మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఆవహించుగాక

by Samala Kiran July 13, 2023
written by Samala Kiran

ఎందరో పుడుతున్నరు 

కాలంలో కలిసిపోతున్నరు 

కొందరు మాత్రం

చెరిగిపోనంత ప్రభావంతో

చెరపలేనంత ప్రజ్ఞానంతో

కాలం పై తమ ముద్రని

మిగిల్చి పోతరు….

తామే ఓ చరిత్ర అయి

చరిత్రలో నిల్చిపోతరు

కొందరికి పుట్టుకే పండగ

కొందరికి చావే పండగ

రెండింటి మధ్యలోని

సార్థక జీవనమే నిన్నైనా

నన్నైనా చరిత్రలో నిలబెట్టేది

రాముడు దేవుడయ్యాడు

ధర్మ జీవనం వల్లనే

రాణా ప్రతాప్ వీరుడయ్యాడు

కర్మ జీవనం వల్లనే

ఓ శివాజీ… ఓ భగత్ సింగ్

ఒక్కొక్కరిది ఓ త్యాగమయం

ఒక్కొక్కరిది ఒక్కో జీవనముద్ర

చరిత్రలో నిలిచిపోయారు

వారి వారసత్వమే మనదీ

వారి ఆత్మతత్వమే మనదీ

ఆ అమరుల ఆత్మలన్ని

140 కోట్ల నా దేశవాసుల్ని

ఆవహించుగాక..

July 13, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

బంజారా జాతి రత్నం బానోత్ జాలంసింగ్

by kandukuri Bhaskar July 13, 2023
written by kandukuri Bhaskar

ప్రముఖుల జీవిత చరిత్రలు మనకు స్ఫూర్తినిస్తాయి.భావి తరాలు వారి మార్గంలో నడవడానికి ఆధారమవుతాయి.ఇప్పటి వరకు అనేక మంది జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో వెలువడ్డాయి.అందులో కొన్ని ఎవరికి వారు తమ జీవితానుభావలను స్వీయ చరిత్రగా రాసుకొనగా,మరికొందరి జీవిత చరిత్రలను ఇతరులు పరిశీలించి రాశారు.ఇతరులు రాసే జీవిత చరిత్రలు ఉహాగానాలతో కాకుండా ప్రముఖల జీవితాలను అధ్యాయనం చేసి వాస్తవాలను పొందుచేరచాలి.సమాజానికి ఆదర్శముగా ఉండాలి.ఆ విధంగా రచయిత,అధ్యాపకుడు

 రాథోడ్ శ్రావణ్ పరిశోధన చేసి రాసినాడే బానోత్ జాలం సింగ్ జీవిత చరిత్ర.

బంజారా సమాజ హితం కోసం సమాజంలో పెరిగిపోయిన దురాచారాల నివారణ  కోసం, బాలికల విధ్య కోసం అహర్నిశలు కృషి చేసిన బంజారా జాతికే వన్నె తెచ్చిన మహానీయుడు బానోత్ జాలంసింగ్ జీవిత విశేషాలతో ఉపన్యాసకులు, రచయిత, పూర్వ ఆధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక,ముత్యాల హారం  రూపకర్త.రాథోడ్ శ్రావణ్  బంజారా జాతి రత్నం  “బానోత్ జాలంసింగ్” అనే జీవిత  చరిత్ర పుస్తకాన్ని వెలువరించారు.

ఈ పుస్తకంలో బానోత్ జాలం సింగ్ జీవితానుభావలను, కుటుంబ జీవనం,ఆధ్యాత్మిక భక్తిభావం,రాజకీయ జీవితం ,నార్నూరులో విధ్య,వైద్య రంగాల  అభివృధ్ధికి అయన చేసిన కృషిని  రచయిత తెలియ జేశారు.బంజారా జాతికి ఇతర సమాజానికి అతను చేసిన సేవలు,వేంకటేశ్వర మందిర నిర్మాణం,తెలంగాణ ఉద్యమ అనుభవాలు,వ్యక్తిగత విషయాలతో పాటు సకల అంశాలతో పూర్తి సమాచారాన్ని అందించారు.బానోత్ జాలంసింగ్ జీవితంలోని ముఖ్య ఘట్టాల చిత్రమాలికను కూడా అందులో పొందుపరిచారు. జాలంసింగ్ సందర్శించిన జ్యోతిర్లింగాలు,

కుంభమేళాలు,తీర్థ యాత్రల గురించి విపులంగా  వివరించారు.

 1943 లో అక్టోబరు 2న బానోత్ సుర్తాబాయి సక్రునాయిక్ దంపతులకు ఆదిలాబాదు జిల్లా నార్నూర్  గ్రామంలో జాలంసింగ్ జన్మించారు.చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతను నానమ్మ,చిన్నమ్మ చిన్నాన్న వద్ద పెరిగారు.యాదృచ్చికంగా గాంధీ జయింతిని పుట్టిన జాలంసింగ్ గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి శాంతియుత జీవనం గడిపారు.అహింసా మార్గాన్ని అనుసరించారు. సంఘ సంస్కర్తగా సమాజ సేవకుడిగా ఉద్యమకారుడిగా ప్రజలతో మమేకం అయ్యారు.అందుకే బంజారా ప్రజల చేత ఆదిలాబాద్ జిల్లా బంజారా గాంధీగా కొనియాడబడ్డారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో  అయిన కృషి ఎనలేనిది.కుల మతాల కతీతంగా ప్రజా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేవారు. సమాజంలో పేరుకు పోయిన దూరచారాలు,వరకట్నుం,బాల్య వివాహాలు,మూఢనమ్మకాలు మొదలగు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి, యావత్ బంజారా సమాజానికి స్ఫూర్తిగా  నిలిచారు. గాంధేయ వాదిగా,పోరాట యోధుడిగా, బంజారా సంఘ సంస్కర్తగా,లంబాడీ ప్రజల హక్కుల కొరకు వారి ఆర్థికాభివృధ్ధి కోసం రిజర్వేషన్ల కోసం విశేషంగా కృషి చేశారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో పాల్గొని తన ఉపన్యాసాల ద్వారా ప్రజలను చైతన్య పరిచారు.

నార్నూర్ మండలంలో ఆర్థికంగా వెనుకబడిన గిరిజన విద్యార్థుల కొసం గురుకుల కళాశాల మంజూరుకై కృషి చేశారు. అఖిల భారతీయ బంజారా సేవా సంఘం జాతీయ కార్యదర్శిగా బానోత్ జాలం సింగ్ వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. బంజారా సంస్కృతి ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు.లంబాడీ సమాజంలో  తెరవి (పెద్దకర్మ )కార్యక్రమాన్ని ప్రారంభించి తెరవికి‌ అద్యుడిగా నిలిచారు.తన సమాజంతో పాటు ఇతర సమాజానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జంటలకు సాముహిక వివాహాలను జరిపించారు.

1967లో నార్నూరు గ్రామపంచాయితి ఉప సర్పంచ్ ఎన్నికతో రాజకీయ ప్రవేశం చేసిన జాలంసింగ్ 1970 నుండి2002 వరకు సుమారు 32 సంవత్సరాలు సుదీర్ఘ కాలం సర్పంచ్ గా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఎంపిటిసిగా,జడ్పీటీసిగా కూడా ప్రజలకు తన సేవాలు అందించారు.జిల్లా పరిషత్  ఉన్నత  పాఠశాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్, తపాలా కార్యాలయం, పశు వైద్యశాల,ఆయుర్వేద అసుపత్రి మొదలగు వాటి మంజూరీకై కృషి చేశారు.బాలికల ఆశ్రమ‌ పాఠశాల కోసం ,గోండు ఆదివాసీల నివాసం కోసం, రైతు వేదిక,ధర్మశాల కోసం విరాళం తోపాటు భూదానం కూడా చేశారు.

భక్తీ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ బాలాజీ మందిర నిర్మాణాన్ని శ్రీకారం చుట్టి అందరి సహాయ సహాకారాలతో ప్రారంభించారు.16 డిసెంబర్2020 న కరోనా బారిన పడి తుది శ్వాస విడిచారు. బానోత్ జాలంసింగ్ జీవిత చరిత్రను బంజారా సమాజంతో పాటు ఇతర సమాజానికి పరిచయం చెయ్యడం కోసం రచయిత రాథోడ్ శ్రావణ్ సోనాపూర్ నార్నూర్ గారు చేసిన కృషి అభినందనీయం. తమ జాతి ప్రజలను తన పోరాట పటిమతో మేల్నొల్పిన నాయకుడు బానోత్ జాలంసింగ్  జీవితాన్ని ఈ పుస్తకం ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు రచయిత రాథోడ్ శ్రావణ్. రాబోవు రోజుల్లో ఇది బంజారా జాతి ప్రజలకే కాకుండా  పలువురికి ప్రేరణగా  నిలుస్తుంది.ఉట్నూరు సాహితీ వేదికకు పూర్వ అధ్యక్షుడిగా పనిచేసిన రాథోడ్  శ్రావణ్ అనేక  సాహితీ కార్యాక్రమాలు చేపట్టి మరిన్ని పుస్తకాలు రాసి తెలుగు  సాహితీ లోకానికి అందిస్తారని ఆశిద్దాం.

పుస్తకం వెల ₹=90

ప్రతులకు:-
రాథోడ్ శ్రావణ్ ఇంటి నెం 2-2/1
ఐబి సుభాష్ నగర్ ఉట్నూర్.

ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ 504311  చరవాణి సంఖ్య 9491467715

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi July 13, 2023
written by Chillara Bhavanidevi

8
కాషాయాంబరాల స్వామి మౌనంగా ధ్యానంలో ఉన్నాడు. దూరంనించి వేణుగానం విన్పిస్తోంది. స్వామి అలాగే వింటూ కూర్చుండిపోయాడు. ఆ గానంలోని ఆర్తి స్వామి మనస్సును ఆకట్టుకుంటున్నది.
కొంతసేపటికి చంద్రప్ప అక్కడికి వచ్చాడు. అతని చేతిలో వేణువు చూశాడు స్వామి. ఇప్పటిదాకా సంగీత తరంగాలలో నిమగ్నమైన వ్యక్తి ఇతనే అని గ్రహించాడు. చంద్రప్ప స్వామికి నమస్కరించాడు.
‘‘ఎవరు నాయనా నీవు? వికల మనస్కుడిగా వున్నావు?’’
‘‘అవును స్వామీ! దారి తోచక అల్లాడుతున్నాను’’ నిట్టూర్చాడు చంద్రప్ప.
‘‘నీ ఆవేదన అర్థమయింది నాయనా! నీవు వలచిన కన్యకూ నీకూ వివాహయోగం లేదు’’ నిట్టూర్చాడు.
‘‘ఎందుకు లేదు స్వామి? త్వరలోనే మా వివాహం జరుగుతుందనే నమ్మకంతోనే బతుకుతున్నాను.’’
‘‘అనుకుంటున్నావు. కానీ గండముంది. ఓర్మి వహించు. దేశానికి యుద్ధసమయం వచ్చింది’’ అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు స్వామి.
చంద్రప్ప కలవరపడ్డాడు. శాంతియుతమైన వాతావరణం నెలకొన్నది అనే పరిస్థితిలో యుద్ధమేమిటి? బహ్మనీలు మళ్ళీ దండెత్తుతున్నారా ఏమిటి? ఆలోచిస్తూనే మంజరి మందిరంకేసి నడిచాడు.
* * *
నిండు పున్నమి వేళ. సుధాకరుడు అమృత కిరణాలతో ప్రకృతిని తన్మయ మొనర్చుతున్నాడు. చలిగాలి మెత్తని సూదుల్లా తాకుతున్నది. అలసిపోయిన రాయల సైన్యంకూడా ప్రశాంతంగా సేదతీరినిద్రపోతున్నది. అద్భుత కళాసౌధంలో కృష్ణరాయ ప్రభువు ప్రకాశిస్తున్నారు. ఎదుట ఆసీనులైన అప్పాజీకేసి ప్రసన్నంగా చూస్తూ చిరునవ్వులు చిందించారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన వైఖరి చూస్తే ఆ రోజేదో ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకోదల్చినట్లే కన్పిస్తున్నది.
చిన్నతనం నుంచి రాయల మనసెరిగిన మహామాత్యులు రాయలకేసి ప్రేమతో చూస్తూ వింటున్నారు.
రాయలు మేఘగంభీర స్వరంతో ఇలా అన్నారు. ‘‘అప్పాజీ! మీరు గమనిస్తున్నారు గదా! నా ధైర్యసాహసాలు మీ బుద్ధిబలంతోనే ఈ విజయనగర మహాసామ్రాజ్యం ఈ విధంగా కుదురుకుంది. ఈ రెండు కలబోసుకున్న సాహస ప్రజ్ఞావంతుడైన ఆ యువకుడు పదే పదే నా స్మృతిపధంలో మెదులుతున్నాడు. అతని ధైర్యసాహసాల వల్లనే మనం ఉదయగిరి దుర్గంపై విజయం సాధించగలిగాం’’
అప్పాజీకి రాయల మాటలు చెవిలో అమృతము నింపినట్లున్నాయి. ఆ యువకుని పట్ల అప్పాజీకి కూడా అంతటి మెప్పుదల భావం కలిగింది.
‘‘రాయా! మీరన్నది ముమ్మాటికి నిజం. నా మనస్సుకు కూడా తోచని అనేక విషయాలలో అతడు నిష్ణాతుడనటంలో సందేహం లేదు. శత్రువ్యూహాలకు సరిjైున ప్రతివ్యూహాలు పన్నగల దక్షుడతను, అతనికి….’’
‘‘అతనికి గొప్ప బహుమానమివ్వాలి’’ మంత్రిగారి మాట పూర్తికాకముందే రాయలు వాక్యాన్ని పూర్తి చేశారు.
‘‘నా అభిప్రాయమూ అదే! మీరూ అలాగే అనుకుంటున్నారంటే అంతకంటే
ఉత్తమం ఏముంటుంది! ప్రభువిచ్చే బహుమానం గొప్పగా ఉండాలి’’ తిమ్మరుసు సాభిప్రాయంగా అన్నారు.
‘‘గొప్పది అంటే?’’ రెట్టించారు రాయలు.
‘‘మీ మనసులో ఉన్నదే’’ చిరునవ్వుతో అన్నారు తిమ్మరుసు.
‘‘అది గొప్పదవుతుందా! అందరూ ఆలోచించే పద్ధతే కదా!’’
‘‘కాదు ప్రభూ! రాజాధిరాజ రాజపరమేశ శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల పుత్రికారత్నం తిరుమలాంబికను బహుమానంగా పొందటమంటే సామాన్యుల కలవిగాని పని.’’
రాయలు మందహాసం చేశాడు. ఆలోచన అంతర్ముఖం అయింది. తిరుమలాంబికనే కాదు, రాజ్యాన్ని యావత్తూ ఆ వీరునికిచ్చినా తక్కువే! ఎంతటి ప్రతాపవంతుడు! ప్రచండులైన వైరివీరులకు భయంకర చండమార్తాండు డయ్యాడు.
అరివీర హరిణ సముదాయానికి అతడు సింహమయ్యాడు. దుర్భేద్యమైన
ఉదయగిరి మాత్రమే కాదు, గోల్కొండ ప్రభువు కందవోలును ముట్టడిరచినపుడు కూడా అతడు తండ్రి అయిన శ్రీరంగ దేవరాయల ఆజ్ఞతో కందవోలుకు వెళ్ళి దానిని శత్రువుల చేతుల్లో పడకుండా కాపాడాడు.
ఆలోచనలోంచి రాయలు తిమ్మరుసుకేసి చూసి ‘‘అతని వంశచరిత్ర ఏమిటి అప్పాజీ’’ అని అడిగారు.
తిమ్మరుసు ఆ యువకుని వంశచరిత్రను ఇలా చెప్పారు.
‘‘రాయా! తురుష్కులు దక్షిణభారతదేశంపైకి దండయాత్రలు విరివిగా చేస్తున్నప్పుడు విశిష్ట హిందూసామ్రాజ్యమైన కాకతీయ సామ్రాజ్యం చిన్నాభిన్నమైన సంగతి మీకు తెలిసినదే! హిందువులను ఏకీకృతం చేయటానికి చేసిన ప్రయత్నమే మన విజయనగర సామ్రాజ్య స్థాపన.
అలాగే ప్రసిద్ధి పొందిన మరో హిందూ రాజ్యం ఉంది. వారి ముఖ్యపట్టణం కళ్యాణి నగరం. దీనిని అనాదిగా చంద్రవంశ రాజులు పాలిస్తున్నారు. వీరు అత్యంత పరాక్రవంతులై పొరుగున ఉన్న హోయసల రాజ్యానికి, కంపిలి రాజ్యానికి పక్కలో బల్లాలుగా ఉన్నారు. వీరి మూల పురుషుడు ‘వీరహమ్మాళిరాయుడు’. ఇతనికి ‘బొమ్మరాజు’ అనే మరొక పేరున్నది. ఇతని మనుమడు రాఘవరాజు కంపిలిరాయ సైన్యాన్ని గెల్చి ‘గండరగూళి’ బిరుదు పొందాడు. మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సామంతరాజ్యమైన మాళవ రాజ్యాన్ని ఓడిరచి ‘మాళవ రాజేంద్రమస్తకశూల’ బిరుదుపొంది చాళుక్యరాజ్య స్థాపనకు ప్రయత్నించాడు. తుంగభద్రకు ఉత్తరానగల రాజ్యాన్నంతా జయించి సప్తదుర్గాధిపతి అయ్యాడు. రాఘవరాజు మరణించాక పిన్నభూపాలుడు ఆరవీడు రాజధానిగా దేవరాయ మహారాయలకు సామంతుడయ్యాడు. ఇతని కుమారుడు బుక్కభూపాల చంద్రుడు. చంద్రగిరి ప్రభువైన సాళువ నరసింహరాయలకు పరమమిత్రుడు. అత్యంత పరాక్రమవంతుడైన ఆరవీటి బుక్కరాజు కుమారుడు రామరాజు. ఇతని కడపటి కుమారుడు శ్రీరంగరాజు. మొదటి కుమారుడైన తిమ్మరాజు నలభై సంవత్సరాలు విజయనగర రాజులపక్షాన యుద్ధంలో పాల్గొన్న గొప్ప రాజభక్తుడు.
‘‘అతని గురించి మేమొక ఉదంతం విన్నాము’’ ఆసక్తిగా చెప్పారు రాయలు.
‘‘అవును రాయా! ఒకప్పుడు తిరుపతి వేంకటేశ్వరస్వామి ఒక అంధగోపకుని కరుణించి ఒక కన్ను మాత్రమే ఇచ్చి తిమ్మరాజు కలలో కన్పించి మిగిలిన రెండవకన్ను ఈయమని ఆజ్ఞాపించాడట! అప్పుడు తిమ్మరాజు ఆ గోపబాలునికి రెండవ కంటిచూపు ఇచ్చాడట. మరోసారి సైన్యంతో మండు వేసవికాలంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సైన్యానికి చాలా దాహం వేసిందట. తిమ్మరాజు ఎంతో భక్తిగా విష్ణువును ప్రార్ధించాడట. ఆశ్చర్యంగా వాళ్ళున్న ఆ ఎత్తైన కొండమీద నీటిబుగ్గ పుట్టిందట. అంతా దాహం తీర్చుకోగానే అది మాయమైందట. ఇంతటి వీరుడు, భక్తుడైన తిమ్మరాజు మహమ్మదీయులతో పోరాడి జయము పొందాడు. కళింగాధీశుడైన ఒడ్డెరాయని జయించాడు. శ్రీవారి పట్టాభిషేకోత్సవంలో పాల్గొన్నాడు. శ్రీవారి జైత్రయాత్రలన్నింటిలో పాల్గొన్న ముఖ్యడు’’ అప్పాజీ వివరించారు.
‘‘చాలా బాగున్నది అప్పాజీ! అయితే ఈ వీర యువకుడు ఎవరి సంతానం?’’ రాయలు ప్రశ్నించాడు.
‘‘ఆరవీటి బుక్కరాయవంశం వారు మొదటినుంచి విజయనగర రాజుకండగా ఉన్నారు. నంద్యాల, కందవోలు, ఆదవని, అవుకు, గుత్తి, గండికోట మొదలైన ప్రాంతాలీవంశం వారివే! తిమ్మరాయుని చివరి తమ్ముడు శ్రీరంగదేవరాయలు మీకు బహుప్రీతిపాత్రుడని ఎరుగుదును. ఈయనకు కోనరాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వెంకటపతిరాజు అను ఐదుగురు కుమారులున్నారు. వీరిలో మూడవ కుమారుడైన రామరాజే మీ వాత్సల్యానికి పాత్రుడైన అదృష్టవంతుడు. అతనే రామరాయలు’’ తిమ్మరుసు ముగించాడు.
రాయల వదనం సంతోష తరంగితంగా ఉంది. తన కుమార్తెకు నచ్చిన వరుని అన్వేషించే తండ్రికి సరిjైున గమ్యం దొరికినట్లయింది.
రాయల చిరునవ్వులో తిమ్మరుసుకు కృతనిశ్చయం కనిపించింది. ఆయన సంతుష్టుడై ఆనాటికి సెలవు తీసుకున్నారు.
* * *
అన్నపూర్ణాదేవి జగన్నాథస్వామికి పూజ ముగించి హారతిని వీరేంద్రుని కందించింది.
‘‘పూజలకేమిగాని అసలు విషయం ఆలోచించావా?’’ నిష్టూరం అతని గొంతునిండా వినిపిస్తున్నది.
‘‘ఏమిటది వీరేంద్రా?’’ చిరునవ్వుతో అడిగిందామె.
‘‘జగన్నాథ! నీ కుమారుని గురించి’’
‘‘కుమారుని గురించి ఏముంటుంది? వాడిరకా పసివాడు. విద్యలు నేరుస్తున్నాడు’’ తల్లిప్రేమ తొణికిసలాడుతూ అంది.
‘‘నా బాధ అదేనమ్మా! నువ్విలా పూజలు వ్రతాలు చేసుకుంటూ కూచుంటావు. ఆ తిమ్మరుసు ఏం కుట్రలు పన్నుతాడో అని నా భయం.’’
‘‘అప్పాజీవారలాంటివారు కాదు వీరేంద్రా! వారి కృషివల్లనే ఈ విజయనగర సామ్రాజ్యలక్ష్మి ఇంతగా కళకళలాడుతోంది’’ నమ్మకంగా అంది.
‘‘సైన్యాధికారులు, సైన్యం, రాజ్యంలోని ఈగ, దోమ కూడా తిమ్మరుసు మాట జవదాటదు. జగన్నాధ! దీపం ఉండగానే ఉల్లు చక్కబెట్టుకోమనే నేను చెప్పేది’’ వీరేంద్రుడు వల విసిరాడు.
‘‘మీ మాటలు నాకు రుచించటం లేదు. ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యంలో మంచిచెడ్డలు నాకన్నా నీకన్నా అప్పాజీవారికి బాగా తెలుసు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు’’ తీవ్రంగా హెచ్చరించిందామె. వల జారిపోయింది.
వీరేంద్రుడు దెబ్బతిన్న పులిలా చూశాడు. అతని మొహం కోపంతో జేవురించింది.
‘‘జగన్నాథ! నువ్వింత అమాయకురాలివి కాబట్టే రాజుగారు ఆడిరది ఆట, పాడిరది పాట అయింది. ఆ దేవదాసీని గజపతుల ఇంటి ఆడపడుచుతో సమానంగా కూచోపెట్టాడు. రేపు నీ కుమారుని పట్టాభిషేకం ఏం జరుగుతుందో! దానిని కళ్ళార చూడాలనే నా తాపత్రయం. నీ పుట్టింటి బంధువును కదా! శ్రేయస్సు కోరి చెప్పాను. నీ ఇష్టం తల్లీ’’ వీరేంద్రుడు విసవిసా వెళ్ళిపోయాడు.
చాటునుంచి అంతా వింటున్న మంజరి వ్యధ చెందింది.
వీరేంద్రుడు వెళ్ళిపోయాక అన్నపూర్ణాదేవి సుదీర్ఘమైన ఆలోచనలో పడటం మంజరి గ్రహించింది. ఆ సమయంలో తాను తెచ్చిన విషాద వార్తను వినిపించటం ఎలా?
చీకటిపడినా ఎవరూ దీపాలు వెలిగించలేదు. అన్నపూర్ణాదేవి చుట్టూ చూసింది. కటిక చీకటి. దూరాన హజరారామ దేవాలయంలోంచి చిరువెలుగు కన్పిస్తున్నది. ధ్వజస్తంభం గంటల చప్పుడు మనస్సుకు ప్రశాంతతను ప్రసాదిస్తోంది.
‘‘ఎవరక్కడ’’ అన్నపూర్ణాదేవి పిలిచింది. ఎవరూ పలకలేదు. మరోసారి పిలిచింది. పరిచారిక వచ్చింది చిన్నదీపంతో.
‘‘దీపాలు వెలిగించలేదు. ఇదేమిటీ దివ్వె?’’ తీవ్రంగా అడిగింది అన్నపూర్ణాదేవి.
‘‘దేవీ! ఒక సంతాపవార్త. చిన్నాదేవిగారు అస్తమించారు. రాజమందిరా లన్నింటిలో దీపాల ఉజ్వలత తగ్గించమని తిమ్మరుసుగారు సెలవిచ్చారు’’ మెల్లగా చెప్పి దీపం ఉంచి పరిచారిక వెళ్ళిపోయింది.
ఈ వార్తకు అన్నపూర్ణాదేవి మ్రాన్పడిపోయింది.
చిన్నాదేవి ఎంతటి కళాసౌందర్యగని! ఆమెను అంతా దేవదాసి అంటారు. ఆమె ఎవరికి ఎక్కడ పుట్టిందో తెలీదు. ఆమె నాట్యం, సంస్కారం, రాజసం వెలయాలనిపించవు. పెంచిన తల్లి నేర్పిన విద్యగాక జన్మతః అబ్బిన సంస్కారాలు ఆమెకు వన్నెతెచ్చాయి. స్త్రీలయిన తామే ఆమెపట్ల ఆకర్షితులయితే కళాపిపాసి అయిన ప్రభువు ఆమెను వలచుటలో వింతలేదు. తామందరికన్నా ముందు రాయల మనసు దోచిన అదృష్టవంతురాలు. కొన్నిదినాలుగా అస్వస్థురాలుగా ఉన్నదామె. తాను ఒకసారి చూడబోతే!
‘‘సోదరీ! నాకిక సెలవు’’ అని కన్నీరు నింపుకుంది.
తన మనస్సెంత కలవరపడిరది! ఆమెనెంతో ఓదార్చింది. రాజవైద్యులను ఆమె అనారోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నది. ఈనాటికీ విషాదాన్ని ప్రభువు ఓర్వగలడా! ‘చిన్నాజీ’ అని ఆప్యాయంగా ఆమెని ఒడిచేర్చే ప్రభువు దుఃఖాన్ని తామెందరు రాణులున్నా తీర్చలేరు. శ్రీకృష్ణదేవరాయల వారి జీవితంలో చిన్నాదేవి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆలోచిస్తుండగానే పరిచారిక వచ్చింది.
‘‘అమ్మా! మేనా సిద్ధం!’’
అన్నపూర్ణాదేవి మేలిముసుగు సవరించుకుని జగన్నాధునికోసారి నమస్కరించి మేనా ఎక్కింది. స్వంత సోదరి మరణవార్త విన్నంతగా ఆమె మనస్సు తల్లడిల్లిపోతున్నది. చిన్నాదేవి మందిరం ముందు మేనా ఆగింది. మూర్తీభవించిన విషాద దేవాలయంలా ఉన్న ఆ మందిరంలోకి అన్నపూర్ణాదేవి దుఃఖితjైు అడుగుపెట్టింది.
విచలితుడైన ప్రభువుని చూసి మరింతగా కన్నీరు పెట్టిందామె. శ్రీవారిని పలకరించే సాహసం ఎవరికీ లేదు. శ్రీకృష్ణదేవరాయ ప్రభువు అనుంగు దేవేరి చిన్నాదేవిని సాగనంపటానికి అంతిమ ఏర్పాట్లు అప్పటికే మొదలైనాయి.
* * *
చిన్నాదేవి మరణించిన దుఃఖం నుంచి రాయలు ఇంకా కోలుకోలేదు. వీరేంద్రునికిది మహదవకాశం. రాజ్యాధికారానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ తిమ్మరుసుకు అతడు అవరోధాలు కల్పిస్తున్నాడు. రామలింగేశ్వర నాయకుడు, గండపనాయకుడు మొదలైనసేనానాయకులతో వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా మంతనాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు వీరేంద్రుడు.
తిమ్మరుసు మంత్రి తీవ్ర దుఃఖాంధకారంలో మునిగిపోయిన రాజును చైతన్యవంతుడ్ని చేయటానికి చాలా ప్రయత్నిస్తున్నారు.
శని వీరేంద్రుని రూపంలో విజయనగరంలో తిరుగుతున్నది. అతడు అనుక్షణం రాజ్యాన్ని ఏవిధంగా అల్లకల్లోలం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ అడుగడుగునా మహామంత్రే అతనికి అడ్డంకిగా మారాడు. అంతకుమించి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉండే సైన్యాధిపతులు, సహోద్యోగులు కూడా కంటకప్రాయంగా ఉన్నారు. వీరేంద్రుడేది మాట్లాడినా రాజ్యక్షేమం గురించే అన్నట్లు ప్రవర్తించేవాడు. అన్నిటా తానే ఉండేవాడు. అయినా అతనిమీద ఎవరికీ సదభిప్రాయం కలుగలేదు. తిమ్మరుసుకు మాత్రం వీరేంద్రుడేదో దురాలోచనలో ఉన్నాడని అర్థమవుతున్నది.
* * *
మంజరి చంద్రప్పలు సుదీర్ఘాలోచనలో విచారంగా ఉన్నారు.
‘‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. వీరేంద్రుడు కాలసర్పం. నేను రాయలవారి అంగరక్షకుడిగా ఉన్నాను కదా! నిరంతరం ప్రభువుచెంత ఉండడం వల్ల వాడు ప్రభువులవార్కి తిమ్మరుసు మహామంత్రి గురించి విషం ఎక్కించే ప్రయత్నం చేయటం చూస్తున్నాను. ప్రభువు వీరేంద్రుని మాటలు నమ్మినట్లు కనపడరు. కానీ చెప్పగా చెప్పగా ఎవరికైనా చెడుతలపులు వస్తాయని నా భయం’’ చంద్రప్ప మంజరికి చెప్పాడు.
‘‘రాయలవార్కి తిమ్మరుసులవారు తండ్రితో సమానం. అంతకంటే ఎక్కువే! అయినా ఆలోచించాల్సిందే! ఈ వీరేంద్రుడు అన్నపూర్ణాదేవిగారు పద్మమహల్‌లో విడిది చేసినపుడు కూడా వదిలిపెట్టలేదు. రాజబంధువుగా హంపీలో అతడు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. అందులోనూ అన్నపూర్ణాదేవి బంధువు కాబట్టి ఆమె ఎక్కడ ఉన్నా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాడు’’ మంజరి వీరేంద్రుని కుబుద్ధిని అసహ్యించుకుంది.
‘‘పద్మమహల్‌ అంటేనే ప్రశాంత సరోవరం వంటిది. రాణివాసం స్త్రీలు చల్లదనానికి ఆ సుందర ప్రదేశంలో విడిది చేస్తారు. వీరేంద్రుని పాదస్పర్శతో అక్కడ తాపమే పెరుగుతుంది’’ చంద్రప్ప కోపంగా అన్నాడు.
‘‘అంతే జరిగింది. ఆనాడు కూడా వీరేంద్రుడు అన్నపూర్ణాదేవితో ‘రాయలు తిమ్మరుసుకు బానిస’ అన్నాడు వ్యంగ్యంగా’’ మంజరి చెప్పింది.
‘‘ఆ! అంతమాట మన దేవేరిగారు సహించారా’’ చంద్రప్ప సందేహం.
‘‘ఆమె అసహనాన్ని ఇతడు గణించడు.’’
‘‘రాయలవారిని కళ్ళుపీకించి చంపమని రాజాజ్ఞ అయినా తిమ్మరుసువారు ఒక ఆడమేక కళ్ళు రాజుగారికి చూపించి రాయలవారిని రక్షించి తమ ఇంట రహస్యంగా దాచి, విద్యలు నేర్పి ఉపాయంతో ఈ విజయనగరాధీశుని చేశారు. తన శక్తియుక్తులన్నీ వెచ్చించి ఈ విశాల సామ్రాజ్యాన్ని సువర్ణమయం చేశారు. మనం ఇంత ఐశ్వరాలతో తులతూగుతున్నామంటే అప్పాజీవారి దయకదా’’ చంద్రప్ప వేదన చెందాడు.
‘‘అవును. రాయలవారికీ సంగతి తెలుసుగానీ నిన్నమొన్న వచ్చిన అన్నపూర్ణాదేవికేం తెలుసు’’ మంజరి విచారించింది.
‘‘ఎందుకు తెలియదు? ఆమె పతిననుసరించి నడుచుకునే సాధ్వి’’ నమ్మకంగా అన్నాడు చంద్రప్ప.
‘‘నిజమే! ఈ వీరేంద్రుడు ఎంతటివారినైనా పడగొట్టగలడు. ఇప్పటికే అంతఃపురంలో వాడంటే అందరికీ భయమే! అన్నపూర్ణాదేవిగారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు’’ మంజరి గొంతులో బాధ ధ్వనించింది.
‘‘రాయలవారి మనసును కూడా విరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. తిమ్మరుసుల వారు ఏదో ఒకటి చేసి వాడినీ రాజ్యంనుంచి వెళ్ళగొడితే బావుండు’’ చంద్రప్ప ఆశ.
‘‘రేపటి సాయంత్రం తులామానం జరుగుతుంది. ప్రభువులవారు విజయయాత్ర ముగించిన ఉత్సవంలో భాగంగా ఈ తులామానం జరగటం నీకూ తెల్సు. ప్రభువు వదాన్యులై అందరికీ తులలేని రత్నమాణిక్యాలు తమ ఎత్తు తూచి పంచుతారట’’ మంజరి సంతోషంగా అంది.
‘‘అదే ప్రభువు గొప్పతనం. దీనికి తిమ్మరుసులవారి ఆశీస్సులు మెండుగా
ఉన్నాయి. వీరేంద్రుడేమిటి ఇటువంటివారెందరైనా తిమ్మరుసులవారి బుద్ధిబలానికి తలొంచవలసిందే’’ చంద్రప్ప సవాలుగా అన్నాడు.
‘‘పద! వీరేంద్రుడు ఇటుకేసే వస్తున్నాడు. వాడి ఆలోచన దురాలోచన కాకుండుగాక’’
ఇద్దరూ పూలపొదల మాటునుంచి వడివడిగా నిష్క్రమించారు.
* * *
రాయలవారి తులామానం జరుగుతోంది. ఒకవైపు రాయలవారు త్రాసులో ఆసీనులైనారు. రెండు ఏనుగుల నిలువుల ఎత్తున్న ఆ తులాదండం రెండోవైపు త్రాసులో నవరత్నాలు రాశులుగా పోశారు. రాయలవారి చిరునవ్వు చంద్రికల సాక్షిగా ఆ రత్నాలు, ముత్యాలు, పగడాలు, విలువైన మాణిక్యాలు బ్రాహ్మణులకు, బారులు తీరిన పౌరులకు దేవేరుల చేతులమీదుగా పంచిపెడుతున్నారు.
వందిమాగధులు రాయలవారి వితరణను వేనోళ్ళ కొనియాడారు. కవి సత్తములలో ఒకరీవిధంగా రాయల తులామానాన్ని శ్లాఘించారు.
ప్రథిత విద్యానగర ప్రాజసామ్రాజ్య
శౌర్యలక్ష్మికి జిత్తశాంతి గాగ
సకలార్త పోషణోత్పుక విరూపాక్షుని
ధన్యకీర్తికి దోహదంబుగా
మజ్జనమాత్ర సమస్తాఘ భంజక
భద్రాంబు చయము సాఫల్యమంద
గజపతీంద్రోగ్ర సంగర జయోపార్జిత
ధనమహాలక్ష్మి సార్ధక్యమంద
ఘటిత విత్తము రాజ్యోపకారి తనువు
సమత దాల్పగ శ్రీకృష్ణ జనవరుండు
తగదులామానమున నంచితమ్ము సేసి
జనుల కిప్పించె సతుల హస్తముల చేత
మహారాజు తెల్లని వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలపై బంగారు గులాబీల అల్లిక ఉంది. విశేషంగా నగలు అలంకరించుకున్నారు. రాజలాంఛనాలతో నిలిచిన ఆయన ఇరుపక్కలా దేవేరులున్నారు. అప్పాజీ, రామలింగనాయకుడు
ఉచితాసనాలపై ఉన్నారు. కొంచెం వెనుకగా ఇద్దరు సేవకులు బంగారురేకు తాపడం చేసిన చామరలతో వీస్తున్నారు. ప్రత్యేక సింహాసనం మీద ఆసీనుడైన శ్రీకృష్ణదేవరాయలు తులామాన ఉత్సవాన్ని సంతృప్తిగా చూస్తున్నారు. తులాదండంపై రాజు ఇద్దరు దేవేరుల శిలారూపాలు భవిష్యత్‌ తరాలవారికి రాయల వదాన్యత తెలిపే సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
రాజ ప్రముఖుడు కృష్ణదేవరాయలకు అభివందనం చేశాడు.
‘‘గోవా గవర్నరు ఏమన్నారు’’ మంత్రి ప్రశ్నించాడు.
‘‘ఒక గొప్ప మేస్త్రీని పంపారు అమాత్యా! కానీ ఆ రెండు కొండల మధ్య సరస్సు కోసం గోడను నిర్మించటానికి సున్నం సిద్ధంచేయమని చెప్పాడు’’ రాజప్రముఖుడు చెప్పాడు.
తిమ్మరుసు మంత్రి నవ్వారు.
‘‘సున్నమా! అది మనం ఎరుగనిది. సరే! మనమే పెద్దపెద్ద శిలలు తెప్పించి లోయలో గోడను నిర్మింపచేస్తాం. రెండు కొండల మధ్య ఆ సరస్సు వల్ల ప్రజలకి భూసాగుకు వీలవుతుంది. ఆ గోడ నిర్మాణానికి ఏర్పాట్లు చూడండి’’ రాయలు తిమ్మరుసుకు కనుసైగ చేశారు.
ఆ రాజప్రముఖుడు అంగీకారసూచనగా రాజుకు అభివాదం చేసి వెళ్ళిపోయాడు.
‘‘అప్పాజీ! మన రైతులు గోధుమ, వరి, జొన్నగాక ఇంకేం పండిస్తున్నారు?’’ రాయలు ఆరా తీశారు.
‘‘రాయా! నిరంతరం తాంబూల సేవనభోగం కోరే విజయనగర ప్రజలు తమలపాకు పంటవేస్తారు’’ తిమ్మరుసు సమాధానానికి రాయలు చిరునవ్వుతో తల పంకించారు.

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

చదవటం, రాయడమే కదా నా పని!

by Aruna Dhulipala July 13, 2023
written by Aruna Dhulipala

– ఒద్దిరాజు మురళీధరరావు

ప్రపంచ విజ్ఞాన జిజ్ఞాసులై, స్వీయ ప్రతిభతో వివిధరంగాల్లో నైపుణ్యాలను సాధించి, సాహితీ రంగంలో తమ ముద్ర నిలిపిన బహుభాషా కోవిదులు, పట్టుదలతో తమ జీవితాలకు సాఫల్యత సాధించుకున్న అపురూప ఒద్దిరాజు సోదరుల వంశీయులు, అనువాద సాహితీ ప్రముఖులు, రచయిత ఒద్దిరాజు మురళీధరరావు గారితో మయూఖ ముఖాముఖి…..

1. మొదటగా మీరు పుట్టిన ఊరు, బాల్యం గురించి చెప్పండి.

జ:  నా పేరు ఒద్దిరాజు మురళీధరరావు. మా అమ్మ, నాయన గార్లు శ్రీమతి వెంకట రామనర్సమ్మ. సీతారాం రావు గారు. వారి సంతానంలో నేను తొమ్మిదవ వాడిని. మొదట అక్కగారు తరువాత ఐదుగురు అన్నయ్యలు, తరువాత ఇద్దరు అక్కయ్యలు చివరగా నేను. నేను పుట్టినది అక్టోబర్ 23, 1933 ( శ్రీముఖ నామ సంవత్సరం, నాగపంచమి ). మావూరు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి. ఇప్పుడది మండలం అయింది. మాగ్రామం జనాభాలో రెండవది.  మహబూబాబాద్ తాలూకాలో మొదటిది పెద్ద ముప్పారం. కానీ రెవిన్యూలో మా గ్రామమే పెద్దది. మాకు దగ్గరలో అంటే 11 కిలోమీటర్ల దూరంలో కేసముద్రం రైల్వేస్టేషన్, 22 కిలో మీటర్ల దూరంలో రోడ్డు మార్గంగా తొర్రూరు గ్రామం, 14 కిలోమీటర్ల దూరాన నెక్కొండ స్టేషన్. మొదట మాది వరంగల్ జిల్లా, మహబూబాబాద్ తాలూకా. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణాలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినపుడు మాది జిల్లా అయింది. నా బాల్యంలో ఇనుగుర్తి పాఠశాలలోనే రెండవతరగతి, మాఅమ్మమ్మగారి వద్ద నర్సింహుల పేటలో మూడవతరగతి చదవడం జరిగింది. అప్పుడు ఇనుగుర్తి పాఠశాలకు శ్రీమాన్ వెలగలేటి కృష్ణమాచార్యుల గారు ట్రాన్స్ ఫర్ మీద వచ్చారని నన్ను ఇనుగుర్తికి తీసుకొచ్చారు. వారు నాకు ఇంగ్లీష్, ఉర్దూ ప్రైమరు బోధించి నాల్గవ తరగతిలో మంచి పునాది వేశారు. అందువలన పదవతరగతి వరకు ఎక్కడా ఫెయిల్ కాలేదు. రెండవక్లాస్ లో ఉతీర్ణుడనయినాను. హన్మకొండ జదీబ్ వస్తానియా, మల్టీపర్పస్ హైస్కూలులో చదవడం జరిగింది. మాకు పదవతరగతిలో కాలేజీ ప్రిన్సిపాల్ అహ్మద్ హుసేన్ గారు చాలా మంచి ఇంగ్లీష్ టీచరు. దాదాపు అందరూ మంచి ఉపాధ్యాయులే.

2. మీ ఉన్నత విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఆ అనుభవాలు ఎటువంటివి?

జ: ఇంటర్ లో నేను బైపీసీ తీసుకున్నాను. ఇంగ్లీష్, సైన్సులలో పాసయ్యి రెండవ భాష ( సెకండ్ లాంగ్వేజ్ ) ఉర్దూలో 28/100 మార్కులతో ఫెయిల్ అయ్యాను. సప్లిమెంటరీలో 56/100 మార్కులతో పాస్ అయినాను ( ఒక్కొక్కసారి మార్కులు సరిగా వేయడం జరగదని నేను టాబులేషన్, స్క్రుటినీ చేస్తున్నప్పుడు అర్థమయింది. అప్పుడు రీకౌంటింగ్ ఎట్లు చేయించాలో తెలియదు. ఒక అబ్బాయికి 66 మార్కులు వస్తే 6 మార్కులు వేసి మెమో ఇచ్చారు. అతను రీకౌంటింగ్ చేయించుకుని ఉతీర్ణుడయినాడు. నేను ఖాళీగా ఉన్నందున ఖమ్మం జిల్లా కార్యాలయంలో క్లర్క్ గా చేరాను. మే చివరలో రిజైన్ చేసినప్పుడు జార్జు భట్ కలెక్టర్ భగవంతుడు ఇచ్చిన చిన్న ప్లేటును నిర్లక్ష్యం చేయవద్దని గిర్దావరుగా ప్రమోషన్స్ వస్తుంటాయని ప్రేమగా చెప్పారు. అయినా ఆ జాబు ఇష్టం లేకుండెను. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బి ఎస్ సి జాయిన్ అయినాను. అప్పుడు ఇంటర్ రెండు సంవత్సరాలు, డిగ్రీ రెండు సంవత్సరాలు బిఎస్ సి రెండు సంవత్సరాలు. డిగ్రీ సెకండ్ క్లాస్ లో పాసయ్యాను. ఎమ్మెస్సీ చేస్తే జాబులు సరిగా లేవని, ఇంటివద్దనే వ్యవసాయం చేస్తూ ఉండిపోయాను.

3.    వ్యవసాయం చేస్తూ ఇంటివద్ద వున్న మీకు ఉద్యోగంవైపు దృష్టి ఎలా మళ్ళింది?

జ:   ఆ సమయంలో మా మూడవ అన్నగారు గోపాలరావు గారు సర్పంచ్. పాలకుర్తి యాదగిరి అని ఒక సర్పంచ్ మా అన్నగారిని కలవడానికి వచ్చాడు. నన్ను చూసి మీవంటి వారు చదువుకున్నా గ్రామానికి ఏం లాభం చేయరు అని నాతో అన్నాడు. ఏం చేయాలో చెప్పామన్నాను. గ్రామ బాగోగులకు కొన్నిరకాల పనులు చేపట్టి గ్రామ ఆదాయం పెంచుకునేటందుకు జిల్లా పంచాయితీ ఆఫీసునుండి కొన్ని సూచనల కాగితాలు తెచ్చి ఇచ్చారు. కాణిచిట్టీ, అంగడి. అందులో నాకు అంగడి మంచిదనిపించి జిల్లా ఆఫీసునుండి అనుమతి తీసుకొని 1957 ఏప్రియల్ లో అప్పటి నిజాయితీ కాంగ్రెస్ నల్లపు పిచ్చయ్య గారితో, గ్రామ శాస్తుర్లు సీతారామయ్య గారిచేత పూజ చేయించి అంగడి ప్రారంభించాము. నన్ను దానికి సెక్రటరీగా నియమించారు. చాలా శ్రద్ధతో పశువుల మరియు ఇతర వస్తువుల క్రయ విక్రయాలు ఏర్పాటుచేశాము. ఇప్పటికీ పశువులు తక్కువే గానీ బట్టలు, ఇతర వస్తువుల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. అది గ్రామానికి మంచి ఆదాయం. అప్పుడు అక్కడి మాధ్యమిక పాఠశాల హెడ్మాస్టర్ వి. జనార్దన రావుగారు నాకు మంచి స్నేహితుడైనాడు. ఆయనగారి ఇంటికి ఒకరోజు మధ్యాహ్నం వెళ్లి ఉంటిని. అప్పుడు వారి ఇంటికి ఆయనగారి మిత్రుడు వరంగల్ నుండి వచ్చి ఉండెను. నన్ను అతనికి పరిచయం చేస్తూ బిఎస్ సి చేశాడని చెప్పాడు. ఆ మిత్రుడు వెంటనే నాకు ఇష్టమైతే వారి చిన్నాయన గారు బాజారు హనుమంతరావు గారి మహబూబియా స్కూల్లో సైన్సు టీచరు కొరకు అప్లికేషన్ ఇవ్వమన్నారు. పశువులకు ఆ సంవత్సరం నాగటి దున్నల రోగం వచ్చినందువలన బాగా నష్టం వచ్చింది. దాంతో వెంటనే జాబు చేయడం మంచిదనుకొని అప్లికేషన్ ఇచ్చాను. ఒక వారం రోజుల్లోనే అపాయింట్ మెంట్ లెటర్ వచ్చింది. వెంటనే వెళ్లి జాయిన్ అయినాను. నాకు ఎందుకో ప్రయివేట్ స్కూల్ కన్నా ప్రభుత్వ పాఠశాల బాగనిపించేది. ఏప్రియల్ చివర్లో వారే డిస్ కంటిన్యూ చేశారు. తర్వాత మీనం మేషం లెక్కిస్తూ మరల జూన్ లో జాయిన్ అవడానికి మే చివర్లో అప్లికేషన్ పంపాను. నేను రాననుకొని వేరే అతనికి అపాయింట్ మెంట్ లెటర్ పోస్టు చేసి, స్కూలుకు చేరగానే నా అప్లికేషన్ చేరి, హనుమంతరావు గారు కొంత విచారపడినారు. ఆ తర్వాత వెంటనే తొర్రూరు హైస్కూల్ కు సైన్స్ టీచరు కావాలని ఆ గ్రామస్తుడు A.V.B. హైస్కూలు టీచరు నన్ను కలిశాడు. మా గ్రామానికి 14 మైళ్ళు మాత్రమే ఉంటుంది తొర్రూరు. బాగానే ఉందని వెళ్లి జాయిన్ అయినాను. రెండు సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశాను.

4. టీచరు దశనుండి బయాలజీ లెక్చరర్ గా మీ ఉద్యోగ ప్రస్థానం కొనసాగిన క్రమాన్ని వివరించండి.

జ:  నేను తొర్రూరులో టీచరుగా చేస్తున్నప్పుడు మహబూబాబాద్ హైస్కూలులో బయాలజీ టీచరు లేక చాలా ఇబ్బంది ఉండింది. అక్కడ నా స్నేహితుడు కె. ఇంద్రారెడ్డి టీచరు నాజాడ అక్కడి హెచ్. ఎమ్ కు చెప్పాడు. వారు వెంటనే నా అప్లికేషన్ తెప్పించుకొని జిల్లా అధికారి అనుమతితో నన్ను అక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అప్పటి 12వ తరగతి పిల్లలకు బయాలజీలో 10,11,12 సంవత్సరాల కోర్సు బోధించాను. ఆ సంవత్సరం MBBS కు ముగ్గురు సెలెక్ట్ అయినారు. రెండవ సంవత్సరం 5,6 గురం టీచర్లం బెనారస్ లో ఇంగ్లీష్ ఎమ్.ఏ కొరకు స్టడీస్ మొదలు పెట్టాము. ఏవో కారణాల వల్ల రాఘవరావు గారు విరమించుకున్నారు. నేను, ఫిజిక్స్ టీచరు జి. రమణమూర్తిగారు మాత్రం బెనారస్ బయలుదేరాము. మా చదువు రైల్లోనే జరిగింది. ఇద్దరం నాల్గు పేపర్లలో మూడిట్లో పాస్ అయినాము. అతను ఇక లాభం లేదని డిపార్ట్మెంట్ కాండిడేట్ గా ఉస్మానియా యూనివర్సిటీకి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా పంపాడు. అతను చాలా సీనియర్, బిఎడ్ కూడా. నేను కూడా అప్లై చేశాను. నాకు సీనియారిటీ లేదని డైరెక్టర్ రిజెక్ట్ చేశారు. నాకు బీఎస్సీ బాటనీలో 55% ఉన్నందున వెంటనే యూనివర్సిటీ వెళ్ళి నా అప్లికేషన్ జనరల్ లిస్ట్ లో చూడవలసినదని లెటర్ యూనివర్సిటీకి రాశాను. నాకు సీటు వచ్చింది. 1964 లో ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ లోపాస్ అయినాను. ప్రాక్టీకల్స్ లో నా పర్ఫామెన్స్ మంచిగ ఉండి డా. ఎన్. రామయ్య లెక్చరర్ గారు నాకు లెటర్ రాసి న్యూ సైన్స్ కాలేజీలో వెకెన్సీ ఉందని తెలిపారు. నేను వెంటనే న్యూ సైన్స్ కాలేజీలో మోడల్ లెక్చర్ ఇచ్చాను. నన్ను జాయిన్ చేసుకున్నారు. నేను టీచరు సర్వీసుకు రిజైన్ చేయలేదు. ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ తరువాత వేసవిలో స్కూల్లో జాయిన్ అయినాను. దానివలన నాకు ఆ సర్వీసంతా కలిసి వచ్చింది. 1964 లో న్యూ సైన్స్ కాలేజ్, 1965 లో ఎన్. బి. కాలేజ్, సాయంత్రం అగర్వాల్ సైన్స్ కాలేజ్ లో మొదట లెక్చరర్ గా జాయిన్ అయ్యి 1992 వరకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా సేవలు చేశాను. అందరు స్టాఫ్ మెంబర్లతో, విద్యార్థులతో మంచిపేరు తెచ్చుకున్నాను. నాది 6 సంవత్సరాల స్కూల్  సర్వీసు, 28 సంవత్సరాల కాలేజీ సర్వీసు మొత్తం 34 సంవత్సరాల సర్వీసు కౌంట్ అయింది. చివరి సాలరీ పదివేలు ( నవ్వుతూ ) నెలకు. తరువాత 2 సంవత్సరాలు ప్రగతి కాలేజీ ఎల్బీనగర్ లో చేశాను. 1994 ఏప్రిల్ లో అమెరికా వెళ్ళి 9నెలలు ఉండి మా మొదటి మనుమడు శ్రీముఖ్ 21వ రోజు నామకరణోత్సవం చేసి ఇండియాకు తిరిగి వచ్చాము.

5. మీ కుటుంబం గురించి విశేషాలు చెప్పండి.

జ: మా అమ్మ, నాయనగారి సంతానం ఆరుగురు మగవారం, ముగ్గురు ఆడవాళ్ళు. నేను 9వ సంతానం. నేనే చివరివాడిని. నాకన్నా రెండున్నర సంవత్సరాలు పెద్ద అయిన సోదరి శ్రీమతమ్మ వరంగల్ వృద్ధాశ్రమంలో వున్నది. ఆమెకు భారత, భాగవతాలు క్షుణ్ణం. ఆశ్రమంలో ఉన్నవారికి చదివి వినిపిస్తుంటుంది. ఆమె ఒక్క దాని మటుకు సంతానం కలుగలేదు. 90% అందరి పిల్లలు సుఖ సంతోషాలతో వున్నారు. ఇక నాకుటుంబం దగ్గరకు వస్తే నాకు ముందు ముగ్గురు అమ్మాయిలు. తర్వాత ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయిలు ముగ్గురూ బాటనీ లెక్చరర్లుగా ఉద్యోగం చేసి రిటైర్ అయినారు. పెద్దమ్మాయి లక్ష్మీకుమారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు అమెరికాలో సెటిల్ అయినారు. రెండో అమ్మాయి రుక్మిణి. ఆమెకు ఇద్దరు కుమారులు. వారు కూడా అమెరికాలో వున్నారు. మూడో అమ్మాయి సీతాకుమారికి ఒక కుమారుడు డెంటిస్ట్. ఒక అమ్మాయి అమెరికాలో ఉంది. మా పెద్ద కుమారుడు విజయ్ కుమార్ వొలాంటే సాఫ్ట్ వేర్ కంపెనీ CEO. అతనికి ఒక కుమారుడు శ్రీముఖ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించాడు. కుమార్తె సారణి ‘పద్మ భూషణ్’ రుక్మిణీ అరండేల్ కళాక్షేత్ర ఫౌండేషన్ లో మూడు సంవత్సరాలు నాట్య శిక్షణ పూర్తి చేసింది. నా రెండవ కుమారుడు వేణు గోపాల్  పిహెచ్ డి ఫారెస్ట్రీలో. కానీ సాఫ్ట్ వేర్ జాబ్ అమెరికాలో. అతని భార్య డాక్టరు. వాళ్లకు ఇద్దరు కుమారులు పెద్దవాడు వినయ్. మంచి జాబ్ చేస్తున్నాడు. రెండవవాడు డిగ్రీ రెండవసంవత్సరం.

6. మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు సైన్సు కు సంబంధించిన రచనలు చేశారు..ఆ రేడియో ప్రసంగాల అనుభవాలు చెప్పండి

జ: నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ మరియు హిందూ పత్రికల్లో వచ్చిన పర్యావరణ వ్యాసాలు చదివి తెలుగు లోకి అనువదించేవాడిని. నా మిత్రుడు  డా. పి.ఎల్.కె. ఎమ్.రావు నన్ను ఆల్ ఇండియా రేడియోకు పరిచయం చేశారు. దాదాపు 60 ప్రసంగాలు చిన్నవి, పెద్దవి కలిసి చేశాను రేడియోలో. ఉర్దూలో కూడా అడవుల ప్రాముఖ్యత గురించి ప్రసంగాలు ఇవ్వడం, వ్యాసాలు కూడా రాయడం చేశాను. ప్రసంగాలు ఇచ్చేటప్పుడు  ప్రజలందరికీ కూడా అర్థమయ్యేరీతిలో  సామాన్య తెలుగులో ఇచ్చేవాడిని. మావూరి వారు నాతో ఆ ప్రసంగాలలోని విశేషాలను చెప్తుండేవారు. ఆ ప్రసంగాలనే విశాలాంధ్ర వారు పుస్తకం ప్రచురించారు. “పరిసరాలు, విజ్ఞానం” అదే నా మొదటి పుస్తకం.

7. మీరు హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి?

జ:     1946 లో హైదరాబాద్ కు నేను మొదటిసారి వచ్చినప్పుడు నాకొక వింత కనిపించింది. అదేంటంటే రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ గారు ప్రతీరోజు సాయంత్రం 5 గంటలకు కింగ్ కోఠీ నుండి చార్మినార్ అవతల మక్కా మసీదుకు నమాజు కొరకు వెళ్ళేవారు. ఆ సమయంలో పోలీసుల సీటీ మోతలు. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ ను నిలిపివేసేవారు. అందరూ ఆ ప్రయాణాన్ని గొప్పగా చూసేవారు. ఆ పద్ధతిని కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి కీ. శే. బూర్గుల రామకృష్ణారావు గారు నిలిపివేశారు. మొదటిసారిగా మనుషులు గుంజే రిక్షాలను చూశాను. నిజాం ప్రభుత్వ ప్రభావం వలన ఉర్దూ ఎక్కువగా మాట్లాడేవారు. క్రమ క్రమంగా పరిస్థితులు మనకనుకూలంగా మారుతూ తెలుగు మాట్లాడడం మొదలైంది. రద్దీ తక్కువగా ఉండేది. చాలావరకు కాలినడకే. మరీ దూరం అనుకుంటే లాగే రిక్షాలపై వెళ్లడం. వారిని అలా చూడడం చాలా బాధగా ఉండేది. రాను రాను మాములు రిక్షాలు, ఆ తరువాత ఆటోలు ఇలా వాహన సదుపాయం పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ అన్ని వైపులా బాగా విస్తరించింది. అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు ముఖ్యంగా గచ్చిబౌలి వైపు ఆకాశహర్మ్యాలు వెలిశాయి. 24 అంతస్తులు ఎత్తులో, అడ్డంగా, 24 పోర్షన్లతో..అప్పుడు ఇవన్నీ ఊహకందని విషయాలు.

8. ఒద్దిరాజు అనే పేరు వింటేనే ఒక సాహితీ వాతావరణం దృగ్గోచరమవుతుంది. మీ పూర్వీకులు, తెలంగాణాలో సుప్రసిద్ధ కవులు, రచయితలు అయిన ఒద్దిరాజు సోదరుల గురించి వివరించండి..

జ.  ఒద్దిరాజు సోదరులు ప్రతిభావంతులు. వారు బహుభాషాకోవిదులు. అన్ని భాషలు స్వయంకృషితో నేర్చినవే.  ఆంగ్ల ఓవర్సియరు వద్ద ఇంగ్లీష్ ప్రైమరు, ఆయన ట్రాన్స్ఫర్ తరువాత మానుకోట డాక్టరు సలహాతో ఆంగ్లపత్రికలు చదవడం, అట్లు నేర్చుకొని రవీంద్రుని ‘wreck’ ఆంగ్ల నవలని తెలుగులోకి అనువదించారు. ఇది చాలా గొప్ప విషయం. రాత్రిళ్ళు గస్తీ చేసే గుఱ్ఱపు సవార్ల వద్ద ఉర్దూ మొదలు పెట్టారు. వారి ట్రాన్స్ఫర్ తో “లొగాత్ కిశ్వరీ “డిక్షనరీ తెప్పించుకొని ఉర్దూ నేర్చారు. మేక చర్మాల వ్యాపారి తమిళుని వద్ద ఆయనకు తెలుగు నేర్పుతామనే వాగ్దానంతో తమిళం నేర్చారు. ఆ వ్యాపారి మాత్రం పనుల మూలంగా తెలుగు నేర్చుకోలేకపోయాడు అది వేరే సంగతి (నవ్వుతూనే). సోదరులిద్దరూ డాక్టర్లు, ఇంజనీర్లు, పండితులు, కవులు, అనువాదకులు జర్నలిస్టులు. 1922 నుండి 1927 వరకు తెనుగు పత్రికను పల్లెటూరు నుండే నడిపించారు. అది వారపత్రిక. గ్రామానికి పోస్ట్ ఆఫీస్ తెప్పించారు. వడ్లగిర్నీ, వేరుశనగ తీసే మరలు ఏర్పాటు చేశారు. ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి పరీక్షలు ఉతీర్ణులైనారు. గ్రామఫోన్, హార్మోనియం, ఫిడేలు, వయోలిన్, సైకిల్, టార్చ్ లైట్ తెచ్చి అందరికీ పరిచయం చేయించారు. వారి బంగ్లాకు బ్యాటరీల సహాయంతో ఎలక్ట్రిక్ లైట్లు, నల్లాలు ఏర్పాటుచేసి బంధువులను ఆశ్చర్యపరిచారు. గృహప్రవేశ సమయంలో వచ్చిన అతిథులకు ఇడ్లీలు అల్పాహారంగా పెట్టడం ఆనాటి జనులు ఊహించలేని విషయం. సోదరులలో పెద్దవారు కట్టించిన బిల్డింగులో ఒక వైపు పసుపు పచ్చ కాగితంపై పైనుండి క్రిందికి ఒద్దిరాజు సీతారామచంద్రరావు అని రాయడం నేను స్వయంగా చూశాను. దాని ప్రకారం సిమెంటుతో ఆ అక్షరాలు కట్టించారు. అప్పుడు నేను నాల్గవ తరగతిలో ఉంటిని. వారి గొప్పతనమంతా డా. కొండపల్లి నీహారిణి తన పిహెచ్ డి లో వివరించింది.  ముఖ్యంగా అటువంటివారు అరుదే. ఆచార్య రామరాజు గారు అన్నట్లు వారు 64 కళల్లో ఒక చౌర్యం తప్ప అన్నింటిలో నిష్ణాతులు.

9. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను, లియో టాల్ స్టాయ్ కథలను అనువదించారు. వాటిపై దృష్టి సారించడానికి కారణం ఏమిటి? అనువాద సాహిత్యంలో మీ పాత్ర ఎటువంటిది?

జ :  కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. వాటిని చదివినప్పుడు ఆ కథలు తెలుగు వారు చదవాలనే ఉద్దేశ్యంతో అనువదించాను. రవీంద్రుని కథల పుస్తకం ఆంగ్లంలో ఉన్నది  దొరికింది. దానిని తెలుగువారికి అందుబాటులోకి తేవాలని అనువదించి పుస్తకం ముద్రింపచేశాను. ‘కాబూలీవాలా’ చాలా గొప్ప కథ. లియో టాల్ స్టాయ్ కథలు “అందరి దేవుడు ఒకడే” అనే పేరుతో పుస్తకం ముద్రింపచేశాను. దానిలో ముఖ్యంగా “మనిషికి ఎంత భూమి కావాలి”  “మానవజీవితం-దైవ నిర్ణయం” మొదలగు ఎన్నో కథలు నీతివంతమైనవి. అలాగే నాకు ‘సంత్ దర్శన్’ అనే ఆంగ్ల పుస్తకం దొరికింది. దాంట్లోని గొప్పవాండ్ర చరిత్రను “భక్తాగ్రేసరులు” అని తెలుగులోకి అనువదించి ముద్రింపచేశాను. అదే మాదిరి పన్నిద్దరాళ్వాల  దివ్య సంగ్రహచరిత్ర పుస్తకం ముద్రింప చేశాను. ఒకసారి మా మనవడి పుస్తకాల రాక్ లో “Bed time stories” బుక్ కనబడింది. దానిలోని కథలన్నీ చదివి, ఆ రైటర్ అనుమతి తీసుకొని ‘పాడేపక్షులు’ పుస్తకంగా అనువదించి ముద్రింపచేశాను. వాటి సేల్స్ కొరకు ‘పాలపిట్ట’ పత్రిక సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లు గారికి అప్పగించాను. ముఖ్యంగా  నా పుస్తకాలన్నీ ఆంగ్లం నుండి అనువదించినవే. ఇలా నచ్చిన పుస్తకం ఏదైనా ఉంటే అనువాదం చేస్తుంటాను.

10.  ఠాగూర్ ‘ది రెక్’ నవల ‘నౌకాభంగం’ అనే పేరిట ఒద్దిరాజు సోదరుల చేత అనువదించబడింది. చాలాకాలం తర్వాత గానీ అది ముద్రణకు నోచుకోలేదు. దాన్ని అచ్చులో చూడాలని మీరు ఎంతగానో తపించారు. అది పుస్తకరూపంలోకి రావడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేశాయి?

జ:       కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. వాటిని చదివినప్పుడు ఆ కథలు తెలుగు వారు చదవాలనే ఉద్దేశ్యంతో అనువదించాను. రవీంద్రుని కథల పుస్తకం ఆంగ్లంలో ఉన్నది  దొరికింది. దానిని తెలుగువారికి అందుబాటులోకి తేవాలని అనువదించి పుస్తకం ముద్రింపచేశాను. ‘కాబూలీవాలా’ చాలా గొప్ప కథ. లియో టాల్ స్టాయ్ కథలు “అందరి దేవుడు ఒకడే” అనే పేరుతో పుస్తకం ముద్రింపచేశాను. దానిలో ముఖ్యంగా “మనిషికి ఎంత భూమి కావాలి”  “మానవజీవితం-దైవ నిర్ణయం” మొదలగు ఎన్నో కథలు నీతివంతమైనవి. అలాగే నాకు ‘సంత్ దర్శన్’ అనే ఆంగ్ల పుస్తకం దొరికింది. దాంట్లోని గొప్పవాండ్ర చరిత్రను “భక్తాగ్రేసరులు” అని తెలుగులోకి అనువదించి ముద్రింపచేశాను. అదే మాదిరి పన్నిద్దరాళ్వాల  దివ్య సంగ్రహచరిత్ర పుస్తకం ముద్రింప చేశాను. ఒకసారి మా మనవడి పుస్తకాల రాక్ లో “Bed time stories” బుక్ కనబడింది. దానిలోని కథలన్నీ చదివి, ఆ రైటర్ అనుమతి తీసుకొని ‘పాడేపక్షులు’ పుస్తకంగా అనువదించి ముద్రింపచేశాను. వాటి సేల్స్ కొరకు ‘పాలపిట్ట’ పత్రిక సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లు గారికి అప్పగించాను.ముఖ్యంగా నా పుస్తకాలన్నీ ఆంగ్లం నుండి అనువదించినవే. ఇలా నచ్చిన పుస్తకం ఏదైనా ఉంటే అనువాదం చేస్తుంటాను.

11. ఒద్దిరాజు సోదరుల పుస్తకాల ఆవిష్కరణ సభల్లోమీ కృషి చాలా ఉందని అంటుంటారు… ఆ అనుభవాలను కొన్నింటిని మాకోసం…

జ: ఒద్దిరాజు సోదరులు నాకు చిన్నాన్నలు అవుతారు. ఇంతకుముందే చెప్పుకున్నట్లు ‘రెక్’ నవల మా అక్క కోరిక మేరకు ఆవిష్కారానికి నేను ప్రయత్నం చేసి సాధ్యం చేసుకున్నాము. అదేవిధంగా చిన్నవారైన రాఘవ రంగారావు కూతురు రంగరాజు పద్మజ (నాకు చెల్లెలు) వాళ్ళ నాన్నగారి శతజయంతి వేడుకలు జరపాలని తన కోరిక తెలిపింది. దాని కొరకు కోదాటి నారాయణ రావు గారిని కలిశాను. ఆయన “వారు అన్ని పనులు కలిసి చేశారు కాబట్టి ఇద్దరికీ కలిపి శతజయంతి వేడుకలు జరపాలని” ఆన్నారు. ఆయన సలహా మేరకు రామరాజు గారిని కలవడం, ఆయన రచించిన “తెలుగు సాహిత్యోద్ధారకుల” గ్రంథంలో ప్రస్తావించిన ఒద్దిరాజు సోదరులకు సంబంధించిన వ్యాసాన్ని చూపడం జరిగింది. దర్భా శేషాచార్యులతో విషయం చెప్పగానే కోవెల సంపత్కుమారాచార్యులు గారు, కోవెల సుప్రసన్నాచార్యులు గార్లతో సంప్రదించి ప్రణాళిక ఏర్పాట్లు సిద్ధం చేశారు.  ఆ సందర్భంగా ఇనుగుర్తి, హైదరాబాద్, వరంగల్ లో మూడు సమావేశాలు నిర్వహించాము. అయితే ఒద్దిరాజు వారు రచించిన పుస్తకాలు దాదాపు వందకు పైగా ఉంటాయి. అముద్రితాలైన వ్రాత ప్రతులు జీర్ణస్థితికి వచ్చాయి. వారి కుమారులు డా.వేంకట నరసింహారావు గారు బైండింగ్ చేయించారు. ఆయన కుమారుడు సుభాష్ చంద్రరావు ( సీతారామ చంద్ర రావు గారి మనుమడు) వాటి ముద్రణ కోసం వాటన్నింటినీ నాకు అందించాడు. క్రమంగా వాటిని ముద్రించాలనుకున్నాం. ఇట్లా అనేక పుస్తకాలను ఆవిష్కరించాము. అయితే ఇదంతా జరగడానికి కారణం వారి కుటుంబీకులే. వారు ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టి ఈ రోజు మనకు ఒద్దిరాజు సోదరుల సాహిత్యాన్ని మనకు అందించారు. అంత గొప్ప సేవ చేసిన సోదరుల గురించి చాలామందికి తెలియక పోవడం దురదృష్టకరం.

12. సుధామూర్తి గారి అమ్మమ్మ కథలు అనువాదం చేశారు కదా..మయూఖ పత్రిక బాల సాహిత్యంలో చదివాను.. వాటి గురించి వివరిస్తారా?

జ: సుధామూర్తి గారి అమ్మమ్మ సంచీలోని 22 కథలను అనువదించాను. వారి  ఇంతకు ముందే అలకానంద, విజయవాడ పబ్లిషర్సుకు అనుమతించారు. కాబట్టి నాకు పర్మిషన్ రాలేదు. అవే కథలు డా. కొండపల్లి నీహారిణి తన మయూఖ ఆన్ లైన్ పత్రికలో ప్రచురిస్తున్నది..

13. ఇతర పత్రికలలో మీ రచనలు ఏవైనా వచ్చాయా? ఇంకా కూడా ఏమైనా రచనలు చేస్తున్నారా?

జ:       నా వ్యాసాలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఉర్దూ సియాసత్, సైన్స్ కీ దునియాలో ప్రచురించబడినాయి. నేను ఒకసారి అడవుల ప్రాముఖ్యత ( జంగల్ కి మహ ఫూజ్ కిస్ లియే ) రేడియో టాక్ ఇచ్చినాను. మా గ్రామానికి దగ్గరలో సీతారాంపురంలో ఒక ఈతచెట్టు వంగడం, లేవడం దినచర్య గురించి నేను స్వయంగా వెళ్ళి 24 గంటలు అక్కడనే ఉండి చూసి ఆ సమాచారం ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,సియాసత్ లో ప్రచురింపచేశాను. నేను రిఫర్ చేసిన పత్రికలు హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాత్రమే. మరో విషయం. మా సహాధ్యాయి, పండితులు శ్రీమాన్ వెలగలేటి నర్సింహాచార్యుల వారి జ్ఞాపకార్థం ఒక పుస్తకం ప్రచురించాలనే ఉద్దేశ్యంతో పూర్వ విద్యార్థులు, శిష్యులు, అభిమానులు “స్మృతి కదంబం” అనే పేరుతో పుస్తకాన్ని ముద్రింప చేశారు. నర్సింహాచార్యులు గారు గొప్ప పండితులు. ఉపన్యాసకులు. శిష్యులు, అభిమానులు, వారి కుమారులు రచించిన వ్యాసాలు ఇందులో పొందు పరచబడ్డాయి. జ్ఞాపకం ఉంచుకోదగిన వ్యక్తి. ఆ ప్రచురణకు నేను ఒక సంపాదకుడిని. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నవంబర్ 2016లో ముద్రించబడింది. నా ఆర్టికల్ కూడా దాంట్లో ఉంది. వారి ముగ్గురు అబ్బాయిలు డాక్టర్లు. వారి పెద్దబ్బాయి డా. రాఘవాచారి మానుకోట పాఠశాలలో నా శిష్యుడు. అతను మొత్తం కుటుంబాన్ని పైకి తీసుకువచ్చాడు. చాలా ఉత్తముడు. ఇంకో గొప్ప అనుభూతి చెప్తాను. రామరాజు గారు ఏడుగురు పండితుల గొప్పదనాలను తెలుపుతూ ” తెలుగుసాహిత్యోద్ధరకులు” అనే పుస్తకం వేశారు. అందులో ఒద్దిరాజు సోదరుల విషయాన్ని ప్రత్యేకంగా ముద్రిస్తే బాగుంటుంది అని ఆయన నాతో అన్నారు. అది ఆవిష్కరణ త్యాగరాయ గాన సభలో జరిగింది. అక్కడికి ద్వానా శాస్త్రి వచ్చారు. ఆయన అప్పటికి నాకు తెలియదు. ఆయనకు అప్పుడు 62 ఏళ్ళు. ఆ సందర్భంగా ఆయన 62మంది తెలుగు పండితులను ఒక్కచోట చేర్చి పుస్తకం వేయాలని సంకల్పించారు. “మీ చిన్నాన్నల గురించి 8 పేజీలు రాసి వారం రోజుల్లో ఇవ్వగలరా” అని అడిగారు. నేను సరేనని 4 రోజుల్లో ఇచ్చాను. ( పెద్దగా నవ్వుతూ ‘బికారీ కీ భూక్ కీ ఫికర్’ అన్నట్లు…బిచ్చగాడు ఎప్పుడూ ఆకలికి అలమటిస్తున్నట్లు నాకు రాయడం ఇష్టం కాబట్టి ఎవరు అడిగినా ఆలస్యం లేకుండా రాయడం ). ద్వానా శాస్త్రిగారు కాలక్రమాన్ని అనుసరించి వరుసగా పండితులను పరిచయం చేస్తూ  ‘మా నాన్నగారు’ అనే పేరుతో ప్రచురించారు. 

          నేను పత్రికలు, ఇతర పుస్తకాలు చదువడం, వ్యాసాలు రాయడం చేస్తూ ఉంటాను. ఇప్పటికి ఎనిమిది పుస్తకాలు రాశాను. ఒక్క మా అమెరికా యాత్ర తప్ప మిగిలిన ఏడు పుస్తకాలు ఆంగ్లం నుండి అనువదించినవే. ఇక ప్రస్తుతం నా ఆత్మకథ రాయాలని సంకల్పించి మొదలు పెట్టాను. అదీగాక షేక్ స్పియర్ రచనల్ని అనువాదం చేయాలని ఉంది. చదవడం, రాయడమే కదా నా పని..( నవ్వుతూ ).

14. అమెరికాలో ఉన్నప్పుడు ఆ విశేషాలతో పుస్తకం రాసారని విన్నాం..దానికి ప్రేరణ ఏమైనా ఉందా?

జ:  1994లో నేను, నా సతీమణితో యుఎస్ ఏకు మా పెద్దబ్బాయి 6 నెలల కొరకు వద్దకు వెళ్ళి, మనవడు కలగపోతున్నందుకు ఇంకో 3 నెలలు పొడిగించుకొని నామకరణోత్సవం చేసి తిరిగి వచ్చాము. అయితే మేము వెళ్లేముందు మిత్రుడు దర్భా శేషాచార్యులు గారు మేము బేగంపేటలో అడుగు పెట్టినప్పటినుండి తిరిగి బేగంపేటలో అడుగు పెట్టేవరకు మా అన్ని అనుభవాలు పూస గుచ్చినట్లు తెలపాలని కోరారు. ఆ ప్రకారం మేము లెటర్స్ రాశాము. అవి ఆ దేశాన్ని చూసేవారికి గైడుగా ఉన్నాయని, ప్రింటు చేస్తే బాగుంటుందని మిత్రులు సలహా ఇవ్వడంతో  “మా అమెరికా యాత్ర” అనే పేరుతో ప్రింటు చేయించాము. ఈ మధ్యనే  రెండవ ప్రింటు కూడా చేయించాము. అది చదివినవారికి దాదాపు ఆ ప్రదేశాలు చూస్తున్న తృప్తి కలిగిందనేవారు. నేను, నా సతీమణి ఇప్పటికి ఐదుసార్లు అమెరికా వెళ్ళి వచ్చాము. మొదటి ట్రిప్ వలె మిగతా నాలుగు ట్రిప్పుల సమాచారం పుస్తకరూపంలో చేయాలని ఉంది.

          ఇక్కడ ఒక విషయం తెల్పాలి. నేను మానుకోట హైస్కూల్ లో పనిచేస్తున్నప్పుడు శ్రీమాన్ వెలగలేటి నర్సింహాచార్యుల గారు గొప్ప తెలుగు మాస్టరు గారు. వారి పెద్ద కుమారుడు కుమారుడు రాఘవాచారి. తెలివైన వాడు. 11th, 12th లో అతనికి టీచరును. ఆ తర్వాత ఆయన పి.పి.సి హైదరాబాద్ లో చేరాక కూడా నా వద్దకు వస్తుండేది. అతను ఎమ్ బిబిఎస్ చేశాక రెండు సమస్యలు. ఒకటి అమెరికా డాక్టరుగా వెళ్ళడం, రెండవది మిలిటరీ జాబు. నా వద్దకు వచ్చి ఏది బాగని అడిగాడు. “మిలీటరీలో చేరితే నీ కుటుంబం బాగానే ఉంటుంది కానీ తమ్ములకు, కుటుంబానికి మాట తప్ప సహాయం చేయలేవు. అదే అమెరికాకు వెళ్ళితే మొత్తం కుటుంబాన్ని పైకి తీసుకురాగలవని” భగవంతుడు నాతో చెప్పించాడు. అందుకు వారి తండ్రిగారు నామీద కొద్దిగా అసంతృప్తి చెందినాడు. కారణం రాముడు అడవికి పోతుంటే దశరథునికి మనస్తాపం కలిగినట్లు. ఏదైతే ఏం? చాలా బుద్ధిమంతుడు. మొత్తం కుటుంబాన్ని ఆదుకున్నాడు. అందరు తమ్ముల అభివృద్ధికి తోడుపడినాడు. అతను వెళ్ళాడు కాబట్టి మా పెద్దన్నయ్యగారి రెండవకుమారుడు లక్ష్మణ్ రావును ధైర్యంగా అమెరికా పంపించాము. అతను అక్కడ ఉన్న ధైర్యం మీద నా పెద్ద కుమారుడు విజయ్ కుమార్ ను, అతను ఉన్నాడని మా రెండవ అబ్బాయి వేణు గోపాల్ ను పంపించాను. ఇప్పుడు దాదాపుగా ప్రతీ కుటుంబం నుండి ఒకరో, ఇద్దరో వెళ్తున్నారు. ఆర్థికంగా, మంచిగా సెటిల్ అవుతున్నారు.

15. ‘భక్తామృతం’ ఆధ్యాత్మిక పత్రికలో మీ రచనలు చాలా వచ్చాయి. వాటిలో మీరు భావావేశం పొందినవి ఏమైనా ఉంటే చెప్పండి.

జ:       ‘భక్తామృతం’ మాసపత్రికకు 2021 నుండి నాకు నచ్చిన వ్యాసాలు రాస్తున్నాను.  స్వామివారు ఇష్టపడుతున్నారని ఒద్దిరాజు వారి వ్యాసాలు ఎక్కడ అని అడుగుతుంటారని ఎడిటర్ డా.జి. మోహనా చార్యుల వారు అంటుంటారు. ఒకరోజు సుల్తాన్ బజార్ లోని గ్రంథాలయంలో పుస్తకాల ఆవిష్కరణ గురించి వెళ్ళినపుడు స్వామి వారు మే 25వ తేదీన నన్ను దీవించుటకు విజయవాడ నుంచి వేంచేశారు. నా గురించి నాల్గు మంచి మాటలతో పొగుడుతుంటే నేను అంత అర్హుడినా యని తలవంచుకున్నాను. అది వారు నాపై చూపిన కరుణ. ఆ సందర్భంలో నేను పొందిన ఆనందం, అనుభూతి అంతా ఇంతా కాదు

16. మీరు చేసిన ఉత్తర భారతదేశ యాత్ర గురించిన  అనుభవాలు ఎటువంటివి?

జ:    మా స్నేహితుడు కళకుంట్ల అళహ సింగరాచార్యులు ప్రతీ సంవత్సరం ఉత్తర భారదేశ యాత్రకు బస్సు ఏర్పాటు చేసి తన భార్యతో సహా బయలుదేరేవారు. 1993 లో నేను, నా సతీమణి, ఇంకా నాకు తెలిసిన 3 జతల మిత్రులు, మిగతావారిలో  పర్కాల తాలూకా శనిగరం గ్రామ ఆచార్యుల రెండు కుటుంబాలు కలిసి 35 రోజుల ప్రయాణం ఏర్పాట్లతో 55 మంది ప్రయాణీకులం ఉన్నాం బస్సులో. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా మా ఇంటి అల్లుడు డా.సి. ఎల్. నర్సింహారావు గారు జ్వరం, వాంతులు, విరేచనాలకు, నొప్పులకు మందులు రాసి ఇచ్చారు. హన్మకొండ నుండి గమ్యం బద్రీనాథ్, కేదారినాథ్. మొదటిరోజు గడిచింది. రెండవరోజు నుండీ ప్రయాణీకులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. నేను వెంటనే బాధితులకు నా వద్ద నున్న మందులు, నిమ్మకాయనీళ్ళు, పంచదార కలిపి ఇస్తూ ఆరోగ్యం నిమ్మళపడేట్లు చేశాను. ఒకరి తర్వాత ఒకరు దాదాపు 20 మంది వరకు అవస్థపడి నెమ్మదిగా కోలుకున్నారు. మందులు అయిపోయిన కొద్దీ ఏ సిటీ వస్తే ఆ సీటులో మందులు మరల కొని భర్తీ చేసుకునేవాణ్ణి. ఒక్కోసారి మందులు బ్యాగునుండి తీయడం ఆలస్యం అవుతుందన్న భయంతో సీటులో పక్కనే పెట్టుకునేవాడిని. నా భార్య కూడా నాకు ఓపికగా సహాయపడింది.  ఇక మధ్యప్రదేశ్ లో ప్రయాణం జరుగుతున్నప్పుడు వయసులో పెద్దవారైన ఒక ఆచార్యులు సంస్కృతంలో వారి బాధ చెప్పడం, నాకు అర్థం కాకపోవడం. తీరా ఏంటంటే ఆయనకు కలిగిన బాధకు తనను అక్కడే వదిలేసి పొమ్మంటున్నారు ఆయన. కానీ వారికి ధైర్యం చెప్పి తగిన మందులు ఇచ్చి ఊరట కలిగించాను. ఇటువంటిదే మరొక కేసు. మా పరమ మిత్రుడు వెలగలేటి శ్రీనివాసాచార్యుల వారు బద్రీనాథ్ లో వేరొక గది తీసుకుని పడుకున్నారు.  ఆ అర్ధరాత్రి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతూ నన్ను లేపడానికి మోహమాటపడి చివరకు తప్పక లేపారు. మందులు ఇచ్చాను. కానీ బాగా నీరసపడినారు. తెల్లవారే మా తిరుగుప్రయాణం. ఆయన నడవలేకపోతుంటే బుట్టలో కూర్చుండ బెట్టుకొని మనిషి మోతతో బస్సువద్దకు చేర్చాము. ఆయన బస్సు తీసినాయనకు బావమరిది. భోనగిరి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్. మొత్తానికి అందరం క్షేమంగా హన్మకొండ చేరారు. మేము మాత్రం భద్రాచలంలో దిగి దైవ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చాం. ఎవ్వరి దగ్గరా మందులకు డబ్బులు తీసుకోలేదు. ఆ రోజుల్లో నాకు 600 రూ. ఖర్చు అయ్యాయి. వాటికంటే కూడా సమయానికి వారికి నాకు తోచినంతలో సహాయపడ గలిగానని తృప్తి కలిగింది. అంతా భగవంతుని దయ. ఒకనాడు బద్రీనాథ్ లో నది పక్కన  శనిగరం ఆచార్యులు తిరుమణి కాపు చేసుకుంటున్న వారి ఫోటో తీసి పోస్టులో పంపాను. వారు ఎంతో సంతోషించారు. ఆ కాలంలో అది ఒక ప్రత్యేకం. ఇవన్నీ మరపురాని గుర్తులు. ఇక గయ, బద్రీనాథ్ లలో సంప్రదాయబద్ధంగా పితరులకు పిండ ప్రదానాలు కూడా చేసాం.

17. మీ ఉద్యోగ జీవితంలో విద్యార్థులను ప్రోత్సాహపరచినట్లు మీకు తెలిసినవారి విషయంలో కూడా చదువు గురించి ప్రోత్సాహపరచిన మరచిపోలేని అనుభూతి ఏమైనా ఉంటే చెప్పండి..

జ:   డాక్టర్ సి.ఎల్. నరసింహారావు చాలా సహృదయులు. సాహితీప్రియులు కూడా. ఆయన ఎన్నో పద్యాలు, శ్లోకాలు అనర్గళంగా చదువుతారు. ఆయన నాకు వరుసకు అల్లుడు అవుతారు (ఒద్దిరాజు సీతారామచంద్రరావు మనవరాలుకు భర్త).నాకంటే సంవత్సరమే పెద్ద. కాబట్టి ఎంతో సన్నిహితంగా మెలిగేవాళ్ళం. ఒకళ్ళనొకళ్ళం మామూసాబ్ అని పిలుచుకునేవాళ్ళం. వాళ్ళు హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారింటికి తరచూ వెళ్తుండడం వల్ల పిల్లలతో కూడా చనువు ఏర్పడింది. వారి రెండవ కుమారుడు వేణు అతడు వరంగల్ కాలేజీలో ఫిషరీస్ కోర్స్  పూర్తి చేశాడు. ఎమ్ ఎస్ సి గురించిన విచారం మొదలైంది. అతనికి సౌరాష్ట్రలో సీటు దొరికింది కానీ చాలా దూరం. ఏమీ చేయడానికి పాలు పోని పరిస్థితి. అయితే నేను ఎమ్ ఎస్ సి చేస్తున్నప్పుడు బి.హాస్టల్ సీనియర్ హౌస్ మానిటర్ గా ఉంటిని. అప్పుడు ప్రొఫెసర్ అనంతం గారు హాస్టల్ వార్డెన్. వారితో నాకు చనువు ఏర్పడింది. భగవంతుని ప్రేరణగా ఒకసారి వారు బొంబాయి యూనివర్సిటీలో పని చేస్తున్న వారి మిత్రుడు ప్రొఫెసర్ దేవరాజ్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ వున్నాను. వారి వద్ద ఎమ్ ఎస్ సి చేస్తే ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుందని అనంతం గారు నాతో అన్నారు. నాకు వెంటనే వేణు గురించిన ఆలోచన వచ్చింది. కానీ బొంబాయిలో మాకు తెలిసిన ఆచార్యుల అబ్బాయి రొట్టెలు పడక రక్తవిరేచనాలతో మరణించాడు. ఆ భయం వున్నప్పటికీ వేణు రొట్టెలు తిని ఉండగలుగుతాడు అన్న నమ్మకంతో నరసింహారావు గారి అంగీకారంతో వేణును బొంబాయి పంపించడం జరిగింది. దేవరాజు గారు గట్టి క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ ఇచ్చారు. అందువల్ల వేణు కూడా బుద్ధిగా చదువుకొని ఆయనకు ప్రియశిష్యుడైనాడు. అక్కడే కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన వేణు అమెరికా వెళ్లి మంచిగా స్థిరపడినాడు. అది నాకు ఎంతో సంతోషదాయకం. అంతేకాక వేణు కూడా సాహిత్యాభిలాష కలిగివుండడం గొప్ప విషయం. డిగ్రీలో ఫిషరీస్ కోర్సు చేసి, సముద్రాలు దాటి ఫిష్ వలె అమెరికా చేరాడు కాబట్టి నేను వేణును ముద్దుగా ఫిష్ అని పిలిచేవాడిని. ఇప్పటికీ అలాగే పిలుస్తాను. ఆ విధంగా ఆ పిల్లవాడు వేణు జీవితంలో స్థిరపడడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం. అయితే ఇందులో భగవంతుని అనుగ్రహం తప్ప నా గొప్పతనం ఏమీలేదు. సమయానికి భగవంతుడు నా చేత అలా చేయించాడు అంతే.

 ఈ మధ్యనే వేణు అమెరికానుండి ఇండియాకు వచ్చాడు.  డాక్టరు గారు నాతో మాట్లాడుతూ “మామూసాబ్, మీ ఫిష్ వచ్చాడు” అని నవ్వుతూ చెప్పారు. డాక్టరు గారి పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు నాతో ఎంతో చనువుగా వుంటారు. వారి మూడవ కుమారుడు డాక్టర్ శ్యామ్. శ్యామ్ పెద్దకూతురు శ్రియ తన చిన్నతనంలో  నేను వాళ్ళింటికి వెళ్లి మెట్లు ఎక్కుతున్నప్పుడు  మురళి తాతయ్య వస్తున్నాడు అనేది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇప్పటికీ చిన్నతనపు ఆ గుర్తులు ఆ అమ్మాయి మర్చిపోలేదు. ఈ విషయాలన్నీ నేను స్వీయచరిత్రలో రాసుకున్నాను.

18. మీరు పుట్టిన ఇనుగుర్తితో ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయా? ఎలా?

జ: ఇనుగుర్తిలో పూర్వం 22 బ్రాహ్మల ఇండ్లు ఉండేవి. ఇప్పుడు మా ఇంట్లో మా అన్నగారి కుమారుడు వసంత్ ఉంటున్నాడు. గుడి పూజారి, ఒక స్థానాచారి, వెంకటాచార్యులనే రిటైర్డు టీచరు, ఇంకొక ఇల్లు ఆచార్యులది ఉంది అంతే. అక్కడ ప్రస్తుతం బ్రాహ్మణ సావాసమే లేదు. నాకు ఆ గ్రామంలో మూడు ఎకరాల తరిభూమి ఆరు ఎకరాల చెలుక భూమి వుంది. మా నాల్గవ అన్నగారి కుమారుడే చూస్తుంటాడు. నేను వెళ్లడం సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నది. ఆలయం గురించి మా కుటుంబాల వారంతా వెళ్ళి వస్తుంటారు. ఇక్కడ ఉండి కూడా నేను మనసులో దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ ఉడియవర్లను, ఆంజనేయుని, తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తీర్థం, శఠారి తీసుకుంటున్నట్లు భావిస్తుంటాను. ఆ తరువాతనే ముకుందమాల శ్లోకాలు చదువుతాను.

అంతా దేవుని దయ.

       ఇక్కడ మరో విషయం చెప్పాలి. మేము జూన్ 2021 లో కరోనా వ్యాధికి గురైనందున మా పెద్దకుమారుడు విజయ్ కుమార్ మమ్మల్ని ‘కాంటినెంటల్ ‘ ఆసుపత్రిలో చేర్పించారు. ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినాక అధిక శుభ్రత కలిగిన తన బావమరిది ఇంట్లో పదిరోజులు ఉంచి, తన ఇంటికి అంటే ఇప్పుడు మేమున్న ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటి నుండి ఇక్కడే వుంటున్నాము. అప్పుడప్పుడు నల్లకుంటలోని మా స్వగృహానికి పోయి రావడం జరుగుతున్నది. మా చిన్న కుమారుడు వేణుగోపాల్ అమెరికాలో కుటుంబంతో ఉంటున్నాడు. ప్రతి రెండు రోజులకొకసారి ఫోన్ చేస్తుంటాడు. అవసరమైనప్పుడు కొద్దిరోజులు ఉండిపోతాడు. ఇక్కడ మాకు అన్ని వసతులు బాగున్నాయి. మా శ్రీమతి ప్రతిరోజు ఒక పేజీ రామకోటి రాస్తుంటుంది. ఇప్పటికి అవి ముప్ఫయి లక్షల యాభై వేలు అయింది.

శతకోటి వందనాలు గురువుగారు. తొమ్మిది దశాబ్దాల వయస్సులో  మేము అడిగిన వాటికి ఎంతో ఓపికగా మీరు సమాధానాలు ఇచ్చినందుకు మా పాఠకుల పక్షాన, మా పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు. మీకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్త్రీల సాధికారత

by Kondapally Neeharini July 12, 2023
written by Kondapally Neeharini

భారతీయ సమాజంలో కుటుంబం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జీవన సరళి మొత్తం కౌటంబిక వ్యవస్థ పైన ప్రముఖ స్థానం ఇస్తుంది .ఉజ్వలమైన స్త్రీల భవిష్యత్తును అంధకారంలో పడేసే దుష్టశక్తులు ఏవో పసిగట్టి దుర్మార్గులను కృష్ణ జన్మాస్థానానికి పంపించినప్పుడే న్యాయం జరుగుతుంది. లైంగిక వేధింపులు చేసే ఆ దుర్మార్గులైన వాళ్ళను శిక్ష గురి చేసేలా కృషి చేయవలసిన బాధ్యత సమాజానిదే. మానసికంగా స్త్రీల ను కృంగీదీసి శారీరక శ్రమను దోచుకుంటారు. స్త్రీల సాధికారతకు స్త్రీలపై వివక్షకు ఏంటి సంబంధం?  సరైనటువంటి అభిప్రాయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.వివక్ష లేకుండా ఉంటే సాధికారత సాధనకు సాధ్యమవుతుంది.

2001 సంవత్సరాన్ని భారతదేశ మహిళా సాధికారత దినోత్సవం గా ప్రకటించారు సాధికారత అంటే ఏమిటి? అంటే స్వేచ్ఛగా ఉండడం. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం  కాదు. సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్వేచ్ఛగా ఉండడం అని అంటాం. సాధికారతను సాధించుకున్నారని అంటాం. ఆడవాళ్లు స్వశక్తిపై ఒక నమ్మకం కలిగి ఉండేలా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఉండేలా చూడడం నిర్ణయాధికారాలు ఉండడం. ఒక సానుకూలమైన దృక్పథం కలిగి ఉండడం. వాళ్ళలోని నైపుణ్యాలను సృజనాత్మకతను వ్యక్తం చేసుకొనే అవకాశం ఇవ్వడం.వీటికి ముఖ్యమైన విషయాలు మూడు విధాలుగా చెప్పుకున్నట్టయితే,

1. ఆర్థికంగా బలోపేతంగా ఉండడం

2. సామాజికంగా బలోపేతంగా ఉండడం

3. రాజకీయంగా బలోపేతంగా ఉండడం

 1 ఆర్థికంగా బలోపేతంగా ఉండడం అనే విషయాన్ని తీసుకున్నప్పుడు భారతదేశంలోని మహిళలకు ఒక ప్రత్యేకమైన హోదాను మన రాజ్యాంగంలో పొందుపరిచారు 14,15 నిబంధనల ప్రకారం సమానత్వం కలిగి ఉండడం వివక్ష చూపకుండా ఉండడం. స్త్రీలందరికీ సమాన అవకాశాలు కల్పింప చేయడం. ఇలాంటి చట్టాలలో స్త్రీలతో పాటు

పిల్లలనూ కొన్నింటికి జత చేశారు. పని వేతనాలలో తేడా లేకుండా ఉండడం స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా చూడడం ఆచారాల పేరుతో చేసే పనులలో స్త్రీల మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడడం ఉచిత ఉచితలను సమంగా పరిశీలించి పరిరక్షణ చేయడం వంటివి ఇందులో వస్తాయి ఇటువంటి ఉద్యమ స్ఫూర్తితో పని చేసిన సంస్థలను గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనదే

 2001 నుండి స్త్రీల స్వశక్తి అనే విషయం పైన జాతీయ విధానాన్ని అంటే ఒక పాలసీని జారీ చేసినప్పటి నుండి మహిళా సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి 1990లో ఎన్ ఈ డబ్ల్యూ ఏ [N E W A ] సేవ అనేది అంటే స్వయం ఉపాధి మహిళా సంఘాలు అని అంటాం. ఈ సంస్థ భారతీయ మహిళా హక్కుల గురించి ఎన్నో పోరాటాలు చేసింది.బాధితులైన స్త్రీలకు, ఒంటరి స్త్రీలకు, అభయహస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. స్త్రీలు రోజుకు ఒక రూపాయి ఇవ్వాలి. ఎన్నేళ్ల తర్వాతనైనా ఆ స్త్రీ  ఒక రూపాయి రోజుకి ఇస్తే ప్రభుత్వం మరో రూపాయి జత చేసి వారికే ఉపయోగ చేస్తుంది. వృద్ధులకు ఆసరా పెన్షన్ పథకాన్ని కూడా పెట్టారు. ఇటువంటి పథకాల వలన స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకొని మరికొందరికి ఆదర్శంగా నిలువగలరు.

2. సామాజికంగా బలోపేతంగా ఉండడం అనే అంశంలో గృహహింస నిరోధక చట్టం అనేది ముఖ్యమైనటువంటిది. ఇది 2005లో ఏర్పడిన సివిల్ చట్టం బాధిత మహిళ పక్షాన నిలబడి వారికి ఉపశమనం కలిగించే దిశగా సహాయం చేయడం అనేది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందులో ముఖ్యభాగం ఆడవాళ్లు తమ ఇంట్లో తాము నివసించడము అనే హక్కును కలిగి ఉండడం. సాధారణంగా పెళ్లయి భర్త దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఈ నివాసం పై హక్కు అనేది ఉండేదే కాదు ఒకవేళ ఇంట్లో ఆడవాళ్లను హరాస్మెంట్ చేస్తే హింసిస్తే ఆమె వెనక కేసు నమోదు చేస్తే ఆమె భర్త మామగారు అత్తగారు ఇబ్బంది పెడితే కౌన్సిలింగ్ చేయించే హక్కు కూడా ఆమెకి ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏర్పరిచే ఈ సౌకర్యాలే కాదు దాదాపు 72 స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వమే సర్వీస్ ప్రొవైడర్లుగా ఏర్పరిచింది షెల్టర్ హోమ్ లో ఆశ్రయం ఇవ్వడము. మెజిస్ట్రేట్ సిద్ధం చేసిన

నివేదికను అందించడం.లౌకిక జీవనానికి కావాల్సిన మనోబలాన్ని సామూహిక భాగస్వామ్యమే ఇస్తుంది .ఈ సత్యాన్ని గ్రహించేలా చేయడము. ఏ భాషకైనా ఆదేశం లోని వర్ణాలు ఫోనిక్స్ శబ్దాలు మైక్రోఫోనిక్స్, మార్చి నిర్మాణం సింటాక్స్ లు ఎలాగైతే అర్థవంతంగా ఉండేలా ఉంటే  సమర్థవంతమైన రచన ఆవిర్భవిస్తుందో అలా జీవితానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. అలాగే అన్ని  భావాలు, అన్ని హక్కులు కలిస్తే ఏకశక్తిగా ఉద్భవిస్తుంది ఇదే సామాజికపరంగా స్త్రీ సాధికారత సాధనకు సాధ్యమవుతుంది

 3.రాజకీయంగా బలోపేతంగా ఉండేలా చాలా ముఖ్యమైనటువంటి అంశం.

మార్గదర్శక సూత్రాల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నియమాలను ఏర్పరిచాయి .అవి స్త్రీలకు సమంగా చేరుతున్నయా లేదా చూడాలి అంటేళఅంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. 33 శాతం రిజర్వేషన్ అని తీసుకొచ్చినా కానీ, రాజకీయ రంగంలో స్త్రీలు ఆ శాతానికి కాదు కదా దాని అంచుల వరకు కూడా వెళ్లలేని పరిస్థితిలో మన దేశం ఉంది. పొలిటికల్ లీడర్ లు గా స్త్రీలు ఎదిగినప్పుడు స్త్రీలకుండేటువంటి సాధకబాధకాలు తెలుసు కాబట్టి సహజసిద్ధంగా తెలుస్తాయి కాబట్టి వాళ్ల కోసం ఏదైనా చేసే ప్రయత్నం రాజకీయ శక్తిగా చేయగలుగుతుంది . కాబట్టి ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి గెలవగలిగే సత్తాను స్త్రీలు సంపాదించుకోవాలి కానీ ఈ అవకాశాలను రాకుండానే జాగ్రత్తపడుతుంది పురుష ప్రపంచం ఎక్కడో కొంతమంది రాజకీయ నాయకురాలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నా వాళ్ళపైన వాళ్ళ కుటుంబ సభ్యుల పెత్తనమే సాగుతుంది. తండ్రిదో, కొడుకుదో,భర్తదో  అండ ఉండాల్సిందే అనే ఒక విధానాన్ని క్రియేట్ చేస్తారు. చేసి, ఒక స్టాంపు లాగా తయారుచేసి కీలుబొమ్మను తయారుచేసి వాళ్ళ పబ్బం కడుక్కుంటుంది  ఈ పురుష ప్రపంచం

   చట్టాలకు చుట్టాలుగా ఉండగలిగే రాజకీయ నాయకులు వారి పురుష నిత్య స్వభావంతోనే స్త్రీల పరంగా ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటారు.

సమాన హక్కులు పొందుతున్నారా లేదా అని  మనస్ఫూర్తిగా మహిళల పట్ల ఆలోచనలు తీసుకునే వారు ఎక్కడ? గతంలో రాష్ట్రపతిగా

ప్రధానమంత్రిగా లోక్సభ అధిపతిగా ప్రతిపక్ష నాయకురాలు గా వారి వారి సేవలనందిచిన వారు గా ఎందరో మహిళలు ఉన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి కూడా స్త్రీ నే , ఇది జాతి గర్వించదగిన విషయం. కానీ, ఒకవైపు పరిపూర్ణత అక్షరాస్యతను సాధించలేదు మరోవైపు స్త్రీలకు కేటాయించిన శాతం అమలులోకి రావడం లేదు. కూలీలు గా వ్యవసాయదారులుగా వ్యవసాయ కూలీలుగా ఎందరో మహిళలు పనులు చేస్తున్నారు. వాళ్లందరికీ సత్వర సమస్త న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత రాజనీతిజ్ఞులదే. ఇందులో ప్రధానంగా చెప్పవలసి వస్తే వరకట్న నిషేధం చట్టం ఎంత ప్రయత్నించినా అరికట్టలేకపోతున్నటువంటి విషయం. బాల్య వివాహాల బాధల నుండి వితంతు స్త్రీల ఇక్కట్ల నుండి మూడో కాలు పట్టుకుని నడిచే వృద్ధాప్యం వరకు వరకు పోరాటాలు చేసిన ఫలితం శూన్యం.

యూనిసెఫ్ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 18 ఏళ్ల కంటే ముందే పెళ్లిళ్లు జరిగి, తల్లులై ఎన్నో కష్టాలకు గురవుతున్నారు అనేది తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం నిరక్షరాస్యత ఆర్థిక స్వావలంబన లేకపోవడం, పురుషాధిపత్య  ఉక్కు పిడికిళ్ళలో నలిగిపోవడం.

ఇక గృహహింస అని మరో విపరీతం స్త్రీలను అదిమిపెట్టి ఎదగకుండా చేస్తున్న ది. ఇక మరో అన్యాయమైన విషయం ఏమిటంటే అమ్మాయిలను వేశ్య వృత్తిలోకి దింపి వ్యాపారం చేసుకుంటున్న లోకం ఇది. ఒకసారి ఆ ఊబిలో పడిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళని  బయటికి రానీయకుండా చేసే కొద్ది మార్గపు లోకం ఇది.

ఇక బాల కార్మికుల అవస్థలు అయితే చెప్పనక్కర లేనివి. పసి మొగ్గలను చినిమేసే నియంతలు అడుగడుగునా కనిపిస్తుంటారు.

మన అభివృద్ధి శాఖ ఇచ్చే నివేదికలో చూస్తే ఆరోగ్య విషయంలో స్త్రీలు ఎన్నో కష్టాలకు గురవుతున్నారు. గర్భనిరోధక పద్ధతులు వాడకం వల్ల, స్టెరాయిడ్స్ వాడకం వల్ల  అయితే నేమి క్యాన్సర్ వంటి విపరీత జబ్బులు అయితే నేమి కుటుంబ నియంత్రణ కొరకు ఉపయోగించే పిల్స్ అయితేనేమి గర్భస్రావాలు అయితేనేమి  ఆడవాళ్ళ ను  ఎన్నో కష్టాలకు గురి చేస్తున్నాయి.

ఈ అన్నింటినీ మించి మరొక వికృతమైన చర్య భ్రూణ హత్య. తినడం గా ఉన్నప్పుడే ఆడపిల్లని తెలవగానే చిదిమేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనదేశంలో విపరీతంగా ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవాళ్ళ కష్టాలు అనంతం. వీటిని కనిపెట్టి కీలరి వాతపెట్టే పరిస్థితులు వస్తే బాగుంటుంది వీటి కొరకే మహిళా సాధికారత దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది

మానవ వనరులను వినియోగించుకోవడంలోనూ విద్య విజ్ఞానాలను సంపాదించుకోవడంలోనూ స్త్రీలకు సమాన అవకాశాలు కలిగింప చేయడమే మహిళా సాధికారతకి ఒక అర్థం. కుటుంబ స్థితిలో స్త్రీలది ఎంతో గణనీయమైన పాత్ర ఉంటుంది గుర్తింపు ఏమాత్రం ఉండదు. రాజకీయ సాధికారత చట్టపరమైన సాధికారత విద్యా సాధికారత మహిళలందరూ పొందినప్పుడే సమ సమాజం స్థాపించబడుతుంది

 ______****_____

July 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పట్టుదల

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, July 12, 2023
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

        రంగడు సోమరి.  అతడు  ఏ పనీ పాటా లేకుండా స్నేహితులతో తిరిగేవాడు . అతనికి ఒక్క అవ్వ తప్ప నా అన్న వాళ్లెవరూ  లేరు .  ఆమె వృద్ధురాలు.    ఆమె ” నా మనవడు కష్టపడి వృద్దిలోకి రాకపోతాడా!” అని ఇన్నేళ్లు ఎదురు చూసింది.   కానీ రంగనిలో మార్పు రాలేదు . ఒకరోజు ఆమె ” ఒరేయ్!   ఈ సోమరితనం వదిలిపెట్టరా! కష్టించి పనిచేయడం నేర్చుకో” అని అంది.   అప్పుడు రంగడు “అవ్వా!   నేనేం చేయాలో నీవే చెప్పు” అని అన్నాడు.  అప్పుడు ఆమె ” ఒరేయ్! నీకు ఇష్టమైన పని చేయరా! అది మన కడుపు నింపేదైతే చాలు ” అని అంది.  “సరేలే అవ్వా! నాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం .  నేను రేపు చేపలు పట్టడానికి పొరుగూరిలో గల  చెరువుకు వెళతాను” అని అన్నాడు. ఆ అవ్వ ఎంతగానో  సంతోషించింది.   
         మరునాడు  అతడు తన అవ్వ బాధ పడలేక  పొరుగు గ్రామంలోని చెరువుకు తన వలను తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాడు .  అతడు  చేపలు పట్టడానికి  ఆ వలను నీటిలో  వేశాడు.    అప్పుడు ఆ వల కొంచెం బరువుగా అనిపించి రంగడు ఎంతో సంతోషపడ్డాడు.  కానీ ఆ వలను తీసి చూస్తే  అందులో అన్ని కప్పలు కనిపించాయి.  ” అయ్యో! ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని ఎవరో చెప్పగా విన్నాను. కానీ నాకు ఒక్క చేప కూడా  వలలో పడలేదు. ఈ  కప్పలను నేను ఏం చేసుకోను” అని వాటిని తీసి తిరిగి నీటిలోకి వదిలి మళ్లీ వలను వేశాడు.   ఈసారి వల ఇంకా బరువుగా అనిపించింది.  అతడు  తన పంట పండిందని అనుకున్నాడు.   కానీ ఈసారి కూడా అతనికి నిరాశనే ఎదురైంది.   అందులో పెద్ద తాబేలు పడింది .  “అయ్యో! ఈ తాబేలును నేను ఏం చేసుకోను “అని దాన్ని కూడా నీటిలోకి వదిలాడు. 
        ఆ  తర్వాత  అతడు ఈసారి తప్పకుండా తనకు పెద్ద చేప పడుతుందనే ఆశతో తన వలను మళ్ళీ నీటిలోకి వేశాడు.   ఈసారి ఆ వల చాలా బరువుగా అనిపించింది. దాన్ని అతి కష్టం మీద లాగాడు .  అందులో ఒక చిన్న మొసలి పిల్ల కనిపించింది .  “అమ్మో !మొసలీ “అని భయపడి రంగడు ఆ వలను మొసలితో సహా  నీటిలోకి వదిలిపెట్టి ఇంటికి పరుగెత్తి జరిగిన విషయం తన అవ్వకు చెప్పాడు.   ఆమె అతడిని ఊరడించి ఉత్సాహపరచి  ” ఒరేయ్! ఆ వల పోతే పోని! మరొక వలను తీసుకొని వెళ్లు. నీ ప్రయత్నం మానకు.  కష్టపడితే తప్పకుండా నీకు  ఫలితం వస్తుంది  చూడు!” అని అంది.
           మరునాడు  రంగడు పట్టువీడకుండా ఎలాగైనా కష్టపడి ఆ పెద్ద చేపను పట్టుకుంటానని తలచాడు.  వెంటనే  పొరుగింటి వారిని మరొక వలను అడిగి తీసుకొని అదే చెరువుకు వెళ్లి  ఆ వలను నీటిలో  వేశాడు . ఈసారి ఆ వలలో  ఒక పెద్ద చేప పడింది .  అక్కడే ఉన్న గ్రామస్థులు అది  చూసి “అబ్బో! నీ పంట పండింది .  మాకు ఎవ్వరికీ  వలలో పడని పెద్ద చేప నీకు పడింది.  ఈ రకం చేప కొరకు చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరికీ ఇది దొరకలేదు.  నీవు చాలా అదృష్ట వంతుడివి. ఇది  చాలా ఖరీదు చేస్తుంది.   దీన్ని  అంగడిలో అమ్ముకో!” అని అన్నారు.   రంగడు సంతోషించి వెంటనే వెళ్లి ఆ చేపను  అంగడిలో  విక్రయించాడు.   దానికి చాలా డబ్బు వచ్చింది . అతడు తన అవ్వకు ఆ డబ్బును చూపాడు. ఆమె ఎంతో సంతోషించింది.  తర్వాత   అతడు” మా అవ్వ చెప్పినట్లు ఎంతో కష్టపడితేనే  చివరకు ఫలితం దక్కుతుందన్నమాట .  ఎన్నిసార్లు వేసినా నన్ను కరుణించని ఆ పెద్ద చేప ఈసారి మాత్రం నాకు దొరికింది . పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ  ఏమీ లేదు ” అని ఆనాటి నుండి  తన సోమరితనాన్ని వీడి కష్టపడడం నేర్చుకున్నాడు .    అతడు సోమరితనం  వదలిపెట్టినందుకు   అతని  అవ్వ ఎంతగానో సంతోషించింది. 

July 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చచ్చిపోతే…

by -ప్రమోద్ ఆవంచ July 12, 2023
written by -ప్రమోద్ ఆవంచ

ఏం చేసాననీ..
ఏం చేయగలననీ…
ఏం చేస్తూ
వచ్చాననీ…..
ఇన్ని సంవత్సరాలుగా
ఎన్నో అద్భుత
సూర్యోదయాలను
భూస్థాపితం చేసాను….
ఎన్ని సాయంకాలాలు
రాలిపోతున్న సంధ్య
పొద్దుల్లో గడిపాను…
ఎన్నో చీకట్లను
వెలుగనుకొని
భ్రమ పడ్డాను…
ఎన్నో దారుల్లో దారి తప్పి
గమ్యం వెతుక్కునే
పనిలో తిరిగాను…

ఏం అడిగానని ..
ఎవరిని వంచించానని..
ఇంకెవరినీ మోసం
చేసాననీ….
ఏదో ఒక బాధ నుంచి
పదం పుట్టి ఆ పదం
వాక్యమై వియోగ
కవితలుగా
అవతరించాయి తప్ప…
వివరించినా అర్థం కాని
వారంతా పిచ్చివాడన్నారు..
లోకమంతా పిచ్చిని నా ఇంటి
పేరు చేసింది!

ఏం కావాలనీ ….
ఏం కోరాననీ…
చచ్చిపోతే…
మెడలో వేయడానికి
ఆరు మూరల పూల దండ…
చచ్చిపోతే…
మీద కప్పడానికి…
కొన్ని పుస్తకాలు…
నేను రాసుకున్న
కొన్ని పిచ్చి కవితల
కాగితాలు…
చచ్చిపోతే…
పూడ్చడానికి
ఆరు అడుగుల నేల తప్ప…

July 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖల్లో తిలక్

by Cheedella Seetha Lakshmi June 1, 2023
written by Cheedella Seetha Lakshmi
“ఆంధ్ర సాహిత్యంలో వచన కవితా శిల్పి,కవికుల తిలకుడు,రస గంగాధరుడు అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తన రచనల ద్వారా ఒక విశిష్ట రచనా ప్రవృతిని,కవితా స్రవంతిని, నిర్దిష్టకులాలలో, నిరంతర రస ప్రవాహంగా ప్రవహింపచేశాడు. తన అమూల్య రచనల ద్వారా ఆంధ్ర సాహిత్య చరిత్రలో శాశ్వత కీర్తి చంద్రికల్ని ప్రసరింప చేశాడు. ఆయన రచనలు ఆంధ్ర సాహిత్య ధనాగారానికి ఒక అక్షయ రత్న సంపద వంటివి”.తిలక్ గొప్ప కవి.ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇతనికొక విశిష్ట స్థానముంది.

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
అని తన కవితా లక్ష్యాన్ని చెప్పుకున్న దేవరకొండ బాల గంగాధర తిలక్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో ఆగస్టు 1 వ తేదీ 1921 సంవత్సరంలో జన్మించాడు.
సమాజంలో దగాపడిన వారి జీవితాలను చూసి చలించిన తిలక్ సున్నిత హృదయుడు కాబట్టి వాటినే తన కవితావస్తువులుగా మలచుకున్న
తిలక్ భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేతతో “అమృతం కురిసిన రాత్రి,ప్రభాతము సంధ్య,గోరువంక కవితాసంపుటిలు,సుందరీ సుబ్బారావు,ఊరి చివర ఇల్లు అనే కథా సంపుటాలు,సుశీల పెళ్లి,,సాలెపురుగు అనే నాటకాలు,సుచిత్ర ప్రయాణం,ఇరుగుపొరుగు,సప్తశిల అనే నాటికలు ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన తిలక్ కేవలం 45 ఏళ్ల అతి చిన్న వయసులో సెప్టెంబరు 1 వ తేదీ 1966వ సంవత్సరంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.చనిపోయాక కుందుర్తి ఆంజనేయులు రాసిన పీఠికతో 1968 సంవత్సరంలో ముద్రింపబడిన అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా 1971 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
సమాజాన్ని చూసి కరిగిపోయిన తిలక్
మిత్రులకు రాసిన లేఖల ద్వారా మిత్రులతో తిలక్ కున్న సత్సంబంధాలు ,తిలక్ వ్యక్తిత్వం,మనస్తత్వం మొదలగు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.

‘ఆవంత్స సోమసుందర్’ తిలక్ కు ప్రాణమిత్రుడు.సోమసుందర్ కు రాసిన లేఖలో ” జీవితంలో ఎప్పుడు ఎవరు వచ్చి గుండెల్ని పెనవేసుకుపోతారో ఏం తెలుస్తుంది.అలాగ సామీప్యంలోని ఆత్మీయమైన ఆవరణలోకి విచిత్రంగా సురభీకృతం చేస్తూ నువ్వొచ్చావు. అన్నా అని పిలిచావు.ఆ పిలుపు గుండె లోతులంటి, తిరిగి తమ్ముడూ అని ప్రతిబింబించక మానుతుందా? అందుకే ఇంకా మీరు అనే సంబోధన కృత్రిమంగా ఏదో దూరాన్ని పలకరిస్తున్నట్లు తోచి మానివేశాను.” అని రాయడం వల్ల మిత్రులను ఆత్మీయుతతో దగ్గరకు తీసే ప్రేమతత్వం కన్పిస్తుంది. వరవరరావుకు రాసిన లేఖలో ” నా కింత దగ్గరైన నువ్వు అలా అలా దూరదూరంగా ఎందుకున్నావో అని నా మనసు చాలా బాధ పడుతుంది.డబ్బూ,వ్యాపారమూ, ప్రయోజనమూ ప్రధానంగా ఎంచబడే నేటి సంఘంలో అవ్యాజమైన మైత్రి,ఆర్టిస్టుల మధ్య మైత్రి ఒకటి గదా!
కన్సిడరేషన్! నువ్వు నా కన్నా చాలా పిన్నవాడివైతే మాత్రం కుల వయో దశ భేదాలు కవులలో,కళారాధకులలో అప్లై చేయవు.” అంటాడు.మైత్రీ బంధానికి తిలక్ ఇచ్చిన విలువ గొప్పది.డబ్బు,హోదాకు లొంగనిది.కులాతీత,వయోతీతమైంది.నిస్వార్థ,అవ్యాజమైనదే అసలు సిసలైన మిత్రత్వము.నిజమైన మైత్రికి ఇవేవీ అడ్డుకావని మైత్రికి చక్కని నిర్వచనం చెప్పాడు.ఇలా లేఖలలో తిలక్ స్నేహానికిచ్చిన ప్రాధాన్యం తెలుస్తుంది.

జీవితంలో ఏదో సాధించాలనే ఆశ,తపన ” వేళ్ళ సందుల్లోంచి పొడి ఇసుకలా జారిపోయే కాలాన్ని, వయస్సునీ,తల్చుకుంటే భయమౌతుంది.” అని ఒక ప్రచురణ సంస్థ నెలకొల్పాలన్న తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ నీ సహకారం ఉంటే తప్పక కృతకృత్యుణ్ణవుతానని రాస్తూ సమయం దాటాక బాధపడి ప్రయోజనం లేదు.” అందుకే ఈ లోపుగా చేసి వెయ్యడం మంచిది కదా.” అంటూ సోమసుందర్ కు రాసిన లేఖలో తెలిపాడు.

మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో జీవితంలో తృప్తి ఎట్లా లభిస్తుందో వివరించాడు.” నెల బారుగా,చప్పగా,బాధగా వెళ్లిపోయే జీవితంలో ఏవో కొన్ని గొప్ప క్షణాల్ని మనవిగా చేసుకున్నామనే ఆనందమూ,దాన్ని నలుగురితో పంచుకోవడమూ కన్నా తృప్తి ఏముంది.” అంటూనే ” ఇక్కడ దట్టంగా పరచుకున్న మనుష్యారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ,దోమలూ,రాజకీయాలు జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలో కన్నా అడవుల పచ్చదనమూ,ప్రకృతి సన్నిహితంగా ఉన్న మీ జీవితమే సుఖకరమేమో.” అనడం వల్ల కుళ్లు మనుష్యుల మధ్య నలిగి బ్రతికే కంటే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అడవుల్లో ఉంటే మనసుకు తృప్తి అనే భావన కలిగినవాడు. అట్లాని మానసికమైన ఒంటరితనాన్ని భరించడం కూడా కష్టమే నంటాడు.

తిలక్ బాధాతప్త హృదయుడు.జీవితంలో జరిగిన సంఘటనలు, మనసులో మరపురాని ముద్రలే అతన్ని కవిగా చేశాయి మోగంటి మణిక్యాంబకు రాసిన లేఖలో చిన్నతనంలో ఒక వృద్ధుడు,జీర్ణాదేహుడు,ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి చూసి ఎంతో ఏడ్చాడు.” జీవితం అంటే ఏమిటి? సృష్టి పరమార్థం ఏమిటి? అన్న చింతనలో పడ్డాడు.16,17 సంవత్సరాల వయసులో ఒకసారి పార్క్ టౌన్ స్టేషన్ లో దిగివస్తుంటే ఇద్దరు ముగ్గురు బాబూ! ఒక మాట అని పిలిచారు.ఏమిటో నని వారి దగ్గరకు వెళ్ళాడు.ఒక వస్తువు మీద గుడ్డను తీసి చూపించారు.భయంకరమైన, వికృతమైన శవం.దహనానికి చందా అడుగుతున్నారు.జేబులోంచి చేతికి వచ్చిన డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళాడు.గది కెళ్లగానే ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లు భయపడ్డాడు.రాత్రంతా ఆలోచనలతో సతమతమయి అంతా మిథ్యగా అనిపించింది.బ్రతుకు మీద విరక్తి కలిగింది.

ఇంకోసారి మిత్రులతో సినిమాకి వెళ్తున్న సమయంలో ఒక ఎనిమిదేళ్ల పిల్ల ఆకలిగా ఉంది.డబ్బులిమ్మంది అందరూ ఆమెని విదిలించుకుని చీ అని తోసి వేస్తుంటే సభ్యత కోసం తిలక్ కూడా విదిలించుకున్నాడు.ఆ రోజు రాత్రంతా బాలికనే కళ్ళముందు నిలిచింది తెల్లవారి జేబులో పది రూపాయలు వేసుకుని ఆ అమ్మాయి కోసం అంతా గాలించాడు.కానీ ఆమె కనిపించలేదు.మూడు రోజులు వెతికాడు కానీ వృధా. ” ఆమె అందమూ ,సొగసైన కళ్ళు,ఆ బాల్య చాపల్యమైన మనస్సు ఏ ధూళిలో ఏ బాధలో ఏ మంటలో దినదినమూ కాలిపోతున్నాయి ” ఎవరు దీనికి కారణం?…విలవిలలాడి పోయాను.ఆమె నా చెల్లెలే అయితే అలా ఛీదరించుకునేవాణ్ణ ?” అనుకున్నాడు నెలరోజుల తర్వాత ఆమె కనిపిస్తే జేబులోంచి ఆరు రూపాయలు తీసి చేతిలో పెట్టి ఒక రోజు కడుపు నిండా తిను అని వెళ్ళిపోయాడు.అప్పటి సంఘటనలు మనసులో కలవరం రేపి ” ఈ జీవితానికి,సమాజానికి అర్థం తెలుసుకోవడానికి,ఒక అర్థం ఇవ్వడానికి ఒక ఆదర్శ జ్వాలలో నా బ్రతుకును చుట్ట బెట్టి తోడు లేని ఈ దారిని నాటి నుండి ప్రయాణం” సాగించి అనేక బాధలతో,అనారోగ్యంతో అలమటించి ” గొప్ప అనుభవాన్ని కవిత్వాన్ని పొందాడు మధురమైన
ఆ హృదయాన్ని,మనస్సుని లోకంచుట్టూ తిప్పి సౌందర్యాన్ని అవలోకించి ఆహ్వానించాడు.” అని చెప్పిన సున్నిత హృదయుడు,కోమల మనస్కుడు జీవితానికి,సృష్టికీ ఒక అర్థం వెదికి సమాజానికి సుఖ సంతోషాల్ని అన్వేషించాలనే తపన కలవాడు.” మనిషీ, సంఘమూ,దేశమూ, విశ్వమూ ఈ సర్వ జగత్తు జ్ఞాన సరస్సులో విరిసిన ప్రేమ పద్మం లాగా సత్యం,శివం, సుందర శీలమై ఉండాలి.” అంటాడు.”

వ్యుత్పత్తి,వివేకం,ఉద్రేకం ఇన్నింటిని సమ్యక్ స్వరంలా మేళవించి” ఏదో సాధించాలనే తహతహలాడేవాడు.నిజమైన వెలుగు కోసం ” ఏళ్ల తరబడి సృష్టించుకున్న మౌఢ్య భావాలు,సంకెళ్లని పగులగొట్టి” స్వార్థమూ, సంఘ గౌరవమూ, ధనమూ ప్రధానమైన ఈ లోకాన్ని ఖాతరు చేయక ఏ పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కోగల ఆత్మీయశక్తి నాకుంది ఆనుకొని ” సంపూర్ణ నిర్మలానురాగం ముందు తప్ప తల వాల్చగూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.” అని మానసిక ఆవేదనను,ఆశయాన్ని తేటతెల్లం చేశాడు.” నిర్ధయా, నిశ్చితమైన నిధి కొండరాళ్ల మీద తలబాదుకొని ఏడ్చినవాణ్ణి కాబట్టి ఏ విశ్వాసాన్ని వృధా పోనివ్వను.” సున్నితమైన నా మనస్సు మీద కూడా ఎన్నో దెబ్బలు తగిలాయి.” అంటూ మానసిక బాధను వ్యక్తపరచి ” ఒక్కొక్క కన్నీటి చుక్కను తుడువగలిగితే జన్మ సార్థకమన్న శరత్ మాటలను స్వతహాగా ఆచరించాలన్న ఉబలాటం కలిగిన వాడు.ఆయన మాటల్లోనే ” ఒక సంఘము నుండి ఉబికే బాష్పాన్ని తుడువగలిగితే ఒక్క అధరం మీదికి హాస్యాన్ని రప్పింపగలిగితే జీవితం ధన్యమౌతుందని నా ఉద్దేశ్యం.కరుణ,సౌందర్యమూ, మానవత్వమూ ఈ మూడు ప్రాతిపదికలుగా నా ఆదర్శాన్ని,ఆలోచనల్ని నిర్మించుకున్నాను నా రచనలూ నా జీవితమూ ఈ భావనల్ని వ్యక్తీకరించకపోతే నేను జీవచ్చవాన్ని” అని తన కవితా లక్ష్యాన్ని, జీవితాదర్శాన్ని వివరించాడు.తిలక్ మనస్తత్వమేమిటో ఎంతో చక్కగా వివరించాడు లేఖల ద్వారా.” *దుఃఖానికీ, బాధకీ కరుగలేకపోతే ఈ బాలగంగాధరుడు తన కవిత్వాన్ని,తన ప్రాణాన్ని కూడా బంగాళాఖాతంలో విసిరిపోతాడు అతనిలో ఎంతో దృఢవిశ్వాసం కన్పిస్తుంది.మనిషికి మానవత్వముండాలి.కరుణ, జాలి,దయా ఉండాలి.అవి లేకపోతే జీవచ్చవమేనన్న అభిప్రాయం కలవాడు.తిలక్.జీవితానుభవాలకు,రచనలకు అవినాభావ సంబంధమున్న విషయం ప్రస్పుటమైందీ లేఖల్లో.

” ఆర్ద్రమైన ప్రతి హృదయమూ అశ్రుసిక్తమైన ప్రతి నయనమూ సుందరమైన ప్రతి దృశ్యమూ నన్ను కలలో కూడా వశం చేసుకుంటాయి.ఒక్క పాటకోసం ఒక్క మాటకోసం అవసరమైతే ఈ ధనాన్ని జగత్తునీ కాదనగల సాహసం వుంది నాకు”.అని ప్రపంచాన్నే ఎదిరించి పోరాడిన ధీశాలి, కవితా వీరుడు.కవికి ఉండవలసిన ఉత్తమగుణం తిలక్ లో కనిపిస్తుంది.కవి ఊహలో చరించకుండా జగత్తులో చేదు నిజాన్ని చవిచూసి అనుభవించి ఆవిష్కరించాడు. బాహ్య జగత్తులోని విశిష్ట సన్నివేశాల వలన, ప్రజ్ఞా విశేషం వలన తమలో కలిగిన ఆలోచనా వైవిధ్యం చేత,తమకు కలిగిన అనుభవాలను కావ్య చిత్రణం ద్వారా వ్యక్తీకరించి ఆనందం చేకూర్చడం తిలక్ లక్ష్యం.ఇంద్రియాలకు తృప్తి కలిగించేది అతని దృష్టిలో ఆనందం కాదు మానవత్వంలో పరిపూర్ణత నొందుటలోనే ఆనంద మున్నదని అతని సిద్ధాంతం. *సుందర స్వప్నాల మేడమెట్ల నుండి వాస్తవిక శిథిల రూపాలలోకి హఠాత్తుగా జారిపడిన నాకు తెలుసు అంటాడు.” పైకి నవ్వుతున్నా అలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో వున్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు”. అని వాపోతాడు,లోతుల్ని వెతుకుతాడు.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గాయాలు తగిలినా ఎదుర్కోగలిగే శక్తి గలవాడు.కృంగిపోవడం నా స్వభావానికి వ్యతిరేకం అన్న ధీరమనస్కుడు.
అసలు కవి అంటే ఎవరు?కవి ధర్మాన్ని లేఖల్లో వివరించాడు.” సున్నితమైన ఊహ,ఉద్రేకము,” ఉంటేనే గొప్ప రచనలు వస్తాయన్న విశ్వాసము కలవాడు.సాధారణంగా మానవులందరూ దైనందిన సమస్యలతో ,బాధలతో సతమతమవుతూ వుంటారు.చిన్న చిన్న కోరికలూ,ద్వేషాలూ,అల్పమైన ఊహాలతో సతమతమవుతూ వుంటారు.” నేలబారుగా జడంగా స్తబ్దంగా గొంగళిపురుగుల్లా పాకుతారు.వాళ్ళకి సౌందర్యం డబ్బులోనూ ఉద్యోగం లోనూ భేషజంలోనూ కనబడుతుంది కానీ కళాశీలికి యివేమీ కనిపించవు.అతనికున్న విలువలు వేరు.అతని చూపు వినీల గగనాన్ని బురుసుకుంటూ నక్షత్రమండలంలోకి పోతుంది.అతడు మనిషి లోపల మనిషిని చూస్తాడు.అతని దృష్టి ఎక్కడ అందం వున్నా నిజం వున్నా అక్కడ వాలుతుంది. దేనికోసమో తపన,అన్వేషణ నిరంతరంగా సాగిస్తాడు.ఈ యాత్రలో అతడు లౌకిక జగత్తును లక్ష్య పెట్టడు. అందుకే అతని ఊహ శాశ్వతమైంది.అతని నీతి అతీతమైంది.అతని రచన అక్షరమైంది. నశించనిది.” కవి ఊహ లోకోత్తరమైంది. అందువల్లనే ఉత్తమ రచన సార్వజనీనము,సార్వకాలికమౌతుందన్న ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయాలను తలపింపచేశాడు.

కవి సంప్రదాయబద్ధుడుగా కాక కాలానుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకొని రచన సాగించాలంటాడు. కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని,బూజు పట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే. అంటూ సంఘాన్ని మేల్కొల్పాలి,ప్రజలను చైతన్యవంతులను చేయాలి.ఆత్మవిశ్వాసం ఉండాలి.కవిత్వాన్ని సమగ్రంగా దర్శించడమూ,జీవిత విధానాన్ని గురించి స్పందించడమూ చాలా అవసరం అంటాడు తిలక్.

తిలక్ ప్రకృతిలోని అందాన్ని చూసి పరవశించిపోయేవాడు.ప్రకృతిని ఆరాధించేవాడు.లేఖల్లో ప్రకృతి వర్ణన కూడా కనిపిస్తుంది.సహజ చిత్రీకరణ,కవి దృష్టి ప్రత్యేకంగా లోతుల్ని చూస్తుంది.గుండెను హత్తుకుపోయే విధంగా ఉంది.ప్రకృతి వర్ణన సహజంగా వుంది. సోమసుందర్ కు రాసిన లేఖలో ” ఈ రెండు రోజుల నుంచీ వర్షం కురిసి కురిసి భూమి తడిసి తడిసి పచ్చి పచ్చి బాలింతరాలిగా అందంగా వుంది ” అంటాడు
వర్షాకాలంలో తడిగా ఉన్న భూమి ఎట్లా ఉందో ఉపమాలంకార ప్రయోగం చేశాడు. ఆలంకారిక రచన,ప్రకృతిసాన్నిహిత్యాన్ని కోరుకునేవాడు.దట్టంగా పరచుకున్న మనుషారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ దోమలూ రాజకీయాలూ జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలోకన్నా అడవుల పచ్చదనము,ప్రకృతి సన్నిహితంగా వున్న జీవితమే మంచిదని మిరియాల రామకృష్ణ గారికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు.వర్షాకాలం అంటే తిలక్ ఇష్టపడేవాడు.ఆకాశంలో నల్లని మబ్బులు,ఒక్కసారిగా వాన,భూమి చల్లబడి పచ్చబడి మనసుకు ఎంతో హాయిసిస్తుందని చెప్తూనే ” స్నానం చేసి వచ్చిన యవ్వనవతి శరీరంలాగా విచిత్రమైన అందం,ఆకర్షణ.” ఉందని వర్ణించాడు.
మోగంటి మాణిక్యాంబా దేవికి రాసిన లేఖలో మనసులోని వ్యధను ఎవరూ గుర్తించలేరని రాస్తున్న సందర్భంలో పైకి నవ్వుతున్నా అలలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో ఉన్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు అంటూనే జీవితం చాలా విచిత్రమైంది,అద్భుతమైందని చెప్తూనే ” రంగురంగుల అలలలో వంగి బ్రతుకు అంచుల్ని ముంచుతూ వుంటుంది. ఎన్ని స్వప్నాలూ,ఎంత లోతు తెలియని భయంకరాఘాతాలు.” అంటూనే సూర్యోదయాన్ని యీ విధంగా ” చీకటి లొత్త గిత్తి మెత్తని వెల్తురు తూర్పున ఆడదాని అనురాగంలాగ వ్యాపిస్తోంది.నక్షత్రాలు కాంతి విహీనమై గాజుపూసల్లాగా వున్నాయి. అక్కడక్కడ ఒక మబ్బు ఏ అప్సరస ఒంటిమీద నుండో జారిన చీరకొంగులాగ గాలిలో తేలిపోతుంది.మనోహరమూ,శాంతమూ అయిన ఆ ప్రకృతిలో లీనమౌతున్న నా మనసుకు మళ్లీ అశాంతి.” అంటూ తన అనుభూతిని వివరించాడు ఇంతలోనే నిరాశావాదం.” లోపల్లోపల ఏదో ఒంటరితనం ఒక్కణ్ణే నా బాధలతో ఏదో ఎడారి అంచులమీద నడచిపోతున్నాను– అనిపించింది.ఈ సంసారమూ ఈ స్నేహాలూ అన్నీ ఎండమావులేమో– అనిపిస్తుంది.మబ్బు పట్టి ఆకాశంలో ఈ రోజంతా తెలియని చక్కని కౌశలమూ ప్రజ్ఞా వుంది.నేను కొంత ఆశ్చర్య పడ్డాను.ఇంత బాగా రాయగలడా కథలు కూడా అని— కాని నీ కథల పుస్తకంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకుగాని,బలపరచుటకుగాని నీవు చేసిన ప్రయత్నం- ఆ కథాశిల్పంలో ముఖ్య దోషంగా కనబడింది.ఆ కథల రక్తిని అనుభవించకుండా చేసింది. పాలటబులో డిజైనులవల్ల కళ ఎప్పుడూ పరిమితమూ సంకుచితమూ అయిపోతుంది.అయితే ఆ రోజుల్లో నువ్వు ఆ ప్రభావపు ఇనుప కౌగిలిలో ఉండేవాడిని.కాని ‘కాలనేమి’ లో దోషం మచ్చుకైనా లేదు”.

వరవరరావు రచనలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరవరరావుకు రాసిన లేఖలో “అమృతవృష్టిలో అక్కడక్కడ బెట్టుగా ఉంది.యజ్ఞంకై కొత్త టానిక్,సోషలిస్టు సీత–ఇటువంటివి అనుచితంగా తోచాయి.
కుక్క నోట్లోంచి ఎంగిలాకు– ఆ ఇమేజరీ ఎందుకో? ఫోర్స్ డ్ గా వున్నట్లు అనిపించింది.రాకాశశికి మబ్బురంగు పైట అన్నాడు.మబ్బే పైటగా ఉంటుంది గదా.ఆషాఢ మాసంలో ఆ రంగుగల మరో పైట ఏముంటుంది? శశికి మరోసారి రివైజ్ చేస్తే మంచిదేమో అనుకున్నాను.నాకు నచ్చిన లైన్స్ గురించి చెప్పడం లేదు.మీరు మరోసారి చూడండి.మరి మీ కెలా తోస్తుందో? అన్నట్లు “వూసి” అని రెండు మూడు సార్లు ప్రయోగించారు.దాని అర్థం? నాకు కొత్తగా ఉంది.” – యూసేజ్. వరవరరావు తన రచనను సమర్థించినట్లు తెలిశాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను,పొరపాటయింది అని వేరే లేఖలో” పేజీలు సరిజేసి చదివితే రచన సందర్బశుద్ధిగా కనబడింది.” అని రాశాడు. వెనుకటి కవులకు తన కాలంలో కవులకు తారతమ్యాన్ని వివరిస్తూ ” నా వెనుక తరంలో కవులలో ముఖస్తుతీ వెనకాలే దూషణా ప్రత్యేకంగా ఉండేవి.సామాన్యుడి కన్నా ఊహలో,సంస్కారంలో మరికాస్త పెరుగుదల సూచించవలసిన ఆ కవులలో కనబడే ఈ కృత్రిమత్వం ,పిరికితనం దుర్భరమనిపించేవి.ఆఖరుకి కవిత్వంలో కవిత్వాన్ని గురించి నిజాయితీగా చూడలేని వీరి నుంచి ఏ మాశించగలమనుకొనే వాడివి.” అంటాడు.

జానకీ జానికి రాసిన ఉత్తరంలో ‘ మోడరన్ పోయిట్రీ పేరుతో పత్రికలలో ప్రకటితమయ్యే వాటిని చూచి విసుగు చెందాను.దాని మూలంగా చాలా విచారిస్తున్నాను.ప్రబంధయుగంలో చివరికాలంలో వచ్చిన సాహిత్యంలోని సమానమయిన క్షీణత, పదాల గారడి,నడకల శూన్యత,ప్రాస కొరకు ప్రయత్నించుట అందులో మనకు గోచరిస్తాయి.” అంటూ నవీన కాలాన్ని గూర్చి శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి రాసిన వ్యాసమే బాగుందని చెప్తూ సమకాలీన చరిత్రను గూర్చి విశదంగా విమర్శిస్తారని అనుకుంటున్నాదన్నాడు.

ఈ విధంగా తిలక్ లేఖల్లో అతని అనుభూతులు,అనుభవాలు, కవితాలక్ష్యం,రచనోద్దేశ్యం,విమర్శ, ప్రకృతి వర్ణన,ఆరోగ్య విషయాలు,మిత్రత్వానికి యిచ్చిన విలువ మొదలైనవి అనేకాంశాలు విదితమౌతున్నాయి.స్నేహితులకు తన మనోగతాన్ని స్పష్టంగా,నిర్మొహమాటంగా, కవితాత్మకతలో విశదపర్చడం లేఖలవల్ల గమనించవచ్చు. మారుతున్న కాలాన్ని బట్టి సత్యాన్ని అన్వేషించి సమాజాన్ని జాగృతం చేసేదే నిజమైన కవిత్వమనే అభిప్రాయం వున్నవాడు మానవత్వంలో పరిపూర్ణత నొందజూచుటలోనే ఆనందమున్నదని అతని సిద్ధాంతం.
ఈ రకంగా లేఖల వలన కవిత్వంపట్ల తిలక్ కున్న ప్రత్యేకమైన,ఖచ్చితమైన అభిప్రాయం తెలుస్తుంది.
తెలుగు సాహిత్య కన్యకు తన రచనల ద్వారా తిలకం దిద్దిన ప్రముఖ కవి తిలక్ సాహిత్య పరంగా కూడా లేఖలకు ప్రముఖ స్థానముందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

June 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సులక్ష్య సేవా సమితి – పదేళ్ల సేవా ప్రస్థానం

by Manduva Santhosh June 1, 2023
written by Manduva Santhosh

“సు”- మంచి , “లక్ష్య ” – లక్ష్యం

ట్యాగ్ లైన్ – సర్వే సుజనా సుఖినోభవంతు
నేపధ్యం :
2008 – 2013 వరకు వివిధ సేవా కార్యక్రమాలను చేసిన తరువాత ,ఈ కార్యక్రమాలన్నింటిని ఒక గొడుగు కిందికి తీసుకురావాలనుకొని అనుకున్నాం.
మన అభ్యున్నతికి కారణమైన ఈ సమాజానికి కొంతైనా తిరిగివ్వాలనే సదుద్దేశంతో మిత్రులమంతా ఒక బృందంగా ఏర్పడి ఉగాది పర్వదినాన ( ఏప్రిల్ 11 2013 ) న సులక్ష్య సేవా సమితి కి అంకురార్పణ చెయ్యడం జరిగింది. రానున్న ఉగాదికి ఒక దశాబ్దం పూర్తి చేసుకోబోతుంది.

ముఖ్య లక్ష్యాలు – చేపట్టిన కార్యక్రమాలు

అందరికి విద్య – ఈ రోజుకి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కొరవడుతున్నాయి – ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్థోమత చాలా మంది కూలి – నాలి చేసుకునే తల్లితండ్రుల్లో లేదు . దీని వల్ల చాలా మందికి సరైన విద్య అందడం లేదు , కొంత మంది మధ్యలోనే చదువు ఆపేసి ఎక్కడో బాల కార్మికులుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు .

ఈ పరిస్థితిని కొంతైనా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని, ఆ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. 1 . 2 లక్షలతో శ్రీ వ్యాస అవాసంలో గ్రంధాలయం ఏర్పాటు చెయ్యడం జరిగింది . 1 లక్ష రూపాయల విలువగల పుస్తకాలను వివిధ ఆశ్రమాల్లో ఇవ్వడం జరిగింది . ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు వారి ఫీజులు మరియు ఇతర అవసారాలకై ఆర్ధిక సహాయం సహాయం చెయ్యడం జరిగింది . వివిధ ఆశ్రమాల్లో స్కూల్ యూనిఫార్మ్స్, వారు చదువుకోవడానికి కావలసిన ఇతర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. వైద్యం – ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు . కానీ నేటి రోజుల్లో చాలా మంది జీవన విధానం వల్ల , ఆరోగ్య అలవాట్ల వల్ల, కల్తీ ఆహరం వల్ల చిన్న వయస్సులోనే అనారోగ్యం పాలైతున్నారు తాము సంపాదించే డబ్బులో ఎక్కువ భాగం వైద్యులకు , మందులకు పెట్టడమే కాక తీవ్ర అశాంతికి గురవుతున్నారు . అందుకే పాఠశాలల్లో , కళాశాలల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయం మీద సదస్సులు నిర్వహించడం జరుగుతుంది .

కరోనా వ్యాధి ప్రబలి ప్రపంచమంతా స్తంభించిందినప్పుడు , ఫ్రంట్లైన్ వారియర్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడారు . వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా , వారి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని డాక్టర్లకు , ఆరోగ్య కార్యకర్తలకు,పోలీస్ సిబ్బందికి , పారిశుధ్య కార్మికులకు, మీడియా ప్రతినిధులకు రెండు లక్షల నలభై వేల విలువగల ఆరు వస్తువులతో కూడినటువంటి రెండు వేల సేఫ్ ఎనర్జీ కిట్లను అందివ్వడం జరిగింది .
అలాగే ఒక లక్షా ఎనభై వేల రూపాయల విలువగల మూడువేల పైగా మాస్కులు , శానిటైజర్స్ పంపిణి చేసాము

పర్యావరణ పరిరక్షణ – వృక్షో రక్షతి రక్షితః , మట్టి గణపతులను ప్రతిష్టిద్దాం – పర్యావరణ పరిరక్షణకై పాటుపడడం , ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం – కాలుష్య నివారణకై కృషిచేద్దాం .
వివిధ కారణాల వల్ల పర్యావరణం రోజు రోజుకి వినాశనం అయితున్నది. దీని వల్ల మనం అనేక సమస్యలకు గురవుతున్నాం . ఈ లక్ష్యంలో భాగంగా 1000 కి పైగా మొక్కలను వివిధ పాఠశాలలో , రోడ్లపై నాటడమేకాక వాటిని పెంచడం జరిగింది . అదే కాకా ప్రముఖ పర్యావరణవేత్త , కోటి మొక్కలు నాటిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత , వనజీవి దారిపల్లి రామయ్య గారితో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.

గత తొమ్మిది సంవత్సరాలుగా ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణి చెయ్యడం జరిగింది . యువత సాధికారత – ఒక వంద మంది యువకులను ఇవ్వండి – భారత దేశాన్ని బలమైన దేశంగా మారుస్తా అని స్వామి వివేకానంద అన్నారు . భారత దేశంలో 65 % జనాభా యువకులే . ఇది మనకు చాలా పెద్ద ఆస్తి . కానీ అనేక మంది యువకులు సరైన అవగాహన లేక , చెడు అలవాట్లకు బానిసై , అవకాశాలు దొరకక , చదువుకునే స్థోమత లేక వారి గమ్యానికి చేరలేకపోతున్నారు .ఇందుకు గాను సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీ పరీక్షాలలో విజయం సాధించడం ఎలా , వ్యక్తిత్వ నిర్మాణం, ఒత్తిడిని అధిగమించడం లాంటి వివిధ అంశాల మీద పలు కళాశాలల్లో , పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది .కనీస అవసరాలు తీర్చడం – భారత దేశంలో ఒకవైపు అపర కుబేరులు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే , కోట్లాది మంది పేదరికంతో మగ్గుతూ వారి కనీస అవసరాలు తీర్చలేకపోతున్నారు .

నగరంలోని వివిధ ఆశ్రమాలకు నిత్యావసర వస్తువులు వితరణ చేసి తోడ్పాటు అందించడం జరిగింది . చలి కాలంలో నిరాశ్రయులకు , పేదవారికి , అనాధలకు , వృద్ధులకు వెచ్చదనం కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 4 .8 లక్షల విలువైన 2400 బ్లాంకెట్ల్లను నిరాశ్రయులకు మరియు నిరుపేదలకు , అనాధలకు , వృద్ధులకు పంపిణి చెయ్యడం జరిగింది . మేము చేసిన అన్ని కార్యక్రమాల్లో మాకు నిజంగా సంతృప్తిని ఇచ్చింది కరోనా మహమ్మారి ప్రబలినప్పుడు మా సంస్థ ద్వారా చేపట్టిన సహాయక కార్యక్రమాలు. ప్రజలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురైతున్న పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం అనేది మాకు జీవితాంతం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే అనుభవాన్ని మిగిల్చింది. ఈ అనుభవంతో ముందు ముందు ఇంకా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టే శక్తి మాకు కలగాలని మా ఆశ.

మా లక్ష్యాల్లో ఒకటైన కనీస అవసరాలు తీర్చటం లో భాగంగా గుడిసెల్లో నివసించే పేదవారికి , సంచార జాతులకు ,చెత్త సేకరించే కార్మకులకి , అనాధాశ్రమాలకి , వృద్ధాశ్రమాలకు , వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలిలకి , భవన నిర్మాణ కార్మికులు , పానీ పూరి బండి వాళ్ళు , గుత్తి కోయలకు, నేపాల్ నుంచి వచ్చిన గురఖాలు , అనాధ వృద్ధులు ,దినసరి కూలి కార్మికులు , తదితర వెయ్యి కుటుంబాలకు ఆరు లక్షల విలువగల పదమూడు వస్తువులతో కూడిన నిత్యావసరాల కిట్లను పంపిణి చెయ్యడం జరిగింది.
తమ స్వస్థలాలకు వెళ్లాలనే తలంపుతో ఎర్రటి ఎండలో వందలాది కిలోమీటర్స్ నడుస్తున్న వలస కార్మికుల గోసను దృష్ఠ్టిలో ఉంచుకుని వారికి రెండు లక్షల విలువ్ కల పన్నెండు వస్తువులతో కూడిన మైగ్రంట్ రెఫ్రెషమెంట్ కిట్లను వెయ్యి మందికి పంపిణి చెయ్యడం జరిగింది . అలాగే కొందరికి మా స్వంత ఖర్చులతో వాహన సౌకర్యం ఏర్పాటు చేసి వారి స్వంత రాష్ట్రాలకు పంపించడం జరిగింది .ప్రేమ , వాత్సల్యాలను పంచడం – అనాధ, వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వారు తమ అనుకున్న వాళ్ళ ప్రేమను నోచుకోక నిరాదరణకు గురవుతుంటారు. వారికి కావలసిందల్లా ఆత్మీయ స్పర్శ , మేమున్నామనే భరోసా , వారితో సరదాగా గడిపేందుకు కొద్ది సమయం .

ఈ ఉద్దేశంతో సమయం దొరికినప్పుడల్లా అనాధాశ్రమాల్లో నివసిస్తున్న పిల్లలతో సమయం గడపడం, సినిమాలకు ( బాహుబలి, ఏషియన్ మాల్ లో ) , విహార యాత్రలకు తీసుకెళ్లడం ( రామప్ప, లక్నవరం, ఖిలా వరంగల్ , వేయి స్థంబాల దేవాలయం, జూ పార్క్ , సైన్స్ సెంటర్ , హైదరాబాద్ లోని వండర్ లా ) , హోటళ్ళకి తీసుకెళ్లి వారికి ఇష్టమైనవి తినిపించడం , ఆట వస్తువులు కొనిపెట్టడం , వారి పుట్టిన రోజులు జరపడం చేస్తుంటాము . వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వారికి సాంత్వన కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ మాతృదినోత్సవాలు , సంగీత విభావరులు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది .

డిగ్నిటీ అఫ్ లేబర్ – మన జీవనం సాఫీగా సాగుతుందంటే అందులో ప్రతి ఒక్కరి కృషి ఉంటుంది. కానీ డబ్బు , హోదా ఉన్న వాళ్లకు ఇచ్చే మర్యాద , గుర్తింపు కింది స్థాయిలో ఉండదు . అమెరికా లాంటి దేశాల్లో ఆ దేశ అధ్యక్షుడిని ఎలా చూస్తారో , ఒక సామాన్య గుమాస్తాను కూడా అలానే చూస్తారు .

అందుకనే కింది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉండడానికి నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికులు మరియు ఇతర పనులు చేసే వారిని గుర్తించి , సత్కరించి వారికి కావాల్సిన సహాయం అందించడం జరుగుతుంది . సుపరిపాలనకై పాటుపడడం – భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మన దేశం ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉంది . అవినీతి , మత విద్వేషాలు , అవకాశవాద ధోరణి , లాంటి ఎన్నో సమస్యలు మనన్ని పట్టి పీడిస్తున్నాయి . అందుకనే వివిధ పాఠశాలల్లో , కళాశాలల్లో, ఓటు హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం , పౌరుడిగా మన హక్కులు లాంటి వివిధ విషయాల మీద అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది .

భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను పరిరక్షించడం – యావత్ ప్రపంచానికి దిక్సూచిగా, దిశా నిర్దేశం చేసిన ఘనత మనది . కానీ యాంత్రిక జీవన విధానం వల్ల , మనం మన పురాణాలను , ఇతిహాసాలను రాబోయే తరాలకు అందివ్వలేకపోతున్నాం , మన చారిత్రిక కట్టడాలను పరిరక్షించుకోలేకపోతున్నాం. అందుకనే విద్యార్థులకు మన ఇతిహాస , పురాణాల గురించి తెలియచేసి , మన చారిత్రక కట్టడాల సందర్శనకు తీసుకువెళ్లడం జరుగుతుంది .

గ్రామీణ భారతంలో పరివర్తన తీసుకురావడం – ఇప్పటికి 65 % కన్న ఎక్కువ ప్రజలు పల్ల్లెలో నివసిస్తున్నారు . పల్లెలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని నానుడి . కానీ ప్రపంచీకరణ తో పల్లెల్లో నివసిస్తున్న అన్నదాతలు ,ఇతర వృత్తి నైపుణ్యం గల వారు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు , ఇతర దేశాలకు వలస పోతున్నారు, అక్కడ కూలీలుగా వారి బతుకు బండిని నెట్టుకొస్తున్నారు . దీని వల్ల వారి జీవితాలు చీకటిమయం అవ్వడమే కాకుండా దేశ ప్రగతి కూడా స్తంభించి పోతుంది. అందుకనే పల్లెలకు వెళ్లి వాళ్లకు సేంద్రియ వ్యవసాయం , చేనేత , హస్తకళల లాంటి రంగాల్లో ప్రోత్సాహాం అందించి , వారిలో ఉన్న ఇతర నైపుణ్యాలను వెలికి తీసి వారికి కావలసిన సహాకారం అందించడం జరుగుతుంది .

భవిష్యత్ ప్రణాళిక
“ఎడ్యుకేట్ , ఎంపవర్ , ఎన్ లైటెన్” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో, కళాశాల విద్యార్థుల్లో మరియు యువతలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము .

మేము చేసే కార్యక్రమాలకు మొదటినుంచి ఆర్థికంగా సహకరిస్తున్న దాతలకు , మా గురించి కధనాలు ప్రచురిస్తున్న మీడియా ప్రతినిధులకు, మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమాలకు విచ్చేస్తున్న అతిథులకు మా హృదయపూర్వక అభినందనలు .
మాకు పెద్ద మొత్తంలో సరకులను ఇస్తున్న వ్యాపారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము

మా చిహ్నం

  • భారతీయత ప్రతిబింబించేలా మన జాతీయ పతాకం లో త్రివర్ణాలను మాయా చిహ్నంలో వాడాము.
  • మన రెపరెపలాడినట్టున్న మూడు “S ” లు సులక్ష్య , సేవ , సమితి ని స్ఫురించేలా పెట్టడం జరిగింది .
  • మధ్యలో ఉన్న 4 మా ప్రధాన లక్ష్యాలకు సంకేతాలు .
  • ఒకరి చేతులు ఇంకొకరు పట్టుకుని ఉన్న చిత్రం “టీం వర్క్ ” కి సంకేతం , 11 మందిని పెట్టడానికి ఉద్దేశం , మన దేశంలో క్రికెట్ ని ఎంత ఆరాధిస్తారో , సమాజ సేవని కూడా అంతే ఆరాధించాలని చెపుతుంది

ముఖ్య సభ్యులు :
మండువ సంతోష్ , కౌశిక్ భూపతి. మండువ శివ సంపత్., బొల్లం రాహుల్, దేవులపల్లి జయంత్, కోడం వినయ్, సాయి కిరణ్, విష్ణు.
మరెంతో మంది మిత్రులు మంది మిత్రులు మాకు వెన్ను దన్ను గా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు .

కుటుంబ నేసథ్యం

పేరు : మండువ సంతోష్
తండ్రి : కీ. శే. మండువ వెంకట రమణ రావు
తల్లి : పసునూరి వెంకట రాఘవ శాంత , విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు
తమ్ముడు : మండువ శివ సంపత్ , అమెరికా లో సాఫ్ట్ వెర్ ఇంజనీర్
విద్యార్హత : ఎంబిఏ , మార్కెటింగ్, కాకతీయ విశ్వవిద్యాలయం
సొంత ఊరు : పెగడాపల్లి ,హాసనపర్తి మండలం
ప్రస్తుత నివాసం : శ్రీనగర్ కాలనీ , హన్మకొండ
నిధుల సమీకరణ : మా కార్యక్రమాలను చూసి భాగస్వామ్యం అవ్వదలచిన కొద్ది మంది దగ్గరి మిత్రుల ద్వారానే నిధుల సమీకరించడం జరుగుతుంది . మేము చేసే కార్యక్రమాల వివరాలను మా పేస్ బుక్ పేజీ పేజీ మరియు వెబ్ సైట్ లో పొందుపరచటం జరుగుతుంది .

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
పల్లవి :

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
ముందడుగే వేశారు ..
పదిమందికి జీవనమిచ్చారు

సేవే ధర్మాంగా ..
సేవే వేదంగా ..
మదితోనే చూసారు
సాయానికి ముందుగ నిలిచారు

అణగారిన బతుకుల్లోనా
ఆనందపు వెలుగయ్యారు
అనాధలకు బలమయ్యారు
ఆసరాగా నిలిచారు

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి

బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా

చరణం 1 :

బడిపిల్లల భవితను మార్చగ
విద్యాబుద్ధులనందించారు
పాఠశాలలను మెరుగు పరచగా
విశ్వాసాన్నిస్తూ కదులుతున్నారు

నవసమాజ నిర్మాణానికై
పట్టుదలగా పయనిస్తున్నారు ..
కూడూ … గుడ్డా .. లేనివారికై
శాయశక్తులా శ్రమిస్తున్నారు

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..

చరణం 2 :
యువతకు మార్గం చూపిస్తూ
సదస్సులెన్నో నిర్వహిస్తూ
భవిష్యత్తును అందిస్తూ
ముందుకు గమనం సాగిస్తూ

అందరు బాగుండాలని
ఆరోగ్యాంగా బతకాలని
పేదరికం నిర్మూలనకై
కనీస అవసరాలనందిస్తున్నారు

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..

చరణం 3 :
అనాధ వృద్ధుల బాసటగా
ప్రేమా కరుణ లోగిలిగా
ఆత్మీయంగా పలకరిస్తూ
పలు సంతోషాలను అందిస్తూ

శ్రమైక జీవనాన్ని గుర్తిస్తూ
సత్కారాలను అందిస్తూ
సమానత్వాన్ని పంచేస్తూ
సమాజ శ్రేయస్సు నినదించే ..

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి

సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి

సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..

June 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

బాల చిత్రకారులు

by Raghav Keshav June 1, 2023
written by Raghav Keshav
రాఘవ్
కేశవ్
June 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us