మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

అద్బుతమైన యాత్రా ప్రాంతం అస్సాం

by Rangaraju Shyamsundar November 30, 2024
written by Rangaraju Shyamsundar

అస్సాం ని గేట్ వే ఆఫ్ ఈశాన్య భారతదేశం గా పరిగణిస్తారు.ఈసారిఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంరాష్ట్రాన్ని దర్శించుకునేందుకు ఎంచుకున్నాం.  విమానంలో హైదరాబాదు మీదుగా గౌహతికి వెళ్ళాం.

అస్సాం ప్రాంతం చాలా భాగం ఎగుడు, దిగుడు,కొండలు,గుట్టలు లోయలుగా ఉండే ఈ ప్రదేశాన్ని మొదటగా అసమా దేశంగా పిలిచేవారు కాలక్రమేనా అసమా పేరు కాస్త అస్సాంగా స్థిరపడింది.

గౌహతి విమానాశ్రయం నుండి దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి ముందుగా నీలాంచల్ పర్వత శ్రేణిలో ఉన్న కామాఖ్య ఆలయానికి చేరుకున్నాం. ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇది 51 శక్తిపిఠాల్లోఒకటి.ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళీ, తార, భువనేశ్వరి,బగలాముఖి, చిన్నమస్త,భైరవి,ధూమావతి, కమలాంబిక, షోడసి, మాతంగి అనే పది వేరు వేరు ఆలయాలు ఉన్నాయి. కామున్ని దహించిన ప్రదేశంగా దీనికి కామాఖ్య అనే పేరు స్థిరపడింది.

ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్య మతస్తుల దాడుల్లోద్వంసం కాగా 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నర నారాయణుడు పునర్ నిర్మించాడనిశాసనాధారాలు ఉన్నాయి. ఈ ఆలయం మూడు మండపాలుగా నిర్మించి ఉంటుంది. మొదటి ప్రాకారంలో గుహలా ఉండి గర్భాలయంలో నల్లటి బండరాయి ఉంటుందిదీనికి పూజలు జరుగుతాయి ఆ గుహలో రాతి మీద ఎప్పుడు జలం ఊరుతూ ఉంటుంది అందువల్ల ఎప్పుడు తడిగా ఉండి ఆలయమంతా చిత్తడిగా జారుతూ ఉంటుంది.

ప్రతి సంవత్సరం జూన్ రెండవ వారంలో అంబుభాషి సమయంలో నాలుగు రోజులు ఈ ప్రాంతంలోని ఆలయాలన్ని పూర్తిగామూసి వేయబడతాయి. ఈ ప్రాంతంలో ఇంకా అనేక ఆలయాలు ఉన్నాయి. సమయాబావంవల్ల ముఖ్య ఆలయాలను మాత్రమే దర్శించుకొని ఆ రోజు సాయంత్రం బ్రహ్మపుత్ర నదిలోని క్రూయిజ్విహారయాత్ర కోసం బయలుదేరాం.

ఇక బ్రహ్మపుత్రా నది విశేషాల్లోకి వస్తే బ్రహ్మపుత్ర ఆసియాలోని ముఖ్యమైన నదుల్లో ఒకటి. చాలా నదులు సహజంగా స్త్రీ పేరుతో పిలువబడగా బ్రహ్మపుత్ర మాత్రమే పురుష నామముతో పిలవబడటం విశేషం.ఈ నదిటిబెట్లో నైరుతి ప్రదేశంలో యార్లు నదిగా పుట్టి దక్షిణ టిబెట్లో దిహన్ నదిగా ప్రవహించి హిమాలయాలలోని లోతైన లోయలోకి ప్రవహించి దాదాపు 2900ల కిలోమీటర్లు ప్రవహించి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం దాదాపు 650 చదరపు కిలోమీటర్లు. ఈ నది ప్రత్యేకత ఏంటంటే సముద్రం లాగానే ఈ నదిలోకూడాఅలలు ఉవ్వేత్తున ఎగిసి పడతాయి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, చైనా దేశాల్లో ప్రవహిస్తుంది.

2011లోమేము మొట్టమొదటిసారి మానససరోవరం వెళ్ళినప్పుడు ఉత్తర హిమాలయాల్లోని కైలాస పర్వతం దర్శించినప్పుడు అతి తక్కువ ప్రవాహంగా ఉండే ఈ నది ప్రవాహ వేగం దాదాపు పదివేల అడుగుల ఎత్తులో ప్రవహించి ప్రపంచంలోని అన్ని నదుల కన్నా ఎత్తుగా ప్రవహిస్తున్న నదిగా కూడా రికార్డుల్లో ఉంది.కొన్ని ప్రాంతాల్లో ఈ నది వెడల్పు దాదాపు 12 కిలోమీటర్ల నుండి 24 కిలోమీటర్లు పైబడి కూడా ఉండి కొన్ని ప్రాంతాల్లో దాదాపు60 నుండి 70 అడుగుల లోతు ఉంటుంది.  ఇదిప్రపంచంలోనే 9 వ అతిపెద్ద నది.

ఇక మా క్రూయిజ్ప్రయాణం లోహిత్ గాట్లోప్రారంభం అయింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం చూడడానికి చాలామంది క్రూయిజ్ ప్రయాణం ఎంచుకుంటారు. క్రింది భాగంలో రూ.650 వసూలు చేస్తారు కానీ సంగీత శబ్దాలు ఎక్కువగా ఉండటం వల్ల మేము పై భాగంలోకి వెళ్ళాము దీనికి రూ.750 రుసుముగా ఉంటుంది.

దాదాపు ఒక రెండు గంటలు క్రూయిజ్ లో నది విహారం చేశాం. చుట్టుపక్కల ఉండే నదిలోని దీవులు, ఎత్తైన భవనాలు వాటి అలంకరణలు, వాటి ప్రతిబింబాలు నీటిలో ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఇప్పటివరకు చాలా క్రూయిజ్ లలో తిరిగిన అనుభవం ఉన్నాఈ క్రూయిజ్ అనుభవం మాత్రం అనిర్వచనీయంగా ఉంది.క్రూయిజ్ లో భోజనం ముగించుకొని వసతి గృహానికి చేరుకున్నాం.

ఆ మరుసటి రోజు ఉదయం ఉపాహారం ముగించుకొని తదుపరి యాత్రా ప్రదేశం ఐనకజీరంగానేషనల్ పార్క్ చూడ్డానికి బయలుదేరాం. గౌహతి నుండి దాదాపుగా 204 కిలోమీటర్ల దూరంలో ఉన్న కజీరంగా చేరడానికి దాదాపు 5 గంటలు పడుతుంది. మధ్యలో దారిలోని కొన్ని ప్రదేశాలను దర్శించుకుని నాలుగు గంటల వరకు కజీరంగాలోని మా వసతి గృహానికి చేరుకున్నాం.

 ఆరోజు రాత్రి భోజనం ముగించుకుని విశాలమైన మా వసతి గృహంలో విహరించినప్పుడు ఆకాశం మొత్తం నల్లని చుక్కల చీర కట్టుకుందా అనిపించి చిన్నప్పటి మధురస్మృతులను గుర్తుకు తెచ్చింది. రాత్రి సమయంలో పెరట్లో నులకమంచం పై అమ్మ పక్కన పడుకొని అమ్మ చెప్పే చక్కటి చందమామ కథలు వింటూ ఆకాశంలో నుండి జారిపడుతున్నట్లుగా అనిపించే నక్షత్రాలను లెక్కపెడుతున్న రోజులు గుర్తుకు వచ్చి మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఆ రాత్రంతా అలానే నక్షత్రాలను చూస్తూ ఉండిపోవాలని అనిపించింది.

ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకే కజిరంగా పార్కుకు చేరుకున్నాం. ఇక కజిరంగా పార్కు నేపథ్యం చూస్తే ఇది ప్రపంచంలోనే హెరిటేజ్ పార్క్ గా గుర్తింపు పొందిన ఈ పార్కు 1905లో స్థాపించబడి 1974లో నేషనల్ పార్కుగా అవతరించింది. దాదాపు 70,780 ఎకరాలు కలిగి ఉన్న ఈ పార్క్ మధ్య నుండి బ్రహ్మపుత్రా నది కూడా ప్రవహిస్తుంది. ఈ పార్కు ప్రపంచంలోనే మూడింట రెండువంతులు ఒక కొమ్ముగల ఖడ్గమృగాలకు ఈ పార్క్ ఆతిథ్యమిస్తోంది. దాదాపు 3 వేల పై చిలుకు గల ఖడ్గ మృగాలు ఇందులో ఉన్నట్లు అంచనా.ఒక్కొక్క ఖడ్గమృగం 1600 కేజీల నుండి 2700 కేజీలవరకు ఉంటాయి. ఇవి అపాయం ఉన్నట్టు గమనిస్తే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి. ఈ పార్కులో 57% నీటి గేదెలు, ఏడు జాతుల రాబందులు, ఏనుగులు, జింకలు, మెరిసే జింకలు,క్యాపడ్ లంగూర్లు,చిరుత పులులు, ఎలుగుబంటులు, బెంగాల్ ఫాక్స్, హిమాలయన్స్ స్క్వేరిల్ తో పాటు 385 రకాల పక్షుల జాతులు ఉన్నట్లు15 రకాల క్షీరదాలు ఉన్నట్లు అంచనా.

కజీరంగా పార్కులో ఏనుగులపై స్వారీ మరియు 5 జోనులలో జీప్ సఫారీలు ఉంటాయి. ఏనుగు సఫారీఉదయము 6 నుంచి 7వరకుమరియు 7 నుంచి 8వరకుఅనుమతిస్తారు.  జీప్ సఫారీ ఎనిమిది గంటలకు మొదలవుతుంది. జీప్ సఫారీలో ప్రయాణించి ఖడ్గమృగాలను, ఏనుగుల గుంపును, జింకల గుంపును, నీటి గేదెలను మాత్రమే చూడగలిగాం కానీ స్వేచ్ఛగా తిరుగుతున్న జంతువులను చూస్తుంటే ఒకవైపు సంతోషం ఇంకోవైపు హఠాత్తుగా వేరే జంతువులు వచ్చి మీద పడతాయోఅన్న భయం కలగలిపి ఒక విధమైన కొత్త భయం కలిగినా జీప్సఫారీ మాత్రం అద్భుతంగా అనిపించింది. ఇంకా కొన్ని పక్షుల జాతులను కూడా చూశాం ఒకే మారు 4 నుండి 5 జీపులను ఒక ఫారెస్ట్ గార్డ్అనుమతిస్తారు.

చాలా దూరంలో టైగర్ కూడా చూసామని కొందరు చెప్పారు కానీ మాకు మాత్రం కనబడలేదు. మధ్యాహ్నం వరకు జీప్ సఫారీ పూర్తి చేసుకుని అదే ప్రాంతంలోని అరుదైనమొక్కలుమరియుఅంతరించిపోతున్నజాతులమొక్కలుకలిగిఉన్న పార్క్ కి వెళ్ళాం. ప్రపంచంలోని అరుదైన మొక్కలనుసేకరించి ఇందులో ఉంచారు. చాలా రకాలైన అరుదైన పుష్పాలు, అరుదైన మొక్కలు చూసి సంభ్రమాచార్యలకు లోనయ్యాం. ఆ తదుపరి ఈ పార్క్ లోనే దాదాపు 30 రకాల అస్సాం (PHOTO 5) వంటకాలతో వడ్డించిన బాహుబలి భోజనం ఎంతో సంతృప్తిని ఆనందాన్ని కలుగజేసింది.

సాయంత్రం వరకు పార్క్లోని వివిధ ప్రాంతాలు దర్శించి ప్రత్యేకంగా కొన్ని వందల రకాల వెదురు బొంగుల పార్కునుకూడాదర్శించి ఆశ్చర్యపోయాం. సాయంత్రం అక్కడే అస్సాం కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ నృత్యకార్యక్రమాలు వీక్షించి ఆ పరిసర ప్రాంతంలోని తేయాకు తోటల్లో ఫోటోలు తీసుకొని మా వసతి గృహానికి చేరుకున్నాం.

ఆ మరుసటి రోజు కజీరంగా నుండి సాంస్కృతిక కళలకు నేపథ్యమున్న తేజ్ పూర్ బయలుదేరాం. దారిలో కొసాయి అనే గ్రామంలో అతి ఎత్తైన మహా మృత్యుంజయ లింగం దర్శించుకుని ఈ ప్రాంతంలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు మృత్యుంజయ మంత్రంతో తపస్సు చేశాడని ఆ తదుపరి స్థానికులు ఈ ప్రాంతంలో అతిఎత్తయిన శివలింగాన్ని ప్రతిష్టించి ఇప్పటికీ పూజలు కొనసాగిస్తున్నారని స్థానికులువిషదికరిస్తేవినిఅపురూపమైనప్రాంతంచూశామనేసంతృప్తితోతేజ్పూర్కిచేరుకున్నాం. తేజ్ పూర్ లో బాణాసుర రాజుచే నిర్మించబడ్డ పురాతన ప్రముఖ మహా భైరవ ఆలయం దర్శించుకున్నాం. ఇక్కడి శివలింగం ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతున్నట్టు స్థానికులు చెప్పారు. అక్కడినుండి బ్రహ్మపుత్రా నది తీరంలో బాణాసుర రాజు తన కుమార్తె ఉష అనిరుద్ ని  ప్రేమించిన విషయం తెలుసుకొని ఆమెను బంధించి ఉంచిన ప్రదేశమైనా అగ్నిగర్ దర్శించుకున్నాం. ఈ అగ్నిగర్ గుట్ట పై భాగంలో ఉంటుంది. ఈ ప్రాంతం నుండి బ్రహ్మపుత్రా నది ప్రవాహాన్ని, సూర్యోస్తమయ అందాలను బ్రహ్మపుత్రా నది పైన నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని,తేజ్ పూర్ పట్టణాన్ని వీక్షిచం. ఇక్కడి నుండి బ్రహ్మపుత్ర ఘాట్లనుకూడా దర్శించుకుని అక్కడి తేయాకు తోటలను దర్శించుకుని వసతిగృహం చేరుకున్నాం.

విహంగ వీక్షణవీక్షణంలా సాగిన ఈ మా నాలుగు రోజులు అతి ముఖ్యమైనఅస్సాం ప్రాంతాల ఈ ప్రయాణం ఈరోజుతో ముగిసింది.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనిషి- మరణం

by Ammangi Venugopal November 30, 2024
written by Ammangi Venugopal

మనిషంటే
కాల సముద్రాన్ని ఈది వచ్చిన గజ ఈతగాడు
భూకంపాలతో అగ్నిపర్వతాలతో
క్రూర మృగాలతో ఉల్కా పాతాలతో
ఈ భూమి సంకుల సమరంగా ఉన్నప్పుడు
ధైర్యమే ఆయుధంగా పోరాడి గెలిచిన విశ్వవిజేత

సంస్కృతి నాగరికతల చక్రాల మీద
పరిగెత్తిన చరిత్ర అంతా మనిషిదే
అతని కోసమే ఈ సజీవ సృష్టి
విప్పారిన పూలతో ఉత్సవం చేసుకుంటున్నది
అతడు చిందించిన చెమట చుక్కలోనే
హరివిల్లు తన అందం చూసుకుంటున్నది

జననం మనిషి జన్మ హక్కు
తనని ఎప్పుడూ మృత్యువుకు తాకట్టు పెట్టలేదు
కాని – ఇదేమిటి?
పక్షి రెక్కల టప టప
గుండెలోని దడ దడ
క్షణాలను లెక్కపెట్టే లోగా
మనిషిని లాక్కుపోతున్నది రోగం!
స్నేహాలు,ఆప్యాయతలు, అనుబంధాలు
నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాయి
ప్రేమతో పేదరికం జయించినవాడు
కరచాలనంతో కష్టాలను ధిక్కరించినవాడు
పొగిలి పొగిలి ఏడ్చినా,విరగబడి నవ్వినా
చిమ్మిన కన్నీటి చుక్కలో ప్రతిబింబించినవాడు
భూమిలో లోతుల్లోకి ఇంకిపోతున్నాడు!
మానవ చరిత్రకు పునాదులు తీసినవాడు
మన ముందే మట్టిలోకా?
సాహసంతో కార్చిచ్చును చల్లార్చినవాడు
ఈరోజు చితిమంటల్లోనా?
శాస్త్ర శస్త్రంతో చావును చావు దెబ్బ తీయాలి
మరణించిన మనిషిని మళ్లీ బతికించాలి

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

సీతమాట – బంగారు మూట పద్య మాలిక

by Dr. Nannapuraju Vijayasri November 29, 2024
written by Dr. Nannapuraju Vijayasri

సీతమాట శతకకర్త డా. చీదెళ్ళ సీతాలక్ష్మి విశ్రాంత సహాయాచార్యులు ప్రభుత్వ డిగ్రీకళాశాల ఇబ్రాహింపట్నం రంగారెడ్డి జిల్లా
అనేక కవితలు, కథానికలు, కథలు, పద్యాలు, వ్యాసాలు, వ్యంజ కాలు, మొగ్గలు, గజల్స్, గేయాలు, హైకూలు అనేక ప్రక్రియలుపలు రచనలు చేశారు అనేక పత్రికలలో ప్రచురించబడ్డాయి తెలుగులో లేఖాసాహిత్యం పై పి . హెచ్ . డి.సిద్ధాంత గ్రంధం ముద్రణ 2004 లో జరిగింది . తేలుగు కావ్యావతారికలలో సాహిత్య విమర్శ 15, వ శతాబ్దంవరకు ఎమ్. ఫిల్ . పరిశోధనాగ్రంథం ‘ ముద్రణ 2019 లో జరిగింది జానకీ రాఘవీ యం – జననీశతకం ముద్రణ 2017 లో జరిగింది
నందగిరి ఇందిరాదేవి కథలు సంపాదకులు డా. చీదేళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకటసత్య మూర్తి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ 2018 లో జరిగింది నంద గిరి ఇందిరాదేవి అమ్మమ్మ కధలు సంపాదకులు డా. చీదెళ్ళ సీతాలక్ష్మి పరిమి వెంకట సత్యమూర్తి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ 2019 లో జరిగింది
మేడ్చల్ సాహిత్య వేదిక దర్పణం సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు నిష్కల్మష వ్యక్తిత్వం ఉపన్యాస ధోరణి రచనా కౌశల్యం ప్రేమ స్వభావం ఆమె సహాజలక్షణం సంపూర్ణ మద్దతు తెలిపె సత్యమూర్తి అండదండ తో అనేక విజయాలు సాధించే సీతాలక్ష్మ వ్యయ ప్రయాసాలకోర్చి 202 సీతమాట పద్యాలను నేటియువతి యువకులకు అందించాలని అనేక పరిష్కార మార్గాలను పద్యంలో చూపించారు ఇది అమూల్యమైన పుస్తక రాజ మిదిఅక్షరజ్ఞానం కలిగిన వారు అందరూ చదివి ఆలోచించే పుస్తకము అందులో సూచించిన పరిష్కార మార్గాలు వినిపిస్తూ ప్రచురించిన అమూల్యమైన పుస్తకము అందరుచదివి ఆలోచించడమే కాదు అందులో సూచించిన పరిష్కార మార్గాలు అనుసరించాలి ఎలాంటి విపత్కరపరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు

ఇందులో ధైర్యం,చైతన్యం,సామాజిక న్యాయం,దైవం,అమ్మ,భాష,సెల్ ఫోన్,హిందువులకు బుర్కా పద్ధతి వద్దని,విద్యార్థులు శ్రద్ధగా చదవాలని,ప్రియుని మాటలు నమ్మరాదని,అధిక అలంకరణ మంచిది కాదని,మంచి స్నేహం చేయాలని,సంస్కారం ఉండాలని,గర్వం పనికిరాదని,బద్ధకం విడాలని,వ్యాయామం చేయాలని,తల్లిదండ్రులను గౌరవించాలని, బార్య భర్తలు అణ్యూ ణ్యంగా వుండాలని,తృప్తిగా జీవించాలని, చెడుపనులుచేయరాదని,కాళోజీ గురించి,ఉగాది గురించి,వలిగొండ రైలు ప్రమాదం గురించి,రాజకీయం గురించి,వలస కూలీలు వ్యద,రైతు వ్యధలు,లాక్ డౌన్ గురించి, అమరుల త్యాగం, మధ్యపానం మానాలని, ఆలోచించి మాట్లాడాలని, చెల్లెలిని ప్రేమగా చూసుకోవాలని, శ్రమించి పనిచేయాలని, వినయ విధేయతలు వుండాలని, బందువులు మనకు బాధ వచ్చినప్పుడే సహా యం చేసిన వారే నిజమైన బం దువులు అన్నారు .
201 పద్యాలతో చిత్తగించరయ్య సీతమా ట. అని బోధించిన డా. చీదెళ్ళ సీతాలక్ష్మి ఆటవెలది పద్యాలతో అనేక అంశాలు జోడించి వ్రాసిన నీతి శతకం సీత మాట
స్తబ్దత సృజన శీలత మానవీయత కలసి పుష్పించిన పుస్తకం సీత మాటమంచి చెడులను సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిశీలనలు ఉన్నాయి .సాహిత్యంలో వస్తున్న క్రమమార్పుల పట్ల బాధ్యతాయుతమైన అధ్యయనం అనుభవప్రాధాన్యత గల భావోద్వేగం పొందిన అనేక అంశాలతోరణం .ప్రయోగశీలమైంది వాస్తవికతను దృశ్యమానం చేశారు అర్థం కానివి విడమరిచి లోతుపాతులు తెలుసుకొనిస్పష్టంగా ఉన్నఅనేక సమస్యలను పద్యరూపకంగా సృజన శీలంగా అభివ్యక్తం చేశారు .
“చదువు లేన్ని యున్నసంస్కారమొకటే”
లేనిచోపశువుతో సమానం శిల్పం కోసం పాకులాడుతూ భావాన్ని నష్టపరుచుకోలేదు .భాష కోసం వెతుక్కోలేదు ఏవో అక్షరాల సమూహాన్ని అతికించే ప్రయత్నం చేయలేదు సహజంగా అతి సులభశైలిలోశతకాన్ని వివరించారు .
వినూత్న దృశ్య కోణాలు అన్వేషించారు సీతగారు
“ఆత్మహత్య యనగ అవహేళనకరము” బ్రతుకుచు సాధించు అన్నారు.
ఉన్నయంతలో నెయున్న తంబుగ నుండు
ఆశ పెంచుకొనకు మధికముగను
కలిగినంత తృప్తి ; తోలు గును శోకము
చిత్తగించరయ్య సీత మాట
అని చక్కగ తృప్తి గోప్పతనం వివరించారు
మాయమాట చెప్ప మనసు పాడైపోవు
చెప్పు మాటలెపుడుచెవికి యింపు
మంచి చెడు నెరుంగుమనిషియేశ్రేష్టుడు
చిత్తగించరయ్య సీత మాట
మాయ మాటలు వినరాదని అందులోని మంచి చెడును గ్రహించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రవహించే పద్యం సౌకుమార్యం మృదుల స్వభావం సున్నితత్వం, లాలన, పాలన, పలుకరింపు, ఒడుపుగా నీతిని బోధించడం మాట్లాడుకునే అంత సహాజంగా ఒదిగిపోయె పద్యాలు
ఎదుటి వారి నెవడు యెంత బాధించినా
సహనమునను వాడెసజ్జనుండు
నిజము దెలసినంత నీరేను నీచుడు
చిత్తగించరయ్య సీతమా ట
విద్యార్థులకు సహానం గోప్పతనం వివరించారు
శిలనులి సృశింప శిల్ప మౌను నిజము
లోహమెంత కాల్చ లొంగునంత
కష్టజీవి కెపుడు కాలమ్ము కలిసోచ్చు

చిత్తగించరయ్య సీతమా ట
విద్యార్థులు కష్టపడాలనికష్టపడితేనే ఫలితం వస్తుందని అన్నారు.
నిద్రాణ స్థితి నుంచి యువత మేలుకోవాలని మానవ పురోగతికి చిహ్నందౌర్భాగ్యపు పరిస్థితులు తలుచుకొని సంస్కృతిని దెబ్బతీయరాదని అన్నారు.
లంగ వోణి నేడు తుంగలో త్రోక్కిరి
వంటి కతుకుబట్ట వండ రయ్యే
వెకిలి వేషమంత విష సంస్కృతిని దెల్పు
చిత్తగించరయ్య సీతమా ట
సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించారు
భారమనుచు మీరు భావింప వలదులే
తల్లి తండ్రులంత తల్లడిల్ల
నిన్ను వదిలి వేయ నీ వెట్లు ఎదిగేవు
చిత్తగించరయ్య సీతమా ట
పూర్వ కాలంలో తల్లి దండ్రులను కడవరకు ప్రేమతో చూసేవారు . ప్రస్తుతం అనాధ ఆశ్రమం లో వేస్తున్నారని ఆవేదన వ్యక్త పరిచి అలా చేయ రాదని యువతకు నీతిని బోధించారు .
తెలుగులో లేఖా సాహిత్యం సిద్ధాంత గ్రంధంగా తెలుగు కావ్యా వతారికలలో సాహిత్య విమర్శ యం . ఫిల్‌ ‘ సిద్ధాంత గ్రంథంగా కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణం గా సీతమాట ద్విశతి బాల్య వివరాలు తెలియ జేసే జానకీ రాఘవీయం ఆనాటి ఆచారం సంప్రదాయాలు సంస్కృతిని ప్రతి భిం బించే శతకం జానకీ రాఘవీ యం
వ్యవస్థ మార్పుకు అద్దం పట్టిన తీరుతెన్నులు సీత మాట శతకం ప్రతి ఒక్కరు చదివే పుస్తకం

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

హైడ్రా

by Kura Bhanuja November 29, 2024
written by Kura Bhanuja

ఇది
కొత్తపదమైంది ఇపుడు!
పదాలు ఎపుడూ ఉంటూనే ఉంటాయి..
ఆవశ్యకత మాత్రం
కొన్ని సమయాలలోనే గుర్తొస్తుందా!

ఇచ్చే పర్మిషన్లు
పుచ్చుకున్నపుడు ఏమైందో??
కూల్చివేయడం చేతనైన పనే
బ్రతుకులు కూల్చేయడం సరైనదేనా??
అప్పులు తెచ్చి
ఆశలతో కట్టుకున్న
మధ్యబ్రతుకులు ఇవి!
ఎపుడూ మధ్యలోనే ఆగిపోవద్దని
ఒక్క అడుగు ముందుకేస్తే
హైడ్రా అనే వరద
మమ్మల్ని ముంచెత్తింది
కోలుకునే కొసమెరుపు
రానే లేదు
లేనే లేదు
రాజకీయం మారినప్పుడల్లా
ప్రభుత్వం మారినప్పుడల్లా
ఆశలు కాదు ఆశయాలు కాదు
బ్రతుకును చిదిమే భారం
ముంచుకొస్తుందనే భయం
ప్రజాస్వామ్య దేశంలో
పాలకుల పాలన
పరుగెడుతుంది ఎటువైపో
ఓటరు మిగులుతున్నాడెపుడు
మారుతున్న దారిలో మరుగునపడుతూ
ప్రశ్నలు మిగిలే ఉన్నాయి
FTL ఓటరుకేనా??
మరి ప్రభుత్వానికి??

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

వర్తమాన కవులలో అధ్యయనం తక్కువైంది- రాయడం ఎక్కువైంది- కందాళై రాఘవాచార్య

by Naresh Chary November 29, 2024
written by Naresh Chary

కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ కందాళై రాఘవాచార్య గారి ఇంటర్వ్యూ
కవిత్వం అంటే వీరికి ప్రాణం. గడ్డి పువ్వు నుండి గజరాజు వరకు , ఇసుక రేణువు నుండి కొండవరకు కవితా వస్తువులు. సామాన్యులు , సమాజం వీరి కవిత్వంలో ఆలోచనలు రేకిత్తిస్తుంటాయి. ఇలా ఎన్నో అంశాలపై కవిత్వమల్లిన కవి కందాళై రాఘవాచార్యులు.
1 “గురు దర్శనం” ,2. 500 సంవత్సరాల ఎన్కిరాల గ్రామ ఆలయ చరిత్ర ,3 “ఏకధార” – కవిత్వం నూరు కవితలు సంపుటి ,
4 “గురుకృప ధ్యాన గానం” తత్త్వాలు ,5 విశ్వ ధ్యానం వంటి రచనలు చేసిన కవి కందాళై రాఘవాచార్యులు గారిని మయూఖ ముఖాముఖి లో పరిచయం చేసుకుందాం.

1. కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సర్
జ :  మా తాత ముత్తాతలు కరీంనగరం జిల్లా మెట్ పల్లి దగ్గరి బండలింగపురం సంస్థానం గ్రామంలో ఉండేవారు. మా తాత పేరు కందాళై రాఘవాచార్య .వారూ సాహిత్యంలో ఎక్కువ పద్యాలు రాసే వారు. అప్పటి దొరగారు కవులను పండితులను గౌరవించేవారు. శతావధాని కృష్ణమాచార్యులు ఇక్కడ ఆస్థాన కవిగా ఉండేవారు.పృథ్వీరాజ్ కపూరు సత్య సాయిబాబ లాంటి వారు ఇక్కడికి వేసవిలో వచ్చి ఉండేవారు. మా నాన్న కందాళై గుండాచార్యులు పౌరోహిత్యం చేసేవారు. ఇక్కడ రెండవ తరగతి  వరకు చదివాను. 1958 లో ఒక ఆలయంలో పూజారిగా స్థిరపడి ఉండటానికి నిజామాబాద్ వచ్చాము.మా అమ్మమ్మ ఊరు కోరుట్ల దగ్గరి అయిలాపురం గ్రామం. తాత గారు దప్పూరి శ్రీనివాసాచార్యులు వేమన సుమతి రామకుమారి శతకాలను ఉదయం లేపి వల్లె వేయించేవారు. ఈ పద్య పారాయణం  నాలో కవిత్వానికి బలమైన బీజమై ఉంటుంది .మేము నల్గురు అన్నదమ్ములం. ఒక చెల్లె

2. మీ బాల్యం,విద్యాభ్యాసం గురించి చెబుతారా?
జ. బండ లింగాపురంలో 2 వ తరగతి. తరువాత నిజామాబాద్ లోనే డిగ్రీ వరకూ విద్యాభ్యాసం. యం. ఎ .తెలుగు ప్రయివేట్ గా అంటే ఎక్స్టర్నల్ ఎక్జామ్స్ ఉస్మానియా లో రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను.

3. మీ ఉద్యోగ జీవితం గురించి చెప్పండి
జ. 1985 సెప్టెంబర్ లో నేను డి.యస్. సి  రాసి అప్పటి స్పెషల్ టీచర్ గా ఉద్యోగం సంపాయించాను.యన్. టి రామారావు అప్పటి ముఖ్యమంత్రి. మొదట వజ్జపల్లి అనే చిన్న తండా లో పనిచేసాను. అక్కడి ప్రజల విద్యార్థుల అభిమానం సంపాదించాను. అప్పటి విద్యార్థులు కొందరు మిలిటరీలో ఉన్నారు.హైదరాబాద్ వచ్చినపుడు కలుస్తారు. అక్కడి నుండి నిజామాబాద్ లోని తారకరామ నగర్.రెంజల్ మండలంలోని రెంజల్  , కళ్యాపుర్. తరువాత చివరకు నిజామాబాద్ లోని మోపాల్ గ్రామంలో పనిచేసాను. మొత్తం ఐదు పాఠశాలలో ఉద్యోగం చేసాను. 2010 లో పదవీ విరమణ చేసాకా మా మిత్రుడి ప్రయివేట్ పాఠశాల జగన్నాథ ఉన్నత పాఠశాల చందూరులో ప్రధానోపాధ్యాయులుగా పని చేసాను. ప్రతి పాఠశాలలో పిల్లలతో బాలగేయాలు  పద్య రచన రచింపజేయటం చేసాను. కొందరు కవులుగా కవయిత్రులుగా అవతరించారు. ఇదొక గొప్ప తృప్తి.గ్రామ,మండల,జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నాను.

4. మీరు సాహిత్యం వైపు మళ్ళడానికి గల కారణం ఏమిటి ?

జ : అనేక ప్రేరణలు. చిన్ననాడు మా తాత గారు పద్యాలు వల్లె వేయించడం మొదటి కారణం. మాకు పెద్ద దేవాలయం ఉండేది. బ్రహ్మోత్సవాలకు కవులు పండితులు హరికథలు చెప్పేవారు వేంచేసేవారు. వారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది.ఆలయంలో అవధానాలు జరిగేవి.కవిసమ్మేళనాలు జరిగేవి. ఆ రకంగా పద్య రచన అభ్యాసం అయింది.
కొన్ని ఆట వెలదులు
ఆవె : చారు లేక బుక్క చక్కగా జారదు
చారులోని కిటుకు చార్యు లెరుగు
చారు లోన ముక్క చాల చాల కమ్మ
కిడ్ని రోగమునకు కిటుకు చారు

ఆ వె – పప్పు లేక కూడు పసందు కాదురా
పప్పులోన బలము పట్టి ఉండు
పప్పు ఆన్నమన్న పరిణయాల పంట
పూట పూట పప్పు పాట పాడు

ఇదంతా పెద్దల వలన నా ఆసక్తిగాకవితా సాధన. ఇంకాసామాజంలోని రుగ్మతలను ఉపన్యాసల వలె పెద్దగా కాకుండా
కవిత్వం ద్వారా క్లుప్తంగా చెప్పవచ్చు. సాహిత్యంలో స్థిరత్వం కలగడానికి ఆశయంగా ఇది గొప్ప ప్రేరణ

కందాళై రాఘవచార్యగారితో నరేశ్ చారి

5. మీ సాహితీ ప్రయాణం గురించి చెప్పండి.
జ. సాహితీ ప్రయాణం 12 – 01 – 1969 సంక్రాంతి పండగ నుండి ఇప్పటి వరకు అంటే 55 సంవత్సరాలుగా నా సాహితీ ప్రయాణం.ఇందూరు భారతి సాహితీ సంస్థ నా మాతృ సంస్థ. ఈ సంస్థ వారోత్సవాలు చేసినప్పుడు సుప్రసిద్ద కవులు రచయితలు వచ్చేవారు.వారికి భోజనాల ఏర్పాటు సకల సదుపాయాలు కల్పించడం వారు చెపుతున్న సాహితీ ముచ్చట్లు– వారి సాహితీ ప్రయాణం వినడంనా సాహితీ ప్రయాణానికి ప్రేరణ.
వచ్చిన కవులు వానమామలై — దాశరథి –ఆరుధ్ర –శేషేంద్ర –సినారె –నార్ల చిరంజీవి దాశరథి రంగాచార్య –అజంతా — జ్వాలాముఖి– నిఖిలేశ్వర్ –నగ్నముని –శివారెడ్డి మామిడిపూడి రంగయ్య —కొత్తపల్లి వీరభద్ర రావు — పోరంకి దక్షిణా మూర్తి –ముదిగొండ వీరభద్రయ్య — అంపశయ్య నవీన్– ముప్పాళ రంగనాయకమ్మ –నాయని కృష్ణ కుమారి — యశోదా రెడ్డి –ఆనందరామం ,పరిమళా సోమేశ్వర్ –వాసిరెడ్డి సీతాదేవి మాదిరెడ్డి  సులోచన,నందిని సిధారెడ్డి ఇంకా ఎందరెందరో. వీరి ప్రసంగాల వలన కవితా శైలి ఎలా ఉండాలి బహుముఖ కోణంలో అవగతం అయింది. ఇంకా నేను నాకన్నా చిన్నవారైన యువత నుండి ఎన్నో కవిత్వం మెరుపులు అలవరుచుకుంటున్నాను. ఇంకా నా సాహితీ ప్రయాణం వైవిధ్యంగా సాగుతునే ఉంటుంది.

6. మీ రచనల గురించి చెప్పండి
జ. 1969 నుండి ఇప్పటి వరకూ రోజుకొక కవిత రాయడం నా నియమం. నిష్ఠ. ప్రతి సంవత్సరం కొత్త డైరీ కొని అందులో కవిత్వం రాయడం నాకు మొదటి నుండి అభ్యాసం. కొన్న వేల కవితలు రాసాను. రాస్తున్నాను.
1 అధ్యయనం
2 కవిత్వం నిరంతరంగా రాయడం
3 కవితలు పత్రికలకు ప్రచురణార్థమై పంపడం.
ఈ మూడు మెట్లు నా కవితా శబలతకు కారణం.
భారతి,ఆంధ్ర పత్రిక దిన వారపత్రికలు -ఆంధ్ర ప్రభ దిన వార పత్రికలు – ఆంధ్ర జ్యోతి దిన వార పత్రికలు. -కృష్ణా పత్రిక ‐ ఈనాడు – సాక్షి – నవ తెలంగాణ దిన పత్రిక- మన తెలంగాణ దిన పత్రిక- ప్రజాపక్షం – సూర్య దినపత్రిక జ్యోతి మాస పత్రిక నేటి నిజం, తంగేడు, నమస్తే తెలంగాణ దిన పత్రిక ఇంకా ఎన్నో పత్రికలలో నా కవితలు ప్రచురితమయ్యాయి.సంస్థలూ కూడా నా కవితలను ప్రచురించాయి.నా అనేక కవితలు ఆంగ్లంలో హిందీలో కన్నడంలో అనువాదాలుగా ప్రసిద్ధి అయినాయి. నా కవిత్వం గురించికేంద్ర విశ్వ విద్యాలయం తెలుగు ప్రోఫెసర్ డా.ముదిగొండ వీరభద్రయ్య గారు గ్రంథంగా వెలువరించారు.ఇంతవరకూ రచించిన అనేక కవితలను 2018 లో “ఏకధార” కవిత సంపుటిగా వెలువరించాను. దీనికి ముందుమాట ప్రప్రథమ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు ప్రసిద్ధ కవి నంది అవార్డు గ్రహీత డా.నందిని సిధారెడ్డి రాసారు. 500 సంవత్సరాల పూర్వం ఎన్కిరాల గ్రామ ఆలయ చరిత్ర రాసాను.

7. సాహిత్యంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు ఎవరు?
జ. సాహిత్యంలో నన్ను ప్రభావితంచేసిన వారు :ముందుగా మా తాతగారు విద్వాన్ దప్పూరి శ్రీనివాసాచార్యుల వారు– తరువాత సినారె ‐-దాశరథి– — శేషేంద్ర — అజంతా .ఈ ముగ్గురిది మూడు రకాల వైవిధ్య శైలి .వస్తువు ఎంపిక– కవిత్వం నడక ఎవరినైనా ప్రభావితం చేస్తాయి.

8. సీనియర్ కవులతోగల మీ సాన్నిహిత్యం గురించి చెప్పండి
జ. సీనియర్ కవులతో గల సాన్నిహిత్యం: ఆదివారం — ఇంకా సెలవు దినాలలో ఖైరతాబాద్ లో గల శివారెడ్డి గారి ఇంటికి– శేషేంద్ర శర్మ జ్ఙాన్ బాగ్ ప్యాలెస్ కు – చిక్కడపల్లి అశోక్ నగర్ లో ఉండే సినారె ఇంటికి– రేడియో స్టేషన్ లో ఉండే రావూరి భరద్వాజ గారి ఇంటికి — కుందుర్తి గారి ఇంటికి వెళ్లి కొన్నిగంటలు వారి సాహిత్య సంభాషణలు వినే వాళ్లం. ముఖ్యమైన సంగతులు నోట్ చేసుకునే వాళ్లం .వెంట సైబ, సలంద్ర, చందన్ ఉండేవారు. చివరికి అబిడ్స్ లో పుట్ పాత్ పై అమ్మే పాత పుస్తకాలు కొనుక్కుని రైలెక్కి నిజామాబాద్ వెళ్లేవారం. ఈ మాన్య కవులంతా నిజామాబాద్ సభలకు వచ్చినపుడు వారికి ఏ అసౌకర్య కలగకుండా చూసుకునే వాళ్లం.

రాఘవచార్య రచనలు

9. మీరు కవితా ప్రక్రియేనా? ఇంకా ఏమైనా ప్రక్రియలను స్పృశించారా?
జ. : కవితా ప్రక్రియే కాకుండా పద్యాలు వ్యాసాలు సమీక్షలు కథలూ రాసాను. నాతోటి కవుల కవితా సంపుటాలకు సమీక్షలు రాసాను. 10 కథలు ప్రచురింపబడ్డాయి. మిమిక్రీ లోనూ సాధన చాలా చేసాను. “జి ఛానల్ “వారు 3 ఎపిసోడులు టివి లో ప్రసారం చేసారు.షూటింగ్ సారథి స్టూడియో లో జరిగింది. యూట్యూబులో నా మిమిక్రీ అంశాలు ఉన్నాయి.వరంగల్ లో మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ తో సన్మానం అందుకున్నాను. ఇంకా రాజాయోగాలో 12 సంవత్సరాలుసాధన చేసి సంపూర్ణం చేసుకున్నాను. సాప్ట్ వేర్ ఇంజనీర్లు చాలా మంది నా వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. యోగ సంబంధమైన మూడు పుస్తకాలు అభిమానులు ప్రచురించారు. 1 సద్గురు దర్శనం ( మా యోగాచార్యుని జీవిత చరిత్ర) 2 గురుకృప (యోగ తత్త్వ గీతాలు) 3 విశ్వ ధ్యానం ( నా పన్నెండు సంవత్సరాల సాధనా అనుభవాలు) . ఇంకా చిత్ర లేఖనంలోనూ సాధన చేసాను. మనిషిని చూసి చిత్రించగలను. గానం కూడా ప్రాణం. నిజామాబాద్ సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించాను.

10. వివిధ సాహితీ సంస్థలతో గల మీ అనుబంధం గురించి చెప్పండి

జ: నిజామాబాద్ లో మా మాతృ సంస్థ “ఇందూరు భారతి సాహితీ సమాఖ్య.” ఇంకా తెలుగు రచయితల సంఘం. ప్రజాశక్తి. హరిదా రచయితల సంఘ.సాగర్ కళా మందిర్ .అన్ని సంస్థలు కలిపి ఇందూరు సాహితీ సమాఖ్య ఏర్పాటు చేసాం. ఈ సంస్థ సుప్రసిద్ద కవులను ఆహ్వానించింది. ఏ సంస్థ కార్యక్రమాలు చేసిన అందరం కలుసుకునే వాళ్లం. మేము ప్రతి పున్నమకు కవుల ఇండ్లలోనూ సమావేశాలు జరిపేవాళ్లం. భోజనాలు ఆ కవి ఇంట్లోనే. రాత్రి 10 దాటేది. ఇంకా వేముల వాడ కామారెడ్డి మెదక్ మంజీర రచయితల సభలకూ వెళ్లేవాన్ని. కడప తిరుపతి సాహితీ సంస్థలకార్యక్రమాలకు వెళ్లేవాళ్లం. ప్రతి సాహితీ సంస్థ కవిత్వానికి స్పూర్తి దాయకమే.

11. మిమ్మల్ని వరించిన అవార్డుల గురించి చెప్పండి
జ. 1- జి ఛానల్ మిమిక్రీ పురస్కారం
2007 .హైదరాబాద్ సారథి స్టూడియో
2  కుందుర్తి పురస్కారం 2011
త్యాగరాజ గాన సభ హైదరాబాద్
3. దాశరథి పురస్కారం– హరిదా రచయితల సంఘం. నిజామాబాద్
4  ఇందూరు అపురూప అవార్డు
      2017 నిజామాబాద్
 5″కవిదిగ్గజం ” తెలుగు వెలుగు
     సాహితీ సంస్థ నిజామాబాద్
6 . సాహితీ రత్న “
శ్రీ విద్యా గణపతి సాహిత్య కళాపీఠం నిజామాబాదు వారు

12. అప్పటికి ఇప్పటికీ తెలుగు  కవిత్వంలో వచ్చిన మార్పు ఏమిటని మీరనుకుంటున్నారు.

జ. అప్పుడు కవిత్వంలో ఇన్ని వాదనలు ఉండేవి కావు. విప్లన దిగంబర కవిత్వంగా రాణించింది. ఇప్పుడు స్తీ వాద కవిత్వం దళిత వాద కవిత్వం మైనారిటి కవిత్వాలు ధ్వనిస్తున్నాయి. గుర్తింపు లభించనపుడు ఇలాంటి వాదనలు సామాజికంగా అవసరమే. కవిత్వంలో వైవిధ్యం ప్రత్యక్షమౌతుంది.

13. వర్తమాన కవులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి?.
జ. వర్తమాన కవులలో అధ్యయనం తక్కువైంది. రాయడం ఎక్కువైంది. ఈ ప్రయత్నం మంచిదే. కాని అధ్యయనం వలన మన కవిత్వంలో వైవిధ్యం శిల్పం వ్యంగ్యం ఇంకా ఎన్నో తీరులుగాపరిపూర్ణత సంతరించుకుంటుంది రాసిన కవిత్వం పత్రికలకు పంపటం మధ్య మధ్యలో  పుస్తకంగా ప్రచురించడం సామాజిక అవసరం. మన కవిత్వం ఉనికి శాశ్వతంగా నిలిచి రాబోయే తరాలకు అందుతుంది. కొత్త తరం అంటే 18 సంవత్సరాల యువతి యువకులు ఇపుడు కవిత్వం రాస్తున్నారు. మా విల్లాలో పదుగురు కవిత్వం రాస్తున్నారు. ఇంకో విశేషం. 4 వ తరగతి చదివే మా పెద్ద మనుమడు లక్మణుడు వాళ్ల అమ్మ గురించి కవిత్వం రాసాడు.

మయుఖ పత్రిక సంపాదకురాలు డా.కొండపల్లి నీహారిణి మార్గదర్శకత్వంలో మీరు నా కవితా కృషి గురించి సాగించిన ముఖాముఖి సంభాషణ లోకానికిఅందించటం చాలా ఆనందం. మయూఖకు శనార్తులుమీకు ధన్యవాదాలు.

      

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni November 29, 2024
written by Narendra Sandineni

ముదిగొండ ఈశ్వర చరణ్ జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఆదిలాబాద్,ముదిగొండ ఈశ్వర చరణ్ కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత పై విశ్లేషణా వ్యాసం.భారతదేశం పసిడి పంటలకు నిలయం.ఎందరో మహర్షులకు జన్మ నిచ్చిన తపో భూమి.భారతదేశం వేదాలు, ఉపనిషత్తులు,పురాణాలు,కావ్యాలు,రామాయణ, మహాభారత,భాగవతాదులు వ్యక్తుల జీవనాడులలో విజ్ఞానవాహినులుగా ప్రవహించిన పుణ్యభూమి. పూలు,పండ్లతో,పక్షుల కిలకిలరావాలతో అలరారే ఉద్యానవనంలోనికి గుడ్లగూబలు చొరబడి తోట విధ్వంసమైనట్లుగా మన దేశంలోకి విదేశీయులు అక్రమంగా అడుగు పెట్టడంతో దేశ పూర్వ వైభవమంతా నశించింది.పూర్వపు ప్రాభవంతో విలసిల్లుతున్న మన దేశ గడ్డ పై విదేశీయులు అడుగు పెట్టి మన సంస్కృతిని,మట్టిలో కలిపిన తీరునకు ప్రతీక ఈశ్వర చరణ్ జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత.జాతికి గ్రహణం పట్టడం అనే పదం ఒక వ్యక్తి లేదా సమాజంలో జరిగిన ఒక కీలకమైన సంఘటనను సూచిస్తుంది.గ్రహణం అంటే ఒక మార్పు వచ్చే సమయంగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన రోజులలో జాతికి అత్యంత ముఖ్యమైన మార్పులు లేదా సంఘటనలు జరుగుతాయి.బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి వీడి భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో జాతికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.దేశంలో సాంఘిక,రాజకీయ పరిణామాలు సంభవించి సమాజము మరియు జాతిలో మార్పులు కలిగినాయి.సమాజంలో కొనసాగుతున్న అన్యాయాలు,అసమానతలకు సంబంధించి ప్రజలలో కలిగిన మౌలికమైన చైతన్యం,దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం,అభివృద్ధి వంటి అంశాలు జాతి ప్రగతిని ప్రభావితం చేస్తాయి.జాతికి గ్రహణం పట్టిన రోజున జరిగే సంఘటనలు,జరగవలసిన మార్పులు అనేకం ఉంటాయి.జాతికి గ్రహణం పట్టడం అనేది సమాజానికి సంబంధించిన ప్రతి అంశంలో చోటు చేసుకునే మార్పుల సమాహారాన్ని సూచిస్తుంది.ఇది జాతిలోని ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేయ గల సందర్భంగా చెప్పవచ్చు.

జాతికి గ్రహణం పట్టిన రోజు గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?అయితే ఒక్క సారి మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.అందమైన ఆ రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు.గతించిన ఆ అందమైన రోజును మరువ లేకున్నాం.అది ఇప్పటికే మనసులో మెదులుతూనే ఉంది.అందమైన ఆ రోజు ఇంకా జ్ఞాపకం ఉన్నది.అందమైన ఆ రోజు సాంప్రదాయికంగా ఒక ప్రత్యేకమైన సంతోషకరమైన సంఘటనల సందర్భాన్ని సూచిస్తుంది.అందమైన ఆ రోజు భావోద్వేగాలతో కూడిన జ్ఞాపకాలను మరియు వ్యక్తిగత అనుభవాలను అందిస్తుంది.ఆ రోజు నూతనమైన ఆరంభాలను అనుభవాలను, విజయాలను గుర్తు చేస్తుంది.అందమైన ఆ రోజు ఒక రకమైన సంతోషాన్ని,మనసుకు శాంతిని కలిగించేది. అందమైన ఆ రోజు సాహిత్యం,కళలు మరియు సాంస్కృతిక రంగాలలో కలిగిన గొప్ప మార్పును ప్రతిబింబిస్తుంది.భారతీయ సంస్కృతిలో భాగమైన సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,పండుగలు, వివాహాలు,వేడుకలు,అందమైన రోజులుగా గుర్తించబడతాయి.అందమైన ఆ రోజు అనేది కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు.జాతి జనులకు ఆ రోజు అందించిన అనుభూతులను,జ్ఞాపకాలను, ఆలోచనలను,కదిలించే సందర్భం.అందమైన ఆ రోజు జీవితంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక,భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. అందమైన ఆరోజు అనగానే మనసులో ఒక మధురమైన జ్ఞాపకం మిగిలినట్లు ఉంటుంది.ఆ రోజు ఎంతో ప్రత్యేకమైనది.అందమైన ఆ రోజు ఒక పండుగలా మన హృదయాన్ని గులాబీల పరిమళాలు తాకినట్లుగా,సంతోషాన్ని నింపినట్టుగా, మనసుకు ఆనందాన్ని,ఆహ్లాదాన్ని పంచుతుంది. అందమైన ఆ రోజుకు చెందిన జ్ఞాపకం మనలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.మన జీవితంలో ఒక మధురమైన కథలా,అద్భుతమైన చిత్రంలా మన హృదయంలో నిలిచి ఉంటుంది.నీలి జలతారు నీడల్లో/నింగి దోబూచులాడిన రోజు/అంటున్నారు. నీలి రంగు బంగారు అంచు కలిగిన వస్త్రపు నీడలో నింగి దాగుడుమూతలాడిన దినం.మనసులోని అనుభవాలను ప్రతిబింబించే జ్ఞాపకాలను చూపించడానికి కవి తమ కలం నుండి వివిధ రకాల పద చిత్రాలను ఉపయోగిస్తాడు.నింగి జలతారు నీడల్లో అనేది ఆకాశంలోని నీలిమతో కూడి ప్రకృతిలోని సౌందర్యాన్ని సూచిస్తుంది.నింగి దోబూచులాడిన రోజు అంటే ఆకాశం ఉల్లాసంగా కదులుతూ ఆడి పాడిన రోజు.ఆ రోజున ప్రకృతిలోని సొగసైన అందాన్ని వర్ణిస్తూ ఆకాశంలో మబ్బులు కదులుతూ చూడ ముచ్చటగా అందంగా అలంకరించినట్టుగా ఉన్నాయి.వాన చినుకులు పడే ముందర ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం,వాన వెలిసిన తర్వాత మబ్బులు తేలిపోవడం వంటి ప్రక్రియను అందమైన దృశ్యాన్ని తెలుపుతుంది. చుక్కల కాటుక కన్నుల్లో/ముత్యాలు/తళతళలాడిన రోజు/అంటున్నారు.నక్షత్రాల కాటుక కనులలో ఆనందం కారణంగా కన్నీటి ముత్యాలు తళతళ మెరిసిన రోజు.ఒక అందమైన అనుభవాన్ని చెబుతున్నారు.ఒక మనిషి కన్నుల్లో కాటుకను పెట్టుకున్నప్పుడు కళ్ళు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.అప్పుడు కళ్ళు తళతళలాడతూ ముత్యాల వలె ప్రకాశిస్తాయి. చుక్కల కాటుక కన్నుల్లో ఆనంద భాష్పాలు అనే ముత్యాలు తళ తళ లాడిన రోజు.చుక్కల కాటుక కన్నుల్లో ముత్యాలు ధగధగ మెరిసిన రోజు.ఇది ప్రకృతిలోని ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,కొత్తగా వెలువరించే సందర్భాన్ని తెలుపుతుంది.ఇది ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించేందుకు చేసిన ఒక ప్రయత్నం. ఇది మనసులో దాగి ఉన్న అందమైన జ్ఞాపకాలను సృజించగల సామర్థ్యానికి ప్రతీక.ప్రకృతిలోని దృశ్యాలు మనసులోని నిశ్శబ్దతను ఉత్తేజితం చేస్తాయి.కమ్మ తెమ్మెరలు/విందుగా పసందుగా/ కితకితలు పెట్టిన రోజు/కన్నె మబ్బులు/మెల్లగా చల్లగా/తేలిపోయిన రోజు/అంటున్నారు.తీయనైన కమ్మని ఇంపైన పిల్లగాలులు,రుచికరమైన,పసందైన విందును సమకూర్చినట్టుగా గిలిగింతలు పెట్టిన రోజు.కన్నె మబ్బులు మందగమనంతో చల్లదనాన్ని కూర్చుతూ ఆకాశమున తేలిపోయిన దినం.ఈ కవితా పంక్తులు ప్రకృతి అందాన్ని మరియు అనుభూతుల మేళవింపును బలంగా పాఠకుడికి అందిస్తున్నాయి.కమ్మ అంటే అందమైనది, ఆకర్షణీయమైనది.కమ్మ తెమ్మరలు అంటే ఇంపైన పిల్ల గాలులు.ప్రకృతి యొక్క అందాన్ని,సుందరమైన దృశ్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇవి ఉపయోగపడతాయి.ఇది ఒక పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.విందుగా పసందుగా అనేది సంతోషకరమైన మాధుర్యమైన అనుభూతిని అందిస్తున్నది.ఇది ప్రాతః కాలంలో ఒక శుభ సమయంలో జరుగుతున్న సన్నివేశాన్ని మరియు పండుగలు,వేడుకల వంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది.కితకితలు హాస్యానికి లేదా ఆహ్లాదానికి సంకేతంగా చెప్పవచ్చు.పండుగ వేడుకల్లో జరిగే సంఘటనలు,ఆటలు,పాటలు, సంబరాలు ఒక గొప్ప అనుభవాన్ని,ఆనందాన్ని, సందడి వాతావరణాన్ని కల్పిస్తాయి.కన్నె మబ్బులు అనగా మెల్లగా ఆకాశంలో కదలుతున్న మబ్బుల దృశ్యం,నిశ్శబ్దమైన ప్రకృతిని,ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.మబ్బులు ఆకాశాన్ని కమ్ముకొని కదులుతూ ఉంటే వాతావరణంలో ఒక రకమైన ప్రశాంతత వ్యాపిస్తుంది.తేలిపోయిన రోజు అనేది ఆ దినం గడిచినట్లుగా లేదా ఉత్సవ సమయంలో ఘనంగా జరిగే వేడుకలు,ఒక శ్రేష్టమైన అనుభూతిని వ్యక్తపరుస్తుంది.ఇది వాతావరణంలోని ఉత్సాహం మరియు ఆనందాన్ని,ప్రకృతి అందాన్ని,ఆనందాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది.పూల బాలలు/కాళ రాత్రి కరిగిందని/మురిసి మురిసి విరిసిన రోజు/ అంటున్నారు.పూల బాలికలు భయంకరమైన రాత్రి గడిచిందని ఎంతో ముద్దుగా మురిపంగా వికసించిన రోజు.ప్రకృతి అందం చేత మరియు పుష్పంల ద్వారా కవికి కలిగిన అనుభూతి దృశ్యాలు భావాల ద్వారా వ్యక్తమవుతున్నాయి.పూల బాలలు అనేది పువ్వులు లేదా మొగ్గలు అంటే ప్రకృతిలోని సౌందర్యాన్ని,కొత్త జీవనాన్ని సూచిస్తుంది.పూలు తేటగా అందంగా ఉండడం,నవ జీవనాన్ని సూచిస్తుంది.కాళ రాత్రి అనేది భయంకరమైన రాత్రి. రాత్రి వేళలో వికసించే పుష్పాలు రాత్రి సంస్కృతికి సంబంధించిన ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,సంబరాల విశేషాలను వివరించడంలో సహాయపడతాయి. మురిసి మురిసి అనేది అనంతమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.మురిసి మురిసి విరిసిన రోజు అనేది మనసులో ఒక రకమైన కొత్త దనాన్ని,ఉత్తేజాన్ని, పూసిన పువ్వుల సౌందర్యాన్ని,కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తుంది.ప్రకృతిలోని పువ్వుల అందాన్ని,

ఆనందాన్ని,సజీవంగా చిత్రిస్తుంది.ప్రకృతి యొక్క రమణీయతను,పుష్పాల పరిమళాల్ని, ఆత్మీయ అనుభూతుల్ని అందిస్తుంది.ఆకసానికి సింధూరం పూసి/చీకటి గుయ్యారం చీల్చుకొని/ సూర్యుడి బింబం చొచ్చుక వచ్చిన రోజు/ అంటున్నారు.ఆకాశానికి సింధూరపు ఎరుపు రంగును పులిమి చీకటి గుహ నుండి చీల్చుకొని సూర్యబింబం లోకములోనికి చొచ్చుకు వచ్చి తన దివ్య తేజస్సుతో లోకాన్ని వెలిగించిన రోజు. ప్రకృతి,సూర్యుడు ప్రజల ఆనందాన్ని,అనుభూతుల సౌందర్యాన్ని,ప్రభావశీలంగా వ్యక్తపరుస్తున్నాయి. సింధూరం అనేది ఎరుపు రంగు.ఉదయ కాంతి రావడంతో ఆకాశం ఎరుపు రంగు పులుముకొని మెరుస్తున్నది.ఉదయం పూట సూర్యుడు తన కాంతితో చీకటిని తొలగించి వెలుగును ప్రసరింప జేస్తున్నాడు.సూర్య కాంతి ఒక అందమైన ఉదయాన్ని,జీవన శక్తిని ప్రతిబింబిస్తుంది.చీకటి గుయ్యారం అనేది రాత్రి పుడమిలో అలుముకొన్న చీకట్ల ఆధిక్యతను సూచిస్తుంది.సూర్యుడి కాంతి చీకట్లను చీల్చుకుంటూ పుడమిపై వ్యాపిస్తుంది. సూర్య శక్తి మానవులకు జీవనాన్ని,బతుకు పట్ల ఎనలేని ఆశను కలిగిస్తుంది.సూర్యుడు జీవం కలిగించే శక్తిగా నిత్యం కొత్తదనాన్ని అందిస్తాడు.ఇది మానవుని దిన చర్యలో కొత్త అనుభూతిని, ఆనందంతో కూడిన చైతన్యాన్ని నింపే రోజు.సూర్య కాంతి ప్రకృతిని,జీవుల జీవితాన్ని,వాటి ఆశను అత్యంత మనోహరంగా పునరుత్తేజాన్ని కలిగిస్తున్నాయి.అంతేగాక ప్రకృతిలోని అందాన్ని, మార్పులను,కవితా పంక్తులు అద్భుతంగా వివరిస్తాయి.కాషాయపు రోచిస్సులు/కాంతి రేఖలు/ క్రాంతి రేఖలు/నింపిన రోజు/ఆ రోజు/అందమైన రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు. కాషాయపు అందమైన కిరణ సముదాయపు కాంతులు విరజిమ్మి అభ్యుదయపు వెలుగులను జగమంతా నింపిన రోజు.ఇంకా మనసులో కదలాడుతూనే ఉంది.ఆ అందమైన రోజు ఎంతో ప్రత్యేకమైనది.మనసులో ఎంతో హాయిగాను, సంతోషంగాను గుర్తుండి పోయింది.ఆ రోజులో జరిగిన సంఘటనలు,ఆ అనుభవాలు,అందమైన జ్ఞాపకాలు,మనసును ఆహ్లాదపరుస్తాయి.మనసుకు జ్ఞాపకాల రుచి చూపిస్తూ ఎప్పటికీ గుర్తుండి పోతాయి.ఒక మహోన్నతమైన భావజాలాన్ని,ఒక గొప్ప చైతన్యాన్ని మరియు మన దేశ సాంస్కృతిక, రాజకీయ చరిత్రను ప్రతిఫలిస్తుంది.కాషాయపు రోచిస్సులు సూర్యోదయం సమయంలో సూర్య కిరణాలు అందించే ప్రకాశాన్ని ప్రకృతిలో కనిపించే అందాన్ని సూచిస్తాయి.ఈ సూర్యకిరణాలు జీవ చైతన్యానికి,ప్రకృతి సౌందర్యానికి ఒక చిహ్నంగా ఉంటాయి.కాషాయపు రోచిస్సులు అనేది త్యాగానికి,ధైర్యానికి మరియు సంకల్పానికి సంకేతం.దేశ భక్తితో ప్రణాళికలు,లక్ష్యాలు ఏర్పర్చుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న భౌగోళిక,సాంఘిక,రాజకీయ పరిణామాలను సూచిస్తుంది.మన దేశ అభివృద్ధిని సుఖ శాంతులతో కూడిన జీవన సౌభాగ్యాన్ని ఈ కవితా పంక్తులు నిరంతరం గుర్తుచేస్తాయి.ఆ రోజు/అందం కుసుమించిన రోజు/అంటున్నారు. అందం పుష్పించిన రోజు.పువ్వు ఎప్పుడు వికసిస్తుందో,ఆ రోజు ప్రత్యేకమైనది.అన్ని రంగాలలో విస్తరించిన దేశ సౌందర్యం,ప్రకృతి యొక్క అందచందాలు చక్కగా విలసిల్లిన రోజు.ప్రతి రోజు పూసే పువ్వుల వలె దేశవాసుల జీవితం సౌందర్యంతో ప్రకాశించిన రోజు.అందం కుసుమించిన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన దినంగా భావించబడినది.ఆనందం పల్లవించిన రోజు/అంటున్నారు.ఆనందం అనే చెట్టు చిగురించి కొత్త ఆకులతో విలసిల్లిన రోజు.ఆనందం పల్లవించడం అంటే ఆనందం వెల్లి విరిసిన రోజు. మన జీవితంలో ఒక ముఖ్యమైన అద్భుతమైన క్షణాన్ని కొత్తకోణంలో అనుభవిస్తున్నప్పుడు ఆ రోజును ఆనందం పల్లవించిన రోజు అని చెప్పవచ్చు.మన హృదయంలో పల్లవించిన సంతోషాన్ని,సున్నితత్వాన్ని,సౌందర్యాన్ని ఈ కవితా పంక్తి సూచిస్తుంది.స్వచ్ఛంగా స్వచ్ఛందంగా/ మెరుస్తున్న సూర్యున్ని చూచి/కళ్ళు మండి రాహువు/దుమ్మెత్తి పోసిన రోజు/అంటున్నారు. కల్మషం లేని రీతిలో స్వతంత్రంగా మెరుస్తున్న సూర్యుని చూసి కళ్ళు మండిన రాహువు(తాము దేవతల పంక్తిలో కూర్చుండి అమృతం తాగుతున్న రాహువు కేతువులను అమృతం తాగకుండా చేసిన సూర్యచంద్రులను పగతో మింగ ప్రయత్నిస్తుంటారు, దాన్నే గ్రహణం పట్టడం అంటారు).సూర్యునిపై పగతో దుమ్మెత్తి పోసిన రోజు అంటే చక్కగా సుఖ సంతోషాలతో శాంతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సుసంపన్నమైన సుభిక్షమైన మన భారతదేశంపై విదేశీయులనే రాహువుల ఆక్రమణ మొదలైన రోజు అది.సూర్యుడు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మెరుస్తున్నాడు.సూర్యుడు శక్తిని, వెలుగును,జ్ఞానాన్ని అందించి లోకాన్ని ప్రకాశింప జేస్తున్నాడు.సూర్యుడు వెలుగులు విరజిమ్ముతూ లోకానికి ప్రశాంతతను,విజయాన్ని ప్రసాదిస్తున్నాడు. సూర్యుడు ఎవరో కాదు భారతదేశం కళ్ళు మండటం అంటే ఆ వెలుగును,సత్యంను, విజయంను చూడలేని శత్రువులైన విదేశీయుల స్థితిని సూచిస్తుంది.కళ్లు మండడం అంటే అసూయ, ద్వేషం లేదా ఇతరుల విజయాన్ని చూడ లేని మనసులోని నెగటివ్ భావాలను తెలుపుతుంది. రాహువు దుమ్మెత్తి పోసిన రోజు అంటే భారతదేశపు విజయాన్ని,శోభను దెబ్బ తీసిన రోజు అని చెప్పవచ్చు.ఒకప్పుడు అత్యంత శోభతో వెలుగుతున్న దేశ సౌభాగ్యాన్ని ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించిన రోజు.చీకటితో చేయి కలిపి/ మసి బూసిన రోజు/అంటున్నారు.చీకటితో స్నేహం చేసి మసిబూసి మాయలు పన్నిన రోజు.చీకటి అనేది అజ్ఞానానికి,చెడు మరియు పాపపు చింతనకు ప్రతీక.అనైతికంగా తప్పుడు మార్గంలో పయనించడాన్ని చీకటి శక్తులకు లోబడినట్లుగా తలచవచ్చు.కట్టెలు కాల్చగా ఏర్పడిన బూడిద మసి.మసి బూయడమంటే విదేశీ శత్రువులు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించి వాస్తవానికి మసి బూసి పౌరులను బలహీనులుగా చేసిన రోజు.ఒక వ్యక్తి, సమాజం సత్యంపై నడకలు సాగిస్తున్నప్పుడు తర్వాత అట్టి చక్కగా విలసిల్లుతున్న సమాజం చీకటి లేదా చెడు శక్తుల ప్రభావానికి లోనై స్వచ్ఛతను కోల్పోయి అనైతిక మార్గాలకు అలవాటైన ఆ రోజును మసి బూసిన రోజుగా భావించవచ్చు.కోటి కోటి రావాలు/కుమిలి కుమిలి/ రోదించిన రోజు/అంటున్నారు.కోట్ల కొలది మంది భారతీయులు తమకు కలిగిన బానిసత్వపు దుర్దశకు కుమిలి కుమిలి దుఃఖించిన రోజు.ఇది గంభీరమైన భావనతో కూడుకొని ఉన్నది.మనసులో అణిచివేయబడిన బాధ,దుఃఖం మరియు తీవ్రమైన వేదనను ప్రతిబింబిస్తున్నది.కోటి కోటి అనేది సంఖ్యాపరంగా ఎంతో ఎక్కువ అనేక కోట్లు.రావాలు అంటే వేదనతో కూడిన జీరవోయిన కంఠ ధ్వనులు. కోటి కోటి రావాలు అంటే దుఃఖపూరితమైన కోట్ల కొలది వ్యక్తుల కంఠ ధ్వనులు అసహనం,వేదన యొక్క పరాకాష్టను సూచిస్తుంది.ఇది వ్యక్తులను, సమాజం యావత్తును అణిచివేయబడిన తీరును ప్రతిబింబిస్తుంది.కుమిలి కుమిలి అనే పదం శరీరం బాధతో,దిగులుతో విపరీతంగా విచారం చెందడం వల్ల కలిగే వేదనను తెలుపుతుంది.దీర్ఘకాలంగా అణిచివేయబడిన వారి బాధ,దుఃఖం,మనస్సును ఎలా కలవరపరచినాయో ప్రతిబింబిస్తుంది.ఆ రోజు/మనిషి చచ్చిన రోజు/మనసు చచ్చిన రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు.ఆ రోజు మనిషి చచ్చిన రోజు అంటే మనిషిలో మానవత్వం నశించి రాక్షసత్వం విజృంభించిన రోజు. అసాధారణమైన ఒక ప్రత్యేకమైన రోజు.జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు.ఆ రోజు జీవితాన్ని పూర్తిగా మార్చేసిన అనుభూతిని కలిగిస్తుంది.మనిషి చచ్చిన రోజు.ఇది భౌతిక మరణాన్ని సూచించే వాక్యం. మనిషి మరణించడం అంటే ఆ వ్యక్తి శరీరం మాత్రమే కాదు,అతని ఆలోచనలు,స్వభావం, అనుభవాలు అన్ని హరించబడతాయి.మనసు చచ్చిన రోజు అంటే మంచి మనసు చచ్చిన రోజు. మనిషి జీవితం సంక్లిష్టమైనది,మనసు బాధకు లోనవడం యాదృచ్ఛికం.ప్రతి వ్యక్తికి మరణం అనేది చెట్టుకు పూసిన పువ్వు రాలినట్లుగా సహజమైనట్టిది.మరణం అనేది శరీరంతో పాటు మనసును కూడా చంపుతుంది.ఇక్కడ మనసు చచ్చిపోవడం అనే వాక్యం మరణం కన్నా ఎక్కువ బాధను వ్యక్తం చేస్తుంది.ఒక వ్యక్తి యొక్క ఆశయాలకు,ఆత్మవిశ్వాసానికి దెబ్బ తగలడం, విలువలు విధ్వంసం కావడాన్ని తెలియజేస్తుంది. మనిషి మనస్సులో పొడముతున్న భావోద్వేగాలు పతనం అవుతున్న సామాజిక విలువల్ని గుర్తు చేస్తుంది.ఇంకా జ్ఞాపకం ఉన్నది అంటున్నారు.ఆ సంఘటన గాఢంగా మనసులో నిలిచిపోయి ఎన్నటికీ మరిచిపోలేని ఒక భయంకర అనుభవంగా మిగిలిపోయింది.సమాజంలో జరిగిన దుష్ట సంఘటనల వల్ల సంక్రమించిన బాధ,దుఃఖం, అంతరంగంలో వేదనను ప్రతిబింబించడం సహజం.మనిషి చచ్చిన రోజు,మనసు చచ్చిన రోజు అనేది కేవలం శారీరక మరణం మాత్రమే కాదు. మానవ విలువలు లుప్తమై భవిష్యత్తు పట్ల ఆశలు అడుగంటిన రోజు అని చెప్పవచ్చు.ఆ రోజు/ అందాన్ని హత్య చేసిన రోజు/ఆనందాన్ని అణగార్చిన రోజు/అంటున్నారు.ఆ రోజు దేశ సౌభాగ్య సౌందర్యాన్ని హత్య చేసిన రోజు.దీనిలోని భావం ఎంతో సున్నితమైనది.కవి భావోద్వేగపూరితమైన సంఘటన గురించి వ్యక్తీకరిస్తున్నాడు.అందాన్ని హత్య చేసిన రోజు అలంకారంతో కూడిన వాక్యం.అందం లేదా అందమైన క్షణాలను,స్నేహాన్ని,ప్రేమను, సృజనాత్మకతను నాశనం చేసిన ఒక సంఘటనను సూచించవచ్చు.సమాజంలో నెలకొన్న దారుణమైన సంఘటనల కారణంగా అందమైన దృశ్యాలను, అనుభూతులను కోల్పోవడం జరుగుతుంది.అందం అంటే మిరిమిట్లు గొలుపుతూ కనులకు గోచరించేది మాత్రమే కాక.మనసునకు శాంతిని,సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి.అందమైన ఆనందాలకు ఆటంకం కలిగితే,జీవితంలో సుఖ సంతోషాలు కరువు అవుతాయి.అందం అంటే మన చుట్టూరా అల్లుకున్న సంతోషాల వెల్లువని,శాంతిని తెలియ జేస్తుంది.ఆ రోజు జరిగిన సంఘటనలు,దుర్ఘటనలు, సంతోషాన్ని నశింపజేసినాయి.ఆనందాన్ని అణగార్చిన రోజు.ఆ రోజు ఎదుర్కొన్న కష్టాలు,చేదు అనుభవాలు,భావోద్వేగాలను పెంచినాయి.బాధలో ఉన్నప్పుడు మనిషికి ఆనందం ఉండదు.గడ్డు సమయం ఎదురైనప్పుడు మనిషికి మనో ధైర్యం,శక్తి అవసరం.ఒక్కో సారి మనిషి జీవితం నిరాశ అనే చిక్కు ముళ్ళలో కూరుకుపోతుంది.మనిషికి ఎదురైన నిరాశ కూడా విలువైన పాఠాలు నేర్పుతుంది.నిరాశ నుండి తేరుకుంటేనే మనం మరింత బలంతో ముందుకు సాగగలం.ఆనందం అంటే సంతోషం,ప్రశాంతత.ఆ రోజు జరిగిన సంఘటనలు,ఆనందాన్ని అణగార్చినాయి.ఆ రోజు అందాన్ని హత్య చేసిన రోజు,ఆనందాన్ని అణగార్చిన రోజు అంటే అందరి ఆనందాలను రూపుమాపిన రోజు అని భావం.సూర్యుడికి గ్రహణం పట్టిన రోజు/రాహువు నెత్తిన/చీకటి మొత్తిన రోజు/ అంటున్నారు.దేశంలోని వికాసం అనే వెలుతురును సకల సంపదను దోచుకుని వెళ్లి మన దేశం బయట మనవి కాని దేశాలలో విదేశీయులు సంపదను భద్రపరుచుకున్నారు.సూర్యుడు చుట్టు తిరిగే చంద్రుడు,సూర్యునికి మరియు భూమికి మధ్యలో అడ్డుగా వచ్చి సూర్య కాంతిని అడ్డుకోవడం వల్ల గ్రహణం ఏర్పడుతుంది.ఈ సమయంలో సూర్యబింబంలోని ఒక భాగం లేదా మొత్తం కాంతి భూమి మీది కనిపించదు.దాన్ని గ్రహణంగా చెప్పుకుంటాం.పూర్వ కాలంలో ఇది ప్రజల్లో భయాన్ని కలిగించేది.గ్రహణం ముగిసిన తర్వాత సూర్యుడి ప్రకాశం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. సూర్యుడికి గ్రహణం పట్టడం అంటే ప్రజల, సంతోషాన్ని,జీవితంలోని చైతన్యాన్ని,చీకటి ఆక్రమించుటకు ప్రతీక.జీవితంలో ఎదురైన ఏదో ఒక అడ్డంకిని కష్టాన్ని సూచిస్తుంది.రాహువు వల్ల జీవితంలో సమస్యలు,అంతరాయాలు, ఏర్పడతాయని ప్రజల విశ్వాసం.భారతీయ పురాణాలలో రాహువు ఒక చీకటి,అధర్మానికి, అపశకునానికి ప్రతీక.రాహువు సూర్యుడిని మింగడం వల్ల దుష్ట శక్తులు విజయం పొంది జీవితాలను కష్టాలలోకి నెట్టుతుంది.ఆ రోజు జరిగిన సంఘటనల వల్ల దేశం ఒక పెద్ద సంక్షోభాన్ని,గడ్డు స్థితిని ఎదుర్కొవాల్సి రావడాన్ని,రాహువు,చీకటి వంటి ప్రతీకల ద్వారా కవి వ్యక్తపరిచారు.దిగంతాల కావల/వెలుతురు విశ్రమించిన రోజు/మింగలేక కక్కలేక/గొంతు మూగ వోయిన రోజు/జాతి బుద్ధిగా చేతులెత్తిన రోజు/అంటున్నారు.వెలుతురు దిగంతాల బయట విశ్రాంతి తీసుకుంటుందని, తమకు కలిగిన బాధలను క్రక్క లేక మింగలేక దేశ ప్రజల గొంతులు మూగవోయినవని,కవితలోని పంక్తులు గాడమైన భావాలను వ్యక్తపరుస్తున్నాయి. ఈ కవితలోని వెలుగు దేశం యొక్క అనంతమైన సంపద.దీనిని విదేశీయులు కొల్లగొట్టి తమ దేశాలకు తరలించి భద్రపరచుకోవడం అనేది వెలుగులు దిగంతాల ఆవల విశ్రాంతి తీసుకుంటున్నాయని ప్రతీకగా కవితలో చెప్పబడినది.జాతి సిగ్గుతో తలవంచిన రోజు/అంటున్నారు.సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల జాతి గౌరవాన్ని,ప్రతిష్ఠను కోల్పోవడం,ఆందోళనను,ఆవేదనను కలిగిస్తుంది. జాతి సిగ్గుతో తలవంచిన రోజు అంటే మన దేశం స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన రోజు.విదేశీయుల పాలనలో భారతీయులు బానిస బ్రతుకులు గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.భారత జాతి ప్రజల స్వాభిమానం దెబ్బతినడం,సిగ్గును కలిగిస్తుంది.అది ఒక భయంకరమైన సంఘటనకు నిదర్శనం.ఆ రోజున భారత జాతి గౌరవం మంట కలిసి పోయింది.భారత జాతి సిగ్గుతో తలవంచుకున్నది. మన దేశంలో ఆ రోజు జరిగిన కొన్ని ప్రధానమైన సంఘటనలు,జాతిని సిగ్గుపడునట్లు చేసినాయి. మన దేశంలో స్వాతంత్ర్యానంతరం,ఇలాంటి సంఘటనలు తరచుగా జరిగి మానవతా విలువలు మంట కలవడం,దేశానికి ఒక మచ్చగా నిలుస్తున్నది. మన దేశ ప్రజలు నైతిక విలువల పరిరక్షణ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.జనం బుద్దిగా చేతులెత్తిన రోజు/అంటున్నారు.జనం బుద్ధిగా అంటే నిస్సహాయ స్థితిలో చేరి చేతులెత్తిన రోజు. సమాజంలో మనిషి తనకు తానే ఆత్మ వంచన చేసుకోవడం,నిర్లిప్తతను సూచిస్తుంది.బుద్ధిగా చేతులు ఎత్తడం అంటే పోరాటం లేకుండా స్థబ్దంగా ఉండడం అని అర్థం.ప్రజలు తమ కర్తవ్యాన్ని మరిచి పోవడం,సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం,బాధని కలిగిస్తుంది.తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలు,ప్రకృతి, సమాజం అన్ని ఎలా ప్రభావితమవుతాయో, మనిషిలో తెలియని నిర్లిప్తత,నిస్సహాయత ఎలా వ్యాప్తి చెందుతుందో కవి భావాల్లో అద్భుతంగా వెల్లడించారు.ఆ రోజు/చీకట్లు ముసిరిన రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు.చీకట్లు ముసిరిన రోజు అంటే దేశం యావత్తు స్వాతంత్రం కోల్పోయి పరాయిపాలనలోకి జారుకున్న ఆ దుర్ధినాన్ని ఇంకా మరిచిపోలేక పోతున్నాం.ఆ రోజు జరిగిన ప్రత్యేకమైన సంఘటనలు,జ్ఞాపకాలు,అనుభవాలు, జాతిని ఎంతగానో ప్రభావితం చేసినాయి.ఆ రోజు జరిగిన తీవ్రమైన సంఘటనలు,మనిషికి అనుభవాన్ని,సామూహిక చైతన్యాన్ని కలిగింప జేసినవి.ఆ రోజు జరిగిన సంఘటన వల్ల సమాజంలో ఆనందపు వెలుగులు అన్నీ మాయమై చుట్టూ చీకటి కమ్ముకున్నది.మనిషి జీవితంలో జరిగిన దుర్భరమైన,బాధాకరమైన సంఘటనలు మనసును గాయపరిచిన విధానం ఈ కవితలో ప్రతిబింబిస్తున్నది.ఇంకా జ్ఞాపకం ఉన్నది/ అంటున్నారు.ఆ రోజు సంఘటన గడిచిపోయింది. అయినప్పటికీ,ఆ రోజు సంఘటనకు సంబంధించిన అవశేషాలు ఇంకా మనసులో నిలిచి ఉన్నాయి.ఆ అనుభవం ఎంతో ప్రభావాన్ని చూపింది.ఆ రోజును పూర్తిగా మరిచిపోలేని విధంగా మనసులో నిలిచిపోయింది.బంగారు భారతదేశం పరాయి పాలనలోకి వెళ్లి అన్ని విధాల దుర్దశను పొంది మ్రగ్గిపోయిన ఆ రోజును తలుచుకుంటూ ‌జాతికి గ్రహణం పట్టిన రోజుగా ఎంతో మధనపడి కవి ఈశ్వర చరణ్ తన మానసిక క్షోభనంతా ఈ కవితలో వ్యక్తం చేశారు.కవి ఈశ్వర చరణ్ జాతికి గ్రహణం పట్టిన రోజు కవితలోని భావాలు వాస్తవానికి అద్దం పడుతున్నాయి.కవి ఈశ్వర చరణ్ భౌతికంగా లేరు.కాని వారు అందించిన జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత పాఠకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.

November 29, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక ‌‌విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni November 29, 2024
written by Narendra Sandineni

ముకుంద రామారావు ‌‌. వలస పోయిన మందహాసం కవిత ప్రముఖ కవి,అనువాదకుడు,ముకుంద రామారావు కలం నుండి జాలువారిన వలస పోయిన మందహాసం కవితా సంపుటిలోని వలస పోయిన మందహాసం కవిత పై విశ్లేషణా వ్యాసం.వలస పోయిన మందహాసం కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నన్ను ఆలోచింపజేసింది.కవిత శీర్షిక పేరు వలస పోయిన మందహాసం చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది.మందహాసం వలస పోతుందా? మనం ఎన్నడు కని విని ఎరుగం.అంతా ఏదో కొత్త కొత్తగా వింత వింతగా అనిపించింది.విలక్షణమైన భావాలు హృదయానికి తాకేలా ఉన్నాయి.పాడి పంటలతో కళకళలాడాల్సిన పల్లెలు.కరువు కాటకాలకు నిలయాలుగా మారినాయి.కరువు తాకిడికి పల్లెలు విలవిలలాడుతున్నాయి.పల్లెలో జనాలకు ఉపాధి కరువై పట్టణాలకు వలసలు కొనసాగుతున్నాయి.కొందరు జనాలు పల్లెలో ఉపాధి లేక విదేశాలకు వలస వెళుతున్నారు.మన దేశంలో విద్యార్థులు చదువుకున్న చదువుకు సరైన ప్రోత్సాహం లేక ఉపాధి లేక విదేశాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేస్తూ బతుకు గడుపుతున్నారు. అడవుల్లో స్వేచ్ఛగా జీవించే పశువులు,పక్షులు, జంతువులు అడవుల నరికివేత వల్ల వాటి మనుగడ కరువై జనావాసాల్లోకి చొరబడుతున్నాయి.ముకుంద రామారావు కూతురి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన సందర్భంగా అతనిలో కలిగిన భావాలు ప్రేరణగా నిలిచాయి. గుండె లోతుల్లో నుండి పొంగి పొరలే భావాలతో కవిత అక్షర రూపం దాల్చింది.ఇది కూతురు వివాహం చేసి అల్లునితో వియ్యంకుని ఇంటికి సాగనంపుతు కలిగిన దుఃఖము,వేదన నుండి జాలువారిన కవిత.వేదన నుండే కవిత్వం పుడుతుంది అంటారు.కవి ముకుంద రామారావు అనుభవించిన తీయని వేదనగా తోస్తోంది. కూతురుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి యుక్త వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసి భర్తతో పంపించడం తల్లిదండ్రుల బాధ్యత.తండ్రిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినాడు.మనుషులు వలస పోవడం తెలుసు.పక్షులు,జంతువులు వలస పోవడం తెలుసు.మందహాసం వలస పోవడం ఏమిటి? అని మనలో సందేహాలు రేకెత్తవచ్చు.వలస పోయిన మందహాసం కవితా సంపుటిలో సుప్రసిద్ధ విమర్శికుడు చేకూరి రామారావు చేరా గారి ముందు మాటలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో అచ్చయిన వలస పోయిన మందహాసం అనే కవిత ఖండిక ద్వారా తెలుగు కవితాభిమానుల దృష్టిని ఆకర్షించిన వై. ముకుంద రామారావు గారు ఈ దశాబ్దంలో గొంతు విప్పిన కొత్త కవి.తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపథ్యం.ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు.సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు.భావుకుడిలా అనుభవిస్తారు.కవిలా వ్యక్తీకరిస్తారు.ఈయన కవిత్వంలో స్పష్టాస్పష్టత ఉంటుంది.పారదర్శకత్వం ఉండదు.పదౌచిత్యం ఉంటుంది.పదాడంబరం ఉండదు.భావ గాంభీర్యం ఉంటుంది.భాషా క్లిష్టత ఉండదు.పురోగమన శీలత ఉంటుంది.

ముకుంద రామారావు

సిద్ధాంత వలయం ఉండదు.అనుభవం వైయుక్తికమే. దృక్పథం విశ్వజనీనం.ఇది ఈయన తొలి కవిత సంకలనమే కాని తొలి నాటి కవితల సంకలనం కాదు అని చక్కటి ముందుమాట రాశారు.వలస పోయిన మందహాసం కథా కమామీషు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?అయితే కవి ముకుంద రామారావు వలస పోయిన మందహాసం కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.“నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతి/నాకే వీడ్కోలిస్తున్నప్పుడు/ ఇన్నాళ్లు/గుండె గదిలో వొదిగి వొదిగి/కళ్ళకేదో మంచు తెర కప్పి/చూస్తూ చూస్తూనే/గువ్వలా ఎగిరిపోయినట్టుంది/అంటున్నారు.వీడ్కోలు మరియు సంతోషకరమైన సమయాల్లో మనం మళ్ళీ కలుద్దాము అని విడిపోతున్నప్పుడు చెప్పుకుంటాం. విడిపోతున్నప్పుడు శుభాకాంక్షల వ్యక్తీకరణ వీడ్కోలు.ఇది అభిమాన పూర్వకంగా ఉంటుంది. వీడ్కోలు అంటే ఎవరైనా బయలుదేరడం.సుదీర్ఘ ప్రయాణం,పదవీ విరమణ సందర్భంలో వీడ్కోలు చెప్పబడుతుంది.అతడు ఆమె ఆనందాల కలయికకు ప్రతిరూపంగా చైతన్యం వెల్లి విరిసి అద్భుతమైన ఒక పాప రూపం దాల్చింది.అతని భార్య నవ మాసాలు మోసి ఓ సుందర చైతన్య రూపం గల పాపకు జన్మనిచ్చింది.అతని కూతురు పెరిగి పెద్దయి వివాహం జరిగిన సందర్భంగా తండ్రి అయిన తనకు వీడ్కోలు చెబుతూ భర్త వెంట బయలుదేరడం చూసి తన కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి.చిన్నారి పాపాయి ఇన్నాళ్లు ఈ ఇంట్లో బుడిబుడి నడకలతో మెదిలి తన హృదయపు గదిలో ఒదిగి ఒదిగి ఉన్నది.ఆ ఇంట్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.పెళ్లి సందడితో భాజా భజంత్రీలతో రంగు రంగుల తోరణాలతో ఆ ఇల్లు ఆనందంతో బంధు,మిత్రుల సందడి సమాగమంతో ఒక రకమైన హడావుడి కొనసాగుతుంది.ఒక పక్క సంతోషం మరొక పక్క ముప్పిరిగొన్న బాధ ఆ తండ్రిలో కనబడుతుంది. రేపటి నుండి ఆ ఇంట్లో ఆ అమ్మాయి కనిపించదు. తన కళ్ళకేదో మాయ కమ్మినట్లు మంచు తెర కప్పినట్లుంది.చూస్తూ చూస్తూ ఉండగానే తన ముందు నుండి గువ్వలా రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్లుంది.తన కళ్ళను తాను నమ్మలేక పోతున్నాడు.అమ్మాయి గువ్వవలె ఎగిరిపోయినట్లుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.“తెలిసి తెలిసి/సైబీరియన్ పక్షిలా వలస పోయినట్టుంది/సందడిని సంబరాన్ని మూట కట్టుకు పోయిందేమో!/అంటున్నారు.వలసను ఆంగ్లంలో Migration అంటారు.అనగా రుతుక్రమంగా,జంతువులు పక్షులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోవడం చూస్తుంటాము.గుడ్లు పెట్టే స్థలాల కోసం,ఆహార సేకరణ కోసం వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని పక్షుల వలసలు జరుగుతాయి.చాలా పక్షులు సుదూర ప్రాంతాలకు ఒక నిర్దిష్టమైన మార్గాలలో వలస పోతాయి.వీటిలో ఎక్కువగా ఉత్తర దిక్కు నుండి చలికాలంలో దక్షణ దిక్కులోని ఉష్ణ ప్రాంతాలకు వలస పోయి గుడ్లను పెట్టి పొదిగి పిల్లలతో తిరిగి వాటి ప్రాంతాలకు తిరిగి వస్తాయి.సైబీరియన్ పక్షులు,పొడవాటి ముక్కు, భారీ రెక్కలు,అందంగా,ఆకర్షణీయంగా కనిపించే ఈ కొంగలు వచ్చి చెట్లపై విడిది చేస్తాయి.5000 వేల కిలోమీటర్ల దూరం నుండి జనవరి మాసంలో వచ్చి జూన్ చివరి నాటికి వెళ్లిపోతాయి.ఈ సైబీరియన్ పక్షులు ఒంటరిగా వచ్చి గుడ్లు పెట్టి పిల్లలతో పాటే తిరిగి సైబీరియాకు వెళ్లిపోతాయి.ఇది అందరికీ తెలిసిన సంగతి.వివాహం జరిగిన తర్వాత భార్య భర్తతో వెళ్లడం కొత్తది ఏమీ కాదు.ఆ విధంగానే అమ్మాయి వివాహం చేసుకొని అత్త వారింటికి వెళ్లడం,సుదూర ప్రాంతాలకు సైబీరియన్ పక్షిలా వలస పోయినట్టుంది.తమ ఇంట్లో మెదులుతూ తన మాటలతో ఆటలతో పాటలతో మందహాసంతో అలరించిన అమ్మాయి సందడిని సంబరాన్ని మూటగట్టుకొని వెంట తీసుకొని పోయింది అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.“ఇంతలోనే మేము మనుష్యుల మధ్యే లేనట్టుంది/ అనుభవానికొస్తేగాని/ఏ వేదనైనా అర్థం కాకుండా ఉంది/అంటున్నారు.వేదన అనగా తీవ్రమైన మానసిక బాధ.ఆవేదన అనగా తీవ్రమైన బాధ.పెళ్లి కాగానే అమ్మాయి అత్త వారింటికి వెళ్ళింది. అమ్మాయి ఇంట్లో లేక పోవడం వల్ల మేము మనుషుల మధ్య లేనట్లుగా తోస్తుంది.అమ్మాయి లేని వెలితి మా ఇంటిలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.వివాహ బంధం వల్ల అతనితో అమ్మాయి వెళ్లిపోవడం చేత తీవ్రమైన మానసిక బాధ ఏర్పడింది.అమ్మాయి ఇంట్లో కనిపించక పోవడం వల్ల తీవ్రమైన బాధ కలిగింది.ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి లేని లోటు అనుభవం ద్వారా తెలిసింది.పెళ్లిలో అప్పగింతల కార్యక్రమం చేసి అమ్మాయిని పంపించిన తర్వాత అనుభవం ఏర్పడింది.తీవ్రమైన మానసిక బాధ,అనుభవం ద్వారా తనకు తెలిసింది. ఇది అంతా అయోమయంగా అర్థం కాకుండా ఉంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.”చెంగు చెంగున గెంతులు/చిన్నప్పటి గుజ్జెన గూళ్ళు/చిలిపి చేష్టలు/ఇళ్ళంతా నింపిన అలంకరణలై/ఇంటందరికీ గుర్తు చేస్తూనే ఉంది/అంటున్నారు.గుజ్జన గూళ్ళు దీనిని బువ్వలాట అని కూడా అంటారు. బువ్వలాటను పూర్వము ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు కలిసి ఆడుకునే వారు.పిల్లలు ఇంటిలో తమ పెద్ద వాళ్లను అడిగి బియ్యము,పప్పులు,బెల్లం, చక్కెర తెచ్చుకొని వాటిని పొయ్యి మీద పెట్టినట్లు నటిస్తూ వంట తయారు కాగానే పొయ్యి మీద నుంచి దించినట్లు నటిస్తూ కొంత సేపటికి అందరు కలిసి తింటారు.గుజ్జన గూళ్ళు ఆటను ఆడినప్పుడు బొమ్మల పెళ్లి చేసి రెండు జట్లుగా ఏర్పడి వియ్యాలవారికి విందు పెట్టుటకై గుజ్జన గూళ్ళు పెడతారు.బాగా పండిన చింతకాయలను తెచ్చి నేర్పుతో దాని గుజ్జును గుల్ల చెడకుండా పూర్తిగా తీసివేసి ఆ గుల్లలో బియ్యం పోసి దానిని మండుచున్న పొయ్యిలోకి కుమ్ముతోనే పెట్టి ఉడికిన తర్వాత పిల్లలు గుజ్జన గూళ్ళు అని వేడుకగా తింటారు.పిల్లలు ఇల్లంతా తిరుగుతూ చెంగు చెంగున గెంతుతారు.తోటి పిల్లలతో కలిసి గుజ్జన గూళ్ళు బొమ్మల ఆటలు ఆడతారు.పిల్లల చిలిపి చేష్టలతో కోతుల వలె ఇల్లంతా గెంతుతూ ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తూ అలరిస్తారు.

అమ్మాయి ఆడిన బొమ్మలు ఇంటిలో అందరికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి.అమ్మాయి నడయాడిన ఇల్లు ఆడిన బొమ్మలతో ఆ నేల అంతా ఒక రకమైన పరిమళంతో నిండి ఉంది.అమ్మాయి ఇంటి వారందరికీ అనుబంధాలను గుర్తు చేస్తూనే ఉంది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. “ఎగిరిపోయిన ఛాయా లెక్కడా లేవు/కనిపించక కలవరం తప్ప/లేకుండా ఉండలేని నిర్లిప్తత తప్ప/ నువ్వైనా నేనైనా/మొలకెత్తిన చోటే మొక్కలన్నింటిని ఉండనీయం/పూచిన పూలనీ,పండ్లనీ,చెట్టుకే వదిలేయం/ఎంత లేదన్నా కాదన్నా/విడిచిపోలేని బాధ/విడదీస్తున్న చేతులకంటదు/అంటున్నారు. అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా జీవితం గడపడానికి అత్త వారింటికి వెళ్లిపోయింది.
అమ్మాయి గువ్వవలె ఆకాశంలోకి ఎగిరిపోయిన ఛాయలు ఎక్కడ కనిపించడం లేదు.అమ్మాయి పెళ్లి చేసుకుని కన్న వారిని వదిలి అత్తవారింటికి వెళ్ళిపోయింది.ఇక కన్న వారి ఇంటిలో పెళ్లి చేసుకున్న అమ్మాయి జాడ కనిపించదు.కాబట్టి తండ్రికి ఆ కుటుంబంలో అమ్మాయి లేదనే కలవరం ఏర్పడింది.అమ్మాయి కన్నవారి ఇంటిలో లేదు. అమ్మాయి లేకుండా ఉండలేని ఒక రకమైన నిర్లిప్తత ఇంటిల్లిపాదికి ఏర్పడింది.నువ్వు,నేను,ఎవరు అయినప్పటికీ మన ఇంటి పెరట్లో మొలకెత్తిన మొక్కలు అన్నింటిని ఒక్కచోట ఉండనీయం. మొక్కలను మన ఇంటి పెరట్లో అనువైన చోట నాటుతాం.మన ఇంటి పెరట్లో కాసిన కాయలను పక్వం రాగానే పండ్లను తెంపుతాం.చెట్టుమీద కాచిన పండ్లను చెట్టుకే వదిలి వేయడం జరగదు.ఎంత లేదు కాదు అని చెప్పినప్పటికీ అమ్మాయిని విడిచి ఉండలేని ఒక రకమైన బాధ ఆ ఇంటిలో కొనసాగుతుంది.అమ్మాయిని అత్త వారింటికి పంపించిన బాధ కన్నవాళ్ళ చేతులకు అంటదు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.లేదంటే చూడు/ పోగొట్టుకున్న వాడి ముందు/గెల్చుకున్న వాడి గర్వంలా/ఆ చేతిలో చేయి అభయ హస్త మవునో కాదో/మందహాసమై మెరుస్తోంది/సరిగ్గా ఒకప్పటి నాలాగే/అంటున్నారు.నవ్వు,మందహసం,దరహాసం ఒక విధమైన ముఖ కవళిక.నవ్వుతో ముఖంలోని వివిధ కండరాలు ముఖ్యంగా నోటికి రెండు వైపులా ఉండేవి సంకోచిస్తాయి.మానవులలో నవ్వు, సంతోషం,ఆనందానికి బాహ్య సంకేతం. మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాలలో, సంభాషణలలో,ఉత్తేజాన్ని కలిగిస్తుంది నవ్వు. ఇతరుల నుండి కలయికను కాంక్షిస్తుంది నవ్వు. అనేక రోగాలను దూరం చేసే టానిక్ నవ్వు.
నవ్వు శారీరకంగాను,మానసికంగాను,ఆరోగ్యాన్నిచ్చి ఉత్సాహంగా,ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.నవ్వు వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నవ్వడం వల్ల బాధను మరిచిపోతాం.నవ్వు శారీరక మానసిక రుగ్మతులను దూరం చేసి ప్రశాంతతను పోషిస్తుంది.చిరునవ్వు,మందహాసం అనగా పళ్ళు కనిపించకుండా పెదవులు విరిసి విరవకుండా నవ్వడం.అతనితో పెళ్లి చేసి పంపించి అమ్మాయిని దూరం చేసుకున్న తండ్రిలో వేదన కనబడుతుంది. అమ్మాయిని దూరం చేసుకున్న తండ్రి ముందు వివాహం చేసుకొని అమ్మాయిని గెలుచుకున్న అతనిలో ఒక రకమైన గర్వం కనబడుతుంది. అమ్మాయికి అతను చేతిలో చెయ్యి వేయడం చూసినాడు.అమ్మాయికి అతను రక్షణగా ఉంటాడో లేదో అనే సందేహం కలిగింది.పెళ్లి చేసుకుని అమ్మాయిని వెంట తీసుకొని పోతున్న అతని ముఖంలో చిరునవ్వు వలె మెరుస్తోంది.అమ్మాయి తండ్రి కూడా వివాహం చేసుకొని తన భార్యను తన వెంట తీసుకు వచ్చాడు.అమ్మాయి తండ్రి తన వివాహం రోజు నాటి గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఉన్నాడు.ఒకప్పటి తనలాగే అమ్మాయి వివాహం జరిగింది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.వలస పోయిన మందహాసం అనే చక్కటి కవిత రాసిన ముకుంద రామారావును అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలను విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
యల్లపు ముకుంద రామారావు తేది 09 – 11 – 1944 రోజున పశ్చిమబెంగాల్ ఖరగ్పూర్ లో జన్మించాడు.తల్లి ఎరుకలమ్మ,తండ్రి యెల్లయ్య. తండ్రి రైల్వే ఉద్యోగి.ముకుంద రామారావు ఎమ్మెస్సీ మ్యాథ్స్, డి.ఐ.ఐ.టి., పి.జి.డి.సి ఎస్. ఖరగ్పూర్ లో చదివారు.వీరు రైల్వే శాఖ లో కంప్యూటర్ రంగంలో పని చేసి రిటైర్ అయ్యారు.వీరి భార్య పేరు సుభాషిణి.ముకుంద రామారావు, సుభాషిణి దంపతులకు ముగ్గురు సంతానం;1) లావణ్య 2)చైతన్య, 3)కళ్యాణ చక్రవర్తి.
వీరు రచనా ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభించి కవిగా స్థిరపడ్డారు.వీరు అనువాదకుడిగా రాణించారు.
ముకుంద రామారావు వెలువరించిన గ్రంథాలు స్వీయ కవిత్వం.
1) వలస పోయిన మందహాసం – 1995/2) మరో మజిలీకి ముందు – 2000./3) ఎవరున్నా లేకున్నా – 2004/4) నాకు తెలియని నేనెవరో – 2008/5) నిశ్శబ్దం నీడల్లో – 2009/6) విడని ముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – 2013./7) ఆకాశయానం – 2014/.8) రాత్రి నదిలో ఒంటరిగా – 2017/9) నిశ్శబ్దంలో శబ్దం – 2024.
ముకుంద రామారావు వెలువరించిన స్వీయ అనువాద రచనలు :1) అదే ఆకాశం – 52 మంది కవుల పరిచయం,70 కవితలతో 23 దేశాల అనువాద కవిత్వం.తొలి ప్రచురణ – 2010.మలి ప్రచురణ – 2023/ 2)అదే గాలి (2000 మంది కవుల పరిచయం,500 కవితలు,560 పేజీలు, వందకు పైగా ప్రపంచ దేశాల కవిత్వం – నేపథ్యం) – 2016/3)అదే నేల (3000 మంది కవుల పరిచయం, 700 కవితలు,900 పేజీలు,నలబైకి పైగా భారతీయ భాషల కవిత్వం – నేపథ్యం)2019/ 4)అదే కాంతి (210 మంది కవుల పరిచయం,1200 కవితలు,750 పేజీలు,మధ్యయుగంలో భక్తి కవిత్వం సామాజిక నేపథ్యం) – 2022/ 5) అదే నీరు – వంద మంది కవుల 700 కవితల జాతీయ అంతర్జాతీయ కవుల కవిత్వం,పరిచయం విశాలాక్షి సాహిత్య మాస పత్రికలో ధారావాహికంగా ప్రచురితం) – 2023.
6)శతాబ్దాల సూఫీ కవిత్వం – 52 మంది కవుల 121 కవితలు -2011./7)1901 నుండి నోబెల్ కవిత్వం (37 మంది కవుల 171 కవితలు, 320 పేజీలు, నోబెల్ కవుల కవిత్వ – జీవితవిశేషాలు) – 2013/ 8)1901 నుండి సాహిత్యంలో 13 మంది నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015)/ 9) భరత వర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం – (2017)/ 10) చర్యా పదాలు – 23 మంది కవుల 50 కవితలు (అనేక భాషల ప్రథమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) -2019/ 11) మిణుగురులు ( టాగూర్ Fireflies కు తెలుగు అనువాదం) కినిగె ఈ – బుక్ – (2022)/ 12)ఇసుక నురగ (ఖలీల్ జిబ్రాన్ Sand and Foam కు తెలుగు అనువాదం) – కినిగె ఈ బుక్ – (2022./13) మియా కవిత్వం – అసోమియా ముస్లిం అస్తిత్వ స్వరం (2022)./
14)బెంగాలీ బౌల్ కవిత్వం – 80 మంది బౌల్ కవుల 170 బౌల్ కవితలు – (2023)/వీరి కవిత్వం ఇతర భాషల్లోకి అనువాదాలు :1)వలస హోద మందహాస – మొదటి రెండు కవిత్వ సంకలనాల్లోని కవితల కన్నడ అనువాదం (2005)/2)The Smile That Migrated And Other Poems – మొదటి మూడు కవిత్వ సంకాలనాల్లోని కవితల ఆంగ్ల అనువాదం – (2011/).వీరు రచించిన కథలు/ ఇతరాలు : (విశాలాంధ్ర/ నవచేతన ప్రచురణలు) :1) దేశ దేశాల కప్పల కథలు – (2010)./2) నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015)/3) వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) -(2018)/4) అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019).
వీరు రాసిన పుస్తకాలు ప్రచురణలో ఉన్నవి/ 1) నిశ్శబ్దంలో శబ్దం – స్వీయ కవిత్వ సంకలనం./2) నా ఇల్లెక్కడ? – కథల సంకలనం./3) ఆసక్తి – వ్యాస సంకలనం./ 4) విశ్లేషణ – సమీక్షలు సమాలోచనలు./5) అనామక ప్రతిబింబాల ప్రవాహం (టాగూర్ చిత్రాల కవిత్వం కు తెలుగు అనువాదం)
వీరు పొందిన పురస్కారాలు :1) వలస పోయిన మందహాసం కవితా సంకలనానికి శ్రీ రమణా సుమన శ్రీ పురస్కారం – (2000)./2) వచన కవిత్వానికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం – (2009)/.3)C.P. బ్రౌన్ పండిత పురస్కారం (హ్యూస్టన్ USA లో) – (2015)./4) అదే గాలి ఉత్తమ సాహిత్య గ్రంధానికి గంగిశెట్టి స్మారక మహాంద్రభారతి పురస్కారం (2017)./ 5) నోబెల్ కవిత్వ గ్రంథానికి అనువాద ప్రక్రియలో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం – (2017)6) అదే నేల (భారతీయ కవిత్వం – నేపథ్యం) గ్రంథానికి తాపీ ధర్మారావు పురస్కారం – (2020)./ 7) కవి సంధ్య ప్రతిభ పురస్కారం (అనువాదానికి) – 2021/.8) అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం,సామాజిక నేపథ్యం) గ్రంథానికి పెమ్మరాజు లక్ష్మీపతి గారి స్మారక పురస్కారం – 2022/.9) మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పురస్కారం – 2022/.10) కృష్ణాజిల్లా రచయితల సంఘం శ్రీ వేములపల్లి కేశవరావు, శ్రీమతి విశాల గార్ల అనువాద ప్రతిభా పురస్కారం – 2022/.11)అజో- విభో -కందాళం ఫౌండేషన్ వారి 2024 ప్రతిభా మూర్తి జీవితకాల సాధన పురస్కారం/12) విజయనగరం విజయ భావన 2024 ఉగాది పురస్కారం/.వీరు రాసిన ఇతరాలు :
1) ఆంగ్లం పోలిష్,హిందీ,ఉర్దూ,బెంగాలీ,కన్నడం, తమిళం,మలయాళం,ఒడియా,సంతాలీ, మరాఠీల్లో కి ఎన్నో కవితల అనువాదాలు./2) వివిధ సంకనాల్లో,కవిత వార్షికల్లో,కవితా దశాబ్ది సంచికల్లో,/అనేక వెబ్సైట్లలో కవితలు/ 3) ప్రతిష్టాత్మక the little magazine సంకలనం India in Verse – Contemporary poetry from 20 Indian Languages and 167 Poets సంకలనంలో అనువదించబడ్డ కవిత ప్రచురితం./4) మధురై నుండి ప్రచురితమయిన Kavya Bharathi 2008 -Study Centre for Indian Literature in English and Translation,American College సంకలనంలో అనువదించబడ్డ ఆంగ్ల కవితలు ప్రచురితం. 5) ఈ క్రింది సంకలనాలలో అనువదించబడ్డ ఆంగ్ల కవితలు ప్రచురితం./ I)Pride of Place – An anthology of Telugu Poetry. 1981 -2000 with 117 Poets – K.Damodhar Rao/.ii)Voices on the Wing – Telugu Free Verse – 1985 – 95 – V.V.B.Ramarao/iii)VIRTUOO -A refereed Transnational Bi -Annual Journal of Language and Literature in English /iv)San Diego Poetry Annual 2011 – 12,2015 -16 (The Best Poems from every corner of the Region)/v)Wakes on the Horizon – A Selection of Poems translated from Telugu – N.S.Murthy./6) వలస పోయిన మందహాసం కవితా సంకలనం మీద వార్త దినపత్రికలో సంపాదకీయం./7) కేంద్ర సాహిత్యఅకాడమీ,తెలుగు విశ్వవిద్యాలయం/,Hyderabad Literary Festival లాంటి సంస్థల్లో పత్ర సమర్పణ, కవిత్వ పఠనం. 8) ఆకాశవాణి రేడియో కేంద్రాలలో, టీవీలలో,కవితల ప్రసారం, పరిచయ ప్రసంగాలు/9) కేరళ తుంజన్ 2013 కవితోత్సవాలకు తెలుగు కవిగా ప్రత్యేకాహ్వానం./10)”రాత్రి నదిలో ఒంటరిగా” కవిత్వ సంకలనం మీద మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్. పట్టా ప్రదానం – 2018./వివిధ గ్రంథాలలో వీరు రాసిన పరిచయ వ్యాసాలు :/1)Modern Poetry in Telugu – వడలి మందేశ్వర రావు./2) సాహిత్య మహిళావరణం, కవిత్వానుభవం – చేరా/.3) సాహిత్యకీయాలు – ఏ.బి.కె/.4) అభివ్యక్తి – గుడిపాటి/.5)సాలోచన – గోపి./6) గుండెతడి – జింబో/.7) ఈ కాలం కవులు – సౌభాగ్య./8) సాహితీ మంత్ర నగరిలో సుస్వరాలు – మునిపల్లె రాజు./9) తెలుగులో ఆధునిక నవల – ఇతర వ్యాసాలు – అంపశయ్య నవీన్.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

Egoist

by Rudrakhala Matam Prabhu linga Shastri November 29, 2024
written by Rudrakhala Matam Prabhu linga Shastri

“While making all the industrious efforts
In studying, passed in the examination,”
One has claimed on the announcement
Of results but not acknowledged teacher.

“Since entering into the services, at each
Second while meeting all required needs,
Saved money as possible with the best
To construct house of own” but one didn’t
Mention blessings of parents are there.

“On going through all the provisions of
The Act, guidelines in circular instructions
And the Government Orders passed time
To time,” note has been prepared and
Submitted but not thanked one’s officer
Who guided one how to do so and so.

“Due to have been suffering from hungry
For three hours, this pudding might have
Been tasted very delicious” one commented
But ignored attentive preparation of his wife.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“వేద…అక్షరయోధ”

by Chitti Sidda Lalita November 29, 2024
written by Chitti Sidda Lalita

“వేద”….ఈ పదంలోనే ఒక వైబ్రేషన్ వుంది.వేదాలు ఎంత ప్రాముఖ్యమైనవో వేదమంత్రాలు ఎంత పవిత్రమైనవో మనకు తెలుసు. తన నవలకు వేద అనే శీర్షికను ఎంచుకుని నవలా నాయికకు వేద అనే నామకరణం చేసి తన సాహితీ ప్రతిభను చాటుకున్నారు అనూశ్రీ.

అలాగే వేద అనే ఈ శీర్షిక ద్వారా నవలకు ఎంతో పవిత్రతను, గౌరవాన్ని ఆపాదించారు. నా దృష్టిలో విధివంచితలై ఆవేదనతో కన్నీరు కార్చే ప్రతి స్త్రీ జీవితం ఒక వేదమే..

తపస్వి మనోహరం వారు డిజైన్ చేసిన అందమైన ఆకట్టుకునే ముఖచిత్రం ఈ వేదకు మరింత సొగసును తీసుకొచ్చింది. లబ్ధప్రతిష్టులైన రచయితలు యండమూరి, మన్నెం శారద గారి అభినందనలతో, ఆశీస్సులతో ఈ నవలకు మరింత నిండుదనం సమకూరింది.
ఇంతకీ ఏముంది ఈ నవలలో…? ఇది కమర్షియల్ నవలా..!?
ఎవరినో మెప్పించడానికి, సాహితీ శిఖారాగ్రాన కూర్చోడానికి లేకపోతే అమ్మి సొమ్ము చేసుకోవడానికో రచయిత్రి ఈ నవలను రాయలేదు.
మన దేశంలో స్త్రీలు పడే బాధలు, అనుభవించే వేదన, పురుషపుంగవుల అణచివేతలతో స్త్రీ అబలగా నిలిచి అల్లాడే వైనం,ఈ సమాజపు పోకడ, ఆడపిల్లకు ఇంట్లో వ్యతిరేకతలు, ఆత్మహత్యలకు పాల్పడడం, కాదని పిల్లలకోసం ప్రాణం నిలుపుకుని జీవించడం లాంటి సగటు భారతీయ స్త్రీ అనుభవించే వ్యథతో రూపుదిద్దుకున్న ఒక అక్షర శిల్పం ఈ వేద.

ఈ వేద అనూశ్రీ గౌరోజు ఆప్యాయంగా చెక్కిన ఒక శిల్పం.
ఇదో జీవన వేదం. ఆరవ వేదం. పురుషహంకారపు కోరల్లో చిక్కుకుని బతకలేక చావలేక విలవిల్లాడుతున్న ఎందరో స్త్రీ మూర్తుల వ్యథలకు అక్షర రూపం ఇది.

ఈ సమాజం భర్త తోడు లేనిదే స్త్రీకి మనుగడ లేదు, ఒంటరి స్త్రీలకు గౌరవం లేదు అని భయపెడుతుంది. అందుకే ఎంతోమంది స్త్రీలు బాధలు భరించలేక, వేధింపులకు తాళలేక, చిత్రహింసలను తట్టుకోలేక వంటింట్లో కిరోసిన్ కు ఆహుతి అయ్యారు. ఉరి వేసుకుని అశువులు బాసారు. గోదాట్లో దూకి బలవన్మరణం పాలయ్యారు. మరి ఈ సమాజం ఆమెకు ఆలంబనగా నిలవకపోగా ఆమె బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళను ఇంత కళ్ళేసుకుని చూస్తూనే వుంటుంది. ఆమెను హేళన చేస్తుంది. వెంటాడుతుంది. నాలుగురాళ్ళను విసిరి గాయపరుస్తుంది.

అనుశ్రీ గౌరోజు

ఎందుకలా..?
ఎందుకింత వివక్ష..?
మిలియన్ డాలర్ల ప్రశ్న.
సమాధానం సమాజం చెప్పదు.
మనమే చెప్పాలి.
ఎందుకంటే సమాజమంటే ఎవరోకాదు. మనమే.
ఇదెంతో శోచనీయం.
మూడువందల పేజీల ఈ నవలను మూడు భాగాలుగా విభజించవచ్చు.
ఒకటి వేద పెళ్ళికి ముందు స్నేహితులతో గడిపిన కాలం.
ఇక్కడ తేజ, స్నేహ, స్వాతి, మురళి అనేవాళ్ళను ప్రాముఖ్యంగా చెప్పుకోవాలి. అరమరికలు లేని వీరి స్నేహం అబ్బురపరుస్తుంది.
కష్టసుఖాలు పంచుకుని తోడ్పాటును అందించుకుంటారు.
నవల చదువుతుంటే అందులో లీనమయిపోతాం. అరె ఇలాంటి ఫ్రెండ్స్ మనకుంటే ఎంత బావుండు అనిపిస్తుంది. ఈ ప్రథమ భాగంలో రచయిత్రి స్నేహానికి వేసిన పీట సమున్నతమైనది. స్నేహబంధానికి వున్న విలువను, ప్రాధాన్యతను రచయిత్రి చక్కగా అక్షరీకరించారు. నవలలో ఎక్కడా మనకు అసభ్యత, అనైతికత కనిపించదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవల్సింది నాకు నచ్చింది ఏమిటంటే.. దగ్గరే వున్న మిత్రులకు కూడా ఉత్తరాలు రాయడం. వేదకు వున్న మంచి అలవాటు ఇది. మాటల్లో చెప్పలేని భావాలు అక్షరాలతో చెప్పచ్చు అంటుంది.ఈ విధంగా రాయడం.. భావాలను కాగితంతో పంచుకోవడం అనే అలవాటు బాగుంది కదా..!
ఇక రెండవ భాగానికి వస్తే…
పెళ్ళి తరువాత జీవితాలు అందరివీ ఒకేలా వుండవు.
ఒడిదుడుకులు, కష్టాలు,కన్నీళ్ళు జీవితంతో పెనవేసుకుని వుంటాయి. కానీ అవి శృతి మించకూడదు. గతి తప్పకూడదు. ఎవరినీ బలి తీసుకోకూడదు.
దానికీ ఒక లిమిట్ వుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఎంతో ప్రతిభకల వేద జీవితం భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసే దాకా వస్తుంది. ఇక్కడ తేజ, స్వాతి పాత్రలు బాధ్యతాయుతమైన స్నేహానికి చిరునామాగా చెప్పచ్చు. స్నేహమంటే ఆషామాషీ వ్యవహారం కాదు అది ఒక బాధ్యత అని గుర్తెరిగినవాడు తేజ. అలాగే అతడి చెల్లెలు స్నేహ.చెలిమికి ప్రాణమిచ్చే నీటి చెలమ. అన్నకు ప్రియమైన చెల్లిగా వేదకు ప్రాణ మిత్రురాలిగా మంచి సపోర్ట్ ఇస్తుంది స్నేహ. కానీ స్నేహ అర్థాంతరంగా లోకాన్ని వీడడం మనల్ని కంటతడి పెట్టిస్తుంది.
స్త్రీ కుమిలిపోతూ, కృంగిపోతూ, కన్నీళ్ళు కారుస్తూ జీవచ్ఛవంలా ఎన్నాళ్ళు జీవిస్తుంది..? ఏ ఆశతో జీవిస్తుంది..?
రకరకాల మగాళ్ళు. మృగాళ్ళు. శాడిస్టులు. సైకోలు. వీళ్ళ టార్గెట్ స్త్రీ.
ఆమెని బాధించడం.. వేధించడం, హింసించడమే వీరి లక్ష్యం.
స్త్రీలే తిరగబడి వీరికి తగిన బుద్ది చెప్పాలి. ప్రతి స్త్రీ శక్తిని కూడగట్టుకుని నరకాసురుని వధించిన సత్యభామ కావాలి.
ఇంతకీ ఈ వేద నవల అందించే సందేశం ఏమిటంటే..
రచయిత్రి అనుశ్రీ అయినా నేనయినా కోరుకునేది ఒక్కటే.
ఈ వేద మన చుట్టూ జరిగే సంఘటనల సమాహారం.
వేదలాంటి స్త్రీలు మన చుట్టుపక్కలే వుండచ్చు.
అమ్మల్లారా.. అక్కల్లారా.. చెల్లెళ్ళారా.. మిమ్మల్ని అర్థించేది ఒక్కటే.
ఒంటరి స్త్రీలను కాకుల్లా పొడవకండి. మగాడికి వత్తాసు పలకుతూ గుసగుసలతో, సూటిపోటి మాటలతో నొప్పించకండి. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే మాటను మనం చరిత్రలోనుండి తీసేద్దాం. సాటి స్త్రీకి చేతనయిన సహాయం చేద్దాం. వారికి ఆసరా ఇచ్చి కన్నీళ్ళు తుడుద్దాం. అది చేతకాకపోతే మనపని మనం చూసుకుందాం. అంతే తప్ప ఆమెను పరిహసిస్తూ కుళ్ళబొడిచి పాపం మూట కట్టుకోవద్దు.అయినా గట్టునున్నవారికేం తెలుస్తుంది గుండెకోత..? మునిగితే కదా తెలిసేది బతుకు రోత.

ఏ రంగమైనా సరే ఒక స్త్రీ ముందడుగు వేస్తే వెనక్కి లాగడానికి ఎన్ని ప్రయత్నాలో..ఎన్ని కుట్రలో..ఆమెను అణిచి వేయడానికి ఎన్ని కుయుక్తులో..స్త్రీకి స్వంత ఇంట్లోనే ప్రోత్సాహం లభించదు.
ఆడదానివి నీకెందుకు ఇంట్లో కూచో అంటారు.ఒక స్త్రీ విజయం సాధించాలంటే ఎంతో శ్రమించాలి. తపస్సు చేయాలి.తప్పదు.
మహిళం మనం శ్రమించుదాం. తపస్సు చేద్దాం. విజయాన్ని స్వంతం చేసుకుందాం.ప్రపంచానికి మన సత్తా చూపిద్దాం.
~~
ఈ నవలలో హృదయాన్ని పిండేసే మాటలు చాలా వున్నాయి.
కొన్ని చెప్పి ముగిస్తాను.

1.ఎవరు ఆదరించకపోయినా, కన్నతల్లి కాదన్నా..పుడమితల్లి మాత్రం కాదనదుగా.. అలసిన నన్ను తన ఒడిలో చేర్చుకుంటుందిగా అంటుంది వేద నిర్వేదంగా. ఎంతగా విరక్తి కలిగితే ఒక స్త్రీ ఆ మాట అంటుందో ఒకసారి ఆలోచించండి.

2.”ఆడపిల్లలు గుండెలో అగ్ని పర్వతాలు దాచుకుంటారు. పైకి సంతోషంగా వున్నట్లు నటిస్తారు “అంటాడు మురళి. “బాధను పౌడర్ గా నిరాశను కాటుకగా ఆవేదనంతా మేకప్ గా వేసుకుంటాను. నువ్వు ఓదార్చగలవా..? ఆడవాళ్ళని ఓదార్చాలంటే యుగాలు సరిపోవు మీ మగాళ్ళకి అంటుంది” స్వాతి.
ఈ స్వాతి ముక్కుసూటిగా మాట్లాడే పాత్ర. చాలా బాగుంది.

3. ఒక సందర్భంలో “ఈరోజును ఎంజాయ్ చెయ్యనీరా..రూపంలేని రేపటిలో విషాదాన్ని వెతుక్కుంటూ ఈ సమయాన్ని పాడుచెయ్యలేను” అంటాడు తేజ. నిజమే రేపనేది వుందో లేదో ఈ క్షణం నిజమైనది. అమూల్యమైనది. దాన్ని ఆస్వాదించాలి.

4. అలాగే “మీనుండి ఏదైనా ఆశించి సహాయం చేస్తే అది వ్యాపారం అవుతుంది. అది నాకిష్టం లేదు” అంటాడు తేజ.
ఇతడు అందరినీ ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు. బాధ్యతలను బరువులను మోసే ఉదాత్తమైన పాత్ర అని చెప్పాలి.
“తల్లిదండ్రుల మాట విని.. భర్త నీడలో సుమంగళిగా రాలిపోయి
వంశోద్ధారనిగా బిరుదులు తెచ్చుకున్న కథలు ఇప్పటికే బోలెడు ఉన్నాయి కదా. నా కథను నేను కొత్తగా రాసుకోవాలనుకుంటున్నాను. గొప్పగా చెప్పుకోడానికి కాదు తృప్తిగా చదువుకోడానికి ” అంటుంది వేద..
నాకూ కొత్తగానే అనిపించింది..
ఈమధ్య నేను ఒక కవిత రాస్తే కొందరు అడిగారు. “కాలం మారింది. స్త్రీ బ్రతుకు మీరనుకున్నంత అధ్వానంగా లేదు!” అని
నేనన్నాను..
“ఎక్కడా మార్పు రాలేదు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. స్త్రీల బ్రతుకులు ఎంత హీనంగా వున్నాయో..పెళ్ళి అనే పంజరంలో చిక్కి ఎంతగా రోదిస్తున్నాయో, మీరనుకున్నట్లు మారితే సంతోషమే అని చెప్పాను.
సాయంకాలం మందు షాపుల ముందు ఆరాటంగా క్యూలో నిల్చున్న మగాళ్ళను చూస్తే అర్థమవుతుంది మన కుటుంబాల పరిస్థితి. మగాళ్ళతో పాటూ స్త్రీలు కూడా బాధ్యతలు మరిచి బారులు తీరుతున్నారా..?
అయితే ఎంతమంది..?
మరి పురుషులే ఎందుకిలా..?
వీళ్ళను పాడుచేసేది సమాజమా, మన కుటుంబ వాతావరణమా..?
~~~
మూడో భాగం. నేను చెప్పను. నవల చదివి మీరు తెలుసుకోవాలి.
సున్నితమనస్కురాలయిన వేద, చిన్న బాధకే కదిలిపోయే ఆమె హృదయం
తరువాత ఎలా గట్టిపడింది..? పరిస్థితులను ఎదిరించి ధైర్యంగా ఎలా నిలవగలిగింది? ఆమెకు ప్రేరణ ఏమిటి..? ఆమెకు తోడు ఎవరు? ఆమెను ప్రపంచానికి పరిచయం చేసి వేదికపై నిలబెట్టే పెన్నిధి ఎవరో తెలుసుకోవాలంటే వేద నవలను మీరు చదవాల్సిందే.
ఈ వేదకు ప్రాణం పోసి రూపాన్నిచ్చి, ఆవిష్కరించిన రచయిత్రి అనూశ్రీ గౌరోజును **వేద అని **అక్షరయోధ అని పిలవాలనిపిస్తోంది.వేద నవలకి గిడుగు రామమూర్తి పురస్కారం లభించడం ఆనందదాయకం. ఎన్ని అడ్డంకులున్నా, అవరోధాలు ఎదురైనా.. వెనుదిరగక, నిరాశ చెందక తన కవిత్వంతో, సాహితీ సేవలతో ఈ ప్రాంతానికి కీర్తి తెస్తున్న అనూశ్రీ నిస్సందేహంగా అక్షరయోధే..
వేద నవలకు నన్ను సమీక్షకురాలిగా, అనిశెట్టి రజిత గారిని ఆవిష్కర్తగా, రమాదేవి గారిని స్వీకరణకర్తగా ఎన్నుకున్న అనూశ్రీ నిస్సంకోచంగా స్త్రీ పక్షపాతి. భవిష్యత్తులో స్త్రీవాద రచనలు చేసి మరిని పుస్తకాలను వెలువరించి స్త్రీ విముక్తికోసం పోరాడాలని ఆశిస్తూ.. అభినందిస్తున్నాను.
మరోసారి మీ అందరికీ నా నమస్సులు జైహింద్.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం

by Narendra Sandineni November 29, 2024
written by Narendra Sandineni

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
“నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
“జీవితమా …
“ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
“ఎంత గారాల బిడ్డనో నేను ? “
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (16)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“శత్రువులను కలుద్దామని వాళ్ళ ఇళ్ళని
“వెతుక్కుంటూ వెళ్ళానా …ఇక చూడండి
“అక్కడ నా స్నేహితులతోనే ములాఖత్ అయింది”.
ఒకరికి కొందరికి హాని కలిగించినట్టి,రాజ్యానికి దేశానికి ద్రోహం చేసినట్టి వ్యక్తిని శత్రువుగా భావిస్తారు.మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు.ఒకరికి మరొకరిపై మనసులో కలిగే కీడు భావన ఇరువురి మధ్య శత్రుత్వాన్ని కలిగిస్తుంది.అటు వంటి వాడే శత్రువు.ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు మౌనంగా ఉండకపోవడం వల్ల మనసులో చెలరేగే ప్రతీకార భావనలు శత్రువుల్ని తయారుచేస్తాయి.తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో రాయబడి ఉంది.స్నేహితులు కాని వారు శత్రువులు.మనకు హాని కలిగించే వారు శత్రువులు. మనకు వ్యతిరేకంగా పని చేసే వారు శత్రువులు.శత్రుత్వం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య నెలకొన్న వ్యతిరేక భావనగా పేర్కొనవచ్చు.స్నేహితుల మధ్య సయోధ్య లేక పోవడం,అపోహలు,మనస్పర్ధలు,అవగాహన లోపంతో స్నేహం పటాపంచలై శత్రుత్వంగా మారుతుంది. స్నేహం అద్భుతమైంది.నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహానికి హద్దులు లేవు.అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. స్నేహం ఓ మధురమైన అనుభూతి.దానికి వయసుతో నిమిత్తం లేదు.ఆట పాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.అటు వంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.సృష్టిలో నా అనే వారు,బంధువులు లేని వారైనా ఉంటారేమోగాని స్నేహితుడు లేని వారు అసలు ఉండరు.ఇంట్లో చెప్ప లేని సమస్యలను,బాధలను సైతం స్నేహితులతో ఎటు వంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పును పొందుతారు.అది స్నేహంలోని గొప్పతనం.స్నేహం ప్రకృతి వంటిది.అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయిని ఇస్తుంది.మనిషి జీవన యానంలో స్నేహం శ్వాస వంటిది.స్నేహం ఎంతో తియ్యనైంది.అమ్మ ప్రేమ,స్నేహం వెల కట్ట లేనిది.ఈ రెండే జీవితంలో ముఖ్యమైనవి.స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం చెప్ప లేనిది.పవిత్రమైన స్నేహం ఉండాలి.అటు వంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఈ కవిత శత్రుత్వం మరియు స్నేహం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది.మనం శత్రువులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు తారసపడ్డట్లుగా ఉంది.ఈ కవితలోని భావం మనల్ని ఆలోచింప జేస్తుంది.అసలు శత్రువులు అంటే ఎవరు? మనుషుల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడుతుంది? స్నేహం మరియు శత్రుత్వానికి గల సంబంధం ఏమిటి?ఈ కవితలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా స్నేహితులను మరియు శత్రువులను గురించి ఆలోచింప జేస్తుంది.శత్రువులు అందరు మన స్నేహితులు కాకపోవచ్చు.స్నేహితులు కూడా శత్రువులుగా మారవచ్చు. మనం ఎవరిని శత్రువులుగా భావిస్తాము అనే సంగతి గురించి ఆలోచించాలి.ఈ వాక్యం ఆలోచనాత్మకంగా మరియు వ్యంగ్య భరితంగా,ఎంతో లోతైన భావాలు,జీవన దార్శనికతతో కూడిన అనుభవాలను ప్రతిబింబించేలా ఉంది.శత్రువులను కలుద్దామని వెతుక్కుంటూ వెళ్లడం అనే వాక్యం మనలను ఆలోచింపజేస్తుంది.ఇది సమస్యను నేరుగా ఎదుర్కోవాలనే సంకల్పంతో ప్రారంభమైన చర్యగా భావించవచ్చు.శత్రువులు అంటే మీరు ప్రత్యర్థులుగా భావించిన వారు అని సూచిస్తుంది. జీవితంలో మనం ఎవరిని శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అసలు వాళ్లు శత్రువులే కాకుండా స్నేహితులుగా కూడా మారవచ్చు.అక్కడ స్నేహితులతో ములాఖత్ కావడం అనేది ఆలోచింపజేస్తుంది. ములాఖత్ అనేది ఉర్దూ పదం.ఎవరైనా లేదా వ్యక్తులతో సమావేశం కావడం అని అర్థం.ఒకో సారి మనకు జీవితంలో అనుకోని సందర్భాలు కూడా ఎదురవుతాయి.మీరు ఒక ప్రతికూల సంఘటనను ఎదుర్కొనే ఉద్దేశంతో వెళ్లడం అది ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మారిపోవడం సహజం అనిపిస్తుంది.అనూహ్యంగా మీరు శత్రువులుగా భావించిన వారు నిజానికి మీ స్నేహితులు అని తెలిసింది.అక్కడ మీరు అనుకోని స్నేహితులను కలిశారు.మీరు వారిని మనసులో ప్రతికూలంగా భావించారు.కాని సానుకూల పరిణామం ఏర్పడింది.అది జీవితపు వ్యంగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.మనం చాలా సార్లు ఒక దాన్ని అనుకుంటాం.విచిత్రంగా వేరే దాన్ని ఎదుర్కొంటాం.మనం కొన్ని సార్లు అపోహతో ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకుంటాం.జీవితంలో మనం కొన్ని సార్లు అనవసరంగా కొందరిని శత్రువులుగా భావిస్తాం.కాని వారిని గమనిస్తే మనకు వాళ్లలో ఏదో తెలియని సంబంధం,స్నేహం మిళితమై ఉంది అనిపిస్తుంది.ఒక్కో సారి మనకు తెలియకుండానే జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.మన జీవితంలో ఏది ఎలా జరుగుతుందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం.జీవితం అనే మజిలీలో జరిగిన ఆ సంఘటన చిత్రంగా అనుకోని మలుపుగా భావించవచ్చు.జీవితంలో ఎదురైన సంఘటనలు కొన్ని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాను ఎదురు చూసింది ఒకటి తనకు తెలియకుండానే మరొకటి జరిగింది.తాను ప్రతికూల భావనలతో వ్యవహరించినప్పటికీ చివరకు అది సానుకూల పరిణామంగా మారడం సంతోషాన్ని కలిగించింది.ఈ వాక్యం జీవితపు అంతర్లీన సత్యాలను,అనుభవాలను, దార్శనికంగా వ్యక్తపరుస్తుంది.శత్రువులను వెతుక్కుంటూ వెళ్లి స్నేహితులని కలవడం అంటే తాను అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని పొందడం విస్మయం కలిగిస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (17)
తెలుగులోకి అను సృజన ;గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.దీనిని గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఎందుకు ఎప్పుడు నా వెంటే
“నడుస్తుంటావని నా నీడను అడిగాను
“మరి ఇంకెవరున్నారు నీకు తోడుగా
“ చెప్పు .. అంటూ చిన్నగా నవ్వేసింది నా నీడ !
నీడ ఇది ఒక మూల పదం.నీడ లేదా ఛాయకు ఆంగ్లంలో Shadow అని అర్థం.మనం నీడ కోసం గొడుగులు వాడతాము. ఇవి వేసవి కాలంలో మనల్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తాయి.కాంతి ప్రసారాన్ని వస్తువు అడ్డగించినప్పుడు,అడ్డగించిన ఆకారాన్ని పోలిన నల్లటి ఆకారం నీడ.పురాతన కాలం నుండి గడియారం అవసరం లేకుండా సూర్యుని నీడను ఉపయోగించి సమయాన్ని కనుగొనేవారు.తోలుబొమ్మలాటలు బొమ్మల నీడలను ఉపయోగించి జన రంజకంగా ప్రదర్శించే సాంప్రదాయం చాలా దేశాలలో ఉంది.ఖగోళంలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి.సూర్యుని వెలుతురు పడని స్థలం నీడ.సూర్యుని ప్రకాశానికి ఏదైనా వస్తువు అడ్డుగా వచ్చినప్పుడు నీడ ఏర్పడుతుంది. ఎండా కాలంలో బాటసారి చెట్టు నీడలో చేరి సేద తీరుతాడు.ఒక వస్తువు యొక్క ప్రతిబింబం కనిపించుట నీడ.వెలుతురు ఉన్నప్పుడు మనలాంటి ఆకారమే మరొకటి కనిపిస్తుంది.అది నీడ.ఈ కవిత ఒక భావోద్వేగంతో కూడిన భావనను ప్రతిబింబిస్తుంది.ఇందులో కవి తనకు నీడతో ఉన్న అనుబంధాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరిస్తాడు.వ్యక్తి తన నీడను అడగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ”ఎప్పుడు నా వెంటే నడుస్తుంటావు ఎందుకు?దానికి నీడ సమాధానం ఇస్తుంది.నాకు తోడుగా నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చిన్నగా నవ్వుతూ అంటుంది.ఈ వాక్యం మనుషుల జీవితాలలో తోడుగా ఉండే ఒంటరితనాన్ని,అనుబంధాలను ప్రతిబింబిస్తుంది.నీడ ఇక్కడ కేవలం శారీరకంగా ఉండే దృగ్విషయం మాత్రమే కాదు.మన జీవన ప్రయాణంలో నీడ అణుకువగా ఉన్న తోడు అని భావించవచ్చు.నీడను అడగడం ద్వారా తనను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా?అనే ఆలోచనను వ్యక్తం చేస్తాడు.ఇది మనిషి జీవితంలో సహజంగా ఎదుర్కొనే ప్రశ్నలను ప్రతిబింబిస్తుంది.నీడ సమాధానం చెబుతూ నాకు తోడుగా నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పడం ద్వారా వ్యక్తికి సానుభూతిని కలిగిస్తుంది.నీడతో చెప్పిన మాటలు జీవిత సత్యాన్ని తెలియజేస్తాయి.ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండవలసి వస్తుంది.ఒంటరిగా ఉన్న సమయంలో మనిషి తనకు తానే తోడుగా నిలుస్తాడు.నీడ ఎక్కడైనా నవ్వుతుందా?అనే ప్రశ్నలు మనలో చెలరేగుతాయి.
నీడ చిన్నగా నవ్వడం అనేది కవితలో ఒక తేలికపాటి దార్శనిక భావనను సూచిస్తుంది.ఇది మనం సాధారణంగా చూసే విషయాలను ప్రత్యేక దృక్పథంలో పరిశీలించవల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.ఈ కవితలోని భావనలు మనకు కొన్ని ముఖ్యమైన సందేశాలను ఇస్తాయి.మన జీవిత ప్రయాణంలో కొన్ని సార్లు మనకు మనమే తోడుగా నిలవాలి.నీడ మనకు స్నేహం,నమ్మకం,ధైర్యం కలిగిస్తుంది.నీడ మనకు ఎప్పుడు తోడుగా మన వెన్నంటి ఉంటుంది.నీడ ఎప్పుడు మనలని వదిలి పెట్టదు.మనుషుల ఒంటరితనం అలాగే మన ఆత్మ బలాన్ని కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం ఇక్కడ వ్యక్తం అవుతున్నది.ఇందులో జీవితంలోని సహజమైన అనుబంధాలను చక్కగా తెలియజేసిన తీరు బాగుంది.ఈ కవిత మన జీవితంలో నీడ వలె ఉండే వ్యక్తుల గురించి చెబుతుంది.నీడ ఎల్లప్పుడు మన వెంట ఉంటుంది.అదే విధంగా మన జీవితంలో నీడ వలె కొంత మంది వ్యక్తులు ఎల్లప్పుడు మన వెంట ఉంటారు.ఈ కవిత మనల్ని మన జీవితంలోని వ్యక్తుల గురించి ఆలోచింపజేస్తుంది.మన జీవితంలో వారి పాత్రలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ కవితలో నీడ ఒక ప్రతీకగా ఉపయోగించబడింది. నీడ అనేది మన జీవితంలో ఎల్లప్పుడు మన వెంట ఉండే వ్యక్తులను సూచిస్తుంది.ఈ కవితలో భాష సరళంగా ఉన్నందు వల్ల అర్థం చేసుకోవడం సులభం.గుల్జార్ షాయరీ కవితలోని శైలి ప్రత్యేకతను కలిగి ఆకర్షణీయంగా ఉంది.షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలకు ఉల్లాసం కలిగిస్తుంది.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (18)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.దీనిని గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ప్రతీ సంధ్య వేళలో నా కుశలం
“కనుక్కుంటున్నావు కదా మర్చిపోయావా …
“లేక … మీ ఊర్లో అసలు సాయంత్రమే “కాదా ఏంటి?”
రాత్రి ముగిసి సూర్యోదయం అయ్యే మధ్య కాలాన్ని అలాగే సాయంత్రం ముగిసి సూర్యాస్తమయం అయ్యే మధ్య కాలాన్ని సంధ్యా సమయం అంటారు. రాత్రి వేళ చలి మంట కాచుకుంటూ చంద్రుని నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తుంటే ఎంతో కను విందుగా ఉండేది.ఆ సంధ్య వేళ వీచే చిరు గాలి చుట్టూ ఉన్న మొక్కల నుండి మోసుకొచ్చే పరిమళాలు ఇంపుగా ఉండేవి.సాయంత్రం అనేది పగటి పూట ముగింపుతో ప్రారంభమయ్యి మరియు రాత్రి మొదలు కావడంతో ముగుస్తుంది.ఈ కవిత ఒక వ్యక్తి తన స్నేహితుడితో సంభాషించడం గురించి చెబుతుంది.కవితలోని భావం హృదయానికి తాకేలా ఉంది.”ప్రతీ సంధ్య వేళలో నా కుశలం కనుక్కుంటున్నావు కదా?మర్చి పోయావా? లేక మీ ఊర్లో అసలు సాయంత్రమే కాదా? ఏంటి?అని కవితాత్మకంగా అడుగుతున్నాడు.ఈ కవిత మన జీవితంలోని స్నేహ ప్రాధాన్యతను వ్యక్తం చేస్తుంది. స్నేహితులు మన జీవితంలో ఎల్లప్పుడు మన వెన్నంటి తోడుగా రక్షణ కవచంలా నిలుస్తారు. స్నేహితులు ఎప్పుడు మన యోగ క్షేమాలపై దృష్టి సారిస్తారు.స్నేహం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైంది.స్నేహితులు మనల్ని సరి అయిన గమ్యంలో నడిపిస్తారు.స్నేహం అనేది మన జీవితంలో మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది.ఈ భావన స్నేహితుల మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని తెలుపుతుంది.స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయతతో అడగడం,సమాధానం ఇవ్వడం వంటి విషయాలు మనం ఎరిగినదే.ఇది స్నేహితుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.వారు పరస్పరం మరిచిపోని వారై ఒకరిపై ఒకరి పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారు.సాయంత్రం అనే కాలమానానికి మానవ సంబంధాలను అన్వయిస్తూ మనసులోని వ్యధను ఈ విధంగా వ్యక్తీకరించడం బాగుంది.ఈ కవిత ఒక వ్యధతో కూడిన ప్రేమను, ఆత్మీయతను ప్రతిబింబిస్తుంది.ఇది ప్రేమ,దూరం కావడం మరియు మరిచిపోవడంపై కవి గుండెలో చెలరేగుతున్న అనేక అనుభూతులను వ్యక్తీకరిస్తుంది.ఈ కవితలోని ప్రతి పంక్తి లోతైన భావాలతో నిండి ఉంది.ప్రతి సంధ్య వేళలో నా కుశలం కనుక్కుంటున్నావు కదా మర్చిపోయావా? ప్రతి సాయంత్రం తనను గుర్తు చేసుకుంటున్నావా అని కవి ప్రేమతో,ముద్దుగా మనసులో నెలకొన్న సందేహంతో ప్రశ్నిస్తున్నాడు.మర్చిపోయావా అనే ప్రశ్న వేదనతో కూడిన సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది ప్రేమలో ఉన్న అపార్థాలను అంతర్గత భయాన్ని సూచిస్తుంది.లేక,మీ ఊర్లో అసలు సాయంత్రమే కాదా ఏంటి? అని కవి ప్రశ్న ద్వారా సార్వజనీనమైన ప్రకృతిని కూడా వ్యక్తిగతంగా అన్వయిస్తున్నాడు. సాయంత్రం అనే సమయాన్ని గుర్తు చేస్తూ ఆ వ్యక్తి తన గురించి ఆలోచించడం లేదని భావించి,అది నిజమా?కాదా?అని ప్రశ్నిస్తున్నాడు.ప్రేమికుల మధ్య ఎడబాటు మరియు దూరం వల్ల ఉత్పన్నమైన ఆత్మీయతను కోల్పోవడం మరియు ప్రేమలో కలిగే నిరాశకు ప్రతీకగా ఉంది.ఈ కవితలో ప్రేమికుల మధ్య పెరిగిన దూరం,సాయంత్రం వంటి ప్రత్యేక సమయాలు జ్ఞాపకం వచ్చి ఆ వ్యక్తి తన గురించి ఆలోచిస్తున్నాడా?లేదా?అనే అనుమానాన్ని, మరిచిపోయాడేమో అనే బాధను ప్రతిబింబిస్తుంది. ఇది వేదనతో కూడిన భావన.మీ ఊర్లో సాయంత్రమే కాదా ఏంటి?అనే ప్రశ్న ద్వారా కవితలో గంభీరతతో కూడిన భావన మరింతగా హృదయాన్ని తాకుతుంది.ఈ పంక్తి గుండెలో నెలకొన్న బాధను, అసహనాన్ని మరియు ఒక ప్రత్యేకమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది.కవి ఎదుటి వ్యక్తిలోని నిర్లక్ష్యాన్ని లేదా స్పందన లేకపోవడాన్ని గమనిస్తున్నాడు. సాయంత్రమే లేక పోతే అని రూపకాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి జీవితంలో ప్రేమను, ఆత్మీయతను తాను కనుగొనలేక పోతున్నట్లు భావిస్తున్నాడు.ఇది ఆ వ్యక్తిలోని అజాగ్రత్తను, స్పందన లేనితనాన్ని ప్రతిబింబిస్తుంది.సాయంత్రం అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆహ్లాదాన్ని,ప్రశాంతతను, ఒక ప్రత్యేకతను గుర్తు చేస్తుంది.అయితే మీ ఊర్లో సాయంత్రమే కాదా?అనే ప్రశ్న ద్వారా కవి ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయతకు చోటు లేదని పేర్కొంటున్నాడు.అది వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం వల్ల వచ్చిన కోపాన్ని,నిరుత్సాహాన్ని సూచిస్తుంది.మీ ఊర్లో సాయంత్రమే కాదా? అనే ప్రశ్న వ్యంగ్యంగా ఉంది.ఇది ఎదుటి వ్యక్తిలోని నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే పద్ధతిగా భావించ వచ్చు.అది నిజంగా సాయంత్రం లేక పోవడం గురించి కాదని, అతను సాయంత్రం గురించి ఆలోచించట్లేదని స్పష్టం చేస్తున్నాడు.ఈ పంక్తి ప్రేమలో నిర్లక్ష్యం లేదా మర్చిపోవడాన్ని సూచిస్తుంది.మనం మన ప్రియమైన వ్యక్తిని గుర్తు పెట్టుకోవడం మరియు వారి కోసం ఆలోచించడం మన సహజమైన బాధ్యత. సాయంత్రం ప్రకృతిలో నిరంతర చక్రం కాగా అది వారిలో ఉండకపోవడం అంటే ప్రేమ,ఆత్మీయత లోపించినట్లు కవి భావిస్తున్నాడు..మీ ఊర్లో సాయంత్రమే కాదా?అనేది వ్యక్తిగత బాధను, అపేక్షను మరియు అంతర్మధనాన్ని వ్యక్తీకరించే అద్భుతమైన ప్రశ్న.ఇది ప్రేమలో గోచరమయ్యే దూరం,నిజమైన భావోద్వేగాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను అద్భుతంగా వ్యక్తీకరించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.కవి గుల్జార్ లోక రీతిని ఎరిగిన వాడు.షాయరీ కవితలో పొందుపరిచిన భావాలు పాఠకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us