మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

ఓ బాటసారి ఇది జీవిత రహదారి – పాట విశ్లేషణ

by Padmasri Chennojwala May 14, 2023
written by Padmasri Chennojwala

(మే నెల రెండవ ఆదివారం ‘మదర్స్ డే ‘ ని పురస్కరించుకుని)

తాతినేని రామారావు
దర్శకత్వం వహించి, జి . బాబు నిర్మాతలుగా వ్యవహరించి ,1981 లో విడుదలైన ఇల్లాలు చిత్రం లోని పాట ఇది . ఆత్రేయ రచించి , జేసుదాస్ , శైలజ గార్లు గానం చేశారు .ముఖ్య తారాగణం శోభన్ బాబు జయసుధ శ్రీదేవి.

సద్గుణ సంపన్నుడైన భర్త ,ముద్దులొలికే బిడ్డ ,జీవితం సాఫీగా సాగడానికి అవసరమైనంత డబ్బు ఉన్నప్పటికీ ,ఆమె మనసు ఎండమావుల వెంట పరుగులు తీస్తుంది . ఫలితంగా ముగ్గురి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి.

పల్లవి:

ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఎంత దూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది ఒకరికి సొంతం కాదు ఇది

ఆది అంతం తెలియని ఈ రహదారి పయనంలో ఎవ్వరికీ ఏది సొంతం కాదు . దీని లోతులు కనుగొనడం ఎవరివల్లా కాదు అని ఒకింత వైరాగ్యాన్ని వ్యక్తపరుస్తుంది (పల్లవి)

చరణం 1.
ఎవరు ఎవరికి తోడవుతారో ఎప్పుడెందుకు విడిపోతారో మమతను కాదని వెళతారో మనసే చాలని ఉంటారో ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ

కలిసి ఉండటానికైనా , విడిపోవటానికైనా ఒక్క కారణం చాలు. ఆ కారణం వారి వారి ఆలోచనా విధానంపై , వారి వారి మనస్తత్వాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేమాభిమానాల విలువ తెలియక ఒకరు వదులుకుంటే , ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన సంపద ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రేమే అని ఇంకొక స్త్రీ అతని జీవితంలోకి అడుగెట్టి శూన్యమైన అతని జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. ఏ నిర్ణయానికైనా కారణం ఏమిటని ఈ రహదారి ప్రయాణం అడగక పోవడానికి కారణం ఆలోచించే కోణాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. దీనికి ప్రయాణమే తప్ప కారణాలతో సంబంధం ఉండదు అని అభిప్రాయపడుతున్నారు.
చరణం 2:
కడుపు తీపికి రుజువేముంది అంతకుమించిన నిజమేముం
ది
కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా ఇప్పుడు తప్పును తెలుసుకుని జరిగేదేమిటనీ క్షమించదెవ్వ రినీ

శుష్కమైన ఆనందాల వేటలో పడి మాతృత్వాన్ని కాలదన్నకున్న నిన్ను భూమాత క్షమిస్తుందా ? చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు.

మనిషి పూర్తి సుఖంగా బ్రతకలేక పోవడానికి కారణం తనకున్న దానిపై నిర్లక్ష్యం , లేని దానికోసం ఆరాటం అంటారు ప్రఖ్యాత తత్వవేత్త రియో

కథానాయిక తనకున్న పచ్చని పైరు లాంటి జీవితం విలువ తెలియక జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటుంది.
పేగు బంధాన్ని బరువు అని తలచిన నిన్ను భూమాత ఎలా మోస్తుంది అనీ,జరగకూడని నష్టమంతా జరిగిపోయాక తప్పును తెలుసుకోవడం వల్ల ఫలితం శూన్యం అని వివరిస్తున్నారు.

చరణం 3:
తెంచుకుంటివి అనుబంధాన్ని పెంచుకున్నదొక హృదయం దాన్ని
అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతంగా తెచ్చుకుని తల్లివి కాగలవా తనయుడు కాగలడా

నవ మాసాల ఫలాన్ని నువ్వు కర్కశంగా , నిర్దాక్షిణ్యంగా వదులుకొని వెళితే ఆ అనుభూతి పరిమళాలేవీ ఆస్వాదించకపోయినా, కేవలం హృదయౌన్నత్యంతో ఆ పసిబిడ్డను గుండెకు హత్తుకున్న స్త్రీ ఎంతటి ప్రేమ మూర్తో , ఎంతటి అనురాగమూర్తో ఒకే ఒక పదంతో చెబుతున్నారు.

ప్రేమించే మనసు నీటి చెలిమి వంటిది . ఎన్ని నీళ్లు తోడుకున్నా ఇంకా ఇంకా ఊరుతూనే ఉంటాయి. నువ్వు ప్రేమను పంచినప్పుడే అవతలి వైపు నుండి పొందగలవు . అమ్మతనం గుండె లోతుల్లోంచి ఉప్పొంగాలే తప్ప బలవంతంగా తీసుకోవాలనుకుంటే దానివల్ల ప్రయోజనం శూన్యం అని చెబుతున్నారు.

చరణం 4 :

అడ్డదారిలో వచ్చావమ్మా అనుకోకుండా కలిశావమ్మా నెత్తురు పంచి ఇచ్చావు నిప్పును నువ్వే మింగావు ఆడదాని ఐశ్వర్యంమేమిటో ఇప్పుడు తెలిసిందీ కథ ముగిసే పోయింది.

జీవితం విలువ తెలియని నాడు , స్త్రీ యొక్క ఆనందం ఎందులో ఉంటుందనే విషయం అర్థం కాని రోజుల్లో, వదులుకున్న ఆనందాలని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసే నాటికే సమయం మించిపోయింది అని చెబుతున్నారు.

కథ మొత్తం ఈ ఒక్క పాటలోనే ఆవిష్కరింపబడిందా అన్నంతగా పదం పదం లో ఒదిగిన ఆర్ద్రత , నటీనటుల హావభావ వ్యక్తీకరణ ,శ్రోతలను అలరించగలిగిన అనేకంటే కదిలించగలిగిన గాయనీ గాయకుల ప్రతిభ, కాచి వడబోసిన జీవిత సత్యాలు , కుటుంబ విలువల గూర్చిన వివరణ , వాటిని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం గూర్చి ఒక చక్కని సందేశాన్ని అందించారు. కథను ఆవిష్కరించడానికి రహదారిని వస్తువుగా ఎంచుకోవడం బస్సు ప్రయాణంలోసాగే నేపథ్యగానం అత్యంత వైవిద్యభరితంగా ఉంది.
చక్కని పాటను మనకందించిన అందరికీ అభినందనలు.

             పద్మశ్రీ చెన్నోజ్వల
May 14, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాధలు రోదనల నీడలు కారాదు

by Jaggiah May 14, 2023
written by Jaggiah
నీళ్ళల్లో అలజడి కలిగి
జలం జ్వలించి జ్వాల పుట్టదా
తొక్కిన కొధ్ధీ మట్టి
గట్టిపడి రాయిలా మారదా!

నాటిన విత్తనం నేలను చీల్చుకొని
గెలుపును సూచించదా
ఒత్తిడిలో కుక్కర్
ఈల పాట పాడదా!

గాయమైన గుండె
హాయిగొలిపే గేయాలు రాయదా
కాలికి కట్టిన గజ్జె
గుండెల్లో శబ్ధం చేయదా!

బాధలు రోదనల నీడలు కారాదు
అవి జీవితానికి దారిచూపే బోధనలు
భయం పిల్లిని చేస్తుంది
ధైర్యం పులిని ఎదిరిస్తుంది!

అడుగులు ముందుకు వేస్తే
దూరం దగ్గరయి పలుకరిస్తుంది
విజయం బాట వేసి పిలుస్తుంది
ఆనందం ఆలింగనం చేసుకుంటుంది!

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కుందేలు ఉపాయం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, May 14, 2023
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

      అదొక అడవి .   ఆ అడవికి రాజులేడు.   అప్పుడు మరొక  అడవి నుండి ఒక  చిరుత పులి అక్కడికి  వచ్చింది. అది తన ఇష్టము వచ్చినట్లు జంతువులపై దాడి  చేయ సాగింది .దాని బాధ పడలేక జంతువులన్నీ తప్పించుకొని తిరగసాగాయి. ఆ చిరుత పులి ఆగడాలకు అంతే లేదు.
        ఇలా ఉండగా ఆ జంతువులన్నీ ఈ  చిరుతపులి బాధలు భరించలేక  అవి  కుందేలుతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు ఆ  కుందేలు” మీరు నేను చెప్పినట్లు చేయండి. మీ బాధలు నివారణ అవుతాయి” అని వాటికి ఒక ఉపాయం చెప్పింది. అవి సరేనన్నాయి. 
       కుందేలు చిరుతపులి వద్దకు వెళ్లి “ఓ  చిరుతపులి రాజా !నీవు పరిగెత్తి వేటాడే అవసరం లేకుండా  ఆ జంతువులు నీ ముందరే ప్రత్యక్షమయ్యే మంత్రం నా వద్ద ఉంది. ఒక మునీశ్వరుడు ఈ మంత్రాన్ని పఠించగా నేను దానిని విని నేర్చుకున్నాను.   ఇదిగో చూడు “అని తన కళ్ళు మూసుకుని ” టుర్ర్ ర్ర్  కాంజి” అని అంది.  వెంటనే అక్కడ ఒక జింక ప్రత్యక్షమైంది .అప్పుడు చిరుతపులి దానిని వేటాడబోయేంతలో కుందేలు దానిని ఆపి “ఆగండి చిరుత పులిరాజా! ఇంకా కొన్ని జంతువులు కూడా ఇలాగే మీ ముందు ప్రత్యక్ష మవుతాయి.  మీరు దేనిని కోరుకుంటారో  చెప్పండి.  ఆ జంతువు   ఇక్కడ మీ ముందు వెంటనే  ప్రత్యక్షమవుతుంది. చూడండి .  మీకు ఇంకా ఏ జంతువు  కావాలి “అని  అడిగింది .  అప్పుడు చిరుతపులి” కోతి” అని అంది.  వెంటనే కుందేలు ” టుర్ర్ ర్ర్ తికో ”  ”  అని అంది.   వెంటనే ఒక కోతి వాటి ముందు ప్రత్యక్షమైంది.
         తర్వాత చిరుతపులి “అడవి దున్న” అని కోరింది. అప్పుడు కుందేలు ” టుర్ర్ ర్ర్  న్నదువిడఅ  ”  అని అంది .వెంటనే అక్కడ  అడవిదున్న  ప్రత్యక్షమయింది. అలాగే ఎలుగుబంటి, దుప్పి, జిరాఫీ కూడా కుందేలు ఆ మంత్రం చదవగానే  ప్రత్యక్షమైనాయి.  చిరుతపులి సంతోషించి” ఓ కుందేలా! నాకు ఈ మంత్రం చెప్పవా! నేను నిన్ను ఏమీ చేయనులే!” అని అంది.
        అప్పుడు కుందేలు “చిరుతపులి  రాజా! ఈ మంత్రం చాలా మహిమ గలది.  ఇది  పనిచేయాలంటే  మీరు  కొన్ని నియమాలు పాటించాలి.   ఒక నెల రోజుల వరకు మీరు  ఏ జంతువును చంపకూడదు.  అలా చేస్తేనే మీకు ఈ మంత్రం  పనిచేస్తుంది “అని అంది. అందుకు చిరుత పులి  సరేనంది .
            ఇలా నెల రోజులు గడిచాయి.   తర్వాత  ఆ చిరుతపులి ఆ మంత్రాలను చదివింది.  కానీ ఒక్క జంతువు దాని  ముందర నిలువలేదు. ఇదేదో కుందేలు తనను మోసగించిందని దానికి అప్పుడు అర్థమైంది.  వెంటనే అది కోపంతో  కుందేలు కోసం ఎంత వెదికినా  అది కనబడలేదు.  అదే కాదు. ఆ  అడవిలో ఒక్క జంతువు కూడా కనిపించలేదు .
          అవి అన్నీ పక్క అడవికి పారిపోయి మృగరాజు సింహాన్ని శరణు వేడాయి .  వెంటనే ఈ చిరుతపులి ఆ అడవికి కుందేలును వెదకుటకై వెళ్లింది.    ఆ అడవికి వెళ్ళిన చిరుతపులిని సింహం తరిమి తరిమి కొట్టింది.   చివరకు ఆ చిరుతపులి తన అడవికి తిరిగి వచ్చి  అక్కడ ఒక్క జంతువు కూడా  లేకపోవడంతో చేసేది లేక  అది  అక్కడనుండి మరొక కొత్త అడవిని  వెతుక్కుంటూ బయలుదేరింది .
        ఈ సంగతి తెలిసిన జంతువులన్నీ తిరిగి ఆ అడవికి వచ్చి సుఖంగా ఉండసాగాయి. అవి కుందేలుతో ” ఆ మంత్రం ఏమిటి? మాకు కూడా చెప్సవా!” అని అడిగాయి. అప్పుడు కుందేలు నవ్వి ” అయ్యో! అది మంత్రం కానే కాదు. అక్షరాలను తలక్రిందులుగా చేసి అన్నాను. అంతే! ఆ తెలివి తక్కువ చిరుత పులి నమ్మింది ” అని అంది.
        ఆ తర్వాత  అవి తమను కాపాడిన సింహాన్నే తమ అడవికి  రాజుగా ఉండమని కోరాయి .  అందుకు సింహం అంగీకరించి ఈ రెండు అడవుల్లో ఏ జంతువుకు ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని హామీ ఇచ్చింది.  కుందేలు తెలివి వల్ల  చిరుతపులి బాధ తొలగి జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అందుకే పిల్లలూ! ఆపద వచ్చినప్పుడు ఇతరులకు చెప్పి వారి  సాయాన్ని కోరాలి.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బహుముఖ ప్రజ్ఞాశాలి :శ్రీమతి పాకాల యశోదారెడ్డి

by Radhika Suri May 14, 2023
written by Radhika Suri

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు ,వక్త, వ్యాసకర్త, అధ్యాపకురాలు ,బహుభాషా కోవిదరాలు ఐన శ్రీమతి పాకాల యశోద రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ .ఈమె ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ‘బిజినేపల్లి’ గ్రామం, నాగర్ కర్నూల్ లో ఆగస్టు 8 1929న జన్మించారు .తల్లిదండ్రులు సరస్వతమ్మ ,కాశిరెడ్డి గార్లు. మూడవ తరగతి వరకు మహబూబ్ నగర్ లో చదివి తదనంతరం ‘రాజబహదూర్ వెంకటరామిరెడ్డి ‘గారి ప్రోత్సాహంతో నారాయణగూడ లోని ‘బాలికోన్నత పాఠశాల’లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషల్లో స్నాతకోత్తరపట్టా పొందారు. 1976లో” అలీఘర్ విశ్వవిద్యాలయం’ నుండి డి.లిట్.అందుకున్నారు.హిందీ, ఉర్దూ ,కన్నడ భాషలతో పాటు జర్మన్ భాషలో కూడా ప్రవీణురాలు.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ పాకాల తిరుమలరెడ్డి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రెడ్డిగారు గీసిన ఎన్నో చిత్రాలకు ఆమే స్ఫూర్తి ప్రదాత .స్వతహాగా కళాపిపాసి ఐన ఈమె ‘ఇత్తడి విగ్రహాల’ సేకరణ చేసేవారు. భర్త చిత్రకళా ప్రదర్శనలో చురుకుగా పాల్గొని విజయవంతం అయ్యేలా చూసేవారు. రెడ్డి గారితో ప్రదర్శనల కోసం పలు దేశాలు పర్యటించిన సందర్భంలో ‘భారతీయ చిత్రకళ’ అనే గ్రంథాన్ని రచించారు.

యశోద గారు తన 12వ ఏట నుండే రచనలు చేయడం ప్రారంభించారు. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం రచయిత్రి .ఈమె రచనలు కల్పితాలు కావు. అవి అనుభవ సారాలు .తెలంగాణ జీవన విధానం ,సంస్కృతి- సంప్రదాయాలు ,ఆచార- వ్యవహారాలు ,సామెతలు సందర్భానుసారంగా తమ రచనల్లో నిక్షిప్తం చేసేవారు .బాల్యంలో ఈమెను ‘ఎచ్చమ్మ ‘అని పిలిచేవారట .ఆ పేరుతోనే ‘ఎచ్చమ్మ కథలు ‘రాశారు .యశోద గారు వందకు పైగా కథలల్లినా 63 మాత్రమే పుస్తక రూపం సంతరించుకున్నాయి. మూడు కథా సంపుటాల్లో ‘మా ఊరి ముచ్చట్లు’ (1973 )సంపుటిలో 1920 – 40 మధ్యకాలంనాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ‘ఎచ్చమ్మ కథలు'( 1999 )లో 1950- 70 నాటి తెలంగాణ సంస్కృతిని ప్రస్ఫుటంగా దర్శింప జేశారు .’ధర్మశాల'( 2000) సంపుటిలో 1980 – 90 మధ్యకాలం నాటి తెలంగాణ సమాజపు పరిస్థితులు చక్కగా వివరించారు. ఒక రకంగా తెలంగాణ సమాజపు నూతన శకానికి ‘దర్పణం’గా దీన్ని పేర్కొనవచ్చు. ఈ మూడు సంపుటాల్లో తెలంగాణ భాష, మాండలికం ,సంస్కృతి ,సామాజిక అంశాలను చక్కగా వివరించారు. ‘మా ఊరి ముచ్చట్లు ‘,’ఎచ్చమ్మ కథలు ‘పాలమూరు మాండలికంలోను, ‘ధర్మశాల’వ్యావహారిక తెలుగులో రాశారు.
మాండలిక భాష పరిరక్షణే ధ్యేయంగా ఆమె రాసిన పరిశోధక వ్యాసాలు భారతి, జాగృతి ,మూసీలాంటి ఎన్నో పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంచి వక్తయైన ఈమె ప్రాచీన తెలుగు సాహిత్యంపై చేసిన ప్రసంగాలతో పండితుల ప్రశంసలు అందుకున్నారు .తన మాండలిక యాసతో సభికులను ఆకట్టుకునేవారు .’ఆకాశవాణి’లో తెలంగాణ మాండలికంలో ప్రసంగించిన తొలి రచయితగా పేరుపొందారు .’ఆకాశవాణి’లో ‘పండుగలు – పబ్బాలు ‘,’జరఇను కోవే తల్లీ’ , ‘ఎచ్చమ్మ ముచ్చట్లు’ ఇలా పలు శీర్షికల పేరిట 200 పైగా ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
194 9- 50 ప్రాంతంలో” దక్కన్ రేడియో’లో మాండలిక భాషలో కథలు ,సంభాషణలు, పిల్లల నాటికలు మొదట ప్రారంభించిన ఘనత వహించారు. బాల సాహితీవేత్త ఐన ఈమె ‘బుచ్చయ్య పెబ్బె ‘నాటికను పిల్లలకోసం రచించారు.
యశోద గారు కవయిత్రిగా ఉగాదికి – ఉయ్యాల, భావిక అనే రెండు సంపుటాలు స్వయంగా వెలువరించారు. ఇంకా ద్విపద వాఙ్మయం, ప్రబంధ వాఙ్మయం, భాగవతసుధ రచించారు. సంయుక్తంగా వెలువరించిన మరొక రెండు రచనలు. 1.కావ్యానుశీలనం (డాక్టర్.కులశేఖర్ రావు గారితో కలిసి) 2.చిరుగజ్జెలు (ఆల్వార్ స్వామి ,సి.నారాయణరెడ్డి గార్లతో కలిసి)
వీరు పారిజాతాపహరణం, ఉత్తర హరివంశం ,తెలుగు సామెతలు, ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించి విలువైన పీఠికలు రాసి వెలువరించారు. అనువాదకురాలైన ఈమె’ హిందీ కవయిత్రులు’ గ్రంథాన్ని అనువదించారు.
యశోద గారి అభిప్రాయం: భాషలో నానుడిగాని ,సామెత గానీ, జాతీయం గాని అలవోకగా పుట్టదు. ఆయా ప్రాంతాల వారి అనుభవాల సారం నుండి ఉద్భవించినవి ఇవి. ‘నుడికారాలు ‘భాషకు ‘జీవనాడి’ అని ఆమె పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ,లలిత కళా అకాడమీ, సంగీతా అకాడమీ లలో సభ్యురాలిగా పనిచేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో కూడా అనుబంధము ఉండేది .
నిక్కచ్చి మాట తీరు, నిర్విరామ కృషి ,తెలంగాణ భాషపై పట్టు, మాండలికం పై అవ్యాజమైన మమకారంతో
శైలిలో హృద్యంగా రాసి మాండలికాన్ని ‘సజీవ శిల్పం’గా మలిచి తెలంగాణా భాషా సొబగుల్ని తన విశిష్ట రచనావ్యాసంగాల ద్వారా విశ్వవ్యాప్తం చేసి అలసి ,ఆ భారతీదేవి పాదాల చెంత అక్టోబర్ 7 ,2007న ప్రశాంత నిద్రలోకి జారుకున్న ఈ అవిశ్రాంత బహుముఖ ప్రజ్ఞాశాలికి అందించే ‘అక్షర నివాళి’యే ఏ నిజమైన శ్రద్ధాంజలి.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

లేఖల్లో తిలక్

by Cheedella Seetha Lakshmi May 14, 2023
written by Cheedella Seetha Lakshmi
“ఆంధ్ర సాహిత్యంలో వచన కవితా శిల్పి,కవికుల తిలకుడు,రస గంగాధరుడు అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తన రచనల ద్వారా ఒక విశిష్ట రచనా ప్రవృతిని,కవితా స్రవంతిని, నిర్దిష్టకులాలలో, నిరంతర రస ప్రవాహంగా ప్రవహింపచేశాడు. తన అమూల్య రచనల ద్వారా ఆంధ్ర సాహిత్య చరిత్రలో శాశ్వత కీర్తి చంద్రికల్ని ప్రసరింప చేశాడు. ఆయన రచనలు ఆంధ్ర సాహిత్య ధనాగారానికి ఒక అక్షయ రత్న సంపద వంటివి”.తిలక్ గొప్ప కవి.ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇతనికొక విశిష్ట స్థానముంది.

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తన కవితా లక్ష్యాన్ని చెప్పుకున్న దేవరకొండ బాల గంగాధర తిలక్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో ఆగస్టు 1 వ తేదీ 1921 సంవత్సరంలో జన్మించాడు.
సమాజంలో దగాపడిన వారి జీవితాలను చూసి చలించిన తిలక్ సున్నిత హృదయుడు కాబట్టి వాటినే తన కవితావస్తువులుగా మలచుకున్న
తిలక్ భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేతతో “అమృతం కురిసిన రాత్రి,ప్రభాతము సంధ్య,గోరువంక కవితాసంపుటిలు,సుందరీ సుబ్బారావు,ఊరి చివర ఇల్లు అనే కథా సంపుటాలు,సుశీల పెళ్లి,,సాలెపురుగు అనే నాటకాలు,సుచిత్ర ప్రయాణం,ఇరుగుపొరుగు,సప్తశిల అనే నాటికలు ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన తిలక్ కేవలం 45 ఏళ్ల అతి చిన్న వయసులో సెప్టెంబరు 1 వ తేదీ 1966వ సంవత్సరంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.చనిపోయాక కుందుర్తి ఆంజనేయులు రాసిన పీఠికతో 1968 సంవత్సరంలో ముద్రింపబడిన అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా 1971 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
సమాజాన్ని చూసి కరిగిపోయిన తిలక్
మిత్రులకు రాసిన లేఖల ద్వారా మిత్రులతో తిలక్ కున్న సత్సంబంధాలు ,తిలక్ వ్యక్తిత్వం,మనస్తత్వం మొదలగు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.

‘ఆవంత్స సోమసుందర్’ తిలక్ కు ప్రాణమిత్రుడు.సోమసుందర్ కు రాసిన లేఖలో ” జీవితంలో ఎప్పుడు ఎవరు వచ్చి గుండెల్ని పెనవేసుకుపోతారో ఏం తెలుస్తుంది.అలాగ సామీప్యంలోని ఆత్మీయమైన ఆవరణలోకి విచిత్రంగా సురభీకృతం చేస్తూ నువ్వొచ్చావు. అన్నా అని పిలిచావు.ఆ పిలుపు గుండె లోతులంటి, తిరిగి తమ్ముడూ అని ప్రతిబింబించక మానుతుందా? అందుకే ఇంకా మీరు అనే సంబోధన కృత్రిమంగా ఏదో దూరాన్ని పలకరిస్తున్నట్లు తోచి మానివేశాను.” అని రాయడం వల్ల మిత్రులను ఆత్మీయుతతో దగ్గరకు తీసే ప్రేమతత్వం కన్పిస్తుంది. వరవరరావుకు రాసిన లేఖలో ” నా కింత దగ్గరైన నువ్వు అలా అలా దూరదూరంగా ఎందుకున్నావో అని నా మనసు చాలా బాధ పడుతుంది.డబ్బూ,వ్యాపారమూ, ప్రయోజనమూ ప్రధానంగా ఎంచబడే నేటి సంఘంలో అవ్యాజమైన మైత్రి,ఆర్టిస్టుల మధ్య మైత్రి ఒకటి గదా!
కన్సిడరేషన్! నువ్వు నా కన్నా చాలా పిన్నవాడివైతే మాత్రం కుల వయో దశ భేదాలు కవులలో,కళారాధకులలో అప్లై చేయవు.” అంటాడు.మైత్రీ బంధానికి తిలక్ ఇచ్చిన విలువ గొప్పది.డబ్బు,హోదాకు లొంగనిది.కులాతీత,వయోతీతమైంది.నిస్వార్థ,అవ్యాజమైనదే అసలు సిసలైన మిత్రత్వము.నిజమైన మైత్రికి ఇవేవీ అడ్డుకావని మైత్రికి చక్కని నిర్వచనం చెప్పాడు.ఇలా లేఖలలో తిలక్ స్నేహానికిచ్చిన ప్రాధాన్యం తెలుస్తుంది.

జీవితంలో ఏదో సాధించాలనే ఆశ,తపన ” వేళ్ళ సందుల్లోంచి పొడి ఇసుకలా జారిపోయే కాలాన్ని, వయస్సునీ,తల్చుకుంటే భయమౌతుంది.” అని ఒక ప్రచురణ సంస్థ నెలకొల్పాలన్న తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ నీ సహకారం ఉంటే తప్పక కృతకృత్యుణ్ణవుతానని రాస్తూ సమయం దాటాక బాధపడి ప్రయోజనం లేదు.” అందుకే ఈ లోపుగా చేసి వెయ్యడం మంచిది కదా.” అంటూ సోమసుందర్ కు రాసిన లేఖలో తెలిపాడు.

మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో జీవితంలో తృప్తి ఎట్లా లభిస్తుందో వివరించాడు.” నెల బారుగా,చప్పగా,బాధగా వెళ్లిపోయే జీవితంలో ఏవో కొన్ని గొప్ప క్షణాల్ని మనవిగా చేసుకున్నామనే ఆనందమూ,దాన్ని నలుగురితో పంచుకోవడమూ కన్నా తృప్తి ఏముంది.” అంటూనే ” ఇక్కడ దట్టంగా పరచుకున్న మనుష్యారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ,దోమలూ,రాజకీయాలు జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలో కన్నా అడవుల పచ్చదనమూ,ప్రకృతి సన్నిహితంగా ఉన్న మీ జీవితమే సుఖకరమేమో.” అనడం వల్ల కుళ్లు మనుష్యుల మధ్య నలిగి బ్రతికే కంటే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అడవుల్లో ఉంటే మనసుకు తృప్తి అనే భావన కలిగినవాడు. అట్లాని మానసికమైన ఒంటరితనాన్ని భరించడం కూడా కష్టమే నంటాడు.

తిలక్ బాధాతప్త హృదయుడు.జీవితంలో జరిగిన సంఘటనలు, మనసులో మరపురాని ముద్రలే అతన్ని కవిగా చేశాయి మోగంటి మణిక్యాంబకు రాసిన లేఖలో చిన్నతనంలో ఒక వృద్ధుడు,జీర్ణాదేహుడు,ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి చూసి ఎంతో ఏడ్చాడు.” జీవితం అంటే ఏమిటి? సృష్టి పరమార్థం ఏమిటి? అన్న చింతనలో పడ్డాడు.16,17 సంవత్సరాల వయసులో ఒకసారి పార్క్ టౌన్ స్టేషన్ లో దిగివస్తుంటే ఇద్దరు ముగ్గురు బాబూ! ఒక మాట అని పిలిచారు.ఏమిటో నని వారి దగ్గరకు వెళ్ళాడు.ఒక వస్తువు మీద గుడ్డను తీసి చూపించారు.భయంకరమైన, వికృతమైన శవం.దహనానికి చందా అడుగుతున్నారు.జేబులోంచి చేతికి వచ్చిన డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళాడు.గది కెళ్లగానే ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లు భయపడ్డాడు.రాత్రంతా ఆలోచనలతో సతమతమయి అంతా మిథ్యగా అనిపించింది.బ్రతుకు మీద విరక్తి కలిగింది.

ఇంకోసారి మిత్రులతో సినిమాకి వెళ్తున్న సమయంలో ఒక ఎనిమిదేళ్ల పిల్ల ఆకలిగా ఉంది.డబ్బులిమ్మంది అందరూ ఆమెని విదిలించుకుని చీ అని తోసి వేస్తుంటే సభ్యత కోసం తిలక్ కూడా విదిలించుకున్నాడు.ఆ రోజు రాత్రంతా బాలికనే కళ్ళముందు నిలిచింది తెల్లవారి జేబులో పది రూపాయలు వేసుకుని ఆ అమ్మాయి కోసం అంతా గాలించాడు.కానీ ఆమె కనిపించలేదు.మూడు రోజులు వెతికాడు కానీ వృధా. ” ఆమె అందమూ ,సొగసైన కళ్ళు,ఆ బాల్య చాపల్యమైన మనస్సు ఏ ధూళిలో ఏ బాధలో ఏ మంటలో దినదినమూ కాలిపోతున్నాయి ” ఎవరు దీనికి కారణం?…విలవిలలాడి పోయాను.ఆమె నా చెల్లెలే అయితే అలా ఛీదరించుకునేవాణ్ణ ?” అనుకున్నాడు నెలరోజుల తర్వాత ఆమె కనిపిస్తే జేబులోంచి ఆరు రూపాయలు తీసి చేతిలో పెట్టి ఒక రోజు కడుపు నిండా తిను అని వెళ్ళిపోయాడు.అప్పటి సంఘటనలు మనసులో కలవరం రేపి ” ఈ జీవితానికి,సమాజానికి అర్థం తెలుసుకోవడానికి,ఒక అర్థం ఇవ్వడానికి ఒక ఆదర్శ జ్వాలలో నా బ్రతుకును చుట్ట బెట్టి తోడు లేని ఈ దారిని నాటి నుండి ప్రయాణం” సాగించి అనేక బాధలతో,అనారోగ్యంతో అలమటించి ” గొప్ప అనుభవాన్ని కవిత్వాన్ని పొందాడు మధురమైన
ఆ హృదయాన్ని,మనస్సుని లోకంచుట్టూ తిప్పి సౌందర్యాన్ని అవలోకించి ఆహ్వానించాడు.” అని చెప్పిన సున్నిత హృదయుడు,కోమల మనస్కుడు జీవితానికి,సృష్టికీ ఒక అర్థం వెదికి సమాజానికి సుఖ సంతోషాల్ని అన్వేషించాలనే తపన కలవాడు.” మనిషీ, సంఘమూ,దేశమూ, విశ్వమూ ఈ సర్వ జగత్తు జ్ఞాన సరస్సులో విరిసిన ప్రేమ పద్మం లాగా సత్యం,శివం, సుందర శీలమై ఉండాలి.” అంటాడు.”

వ్యుత్పత్తి,వివేకం,ఉద్రేకం ఇన్నింటిని సమ్యక్ స్వరంలా మేళవించి” ఏదో సాధించాలనే తహతహలాడేవాడు.నిజమైన వెలుగు కోసం ” ఏళ్ల తరబడి సృష్టించుకున్న మౌఢ్య భావాలు,సంకెళ్లని పగులగొట్టి” స్వార్థమూ, సంఘ గౌరవమూ, ధనమూ ప్రధానమైన ఈ లోకాన్ని ఖాతరు చేయక ఏ పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కోగల ఆత్మీయశక్తి నాకుంది ఆనుకొని ” సంపూర్ణ నిర్మలానురాగం ముందు తప్ప తల వాల్చగూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.” అని మానసిక ఆవేదనను,ఆశయాన్ని తేటతెల్లం చేశాడు.” నిర్ధయా, నిశ్చితమైన నిధి కొండరాళ్ల మీద తలబాదుకొని ఏడ్చినవాణ్ణి కాబట్టి ఏ విశ్వాసాన్ని వృధా పోనివ్వను.” సున్నితమైన నా మనస్సు మీద కూడా ఎన్నో దెబ్బలు తగిలాయి.” అంటూ మానసిక బాధను వ్యక్తపరచి ” ఒక్కొక్క కన్నీటి చుక్కను తుడువగలిగితే జన్మ సార్థకమన్న శరత్ మాటలను స్వతహాగా ఆచరించాలన్న ఉబలాటం కలిగిన వాడు.ఆయన మాటల్లోనే ” ఒక సంఘము నుండి ఉబికే బాష్పాన్ని తుడువగలిగితే ఒక్క అధరం మీదికి హాస్యాన్ని రప్పింపగలిగితే జీవితం ధన్యమౌతుందని నా ఉద్దేశ్యం.కరుణ,సౌందర్యమూ, మానవత్వమూ ఈ మూడు ప్రాతిపదికలుగా నా ఆదర్శాన్ని,ఆలోచనల్ని నిర్మించుకున్నాను నా రచనలూ నా జీవితమూ ఈ భావనల్ని వ్యక్తీకరించకపోతే నేను జీవచ్చవాన్ని” అని తన కవితా లక్ష్యాన్ని, జీవితాదర్శాన్ని వివరించాడు.తిలక్ మనస్తత్వమేమిటో ఎంతో చక్కగా వివరించాడు లేఖల ద్వారా.” *దుఃఖానికీ, బాధకీ కరుగలేకపోతే ఈ బాలగంగాధరుడు తన కవిత్వాన్ని,తన ప్రాణాన్ని కూడా బంగాళాఖాతంలో విసిరిపోతాడు అతనిలో ఎంతో దృఢవిశ్వాసం కన్పిస్తుంది.మనిషికి మానవత్వముండాలి.కరుణ, జాలి,దయా ఉండాలి.అవి లేకపోతే జీవచ్చవమేనన్న అభిప్రాయం కలవాడు.తిలక్.జీవితానుభవాలకు,రచనలకు అవినాభావ సంబంధమున్న విషయం ప్రస్పుటమైందీ లేఖల్లో.

” ఆర్ద్రమైన ప్రతి హృదయమూ అశ్రుసిక్తమైన ప్రతి నయనమూ సుందరమైన ప్రతి దృశ్యమూ నన్ను కలలో కూడా వశం చేసుకుంటాయి.ఒక్క పాటకోసం ఒక్క మాటకోసం అవసరమైతే ఈ ధనాన్ని జగత్తునీ కాదనగల సాహసం వుంది నాకు”.అని ప్రపంచాన్నే ఎదిరించి పోరాడిన ధీశాలి, కవితా వీరుడు.కవికి ఉండవలసిన ఉత్తమగుణం తిలక్ లో కనిపిస్తుంది.కవి ఊహలో చరించకుండా జగత్తులో చేదు నిజాన్ని చవిచూసి అనుభవించి ఆవిష్కరించాడు. బాహ్య జగత్తులోని విశిష్ట సన్నివేశాల వలన, ప్రజ్ఞా విశేషం వలన తమలో కలిగిన ఆలోచనా వైవిధ్యం చేత,తమకు కలిగిన అనుభవాలను కావ్య చిత్రణం ద్వారా వ్యక్తీకరించి ఆనందం చేకూర్చడం తిలక్ లక్ష్యం.ఇంద్రియాలకు తృప్తి కలిగించేది అతని దృష్టిలో ఆనందం కాదు మానవత్వంలో పరిపూర్ణత నొందుటలోనే ఆనంద మున్నదని అతని సిద్ధాంతం. *సుందర స్వప్నాల మేడమెట్ల నుండి వాస్తవిక శిథిల రూపాలలోకి హఠాత్తుగా జారిపడిన నాకు తెలుసు అంటాడు.” పైకి నవ్వుతున్నా అలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో వున్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు”. అని వాపోతాడు,లోతుల్ని వెతుకుతాడు.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గాయాలు తగిలినా ఎదుర్కోగలిగే శక్తి గలవాడు.కృంగిపోవడం నా స్వభావానికి వ్యతిరేకం అన్న ధీరమనస్కుడు.
అసలు కవి అంటే ఎవరు?కవి ధర్మాన్ని లేఖల్లో వివరించాడు.” సున్నితమైన ఊహ,ఉద్రేకము,” ఉంటేనే గొప్ప రచనలు వస్తాయన్న విశ్వాసము కలవాడు.సాధారణంగా మానవులందరూ దైనందిన సమస్యలతో ,బాధలతో సతమతమవుతూ వుంటారు.చిన్న చిన్న కోరికలూ,ద్వేషాలూ,అల్పమైన ఊహాలతో సతమతమవుతూ వుంటారు.” నేలబారుగా జడంగా స్తబ్దంగా గొంగళిపురుగుల్లా పాకుతారు.వాళ్ళకి సౌందర్యం డబ్బులోనూ ఉద్యోగం లోనూ భేషజంలోనూ కనబడుతుంది కానీ కళాశీలికి యివేమీ కనిపించవు.అతనికున్న విలువలు వేరు.అతని చూపు వినీల గగనాన్ని బురుసుకుంటూ నక్షత్రమండలంలోకి పోతుంది.అతడు మనిషి లోపల మనిషిని చూస్తాడు.అతని దృష్టి ఎక్కడ అందం వున్నా నిజం వున్నా అక్కడ వాలుతుంది. దేనికోసమో తపన,అన్వేషణ నిరంతరంగా సాగిస్తాడు.ఈ యాత్రలో అతడు లౌకిక జగత్తును లక్ష్య పెట్టడు. అందుకే అతని ఊహ శాశ్వతమైంది.అతని నీతి అతీతమైంది.అతని రచన అక్షరమైంది. నశించనిది.” కవి ఊహ లోకోత్తరమైంది. అందువల్లనే ఉత్తమ రచన సార్వజనీనము,సార్వకాలికమౌతుందన్న ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయాలను తలపింపచేశాడు.

కవి సంప్రదాయబద్ధుడుగా కాక కాలానుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకొని రచన సాగించాలంటాడు. కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని,బూజు పట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే. అంటూ సంఘాన్ని మేల్కొల్పాలి,ప్రజలను చైతన్యవంతులను చేయాలి.ఆత్మవిశ్వాసం ఉండాలి.కవిత్వాన్ని సమగ్రంగా దర్శించడమూ,జీవిత విధానాన్ని గురించి స్పందించడమూ చాలా అవసరం అంటాడు తిలక్.

తిలక్ ప్రకృతిలోని అందాన్ని చూసి పరవశించిపోయేవాడు.ప్రకృతిని ఆరాధించేవాడు.లేఖల్లో ప్రకృతి వర్ణన కూడా కనిపిస్తుంది.సహజ చిత్రీకరణ,కవి దృష్టి ప్రత్యేకంగా లోతుల్ని చూస్తుంది.గుండెను హత్తుకుపోయే విధంగా ఉంది.ప్రకృతి వర్ణన సహజంగా వుంది. సోమసుందర్ కు రాసిన లేఖలో ” ఈ రెండు రోజుల నుంచీ వర్షం కురిసి కురిసి భూమి తడిసి తడిసి పచ్చి పచ్చి బాలింతరాలిగా అందంగా వుంది ” అంటాడు
వర్షాకాలంలో తడిగా ఉన్న భూమి ఎట్లా ఉందో ఉపమాలంకార ప్రయోగం చేశాడు. ఆలంకారిక రచన,ప్రకృతిసాన్నిహిత్యాన్ని కోరుకునేవాడు.దట్టంగా పరచుకున్న మనుషారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ దోమలూ రాజకీయాలూ జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలోకన్నా అడవుల పచ్చదనము,ప్రకృతి సన్నిహితంగా వున్న జీవితమే మంచిదని మిరియాల రామకృష్ణ గారికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు.వర్షాకాలం అంటే తిలక్ ఇష్టపడేవాడు.ఆకాశంలో నల్లని మబ్బులు,ఒక్కసారిగా వాన,భూమి చల్లబడి పచ్చబడి మనసుకు ఎంతో హాయిసిస్తుందని చెప్తూనే ” స్నానం చేసి వచ్చిన యవ్వనవతి శరీరంలాగా విచిత్రమైన అందం,ఆకర్షణ.” ఉందని వర్ణించాడు.
మోగంటి మాణిక్యాంబా దేవికి రాసిన లేఖలో మనసులోని వ్యధను ఎవరూ గుర్తించలేరని రాస్తున్న సందర్భంలో పైకి నవ్వుతున్నా అలలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో ఉన్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు అంటూనే జీవితం చాలా విచిత్రమైంది,అద్భుతమైందని చెప్తూనే ” రంగురంగుల అలలలో వంగి బ్రతుకు అంచుల్ని ముంచుతూ వుంటుంది. ఎన్ని స్వప్నాలూ,ఎంత లోతు తెలియని భయంకరాఘాతాలు.” అంటూనే సూర్యోదయాన్ని యీ విధంగా ” చీకటి లొత్త గిత్తి మెత్తని వెల్తురు తూర్పున ఆడదాని అనురాగంలాగ వ్యాపిస్తోంది.నక్షత్రాలు కాంతి విహీనమై గాజుపూసల్లాగా వున్నాయి. అక్కడక్కడ ఒక మబ్బు ఏ అప్సరస ఒంటిమీద నుండో జారిన చీరకొంగులాగ గాలిలో తేలిపోతుంది.మనోహరమూ,శాంతమూ అయిన ఆ ప్రకృతిలో లీనమౌతున్న నా మనసుకు మళ్లీ అశాంతి.” అంటూ తన అనుభూతిని వివరించాడు ఇంతలోనే నిరాశావాదం.” లోపల్లోపల ఏదో ఒంటరితనం ఒక్కణ్ణే నా బాధలతో ఏదో ఎడారి అంచులమీద నడచిపోతున్నాను– అనిపించింది.ఈ సంసారమూ ఈ స్నేహాలూ అన్నీ ఎండమావులేమో– అనిపిస్తుంది.మబ్బు పట్టి ఆకాశంలో ఈ రోజంతా తెలియని చక్కని కౌశలమూ ప్రజ్ఞా వుంది.నేను కొంత ఆశ్చర్య పడ్డాను.ఇంత బాగా రాయగలడా కథలు కూడా అని— కాని నీ కథల పుస్తకంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకుగాని,బలపరచుటకుగాని నీవు చేసిన ప్రయత్నం- ఆ కథాశిల్పంలో ముఖ్య దోషంగా కనబడింది.ఆ కథల రక్తిని అనుభవించకుండా చేసింది. పాలటబులో డిజైనులవల్ల కళ ఎప్పుడూ పరిమితమూ సంకుచితమూ అయిపోతుంది.అయితే ఆ రోజుల్లో నువ్వు ఆ ప్రభావపు ఇనుప కౌగిలిలో ఉండేవాడిని.కాని ‘కాలనేమి’ లో దోషం మచ్చుకైనా లేదు”.

వరవరరావు రచనలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరవరరావుకు రాసిన లేఖలో “అమృతవృష్టిలో అక్కడక్కడ బెట్టుగా ఉంది.యజ్ఞంకై కొత్త టానిక్,సోషలిస్టు సీత–ఇటువంటివి అనుచితంగా తోచాయి.
కుక్క నోట్లోంచి ఎంగిలాకు– ఆ ఇమేజరీ ఎందుకో? ఫోర్స్ డ్ గా వున్నట్లు అనిపించింది.రాకాశశికి మబ్బురంగు పైట అన్నాడు.మబ్బే పైటగా ఉంటుంది గదా.ఆషాఢ మాసంలో ఆ రంగుగల మరో పైట ఏముంటుంది? శశికి మరోసారి రివైజ్ చేస్తే మంచిదేమో అనుకున్నాను.నాకు నచ్చిన లైన్స్ గురించి చెప్పడం లేదు.మీరు మరోసారి చూడండి.మరి మీ కెలా తోస్తుందో? అన్నట్లు “వూసి” అని రెండు మూడు సార్లు ప్రయోగించారు.దాని అర్థం? నాకు కొత్తగా ఉంది.” – యూసేజ్. వరవరరావు తన రచనను సమర్థించినట్లు తెలిశాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను,పొరపాటయింది అని వేరే లేఖలో” పేజీలు సరిజేసి చదివితే రచన సందర్బశుద్ధిగా కనబడింది.” అని రాశాడు. వెనుకటి కవులకు తన కాలంలో కవులకు తారతమ్యాన్ని వివరిస్తూ ” నా వెనుక తరంలో కవులలో ముఖస్తుతీ వెనకాలే దూషణా ప్రత్యేకంగా ఉండేవి.సామాన్యుడి కన్నా ఊహలో,సంస్కారంలో మరికాస్త పెరుగుదల సూచించవలసిన ఆ కవులలో కనబడే ఈ కృత్రిమత్వం ,పిరికితనం దుర్భరమనిపించేవి.ఆఖరుకి కవిత్వంలో కవిత్వాన్ని గురించి నిజాయితీగా చూడలేని వీరి నుంచి ఏ మాశించగలమనుకొనే వాడివి.” అంటాడు.

జానకీ జానికి రాసిన ఉత్తరంలో ‘ మోడరన్ పోయిట్రీ పేరుతో పత్రికలలో ప్రకటితమయ్యే వాటిని చూచి విసుగు చెందాను.దాని మూలంగా చాలా విచారిస్తున్నాను.ప్రబంధయుగంలో చివరికాలంలో వచ్చిన సాహిత్యంలోని సమానమయిన క్షీణత, పదాల గారడి,నడకల శూన్యత,ప్రాస కొరకు ప్రయత్నించుట అందులో మనకు గోచరిస్తాయి.” అంటూ నవీన కాలాన్ని గూర్చి శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి రాసిన వ్యాసమే బాగుందని చెప్తూ సమకాలీన చరిత్రను గూర్చి విశదంగా విమర్శిస్తారని అనుకుంటున్నాదన్నాడు.

ఈ విధంగా తిలక్ లేఖల్లో అతని అనుభూతులు,అనుభవాలు, కవితాలక్ష్యం,రచనోద్దేశ్యం,విమర్శ, ప్రకృతి వర్ణన,ఆరోగ్య విషయాలు,మిత్రత్వానికి యిచ్చిన విలువ మొదలైనవి అనేకాంశాలు విదితమౌతున్నాయి.స్నేహితులకు తన మనోగతాన్ని స్పష్టంగా,నిర్మొహమాటంగా, కవితాత్మకతలో విశదపర్చడం లేఖలవల్ల గమనించవచ్చు. మారుతున్న కాలాన్ని బట్టి సత్యాన్ని అన్వేషించి సమాజాన్ని జాగృతం చేసేదే నిజమైన కవిత్వమనే అభిప్రాయం వున్నవాడు మానవత్వంలో పరిపూర్ణత నొందజూచుటలోనే ఆనందమున్నదని అతని సిద్ధాంతం.
ఈ రకంగా లేఖల వలన కవిత్వంపట్ల తిలక్ కున్న ప్రత్యేకమైన,ఖచ్చితమైన అభిప్రాయం తెలుస్తుంది.
తెలుగు సాహిత్య కన్యకు తన రచనల ద్వారా తిలకం దిద్దిన ప్రముఖ కవి తిలక్ సాహిత్య పరంగా కూడా లేఖలకు ప్రముఖ స్థానముందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అమ్మ

by Rudrakhala Matam Prabhu linga Shastri May 14, 2023
written by Rudrakhala Matam Prabhu linga Shastri

ఉ.మోసెను గర్భమందు నగుమోముయె౹ సంతస మేనిరంతరమ్౹
కాసెను రెప్పవోలె తనకన్నుల౹నిద్రను లెక్కచేయకన్౹
చేసెను సేవలెన్నొ తనచేతను గొల్చు ప్రమాణ మున్నీరుగా?
వ్రాసెటి వేధకైన నది వ్రాయగ సాధ్యమె? అమ్మశ్రేష్ఠతన్౹
~~
(మాతృ దినోత్సవము-14-05-2023)

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

Of Mother too

by Rudrakhala Matam Prabhu linga Shastri May 14, 2023
written by Rudrakhala Matam Prabhu linga Shastri

(poem)

She is meant to beget an
Attachment is not known.

From her birth to death
She does breathe for it.

This is not an association
Venerated as Motherhood.

Fatherhood is regarded when
Womanhood is held with pride.

The Cause may not be inferred
Begetting odd ones is visioned.

He might not be attached
To beget whom He caused.

His Love towards Her would
Cause Him to have attached.

Her worshipping Him would
Let Her have attached to Him.

Love can expect this or that
Whereas worshipping doesn’t.

Worshipping Him would grace
Her Motherhood that is unique.

Uniqueness is not only of the
Almighty but of each mother.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కాలం కబళించిన కవి మిత్రుడు బాల శ్రీనివాసుడు

by madishetti gopal May 11, 2023
written by madishetti gopal

ఇటీవల కీర్తిశేషులైన తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్ డా. బాలశ్రీనివాస మూర్తి ఒక మంచి పరిశోధకులు, ఉత్తమ అధ్యాపకులు, గొప్ప సాహితీ వేత్త గా పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వయంకృషితో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నుంచి ఆచార్య స్థాయి వరకు ఎదిగిన ప్రతిభాశాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వినయం ఆయన సొంతం.
ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా చిరునవ్వుతో అన్నా అని సంభోదించే గొప్ప మనసు ఆయనది. కరీంనగర్ లో జరిగిన రెండు మూడు కార్యక్రమాలలో ఆయనను కలిసి ఆయన ప్రసంగం వినే అవకాశం కలిగింది. అలాగే నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో శ్రీ సి. పార్థసారథి, ఐఏఎస్ వైస్ ఛాన్స్ లర్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పక్కనే కూర్చుని చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. ఆయన మృదు స్వభావి సున్నిత మనస్కుడు. అన్నా,అక్క,తమ్మి అని ఆత్మీయ పిలుపులతో అందరినీ పలకరించేవాడు. ఏ విషయమైనా తనకు తోచినంత సహాయ సహకారాలు అందించేవాడు. ఎవరినైనా తొందరగా నమ్మే స్వభావం ఆయనది. కానీ ఎవరైనా నమ్మకద్రోహం చేశారనిపిస్తే మాత్రం అంతే కఠినంగా వ్యవహరించేవారు. సాహిత్యం అంటే విపరీతమైన ప్రేమ. ఏ పని చేసినా సాహిత్యాన్ని, సాహిత్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించేవారు. అంతేకాదు ఆయనను ఆహ్వానిస్తే సాహిత్య ప్రసంగాల కోసం ఎంత దూరమైనా, కష్టమైనా ఇష్టంగా వెళ్లేవారు. అతని ప్రసంగాలలో చక్కటి విశ్లేషణ ఉండేది. విషయ పరిజ్ఞానంతో పాటు శ్రోతలను తన వైపు తిప్పుకునే అద్భుత ధార ఉండేది. అనవసరమైన విమర్శకు దిగేవారు కాదు. తాను చేయాలనుకుంటే ఎంతటి కఠినమైన పని అయినా , కష్టమైన పనైనా ఓపికగా పూర్తి చేసేవారు. విమర్శ రంగంలో సాటిలేని మేటి సాహితీవేత్తగా పేరొందినారు. అనేక రచనలు, వ్యాసాలు ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించి చక్కటి సాహిత్యాన్ని అందించారాయన.

ప్రొఫెసర్ బాల శ్రీనివాసమూర్తి 1966 సెప్టెంబర్ 5న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లోని పోతిరెడ్డి పేట గ్రామం లో జన్మించారు. స్వగ్రామమైన పోతిరెడ్డి పేట, రామాయంపేట, చిన్నకోడూరు, సిద్దిపేట ప్రాంతాల్లో ప్రాథమిక ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ మరియు పీహెచ్డీ చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున జన్మించినటువంటి బాల శ్రీనివాసమూర్తి గురువుగా గొప్ప గౌరవాన్ని చూరగొన్నారు. శిష్యాదిచ్చేత్‌ పరాజయం అన్నట్టుగా శిష్యుడి ఉన్నతిని నిరంతరం కోరుకునే వారు.

తన తండ్రి సుప్రసిద్ధ అష్టావధాని దివంగత లక్ష్మీనర్సింహశర్మ జీవిత విశేషాలపై ఇటీవల రచించిన ‘జీవన హిందోళం’ పుస్తకాన్ని డాక్టర్‌ నందిని సిధారెడ్డి పీఠిక తో ప్రచురించారు. ఆయన తండ్రి కూడా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు. ఈ రచన పలువురు సాహిత్యాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నది. ఇటీవలే ఈ పుస్తకానికి కరీంనగర్ సాహితీ గౌతమి వారు డాక్టర్ గండ్ర హనుమంతరావు స్మారక పురస్కారాన్ని ప్రకటించారు. పురస్కారం అందుకోకుండానే ఆయన పరమపదించడం ఒక విషాదం. బాల శ్రీనివాసమూర్తి భార్య శైలజ. వీరి కుమార్తె హంసిక, కుమారుడు గౌతమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఆయన రాసిన ‘తెలంగాణం-తెలుగు మాగాణం’, ‘ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ’ పరిశోధనాత్మక గ్రంథాలు తెలంగాణ సాహిత్య చరిత్ర రచనల్లో మేటిగా నిలుస్తాయని విమర్శకుల ప్రశంసలు చూరగొన్నారు. ‘వానమామలై వరదాచార్య, విలక్షణ పి.వి జీవిత చరిత్రలు.. ‘తెలుగు వారి చరిత్ర మైలురాళ్ళు – మణిదీపాలు’, ‘65ఏళ్ళ నాటి అలంపురం సభలు’, ‘మా ప్రసిద్ధిపేట’ తదితర రచనలు ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఆయన రచించిన విలక్షణ పి.వి పి.వి నరసింహారావు గారి బహుముఖీనమైన విలక్షణ విశేషాలను తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని పి.వి. శత జయంతి సందర్భంగా మోనోగ్రాఫ్ గా రచించాడు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్ 23 2022 రోజున ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఆయన సంపాదకత్వంలో ‘తెలంగాణ వైతాళికులు’ మూడు సంపుటాలు, ‘తెలంగాణ సాహిత్య చరిత్ర’ పేరుతో మరో మూడు సంపుటాలు వెలువడ్డాయి. జాగృతి వార పత్రిక లో మంచి కథలను సంకలనం చేశారు. తెలుగులో ఆధ్యాత్మిక వచన కావ్యాలు అనే అంశంపై ఆయన రచించిన పరిశోధన గ్రంథం పండితుల మెప్పును పొందింది. తండ్రి గురించి తన బాల్యపు జ్ఞాపకాల గురించి “స్మృతి పదిలం” పేరుతో పుస్తకాన్ని రచించారు. విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం అద్భుతమైన పుస్తకాన్ని అందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుంచి ‘1920-56 మధ్యకాలంలో తెలంగాణలో సాహితీ సాంస్కృతిక చైతన్యం-పత్రికల పాత్ర’ అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందారు. ఆయన పరిశోధన కూడా సుమారు నాలుగు దశాబ్దాల తెలంగాణ సామాజిక చారిత్రక ఘట్టాల ను గొప్పగా ఆవిష్కరించింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చలం రాసిన “సుధ” గీతాలపై ఎంఫిల్ చేశారు. వివిధ పత్రికలలో అసంఖ్యాక వ్యాసాలను రాయడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలు సమర్పించారు.
పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నట్టుగా నువ్వు నాకన్నా ఎదగాలి అని ఆకాంక్షించిన తండ్రి మాటను నిజం చేసి చూపించిన శిఖర సమానుడాయన. సాంప్రదాయ ఆధునిక విమర్శనా రీతులను అధ్యయనం చేసి ప్రామాణిక సాహితీ విమర్శకునిగా ఎదిగిన పరిశోధనా చక్రవర్తి ఆయన.

కరీంనగర్‌లో తెరవే మిత్రులు ‘తెలంగాణ రుబాయిలు’ పరిచయసభ పెట్టినప్పుడు ఎం.నారాయణ శర్మతోపాటు హైద్రాబాద్ నుండి బాలశ్రీనివాస మూర్తిని హాజరైన జ్ఞాపకం ఉంది. అలాగే కరీంనగర్ లో జరిగిన అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక వారి సభల్లో ఆయన హాజరై అద్భుతమైన ప్రసంగం చేసినప్పుడు అల్లం రాజయ్య ఎంత గొప్ప వక్త అని ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ రూపొందించిన “బసవపురాణం పద ప్రయోగ సూచిక” పుస్తక ఆవిష్కరణకు డాక్టర్ బాల శ్రీనివాసమూర్తి మరియు ఆచార్య రవ్వా శ్రీహరి గారలు అతిథులుగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరై ఆ ఇద్దరి అద్భుత ప్రసంగాలు వినే అవకాశం నాకు దక్కింది. యాదృచ్ఛికంగా ఆ ఇద్దరు తక్కువ వ్యవధిలోనే అస్తమించడం సాహితీ ప్రపంచానికి తీరని లోటు.

బాలశ్రీనివాసమూర్తిగారితో రచయిత

విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రాక పూర్వం కొద్దికాలం సికింద్రాబాద్ ఎస్పీ కాలేజీలో పనిచేశారు. ఆ సమయంలో విజేత ఇతర పోటీ పుస్తక ప్రచరణ సంస్థలకు రెఫరెన్స్ గ్రంథాల రచన ప్రారంభించారు. పత్రికల్లో క్రమం తప్పకుండా కాలం రాసేవారు. ఎడిటోరియల్ పేజీలో ప్రతిరోజు ఒక వ్యాసం సమకాలీన రాజకీయాలపై రాసేవారు. సద్గురు శివానందమూర్తి శిష్యునిగా ఆయన సూచన పై పుస్తకాలు రాశారు. తెలుగు సాహిత్య రంగంలో లబ్ద ప్రతిస్తులైన వారిపై 1000 పేజీలకు పైగా సమగ్ర గంధాన్ని వెలువరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ఇటీవల ప్రచురించిన తెలంగాణ సాహిత్య చరిత్ర గ్రంథానికి సంపాదకత్వం వహించి విశేష కృషి చేశారు.

సాటి లేని మేటి పరిశోధకునిగా, విశిష్టత కలిగిన విమర్శకునిగా, గురువుకు పర్యాయపదంగా నిలిచిన ఆచార్యునిగా, సుసంపన్నమైన సాహిత్యాన్ని వెలువరించిన సాహిత్య మూర్తిగా తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసిన బాల శ్రీనివాసమూర్తి ఏప్రిల్ 24 2023 రోజున హైదరాబాదులో సుచిత్రలోనీ తన స్వగృహం లో 57 వ ఏట అస్తమించడం సాహితీ రంగానికి తీరని లోటు. ఆయనకు ప్రగాఢ నివాళులు

May 11, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

అమృత బిందువు

by mayuukha May 11, 2023
written by mayuukha

 దట్టమైన మబ్బులు పరుచుకున్నాయి. చిరుజల్లు వానకురుస్తుంది చిరుజల్లుల్లో తడిసిన నేలతల్లి తన పరిమాళన్ని గాలి ద్వారా లోకంలో వెదజల్లుతుంది. వర్షం నీటిలో తడిసిన చెట్లు, ఆకులు పువ్వులు ఆనందంలో ఒకకొమ్మ పై మరోకొమ్మ వంగి గుసగుసలాడుతుంటే పుష్పాలు తమ మకరందమును పంచుతూ ఆనందడోలికల్లో తెలియాడుతున్నాయి. అంతలోనే పెద్ద ఉరుము ఆ వెంటనే మెరుపులు ఒక్కసారి వాతవరణమును భయకపితులను చేసింది. వీది దీపాలు వస్తూ పోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటోరిక్షా కిర్రుమంటు శబ్ధం చేసుకుంటు గాంధీ బొమ్మ వద్దకు వచ్చి ఆగింది. ఆటు, ఇటు చూసి అందులోని మనుష్యులు వెనుదిరిగిపోయారు. వారు వెళ్ళి తరువాత జల్లువాన కాస్త జడివానగా మారింది. ఆమసక వెలుతురులో ఎదో నీడ కన్పిపించింది. మూడుకాళ్ళ (చేతికర్ర)ను అసరచేసుకొని అడుగులో అడుగువేసుకుంటు నెమ్మదిగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంది. పైన కాస్త కప్పు ఉండటము వల్ల తడిసిన చీర చెంగును పర్చుకొని తన చేతులనే తలగడగా చేసుకొని, కాళ్ళు కడుపులోకి ముడ్చుకొని గాంధీ తాత వైపుచూడసాగింది. మహత్మ ఏమిటి ఈ కాలం? నీవు కోరుకున్న ఆహింస సమాజం? ఎక్కడ? ధర్మ నమసిపోతుంది. “ఏది జీవితం, ఏది మృత్యువు, ఏది నరకం”. అని ఆనాడు శ్రీశ్రీమహకవి అన్నారు “మాయమవుతున్నాడమ్మ మనిషన్నవాడు” అని నేటికాలంలో అందెశ్రీ గారు పాట రాశాడు. ఈనాటి నాస్థితి మరణమా! నరకమా, మృత్యువా తెలియకుంది బాపు నీవు మళ్లీ జన్మిస్తావా! మాలాంటి వాళ్ళు ఎందరో వున్నారు. వారికి జీవన విముక్తినైన ఇవ్వు, లేదా జీవనరక్షణనైనా ఇవ్వు కానీ ‘అంపశమ్య బ్రతుకులు బ్రతకలేకున్నాము. మానవుడు రాకెట్ ప్రయోగము చేస్తున్నాడు. ఖగోళ పరిశోధనలు చేస్తున్నారు. కాని కన్నవారి ఆత్మఘోష పరిశోధన చేయడం లేదు. నీవు ఎవరిలోనైన పరకాయ ప్రవేశం చేసి మాలాంటి వారికి ఆత్మశాంతి కల్గించు అంటు మౌనంగా కళ్ళ నుండి నీరు ధారపాతంగా ప్రవాహిస్తు ఉండగా మగతగా కళ్ళు మూతలు పడిపోయాయి.

బళ్ళున తెల్లవారింది గాంధి బొమ్మ దగ్గర పిల్ల పెద్ద, ముసలి అందరు గుమిగూడరు ఎదో అలజడిగా, అందోళనగా వుంది. నాకు మెలకువ వచ్చింది. రాత్రి కలలోని నుండి బయటకు రాలేదు. కాని ఎదురుగా గుంపు దగ్గరకు పోయి చూశాను నేను రాత్రి కలలో చూచిన హృదయ విచారకర దృశ్యం సాక్షాత్తుగా నాఎదుట ఉంది. అందరు తలో మాట అంటున్నారు అసలు ‘ఉపిరి’ వుందా! లేదా? అనే ‘సందేహం’ నేను దగ్గరికి వెళ్ళెలోపే వేరే వారు నాడీ పరిక్ష, శ్వాస చూసి బ్రతికె ఉందని ఋజువు చేశారు. అక్కడ చేరిన వారిలో సగం మంది వెళ్ళిపోయారు. మిగతవారు తమ ఇళ్ళల్లోకి వెళ్ళి ఒకరు నీళ్ళు తెచ్చి ముఖం పై చల్లీ త్రాగించారు. నేను వేడిగా పాలు తీసుకునిపోయి త్రాగించాను. అవ్వ కాస్త కోలుకున్నది. కానీ ఆమె బట్టలు అన్ని తడిసి పోయి ఉన్నాయి. మరో తల్లి పొడి బట్టలు తెచ్చింది. కట్టించాము. మాకు సూర్యకిరణాల నులివెచ్చధనము తోడునిల్చింది దాంతో అవ్వది మంచి జుట్టు ఆ జుట్టుకాస్త సరిచేసి పైకి ముడిచి పెట్టాము. పర్వాలేదు అసరా ఇస్తే కూర్చుంది. నీ పేరు ఏంటి? అవ్వ అని అడిగాము చెప్పటానికి కాస్త తటపటాయించింది. కాసేపటికి “రాజమ్మ” అని చెప్పింది. ఇంక వివరాలు అడిగితె చెప్పటానికి నిరాకరించింది. మేము బలవంతం చేయ చేయలేదు. నా ఫ్రెండ్ డా|| రామిరెడ్డి గారికి ఫోన్ చేసింది. డాక్టరు గారు వచ్చి ‘ఉలన్ కంబలి కప్పి’ బలానికి టానిక్ ఇచ్చి వెళ్ళారు. కాసేపటికి అవ్వకు బోజనం పెట్టి టానిక్ ఇచ్చి పడుకోబెట్టాము. రాత్రికి పగలుకు ఎంత తేడానో అవ్వకూడ అదే తేడాతో మనస్సులో మదనపడ్తునే వుంది. గతం తాలుకు వైభవం తన సంతానం, వారి వృద్ధి ఆనంద, తన భాగస్వామి సహచర్యం అన్ని కళ్ళముందు కదలాడుతున్నట్లున్నాయి. కళ్ళు మూసుకొనే వున్నాయి కాని కంటి కొనలనుండి నీరు కారిపోతుంది. అది గమనించి మేము అవ్వను కాసేపు ఒంటరిగానే ఒదిలేశాము.

సాయంకాలం వేళ పిల్లలు అందరు స్కూల్ వదలగానే గాంధీ బొమ్మ దగ్గర చేరి ఆడుకుంటారు కాని ఆరోజు వారు అవ్వనుచూసి కాస్త బెరుకుగానే వున్నారు. ఇంతలో చింటూ గాడు దగ్గరకు పోయి అవ్వ మాతో ఆడుకుంటావా. చాక్లెట్ ఇస్తాను అన్నాడు. అవ్వ మోహంలో ఎదో తెలియని వెలుగు కన్పిపించింది. చాక్లెట్ తీసుకొని చింటూగాడి నోట్లోపెడ్తూ నాకు పళ్ళులేవు నాయన నీవే తిను అంది. అయితే ఐస్క్రీమ్ తింటావా అంటు నానిగాడు వచ్చాడు. అవ్వనవ్వుతు వారించింది. అలా కాసేపు పిల్లలు అవ్వతో గడిపి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళి పోయారు. ‘టీగ్లాస్’ తీసుకొని నేను అవ్వ దగ్గరకు పోయి గ్లాసు నోటికి అందించా ఎంతో కృతఘ్నత భావంతో నావైపు చూస్తు ‘టీ’ తాగింది అవ్వ. అవ్వతాత పేరు చెప్పు అన్నాను. అవ్వ సిగ్గుపడి పోయి కాసేపు ఆగి “రామచంద్రయ్య” అని చెప్పింది. ఇంక నెమ్మదిగా వివరాల్లోకి వెళ్లాను. ఎక్కడినుండి వచ్చావు నీవు నీకు ఎవరు లేరా! అని అడిగినాను. ఓక్షణం మౌనం రాజ్యమేలింది. నెమ్మదిగా తనకు ఓకొడుకు, కూతురు ఉన్నారని, ఈ మధ్యనే తనకొడుకు చనిపోయాడని అతనికి నల్గురు కూతుళ్లు అని, తన కూతురు మరో ఊరిలో స్థిరపడిందని చెప్పింది కళ్ళ నీళ్ళతో. ఇంక వివరాలు అడిగితే రెండు చేతులు జోడించి దండం పెడ్తూ అడగవద్దని వారికి చెడ్డ పేరు వద్దని వారించింది. దాదాపు 90సంవత్సరాల వయస్సులో వున్న ఆతల్లి మనసా, వాంచ తన వారి కుటుంబ క్షేమంనే కోరుతుంది. తప్ప మరో ఆలోచనలేదు. అదేకాబోలు తల్లిప్రేమ భూమాతలా ఎన్నితప్పులు చేసిన క్షమిస్తుంది. ఇక్కడికి ఎలా వచ్చావంటే దాదాపు 40కీ, లో మీటర్లు నడిచి వచ్చానని చెప్పింది. ఆమాట విన్న ప్రతి హృదయం చలించిపోయింది. ఒకరి మెహలు ఒకరు చూసుకుంటు అవ్వ ద్గర ఉన్న వాకింగ్ స్టాండ్ అది కూడ చాలపాతది దాంతో ఇంత దూరం తలుచుకుంటేనేమైండ్ ఓక్షణం పనిచేయడం మానేసింది. అవ్వకు రాత్రి బోజనం ఏర్పాటు చేసినాము. ఎవరింట్లోనైనా వుండు రమ్మని అడిగాము అవ్వ ఓప్పుకోలేదు. దాంతో పడకకు కావలసి ఏర్పాట్లు కూడా చేశాము.

ఇంటికొచ్చి పడుకున్నాను పైనా ఫ్యాన్ తిరుగుతుంది. నాలో ఆలోచనలు కూడ అంతే స్వీడ్గా తిరుగుతున్నాయి. స్త్రీ జన్మఇంతేనా లేక మానవజన్మనే ఇంతనా. ముసలి తనం వరమా! శాపమా! యవ్వనము బాధ్యతలతో గడిచిపోతుంది. బాల్యము చదువుతో, నడివయస్సు నల్లేరు మీద బండి అయితే ముసలి తన అంపశయ్య మీద ఎదురు చూపులా! ఎంటి ఈసృష్టి దీనికి పరిష్కరము లేదా లాంటి ఎన్నో ఆలోచనలు మనస్సు నిండా తేనేటిగల్లా ముసురుకున్నాయి. ఆలోచనల్తో ఎపుడు నిద్రపోయానో నాకే తెలియదు. ఫోన్ మ్రోగుతుంది ఎక్కడో లీలాగా విన్పిస్తుంది నిద్రమత్తు వీడలేదు అదే పనిగా సెల్ఫోన్ మోగుతూనె వుంది దాంతో మెలకువలోకి వచ్చి ఫోన్ ఆన్ చేసి మాట్లాడిన రాత్రి ఎవరో ఇద్దరు మనుష్యులు వచ్చి అవ్వను కొట్టపోయారంట దారిన పోతున్న వారు చూసి వాళ్లను పట్టుకొని పోలీసులకు అప్పగింస్తానంటే అవ్వ ఓప్పుకోలేదట ఇంతలో వారు పారిపోయారంటా నా ఫ్రెండ్ చెప్పిన విషయం. అప్పుడు అర్థం అయింది అవ్వను ఎవరో కాదు తన కుటుంబ సభ్యులే ఇలా చేస్తున్నరని అయిన అవ్వ వారిని క్షమిస్తుంది. ఎందుకు తన మనవారాళ్ళ కోసమా! తన కన్నపేగు దూరం అయిన తన వారసులైన క్షేమంగా వుండలని కాబోలు ఏదిఏమైన అవ్వగతం తెలుసుకోవాలని దాన్ని గూర్చి ఆలోచన చేశాను.

అవ్వ పుట్టింటివాళ్ల ఓరకంగా ధనవంతులే అమెకు పసుపుకుంకువ కింద కాస్తపొలం ఇచ్చారు. ఒకతె కూతురు కావడం వల్ల ఓ బంగళా కూడ ఇచ్చారు. దాంతో ఆ ఇంట్లోనే తను తన భర్తతో కల్సి కాపురం చేశారు. పిల్లలు లేకపోవడంతో ఒక అబ్బాయిని తెచ్చుకొని పెంచుకుంది. అతనికి రాఘవ అని పేరుపెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సమయంలోనే రాజవ్వకు ఓ కూతురు జన్మినించింది. ఇద్దరిని రెండు కళ్ళగా భావించి వారి బావితరానికి చక్కటి బాటలు వేయాలని రాజవ్వ, రామచంద్రయ్య దంపతులు ఎన్నో కలలు కనడమే కాకుండా వాటిని అచరణలో పెట్టడానికి సాయశక్తులు కృషి చేశారు. వారి ఆశలకు తగ్గట్టుగానే రాఘవ, రమ్య ఇద్దరు చక్కని రూపం, తెలివితో చదువులోను ముందుండేవారు. ఒకసారి రాఘవకు విపరీతమైన జ్వరం వచ్చింది. పరిస్థితి ఆందోళనకరంగా మారగ డాక్టర్ గారు భగవంతునిపై భారం వేశారు. ఆసమయంలో రాజమ్వ తనకులదైవం అయిన అమ్మవార్ని పూజిస్తూ మోకాలిపైనా 108 ప్రదక్షణాలు చేసింది. మోకాళ్ల నుండి రక్తం కారుతున్న లెక్క చేయలేదు. ఉపవాసాలు, దీక్షలుచేసింది. ఇలా ఓవారం రోజుల పూజలానంతరం, డాక్టర్లు వైద్య ఫలితంమో రాఘవ కళ్ళుతెరచి అమ్మ! ఆకలి అన్నాడు. పట్టరాని సంతోషంతో రాజవ్వ వేడి వేడి అన్నం తినిపించింది. అలా కొడుకు కడుపు నిండా తిటుంటే రాజవ్వ పడిన కష్టం, తన ఆకలి మర్చిపోయింది. రాజవ్వ కొడుకును ఒళ్ళో పడుకో పెట్టుకొని దేవుని కథలు, చందమామకథలు చెప్పసాగింది. వాడికి ఇష్టమైన అన్ని వండి పెడుతుంది. ప్రతిరోజు ఒక్కోరకంగా వారం పది రోజుల్లో వాడుమాములు మనిషైయ్యాడు. ఎవరు కన్నబిడ్డ అయినప్పటికి రాఘవ తనబిడ్డ అనుకుంది. ఎందుకంటే రాఘవ మూసినకన్ను తెరవకుండ జ్వరంతో పడివున్న రోజుల్లో డాక్టరు గారు రక్తం కావాలి రాఘవకు రక్తంలేదు అన్నారు. ముందు వెనుక ఆలోచిచంకుండ రాజవ్వ తన రక్తం ఎంత కావలన్న తీసుకొండి కాని నా రాఘవ బ్రతకాలి వాడు లేకుంటే నేను బ్రతకలేను అని బోరున ఏడ్చింది. అలాంటి సందర్భంలో రాజవ్వ తన రక్తం రాఘవకు పంచి నిజంగానే కన్నతల్లి అయింది. ఇపుడు రాఘవ సంపూర్ణంగా రాజవ్వ కొడుకు ఆనాటి నుండి రాఘవకు కూడ ఎలాంటి అనారోగ్యం కల్గులేదు. తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూస్తూ జీవనం సాగిస్తున్న రాజవ్వ భర్త పొరుగు వూళ్లో వ్యాపారం బాగా సాగితే కొన్నాళ్ళ వరకు ఇంటికే రారు. వ్యాపారం తక్కువ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి రాజవ్వతోను, పిల్లలతోను సంతోషంగా ఉండేవాడు. రాజవ్వ ఏరంగుచీర కట్టుకుంటే ఎంత అందంగా ఆనందంగా వుంటుందో రామచంద్రయ్యకు బాగా తెల్సు. దానికి తోడు మెడలో కాసుల పేరు, తలలో మల్లెపూవ్వులు, చేతి నిండా గాజులు, పెద్ద కుంకుమబొట్టు, కళ్లకు కాటుకతో చూడగానే చేతెలెత్తిమెక్కెలానే వినయంగల రూపం రాజవ్వది. చుట్టు ప్రక్కల వారికి ఎంతో గౌరవం అభిమానం కూడ, గిట్టనివారికి రాజవ్వ ఆత్మాభిమానం గర్వంగా కన్పిస్తుంది. కాని సున్నితమైన మనస్సు తన కోసం తాను ఏనాడు ఆలోచించుకోదు. అడిగిన వారికి లేదనకుంటా తన చేతనైన సహాయం చేస్తూ తనపని తాను చేసుకుంటూ జీవనం గడిపేది. ఇలా కొంత కాలానికి రాఘవకు యుక్త వయస్సుతో పాటు ఉద్యోగము వచ్చింది. రమ్యకు కూడా పెండ్లి చేయాల్సిన సమయం వచ్చింది. అందమైన చదువకున్న రమ్యకు తగిన వరుడ్ని చూసి కాస్త ధనవంతుల ఇంటికోడలిగా చేసింది. ఇంక మిగిలింది రాఘవ.

ఓరోజు రామచంద్రయ్య రాఘవ పెండ్లి ప్రస్తవం తెచ్చారు. రాఘవ! చెల్లి పెండ్లి అయింది. ఇంక నీకు కూడ పెండ్లిచేస్తే మా బాధ్యత తీరుతుంది. మాకు కూడ వయస్సు మీదపడ్తుంది అన్నారు. అప్పటి వరకు అమాయకంగా అమ్మచాటు పిల్లాడిలా వుండే రాఘవ పెండ్లిమాటలు వచ్చే సరికి ఎలాంటి సంకోచము లేకుండ, నాన్న నేను క్లాస్ ఎపుడు ఫస్ట్ గా వుండేవాన్ని మీకు తెస్సు కదా. నాతోపాటు టాప్ ర్యాంకర్గా ఓ అమ్మాయి అదే ధరణి నాన్న మేము ఇద్దరము పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అన్నారు. ఆమాటలు విన్న శ్రీమతిశ్రీ రామచంద్రయ్య గార్లు విస్తుపోయారు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అన్నారు. సందర్భం రాలేదు కదా నాన్నగారు. ఇప్పుడు మీరు పెండ్లి విషయాలు మాట్లాడుతుంటే చెప్పలనిపించింది అన్నాడు. ఈ దంపతులు ఒకరిమోహలు ఒకరు చూసుకుంటు చేసేది ఏమి లేదు అనుకున్నారు కాబోలు రాఘవ ఇష్టప్రకారమే ధరణితో వివాహం జరిపారు. అంత సవ్యంగానే జరుగుతుంది. రాఘవ, ధరణి మంచిజీతం గల ఉద్యోగస్తులు అయ్యి ఇద్దరు సంపాదన పరులైయ్యారు.

రమ్యకు ఇద్దరు పిల్లలు వారు తమ సంసారంలో సుఖంగానే వున్నారు. రాఘవకు ఇద్దరు అమ్మాయిలు మూడో కాన్పు దగ్గరకు వస్తుంది. ఇసారైన ఫ్యామిలి ఫ్లానింగ్ చేసుకోమని రామచంద్రయ్య తనకొడుకుకు సలహా ఇచ్చారు కాని ధరణి తల్లి అందుకు ససేమిరా ఓప్పుకోలేదు “పున్నమనరకము” నుండి కాపాడె కొడుకు లేకుండ ఎలామరో సారి చూద్దాము అంటు రామచంద్రయ్య మాటలను త్రోసి పుచ్చింది. నల్గువ సారి కూడ అమ్మాయే ఇలా నల్గురు అమ్మాయిలకు తండ్రిగా రాఘవ. అమ్మ వార్లు అందరు తమ ఇంట్లోనే వున్నారని రాజవ్వ సంబరపడిపోతు వారి కోసం పొదుపు చేయటం మొదలు పెట్టింది. తన పుట్టింటి వారు ఇచ్చిన పొలం, ఇల్లు చాలా ఖరీదైన ఆస్తులుగా ఎదిగినాయి.

ఆకస్మాతుగా రామచంద్రయ్య గారి ఆరోగ్యము క్షీణించసాగింది వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య కుదుట పడ్తునే వుంది. అంతలోనే మళ్ళి వ్యాదీ తిరగపడ్తుంది. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. రామచంద్రయ్య వ్యాపారం బాగా సాగిన రోజుల్లో చాల డబ్బు రాజవ్వ పేరున వుంచారు. కొంత రామచంద్రయ్య వైద్యానికి ఖర్చు అయిన చాలా సొమ్ము రాజవ్వ పేరునే వుంది. ఇంట్లో ధరణి పెత్తనం మితిమీరటం ఆసొమ్ము తన పిల్లలకు తనకు కావలని ఇంట్లో గొడవలు మొదలైనాయి. రాఘవ కూడ భార్యకు తోడుగానే వున్నాడు.

ఈ ఇలాంటి సందర్భాలు అందరికి సహజమే కాబట్టి రామచంద్రయ్య దంపతులు కూతురు అల్లుడిని పిలిచి పాత ఇల్లు కూతురికి, పొలం తాలుకుహక్కును మాత్రం రాఘవకు ఇచ్చారు. రాజవ్వ పేరున ఆస్తులు మాత్రం అమె బతికి ఉన్నంత కాలం ఆమెకు చెందాలని వీలునామా రాయించారు. అప్పటికి గొడవ సద్దుమణిగినప్పటికీ మానసికంగా రామచంద్రయ్య చాల కృంగిపొసాగాడు. రాజవ్వ ఎంత దైర్యం చెప్పిన అతని మానసిక రోగం తగ్గుముఖం పట్టలేదు. కొంత కాలానికి రాజవ్వను ఒంటరిదాన్ని చేసి రామాచంద్రయ్య పై లోకానికి వెళ్ళిపోయాడు. తాత చనిపోయిన సంవత్సరంలో ఆడ పిల్ల పెళ్ళి చేసి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే నమ్మకంతో రాఘవ ఇద్దరు అమ్మాయిల పెండ్లి ఒకేసారి చేశారు. పొలంలో కొంత భాగం అమ్మివేసి మరికొంత వారి ఆదాయంతో అప్పటికే రాజవ్వ వంటి మీది నగలు మాయమైనాయి. భార్య పిల్లలు ఖర్చులు భరించలేక లంచం తీసుకోవడం వల్ల అనుకొని పరిస్థితుల్లో రాఘవ ఉద్యోగం నుండి తీసివేయబడ్డాడు. దాంతో ఇంక ఇద్దరు అమ్మాయిల పెండ్లిళ్ళు చేయ్యాలి. ఎలా అని మానసికంగా మధనపడ్తూ అనారోగ్యం కొని తెచ్చుకున్నాడు. భార్య ధరణి మాత్రం తనకు ఇంక ఎదురులేదని తనదే పెత్తానం అన్నట్లు ఆమె ప్రవర్తన రోజురోజుకు శృతి మించి పోతుంది. రాజవ్వ పై ఒత్తిడి తీసుకరాసాగింది. డబ్బు మిగిలిన నగలు ఇస్తే తన కూతుళ్ళ పెండ్లి చేస్తానని నిస్సహాయ స్థితిలో రాఘవ ఉన్నాడు.

అనుకున్నట్లుగానే మిగిలిన పొలం రాజవ్వ నగలతో మరో ఇద్దరు అమ్మాయిల పెండ్లి ఘనంగా జరిపారు. కొంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది. అప్పు చేశారు కాని ఎలా తీర్చాలో అనే ఆలోచన లేదు. కొంత కాలానికి అప్పుల వాళ్ళ అగడాలు ఎక్కువైనాయి. రాఘవ ఏమి తోచ్చని స్థితిలో తన నాన్న గారి వ్యాపారం చేయసాగారు. కుటుంబానికి దూరంగా వుంటూ అలవాటులేని వ్యాపారం కాబట్టి లాభల కన్న నష్టలే ఎక్కువైనాయి ఉన్న అప్పులు తీర్చలేదు సరికదా కొత్త అప్పులు చేయడం జరిగింది. రాజవ్వకు వయస్సు మీదపడి కంటిచూపు మందగించింది. నడవలేని స్థితిలోకి వచ్చింది. కాని తన భర్త రామచంద్రయ్య మాట ప్రకారం తన వద్దనున్న డబ్బును తన మనవారళ్ళ పిల్లలకు ఇవ్వాలని భద్రపర్చసాగింది. కాని వాటికై కోడలు, కొడుకు ప్రతిరోజు హింసించడం మొదలుపెట్టారు.

ఓరోజు ఇంట్లో అందరు గొల్లుమని ఎడ్చుస్తున్నారు. రాజవ్వ అప్పుడే నిద్రలో నుండి మెల్కొని కళ్ళజోడు సవరించుకుంటూ కిందకు వచ్చి చూసింది. తనబిడ్డ రాఘవ చలనం లేకుండ పడివున్నాడు. తన రక్తం ధారపోసి బ్రతికిచుకున్న వాడు ఈనాడు వాడి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరు కలిసి నన్ను ఒంటరి దాన్ని చేశారు అనుకుంటు ఆచేతనంగా కూలబడింది. కళ్లవెంట నీళ్ళురావడం లేదు ఎందుకంటే రాఘవకువ తను ఎడిస్తే చూడలేదు. మౌనగంగలా తనలో తానే వేదన తరంగాలను అదుపు చేసుకుంటుంది. జరగాల్సిన కార్యక్రమాలు జరిపించారు.

కొడుకు తనప్రాణం దూరం అయ్యాడు. తట్టుకొనిలేని హృదయం రాత్రి పగళ్ళు విలపిస్తునే వుంది. అలా చీకటి గదిలో ఎన్ని రోజులు వుందో తనకే తెలియదు. ఓ రోజు గదిలో లైటు వెలిగింది. రాఘవ పెద్ద కూతురు వచ్చింది. తన భుజం పైనచేయి వేసింది. రాఘవ స్పర్శలా అన్పించి మనస్సుకు కాస్త ఊరట కల్గింది. చేతిలో బాబు వున్నాడు ఒళ్లోకి తీసుకుంది. మా నాయన మళ్ళీ నా ఒళ్ళోలోకి వచ్చాడు అంటూ సంబరంగా గదిదాటి బయటికి వచ్చింది. కోడలు తినడానికి అన్ని పెట్టింది. ఎన్నాళ్ళు అయిందో రాజవ్వ అన్నం తినక కడుపునిండా తిన్నది తనగదిలో నిద్రపోతుంది. అప్పుడే చల్లటిగాలి చిన్నుకులు మొదలైనాయి. కరెంట్ పోయింది. ఎవరో తన గదిలోకి వస్తున్న అలికిడి గాజుల శబ్దం వినబడుతుంది. తనను (రాజవ్వ) నలుగురు పైకి ఎత్తుకున్నారు. నిద్రలో ఉన్నదని భయపడినారు. కాని రాజవ్వ మెలకువతోనే గమనించసాగింది. ఆనలుగురు కలిసి రాజవ్వను ఓ ఆటోలో వేసుకుని వెళ్ళి వూరిచివరన ఒదిలేసి వెళ్ళారు. ఇంక ముసలిదాని పీడ విరగడైంది. ఈ వర్షంలో తడిసి చచ్చిపోతుంది. ఆ డబ్బు మొత్తం తీసుకోవచ్చని ప్లాన్ వేసి రాజవ్వను చీకటిలో ఆనాధగా వదిలి వెళ్ళారు. ఇది రాజన్య గతం గురించి మేము తెలుసుకున్న విషయాలు. చాలా బాధ

కలిగింది.

మరునాడు ప్రొద్దున్నే కాలింగ్ బెల్ మోగుతుంది పాలవాడు పాలు తెచ్చాడు. దాంతో పాటు రాజవ్వ పరిస్థితి బాగా లేదని చెప్పాడు. రాజవ్వకు పాలగ్లాసు తీసుకొని వెళ్ళాను మేము తెలుసుకున్న విషయాన్ని నా కలగా రాజవ్వకు చెప్పాను. రాజవ్వ నన్ను గట్టిగా పట్టుకుని ఎడ్వసాగింది.

–

అదే బిడ్డ నాగతం నీకలగా వచ్చింది. అని తల ఊపింది. రేడియో వారు అప్పుడే మానవ సంబంధాలు – విలువలను గూర్చి చెప్తు పాటలు వేస్తున్నారు. నాకో ఐడియా వచ్చింది. దాన్నితోటి వారితో పంచుకున్న. మా ప్రయత్నం ఫలించి, ఓ 10 సంవత్సరాల అబ్బాయి, 8 సంవత్సరాల అమ్మాయి రాజవ్వ దగ్గరకు పూలు పట్టుకుని వచ్చారు. రాజవ్వ వారిని తన తొడమీద కూర్చోపెట్టుకొని ముద్దులు పెట్టుకుంది. తన సంచిలో భద్రంగా దాచుకున్న కొన్ని కాగితాలను వారికి ఇచ్చింది. ఆ పిల్లలు వారి ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో రాజవ్వ విషయం చెప్పారు. అవ్వను మన ఇంటికి తీసుకు రండి, లేకపోతే మేము కూడ ఇంట్లోకి రామని మొండికేశారు. రాజవ్వ ఇచ్చిన ఆస్తి కాగితాలు వారిపైకి విసిరి బయటకి వచ్చారు వారి స్నేహితులతో కలిసి గాంధి తాత బొమ్మ వద్దకు వచ్చారు. రాజవ్వలో ఎదో తెలియని శక్తి కాస్త వచ్చినట్లు అయింది. కాని మాట్లాడలేకపోతుంది. ఎదో సైగలు చేస్తుంది. కానీ అర్థం కావడం లేదు. గాంధి తాత బొమ్మపై చూపులు నిల్పి అలాగే పడుకుంది. ఇంతలో రాఘవ భార్య ఆమె కూతుళ్ళు వచ్చారు పశ్చాతాపంతో. అప్పటికే రాజవ్వ ప్రాణజ్యోతి గాంధీ తాత విగ్రహం దాటి రామచంద్రయ్యను కలిసింది. మానవత్వమును తిరిగి మెల్కోలిపిన పిల్లలు రాఘవ మనవడు, రమ్య మనరాలు. మరో తరం, మధ్య తరానికి మార్గదర్శనమై నిల్చింది.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తొలి అడుగు

by Bandi Usha May 11, 2023
written by Bandi Usha

‘‘నారాయణ రాలేదు.. ఎక్కడికి వెళ్ళాడు?’’ పక్కనే ఉన్న పొలంలో కలుపు తీస్తూ అడిగింది మంగమ్మ.

‘‘మిరప తోటకు మందులు తెస్తానని పొద్దన్నే పట్నం వెళ్ళాడు పిన్ని’’ బెండకాయలు కోస్తూ చెప్పింది ఆదిలక్ష్మి.

‘‘ఒక్క దానివే అన్ని బెండకాయలు కోయాలంటే చాలా కష్టం’’

‘‘అవును పిన్నీ. చేతులు బాగా దురద పెడుతున్నాయి. ఒక్కరోజు ఆగితే ముదిరిపోతున్నాయి’’.

‘‘నిజమే. ఇక అన్నం తిని కాసేపు కూర్చుందాం పద’’

‘‘వస్తున్నా’’ అంటూ బెండకాయలు కోయటం ఆపింది ఆదిలక్ష్మి.

కాళ్ళు చేతులు కడుక్కొని ఇద్దరూ చెట్టు క్రిందికి చేరారు.

‘‘ఏం కూర తెచ్చావు?’’ అడిగింది మంగమ్మ.

‘‘ఆయన పొద్దున్నే వెళ్ళాడు. నేను ఊళ్ళో పాలు పోసి వచ్చేసరికి పొద్దెక్కింది. కూర చేయలేదు. నిన్న నూరిన గోంగూర పచ్చడే తెచ్చాను’’

‘‘నేను నువ్విచ్చిన బెండకాయలే వండాను వేసుకో’’

అన్నం తింటూ కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. నారాయణ రాలేదు. మళ్ళీ పనికి లేచారు.

తోటలోనే బేరగాళ్ళకు బెండకాయలు అమ్మి గేదెల్ని తోలుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంది ఆదిలక్ష్మి.

నారాయణ జాడలేదు. పాలు తీసి అందరికీ పోసేసరికి బాగా చీకటి పడిరది. అన్నం కూడా వండి ఇంట్లో పనయ్యేసరికి ఎనిమిది అయ్యింది.

పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంకా రాకపోవడంతో పక్కనే ఉన్న మరిదికి చెపుదామని బయటకొస్తుండగా అప్పుడు నారాయణ తూలుకుంటూ వచ్చాడు.

ఎప్పుడో చుట్టం వచ్చినప్పుడు కొద్దిగా తాగే మనిషి ఇట్లా తాగాడు ఏమైంది నీకు’’ అని అడిగింది ఆదిలక్ష్మి.

‘‘ఏమీ కాలేదు. మన బతుకులు బాగుపడుతున్నాయి’’

‘‘ఏం మాట్లాడుతున్నావు’’

‘‘మందులు తెద్దామని పట్నం బయలు దేరానా.. దారిలో సర్పంచ్‌గారు కలిసి మంత్రి గారి దగ్గరకు తీసుకెళ్ళారు’’

‘‘ఎందుకు’’

‘‘ఓట్లు వస్తున్నాయి కదా. నన్ను మన కాలనీ చూసుకోమన్నారు. ఇదితో నాకు ఫోన్‌ కూడా ఇచ్చారు’’.

‘‘కష్టపడి బతికేటోళ్ళం. మనకెందుకు ఇలాంటివన్నీ?’’

‘‘పాతికేళ్ళ నుంచి కష్టపడుతున్నాం. ఈ గుడిసె తప్ప ఇల్లయినా కట్టుకోగలిగామా?’’

‘‘బాగానే బతుకున్నాం కదా. పిల్ల పెళ్ళి జేసినం. పిలగాడు చదువకుంటున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వెనకేసుకున్నాము. మంచిరోజులు చూసి మొదలుపెడదాం అనుకున్నాముగా’’

‘‘ఓట్ల పండగ కానివ్వు. పెద్ద భవంతే కడదాం’’

‘‘నీ మాటలు ఏమీ అర్ధం కావడంలేదు. ఈ సంసారాన్ని ఏం చేస్తావో. ఇక అన్నం తిందువు రా’’

‘‘నాకొద్దు. సర్పంచ్‌గారు బిరియానీ పెట్టించారు’’

‘‘పెద్దోళ్ళతో నీకెందుకు?’’

‘‘చెప్పింది చాల్లే. నువ్వు తిని పడుకో’’ అని మంచి మీదకి ఒరిగాడు.

ఆదిలక్ష్మి కాసేపు ఆలోచనలో పడినా పగలంతా కష్టపడడంతో కాసేపట్లో వొళ్ళెరగకుండా నిద్రపోయింది.

*      *     *

రోజూ తెల్లవారురaామునే లేచే నారాయణ లేవలేదు. ఆదిలక్ష్మే లేచి పాలు తీసింది. పాలు పోయడానికి నారాయణను లేపింది.

‘‘నేనలాంటి పనులు ఇక చెయ్యను’’ కరాఖండిగా చెప్పాడు నారాయణ.

ఆదిలక్ష్మి పాలు పోయడానికి వెళ్తూ ‘‘ఈరోజైనా పురుగుమందులు తీసుకొని రా. తోట పాడువుంది’’.

‘‘తెస్తాలే’’

‘‘త్వరగా రా. వెంటనే మొదలు పెడదాం’’

‘‘వీలవదు. సర్పంచ్‌గారు ఇవాళ మీటింగ్‌కు వెళ్ళాలన్నారు’’

‘‘నీకేదో పిచ్చి పట్టింది’’

‘‘అవునే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలన్న పిచ్చి పట్టింది’’

‘‘ఏదీ వట్టిగా రావాలి అనుకోవద్దు. ఒకసారి అటువైపు అడుగువేస్తే ఆ బురద కడిగినా పోదు’’

‘‘నీకే తెలవదులే. ఇక ఆపు వెర్రిమొహమా’’ అంటూ బయటకెళ్ళి పోయాడు నారాయణ.

*      *     *

‘‘నారాయణ ఇవాళ కూడా రాలేదేంటే ఆదిలక్ష్మీ..’’ మధ్యాహ్నం అన్నం తింటూ అడిగింది మంగమ్మ.

‘‘నాకు ఆయన ఎవ్వారం చూస్తుంటే భయమేస్తుంది పిన్నీ’’ అని జరిగినదంతా చెప్పింది ఆదిలక్ష్మి.

ఈ వోట్లేమో గానీ మన సంసారాలు పాడవుతున్నాయి. మీ బాబాయి కూడా వోట్లప్పుడే కదా నాటుసారాకు అలవాటయి చనిపోయింది.

ఆ మాటలో మరింత దిగులు పట్టుకుంది ఆదిలక్ష్మికి.

‘‘భయపడకు అన్నిటికి భగవంతుడే ఉన్నాడు. బెండకాయలు కోయటానికి నేనూ సాయం వస్తాను పద’’ అంటూ ఆదిలక్ష్మిని లేపింది.

*      *     *

సాయంత్రం ఇంటికెళ్ళే సరికి నారాయణ జాడలేదు. పాలుతీసి కాలనీలో పోయడానికి వెళితే అక్కడ నారాయణ కనిపించాడు.

‘‘ఇక్కడేం చేస్తున్నావు’’

‘‘మగాడన్నాక సవాలక్ష పనులుంటాయి. నీకెందుకు? ఇంటికెళ్ళు’’ కోపంగా అన్నాడు నారాయణ.

ఎంతో నెమ్మదిగా మాట్లాడే నారాయణ రెండు రోజుల్లోనే మారిపోయాడు. ఆదిలక్ష్మి ఏమీ అనలేక ఇంటికొచ్చి అన్నం, కూర వండిరది. బాగా పొద్దుపోయాక నారాయణ తూలుకుంటూ వచ్చాడు. మాట్లాడే పరిస్థితిలో లేడు.

ఆదిలక్ష్మికి బాగా భయం పట్టుకుంది. ఏదో ఇంత తిని పడుకుంది.

*      *     *

నారాయణ పక్కమీద నుండి లేవకముందే ‘‘సర్పంచ్‌గారు రమ్మంటున్నారు’’ అని వచ్చాడు పాలేరు రంగడు.

దిగ్గున లేచి తయారవుతుంటే ‘‘పెద్దోళ్ళతో మనకెందుకు?’’ అంది ఆదిలక్ష్మి.

‘‘మనమూ పెద్దోళ్ళమవుతాం’’

‘‘ఆకాశానికి నిచ్చెనలు వేయక భూమి మీద నడువు’’

‘‘ఆడపెత్తనం ఆపు’’ అంటూ వెళ్ళిపోయాడు.

*      *     *

‘‘తోటనిండా పురుగులు ఎక్కువవుతుంటే ఎన్ని రోజులు అలా ఉంచుతారే’’ మంగమ్మ తోటలో తిరుగుతూ అడిగింది.

‘‘ఆయన నా మాట వినేలా లేడు పిన్నీ’’

‘‘పెద్దోళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళతో తిరిగితే మనమే నష్టపోతాము’’

‘‘ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు’’

‘‘పిలగాడితో అయినా తెప్పించరాదు’’

‘‘వాడికిలాంటి పనులు చెపితే చదువు ఆగమవుతుంది’’

‘‘ఏదో ఒకటి చెయ్యి. చేతికొచ్చిన తోట పాడవుతుంది’’

‘‘రేపు మా అన్నను పిలిపించి మందుకొట్టిస్తా’’

‘‘సరే ఇక పని మొదలు పెడదాం’’ అంటూ లేచింది మంగమ్మ.

*      *     *

సాయంత్రం ఇంటికెళ్ళేసరికి కొడుకు శ్రీకాంత్‌ బ్యాగ్‌ ఉంది.

వీడు ఇప్పుడెందుకు వచ్చాడు. ఇప్పుడేమీ సెలవులు లేవుగా అనుకుంటూ ‘‘శ్రీకాంత్‌..’’ అని పిలిచింది.

‘‘అన్న బయటకెళ్ళాడు’’ బజార్లో ఆడుకుంటున్న ఎదురింటి అబ్బాయి వంశీ చెప్పాడు.

స్నేహితుల దగ్గరకు వెళ్ళాడేమో అనుకొని కొడుక్కి ఇష్టమయిన పప్పు చేసింది. ఎంతకీ రాకపోయే సరికి వాకిట్లోకి వెళ్ళింది.

‘‘ఏమిటి వదినా తీరిగ్గా ఉన్నావు’’ అడిగాడు మరిది రాంబాబు.

‘‘శ్రీకాంత్‌ వచ్చాడు. ఎటు వెళ్ళాడా అని చూస్తున్నాను’’

‘‘అన్నయ్యా, శ్రీకాంత్‌.. సర్పంచ్‌ ఇంట్లో ఉన్నారు’’

ఏదో తెలియని నిస్సత్తువ ఆవహించింది ఆదిలక్ష్మికి. రాత్రి పదకొండు గంటలకు తండ్రీ, కొడుకులు వచ్చారు.

అన్నం తినమంటే సర్పంచ్‌ గారింట్లో తిన్నామని చెప్పారు.

‘‘నువ్వు కాలేజీ వదిలి ఎందుకొచ్చావురా?’’

‘‘నాన్న రమ్మన్నాడు’’

‘‘ఎందుకు’’

‘‘ఎలక్షన్లు కదా. యూత్‌ కోసం ప్రచారం చేయాలన్నాడు. డబ్బులు కూడా ఇస్తారన్నాడు’’

‘‘నీ చదువు ఏమవుద్ధి?’’

‘‘నాలుగు రోజులకు ఏమీ కాదులే’’

ఎంతచెప్పినా వినిపించుకోకుండా తండ్రి బాటే పట్టాడు శ్రీకాంత్‌.

*      *     *

పొద్దున్నే వెళ్ళి తండ్రితోపాటే రాత్రి బాగా పొద్దపోయాక వచ్చేవాడు శ్రీకాంత్‌. ప్రచారాల జోరు బాగా ఊపందుకుంది. తండ్రీకొడుకులను సర్పంచ్‌ మెచ్చుకోవడంతో వీళ్ళు ఎక్కడా ఆగడం లేదు.

ఆదిలక్ష్మి వాళ్ళ అన్నయ్యను పిలిపించి తోటకు మందు కొట్టించింది. కొడుకు ఎక్కడ పాడవుతాడో అన్న బెంగ రోజురోజుకూ ఎక్కువవుతోంది.

ఓట్ల ముందు రోజు రాత్రి తండ్రీకొడుకులు ఇంటికే రాలేదు. మద్యం ఏరులా ప్రవహింపచేశారు. ఎన్నడూ లేనిది ఓట్ల రోజు నారాయణ ఖద్దరు బట్టలు వేశాడు. సర్పంచ్‌ పక్కనే తిరిగాడు.

ఓటు వేయడానికి ఆదిలక్ష్మి వెళితే ‘‘మీ ఆయన గొప్పోడు అవుతున్నాడే’’ అంది సుబ్బలక్ష్మి.

‘‘అసలుకు మోసం రాకపోతే చాల్లే అక్కా’’ అంది ఆదిలక్ష్మి.

‘‘వాళ్ళ ఆయనే కాదు, కొడుకును కూడా రాజకీయాల్లో దించింది’’ అన్నాడు కోటయ్య.

‘‘నాకేం తెలుసు బాబాయ్‌.. చదువుకోమంటే నాలుగు రోజుల నుండి ఇక్కడే తిరుగుతున్నాడు’’

‘‘సర్పంచ్‌ సంగతి తెలుసుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి’’

‘‘అదే బాబాయ్‌ నా బాధ’’

*      *     *

ఓట్లు ముగిశాయి. లెక్కింపుకు నాలుగు రోజులు ఉంది. తండ్రీ కొడుకులిద్దరూ లెక్కలు చూసుకోవాలి అంటూ సర్పంచ్‌ ఇంటికి వెళ్తుంటే.. ‘‘ఎల్లుండి మంచి ముహూర్తం ఉందట. సామానంతా తెప్పించుకొని ఇల్లు మొదలుపెడదాం. అది కాగానే శ్రీకాంత్‌ను కాలేజీకి పంపిద్దాం’’ అంది ఆదిలక్ష్మి.

‘‘ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయి’’

‘‘ఏందయ్యా కొత్తగా మాట్లాడుతున్నావు. ఇల్లు కడదామని బ్యాంకులో ఐదు లక్షలు దాచాము కదా’’

‘‘ఓట్ల కోసం పెట్టాను’’

‘‘ఓట్ల కోసం నువ్వు పెట్టడమేంటి?’’ వణుకుతున్న స్వరంతో అడిగింది ఆదిలక్ష్మి.

‘‘ఓట్లయ్యాక డబుల్‌ ఇస్తాను అని సర్పంచ్‌గారు పెట్టమంటే పెట్టాను’’

‘‘ప్రపంచంలో ఇలా ఎవరయినా నమ్మి పెడతారా? అయినా అంత ఆశ ఎందుకు?’’

‘‘ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ఇంకా ఎన్నాళ్లు కష్టపడతాం’’ అంటూ బయటకు విసురుగా వెళ్ళిపోయాడు నారాయణ.

*      *     *

ఆదిలక్ష్మికి ముద్ద సహించడం లేదు. నిద్రలేదు. ఆ ఐదు లక్షలు ఏమవుతాయో అన్న భయం పట్టుకుంది.

పాతిఏళ్ళ కల నెరవేరే సమయంలో ఇలా జరిగింది. ఆ డబ్బు వెనకేయడానికి పగలనకా, రాత్రనకా ఎంత కష్టపడిరది గుర్తొస్తుంటే దుఃఖం ఆగడం లేదు.

ఓట్ల లెక్కింపు రోజు రానే వచ్చింది. నారాయణ తిరిగిన పార్టీ ఓడిపోయింది. నారాయణకు ఏదో తెలియని భయం పట్టుకుంది. తెల్లవారి ఉదయం సర్పంచ్‌ ఇంటికి వెళ్ళాడు.

‘‘ఏంటి ఇలా వచ్చావు?’’

మాటలో తేడాను గ్రహించాడు నారాయణ.

‘‘డబ్బులు ఇచ్చేస్తే ఇల్లు మొదలు పెట్టుకుంటాను’’

‘‘పార్టీ ఓడిపోయింది. ఏ మొహం పెట్టుకొని మంత్రి గారిని డబ్బులు అడుగుతాము’’

‘‘మరి నా డబ్బులు’’

‘‘నీవి ఐదు లక్షలే. నావి పాతిక లక్షలు’’

‘‘మేం ఇంటిల్లిపాది రెక్కలుముక్కలు చేసుకొని ఇంటిల్లిపాది కష్టపడి సంపాదించుకన్న డబ్బు. అలా అంటే ఎలా?’’

‘‘ఏం చేయమంటావు నన్ను’’

‘‘మీరే ఇవ్వాలి నాకు. గట్టిగా అన్నాడు’’

‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకిచ్చావా. ముందు బయటకు నడువు’’

‘‘నీవిచ్చేంతవరకు వెళ్ళను’’

‘‘వీడిని బయటకు నెట్టండిరా’’ అనుచరులకు చెప్పాడు.

ఆ తోపులాటలో నారాయణ తలకు గోడ గట్టిగా తగిలి రక్తం బాగా కారడంతో ‘‘లేనిపోని సమస్య మనకెందుకు’’ వాడిని ఇంటికి పంపించండి అన్నాడు సర్పంచ్‌.

*      *     *

నారాయణ తలకు దెబ్బ చూసి ఏడవడం మొదలు పెట్టింది ఆదిలక్ష్మి. శ్రీకాంత్‌ డాక్టర్‌ను పిలవడానికి వెళ్లాడు.

‘‘నీ మాట విన్నట్లయితే ఇట్లా జరిగేది కాదదు ఆదిలక్ష్మి’’ ఎగపోసుకుంటూ అన్నాడు నారాయణ.

‘‘బాధపడకు. బతకడానికి ఏదో ఒక దారి ఉంది కదా’’

‘‘మోసపోయాను. పాతికేళ్ళ కష్టం వృథా అయింది’’

నారాయణ తల నిమురుతూ ‘‘ఏం కాలేదులే కాసేపు మాట్లాడకు’’

డాక్టర్‌ వచ్చేసరికి ఎగపోత ఎక్కువయి ప్రాణం విడిచాడు నారాయణ.

ఆదిలక్ష్మి కుప్పకూలిపోయింది.

*      *     *

నారాయణ చనిపోయిన పదిరోజులకు ఆదిలక్ష్మి స్పృహలోకి వచ్చింది. తల్లి పరిస్థితి చూసి సర్పంచ్‌ దగ్గరకు వెళ్ళి తాడోపేడో తేల్చుకోవాలి అనుకున్నాడు శ్రీకాంత్‌.

‘‘మీ నాన్నలాగే అవుతావు’’ అని మేనమామలు, బాబాయి పోనివ్వలేదు.

నాన్న చదువకోక, నేను చదువుకున్నా అనుభవం లేక ఇద్దరం రాజకీయ ఉచ్చులో చిక్కాం. మేమే కాదు ఇలా ఎంతమంది చిక్కారో. దీనికి ముగింపు ఉంటుందా?

పూర్తిగా ఉండదేమో కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళనైనా చైతన్య పరచాలి. చదువు పూర్తిచేసి నాకాళ్ళ మీద నేను నిలబడ్డాక సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడూ ఇలాంటి ఊబిలో దిగకూడదు.

జరిగినదంతా పీడకల అనుకోలేను గానీ గుణపాఠంగా తీసుకోవాలి. ఇదో మేల్కొలుపు. ఆలస్యం చేయకుండా చదువులో నిమగ్నమవ్వాలి. వెంటనే తల్లి దగ్గరకు వెళ్లి పక్కన కూర్చున్నాడు. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని ‘‘అమ్మా.. నేను కాలేజీకి వెళ్ళాళి’’ అన్నాడు.

‘‘వెళ్ళు నాన్నా’’ కొడుకు తల నిమిరింది.

‘‘ఇక ఎప్పుడూ నిన్ను కష్టపెట్టను. నువ్వు గర్వపడేలా తయారవుతాను. నన్ను నమ్ము అమ్మా’’

ఆదిలక్ష్మికి దుఃఖం పొంగుకొచ్చింది.

శ్రీకాంత్‌ కొద్దిసేపు కూర్చున్నాడు. తర్వాత తల్లి బాధ్యతలను మేనమాలకు అప్పగించి బ్యాగు తీసుకొని మరో నూతన ఉషస్సు వైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళాడు.

కాదు కాదు మార్పుకు శ్రీకారం చుట్టే బాటలో అడుగువేశాడు.

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us