మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

చచ్చిపోతే…

by -ప్రమోద్ ఆవంచ July 12, 2023
written by -ప్రమోద్ ఆవంచ

ఏం చేసాననీ..
ఏం చేయగలననీ…
ఏం చేస్తూ
వచ్చాననీ…..
ఇన్ని సంవత్సరాలుగా
ఎన్నో అద్భుత
సూర్యోదయాలను
భూస్థాపితం చేసాను….
ఎన్ని సాయంకాలాలు
రాలిపోతున్న సంధ్య
పొద్దుల్లో గడిపాను…
ఎన్నో చీకట్లను
వెలుగనుకొని
భ్రమ పడ్డాను…
ఎన్నో దారుల్లో దారి తప్పి
గమ్యం వెతుక్కునే
పనిలో తిరిగాను…

ఏం అడిగానని ..
ఎవరిని వంచించానని..
ఇంకెవరినీ మోసం
చేసాననీ….
ఏదో ఒక బాధ నుంచి
పదం పుట్టి ఆ పదం
వాక్యమై వియోగ
కవితలుగా
అవతరించాయి తప్ప…
వివరించినా అర్థం కాని
వారంతా పిచ్చివాడన్నారు..
లోకమంతా పిచ్చిని నా ఇంటి
పేరు చేసింది!

ఏం కావాలనీ ….
ఏం కోరాననీ…
చచ్చిపోతే…
మెడలో వేయడానికి
ఆరు మూరల పూల దండ…
చచ్చిపోతే…
మీద కప్పడానికి…
కొన్ని పుస్తకాలు…
నేను రాసుకున్న
కొన్ని పిచ్చి కవితల
కాగితాలు…
చచ్చిపోతే…
పూడ్చడానికి
ఆరు అడుగుల నేల తప్ప…

July 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖల్లో తిలక్

by Cheedella Seetha Lakshmi June 1, 2023
written by Cheedella Seetha Lakshmi
“ఆంధ్ర సాహిత్యంలో వచన కవితా శిల్పి,కవికుల తిలకుడు,రస గంగాధరుడు అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తన రచనల ద్వారా ఒక విశిష్ట రచనా ప్రవృతిని,కవితా స్రవంతిని, నిర్దిష్టకులాలలో, నిరంతర రస ప్రవాహంగా ప్రవహింపచేశాడు. తన అమూల్య రచనల ద్వారా ఆంధ్ర సాహిత్య చరిత్రలో శాశ్వత కీర్తి చంద్రికల్ని ప్రసరింప చేశాడు. ఆయన రచనలు ఆంధ్ర సాహిత్య ధనాగారానికి ఒక అక్షయ రత్న సంపద వంటివి”.తిలక్ గొప్ప కవి.ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇతనికొక విశిష్ట స్థానముంది.

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
అని తన కవితా లక్ష్యాన్ని చెప్పుకున్న దేవరకొండ బాల గంగాధర తిలక్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో ఆగస్టు 1 వ తేదీ 1921 సంవత్సరంలో జన్మించాడు.
సమాజంలో దగాపడిన వారి జీవితాలను చూసి చలించిన తిలక్ సున్నిత హృదయుడు కాబట్టి వాటినే తన కవితావస్తువులుగా మలచుకున్న
తిలక్ భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేతతో “అమృతం కురిసిన రాత్రి,ప్రభాతము సంధ్య,గోరువంక కవితాసంపుటిలు,సుందరీ సుబ్బారావు,ఊరి చివర ఇల్లు అనే కథా సంపుటాలు,సుశీల పెళ్లి,,సాలెపురుగు అనే నాటకాలు,సుచిత్ర ప్రయాణం,ఇరుగుపొరుగు,సప్తశిల అనే నాటికలు ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన తిలక్ కేవలం 45 ఏళ్ల అతి చిన్న వయసులో సెప్టెంబరు 1 వ తేదీ 1966వ సంవత్సరంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.చనిపోయాక కుందుర్తి ఆంజనేయులు రాసిన పీఠికతో 1968 సంవత్సరంలో ముద్రింపబడిన అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా 1971 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
సమాజాన్ని చూసి కరిగిపోయిన తిలక్
మిత్రులకు రాసిన లేఖల ద్వారా మిత్రులతో తిలక్ కున్న సత్సంబంధాలు ,తిలక్ వ్యక్తిత్వం,మనస్తత్వం మొదలగు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.

‘ఆవంత్స సోమసుందర్’ తిలక్ కు ప్రాణమిత్రుడు.సోమసుందర్ కు రాసిన లేఖలో ” జీవితంలో ఎప్పుడు ఎవరు వచ్చి గుండెల్ని పెనవేసుకుపోతారో ఏం తెలుస్తుంది.అలాగ సామీప్యంలోని ఆత్మీయమైన ఆవరణలోకి విచిత్రంగా సురభీకృతం చేస్తూ నువ్వొచ్చావు. అన్నా అని పిలిచావు.ఆ పిలుపు గుండె లోతులంటి, తిరిగి తమ్ముడూ అని ప్రతిబింబించక మానుతుందా? అందుకే ఇంకా మీరు అనే సంబోధన కృత్రిమంగా ఏదో దూరాన్ని పలకరిస్తున్నట్లు తోచి మానివేశాను.” అని రాయడం వల్ల మిత్రులను ఆత్మీయుతతో దగ్గరకు తీసే ప్రేమతత్వం కన్పిస్తుంది. వరవరరావుకు రాసిన లేఖలో ” నా కింత దగ్గరైన నువ్వు అలా అలా దూరదూరంగా ఎందుకున్నావో అని నా మనసు చాలా బాధ పడుతుంది.డబ్బూ,వ్యాపారమూ, ప్రయోజనమూ ప్రధానంగా ఎంచబడే నేటి సంఘంలో అవ్యాజమైన మైత్రి,ఆర్టిస్టుల మధ్య మైత్రి ఒకటి గదా!
కన్సిడరేషన్! నువ్వు నా కన్నా చాలా పిన్నవాడివైతే మాత్రం కుల వయో దశ భేదాలు కవులలో,కళారాధకులలో అప్లై చేయవు.” అంటాడు.మైత్రీ బంధానికి తిలక్ ఇచ్చిన విలువ గొప్పది.డబ్బు,హోదాకు లొంగనిది.కులాతీత,వయోతీతమైంది.నిస్వార్థ,అవ్యాజమైనదే అసలు సిసలైన మిత్రత్వము.నిజమైన మైత్రికి ఇవేవీ అడ్డుకావని మైత్రికి చక్కని నిర్వచనం చెప్పాడు.ఇలా లేఖలలో తిలక్ స్నేహానికిచ్చిన ప్రాధాన్యం తెలుస్తుంది.

జీవితంలో ఏదో సాధించాలనే ఆశ,తపన ” వేళ్ళ సందుల్లోంచి పొడి ఇసుకలా జారిపోయే కాలాన్ని, వయస్సునీ,తల్చుకుంటే భయమౌతుంది.” అని ఒక ప్రచురణ సంస్థ నెలకొల్పాలన్న తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ నీ సహకారం ఉంటే తప్పక కృతకృత్యుణ్ణవుతానని రాస్తూ సమయం దాటాక బాధపడి ప్రయోజనం లేదు.” అందుకే ఈ లోపుగా చేసి వెయ్యడం మంచిది కదా.” అంటూ సోమసుందర్ కు రాసిన లేఖలో తెలిపాడు.

మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో జీవితంలో తృప్తి ఎట్లా లభిస్తుందో వివరించాడు.” నెల బారుగా,చప్పగా,బాధగా వెళ్లిపోయే జీవితంలో ఏవో కొన్ని గొప్ప క్షణాల్ని మనవిగా చేసుకున్నామనే ఆనందమూ,దాన్ని నలుగురితో పంచుకోవడమూ కన్నా తృప్తి ఏముంది.” అంటూనే ” ఇక్కడ దట్టంగా పరచుకున్న మనుష్యారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ,దోమలూ,రాజకీయాలు జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలో కన్నా అడవుల పచ్చదనమూ,ప్రకృతి సన్నిహితంగా ఉన్న మీ జీవితమే సుఖకరమేమో.” అనడం వల్ల కుళ్లు మనుష్యుల మధ్య నలిగి బ్రతికే కంటే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అడవుల్లో ఉంటే మనసుకు తృప్తి అనే భావన కలిగినవాడు. అట్లాని మానసికమైన ఒంటరితనాన్ని భరించడం కూడా కష్టమే నంటాడు.

తిలక్ బాధాతప్త హృదయుడు.జీవితంలో జరిగిన సంఘటనలు, మనసులో మరపురాని ముద్రలే అతన్ని కవిగా చేశాయి మోగంటి మణిక్యాంబకు రాసిన లేఖలో చిన్నతనంలో ఒక వృద్ధుడు,జీర్ణాదేహుడు,ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి చూసి ఎంతో ఏడ్చాడు.” జీవితం అంటే ఏమిటి? సృష్టి పరమార్థం ఏమిటి? అన్న చింతనలో పడ్డాడు.16,17 సంవత్సరాల వయసులో ఒకసారి పార్క్ టౌన్ స్టేషన్ లో దిగివస్తుంటే ఇద్దరు ముగ్గురు బాబూ! ఒక మాట అని పిలిచారు.ఏమిటో నని వారి దగ్గరకు వెళ్ళాడు.ఒక వస్తువు మీద గుడ్డను తీసి చూపించారు.భయంకరమైన, వికృతమైన శవం.దహనానికి చందా అడుగుతున్నారు.జేబులోంచి చేతికి వచ్చిన డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళాడు.గది కెళ్లగానే ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లు భయపడ్డాడు.రాత్రంతా ఆలోచనలతో సతమతమయి అంతా మిథ్యగా అనిపించింది.బ్రతుకు మీద విరక్తి కలిగింది.

ఇంకోసారి మిత్రులతో సినిమాకి వెళ్తున్న సమయంలో ఒక ఎనిమిదేళ్ల పిల్ల ఆకలిగా ఉంది.డబ్బులిమ్మంది అందరూ ఆమెని విదిలించుకుని చీ అని తోసి వేస్తుంటే సభ్యత కోసం తిలక్ కూడా విదిలించుకున్నాడు.ఆ రోజు రాత్రంతా బాలికనే కళ్ళముందు నిలిచింది తెల్లవారి జేబులో పది రూపాయలు వేసుకుని ఆ అమ్మాయి కోసం అంతా గాలించాడు.కానీ ఆమె కనిపించలేదు.మూడు రోజులు వెతికాడు కానీ వృధా. ” ఆమె అందమూ ,సొగసైన కళ్ళు,ఆ బాల్య చాపల్యమైన మనస్సు ఏ ధూళిలో ఏ బాధలో ఏ మంటలో దినదినమూ కాలిపోతున్నాయి ” ఎవరు దీనికి కారణం?…విలవిలలాడి పోయాను.ఆమె నా చెల్లెలే అయితే అలా ఛీదరించుకునేవాణ్ణ ?” అనుకున్నాడు నెలరోజుల తర్వాత ఆమె కనిపిస్తే జేబులోంచి ఆరు రూపాయలు తీసి చేతిలో పెట్టి ఒక రోజు కడుపు నిండా తిను అని వెళ్ళిపోయాడు.అప్పటి సంఘటనలు మనసులో కలవరం రేపి ” ఈ జీవితానికి,సమాజానికి అర్థం తెలుసుకోవడానికి,ఒక అర్థం ఇవ్వడానికి ఒక ఆదర్శ జ్వాలలో నా బ్రతుకును చుట్ట బెట్టి తోడు లేని ఈ దారిని నాటి నుండి ప్రయాణం” సాగించి అనేక బాధలతో,అనారోగ్యంతో అలమటించి ” గొప్ప అనుభవాన్ని కవిత్వాన్ని పొందాడు మధురమైన
ఆ హృదయాన్ని,మనస్సుని లోకంచుట్టూ తిప్పి సౌందర్యాన్ని అవలోకించి ఆహ్వానించాడు.” అని చెప్పిన సున్నిత హృదయుడు,కోమల మనస్కుడు జీవితానికి,సృష్టికీ ఒక అర్థం వెదికి సమాజానికి సుఖ సంతోషాల్ని అన్వేషించాలనే తపన కలవాడు.” మనిషీ, సంఘమూ,దేశమూ, విశ్వమూ ఈ సర్వ జగత్తు జ్ఞాన సరస్సులో విరిసిన ప్రేమ పద్మం లాగా సత్యం,శివం, సుందర శీలమై ఉండాలి.” అంటాడు.”

వ్యుత్పత్తి,వివేకం,ఉద్రేకం ఇన్నింటిని సమ్యక్ స్వరంలా మేళవించి” ఏదో సాధించాలనే తహతహలాడేవాడు.నిజమైన వెలుగు కోసం ” ఏళ్ల తరబడి సృష్టించుకున్న మౌఢ్య భావాలు,సంకెళ్లని పగులగొట్టి” స్వార్థమూ, సంఘ గౌరవమూ, ధనమూ ప్రధానమైన ఈ లోకాన్ని ఖాతరు చేయక ఏ పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కోగల ఆత్మీయశక్తి నాకుంది ఆనుకొని ” సంపూర్ణ నిర్మలానురాగం ముందు తప్ప తల వాల్చగూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.” అని మానసిక ఆవేదనను,ఆశయాన్ని తేటతెల్లం చేశాడు.” నిర్ధయా, నిశ్చితమైన నిధి కొండరాళ్ల మీద తలబాదుకొని ఏడ్చినవాణ్ణి కాబట్టి ఏ విశ్వాసాన్ని వృధా పోనివ్వను.” సున్నితమైన నా మనస్సు మీద కూడా ఎన్నో దెబ్బలు తగిలాయి.” అంటూ మానసిక బాధను వ్యక్తపరచి ” ఒక్కొక్క కన్నీటి చుక్కను తుడువగలిగితే జన్మ సార్థకమన్న శరత్ మాటలను స్వతహాగా ఆచరించాలన్న ఉబలాటం కలిగిన వాడు.ఆయన మాటల్లోనే ” ఒక సంఘము నుండి ఉబికే బాష్పాన్ని తుడువగలిగితే ఒక్క అధరం మీదికి హాస్యాన్ని రప్పింపగలిగితే జీవితం ధన్యమౌతుందని నా ఉద్దేశ్యం.కరుణ,సౌందర్యమూ, మానవత్వమూ ఈ మూడు ప్రాతిపదికలుగా నా ఆదర్శాన్ని,ఆలోచనల్ని నిర్మించుకున్నాను నా రచనలూ నా జీవితమూ ఈ భావనల్ని వ్యక్తీకరించకపోతే నేను జీవచ్చవాన్ని” అని తన కవితా లక్ష్యాన్ని, జీవితాదర్శాన్ని వివరించాడు.తిలక్ మనస్తత్వమేమిటో ఎంతో చక్కగా వివరించాడు లేఖల ద్వారా.” *దుఃఖానికీ, బాధకీ కరుగలేకపోతే ఈ బాలగంగాధరుడు తన కవిత్వాన్ని,తన ప్రాణాన్ని కూడా బంగాళాఖాతంలో విసిరిపోతాడు అతనిలో ఎంతో దృఢవిశ్వాసం కన్పిస్తుంది.మనిషికి మానవత్వముండాలి.కరుణ, జాలి,దయా ఉండాలి.అవి లేకపోతే జీవచ్చవమేనన్న అభిప్రాయం కలవాడు.తిలక్.జీవితానుభవాలకు,రచనలకు అవినాభావ సంబంధమున్న విషయం ప్రస్పుటమైందీ లేఖల్లో.

” ఆర్ద్రమైన ప్రతి హృదయమూ అశ్రుసిక్తమైన ప్రతి నయనమూ సుందరమైన ప్రతి దృశ్యమూ నన్ను కలలో కూడా వశం చేసుకుంటాయి.ఒక్క పాటకోసం ఒక్క మాటకోసం అవసరమైతే ఈ ధనాన్ని జగత్తునీ కాదనగల సాహసం వుంది నాకు”.అని ప్రపంచాన్నే ఎదిరించి పోరాడిన ధీశాలి, కవితా వీరుడు.కవికి ఉండవలసిన ఉత్తమగుణం తిలక్ లో కనిపిస్తుంది.కవి ఊహలో చరించకుండా జగత్తులో చేదు నిజాన్ని చవిచూసి అనుభవించి ఆవిష్కరించాడు. బాహ్య జగత్తులోని విశిష్ట సన్నివేశాల వలన, ప్రజ్ఞా విశేషం వలన తమలో కలిగిన ఆలోచనా వైవిధ్యం చేత,తమకు కలిగిన అనుభవాలను కావ్య చిత్రణం ద్వారా వ్యక్తీకరించి ఆనందం చేకూర్చడం తిలక్ లక్ష్యం.ఇంద్రియాలకు తృప్తి కలిగించేది అతని దృష్టిలో ఆనందం కాదు మానవత్వంలో పరిపూర్ణత నొందుటలోనే ఆనంద మున్నదని అతని సిద్ధాంతం. *సుందర స్వప్నాల మేడమెట్ల నుండి వాస్తవిక శిథిల రూపాలలోకి హఠాత్తుగా జారిపడిన నాకు తెలుసు అంటాడు.” పైకి నవ్వుతున్నా అలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో వున్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు”. అని వాపోతాడు,లోతుల్ని వెతుకుతాడు.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గాయాలు తగిలినా ఎదుర్కోగలిగే శక్తి గలవాడు.కృంగిపోవడం నా స్వభావానికి వ్యతిరేకం అన్న ధీరమనస్కుడు.
అసలు కవి అంటే ఎవరు?కవి ధర్మాన్ని లేఖల్లో వివరించాడు.” సున్నితమైన ఊహ,ఉద్రేకము,” ఉంటేనే గొప్ప రచనలు వస్తాయన్న విశ్వాసము కలవాడు.సాధారణంగా మానవులందరూ దైనందిన సమస్యలతో ,బాధలతో సతమతమవుతూ వుంటారు.చిన్న చిన్న కోరికలూ,ద్వేషాలూ,అల్పమైన ఊహాలతో సతమతమవుతూ వుంటారు.” నేలబారుగా జడంగా స్తబ్దంగా గొంగళిపురుగుల్లా పాకుతారు.వాళ్ళకి సౌందర్యం డబ్బులోనూ ఉద్యోగం లోనూ భేషజంలోనూ కనబడుతుంది కానీ కళాశీలికి యివేమీ కనిపించవు.అతనికున్న విలువలు వేరు.అతని చూపు వినీల గగనాన్ని బురుసుకుంటూ నక్షత్రమండలంలోకి పోతుంది.అతడు మనిషి లోపల మనిషిని చూస్తాడు.అతని దృష్టి ఎక్కడ అందం వున్నా నిజం వున్నా అక్కడ వాలుతుంది. దేనికోసమో తపన,అన్వేషణ నిరంతరంగా సాగిస్తాడు.ఈ యాత్రలో అతడు లౌకిక జగత్తును లక్ష్య పెట్టడు. అందుకే అతని ఊహ శాశ్వతమైంది.అతని నీతి అతీతమైంది.అతని రచన అక్షరమైంది. నశించనిది.” కవి ఊహ లోకోత్తరమైంది. అందువల్లనే ఉత్తమ రచన సార్వజనీనము,సార్వకాలికమౌతుందన్న ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయాలను తలపింపచేశాడు.

కవి సంప్రదాయబద్ధుడుగా కాక కాలానుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకొని రచన సాగించాలంటాడు. కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని,బూజు పట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే. అంటూ సంఘాన్ని మేల్కొల్పాలి,ప్రజలను చైతన్యవంతులను చేయాలి.ఆత్మవిశ్వాసం ఉండాలి.కవిత్వాన్ని సమగ్రంగా దర్శించడమూ,జీవిత విధానాన్ని గురించి స్పందించడమూ చాలా అవసరం అంటాడు తిలక్.

తిలక్ ప్రకృతిలోని అందాన్ని చూసి పరవశించిపోయేవాడు.ప్రకృతిని ఆరాధించేవాడు.లేఖల్లో ప్రకృతి వర్ణన కూడా కనిపిస్తుంది.సహజ చిత్రీకరణ,కవి దృష్టి ప్రత్యేకంగా లోతుల్ని చూస్తుంది.గుండెను హత్తుకుపోయే విధంగా ఉంది.ప్రకృతి వర్ణన సహజంగా వుంది. సోమసుందర్ కు రాసిన లేఖలో ” ఈ రెండు రోజుల నుంచీ వర్షం కురిసి కురిసి భూమి తడిసి తడిసి పచ్చి పచ్చి బాలింతరాలిగా అందంగా వుంది ” అంటాడు
వర్షాకాలంలో తడిగా ఉన్న భూమి ఎట్లా ఉందో ఉపమాలంకార ప్రయోగం చేశాడు. ఆలంకారిక రచన,ప్రకృతిసాన్నిహిత్యాన్ని కోరుకునేవాడు.దట్టంగా పరచుకున్న మనుషారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ దోమలూ రాజకీయాలూ జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలోకన్నా అడవుల పచ్చదనము,ప్రకృతి సన్నిహితంగా వున్న జీవితమే మంచిదని మిరియాల రామకృష్ణ గారికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు.వర్షాకాలం అంటే తిలక్ ఇష్టపడేవాడు.ఆకాశంలో నల్లని మబ్బులు,ఒక్కసారిగా వాన,భూమి చల్లబడి పచ్చబడి మనసుకు ఎంతో హాయిసిస్తుందని చెప్తూనే ” స్నానం చేసి వచ్చిన యవ్వనవతి శరీరంలాగా విచిత్రమైన అందం,ఆకర్షణ.” ఉందని వర్ణించాడు.
మోగంటి మాణిక్యాంబా దేవికి రాసిన లేఖలో మనసులోని వ్యధను ఎవరూ గుర్తించలేరని రాస్తున్న సందర్భంలో పైకి నవ్వుతున్నా అలలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో ఉన్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు అంటూనే జీవితం చాలా విచిత్రమైంది,అద్భుతమైందని చెప్తూనే ” రంగురంగుల అలలలో వంగి బ్రతుకు అంచుల్ని ముంచుతూ వుంటుంది. ఎన్ని స్వప్నాలూ,ఎంత లోతు తెలియని భయంకరాఘాతాలు.” అంటూనే సూర్యోదయాన్ని యీ విధంగా ” చీకటి లొత్త గిత్తి మెత్తని వెల్తురు తూర్పున ఆడదాని అనురాగంలాగ వ్యాపిస్తోంది.నక్షత్రాలు కాంతి విహీనమై గాజుపూసల్లాగా వున్నాయి. అక్కడక్కడ ఒక మబ్బు ఏ అప్సరస ఒంటిమీద నుండో జారిన చీరకొంగులాగ గాలిలో తేలిపోతుంది.మనోహరమూ,శాంతమూ అయిన ఆ ప్రకృతిలో లీనమౌతున్న నా మనసుకు మళ్లీ అశాంతి.” అంటూ తన అనుభూతిని వివరించాడు ఇంతలోనే నిరాశావాదం.” లోపల్లోపల ఏదో ఒంటరితనం ఒక్కణ్ణే నా బాధలతో ఏదో ఎడారి అంచులమీద నడచిపోతున్నాను– అనిపించింది.ఈ సంసారమూ ఈ స్నేహాలూ అన్నీ ఎండమావులేమో– అనిపిస్తుంది.మబ్బు పట్టి ఆకాశంలో ఈ రోజంతా తెలియని చక్కని కౌశలమూ ప్రజ్ఞా వుంది.నేను కొంత ఆశ్చర్య పడ్డాను.ఇంత బాగా రాయగలడా కథలు కూడా అని— కాని నీ కథల పుస్తకంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకుగాని,బలపరచుటకుగాని నీవు చేసిన ప్రయత్నం- ఆ కథాశిల్పంలో ముఖ్య దోషంగా కనబడింది.ఆ కథల రక్తిని అనుభవించకుండా చేసింది. పాలటబులో డిజైనులవల్ల కళ ఎప్పుడూ పరిమితమూ సంకుచితమూ అయిపోతుంది.అయితే ఆ రోజుల్లో నువ్వు ఆ ప్రభావపు ఇనుప కౌగిలిలో ఉండేవాడిని.కాని ‘కాలనేమి’ లో దోషం మచ్చుకైనా లేదు”.

వరవరరావు రచనలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరవరరావుకు రాసిన లేఖలో “అమృతవృష్టిలో అక్కడక్కడ బెట్టుగా ఉంది.యజ్ఞంకై కొత్త టానిక్,సోషలిస్టు సీత–ఇటువంటివి అనుచితంగా తోచాయి.
కుక్క నోట్లోంచి ఎంగిలాకు– ఆ ఇమేజరీ ఎందుకో? ఫోర్స్ డ్ గా వున్నట్లు అనిపించింది.రాకాశశికి మబ్బురంగు పైట అన్నాడు.మబ్బే పైటగా ఉంటుంది గదా.ఆషాఢ మాసంలో ఆ రంగుగల మరో పైట ఏముంటుంది? శశికి మరోసారి రివైజ్ చేస్తే మంచిదేమో అనుకున్నాను.నాకు నచ్చిన లైన్స్ గురించి చెప్పడం లేదు.మీరు మరోసారి చూడండి.మరి మీ కెలా తోస్తుందో? అన్నట్లు “వూసి” అని రెండు మూడు సార్లు ప్రయోగించారు.దాని అర్థం? నాకు కొత్తగా ఉంది.” – యూసేజ్. వరవరరావు తన రచనను సమర్థించినట్లు తెలిశాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను,పొరపాటయింది అని వేరే లేఖలో” పేజీలు సరిజేసి చదివితే రచన సందర్బశుద్ధిగా కనబడింది.” అని రాశాడు. వెనుకటి కవులకు తన కాలంలో కవులకు తారతమ్యాన్ని వివరిస్తూ ” నా వెనుక తరంలో కవులలో ముఖస్తుతీ వెనకాలే దూషణా ప్రత్యేకంగా ఉండేవి.సామాన్యుడి కన్నా ఊహలో,సంస్కారంలో మరికాస్త పెరుగుదల సూచించవలసిన ఆ కవులలో కనబడే ఈ కృత్రిమత్వం ,పిరికితనం దుర్భరమనిపించేవి.ఆఖరుకి కవిత్వంలో కవిత్వాన్ని గురించి నిజాయితీగా చూడలేని వీరి నుంచి ఏ మాశించగలమనుకొనే వాడివి.” అంటాడు.

జానకీ జానికి రాసిన ఉత్తరంలో ‘ మోడరన్ పోయిట్రీ పేరుతో పత్రికలలో ప్రకటితమయ్యే వాటిని చూచి విసుగు చెందాను.దాని మూలంగా చాలా విచారిస్తున్నాను.ప్రబంధయుగంలో చివరికాలంలో వచ్చిన సాహిత్యంలోని సమానమయిన క్షీణత, పదాల గారడి,నడకల శూన్యత,ప్రాస కొరకు ప్రయత్నించుట అందులో మనకు గోచరిస్తాయి.” అంటూ నవీన కాలాన్ని గూర్చి శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి రాసిన వ్యాసమే బాగుందని చెప్తూ సమకాలీన చరిత్రను గూర్చి విశదంగా విమర్శిస్తారని అనుకుంటున్నాదన్నాడు.

ఈ విధంగా తిలక్ లేఖల్లో అతని అనుభూతులు,అనుభవాలు, కవితాలక్ష్యం,రచనోద్దేశ్యం,విమర్శ, ప్రకృతి వర్ణన,ఆరోగ్య విషయాలు,మిత్రత్వానికి యిచ్చిన విలువ మొదలైనవి అనేకాంశాలు విదితమౌతున్నాయి.స్నేహితులకు తన మనోగతాన్ని స్పష్టంగా,నిర్మొహమాటంగా, కవితాత్మకతలో విశదపర్చడం లేఖలవల్ల గమనించవచ్చు. మారుతున్న కాలాన్ని బట్టి సత్యాన్ని అన్వేషించి సమాజాన్ని జాగృతం చేసేదే నిజమైన కవిత్వమనే అభిప్రాయం వున్నవాడు మానవత్వంలో పరిపూర్ణత నొందజూచుటలోనే ఆనందమున్నదని అతని సిద్ధాంతం.
ఈ రకంగా లేఖల వలన కవిత్వంపట్ల తిలక్ కున్న ప్రత్యేకమైన,ఖచ్చితమైన అభిప్రాయం తెలుస్తుంది.
తెలుగు సాహిత్య కన్యకు తన రచనల ద్వారా తిలకం దిద్దిన ప్రముఖ కవి తిలక్ సాహిత్య పరంగా కూడా లేఖలకు ప్రముఖ స్థానముందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

June 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సులక్ష్య సేవా సమితి – పదేళ్ల సేవా ప్రస్థానం

by Manduva Santhosh June 1, 2023
written by Manduva Santhosh

“సు”- మంచి , “లక్ష్య ” – లక్ష్యం

ట్యాగ్ లైన్ – సర్వే సుజనా సుఖినోభవంతు
నేపధ్యం :
2008 – 2013 వరకు వివిధ సేవా కార్యక్రమాలను చేసిన తరువాత ,ఈ కార్యక్రమాలన్నింటిని ఒక గొడుగు కిందికి తీసుకురావాలనుకొని అనుకున్నాం.
మన అభ్యున్నతికి కారణమైన ఈ సమాజానికి కొంతైనా తిరిగివ్వాలనే సదుద్దేశంతో మిత్రులమంతా ఒక బృందంగా ఏర్పడి ఉగాది పర్వదినాన ( ఏప్రిల్ 11 2013 ) న సులక్ష్య సేవా సమితి కి అంకురార్పణ చెయ్యడం జరిగింది. రానున్న ఉగాదికి ఒక దశాబ్దం పూర్తి చేసుకోబోతుంది.

ముఖ్య లక్ష్యాలు – చేపట్టిన కార్యక్రమాలు

అందరికి విద్య – ఈ రోజుకి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కొరవడుతున్నాయి – ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్థోమత చాలా మంది కూలి – నాలి చేసుకునే తల్లితండ్రుల్లో లేదు . దీని వల్ల చాలా మందికి సరైన విద్య అందడం లేదు , కొంత మంది మధ్యలోనే చదువు ఆపేసి ఎక్కడో బాల కార్మికులుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు .

ఈ పరిస్థితిని కొంతైనా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని, ఆ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. 1 . 2 లక్షలతో శ్రీ వ్యాస అవాసంలో గ్రంధాలయం ఏర్పాటు చెయ్యడం జరిగింది . 1 లక్ష రూపాయల విలువగల పుస్తకాలను వివిధ ఆశ్రమాల్లో ఇవ్వడం జరిగింది . ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు వారి ఫీజులు మరియు ఇతర అవసారాలకై ఆర్ధిక సహాయం సహాయం చెయ్యడం జరిగింది . వివిధ ఆశ్రమాల్లో స్కూల్ యూనిఫార్మ్స్, వారు చదువుకోవడానికి కావలసిన ఇతర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. వైద్యం – ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు . కానీ నేటి రోజుల్లో చాలా మంది జీవన విధానం వల్ల , ఆరోగ్య అలవాట్ల వల్ల, కల్తీ ఆహరం వల్ల చిన్న వయస్సులోనే అనారోగ్యం పాలైతున్నారు తాము సంపాదించే డబ్బులో ఎక్కువ భాగం వైద్యులకు , మందులకు పెట్టడమే కాక తీవ్ర అశాంతికి గురవుతున్నారు . అందుకే పాఠశాలల్లో , కళాశాలల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయం మీద సదస్సులు నిర్వహించడం జరుగుతుంది .

కరోనా వ్యాధి ప్రబలి ప్రపంచమంతా స్తంభించిందినప్పుడు , ఫ్రంట్లైన్ వారియర్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడారు . వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా , వారి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని డాక్టర్లకు , ఆరోగ్య కార్యకర్తలకు,పోలీస్ సిబ్బందికి , పారిశుధ్య కార్మికులకు, మీడియా ప్రతినిధులకు రెండు లక్షల నలభై వేల విలువగల ఆరు వస్తువులతో కూడినటువంటి రెండు వేల సేఫ్ ఎనర్జీ కిట్లను అందివ్వడం జరిగింది .
అలాగే ఒక లక్షా ఎనభై వేల రూపాయల విలువగల మూడువేల పైగా మాస్కులు , శానిటైజర్స్ పంపిణి చేసాము

పర్యావరణ పరిరక్షణ – వృక్షో రక్షతి రక్షితః , మట్టి గణపతులను ప్రతిష్టిద్దాం – పర్యావరణ పరిరక్షణకై పాటుపడడం , ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం – కాలుష్య నివారణకై కృషిచేద్దాం .
వివిధ కారణాల వల్ల పర్యావరణం రోజు రోజుకి వినాశనం అయితున్నది. దీని వల్ల మనం అనేక సమస్యలకు గురవుతున్నాం . ఈ లక్ష్యంలో భాగంగా 1000 కి పైగా మొక్కలను వివిధ పాఠశాలలో , రోడ్లపై నాటడమేకాక వాటిని పెంచడం జరిగింది . అదే కాకా ప్రముఖ పర్యావరణవేత్త , కోటి మొక్కలు నాటిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత , వనజీవి దారిపల్లి రామయ్య గారితో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.

గత తొమ్మిది సంవత్సరాలుగా ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణి చెయ్యడం జరిగింది . యువత సాధికారత – ఒక వంద మంది యువకులను ఇవ్వండి – భారత దేశాన్ని బలమైన దేశంగా మారుస్తా అని స్వామి వివేకానంద అన్నారు . భారత దేశంలో 65 % జనాభా యువకులే . ఇది మనకు చాలా పెద్ద ఆస్తి . కానీ అనేక మంది యువకులు సరైన అవగాహన లేక , చెడు అలవాట్లకు బానిసై , అవకాశాలు దొరకక , చదువుకునే స్థోమత లేక వారి గమ్యానికి చేరలేకపోతున్నారు .ఇందుకు గాను సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీ పరీక్షాలలో విజయం సాధించడం ఎలా , వ్యక్తిత్వ నిర్మాణం, ఒత్తిడిని అధిగమించడం లాంటి వివిధ అంశాల మీద పలు కళాశాలల్లో , పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది .కనీస అవసరాలు తీర్చడం – భారత దేశంలో ఒకవైపు అపర కుబేరులు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే , కోట్లాది మంది పేదరికంతో మగ్గుతూ వారి కనీస అవసరాలు తీర్చలేకపోతున్నారు .

నగరంలోని వివిధ ఆశ్రమాలకు నిత్యావసర వస్తువులు వితరణ చేసి తోడ్పాటు అందించడం జరిగింది . చలి కాలంలో నిరాశ్రయులకు , పేదవారికి , అనాధలకు , వృద్ధులకు వెచ్చదనం కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 4 .8 లక్షల విలువైన 2400 బ్లాంకెట్ల్లను నిరాశ్రయులకు మరియు నిరుపేదలకు , అనాధలకు , వృద్ధులకు పంపిణి చెయ్యడం జరిగింది . మేము చేసిన అన్ని కార్యక్రమాల్లో మాకు నిజంగా సంతృప్తిని ఇచ్చింది కరోనా మహమ్మారి ప్రబలినప్పుడు మా సంస్థ ద్వారా చేపట్టిన సహాయక కార్యక్రమాలు. ప్రజలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురైతున్న పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం అనేది మాకు జీవితాంతం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే అనుభవాన్ని మిగిల్చింది. ఈ అనుభవంతో ముందు ముందు ఇంకా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టే శక్తి మాకు కలగాలని మా ఆశ.

మా లక్ష్యాల్లో ఒకటైన కనీస అవసరాలు తీర్చటం లో భాగంగా గుడిసెల్లో నివసించే పేదవారికి , సంచార జాతులకు ,చెత్త సేకరించే కార్మకులకి , అనాధాశ్రమాలకి , వృద్ధాశ్రమాలకు , వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలిలకి , భవన నిర్మాణ కార్మికులు , పానీ పూరి బండి వాళ్ళు , గుత్తి కోయలకు, నేపాల్ నుంచి వచ్చిన గురఖాలు , అనాధ వృద్ధులు ,దినసరి కూలి కార్మికులు , తదితర వెయ్యి కుటుంబాలకు ఆరు లక్షల విలువగల పదమూడు వస్తువులతో కూడిన నిత్యావసరాల కిట్లను పంపిణి చెయ్యడం జరిగింది.
తమ స్వస్థలాలకు వెళ్లాలనే తలంపుతో ఎర్రటి ఎండలో వందలాది కిలోమీటర్స్ నడుస్తున్న వలస కార్మికుల గోసను దృష్ఠ్టిలో ఉంచుకుని వారికి రెండు లక్షల విలువ్ కల పన్నెండు వస్తువులతో కూడిన మైగ్రంట్ రెఫ్రెషమెంట్ కిట్లను వెయ్యి మందికి పంపిణి చెయ్యడం జరిగింది . అలాగే కొందరికి మా స్వంత ఖర్చులతో వాహన సౌకర్యం ఏర్పాటు చేసి వారి స్వంత రాష్ట్రాలకు పంపించడం జరిగింది .ప్రేమ , వాత్సల్యాలను పంచడం – అనాధ, వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వారు తమ అనుకున్న వాళ్ళ ప్రేమను నోచుకోక నిరాదరణకు గురవుతుంటారు. వారికి కావలసిందల్లా ఆత్మీయ స్పర్శ , మేమున్నామనే భరోసా , వారితో సరదాగా గడిపేందుకు కొద్ది సమయం .

ఈ ఉద్దేశంతో సమయం దొరికినప్పుడల్లా అనాధాశ్రమాల్లో నివసిస్తున్న పిల్లలతో సమయం గడపడం, సినిమాలకు ( బాహుబలి, ఏషియన్ మాల్ లో ) , విహార యాత్రలకు తీసుకెళ్లడం ( రామప్ప, లక్నవరం, ఖిలా వరంగల్ , వేయి స్థంబాల దేవాలయం, జూ పార్క్ , సైన్స్ సెంటర్ , హైదరాబాద్ లోని వండర్ లా ) , హోటళ్ళకి తీసుకెళ్లి వారికి ఇష్టమైనవి తినిపించడం , ఆట వస్తువులు కొనిపెట్టడం , వారి పుట్టిన రోజులు జరపడం చేస్తుంటాము . వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వారికి సాంత్వన కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ మాతృదినోత్సవాలు , సంగీత విభావరులు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది .

డిగ్నిటీ అఫ్ లేబర్ – మన జీవనం సాఫీగా సాగుతుందంటే అందులో ప్రతి ఒక్కరి కృషి ఉంటుంది. కానీ డబ్బు , హోదా ఉన్న వాళ్లకు ఇచ్చే మర్యాద , గుర్తింపు కింది స్థాయిలో ఉండదు . అమెరికా లాంటి దేశాల్లో ఆ దేశ అధ్యక్షుడిని ఎలా చూస్తారో , ఒక సామాన్య గుమాస్తాను కూడా అలానే చూస్తారు .

అందుకనే కింది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉండడానికి నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికులు మరియు ఇతర పనులు చేసే వారిని గుర్తించి , సత్కరించి వారికి కావాల్సిన సహాయం అందించడం జరుగుతుంది . సుపరిపాలనకై పాటుపడడం – భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మన దేశం ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉంది . అవినీతి , మత విద్వేషాలు , అవకాశవాద ధోరణి , లాంటి ఎన్నో సమస్యలు మనన్ని పట్టి పీడిస్తున్నాయి . అందుకనే వివిధ పాఠశాలల్లో , కళాశాలల్లో, ఓటు హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం , పౌరుడిగా మన హక్కులు లాంటి వివిధ విషయాల మీద అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది .

భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను పరిరక్షించడం – యావత్ ప్రపంచానికి దిక్సూచిగా, దిశా నిర్దేశం చేసిన ఘనత మనది . కానీ యాంత్రిక జీవన విధానం వల్ల , మనం మన పురాణాలను , ఇతిహాసాలను రాబోయే తరాలకు అందివ్వలేకపోతున్నాం , మన చారిత్రిక కట్టడాలను పరిరక్షించుకోలేకపోతున్నాం. అందుకనే విద్యార్థులకు మన ఇతిహాస , పురాణాల గురించి తెలియచేసి , మన చారిత్రక కట్టడాల సందర్శనకు తీసుకువెళ్లడం జరుగుతుంది .

గ్రామీణ భారతంలో పరివర్తన తీసుకురావడం – ఇప్పటికి 65 % కన్న ఎక్కువ ప్రజలు పల్ల్లెలో నివసిస్తున్నారు . పల్లెలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని నానుడి . కానీ ప్రపంచీకరణ తో పల్లెల్లో నివసిస్తున్న అన్నదాతలు ,ఇతర వృత్తి నైపుణ్యం గల వారు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు , ఇతర దేశాలకు వలస పోతున్నారు, అక్కడ కూలీలుగా వారి బతుకు బండిని నెట్టుకొస్తున్నారు . దీని వల్ల వారి జీవితాలు చీకటిమయం అవ్వడమే కాకుండా దేశ ప్రగతి కూడా స్తంభించి పోతుంది. అందుకనే పల్లెలకు వెళ్లి వాళ్లకు సేంద్రియ వ్యవసాయం , చేనేత , హస్తకళల లాంటి రంగాల్లో ప్రోత్సాహాం అందించి , వారిలో ఉన్న ఇతర నైపుణ్యాలను వెలికి తీసి వారికి కావలసిన సహాకారం అందించడం జరుగుతుంది .

భవిష్యత్ ప్రణాళిక
“ఎడ్యుకేట్ , ఎంపవర్ , ఎన్ లైటెన్” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో, కళాశాల విద్యార్థుల్లో మరియు యువతలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము .

మేము చేసే కార్యక్రమాలకు మొదటినుంచి ఆర్థికంగా సహకరిస్తున్న దాతలకు , మా గురించి కధనాలు ప్రచురిస్తున్న మీడియా ప్రతినిధులకు, మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమాలకు విచ్చేస్తున్న అతిథులకు మా హృదయపూర్వక అభినందనలు .
మాకు పెద్ద మొత్తంలో సరకులను ఇస్తున్న వ్యాపారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము

మా చిహ్నం

  • భారతీయత ప్రతిబింబించేలా మన జాతీయ పతాకం లో త్రివర్ణాలను మాయా చిహ్నంలో వాడాము.
  • మన రెపరెపలాడినట్టున్న మూడు “S ” లు సులక్ష్య , సేవ , సమితి ని స్ఫురించేలా పెట్టడం జరిగింది .
  • మధ్యలో ఉన్న 4 మా ప్రధాన లక్ష్యాలకు సంకేతాలు .
  • ఒకరి చేతులు ఇంకొకరు పట్టుకుని ఉన్న చిత్రం “టీం వర్క్ ” కి సంకేతం , 11 మందిని పెట్టడానికి ఉద్దేశం , మన దేశంలో క్రికెట్ ని ఎంత ఆరాధిస్తారో , సమాజ సేవని కూడా అంతే ఆరాధించాలని చెపుతుంది

ముఖ్య సభ్యులు :
మండువ సంతోష్ , కౌశిక్ భూపతి. మండువ శివ సంపత్., బొల్లం రాహుల్, దేవులపల్లి జయంత్, కోడం వినయ్, సాయి కిరణ్, విష్ణు.
మరెంతో మంది మిత్రులు మంది మిత్రులు మాకు వెన్ను దన్ను గా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు .

కుటుంబ నేసథ్యం

పేరు : మండువ సంతోష్
తండ్రి : కీ. శే. మండువ వెంకట రమణ రావు
తల్లి : పసునూరి వెంకట రాఘవ శాంత , విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు
తమ్ముడు : మండువ శివ సంపత్ , అమెరికా లో సాఫ్ట్ వెర్ ఇంజనీర్
విద్యార్హత : ఎంబిఏ , మార్కెటింగ్, కాకతీయ విశ్వవిద్యాలయం
సొంత ఊరు : పెగడాపల్లి ,హాసనపర్తి మండలం
ప్రస్తుత నివాసం : శ్రీనగర్ కాలనీ , హన్మకొండ
నిధుల సమీకరణ : మా కార్యక్రమాలను చూసి భాగస్వామ్యం అవ్వదలచిన కొద్ది మంది దగ్గరి మిత్రుల ద్వారానే నిధుల సమీకరించడం జరుగుతుంది . మేము చేసే కార్యక్రమాల వివరాలను మా పేస్ బుక్ పేజీ పేజీ మరియు వెబ్ సైట్ లో పొందుపరచటం జరుగుతుంది .

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
పల్లవి :

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
ముందడుగే వేశారు ..
పదిమందికి జీవనమిచ్చారు

సేవే ధర్మాంగా ..
సేవే వేదంగా ..
మదితోనే చూసారు
సాయానికి ముందుగ నిలిచారు

అణగారిన బతుకుల్లోనా
ఆనందపు వెలుగయ్యారు
అనాధలకు బలమయ్యారు
ఆసరాగా నిలిచారు

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి

బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా

చరణం 1 :

బడిపిల్లల భవితను మార్చగ
విద్యాబుద్ధులనందించారు
పాఠశాలలను మెరుగు పరచగా
విశ్వాసాన్నిస్తూ కదులుతున్నారు

నవసమాజ నిర్మాణానికై
పట్టుదలగా పయనిస్తున్నారు ..
కూడూ … గుడ్డా .. లేనివారికై
శాయశక్తులా శ్రమిస్తున్నారు

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..

చరణం 2 :
యువతకు మార్గం చూపిస్తూ
సదస్సులెన్నో నిర్వహిస్తూ
భవిష్యత్తును అందిస్తూ
ముందుకు గమనం సాగిస్తూ

అందరు బాగుండాలని
ఆరోగ్యాంగా బతకాలని
పేదరికం నిర్మూలనకై
కనీస అవసరాలనందిస్తున్నారు

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..

చరణం 3 :
అనాధ వృద్ధుల బాసటగా
ప్రేమా కరుణ లోగిలిగా
ఆత్మీయంగా పలకరిస్తూ
పలు సంతోషాలను అందిస్తూ

శ్రమైక జీవనాన్ని గుర్తిస్తూ
సత్కారాలను అందిస్తూ
సమానత్వాన్ని పంచేస్తూ
సమాజ శ్రేయస్సు నినదించే ..

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..

June 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

బాల చిత్రకారులు

by Raghav Keshav June 1, 2023
written by Raghav Keshav
రాఘవ్
కేశవ్
June 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహాకవి గురజాడతో ఊర్వశి ఇంటర్వ్యూ

by Dr. Kasarla Rangarao May 31, 2023
written by Dr. Kasarla Rangarao

(మొదటి భాగం)
మహాకవి గురజాడ స్వర్గంలో సుఖవంతమైన ఈజీ చైర్లో (ఎనుకటి తాతయ్యలు వాడేది) కూర్చుని మధురవాణి ఇంటర్వ్యూలు చదువుతుంటాడు. చుట్టూ చాలా పుస్తకాలు నిలువు గుట్టల్లా ఉంటాయి.
ఊర్వశి : నమస్కారం గురువులకు గురువు గురజాడ గారూ! బాగున్నారా?
గురజాడ : ఆఁ ఈ బిరుదు గురువులకే గురువు అనేది చెళ్ళపిళ్ళ వారికి, ఆ తర్వాత విశ్వనాథకు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీకే నప్పుతుంది, చెల్లుతుంది.
ఉ: అదేమిటి మీ స్ట్రగుల్ తర్వాత దాదాపు ఒక ముప్పయేళ్ళు మీ ప్రభావం తెలియకుండా, బయట పడకుండా చేసిన చెళ్ళపిళ్ళ వారికి, విశ్వనాథ వారికి ఈ బిరుదు చెల్లుతుందన్నారు. ఎందుచేత?
గు: వ్యావహారిక భాషోధ్యమ తీవ్ర ప్రభావం చేతనే చెళ్ళపిళ్ళ వారి పద్యాలు పండితుల నొదిలి పామరుల చెంతకు చేరాయి. అంతే కాకుండా నేను చెప్పిన పై ఆ నలుగురూ సాహిత్య బృందాలను వెంటేసుకు తిరిగారు. కాబట్టి ఆ బిరుదు వారికే వర్తిస్తుంది.
ఉ : ఓహో! అలాగా! మీ చేతిలోకి ఈ మధురవాణి ఇంటర్వ్యూలు ఎలా వచ్చింది?
గు : ఇది మిసిమి రాణి పంపించింది.
ఉ : ఆహా! మధురవాణి, మిసిమిరాణి ఇలా ఎంతమంది తెలుసేం మీకు.
గు: అది నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. అదంతే.
ఉ : సరే కానీ, మీ శిష్య న్యూక్లియర్ బాంబు శ్రీశ్రీ “అడుగు గురజాడది. అది భావికి బాట. మనలో వెధవాయిత్వం మరపించే పాట” అంటూ మన సాహిత్య పరిణామంతో కొత్త రోడ్డు మీరు వేశారని తామంతా అరసం, విరసం ఇత్యాదులు ఆ రోడ్డు వెడల్పు మాత్రమే చేశామని వాక్రుచ్చారు. మీరేమంటారు?
గు: అదేమిటి? వీళ్ళు చేసిన అన్ని అవకతవక పనులకు నేనా బాధ్యున్ని? అంటే కీర్తి కిరీటాలు, అవార్డులు వీరికి, అపఖ్యాతి, నిందా, దుమారాలు నాకా? ఏడి వాడు ఎక్కడున్నాడిప్పుడు?
ఊ : ఆయన ఆర్నెల్లు స్వర్గంలో, ఆర్నెల్లు నరకంలో ఉంటుంటాడు. ఎక్కడున్నా కుదురుగా ఉండడు. ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడూ విప్లవం లేవదీస్తుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు మీకు కలవకపోతాడా! ఒక తడాఖా తీద్దురు గాని లెండు.
గు : సరేగానీ, ఏమిటీ వీడ్ని నా శిష్య న్యూక్లియర్ బాంబు అన్నావూ. ఇదేం ప్రయోగం?
ఊ: : అంటే శిష్య పరమాణువు అనేది సాధారణంగా అందరూ వాడేదే కదా అని. అది కాక శ్రీశ్రీ మరియు ఆయన అనుయాయులంతా మీకు చేసిన సేవ అంతాయింతా కాదు కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఆపద ప్రయోగం చేశా.
గు : ఉహ్, ఆ సోది పోనిద్దూ. నా తర్వాత వారు నా బాటలు నడిచినవారు కృష్ణశాస్త్రి, చలం, దాశరథి, సుంకర, కాళోజీల తర్వాత నేను నీకు గుర్తొచ్చానా!
ఊ : నాకు మీపై అవ్యాజమైన ప్రేమ, భక్తి ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో ఎడిటోరియల్ బోడొకటి ఏడ్చింది కదా. వారు సూచించిన వారినే, సూచించిన క్రమంలోనే మేము ముఖాముఖి నిర్వహించాలి.
గు : ఒహో! అదొకటుందా మధ్య. సరే, కానీయ్.
ఊ : : శ్రీ కొవ్వలి గోపాలకృష్ణ, శ్రీమతి గురజాడ అరుణ, శ్రీ గురజాడ రవీంద్రుడు అంటే మీ ముని ముని సంతతి అమెరికాలో గురజాడ ఫౌండేషన్ పెట్టి మీరు నడిపి వదిలిన ప్రకాశికను త్రైమాసికంగా అంతర్జాల పత్రికగా నడుపుతున్నారు.
ఎల్ల లోకములొక్క యిల్లె
వర్ణబేధములెల్ల కల్లె
చెట్ట పట్టాల్ పట్టుకు
దేశస్తులంతా నడువ వలెనోయ్
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించకముందు కడుగేయ్
అనే మీ భావజాలానికి అనుగుణంగా నడుపుతున్నారు. ఇందులో గురజాడ అరుణ స్వయానా మీ ముని ముని సంతతే.
గు : అదేమిటీ! ఇప్పుడున్న సాహిత్యకారులూ, సాహిత్యాభిమానులూ, కళాకారులూ, కళాభిమానులంతా నా ముని ముని సంతతే కదా! ఇందులో స్వపర బేధం లేదు నాకు. అయినా ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నావూ?
ఊ : ఎందుకంటే మీ ఆనందగజపతిరాజు సంతతి నుంచి వచ్చిన పి.వి.జి. రాజు గారు కాంగ్రెస్ నాయకులు. అప్పటి జమీందారీల రద్దు నేపథ్యంలో గుడి, గోపురాలు, స్కూళ్ళు, కాలేజీలు యాజమాన్యం పేరు మీద రూ. 50,000 కోట్ల ట్రస్టు ఏర్పరచారు. ఆ సంతతి ఇంకా ఆ దర్జా, హోదా అనుభవిస్తున్నారు. మీ సంతతులు మాత్రం అదే సాహిత్య సేవలో తరిస్తున్నారు. ఈ తేడాలెందుచేత?
గు : అదే, అంతే నాకు ప్రాప్తం అనుకుంటాను. ఈ కొవ్వలి గోపాలకృష్ణ సహస్రాధిక నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహరావు సంతతేనా?
ఊ : : ఔనౌను. అదే సంతతి. కానీ మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. దాటవేస్తున్నారు.
గు : రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి దేశంలోకెల్లా అత్యంత విలువైన సంపదను ట్రస్ట్ ద్వారా కాపాడుకున్నారు. కాంగ్రెస్, టిడిపి ఏదైతేనేం వాళ్ళకు సాధ్యమైన తోచిన రాజకీయ, సామాజిక సేవ చేస్తున్నారు. మిగతా వారిలో ఆ తెలివితేటలు, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల ఆస్తులన్ని ప్రభుత్వ పరమైనాయి. ఇక మిగతాది ఎ.జి.కె. మూర్తి అడ్వర్టైజింగ్ రంగంలో రాణించాడు కదా. ఎవరైనా స్క్రాచ్ టు రిచ్చెస్ కావలసిందే. ఏ రంగమైనా తెలివితేటలు, ప్రతిభ, పోటీతో రాణించాల్సిందే.
ఊ : కానీ మావోయిస్టులు, రాజ్యాంగం ప్రతిభా, గితిభా జాన్తానై. దళిత, గిరిజనులందర్నీ బహుజనులతో పాటు అధికార పీఠం ఎక్కించాల్సిందే అంటున్నారు కదా! దీనికేమంటారు.
గు : అనడానికేముంది. సామాజిక చట్రంలో బ్రాహ్మణులుపై దొంతరలో ఉన్నారు. వారి క్రింద రెడ్డి, వెలమ, కమ్మలు ఉండి వ్యవసాయం చేయించేవారు. ఆ గ్రామీణ వ్యవస్థలో కులవృత్తులన్నీ పాలుపంచుకునేవి. వాటి క్రింది సంచారజీవులు, సామాజిక బహిష్కరణకు గురైనవాళ్ళు ఉండేది. గిరిజనులు ఒక ప్రత్యేక జీవన పద్ధతి. వారి రక్షణకు, ఎదుగుదలకు రాజ్యాంగం ప్రత్యేక సూచనలిచ్చింది. ఐతే సామాజిక, రాజకీయ రంగాలలో సమాన అవకాశాలు లభించి అందరి ఎదుగుదలకు, సామాజిక ఉద్యమాలు దోహదం చేయాలి.
ఊ : ఐతే నేను శ్రీ పి.వి. నర్సింహారావు మరియు శ్రీ జి. వెంకటస్వామి గార్లపై తులనాత్మక, సామాజిక, రాజకీయ పరిశోధన చేయాలని అనుకుంటున్నాను గురువుగారూ.
గు: నీ జర్నలిజం ఇంటర్వ్యూలేవో నువ్వు చేసుకోక ఇటువంటి సమస్యల తేనెతుట్టి వ్యవహారాల్లో ఎందుకు వేలు పెడతావు. నీ పని నువ్వు చేసుకో చాలు.
ఊ : మీ వీరేశలింగం పంతులు, మీ వరవరరావు తమ సమకాలీన సమాజాన్ని, చెడును చీల్చి చెండాడొచ్చు కానీ మేం పరిశోధనలు చేయకూడదా? మీరు మీ లెక్చరరుద్యోగం చేసుకోక అన్నింట్ల వేలు పెడతారేం! మేం మాత్రం చేయకూడదా?
గు :అందులో రాగల సాధక బాధకాల వల్ల నేనలా చెప్పాను. నీకు ఆ ఓపికా, ఉత్సాహం ఉంటే చెయ్యి. పట్టుదలను ఎవడాపగలడు?
ఊ : ఇదేమిటి, నేను మీ అభిప్రాయాల్ని, ఇంకా చాలా విషయాల్ని అడుగుదామని వచ్చి ఇలా వేరే రూట్లో వెళ్తున్నాను.
గు : అదే చాంచల్యం!
ఊ : ఎందుకో గురువుగారూ మీలాంటి వాళ్ళు దగ్గరకు వస్తే వ్రాసుకున్న ప్రశ్నలకు బదులుగా చాలా ఉప ప్రశ్నలే వస్తుంటాయి.
గు : సరే సరే ఇతర దారుల్లో వెళ్ళకుండా నీ సమయం మించి పోకుండా ప్రశ్నలు వెయ్.
ఊ : కవులలో గుర్రపు స్వారీ వచ్చిన ఆధునిక కవులెవరైనా ఉన్నారా?
గు : అదేమిటి! నీ చూపు గుర్రపు స్వారీ మీదకు పోయింది. కొంపదీసి నా స్థానిక ప్రయాణాలలో వేరే రవాణా సౌకర్యం అందుబాటులో లేక నేను గుర్రపు స్వారీ చేశాను. నన్ను రామప్పంతులును ఒక గాటను కట్టవు గదా!
ఊ : అది కాదు, మీ పాత్రలన్నీ మీ అభిమాన పాత్రలే, సజీవ మూర్తులే. మీరు గుర్రపు స్వారీ ఠణాయించారు. ఆ విధంగా ఎన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు గార్ల జానపదాలకు స్ఫూర్తి కదా!
గు: సంపూర్ణ ఆరోగ్యవంతులైన వారెక్కడ, అర్భకున్ని నేనెక్కడ! నువు భలే సామ్యం చెపుతావులే. ఊరుకో. అయితే ఒక రకంగా ఎన్టీఆర్ అభినయంలో ఆణిముత్యం, మధురవాణి అలియాస్ సావిత్రిల కన్యాశుల్కం
ఉంది కదా!
ఊ : ఆఁ గుర్తొచ్చింది గుర్తొచ్చింది. నష్కల్ రాకుమారుడు తీగారం నాన్న, ఎన్టీఆర్ నెల్లుట్ల నర్సింహ్మారావు అలియాస్ మధుసుధనరావు గారు, నష్కల్ నుంచి హన్మకొండకు యెల్ల గుర్రంపై వచ్చేవారు.
గు : ఇదేం బేహద్బీ. ఉండుండు. గుర్తుచేసుకోనీ. ఆ ఈయన మంచి అందగాడు, స్ఫురద్రూపి, కవి, గేయ రచయిత, గాయకుడు.
ఊ : ఔనౌను. అయితే మన సినీ కథానాయక ఎన్టీఆర్ గారు చదువుకునేటప్పుడు సైకిల్పై తిరిగి పాలు అమ్మేవారు. ఆ కాలంలో ఈ నష్కల్ లేదా తీగారం ఎన్టీఆర్ గారు మక్తేదార్ అంటే ఒక రకమయిన జమీందార్ హోదాలో తెల్ల గుర్రంపై కమాను నిర్వహించేవారు. అయితే కమ్యూనిస్టు పోరాటాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో ఆ మక్తాలు, జమీందారీలు రద్దై తెలంగాణ విముక్తమైంది. ఆ తర్వాత చివరకు చివరి పది పదిహేను సంవత్సరాల కాలంలో ఈ కరణం ఎన్టీఆర్ మహావీర్ హాస్పిటల్లో కేర్కర్గా, కోఆర్డినేటర్గా నెలకు 10 వేల రూపాయలకు పాలు పండ్లు, ఔషధాల పంపకం చూసేవారు. ఒక జీవితంలోనే ఐశ్వర్యం, హోదా, ఎత్తుపల్లాలు, నిమ్నోన్నతాలు ఈ ఇద్దరు ఎన్టీఆర్ జీవితంలో సంభవించాయి. దీనికి మీరేమంటారు?
గు : ఔనౌను, జీవితం బహు విచిత్రమైంది. ఎన్నో మలుపులు తిరుగుతుంది.
ఊ : చరిత్ర ఇది అయితే, మరి దేశ్ముఖ్, దేశ్పాండే, మక్తేదార్ల రద్దు కాంగ్రెస్ ఖాతాలో పడిందేమిటి?
గు : కాంగ్రెసు నైజమే అది. అది స్వతహాగా ఏ ఉద్యమం చేయదు. ప్రతి ఉద్యమాన్ని అది క్యాష్ చేసుకుంటుంది.
ఊ : ఐతే, ఈ కరణం ఎన్టీఆర్ గారు మంచి ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఒక అందమైన వైశ్య పతివ్రతా శిరోమణి, 20 కిలోల బంగారంతో లేచిపోదాం వస్తావా అని వెంటపడిందట. మీకేమైనా ఇటువంటి అనుభవాలున్నాయా?
గు : సాహిత్యం, భాషాసేవ, సంస్కరణవాదం, ఉద్యోగ బాధ్యతలు ఇలా నేను నా పనులలోనే నిమగ్నమై ఉన్నాను. అయినా వెంకటరమణయ్య పంతులు గారు వేశ్యల జీవితాలు, తాగుబోతుల అడ్డాలు, సామాజిక సమస్యల్ని నువు నిశితంగా దగ్గరగా పరిశీలించావు. అందుకే సజీవ రక్తమాంసాలతో తొణికిలాడుతున్న అద్వితీయ నాటకాన్ని, కథల్ని, గేయాల్ని రచించావని కితాబునిచ్చారు. అయితే సమాజంలో ఐశ్వర్యవంతులు, అందగాళ్ళకు ఇటువంటి ఉపాఖ్యానాలెన్నో ఉంటాయి. పోనిద్దూ.
ఊ : సరే, సరే గురువుగారూ. ఈ కరణం ఎన్టీఆర్ గారు మన కమ్యూనిస్టు రాఘవరావుగారూ ఉత్తరోత్తరా వియ్యంకులయ్యారు.
గు : మరి అదే కదా! సంఘర్షణ, సంవాదం, సమన్వయం అదే హైందవం (భారతీయం). ఇలానే సామాజిక పరిణామ ప్రగతి నడుస్తుంది.
ఊ : మీరు కొంచెం ఓర్పుతో, సమన్వయంతో ఇంకో 25-30 సంవత్సరాలు మంచి నవల శాస్త్రీయ రచనలు చేస్తే మీ ఆణిముత్యాల్ని మీరే ఆంగ్లీకరిస్తే తెలుగు సాహిత్యానికి అంటే భారతికి రెండవ వాఙ్మయ నోబెల్ బహుమతి వచ్చేది కదా!
గు: ఆలోచించకుండా ఉండటం, విశ్రాంతిగా గడపటం నా స్వభావానికే విరుద్ధం. అందుకే ఎల్లప్పుడూ ఆలోచనలతో ఉద్రేకానికి ఉద్వేగానికి గురయ్యేవాన్ని. అందుకే నా చివరి రోజుల్లో నన్ను కలుద్దామని నా ప్రాణమిత్రుడు గిడుగు పిడుగు వెంకటరామ్మూర్తి పంతులు అనుకొని మా ఊరికి వచ్చి కూడా కలువలేదు. ఏం ఉంటుంది? భాషా సంస్కరణవాదం, సంఘ సంస్కరణ వాటికై ఉద్రేకపడటం అదే కదా! అందుకే పాపం ఆయన రాలేదు. అయితే హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు నోబెల్కి అర్హతలున్నా హంగు చేసుకోలేకపోయాడు.
ఊ : ఔనౌను అదే కదా! ఎవర్ని కలవం వారే గుర్తించాలి అని భీష్మించుకుంటే ఈ రోజులలో కుదరదు కదా! మళ్ళీ మనవాళ్ళలో శేషేంద్ర ఒక్కరే ఆ స్థాయికి ఎదిగారు.
గు : సంప్రదాయ సాహిత్య పరంపర అవగాహనతో షోడశి రామాణ రహస్యాలు మంత్రశాస్త్ర యోగశాస్త్ర నేపథ్యంలో నిరూపించాడు. ఆధునిక సాహిత్య నేపథ్యంలోనూ అద్భుత కృషి సల్పాడు.
ఊ : ఔనౌను, ఇందిరాదేవి ధనరాజ్గర్ సాంగత్యంలో జ్ఞానబాగ్ ప్యాలెస్ కూడలిగా ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీష్ గోష్టిలు జరిగేవి. జర్మన్, లాటిన్, గ్రీక్ ఇత్యాదుల్లో ఆయన కవిత్వం అనువాదమై అనువాదమై, విశ్వవ్యాప్త అభిమానులను ఆయనకు తెచ్చిపెట్టింది. నోబెల్ దాకా పాకగల్గాడు కానీ ఆయనకీ జ్ఞానపీఠం దక్కలేదు, అని అభ్యుదయ సాహిత్యకారులు ఆయన గురించి, శ్రీశ్రీ గురించి వాపోతున్నారు.
గు : అందుకే నేను సాహిత్యం, కళలు రెండూ స్వతంత్ర ప్రతిపత్తితో ఉండి సమాజానికి దిక్సూచిలా కావాలని ప్రతిపాదించాను. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండి, నిజమైన ప్రతిభను గుర్తిస్తే ఇటువంటి విమర్శలు రావు కదా!
ఊ : మరేమో… మరీ… మరీ మీ బయోపిక్ రాద్దామని ఎవరైనా వచ్చారా?
గు : అబ్బా, భూమి గుండ్రంగా ఉంటుందని ప్రతి విషయాన్ని అటుతిప్పి ఇటు తిప్పి నా నెత్తిమీదకు తెస్తావెందుకు? నా కాలంలో నాకు అటువంటివి తటస్థపడలేదు. అయితే ఏం? ఎన్టీఆర్ జీవిత చరిత్ర లక్ష్మీపార్వతి వ్రాస్తే నీకేంటి, నాకేంటి ఆవిడ తెలుగు సంస్కృత భాషాధురీణ, మంచి విద్వాంసురాలు.
ఊ : మీరు, వీరేశలింగం పంతులు గారు ఓ… ఏకపక్షంగా బాగా బౌద్ధాన్ని అభిమానించి హిందూమతాన్ని తూలనాడారు. ఆఁ మీ ఈ విదుషీమణులే విద్వాంసురాల్లే బౌద్ధాన్ని భ్రష్టు పట్టించారు. ఆ అవశేషాల నుంచి అవకతవకల నుంచి అద్వైత భేరీ మ్రోగించి శంకరులవారు ఆ శతాధిక మతాల్ని ఒక్కటి చేశారు.
గు : ఔను, అదంతా చరిత్ర. సరే ఇప్పుడేమంటావు.
ఊ : కారం గారని మహా ముదురు. రెండు సూత్రీకరణలు చేశారు. 1. పిలిచి తిట్టించుకోవడం అంటే ఇప్పుడు బౌద్ధం ఉంది కదా. యజ్ఞయాగాదులు, బలులు, క్రతువులతో ఉన్నప్పుడు దానిని సంస్కరించింది. మరదే బౌద్ధం పతనమైనప్పుడు ఇదే హిందూ బ్రాహ్మణ మతం దాన్ని జీర్ణం చేసుకుంది. అదే బ్రాహ్మణులు సామాజిక మార్పుకై చిత్తశుద్ధితో కృషిచేసి ఇప్పుడు సకల దుర్గుణాలకు, రుగ్మతలకు బ్రాహ్మణులే కారణమని వారు సంస్కరించిన వారితోనే తిట్టించుకోవడం. ఇంగ్లీషువారు ఆధునిక ఆలోచనా, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య భావాలు విద్యావిధానంతో ప్రవేశపెట్టి తమ ముడ్డిక్రిందికి తామే నీళ్ళు తెచ్చుకొన్నారు. ఇట్ల ఇవన్నీ పిలిచి తిట్టించుకోవడంగా చెప్పుకోవచ్చు.
గు :: ఆహా! అయితే ఇంకొకటి ఏమిటి?
ఊ : దే ఆర్ అగ్రీడ్ టు డిసగ్రీ. అంటే ఎవరి భావాలు వారికి ఉండవచ్చు. అందుకే వారు ఎవరి స్వతంత్ర ఆలోచనలు వారికి ఉంచుకొని సమాజంలో స్వయం ప్రతిపత్తితో ఆలోచిస్తూ మనగల వచ్చు. అది ఈ భారతీయ, హిందూ సంస్కృతిలో, సమాజంలో ఎప్పటినించో అంతర్భాగంగా వస్తుంది. ఇది రెండో సూత్రీకరణ.
గు : ఔను, త్రిపురనేని వారిని, జాషువా, అల్లూరి, బోస్, రామానంద తీర్థ, ప్రకాశం, మగ్దూం, రావి, తాపీ వంటి వారిని కులదృష్టితో చూడటం చాలా తప్పు. ఎవరైనా ఏ కులంలో పుట్టినా ఆ కుల బారియర్ దాటి సమాజానికి ఏం చేశారనేది చూడాలి. ఇక్కడ కూడా సంకుచిత దృష్టేనా?
ఊ : మీకూ, వీరేశలింగం గారికి కూడా ఈ తిట్లు తప్పలేదు.
గు : సమాజంలో బేధభావాలు, వివక్షలు పోవాలని, కృషి చేసేవారిని కూడా అపార్థం చేసుకుంటారా? ఇది చాలా తప్పు. తప్పుడు అవగాహన.
ఊ : ఈ విధంగా కారం గారి ఈ రెండు సూత్రీకరణలు నా అవగాహనను పెంచాయి గురువుగారూ. అందుకే ప్రపంచమంతా, దేశస్తులంతా చెట్టపట్టాల్ పట్టుకు నడువవలెనోయ్ అనే మీ మాట శిరోధార్యం.
గు : ఏమిటేమిటి? చిత్రం బహు చిత్రం. విచిత్రం అనేలాగుంది నీ భావన. ఎవడో బోడిగాడు. ఈ కారంగాడు రెండు సూత్రీకరణలు చేశాడట. మహా పొంగిపోతున్నవ్. మళ్ళీ కొత్తగా వీన్నెవర్నో నా నెత్తిమీదికి తెస్తున్నది. ఒక్క గిరీశం గాడితోనే సతమతమౌతున్నా.
ఊ : అది కాదండీ గురువుగారూ. ఇస్లాంలో వేరే ఆలోచనకు, భావనకు చోటుండదు. అట్లే క్రిస్టియన్ దేశాలు క్రిస్టియానిటీ తప్ప వేరేవాటిని అంగీకరించవు. ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి వివిధ భావాలు విరుద్ధ భావాల సహజీవనం భారతీయం, హైందవం. మరి ఈ రెండు గుంపులు భారతదేశానికి సెక్యులరిజం బోధిస్తామని బయల్దేరాయి కదా! ఇది ఎంత వరకు సమంజసం.
గు : బహుశా ఆ కారంగాడి రెండు సూత్రీకరణల ద్వారా నీవీ ప్రశ్న వేస్తున్నావా? మంచిది, మంచిది. ఇంకో ఆలోచనని, సంస్కరణని ఒప్పుకొనని ఎడారి మతాలు ఈ వైవిధ్య, విరుద్ధ భావాల సంకలనం స్వతంత్రం అయిన భారత్కు పాఠాలు బోధిస్తారా అని నీ ధర్మాగ్రహం. సరే, ప్రజాస్వామ్యయుతంగా ఏ గుంపు గద్దెనెక్కితే అవే భావాలకు గుర్తింపు వస్తుంది.

May 31, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

కైరవ శతకం

by Ananthaacharaya K.S. May 31, 2023
written by Ananthaacharaya K.S.

అక్షరార్చన సమూహ పండిత సమూహానికి
సవినయ పూర్వక నమస్సుమాంజలు.

గురువుగారు డా.గండ్ర లక్ష్మణ రావు గారి ప్రేరణ తో…

వేణుశ్రీ గారు అనగానే ప్రశ్నించే గొంతుక,ఎదురు తిరిగే సాహసం, స్థిర చిత్తు లు, చైతన్య మైన నడక, అభ్యుదయం ఆయన దృక్పథం.మానవత్వం ఆయన తత్వం. కవిగా,అనేక సాహితీ సంస్థలతో అనుబంధం కలిగినవారు. సామాజిక కార్యకర్త. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు. వేణుశ్రీ గారి పూర్తి పేరు సుదర్శనం వేణుగోపాలా
చార్య. వీరు ఉమ్మడి కరీంనగర్ జల్లాలోని నందగిరి కోట్ల గ్రామానికి చెందిన కవి. వీరి తండ్రి గారు సుదర్శనం హనుమాoడ్లు
తెలుగు భాషా పండితులు.
ఆచార వ్యవహారాలు కట్టు బొట్టు అన్ని తెలిసిన వైష్ణవ సంప్రదాయo లోంచి వచ్చిన వేణుశ్రీ గారు అభ్యుదయ సంఘాలతో
అనుబంధం పెంచుకొని
ఆదర్శ వివాహం చేసుకొని
తాను నమ్మిన దానిని బోధించి, ఆచరించి సిద్ధాంతానికి కట్టుబడిన
వారు వేణు శ్రీ గారు. వరంగల్ లోని విశ్వేశ్వరాంధ్ర సంస్కృత కళాశాలలో మహా మహోపాధ్యాయ పద్మ శ్రీ శ్రీభాష్యo విజయ సారథి గారి శిష్యరికం లో సంస్కృత, తెలుగు సాహిత్య అంశాలు,వ్యాకరణ ఛందో అలంకార శాస్త్రాలు అభ్యాసం చేసిన ప్రతిభాశాలి. వీరి మొదటి రచన స్వేచ్చ వచన కవితా సంపుటి. తదుపరి ప్రజాభారతం, వరేణ్య శతకం, తెలంగాణ ఘోష
ప్రచేతసా, కైరవ శతకాలు.
తన కవితా శక్తితో సమ సమాజ కాంక్షను వెలిబుచ్చారు.కవిత్వం కవిత్వం కోసం కాకుండా రేపటి తరానికి అందించాలన్నదే ఆరాటం.
తేలికైన పదాల తో వచన కవిత్వం రాసిన వేణుశ్రీ గారు అంతే సులభంగా పద్యం రాయవచ్చునని
నిరూపించారు. ప్రస్తుతానికి వస్తే కైరవ శతకం లో మనుమడి పేరుతో తాత
బోధిస్తున్నారు కాదు ఉపదే శిస్తున్నారు.
తాత మాటలు కైరవా! తరగని నిధి! అనే మకుటంతో శతకం సాగుతుంది. మకుటం లోనే గొప్ప నిధిని ప్రోగుచేసి పంచారు.
శతకం లో పద్య రూపం పాతదే అయినా కవి తన చుట్టూ ఉన్న జీవన అల్లికలుగా శాతం ఆధునికతను కలిగి ఉంది.
కైరావ అనే పదానికి అర్థం
తెల్లకలువ అని అర్థం.స్వచ్చ మనసు పారదర్శకత నీతి నిజాయితీలను ప్రతి బింబoప జేశారు. డా.గండ్ర లక్ష్మణ రావు గారు ముందు మాట రాస్తూ ఒక్కొక్క పద్యం లో ఒక్కొక్క విషయాన్ని పలు కోణాల లో వివరించడానికి
పొడవైన సీసా పద్యాల నెన్నుకున్నారు. సీస పద్యాలు పదహారు రకాలున్నాయని ఛందో శాస్త్రం తెలుపుతుందన్నారు.
గణాల ప్రయోగాన్ని బట్టి.పాదాల విరుపులను
బట్టి వైవిద్యం గల సీస పద్యాలున్నాయన్నారు.
నన్నయ్య నుండి నేటి దాకా కావ్యాలలో శతకాల లో విరివిగా వాడిన సీసా పద్యానికి వేణు శ్రీ గారు కొత్త నడకలు నేర్పించారని అన్నారు.
వేణు శ్రీ గారు ప్రజాకవి కనుక పల్లె జనాలు,అవస్థలు వృత్తులు, తెలంగాణ తేజైన పదాలతో బలహీన మైన వారి పక్షాన నిల్చి బలమైన గొంతుతో,సూక్ష్మ దృష్టితో పద్య నివేదనం చేశారు.

సీ!! పాత విషయముల పద్యాలలో తిరిగి
వ్రాయుటేలయనుచు ప్రశ్నలేయు
వారలుకాలరింక వాదనలను చేయు
సద్విమర్శకులకు సవినయముగ
తిన్నయన్నమెరోజు తినుటలేదమనము
అట్టివేపద్యాలు అందరింక
మంచి మార్గమున మసులు కొందురనియు
మరల మరల వ్రాయ మారుదురని

తే!! ఎంచుకొన్న కవులికను ఎంచినట్టి
మనుషులందున కొందర్ని
మార్చవచ్చు
ననుచు కొత్తగజెప్పంగ జనులు చదువ
కవితా పద్యమైనను నిల్చు కాలమందు
తాటమాటలుకైరవా! తరగని నిధి.

ఈ పద్యం సులభంగా అర్థమవుతంది. పాత విషయాలే అయినా
కొత్తగాచెప్పారు. విశ్వనాథ వారి వాడుకను వాడుకొని ..తినిన అన్నము తినుటలేద మనము…అట్టివే పద్యాలు. ఎన్ని మార్లు విన్నా అవి విలక్షణంగా నిత్య నూతన తో భాసిస్తాయి అనేది వీరి భావన. అందరినీ మార్చలేం ఎంచుకొని కొందరిని మార్చ వచ్చు అని సూటిగా తెల్పారు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు…అనే శతక పద్యాన్ని గుర్తు చేసి మంచి శతకం మన ముందుంచారు. కరీంనగర్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన లో4.3.2023 న రచయిత ముద్దసాని రాంరెడ్డి గారి స్మారక పురస్కారం మరియు పది వేల నగదు అందుకోబోతున్న సందర్భం లో వేణు శ్రీ గారికి నమస్సులు.. అభినందనలతో..

కె ఎస్ అనంతాచార్య
కరీంనగర్

May 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మాట

by Radhika Suri May 31, 2023
written by Radhika Suri

మాటలో మతలబులెన్నో!
మర్మాలు ఇంకెన్నో కదా!
మాట మలయ మారుతంలా హాయినిస్తుంది
చందన లేపనంలా చల్లనైనది
ఆత్మబంధువు పలకరింపులా సాంత్వనమిస్తుంది
మాట చిన్నదే !మది గాయం పెద్దది చేస్తుంది
అదే మాట గాయాన్ని మాన్పే దివ్య ఔషధమౌతుంది
అలజడితో నిశ్శబ్ద తరంగమౌతుంది
మదిని కాల్చే అగ్ని కణమౌతుంది
కసిరేపి పాతాళానికి తొక్కేస్తుంది
మారణ హోమానికి పరాకాష్ఠౌతుంది
ఒక్క మాట జీవితాన్నే మార్చేస్తుంది
మార్పుకు మూల హేతువౌతుంది
మనసు పదిల పరిచే ప్రయత్నమౌతుంది
మానవత్వానికి మరో రూపమౌతుంది
ప్రేరణతో విశ్వవిజేతను చేస్తుంది
పెదవి దాటితే మరలి రాదు
మదిని కాల్చితే మరపురాదు

May 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

పిల్లల కథ

by డా.కందేపి రాణీప్రసాద్ May 31, 2023
written by డా.కందేపి రాణీప్రసాద్
May 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఇల్లొక స్టోరీ టెల్లర్ !!

by Geethanjali May 31, 2023
written by Geethanjali

–గీతాంజలి కవిత.(13.1.2023)


ఇప్పుడా నువ్వు వచ్చేది ??నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక?
నాకు తెలుసు ఇక ఇప్పుడు నువ్వు వస్తావని…
నా వీధిలోకి నింపాదిగా నడుచుకుంటూ ఇప్పుడైనా వస్తానంటావా? సరే.. రా..
నేను లేని ఖాళీ ఇంటి ముందు నిలబడి…
ఒకప్పుడు నీ కోసం ఎదురుచూసిన ఈ శూన్యపు ఇంటిని గాజు కళ్ళతో చూస్కో..
నా ఇంటి నిశ్శబ్దంలో ..నేను నీకు చెప్పాలనుకున్నవి వినిపిస్తే.. ఇప్పటికైనా విను..
కన్నీళ్లేమైనా రాలితే… రాలనివ్వు !
విషాదపు చీకటి నిండిన గదుల్లో వెలుతురు మిణుగురులు ఏమైనా మెరిస్తే పట్టుకో కొన్ని.
ఇక వెళ్లిపో..అక్కడ నేను లేను
నీకు ఇక దొరకను…!
నేనున్నప్పుడు ఇన్నాళ్లూ రాకుండా ఉన్న నువ్వు..
ఖాళీ ఇంటి ముందు కూడా ఉండకుండా వెళ్లిపో..
రాకింక !
మనిషిగా మారానంటావా..
నేను వెలిగించాల్సిన దీపం ఇంకా చీకటిని తాగుతూ ఉందంటావా.. ఉండనివ్వు !
నేను రాకపోతేనేం .. లేకపోతేనేం.. ? దీపం దానంతట అదే వెలుగుతుంది.
వెళ్లు….!
నన్నిక రమ్మనకు !
నువ్వూ రాకు !
నువ్వు లేని ఇల్లేమీ చిన్నబోదు.
నన్ను బాధపెట్టిన నిన్ను ఇల్లేనాడు ప్రేమించలేదు..క్షమించలేదు కూడా !
నువ్వు నాతో లేనప్పుడు ఇల్లే మనిషిగా మారి నాతో కబుర్లు చెప్పేది..వెచ్చగా కౌగలించుకుని ఓదార్చేది !
నేను లేక పోతేనే.. ఇల్లు ఏడుస్తుంది.
దానికదే కథలు చెప్పుకుంటుంది.
గది గదినీ పలకరిస్తుంది.
తనలో తాను ఆరాటంగా తిరుగుతూ నా గాయాల్ని తడుముతుంది.
ఏకాంతపు రాత్రుళ్లల్లో నేను మైమరచి విన్న గులాం అలీ గజల్స్ నీ…నా రఫీ పాటల్ని..నూర్జహాన్ గమకాల్ని తానూ యాద్ చేసుకుంటూ ఇల్లు కన్నీరు పెడుతుంది…
నన్ను తలచుకుంటూ… విరహ వేదనలో కాలిపోతుంటుంది.
నా పాదాల స్పర్శ కోసం నేలను ముధ్ధాడుతూ ఉంటుంది.
నన్ను అక్కడ లేకుండా చేసిన నీపై ఆగ్రహంతో రగిలిపోతుంటుంది.
నా కన్నీళ్ళతో మరకలైన దిండు గలీబుని ప్రేమగా నిమురుతుంది.
నేను రాసిన కథలు.,కవితలూ నువ్వు వినలేదేమో కానీ… ఇల్లు విన్నది.
నేను వెళ్లాక ఇల్లు గడపమీద కూర్చుని తీరిగ్గా నా కవితల పుస్తకాన్ని తిరగేస్తూ కన్నీళ్లు కారుస్తుంది.
కిటికీలతో..గదులతో.,తలుపులతో., పరువులతో..పరదాలతో.,
వంటింటి గిన్నెలతో ..ఆరిపోయిన పొయ్యితో..అలమరలోని పుస్తకాలతో.. టేబుల్ పైని నా కాగితాలతో ..కలంతో..నా చాయ్ కప్పుతో..
హేంగర్లకు వేలాడుతూ గాలికి కదిలే నా చీరలతో..నన్ను నేను చూసుకున్న నిలువెత్తు అధ్ధంతో..
అధ్ధం మీది నా కళ్ళ కాటుక మరకలతో.. గోడమీది నా బొమ్మతో..
ఇంటిని అల్లుకున్న పూల తీగలతో.. పెరటిలోని గువ్వలతో .,ఇంటి డాబాతో.,
డాబా పైని వెన్నెలతో చుక్కలతో…వాకిట్లోని ముగ్గుతో…ముగ్గుపై వాలిన ఎండతో… రాత్రి రాలిన పున్నాగ పూలతో .. కథలు చెబుతుంది ఇల్లు.
ఎవరివి అనుకున్నావు…
నీ–నా కథలే..!
అర్థాంతరంగా ఆగిపోయిన మన కథలు!
ఏమనుకున్నావు మరి…ఇల్లొక స్టోరీ టెల్లర్ !
దిగులు పడకు.. నువ్వు లేకపోతే ఇల్లేమీ చిన్నబోదు.. ఇల్లు కథలే కాదు పాటలు కూడా పాడుతుంది…
పాడకుండా గొంతులో నిలిచిపోయిన పాటలే అందుకుంటుంది ఇల్లు.
నేను రాసిన కవితలనే పాడుతుంది….
అవును ఇల్లు పాడుతుంది
అందుకే ఇల్లు .. నువ్వు నాకు చేసిన గాయాల్ని పాడే గాయకురాలు !
ఇల్లొక సంగీతం !
ఇల్లు కథలు రాస్తుంది
ఇల్లొక పుస్తకం అవుతుంది.
ఇల్లొక కలం అవుతుంది.
ఇల్లొక రచయిత్రిగా మారిపోతుంది
అడిగి చూడు…ఇల్లు మాట్లాడుతుంది.
అచ్చం నా లాగా !
అవును నేను ఇల్లుగా మారాక
ఇల్లు నేనుగా పరివర్తన చెందాక..
ఇల్లూ.. నేనూ ఒకటే అయ్యాక..
నేనా ఇల్లు విడిచి పెట్టిపోయినా
ఇల్లు.. నేనుగా నిలబడి ..నిట్ట నిలువు చూపుల కన్నులతో…నీతో మాట్లాడుతుంది.
నిన్ను నాలాగే ప్రశ్నిస్తుంది
హెచ్చరిస్తుంది.
నిన్ను లోపలికి రానిస్తుందనుకుంటున్నావా…
ఈ ఇల్లు నీ ఉనికికి మాత్రమే కాదు నా దుఃఖానికే చిరునామా !
నేను లేని ఇంట్లో ఉంటే ఉండు..పోతే పో !
ఇల్లు అలానే అక్కడే ఉంటుంది…
ఎందుకంటే ఇల్లు
నన్ను పువ్వు నుంచి కత్తిగా మార్చిన కార్ఖానా !
ఇల్లొక చరిత్ర !!
ఇల్లొక స్టోరీ టెల్లర్ !!

May 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

కాలమేఘం

by రంగరాజు పద్మజ May 31, 2023
written by రంగరాజు పద్మజ

కే దా ర్ నా థ్ జ ల వి ల యం…..

మహాద్రి, పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురా సురైర్యక్ష మహోరగాద్వైః కేదారమీశం శివమేక మీడే ॥

ఏ పుస్తకానికైనా ముఖచిత్రం రచయిత ఏం చెప్పబోతున్నారో అనే దానికి సూచికగా ఉంటుంది. అలాగే ఈ కాలమేఘం కేదార్నాథ్ జలవిలయం ముఖచిత్రం కూడా లోపలి అంశాలకు అద్దం పట్టినట్టు ఒక సంకేతంగా నిలిచి ఎంతో బాగుంది…

కంటికంతా జలమయమై
మింటి వరకు ఏక రాశై
జగములన్నియు కాలయోనిలో
మొగములెరుగక నిదురబోవగ…

ఈ పుస్తకం పేరు చూడగానే నాకు ప్రళయావసాన ప్రకృతి కళ్ళముందు కదలాడింది.
కాలమేఘ పుస్తక సమీక్షరాద్దామని అనుకున్నప్పుడు….
తెలుగు సాహిత్య ప్రక్రియలలో ఎన్నో చదివాము !చూసాము!
కొన్ని ఆనందింప చేసేవిగా కొన్ని ఆలోచింపచేసివిగా ఇలా రకరకాల అనుభూతులను కలిగిస్తాయి ఆయా పుస్తకాలు…
కానీ కాలమేఘం మాత్రం యదార్ధ సంఘటనైనా కూడా… జరిగిన ప్రమాదం టీ.వీ వార్తా ఛానళ్ల ద్వారా భయానక కథలతో.. జలప్రళయంతో అంతా మునిగిపోతున్నదా? అన్నట్టున్న ఉత్తరాఖండ్ లోని రుద్ర ప్రయాగ లోనిచార్ ధామ్ యాత్రలలో ఒకటైన కేదార్ నాథ్ ఆకాశగంగ విరుచుకుపడిన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలను పదేపదే చూసినప్పుడు టీ.వి. వాళ్ళు ఎందుకు చిత్రహింస పెడుతున్నారని అనిపించింది. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత సాటి- తోటి మనవారు పడిన కష్టాలు చూసి మనసంతా కలచివేసింది. అదేమిటో చూద్దాం! మానవతా దృక్పథంతో స్పందిద్దాం!!
రండి ! ఈ పుస్తకంలో పయనిద్దాం!!
M.S.R. వెంకట రమణ గారు రచించిన కాలమేఘం పుస్తకాన్ని జగద్గురువు ఆది శంకరాచార్యుల దక్షిణామ్నాయ శృంగేరి పీఠం శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారు ఆవిష్కరణ చేయడం రచయిత యొక్క ఆధ్యాత్మిక చింతన తెలుస్తోంది.
ఈ పుస్తకానికి గౌరవనీయులు రచయిత , నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారు” అకాలమేఘం” అంటూ ముందు మాటలో “భారతీయ జీవనంలో తీర్థయాత్ర ప్రాముఖ్యతను వివరిస్తూ..” గంగను తీసుకువెళ్లి రామేశ్వరంలో కలపడం అంటే యావత్ భారతాన్ని ఆ సంస్కృతిని, ఆ వేషభాషలను ,ఆ ప్రదేశాలను పరిశీలించి అక్కడ ప్రతిబింబిస్తున్న భారతీయ ఆత్మ దర్శనం చేసుకోవడమే అని అభిప్రాయపడ్డారు.
శ్రీ ముత్తై రవీంద్ర గారు” రచనలో శాస్త్రీయ సమాచారం జోడిస్తేనే ఏ రచనకైనా ప్రామాణికత చేకూరుతుంది” అని విలువైన సందేశాన్ని అందించారు.
అలానే ఈ పుస్తకం వాతావరణ శాస్త్రీయ సమాచారంతోనే సాగి, ఎక్కడ ఆగకుండా చదవరులను చదివించింది.
కేదార్నాథ్ ఆధ్యాత్మిక నివాస స్థలమైన చిన్న పట్టణం. ఆ వరద బీభత్సానికి కొట్టుకొని పోయిన కేదార్నాథ్ మందిరాన్ని కొట్టుకుపోకుండా ఆపిన భీమశిల దైవ సంకల్పమా? లేక యాదృచ్ఛికమా? అని ఆశ్చర్యపోతూ వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదని అంటూ….”ఓరోగ్రాఫిక్” ప్రభావం గురించి మంచి అవగాహన కల్పించడం బాగుందని ప్రశంసించారు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హ్యూస్టన్ టెక్సాస్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు గారు.
నిజమే! భారత పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు రచయిత.
ఎప్పుడైనా మానవులు ప్రకృతిని రక్షించుకుంటూ దానితో కలిసి జీవించాలి కానీ దానిమీద అధికారం చూపిస్తూ నాశనం చేయకూడదని … అలా ధ్వంసం చేయడమే ఈ మహా విపత్తుకు కారణమని, వచ్చిన ప్రకృతి వైపరీత్యాలను ఎంతమంది చెప్పినా తన ధోరణి మానుకోని మానవుడు ప్రకృతి కోపానికి బలి కాక తప్పదని హెచ్చరిస్తూనే … కనీసం ఇలాంటి రచనలు చదివైనా కొందరైనా మారతారని ఇటువంటి రచనలు సమాజానికి అవసరమని నొక్కి ఒక్కాణించారు భాషావేత్త పూర్వ ఉప సభాపతి మాన్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు.
మానవ మాత్రులు ప్రకృతితో వాదలాడకూడదని కనువిప్ప కలిగించే రచన ఈ కాలమేఘమని అంటూ ప్రకృతిలో పుట్టి గుహలలో పెరిగిన మనిషి వాటి నుంచి దూరమై ఊళ్లోకి చేరి గూళ్ళు కట్టుకున్న జీవి.. ప్రకృతి విలయానికి భయపడి పోతున్నాడని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పిన ఈ రచయిత వెంకూ గారిని అభినందిస్తూ” ఈ ప్రకృతి వైపరీత్యానికి” కారణమని వృక్షాల ఆవశ్యకతను తెలియజేస్తూ గౌరవనీయులు విశ్రాంత న్యాయమూర్తి కుకుడాల లక్ష్మణగారి ముందుమాట కాలమేఘం పుస్తక రచయిత వెంకూ గారి మాటకు వత్తాసు పలికింది.
నిజంగా మనమందరం ఆలోచించవలసిన విషయం ఇది! కాదు తేలికగా తీసుకోకూడని విషయం కూడా…
కాలమేఘం పుస్తకం కరుణ రసభూయిష్ట బాణీ అని ఆధ్యాత్మిక ధోరణిలో స్పందిస్తూనే… ప్రేక్షకుల వలే కేదార్ నాథ్ లో జరిగిన సంఘటనలను చూసి ఊరుకోకుండా… భవిష్యత్తులో ఇలాంటి విపత్తు వస్తే ఎలా స్పందించాలనే విషయం ఈ పుస్తకం ద్వారా అందించారని రచయితను చెన్నపురి తెలుగు అకాడమీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ డాక్టర్ తూమాటి సంజీవరావు గారు తమ ముందు మాటలో అభినందించారు.
ఇక రచయిత తన మనసులోని మాట “ధర్మ చక్ర *ప్రవర్తితం ” ప్రకారం ఈ రచన చేయడంలో తాను కర్తను కానని రాయాలనే కోరికే కర్తగా రాయించిందని మల్లినాథ సూరి వలె సవినయంగా మనవి చేసుకున్నారు.
నిజమే అనిపించింది ! ఒక జలవిలయాన్ని అక్షరీకరించడం మామూలు మాట కాదు! శాస్త్రీయంగా ఏ తప్పిదాలు ఎలా జరిగాయని ఈ తిలా పాపంలో తలాపిడికెడు ఎవరు ఎవరిదని ఖచ్చితంగా తేల్చి చెప్పడం దానికి సాక్ష్యమా అన్నట్టుగా… కేదారేశ్వరునితో పాటు యాత్రీకుల, ప్రయాణ సాధనాల, ప్రకృతి రమ్యతను, భక్తుల సత్సంగాలను, గంగానది ఉగ్రరూపాన్ని, పట్టణంలోని భవనాలు కూలిపోయి విపత్తు కలిగించిన భయానక దృశ్యాలను, అంతకు ముందుఉన్న పూర్వ పట్టణాన్ని, ఢిల్లీలోని వాతావరణ శాఖ కార్యాలయం, సీనియర్ సైంటిస్ట్ విశ్వనాథ చాంబర్ ను, మునిగిపోతున్న కేదారేశ్వర ఆలయాన్ని, మంచు కొండలు, ‘ఎలనినో ‘ ఏర్పడితే ఎలా ఉంటుందో వివరించే చిత్రాలను, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ విభాగాన్ని, శిఖర పరిశోధన చిత్రం, గంగలో కొట్టుకుపోయిన వాహనాల చిత్రాలు….ఇలా ఒకటేమిటి? దేవాలయ నిర్మాణ పరిజ్ఞాన చాతుర్యాన్ని వివరించే ప్రాచీన చిత్రంతో పాటు, పాండవులు కట్టిన మందిరాన్ని, అక్కడి వ్యాపారుల అమానుష చర్యలను, శవాల మీది వస్త్రాలను మాన రక్షణకోసం ఉపయోగించుకున్న పరిస్థితి కల్పించిన లయకారుడి విన్యాసాన్ని, లింగం చుట్టూ ఉన్న శవాలు, కాలనేత్రుడై చూస్తున్న రుద్రుడు, రక్షణ కోసం పర్వతం పైకి ఎక్కుతున్న యాత్రికులు, తెహ్రి- గడ్వాల్ లోని జలాశయం, భాగీరథి నదిపై నిర్మించిన డ్యామ్, విద్యుత్ ఉత్పత్తి కోసం నిలువ ఉంచిన ఆ డ్యామ్ తెగితే ఊరు కొట్టుకొని పోతుందని హెచ్చరిస్తూ తెలిపిన చిత్రం, హరిద్వార్ , ఋషీకేష్ , పట్టణాలకే కాక ఎన్నో నగరాలకు ముప్పు ఉందని, మిథైన్ వాయువు యొక్క ప్రభావం వల్ల కలిగే ముప్పు ఎన్నో విషయాలు చదువరులకు చిత్రాలతో విశదీకరించడం, చిత్రాలను చూస్తూ పుస్తకం చదువుతూ ఉంటే హృదయం ద్రవిస్తున్నది. ఎప్పుడో 2013లో జరిగిన ఈవిలయం ఇప్పుడు జరుగుతూన్నదా? అన్నట్టుగా ప్రకృతి విలయాన్ని కళ్ళకు కట్టేలా ఉందీ పుస్తకం.
వేడినీటి కుండాలు ఎలా పేలిపోయాయో? దాని తాండవమేమిటో? ఆ శబ్దానికి భయపడిన జనం హాహాకారాలు కళ్ళకు కట్టినట్టు వివరించారు.
మిలిటరీ వారి దుశ్చర్య కూడా బాధ కలిగించింది. ఇదే సందని డబ్బులు దోచుకోవడం అక్కడి ప్రాంతీయుల పైశాచిక ఆనందం, ఆడవారిదేహ బాధల పరిస్థితి.. బాపురే!! పగవారికి కూడా ఇలాంటి దుస్థితి రావద్దనిపించింది.
గాయపడిన వారు చనిపోవడం చూసి ఇతర యాత్రికులు భయపడటం… నిజంగా రంపపు కోతే! ఇంత క్షోభలో రాజకీయాల కంపుతో మరింత జుగుప్సాకరంగా మారడం రచయితకు అసహ్యం వేసినట్టుంది.
కలెక్టర్ బసవ వెంకటరామచంద్ర పురుషోత్తం అండ….. గుడ్డిలో మెల్ల!
భాగీరథి, అలకనంద, మందాకినిల ఉగ్రత్వానికి బలైపోయిన యావత్ మానవ నిర్మితాలు రోడ్లు, వంతెనలు మొదలైనవే కాకుండా ప్రాజెక్టులు సర్వం సహా నాశనాన్ని, ఆ రాష్ట్రాభివృద్ధి వందసంవత్సరాలు వెనుకబడింది అనడం.. ఒక విలేఖరిగా రచయిత జల ప్రళయాన్ని విలయంగా మలచడం అద్భుతమైన విషయం.
మొదటి పేజీలోని “బృహద్ స్వరూపుడైన మహాకాలుడు అంత వరదల్లోనూ కంఠం వరకే వరద పోట్టేత్తడం…” ఆ చిత్రం… చిత్రంగా ఉంది.
సాంకేతిక కారణాలు కొన్ని అయితే అనుభవం లేని వారు నిర్మాణాలు చేయడం ,విద్యుత్ కోసం ప్లాంట్లు కట్టడం, నది నీటిని తరలించడం… మొదలైనవే కాకుండా అడవులు నరికి వేయడం వంటి ఎన్నో పొరపాట్లు మరియు టూరిజం కూడా విలయానికి కారణం అని సూచించారు రచయిత.
చివరకు ఇచ్చిన సందేశం ప్రకృతితో ఆటలాడవద్దని అలాగే ఆ ప్రాంతం వారికి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి సాధించాలని, కేవలం టూరిజం మీదనే ఆధారపడద్దని చక్కని సూచన చేశారు.
” క్లౌడ్ బరస్ట్” కారణంగా (కేదార్నాథ్) ఉత్తరాఖండ్ విషాద జలవిలయానికి కారణం మానవ తప్పిదంగా జరిగిందని, చెప్తూనే ఊరుకోలేదు. పరిష్కారం కూడా చక్కటి సూచనలతో… ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చేసిన హెచ్చరిక ఒక్క ఉత్తరాఖండవాసులకే కాదు… ఎక్కడెక్కడ నదీ పరివాహక ప్రాంతాలున్నాయో?? ఎక్కడెక్కడ తీర్థయాత్రా స్థలాలున్నాయో? వాటి దగ్గర యాత్రికులు మానవతా ధోరణితో ఉండి, వ్యర్థాలతో భూమిని, నీళ్ళను, గాలిని కలుషితం చేయవద్దని చెప్పే ఈ కాలమేఘం ఒక వీరబ్రహ్మ కాలజ్ఞానం వంటిది!
ప్రతి ఒక్కరూ చదివి పాటించాల్సిన ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అవన్నీ చెప్తూ పోతే నా సమీక్ష వ్యాసం వలె కాకుండా పుస్తకమయ్యే ప్రమాదముంది… అందుకే ముగిస్తూ..
ఎందుకంటే ప్రకృతి శక్తిని ఎవరూ ఊహించలేరు! భవిష్యత్తులోఎటువంటి వైపరీత్యమైనా రావచ్చు! జీవితాలను అస్తవ్యస్తం చేయవచ్చు! అలా జరగకుండా ఉండాలంటే శాస్త్రీయతతో ఏర్చి కూర్చిన విజ్ఞాన భాండాగారం వంటి పుస్తకం ఈ కాలమేఘం పుస్తకం . ముఖ్యంగా యాత్రికులు తప్పక చదవాలి! చదివిన విషయాలు పాటించి భవిష్యత్ తరాల వారికి మన సంప్రదాయ కట్టడాలను వారసత్వంగా ఇవ్వాలి!

May 31, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us