మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

సదాశివ బ్రహ్మేంద్రరలు

by Krishna Kumari Yagnambhatt March 7, 2023
written by Krishna Kumari Yagnambhatt

17 వ శతాబ్దికి చ ేందిన ఉత్తమ వాగ్గేయకారులలో సదాశివ బ్రహ్మేంద్రరల వారొకరు. వీరి ఋషిత్ులుుల ైన పదాలలో ఆధ్ాుత్మమక , భకిత భవనాలు నేండారి ఉనాాయి. ఎననా యజ్ఞా లు చేసిన పవిత్ర మూరుత లు వీరు. అేంతేకాద్ర, దారుకావన విలాసము, ఉత్సవ మేండపము అనర మేండపములు కట్టేంచిన విత్రణ శీలురు.వీరిది పరసిదిికెకిిన శీీ శివా ద ైైత్ మతానకి చ ేందిన సేంపరదాయేం అయినపపట్కీ సేంగ్ీత్ కచేరీలలో వీరి కీరతనలు పాడడేంవిదాైేంసరలకు అలవాటే.సదాశివ బ్రహ్మేంద్రర ల పెరు చ పపగ్ానే “మానస సేంచరరగ “ అనా కీరతన గురుత కు వసరత ేందిఎవరికెైనా. వీరి కీరతనలలో సగుణోపాసన, నరుేణో పాసన రెేండు భావనలు కనపసరత నాయి. ద్క్షిణ భారత్ేంలో అనేక ఆశ్రమాలలో వీరి కీర్త నలు అక్షర్ బద్ధ ం చేయబడి ర్క్ష ంపబడుతున్నాయి. దాని ఆధార్ంగా వీరు పర యోగంచిన రాగాలు తెలుస్తు న్నాయి. కంతలవరాళి, స్తర్టి,కంభోజి, మోహన, తోడి, ధనశ్రర,ఆనంద్ భై ర్వి మొద్లై న రాగాలను వీరు ఉపయోగంచారు. భగవంతుని నిరాకరునిగా భావించి కీరిత ంచిన కీర్త నలను గాని, సగుణునిగా భావించి కీరిత ంచిన కీర్త నలను గాని గమనించినట్ల యితే వీరి భక్త గాఢత, తతపర్త అర్థ మవుతాయి. పర్మేశ్వరుని పట్ల వీరిక్ గల అపరిమిత విశ్వవసం తెలుస్తు ంది. అయితే కీర్త నల లో ఏ లౌక్కమై న కోరికలు కోరుతునాట్లల కనిపంచదు.నిర్మలమై న భక్త విశ్వవసాలు తపప ఇంకో భావన ఈ కీర్త నలలో గోచర్ం కదు. వీరిది పర్మహంస ముద్ర. మృదువై న భాషతో కూడిన వీరి కీర్త నలు సంగీత చరితర లో ఒక పర తేేక సాథ న్ననిా కల్గి ఉన్నాయి. ఒక ఉదాహర్ణ చూడండి. పలల వి: చింతా న్నస్తు ఖిలం తేషం చర్ణం: శ్మద్మ కరుణా సంపూరాా న్నం సాధు సమాగమ సంకీర్ాన్నం చర్ణం: పర్మహంస గురు పద్ చితాున్నం బర హ్మమ నందా మృత మతున్నం . ఇదీ మన వాగ్గి య కరుల సంక్ష పు చరితర. ఒక్కొకొ వాగ్గి య కరుని గురించి తెలుస్తకోవ లస్తంది ఎంతో ఉంది. వారు మనక ఇచిిన సందేశ్వనిా అర్థ ం చేస్తక్కని ముందుక సాగడం మన కర్త వేం.వారు జనిమంచిన దేశ్ంలో మనం పుట్ట డం ఎంతో అద్ృషట ం. ఈ అద్ృషట నిా మన స్తకృతంగా భావించి కర్త వాేనిా పాల్గంచినట్ల యితే మన జీవితాలు ధనేం అవుతాయి.

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi March 7, 2023
written by Chillara Bhavanidevi

6
మనస్సు శాంతపరుచుకోవడానికి మంజరికి ఒకే ఒక మార్గం మిగిలింది. అది వివిధ శిల్ప సుందర దృశ్యాలను చూసి సమ్మోహనంగా నర్తించటం. ఆ రోజు ఉదయమే మంజరి భూగర్భ ప్రసన్నవిరూపాక్ష దేవాలయానికి బయలుదేరింది.
దేవాలయప్రాంగణం చేరి నిరంతరం నీటిలో నిమగ్నమై ఉండే విరూపాక్షుని సందర్శించింది. ఈ స్వామిని కొలిచినవారి మనస్సు పరమ ప్రసన్నమౌతుందిట. మంజరికీనాడు స్వామి దర్శనం పరమానందాన్ని కల్గించింది.
భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరం కృష్ణరాయలు పట్టాభిషిక్తుడైన సందర్భంగా పునరుద్ధరణకు నోచుకున్నది. భూమట్టానికి దిగువగా ఉన్న ఈ దేవాలయం తూర్పు అభిముఖంగా రెండు పెద్ద గోపురాలతో గంభీరతను ప్రసాదిస్తోంది.ధ్వజస్తంభం,మహామండపం, గగన దీపస్తంభం, పలుమండపాలతో శోభాయమానంగా అలరారుతున్న ప్రసన్న విరూపాక్ష దేవాలయానికి ఉత్తర దక్షిణ దిక్కుల్లో చతురస్రాకారపు బలమైన స్తంభాలతో విశాలమైన మండపాలనేక మున్నాయి. మహామండపం నుంచి అర్థమండపం, షట్కోణాకారంతో ఉన్న మండపం నీటిలోనే ఉంది.
తీక్షణకుంభంగల పెద్ద విగ్రహం. కళ్యాణమండపాలను దాటింది మంజరి. ఆ దేవాలయ శిల్పకళా వైభవం ఆమెలో పరమ భక్తిభావాన్ని మేల్కొలిపింది. ప్రసన్న విరూపాక్షుని ఎదుట మహామండపంలో ముద్రపట్టి నృత్యరీతిలో శివారాధన చేస్తున్నది మంజరి.
పరమేశ్వరా దేవా జగదీశ్వరా!
దయాగుణశేఖరా, స్వామి పంపాపతీ!
నిను మనసార కొలిచేను మహేశ్వరా
మమ్ము కృప జూపి కాపాడు శివశంకరా!
ఆడేనురా పాట పాడేనురా!
ఎన్ని జన్మలకైనా పూజింతురా
నీచరణాలె శరణంటి నటధీవరా
మమ్ము కృప జూపి కాపాడు శివశంకరా!
గిరజావరా స్వామి వరసుందరా
భవములు బాపేటి ముల్లోక దీనబంధుడా!
మూడు కన్నుల కాచేటి మునివంద్యుడా
మమ్ముకృప జూపి కాపాడు శివశంకరా!
ఆమె పరవశంతో భక్తిభావంతో నర్తిస్తున్నది. శివకైంకర్యమైన ఆ నృత్య సమారాధనకు పరమశివుడు కూడా పరమానందంతో నర్తిస్తుంటే స్వామి జటాజూటం నుంచి గంగ తొణికిసలాడిరదేమోనన్నట్లు చిరుజల్లు ప్రారంభమైంది. గుడిప్రాంగణంలో జల్లుల స్వర విన్యాసంతోబాటు వీరేంద్రుని అట్టహాసానికి ఆమె ఒళ్లు జలదరించింది. చుట్టూ పరికించి చూసింది.
సిల్కుధోవతి, ఆపైన జరీ అంగరఖా, పట్టుకండువా, ముత్యాలపేర్లు ధరించి కన్నుల్లో కుటిలత్వం నింపుకున్న వీరేంద్రుడు ఆమె ఎదుట నిలిచాడు.
‘‘అమ్మాయీ… బాగు బాగు’’ మరోసారి విచిత్రంగా నవ్వాడు.
‘‘మీరా’’ ఆమె భయాందోళనతో ఒకడుగు వెనక్కి వేసింది.
‘‘జగన్నాథ! అంత భయమెందుకు? నీ నృత్యకౌశలం గురించి విన్నామేగానీ చూసింది లేదు. చిన్నాదేవి నృత్యంలో శృంగారం పాలు ఎక్కువట గదా! ఆమె నృత్యాన్ని చూసే అవకాశాన్ని రాయలు మాకివ్వలేదు. ప్చ్‌! ఏం చేద్దాం! జగన్నాథ!’’
‘‘ఏమిటీ మాటలు? వారిప్పుడు దేవేరులు. అలా మాట్లాడరాదు.’’
‘‘హు! ఏం దేవేరి? ఒక దేవదాసి ఎన్నటికీ దేవేరి కాలేదు. ఆ దాసీపుత్రుడు కృష్ణదేవరాయలకు ఆమె తగిన దేవేరియే! దేవేరి అంటే మా గజపతులపుత్రి అన్నపూర్ణాదేవే!’’
‘‘విూరిట్లా మాట్లాడటం తగదు. రాయలవారి తల్లిగారు వీరనరసింహ రాయలవారికి చాలాకాలంగా పుత్రసంతతి లేదు. నరసప్ప నాయకుని ముగ్గురు భార్యలలో నాగలాంబిక కుమారుడు రాయలవారు. అందరికీ తెల్సిన విషయమే గదా!’’ మంజరి వీరేంద్రుని అపోహను ఖండిరచింది.
అతడు వికటంగా నవ్వాడు.
‘‘ఇదంతా మీరనుకుంటున్నది. కానీ అది నిజం కాదు. మీలాంటి వారిని మభ్యపెట్టడానికి. అసలు సంగతి చెబుతాను విను జగన్నాథ!
రాయలు సత్కుల సంజాతుడు కానేకాదు. రాయల తండ్రి నరసనాయకుని చేతిలోని నీటిపాత్రలో ఓ సాయంత్రం ప్రకాశవంతమైన చుక్క రాలింది. ఆయన ఆ పాత్రమూసి మంత్రిగారికి ఈ విషయం కబురు చేశాడు. మంత్రిగారు ఆ నీటిని తాగమని రాజుకు వర్తమానం పంపాడు. రాజు నీటిని తాగి ఆ రాత్రి పట్టపుదేవి అంతఃపురానికి వెళ్ళాడు. కానీ ఆమెను కలవలేని సందర్భంలో ఆమె పరిచారికతో కలిశాడు. కృష్ణరాయని జన్మ ఆమెవల్ల జరిగింది’’ వీరేంద్రుడు గొప్ప రహస్యం కనిపెట్టినవాడిలా నవ్వాడు.
‘‘అంటే మీ వుద్దేశం రాయలవారి తల్లి కులీన కాదనేగా’’
‘‘జగన్నాథ! అందుకే ఆయన బుద్ధి కూడా అలాగే పెడతోవబట్టింది. భోగకాంతయిన చిన్నాదేవిని చేరదీశాడు కదా!’’
‘‘ఛీ! మీకీ విషం ఎవరు పెట్టారు? మీరు కులీన స్త్రీకి జనించలేదా?’’ మంజరి బుసకొట్టింది.
ఆ క్షణంలో ఆమె పరమశివుని కంఠాభరణమైన నాగినిలా ఉంది.
‘‘ఏం కూశావ్‌! మా గజపతుల వీరపరాక్రమం గురించి నీకు తెలీదు! కొన్నాళ్ళు ఆగు. నువ్వూ, నీ రాయలు ఈ విజయనగరం మట్టిలో కలవకపోతే నా పేరు వీరేంద్రుడు కాదు’’ హుంకరించాడు.
మంజరి వెంటనే తేరుకుంది. యుక్తివంతంగా వ్యవహరించాలనుకుంది.
‘‘మీరన్నదే నిజమైతే ఇంతటి దాసీపుత్రునికి అన్నపూర్ణాదేవినిచ్చి ఎలా వివాహం చేశారు’’ ఆరా తీసింది.
‘‘అదా! గ్రహచారం జగన్నాథా! ఇస్తే ఇల్లలకగానే పండగయిందా? గజపతుల కృష్ణసర్పం పడగనీడలో రాయలున్నాడని మర్చిపోతున్నాడు. చూస్తావుగా ఇకనించి అంతా మా కాళ్ళకింద మట్టిగానే మిగుల్తుంది’’ వీరేంద్రుడు కాలితో నేలను తన్ని విసవిసా వెళ్ళిపోయాడు.
అతని నిజస్వరూపం తెలుసుకున్న మంజరి తుఫాను ఎదుర్కొనే ఆకులా అల్లాడిపోయింది. అతనితో మాట్లాడటం మేలుకే అయింది. ఇతగాడి విషబుద్ధి మహామంత్రికి సెలవీయాలి. విజయనగర సామ్రాజ్య పరిరక్షణ కోసం తన ఆఖరిశ్వాస దాకా అంకితమౌతుంది.
తిమ్మరుసువారికీ విషకీటకం బుసలు విన్పించకుండా ఉంటాయా! చంద్రప్ప రాగానే చర్చించాక అసలు విషయం బయటపెట్టాలి. పాపం అన్నపూర్ణాదేవి మహాసాధ్వి. గంధపుచెట్టును సర్పాలు చుట్టుకున్నట్లు ఇటువంటి నాగులెన్ని కదిలినా రాయలవారి ఖడ్గానికి బలికాక తప్పదు. ఏది ఏమైనా వీరేంద్రుని కదలికలని కొంత కనిపెట్టి ఉండాల్సిన అవసరమేర్పడుతున్నది.
ఆముక్త మాల్యదలో ప్రభువు రాసిన పద్యం గుర్తొస్తున్నది.
రాష్ట్రమెరియంపకొనుము దుర్గములు తదవ
రోధ మగవడ్డ బుట్టించి రూఢ నడపు
పరుషములు తద్రిపుల రాయబారు లెదుట
బలుకకుము సంధి యొకవేళ వలసియుండు (4)
శత్రుదేశాన్ని తగులబెట్టు. శత్రురాజుల కోటలను ఆక్రమించు. కానీ బందీలుగా ఉన్న శత్రువుల స్త్రీలను పుట్టింటి తోబుట్టువులుగా భావించి మర్యాదతో ప్రవర్తించు. రాయబారులతో పరుషవాక్యాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సంధి చేసుకోవాల్సి రావచ్చు.
ఇటువంటి ఉన్నతాశయాలు కలవాడు కనుకనే రాయల సంస్కారం అదే తీరులో ఉంది. కానీ తమ ఇంటి ఆడబడుచు బంధువుగా వచ్చిన వీరేంద్రుడు ఇలా ప్రవర్తించటం అతని నీచత్వానికి నిదర్శనం. ప్రతాపరుద్ర గజపతిని ఓడిరచిన తర్వాత అతని కొడుకైన వీరభద్ర గజపతికి రాయలవారు ప్రాణభిక్ష పెట్టకపోతే గజపతులకు వారసుడెవరుంటారు? మరుక్షణంలోనే అన్నపూర్ణాదేవి కుమారుడు తిరుమలరాయలు స్ఫురణకొచ్చాడు. అంతకుముందు రాయల వారికి పుత్రులు పుట్టినా దక్కలేదు. తిరుమలరాయడే భావి విజయనగర సామ్రాజ్యాధినేత గదా! అని మంజరి తనలో తాను వితర్కించుకుంటూ మరోమారు ప్రసన్న విరూపాక్షునికి నమస్కరించి బయలుదేరింది. మెట్లెక్కి ప్రాకారం దాటి బయటికి రాగానే వెనుకనే రామేశ్వర శాస్త్రి బయటికి రావడం గమనించిన మంజరి ఆశ్చర్యచకితురాలయింది.
బ్రహ్మతేజస్సుతో అలరారే ముఖవర్చస్సు, స్ఫురద్రూపం, కాలికి కడియం, నుదుట విభూతిరేఖలు, దీటైన వస్త్రధారణతో పాతికేళ్ళ ఆ యువకుడు మంజరి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమెపట్ల అతని ఆరాధనభావమంతా ఆ కన్నులలో తొణికిసలాడిరది.మంజరికి ఈ యువకుని గురించి పూర్తిగా తెలియదు. చాలాసార్లు ఇతనిని శిల్పారామంలో చూసింది. యువశిల్పిగా భావించింది. కానీ శాస్త్రి మంజరి సౌందర్యాన్ని ఆమె నృత్యశోభను ఆరాధిస్తున్నాడని ఆమెకు తెలిసే అవకాశం లేదు.
తనకీ వీరేంద్రునికి మధ్య జరిగిన సంవాదానికి సాక్షి పరమేశ్వరశాస్త్రి అనే విషయం మంజరికి అర్థమయింది. ఆమె అతనికేదో చెప్పాలనుకొంది.
అతను మాత్రం ఆమెకా అవకాశం ఈయకుండానే మరోదోవలో చకచకా ముందుకు సాగిపోయాడు. వెళ్తున్న అతనికేసి చూస్తూండిపోయింది మంజరి.
పరమేశ్వరశాస్త్రి పరమ శివభక్తుడు. ప్రశాంతంగా ఉండే భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరంలో రోజూ కొన్నిగంటలు యోగసాధన చేస్తుంటాడు. అతనెవ్వరివాడో ఎక్కడివాడో ఏ వివరాలు ఎవరికీ పూర్తిగా తెలియవు.
పరమేశ్వరశాస్త్రి తిమ్మరుసు స్నేహితుని కుమారుడని మాత్రం అంతా చెప్పుకుంటారు. కళగల మొహంతో అందంగా బలంగా కన్పించే శాస్త్రి అప్పుడప్పుడు రాతిరథం దగ్గర కూచుని ఎలుగెత్తి శ్రావ్యమైన స్వరంతో పాటలు పాడుతుంటాడని అందరికీ తెలుసు.
ఆరోజు కూడా విరూపాక్ష దేవాలయం నుంచి శాస్త్రి నేరుగా రాతిరథం దగ్గరికి వచ్చాడు. రెండు చక్రాల మధ్యస్థలంలో బాసీపట్టి వేసుకుని కూచున్నాడు. శివయోగం సాధన చేశాడు. మనసుకు శాంతి లభించటం లేదు. మంజరిని చూసినప్పుడల్లా తెలియని అశాంతికి లోనవుతున్నాడు.
నిలువ నీడలేని తనకు ఆశ్రయమిచ్చి సర్వశాస్త్రాలలోముఖ్యంగా శిల్పశాస్త్రంలో మెళకువలు అవగతం చేసిన గురువును స్మరించాడు. తనలోని సంగీతతృష్ణని పెంచి గంధర్వగానాన్ని నేర్పిన రెండవ గురువు అమ్మకి నమస్కరించాడు.
శిల్పాచార్యులవారి దగ్గరికి వెళ్ళి శిల్పిగా ఉద్యోగం అర్థిస్తే పాటలుపాడే శిల్పి మా కక్కర్లేదన్నాడు.
సంగీతాచార్యుడుగా మారుదామంటే రాళ్ళమధ్య బతికేవాడు సంగీతానికి పనికిరాడన్నారు.
ఎందుకిలా? ఎన్నాళ్ళిలా? నేనెవరిని? నా జీవితం ఎందుకిలా…. నా జీవితమే ఎందుకిలా? స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఇంత బలమైనదా!
విజయనగర సామ్రాజ్యంలో స్త్రీలకి ఎంత మర్యాద ఈయాలో తెలుసు. అందుకే మంజరితో ఏనాడూ పల్లెత్తి మాట్లాడలేకపోయాడు. కన్నెత్తి పూర్తిగా చూడలేకపోయాడు. ఆమె అప్పుడప్పుడు ఆ చంద్రప్పతో కల్సి కనిపిస్తుంటుంది. అతడు సంగీతకారుడే కాదు రాజుగారి వేగు అని అనుమానం. వారిద్దరూ అనురాగబద్ధులైతే…
అతని మనసు చిగురుటాకులా కంపించింది.
‘‘ఎవరు నాయనా నీవు? ఏమిటీ ధ్యానం?’’
ఎవరో కాషాయాంబరధారి అపరశివునిలా ఎదుట నిలిచి ప్రశ్నిస్తున్నాడు.
‘‘నేనెవర్ని స్వామి? నా మనసులో ఈ అశాంతి ఏమిటి?’’ శాస్త్రి ప్రశ్నించాడు.
స్వాములవారు శ్రద్ధగా అతన్ని చూశారు. దగ్గరకు రమ్మని పిలిచి తనతో మఠానికి తీసుకువెళ్ళారు. శాస్త్రి నమస్కరించి స్వాముల వారి ఎదుట కూర్చున్నాడు.
స్వాములవారి సైగతో శిష్యులొక రుద్రాక్షమాలనూ, శాలువాను స్వాములవారికి అందించారు. స్వాములవారు స్వయంగా శాలువాను శాస్త్రికి కప్పి, మెడలో రుద్రాక్షమాల వేశారు. తలపైన అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
‘‘నాయనా! నీది సన్యసించే జాతకం కాదు. అందుకే కాషాయ వస్త్రాలందించలేదు. కానీ నీకు ఎటువంటి భవబంధాలు వద్దు. నీకు మరుజన్మ లేదు. అంటే పూర్వజన్మ పరిహారం చేసుకో. నువ్వు కావాలనుకుంటున్న వ్యక్తి నిన్ను కోరుకోదు. నీమీద గౌరవం మాత్రమే ఉంది.’’
‘‘నామీద ఎవ్వరికీ ప్రేమ ఉండదా’’ రామేశ్వరిశాస్త్రి గొంతులో బాధ ధ్వనించింది.
‘‘నిస్సంగుల్ని లోకం గౌరవిస్తుంది. పూజిస్తుంది. కానీ ప్రేమించదు. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. నిన్ను గౌరవించినవాళ్ళు ప్రేమించాలని కోరుకుంటే మిగిలేది దుఃఖమే గదా’’ స్వాములవారు అంతరార్థం చెప్పారు.
రామేశ్వరశాస్త్రి మనసు తేలికపడిరది. అతని దుఃఖం దూరమైంది. మనస్సులో చిత్రించుకున్న మంజరి బొమ్మను మనస్సే చెరిపేసుకుంది. ఇప్పుడు అపరిమితమైన ఆనందమంటే ఏమిటో తెలుస్తున్నది.
‘‘స్వామీ! నా జీవిత పరమార్థం ఏమిటి? ఇలా గమ్యంలేని ప్రయాణం ఎటు వెళ్తుంది?’’ అడిగాడు.
స్వాములవారు అతని శిరస్సున హస్తముంచారు. రెండు నిమిషాలు
కళ్ళు మూసుకుని తీవ్రంగా ధ్యానం చేశారు.
‘‘నీకు విముక్తి మార్గం లభిస్తుంది నాయన! అశాశ్వతమైన బంధాల నుంచి శాశ్వతమైనదానిని సాధించు. నీలోని శక్తిని మేల్కొలుపు. నీవు చేసిన సృష్టి శాశ్వతంగా ఉంటుంది. ముందుతరాలవారు నిన్ను చిరయశస్విగా గుర్తిస్తారు. నీకు ఆత్మసంతృప్త్తి కూడా అందులోనే కలుగుతుంది. నువ్వు చిన్నతనంలో దీక్ష పొందిన మంత్రం గుర్తుందా కుమారా!’’ ప్రశ్నించారు స్వాములవారు.
రామేశ్వరశాస్త్రికి వెంటనే స్ఫురించలేదు. రెండు క్షణాలు ఆలోచించాక ఓ మెరుపు మెరిసింది. చిన్నతనంలో తండ్రి వెంట ఓ యోగిని దర్శించినపుడు ‘‘రూపధ్యాన గానావళీ’’మంత్రాన్ని ఉపదేశం పొందాడు. కానీ దానిని ఇంతదాకా ఉపాసన చేయలేదు.
‘‘అవును స్వామి. ఓ మంత్రం నాతో ఉంది’’ వినయంగా చెప్పాడు.
‘‘ఆ రూపధ్యాన గానావళీ మంత్రాన్ని సాధన చేయి. అది నిన్ను కటాక్షిస్తుంది. నువ్వు శిల్పగాయకుడివి. నువ్వు చెక్కిన దేవతామూర్తుల్ని చూస్తుంటే ఆ మూర్తులే మైమరిచిపోయేంతగా గానం విన్పిస్తుంది. నువ్వు ఆలపించే గానంతో దేవతామూర్తుల దివ్యరూపం కనిపిస్తుంది. ఇలా శిల్పంలో గానాన్ని, గానంలో శిల్పాన్ని సృష్టించు నాయనా!’’ స్వాములవారు ఆదేశించారు.
‘‘నేను విశ్వకర్మని కాను సాధారణ మానవుణ్ణి. స్వామీ! నాకిది సాధ్యమవుతుందా?’’
‘‘నీ శక్తి తెలీక అలా మాట్లాడుతున్నావు. నువ్వు మామూలు మనిషివి కావు.’’
‘‘అయితే నేను ఎవరిని స్వామీ?’’
‘‘తత్త్వమసి’’ అన్నారు స్వాములవారు నీలిగగనంలోకి చూస్తూ చేతులు జోడిస్తూ.
ఇపుడు రామేశ్వరశాస్త్రి మనసులో ఎటువంటి అనుమానాలు, భయాలు లేవు. అతని హృదయంలో వేయిరాగాలు వీణ మీటుతున్నాయి. కళ్ళముందు అనేక శిల్పకళామూర్తులు, కళారూపాలు ప్రత్యక్షమౌతున్నాయి.
అప్పటిదాకా ఈ సంఘటనకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న ప్రధాన శిల్పాచార్యుడు ముందుకు వచ్చి స్వాములవారికి నమస్కరించాడు. రామేశ్వరశాస్త్రి చేయి పట్టుకున్నాడు.
‘‘పద నాయనా! విజయవిఠల దేవాలయ సప్తస్వర మండప వైభవం కోసమే నువ్వు పుట్టావు. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ శిల్ప స్వర స్థానాలు పూర్తి స్థాయిలో కుదరటంలేదు. నాతో రా! నీ వల్ల నా జన్మ కూడా తరిస్తుంది’’ ప్రేమగా అన్నాడు ప్రధాన శిల్పాచార్యుడు.
‘‘సెలవు స్వామీ’’ రామేశ్వరశాస్త్రి సంతోషంగా స్వాములవారికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
ప్రధాన శిల్పాచార్యులతో బాటు వెళ్తున్న రామేశ్వరశాస్త్రిని చూసి స్వాములవారి గుబురుమీసాల మాటున తెల్లని చిరునవ్వు తొణికిసలాడిరది. విఠల మండపం తుదిరూపురేఖలు పూర్తవుతాయనే విశ్వాసం కలిగింది. పైనుండి దేవతలు కూడా ‘తధాస్తు’ అని ఉంటారు. అందుకే రాయల విజయయాత్ర విహారం తర్వాత విజయనగరంలో శిల్పకళాశక్తి ఆత్మశక్తితో రూపుదిద్దుకున్నది.
విజయ నగరమునన్‌ విఠ్ఠలాలయమున
బ్రథిత శిల్పము జక్కపరుప జేసె
మాన్య హజారు రామస్వామి కోవెలన్‌
దగు చెక్కడమ్ముల తావు జేసె
దివ్య పంపావతీ దేవాలయమునకు
స్థాపించె శిల్పాల గోపురమ్ము
ధీరోగ్ర నరసింహదేవు విగ్రహమును
బ్రౌఢ శిల్పంబు తావలయుజేసె
మంజులారామముల సభామంటపముల
హర్మ్యారాజీ విరాజి రత్నాపణముల
జాల దీర్పించి శిల్పకళాలయముగ
రాయలలరించె దన దివ్యరాజధాని
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘శ్రీవేంకటేశ్వర పాదపద్మావేశిత సదయహృదయ! తిరుమల దేవీవల్లభా! రాజకంఠీరవా! ఈశ్వర నరసింహ భూఫురంధర! చిన్నమదేవీ జీవిత నాయకా! కవితా సామ్రాజ్య ఫణీశ! శ్రీకృష్ణదేవరాయ బహుపరాక్‌! బహుపరాక్‌!’’ వందిమాగధుల కైవారాలు మిన్నుముట్టాయి.
శ్రీకృష్ణదేవరాయలు, అప్పాజీ వచ్చారు. సభలోని కవిగాయక సేనానులు, పండితులు అందరూలేచి అభివాదం చేశారు. రాయలు అప్పాజీకి, అందరికీ అభివాదం జేసి సింహాసనం అధిష్టించాడు. రాయల దేవేరులు కూడా
ఉచితాసనాన్ని అలంకరించారు.
పెద్దనామాత్యుడు రాయల కీర్తిని నుతిస్తూ…
‘‘ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమా
రతకు గ్రౌంచాచల రాజమయ్యె
నావాడ పతి శకంధర సింధురాధ్యక్షు
లరికాపుల నెవ్వాని ఖరత రాసి
కాపంచగౌడ ధాత్రీ పధంబెటవ్వాని
కసివాడగ నేగునట్టి బయలు
సకల యాచక జనాపూర్తి కెవ్వాని
ఘన భుజాదండంబు కల్పశాఖి
ప్రబల రాజాధిరాజ వీర ప్రతాప
రాజ పరమేశ బిరుద విభ్రాజి యెవ్వ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు’’
అని ఆశీర్వదించాడు. రాయలు చిరునవ్వుతో నమస్కరించాడు. నందితిమ్మనగారు రాయలను వినుతిస్తూ…
‘‘ఉదయావేగత్యుయద్ధతి సాధించె
వినుకొండ మాటమాత్రాన హరించె
గూటము ల్సెదరంగ కొండవీడగవించె
బెల్లమకొండ యచ్చల్లజెరిచె
దేవరకొండ యుద్వృత్తి భంగముసేసె
జల్లిపల్లె సమగ్రశక్తిడులిచె
గినుకవిూర ననంతిగిరి క్రిందపడజేసె
గంబంబు మెట్టు గ్రక్కున గదల్చె
బలనికాయము కాలిమట్టులక నెక్కునయడచు
గటకమును నింక ననుచు నుత్కలమహీశు
డనుదినమ్మున వెరచు నెవ్వనికి నతడు
రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుడు’’
రాయలు అంజలిఘటించి కృతజ్ఞతలు తెలిపాడు. సంగీత సాహిత్య కోవిదులున్న ఆ సభలో ఒకే ఒక వ్యక్తి రాయలకేసి కార్పణ్య దృష్టితో చూస్తున్నాడు. వీరేంద్రునికీ వైభోగం ఆనందం కల్గించటం లేదు.
విజయయాత్రలకు కారకులైన సేనానాయకులందరినీ ప్రభువు ఘనంగా సత్కరించాడు. అప్పాజీ సభనుద్దేశించి ప్రసగించారు.
‘‘దక్షిణాన విలసిల్లుతున్న ఈ సువిశాల హైందవ స్రామాజ్యం విద్యారణ్యుల వారి ఆశీఃబలంతో ఏర్పడిరది. మనవారి అనైక్యత, ఈర్ష్యాసూయలు, స్వార్థంవల్ల ఇంకా పరదేశీయులను ఆపలేకున్నాము. రాయలవారి గురించి నా కలలు నెరవేరాయి. ప్రభువు పరాక్రమశౌర్యులు, వినయశీలురు, ఆదర్శనీయులు, యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు, వికలాంగులైనవారికి తగిన పరిహారం, పారితోషికాలు ఇస్తున్నాం. నిద్రాహారాలుమాని విజయనగరం కోసం శ్రమిస్తున్న మన వీరులందరికీ అభినందనలు. విజయనగర కేతనం చిరకాలం వినువీధిలో రెపరెపలాడాలని అభిలషిస్తున్నాం’’ అని ముగించారు.
‘‘నా జీవనదాత, రాజ్యానికి మూలశక్తి, మాకిన్ని విజయాల నందించి మమ్మల్నీ సింహాసనంపైన నిలిపిన మా అప్పాజీవారిని ఎలా గౌరవించినా తక్కువే అవుతుంది. అందుకే వారిని మా గౌరవప్రదమైన అభిమాన కౌగిలిలో బంధింప దలిచాము’’ రాయల గంభీరవచనాలతో అప్పాజీని మనసార కౌగిలించుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీల మధ్య అతులితమైన ఆ ప్రేమానుబంధాన్ని చూసి సభ పులకించింది. కాని ఆ దృశ్యాన్ని చూసి కళ్ళనిప్పులు రాలుస్తున్నది వీరేంద్రుడొక్కడే.
‘ఈ మైత్రి ఇంకెన్నాళ్ళులే’ అనుకున్నాడు. అప్పటికే అతని మనసులో ఒక విషపన్నాగం రూపుదిద్దుకుంది. రాజు అంగరక్షకుడిగా వీరేంద్రుని ముఖకవళికలు చురుగ్గా గమనిస్తున్నాడు చంద్రప్ప.
నాటి సభ కవిపండిత సత్కారంతో ముగిసింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
తిమ్మరుసు మహామంత్రి ఆస్థాన జ్యోతిష్యులతో సమావేశమయ్యారు.
‘‘ఈ పరిస్థితుల్లో రాయలవారి జన్మకుండలి విశేషాలు సెలవీయండి జ్యోతిష్యవర్యా’’ తిమ్మరుసు గూఢంగా అడిగారు.
‘‘చిత్తం మహామంత్రీ’’ జ్యోతిష్యవేత్త తాళపత్రాలు చూసి రాయల జాతకం గణన చేసి నిట్టూర్చాడు.
‘‘ఏమయింది? రాయలవారి గ్రహస్థానాలు ఎలా ఉన్నాయి?’’ ఆందోళనగా అడిగాడు తిమ్మరుసు. ఆ వృద్ధుని వదనంలో రాయలపైన ప్రేమ పొంగి పొర్లుతోంది. రాజ్యభద్రత గురించిన బాధ్యత ప్రస్ఫుటంగా కన్పిస్తున్నది. జ్యోతిష్యవేత్త మంద్రస్వరంతో చెప్తున్నాడు.
‘‘చక్రవర్తి జన్మకుండలి ప్రకారం శని, సూర్య, మంగళ గ్రహాల కలయికవల్ల హాని జరిగే సూచనలున్నాయి.’’
‘‘దీనికి శాంతి లేదా?’’
మనసులోని ఆందోళన బయటపడనీయని ధీరుడు తిమ్మరుసు మంత్రి.
‘‘ఉంది మంత్రివర్యా! రాయలవారి రాజయోగానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఆ దోషం తొలిగేదాకా సింహాసనంపై కూర్చోరాదు’’
‘‘సరే. మీరు వెళ్ళొచ్చు’’ జ్యోతిష్యవేత్తను పంపివేసి తిమ్మరుసు ఆలోచనలో పడ్డారు. కాస్సేపట్లోనే ‘‘రాయవారి మందిరానికి పల్లకీ సిద్ధంచేయండి’’ సేవకుల్ని ఆజ్ఞాపించారు.
తిమ్మరుసు అనుకోకుండా తమ మందిరానికి రావటం రాయలకు ఆశ్చర్యం కలిగించింది. అప్పాజీ వివిరించిన విషయాలు సావధానంగా విన్నారు రాయలు. ఇద్దరూ గురుదేవులయిన వ్యాసరాయలవారి కుటీరానికి ప్రయాణమయ్యారు.
వ్యాసరాయలవారి కుటీర ప్రాంగణం మునివాటికలా ప్రశాంతంగా ఉంది. ఎత్తైన వృక్షాలు, పూలచెట్లు, లేళ్లు, నెమళ్ళు, ఆ ఆశ్రమ వాతావరణంలోకి అడుగుపెడితేనే ఎవరికైనా వేదనలు, బాధలు తీరిపోతాయి. ఆవరణంతా
శుభ్రంగా అలికి ముగ్గులు తీర్చి ఉంది.
విజయనగర మహాసామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు మహామంత్రితో వచ్చి వ్యాసరాయల ముంగిట యాచకుడై నిలిచారు.
గురుదేవులైన వ్యాసరాయలు పరమ ఆదరంతో రాయలకు ఎదురేగి లోపలికి తోడితెచ్చాడు. భద్రాసనాలను అలంకరింపజేశారు.
‘‘రాయా! ఏమిటీ ఆకస్మికాగమనం?’’ వ్యాసరాయలి ప్రశ్నకు రాయలు తిమ్మరుసువైపు అర్థవంతంగా చూశారు.
‘‘గురువర్యా! కృష్ణరాయలి జన్మకుండలిరీత్యా యోగభంగం వుంది’’ తిమ్మరుసులవారు వ్యాసరాయలితో చెప్పారు. వ్యాసరాయలు కలవరంగా చూశారు.
‘‘దీనికి ఎన్ని జపహోమాలు చేయించినా ఉపశాంతి లేదన్నారు’’ తిమ్మరుసు తానే మళ్ళీ చెప్పారు.
‘‘అయితే?’’ వ్యాసరాయలు ఆలోచనగా అన్నాడు.
‘‘అందుకే అర్థులమై వచ్చాము. కృష్ణరాయలకీ యోగభంగం కొద్దిరోజులు మాత్రమే ఉంది. మీరీ దోషకాలం రాయల సింహాసనం అధిష్టిస్తే ఆ దోష నివారణ జరుగుతుంది’’ అభ్యర్థనలోనే అధికారాన్ని మేళవించారు తిమ్మరుసు.
‘‘కానీ…’’ వ్యాసరాయలు సంకోచం వెలిబుచ్చారు.
‘‘కాదనకండి గురుదేవా! మీరు తప్ప దోషహరణం చేయగల సమర్థులు మరొకరు లేరు. నా ప్రార్థన మన్నించి విజయనగర సింహాసనంపై చక్రవర్తిగా కొన్నిదినాలు రాజ్యపాలన చేయండి. మేమంతా మీవెంట దోయిలొగ్గి ఉండగలం’’ కృష్ణరాయలు అంజలి ఘటించారు.
విశాలమైన కనుదోయి. నిలువునామం. రాచఠీవి, జ్ఞానతేజస్సుతో, భుకపరాక్రమంతో వెలుగొందే కృష్ణరాయలు తన ఎదుట అలా కైమోడ్చి ప్రార్థిస్తుంటే వ్యాసరాయల మనసు శిష్యవాత్సల్యంతో కరిగిపోయింది.
‘‘రాయా! నీవు నామీద ఉంచిన నమ్మకానికి నీ గురుభక్తికి నాకెంతో ఆనందంగా ఉంది. నా మఠదైవం గోపాలకృష్ణునికి అంకితంగా నేనీ బాధ్యత స్వీకరిస్తున్నాను’’ అన్నారు వ్యాసరాయలు.
కృష్ణరాయలు, తిమ్మరుసుమంత్రి, వ్యాసరాయలకు ధన్యవాదాలు తెలిపారు.
మరునాడు సభలో ఈ విషయం ప్రకటించబడిరది. మొదలు సామంత దండనాథులకేమీ అర్థం కాలేదు. ఇది ఏ విపరీతానికి దారితీస్తుందోనని వాళ్ళు భయపడ్డారు. తిమ్మరుసు మంత్రి కృష్ణరాయని జన్మకుండలిలోని దోషం గురించి ఇతర వివరాలను సభాసదులకు తెలియజేశారు.సభ ఆమోదం పొందింది.
ఒక శుభదినాన నిండుసభలో మంత్రయుక్తంగా శ్రీకృష్ణదేవరాయలు తమ భుజబల సముపార్జితం, తిమ్మరుసు ధీశక్తితో విలసితం అయిన విజయనగర మహాసామ్రాజ్యాన్ని వ్యాసరాయ గురుదేవులకు అప్పగించారు.
వ్యాసరాయలవారిని భద్రాసనంపై సగౌరవంగా కూర్చుండబెట్టి నవరత్నాలతో అభిషేకించారు. వినమిత శిరస్కుడై రాయలు నమస్కరించారు.
వ్యాసరాయలు శిష్యునికి తనపట్ల గౌరవాభిమానాలకు చాలా సంతోషించాడు. ప్రేమార శిష్యుని కౌగలించుకున్నాడు.
‘‘నాయనా! యీ రాజ్యప్రేమ, నిర్మలహృదయం వల్ల నీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలువగలదు’’ అని ఆశీర్వదించాడు.
తనను అభిషేకించిన నవరత్నాలను కులమతభేదం లేకుండా బీదలకు పంచిపెట్టాడు వ్యాసరాయలు.
జన్మకుండలిలోని దోషకాలం పూర్తయ్యేవరకు సింహాసనాన్ని వ్యాసరాయలవారే అధిష్టించారు. అది తొలగిపోగానే మరలా శాస్త్రోక్తంగా రాయలు సింహాసనాన్ని అధిష్టించారు. ఇపుడు రాయలు మబ్బువిడిచిన సూర్యుడిలా మరింత వీరప్రతాపాలతో వెలుగొందుతున్నారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
రామేశ్వరశాస్త్రి అన్నం తిని మూడుదినాలయింది. నిరంతరం విఠలమందిరంలోనే ఉంటున్నాడు. తాను తీర్చిదిద్దిన సంగీత స్తంభాలను స్పర్శించి ఆ స్వరమాధురుని ఆనందిస్తూ కొసమెరుగులు దిద్దుతున్నాడు.
ఏదో లోకంలో ఉన్నట్లున్నాడు. గడ్డం పెరిగి మాసిన వస్త్రాలతో మారువేషంలో ఉన్న విశ్వకర్మలా ఉన్నాడు శాస్త్రి.
మంజరి రోజూ భోజనం తనే తీసుకువస్తున్నది. కానీ అతను దానికేసి చూడటం కూడా లేదు. ఆమెనా పనికి ఎవరూ నియోగించలేదు. ఆమె కళాసక్తి అలాంటిది.
ఆ రోజుకూడా మంజరి భోజనం తెచ్చింది. కాని ఎప్పటిలా అక్కడ వుంచి వెళ్ళలేదు.
‘‘అయ్యా!’’ పిలిచింది. అతను ఆమెకేసి చూడలేదు. ‘నవమోహిని’ విగ్రహాన్ని తదేకంగా చూస్తూ తుదిమెరుగులు గురించి ఆలోచిస్తున్నాడు.
‘‘అయ్యా! నేను మంజరిని.’’
అతను ఆమెకేసి చూశాడు. అతని కళ్ళలో లిప్తపాటు మెరుపు. మళ్ళీ అంతలోనే ప్రశాంత కాంతి.
‘‘అక్కడ వుంచివెళ్ళు మంజరీ’’
‘‘లేదు స్వామి! మూడురోజులుగా మీరు తినటం లేదు. నేనుండగానే తినండి.’’
‘‘ఫర్వాలేదు. అక్కడ ఉంచి వెళ్ళు’’ అతని చూపులు మాత్రం ఆ శిల్పం మీదే! ఏదో లోకంలోంచి మాట్లాడుతున్నట్లు కన్పిస్తున్నాడు.
‘‘స్వామీ! మీరు ఇంతలా శ్రమపడితే ఆరోగ్యం పాడయిపోతుంది. కొంచెం విశ్రాంతి కూడా అవసరం’’ మంజరి మెల్లగా చెప్పి భోజనపాత్ర అక్కడ
ఉంచింది.
రెండు ఘడియల పాటు తదేకంగా అతను చెక్కే ‘నవమోహిని’ విగ్రహాన్ని చూసింది. ఆ విగ్రహంలో కుదురుకున్న స్త్రీమూర్తిని ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడ? ఎక్కడ? తటాలున విద్యుల్లతలాంటి స్ఫురణ! అది అద్దంలో తన ప్రతిబింబమే! అంటే తనలాంటి విగ్రహాన్ని ఈ రామేశ్వరశాస్త్రి చెక్కడం ఎంత ఆశ్చర్యమో అంతే ఆనందం!
ఆ స్త్రీమూర్తిని మరింతగా చూడాలనిపించింది. నాట్యభంగిమలో వయ్యారంగా నిలబడి ఉంది. సర్వాభరణ భూషితురాలై ప్రేమగా చూస్తున్నది. ఆ చూపులో పారవశ్యం, తాదాత్మ్యం మమేకమైనాయి. ఆమె శిరస్సుపై నుండి ఇరుపక్కలకి జాలువారుతున్న పుష్పతోరణం మరింత అందాన్ని ప్రసాదిస్తున్నది. స్త్రీమూర్తి విగ్రహం కొలత దాదాపు మానవ సహజమైన ఎత్తుతో నల్లశిలలో ఉంది. రామేశ్వరశాస్త్రి చేతిలో ‘నల్లనిరాయి వెన్న, మైనంలా’ మారిందా అనిపిస్తుంది. వంపుసొంపులు, ఇంపులు, వస్త్రాలు, నగలు నఖశిఖ పర్యంతం ప్రతి అంశంలో తెలుగుదనం ఉట్టిపడుతూ చూసేవారికి పవిత్రభావాన్ని ప్రసాదిస్తున్నది. శాస్త్రి ఉలివిన్యాసం, హృదయఔన్నత్యం ఆ శిల్పంలో ప్రతిఫలిస్తున్నది.
మంజరి కళ్ళనిండుగా నీళ్ళు. రామేశ్వరశాస్త్రి ఆరాధన తనకి తెలియంది కాదు. తన నాట్యం ఒక శిల్పికి స్ఫూర్తినీయటం తనకీ ఆనందమే! కానీ తనదైన లోకంలో బతికే ఈ యువశిల్పి భవిష్యత్‌ ఏం కానున్నది? విజయనగర సామ్రాజ్య కళాజగత్‌లో ఈతని స్థానం ఏమిటి? దీనిని కాలమే నిర్ణయిస్తుంది. నిట్టూర్చి కర్తవ్య స్ఫురణతో కదిలింది.
రామేశ్వర శాస్త్రి విఠలమండప నిర్మాణంలో సప్తస్వర స్తంభాలను పూర్తి చేయటంలో ప్రధాన పాత్ర వహించాడు. దాని నిర్మాణం పూర్తి అయింది కాబట్టి ప్రధాన శిల్పాచార్యుడు శాస్త్రిని తిరుపతిలో నిర్మిస్తున్న వేయిస్తంభాల మండప నిర్మాణంలోతోడ్పడమని కోరాడు. శాస్త్రి మరునాడే తిరుపతికి ప్రయాణమయ్యాడు. బయలుదేరినప్పుడు శాస్త్రికే తెలియదు తాను మళ్ళీ ఎప్పుడీ కళానగరానికి రాగలడో! ఎప్పుడీ మంజరిని మళ్ళీ చూడగలడో! మంజరికి శాస్త్రి తిరుమల ప్రయాణం గురించిన సమాచారం మర్నాడు అతను వెళ్ళిపోయాక గానీ తెలియలేదు.

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఆమె-రాత్రి-నేను

by S Lahari March 4, 2023
written by S Lahari

కొన్ని కవితల్ని చదివినప్పుడు మనసులో ఏదో అలజడి రేగుతుంది. వాటిని అలాగే ఆస్వాదిస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది.
ఒక అనామకుడు వేశ్య దగ్గరికి వెళ్తాడు.” చీకటి ఆకాశాన్ని ఆక్రమిస్తున్న వేళ/ వివస్త్ర మవుతూ అడిగింది ” అని అంటున్నపుడు.. ఏదో తప్పు చేస్తున్న భావన కంటే, అంతర్లీనంగా తన ప్రేయసి విరహవేదన బాధగా అతణ్ణి మెలిపెడుతుంటే.. ఆమె దేహానికి వస్త్రాన్ని చుట్టబెట్టి మౌనంగా కూలబడతాడు. ఏదో కోల్పోయిన తనంలోంచి ఆమె తీసిన వస్త్రాల్ని తిరిగి చుట్టాలనుకుని.. ఆ మనిషి కనిపించగానే ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదామెకు.
మిమ్మల్ని ” ప్రేమ మోసం చేసిందా? ” అనడిగింది.
అతడి సమాధానం
” నన్ను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రేమిస్తూ/ఎక్కడో/దూరంగా తాను తనను మారువలేక/ఆ జ్ఞాపకాలతో/భారంగా ఇక్కడ నేను ” అని అంటూ మథనపడుతూనే ” మరి నువ్వు ” ఒక అర్ధోక్తి సందేహంతో.. నిజం తెలుసుకోవాలనే తాపత్రయంలో ఆగిపోతాడు.
నాది ప్రేమ కూడా నా వాడికి భారమై, ఆకలికి బానిసై, అందరికి శరీరాన్ని అప్పగిస్తూ చివరికి ఒక జీవచ్ఛవంలా బతుకుతున్నాను అంటుంది.
అతని ప్రేమలో నేను, ఆమె ప్రేమలో మీరు ఇలా బాధగా ఇద్దరం ఇక్కడ …అంది
అతడు వెళ్లేప్పుడు నోటి నుండి మందు వాసన ఎంత దుఃఖాన్ని గొంతులోకి వొంపిన, (అంటే ఎంత తాగినా కూడా)
అవి గుండెల్లో నిక్షేపం అయి ఉంటాయి కాబట్టి ఏమి చేయలేం.

“ప్రేమ ఎన్నడు కామించదు.

కాయం ఎప్పటికి ప్రేమించలేదు”.

అందుకే తన్మయం పొందే చీకటి గతిలో ఇక్కడ ప్రేమ ఉంటుంది.

కామం తప్ప, ఇక్కడ మీరు, నేను నిషిద్ధం అంటూ చెప్పేస్తాడు.

అయినా సరే నేను మళ్లీ వస్తాను.. నీతో సుఖం పంచుకోవడానికి కాదు నీ దుఃఖాన్ని పంచుకోవడానికి అంటూ వెనుతిరిగి పోతాడు.

చివరి వరకు ఆమె చూపులు అతడిని వెంబడిస్తూనే
ఉంటాయి.

విశ్వ

చివరగా కవితను పరిశీలిద్దాం..
ఆమె-రాత్రి-నేను
~

1.
ఎంత సేపుంటారు?
చీకటి ఆకాశాన్ని ఆక్రమిస్తున వేళ..
వివస్త్రమవుతూ అడిగింది!

అపరాధ తనమేదో..
మనసును మెలేస్తున్న బాధతో తనకు
వస్త్రాన్ని చుట్టి కూలబడ్డాను

2.
కోల్పోయినదేదో తిరిగి దొరికినట్టు..
తన తనమేదో
వెనుతిరిగి పలకరించినట్టు ఆశ్చర్యంగా
చూస్తూ అందామె-

గాయాలు చేసేవారే తప్ప..
గాయపడి ఇక్కడికొచ్చిన వారు మీరే!
బహుశా.. ప్రేమ మోసం చేసిందా?

3.
ఏమో.. చెప్పలేను!
నన్ను వదిలేసి జీవితాన్ని ప్రేమిస్తూ
ఎక్కడో..
దూరంగా తను తనను మరువలేక
ఆ జ్ఞాపకాలతో..
భారంగా ఇక్కడ నేను! మరి, నువ్వు..
ఈ పని..?’

నాదీ ప్రేమే..!
అతనికి భారమై.. నాకు బాధ్యతై..
ఆకలికి బానిసై.. అందరికీ వశమై..
చివరికి జీవచ్చవాన్నై ఇక్కడ!

అతని ప్రేమలో మునిగి నేను ఆమె
ప్రేమలో తడిసి
మీరు ఇలా కలిశామన్నమాట అంది
రెప్పలపై
నీటిచెమ్మను తుడుచుకుంటూ!

4.
‘వాన వెలిసింది! వెళ్ళొస్తా..’ అన్నాను

కానీ.. మీ
గొంతులోంచి ప్రేమ గాఢమైన బ్రాందీ
పరిమళంతో గుబాళిస్తోంది
ఎంత..
దుఃఖాన్ని గొంతులోకి వొంపినా.. కొన్ని
జ్ఞాపకాలను
గుండెల్లోంచి తీసేయ్యలేము వాటిలో
జీవితాంతం..
వెంటాడేవి కొన్ని వేటాడేవి మరికొన్ని!

ప్రేమ ఎన్నడూ కామించదు
కామం ఎప్పటికీ ప్రేమించ లేదు!
కామంతో రగిలే తనువులు
తన్మయత్వం పొందే చీకటి గదులివి
ఇక్కడ ప్రేమ ఇంకా మీరు నిషిద్ధం!

5.
అర్ధమైంది! అయినా మళ్లీ వస్తాను..
కామంతో
కాదు ప్రేమతోనే నీతో సుఖించడానికి
కాదు నీ దుఃఖాన్ని
పంచుకోడానికి!- అని కదిలాను.

దారి..
చివరివరకూ ఆమె చూపులు నా
వీపును
తాకుతూనే వున్నాయి!!
కవి: విశ్వ

March 4, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

అధికార భాషాసంఘ అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి గారితో ముఖాముఖి

by Aruna Dhulipala March 4, 2023
written by Aruna Dhulipala

మయూఖతో ముఖాముఖి

నమస్కారం మేడం..మీతో ఇలా ముఖాముఖిలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ అధికార భాషా సంఘు అధ్యక్షురాలిగా మా పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయాలని అనుకున్నాం. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

1.         మీరు పుట్టిన తేదీ, మీ సొంత ఊరు, మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా?

జ: నేను పుట్టింది నవంబర్ 2, 1971… పాలమూరు నా జన్మస్థలం. కానీ పెరిగింది మాత్రం నల్లగొండ. నా విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. మీకందరికీ తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలు ఉండి ప్రముఖమైన కళాశాలగా పేరు పొందిన నాగార్జున కాలేజీ లో బి ఎస్ సి బి జడ్ సి కోర్స్ లో డిగ్రీ చేసాను. తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుండి ఎమ్ ఎస్ డబ్ల్యూ ( మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) పట్టా అందుకున్నాను.

2..        మీ తల్లిదండ్రుల పేర్లు,మీ కుటుంబ నేపథ్యంచెప్పండి.

జ: మా నాయిన పేరు మంత్రి శేషభూషణ్ రావు. అమ్మ మంత్రి రాధాదేవి. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. కానీ మా నాయిన ప్రభావం వల్ల పెరిగింది విప్లవ అభ్యుదయ భావజాలంతో. చదువనేది సర్టిఫికెట్ల కోసం, మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, పేదల అభ్యున్నతి కోసం, సంస్కారవంతమైన చదువు చదవాలని, మనిషికి వాక్భూషణమే సుభూషణమని, ఏ అలంకారాలూ మనిషిని మనిషిగా నిలబెట్టలేవని తెలియజేసిన ఘనత మా నాయినది. అటువంటి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన నాకు నేటికీ సమాజ సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం.

మంత్రి శ్రీదేవి

3.         మీరు బహుముఖ కళాకారిణి అని విన్నాం. మీ కళా ప్రావీణ్యత గురించి తెలుసుకోవచ్చా?

జ: అది మీ అందరి అభిమానం. అందుకు ధన్యురాలిని. నాకు సంగీతం, సాహిత్యం, నృత్యం మొదలగు రంగాలలో ప్రవేశం ఉంది. పాఠశాల, కళాశాల స్థాయిలోఎన్నో ప్రదర్శనలిచ్చాను. ఝాన్సీ లక్ష్మీ బాయి ఏక పాత్రాభినయం, నాటికల్లో రకరకాల పాత్రలు, లంబాడీ నృత్యాలు, దేశభక్తి గీతాల మీద నృత్యాలు ప్రదర్శించేదాన్ని. పాటలు, వ్యాసాలు, వక్తృత్వం, నృత్యం వీటిల్లో ఎప్పుడూ ప్రథమస్థానంలో ఉండేదాన్ని. వాటిపై ఎన్నో ప్రశంసలు, బహుమతులు అందుకున్నాను.

4.         సాహితీ రంగంలో మీ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసు కోవచ్చా?

జ: పువ్వు పుట్టగానే పరిమళించినట్టు బాల్యదశలోనే అన్ని రంగాలలో ముందుండాలని సాహిత్య, సామాజిక రంగాలలో మక్కువ కల్పించిన మా గురువు కీ.శే. కట్టా రామచంద్రారెడ్డి గారిని నేనెప్పుడూ మర్చిపోలేను. బాల్యంలోనే కలం పట్టి కవితలల్లి పలువురి ప్రశంసలు పొందడం నాకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పెంచింది. అంతే గాక మా నాయిన వల్ల కూడా తెలుగు భాషపై మక్కువ ఏర్పడింది. అలా సాహితీ సౌరభాలతో సాగుతున్న నేను ఇవాళ అధికార భాషా పీఠాన్ని అధిరోహించడమంటే సామాన్య విషయం కాదు. ఒక సాధారణ ఉద్యమకారిణికి మన మాన్య ముఖ్యమంత్రి బాపూ కేసీఆర్ గారు ఇంత బాధ్యతను ఇచ్చారంటే దానికి కారణం నేను నిబద్ధతతో బాల్యం నుండి ఇప్పటివరకు సాహిత్య రంగంలో కృషి చేయడమేననిపిస్తుంది.

5.         మీరు ఈ పదవిలోకి వచ్చాక వేదికల మీద మీ ఉపన్యాసాలు విన్నాము.. అద్భుతమైన సాహితీ ధారతో, వాక్పటిమతో మీరు మాట్లాడడం మమ్మల్ని అబ్బురపరిచింది. ఇంతటి ప్రతిభావంతులైన మీరు ఏవైనా రచనలు చేశారా?

జ: చిన్నప్పటి నుండే నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. తెలుగు భాషాభిమానంతో రామాయణ, భారత, భాగవతాలు చదివాను. అనేక కథల పుస్తకాలు, వీరుల గాథలు చదివేదాన్ని. శ్రీశ్రీ, దాశరథి కవిత్వం పట్ల ఆరాధనా భావంతో పెరిగాను. ఏడవ తరగతిలోనే గేయ రచనలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందాను. ఇప్పటికీ సమయం చిక్కినప్పుడల్లా చదువుతుంటాను. ఎన్నో కవితలు, గేయాలు వ్యాసాలు రాసాను. రాయడం జరిగింది కానీ పుస్తకం వేసుకోవాలనే దృష్టి ఎప్పుడూ లేదు (నవ్వుతూ). అందువల్ల ఏవీ పుస్తకరూపం దాల్చలేదు. ఎప్పుడో రాసిన రైతుల ఆకలి వెతలు, కన్నీటి గాథలు, దేశానికి రైతే వెన్నెముక అనే భావనతో రైతుల అభివృద్ధి గురించి రాసిన కవితలతో ‘ మాగాణి తేజస్సు’ అనే కవితా సంపుటి ముద్రణకు సిద్ధంగా ఉంది. అమరవీరుల స్మృతిలో ఉద్యమ చైతన్యం గురించి రాసిన కవితలతో ‘ప్రజా గొంతుక గళమెత్తాలి’ అనే కవితాసంపుటి కూడా ప్రచురణకు సిద్ధమై ఉంది. ఇక తెలంగాణ అంశాల మీద, సంక్షేమ పథకాల మీద, జరుగుతున్న అభివృద్ధి పైన రాస్తున్న కవిత్వంతో ఆచంద్ర తారార్కం’ అనే కవితా సంపుటిని తీసుకురావాలనుకుంటున్నాను. త్వరలోనే అది పూర్తవుతుంది.                

6.         తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో మీ క్రియా శీలక పాత్ర ఏమిటి?

జ: మా నాయిన తెలంగాణను సాధించుకోలేమని నిరాశతో ఉండేవాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడలేదు. నేను ఉద్యమ కాలంలో నా నేల, నావారు అంటూ అహర్నిశలు శ్రమించాను. ఎన్నో పోరాటాలు చూసాను. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన మాదిగ దండోరా, మాల మహానాడు ప్రజా సంఘాలు జరిపిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నాను. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆరెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతి ఉద్యమంలో పాల్గొని, అప్పటినుంచి ఇప్పటివరకు బాపు కేసీఆర్ వెంటే నడిచాను. ఆయన పిలుపునిచ్చిన ప్రతీ ఉద్యమ సభలు, సమావేశాలకు హాజరయ్యాను. ఏ ధర్నా జరిగినా, ఏ ఉద్యమం జరిగినా అందరికంటే ముందు ఉండేదాన్ని. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగర హారం, వంటావార్పు, మానవ హారం, రైల్ రోకో, 48 గంటలు తెలంగాణ బంద్, నిరాహారదీక్ష, సత్యాగ్రహం, ఇలా అన్ని పోరాట సందర్భాల్లో కార్యకర్తగా పాల్గొనడమే కాకుండా సమావేశాలు, సభలు నిర్వహించినం. సోషల్ మీడియాలో తెలంగాణపై, ఆంధ్ర మీడియా, ఆధిపత్యవాదుల కుట్రలను, చేసిన విషప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టినం.’ బాపూ కేసీఆర్ దళం’ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని అడుగడుగునా చైతన్యం చేసాం. దాదాపు ఆ తరం వారంతా ఆశలు వదులుకున్న సమయంలో అప్పుడొక ఆశాకిరణం ఉద్భవించింది. ఆ వెలుగు జిలుగుల ప్రతిరూపమే మన తెలంగాణ ఆవిర్భావం. దీనికి గత 60 సంవత్సరాల నేపథ్యమే కాక 14 సంవత్సరాల (2001-2014) నిరంతర కృషి, అనితర సాధ్యమైన ఒక నాయకుని ఉద్యమ నేతృత్వమే మన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసింది. ఆ నాయకుడు కారణజన్ముడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అతడు వేరెవరో కాదు. తెలంగాణ సాహితీ సమరాంగణ చక్రవర్తి కేసీఆర్.

7.         తెలంగాణ ఉద్యమంలో మీ రచనలకు కానీ, మీ భాగస్వామ్యానికి లభించిన స్పందన ఎలా ఉండేది? 

జ. మా తాతయ్య మంత్రి రంగారావు. నాయిన, చిన్నాయినలు 1969 ఉద్యమకారులు. వారి ఉద్యమ నేపథ్య ప్రభావం వల్లనే నేను సైతం మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఒక మహిళగా, రచయిత్రిగా, ఉద్యమకారిణిగా పాల్గొన్న నాకు నాయకుల నుండి, బంధు మిత్రుల నుండి సానుకూల స్పందన లభించడం నన్ను మరింత ముందుకు నడిపింప జేసింది. అప్పుడు మా అందరి కల, లక్ష్యం కేవలం తెలంగాణ ఏర్పాటు. మన ప్రజల కోసం మనం పోరాడాలి. మన గడ్డ కొరకు మనం పాటు పడాలి. అనే ఉద్దేశ్యాలతో ముందుకు సాగాం. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసుకున్నాం.

8.         ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రగతిపై మీ అభిప్రాయం?

జ: దేశచరిత్రలో ప్రత్యేకంగా గుర్తుంచుకోదగిన మహో ద్యమాన్ని సాగించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే మన ముఖ్యమంత్రి బాపు కేసీఆర్ గారి నాయకత్వంలో సమగ్రమైన ప్రగతి పరుగులు పెడుతున్నది. ఎవరెన్ని కేసులు పెట్టినా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యింది. చెరువులన్నీ జల సముద్రాలు అయినాయి. బీళ్లు పచ్చని పంటలతో పోశమ్మ ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లు పొలాలు దర్శనమిస్తున్నాయి. చెలిమల్లో చేపలు, జల పుష్పాల ఉత్సాహం, హరిత హారాలు అన్నీ మనం చూస్తున్నాం. ఒక్కటేమిటి? అనేకమైన అభివృద్ధి పథకాల ద్వారా దేశానికి నమూనా అయి, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, తెలంగాణ అంతటా సుభిక్షమైన పాడి పంటలతో వర్ధిల్లుతున్నది. నిన్నటి వలసలను, దుఃఖాన్ని శాశ్వతంగా నివారించడంతో పాటు రేపటి ఆశయాల సాధనకు పతాకం రెపరెపలాడుతున్నది. పరి పాలనలో వెనుదిరుగని పట్టుదల ప్రజా సంక్షేమాకాంక్షలతో నూతన భవనం డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. అద్భుతమైన భవనంగా ప్రశంసలను అందుకుంటున్నది. బాపు కేసీఆర్ ఏది చేసినా ఒక నమూనాగా మారి జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలుస్తున్నది. నాడు కలలు గన్న తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా విరాజిల్లుతున్నది.

9.         అధికార భాషా సంఘ అధ్యక్ష పదవిని స్వీకరించడంపై మీ అనుభూతిని, మీకు లభించిన సహకారాన్ని వివరించ గలరా?

జ: అధికార భాషా సంఘ అధ్యక్ష పదవిని స్వీకరించడం అనేది ఒక అధికారంగా భావించడం లేదు. అభ్యర్ధనే నా అభిమతం. చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు, యువతీయువకులు, కార్యాలయాలు అన్నింటా మన తెలంగాణ తెలుగు భాషా వికాసం ఆమనిగా విరబూస్తే ఈ కోయిలలన్నీ తెలుగు పలుకులు గానం చేస్తుంటే అప్పుడు నా కృషి ఫలించినట్లు భావిస్తాను. అనునిత్యం తెలంగాణ తెలుగు తల్లికి నీరాజనాలు అర్పిస్తాను. భరతమాత బిడ్డగా గర్విస్తాను. తెలుగు భాషపై అమోఘ మైన పట్టువున్న నాయకుడు బాపు కేసిఆర్ గారు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను తెలుగు భాషాభివృద్ధి కోసం నా శాయాశక్తులా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను.

10.       అధికార భాషా సంఘ అధ్యక్షురాలిగా భాషా వికాసం పట్ల మీ అభిప్రాయం ?

జ: ప్రజాకవి కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీని ప్రతి ఏడాది తెలంగాణ భాషా దినోత్సవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 సెప్టెంబర్ 9న వరంగల్లులోని కాజీపేట నిట్ కళాశాలలో జరిగిన కాళోజీ నారాయణరావు 100వ జయంతి సభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళోజీ నారాయణ రావు జన్మదినం సెప్టెంబర్ 9వ తేదీని ‘ తెలంగాణ భాషా దినోత్సవం’ గా ప్రకటించారు. తెలంగాణ యాస వినసొంపుగా ఉంటుంది. నిజాం పాలనలో ఉర్దూ ప్రాబల్యాన్ని తట్టుకొని మరీ నిలబడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఉర్దూ కలగలిసిన తెలంగాణ ప్రజల యాసను కొందరు గేలి చేశారు. దీన్ని తెలంగాణ కవులు తీవ్రంగా విమర్శించారు. అలాంటి వారిలో కాళోజీ నారాయణ రావు ముఖ్యులు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన తెలుగు భాషపై, తెలంగాణ యాసపై ఎనలేని ప్రేమ కనబరిచారు.

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు భాషీయుల

‘సుహృద్భావన’ ఎంతని వర్ణించుట సిగ్గుచేటు

అని తెలంగాణ యాసను విమర్శించే వారికి కాళోజీ దీటుగా బదులిచ్చారు. వీర తెలంగాణ నాది. వేరు తెలం గాణ నాది అన్న కవి కాళోజీ. తెలంగాణ భాష తేనె పలుకుల జీవధార. అధికార భాషా సంఘం, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇంటి భాష, వ్యవహారిక భాష, గ్రాంధిక భాష ఇలా… ఎన్నో.. ప్రజాకవి కాళోజీది పలుకుబడుల భాష. తెలంగాణ భాషకు మాండలికం ప్రాణం. తెలుగు సాహిత్యంలో తెలంగాణ ప్రాంతకవులు, సాహితీవేత్తలు చేసిన కృషిని చాటి చెప్పడానికి, కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో నిర్వహించాం. స్వయంగా సీఎం కేసీఆర్ ఈ సభలను ముందుండి నడిపించి తెలంగాణ సాహితీ, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. తెలంగాణ ప్రాంతం సాంస్కృతికంగా, సాహిత్య పరంగా, కళల పరంగా ఘనమైన చరిత్ర కలిగి ఉంది. తెలంగాణ సకల కళలకు నిలయం. సామాన్యుడి భాష, యాస ద్వారా సమస్యలపై గళం విప్పిన కాళన్న స్ఫూర్తితో తెలంగాణ భాషను ముందుకు తీసుకుపోతాం.

11.       తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో మాండలిక భాష ఎక్కువగా కనిపిస్తుంది కదా? మరి విద్యా సంస్థల్లో కానీ నిత్య జీవితంలో కానీ మాండలికభాష ఉపయోగించడం మంచిదేనంటారా?

జ: ఏ విద్యార్థికైనా తన మాతృభాషలో నేర్పిస్తే భాష సులువవుతుంది. అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రామాణిక భాష అని ఏర్పరచి ప్రాంతీయ భాషల విలువను తగ్గించడం సరియైనది కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు అధిక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాష ఆ ప్రాంతపు మాండలికం అవుతుంది. అది ప్రధానభాషలో ఒక భాగమవుతుంది. ఇది వ్యవహార ప్రధానంగా ఉంటుంది. కాబట్టి దానిని ఉప యోగించడం వల్ల భాష అవగాహనకు సులువుగా ఉంటుంది.

12 .      తెలుగు మాతృభాషగా విద్యనభ్యసించిన విద్యార్థులకు భావప్రసార నైపుణ్యాలు, ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆంగ్లభాష సమస్య వలన ఆశించిన ఉద్యోగాలు దొరకడం లేదని ఆవేదన పడడం వింటున్నాం.. దీనిపై మీ స్పందన?

జ: ఉద్యోగంలోకి తీసుకునే విషయంలో, ఆ ఉద్యోగాల ప్రకటన చేసిన సంస్థలలో ముందుగా మార్పు రావాలి. అభ్యర్థులకు ఉద్యోగానికి సంబంధించిన విషయం మీద అవగాహన ఉందా, లేదా అన్నది కూడా ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఆధునిక సమాజాలకే పరిమితం కాక ఏ సమాజానికైనా భాష ప్రాధాన్యత చాలా అవసరం. ఎందుకంటే భాష ద్వారానే భాష వినిమియం జరుగుతుంది. కాబట్టి మాతృభాషలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ బడుగు, బల హీన వర్గాల పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కు కోవాలంటే మాతృభాషతో పాటు ఇంగ్లీషు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

13.       భాష, యాసలపై మీ అభిప్రాయం?

జ: భావవ్యక్తీకరణకు భాషే సరైన సాధనం. అయితే ఎంత భాషాభివృద్ధి జరిగినా భాషకి మూలమైన సంజ్ఞల ద్వారానే మానవాళి ఇప్పటికీ ఎప్పటికీ కళ్ళు, కాళ్ళు, చేతులు, ముఖం ఆంగికమైన కదలికలతో భావ ప్రకటన చేస్తూ ఉంటుంది. మాతృభాషలో విద్యార్జన సులభ గ్రాహ్యంగా ఉండడమే కాక జ్ఞప్తికి సులువుగా వచ్చే వీలుంటుంది. అందుకేనేమో జపాన్ వాళ్ళకి తమిళనాడు ప్రజలకి భాషాభిమానం ఎక్కువ. తెలివి తేటలలో కూడా అగ్రగణ్యులే. భాషను ఉచ్చరించే తీరు, దీర్ఘాలను, హ్రస్వాలు గాను, హ్రస్వాలను దీర్ఘాలు గాను పలికే తీరును బట్టి యాస అనడం జరిగింది. ఈ యాస ఏర్పడడానికి ఆ భాషను మాట్లాడేవారి భౌగోళిక, సాంస్కృతిక అంశాలు, ఆహారవిహారాలు, జీవన విధానాన్ని బట్టి యాస ఏర్పడుతుంది. తెలంగాణ జనులు తమ భాష, యాసలను శ్వాస, ధ్యాసలుగా భావిస్తారు.

14.       ఆధునిక సమాజంలో భాష ప్రాధాన్యత ఏమిటి..అసలు భాష..యాస అనేది ఎలా ఏర్పడింది..??

జ: ఆధునిక సమాజంలో భాష ప్రాధాన్యత మునుపటికన్నా మరింతగా పెరిగింది. ప్రాచీన

సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మనుషులు తమ మనసులోని ఆలోచనలను ఇతరులతో పంచుకునే తీరికా, వెసులుబాటు ఉండేవి. ఆధునిక సమాజంలో మానవుడు దాదాపు, ఒంటరిగా మిగిలిపోయారు. ఈ ఏకాకిని సాంత్వన పరుస్తున్నది ఇవాళ భాష మాత్రమే! ఐతే భాష తన రూపాలను మార్చుకున్నది. తెల్లవారున లేవగానే మనం ఫేస్ బుక్కులోనో వాట్సాప్ మొదలైన వాటిలోనే పోస్టులు చదువుతున్నాం. పెడుతున్నాం. యూట్యూబ్ మొదలైన ఆధునిక మాధ్యమాల ద్వారా ఇష్టమైన పాటలు వింటున్నాం, కార్యక్రమాలు వీక్షిస్తున్నాం లేదా పుస్తక పఠనంలో నిమగ్నమవుతున్నాం. థియేటర్ లో సినిమాలు చూస్తున్నాం, ఇవాళ వేగం బాగా పెరిగి సమయాభావం వల్ల ఇతరులతో కలిసి ముచ్చటించ లేని పరిస్థితుల్లోకి మనిషి నెట్టబడ్డాడు. సామాజిక మాధ్యమాల మంచిచెడ్డల ప్రస్తావన అలా ఉంచండి. మొదటి నుండి మనిషికి భాషతో ఒక అవినాభావ సంబంధం ఉంది. అసలు… ఈ సమస్త ప్రాణికోటిలో ఒక మానవుడికే భాషకు ఆధారమైన జన్యువులు వారసత్వంగా సంక్రమించాయి. ఐతే, మనుషులు తాను పరస్పరం సంభాషించుకునేలా మునుపటి పరిస్థితులు వస్తేనే ఆది మానవీయంగా ఉంటుంది. మార్కెట్ సంబంధాలే యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈనాటి ఆధునిక సమాజంలో మానవ సంబంధాలను పునః ప్రతిష్ఠ చేయగలిగిన భాషకు మరింత ప్రాధాన్యత పెరిగిందనేది కాదు అనలేని సత్యం. ఇక భాష, యాసల ఏర్పాటు ఎలా జరిగిందంటారా? దాదాపు 50,000 సం, క్రిందట ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ప్రాచీన మానవుడు మాట్లాడినట్లు చెబుతున్నారు భాషా శాస్త్రవేత్తలు. క్రీ.పూ 8000 ల నాటికి 20,000 భాషలు ప్రపంచంలో ఉండేవట! ఆ తర్వాత కొన్నేళ్ళకు లిపి బద్దం చేసారు భాషను. ఐతే, భాష ఎలా పుట్టింది అన్న విషయకంగా చాలా సిద్ధాంతాలున్నాయి. అందరూ అంగీకరించిన ఏకైక అంశం … భాష అనేది శ్రమ నుండి ఆవిర్భవించిందని! పనిలోంచి పాట పుట్టింది. పాటతో మాటలున్నాయి. తీరుబడిగా కథలు చెప్పుకున్నారు. సమస్త కళలూ ఆ తర్వాత రూపుదిద్దుకోవడం మనందరికి తెలిసిందే! “యాస” అనేది… భాషలోని మాటలు మారిన రూపం. అంటే ఉచ్చారణలో పదస్వరూపం కొందరిలో మారుతుంది. అట్లా మారేందుకు నిరక్షరాస్యతా, సామాజిక అంతరమూ, మాట్లాడంలో వేగము ఏదైనా కారణం కావచ్చును. చదువుకున్న వాళ్ళు ” వేప ” అంటారు. మిగిలిన వాళ్ళు “యాప” అంటారు. ” యాప” అన్న వాళ్ళను చూసి, నవ్వుకోవద్దు. నిజానికి మీరడిగిన యాస” అనే 2 అక్షరాల పదమే ‘యాస’గా ఉంది. అది నిజానికి “ఏచ ” అనే మాట. భావోచ్చారణలో ప్రాంతీయంగా కనిపించే ప్రత్యేకత లేదా వ్యత్యాసం ” యాస అని శబ్దరత్నాకరం చెబుతున్నది.

15.       భాషకు, యాసకు ఉన్న వ్యత్యాసాలు… అవి వ్యక్తుల ఉనికిని ఎలా నిర్దేశిస్తాయి?

జ: ఇందాక చెప్పుకున్నాం వీటి గురించి. గ్రామీణంలో ‘యాస’ ఎక్కువగా వినిపిస్తుంది. కారణం నిరక్షరాస్యత. ‘యాస’లో వంకరగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళను తక్కువగా చూడరాదు. శ్రమజీవన సౌందర్యంతో గొప్ప జీవనానుభవంతో నైగనిగ్యంతో సహజంగా పల్లీయుల నోటి నుండి వెల్వడే వాగ్దార అది. భాష చక్కగా, నిర్దుష్టంగా, స్పష్టంగా, మాట్లాడగలిగిన వాళ్ళు మాత్రమే సంస్కారవంతులు అనటం సరైనది కాదు. భాష, యాస, మాండలికం.. ఏదైనా నిర్దుష్టమైనదే. ఇది దుష్టమా, ఇది నిర్దుష్టమా అనే పాతకాలపు కొలమానాలు ఈనాటి సభ్య సమాజానికి పనికి రావు.

16.       మన తెలంగాణ యాసలో సొబగులేమిటి? కొనసాగింపునకు మీ చర్యలు?

జ: తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ” యాస ” అనేది యాస కాదండి. అది ఇతరులకు. “యాస”, మనకు “భాష” అది అలా ఉంచండి, కాసేపు తెలంగాణ భాష… ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఏ భాషకైనా దానిదైన ప్రత్యేక సొగసు ఉంటుంది. ఐతే తెలంగాణ భాష సొగసు కొంత ప్రత్యేకం. ఎందుకని? అది… తెలుగు భాషకు బాగా దగ్గర. “దేశ భాషలందు తెలుగులెస్స కదా! ఆ ” లెస్స “తనం తెలంగాణలో ఉంది. తెలుగు భాషకు ప్రత్యేకమైన “నిండుసున్న ” తెలంగాణలో ఉంది. అది భాషను నాదమయం చేస్తున్నది. ఉదా॥ నాగుంబాము, ఆంబోతు, తాబేలు మొదలగునవి. మరో సొగసు… యతిని కోల్పోక పోవడం, ” తెట్టన తెల్లారింది, పట్టన పలిగిండు .. ఇలాంటివి. కొన్ని మాటల్లో ద్విత్వ అక్షరం ఊనిక కోసం కావాలని ఉంచడం. ఉదా: మస్రీ, మస్సాల మొ. వి. ఇంకా అనేక అర్థవంతమైన పదాలు, అచ్చ తెనుగు పదాలూ ఉన్నాయి ఉదాహరణకు ” పాముపడిగె చెట్లు” (నాగజెముడుకు బదులుగా) ఈ సొగసైన మాటల కొనసాగింపు కొరకు ఈ పదాలతో కూడిన భాషనూ, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తాం. ఉదాహరణకు… ఒక ఊళ్ళో ఉన్న మనుషుల పేర్లు, చెట్ల పేర్లు, జంతువులు            పేర్లు పెద్ద తరం వాళ్ళతో సేకరించవచ్చు. సొరకాయకు బదులు ” ఆనిగెపుకాయను” సేకరించి రికార్డు

చేయవచ్చు. “ఒంటె”కు ” లొటపేట” నమోదు చేయాలి. సమ్మక్క, సారక్క, ఐలయ్య మొదలైన వ్యక్తుల నామాలను సేకరణ చేయవచ్చు.

17.       తెలంగాణ సాహిత్యం, భాష, యాస… అణచివేతకు గురైందా?

జ: అనుమానమా ఇంక! అణుమాత్రమూ అనుమానం లేదు. తెలంగాణ మలిదశ ఉధృత ఉద్యమ సందర్భంలోనూ పోతన్నను మరలా ఒంటిమిట్టకు లాక్కుపోయారు. ఇంకా… ఇతర కవుల స్థానాలూ, గౌరవాల గురించి ఏం మాట్లాడగలం. నీళ్ళు, నిధులు, నియామకాల్లో అన్యాయకారణంగానే తెలంగాణ ఏర్పాటు జరిగిందని చెప్పలేం కదా!! భాష పట్ల వివక్ష సైతం తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రధాన కారణం. అల్లం రాజయ్య వంటి గొప్ప రచయితల రచనల్ని దిద్దారు. ఇటువంటి అంశాలు లోగడ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం.

18.       భాషా ప్రాతిపాదిక రాష్ట్రాలు ఏర్పడటం వెనుక ఉన్న అంతరార్థం?

జ: ఇది చాలా లోతైన అంశం. సున్నితమైన విషయం, ఈ ఏర్పాటు సరైనది కాదని అభిప్రాయాలు ఉన్నాయి. ఐతే గొప్ప భాషా శాస్త్రవేత్తలైన ఎమెనో, బరోలు ప్రపంచంలో ” ఇండియా ఒక మంచి, బహు భాషా ప్రదేశం ” అన్నారు. ఈ అనేక భాషల భారతంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ప్రజలకు… అంటే ఏకభాషీయులకు సులువు. పాలన సులభంగా కొనసాగుతుంది. న్యాయవ్యవహారాల్లో, బోధనలో, ఇతర విషయాల్లో ఒకే భాష మాట్లాడగలిన వ్యవహార కర్తలకు పనులు చాలా సుగమంగా సాగిపోతాయి. ఇదే ఈ ఏర్పాటులో పునాది అంశం.

19.       జీవభాష అని దేనిని అంటాం… భాషను సజీవంగా ఉంచడంలో సాహిత్యం, మేధావులు ఏం చేయాలి? 

జ: దైనందిన వ్యవహారంతో ఉండేది జీవద్భాష. భాష ప్రవాహిని. గడ్డ కట్టుకుని పోతే భాష కాదు. భాష అనే నదిలో పాత నీరు, కొత్త నీరు ఉంటుంది. ఏ నీరు ఎంత అవసరమో కాలానుగుణంగా ప్రజలు, మేధావులు, పండితులు, పాత్రికేయులు, విద్యాధికులు, ప్రభుత్వాలు. అందరూ కలిసి నిర్ణయించాల్సి వుంది. క్రొంగొత్త వస్తువులు వస్తున్న కొద్దీ కొత్త కొత్త మాటల అవసరం ఉంటుంది. ఆ పదాల్ని వీలున్నంతవరకు తల్లిభాష నుండి సృష్టించాలి. అలా సాధ్యం కాని పరిస్థితుల్లో పలుమాటలు గ్రహించాలి. సాహిత్యం కూడా అనేక రూపాల్లో భాషను మనుగడలో ఉంచుకుంది. కవిత్వం, కథ, నవల, నాటకం, సామాజిక మాధ్యమాలు, ఇంకా అనేక ఇతర ప్రక్రియల ద్వారా భాష పరిపుష్టం చేయాలి. ముఖ్యంగా అనువాదాలు రావాలి, కొత్త పదాల పుట్టుక జరగాలి, ఉదాహరణకు ఇజ్రాయిల్ దేశంలో హిబ్రూ, ఇద్దిస్ భాషల పరిరక్షణకు దాదాపు 40 సం.లు కష్టపడి ఆంగ్లంలోఉన్న సాహితాన్ని, శాస్త్ర సాంకేతిక గ్రంథాల్ని తమ భాషల్లోకి అనువదించుకున్నారు. ముఖ్యంగా భావి పాఠాల్ని తయారుచేయ గల్గితేనే భాష బతుకుతుంది.  బాగా చదవగల్గిన వాళ్ళు బాగా రాయగలిగే అవకాశం ఉంది. అందుకని పఠన లేఖనాల గురించి అందరూ గంభీరంగా ఆలోచించాల్సిన తరుణమిది. 

20.       ఆధునికత ప్రభావం భాషపై ఎలా ప్రతిఫలిస్తున్నది?

జ: ఆధునికత ప్రభావం మానవ జీవితాన్నే ప్రభావితం చేస్తున్నప్పుడు, భాష మీద కూడా ఆ ప్రభావం తప్పదు, సామాజిక మాధ్యమాలు పురుడు పోసుకున్న వైనం ఆధునికత కారణంగానే అనేది మన అనుభవంలో ఉన్నది కదా! ఆధునిక కాలంలో ప్రపంచ భాషలన్నీ నిత్యం మారుతున్నాయి. ఈ వేగంలో, ఆంగ్ల ప్రభావంలో కొన్ని భాషలు అంతర్ధానమయ్యాయి. కొన్ని రాటుదేలాయి. కొన్ని ప్రమాద ఘంటికల్ని వింటున్నాయి. మన తెలుగు డిజిటలైజు కావాలి. అందరికీ అందుబాటులోకి మన భాషను తేవాలి. పాతకాలం నాటి “వచ్చియున్నవాడు” వచ్చి యున్నాడు” గానూ, “వచ్చినాడు” గానూ, “వచ్చాడు” గానూ, “వచ్చిండు” గానూ మారింది. ఈ రూపాలన్నిటిని ఈ రికార్డు చేయాలి. అన్నీ ప్రామాణికమే అని చెప్పాలి. “అచ్చిండు” అనే రూపమూ నమోదు చేయాల్సిందే! శేషసాయి లాంటివాళ్ళే “ఆంధ్ర భారతి” పేర నిఘంటువుల్ని ఉంచారు. వాళ్ళ సైటులో “సెల్లు”లోని,  ఆ సైటులో సెర్చ్ లోకి వెళ్ళి టైపు చేస్తే ఏదైనా పదాన్ని, ఆ పదానికి అర్ధం తెలుస్తుంది. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు సైతం తెలుగులో పదానికి సమానార్థకమైన మాటల్ని కొన్ని ఇతర భాషల్లో, తెల్సుకునేలా ఏర్పాటు కల్గించారు, యాంత్రికానువాదమూ ఇటువంటిదే కదా…. 

21.       తెలంగాణ సాహిత్యాన్ని పదిలపరచడానికి, ముందు తరాలకు అందించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? 

జ: తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది పూర్వాధ్యక్షులు నందిని గారు ఉన్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి, అపురూప గ్రంథాల ప్రచురణ అయ్యింది. ఇటీవలే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర వచ్చింది. జూలూరి వారు పిల్లల కథలూ, ఊర్ల చరిత్ర మొదలగు పనుల్లో ఉన్నారు. భాషా సాంస్కృతిక శాఖా తరఫున అనేక గ్రంథాలు ప్రచురించారు. సభలూ, సమావేశాలు అధికార భాషా సంఘం తరఫున మేమూ మా ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. 

22.       చరిత్రలో నిలిచిన తెలంగాణ వాగ్గేయకారులు, రచయితల గురించి ఈ తరానికి ఎలా అవగాహన కలిగిస్తారు? 

జ: గొప్ప కర్ణాటక సంగీత వాగ్గేయకారుడైన మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు చనిపోతూ కూడా “ఏ తీరున నను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా” అనుకుంటూ కన్ను మూసారట! అది భద్రాచల రామదాసు కీర్తన కదండీ! ఆ రామదాసు … కర్ణాటక సంగీత మూర్తిత్రయంలో ప్రథముడైన త్యాగరాజుకు స్ఫూర్తి, ఆ పదకవితా పితామహుడు అన్నమయ్య గొప్పవాడే. కానీ. ఆ ప్రవాహంలో రామదాసును ఆ స్థాయిలో నిలుపుకోలేకపోతున్నాం ఈనాటికీ. ఇక రచయితలు.. దాశరథి, కాళోజీ, అలిశెట్టి, వానమామలై సోదరులు, సురవరం ఇటువంటి రచయిత రచనల్ని ఈ తరానికి మరింత అందుబాటులో ఉంచుతాం, వారి జీవిత చరిత్రల్ని నాలుగైదు పేజీలకు మించకుండా ఈ తరానికి అందిస్తాం. 

23.       తెలుగుభాషలో ఉన్న సాహిత్యమంతా వెలుగులోకి వచ్చిందని భావిస్తున్నారా? 

జ: సాహిత్యమంతా ఎక్కడ వెలుగులోకి వచ్చింది? కేవలం పరీక్షలలో ఉత్తీర్ణత పట్ల వుండే శ్రద్ధ భాష మీద భావం మీద కూడా పెడితే సాహిత్యపు విలువలు తెలుస్తాయి. సాహిత్యం బయటకు రావాలి. మనకు అద్భుతమైన సాహిత్యం ఉంది. అది బయటకు వచ్చినపుడు సంస్కృతీ సాంప్రదాయాల విలువ కూడా మనవాళ్ళు తెలుసుకుంటారు. 

24.       టి.ఆర్. యస్. ఇప్పుడు బి. ఆర్. యస్. గా ఎదగటం పై మీ స్పందన ? 

జ: అహర్నిశలు ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ, ప్రజా సేవలో తలమునుకలయ్యే జన హృదయాధినేత 

రాష్ట్రాభ్యున్నతే కాకుండా దేశాభ్యున్నతి అభిలషించడంలో ఆశ్చర్యం అణుమాత్రం లేదు. ఇదే తెరాసా భారాసాగా రూపుదిద్దుకోవడంలోని బహిరంగ రహస్యం. అంత గొప్ప నాయకునికి నేను సైతం చంద్రునికో నూలుపోగులా బాపు దళం స్థాపించి సామాజిక మాధ్యమం ద్వారా కందకాలలో దాక్కున్న కువిమర్శకులను వెంటాడి అక్షర శరాఘాతాలతో అణిచివేసే బృహత్ ప్రయత్నాన్ని నా మిత్రుల సహకారంతో కొనసాగిస్తున్న.. 

25.       నేటి బాలల్లో, యువతలో తెలుగుభాషాసక్తిని, సాహితీ విలువలను ఎలా పెంపొందించగలం ? 

ఇందులో ప్రభుత్వ, ప్రజల పాత్ర ఎలా ఉండాలని మీ భావన ? 

జ: చిన్నపిల్లలకు చిన్నప్పటినుండి మాతృభాష మీద అవగాహన, అభిరుచి కలిగించాలి. యువతకు సాహిత్యం పట్ల మక్కువ కలిగించి, వారిని ఆ దిశగా ప్రోత్సహించి సాంస్కృతికోద్ధరణ వైపుగా వారిలో ఆసక్తిని పెంపొందించాలి. ఆ విషయంలో కొన్ని అవార్డులు, రివార్డులు ప్రకటించాలి తద్వారా కూడా సాహితీ విలువలు పెరుగుతాయి. కుటుంబ పెద్దలు తెలుగు మాట్లాడటం, తెలుగు పుస్తకాలు చదవటం వంటివి అలవాటు చేయాలి. తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త ప్రక్రియలు, సంప్రదాయాలు మన తెలంగాణ కవుల నుంచే మొదలయ్యాయి. మల్లియ రేచన, పంపన, బండారు అచ్చమాంబ వంటి తెలంగాణ సాహితీ మూర్తులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ సకల కళలకు నిలయం. కాబట్టి ఇక్కడి బిడ్డలు కళాకారులై విశ్వానికి వెలుగులు నింపాలని నా ఆకాంక్ష 

26.       అనేక రచనలు చేసి, వివిధ సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్న మీరు ఆధునిక  కవిత్వంలో గమనించిన లోటుపాట్లు తెలుపగలరా ? 

జ: ఆధునిక కవిత్వంలో లోటుపాట్లు ఏవంటే వచనాన్ని విరుగగొట్టి, ముక్కలు చేసి దాన్నే కవిత్వం అంటున్నారు . అదేవిధంగా చదివిందే మళ్లీ మళ్లీ చదివి ప్రేక్షకులలో సహనానికి పరీక్షలు పెడుతున్నారు. సాహిత్యంలో తెలుగు తప్ప మరే భాషకు స్థానం ఉండకూడదు . నంబర్ల వాడకం అసలు ఉండకూడదు. వీటిని గమనించుకుంటే చక్కటి సాహిత్యాన్ని అందించగలుగుతాం. 

27.       భాషకు – ప్రగతికి గల సంబంధాన్ని వివరించండి ?                                                        

జ: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే, ఆ దేశపు భాష సంస్కృతి కూడా చాలా ముఖ్యం. భాషకు గుర్తింపు వస్తే భావం అర్థమవుతుంది. అప్పుడు విలువ పెరుగుతుంది . తద్వారా విజ్ఞాన సంబంధమైన విషయాల్లో కూడా మంచి రచనలు ప్రాచుర్యంలోకి వస్తాయి . ఉదాహరణకు…. శాస్త్రాలు. మన భారతదేశం వేద భూమి, కర్మభూమి, తపోభూమి . ఎన్నో సంవత్సరాలు మన మహా ఋషులు ఘోరమైన తపస్సు చేసి సంపాదించిన విజ్ఞానం మనది. ఆ విజ్ఞాన సర్వస్వం అంతా కూడా వేదాల రూపంలో పొందుపరిచారు . అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఒక్కొక్క వేదం ఒక్కొక్క శాస్త్రాన్ని చెస్తోంది. ఆ శాస్త్రాన్ని విదేశీయులు కొన్నిటిని తాళపత్ర గ్రంథ రూపంలో ఉన్న వాటిని ఇక్కడి నుంచి దోచుకు వెళ్లి వాటిని డీకోడ్ చేసి తిరిగి మనకి ఎక్కువ రేటులో అందజేసి దానివల్ల వచ్చే లాభాలను, పేరును, ప్రతిష్టను అన్ని వాళ్లే పొందుతున్నారు కానీ నిజానికి అదంతా మన జ్ఞానసంపద. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఎవ్వరికైనా తమ మాతృభాష పట్ల అభిమానం, గౌరవం ఉండాలి. అభ్యాసం చేయాలి. మన తెలుగు భాష ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఏ భాష నైనా తనలో కలుపుకునే సౌలభ్యం. ఎన్ని భాషలు నేర్చు కున్నా ఆ జ్ఞానాన్ని మన భాషాభివృద్ధికి వినియోగించాలి. 

28.       ఆధునిక సమాజంలో స్త్రీ పాత్రను విశ్లేషించండి?

జ: ఆధునిక సమాజంలో స్త్రీ విషయమంటారా? ఈనాడు మహిళ ఆధునిక సమాజంలో గొప్ప కీలక పాత్ర వహిస్తున్నది. అన్ని రంగాల్లో కూడా సత్తా చాటుకుంటున్నది. అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టి, అద్భుత విజ్ఞానాన్ని సంపాదించి, మహోన్నతంగా విశ్వ వేదిక మీద కూడా తన ప్రతిభను చాటుతున్నది.” ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్” అన్నట్లు ఆఖరికి వేదాధ్యయన కాలంలో వేదాలు కూడా నేర్చి, దీటుగా నిలబడుతున్నది .ఉదాహరణకు గార్గి, మైత్రి వంటి వారు. మీరాబాయి భక్తి ఉద్యమంతో ప్రాశస్త్యం పొందింది. అట్లాగే అక్క మహాదేవి…నేడు ఆధునిక కాలంలో చూసుకుంటే అన్నా చండి కేరళ హైకోర్టు ప్రథమ మహిళా న్యాయమూర్తిగా పేరు తెచ్చుకుంది . సుచేతా కృపలాని ఉత్తరప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె పేరు తెచ్చుకుంది. అట్లాగే విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో స్థానం సంపాదించుకున్న తొలి మహిళగా గొప్ప స్థానాన్ని పొందింది. ఇక సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ లో అధ్యక్షత వహించిన తొలి మహిళ. కిరణ్ బేడీ తొలి ఐపీఎస్ అధికారిణి. ఇలా ఎందరో మహిళలు ఇంకెందరో గొప్ప స్థానాన్ని తమ జ్ఞాన సంపదతో సంపాదించడమే కాకుండా చరిత్రలో ఆదర్శమూర్తులుగా మిగిలిపోయారు. ప్రస్తుతం ఎంతో మంది మహిళలు ఉపాధ్యాయినులుగా, డాక్టర్లుగా నర్సులుగా, పోలీసు ఉద్యోగాల్లోనే కాక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎనలేని జ్ఞానాన్ని సంపాదించి అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. 

29.       సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి ?

     జ: సమాజం అంటే వ్యక్తుల సమూహం లేదా సామూహిక జీవన విధానం. 

          ఇందులో భిన్నమైన వ్యక్తిత్వాలు, విభిన్నమైన మనస్తత్వాలు కల గలిసిన మనుషుల జీవితాలు      కొన్ని కట్టుబాట్లకు, విధివిధానాలకు లోబడి సమూహాలుగా సమాజంలో కొనసాగించడం. 

          బతకడానికి తినడం, తినడానికి సంపాదించడం, సంపాదనకోసం ఉద్యోగ వ్యాపారాలు, విలాసాలు,     కుటుంబాలు, బాధ్యతలు ఇలా గానుగెద్దు జీవితాలుగా కాకుండా సమాజం పదికాలాలపాటు పచ్చగా జీవించడానికి మనవంతు కృషి ఏమిటి..? అని ప్రతి వ్యక్తీ ఆలోచించుకోవాలి.. ఆత్మ పరిశీలన        చేసుకోవాలి. దానధర్మాలు, ప్రేమైక జీవనవిధానం, సేవాతత్పరత ఇలాంటి పెద్ద మాటలు కాకుండా ఒకరికొకరు సాయపడాలనుకోవడం, పడి పోయిన వ్యక్తిని చూసి హేళన చేసో, జాలిపడో  వెళ్ళిపోయేబదులు చేయూతనిచ్చే ప్రయత్నం చేయాలంటాను. మనకెందుకులే.. అని మరలిపోయే   మనస్తత్వం మారాలంటాను. మనిషిగా పుట్టినందుకు మానవత్వపు విలువలు పెరగాలంటాను. 

మంత్రి శ్రీదేవితో అరుణ ధూళిపాళ

30.       మహిళా దినోత్సవాలు జరుపుకోవడం అవసరమంటారా? 

            జ: స్త్రీ స్థితిగతులు బాగుపడనిదే సమాజం బాగుపడదు,ఏ పక్షి అయినా ఒంటి రెక్కతో ఎగరలేదు.     అన్నారు స్వామి వివేకానంద. ఆకాశంలోసగం,అవకాశాల్లో సగం నేడు మహిళ అన్ని రంగాల్లో పురుషునితో పోటీ పడుతుంది, రాణించ గలుగుతుంది, అంతరిక్షంలో కూడా అడుగుపెట్టింది నేడు   మహిళలేని రంగంలేదు. శాస్త్ర, సాంకేతిక, రాజకీయ, వ్యాపార,క్రీడా రంగాల్లో నేటి ఆధునిక మహిళ   అద్భుతమైన ప్రతిభాపాటవాలు చూపుతుంది,అయినా నేటి పితృస్వామ్య వ్యవస్థ స్త్రీని ఆటవస్తువుగానూ,ఒక అలంకార వస్తువుగానూ చూస్తుంది. ఈ రాకెట్ యుగంలోకూడా స్త్రీ    గృహహింసకు, అత్యాచారాలకు గురవుతూనే ఉంది.ఆర్థిక స్వావలంబనే స్త్రీ విముక్తికి మార్గం. సమాన పనికి సమాన వేతనం. పనిగంటలు తగ్గించాలనే డిమాండ్ తో న్యూయార్క్ లో మహిళలు సాగించిన    పోరాటం మనం స్ఫూర్తిగా తీసుకోవాలి.  స్త్రీ ఆత్మగౌరవం ప్రతీకగా మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.పక్కవాడు మనవాడే అనే భావన అలవరచుకోవాలంటాను….. 1908 సంవత్సరం లో న్యూయార్క్ లోని పదిహేను వేల మంది శ్రామిక మహిళలు సమానపనికి సమానవేతనం,పనిగంటలు తగ్గించాలి,మహిళలకు ఓటుహక్కు కల్పించాలనే   డిమాండ్ తో కదంతొక్కారు. గౌరవం, గుర్తింపు కోసం స్త్రీలు ప్రాణాలొడ్డి పోరాడారు. తమ హక్కులు సాధించుకున్నారు. 1910 లో డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్    వర్కింగ్ ఉమెన్స్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో జర్మనీకి చెందిన మార్క్సిస్టు సిద్దాంతకర్త క్లారాజట్కిన్ అనే మహిళ న్యూయార్క్ మహిళలు సాగించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి 8 ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు,దీనికి సభ ఆమోదం   తెలిపింది, అప్పటినుండి ప్రపంచమంతా మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దీనిని 1975 లో ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. కాబట్టి మహిళా దినోత్సవాలు సమాజంలో చైతన్యాన్నినింపాలి. 

          చాలా సంతోషం మేడం. మీ విలువైన సమయాన్ని మాకోసం, మా పాఠకుల కోసం వెచ్చించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ      సెలవు.. నమస్కారాలు. 

March 4, 2023 1 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆశయకలలు

by Dr. C Udaysri March 4, 2023
written by Dr. C Udaysri

ఆశయాల ముందు ఆకలి గెలిచేస్తోంది 

భారమైన బతుకుల మధ్య     

ఆనందం కన్నీరు కారుస్తోంది

ఎన్నో వెలుగులేని రాత్రులలో

సన్నని చిరు వెలుగుకై పడే తపన 

నిస్సారమైన ఆ గాజుకన్నులకే తెలుస్తుంది.

ఆకాశంలో మెరిసే చుక్కల్ని చూస్తూ 

ఓ చుక్కైనా రాలదా సంతోషాన్ని 

పెదాల చివర మురిపించటానికని

ఎదురుచూసే మనసుకు తెలుసు 

తీరని కోరికని 

అయినా ఆశల దారాన్ని అందుకునే 

ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదనే 

గట్టి నమ్మకమే జీవితాన్ని నడిపిస్తుంది లోకంలో

అంట్లుతోమే చేతులకు అందించే 

పలకా బలపం ఖరీదు పెద్దదే

ప్రభుత్వ పథకాల్లో అందే ఉచితాలు 

మాత్రం కొందరికే 

అదృష్టవశాత్తు అందినా 

దురదృష్టం మాత్రం 

కన్నవారి కష్టాలకు….అవసరాలకు

తోడుగా వెన్నంటి అణగదొక్కేస్తుంటే  

ఆదరించే చేతులకోసం ఎదురు చూపుల్లో 

ఎన్ని పసి ప్రాణాలు వడిలిపోతున్నాయో

చేయుతనిచ్చే మానవ దేవతలు

దిగివస్తారని కలలు కంటూ 

Dr. సి. ఉదయశ్రీ

March 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

విరాటపర్వం -వెన్నెల వైరాగ్యం

by Md Abdul Khaleem Azad March 4, 2023
written by Md Abdul Khaleem Azad

ఆర్తనాదాలు చేస్తున్న అడవిలో పండు వెన్నెలలో నిండు గర్భిణీగా ఒక తల్లి చేసిన యుద్ధన్నీ జయించి జన్మించింది వెన్నెల.

 ప్రాపంచిక మానవసంబంధాలను జయించి భుజావా వ్యవస్థ నుండి సమాజ మనుగడ ను కాపాడడానికి చీకటి పులుముకుంది ఈ వెన్నెల. 
అక్షరాల వెలుగులో కారు  చీకట్లు కమ్మిన అడవి మార్గంలో, ఆకాశం కూడా కనబడని నిండు అరణ్యంలో, కొండల్ని ఎక్కింది కోణాలను దాటింది,  వాగులు వంకలు ఈదుతూ ఆయుధం చేపట్టింది వెన్నెల.

ఉద్యమంలో ఒక సమిధ గా మారాలి అనుకున్న వెన్నెల సమస్యగా మారిందని తాను ప్రేమించిన ఉద్యమ ప్రేమ వెన్నెలను హతమార్చింది.

అడవుల్లోకి వెళ్లేముందు వెన్నెల తెల్లగా స్వచ్ఛమైన ప్రేమతో విప్లవ మీద గౌరవంతో తన కళ్ళను ఎర్రగా మార్చుకుని వెళ్ళింది,
కానీ చివరకు ఎర్రని రక్తంతో తడిసి మాంసంముద్దగా మారింది.

అయినా తను అనుకున్నది సాధించింది తన ప్రేమను చేరుకున్నది , విప్లవంలో సమిధగా మారింది ప్రమిదగా ఆరిపోయింది.

వెన్నెల నీ ప్రేమ అనంతం, అనాణ్యమైన ని విప్లవాస్ఫూర్తి ఆ అరణ్యం ఎప్పుడు ఘోషిస్తూనే ఉంటుంది.

వెన్నెల నువ్వు అడవికాచిన వెన్నెలవై, విప్లవ కాగడావై ఇప్పటికీ వెలుగునిస్తూనే  ఉంటావు.

ఇంత గొప్ప కథకు ప్రాణం పోసిన వేణు అడుగుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు,  చివరిగా వెన్నెలకి రెడ్ సెల్యూట్,


March 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ముక్కుపుడక

by Nellutla Sunitha March 4, 2023
written by Nellutla Sunitha

మగని మనసుకే గుర్తు

మగువ ముక్కుపుడక

ఆ సిరితో సప్తపదుల నడక

అద్దాల చెక్కిలిలో

అధరాల వంపులో

మెరిసింది నాసిక

ముత్యపు చినుకై మురిపిస్తూ

ముక్కుపుడక

అనాదిగా మన ఆచారమై

సంస్కృతుల విశేషమై

సాంప్రదాయ లావణ్యమై

సౌభాగ్య సంకేతమై

అందాన్ని ఇమిడ్చి

అలంకరణ భూషణంగా

అతివలకు  ప్రియం

రూపానికి మెరుగై

ఆకర్షణ ఆభరణమై

ముక్కుకి ముచ్చటగా

ముత్యం కెంపు వజ్రం తో

కొనదేలిన ముక్కుపై ఎరుపై

వయ్యారాలు పోతుంది.

ఆరోగ్య రహస్యమై

 అర్థ చంద్రబేసరి

సూర్య నాడీ చంద్ర నాడితో

జీవిత తత్వాన్ని తెలిపే

వేదాంతమై

నాడీ శాస్త్రమై

అతివల సౌందర్యము

మేనమామ ఇచ్చేబహుమతిగా

ముక్కుపుడక ఎంతో ప్రత్యేకం.

వర్చస్సులో తేజస్సు నింపి

ఆకర్షణ అయి ఆకట్టుకునేది.

మగువ ముక్కు పుడక

మగని ఆయుష్ కి ప్రతీక.

 

March 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

‘ప్రళయాక్షరాలు’:

by Sunka Dharani March 4, 2023
written by Sunka Dharani


‘ప్రళయాక్షరాలు’:

ప్రపంచం నా మాట వినట్లేదని
తాళలేని గొంతుక
దారితప్పిన వలయకాలువలా
ఘీంకరిస్తూ బాష్పీభవిస్తుంది
ఆ ఆవిరి సెగలు
ఉరుముల్లా
కాగితంపై నర్తిస్తుంటే
ఎండుటాకు శబ్దాల క్రోధనినాదాలు
చిగురుటాకు లబ్దాల కరతాళాలు
యుద్ధం.. శత్రువు.. గెలుపు..
అనే అభిప్రాయ వేదికపై
సహనములు
సరిగమలు మూటగట్టి
నీకో రహస్యం దాచిపెట్టా!
నిండు కలల వంతెనపై
కదపలేని వేళ్లతో ఈ ఉదాంతాన్ని రాసింది నేనే
నిన్ను చుట్టు ముట్టి
కదిపే కళ్లతో ఈ వేదాంతాన్ని చదువుతున్నది నేనే..

‘కవిత్వ కరవాలం’:

అక్షరం తప్ప వేరే గత్యంతరం లేదు
భావం తప్ప మరో బాంధవ్యం తెలీదు
గుప్పెడు కవిత్వం రాసుకోడానికి
గుక్కెడు భావం అందులో పోసుకోడానికి
పుస్తకాలెన్నో తిరగడం
మస్తకాలెన్నో వెతకడం
అనువైన వాటిని అరువుతెచ్చుకోడానికి
అన్నీ కలిపి ఆకృతిని ఇచ్చి ప్రాణం పోస్తే
అది కవిత్వమని ప్రకృతి చెప్పింది
బహుశా అదే అనుకుంటా ప్రకృతితో మాట్లాడే తీరు
అంతే అనుకుంటా తనకి తాను పెట్టుకున్న పేరు
గాలిని తాగి తాగి
నీటిలో కాగి కాగి
నిప్పులో మాగి మాగి
మట్టిని తిన్నాక అర్థమైంది
మెరుగులద్దుకొని విధిగా నిలువరిస్తే అవగతమైంది
రగిలే ఆలోచనల్లో కాలితేనే ఆశయాల ఆకాశం అందుతుందని
అప్పుడు నేను మారాను మనిషి నుండి
మహత్తు నిండిన కవిత్వంలా
అప్పుడే నేను మారాను కరుణగుణం నుండి
క్రోదాగ్నితనం నిండిన సిరాపాతంలా
నేను రోజు బడభాగ్నితో మాట్లాడతాను
నేను రోజు శూన్యంతో స్నేహం చేస్తాను
నేను రోజు స్వప్నాలతో కలిసి నడుస్తాను
నేను రోజు మెలుకువతో నిద్రిస్తాను
ప్రశ్నలు లేని సమాధానాల్ని ఛేదిస్తూ
ఒంటి నిండా ఖడ్గగుచ్ఛాలతో రోజూ ఉదయిస్తాను..
కర్మాకర్మల కర్మాగారాల పొగ పీలుస్తూ
గాయపడిన కాయంలా జాలిగా హీనంగా నీరసిస్తాను..
ఎండ వానల సమాంతర స్థితిలో జనించిన ఇంద్రధనుస్సులా హాయిగా అద్భుతంగా నవ్వుతాను..
హృదయ ప్రాకారాల ఆవిర్లను ఒడిసిపట్టి
దాహాన్ని తడుముకుంటూ
నిషా నిండిన వాక్యాలతో జీర్ణ కుడ్యాల
ఆకలిని కరుచుకుంటూ
నాటి ప్రణవ శబ్ద మూలం బోధించే
నేటి ప్రయాణ ప్రారబ్దం తెలుసుకుంటూ
అష్టదిక్కుల్లో తిష్టవేసిన అస్థిత్వాన్ని
అర్ధాంతర విన్యాసాల అగోచరత్వాన్ని
అనువుగా సృష్టించుకున్న జ్ఞాన స్థిరత్వాన్ని
కాగితాలపై కారుస్తున్నా కాలాన్ని వల్లె వేస్తూ…
ఖగోళాన్ని ఓ కంట కనిపెడుతున్నా
ఒంటి చేత్తో కవనాలను పూయిస్తూ.

March 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ధర్మం చెయ్యండి బాబూ, దిక్కు లేనోడ్ని!

by Pathivada Nastik March 3, 2023
written by Pathivada Nastik

ఇలా అడుక్కు తిని బతకడానికి 

సిగ్గుగా లేదూ?

నేనెందుకు సిగ్గు పడాలి తండ్రీ?

నన్ను అడుక్కు తినేలా చేసిన 

ఈ దేశం సిగ్గు పడాలి!

బాగానే ఉన్నావుగా,

ఏదన్నా పని చేసుకు బతకరాదూ?

నా కష్టాన్ని దోచుకొని 

నా నెత్తురు తాగుతున్న 

ఈ వ్యవస్థను నువ్వు 

బాగుచేస్తానంటే…

అలాగే సామీ, 

పని చేసుకునే బతుకుతాను

ఏం, పిడికిలి బిగించి తిరగబడొచ్చుగా?

సర్కారోడు నన్ను సెల్లోకి తోసి 

కుళ్ళబొడవకుండా

నువ్వు కాపాడతానంటే బాబయ్యా!

తప్పకుండా తిరగబడతాను

సమస్య అందరిదీ కదా,

నువ్వొక్కడివే యెందుకు,

అందరూ కలిసి సంఘటితంగా తిరగబడొచ్చుగా?

అయ్యో , యిది కూడా తెలీదా నాయినా!?

మేం కప్పలం , 

ఎటు పడితే అటు

ఎలా పడితే అలా గెంతుతాం!

మమ్మల్ని కలపాలని చూట్టం

కంఠశోష , వృధా ప్రయాస!

ఆ సంగతి ఆ యేలినోళ్ళకి కూడా తెలుసు

అందుకే ఐదేళ్ళకొక సారి

మాకింత ముష్టెయ్యడమే కాక,

ఏడాదికి పదేసి వేలు 

మా ఖాతాలో ఏసేస్తారు.

అలా నోరెల్లబెట్టి సూస్తావేటి సారూ!?

ఒక ఐదో పదో ముష్టెయ్యు!

March 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నేనొక ఇల్లు

by Jangam veeraiah March 3, 2023
written by Jangam veeraiah

అమ్మానాన్నల 

చెమట చుక్కల కష్టం 

వారి రక్త మాంసాల 

సారం నా రూపం 

కన్న కలల ఫలితం 

ఈ దేహం 

కష్టములు ఎన్నో దాటి 

కడుపు తీపి తోటి ఊహల వులితో తన బిడ్డ రూపం

ఊహించుకుని చక్కని శిల్పం చెక్కుకుంటూ 

కనులు మూసుకుని 

కొన్ని కలలు 

కన్నులు తెరిచి మరికొన్ని కలలు అన్ని ఇన్ని  

కావు కన్న కలలన్నీ 

లెక్క తేలని 

చుక్కల లెక్కల 

ఊపిరి బిగబట్టి 

పురిటి నొప్పులు ఎన్నో 

భరించి 

ప్రసవ వేదనను అనుభవించి నన్ను ప్రసవించి 

దేహం లేని ఆత్మ ఉన్నట్టు రూపంలేని 

పదార్థం ఉన్నట్టు 

రూపానికి రాని ఆకారాన్ని ఆశతో ఆశయంతో 

శంశయం వీడి సకల ప్రయత్నములు చేస్తూ పరాయిండ్ల మాటల బాణాలకు 

గాయం కానీ చోటు లేదు దేహంలో 

రాగం కానీ బాధల నాదం లేదు 

ఇల్లు ఇల్లు తిరిగే 

పిల్లి నై ఇహలోకమంతా 

నా ఇల్లు అనుకుని 

ఇండ్లు 

ఎన్ని తిరిగిన 

ఇల్లు ఒకటి కచ్చితంగా కావాలని 

కాలాన్ని విశ్వసించి కదులుతున్న 

కలిసి వచ్చినది 

ఒక అవకాశం 

ఏదో ఒక లోపం లేకపోతే మరేదో రూపం 

రానే రాదు కదా 

మాట ఒకటి దూసుకొచ్చి మస్తీస్కాన్ని తాకింది మనసున్న పడ్డ మాట 

మదిని మదించి 

పాలసంద్రం చిలికిన 

సురలు దానవుల వలె చిలికినట్టు 

ఒక రూపం కోసం 

పలు దిక్కుల పైనుంచి క్షయణించ 

సుఖనిద్ర సుకలలకై 

సమతల గుండె లయలకై 

మట్టి ఇటుకల 

కలయిక 

కంకర 

ఇసుక సిమెంటుల 

కలబోత పుట్టింగులై 

బీములై పిల్లర్ లై స్లాబై ఇటుకలై మేస్త్రీ రెక్కలై కార్మికుల 

చెమట చుక్కల 

తడికి తడిసి 

అల్లుకొని గోడలై 

పలువురు చేతుల సహకారమై మనుషులు జీవించే నీడై

పద పద మంటూ 

పసిడి కలలు నిజమై 

సుదూర సుసప్నం నిజమై కవిత నిలయమై 

నా దేహమే ఇప్పుడు 

ఒక ఇల్లు.

March 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us