మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంట‌ర్వ్యూలు

సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది

by Ananthaacharaya K.S. July 29, 2024
written by Ananthaacharaya K.S.

వారాల ఆనంద్

వెన్నెల వెళ్ళిపోతున్నదని రోదిస్తూ కూర్చుంటే ప్రభాతాన్ని కోల్పోతావు….
కోల్పోయిన దాని గురించి కాదు,రాబోయే భవిష్యత్తు కొరకు, చైతన్య దీపం పట్టుకొని అడుగు వేయి అని చేయి పట్టుకుని నడిపించే కవిత్వం శ్రీ వారాల ఆనంద్ గారిది. ఒక కవి సాయంకాల వేళ పొంగుతున్న వెలుతురు ధారలను తీసుకొని కవితలు అల్లుతూ కూర్చుంటాడు,  కవి సమయాలను ఉదయము సాయంకాలంలో, ప్రకృతిలోని పక్షుల ధ్వనులను, చెట్టు… వెతుకులాటలు తాను తిరిగి, కదిలే దృశ్యాలను తన సొంత ఊరి జ్ఞాపకాలను దారం చేసిన పల్లె రాగం వారాల ఆనంద్. మాట మైకు నుంచి రాలిపడే ఉపన్యాసపరంపర కాదు… మాట రెండు మనుషులను కలిపే ఆత్మీయ బంధంగా ఉండాలి. మానవ సంబంధాలు మరింత మెరుగుపడి ఆరోగ్య సమాజ నికి దోహదపడాలి, అని కోరుకునే ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా  కవిత్వంతోనే కౌన్సిలింగ్ చేస్తారు,  వారాల ఆనంద్ సర్
 నేను సైతం అంటూ… మానేరు తీరాన నడిచి అందరికీ గుక్కెడు అనురాగ జలాన్ని అందించిన సున్నితత్వం ఆనంద్ సార్ ది.
గుల్జార్ ప్రముఖ సాహితీకారుడు, గీత రచయిత, కవితల్ని ఆకుపచ్చని కవితలుగా ఆనంద్ సార్ అనువదించి అనువాదకుడిగా అక్షరమక్షరం పచ్చదనంలో  ముంచి, ఆత్మీయతా పూల పరిమళాలను పంచి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకున్న కవి రచయిత. భారతీయ కవిత్వపు నాడిని పట్టుకున్న సాహితీ వైద్యులు సర్. యాదోoకి బారాత్…. పేరిట వాట్సాప్ లో వారం, వారం గా ఆదివారం పూట రాస్తూ రాస్తూ…… స్వీయ అనుభవాలు, నేర్చిన, తాను నేర్పిన పాఠాలు ప్రముఖులతో ములాఖత్, ఉద్యోగ జీవనం, విద్యార్థులతో తాను పెంచుకున్న బంధం, ఆరోగ్యం, మిత్రుల పరస్పర ఆదాన ప్రదానాలు, కాలేజీలో డిజైన్ చేసి నడిపించిన కోర్సులు, సినిమా మీద, కెమెరా, షూటింగ్,  జర్నలిజం, ఒకటేమిటి పలు రకాలుగా పాఠాలు బోధించి… మార్గదర్శకత్వం చేసిన అంశాల మన ముందు ఉంచుతున్నారు.
తెలంగాణ పునర్నిర్మాణ వేళ…. మన సినిమా మన సాహిత్యం గొప్పతనాన్ని తెలుపుతూ… మానేరు గల గలలు, బంగారు తెలంగాణలో చలనచిత్రం
మనిషి లోపల, సొంతూరు, మెరుపు, నవ్య చిత్ర వైతాళికులు,
బాలల చిత్రాలు, తెలంగాణ దశ దిశ,  పుస్తకాలను ప్రకటించి అచ్చుతెలంగాణ మనిషినని నిరూపించుకున్నారు  వారాల ఆనంద్ సర్ అలాగే ఉద్యమానికి ఊపిరి పోసారు.
మృదుభాషీ స్మితభాషి హితైషి, సౌమ్యలు అయిన ఆనంద్ సర్, జీవితంలో ఆరోగ్యం దెబ్బతిని మూత్రపిండాలు రెండు పాడైన సందర్భంలో ఆందోళన నుండి ఉద్వేగం విచారణ నుండి కవిత్వాన్ని రాశారు. అది మనిషి లోపల… నా కలలు నీ కలలు ప్రోది చేసుకొని విశ్వంలోకి దూసుకెళ్ళు అంటూ… పునర్జన్మ పొందిన వారి కవిత్వం నిండా ఆత్మవిశ్వాసం, ఆశయే శ్వాసగా పునరుజీవనం పొందింది.
ఊహల రెక్కలు కట్టుకొని బాల్యం ఉదయం మీద వాలి చిన్నోడి ఇంగితాలను అక్షర రూపంలోపలకి మార్చి, ఆటలను భావచిత్రాలుగా రూపొందించి, చిన్నారి చిలిపితనాన్ని ముక్తకాలలో బంధించి, బాల సాహిత్యపు వెలుగులను దశ దశలా వ్యాపించేలా చేశారు వారాల సర్.
ఇరుగుపొరుగు పేరిట అనేక భాషల నుండి కవిత్వాన్ని తెలుగులోకి అనుసృజన చేసి అందిస్తూనే ఉన్నారు.
ఫిలిం సొసైటీలు యువత మూర్తిమత్వ వికసిత కేంద్రాలుగా భావించి, వాటి విస్తరణకు నడుము కట్టి విజయం సాధించినారు. దక్షిణ భారతదేశంలో బెంగుళూరు తర్వాత, కరీంనగర్లో ఫిలిం భవన్ నిర్మాణాన్ని పూర్తిచేసి జిల్లా కళారంగా అభిమానుల కలల్ని నెరవేర్చినారు. ఇప్పుడు కళా సాహిత్య కార్యక్రమాలకు అడ్డగా ఇది నిలిచింది.
సినీ విమర్శకులుగా, నంది అవార్డుల జూరి మెంబర్ గా, ఇండియన్ పనోరమా చిత్రాల ప్రదర్శనలో న్యాయ నిర్ణేతగా, కేరళ జాతీయ ఫిలిం ఫెస్టివల్ తో పాటు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు  కూడా జూరీ మెంబర్ గా వ్యవహరించిన ఘనత వారిది. ఒక సాధికారికంగా సినిమాపై 24 ఫ్రేమ్స్ ను రాసిన వారాల ఆనంద్ సార్ మంచి సినీ విశ్లేషకులు.
సెన్సార్ బోర్డు మెంబరుగా, సినీసుమాలను పూజించి భారతీయ మహిళల మేధోసంపత్తి ఆలోచన ధోరణిలను ఆవిష్కరించిన సినీ సాహితీ విరించి.
వేములవాడ ఆలయ సంస్కృతి అక్కడ సాంబ కవిలాంటి వారి సాహిత్యాన్ని విని అధ్యయనం చేసి తెలంగాణ భాషకు మారుపేరైన సామల సదాశివ, సంస్కృత సాహిత్యానికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీ భాష్యం విజయసారథి పై మూడు భాషల సాధికారికత కలిగిన ముద్దసాని రామిరెడ్డి లపై డాక్యుమెంటరీలను నిర్మించినారు.  వేములవాడలో …. వ్యవస్థను చూపిస్తూ మరొక డాక్యుమెంటరీ, పైడి జయరాజ్, మిద్దె రాములు పైన ( మోనోగ్రాఫ్ ) నిర్మించినారు. రచయితగా దర్శకునిగా, దార్శనికతతో బాధ్యతాయుతంగా పనిచేసిన సృజన కారులు.
ఒక పాత్రికేయునిగా మొదలై టోరి రేడియో….. లో అనుసంధానకర్తగా ఎంతోమంది లబ్ద ప్రతిష్టులైన కవులు రచయితల నుండి వర్ధమానుల దాకా పరిచయం చేసి ప్రోత్సహించిన ఘనత వారికి దక్కుతుంది. గ్రంధపాలకునిగా, అభ్యుదయ భావాలతో, క్రమశిక్షణతో, అధ్యయనం నుండి రచనలు దాకా అదే కొనసాగింపు కనపడుతుంది.
ఇంకా గడపాల్సిన కాలము నడవాల్సిన దూరము చాలా ఉంది అంటారు ఆనంద్ సార్, మనము అనుకుంటున్నాం ఇంకా రాయాల్సింది, తీయాల్సింది, దర్శకత్వం వహించాల్సింది, విమర్శల్లో విప్పాల్సింది…. వారి చేతికి చాలా పని ఉంది.
కవి రచయిత సినీ విమర్శకులు డాక్యుమెంటరీల నిర్మాత పాత్రికేయులు ,సెన్సార్ బోర్డ్ మెంబర్ గా ఫిలిం సొసైటీల వ్యవస్థాపకులు గా, అనువాదకులు ఉద్యోగ నివృత్త గ్రంథపాలకులుగా, ఆత్మీయులుగా ఉన్న ఆనంద్ సార్ ని, కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్న తదుపరి శ్రీ కే.ఎస్.అనంతా చార్య చేసిన ఇంటర్వ్యూ.


నమస్తే ఆనంద్ సార్.

మయూఖ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యు చేద్దామని, కొన్ని ప్రశ్నలు అడుగుతాను.

తప్పకుండా సర్.

ప్రశ్న : కవిత్వం, కథలు, పిల్లల కథలు, సినిమా విమర్శ, డాక్యుమెంటరీల రూపకల్పన, ‘త్మ కథ’ ఇట్లా అనేక ప్రక్రియల్లో కృషి చేస్తున్నారు. ప్రభావంతమయిన రచనలు చేసారు. ఇన్ని ప్రక్రియల్లో రాయడం ఎందుకు, ఎట్లా మొదలయింది, ప్రేరణ ఏమిటి?

మీరన్న అన్నిప్రక్రియాల్లో వున్నవి రూప బేధాలే తప్ప మౌలికంగా అన్నీ కళాత్మక సృజన రూపాలే.  
సృజనకారుడనేవాడు తనను తాను వ్యక్తం చేసుకోవాలనుకున్నప్పుడు ఇదిమిద్దంగా ప్రత్యేకంగా ఒక ప్రక్రియలోనే రాయాలని అనుకోడు. ఆయా సందర్భంలో పెల్లుబికిన భావ పరంపరకు అనుగుణంగా వ్యక్తీకరణ రూపాన్ని ఎంచుకుంటాడు. తాను అనుకున్న, తాను చెప్పదలుచుకున్న భావం ఏమేరకు పాఠకుడుకి అందిచగలిగానా అన్నది మాత్రమే చూస్తాడు. నిజానికి నేను కవిత్వంలో దృశ్యాన్ని, దృశ్యం లో కవిత్వాన్ని చూస్తాను. కవిత్వంలో భావ లయ, దృశ్య మాధ్యమంలో దృశ్య లయ నన్ను ప్రధానంగా ఆకర్శిస్తాయి. ఆ దిశలోనే నా రచనలూ సాగాయి. ఏదీ ప్రణాలికా బద్దంగా ఆ రూపంలో రాయాలని రాయలేదు. ఇన్ని ప్రక్రియలలో రాయాలని కూడా అనుకోలేదు. మంచి సినిమాకు మంచి కవిత్వానికి నడుమ పెద్ద తేడా వుందని నేనుకోను. పథేర్ పాంచాలి, దాసి, రాషోమాన్ లాంటి ఓ మంచి సినిమా చూసినప్పుడు మంచి కవిత్వం చదివినట్టే వుంటుంది. అట్లే మంచి కవిత చదివినప్పుడు గొప్ప దృశ్య భావన కలుగుతుంది. కేవలం సినిమా, కవిత్వాలే కాదు పెయింటింగ్ సంగీతం ఇట్లా అన్ని కళల్లో రూపాలు మాత్రమే  భిన్నమయినవి. కానీ మనసున్న మనుషులపై వాటి ప్రభావం ఒకేలా వుంటుంది. నేను సమాంతర సినిమా ఉద్యమంలో ప్రధానంగా వున్నప్పుడు వివిధ భారతీయ భాషల్లో వస్తున్న సినిమాల్ని చూడడం సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్ లు ఏం తీసారు, అదూర్ , అరవిందన్ సినిమాలు ఎట్లా వున్నాయి అని చూసేవాన్ని. అంతేకాదు అకిర కురుసువా, ఇజెన్ స్టీన్ లాంటి అనేక మంది విదేశీ దర్శకుల సినిమాలూ చూశాను వాటినన్నింటినీ  ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూస్తూ అనువదించుకుని సంభాషణల్నీ అర్థం చేసుకునే వాణ్ని. అట్లే కవిత్వం పై ప్రధానంగా దృష్టి పెట్టినప్పుడు వివిధ భారతీయ భాషల్లో వస్తున్న కవిత్వం చదవడం ఆరంభించాను. నిజానికి నా చిన్నప్పుడు నేనో  పెద్ద అంతర్ముఖున్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీంనగర్ లో మా నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. ముఖ్యంగా వ్యాపార నేపధ్యంవున్న కుటుంబం. మా ఇంట్లో సాహిత్య వాతావరణం అసలు లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్న ఉర్దూలో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి క్లాక్ టవర్ దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్ స్టాల్ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్ట్ బుక్స్ కు అదనంగా ఇతర పుస్తకాలు చదివే అలవాటయింది. తర్వాత యద్దనపూడి, అరికెపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలూ చదివాను. డిగ్రీ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటికథ ‘చిత్రిక’ వార పత్రికలో అచ్చయింది. కవిత్వంలో మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో, పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘‘లయ”’ మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. 1981 లోనే వేములవాడ ఫిలిం సొసైటీ ప్రారంభించాను. అప్పుడే సత్యజిత్ రె మృణాల్ సేన్, శ్యాం బెనెగల్, సత్యు, చార్లీ చాప్లిన్ ఇట్లా అనేక మంది గొప్ప దర్శకులు రూపొందించిన సినిమాలని మేము చూడడంతో పాటు సభ్యులకు చూపించాము. దృశ్య శ్రవణ మాధ్యమంయిన సినిమా చాలా ప్రభావ  వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని  చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. ఆట్లా అర్థవంతమయిన సమాంతర సినిమాల్ని ప్రదర్శించడమే కాకుండా వాటి పైన రాయడమూ అప్పుడే ఆరంభమయింది. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’ లాగా తిరుగుతూ వచ్చాను. ఎదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది. ప్రభావాల విషయానికి వస్తే ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రభావితం చేసారు. కవిత్వం లో శ్రీ శ్రీ, తిలక్, వీవీ, వచనంలో బుచ్చిబాబు, రావి శాస్త్రి, అంపశయ్య నవీన్ ఇట్లా ఒకరేమిటి అనేకమందిని విస్తృతంగా చదివాను. వారి రచనలతో ప్రభావితున్ని అయ్యాను. కానీ ఎవరినీ అనుకరించాలని వారిలా రాయాలని అనుకోలేదు. ఆ గొప్ప వారందిరి రచనల వాతావరణంలో నా స్వీయ గొంతుక కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాను..

కవిత్వం అనువాదాలతో పాటు “ యాదొంకి బారాత్” పేర మీ ఆత్మకథ రాస్తున్నారు. ఎందుకు రాయాలనిపించింది?  యాదొంకి బారాత్ కి ప్రేరణ దాని ప్రణాళిక ఏమిటి? ఎంతవరకు వచ్చింది?


మూడేళ్ళ క్రితం మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన తవ్వకాల్లో బయట పడ్డ ఒక చిన్న ఫోటో ఓ నాలుగు వాక్యాలు రాసేందుకు కారణమయింది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాల్ని పంచుకున్నాను. అదిచూసి  నా సహచరి ఇందిర చాలా బాగున్నాయి అప్పటి విషయాల్ని రాయకూడదూ అంది అంతే కాదు. ఒక రకంగా ఒత్తిడి తెచ్చింది. చిన్నప్పటినుండీ విషయాల్ని రాస్తే అది ఆత్మకథ అవుతుంది, మనం అంత పెద్ద వాళ్ళం కాదులే అన్నాను. కాని తను ఊరుకోలేదు. అన్ని వివరాల్ని రాయండి చదివేవాళ్ళు చదువుతారు. ఏముంది అన్నది తను. ఇంకేముంది నాలో కూడా రాయాలనే కోరిక పెరిగింది. ఎప్పుడో ఇంటర్ లో వున్నప్పుడు చూసిన హిందీ సినిమా పేరు ‘యాదొంకీ బారాత్’ గుర్తొచ్చింది. ఆ పేరు మీదే వరం వారం రాయడం మొదలు పెట్టాను. సామాజిక మాధ్యమాలయిన ఫేస్బుక్,వాట్స్ అప్, నా word press పేజీల్లో రాయడం మొదలు పెట్టాను.  మిత్రులు బాగుంది కొనసాగిన్చామన్నారు. అట్లా సాగుతూ వచ్చింది.  ఎవరయినా డైరీ రాయడం వేరు జ్ఞాపకాల్ని రాయడం వేరు. తేదీల వారిగా రాయడం కష్టమే అయినా మొత్తానికి క్రమంగా రాయడం మొదలు పెట్టాను.
‘లోపల జ్ఞాపకాల జాతర నేనేమో వర్తమాన జెండా పట్టుకుని ముందు నడుస్తున్నా’  అనుకుంటూ రాస్తూ వచ్చాను. “ఆత్మకథలు ఎప్పుడయితే భేషజాలు లేకుండా నిజాయితీగా శ్వేత పత్రాలుగా రాస్తారో అవి గొప్ప ప్రేరణ నిస్తాయి”. అందుకే యాదొంకీ బారాత్ లో నా విజయాలే కాదు నా ఓటములు, నేను ఎదుర్కొన్న అవమానాలు అన్నీ రాసాను. చీకటి వెల్తురు అన్నింటినీ చిత్రించాను.ఇప్పటి వరకు 113 వారాలు రాసాను. 1958 లో నేను పుట్టినప్పటి నుండి 2014 లో తీవ్రమయిన అనారోగ్యానికి గురయి విజయవంతంగా పునర్జన్మ పొందిన కాలం దాకా రాసిన యాదొంకి బారాత్ ను పుస్తకంగా తెస్తున్నాను. మిగతా కాలాన్ని కూడా క్రమం తప్పకుండా రాసే ప్రయత్నం చేస్తున్నాను.

లయ’ కవితా సంకలనం నుండి నేటి వరకు గత నాలుగు దశాబ్దాలుగా సాహితీ ప్రస్థానాన్ని విడువకుండా విస్తరించుకుంటూ కొనసాగడంలో మీ అంతర్యం ఏమిటి? ఆ ప్రయాణాన్ని వివరిస్తారా?  

ఇంతకు ముందే  నేను చెప్పినట్టు నా చిన్నప్పుడు నేను పెద్ద అంతర్ముఖున్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక ఇబ్బందికి గురయ్యేవాన్ని. చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీమంగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో డిగ్రీ చదువు అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. రాయాలనే తపనా పెరిగింది. శ్రీశ్రీ కవిత్వంతో పాటు, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. తప్పకుండా రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో,పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ” మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. సినిమా చాలా ప్రభావ వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’ లాగా తిరుగుతూ వచ్చాను. ఎదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది.    

‘మానేరు తీరం’. ‘మనిషిలోపల’, ‘అక్షరాల చెలిమే’, ‘సొంత వూరు’ తో సహా మీ మొత్తం కవిత్వంలో ప్రధానంగా మనిషి ప్రకృతి సంబంధిత అంశాలు కనిపిస్తాయి వీటి గురించి తెలపండి ?

“ నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు
సగం శబ్దం సగం నిశబ్దం
శబ్దమేమో బతుకు ఏడుపులోంచి ఎగిసిపడుతున్నఎక్కిళ్ళు
 నిశబ్దమేమో బతుకు చేతగానితనం లోంచి వ్యక్తమవుతున్న మౌనం.”.  
అంతే కాదు
“కవిత్వం సంక్షోభ కాల ప్రవాహంలో నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప
బతుకు సమరంలో నిలబెట్టే లంగరు” అని కూడా రాసుకున్నాను. కవిత్వాన్ని ఎప్పుడూ నేను కారీర్ గా తీసుకోలేదు. అది నా ‘లైఫ్ లైన్’.
సాహిత్య పరంగా నాపైన మొదట ప్రభావం కలిగించిన సంస్థలు వేములవాడలోని నటరాజ కళానికేతన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉస్మానియా రైటర్స్ సర్కిల్. ఈ రెండు సంస్థలూ నా అధ్యయనాన్ని ఆలోచన రీతినీ మార్చాయి. వేములవాడలో శ్రీ చొప్పకట్ల చంద్రమౌళి సలహాదారుగా ఏర్పడ్డ సంస్థ నటరాజ కళానికేతన్ సమయంలోనే ప్రముఖ కవులు కే.శివారెడ్డి, దేవి ప్రియ, జ్వాలాముఖి, కుందుర్తి లాంటి ఎందరినో దగ్గరినుంచి చూసే అవకాశం కలిగింది. అప్పుడు వజ్జల శివకుమార్, పీ.ఎస్.రవీంద్ర, జింబో లాంటి కవి మిత్రుల సహచర్యం సాహిత్యం వైపునకు నన్ను నడిపించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నందిని సిద్దారెడ్డి, సుంకి రెడ్డి నారాయణ రెడ్డి, మర్రి విజయ రావు, నందిగం కృష్ణారావు లతో సన్నిహితంగా వున్నాను. ఈ అందరి మిత్రుల స్నేహం సాహిత్యం రచనల వైపునకు దారి తీసింది. తర్వాత జూకంటి జగన్నాదం, అలిశెట్టి ప్రభాకర్ ల కవిత్వమూ ఆకట్టుకుంది. వాళ్ళతో స్నేహాన్నీ కలిపింది.అట్లా రాయాలనే కోరికా శురూ అయి రాయడం మొదలు పెట్టాను. ఆ క్రమంలో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అది ముందుకు సాగి మొదటి పుస్తక ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివకుమార్, జింబో,పీ.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ” మినీ కవితా సంకలనం తెచ్చాం.

సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ మీ యవ్వనంలో ప్రభావవంతమైన ప్రాంతాలు వాటి ప్రభావం మీ సాహిత్యం పైన ఎలా ఉండేది.

డిగ్రీ చదువులు పూర్తి అయి ఒస్మానియాలో చేరే సమయానికి సిరిసిల్లా జగిత్యాల అంటేనే ఒక గొప్ప ఉద్వేగం, ఉత్సాహం. అప్పుడు మేమే కాదు యవ్వనంలో వున్న వాళ్ళందరి పైనా ఆ ఉద్యమాల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమితంగా వుండేది. రగులుతున్న పల్లెలు ఒక పక్క, మరోపక్క అణచివేత ఎన్కౌంటర్లు అంతా ఒక సంఘర్షనాత్మక స్థితి. ఎప్పుడే భీభత్సం జరుగుతుందో నన్న స్థితి నెలకొని వుండేది. ఆ నేపధ్యంలో ఆ ఉద్యమ ప్రభావం నాపైనా, నా మిత్రుల పైనా స్పష్టంగా వుండేది. ఆనాటి  మా రచనల్లో ప్రతిభింబించేది, ప్రతిధ్వనించేది. అయితే కవితల్లో కవిత్వంతో పాటు అంతర్లయగా ఉద్యమం ధ్వనించేది. ఆ కాలంలోనే చాలా సాహిత్యం చదివాము. సామాజిక రాజకీయ దృక్పధాన్ని ఏర్పరుచుకున్నాం. సాటి మనిషిని ప్రేమించడం, వారి జీవితాల్ని మా సృజనలో ప్రతిఫలించడం అప్పుడే మొదలయింది. మధ్యతరగతి కుటుంబాల్లోంచి వచ్చాను కనుక ఆ నాటి ఉద్యమ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాని ప్రతి సంఘటననీ సందర్భాన్నీ దగ్గరగా చూసాను వాటిని  లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను. సృజనాత్మక జీవితంతో పాటు సమాంతర సినిమాను కూడా కళా చైతన్య రంగంలో ప్రధానంగా తీసుకున్నాను. అందుకే ఫిలిం సొసైటీ ఉద్యమంలో దశాబ్దాల పాటు పనిచేసాను.

మీ స్వీయ కవిత్వం వివరాలు చెప్పండి?

‘మానేరు తీరం”, ‘మనిషి లోపల’, ‘అక్షరాల చెలిమె’,’సొంతవూరు’, ’ముక్తకాలు’, చిన్నోడి ముక్తకాలు’ వెలువడ్డాయి. ‘మనిషి లోపల’ సంకలనాన్ని అనురాధ బొడ్ల ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’  పేర ఇంగ్లీషులోకి, మనోహరన్ తమిళం లోకి, ఎస్డీ కుమార్ కన్నడంలోకి అనువదించారు. ఇక అనువాదం లో గుల్జార్ GREEN POEMS ని ‘ఆకుపచ్చ కవితలు’ పేర అనువదించాను. కే.సచ్చిదానందన్ ‘వైల్ ఐ రైట్’, జావేద్ అఖ్తర్ ‘ ఇన్ ఆదర్ వర్డ్స్’ కు అనువాదాలు చేసాను. ఇంకా 29 భారతీయ భాషల్లోంచి 90 మంది కవులు రాసిన 152 కవితల్ని తెలుగులోకి అనువదించి ‘ ఇరుగు పొరుగు’ పేరా సంకలనం తెచ్చాను. ప్రస్తుతం ఇరుగు పొరుగు రెండవ సంపుటికోసం అనువాదాలు చేస్తున్నాను.

అభ్యుదయం నుండి అనేక వాదాలు చెలరేగినా అన్నివాదాలు దాటుకుంటూ కవితా వాదాన్ని మానవతా వాదాన్ని నిలబెడుతూ సాగడం లోని మీ నిష్ఠ-నిశ్చయం?

ఆయాకాలాల్లో పెళ్ళుబికిన సామాజిక సంఘర్షణ, సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది. ప్రతిస్పందన మాత్రం ఆ సృజనకారుడి మానసిక స్థితి, స్వీకరించి ప్రతిస్పందించే లక్షణం మీద ఆధారపడి వుంటుంది. నా మట్టుకు నేను అన్నివాదాలనీ దగ్గరి నుంచి చూసాను. కలిసి నడిచాను. జీవితమూ రాజకీయమూ వేర్వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. జీవీతంలో రాజకీయం ఒక భాగమే అయినప్పటికీ ఆ భాగమే మిగతా మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మాను. అది నిజం కూడా. అయితే కళాత్మకం కాని ఏ సృజన అయినా అది సాహిత్యమయినా సినిమా అయినా పొడి పొడిగానే వుంటుంది అన్నది నా అభిప్రాయం. అందుకే సమాజంలో వున్న మనిషి వాడి మనసుతో పాటు సమాజంలో వున్న అనేక పొరల్ని నా రచనల్లో ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నాను. వివిధ భాషల కవిత్వాన్ని మనవాళ్ళకు అందించడం వివిధ సినిమాల్ని పరిచయం చేయడం అందులో భాగమే.v
నేనెప్పుడో రాసుకున్నట్టు
“ ఈ సమాజం అచ్చుతప్పులున్న గొప్ప పుస్తకం, ఇప్పుడు కావలసింది తప్పొప్పుల పట్టిక తయారు చేయడం కాదు, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలి” అన్న భావనలోనే వున్నాను.

సాహిత్య సృజన అట్లా వుంటే పలు డాక్యుమెంటరీలు రూపొందించారు ఆ వివరాలు చెప్పండి? ఏమేరకు వ్యాజ్యం సాధించారు.

నేనిందాకే చెప్పినట్టు సినిమా కవిత్వం రెండూ కళాత్మక వ్యక్తీకరణలే. కానీ కవిత్వం వ్యక్తిగత వ్యక్తీకరణ, సినిమా సమిష్టి కళల వ్యక్తీకరణ. అర్థవంతమయిన భావయుక్తమయిన ఆ రెంటినీ ఇష్టపడతాను. మనిషినీ సమాజాన్నీ పట్టించుకునే ఆ రెండూ నాకు వూపిరుల్లాంటివి. అందుకే  తెలంగాణ సాహితీమూర్తుల సృజన జీవితాల పైన దృశ్య మాధ్యమంలో ఫిలిమ్స్ చేద్దామని సంకల్పించాను. వాటికోసం ‘ముద్దసాని రామిరెడ్డి’,యాది సదాశివ’ ల  పైన ఫిలిమ్స్ చేసాను. తర్వాత తెలంగాణ జీవన సంస్కృతిలో భాగమయిన ‘శివ పార్వతులపైన’ ఫిలిం చేసాను. ఇంకా పలు ప్రయత్నాలు చేసాను. సాహితీ మూర్తుల డాక్యుమెంటరీలు మరిన్ని చేయలేకపోయాను. ప్రభుత్వాలూ సంస్థలూ సహకరించలేదు. చేసినకాడికి శక్తి మేరకు చేసాను అని అనుకున్నాను.

ఫిలిం సొసైటీల ఏర్పాటు నిర్వహణ లలో కృషి చేసారు. ఆ వివరాలు చెప్పండి.

వేములవాడ లాంటి మామూలు గ్రామంతో పాటు సిరిసిల్ల, జగిత్యాల,గోదావరిఖని, కోరుట్ల తాడిత ప్రాంతాల్లో సొసైటీల ఏర్పాటులో నిర్వహనల్లో పాలు పంచుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి, ఒంగోల్ దాకా వైజాగ్,టెక్కలి లాంటి చోట్ల కాంపస్ ఫిలిం క్లబ్స్ ఏర్పాటు చేయడంలో ప్రహాన భూమికను పోషించాను. ఇక కరీంనగర్ ఫిలిం సొసైటీ నా ప్రధాన వేదిక. కరీంనగర్ లో ‘ఫిలిం భవన్’ ఆలోచనలో నిర్మాణంలో మున్డున్నాను. అప్పటి కలెక్టర్ పాతసారధి గారి ప్రోత్సాహంతో ఫిలిం బవన్ రూపుదిద్దుకుంది. 2010 దాకా జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాము. నేను పనిచేసిన ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ పేజీ కాలేజీలో ఫిలిం క్లబ్ తో పాటు ఫిలిం మేకింగ్ కోర్సు నిర్వహించాను. పలు వార్క్షాప్స్ నిర్వహించాము.

జర్నలిస్టుగా మీ ప్రస్తానం, ‘జర్నలిజం’ కోర్సు నిర్వహణ వివరాలు చెప్పండి?

ముఖ్యంగా ఈనాడులో సాంస్కృతిక విలెఖరిగానూ, సుప్రభాతం మగజైన్ లో ఉత్తర తెలంగాణ ప్రతినిదిగాను, మాభూమిలో కూడా ప్రతినిధిగా పని చేసాను. మా కాలేజీలో జర్నలిజం లో ఆర్నెల్ల కోర్సును 13  బాచులు నిర్వహించాను. ఉత్తమ శిక్షణ నిచ్చాము.v ఇక కరీంనగర్ నుంచి కీ.శే.v.విజయకుమార్ సంపాదకత్వంలో వచ్చిన “జీవగడ్డ” లో కే.ఎన్.చారి, అల్లం నారాయణ ళ సహచర్యం తో “వారానందం” కాలం రాసాను, ఇంకా పొన్నం రవిచంద్ర సంపాదకత్వంలో వచ్చిన మానేర్ టైమ్స్ లో ‘మానేరు తీరం’రాసాను,

గ్లోబైజేషన్ నేపథ్యం లో తెలుగు భాష పరిస్థితి ఏమిటి? అనువాద ప్రభావం ఏమేరకు వుంటుంది?

ప్రపంచీకరణ మొత్తంగా ప్రపంచంలోని దేశాల మధ్య మనుషుల మధ్య హద్దుల్నీ సరిహద్దుల్నీ చెరిపేసిందనే చెప్పాలి. పెరుగుతున్న సాంకేతికత దూరాల్ని చెరిపేస్తున్నది. అనేక సంస్కృతులు వేలాది భాషలు వున్న ప్రపంచంలో సమాచారప్రసారం ముఖ్యమయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో అనేక చిన్న భాషలు ప్రభావితమవుతున్నాయి. కొన్ని భాషలు అంతరించిపోయే స్థితి ఏర్పడుతున్నది. ఈ నేపధ్యంలో తెలుగు కూడా ఎంతోకొంత ప్రభావితం అవుతుంది. తప్పదు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కాలేజీల ప్రభావం తెలుగుపై కనిపిస్తూనే వున్నది. కంప్యూటర్ నేర్చుకోవడానికి, అమెరికా వెళ్లడానికి ఇంగ్లీష్ కావాలి కనుక రానున్న తరాల్లో తెలుగు ఉపయోగం తగ్గిపోయే అవకాశం వుంది. మాతృభాషా పరిరక్షణ ఉద్యమం రావాల్సిన అవసరం కూడా వుంది. ఇక ప్రపంచీకరణ నేపధ్యంలో అనువాదం ఒక పరిశ్రమగా అభివృద్ది చెందే అవాకాశం కనిపిస్తున్నది. సాహిత్య అనువాదం మాత్రమే కాకుండా విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాలు, మీడియా, వ్యాపార రంగాల్లో అనువాద అవకాశాలు పెరిగే అవకాశం వుంది పెరుగుతున్నాయి కూడా. సాహిత్యానువాదమప్పుడూ ఇప్పుడూ అత్యంత ప్రధానమయింది అని నేననుకుంటాను.

ఈ నాటి యువతకు మీరేం చెబుతారు?

ఇవ్వాల్టి యువత చాలా ప్రతిభావంతులు. పెరిగిన శాస్త్ర సాంకేతికాభివ్రుద్ది వారిని కోత్హ పుంతలు తొక్కిస్తోంది. అయితే నేల విడిచి సాము చేయొద్దని మాత్రం  నేను చెబుతాను. పుట్టిన ఇల్లు వూరు దేశాలను మరువవోద్దంటాను. సాటి మనుషులపట్ల ప్రేమతో స్నేహంతో మెలగాలని కోరుకుంటాను. యువతీ యువకులు తమకు ఇష్టమయినవి బాగా చదవండి అధ్యయనం చేయండి అని మనసారా కోరుకుంటాను.    
++++

అనంతా చార్య: చాల సమయమిచ్చి వివరంగా సమాధానాలిచ్చారు. థాంక్స్ ఆనంద్ సార్.
ఆనంద్: మీక్కూడా ధన్యవాదాలు. మయూఖ సంపాదకులక్కూడా ధన్యవాదాలు.

July 29, 2024 2 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

“పరిశోధన కెత్తిన జయకేతనం”-

by B. Anjaneyulu July 29, 2024
written by B. Anjaneyulu

ఆచార్య వెలుదండ  నిత్యానందరావు

   “ లోకంలో ఎంతో మంచితనం ఉంది. ఎందరెందరో ఎన్నో తీరులుగా వారి వారి స్థాయిలో మంచి పనులు చేస్తున్నారు. ఎదుటివారి పట్ల ప్రేమాభిమానాలు పంచడం మంచిని పెంచడం కృతజ్ఞతా శీలాన్ని, పరోపకార స్వభావాన్ని కలిగి ఉండడం లాంటి సల్లక్షణాలను అనుభవంలోకి తెస్తున్న పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను”…అని షష్టిపూర్తివేళ నిత్యానందరావుసారు చెప్పు(రాసు)కొన్న ఈ వాక్యాలను  గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయంలో పెద్దగా టైప్ చేసి అతికించారు. ఇది నిత్యానందరావుకు లభించిన ఘన సత్కారమే అని చెప్పవచ్చు.

సాహిత్య రంగంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని ఆరాటపడతారు . రచనా పాటవం చేత, కవితాసృజనం చేత, వక్తృత్వకళచేత, పరిశోధనతత్పరతచేత, సంస్థాగతగత నిర్వహణంచేత, భావజాలాలచేత, ఆకర్షణీయపాఠ ప్రవచనం చేత, సహాయ సహకారాల నందించడంచేత  ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులైన ఆనాటి రాయప్రోలు నుంచి ఈనాటి ఎస్.రఘు దాక ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథా, ఒక్కో విలక్షణశైలి .   

గత 40 సంవత్సరాలుగా నిత్యసాహిత్య కృషీవలుడనీ, నిత్యవిద్యార్థిఅనీ, నిత్యపరిశోధకుడనీ, పరిశోధకరాక్షసుడనీ, పరిశోధకపరమేశ్వరుడనీ సర్వుల చేత కీర్తింపబడుతూ పరిశోధకరంగంలో  తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకొన్నవారు   ఆచార్య వెలుదండ నిత్యానంద రావు.

“సాధుసంగంబు సకలార్ధ సాధనంబు” అంటాడు భర్తృహరి. నిరంతరం సజ్జన సాంగత్యం చేత వివేకం ఉదయిస్తుంది. నిత్యానందరావు గారి జీవితంలో అది అక్షర సత్యం. డిగ్రీ చదివే రోజుల్లో శ్రీ రంగాచార్యులు కపిలవాయి లింగమూర్తి, మామిడన్న సత్యనారాయణ మూర్తి ; విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించిన తర్వాత బిరుదు రాజు రామరాజు, నాయని కృష్ణకుమారి, సినారె వంటి ఉద్దండ పండితుల వద్ద శిష్యరికం కొనసాగింది.  ఇలా వారి ప్రయాణమంతా తెలుగు సాహిత్యం చుట్టే పరిభ్రమించింది. అందుచేతనే సాహిత్యంలోని అనేక విషయాలను పరిశోధనాత్మక కోణంలో శోధించి గొప్ప సాహిత్య రాశిని పోగు చేసి పరిశోధనా రంగానికి దివిటీగా నిలిచారు. సాహిత్య చరిత్ర ఒక్కటి సూటిగా రాయలేదు గాని, అంతకుమించి చర్చ, సమీక్ష చేశారు.

పాండిత్య వారసత్వం గల శ్రీ వెలుదండ రామేశ్వరరావు లక్ష్మమ్మ దంపతులకు 1962 ఆగస్టు 9వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా మంగనూరులో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మంగనూరులోనూ తదుపరి  డిగ్రీ విద్యాభ్యాసం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల పాలెంలో జరిగినది. ఉన్నత విద్య ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో కొనసాగినది. పీజీ చదివే రోజుల్లోనే యుజిసి వారు నిర్వహించే NET పరీక్షలో JRF అర్హతసాధించారు.” చంద్రరేఖా విలాపం -తొలి వికట ప్రబంధం” అను అంశంపై ఎంఫిల్,“తెలుగు సాహిత్యంలో పేరడీ”అను అంశాల మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1988 లో తెలుగు శాఖలో పార్ట్ టైం లెక్చరర్ గా మొదలుపెట్టి  అదే శాఖలో ఆచార్యులుగాను పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షులుగా, తెలుగు శాఖ అధ్యక్షునిగా. వివిధ హోదాల్లో పేరు ప్రఖ్యాతులు పొందారు.  పదవీ విరమణ పొందే వరకు గొప్ప పరిశోధకుడిగా, సమీక్షకుడిగా, విమర్శకునిగా, కథకునిగా, సంపాదకుడిగా విశేషమైన సేవ చేశారు. ఎంతటి వివాదాస్పదాంశం పట్లనైన నొప్పించక తానొవ్వక అను చందంబున విమర్శించగలిగే ప్రతిభాశాలి.

చిన్నతనంలోనే పుస్తక పఠనం అలవడి, పాఠశాల స్థాయిలోనే రచన వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు.  18 వ ఏటనుంచి వివిధ పత్రికల్లో వారి రచనలు రావడం ప్రారంభమైంది.  “వాగ్దేవి” శీర్షికన మొదటి పద్య రచన 1979 లో సమాలోచన పత్రిక ప్రచురించినది. 1982లో డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోనే “పరిశీలన” పత్రికలో వారి అష్టవిధ శృంగార నాయికలను గూర్చి రాసిన పద్యం ఎంతో విశిష్టమైనది. విద్యార్థులకు ఉపయోగకరమైనది. ఆ వయసులోనే ఛందో వ్యాకరణ అలంకారాది విషయాలను ఒంట పట్టించుకొన్నారు.  

“భర్తను స్వాధీనపరచుక సుఖియించు

పద్మాక్షి స్వాధీనపతిక యగును

పతివచ్చుసమయాన వాసమ్ము సరిజేయు

జలజాక్షి వాసకసజ్జిక యగు

విభుడు జాగు సలుప విరహార్త యగునట్టి

తరళేక్షణ విరహోత్కంఠిత యగు

విభుడు రాకుంటచే విరహమే మిగిలిన

లలితలోచన విప్రలబ్ద యగును

పరకాంతతో గూడి పతిరాగ దూషించు

కంజాయతేక్షణ ఖండిత యగు

పతితోడ పోట్లాడి పరితాపమును చెందు

నళిననేత్ర కలహాంతరిత యగును

భర్త దూరదేశమ్మున బరుగునట్టి

వనజలోచన ప్రోషితభర్తృక యగు

విరహమును సైపజాలక విభుని కడకు

చనెడు చారులోచన యభిసారిక యగు”

  1980 లో తన పాఠ్యభాగంగా ఉన్న “కుమార సంభవ పంచమసర్గ” లో కొంత భాగాన్ని సంస్కృతం నుండి తెలుగు చేశారు. మొదట పద్యం, వచనకవిత్వం, సమస్య పూరణలు, నాటికలు, అనువాదాలు చేసినా  తర్వాతి కాలాల్లో పరిశోధన వ్యాసరచనల్లో రాటుదేలారు. 20 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాలపై అవగాహనతో ప్రజా సమస్యల పై పత్రికల్లో వ్యాసాలు రాయడం, పేరడీ పద్యాలు రాయడం రాజకీయ విశ్లేషణ చేయడం కనిపిస్తాయి.

 పదవీ విరమణ చేసే నాటికే వారి  సాహిత్యాన్నంతా దాదాపు నాలుగువేల పుటల్లో   7 సంపుటాలుగా తీసుకువచ్చారు. ఈ సంపుటాల్లోనే కొన్ని రచనలు అంతకు పూర్వమే ముద్రణ పొంది  ఉన్నాయి. వారి ఏడు సంపుటాలు వరుసగా

  1. అనుభూతి– అన్వేషణ    2. అక్షరమాల         3. వాగ్దేవి వరివస్య                   4. పరిశోధక ప్రభ

         5. వ్యాస శేముషి            6. సృజనానందం     7. ఆదర్శ పథం

  1. అనుభూతి–అన్వేషణ:

సమగ్ర సాహిత్యం ప్రచురణ పరంగా మొదటి సంపుటం. 9-8-2022  మూసి సాహిత్య ధార ఆధ్వర్యంలో 60 పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కృతమైనది. నిత్యానందరావు గారు1982 లో మొట్టమొదట రాసిన గ్రంథ సమీక్ష మోపిదేవి కృష్ణస్వామి గారి అన్వేషణ–అనుభూతి. ఈ సంపుటానికి కూడా ఆ గ్రంథ సమీక్ష పేరే పెట్టారు. కాకపోతే అన్వేషణ–అనుభూతి కాస్త అనుభూతి–అన్వేషణగా మార్చారు. 147 గ్రంథ సమీక్షలు,  82 పీఠికలు గల గొప్ప పుస్తకం ఇది. ఏ పుస్తకాన్ని సమీక్షించినా దాన్ని నిశితంగా విశ్లేషిస్తూ , గ్రంథ సారం, శైలి, గుణదోష చర్చ చేశారు.“ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి సిద్ధాంత గ్రంథాన్ని చూస్తే వచన రామాయణాల వివరాలు తెలుస్తాయి, వాటి ఆధారంగా వచన రామాయణాలపై డాక్టరేటు చేయవచ్చు” అని చెప్పారు. పుస్తక ప్రాముఖ్యతను, దాని పీఠికను చూసి తెలుసుకోవచ్చు.  పీఠిక రాసే వ్యక్తి కూడా సాహిత్యం పైన అంతే సాధికారత కలిగిన వాడై ఉండాలి. వ్యక్తిపూజ కన్నా విషయ నిష్ఠంగాను, రచయిత శక్తిని సామర్ధ్యాన్ని కచ్చితంగా అంచనా వేయగలగాలి. పుస్తకం ఏ ప్రక్రియలో ఉంటే ఆ ప్రక్రియలో లీనమై, విషయ వైవిధ్యాన్ని, రచయిత హృదయాన్ని, భావుకతను, బేరీజు వేయగల సమర్థులు నిత్యానందరావు. జంగాహనుమంతరాయచౌదరి, తూమురామదాసు లాంటివారి రచనల మీద,  మిత్రుల, విద్యార్థుల రచనల మీద ఆత్మీయమైన విషయనిర్భరమైన, సాధికారికమైన పీఠికలు రాశారు నిత్యానందరావు.

  • అక్షరమాల:

 ఇందులో చాలా వ్యాసాలు వారి చిన్నతనంలోనే రాసినవి. దీనిలో వ్యక్తిత్వ సౌరభం, సాహిత్య సౌరభం అనే రెండు విభాగాలుగా చేశారు. వ్యాసాల్లో రాసే ప్రతి అంశం విషయ ప్రాధాన్యత,  పరిశోధనతత్పరతతో కూడుకున్నవై ఉంటాయి. చదివిన పనిచేసిన కళాశాలకు లేదా సంస్థకు ఏ రూపంగా నైనా రుణం తీర్చుకోవాలి అంటారు వారు.ఈ సంపుటిలో ఎక్కువ వ్యాసాలు ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యుల సాహిత్య సేవకు సంబంధించినవి. తెలుగు శాఖ మీద వారికున్న అపార అభిమానం, గురువుల మీద అచంచలమైన  అనురాగాన్ని రెండు వ్యాసాల్లో వివరించారు. పనిచేసిన మూడు కళాశాలలకు సంబంధించి ఎవరు ఇంతవరకు చెప్పనటువంటి కొత్త విషయాలను వారు వెలుగులోకి తీసుకువచ్చారు. విశ్వనాథసత్యనారాయణగురించి రాస్తూ ఆయన చదివిన ఆంగ్లగ్రంథాలను పేర్కొన్నారు. ఆంధ్ర యునివర్సిటీ బి.ఏ మొదటి బ్యాచ్ విద్యార్థి  ఆండ్రశేషగిరిరావు నిర్వహించిన ఆంధ్రభూమి మాసపత్రిక విశేషాలను సోదాహరణంగా వివరించారు. భారతదేశంలో తొలి ఎం.ఎ పట్టభద్రురాలు  బెంగాల్ కు చెందిన చంద్రముఖిబోస్, బంకించంద్రచటర్జి, శరత్ బాబు లాంటి బంగాలీయుల గురించి; దుబ్బాక రాజశేఖరశతావధాని, పుట్టపర్తి నారాయణాచార్య, కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై, భూతపురి సుబ్రహ్మణ్యశాస్త్రి, విద్వాన్ విశ్వం లాంటి రాయలసీమకవులగురించి. కోవెల సంపత్కుమార, సుప్రసన్నాచార్య, చేకూరిరామారావు, . ఆదిరాజు వీరభద్రరావు, జే. బాపురెడ్డి, కాళోజి, దాశరథి లాంటివారిమీద, బోయిభీమన్న, జి. వి.సుబ్రహ్మణ్యం మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, గరిమెళ్ళసత్యనారాయణ లాంటి దిగ్దంతులమీద విలక్షణమైన వ్యాసాలున్నాయి

3.వాగ్దేవి వరివస్య:

ఈ సంపుటిని గూర్చిడాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి “వెలుదండ వారి వెలుగుదండ” అని ముందుమాటలో అభివర్ణించారు. నిజంగానే ఈ సంపుటి వారికి వెలుగులదండే. అన్నింటినీ మించి ఈ పుస్తకానికి ఒక విశేషం ఉన్నది. ఇందులో చాలా వ్యాసాలు వారి డిగ్రీ కాలానికి మునుపే వచ్చాయి. ఇంటర్మీడియెట్(నిత్యానందరావు చదివింది ఇంటర్మీడియెట్ అనకుండా డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ అంటారు.  ) విద్యార్థిగా ఉన్నప్పుడే “తెలుగు రాజులు సంస్కృత భాషా సేవ” అనే వ్యాసం “సమాలోచన” సాహిత్య పత్రికలో 1979లో ప్రచురితమైనది. ఆనాటికి  సరిగ్గా వారికి 17 సంవత్సరాల వయసు. బి ఏ చదువుతున్న కాలానికే ఈ పుస్తకం లోని ఆరు వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి అంటే ఆశ్చర్యకరమే. తెలుగువారు ప్రాకృత, హిందీ, తమిళ, ఉర్దూ, ఒరియా, కన్నడ, భాషలకు చేసిన సేవను, మరాఠీ తెలుగు భాషల బాంధవ్యాలను వివరించారు. ఇవన్నీ పెంచుకొని రాసుకొంటే ప్రత్యేక పరిశోధనాంశాలవుతాయి. కానీ ఇంతవరకు అలా ఎన్ని జరిగాయో ఆలోచించాలి.   తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు చేసిన భాషా సేవను, శాతవాహన కాలం నాటి ప్రాకృత భాషా ప్రక్రియ అయిన గాథను, గాథలోని రకాలను, గాథల్లో చిత్రించబడిన సాంఘిక జీవిత విశేషాలను, గాథాసప్తశతికి వచ్చిన అనువాదాలను సమగ్రంగా వివరించారు. 11 భారతీయ భాషా సాహిత్యాల ప్రగతికి పాశ్చాత్యుల దోహదాన్ని సమగ్రంగా వివరించారు. వీటిల్లో ఏనాడు మనకు వినడానికి అవకాశం లేని ఎన్నో కొత్త అంశాలు ప్రస్తావింపబడి ఆశ్చర్యం కొలుపుతాయి.   అనువాదాలను ప్రత్యేకించి పరిశీలిస్తూ “అనువాద కృషికి ప్రత్యేకంగా ఒక అకాడమీ ఉండాలని ప్రతిపాదించారు, తెలుగు కవిత్వం ఆంగ్లంలోకి అనువాదం చేయబడ్డ విధానాన్ని “ఆంగ్లంలో ఆంధ్ర కవిత” అనే వ్యాసంలో వివరించారు. వి.వి.బి.రామారావు అనువాద కృషిని, తిక్కన భారతాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన గుర్రం వెంకట సుబ్బరామయ్య ప్రతిభను తెలుగు పాఠకలోకంలోకి తీసుకువచ్చారు.“మంగనూరు ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థుల తెలుగు భాష—మాండలిక ధోరణి–పరిశీలన” భాషాశాస్త్ర విద్యార్థిగా పీ.జీ డిప్లొమా చేస్తున్నపుడు  రాసిన వ్యాసం. కొందరు బెంగాలీ కవులు రచయితలు పరిచయం కింద 65 మంది బెంగాలీ కవుల సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఇంటర్నెట్ ఇంకా అందుబాటులోకి రాని ఆ కాలంలోనే ఇంత సమాచారం సేకరించారంటే దానికి వారు ఎంత పరిశోధన చేశారో గమనించవచ్చు. సాహిత్య వరివస్య అను విభాగం కింద 27 వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ ప్రక్రియల పైన రాసినవే. ఇందులోని “విశ్వనాథ- తెలుగు సినిమా” వ్యాసంలో విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేయవలసినంత విషయం ఉన్నది. “కృష్ణా కవిత్వ తరంగ శీకరాలు”,“గోదావరి గలగలలు”ఆ నదుల నేపథ్యంగా వచ్చిన కవిత్వాన్నంతా క్రోడీకరించాయి. అభ్యుదయ, దేశభక్తి, జాతీయోద్యమ కవిత్వాన్ని మూడు వ్యాసాల్లో సమగ్రంగా రాశారు. “తెలంగాణ కథానికా క్రమం బెట్టిదనిన”, “నిజాం పాలనలో వెలవెలబోయిన తెలుగు వెలుగు”, “తెలంగాణలో విజ్ఞాన సర్వస్వాలు -సూచీ గ్రంథాలు- నిఘంటువులు” అన్నవి తెలంగాణ సాహిత్య కేంద్రంగా సాగినవి. “కల్వకుర్తి కవుల కవన కుతూహలరాగం” అను వ్యాసం  ఆ ప్రాంత కవుల సాహితీ సేవను ప్రకటించినది. ఏ విషయాన్ని తీసుకున్న సమగ్రంగా ఉంటుందని చెప్పడానికి ఇదో నిదర్శనం.“తెలుగు పరిశోధన వర్తమాన స్థితిగతులు” అన్న వ్యాసంలో నేడు పరిశోధనలు సాగుతున్న తీరును, ప్రభుత్వ విధానాలను, యూనివర్సిటీల పనితీరును, ఆవేదనాత్మకంగా చెప్పారు. ఏ సందర్భం వచ్చినా, ఏ వ్యాసం రాసినా ప్రతిచోట పరిశోధన దృక్పథం తొంగి చూడడం వారికే దక్కినది.

4. పరిశోధక ప్రభ:

విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన:

సాధారణంగా పీజీ విద్యానంతరం ప్రతివిద్యార్థి లక్ష్యం ఎంఫిల్ చేయడం,  పిహెచ్డి చేయడం. దానికి సంబంధించిన పరిశోధనాంశం గూర్చి తర్జనభర్జన పడి చివరికి ఓ విషయాన్ని నిశ్చయించుకొని, ఆ అంశం పైపూర్వ పరిశోధనలు సమాచారం తెలియక చాలాసార్లు పరిశోధనాంశాన్నే మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. కానీ దానికి వెలుదండ నిత్యానందరావు గారు విరుద్ధం. ఆ సమస్యను గమనించి ఒక సంస్థ, ఒక యూనివర్సిటీ, ఒక పరిశోధనా స్థానం చేయవలసిన పనినంతా అన్నీ తానై మోసి మూడు ముద్రణలు పొందిన “విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన” అనే గ్రంథానికి రూపశిల్పి అయ్యారు. కవిత్రయం నుండి ప్రారంభిస్తే సాహిత్య రంగంలో పరిశోధన సాగిన అనేక విషయాలను సమగ్రంగా వర్గీకరించి 5225 పరిశోధనాంశాలను 61 శీర్షికలతో విభజించి ఆయా విభాగాల క్రింద జరిగిన పరిశోధనలన్నింటినీ ఒకచోట చేర్చారు. పరిశోధనాంతరంగం అనే పేరుతో రాసిన పీఠికలో పరిశోధనాంశ నిర్ణయం నుండి పట్టా పొందు వరకు గల సమస్యలను,  చూపవలసిన జాగరుకతను, వదులుకోవలసిన జాడ్యాలు, పరీక్షకుల పరిశోధకులకు సంబంధించిన సూచనలు చేస్తూ అనేక అపూర్వ విషయాలను చర్చించారు. జరుగవలసిన ఎన్నో పరిశోధనాంశాలను సూచించారు.  ఈనాడు తెలుగులో పరిశోధన చేయాలనుకుంటున్న ప్రతి విద్యార్థి మొట్టమొదట చూసే పుస్తకం ఇదేనంటే ఆ పుస్తక ప్రామాణికత ఏమిటో చెప్పనవసరం లేదు. ఎంఫిల్ చేయక మునుపే అనధికారికంగా ప్రకటించుకున్న పీహెచ్డీ గ్రంథం ఇది.

చంద్ర రేఖ విలాపం-తొలి వికటప్రబంధం:

నిత్యానంద రావు గారి M.Phil సిద్ధాంత వ్యాసం చంద్ర రేఖ విలాపం. పేరుకు M.Phil పరిశోధనా గ్రంథం అయిన పీహెచ్డీకి తక్కువేమీ కాదు. కూచిమంచి జగ్గకవి రచించిన చంద్రరేఖ విలాపం ఆనాటి సమాజంలో బూతుల బుంగగా, నీచకావ్యంగా నిందను మూట కట్టుకుని, ఆనాటి సాహిత్యకారులు ఈ కావ్యం గూర్చి నోరు మెదపకుండా ఉండి, సాహిత్య చరిత్రలో దానికి స్థానం కల్పించలేదు. ప్రభుత్వమే ఆ కావ్యాన్ని నిషేధించిందంటే మామూలు విషయం కాదు. అట్లాంటి కావ్యం పైన ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటారా? ఒకవేళ చేద్దామనుకొన్నా ఆచార్యులు ఒప్పుకుంటారా? కానీ నిత్యానందరావు గారు అందరినీ ఒప్పించి  ఆ పని చేసి విజయవంతంగా పూర్తి చేశారు. “గైనకాలజిస్టు తన కళ్ళ ముందు ఉన్న సుందరిని రోగిగానే చూస్తాడు మరో విధంగా చూడడు. అలాగే చంద్రరేఖా విలాపం పైన చేసే పరిశోధన ఆ పరిశోధకుని సంస్కార రాహిత్యానికి గాని, మూర్ఖత్వానికి గాని నిదర్శనంగా తలపోయనవసరం లేదు. ఈ పరిశోధనలో విజయం పొందకపోతే క్షమించవలసిన అవసరం అంతకంటే లేదు” అంటూ అందరిని మెప్పించగలగడం పరిశోధన పట్ల ఆయన ధైర్యప్రపత్తు లెలాంటివో   నిరూపిస్తాయి. బ్రౌన్ రాయించిన మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో ఉన్నటువంటి చంద్రరేఖావిలాపం అముద్రిత వ్యాఖ్యానాన్ని వెలుగులోకి తెచ్చి ఒక అధ్యాయంగా ఈ పుస్తకంలో రాశారు. విజయనగర సంస్థాన రాజకీయాల్లో నీలాద్రి రాజు పోషించిన పాత్రను- సాహిత్య పరిశోధకులు ఆయనను విస్మరించిన విధానాన్ని ,  జగ్గకవి కావ్యరచన మూలాన కలిగిన అవమానంతో మరణించలేదు అని, ఆయన పద్మనాభ యుద్ధం లో చనిపోయాడని చారిత్రక ఆధారాలతో నిరూపించాడు.

తెలుగు సాహిత్యంలో పేరడీ:

            పీహెచ్డీ పరిశోధనా గ్రంథం తెలుగు సాహిత్యంలో పేరడీ. ఇది1990 లో పట్టా పొంది 1994లో ముద్రితమైనది.  ప్రాచీన తెలుగు కావ్యాల నుండి మొదలుకుంటే ఆధునిక కావ్యాలు , నవల కథానికాది ప్రక్రియలు, జానపద సాహిత్య గేయాలు, వివిధపుస్తకాలపై రాసిన పేరడీసాహిత్యాన్నంతా తవ్విపోసిన పరిశోధన గ్రంథమిది. ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో పేరడీ పై వచ్చిన సమగ్రమైన పరిశోధన. మొదటి అధ్యాయంలో పేరడీ స్వరూప స్వభావాల లక్షణ చర్చ చేస్తూ” ఒక మాతృకకు అధిక్షేపాత్మకమైన హేళనాత్మకమైన హాస్యాత్మకమైన విషయాంతరంతో కూడిన అనుకరణే పేరడీ అని నిర్వచించారు. పేరడీ సాహిత్యం పైన పరిశోధన తపన డిగ్రీ స్థాయిలోనే ఉదయించినది. 1983లో ఆంధ్రప్రభ పత్రికలో “రాజకీయ భాగోతం”అన్న పేర భాగవత పద్యాలకు రాసిన కార్టూన్ పేరడీలు ఎందరో ప్రశంసలను పొంది ఈ పరిశోధనకు మరింత ఉద్దీపనను చేకూర్చింది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పేరడీకవిగా తెనాలి రామకృష్ణుని నిరూపించి, క్రీడాభిరామకర్త వినుకొండ వల్లభ రాయుడు, కూచిమంచి జగ్గకవి ఆధునికుల్లో జలసూత్రం రుక్మిణీ నాథశాస్త్రి, మాచిరాజు దేవి ప్రసాద్, శ్రీ శ్రీ , జొన్నవిత్తుల వంటి వారి పేరడీ విన్యాసాన్ని సముచితంగా వివరించి ఎట్లాంటి అనుకరణలు పేరడీలు కావో నిస్సంకోచంగా తూచిన గ్రంథం ఇది. జర్మన్ విశ్వవిద్యాలయంలో వచ్చిన  “పేరడీ-ఎ మెటఫిక్షన్” అనే సిద్ధాంతగ్రంథాన్ని సైతం  చదివి  తెలుగు పేరడీలకు అన్వయిస్తూ  పేరడీ లక్షణ చర్చ చేయడం గమనిస్తే నిత్యానందరావు ఎంత మారుమూలల్లో ఉన్న సమాచారాన్నయినా ఎంత ఒడుపుగా సేకరించి వాడుకొంటారో అర్థమవుతుంది.

5. వ్యాస శేముషి.

 వ్యాసశేముషి అనే ఐదవసంపుటంలో  సాంప్రదాయ సాహిత్యానుశీలనం, హాసవిలాసం అను రెండు విభాగాలుగా చేయబడినది. వివిధ సాహిత్య సదస్సులలో సమర్పించిన పరిశోధనాత్మక వ్యాస సంపుటి ఈ గ్రంథం. ఏ కార్యం చేసినా గణపతి స్తుతితో ప్రారంభించడం అనాది సంప్రదాయం. మంగళకరం. ఇందులోని మొదటి వ్యాసం కూడా గణపతి స్తుతితోనే ప్రారంభమైనది. కర్త ఎవరో తెలియని ఒక పద్యాన్ని   విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించిన వ్యాసం అది. అందునా ఆ పద్యాన్ని వారికి ఎరుకపరచిన గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ కోదండరామ శర్మగారికి కృతజ్ఞతలు తెలిపిన విధం వారి ఔన్నత్యానికి తార్కాణం. ప్రతి వ్యాసంలోను తనకు తోడ్పడినవారిని స్మరించుకొని, కృతజ్ఞతలు తెలుపుకోవడం నిత్యానందరావు నిజాయితీ (Academic Honesty)కి నిదర్శనం.    కవిసార్వభౌముడు శ్రీనాథుని పై చేసిన సాహితీ చర్చ రెండు వ్యాసాలలో కనిపిస్తుంది. శ్రీనాథునిపై వెలువడిన పూర్వపు పరిశోధనలన్నింటినీ సమీక్షిస్తూ అదనపు సమాచారాన్ని పొందుపరచారు. పాల్కురికి సోమన, పోతన, రామదాసు అన్నమయ్య, కృష్ణదేవరాయలు మొదలగు కవులు, తెలంగాణ ప్రాచీన సాహిత్యం పైన చేసిన సవిస్తరమైన చర్చ వారి వ్యాసాలలో కనబడుతుంది.

హాసవిలాసం:

హాసవిలాసం  హాస్య విశ్లేషణాత్మక వ్యాసావళి.  హాస్యపు తీరుతెన్నులు హాస్య ప్రత్యేకతను వివరిస్తూ వేరువేరు సందర్భాలలో ప్రచురించబడిన 14వ్యాసాలు ఉన్నవి. హాస్యాన్నిగూర్చి చర్చించే రచయితకు సహజంగా చమత్కారశీలియై, హాస్యకారియై, హాస్యాన్ని పండించే జిజ్ఞాస, మనస్తత్వం ఉండాలి. నిత్యానందరావు ఎంత సీరియస్ గా వ్యాసాలు రాస్తారో మిత్రులవద్ద, విద్యార్థులవద్ద చమత్కారభరితంగా నవ్విస్తూ సంభాషిస్తూ అంత సరదాగా గడుపుతారు.   వారిలో దాగి ఉన్న  ఈ హాస్యపార్శ్వమే హాసవిలాసం లోని వ్యాసాల రచనకు, రాజకీయభాగోతం పేరడీ కార్టూన్లకు, పేరడీ పై పరిశోధనకు ప్రేరేపించాయేమో! తెలుగువారి హాస్యం, హాస్య తత్వ విచారం అనే వ్యాసాలలో హాస్యాన్ని గూర్చిన చర్చ, కందుకూరి గురజాడ, చిలకమర్తి, పానుగంటి, ముణిమాణిక్యం,  శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి వంటి వారి సాహిత్యంలోని హాస్యాన్ని గూర్చి చర్చించారు. కవన శర్మ, శ్రీరమణల వంటి ఆధునికులను గూర్చి కూడా పేర్కొన్నారు. కవనశర్మ రచించిన వ్యంగ్య కవనాలుఅన్న కథా సంకలనం గురించి చెబుతూ “మనలో జీర్ణించుకుని పోయిన హిపోక్రసీని దగుల్బాజీ తనాలను వేలెత్తి చూపుతూ భుజాలు తడుముకునేలా చేస్తాయి ఈ కథలు” అంటారు. విశ్వనాథహాస్యం మీద ప్రణాళికాబద్ధంగా అధ్యాయవిభజనతో  రాసిన వ్యాసం నిత్యానందరావు విషయసేకరణ కోసం పడే తపన, ఓపిక, శ్రమశీలానికి నిదర్శనం.  విశ్వనాథసాహిత్యసాగరాన్ని ఈది ఎన్నెన్నో అపూర్వ హాస్య, చమత్కార రత్నాలను వెలుగులోకి తెచ్చి పాఠకులను, పండితులను ఆశ్చర్యానందమగ్నులను చేశారు.     

6. సృజనానందం:

నిత్యానందరావు సాహిత్యంలో పదును దేలుతున్న క్రమంలో అక్షరబద్ధం చేసిన అనేక లఘు రచనలు, అనుభవాలసమ్మేళనం ఈ సంపుటి. కృతిస్వీకృతి, జంబుమాలి, మార్గదర్శి వివేకానందుడు, వంశాంకురం వంటి నాటికలు, చమత్కారభరితమైన “చెవిలో పువ్వు” వంటి కథలు, సన్మాన పత్రాలు, రాజకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతికఅంశాలకు సంబంధించిన కొన్ని లేఖలు, నివేదికలు, పీఠికలు, సాహిత్య వ్యాసాలు, కళాశాల, పాఠశాలజీవితానికి సంబంధించిన కొన్ని వ్యాసాలు ఉన్నాయి.

7. ఆదర్శపథం:

భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర

ఈ గ్రంథాన్ని వందేమాతరం శతజయంతి ఉత్సవాల కానుకగా ప్రచురించారు. బంకించంద్రుని గురించి మునుపు ప్రసాద రాయకులపతి, దేవులపల్లి రామానుజరావు వంటి వారు రచనలు చేసినా తెలుగులో సమగ్రమైన విస్తృతమైన బహుముఖీనమైన పుస్తకం వెలుదండవారు రచించినదే. “నాకు విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన తో చాలా పేరు వచ్చిన మాట నిజమే, ఆ రచన వల్ల అవతలి వ్యక్తి పొందిన ప్రయోజనం, ఉపకారం రీత్యా వచ్చిందే తప్ప, నా ప్రతిభా సామర్థ్యాలకు, ఆలోచనల తీరుతెన్నలకు వచ్చిన పేరు కాదు, శ్రీనాథుని జీవిత పర్యంతం నైషధ కావ్య స్మరణం చేశాడు. అలాగే నా చిరకాల రచన బంకించంద్ర నా కృతుల్లో శిఖరప్రాయమైనది, సంతృప్తి దాయకమైంది. భాషా భావనల జోడు గుర్రాల మీద స్వారీ చేసినట్లైంది”. ఆ పుస్తకం ప్రాధాన్యం గురించి వారు రాసుకున్న మాటలు ఇవి. శ్రీ నాథునికి నైషధకావ్యం ఎంతటి గౌరవాన్ని, కీర్తిని కలిగించాయో వారికిని బంకించంద్ర కావ్యం అంతే కీర్తిని సముపార్జించాయి. ముదిగొండ శివప్రసాద్, ద్వానాశాస్త్రి, వకుళాభరణం శివరామకృష్ణ వంటి సాహితీ ఉద్దండులు ఈ పుస్తకంపై వివిధ పత్రికల్లో సుమారు 11 పైచిలుకు సమీక్షలు ప్రచురించారు. తెలుగులో సాహితీ సామాగ్రి అంతగా దొరకని మహాత్ముని చరిత్రను పాటక లోకంలోకి తీసుకురావడం అంత ఆషామాషి విషయం కాదు. బంకించంద్రుడు జన్మించేనాటికి  నాటి భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ “సాంఘిక ఆర్థిక రాజకీయ వైజ్ఞానికపరంగా వినూత్నకాంతులు ప్రసరింపజేస్తూ సంచలనభరితమైన కాలంలో బంకించంద్రుడు జన్మించారు” అంటారు. అట్లాంటి వాక్యం రాయాలంటే ఆనాటి కాలంలోకి ప్రయాణం చేసి, ఆ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటే తప్ప రాయలేరు. అలాంటి భావుకత వందేమాతర గీత వైశిష్ఠ్యాన్ని, బంకించంద్రుని దేశభక్తిని వర్ణించే సందర్భంలో ఉద్వేగపూరిత వాక్యాలు రాశారు. సార్ధకజీవుడు అన్న శీర్షికతో రెండవ అధ్యాయాన్ని ప్రారంభించి బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ పరిస్థితులు, సమకాలికులు, ఉద్యోగ జీవితం ఇత్యాది విషయాలు చెప్పారు. భారతదేశంలో మొదటి నవలాకారునిగా ఆయనను సప్రమాణంగా నిరూపించారు. ఆనందమఠం లాంటి లక్ష్యాత్మక నవలలను, కపాలకుండల లాంటి కాల్పనిక నవలలను, కవితలను, కథలను, హాస్య వ్యంగ్య రచనలను, ధార్మిక రచనలను కూలంకషంగా విశ్లేషించారు.  బంకించంద్ర చటర్జీ పైన వచ్చిన తెలుగు రచనలను, ఆయన సాహిత్య ప్రభావంతో వచ్చిన రచనలను,   ఇతర భాషల్లోని విషయాలను, అరుదైన ఛాయాచిత్రాలను, చేతిరాతను, వందేమాతరగీతం చుట్టూ అల్లుకొన్న చారిత్రక రాజకీయకోణాలను పలు ఆంగ్ల గ్రంథాలు, కన్నడ గ్రంథం నుండి సేకరించి సమగ్రపుస్తకం గా తీసుకువచ్చి కొత్తతరానికి అందించారు.

రాజనీతిజ్ఞుడు బూర్గుల రామకృష్ణారావు:

బంకించంద్రుని గురించి రాసిన పుస్తకం ఆనాటి వందేమాతరోద్యమ కాలం నాటి భారతదేశ సామాజిక పరిస్థితులను రాజకీయ వాతావరణాన్ని కళ్ళకు కడితే బూర్గుల రామకృష్ణారావు పైన రాసిన ఈ పుస్తకం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, సమైక్య ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులకు దర్పణం  పడతుంది. “ఈ పుస్తకం జీవిత చరిత్ర రచనల్లో  సాంప్రదాయ రచన పద్ధతికి విరుద్ధంగా ఆరంభం అవుతుంది” అని రాశారు. అన్నట్టుగానే ఈ పుస్తకం ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన పరిస్థితుల నుండి మొదలవుతుంది. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను, విద్యావ్యవస్థ స్థితిని చక్క పెట్టడానికి, ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమంలో విద్యాబోధన చేసే ఖాన్గీ పాఠశాలలను తెరిపించడానికి ఆంధ్ర మహాసభ ద్వారా బూర్గుల చేసిన కృషిని సమగ్రంగా వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు, నాటకీయ పరిణామాల మధ్య బూర్గుల ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన విధం, తదనంతర కాలంలో విశాలాంధ్ర ఏర్పాటు ఆ ఏర్పాటులో భాగంగా బూర్గుల తొలి సమిధగా తనను తాను అర్పించుకున్న విషయాలు ఎన్నింటినో చర్చించారు. ఆదర్శ ముఖ్యమంత్రిగా, విశాలాంధ్ర నిర్మాతగా, ప్రజల న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సాహిత్య బంధువుగా, విశిష్ట వ్యక్తిత్వ సంపన్నునిగా, వారి జీవితవిశేషాలను వ్యక్తిత్వాన్ని, రాజకీయనీతిజ్ఞతను, అకుంఠితదీక్షను స్ఫూర్తిప్రదంగా విశ్లేషించారు.   “రాజకీయవేత్తలు ఎందరో ఉంటారు. రాజకీయవేత్తల్లో దార్శనికులు తక్కువమంది, పాలన రహస్యాలు తెలిసిన దార్శనికుడు బూర్గుల” అన్న ఒక్క వాక్యంతో వారి చరిత్రను సార్ధకం చేశారు.

“విశాలాంధ్ర ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి  స్థానంలో ఉన్న బూర్గుల నిర్మమత్వంతో తాము చేయవలసిన పని తాము చేశారు. ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో ఆదర్శంతో ఆనాటి పెద్ద మనుషులు చేసిన ప్రయోగం స్వార్థ రాజకీయ నాయకుల వికృతచేష్టకు బలి అయిపోయింది. విద్య, ఉపాధి, సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలలో, వనరులు- అవకాశాల పంపిణీలో సమ భాగస్వామ్యం లేకుండా దగాపడడానికి రాజకీయ నాయకుల దూరదృష్టి లేమి, నిజాయితీలేమి, స్వార్థం కారణమే తప్ప ఆనాటి పెద్దల చిత్తశుద్ధి, ఆదర్శాలలో లోపం కాదు. అడ్డుగోడలు కూలిపోవచ్చు. కొత్త గోడలు మొలవవచ్చు. రాజ్యాల భౌగోళిక సరిహద్దులు ఎన్నోసార్లు మారుతుంటాయి. ప్రాంతాలు విడిపోవడం కలవడం- అనేది చారిత్రక పరిణామంలో భాగమే. ఈ విశ్లేషణాత్మక ప్రవృత్తి, విజ్ఞత సమకాలీన ఆవేశకావేశాలకు బలి కాకూడదు. మంచితనం, మనిషితనం ఎప్పటికీ వసివాడనివన్న సంగతి విస్మరించకూడదు” అన్న భావనతో నిత్యానందరావు గారు ఈ రచన చేశారు.

ఆటుపోట్ల కావేరి:

ఈ పుస్తకం ద్వారా వారు అనువాదకుడిగా మారారు. కావేరి చటోపాధ్యాయ అనే బెంగాలీ రచయిత్రి రచించిన “Peeping through my window”  ఆంగ్ల జీవిత చరిత్రకు తెలుగు రూపమే “ఆటుపోట్ల కావేరి”. ఆ పుస్తకాన్ని చదివి ఆమె జీవితంలోని విషాదానుభవాలకు హృదయం ద్రవించి,   తెలుగువారికి  పరిచయం చేశారు. అంతటితో ఆగలేదు.   కావేరి చటోపాధ్యాయ గారిని తన తోబుట్టువుగా భావించి హైదరాబాదుకు రప్పించి పుస్తకావిష్కరణ చేయించి ఇంట్లో పండుగలా ఘనసన్మానం చేయడం విశేషం. అందులో మాకందరికీ భాగస్వామ్యం కల్పించడం ఆనందదాయకం.

తెలుగు శాఖకు చేసిన సేవ:

నిత్యానందరావు రాసిన ఎన్నో వ్యాసాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, -తెలుగుశాఖకు సంబంధించినవాటిని ప్రత్యేకంగా వర్గీకరించుకోవచ్చు. తాను పని చేసిన మహిళాకళాశాల, నిజాంకళాశాల, ఆర్ట్స్ కాలేజ్   మూడింటిపట్ల మూడు వినూతన చారిత్రకవ్యాసాలు రాసి ఋణం తీర్చుకున్నానని నిత్యానందరావు సంతోషంగా చెప్తారు.   అందులో ఆర్ట్స్ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ సర్ సయ్యద్ రాస్ మసూద్, (ఆయన నియమించిన మొదటి తరం అధ్యాపకుల వివరాలు) ;   కోఠీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ అమీనాపోప్, నిజాం కళాశాల మొదటి సంస్కృతాంధ్ర అధ్యాపకులు రాయప్రోలు వెంకట సోమయాజులు, పాలనాదక్షుడైన విద్యావేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం  ఉపాధ్యక్షులు  ఎం.ఎస్ దొరై స్వామి జీవనవివరాలు –వారి వైశిష్ట్యం గూర్చి తొలిసారిగా అధికార పత్రాల ఆలంబనగా పరిశోధనాత్మకంగా రాసే అవకాశం భగవంతుడు నాకు ప్రసాదించాడంటారు నిత్యానందరావు..

బిరుదురాజు రామరాజుగారు ఒక వ్యాసంలో  “రాయప్రోలు వెంకట రామ సోమయాజులు అని నిజాంకళాశాలలో పనిచేశారు.  1947 నాటికే వారు లేరు. వారి గురించి చెప్పేవారెవ్వరూ ఇప్పుడు లేరు”– అని రాశారు.   వారు  గురించి నిత్యానందరావు సేకరించిన సమాచారం ఎంతో విలువైనది. పాఠక లోకానికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని వారు నిజాం రాష్ట్రంలో తొలి సంస్కృతాంధ్ర ఆచార్యునిగా పనిచేశారని,  1910 లోనే అంటే రాయప్రోలు సుబ్బారావు తెలుగుశాఖలో చేరక ముందే వారు  నిజాం కళాశాలలో చేరి ఉన్నారనీ, ఫస్లీ తేదీలతోఉన్న సమాచారాన్ని ఆంగ్లశకంలోకి మార్చి నిరూపించడమే కాకుండా, వారి రచనలను సైతం సేకరించి ఎవరయినా డాక్టరేట్ పరిశోధనకు పూనుకోవాలని ప్రబోధించారు.  1976లో కాకతీయ విశ్వవిద్యాలయం స్వయంప్రతిపత్తి పొందే వరకు అక్కడ తెలుగుశాఖకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారానే నియామకాలు జరిగాయి. కావున కాకతీయ విశ్వవిద్యాలయం తొలితరం ఆచార్యుల నుండి 2017 వరకు ఉస్మానియా తెలుగుశాఖకు సేవలందించిన 62 మంది ఆచార్యుల సమగ్ర సమాచారాన్ని వారు అందించారు. 1919 తెలుగు శాఖ ఆవిర్భావ వసంతం నుండి ఆ శాఖలో జరిగిన అభివృద్ధిని, అధ్యక్షులుగా సేవలందించిన పండితుల సాహిత్య కృషిని సమగ్రంగా అక్షరబద్ధం చేశారు. తెలుగుశాఖ మొదటి విద్యార్థి పల్లా దుర్గయ్య, రెండవ విద్యార్థి ఈటూరి లక్ష్మణరావు,  తొలి విద్యార్థిని ఇల్లిందల సుజాత, తొలి దివ్యాంగ పట్టభద్రుడు డి.వి కృష్ణారావు, మూడవ విద్యార్థి కే గోపాలకృష్ణారావు, బి.రామరాజు, ఎం.కులశేఖరరావు, సి.నారాయణరెడ్డి   గారి సమాచారాన్ని సేకరించారు. రెండేళ్ళే తెలుగుశాఖలో పని చేసిన వెల్లలూరి వెంకటరాఘవశర్మ, కుమారి ఇందిరావందనం గార్ల వివరాలు నిత్యానందరావు తొలిసారిగా బయటపెట్టారు.  ఎన్నో వ్యయప్రయాసలకు నోర్చి  ఎం.ఎ తెలుగు శాఖ విద్యార్థుల పూర్తి సమాచారాన్ని, వారు ఉత్తీర్ణులైన సంవత్సరాలను, మార్కులను సైతం సేకరించారు.

 ఆధునిక కవిత్వ సంబంధమైన మొదటిరచన డా. పాటిబండ మాధవ శర్మగారి  “ఆధునికాంధ్ర భావ కవిత్వం”. (2012, పొ.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం.), జనగామజిల్లా బచ్చన్నపేటకు చెందిన చెన్నమాధవుని వెంకటరామరాజ కవి రచించిన “రామకృష్ణ యుధిష్టర చరితమ్”  (మూడర్థాల సంస్కృత చంపూ కావ్యం 2020, తెలంగాణ సాహిత్య అకాడమీ) లను ప్రప్రథమంగావెలుగు లోకి తెచ్చారు   తూము రామదాస కవి రచించిన నిఘంటుకావ్యం “ఆంధ్ర పద నిధానము”  (2019, తెలంగాణ సాహిత్య అకాడమీ)నకు సంపాదకత్వం వహించారు.  సిద్ధాంత గ్రంథాల సార సంగ్రహాల సంకలనం “పరిశోధన వ్యాసమంజరి” రెండు సంపుటాలను వీరి సంపాదకత్వంలో బ్రౌన్ అకాడమీ (2009,2010) వెలువరించింది.  

ఓయూ నూరేళ్ల పండగ చేసుకున్న సందర్భంలో వచ్చిన “శతవాసంతిక” అను సంచిక వెలువడడంలో విశేషమైన కృషి చేశారు. తెలుగు శాఖకు సంబంధించిన మరింత సమాచారాన్ని శతవాసంతికలో పొందుపరిచారు. ఇటువంటి కృషి ఇప్పటివరకు ఏ తెలుగు శాఖలోనూ, మరే ఇతరశాఖల్లోనూ  జరగ లేదు. ఉస్మానియా, ఆంధ్ర , తెలుగు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు పాఠ్యభాగరచయితగా వ్యవహరించారు.

పురస్కారాలు:

ఎం ఏ తెలుగులో సర్వోత్తమ స్థానం పొందినందుకు గురజాడ అప్పారావు స్వర్ణ పతక పురస్కారం-1985  .  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంచే ఉత్తమ సాహితీవేత్త పురస్కారం-2017

బోయి భీమన్న సాహితీ నిధివారి  భీమన్నపురస్కారం–2019; తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య విమర్శలో ధర్మనిధి పురస్కారం(2007);- ప్రతిభా పురస్కారం -2021; సాహితీ పురస్కారం-2023 . లభించాయి. ఇంకా

 తెలంగాణ సారస్వత పరిషత్ వారి సాహిత్య విమర్శ రంగంలో ఉత్తమ గ్రంథ పురస్కారం -2022; ఆచార్య జి చెన్నకేశవరెడ్డి పురస్కారం–2022;  పీచరసునీతారావు స్మారకపురస్కారం- 2023; మొదలైనవి నిత్యానందరావును వరించాయి.  మరింత ఉన్నతమైన, జాతీయస్థాయి పురస్కారాలకు అన్నవిధాలా అర్హులు మాగురువుగారు.

ముగింపు:

ఆచార్య వెలుదండ నిత్యానందరావు  “భగవంతుడు ఈ జన్మకు రాతపనే నా నొసట రాశా”డని బలంగా విశ్వసించి సుమారు 45 సంవత్సరాలుగా సాహిత్యమే జీవితంగా, జీవితమే సాహిత్యంగా నడుస్తున్నవారు. ఏదైనా రాయడానికి పూనుకుంటే ఆ పనికి అలాగే అతుక్కుపోతారు, వారి దృష్టి అంతా అది పూర్తయ్యే వరకు దాని చుట్టే తిరుగుతుంది. అగ్రశ్రేణి ఆచార్యుల వద్ద శిష్యునిగా, సమకాలికులలో ఉన్నతంగా, ఎందరో విద్యార్థులకు ప్రియమైన గురువుగా మెలిగారు. ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో అవసరమైన చోట ఔచితీమంతంగా ఎంతటి వారినైనా మరొక్కసారి పరిశీలించండి అని సున్నితంగా చురకలు అంటించారే తప్ప, ఏనాడు వ్యక్తిగతంగా విమర్శించినది లేదు. విషయార్థియై వచ్చిన ఏ విద్యార్థిని వట్టి చేతులతో పంపలేదు, భోజనపు వేళ వచ్చినవాడు ఆకలితో వెళ్లలేదు. పలానా పుస్తకం అని వెళితే, అది వారి వద్ద లేకుంటే, దానికి సంబంధించి ఎక్కడ దొరుకుతుంది, ఎవరి వద్ద దొరుకుతుంది, ఎలా సేకరించాలో పూర్తి సమాచారాన్ని ఇచ్చి పంపిస్తారు. ఏది రాసినా, ఏది చదివినా ఓ కొత్త కోణంలో చూడడం వారి అలవాటు. చదివిన, చూసిన విషయాన్ని అలాగే గుర్తుంచుకొనే ఏకసంథాగ్రాహిత్వం, అలసట లేకుండా భిన్నభిన్న అంశాలమీద రచనలు చేసే ఉత్సాహశీలం,  రాసిన ప్రతి అక్షరాన్ని భద్రపరచుకునే తత్వం అన్నీ కలిసి సప్తగిరులలాగా సప్త బృహత్సంపుటాల ప్రచురణతో నిత్యానందరావుకు సాహిత్యలోకంలో శాశ్వతస్థానం సముపార్జించి పెట్టాయి.    

ఏనాడూ వ్యక్తిగత గుర్తింపు హంగులు ఆర్భాటాల జోలికి పోలేదు. అందరిలో ఒకరిగా నవ్వుతూ, నవ్విస్తూ కలిసిపోతారు. కుట్రకు, కూహకాలకు, ముఠా రాజకీయాలకు, ఆమడ దూరంలో ఉన్నారు. చేయగలిగితే మేలు చేయాలి  లేకపోతే నోరు మూసికొని కూర్చోవాలంటారు. చైతన్యమహాప్రభు సాంప్రదాయం చేత ప్రభావితుడైన వారి తండ్రి తన కుమారునకు “నిత్యానందరావు” అని పేరు పెట్టారు. ఆ మహానుభావుడు ఏమి ఆశించి ఆ పేరు పెట్టారోగాని, ఎప్పుడూ నిష్కల్మషంగా, చిరునవ్వు నలంకరించుకొని కనిపిస్తారు. తండ్రిగారి చివరి అంకంలో వారి సేవ చేసి పునీతులయ్యారు. గృహస్థ ధర్మాన్ని, అటు ఉద్యోగ ధర్మాన్ని సమానంగా పోషించారు.

“అహంకార ద్వేషాలు, ఈర్ష్య అసూయలు స్వాభావిక ప్రకృతులే అయినా వాటి ప్రవాహంలో కొట్టుకొని పోయే స్థితి రాలేదు. ప్రశాంతంగా హాయిగా సంతృప్తిగా జీవితాన్ని గడిపాను. సంతృప్తిని మించిన సంపద మరేముంటుంది” అని జీవిత పరమార్ధాన్ని దర్శించిన సార్ధక జీవి.

“ ఇంత సాహిత్య వ్యాసంగాన్ని నేను జరిపానని ఆనందంగా చెప్పుకోవడానికి మూలం నా నిరంతర సాధన ఒకటైతే, సజ్జనులతో సద్గురువులతో నా సహవాసం మరో ప్రధాన అంశం.  ఓ పది, ఇరవై దొరకకపోయినా అన్నీ భద్రంగా ఉండడం మరో ముఖ్య విశేషం. నా ఉన్నత పాఠశాల, నా ప్రాచ్య కళాశాల అధ్యాపకుల గురించి రాయడంలో, నా విశ్వవిద్యాలయ అధ్యాపకుల గురించి (అక్షరమాల రెండవ సంపుటంలో) రాయడంలో నాకు ఉన్నది  వినయం, కృతజ్ఞతాభావం, అభిమానం, ఆర్ద్రత. నా జీవితాన్ని ఇంతవరకు ముందుకు నడిపించినవి ఈ నాలుగు అంశాలే……… ఎందరెందరో ఎన్నో విధాలుగా తమ సహాయ సహకారాలను అందించి తోడ్పడ్డారు. ఇది ఎవరి కోసమో, దేనికోసమో, ఏదో ఆశించి కాక, నాకోసం, నా ఆనందం కోసం ప్రచురిస్తున్నది ‘నాలోన గల వెల్గు నా పరిసరముల వారి రూపమున కన్పట్టుగాక’ అన్న ఎక్కిరాల కృష్ణమాచార్యుల వాక్కులకు అనుగుణంగా ఒక చారిత్రకమైన బాధ్యతగా భావించి నిర్వహిస్తున్నది. ఉపదేశాలు, బోధలు చేయడం కోసం కాదు. పుస్తక పఠనం పూర్తిగా పోయింది. తెలుగు భాష మాట్లాడడమే తప్ప రాయలేని తరం తయారయింది. వైయక్తికమైన క్షణికానందాల కోసం వాట్సాప్ లో తలదూర్చి బతుకుతున్న ఉష్ట్ర పక్షుల సంఖ్య  పెరిగిపోతుంది. సాధికారికంగా ప్రసంగించే వక్తలు, రాసే రచయితలు తగ్గుతున్నారు. క్రమేపి పాలన విద్యాది వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఇవన్నీ నిజమే కావచ్చు గాక! సమాజానికి నా రచనలు హితకరమైనవి, ప్రామాణికమైనవి అని నమ్ముతున్నాను. అందుకే సాహసంతో, శ్రమతో, ఆర్థికభారాన్ని లెక్కచేయకుండా నూతనతరం మీద విశ్వాసంతో సంపుటాలు తెస్తున్నాను….. ఇన్నాళ్లు “ప్రవృత్తి” మార్గంలో రచనావ్యసనిగా జీవించాను. చాలా కొత్త విషయాలు చెప్పాను. ఎన్నెన్నో సేకరించాను -అని ప్రశంసలు పొందాను. ఇకముందు “నివృత్తి” మార్గంలో ముందుకు సాగుతాను.  ప్రదర్శన కళ అయిన రచన కన్నా దర్శన కళ అయిన అంతర్దృష్టి కి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాను.

అధ్యాపకునిగా, పరిశోధకునిగా, పర్యవేక్షకునిగా, రచయితగా, గృహస్థుగా, లౌకికమైన నా పాత్ర సక్రమంగా నిర్వహించానన్న సంతృప్తి ఉంది. ఇది చాలు అందరికీ మరోసారి వినయంగా, ప్రేమ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను”  ఆరవసంపుటమైన సృజనానందం పీఠిక ముగిస్తూ అంటారు.  ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి జీవనసారాన్ని, దృక్పథాన్ని ఈ మాటలు వెల్లడిస్తున్నాయనడం నిర్వివాదాంశం.

నిత్యానందరావుగారివద్ద నేను నేరుగా చదువుకోకపోయినా వారు నాకు గురువులే.  నా పరిశోధనాంశ విషయమై వారిని మొదటిసారి కలిశాను. అనుకోకుండా వారి ఇంటికి దగ్గరలోనే నేను ఉండటం వల్ల వారితో సాన్నిహిత్యం పెరిగింది.  నా పరిశోధనకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను, ఇతర సాహిత్యసమాచారాన్ని అందించి ప్రోత్సహిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన మాలాంటి  శిష్యులను  ఇంటికి  ఆహ్వానించి సత్కరించి ఆశీర్వదించారు.  జీవితంలో నేను మర్చిపోలేని అనుభూతి. ఇది నాకు కలిగిన తొలి సత్కారం. తండ్రి బిడ్డల మీద చూపే మమకారాన్ని మా మీద కురిపిస్తారు. వారితో మాట్లాడుతున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు  వివిధ సాహిత్య అంశాలను బోధిస్తూనే ఉంటారు. సరదాగా నవ్విస్తూనే ఉంటారు. ఛలోక్తులు విసురుతారు. పదాలతో ఆడుకుంటారు. అవి కూడా సాహిత్య సంబంధం కావడం విశేషం.  విస్తార సాహిత్య కృషి సల్పిన ఆచార్య వెలుదండ నిత్యానందరావు గురించి ఈ వ్యాసం రాసే అవకాశాన్ని నాకు ప్రసాదించిన మా గురువుగారు తెలుగు శాఖ అద్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ  ముగిస్తున్నాను.

-****-

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మహా కవి జాషువా వర్ధంతిసందర్భంగా స్మృతి గీతాలు

by Dr. Boddula Laxmaiah July 26, 2024
written by Dr. Boddula Laxmaiah

1జాతి గౌరవమును పెంచి ఖ్యాతి గనిన
వారి స్మృతులను స్తుతులను వ్రాయు కతన
భావి తరముల కందించ బడియె నవ్వి
జాషువా! వారు నీవు శాశ్వతులు సుమ్మి!

2 పుట్టి పెరిగిన వినుకొండ పురము నీకు
నుగ్గు పాలతో పోసిన యూసు లన్ని
తీపి చేదులు తీరైన జ్ఞాపకములు
కృతులుగా జేసితివి లోక హితుడ వీవు

3 గొల్ల సుద్దుల చేత నీ యుల్ల మింత
పులకరింపగా జేసిన పుణ్య మూర్తి
తండ్రి వీరయ్య పలుకుల ధాటి తోడ
పాడితివి శివాజీ గ్రంథ పద్యములను

4 ఛాందసుల యీయడింపులే సరస కృతులు
చేయ దగుటకు నీ కింత చేవ నిచ్చె
వెక్కిరించిన వారింత స్రుక్కి స్రుక్కి
వారె వాహ్ సెహ బాషని నారు నాడు

5 అతిశయోక్తులు గుప్పించి యసలు రంగు
కప్పి పిచ్చగా జూచిన కవివి గావు
కుండ బద్దలు గొట్టుచు గుట్టు నింత
విప్పి చూపి నాడవు గదా విబుధ వర్య!

6 పంచముడు కవి యని సభా ప్రాంగణమును
వదలి పాఱిన పాఱుల యెద లొకింత
కరగి పోయెడు రీతి నీ కలము నడిచె
పరుష మెఱుగని సంపూర్ణ పండితుడవు

7 ఖండ కావ్యాల తోడ నఖండ కీర్తి
నింపితివి జాషువా జాతి కింపు మీర
కవుల లోన దిగ్గజ మని; నవ యుగ కవి
చక్ర వర్తి యన్ బిరుదును సార్థకములు

8 ప్రతిభ గని నంత మది నింత పరవశించె
చెళ్ళ పిళ్ళ వేంకన తన చెలిమి పెంచె
గండ పెండేరమును నీదు కాల నుంచె
కవి కులంబున నుభయుల ఖ్యాతి మించె

9 కందుకూరి సుకవి నీదు కవిత జూచి
మెచ్చి; శారద నిన్నింత మెచ్చె;కులము
పిచ్చి వారలు నిను మది మెచ్చ లేరు
సాగు మని భుజమును తట్టి సాగ జేసె

10 ప్రేమతో ‘ కవి కోకిల’ బిరుద మిచ్చి
కన్న విను కొండ తన దైన ఖ్యాతి పెంచె
నిండు వెన్నెల బ్రతుకులో పండె ననుచు
వింటి గెలుపుగా దాని గై కొంటి వపుడు

11 చిలకమర్తి లక్ష్మీ నరసింహ సుకవి
మెప్పు కొండంత బలముగా నొప్పు కతన
నా’మదాలస’ నాటక మల్లి నావు
ప్రతిభ గని ప్రోత్సహించని వారు గలరె

12 సత్యవోలు గున్నేశ్వర సరస నీవు
చేరుటయె పెద్ద మలుపుగా చెప్ప దగును
వారి ప్రోత్సాహమున నీవు వ్రాసి నావు
నాడు రుక్మిణీ కల్యాణ నాటకమును

13 కరుణ రస పూర్ణ మైన నీ కావ్యములకు
కను చెమర్చని మనుజులు కాన రారు
నాటి భవభూతి రీతి యీ నాడు నీవె
కరుణ రస పూర్ణుడవు గాన ఖ్యాతి మిగిలె

14 పంచమునకు ప్రతీకగా పక్షులందు
గణపతి కెక్కని మ్రొక్కని గబ్బిలమును
దూతగా నెంచి నీ లోని దుఃఖ మంత
వ్రాసి పంపితి కైలాస వాసు డరయ

15 పంచముడ నాదు పాదము పడని గుడికి
పులుగు దొరసాని నీవు పోగల వటంచు
పురములను పూర్వ వైభ వమ్ముల నుతింప
తేట పడె సత్కవీ!నీదు దేశ భక్తి

16 భావ కవితా ప్రవాహాన బడిన కవులు
వ్రాసి యున్నట్టి మార్గాన వ్రాయ కున్న
ప్రకృతి కవితకు’ ఫిర దౌసి’ పట్టు గొమ్మ
యగుట నీ కాంధ్ర దేశాన యశము గలిగె

17 ఇరువురు వియోగ దుఃఖాబ్ది నీది రేని
వారి యూహ లొకే రీతి వరలి నటుల
పిచ్చి వాడైన శ్వపచుని మచ్చు బొమ్మ
పాదుషా మెప్పు కెంతయు పాత్ర మయ్యె

18 షాజహాన్ముప్ప దారేండ్లు సతిని తలచి
యేక పత్నీ వమ్రతుండై యీడ్చె బ్రతుకు
తాజ మహ లొక చిహ్నమై తనరు చుండె
ప్రేమ సామ్రాజ్యమున కిదే పెద్ద పీట

19. ప్రణయ తత్వాని కిది మూగ భాష యనగ
సృష్టి గల దంపతుల కెల్ల స్పష్ట మగును
తాజ మహలు పోయినను ముంటాజ మహలు
ఖిలము గాకుండా నీ కృతి వెలుగు చుండు

20 అరయ రుక్మిణీ కల్యాణ మందు నాటి
దేశ కల్యాణ కాంక్షయే తేట మయ్యె
నార్త యైన రుక్మిణి’మహాత్మా!’ యటన్న
పిలుపు బాపును రమ్మని పిలిచి నటులె

21 భరత వాక్యము లోన విస్పష్ట మయ్యె
దేశ మాత యా రుక్మిణీ దేవి భంగి
సుఖము లందెడు ఘడియలు చూత మనెడు
సుకవి యాకాంక్ష పఠితల చూర గొనియె

22 క్రీస్తు చరితము నొక పద్య కృతిగ జేసి
కేంద్ర సాహితీ బహుమతి నంది; దాని
నొసగుతివి కొంత పేదల వసనములకు
మూగ జీవుల యాహారమునకు కొంత

23 కాళిదాస త్రయంబును కరుణ తోడ
చెప్పె జూపుడి హన్మయ్య చిన్న నాడె
యట్టి విద్యతో నవధాన మందు గట్టి
పట్టు సాధించి నా వింత దిట్ట వగుట

24 జంట  కవులుగా పిచ్చయ్య శాస్త్రి పేరు
కలువ కుండె భావాలును కలువ కుండె
పిచ్చ జాష్వాలు’ జాషువా పిచ్చ లనుచు
పలుకు చుండుట పరిహాస పాత్ర మయ్యె

25 పళ్ళెరము నుండి నేలపై బడిన వాని
నపరి శుభ్ర పదార్థంబు లనక తినగ
తల్లి లింగాంబ వారింప దయ్యె నకట!
పేదరికము పెను భూతమై పీల్చు కతన


26 రెడ్డి సాని విషాద చరిత్ర నంత
స్వప్న కథ’ లోన నింపి పరోపకార
మునకె తను వెల్ల ధార వోసిన దటంచు
చిన్న నాటి నీ బ్రతుకును చిలికి నావు

27 ఆదు కొన్నావు ఘోర ప్రమాద మందు
పరమ ధర్మ మూర్తి యటంచు పాంథు నొకని
‘లోక బాంధవు ‘ డనుచు చిత్రీకరించి
సాటి వారి గావు డటంచు చాటి నావు

28 అంట రాని తనంబన్న  కొంటె జబ్బు
పుట్టు దారిద్రయమునకు తో బుట్టు వగుట
మాలెత’అనాథ’దయనీయ మైన గాథ
విన్న కన్నీరు కార్చక యున్నె జగము

29. పంచముడు విశేషణముగ నుంచు టేల?
జాషువను నను కవి యన జాల రేల?
కలము నకు కుల భేదము కలుగు టేల?
యనుచు స్రుక్కుచు ప్రశ్నించు వను దినంబు

30 దుర్భర దరిద్ర మున్నను నిర్భయముగ
చెప్పితివి యథార్థము కను విప్పు గలుగ
కవి కలము నడ్డు మొన గాడు కాన రాడు
నాడు నేడును మరి యొక నాడు చూడ

31 నలువ దారేండ్లు తన వెంట నడచి నడచి
కష్ట నష్టాల నైన తా నిష్ట పడుచు
పంచు కొన్నది తన ప్రేమ పంచి మించె
‘మేరి’ గృహిణియే జూషువా కీర్తి గృహము

32 కర్మమున ద్వితీయ యొకింత కలుగు ననుచు
సూత్ర మొక్కటి చిన్నయ్య సూరి వ్రాసె
విమల నీకు ద్వితీయ యై విసుగు లేక
పొంచి సేవించె వ్యాధి గ్రసించి నపుడు

33 తెలుగు భాషలో భారతి తొలి దినాల
అచ్చు పడగ నీ కవితలు నచ్చు పడియె
నదియె సాహితీ కృషికి దోహదము జేసె
‘భారతి’ యె నీదు పాలిటి భారతి గద

34 హిందువుల గూర్చి నట్టి సాహిత్య మింత
చదివి వ్రాయుటచే కిరస్తాను లపుడు
ఫాదరిగ నీడ దీసిరి బ్రతుక కుండ
నిన్ను వెలి వేసినను తండ్రి మిన్న కుండె

35 మాల జాతి నింత మానవ జాతిగా
చూడ జాల నట్టి సూరి జనుల
కనులు విప్పు నటుల కవితల నల్లిన
జాషువాకు నుతులు జాలు వారె

July 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

వాస్తవిక చిత్రణల్లో రచన చేయగలగాలి

by Aruna Dhulipala July 25, 2024
written by Aruna Dhulipala

– బి.ఎస్. రాములు

ప్రసిద్ధ కథకులు, నవలాకారులు, సాహిత్య విమర్శకులు, సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు గారి 75 వ జన్మదిన వజ్రోత్సవ సందర్భంగా ‘మయూఖ’ ప్రతినిధి బి.ఎస్.రాములుగారితో ప్రత్యేక ముఖాముఖి

నమస్కారం సార్!

1. సార్ ! మీ గురించి ఎన్నో రచనలు వ్యాసాలు , పరిశోధనలు వెలువడ్డాయి.
1998 ఆగస్టులో యాభయ్యవ జన్మదిన స్వర్ణోత్సవం సందర్భంగా “ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త బి ఎస్ రాములు” అనే సావనీర్ ను ఆహ్వాన సంఘం వెలువరించి 25 ఏళ్లయింది. ఈ 25 ఏళ్లలో మరెన్నో అనుభవాలు సంతరించుకున్నారు. ఎన్నో రచనలు చేసారు. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక భూమికలు అందించారు. తెలంగాణ తల్లి రూపకల్పన చేశారు. 2003 నుండి ఉస్మానియా యూనివర్సిటీ పక్కన విశాల సాహిత్య అకాడెమీ కార్యాలయం నిర్వహించారు. ఒక రచయిత, ఇలా తెలంగాణ ఉద్యమానికి, రచయితలకు , ఉద్యమ కారులకు ఒక కేంద్రంగా , థింక్ టాంకుగా, ప్రచురణల కేంద్రంగా వందలాది ఉద్యమ కారులకు అడ్డాగా నిర్వహించారు. 
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 2007 లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాలు  రూపొందించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఒకసారి, గూడ అంజయ్య, పాశం యాదగిరి, గద్దర్ తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యతో ఒకసారి, కెసిఆర్ టిఆర్ఎస్ తో మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం వెనక మీరే వ్యూహ కర్తగా నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ప్రతి నెలా ఒక పుస్తకం ప్రచురిస్తానని ప్రకటించి  ఆ పుస్తకాలను ఉస్మానియా, కాకతీయ విశ్వ విద్యాలయాల్లో పంచారు. టిఆర్ ఎస్. తెలంగాణ భవన్ తో పాటు ప్రతి సభలో పుస్తకాలు, కరపత్రాలు పంచడం ద్వారా విశేష కృషి చేసారు. అదే సమయంలో  అంతకన్నా ముందు 1992నుండి దరకమే ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల గొంతుకగా సిద్ధాంతకర్తగా  చేస్తున్న కృషిని అంతే ప్రాధాన్యతతో కొనసాగించారు. ఎన్నో రచనలు  వెలువరించారు. ప్రసంగాలు చేసారు.  మరోవైపు రచయితగా తెలంగాణ ఉద్యమం గురించి బీసీ ఎస్సీ ఎస్టీల జీవితం సంస్కృతి గురించి కథలు నవలలు రాసారు.  కథా రచనకు కథకుడి పాఠాలు, స్వాతంత్య్రానంతరం 60 ఏళ్ల తాత్విక, సామాజిక పరిణామాలు వివరిస్తూ యువ రచయితలకు మార్గనిర్దేశం చేసారు.
            1990 లో స్థాపించిన విశాల సాహితి అకాడెమీ ద్వారా 190 పుస్తకాలు ప్రచురించారు. అనేక సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేశారు. వందలాది రచయితలకు విశాలసాహితి పురస్కారాలను అందించారు. డా. సినారె, దాశరథి, ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలకపల్లి రవి, ఎస్వీ సత్యనారాయణ , రవ్వా శ్రీహరి, ఆచార్య కె. జయశంకర్ తదితరులు చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు. కథా వర్క్ షాపులు నిర్వహించారు.
          1996లో ‘ప్రవహించేపాట -ఆంధ్రప్రదేశ్ దళిత పాటలు’ అనే సంకలనం ప్రచురించారు. 2004 లో విశాల సాహితి బీసీ ఎస్సీ ఎస్టీల పాటలు, సామాజిక చైతన్య పాటలు, సంకలనాలు వెలువరించారు. 1997 నుండి కరీంనగర్ జిల్లా కథలు నాలుగు సంపుటాలు వెలువరించి 2003లో ‘భారతీయ సాహిత్యం తెలుగు కథలు’ అనే గొప్ప సంకలనాన్ని ప్రచురించారు.
       తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ తల్లి రూప కల్పన తోపాటు, డబుల్ బెడ్ రూం పథకం, గురుకుల పాఠశాలల రూపకల్పనలో క్రియాశీల పాత్ర నిర్వహించారు. కుటుంబాన్ని కూడా  తీర్చిదిద్దారు.  నలుగురు పిల్లలు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.
        తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక బీసీ కమిషన్ తొలి చైర్మన్ గా చరిత్ర సృష్టించారు. ఇన్ని పనులు ఏకకాలంలో ఎలా చేయగలిగారు? అసలు మీ సామాజిక జీవితం, రచనా జీవితం ఎలా ప్రారంభం అయిందో యువతరానికి తెలపాలని కోరుతున్నాను.

బి ఎస్ రాములు:   మా చిన్నప్పుడు అమ్మ  అనేక కథలు చెప్పేది. నిద్ర పోవడానికి, ఆకలి మరిచి పోవడానికి కథలు చెప్పేది. జానపద కళాకారులు శారదకాండ్రు, బుర్ర కథ వాళ్లు ఇంటింటికి తిరిగి కథలు చెప్పేవారు. అలా చిన్నప్పటినుండి కథలంటే చాలా ఇష్టం. అమ్మ చెప్పిన కథలను నాకు తోచినట్టు మరికొంత కల్పించి నా బాల్య స్నేహితులకు చెప్పేవాడిని. అలా కథలు వినడం, కథలు చెప్పడం ఏకకాలంలో ప్రారంభమైంది.

మా సామాజిక జీవితంతో పాఠశాల జీవితంతో  మొదలైంది. మా కాలంలో మా పాఠశాల జీవితం ఒక సోషలిస్టు సమాజ నిర్మాణంలో భాగంగా సాగింది. అందరం ప్రభుత్వం పాఠశాలలోనే చదువుకునే వాళ్లు. ఎవరు బాగా మార్కులు తెచ్చుకుంటారో వారికే గౌరవం. కులాలు, ధనవంతులు, తహసీల్దార్ కొడుకు అందరం, అన్ని కులాలవారు, ప్రభుత్వోద్యోగులు, ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు కునే వాళ్లం సమానమే. ఎవరు బాగా మార్కులు తెచ్చుకుంటారో, ఎవరు బాగా ఆటలు ఆడతారో వాళ్లకు గౌరవం. అది తొలి సోషలిస్టు సమాజ నిర్మాణం. మా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ముద్దు రామకిష్టయ్యగారు ప్రపంచ దేశాలు తిరిగి చదువుకున్న అనుభవంతో నూతన పద్ధతులలో మా జగిత్యాల పాఠశాల విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో మహోన్నత పాత్ర నిర్వహించారు. ఆ కాలంలో అనగా 1960 లో మా మల్టీ పర్పస్ హైస్కూలులో 2 వేల మంది విద్యార్థులుండే వారు. తెలంగాణలోనే అత్యధిక విద్యార్థులున్న పాఠశాల. శ్రమపట్ల గౌరవం పెంచడానికి స్వయంగా సంపాదించుకోవడం నేర్పడానికి  స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టిస్తూ, కంకర కొట్టి సంపాదించడానికి ఏర్పాటు చేశారు. కొత్త కొత్త ఆటలు రూపొందించారు. ప్రతిసంవత్సరం విద్యార్థులకు ఆలిండియా టూర్ విజ్ఞాన యాత్రలు నిర్వహించారు. ఆయన జీవితాన్ని, జీతాన్ని విద్యార్థుల కోసమే ఖర్చు పెట్టేవారు. అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో మా చదువులు, వ్యక్తి వికాసం సాగినాయి. పాఠశాల జీవితమే మా తొలి సామాజిక జీవితం.

2.  మీ జననం, బాల్యం గురించి చెప్పండి.

జ :-  నేను 23 ఆగస్ట్, 1949 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో చేనేత కుటుంబంలో జన్మించాను. మా నాన్న మిట్టపల్లి నారాయణ, మా అమ్మ బేతి లక్ష్మిరాజు. ఆ కాలంలో మేము పేదలం కాము. మా నాన్న చేనేత కార్మికుడు. బొంబాయిలో మిల్లు కార్మికుడుగా పనిచేశారు. కుటుంబాన్ని తీసుకుపోలేక జగిత్యాలకు వచ్చారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, ఆహారం పడక నాన్నకు హెర్నియా వచ్చింది. అప్పుడు వైద్య సదుపాయాలు లేవు.  1955 లో మా నాన్న చనిపోయే నాటికి నాకు ఆరేళ్ళ వయస్సు. మా తమ్ముడు పాలు కూడా మరవలేదు. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను నడిపోన్ని.
మా అమ్మ బీడీలు చేసి మమ్మల్ని పెంచి పోషించింది. మా తాతయ్యకు మా నాన్న మేనల్లుడు. మా చుట్టూ మా మేనమామ, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య ఉండడం వల్ల మా అమ్మకు ఒంటరితనం తెలియదు. ఆరోజుల్లో పిల్లలను కొడితేనే చదువు వస్తుందనే దుర్భావన ఉండేది. మా అన్న దెబ్బల బాధ తట్టుకోలేక చదువు మానేసిండు. మా అమ్మ కిరాణా షాపులో జీతం ఉంచింది. తొమ్మిదేండ్ల వయసు పిల్లవాడు కావడంవల్ల షాపులో ఉండలేక పోయాడు. ఇంట్లో అందరూ తిడుతుంటే, కొడుతుంటే దేవుని కోసం ముడుపు కట్టిన గురిగి పగులగొట్టి ఆ డబ్బులతో బొంబాయి పారిపోయాడు. మా ప్రాంతం నుండి చాలామంది బొంబాయికి వెళ్ళి పనిచేసేవాళ్ళు.

3. ఇంట్లో అలాంటి పరిస్థితులు ఉండగా మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది?

జ :- నేను చిన్నప్పటి నుండీ చదువుపట్ల ఆసక్తి కలిగి ఉండేవాడిని. మా అన్న రాజ నర్సయ్య ఉపాధ్యాయుల పట్ల ఉన్న భయంతో నన్ను కూడా బడికి వెళ్ళొద్దనేవాడు. నేను బాలశిక్ష సాతాని అయ్యోరు పంతులు దగ్గర చదువుకున్నాను. ప్రాథమిక విద్య మర్కజి ప్రైమరీ స్కూల్, జగిత్యాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాను. దాన్ని సెంట్రల్ ప్రైమరీ స్కూల్ అంటారు. తరువాత మల్టీ పర్పస్ హైస్కూల్ లో 6వ తరగతులు చేరాను. ఆ పాఠశాలలో 12వ తరగతి వరకు ఉండేది. 6వ తరగతి నుండి మల్టీపర్పస్ హైస్కూల్ లో చదివాను. 1967 మార్చిలో 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ప్రథమశ్రేణిలో పాసయ్యాను. 9వ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినవారిని 10వ తరగతి ఆప్షనల్స్ లో ఎమ్ పి సి, బి పి సి గ్రూపులో చేర్చేవారు. తక్కువ మార్కులు వచ్చినవారిని ఆర్ట్స్ గ్రూపులో పెట్టేవారు. నేను ల్యాబ్ ఫీజు 15 రూపాయలు కట్టలేదు. అమ్మనడిగితే చదువు బంద్ చేయుమన్నది. దాంతో సిఇసి తీసుకున్నాను. 7 సంవత్సరాల కాలంలో నేనొక్కడినే ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను.

4. మీ ఉద్యోగజీవితం ఎలా ప్రారంభమైంది?

జ :- అప్పటి రోజుల్లో ఫస్ట్ క్లాస్ లో పాసయిన వాళ్ళకు. పోస్టాఫీసులో ఉద్యోగం వచ్చేది. అందుకని డిగ్రీ చేయలేదు. నాకున్న మార్కులను బట్టి ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో జగిత్యాలలో టీచర్ ట్రైనింగ్ ఉన్నప్పటికీ జాయిన్ కాలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో టీచర్లకు 96 రూపాయల జీతం ఉంటే పోస్ట్ ఆఫీసులో 240 రూపాయలు ఉండేది. పోస్టల్ ఉద్యోగం రాలేదు. మూడేళ్లు చూసి ధర్మపురిలో ఈవెనింగ్ కాలేజీలో  జాయినయ్యాను. పొద్దుటి సమయమంతా న్యూస్ పేపర్ ఏజెంటుగా ఉంటూ, బీడీల కంపెనీలో పని చేసుకుంటూ చదువుకున్నాను. 1970-74 మధ్య ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో డి ఓ ఎల్, బి ఓ ఎల్ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల వల్ల నాలుగేళ్ళ కోర్సు అయిదేళ్లు కొనసాగింది. 1973లో ఆదిలాబాద్ జిల్లా డిఎస్సీలో డి ఓ ఎల్ అర్హతతో తెలుగు పండిట్ పోస్టుకు ఎంపికయ్యాను. పోస్టింగ్ ఆర్డర్ రాలేదు. పైరవీ చేసి డబ్బులు ఇస్తే పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారని అన్నారు. సరేనని ఒకరికి డబ్బులు ఇచ్చాను. ఆయన ఆ ప్రయత్నం చేశాడో లేదో కానీ నాకు ఉద్యోగం రాలేదు. ఆ సెలక్షన్ లెటర్ చూసి నేను పనిచేస్తున్న బీడీ కంపెనీ యజమానురాలు మిట్టపల్లి ఈశ్వరమ్మ మా అక్క కూతురు శ్యామల ఉందని చెప్పి నన్ను ఒప్పించారు. 1973 మే 17వ తేదీన శ్యామలతో పైడిమడుగు లలో పెండ్లి జరిగింది. ఎమర్జెన్సీ విధించిన తరువాత 5 నెలలకు 1975 డిసెంబర్ లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎలుగందలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగం వచ్చింది.

5. ఆర్.ఎస్.ఎస్ పట్ల మీరు ఆకర్షితులవడానికి ప్రేరణ ఏమిటి?


జ :-  మా ఇంటిముందే ఆర్ ఎస్ ఎస్ శాఖ నడిచేది. 9 వ తరగతి నుండి శాఖకు వెళ్ళేవాళ్ళం. చెంచు లక్ష్మయ్య, శ్రీధర్ జీ, కళ్ళెపు విద్యాసాగర్ జీ మొదలైన వాళ్ళు ఇతర ప్రాంతాల నుండి వచ్చి శాఖను నడుపుతుండేవారు. మా ఇంటి చుట్టూ మా క్లాస్ మేట్స్, బ్యాచ్ మేట్స్ పల్లెటూళ్ళ నుండి చదువుకోవడానికి వచ్చి ఇక్కడ కిరాయికి ఉండేవాళ్ళు. అందరమూ ఆ శాఖకు వెళ్ళేవాళ్ళం. 1967 నుండి 1970 దాకా నేనే ముఖ్య శిక్షక్ గా శాఖను నడిపేవాడిని. ధర్మపురికి పోయినాక 1972 దాకా అక్కడ కూడా శాఖను నడిపేవాడిని. మేము మతం కన్నా దేశభక్తి గురించి ఆకర్షితులమైనాము.

6. మీ దృష్టి సాహిత్యం వైపు ఎప్పుడు మళ్ళింది?

జ :-  నాకు చిన్నప్పటి నుండి సాహిత్యం పట్ల ఆసక్తి. మా ఇంటి సమీపంలోనే శాఖా గ్రంథాలయానికి వెళ్లి పత్రికలు, పుస్తకాలు తెగ చదివేవాళ్లం. 9వ తరగతి నుండి కథలు, పాటలు, పద్యాలు రాసేవాణ్ణి. భాస్కర్ రెడ్డి సార్, కమలాకర్ రావు సార్ బాగా ప్రోత్సహించారు. అట్లా స్కూల్లో వ్యాసరచన పోటీల్లో, ఉపన్యాస పోటీల్లో ముందుండేవాడిని. అనేక బహుమతులు గెలుచుకునే వాడిని. 9వ తరగతి నుండి నేను మాతోటి విద్యార్థులకు త్రైమాసిక, షాన్మాదిక, వార్షిక పరీక్షల జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసేవాడిని. 300 మంది విద్యార్థులలో ఆ అవకాశం నాకు వచ్చింది. తద్వారా నాకు ఎంతో అవగాహన పెరిగి, తోటి విద్యార్థుల స్థాయి ఏమిటో తెలిసేది.
           నేను జగిత్యాలలో డిగ్రీ చదవకపోయినా దివాకర్ల వేంకటావధాని గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, సి. నారాయణరెడ్డి గారు వచ్చినపుడు నా స్నేహితులతో పాటు కాలేజీకి వెళ్ళి వాళ్ళ ప్రసంగాలు వినేవాడిని. ధర్మపురిలో కూడా  మేము కవిసమ్మేళనాలు జరిపే వాళ్ళం. ముత్యాల విశ్వనాథం, జయధీర్ తిరుమల రావు, మంచాల గంగాధర్, సంగనభట్ల నర్సయ్య ఇట్లా స్థానికులు ఎంతోమంది 20, 25 మంది దాకా కవిసమ్మేళనంలో పాల్గొనేవాళ్ళం. ప్రసంగాలు, ఉపన్యాసాలు నిర్వహించుకునే వాళ్ళం. కార్తీకపౌర్ణమి గోదావరీ తీరాన ఇసుక తిన్నెల్లో ఆటలు పాటలు ఉండేవి. నిరుద్యోగం, నిరాశ, ఇంకోవైపు ఉత్సాహం. నేను దిన, వార, మాస పత్రికలతో పాటు యువభారతి ప్రచురణలను, ఎమెస్కో ప్రచురణలన్నింటినీ తెప్పించేవాడిని. నేను న్యూస్ పేపర్ ఏజెంటును కాబట్టి నాలుగు పుస్తకాలు తెప్పిస్తే ఒక పుస్తకం కమిషన్ గా మిగిలేది. అట్లా నా గ్రంథాలయం తయారైంది. ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ పుస్తకాలు మొదలైన ఎన్నో పుస్తకాలు చదివాను. సాహిత్యమంటే ఇదీ అదీ అని కాకుండా అన్ని పుస్తకాలు చదివేవాడిని.

7. మీరు నిర్వహించిన బాధ్యతల గురించి చెప్పండి.

జ :-  నేను ఏపని చేసినా అంకితభావంతో చేశాను. అయిదేళ్ల పాటు 1972 దాకా ఆర్ ఎస్ ఎస్ ముఖ్య శిక్షక్ గా పనిచేసి  50 సంవత్సరాలు గడిచినా ఆర్ ఎస్ ఎస్ గురువులు గానీ, నా నుండి శిక్షణ పొందినవారు గానీ, సహచరులు గానీ ఇప్పటికీ స్నేహంగా ఉంటారు.
       ఉద్యోగం వచ్చాక ఉద్యోగ సంఘాలను నిర్మాణం చేశాను. ‘సంఘమిత్ర’ అనే పేరుతో పత్రిక నిర్వహించాను. హాస్టల్ వార్డెన్ గా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 20 సూత్రాల పథకం కింద 25 మంది ఉండే హాస్టళ్లలో 100 సీట్లకు పెంచుమని ఆదేశాలు జారీ చేసింది. సైకిల్ మీద ఒక స్టాఫ్ ని తీసుకొని మానేరు డ్యామ్ కి అటు ఇటు ఉన్న గ్రామాలన్నీ తిరిగి 100 మందిని చేర్పించాను. సుమారు 40,50 గ్రామాలు తిరిగాము. దానివల్ల నాకు దళిత వాడల్లో వాళ్ళ జీవితాల గురించి తెలిసివచ్చింది. మానేరు డ్యామ్ కడుతున్నందువల్ల బలి ఇస్తారని ప్రచారం చేశారు. హాస్టళ్లలో పురుగుల అన్నం పెడతారనే అపవాదును తొలగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక విద్యార్థి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ అయ్యాడు. అతడే ఘంటా చక్రపాణి. అట్లా ఎంతోమందిని చదువు వైపు మరల్చాను. అప్పుడే ‘గ్రామాలకు తరలిరండి’ అనే నినాదంతో విద్యార్థులు ఉద్యమం చేశారు. విప్లవోద్యమాలు ప్రారంభం అయినాయి.

8. మీ మొట్టమొదటి కథ ఏది?


జ:- నేను 1964 నుండి అనేక కవితలు, పాటలు బాల సాహిత్యగేయాలు, పత్రికలకు ఉత్తరాలు రాసేవాడిని. ఆనాటి పత్రికల్లో కొన్ని అచ్చు అయ్యాయి. స్కూల్ మ్యాగజైన్ ‘స్రవంతి’లో 1966లో ప్రకృతి వర్ణన గురించిన పద్యాలు వచ్చాయి. 1968 జనవరిలో బాలమిత్రలో నేను రాసిన కథ ‘జగిత్యాల కథ’ అనే పేరుతో వచ్చింది. అంతకుముందే డిటెక్టివ్ నవలలు, కథలు చదువుతూ ఉండడం వల్ల రాయడం అలవాటయింది. ప్రత్యేకంగా యువతరాన్ని ప్రోత్సహించే వాతావరణం  అప్పటికి పత్రికల్లో లేదు. 1979 లో విరసంలో చేరాక కథలు రాసేవాళ్ళు తక్కువున్నారని కథలు రాయాలనుకొని రాయడం మొదలుపెట్టాను. పాటలు, వచన కవిత్వం తగ్గించాను.  అట్లా 1979 లో ఆధునిక కథలు రాయడం మొదలైంది. బాలమిత్రలో కథ వచ్చిన తరువాత తొమ్మిదేళ్లకు ‘ఇంటర్వ్యూ’ అనే పేరుతో పత్రికల్లో కథ అచ్చయింది. దాన్నే ‘బతుకు నేర్పిన పాఠం’ గా పుస్తకంలో వేశాను. ఈ కథను విహారి గారు అత్యుత్తమ కథగా పేర్కొన్నారు. కాకతీయ కెనాల్ పనుల్లో చేయిస్తున్న వెట్టిచాకిరీ గురించి రాసిన ‘తిరుగుబాటు కథ’ సృజనలో వచ్చింది. అట్లా విప్లవకథలు రాశాను. ఆ తర్వాత 1990 నుండి బిసి, ఎస్సీ, ఎస్టీల కథలు నవలలు రాస్తూ వస్తున్నాను. 1982లో ‘బతుకు పోరు’ నవల వెలువడింది. అయిదు ముద్రణలు వెలువడ్డాయి. దానిపై 40 వ్యాసాలు, రెండు ఎమ్ ఫిల్స్ ప్రచురించబడ్డాయి. ఈ నవలతో నన్ను ఆంధ్ర గోర్కీ, ఆంధ్ర లూసన్ అని ప్రశంసించారు. 2013లో చూపు నవల 2017లో ‘జీవనయానం’ నవల వెలువడ్డాయి. 175 కథలు రాసినప్పటికీ కొన్ని మాత్రమే దొరికాయి. కొన్ని అచ్చు కాకుండానే పోయాయి. 15 కథల సంపుటాలు అచ్చు వేశాను. 3 కథల సంపుటాలు ఇంగ్లీషులోకి అనువాదమయ్యాయి. ‘బతుకుపోరు’ నవల ఇంగ్లీషులో వచ్చింది. నేను రాసిన 8 నవలల్లో 3 మాత్రమే అచ్చయ్యాయి. కొన్ని పోగొట్టుకున్నాను.

9. తెలుగు సాహిత్యంలో ఇన్ని ప్రక్రియల్లో, తాత్విక రంగంలో దృష్టి సారించడానికి కారణం ఏదైనా ఉందా?

జ :- ఉంది. చరిత్ర పరిణామమే ఆ కారణం. అది చరిత్ర ఇచ్చిన అవకాశం, అనివార్యత.

10. తెలంగాణ సాహిత్యకారునిగా మీరు ఎదుర్కున్న వివక్షతలేమిటి?

జ :- చాలా వివక్షతలు ఎదుర్కొన్నాము. తెలుగు వాళ్లంతా ఒకటి తెలుగు భాష ఒకటి అని 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటినుండి మా కష్టాలు మొదలయ్యాయి. భాష ఒకటే అన్నవాళ్ళు మా భాష అర్థం కావడం లేదన్నారు.         సురవరం ప్రతాపరెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగు మాసపత్రిక, స్రవంతి, గోలకొండ పత్రికలలో ఆంధ్ర ప్రాంత రచనలు కూడా అచ్చు వేసేవారు. ఎప్పుడైతే ఆంధ్రప్రాంతం నుండి సంపాదకులు, ఉప సంపాదకులు, సాహితీపరులు వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారో వాళ్లకు ఒక రకమైన గర్వం పెరిగి తెలంగాణ భాషను భాష కాదన్నారు. రాష్ట్రం ఏర్పడిన 4, 5 ఏళ్ళకే మన భాషను తెలంగి, బేడంగి అని అవహేళన చేయడం మొదలుపెట్టారు. తత్వశాస్త్రం పట్ల నాకు చిన్నప్పటి నుండి ఆసక్తి. మా నాన్నతో పాటు బొంబాయిలో బట్టలమిల్లు కార్మికునిగా పనిచేసిన మా మేనమామ ఇంట్లో గృహ గ్రంథాలయం ఉండేది. పురాణాలు, వైద్య గ్రంథాలు, ఉపనిషత్తులు మొదలైనవి తీసుకొని చదివేవాడిని. మా పెదనాన్న అచలతత్వంగా ప్రాచుర్యం పొందిన అద్వైత శాఖకు 50 ఏండ్ల పాటు గురువుగా కొనసాగారు. అయిదారుగురు స్నేహితులం పోటీపడి వందల వేల పుస్తకాలను చదివేవాళ్లం. డిటెక్టివ్ నవలలను కూడా తెగ చదివేవాళ్లం. రవీంద్రనాథ్ ఠాగూర్, మున్షీ ప్రేమ్ చంద్, శరత్ బాబు, కోడూరి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ, శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఉమర్ ఖయ్యామ్ తదితరుల రచనలను బాగా చదివేవాళ్లం. అలా కథలు, నవలలు, కవిత్వం, సాహిత్య విమర్శ , అర్థశాస్త్రాల మీద ఆసక్తి కలిగింది. చందమామ, బాలమిత్రల్లోని బాల సాహిత్యం మా వ్యక్తిత్వాలను తీర్చి దిద్దాయి. 10వ తరగతిలో ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్   చదువుకోవడం వల్ల ఈ శాస్త్రాలపై విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఆసక్తి పెరిగింది. అలా సాహిత్యం, భావజాల పరిణామం ఎన్ని మలుపులు తిరిగిందో అన్ని మలుపుల్లోనూ వీటన్నిటి గురించి మారిన అవగాహనననుసరించి రాస్తూ వచ్చాను. అలా నా రచనలు, భావాలు, వైవిధ్యభరితంగా పరిణామం చెందుతూ వచ్చాయి.

బి.ఎస్.రాములుగారితో మయూఖ ప్రతినిధి

9. మీ ‘కథలబడి’ పుస్తకాన్ని సాహిత్య అలంకార శాస్త్రంగా పేర్కొనడానికి కారణం ఏమిటి?

జ :- అలా పేరు పెట్టినందుకు డా. సి. నారాయణ రెడ్డి గారు, రావూరి భరద్వాజ గారు ఎంతగానో సంతోషించారు. సినారె గారు దాన్ని ఆవిష్కరించారు. రావూరి భరద్వాజ గారు ముందుమాట రాశారు. ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల ప్రశంసలు పొందిన పుస్తకం ఇది. నేను డి ఓ ఎల్, బి ఓ ఎల్ పాఠ్యాంశాలుగా కావ్యాలంకార సంగ్రహం, ప్రతాపరుద్ర యశోభూషణం, ఆనంద వర్ధనుడు, భరతుడు, ధ్వని, రస, వక్రోక్తి సిద్ధాంతాలు చదువుకున్నాను. నవరసాలతో పాటు అనంతరసాలు, స్థాయి భావాలతో రససృష్టి గురించి అధ్యయనం చేశాను. ఆధునిక ప్రక్రియలలో వీటిని సాధించడం, సమర్థవంతంగా, ప్రతిభావంతంగా చిత్రించడం కోసం ‘కథలబడి’ సాహిత్య అలంకార గ్రంథం రాయడం జరిగింది.
విప్లవోద్యమంలో పనిచేసినప్పుడు కథలు ఎట్లా రాయాల్నో తెలిపి చాలా మందితో కథలు రాయించాను. 1984 నుండి 1990 వరకు పూర్తి కాలం కార్యకర్తగా పని చేస్తూ దేశమంతటా పర్యటన చేశాను. 1990 ఏప్రిల్ లో బహిరంగ జీవితంలోకి వచ్చాక బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీల సామాజిక అభివృద్ది కోసం భారత రాజ్యాంగ పరిధిలో కృషి చేయడం ప్రారంభించాను. అట్లా 1992లో “దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక” ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వ్యవస్థాపక అధ్యక్షునిగా రాష్ట్రమంతటా సభలు, సమావేశాలు నిర్వహించాం. యువతరాన్ని సాహిత్యకారులుగా తీర్చడానికి కథ, పాట, ప్రసంగం, వ్యాసరచన తదితర ప్రక్రియల్లో శిక్షణా తరగతులు నిర్వహించాం. శిక్షణా తరగతులకు ఒక పాఠ్య ప్రణాళిక ఉండాలని ‘కథలబడి’ రాయడం జరిగింది. అలాగే పాటల గురించి, పాట పుట్టుక గురించి రాయడం జరిగింది. వాటితో వందలాదిమంది యువకులు ఎదుగుతూ వచ్చారు. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, దేశ, భాష  వివక్షతలను, అసమానతలను నిర్మూలించడానికి ‘దరకమే’ ఐక్య వేదిక సాహిత్య సామాజిక సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తుందని ప్రకటించాము. అప్పటిదాకా వచ్చిన కథలు వాటి శైలీ శిల్పం, కథా వస్తువుకు భిన్నంగా మాదైన కథా వస్తువు, శైలీ శిల్పం రూపొందించుకోవాల్సి వచ్చింది. అలా కథా ప్రారంభం, పాత్రలు, సంఘటనలు, కథ ముగింపు మొదలైనవన్నీ ఉత్పత్తి కులాలైన, సేవా కులాలైన శూద్ర, అతి శూద్రుల జీవితం, సంస్కృతి, భాష వారి ఆశలు చిత్రించడం, జీవితం పట్ల ఆశ, విశ్వాసం, ‘we can win’ అనే దృష్టి కోణాన్ని ఇవ్వడం అవసరం. అంతకుముందు సాహిత్యంలో వీరంతా బలిపశువులైనట్లు విషాదాలు, అణచివేత మాత్రమే చిత్రించేవారు. దాన్ని అధిగమించి జీవితాన్ని ఎట్లా గెలుచుకోవాలో చెప్పడం అవసరం. అందువల్ల దరకమే ఐక్య వేదిక ఏర్పడ్డాక మొత్తం సాహిత్యరంగంలో ఒక మార్పు మొదలయింది. అందుకు అలంకార శాస్త్రంగా ‘కథలబడి’ పాఠ్యగ్రంథంగా ఉపయోగపడింది.

10. మీ “గతి తర్క తత్వ దర్శన భూమిక’ రచన ప్రత్యేకత, విశిష్టత, దాని ప్రభావం గురించి తెల్పండి.

జ :-  1977 నుండి 1989 దాకా విప్లవోద్యమంలో పని చేశాను. అప్పుడు విరసంతో సహా మార్క్సిజమ్, లెనినిజం, మావో ఆలోచనా విధానాల గురించి చెప్పేవారు. ఆ ప్రభావంతో 1977-90 దాకా  ఉద్యమంలో పని చేశాను. ప్రజల మధ్య పని చేస్తున్న క్రమంలో ప్రజల పట్ల నిర్బంధాలు పెరిగాయి. ఉద్యమం పెరుగుతున్నట్టు కనబడుతూ క్రమంగా కుదించుకు పోవడం జరిగింది. అఖిల భారత పర్యటనలో వరవరరావు, గద్దర్, సంజీవ్, డప్పు రమేశ్, డోలకిస్టు రాజుతో కలిసి 12 రాష్ట్రాలు పర్యటించాము. ఎందరో రచయితలు, కళాకారులు, సాహితీ వేత్తలు, ఉద్యమ కారులు, పౌరహక్కుల సంఘాల వాళ్ళు, జర్నలిస్టులు, పత్రికా సంపాదకులు, ప్రొఫెసర్లు ఎందరో కలిసారు. ప్రపంచ విప్లవోద్యమం గురించి, భారతీయ విప్లవోద్యమం గురించి వాటిలోని ఒడి దుడుకులను గురించి, ఎదురవుతున్న కష్ట నష్టాలు, సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో నక్సలైట్ నాయకుడు కేరళ వేణు, నక్సలైట్ పత్రిక మాస్ లైన్ సంపాదకుల ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఆ చర్చలో పాల్గొన్నాం. అర్థ భూస్వామ్య వ్యవస్థ, అర్థ వలస వ్యవస్థ అనే దృష్టితో చేసిన ఉద్యమాలన్నీ ఆగిపోయినాయి. అందువల్ల మేము పునరాలోచనలో పడ్డాము. నయా వలసవాదానికి వ్యతిరేకంగా అనగా నేటి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జాతుల ఉద్యమాలు నిర్వహించాలి అన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో నక్సలైట్ ఉద్యమానికి ప్రతి చోట కుల సమస్య ఎదురైందని, ఉద్యమాలు స్తంభనకు గురయ్యాయని చెప్పారు. ఇంకొకవైపు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రాజ్ నం ద్ గామ్ లో శంకర్ గుహ నియోగి ఒక విశిష్టమైన,  సమగ్రమైన, సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని ప్రత్యక్షంగా చూసాము. ఉద్యమ నాయకత్వమే హాస్పిటల్స్ ను, స్కూళ్లను కమ్యూనిటీ హాళ్లను నిర్మింపచేసింది. మద్యపాన నిషేధాన్ని అమలు జరిపింది. భిలాయి ఉక్కు గని కార్మికులను సంఘటిత పరిచింది. వారి జీత భత్యాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి కృషిచేసింది. మహిళల పట్ల వివక్షను నిర్మూలించడానికి మహిళా కమిటీలను వేసింది. ఇలా నిర్దిష్ట ప్రాంతంలో వర్గ సామాజిక విప్లవాన్ని, సమగ్ర సామాజిక వికాసాన్ని ఒక ఉద్యమంగా కొనసాగిస్తున్నారు. అది నన్ను బాగా ఆకర్షించింది. అలా అఖిల భారత పర్యటనతో బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు జ్ఞానోదయమైంది. అప్పటినుండి సమస్త వర్గ కుల లింగ జాతి మత భాష వివక్షతలు, అసమానతలు దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా సమగ్ర సామాజిక వికాసమే సమగ్ర సామాజిక విప్లవంగా కొనసాగించాలని అవగాహనకు వచ్చాను. ఈ అవగాహనతో మార్క్సిజమ్, లెనినిజం, మావో ఆలోచనా విధానంతో పాటు వాటి వ్యూహం ఎత్తుగడలు కార్యక్రమాలన్నింటిలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని గమనించాను. వాటిని మార్క్స్, ఏంజిల్స్ లాగానే తత్వశాస్త్రంలో భాగంగా చర్చించడం అవసరమనిపించింది. దాంతో మార్క్సిస్టు తత్త్వ శాస్త్రాలను పున రధ్యయనం చేశాను. సిపిఐ, సిపిఎం విప్లవకారులంతా గతి తార్కిక ఆర్థిక వాదము, గతి తార్కిక భౌతిక వాదము, గతి తార్కిక చారిత్రక వాదము, ఇట్లా ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన విషయాలతో పాటు ప్రపంచ పరిస్థితులను గురించి మాట్లాడుతారు. రష్యా, చైనాల్లో లాగా మనదేశ ప్రజలు ఒక వర్గానికి చెందినవారు కారు. ఇక్కడ కుల మత వ్యవస్థలున్నాయి. మరి మనుషులంతా సమానమేనని చెప్పడానికి ఈ ఉద్యమంలో ఏముంది? ఆర్థికం మారితే అన్నీ మారతాయని వాళ్ళ సిద్ధాంతం. మనదేశం ఆర్థికంగా, సాంఘికంగా ఒక్కటేనని చెప్పుకున్నా కులమనేది మూలసూత్రంగా ఉంటుంది. మనిషి హావభావాలు, వేషధారణ, భాష, ప్రవర్తన కూడా కుల సంస్కృతిని సూచిస్తాయి. ఇవన్నీ అణచివేతకు గురవుతున్నాయి. విప్లవం పేదలనుండే వస్తుంది కానీ నాయకత్వం దగ్గర వివక్ష ఏర్పడుతుంది. దీన్ని బట్టి సిద్ధాంత లోపం ఉన్నట్లే కదా! 70 , 80 ఏళ్లనుండి బిసిలు,ఎస్సీ, ఎస్టీలు జెండాలు మోసేవాళ్లుగా, లాఠీ దెబ్బలు తినేవాళ్లుగానే మిగిలి పోతున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయం. అందువల్ల తత్వశాస్త్రంలో వ్యూహం, ఎత్తుగడల్లో లోపం ఉందని గమనించాను. మార్క్స్ వద్ద ఆగిపోకుండా ప్లేటో, అరిస్టాటిల్, బుద్ధుడు, నాగార్జునుడు, కాంట్, హెగెల్ తత్వశాస్త్ర అధ్యయనం చేయడం జరిగింది. అలా గతి తర్కం యొక్క మౌలిక సూత్రాలను విస్తారంగా చర్చించడం జరిగింది. నేను చదివిన మేరకు ప్రపంచంలో ఈ కోణంలో చర్చించిన మొదటి పుస్తకం ఇదే. ఈ పుస్తకం వచ్చిన తరువాత అన్ని పార్టీలు, సాహిత్య ఉద్యమాలు తమను సవరించుకున్నాయి. మార్చుకున్నాయి.

11. తెలంగాణ ఉద్యమంలో మీరు నిర్వహించిన పాత్ర చాలామందికి తెలియదు. అంతర్గతంగా మీరు నిర్వహించిన పాత్ర ఎటువంటిది?

జ :- మలి తెలంగాణోద్యమం 1995 నుండి ప్రారంభమైంది. 1996 నుండి తెలంగాణోద్యమంలో ముందుగా భాష, సంస్కృతులను తీసుకున్నాం. తర్వాత ఉద్యోగాలు, పదవులు, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడం మొదలైనవి తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించాం. బిసి, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగడం లేదన్నది ప్రధానంగా తీసుకున్నాం. 1969లో తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం మన ఉద్యోగాలు మనకు రావడం లేదని. అందుకే ‘ఆంధ్రా గో బ్యాక్’ అన్నారు. 40 ఏళ్ళలో 40,50 కార్పొరేషన్లు పెట్టి వాళ్లే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాళ్ళను వెనక్కి పంపితే గానీ ఇక్కడ ఖాళీలు ఏర్పడవు. అందువల్ల వారిని శాంతియుత పద్ధతిలో ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడే ఖాళీల్లోకి బదిలీ చేయాలి. వీళ్ళు వెళ్లాలంటే సీనియారిటీ పోతుంది. వాళ్లకు పే ప్రొటెక్షన్, ప్రమోషన్ ప్రొటెక్షన్ ఇస్తూ ఆర్డర్ ఇస్తే ఇక్కడ పోస్టులు క్రియేట్ అవుతాయి.తద్వారా మనకు  న్యాయం జరుగుతుంది. అని చెప్పడం జరిగింది. రచయితలుగా, కళాకారులుగా మేమంతా దాన్ని ప్రతిపాదించాం. చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆధునిక విద్యను అందుబాటులోకి తేవడం, ఇక్కడ కాలేజీలను పెంచడం ఇవన్నీ ఎజెండా. నీళ్ళలో వాటా, ఉచిత కరెంటు నినాదాలు కూడా ముందుకు వచ్చాయి.  దళిత బహుజన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే దిశగా ఉద్యమం సాగింది. అధిక శాతం ప్రజలు వీళ్ళే కాబట్టి విద్య, వైద్యం, ఉద్యోగం, ఆ తరువాత గృహవసతి. తాగునీటి సమస్య వ్యవసాయ భూమి ఉన్నవాళ్ల సమస్య. వాళ్ళు”నీళ్లు, నిధులు, నియామకాలు”, అనే నినాదం, దుబాయి, బొంబాయి, సింగరేణికి కూలీలుగా వెళ్ళే వలసలు ఆగాలని ” “దుబాయ్, బొంబాయ్, బొగ్గుబాయ్” అనే నినాదం ముందుకు వచ్చింది. 1996 నుండి 2001 వరకు రాష్ట్రసాధన కొరకు 42 సంఘాలు ఏర్పాటు అయ్యాయి. గద్దర్, పాశం యాదగిరి, గూడఅంజయ్య, గోరేటి వెంకన్న, అందెశ్రీ, మొదలైన వాళ్ళతో కలిసి ముందుకు సాగాము.
2001వ సంవత్సరంలో టిఆర్ ఎస్ ఆవిర్భావం జరిగింది.  ఉద్యమం రాజకీయ ప్రయోజనం ప్రాతిపదికగా మారింది. అయినా  మేము ఊరుకోకుండా బిసి, ఎస్సీ, ఎస్టీల కోసం గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టడం మొదలైన వాటి గురించి కృషి చేశాం. ప్రతీ నెల ఒక పుస్తకం తీసుకు రావాలనుకున్నాను.  ప్రజల్లో చైతన్యం రావాలన్నది ప్రధానంగా పనిచేశాం. 1969 లాంటి ఉద్యమం మళ్ళీ జరగాలన్నదే మా ధ్యేయం. అదీ శాంతియుతంగానే. ఎప్పటికప్పుడు ఉద్యమ తీరులను సమీక్షించుకుంటూ, క్రియాశీలక మార్పులను చేసుకుంటూ ముందుకు నడిచాం. మన తెలంగాణ సాహిత్యం, ఉద్యమ సిద్ధాంతాలను తెల్పుతూ ఎన్నో పుస్తకాలను తీసుకొచ్చాం.

12. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ చైతన్యం కొరకు మీరు రాసిన ‘కొత్తచరిత్ర’ పుస్తకంలో కీలకమైన అంశాలేవి?

జ :- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొన్ని వందల వ్యాసాలను రాయడం జరిగింది. అంటే ఈ కొత్త విజన్ ఎలా ఉండాలో, దానికి సంబంధించి నూతన ప్రణాళికలను గురించి మేము చర్చించిన విషయాలను, కేసీఆర్ చేయాలనుకున్న నూతన మార్పులను అన్నింటినీ అయిదు పుస్తకాలుగా వేయడం జరిగింది. అందులో మొదటి పుస్తకం  ‘కొత్త చరిత్ర’ రెండవది ‘బంగారు తెలంగాణ’, మూడవది ‘తెలంగాణ విజన్ దేశానికి దిక్సూచి’, నాల్గవది ‘కొత్త సిలబస్’, ఐదవది ‘ఇండియాలో ఫెడరలిజమ్’..కొత్తరాష్ట్రంలో కొత్త విజన్ తో ముందుకు సాగి సమర్థవంతంగా ఆచరణ చేయ గలిగితే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనేది వాటి అంతస్సారం. తెలంగాణ ప్రభుత్వం 416 దాకా ప్రణాళికలను ప్రవేశపెట్టింది. అందులో కొన్నయినా అమలు అవుతాయన్న ఆశ. అయితే ప్రవేశపెట్టడం మాత్రమే జరిగింది. కానీ అమలు చేయలేదు.  పైగా అవినీతి, ఆస్తులు పెంచుకోవడం మొదలైన స్వార్థ ప్రయోజనాలను ఎప్పుడైతే ఆశించారో 50 ఏళ్ళ ఉద్యమ ఫలితాలు ప్రజలకు అందలేదు. అట్లాంటి వాటన్నిటినీ చూపిస్తూ ఈ పుస్తకాల్లో విమర్శలు కూడా రాశాను. మంచి జరగలేదని అనను. కానీ ఉద్యమ ఫలితమైతే పూర్తి స్థాయిలో అందలేదు. ఉద్యమకారులకు సరైన న్యాయం జరుగలేదు. కేవలం రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూరింది. అస్సాం వంటి ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు, యువకులు, లెక్చరర్లే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ ఆ అవకాశం కొద్దిమందికే దక్కింది.

13. ఇప్పటి వరకు మీ లేఖిని నుండి వెలువడిన పుస్తకాలెన్ని?

జ :-  నా రచనలు మొత్తం 120 పుస్తకాలుగా వెలువడ్డాయి. వాటిలో కథలు, నవలలు 21,తత్త్వ శాస్త్రానికి సంబంధించినవి 17, రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసానికి చెందినవి 14,  అలంకారశాస్త్రాలు, బిసిల గురించి రాసినవి 9, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు, చరిత్ర, సంస్కృతికి, రాష్ట్రసాధనకు సంబంధించినవి 42 ఉన్నాయి. మూడు వందలకు పైగా పుస్తకాలకు పీఠికలు రాశాను. సాహిత్య చరిత్రను కొత్తమలుపుతో ఎలా చూడాలని తెలంగాణ దృష్టితో, బిసిల దృష్టితో, తెలంగాణ సాహిత్య చరిత్రను పునర్మూల్యాంకనం చేయడం జరిగింది. అట్లాగే తెలంగాణ కథ, అస్తిత్వం మీద రాయమని సి. నారాయణ రెడ్డిగారు అడిగారు. తెలంగాణ కథల్లో, నవలల్లో తెలంగాణ అస్తిత్వం ఎలా ఉందో దాని గురించి పుస్తకం వేశాను. ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకొని అర్థశాస్త్రం మీద రాశాను. స్వీయచరిత్ర కూడా 5 భాగాలుగా రాశాను. 1982 డిసెంబర్, అంటే ఎన్టీ రామారావు ఎన్నికల ప్రచారం చేస్తున్నంతవరకు స్వీయచరిత్ర పూర్తయింది. ఇప్పటికే 1200 పేజీలు అయింది (నవ్వుతూ). మిగతాది పుస్తకరూపంలో రావాల్సి ఉంది. ఉపన్యాసాలివ్వడం, సామాజిక ఉద్యమాలను ఆర్గనైజ్ చేయడం, విప్లవోద్యమంలో పాల్గొనడం,  ఇట్లా నా జీవితమంతా పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుండి సామాజిక కార్యకలాపాలతోనే సహవాసం చేశాను. అందువల్ల నేను రాయదలచుకున్న దాంట్లో పదిశాతమే రాయగలిగాననుకుంటున్నా. శరత్ బాబు, ఠాగూర్, మున్షీ ప్రేమ్ చంద్ వీళ్ళలాగా నిరంతరం రాయాలి. కానీ సమాజం, చరిత్ర, ఉద్యమాలు నాకా అవకాశం ఇవ్వలేదు. అన్యాయాన్ని, వివక్షతను ఎదిరించే క్రమంలోనే సమయమంతా గడిచిపోయింది. అందువల్ల తపన ఉన్నా రాయలేకపోయాను.

14. సాహిత్య చరిత్రలో మార్పు తేవాలనుకున్నారు కదా! తీసుకురాగలిగారా?

జ :-  కచ్చితంగా వచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా సాహిత్య చరిత్రను మలుపు తిప్పాలనుకున్నాను.  తిప్పాను కూడా. సామాజిక, తాత్విక, సాంస్కృతిక రంగాలలో నూతన కోణాలను ముందుకు తేవడం జరిగింది. మొత్తం సమాజం ఆమోదించింది. 1970 దశాబ్దం విరసం దశాబ్దం.1980-90 వరకు మహిళా దశాబ్దం.  1990 నుండి దళిత బహుజన దశాబ్దం.  భారతదేశంలో కులమనేది ఒక వాస్తవం. ఆ కుల సంస్కృతులు పుట్టుక నుండే అలవడుతాయి. అందుకే నేను అలంకారశాస్త్రం రాశాను. ఒక కుటుంబం గురించి కథ రాసినా, నవల రాసినా, సినిమా తీసినా అది తప్పక ఏదో ఒక కులానికి చెందినదై ఉంటుంది. అలాగే దళితులు రాసినటువంటి రచనలు వాళ్ళ కులవృత్తులకు, వారి సంస్కృతులకు సంబంధించినవే ఉంటాయి. ఎప్పటివరకైతే కులం అనేది ఉంటుందో అప్పటివరకు కుల సంస్కృతులు, భాష, ఆహార్యం, జీవనవిధానం ఇవన్నీ ఉంటాయి. చైతన్యం పెరగకపోతే అదే సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడినా పాత సంస్కృతిలో మార్పు రాకపోగా విస్తరించింది. దాన్ని మార్చాలి. ఆ దిశగా చైతన్యులను చేయాలి. అందుకే ఆర్థిక విప్లవం కన్నా భావజాల విప్లవం కోసం కృషి చేశాను. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, భాష వివక్షతలకు, అసమానతలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, సమానత్వం కోసం సామాజిక, సాహిత్య , తాత్విక రంగాల్లో కృషి చేస్తున్నాను. భారత రాజ్యాంగ మౌలిక లక్షణం కూడా అదే కదా! మనం ప్రపంచ సాహిత్యాన్ని చదువుతున్నాం. మన భారతీయ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని వాళ్ళెందుకు చదవడం లేదు? అందుకే నేను కొన్ని అనువాదాలు చేయించాను. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు ఎన్నో పుస్తకాలు చదివాను. అక్కడి జీవితాన్ని కళ్ళారా చూశాను. మన సాహిత్యం వాళ్లకు అంటదని అర్థమైంది. వాళ్లు ఉమ్మడి కుటుంబాల జీవితాలను వదిలేసి వందేళ్ళ పైన అయింది. వాళ్ళకు కులాలు, కుల వృత్తులు లేవు.  అందుకే మన పరిస్థితుల కనుగుణంగానే సిద్ధాంతం తయారవ్వాలి. లక్ష్యాలు ఏర్పడాలి. అందుకే అటువంటి సాహిత్యం రాయాల్సి వచ్చింది.

15. ‘విశాల సాహిత్య అకాడెమీ’ ద్వారా మీరు చేస్తున్న కృషి మరికొంత వివరించండి.

జ :- మేము విప్లవ రచయితల సంఘంలో పని చేసినప్పుడు మా పుస్తకాలను అచ్చు వేసుకోవడం కోసం ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ స్ఫూర్తితో కరీంనగర్ బుక్ ట్రస్ట్ పేరు పెట్టి ‘నా బతుకు పోరు’ నవలని, అల్లం రాజయ్య ‘భూమి’ కథల సంపుటిని అచ్చు వేయడం జరిగింది. సింగరేణి కార్మికుల ‘సింగరేణి కథలు’ అచ్చు వేశాం. ‘అడవిలో వెన్నెల’ పేరుతో గిరిజనుల కథలను కూడా అచ్చు వేశాం. నేను అజ్ఞాతంలోకి వెళ్ళాక దాన్ని ఎవరూ ముందుకు తీసుకు వెళ్ళలేదు. 1990 లో నేను బయటకు వచ్చాక ‘విశాల సాహిత్య అకాడెమీ’ పేరుతో తిరిగి ప్రచురణలు ప్రారంభించాను. నా పుస్తకాలతో పాటు 75 ఇతరుల పుస్తకాలు కూడా వేశాం. ప్రతీ ఏటా విశాల సాహితీ పురస్కారాలు కూడా ఇస్తున్నాం. వందలాది మంది వాటిని అందుకున్నారు. మా కాలంలో మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని శిక్షణా తరగతులు, చర్చలు, సదస్సులు నిర్వహించాం. వారి రచనలను సవరించి చక్కగా ముద్రించి ప్రోత్సహిస్తూ వస్తున్నాం.

16. ‘నడుస్తున్న గ్రంథాలయం’ గా మిమ్మల్ని అభివర్ణించిన గొల్లపూడి మారుతీరావు సాహిత్య సంచికలో మీ ‘బతుకు పయనం’ కథ ఎంపిక కావడం పట్ల ఎలాంటి అనుభూతి చెందారు?

జ :- హెచ్ ఎమ్ టి వి లో ప్రసారమైన ‘నూరేళ్ళ కథ’ అనే శీర్షికను గొల్లపూడి వారు నిర్వహించారు. నేను ఏ కథ ఇవ్వాలా? అని ఆలోచించాను. విభిన్న తరహాలో ప్రత్యేకంగా ఉన్న దానిని తీసుకోవాలి అనుకున్నాను. ‘బతుకుపయనం’ ఒక బట్టలు నేసే పద్మశాలీ సామాజిక వర్గం నుండి ఒక యువకుడు బిటెక్ చేసి, అమెరికాకు ఎట్లా పోగలిగాడో చెప్పే ఒక పరిణామాన్ని
ఆవిష్కరించిన కథ బాగుంటుందనుకున్నాను. . అత్యంత పేదరికం నుండి అత్యున్నతస్థాయి ఉద్యోగం చేసే విధంగా అతని బతుకుపయనం ఎట్లా సాగిందో వివరించే కథ. అందులో బిసిల సంస్కృతి, ఆలోచనలు, పెళ్ళిచూపులు, పెట్టుబడులు మొదలగు ఎన్నో విషయాలుంటాయి.
విశాలాంధ్ర వారి ‘నూరేళ్ళ తెలంగాణ కథ’ పుస్తకంలో నేను రాసిన ‘దక్షయజ్ఞం’ కథ చేర్చారు. దీన్ని నేను ఎంపిక చేసుకోవడానికి కారణం కూడా విభిన్నంగా ఉండడమే. ఇందులో  పీడితుల గురించి రాశాను. అంటే ఈ రెండూ కూడా వైవిధ్యంగా ఉన్న కథలు. ఒక చైతన్య స్ఫూర్తితో ఈ రెండింటిని ఎంపిక చేశాను. గొల్లపూడి మారుతీరావు గారు మా ఇంటికే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి దాన్ని ప్రసారం చేశారు.
అసలు గొల్లపూడి నన్ను ఇంటర్వ్యూ చేయరనుకున్నాను. మేము తెలంగాణ తల్లి గురించి కొట్లాడుతున్న రోజులు. ఆయనేమో తెలంగాణ తల్లి ఉంటుందా? అంటూ విమర్శ వ్యాసం రాసిన వ్యక్తి (నవ్వుతూ). కలిసి మాట్లాడిన తర్వాత ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. నా ఆలోచనా దృక్పథం ఆయనకు అర్థమైంది. “ఈ పుస్తకాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. సహకరిస్తారా? అని కూడా అడిగారు. ఎంతో సంతోషం కలిగింది. ‘వందేళ్ల కథ’ గొప్ప పేరు తెచ్చుకుంది. గొప్ప క్లాసిక్ అది. అటువంటి వాటిల్లో చరిత్ర, సాహిత్యం, సంస్కృతి ఉంటాయి. ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు వేసిన ఇట్లాంటి పుస్తకం మరొకటి కూడా గొప్ప పేరును పొందింది. అలాగే వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకత్వంలో 1990 నుండి వెలువరించిన కథా సంకలనాలను రెండు సంపుటాలుగా పునర్ముద్రించారు. అందులో మెరుగు అనే కథ చేర్చుకున్నారు. చీకోలు సుందరయ్యగారు ‘నిచ్చెన’ కథాసంకలనంలో పాలు కథ తీసుకున్నారు. దళిత కథలు ఎనిమిది సంకలనాలు తెచ్చిన డా. కె. లక్ష్మి నారాయణ ‘బందీ’ కథ మొదలుకొని అనేక కథలను సంకలనంలో చేర్చారు. నేను, వనమాల చంద్ర శేఖర్ సంపాదకత్వంలో వెలువరించిన కరీంనగర్ జిల్లా కథలు నాలుగు సంపుటాల్లోను ‘భారతీయ సాహిత్యం- తెలుగు కథలు’ అనే సంకలనం లోను మరికొన్ని కథలను చేర్చడం జరిగింది. ఇలా ఆయా సంకలనాల్లో సామాజిక చరిత్ర పరిణామాలను విస్తృతంగా ప్రతిఫలించే కథలను సూచించడం జరిగింది. ఇంకా అనేక సంకలనాల్లో కథలు చేర్చుకోబడ్డాయి. ‘కథాసాగర్’ సంకలనంలో ‘సదువు’ కథను చేర్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి సంకలనంలో ‘అడవిలో వెన్నెల’ కథ చేర్చారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అచ్చువేసిన కథా సంకలనాల్లో ‘అడవిలో వెన్నెల’ కథ మొదటిసారిగా అచ్చు వేశారు. తర్వాత అనేక సంకలనాల్లో దీన్ని చేర్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున ప్రచురించే ఇండియన్ లిటరేచర్ అనే పత్రికలో ‘రియల్ ఎస్టేట్’ అనే కథను ఎంపిక చేసి ప్రచురించారు.

17. మీ కథా వస్తువు శైలీ శిల్పం లోని ప్రత్యేకతను, పరిణామ క్రమాన్ని వివరించండి.

జ :- నా కథా వస్తువులో కాలానుగుణంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నా కథలపై 6 ఎమ్ ఫిల్స్, 2 పి హెచ్ డి లు వచ్చాయి. దాంట్లో కథల గురించే కాక కాలక్రమానుగతమైన దశల గురించి, శిల్పంలో క్రమేణా వచ్చిన దశల గురించి వివరించారు.  అట్లాగే నా సాహిత్యం మీద ఒక సెమినార్ జరిగింది. వాటన్నిటి సారాంశం ….ఇలా చెప్పుకోవచ్చు.
1.1977 నుండి ప్రారంభదశ, 2. 1980- 1990 విప్లవ సాహిత్యం 3.1990-1995 బహుజన సాహిత్యం 4. 1996-2000 మానవ సమాజ పరిణామం 5. 2001-2005 తెలంగాణ ఉద్యమ ప్రాధాన్యత 2006 నుండి పై అన్ని దశల పరిణామాలు, విశ్లేషణ, సామాజిక పరివర్తన చిత్రణ.
ఇలా కథల వస్తువుల్లో శైలీశిల్పంలో అనేక మార్పులు జరిగాయి. మొదటగా జీవితంలో కష్టాలు, కన్నీళ్ళ గురించి రాశాను. 1980-90 వరకు రాసిన కథలన్నీ విప్లవానికి సంబంధించినవి. అన్యాయానికి, అణచివేతకు గురవుతున్న వారి గురించి రాశాను. విప్లవ సంఘాలు, నక్సలైట్లు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘాలు, బిసి,ఎస్సీ,ఎస్టీలు ఇలా అనేక విభాగాలకు సంబంధించిన వారి గురించి రాశాను. విప్లవ కథలతో 1991లో ‘పాలు’ కథల సంపుటి వెలువడింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో ఎమ్ ఏ విద్యార్థులకు పాఠ్య గ్రంథం. ఆతర్వాత మరికొన్ని కథలు కలిపి ‘ఇతర కథలు’ సంపుటి తెచ్చాను. అలాగే విప్లవ కథలతో 2004 లో ‘తేనెటీగలు’ కథల సంపుటి వేశాను. ఆతర్వాత 2013లో అంతదాకా దొరకని కథలు సేకరించి ‘అడవిలో వెన్నెల’ కథా సంపుటి వేయడం జరిగింది. ఇందులో మారుతున్న విప్లవం పట్ల మారిన నా భిన్నమైన అభిప్రాయాలతో ముందుమాట రాశాను.     ‘ఉద్యమం ఉద్యమం కోసం కాదు. జీవితం  గెలవడం కోసం’ అని కథలు రాశాను. విద్య యొక్క ప్రాధాన్యత, విద్యావ్యవస్థ తీరు, కుటుంబ వ్యవస్థ పరిణామాలు, ప్రాజెక్టులు తెచ్చిన పరిణామాలు, అభివృద్ధి తెచ్చిన పరిణామాలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, వాటి పరిణామాలు మొదలైనవి కథల్లో నవలల్లో చిత్రించాను. కథల్లో జీవితంలో గెలుచుకున్న విధానాన్ని చూపించాలి కానీ ఓడినట్లు చూపించొద్దని నా అభిప్రాయం. మొదటినుండీ వివక్ష ఎలా ఉంది? దానిని ఏ విధంగా దూరం చేయాలి? సమసమాజ నిర్మాణానికి ఏం చేయాలి? ఇదీ కథల్లో చూపించాల్సింది. దీన్ని ‘సోషలిస్టు వాస్తవికత’ అంటారు. అనగా జీవితం ఎలా వుందో చెప్పడంతో పాటు, ఎలా ఉంటే బాగుంటుందో కూడా చిత్రించాలి. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? ఆ పరిణామం ఎందుకు అనివార్యమైంది? అనే విషయాలు అన్ని కథల్లో చిత్రించగలిగితే ఆ కథా వస్తువు శైలీ శిల్పం ప్రారంభం, ముగింపు చక్కగా కుదిరితే అది గొప్ప కథ. ఇలాంటి కథలు క్లాసిక్స్ గా ప్రతిభాషలో ప్రపంచ సాహిత్యం లో కలకాలం నిలిచిపోతాయు. ఇదే విషయాన్ని ‘కథలబడి’ కథా సాహిత్యాలంకారంలో విశ్లేషించాను. నా కథల్లో వీలైన మేరకు వీటిని చిత్రించాను. ఆపిల్ ను కోసి ఎంత చిన్న ముక్క చేసినా దాని రుచి మారదు. అలాగే జీవితంలోంచి ఏ చిన్న అంశం తీసుకున్నా మొత్తం సామాజిక స్వరూప స్వభావాలు ఆపిల్ ముక్కలో ఉండే రుచిని చెప్పగలిగేటట్లు ఉండాలి. ఇదే విషయాన్ని నిర్వచించడానికి ‘సమగ్ర సామాజిక కథ’ అని పేరు పెట్టడం జరిగింది. ‘సమగ్ర సామాజిక కథ 50 ఏళ్ల తెలుగు కథ తీరుతెన్నులు’ పుస్తకాన్ని 2003 లో వెలువరించాను. 2004లో ‘సాహిత్య చరిత్రను కొత్త చూపుతో తిరగ రాయాలి’ అనే పుస్తకాన్ని ప్రచురించాను. ఇలా నేను కథల్లో, నవల అంత కథావస్తువును ఒక శైలీ శిల్పంతో కథలుగా మలిచాను. ఇదే మాటను విపుల, చతుర సంపాదకులు చలసాని ప్రసాద రావుగారు అడిగారు. మా తెలంగాణ కథలు, నవలలు అచ్చు వేయడానికి వివక్షతకు గురవుతున్నాయి. నిరంతర ఉద్యమాలతో చురుకైన పాత్ర నిర్వహించడం వల్ల సమయం సరిపోవడం లేదు. ఒకపేజీ కథ రాసుకొని రెండు గంటల సినిమా తీస్తున్నారు. వంద ఏపిసోళ్ల టివి సీరియల్ తీస్తున్నారు. ఈ నాలుగు కారణాల వల్ల కథ వస్తువు ఇతివృత్తం ఎంత విశాలమైనదైనప్పటికీ కథలుగా, కథానికలు గా మలిచాను. ఇదే నా కథలోని కథా వస్తువు, శైలీ శిల్పం, ప్రెజెంటేషన్ ప్రత్యేకత. యువ రచయితలు పరిణతి పొందే క్రమంలో ఈ దశకు తప్పనిసరిగా ఎదగాలి. 1968 లో అచ్చయిన ‘జగిత్యాల కథ’ కూడా ఒక మొత్తం సమాజ పరిణామాన్ని కుటుంబ సంబంధాలను ఉమ్మడి కుటుంబం, వ్యక్తి కుటుంబసలుగా విడిపోతున్న తీరును చిత్రించిన కథే. అందుకే అలాంటి మార్పు కోసం నా కథలను కూడా దశలవారీగా, పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటూ చైతన్యాన్ని కలిగించేలా రాశాను.

18. మీ కథా కథనాన్ని విశ్లేషిస్తూ విహారి గారు రచించిన ‘నవ్య కథాశిల్పి- బిఎస్ రాములు’ పుస్తకంలోని విశేషాలు ఏవి?

జ :-  కథా వస్తువు ఎవరిది? ఆ పాత్రలు, సంఘటనలు ఎవరివి? ఎవరి జీవితం గురించి రాశారు? వీటిని వివరిస్తూ ‘నవ్య కథా శిల్పి-బిఎస్ రాములు’ అని సుప్రసిద్ధ సాహితీ వేత్త విహారి గారు ఎంతో ప్రేమతో ఆ పుస్తకం రాశారు. కాలం తెచ్చిన మార్పు, గెలుచుకున్న జీవితం, చికాగోలో నానమ్మ అనే మూడు కథా సంపుటాలను తమ పరిశీలనకు తీసుకున్నారు. ఆ కథల్లో ఏ ఏ వృత్తులున్నాయో వాటిని చిత్రించారు. మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, బిసి ల పట్ల, చేతి వృత్తుల పట్ల సహానుభూతితో జీవితాలను, సంస్కృతిని చిత్రించారని ప్రతి కథ గురించి చక్కగా విశ్లేషించారు. అది ఒక రకంగా ఎమ్ ఫిల్, పి హెచ్ డి సిద్ధాంత గ్రంథంతో సమానమైనది. వారు విశ్లేషించిన తీరు, పరిణతి అనితరసాధ్యం . కథలు రాయడం నేర్చుకున్న తర్వాత మంచి కథలు రాయడానికి, గొప్ప కథలు రాయడానికి ఈ పుస్తకం తప్పక చదవాలి. అసలు అలాంటి వారికోసమే ఈ పుస్తకం విహారి గారు రాసినట్టున్నారు. నేను ‘కథలబడి’ లో కథారచనకు కథకుడి పాఠాలు అనే అలంకార శాస్త్రాలలో చెప్పిన అంశాలు, విశ్లేషణలు వీటి తరువాత ఇంకేం చెప్పాలో? ఇంకేం చదవాలో? అనే పరిశీలనా విశ్లేషణ విహారి గారు అందించారు. 

19. సామాజిక తత్వవేత్తగా, రచయితగా, సాహితీ విమర్శకులుగా ప్రసిద్ధి పొందిన మీరు దేన్ని ఎక్కువ ఇష్టపడతారు? ఎందుకు?

జ :- మొట్టమొదట కథలు అచ్చులో చూసుకోవాలని కథలు రాయడం ప్రారంభించాను. తర్వాత ఎదిగిన క్రమంలో సిద్ధాంతాలను అధ్యయనం చేసి సమాజం, దేశం బాగుపడాలని ఆర్ ఎస్ ఎస్ లో చేరాను. మత ప్రాధాన్యత పెరగడం చూసి, బయటకు వచ్చాను. పేద ప్రజలకు మేలుచేయడం, సామాజిక న్యాయం కోసం విప్లవోద్యమంలోకి వచ్చాను. దాంట్లో తీరుతెన్నులు మారడంతో ఇలా కాదని బయటకు వచ్చాను. బిసి,ఎస్సీ, ఎస్టీలు అధికారంలోకి రావాలనుకున్నాను. దాని కంటే ముందు తెలంగాణ రావాలనుకొని తెలంగాణ రాష్ట్రోద్యమంలో ప్రవేశించాను. అన్యాయమైన మన ప్రాంతం గురించి ఆలోచన. అంటే నా భావజాలంలో మార్పు వచ్చింది కదా! దానికి ఎంత సంఘర్షణ జరిగి ఉండాలి? ఎంత సంఘర్షణ జరిగితే ఒక ఆస్తికుడు నాస్తికునిగా మారతాడు? ఎంత భావజాలంలో మార్పు వస్తే పురుషాధిక్యత నుండి స్త్రీ వాదాన్ని కొత్త కోణంలో అందించా గలుగుతాడు. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను, జాతీయోద్యమాన్ని, కాంగ్రెసును, ఆర్థిక శాస్త్రాన్ని, అంబేద్కరిజాన్ని అన్నింటినీ అధ్యయనం చేశాను. 1977 నుండి బౌద్ధ అధ్యయనం మొదలుపెట్టాను. సాంప్రదాయిక, వైదిక సాహిత్యం ఆర్ ఎస్ ఎస్ నుండి మొదలుకొని మొన్నటి విప్లవ సిద్ధాంతాల వరకు చేసిన  అధ్యయనంతో తాత్వికత ఏర్పడింది. మా పెదనాన్న మిట్టపల్లి రాజయ్య 50 ఏళ్ళ పాటు అచలతత్వ గురువు. ఆయనకు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో వేలాదిమంది శిష్యులుండేవాళ్ళు. బాల్యంలో ఆ ప్రభావం నామీద పడింది.  “బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేడ్కరిజం ప్రతీత్య సముపాద్య” అనే పుస్తకంలో రెండున్నర వేల ఏళ్లుగా సాగుతూ వస్తున్న సోషలిస్టు భావ పరిణామాన్ని, నిర్మాణాలను, అవగాహనలను వివరించాను. 11 వ శతాబ్ది వరకు బౌద్ధమే సోషలిజాన్ని ఏవిధంగా చూపించిందో రాస్తూ, అంబేద్కర్ భారత రాజ్యాంగంలో సమసమాజాన్ని, లౌకిక తత్వాన్ని, శాంతియుత పరివర్తన, సామాజికన్యాయం గురించి ఏమని చెప్పాడో క్రోడీకరించాను. మార్క్సిజం వెలికి తెచ్చిన అంశాలను వివరించాను.  భావజాల పరిణామం లేకుండా మార్పు జరగదు.  తాత్వికరంగంలోనే మొదట మార్పు రావాల్సి ఉంటుంది. అందువల్ల ఆ రంగంలో ఎక్కువ కృషి చేశాను. అది చదివిన వారు ఎదిగారు. వారి కథల్లో, నవలల్లో మార్పులు తెచ్చుకున్నారు. నా రచనల్లో తాత్వికత ఎక్కువ. అంతర్లీనంగా అన్నిచోట్లా అది కనిపిస్తుంది. అందుకు కారణం తాత్విక రచనలు చేయడమే. ఏక కాలంలో ఫిలాసఫీతో పాటు ఫిక్షన్ రాయడం అవసరమైంది. జీన్- పాల్ స్రాత్రే కూడా అలాగే రెండురాయాల్సి వచ్చింది. రెంటిలోను మేము విజయమే సాధించామని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

20. మీ జీవితంలో విభిన్న పార్శ్వాల్లో ఉన్న అంతస్సూత్రం ఏమిటి?

జ :- అనేక కోణాల్లో నేను కూడా ఈ ప్రశ్నను  అనేక సందర్భాల్లో వేసుకున్నాను. ఈ పరిణామాల అంతస్సూత్రం, ఏక సూత్రత ఏమిటి? అని. మిత్రులు, సాహితీ వేత్తలు, నేను చర్చించుకున్నాం. సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు సాధించడం, అసమానతలు తొలగిపోయి వివక్ష వెలివేతలు నిర్మూలించబడి, సమస్త వర్ణ వర్గ కుల మత భాష వివక్షతలన్నీ తొలగిపోయి మనుషులందరు సమానమే. మానవులంతా ఒక్కటే. అనే మానవీయ దృష్టి ఈ పరిణామాలన్నింటిలోను కొనసాగిన అంతస్సూత్రం. అలా బౌద్ధ, హిందూత్వ, మార్క్సిజం, అంబేడ్కరిజం, బహుజన వాదం, స్త్రీ వాదం, మానవతా వాదం వీటి యొక్క సంశ్లేషణయే వీటన్నిటిలో కొనసాగిన పార్శ్వాలు. అభివృద్ధి చెందిన వారికి, అధికారాలు అందిన వారికి, అభివృద్ధి, అధికారం అందని వారికి, అందుకోలేనివారికి, అందుకోవాలనే విషయం కూడా తెలియని వారికి నిరంతరం అసమానతలుంటాయి. వాటిని పరిష్కరించు కుంటూ పోవడమే సోషలిజం. సమసమాజ నిర్మాణం, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అందరికీ సమాన హక్కులు, అవి అందుకోలేని వారికి ప్రత్యేక ప్రాతినిథ్య ఏర్పాట్లు రిజర్వేషన్లు మొదలైనవి. భారత రాజ్యాంగం ఈ మౌలిక అంశాలకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగం ప్రవేశికలోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. బహుళ పార్టీ వ్యవస్థలో శాంతియుతంగా ఈ లక్ష్యాలను సాధించుకోవడమే భారత రాజ్యాంగం ఉద్దేశించబడింది. అందువల్ల రాజ్యాంగ పరిధిలో సాధించుకోవాల్సిన అన్నిటినీ ఎలా సాధించుకోవాలో చెప్పడం, నాయకత్వం వహించడం కర్తవ్యంగా స్వీకరించిన వారే ఈ దేశానికి నిజమైన నాయకులు, గురువులు. ప్రతీ మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు అనే తాత్వికతకు సంబంధించిన తత్వశాస్త్రం ఇంకా పుట్టలేదు. ‘గతి తర్క తత్వ దర్శన భూమిక’, ‘బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేడ్కరిజం’, ‘బహుజన తత్వం’, ‘అంబేడ్కరిజం-సోషలిజం’ మొదలైన తాత్విక రచనలు ఈ ప్రయత్నంలో వెలువడినవే. సామాజిక తాత్విక సాహిత్య రంగాలలో ఏక కాలంలో కృషి చేశాను. అందుకే ఈ మూడు రంగాలు నాకిష్టమైనవే. నా జీవితమంతా వీటి చుట్టూతా పెనవేసుకొని సాగింది.

21. బిసి కమిషన్ చైర్మన్ గా మీరు ప్రజల కోసం ఏ విధమైన పనులు చేపట్టారు?

జ :- బిసి కమిషన్ చైర్మన్ గా పని చేయడం జీవితంలో మరచిపోలేని ఒక మహత్తర అధ్యాయం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసి పని చేసిన క్రమంలో నేను కేసీఆర్ ఎదురెదురుగా మూడవ వ్యక్తి లేకుండా వందల, వేల గంటలు కొన్ని సంవత్సరాల పాటు చర్చించుకున్నాము. మేము చర్చించని విషయమంటూ లేదు. “సాహచర్యంలో 6 నెలల్లో వారు వీరవుతారు. వీరు వారవుతారు” అని సామెత ఉండనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను అనుకున్నదానికన్నా ఎన్నోరెట్లు ఉత్తమమైన బాధ్యతను అప్పగించారు. 3కోట్ల డెబ్భై లక్షల జనాభాలో రెండు కోట్ల 20 లక్షలు బిసిలే. బిసి కమిషన్ చైర్మన్ గా సగం ముఖ్యమంత్రితో సమానం అని కేసీఆర్ ప్రశంసించారు. బాధ్యత అప్పగించారు. బిసి కమిషన్ ఛైర్మన్ గా పదవీ స్వీకారం చేశాక చాలా విషయాలు కొత్తగా అర్థమైనాయి. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చాలా దగ్గరగా, సన్నిహితంగా చూడడం జరిగింది.  ఛైర్మన్ అయిన తరువాత భాష మారింది భావ వ్యక్తీకరణ మారింది. సామాజికోద్యమాల్లో మాట్లాడినప్పుడు నా భాష వేరు. ప్రశ్నించడం, ఎదిరించడం ఉత్తేజపరచడం ఆనాటి పద్ధతి. బిసి కమిషన్ చైర్మన్ గా అప్పుడు వేటినైతే ఎదిరించానో దాన్ని పరిష్కరించే బాధ్యత ఏర్పడింది. అందువల్ల భాష కూడా మారుతుంది.  కథల్లో, నవలల్లో, విమర్శలో, వ్యాసాలలో ఈ మార్పు గమనించవచ్చు. భారత రాజ్యాంగ విలువ తెలిసింది. ‘భారత రాజ్యాంగ ముఖ్యాంశాలు’ అనే పుస్తకం కూడా రాశాను. ఇతర రాష్ట్రాల బిసి కమిషన్ నివేదికలను అనువాదం చేసి ముద్రించడం జరిగింది. మండల కమిషన్, ఎమ్ ఎస్ జనార్దనం కమిషన్, అనంతరామన్ కమిషన్, మురళీధరరావు కమిషన్ మొదలైన వాటిని తెలుగు చేసి ప్రచురించడం జరిగింది. ‘భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు’ పుస్తకంలో రాశాను. ఇంకా ఏం చేయాలి ముందు మాటలో రాశాను. వీటన్నింటినీ చూస్తే విప్లవంలో జరుగుతున్న లోపాలు మరిన్ని తెలిశాయి. విప్లవోద్యమాలు చేసేవాళ్లు ప్రతి ఒక్కరు కనీసం భారత రాజ్యాంగం గురించి వేసిన బుక్ చదివితే ఒక చక్కటి అవగాహన కలుగుతుంది. కమిషన్ ఛైర్మన్ గా అవగాహన, పరిణతి పెరిగి పరిభాష మారింది. ఏది రాసినా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను అనుసరించి రాయడం జరిగింది.  అంతకుముందు ఛైర్మన్ గా పని చేసిన వాళ్ళను గురించి చదవడం, రాజ్యాంగాన్ని అధ్యయనం చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సాధికారికంగా ప్రజల దగ్గరకు వెళ్ళి వారి కష్టనష్టాలను తెలుసుకున్నాను. వాటికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అత్యంత పేదరికంలో ఉన్న 17 కులాలను గుర్తించి 14 కులాలను బిసి(ఎ) లో, 3 కులాలను బిసి(బి) లో చేర్పించడం జరిగింది. అన్ని రంగాలలో వారికి అవకాశాలకు అర్హత కల్పించాము. కొంతమంది మతం మార్చుకున్నప్పటికీ కులవృత్తులు మారలేదు. అటువంటి బిసి (ఇ) గ్రూపులో ని 14 కులాల వారికి రిజర్వేషన్ శాతం పెంచాలని ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. దాన్ని మంత్రిమండలి ఆమోదించి కేంద్రానికి పంపింది. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు, నేను అనేక చర్చలు చేశాము. దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శవంతంగా ఉండేలాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పథకం గురించి చర్చించాము. అందులో రెండు బర్రెలను, ఇంటి వెనుక 100 వనరాజ, గిరిరాజ కోళ్లను పెంచుకుంటే. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆ దృష్టి తో చర్చించాము. బలహీన వర్గ విద్యార్థులకు హాస్టళ్లకు బదులుగా రెసిడెన్సీ స్కూళ్ళు ఏర్పాటు చేయాలనేది నా 35 ఏళ్ళ కల. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆ కల నెరవేరింది. ఇప్పుడు 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలతో ఐదున్నర లక్షల మంది బాలబాలికలు  చక్కని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందుకుంటున్నారు. వారికి రెసిడెన్సీ స్కూల్లో చేరగానే రెండు నెలల పాటు  ఇంగ్లీషు మీడియంలో ఇంగ్లీషులో మాట్లాడే ఉచ్చారణ హాండ్ రైటింగ్ అందంగా కుదిరేలా రాయడం నేర్పుతారు. 9వ తరగతికి వచ్చేసరికల్లా పిల్లలు ప్రపంచ జ్ఞానాన్ని అందుకొని చక్కని వక్తలుగా ఎదుగుతున్నారు. ఇది ఒక గొప్ప కాంట్రిబ్యూషన్.    తెలంగాణ తల్లి’ అస్తిత్వం ఉండాలని 8 నెలలు కష్టపడి అనేక రూపాలనుండి తెలంగాణ తల్లిని ప్రస్తుత రూపానికి తీసుకురావడం జరిగింది. ఉద్యమంలో ఉన్నప్పుడు చేయాలనుకున్నవి కొన్ని ప్రభుత్వంలోకి వచ్చాక సాధికారికంగా చేయడం జరిగింది. ప్రభుత్వంలో ప్రోటోకాల్స్ ద్వారా అత్యున్నత గౌరవాలు అందుకున్నప్పుడు కలిగే ఆనందం, పెరిగే బాధ్యత మనిషిని ఉన్నతీకరిస్తుంది. అలా గవర్నర్, ముఖ్యమంత్రి , మంత్రులు, ఐ ఏ ఎస్ అధికారులు వందలాదిమందిని కలుసుకొని చర్చించడం జరిగింది. పలు కుల సంఘాల నాయకులకు ఆయా రాష్ట్రాల బిసి కమిషన్ నివేదికల అనువాదాలను పంచి, ఉచితంగా వచ్చే సౌకర్యాలను వివరించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బిసి కమిషన్ ప్రతిష్ఠను, ప్రాచుర్యాన్ని కలిగించడంతో పాటు గొప్ప స్ఫూర్తిని నింపింది. ఇలా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు సాన్నిహిత్యం చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో బిసి ఉద్యోగులు, వారి శాతం, బిసిల కోసం పెట్టే నూతన పథకాల అవకాశాలు , ఉద్యోగాల ఖాళీలను ఎలా నింపుతున్నారు తెలుసుకోవడం జరిగింది. పారిశ్రామికీకరణ వల్ల యంత్రాల వినియోగం వల్ల లక్షలాదిమందికి ఉపాధి లేకుండా పోయింది. సుమారుగా 45 శాతం ప్రజలు ఉపాధి కోల్పోయి ఇతరుల మీద ఆధారపడి బతకడం జరుగుతున్నది. ఉన్న ఊరు వదిలి, ఇళ్లను వదిలి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు skilled, un skilled labour గా వలస బతుకులు బతకాల్సి వస్తున్నది. వీరికి జిల్లా పరిధిలో ఉపాధి కల్పించే అవకాశాలు పెంచడం ఎలా? ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని 97 డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులను, ప్రిన్సిపాల్ సెక్రెటరీలను పిలిచి మాట్లాడడం జరిగింది.  అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లను  బిసి కమిషన్ కార్యాలయానికి పిలిచి విద్యార్థులలో బిసిలు, ఉద్యోగులలో బిసిలు,ఖాళీలు, ఉపాధికల్పనకు సంబంధించిన విషయాలను చర్చించడం జరిగింది. బిసి రిజర్వేషన్ కోటాను పాటించని వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయా వ్యక్తులకు, సామాజిక వర్గాలకు సంబంధించిన విజ్ఞప్తులు వచ్చినప్పుడు వాటిని పరిశీలించి పరిష్కరించేలా కృషి చేశాము. ఆసరా పథకం, కళ్యాణలక్ష్మి, బీడీ కార్మికులకు ఆసరా, ఆర్ టి సి కార్మికుల సమస్యలు మొదలైనవెన్నో మా దృష్టికి వచ్చాయి. ఎప్పటికప్పుడు వాటిని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. బిసిల చైతన్యం పెంచడంలో బిసి కమిషన్ నిర్వహించిన పాత్ర మహత్తరమైనది. అలా మూడేళ్లు బిసి కమిషన్ ఛైర్మన్ పదవీ కాలం జీవితంలో మరచిపోలేని అధ్యాయం.

22. సీనియర్ సాహితీ వేత్తలైన మీరు మా మయూఖ పత్రిక ద్వారా నేటి రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.

జ :-  నా సూచన ఏమిటంటే బాగా చదవాలి. ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా పరిశీలించాలి. రాజకీయాలతో, ప్రభుత్వ నిర్ణయాలతో, సామాజిక ఉద్యమాలతో సైన్స్ అండ్ టెక్నాలజీతో, ప్రపంచీకరణ ప్రయివేటీకరణతో, ప్రచార, ప్రసార దృశ్య మాధ్యమాలతో, మానవ జీవితంలో, కుటుంబ సంబంధాల్లో సంస్కృతిలో , ఆలోచనల్లో , ఆశయాల్లో వస్తున్న మార్పులను పసిగట్ట గలగాలి. వాటిని కథల్లో నవలల్లో దృశ్య మీడియాలలో చిత్రించగలగాలి. బాధితుల, పీడితుల వైపు నిలబడి వారికి మద్దతుగా వారి ఆత్మవిశ్వాసం పెంచే విధంగా రచనలు చేయాలి. ఆత్మహత్యలు ఆగిపోయి, ఆ కష్టాలను అధిగమించి, జీవితాన్ని గెలుచుకోగలం అనే విశ్వాసాన్ని కలిగించాలి. నిరాశా నిస్పృహలు కలిగించే సాహిత్యం, భయపెట్టే సాహిత్యం, పిరికివారిని చేసే సాహిత్యం మంచి సాహిత్యం కాదు. వేల సంవత్సరాలుగా శూద్రులు, అతి శూద్రులు ఆదివాసులే సమస్త సంపదల సృష్టికర్తలు. సమస్త నైపుణ్యాలు వారు అభివృద్ధి పరచినవే. ఖనిజాలు, లోహాలు వెలికి తీశారు. కత్తులు, ఆయుధాలు, కోటలు ,దుర్గాలు దేవాలయాలను నిర్మించారు. సంగీతం, కళలు సామూహిక ప్రదర్శనలు వారు సృజించిందే. ఆధునిక పారిశ్రామిక అభివృద్ధి 1810 నుండి విస్తరించి వీరందరూ ఉపాధి కోల్పోతూ వస్తున్నారు. ఈ సమాజ సంపద సృష్టికర్తలు ఇవాళ వెనుకబడిన తరగతిలో వర్గీకరించబడ్డారు. వీరంతా దేశ జనాభాలో 70 శాతానికి పైగా ఉంటారు. వారికి విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, ఉన్నత జీవన ప్రమాణాలు నూతన నైపుణ్యాలు అందించడం ప్రభుత్వంతో పాటు అందరి బాధ్యత. ఇవి ఏ మేరకు అందుతున్నాయో, అందలేక పోతున్నాయో కథల్లో, నవలల్లో చిత్రించినపుడే అవి సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఇంగ్లీషు కథలు, నవలలు చదవాలి. మంచి సినిమాలు చూడాలి. ఇప్పుడు నవలలకు ప్రాధాన్యత పెరిగింది. పాశ్చాత్య సాహిత్యంలో వాళ్ళు ఎలా రాస్తున్నారో తెలుసుకోవాలి. వాళ్ళవి ఎదిగిన జీవితాలు. అయినా శైలీ శిల్పం, జీవితాలను పరిశీలించే తీరు ఇవన్నీ గమనించాలి.  రచయితలు ఒక కుటుంబానికి పరిమితం కాకుండా ప్రభుత్వాలు, పథకాలు, వాటి అమలు, చట్టం, న్యాయం, రాజకీయ పరిణామాలు, ఉద్యమాలను అవి మలువుతున్న తీరును రాయాలి. రచయితలు సామాజిక శాస్త్రాలను, ఆర్థిక శాస్త్రాలను చదవాలి. ప్రతి ఏటా కథలకు, నవలలకు ఎన్నో సంస్థలు బహుమతులు ఇస్తుంటాయి. అలాంటి భారతీయ రచనలను అంతర్జాతీయంగా ఇస్తున్న ‘బుకర్ ప్రైజ్’ గెలుచుకున్న రచనలను చదవాలి. సోవియట్ రష్యా, అమెరికా, యూరప్ సాహిత్యం చాలా గొప్పవి. ‘మొపాసా’ అనే ఫ్రెంచ్ రచయిత 150 ఏళ్ళ క్రింద రాసిన సాహిత్యం చదివితేనే ఇంత గొప్పగా ఎలా రాయగలిగారు? అనిపిస్తుంది. మరి మనం ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం? ఇతర దేశాల్లో  వ్యక్తి కుటుంబాలు ఉంటాయి. మన దగ్గర సమిష్టి కుటుంబాలు, కులాలు ఇవన్నీ ప్రాధాన్యం వహిస్తాయి. రచనల్లో ఆ ప్రభావం తప్పక ఉంటుంది.  వాస్తవిక చిత్రణల్లో రచన చేయగలగాలి. డా. కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే అద్భుతమైన నవలను రాశాడు. అది చదివినప్పుడు పందుల వెంట మనమే వెళ్తున్న భావన కలుగుతుంది. అంత చక్కగా పాఠకులను పాత్రలోకి సంలీనం  చేయగలిగారు. ‘వేట’ కథ రాసిన అల్లం శేషగిరావు క్రూర మృగాలను గురించి వాస్తవాలు చిత్రించాడు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? అనివార్యం ఎందుకైంది?  ఆ అనివార్యం ఎందుకైందో చెప్పడమే తాత్వికత. పాఠకులు పాత్రలతో మమేకమై పోవాలి. అందుకే ఆ స్థాయి రచనల కోసం మనం ప్రయత్నించాలి. ప్రపంచ భాషల సాహిత్యాన్ని మనం చదువుతున్నాం.  “తెలుగు సాహిత్యాన్ని చదవాలి” అని ప్రపంచ దేశాలు వారి భాషల్లోనికి అనువదించుకొని చదవాలి. అనే ఆసక్తి కలిగినప్పుడు మన తెలుగు సాహిత్యం ప్రపంచస్థాయికి ఎదిగినట్టు లెక్క.

మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మీ భావజాలాన్ని, మీరు సమాజం కోసం పడిన తపనను, సాహిత్యం కోసం చేసిన కృషిని గురించి ఓపికగా సమాధానాలు చెప్పినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున మరీ మరీ ధన్యవాదాలు.

July 25, 2024 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహిత్యంలో చిరుధాన్యాలు – జొన్నలు

by Acharya Madireddy Andamma July 25, 2024
written by Acharya Madireddy Andamma

సాహిత్యంలో అనేకరకాల ప్రక్రియలున్నాయి. అందులో చాటువులు కూడా ఒక భాగం. చాటువుకు నైఘంటికార్థం ప్రకారం ‘ప్రియమైనమాట (చాటు: ప్రియవచనం). ఆ చాటువు (ప్రియమైనమాట) వచనరూపంలో, గేయరూపంలో, పద్యరూపంలో ఎలా అయినా ఉండవచ్చు (ప్రస్తావన, సంస్కృతాంధ్ర చాటుమణిమాల). చాటువుల్లో చిరుధాన్యాల గురించి తెలుసుకుందాం.

చిరుధాన్యాలు: నైఘంటికార్థం

చిఱు:

చిఱు : వై. విణ. వృత్తి యందు చిఱుత శబ్దమునకు మీది వర్ణము లోపింపగా మిగిలిన రూపము. ఉదా. చిఱుగజ్జె,

చిఱుగెంపు, చిఱుచెమట, చిఱుచేప, చిఱుగాలి మొదలైనవి. చిఱుత – చిఱు చిరు

ధాన్యము(0):

ధాన్యము (0) వ 1. కొలుచు (నవధాన్యములు – గోధుమలు, యవలు, పసలు, సనగలు, కందులు, బొబ్బరలు, నువ్వులు, మినుములు, ఉలవలు), 2, దనియాలు (శ.ర). భాషాపరంగా చూస్తే చిరుధాన్యాలు, సిరిధాన్యాలు(శ్రీ-సిరి, ధాన్యాలు) దుష్టసమాసాలు.

సాహిత్యంలో ఒక భాగమైన చిరుధాన్యాల గురించి తెలుసుకుందాం. ఆంగ్లకొలమానం ఎక్కువగా వాడుకలోకి రాక పూర్వం ఏ ధాన్యాలనైనా కొలపాత్రలతో – తవ్వ, పేరు, మానిక, అడ్డ, కుండతో మొదలైన వాటితో కొలిచేవారు. ఈ కారణంగానే ‘కొలుచు’ అనునది ధాన్యానికి మారుపదంగా నిఘంటువుల్లో చేరిందని చెప్పవచ్చు. పదాలకు సంకోచవ్యాకోచాలు చెందుతుంటాయి. అది సహజం. అందువల్లనే ‘నన్నయనాటి కంపు మనకు ఇంపుగాదు’ అని ఈనాడు అంటున్నాం. నన్నయ నాడు (క్రీ.శ.11వ శతాబ్దం) కంపు పదానికి కేవలం ‘వాసన’ అనే అర్థం ఉండేది. ఈ నాడు కంపు అంటే ‘ముక్కు మూసుకునేంత దుర్వాసన’ అనే అర్థంలో ప్రయోగిస్తున్నాం. అలాగే ధాన్యం అనే పదం యొక్క అర్థం ‘కొలుచు’ అనే క్రియాపదం ‘కొలిచే పంట’కు పర్యాయపదంగా మారిందనవచ్చు.

ధాన్యాలు అనేకరకాలు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. వాటిని మనం అనేకరకాలుగా – ఆకారస్వరూపం, పంటపండే కాలం, వంటవండించే పద్ధతులు, విత్తేపద్ధతులు, ఉపయోగం మొదలైన వాటిని బట్టి విభజించవచ్చు. గత థాబ్దం నుండి ‘చిరుధాన్యాల’నే పదం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. దానికి అనేక కారణాలున్నాయి. వాటన్నిటి గురించి ఇక్కడ చర్చించడం భావ్యం కాదు.

చిరుధాన్యాలుగా ప్రధానంగా రాగులు, ఊదలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు మొదలైనవాటిని మాత్రమే మనం పరిగణిస్తున్నాం. రాగులు, కొర్రలు మొదలైనవి 90 రోజుల్లోనే చేతికి వస్తాయి. కాని వీటి కన్నా సజ్జలు, జొన్నలు ఎక్కువ కాలం తీసుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ కేవలం జొన్నలు, వాటితో చేసిన అంబలి గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. చాటువుల్లోనూ, శిష్టసాహిత్యంలోనూ వీటి ప్రస్తావన గురించి తెలుసుకుందాం.

జొన్నకూడు, అంబలి:

కావ్యయుగం(క్రీ.శ.14-15వ శతాబ్దం)లో శ్రీనాథుడు మిక్కిలి పేరుపొందినవాడు, కవిసార్వభౌమునిగా ప్రసిద్ధుడు. అతను చిరుధాన్యాల్లో భాగమైన జొన్నలతో తయారైన ఆహారం గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం.

కంద పద్యం:

రసికుడు పోవడు పలనా

డసగంగా రంభయైన ఏకులె వడకున్‌

వసుధేశుడైన దున్నును

కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్‌ (సంస్కృతాంధ్ర చాటుమణిమాల)

(పలనాడులో రంభ వంటి అందగత్తె కూడా ఏకులే వడకుతుంది. అక్కడి దొరలు (వసుధేశుడు, రాజు) కూడా (నాగలి పట్టి),పొలం దున్నుతాడు. మన్మథుడైనా జొన్నకూడే తింటాడు. కాబట్టి రసికుడు ఎవరైనా పలనాడు పోడని అన్నాడు)

పలనాడులోని పరిస్థితి:

శ్రీనాథుడు రాజాస్థానాల్లో తిరుగుతూ, భోగలాలసాలను అనుభవించినవాడు, రసిక జీవనం గడిపినవాడు. ఆయన ఒకసారి పలనాడు వెళ్లాడు. అక్కడి ప్రజల ఆహారం, ఆచారవ్యవహారాలు మోటుగా ఉండేవనీ, మోటువాడైనా, సుకుమారుడైనా జొన్నకూడే తింటారనే విషయాన్ని పరిహాసంగా పై పద్యంలో చెప్పాడు.

ఉత్పలమాల:

పుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా

డల్లదవాగ్ని మ్రింగితి వటంచును నిక్కదవేల తింత్రిణీ

పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్నకూటితో

మెల్లన యొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస గాననయ్యెడున్‌II

‘కృష్ణా! ఆనాడు నీవు చనుబాలవిషాన్ని తాగి హరించుకున్నావనీ, కార్చిచ్చును నోటిలో మింగి, చల్లార్చావనీ గొప్పలు చెప్పుకుంటున్నావు. అదేమంత గొప్ప విషయం కాదు. నీకు చేతనైతే జొన్న అన్నంలో చింత చిగురు వేసి వండిన బచ్చలికూరను కలుపుకొని, ఒక్క ముద్ద తిని చూడు. అప్పుడు నీ సామర్థ్యం తెలుస్తుంది).

శ్రీనాథుడు పలనాడులో తిరుగుతూ ఒకరింటికి ఆతిథ్యానికి వెళ్లాడు. అప్పుడాయనకు జొన్నన్నం, బచ్చలికూర భోజన0లో వడ్డించారు. ఆ సందర్భంలోనే కృష్ణుణ్ని సవాలు చేస్తూ, పై పద్యం చెప్పాడు.

శ్రీనాథుని మాటలను బట్టి చూస్తే విషాన్ని అయినా సులభంగా జీర్ణం చేసుకోవచ్చు కానీ జొన్న అన్నం, చింతచిగురు వేసి వండిన బచ్చలికూర తొందరగా జీర్ణం కాదనే విషయం తెలుస్తుంది. అంతేగాకుండా పలనాడు వాతావరణ పరిస్థితులు, ప్రజాల ఆర్థికపరిస్థితిగతులు, వర్షాధారపంటలు, ఆహారపు అలవాట్లు, ప్రజలస్థితిగతులు తెలుస్తున్నాయి.

శార్దూలం:

కుల్లాయుంచితి కోక చుట్టితి మహాకూర్పాసముం దొడ్లితిన్‌

వెల్లుల్లిం దిలపిష్టము న్మెసవితి న్విశ్వస్త వడ్డించగా

చల్లాయంబలి త్రావితిన్రుచుల దోసంబంచు పోనాడితిన్‌

తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్‌

(సంస్కృతాంధ్ర చాటుమణిమాల)

(కుల్లాయి కట్టుకున్నాను, చీర(కోక) ధరించాను, పొడుగు చేతుల పెద్ద చొక్కా తొడుక్కున్నాను. పూటకూటింటిలో విత0తువు వడ్డించగా వెల్లుల్లిని, నువ్వుపిండిని తిన్నాను. చల్లతో కూడిన అంబలిని తాగాను. రుచులను ఆశించడం తప్పని మానుకున్నాను. ఓ తల్లీ కన్నడరాజ్యలక్ష్మీ! నేను శ్రీనాథుడిని, దయలేదా అని అంటూ ఆ కన్నడతల్లికి తన దుర్దశను శ్రీనాథుడు రాజదర్శనానికి ఎదురుచూస్తున్న రోజులలో విన్నవించుకున్నాడు).

ఒకనాడు శ్రీనాథుడు కన్నడదేశానికి వెళ్లినప్పుడు రాజసన్మానం తొందరగా లభించని సందర్భంలో శ్రీనాథుడు కన్నడరాజ్యలక్ష్మితో మొరపెట్టుకున్న పద్యమిది. అని అంటారు. శ్రీనాథుడు పలనాడులోనే గాకుండా కన్నడనాడులో కూడా కష్టాలుపడ్డట్లు తెలుస్తుంది.

ఆటవెలది:

వంగతోట నుండు వరిమళ్లలో నుండు

జొన్నచేల నుండు చోద్యముగను

తలుపుమూల నుండు తలమీద నుండును

దీని భావమేమి తిరుమలేశI

పై పద్యం చదువగానే వంగతోటలో, పరిమళ్లలో, జొన్నచేలలో, తలుపుమూల, తలమీద ఉండేది ఏమిటి అనే ప్రశ్న,ఆలోచన మన మనసులో మొలకెత్తుంది. కాని కొంచెం లోతుగా ఆలోచిస్తే అందులోనే మనకు జవాబు కూడా లభిస్తుంది. పదాల విరుపును గమనిస్తే అసలు విషయం బోధపడ్తుంది.

వంగ తోటన్‌ ఉండు – తోటలోన వంగ ఉండు

వరి మళ్లలో నుండు – మళ్లలోన వరి ఉండు

జొన్న చేల నుండు – చేలన్‌ జొన్న ఉండు

తలుపు మూల నుండు – మూలన్‌ తలుపు ఉండు

తల మీద నుండును – మీదన్‌ (పై భాగాన) తల ఉండును (ఉంటుంది)

వేసవికాలం – అంబలి ప్రస్తావన:

చంపకమాల:

తెలినులి వెచ్చ యోగిరము దీయని చేరులు దిమ్మనంబులున్‌

బలుచని యంబళుల్‌ చెఱకుబాలెడ నీళ్లు రసావళుల్‌ ఫలం

బులును సుగంధ శీతజలమున్‌ నడపిందెలు నీరు చల్లయున్‌

వెలయగ బెట్టు భోజనము వేసవి జందనచర్చ మున్నుగన్‌బబ

(వేసవికాలంలో అతిథులకు ముందుగా తాపం చల్లార్చే గంధపుపూతపెట్టి, ఆయా పదార్థాలు వడ్డిస్తున్నారు.

కొంచెం వేడి గల అన్నం, తియ్యనిచారు, తీపిపదార్థాలు, పలుచని అంబళులు, చెరకుపాలు, కొబ్బరినీళ్లు, తీపి భక్ష్యాలు, పండ్లు, వాసనగల చల్లనినీరు, వేసవి వడను పోగొట్టడానికి ఊరవేసిన మామిడి పిందలు, నీరులెక్కువగా కలిపిన మజ్జిగతో తృప్తికలిగే విధంగా (విష్ణుచిత్తుడు అతిథులకు భోజనం పెట్టును. (ప.81, ప్రథమాశ్వాసం, ఆముక్తమాల్యద) (పైన చెప్పిన పదార్థాలన్నీ వేడిని పోగొట్టే పదార్థాలు), సజ్జ వేడి, జొన్న చలువ అంటారు.

పై పద్యాలను బట్టి చిరుధాన్యాల వైశిష్ట్యం, వాటిని తినడానికి రసికులు పడే కష్టాలు, ప్రజల స్థితిగతులు తెలుస్తున్నాయి. అంతేగాకుండా ‘ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే నానుడి కూడా ఈ చిరుధాన్యాలకు వర్తిస్తుంది. ఒక నాడు తినడానికి అయిష్టపడేవారు ఈనాడు ఆరోగ్య కారణంగా రొట్టెలు, ఉప్మా, గట్క, అంబలి, జావా రూపంలోతప్పనిసరిగా తినవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

జొన్నలు పండే ప్రాంతానికి జొన్నలగడ్డ(గెడ్డ) అనే పేరు ఉన్నట్లుగానే ఆ పేరుతో ఇంటిపేర్లు కూడా ఉన్నాయి. జొన్నలగడ్డ(గెడ్డ), జొన్నాడ అనే ఇంటిపేర్లు రెడ్లలో, బ్రాహ్మణుల్లో కనిపిస్తున్నాయి (బ్రాహ్మణుల గోత్రములు, ఇండ్లపేర్లు -శాఖలు). జొన్నలగడ్డ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులు ‘ఇంటర్‌ నెట్‌’ లో కూడా కనిపిస్తారు. జొన్నలగడ్డ గ్రామం గు0టూరుజిల్లాలో ఉంది. చిరుధాన్యాలలో భాగమైన జొన్నలు భోగిపండ్లలోనూ, తలంబ్రాలలోనూ కలుపుతారు. జొన్నలు కేవలం ఆహారం మాత్రమే గాకుండా ఒకసాంస్కృతిక వస్తువు అని కూడా చెప్పవచ్చు. వరిధాన్యాన్ని పొట్టుధాన్యంగానూ, సజ్జలు. జొన్నలను గట్టిధాన్యంగానూ పరిగణిస్తారు. వీటిలో పొట్టురూపకంగా ధాన్యం వృధా కాదు.

ఇలా జానపదుల రామాయణం కథలో భరతునికి పన్ను ఎగవేయడానికి (మోసగించడానికి కూడా ఈ జొన్న ఉపయోగపడింది. భరతుడు ‘మంచి ఫిలాసఫర్‌ (తత్త్వవేత్త). కాని సమర్థుడైన పరిపాలకుడు కాడు. హరతుని మంచితనాన్ని అలుసుగా తీసుకొని రైతులు పంటలు పండలేదని, పన్నులు ఎగవేస్తుంటారు. మంత్రులు ఈ విషయాన్ని భరతుని దృష్టికి తీసుకు వస్తారు. అప్పుడు భరతుడు ‘పంట పైకి కనిపించే విధంగా) వంగడాలు వేయమని చాటింపు వేస్తారు. రైతులు మొక్కజొన్న వేస్తారు. రైతులు మొక్కజొన్నలు విత్తి, మధ్యనున్న కంకులు తెంపుకొని, పంట పండలేదనిభరతునికి చూపిస్తారు.

భరతుడు ఈ సారి మొక్కమధ్యలో కాత కాసే పంటలు వేయమంటాడు. అప్పుడు రైతులు ఉల్లిగడ్డ, వేరుశనగ మొదలైనవి వేస్తారు. వీటికి పైన పూలు వస్తాయి. కాని భూమిలోపల (మొక్కకింద) కాపు వస్తుంది. రైతులు భూమిలోని గడ్డలు తెంపుకొని, మొక్కలను చూపించి పంట పండలేదని చెప్తారు. ఈసారి భూమిలోపల పండే పంటలు వేయమంటాడు. అప్పుడు రైతులు ‘జొన్న’ వేస్తారు.

జొన్నకర్ర, మొక్కజొన్నకర్ర చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. రైతులు జొన్నమొక్క పైభాగంలోని కంకులు తెంపుకొని, పంట పండలేదని చెప్తారు. ఈ విధంగా జొన్నపంట పరిపాలకులను మోసం చేయడానికి కూడా పనికివచ్చింది.అందుకే పరిపాలకులకు క్షేత్రపరిజ్ఞానంకూడా ఉండాలంటారు. ఇలా ఒక్కొక్క ధాన్యం, ఆహారపదార్థం గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు.

(అంబలి – చిరుధాన్యాలపిండి, నూకలు లేదా బియ్యం చేర్చి జాలువారుగా వండిన ఆహారం., గటక(గట్క) – చిరుధాన్యాలతో గట్టిగా వండిన వంట.

బర్పట – రవ్వలాగ విసరిన ధాన్యం.

ఆధార గ్రంథాలు:

1. సంస్కృతాంధ్ర చాటుమణిమాల

2. ఆముక్తమాల్యద

3. బ్రాహ్మణుల గోత్రములు, ఇండ్లపేర్లు – శాఖలు

4. శబ్దరత్నాకరం

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

హలో హల్లూ

by Vijaya Kandala July 25, 2024
written by Vijaya Kandala

     ప్రపంచ భాషల వ్రాత లిపుల్లో మొదటి ఉత్తమ లిపి కొరియా  దేశానిది కాగా  , రెండవ ఉత్తమలిపి  తెలుగు కావడం మనకు గర్వకారణం .
కాలికి బలపం
        అవసరం ఉన్నందున దూరభారాలు లెక్కించకుండా తిరిగినప్పుడు కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అంటారు .    బలపం అనేది రాతిముక్క. పలకాబలపం అనే వి ఒకప్పుడు విడదీయలేని జంట పదాలు . ఒకప్పటి విద్య విధానానికి ఆనవాళ్ళు . ఒక్కసారి పలక  కొంటె ఒకరి తర్వాత మరొకరు వాడుకునే సౌకర్యం ఉన్న సాధనం . తిరగలేక బాధపడుతున్నట్లు ,తిరగక  తప్పదన్నట్లు చెప్పడమే దీనిలోని అసలు ఉద్దేశ్యం .
ఖండితం
                ఈ సంస్కృత పదానికి నరకబడినది అని నిఘంటు అర్థం . యుక్తులు చెప్పి ,ఒక వాదాన్ని నిరాకరించడం కూడా ఖండించడమే . ఈ రోజుల్లో ఏ రాజకీయ    నాయకుని ఏ విషయంలో అభిప్రాయం అడిగినా  యదుటివారు చెప్పింది ఖండిస్తున్నాను అనే అంటారు . దేన్ని ఖండిస్తున్నాడు ,ఎందుకూ ఖండిస్తున్నాడు అతనికే తెలియదు . అతనికే తెలీనప్పుడు మనకు తెలిసే అవకాశం లేనేలేదు . ఖండితంగా చెప్పడమంటే స్పష్టంగా ,దాపరికం లేకుండా అనే అర్థంలోనే నేడు వాడుతున్నాం
గుడ్డి గవ్వ
         కొన్ని ఏళ్ళ క్రితం గవ్వలు నాణాలుగా చెలా మణిలో ఉండేవి. అంటే గవ్వలిచ్చి ,కావలసిన సరుకులను కొనేవాళ్ళు . గవ్వ విరిగిన ,పగిలిన అది గుడ్డిగవ్వ . అది వ్యాపార వ్యవహారాలలో చెల్లుబాటయ్యేది కాదు . ఎందుకూ  పనికిరానిదని  అర్థం . బీదవారిని గుడ్డిగవ్వ పాటి ఖరీదు చేయడని  భావించేవారు .
ఘంటాపథం
         తెలుగులో ఈ పదానికి నొక్కి చెప్పుట , బల్ల గుద్ది  చెప్పుట అనే అర్థాలున్నవి . తాను నమ్మిన దాన్ని ఎదుటివారు సంశయించినప్పుడు వారికీ బోధ పడేలా నొక్కి చెప్పడం ఘంటాపథం .
చిరునామా
                        చి రునామా అనేది ఇ ప్పుడెక్కడా  వాడటం లేదు . ఆ స్థానం  లో Address వచ్చి , పీఠం వేసుకుని కూర్చున్నది .ఈ అడ్రసునే ఒకప్పుడు చిరునామా , విలాసం అనే వారు . ఇది హిందీ నుంచి వచ్చిన మాట అని సి. పి  బ్రౌన్ అభిప్రాయం . అన్యదేశ్యం అని మరికొందరి భావన . ఇ వన్నిటిని  పక్కకు నెట్టి అడ్రసు స్థిరపడింది . సులువుగా చెప్పాలంటే క్లుప్తంగా ఒక వ్యక్తి నామ , నివాసస్తలాల వివరం చిరునామా.
జరిగిన కథ
             నిజంగా సంఘటిల్లిన కథను జరిగిన కథ అంటారు . అయితే మనం ఇ ప్పుడీ అర్థంలో వాడటం లేదు . వార , మాస పత్రికలు పెద్ద కథలను ,ధారావా హికలను  ప్రోత్సహించడం ,ప్రచురించడం మొదలె ట్టాక  కథలోని కొద్ది భాగాన్ని ప్రచురించి ,మిగిలిన కథను తరువాతి సంచికలో చదవమని సూచించే అవసరం ఏర్పడింది . మిగిలిన భాగాన్ని ప్రచురించేటప్పుడు  అంతవరకూ  జరిగిందాన్ని క్లుప్తంగా చెప్పాల్సిన పరిస్తితి  ఏర్పడింది . దానివల్ల సత్యమైన ,గడచిన అనే అర్థంలో జరిగిన కథ వాడటం తప్పనిసరైంది .
టిప్పణి
              ఒ  క  గ్రంధంలోని  విశేషాలను వివరిస్తే అది టీక అనీ ,కటిన పదా లకు అర్థాన్ని వివరిస్తే అది టిప్పణీ అని సామాన్యమైన అర్థం . పద్యాల్లోని పదాలను ,అర్థాలను వచన క్రమంలో  పెట్టడమే తాత్పర్యం . తెలుగులో టీ కా తాత్పర్యాలకే ప్రచారం ఎక్కువ . ఒకనాటి సాహితీ సంప్రదాయాలను పరిచయం చేసుకోవాలంటే ఇ లాంటి పదాల పరిచయం అవసరం .
TLAYINCHU
         ఇది హిందీ /ఉర్దూ నుంచి వచ్చిన పదం . తెలుగులో పని ఎగ్గొట్టు ,మోసగించు అనే అర్థాలున్నాయి . అయితే నేడు మనం తప్పించుక తిరుగు ,తప్పుదారి పట్టించు ,మోసగించు అనే అర్థాలతో బాటు కావాలని ఆలస్యం చేయు అనే అర్థంలోనూ వాడుతున్నాం .
డ బ్బాకొట్టు
           డబ్బా అనేది హిందీ మాట  దానికి తెలుగు నిఘంటువుల్లో తుపాకీ మందు ఉంచుకునే తోలుపెట్టే అని అర్థం ఉంది దీనికి కోతలు కోయు ,పొగడు అనే వ్యవహారిక ఆర్గాలు ఉన్నాయి. నేటి వాడుకలో చప్పుడు చేస్తూ పోవడం, పొగడుకోవడంతో పాటు అనవసరంగా పొగడు ,అతిగా పొగడు అనే అర్థాలు ఉన్నాయి నేడు.
అణాకాణీ
               రూపాయికి 100 పైసల విధానం వచ్చాక రకరకాల పాత  నాణా లు వాటి లెక్కలు మరుగున పడిపోయాయి  .పేర్లు కొన్ని వ్యవహారంలో నిలిచిపోయా యి . అలాంటి వాటిలో అణాకాణీ  40 , 50 ఏళ్ల క్రితం వరకు పలుకుబడిలో ఉండేది. ఒకప్పుడు రూపాయికి 16 అణాలు అంటే 96 పైసలు ఉండేవి . దాన్నిబట్టి పదహారణాల ఆంధ్రుడు అనే మాట ఎక్కువగా వినబడేది. అంటే మాట,లో కట్టుబొట్టులో తెలుగు లక్షణాలున్న వాడని అర్థం. రూపాయిలో 16వ వంతు అణా  దాంట్లో నాలుగవ వంతు కాణీ . అందువలన చిల్లర మనిషి అనే అర్థంలో అణాకాణీ  మాట వాడేవారు. ఇలా వాడే రోజుల్లో కాణీ ఖర్చు లేకుండా పెళ్లి చేశాడు అనే మాటలు పుట్టాయి . అణా అనేది సత్తు నాణెం.
తాహతు
 తెలుగు సినిమాల్లో  తరచూ వినిపించే మాట ఇది .  హిందీలో తాకత్ అనే శబ్దం నుంచి పుట్టిన మాట.  హిందీలో ఈ మాటకు బలం , శక్తి , అధికారం అనే అర్థాలు ఉన్నాయి  తెలుగులో  అధికారంతోపాటు హోదా,స్థాయి  అనే అర్థాలు కూడా ఉన్నాయి  
        ఆయన  తాహతు  ఎక్కడ ?   మనది ఎక్కడ ? ఈ మాటలు మన సినిమాల వల్ల రాజకీయ నాయకుల వల్ల ప్రజల నోళ్లలో నానుతున్నాయి.
దుంప నాశనం
          తెలుగువారికి ప్రత్యేకమైనది  ఈ తిట్టు . మొక్కల పుట్టుకకు  ,పెరుగుదలకు మూల కారణమైంది దుంప . అది నశిస్తే , ప్రస్తుతమున్న మొక్క వంశమే నశించినట్లు లెక్క.  ఎదుటి వ్యక్తి గాక  అతని వంశమంతా నశించాలని   దీనికి అర్థం . ఇంగ్లీష్ తిట్లు  అలవాటయ్యాక  తెలుగు తిట్లు  మరిచిపోతున్నాము  అ.యినా  కొన్ని పదాల యొక్క  అసలు  అర్ధాన్ని  తెలుసుకోవాలి .
ధనియాల జాతి
      తిట్టి, కొట్టి బాధిస్తే ,గాని దారికి రాని, పని చేయని వ్యక్తులను గురించి చెప్పేటప్పుడు ఈ మాటను వాడతారు  . ధనియాలను  ఉన్నవి ఉన్నట్లు పాతేస్తే మొలకెత్తవు.   వాటిని  చెప్పు కింద నలిపి, నాటాలనేది విశ్వాసం  అలా  పీడించి, హింసించి, భాధిం చినప్పుడే గాని మర్యాదగా చెప్పితే, పనిచేయని వాళ్లని ధనియాల జాతి అంటారు.
నదీ నదాలు
 ఇది ద్వంద్వ సమాసం .  ఇందులోని నది, నదం రెండూ సంస్కృత పదాలే.   నదం అంటే తూర్పున పుట్టి, పడమటికీ ప్రవహించేది .  మనదేశంలో నర్మదా, తపతి నదాలు .  నది అంటే పడమట పుట్టి, తూర్పుకు ప్రవహించేది.   ఇంత  సూక్ష్మమైన  విషయాన్ని   గమనించి , ప్రత్యేకంగా  పేరు పెట్టిన  మన  పూర్వీకుల పరిశీలనా శక్తికి నమస్కారాలు .
పాలు
 పాలు అనగానే మనకు ఆవు , గేదె ,మేక ,గాడిద  గుర్తొస్తాయి కదా ! ఇవన్నీటిని మరిపింప చేసేది అమ్మ .ఆమె ప్రేమ . ఇవాళ పాలుకు ఉన్న ఎన్నో అర్థాలలో కొన్నింటిని చెప్పుకుందాం పాలతో కలిసి కోపాలు ,తాపాలు ,శాపాలు ,మురిపాలు ఇలా ఎన్నో రకాలు .
          కృష్ణుడు రాయబారంలో పాండవులకు సగపాలిమ్మని అడిగాడు.   ఇక్కడ పాలు అంటే భాగం . రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నప్పుడు  రాళ్ళల్లో కలిసిపోయాయని అర్థం . దేవా నా పాల రావా అంటే  నన్ను రక్షించడానికి రావా  అని భావం .   జిల్లేడు పాలు అంటే రసం అనే అర్థం .ఇలా పాలు అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి .
 ఫల సాయం
             ఫలసాయం   అన్న మాటకి పంట అనే అర్థం ఉంది .  వ్యవసాయం చేయగా వచ్చే ఆదాయం ఫలాయం . కానీ నేడు పంట దిగుబడిని సూచించడానికి ఫలసాయం అనే మాటను  వాడుతున్నాము .
బాదరబందీ
                ఒకప్పుడు నిజాం రాష్ట్రంలో  ఉద్యోగులు పొడుగాటి అంగీ ధ రించడం సంప్రదాయం . వాటికి ఇప్పట్లో లాగా గుండీలు ఉండేవి కావు .ఓవైపు తాళ్లు   ,మరోవైపు వాటిని దూర్చడానికి రంద్రాలు ఉండేవి . ఎదురెదురుగా వాటిలో నుంచి దూ ర్చిన తాళ్ళను ముడి వేసేవారు . ఇవి 12 ఉండేవి . ఈ పద్ధతిని బారాబంది , బారాబుంది అనేవారు .ఇది చాలా సమయం తీసుకుంటుంది .విసుగు పుట్టిస్తుంది .అలా ఈ బారాబంధి కాస్త బాదర  బందీగా మారిపోయింది . సరిగా కట్ట కుంటే నలుగురిలో నగుబాటు . ఇలా 12 ముళ్ళు వేయడం . విప్పటం చికాకు పుట్టించేది .ముళ్ళు సరిగా వేయకుంటే , విప్పడం మరి కష్టం . ఇలా విసుగు పుట్టించే వ్యవహారం ,అనవసర శ్రమ అనే అర్థంలో బాదరబందీ అనే పదాన్ని వాడతారు .
భత్యాలు
             పనిచేసినప్పుడు ఇచ్చేది జీతం .తర్వాత వచ్చేది పింఛన్ . బత్తా   అనే హిందీ లేదా ఉర్దూ మాటకు తెలుగు మాట భత్యం .ఇది తాత్కాలిక , ప్రత్యేక సేవలకు ప్రతిఫలంగా ఇచ్చేది . రాను రాను భత్య మనేది జీతానికి భిన్నంగా , అదనంగా ముట్ట చెప్పేది అనే అర్థం వచ్చింది .  అప్పటినుంచి  కరువు భత్యం ,దిన భత్యం ,ప్రయాణ భత్యం ,  అదనపు భత్యం ఇవన్నీ వచ్చి చేరాయి   .ఒకప్పుడు జీతభత్యాలు ధన రూపంలోనే గాక వస్తు రూపంలో కూడా ఉండేవి
మందలింపు
           తప్పుగా మాట్లాడిన వారిని , తప్పుడు పనులు చేసిన వారిని సుకుమారంగా హెచ్చరించడాన్ని  మందలింపు అంటారు . తెలంగాణ ప్రాంతంలో ఈ మాటకు పరామర్శ , ఓదార్పు అనే అర్ధాలు ఉన్నాయి . మిత్రులు , బం ధువులు ,ఆత్మీయుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పలకరించి , ఓదార్చి , కష్టసుఖాలు విచారించడాన్ని మందలించడం అని అంటారు ఈ ప్రాంతంలో .
యక్ష ప్రశ్నలు
            సమాధానం చెప్పడం సాధ్యం కానీ చిక్కు ప్రశ్నలు ఎవరైనా అదేపనిగా అడుగుతూ ఉంటే యక్ష ప్రశ్నలు వేస్తున్నాడయ్యా అని అంటారు  . ఈ జాతీయానికి సంబంధించిన కథ మహాభారతంలో ఉన్నది . పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో , ఈ సంఘటన జరిగింది .ఒకసారి  పాండవులు అందరికీ అలసట , దాహం కలిగాయి . అప్పుడు చెరువులోని నీరు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి యక్షుడు ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానాలు చెప్పితే ,ఈ నీళ్లు తాగడానికి అనుమతి ఇస్తాను అని చెప్పాడు .  యక్షుడు ఎన్నో చిక్కు ప్రశ్నలు అడిగాడు . అన్నిటికీ ధర్మరాజు సరిగ్గా సమాధానాలు చెప్పాడు .  తన తమ్ముళ్లందరినీ కూడా కాపాడుకున్నాడు.
రాజధాని
       రాజులు ఉండే ప్రధాన నగరం రాజధాని . ఇప్పుడు రాజులు  లేరు గాని , రాజభోగాలు ఉన్నాయి.   రాష్ట్రాలు ఉన్నాయి . వాటికి పరిపాలనా కేంద్రాలుగా ముఖ్య పట్టణాలు ఉన్నాయి .వాటిని కూడా రాజధానులనే పిలుస్తున్నాము . రాజు లేకున్నా పాత అలవాటు ప్రకారం ప్రధాన నగరాన్ని రాజధాని అంటున్నాము  .
లక్షణ
          మీరు సరిగానే చదివారు ఇది లక్ష్మణుడు కాదు . లక్షణ . శ్రీకృష్ణుని  అష్టభార్యలలో చివరిది లక్షణ . ఈమెను కృష్ణుడు మత్స్య యంత్రాన్ని కొట్టి ,వివాహం చేసుకున్నాడు . ఈ సంగతి అన్నమాచార్యుల వంశానికి చెందిన తాళ్లపాక తిరువేంగళ నాథుడు అష్టమహిషి  కళ్యాణం అ నే కావ్యంలో  చాలా చక్కగా వర్ణించాడు .మత్స్య యంత్రాన్ని కొట్టడం అనగానే అందరికీ అర్జునుడు మాత్రమే గుర్తొస్తాడు . ఈ లక్షణ స్వయంవరంలో భీముడు , కర్ణుడు కూడా ప్రయత్నించారు , కానీ సాధ్యం కాలేదు . చివరగా శ్రీకృష్ణుడు వెళ్లి మత్స్య యంత్రాన్ని ఛేదించి ,లక్షణను  వివాహం చేసుకున్నాడు
వారాలబ్బాయి
             ఇప్పటిలాగా వసతి గృహాలు , ఉచిత వేతనాలు లేని రోజుల్లో పేద విద్యార్థులు ఏ బడి పంచలోనో  తలదాచుకుని , సంపన్న గృహస్తులను ఆశ్రయించి , భోజన వసతి సంపాదించేవారు . ఏ ఒక్కరి మీదనో ఆధారపడక ,పూటకో ఇంట్లో తింటూ , బట్టల కోసం కొందరినీ ,పుస్తకాల కోసం మరికొందరిని , ఆశ్రయించి , చదువుకునేవాళ్లు . అలా దుర్భర జీవితం గడుపుతూ , చదువుకునే వారిని వారాలబ్బాయి అనేవారు .అమ్మాయిలు ఇలా చదివే పద్ధతి లేనట్టుంది . అందుకే వారాల అమ్మాయి అనే పదం పుట్టలేదు . ఇప్పుడు ఈ రకంగా చదివే వాళ్ళ సంఖ్య చాలా అరుదు .
శాఖాహారం
          చాలా భోజనశాలలను శాఖాహార భోజనశాల అని రాయడం , పలకటం మన అలవాటు . శాఖ అంటే కొమ్మ . శాకం అంటే కూర .మాంసాహారం దొరకదని కూరగాయల వంటలు ఉంటాయని సూచించడానికి  శాకాహారమనే మాట సరియైనది . అయితే  మనము శాఖహారం అంటే కొమ్మలనే ఆహారంగా తీసుకుంటాము అని  ఆ బోర్డు ద్వారా తెలియజేస్తున్నాం . అది సరైనది కాదనుకోండి కానీ , మనకు బాగా అలవాటైపోయింది . అయితే ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి . ఏది శాకాహారం అనే విషయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి , ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి అలవాటులో ఉంది  .అది చాలా పెద్ద విషయం తర్వాత దాని గురించి చెప్పుకుందాం .
షికారు
                ఈ పదానికి వేట ,సంచారము అనే అర్థాలు ఉన్నాయి .  ఇది పార్శీ మాట .హిందీ ,ఉర్దూ ద్వారా తెలుగులోకి వచ్చింది  మూల భాషలో భక్ష్యం, లక్ష్యం , వేట అని అర్థాలు ఉన్నాయి తెలుగులో వేట , స్వారీ ,వా హ్యాళి అనే అర్థాలు ఉన్నాయి . అడవులు తగ్గి ,క్రూర మృగాల సంఖ్య తగ్గిన తర్వాత ,వనభోజనాలకు , వినోద వ్యవహారాలకు పరిమితమైన సామాజిక జీవనంలో వేట అనే అర్థం కన్నా విహారం వాహ్యాలి అని అర్థాలకే ఎక్కువ ప్రసిద్ధి రూపంలో , అర్ధాల్లో మార్పు వచ్చిందని గుర్తుంచుకోవాలి .
సాము గరిడీలు
               సాము గరిడీ అనే రెండు మాటలు ఒకదానికొకటి పర్యాయపదాలు అనే అర్థం లో ఈ ద్వంద్వ సమాసాన్ని వాడుతుంటాము . సిగ్గు బిడియం , అందం చందం అటువంటిదే ఇది కూడా అనుకుంటాము . అయితే సాము అంటే వ్యాయామం . గరిడీ అంటే సాము నేర్చుకునే చోటు . కాబట్టి  సాము నేర్చే నేర్పే ప్రదేశాలని అర్థం.      తెలుగుదేశంలో ఒకప్పుడు తాలింఖానాలు ఉండేవి అక్కడ వ్యాయామ విద్యలు మాత్రమే నేర్పేవారు .  స్వాతంత్రం వచ్చాక ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి వీటిని గరిడీలు అని కూడా అంటారు కాబట్టి వ్యాయామశాలలు అని అర్థం .
హక్కు
               ఇది ఉర్దూ లేదా హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన మాట . . శబ్ద రత్నాకరం ప్రకారం దీనికి బాధ్యత అని అర్థం  నేటి రాజ్యాంగ ,రాజకీయ వ్యవహారాల్లో హక్కు అంటే అధికారమే గాని బాధ్యత కాదు . పదవి వల్ల ప్రత్యేక పరిస్థితుల వల్ల సంక్రమించే స్వామ్యం అధికారం హక్కు . సదరు హక్కు పొందినందువల్ల కర్తవ్యం గా భావించి చేయవలసిన పనులు బాధ్యతలు .నేటి భాషలో ఈ రెండు వేరు వేరు . హక్కు వేరు బాధ్యత వేరు .
            అందరమూ భాషను మాట్లాడుతున్నాము కానీ దానిమీద పట్టును సంపాదించుకోలేకపోతున్నాము .  కారణం శ్రద్ధ తగ్గిపోవడమే .  సామెతలు ,నానుడులు , జాతీయాలు , పదబంధాలు ,  పొడుపు కథలు ఇలాంటివి తెలుసుకున్నప్పుడు  భాష మీద పట్టు దొరుకుతుంది . అలా దొరికినప్పుడు అభిమానము పెరుగుతుంది . అయితే ,కొన్ని పదాల వెనక ఉండే అంతరార్థం కూడా తెలుసుకోవడం అనేది మన భావాలను మరింత స్పష్టంగా వెలిబుచ్చడానికి సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతోటి ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది .ఇది రెండు భాగాలుగా  రాయడం జరిగింది . ఈ రెండింటిని  చదవండి .చదివించండి .  అందమైన భాష మనది .దాన్ని మరింత అందంగా  మన భావాలను వెల్లడి చేయడానికి వాడుకుందాం .
విజయ కందాళ

July 25, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కారా మాస్టారు

by Vijaya Ranganatham July 25, 2024
written by Vijaya Ranganatham

ఈ సారి మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయాలని వచ్చాను. అతను మరెవరో కాదు, కథ అంటే కారామాస్టారే అని పిలిపించుకున్న, కథాయజ్ఞాన్ని చేసిన గొప్ప రచయిత కాళీపట్నం రామారావు గారు. తెలుగు కథలు గురించి ఏ మాత్రం పరిచయమున్నా, వీరి గురించి తెలియని వారుండరు.

కారా మాస్టారుగా పిలువబడే “కాళీపట్నం రామారావు” 1924, నవంబరు 9 న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన మురపాకలో పేర్రాజు, భ్రమరాంబ లకు జన్మించారు. శ్రీకాకుళంలో S.S.L.C వరకు చదివారు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల వివిధ ఉద్యోగాలు చేసినా స్థిరంగా చేసింది మాత్రంఉపాద్యాయవృత్తిలో. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగం చేసారు. అతను 1972లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేసారు.

కాళీపట్నం రామారావుగారు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా సుప్రసిద్ధాలు. 1966లో ఈయన వ్రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించాడు.

ఆయనఒక సందర్భంలో తన రచనా ప్రస్థానం గురించి చెబుతూ, 1935 నుండి పాఠకుడుగా బాల్యం,తరువాత 1940-1942 వరకు రాసేందుకు ప్రయత్నం, 1943 నుండి ఐదేళ్ళు చిన్నా,చితగా పత్రికల్లో ఏవోవో కొన్ని రచనలుచేసానని, 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ , భారతి వంటి పత్రిలలో పన్నెండు వరకు ఒక స్థాయి కథలు రాయగలిగానని . 1957 నుండి ఉన్నతస్థాయి కథలు రాయగలిగేందుకు అధ్యయనం, ఆ తరువాత 1963 నుండి పదేళ్ళు పాటు మరో పన్నెందు కథానికలు రాసానని అన్నారు. ఆ తర్వాత కథలైతే రాయలేకపోయాను కాని కథను గురించిన అధ్యయనము, అందుకవసరమైన ఇతర ప్రక్రియలతో సహా చదువుతో పాటు అభిప్రాయాలు పదిమంది తో పంచుకోవడమూ ఆగలేదని చెప్పారు.

ఈయన తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశారు. ఆంధ్రభూమి దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు.

ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయని,తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చాడని పలువురితో ఆయన అభినందనలు పొందారు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపాడు.

1964లో వెలువడిన ‘యజ్ఞం’ కథ ఫ్యూడల్ విధానంలోని దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి.

కారా మాస్టారు, “యజ్ఞం” కథా రచయితగా సుప్రసిద్ధుడు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.ఆం.ప్ర. సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించాడు.

ఆ తరువాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ అవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో అవార్డుని స్వీకరించారు. అవార్డుగావచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి, కథానిలయానికి పునాది వేశారు.

అతని మొదటి కథ చిత్రగుప్త లో ప్రచురితమైన ‘ప్లాట్ఫామ్‘ అనే ఒక చిన్న కథ. అది పోస్ట్ కార్డువెనుక వ్రాయబడింది . 1963లో “తీర్పు” రాశాడు. తరువాత 1960ల చివరలో “యజ్ఞం”, “మహాదాశీర్వచనము”, “వీరుడు-మహావీరుడు”, “అదివారం”, “హింస”, “నో రూమ్”, “స్నేహం”, “ఆర్తి”, “భయం”, “శాంతి”, “చావు”, “జీవన ధార”, “కుట్ర”వంటి అనేక కథలు రాశారు.

“కుట్ర” వ్రాసిన తరువాత, అతను రాయడం మానేశాడు. తన తొలినాళ్లలో తాను చాలా రాసేవాడినని, తాను రాసిన దానితో సంతృప్తి చెందకపోవడంతో వాటిని ప్రచురణకు పంపలేదని చెప్పారు. తర్వాత రోజుల్లో ఏడాదికి ఒకటి రెండు కథలు రాసేవాడు. అతని కథలు రష్యన్ మరియు ఆంగ్లంతో సహా వివిధ విదేశీ భాషలలోకి అనువదించబడ్డాయి.

కాళీపట్నం విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు కూడా.

ఆయన దాదాపు 51 కథలకు పైగా రచించి, ఎన్నో ప్రశంసలను, పురస్కారాలను ముఖ్యంగా ఎంతమందో సాహిత్యాభిమానుల మనసుల్లో కారా మాస్టారుగా చిరస్థాయిగా నిలిచి పోయారు. కాలం కృరమైంది కదా మనమాస్టారుగారిని కూడా మనకు దూరం చేసింది.  ఆయన తన 96 ఏళ్ళ వయసులో వృద్దాప్య కారణంగా 2021 జూన్ 4వ తేదీన శ్రీకాకుళంలో కన్నుమూసారు.

పురస్కారాలు

యజ్ఞం కథ కు రెండవ ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు,ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్), కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.అతను 1995లో “సెంట్రల్ కల్చరల్ అకాడమీ అవార్డు” గెలుచుకున్నారు.1993లో న్యూయార్క్‌లో జరిగిన 9వ తానా సదస్సు – ప్రపంచ తెలుగు మహాసభలకు అతిథిగా ఆయన USలో పాల్గొన్నారు.18 జనవరి 2008న లోక్‌నాయక్ ఫౌండేషన్ (విశాఖపట్నం)వారిచే సత్కరింపబడ్డారు.

బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి స్ఫూర్తి పురస్కారం -2015,

కథానిలయం

ప్రసిద్ధ కథారచయిత కాళీపట్నం రామారావుగారికి ఒక ఆలోచన కలిగింది. ఒక కథ రాయటానికి ఒక వ్యక్తి కనీసం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు వారాలు నెలలు శ్రమ పడతాడు. ఆ శ్రమ ఫలితానికి ఆయువు ఎన్నాళ్లు? అచ్చైన పత్రికని బట్టి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక మాసం. ఆసక్తీ, శక్తీగలవారు పూనుకుని పుస్తకరూపంలోకి తెచ్చుకుంటే కొన్నేళ్లు. ఇలా ఈ శ్రమంతా వృధాపోవలసిందేనా? నన్నింతవాడిని చేసిన కథాప్రక్రియలోని శ్రమనైనా కనీసం కొంతకాలమైనా భద్రపరచలేనా? అని ప్రశ్నించుకున్నారు.

అలా పుట్టింది 1997లో శ్రీకాకుళంలో కథానిలయం. గురజాడ అప్పారావుగారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావుగారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తిగారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రథమం. – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలు గాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు. కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళంపట్టణంలో ఉంది. విశాఖ నుంచి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనుక వైపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు – గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిథి గది బాత్రూము సౌకర్యంతో సహా – ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు.

2014 సెప్టెంబర్ నాటికి రమారమీ 900 పత్రికల వివరాలు, 3000కి పైగా కథాసంపుటాలూ, సంకలనాలూ కథానిలయం సేకరించగలిగింది. వీటితోబాటు దాదాపు 1000 మంది రచయితలు తమ వివరాలను, తమ కథల నకళ్లను (దొరికిన వాటిని) అందించారు. ఇవికాక ఈ కథల కాల నేపథ్యాన్నీ సమాజ నేపథ్యాన్నీ అధ్యయనం చేసేందుకు వీలుగా ఆత్మకథలు, జీవిత కథలు, సామాజిక చరిత్రలు, ఉద్యమ చరిత్రలు కూడా సేకరించబడుతున్నాయి. ఇక్కడ ఏముందో సాహిత్య జీవులకు అందించే ప్రయత్నంలో కథానిలయం వెబ్‍సైట్ ఏర్పడింది. వివిధ మార్గాల ద్వారా లభ్యమైన ఈ రచనలని లాభాపేక్ష లేకుండా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.

విశ్వవిద్యాలయాలలోని పరిశోధక విద్యార్థులు, సాహిత్యాభిమానులు, రచయితలు, విమర్శకులు, ఎందరో కథానిలయం సేవలను వినియోగించుకోడం మొదలెట్టారు. ఈ వెబ్‍సైట్ వారందరికీ మరింత సేవలు అందిస్తుంది.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానిలయం సేకరణ, సహకారాలతో “కథాకోశం” తీసుకు వచ్చింది. అనేకమంది రచయితలు తమ సంపుటాలను ప్రచురించారు.

ఇదీ కారా మాస్టారి గారి జీవన ప్రస్థానం.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

శిక్షెవరికి

by Vijaya Ranganatham July 25, 2024
written by Vijaya Ranganatham

రచ్చబండ దగ్గర చేరిన జనాలందరూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడు తున్నారు. “ఏం రోగం, ఉన్నచోట ఉండకుండా తెల్లవారు ఝామున తోటలోకి ఎందుకెళ్ళాలట.” రంగమ్మగారు ఈసడింపుగా అంది.
“రోజూ వెళుతుంది కదా ఈ వేళ ఏమైనా కొత్తా. చిన్నప్పటినుండి వాళ్ళ నాన్న మాలకారి రాఘవ శాస్త్రి గారికి సహాయం చేయటానికి తోటలో కెళ్ళి పూలుకోసుకొస్తుంది కదా ఈ పిల్లా… మరి ఉదయమే దేవుడికి వాళ్ళ నాన్న మాలలు ఇవ్వాలికదా. తప్పదాయే.” తాయమ్మ జవాబిచ్చింది. రోజూ దేవుడి అలంకరణకోసం పూల మాలలు గుచ్చి పోద్దున్నే గుడిలో ఇవ్వటం రాఘవశాస్త్రి గారి ఉద్యోగం. అందుకని అంతా ఆయన్ని ‘మాలకారి’ అంటారు. అంటే మాలలు చేసేవాడు. అంతేకాక మంచి మనసున్న వైధ్యం తెలిసిన వాడు. ఊరి జనాలంతా ఆయన దగ్గరికే మందుల కోసం వెళతారు.
“ఏదేమైనా ఈడొచ్చిన పిల్ల. అన్ని రోజులు ఒక్కలా ఉంటాయా.. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇంతకాలం నేను చాలా విషయాలు రాయాలనుకుంటున్నాను ఎక్కడంటే అక్కడ తిరగటం పరవాలేదు. ఇప్పుడు జాగర్తగా ఉండాలని నీవైనా చెప్పాలికదా జానకమ్మా. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో” రాధమ్మ తనకు తోచిన విధంగా జానకమ్మని ఓదార్చుతుంది.
“ఊరుకోండి, జానకమ్మను ఊరడించాల్సింది పోయి ఎవరికి తోచింది వారు మాట్లాడుతారా..కాసేపు గమ్మునుండండి. ఆమె పెంపకం గురించి ఇవేళ కొత్తగా తెలిసొచ్చిందా. ఎంతో మర్యాద తెలిసిన పిల్ల. ధైర్యస్థురాలు. ఎవరికి కష్టమొచ్చినా నేనున్నానంటూ వచ్చే పిల్ల. ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పమ్మా. మీరు మీ పెంపకం గురించి చూసుకున్నాక పార్వతమ్మ గురించి మాట్లాడండి.” అంటూ కసురుకుంది ఆండాళు. రాదమ్మ ఇంకో మాట అనకుండా చేసింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించానని ఊర్లోంచి వెళ్ళి పోయింది. వయసులో పెద్దది, నిర్మొహమాటంగా మాట్లాడే ఆండాళు అంటే అందరికి హడలు. ఎంతవారినైనా తప్పు చేస్తే వదిలి పెట్టదు. జానకమ్మ ఏడ్చి ఏడ్చి రచ్చబండకి కాస్త దూరంలో ఉన్న రావి చెట్టుకింద, కూతురు పార్వతి పక్కనే కూచుండి పోయింది.
రాఘవ శాస్త్రి గారు జానకమ్మలు, ఒక్కతే కూతురని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. అయినా చక్కటి సంస్కారం, తెలివిని నేర్పాడు తండ్రి. ఇంటిపనులు, వంటపనులలో కూడా ఆరితేరింది. తండ్రి, బావకు నేర్పిస్తుంటే తనుకూడా కొద్దిగా వైద్యం, సంస్కృతం నేర్చుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన మేనల్లుడు శంకరాన్ని, చెల్లెలు సీతమ్మను తన దగ్గరే ఉంచుకున్నాడు. పార్వతి, చిన్నప్పటినుండీ బావతోనే లోకంగా పెరిగింది. శరీరాలు వేరైనా మనసులు ఒకటేలా ఉంటారని ఊరంతా అనుకునేవారు. రాఘవశాస్త్రి గారు, పక్క ఊళ్ళో శంకరం హైస్కూల్ చదువు అయిపోగానే పై చదువులకై మేనల్లుడిని దగ్గరలో ఉన్న, చెన్నపట్నం పంపాడు. తరువాత ‘లా‘ చదువుతానంటే ఊళ్ళోని పొలం అమ్మి చదివించాడు. శంకరం, చదువుతో పాటు చెన్నపట్నంలో జరుగుతున్న స్వతంత్ర పోరాట ఉద్యమాల్లో కూడా చురుకుగా పాల్గొనేవాడు. మంచి చెడుల వివరణ పట్ల ఉండే సంస్కారాన్ని చిన్నప్పటి నుండి మేనమామ దగ్గర నేర్చుకున్నాడు. సమాజ శ్రేయస్సు పట్లా, రాజకీయాల పట్లా అవగాహన కలిగిన యువకుడిలా మారాడు. ఈ సంవత్సరం పరీక్షలవంగానే, పార్వతితో పెళ్ళి జరిపించేద్దా మనుకున్నారు ఇంటివాళ్ళు.
పార్వతి తండ్రి దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకుని అతనితో పాటు ఊళ్ళో అందరికి తన సేవలందిస్తుంది. దేవుడి మాలకట్టడంలో తండ్రికి సహాయ పడ్డం, తల్లికి ఇంటిపనుల్లో చేదోడు వాదోడుగా ఉండడం. లక్ష్మి, సీత, కళ్యాణి లతో కలిపి ఊర్లో వారికి ఏ సహాయం కావాలన్నా, ఎవరైనా జబ్బు పడినా నేనున్నానంటూ వెళ్ళడం, ఆమె రోజూ దినచర్య. సెలవులకు బావ వస్తే క్షణం వదలకుండా శంకరం తోనే గడపేది.
పార్వతి ఈలోకంలో లేనట్టుగా ఎటో చూస్తూంది. ఆమెని తీసుకొచ్చి చెట్టు దగ్గర కూచోబెట్టి నప్పటునుండి అలాగే జారిగిలపడి కూచునుంది. నల్లని ఓణీ పమిటను, తల్లి భుజం చుట్టూ కప్పినా కూడా చిరిగిన నల్లని జాకెట్టు చేయి సన్నటి ఓణీ లోంచి కనబడుతూనే ఉంది. బారెడు జడ ఊడి పోయి వీపంత పరచుకున్న వెంట్రుకలతో, పాలిపోయిన తెల్లటి ముఖాన గీరుకుపయిన గాయాల్లోంచి రక్తం కారి గడ్డ కట్టి కపోలాలు వాచి, ఎర్రబడ్డాయి. చేతులు కూడా రక్కుకు పోయి రక్తం మరకలు కనబడుతున్నాయి. ఏంజరిగిందో చెప్పకనే చెబుతున్నాయి ఆమె కనబడుతున్న తీరు.
“ఏవరు ఈ దురాఘాతానికి ఒడిగట్టారో చెప్పమ్మా.. నీవు నోరు తెరువక పోతే మా కెలా తెలుస్తుంది.” అంటూ ఊరు పెద్ద పరందామయ్యగారు అనునయంగా అడిగారు. పార్వతికి మాటలు వినబడుతున్నాయో లేదో ఆమె దగ్గరనుంచి ఏ జవాబు లేదు. పక్కనే ఉన్న జానకమ్మ కూడా కూతురుని పదే పదే పిలుస్తున్నా లాభం లేక పోయింది. “లక్ష్మీ, ఎప్పుడూ పార్వతితో వెళ్తావు కదా నీకు తెలియదా” ఆమె ద్వారా నన్నా విషయం తెలుసుకుందామని అడిగాడు. “లేదు బాబాయ్, ఈ రోజు నేను వెళ్ళలేదు. తాను ఒక్కతే వెళ్ళింది.” లక్ష్మి జవాబిచ్చింది. స్నేహితురాలి దీనావస్థచూసి ఏడుస్తుంది.
“పోనీ, ఇంతకు ముందు ఎవరైనా మిమ్మల్ని వెంటబడి ఏడిపించేవారా? వాళ్ళే ఈ దురాగతానికి పాల్పడ్డారేమో…ఏ మైనా జ్ఞాపకముందా..” ‘‘లేదు. ఎవరూ మమ్మల్ని అలా చేయలేదు”. లక్ష్మి అంది.
“అసలు ముందుగా ఎవరు చూసారు?”  అందరిని ఉద్దేశించి అడిగారు పరంధామయ్య. “నేను బాబుగారు, ఆరు గంటలేళ శాస్త్రిగారు నాతో, అమ్మాయి గారు వెళ్ళి ఇంకా రాలేదు. మాలకట్టటానికి సమయం మించి పోతుందని తోట కెళ్ళి చూసి రమ్మన్నారు. నేను వెళ్ళే సరికి తోటలో ఎక్కడా కనబడ లేదు. అప్పుడే వచ్చిన గోవిందు, అమ్మాయిగారు పూలు కోసుకుండగా తాను గోశాల కెళ్ళానని చెప్పాడు. ఒక్కో సారి అమ్మాయిగారు వెనకాల తోట బావి దగ్గర ఉన్న గులాబీల కోసం వెళ్తారు. అందుకని అటు వేపు కూడా చూడమని గోవిందు చబితే వెళ్ళాను. అక్కడ ముళ్ళ పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న అమ్మాయిగార్ని సూసి గుండె గుబేల్ మందండి. వెంటనే తోటమాలి గోవిందుని కేకేసి ఇద్దరం మంచం మీద పడుకో బెట్టి శాస్త్రి గారింటికి పట్టుకొచ్చామండి. అప్పుడే మీరూ వచ్చారు కదండి” అన్నాడు రాఘవ శాస్త్రి గారి పాలేరు రంగయ్య.
“మరి గోవిందూ, నీవేమి చూడలేదా? నీకు పార్వతి తప్ప ఎవరూ కనబడలేదా?”
“లేదు బాబుగారు, అమ్మాయిగారు పూలు కోసుకుని తులసి దవనం, గులాబీలు కోసుకుంటానని వెనకాతల వేపు కెళ్ళారండి. నేనేమో, గో మందల్ని మేతకి తోలడానికి గోశాలకి వెళ్లానండి. అమ్మాయిగారు ఎప్పటిలాగా గులాబీలు కోసుకుని వెళ్ళి పోతారని నేనూ అక్కడ్నుంచి నా పనిమీద వెళ్ళి పోయానండి.” గోవిందు జవాబిచ్చాడు.
“నీవు అమ్మాయి గారితో తోట వెనకాలకు వెళ్ళలేదా? పోనీ, అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నట్టు కనిపించిందా?”
“లేదండి, ఎప్పుడూ పార్వతమ్మకి అలవాటే తోట అంతా తిరిగి పూలు కోసుకోవటం అందుకని నేను అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడూ పార్వతమ్మ, లక్ష్మమ్మ తప్ప ఎవరూ రారు. చాలా చీకటిగా ఉంది. నాకెవరూ ఉన్నట్టు కనబడలేదయ్యా”. గోవిందు బాధగా అన్నాడు. తను కొంచెం జాగర్తగా ఆమె వెంటే ఉంటే బాగుండే దేమో, ఇంత ఘోరం జరిగేది కాదేమో …అంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందని బాధ పడుతున్నాడు.
పరంధామయ్యగారికి ఎలా దోషిని పట్టుకోవాలి అగమ్యగోచరంగా అనిపించింది. ఎవరైనా ఆ సంఘటన చూసిన వాళ్ళన్నా చెప్పాలి లేదా బాధితురాలైనా చెప్పాలి. అప్పటికే ఉదంతం జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్దగా ఏ ఆధారాలు దొరకలేదు. ఎవరో మట్టి కాళ్ళతో తోట వెనక గోడమీదకి ఎక్కి అటువేపు దూకినట్టుగా మరకలున్నాయి. అలాగే గోడ మీద రక్తపు మరకలు ఉన్నాయి. అంటే ఆ దుర్మార్గుడి కాలు గాయపడి ఉండాలి. ఆ ఒక్క కాలి గాయం ఆధారంగా దోషిని పట్టుకోలేము. లాభం లేదు. ఎలా అయినా పార్వతికి స్పృహలోకి రావాలి అప్పుడేగాని దోషి బయట పడడు.
అక్కడే ఉన్న ఆండాళుని పిలిచి, పార్వతిని మాట్లాడించ్చేట్టు ప్రయత్నించమన్నాడు. అప్పటికే ఆ పనిలోనే ఉంది తను. ముఖాన కాసిని నీళ్ళు చల్లింది. తన పమిట చెంగుతో తుడిచి.  “పార్వతీ..పార్వతీ..ఇటు చూడు తల్లి..మాట్లాడు పార్వతి..ఇంత ఘోరం ఎవరు చేసారో చెప్పు. వాడికి తగిన శాస్తి చేద్దాం నీవేం భయపడకు. పరందామయ్య ఉన్నారుగా. మాట్లాడమ్మా.”  అంటూ మంచినీళ్ళు తాగించే ప్రయత్నం చేసింది. అప్పటి వరకూ స్పందించని పార్వతి గట గటా నీళ్ళు తాగింది. కొంచెం తేరుకో గానే తన పరిస్థితి అర్థమైంది.  వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది. తల్లి జానకమ్మ కూతుని కౌగలించుకుని ఏడుస్తుంటే అక్కడున్నవారంతా కన్నీళ్ళు ఆపుకోలేక పోయారు. చెంగు చెంగున ఆ ఊరు ఊరంత లేడి పిల్లలా తిరిగే పార్వతి ఇలా దీనంగా, హృదయవిదారకంగా ఏడుస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. ఆండాళు వాళ్ళిద్దరిని ఓదార్చుతూ “పార్వతీ, అలా ఏడిస్తే కాదు. జరిగింది ఘోరమే.. కాని మనం ఇప్పుడు ఆ దుర్మార్గుడిని పట్టుకొని శిక్షించాలి. నీకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలి. ఇలాంటి ఘోరం మరోసారి ఈ ఊర్లో మరెవరికి జరగకుండా చూడాలికదా.” అంది.
పరందామయ్య మాట్లాడుతూ..”చూడు తల్లీ! నీవు ధైర్యస్థురాలివి… నాకు తెలుసు. బేలగా బాధపడి ఏడ్చి బలహీన పడకు. నాకు తెలుసు నీవు ఎటువంటి కష్టంలో నైనా పోరాడగలవని. ఏడవకు. నిన్ను నీవు సమాధాన పరచుకో.. జ్ఞాపకం చేసుకో ఎవరు నీపై అఘాయిత్యం చేసింది. చెప్పు తల్లి.” పార్వతి స్వభావాన్ని, ధైర్యాన్ని ఆమెకే గుర్తు చేస్తూ బాధ నుంచి బయటపడేయాలని అనునయంగా చెప్పాడు. ఆ ఊరు ఊరంతా అక్కడే ఉన్నారు. అప్పటివరకూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్న వాళ్ళు, అంతా నిశ్శబ్దం అయిపోయారు. పార్వతి, ఏం చెబుతుందోనని, ఆ దుర్మార్గుడు ఎవరని చెబుతుందోనని అందరూ, చెవులు రిక్కించి వింటున్నారు.
పార్వతి ఏడుపు ఉదృతం కొంచెం తగ్గింది. అయినా వెక్కిళ్ళు పడుతూనే ఉంది. “ఎవరో నాకు తెలియదు. చాలా చీకటిగా ఉంది. ముఖాన్నంతా కప్పేసుకున్నాడు. ఎవరో గుర్తించలేక పోయాను. అనుకోని సంఘటనకి నాకు స్పృహ తప్పినట్టైంది. తేరుకుని తప్పించుకోవాలని ప్రయత్నం చేసా..బతిమిలాడాను…పెనుగులాడాను. చివరికి అతని ముసుగు తీయాలని చూసాను. కాని బాగా కొట్టాడు. హింసించాడు….” ఏడుపు  ఎక్కిళ్ళ మధ్య చెప్పింది. ఆమె దీనావస్థకి అందరూ కలత పడ్డారు. పెళ్ళీడు కొచ్చిన పిల్ల బతుకు ఇలా అన్యాయమై పోవటం అందరిని కలచి వేస్తుంది. కానీ, పార్వతి కూడా ఆ మనిషిని గుర్తించలేక పోవటం నిరాశే ఎదురైంది. ఆమె వల్లనైనా దోషి ఎవరని తెలుసుకో వచ్చననుకునే ఆశ కూడా పోయింది.
అదో మప్పై నలబై కడపలున్న, మారు మూల కుగ్రామం. స్వతంత్రం రాక పూర్వం, సనాతన ఆచారాలతో నియమ నిష్టలతో కూడుకున్న బ్రాహ్మణ అగ్రహారం కావటం వల్ల ఆ పల్లెటూళ్ళో పోలీసులు కంప్లేంట్స్ ఇవ్వడాల్లాంటివి లేవు. అన్ని సమస్యలను గ్రామ పెద్దలే పరిష్కరించుకుంటారు. అందుకని డిఎన్ఏ ద్వారా లేదా వేరే పద్దతుల ద్వారా ఆ అగంతకుడిని పట్టుకునే ఆస్కారం ఆరోజుల్లో, ఆ గ్రామం లో లేదు.
పరందామయ్యగారు ఆలోచనలో పడ్డారు.. అక్కడ గుమి కూడిన జనాల్లోకి చూసారు. వాళ్ళలో నిలుచున్న యువకులందరిని తేరిపారా చూసారు. వాళ్ళ కాళ్ళ వేపు చూసారు. ఎవరికైనా కాళ్ళకి గాయాలున్నాయాని. ఆలోచనలో పడిపోయారు.
ఆ గ్రామంలోని వయసులో పెద్దైన, అనుభవజ్ఞులైన అయిదుమంది పెద్దలతో ఆ న్యాయపీఠం ఏర్పడింది. వాళ్ళలోని గంగాధరంగారు “పరందామయ్యా, ఇప్పుడు ఏమిటి దారి. బాధితురాలు ద్వారా తప్ప దోషిని పట్టుకునే అవకాశం లేదనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఆశ లేదు. పార్వతి, అతనెవరో తెలియదంటుంది. ఎవరా వ్యక్తని తెలుసు కోలేక పోయాం..ఏ అవకాశమూ కనబడటం లేదు. ఏం చేద్దాం.” అనడిగారు.
ఇంకో సభ్యుడు మాధవయ్య “సరే, ఇప్పుడెలాగూ దోషిని కనిపెట్టే ఆస్కారం లేదు కాబట్టి…అతనిని పార్వతి కనిపెట్టినప్పుడు శిక్ష విషయం ఆలోచిద్దాం. ఇహ ఇప్పుడు మిగిలిన కార్యక్రమాలు కానిద్దాం. పార్వతి వల్ల ఆ కుటుంభం అపవిత్రం అయిపోయింది కాబట్టి మాలకారి దేవుడి కైంకర్యానికి రాఘవ శాస్త్రి అయోగ్యుడు. ఇకనుంచి సుందరానికి ఈ పనిని అప్పగిద్దాం.‘‘ ఎప్పటినుంచో ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మాధవయ్య ఇప్పుడు వదులుకో దలచుకోలేదు. తన బావ మరిది సుందరం చాలా బాగా కొత్త కొత్త పద్దతుల్లో పూల మాలలు కడతాడు. కానీ, అతనికి సరియైన ఉపాది లేదు. పోని ఇక్కడ దేవుడి కొలువు దొరకటానికి రాఘవయ్య అడ్డుగా ఉన్నాడు. తరతరాల నుంచి అతని వంశం వారే ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటనని మాధవయ్య ఉపయోగించుకో చూసాడు.
అతని మాటలు జగన్నాధాచారికి అభ్యంతరకరంగా తోచింది. ‘‘ఇది సబబుగా తోచడం లేదు. ఎప్పటినుంచో దేవుడి సేవలో ఉన్న శ్రీమాన్ పరాంకుశంగారి వంశజుల మునిమనుమడైన రాఘవశాస్త్రి గారిని పనిని మాన్పించటం తప్పు. ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన మీ మేనత్త ఎవరితోనో లేచిపోయినప్పుడు మీ నాయన గారిని, దేవుడి రామానుజకూటం వంట పనులు నుండి ఈ కమిటీ దూరం చేయలేదు కదా. చిన్న ప్రాయశ్చిత్తంతో ఆకుటుంభాన్ని వదిలేశారుకదా. గుర్తులేదా. ‘‘  అంటూ కొంచెం ఘాటుగానే అన్నాడు.
జగన్నాధాచారి గారి మాటలు మాధవయ్యని చురుక్కుమనిపించాయి. అయినా ‘‘ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముందు మాట. ఇప్పుడు మరీ గుర్తుచేసుకుని చెప్పక్కర్లేదు. కాలం మారలేదూ? అయినా ఆ విషయం ఈవిషయం ఒకటేనా ఏమిటి? మరీ చెప్పుకొచ్చారు!‘‘ అంటూ సాగదీశాడు. ‘‘సరే! జరిగిన సంగతులు ఇప్పుడెందుకు గానీ, ఎంతైనా దేవుడి పని కదా, ఏదో ప్రాయశ్చిత్తంతో రాఘవ శాస్త్రి గారిని విధులకు అంతరాయం లేకుండా చేద్దాం. పార్వతికి ఆమె తల్లి తండ్రికి పుణ్యావాచనం, ప్రాయశ్చిత్తం నిర్దారించండి.‘‘ అన్నాడు గోపాలంగారు.
ఆ నలుగురు న్యాయపీఠం సభ్యులు చెప్పిన దాన్ని విని పరంధామయ్య ఆలోచనలో పడ్డాడు. దూరంగా ఉన్న ఆండాళు, వయసుతో వచ్చిన వడిలిన శరీరానికి, ఊతకర్ర సహాయం చేసుకుని నెమ్మదిగా రచ్చబండ మీద కూచున్న పెద్దల దగ్గరగా వచ్చింది. ‘‘ఏమయ్యా, పెద్దమనుషులు, ఏం మాట్లాడుతున్నారు? ఇదేమయినా న్యాయంగా ఉందా? తప్పెవరు చేశారూ, శిక్ష ఎవరికి వేస్తున్నారు? దోషి పట్టుబడనంత మాత్రాన వాణ్ణి వదిలేసి ఇప్పటికే జరిగిన ఘోరానికి బాధ పడుతున్న వారికా ప్రాయశ్చిత్తము గురించి మాట్లాడుతున్నారు.‘‘ అంటూ అందరిని కడిగేసింది. ఆమె ధాటికి కొద్దిగా జంకారు ఆ నలుగురు.
‘‘మరి మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇంత దుశ్శహాసానికి పాల్పడ్డవాడు దొరికితే బాగుండేది.‘‘ అయోమయంగా అన్నాడు గంగాధరం. ‘‘పెద్దమ్మా, నీవెళ్ళి కూచో. మేమున్నాం కదా. న్యాయంగానే పరిష్కరిద్దాం‘ అంటూ గోపాలం గారు ఆవిడకు సర్ది చెప్పారు. సణుక్కుంటూ అక్కడే ఓ పక్కగా కూర్చుండి పోయింది ఆండాళు.
చుట్టూ ఉన్న వాళ్ళల్లో గుసగుసలు మొదలయ్యాయి. గట్టి చర్యలు తీసుకోక పోతే, గ్రామంలో ఇలాంటి అరాచకాలు ఎక్కువ కావా. ఆడపిల్లల్ని అడ్డూ అదుపు లేక బయటకు వెళ్ళనిచ్చే తల్లితండ్రులకు బుద్ది రావాలిగా… అంటూ తలా ఒకరకంగా మాట్లాడుతున్నారు. మాధవయ్య జనాల్లో ఉన్న ఆయన మేనల్లుడు భాస్కర్కి కనుసైగ చేసాడు. ‘‘అవునవును.. ఊరంతా నియమం నిష్టలు లేక పిల్లలంతా బరితెగించి పోతారు. ఇంతవరకూ మన అంబాపురానికున్న మంచి పేరు పోతుంది. తగిన శిక్షలు వేయాల్సిందే. మన ఊరి ఇలవేల్పు భ్రమరాంభికాదేవి ఇలాంటి ఘాతుకాన్ని సహించదు‘‘. అంటూ అందర్నీ రెచ్చగొట్టాడు. జనాలంతా అవునవును అంటూ వంత పాడారు.
‘‘అందరూ అలాంటి అభిప్రాయంలో ఉంటే మనకు గత్యంతరం లేదు మరి. మీరేమంటారు‘‘ అంటూ మాధవయ్య గంగాధరం వేపు చూస్తూ అన్నాడు. ‘‘తప్పదుగా ప్రజలు మాటే మనమాట‘‘ అంటూ గంగాధరం తలూపాడు. ఆ అయిదుగు సభ్యుల్లో ముగ్గురూ అవునవునంటూ వంత పాడారు.
పరంధామయ్యకీ, జగన్నాధం గార్కి వాళ్ళమాటలు అంతగా నచ్చలేదు. ‘‘మీరంతా కాస్త నిశ్శంబ్దంగా ఉంటే సరియైన నిర్ణయం తీసుకునే వీలవుతుంది. అందరి గురించి ఆలోచించే న్యాయ బద్దంగా తీర్పు చెప్పబడుతుంది.‘‘ అక్కడున్న వారితో అన్నారు.
‘‘ఇంకా ఏం నిర్ణయం తీసుకోవటం ఏమిటీ, ముందు నుంచీ ఉన్నదేగా. బలత్కరించిన వాడు దొరికితే, పార్వతి వివాహం జరిపించడం తప్పదుగా. ఆపిల్ల జీవితం చక్కదిద్దాలంటే, ఓ దారి చూపించాలంటే అతడే పార్వతిని పెళ్ళి చేసుకుని తీరాలి. గత్యంతరం కూడా లేదు. ఒకవేళ వాడు పట్టుబడక పోతే, రాఘవ శాస్త్రి వంశపారంపర్యంగా వస్తున్న మాలకారీ కొలువును వదులుకుని కుటుంభ సహితంగా గ్రామం వదిలి వెళ్ళాలి. తీసేయకూడదన్నారుగాని. దేవుడి కైంకర్యమాయే, మరి అతడు ఎలా నిర్వహిస్తాడు. మరో మార్గం అంటే, ఆయన కుటుంభానికి ప్రాయశ్చిత్తం చేసి దోష నివారణ చేసి, ధనదండ శిక్ష వేయాలి. కానీ పార్వతి బతుకేమిటి? ఏ మంటారు‘‘ అని సబ్యులను అడిగాడు మాధవయ్య. ‘‘‘సబబుగా లేదనిపిస్తుంది‘‘ అన్యమనస్కంగా అన్నారు గంగాధరం. ‘‘ అదెలా, ఏ నిర్ణయమైనా దోషి దొరికితేనే కదా తీసుకోగలం.‘‘ జగన్నాధం అడ్డుపడ్డాడు.
‘‘నిజమే కాని అప్పటి వరకూ రాఘవ శాస్త్రిగారి పని ఆపలేం కదా. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అదీ కాక వాడు ఎప్పుడు దొరుకుతాడో తెలియడం లేదు. అందుకని మిగిలిన కార్యక్రమాలు కానిచ్చి సభను ముగిస్తే సరి. అంతకంటే వేరేదారి కనపడ్డం లేదు.‘‘ గంగాధరం జవాబిచ్చాడు.‘‘‘అవునవును‘‘  అంటూ అక్కడున్న వారిలో సగం మంది ఆయనతో ఏకీభవించారు. వారి మాటలు వింటూ పార్వతి భవిష్యత్తు ఘోరంగా కనబడుతుంటే మనసులోనే రోదిస్తున్నాడు రాఘవశాస్త్రి. జానకమ్మ ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లే స్థితిలో ఉంది.
పార్వతి నెమ్మది నెమ్మదిగా పరిస్థితిని గ్రహిస్తుంది. ఆలోచించటం మొదలు పెట్టింది. ‘ఎవరు ఈఘోరం చేసింది. ఏమాత్రం గుర్తుకు రావటం లేదు. సూచనా మాత్రంగా కూడా ఆవ్యక్తిని పోల్చుకునే ఆధారం దొరకటం లేదు. ఎలా కనిపెట్టాలి‘ అనుకుంటూ తన భవిష్యత్తు ఏమిటి? ఎంతగానో ప్రేమించిన బావతో, త్వరలో వివాహం చేయాలనుకునే తల్లీతండ్రీ, అత్తయ్య ఎంత బాధ పడతారో. బావకి ఇలా జరిగిందని తెలిస్తే…. తనను క్షమించి మన్నించగలడా? తన తప్పు లేదని నమ్ముతాడా? అయినా ఎవరో దుర్మార్గుడు వల్ల తను శిక్ష అనుభవించాల్సి రావటం ఏమిటనే ఊక్రోషంతో ముఖం ఎరుపెక్కింది. ఇలా అందరి ముందూ తానే తప్పు చేసిన దానిలాగా నిలబడాల్సి వస్తుంది. తనవల్ల అమ్మా నాన్న కూడా అవమానాన్ని ఎదుర్కుంటున్నారు. ఇంతకింత పగ తీర్చుకుంటాను వాడు కానీ దొరికితే‘ అని బాధ పడుతున్న పార్వతి రచ్చబండ దగ్గర జరుగుతున్న చర్చ వినబడటం లేదు.
‘‘అయితే మరి పరంధామయ్య గారు, పుణ్యావచనం, ప్రాయశ్చిత్త హోమం చేసి, గంగ తీర్త స్నానాధికాలతో కార్యక్రమం పూర్తి చేద్దాం. ఏమంటారు‘‘ అంటూ అడిగాడు గంగాధరం. అందరు పెద్దలు అతని మాటకు సరే నన్నారు. ‘‘అలాగే తండ్రిగా ‘ధన దండన శిక్ష‘ కూడా రాఘవశాస్త్రికి తప్పదు.‘‘  అంటూ మాధవయ్య జోడించాడు. ‘‘అతను ఎక్కువ ఇచ్చుకోలేడు కనక, ఏదో చిన్న మొత్తాన్ని దేవాలయ హుండీలో వేయమని చెబుదాం‘‘. అంటూ గోపాలం సూచించాడు. ఆ మాటలు నచ్చకున్నా ఎక్కువ ఏమి అనలేక పోయాడు మాధవయ్య. పరంధామయ్యకు జరుగుతున్న చర్చా, శిక్షల నిర్ణయాలు ఏమాత్రం నచ్చటం లేదు. ‘‘చూడండి. ఇలా మాట్లాడటం ధర్మం కాదు. తప్పు చేసింది ఎవరో. మనం అపరాధం చేసిన వారికి కాక శిక్షలు వేస్తున్నది బాధితులకు. ఇదెక్కడి న్యాయం. ఆలోచించండి.‘‘ అంటూ తన అభిప్రాయం చెప్పాడు.
‘‘అవును, నీవన్నది సమంజసంగానే ఉన్నది. కానీ ఇక్కడ శాస్త్రి గారు దేవుడి సేవకు అపవిత్రంగా వెళ్ళలేడు కదా. అందుకని అయినా, ఆ కుటుంభానికి పుణ్యావచనం తప్పదు. ఇక కొద్ది మొత్తం దండనగా దేవుడికి సమర్పించటం వల్ల దోషం కూడా పోతుందని నా భావన.‘‘ గోపాలం గారు వివరించారు. దానికి పరందామయ్య ఏమీ అనలేక, మనసుకు కష్టంగా ఉన్నా, న్యాయపీఠం సభ్యుల నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చింది.
అక్కడున్న యువకులంతా హోమానికి సిద్దం చేశారు. ముందుగా పుణ్యావచనం కార్యక్రమం కోసం బ్రాహ్మణులు అన్నీ సిద్దం చేసారు. పార్వతిని శాస్త్రి గారిని జానకమ్మని బావి దగ్గర తలమించి నీళ్ళు పోసుకుని హోమం దగ్గరికి రమ్మని చెప్పాడు పూజారి ఆంజనేయశాస్త్రి. బావి దగ్గర నాలుగు బొక్కెనల నీళ్ళు తల మీద గుమ్మరించుకుని రాఘవశాస్త్రి వెళ్ళగానే తల్లీ కూతుర్లు కూడా తలమించి స్నానం చేశారు. ఆండాళు ఒక శాలువా తెప్పించి పార్వతికి కప్పింది. ఆ కార్యక్రమాన్ని పూజారి తదితరులు ప్రారంభించి హోమగుండంలో మంత్రోశ్చారణుల మధ్య అగ్నిని ప్రజ్వలింప చేసారు. తలవంచుకుని తప్పు చేసిన వాడిలా నడుస్తున్న రాఘవ శాస్త్రి గారితో కలిసి తల్లీ కూతుర్లు తడి బట్టలతో అక్కడికి వచ్చారు. ఆండాళు పార్వతికి సహాయంగా పక్కనే నిలబడింది.
హోమం దగ్గర పూజారికి సహాయంగా నిలబడ్డ ధనుంజయుడు ఒక్కసారిగా మండుతున్న హోమ గుండలో పడ్డాడు. శరీరం పడకుండా చేతులతో ఆపటానికి ప్రయత్నించాడు. హోమం కోసం ఆజ్యపు గిన్నెని పట్టుకున్న అతని చేతులు అగ్ని ప్రజ్వరిల్లుతున్న హోమగుండంలో ఆజ్యంతో పాటు పడ్డాయి. ఇంకేం అగ్నికి ఆజ్యం తోడైనట్టు, నెయ్యిలో మునిగిన అతని చేతులు హోమం మంటతో సహా మండడం మొదలెట్టాయి. ఆ మంటకు దిక్కులు పెక్కుటిల్లేట్టు అరుస్తున్నాడు. చేతులు పైకి తీసేసరికే రెండు అరచేతులూ అగ్నికీలలతో ఎగిసి పడుతున్నాయి. అనుకోని ఈ అవాంతరానికి దిక్కుతోచని పూజారి కలశంలోని నీటిని అతని చేతులపై పోయబోయాడు. అక్కడే ఉన్న మాధవయ్య పరుగున వచ్చి కొడుకు ధనుంజయని పట్టుకున్నాడు. ‘‘ఏ పార్వతీ కలశం తీసుకుంటావేమిటి వీడి చేతులు కాలి పోతున్నాయి. దాంలోని నీటిని చేతులమీద పోయ్యి. త్వరగా‘‘ అంటూ అరుస్తున్నాడు. అప్పటికే పార్వతి పూజారి చేతిలో నుంచి కలశం లాక్కుంది. ఆమె ముఖం ఖణ ఖణ మండే అగ్ని గోళంలా రగులుతుంది.
‘‘కాలనీ, బూడిదవనీ, చేసిన పాపం ఊరికే పోతుందా. నా బతుకుమీద మాయని మచ్చ వేసాడు. పశువులా నన్ను హింసించాడు. నన్ను తాకిన చేతులు మండిపోనీ, వాడికీ జీవితమంతా గుర్తుండే మచ్చపడని. అవిటివాడవని. ఆ భ్రమరాంభికాదేవి శిక్ష వేయకుండా ఉంటుందా‘‘ కోపంతో రొప్పుతూ అరుస్తుంది.
‘‘ఏమైందమ్మా, అమ్మ శిక్ష వేసిందా! ఎందుకు?‘‘ అంటూ గోపాలంగారు మిగిలిన పెద్దలూ అక్కడికి వచ్చారు.
‘‘అవును, ఆ పాపాత్ముడు వీడే. నన్ను నా జీవితాన్ని నాశనం చేసింది ఇతడే‘‘ అంటూ కోపంతో కన్నీళ్ళతో ఏడుస్తూ అంటోంది. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ పార్వతి మతిగాని పోయిందా? నాకొడుకు నీ మీద అఘాయిత్యం చేసాడా? వాడు అమాయకుడు అనవసరంగా మాట్లాడకు‘‘ అంటూ కోపంతో అరుస్తూ, తన మేనల్లుడు భాస్కర్ తెచ్చిన గంగాళంలోని నీటిలో కొడుకు కాలుతున్న చేతులను పెట్టాడు. మంటకు తాళలేక ఏడుస్తున్నాడు ధనుంజయుడు.
‘‘ఏమయింది పార్వతీ, ఇంతవరకూ ఎవరో తెలియ దన్నావు. ఇప్పుడు ఇతడే అంటున్నావు. ఎలా? ఏ ఆధారాలతో చెబుతున్నావు?‘‘ అంటూ పరంధామయ్యగారు ఆమె దగ్గరగా వెళ్ళి అడిగాడు.
ఆమె ధనుంజయ దగ్గరగా వెళ్ళింది. భయంగా చూసాడు ఆమె వైపు. వంగి మండుతున్న చేతులను నీటిలో ఉంచి నిలుచున్న అతని పైన అంగవస్త్రం కింద పడిపోయింది. నగ్నంగా ఉన్న అతని ఛాతీ అంతా రక్తపు గీరికలు. బయటపడ్డ యజ్ఞోపవీతానికి తగులుకుని మెరుస్తున్న పార్వతి బంగారు ఉంగరం వేలాడుతుంది. ఆమె ఉంగరాన్ని ఊరు ఊరంత గుర్తుపడతారు. చాలా ప్రత్యేకంగా కనబడేది. పొడుగు దోసపలుకు ఆకారంలో ఉన్న కెంపు తొడిగిన బంగారు ఉంగరం అది. ఆమె వేలు సగ భాగాన్ని కప్పివేసేది. ఆమె నానమ్మగారు అవసాన దశలో తన ఉంగరాన్ని తీసి పార్వతికి వేలుకి ఆమె బావ శంకరంతో తొడిగించింది. ఇద్దరికి పెళ్ళి చేసేట్టు కూతురు సీతమ్మ, కొడుకు రాఘవ శాస్త్రి గారి దగ్గర వాగ్దానం చేయించుకుంది. ఈ సంగతి ఊరంతా తెలుసు.
అంతకుముందు, స్నానంచేసి హోమగుండం దగ్గరికి వచ్చిన పార్వతికి అక్కడే నిలుచున్న ధనుంజయ ఉత్తరీయం కిందుగా వచ్చిన యగ్నోపవీతం, దానికి చిక్కుకున్న ఆ ఉంగరాన్ని చూసింది. ఆ ఉత్తరీయంతో తన పై భాగాన్నంతా కప్పేసుకున్నాడు. అతడే ఈ ఘాతుకానికి బాధ్యుడని తెలిసిపోయింది. పట్టరాని కోపంతో అతన్ని హోమగుండలోకి తోసింది. అదంతా పక్కనే ఉన్న ఆండాళు చూస్తూనే ఉంది. వాడిని అలా శిక్షించే హక్కు పార్వతికి మాత్రమే ఉందని బలంగా నమ్మింది. చెప్పకనే అందరికీ అర్థమై పోయింది. తప్పు దొరికి పోయినందుకు తన దగ్గరికి వచ్చిన పార్వతిని భయంగా చూస్తూ నిటారుగా నిలబడిపోయాడు. ధనుంజయ చెంపలు బలంగా వాయించింది. రాఘవశాస్త్రి ఆమెని ఆపుతూ శాంతింప చేస్తున్నాడు.
‘‘ఏంటి, అలా కొడుతున్నావు. నీవు అతన్నే వివాహం చేసుకోవాలి. నీకు మరో గత్యంతరం లేదు. లేదంటే కులటలా ఈ ఊరు విడిచి నువ్వు నీ కుటుంభం బయటకు నడవాల్సి వస్తుంది. నీ దూకుడు తగ్గించు కోవటం మంచిది.‘‘ అంటూ మాధవయ్య కోపంగా చూశాడు పార్వతి వైపు. ఆమె అపర కాళిలా ఊగిపోతుంది. ‘‘ఎవడ్ని చేసుకునేది? ఈ దుర్మార్గుడినా? ఎందుకు చేసుకోవాలి.‘‘
గోపాలంగారు పార్వతిని శాంతపరుస్తూ ‘‘చూడమ్మా, నీ జీవితం పాడై పోతుంది. నిన్ను ఎవరు చేసుకుంటారు. మీ తండ్రి గారు నీ బాధ్యత తీర్చుకోవాలికదా. నీ బతుకుని పాడుచేసినందుకు అతను నిన్ను తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోరాదు. అది అతనికి శిక్ష. పెళ్ళి చేసుకోక పోయినా శిక్ష పడుతుంది. అలా కాదంటే నీ తల్లితండ్రులతో పాటు గ్రామ బహిష్కరణ తప్పదు.‘‘  
‘‘అతనికి శిక్షా, నాకా? నేనేపాపమూ చేయకుండా నా తప్పు లేకుండా అన్యాయంగా బలైన నాకెందుకు శిక్ష మరి. ఆడవాళ్ళ పట్ల గౌరవం లేని ఈ పశువుకన్నా హీనమైన వీణ్ణి, నీతి లేనివాణ్ణి చేసుకుని నేను నా జీవితాంతం వీణ్ణెందుకు భరించాలి. పశువు కూడా బలవంతంగా జతకట్టవు. వీడిని పశువుతో పోల్చినా తప్పే. నేనెందుకు చేసుకోవాలి. ఏ ధర్మ శాస్త్రం లో చెప్పబడింది. నేను వీడిని చంపి, ఈ అగ్నిగుండంలో దూకనైనా దూకుతాను కానీ వీడిని చేసుకోను.‘‘ ఆమె కోపం పట్టలేక పోతుంది.
‘‘అవును, నీవు ధనుంజయని పెళ్ళి చేసుకోవలసిందే. ఈ గ్రామ కట్టుబాట్లను కాదనడానికి వీల్లేదు. మేమంతా చూస్తూ ఊరుకోము. ఈ ఊర్లో ఇలాంటి అఘాయిత్యాలు ఇంకోసారి జరగకూడదు. ఇక్కడ నీ ఇష్టాయిష్టాలతో పనిలేదు.‘‘ అంటూ భాస్కరం కల్పించుకుంటూ కోపంగా అన్నాడు.
‘‘ఎందుకు పనిలేదు? తనే ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికైనా అర్హురాలు. ఎందుకంటే తానే బాధితురాలు కాబట్టి. తానే ఎక్కువ నష్టపోయింది కాబట్టి. పార్వతి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె శరీరాన్ని, మనసుని గాయపరచి, అవమానించినందుకు ఆమే వాడికి ఎలాంటి శిక్ష వేయాలో నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. అతన్ని శిక్షనుంచి విముక్తుణ్ణి చేయటానికి మాధవయ్య మామయ్య చాలానే ప్రయత్నిస్తున్నారు. పార్వతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమెకో జీవితాన్ని ఇవ్వటానికి, ఆమె కాపురాన్ని నిలబెట్టాలని చూడాలని ధనుంజయని దోషిని చేయకుండా, వివాహం చేయటం ధర్మ మనుకుంటుంన్నారు. మరో దారి లేదని దానికో ముద్ర వేస్తున్నారు. తరతరాలుగా ఈ సంఘంలో జరుగుతున్న పురుషహంకార అరాచకమిది. ఏతప్పు జరిగినా ఆమెని కళంకిని, అపవిత్రురాలు, పతిత అనే ముద్రలు వేసి ఆడదాన్నే దోషిగా చేయటమనే జాడ్యం జీర్ణించుకుపోయింది. కానీ, ఒక ఆడపిల్లని పైశాచికంగా బలత్కరించి, శారీరక మానసికంగా హింసించిన వాడితో పెళ్ళి చేసుకోవటమంత ఘోరం మరోటి ఉందా ఆ అమ్మాయికి? జీవితాంతం ఈ జరిగిన సంఘటన తలుచుకుంటూ చిత్రవధ అనుభవించే జీవితశిక్ష ఆమెకెందుకివ్వాలి? ఆమె బాధితురాలా? దోషా? శిక్ష ఎవరికి‘‘
ఎక్కుపెట్టిన బాణాల్లాంటి మాటలు అంటున్నదెవరా నని అందరూ వెనక్కి తిరిగి చూసారు. శంకరం నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి మాధవయ్య ఉలిక్కి పడ్డాడు. అయినా ధైర్యం కూడదీసుకుని ‘‘చాల్లే కుర్రకుంకవి, ఏదో పెద్దచదువులు చదివానని, మామీదే నీ ప్రతాపం చూపించకు. ఎప్పటినుండో వస్తున్న మా ఊరి సనాతన ధర్మాలను కాదనటానికి నువ్వెవరు? అంబాపురం ధర్మ పీఠం, వారి న్యాయ నిర్ణయాలంటే చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో దడ. అలాంటిది మా నిర్ణయాన్నే తప్పుపడతావా?‘‘ అంటూ హూంకరించాడు.
‘‘బాబాయ్, ఇక చాలు, నా చదువు సంస్కారం, మంచేదో చెడేదో నాకు నేర్పింది. ఆ జ్ఞానమే ఈ వివరణ ఇచ్చింది. ఇది కాక చాలా విషయాలు చెప్పగలను నీగురించి.  నీ పెంపకాన్ని, నీ ధర్మపీఠం అధికారాన్ని ఆసరా చేసుకుని ఎంతమందో అమ్మాయిల జీవితాలను నాశనం చేసి బయటపడకుండా వాళ్ళని గంగలోకి తోసారు. పోలీసుల జోక్యం లేదుకాబట్టి పట్టుపడలేదు నీ కొడుకు, నీ మేనల్లుడు. కానీ ఎప్పటికైనా పాపం పండక పోదు. అవన్ని బయట ఊళ్ళల్లో చేసారు కాబట్టి ఈ ఊరివరకు రాలేదు. చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇక పోతే, నీ గురించి. మా మామయ్య మాలకారి పనిని నీ బావమరిదికి ఇప్పించే కుట్రే ఈనాటి సంఘటన. పార్వతిని అడ్డుపెట్టుకుని, కోడల్ని చేసుకుంటే మెల్లిగా మామయ్య మంచితనాన్ని ఆసరాగా చేసుకుని అతన్నించి ఆ కైకంర్యాన్ని నీ చేతుల్లోకి తీసుకునే కార్యక్రమే ఇది. ఒకవేళ పార్వతి పెళ్ళికి నిరాకరిస్తే ఆ కుటుంభాన్ని గ్రామ బహిష్కరణ చేయించినా ఆ కొలువు మీదే కదా. ఈ మొత్తం గ్రంథం నీ కొడుకు, నీ మేనల్లుడు తో కలిసి రచించావు. అంతే కాదు, నీవు చెన్నపట్నం లోని బ్రిటిష్ అధికారిని కలిసి ఇక్కడిభూములు, వారికి ధారాదత్తం చేయాలనే నీ దురాలోచన కూడా నేను ఆధరాలతో సహా తీసుకొచ్చాను. చాలా? నీవి, నీ పిల్లల అరాచకాలను గురించి ఇంకా చెప్పాలా?‘‘ ఊరందరి ముందు మాధవయ్య బాగోతం వినిపించాడు శంకరం.
తాను ఎంతో పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఈ ప్రయత్నం ఇలా ఊరందరి ముందు బయటపడిపోవటం మాధవయ్యకి, ధనుంజయకి, భాస్కరానికి మతులుపోగొట్టాయి. ఏం మాట్లాడి తనని తాను సమర్థించుకోవాలో అర్థం కాలేదు మాధవయ్యకి. అయినా ‘‘ఏం టబ్బాయ్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా, న్యాయపీఠం సభ్యుడనని కూడా చూడకుండా అవాకులు చెవాకులూ పేలుతున్నావ్. ఇదేం బాగాలేదు. మాట్లాడరేం గంగాధరం గారు, గోపాలం గారు.  జనార్దనం గారు మీరు చూస్తూ ఊరుకుంటున్నారు‘‘ అని  పీఠం సభ్యులందరిని అడిగాడు తనను సమర్థిస్కారేమోనని.
‘‘నీవు కాసేపు మాట్లాడకు మాధవయ్యా, నీవిపుడు సభ్యుడివి కాదు. ముద్దాయి తండ్రివి. మమ్మల్ని నీ కొడుకుతో మాట్లాడనీ.‘‘ అంటూ జనార్ధనం అతని నోరు మూయించాడు.
‘‘ధనుంజయ్, ఇప్పుడు చెప్పు, తనని ఈ రోజు తెల్లవారు ఝామున అమ్మవారి తులసి తోటలో తనను నీవు అమానుషంగా బలత్కరించావవి నీ మీద అభియోగం మోపింది పార్వతి. దానికి సాక్షంగా నీ యగ్నోపవీతానికి ఆమె ఉంగరం తగులుకొని ఉండటం, నీ చిటికెనవేలు చిట్లి రక్తం రావటం, నీ చేతులు, వంటిమీద పార్వతి గోర్ల గుర్తులుండటం ఆమే నిన్ను దోషి అనటానికి సాక్షాలుగా కనబడుతున్నాయి.‘‘ దీనిమీద నీవు చెప్పాల్సింది ఏమైనా ఉందా?‘‘ అని గోపాలంగారు అడిగారు.
రెండుచేతులు బొబ్బెలెక్కగా, విపరీతమైన మంటతో మాట్లాడలేక పోతున్నాడు ధనుంజయుడు. ‘‘నేను చాలా తప్పు చేసాను. క్షమించుమని అడిగలేనంత పెద్ద తప్పే చేసాను. నేను మారిపోయాను. నన్ను నమ్మండి, మీరంతా అనుమతిస్తే పార్వతిని వివాహం చేసుకుంటాను. నా వల్ల ఆమె జీవితం బలవకుండా కాపాడుతాను. నాకిక ఏ శిక్షా వేయకండి. అమ్మవారే నాకు సరైన శిక్ష వేసింది. నన్ను క్షమించి నాకు ఒక్క అవకాశ మివ్వు పార్వతి‘‘. ఏడుస్తూ అంటున్న ధనుంజయుడ్ని చూసి మాధవయ్య లోలోన మెచ్చుకుంటున్నాడు. తను అనుకున్నట్టుగా తన కొడుకు చేస్తున్నాడని, అంతా సవ్యంగానే జరుగుతుందని, ధర్మపీఠం వాడి మాట నమ్మి వివాహం జరిపించటం, తన గుప్పిట్లోకి రాఘవయ్య కుటుంభం చిక్కుతుందని, శంకరాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చననే ఆలోచనలతో ఉన్నాడు.
పార్వతి శంకరానికి తన ముఖాన్నిచూపించలేక చేతుల్తో ముఖం దాచుకుని కింద కూలబడి పోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ధనుంజయుడు క్షమించమని అడుగుతూ ఆమె దగ్గరికి రావటం తో, కోపాన్ని ఆపుకుంటూ అతని చెంపలు వాయించింది. ‘‘నువ్వు నన్ను కాపాడుతావా? నీవే ఒక వేటగాడివి. నీ వల్ల పాడై పోయిన ఎంతమంది అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటావు. ఛీ.. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఫో అవతలకి. ఇంకా నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు.‘‘ అంటూ వెక్కి వెక్కి ఏడవ సాగింది.
ఆండాళు, పార్వతి దగ్గరికి వచ్చి ‘‘నిజమే నమ్మా, వీడు ఊళ్ళో ఉండదగిన వాడు కాదు. నీవు చేసుకోవాల్సిన అవసరమూ లేదు‘‘ అంటూ ఓదార్చింది. పరుగున దగ్గికి వచ్చి అక్కున చేర్చుకున్నాడు శంకరం. ‘ఏడవకు పార్వతి, నీవే తప్పు చేయలేదు. నీకు నేనున్నాను.‘‘ అంటూ ఆమెను ఊరడించాడు.
‘‘మామయ్యా, నిన్ననే పరీక్షలయిపోయాయని ఇక్కడికి బయలుదేరుదామని అమ్మా నేను అనుకుంటున్నాము.   ఇంతలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. జరిగిన విషయాలని మనసులో పెట్టుకుని బాధ పడకండి మామయ్యా. అతనికి తగిన శాస్తి జరిగిందికదా. అతన్ని ఏంచేయాలో బాబాయి వాళ్ళు తీర్పు చెబుతారు.‘‘ రాఘవశాస్త్రిగారితో అన్నాడు.
వెనుకనే ఉన్న శంకరం తల్లి, శాస్త్రి గారి చెల్లెలు సీతమ్మ,‘‘అన్నయ్యా, జరిగినదాన్ని పీడకలని మరచి పొండి. పార్వతిని నా కూతురుగా చూసుకుంటాను. నీవు దిగులు పడకు. మంచి ముహుర్తం చూసి పెళ్ళి కానిచ్చేద్దాం‘‘ అన్న చెల్లెలి మాటతో కన్నీళ్ళు తుడుచుకున్నాడు. సీతమ్మ, ఏడుస్తున్న జానకమ్మను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఆమె ముఖం దుఃఖం, అవమానంతో దిగులుగా ఉంది.
పరందామయ్య మిగిలిన ముగ్గురూ ఆ ఊరికి వయసుకి పెద్దదైన ఆండాళు కలిసి చర్చించుకుని తమ ధర్మ పీఠం తీర్పును చెప్పారు. ధనుంజయ హోమగుండంలో పడిన విషయం పరందామయ్యకి, కమిటీ వాళ్ళకి వివరించి వాడి శిక్ష ఏవిధంగా వేయాలనే నిర్ణయాధికారం, బాధితురాలిగా పార్వతికి ఉందని, ఆమె ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని కమిటీ గుర్తించాలని కరాకండీగా చెప్పింది. అందరూ ఆమె వాదన సమంజసమని వప్పుకుంటూ, ఆ ధర్మపీఠం తీర్పును తీర్మానించింది.
‘‘ఇంతవరకు ఇక్కడ గ్రామ ప్రజలందరి సమక్షంలో జరిగిన విషయాలకు మీరంతా ప్రత్యక్ష సాక్షులు. మేము అందరం కలిసి న్యాయమైన తీర్పును నిరిణయించాం. పార్వతిని అమానుషంగా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ధనుంజయ బలత్కరించాడు కాబట్టి అతన్ని, అతని కుటుంభాన్ని దోషులుగా పరిగణిస్తూ గ్రామ బహిష్కరణ శిక్షను విధిస్తున్నాము. అపరాధి ఎప్పుడూ తప్పించుకోలేడు. ఎప్పుడో ఒకప్పుడు దొరికి పోతాడు, తన తప్పుకు శిక్షను తప్పకుండా అనుభవిస్తాడనే రుజువుని ఆదిశక్తి పార్వతీదేవి చూపించింది. అతన్ని బ్రమరాంభికా అమ్మవారు చేసిన తప్పుకు శిక్షను వెంటనే అనుభవింపచేసింది. అయినా శంకరం మాకు అందించిన సమాచారం, ఆధారిత సాక్ష్యాలు పరీక్షించిన మీదట ఈఊరు ప్రజల క్షేమం దృష్ట్యా ఆకుటుంభం అంతా తక్షణమే ఊరువిడిచి వెళ్ళ వలసిందిగా ఊరుమ్మడిగా తీర్మానించాము. రాఘవశాస్త్రి గారి కుటుంభం నిరపరాదులు, వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన అవసరం లేదు. అమ్మవారే ప్రాయశ్చిత్తం కార్యక్రమాన్ని ఆపివేస్తూ విఘ్నాన్ని కలిగించారు. వారు పుణ్యావాచనం వారి గృహంలో చేసుకుని తమ మాలకారి విధులను నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. ఇక పార్వతి, బాధితురాలు. దోషికాదు. ఆమె తన ఇష్ట ప్రకారం తన వివాహ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకి ఉంది. ఆమెని వివాహం చేసుకోవటానికి తమ ఇష్టాన్ని వ్యక్తపరచిన రాఘవశాస్త్రి మేనల్లుడు శంకరం, అతని తల్లిగారు సీతమ్మగారి మంచి మనసును ఈ ఊరంతా అభినందనలు తెలుపుతుంది.‘‘ అంటూ పరందామయ్య గారు చెప్పిన తీర్పుకు గ్రామ ప్రజలంతా హర్షాతి రేకాలతో చప్పట్లు చరితారు.

July 25, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

నాన్నా.. నాక్కొంచెం ధైర్యం యివ్వు

by Madhu Jella July 25, 2024
written by Madhu Jella

నీ చూపులనే
గొడుగగా పట్టి
నా వెంటే నీవున్నపుడు

ఆ గొడుగు నీడలో
నా నడకలు సాగుతున్నపుడు
ఏ భయమూ లేదు
నీవుంటే
నా వెంటే ధైర్యం

నీ తోడుగా…
నాకు తెలియని
లోకాలెన్నో చూసాను
నా రెక్కల గుర్రం నీవే

నా ఎదుగుదలకు
ఉప్పొంగి పోయి
లోకమంతా చాటింపు వేసావు
గర్వంతో..
నా ఉన్నతి
ఉచిత ప్రచారకర్తవు నీవే

మంచి చెడుల మధ్య ఉన్న
చిన్నని గీత ఆనవాలేమిటో
లోకుల తత్వమేమిటో
విశ్లేషించుకొనే
శక్తినిచ్చావు
నీవో మనస్తత్వ నిపుణుడివి గదా..

ఉన్నపుడు పొంగిపోకుండా
లేనినాడు కుంగిపోకుండా
బతకడం నేర్పించావు
బతుకుదారిలో…
నా తోడొచ్చే బాటసారివి నీవే కదా

కఠినంగా… అనిపించినా
నవనీతమువంటి
సున్నితత్వము నీవు

బతుకుబండిని లాగడానికి
ఎన్నెన్ని కష్టాలు పడ్డావో
ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో…

చిన్నప్పుడు నీతో ఉన్న ఙ్ఞాపకాలు
అంతగా గుర్తులేదుగానీ
ఊహ తెలిసిన నాటి ఙ్ఞాపకాలు
మదిపుటలలో
పదిలంగానే ఉన్నాయి

నేస్తంగా..
ఎన్నో ముచ్చట్లు చెప్పేవాడివో
గురువుగా ఎంత ఙ్ఞానము
పంచావో
ఏమీ తెలియని అనామకునిలా
అమాయకుడిలా
లోకానికి తెలిసిన నీవు
అన్నీ తెలిసిన
ఓ మహాఙ్ఞానివి
మహాయోగివి
నిరాడంబర నిష్కామ యోగివి
నేనెరిగిన సత్యమిదే

నీవు..
యిప్పుడు నా చెంత లేవు
నా కష్టసుఖాలను చూసే..
వినే
ఆప్తులూ.. లేరు
చింత తీర్చే నేస్తాలూ..లేరు

నా ఆనందాలను ఆస్వాదించేవారూ
నా దుఃఖాలకు
ఓదార్పునిచ్చేవారు కరువు
‘నాన్నా’… మరలి రావూ…
నాకు ధైర్యంగా నిలువు
నా బాధ్యతలు..బంధాలలో
తోడై నడువు

నాన్ననైన నేను
నా బిడ్డల తోడుగా
నడిచే
ధైర్యం యివ్వు

July 25, 2024 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మనం మన సమాజం మారేదెప్పుడో ?

by Banda Saroja July 25, 2024
written by Banda Saroja

భగవంతుని దృష్టిలో, సృష్టిలో మానవులంతా ఒక జాతి. సంఘంలో స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వాములు. సంసారపు బండికి రెండు చక్రాలు. సంమాజంలో సగం సగం. ఒక జాతి జీవన విధానం ఆ జాతి తమ స్త్రీలకిచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది. అన్నాడొక ఫ్రెంచి దేశీయుడు. మానవ జాతిని సృష్టించే ముందు సృష్టికర్త తననుతాను రెండు భాగాలుగా విభజించుకున్నట్టు చెప్పే అర్ధనారీశ్వర సిద్ధాంతం ఒక భారతీయ సంస్కృతిలోనే ఉంది. ధర్మాచరణలోను, కుటుంబ విధుల నిర్వహణలోను భారతీయ స్త్రీలకున్న విశిష్ట స్థానం మరే ఇతర దేశాల ప్రాచీన సాహిత్యంలో, పురాణ గ్రంథాల్లోను కనిపించదు. ”యత్ర నార్యన్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” అంటే స్త్రీలు గౌరవించ బడిన ఇల్లల్లో దేవతలు విహరిస్తారు అన్న సూక్తులను బట్టి మన ప్రాచీనులు స్త్రీకి సమాజంలో ఎలాంటి మహోన్నత స్థానాన్ని ఇచ్చారో గ్రహించవచ్చు. ”మాతృదేవోభవ” అని ముందు తల్లికి, ”పితృదేవోభవ” అని తండ్రికి, ఆ పిదప = ”ఆచార్యదేవోభవ” అని గురువులకు నమస్కరించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఇంకా సరస్వతీదేవి మనకు చదువుల తల్లి. లక్ష్మీదేవి సంపదలను, భోగభాగ్యాలను ఇచ్చే తల్లి, పార్వతీదేవి శక్తి స్వరూపిణి, అందరినీ రక్షించే అమ్మ. ఈ ముగ్గురు మనకు ”మూలదైవాలు”. దీన్ని బట్టి మనదేశంలో, మన సమాజంలో స్త్రీలంటే ఎంతటి గౌరవ ప్రతిపత్తులు, భక్తి భావాలున్నాయో తెలుస్తుంది.

మన ప్రాచీనులు తాము అనుభవించే అన్ని కష్టసుఖాలు స్త్రీల పైనే ఆధారపడి ఉంటాయని భావించారు. ధర్మార్థ, కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలను సాధించడానికి తోడు స్త్రీ కావాలన్నారు. అందుచేత పురుషుడు స్త్రీలను అనుసరించి వారి ఇష్టాలకు అనుగుణంగా తమ అభిమతాలను మార్చుకోవాలని నిర్దేశించారు. ధర్మసంస్థాపన, తద్వారా సంఘ సంక్షేమంలో స్త్రీలకు సమానమైన ప్రాధాన్యత ఉందని భావించారు. స్త్రీ పురుషులలో ఒకరు అధికులు, మరొకరు తక్కువ అనే భావన వారి దృక్పథంలో లేనేలేదు. ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగల ‘నేర్పరి’ స్త్రీయని భావించి ‘గృహలక్ష్మి’గా ఆమెకు మహోన్నత స్థానాన్ని కల్పించారు. విశ్వమంతా స్త్రీమూర్తిగా భావించారు. ఇదే ఒరవడిలో డాక్టర్‌ సి.నారాయణ రెడ్డిగారు తమ ‘ప్రపంచ పదులు’ అనే కవితలో ”ఆకసమే బీజ ప్రదాతగ, అవనియే ఒక ఆదిమాతగ, కాంచగలిగిన మానవునకు జగజ్జనావళి ఒకే కుటుంబం” అని నొక్కి వక్కాణించారు. మన పూర్వీకులు నారీరహితుడైన పురుషుడు పరిమళం లేని పుష్పమని భావించారు. గృహస్థాశ్రమం ఎరుగని పురుషుడు మోక్షానికి అనర్హుడని చెప్పారు. స్త్రీల శ్రేయస్సును కోరుకునే ప్రతి తండ్రి, భర్త, సోదరుడు స్త్రీని గౌరవించాలన్నారు ‘మనువు’. అదే సందర్భంలో ”పితారక్షేతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, రక్షాన్తి వార్ధక్యే పుత్ర, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అనే ద్వంద్వభావాన్ని వెలిబుచ్చారు. ఇది స్త్రీలపై ఉండే ప్రేమ, గౌరవం, కారుణ్యమో తెలియదు. ఏది ఏమైనా ఆధునిక మహిళలకిది చర్చనీయాంశమే. వివక్షా పూరితమైన మహిళల జీవన విధానానికి, కొడుకులు కోడండ్ర నిరాదరణకు గురై వృద్ధాశ్రమాల్లో మగ్గే స్త్రీలకు, సాంఘిక దురన్యాయాలకు బలయిన వితంతువులకిది చుక్కెదురే. ఈరోజు మనం సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక, విద్యా వైద్య రంగాలలో, క్రీడా ప్రపంచంలో ప్రగతిని సాధించాం అనుకుంటే అది కూడా పురుషుల కంటె తక్కువే. నేటికీ సమాజంలో స్త్రీ స్థాయి, హోదా ద్వితీయ శ్రేణికి చెందినదే అంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా వేదకాలం నుంచి నేటివరకు స్త్రీ స్థాయి హోదా ఎలా ఉందో పరిశీలిద్దాం.

– వేదకాలంలో పురుషునితో సమానంగా స్త్రీకి స్థానం ఈయబడింది. ఆనాడు స్త్రీలు యజ్ఞ యాగాదుల్లో పాల్గొనేవారు. ధర్మవిధులను పాటించేవారు. యుద్ధ రంగాలకు పోయి పురుషులతో ధీటుగా యుద్ధాలలో పాల్గొనేది. నాటి స్త్రీలు ఆయుధవిద్యను అభ్యసించేది. ఉదా: సత్యభామ, కైకేయి, ఖేలుని భార్య ‘విస్ఫల’ యుద్ధంలో కాలు పోగొట్టుకుంది. ముద్గలుని భార్య ‘ముద్గలాని’ శత్రువులను తరిమి కొట్టింది.

– ఆనాడు స్త్రీలు కవులుగా, ఋషులుగా పేరు పొందారు. భాష, సాహిత్యం, లలిత కళలు అన్నీ స్త్రీలకు అందుబాటులో ఉండేవి. ఘోష, లోపాముద్ర, అపాల, రోమష, సూర్య మొదలైన వారు వివిధ రంగాలలో గణనీయులు.

– పండుగలు, పబ్బాలు, తాత్త్వికమైన చర్చలల్లో వాటి స్త్రీలు పాల్గొనేవారు. ఉపనిషత్తుల కాలంలో ‘బ్రహ్మజ్ఞాన’ సముపార్జన విషయంలో పురుషులతో ‘నమనీయ’గా ఉన్న స్త్రీలు గార్గి, మైత్రేయి,  పదవ ప్రాథితేయి. నాటి విద్యార్థినులు రెండు రకాలు. జీవితాంతం మతశాస్గ్రాన్ని అధ్యయనం చేసేవారు బ్రహ్మవాదినులు, వివాహమయ్యేవరకు విద్యనభ్యసించువారు సద్యోద్వాహులు.

– రుగ్వేదంలో కొన్ని రుక్కులు స్త్రీలు రాశారని చెప్పబడుతుంది. అపాల ఇంద్రున్ని కొనియాడుతూ రుక్కు చెప్పింది. విశ్వావర అగ్నిని స్తోత్రం చేసింది.

– కాశకృత్సవ మీమాంసపై ఉద్గ్రంథం రాసింది.

– ఆత్రేయ వేదాంతాన్ని అధ్యయనం చేసింది. ఆమె గొప్ప పండితురాలు. వాల్మీకి, అగస్త్యుని వద్ద ఆమె విద్యనార్జించింది.

– ఆ కాలంలో స్త్రీలకు ఉపనయనం ఉండేది. ఆ కర్మలలో ఆమె నడుముకు పలుపు కట్టేవారు. కర్మలలో పాల్గొనటానికి ఆమెకు ప్రవేశం కల్పించటానికి అది చిహ్నమట.

– బౌద్ధంలో అనేకమంది స్త్రీలు సంఘంలో చేరి సన్యాస జీవితాన్ని గడిపారు. ”తేరీగాథ” అనే గ్రంథాన్ని అలాంటి స్త్రీలు రచించారు.

– గాథా సప్తశతిలో అనేకమంది కవయిత్రుల పేర్లు కనబడతాయి. రేవ, రోహ, మాధవి, అమలక్ష్మీ.

– సంస్కృత కవుల చరిత్రలో పెక్కుమంది స్త్రీల పేర్లు ఉటంకించబడ్డాయి. ఉదా: మారులా, మోరికా, సుభద్రా, ప్రియదర్శిని, శకుంతల, కాదంబరి లాంటి కావ్యాలలో నాయికలు లలిత కళలలో ప్రవీణులు.

– శాతవాహనుల కాలపు నాయనికా క్రీ.పూ. 2 శతాబ్దం

– వాకాటక వంశపు ప్రభావతిగుప్త క్రీ.త. 4వ శతాబ్దం

– చాణక్య వంశపు విజయ భట్టారిక క్రీ.త. 7వ శతాబ్దం

– కాశ్మీరుకు చెందిన సుగంధ దిద్దా క్రీ.త. 10వ శతాబ్దం పరిపాలనాదకక్షులు.

– వయసు వచ్చిన ఆడపిల్లలు గృహనిర్వహణలో ఎక్కువ బాధ్యత తీసుకునేవారు. శకుంతల, కుంతి విధి నిర్వహణ చేసి అతిథి అభ్యాగతులను ఆదరించారు.

– వేద కాలంలో పురాణ కాలంలో స్త్రీలు ‘కందువ’ క్రీడల్లో పాల్గొనేవారు. బంతి ఆట ద్వారా తగినంత శరీర వ్యాయామాన్ని పొందేవారు.

– సర్వ సామాన్యంగా వేదకాలంలో ఆడపిల్లలు ఇంట్లో పెద్దల వద్ద విద్యను అభ్యసించేవారు. స్త్రీలు ఎక్కువ దూరం వెళ్లి విద్యాభ్యాసం చేయలేదని జాతక కథలను బట్టి తెలుస్తుంది.

– వేదకాలంలో కన్య సామాజిక ఉత్సవాలన్నింటిలో పాల్గొనేది. భర్తను వెతుక్కోవటానికి ‘సమనకు’ వెళ్ళేది. తల్లులు కుమార్తెలను అలంకరించి పంపేవారు. వరులు అచట తమకు కాబోయే భార్యల అభిమానాన్ని చూరగొనటానికి ప్రయత్నించేవారు. ‘సమనలు’ సాధారణంగా వసంత ఋతువులో ఏర్పాటయ్యేవి. యువతీ యువకులు చెట్టాపట్టాలేసుకొని నృత్యం చేసేవారు.

– భారతకాలం నాటికి స్త్రీలు, పురుషులు కలిసి ఆడటం ఆగిపోయింది.

– ధర్మశాస్త్ర యుగం – పురాణకాలం స్త్రీకి అంధకార యుగాలని చెప్పవచ్చు. స్త్రీని చూస్తే భయం, స్త్రీని నిరసించడం, ఆమె స్వేచ్ఛను అరికట్టడం, ఆమెను విద్యా విజ్ఞానాలకు దూరంగా ఉంచడం, ఆమె పురుషుని అంటిపెట్టుకొని బతికేలా చేయడం ఆనాటి పురుషుల చర్యలు.

– ముస్లిం యుగంలో పర్దా అవతరించింది. భార్యలను రక్షించుకోవడమే పురుషుల కర్తవ్యంగా పరిణమించింది. విందులు వినోదాలకు స్త్రీ దూరమయింది.

– వాత్సాయనుని కాలానికి వేశ్యాసంగమం ప్రతిష్టాకరమయింది. 10,12 శతాబ్దాలలో నిర్మితమైన దేవాలయాలలో స్త్రీ పురుష శృంగార ఘట్టాలు చిత్రితమైనాయి.

– రజస్వల అయిన స్త్రీ నాలుగు మూరల దూరంలోను, ప్రసవించిన స్త్రీ ఎనిమిది మూరల దూరంలోను ఉండవలెనని బృహస్పతి నిర్దేశించాడు.

– ఋగ్వేదకాలంలో స్త్రీ బలహీనురాలు కాదు. సాహసి, స్వేచ్ఛాజీవి. ఆమెకు వ్యక్తిత్వం ఉండేది. స్త్రీ శిశు జననాన్ని దురదృష్టంగా భావించిన దాఖలాలు లేవు. కాని పురుష సంతానం కావాలని అనేక రుక్కులున్నాయి. పలుసార్లు పురుష సంతానం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేయబడింది.

– బాలిక హోదా మరీ హీనమైనది కాదు. కాని బాలుని హోదాతో మాత్రం సమానమైనది కాదు (అశ్వలాయన గృహ్యసూత్రం)

– అధర్వవేదంలో గొడ్రాలితనం రాకుండా తాయత్తు, పురుష సంతానం కలగటానికి ప్రార్థన, ఆడపిల్ల వద్దని అభ్యర్థనలున్నాయి.

– బ్రాహ్మణాల కాలం సుమారు క్రీ.పూ. 600 వరకు సాగింది. కుమారునికి విలువ పెరిగింది. కుమారుడు మోక్ష సాధనం. కుమార్తెలు బరువుగా ఎంచబడి బాలిక జననం అక్కరలేదని క్రతువులు చేయసాగారు. ఈ క్రతువులను తైత్తరీయ సంహిత నిర్దేశించింది.

– భార్య సహచరి, కుమార్తె దుఃఖభాడనురాలు, కుమారుడు ఉన్నతోన్నత స్వర్గంలో దీపం. (ఐతరేయ బ్రాహ్మణం).

– పురుష ప్రాధాన్యత గల సమాజాన్ని హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు, హిందూ సంస్కృతి ఊహించాయి, పోషిస్తున్నాయి.

– ”విశీలః కామవృత్తోవా – గుణైవ పరివర్జితః ఉపచర్యః స్త్రీయా స్వాధ్యా సతతం దేవత్పతి” (మనుధర్మశాస్త్రం) అనగా భర్త శీలరహితుడైనను, కామ ప్రవృత్తి కలవాడైనను, ఏ సద్గుణములు లేని వాడైనను, భార్య అతనిని దేవునిగా భావించి పూజించవలెనని భావం.

ఈ విధంగా ఒకప్పుడు స్త్రీ జీవితం ఔన్నత్యంతో ప్రకాశించినప్పటికీ, రానురాను ఆమె జీవితంలో అపశ్రుతులు వెల్లివిరిశాయి. ఆమె హోదా, స్థాయిలలో విపరీతమైన పరిణామాలు కలిగాయి. స్త్రీకి ద్వితీయశ్రేణి పౌరసత్వం అంటకట్టబడింది. ఈ సందర్భంగా భర్త మరణానంతరం వితంతువైన ఒక స్త్రీ జీవితాన్ని ఊహించదు. చాలా కష్టసాధ్యమైన పని. అందుకే ఎంతోమంది సంఘ సంస్కర్తలు అప్పట్లో హిందూ సంప్రదాయంలో అమల్లో ఉన్న ”సతీ సహగమనాన్ని” రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. లార్డు విలియం బెంటింగ్‌, లార్డు కానింగ్‌ మొదలైన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో ఎంతో ప్రయత్నం జరిగింది. తుదకు 1856లో లార్డు డల్‌ హౌసీ కాలంలో ”సతీ సహగమన నిర్మూలన” చట్టరూపకంగా వెలువడింది. భర్త చనిపోయిన స్త్రీ వితంతువులకు ఎన్నో విధాలైన నిబంధనలను, ఆంక్షలకు మన పెద్దలు, పండితోత్తములు, సమాజం, సనాతన ధర్మాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు విధించి అమానవీయ దృక్పథాన్ని చాటడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. సాధారణ సమయంలో కూడా స్త్రీలను గురించిన కొన్ని భావనలు చదువుతుంటే, వింటుంటే సభ్యసమాజానికి తలవంపులుగానే ఉంటాయి. ప్రత్యేకించి స్త్రీల గురించి ఇలాంటి ”వివక్ష వైఖరి” ఎందుకుంది? అనేది సమాధానం లేని ప్రశ్న.

స్త్రీని గురించిన కొన్ని భావనలు :

– ‘అస్వతంత్రా ధర్మే స్త్రీ’ ధర్మంలో స్త్రీకి స్వాతంత్య్రమే లేదు.

– భర్త అనుజ్ఞ లేకుండా చేయబడు వ్రతములు రాక్షసులకు చేరునని స్మృతులు చెప్పుచున్నవి. (హిందూ మతం పుట 143)

– ”స్త్రీలు చంచల చిత్తులు” రుగ్వేదం

– ”స్త్రీ అసత్యానికి మారుపేరు” మైత్రాయణ సంహిత

– ”స్త్రీలు అసత్యం అవతారమూర్తి” రామాయణం

– స్త్రీలు క్రూరులు, స్వార్థపరులు – రామాయణం

– స్త్రీలలో మెరుపు యొక్క చంచలత్వం, ఆయుధం యొక్క పదును, డేగ యొక్క వేగం అన్నీ కలిసి ఉన్నాయి. (రామాయణంలో ‘అగస్త్యుని’ పలుకులు)

– స్త్రీలు మనసును అదుపులో పెట్టుకోలేరు (రుగ్వేదం)

– స్త్రీల దుర్గుణాలను లోపాలను వర్ణించాలంటే నూరు నాలుకలు కల మనిషికయినా నూరే&ండ్ల కాలం చాలదు (మహాభారతం)

– స్త్రీలలో చెలిమి అనేది లేదు. వారి హృదయాలు క్రూరమైనవి. (శతపథ బ్రాహ్మణం)

– ”స్త్రీ, శూద్రుడు, శునకం, కాకి అసత్యానికి, పాపానికి, అంధకారానికి మారుపేరు” (శతపథ బ్రాహ్మణం)

– స్త్రీ పాపానికి మూలం (మహాభారతం అనుశాసన పర్వం)

– స్త్రీ చేత పరిపాలింపబడేదే దేశానికి అపకీర్తి సంభవిస్తుంది. స్త్రీ ఆధిపత్యానికి లొంగే పురుషులు అప్రతిష్ఠ పాలవుతారు (అశోకరుద్ర వ్యాసం).

– మనువు, శుక్రుడు – చాణక్యుడు – యాజ్ఞవల్కు ్యడు స్త్రీని తక్కువ చూపు చూశారు.

– ధర్మశాస్త్రాలు, పురాణాలు స్త్రీలకు ద్వితీయ స్థానం ఇచ్చాయి. భర్త నీడలో బతికే మనిషిగా భార్యను మలిచాయి.

– ఋగ్వేదం, అధర్మవేదం, శ్రౌత సూత్రాలు, గృహ్యసూత్రాలు, ధర్మసూత్రాలు, స్మృతులు, ధర్మశాస్త్రాలు వాటి వివరణలో భాష్యాలు మరియు ఇతర గ్రంథాలు, ఇండో ఇరానియనుల వలస – హూణుల శకుల దండయాత్రలు, ముసల్మానుల దాడులు, ముసల్మానుల రాజ్యస్థాపన, పాశ్చాత్యుల దేశప్రవేశం, ఇవన్నీ కూడా హిందూ సమాజంపై ప్రభావం చూపాయి. అంతేకాకుండా, జైన, బౌద్ధ మతాలు కూడా కొంతలోకొంత హిందూ సమాజాన్ని మలిచాయి. స్త్రీల హోదాలో, స్థాయిలో అనేక మార్పుల్ని కలుగజేశాయి. వితంతు వ్యవస్థలో పెనుమార్పులు సృష్టించాయి.

– వేదకాలంలో స్వయంవరాలు ఉండేవి.

– వైదిక వాఙ్మయంలో వర్ణాంతర వివాహాలు కనబడతాయి.

– ఆడపిల్లను అమ్మినవారి సంరక్షకులు ఘోరమైన నరకానికి పోతారని బౌద్ధాయనుడు ప్రకటించారు. ఆడపిల్లను విక్రయించిన వాని ముఖం చూడరాదని పద్మపురాణం శాసించింది.

– భ్రూణ హత్య మహాపాతకమని చెప్పబడింది.

– సుమంగళీ, కళ్యాణీ, గృహలక్ష్మీ, వీరాంగన, సతి, సాధ్వి అని స్త్రీలు పొగడ్తలనందారు. భర్తను కోల్పోయిన స్త్రీని విధవ, వితంతువు అంటూ నీచంగా, హీనంగా చూడడం ఆనవాయితీగా మారింది. బయటి ప్రపంచానికి వారి ముఖం కనిపించగూడదనే ఆంక్షలు మొదలయ్యాయి. వితంతు స్త్రీలు అపశకునంగా పరిగణించబడ్డారు.

– ఏక భార్యాత్వం, ఏక భర్తృత్వం ఋగ్వేద కాలంలో ఉన్న నియమం. వేద కాలం చివరి రోజుల్లో బహుభార్యాత్వం కనబడుతుంది.

– భర్త భుజించిన తరువాత భార్య భోజనం చేయాలని ‘శతపథ బ్రాహ్మణం’లో చెప్పబడింది.

– భార్య భర్త ఆజ్ఞలను శిరసా వహించాలని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.

– రాజులు యోచించు చోట స్త్రీలు ఉండరాదు. పండితుల సమావేశాలల్లో పాలు పంచుకోరాదు.

– గృహ్యసూత్రాల్లో ఒక్క పారాస్కర గృహ్యసూత్రం మాత్రమే బహు భార్యాత్వాన్ని సమర్థించింది.

– బౌద్ధంలో ‘సతీ సహగమనం’ లేదు. పునర్వివాహం ఉంది.

– జైనులలో కొందరు సతీసహగమనాన్ని ఆమోదించారు.

– కాదంబరి రచయిత బాణుడు సతీసహగమనాన్ని నిరసించాడు.

– విధవ నూనె అంటుకొని తలస్నానం చేయరాదని సన్యాసి కారాదని ప్రాచేతనుడు స్కాంద పురాణం (కాశీఖండం)లో విధవ విధులను విశదీకరించాడు.

– భర్త చనిపోయిన స్త్రీ ‘శిరోముండనం’ చేయించుకోవాలనే ఆచారం అమల్లో ఉండేది.

– వేదకాలంలో నాట్యకత్తెలు ఉండేవారు. రాజాస్థానాల్లో నృత్యం చేసేవారు.

– ఆడపిల్లను దేవదాసీలుగా ఇస్తే సూర్యలోక ప్రాప్తి జరుగుతుందని భవిష్యత్‌ పురాణం చెప్తుంది.

ఆడపిల్లను తక్కువగా చూడడానికి కారణాలు :

– మగపిల్లవాడు వంశాంకురం, వంశోద్ధారకుడు – ఆడపిల్ల పరాయిది.

– కర్మకాండ చేస్తాడు, పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు.

– వంశం నిలుస్తుంది – మోక్ష ప్రాప్తి కలుగుతుంది.

– తల్లిదండ్రులకు సంరక్షకుడు – పోషణభారం వహించేవాడు.

– ఇంటా బయట సహాయం చేస్తాడు. కుటుంబ స్థాయి, శక్తి వారిమీదనే ఆధారపడి ఉంటాయి.

– కుటుంబ ఆర్థికాభివృద్ధికి, కష్టకాలంలో ఆదుకోవడానికి, కుటుంబ నిర్వహణకు తోడ్పడతాడు అనే ఎన్నో ఇతర భావనలు వివక్షతకు కారణాలు.

– భార్య చనిపోయిన పురుషున్ని గుర్తించడానికి సమాజం అతనికి ఎలాంటి నిబంధనలను అంటగట్టడం లేదు. ఆడవాళ్లకు మాత్రమే ఎన్నో ఆంక్షలు. మగవాళ్లు పెండ్లిల్లు, పేరంటాలలో (నిక్షేపంగా) కుంకుమ బొట్టు ధరించవచ్చు, ఉంపుడుకత్తెల్ని పెట్టుకొని, ద్వితీయ వివాహం చేసుకొని, నిక్షేపంగా లైంగిక కోర్కెలను తీర్చుకోవచ్చు. వీలైతే చిన్న ఇల్లు, పెద్ద ఇల్లును నిర్వహించుకోవచ్చు. కొందరు పురుషులు మాత్రం నూలు మొలతాడు తీసివేస్తారట. వెండి మొలతాడును ధరించవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేవు. భర్త చనిపోయిన స్త్రీలను మాత్రం విధవ, వితంతువు, ముండతనం అనే భాషా పదాలను అంటగట్టి అనాదిగా అదీ ఒక సాంఘిక ఆచారంగా, కట్టుబాటుగా తయారుచేసి స్త్రీ శక్తి కుంచించుకుపోవడానికి ఎవరు కారణభూతులు?

– నేటి సమాజంలో మగబిడ్డలను కన్నతల్లి హోదా పెద్దది. మగపిల్లవాడు కుటుంబానికి ఒక పెట్టుబడి. పూర్వీకుల ఆస్తికి వారసుడు.

– ఆడపిల్ల ఆర్థిక భారం, ఆమె పుట్టుక, పోషణ, చదువు, వివాహం, ఉద్యోగం, సంపాదన, కుటుంబ నిర్వహణ అన్నీ సమస్యలే. అందుకే భ్రూణహత్యలు, చెత్త కుండీలల్లో పారేయడం, రైల్వే ట్రాకులల్లో, పొదలల్లో పారేయడం, బతికి బట్టకట్టిన వారిని అమ్మేయడం. ఈనాడు సాధారణ స్త్రీలనే ఎన్నో రకాలైన కష్టాలు, కడగండ్లు చుట్టుముడుతున్నాయి. ఇంకా విధవలు – వితంతువుల అగచాట్లు చెప్పనవసరం లేదు.

– అనాదిగా స్త్రీ శృంగారవస్తువు, విలాసవస్తువు, పడకటింటికి పరిమితం, వంటింటి కుందేలు, శక్తీహీనురాలు, బలహీనురాలు, అబల, సుకుమారీ, ఆటబొమ్మ, చెల్లింపు లేని పనిమనిషిగా భావించ బడుతుంది.

– శారీరక నిర్మాణంలో తేడాలున్నాయనే సాకుతో సామాజిక అసమానత్వాన్ని సమర్థించే వాదన.

– స్త్రీ ఇష్టపూర్వకంగా తన వ్యక్తిత్వాన్ని నశింపజేసుకోవడం, పురుషాధిపత్యానికి లొంగి ఉండడం, శ్రమశక్తి దోపిడీకి గురికావడం, సామాజికంగా హక్కులు లేకపోవడం, ఉన్నా అవగాహన చేసుకోక పోవడం, తమ ఇంటిలోనే తాము బానిసలుగా బతుకుతూ బానిసత్వానికి లోను కావడం, ఉంపుడు కత్తెలుగా బతకడం ఇవన్నీ వ్యక్తిత్వ వినాశ లక్షణాలు.

– ఆడపిల్లలు మగపిల్లలు తల్లిదండ్రులకు రెండు కళ్లు. ఈ సృష్టి ప్రకృతి పురుషుల కలయిక. సృష్టిలో పరాత్పరుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానులు. ఆకాశంలో సగం – ఆకాశంలో విభజన రేఖలు లేవు. అఖిలాండ కోటి బ్రహ్మాండానికి ఆదిశక్తి, పరాశక్తి, అపారశక్తి స్త్రీ. సంతాన ప్రాప్తిలో మానవ జీవిత పరిణామ గతిలో ఇద్దరూ సమానులు. పురుషుడు బీజప్రదాత, అవనీతల్లి మాత. ఇద్దరూ సగం – సగం – కాని సగాలు సమానం కాని విడ్డూరమైన గణితశాస్త్రం చిక్కుముడుల లెక్కల్లో చిక్కుకుపోయిందీ సమాజం. ”అంతరించిపోతున్న వింతజాతి ఆడజాతి”. పురుషాధిపత్యానికి, శరీర, ధన, మాన, ప్రాణాలను అర్పించిన వ్యక్తిత్వం లేని ఆటబొమ్మగా జీవిస్తుంది. ‘అబల’ అనే సామాజిక ముద్ర వేయించుకుంది. అలాంటప్పుడు వేరుగా విధవలు – వింతతువుల జీవన పరిధులను, పరిణామాలను గురించి ఆలోచించడం, అంచనా వేయడం విడ్డూరం. సమాజంలో ఒక స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం, మర్యాద, విలువ, స్థాయి, హోదాతోనే అని ముడివడి ఉంటాయి. ఈ తారతమ్యానికి కారణాలు: 1. మత సంస్కృతి, 2. సనాతన సంప్రదాయాలు, 3. ఆచారాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, 4.హక్కులు విధులు, బాధ్యతలు, కర్తవ్యాలు, ధర్మాలను తెలుసుకోకపోవడం, 5.అసమానత, అవిద్య, అజ్ఞానంలో కొట్టుమిట్టాడడం.

తరాలు మారినా తల్లిదండ్రులకు, సమాజానికి ఇష్టంలేని ఉపేక్షిత శిశువుగా, చెల్లింపులేని పనిమనిషిగా స్త్రీ జీవితం అన్ని థలల్లో నేటికీ అభాసుపాలవుతూనే ఉంది. అవివాహిత, గొడ్రాలు, విధవ, అభాగిని, కులట అని స్త్రీలను ఎన్నో విధాలుగా ఈనాటి సమాజం అవహేళ చేస్తూనే ఉంది. మనం మన సమాజం మారేదెప్పుడో?

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us