7
నవరాత్రి పండగ వేడుకలతో హంపీ పట్టణమంతా కోలాహలంగా
ఉంది. రాయలవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పండుగనాడు హంపీ విజయనగరం ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. నగరాన్ని రంగురంగుల రంగవల్లికలతో ఫలపుష్ప సమూహాలతో అలంకరించారు. స్త్రీ పురుషులంతా ఆకర్షణీయమైన వస్త్రాభరణాలతో పూలమాలలు, గంధం, కస్తూరి అగరులతో శోభిల్లుతున్నారు. వీరవరుల పౌరుష విన్యాసాలైన ఖడ్గం, బల్లెం, అశ్వారోహణం, గజారోహణం మొదలైన విద్యలన్నీ రాజ సముఖంలో ప్రదర్శనకు సిద్ధమైనాయి. విజయనగరంలో రత్నాల వర్తకులంతా మరిన్ని మేలిమి రత్నాలను రాసులుగాపోసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. వివిధ రత్నాభరణాల భూషణాలు ధరించిన స్త్రీ పురుషులు ఆనందాతిరేకంతో నృత్యాలు చేస్తున్నారు.
క్రీడామైదానంలో వివిధ క్రీడాకారుల పాటవ ప్రదర్శనలు జరుగుతున్నాయి. కూచిపూడి మొదలైన నృత్య సమారాధనలతో రాజ్య జనాభా అంతా విజయనగరం చేరిందా అన్నట్లున్నది. పదిలక్షల సైన్యం కవాతు చేస్తూ విజయనగర కీర్తితోరణాన్ని వెలిగిస్తున్నది.
తోలుబొమ్మల కళాప్రదర్శనలు, యక్షగానాలు, కోలాటాలు ఒకటేమిటి, విజయనగరమే ఒక సుందర కళావేదికగా మారిపోయింది.
‘విజయమందిరం’ సర్వాంగ సుందరంగా అలంకరించబడిరది. ఈ వేదికను ‘సింహాసనవేదిక’ అని కూడా పిలుస్తారు. ఇది ప్రాచీన విజయనగర రాజుల వైభవాన్ని చాటటానికి ఆదర్శప్రాయమైన వేదిక. మూడునాలుగు నెలల ప్రయాణం చేయవలసినంత దూరప్రాంతాల నుండి, రాజ్యాలనుండి సామంతరాజ ప్రభువులు అక్కడ సమావేశం కావాలని విజయనగరాధీశుని ఆజ్ఞ. విజయనగరానికి వచ్చే దారులన్నీ సముద్రాన్ని చేరే నదీప్రవాహాల్లా ఉన్నాయి. మేఘాల్లా గర్జిస్తూ అంబారీలతో అలంకరించబడి ఏనుగులమీద గారడీ విద్యలవాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు పైనుండి సుగంధ పరిమళాల జల్లుల్ని కురిపిస్తూ తమవెంట వేల ఏనుగుల్ని తీసుకొస్తున్నారు. ఆ ఏనుగులన్నింటికి చెవులు, నొసట, తొండంమీద వివిధరంగులతో అతి విచిత్ర సుందరమైన చిత్రాలను చిత్రించారు. అవి చూసేవారికి ఆసక్తికరంగా ముగ్ధుల్ని చేస్తున్నాయి.
‘విజయమందిరం’ అని పిలిచే దసరాదిబ్బ మందిరం ముందు తొమ్మిది అంతస్తుల శిలాస్తంభాలతో కూడిన భవనాలున్నాయి. మహారాజు సింహాసనం తొమ్మిదవ అంతస్తుల్లో విరాజిల్లుతున్నది. విదేశీ రాయబారులు, యాత్రికులకు ఏడవ అంతస్తు కేటాయించబడిరది.
ఈ భవనానికి విజయభవనానికి మధ్యలో ఉన్న విశాల మైదానంలో కథకులు, గాయకులు తగినంత అభ్యాసం చేసుకోవటానికి వీలుంది. గాయకులలో చాలామంది యువతులే ఉన్నారు. ఆ రోజు చంద్రప్ప గానం ప్రత్యేక ఆకర్షణ అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గాయకులంతా మహారాజు ఎదురుగా ఒక జలతారు తెర వెనుక ఆసీనులై ఉన్నారు. రెండువైపులా ఉన్న తెర తొలగించినప్పుడు బంగారంతో తాపడం చేసిన అమూల్య రత్నఖచిత సింహాసనంపైన కూర్చుని
ఉన్న ప్రభువు వీరిని చూడటం జరుగుతుంది.
వైభవోపేత విజయభవనం ముందుభాగంలో గోపురంతో ఉన్న ప్రవేశ ధ్వారముంది. దీని బయట రాజమందిరం చుట్టూ చాలా ఎత్తయిన ప్రహరీగోడ ఉంది. సింహద్వారంలో సాయుధులైన భటులు కాపలా కాస్తున్నారు.
దీని తర్వాత కొంతదూరంలో మరోద్వారముంది. ఆ దారిలో ప్రవేశిస్తే విశాలమైన ఆరుబయలు ప్రాంతం. దాని పక్కన ఒక పెద్దమండపముంది. అక్కడ ముఖ్యమైన అధికారులు, నగర ప్రముఖులు కూర్చుని వినోదాలు చూస్తున్నారు. ఈ ఆరుబయలు ప్రాంతానికి ఉత్తరంగా మరో పెద్ద పలు అంతస్తుల భవనం కన్పిస్తోంది.
ఏనుగు, గుర్రం వంటి ఆకారాలతో ఎత్తైన స్తంభాల మీద ఈ కట్టడాలు కట్టారు కాబట్టి విశాలంగా ఉండి పైకి ఎక్కటానికి రాతిమెట్లు కన్పిస్తున్నాయి.
ద్వారానికెదురుగా రెండు వృత్తాకార రంగస్థలాలున్నాయి. వాటిలో నాట్యగత్తెలు రత్నఖచిత సువర్ణాభరణ భూషితలై నృత్యాలు చేస్తున్నారు.
ఈ రంగస్థలాలకెదురుగా సింహద్వారానికి తూర్పున విజయ భవనం లాంటి మరో రెండు మందిరాలున్నాయి. వాటిలో ఒకటి మధ్యలో, ఇంకొకటి చివరిలో ఉన్నాయి. ఇవి అమూల్యవస్త్రాలచే అలంకరింపబడి ఉన్నాయి. ఆ వస్త్రాలమీద ఆసక్తికరంగా వివిధ చిత్రాలు కన్పిస్తున్నాయి. ఈ భవనాలలో రాజకుమారులు తమ అభిరుచుల కనుగుణమైన విందులు ఆరగిస్తూ మిత్రులతో కలసి ప్రదర్శనలు చూస్తున్నారు.
నవరాత్రి విజయోత్సవ ప్రారంభసూచికగా ధర్మఘంటారావం విన్పించింది. అది నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు. శ్రీకృష్ణదేవరాయలు విజయమందిరానికి విచ్చేశారు. అక్కడే నిర్మితమై ఉన్న దేవమందిరంలోకి ప్రవేశించారు.
బలమైన అవయవ సౌష్టవంతో మంచి ముఖవర్చస్సు గల్గిన శ్రీకృష్ణదేవరాయల వదనంలో ప్రత్యేకత అందరినీ ఆకర్షిస్తోంది. పట్టుపంచ, అంగరఖా, ఉత్తరీయం ధరించి తులలేని నవరత్నఖచిత ఆభరణాలతో, కిరీట భుజకీర్తులతో రాచకరవాలంతో నిలువెత్తు వీరత్వానికి ప్రతీకగా భాసిల్లుతున్న రాయలు దేవమందిరంలోని విగ్రహాన్ని పూజించారు. బయట ఉత్సవం కోలాహలంగా జరుగుతున్నది. ప్రభువు బంధువులు, ఆప్తులు, కళాకారులు అంతా నృత్యగాన విశేషాదుల్ని ఆనందిస్తున్నారు. బయట మండపాల్లో దండనాథులు,
ఉన్నతాధికారులు, పౌర ప్రముఖులు ఉత్సవాన్ని దర్శించాలని వచ్చి వేచిచూస్తున్నారు.
కింద ఆరుబయలు ప్రాంగణంలో నానావిధాలుగా పుష్పాది సుగంధ ద్రవ్యాలతో అలంకరింపబడిన పదకొండు అశ్వాలు, నాలుగు పట్టపుటేనుగులు వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయ ప్రభువు లోపలినుండి సద్బ్రాహ్మణసమేతుడై అక్కడికి వచ్చారు. బ్రాహ్మణులు గజాశ్వాలను వైదిక సంస్కార ప్రకారం మంత్రజలంతో ప్రోక్షణ చేసి పూలమాలలతో వాటిని అలంకరించారు. ఆ తర్వాత జాజ్వల్యమాన వజ్ర ఖచిత కనక సింహాసనం మీద విజయనగర సామ్రాజ్యధీశుడైన శ్రీశ్రీశ్రీ కృష్ణదేవరాయల ప్రభువు ఆసీనుడయ్యారు.
ఆనవాయితీ ప్రకారం కొన్ని పొట్టేళ్ళు, దున్నపోతుల్ని బలి ఇవ్వటం పూర్తయింది. మహారాజు బ్రాహ్మణుల వేదమంత్రయుక్త ఆశీర్వాదం అందుకుని మరలా తొమ్మిదవ అంతస్తుకు వెళ్ళి కిరీటం తీసి దేవుని ఎదుట ఉంచి దేవునికి సాష్టాంగ ప్రణామం చేసి లోనికి వెళ్ళిపోయాడు.
ఇక్కడ రంగస్థలాలపై చాలాసేపు నృత్యప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. నవరాత్రుల తొమ్మిదిరోజులు ఇదేవిధమైన కార్యక్రమం ఏర్పాటు చేయబడిరది.
సాయంత్రంవేళ అవుతున్నది. మర్తాండుడు ప్రతాపం చాలించి లోకం మీద తన వేడికిరణాలను ఉపసంహరించుకొని పశ్చిమాద్రికి ప్రయాణమవుతున్నాడు.
ప్రజలు, ఉద్యోగులు, అతిథులు అంతా విజయభవన ప్రాంగణానికి విచ్చేశారు. మల్లురు, జెట్టీలు, నృత్యగాన కళాకారులు అలంకృత అశ్వాలతో ఊరేగింపుగా బయలుదేరారు. బ్రాహ్మణులు, రాకుమారులు, రాజబంధువులు, వారి వారి మిత్రులు, పరవారం మహారాజుని అనుసరించారు.
ఈ ఉత్సవాల విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అడుగడుగునా శక్తివంతమైన గూఢచారి వ్యవస్థతో మహామంత్రి తిమ్మరుసే స్వయంగా పర్యవేక్షిస్తూ తగు సూచనలు, ఆజ్ఞలు ఇస్తున్నారు.
మహారాజు విజయభవన వేదికపై సింహాసనాన్ని అధిరోహించారు. ప్రజలు అధికారగణం లేచి నిలుచుండి విజయాభివందనం చేశారు. కొందరు ఆప్తులు మహారాజు దగ్గరగా కూర్చున్నారు. దేవేరులు మహారాజు సమీపంలో తెరల మాటున వీక్షిస్తున్నారు. తాంబూల సేవనం మహారాజు సమక్షంలో నిషిద్ధమని అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ ఆ పని చేయటం లేదు.
అప్పటిదాకా బయట నిరీక్షిస్తున్న సేనాధికారులు ఒక్కొక్కరు వరుసలో వచ్చి రాజుకు జోహారులు సమర్పించి మండపంలో తమతమ స్థానాలలో కూర్చున్నారు. అనంతరం నత్య ప్రదర్శన జరిగింది.
నాడు మంజరి చేసిన ‘నవమోహిని’ నృత్యం సరికొత్త భావానుభూతిని మిగిల్చింది. క్షీరసాగరమధనంలో హాలాహలాన్ని పరమశివుడు భరించాడు. తర్వాత పుట్టిన అమృతాన్ని దేవదానవులకు పంచే విధానంలో శ్రీ మహావిష్ణువు మోహినీరూపంలో అవతరించి దానవులను సమ్మోహనపరచిన విధానాన్ని మంజరి అభినయ నర్తనంగా అందించిన ప్రావీణ్యతకు కళాహృదయాలన్నీ పులకించాయి.
మంజరి నవమోహినీ రూపం చంద్రప్ప మనసులో గిలిగింతలు పెట్టింది. ఈ దసరా నవరాత్రులలోనే విజయదశమినాడు ఆ ఇద్దరికీ పరిణయం జరుగనుంది. ఆ తలపే చంద్రప్పను వివశుడ్ని చేస్తున్నది.
‘‘బాగు బాగు’’ ఆ కర్కోటక స్వరం వీరేంద్రునిదే.
చంద్రప్ప తీక్షణంగా వీరేంద్రుని చూశాడు. వీరేంద్రుని వాక్కులో ప్రశంసకన్నా కుటిలత్వమే విన్పిస్తున్నది.
‘‘నర్తకీమణీ! మీ నృత్యాభినయంతో మేము ముగ్ధులమయ్యాం!’’ అంటూ ప్రభువు తన మెడలోని ముత్యాలహారాన్ని ఆమెకు బహుకరించారు. కృతజ్ఞతతో మంజరి కళ్ళు చెమర్చాయి.
‘‘మంజరీ! నేటినుండి నిన్ను మా ఆస్థాన నర్తకిగా గౌరవిస్తున్నాం.’’ ప్రభువిచ్చిన వెలలేని కానుకలతో ఇల్లుచేరిన మంజరికి తల్లి గుర్తొచ్చింది. కృష్ణసాని ఉంటే ఎంత సంతోషించేదో! ఆమె కళ్ళు తల్లి జ్ఞాపకాలతో చెమర్చాయి.
మర్నాటి కార్యక్రమం మొదలయింది.
రంగస్థలంలో వెయ్యిమంది మల్లయోధులు ఆయుధాలు లేకుండా పోరాడి వివిధరకాల మల్లవిద్యలు ప్రదర్శించారు. వారికందరికీ బహుమతులు అందాయి. కొందరు వలలు విసురుతూ రంగస్థలంలోనివారిని చేపల్లా పట్టే వినోదాన్ని ప్రదర్శించారు.
ఈవిధంగా అనేక ప్రదర్శనల తర్వాత పలువర్ణాల జ్యోతులు వెలిగించారు. బాణాసంచా పేల్చారు.
అనంతరం బారులుతీరిన అలంకృత ఏనుగులు, అశ్వాలు, వృషభాలు రాజు ఎదుట వచ్చి నిలబడ్డాయి. బ్రాహ్మణుడు మంత్ర పుష్పాక్షతలతో వీటిని అర్చించాక మహారాజు పక్కనే ఉన్న చిన్నద్వారం గుండా నిష్క్రమించాయి.
బ్రాహ్మణులు విజయమందిర దేవాలయ విగ్రహాన్ని యథాశక్తి పూజించారు. మహారాజు ఉత్సవాలు జరిగే తొమ్మిదిరోజులు ఉపవాసమున్నారు. ఆయన ముఖకళ రోజురోజుకూ ఇనుమడిస్తూనే ఉండటం విశేషం.
ఈ ఉత్సవాల కాలంలో సామంత నాయకులు రాజమందిరం దగ్గర నవదుర్గాల్లో అమూల్య వస్త్రాభరణాలు, వస్తువులు ఉంచి విజయదశమి మహోత్సవవేళ చక్రవర్తికి రాజచిహ్నాలను అలంకరించి కానుకలు చెల్లించారు. ప్రభువు దేవేరులంతా స్వర్ణాభరణ భూషితులై బంగారుకలశాలతో రాజచంద్రునికి నీరాజనాలు సమర్పించారు. నవరాత్రి దసరాఉత్సవం తొమ్మిదిరోజులు రాజభవనం ఆనందపారవశ్యంలో మునిగితేలుతున్నది.
కురిసిన దెచట వాక్కుల జృంభణములోన
కవిరాజుపైన బంగారువాన
సలిపిన దెచట ధూర్జటి దివ్యలేఖిని
నవ్యవారాంగనా నర్తనంబు
తొడిగిన దెచట నిస్తుల రాజహస్తము
కవిపితామహు కాలి కంకణంబు
విసిరిన దెచట ప్రవీణవాచస్పతి
రామలింగని హాస్య రససమృద్ధి
అది శిలలదిబ్బ దసరాలకైన దిబ్బ
తెలుగు లలితకళాదేవి తీర్చినట్టి
కొలువుకూటపు దిబ్బ వన్నెలకు దిబ్బ
మా మహర్నవవిూశాల మంటపంబు
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
తిమ్మరుసు భవనంలో కుమారుడు గోవిందరాయలతో గంభీరంగా సమావేశమైనాడు.
‘‘మీరేమైనా చెప్పండి నాన్నగారూ… వీరేంద్రుడిరక విజయనగరంలో
ఉండటానికి వీలులేదు’’ గోవిందరాయలు ఆవేశంగా అన్నాడు.
‘‘త్వరపడితే ఎలా గోవిందా! అతను రాజబంధువు. ముల్లును ముల్లుతోనే తీసివేయాలి. అతని కపటబుద్ధి నాకూ తెలుసు. గజపతుల కూతురితో వచ్చి విజయనగరంలో పాగా వేసినప్పటినుంచి అతన్ని కనిపెడుతూనే ఉన్నాను’’ తిమ్మరుసు సాలోచనగా అన్నాడు.
‘‘ఇంక జాప్యం చేయరాదు నాన్నగారూ. కంటకుడు రాజద్రోహులతో మంతనాలు చేస్తున్నాడు. సైన్యాధికారులు, రాజోద్యోగుల మీద పెత్తనం చేయాలని చూస్తున్నాడు’’ గోవిందరాయలి కోపం తారాస్థాయిలో ఉంది.
తిమ్మరుసు మౌనంగా తల పంకించాడు.
‘‘విజయనగరంలో స్త్రీలను ఎంత గౌరవిస్తామో మీకు తెల్సు. అలాంటిది ఎందరో స్త్రీలు అతనివల్ల బాధపడ్తున్నారు. అధికారులకు లంచాలు నేర్పిస్తున్నాడు’’ ఆవేశంగా మళ్ళీ చెప్పాడు గోవిందరాయలు.
‘‘నిజమే గోవిందా! అన్నపూర్ణాదేవి బంధువు అనే చిన్న కారణమే అతన్ని రక్షిస్తుంది. మన వేగులవల్ల చాలా కొత్త సంగతులు తెలుస్తున్నాయి. నేనున్నాను నీవు కలవరపడకు’’ కుమారుని శాంతపరిచే ప్రయత్నం చేశారు తిమ్మరుసు.
ఇంతలో చంద్రప్ప వచ్చినట్లు వర్తమానం అందింది. చంద్రప్ప వచ్చేలోపు గోవిందరాయలు లోనికి నిష్క్రమించాడు.
‘‘అభివాదం మంత్రివర్యా’’
‘‘చంద్రప్పా! ఏమి వార్త’’
‘‘మంత్రివర్యా! నవరాత్రి ఉత్సవాల్లో ఒక ప్రమాదం తప్పింది.’’
‘‘ఏమిటది చంద్రప్పా?’’
‘‘ఓఢ్రం నుంచి వచ్చిన నృత్యాంగనల్లో ఒక స్త్రీ దుస్తులమాటున ఛురిక దాచింది. ఆమె రాయలవారికి చాలా చేరువగా వచ్చింది గాని ప్రయత్నించేలోపు మంజరి ఆ రహస్యాన్ని ఛేదించడంతో ఆ నర్తకిని దండనాథులు బందీని చేశారు.’’
‘‘ఆమెను ఓఢ్రం నుంచి పిలువనంపింది మనమేనా?’’ అనుమానంగా అడిగారు తిమ్మరుసు.
‘‘కాదు. వీరేంద్రులవారి వ్యక్తిగత ఆహ్వానం మేరకు వచ్చిందట’’ తటపటాయిస్తూ చెప్పాడు చంద్రప్ప.
‘‘ఊ’’ తిమ్మరుసు గంభీరముద్ర వహించారు.
‘‘అంతేకాదు అమాత్యవర్యా! కవాతు చేసిన మన సైన్యంలో లెక్కకు మించి ఇతర సైన్యం గుర్తించలేనివిధంగా కలిసి ఉందట.’’
‘‘ఇక నీవు వెళ్ళవచ్చు’’ చంద్రప్ప నమస్కరించి వెళ్ళిపోయాడు. మంత్రి తిమ్మరుసు చురుకుగా సేనా నాయకుడికి కబురుపెట్టారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి పున్నమి వెలుగులో వసంతవాటికలో వేచివుంది. కొలనులోని చందమామ చంద్రప్పలా ఉన్నాడు. తమ వివాహానికి ఇంకా మూడు
నాళ్ళున్నది.
ఆ తర్వాత చంద్రప్పతో తమ విహారం శిల్పారామంలోనే! పరవశిస్తూ సంచరిస్తున్నది మంజరి.
విజయనగరమంతా ఎక్కడ చూసినా అద్భుత శిల్పప్రపంచమే కదా! శ్రీరామచంద్రునికి సహాయపడిన వానరోత్తముల రాజ్యం ఇది. ఇపుడు మరో రామరాజ్యమయింది. వరాహస్వామి పతాకచిహ్నంగా ఉన్న ఈ విజయనగరంలో రఘునాథ దేవాలయం బయటి గోడమీద శిల్పకళాకృతులంటే మంజరికి ఎప్పుడూ ఇష్టమే. ఇక్కడే రామచంద్రుడు తమ తండ్రికి పిండప్రధానం చేశాడంటారు. నిజమేనా! ఎప్పటి రాముడు! త్రేతాయుగం నాటి మాట. నమ్మినా నమ్మకపోయినా ఆ పుణ్యస్థలం నేటికీ పవిత్రమైనదే! మంజరి నర్తనశాలలో ప్రవేశించింది. రాత్రివేళ కదా! నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆమె మనోవీధిలో అక్కడ నృత్యకేళి పరమ మనోహరంగా జరుగుతున్నది. ఇది ఎంతటి ముగ్ధమనోహర ప్రదేశం!
‘‘కాళ్ళ పారాణిచిక్కన నృత్యవేళల
చెమటలో కరిగిపోసినది ‘చార’
చక్రభ్రమణ వేళ జలతారు తలకట్టు
తెగిన ముత్యాలు దిద్దినవి ‘ముగ్గు’
శ్రామకేళికావేళ వాదించి ప
చ్చీసులో నెంచి కచ్చినది ‘పావు’
నృత్యగానపరీక్ష నెరిగి దినాభ్యాస
మునకు ధరించి విప్పినది ‘గజ్జె’
రేగిపోలేదు, చెరగను లేదు, కదలి
పంటగడి తప్పలేదు, సప్తస్వరాల
కనుగుణంబుగ మ్రోయ మానినది లేదు
నేటినికి కిన్నరాంగనా నిచయ మాంధ్ర
రాజకన్యానుసరణ పర్వతమందు
తెలుగు నర్తనశాలలో తిరుగుకతన’’
ఆమె వివశంగా సన్నని గొంతుతో పాడుకుంటున్నది. అకస్మాత్తుగా గోవిందరాయడి రాక ఒకింత విస్మయం కలిగించింది.
‘‘మంజరీ! ఇక్కడ్నించి త్వరగా వెళ్ళిపో! అపాయం’’ హెచ్చరించిన అతను మరుక్షణంలో మాయమయ్యాడు.
ఆమె తేరుకుని వెంటనే పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకుంది. వెనుక కత్తుల శబ్దాలు విన్పిస్తున్నాయి. ఏం జరుగుతుందిక్కడ? విజయనగరం నివురుకప్పిన నిప్పులా ఉంది.
‘‘ఈ నిప్పు జ్వాలగా ఎగయకముందే చల్లార్చు స్వామి!’’ విరూపాక్షుని
ఉద్వేగంగా ప్రార్ధించింది మంజరి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయల మందిరంలో సేనానాయకుడు రామలింగనాయకునితో సమావేశమయ్యారు ప్రభువు.
‘‘ప్రభూ! చిన్న పామునైనా పెద్ద కర్రతోనే…’’ రామలింగనాయకుని ఆత్రుత అది.
‘‘మాకు తెలుసు రామలింగనాయకా! ఇస్మాయిల్ ఆదిల్ఖాన్పై దాడి జరిపి రాయచూర్ను మన స్వంతం చేసుకున్నది సముచితమే! అయినా స్వమత కారణంగా గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బీరార్ పాలకులు మనపై కత్తిగట్టారు. ఆదిల్ఖాన్కు రాయచూర్ తిరిగి ఇవ్వాలట. హు!’’ రాయలు సింహంలా జూలు విదిల్చి మళ్ళీ అన్నాడు కోపంగా`
‘‘అదెన్నటికీ జరుగదు. ఆదిల్ఖాన్ని వచ్చి నా పాదాలను ముద్దుపెట్టుకో మనండి. అలాచేస్తే అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తామని కబురు పంపండి.’’
‘‘కానీ ప్రభూ!’’
‘‘మా ఆజ్ఞ’’ ప్రభువు మందిర అంతర్భాగంలోకి విసవిసా వెళ్ళిపోవటంతో రామలింగనాయకుడు నిస్సహాయంగా చూశాడు.
ప్రాణాలొడ్డి సాధించిన రాయచూర్ను తిరిగి ఆదిల్ఖాన్కు అప్పగించటమా! ఇది విజయనగర ప్రతిష్టకే మాయని మచ్చ. తిమ్మరుసుల వారేమని యోచించారో! ఆదిల్ఖాన్ రాయల్ని కలవటానికి సిద్ధంగానే ఉన్నాడు. సరిహద్దులోకి రమ్మని కబురంపాలని ప్రభువు ఆజ్ఞ. కానీ అతను వస్తాడా? బెల్గామ్ సుల్తాన్ లారీ కూడా జిత్తులమారి. నమ్మటానికి లేదు. ఆలోచిస్తూ రామలింగనాయకుడు మందిరం బయటికి వస్తుండగా వీరేంద్రుడు ఎదుటపడ్డాడు.
‘‘రామలింగ నాయకులేదో రాచకార్యం నిర్వర్తించడానికి వచ్చినట్లున్నారే’’ వెటకారంగా ప్రశ్నించాడు.
రామలింగనాయకుడు అతనికేసి తీక్షణంగా చూశాడు.
‘‘మా సైన్యంలోకి దూరిన నక్కల్ని ఏరిపారేయటానికి’’ విసురుగా జవాబిచ్చాడు.
‘‘నక్కలకీ తెలివి ఉంటుంది మిత్రమా!’’ వీరేంద్రుడు వ్యంగ్యంగా అన్నాడు.
‘‘సింహాలముందు ఆ తెలివి పనిచేయదులెండి’’ అంటూ రామలింగ నాయకుడు బయలుదేరాడు.
వీరేంద్రుడు పళ్ళు పటపట కొరికాడు.
‘‘సింహమా! ఎవరో అదీ తేలుస్తానురా! నేనిక్కడ అడుగుపెట్టిందే ఈ విజయనగరాన్ని మట్టి చేయటానికి. మీరెంత సైన్యపాలన చేసినా ఈ వీరేంద్రుని తెలివితేటల ముందు చిల్లపెంకులే. మా అమ్మాయినిచ్చి పెళ్ళిచేశామని లోకువయ్యామేమో! అది పెళ్ళా? శ్మశానానికి దారి. అన్నపూర్ణ వట్టి పిచ్చి పతివ్రత. భర్తే దైవం, జగన్నాథం అనుకుంటున్నది. ఆమెకెంత చెప్పినా తిమ్మరుసుని తండ్రిలా భావిస్తున్నది. తిమ్మరుసుకు రాజుకు మధ్య దూరం పెంచనిదే, స్పర్థ రేకెత్తించనిదే నా పని సులభం కాదు. మహాభారతంలో శకునే నాకు ఆదర్శం’’ అనుకుంటూ కళ్ళెగరేశాడు క్రూరంగా.
స్వపక్షంలోనే ఉంటూ స్వపక్ష వినాశనం ఎలా చేయాలో నేర్పిన గురువు శకునే కదా!
‘‘రాయలు పోర్చుగీసువారితో స్నేహంచేసి పరాయిపాలనకు బీజం వేస్తున్నాడు. ముస్లిం రాజుల ఐక్యతకు దోహదపడ్తున్నాడు. ఇవన్నీ నాకే లాభిస్తాయి. నా లక్ష్యం ఒకటే! విజయనగర పతనం. అంతే! దీనికోసం అన్నపూర్ణ ప్రాణం తీయాల్సివచ్చినా వెనుకాడే ప్రసక్తి లేదు. జగన్నాథ’’
లోపలికి వెళ్తున్న వీరేంద్రుని రహస్యంగా అనుసరిస్తూ పొంచి ఉండి అంతా విన్న చంద్రప్ప కర్తవ్య స్ఫురణతో మెరుపులా తిమ్మరుసు మందిరం వైపు కదిలాడు.
క్షీరసాగర మధనంలో
అందం తాలూకు అమృతబిందువుల్ని
మహిళాలోకం ఒడిసిపట్టుకున్నారా బహుశా
అందం కురిసిన అసలు ఆ రాత్రిఆడవాళ్లు మాత్రమే మేల్కొని
ఉన్నారేమో తెలివిగా,
పారిజాతంలా ,పున్నాగంలా
నా వాక్యాలకు అందని ఇంకాఏదో అవ్యక్త సౌందర్య వారాశి లా
‘అందం’ వాళ్ల వశమై పరవశమయ్యింది
మగమానవుడు వాళ్ల జీవిత ఖైదే ఈనాటికికూడా
సహనం,త్యాగం,సాహసం వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు
ఆనందం, సహన సున్నితత్వాలు వాళ్లతో ముడిపడ్డాయి
అనాదిగా
అతివలదే ఘనత అంతా
వనితలదే చరిత అంతా
బ్రహ్మచారికి మోక్షం గృహస్థాశ్రమంలోఉందంటారు పండితులు
మగువతోడు లేని మగరాయుడి జీవితమంతా సన్యాసం
కాదంటే శూన్య విన్యాసమే అంటారు బాధితులు
శిశిర మోడుల మౌన ఆకాశం లో
శిలల శిలల పరమ నిశ్శబ్దంలోంచి
ఒక వసంతగాన పులకిత పుడమిలా
మగాడు గాయపడ్డప్పుడు
ఈ బాధామయ,కన్నీటి కథలు నుంచి
గుండె పగిలే క్షణాల్నుంచి
ఆమె అమలినప్రేమవర్షంతో తడుస్తూ
అనంత ఓదార్పు నదిఒడిలో స్నానిస్తూ
ఆమె అనంత దయాపారావారం తీరం చేరి
ఉపశమనిస్తున్నాడు,తిరిగి మానవత్వమున్న మనిషౌతున్నాడు పురుషపుంగవుడు
రేయి పగలు యుగయుగాలుగా….
శక్తి,చేతనత్వాలకు పర్యాయపదం కదా మానవి
స్థావర జంగమాత్మక ఈ జగత్తుసమస్తం
సమ్మోహన పరాశక్తి స్త్రీ కాబోలు
ఏమని చెప్పను
ఇంకా ఎంతని చెప్పగలను
నాతో నడుస్తున్న నా అర్థాంగికి
నన్ను నడిపిస్తున్న మా అమ్మకు
సుకుమారమైన మనసుగల ఈ ఆడాళ్లకు
ఈ జన్మకు కృతజ్ఞతలు తప్ప!
రమేశ్ నల్లగొండ
8309452179
నిరంతర పరిశోధకుడు
నిత్య సాహిత్య సాధకుడు
స్నేహశీలి బాలన్న
అర్థాంతరంగా
అంతర్ధానమయ్యాడు
వ్యక్తిత్వం , వక్తవ్యంతో
సముజ్వలంగా ప్రకాశించిన
ఉత్తమ అధ్యాపకుడు
సాహిత్య సారాలను శోధించి
వెలికితీసిన బహుగ్రంథకర్త
ఆత్మాభిమానధనుడు
ఆ కృషి మహోన్నతం
ఆయన మార్గం అనుసరణీయం
( ప్రొఫెసర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి స్మృతిలో..
( ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సంస్మరణలో…)
బహుముఖ కృషితో ప్రామాణికమైన రచనలను తెలుగు సాహిత్యానికి అందించిన విద్వన్మణి ఆచార్య గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి. సాహితీవేత్తగా, పరిశోధకునిగా, పత్రికా సంపాదకునిగా నిత్యకృషితో ఉజ్వలంగా ప్రకాశించిన ప్రజ్ఞామూర్తి. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వేలాది రచనలను పత్రికలలో ప్రచురించి ప్రామాణిక పత్రికా రచనకు అర్థం చెప్పిన జ్ఞానశీలి.
గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 5 సెప్టెంబరు 1966న మెదక్ జిల్లా పోతారెడ్డిపేటలో లక్ష్మీనరసింహశర్మ, పద్మావతి దంపతులకు జన్మించారు. శ్రీనివాసమూర్తి తండ్రి లక్ష్మీనరసింహశర్మ కవి, అవధానిగా ప్రఖ్యాతి పొందారు. చిన్ననాడే ఇంటి నుండే బాల శ్రీనివాసమూర్తికి సాహిత్యంపై యెనలేని మక్కువ ఏర్పడింది. పాఠశాల, కళాశాల స్థాయి విద్యాభ్యాసానంతరం హైద్రాబాదులో విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యను అభ్యసించి పరిశోధన చేసి డాక్టరేట్ను అందుకున్నారు. జర్నలిస్టుగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా సుదీర్ఘ కాలం వివిధ పత్రికలకు విభిన్నమైన రచనలు అందించి తెలుగు పాఠకులకు సుపరిచితులయ్యారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత అక్కడ బోధకులుగా చేరి క్రమంగా అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా పదోన్నతులు పొందారు. పరిపాలనాపరమైన వివిధ పదవులను కూడా ఆయన నిర్వహించారు. పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని అనేక పరిశోధనాపత్రాలు సమర్పించారు. వివిధ కార్యక్రమాలలో సాహిత్య ప్రసంగాలెన్నో చేశారు. సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక అంశాలపై పది వరకు ప్రామాణికమైన పుస్తకాలను వెలువరించారు. ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ, సమకాలీన వాదాలు – సాహిత్య విమర్శ, తెలంగాణం – తెలుగు మాగాణం, తుషార సమీరం, తెలంగాణ పత్రికలు, వెలుతురు కొలను, మా ప్రసిద్ధపేట, విలక్షణ – పి.వి నరసింహారావు జీవిత చరిత్ర, దేవులపల్లి రామానుజరావు (మోనోగ్రాఫ్), జీవనహిందోళం (గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ గారి జీవితం – అవధానం), తెలంగాణ వైతాళికులు సంపాదకత్వం (మూడు సంపుటాలు.. జననేతలు, అక్షర మూర్తులు, ప్రతిభామూర్తులు), సాహితీ సుధ, తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం, తెలంగాణ సాహిత్య చరిత్ర మొదలైన ఆయన రచనలు ఎంతో పేరొందాయి. 56 సంవత్సరాల వయస్సులోనే వెలకట్టలేని సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, సామాజిక అంశాలను శోధించి, పరిశోధించి సాహిత్యలోకానికి అందించారు.
పండిత కవి, అవధాని లక్ష్మీనరసింహశర్మ కుమారుడైన బాల శ్రీనివాసమూర్తి తన అద్వితీయ రచనా ప్రతిభతో తండ్రికి తగ్గ తనయుడిగా సాహిత్యరంగంలో ఎంతో పేరొందారు. తెలంగాణ, తెలుగు మాగాణం, వెలుతురు కొలను, తుషార సమీరం అన్నవి శ్రీనివాసమూర్తి విమర్శా ప్రతిభను చాటిచెప్పడమే కాక ఎందరో ప్రసిద్ధ విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ అన్న రచనలో మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలోని కథలు పోషించిన కీలక పాత్రను రాజకీయ నిబద్ధతతో అత్యంత జాగ్రత్తగా శ్రీనివాసమూర్తి రచించారు. ఆధ్యాత్మిక రచనా విశిష్టతను తెలుపుతూ రచించిన తెలుగులో ఆధ్యాత్మిక వచన కావ్యాలు అన్న పరిశోధనాత్మక గ్రంథం ఎంతో మంది పండితుల ప్రశంసలందుకుంది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్యం – పత్రికల పాత్ర అన్న పరిశోధనతో 1920 – 56 మధ్య కాలంలో తెలంగాణలో పత్రికల చైతన్య భూమికను, సామాజిక చారిత్రక ఘట్టాలను వివరించారు. విలక్షణ అన్న పేరుతో పీవీ శత జయంతి మోనోగ్రాఫ్ను నీల్కమల్ పుస్తక సంస్థ కోసం ఎంతో అద్భుతంగా శ్రీనివాసమూర్తి రాశారు. పీవీ బహుముఖ ప్రజ్ఞకు ఈ గ్రంథం ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. తెలంగాణ గురించి మూడు ప్రత్యేక సాహిత్య వ్యాస సంపుటాలకు సంపాదకత్వం వహించి ఎందరో సాహితీవేత్తలను ప్రోత్సహిస్తూ విలువైన వ్యాసాలను రాయించారు. ఎంతో గొప్ప సాహిత్య కృషిని ఈ సంపుటాల ద్వారా బాలశ్రీనివాసమూర్తి అందించారు. సులభ వచన రచనాశైలిలో ఏ స్థాయి పాఠకుడినైనా వెంటనే ఆకట్టుకునేలా రచన చేయడం బాలశ్రీనివాసమూర్తి ప్రత్యేకత. చిన్న వాక్యాలు, సులభమైన పదాలతో అర్థవంతంగా అమూల్య గ్రంథాలను అందించిన ఆయన సాటిలేని మహోన్నత సాహితీమూర్తి. వినమ్రతతో, విజ్ఞానంతో అందరికీ ఆత్మీయునిగా ఆయన తన సాహిత్య ప్రయాణాన్ని కొనసాగించారు.
తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన బాలశ్రీనివాసమూర్తి 24 ఏప్రిల్ 2023న హైద్రాబాదు సుచిత్రలోని తమ ఇంటిలో గుండెపోటుకు గురై మరణించారు. తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే విశిష్ట కృషి చేసిన పరిశోధకమూర్తి, అరుదైన సాహితీవేత్త బాలశ్రీనివాసమూర్తికి కన్నీటి నివాళి.
(మే నెల రెండవ ఆదివారం ‘మదర్స్ డే ‘ ని పురస్కరించుకుని)
తాతినేని రామారావు
దర్శకత్వం వహించి, జి . బాబు నిర్మాతలుగా వ్యవహరించి ,1981 లో విడుదలైన ఇల్లాలు చిత్రం లోని పాట ఇది . ఆత్రేయ రచించి , జేసుదాస్ , శైలజ గార్లు గానం చేశారు .ముఖ్య తారాగణం శోభన్ బాబు జయసుధ శ్రీదేవి.
సద్గుణ సంపన్నుడైన భర్త ,ముద్దులొలికే బిడ్డ ,జీవితం సాఫీగా సాగడానికి అవసరమైనంత డబ్బు ఉన్నప్పటికీ ,ఆమె మనసు ఎండమావుల వెంట పరుగులు తీస్తుంది . ఫలితంగా ముగ్గురి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి.
పల్లవి:
ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఎంత దూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది ఒకరికి సొంతం కాదు ఇది
ఆది అంతం తెలియని ఈ రహదారి పయనంలో ఎవ్వరికీ ఏది సొంతం కాదు . దీని లోతులు కనుగొనడం ఎవరివల్లా కాదు అని ఒకింత వైరాగ్యాన్ని వ్యక్తపరుస్తుంది (పల్లవి)
చరణం 1.
ఎవరు ఎవరికి తోడవుతారో ఎప్పుడెందుకు విడిపోతారో మమతను కాదని వెళతారో మనసే చాలని ఉంటారో ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
కలిసి ఉండటానికైనా , విడిపోవటానికైనా ఒక్క కారణం చాలు. ఆ కారణం వారి వారి ఆలోచనా విధానంపై , వారి వారి మనస్తత్వాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేమాభిమానాల విలువ తెలియక ఒకరు వదులుకుంటే , ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన సంపద ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రేమే అని ఇంకొక స్త్రీ అతని జీవితంలోకి అడుగెట్టి శూన్యమైన అతని జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. ఏ నిర్ణయానికైనా కారణం ఏమిటని ఈ రహదారి ప్రయాణం అడగక పోవడానికి కారణం ఆలోచించే కోణాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. దీనికి ప్రయాణమే తప్ప కారణాలతో సంబంధం ఉండదు అని అభిప్రాయపడుతున్నారు.
చరణం 2:
కడుపు తీపికి రుజువేముంది అంతకుమించిన నిజమేముం
ది
కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా ఇప్పుడు తప్పును తెలుసుకుని జరిగేదేమిటనీ క్షమించదెవ్వ రినీ
శుష్కమైన ఆనందాల వేటలో పడి మాతృత్వాన్ని కాలదన్నకున్న నిన్ను భూమాత క్షమిస్తుందా ? చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు.
మనిషి పూర్తి సుఖంగా బ్రతకలేక పోవడానికి కారణం తనకున్న దానిపై నిర్లక్ష్యం , లేని దానికోసం ఆరాటం అంటారు ప్రఖ్యాత తత్వవేత్త రియో
కథానాయిక తనకున్న పచ్చని పైరు లాంటి జీవితం విలువ తెలియక జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటుంది.
పేగు బంధాన్ని బరువు అని తలచిన నిన్ను భూమాత ఎలా మోస్తుంది అనీ,జరగకూడని నష్టమంతా జరిగిపోయాక తప్పును తెలుసుకోవడం వల్ల ఫలితం శూన్యం అని వివరిస్తున్నారు.
చరణం 3:
తెంచుకుంటివి అనుబంధాన్ని పెంచుకున్నదొక హృదయం దాన్ని
అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతంగా తెచ్చుకుని తల్లివి కాగలవా తనయుడు కాగలడా
నవ మాసాల ఫలాన్ని నువ్వు కర్కశంగా , నిర్దాక్షిణ్యంగా వదులుకొని వెళితే ఆ అనుభూతి పరిమళాలేవీ ఆస్వాదించకపోయినా, కేవలం హృదయౌన్నత్యంతో ఆ పసిబిడ్డను గుండెకు హత్తుకున్న స్త్రీ ఎంతటి ప్రేమ మూర్తో , ఎంతటి అనురాగమూర్తో ఒకే ఒక పదంతో చెబుతున్నారు.
ప్రేమించే మనసు నీటి చెలిమి వంటిది . ఎన్ని నీళ్లు తోడుకున్నా ఇంకా ఇంకా ఊరుతూనే ఉంటాయి. నువ్వు ప్రేమను పంచినప్పుడే అవతలి వైపు నుండి పొందగలవు . అమ్మతనం గుండె లోతుల్లోంచి ఉప్పొంగాలే తప్ప బలవంతంగా తీసుకోవాలనుకుంటే దానివల్ల ప్రయోజనం శూన్యం అని చెబుతున్నారు.
చరణం 4 :
అడ్డదారిలో వచ్చావమ్మా అనుకోకుండా కలిశావమ్మా నెత్తురు పంచి ఇచ్చావు నిప్పును నువ్వే మింగావు ఆడదాని ఐశ్వర్యంమేమిటో ఇప్పుడు తెలిసిందీ కథ ముగిసే పోయింది.
జీవితం విలువ తెలియని నాడు , స్త్రీ యొక్క ఆనందం ఎందులో ఉంటుందనే విషయం అర్థం కాని రోజుల్లో, వదులుకున్న ఆనందాలని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసే నాటికే సమయం మించిపోయింది అని చెబుతున్నారు.
కథ మొత్తం ఈ ఒక్క పాటలోనే ఆవిష్కరింపబడిందా అన్నంతగా పదం పదం లో ఒదిగిన ఆర్ద్రత , నటీనటుల హావభావ వ్యక్తీకరణ ,శ్రోతలను అలరించగలిగిన అనేకంటే కదిలించగలిగిన గాయనీ గాయకుల ప్రతిభ, కాచి వడబోసిన జీవిత సత్యాలు , కుటుంబ విలువల గూర్చిన వివరణ , వాటిని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం గూర్చి ఒక చక్కని సందేశాన్ని అందించారు. కథను ఆవిష్కరించడానికి రహదారిని వస్తువుగా ఎంచుకోవడం బస్సు ప్రయాణంలోసాగే నేపథ్యగానం అత్యంత వైవిద్యభరితంగా ఉంది.
చక్కని పాటను మనకందించిన అందరికీ అభినందనలు.
పద్మశ్రీ చెన్నోజ్వల
నీళ్ళల్లో అలజడి కలిగి
జలం జ్వలించి జ్వాల పుట్టదా
తొక్కిన కొధ్ధీ మట్టి
గట్టిపడి రాయిలా మారదా!
నాటిన విత్తనం నేలను చీల్చుకొని
గెలుపును సూచించదా
ఒత్తిడిలో కుక్కర్
ఈల పాట పాడదా!
గాయమైన గుండె
హాయిగొలిపే గేయాలు రాయదా
కాలికి కట్టిన గజ్జె
గుండెల్లో శబ్ధం చేయదా!
బాధలు రోదనల నీడలు కారాదు
అవి జీవితానికి దారిచూపే బోధనలు
భయం పిల్లిని చేస్తుంది
ధైర్యం పులిని ఎదిరిస్తుంది!
అడుగులు ముందుకు వేస్తే
దూరం దగ్గరయి పలుకరిస్తుంది
విజయం బాట వేసి పిలుస్తుంది
ఆనందం ఆలింగనం చేసుకుంటుంది!
అదొక అడవి . ఆ అడవికి రాజులేడు. అప్పుడు మరొక అడవి నుండి ఒక చిరుత పులి అక్కడికి వచ్చింది. అది తన ఇష్టము వచ్చినట్లు జంతువులపై దాడి చేయ సాగింది .దాని బాధ పడలేక జంతువులన్నీ తప్పించుకొని తిరగసాగాయి. ఆ చిరుత పులి ఆగడాలకు అంతే లేదు.
ఇలా ఉండగా ఆ జంతువులన్నీ ఈ చిరుతపులి బాధలు భరించలేక అవి కుందేలుతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు ఆ కుందేలు” మీరు నేను చెప్పినట్లు చేయండి. మీ బాధలు నివారణ అవుతాయి” అని వాటికి ఒక ఉపాయం చెప్పింది. అవి సరేనన్నాయి.
కుందేలు చిరుతపులి వద్దకు వెళ్లి “ఓ చిరుతపులి రాజా !నీవు పరిగెత్తి వేటాడే అవసరం లేకుండా ఆ జంతువులు నీ ముందరే ప్రత్యక్షమయ్యే మంత్రం నా వద్ద ఉంది. ఒక మునీశ్వరుడు ఈ మంత్రాన్ని పఠించగా నేను దానిని విని నేర్చుకున్నాను. ఇదిగో చూడు “అని తన కళ్ళు మూసుకుని ” టుర్ర్ ర్ర్ కాంజి” అని అంది. వెంటనే అక్కడ ఒక జింక ప్రత్యక్షమైంది .అప్పుడు చిరుతపులి దానిని వేటాడబోయేంతలో కుందేలు దానిని ఆపి “ఆగండి చిరుత పులిరాజా! ఇంకా కొన్ని జంతువులు కూడా ఇలాగే మీ ముందు ప్రత్యక్ష మవుతాయి. మీరు దేనిని కోరుకుంటారో చెప్పండి. ఆ జంతువు ఇక్కడ మీ ముందు వెంటనే ప్రత్యక్షమవుతుంది. చూడండి . మీకు ఇంకా ఏ జంతువు కావాలి “అని అడిగింది . అప్పుడు చిరుతపులి” కోతి” అని అంది. వెంటనే కుందేలు ” టుర్ర్ ర్ర్ తికో ” ” అని అంది. వెంటనే ఒక కోతి వాటి ముందు ప్రత్యక్షమైంది.
తర్వాత చిరుతపులి “అడవి దున్న” అని కోరింది. అప్పుడు కుందేలు ” టుర్ర్ ర్ర్ న్నదువిడఅ ” అని అంది .వెంటనే అక్కడ అడవిదున్న ప్రత్యక్షమయింది. అలాగే ఎలుగుబంటి, దుప్పి, జిరాఫీ కూడా కుందేలు ఆ మంత్రం చదవగానే ప్రత్యక్షమైనాయి. చిరుతపులి సంతోషించి” ఓ కుందేలా! నాకు ఈ మంత్రం చెప్పవా! నేను నిన్ను ఏమీ చేయనులే!” అని అంది.
అప్పుడు కుందేలు “చిరుతపులి రాజా! ఈ మంత్రం చాలా మహిమ గలది. ఇది పనిచేయాలంటే మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఒక నెల రోజుల వరకు మీరు ఏ జంతువును చంపకూడదు. అలా చేస్తేనే మీకు ఈ మంత్రం పనిచేస్తుంది “అని అంది. అందుకు చిరుత పులి సరేనంది .
ఇలా నెల రోజులు గడిచాయి. తర్వాత ఆ చిరుతపులి ఆ మంత్రాలను చదివింది. కానీ ఒక్క జంతువు దాని ముందర నిలువలేదు. ఇదేదో కుందేలు తనను మోసగించిందని దానికి అప్పుడు అర్థమైంది. వెంటనే అది కోపంతో కుందేలు కోసం ఎంత వెదికినా అది కనబడలేదు. అదే కాదు. ఆ అడవిలో ఒక్క జంతువు కూడా కనిపించలేదు .
అవి అన్నీ పక్క అడవికి పారిపోయి మృగరాజు సింహాన్ని శరణు వేడాయి . వెంటనే ఈ చిరుతపులి ఆ అడవికి కుందేలును వెదకుటకై వెళ్లింది. ఆ అడవికి వెళ్ళిన చిరుతపులిని సింహం తరిమి తరిమి కొట్టింది. చివరకు ఆ చిరుతపులి తన అడవికి తిరిగి వచ్చి అక్కడ ఒక్క జంతువు కూడా లేకపోవడంతో చేసేది లేక అది అక్కడనుండి మరొక కొత్త అడవిని వెతుక్కుంటూ బయలుదేరింది .
ఈ సంగతి తెలిసిన జంతువులన్నీ తిరిగి ఆ అడవికి వచ్చి సుఖంగా ఉండసాగాయి. అవి కుందేలుతో ” ఆ మంత్రం ఏమిటి? మాకు కూడా చెప్సవా!” అని అడిగాయి. అప్పుడు కుందేలు నవ్వి ” అయ్యో! అది మంత్రం కానే కాదు. అక్షరాలను తలక్రిందులుగా చేసి అన్నాను. అంతే! ఆ తెలివి తక్కువ చిరుత పులి నమ్మింది ” అని అంది.
ఆ తర్వాత అవి తమను కాపాడిన సింహాన్నే తమ అడవికి రాజుగా ఉండమని కోరాయి . అందుకు సింహం అంగీకరించి ఈ రెండు అడవుల్లో ఏ జంతువుకు ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని హామీ ఇచ్చింది. కుందేలు తెలివి వల్ల చిరుతపులి బాధ తొలగి జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అందుకే పిల్లలూ! ఆపద వచ్చినప్పుడు ఇతరులకు చెప్పి వారి సాయాన్ని కోరాలి.
ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు ,వక్త, వ్యాసకర్త, అధ్యాపకురాలు ,బహుభాషా కోవిదరాలు ఐన శ్రీమతి పాకాల యశోద రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ .ఈమె ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ‘బిజినేపల్లి’ గ్రామం, నాగర్ కర్నూల్ లో ఆగస్టు 8 1929న జన్మించారు .తల్లిదండ్రులు సరస్వతమ్మ ,కాశిరెడ్డి గార్లు. మూడవ తరగతి వరకు మహబూబ్ నగర్ లో చదివి తదనంతరం ‘రాజబహదూర్ వెంకటరామిరెడ్డి ‘గారి ప్రోత్సాహంతో నారాయణగూడ లోని ‘బాలికోన్నత పాఠశాల’లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషల్లో స్నాతకోత్తరపట్టా పొందారు. 1976లో” అలీఘర్ విశ్వవిద్యాలయం’ నుండి డి.లిట్.అందుకున్నారు.హిందీ, ఉర్దూ ,కన్నడ భాషలతో పాటు జర్మన్ భాషలో కూడా ప్రవీణురాలు.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ పాకాల తిరుమలరెడ్డి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రెడ్డిగారు గీసిన ఎన్నో చిత్రాలకు ఆమే స్ఫూర్తి ప్రదాత .స్వతహాగా కళాపిపాసి ఐన ఈమె ‘ఇత్తడి విగ్రహాల’ సేకరణ చేసేవారు. భర్త చిత్రకళా ప్రదర్శనలో చురుకుగా పాల్గొని విజయవంతం అయ్యేలా చూసేవారు. రెడ్డి గారితో ప్రదర్శనల కోసం పలు దేశాలు పర్యటించిన సందర్భంలో ‘భారతీయ చిత్రకళ’ అనే గ్రంథాన్ని రచించారు.

యశోద గారు తన 12వ ఏట నుండే రచనలు చేయడం ప్రారంభించారు. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం రచయిత్రి .ఈమె రచనలు కల్పితాలు కావు. అవి అనుభవ సారాలు .తెలంగాణ జీవన విధానం ,సంస్కృతి- సంప్రదాయాలు ,ఆచార- వ్యవహారాలు ,సామెతలు సందర్భానుసారంగా తమ రచనల్లో నిక్షిప్తం చేసేవారు .బాల్యంలో ఈమెను ‘ఎచ్చమ్మ ‘అని పిలిచేవారట .ఆ పేరుతోనే ‘ఎచ్చమ్మ కథలు ‘రాశారు .యశోద గారు వందకు పైగా కథలల్లినా 63 మాత్రమే పుస్తక రూపం సంతరించుకున్నాయి. మూడు కథా సంపుటాల్లో ‘మా ఊరి ముచ్చట్లు’ (1973 )సంపుటిలో 1920 – 40 మధ్యకాలంనాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ‘ఎచ్చమ్మ కథలు'( 1999 )లో 1950- 70 నాటి తెలంగాణ సంస్కృతిని ప్రస్ఫుటంగా దర్శింప జేశారు .’ధర్మశాల'( 2000) సంపుటిలో 1980 – 90 మధ్యకాలం నాటి తెలంగాణ సమాజపు పరిస్థితులు చక్కగా వివరించారు. ఒక రకంగా తెలంగాణ సమాజపు నూతన శకానికి ‘దర్పణం’గా దీన్ని పేర్కొనవచ్చు. ఈ మూడు సంపుటాల్లో తెలంగాణ భాష, మాండలికం ,సంస్కృతి ,సామాజిక అంశాలను చక్కగా వివరించారు. ‘మా ఊరి ముచ్చట్లు ‘,’ఎచ్చమ్మ కథలు ‘పాలమూరు మాండలికంలోను, ‘ధర్మశాల’వ్యావహారిక తెలుగులో రాశారు.
మాండలిక భాష పరిరక్షణే ధ్యేయంగా ఆమె రాసిన పరిశోధక వ్యాసాలు భారతి, జాగృతి ,మూసీలాంటి ఎన్నో పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంచి వక్తయైన ఈమె ప్రాచీన తెలుగు సాహిత్యంపై చేసిన ప్రసంగాలతో పండితుల ప్రశంసలు అందుకున్నారు .తన మాండలిక యాసతో సభికులను ఆకట్టుకునేవారు .’ఆకాశవాణి’లో తెలంగాణ మాండలికంలో ప్రసంగించిన తొలి రచయితగా పేరుపొందారు .’ఆకాశవాణి’లో ‘పండుగలు – పబ్బాలు ‘,’జరఇను కోవే తల్లీ’ , ‘ఎచ్చమ్మ ముచ్చట్లు’ ఇలా పలు శీర్షికల పేరిట 200 పైగా ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
194 9- 50 ప్రాంతంలో” దక్కన్ రేడియో’లో మాండలిక భాషలో కథలు ,సంభాషణలు, పిల్లల నాటికలు మొదట ప్రారంభించిన ఘనత వహించారు. బాల సాహితీవేత్త ఐన ఈమె ‘బుచ్చయ్య పెబ్బె ‘నాటికను పిల్లలకోసం రచించారు.
యశోద గారు కవయిత్రిగా ఉగాదికి – ఉయ్యాల, భావిక అనే రెండు సంపుటాలు స్వయంగా వెలువరించారు. ఇంకా ద్విపద వాఙ్మయం, ప్రబంధ వాఙ్మయం, భాగవతసుధ రచించారు. సంయుక్తంగా వెలువరించిన మరొక రెండు రచనలు. 1.కావ్యానుశీలనం (డాక్టర్.కులశేఖర్ రావు గారితో కలిసి) 2.చిరుగజ్జెలు (ఆల్వార్ స్వామి ,సి.నారాయణరెడ్డి గార్లతో కలిసి)
వీరు పారిజాతాపహరణం, ఉత్తర హరివంశం ,తెలుగు సామెతలు, ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించి విలువైన పీఠికలు రాసి వెలువరించారు. అనువాదకురాలైన ఈమె’ హిందీ కవయిత్రులు’ గ్రంథాన్ని అనువదించారు.
యశోద గారి అభిప్రాయం: భాషలో నానుడిగాని ,సామెత గానీ, జాతీయం గాని అలవోకగా పుట్టదు. ఆయా ప్రాంతాల వారి అనుభవాల సారం నుండి ఉద్భవించినవి ఇవి. ‘నుడికారాలు ‘భాషకు ‘జీవనాడి’ అని ఆమె పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ,లలిత కళా అకాడమీ, సంగీతా అకాడమీ లలో సభ్యురాలిగా పనిచేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో కూడా అనుబంధము ఉండేది .
నిక్కచ్చి మాట తీరు, నిర్విరామ కృషి ,తెలంగాణ భాషపై పట్టు, మాండలికం పై అవ్యాజమైన మమకారంతో
శైలిలో హృద్యంగా రాసి మాండలికాన్ని ‘సజీవ శిల్పం’గా మలిచి తెలంగాణా భాషా సొబగుల్ని తన విశిష్ట రచనావ్యాసంగాల ద్వారా విశ్వవ్యాప్తం చేసి అలసి ,ఆ భారతీదేవి పాదాల చెంత అక్టోబర్ 7 ,2007న ప్రశాంత నిద్రలోకి జారుకున్న ఈ అవిశ్రాంత బహుముఖ ప్రజ్ఞాశాలికి అందించే ‘అక్షర నివాళి’యే ఏ నిజమైన శ్రద్ధాంజలి.
“ఆంధ్ర సాహిత్యంలో వచన కవితా శిల్పి,కవికుల తిలకుడు,రస గంగాధరుడు అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తన రచనల ద్వారా ఒక విశిష్ట రచనా ప్రవృతిని,కవితా స్రవంతిని, నిర్దిష్టకులాలలో, నిరంతర రస ప్రవాహంగా ప్రవహింపచేశాడు. తన అమూల్య రచనల ద్వారా ఆంధ్ర సాహిత్య చరిత్రలో శాశ్వత కీర్తి చంద్రికల్ని ప్రసరింప చేశాడు. ఆయన రచనలు ఆంధ్ర సాహిత్య ధనాగారానికి ఒక అక్షయ రత్న సంపద వంటివి”.తిలక్ గొప్ప కవి.ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇతనికొక విశిష్ట స్థానముంది.
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తన కవితా లక్ష్యాన్ని చెప్పుకున్న దేవరకొండ బాల గంగాధర తిలక్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో ఆగస్టు 1 వ తేదీ 1921 సంవత్సరంలో జన్మించాడు.
సమాజంలో దగాపడిన వారి జీవితాలను చూసి చలించిన తిలక్ సున్నిత హృదయుడు కాబట్టి వాటినే తన కవితావస్తువులుగా మలచుకున్న
తిలక్ భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేతతో “అమృతం కురిసిన రాత్రి,ప్రభాతము సంధ్య,గోరువంక కవితాసంపుటిలు,సుందరీ సుబ్బారావు,ఊరి చివర ఇల్లు అనే కథా సంపుటాలు,సుశీల పెళ్లి,,సాలెపురుగు అనే నాటకాలు,సుచిత్ర ప్రయాణం,ఇరుగుపొరుగు,సప్తశిల అనే నాటికలు ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన తిలక్ కేవలం 45 ఏళ్ల అతి చిన్న వయసులో సెప్టెంబరు 1 వ తేదీ 1966వ సంవత్సరంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.చనిపోయాక కుందుర్తి ఆంజనేయులు రాసిన పీఠికతో 1968 సంవత్సరంలో ముద్రింపబడిన అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా 1971 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
సమాజాన్ని చూసి కరిగిపోయిన తిలక్
మిత్రులకు రాసిన లేఖల ద్వారా మిత్రులతో తిలక్ కున్న సత్సంబంధాలు ,తిలక్ వ్యక్తిత్వం,మనస్తత్వం మొదలగు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.
‘ఆవంత్స సోమసుందర్’ తిలక్ కు ప్రాణమిత్రుడు.సోమసుందర్ కు రాసిన లేఖలో ” జీవితంలో ఎప్పుడు ఎవరు వచ్చి గుండెల్ని పెనవేసుకుపోతారో ఏం తెలుస్తుంది.అలాగ సామీప్యంలోని ఆత్మీయమైన ఆవరణలోకి విచిత్రంగా సురభీకృతం చేస్తూ నువ్వొచ్చావు. అన్నా అని పిలిచావు.ఆ పిలుపు గుండె లోతులంటి, తిరిగి తమ్ముడూ అని ప్రతిబింబించక మానుతుందా? అందుకే ఇంకా మీరు అనే సంబోధన కృత్రిమంగా ఏదో దూరాన్ని పలకరిస్తున్నట్లు తోచి మానివేశాను.” అని రాయడం వల్ల మిత్రులను ఆత్మీయుతతో దగ్గరకు తీసే ప్రేమతత్వం కన్పిస్తుంది. వరవరరావుకు రాసిన లేఖలో ” నా కింత దగ్గరైన నువ్వు అలా అలా దూరదూరంగా ఎందుకున్నావో అని నా మనసు చాలా బాధ పడుతుంది.డబ్బూ,వ్యాపారమూ, ప్రయోజనమూ ప్రధానంగా ఎంచబడే నేటి సంఘంలో అవ్యాజమైన మైత్రి,ఆర్టిస్టుల మధ్య మైత్రి ఒకటి గదా!
కన్సిడరేషన్! నువ్వు నా కన్నా చాలా పిన్నవాడివైతే మాత్రం కుల వయో దశ భేదాలు కవులలో,కళారాధకులలో అప్లై చేయవు.” అంటాడు.మైత్రీ బంధానికి తిలక్ ఇచ్చిన విలువ గొప్పది.డబ్బు,హోదాకు లొంగనిది.కులాతీత,వయోతీతమైంది.నిస్వార్థ,అవ్యాజమైనదే అసలు సిసలైన మిత్రత్వము.నిజమైన మైత్రికి ఇవేవీ అడ్డుకావని మైత్రికి చక్కని నిర్వచనం చెప్పాడు.ఇలా లేఖలలో తిలక్ స్నేహానికిచ్చిన ప్రాధాన్యం తెలుస్తుంది.
జీవితంలో ఏదో సాధించాలనే ఆశ,తపన ” వేళ్ళ సందుల్లోంచి పొడి ఇసుకలా జారిపోయే కాలాన్ని, వయస్సునీ,తల్చుకుంటే భయమౌతుంది.” అని ఒక ప్రచురణ సంస్థ నెలకొల్పాలన్న తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ నీ సహకారం ఉంటే తప్పక కృతకృత్యుణ్ణవుతానని రాస్తూ సమయం దాటాక బాధపడి ప్రయోజనం లేదు.” అందుకే ఈ లోపుగా చేసి వెయ్యడం మంచిది కదా.” అంటూ సోమసుందర్ కు రాసిన లేఖలో తెలిపాడు.
మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో జీవితంలో తృప్తి ఎట్లా లభిస్తుందో వివరించాడు.” నెల బారుగా,చప్పగా,బాధగా వెళ్లిపోయే జీవితంలో ఏవో కొన్ని గొప్ప క్షణాల్ని మనవిగా చేసుకున్నామనే ఆనందమూ,దాన్ని నలుగురితో పంచుకోవడమూ కన్నా తృప్తి ఏముంది.” అంటూనే ” ఇక్కడ దట్టంగా పరచుకున్న మనుష్యారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ,దోమలూ,రాజకీయాలు జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలో కన్నా అడవుల పచ్చదనమూ,ప్రకృతి సన్నిహితంగా ఉన్న మీ జీవితమే సుఖకరమేమో.” అనడం వల్ల కుళ్లు మనుష్యుల మధ్య నలిగి బ్రతికే కంటే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అడవుల్లో ఉంటే మనసుకు తృప్తి అనే భావన కలిగినవాడు. అట్లాని మానసికమైన ఒంటరితనాన్ని భరించడం కూడా కష్టమే నంటాడు.
తిలక్ బాధాతప్త హృదయుడు.జీవితంలో జరిగిన సంఘటనలు, మనసులో మరపురాని ముద్రలే అతన్ని కవిగా చేశాయి మోగంటి మణిక్యాంబకు రాసిన లేఖలో చిన్నతనంలో ఒక వృద్ధుడు,జీర్ణాదేహుడు,ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి చూసి ఎంతో ఏడ్చాడు.” జీవితం అంటే ఏమిటి? సృష్టి పరమార్థం ఏమిటి? అన్న చింతనలో పడ్డాడు.16,17 సంవత్సరాల వయసులో ఒకసారి పార్క్ టౌన్ స్టేషన్ లో దిగివస్తుంటే ఇద్దరు ముగ్గురు బాబూ! ఒక మాట అని పిలిచారు.ఏమిటో నని వారి దగ్గరకు వెళ్ళాడు.ఒక వస్తువు మీద గుడ్డను తీసి చూపించారు.భయంకరమైన, వికృతమైన శవం.దహనానికి చందా అడుగుతున్నారు.జేబులోంచి చేతికి వచ్చిన డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళాడు.గది కెళ్లగానే ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లు భయపడ్డాడు.రాత్రంతా ఆలోచనలతో సతమతమయి అంతా మిథ్యగా అనిపించింది.బ్రతుకు మీద విరక్తి కలిగింది.
ఇంకోసారి మిత్రులతో సినిమాకి వెళ్తున్న సమయంలో ఒక ఎనిమిదేళ్ల పిల్ల ఆకలిగా ఉంది.డబ్బులిమ్మంది అందరూ ఆమెని విదిలించుకుని చీ అని తోసి వేస్తుంటే సభ్యత కోసం తిలక్ కూడా విదిలించుకున్నాడు.ఆ రోజు రాత్రంతా బాలికనే కళ్ళముందు నిలిచింది తెల్లవారి జేబులో పది రూపాయలు వేసుకుని ఆ అమ్మాయి కోసం అంతా గాలించాడు.కానీ ఆమె కనిపించలేదు.మూడు రోజులు వెతికాడు కానీ వృధా. ” ఆమె అందమూ ,సొగసైన కళ్ళు,ఆ బాల్య చాపల్యమైన మనస్సు ఏ ధూళిలో ఏ బాధలో ఏ మంటలో దినదినమూ కాలిపోతున్నాయి ” ఎవరు దీనికి కారణం?…విలవిలలాడి పోయాను.ఆమె నా చెల్లెలే అయితే అలా ఛీదరించుకునేవాణ్ణ ?” అనుకున్నాడు నెలరోజుల తర్వాత ఆమె కనిపిస్తే జేబులోంచి ఆరు రూపాయలు తీసి చేతిలో పెట్టి ఒక రోజు కడుపు నిండా తిను అని వెళ్ళిపోయాడు.అప్పటి సంఘటనలు మనసులో కలవరం రేపి ” ఈ జీవితానికి,సమాజానికి అర్థం తెలుసుకోవడానికి,ఒక అర్థం ఇవ్వడానికి ఒక ఆదర్శ జ్వాలలో నా బ్రతుకును చుట్ట బెట్టి తోడు లేని ఈ దారిని నాటి నుండి ప్రయాణం” సాగించి అనేక బాధలతో,అనారోగ్యంతో అలమటించి ” గొప్ప అనుభవాన్ని కవిత్వాన్ని పొందాడు మధురమైన
ఆ హృదయాన్ని,మనస్సుని లోకంచుట్టూ తిప్పి సౌందర్యాన్ని అవలోకించి ఆహ్వానించాడు.” అని చెప్పిన సున్నిత హృదయుడు,కోమల మనస్కుడు జీవితానికి,సృష్టికీ ఒక అర్థం వెదికి సమాజానికి సుఖ సంతోషాల్ని అన్వేషించాలనే తపన కలవాడు.” మనిషీ, సంఘమూ,దేశమూ, విశ్వమూ ఈ సర్వ జగత్తు జ్ఞాన సరస్సులో విరిసిన ప్రేమ పద్మం లాగా సత్యం,శివం, సుందర శీలమై ఉండాలి.” అంటాడు.”
వ్యుత్పత్తి,వివేకం,ఉద్రేకం ఇన్నింటిని సమ్యక్ స్వరంలా మేళవించి” ఏదో సాధించాలనే తహతహలాడేవాడు.నిజమైన వెలుగు కోసం ” ఏళ్ల తరబడి సృష్టించుకున్న మౌఢ్య భావాలు,సంకెళ్లని పగులగొట్టి” స్వార్థమూ, సంఘ గౌరవమూ, ధనమూ ప్రధానమైన ఈ లోకాన్ని ఖాతరు చేయక ఏ పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కోగల ఆత్మీయశక్తి నాకుంది ఆనుకొని ” సంపూర్ణ నిర్మలానురాగం ముందు తప్ప తల వాల్చగూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.” అని మానసిక ఆవేదనను,ఆశయాన్ని తేటతెల్లం చేశాడు.” నిర్ధయా, నిశ్చితమైన నిధి కొండరాళ్ల మీద తలబాదుకొని ఏడ్చినవాణ్ణి కాబట్టి ఏ విశ్వాసాన్ని వృధా పోనివ్వను.” సున్నితమైన నా మనస్సు మీద కూడా ఎన్నో దెబ్బలు తగిలాయి.” అంటూ మానసిక బాధను వ్యక్తపరచి ” ఒక్కొక్క కన్నీటి చుక్కను తుడువగలిగితే జన్మ సార్థకమన్న శరత్ మాటలను స్వతహాగా ఆచరించాలన్న ఉబలాటం కలిగిన వాడు.ఆయన మాటల్లోనే ” ఒక సంఘము నుండి ఉబికే బాష్పాన్ని తుడువగలిగితే ఒక్క అధరం మీదికి హాస్యాన్ని రప్పింపగలిగితే జీవితం ధన్యమౌతుందని నా ఉద్దేశ్యం.కరుణ,సౌందర్యమూ, మానవత్వమూ ఈ మూడు ప్రాతిపదికలుగా నా ఆదర్శాన్ని,ఆలోచనల్ని నిర్మించుకున్నాను నా రచనలూ నా జీవితమూ ఈ భావనల్ని వ్యక్తీకరించకపోతే నేను జీవచ్చవాన్ని” అని తన కవితా లక్ష్యాన్ని, జీవితాదర్శాన్ని వివరించాడు.తిలక్ మనస్తత్వమేమిటో ఎంతో చక్కగా వివరించాడు లేఖల ద్వారా.” *దుఃఖానికీ, బాధకీ కరుగలేకపోతే ఈ బాలగంగాధరుడు తన కవిత్వాన్ని,తన ప్రాణాన్ని కూడా బంగాళాఖాతంలో విసిరిపోతాడు అతనిలో ఎంతో దృఢవిశ్వాసం కన్పిస్తుంది.మనిషికి మానవత్వముండాలి.కరుణ, జాలి,దయా ఉండాలి.అవి లేకపోతే జీవచ్చవమేనన్న అభిప్రాయం కలవాడు.తిలక్.జీవితానుభవాలకు,రచనలకు అవినాభావ సంబంధమున్న విషయం ప్రస్పుటమైందీ లేఖల్లో.
” ఆర్ద్రమైన ప్రతి హృదయమూ అశ్రుసిక్తమైన ప్రతి నయనమూ సుందరమైన ప్రతి దృశ్యమూ నన్ను కలలో కూడా వశం చేసుకుంటాయి.ఒక్క పాటకోసం ఒక్క మాటకోసం అవసరమైతే ఈ ధనాన్ని జగత్తునీ కాదనగల సాహసం వుంది నాకు”.అని ప్రపంచాన్నే ఎదిరించి పోరాడిన ధీశాలి, కవితా వీరుడు.కవికి ఉండవలసిన ఉత్తమగుణం తిలక్ లో కనిపిస్తుంది.కవి ఊహలో చరించకుండా జగత్తులో చేదు నిజాన్ని చవిచూసి అనుభవించి ఆవిష్కరించాడు. బాహ్య జగత్తులోని విశిష్ట సన్నివేశాల వలన, ప్రజ్ఞా విశేషం వలన తమలో కలిగిన ఆలోచనా వైవిధ్యం చేత,తమకు కలిగిన అనుభవాలను కావ్య చిత్రణం ద్వారా వ్యక్తీకరించి ఆనందం చేకూర్చడం తిలక్ లక్ష్యం.ఇంద్రియాలకు తృప్తి కలిగించేది అతని దృష్టిలో ఆనందం కాదు మానవత్వంలో పరిపూర్ణత నొందుటలోనే ఆనంద మున్నదని అతని సిద్ధాంతం. *సుందర స్వప్నాల మేడమెట్ల నుండి వాస్తవిక శిథిల రూపాలలోకి హఠాత్తుగా జారిపడిన నాకు తెలుసు అంటాడు.” పైకి నవ్వుతున్నా అలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో వున్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు”. అని వాపోతాడు,లోతుల్ని వెతుకుతాడు.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గాయాలు తగిలినా ఎదుర్కోగలిగే శక్తి గలవాడు.కృంగిపోవడం నా స్వభావానికి వ్యతిరేకం అన్న ధీరమనస్కుడు.
అసలు కవి అంటే ఎవరు?కవి ధర్మాన్ని లేఖల్లో వివరించాడు.” సున్నితమైన ఊహ,ఉద్రేకము,” ఉంటేనే గొప్ప రచనలు వస్తాయన్న విశ్వాసము కలవాడు.సాధారణంగా మానవులందరూ దైనందిన సమస్యలతో ,బాధలతో సతమతమవుతూ వుంటారు.చిన్న చిన్న కోరికలూ,ద్వేషాలూ,అల్పమైన ఊహాలతో సతమతమవుతూ వుంటారు.” నేలబారుగా జడంగా స్తబ్దంగా గొంగళిపురుగుల్లా పాకుతారు.వాళ్ళకి సౌందర్యం డబ్బులోనూ ఉద్యోగం లోనూ భేషజంలోనూ కనబడుతుంది కానీ కళాశీలికి యివేమీ కనిపించవు.అతనికున్న విలువలు వేరు.అతని చూపు వినీల గగనాన్ని బురుసుకుంటూ నక్షత్రమండలంలోకి పోతుంది.అతడు మనిషి లోపల మనిషిని చూస్తాడు.అతని దృష్టి ఎక్కడ అందం వున్నా నిజం వున్నా అక్కడ వాలుతుంది. దేనికోసమో తపన,అన్వేషణ నిరంతరంగా సాగిస్తాడు.ఈ యాత్రలో అతడు లౌకిక జగత్తును లక్ష్య పెట్టడు. అందుకే అతని ఊహ శాశ్వతమైంది.అతని నీతి అతీతమైంది.అతని రచన అక్షరమైంది. నశించనిది.” కవి ఊహ లోకోత్తరమైంది. అందువల్లనే ఉత్తమ రచన సార్వజనీనము,సార్వకాలికమౌతుందన్న ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయాలను తలపింపచేశాడు.
కవి సంప్రదాయబద్ధుడుగా కాక కాలానుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకొని రచన సాగించాలంటాడు. కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని,బూజు పట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే. అంటూ సంఘాన్ని మేల్కొల్పాలి,ప్రజలను చైతన్యవంతులను చేయాలి.ఆత్మవిశ్వాసం ఉండాలి.కవిత్వాన్ని సమగ్రంగా దర్శించడమూ,జీవిత విధానాన్ని గురించి స్పందించడమూ చాలా అవసరం అంటాడు తిలక్.
తిలక్ ప్రకృతిలోని అందాన్ని చూసి పరవశించిపోయేవాడు.ప్రకృతిని ఆరాధించేవాడు.లేఖల్లో ప్రకృతి వర్ణన కూడా కనిపిస్తుంది.సహజ చిత్రీకరణ,కవి దృష్టి ప్రత్యేకంగా లోతుల్ని చూస్తుంది.గుండెను హత్తుకుపోయే విధంగా ఉంది.ప్రకృతి వర్ణన సహజంగా వుంది. సోమసుందర్ కు రాసిన లేఖలో ” ఈ రెండు రోజుల నుంచీ వర్షం కురిసి కురిసి భూమి తడిసి తడిసి పచ్చి పచ్చి బాలింతరాలిగా అందంగా వుంది ” అంటాడు
వర్షాకాలంలో తడిగా ఉన్న భూమి ఎట్లా ఉందో ఉపమాలంకార ప్రయోగం చేశాడు. ఆలంకారిక రచన,ప్రకృతిసాన్నిహిత్యాన్ని కోరుకునేవాడు.దట్టంగా పరచుకున్న మనుషారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ దోమలూ రాజకీయాలూ జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలోకన్నా అడవుల పచ్చదనము,ప్రకృతి సన్నిహితంగా వున్న జీవితమే మంచిదని మిరియాల రామకృష్ణ గారికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు.వర్షాకాలం అంటే తిలక్ ఇష్టపడేవాడు.ఆకాశంలో నల్లని మబ్బులు,ఒక్కసారిగా వాన,భూమి చల్లబడి పచ్చబడి మనసుకు ఎంతో హాయిసిస్తుందని చెప్తూనే ” స్నానం చేసి వచ్చిన యవ్వనవతి శరీరంలాగా విచిత్రమైన అందం,ఆకర్షణ.” ఉందని వర్ణించాడు.
మోగంటి మాణిక్యాంబా దేవికి రాసిన లేఖలో మనసులోని వ్యధను ఎవరూ గుర్తించలేరని రాస్తున్న సందర్భంలో పైకి నవ్వుతున్నా అలలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో ఉన్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు అంటూనే జీవితం చాలా విచిత్రమైంది,అద్భుతమైందని చెప్తూనే ” రంగురంగుల అలలలో వంగి బ్రతుకు అంచుల్ని ముంచుతూ వుంటుంది. ఎన్ని స్వప్నాలూ,ఎంత లోతు తెలియని భయంకరాఘాతాలు.” అంటూనే సూర్యోదయాన్ని యీ విధంగా ” చీకటి లొత్త గిత్తి మెత్తని వెల్తురు తూర్పున ఆడదాని అనురాగంలాగ వ్యాపిస్తోంది.నక్షత్రాలు కాంతి విహీనమై గాజుపూసల్లాగా వున్నాయి. అక్కడక్కడ ఒక మబ్బు ఏ అప్సరస ఒంటిమీద నుండో జారిన చీరకొంగులాగ గాలిలో తేలిపోతుంది.మనోహరమూ,శాంతమూ అయిన ఆ ప్రకృతిలో లీనమౌతున్న నా మనసుకు మళ్లీ అశాంతి.” అంటూ తన అనుభూతిని వివరించాడు ఇంతలోనే నిరాశావాదం.” లోపల్లోపల ఏదో ఒంటరితనం ఒక్కణ్ణే నా బాధలతో ఏదో ఎడారి అంచులమీద నడచిపోతున్నాను– అనిపించింది.ఈ సంసారమూ ఈ స్నేహాలూ అన్నీ ఎండమావులేమో– అనిపిస్తుంది.మబ్బు పట్టి ఆకాశంలో ఈ రోజంతా తెలియని చక్కని కౌశలమూ ప్రజ్ఞా వుంది.నేను కొంత ఆశ్చర్య పడ్డాను.ఇంత బాగా రాయగలడా కథలు కూడా అని— కాని నీ కథల పుస్తకంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకుగాని,బలపరచుటకుగాని నీవు చేసిన ప్రయత్నం- ఆ కథాశిల్పంలో ముఖ్య దోషంగా కనబడింది.ఆ కథల రక్తిని అనుభవించకుండా చేసింది. పాలటబులో డిజైనులవల్ల కళ ఎప్పుడూ పరిమితమూ సంకుచితమూ అయిపోతుంది.అయితే ఆ రోజుల్లో నువ్వు ఆ ప్రభావపు ఇనుప కౌగిలిలో ఉండేవాడిని.కాని ‘కాలనేమి’ లో దోషం మచ్చుకైనా లేదు”.
వరవరరావు రచనలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరవరరావుకు రాసిన లేఖలో “అమృతవృష్టిలో అక్కడక్కడ బెట్టుగా ఉంది.యజ్ఞంకై కొత్త టానిక్,సోషలిస్టు సీత–ఇటువంటివి అనుచితంగా తోచాయి.
కుక్క నోట్లోంచి ఎంగిలాకు– ఆ ఇమేజరీ ఎందుకో? ఫోర్స్ డ్ గా వున్నట్లు అనిపించింది.రాకాశశికి మబ్బురంగు పైట అన్నాడు.మబ్బే పైటగా ఉంటుంది గదా.ఆషాఢ మాసంలో ఆ రంగుగల మరో పైట ఏముంటుంది? శశికి మరోసారి రివైజ్ చేస్తే మంచిదేమో అనుకున్నాను.నాకు నచ్చిన లైన్స్ గురించి చెప్పడం లేదు.మీరు మరోసారి చూడండి.మరి మీ కెలా తోస్తుందో? అన్నట్లు “వూసి” అని రెండు మూడు సార్లు ప్రయోగించారు.దాని అర్థం? నాకు కొత్తగా ఉంది.” – యూసేజ్. వరవరరావు తన రచనను సమర్థించినట్లు తెలిశాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను,పొరపాటయింది అని వేరే లేఖలో” పేజీలు సరిజేసి చదివితే రచన సందర్బశుద్ధిగా కనబడింది.” అని రాశాడు. వెనుకటి కవులకు తన కాలంలో కవులకు తారతమ్యాన్ని వివరిస్తూ ” నా వెనుక తరంలో కవులలో ముఖస్తుతీ వెనకాలే దూషణా ప్రత్యేకంగా ఉండేవి.సామాన్యుడి కన్నా ఊహలో,సంస్కారంలో మరికాస్త పెరుగుదల సూచించవలసిన ఆ కవులలో కనబడే ఈ కృత్రిమత్వం ,పిరికితనం దుర్భరమనిపించేవి.ఆఖరుకి కవిత్వంలో కవిత్వాన్ని గురించి నిజాయితీగా చూడలేని వీరి నుంచి ఏ మాశించగలమనుకొనే వాడివి.” అంటాడు.
జానకీ జానికి రాసిన ఉత్తరంలో ‘ మోడరన్ పోయిట్రీ పేరుతో పత్రికలలో ప్రకటితమయ్యే వాటిని చూచి విసుగు చెందాను.దాని మూలంగా చాలా విచారిస్తున్నాను.ప్రబంధయుగంలో చివరికాలంలో వచ్చిన సాహిత్యంలోని సమానమయిన క్షీణత, పదాల గారడి,నడకల శూన్యత,ప్రాస కొరకు ప్రయత్నించుట అందులో మనకు గోచరిస్తాయి.” అంటూ నవీన కాలాన్ని గూర్చి శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి రాసిన వ్యాసమే బాగుందని చెప్తూ సమకాలీన చరిత్రను గూర్చి విశదంగా విమర్శిస్తారని అనుకుంటున్నాదన్నాడు.
ఈ విధంగా తిలక్ లేఖల్లో అతని అనుభూతులు,అనుభవాలు, కవితాలక్ష్యం,రచనోద్దేశ్యం,విమర్శ, ప్రకృతి వర్ణన,ఆరోగ్య విషయాలు,మిత్రత్వానికి యిచ్చిన విలువ మొదలైనవి అనేకాంశాలు విదితమౌతున్నాయి.స్నేహితులకు తన మనోగతాన్ని స్పష్టంగా,నిర్మొహమాటంగా, కవితాత్మకతలో విశదపర్చడం లేఖలవల్ల గమనించవచ్చు. మారుతున్న కాలాన్ని బట్టి సత్యాన్ని అన్వేషించి సమాజాన్ని జాగృతం చేసేదే నిజమైన కవిత్వమనే అభిప్రాయం వున్నవాడు మానవత్వంలో పరిపూర్ణత నొందజూచుటలోనే ఆనందమున్నదని అతని సిద్ధాంతం.
ఈ రకంగా లేఖల వలన కవిత్వంపట్ల తిలక్ కున్న ప్రత్యేకమైన,ఖచ్చితమైన అభిప్రాయం తెలుస్తుంది.
తెలుగు సాహిత్య కన్యకు తన రచనల ద్వారా తిలకం దిద్దిన ప్రముఖ కవి తిలక్ సాహిత్య పరంగా కూడా లేఖలకు ప్రముఖ స్థానముందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.
