సత్యాహింసలు మూర్తీభవించి ప్రభవించిన వ్యక్తిగా విశ్వమంతటా ఖ్యాతిని పొందిన మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలుఘనంగాజరుపుకుంటున్నాము. అహింసాయుధంతో పోరాడి పరాయి పాలనను అంత మొందించిన జాతీయ వీరుడే కాక విశ్వమంతటా మానవసంబంధాలను అంతర్జాతీయ సహకారాన్ని వ్యాపింప చేసేందుకు శాశ్వత సూత్రాలను ప్రవచించి ప్రతిపాదించినధీరుడు.
గాంధీ గారు సౌతాఫ్రికాలో నల్లజాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు అక్కడి వాడైన డెన్మండ్ టూ టూ అను నతడు మరియు భారతదేశ స్వాతంత్రాన్ని అహింసాయుధంతో సాధించినందుకు యూపీఏ పర్సన్ సోనియాగాంధీ సలహా సూచనతో ఐక్యరాజ్యసమితి 2007 జూన్ 15 నాడు గాంధీ మహాత్ముని పుట్టినరోజైన అక్టోబర్ 2 ను ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్’ డే గా ప్రకటించారు.
మహాత్ము ని మహిమాన్వితమైన వ్యక్తిత్వాన్ని గురించి గానీ, అర్ధ నగ్నంగా ఉండే ఆ యోగిపుంగవుడి శక్తియుక్తుల గురించి గానీ, చారిత్రక దృష్ట్యా గాని, మానవ దృష్ట్యా గాని అంచనా వేయడం అంత సులభం కాదు. ప్రపంచ ప్రజానీకాన్ని ఆకట్టుకున్న ఆ మనీషి వినూత్నమైన, అత్యద్భుతమైన వ్యక్తిత్వాన్ని గురించి నాలుగు మాటలు వ్రాయాలనుకోవడం నైతిక బాధ్యత.
ఒక్కొక్క మహానుభావులు ఒక్కొక్క క్షేత్రము నందు మాత్రమే మార్గదర్శకమై ప్రజలనుద్ధరింతురు. కానీ గాంధీగారుదేశముయొక్కసర్వతోముఖాభ్యుదయమునకై ఆధ్యాత్మిక ,పర్యావరణ , రాజకీయ, సాంఘిక రంగాలలో నిర్విరామంగా కృషి సల్పి అహింసాయుత సత్యాగ్రహ సమరం ద్వారా స్వరాజ్యమునుసంపాదించి ప్రపంచ చరిత్రలో మరెవ్వరూ పొందలేని స్థానాన్ని ఆక్రమించారు.
వీరికి బ్రాహ్మణుని కుండవలసిన బ్రహ్మజ్ఞానము, క్షత్రియుని కుండవలసిన శౌర్య ధైర్యపరాక్రమములు, వైశ్య ధర్మానుసారం గా పారిశ్రామికాభివృద్ధి వంటి వ్యాపారముల ద్వారా ధర్మబద్ధమైన ఆర్థికాభివృద్ధి నాలుగవదైన సేవాపరాయణత తో తన జీవితాన్నే
అంకితం చేసిన మహా పురుషుడు.
బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస, ఆశ్రమ ధర్మాలను నాలుగింటిని పాటించిన పూర్ణ పురుషుడితడు.. చతుర్విధ పురుషార్ధములఅనుష్టించి సాధించుకున్న మహాయోగి.వీరిదృష్టిలోఆధ్యాత్మికమనగానైతికములు. ధర్మ మనగా నీతి. సత్య మనగా స్వతంత్రం.
రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీ ఆశ్రమానికి వెళ్లి నప్పుడు
. ఏషదేవో విశ్వకర్మా మహాత్మా
సదా జనానాం హృదయే సన్నివిష్టః
అను ఉపనిషద్వాక్యాన్ని గాంధీకి అన్వయించి చెప్పి మహాత్మా’ అని సంబోధించినాడట.
స్వాతంత్రం వచ్చాక ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందని వారైన డాక్టర్ బి అంబేద్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, సి.డి.దేష్ముఖ్ లను ప్రభుత్వ యంత్రాంగంలో మంత్రివర్గ సభ్యులుగా చేర్చుకోవాలని దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రతీ పౌరుడి పాత్ర ఉంటుందని, నెహ్రూకు సూచించిన రీతి వీరికి ప్రజాస్వామిక వ్యవస్థ పై ఉన్న ప్రగాఢ విశ్వాసానికొక నిదర్శనం. అహింస స్వేచ్ఛాయుత సహకారం వల్లనే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని వీరి నమ్మకం ఏ ప్రభుత్వము ప్రజా పాలన లో తక్కువ జోక్యం కలిగించుకొనునో అదే శ్రేష్టమైన ప్రభుత్వం అనికూడా వీరి అభిప్రాయం.
ఇండియాలో మహత్తరశక్తి గాంధీయే అని న్యూఢిల్లీలో వైస్రాయి లిన్ లిత్ గో ప్రభువు ఒక పత్రికా విలేఖరితో అన్నాడట.
1924 సెప్టెంబర్ లో శ్రద్దానందస్వామిఢిల్లీప్రాంతంలో లేవదీసిన శుద్ధి ఉద్యమం ఫలితంగా హిందూ ముస్లింల మధ్య జరిగిన కలహాన్ని నిరసిస్తూ వారి ఐక్యత నే తన జీవితంలో ప్రధాన ఉద్దేశ్యమని అది ఫలించినప్పుడు మానవుడికి ఉండే 120 సంవత్సరాల ఆయువు తో తాను బ్రతక గలనని, లేనిచో నిరాహార దీక్షకు ఉపక్రమింతునని చెప్పడం వీరి మత సహనానికి ఉదాహరణ.
దేశ స్వాతంత్ర ప్రకటనతో దేశమంతా జయ జయ ధ్వనులతో వేలకంఠాలు మారు మ్రోగుతున్న చారిత్రాత్మక సంఘటన తో ఢిల్లీలోఎర్రకోటపై జాతీయ పతాకం రెపరెపలాడుతున్న తరుణంలో బెంగాల్ లో జరుగుతున్న హిందూ ముస్లింల అల్లర్లను అణచటానికి ఉపవాసదీక్ష అనే అస్త్రంతో అక్కడే ఉండి తను ఆశించింది ఒక్క రాజకీయ స్వాతంత్రం మాత్రమే కాదని సర్వమత ఐక్యత అన్నిటికంటే ముఖ్యమని ఈ మత కక్షల వల్ల తన మనస్సు పాడై నిరాశగాఉన్నదని,ప్రాణం పోయే వరకు ఉపవాసం చేస్తాననిహిందూ-ముస్లింల అంతరాత్మలను హెచ్చరిస్తూ ప్రకటించాడు. దీనితో గాంధీకి ఏమవుతుందోనన్న భయంతో ఇరు మతాలు శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేశారు.
ప్రపంచంలో అణుబాంబు నాశనం చేయనిది ఏదైనా ఉందంటే అదే అహింస అని గాంధీజీ ప్రకటించారు. అంతేకాక అహింసా ఆయుధాగారంలో నిరాహార దీక్ష ఆఖరి అస్త్రంగా తలచాడు.
పాకిస్తాన్ నుండి ఇండియాకు బాకీ ఉన్న ఒక పద్దు లోని మొత్తాన్ని రాపట్టుకునేందుకు గాను ఇండియా ప్రభుత్వం తాను పాకిస్థాన్ కి ఇవ్వవలసిన 55 కోట్ల రూపాయలను ఇచ్చుటకు ఆలస్యం చేసినప్పుడు గాంధీజీ మాటపై ఆ మొత్తం వెంటనే వారికి జమకట్టి వేశారు. ఇది వారి నైతికతకు ఒక చక్కని ఉదాహరణ
భారత నాగరికత వ్యవసాయిక నాగరికత అని ప్రపంచమునకు అన్నము కల్పించు వ్యవసాయకుడు సంఘమునకు మూలవిరాట్టుగా తలచెను.
లెక్కకు మించిన ఉత్పత్తికి బదులు లెక్కకు మించిన శ్రామికుల ద్వారా ఉత్పత్తిని కోరే గాంధీ గారు యంత్రీకరణ కు వ్యతిరేకులు కారు కానీ యంత్రాల ఎడ ఉన్మాద ప్రేమను, విచక్షణారహిత యంత్ర వృద్ధిని వ్యతిరేకించారు తప్ప ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వ్యతిరేకించలేదు.
వీరి దృష్టిలో స్త్రీలకు అత్యంత గౌరవ స్థానం ఉండేది అన్ని రంగాలలో స్త్రీలు ముందంజ వేయాలని, స్త్రీల పట్ల వివక్ష కూడదని నొక్కివక్కాణించారు.
వీరు అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డాక్టర్ బి అంబేద్కర్ తో సమానంగా దాని నిర్మూలనకై జీవితాంతం కృషి చేశారు. దేవుని మనుషులు గా పిలవబడే వారే హరిజనులని నామకరణం చేస్తూ వారే దేవుని ప్రేమకు పాత్రులని సాంఘిక అసమానతలకు కనువిప్పు కలిగించారు.
స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు గాని, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నపుడుగానీ, ఆశ్రమంలో ఉన్నప్పుడు గానీ ఎవరుతన అభిప్రాయాలను తిరస్కరించినా , గౌరవించినా మహాత్ముడు ఓర్పుతో విని అవసరమైన సలహాలను తీసుకునేవాడు.
ముస్లిం పక్షపాతిగా గాంధీని తలచి హిందూ మతోన్మాది ఆ మహాత్మను పేల్చివేసి విశ్వాత్మ లో లీనం చేశారు. భిన్న మతాల సామరస్యానికి జీవితమంతా కృషిచేసి, ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్’ అని ప్రతి రోజు ప్రార్థించే అతని నోట ‘ హే రామ్’ ”హేరామ్’ అనే మాట చివరిదైంది.
వారు జీవితాంతం ఏ ఆశయాల కోసం పోరాడారో అవన్నీ ఈనాడు భూస్థాపితం అయిపోయి మామూలుగా ప్రతి ఏడాది అక్టోబర్ 2న జరిగే సభలో ఉపన్యాసాలు సమావేశాలు ఆయన పటానికి బూజు దులిపి పూల దండల అలంకరణ యధావిధిగా జరుగుతున్నది. రాను రాను కొత్త తరాలకు గాంధీ అనే పేరు మాత్రమే తెలిసి గాంధీజయంతి ఉత్సవాలు ఒక విగ్రహారాధన ప్రక్రియగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది.
గాంధీ గారి స్మారక చిహ్నాలు అనేక చోట్ల ఉన్నాయి. విజయవాడలో ఒక కొండకు గాంధీ పర్వతం అని పేరు. భూతలం మీదనే కాక ఆకాశంలో కూడా ఆయన పేరుతో గాంధీ నక్షత్రమని నామకరణం చేయాలని ఆలోచన ఉంది . కానీ గాంధీ గారు భౌతికంగా ఉన్నప్పుడే ఆయనను వ్యక్తిగతంగా కీర్తించడం. భజన చేయడం, పొగడడం ఏవగించుకునే వాడు. కేవలం తన ఆశయాలను. నైతికతను, అహింసా వాదాన్ని గౌరవిస్తూ అవి పాటించాలని కోరేవారు.
కాని పైన చెప్పబడిన వారి ఆశయాలన్నీ మృగ్యమై నేటి సమాజంలో కేవలం పదవి, ధనానికే పట్టాభిషేకం జరుగుతూ, రోజురోజుకు ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోతూ, మతకల్లోలాలు మారణహోమా లవుతూ మానవ ప్రకృతి రోజురోజుకు సంకుచితమై, స్వార్థంతో నీచమైఈపోతున్న ఈ తరుణంలో ఈ పరిస్థితులను ప్రక్షాళన చేయాలంటే గాంధేయవాదులు ఇంకా విస్తారంగా గాంధేయ సిద్ధాంతాల ఆశయాల సాహిత్యాన్ని లోకానికి సమర్పించాలి.
గాంధీ జన్మించి 150 సంవత్సరాల తర్వాత కూడా నేటి సమాజానికి యువతకు దేశానికి వారి ప్రబోధాలు అవసరం ఉంది. అంతేగాని ఆయన బోధనలకు తిలోదకాలు ఇస్తూ ఆయనను కరెన్సీ నోట్లపైఒక బొమ్మ గా, రాయిగా చివరకు నక్షత్రంగా మార్చాలి అనుకోవడం అవివేకం.
ఇంత మహనీయుడు అయిన వ్యక్తిఈనేలపైనడిచాడా!” అని భావి తరాల వారు విస్తు పోతారని ఇంకా వేల సంవత్సరాలు అయినా అటువంటి వ్యక్తి ఉండడని ప్రపంచప్రఖ్యాతసైంటిస్ట్ఐన్ స్టీన్ అన్నట్టుఆయనతరతరాలమానవఔన్నత్యానికైబోధించినవిలువలు ,నైతికధర్మాలుమననంచేసుకుంటూప్రభావితులమవుతూ, భావితరాల వారికి
దసరా సెలవుల ముందురోజు పూల వనంలా మారింది బడి. బతుకమ్మ లోని రంగు రంగుల పూలకు సాటిగా రంగు రంగుల బట్టల్లో పువ్వుల్లా కేరింతలు కొట్టే చిన్నారులతో ప్రతీ ఏడాది దసరా సెలవుల ముందు రోజు బతుకమ్మ సందడి సంతరించు కుంటుంది తెలంగాణ బడులల్లో.
కాలంతో పాటు ప్రయాణించాలి కాబట్టి కాలానికనుగుణంగా కట్టూ బొట్టుకు అలవాటు పడిన పిల్లలు చక్కని పరికిణీలు కట్టుకొని వాలుజడలు, వాటి చుట్టూరా పూల దండలు, పాపిట బిళ్ళ లు – చంపసరాలు , వడ్డాణాలు – వంకీలు, గాజులు – గజ్జెలు, కాటుకలు – గోరింటాకు భారతీయ వస్త్రధారణలో ధగ ధగా మెరిసిపోతూ బతుకమ్మలు పట్టుకున్న అమ్మాయిలను కళ్ళనిండుగా చూస్తూ ఉంటే కళ్ళకింపుగా ఉంటుంది.
ప్రతి దానికీ తీన్ మార్ డాన్సులు మాత్రమే తెలిసిన మగపిల్లలు కోలాటం కర్రలు పట్టుకుని పాటలకనుగుణంగా పదం కలపడం భారతీయ సంస్కృతిక వైభవాన్ని గుర్తుచేస్తోంది. పాశ్చాత్య పోకడలు ఎన్ని పెరిగినా భారతీయత మాత్రం లోపల అలాగే భద్రంగా ఉంది అనే సంతోషాన్ని , భరోసాను నింపుతోంది. విద్యాలయాల్లో జరిగే ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను పరిచయం చేస్తాయి. మూలాలు మరువకుండా చూస్తాయి.
ఎప్పటిలానే సరిగా అర్థం కాని తీన్ మార్ పాటలు కాకుండా మంచి భావం, సందేశం గల సాహిత్యంతో అచ్చతెలుగు పాటల వల్ల ఈ తరం పిల్లలకు తెలుగు పదాలు పరిచయం అవుతున్నాయి. జస్టిన్ బీబర్, షకీరా పాటలే కాదూ అచ్చతెలుగు పాటలూ అంతే ఉత్సాహాన్ని ఊపునూ ఇస్తాయని పిల్లలకు తెలిసేలా నిరూపిస్తున్నాయి బతుకమ్మ పాటలు.
తెలంగాణ రాష్ట్ర పండగగా గౌరవం దక్కిన తర్వాత కాలం నుండి ఇప్పటి తరానికి అర్థమయ్యే భాషలో చాలా చాలా బతుకమ్మ పాటలు రాయబడుతున్నాయి, ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా ప్రత్యేకంగా బాణీలు కట్టబడుతున్నాయి. అయితే వెనుకటి నుండి కూడా ప్రాచుర్యంలో ఉన్న పాటలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…, ఒక్కొక్క పువ్వేసి సందమామ…, రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీ రామ ఉయ్యాలో…ఇలాంటి పాటల్లో ప్రజల జీవన విధానం ప్రతిబింబించేలా సుఖ దుఃఖాలు కలగలిసిన బతుకులు అగుబడేలా పాటలు ప్రాచుర్యంలో ఉన్నవి.
నిజానికి తెలంగాణ ఏర్పడక ముందు వరకు ఉత్తర తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న బతుకమ్మ పండుగ దక్షిణ తెలంగాణ లోని పాలమూరు జిల్లాలో తెలియదు. ఎక్కడా బతుకమ్మ ఆడే వారు కాదు కానీ ఏరొంక పున్నమి, పీర్ల పండుగలప్పుడు పిల్లలను అమ్మవార్లుగా భావించి మధ్యలో కూచోబెట్టి చుట్టూరా చేరి పాటలు పాడుతూ బొడ్డెమ్మ వేసే వారు. తెలంగాణా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి, సభ్యత చాటిచెప్పే వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ పండగ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం ఉద్యమనాయకుల ఆదేశం అయ్యిందీ ఇప్పుడదే ఆనవాయితీ అయ్యిందీ.
తెలంగాణ ఏర్పడ్డాక దీనికి రాష్ట్ర పండగ గా గౌరవం కల్పించబడింది. అప్పటినుంచి తెలంగాణా ప్రభుత్వం ఈ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తప్పని సరిగా బతుకమ్మ నిర్వహించేలా ఆదేశాలు చేసింది. ప్రజలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు,కార్యాలయాలు బతుకమ్మను నిర్వహించడానికిగాను అనేక వేదికలు ఏర్పాటు చేసి, పూవులు,విద్యుత్ వెలుగులు, పాటల కోసం మైకులు సమకూర్చి వేడుక చేసుకునేలా సౌలభ్యం కల్పిస్తోంది.
భారతీయులు ప్రాణి కోటి మనుగడకి కారణం అయిన ప్రతి దానినీ అంటే విశ్వంలోని సూర్యచంద్రులు, గ్రహాలు నక్షత్రాలు, గాలి, నీరు, నిప్పు, నేల, రాయి రప్ప, చెట్టు,పుట్ట , కొండ, గుట్ట, పాము,పక్షీ, జంతువు, కాలం, ఇలా ప్రతీది చివరికి జీవనానికి ఉపయోగపడే వస్తువులను కూడా కృతజ్ఞతా భావంతో దేవతల రూపంలో కొలుస్తారు. సామూహికంగా పండగలు, పర్వదినాలు చేస్తారు. భారతీయ పండుగలలో ప్రతి పండగకి ఓ పరమార్థం ఉంటుంది. ప్రతి ఉత్సవానికి ఓ కథ ఉంటుందీ. కాల గమనంలో ఉత్సవాల వెనక కథలు మారుతూ కొత్తవి చేరుతూ పోతున్నా ఉత్సవాల ఉద్దేశం మాత్రం అంతర్లీనంగా అదే ఉంటుంది.
ఇక బతుకమ్మ పండుగ విషయంలో రకరకాల కథలు కథనాలు ప్రచారంలో ఉన్నా జీవులకు మనుగడకి కారణం అయిన ప్రకృతిని గౌరీదేవి పేరుతో కొలుస్తూ ఆమెకు ప్రతిరూపంగా సహజ సంజీవని రోగ నివారణి అయిన పసుపు ముద్దను చేసి ఆ ప్రతిమ చుట్టూరా అందుబాటులో ఉన్న పూలను అలంకరించి అందరూ చుట్టూ చేరి పాటలు పాడుతూ ప్రాణులకు బతుకునిచ్చే దేవతగా బతుకమ్మ పేరుతో కొలుస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరాదరణకు గురి అయి అంత పెద్దగా జరుపుకోని ఈ బతుకమ్మ పండుగ ఈ నాడు ప్రత్యేక తెలంగాణకు ప్రత్యేక పండగ. రాష్ట్ర అవతరణ తరవాత రాష్ట్రం లోని ఊరు – ఊరు, వాడ – వాడా చేరింది. రాష్ట్ర హద్దులు దాటి, దేశ ఎల్లలు దాటి వెళ్లింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పూల పండగను ఘనంగా, ఇంత కళగా పుష్కలంగా పువ్వులతో జరుపుకోవడంతో ప్రజలకు వేడుకే కాదు ఆ పువ్వులు పండించే రైతుల మొహాల్లో కూడా నవ్వులు విరుస్తున్నాయి. బతుకమ్మ పుణ్యమా అని పూలు రైతులకు బతుకుదెరువు పెరిగింది. పూల వ్యాపారలకు లాభాలు పెరిగాయి తద్వారా ఆర్థిక మార్పిడి పెరిగింది. అలాగే బతుకమ్మ పాటల రూప కల్పన లో కవులకు , కళాకారులకి, గాయకులకు, సాంకేతిక నిపుణులకు చేతినిండా అవకాశాలు, పని పెరిగినాయి.
పిల్లలు పెద్దలు సంతోషంతో పాటు ఆనంద డోలికల్లో ఊగే సంబరం బతుకమ్మ.
ఆడ మగ తేడా లేకుండా పెద్దలే పిల్లలై, పిల్లలతో కలిసి బతుకమ్మ ఆటలో లీనమై బాధ్యతలు, వత్తిడులు , సాధక బాధకాలు మరచి, ఈగోలు, స్థాయిలు, పట్టింపులు పక్కకు పెట్టి కాసేపు సంతోషంగా ఆనందంగా గడపటం ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించింది. బాల్యాన్ని గుర్తు చేసింది. ఏడాదికోమారు వచ్చే ఈ సంబరం మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యంగా కూడా పెంచుతుంది…
మనస్పర్థలు మరిపించే ఇలాంటి చక్కటి సంబరాన్ని కార్యాలయాల్లో ప్రవేశ పెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
శుష్క ప్రాంతం, గుట్టల ప్రాంతమైన తెలంగాణలో బంజరు భూములలో మొలిచే ఔషద మొక్కలు తంగేడు, గునుగు, పోక పూలు, పట్టుకుచ్చు పూలు, ఉప్పు పూలను శంఖు ఆకారంలో పేర్చి విశ్వ గతికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఎంచి ప్రకృతి ఆరాధన చేసే ఈ పూల పండుగ ప్రకృతి స్వభావాన్ని, ఔషద గుణాన్ని, ప్రకృతి విలువను చెబుతుంది, ప్రకృతి పట్ల మనిషి భాధ్యత తెలుపుతుంది. పర్యావరణ హితకారిగా ఉంది.
https://drive.google.com/file/d/1Ivv499DrppiHHK1DDgU0nEnVsbqNAYdK/view?usp=sharing
బ్రతుకు అర్ధం తెలియచేసేదే మానవత్వమే
మానసనిశీధి రెప్పలపై కాంతిరేఖ
మానవత్వమే
గుండెలోని అలజడులు కాలం చేసే గాయాలు
రుధిరపు మడుగుల ప్రళయంతో చితిని పేర్చవద్దురా
మనసులోని నిరాశకు ఆత్మీయతే
రేపటి పొద్దు
గగనపు దేవుడి రూపుకు పసిడే
అలంకారం కాదు
మనసే మాధవుడైతే మానవత్వమే వేదమంత్ర మవుతుంది.
పులకించే పూలగాలిలో శుభోదయం
మానవత్వ పరిమళమే మహోదయమై మహిని మురిపించే
సరిగమల పాట మానవత్వం.
ఋతువుల్లో మధువంతా
అనురాగపు మాటలవ్వాలిరా
మమతా సమతలతో మనసుబంధం పెనవేయాలు
కులమతాల కుమ్ములాటలు
రంగుల లోకపు భాగోతాలు
అనుబంధపు ప్రేమలే నింగి దేవుడి వాకిళ్ళు
చెలిమిని పంచేటి మానవత్వమే నిర్మల మానసం
మానవత్వమే మనిషిని మాధవుణ్ణి చేసే
నిత్య సత్యమైన అలంకారం.
“ఉప్పెన” సినిమా కోసం “శ్రీమణి” రాసిన
“నీ కన్ను నీలి సముద్రం “.. ఈ ప్రేమ పాట వింటే ..
మనసు పరవశిస్తుంది.. పలవరిస్తుంది..
ప్రేయసికై పరుగులు తీస్తుంది..
అలతి అలతి పదాలతో.. ప్రేమకు ప్రేమను అద్ది
హృద్యంగా ఆవిష్కరించిన తీరు..
ఈ పాటను పదేపదే వినేలా చేసింది.
చిలిపితనం.. కుర్రతనం.. కలగలిపి,
ప్రేమ పాటలలో.. పదికాలాల పాటు నిలిచేలా
ఈ పాటను తీర్చిదిద్దారు.
“నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం..” అంటూ
పల్లవిలోనే అదరగొట్టేశారు.
ప్రేయసి కన్నులను నీలి సముద్రం చేసి
ప్రేమికుడి మనసుని పడవ ప్రయాణం
చేయించారు కవి..
నీలాల కన్నులు అందానికి ప్రతిరూపమే కాదు..
వేలవేల భావాలను పసిగట్టేవి.. పలికించేవి..
నిగూఢతకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచేవి.
అలాంటి కన్నులను నీలి సంద్రం చేసి..
ప్రేమలోని గాఢతను తెలియజేశారు శ్రీమణి
ముత్యం స్వచ్చతకు ప్రతిరూపం..
మరి.. ప్రేయసి పెదాలపై విచ్చుకున్న ఆ స్వచ్చమైన నవ్వు
ప్రేమికుడిలోని కష్టాలను దాచేసి.. దాటివేసి
తీరానికి లాగేటి దారమే కదా..!
“నల్లనైన ముంగురులే
అల్లరేదో రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే ..”
ముసురుకున్న ప్రేయసి ముంగురులు అల్లరేదో రేపి..
ఇంకో లోకాన్ని లేకుండా కప్పాయి అంటూ.. కొంటేతనాన్ని కవిత్వికరించిన శ్రీమణి..
“ఘల్లుమంటే నీ గాజులే
జల్లుమంది నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులా ప్రేమే ..”
ప్రేయసి గాజుల గలగలలు గల్లుమంటుంటే..
ప్రియుడి ప్రాణం జల్లుమనకుండ ఉంటుందా..?
వానాజల్లుల అల్లుకుంటుంది.. అలరిస్తుంది ..
అని
చిలిపి తనాన్ని చమత్కరించారు..
అంత్య ప్రాసలతో ఆకట్టుకున్నారు..
“చిన్ని ఇసుక గూడు కట్టినా
నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ..”
ప్రేమలో నాకే దక్కాలి అనే స్వార్థం ఉంటుంది..
ఆ స్వార్థంలో పసితనంలోని నిష్కల్మశం దాగి ఉంటుంది..
అందుకేనేమో కవి మనలను తిరిగి
పసివాల్లను చేశారు..
ఇసుక గూడు చేసుకుని పేరు రాసి పెట్టడం..
ఎంత హృద్యమైన భావన.. మరెంత గొప్ప వర్ణన..!
ఆ పేరును చేరిపెటి కెరటాలు పుట్టలేదని
తన ప్రేమను ఉన్నతీకరించాడు..
“ఆ గోరువంక పక్కన
రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంటా నువ్వుంటే నా పక్కన..”
ఏ జంటనైనా ఒకరికి ఒకరులా ఉంటే
చిలుక గోరువంకలా ఉన్నారు.. అని అంటాము.
అంతకన్నా చక్కని జంట తమదని చెప్పడం
కవి దార్శనికతకు… ఆదర్శ జంటని చెప్పటానికి
అద్దం పడుతుంది.
“అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ
చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమనీ..”
పాటకే హైలైట్ ఈ వర్డ్స్ ..
శ్రీమణి ఈ పాట రాయడానికి నిజంగానే
కొత్త కొత్త మాటలని అప్పు అడిగే ఉంటారు..
నవ్యత కు.. సృజనకు తన పాటలతో
ప్రాణం పోయడానికి నిత్యం తపన పడే శ్రీమణి
కవి హృదయానికి ఈ చరణం తార్కాణం అని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఒక సినిమా పాట రాసేటప్పుడు..
సాహిత్యం రాయాలంటే..గీత రచయిత కు
మంచి సన్నివేశం.. సందర్భం దొరకాలి..
ఆ రెండు దొరికాయేమో రచయితకు
విజృభించాడు..
కమర్షియాలిటీ కూడా ఆలోచించి
టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వాలి
అనుకున్నారేమో శ్రీమణి..
“నీ అందమెంత ఉప్పెన
నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా”.. అంటూ
“ఉప్పెన” టైటిల్ ని ఉదాహరిస్తూ
సాహిత్యానికి భంగం కలగకుండా
తెలివిగా.. చక్కగా రాసారు..
యవ్వనంలో ఆకర్షణ .. అందం ..
యువతి యువకులకు ..
చాలా పసందుగా ఆనిపిస్తాయి ..
అందుకే..
ఉప్పెనెలా అందం చప్పున ముంచేసిందని
ప్రియుడు మునిగి తేలుతున్న వైనాన్ని..
ప్రేయసి ప్రాయపు పొంగులను..
ఆకర్షణను ఆరబోసారు.. కవి శ్రీమణి..
“చుట్టూ ఎంత చప్పుడొచ్చినా
నీ సవ్వడేదో చెప్పనా
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా..”
ప్రేమికుడు ఏకాంతంగా ఉన్నా.. ఎందరిలో ఉన్నా
తన ప్రేయసి సవ్వడిని పసిగట్టగలడు..
ఎంత దాచేసినా..దాయాలని చూసినా
జల్లేడేసి మరీ పట్టుకోగలడు..
శ్రీమణి సాహిత్యంలో కొత్త పోకడలను స్పృశించారు..
“జల్లడేసి” అనే ఆర్డినరీ పదాన్ని చాలా అద్భుతంగా
ఒదిగి పోయేలా రాశారు .. ఇది కవి నేర్పుని సూచిస్తుంది.
ఇలా.. పద ప్రయోగాలు చేస్తూ
ప్రేమ పాటకు జీవం పోయడం
రచయితకు ఆత్మ తృప్తిని ఇస్తుంది..
గీత రచయితగా కీర్తిని తెస్తుంది..
ఈ రెండూ చక్కగా నిర్వర్తించిన
శ్రీమణి అభినందనీయులు..
“నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని..’
అబ్బాయిలు అమ్మాయిలకు వల వేస్తారు..
కానీ..
ఇక్కడ అబ్బాయే అమ్మాయి ప్రేమ వలలో చిక్కుకుని
చేపలా విలవిలలాడుతున్నాడు..
నిజమే కాబోలు..
ప్రేయసి ఊహలను ఊపిరిగా
ఆమె ఊపిరినే ప్రాణంగా
బతుకుతున్న పిచ్చోడు కదా..!
సినిమా పాటలలో.. ప్రేమ పాటలకు
విస్తృతి, పరిధి చాలా ఎక్కువ..
కమర్షియాలిటీ మిస్సవ్వకుండా.. చక్కని సాహిత్యాన్ని అందించి.. కవిత్వాన్ని సూత్రీకరించి..
తన కలానికి ఉన్న పదును
మరోసారి తెలియజేశారు శ్రీమణి.
“శ్రీమణి.. ది బెస్ట్” అనేలా..
సాహిత్యాన్ని అందించిన ఈ పాట
ప్రేమికుల హృదిలో..
తెలుగు భాషాభిమానుల మదిలో..
“ఓ.. మంచి హిట్ పాటగా నిలిచిపోతుంది..
రచయిత్రి పరిచయం:
అర్థశతాబ్దంపాటు నిరంతసాహితీ సృజన చేసిన ఇల్లిందల సరస్వతీదేవి తెలుగుకథాసాహిత్యానికి ఒక ‘స్వర్ణకమలం‘. తన 35వ ఏట రచనను ప్రారంభించినప్పటికి రెండువందలకు పైగా కథలు, పదమూడు నవలలు, పెద్దకథలు, పిల్లలకథలు, పతిక్రల్లో వ్యాసాలు ఇట్లా బహుముఖీనమైన కృషిచేసిన సాహిత్యమహిళాశిరోమణి. స్వర్ణకమలాలు కథాసంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు రావడమన్నది సరస్వతీదేవి రచనా ప్రతిభకు వచ్చిన గుర్తింపు. అంతేకాకుండా సాహిత్యం, సంఘసేవ రెండుకండ్లుగా భావించి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో నిలిచిన విదుషీమణి.
ఇల్లిందల సరస్వతిదేవిగారు 1918లో పశ్చిమగోదావరి జిల్లా సరసాపురంలో ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టారు. తండ్రి కామరాజు వెంకటప్పయ్య ఉద్యోగరిత్యా అనేక
ఊర్లు తిరగవలసివచ్చింది. తల్లి బాల్యంలో మరణించడవల్ల సరస్వతీదేవి తన పెద్దతల్లి ఆలనపాలనలో పెరగవలసి వచ్చింది. వీరిది కుటుంబం విద్యావంతుల కుటుంబం. అదే బాటలో నడిచిన సరస్వతిదేవి ఎంతో ఆసక్తితో చదువుకున్నారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చిన్నవయసులో పెండ్లిళ్లు చేసేవారు. చదువుకుంటున్న వయసులోనే సరస్వతీదేవి వివాహం జరిగింది.
సరస్వతీదేవి గారి మెట్టినిల్లు తెలంగాణ ప్రాంతం. భర్త ఇల్లిందల సీతారామారావు ఉస్మానియా విశ్వవిద్యాలయ రసాయన విభాగంలో రీడర్ గా పనిచేశారు. భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సరస్వతీదేవి చదవడం మానలేదు. శ్రీకృష్ణదేవరాయ భాషానిలయం నుండి అనేక గ్రంథాలను, పత్రికలను తెప్పించుకొని చదివేవారు. ఆమె పఠనాశక్తిని గమనించిన భర్తకూడా అందుకు ప్రోత్సహించారు. ఆమె నిరంతర అధ్యయనం తరువాతి రోజుల్లో ఒక సాహితీమూర్తిగా ఎదగడానికి బలమైన పునాది అని చెప్పవచ్చు.
1982లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న స్వర్ణకమలాలు కథాసంపుటి 1981లో ప్రచురించబడింది. అంతకుముందు వెలువరించిన ‘పండుగ బహుమానం’, ‘అక్కరకు వచ్చిన చుట్టము’, ‘ముత్యాల మనసు’ అనే మూడు కథాసంపుటలలోని నలభైరెండు కథలకు అధనంగా యాభైఎనిమిది కథలను చేర్చి వందకథలతో, పదకొండువందల ఏడు పేజీలతో ‘స్వర్ణకమలాలు’ కథాసంపుటి వెలువరించి కథాసాహిత్యంలో చెరగని ముద్రను వేశారు. రచయిత్రి వెలువరించిన తరువాతి కథాసంపుటి ‘తులసీ దళాలు’ నూట ఎనిమిది కథలతో ప్రచురించబడింది. వీరు రాసిన కథలన్ని ఆండియా రేడియోలో, భారతి, శోభ, స్రవంతి, ఆంధ్రభూమి, వనిత, యువ, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, అనామిక పత్రికలలో ప్రచురించబడ్డాయి.
స్వర్ణకమలాలు- వస్తువైవిధ్యం:
‘నిగూఢభీజ స్థితినుండి వెలికి వచ్చిన విషయాంకురం కథావస్తువు’ అన్నారు పోరంకి దక్షిణామూర్తి. నిత్యం మనం చూసే సంఘటనలు, పొందే అనుభూతులు, జరిగేవింతలు, సామాజిక అంశాలు, రాజకీయ పరిణామాలు, నాగరికపు హంగులు రచయిత దృష్టిలో పడగానే కథావస్తువులుగా మారుతాయి. జీవితాన్ని, సమాజాన్ని నిశితంగా పరిశీలించి ఆకట్టుకునే శైలిలో, అనుభూతి ఐక్యతతో ఇల్లిందల సరస్వతిదేవి కథలను రాసి జీవితకళాఖండాలుగా మలిచారని చెప్పవచ్చు.
కుటుంబ వ్యవస్థ:
వ్యక్తి, కుటుంబం, సమాజం పరస్పర సహాయసహకారాలతో కాలమనుగడ సాగుతుంది. భారతీయ వ్యవస్థలో కుటుంబం అత్యంత కీలకమైనది. వ్యక్తి యొక్క జీవనవిధానం, సంస్కృతి, ప్రేమ ఆప్యాతలు, బంధాలు ఇవ్వన్ని కుటుంబంవలనే సాధ్యమౌతాయి. రచయిత్రి కలంపట్టేనాటికి ఉమ్మడి కుటుంబవ్యవస్థ ఉండేది. రానురాను సమాజంలో చిన్నకుటుంబాలు పెరుగుతూవచ్చాయి. ఇల్లిందల సరస్వతిదేవి ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలలో మంచిచెడులను కథావస్తువులుగా స్వీకరించారు. ఆర్థికోణంతో చూసినప్పుడు ధనిక, మధ్యతరగతి, పేదకుటుంబాలుగా విభజించిచూడవచ్చు. సరస్వతీదేవి కథలు కుటుంబజీవన తాత్త్వికతను చెప్తూనే ధనిక, పేదవర్గాల మధ్య ఉన్న ఆర్థి సంబంధాలను కూడా తెలియజేస్తాయి. ‘బలియసీ కేవలమీశ్వరాజ్ఞ’, ‘కొండమల్లెలు’, ‘పండుగచీర’, ‘పితృహృదయం’, ‘అసమర్ధుడు’, ‘బహుమానం’, ‘సహోదరులు’, ‘ముత్యాల మనసు’, ‘తండ్రిపోలిక’, ‘వేమూరివారి కోడలు’, ‘అడ్డుతెరలు’, ఎదిగిన కొడుకు’, ‘
తల్లి మనసు‘ మొదలైన కథల్లో వివిధ బంధాల, అనుబంధాల గాఢతలు, చేదు అనుభవాలు చిత్రించబడ్డాయి.
స్వర్ణకమలాలు కథాసంపుటిలో మొదటికథ కొండమల్లెలు. ఈ కథ డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠంగా కూడా ఉంది. ఇందులో శివనాథం, గురవడు రెండు ప్రధాన పాత్రలు. “శివనాథం తక్కువ జీతాల తెగలోవాడు. కలిగిన దాంట్లోనే జీవితానికి కావలసిన నాలుగు అమర్చుకోవాలనుకుంటాడు. అతడికేదయినా లేదు, చాలదనుకోవటానికే అసహ్యము. శకుంతల దీనికి సరిగ్గా వ్యతిరేకము” భార్యకోరికలు తీర్చే ఆర్థికస్తోమత అతడికి లేదు. అందుకని అతడి జీవితాన్ని ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతుంది. అందుకని శివనాథం ఆఫీసునుండి గంటముందు బయలుదేరి ఏటిగట్టువెళ్ళి ఇసుక తిన్నెల్లో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఆ నీటి ప్రవాహచప్పుడును వింటూ ఏకాంతంగా కూనిరాగాలు పాడుకొని రావటం అలవాటుగా మార్చుకున్నాడు. శివనాథం, శకుంతల మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యభర్తలు. ఈ కథలో రచయిత్రి సమాంతరంగా గురువడు, పోచాలు పాత్రలను చిత్రించి కుటుంబంలో భార్యభర్తల మధ్య ఉండవలసిన సర్దుబాటును తెలియజేశారు. గురువడు, పోచాలు కూలీనాలీ చేసుకొని బతికే పేదకుటుంబం. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికి, గురువడు ఒకానొక సందర్భంలో అస్వస్థతకు గురైన సందర్భంలో భార్య పోచాలు కూలీపనికి వెళ్ళిసంసారం నెట్టుకొస్తుంది. కానీ భార్యభర్తల మధ్య అనురాగం తగ్గలేదన్న విషయాన్ని సాక్షీభూతంగా గురువడు, పోచాలు పాత్రలు ప్రవర్తిస్తాయి. శివనాథం జీవితంలోని అసంతృప్తిని పోగొట్టుకోవడానికి, గురువడి జంటను చూసి ఆనందపడతాడు. రచయిత్రి పాఠకుడిని ఒక సద్భావనవైపు తీసుకెళ్ళడానికి ఈ పాత్రలు ఎంతగానో తోడ్పడుతాయి. దంపతులు ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదో అన్న విషయాన్ని స్పురణకు తెస్తాయి. ఈ కథలో మధ్యతరగతి, పేద ప్రాతినిధ్య పాత్రలను చూపిస్తూ డబ్బుకంటే ప్రేమగొప్పదన్న జీవనతాత్త్వికతను చిత్రించి సఫలీకృతులయ్యారు రచయిత్రి.
1958లో ‘భారతి’ పత్రికలో అచ్చయిన కథ ‘బలీయసీ కేవలమీశ్వరాజ్ఞ’. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి రెండు సంవత్సరాలైంది. తెలంగాణ ప్రాంతంలో జమీందారి వ్యవస్థ మూలాలు బలంగా ఉండటంతో ధనిక, పేదవర్గాలు మాత్రమే ఉన్నాయి. మధ్యతరగతి చాలా ఆలస్యంగా ఏర్పడింది. ధనికవర్గానికి చెందిన జమీందారిణి కథలోని ప్రధాన పాత్ర. ఆర్థిక సంబంధ విషయాలలో ఏ లోటు లేదు. ఇంటినిండా పనివాళ్ళు కాబట్టి హోదాలో జీవిస్తున్న జమీందారిణికి ప్రేమానురాగాల విలువ పెద్దగా తెలియకుండానే జీవితం గడిచిపోయింది. యజమాని అయిన భర్తకు బాగాలేక ఎండాకాలం శీతల ప్రదేశాలకు వెళ్ళే ప్రయాణం ఆగిపోయింది. ఇల్లుచల్లగా ఉండటానికి భవనం చుట్టుతడకలు వేయించే పనిలో భాగంగా పరిచయమైన దంపతుల పాత్రలు చెల్లమ్మ, రామయ్యలు. ఇద్దరు కలిసిమెలసి పనిని ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. జమీందారిణికి వాళ్ళను చూసినప్పుడు భార్యభర్తలకు ఇంతగా మాట్లాడుకునే విషయాలు ఏముంటాయి అనిపించేది. ఒకసారి వారిని గద్దించింది కూడా. ఒక రోజు అనుకోకుండా పనిచేస్తున్న క్రమంలో రామయ్య ఎక్కిన నిచ్చెన విరిగిపోయినందువల్ల అతడు కిందపడిపోతాడు. కాళ్ళు విరిగిపోతాయి. ఆ సందర్భంలో చెల్లమ్మ అన్న మాటలు జమీందారిలో మార్పును తీసుకొస్తాయి. “అమ్మా మారుమనువు ఎవరికి కావాలి తల్లీ! మా మామ మనసిచ్చి మనసును ఆకర్షించుకున్నాడు. ఒక పొల్లుమాట, ఒక కలుబొట్టు ఎరుగడు. ఒకరి జోలికి పోడు” అన్న చెల్లమ్మ మాటలు జమీందారిణిని ఎంతో ఆలోచింపజేశాయి. తను ఎప్పుడు కూడా భర్త దగ్గర ఒక పరిధిని విధించుకొని జీవించిందే తప్ప రామయ్య, చల్లమ్మల మధ్య ఉన్న అనురాగం తను అనుభూతి చెందలేదనిపించింది. వెంటనే భర్తగదికి వెళ్ళింది జమీందారిణి. ఎప్పుడు తన గదివైపు రాని భార్య, వచ్చేసరికి ఆ జమీందారు ఆనందానికి అవధులులేవు. పక్షవాతంతో బాధపడుతున్న భర్తకు పనివాళ్ళ చేత కాకుండా తనే సేవలు జేయడానికి పూనుకుంటుంది. రచయిత్రి ఈ కథలో దంపతుల మధ్య ఉండవలసినవి ప్రేమానురాగాలు తప్ప మరేమికాదన్న జీవన సత్యాన్ని చెప్పారు.
‘పితృహృదయము” కథలో కూతురు పుట్టిన తర్వాత వెంకట్రామయ్య భార్య చనిపోయింది. మూడు నెలలపాపను పెంచి పెద్దచేసి, చదువుచెప్పించి, పెళ్ళిచేసి బాధ్యతను నిర్వర్తించిన తర్వాత మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడు వెంకట్రామయ్య. అప్పటినుండి కూతురు ఇంటికివచ్చే పరిస్థితులు లేవు. వీలున్నప్పుడు తండ్రీ కూతురు దగ్గరికి వెళ్ళివస్తూ ఆమె బాగోగులు చూస్తుంటాడు. కూతురుకు చెప్పరాని కష్టం వచ్చినప్పుడు కూడా తండ్రి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండదు. ఈ కథలో తండ్రిపట్ల కూతురికి, కూతురుపట్ల తండ్రికి ఉండే అనురాగం బాధ్యతాయుతమైనది. ఉన్నతమైనది కూడా.
– “పండుగచీరె” కథలో రాజ్యలక్ష్మి మధ్యతరగతికి చెందిన ఇల్లాలు. భర్త భావనారాయణ కలెక్టరు ఆఫీసులో గుమస్తా. పల్లెటూరి నుండి పట్నంకు వచ్చిన రాజ్యలక్ష్మికి ఎన్నో సరదాలు, మరెన్నో కోరికలు ఉంటాయి. వాటిని తీర్చే ఆర్థికశక్తి భర్తకు లేదు. దీపావళికి కొత్త చీర కట్టుకోవాలని సరదా పడుతుంది రాజ్యలక్ష్మి. భర్త అప్పుచేసి మరి
భార్యకు చీరకొని తెస్తాడు. ఈ కథలో మధ్యతరగతి దంపతుల సాధక బాధకాలను రచయిత్రి చక్కగా విశ్లేషించారు. కథలో రాజ్యలక్ష్మి పెద్దగా చదువుకోలేదు. కాబట్టి ఉద్యోగము చేయలేదు. భర్తపై ఆధారపడి జీవించే స్త్రీ పాత్ర ఆనాటి సామాజిక పరిస్థితులను తెలియజేస్తుంది.
“అసమర్థుడు” కథలో రంగారావు ఇంటి పెద్దకొడుకు. తండ్రి చెప్పినట్టుగానే కుటుంబంలోని పిల్లందరు నడుచుకున్నారు, అభివృద్ధి చెందారు కాని పెద్దకొడుకు రంగారావుకు మాత్రం తండ్రి చెప్పినట్టు వినడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఇంటర్ చదివి ఏ ఉద్యోగాన్ని సంపాదించలేకపోయాడు. దానితో తండ్రికి పెద్దకొడకంటే చిన్నచూపు. కాని రంగారావుకు తనమీద తనకు నమ్మకముంది. భార్యకూడా అతన్ని పూర్తిగా నమ్మింది. వ్యాపారం చేయాలని,
ఏమిచేస్తే బాగుంటుందని కొంత ఆలోచించుకునే లోపల ఇంట్లో ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. భార్య నగలను తీసుకొని వెళ్ళి మహానగరం ముంబాయిలో పెట్టుబడి పెట్టి, విజయంసాధించి, భార్య పిల్లలతో ఆనందంగా జీవితం గడుపుతుంటాడు. అతడు తండ్రిముందు అసమర్థుడు కాదని నిరూపించుకుంటాడు.
‘సలహా’ కథలో లక్ష్మీకాంతరావు, రాజ్యం భార్యభర్తలు. వీరిద్దరికి శ్రేయోభిలాషి, బంధువు నరసింహారావు ఉ ంటాడు. పెండ్లి తర్వాత చాలా అన్యోన్యమైన జంటగా పేరుతెచ్చుకున్న రాజ్యం దంపతులు, కొన్ని కుటుంబ నిర్ణయాలు తీసుకోవడంలో వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ సమయంలో ఒకరు ఇల్లు కొనాలని, మరొకరు కారు కొనాలని పంథం పట్టి కూర్చుంటారు. ఆ సందర్భంలో వీరిద్దరి మంచిని కోరే నరసింహారావు పాత్ర యుక్తిని ప్రదర్శించి, తగిన సలహాలను ఇచ్చి భార్యభర్తల మధ్య ఉన్న సమస్యను పరిష్కరిస్తాడు.
‘వేమూరివారి కోడళ్ళు’, ‘సహోదరులు’ ఈ రెండు కథల గ్రామీణ వాతావరణంలో కుటుంబసంబంధాలను తెలియజేసినకథలు. చిన్నప్పుడు కలిసి పెరిగిన అన్నదమ్ములు పెరిగి పెద్దగై ఎవరి సంసారాలు వారికి అయ్యాక పాలొళ్లుగా మారిపోతారు. సహోదరులు కథలో రచయిత్రి ఒక సంఘటనను సృష్టించి అన్నదమ్ముల మధ్య ఉండాల్సింది పగలు, ప్రతీకాలు కాదు, ప్రేమా ఆప్యాయతలు అని సందేశం ఇచ్చారు. అట్లాగే ‘వేమూరి వారికోడలు’ కథలో ఉన్నత కుటుంబాల్లో కోడళ్ళ మధ్య ఉండే పోటీతత్వం, రాగద్వేషాలు, ఈర్ష్య అసూయలు అన్నింటిని కళ్ళకు కట్టినట్లుగా చిత్రించారు. ఈ కథ చదివితే ఆడవాళ్ళ మధ్య ఉండాల్సింది అసూయకాదు ఐకమత్యం ఉండాలని బోధపడుతుంది.
ఇట్లా ఇల్లిందల సరస్వతీదేవి రాసిన చాలాకథలు కుటుంబవ్యవస్థను గురించి అనేకకోణాలను ఆవిష్కరించాయి. ‘ఆకరివాడు’ కథలో చిన్నవాళ్ళుగా పుట్టడడం వల్ల జీవితంలో జరిగే లోటుపాట్లు తెలియజేశారు. డైరీకథలో కూతురి ప్రేమను, ఆమె చిలిపి చేష్టలను తండ్రి అర్థంచేసుకోలేని సందర్భాలను చిత్రించారు. సామాజిక సమస్యలు:
వ్యవస్థలో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, అంటరానితనం, స్త్రీల సమస్యలు, మూఢవిశ్వాసాలు, నమ్మకాలు, వైవాహిక జీవిత సమస్యలు, వృత్తిపరమైన కష్టాలు వస్తువులుగా ఇల్లిందల సరస్వతి అనేక సామాజిక కోణాలను చిత్రించారు.
1968 లో రాసిన ముత్యాలమనసు, స్వర్ణకమలాలు ఈ రెండుకథలు సమాజంలో ఉన్న వర్గ తారతమ్యాన్ని చిత్రించిన కథలు. ధనికులకు పేదవారు కూలీలుగా సేవచేయడం ఇప్పటికీ జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు ఆర్థిక అసమానతలకు ఉదాహరణలు. ‘ముత్యాలమనసు’ కథలో ముత్యాలు ఆరుసంవత్సరాల పసిబాలుడు. బాలుడి తల్లిదండ్రులు బతుకుదెరువుకోసం ఉన్న ఊరు వదిలి మరొక ఊరుకు వలసవెళ్ళిన పరిస్థితి. ఒక ధనవంతుల దగ్గర పనికి కుదురుతారు. యజమాని ఇంట్లో ముత్యాలుతల్లి వెంకటి ధనవంతుల కొడుకును ఎత్తుకోవాలి. తండ్రి తోటపని చూసుకోవాలి. వీరుండటానికి మేడపక్కన చిన్న ఇరుగుగదిని కేటాయించారు.
ఒక రోజు ముత్యాల తల్లితోపాటు మేడలోకి వెళ్ళాడు. ఆ మేడలోని వస్తువులను చూసి ఆశ్చర్యపోతాడు. ఆటవస్తువులను చూసి అతడికెందుకులేవని చిన్నబుచ్చుకుంటాడు. ఊరు వదిలి వలస వచ్చినప్పటినుండి ముత్యాలు మనసు మనసులో లేదు. ఊళ్లో తల్లిదండ్రి పనికిపోయినా ఆడుకోవడానికి స్నేహితులుండేవారు. తల్లిదండ్రి పనికిపోతే ఇక్కడ చీకటిగదిలో ఒక్కడే ఉండాల్సిన పరిస్థితి. రోజు ముత్యాలు లేచే సమయానికే తల్లిదండ్రి ఇద్దరు ఉండరు. ముత్యాలు నిద్రలేచి బయటికి వచ్చిచూశాడు. “మేడమీద వరండాలో తల్లిబాబును ఎత్తుకొని బిస్కట్లు తినిపిస్తూ బొమ్మలు చూపిస్తూ తిరుగుతుంది. అది చూసిన ముత్యాలు ఆత్రముతో “అమ్మా! అమ్మా!” అని కేక పెట్టాడు. వెంకటి ఇటువైపు చూడనన్న చూడలేదు. బాబు చేతిలో ఉన్న బిస్కట్టుముక్కచూడగానే ముత్యాలుకు తాను తిన్న కారపుమెతుకులు జ్ఞాపకము వచ్చాయి. ఆ పనిహృదయం ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది. జ్వరం వచ్చింది. అయినా తల్లి తనదగ్గర లేదు. బాబుదగ్గరే ఉంది. ఏడ్చినా లాభం లేదు. ఆ చిన్ని హృదయంలో ఎన్నో ప్రశ్నలు అమ్మబాబును ఎత్తుకుంటుంది. తనను నిర్లక్ష్యం చేస్తుంది. అందుకే ఆ ఊరు నచ్చలేదు ముత్యాలుకు. తిరిగి పెద్దమ్మ ఊరుకు వెళ్ళాలని బయలుదేరాడు. జ్వరం తీవ్రంగా ఉండటంవల్ల కండ్లు చీకట్లు కమ్ముతున్నాయి. కాళ్ళు తడబడిపోయాయి. రోడ్డు పక్కన తూములో జారిపడ్డాడు. ఈ కథలో పసిబాలుడి పాత్ర యొక్క కంఠస్వరం పాఠకులను ఆలోచింపజేస్తుంది. ముత్యాలు ఏం తప్పుచేశాడన్న ప్రశ్న ఉదయిస్తుంది. బతకటం అనే ఇరుసు చుట్టు ఉన్న అవసరాలు, కార్యచరణ సంబంధాలను విశ్లేషిస్తూ కరుణరస భరితంగా ఈ కథ సాగుతుంది.
“స్వర్ణకమలాలు” కథలో ఏడుకొండల పాత్ర ధైర్యసాహసాలు ప్రదర్శించింది. మునసబు రంగారావు వినాయకచవితికి తామరపూలు కోసుకురమ్మని ఏడుకొండలుకు చెప్తాడు. ఏడుకొండలు ఏ పనిచెప్పిన పక్కాగా చేత్తడు. అతడికి యుక్తవయసు కావడంతో కండలు తేలి నవయవ్వన కాంతితో శోభిల్లుతుంటాడు. మునసబు గారి పెద్దకూతురు ఐదేండ్ల కొడుకునెత్తుకొని పుట్టింటికి వచ్చింది. మనవడు తాత ఇంట్లో తొలిసారిగా పూజచేస్తున్నాడు. అందుకని మునసబు పత్రి, పూలు తెమ్మని తనకింద పనిచేస్తున్న వారికి చెప్పి పంపాడు. కలువపూలను తెమ్మని ఏడుకొండలుకు చెప్పాడు.
ఏడుకొండలు అర్ధరాత్రి సమయానికే చెఱువుగట్టుకు ప్రయాణమయ్యాడు. వినాయకచవితి కాబట్టి ఊరువాళ్ళందరు పూలకోసం వస్తారని ఆలస్యం కాకుండా ముందుగానే చెరువు గట్టుకు చేరుకున్నాడు. కళ్ళు మూతలు పడుతున్నప్పటికి మధ్యమధ్యలో ఉలికిపాటుతో లేచి చూస్తున్నాడు. వర్షం ప్రారంభమయ్యింది. అయినా ఆ వర్షంలో కూడా తడుస్తూ చెఱువులోని తామర మొగ్గలు ఎప్పుడు విచ్చుకుంటాయోనని ఎదురుచూస్తున్నాడు. పూలను తీసుకెళ్తే అమ్మగారు పెట్టే భోజనం సంగతి గుర్తొచ్చి, మునసబు ఇచ్చిన దావతిని జోలెగా నడుముకు కట్టుకొని చెఱువులోకి దిగాడు. చెఱువులోని జల్లలు కాళ్ళకు పట్టుకున్నాయి. అడుగులో ఉన్ననాచు అడుగు తీసి అడుగు వెయ్యనియ్యటం లేదు. అయినప్పటికి చేతికందిన కలువలను కోసుకొని గట్టుమీద పెడుతున్నాడు. ఎంత కష్టమైనా కలువలను కోస్తుపోతున్నాడు. పదిచొప్పున లెక్కపెడితే వందకలువలయ్యాయి. తెల్లవారింది. సూర్యరశ్మికి విచ్చుకున్న తామరలు బంగారు పువ్వుల్లా కనిపిస్తున్నాయి. ఆ పూలను చూసి పరవశుడై తనెందుకు వినాయకుడి పూజచెయ్యొద్దు అన్న ప్రశ్న ఏడుకొండలు మనసులో ఉదయించింది. మట్టిలో వినాయకుడి బొమ్మను గీశాడు. గీసిన బొమ్మచుట్టు పూలన్నిటిని పేర్చాడు. అయ్యే తనకు మంత్రాలు రావు కదా! మరిఎట్లా, అయినప్పటికి పూజచేయాలనే సంకల్పంతో అక్కడే ఉండిపోయాడు. ఉదయం ఎనిమిదయినా ఏడుకొండలు రాకపోయేసరికి మునసబు వెంకటేశు, మల్లేశులను పంపించి తీసుకురమ్మన్నాడు. ఏడుకొండలు వీళ్ళను చూడగానే నీళ్లలో మునిగి రమ్మని చెప్పి తనలాగా పూజచేయమన్నాడు. వెంకటేషు ఏడుకొండలును అనుసరించాడు. మల్లేషు తిరిగి మునసబు, దగ్గరికి వెళ్లాడు. ఈ కథలో తాత్త్వికకోణం కష్టం ఎవరిది, ఫలితం ఎవరిది అనే ప్రశ్నకు అద్దం పడుతుంది. కథలోని వాతావరణం పండుగ, చెఱువుగట్లు, కలువపూలు పాఠకుడికి గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఏడుకొండలు పాత్రలో తలెత్తిన స్వతంత్ర్య భావనలు వ్యవస్థ చైతన్యానికి ఉదాహరణలుగా నిలిచాయి. అట్లాగే మల్లేషులోని భయం వెనకడుగు వేసే తత్త్వాన్ని తెలియజేస్తుంది. కథ మొత్తానికి ఆలోచింపజేస్తుంది.
వివాహ వ్యవస్థలో వరకట్న సమస్య ఆనాడు, ఈనాడు ఆడపిల్లల తల్లిదండ్రులకు మోయలేని భారంగానే ఉంది. ‘ఆదర్శాలు- అనుభవాలు’ కథలో కథానాయకుడు కట్నానికి వ్యతిరేకి. తన అభిప్రాయాన్ని ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్తే వారు మెచ్చుకోకపోగా వరుడికి ఏదైనా లోపం ఉందని అనుమానిస్తారు. కథలో పుంజరి పాత్రను అతడి ఆదర్శాన్ని అర్థంచేసుకోవడానికి కొంతసమయం పడుతుంది. అట్లాగే కులాంతర వివాహం చేసుకున్న ఆడపిల్ల మాణిక్యమ్మ చేదు అనుభవాన్ని చెప్పిన కథ “కథ వెనుక దాగిన నిజం”. పెళ్ళైన మరుసటి రోజే భర్త నిజస్వరూపం తెలుసుకున్న మాణిక్యమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో కాపురం చేస్తుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఆమెకు ఇష్టంలేని పనులన్నీ చేయించి, పైశాచికానందం పొందేవాడు ఆమెభర్త. అయినప్పటికి మాణిక్యమ్మ ఆమె తల్లిదండ్రుల దగ్గర చులకన కావద్దని అహర్నిశలు కష్టపడింది. ఆమె శాఖాహారి అయినా భర్తకు మాత్రం మాంసాహారం వండిపెట్టేది. అతడు పెట్టే చిత్రహింసలను భరించేది. ఆ మనోవ్యధలన్నిటిని తట్టుకోలేక అనారోగ్యం పాలవుతుంది. ఆమె చనిపోతే పిల్లలను ఎవరు చూస్తారనే బెంగతో ఆమెచివరి క్షణాలు యుగాల్లాగా గడుస్తాయి. వైద్యంచేసే డాక్టరు పిల్లలను సురక్షితమైన చోటికి చేర్చడం ద్వారా కథ ముగుస్తుంది.
మధ్యతరగతి కుటుంబాల్లో వివాహం ఒక జటిలసమస్య. ఉత్తముడైన వరుడు దొరకాలంటే ముందునుండే తల్లిదండ్రులు వరుడికోసం ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ‘శలభాలు’ కథలో ఆడపిల్లల తల్లి మీనాక్షమ్మ రామశర్మ అనే యువకుడికోసం వల విసురుతుంది. తన కూతురు అందానికి అతను మైమరిచి కట్నం లేకుండా వాళ్ళలో ఒకరిని పెళ్ళిచేసుకుంటాడని ఆశపడుతుంది. రెండు కుటుంబాలు ఒక ఉద్యోగస్తుడికి వల విసిరి భంగపాటుపడటం కథా ఇతివృత్తంగా సాగింది. ముగింపులో ఈ రెండు కుటుంబాలు ఆ యువకుడికి వివాహం అయ్యిందన్న విషయం తెలుసుకొని నోరువెల్లబెడతారు. ఇల్లిందల సరస్వతిదేవిగారు చాలా కథల్లో వివాహబంధంకు సంబంధించిన అనేకకోణాలను ఆవిష్కరించారు.
వృత్తిపరమైన చిత్రణ:
సమాజం అంటేనే విస్తృతమైన కాన్వాసు. అందులో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మొదలైన జీవనసంబంధ వ్యాపకాలు అనేకం ఉంటాయి. ఇల్లిందల సరస్వతిదేవిగారి చాలా కథల్లో వైద్యవృత్తిని తెలియజేసే ఇతివృత్తాలు స్వీకరించారు. ఆ తర్వాత లాయరు వృత్తిని కథానేపథ్యంగా, పాత్రలుగా స్వీకరించారు. గ్రామాల్లో ఉండే బెస్తవారు, బెల్లంకట్టువారు, మేథరివాళ్ళు, మెహర్తానీవారు ఇట్లా వారి వృత్తుల్లో ఉండే సాధకబాధకాలను విశ్లేషించారు. అట్లాగే చదువుకొని సమాజంలోని సేవలు అందించే అధ్యాపకవృత్తి, దేశానికి సేవచేసే సైనికులు, రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించే రచనా వృత్తి ఇట్లా రచయిత్రి దృష్టికి వచ్చిన ప్రతి అంశం కథగా రూపుదిద్దుకొని శిల్పనైపుణ్యంతో చదివించే గుణాన్ని కలిగివుందని చెప్పవచ్చు.
“చేపకన్ను మిలమిలా – బాలయ్యకన్ను తెలతెల” కథ ప్రాణాలకు తెగించి బెస్తవారు ఏటికి ఎదురెల్లి చేపలు పట్టడం, అయినా వారి జీవితాల్లో తొంగిచూసే పేదరికం, భార్యభర్తల అనురాగం, మనస్పర్థలు, సర్దుబాటు అన్నిటిని కలిపిన కథాకథనంతో ఆసక్తికరంగా, మలుపులు తిరుగుతూ రసాస్వాదనను కలిగిస్తుంది. “బల్లకట్టు భద్రయ్య” కథ నదీతీరప్రాంతాల్లో ఏరుదాటడానికి బల్లకట్టునడిపే భద్రయ్య జీవితాన్ని చిత్రించింది. రోజంతా ప్రయాణికులతో గడిపే భద్రయ్యకు వారి జీవితాల్లోని సంఘర్షణలను అర్థంచేసుకునే అనుభవం ఏర్పడుతుంది. తన వృత్తిద్వారా ఆర్థిక ఆధారంతోపాటు లోకానిన చదువుతాడు. తద్వారా తన జీవితంలో ఆనందాన్ని వెతుక్కుంటాడు. “మెహరాని” కథలో శాంతి అందం, విద్యానాగరికత కలిగిన అమ్మాయి. అమె కులం తెలియకముందు శాంతిని మెచ్చుకున్న వాళ్ళే, మెహర కులం అని తెలువగానే వారి ముఖాల్లో రంగులు మారాయి. ఏదో వికారం వారి మనసుల్లో బయలుదేరి ముఖాల్లోకి చొచ్చుకువచ్చింది. మురళీకృష్ణ ఆమెను ప్రేమించినా పెళ్ళిచేసుకోవడానికి సాహసించలేడు. కారణం రోతపుట్టించే ఆమెవృత్తి. కాని శాంతిలోని ఏకాగ్రత, సంస్కారం గమనించిన తెలుగు లెచ్చరర్ ముకుందం ఆమెను పెండ్లి చేసుకుంటాడు. ఒకరు వృత్తికి, మరొకరు ప్రవృత్తికి ప్రాధాన్యతనిచ్చే వైరుధ్యంతో కథసాగడం పాఠకులకు ఆసక్తిని కలిగిస్తుంది. “బలీయసీ కేవలమీశ్వరాజ్ఞా” కథలో మేథర్ల వృత్తి ప్రస్తావన ఉంది.
“ఊహకందని నిజాలు”, “నాగరికము”, “చీకటిలో చెదరనిమనిషి”, “బంధవిముక్తి”, “అడ్డుతెరలు”, “బతికిచచ్చినవాళ్లు”, “ఈ చీకటి వీడదేమి”, “అక్కరకు వచ్చిన చుట్టము”, “దగాపడ్డ డాక్టరమ్మా”, “ప్రియాగమనం”, “ట్రూత్ సీరం చెప్పినకథ’, ‘పరిగెత్తే బొమ్మ”, “తీపిలో చేదు”, “పునర్లబ్దము” కథల్లో వైద్యవృత్తి సంబంధ వాతావరణం ఉంది. పాత్రగానో, నేపథ్యంగానో సంఘటనగాని, వ్యాధి సోకినపుడో ఇలా ఏదోఒక సందర్భంలో వైద్యవృత్తి ప్రస్తావించబడింది.
“బతికిచచ్చినవాళ్ళు” కథలో సిరి, గంగ బాల్యంలో స్నేహితురాళ్ళు. చాలా రోజుల తర్వాత హాస్పిటల్ ప్రాంగణంలో కలుసుకుంటారు. రంగ డాక్టరు కాబట్టి కష్టాల్లో ఉన్న సిరికి ఆశ్రయమిచ్చి ఆదుకుంటుంది. స్నేహితురాలి పిల్లలను పెంచి పెద్దచేసి సహృదయతను చాటుకుంటుంది.
“ఊహకందని నిజాలు” కథ తల్లికొడుకుల సంభాషణతో మొదలౌతుంది. శివకామమ్మ కోడలు బిడ్డను ప్రసవించిన కారణంగా ఆసుపత్రిలో ఉంటుంది. రెండవసారి కూడా అమ్మాయే కావడంతో రంగారావు మరొక ఛాన్సు ఇచ్చి చూద్దామా అనే సందిగ్ధంలో ఉంటాడు. ఈ లోపల రంగారావు తల్లి శివాకామమ్మ నెలతప్పిన విషయం తెలసుకుంటాడు. రంగారావు సోదరసోదరీమణుల సంఖ్య పెరుగుతుండటంతో తనకు ఇద్దరు పిల్లలు చాలు అనే నిర్ణయానికి వస్తాడు. ఒకప్పుడు ఫ్యామిలి ప్లానింగ్ ఆపరేషన్లు ఉండేవికావు. ఈ అనుకోని సంఘటనకు కథాంతంలో తండ్రి కొడుకు మొఖాన్ని తల ఎత్తి చూడలేకపోతాడు. “అక్కరకు వచ్చిన చుట్టము” లో భర్త క్షయబారిన పడితే భార్య తనసొమ్ములను అమ్మి వ్యాధి నయం చేపించాలని పడరానిపాట్లు పడుతుంది. చివరికి భర్తను కోల్పోతుంది. “దగాపడ్డ డాక్టరమ్మ” కథలో వైద్యవృత్తికి పూర్తిగా అంకితమవ్వాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ రాజేశ్వరి పెళ్ళికూడా చేసుకోలేదు. కాని అనుకోకుండా రామమోహనరావు పెళ్ళిచేసుకొమ్మని ప్రేమవల విసరగా కరిగిపోతుంది. చివరకు అతడు నేరస్థుడన్న విషయం తెలుసుకొని బాధపడుతుంది. “తీపిలో చేదు”, “పరిగెత్తే బొమ్మ” ఈ రెండు కథలో హాస్పిటల్ నేపథ్య వాతావరణంగా చిన్నపిల్లల మనస్తత్వాన్ని చిత్రించారు రచయిత్రి.
“మహోన్నతుడు”, ‘సప్తమభావము” కథల్లో జ్యోతిష్యవృత్తి ప్రస్తావన చిత్రించబడింది. సప్తభావములో వాసుదేవరావుగారి కుమారుడు వివేకానందుడికి వివాహము చేస్తే కాపురానికి రాకపూర్వమే ఒకరు, రెండు నెలలు కాపురంచేసి ఒకరు ఇద్దరు కోడళ్లు పోయినారు. మూడో పెండ్లి చేయడం అవసరమా! జాతకంలో సప్తమభావం చెడిందని తెలుసుకున్నాక వివాహ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. కొడుకు ఉద్యోగరిత్యా తల్లిదండ్రులకు దూరంగా ఉండి, వారికి తెలియకుండా పెండ్లి చేసుకుని పిల్లలు పుట్టాక కన్నవారికి పరిచయం చేస్తాడు.
‘మహోన్నతుడు‘ కథలో ధనవంతులు, రాజకీయ నాయకులు జ్యోతిష్యుడికి ఎంతవిలువనిస్తారో, అట్లాగే జడ్జిగా వృత్తిని కొనసాగిస్తూ సామాజిక హోదాలో గడిపే బ్రహ్మానందం తన కాలనీలో ఒక జ్యోతిష్యుడు ఉన్నసంగతిని తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
శిల్ప సౌందర్యం:
కథ ఉత్తమమైన శిల్పంతో సజీవంగా రూపుదిద్దుకున్నప్పుడు పాఠకుని మనసులో కలకాలం నిలిచి ఉంటుంది. రచయితను బట్టి శిల్పం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. వస్తువు, సంఘటన, సన్నివేశం, వర్ణన పాతచిత్రణ, సంఘర్షణ, కథనం, శీర్షిక, భాషాశైలి ప్రధానమైన కథానిక లక్షణాలుగా గుర్తించవచ్చు. వస్తువు ఏదైనా కథానిర్మాణంలో ఇల్లిందల సరస్వతీదేవిగారి కలం అందెవేసిన చెయ్యి. స్వర్ణకమలాలు కథాసంపుటిలో శిల్పవిన్యాసాన్ని ప్రదర్శించిన కథలు అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా పాఠకుడి హృదయంపై చెఱగని ముద్రను వేసి అనుభూతిని కలిగిస్తాయి.
“కొండమల్లెలు”, “పై మనిషి”, “ప్రణయలేఖలు”, “విచ్చినమబ్బులు”, “చిరునవ్వువెల ఎంత?” కథల్లోని వస్తువులు సమాజంలో మనకు తారసపడేవే. రచయిత్రి ప్రయోగించిన వస్తువిన్యాసనేర్పువల్ల కథలు గాఢానుభూతిని కలిగిస్తాయి. ‘పైమనిషి‘ కథలో భార్య ఉత్తరాలద్వారా విదేశాల్లో ఉన్న భర్తకు సమాచారాన్ని అందిస్తుంది. కథమొదటి నుండి చివరివరకు సస్సెతోను, అనుమానంతోను కొనసాగుతుంది. భార్యభర్తకు పంపే ఉత్తరాల సారాంశంలో అతిథి అంటే బంధువుగా అర్థం చేసుకుంటాడు భర్త. ఇంటికి వచ్చి చూస్తే గాని తన వంశాంకురం పుట్టాడన్న విషయాన్ని తెలుసుకోలేకపోతాడు. “విచ్చినమబ్బులు” కథలో ఎత్తుగడతోనే ఇల్లు తగలబడిపోతుంటే శాంత ప్రాణాలకు తెగించి, మండుతున్న ఇంట్లోకి వెళ్ళి ఉత్తరాల పెట్టెను తెచ్చుకోవటం ద్వారా అనారోగ్యాన్ని తెచ్చుకుంటుంది. ఇట్లా కథను ప్రారంభించడం ద్వారా కథానికకు బలం చేకూరింది. పైగా రచయిత్రి తరువాతి కథను నడిపించడం సులవైంది. ఈ సంఘటనతో భర్తకు భార్యపై అనుమానం కలుగుతుంది. ఆ పెట్టెలోని ఉత్తరాల్లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం అటు భర్తకు, ఇటుపాఠకులకు కలుగుతుంది. ఆ తర్వాత భర్త భార్య ఉత్తరాల్లో గమనించిన “ప్రభూ” అనే సంబోధన మరింత అనుమానానికి హేతువు అవుతుంది. వాస్తవంగా ‘ప్రభు‘ శాంత స్నేహితురాలు. కథాముగింపులో స్నేహితుడి పాత్రను ప్రవేశపెట్టి శాంతభర్త అపోహను తొలగించింది రచయిత్రి.
“చిరునవ్వు వెల ఎంత” కథలో అలివేలు భర్త శంకరం ఆత్మహత్య ప్రయత్నంతో కథ ప్రారంభమౌతుంది. సగటు మధ్యతరగతి వాతావరణంలో నడిచిన కథలో భార్య అలివేలు ఆశావాది. ఆ రోజుల్లో సంతానం అంటే నలుగురైదురికి తక్కువుండే వారు కాదు. ఒక రాత్రివేళ ఇంటికి వచ్చిన భర్త శంకరానికి వడ్డిస్తూ “ఈ నలుగురు పిల్లలు రేపు పుట్టబోయే బిడ్డతో ఐదుమంది వీళ్లంతా ఏం చదువుతారు? ఏం తింటారు” అని విచారిస్తుంది. అయినా మొండిధైర్యంతో ముఖంమీద చిరునవ్వును చిందిస్తూనే కష్టాల్లో సైతం ఆనందాన్ని వెతుక్కుంటుంది.
ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంటుంది. కథలో ముందటిరోజు రాత్రి భర్త, నిద్రమాత్రలు మింగి చనిపోదామనుకున్నాడు. కారణం సంసార బరువు మోయలేకకాదు. శంకరం ప్యాకాట ఆడటం ద్వారా అప్పులపాలయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న అలివేలు బ్యాంకులో లో ద్వారా డబ్బులు తెచ్చి తను ఉద్యోగానికి వెళ్తు భర్తకు డబ్బులిచ్చి వెళ్తామని అతడి ఆఫీసుకు వెళ్తుంది. శంకరం రాలేదని చెప్పడంతో తిరుగు ప్రయాణంలో హుస్సేన్సాగర్ వద్ద ఒక యువకుడు. నీళ్ళలో పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తను వినగానే మనసులో నిండుకున్న సంఘర్షణతో తన భర్తనే అనుకొని అలివేలు కూడా నీళ్ళలో పడిపోతుంది. ఎత్తుగడలో భర్త ఆత్మహత్యాయత్నం. ముగింపులో నిజంగానే భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. హుస్సేన్సాగర్ దగ్గర పచార్లు చేస్తున్న శంకరం చనిపోయిన ఆడమనిషి ఎవరని వెళ్ళి చూసేసరికి తన భార్య అన్నసంగతి తెలుసుకొని నోరెవెల్లబెడతాడు. కథలో చివరసంఘటన అనుకోని మలుపుగా పాఠకులకు వేదనను మిగులుస్తుంది.
“ప్రియాగమనం“, “పరుగెత్తే బొమ్మ” కథలు కథనం ద్వారా నడిపించబడ్డాయి. ఈ కథలు అల్లడంలో, పాత్రలు ప్రవేశపెట్టడంలో రచయిత్రి నేర్పు కనబడుతుంది. ప్రియాగమనం కథలో మంగళకు జబ్బుచేసి ఆసుపత్రికి వెళ్తుంది. డాక్టరు, మంగళ పాత్రల సంభాషణల్లో ఆమె భర్త పేరు, చేస్తున్న వృత్తి వివరాలు తెలుస్తాయి. పదిరోజుల తర్వాత మిలిటరీలోనుండి చంద్రకాంత్ నేరుగా వైద్యం చేయించుకోవాలని ఆసుపత్రికి వస్తాడు. ఆ సమయంలో
భార్యభర్తలిద్దరు ఒకే ఆసుపత్రిలో ఉంటారుకాని ఒకరువచ్చిన సంగతి ఇంకొకరికి తెలియదు. డాక్టరు తెలుసుకుని వారికి చెప్పడు. కథలో డాక్టరు నిర్వహించిన పాత్ర ఎంతో కీలకమైనదిగా, మానవత్వ పరిమళాలను వెదజల్లేదిగా ఉంటుంది. చివరికి చంద్రకాంత్ ప్రాణాలను కోల్పోతాడు. తను తెచ్చిన డబ్బు, నగలు భార్యకు అందజేయమని ముందే చెప్తాడు? రచయిత్రి కథలో కనీసం ముగింపులోనైనా భార్యభర్తలను కలిపితే బాగుండేది అనిపిస్తుంది. ముగింపు వేదనను కలిగిస్తుంది.
“పరిగెత్తే బొమ్మ” కథలో ఎత్తుగడ సౌజన్య ఇంట్లో అడుగుపెడుతూనే టైనీఏడీ అంటూ హాల్లో ఇటు అటుచూసింది అంటు మొదలౌతుంది. సౌజన్యకు టైనీ తమ్ముడి కొడుకు, కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నాడు. అందుకని స్కూలుకు కూడా వెళ్ళటం లేదు. సౌజన్య పిల్లల మనస్తత్వాన్ని బాగా అధ్యయనం చేసింది. లండన్ వెళ్ళి డిప్లమా తెచ్చుకుంది. బొంబాయిలో టీచర్ గా పనిచేస్తుంది. కాబట్టి టైనీ జ్వరం ఎలా తగ్గించాలనే ఆలోచనలో పడింది సౌజన్య. ఆ తర్వాత కథంతా సౌజన్య టైనీ సంభాషణల్లో ముందుకు సాగుతుంది. ఈ కథలో సౌజన్య టైనీ మానసిక స్థితిని అర్థంచేసుకుంటుంది. ఎక్కడ ఆ పసిబాలుడి మనసు గాయపడ్డదో టైనీ మాటల ద్వారానే తెలుసుకుంటుంది. టైనీ పిల్లవాడు కాబట్టి ఒకచోట కూర్చోవటం నచ్చడం లేదు. నీరసంగా ఉన్నాడు కాబట్టి లేచి ఆడుకోలేడు. సౌజన్య పరిగెత్తే బొమ్మనుకొని తెచ్చింది. రెండు రోజులు ఆడి పక్కనపడేశాడు. ఆ తర్వాత పరిగెత్తే బొమ్మలను బోర్డుపైన గీసి చూపించసాగింది. ఆ తర్వాత పరిగెత్తే టైనీ బొమ్మ వేసింది. వెనుక మరొకబొమ్మ దించింది. అప్పుడు టైనీ “అవునత్తా నేనే, ఆ రమేష్ గాడు వెనుకబడ్డాడు వాడికంతే కావాలి. కిందపడ్డాడు కదూ” అంటూ చప్పట్లు కొడుతూ నవ్వటం మొదలు పెట్టాడు. ట్రైనీలో శారీరక బలహీనత కాళ్ళు చచ్చుబడిపోవటం అయితే సౌజన్య అతడిలోని తీరనికోరికను బొమ్మలువేయటం ద్వారా పరిగెత్తించింది. క్లిష్టమైన వస్తువును సంభాషణల ద్వారా సునాయాసంగా నడిపించగలిగింది రచయిత్రి.
ఇల్లిందల సరస్వతీదేవి గారు కథనశిల్పంలో ఉన్న పద్ధతలన్నిటిని ఉపయోగించలేదు. ఎక్కువగా ప్రథమపురుష కథనాన్ని వాడారు. కొన్ని సందర్భాలలో మధ్యమ పురుషతో కథలను ప్రారంభించారు. కొన్ని కథలు వర్తమానంలో ప్రారంభమై భూతకాలంలోనే నడిచి మళ్ళీ వర్తమానానికి వస్తుంటాయి. ‘డైరీ‘ కథలో మిలిటరీ డ్రలో ఉన్న దుర్గాప్రసాద్ తన కథను శాస్త్రిగారికి ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో చెబుతాడు. పాపడైరీలో వ్యక్తపరిచిన భావాలు తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ‘కాగితంపూలు‘, ‘అసమర్థుడు‘, ‘అక్కరకు వచ్చిన చుట్టము‘, ‘రక్తపు చుక్కకు నీటిచుక్క‘, ‘మనసులోని ఇజం‘, ‘పాంథుడు‘, ‘గళ్ళలుంగీ’ కథలు ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో నడిచాయి.
రచయిత్రి రాసిన కథల్లో ప్రణయలేఖలు, ‘పై మనిషి‘, ‘అసమర్థుడు‘, ‘అనాశ్వాసిత‘, ‘ఈ చీకటి వీడదేమి‘ మొదలైన ఉత్తరాల ప్రాధాన్యత కథనంతో నడిచాయి.
కథలో పాత్రచిత్రణ అనేది ప్రధానమైనది. కథానిక నిడివిలో తక్కువగా ఉండటంవల్ల తక్కువ పాత్రలతో కొద్ది సమయంలో పాఠకుడిపై ముద్రవేయాలంటే రచయితకు నేర్పుకావాలి. కథలో పాత్రచిత్రణలో జీవితకాలాన్నంత ప్రదర్శించడం సాధ్యం కాదు. ఆ పాత్ర ప్రవృత్తిని కొన్ని వర్ణనల ద్వార సూచించి, సన్నివేశాల ద్వారా విశ్లేషించడం సులభమౌతుంది. ఇల్లిందల సరస్వతీదేవిగారు చిత్రించిన కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు.
‘కొండమల్లెలు‘ కథలో శివనాథం పాత్ర, ‘స్వర్ణకమలాలు‘ కతలో ఏడుకొండలు, ‘పరుగెత్తే బొమ్మ‘లో సౌజన్య, ‘కథ వెనుక దాగిన నిజం‘లో శారద, ‘శాంతించిన సముద్రం‘లో సావిత్రి, ‘అడ్డుతెరలు‘ కథలో కాత్యాయిని, ‘పండుచీర‘లో రాజ్యలక్ష్మి పాత్రలు పాఠకుల మనసుపై చెఱగని ముద్రనువేస్తాయి.
“ఎదిగిన కొడుకు‘ కథలో రమణపాత్ర ఆదర్శవంతమైనది. అతడు దూరప్రాంతంలో చదువుకోవటంవల్ల మూడుసంవత్సరాలు ఇంటికి వెళ్ళటం కుదురలేదు. అవసరం ఉన్నప్పుడల్లా తండ్రి డబ్బు పంపిస్తుంటాడు. కాని చూడటానికి రాడు. ఈ కథలోని ఇతివృత్తం లోకంలో తారపడే అంశమే అయినప్పటికీ రమణ పాత్ర చిత్రణకు సమయస్ఫూర్తి, ధైర్యం, ఆలోచనా విధానం మేళవించిన పాత్రగా తీర్చిదిద్దటం రచయిత్రి గొప్పదనంగా చెప్పవచ్చు. రమణ తండ్రి ప్రభుత్వ ఉద్యోగస్తుడు. బదిలీల మూలంగా కుటుంబానికి దూరంగా ఉంటాడు. భార్యకు, పిల్లల చదువులకు కావలసిన డబ్బును పంపిస్తుంటాడు. ఒకసారి రమణకు తెలిసిన వ్యక్తి ద్వారా తన తండ్రి గురించి వింటాడు. “నీకు తెలిసిందా రమణా మీ నాన్న మీ అమ్మను ఓ పల్లెటూళ్ళో ఉంచి భరణం పంపిస్తున్నాడు. చదువు చదువు అంటూ నిన్ను ఇక్కడికి రానివ్వటం లేదు. కూతుర్లకు సంబంధాలు చూసి పెళ్ళి చేయాల్సిన వయసులో ‘తానొక పాతికేళ్ళ పడుచును పెండ్లి చేసుకున్నాడు‘ అని చెప్పగానే రమణ తల్లి దగ్గరికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుంటాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అతడిని నిలదీస్తాడు. “నా తల్లికి పిచ్చిదన్న పేరు పడేస్తే గాని మీకు ముందడుగు పడలేదు కదూ? ఆ పల్లెటూర్లో మీరిచ్చే భరణం తింటూ నా తల్లి ఒంటరిగా నానా తంటాలు పడుతుంది. ఇవాల్టి నుంచీ నాకు తల్లి ఒక్కతే ఉందనుకుంటాను” అని తండ్రితో తెగదెంపులు చేసుకొని రమణ కుటుంబ బాధ్యతను మోయడానికి సిద్ధపడతాడు.
‘బతికి చచ్చినవాళ్ళు‘ కథలో రంగపాత్ర గొప్ప మనసున్న మహిళ. ఫ్యామిలి ప్లానింగ్ యూనిట్లో పనిచేస్తున్న డాక్టర్, ఒక రోజు అనుకోకుండా తన బాల్యస్నేహితురాలు సిరి కనిపిస్తుంది. ఆమె కష్టాల్లో ఉందని తెలుసుకొని ఆశ్రయం ఇస్తుంది. సిరి పిల్లలకు చదువు చెప్పిస్తుంది. స్నేహితురాలి పూర్తి బాధ్యతను తను స్వీకరించి వారికి అండగా నిలబడుతుంది. ‘ప్రార్థించే పెదవులకన్నా సహాయంచేసే చేతులు మిన్న‘ సామెతకు రంగపాత్ర ఉదాహరణగా నిలుస్తుంది. ‘మనసులోని ఇజం‘ కథలో మహేంద్రపాత్ర విచిత్రమైన మనస్తత్వానికి చెందినదిగా ఉంటుంది. కథలో ఈ పాత్ర ప్రవర్తించిన తీరును చూసినపుడు మనిషి చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉండకూడదన్న విషయం అవగతమౌతుంది. ఎదిగిన తరువాత గతాన్ని మరిచి ప్రవర్తించకూడదన్న మానవ విలువలను తెలియజేస్తుంది.
ఈ విధంగా ఇల్లిందల సరస్వతిదేవి కథలు వస్తుపరంగా విస్తృతిని, వైవిధ్యాన్ని కలిగివున్నాయి. శిల్పపరంగా చదివించే గుణాన్ని కలిగివున్నాయి. స్వర్ణకమలాలు కథా సంపుటిలో ఉన్న వందకథలు వస్తురూప శిల్పాన్ని ప్రదర్శించాయని చెప్పవచ్చు.
“గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండు ఉండేవి. ఒక గూటిలోన రామచిలుక ఉంది, ఒక గూటిలోన కోయిల ఉంది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది అయిన రెంటికీ జత కుదిరింది” ఈ పాట ప్రతి ఉదయం “ఆత్మీయ నిలయం”లో సుప్రభాతంలా వినపడ్తూనే ఉంటుంది. అక్కడ ఉండే వారందరూ బంధువులు కారు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. కొందరు కన్నా బిడ్డలు వదిలిచ్చుకున్నవారు. మరికొందరు కూడు, గూడు లేనివారు. అందరూ అక్కడ ఒకరికి ఒకరు ఆత్మీయులే అక్కడ అందరి మతం మానవత్వమే ఒకరికి ఒకరుగా వయో బేధం లింగ వివక్ష లేని నిలయం. ఆరోగ్య ప్రధమైన ఆలయం అనవచ్చు. ఆత్మీయ నిలయంకు అంకురార్పణ చేసింది రామయ్య, అతనికి ఒక కుమారుడు, బాగా చదువుకొని విదేశాల్లో స్థిర పడ్డాడు. కొంత కాలం క్రితమే రామయ్య భార్య సీతమ్మ దేవుడి దగ్గరకు పోయింది. రామయ్యకు రంగయ్య ప్రాణ స్నేహితుడు. రంగయ్య నిలువెత్తు ఫోటో ఆత్మీయ నిలయంలో అడుగు పెట్టగానే ఎదురుగా కనిపిస్తుంది. రంగయ్య ఇష్ట దైవం శ్రీ కృష్ణుడు ఆ విగ్రహం కూడా పూల తోట మధ్యలో మనకు కనిపిస్తుంది. పచ్చని చెట్లు, పండ్లు, కూరగాయలతో పూల పరిమళాలు వెదజల్లుతూ నిత్య వసంతంగా ఆత్మీయ అనురాగాలతో ఆనంద నిలయంగా కళకళగా ఉంటుంది.
అర్థరాత్రి అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. గేటు బయట కట్టిన గంట అదే పనిగా మొగుతుంది. ఎవరో ఆశ్రమం కోసం వచ్చారనుకొని రామయ్య వెళ్ళి గేటు తీసాడు అంతే, ఓ అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి తూలుతు కనిపించాడు. రామయ్య పడిపోకుండా ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఆపలేకపోయాడు. ఆలింగనం చేసుకున్నాడు పోదిమి పట్టుకున్నట్లుగా ఆ స్పర్శ ….. ఆ స్పర్శ రామయ్యలో ఏదో భావోద్వేగాన్ని కల్గించింది. మనసు తనువు పులకించింది. నెమ్మదిగా లోపలికి తీసుకువచ్చి వేడి నీటితో స్నానం చేయించి మంచి బట్టలు వేసి, ఆహారం తినిపించి, మంచంపై పడుకోబెట్టాడు. ఆ వ్యక్తిని పోల్చుకోలేనంతగా మారిపోయాడు కాని శరీర పరిష్వంగణలో చిన్ననాటి ప్రాణ స్నేహం చెదరలేదు. అతడే రంగయ్య, రామయ్య ప్రాణ బంధం. రంగయ్య నిద్రలోకి జారుకున్నాడు. రామయ్య పక్కనే కూర్చొని ఆలోచనలోకి జారుకున్నాడు. ”రంగయ్య ఒకప్పుడు శ్రీ కృష్ణుడైతే తాను కుచేలుడు అలాంటి గుణవంతుడు, ధనవంతుడు, స్నేహ శీలి, అందరి కష్టాలు వాడివిగా భావించి సహాయం చేసే ధర్మదాత. నేడు ఈ పరిస్థితిలోకి ఎలా వచ్చాడు. గత కొంత కాలంగా అందరికీ దూరంగా ఉన్నాడు. కనీస వివరాలు గానీ, ఫోన్ నంబర్ కూడా లేదు. కానీ రామయ్య మాత్రం రంగయ్య జ్ఞాపకాలతోనే కాలం గడుపుతున్నాడు. నేడు ఇలా …… చూస్తుంటేనే గుండెల్లో బాధ మెలిపెడుతుంది. అలానే నిద్రలోకి వెళ్ళిపోయాడు.
వరంగల్ దగ్గర ఒక పల్లె, అక్కడ యజమాని-నౌకరు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్యతో పనులు చేసుకునేవారు. వారికి ఇద్దరు కొడుకులు, వారి పేరే రంగయ్య, రామయ్య. చిన్న తనం నుండి కలిసి మెలిసి ఉండేవారు. గడ్డివాముల్లో కూర్చొని చదువుకునేవారు. రంగయ్య తల్లి కూడా రామయ్యను తన కొడుకుతో సమానంగా చూసుకునేది. హెచ్చు తగ్గులు బాల్యానికి అవరోధం కాకూడదు. పసి మనసులకు తారతమ్యం ఉండకూడదు అనే మంచి మనసు ఆ తల్లిది. రాము, రంగ అంటూ ముద్దుగా పిలిచేది. ఇద్దరు రూపంలో రంగుల్లో వేరైనా మాట, బాట, నిజాయితీ ఒకటిగా పెరిగారు. చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారికి వారే పోటీ. కొన్ని సార్లు రాము ఓడి రంగను గెలిపిస్తే, మరోసారి రంగా ఓడి రామును గెలిపించేవాడు. పాఠశాల వార్షికోత్సవము లో బహుమతులన్నీ వాళ్ళవే. వారి స్నేహం ఆ గ్రామానికే కాక అందరికీ ఆదర్శం. రంగయ్య పై చదువులకు పట్నం వెళ్ళాడు. రాము చేతి వృత్తుల విద్యతో పాటూ వ్యవసాయం నేర్చుకొని ఉన్న ఊర్లోనే ఉండిపోయాడు. సెలవుల్లో కలుసుకొని యోగ క్షేమాలు తెలిసుకోనేవారు. రంగ పట్నంనుండి రాము కోసం మంచి మంచి పుస్తకాలు, బట్టలు తెచ్చేవాడు. వృత్తికి వ్యవసాయానికి సరైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు. రాము రంగ దగ్గరికి వెళ్ళినపుడు పల్లె రుచునలను, పల్లె తల్లి ఇచ్చిన సంపదలను కానుకగా తీసుకెళ్ళేవాడు. కొంత కాలం గడిచాక రాముకు, రంగకు తగిన అమ్మాయిలను చూసి పెళ్లిళ్లు చేశారు వారి తల్లిదండ్రులు. రాముకు దగ్గరి బంధువుల అమ్మాయి మామూలుగా చదువుకున్నది. రంగకు బాగా చదువుకున్న అందమైన, ఆస్తి గల కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. రాము, రంగ భార్యల స్వభావం విభిన్న దృవాలైన తమ భర్తల స్నేహం ముందు తల వంచారు. స్నేహ మాధుర్యాన్ని తమ మనసులో ఆస్వాధిస్తూ వారి మధ్య కూడా సఖ్యత, ఆప్యాయతలు నెలకొన్నాయి. కాల చక్రం అయిదు సంవత్సరాలు తిరిగే సరికి రాము, రంగ ఇద్దరు తండ్రులైనారు వారికి చెరొక కొడుకు చాలనుకున్నారు. కాలానుగుణంగా మార్పులు సహజంగా వచ్చాయి. రంగ, రాము ఇద్దరు వారి పిల్లలను బాగా చదివించి అమెరికాకు పంపించాలన్న సంకల్పం చేసుకున్నారు. రాము పల్లెలోని పొలం కౌలుకు ఇచ్చి తన వ్యాపారంను పట్నంలో సాగిస్తూ ఇద్దరు మిత్రులు ఒకే ఊరిలో జీవనం సాగిస్తున్నారు. అనుకున్నట్లుగానే రాము వ్యాపారం బాగా వృద్దిలోకి వచ్చింది. రంగ ఉద్యోగంలోనూ, ఆస్తులలోనూ చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇద్దరి మధ్య స్నేహ వారధి ఇంకా బలపడసాగింది. పిల్లల చదువులు ముగిశాయి. పై చదువులకు అమెరికా వెళ్లాలని రంగ కొడుకు, జర్మనీ వెళ్తానని రాము కొడుకు నిర్ణయించుకున్నారు. వారి అభిరుచులకు, ఆశయాలకు అనుగుణంగానే రాము, రంగ ఏర్పాటుచేసి విమానాశ్రమానికి వెళ్ళి, విమానం ఎక్కించి వచ్చాడు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో రంగ కొడుకు అమెరికా నుండి ఫోన్ చేశాడు “తానే స్వంతంగా ఒక కంపెనీ పెడుతున్నానని ఇక్కడి అమ్మాయి పరిచయం వల్ల నాకీ అవకాశం వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను”. అంటూ ఫోటోలు పంపించాడు. ఏమీ చేయలేని స్థితిలో రంగ దంపతులు సోఫాలో కూలబడిపోయాడు. రాము దంపతులు రంగను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. మనసులో మాత్రం తన కొడుకు ఏమి చేస్తాడో అన్నదిగులు ఉండేది రాము దంపతులకు. కాని రాము కొడుకు తల్లిదండ్రుల ఇష్టంతోనే ప్రేమించిన అమ్మాయిన పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఉద్యోగాలుచేస్తూ వారి ఖర్చులకు పోనూ మిగిలిన డబ్బులను తండ్రికి పంపించేవాడు. వాటితో రాము ఆస్తులను కొని కొడుకు, కోడలు పేరున ఉంచేవాడు.
రంగ కొడుకు వ్యాపారంలో మెళకువలు నేర్చుకొని బాగా సంపాదిస్తూ ఖరీదైన స్నేహాలు, అలవాట్లతో పొదుపు చేయలేకపోయాడు. అతని భార్య కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చింది కావడం వలన విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. రంగయ్య కొడుకును ఎప్పుడు ఏమీ అనేవాడు కాదు. సంతోషంగా ఉంటేచాలు అనుకునేవాడు. రంగయ్య దంపతులను కొడుకు అమెరికా పిలుచుకున్నాడు. అక్కడి అందమైన ప్రదేశాలు చూపించాడు. తన కంపెనీ ఎలా నడుస్తుందో చెప్పాడు. స్నేహితులను పరిచయం చేశాడు. దాదాపు రెండు నెలల కాలం కొడుకు, కోడలు, మనవళ్లతో గడిపాడు. ఈ ఆనందం చాలు ఇంకా ఏ దిగులు లేదనుకున్నాడు. ఇద్దరు ఇండియా కు ప్రయాణం అవుతున్నారు. సరిగ్గా అదేసమయంలో కోడలు దగ్గరకు వచ్చి “మావయ్య మీ అబ్బాయి బిజినెస్ ను ఇంకా డెవెలప్ చేయాలనుకుంటున్నాడు”… అంటూ ఆగిపోయింది నేలచూపులు చూస్తూ, చెప్పు తల్లీ నువ్వు నా బిడ్డవే అన్నాడు రంగ.”అదే మామయ్య పట్నంలో ఉన్న ఆస్తులు కొన్ని అమ్మి మాకు డబ్బులు సర్దుబాటు చేస్తే బాగుంటుంది”. ఆ మాటలకు ఓ క్షణం తటపటాయించి ఇంటికి వెళ్ళి కబురు చేస్తా, వాటికి ఎంత ధర వస్తుందో తెలుసుకోవాలిగా అన్నాడు. సరే మామయ్య అంటూ సాగనంపారు. ఇండియాకు వచ్చి కోడలు అడిగినట్లుగానే ఆస్తులు అమ్మి కొడుకు అకౌంటుకు బదిలీ చేయించాడు. రాము వారించినా వినలేదు. మనం సంపాధించింది వాళ్ళకే కదా అంటూ రాము మాటలను తోసిపుచ్చాడు. మరో రెండు సంవత్సరాలకు ఇంకొంత ఆస్తి అమెరికా చేరింది. వయసు తెచ్చిన ప్రభావమో, దిగులో తెలియదు రంగ భార్యకు అనారోగ్యం వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. విషయం తెలుసుకున్న రంగ కొడుకు మిగిలిన ఆస్తులను అమ్మి అమ్మను తీసుకొని మా దగ్గరకు రండి ఇక్కడ మెరుగైన వైద్యం చేయించవచ్చు అన్నాడు. భార్యను బ్రతికిచ్చుకోవాలి అన్న ఆరాటంతో ఆస్తులను సొమ్ముగా మార్చుకొని భార్యను తీసుకొని కొడుకు దగ్గరకు వెళ్ళాడు. ఇంతకుముందు వెళ్ళినపుడు కొడుకు కోడలు బాగా చూసుకున్నారు కదా ఇప్పుడు అలాగే అనుకున్నాడు. కాని అక్కడకు వెళ్ళిన కొద్ది రోజులకు తెలిసింది. ఆస్తులు కావాలి కాని కన్నవారి అవసరం కాదని ఏదో మొక్కుబడిగా వైద్యం సాగుతుంది. కాస్త మెరుగైంది అనుకునే పరిస్థితిలోనే రంగ భార్య చనిపోయింది. ఆ తర్వాత రంగ నుండి ఫోన్లు ఏమీ రాలేదు……
రంగ లేచి కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న రాముని లేపి అమాంతంగా కౌగిలించుకున్నాడు. “స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం” అనే పాట వినిపిస్తుంది ఇద్దరి మనసుల్లోనూ. అప్పుడు అడిగాడు రాము, రంగను ఇన్నాళ్ళు ఎక్కడకు వెళ్లావు? నేను గుర్తుకు రాలేదా? అంటూ …. రంగ కళ్ళు జలపాతంగా మారాయి. రాము తన కండువతో కన్నీటిని తుడిచి ఏంటి రా చిన్నపిల్లాడిలా! అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ముందు కాఫీ తాగు అంటూ మొక్కల మధ్య ఉన్న శ్రీ కృష్ణుని విగ్రహం దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. చూడరా నీకు ఇష్టమైన దైవం నీ గుర్తుగా ఇక్కడ పెట్టించాను. అదిగో అక్కడు చూడు నీ ఫోటో ఉంది అంటూ చూపించాడు. రంగ రాము చాలా ఆనందంగా చిన్నపిల్లలై పోయారు.
ఇప్పుడు చెప్పరా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అని రాము రంగ ను మళ్ళీ మళ్ళీ అడిగాడు. “ఏముందిరా చెప్పడానికి వాళ్ళు పథకం ప్రకారం నా ఆస్తులన్ని స్వంతం చేసుకొన్నారు. తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పు చూశాను, ఇండియాకు రావాలనుకున్నాను. కాని ఆవిడ చనిపోవడంతో కొంత కాలం ఉండాల్సి వచ్చింది. నిన్ను చూడాలని మన పల్లెలో బ్రతకాలని మనసు ఆరాట పడింది. ఆ విషయమే కొడుకుకు చెప్పాను. వాడు విమానం మాత్రం ఎక్కించాడు. చేతిలో చిన్ని గవ్వలేదు. పట్నం రాలేక ఎక్కడెక్కడో చిన్నచిన్న పనులు చేసుకుంటూ చివరకు ఇలా నీ దగ్గరకు చేరాను” అని చెప్పాడు.
ఆత్మీయ నిలయం ఏంటి రా ఎందుకు పెట్టావు అని రంగ రాముని అడిగాడు. నా కొడుకు పంపిన డబ్బులతో ఆస్తులను కూడబెట్టాను. వాడు రమ్మన్నా నేను పోలేదు, వాళ్ళే అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోతారు. ఇక్కడ అన్నీ లెక్కలు చూసుకుంటారు. మన ఊళ్ళో ఉన్న మన వయసు వాళ్ళందరూ ఒంటరి వాళ్ళు అయ్యారు. పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, అందుకే కొడుకు, కోడలు, నేను కలిసి తీసుకున్న నిర్ణయం మన స్నేహానికి గుర్తుగా మన లాంటి వారి కోసం ఏర్పాటుచేసిన నిలయమే ఈ ఆత్మీయ నిలయంరా అంటూ ఒకరినొకరు కౌగిలించుకొని ఇద్దరి ఆత్మలు ఒకటిగా అడుగులు వేయసాగారు. “స్నేహానికన్న మిన్న లోకాన లేదురా …. కడ దాకా నీడ లాగా నిను వీడిపోదురా … పాట సాక్షిగా రాము రంగ స్నేహానికి చిరునామా అయ్యారు.”
https://youtu.be/rwIcPMXnsvA
శ్రీభారత్ వీక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..🌹 పూల పండుగ..పూల పరిమళాల పండుగ.. బతుకు పండుగ.. బతుకు నేర్పే పండుగ.. ఈ బతుకమ్మ పండుగ. స్త్రీ లను ఉన్నత స్థానంలో నిలిపే స్త్రీపురుషుల పండుగ విశేషాలను, ప్రయోజనాలను ఎంతో చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి డా. కొండపల్లి నీహారిణి గారు. మధురమైన పాటలను ఆలపిస్తూ, ఆ పాటల్లోని సాహిత్య సౌరభాలను అందించారు రచయిత్రి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
మయూఖ పత్రిక పాఠకులకు కానుక అని చెప్పడానికి ఈ పత్రికలో ప్రచురించిన ఎన్నో సాహిత్య విషయాలు ఒక కారణమైతే, ఇంద్రధనుస్సు శీర్షిక లో విభిన్న రచనలు మరో కారణం. “ప్రదేశాలు వాటి ప్రాచుర్యాలు ” శీర్షికలో భాగంగా ఆగస్టు మయూఖ లో ‘అల్జీరియా ‘ దేశం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బోట్స్వానా గురించి తెలుసుకుందాం. ప్రపంచం మన అరచేతిలోకి వచ్చినా , కన్నుల్లో నింపుకుని ఆనందించే అవకాశం వస్తే చాలా బాగా ఉంటుంది. ప్రపంచం లోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఆఫ్రకా ను చూడాలి . అక్కడి ప్రకృతి ని గురించి ఇలా నాలుగు మాటలలో నేను రాస్తున్నా, అవకాశం వస్తే మీరందరూ చూడండి. ప్రస్తుతం ఈ వ్యాసం లో బోట్స్వానా ను చూడండి.
“అద్భుత దృశ్యాల బోట్స్వానా
బోట్స్వాన ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశానికి దక్షిణ మరియు ఆగ్నేయ సరిహద్దులలో సౌత్ ఆఫ్రికా ఉంది.
పడమట మరియు ఉత్తర సరిహద్దులలో నమీబియా దేశం ఉంటుంది.
ఉత్తర సరిహద్దులలో జింబాబ్వే కూడా ఉంది తూర్పున కొన్ని వందల మీటర్లు మేర స్వల్ప సరిహద్దుగా జాంబియా ఉంది.
బోట్స్వానలో ప్రాచుర్యం పొందిన కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో 1. చోబె నేషనల్ పార్క్, 2. ది ఒక్వంగ డెల్టా మరియు 3. కలహారి డెసర్ట్ చాలా ప్రాముఖ్యత చెందిన ప్రదేశాలు.
చోబె నేషనల్ పార్క్ లో హ్యూజ్ ఎలిఫెంట్స్, చాలా పెద్ద పర్సనాలిటీ కలిగిన ఎలిఫెంట్ బఫెలోస్ మరియు నేషనల్ పార్క్ లకు గర్వాన్ని పెంచే మృగరాజులు ఎన్నో వీక్షకులకు కన్నుల విందు చేస్తాయి.
కోతికొమ్మచ్చిలాడే బబూన్స్ మరియు రకరకాలైన పెద్ద పెద్ద పక్షులతో చోబె నేషనల్ పార్క్ నిండి ఉంటుంది
ఈ నేషనల్ పార్క్ ను “ట్రూ వైల్డ్ లైఫ్ పారడైజ్” అని అభివర్ణించొచ్చు. అక్కడ ఉన్న నదుల్లో హిప్పోపోటమస్లు (నీటి ఏనుగులు) అత్యంత ఆనందంతో ఎప్పుడూ జలకాలాడుతూనే ఉంటాయి.
ఇప్పుడు ఇక ఒక్వంగా డెల్టా గురించి తెలుసుకుందాం. ఈ డెల్టా ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందింది. ఈ డెల్టా ప్రాంతం “7 వండర్స్ ఆఫ్ ద ఆఫ్రికాలో” ఒకటి. రకరకాల పక్షులు, జింకలు, నదులు మరియు చిన్నచిన్న కాలువలతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది.
ఇక బోట్స్వానాలో అతి ప్రసిద్ధి చెందిన కలహారి డెసర్ట్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా అందమైన, విశాలమైన ఎడారి ప్రాంతం.
ఈ ఎడారి దాదాపు 9,30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఈ ఎడిరిలో మీర్కాట్స్(Meerkats) అనే చిన్న ముంగీస జాతికి చెందిన జంతువులు ఉంటాయి.
వీటికి ఈ పేరు డచ్ భాష నుండి వచ్చిందనీ, సంస్కృత భాష ప్రకారం దీనికి ఈ పేరు మర్కటం నుండి వచ్చిందని అంటుంటారు.
ఈ జంతువులు తమ రెండు కాళ్ళ మీద నిలబడి ఏదో వచ్చే వింతను చూస్తున్నట్టుగా పోజు పెడతాయి. ఇవి నిజంగా ఫోటోల కోసం పోజు పెట్టినట్టుగానే ఉంటాయి. ఈ కలహారి డెసర్ట్ లో “బుష్మన్”(Bush-man) అనే ట్రైబల్ తెగలు ఉంటాయి. ఈ జాతివారికి చాలా ప్రత్యేకత ఉంది. వీరు చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ డెసర్ట్ లో దొరికే రకరకాల మూలికలతోనే నయం చేసుకుంటారు. వీరి కను దృష్టి చాలా షార్ప్ గా ఉంటుంది.
“గాడ్స్ మస్ట్ బి క్రేజీ” The God’s Must be Crazy) అనే English సినిమాలో ఈ బుష్మన్ల గురించి చాలా బాగ చిత్రీకరించారు. వీరి జీవన శైలి గురించి, వారు నివసిస్తున్న పరిస్థితుల గురించి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ ఎడారి లోని “సోడి హిల్స్” (Tsodi) రాక్ ఆర్ట్స్ గా చాలా ప్రసిద్ధి చెందింది.
చాలా వందల సంవత్సరాల క్రితం ఈ తెగవారు అక్కడి సోడో హిల్స్ లో రాళ్లపైన చిత్రీకరించిన జంతువుల బొమ్మలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
ఇన్ని వింతలతో,
ఇంత చక్కని ప్రదేశాలతో ఆనందాన్ని ఇచ్చే బోట్స్వానా (Botswana) దేశాన్ని మీరు తప్పకుండా విజిట్ చేయండి.
“పెండ్యాల రాఘవరావు అంటే ఆ మాదిగల కలిసినాయన “అని పేరు ను, తీర్మానాన్ని చేసి అదేదో తప్పు పని అన్నట్టు మాట్లాడేవారికి ఎదురు నిలిచి
మా బాపు సమానత్వ భావనల సమరశంఖం పూరించి ,సహపంక్తి భోజనాలు నిర్వహించారు.
1935 ప్రాంతం రోజులవి. మహా గడ్డు కాలం,గుడ్డి లోకం. ఆనాడు దళితులను హరిజనులు, మాదిగలు అనే వాళ్ళు. దూరం పెట్టేవాళ్ళు. ఈ అంటరానితనం నిర్మూలనకు కృషి చేయాలని మా బాపు నడుకట్టారు. మేము నాన్న ను బాపు అని అంటాం . మా బాపు చాలా మంచి వారు.
పెండ్యాల రాఘవరావు గారు ( 15. 3.1917 _ 10. 9 . 1987)
వరంగల్ జిల్లా చిన్న పెండ్యాల గ్రామ వాస్తవ్యులు. పెండ్యాల పిరాట్యమ్మ , రామంచందర్ రావు వీరి తల్లిదండ్రులు. భూస్వామ్య, గ్రామ కరణం కుటుంబం. చిన్ననాటి నుండి చదువులో చురుగ్గా ఉండటం తో హన్మకొండ లో చదువు కొరకు పంపించారు. ప్రపంచం, రాజకీయాలు పరిచయమయ్యాయి. గాంధీ స్వాతంత్ర్య పోరాటాలు తెలిసాయి.

నిజాం నిరంకుశ రాజ్యంలో తొలి స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహి గా ఎన్నో పోరాటాలు చేసారు.
హైదరాబాద్ రాజ్యం లో చైతన్యాన్ని రాజేసిన ఆనాటి ఆంధ్ర మహాసభ లో జాతీయపక్ష కార్యకర్తగా పనిచేస్తున్న కాలంలో తనకు తానే స్వతంత్ర వీరునిగా మలుచుకున్నారు. గ్రామాల్లో విద్య అనేదే లేక అంధకారంలో ఉన్న సమాజానికి తామే స్వయంగా సిలబస్ తయారు చేయించి బళ్ళు పెట్టి చైతన్యవంతులను చేసారు. హాస్టల్ పెట్టారు.
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి ఎదిరించినందుకు జైలు పాలయ్యారు. సాంఘిక కట్టుబాట్లను ఖండిస్తూ స్త్రీ ల పక్షాన గొంతెత్తారు. వెట్టిచాకిరి నిర్మూలన కోసం పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి తమ జీవితాన్నే బలి ఇచ్చేందుకు సిద్ధపడిన విశాల హృదయుడు పెండ్యాల రాఘవరావు. దళ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసాడీ అజ్ఞాత వీరుడు . శాసనోల్లంఘనం చేసి నిజాం ప్రభుత్వానికి నిద్ర పట్టకుండా చేసిన సాయుధ పోరాట యోధుడు. రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పాటుపడిన ఘనుడు. ఎన్నో ఏళ్ళు అడవుల్లో క్యాంపులు నిర్వహించి స్వాతంత్ర్య సమరం చేసిన విప్లవ వీరుడు.కమ్యూనిస్ట్ నాయకుడు.
క్రమశిక్షణ ,సత్ప్రవర్తన,మంచితనం , ఉన్నత భావాలు పోతపోసిన రూపు మా బాపు ధృఢకాయానికి మరింత వన్నె తెచ్చినవని ఆనాటి పెద్దల అభిప్రాయం.
ఔను! అనర్ఘళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారనీ, బాపు మీటింగ్ ఎక్కడున్నా ప్రజల సద్దులు గట్టుకొని బండ్లల్లో వచ్చేవారు అని ఎందరో గుర్తుచేసుకున్న మాటలు నాకు స్ఫూర్తినిస్తాయి . మా బాపు జీవిత చరిత్ర రాయాలని చుట్టుపక్కల గ్రామాల్లో బాపుతో పనిచేసిన కొందరు దళ సభ్యుల్ని,ఇతర ప్రముఖ లీడర్ల ఇంటర్వ్యూచేస్తే ఇలాంటి విషయాలెన్నో చెప్పారు- “ఆయన మాటలే తూటాలు”,”ప్రజలను చూరగొనే వాగ్ధాటి”, ” ఉత్తమ నిర్మాత”,”ప్రజల మనిషి”, “రాఘవ రావే మూమెంట్”, “ప్రజలను అంటిపెట్టుకున్న వీరుడు “, “పట్టుదలగల మనిషి “,” హృదయంలో సాయుధ పోరాటం”, “ధన్యమైన జీవితం “,” మంచి స్నేహితుడు “,”ఆయనే పోరాటం “,”మడమతిప్పని మరో స్వాతంత్ర్య సమరసేనాని”,”ఆదర్శప్రాయమైన జీవితం “,”ఆయన త్యాగధనుడు”,”మెస్మరైజ్ చేసే ఉపన్యాసం”,”సామాజిక విప్లవ వైతాళికుడు””ఆత్మీయుడు”, “సైన్యాధిపతి” అంటూ వారి వారి అభిప్రాయాలను వ్యాసాలలో రాసిచ్చినవీ మా బాపు రాసుకున్న ” నా ప్రజా జీవితం” పుస్తక రూపంలోకి తెచ్చినప్పుడు అవన్నీ వేసి ముద్రించాము. అదొక గొప్ప అనుభూతి. అవును మరి మా బాపు నూనూగు మీసాల నూత్న యవ్వనం లో ఊళ్ళో ‘ఓం జెండా ‘ఎగురవేసి సర్కార్ ను, త్రివర్ణ పతాకాన్ని వరంగల్ కోటపై ఎగురవేసి నైజాం రాజుకు ఎదురొడ్డిన పోరాటాలన్నీ కథలు కథలుగా విన్నదాన్ని ఎలా ఊరుకుంటాను? ” మావి రికార్డు లు లేవు, ఉన్న రికార్డులను తగులబెట్టడమే మా కార్యక్రమాలాయె” అనీ
“మేము ఏదో ఆశించి చేయలేదు ఆ పోరాటాలు . అసలు మేం బతుకుతామని అనుకున్నామా?”అని ప్రముఖ వారు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతుంటాయి.ఇప్పుడు ఈ స్వాతంత్ర్య వజ్రోత్సవ సందర్భంగా ఇలా తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆనాటి వీరుల గురించి అక్షరాలలో నిక్షిప్తం చేస్తుంటే ఎంత సముచితమైన కార్యం తలపెట్టారని అభినందనలు చెప్పడం తప్ప ఏం చేస్తాం? స్వాతంత్ర్యం వడ్డించిన విస్తరి అయింది నేటి విచ్చలవిడి సమాజానికి. నిర్లక్ష్యం వహిస్తే గ్రద్ద లా తన్నుకుపోతారీ స్వాతంత్ర్య శాంతి కపోతాన్ని. అప్రమత్తం చేయాలనే నిర్వాహకులు భుజాన వేసుకున్నారనకతప్పదు. ఈ మహా కార్యక్రమం లో ఓ అక్షర మౌతున్నందుకు నాకైతే సంతోషంగా ఉంది. ఈ వీరుని బిడ్డ ను అని చెప్పుకోవడం గర్వం గా నూ ఉంది.
భారత భూమి మనదే కానీ ఫలితము మనకేది ॥2॥
భారతదేశము భాగ్యమదేశం
పై గనగా మనదే
ఆకలితోడ మలమల మాడి
అలమటించుట మనదేగా
పరదేశీయుల్ పాలన చేయగా స్వరాజ్యంబదియేది
ఫలితము మనకేది॥2॥
రత్నగర్భయని నామమొంది
దేశ దేశముల కీర్తి పొంది
ఘనవిఖ్యాత ఖ్యాతి నొందె ఘనతర స్వాతంత్ర్యము లేక ఫలితము మనకేది ॥భారత॥
అంటూ పాటలు రాసి పాడిన మా బాపు ఆనాటి ఆర్య సమాజం లో పనిచేసారు.
“తల్లిని మించిన దైవము వేరే
ధారుణి లేదోయూ ॥2॥
స్వారాజ్యంబె స్వరాజ్యమాయే
మా సేవా బలమాయే
ఈ ధరణీ మాతోయీ ॥ 2॥
అని గేయాన్ని రాసిన మాబాపు ఎంత గొప్ప కవి కదా!
“భారతమాత వందనం
కన్నా తల్లి వందనం
మా కన్నా తల్లీ వందనం ॥భారత॥
మన భూమి హితమే కోరి
మానరా మధుపానమూ
మాని సుఖియించరా॥భారత॥
అని సామాజిక గేయాలు రాసినా,
“త్యాగశీలురకు దేశ సేవకులకు జోహారులిడగా కదలిరారే దేశభక్తులకు దీన బంధువులకు జోహార్లీడగా కదలిరారే ॥ జోహారు॥సత్యమహింసా సర్వభూత దయ మూర్తిభవించి సాక్షాత్కరించిన దేశభక్తులకు దీనబంధువులకు జోహారులిడగా ॥
ధరా సుతులను వర్జించి
ధన ధాన్యంబులు త్యజియించి మాతృభూమిని సేవించుటయే పరమార్ధమని యెంచి
పాటుపడిన భవ్యమూర్తులకు జోహారులిడగా కదలిరారే”
అంటూ ఉత్తేజకరమైన గేయాలు ప్రజలముందు పాడినా మా బాపు స్వాతంత్ర్య కాంక్ష , సాహిత్య అభిలాష తెలిసిపోతుంది.
ఏడవ తరగతి వరకే చదువుకున్నా తెలుగు,ఉర్దూ,హిందీ, ఇంగ్లీష్ భాష లలో పటుత్వాన్ని సాధించుకున్నారు .
అందుకేనేమో ఎం.పి. పదవి తీసుకొమ్మని కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి చేసి శాసనసభ సీట్లు వదులుకొమ్మని ఉంటుంది. పార్లమెంట్ లో గళాన్ని వినిపించాలంటే హిందీ బాగా మాట్లాడగలగాలనే , భాషా నైపుణ్యం ఉన్నవారు కావాలనే కావచ్చు. మా బాపు ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పోలీసు ఆక్షన్ సమయం లో మూడు ఏళ్లు జైలు జీవితం గడిపారు. 1952 లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల లో పోటీ కి జైలు నుండే నామినేషన్ వేసి, పి.డి.ఎఫ్ తరపున పోటీ చేసారు. రెండు ఎం .ఎల్.ఏ. సీట్లు ఒక ఎంపీ సీటు కైవసం చేసుకున్నారు. అత్యధిక సీట్లు ఏక కాలంలో గెలుచుకున్నందుకు మా బాపును , అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రావి నారాయణరెడ్డి గారిని నెహ్రూ గారు పార్లమెంట్ లో అభినందించారు.
1952 నుంచి 57 దాకా తొలి లోక్ సభ లో ఎన్నో సమస్యలపై ప్రజాగళం వినిపించిన వక్త మా బాపు.
“ఆయన ఎవరనుకున్నావ్? ” ,”హి ఈజ్ అవర్ మాన్” అని హృదయపూర్వకంగా తోటి పోరాట వీరులతో ఆనాటి నాయకులతో అనిపించుకున్న పెండ్యాల రాఘవరావు గారు వారు జైలు లో ఉన్నప్పుడు 1949-50 లలో కంట్రోళ్ళ పై
‘‘ నా దేశం- నా భారత దేశం
నా దేశం నా భారత దేశం
మన్ను బంగరౌ మాన్యాలున్నా
సాలెల్ల పారే సెలయేరులున్నా
మడిలో మొక్కకు తడిలేదన్నా”॥ నా దేశం రా॥
అంటూ రాసిన గేయం లో పేద బ్రతుకులను స్పృశిస్తూ, దళారుల మోసాలను , రాజకీయాలను ఎండగట్టారు. ” వలస విధానపు వరమేరయిది/ తెల్లోడు పెట్టిన తెగులేరయిది/
నల్లోడు నేడు నడుపుతున్నాడు/ దోపిడి వర్గాల దాపునున్నాడు” ॥ నా దేశం నా భారత దేశం”
అని రాసినారు.
మా బాపు ధైర్యసాహసాల గురించి ఎన్నైనా చెప్పవచ్చు.ఆయన జీవిత చరిత్ర అంటే ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాట చరిత్ర, సాయుధ పోరాట చరిత్ర
ప్రత్యేక తెలంగాణ కు ప్రత్యేక పండగ బతుకమ్మ, రాష్ట్ర అవతరణ తరవాత రాష్ట్రం లోని ఊరు ఊరు వాడ వాడా చేరింది బతుకమ్మ, రాష్ట్ర హద్దులు దాటి, దేశ ఎల్లలు దాటి వెళ్లింది బతుకమ్మ. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పూల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. మా బడి పిల్లలు బతుకమ్మ సంబరాలను బొమ్మగా గీశారు. చిన్నారుల చిట్టి ప్రయత్నం మెచ్చుకోదగినది.
-రూప

చిన్నారి చిత్రకారులు
D.హర్ష
ఆదిత్య కుమార్,
M రమేష్,
8th ‘డి’ సెక్షన్
ZPHS శివరాంపల్లి
రాజేంద్ర నగర్ మండలం
రంగారెడ్డి జిల్లా
