చేస్తుంది..

ఆనందపు రంగుల అద్దకం ఉంది..
అది మనసు పొరల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

మమకారపు మగ్గం ఉంది..
అది పుట్టినింటికి మెట్టినింటికి మధ్య
అనుబంధాన్ని పెంచుతుంది అంటూ చీర తయారీ విధానంలోని కళాత్మకతకు కవితాత్మక సొగసులు దిద్దారు గీత రచయిత.

మడికట్టుతో నువ్వు పూజచేస్తే..గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే..సిరిలక్ష్మిని కురిపించును పంటలు

ఆధునిక దుస్తులు ధరించి
నియమ నిష్ఠలతో నువ్వు పూజ చేస్తే అందులో నిండుతనం ఉండదు.. నిండార చీరకట్టుకుని, మడికట్టుతో నువ్వు చేసే పూజ వలన గుడిని సైతం వదిలి దిగివస్తాడు దేవుడు. అంతటి మహత్యం ఉంది చీరకు.

చీరను దోసి, ఎంకి కట్టుతో సౌకర్యవంతంగా పొలం పనులు చేస్తుంటే ధాన్యాగారం నీ ఇంట పొంగిపొరలి సాక్షాత్తు మహలక్ష్మియే నట్టింట నిలిచి సిరులు కురిపిస్తుంది.

జారుకట్టుతో పడకటింట చేరితే..గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే.. దండాలే పెడతారు అందరూ

కనీ కనిపించని అందాలను పడకటింట భర్త కంట పడేలా చేసేది చీర మాత్రమే.. ఆ కనికట్టు చీరకు ఉంది కాబట్టే జారుకట్టుతో భర్తకు చేరువగా భార్య వచ్చినప్పుడు తన గుండె జారి చూస్తాడు పురుషుడు.. ఎంతటి అలకలు ఉన్నా ఆ క్షణం అన్నీ క్షణభంగురమే కదా..!

నిండైన ఆహార్యంతో చీర కట్టుకుని, ఆత్మవిశ్వాసంతో నడిచి వెళ్తుంటే.. అందరూ దండాలు పెడతారు. ఆ పవిత్రత చీరకట్టుకు ఉంది.

అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది.. కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది

కడుపారా అన్నం తిన్న తదుపరి మూతిని తూడ్చే చీర కొంగు, కన్నీరై ఉన్నప్పుడు చెంపను కూడా తడుమును. అన్నంలో ఆపదలో అమ్మను చూపేది, అమ్మలా బాసటగా నిలిచేది చీర కొంగు మాత్రమే అని.. మన జీవనంలో చీర కొంగు నిర్వహించే ఉద్దాత్తమైన పాత్రను తెలియజేస్తున్నారు చంద్రబోస్.

పసిపాపలా నిదురపోయినప్పుడు.. అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు..ఈ చీరేగా అందాలకు అడ్డుతెర

ఆదమరిచి పసిపాపలా నిద్దుర పోయినప్పుడు ఊయలగా మారి హాయినిచ్చును. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే ఘడియలకు సాక్షీభూతంగా నిలిచి, అరవిరిసిన అందాలకు అడ్డుతెరగా నిలుచును ఈ చీర..!

గాలి ఆడక ఉక్కపోసినప్పుడు..ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు.. ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది..
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది..

గాలి స్తంభించి ఉక్కిరబిక్కిరైన సమయాన వింజామరలా మారి నీ ఉక్కపోతను తీర్చేది ఆ పైటే..

ఎండనుండి నిన్ను కంది పోకుండా కాపాడిన ఆ కడకొంగే, వాన నుండి నిన్ను రక్షించటానికి గొడుగుగా మారి నీ వెతలు తీర్చును.

విదేశీ వనితకు సారే పోసి సోదరిగా గౌరవమిచ్చి ఆదరించి, మన భారతీయ సంస్కృతిని సగౌరవంగా చాటేది చీర.. అంతెత్తున ఎగిసే మన జాతీయ జెండాకు సరితూగి సమానంగా నిలిచేది చీర అని,
ఈ తరానికి చీర గొప్పతనం చాటి చెప్పే గీతాన్ని అందించారు చంద్రబోస్.

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కథాభారతి – 55

by Madhu Jella July 29, 2024
written by Madhu Jella

అంశం: వీడిన మబ్బులు
కథా శీర్షిక:
ఆదివారం.. పిల్లలు..ఆయనా బయటికెళ్ళారు.పనులన్నీ తీరినాక టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తూ కూర్చున్నా. అంతలో ఫోన్ మ్రోగింది..ఆయనదే.ఇంట్లోనే మరిచిపోయినట్లున్నాడు.పట్టించుకోలేదు.
నాలుగైదుసార్లు అదే పనిగా ఫోన్ రింగవుతూంటే .. నేనే వెళ్ళి లిఫ్ట్ చేసా. “హలో సార్..’ ఓ స్వీట్ వాయిస్ పలకరించింది. ‘హెలో..ఎవరు’ అన్నాను.’సార్ .. సార్ లేరా అండీ’ అంది. ‘లేరు.. ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటికెళ్ళారు’.ముక్తసరిగా అనేసరికి కాల్ కట్ చేసింది. కొద్దిసేపటికి
మళ్ళీ అదే నంబరు నుండి కాల్.కట్ చేసా. మళ్ళీ కాల్ చేస్తున్నారెందుకో..చిరాకేసింది.
మళ్ళీ కాల్ వస్తోంది.ఇప్పుడు.. కాల్ లిఫ్ట్ చేయగానే ‘హలో..’ అదే గొంతు.తీయగా పలకరిస్తోంది.’ఎవరు?’ .. కొద్దిగా గట్టిగా అనగానే కాల్ కట్ చేసింది.
బయటికెళ్ళి ఇంకా ఈయన రానేలేదు. ఈ ఫోన్ల గోలొకటీ..వెంటతీస్కెళ్ళొచ్చుగా.. ఉన్నట్టుండి ఏదో ఆలోచన మనసులో మెదిలి కళుక్కుమంది. ఏదో అనుమానపు తెర మనస్సును కమ్మేయబోతుంది .ఆ ఊహే భయం కలుగజేసింది.. ఎంత కంట్రోల్ చేసుకున్న..ఆ ఫోన్ కాల్.. తీయని గొంతు.. గుర్తుకొస్తున్నాయి..ఈయనేమైనా….అంతటితో బలవంతంగా ఆ ఆలోచనను మానుకుందామని ప్రయత్నిస్తున్నా..
ఇంతలో అదే నెంబరు నుండి మళ్ళీ కాల్ వస్తోంది.
కాల్ లిఫ్ట్ చేసి ‘హలో..ఎవరు మీరు. కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడకుండా కట్ చేస్తున్నారు.విషయం ఏమిటో చెప్పండి ‘ గట్టిగా అన్నాను. ‘హలో.. అమ్మ..సార్ లేరా?.. ఇప్పుడు మధ్య వయస్సు ఆవిడ మాట్లాడుతోంది.’అమ్మా.. సార్ గారికి చాలా థాంక్సమ్మా.. నిన్న సార్ గనుక సాయం చేయకుంటే నా కొడుకు ప్రాణాలతో బయటపడేవాడే కాదు. మా చిన్నబ్బాయి నిన్న బైక్ ఆక్సిడెంట్ అయి పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూంటే అక్కడే ఉన్న సార్ హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేసి అవసరమైన సాయం చేసాడు.మా వాడి ఫోను,పర్సులో ఉన్న అడ్రస్ తో మాకు సమాచారమిచ్చాడు తల్లి. గాబరాగా..అందరం షాక్ తోనే హాస్పిటల్ కి వెళ్ళాం.మమ్మల్ని సారే గుర్తించి మా అబ్బాయిని ఉంచిన వార్డు కు తీసికెళ్ళాడు.డాక్టర్లతో మాట్లాడించి, మాకు ధైర్యం చెప్పాడు. ఇంతకు ముందు కాల్ చేసింది మా అమ్మాయేనమ్మా..ఆ సార్ కి ఫోన్ చేయమని నేనే చెప్పాను. బాధలో,కంగారులో సార్ పేరు కూడా కనుక్కోలేదు. సార్, మాకు ఫోన్ చేసిన నెంబరు గుర్తించి ఫోన్ చేస్తున్నాము తల్లీ.. దేవుడిలా వచ్చి నా కొడుకుని రక్షించాడమ్మా.. అందరిలా ఆయనా వదిలేసి వెళ్ళుంటే..”’ ఆమే గొంతు గద్గదమైంది.వెక్కి ఏడుస్తోంది..తనే ‘ నా కొడుకు ప్రాణాలు నిలబెట్టాడు.. ఆయనకు చాలా ఋణపడి ఉంటామమ్మా.. సార్.. మీరందరూ చల్లగా ఉండాలి తల్లి.. సార్ తో చెప్పమ్మా..మా వాడు బాగానే ఉన్నాడు..” కృతజ్ఞతతో నిండిన గొంతుతో చెబుతూ ఆమె ఫోన్ పెట్టేసింది.
కొద్ది సేపు నన్ను మౌనం ఆవహించింది. చాలా గిల్టీగా అనిపించింది. క్షణంలో మనసు చేసిన మాయలోపడి మా ఆయనని అపార్థం చేసుకొనే స్థాయికి వెళ్ళినందుకు. ఇప్పుడు మనసు తేలికైంది.ఆ పెద్దావిడ మాటల్లో వినిపించిన కృతజ్ఞతాభావం నాలో మా ఆయనపట్ల ఉన్న ప్రేమా, నమ్మకమూ మరింత బలపడ్డాయి.. తాత్కాలికంగా నా మనసును ముసిరిన అనుమానం మబ్బు తెరలు ఒక్కసారిగా తొలగిపోయాయి. అపోహపడినందుకు మనసులోనే క్షమాపణలు కోరుకున్నా. ఎవరూ కూడా పూర్తిగా విషయం తెలుసుకోకుండానే ఎవరినీ.. మనవారినీ..అయినవారినీ అపార్థం చేసుకోవద్దని నిర్ణయించుకున్నా. అలికిడైతే ఈ లోకంలోకొచ్చి..గేటుతీసుకుని ఇంట్లోకి వస్తున్న మా ఆయనవైపు కన్నార్పకుండా ఆరాధనభావంతో చూస్తున్నా…

July 29, 2024 1 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us