మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఈ సృష్టి ఉంటుందా..?

by Charu Sri May 9, 2023
written by Charu Sri

ఆడ కూతురుగా పుట్టానని
అమ్మే నన్ను చిదిమేస్తుంది

ప్రేమ పెళ్లి చేసుకున్నానని
కన్నవాళ్లే పరువు పేరుతో
నా ఉసురు తీస్తున్నారు

కాముకులు నా జీవితాన్ని
కుక్కలు చించిన విస్తరిచేస్తున్నారు

అత్తింటిలో కట్నదాహం
నన్ను అగ్గికి ఆహుతిచేస్తుంది

మేథావుల్లారా మౌనం వీడండి
మనుషుల్లారా సమాధానం చెప్పండి
ప్రజాస్వామ్య భారతంలో నాకు..
బ్రతికే అర్హతలేదా..?

నేను లేకుంటే..
ఈ సృష్టి ఉంటుందా..?

May 9, 2023 0 comment
3 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మధురా విజయము

by రంగరాజు పద్మజ May 9, 2023
written by రంగరాజు పద్మజ

గంగాదేవి ప్రతిభా వైచిత్రి

తెలుగువారి సాహితీ సంపద చాలా గొప్పది. పురాణాలు, ఇతిహాసాలు, శతకాలు వంటిఎన్నో ప్రక్రియలతో నిండి ఉంటుంది.
తెలంగాణా చరిత్రలో కాకతీయుల పరిపాలనాకాలం ఎంతో వైభవంగా సాగి పేరు పొందింది.
ఓరుగల్లును రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని దాదాపు 200 సంవత్సరాలు పాలించి చరిత్రకే తలమానికంగా నిలిచారు కాకతీయులు.

స్త్రీలకు విద్య నిషేధం అన్నప్పుడు కూడా స్త్రీలు చక్కని సాహిత్యాన్ని సృష్టించారని పరబ్రహ్మ శాస్త్రి గారు ‘కాకతీయచరిత్ర‘ లో చెప్పారు. కాకతీయ వంశస్థులలో ఎందరో మహిళా రచయిత్రులున్నారని వారిలో కామసాని రాసిన చంపకమాల ఉత్పలమాల పద్యాలు గొప్పగా ఉన్నాయనీ, మిర్యాల వంశాల విశేషాలు రాసిందని చెప్పారు.
ఈవంశానికి చెందిన మహిళనే కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రని ఒద్దిరాజు రాఘవ రంగారావు గారు ఒక చారిత్రక వ్యాసంలో రాశారు.
అలాగే కాకతీయ వంశంలో ఎందరో ఎన్నోరంగాలలో నేర్పరులైన మహిళలు ఉన్నారు. వారే కామసాని, ఎరుకసాని, అయితసాని మొదలైన వారు.
సాని అంటే సంగీతంలో నిష్ణాతురాలని అర్థం.
స నుండి ని వరకు సంపూర్ణ సంగీత పాండిత్యాన్ని సాధించిన గంధర్వాంగన వంటి ప్రతిభ కలవారికి ‘సాని ‘అని బిరుదు ఇచ్చేవారు. ఆనాటి మహిళలు ఎంతో కష్టపడి ‘సాని ‘బిరుదును సాధించి దాన్ని గొప్పగా గౌరవంగా భావించేవారు. ఈ ‘సాని ‘బిరుదు కల వారంతా సమాజ నిర్మాణంలో వారు ఎంతో తోడ్పాటు అందించారు. వారంతా మేధావినులు కాబట్టే ఎన్నో రచనలు చేశారు. అభినందించే విషయం ఏమిటంటే అంతఃపురంలో నివసించే రాణీ వాసపు స్త్రీలు బయట ప్రపంచంలో కాలు పెట్టకుండా రచనలు చేయడం కష్టమే.. ఎలా చేయగలిగారో! ఎంతటి ఊహా శాలిత్యమో కదా! ఎందుకంటే స్త్రీలు ప్రబంధాలో, రుక్కులో, రాసిన వారు ఉన్నారు…. వారిగురించి విన్నాము.. కానీ చరిత్ర రాయడం కష్టతరమే కావ్యాలైతే ఊహించి కల్పనలు చేసి,రాయవచ్చు. కానీ చరిత్ర ను ఆధారాలతో రాయాల్సి ఉంటుంది. అటువంటి నైపుణ్యం ఉన్న గంగాదేవి అసమాన్యురాలు. ఈ రచయిత్రి వల్ల కాకతీయుల పాలన రాజ్య విస్తీర్ణం వలననే మహిళల ఖ్యాతి విస్తరణ జరిగింది. లేకపోతే ఇవాళ గంగాదేవి గురించి మాట్లాడుకోలేకపోదుము.
పురుషులే కాకుండా స్త్రీలు కూడా గొప్ప కవులు అవుతారు!కావచ్చు ! ప్రతిభ ఆధారంగా వారి వారి ప్రజ్ఞ పాటవాలను విచారించాలి కానీ లింగ వివక్షత చూపకూడదు కదా!
‘మధురా విజయం ‘లేక ‘విక్రమ పరాజయ చరితం ‘ అనే కావ్యాన్ని మహిళా కవయిత్రి శ్రీమతి గంగాదేవి గారు రచించినట్లు మధుర విజయంలోని మొదటి, రెండవ సర్గలో తెలిపారు. ఈ కావ్యంలో 39– 42 సర్గలలో ఈ విషయం స్పష్టంగా రాయబడింది.

తతోయధావత్ కృతిచేల సంస్క్రియో
నరేంద్ర సూను స్వత ఏవ లబ్దివాన్
కలాసు శశ్వత్ సకలాసు కౌశలం
గురూపదేశస్త్యపదేశ తామగాత్ ॥

భావం:–అనంతరం (తన సోదరులతో దినదినాభివృద్ధి చెందిన) రాజకుమారుడు కంపరాజు యధావిధిగా చూడాకర్మ, ఉపనయనాది సంస్కారములు ముగించుకొని సకల కళల యందు నైపుణ్యం సంపాదించుకొని,గురువు దగ్గరకు శిక్షణను పొందుటకు వెళ్ళెను.

సతీర్థ లబ్ధాయుధ శస్త్ర సంపదా
గుణాభిరామో గురుణైవ శిక్షితః ౹
శరాసనాసి ప్రముఖేషు శాత ధీ
ర గచ్ఛదస్త్రేష్వభిరేషు పాటవమ్ ॥

భావం:- శౌర్య ఔదార్యాది గుణములతో ఆహ్లాదమైన సూక్ష్మ బుద్ధి గల ఆ రాజకుమారుడు (కంపరాజు) గురువు నుండి ఆయుధాలను మంచి శాస్త్రాల జ్ఞానాన్ని పొంది గురువు ద్వారా శిక్షణ పొంది శర( బాణము) ఖడ్గము (పొడవైన కత్తి) మొదలైన అస్త్రముల ఉపయోగ సామర్థ్యం పొందెను.

సత్య వాగ్ భూరిబలో ధనుర్ధర
స్తురంగ మారోహణ కర్మ మర్మవిత్ ౹
కృపాణ విద్యా నిపుణః పృథాభువా
మదర్శి సంఘాత యివైకతాం గతః ॥

భావం:- ఆ రాజకుమారుడు (కంపరాజు) సత్యభాషణలో ధర్మరాజు వలె బలసంపన్నతలో భీముడి వలె, ధనుర్దారులలో అర్జునుడి వలె, అశ్వ (గుర్రం ) విద్యలో నకులుడి వలె, కత్తి సాములో సహదేవుడి వలె.. పాండవులందరిని ఒక చోటు చేర్చినట్టు ఆ రాజకుమారుడు కనిపించ సాగాడు.

ఇంత గొప్పగా వర్ణన చేస్తూ కావ్య రచన సాగింది. ఈ కావ్యానికి ఇతివృత్తం ఇతిహాసాల నుండి కాకుండా భర్త యొక్క పరిపాలన విధానం, దండయాత్రలో గెలుపు అనే అంశాలను తీసుకొని శాస్త్రీయంగా మధురా విజయం అనే కావ్యాన్ని గంగాదేవి రచించింది. ఐతే తాళపత్రాలమీద రాయడం వల్లకొన్ని తాటాకు కమ్మలు ఎక్కడో పోయాయట! కొన్నిచోట్ల పురుగులు తినడం వల్ల ఆయా పదాలు కనపడడంలేదు. అలాగే గంగాదేవి కన్నుక్కొన్న పదాలకర్ధాలు కాలక్రమంలో మారడంతో తాళపత్రాలను పరిష్కరించిన భాషావేత్తలు అక్కడ చుక్క గుర్తు పెట్టి , సమానార్థ పదాలను చేర్చారు.

ఒక మహిళ చరిత్ర తాను రాసిన కావ్యం వైధర్భీ శైలిలో రాసి, సంస్కృత భాషలో తనకనుగుణంగా కొన్ని పదాలు వ్యాకరణానికి తగినట్టుగా సృష్టించి, దోషాలు లేకుండా, శాస్త్రీయ కావ్య నియమాలతో, సంప్రదాయబద్ధంగా చక్కని వాక్య నిర్మాణం, పద గుంఫనలతో మధురా విజయం లేదా కంపరాయ చరిత్ర అనే పేరుతో తన భర్త కంపరాయని సాహస గాధను రాసింది.
అది కూడా సంప్రదాయంగా!ఇలా…

దాస్తా కాళీదాసస్య కవయః కేన విభ్రాతి
ఇదానీమాపి తస్యార్ధానుపజీవస్య భీయతః ॥

అని కాళిదాసుకు నమస్కరించి,

వాణీపాణీ పరామృష్టవీణా నిక్కంపహారిణీం
భావయంతి బ్రహ్మశ్రీ వాన్యే భట్ట బాణస్య భారతీమ్

ఇలా భారవి, ఆచార్య దండి,భవభూతి,కర్ణామృత కవీశ్వరులను , తిక్కన్నను,తన గురువైన అగస్త్యుడిని, నాటక రచయిత గంగాధర మహాకవిని, విద్యానాధులను మొదలైన కవులనెందరినో స్మరిస్తూ… నమస్కరిస్తూ మధురావిజయ కావ్య రచన ప్రారంభించింది రచయిత్రి గంగాదేవి.
క్రీ.శ.16 శతాబ్దం ప్రాంభంలో విజయనగర మహారాజు అచ్చుతదేవరాయల ఆస్థానంలో మహిళా గ్రంథ కర్తలుండే వారని చరిత్ర స్పష్టం చేసింది.
విజయనగరవైభవాన్ని గొప్పగా వర్ణిస్తూ రాసిన చారిత్రక విశేషాలతో రాసింది. కంపరాయ చరిత్ర రాయడానికి గంగాదేవికి (రచయిత్రికి) పెద్దకారణమే ఉన్నది.. అది ఏమిటి అంటే?యువరాజుగా ఉన్న కంపరాయుడు గొప్ప వీరుడు… తన భర్త పరాక్రమాన్ని గ్రంథస్తం చేయాలని రాసిన కావ్యమిది. ఈయన బుక్కరాయల కుమారుడు కనుక అతనిని పరిచయంచేసి, తరువాత కంపరాయల విజయయాత్రను రాయాలనుకుని, విజయనగర రాజైన హరిహర రాయలు సోదరుడు బుక్కరాయలుతో కథను ప్రారంభించింది రచయిత్రి. ఈయనకు ఎంతోమంది భార్యలున్నా దేవయాని అంటే చాలా ప్రేమ ఉండేదట. ఈ దేవయానికి కంపన, చినకంపన,సంగమ అనే కుమారులు పుట్టారని, కంపన గర్భంలో ఉండగా తామ్రపర్ణీ నదిలో స్నానం చేయాలనే కోరిక కలిగిందట దేవయానికి…తన ఇష్టమైన భార్యకోరిక కోరడం రాజు తీర్చకుండా ఉంటాడా? అలా నదిలో స్నానం చేయడం వల్ల కొడుకు అందంగా పుట్టాడని ఆమె నమ్మకం.
ఈ బుక్కరాయలుకు ఎందరో సామంత రాజులు ఉండేవారని వారంతా ఎంతో విధేయులై ఉన్నారని రాస్తూనే… విజయనగర నగరవర్ణన ఎంతో గొప్పగా చేసింది. అందమైన భవనాలు, సుందరమైన ఉద్యానవనాలు ఉండేవనీ, తుంగభద్రానది నుండి నీళ్లు కాలవల ద్వారా తెప్పించి కృత్రిమ స్నాన కొలనులు ఏర్పాటు చేసుకున్నారనీ, తుంగభద్రా నది కోటకు ఒక కందకం వలే రక్షణ కల్పించిందనీ, అటు దక్షిణం వైపు మలయ పర్వతాలు, ఉత్తరంలో వింధ్య పర్వతాలు ఉండేవనీ, తూర్పున ఉదయాచలం, పడమటివైపున ఆశాచలం పర్వతాలు సరిహద్దుగా ఉండి, మంచి శిక్షణతో ఉన్న సైన్యాలతో రక్షణకు లోటు లేకుండా ఉండేదనీ, నగర శివారులలో విరూపాక్ష దేవాలయం ఉండి ఆధ్యాత్మికతతో సంపన్నమై, బుక్కరాయల పరిపాలన రామ రాజ్యం వలె సాగిందని, రాజులకుండాల్సిన చతుర్విధ పురుషోర్ధాలు పుష్కలంగా ఉన్నాయని, విజయనగర వైభవంతో పాటు, కుమారుడు కంపన పుట్టుక,గంగా దేవితోవివాహం, అతని జీవితం, దండయాత్రలో శంభువరాయల నుండి తుండీర మండలాన్ని ఎలాగెలిచి, చేజిక్కించుకున్నారో, ఆ కథను, సుల్తాన్ తో కంపన చేసిన యుద్ధరీతి చదివేవారికి కూడా పౌరుషం ఉప్పొంగేలా రచించింది. అంతేకాకుండా దండయాత్ర సాగిస్తున్నప్పుడు తోవలో ఆయన శృంగార సన్నివేశాలను, కంపన వీరత్వం, అతని అందం, సాహసం, యుద్ధ వివరాలను మొదటి రెండు సర్గలలో… కొన్నిచోట్ల రాఘవేంద్ర విజయం రచయిత నారాయణ కవివర్ణన వలె, కొన్నిచోట్ల కామసాని రచనా శైలివలె రాసింది.
” ఒక స్త్రీ గర్భధారణ ” గురించి రాసిన ద్విపదలలో తను కనుగొన్న కొత్త పదాలనే ఉపయోగించింది. అవి కూడా సహజంగా ఉండేలా పాఠకులు చదువుతున్నట్టుగా కాకుండా ఆ సంఘటనలు వారి కళ్ళ ఎదుట దృశ్యాల వలె కదలాడుతుంటాయి.
ఈ కావ్యంలో ఆనాటి సైనికుల సాహసాలు, యుద్ధ నైపుణ్యాలు, విజయనగర విస్తరణ కోసం చేసిన దండయాత్ర కొనసాగుతున్నప్పుడు ఉదయాస్తమానాల వర్ణనలనూ, ఋతువుల వర్ణనలనూ తన ప్రతిభతో చక్కగా రచించి, కావ్యాన్ని భర్త పుట్టినరోజున బహుమతిగా ఇచ్చింది గంగాదేవి.

ముస్లిం సైన్యాలను హతమార్చిన కంపన పేరు చెబితే చాలు ఎదుటి శత్రు సేనలు కంపించిపోయేవారట అలా పేరుకు తగిన వీరత్వం, అతని అందం అన్నీ వర్ణించింది. కంపన రకరకాల ఆయుధాలు, ఉపయోగించి యుద్ధం చేసిన సాహసం గురించి రాసింది.

ఇందులో రాసిన ఓ గొప్ప విశేషం …. సుల్తాన్ తో యుద్ధం చేస్తుండగా తల తెగిపోయినా ఒక సామంతుడు గుఱ్ఱం యొక్క పగ్గం పట్టుకున్న అతని చేతి పట్టుతప్పలేదనీ, కుడిచేయి కంపనునితో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నదని రాయడం ఔరా! అనిపించింది.

గంగాదేవి రచనా చమత్కారం బాగుంటూనే… మనసును ఒక్కోచోట కలుక్కుమనిపిస్తుంది….

తురుష్కుల దౌర్జన్యానికి శ్రీరంగ పట్టణం నాశనమైందనీ, చక్కని పచ్చని కొబ్బరి తోటలను నాశనం చేసారనీ, కోవెలలో ఆరాధనలు చేయకుండా బ్రాహ్మణులను బంధించారనీ, కోవెలలో వేద మంత్రాలకు బదులు గుడ్లగూబల కేకలు వినలేకపోయేవారమనీ, చిలుక పలుకులకు బదులు పారశీక పలుకులు చెవిలో ముల్లులవలె గుచ్చాయనీ, రాజుతో చెప్పి దండయాత్ర కు ఉసిగొల్పిందట! మహ్మదీయుల పరాజయం వరకూ రచన కొనసాగింది.
దిగ్విజయంగా విజయ యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత విషయాలెన్నో రచించింది గంగాదేవి. శ్రీరంగంలోని విమాన గోపురం శిధిలమై పోవడం, రంగనాథుని కోవెల మండపాలు చెట్లు మొలిచి ఉండడం, దేవాలయ ప్రధాన ద్వారం తలుపులు చెదపురుగులు తిని పాడుచేయడం వంటివన్నీ ఈ వర్ణన లలో ఉన్నాయి. ఇతర సన్నిధులలోని ఆలయాల గర్భగుడులన్నీ శిధిలమైనాయి… వాటి నుండి సంగీత మృదంగ ధ్వనులు ఎంతో మధురంగా వినిపించేవి. అంత గొప్ప దేవాలయంలో నక్కల అరుపులు వినిపిస్తుంటే కంపన సహించలేకపోయాడు.

కావేరీ నది ఉప్పొంగి, ఎన్నో నష్టాలు జరిగాయి. అగ్రహారాలలో తురుష్కులు మద్యమాంసాలను తిని- తాగుతూ యజ్ఞాలు చేయనివ్వకుండా యజ్ఞ కుండాలు చల్లారిపోయి, హోమపు సువాసనలు రావడంలేదు. మాంసం కాల్చిన వాసనలు రావడం , దుర్వాసన రావడం, వేదగానాలు మోగి వీనులవిందైన దేవాలయం శోకాలతో నిండిపోయింది.

ఇనుప శూలాలతో యువకుల తలలను గుచ్చేవారు. తామ్రపర్ణి నదిలో యువతులు స్నానం చేస్తుంటే వారి రొమ్ములను కోయగా వారి నెత్తురుతో తామ్రపర్ణీ నది నీళ్లన్నీ రక్తసిక్తమైపోయి ఎర్ర రంగుతో పారాయట. ఆవులను చంపి ఆ నదిలో వేసారట.ఈ విషయం కంపనకు చెప్పి, దక్షిణ దిక్కు గెలిచేలా ఉపాయం చెప్పింది. తనను పంపించిన విషయం గుర్తుకు వచ్చి, ఆమె వైపు సానుకూలంగా చూసి అవన్నీ బాగు చేయించాడు… గంగాదేవి నడికట్టుకు ఒక తళతళ లాడే ఖడ్గంఉంది. దాన్ని తీసి చక్రవర్తీ! పూర్వ కాలంలో విశ్వకర్మ దేవతల ఆయుధాల నుండి కొసలను సేకరించి వాటిని కరిగించి, ఈ ఖడ్గం తయారు చేసి, రాక్షసులపైన గెలవడానికి పరమేశ్వరుడికి ఇచ్చాడు. ఆ ఖడ్గం కోసం తపస్సుచేసి, పాండవ మధ్యముడు వరంగా పొందాడు . దాంతో యుద్ధంచేసి, ధర్మ రక్షణ చేసాడు. అలాగే మీరు కూడా ముష్కర మూకలను తరిమి వేయండి అని అతనికిచ్చింది.

మెట్టినింటి- పుట్టినింటి దేశభక్తి కల గంగాదేవి వంటి భార్య ప్రోత్సాహం వల్లనే విజయం సాధించగలిగానని, ఆమెను మనస్పూర్తిగా అభినందించాడట.
ఇలా దేశ పౌరురాలిగానూ , భార్యగానూ, రచయిత్రిగాను ఎందరి మెప్పులో పొందిన గంగాదేవి మహిళలకెంతో ప్రేరణ! మార్గదర్శి! స్పూర్తి!

[ ఈ రచయిత్రి గురించి రాజశేఖరుడనే కవి గొప్ప నాటక కర్త చెప్పాడు ]

సేకరణ:- మల్యాల దయామతీదేవి* ఈయన గుఱ్ఱం చాలా పేరుపొందిన గుఱ్ఱం! ఎలా అంటే ఆ గుఱ్ఱమెక్కి బయలుదేరితే చోళ, కేరళ, పాండ్య రాజులు ఆ గుఱ్ఱానికి దారి ఇస్తూ… చేత ఖడ్గాలు పట్టుకొని ముందు నడిచే వారట! అంతటి వీరుడు కంపన. అతను గుఱ్ఱం మీద వీధుల్లో వెడుతుంటే అతనే గెలవాలని ముత్తైదువలు, కన్యలు బంగాళాల మీద నుండి ఆశీర్వదిస్తూ పూలు చల్లేవారట! అలా ప్రయాణించి ఐదారు రోజులకు కర్ణాటకను దాటి కంటకానన అనే ప్రదేశం చేరాడు. ఆ రాజును వశపరచుకోవడానికి ఎప్పటినుండో అతను ఎదురుచూస్తూ కొంతకాలం అక్కడే ఉన్నాడు. ఎవరూ తనపై దండెత్తిరాకుండా.. విరించిపురంలో తన మకాం ఏర్పాటు చేసుకున్నాడు. సైన్యాన్ని కాపలా పెట్టుకున్నాడు.
కంపన ద్రవిడరాజుతో యుద్ధం చేసి అతన్ని భయపెట్టాడు. అతను భయపడి పారిపోయాడు.
అయితే ఈ కావ్యంలో అతిశయోక్తులున్నాయని ఆంగ్ల కవి [ Long for affair] రచయిత విజయనగరం నుండి 150 మైళ్ళ దూరం 5 రోజూలలో ఎలా చేరగలరు? ఇది అతిశయోక్తి వలె ఉన్నదని విమర్శించడంతో ఈ కావ్య స్థాయి తగ్గిందని భాషావేత్తలు అభిప్రాయ పడ్డారు… ఎలా అంటే 21 పేజీలో 47 శ్లోకంలో కంపన పెద్దసైన్యంతో ఉత్తర ఆర్కాటు జిల్లా నుండి కంటకానన చేరుకున్నడని ఉంది … ఐతే ఆకాలంలో ఎంతటి కారడవియైనా , బాటలు సరిగా లేకపోయినా సైన్యం 30 మైళ్ళ వేగంతో నడిచే సత్తాగల సైన్యం కంపన దగ్గిర ఉండేదని చారిత్రక విశ్లేషకులు వ్రాశారు.
ఈ కావ్యం రాసిన గంగాదేవి స్వయంగా కంపన భార్య కనుక ఆమె ప్రత్యక్ష సాక్షిగా అలా రాసి ఉండవచ్చు.
మద్రాసు యూనివర్శిటీ సంస్కృత పండితుల ఆదరణ, కావ్యానికి రచనా పరంగా వారిచ్చిన గౌరవం, ఆమోదం వల్ల వారు డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ‘ మధురా విజయం‘ కావ్యాన్ని నిర్ణయించినందువల్ల పాఠకుల సంఖ్య ఎక్కువై రెండవ ముద్రణ కూడా చేసారు.

మధురావిజయ కావ్యం చదవి, ఒక స్త్రీ రాసిందని కొట్టిపడేయక … సంస్కృత సాహిత్యంలో పురుషులతో పాటు స్త్రీలు సమాన స్థాయిలో రాయగల విదుషీమణులున్నారని అంగీకరించి… ఈ కావ్యం తమ స్వంత గ్రంథాలయంలో దాచుకోతగిన గ్రంథం!
ఒక మహిళగా గర్వ పడుతూ…

ఈ గ్రంథానికి ముందుమాట రాసిన G.హరిహర శాస్త్రిగారి మరియు T.A గోపీనాథ రావు సూపరండెంట్ ఆర్కియాలజీ ( ట్రావెన్కూర్) వారి సౌజన్యంతో…

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

వృక్షానుబంధం

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు May 9, 2023
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

తొలకరి వాన పడిన మరునాడే

తీవ్రమైన ఆందోళనతో

తిరిగి వచ్చేవాణ్ని మా యింటికి

ఏళ్ల తరబడి అదే జరిగింది

విరగబూసిన ఎర్ర చంపకవృక్షాలు మూడు

మైలు దూరం నుంచే కనిపించేవి

వాటి స్వర్ణవర్ణ రేణువుల పుప్పొడిమేఘం

దారిపొడుగునా దట్టంగా పేరుకుని

అమ్మకు పార్శ్వపు నొప్పినీ

తాత్కాలిక అంధత్వాన్నీ తెప్పించేది

దాని వాసనను ఏ గాలీ వడగట్టలేకపోయింది

నల్లని స్తంభాలతో కట్టిన మా యింటిగోడలకు

చెవులూ కళ్లే కాదు, పెచ్చులూ వాసనలూ

ఎముకల కటుక్కు శబ్దాలూ

రాత్రుళ్లలో వినిపించే గొంతుకలూ ఉండేవి,

అన్నీ ప్రవేశించగలిగే దేహాల్లాగ.

ఏ తలుపూ ఆ పుప్పొడిని ఆపలేకపోయింది

అమ్మ అవస్థ బాల్కనీ లోని

లోహపు తీగ లాంటిది

అది తళతళ మెరుస్తుండేది

దానిమీద మనుమల, మనుమరాళ్ల చెడ్డీలు…

అవి తలనొప్పిని తగ్గించేందుకు

తలమీద పెట్టుకునే తడిబట్టల లాంటివి

అవస్థకు కారణమైనా

ఆ చెట్టును కొట్టనివ్వలేదు అమ్మ!

ఆంగ్ల మూలం: ఎ.కె. రామానుజన్

అనువాదం: ఎలనాగ

***

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఉడుతా ఉడుతా .. ఊచ్

by Shanthi Prabodha Valluripalli May 9, 2023
written by Shanthi Prabodha Valluripalli

అనగనగా ఒక చెట్టుంది. ఆ చెట్టుకేమో పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్రలో ఉడుత జంట కాపురం ఉంటున్నది. 

ఉడుత త్వరలో తల్లి కాబోతున్నది.  బిడ్డల్ని కనబోతున్నది.  నార, మెత్తటి గడ్డి లాంటివి ఏరుకొచ్చి సన్నగా చీల్చి మెత్తగా దూదిలాగా చేసి, గుండ్రంగా సర్ది,  గూట్లో పరుపులా తయారు చేసాయి ఉడుత జంట. పిల్లలకు ఒత్తిడి తగలకుండా, సౌకర్యంగా ఉండటం కోసం ఆ ఏర్పాటు చేసాయి. 

ఆ ఉడుత జంటకి నాలుగు పిల్లలు పుట్టాయి.   

ఆ తొర్ర ఇంట్లో పిల్లలతో కాపురం ఉంటున్నాయి ఆ జంట. 

ఉడుత పిల్లలు చాలా చిన్నవి. బుజ్జి బుజ్జి గా ఉన్నాయి. వాటిని ముందే తయారు చేసి పెట్టుకున్న మెత్తటి గడ్డి పరుపుపై వాళ్ళమ్మ పడుకోబెట్టింది.  

చిట్టి చిట్టి ఉడుతలు అమ్మని కరుచుకు పడుకున్నాయి. 

అవి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతాయి.  తర్వాఉడుతా ఉడుతాత నిద్దుర పోతున్నాయి.

పిల్లలు పడుకున్నాయి కదా…  అవి లేచే లోపల తన పిల్లలకు ఆహారం తెద్దామని అమ్మ ఉడుత బయటకు చూసింది. 

తనను ఎవరు గమనించడం లేదు అని నిర్ధారించుకుంది.  బయటకు  వెళ్ళింది. 

టమాటో తోటలో టమాటా కొద్దామని చూసింది. తియ్యటి పెప్పర్ మెంట్ వాసన వస్తోంది . మొహం ఎట్లాగో పెట్టుకుని దూరం జరిగింది. 

వెల్లుల్లి వాసనంటే గిట్టదు . మిరియాల ఘాటు అంటే కూడా ఉడుతకి అస్సలు నచ్చదు.   జాగ్రత్తగా వెతికి వెతికి కూరగాయలు, పళ్ళు తెచ్చింది అమ్మ. 

పగలంతా మొక్కజొన్న, పుట్టగొడుగులు, ఆకుకూరలు, జామకాయలు వెతికి తెచ్చాడు నాన్న.  అన్నిటినీ తెచ్చి చక్కగా ఆ తొర్రలో  భద్ర పరిచారు అమ్మానాన్న.

ప్రతిరోజూ అంతే.  

వెలుతురు ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు తెస్తారు.  వెలుతురు పోయే లోపల పనులు ముగించుకుని ఇంటికి చేరుతారు. రాత్రిపూట ఇంట్లో నుంచి బయటకు రారు. విశ్రాంతి తీసుకుంటారు. 

ఉడుత పిల్లలు రోజు రోజుకు పెరిగి పెద్దగా అవుతున్నాయి.  నిద్ర లేచిన పిల్లలు అమ్మ కోసం వెతుక్కోవడం మొదలు పెట్టాయి.  తొర్రలో అమ్మ కనిపించటం లేదు . నాన్న లేడు.  

పిల్లలు నిద్ర పోకుండా అమ్మ నాన్న ఎటు వెళుతున్నాయో చూడాలని అనుకున్నాయి. రెండు రోజులు పిల్లలు నిద్రపోవడం లేదని వాటికి జాగ్రత్తలు చెప్పి అమ్మ నాన్న ఉడుతలు బయటికి వెళ్లడం మొదలు పెట్టాయి. 

ఓ రోజు “అమ్మ నాన్న రోజు ఎటో వెళ్లి వస్తారు. కానీ మనకు మాత్రం ఇక్కడ నుంచి కదలొద్దు అని చెబుతున్నారు. బయటకు తొంగి చూడవద్దని చెప్పి వెళ్తున్నారు.  

బయట ఎలా ఉంటుందో, ఏమి చేస్తారో చూడాలని ఆత్రంగా ఉంది” అన్నది ఓ ఉడుత పిల్ల. 

“అవును నిజమే, రోజంతా గూట్లో కూర్చుంటే విసుగు వస్తున్నది.  మనం కూడా ఎంచక్కా బయటకు పోతే..  ” అన్నది మరో ఉడుత పిల్ల.  

“అబ్బ !.. బయటికి పొతే… ” కళ్ళు మెరిపిస్తూ అన్నాయి మిగతా రెండు ఉడుత పిల్లలు.  

“ఇంకేం, అయితే పదండి పోదాం” ఉత్సాహంగా అన్నది మొదటి పిల్ల 

అంతలో ఒక పిల్ల అదిగో అమ్మ అటు వెళ్ళింది అంటూ తొర్ర పైకి చూపింది 

అందరూ తొర్ర పైకి వచ్చారు. అంతలో అమ్మ ఆహారం తీసుకుని వచ్చింది.  

పిల్లల్ని చూసి “అయ్యో .. మీరు  ఇక్కడికి ఎందుకు వచ్చారు” కంగారుగా అడిగింది 

“నువ్వు ఇటే వెళ్లావుగా .. అందుకే నీకోసం మేము బయలు దేరాం” అని చెప్పారు పిల్లలు.  

“మీరింకా చిన్న పిల్లలు. అట్లా రాకూడదు. ఇంట్లోనే ఉండాలి” బుజ్జగింపుగా చెప్పింది అమ్మ 

“ఏం ఎందుకని ..? ” మొదటి పిల్ల వెంటనే ప్రశ్నించింది. 

“బయట ఎలా మెసలాలో మీకు తెలియదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీకు తెలియదు.  రకరకాల ప్రమాదాలు వెన్నంటి ఉంటాయి. ఇంకా కొన్నాళ్ళు పోయాక నేనే తీసుకుపోయి అన్నీ చూపిస్తా, సరేనా ..  ” అని చెప్పింది అమ్మ ఉడుత. 

అంతలో తండ్రి ఉడుత తోక తో ఏదో సంకేతాలు పంపింది .  నోటితో ఏవో శబ్దాలు చేసింది. తల్లి ప్రమాదం పసికట్టింది . 

గప్ చిప్ గా పిల్లల్ని లోపలికి తీసుకుపోయింది తల్లి. 

ప్రతి రోజూ చెట్టు తొర్రలో ఉండే ఉడుతలను గమనించే చిన్నూకి చాలా ఆశ్చర్యంగా ఉంది.  

తండ్రి ఉడుత తోక ఊపగానే తల్లి పిల్లల్ని ఎందుకు లోపలికి  తీసుకుపోయిందో అర్థం కాలేదు.  

“ఉడుత ఉడుతా ఊచ్ .. ఎక్కడికెళ్ళావోచ్ ” పాడుతూ చెట్టు తొర్ర కేసి చూస్తున్నాడు చిన్నూ. 

చెట్టు తొర్ర దగ్గర లో పాము కనిపించింది.   కొమ్మ పైన ఉన్న తండ్రి తోక ఊపుతూ మళ్ళీ ఏదో శబ్దం చేసింది.  

ఇప్పుడర్థం అయింది తండ్రి ఉడుత ఎందుకు తోక ఊపిందో .. 

మరి మీకు అర్ధమైందా .. 

చెప్పండి చూద్దాం .

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఆదర్శ విద్యాలయంలో మెరిసిన ముత్యాల హారాలు

by Rathod Sravan May 9, 2023
written by Rathod Sravan

నన్నయ్య ఉపకథలు

తిక్కన్న నవరసాలు

ఎర్రన్న వర్ణనలు

భారతాన కోకొల్లలు

మహాభారతంలోని పర్వాలు రచించిన కవిత్రయం గుర్చి కవి అద్భుతంగా చేప్పారు. 

వెలుగునిచ్చే దీపాలు

జ్ఞానమిచ్చు పుస్తకాలు

మారిపోవు మస్తకాలు

ఆనందమె జీవితాలు

కవి పుస్తక పఠనం వలన లభించే జ్ఞానమును తెలియజేశారు.

తెలంగాణ ఆదర్శ పాఠశాల జనగాం జిల్లా బచ్చన్నపేటలో తెలుగు భాషోపాధ్యాయులుగా  విధులు నిర్వర్తిస్తున్న కవి, రచయిత,విశ్వవిద్యాలయంలో లెక్చరర్ షిప్ కోసం జరిగే    యూజీసీ నెట్,సెట్ పరీక్ష యందు ఉత్తీర్ణులై

ఎం,ఏ. తెలుగు సాహిత్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల హైదరాబాదు నుండి 2007లో

 సురవరం ప్రతాపరెడ్డి స్వర్ణ పతకం సాధించిన ఉన్నత విద్యావంతుడు *మీసాల సుధాకర్ గారు*   తెలుగు సాహిత్యంలో నూతన లఘు కవిత ప్రక్రియ ముత్యాల హారంలో దాదాపు ఏడు వందల    పైచీలుకు ముత్యాల హారాలు లిఖించి 

“సాహితీ ముత్యాల హార పురస్కారం” పొంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తి వంతులవుతున్నారు.

చాలా చక్కని సరళమైన పదజాలంతో ఆకర్షణీయమైన అంత్యానుప్రాసతో అద్భుత రచనలు చేయగల చేయి తిరిగిన కవి మీసాల సుధాకర్ జనగామ జిల్లా రఘు నాథపల్లి మండలంలోని  ఖిలాషాపురం గ్రామంలో శ్రీమతి/శ్రీ, కీ.శే.మీసాల రామయ్య , సోమక్క దంపుతులకు 09‌ జూన్1977‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. జీవిత భాగస్వామి పేరు స్వప్న వీరికి సాయి నిఖిల్, సాయితేజ ఇద్దరు కుమారులు ఉన్నారు.

వృత్తి రీత్యా తెలుగు భాషోపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తూ ప్రవృత్తి రీత్యా సాహితీ సృజనకారుడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.సాహితీ సృజన కవితలు, మధురిమలు, గేయాలు రాస్తూ, విద్యార్థులలోని దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికి తీయడం మాతృభాష పై మమకారం పెంపొందించడం

పలు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్య భూమిక పోషిస్తూన్నారు.సాహిత్యం మీద ప్రేమతో *తొలి పొద్దు బాలల కవితల సంకలనం-2021* కి సంపాదకత్వం వహించారు. మీసాల సుధాకర్  *అణిముత్యాలు* పేరుతో *ముత్యాల హారాల సంపుటిని* మన ముందుకు తీసుకొచ్చారు. ఇది వారి తొలి కవితా సంపుటి కావడం విశేషం.

ఈ సంకలనం వివిధ సామాజిక, సమకాలీన అంశాల పై వెలువరించడం గొప్ప విషయం.మాతృభాషాభిమానంతో సాహిత్యాన్ని ఎంచుకొని సాహితీ రంగంలో విద్యార్థులను, పాఠకులను, రచయితలను, ప్రోత్సహిస్తు సాహిత్యంలో సేవ చేస్తూ 2020 లో విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బండారు బాలానంద సంఘం వారిచే “ప్రతిభా పురస్కారం” ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్ సౌజన్యంతో  సాహితీ వేదిక అధ్యక్షుడు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్ ప్రధాన కార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్ వారిచే  “సాహితీముత్యాల హార పురస్కారం” అందుకున్నారు.

తెలుగు పండితులు ఆయన యువకవి మీసాల సుధాకర్ తెలుగు సాహిత్య ప్రక్రియను

అలవోకగా వ్రాయగల దిట్ట.

 “ముత్యాలహారం”  నూతన కవిత ప్రక్రియలో  ఆణిముత్యాలు -ముత్యాల హారాలు

అను పేరుతో మొత్తం నాల్గు వందల నలభై ముత్యాల హారాలతో పుస్తకములో రూపొందించడం సంతోషం. ఈ పుస్తక సాగరంలో ఎన్నో ఆణిముత్యాలాంటి ముత్యాల హారాలు కలవు.

తెలుగు సాహితీ క్షేత్రంలో అందనంత ఎత్తుకు ఎదుగుతున్న ఈ యువకవి

తెలుగు భాష ప్రచారం,ప్రసారం కొరకు తన వంతు కృషి చేస్తూ, తెలుగు తల్లికి ఎనలేని సేవలందిస్తూ,

అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అందమైన అంత్యానుప్రాసలతో  ఆకట్టు కుంటున్న చక్కని ముత్యాల హారాల రచన ఇది. ముత్యాల హారాలు రాస్తూ ముందుకు దూసుకుపోతున్న కవి

కలం నుంచి మరిన్ని పుస్తకాలు వెలుగులోకి రావాలని ఉట్నూర్ సాహితీ వేదిక తరుపున మనసార కోరుతూ, తెలుగు సాహిత్యానికి మీసాల సుధాకర్ చేస్తున్న కృషి అభినందనీయం.

వెల:80/-

ప్రతులకు

మీసాల స్వప్న

ఇం.సం:4-6-22/3-4

సి.ఆర్.రెడ్డితోట, జనగామ జిల్లా 9908628430

సమీక్షకులు:-

రాథోడ్ శ్రావణ్

ముత్యాలహారం రూపకర్త, 

పూర్వ అధ్యక్షులు

ఉట్నూరు సాహితీ వేదిక 

ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా

చరవాణి సంఖ్య:9491467715.

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

చదువు విలువ

by Krishna Mohan May 9, 2023
written by Krishna Mohan

హన్మకొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నాయి రెండు తండాలు వాటిలో ఒకటి హరి చంద్ర నాయక్ తండ అందులో అందరూ ఉద్యోగస్తులే ప్రతి ఇంటికీ ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఆఫీస్ స్థాయి నుండి అటెండర్ వరకూ ఏదో ఒక స్థాయిలో ఉద్యోగం పొందిన వారే అందరూ. దానికి భిన్నంగా దాని పక్కనే ఆనుకుని ఉంది మరొక తండ దాని పేరే నిరూప్ నగర్ తండా ఆ తండాలో గుడుంబా వ్యాపారం ఎక్కువ. అందరూ నిరక్షరాస్యులు తాగి గొడవ పడని రోజ అంటూ ఉండదు ఆకుటుంబాలలో అటువంటి తండాలో హరిసింగ్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకొని ఆసుగుపెట్టింది రాదబాయి.

 పెళ్లి జరిగిన తెల్లవారే నుండి కుటుంబ వారు గుడుంబా బట్టి పెట్టడం నేర్పించారు దానికి ఈ రోజు కూడా తయారుచేయడం పక్కనే ఉన్న పట్టణంలో సాయంత్రం పూట అమ్మడం పనిగా మారింది తరచూ పోలీసులు తండా కి రావడం  మామూళ్ల పేరిట వేధించడం ఏ సందర్భాల్లో అరెస్టు చేసి జైల్లో కి తీసుకెళ్లడం ఇవన్నీ నచ్చలేదు రాధాబాయికి.పక్క తండా లాగా చదివి మంచిగా ఉండలనుకున్నది. అభ్యుదయ భావాలున్న ఆమె అక్కడ బ్రతకడం కష్టమైపోయింది దానికి తోడు తన భర్త తాగుబోతు గా మారిన నిత్యం డబ్బుకోసం వేధింపులకు గురి చేసేవాడు. చేసేది లేక అన్ని భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నది రాధాబాయి. దానికి తోడు కొన్నాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. కొడుకుకి రామ్ సింగ్ అని పేరు పెట్టుకొని తనను చూస్తూ ఆపిల్లవాడిని గూర్చి కలలు కంటూ కష్టాలను మరచి బ్రతుకుతున్నది. ఆ అనదం ఎంతో కాలం నిలవలేదు తనకు

:రామ్ సింగ్ కు నాలుగేళ్ల వయసు వచ్చింది. తాగుడుకు బానిస అయిన భర్త హరిసింగ్ తాగి,తాగి చనిపోయాడు. నాటి నుండి కష్టాలు మరింత పెరిగాయి. తనకు  ఉన్న ఒక్క గది కోసం తోటికొడళ్లు రకరకాలుగా వేధించడం మొదలు పెట్టారు. రామ్ సింగ్ కోసమే బ్రతుకుతున్న తాను తనకొడుకును చదివించి ప్రయోజకుడిని చేయలనుకుంది. తనను బడికి పంపించింది. రామ్ సింగ్ చక్కగా చదువుతున్నాడు. 4వ తరగతి వరకు చేరుకున్నాడు.ఒకరోజు రామ్ సింగ్ వాళ్ళ సార్ రమ్మంటున్నాడని అమ్మని బడికి తీసుకువెళ్లాడు. వెళ్లి సార్ ని కలిసింది రాధాబాయి. నీ కొడుకు బాగా చదువుతున్నాడు ప్రభుత్వ గురుకుల పాఠశాలకు పంపించు సీటు వచ్చింది అని తెలిపాడు. ఎంతో సంతోషించింది. అందుకు కావలసిన పనులకు ఆ ఊరిలో చదువుకున్న లింగన్న సాయం తీసుకుంది. కొడుకును గురుకులంలో చేర్పించింది. అది చూసి తోటికొడళ్లు మరింత రగిలిపోయారు. 

ఈ మార్పును వారు ఆయుధంగా మలుచుకోవాలనుకున్నారు. సెలవులలో ఇంటికి వచ్చిన రామ్ సింగ్ ని చేరదీసి తన తల్లి లింగన్నతో తిరుగుతుందని కావాలనే నిన్ను గురుకులంలో చేర్పించారని లేనిపోనివి నూరిపోశారు రామ్ సింగ్ కి. దానితో తల్లిని శత్రువుగా చూడడడం మొదలు పెట్టాడు రామ్ సింగ్. రాధాబాయి బాధను భరిస్తూ నిజం గ్రహిస్తాడని ఓపికపట్టింది. సెలవులకు ఇంటికి రాకుండా బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళేవాడు. అయినా మంచిగా చదువుతున్నాడుకదా అని సరి పెట్టుకుంది  అలా తొమ్మిదవ తరగతికి చేయూకున్నాడు. అప్పుడే కొత్తగా కౌన్సెలింగ్ తరగతులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆకౌన్సెల్లర్ దగ్గరకు తీసుకు వెళ్లారు. ప్రిన్సిపాల్ చాలా బాగా చదువుతాడు కానీ సెలవులు వస్తే ఇంటికి వెల్లడు. ఎంత అడిగినా కారణం చెప్పడం లేదు అని చెప్పారు ప్రిన్సిపాల్ గారు. రామ్ సింగ్ తో గంటపాటు మాట్లాడిన కౌన్సెల్లర్. వారం తరువాత మళ్ళీ కలవమన్నాడు. వారం తరువాత మళ్ళీ ఒక గంటపాటు మాట్లాడి. రామ్ సింగ్ సమస్యను గుర్తుంచాడు. తన తల్లి ఉన్న పరిస్థితులను. తాను పడుతున్న శ్రమను మరోకోణంలో చూడమన్నాడు. అప్పటికి నీ తల్లిది తప్పనిపిస్తే తనని మార్చుకోమని నీకోసమే బ్రతుకుతున్న తనకు నీప్రేమను అందించు అని సూచించాడు. సెలవురాగానే ఆనందంతో ఇంటికి వెళ్ళాడు రామ్ సింగ్ తను ఇన్నాళ్లు చెప్పుడు మాటలు విని తల్లిని బాధపెట్టినందుకు బాధపడ్డాడు. పదేళ్లుగా రాధాబాయి మనసులో అనుభవిస్తున్న బాధను తుడిచివేశాడు. తన తల్లి కలలను నిజం చేస్తూ  చదువు పూర్తి చేసి ఊద్యోగం పొందాడు.

మనసు ఉంటే మార్గం ఉంటుంది.

కష్టాల రాపిడి నుండి అగ్నికణం పుడుతుంది.

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ తొలి పొద్దు – కాళోజి

by Kancharla Mahesh May 9, 2023
written by Kancharla Mahesh

“నేను ప్రస్తుతాన్ని నిన్నటి స్వప్నాన్ని రేపటి జ్ఞాపకాన్ని” అని చెప్పుకునే జీవిత తత్వానికి నిదర్శనం కాళోజీ. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తెలంగాణ పోరుగడ్డపై జన్మించిన మడికొండ మణిరత్నం కాళోజీ నారాయణరావు. కాలానికి అతీతమైన కవి, మన కాలపు వేమన, ఒక శతాబ్దాపు జీవన ప్రమాణంతో ప్రతి నిమిషం పోరాటాన్ని స్వాసించి కవిత్వీకరించిన వ్యక్తి, తెలంగాణ తొలి పొద్దు, తెలంగాణ ప్రతిధ్వని, రాజకీయ,సాంఘిక,చైతన్య కార్యక్రమాల సమూహాహారం మన కాళోజీ.. కరుడు కట్టిన హృదయాలను కదిలించే అక్షరాలను ఆయుధంగా మలచే కవిత్వాలు రాసిన ప్రజాకవి.

స్వయంగా కాళోజి  “నేనింకా నా నుండి మా వరకు రాలేదు“ అని తనలో ఉన్నటువంటి  సాదాసీదామైన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించాడు. కాళోజీ కవితలు ప్రజల గుండెల్లో నిరంతర ప్రవాహిలా మారుమోగుతూ ఉంటాయి. ఆయన కవిత్వాలు,కథలు,నవలలు వర్తమాన పరిస్థితులను అద్దం పట్టించే ప్రతీకలను కలిగి ఉంటాయి. ఎక్కడ అన్యాయం, ఎక్కడ అనిచివేత, ఎక్కడ ఆకలి మంటలు ఉంటాయో అక్కడ కాళోజీ యొక్క కవిత్వం వినబడుతుంది.

“ఆకలి మంటలు ఒకచోట – అన్నపు రాశులు ఒకచోట“అనే అక్షరాల పూదోటలో నేటి కాలపు ఆర్థిక అసమానతలను వ్యక్తీకరించే భావాన్ని అక్షరీకరించాడు.

“ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు పదును పెడుతుంది“విద్యా ప్రాముఖ్యతను, విద్యకున్న ఔన్నత్యాన్ని సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా అనువర్తించాడు.

“పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది“అన్న నినాదం జాతీయ ఉద్యమ స్ఫూర్తిని, మానవతా దృక్పథాన్ని, తన బాధ్యతను, ప్రజల యొక్క కర్తవ్యాన్ని కవిత్వీకరించాడు.

తెలంగాణ ప్రజల యొక్క గొడవను నా గొడవగా చేసుకొని సమాజ చైతన్యం కోసము అహర్నిశలు కృషిచేసిన తెలంగాణ పెద్దదిక్కు కాళోజీ నారాయణరావు. ఒకవైపు కవిత్వం,మరొకవైపు రాజకీయం మెలకువలు తెలిసిన మహాకవి కాళోజి. నేటి కాలపు రాజకీయ పరిస్థితులకు కూడా అనువర్తించే కవిత్వాన్ని ఆనాటి కాలంలోనే చిత్రీకరించిన గొప్ప కవి.

“అభ్యర్థి ఏ పార్టీ వాడను కాదు. ఏ పాటి వాడని చూడు“ అని రాజకీయ దుమారం లేపే సూక్తిని అక్షరబద్ధం చేశాడు. కాళోజీ  యొక్క ఎన్నో కవిత్వాలు,కథలు, నవలలు నేటి కాలపు యువకులకు యువ రచయితలకు కవులకు ఆదర్శంగా నిలిచాయి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ముందుండి నడిపించి,తెలంగాణ భాష,యాస,సంస్కృతి పట్ల హేళన చేసిన వారిని చెంప చెల్లుమని విధంగా తెలంగాణ భాష సొగసులను ,అందాలను తన కవిత్వంలో గుభాలించాడు.

“పరాయి భావాలు

 పరాయిచూపులు

 పరాయి భాష

పరాయి చెవులు

పరాయినడక

పరాయి చేతలు

అట్లా కాకూడదని నాతిక్క” అని పరాయి అనే పదాన్ని ఏ విధంగా వ్యతిరేకించాడు కనబడుతుంది.

నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించి ప్రజలను ఏకం చేయడానికి గణేశు ఉత్సవాలను నిర్వహించాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అన్యాయాన్ని ఎదిరించినప్పుడే నా గొడవకు ప్రాప్తి,సంతృప్తి కలుగుతుంది. ప్రజలను ఏకతాటిపై తీసుకురావడానికి తన కవిత్వానికి పదును పెట్టి,ప్రజల్లో చైతన్యాన్ని రగులుగొల్పి, పాలకుల పట్ల తప్పులను ఎత్తి  చూపించే ప్రజాగలం కాలోజి. ఆంధ్ర మహాసభతో మొదలుపెట్టి తన ఉద్యమాన్నిఆర్య సమాజం, గ్రంధాలయ ఉద్యమంగా,క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు జీవితాన్ని గడిపిన మహాకవి.

రాజకీయ కోణంలో అక్షర సత్యాలను జీవిత సత్యాలను నిర్మొహమాటంగా ఉద్ఘాటించే కవి కాళోజి.”అక్షరాలను అడ్డుగా పెట్టుకుని ఎదిగిన వారు ఎందరో

ఆ అక్షరాలను ఆత్మగా చేసుకుని బ్రతికిన వారు కొందరే “అని మోసం చేసే వ్యక్తులకు,ఆత్మగా భరించి వ్యక్తులకు మధ్య సంబంధాన్ని తన కవిత్వం ద్వారా ప్రజానీకoలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. తాను చేసిన సేవకులను భారత ప్రభుత్వం గుర్తించి పద్మవిభూషన్, జీవన గీతికి ఉత్తమ అనువాద అవార్డులను ప్రచురించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లి ఘటనకు చలించి పోయిన కాళోజి కాలంబు రాగానే కాటేసి తీరాలి అని అక్షరాలను ఆయుధంగా రజాకారులపై సవాళ్లు విసిరాడు..

“ఏ భాష రానిది ఏమి వేషము రా

ఈ భాష ఈ వేషమేవరి కోసము రా?

తెలుగు బిడ్డ వై తెలుగు రాదంచును

సిగ్గు లేక ఇంకా చెప్పుకుంటే0దుకురా?

అన్య భాషలు నేర్చు ఆంధ్రము రాదంచు

సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా? అని నెగ్గు తేల్చుతూ విశ్వాసంతో తెలంగాణ భాషా పట్ల,తెలుగు భాషా పట్ల తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు.

“చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మదనం చాటలేవు

చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మదనం చూడలేవు“సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు చలించని గుండె అది గుండె కాదు. అదే విధంగా జీవితంలో కనులు చెమ్మగిలకపోతే ఆ బ్రతుకులో ఉన్నటువంటి కమ్మదనాన్ని అర్థం చేసుకోలేడు మానవుడు.. మానవతావాదిగా తాను నిరూపించుకున్నాడు. ఇవన్నీ గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 1946- 51 మధ్యలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొని,తెలంగాణ భాషా సాధనకై నిరంతరం కృషి చేసిన తెలంగాణ దివిటి మన కాళోజీ.

May 9, 2023 0 comment
5 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆరాటం

by Rudrakhala Matam Prabhu linga Shastri April 29, 2023
written by Rudrakhala Matam Prabhu linga Shastri

ఏ లక్ష్యము కోసము
వాడున్నాడో దానిని
చేరడమే వాని పని.
వాడెలా చేరినాడనేది
అవసరం లేదంటాడు.

నిర్దేశించుకున్న పద్ధతి
ప్రకారమే చేరుకోవాలి
మరోపద్ధతి ప్రకారము
మరొకరి ద్వార లక్ష్యము
ఎప్పుడు చేరరాదంటాడు.

మొదటివానిది విశ్వాసము
వ్యక్తము కాలేనిది అందరిచే.
రెండవ వానిది పిడివాదము.
చేయబడుతుంది కొందరిచే.

విచిత్రమేమింటే ఈ రెండూనూ
అందరికి పూర్తిగా అందేవికావు.

వీళ్ళిద్దరికి ఒకరి గురించి ఒకరికి
సంపూర్తిగా తెలుసు తామిద్దరు
వాదనకు దిగితే ఏ ‘పరిష్కారము’
రానేరాదని అయినా తమ తమ
ఉనికి కోసమే ఆ ఇద్దరి ఆరాటం.
~~~
౼రుద్రాక్షల మఠం ప్రభులింగశాస్త్రి
తేది:-20-04-2023
వేళ:సాయంకాలం:గం౹౹4:43ని౹౹లకు

April 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

స్నేహ హస్తం

by Rapolu Sridevi April 17, 2023
written by Rapolu Sridevi

రాత్రి 11 గంటలకు అవుతుండగా శ్రీవారు హడావుడిగా బయటకు వెళ్తూ వ్యాన్ కీస్ అడిగారు ఆ కీస్ ఇచ్చేప్పుడు నా చీర కొంగు దానికి చిక్కుకుంది చూడకుండానే తీసుకొని వెళుతూనే ఉన్నారు.
అప్పుడు గజేంద్రమోక్షంలో విష్ణుమూర్తి లా కనిపించారు.

ఎక్కడికి వెళ్తున్నరని తెలియక మా పక్కింట్లో ఉండే వారి ఫ్రెండుని అడిగాను.

పిటి సార్ వాళ్ళ ఆవిడ బాగా కడుపునొప్పి తో బాధపడుతున్న పడుతుంటే అపెండిటైటిస్ కావచ్చు అని ఆపరేషన్ చేయించాలని హడావుడిగా వ్యాన్లో తీసుకెళుతున్నారు. అని చెప్పారు.
అమ్మ! ” నాన్న ఎక్కడికి వెళ్తున్నారు” అని మా పెద్దమ్మాయి అడిగింది.
నాన్న ప్రాణ దానం చేయడానికి వెళ్తున్నారు .
అని చెప్పాను “ప్రాణదానం” అంటే? అడిగింది పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను సరైన సమయానికి హాస్పిటల్ లో చేర్చడం అంటే ప్రాణదానం చేసినట్టే కదా!….

అసలు “దానం” అంటే ఏమిటి ?
అని అడిగింది పాప
“మనం ప్రతిఫలం (తిరిగి సహాయం) ఆశించకుండా చేసే సహాయం ఏదైనా దానమే” అని చెప్పాను.
అన్నదానం, విద్యాదానం, స్వర్ణదానం, భూదానం, గోదానం, రక్తదానం, ధన దానం అంటూ చాలా ఉంటాయి అన్నాను. అవునా !అంటూ ..
నా వంక ఆశ్చర్యంగా చూసింది.
మీ నాన్నగారు చాలా దానాలు చేశారు తెలుసా? అన్నాను.

అయితే చెప్పమ్మా…అంది

ఓ రోజు ఓ సారు డిగ్రీ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారు.
ఎవరికోసం?
అని అడిగితే.. సార్ “వాళ్ళ తమ్ముని కోసం” అన్నారు.
డిగ్రీ చదివే తమ్ముడు ఇవ్వరా? అని ఆలోచిస్తుండగానే ..
స్కూల్ ఆఫీస్ బాయ్ వచ్చి బుక్స్ అని అడిగితే ఇస్తూ … ఎవరికీ ఇవి ?
అని అడిగాను.
” నా కోసమే మేడం” అన్నాడు.
సార్ వాళ్ళ తమ్ముని కోసం అని చెప్పి తెప్పించారు.
అలా అన్నందుకైనా బాగా చదవాలి అని చెప్పి ఇచ్చాను.
ఇలా విద్యాదానం చేశారు.
టీచర్ గా మీ నాన్న చేసేది విద్యాదానమే అనుకో..

మొన్న మనం భువనగిరికి వెళ్ళినప్పుడు ఓ పిచ్చి ఆవిడ చూసి జాలి పడ్డాము.
కానీ ఏమీ చేయలేకపోయాం.

మరుసటి రోజు మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కు ఫోన్ చేసి “ఆమెకు కాస్త తిండి అన్న పెట్టు లేకుంటే విషయం అన్న పెట్టరా “అని ఆవేశంలో అంటుంటే విని ..
ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అన్నాను.
నిన్న భువనగిరిలో ఓ పిచ్చామే కళ్ళు తిరిగి పడిపోతే సోడా తాపించి ..ఇడ్లీ పెట్టించాను .
ఆమెకు మన భాష రాదు అనుకుంటా..
సోడా తాగిస్తుంటే ఏదో భాషలో తిడుతుంది.
అని చెప్తుంటే నవ్వొచ్చింది .
కానీ “నేను చేయలేని పని మీరు చేశారు” చెప్తూ ఆనందపడ్డాను.
మీ నాన్న ఇలా అన్నదానం చేశారు.

నాన్న వాళ్లందరికీ ఒక గ్రూపు ఉంది .
అందులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వారి వారి బ్లడ్ గ్రూప్స్ నోట్ చేసుకొని పెట్టారు.
ఎవరికైనా బ్లడ్ అవసరమైతే ఆ గ్రూపు వారికి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి రక్తదానం చేస్తారు .
అలా మీ నాన్న ఎన్నోసార్లు రక్తదానం చేశారు .
మరి “ధనదానం చేయలేదా?”అని అడిగింది పాప

ఎవరికి ఏ అవసరం వచ్చినా మొదట మీ నాన్ననే అడుగుతారు. మీ నాన్న జీతం ముందే తీసుకొని అడిగిన వారికి లేదనకుండా ఇచ్చి ఇచ్చి ఏనాడు పూర్తి జీతం తీసుకోలేదు.

మనం ఈ చిన్న ఇంట్లో ఉంటున్నాం కదా… ఓసారి రామకృష్ణ సార్ వచ్చి
“డాడీ మాకు డబల్ బెడ్ రూమ్ ప్లాట్ ఇప్పించి రెంట్ కడుతూ.. పాపం డాడీ ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా?” అని చెప్పే వరకు ఆ విషయం నాకు తెలియదు.
నాన్నను ఆ సార్ “డాడీ” అని ఎందుకు అంటున్నారు ?అని అడిగితే …
ఓ తండ్రిలా వారి బాగోగులు చూస్తున్నారుగా.. అందుకే అలా పిలుస్తున్నారు .
అని చెప్పాను .
మనం ఇంకో ఇల్లు తీసుకుందాం అంటే రెండు ఇళ్లకు కిరాయి కట్టడం కష్టం కాబట్టి మనల్ని ఈ ఇంట్లోనే ఉంచారు మీనాన్న.

“మరి స్వర్ణ దానం అంటే ?
బంగారం దానం చేయడం మా పెళ్లి రోజునే వాళ్ళ ఫ్రెండ్ కి ఏదో అవసరం ఉందని అంటే వాళ్ళ అక్క పెట్టిన బంగారు ఉంగరం పసుపు బట్టల మీద ఉన్నా..తీసి ఇచ్చారు. “అలా ఇవ్వొద్దా?” అమ్మా !అని అడిగింది పాప .
ఇవ్వకూడదని అంటారు.
అయినా అవసరం కంటే ఆచారం ఎక్కువ కాదని ఇచ్చారు.

మరోసారి వాళ్ళ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పరుగు పరుగునా..హాస్పిటల్ కి తీసుకెళ్లి వారిని డాక్టర్ కి చూపించి.. ఇంట్లో దింపి.. వారికి కార్ అవసరం ఉంటుందని మన కారు ఇచ్చి ట్రైన్ కి వచ్చాం .
చెల్లి పుట్టేముందు డెలివరీ ఖర్చుల కాని దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళ ఫ్రెండ్ కి అవసరమైతే ఇచ్చారు. తీరా డెలివరీ రోజు డబ్బులు అడగడానికి వెళ్లి చెల్లి పుట్టాక ఆలస్యంగా వచ్చారు.

నాన్న సహాయం చేసిన వాళ్ళతో మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పితే బాగుండేది కదా,!.. అన్నది పాప.
అవును అన్నాను.

కొందరు మనుషులు ‘మన’ అనే మాటలో ‘మ’ మానవత్వం మరిచి ‘నా’ అనే స్వార్థంతో బ్రతుకుతుంటారు .
కానీ మీ నాన్న మానవత్వమే తత్వం గా…
మంచితనమే ధనంగా
భావించే వ్యక్తి.
ఒక వ్యక్తి మంచితనం ను ఆ వ్యక్తి కున్న స్నేహితులను జాబితాను బట్టి చెప్పొచ్చు అంటారు. అవును …నాన్నకు చాలామంది స్నేహితులు ఉన్నారు కదూ …
అవును అన్నాను.

నాన్న ధన దానం, స్వర్ణదానం ,రక్తదానం, ప్రాణదానం, విద్యాదానం ఇన్ని చేశారా? అని ఆశ్చర్యం గా అడిగింది పాప..

మీరు పెద్దయ్యాక మీ పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం కూడా చేస్తారని చెపితే సిగ్గుల మొగ్గయింది
అమ్మాయి.

ఆపదలో ఉన్నవారికి సాయం చేసే మనసు తో పాటు.. స్నేహస్తం ఇచ్చేవారు నిజమైన దాతలు..

April 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చీరలోని గొప్పతనం

by Ramakrishna Manimadde April 17, 2023
written by Ramakrishna Manimadde

చీరకట్టులో సౌశీల్యం ప్రతిబింబిస్తుంది..
సౌందర్యం ఇనుమడిస్తుంది..
భౌగోళిక అస్తిత్వం భాసిల్లుతుంది..
సంప్రదాయం ఉరకలేస్తుంది..

అంతేనా..?
మరెంతో ఉంది అంటున్నారు కవి ‘చంద్రబోస్.’
‘చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ
‘పల్లకిలో పెళ్ళికూతురు ‘ సినిమా కోసం
ఆడపిల్లకు చీరను ఆయనంగా ఇస్తున్న ఆ వైనాన్ని తెలుసుకుందాం..!

చీరలోని గొప్పతనం తెలుసుకో… ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర. ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

సహజ వారసత్వంగా.. సంప్రదాయంగా
మనకు తరతరాలుగా అందుతున్న
అస్తిత్వ సంపద చీరను ఈ తరం అమ్మాయిలు విస్మరిస్తున్నారు.. పక్కన పెట్టేస్తున్నారు.

ఈ చీర కట్టును ఆధునికత కనుమరుగు చేస్తుంది.
దాని గొప్పతనాన్ని కమ్మేస్తుంది..
అందుకే చీరలోని గొప్పతనం తెలుసుకో..!
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటున్నారు గీతరచయిత చంద్రబోస్.

చీర అల్లిక వెనుక సింగారం అనే దారం ఉంది..
అది అందాన్ని రెట్టింపు చేస్తుంది..

ఆనందపు రంగుల అద్దకం ఉంది..
అది మనసు పొరల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

మమకారపు మగ్గం ఉంది..
అది పుట్టినింటికి మెట్టినింటికి మధ్య
అనుబంధాన్ని పెంచుతుంది అంటూ చీర తయారీ విధానంలోని కళాత్మకతకు కవితాత్మక సొగసులు దిద్దారు గీత రచయిత.

మడికట్టుతో నువ్వు పూజచేస్తే..గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే..సిరిలక్ష్మిని కురిపించును పంటలు

ఆధునిక దుస్తులు ధరించి
నియమ నిష్ఠలతో నువ్వు పూజ చేస్తే అందులో నిండుతనం ఉండదు.. నిండార చీరకట్టుకుని, మడికట్టుతో నువ్వు చేసే పూజ వలన గుడిని సైతం వదిలి దిగివస్తాడు దేవుడు. అంతటి మహత్యం ఉంది చీరకు.

చీరను దోసి, ఎంకి కట్టుతో సౌకర్యవంతంగా పొలం పనులు చేస్తుంటే ధాన్యాగారం నీ ఇంట పొంగిపొరలి సాక్షాత్తు మహలక్ష్మియే నట్టింట నిలిచి సిరులు కురిపిస్తుంది.

జారుకట్టుతో పడకటింట చేరితే..గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే.. దండాలే పెడతారు అందరూ

కనీ కనిపించని అందాలను పడకటింట భర్త కంట పడేలా చేసేది చీర మాత్రమే.. ఆ కనికట్టు చీరకు ఉంది కాబట్టే జారుకట్టుతో భర్తకు చేరువగా భార్య వచ్చినప్పుడు తన గుండె జారి చూస్తాడు పురుషుడు.. ఎంతటి అలకలు ఉన్నా ఆ క్షణం అన్నీ క్షణభంగురమే కదా..!

నిండైన ఆహార్యంతో చీర కట్టుకుని, ఆత్మవిశ్వాసంతో నడిచి వెళ్తుంటే.. అందరూ దండాలు పెడతారు. ఆ పవిత్రత చీరకట్టుకు ఉంది.

అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది.. కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది

కడుపారా అన్నం తిన్న తదుపరి మూతిని తూడ్చే చీర కొంగు, కన్నీరై ఉన్నప్పుడు చెంపను కూడా తడుమును. అన్నంలో ఆపదలో అమ్మను చూపేది, అమ్మలా బాసటగా నిలిచేది చీర కొంగు మాత్రమే అని.. మన జీవనంలో చీర కొంగు నిర్వహించే ఉద్దాత్తమైన పాత్రను తెలియజేస్తున్నారు చంద్రబోస్.

పసిపాపలా నిదురపోయినప్పుడు.. అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు..ఈ చీరేగా అందాలకు అడ్డుతెర

ఆదమరిచి పసిపాపలా నిద్దుర పోయినప్పుడు ఊయలగా మారి హాయినిచ్చును. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే ఘడియలకు సాక్షీభూతంగా నిలిచి, అరవిరిసిన అందాలకు అడ్డుతెరగా నిలుచును ఈ చీర..!

గాలి ఆడక ఉక్కపోసినప్పుడు..ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు.. ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది..
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది..

గాలి స్తంభించి ఉక్కిరబిక్కిరైన సమయాన వింజామరలా మారి నీ ఉక్కపోతను తీర్చేది ఆ పైటే..

ఎండనుండి నిన్ను కంది పోకుండా కాపాడిన ఆ కడకొంగే, వాన నుండి నిన్ను రక్షించటానికి గొడుగుగా మారి నీ వెతలు తీర్చును.

విదేశీ వనితకు సారే పోసి సోదరిగా గౌరవమిచ్చి ఆదరించి, మన భారతీయ సంస్కృతిని సగౌరవంగా చాటేది చీర.. అంతెత్తున ఎగిసే మన జాతీయ జెండాకు సరితూగి సమానంగా నిలిచేది చీర అని,
ఈ తరానికి చీర గొప్పతనం చాటి చెప్పే గీతాన్ని అందించారు చంద్రబోస్.

  • రామకృష్ణ మనిమద్దె
    9494353828
April 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us