మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

స్వప్నం

by Sumalatha Deshpande July 18, 2023
written by Sumalatha Deshpande

అది నిండు పౌర్ణమి రాత్రి… ఆరుబయట మంచంపై పడుకున్న..పంకజానికి… మబ్బుల మాటున.. దోబూచు లాడుతూ… చల్లని వెన్నెల వెదజల్లుతున్న…
చందమామ కానీ… కొబ్బరి చెట్టు ఆకుల సందుల్లోంచి… తళుక్కున మెరిసే.. తారలు కానీ..కనిపించడం లేదు…

తనకు రోజు వచ్చే.. ఆ భయంకరమైన స్వప్నం గురించే… ఆలోచిస్తుంది…ప్రతి రోజు..అర్ద రాత్రి ఒంటిగంటకి …భయంతో.. ఒక్కసారిగా… ఉలిక్కిపడి లేచే.. తన కల.. గురించి…గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ… లేచి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లో… నీళ్ళు తాగి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది…

మరుసటి రోజు రాత్రి కూడా అదే కల వచ్చి.. మళ్లీ లేచి కూర్చుంది.. ఆమెకు… రోజూ ఈ కలలు రావడం… ప్రారంభమయ్యాయి…

ఏదో.. పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా…ఉంటున్న పంకజాన్ని..చూస్తూ..ఏమైందని అడిగాడు.. భర్త పరంధామం…

ప్రతిరోజు వచ్చే.. తన స్వప్నం.. గురించి.. భయపడుతూ…భాధపడుతూ… పూసగుచ్చినట్టుగా…చెప్పింది…పంకజం…

అతనికి..ఆమె అవస్థ… చూడలేక… హృదయం.. భాధతో.. విల, విల లాడింది…
చివరకు ఒకరోజు ఆమెను… ఆ పట్టణంలోని… ప్రముఖ.. సైకియాట్రిస్ట్..వద్దకు తీసుకెళ్లి సమస్యను.. పరిష్కరించాలని.. నిర్ణయించుకున్నాడు…

మరునాడు…. అపాయిట్మెంట్ తీసుకొని…భార్యను వెంటపెట్టుకుని..మానసిక వైద్యుడి వద్దకు.. వెళ్లాడు..

డాక్టర్ గారు.. నా అరవై కేజీల బంగారం.. ఈ ఇరవై రోజుల్లో… యాభై కేజీలు..
అయింది… అర్ద రాత్రి.. ఉలిక్కి పడి లేస్తుంది….వొళ్ళంతా..ఒణికి పోతుంది…ఏదో.. పీడ కల వచ్చింది.. అంటుంది… ఒక కల ఇంతలా…
భయపెడుతుందా????
అసలు ఏం అంతుచిక్కకుండా…ఉంది.. ఎలాగైనా… నా భార్యను..మీరే కాపాడాలి… అని కన్నీళ్ల..
పర్యంతం అయిన.. పరంధామాన్ని…జాలిగా చూస్తూ….

మీ కల గురించి వివరంగా చెప్పండి…అన్నాడు..డాక్టర్…పంకజాన్ని.. చూస్తూ…

” నిగనిగలాడే గుండుతో… ఒకతను.. ఊరికే రావు… ఊరికే రావు… ఫోటో తీసుకో… నాలుగు చోట్ల.. చూపించు…
మా వద్దకు రా…మా వద్దకు రా అంటూ ప్రతి రోజు.. పిలుస్తున్నాడండి…
నాకు చాలా.. భయంగా.. ఉంది…ఆ కల.. కాసేపైనా.. మర్చిపోదామని…టీవీ
ఆంచేస్తే… ప్రతి ఛానల్లో… అతనే కన్పించి… ఇంకా.. భయమేస్తోంది… ఇదంతా.. నాకు భ్రమ..
అని సరిపెట్టుకుందామన్నా… సాధ్యం కాకుండా ఉంది అంటూ… కన్నీళ్లు పెట్టుకుంది…
పంకజం…

సమస్య ఏంటో.. ఇట్టే.. అర్ధం అయిన… డాక్టర్.. “చూడండి సర్ “మీ భార్యకు…
“రోజు కలలో.. కనిపించేది…మరేంటో కాదు… ” అది ప్రముఖ గోల్డ్ షాప్ అడ్వర్టైజ్మెంట్ !
మీరు వెంటనే.. తల తాకట్టు పెట్టి…అయినా.. సరే… ఆ షాప్కీ తీసికెళ్లి… మీ భార్యకు.. బంగారు నగలు కొని పెట్టండి…
అప్పుడే… ఇలాంటి కలలు.. రాకుండా.. ఉంటాయి… వీలైనంత త్వరగా.. వెళ్ళండి…” అన్న డాక్టర్ గారి మాటలకి…
అవాక్కయిన పరంధామం….
“కలలు”ఊరికే రావు..అనుకుని… తెల్లమొఖం వేసాడు….

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నిజం చెప్తే….

by Rapolu Sridevi July 18, 2023
written by Rapolu Sridevi

కొన్ని, చిన్న అక్క తమ్ములు. ఓ రోజు వాళ్ళమ్మ పని మీద బయటకు వెళ్ళింది. ఇంట్లో ఇద్దరే ఉన్నారు కన్న కు ఏమన్నా తినాలని అనిపించింది .ఆగలేక వంటింట్లోకి వెళ్లి అన్నీ కలియ చూసింది .ఉప్పు ,కారం ,పప్పులు ఏవేవో కనిపించాయి .కానీ …అది అందుకోవడం ఎలా ?అని అనుకుని, చిన్న ను రా అని పిలిచి పై అరలో చక్కర ఉంది ఇద్దరం తిందాం ,ఎలాగైనా తీయరా !అన్నది వాడితో! వాడికి చక్కర చూడగానే నోరూరింది. అంతే !ఆ మూలన ఉన్న స్టూల్ లాక్కు వచ్చి, దానిపైకి ఎక్కి, నిక్కి నిక్కి చివరకు అందుకున్నాడు .ఇద్దరూ పిడికిళ్లతో చక్కెర తీసుకొని బుక్కారు .ఏమి ఎరగనట్టే ఆ డబ్బాను అలాగే అక్కడే పెట్టి, అమ్మ వచ్చేసరికి బుద్ధిగా కూర్చుని చదువుకుంటున్నారు.
అమ్మ కూరగాయలు వంటింట్లో పెట్టడానికి వెళ్లేసరికి చీమలు నేల మీద కనబడ్డాయి. చూస్తే, కింద చక్కెర కనిపించింది. డబ్బా చూస్తే అందులో చక్కర కొంచెం తగ్గినట్టు అనిపించింది.
“కన్నా !చక్కర తిన్నారా ?”అంటూ దగ్గరగా వచ్చేసరికి భయంతో “నేను తినలేదు” అన్నది కన్న.
“చిన్న !చక్కెర తిన్నారా?” అని చిన్న అని అడిగితే కాస్త తటపటాయించి” తిన్నాం” అన్నాడు .అంతే !”అబద్ధం చెప్తావా ?”అంటూ కన్నా ను చెంపపై కొట్టింది .”చిన్నా”అని పిలిచి ,”నా చిట్టి తండ్రీ” అంటూ దగ్గరగా తీసుకొని బుగ్గపై ముద్దు ఇచ్చి ,చేతిలో ఓ చాక్లెట్ పెట్టింది.

నిజం చెప్పి కొట్టించినందుకు కోపంగా ఉన్నా, సగం చాక్లెట్ కన్నాకు ఇవ్వగానే అది నోట్లో పెట్టుకుని “నిజం ఇంత తీయగా ఉంటుందా!” అని మనసులో అనుకోవడమే కాదు ,”నిజం నిర్భయంగా చెప్పాలి”మనసులో నిర్ణయించుకుంది కన్న!
*-నిజం వినడానికే చేదుగాని దాని ఫలితం మాత్రం తీయగా మధురంగానే ఉంటుంది

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరాయీకరణ

by C.S. Rambabu July 18, 2023
written by C.S. Rambabu

చెమటను చిందించిన చేతులు
భవనాన్ని నిర్మిస్తే బతుకుపోరంటావు
నువు మాత్రం అవుటర్ రింగ్ రోడ్డో
అందమైన గెస్ట్ హౌసో రూపకల్పన చేసి 
ఇది మేధోమధనమంటావు
అనాదిగా కష్టించే కార్మికులు
ఈ దేశంలో రెండవ తరగతి పౌరులే 
ఆశ్చర్యం పడాల్సిందేమీలేదు
సామూహికంగా అలవాటుచేసుకున్న 
సానుభూతి చాటున 
నీ విసుగు వినయాన్ని ప్రదర్శిస్తోంది
వారిని తలుచుకో ఒక్కసారి…
పునాదులు తీస్తారు
ఇటుకపై ఇటుక పేరుస్తారు
అంతస్తుపై అంతస్తుకట్టి
తథాస్తు దేవతల్లా దీవిస్తారు
ఓటుబ్యాంకు కాదుకాబట్టి
మరోమజిలీకి మారిపోతుంటారు
అద్దె గర్భాన్ని మోసిన తల్లుల్లా
కన్నీటితో వీడ్కోలు పలుకుతారా
పోనీ జ్ఞాపకాలను కన్నీటిని చేస్తారా అనుకుంటే 
వారి గాంభీర్యం అన్నింటిని కప్పేస్తుంది ఆకలితోసహా…!
కట్టినవాడు హక్కుదారుడు కాదు
హుష్ కాకి అంటే ఎగిరిపోయినట్టు
మరో చోటును
వెతుక్కుంటూ అలుపెరగని బాటసారుల్లా సాగిపోతారు అన్న నిజం తెలిసిన ధనికస్వామ్యవర్గం 
విలాసంగా నవ్వుకుంటుంటుంది !
భారంమోసే భూమిలా బలహీనులెప్పుడూ 
బాధ్యతతో సాగే నిశ్శబ్ద యాత్రికులే
వారు పరాయికరణ చెందలేదు
శతాబ్దాలుగా వారు పరాయివారిగానే
మిగిలిపోయారు.. కాదు కాదు
పరాయివాళ్ళని చేసేశాం
మనమే పరాయికరణ చెందాం

(ఏహక్కూలేని కొంతమంది వలస కార్మికులను చూసినప్పుడు)

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లాలుదర్వాజ బోనాలు

by రూపాదేవి July 18, 2023
written by రూపాదేవి

ఉత్సవాలు అంటే ఇష్టపడని మనుషులు ఉంటారా..?! అందులోనూ హైదరాబాదీలు ?! అందులోనూ పాతబస్తీ వాసులు ?! అందులోనూ బోనాల ఉత్సవాలు?! బోనాల పేరు తలవంగానే పాతబస్తీ ప్రజల మొహాల్లో వెలుగు నిండి పోతుంది. ఇక్కడ బోనాలు భలే వైభవంగా జరుగుతాయి.

పండగలు ఆ ప్రాంతపు సంస్కృతికి అద్దం వంటివి. పండగలు జరుపుకునే తంతు (విధివిధానం) ఆయా సమాజపు సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. తెలంగాణాలో హైదరాబాదు సంస్కృతి ప్రత్యేకమైనదైతే హైదరాబాద్ మొత్తంలో పాతబస్తీ రీతి రివాజు ప్రత్యేకమైనవి. అందువల్ల ఇక్కడ జరుపుకునే బోనాల పండగ కూడా ప్రత్యేకమైనది.

ఆషాఢమాసం తొలి ఆదివారం గోల్కొండ లోని జగదంబికా ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమై , అటునుంచి లష్కర్ బోనాలుగా బయలుదేరి రెండో ఆది వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం మీదుగా మూడో వారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం మీదుగా చివరి ఆదివారానికి లాలుదర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం చేరుకుంటుంది బొనాల పండగ.

పాతబస్తీలో ఆషాఢ నవరాత్రులుగా బోనాల పండుగ జరుపుకుంటారు. చివరి ఆదివారానికి ముందు మూడో శుక్రవారం నుంచే నవరాత్రుల సందడి మొదలౌతుంది.

పాతబస్తీలోని లాలుదర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, ఉప్పుగుడ మహంకాళీ ఆలయం, గౌలిపురా భరతమాత మాతేశ్వరీ మహంకాళీ దేవాలయం, సుల్తాన్ షాహి రేణుకా ఎల్లమ్మ ఆలయం. ఆలియాబాద్ దర్బార్ బంగారు మైసమ్మ ఆలయం, బేలా మాతేశ్వరీ ముత్యాలమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, మేకలబండ నల్లపోచమ్మ ఆలయం, మీర్ ఏ ఆలం మండి మహాకాలేశ్వర స్వామి ఆలయాలు రంగులు, విద్యుత్ దీపాలు, పూల తోరణాలతో అందంగా ముస్తాబు చెయ్యబడతాయి.

నవరాత్రులు మొదటి రోజైన మూడవ శుక్రవారం ఉదయం ఆలయంలో గణపతి హోమం, సప్తశతి పారాయణము, దేవీ అభిషేకం, ద్వాజారోహన , శిఖర పూజ నిర్వహించి సాయంత్రము ఘట స్థాపన (కలశ స్థాపన) తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఘట స్థాపన కోసం సాయంత్రం శాలిబండ కాశీ విశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి రూపాల్లో అలంకరించబడిన ఘటాలు అంగరంగ వైభవంగా, బజంత్రీలు, డప్పు మోతలనడుమ సాగిన జూలుస్ గా సాగి ఆయా గుడులకు చేరుతాయి. గుడిలో ఉత్సవ విగ్రహాలుగా ప్రతిష్ట చేస్తారు.
తరవాతి రోజు నుంచి అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి తొమ్మిదవ రోజు మహ తొట్టెలను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. పదవ రోజైన చివరి ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ చేసి, రాత్రికి గుడిలో శాంతి కళ్యాణం నిర్వహిస్తారు.

చేసే విధానం
బోనానికి రెండు రోజుల ముందునుంచే బంధు మిత్రులు రాకతో ఇళ్ళల్లో సందడి మొదలౌతుంది.
ఈ రెండురోజులు బోనంతయారీ, బోనం బైలెల్లడం, తొట్టెలు సమర్పణ బోనం సమర్పణ, పడి, విందు భోజనం, మరునాడు రంగం, ఘటం నిమర్జనం వంటి వివిధ క్రతువులతో పండగ జరుగుతుంది.
బోనాల మొదటి రోజు ఉదయం జానపదులు ఇంటి మధ్యభాగంలో బోనం స్థాపన చేస్తారు. గతంలో కండ్ల కుండ(రంధ్రాలు కుండ) లో బోనం సమర్పించేవారు. కానీ ఈ రోజుల్లో కొత్త కుండను సున్నము పసుపు కుంకుమతో అలంకరించి, వేప రెమ్మలు కట్టి అందులో తెల్ల అన్నం లేదా బెల్లం అన్నం ఉంచి దానిపై చిన్న కుండలో పచ్చి పులుసు లేదా పెరుగు లేదా ఉల్లిపాయ ఉంచి కంచుక పెట్టి దానిమీద దీపాన్ని వెలిగిస్తారు.
ఇంటి ఆడపడుచులు, స్త్రీలు, చిన్నారుల పట్టువస్త్రాలు, పువ్వులు గాజుల అలంకారాలతో ముస్తాబై బోనాన్ని నెత్తిన పెట్టుకొని, విడిగా ఓ కుండలో వేపాకులు వేసిన నీళ్ళు లేదా కల్లు, లేదా బెల్లం నీళ్లు తీసుకుని, మరో కుండలో పసుపు నీళ్ళను తీసుకొని, సంతాన మొక్కు చేసుకునే వారు తొట్టెల మోస్తూ డప్పు మోతలతో, పోతరాజు దరువులు (ఎర్ర వస్త్రం మొలకు కట్టుకొని, ఒళ్ళంతా పసుపు, మొహానికి కుంకుమ రాసుకొని, జులపాలు విరబోసుకుని, నిమ్మకాయల దండ ధరించి, శర్లకోల(కొరడా) కొట్టుకుంటూ మహా భీకరంగా కనిపించే పోతరాజు గజ్జె కట్టి వేసే చిందులు) చేస్తూ, గుగ్గిలం మైసాచి పొగల నడుమ బంధుమిత్ర సమేతంగా ఇంటింటి నుంచీ వచ్చిన బోనం జులుస్(ఊరేగింపు)గా అమ్మవారి ఆలయం చేరుకుంటారు. బోనం కుండ ఆలయంలోకి ప్రవేశించే ముందు బోనం ఎత్తిన వాళ్ళను అమ్మవారు ఆవహించినట్టుగా భావించి తమతో తెచ్చుకున్న పసుపు నీళ్ళను వాళ్ళ పాదాలపై గుమ్మరించి మొక్కుతారు. ఆలయ లోకి ప్రవేశించాక వెంట తెచ్చిన వేపాకు నీళ్లు లేదా కల్లు లేదా బెల్లం నీళ్లు అమ్మవారి ముందు సాకం పొస్తారు, బోనంకుండ అన్నంలో కొంత తీసి ‘పడి’ (బలిఅన్నం కుప్పగా పోయడం) తీసి పాకం సమర్పిస్తారు.
తొట్టేల గుడి వద్ద ఉండే చెట్టుకు లేదా గుడి పక్కన పాతిన గుంజకు కడతారు. అమ్మవారికి నివేదన తరవాత మిగిలిన బోనంతో బంధుజన పరివారంతో కలిసి విందుభోజనంతో మహా ప్రసాదంగా ఆరగిస్తారు.
ఆ రాత్రి జనాలు నిద్రపోయాక 12 గంటల తరవాత బలి అన్నాన్ని(పడి) వీధి వీధిలో చల్లుతారు. దీనివల్ల దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతారు.
రెండోరోజు ఆలయం వద్ద రంగం కార్యక్రమంలో పెళ్ళికాని ఓ స్త్రీ అమ్మవారిని ఆవాహన చేసుకుని పచ్చికుండపై ఎక్కి భవిష్యవాణి చెబుతుంది. (పూర్వం గావు పెట్టడం వంటి క్రతువులు జరిగేవి. నిషేధించడం జరిగింది)
ఆ తరవాత ఘటాన్ని పలహార బండ్లు, డప్పు, పోతరాజు సందడిలో జులూస్ తీసి నాయాపుల్ దగ్గర ముసిలో ఘటాల నిమర్జనం చేస్తారు. దీనితో పండగ తంతు పూర్తి అవుతుంది.

నమ్మకాలు: తెలంగాణ ప్రాంతంలో ఇక్ష్వాకుల కాలం నుంచీ కూడా శక్తిని వివిధ స్త్రీరూపాలలో ఎల్లలు కాపాడే ఎల్లమ్మ, పొలిమేరను రక్షించే పోచమ్మ, ఈత చెట్లల్లో ఈదమ్మ, బాలాత్రిపురసుందరిని బాలమ్మ, మహిషాసుర మర్ధిని మైసమ్మగా అనేక పేర్లతో పిలుచుకుని గ్రామ దేవతలుగా ఆరాధిస్తారు. ఆషాఢ మాసంలో దేవి పుట్టింటికి వస్తుందని, దేవిని తమ ఇంటి ఆడపడుచగా భావించి తాము ఇష్టంగా తినే పదార్థాలను బోనం వండి సకలఅర్యదలతో నైవేద్యం సమర్పించి ఆతిత్యం ఇస్తారు. చీర గాజులు పువ్వులు పెట్టీ మురిసి పోతారు. పిల్లలు లేని వారు తొట్టెలు సమర్పిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. ఊరేగింపును నడిపించే అమ్మవారి సోదరుడుగా భావించే పోతరాజు భక్త బృందానికి రక్షకుడుగా నమ్ముతారు. బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడతారని విశ్వసిస్తారు.

హిందువులు జరుపుకునే ప్రతీ పండగకూ ఓ చారిత్రక నేపధ్యం, ఓ శాస్త్రీయత, ఓ సమాజ హితము తప్పకుండా వుంటుంది. అలాగే తెలంగాణ పండగ హైదరాబాద్ ప్రతిష్టాత్మక పండగ ఆయిన బోనాల పండుగ వెనుక కూడా చారిత్రక నేపధ్యం, శాస్త్రీయత, లోక హితం దాగి ఉన్నది
చారిత్రక నేపథ్యం:
బోనాల పండుగను దాదాపు వెయ్యి నుంచీ జరుపుకుంటున్నారు. గోల్కొండ కోట నిర్మించక మునుపు గొల్లలు పశువుకు మేపుకునే కొండ గొల్లకొండ గా పేరున్న కాలములో గొల్లలు అక్కడున్న ఎల్లమ్మ కు బోనం సమర్పించేవారట. ఆ సంప్రదాయం అలాగే కొనసాగి కాకతీయ రాజు రెండో ప్రతాప రుద్రుడు బోనాల సమయంలో గోల్కొండ ఎల్లమ్మ ఆలయంలో బోనం సమర్పించినట్లు పెద్దలు చెబుతారు. గొల్ల కొండ ముస్లిం రాజుల పాలనకు గోల్కొండ కోట నిర్మాణం తర్వాత అక్కన్న మాదన్న లు ఈ ఉత్సవం జరిపినట్టు తెలుస్తోంది. అంటే ఐదు వందల ఏళ్ళుగా అక్కడ బోనాల ఉత్సవాలు జరుగుతూనే వున్నాయి.
ఓ కథనం ప్రకారం 1908లో మూసీ పోంగి దిక్కు తోచని పరిస్థితిలో అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజా అమ్మవారికి బంగారు చాటలో పట్టుచీర గాజులు, ముత్యాలు, పసుపు కుంకుమలు సమర్పించి నది ఉదృతి తగ్గించమని కోరుకున్నాడట. నది ఉదృతి తగ్గిపోయిందట. నిజాం నవాబు ప్రార్థనతో ప్రాశస్త్యం పొందిన లాలూదర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వందేళ్లు గా బోనం చేస్తూ శతాబ్ది ఉత్సవాల జరుపుకుంటున్నది. అలా చారిత్రక ప్రాశస్త్యం వరుసలోనే తొలి బోనం గోల్కొండలో ఎత్తగా, చివరి బోనం లాల్ దర్వాజాలో ఎత్తుతారు.


శాస్త్రీయత:
ఆషాఢ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి. నిలిచి ఉండే వాన నీరు, నీటి తెమ్మ వల్ల క్రిమికీటకాలు, ఈగలు,దోమలు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వృద్ది చెందుతాయి. వానాకాలంలో కలరా, మశూచి, మలేరియా వంటి అంటు వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి.
అందువల్ల బోనాల పండగలో క్రిమి నాశని అయిన సున్నము. యాంటీ సెప్టిక్ , ఔషద గుణాలు కలిగిన వేపాకు, యాంటీ బయోటిక్స్ అయిన పసుపు, కుంకుమలు వాడతారు.
బోనం కుండకు క్రిమి కీటకాలు దరిచేరకుండా సున్నము రుద్దడం, పసుపు కుంకుమ అద్దడం చేస్తారు. కుండకు వేపాకు కడతారు,
అలాగే వాన నీళ్ళల్లో నాని నాని పాదాల వేళ్ళు చెడకుండాబోనం ఎత్తే స్త్రీలు, మిగతా మహిళల కాళ్ళకు పసుపు రాసినా, భవిష్యవాణి చెప్పే స్త్రీలు మొహమంతా పసుపుతో నింపినా, పోతరాజు ఒళ్లంతా పసుపు పులుముకున్నా అందుకోసమే. ఇంటి దర్వాజలకు, గల్లీలో తోరణాలుగా వేపాకు మండలు కట్టడం వెనక అదే కారణం. బోనం కుండ పై దీపం వెలిగించడం దారి వెంట వెలుగు కనిపించడానికి.
ఆలయ ప్రవేశానికి ముందు బోనం ఎత్తిన స్త్రీ పాదాలపై నీటిని గుమ్మరుంచడం అంటే వానాకాలం బురద దారిలో నడచి రావడం వల్ల బురదతో అపరిశుభ్రంగా మారిన కాళ్ళను శుభ్రపరచడం అన్నమాట.

సమాజ హితము:
పండగ క్రతువుల నిర్వహణతో మనిషిలో ఆధ్యాత్మిక భావన పెంపొందించి శాంతి మార్గములో నడిచేలా చేస్తాయి. పండగ పేరుతో బంధు బలగంతో బంధాలు బాంధవ్యాలు, ఇరుగు పొరుగుతో సత్సబందాలు, మానవ సంబంధాలను పటిష్టంగా ఉంచబడతాయి.
ఎండాకాలం ఎండదెబ్బలకు విసిగి వేసారి నిర్లిప్తమైన జనాలలో ఉత్సవాలు నూతనోత్సాహాన్ని తీసుకు వస్తాయి. పండగ తంతులో ముఖ్య పాత్ర వహించే పసుపు కుంకుమ,
వేపాకుల అవసరం అంతర్లీనంగానే అవగాహణ ఏర్పడుతుంది.

తెలంగాణా ప్రాంతంలో మాత్రమే జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకత రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వము దీనికి రాష్ట్ర పండగగా హోదా కల్పించి బోనాల సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టుచీర కానుకగా సమర్పించే ఆనవాయితీ ప్రారంభించింది. ఇప్పుడు తెలంగాణకే ప్రత్యేకమైన బోనాలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

115 వ వార్షిక బ్ర్మోత్సవాలు జరుపుకుంటున్న లలుదర్వాజ బోనాల జాతర ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు జూలై 7 న ప్రారంభమైనాయి. జూలై 16 బోనాలు, 17 న ఘట నిమర్జనం తో ఉత్సవాలు ముగియనున్నాయి.
లాల్ దర్వాజా బోనాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం కమిటీ ఆద్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 19′ 20, 21 తేదీలలో బోనాలు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
ఈ బోనాలపండుగను తిలకించడానికి వివిధ జిల్లాలనుంచి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

July 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఒద్దిక

by Devanapalli Veenavani July 13, 2023
written by Devanapalli Veenavani

మన నుంచి దేన్నో తీసుకెళ్లి పోతారు
బహుశా నమ్మకం కావచ్చు..
ఇంకెప్పుడు ఎవరిపట్లా కుదరనంతగా
పెకిలించి వేయబడేది
నమ్మకమనే చిన్న వేరు కావచ్చు

సంఖ్యలు కనబడవు..
దృష్టి దోషం కాదది
దిమ్మతిరిగిన తలలో తిరుగుతున్న భూమి
ఏటవాలు కళ్ళకింద నది ఊట

తెల్ల వారుతున్నపప్పుడో
పొద్దుమలుగుతున్నప్పుడో
రేకలు రేకలుగా విచ్చుకునే ఊహల చిత్తుప్రతి
చెత్త బుట్టలో ముడుచుకుపోవడం
మాటల కత్తెరలతోనే కదా

వారి ప్రపంచం చాలా చిన్నదని
తెలుసుకున్నాక
వాదించడం మానేయడమే విరుగుడు

పలక మీద తనను తాను అరగదీసుకున్న బలపంలా
మనకిచ్చిన గడువు తీరుతున్నది
తుడిపేసి రాసినప్పుడల్లా నేర్చుకోవాల్సింది
ఒద్దికగా నిలబడడమే

July 13, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

తెలుగు సాహిత్యంలో తొలి అంధ నవలాకారుడు

by Naresh Chary July 13, 2023
written by Naresh Chary

శ్రీ.టేకులపల్లి. గోపాల్ రెడ్డి గారి ఇంటర్వ్యూ

నమస్కారం సార్
మీ నవల(జీవన స్రవంతి) విస్తృత ప్రజాదరణ పొందినందుకు ముందుగా మీకు అభినందనలు. ఒక అంధుడు నవల రాయడం బహుశా తెలుగు సాహిత్యంలో మీతోనే మొదలైందని చెప్పవచ్చు.అది చదువుతున్నంతసేపు ఒక చారిత్రక డాక్యుమెంటరీని చూసిన అనుభూతి కలిగింది.అందులో ఎన్నో చారిత్రక,రాజకీయ,ఆర్థిక,సాంఘిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.ఈ నవల మొదటిభాగమే దాదాపుగా 500 పేజీల ఉద్గ్రంథంగా తయారయింది. ఇది భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథంగా విరాజిల్లుతుందని నా ప్రగాఢ విశ్వాసం. నేను మీ శిష్యుడనయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.

గోపాల్ రెడ్డి సర్ గారు: నాకు ధూళిపాల అరుణ,మహేందర్ ఇంకా మీలాంటి శిష్యులు లభించడం నా అదృష్టంగా భావిస్తాను. నా నవల విస్తృతంగా ప్రచారం కావడానికి దోహదం చేసిన మీకు, ఈ ఇంటర్వ్యూను ప్రచురించి నా నవలకి విస్తృత ప్రచారం కల్పిస్తున్నందుకు మయూఖ ఆన్లైన్ ద్వైమాసిక పత్రిక నిర్వాహకురాలు శ్రీమతి కొండపల్లి నిహారిణి గారికి మరియు నా నవల చదివి మంచి ఫీడ్ బ్యాక్ అందిస్తున్న పాఠకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్రశ్న:1 సర్ మీజననం మరియు కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?

“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అనే వాక్యం రాముని నోట వెలువడింది.ఇది ఉత్తమోత్తమమైన వాక్యం. ప్రతి వ్యక్తి జీవితంలో జనని ఎంత ముఖ్యమో జన్మభూమి కూడా అంతే ముఖ్యం. జనని కుటుంబానికి పరిమితమైతే జన్మభూమి పూర్తి సమాజానికి సంబంధించినది. జననిని ప్రేమించినట్టే జన్మభూమిని కూడా ప్రేమిస్తారు,ఆరాధిస్తారు, అవసరమైతే ప్రాణమైనా ఇస్తారు. నాకు కూడా నా జన్మభూమైన పోచారం చాలా ఇష్టం. ఇది తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా,నాగిరెడ్డిపేట మండలంలో ఒక అందమైన పల్లెటూరు. నేను నా తల్లిదండ్రులైన రామకృష్ణారెడ్డి,సత్యమ్మలకు ఏప్రిల్ 1,1954 న జన్మించాను. ఒకవైపు ప్రాజెక్టు నీళ్ళు మరోవైపు పచ్చని పంట పొలాలు కలిసి మా ఊరును సుందరమయం చేశాయి. మా అందమైన పల్లెటూర్లోనే నా ఊహా శక్తి మొగ్గ తొడిగింది. ఊరు చుట్టూ నా పాదముద్రలు లేకపోయినా ఊహాశక్తితో నా పల్లె అందాన్ని దర్శించగలిగాను. అదే నా నవలలో చేర్చగలిగాను. నాకు ఇద్దరు సోదరీమణులు ముగ్గురు సోదరులున్నారు. నాకు ఇద్దరు పిల్లలు .కూతురు చైతన్య ప్రియదర్శిని,అల్లుడు విజయ్ భాస్కర్ రెడ్డి. కుమారుడు కృష్ణ కిషోర్ రెడ్డి,కోడలు సంగీత.శశాంక్ అన్వేష్ రెడ్డి,చతుర్వేద,సమీక్ష,మేఘవర్షిణి నా మనవడు మనవరాళ్లు. మాది పెద్ద కుటుంబమే.

ప్రశ్న:2 సర్ మీకు అంధత్వం పుట్టుకతో వచ్చిందా? లేక మధ్యలో వచ్చిందా?

దివ్యాంగులలో అంధత్వం చాలా బాధాకరమైనది. చూపు లేకపోతే ప్రపంచాన్ని దర్శించలేరు, ఇతరుల సహాయం లేనిదే ఎక్కువగా పనులు చేసుకోలేరు. ఇది బాధాకరమైన విషయమే. ఈ అంధత్వం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి పుట్టుకతో వచ్చేది, రెండవది ప్రమాదవశాత్తు పోయేది. మూడవది ఏదైనా జబ్బు చేసి నాటు వైద్యం వికటించినప్పుడు పోయేది. నాకు మూడవది సంభవించింది. నాకు నాలుగు సంవత్సరాల వయసు వరకు అందరిలాగే కళ్లు బాగా కనిపించేవి. ఒకరోజు నాకు కళ్లకలక వచ్చింది దాంతో కంటిపై పొరలు ఏర్పడ్డాయి.అప్పుడు నాటు వైద్యుడి వద్దకు తీసుకెళితే అతను నా కంటిలో బీరాకు పసరు వేయడంతో అది వికటించడంవల్ల,మెదక్ చర్చ్ఆసుపత్రిలోని నర్స్ నాకు ప్రాథమిక చికిత్స సరిగ్గా చేయకపోవడం వలన నా చూపు పోయింది. తర్వాత చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తే డాక్టర్లు ఎడమకంటికి కొంత చూపు తీసుకు రాగలిగారు. అందువల్లనే కొంతకాలంపాటు రంగులను గుర్తించగలిగాను, రాత్రింబగళ్ళను గుర్తించగలిగాను.

ప్రశ్న 3. మీ బాల్యం,విద్యాభ్యాసం గురించి చెప్పండి .

నిజానికి బాల్యం ఎవరికైనా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అందమైన జీవితమది.కల్మషం లేని మనసులు, కావలసినంత స్వేచ్ఛ ఈ సమయంలో దొరుకుతుంది. కాబట్టి ఎవరికైనా ఇది చాలా మధురమైందిగానే అనిపిస్తుంది. ఈ బాల్యం గురించి పెద్ద పెద్ద కవులు కూడా కవితలు రాశారు. శ్రీశ్రీ గారు శైశవగీతిలో బాల్యం గురించి అద్భుతంగా చెప్పారు. నా జీవితంలో నా బాల్యం కూడా మధురంగా గడపాలనుకున్నాను.. నేను మా ఇంటి బయట కూర్చుండి పిల్లలు ఆడుతుంటే గమనించేవాడిని.కొన్ని రోజులు నాకు పాక్షిక చూపు ఉండడం వల్ల వాళ్లతో ఆడుకోగలిగాను. తర్వాత తర్వాత నా వయసు రీత్యా ఆటలని తగ్గించుకున్నాను.నేను ఆ సమయంలో మా అక్కయ్య వాళ్ళతో పాఠశాలకు వెళ్లే వాడిని ,పరిసరాలు గమనించేవాడిని, మాటలు వినే వాడిని ,కానీ నాకు బాహ్య ప్రపంచం గురించి తెలిసింది మాత్రం రేడియో తోనే. 1959లో మా నాన్నగారు ఒక రేడియో కొన్నారు.దాని ద్వారా నాకు ప్రపంచంలోని చాలా విషయాలు అవగతమయ్యాయి. నిజానికి నా జీవితంలో రేడియో అనేది అత్యంత ప్రముఖ పాత్ర వహించింది. అందులో ముఖ్యంగా శారద శ్రీనివాసన్ అనే రేడియో ఆర్టిస్టు నన్ను విశేషంగా ఆకర్షించింది. ఆమె మాటలతో ఊహల్లో తేలిపోయేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే నా ఊహ ప్రేయసి ఆమెనే…రేడియోలో వచ్చే కథానికలు,నాటకాలు,నవలలు నన్ను ఉత్తేజపరిచేవి,కార్యోన్ముఖుడిని చేసేవి.నా లక్ష్యాన్ని సాధించేలా ప్రేరేపించేవి. ఎప్పుడైనా ఇంట్లో గొడవ జరిగినప్పుడు నా మనసు బాధపడి నేను ఇంటి పై గదిలోకి వెళ్లి ఈ కార్యక్రమాలను,శారదాశ్రీనివాసన్ మాటలు విని సాంత్వనపొందేవాడిని. ఈ విధంగా మా నాన్నగారు రేడియో తెచ్చి నాకు ఎంతో మేలు చేశారు. రేడియోతో నా బాల్యం బాగా గడిచిపోయింది.

విద్యాభ్యాసం: నేను మొదటిసారిగా 1965లో మలక్పేటలోని అంధుల పాఠశాలలో చేరాను. నేను పాఠశాలలో లేటుగా జాయిన్ కావడానికి కారణం మా నాన్నగారి భయం. నా చూపు కోసం మా నాన్నగారు మద్రాస్ అపోలో హాస్పిటల్ కి రాయవెల్లూరు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్ళు చూపు వస్తుందని చెప్పారు.అయితే వాళ్ళు ఇచ్చిన మరో సలహా ఏంటంటే నన్ను స్కూల్లో జాయిన్ చేయమని అయితే మా నాన్నగారు నేను ఎలా ఉండగలుగుతానని అనుకున్నారో ఏమో నన్ను వెంటనే పాఠశాలలో జాయిన్ చేయలేదు. రెండోసారి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మరోసారి డాక్టర్లు నన్ను అంధుల పాఠశాలలో చేర్పించమన్నారు అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. అప్పుడు మా నాన్నగారు నన్ను పాఠశాలకు తీసుకెళ్లారు కానీ వాళ్ళు జాయిన్ చేసుకోమన్నారు. అయితే మా నాన్నగారు కొన్ని రికమండేషన్లతో నన్ను జాయిన్ చేశారు.అలా నా విద్యాభ్యాసం 1965లో ప్రారంభమైంది నేను జాయిన్ అయిన రెండు సంవత్సరాలకి మా నాన్నగారు క్యాన్సర్ తో చనిపోయారు. అది నన్ను బాగా కలచివేసింది.మా నాన్నగారు లేకపోవడం నాకు తీరనిలోటు.ఆ సమయంలో నేను ఇంటికి వచ్చాను. చదువులో కూడా కొంత గ్యాప్ వచ్చింది.నేను 1968లో ప్రైవేటుగా 8వ తరగతి పాసయ్యాను.1971లో ఉస్మానియా మెట్రిక్ పాసయ్యాను. 1972లో పియుసి పూర్తయింది.1972-74 వరకుDOL ఆంధ్ర సారస్వత పరిషత్తు కళాశాలలో విద్యాభ్యాసం చేశాను ,1975 లో తెలుగు విశారద,పండిట్ శిక్షణ పూర్తిచేశాను,1973-76 లో సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను, 1976-78లో ఉస్మానియా యూనివర్సిటీలో M.A.తెలుగు పూర్తి చేసి చదువులో నా స్నేహితులను అందుకోగలిగాను. తరువాత జూనియర్ లెక్చరర్(1978-98) గా, డిగ్రీ లెక్చరర్(1998-2012) గా విధులు నిర్వర్తించాను.

ప్రశ్న 4.చదువులో మీకు మిత్రుల సహాయం ఎలా వుండేది?

ఒక సందర్భంలో నందిని సిధారెడ్డి గారు ఏమంటారంటే “కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు కానీ ఒక మంచి మిత్రుడిని సంపాదించుకోవడం కష్టమని”. అది కష్టాలలో ఆదుకునే స్నేహితుడు కావాలి,మనోధైర్యాన్నిచ్చే స్నేహితుడు కావాలి అంటాడు. నిజమే స్నేహితుడనే పదానికి అర్థం అదే కదా! నాకు కూడా నా జీవితంలో మంచి స్నేహితులు తారసపడ్డారు నేను అంధుల పాఠశాలలో ఉన్నప్పుడు ఆదినారాయణతో నా స్నేహం కుదిరింది.ఇతనిది ఆంధ్రా ప్రాంతం. మేము సన్నిహితంగా ఉండేవాళ్లం. మా స్నేహాన్నిచూసి హాస్టల్లో మా ఇద్దరిని జంటకవులు అనేవాళ్ళు. నిజానికి నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది ఆయనే. కర్ర పట్టి ఏ విధంగా నడవాలో నేర్పింది ఆయనే. కర్రపట్టి నడుస్తున్నప్పుడు గోడ దగ్గర కొడితే ఒక రకంగా శబ్దం వస్తుంది. తారు రోడ్డుపైన కొడితే ఒక రకమైన శబ్దం వస్తుంది. బస్ పక్కన కొడితే ఇంకొక రకమైన శబ్దం వస్తుంది,బైక్ పక్కన కొడితే మరొక రకమైన శబ్దం వస్తుంది. ఇలా కర్రతో కొట్టినప్పుడు వచ్చే శబ్దాలను ఎలా ఉంటాయి, నడిచేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను, అదేవిధంగా ఎత్తుపల్లాలలో ఏ విధంగా నడవాలో కూడా చెప్పేవాడు .నేనెప్పుడైనా పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ వారం రోజులు వుండవలసిన వచ్చేది. ఆ సమయంలో తను నాకు భోజనసదుపాయం కల్పించి,పుస్తకాలిచ్చి ఎంతో సహాయం చేసేవాడు. ఎగ్జామ్ కు ఏ విధంగా ప్రిపేర్ కావాలో,ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయో ఇలాంటి విషయాలను చెప్తుండేవాడు. నాకు దొరికిన మంచి మిత్రుడు తను. ఇదే తరగతిలో మోహన్ రావు అనే స్నేహితుడు వుండేవాడు.అతను కూడా నాకు సహాయపడ్డాడు.అదే విధంగా పీజీలో ఉన్నప్పుడు తుపాకుల సిద్ధారెడ్డి (కర్నూల్)అని మరో మిత్రుడు పరిచయమయ్యాడు.ఇతను పీజీ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలో చక్కని సూచనలు చేసేవాడు. ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు పరిచయమై నా గమ్యం చేరుకోవడానికి ఎంతో సహాయపడ్డారు.వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్రశ్న 5 మీరు జీవితంలో ఎన్నోసార్లు ఒంటరి ప్రయాణం చేశారు. మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఎప్పుడూ భయం వేయలేదా?
నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నెలకోసారైనా ఇంటికి ప్రయాణించాల్సి వచ్చేది.ఆ సమయంలో నన్ను ఆర్థిక సమస్యలు వెంటాడేవి. అందుకే నేను ఎక్కువగా రైలు ప్రయాణం చేసేవాడిని.ఎందుకంటే మాకు టికెట్టు కన్సెషన్ ఉండేది. రైలు ప్రయాణంలో ఇంటికి వెళ్ళాలంటే అక్కన్నపేటలో దిగాలి.అక్కడ దిగేసరికి ఒక్కోసారి అర్ద రాత్రి 12 గంటలయ్యేది. ఆ సమయంలో రైలు పట్టాలు దాటేటప్పుడు విపరీతమైన భయంవేసేది.అయినా ఆర్థిక సమస్యల ముందు అవేం పెద్ద సమస్యలు కావని ముందుకు వెళ్లే వాడిని. అంతేకాకుండా నాకు కష్టం వచ్చినప్పుడల్లా నా గమ్యం గుర్తొచ్చేది.గమ్యాన్ని చేరుకోవాలనే తీవ్రమైన కోరికే నా లోపల భయాన్ని పోగొట్టేది. నిజానికి ఆ సమయంలో మాకు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది,డబ్బు కూడా ఉండేది కానీ నా ఆత్మాభిమానం మా వాళ్ళని అడగనిచ్చేది కాదు,వాళ్లూ అర్థం చేసుకొని తగినంత మొత్తం ఇచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో డబ్బుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాను. ఆ ఇబ్బందులే నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పాయి.ఎన్ని కష్టాలు ఉన్నా ముందడుగే వేశాను.అందుకే నన్నందరూ మొండివాడనేవారు.
ప్రశ్న:6 మీరు భూస్వామ్య కుటుంబం నుంచే వచ్చారు.మీరున్న పరిస్థితిలో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ చదువుని గాఢంగా నమ్ముకొని దానివైపే అడుగులు వేశారు దానికి కారణం ఏమిటి?

వ్యవసాయం చేద్దామంటే తప్పకుండా నేను రోజు పొలానికి వెళ్ళాలి,జీతగాళ్ళ జీతాల వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాలి.అది నాకు సాధ్యపడదు. నిజానికి నాకు మొదట్లో పాఠశాలకు వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. నాకు రేడియో ద్వారా చాలా విషయాలు తెలిసేవి. అందువల్ల పాఠశాల అవసరం లేదనుకున్నాను. అంతేకాకుండా చదువుకున్న చాలామంది నా దగ్గరికి వచ్చి వార్తలు అడిగి తెలుసుకునేవారు. నాకు అప్పుడు కొంచెం గర్వంగా ఉండేది.అందువల్ల విద్య అనేది కేవలం పాఠశాలకు వెళ్తే మాత్రమే వచ్చేది కాదని, అది రేడియో ద్వారా కూడా నేర్చుకోవచ్చని అనిపించింది .కానీ మా నాన్నగారు మలక్ పేట అంధుల స్కూల్లో నన్ను జాయిన్ చేసినప్పుడు రేడియో కంటే కూడా చాలా విషయాలు స్కూల్లో తెలుస్తాయనే విషయం అవగతం అయింది నాకు. నన్ను హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మా నాన్నగారికి నన్ను స్కూల్లో జాయిన్ చేయమని అక్కడి డాక్టర్లు చెప్పేవారు.అలాగే వెంకటరెడ్డి సార్ గారు మా నాన్న గారితో చదువు ప్రాముఖ్యం చెప్పి నన్ను చదువులో ప్రోత్సహించమనేవారు. అందువల్ల మా నాన్నగారు ఇక నన్ను చదివించాలనే నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నారు . నీ అన్ని సమస్యలకు చదివే పరిష్కారం చూపెడుతుందని చదువే నువ్వు ఎదగడానికి దోహదపడుతుందని అందువల్ల నువ్వు తప్పకుండా చదవాలని మా నాన్నగారు నన్ను ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను చదువుకోగలిగాను. నాకు ఎప్పుడైనా నిరాశ ఎదురైనప్పుడు మా నాన్నగారి మాటలని గుర్తు చేసుకొని పునరుత్తేజితున్నయ్యే వాడిని. మా నాన్నగారి మాటలతో ఎప్పటికైనా చదువులోనే విజయం సాధించాలని నేను దృఢంగా నిర్ణయించుకున్నాను. నా సమస్యలన్నింటికీ చదువే పరిష్కారం చూపెడుతుందని,చదువే సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది అర్థమైంది.అందుకే నేనెప్పుడూ చదువును వదలలేదు.నాకు చదువులో మా చెల్లెలు, మిత్రులు జగన్మోహన్ రెడ్డి, లెక్కలు చేయడానికి షాప్ లోని మిత్రుడు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మా ఊర్లో నిజాం చేత బహిష్కరణ గురైన స్వామీజీ, శివరాం సార్ గార్లు సహాయపడ్డారు. అలాగే స్క్రైబర్స్ కూడా ఎంతో సహాయపడ్డారు. ప్రధానంగా లెక్కల పరీక్షల్లో స్క్రైబర్స్ చేసిన సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను వారికి నా ధన్యవాదాలు.

ప్రశ్న:7 ప్రస్తుతం అంధుల పాఠశాలల్లో ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?

నిజాం రాజు ఒకరకంగా అంధులకు ఎంతో మేలు చేశాడని చెప్పవచ్చు. అతను ముందుగా స్వచ్ఛంద సంస్థల ద్వారా అంధుల పాఠశాలను స్థాపించాడు. మొదట్లో డఫ్ అండ్ డం పాఠశాలలుండేటివి అందులో వికలాంగులు,అంధులు అందరూ కలిసి ఉండేవాళ్ళు .తర్వాత కాలంలో వేరు వేరుగా అంటే అంధుల పాఠశాలలుగా,డఫ్ అండ్ డం పాఠశాలలుగా వేరు చేసి నడపబడ్డాయి. ఇవి ఎంతోమందికి మేలును చేకూర్చాయి.ఎంతోమంది జీవితాలను నిలబెట్టాయి. అంధుల పాఠశాలల్లో నిజానికి అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అంధులకు జంతువులు ఏ విధంగా ఉంటాయో తెలిసేలా, వాటి మోడల్ బొమ్మలను ఆ పాఠశాలలో ఏర్పాటు చేస్తే వాళ్లు స్పర్శ జ్ఞానం ద్వారా తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా విజ్ఞాన విషయాలను అందించే ఇప్పుడున్న పరికరాలను వాళ్ళకి అందుబాటులోకి తేవాలి. అప్పుడు వారు కూడా మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు వెళ్ళగలుగుతారు.

ప్రశ్న:8 మీరు సాహిత్యం వైపు మళ్ళడానికి కారకులు ఎవరు? మీ పూర్వీకులలో ఎవరైనా సాహిత్యకారులు ఉన్నారా?
పూర్వీకులలో సాహిత్య కారులు ఉంటేనే మనకు సాహిత్యం అలవడుతుందనేది సరైనది కాదు. ఉదాహరణకు సి.నారాయణ రెడ్డి గారు,నందిని సిద్ధారెడ్డి గార్ల కుటుంబాలలో వీళ్ళకంటే ముందు ఎవరు సాహిత్య కారులు లేరు.మా కుటుంబంలో కూడా సాహిత్య కారులు ఎవరూ లేరు. అయితే మా నాన్నకి మాత్రం చదువంటే చాలా ఇష్టం ఉండేది. మా నాన్నగారు కాంగ్రెస్ నాయకులు,పుస్తకాలు బాగా చదివేవారు. అందులో ప్రధానంగా స్వామి దయానంద సరస్వతి రాసిన “సత్యార్థ ప్రకాశిక”గ్రంథాన్ని రోజు ఆరు పేజీల చొప్పున చదివేవారు అలాగే మా ఇంట్లో పెట్టె నిండా ఉర్దూ పుస్తకాలు ఉండేవి. వాటిని కూడా చదివేవారు. అలా మా నాన్నగారు చదివేవారు ,నేనేమో రాస్తున్నాను మా నాన్నగారి చదివే అలవాటే నేను చదువుకోవడానికి, రాయడానికి కారణం అనుకుంటున్నాను‌.మనకి ఒక్క బ్రాహ్మణులలో లో తప్ప ఇంకా మిగతా ఏ కులాలలో కూడా వాళ్ల పూర్వీకులు ఎక్కువగా చదువుకున్నట్టు సాహిత్య కారులైనట్టు నాకైతే కనిపించలేదు.

ప్రశ్న:9 మీ జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు?

నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు ప్రభావితం చేస్తే వ్యక్తులు కనిపిస్తారు. నన్ను కూడా ప్రభా చేసిన వారున్నారు.అందులో మొదటగా మా నాన్నగారు. మా నాన్నగారి వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. మా నాన్నగారు 10 సంవత్సరాలు మా ఊరికి సర్పంచ్ గా ఉన్నారు.ఆ సమయంలో అతను ఎన్నో సంస్కరణలు చేపట్టాడు.ఉదాహరణకి లేబర్స్ కి హాలిడే ప్రకటించడం,అంతేకాకుండా ఎవరైనా పంచాయతీ చెప్పమని వచ్చినప్పుడు వారికి జరిమానా విధించేవాడు కాదు.ఎందుకంటే వారివి అప్పటికే చితికిపోయిన బతుకులు. కష్ట సమయంలో ఏ విధంగా ఉండాలి,గమ్యం చేరడం కోసం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి మొదలైనవన్నీ మా నాన్నగారి నుంచే నేర్చుకున్నాను. ఇక రెండవది రేడియో నా జీవితంలో రేడియో చాలా ప్రముఖ పాత్ర వహించింది. రేడియోలో వచ్చే నాటకాలు ఆ నాటకాలలోని మంచి విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నాకు అది విజ్ఞానాన్ని అందివ్వడమే కాకుండా నా గమ్యం వైపు ముందుకెళ్లేలా ప్రేరేపించింది. నాకెప్పుడూ నిరాశ కలిగిన నేను రేడియో వినేవాడిని. ఈ విధంగా నేను మా నాన్నగారు మరియు రేడియో నాటకాలద్వారా ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యాను.

ప్రశ్న:10 సాహిత్యంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు?

నేను మలక్ పేటలో చదువుతున్నప్పుడు నాకు తెలుగు సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు,తర్వాత కాలంలో అంటే PUC లో తెలుగు ఆప్షనల్ సబ్జెక్టు కావడంతో చదివేవాడిని. ఆంధ్ర సారస్వత పరిషత్తులో DOL చదవడం ద్వారా,M.A తెలుగు చదవడం ద్వారా నాకు సాహిత్యం పై కొంత అవగాహన కలిగింది. అంతకంటే ముందే నాకు రేడియో పరిచయమైంది కాబట్టి నాకు చాలావరకు దాని ద్వారానే సాహిత్యం పరిచయమైంది.నాకు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యం రామాయణ,మహాభారతాలకంటే కంటే ఆధునిక సాహిత్యం అంటే ఎక్కువగా ఇష్టం.ఎందుకంటే ఆధునిక సాహిత్యంలో అభ్యుదయపథం వుంటుంది. అభ్యుదయ భావాలతో సాహిత్యం సృజించిన గురజాడ గారు కన్యాశుల్కం నాటకంలో, ముత్యాల సరాలలో బాల్యవివాహాలను ఖండించాడు.శ్రీశ్రీ కార్మికుల,కర్షకుల పక్షాన కవిత్వం రాశాడు,దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార, రుద్రవీణ ద్వారా ఉద్యమ స్ఫూర్తి రగిలించాడు అప్పటి పరిస్థితులలో నిజాం వ్యతిరేకంగా కవిత్వం రాయడం సాహసమనే చెప్పాలి. ఆయన తిరుగుబాటు తత్వం నన్ను ఆకర్షించింది‌. జాషువా తన “గబ్బిలం” కావ్యంలో కుల వ్యవస్థను ఖండించాడు. ఆయన ఎప్పుడూ నిమ్న వర్గాల గురించే కవిత్వం రాసేవాడు. నాకది బాగా నచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వంలో ఓలలాడించాడు. తన ఊహ ప్రేయసి ఊర్వశి పై ఎంతో అద్భుతమైన కవిత్వాన్ని రాశాడు. అది చదువుతున్నంతసేపు మనం కూడా అతనితోనే ప్రయాణిస్తాం. సినారె గారి కవిత్వంలో ప్రణయతత్వం ఉంటుంది.నాగార్జున సాగరంలో దాన్ని చూడవచ్చు. అదేవిధంగా కర్పూర వసంత రాయలు కావ్యం లో లకుమ పాత్ర చిత్రణ అద్భుతంగా ఉంటుంది.ఆయన రచనలు మోటివేషనల్ గా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నాపై ప్రభావం చూపారు.

ప్రశ్న:11. మీ జీవితాన్ని నవలగా రాయాలని ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది?
నేను చిన్నతనం నుండి ఎక్కువగా ఒంటరిగా ఉండడం వల్ల బాగా ఆలోచించే వాడిని, స్పందించడమంటే ఇష్టపడేవాడిని, చర్చించడం అంటే ఇష్టపడేవాడిని. నేను చిన్నప్పటినుండి ఎక్కువగా నాటకాలు వినేవాడిని కాబట్టి అందులోని పాత్రలను బాగా గమనించేవాడిని, మాటలను కథలను వినేవాడిని. అంతేకానీ రాసేవాడినికాదు. అసలు నాకు 12 సంవత్సరాల వయసు వచ్చేవరకు చదువు అనేది ఒకటి ఉంటుందని తెలియదు. అంధుల పాఠశాలలోచేరిన తర్వాత బ్రెయిలీ లిపి నేర్చుకున్నాను. ఆ తర్వాతే చిన్న చిన్న కథలను రాయడం సాధన చేశాను. నేను లెక్చరర్ అయిన(1978) తర్వాత నా జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను,పరిస్థితులకు అనుగుణంగా మారే మనుషులను, అవకాశవాదులను, కొందరు అధికార దర్పంతో జీవితాలను ఎలా శాసిస్తారో మొదలైన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి డైరీలో రాసేవాన్ని. నాకు డిగ్రీ లెక్చరర్ గా ప్రమోషన్ వచ్చాక(1998) నందిని సిధారెడ్డి గారితో సాన్నిహిత్యం పెరిగింది. అతను ఒక రోజు “నువ్వు నీ జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలను డైరీలో రాస్తున్నావు కదా!వాటి ఆధారంగా నీ జీతాన్ని నవలగా రాస్తే బాగుంటుంది”అని సలహా ఇచ్చాడు.ఆ ఆలోచన నాకు నచ్చింది.నేను నా జీవితాన్ని కథలుగా చెప్పడం సాధ్యం కాదు,నాటకంగా చెప్పలేను ,కాబట్టి నవలగానే రాయాలనుకున్నాను. దీని కారణమేంటంటే నవల విస్తృతి పెద్దది.నేను అప్పటికే ఉన్నవ లక్ష్మీనారాయణ గారి”మాలపల్లి”వట్టి కోట ఆళ్వారు స్వామి గారి” ప్రజల మనిషి”వాసిరెడ్డి సీతాదేవి గారి “మట్టి మనుషులు”,బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది” మొదలైన నవలలు చదివాను కాబట్టి నవల రాయగలననిపించింది. అయితే అయితే మరి నా నవల కేవలం నా జీవితాన్నిమాత్రమే కాకుండా అప్పటి చారిత్రక, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించాలనుకున్నాను. దాదాపు 2000 సంవత్సరం నుండి 2012 వరకు నా యొక్క డైరీ ఆధారంగా నవలను బ్రెయిలీ లిపిలో రాసుకున్నాను.మామూలు పేజీలలో 500 పేజీలు అయితే బ్రెయిలీ స్క్రిప్ట్ లో 3000 పేజీలలో పూర్తయ్యింది‌.

ప్రశ్న:12, ఈ నవల రాయడంలో మీకు సహాయపడింది ఎవరు ?

ముందుగా నవలను నేను బ్రెయిలీ స్క్రిప్ట్ లో రాసుకున్నాను.అప్పుడు ఎవరు సహాయపడలేదు.అది నా జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. అయితే అది చూపు ఉన్న వాళ్లకు చదవడం సాధ్యం కాదు గనక దానిని వాళ్ళకు కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో పుస్తకంగా బయటకు తీసుకురావాలనుకున్నాను. ఈ క్రమంలో నా శిష్యుడు మహేందర్ రెడ్డి ఒక మూడు అధ్యాయాల వరకు రాశాడు. తర్వాత ఎందుకో అది పూర్తి కాలేదు. ఇక నా నవల బయటకు రాదేమోనని అనుకున్నాను. దీనికి పరిష్కారం ఎట్లా అని ఆలోచించే క్రమంలో నేను ఒక వాయిస్ రికార్డర్ కొన్నాను.అందులో నా బ్రెయిలీ స్క్రిప్ట్ లో రాసుకున్నదాన్ని పూర్తిగా రికార్డు చేసుకున్నాను. ఎప్పుడైనా నా మనవడో మనవరాలో ఇది విని వాళ్లైనా పుస్తకంగా బయట తీసుకొస్తారని చిన్న ఆశ ఉండేది. ఎందుకంటే అన్నమయ్య కూడా తను పాటలు పాడుకుంటూ పోయేవాడు వాటిని లిఖితబద్దం చేసింది మాత్రం తన వారసులే.. అలాగే నా వాళ్ళు కూడా బయటకు తీసుకొస్తారని అనుకున్నాను. కరోనా సమయంలో ఒకసారి నా శిష్యురాలు ధూళిపాల అరుణ నాకు ఫోన్ చేసినప్పుడు మాటల మధ్యలో నా నవల విషయం ప్రస్తావనకు వచ్చింది అప్పుడు ఆమె ఈ నవలను నేను రాస్తాను సార్ అని ముందుకు వచ్చింది. అయితే నేను వాయిస్ రికార్డర్ లో భద్రపరచిన ఈ నవలను ఆమెకి పెన్ డ్రైవ్ ద్వారా పంపించాను. దాని ద్వారా వినుకుంటూ రాయడం ఆమెకు కొంత ఇబ్బందిగానే అనిపించింది. తర్వాత అలా కాదని నేను ప్రతిరోజూ కొంత డిక్టేట్ చేస్తుంటే ఆమె రాసేది. ఇట్లా 2019 నుండి 2021 వరకు ఆమె నవల రాయడం పూర్తి చేసింది. దీనిని టిడిపి చేసే బాధ్యతను తన మిత్రురాలు వల్లి తీసుకుంది.నిజంగా వీళ్ళు లేకపోతే నా నవల బయటకు వచ్చేది కాదు. వీరికి ఈ ఇంటర్వ్యూ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఈ నవల ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేదు. నందిని సిధారెడ్డి గారు ఈ నవలను డెని సైజులో ప్రింట్ చేయమన్నారు అలా చేస్తే 600 పేజీల వరకే అవుతుందన్నారు. రోమ్ సైజులో చేస్తే 500 పేజీల్లో పూర్తవుతుందన్నారు అందువల్ల దీన్ని రోమ్ సైజులోనే ప్రింట్ చేయమన్నాను. దానికి ముఖచిత్రం నుండి పూర్తయ్యే వరకు నా శిష్యురాలు ధూళిపాల అరుణనే పూర్తి బాధ్యత తీసుకుంది. ఆమెకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.నాకు శిష్యులు ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో ఎంతో సహాయం చేశారు. ఉదాహరణకు ఢిల్లీలో మహాభారతంపై సదస్సు జరుగుతున్నప్పుడు నన్ను ప్రసంగించమని నా శిష్యురాలు ఊర్మిళ కోరింది. నాకు సాధ్యం కాదు అనుకున్నాను. అయితే ఆమెనే కోఆర్డినేటర్ తో మాట్లాడి నేను ప్రసంగించడానికి అవకాశం కల్పించింది. నేను ఢిల్లీలో ఉన్న మూడు రోజులు నాకు ఎంతో సహాయం చేసింది. ఆ రోజు నేను మహాభారతంలోని స్త్రీ పాత్రలపై మాట్లాడాను. అది నా జీవితంలో గొప్ప అచీవ్ మెంట్ గా భావిస్తాను. అంతే కాకుండా నేను కాలేజీ వెళ్తున్నప్పుడు నన్ను కాలేజీ వరకు తీసుకురావడానికి ఒక్కొక్క దశలో ఒక్కో విద్యార్థి ఇలా ఎందరో నాకు నా శిష్యులు సహాయం చేశారు వారికి ధన్యవాదాలు.

ప్రశ్న:13, మీ నవల ఒక చారిత్రక డాక్యుమెంట్ లా అనిపిస్తుంది అలా రాయడానికి కారణం ఏమయ్యుంటుంది.?
నేను నవల రాసేముందు కొన్ని నవలలు చదివాను అందులో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి “మాలపల్లి” నవల బుచ్చిబాబు గారి “చివరికి మిగిలేది” నవల వాసిరెడ్డి సీతాదేవి గారి “మట్టి మనుషులు” చాలా బాగా అనిపించాయి. ఈ నవలలు చదివిన తర్వాత నవలకి ఒక లక్ష్యం అంటూ ఉండాలని అర్థం అయింది. అంతేకాకుండా అప్పటి పరిస్థితులను కూడా వివరిస్తే ఇంకా బాగా అర్థమవుతుందని తెలిసింది.
నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకుంటూ వచ్చాను. నా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి వాటిని ఎదుర్కొన్నాను. నవల రాసేటప్పుడు అందులోని సమస్యలను చర్చించేటప్పుడు దాని వెనుకున్న నేపథ్యం చెప్తే ఆ సమస్యగురించి పూర్తిగా పాఠకులకు అర్థమవుతుందని, అలాగే ఆ కాలంనాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కూడా ముందుతరాలకు తెలియాలనే ఉద్దేశంతో అలాంటి అంశాలను ప్రస్తావించాను. బతుకమ్మ పండుగ గురించి చెప్పేటప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాల గురించి వివరించాను, నేత పనివారీ మగ్గం గురించి వివరించాను.అలాగే బెల్లం ఏ విధంగా తయారవుతుంది దానికుపయోగించే పరికరాలు ఏమిటి అనే విషయాలను,కులం ప్రస్తావన వచ్చినప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాలు-సమాజంపై దాని ప్రభావాన్ని వివరించాను. ఇవే కాకుండా అవసరమైన సందర్భాల్లో చాలా చారిత్రక అంశాలను ప్రస్తావించాను. ఇదంతా ముందు తరాల వారికి తెలియడం కోసమే.

ప్రశ్న: 14. మీకు ఈ నవల రాయడంలో ప్రతిబంధకాలు ఏమైనా ఏర్పడ్డాయా?

నేను నా జీవితంలోని ముఖ్య సంఘటనలన్నింటినీ డైరీలో రాసుకున్నాను కాబట్టి వాటి ప్రకారం నేను నవలను మొదట బ్రెయిలీ స్క్రిప్టులో రాసుకున్నాను. అప్పుడు నాకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాలేదు. కానీ అది చూపు ఉన్నవారు చదివేలా బయటికి రావాలంటే మాత్రం ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు. ఎందుకంటే నేను చెప్పిన దాన్ని రాయాలి,టిడిపి చేయించాలి,దాంట్లోని తప్పొప్పులను చూడాలి,ముఖచిత్రాన్ని వేయాలి ఇంత తతంగం ఉంటుంది. మరి ఇవన్నీ ఎలా చేస్తానో అని అనుకున్నాను. కానీ ఈ సమస్యలన్నింటినీ దాటుకొని నవల బయటకు వచ్చిందంటే దానికి పూర్తి కారణం ధూళిపాల అరుణ. ఆమె పడ్డ శ్రమ అంతా అంతా కాదు నేను చెప్పడం వరకే ఆపై పూర్తి బాధ్యత ఆమెనే తీసుకుంది. ముఖచిత్రం పైన ఉండే ఆ డిజైన్ రూపకల్పన చేసింది అరుణ మేనల్లుడు ప్రవీణ్. చాలా చక్కగా వేయించింది. నవల వెలువడడంలో పూర్తి బాధ్యత అరుణనే తీసుకుంది కాబట్టి ఆమెకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.అందుకే ఈ నవలను ఆమెకే అంకితం ఇచ్చాను.

ప్రశ్న:15. నవల చదువుతున్నంత సేపు మీరు స్త్రీ పక్షపాతి లాగా కనిపిస్తారు. దాని కారణాలు ఏమైనా ఉన్నాయా?
ఎంత పెద్ద వాళ్ళయినా వాళ్ళ చిన్నతనంలో తల్లి దగ్గరే పెరుగుతారు తల్లి చూపే ప్రేమను ఆస్వాదిస్తారు.ఇది సాధారణ విషయమే కానీ నా జీవితంలో నేను అందరికంటే కొంచెం ఎక్కువగా తల్లి దగ్గరే గడిపాను. ఎందుకంటే నాకు చూపు లేదు కాబట్టి బయట ఆడుకోలేను. అందువల్ల ఇంట్లోనే ఎక్కువ ఉండేవాణ్ణి. మా అమ్మనే నన్ను జాగ్రత్తగా చూసుకునేది.అమ్మలోని తియ్యదనం అర్థమైందప్పుడు. నా జీవితంలో రేడియో ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది.ఆమె రేడియోలో మాట్లాడిన మాటల ద్వారా నేను ఎంతో ఉత్తేజం పొందేవాన్ని. ఎప్పుడు బాధ కలిగినా ఆమె మాటలు వింటూ సాంత్వన పొందేవాన్ని. నాలోని చాలా ఊహలకి కారణం ఆమె తీయనైన మాటలే. బహుశా ఇది కూడా ఇంకొక కారణం అయి ఉంటుంది.ఇక నాకు చిన్నతనంలో ఎక్కువగా అక్కయ్యలతో గడపడం వలన స్త్రీల మనస్తత్వాన్ని దగ్గరగా చూసి అవకాశం కలిగింది. నిజానికి స్త్రీ మన జీవితాల్లో అక్కగా, చెల్లిగా,అమ్మగా,భార్యగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తుంది.మనం ఏ విషయమైనా ముందు అమ్మతో చెప్తాము. నేను ఇంకెక్కువ ఎందుకంటే నాకు మా నాన్నంటే భయం. నేను ప్రతి విషయాన్ని అమ్మతో పంచుకునేవాన్ని. మా అమ్మ నా సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేసేది అప్పుడు అమ్మ మీద మంచి అభిప్రాయం కలిగింది. నా చిన్నతనంలో మా ఇంటికి చుట్టుపక్కల ఉండే స్త్రీలు వచ్చి తమ బాధలన్నింటిని మా అమ్మతో పంచుకునేవారు. నేను ఇంటి పై గదిలోనుండి వినేవాడిని.అదేవిధంగా పంచాయతీ కోసం మా నాన్నగారి దగ్గర ఎప్పుడూ జనాలు ఉండేవారు అందులో ఎక్కువ మంది తమ భర్తల చేత బాధింపబడ్డ స్త్రీలే….వాళ్ల గోడు విన్నప్పుడు నా మనసు చివుక్కుమనేది. ఆడవాళ్లు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటారా? ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా వాళ్లు మళ్లీ భర్త కోసం,పిల్లల కోసం ఆలోచిస్తారు. వాళ్ళది ఎంతో గొప్ప మనసు అని అనుకునేవాన్ని. అలా స్త్రీల పట్ల నాకు జాలి వేసేది,తర్వాత గౌరవం పెరిగింది. సాధారణంగా మగవాళ్ళు బయట పని చేసి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ స్త్రీలు బయట కూలి పనికి వెళ్లి వచ్చి మళ్లీ ఇంటికి రాగానే ఇంటి పనులు చూసుకుంటారు. నిజానికి వాళ్లు కుటుంబంకోసం యంత్రంలాగ పనిచేస్తారు. వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.వారి ఓపికకు జోహార్లు. నాకు స్త్రీల జీవితం ఎంతో ప్రేరణనిచ్చేది. ఎందుకంటే వాళ్లు గృహబంధీలుగానే ఉంటారు, నేనూ గృహబంధీనే . వాళ్లకి లేని బాధలు నాకెందుకు అనుకునేవాన్ని నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు వాళ్ళతో పోల్చుకొని కొంత సంతృప్తి పడేవాడిని. నా జీవితంలో అడుగడుగునా నాకు ఎక్కువగా సహాయపడింది స్త్రీలే.అంతెందుకు ఈ నవల బయటకు రావడానికి కారణం కూడా ధూళిపాల అరుణ మరియు వల్లిలే కారణం కదా ! అందువలన నేను స్త్రీపక్షపాతిలాగా కనిపిస్తాను.

ప్రశ్న:16. ఈ నవలలో మీరు భగ్న ప్రేమికులుగా కనిపిస్తారు. మరి మీ ప్రేమ విఫలం కావడంలో కులం పాత్ర ఏమిటి? అసలు కులం పైన మీ అభిప్రాయం ఏమిటి?
ఆర్యుల రాకపూర్వం కుల వ్యవస్థ ఇంత ఉండేది కాదు.వాళ్ళువాళ్ళ మనుగడ కోసం ఈ కుల వ్యవస్థను సృష్టించారు. వాళ్ళు మనుస్ర్మతిలో అన్ని అంశాలను వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు.విభజించి పాలించడానికి పునాదులు వేసింది వాళ్లే.ఇది నేడు శాఖోపశాఖలుగా విస్తరించి కూలకుండా తయారైంది. నా ప్రేమ విఫలంకావడంలో కూడా కులం ముఖ్యమైన పాత్ర వహించింది. నేను చదువుకుంటున్న రోజుల్లో నా వద్దకు మా వాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నేను మొదట వద్దన్నాను. ఎందుకంటే నాకు నా ఊహ సుందరి రేడియో ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్ వుండనే ఉంది. ఆమె మాటలే నాకు ఎప్పుడు స్ఫూర్తినిచ్చేవి. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే అలా బాగా మాట్లాడే అమ్మాయిని చేసుకోవాలని కోరిక ఉండేది, అమ్మాయిల్లో అలాంటి ధైర్యం,అలాంటి మంచి స్వభావం,ఉండాలన్నదే నా కోరిక. ఆ స్వభావాలు ఆంధ్ర అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తాయని నా భావన. అలాంటి అమ్మాయిలు తెలంగాణలో దొరకదనేది నా నమ్మకం.నేను పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో నాకు కొంత స్పష్టత ఉంది. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి నాకు పుస్తకాలు చదివి పెట్టాలని,నాకు ధైర్యం చెప్పాలని,నా అంధత్వాన్ని అంగీకరించాలని అనుకున్నాను. అలాంటి అమ్మాయి దొరికితే మాత్రమే పెళ్లి చేసుకుంటాను అన్నాను.అప్పుడు మా గుమాస్తా హనుమంతయ్య మా ఇంటి పక్కన సంబంధం గురించి చెప్పాడు ఆ అమ్మాయి పేరు సాధన. వాళ్ళ నాన్న నర్సింగరావు, వెలమ కులస్తుడు.మా నాన్నగారితో చాలా స్నేహంగా ఉండేవాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది మా అమ్మతో చాలాసేపు మాట్లాడేది. అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు కానీ పెళ్లి ప్రస్తావన రాగానే కొంచెం ఆమె మాటల మీద ఆసక్తి పెరిగింది . ఆ అమ్మాయిలో నేను అనుకున్న లక్షణాలు పూర్తిగా ఉన్నాయని తెలిసింది. బాగా గమనించి రెండున్నర సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒప్పుకున్నాను.ఆ సమయంలో ఆమెతో జీవితం ఎలా ఉంటుందో ఊహించుకున్నాను, ఊహల్లో బతికాను,ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను,ఇక సాధనే నా సరస్వము అనుకున్నాను. ఇక తీరా పెళ్లి పీటలెక్కే సమయంలో ఒక రెడ్డి కుల సంబంధం వచ్చింది,వాళ్ళు పేదవాళ్లు వెంటనే మా పెద్దవాళ్లు ప్రధానంగా మా బావ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు .రెండున్నర సంవత్సరాల నా ప్రేమని ముక్కలు చేసి తలవంచుకుని వేరొక అమ్మాయి మెడలో తాళి కట్టమంటున్నాడు. అంటే నా అభిప్రాయాలపై వాళ్లకి గౌరవం లేదు అనుకున్నాను. వాళ్లకు కావాల్సింది కులమే. నేను ప్రేమించిన సాధన వాళ్ళ నాన్నకు రెండవ భార్య కూతురు,మొదటిభార్య చనిపోతే రెండవ భార్యగా బలిజకులస్తురాలిని పెళ్లి చేసుకున్నాడు. నాన్నమో వెలమ కులస్తుడు అమ్మేమో బలిజ కులస్తురాలు. కాబట్టి సాధనను కులం తక్కువ అన్నారు. అప్పుడు నేను మొదట్లో ఈ కులం గుర్తుకు రాలేదా ? అని ప్రశ్నించాను.వాళ్లు సమాధానం చెప్పలేదు. ఎవరు నా ప్రేమను అర్థం చేసుకోలేదు. పంచాయతీ పెద్ద చేత కూడా చెప్పి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు.అప్పుడు నేను మహాభారతంలో కూడా కులాంతర వివాహాలు చాలా ఉన్నాయని శూద్ర కులస్తురాలైన అరుంధతిని వశిష్ఠుడు పెళ్లి చేసుకోలేదా? అని ఎదురు ప్రశ్నించాను. ఆయన ఏమీ సమాధానం చెప్పలేక వెళ్లిపోయాడు. అదే సమయంలో నాకు ఉస్మానియా మెట్రిక్ పరీక్ష ఫీజు డేటు దగ్గర పడుతుంది ,ఫీజు కట్టాలి నేను పెళ్లికొప్పుకుంటే మా బావ డబ్బులిస్తాడు, మా కుటుంబ సభ్యులు నాకు సహాయంగా ఉంటారు. లేకుంటే లేదు. మరేం చేయాలి అని నేను ఒక మూడు రోజులు విపరీతంగా మదనపడ్డాను. నిద్ర సరిగ్గా పట్టలేదు. భూమి బద్దలవుతున్నట్టు అనిపించింది.మనసు పడ్డ అమ్మాయిని వదిలి కులం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా…ఊహించుకోలేకపోయాను. కానీ చివరికి మా పెద్దవాళ్ల అధికార దర్పమనే ఖడ్గానికి నా ప్రేమ ముక్కలైపోయింది. చివరికి రెడ్డి కులస్తుల అమ్మాయి తోనే నా పెళ్లి జరిగింది.జూదంలో ధర్మరాజు ద్రౌపదిని బలి చేసినట్టు నేను కూడా ఈ కులభూతానికి నేను ప్రేమించిన అమ్మాయిని బలి చేశాననిపించింది. నాకు మొదటి నుంచి కులం మీద మంచి అభిప్రాయం లేదు.ఎందుకంటే అది మనుషులను వేరు చేస్తుంది. నిజానికి నేను ఒక హరిజన అమ్మాయిని లేదా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను .ఎందుకంటే వాళ్ళ లోపల జాలి,దయ ఎక్కువగా ఉంటాయి.రెడ్డి కులస్తులకు అధికార దర్పం ఉంటుంది, అహంకారం ఉంటుంది. నేను లెక్చరర్ గా పని చేస్తున్నప్పుడు కూడా నన్ను క్లాస్ రూమ్ కి ఎక్కువగా తీసుకెళ్లింది నిమ్నకుల అమ్మాయిలే. కాబట్టి వాళ్ల మీద నాకు మంచి అభిప్రాయం ఉండేది. ఈ విధంగా కులం వేసిన కాటుకు నేను బలైపోయాను. ఈ కులం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే మనిషి మనిషిగా నిలబడతాడు.

ప్రశ్న:17 మీ నవల చదువుతుంటే “అల్పజీవి,అంపశయ్య” నవలలు గుర్తొచ్చాయి,వాటిలో ఉండే చైతన్య స్రవంతి శిల్పమే కొంతవరకు మీ నవలలోపల కనిపించింది.అది అనుకొని ఆ పద్దతిలో రాశారా ? లేక అనుకోకుండా మీ నవలలో చేరిందా?

సాధారణంగా చాలా నవలల్లో అధ్యాయాలు ఎక్కువగా ఉంటాయి‌. ఉదాహరణకి “ప్రజల మనిషి” నవలలో 20 అధ్యాయాలు ఉంటాయి. ఆ నవల మొత్తం 150 పేజీల్లో ముగుస్తుంది. నా నవలకు వచ్చేసరికి ఇది దాదాపుగా 500 పేజీలు ఉంటుంది కానీ అందులో 11 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. అంటే ఒక్కో అధ్యాయంలో 50 పేజీల వరకు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక అంశాన్ని వివరించేటప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పాల్సి వచ్చింది. ఉదాహరణకి బెల్లం గురించి చెప్పేటప్పుడు ఆ బట్టిల గురించి ప్రస్తావించడం,తయారు చేసే విధానాన్ని కూలంకషంగా చెప్పడం, అలాగే పద్మశాలీల మగ్గం గురించి వివరంగా చెప్పడం,పండగల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పండుగ నేపథ్యం ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు ?ఎలా జరుపుకుంటారు? అనే విషయాలను వివరంగా చర్చించడం వల్ల అంత పెద్దగా అయింది.అయితే నా మానసిక సంఘర్షణ గురించి చెప్పేటప్పుడు మాత్రం చైతన్య స్రవంతి శిల్పంలో చెపితే బాగుంటుందని అదే శిల్పాన్ని ఆశ్రయించాను. ఎందుకంటే ఆ శిల్పం పాఠకుల్ని తనతో పాటు తీసుకెళ్తుంది. రచయిత అనుభవించిన అనుభూతిని పాఠకులూ అనుభవిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాలలో నేను అనుకొని ఆ శిల్పాన్ని ఆశ్రయించాను.

ప్రశ్న:18 మీకు నచ్చిన ప్రాచీన కవులు మరియు ఆధునిక కవులు ఎవరు?వాళ్లు ఎందుకు నచ్చారు?

నాకు చిన్నతనంలో చదివే అలవాటు ఎక్కువ లేదు. ఎందుకంటే చదవడానికి మనిషి కావాలి కాబట్టి రేడియో ద్వారానే నాటకాలు,కథలు,నవలలు వినేవాడిని పెళ్లయిన తర్వాత నా భార్య జ్యోతి ఎన్నో పుస్తకాలను చదివి వినిపించేది.నాకు ప్రాచీన సాహిత్యంకంటే ఆధునిక సాహిత్యమన్నా,సాహిత్యకారులన్నా చాలా ఇష్టం. రాసిన రామాయణ,మహాభారతాల్లో స్త్రీని తక్కువ చేసినట్టనిపించింది. ఉదాహరణకు: సీతను రాముడు అగ్ని ప్రవేశం చేయమనడం,భారతంలో ద్రౌపదిని ధర్మరాజు జూదంలో పెట్టడం లాంటివి బాధ కలిగించే విషయాలు. ఆధునిక కాలంలో గురజాడ అప్పారావు గారు సంఘంలోని లోపాలను ఎత్తిచూపాడు,సంస్కరణలకు బాటలు వేశాడు ,కన్యాశుల్కంలో,ముత్యాల సరాలలో బాల్య వివాహాలను తప్పని ఎత్తి చూపాడు. దేశభక్తి గేయంలో అద్భుతంగా దేశభక్తిని ప్రతిబింబించాడు,అది ఏ దేశానికైనా వర్తించే దేశభక్తి గేయం. ఇలా గురజాడ తన అభ్యుదయభావాలతో తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశాడు. అలాగే రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం ద్వారా అద్భుతమైన సాహిత్యాన్ని సృజించాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వంతో ఓలలాడించాడు. సి నారాయణ రెడ్డి గారి కవిత్వంలో ప్రణయతత్వం ఉంటుంది,అతని నాగార్జున సాగరం చాలా బాగుంటుంది. అలాగే కర్పూరవసంతరాయలు కావ్యంలో లకుమ త్యాగాన్ని గొప్పగా చిత్రించాడు. అదేవిధంగా దాశరధి లోని ఉద్యమ తత్వం నన్ను బాగా ఆకర్షించింది.అతను రాసిన అగ్నిధార, రుద్రవీణ నాపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. ఆ కాలంలో నిజాముకు వ్యతిరేకంగా కవిత్వాన్ని అలా రాయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. దాశరథిలోని ఉద్యమ తత్వం నాకు చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు రాస్తున్నవాళ్ళలో నందిని సిధారెడ్డి గారి కథలంటే నాకు చాలా ఇష్టం.అతని బందారం కథలలో స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది, అంతరించిపోతున్న కులవృత్తులు కనిపిస్తాయి, కథ సూటిగా స్పష్టంగా చెప్తాడు.అలాగే కందుకూరి శ్రీరాములు గారి కవిత్వం అంటే కూడా ఇష్టమే.

ప్రశ్న:19 మీరు భవిష్యత్తులో కూడా ఈ నవల ప్రక్రియనే కొనసాగిస్తారా లేదా మరేదైనా ప్రక్రియలో రచనలు చేపడతారా?

నేను ప్రస్తుతం అయితే ఈ నవల ట్రయాలజీని పూర్తి చేయాలనుకున్నాను. నా నవల మూడు భాగాలుగా వస్తుంది. ప్రస్తుత భాగం ఒకటవది. ఇది పుట్టినప్పటి నుండి కాలేజీ చదువు పూర్తి అయ్యేంతవరకు వుంటుంది. ఇక రెండవ భాగం ఉద్యోగ జీవితం. మూడవ భాగం రిటైర్మెంట్ తర్వాత జీవితం వీటిని పూర్తి చేయడంకోసం కసరత్తు జరుగుతుంది. ఇవి పూర్తయ్యాకే వేరే ప్రక్రియ లో రాయడానికి ఆలోచిస్తాను. నా నవల చదువుతున్నప్పుడు నందిని సిధారెడ్డి గారు ఏమన్నారంటే ఈ నవలలో కొన్ని “కథా లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు కథలు కూడా రాయగలవు వీలైతే రాయి” అని సలహా ఇచ్చాడు. అలాగే కందుకూరి శ్రీరాములు గారు కూడా నన్ను కథలు రాయమని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నవలల్ని పత్రికలు ప్రచురించడం తక్కువైంది కథలైతే ప్రచురించే ఆస్కారం ఎక్కువ అన్నారు. నేను కూడా ఆలోచిస్తున్నాను కవిత్వం రాద్దామంటే కొంత దృశ్యం చూడగలగాలి అది అసాధ్యం. కవిత్వం మెరుపు వంటిది అది క్షణకాలం ఉండి వెళ్ళిపోతుంది కథనైతే వెన్నెల లాంటిది చాలాసేపు నిలవగలుగుతుంది. కథ అయితే బాగా రాయొచ్చు అనే నమ్మకం నాకు వచ్చింది.కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కథలు రాస్తాను.

ప్రశ్న:20 ఈ నవల రాయడంలో,మీ సాహిత్య అధ్యయనంలో,మీ జీవితంలో,మీ సహచరి యొక్క పాత్ర ఏమిటి ?

నా జీవితంలో నా సహచరి జ్యోతిప్రభ పాత్ర ఎంతో ముఖ్యమైనది. నేను చదువుకునేటప్పుడు సబ్జెక్టు పుస్తకాలను చదివిపెట్టేది. నవలలు కూడా చదివి పెట్టేది.అలాగే నోట్స్ కూడా డిటెక్ట్ చేస్తే రాసేది, పరీక్షలు రాస్తున్న సమయంలో కూడా బాగా సహకరించేది.నా ఉద్యోగ ధర్మంలో ఆమె సహకారం మరువలేనిది. నేను ఈ నవలను ముందుగా బ్రెయిలీ స్క్రిప్టులో రాసుకున్నాను, నేనే వాయిస్ రికార్డ్ చేశాను కాబట్టి ఈ నవల రచనలో ఆమె పాత్ర అంతగా లేదు కానీ మిగతా జీవితంలో అన్నీ తానే అయింది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం చిన్నమాటే అవుతుంది.

ప్రశ్న:21 ఇప్పుడొస్తున్న కొత్త రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
ఇప్పుడు చాలామంది యువకులు తమ కలాలను కదుపుతున్నారు.అయితే వాళ్లు ముందుగా గుర్తుంచుకోవాల్సింది అధ్యయన,దర్శనం,వర్ణనం.వాళ్లు ప్రథమంగా చేయాల్సింది తమ సీనియర్ రచయితల రచనల్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి కనిపిస్తుంది ఉదాహరణకి వాసిరెడ్డి సీతాదేవి గారి “మట్టి మనుషులు” నవలలో వాస్తవికత ఎక్కువగా ఉంటుంది.యుద్దనపూడి సులోచనారాణి గారి నవలల్లో కూడా వాస్తవికత ఉంటుంది కానీ దానికంటే ఎక్కువగా కల్పనలు ఉంటాయి. ఈ వాస్తవికతే పాఠకులకు త్వరగా చేరువౌతుంది. కాబట్టి కొత్త రచయితలు ఎక్కువగా వాస్తవిక చిత్రణ కోసం ప్రయత్నించాలి. ఆధునిక సాహిత్యమే కాకుండా ప్రాచీన సాహిత్యాన్ని కూడా విస్తృతంగా చదవాలి. ప్రాచీన కవులలో నన్నయది కథనాత్మకశైలి, తిక్కనది నాటకీయ శైలి,ఎర్రనది వర్ణణాత్మకశైలి. ఇలా ప్రతివారి శైలిని గమనించి వస్తువుకు ఏది బాగుంటుందో దాన్ని ఎన్నుకోవాలి.మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం వ్యవసాయం చేసేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. పొలం దున్నేటప్పుడు, నాట్లువేసేటప్పుడు, పంట కోసేటప్పుడు, వడ్లు ఎత్తేటప్పుడు, ఇలా అడుగడుగునా కాయ కష్టం ఉంటుంది.ఎక్కువగా శ్రామికులు వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసినట్లయితే ఎన్నో కథా వస్తువులు దొరుకుతాయి. వాటిని అక్షరబద్ధం చేయగలిగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాంటి కథలల్లో మట్టి వాసన వుంటుంది.అందువల్ల అవి అందరికీ చేరువౌతాయి. అలాగే అంతరించిపోయిన కులవృత్తుల గురించి కూడా అద్భుతంగా కథలు రాయొచ్చు.అవి వాస్తవ జీవితాలు కాబట్టి అందరూ త్వరగా అక్కున చేర్చుకుంటారు .కాబట్టి యువరచయితలు ఆ దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

ప్రశ్న:22 ఈ నవల మూడు భాగాలుగా వస్తుందన్నారు మరి రెండవ,మూడవ భాగాలు ఎప్పుడు వస్తాయి,వాటిని గురించిన విశేషాలు చెప్పండి.
ఈ నవలలోని మొదటి భాగం నా చదువు పూర్తయ్యే వరకు ఉంటుంది. రెండో భాగం నా ఉద్యోగ జీవితం గురించి ఉంటుంది .నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే ఉద్యోగం వచ్చింది కదా ఇక జీవితం హాయిగా ఉంటుందనుకుంటారు, కానీ అందరి జీవితం ఒకేలా ఉండదు కదా! నా 34 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎన్నో మలుపులు,ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో మధుర స్మృతులు ఉన్నాయి.నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భీమా రెడ్డి అనే విద్యార్థి నేను బాగా చెప్పడంలేదని నా పైన ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేశాడు. అప్పుడు ప్రిన్సిపాల్ నన్ను పిలిచి సబ్జెక్టు పైన ఇంకా పట్టు సంపాదించుకోవాలని చెప్పాడు. అది సరైన కారణం కాదు అని నా అంతరాత్మకు తెలుసు.ఆ సమయంలో నేను విపరీతంగా బాధపడ్డాను. నేను నమ్ముకున్నది అధ్యాపక వృత్తిని. ఇంకా నేర్చుకోవాలనుకున్నాను. ఇంకా బాగా చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత ఒక ప్రశ్న ఎదురయింది నేను సరిగా చెప్పకపోతే సెకండ్ ఇయర్ వాళ్లు కూడా కంప్లైంట్ చేయాలి కదా! మరి వాళ్ళు ఎందుకు చేయలేదు. తర్వాత కాలంలో నా పైన ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ అబ్బాయి నాతో సన్నిహితంగా మెలిగాడు అప్పుడు నేను అతడిని అడిగాను. ఎందుకు కంప్లైంట్ చేసావని అప్పుడు అతను ఏమన్నాడంటే “మిమ్మల్ని రోజు తీసుకురావడం ఇబ్బంది అనిపించింది” అని. నా టీచింగ్ లో లోపం లేకపోయినందుకు నాకు సంతోషమేసింది. అయినప్పటికీ నేను పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు మొత్తం పాఠమే కాకుండా చివరి 15 నిమిషాలు నేను విపులలో చదివిన కొత్తకొత్త కథలు చెప్పే వాడిని,వాళ్ళని చర్చలోకి తీసుకొచ్చేవాడిని అప్పుడు పిల్లల లోపల ఆసక్తి బాగా కలిగింది. నా క్లాసును ఆసక్తిగా వినడం వాళ్ళ అలవాటయింది. ఇలాంటి మధురస్మృతులు, సమస్యలు ఉద్యోగ జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి కాబట్టి వాటి గురించి ఒక భాగంగా రాయాలనుకున్నాను. నేను 2012లో రిటైర్ అయ్యాను ఆ తరువాత సమస్యలు ఏముంటాయని మీరు అడగవచ్చు, కానీ ఆ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను రిటైర్ అయ్యాక సొంతూరికి వెళ్లిపోయాను అక్కడ పొలం వ్యవహారాలు చూసుకున్నాను కొత్త విషయాలను చేరవేసే పరికరాలు, అవకాశాలు విపరితంగా పెరగడంతో కొత్త విషయాలు నేర్చుకోవడంలో నిమగ్నమయ్యాను ఆ విషయాలన్నింటినీ మూడో భాగంగా (రిటైర్మెంట్ తరువాతి జీవితం 2012- 2022 వరకు)తీసుకు వస్తున్నాను. దాంతో ఈ నవల సమాప్తం అవుతుంది. నా నవల రెండవ భాగం ఈ సంవత్సరం (2023)చివర్లో రావచ్చు. మూడో భాగం తర్వాత సంవత్సరంలో(2024) వస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి పనులను కూడా ధూళిపాల అరుణనే చూసుకుంటుంది.

ప్రశ్న:23 మీరు మీ జీవితం ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటి?
జీవితం పూల పాన్పు కాదు. అందులో అంధుల జీవితం అసలే కాదు. ఎవరికైనా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. ప్రతి ఒక్కరూ ఒక గమ్యాన్ని ఏర్పరుచుకోవాలి. నిరంతరం ఆ గమ్యాన్ని చేరుకోవడం గురించి ఆలోచించాలి. అప్పుడే గమ్యాన్ని చేరుకోగలం. గమ్యం చేరడం కోసం చేసే ప్రయత్నం లోనే జీవితం విలువ తెలుస్తుంది. అవి ఇతరులకు పాఠాలుగా నిలుస్తాయి. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో చేయాలి. నిరంతరం జ్ఞాన సంపాదన కోసం కృషి చేయాలి. జ్ఞానవంతులని ఈ సమాజం గౌరవిస్తుంది.ఆదరపుర్వకకమైన మాటలే మనకు సన్నిహితుల్ని పెంచుతుంది. నేను డిగ్రీ లెక్చరర్ గా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో రీప్రెషరీ కోర్సు చేయడం కోసం 25 రోజులు అక్కడే ఉన్నాను. కొత్త వాతావరణం కాబట్టి నేను కొంత ఇబ్బంది పడ్డాను.అప్పుడు అప్పటివరకు పరిచయం లేని సహాధ్యాయినిలు ఝాన్సీ,మోహన శ్రీ గార్లు నన్ను చేతి పట్టుకొని సెమినార్ హాల్ కి తీసుకువెళ్లేవారు. నేను చాలా ఆశ్చర్యపోయాను నాలో వారు ఏం గమనించారో ఏమో కానీ వాళ్లు నాపైన ఎంతో అభిమానం చూపించారు.తర్వాత వాళ్ళు నాకు మంచి మిత్రులుగా మారిపోయారు.ఆ సమయంలో ఎంతో సహాయం చేసిన వారిద్దకి ధన్యవాదాలు.
ఈ సందర్భంగా చెప్పే మరొక విషయం ఏమిటంటే అంధుల సాహిత్యం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి.మొన్న నందిని సిద్ధారెడ్డి గారు ఉత్తర భారతదేశంలో జరిగిన సాహిత్య సభలకు వెళ్లి వచ్చారు. అక్కడ చాలామంది సాహితీ కారులను కలుసుకున్నారు.అక్కడ భిన్నమైన సాహిత్యం చర్చకు వచ్చిందట. అక్కడ అంధుల సాహిత్యం లేదని అన్నప్పుడు నాకు బాధ కలిగింది .అంధులు కూడా అద్భుతమైన సాహిత్యం సృజిస్తారు. వాళ్లను ఆదరించాలి,గౌరవించాలి. వాళ్లకు చూపు లేకపోయినా వాళ్లు సాహిత్యంతో సమాజానికి దారి చూపగలరు. వాళ్లను, వాళ్ల సాహిత్యాన్ని ఇకనైనా ఆదరిస్తారని నమ్ముతున్నాను.ఇక సెలవు.

July 13, 2023 144 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

” ఈ శ్రావణ మాసంలో……?

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) July 13, 2023
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

శ్రావణమాసాన్ని ఎంతో శుభప్రదమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు.కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లలుశ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని నోచుకుంటారు. అత్తవారు తమ కొత్త కోడలికి “శ్రావణపట్టి”ని తెస్తారు. సాధా రణంగా శ్రావణ పట్టీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం రోజున తెస్తారు. శ్రావణపట్టీలో కోడలికి నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలను కానుకగా తెస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజున పురోహితునికిచ్చే సంభావన, పూజ ఖర్చు, పేరంటం ఖర్చును అత్తవారే భరిస్తారు. వియ్యాలవారికి విందు భోజనం పెడతారు అమ్మాయిని కన్నవారు. శ్రావణ మంగళవారం నోములు, శుక్రవారం వరలక్ష్మీవ్రతం లాంటి పూజలతో ఆ నెలంతా అతి త్వరగా గడచి పోయినట్లనిపిస్తుంది.

శ్రావణంలో నాగపంచమిని జరుపుకుంటారు. మహిళలు పుట్ట వద్దకు వెళ్ళి పుట్టను పసుపు కుంకుమ, పూలతో పూజించి అగరు వత్తులను వెలిగించి ఆవుపాలను పుట్టలో పోస్తారు. పచ్చి చలిమిడి, పచ్చి చిమ్మిరి, అరటి పళ్ళను నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగ పంచమికి అధిదేవత నాగమాత. నాగమాతకు ఇష్టమైన తిథి పంచమి, పౌర్ణమికి ముందు వచ్చే పంచమినాడు. “నాగపంచమి”ని జరుపుకుంటారు.

ఆ మాత అనుగ్రహించి, వారికి ఫలాన్ని ప్రసాదిస్తుంది. సంతానం లేని వారు నాగపంచమి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తారు. ఆ మాత కరుణతో ఆ దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. తమకు నాగదేవత దయతో పుట్టిన సంతానానికి నాగ అనే రెండక్షరాలను చేర్చి పేర్లు పెడతారు, “నాగమణి, నాగ వర్ధిని, నాగరత్నం, నాగలక్ష్మి, నాగసాయి, నాగరాజు, నాగభూషణం, నాగకుమార్, నాగసూర్య, నాగశౌర్య, నాగప్రతాప్” లాంటి ఎన్నెన్నో పేర్లు పెడతారు. పిల్లలను ఆ నాగమాత బాలారిష్టాల నుంచి కాపాడుతుంది.

శ్రావణ మంగళవారంనాడు పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి శ్రావణమంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. శ్రావణమాసంలోని ప్రతి మంగళవారంనాడు గౌరీదేవిని పూజించి కథ చెప్పుకుని కాటుకను పెట్టి తోరణాలను కుడి చేతికి కట్టుకుంటారు. ముత్తయిదువులకు శనగలు, పళ్ళు, పసుపుకుంకుమ, పూలు వాయనంగా ఇచ్చి తాము పట్టిన కాటుకను వారికి ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి తల మీద అక్షింతలు వేయించుకుని వారి దీవెనలు పొందుతారు. వరలక్ష్మీవ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారంనాడు స్త్రీలంతా చేసుకుంటారు. మంగళగౌరీ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చేస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేస్తారు. తొమ్మిది రకాల పిండి వంటలతో, బ్రాహ్మణునికి, దక్షిణతాంబూలాలతో వాయన మిస్తారు. లేదా ఒక ముత్తయిదువుకు ఆ వాయనమిస్తారు. సాయంత్రం ముత్తయిదువులందరినీ ఆహ్వానించి పేరంటం చేస్తారు. వరలక్ష్మీదేవి అలంకారాన్ని ఎంతో అద్భుతంగా చేస్తారు. చిరుజల్లులు పడుతూంటే కొత్త చీరలను ధరించి నుదుటిన కుంకుమతో, పాదాలకు పసుపు, మెడకు రాసిన గంధంతో, తలలో పూలతో, చేతిలో శనగల మూటతో రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా, పవిత్రంగా, భక్తికి మన సంప్రదాయాలకు నిదర్శనంగా కనిపిస్తుంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్ర వారం వాడు వరలక్ష్మీవ్రతం చేయటానికి వీలు కాని సందర్భం ఏర్పడితే. ఆ మాసంలోనే మరో శుక్రవారంనాడు వరలక్ష్మీవ్రతాన్ని జరుపుకోవచ్చు.

శ్రావణ పౌర్ణమి కూడా ఎంతో విశిష్టమైన దినం,శ్రావణ పౌర్ణమినాడు రాఖీ పున్నమిగా అక్కాచెల్లెళ్ళు. జరుపుకుంటారు. అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల అను బంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ, అన్నదమ్ముల చేతికి రాఖీని కట్టి, హారతి ఇచ్చి, తీపిని తినిపిస్తారు అక్కా చెల్లెళ్లు. అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళకు కానుకలను ఇస్తారు. శ్రావణపౌర్ణమిని “జంధ్యాల పౌర్ణమి”గా చెప్తారు. ఉప నయనం అయిన బ్రహ్మచారులు, గృహస్తులు ఆరోజు తమ పాత జంధ్యాన్ని తీసేసి కొత్త యజ్ఞోపవీతాన్ని మంత్ర సహితంగా ధరిస్తారు. శ్రావణ పౌర్ణమిని “శరత్ పౌర్ణమి”గా చెప్తారు. శ్రావణపౌర్ణమి లేదా ఏకాదశినాడు సత్య నారాయణ వ్రతాన్ని చేస్తారు. శ్రావణపౌర్ణమినాడు షిరిడీ వాసుడైన బాబా పాదుకలకు నమస్కరించి బాబా వారి ఆశీర్వాదాన్ని పొందుతారు భక్తులు.

ఈ మాసంలో పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం వస్తుంది. కృష్ణపక్షమి మొదలయ్యాక వచ్చే అష్టమినాడు. అర్ధరాత్రి సమయంలో రోహిణీ నక్షత్ర సమయాన శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుని అవతారంగా భువిలో ఉద్భవించాడని భక్తులందరూ నమ్ముతూ ఎంతో వైభవంగా “శ్రీకృష్ణాష్టమి”ని జరుపు కుంటారు. కృష్ణాష్టమిని పర్వదినంగా భావిస్తూ శ్రీకృష్ణుని పూజ తొమ్మిది లేక పదకొండు రకాలైన పిండి వంటలతో నైవేద్యాన్ని ఆ దైవానికి సమర్పిస్తారు. బాల కృష్ణుడు తమ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా భావిస్తూ చిన్న చిన్న పాదాలను బయట నుంచి లోపల వరకూ తీర్చి దిద్దుతారు. సాయంత్రం శ్రీకృష్ణుని పూజించి బాలకృష్ణుని ఊయలలో పవళింపచేసి పాటలు పాడుతూ ఊయలను ఊపుతారు. బాలబాలికలను శ్రీకృష్ణుడు, గోపికల వేషాలతో అందంగా అలంకరిస్తారు. వారి చేత నాట్యం చేయిస్తారు. రాసకేళి రంగులు చల్లుకోవటం జరిపిస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉట్టి కొట్టే వేడుకలో పాల్గొం టారు. ఈ విధంగా శ్రావణ మాసమంతా ఎన్నెన్నో పండుగలు, వ్రతాలు, పూజలు, విందు భోజనాలతో. ఆనందంగా, ఉత్సాహంగా గడచిపోతుంది.

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పౌర్ణమి చంద్రుడు

by కందుకూరి శ్రీరాములు July 13, 2023
written by కందుకూరి శ్రీరాములు

ఉస్మానియా !
నీలో ఎన్ని వేల నెలవంకలు రూపుదిద్దుకొని వెన్నెలలు విరజిమ్మే నిండు పున్నమలయ్యాయో ?

ఉస్మానియా !
నీలో ఎన్ని వేల గాలి తరంగాలు హోరెత్తి కుళ్ళును పారదోలే తుఫానులయ్యాయో !

ఉస్మానియా !
నువ్వో ప్రేమ జలపాతానివి వందయేళ్లలో
ఎన్ని వేల శిలలు నీలో తడిసి శిల్పాలయ్యాయో !

కదిలిపోయే పూల తోటలున్నట్టు –
ప్రేమ యుద్ధాలకు సైనిక గుడారాలున్నట్టు –

ఏ చెట్టు కిందనో
పచ్చిక గడ్డిమీదనో
కాలేజీ మెట్టు మీదనో
రాతి గద్దె మీదనో
సేద తీర్చుకుంటూ వాళ్లు

ఆర్ట్స్ కాలేజ్ – ఒక కళ
ఒక కల
ఒక ఉత్సాహం
ఒక ఉద్వేగం

క్యాంపస్ రోడ్లమీద నడిచినప్పుడు తబలాలై మోగినట్లు –
ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కుతుంటే
విణాతంత్రులై మీటుతున్నట్లు –
లైబ్రరీలో మౌనంగా కూర్చుంటే
కొండల మధ్య
తపస్సు చేస్తున్నట్లు –
క్లాసులో పాఠాలు వింటుంటే
గీతోపదేశం బోధపడుతున్నట్లు –

ఋషులు వేదాలన్నీ పునాదిలో దాచిపెట్టినట్టు

ఉస్మానియా….ఉస్మానియా…

ఎన్నో దిక్కుల నుండి
అక్షరాల పూలు దండలుదండలుగా
వచ్చిన విద్యార్థులు మేధావులైనట్టు

ఉస్మానియా…..ఉస్మానియా….

కవుల కల్పనా జగత్తులో
వెలుగుల జ్ఞానుల నెలవంకలునిండు కొలువుదీరినట్లు

ఉస్మానియా…. ఉస్మానియా….

కదులుతున్న మేఘాలతో
మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలతో
ఆర్ట్స్ కాలేజ్ ఆకాశం మీద
దివ్యంగా వెలుగుతున్న నిండు
పౌర్ణమి చంద్రుడు ఉస్మానియా !

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రాచమల్లు రామచంద్రారెడ్డి(రా.రా)

by Cheedella Seetha Lakshmi July 13, 2023
written by Cheedella Seetha Lakshmi

రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య రంగంలో శ్రీ శ్రీ వలె రా రా గా రెండక్షరాల పేరుతో ప్రసిద్ధి చెందాడు.కథకుడు,సాహితీ విమర్శకుడు,పత్రికా సంపాదకునిగా  ప్రఖ్యాతి గాంచాడు.

ఈయన రచించిన గొప్ప కథలు “అలసిన గుండెలు.” “అనువాద సమస్యలు”,” సారస్వత వివేచన”అనేవి సాహిత్య గ్రంథాలు.”సారస్వత వివేచన” గ్రంథానికి ఉత్తమ విమర్శనా గ్రంథంగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

రారా లేఖల్లో వ్యక్తిగత విషయాలు,ఆలోచనా వైఖరి,సాహిత్య విమర్శ,ఉద్యోగ జీవితం మొదలగు అనేక విషయాలు తెలుస్తాయి.సాహితీమిత్రులకు రాసిన లేఖల్లో రా.రా.హృదయం విప్పి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తేల్చి చెప్పడం ప్రత్యేక లక్షణంగా గమనించవచ్చు.రా.రా తన కష్టసుఖాలను మిత్రులతో పంచుకోవడానికి లేఖలు ప్రముఖంగా ఉపయోగపడ్డాయి.దేశంలో ఉన్నప్పుడే కాక విదేశాలలో ఉద్యోగరీత్యా వున్నప్పుడు కూడా విదేశాలనుండి మిత్రులకు లేఖలు రాశారు.

ప్రత్రికారంగంలో ఉద్యోగాలు చేసినట్లుగా లేఖలవల్ల తెలుస్తుంది.విశాలాంధ్ర దినపత్రికలో పనిచేస్తూ ‘ విజయవాడ వాతావరణం’ సరిపడక గుమస్తా మాదిరి ఆఫీసు పనిచేయలేక రాజీనామా చేసి వచ్చేస్తున్నానని గోవిందరెడ్డికి రాసిన లేఖలో తెలిపాడు రా.రా.

‘ సంవేదన” పత్రికపై వచ్చిన ప్రశంసలు,విమర్శల గురించి రాస్తూనే వ్యక్తిగత విమర్శ వుందని, పత్రిక నిండా రారా వుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయని గోవిందరెడ్డికి రాసిన ఉత్తరంలో తెలిపాడు.”దేశంలోని రచయిత ఎవ్వరూ తమ రచనలు పంపడం లేదు గనుకనే నేను రాయవలసి వస్తున్నది.అని రచయితలపై విరుచుకుపడ్డాడు.తను ఇచ్చే విరాళం తగ్గితే పత్రిక స్థాయి తగ్గిపోతుందని,సంవేదన” దేశంలో సంచలనం కలిగించి ప్రముఖుల చేత ప్రశంసింపబడినప్పటికి ఇదొక విషమ పరిస్థితి అని వాపోయాడు.

” సంవేదన” పత్రికలో సంపాదకునిగా వున్నప్పుడు మిత్రులతో కొన్ని సమస్యల నెదుర్కొన్నాడు.”సాంబుడు” వ్యాసం రాసి పత్రికలో అచ్చు వేయమంటే యథాతథంగా అచ్చువేయడం సాధ్యంకాదని,ఇంటలెక్చ్యుయల్,లిటరరీ స్థాయి లేని వ్యాసాన్ని ఉన్నదున్నట్లు ముద్రిస్తే ” సంవేదన” స్థాయి పడిపోతుందన్న ఆవేదనను వ్యక్తం చేశాడు.సాంబుడికి ,రారా కు మధ్య వాగ్వివాదం చెలరేగి చివరకు సాంబుడు వ్యాసంలో కొన్ని విషయాలు కట్ చేయడానికి ఒప్పుకున్నాడు.తరువాత తనపై ఆరోపణలు వస్తే సహించే స్వభావం లేదు రారాకు.

జయరాంకు రాసిన ఉత్తరంలో వివరాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం అన్యాయమని ” ఆరోపణలు చేసేవాడు తన సుహృద్భావాన్ని ఎదుటివాడు శంకించకుండా ఆరోపణలు చేయవచ్చు.కానీ నీవా జాగ్రత్తలు తీసుకోలేదని…ఆయన్ను యెందుకు దింపుతారు యీ రొంపిలోకి అనడం వాళ్లకేకాదు నాకు కూడా గౌరవప్రదంకాదు”. అని రాయడం వల్ల తనపై ఆరోపణలు వస్తే సహించే స్వభావం కాదని,వాతల్లాంటి సమాధానాలు చెప్పేవాడని తెలుస్తుంది.

తన స్నేహం ఎంత గొప్పదో వివరిస్తూ ” ఒకరి నొకరు నూరు మాటలు అని,అనిపించుకొని కూడా పరస్పర సుహృద్భావానికి ఏ మాత్రం భంగం కలగకుండా వుండే “సాన్నిహిత్యం” వుంది అంటూ జయరాంకు సమాధానం రాస్తూ సంస్కారరహితమైన మీ ఉత్తరాల యుద్దాన్ని అరికట్టే శక్తి నాకు లేకపోయినందుకు లోలోపలనే సిగ్గుపడడం తప్ప నాకు మార్గాంతరం ఏమైనా వుందా?” అంటాడు.

మాస్కోకు వెళ్లిన తర్వాత ” సంవేదన” పత్రిక ఆగిపోయిందని తెలుసుకొని రమణారెడ్డి రాసిన ఉత్తరంలో ” సాహిత్య పత్రికలన్నింటికి ఉన్న జబ్బే దానికి మొదటినుండి వున్నది. డబ్బు కొరతకంటే ముఖ్యన్గా మ్యాటర్ కొరత ప్రతి సంచికకు వంద పేజీలు  నింపడం సమస్యగా ఉండేది.పత్రికలో సగం పేజీలు ఎన్నాళ్ళని నేనే నింపగలను చెప్పండి….ఎన్ని తంటాలు పడినా తగినంత ప్రోత్సాహము వుండేది కాదు.పైగా కొన్ని విషయాల్లో మనవాళ్లతోనే తగవులు తెచ్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడేవి.” అంటూ తన మానసికావేదనను,తాను పడిన కష్టాలను చెప్పుకున్నాడు ఉత్తరాల్లో. పత్రిక నడపడంలో కష్టనష్టాలు తెలుపడం వలన ఏకాలంలో నైనా పత్రికకు రచనల ఆవశ్యకత,అవసరం కూడా ఎంతటిదో తెలుస్తుంది.

రారా మాస్కోకు అనువాదకుడుగా వెళ్ళాడు.మాస్కోలో పరిస్థితిని వివరిస్తూ విశ్వంకు ఉత్తరం రాశాడు. అక్కడ చలి ఎక్కువైనప్పటికి”0″ డిగ్రీ ఉన్నప్పటికీ ఆరోగ్యాలు చెడలేదని, తన ఇల్లు 8 అంతస్తుల భవనంలో మూడవ అంతస్తులో ఉందని తెలిపాడు తిండికి ఏ ఇబ్బంది లేదనీ,బియ్యం ముతకగా ఉన్న రుచిగా ఉండేవని, ఉల్లిగడ్డలు దండిగా దొరుకుతాయని,పాలు పెరుగు చౌక అనీ, మొదటి నెల 250 రూబుళ్లు,పని పరిమాణాన్నిబట్టి ఇంకా ఎక్కువే డబ్బు ఇవ్వడం జరుగుతుందని వివరించాడు.

వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువని,అమూల్యమైన కాలం వృధా అవుతుందనే బాధను వ్యక్తం చేశాడు 

మిత్రులకు ,ఆప్తులకు దూరమైన బతుకులో జాబులే గదా అప్పుడప్పుడు కాస్త ఊరట కలిగించేది అని అంటాడు.” రష్యా భాష రాక వీధుల్లో చెవిటి మూగ వాళ్ళు మాదిరి తిరగడమూ,విశ్రాంతి లేకుండా పని చేయడమూ…ఇవన్నీ ఎలాగైనా భరించవచ్చు గానీ,మనసు విప్పి మాట్లాడుకోడానికి ఆప్తుడన్నవాడు లేకపోవడం భరించడం కష్టం” అని ఆవేదన చెందాడు.

జయరాంకు రాసిన ఉత్తరంలో కూడా మాస్కోలో తను పడే కష్టాలను వివరించాడు.తన మనసులోని బాధ కొంతైనా వ్యక్తం చేయడం అవసరమని రాస్తూ ” ఈ గాడిద చాకిరి’, యీ నిప్పులకుంపటి లాంటి చలీ ,పలకరించే దిక్కు లేకపోవడమూ,చదువుకోవడానికి ఏమీ లేకపోవడమూ…అన్నింటికీ తోడు ఇండియా నుండి జాబులు సరిగా రావు.మిత్రుల అడ్రసులు తెలుసుకోవడం కూడా గగనమైంది.ఈ నా బాధ.” అంటూ తను అనుభవించిన భయంకరమైన ఒంటరి తనాన్ని ,మానసిక ఆవేదన మిత్రునికి వ్యక్తం చేశాడు

“మాస్కోలో లెనిన్ భజన చేయడం తప్ప మార్క్సు,ఎంగేల్స్ ను ప్రస్తావించడం తక్కువని అంటూ యిక్కడి జనం మంచివాళ్ళు, గోమాతల వంటి సాధువులు ఈర్ష్యా అసూయలు,చిల్లర దగాలు,వంచనలు చాలా చాలా అరుదు విదేశీయులను గౌరవంతోను,సానుభూతితోను మాత్రమే కాదు,ఒక ప్రీతితో కూడా చూస్తారు ” అని సంఘ పరిస్థితిని ,మాస్కోలో జనం యొక్క మృదువైఖరిని రమణారెడ్డికి రాసిన లేఖలో తెలియ జేశాడు.

రమణారెడ్డి రా.రా ను విమర్శిస్తూ “ఆయన సోవియట్ యూనియన్ లో ఒక ఉద్యోగి, ఆయన నౌకరికి ప్రమాదం వస్తే ఎట్లా,రాజకీయాలను గురించి” ఉత్తరాల్లో రాయవద్దన్నాడు. సోవియట్ యూనియన్ పై ఈగ కూడా వాలనివ్వని రారా సహించలేక రమణారెడ్డికి రాసిన జాబులో ” నన్ను గురించి మీకు యింత నీచమైన అభిప్రాయం వుంటే నాతో మీరెలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారో అర్థం కావడం లేదు.” అని నిశితంగా సమాధానం చెప్పాడు.

విశ్వంకు రాసిన ఉత్తరంలో మాస్కోలో తన జీవన విధానాన్ని గురించి వివరించాడు. “లెనిన్ ప్రొలేటేరియన్ ఇంటర్నేషనలిజం ,గోర్కీ కథలు అనువాదం చేసినట్లు తెలుపుతూ జీవితం డల్ గా ఉందని, తిండికి బట్టకు లోటు లేకపోయినా జీవితం యాంత్రికంగా, ఒక్కోసారి బేజారుగా కూడా ఉందని అన్నాడు.మాస్కోలో విచిత్రమైన విషయం పరదేశాల పుస్తకాలు దొరక్కపోవడం,సోషలిస్టు,పెట్టుబడి దారీ పుస్తకాలు మాత్రమే లభ్యమౌతాయనీ,అక్కడ యూనివర్సిటీలలో బేరీజు వేయడం బుద్దివాదం.” అంటూనే

 “ప్రేమ అనేది ఎప్పుడు హృదయ వ్యాపారంగానే ఉంటుందని,కె.కె.తన కథల్లోని పాత్రలనూ,సన్నివేశాలనూ ఎప్పుడూ హ్యూమన్ యాంగిల్ నుండే చిత్రిస్తాడు. కాబట్టి “హృదయవాది” అని అంటారు.కె.కె.కథలో సెక్స్ అనేది కేవలం శరీర వ్యాపారం కాదని,సెక్స్ లో హృదయానికి ప్రముఖస్థానం ఉండాలనే చెప్పబడుతుందంటాడు. కె.కె.హృదయవాది అని ఘంటాపథంగా వక్కాణించాడు.

రచనలు పాఠకుల హృదయాన్ని తాకాలన్న నిర్వచనం చెప్పాడనుకోవచ్చు.

గురజాడ అంటే రారా కు ఇష్టమని లేఖలద్వారా తెలుస్తుంది.గురజాడ మీద అవాకులు చవాకులు ప్రేలేవాళ్ళు అ.ర.సంలో ప్రముఖులైనారు అంటాడు వీరేశలింగం ఎంత గొప్పవాడైనా గొప్ప ఉద్యమకారుడు మాత్రమే.గొప్ప సంస్కర్త మాత్రమే మరి గురజాడ పోలికే లేనంత గొప్పవాడు.ఆయన రచనలు ( డైరీలతో సహా) చదివితే ఆయన యెంత గొప్ప మేధావి అయిందీ, సృజనాత్మక రంగంలో యెంత మహా రచయిత అయిందీ,హృదయ పరిపాకం విషయంలో యెంత మహాపురుషుడు అయిందీ తెలుస్తుంది.గురజాడను గురించి సరియైన సమగ్రమైన అవగాహన’ అవసరాల’ కు లేకపోగా ‘పురాణం”కు కూడా లేకపోగా,కనీసం ఒక పరిశీలకునికైనా లేకపోవడం నాకు బాధ కలిగించింది.” అని మల్లారెడ్డికి రాసిన లేఖలో తెల్పడం వల్ల రా.రా కు గురజాడను అంచనా వేసే తీరు, ఒకరిని విమర్శించేటప్పుడు వారి సాహిత్యంపై సంపూర్ణ అవగాహన ఉండాలన్న అభిప్రాయం తెలుస్తుంది.

చలాన్ని’ఆంధ్రాశరత్’ అనడం అర్థం లేని మాట అంటాడు రా.రా.ఇద్దరి రచనల్లోను స్త్రీలకు ప్రాముఖ్యం వుండటం తప్ప మరే పోలికా లేదని,శరత్ బాబులో  లోతు లేదని చలమే ఒకచోట అన్నాడని,తెలుగు రచయితలలో కొందరు చలాన్ని అనుసరించబోయి ,అనుకరించబోయి (లత,రంగనాయకమ్మ) బూతు కథలు రాశారు అని విమర్శించాడు.

మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో మీ వ్యాఖ్యానాలతోనూ,వివరణతోనూ నేను ఏకీభవించని సందర్భాలున్నాయని ఖచ్చితంగా చెప్పాడు.సింబాలిజం గురించి రామకృష్ణ చేసిన ఊహలు,వివరణలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నాడు ” శ్రీ శ్రీ ని పొగడడానికి అడ్డుదారులు,వక్రమార్గాలు అక్కరలేదు గదా ” అని రాస్తూనే గేయాలను ప్రతీకలుగా కాక స్వతహాగానే ఎంతో అర్థవంతంగా చూస్తే మంచిదని ప్రతీకావాదము పేరుతో శ్రీశ్రీ గేయాలను పొడుపుకథలుగానూ,ప్రహేళికాలు మార్చకండి అని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

వి.వి.యస్ మూర్తికి రాసిన ఉత్తరంలో అనువాదపద్ధతిని వివరిస్తాడు రా.రా  ఒక భాషలో నుండి వేరే భాషలోకి అనువాదం చేసేటప్పుడు (తెలుగు నుండైనా,ఇంగ్లీషు నుండైనా) మూలాభాషలోని పదానికి గల విలక్షణస్వభావాన్ని బట్టి లక్ష్య భాషలోకి అనువదిస్తే బాగుంటుంది.” అని సూచనలిస్తూ ఏ భాషలోనైనా అనువాదం చేయాలంటే ఆ భాషపై అనువాదకునికి అధికారం ఉండాలి  అనే భావన కలిగినవాడు  భాషపై సంపూర్ణ అవగాహన ,పట్టు ఉన్నప్పుడే అనువాదం చేయడం సులభమౌతుంది.

‘ నవీన్: గారికి రాసిన ఉత్తరంలో తన గురించి ప్రజల్లో వుండే అభిప్రాయాన్ని ఇలా వివరించాడు.నిజానికి నా విమర్శలు వ్యక్తిగతంగా, అనాగరికంగా,ద్వేషాపూరితంగా ఉన్నాయనే అభిప్రాయం ” ఉందని రాస్తూ కాళోజిమీద రా.రా.సమీక్ష “రాక్షసం” అన్నవాళ్ళున్నారని అంటాడు.” అద్దేపల్లి” ని కూడా అంతకంటే తీవ్రమైన మాటలు అన్నానని ” ఈనాడు తెలుగు సాహిత్యంలో జరుగుతున్న ఘోరకృత్యాలు చూసినప్పుడు యెంత విజయసంపన్నునికైనా ” ఆరోగెన్స్” కలుగుతుంది.తెలుగు సాహిత్యానికి జరుగుతున్న ఘోరమైన అపచారాలు చూసినప్పుడు ” చాలా బాధ కలుగుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అనర్హమైన తెలుగు వాళ్లకే అవార్డులిచ్చిందని, అకాడమీల ద్వారా జరిగే యీ కృషితో తృప్తిపడని భారతపెట్టుబడిదార్లు ఇటీవల “జ్ఞానపీఠం” అనేది ఒకటి స్థాపించి కేవలం సాహిత్య సేవాదీక్ష అంటూ భ్రమపడతారని విమర్శిస్తాడు.నా ఆగ్రహం కేవలం ఇంటపరేట్ ఎమోషన్ కాదు పార్ట్ ఆఫ్ ది డెలిబరేట్ పాలసీ అని కన్ఫం చేస్తున్నాను.మెత్తగా చెప్పడం చాతగాక కాదు గట్టిగా ఘాటుగా చెప్పడం వల్ల నాకు పర్సనల్ గా చెడ్డపేరు వస్తే రావచ్చు కానీ,నేను కోరిన ఫలితాలు లభిస్తాయని నమ్ముతున్నాను.” అని చెప్పుకున్నాడు.

ఏదైనా ముక్కుసూటిగా విమర్శించే మనస్తత్వం. దాపరికం అనేది లేదు ఎదుటివాడు ఏమనుకొన్న పట్టించుకునే తత్వంకాదు మనసులోని విషయం బాధ కలిగించుకునేదైనా సరే,చెడ్డ పేరు వచ్చినా సరే ఖండితంగా చెప్పేయడమే రా రా తత్వం అని తెలుస్తుంది.

తెలుగు సాహిత్యానికి చెడ్డరోజులు వచ్చాయని,వట్టి నినాదాలు ” అభ్యుదయకవిత్వంగా ఒకప్పుడు చలామణి అయ్యాయని” అంతకంటే ఘోరమైన దిగంబరబూతులు విప్లవ కవిత్వంగా శ్రీశ్రీ లాంటి వాళ్ళచేత ఆమోదింపబడడం…. విప్లవకవిత్వం పేరుతో ఇంకెంత ఘోరాలు జరుగుతాయో తలచుకుంటే నాకు భయమౌతుంది .” అని రాస్తూ రమణారెడ్డికి రాసిన లేఖలో తన మనసులోని ఆందోళనను వెల్లడించాడు కాళోజీ తను చేసే విమర్శకు అర్హుడని అంటాడు 

రమణారెడ్డికి రాసిన ఇంకో లేఖలో ” ఆయనతో మీకు గల వ్యక్తిగత సంబంధాలను బట్టి నా విమర్శ బాధ కలిగించవచ్చు గానీ,వెల్ అనే పదానికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఇంగ్లీషు కవిత్వాన్ని అనువదించడానికి పూనుకోవడంలోని దురహంకారం …తెలుగుదేశంలో… కానీ వాళ్ళందరూ ఒక టన్ను ఫోజు పెట్టి ఒక తులం యోగ్యతైనా వున్న వాళ్ళు,అరతులం యోగ్యత కూడా లేకుండా  ఐదు టన్నుల ఫోజు పెట్టిన వాడు నా ఎరుకలో కాళోజీ ఒక్కడే…నా బోటి వాడెవడైనా కాళోజీ నిజమైన యోగ్యత ఎంతో వెల్లడిస్తే అది రాక్షసమంటారు “అని కుండబద్దలు కొట్టినట్లు వ్యక్తం చేశాడు.

అభ్యుదయకవిత్వమంటే ఎట్లా ఉండాలి? అభ్యుదయ రచయిత అంటే ఎవరు? అనే వానికి జయరాంకు రాసిన లేఖలో చక్కని వివరణ యిచ్చాడు. అభ్యుదయ రచయితకు మార్క్సిజం లోతుగా, రాజకీయ పార్టీల నాయకులకు తెలిసినంత సమగ్రంగా తెలియనక్కరలేదంటే తనకేమీ అభ్యంతరం లేదని,”శ్రీ శ్రీ తనకు మార్క్సిజం తెలియదని అన్నాడంటే తనకు గాని,తన రచనలో గాని ఆ దృక్పథం లేదని అర్థం కాదు గదా తనకు సరిగా తెలియదని మాత్రమే అర్థం ” అని సోదాహరణంగా వివరించాడు.

మనవి బూర్జువా డేమోక్రటిక్ ఆశయాలు కావు .మనం పెట్టుబడిదారీ దశలో వున్నాం ఇప్పుడు మనకుండవలసిన ఆశయాలు సోషలిస్టు విప్లవానికి సంబంధించినవి మన సాహిత్యచరిత్రలో ‘భావకవిత్వం’ బూర్జువా డెమొక్రటిక్ విప్లవానికి సంబంధించినది.ఆ కవిత్వం అడుగంటిదంటే ఆ చారిత్రకదశ గడిచిపోయింది.కానీ ” ఈనాడు సోషలిస్టు భావాలు,కార్మిక డిమాండ్లు ప్రతిబింబించని సాహిత్యం అభ్యుదయ సాహిత్యం కాలేదు.ఏమైనా ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏమిటంటే అభ్యుదయ సాహిత్యంలో  ఈనాడు పెట్టుబడి దారీ వ్యతిరేక ధోరణి ఖచ్చితంగా వుండాలి మరి యీ ధోరణి ఖచ్చితంగా ఉండాలంటే రచయితకు మార్క్సిజంతో అంతో ఇంతో పరిచయం వుండాలి కనీసం ఒక్క స్థూలమైన మార్క్సిస్టు అవగాహన వుండాలి. అది లేకపోతె రచయితలో,రచనలలో రాజీ ధోరణులూ ,పెడధోరణులూ ఆస్పష్ట మానవతావాద భావాలు ప్రవేశిస్తాయి.తెలుగుదేశంలో వున్నది ఈనాడు యింకా ప్రధానంగా వ్యావసాయిక సమాజమే.కానీ యీ సమాజంలోని సమస్యలను కూడా బూర్జువా డెమొక్రటిక్ దృష్టితో కాక మార్క్సిస్టు దృష్టితో చూడగలవాడే ఈనాడు అభ్యదయ రచయిత కాగలడు.” అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించాడు మార్క్సిస్ట్ భావాలు గల రా.రా.

రమణారెడ్డికి రాసిన లేఖలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల తెలుగు సాహిత్యం నష్టపడిందనే భావన వ్యక్తం చేశాడు.

రాజకీయ విషయాలను స్పృశిస్తూ తన లేఖలో కమ్యూనిజం ఆత్మను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు జెక్ రచయితలని చెప్తూ మరొకసారి ‘స్టాలినిజం’ అనే ఘాతుకభూతం యీ భూమండలం మీద యెక్కడ తలయెత్తినా యిక కమ్యూనిజానికి పుట్టగతులుండవు.కమ్యూనిజం వంద యేండ్లు ఆలస్యమైనా సరే స్టాలినిజం యే దేశంలోను రిపీట్ కాకూడదనే నా గాఢమైన కాంక్ష.” అంటూ అధికారంలో ఉన్న కమ్యూనిస్టు నాయకుల మాటలను నమ్మవద్దంటాడు.

రామమోహన్ కు రాసిన ఉత్తరంలో మానసిక శాస్త్ర విధానంపై విమర్శ ఉంది.దీనిపై రా.రా విమర్శనావిధానం ఎలా వుందో గమనిద్దాం.” ఉదాహరణకు భౌతిక పరిస్థితులనుబట్టి మనిషి మారతాడని బూర్జువా శాస్ర్తజ్ఞులు గుర్తిస్తారు.కానీ మనిషి అంటే ఏమిటి ? అన్నప్పుడు వాళ్ళు ఒక నిత్యసత్యమైన నిర్వచనం ఇచ్చుకుంటారు.ఈ పదిలక్షల ఏండ్లలోనూ మనిషి ఎంతగానో మారినాడని అంగీకరిస్తారు గానీ ” మనిషి” అనదగిన మూల పదార్థం ఏదో అది శాశ్వతంగా,పరిణామరహితంగా వుందని అనుకుంటారు.మన ” డైలక్టికల్ అండర్ స్టాండింగ్” ప్రకారం మనిషి ఎల్లప్పుడూ చారిత్రకపరిస్థితుల శిశువు మాత్రమే.” అని వివరించాడు.

భావ, భాష విషయంలో కూడా రా.రా ఒక అభిప్రాయాన్ని తెలుపుతూ విశ్వంకు రాసిన లేఖలో ఇలా వివరించాడు.” కడపజిల్లా నుడికారం నాకు సంతోషమే కలిగిస్తుంది.కానీ ,మరీ “గ్రామ్యం ” లో రాస్తే  పాఠకుల్లో అత్యధిక భాగానికి అర్థం కాకపోయే ప్రమాదం వుంది. రా.వి.శాస్త్రి విశాఖపట్నం గ్రామ్యంలో రాసిన కొన్ని కథలు నాకు విసుగు కలిగించాయి.అలాగే తెలంగాణ వాళ్ళు తెలంగాణ గ్రామ్యంలో  రాస్తే మనము అసలు చదవలేము గదా.కనుక ఈ విషయంలో రాజీ అవసరం.లాజికల్ ఎండ్ కు పోకుండా రీజనబుల్ లిమిట్స్ తో ఉండడం మంచిది.వాక్యం బిగువుగా ఉండడం ముఖ్యం.” అని రాశాడు ” గిడుగు గురజాడలు చెప్పింది శిష్టవ్యావహారికము” అని చెప్పాడు.

రా.రా.లేఖలను పరిశీలించి నట్లయితే తేలే అంశమేమంటే ఆయన స్పృశించని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన, మార్క్సిస్ట్ దృక్పథం, సాహిత్య విమర్శ, సోపపత్తిక విమర్శ,గురజాడ,శ్రీశ్రీ లపై మంచి అవగాహన,కాళోజీపై విమర్శల వర్షం ఇలా ఎన్నెన్నో భావాలు ఈయన లేఖల్లో చోటు చేసుకున్నాయి.

సునిశితపరిశీలన,తన కటువైన విమర్శ ఎదుటివారికి బాధ పెట్టినా సరే ఖండించే వైఖరి మొదలైన వెన్నెన్నో రా.రా.లేఖల్లో కనిపించే ప్రముఖ లక్షణాలు.

తెలుగునాట సామూహికంగా ఆయన విమర్శకు గురైన వేత్తలు ఎందరో ఉన్నారు.సాహిత్య విమర్శకు కొత్తబాటను వేసిన వాడుగా రా.రా.ను పేర్కొనవచ్చును.నిశితంగా  విమర్శించడం,చెప్పదలచుకొన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం రా రా.కే చెల్లింది.

ఉదాహరణకు

” నక్కలు బొక్కలు వెదకును

అక్కరతో నూరబంది  అగడిత వెదకున్

కుక్కలు చెప్పులు వెదకును

టక్కరి నా లంజకొడుకు తప్పులె వెదుకున్” ప్రాచీన కాలంలో కవి అన్నట్టు తప్పులే వెతికేటి కుహనా విమర్శకులను నిర్దాక్షిణ్యంగా దుయ్యబట్టాడు.

రా రా అనువాద పద్ధతిని,సమీక్షా వైఖరిని తన లేఖల్లో సూచించాడు., ఆయన అనువాద పద్ధతులను లోతుగా అధ్యయనం చేశాడు. ఆయన రచించిన ” అనువాద సమస్యలు” గ్రంథం యువరచయితలకు,జర్నలిజం విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుంది.

ప్రత్రికారంగంలో ఆయనెదుర్కొన్న సమస్యలు ,విదేశంలో ఆయన జీవన విధానం,ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు రా రా తన లేఖల ద్వారా వెల్లడించాడు.

శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాస రావు) ,కొ కు( కొడవటిగంటి కుటుంబరావు) తర్వాత తెలుగు నాట రెండక్షరాల సంక్షిప్త నామంతో ఎంతో ప్రసిద్ధి చెందిన రా రా( రాచమల్లు రామచంద్రా రెడ్డి) వ్యక్తిగత అభిప్రాయాలు,విమర్శనా వైఖరి,ఆలోచనా సరళి మొదలగు ఎన్నో విశేషాలు లేఖల ద్వారా తెలుసుకోవడం సాహిత్య ప్రపంచంలో రా.రా కు ప్రముఖస్థానం ఉందనడానికి లేఖలే నిదర్శనం..

రారా.జీవనరేఖ

రా.రా గా ప్రసిద్ధి చెందిన రాచమల్లు రామచంద్రా రెడ్డి  కడప జిల్లా పైరిపాలెం గ్రామంలో  ఆదిలక్ష్మి,భయపురెడ్డి దంపతులకు  28 ఫిబ్రవరి 1922 సంవత్సరంలో జన్మించాడు.

పులివెందుల హైస్కూల్ లో స్కూల్ చదువు పూర్తి చేసి అనంతపురంలో ఇంటర్ మీడియట్ ,

చెన్నై లోని గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో గాంధీజీ నిరాహార దీక్షకు మద్దతుగా సమ్మెలో చేరినందుకు కాలేజీ నుండి యాజమాన్యం రా.రా ను తొలగించింది.యాజమాన్యం వారికి క్షమార్పణ చెపితే కాలేజిలో తీసుకుంటామంటే అందుకు నిరాకరించాడు.దేశభక్తి కలిగిన రా.రా తర్వాత విశాలాంధ్ర పత్రికలో ఉపసంపాదకునిగా పనిచేశాడు.మార్క్సిజం వైపు ఆకర్షిపబడి దృక్పథాన్ని వంటపట్టించుకున్నాడు.

   “సంవేదన” అనే పత్రికను నడిపాడు.తర్వాత రష్యా కు వెళ్లి అక్కడ మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో 6 సంవత్సరాలు అనువాదకునిగా పని చేశాడు.

ఆ సమయంలో మార్క్స్,ఎంగెల్స్ సంకలిత రచనలు, లెనిన్‌ సంకలిత రచనలు, పెట్టుబడిదారీ అర్థశాస్త్రం, గోర్కీ కథలు, చేహావ్‌ కథలు మొద లైన రష్యన్‌ గ్రంథాలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి సరళమైన తెలుగులో అనువదించారు. మాస్కోలో సంపాదించిందంతా కడపలోని ‘హోచిమిన్‌’ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు.

  తర్వాత ఇండియా వచ్చి 1977 నుండి ఈనాడు పత్రికలో సంపాదకునిగా పని చేసారు.

 రా.రా.అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు. గొప్ప కథా రచయిత.ఆయన రాసిన 12 కథలు అలసిన గుండెలు

పేరుతో కథాసంకలనంగా వెలుగులోకి వచ్చింది.

,  గొప్ప జర్నలిస్ట్,ప్రముఖ అనువాదకుడు మంచి విమర్శకుడు అయిన రా.రా అనువాద సమస్యలు  అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.

సారస్వత వివేచన గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది.

  విమర్శకు దారిదీపం అయినటువంటి  రా.రా విమర్శను సాహితీ ప్రక్రియగా అభివృద్ధి చేసిన ఘనత దక్కించుకున్న ప్రముఖ విమర్శకుడు .ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ 1988 సంవత్సరం నవంబరు 25 వ తేదీన తనువు చాలించాడు. తెలుగు సాహిత్య విమర్శనా రంగం ఒక ప్రముఖుణ్ణి కోలుపోయింది.

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పిడికెడు అటుకులు ! !

by రాఘవాచార్య‌ July 13, 2023
written by రాఘవాచార్య‌

పిడికెడు అటుకుల గురించి
కలుపు గొలుపుగా దోసెడు మాటలు 

మునుపు తాత ముత్తాతలు సంచారం పోతే
మూటలోని అటుకులే తోవలో కడుపుకు ఆసరా 
 తియ్యని వాగూ నీళ్లే గొంతులో 
అమృత ధారాపాతం !
ఆగని నడకకు అటుకులే 
బల అతిబల మహాబల !

సామాన్యుల అసామాన్య ఆహారం అటుకులే
కొద్ది కొద్దిగా కాదు నమిలినా కొద్ది
ఆస్వాదనగా రుచి రుచి !
దంపుడు అటుకులైతే 
ఎంత తిన్నా దంగేవి కావు !

అంచుకు ఊరగాయ ముక్క 
ఊరించే ఉల్లిపాయలు 
ఎర్ర కారం కలుపుకుని 
పిడికెడు అటుకులు తింటే 
పొట్టకు కంచం నిండా పట్టనంత భోజనమే !

అటుకులే కదా అని తీసిపారేయకండి
శ్రీ కృష్ణుడు ప్రీతిగా పిడికెడు అటుకులు తింటే 
కుచేలునికి జోలెలో పట్టలేనంత ఐశ్వర్యం 
బ్రాండెడ్ అటుకులు !

ఇప్పుటికీ అటుకులు తక్కువేం కాదు
తింటే కడుపు నిండారా ఆయాసంగా ఎక్కువే 
బ్రేవ్   బ్రేవ్   బ్రేవ్

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us