ఆదికవి నన్నయ్య వేదిక ఉ//9గం.లు
విజయవాడ లో 5వ ప్రపంచ తెలుగు మహాసభల్లో నా ప్రసంగం:
19 వ శతాబ్దపు చివరి దశాబ్దాల నుండి ప్రస్తుత పరిస్థితి వరకు ఆధునిక కాలంగా భావించవచ్చు. ఈ కాలంలో వచ్చిన ప్రధాన మార్పులు జాతీయ వాదం , దేశభక్తి, ప్రగతిశీల అభ్యుదయ భావాలు, స్త్రీ విద్య,బాల్య వివాహాల రద్దు ,వితంతు వివాహాలు, సామ్యవాద దృక్పథం తో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, కార్మిక కర్షక వర్గాల శ్రేయస్సు, ఆధునిక వైజ్ఞానిక అవగాహనా దిశగా హేతువాద దృక్పథం పెంపొందించడం యిత్యాదులు .వీటన్నిటి నేపథ్యంలో కూడా ఆథ్యాత్మిక చింతన కూడా మనిషి వైఖరిలో మార్పుకు , మంచి వైపుమరలడానికి దోహదం చేసింది.
ఈ పై భావజాలాల దృష్ట్యా రచయితలు, కవులు తమ తమ రచనల ద్వారా మంచి మంచి ఫలితాలు సాధించారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు రామమూర్తి పంతులు, వంటి వారు ఏర్పరచిన దారిలో గాడిచర్ల, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, త్రిపురనేని, తాపీ వంటి వారలు చాలా వరకు లక్ష్యాలు సాధించారు.
అందు వల్లనే కుల ,మత బేధాలు తగ్గి సమైక్యంగా అందరూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనగలిగారు. సురవరం ప్రతాప రెడ్డి, సరోజినీ నాయుడు, దాశరథి సోదరులు, కాళోజీ సోదరులు, ముఖ్దూం మొయినుద్దీన్, షోయబుల్లాఖాన్, అడవి బాపిరాజు వంటి వారలు ప్రత్యేక ముద్ర వేశారు.దేవులపల్లి రామానుజరావు వంటి వారలు ఆసులో దారంలా యీఅన్ని భావాల వైఖరులు ఉద్యమాల సంధానకర్తలుగా దీప్తి నందించారు.
గరిమెళ్ళ సత్యనారాయణ వంటి కవి గాయకులు గాంధీ శకానికి/ యుగానికి ప్రతినిధులు. వారి పాటల ద్వారా ప్రజలలో మంచి భావావేశాన్ని కలిగించారు. వామపక్ష సోషలిస్టు దృక్పథాలు ఫలితాలు సాధించి ఆధునిక ప్రజాస్వామ్య ప్రయాణాన్ని బలోపేతం చేశాయి.
ప్రజాస్వామ్య యుతంగా , రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వాల్ని ఏర్పరచుకోవడం , ప్రభుత్వాల్ని మార్చడం అనేది అతిపెద్ద సామాజిక మార్పు . దీనికి రచయితలు కవులు ఎంతో దోహదం చేశారు. నిరక్షరాస్యులైనా , గ్రామీణులైనా దళిత గిరిజనులైనా తమ తమ విచక్షణ జ్ఞానం ద్వారా ప్రభుత్వాల్ని మార్చడమనేది ఒక గొప్ప శుభ పరిమాణం, పరిణామం. దీనికి రచయితలు కవితలు , నాటకాలు, పాటలు , బుర్రకథలు యిత్యాదుల ద్వారా ప్రజల అవగాహనకు తోడ్పడ్డారు.
కుల మతాల సాంప్రదాయ భావజాలాలు పునర్వికాసం చెందుతున్నాయి. ఒకప్పుడు ఉద్యమ రూపంలో కలిసి పనిచేసినవారు ,పోరాడినవారు కొంత కాలానికి కుల మత భావజాలాలకు లోనవుతున్నారు.
ఛందో రూపమైన ప్రాచీన సాహిత్యం కన్నా వచన కవిత్వం విశేష ప్రాచుర్యం లోనికి వచ్చింది.ఐనా మంచి పద్యాలు, సమస్యొ పూరణలు వస్తున్నాయి. తిరుపతి వేంకట కవులు, కొప్పురపు కవులు , జాషువా, విశ్వనాథ, శ్రీశ్రీ, నండూరి రామకృష్ణమాచార్య , ఆశావాది ప్రకాశరావులు మంచి పద్య శిల్పాన్ని నిర్మించారు.
శ్రీ గరికిపాటి నరసింహారావు మహా సహస్రావధాని. శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆథ్యాత్మిక ప్రవచన కర్త. ఆధునికత వెర్రి తలలు వేసి సమాజం అడ్డదారులు తొక్కుతున్న తరుణంలో ఈ యిద్దరు ప్రవచనకర్తలు మంచి మార్పుకై దోహదం చేస్తున్నారు.
ఏ సమాజంలో నైనా మంచి ని ప్రోత్సహించడం , చెడును విమర్శించడం , త్యాగమయ దేశభక్తి జాతీయతా దీప్తిని ప్రోత్సహించడం, ధర్మనిరతిని కాపాడటం రచయితల పాత్ర.
ఈ విధంగా ప్రధానంగా అరసం విరసం వంటి సంఘాలు గద్దరు / వంగపండు వంటి కవి గాయకులు చాలా సామాజిక మార్పు సాధించారు. కేవలం రాజకీయ పార్టీల వల్ల 150-200 సంవత్సరాలు పట్టగల మార్పును , వీరు 40 సంవత్సరాల్లో సాధించారు. ఈ యీ సామాజిక ఉద్యమాల / రచయితల రచనల ద్వారానే సామాన్య ప్రజానీకానికి మార్పు తేగలం అనే నమ్మకాన్ని కలిగించారు .
ప్రస్తుత తరుణంలో నేరమయ జీవిత నేపథ్యం గల రాజకీయ రంగమును క్షాళన చేయడానికై రచయితలు/ కవులు ప్రజల అవగాహనను ఈ ప్రధాన సమస్యపై కేంద్రీకరించడానికి కృషి చేయవలసిందిగా ఆయత్త పరచాలి.
పదకిరణ కలనం-10

అడ్డం
**
01. రవికుల తిలకుడు (5)
04. ముక్కెర (4)
07. కోతి జెట్టి (2)
08. యుద్ధం (2)
11. కచ్ఛపం (3)
13. వజ్రాయుధం (3)
15. చాటింపు (3)
17. కిరణం రోగం (2)
18. తల (2)
19. కండోలం (2)
21. జంతువు పిల్ల (2)
23. పోటి పగ (2)
25. లోటు తక్కువ (2)
26. తేలిక (3)
27. ఏమరుపాటు (3)
28. వరుసకు ముందు చుట్టరికం (2)
29. సన్నము కానిదా? ఉష్ణద్రవము (2)
30. పందెం (2)
31. భ్రాంతి ఓ ప్రముఖకవి ఇల్లు (3)
33. తొమ్మిది పదులు (3)
35. పిల్లలను తల్లి లాలించే వెచ్చని పానుపు (2)
36. సుమంత్రుని తొలి విరి (2)
38. వెలితి (2)
39. గెలుచు (2)
40. కూడు కొరివి పెట్టేవాడు (3)
41. శ్రీరామునకు విశ్వామిత్రుడు ప్రసాదించిన ఒక అస్త్రం (4)
43. జతకుదురు సరిపోవు (2)
44. ఇల్లు పీకి వేసేది (3)
45. సదా (3)
46. పెరుమాళ్ళు కెఱుక (3)
**
నిలువు
01. మాధవుని మామ (5)
02. తాలింపులో వాడే సుగంధద్రవ్యం (3)
03. దీనిని దీనితోనే తీయాలట (2)
05. పెంచు బొట్టుదినుసు (2)
06. పూదేనె (3)
08. తీగెలు, మొక్కలకు తావు (2)
10. ఇతరుల తిండితో బ్రతికేది (5)
12. మురికి లప్పం (2)
13. గోడ (3)
14. యుద్ధభూమి ఒకప్పటి రంగూన్ (2)
16. పాకు (2)
20. భాషలో పదిమందిలో ప్రాముఖ్యత (5)
22. దేవతలు మెచ్చి కురిపించేది (4)
24. రాత్రితో ఉపవాసం (3)
26. ఆ విధంగా (2)
27. పందెం (2)
28. తరువాత తన ఆస్తికి అర్హుడు (4)
30. సతికి తనతో సగం ఇచ్చినవాడు (2)
32. అత్యుష్ణం దుఃఖం (4)
34. స్త్రీ నేర్పరి ఇల్లు (3)
35. వంచు వశమగు (2)
37. తాను కోరినదే కావాలని పట్టే మొండితనం (4)
39. రెండుపక్షాలతో తీగసాగిన స్త్రీ (3)
40. స్త్రీ పూలను తురిమేది ఇక్కడ (3)
41. శత్రువు (2)
42. వేరే చోట నివాసం చేసేది (2)
ప్రేమించానని వెంటబడి పెళ్లి చేసుకొన్న అద్వైతకు కులాంతరాలు గుర్తుకు రాలేదు. ఏ లోపాలూ కన పడలేదు. నిన్ను పెళ్లి చేసుకోలేని ఈ జీవితం వ్యర్థం అన్నాడు. రొమాంటిక్ బ్లాక్ మేల్ చేసి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఒక బిడ్డకు జన్మనిచ్చింది శారద. పెళ్లి చేసుకొన్న మూడేళ్లకు ఏదో కెమిస్ట్రీ కుదరలేదని భార్యను బిడ్డను వదిలేసి వెళ్లిపోయాడు అద్వైత .
శారద ఒంటరి ప్రయాణంలో మరో మూడేళ్లు గడిచాయి. ఎన్నో అనుభవాలు పోరాటాలు. ఎందరో మద్దతు నిలిచారు.
ఒంటరి పోరాటంలో కన్నీరు కార్చింది. ఏకైక కూతురు కంట కన్నీరు చూడ లేకపోయారు… కన్న పేగు కదిలింది. కడుపులో దాచుకున్నారు. అత్తామామలకు మనవరాలంటే ప్రేమ. ఎన్నాళ్లకు తమ ఇంట్లో మళ్లీ పసిపిల్ల కేరింతలు. ఆ పసి నవ్వులకు మురిసిపోయారు. కొడుకే చెడిపోయాడు. కోడలు మంచిది అని తెలుస్తూనే ఉంది. మాకు పెళ్లే కాలేదన్న కొడుకు వాదన విన్నాక వీడు తమ కడుపున చెడ పుట్టాడని బాధ పడ్డారు. కోడలు మనవరాలు తమ తో ఉంటే ఎంత సౌఖ్యంగా ఆనందంగా వుండేదో అనుకున్నారు. అలా కలిసి పోయారు. ఇపుడు వాల్లందరికి గారాల మనవరాలంటే ప్రాణం. మనవరాలు ఆటపాటలతో అన్ని మరిచి పోయారు. బయట సంఘర్శన. ఇంట్లో ఆనందం. కోర్టు , అడ్వకేటు , కలిసి దిగిన ఫోటోలు సాక్ష్యాలు అన్నీ బలంగానే ఉన్నాయి.
ఈ కొత్త జీవితం లో అనేక విషయాలు తెల్సుకుంది శారద. శారద ఇపుడు తన ఏటియం కార్డు తానే వాడుకుంటుంది . కేసు పెట్టింది. ఇపుడు జైల్లో వున్న అద్వైత్ ఉద్యోగం పోయి శారద మీద మీద మనోవర్తి కేసు వేసాడు.
కేసు వాసుతీసుకుంటానన్నాడు. అతడు
అడ్వకేటు తో కబురు పెట్టింది గుర్తుకు వచ్చి నవ్వుకుంది శారద.
ఏదో కెమిస్ట్రీ కలవడం లేదన్న బింకం అహంకారం ఎక్కడ పోయిందో! ఇపుడు తనకేమైందని అతనిని ఆహ్వానించడం.
?
అతని లోని మార్పుతో తనకేమీ సంబంధం లేదు.
ఇపుడీ సింగిల్ పేరెంట్ జీవితమే బాగుంది. అపుడు కులాంతరాల పేరిట దూరమైన అమ్మా నాన్నా అత్తమ్మా మామయ్యా అంతా నాతోనే వున్నారు.
ఈ ఉమ్మడి కుటుంబమే బాగుంది. అతడు మల్లీ తన జీవితంలోకి ప్రవేశించడం దేనికి?
తన అడ్వకేటుకు అదేమాట చెప్పింది. ఆ మాట చెప్పాక తనకెంతో బరువు దిగిపోయినట్టు ఉత్సాహం..
శారద మునుపటి శారద కాదు.
ఎన్నో అనుభవాలతో ఎదిగిపోయింది.
వదిలేసిన వాడి జీవితమే వాడిపోయింది. మా శారద గొప్పది.
శారద తన జీవితాన్ని తిరగ రాసుకుంది. స్కూటర్ పై
బిడ్డను స్కూల్లో దింపి నవ్వుతూ టాటా చెప్పి యధావిధిగా డ్యూటీకి స్కూటర్ స్టార్ట్ చేసి బయల్దేరింది శారద.
విషయ ప్రధానమైన భావగతి, నిండైన వర్ణనలు సంపూర్ణ రస నిర్వాహణ ఎర్రన కవితా లక్షణాలు. పురాణ మార్గం నుండి దేశిమార్గం వైపు, జాను తెనుగువైపు పాఠకులను మళ్లించి నూతన సాహిత్య నిర్మాణాన్ని చేసినవాడు నాచనసోమన. ఈ ఇద్దరి కవిత్వాలను, సాహిత్య పరిణామాలను లోతుగా అధ్యయనం చేసిన డా॥ పాకాల యశోదారెడ్డి ఆధునిక సాహిత్య నిర్మాణానికి సాహితీ బాటను నిర్మించింది. “తెలుగులో హరివంశాలు” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పరిశోధన చేసి ప్రాశ్చ్య, ఆధునిక రచయిత్రిగా, విమర్శకురాలుగా తెలుగు సాహితీ రంగంలో సుస్థిర స్థానాన్ని పొందింది.
తెలుగు సాహిత్య వికాసంలో ఎర్రన ప్రబంధ నిర్మాణానికి బలమైన భూమికను, పునాదిని నిర్మించి “ఋషిగా” కన్పిస్తే నాచనసోమన పాత్రల మూర్తి కల్పనా, సంభాషణా చాతుర్యంతో పద్యాల విరుపులతో, జాతీయాలు, సామెతలతో కవిత్వాన్ని వ్రాసి నవీనగుణసనాథుడైన “కవి”గా కన్పించాడు. ఈ ఇద్దరి కవిత్వగుణాలను తనలో ఆకళింపు చేసుకొని యశోదారెడ్డి “సాహితీ తపస్వి”గా తనదంటూ ప్రత్యేక ముద్రను సాహితీ ప్రస్థానంలో స్థిరీకరించింది. తాను చెప్పదలచుకుంది, వ్రాయదలచుకుందీ సూటిగా చెప్పి, వ్రాసి భావి పరిశోధకులకు కావల్సినంత సాహిత్య సరుకును అందించింది.
ఇంగ్లీష్లో “English Men of Letters” అనే పేరు మీద ఆ వాఙ్మయంలోని మహాకవుల, రచయితల జీవిత విశేషాలకు, రచనా సౌందర్య విశేషాలను విశదీకరించే విమర్శ గ్రంథ పరంపర ఒకటున్నది. దాని మాదిరిగానే ఆంధ్రవాఙ్మయంలో ప్రముఖ కవుల జీవిత రచనా విశేషాలను వెలువరించాలనే ఉద్దేశంతో ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నపుడు UGC వారి సహాయంతో “ఆంధ్రకవి నక్షత్రమాల” అనే పేరుతో 27 గ్రంథాలను ప్రచురించాలని సంకల్పించాడు. అందులో రెండవది “ఎఱ్ఱాప్రెగడ” గ్రంథం. 1972, డిసెంబరులో ప్రచురితమైన ఈ గ్రంథం డా॥ పాకాల యశోదారెడ్డి వ్రాసింది. ఎఱ్ఱాప్రెగడ తాత, తండ్రుల వివరాలను మొదలుకొని, ఎర్రన వ్యక్తిత్వంతో పాటు, ఆయన రచనల సారాన్నంతా కూలంకషంగా యశోదారెడ్డి ఈ గ్రంథంలో వివరించింది.
తెలంగాణ ప్రాంత యాసతో ఈ ప్రాంత భాషా నిర్మాణానికి పునాది వేసిన యశోదారెడ్డి కథలు ఎంత ప్రాచుర్యం పొందినా, తెలంగాణా సమాజాన్ని కదిలించినా ముందుగా ఆమె విమర్శకురాలని నా అభిప్రాయం. ప్రాచీన కవిత్వాన్నంతా అధ్యయనం చేసి దానిపై పూర్తి పట్టును సాధించింది. ఆధునిక సాహిత్యంలో అతి తక్కువ మంది మొదటి తరం విమర్శకుల్లో ప్రముఖ స్థానం యశోదారెడ్డిది. మూల గ్రంథాలనే అధ్యయనం చేసింది. అందుకుగాను సంస్కృతం, ప్రాకృతం, జర్మన్ వంటి భాషలను నేర్చుకొని మూలాల సారాంశాల కోసం వెతుకులాడింది. ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన కృషి, వెలువరించిన ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. మహిళలు చదువుకునే పరిస్థితులు సమాజంలోలేని కాలంలో చదువుకొని, ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచింది. అందరికీ జ్ఞానోదయం కలిగించింది.
ఇక “ఎఱ్ఱాప్రెగడ” కవిత్వానుశీలనలో ఎర్రనది ప్రబంధ లక్షణాలున్న సహజ కవిత్వమని యశోదారెడ్డి అభిప్రాయం. కావ్య ప్రయోజనాన్ని ఆశించి, కావ్య రచన చేయడం ఎర్రన కవిత్వ లక్షణాల్లో ప్రధానమైంది. అందుకే రామాయణంలోనూ, మహాభారత అరణ్యపర్వశేషభాగ రచనలోనూ, నృసింహపురాణంలోనూ, హరివంశంలోనూ కావ్య ప్రయోజన సాధనకోసం ప్రబంధరచనా ప్రావీణ్యం, చమత్కారంగా వ్రాసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారనే అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలిబుచ్చారు.
ఎర్రాప్రగడ జీవించిన కాలాన్ని వీరేశలింగం పంతులు పరిశోధన ఆధారంగా, చరిత్ర గ్రంథాల ఆధారంగా క్రీ॥శ॥ 1280-85 మధ్యకాలంలో పుట్టి, 1355 వరకు జీవించివున్నాడని తెలిపారు. విష్ణు పారమ్య ప్రతిబోధకాలైన రామాయణం, హరివంశం, అరణ్యపర్వశేషభాగం, నృసింహపురాణం ఎర్రన రచనలు. ఇవన్నీ విష్ణుభక్తి ప్రతిబోధకాలే. నేడు రామాయణం ఆధారంగా కందుకూరి వీరేశలింగం పంతులు, శేషాద్రి రమణ కవులు, పింగళి లక్ష్మీకాంతం, వేదాల తిరువేంగళాచారి, దివాకర్ల వేంకటావధాని, చాగంటి శేషయ్య, వేలూరి శివరామశాస్త్రి వేదాల తిరువేంగాళాచార్యులు, నోరి నరసింహశాస్త్రి పరిశోధనలను అనుసరించి, ఎర్రన మొదట రామాయణ హరివంశాలను తరువాత అరణ్య పర్వశేషం, నృసింహపురాణాలను వ్రాసినట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడింది.
నోరి నరసింహశాస్త్రి “ఈశ్వర ప్రణిపాతములో గూడిన విజ్ఞాన యోగమునందభినివేశము కలిగిన సమాధిని నిమీలితేక్షణుండనై క్షణంబున్న” అని చెప్పుకున్న వాక్యం అప్రయత్నంగా వచ్చిన సత్యవాక్యమని కవి ఆధ్యాత్మికోన్నతిని పొగిడినాడు. దీన్ని బట్టి నృసింహపురాణమే మొదటిదని చెప్పినా యశోదారెడ్డి అందుకు అంగీకరించలేదు. ఆత్మోన్నతి కలిగిన మహాకవికి నృసింహపురాణం బాల్య రచన కాదనేది యశోదారెడ్డి అభిప్రాయం.
ఎర్రన నృసింహ పురాణంలో “ఎన్నికమై బ్రబంధ పరమేశుడనంగ నరణ్య పర్వశేషోన్నయమంధ్ర భాష సుజనోచ్చ మెప్పగ నిర్వహించితి”నని చెప్పినాడు. చదులవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “ప్రతిభతో నారణ్యపర్వశేషము జెప్పె కవులకు జెవుల పండువులుగాగ” అని ఎర్రన అరణ్యపర్వశేషమును చెప్పినట్టు ధృవపరిచాడు. జక్కన విక్రమార్క చరిత్రలోనూ “ఈత్రయిదా బ్రబంధ పరమేశ్వరుడై విరచించె శబ్దవైచిత్రి నరణ్య పర్వమున శేషము” అని శబ్దవైచిత్రితో ఎర్రన అరణ్య పర్వశేషం వ్రాసెనని చెప్పాడు. ఈ ఆధారాలను తీసుకొని యశోదారెడ్డి అరణ్య పర్వశేష భాగం ఎర్రనే వ్రాసినాడనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
భారతమూలరచనను పరిశీలించి నన్నయ కన్నా ఎక్కువగా మూలాన్ని అనుసరించాడన్నది. నన్నయ తిక్కనల కన్నా ఎర్రనే ఆంధ్రమహాభారతలక్ష్మిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడని, వారిద్దరూ సంపూర్ణ భారతాన్ని అందించలేదూ – ఎర్రన పూర్తి చేసిన తరువాతే భారత రచన ఫలవంతమైందని యశోదారెడ్డి అభిప్రాయపడింది.
సంస్కృత భారతంలో శరదృతువు వర్ణన ఏడు (7) శ్లోకాల్లో ఉంటే, నన్నయ శ్లోక సారాంశాన్ని కలుపుకొని “(1) భూసతికిం దివంబునకు బొల్పె సగంగ శరత్సమాగమం…”, (2). శారద రాత్రు లుజ్వలలస్తతర తారక హార పంక్తులం…”, అనే రెండు పద్యాల్లో శరదృతువు యొక్క ప్రధాన లక్షణాలను చెప్పినాడు. ఈ పద్యాల తరువాతే ఉన్న “స్ఫురదరుణాంశు రాగ రుచి బొంపిరివోయి” పద్యాన్ని పరిశీలించినపుడు పూర్తిగా మూల భారత అనువాదంగానే కనిపించింది. దీంతో భారత రచనా విధాన భేదాన్ని గుర్తించవచ్చు. శ్రీకృష్ణుడు సత్యభామతో పాండవుల దగ్గరకు వచ్చిన సందర్భంలో మూలగ్రంథంలో ఉన్న ఋతు వర్ణనను పరిశీలించినపుడు మూల శ్లోకాలకు మెరుగులు దిద్దినట్లుగా కనబడింది. మూలగ్రంథంలో శ్రీకృష్ణుడు ధర్మరాజును ప్రశంసించిన సందర్భంలో, ద్రౌపదిని ఆమె కుమారుల క్షేమాన్ని గురించి అడిగిన సందర్భంలోనూ మూలంలోని శ్లోకాలు భావ వైవిధ్యం లేక చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పినట్లుగా ఉన్నదని, మూలశ్లోక భావాన్నంతటిని సమీకరించినట్లున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.
సంస్కృత భారతంలోని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినట్లున్న రామాయణ కథాభాగం అనువదించిన విధానాన్ని పోల్చి చూసినపుడు మూలశ్లోక భావాన్ని తప్పక యతి సమర్థుడై వర్ణించాడు ఎర్రన. మూలభారతంలోని రావణ సంహారములో రాముడు బ్రహ్మాస్త్ర సంధానం చేసాడని అది రావణుని నీరుగావించిందని ఉంది. బ్రహ్మాస్త్ర సంధానం తరువాత దేవదావన కిన్నెరాదులు రావణున కాయురల్వావశేషమై ఉన్నదని తలచినట్లున్నదన్న విషయాన్ని వదిలిపెట్టాడు. అశోకవనంలో ఉన్న సీతతో రావణ సంవాదం తరువాత వాల్మీకీ రామాయణంలో త్రిజటా స్వప్న వృత్తాంతం ఉన్నది. మూలభారతంలో త్రిజటా స్వప్న వృత్తాంతం తరువాతే సీతారావణ సంవాదం ఉంది. ఎర్రన భారత కథనం ప్రకారమే అనువాదము చేసినాడు. 30 శ్లోకాల సంభాషణను 7 గద్య పద్యాలల్లోనే వర్ణించాడు ఎర్రన. అంటే భారతంలో రామాయణం ఇతివృత్త ప్రాధాన్యం కొంతవరకే అవసరమని గుర్తించాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది.
హరివంశంలోని “నా తమ్ముండు ఘనుండు అనే పద్యంలో రామకథమున్ జెప్పించి యత్యుత్తమ ఖ్యాతింబొందితి నింకనేను” అనే పద్యాల్లోనూ, కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సారసంగ్రహంలోని అనేక సందర్భాల్లో ఎర్రన పద్యాలను ప్రస్తావించడంలోనూ, గణపవరపు వేంకటకవి ప్రయోగ రత్నాకరమనే లక్షణ గ్రంథంలోనూ, చెదలువాడ మల్లన విప్రనారాయణ చరిత్రలోనూ, ఆనందరంగకవి ఆనందరంగరాట్భందములోనూ, ఎర్రన రామాయణ ప్రస్తావనలున్నాయి. ఎర్రన కాలంలోనే భాస్కర రామాయణం వ్రాయబడింది. అయినా ఎర్రన వ్రాసివున్నట్లుగా అనేక ఆధారాలున్నందున మనోజ్ఞంగా రామాయణం కూడ వ్రాసే ఉంటాడని యశోదారెడ్డి బలంగా వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
మహాభారతం పంచమ వేదమైతే, హరివంశం వేదశిఖ అని యశోదారెడ్డి అభిప్రాయం. భారతంలో శ్రీ కృష్ణుని గురించి సూక్ష్మంగా, వ్యంగ్యంగా చెప్పబడితే, హరివంశంలో విపులంగా, వాచ్యంగా శ్రీహరి చరిత్ర వర్ణింపబడింది. మహాభారత యుద్ధం, క్షత్రియ సంహారంతో పాఠకుని మనస్సు బాధతో నిండి ఉంటుంది. పాఠకునిలో తొలగించే నిర్వేదవైరాగ్యాలను తొలగించడానికి హరివంశం వ్రాయబడింది. ప్రోలయ వేమారెడ్డి ఎర్రనను హరివంశరచన చేయమని కోరగా, ఇదివరకే నన్నయ తిక్కనలు భారత రచన చేసినారు. వారి త్రోవలో నడుచుటకు సంతోషంగా ఉంది. హరివంశం, భారతం రెండూ కూడ వ్యాసమహర్షి వ్రాసినవే అని హరివంశ పీఠికలో అనడంతో హరివంశ రచనాకాలం నాటికే భారత అరణ్యపర్వశేషం వ్రాయలేదని స్పష్టంగా తెలుస్తున్నదనే అభిప్రాయాన్ని యశోదారెడ్డి వ్యక్తపరిచింది.
సంస్కృతంలో హరివంశపర్వము, విష్ణుపర్వము, భవిష్యపర్వములుంటే, ఎర్రన మూల గ్రంథాన్ని అనుసరించలేదని తెలుస్తున్నది. పూర్వభాగంలో తొమ్మిది ఆశ్వాసాలు, ఉత్తరభాగంలో పది ఆశ్వాసాలుగా ఎర్రన విభజించి అనువదించాడు. అయితే ఇక్కడ నాచనసోముని ఉత్తర హరివంశాన్ని గురించి కొంత చెప్పుకోవాలి. నాచనసోమన ఉత్తర హరివంశాన్ని ఆరు ఆశ్వాసాల గ్రంథంగా వ్రాసినాడు. అయితే ఎర్రనను అనుకరించాడని చెప్పే వీలు లేదు. ఎర్రన హరివంశానికి పీఠిక ఉంటే, ఉత్తర హరివంశానికి లేదు. ఎర్రనకు విషయ ప్రధానమైన భావగతి మీద, వర్ణనల మీద, రస నిర్వహణ మీద ప్రధాన దృష్టి ఉంటే, సోమన తెలుగు కవితను పురాణ మార్గం నుండి మళ్లించాలని ప్రయత్నించాడు. సఫలీకృతుడైనాడు. ఎర్రన “ఋషిగా కావ్యం వ్రాస్తే సోమన “కవి”గానే కావ్యం వ్రాశాడు. ఎర్రన హరివంశ అనుకరణలు ఉత్తర హరివంశంలో కానరావు.
సంస్కృతంలోని పద్దెనిమిది పురాణాల్లో నృసింహపురాణం లేదు. ఎర్రన వ్రాసిన నృసింహపురాణం “పురాణం” కాదని స్పష్టమవుతున్నది. ఎర్రన తాత ఎఱపోతసూరి శ్రీమహోబలీశ నరసింహుని భక్తుడు. తన దైవంపై తీర్ధ మహాత్మ్యాన్ని అవతార వైశిష్ట్యాన్ని వ్రాయమని కోరగా ఎర్రన నృసింహపురాణం వ్రాశాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది. కథా ప్రారంభంలో “ఏను విన్నవంబు సేయంగల లక్ష్మీ నరసింహావతారంబను పురాణకథకు బ్రారంభం బెట్టిదనిన” అని పేర్కొన్నాడు. అసలీ గ్రంథం పేరు “లక్ష్మీ నరసింహావతార కథ”. చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “నారసింహుని పురాణ మొనర్చె హరి మెచ్చి నన్నునెన్నడు చూచినాడు వనగ” అని వ్రాసిన వాక్యాలను బట్టి “నృసింహపురాణం” అనే తెలుస్తున్నది. ఇది అనువాదం కాదు. క్షేత్రమాహాత్మ్యం గురించి చెప్పబడిన స్వతంత్ర కావ్యం. పురాణానికి ఉండవలసిన సర్గ ప్రతి సర్గాది పంచలక్షణాలు ఇందులో లేవు. కొంతవరకు బ్రహ్మాండ పురాణంతో సంబంధం ఉన్నది. విష్ణుపురాణంలో కనిపించే కథాసరళి తనకు అనుగుణంగా మలచుకొని ఉపయోగించుకున్నాడు. భాగవతంలోని నృసింహావతార కథాభాగాన్ని కాక, వామన ప్రాదుర్భావానికి తరువాత చెప్పిన కథా భాగాన్ని స్వీకరించినాడు. నృసింహ పురాణంలో ఎర్రన హిరణ్యకశిపుని దిగ్విజయాన్ని వర్ణించిన విధానం హరివంశంలోని కాలనేమ్యాదుల దిగ్విజయ వర్ణనా విధానాన్ని తలపింపజేస్తున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.
ఎర్రన శ్రీమద్భాగవత తృతీయాస్కంధంలోని వైకుంఠపురవర్ణనను నృసింహపురాణంలో అనువదించాడు. “నారాయణుని దివ్య నామ సంకీర్తనంబని శంబు జేయు మహాత్ములకును బద్మాక్షు శ్రీపాద పద్మంబులత్యంత భక్తిమై బూజించు ప్రాజ్ఞులకును” అన్ని రకాల సుఖాలను నారాయణుడు ప్రసాదిస్తాడని వైకుంఠపురవర్దనను జేస్తూ వివరిస్తాడు ఎర్రన. కొన్నిచోట్ల విష్ణుపురాణంలోని హిరణ్యకశిపు ప్రహ్లాదుల సంవాదాన్ని యధాతథంగా వర్ణించాడు.
ఎర్రన రచనలన్నింటిలోను జాతీయాలు, అలంకారాలు సహజ సుందరంగా సందర్భోచితంగా వ్రాశాడు. ఎర్రన నృసింహపురాణంలో భాగవత శ్లోకాలను సంక్షేపించినట్లు, విష్ణుపురాణ శ్లోకాలను యధాతథంగా అనువదించినట్ట్లు, కావ్యకళావైభవాన్ని ప్రదర్శించినాడు. కొన్నిచోట్ల హరివంశ పద్యాలను విపులీకరించాడు. మూలంలోని సూచన ఆధారంగా విస్తృతంగా వ్రాస్తూనే నాచనసోముని అనుకరించినట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎర్రన కాలం నాటికే అనువాదాలు అనేకం వచ్చాయి. కాబట్టి ఎర్రన రెండు భాషల్లోనూ ప్రావీణ్యం పొంది అనువాదం చేయడం సులభమైంది. దానికి తోడు రాజపోషణ వల్ల కూడ తెలుగు భాష స్థిరరూపాన్ని పొందింది. నన్నయ, తిక్కన అనువాదంలో మూలానికి విపులీకరణ, సంక్షేపము, విషయ పరిహరణం, వ్యత్యయం ఈ నాలుగు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎర్రన అనువాదంలో యధామూలకథ ఉన్నాకూడ ఆయా సందర్భాలను బట్టి వివిధ కావ్యాల్లోని సారాంశాలను ఒక సందర్భోచిత కావ్యంగా మలచడం హరివంశ, నృసింహ పురాణంలో కనిపించిందదే. సందర్భోచితంగా కథాపాత్రల పేర్లను కూడ ఎర్రన మార్చినాడు. అనేక సందర్భాల్లో ఇతర గ్రంధాల నుండి సేకరించిన శ్లోకభావాలను తన గ్రంథంలో చేర్చుకోవడమనే విశేష రచనా విధానానికి శ్రీనాథునకు ఎర్రనయే మార్గదర్శకుడై యుండవచ్చని యశోదారెడ్డి అభిప్రాయం.
వ్యక్తి, వస్తు, క్షేత్రాది బాహ్యవర్జనతో తృప్తి పొందక మనోవృత్తులను, భావవైఖరులను విపులీకరించి పాఠకులకు ఆసక్తి కలిగించుటకు మధ్యలో సంభాషణలను పెట్టాడు. భారతారణ్య పర్వశేషంలో అనువాదంలోని “మూలాసరణమును, హరివంశంలో కొంత “స్వేచ్ఛను పాటించి ఇతర గ్రంధాలనుండి ఆయా కథావృత్తాంతాలను తీసుకున్నాడు. నృసింహపురాణంలో కథాక్రమమును పాటించక ఇష్టంవచ్చినట్లు కథాసూత్రంను తనే ఏర్పాటు చేసుకున్నాడు. సోమన రచన స్వతంత్ర రచన. అందుకే సోమన అనువాదం “మూలాతిరిక్తమైన స్వేచ్ఛానువాదమనీ” చెప్పవచ్చని తన పరిశోధన ద్వారా ధృవీకరించింది యశోదారెడ్డి. ఎర్రన అనువాదం అట్లకాదు. మూలాధారం లేక ఏ విషయాన్ని వ్రాయలేదు. “ఒక ఆలంబనమును పురస్కరించుకొని దానిని మెరుగులు దిద్ది తనది కావించుకొనుట ఎర్రన అనువాద విధానం”. ఇతని దృష్టి ఎపుడూ ఒకరిని అనుకరించి, అనుసరించి వాళ్ళను మించి రచన చేయగల దక్షత తనకు కలదని లోకానికి చాటడమే ఎర్రన అనువాద విధానమని యశోదారెడ్డి యొక్క స్థిరమైన అభిప్రాయం. అందుకే ఎర్రన అనువాద పద్ధతి “మూలాతిరిక్తమయ్యు మూలానుసారి” అని చెప్పవచ్చును.
సకల భాషాకవిత్వవేది, బహుపురాణ కథాసకల సంవేదియైన ఇతనిని లోకం కవిత్రయం అన్నందున ఎర్రన అదృష్టవంతుడని అంటుంది యశోదారెడ్డి. రాజపోషణ వల్ల, లిఖిత గ్రంథప్రాచుర్యం వల్ల తెలుగు భాష విస్తరించింది. దానికి ఇంపులు సొంపులు కూర్చినవాడు ఎర్రన. “Personality is what is the Unique in Man” అని పాశ్చాత్య సాహిత్యవేత్తలన్నారు. అదే వ్యక్తిని వ్యక్తి నుండి వేరు చేసి ప్రత్యేకించేది. ఇది ఎర్రనలో సహజ సుందరంగా కనిపించింది.
కథాసంవిధానములో విచిత్ర పద ప్రయోగ వైచిత్య్రములో, శబ్దార్ధాల మేలుకలయికలో నాచనసోమన అనుకరించాడు. నన్నయ, తిక్కన, నాచనసోమనలను ఎర్రన ఆదర్శంగా తీసుకుంటే ఆ తరువాతి శ్రీనాథుని మొదలు కవులంతా ఎర్రననే అనుకరించారు. శ్రీనాథుడు “పరిఢ వింతం బ్రబంధ పరమేశ్వరునిఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్కమాట” అని ఎర్రనను అతిగా సంభావించినాడు. ఎర్రన స్వభావోక్తి అలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించాడు. సూక్తి వైచిత్రాన్ని ప్రదర్శించాడు.
ఎర్రన సకలకళారహస్యాలను తెలిసిన కవి మాత్రమే కాదు. సంగీత సాహిత్య పోషకుడైన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండడం వల్ల, ఆయా సందర్భాన్ని బట్టి తాను చూసిన ఆ కళల్లో ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. అందుకే ఎర్రన కావ్యాల్లో గానకళా ప్రసంగాలు కన్పిస్తాయి. ఉదాహరణకు నృసింహపురాణంలో అప్సరసల విభ్రమవ్యాపారాలను చెప్పు సందర్భం. హరివంశంలో వాద్యసంగీతము, నాట్యం గురించి చెప్పాడు. ఎర్రన ఎక్కువగా “విజ్ఞానము” అనే శబ్దాన్ని వాడినాడు. విజ్ఞానమంటే పరతత్త్వవిద్య, బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము. వీటిని ఉపయోగించే కవిత్వం వ్రాశాడు. గోపికల విరహం, పరమ పవిత్రమైన భక్తి పరిణమింపజేసి మధుర భక్తి విధానానికి దారితీసినవాడు ఎర్రనయే అని యశోదారెడ్డి అభిప్రాయపడింది. ఎర్రనకు “యోగం” అంటే అభిమానం ఎక్కువ. శృంగారిని కూడా మహాయోగిగా అభివర్ణించిన యోగి ఎర్రన. నమ్మకములు, ఆచారాలు కూడా ఎర్రన కావ్యాల్లో ఉన్నాయి. శివములు, పూనికలు, ఆనాటి సహజ సాంఘిక పరిస్థితులను తెలుపుచున్నాయి. నేటి Democracy కన్న ఉత్తమలక్షణం నాటి రాజులకుందని, ప్రజారంజనమే ప్రభువు ప్రథమ ధర్మమన్నట్లు నాటి రాజు చూసినారని ఎర్రన కవిత్వంలో రాజనీతికి సంబంధించిన పద్యాలు కూడా ఉన్నాయని యశోదారెడ్డి నిరూపించినారు.
ఎర్రన ఉత్పల, చంపకమాలలే కాక, మత్తకోకిల, క్రౌంచపదము, మందాక్రాంత, మాలిని, స్రగృణి, తోదకము, కంద తదితర వృతాలను ఉపయోగించాడని యశోదారెడ్డి అభిప్రాయం. ల-ళ, శ-స, ద-ధ, ఖండాఖండ బిందు ప్రాసలు ఎక్కువగా వాడినాడు. టకార-డకారల ప్రయోగం, బహువచనంపై బహువచన ప్రయోగాలు, ఇకార సంధులు, ప్రత్యయాలు, సందర్భోచిత పద ప్రయోగాలు, చమత్కారాలు ఎర్రన కవిత్వంలో ఉన్నాయని శబ్ధరత్నాకరములోనూ ఈ పద ప్రయోగాలకు అర్ధాలు లేవని యశోదారెడ్డి పరిశోధనలో తేలింది.
పద్నాలుగవ శతాబ్దంలో ఉన్న కవుల కవిత్వమే ఆ తరువాతి కవుల కవిత్వానికి ఆదర్శప్రాయమైంది. ప్రాచీన సమ్మతమైన వేదవ్యాసముని ప్రతిపాదితమైన, హరిహరభేద తత్వమును తిక్కన, ఎర్రన, నాచనసోమన ప్రభోదించగా, పోతన ప్రధాన తత్త్వంగా స్వీకరించి భాగవతంలో పరిపూర్ణత సాధించాడు.
అనువాద సందర్భాల్లో నన్నయ, తిక్కన, నాచనసోమనాధుల కన్న కొంత భిన్నంగా, విశిష్టమైన ఎర్రన అనువాద విధానంతో ప్రభావితుడైనవాడు శ్రీనాథుడు. ఎర్రన సూక్తివైచిత్రియే శ్రీనాథునికి ప్రశంసలను తెచ్చిపెట్టింది. నన్నయ ధారాశుద్ధి, తిక్కన తెలుగు తీయదనము, తన సహజ పరిశీలనాదృష్టితో మేళవించి ఒక కొత్త వికాసంతో పద్యాలను అల్లినవాడు ఎర్రన అని స్థిరమైన అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలువరించింది.
ఈ నేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. సాహిత్య పవనాలు సమృద్ధిగా కలిగిన ప్రాంతమిది. సృజనాత్మకతకు, బహుముఖ ప్రజ్ఞకు చిరునామాగా ఎందరో వైతాళికులు ఇక్కడ నడయాడారు. పోరాట తత్వాన్ని, తత్వ జ్ఞానాన్ని కలిగి శరీరాన్ని కరిగించి లోకహితం కోసం ధారపోశారు. అలాంటి వారు ఎందరో అక్షరమూర్తులు మనకు ప్రాతఃస్మరణీయులుగా ఉన్నారు. వారిలో ఒక మేలిమిరత్నం యజ్ఞ కృష్ణమదాసు,
యజ్ఞకృష్ణదాసు 1899వ సంవత్సరం మెదక్ జిల్లా మారేపల్లిలో, ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. వారిది పద్మశాలి కుటుంబం. చాలీచాలని వ్యవసాయం ఉన్నప్పటికీ, కొంత నేతపని, కూలి పనులతో రోజులు గడిచేవి. ఆయన బాల్య జీవితం ఎక్కువగా పశువులను కాయటంలోనే గడిచిపోయింది. బడికి పోయి అక్షరాలు దిద్దవలసిన వయసులో ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు. అందుకు ప్రభలమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజులలో ఉర్దూ ప్రధాన రాజభాషగా కొనసాగింది. ప్రభుత్వ లావాదేవీలన్నీ కార్యాలయ వ్యవహారాలన్నీ ఉర్దూ మాధ్యమంగా జరిగేవి. ఉర్దూ పాఠశాలలు తహతన్య, వస్తిమియా ప్రాథమిక ఉన్నత విద్యగా పిలువబడ్డాయి. అవి ప్రధానమైన తాలూకా కేంద్రాలలో మాత్రమే ఉండేవి. అవికూడా తాలూకా కేంద్రాలకు వెళ్లి చదువుకోవటం గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందికరంగా పరిణమించింది. అందువలన గ్రామంలో అక్కడక్కడ నడిచే ఖాళీ పాఠశాలలలో కొంత మటుకు విద్యాభ్యాసం మాతృభాషలో జరిగింది. ఇది కూడా చాలా తక్కువ అని మాత్రమే చెప్పాలి.
విద్యా అవకాశాలు తక్కువగా ఉండటం వలన నిరక్షరాస్యత శాతం అధికంగా ఉండేది. ఆ విధంగా ఎందరో విద్యకు దూరం అవుతున్న సందర్భంలో తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. 1901 లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం స్థాపించబడటం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రంధాలయాలు స్థాపించబడ్డాయి. గ్రంథాలయ ఉద్యమం జరుగుతున్న దశలోనే అణాగ్రంధమాల ప్రాచుర్యంలోకి రావటం వలన విద్య పట్ల చదవడం పట్ల అభివృద్ధి పెరిగింది. గ్రంథాలయ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆలంపల్లి వెంకట రామారావు గారు ఆంధ్ర జన సంఘం ఏర్పడటానికి పాదులు వేశారు. ఈ సంఘటన తరువాత మాతృభాష పట్ల ఆలోచనలు పెరిగాయి. ఆ వెంటనే ఆంధ్ర జన సంఘం స్థాపించటం ఆంధ్ర మహాసభలు ఏర్పడటం చైతన్యకారకాలు. ఈ ప్రేరణతో ఈ ప్రాంతపు కవులు రచయితలు నవతరాలను ఏర్పరచగలిగారు.
వడ్డేపల్లి సోదరులుగా పేరుగాంచిన దేశబంధు పత్రిక నిర్వాహకులు బెల్లంకొండ నరసింహచార్యులు, బెల్లంకొండ వెంకటాచార్యులు మెదక్ సుభలో గల జోగిపేట నందు అవధానం చేస్తున్న సందర్భంగా వారికి యజ్ఞకృష్ణను దాసు పరిచయమయ్యాడు.
బెల్లంకొండ సోదరులు యజ్ఞకృష్ణమ దాసులో గల పరణాభిలాషను తెలుసుకొని ఆయనకు తన 15వ ఏట అక్షరాభ్యాసం చేశారు. సంస్కృతం ఉర్దూ భాషలు నేర్పించారు. తెలుగులో చందస్సు అలంకార శాస్త్రం నేర్పించారు. యజ్ఞకృష్ణదాసు అక్కడితో ఆగకుండా దేశబంధు సోదరులతో పాటు పత్రికా సంపాదకుల సమావేశానికి హాజరయి, ఆంధ్ర మహాసభలు, ఆర్యసమాజ కార్యక్రమాలు అణాగ్రంథమాలలో పాలుపంచుకునే స్థితి దాకా ఎదిగాడు. హైదరాబాద్ కోటిలో దేశబంధు సోదరులు ప్రతి నెల నిర్వహించే పత్రిక సంపాదకుల సభా నిర్వహణ చేసే స్థాయి దాకా ఎదిగాడు. అక్కడి నుండి ఆయనలో చెప్పుకోతగినంత సాహిత్య పరిణతి కలిగింది.
యజ్ఞకృష్ణమదాసు కవి, కథకుడు, విమర్శకుడు, యక్షగానాలు రచించాడు, పాండవోద్యోగము, శ్రీకృష్ణ రాయబారం, దక్షయజ్ఞము ఆయన రాసిన యక్షగాన రచనలు. వీటితోపాటు జ్యోతిష శాస్త్రాన్ని రచించాడు. ఆయన విస్మృతికి గురైన కవి రచయిత. ఆనాటి పరిస్థితులలో కార్యకర్త. ఆయన కృషిని డా. బెల్లంకొండ సంపత్ కుమార్ వెలుగులోకి తెచ్చారు. యజ్ఞకృష్ణమదాసు కథలను సేకరించి “మెతుకు కతలు”లో ప్రచురించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమం అస్తిత్వం ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గల ఎందరో రచయితలు ఈ గ్రంథం ద్వారా పరిచయమయ్యారు. ఈ పుస్తకానికి వేముగంటి మురళీకృష్ణ, డా. బెల్లంకొండ సంపత్ కుమార్ సంపాదకత్వం వహించారు.
వంద సంవత్సరాల కిందట ఆయన రాసిన రచనలు ఇవాళ చాలా అలభ్యంగా ఉన్నాయి. దేశ బంధు పత్రికలలో జీర్ణప్రతులలో కొందరి పరిశోధకుల కృషి వలన ఆయన గురించిన సమాచారం పరిమితంగానే లభ్యమవుతుంది. యజ్ఞకృష్ణమదాసు కృతజ్ఞతా పూర్వకంగా రాసిన పద్యం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. పశువుల కాపరై పద్మశాలిగపుట్టి
కట్టెలేరుకొనియు గడుపు నన్ను
అవధానములు చేయు నట్టిసభనజూచి
కడుపేద నైనను కరుణజూపి
సంస్కృతముద్దూయు ఛందస్సులను నేర్పి
నట్టిబెల్లంకొండ నాచార్య సోదర
ద్వయముకంజలి తనువు వీడువరకు
యజ్ఞకృష్ణపుదాసు యనెడి నన్ను
తే. దేశ బంధుపత్రికనాకు దిశనుజు
పత్రికసభల అధ్యకునై పాల్గొనుమని
బెల్లంకొండసోదరులైన వారె నిలను
నొందినఘనులనేమని నుడువువాడ
యజ్ఞ కృష్ణ దాసు కథలు:
యజ్ఞకృష్ణమదాసు మరొక గురువు గణపతి శర్మ. తొలి దశలో గణపతి శర్మ వద్ద అక్షరాలు దిద్దుకున్నప్పటికీ కొద్ది కాలానికే విద్యాభ్యాసం ఆగిపోయింది. పశువుల కాపరిగానే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడటం వలన పరిస్థితులు అనుకూలించక ప్రోత్సాహం లేకపోవటంతో విద్య ఆగిపోయింది.
యాజ్ఞకృష్ణదాసు అర్ధశత కథలు రాసినట్టు బెల్లంకొండ సోదరులు దేశబందులో తెలిపారు. వాటిలో లభ్యమవుతున్నవి నాలుగైదు మాత్రమే. యజ్ఞకృష్ణమదాసు రాసిన కథలలో ఇంద్రమాలిక కథ వైవిద్య భరితమైంది. ఇంద్రమాలిక అనే పేరు కథకు శీర్షిక చేయటం ఎంతో ఔచిత్యవంతంగా ఉన్నది. ఈ కథ ఆనాటి పరిస్థితులను కండ్లకు కడుతుంది.
ఇంద్రమాలిక ప్రజావ్యతిరేక రాచరికన్ని నిలువరించే రచనగా మనకు అర్ధమవుతుంది. కల్పవృక్షం కామధేనువు వలె ఇంద్రమాలిక ఒక విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది. పూర్వగాధాలహరిలో ఇంద్రమాలిక అనే పదానికి అర్థం ఒక కమలమాలిక అని అది ఎన్నడును వాడిపోనిది అని. దీనిని ఎవరు ధరించినను వారిని ఏ ఆయుధములు కూడా తాకలేవు అని. ఈ మాలికను ఇంద్రుడు ఉపరిచర వసువునకు ఇచ్చెను. అనే వివరం పేర్కొంది.
ఈ కథలో ఆనాటి రాజ్యపాలన ఉన్నది పాలకుల క్రూరత్వం నిరంకుశ విధానాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల లోకాల నిరసనలను ఈ కథ తెలియజేస్తుంది.
ఇంద్రమాలిక కథలో మంజీరకా దేశం ప్రస్తావన ఉన్నది. మంజీరకా దేశంలో నారయ్య అనే ఒక గృహస్థుడు ఉన్నాడు. అతడు శ్రీ చూర్ణం తిరుమణి కలిగి ఉండి మతభేదములు లేక విభూతి భస్మం ఒక సందూక పెట్టెను ఉంచుకొని దుఃఖితులైన ప్రజలకు దివ్య ఔషధాలను ఇస్తూ ఉంటాడు. వారు ఎద్దులను అలంకరించేవారు. వ్యవసాయ శ్రమను నమ్ముకొని జీవించేవారు. నారయ్య తాతదండ్రులు ఇంద్రమాలిక విద్యను నేర్చుకున్నారు. గండర కత్తెరలు తలలు తెంపినా అతికించగల నేర్పరులు వారి తాత తండ్రులు ఇంద్రమాలిక అనబడేడు కవచం ఒక విద్యగా రచయిత ఈ కథ ద్వారా తెలిపాడు.
కథలో వర్ణనలు ఉన్నాయి. వర్ణనలు కథా శిల్పంలో అమరినట్టు ఉండటం కథలో ఉన్న కొత్తదనం. “ఒక శ్రావణ పూర్ణిమ దినం నవనాడులు జీరములలో నూక మంజీరకా దేశ స్వరమృత్తికన ఆహ్లాదకర వాయువులు వీచుచుండ ఆ జామున ముసళ్ళు నీటి ఉపరితలము మీన నిద్రించుచుండ పవళిని బీద వదనంబున ప్రకృతి విషాదకాంత వలె శంకువులేరుచు వెన్నెల, మెరుపున ఒలలాడుచున్నది”. పవళిని అనే స్త్రీ పాత్రను కథలో ప్రవేశింప చేయడానికి రచయిత వర్ణనను కథకు తగినట్టుగా అమరిక చేశాడు.
పవళిని రాజ్యపాలకులు వంచించారు. ఆమె కుటుంబం అంతా పాలకుల వలన దెబ్బతిన్నది. పాలకుల క్రూరత్వానికి కుటుంబం బలి అయిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు కామోన్మాదిరాజు గా రచయిత పేరులోనే ప్రజా వ్యతిరేకతను కనబరిచారు. అతని దుశ్చర్యలకు పవళిని కుటుంబం మాత్రమే కాదు ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి.
ఆమె నారయ సహాయం తీసుకోవటం కథకి మలుపు. నారయ్యకు ఇంద్రమాలిక విద్య వచ్చును. ఇంద్రమాలిక నిద్రించువారల మేలుకొలుపునది అని రచయిత కథాంశంలో చెప్తాడు.
ఒకనాటి మాఘస్నాన ప్రారంభంలో రాజు గర్వానికి అడ్డుకట్ట వేసి సందర్భం ఏర్పడుతుంది. రాజు పల్లకి మోయటానికి బోయిలు వస్తారు. వారు నారదాసుని మామిళ్ళ తోట దారిన తీసుకు వెళుతూ ఉన్నప్పుడు నారయ్య రాజు పల్లకిని మోసే బోయిగా ఉంటాడు. ఇక్కడ కథలో ప్రధానమైన మలుపు ఉన్నది. నారయ్య మామిళ్ల తోట వద్ద స్నానం ఆచరించి అలంకారం చేయించుకుంటున్నప్పుడు ఆయన కండ్లకు నారయ ఒక అంజనాన్ని లేపనం చేస్తాడు. అంజనం ప్రభావంగా రాజు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. ఆ రాజును బోయిలు దక్షిణ పర్వతశ్రేణిలోకి తీసుకొని వెళ్తారు. రాజును బంధీగా చేసి కట్టివేస్తారు. తెల్లారి అతనికి మేలుకోవచ్చి చూసుకుని అయిన విషయాన్ని గ్రహిస్తాడు. రాజు ఇంద్రమాలిక విద్య వలన బంధి అయినాడు. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆనందంతో పండుగ చేసుకుంటారు. రాజు రాజ్య బ్రష్టుడౌతాడు. ఆ రాజ్యమున ఆకలి అనే మాట లేదు. ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఈ కథలో ఉన్నాయి. ఈ కథ ఆంధ్ర మహాసభల నేపథ్యంలో వచ్చింది.
విమర్శ:
కృష్ణ దాసు “భారతీయ సాహిత్యము” అనే విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు. ఈ వ్యాసం దేశ బంధు పత్రిక ప్రమోదూత నామ సంవత్సరం పాల్గుణ మాస పత్రికలో ప్రచురించబడింది. పాశ్చాత్యుల సాహిత్య భావనలు భారతీయ సాహిత్య భావనలు వేరుగా ఉన్నాయని రచయిత పరిశీలించాడు. పాశ్చాత్యులు భారతీయ లాక్ష్యానికులు రాసిన గ్రంథాలను అభ్యసనం చేశారని తెలిపారు. సాహిత్యం జీవన పరిధిలోనిది. అందువల్ల పాశ్చాత్య సాహిత్యం భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని తెలిపాడు. ఈ వ్యాసంలో భారతీయ సాహిత్య వారసత్వం కావ్య స్వరూపంలో ఇహపర లోక
సార్ధకత ఏ విధంగా పరిరవిల్లిందో అదే విధంగా సాహిత్యం మోక్షగామిగా అనుకూలమైన సందర్భాలను రచయిత పరిశీలించాడు. రామాయణ భారత భాగవతాలను రచించిన వారి జన్మ ధన్యంగా ఆధ్యాత్మిక చింతన యొక్క ప్రాధాన్యతను తెలిపాడు. భారతీయ లాక్యనికులు చెప్పిన కవితా పద్ధతులు వాటి ప్రయోజనం గురించి రచయిత వివరించాడు. కేవలం కావ్యాన్ని స్పర్శించినంత మాత్రాన ఎవరు కవులు కాజాలరు అని చెబుతూ కవికి నిత్య సాధన అవసరమని తెలిపాడు. “దర్శనా ద్వ ర్ణనాచ్చాడ రూడాలోకే కవి శ్రుతి. “రామాయణ రచనలలో వాల్మీకి మొదట కరుణరస హృదయుడైనాడు తర్వాత రచనామయుడైనాడు” అని యజ్ఞకృష్ణమదాసు తెలిపాడు.
ఆయన కవితత్వాన్ని పరిశీలిస్తూ వస్తువును అగోచరముగా దర్శించినవాడు ఉత్తమ కవి కాజాలడు అన్నాడు. “కమనీయం కావ్యం” కావలెనని ఆ లక్షణాలు రామాయణ భారత భాగవతాలకు ఉన్నాయని పరిశీలించాడు.
“సశబ్దో నసన్యా యోన సావిద్యా నసా కళా
తే యన్న కావ్యాంగ మతో భారో మహా కమే”
సావిద్య పట్ల అవగాహన కలిగి ప్రతిభా పాటవాలు రచన సామర్థ్యం కలిగి ఉన్నవాడు కవి కావటానికి అర్హుడని యజ్ఞకృష్ణమదాసు చెప్పాడు. ‘సావిద్య’ అంటే చైతన్యం. చైతన్యం అనేది కాల చైతన్యాన్ని తెలుపుతుంది. రచన ఇతివృత్తాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం, అందుకు ప్రతిభ తోడు కావాలనేది కృష్ణమదాసు భావన. అవి కాకపోయినా పర్వాలేదు కానీ కవిత్వానికి భిన్నంగా అకవిత్వం రాయటం సమంజసం కాదు అని కృష్ణమదాసు ఈ వ్యాసంలో పరిశీలన చేయ తలచాడు. యజ్ఞకృష్ణమదాసు వ్యుత్పత్తి లోపం వలన ప్రతిభ నశించి పోతుందని చెప్పటానికి
” అవ్యుత్పత్తి కృతో దోషః శక్తా సంప్రియతే కవేః
జ స్త్వశక్తి కృతస్థన్య ఝడిత్యేవా వభాసత “
అని తెలిపాడు. ప్రతిభ గుణ సంపదల చేత పరిపూర్ణమవుతుంది. కవి ఈ గుణ విశేషములను పుష్కలంగా కాంచవలెనని యజ్ఞ కృష్ణమదాసు కవితా విమర్శనం చేశాడు.
ఈ విధంగా కృష్ణమదాసు యక్షగాన రచయితగా పద్య రచయితగా, గ్రంథకర్తగా, కథా రచయితగా, విమర్శకుడిగా, పత్రిక రంగంలో వడ్డేపల్లి సోదరుల నిర్వహణలో పత్రికా సంపాదకుల సమావేశానికి అధ్యక్షత వహించి సురవరం ప్రతాపరెడ్డితో మెప్పు పొందిన మేటి రచయితగా బహుముఖంగా దర్శనమిస్తాడు.
యజ్ఞకృష్ణమదాసు కవి రచయిత మాత్రమే కాదు. ఆయన ఆర్య సమాజ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్ర మహాసభలతో ప్రేరణ పొందాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు. నాటి ప్రముఖులతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన 1969వ సంవత్సరం తుదిశ్వాస విడిచే వరకు స్ఫూర్తివంతమైన జీవితం గడిపాడు. యజ్ఞకృష్ణమదాసు వంటివారి సేవ ఎంతటిదైనా అటువంటి వారి కృషి పట్టుదల ఆదర్శనీయత భావితరాలకు మార్గదర్శకమైంది. అట్టి వారి సేవలను విస్మృతికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది.
పరాయి చోటయినా
మెట్టినింటిలో పాదుకొంటో!
పెరిగిన చోటేదైనా…
కాలు పెట్టిన ఇంటిని తన ఇంటిగా తీర్చిదిద్దుకొంటూ!
బాధల వేవిళ్ళెన్నో భరించి
మరో జీవికి పునర్జన్మనిస్తూ!
ఉనికిలోనే తెగువ కల మగువలు!
కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకున్న మగువలు…
చైతన్యంతో చూపుతున్నారు తెగువ!
గలగలలాడే గాజుల చేతులు…
గగన విహారం చేస్తున్నాయి!
గరిట మాత్రమే పట్టిన చేతులు…
గడగడలాడిస్తూ లాఠీ ఝుళిపిస్తున్నాయి!
జోలలు పుచ్చే కరములు…
జోరుగా నడుపుతున్నాయి కార్లు!
కుసుమ కోమల కరములు…
కంప్యూటర్ కీ బోర్డును టకటకలాడిస్తున్నాయి!
నేలను మాత్రమే చూసే
వారి చూపులు…
తలెత్తి అందరినీ శాసిస్తున్నాయి!
వంటింటి గడప వరకే
పరిమితమైన వారి అడుగులు…
అంతరిక్షానికి సైతం పయనిస్తున్నాయి!
ఇంటి బడ్జెట్ నిర్వహణకు మాత్రమే పరిమితమైన వారి మేధ…
దేశ బడ్జెట్ ను రూపొందిస్తో…
శాస్త్రీయ పరిశోధనలో పాలుపంచుకుంటో…
పదవీ నిర్వహణను సమర్థంగా చేపడుతూ…
సవ్యసాచిలా ఇంటా బయటా…
సంయమనంతో,సహనంతో
సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది!
చెప్పండి అందరూ ఇప్పటికైనా…
ఆడాళ్ళూ-మీకు జోహార్లని!!!
క్షీరసాగర మధనంలో
అందం తాలూకు అమృతబిందువుల్ని
మహిళాలోకం ఒడిసిపట్టుకున్నారా బహుశా
అందం కురిసిన అసలు ఆ రాత్రి
ఆడవాళ్లు మాత్రమే మెల్కొని ఉన్నారేమో తెలివిగా,ఆశగా
పారిజాతంలా ,పున్నాగంలా
నా వాక్యాలకు అందని ఇంకాఏదోఅవ్యక్తసౌందర్యరాశిలా
‘అందం’ వాళ్ల వశమై పరవశమయ్యింది
మగమానవుడు వాళ్లకౌగిట జీవిత ఖైదే ఈనాటికికూడా
సహనంత్యాగం,సాహసం వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు
అందం,ఆనందం, సున్నితత్వం వాళ్లతో ముడిపడ్డాయి అనాదిగా
అతివలదే ఘనతంతా
వనితలదే చరితంతాను
బ్రహ్మచారికిమోక్షంగృహస్థాశ్రమంలోఉందంటారుపండితులు
మగువతోడు లేని మగరాయుడిజీవితమంతా సన్యాసం కాదంటే శూన్య విన్యాసమే అంటారు బాధితులు
శిశిర మోడుల మౌనాకాశంలోంచి
శిలలశిధిల పరమ నిశ్శబ్దంలోంచి
ఒక వసంతగాన పులకిత పుడమిలా
మగాడు గాయపడ్డప్పుడు
ఈ బాధామయ,కన్నీటికధల నుంచి
గుండె పగిలే క్షణాల్నుంచి
ఆమె అమలినప్రేమవర్షంతో తడుస్తూ
అనంత ఓదార్పు నదిఒడిలో స్నానిస్తూ
ఆమెఅనంతదయాపారావారం తీరం చేరి
ఉపశమనిస్తున్నాడు,తిరిగి మానవత్వమున్న మనిషౌతున్నాడు పురుషపుంగవుడు
రేయి పగలు యుగయుగాలుగా….
శక్తి,చేతనత్వాలకు పర్యాయపదం కదా మానవి
స్థావర జంగమాత్మక ఈజగత్తు సమస్తం
సమ్మోహనపరాశక్తి స్త్రీ సంతకమే కాబోలు
ఏమని చెప్పనుఇంకా ఎంతని చెప్పగలను
నాతో నడుస్తున్న మా ఆవిడకు
నన్ను నడిపిస్తున్న మా అమ్మకు
అందమైన మనసుగల ఈ ఆడాళ్లకు
ఈ జన్మకు కృతజ్ఞతలు తప్ప.
“ఈసారి ఏమని వ్రాసారండి పెళ్లివారు?” జానకమ్మగారి గొంతులో ఆరాటం.
“ఏముందిలే మళ్లి మామూలే! పెద్దమ్మాయి నచ్చలేదట. చిన్నమ్మాయిని యిస్తే చేసుకుంటామని వ్రాశారు.
చిన్నమ్మాయయితే కట్నం కూడా వద్దట. అందుకే పెళ్లివారికి సునితని చూపించవద్దంటే విన్నావు కాదు. నేను చెప్పేది నువ్వు తలకెక్కించుకోనంత కాలం ఇదిగో ఇలాగే ఏడుస్తాయి వ్యవహారాలు” అనానడు మూర్తి. తనలో కలిగిన నిరాశ, నిస్పృహను భార్యమీద చిరాకు రూపంలో ప్రదర్శిస్తూ.
“నేనే చేయనండి మధ్యన… అమ్మాయి నా మాట వింటేనా అలా చెల్లిని దాచిపెట్టి చేసే పెళ్ళి నాకొద్దు అని మొండికేస్తేనూ…. పెళ్ళైనాక ఎలాగూ తెలుస్తుంది. అప్పుడు చెల్లెలిని చేసుకుంటే బాగుండేది అని అనుకునేందుకే ఆస్కారం ఇవ్వకూడదని మీ కూతురు పట్టు పట్టిందాయే మరి” అంది జానకమ్మ సంజాయిషీ ధోరణిలో! అప్పుడే పోస్టుమేన్ ఇచ్చి వెళ్లిన ఉత్తరం తాలూకు చర్చ అది.
లోపల గదిలో ఏదో పుస్తకం చదువుతూ ఈ సంభాషణ అంతా వింటున్న సుజాత విసురుగా హాల్లో కూర్చున్న తల్లిదండ్రి దగ్గరకి వచ్చింది. “నాన్న నేనొక మాట చెప్తాను వింటారా?” అంది తీవ్రంగా. “చెప్పమ్మా ఏమిటది? సబబుగానూ, సమంజసంగానూ ఉంటే తప్పక వింటాను” అన్నాడు మూర్తి. కూతురు చెప్పబోయేదేంటో అంచనా వేయటానికి ప్రయత్నిస్తూ.
“అయితే వినండి. మొదటిది ఈ రోజుతో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మానేయండి. రెండు ఈ సంబంధం అన్ని విధాల మంచిది అని తోస్తే చెల్లెలు ఇష్టపడితే దానికి పెళ్ళి చేసేయండి” అంది నిశ్చలంగా.
ఒక్క క్షణం మాటలు రానివారిలా వుండిపోయారా దంపతులు. వెంటనే మూర్తే తేరుకొని “అదెలా కుదురుతుందమ్మా అక్కకు పెళ్లి కాకుండా చెల్లెలికి పెళ్ళ చేయటమనేది మన సంప్రదాయంలో లేదమ్మా! ఒకవేళ చేసినా ఆ తరువాత నీకు పెళ్లి చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఏదో లోపం ఉండబట్టే అక్కకు పెళ్లి కాలేదని ఏవో అవాకులు చవాకులు
వాగుతారు. అసలే లోకులు కాకులు. నీకు పెళ్ళికాకపోవడానికి లక్ష కారణాలు సృష్టిస్తారు. ఆ తరువాత మనలను తలెత్తుకు తిరగనీయకుండా చేసి ఆనందిస్తుంది సమాజం.”
అదంతా ట్రాష్ నాన్నా! ఈ సమాజానికి భయపడి ఇప్పుడు మన జీవితాలను ఎందుకు నాశనం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అంతెందుకు ఇప్పుడు నువ్వు చెప్పావే చెల్లెలికి ముందు పెళ్లి చేయటం మన సంప్రదాయంలోనే లేదని, మరి ఈ విషయం తెలిసే చిన్నమ్మాయినిస్తే చేసుకుంటామని ఎలా అడుగుతున్నారంటావు? పెద్దమ్మాయిని ఏం చేద్దామని వాళ్ల ఉద్దేశం? పోనీ పెద్దమ్మాయికి కూడా ఓ పెళ్లి కొడుకును వెతికి పెడతారేమో కనుక్కోండి…. అప్పుడు ఇద్దరి పెళ్ళిళ్లూ ఒక్కసారే చేసేయచ్చు. కానీ అది సాధ్యఁ కాదు. ఎందుకంటావా? వాళ్ళు వెతికి పెట్టబోయే పెళ్ళి కొడుకు మాత్రం అందమైన చెల్లెలిని వొదిలిపెట్టి అక్కని చేసుకోవడానికి ఎందుకు వస్తాడు? మన పిచ్చిగానీ. అందుకే నేను ఇప్పట్లో పెళ్ళి చేసుకోదలచుకోలేదు. బి.ఇడికి అప్లై చేశాను. నా కాళ్ల మీద నేను నిలబడాలి ముందు. ఆ తరువాత నేను నా వ్యక్తిత్వం పూర్తిగా పూర్తిగా నచిచనవాడు తారసపడితే వెళ్ళాడు తాను. లేదా అలాగే ఉండిపోతాను. మీరేమన్నా సరే నా నిర్ణయం మారదు.” ఏమంటారానన్నట్లు తండ్రి వంక చూసింది. తన కళ్లముందే కూతురు ఇంతగా ఎదిగిపోవడం చూసిన ఆ తండ్రి మాత్రం ఏమనగలడు? అందుకే మౌనంగా ఉండిపోయారు. మూర్తిగారు అంగీకారాన్ని సూచిస్తూ.
సునీత, సుధాకర్ పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. పెళ్ళి పనుల్లో ఎంతో సరదాగా ఉత్సాహంగా పాల్గొంది సుజాత. ఆమెను చూసి చుట్టాలు ఆశ్చర్యపోయారు. అదేంటి తనకు పెళ్లవకుండా చెల్లెలికి పెళ్లవుతుంటే ఈ పిల్లకి కొంచెం అయినా బాధగా లేదా? పైగా సంతోషంగా ఉందే అనుకున్నారు. ఈ కామెంట్స్ విన్న సుజాత మనసులోనే నవ్వుకుంది వాళ్ళ అమాయకత్వానికి. మరికొంతమంది అక్కకి పెళ్లి కాకపోవడానికి వేరే ఏదైనా కారణం ఉండి ఉండొచ్చుగా అని లా పాయింట్ తీసి మరీ చెవులు కొరుక్కున్నారు.
తోటి మనిషిలో లేని చెడును ఊహించుకొని ఆనందపడటం మనిషి బలహీనత. అందుకే పెళ్ళిలో చుట్టాల కామెంట్స్ ను అస్సలు పట్టించుకోలేదామె. సునీత భర్తతో అత్తవారింటికి వెళ్ళిపోయింది.
చూస్తూ ఉండగానే ఐదేళ్ళు గిర్రున తిరిగాయి. సునీత బి.ఇడి పూర్తిచేసి స్కూల్ లో టీచర్ గా చేరింది. సునీతకి మూడేళ్ళ బాబు, ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంటం. ఈసారి పురుడు అక్కడే పోస్తామని వాళ్ల అత్తగారు కబురు పెట్టారు. సునీతకి నెలలు నిండాయి. రేపో మాపో శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు మూర్తి జానకమ్మ. ఇంతలో పిడుగులాంటి వార్త! కాన్పు కష్టం అయి ఆపరేషను చేసి బిడ్డను బయటకు తీశారు. కానీ తల్లిని కాపాడలేకపోయారట డాక్టర్లు. మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయారు ఆ తల్లిదండ్రులు. ఈ షాక్ నుంచి సుజాతే ముందు తేరుకొని తల్లిదండ్రిని ఊరడించింది.
అంతా బయలుదేరి సునీత అత్తవారి ఊరు వెళ్ళారు. జరగవలసిన తతంగమంతా అయిపోయినాక బరువెక్కిన హృదయాలతో జీవచ్ఛవాలలా తిరిగి వచ్చారు.రోజులు భారంగా దొర్లస గాయి. పిల్లా పాపలతో కళకళ లాడవలసిన చెట్టంత కూతురి జీవితం అర్థాంతరంగా ముగియడంతో మూర్తిగారు జానకమ్మ పూర్తిగా కృంగిపోయారు.
ఆరునెలలు గడిచాయి ఏ మార్పు లేకుండా.
ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సుజాత తల్లిదండ్రీ చెప్పిన విషయం విని ముందు విస్తుపోయింది. ఆ తరువాత ఛీ… మనుష్యులలో ఇంత స్వార్థం కూడా ఉంటుందా? అని ఏవగించుకొని తన చెల్లెలి మామగారు వ్రాసిన ఉత్తరం చదివింది.
వెంటనే బట్టలైనా మార్చుకోకుండా తన గదిలోకి వెళ్లి ప్రక్కమీద వాలిపోయింది. ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. ఇప్పుడేం చేయటం… భగవంతుడు తన కిటువంటి విషమ పరీక్ష పెడతాడని తనెన్నడూ ఊహించలేదు. చీకూ చింతాలేని జీవితం గడపాల్సిన లేత వయస్సులోనే అతి విలువైన తల్లి ప్రేమకు దూరం అయిన ఆ పసివాళ్ల మీద జాలి చూపేదా, లేక ఒక్కప్పుడు తనను నిరాకరిఁచిన సుధాకర్ ని తృణీకరిఁచి తన కక్ష తీర్చుకొనాలా? ఏమిటిప్పుడు తన కర్తవ్యం? ఎటూ తేల్చుకోలేకపోతున్నదామె మనస్సు.
సరిగ్గా ఆమె ఆలోచనలు ఒక నిర్ణయంగా రూపుదిద్దుకుంటున్న సమయంలోనే మూర్తి ఆమె గదిలోకి వచ్చి ఆమె దగ్గరగా కూర్చొని, చేత్తో తలని నిమురుతూ అడిగారు వాత్సల్యం తొణికిసలాడే స్వరంతో “ఏమ్మా ఏమాలోచించావు సుధాకరం విషయం?”
“ఆత్మాభిమానం కల ఏ ఆడపిల్లయినా ఇందుకు ఒప్పుకుంటుందనే అనుకుంటున్నావా?” ఆమె గొంతులో నిష్ఠూరం.
“అది కాదమ్మా. ఈ పంతాలు పట్టింపులూ మీ వయస్సులో సహజమే. కానీ ఈ వయస్సు కాస్తా దాటిపోయిన తరువాత నీ నిర్ణయం నీకే తప్పుగా అనిపించవచ్చు. ఎన్నాళ్ళని ఒంటరిగా వుంటావు.
ఒంటరితనాన్ని మించిన శత్రువు మరొకటి లేదని అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. తీరా తెలుసుకున్నాక సమయం మించిపోవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం?
అదేకాదు సుధాకర్ని పెళ్ళి చేసుకుంటే ఆ పసివాళ్ళకు తల్లిలేని లోటు తీర్చిన దానివవుతావు. జీవితంలో ఇంతకన్నా ఏం పరమార్థం సాధించదలచుకున్నావమ్మా!”
“నేను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను నాన్నా! ఆ పసివాళ్ళను తలచుకుంటే నాకు జూలిగానే ఉంది. కానీ ఈ పెళ్లితో నేను పిల్లలకి తల్లి కాగలనేమోగాని అతనికి భార్యను మాత్రం కాలేను. ఆ పిల్లలకు నా అవసరం కొన్నాళ్ళే. ఆ తరువాత వాళ్ళు రెక్కలు వచ్చి ఎగిరిపోతారు. అప్పుడు నాకు మిగిలేది ఒంటరితనం కాక మరేమిటి నాన్నా?”
కూతురి మొహంలోని గాంభీర్యతని చూశాక ఆమె నిర్ణయం మారదని అర్థం చేసుకున్న మూర్తి ఒక నిట్టూర్పు విడిచారు.
వారం రోజుల అనంతరం సునీత భర్త సుధాకర్ ఓ లేఖ అందుకున్నాడు. ఫ్రం అడ్రస్ సుజాత అని ఉంది. ఆత్రంగా విప్పి చదివాడు. “సుధాకర్ గారికి”, మీ ఉద్దేశం తెలుసుకున్నాను. కానీ ఈ ప్రపోజల్ తేవడానికి మీకు మనస్సెలా ఒప్పుకుందో నాకు అర్థం కావటం లేదు. ఒక్కప్పుడు నేను మీ భార్య కావటానికి అనర్హురాలినని నిర్ణయించింది మీరే! కాని ఇప్పుడు పిల్లల కోసం నన్ను పెళ్ళాడతానంటున్నారు. అంటే మీ అవసరాలనుబట్టి మీ యిష్టాయిష్టాలు కూడా మారిపోతుంటాయన్న మాట. ఆ ఎదుటి అమ్మయి ఏం కోరుకుంటుందో మీకు అవసరం అని స్పష్టంగా తెలుస్తున్నది. ఇది ఈనాడు కొత్తగా వచ్చిన విషయమేమి కాదు. అనాదిగా వస్తున్న పురుషాధిక్యతే. అందులో ఏమీ మార్పురాలేదు. కానీ ఈనాటి ఆడపిల్లల దృక్పథంలోనే మీరూహించని మార్పు వచ్చేసిందని మీరు తెలుసుకుంటే మంచిది.
పైగా పిల్లల కోసం అంటూ, ఆడదానిలోని సహజ మాతృత్వాన్ని ఎక్ల్సాయిట్ చేయటం మానలేదు మీ మగవారు. అప్పుడూ ఇప్పుడూ కూడా!! చెల్లెలి పిల్లల మీద నేను జాలిపడాలని మీరాశించే బదులు, మీ కన్న పిల్లల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరసలు పెళ్ళే చేసుకోరు.
ఇకపోతే మీరు పెళ్ళి చేసుకొంటననగానే ఎగరి గంతేసి ఒప్పుకుంటాననుకొని ఉంటారు. స్త్రీకీ పెళ్ళే పరమావధి కాదు. నా దృష్టిలో వివాహం జీవితానికొక కొత్తమలుపు మాత్రమే. అదే గమ్యం కాదు. కాకూడదనేది నా దృఢాభిప్రాయం. ఈ ప్రపంచం సువిశాలం. అందులో నా వ్యక్తిత్వానికి విలువనిచ్చి, నన్ను నన్నుగా స్వీకరించి, నా హృదయసౌందర్యాన్ని చూడగలిగిన ఒకే ఒక వ్యక్తి తప్పక లభిస్తారనే నమ్మకం, ఆత్మవిశ్వాసం నాకున్నాయి. అటువంటి వ్యక్తి తారసపడేవరకు నా ఈ అన్వేషణ ఇలా కొనసాగిస్తూనే ఉంటాను.
కానీ మీ హృదయంలో స్థానం లభించకుండా మీ జీవిత భాగస్వామిని మాత్రం కాలేను. చెల్లెలి పిల్లలమీద నాకెప్పుడూ ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళ కోసం నా జీవితాన్నే త్యాగం చేసేంతటి స్థాయికి ఎదగమంటే మారతం… నో థాంక్స్. అంతటి విశాల హృదయం నాకు లేదు… సారి ఉంటాను
– సుజాత
1. జీడిగింజ-ప్రాముఖ్యం
గ్రామీణుల జీవితంలో ప్రాధాన్యత కలిగిన అనేక వస్తువుల్లో జీడిగింజ ఒకటి. జీడిగింజ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది దాని ‘నలుపురంగు‘. అందుకే అది ‘నల్లజీడి‘గా ప్రసిద్ధి పొందింది. వంటల్లో ఉపయోగించే దాన్ని తెల్లజీడి, కొండజీడి, కాజు అని అంటారు. అన్నిపళ్లలో (ఫ్రూట్స్)లో గింజ ఉంటుంది. కాని జీడిగింజ పండుకు వెలుపల ఉంటుంది. ఈ విధంగా దీనికి రంగులోనే కాకుండా స్వరూపంలోనూ ఓ వైశిష్ట్యం ఉంది. నల్లజీడిగింజ ఆంగ్ల నామం మార్కింగ్ నట్, ట్రేసింగ్ నట్.
2. భారతీయ భాషల్లో నల్లజీడిగింజ పేర్లు
కన్నడం : అగ్నిముఖి, భల్లాతక, చేర, గెర్కాయి, కేరుబీజ.
తమిళం : కెల్కొట్టాయి, అరుత్కర్మ్, కెరాన్ కొట్టాయి, ఎరిమముఖి, పెంగొట్టాయి, సెరావొట్టాయి.
తెలుగు : జీడి, తుమ్మెద మామిడి, నల్ల జీడి, భల్లాతక, గుడోవా,
మరాఠీ : బిబ్బ, బిభ, బిబో, బిబ్బా,
మళయాళం : అలక్కుచేరు, కేరు, కెర్కోట్ట, షెగ్గొట్ట, తెల్కొట్ట.
హిందీ: ఖిలావా, బేలతక్, భేలా,
3. వివిధ గ్రంథాల్లో జీడి పేర్లు, గుణాలు
3.1 జీడిపేర్లు: సర్వమూలికా గుణరత్నాకరమ్ (పుట. 104) లో నల్లజీడి (భల్లాతక)కి ఉన్న పర్యాయపదాలు, దాని రుచులు, లక్షణాలు, మొదలైనవాటిని సంస్కృత శ్లోకాల్లో ఇచ్చారు. వాటి చీకను కింద తెలపడమైంది. భల్లాతకః, నభోభల్లీ, రవృక్షః, అగ్ని వక్రకః, అరుష్కర, రూక్ష్మ, తపనః, అగ్నిముఖీ, ధను
3.2. జీడిగుణాలు: జీడిపండు వగరుగా, మధురంగా ఉంటుంది. కొంచెం కాక (వేడి) చేస్తుంది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. వాతం, శ్లేష్మం, ఉదరరోగం, అనాహం, కుష్టువు, అర్మరోగం, గ్రహణి, గుల్మం, జ్వరం, శ్విత, అగ్నిమాంద్యం, క్రిమిజ్వరాలను పోగొడుతుంది, కఫరోగం, బడలిక, వాపు, కడుపుబ్బరం, మలబద్ధకం, శూల, ఆధ్యానం, కృమలను పోగొట్టుతుంది. దాని మజ్జ అతితాపం, పిత్తం, వాతం, అరుచిని హరిస్తుంది. అంతేకాక శీఘ్రంగా పిత్తరోగాన్ని నిర్మూలిస్తుంది. ఈ అంశాలను ‘వస్తుగుణ దీపిక’లో కూడా చెప్పారు.
4. జానపదులు – జ్ఞానపదులు – వినూత్న ప్రయోగశీలురు
చెట్లకు, తాటిచెట్లకు చీమలు పట్టుకుండా జీడి పూస్తారు, కాళ్ళ పగుళ్ళకు, మడమ శూలకు, గుర్రం మూతులకు కూడా జీడిని పెడతారు. అంతేకాక జీడిని నూనెలో కాగబెట్టి, తలకు పెట్టుకుంటారు. వీటితోపాటు గంపలు, గుల్లలు, చేటలు, జల్లెడలకు, కుండలకు కూడా పూస్తారు. అయితే ఈ విషయాలను వైద్య గ్రంథాల్లో ఎక్కడా తెలపలేదు. జానపదులు వైద్య గ్రంథాలను చదవకపోయినా జీడిగింజను నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా మనుషులకు, పశువులకు వాడుకుంటున్నారు. గింజలనుండి చమురు తీసి, చమురు తీయకుండా ఆచారవ్యహారాల్లో, అటు జానపద వైద్యంలో, ఇటు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ‘జానపదులు జ్ఞానపదులనీ, ప్రాయోగశీలురనీ, వినూత్న శాస్త్రీయ ఆవిష్కరణల కర్తలనీ, వారు జీడిగింజలను ఉపయోగించుకునే తీరును బట్టి చెప్పవచ్చు. నిరూపించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం-
4.1. ఆచారవ్యవహారాల్లో, శుభకార్యాల్లో జీడిగింజు: 4.1.1 హిందువుల వివాహ సమయంలో కుమ్మరింటి నుండి ‘అరివేణి కుండలు’ను ఇంటికి తీసుకురావడం అందరికీ తెలిసిన విషయమే. కొందరి ఇండ్లల్లో వారి ఆనవాయితీ ప్రకారం ఆ కుండలను ఇంటిలో దించిన తర్వాత, వాటిలో ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో నైవేద్యం (అన్నం) సమర్పిస్తారు. ఎరుపుకోసం కుంకుమను కానీ, సున్నం, పసుపులు మిశ్రవాన్నిగానీ వాడ్తారు. అలాగే నలుపుకు బొగ్గును దంచి, ఆ పొడినిగానీ, మసినిగానీ వాడుతారు. ఆ నైవేద్యంపై నుండి, అరివేణులపై నుండి ‘సూదికి గుచ్చిన జీడిగింజ’ను మూడుసార్లు తిప్పి, ఆ నైవేద్యం పైన పెడ్తారు.
4,1,2. సంక్రాంతి సమయంలో పిల్లల తలపై పోసే భోగిపండ్లలో జీడి(గింజ) పండ్లను కూడా కలుపుతారు. ఇల్లు అనగానే ఇంటికి ఓ భౌతికస్వరూపం, ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు (గృహిణి), పిల్లలు, పెద్దలు, గొడ్డుగోదలు (పశుసంపద), వాటి పిల్లాజెల్లా మొదలైనవి గుర్తుకు వస్తాయి. వీటికి జీడిగింజకు ఉన్న సంబంధం కూడా తెలుసుకుందాం. 4.2. గృహిణులకు నిత్యావసర (ఔపయోగిక) వస్తువు: 1, పప్పులకు, పొడులకు క్రిమిసంహారక పదార్థం (మందు), 2. వస్తువుల మన్నికకు, దృఢత్వానికి ఉపయోగపడే రసాయనం, 3. ఆయురారోగ్యాలను కలిగించే మందు దినుసు.
4.2.1. క్రిమిసంహారక పదార్థం: దీర్ఘకాలం నిలవ ఉండే పప్పులు, మిరపపొడి, దనియాలపొడి, పసుపు పొడి, మొదలయిన వాటిలో జీడిగింజలను వేసిపెట్టడంవల్ల పురుగు పట్టదు. గింజ ఘాటువల్ల ఆ పొడుల్లో తెల్లపురుగు వంటి క్రిమికీటకాదులు చేరవు, పొడులు చాలాకాలం నిలువ ఉంటాయి.
4.2.2. వస్తువులకు మన్నిక: జీడినూనెను (చమురును, రసాన్ని, తైలాన్ని) చేటలు, జల్లెడలు, గుల్లలు, కుండలు, మొదలైన వాటికి దట్టగా పట్టించడం వల్ల అవి సుదీర్ఘకాలం మన్నికతో ఉంటాయి. అవి జీడినూనెతో గట్టిపడతాయి, కిందపడ్డా విరిగిపోవు. వాటి పేడు (చెక్క బడ్డ)కు కూడా పురుగు పట్టదు.
మామిడికాయ వంటి నిలవపచ్చళ్ళకు ‘జీడిపోత పోసిన కుండలు’ను ఉపయోగిస్తారు. అవి నేటి జాడీలలాగ పనిచేస్తాయి. పూర్వకాలంలో జీడిపోత పోసిన (పూత పూసిన కుండల్లోనే పచ్చడి పెట్టుకొన్నారు. అందులోనే నిలవ చేసుకున్నారు. అందుకోసం జీడగింజలతో ‘బట్టీ’ పెట్టి, వాటినుండి చమురును తీశారు. దాన్ని దట్టంగా కుండలలోపల పట్టించారు. అది ఆరిన తర్వాత అందులో పచ్చడిని నింపారు. జీడిగింజ చమురువల్ల కుండగోడలు గట్టిపడతాయి, అంతేకాక, కుండలను ఉప్పుకారం పచ్చడికుండ ‘మట్టి’ పచ్చడిలోకి రాలదు.
4. 3. ఆయురారోగ్యాలను కలిగించే మందు దినుసుః గృహవైద్యంలో జీడిగింజను మించిన మరో వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. దీన్ని అంటువ్యాధులు, దగ్గులు, చర్మవ్యాధులు, నొప్పులు, చుండ్రు, మొదలైన వాటికి ఉపయోగిస్తారు.
ఇంట్లో శిశువులు, పిల్లలు అకారణంగా గుక్కపట్టి (నిర్విరామంగా) ఏడుస్తుంటారు. వారి ‘ఏద్పు’కు దృష్టిదోషం (దిష్టి) కారణం అనుకుంటారు. మాటలు 204 వచ్చిన పిల్లలైతే, కడుపు పట్టుకొని, కడుపు నొస్తుందని ఏడుస్తారు. వారి కడుపు మీద వేలుతో కొట్టి చూస్తారు. కడుపు ఉబ్బరంగా ఉండి, ‘టక్ టక్’ అని శబ్దం వస్తే, ‘సరదృష్టి – దిష్టి’ కారణం అనుకుంటారు. అప్పుడు డబ్బడం లేదా ఒక ఇనుప చువ్వకు జీడిగింజను గుచ్చి, దానికి అగ్గిని అంటిస్తారు. దానిని ఎడమచేతిలో పట్టుకొని, పిల్లల మీదినుండి తల చుట్టూ వలయాకారంగా తిప్పి, ఆ తర్వాత ముఖం మీది నుండి కిందికి ‘దిగతుడుస్తారు. ఆ జీడిగింజ చిటపటలాడుతూ, పల్చటి చమురు (రసం) కారిస్తే దృష్టిదోషం (దిష్టి/ జిష్టి) తగిలిందనీ, చిటపటలాడకుండా చిక్కటి రసాన్ని కారిస్తే, దృష్టిదోషం తగల్లేదని భావస్తారు. రోగం పోవాలని భావించినపుడు, దేనినైనా తిప్పి తీయదల్చుకున్నప్పుడు, వ్యక్తులకు పైనుండి కిందికి దిగతుడవాలి. అంటే చేతిని పైనుంచి కిందికి తేవాలి. అలా గాకుండా చేతిని కిందినుండి పైకి ఎగతుడిస్తే, రోగమైనా, జిష్టి అయినా ఎక్కువవుతుందని
కలరా వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు చిన్నా పెద్దా భేదం లేకుండా ఈ జీడిగింజ చమురును పాదం మధ్యలో (అరికాలులో పెట్టుకుంటారు. పిల్లలకు, పెద్దలకు రకరకాల దగ్గులు వచ్చినప్పుడు, జీడిగింజను కచ్చె పిచ్చె మెత్తగా కాకుండా, కసపిస గా దంచి, పాలల్లో వేసి, మరిగించి, వడబోసి, బాధితులకు తాగిస్తారు.
స్త్రీలు నిరంతరం నీళ్ళల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చేతిగోళ్ల పక్కన, కాలివేళ్ళ మధ్య దురద, నొప్పి కలుగుతుంది. ఆ చిగురును సన్న సూదిమొనతో కొంచెం అటుఇటు అని (కెలగించి), ఆ సందుల్లో జీడిగింజ నూనె (రసం) పూయాలి. దానివల్ల నొప్పి, దురద (ఇన్ఫెక్షన్) తగ్గుతుంది. అంతేగాకుండా, కాలి మడమలు పగిలి, నెర్రెలు (వెడల్పుగా చీలడం) ఏర్పడతాయి. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉ ంటుంది. అలాంటప్పుడు ఆ నెర్రెలకు జీడిపూస్తే, నొప్పులు తగ్గుతాయి, నెర్రెలు మానతాయి.
మడమనొప్పి లేచినా, మడమ వెనకాల ‘గుర్రం మూతులు’ వచ్చి, నొప్పి కలిగినా, జీడిగింజతో కాల్చాలి. గింజకు ఒకవైపు చిన్నరంధ్రం పెట్టి, మరోవైపు డబ్బడం గుచ్చి, దీపానికి (సెగకు) కాలిస్తే, అందులో నుండి జీడినూనె బయటకు వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు అలాగే కాలుకు పెట్టి నొక్కాలి. కొందరికి ఇది పడక వుండు కూడా అవుతుంది.ముల్లు గుచ్చుకొన్నచోట కూడా ఇలా చేస్తే, నొప్పితగ్గుతుంది.
పూర్వం తలకు మరిగించిన మంచినూనె వాడారు. ఆ నూనె మరుగుతున్నప్పుడు అందులో కొంచెం ఆముదం, సువాసనకోసం కచ్చూరాలు, తుంగగడ్డలు వేసేవారు. ఆ నూనెలోనే నల్లజీడిగింజలను కూడా వేసేవారు. అందులో వేయగానే అవి చిట్లి (పగిలి), అందులోని చమురు నూనెలోకి వచ్చేది, చల్లారిన తర్వాత దాన్ని వడగట్టి, తలకు రాసుకునేవారు.
4.4. దిష్టి తగలకుండా పశువులకు, వాహనాలకు జీడిగింజల దండలు: గ్రామాల్లో ఆవులు, బర్రెలు ఈనగానే (ప్రసవించగానే), వాటికి పెయ్యి కడిగి (స్నానం చేయించి), ‘జీడిగింజల దండ’ కడ్తారు. ఈనిన కొత్తలో దూడ చిన్నగా ఉండి, పాలు తక్కువగా తాగడం వల్ల పొదుగు బరువుగా ఉంటుంది. దూడ కూడా గంతులు వేస్తూ అందంగా, ఆనందదంగా ఎగురుతుంటుంది. వాటిని కొందరు ఈర్ష్యాసూయలతో చూస్తారని, వారి చూపువల్ల ఆ తల్లీపిల్లలకు దిష్టి తగుల్తందని భావిస్తారు. దిష్టి తగిలితే పాలు తగ్గుతాయి. పాడిపశువులు ఎండిపోకుండా ఉండాలని, నల్లదారానికి కుచ్చిన జీడిగింజలదండలను వాటి కాలుకుగానీ, మెడకుగానీ, రెండింటికిగానీ కడ్తారు. జీడిగింజల దండలు అంగడి (సంత) జరిగిన రోజు కొనుక్కోవచ్చు. ఆ దండల్లో జీడిగింజలతోపాటు గవ్వలు, పగడాలు (ఎర్ర పూసలు) కూడా ఉంటాయి. కొందరు ఆ దండలో నిమ్మకాయలు కూడా కలిపి కడ్తారు. అంతేగాకుండా వాటికి ఏమైనా జరిగినా, పాలు ఇవ్వక పోయినా, మేత మేయకపోయినా, పాలు ఇగిరిపోతున్నా, పెరుగు బంకలాగా సాగుతున్నా, వాటికి దిష్టి తగిలిందని, జీడిగింజులతోపాటు, మిరపకాయలతో కూడా దిష్టి తీస్తారు.
ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, వ్యానులు, లారీలు, మొదలైన వాహనాలు, ఎద్దుల బిళ్లు, వ్యాపార సంబంధ ఇతర వాహనాలకు కూడా దృష్టి తగలకుండా జీడిగింజల దండలను కడతారు.
4.5. జీడిగింజ (చమురు / నూనె) చెట్లు: తాటి చెట్లను ‘భూలోక కల్పవృక్షాలు’ అంటారు, తాటి ‘కల్లు’ను తాగడానికి గండుచీమలు బారు (వరసలు) కడ్తాయి, కల్లుగీత కార్మికుడు రోజుకు మూడుసార్లు కల్లు తేవడానికి చెట్టు ఎక్కవలసి ఉంటుంది. చెట్టుపైకి వెళ్తుంటే అవి కుడుతుంటాయి. వాటి బాధకు తాళలేక కిందికి దునికితే, కార్మికుని ప్రాణాలకు అపాయం ఏర్పడుతుంది, గాయాలవుతాయి. ఈ కారణంగా వాటి బాధ పోవడానికి, ఆ చెట్టుపైకి ఎక్కకుండా ఉండడానికి తాటి చెట్టు చుట్టూ జీడిచమురుతో వెడల్పుగా ‘జీడికట్టు’ పెడ్తారు. అంతేగాకుండా తాటికల్లుపై ‘నరదృష్టి’ పడకూడదని, కల్లు ఉత్పత్తి తగ్గ కూడదని, చెట్టు ఎండిపోకూడదని చెట్టుమొదలుకు జీడిగింజనూనెతో ‘జీడికట్టు’ను వలయాకారంగా పెడ్తారు. ఈ జీడికట్టునుండి వచ్చే ఘాటువల్ల గండుచీమలు కూడా కల్లుతాగడానికి చెట్టుపైకి ఎక్కవు.
4.6. బట్టలకు గుర్తులు పెట్టడానికి రజకులు వాడతారు: జీడిగింజను ‘మార్కింగ్ నట్, దోభీ నటి’ అని కూడా అంటారు. దీనికి ఈ పేరు వారివల్లనే వచ్చింది. అందరికన్నా రజకులు తెలివైనవారు అనే గుర్తింపు కూడా జీడిగింజ వల్లనే వచ్చిందంటే ఆశ్చర్యంలేదు.
| బట్టలు ఏ ఇంటివో తెలుసుకోవడానికి చుక్కలతో ఒక గుర్తును ఏర్పాటుచేసుకుంటారు. ఆ గుర్తులను ఆయా ఇంటివారి బట్టలపైన నల్ల జీడిగింజ చమురుతో పెడ్తారు. బట్టలు చిరిగిపోతాయి, కాని జీడిగింజ చమురు గుర్తులు పోవు.
జీడిచమురు పైన తెలంగాణలో ఒక ఉయ్యాలపాట కూడా ఉంది. ‘ఒక మరదలు (ఆడపడుచు) తన అన్నభార్య (వదిన) వద్ద పట్టుచీరను అడుక్కొని, కట్టుకొని, ‘బతుకమ్మ’ ఆడడానికి వెళ్తుంది. ఒక ఆకతాయి అబ్బాయి ఆమె పట్టు చీరపైన చిత్తన గొయ్య (రంగులు చిమ్మేగొట్టం)తో ‘జీడి చమురు’ను కొడ్తాడు (చిల్లిస్తాడు). ఆ అమ్మాయి ఆ చీరతో ఇంటికి వెళ్తే, వదిన కొత్తచీర అని భయపడి, రజకుని వద్దకు వెళ్తుంది. దాన్ని ఉతికి, మచ్చలు పోగొట్టి ఇవ్వమని అడుగుతుంది. ఆ రజకుడు ఇదే సమయమని, ఆమె భయాన్ని తన స్వార్థానికి వాడుకుంటాడు. ‘నువ్వు నన్ను పెండ్లి చేసుకుంటే, తికిస్తాను’ అంటాడు. అందుకు ఆమె ఒప్పు కుంటుంది, పెండ్లి చేసుకుంటుంది. అయితే రజకుడు ఆ చీరను ఎంత ఉతికినా మచ్చలు పోవు. ఆమె పుట్టింటికి పోదు, ‘ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లోని అయొడిన్ లాగా మంచికి, చెడుకు పైన చెప్పుకున్న విధంగా గ్రామాల్లో జీడిగింజ ఒక ఔషధంగా ఉపయోగపడుతున్నది. ఆయుర్వేద గ్రంథాల్లో ఆయుర్వృద్ధి కోసం, కుష్టు, ఆర్మరోగాలు పోగొట్టడానికి, పుండ్లమచ్చలు పోగొట్టడానికి, రోగనిరోధకశక్తిని మొదలైనవాటిని పెంచుకోవడానికి నల్లజీడిగింజలను వాడారని తెలుస్తున్నది. ఈ నల్లజీడిగింజతో జానపదులు చేసే వైద్యం ఎంతవరకు శాస్త్రీయమైందో తెలుసుకోవడానికి కూడా ఆయుర్వేద వైద్యగ్రంథాలను సంప్రదిస్తే బాగుంటుంది. 5. ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో నల్లజీడి
ఆయుర్వేద గ్రంథాలు: 1. అగ్నివేశమహర్షి రచించిన చరక సంహిత, 2.సుశ్రుత సంహిత, 3. ధన్వంతరి, 4. బసవరాజీయమ్, 5. భైషజ్యరత్నాకరమ్ 6. సర్వమూలికా గుణరత్నాకరమ్, 7. వస్తుగుణదీపిక, మొదలైనవి బాగా ప్రసిద్ధి పొందాయి.
‘కృతయుగంలో చరక సంహిత, త్రేతాయుగంలో రసరత్నాకరమ్, ద్వాపరయుగంలో సిద్ధ-ద్యాభువు, కలియుగంలో బసవరాజీయమ్ శ్రేష్ఠమైన గ్రంథాలని బసవరాజీయం (పుట. 3)లో చెప్పారు. అలాగే ధన్వంతరి ఆయుర్వేద గ్రంథంలో కూడా చరక సంహిత, తర్వాతనే సుశ్రుత సంహిత అని చెప్పారు. వస్తు గుణ దీపిక (పుట 35) లో జీడిగింజ పేర్లను, గుణాలను కూడా చెప్పారు. కాబట్టి ముందుగా చరకసంహితలో జీడిగింజ గురించి ఏం చెప్పారో చూద్దాం. చరక సంహిత మూడు అంశాలు 1. భల్లాతక క్షీరరసాయన యోగం (పుట 35), 2. భల్లాతక క్షౌద్ర రసాయనం (పుట 37), 3. భల్లాతక తైలప్రయోగం (పులు 37) గురించి చెప్పారు.
5.1. చరక సంహిత-భల్లాతక క్షీర రసాయన యోగం: వాతావరణ వైపరీత్యాల వల్ల, వృక్షసామాన్యమైన రోగాలవల్ల చెడిపోని, రసంతో బాగానిండినవి, మంచి పరిమాణం కలవి, నేరేడుపండ్లలాగ నల్లని కాంతి కలిగిన నల్లజీడిగింజలను జ్యేష్ఠమాసంలోనైనా, ఆషాఢమాసంలోనైనా తెచ్చుకోవాలి. వాటిని యవలరాశిలోనైనా, ఉద్దుల (ఎనుముల) రాశిలోనైనా నాల్గునెలలు పెట్టాలి. ఆ తర్వాత ఆ గింజలను వెలికి దీయాలి. ఆరోగ్యవంతుడైనవ్యక్తి వాటిని ఆరోహణావరోహణాక్రమంలో 30 రోజులు వాడాలి. పైన చెప్పుకున్న జీడిగింజల నుండి తొలుత పదింటిని నలగ దంచాలి. దానికి ఎనిమిది భాగాలు నీళ్లు పోసి, ఎనిదవ వంతు మిగిలేటట్లు కాచాలి. ఆ రసాన్ని వడగట్టాలి. అందులో ఆవుపాలు కలపాలి. వాటిని తాగే ముందు నోటికి ‘నెయ్యి’ని పూసుకోవాలి. పాలతో కూడిన ఆ జీడిగింజల రసాన్ని మార్గశిర మాసంలోనైనా, పుష్యమాసంలోనైనా తాగాలి. ఇది మొదటి దినం సేవించే పద్ధతి.
రెండవదినం నుండి మిగిలిన (29) రోజులు రోజుకు ఒక్కొక్కటి చొప్పున (10-1) పెంచుకుంటూ పోవాలి. అలా రోజుకు ఒక్కొక్క జీడిగింజ వంతున పది కన్న ఎక్కువగ చేర్చుకుంటూ పైన చెప్పిన విధంగా ఎనిమిదిపాళ్లు నీళ్లు పోసి, ఎనిమిదవ భాగం మిగుల కాచి, వడగట్టి, అందులో పాలు కలుపుకొని తాగాలి. ఈ విధంగా ఒక్కొక్క గింజవంతున హెచ్చించుకుంటూ, ముప్ఫైగింజలు అయ్యే వరకు, పైన చెప్పిన విధంగానే తాగాలి. ఆ గింజల సంఖ్య ‘ముప్పై’ అయిపోయిన మరుసటి రోజునుండి. ఒక్కొక్క గింజ వంతున తగ్గించుకుంటూ, ప్రతి రోజు పైన చెప్పిన విధంగానే తాగాలి. అలా వాడిన మొదటినుండి ఉపయోగించినవన్నీ కలిపి, ‘ఒక వేయి’ సంఖ్య అయ్యేవరకు మాత్రమే తాగాలి. వేయిసంఖ్య కాగానే పూర్తిగా మానాలి.
పై రసాయనం వాడినప్పుడు, ప్రతిదినం ఔషధం జీర్ణమై, ఆకలి కల్గినపుడు ‘రాజనాల’ అన్నమైనా లేదా 60 రోజుల్లో పండే ‘సంబావుల’ అన్నమైనా నేతిని, పాలను కలిపి తినాలి. ఈ రసాయనాన్ని ఉపయోగించడంవల్ల యౌవనం స్థిరంగా ఉంటుంది. నూరు సంవత్సరాలకాలం సుఖంగా జీవించి ఉంటాడు. భల్లాతక (నల్లజీడి) రసాన్ని పాలల్లో (క్షీరంలో) కలిపి వాడడం వల్ల దీన్ని ‘భల్లాతక క్షీరరసాయనము’అని అంటారు. 5.2. భల్లాతక క్షౌద్ర రసాయనం: ఇంతకుముందు (నల్లజీడి గింజల గురించి చెప్పుకున్న లక్షణాలు కలిగిన జీడిగింజలను ముక్కలుముక్కలు చేయాలి. ఆ ముక్కలను ‘సన్నని రంధ్రాలు కలిగిన ఒక కుండ’లో నిండుగ పోయాలి.
భూమిలో గుంటను తవ్వి, నూనె లేదా నెయ్యిలో చాలాకాలం మాగిన (పీల్చుకొన్న) కుండను కంఠం వరకు పాతాలి. పైన చెప్పుకున్న రంధ్రాలున్న పాత్రను దానిపై ఇమిడి ఉండునట్లు బోర్లించాలి. అవి రెండూ కలిపిన చోటు వద్ద (సందులను) నల్లని బంకమట్టిని పూయాలి. దానిపైన ‘ఏడు పిడకలు’ చేత మూటుబెట్టి, ఉడికించాలి. వేడికి గింజలు పగిలి, గింజల్లోని చమురు (తైలం) కింది కుండలోకి కారుతుంది. ఆ గింజల చమురుకు ఎనిమిది భాగాలు తేనెను, రెండింతలు నేయిని కలిపి, ప్రతిదినం ఉదయం పూట, జఠరాగ్నిని అనుసరించి, వాడుకోవాలి. ఈ రసాయనాన్ని వాడడంవల్ల, నూరు సంవత్సరాల వరకు ముసలితనం దరిచేరదు (పుట 37) క్షాద్రం అంటే తేనె. 5.3. భల్లాతక తైల ప్రయోగం: పైన చెప్పిన ‘ధి’ ప్రకారం సిద్ధమైన భల్లాతక స్వరసాన్నే ‘భల్లాతక తైలం’ అంటారు. భల్లాతక తైలాన్ని, పాలును ఒక పాత్రప్రమాణం (ఆడకం) సిద్ధం చేసుకొని, అందులో సమభాగం ఆవుపాలను పోసి, అక్ష(కర) ప్రమాణం అతి మధుర కల్కాన్ని చేర్చి, స్నేహక ప్రకారం పక్వం చేయాలి. పైన చెప్పిన పాలను, అతిమధుర కల్కాన్ని మాటిమాటికి చేరుస్తూ, వంద మార్లు చేయాలి. ఈ భల్లాతక తైలాన్ని, ఇంతకు ముందు చెప్పిన భల్లాతక స్వరసంలాగా ఎనిమిదింతలు తేనెను, నాల్గవపాలు నేతిని చేర్చి, తగిన పరిమాణంలో సేవించాలి (పుట. 37).
భల్లాతక యోగ విశేషాలు పది. అవి- 1, భల్లాతక ఘృతం (జీడి, నేయి), 2. భల్లాతక క్షీరం (జీడిపాలు), 3. భల్లాతక కేంద్రము (జీడి, తేనె), 4. గుడ భల్లాతకము (జీడి, బెల్లం), 5, భల్లాతక యూషము (జీడి,గంజి), 6, భల్లాతక తైలము (జీడి తైలం), 7. భల్లాతక ఫలము, (జీడి, మాంసం- జీడిగింజలను చేర్చి సంస్కరింపదగిన మాంసం),
8.భల్లాతక సక్తువు (జీడి, సత్తుపిండి జీడిగింజలను చేర్చి, సంస్కరింపబగిని సత్తుపిండి). 9. భల్లాతక లవణము (జీడి, లవణం), 10, భల్లాతకతర్పణము (వేపుడు బియ్యపు పిండిని మూకుటిలో వెచ్చ జేయుచు, అందులో నీరు పోసి, ఉడికించిన ముద్ద) పైన చెప్పిన వాటితో వేరువేరుగా సంస్కారం చేయబడినదే భల్లాతకమృతం.
ఆయుర్వేదంలో మిక్కిలి ప్రసిద్ధిపొందిన రెండవ గ్రంథం- సుబ్రత సంహిత, అందులో మూడు విషయాలు- 1. భల్లాతక తైలం కృష్ణకర్మకు లేపనం (పుట 29, 30), 2.భల్లాతక కల్పం (పుట,122), 3. భల్లాతక ధానాలు (పుట 123,124) గురించి చెప్పారు. 5.4. భల్లాతక తైలం (లేపనం) కృష్ణకర్మకు లేపనం: వ్రణం (పుండు), మచ్చలు ఏర్పడినపుడు ‘కృష్ణకర్మ’ను చేయాలి. అందుకు ‘భల్లాతక తైల లేపనం’ చేయాలి.
నల్లజీడిగింజలను ముందుగా ఏడురోజులు గోమూత్రంలో తడిపి, ఎండబెట్టాలి. తరువాత పాలలో నానవేయాలి. బాగుగా నానిన తర్వాత వాటిని తీసి, మధ్యకు రెండు ముక్కలుగా కత్తిరించాలి. వాటి కింది భాగంలో చిన్న రంధ్రాలున్న ఇనుప పాత్రలో పోయాలి. వేరొకమట్టి పాత్రకు లోపల నేతిపూసి ఆరబెట్టాలి. దానిని భూమిలో మెడ వరకు పాతిపెట్టాలి, దాని మూతిమీద జీడిగింజలు పోసిన ఇనుపపాత్ర అడుగుమోపి, నిలబెట్టి, దాని మూతిమీద మూకుడు బోర్లించి, మెత్తాలి. ఆ ఇనుపకుండ చుట్టు పిడకలు పేర్చి (పెట్టి) పుటం వేయాలి. అప్పుడు ఆ జీడిగింజలు చమురు అడుగున ఉన్న మట్టి పాత్రలోనికి దిగుతుంది. దానిని మెల్లెగ తీయాలి. అందులో మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, మొదలైన వాటి డెక్కల గిట్టలను కాల్చి, ఆ మసిని మెత్తగా నూరి కలిపి, తెల్లగా ఉండే కురుపు మచ్చలపైన పూయాలి. దానివల్ల ఆ మచ్చలు నల్లబడి శరీరం సవర్ణమగును, (“కృష్ణకర్మ’కు భల్లాతక తైలం లేపనం, చికిత్సాస్థానం, ప్రథమ అధ్యాయం, పుట 29, 30 6. జానపదులు ప్రాయోగిక జ్ఞానం: పైన చెప్పుకున్న జీడిగింజ జానపదులు నిత్యజీవితంలో ఒక భాగమై, సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఉంది. ఇలా వారికి ‘ఔపయోగిక వస్తువు’గా, జీర్ణాశయవ్యాధులు మొదలైన వాటికి ‘వైద్య దినుసు”గా అనేక విధాలుగా పనికి వస్తున్నది. ఇలాంటి నల్లజీడి గురించి జానపదులు, వైద్యశాస్త్ర గ్రంథాలు ఏమన్నాయో కూడా తెలుసుకున్నాం.
జానపదుల పూర్తిగా ప్రాయోగిక వైద్యం, ప్రాయోగిక జ్ఞానం, వైద్య గ్రంథాలలో చెప్పని అనేక రోగాలకు కూడా ఈ జీడిగింజను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. జీడిగింజలనుండి తైలం తీసే పద్ధతిని జానపదులను చూసి, వైద్యులు నేర్చుకున్నారా?
వైద్యులను చూసి, జానపదులు నేర్చుకున్నారా? అనే సంధిగ్ధావస్థ ఎవరికైనా కలుగుతుంది. ఇప్పటికీ కల్లుగీత కార్మికులు బట్టీ పెట్టి, జీడిగింజలనుండి చమురును తీస్తున్నారు. ఏది ఏమైనా జానపదుల జీవితంలో ‘జీడి’కి ప్రాశస్త్య స్థానమున్న దనేది సుస్పష్టం.
ఆధార గ్రంథాలు:
1 . అగ్నివేశమహర్షికృత చరకసంహిత, పండిత నుదురుపాటి విశ్వనాథ శాస్త్రి (వ్యాఖ్యానం), రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి, ప్రథమముద్రణ, 2010.
2. పండిత మల్లంపల్లి భైరవమూర్తి పంతులు, ధన్వంతరి ఆయుర్వేద గ్రంథము. ఎ.బి.ఎస్. పబ్లిషరు, 4వ ముద్రణ. సంవత్సరం
3. బసవరాజు. బసవరాజీయము. ఎ.బి. ఎఎస్ పబ్లికేషన్స్, రాజమండ్రి, 1998.
4. రామచంద్రరావు, పువ్వాడ, భైషజ్య రత్నాకరం, రోహిణి, పబ్లికేషన్స్, 2016.
5. సుబ్బారాయుడు, యర్రా, వస్తుగుణ దీపిక, ఎ.బి, ఎఎస్ పబ్లిషర్పు, 11వ ముద్రణ. 2010.
6. సుశ్రుతుడు. సుశ్రుత సంహిత, ద్వితీయ ముద్రణ, 2014.
7. సూర్యనారాయణరావు, పువ్వాడ సర్వమూలికా గుణరత్నాకరం, ముద్రణ మోహన్ పబ్లికేషన్స్ 2016
అటువైపు వెళ్లకు తల్లీ!
పురుగూ పుట్రా ఉంటాయి-
అవి నీ నునుపైన చర్మాన్ని ఒరుసుకుని
నీకు తెలీకుండానే నిన్ను కుట్టి
రక్తం తాగుతాయి
బహిర్భూమికైనా
ఎటువైపుకీ వెళ్లకు తల్లీ!
అక్కడ ఆడ వాసన కోసం
నిరంతరం కాచుకున్న తోడేళ్లుంటాయి-
అవి నీ అవయవాల కోసం చొంగ కారుస్తూ
అదును చూసి మీదికి ఉరుకుతాయి
మేకలు మేపుకునేందుకైనా వెళ్లకు తల్లీ!
అక్కడ నీ రక్తం కళ్లజూసేందుకు
సిద్ధంగా ఉన్న పులులుంటాయి
అవి కళ్లల్లో ఆకలి నింపుకుని
నీలాంటి ఒంటరి మేక పిల్ల కోసమే
ఎన్నాళ్లుగానో కాపుకాసి ఉంటాయి
పరపరా చర్మాన్ని గోళ్లతో చీల్చి
కోరపళ్ల కింద యవ్వనాన్ని కరకరా నమిలేస్తాయి
ఎటు వైపుకీ వెళ్లకు తల్లీ!
చుట్టూ మగ మృగాలే ఉన్నాయి
అవి నీ నాలుక తెగ్గోసి
మెడా, నడుం విరిచి
రాక్షస క్రీడలు సల్పుతాయి
పక్కింటికైనా వెళ్లకు తల్లీ!
చివరికి
ఇంట్లో కూడా
జాగరూకతగా ఉండు తల్లీ!
చుట్టూ మగ పశువులున్నాయి
అవి
మావయ్యలు గాను, చిన్నాన్నలు గాను
అన్నయ్యలుగాను, తమ్ముళ్లు గాను
చివరికి
కన్నతండ్రి గాను
నీ పసితనాన్ని చిదిమేస్తాయి
కాపాడుకో తల్లీ
నిన్ను నువ్వు నిరంతరం కాపాడుకో
పురుగుల్నించి, పుట్రల్నించి
తోడేళ్ల నించి, పులుల్నించి
అన్ని వైపులా కాపుగాసిన
మానవమృగాల్నించి
ఇంటా బయటా
కాపాడుకోవడం నేర్చుకో
నిన్ను నువ్వు
కాపాడుకోవడానికే
ఏ విద్యయినా నేర్చుకో
నడుములు విరిచినా
గునపాలతో పొడిచినా
భీకరంగా ఎగిసిపడే సముద్రానివై
ప్రచండ శక్తితో
పెళ పెళా విరిగిపడే ఆకాశానివై
కాపాడుకో-
నాలుక తెగ్గోసినా
నిలువునా చీల్చేసినా
వెయ్యి నాల్కలతో
అంతకంతా
ప్రజ్వలమయ్యే
అగ్నిజ్వాలవై
నిన్ను నువ్వు
నిర్భయంగా కాపాడుకో
