ఈ భూమి పుట్టినప్పుడే నా దేశం పుట్టింది
నేల నాగరికత నేర్చినప్పుడే ఇక్కడ నాగరికత విలసిల్లింది
ప్రపంచ పటంలో చిన్న భాగమే అయినా
అధిక మానవ వనరుల్ని అందిస్తున్న దేశం
రణక్షేత్రం నడుమ గీతోపదేశం అందించిన దేశం
మూడు సముద్రాల మధ్యనున్న మానవ మహా సముద్రం
కోహినూర్ వజ్రంతో బాటు కోట్లాది అపురూప వ్యక్తులకు జన్మనిచ్చిన రత్నగర్భ
వేదాలను అందించడమే కాదు వేదాంతాన్ని తెలియజేసిన నేల
సున్నాను కనిపెట్టి శూన్యంలో అనంతం ఉందని చాటి చెప్పిన భూమి
తిరిగొచ్చే దారి తెలియక పోయినా పద్మవ్యూహం లోకి
చొచ్చుకు పోయే యోధులు పుట్టిన గడ్డ
హంసను బాణంతో బాధించిన దేవదత్తుడి పేరు చరిత్రలో మాసిపోయినా
లేపనం పూసి ఊరడించిన సిద్దార్ధుణ్ణి మరవక బుద్ధుణ్ణి చేసి నెత్తికెత్తుకున్న నేల
గాయం చేసిన వాడిని మరిచినా గాయం నయం చేసిన వాడిని మరువని ఔదార్యం కల జాతి
హంసలు నడయాడిన అవని
పరమ హంసల బోధనల పావని
ప్రపంచమంతా చెట్ల బెరళ్లు కట్టుకుని తిరిగినప్పుడు చీనాంబరాలు ధరించిన ధరిత్రి
సింధు నదీ లోయల్లో చిందులేసిన నాగరికతను సృజించిన భూమాత
సప్త సాగరాలకు సప్తస్వరాలను బహూకరించిన భరత మాత
కంప్యూటర్లు పుట్టక మునుపే మానవ కంప్యూటర్ ను కన్న మాతృ మూర్తి
జీలం నది సాక్షిగా కట్టించుకున్న ఒక్క దారపు పోగుకు
కట్టుబడిన పురుషోత్తముల సౌభ్రాతృత్వం
నరేంద్రుడే వివేకానందుడై చిన్న ఊరి నుండి చికాగో దాకా పాకిన విజ్ఞానం
మొక్కల్నీ కుక్కల్నీ పెంచడమే కాదు మొక్కుకునే ప్రజలున్న దేశం
నీళ్లకూ పూలకూ హారతులిచ్చే ధరణి
పుట్టలనూ గుట్టలనూ పూజించే పుడమి
ఎలుకలకూ , ఏనుగులకూ ఒకేలా దండం పెట్టే దేశం
ఆహారమడిగిన డేగకు సైతం తొడను కోసి ఇచ్చిన శిబి దాతృత్వం
పర్యావరణ స్పృహ లేనప్పుడే ‘వృక్షో రక్షతి రక్షిత ‘అని చాటిన ధరిత్రి
జీవ వైవిధ్య రక్షణ మాట తెలియనప్పుడే పాములకు సైతం పాలు పోసి పూజించిన భూమి
నల్లని రాళ్ళనూ , నల్లని దేవుళ్లనూ ఆరాధించే వర్ణ వివక్షత లేని వసుధ
యోగాతో ఆరోగ్యాన్నీ గీతతో వైరాగ్యాన్నీ గీతాంజలితో సాహిత్యాన్నీ
బహుమతి నిచ్చిన మహీమండలం
చుట్టుపక్కల మానవబాంబులు పుట్టుకొస్తున్న వేళ
మానవ ప్రేమే పరమావధిగా భావించిన నేల
నెత్తురోడుతున్న దేశాల దేహాలకు
శాంతి లేపనాన్ని పూసిన శ్వేత కపోతం
బక్క చిక్కిన దేహంతో బానిసత్వపు సంకెళ్లను తెంపిన
కారుణ్య మూర్తిని కన్న తల్లి
జగతికి శాంతి కాంతిని ప్రసరించి అహింసా మంత్రాన్ని బోధించిన అమృత మూర్తి నా భరత మాత !!
ఏడు దశాబ్దాల క్రితమైనా .. ఇప్పుడైనా నా దేశ పతాకానికి మూడే రంగులు
సత్యం .. శాంతి … అహింస ..
నా దేశ జెండా మధ్యలో ఎప్పటికీ అశోక చక్రమే !
నా జాతి లక్ష్యం శోకమే లేని సరి కొత్త ప్రపంచమే !!
ఎన్నాళ్ళైంది వాన
వానాకాలం పొడవునా కురిసి
నేల దాహం నీ దాహం తీరేదాకా కురువు
మీ ప్రేమ పరిపూర్ణత సాధించే దిశగా
పరుగు పరుగున వచ్చి
చెరువు కట్ట రాతి ని ముద్దాడాలని
ప్రవాహ పరువం తహ తహ
సంద్రమెరుగని పల్లె పడుచు
రాతి ని తాకి కట్ట మీద పడే జల్లు లో తడిసి
పరవశించే
ఎప్పుడెప్పుడు దూకుదామని
ఆతృతలో వాగు
అలుగు రాళ్ళ లెక్కెట్టుకుంటూ
ఒంట్లు నేర్చుకుంటుంది
అలుగు పారితే నమ్మకం తో
కోసే యాట కోసం మైసమ్మ
కళ్ళల్లో వత్తులు వేసుకుని
ఎదురు చూస్తుంది
మోట బొక్కెన లో
నాన బోసిన వడ్లు మొలకెత్తి
ఎప్పుడు అలుకుతావని రైతుని
మడి దున్నమని అడుగుతున్నాయి
ముసురు లో
జారుతున్న కట్ట తోవ మీద
విన్యాసాలు చేస్తూ
కొక్కెరలు తల మీంచి కింది దాకా వేసుకుని
బడి బాట పడుతున్న పిల్లలు
ఎదురెక్కే చేపల కోసం
ఎర గాలాలతో వాగొడ్డున
సోపతి గాళ్ళు ముచ్చట్ల మురిపాల్లో
మంచు ముత్యమెరుగని మర్రి
ఆకాశాన్నంటిన తాటాకు కొసన
రాలనా వద్దా అని ఆలోచిస్తున్న వాన బిందువును
ఒడిసిపట్టుకుందామని నిరీక్షణ లో మర్రి ఆకు
కలిసి పెరిగిన
వేప రావి సహజీవనం లో
రాలే చినుకులు కొత్త దనాన్ని
సృష్టిస్తున్నాయి
మోదుగు పువ్వుపై
రాలిన చుక్క ఎరుపు రంగు పులుముకుని
తంగేడు పూల జత కలిసి
కొత్త సంధ్య కోసం దారి పరుస్తున్నాయి
అది నిన్నటి నీటిని,
ఈనాటి కన్నీటిని
పీల్చుకొని ఊపిరి పోసుకుంది.
ఆటంకాలని చీల్చుకొని,
చీకటి తొడుగుని
విప్పుకొని మొలకెత్తింది.
కొండగాలి కొంటెగా
హార్మోనియం వాయిస్తుంటే
అడుగుల్లో అమ్మోనియం నైట్రేట్
రైట్! రైట్! అంటుంటే
శ్రవణానందకరంగా
ఆకులు అల్లరి చేస్తాయి
నయన మనోహరంగా
కొమ్మలు ఊయలలూగుతాయి
కిరణజన్య సంయోగ క్రియతో
పరిసరమంతా
పత్రహరిత నర్తనమౌతుంది.
దాని వేర్లలో
నల్లని జాడలు ఇంకా ఉన్నాయి.
అయినా
ఆత్మీయతా వెలుతురు సోకినప్పుడల్లా
ఆకుపచ్చని ఆశలను కలగంటుంది
ఏం కొంచెం యాత్రా స్థలాల దర్శనానికి అవకాశం ఉన్నా ముందుండేది మేమే. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ప్రభలడంతో టూరిజం మొత్తంగా కుప్పకూలడం యాత్రా ప్రదేశాలపై కోవిడ్ ఆంక్షల వల్ల ఎక్కడకైనా వెళ్ళాలన్నా అవకాశాలు తగ్గిపోవడంతో రెండు సంవత్సరాల పాటు అన్ని ఆలోచనలకి, కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది.
కొంచెం కొంచెంగా కోవిడ్ తగ్గుముఖం పడ్తున్న ఈ సందర్భంలో లడక్ యాత్ర గురించి మిత్రుల ద్వారా తెల్సుకొని ఎలా అయినా ఈసారి టూర్ మిస్ కావద్దు అనుకొని ముందుగానే వెళ్ళాల్సిన ప్రాంతం వివరాలు ఎక్కువగా తెలువకున్నా ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం.
ప్యాకేజి అయితే బుక్ చేసుకున్నాం కాని, సహచర మిత్రులను ఆహ్వానిస్తే వారు మా ఆహ్వానం తిరస్కరించడమే కాకుండా ఒకరకంగా మమ్మల్ని టూర్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని వత్తిడి తేవడం ప్రారంభించారు. వాళ్ళు చెప్పిన విషయం సూక్ష్మంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన కర్ దుంగ్లా పాస్ 18000 అడుగుల ఎత్తులో ఉంటుందని, ఆ శిఖరాలు అన్ని మంచుతో కప్పబడి ఉంటాయని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి హై ఆల్ టిట్యూడ్ సిక్ నెస్ తో వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ ప్రాంతంలో అక్కడక్కడ మిలటరీ క్యాంప్స్ తప్ప పెద్దగా జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటాయని వైద్య సౌకర్యాలు కూడా చాల తక్కువగా ఉంటాయని, ప్రయాణించే ప్రతి వెహికిల్ లో ఆక్సిజన్ సిలిండర్లు తప్పనిసరిగా క్యారీ చేస్తారని, ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ ద్వారా ధృవపత్రం అందజేస్తేనే ప్రయాణానికి అనుమతి ఉంటుందని వివిధ కారణాలతో మాతో లదాక్ రావడానికి ఉత్సాహం చూపలేదు. మేము మాత్రం ఈ టూర్ ఎలా అయినా వెళ్ళాలనే దృఢ నిశ్చయంతో ప్రయాణానికి సన్నాహాలు మొదలు పెట్టాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఒకసారి ఈ
ప్రాంత విశేషాలను, ఈ ప్రాంతాలు దర్శించిన యాత్రికుల అనుభవాలు కొంత ఉపయోగపడతాయని
వివరాలు సేకరించడం మొదలు పెట్టాం.
మొట్టమొదటగా ఈ ప్రాంతంలో కొంతకాలం పనిచేసిన ఒక డాక్టర్ మిత్రున్ని సంప్రదించి మేం లడక్ వెళ్తున్న విషయం చెప్పగానే చాలా పెద్ద సాహసయాత్ర చేయబోతున్నావ్ అంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ప్రోత్సహించి, అక్కడ పరిస్థితులను, అసౌకర్యంగా ఉన్నప్పుడు ఏ సమయాల్లో ఏం మందులు అవసరమో వివరంగా చెప్పడంతో నేను నా డైరీలో వాటికి సంబంధించిన వివరాలను నోట్ చేసుకుని భద్రపరచుకున్నా. దీనితో పాటు యాత్రలో సందర్శించబోయే ప్రాంతాలు, వాటికి సంభంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంతో మునిగిపోయా.
ఇక లడాక్ వివరాల్లోకి వెళ్తే, వరల్డ్ రూఫ్ టాప్ గా పరిగణించే లడక్ ఒక సుందరమైన ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం. ముఖ్యంగా జూన్, జులై మాసాల్లో అయితే లడక్ లోని వివిధ ప్రాంతాలు సందర్శించుకోవడానికి చాలా మంది యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా యువతీ యువకులు వారి సైకిల్ మోటార్లపై సాహసోపేతంగా ప్రయాణించడానికి ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతం ఐన కార్డుంగ్ లాపాస్ ప్రాంతానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
ఈ ప్రాంతంలో విహరించిన వారం రోజులు ప్రకృతిలో లీనమయినట్టుగా జీవితం సాగిపోయింది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అన్నట్టు ఉండే కరెంటు. ఎప్పుడో ఒక సారికాని కనెక్ట్ కాని ఫోన్, స్వచ్ఛంగా తెల్లగా మెర్సిపోతున్న మంచు కొండలు, గడ్డకట్టి చలిగాలులు, ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు, కిలోమీటర్ల కొద్ది కానరాని మనుషులు, కుడివైపు అంతా కారకోరం పాస్ పర్వత శిఖరాలు, పర్వతాలపై పడి కర్గి పోతున్న మంచు తాలుకు నీటితో లోయలోకి ప్రవాహంలా దూసుకపోతున్న సయోక్ నది ఎడమవైపు ఎంతో ఇరుకైన రహదారి మనని ఎంతో ఆహ్లాదంలో, ఆనందంలో ముంచెత్తుతాయి.
లడక్ ప్రాంతంలో గల లెహ్ ప్రాంతం సముద్రమట్టానికి 11562 అడుగుల ఎత్తున ఉండే అందమైన ప్రదేశం ఇది. పురాతన చరిత్ర పరిశీలిస్తే మొదటి శతాబ్దంలో కుషాన్ చక్రవర్తి కాలంలోనే లడక్ నుండి ఇండియాకు చైనా ద్వారా వ్యాపార సంబంధాలు ఉండేవని దీన్ని సిల్క్ రోడ్ గా వ్యవహరించారని ఇండియాలోని చివరి గ్రామమైన తు తు అనే గ్రామ ప్రాంతం ద్వారా సిల్క్ రూట్ గా ప్రాముఖ్యత వహించిన ప్రాంతం ఇప్పటికి దర్శనీయ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది.
పర్యావరణ మార్పులు, మామూలు వర్షపాతం కంటే అత్యధిక వర్షం పడ్తున్న ప్రాంతాల్లోని 100 ప్రాంతాల్లో ఈ పాతనగరమైన లేహ్ కూడ ఉంది. యాత్రా ప్రదేశమవడం చేతను, జనాభా అధికంగా పెరగడం వల్ల నగర విస్తరణ లేకపోవడం మూలాన, అత్యధిక వర్షపాతం వల్ల వచ్చే ఆకస్మిక వరదలూ ఈ ప్రాంత సురక్షితాన్ని ప్రశ్నిస్తున్నాయి.
లడక్ అంటేనే ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ గా పరిగణిస్తారు. ఈ మౌంటేన్ రేంజెస్ సముద్రమట్టానికి 16400 అడుగుల నుండి 22000 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇవి దాదాపు 45 మిలియన్ సంవత్సరాల క్రితం తయారు అయినట్టుగా పరిగణిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని కారకోరం పాస్ శిఖరాలు సముద్రమట్టానికి 18875 అడుగుల ఎత్తు నుండి 25171 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.
ప్రపంచంలోనే అతి ఎత్తైన మోటరబుల్ రోడ్ ఈ ప్రాంతంలోనే ఉంది. మౌంటేన్ బైకింగ్ కు ఎంతో ప్రాముఖ్యంగా ఉండే ఈ రోడ్డు సముద్ర మట్టానికి 17893 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాన్ని కర్ దుంగ్ లా పాస్ గా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం బ్రిడ్జిల నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ ప్రాంతంలోనే జాన్ స్కర్ నది మరియు ఇండస్ నది రెండు కల్సి ఇండస్ నదిగా మారి పాకిస్తాన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.
దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద పార్కైన హెర్నీస్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంది.
వారం రోజుల లడక్ యాత్ర ఆ రోజు ఉదయం నాలుగు గంటలలో ప్రారంభమయింది. ప్రొద్దున్నే 7 గం||లకు ఫ్లైట్ ద్వారా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుండి లేహ్ ఎయిర్ పోర్టుకి మద్యాహ్నం వరకు వెళ్ళడం జరిగింది. లేహ్ ఎయిర్ పోర్టులో దిగగానే అతి ఎత్తైన ప్రదేశం అవడం మూలాన హై ఆల్టిట్యూడ్ సిక్ నెస్ వచ్చేసిందా అనే మానసిక వత్తిడి ఫీల్ అవడం కూడా జర్గి పోయింది. ఏదో ఒక అనిర్వచనీయమయిన భయం ఆవహించి ఎంత తొందరగా రూంకి వెళ్ళి, చలికి తట్టుకునేలా నూతన వాతావరణానికి, హై ఆల్ ట్ట్యూడ్ కి శరీరం తట్టుకునేలా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి వెహికిల్ లో కూర్చున్నాం. థెర్మల్ తో సహా 4 లేయర్స్ తో డ్రెస్ వేసుకున్నా ఇంకా చలిగా ఉండడంతో ఒక్కసారిగా మిత్రులు లడక్ ప్రయాణమంటే ఎందుకు భయపడ్డారో అర్థం అయింది. ఈ ప్రాంతం చూడాలనే ఉత్సుకత ఎంతో ఉన్నా, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాక ఒక విధమైన నిర్వేదం, భయం ఆవహించాయి. హై ఆల్ టైట్యు లో తట్టుకోవడం కోసం మా డాక్టర్ సూచించిన డయామోక్స్ 250 ఆ రోజు విమానంలో వేసుకోవడంతో దాని పనితనం కొంచెం కొంచెంగా తెలిసొచ్చింది. సహచర తోటి ప్రయాణీకుల్లో ఉన్న తలనొప్పి, అసస్వత మాలో చాలా తక్కువ

మోతాదులో ఉన్నట్లు ఫీల్ అయ్యాం . మాకు కేటాయించిన రూంకి వెళ్ళి వేడివేడిగా టీ త్రాగి, తోటి యాత్రికులతో కాసేపు కబుర్లతో గడిపాము. అప్పటికి కొంత యాంగ్లైంటీ తగ్గింది. హోటల్ లో సర్వ్ చేసిన వేడివేడి ఫుడ్ తినేప్పటికి కొంచెం కొంచెం నార్మల్ స్థితికి వచ్చినట్టుగా రిలాక్స్ అవడం జర్గి, ఆ రోజు క్రొత్త క్రొత్త అనుభూతులతో రాత్రంతా చలితోనే గడిచిపోయింది.
ఆ తర్వాత రోజు ప్రొద్దునే బ్రేక్ ఫాస్ట్ చేసి ఆ రోజు దర్శనీయ ప్రాంతాల్లో మొదటిదైన ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన శాంతిస్తూపం దర్శించడం జరిగింది. ఇక్కడ సూర్యోదయ, సూర్యాస్తమయలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇది 11841 అడుగుల ఎత్తులో చాన్స్పా అనే కొండపై, చంద్ స్పా అనే గ్రామంలో ఉన్న ఒక బౌద్ధ తెల్లని స్తూపం. 1991లో జపనీస్ బౌద్ధ బిష్ణువు గ్యామియో నకమురా చే నిర్మింపబడి 14వ దలైలామ టెస్టిన్ గ్యాట్సో ద్వారా ఆగష్టులో ప్రతిష్టించబడింది.
రెండవ ప్రపంచ యుద్ధంలో హీరోషిమా, నాగసాకి పై జర్గిన అణుబాంబుల దాడిలో దాదాపు 150000 సామాన్య ప్రజలు మరణించాక జపానీ బుద్ధిప్ట్ మాంకు నిచిదత్యుపూజి ఆధ్వర్యంలో ప్రపంచశాంతి కోసం దాదాపు 80 పీస్ పగోడాలు ప్రపంచవ్యాప్తంగా నిర్మించడం జర్గింది. ఇందులో భాగంగా నిర్మించిందే ఈ శాంతిస్తూపం.
ప్రపంచశాంతి మరియు ప్రపంచ శ్రేయస్సులను ప్రోత్సహించడానికి బౌద్ధమతం యొక్క 2500 సంవత్సరాల జ్ఞాపకార్థం దీని నిర్మాణం ఏప్రిల్ 1983లో ప్రారంభమైంది. శాంతి స్థూపం రెండు అంతస్తుల నిర్మాణంగా కల్గి ఉండి మొదటి అంతస్తులో బంగారు బుద్ధ విగ్రహ చిత్రం, రెండో అంతస్తులో బుద్ధుని పుట్టుక, ధ్యానం మరియు మహా నిర్యాణం చిత్రాలు దర్శనమిస్తాయి.
ప్రపంచ శాంతి కోసం నిర్మించిన అద్భుత కట్టడం శాంతిస్థూపం దర్శించుకున్న జ్ఞాపకాలతో ఇంకో ప్రాచుర్య పర్యాటక స్థలం అయిన లెహ్ ప్యాలెస్ దర్శించుకోవడం కోసం వెళ్ళాం. లేహ్ ప్యాలేస్ గా పిలువబడే లాచన్ ఫాల్కర్ ప్యాలెస్ 1645 సం||లో సెంగే న్యాంగన్ నిర్మించిన పూర్వపు టిబెట్ స్టైల్ లోని రాజభవనం. 19వ శతాబ్దంలో డోగ్రా సేనలు లడఖ్ ని తమ ఆధీనంలోకి తీసుకొనే వరకు ఈ రాజభవనం నివాస యోగ్యంగా ఉండేదని చెప్తారు, 9 అంతస్తులుగా ఉన్న ఈ రాజభవనంలో 9వ అంతస్తులో రాజకుటుంబ వసతిగా ఉండేది. క్రింది అంతస్తులో రాజకుటుంబ సహాయకులు, మధ్య అంతస్తులో రాజకీయ ఇతర కార్యకలాపాలకు ఉపయోగపడేలా వివిధ సమావేశ మందిరాలు ఉన్నాయి. ఆకస్మికంగా వచ్చే వరదలను, భూకంపాలను తట్టుకునేలా ఉన్న ఈ మట్టి/రాతిలో ఉన్న నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. చాలా వరకు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో అవసానదశలో ఉన్న ఈ నిర్మాణంలో 450 సం||ల వరకు పూర్వం చిత్రించిన చిత్రాలు మనం దర్శించుకోవచ్చు. మొత్తం 9 అంతస్తులు ఎక్కి చూడ్డానికి చాలా మంది యాత్రికులు ఉత్సాహంతో ప్రయత్నించారు. ఇరుకుగా ఉన్న వుడెన్ స్టెప్స్, అంతస్తు, అంతస్తు ఎక్కటంలో ఉండే అలసట, ఎక్కువగా చలిగా ఉండటమూ కొంత నిరుత్సాహం కల్గించినా, 9వ అంతస్తు పై భాగంలోకి వెళ్ళాక ఎంతో అద్భుతంగా కన్పిస్తుంది ఈ ప్యాలెస్. అక్కడ నుంచి చుట్టూ కనుచూపు మేరలో కన్పిస్తున్న నివాసాలు, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది.
లేహ్ ప్యాలేస్ నుండి ఎంతో ప్రాముఖ్యం గలది, తప్పని సరిగా చూడాల్సిన ప్రాంతం అయిన “హల్ ఆఫ్ ఫేం”కి వెళ్ళడం జర్గింది. ఇండో పాక్ యుద్ధంలో ఇండియాను రక్షించడానికి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర భారత సైనికుల
జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మ్యూజియం లే కార్గిల్ రోడ్ ‘లేహ్‘ నగరానికి 4 కి.మీ. దూరంలో ఉంటుంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఉపయోగించిన వివిధ రకాల ఆయుధాలు, స్వాధీన పర్చుకున్న ఆయుధాలు,
సియాచిన్ ప్రాంతంలో భారత సైన్యం ఉపయోగించిన వివిధ రకాల దుస్తులు, మంచులో కర్తవ్య నిర్వహణలో ఉన్న సైనికుల చిత్రాలు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ చిత్రాలు, దేశాన్ని కాపాడడం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికుల చిత్రాలు మనకు ఎంతో ఉత్తేజాన్ని కల్గించడమే కాకుండా సైనికులు చేస్తున్న త్యాగాలకు జోహార్లు అర్పించేలా మనసంతా దేశభక్తితో నిండిపోతుంది.
మూడవ రోజు ప్రయాణం ఎంతో ఉత్సుకత, ఉత్సాహంతో ప్రారంభమైంది. ప్రయాణం ఆద్యంతమూ హాలివుడ్ సినిమాల్లోనూ మెకనాస్ గోల్డ్ చిత్రాల్లోను చూపించిన లొకేషన్స్ మాదిరిగా ఎత్తైన కొండలు, లోతైన లోయలూ, ఆ ప్రాంతమంతా ప్రకృతి తప్ప ఎవరూ లేనట్టుగా ఎంతో అద్భుతమయిన రోడ్లపై సాగింది మాప్రయాణం.
ఇక ఈ కర్ దుంగ్ లా పాస్ వివరాల్లోకి వెళ్తే ఈ మార్గాన్ని 1976లో ఆర్మీవారు సియాచిన్ ప్రాంతంలో పహారా కాచే సైనికులకు నిత్యావసర వస్తువులు, ఆయుధాలు చేరవేయడం కోసం నిర్మించబడిందని చెప్తారు. 1988 వరకు ఆర్మీ అవసరాలకు మాత్రమే దీన్ని వాడేవారు. ఆ తర్వాత యాత్రికులను కూడా అనుమతిస్తున్నారు. సంవత్సరంలో 9 నెలలు మంచుతో కప్పబడి ఉండే ఈ రోడ్డు కేవలం మూడు నెలలు మాత్రమే రహదారిగా వాడబడుతూ ఉంటుంది. కారకోరం శిఖరాలు ఒకదానితో ఒకటి పోటీ పడున్నావా అనే విధంగా ఆకాశం తాకుతున్నట్టుగా ఎత్తైన శిఖరాలు, కుడివైపు, లోతు కన్పించనంతగా లోయ, లోయలో మంచు కర్గి నీరు పారుతున్న దృశ్యాలు, ఎడమవైపు క్షణాల్లో ఆకాశంలో మారుతున్న అందమైన దృశ్యాలు చూస్తుంటె, లడక్ యాత్రికులకు ఎందుకు స్వర్గధామంగా విలసిల్లుతోందో ఆ ప్రదేశం చూడాలనే తాపత్రయం ప్రభలంగా ఎందుకు అన్పిస్తుందో అనుభవంలోకి వచ్చింది. కొంత దూరం వెళ్ళేటప్పటికి మంచు విపరీతంగా కురవడంతో కొండలన్ని మంచుదుప్పటి కప్పుకున్నట్టుగా ఉన్న చిత్రం చూశాక మానసికంగా ఎంతో తృప్తిగా, అనిర్వచనీయమైన ఆనందం తొణికిసలాడింది.
ఎత్తైన రోడ్డు, పైకి ఎక్కలేక, మంచులో కూరుకుపోయిన కార్లు, వాటిని తోయడానికి దిగిన లోకల్ డ్రైవర్లతో మొత్తం కార్ల కాన్వాయ్ ఆగిపోయింది. అందరూ తమ తమ కార్లలోనుంచి దిగి మంచుతో ఆడుకొనే దృష్యాలు, ఫోటోలతో, సెల్ఫీలతో ఆ ప్రదేశమంతా యాత్రికులతో నిండిపోయింది.

ప్రకృతిని, శిఖరాలను, లోయలో పారుతున్న నదిని, ఆకాశంలో మారుతున్న మేఘాలను చూస్తూ రెండు గంటల ప్రయాణం కొనసాగాక ప్రపంచంలోని ఎత్తైన కదుం యో పాస్ 18000 అడుగుల మైలురాయి రానే వచ్చింది. మొత్తం అన్ని కార్లు ఆగాక అందులోని యాత్రికులు క్రిందకు దిగి ఆ మైలురాయి వద్ద ఫోటోల కోసం వరుసలో నిలబడ్డారు.
నాకైతే ఉత్సాహంతో పాటు మానసిక సంఘర్షణ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ప్రపంచంలో ఎత్తైన మోటరబుల్ రోడ్ పైన ప్రయాణం చేస్తున్న విషయం సాహసోపేతంగా ఉంటే ఆప్రాంతంలో కొంచెం సేపైనా గడపాలంటె మరి అక్కడ ఉండే ఆక్సిజన్ మనకు సరిపోతుందా, ఇలాంటి ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు వస్తే ఎదుర్కోవడం ఎలా? మా వాహనంలో అయితే ఆక్సిజన్ సిలిండర్ ఉన్నాయి. కాని పార్కింగ్ ప్లేస్ నుండి కర్ దుంగ్ లా పాస్ ఓ మూడు, నాలుగు వందల ఫీట్ల దూరంలో ఉంటుంది. ఇలా మనసులో పరిపరివిధాలుగా ఆలోచనలు సుడితిర్గుతుంటే ఎలాగు ధైర్యం చేసి ఇంత దూరం వచ్చాం. అంటూ ధైర్యం చేసి కర్ దుంగ్ లా పాస్ మైల్ స్టోన్ దగ్గర ఫోటోలకు పోజులిచ్చి మరికొంత సేపు గడిపాంజ అప్పటికి మాత్రం జీవిత ధ్యేయం నెరవేరినట్టుగా, ఒక గొప్ప అనుభూతిని స్వంతం చేసుకున్న ఆనందంతో పాటు, గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్ సంపాదించినంత ఫీల్ అయితే వచ్చింది.

దారిలో సయాక్ వార్ మెమోరియల్స్ దర్శించుకొని సియాచిన్ ప్రాంతంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు అంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నాం.
ఆగుతూ, ఆగుతూ వెళ్ళడం మూలాన ప్రయాణం ఆలస్యం అయి భోజనాల సమయం కూడా దాటిపోయింది. సాయంత్రం నాలుగంటల సమయంలో డిక్ సిట్ మోనాస్టీ చూడ్డానికి వెళ్ళాం.
మోనాస్టీ పరిసర ప్రాంతం వెళ్ళెవరకు విపరీతమయిన వర్షం ప్రారంభమయింది. లడక్ ప్రాంతం అంతా వాతావరణం విషయంలో ఏ నిమిషానికి ఏం జరుగునో’ అన్నట్లుగా ఉంటుంది. కొద్దిసేపు విపరీతంగా ఎండ, కొంతసేపటికి వర్షం, కొంతసేపటికి విపరీతమయిన చలి ఈ విధంగా వాతావరణ పరిస్థితులు ఎప్పుడు మారుతూ ఉంటాయి.
ఈ డిక్ సిట్ మోనాస్టీ 10315 అడుగుల ఎత్తులో 14వ శతాబ్దంలో చాంగ్ జెమ్ తెసరాజ్ జాంగో స్థాపించారు. ఈ మఠం సమీపంలో 106 అడుగుల ఎత్తైన మైత్రేయ బుద్ధ విగ్రహం సయాక్ నదికి ఎదురుగా నుబ్రావ్యాలీ వైపు ఉంటుంది. ఈ విగ్రహం నిర్మాణం ఏప్రిల్ 2006లో ప్రారంభించబడింది. దీనిని దలైలామ 25 జులై 2010న ప్రతిష్టించారు. మూడు ప్రధాన కారణాలతో దీనిని నిర్మించారని చెప్తారు. డిక్ సిట్ విలేజ్ రక్షణ, ప్రక్క దేశాలతో తదుపరి యుద్ధాన్ని నివారించడం మరియు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడం. నుబ్రా వ్యాలి, పరిసర ప్రాంతాలలో చలికాలంలో మంచుతో పూర్తిగా కప్పబడ్డాయి. ఈ సమయంలో ప్రజలకు ఈ మఠంలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఈ మఠంలో మంగోలియన్ మరియు టిబెటన్ గ్రంధాలు కూడా ఉన్నాయి.
డిక్ సిట్ మోనాస్టీ నుండి అతి ఎత్తైన ప్రదేశంలో అతి చల్లని ఎడారిగా పిలవబడే హుందర్ గ్రామంలోని ఇసుక తిన్నెలకు వెళ్ళాం. మంగోలియా నుండి వచ్చి స్థిరపడిన రెండు మూపురాల ఒంటెల పై ప్రయాణించడం ఇక్కడకు వచ్చిన యాత్రికుల సరదా. మేం కూడా ఈ ఒంటెల పై కొంతసేపు ప్రయాణించి ఈ నుబ్రాలోయలోని టెంట్స్ లో బస చేయడానికి సయూక్ నదీ తీరంలో ఉన్న మాకు కేటాయించిన టెం లోకి వెళ్ళాం.
నుబ్రావ్యాలీని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. నుబ్రా నది (సియాచిన్ నది అని కూడా పిలుస్తారు) మరియు సయోక్ నది ప్రవహించే అందమైన లోయ ప్రాంతాన్ని నుబ్రా వ్యాలీగా వ్యవహరిస్తారు. సముద్రమట్టానికి 10000 అడుగుల ఎత్తును ఉన్న ఈ ప్రాంతంలో రెండు రాత్రులు టెంట్ లో ఉండటం జరిగింది. ఇది ప్యాంగాంగ్ సో లేక్ వద్ద గడపబోయే ఒక రాత్రికి ప్రిపరేటివ్ గా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా నిర్మింపబడ్డ ఈ టెంట్ లో ఒక వరండా, ఒక బెడ్ రూం, ఒక రెస్ట్ రూంతో కల్సి బట్టతో తయారు చేయబడిన ఈ టెంట్ లో, మనం లోపలికి వెళ్ళాక జిప్ తో అన్ని రూములు మూయాల్సి ఉంటుంది. రాత్రంతా విపరీతంగా చలి వల్ల నిద్రలేమిగా ఉన్నా ఒక క్రొత్త అనుభవంతో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి పొందగల్గాం.
మరుసటి రోజు ప్రొద్దునే బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ఇండియా పాకిస్థాన్ బార్డర్ లోని చివరి గ్రామమైన తురు అనే గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళాం. రెండు గంటల ప్రయాణం తర్వాత హిమాలయా ప్రాంతంలోని కారకోరం రేంజ్ లోని తు తు గ్రామంలో ప్రవేశించాం. ఈ గ్రామం నుబ్రోవ్యాలీలోని సయోక్ నదీ తీర ప్రాంతంలో ఉంది. ఇది ఒకప్పుడు బలిస్తాన్ చక్రవర్తి రాజ్యంలో ఉండే ఈ గ్రామం 13వ శతాబ్దం వరకు బుద్ధిప్ట్ రీజియన్ గా ఉండేది. ఇది 1971 వరకు పాకిస్తాన్ ప్రాంతంలోని కాశ్మీరీ భాగంలో ఉండేది. ఇక్కడ ఉన్న మోనా’ నుండి మౌంట్ పార్క్ కె2ను చూడొచ్చు.

బల్టీ మ్యూజియంలో 400 సంవత్సరాల క్రితం వాడిన వస్తువులను మనం దర్శించవచ్చు. నేచురల్ కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో ఫ్రెష్ గా వున్న స్టాక్స్ ను మనం గమనించవచ్చు. 2.2 కి.మీ. దూరంలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమించిన గిల్ గేట్ – బల్టిస్తాన్ బార్డర్ ఫెన్ సింగ్ ని టెలిస్కోప్ ద్వారా చూసాం. అప్రికాట్, వాల్ నట్ ఇక్కడ సమృద్ధిగా లభిస్తాయి. 5000 సం||ల క్రితం నిర్మించిన బో క్రాఫోర్ట్ ని యాంగ్బో డైనాస్టీకి సంబంధించిన షయాక్ నదీ తీర ప్రాంతంలో ఉన్న కోట అవశేషాలను సమయాభావం వల్ల చూడలేకపోయాం. తిరుగు ప్రయాణం చేసి హుందర్ ప్రాంతంలోని మా అతిథి గృహమైన టెంట్ కి వెళ్ళాం. ఆరోజు ప్రత్యేక ఆకర్షణగా స్థానిక మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లడాక్ గ్రామీణ యువతులు నిర్వహించిన నృత్య కార్యక్రమాల్లో పాల్గొని భోజనం తర్వాత రిలాక్ అయ్యాం .
ఆ మరుసటి రోజు హుందర్ గ్రామం నుండి ప్యాంగాంగ్ సో సరస్సుకి దాదాపు 274 కి.మీ. 8 గం||ల ప్రయాణం చేసి, సాయంత్రం 5 గం||లకి చేరుకున్నాం.
2017 ఆగష్టులో ప్యాంగాంగ్ సో సమీపంలో చైనా | భారత దళాలు పరస్పరం రాళ్ళు విసురుకోవడం, 2020 మే 5-6 తారీఖున సుమారు 250 భారతీయ, చైనా దళాలు ముఖాముఖి తలపడడంతో ప్యాంగాంగ్ సో సరస్సు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది.
సముద్రమట్టానికి 13862 అడుగుల ఎత్తున ఉండే ఈ సరస్సు అంతర్టీనంగా త్యోనాక్, రమ్ తో – జంట సరస్సులు, న్యాక్ స్సో అనే ఐదు ఉప సరస్సులతో మిళితమై ఉంటుంది. ఈ సరస్సు 134 కి.మీ. పొడవు, 5 మీటర్ల గరిష్ట – 3.1 మీటర్ల వెడల్పు కనిష్టంగా ఉండి 50% శాంతం చైనా భూభాగంలో, 40% ఇండియా భూభాగంలో 10% రెండు దేశాల పరిధిలో ఉన్నది. ఇది చలికాలంలో పూర్తిగా గడ్డకట్టబడి ఉండి వేసవికాలంలో మాత్రం హిమాలయ శిఖరాలను
ప్రతిబింభించే విధంగా స్వచ్ఛంగా ఉన్న నీరు, ఏడు వివిధ రంగుల్లో ఉండి కొన్ని ప్రాంతాల్లో ఫోటో-6 అడుగు భాగం స్వచ్ఛంగా కన్పించేలా ఉంటుంది. ప్రకృతిలో ఉండే స్వచ్ఛదనం, రాత్రిపూట ఆకాశంలోని
నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ జీవితంలో మనం ఎప్పుడూ చూడని క్రొత్త ప్రపంచం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మేము మాత్రం విపరీతంగా చలి ఉన్నా మా రూంకి ఉన్న గ్లాస్
డోర్ సహాయంతో ఆకాశం అంతా పరుచుకొని ఉన్నట్లున్న నక్షత్రాలను తనవి తీరా చూసి ఆనందించాం. మాటలకు, రాతలకు అందని అనిర్వచనీయమైన ఆనందం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. లే లో గడిపిన రెండు రోజులు నుబ్రావ్యాలీలోని హుందర్లో గడిపిన అనుభవంతో ప్యాంగాంగ్ సోలోని ఒక రాత్రి
గడపడానికి ఎంతో ఉపయోగపడింది. హై ఆల్టిట్యూడ్ సిక్ నెస్ దాని పర్యావసనాలు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా దాని వల్ల వచ్చే సమస్యలు, అతి కష్టంగానైనా అందుబాటులో దొరకని వైద్యులు ఇవన్నీ కలసి మానసిక ధైర్యం ఈ సాహసయాత్రకు ఎంతో ఉపయోగపడతాయి. ఉదయం ప్యాంగాంగ్ సో సరస్సు మీదుగా వస్తున్న సూర్యోదయ చిత్రం ఎంతో అద్భుతంగా అనిపించింది.
ఈ లేక్ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ ఊసరవెల్లిలా ఈ లేక్ లోని నీటి రంగు మారుతూ ఉంటుంది. నీటి అడుగుభాగం కూడా స్వచ్ఛంగా కన్పించేలా ఉంటుంది. ఇది -30 డిగ్రీల నుండి -10 డిగ్రీల వద్ద గడ్డకట్టబడి ఉండి చలికాలంలో అనేక రకమైన పక్షులను ఆకర్షిస్తుంది. గడ్డకట్టిన లేక్ లో నిర్వహించబడే ట్రెక్కింగ్ ఇక్కడ ప్రత్యేకత. మంచు చిరుతలు ఉండే ఒకే ఒక్క ప్రదేశం లడక్ ఈ లేక్ చలికాలంలో పూర్తిగా గడ్డకట్టి ఉంటుంది.
ఆ మర్నాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని యాత్ర కొనసాగింపుగా ఆ చివరి రోజు ఫోటో-7 సాహసయాత్ర మళ్ళీ కొనసాగింది. తిరుగు ప్రయాణం 150 కి.మీ దూరం ప్రపంచంలోనే రెండో
ఎత్తైన ప్రదేశమైన చాంగ్లాపాస్ 17857 అడుగుల ఎత్తున గల ఈ ప్రాంతంలో చాలా వరకు ల్యాండ్ స్టెడ్స్ జరగడం మూలాన డ్యామేజి అయిన రోడ్లతోను, విపరీతంగా మంచుపడి వాటి ప్రవాహంతో కొట్టుకుపోయిన రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణంవల్ల ప్రయాణం ఆగుతూ, సాగుతూ సాగింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఉద్యోగులు అంత చలిలోను, నిరంతరం శ్రమిస్తూ రోడ్ల నిర్మాణానికి, యాత్రికుల సౌకర్యం కోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తే వాళ్ళ త్యాగ నిరతికి మనసులోనే జోహార్లు సమర్పించుకోవడం జరిగింది.
దాదాపు 6 గం||ల సాహసయాత్ర ముగించుకొని, లేప్లో ఇంకా చూడాల్సిన షేప్యాలెస్లోకి ప్రవేశించాం. దీన్ని 10వ శతాబ్దంలో ల్యాచెన్ పాల్గగాన్ అనే బుద్ధ గురువు నిర్మించారు ఇది లేహ్ సిటికి 15 కి.మీ దూరంగా ఉన్న లేహ్ – మనాలి రోడ్డులో 11204 అడుగుల ఎత్తులో ఉంది. లడక్ కి గతంలో వేసవికాలంలో క్యాపిటల్ గా ఉన్న ఈ ప్రాంతంలో బుద్ధుని అవతారమైన షాక్యముని బుద్ధ రెండవ అతిపెద్ద స్థూపం 39 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ అత్యంత ఎత్తుపైన ఉన్న ఈ ప్యాలెస్ పై భాగం నుండి చూస్తె చుట్టు ప్రక్క సింధునది ప్రాంతాలు ఎంతో అందంగా కన్పించి టూరిస్ట్ స్పాట్ లాగా వెలుగొందుచున్నది. షాక్యముని బుద్ధస్థూపం దర్శించుకొని అక్కడి నుండి లేహ్ ప్రాంతంలోని చివరి టూరిస్ట్ ప్రాంతమైన తిక్ సె మోనా’ దర్శించుకోవడానికి వెళ్ళాం.
థిక్ సె మోనాస్తి లడక్ లోని అతి పెద్ద మానాస్టీల్లో ఒకటి. ఇది 11800 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాదాపు 12 అంతస్తులుగా ఉన్న ఈ మోనా’ పైకి ఎక్కడానికి కొంత ఆయాసపడ్డాం. ఎందుకంటే ఉదయం నుండి నిరంతరంగా ప్రయాణం చేయడం, చలీ ఇబ్బంది పెట్టాయి. ఈ 49 అడుగుల ఎత్తైన మైత్రేయ బుద్ధ విగ్రహం. 1970లో 14 దలైలామాచే ప్రారంభించబడ్డ ఈ రెండంతస్తుల విగ్రహంలో అతి ముఖ్య ఆకర్షణ.
చివరిదైన థిక్ సె మోనాస్టీ దర్శించుకొని లేహ్ లోని మా హోటల్ కి చేరుకొని మరుసటి రోజు తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యాం.
మరుసటి రోజు ఉదయం గడిచిన వారం రోజుల యాత్ర తాలూకు జ్ఞాపకాలతో అందరికీ వీడ్కోలు పల్కుతూ, ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాం. మధ్యాహ్నం వరకు నిరీక్షించినా ఆరోజు రావలసిన ఫ్లైట్ క్యాన్సిల్ అవడం మూలాన, (వాతావరణ పరిస్థితులు అని కొందరంటె, సాంకేతిక కారణాలు అని మరికొందరు చెప్పారు) మళ్ళీ తిరిగి మా హోటల్ కి వెళ్ళి ఆ మరుసటి రోజు ప్రయాణంతో మా లడయాత్ర సుసంపన్నమైంది.
జీవితంలో అత్యద్భుతమైన సాహసయాత్రగా, చిరస్మరణీయ జ్ఞాపకాలతో మాయాత్ర ముగిసింది.
వానాకాలపు సాయంత్రం మలిసంజపొద్దు పడమట కొండల మాటున జారుకుంటుంది. మస్క మసకగా చీకటి ముసురుకుంటుంది. చెట్టు, పుట్ట, గట్టు, కొండలు గుట్టలు అనక ఊరు, వాడ నల్లని కాటుకమల్లే చీకటి దుప్పటి కప్పుకుంటున్నాయి అప్చిపటికే చినుకులు రాలి రోడ్డంతా తడిసిముద్పోదగయిపోయి చిత్తడి చిత్తడిగా మారింది. అటు పడమటి దాపున సరిహద్దుగా ఎత్తైన కొండల శిఖరాలుగా కాపురాలు గుట్ట అంచు వెంబడి దూరంగా విసిరేసినట్టున్న నల్లగొండలోని జీవివారిగూడెం రోడ్డు బాటంతా వచ్చిపోయేవారితో రద్దీగా ఉంది ఆ బస్టాపు మూలమలుపు తిరిగితే నల్లతాసులా పరుచుకునే వారిగూడానికి బాట చాపుతుంది
అసుంట ఆంజనేయస్వామి గుడి బాటకు ఇటు అటుగా ఇద్దరు ముగ్గురు లంబాడ లచ్చువమ్మలు బాటకు పక్కెంట కట్టెలు పొయ్యిలు రాజేసుకుంటు పొయ్యి ముందు సేదతీరిండ్రు పొయ్యిలో మంట రాజుకుంటుంది పొయ్యి మీద పెంక వేడెక్కుతుంది పొయ్యి చుట్టూత రక్షణ కవచంలా నాపరాళ్ళు మూడువైపులా అమర్చి ఉన్నాయి పొయ్యి ముందు ఆమెకు ఒకవైపు ఎండు కట్టెలు కొన్ని, చేతులో ఊదురుగొట్టంతో ఊపిరి బిగబట్టి ఊదుతూ నిప్పు రాజేస్తుంది ఇటుముందు తాంబాలంలా ( బేషన్ గిన్నే ) ఇంకో పక్క కాల్చిన రొట్టెలు వేడి చల్లారకుండా ఉండేందుకు హాట్ బాక్స్. బేషన్లో పిసికి ముద్ద చేసిన పిండి
పక్కెంట జగ్గులో నీళ్ళు , కలపని పొడిపిండి, పొడిపిండిని పీటపై చల్లుతూ పిసికిన పిండి ముద్ద తీసుకొని ఒకచేత పట్టి మరోచేత ఒత్తుతూ అద్దుతూ పీట నిండారగా చేతితో రొట్టెను సాగదీస్తూ నిండు సందమామలా రొట్టెకు రూపమిస్తుంది
యథాలాపంగా వేడివేడి రొట్టెలకోసంనేను ఆమె దగ్గరికి సమీపించాను ఆమె నా వైపు ఇంతలేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ” ఎన్ని రొట్టెలు కావాలి సారు” అని తిన్నగా అన్దినది. నేను ఆమె వైపు చూస్తూ ” రెండు జొన్న రొట్టెలు ఇవ్వమ్మా” అని అన్నాను. నేను అన్న మాటను అందుకుని పీటపై అప్పటికే పచ్చి రొట్టెగా చేసిన రొట్టెను చేత తీసుకొని పొయ్యి పై మంటకు వేడెక్కుతున్న పెంక పై వేసింది. కుడి చేతిని నీటిలో ముంచి పెంకపై కాలుతున్న రొట్టెను తడి చేస్తూ ఉంది , నాలాగే రొట్టెలకు వచ్చినవారు నాకు పక్కగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఆమె దగ్వగరకు వచ్చిన గిరాకి మళ్ళి పోకుండా మంటని పెద్దది చేస్తూ త్వరగా రొట్టెను కాల్చేలా తిప్పి తిప్పి పెంకమీద వేస్తూ ఉంది , వేడికి రొట్టె అక్కడక్కడ ఉబ్బుతుంది అక్కడక్కడ కాలి నల్లగా మారిపోతూ ఉంది . ఆమె తిప్పి తిప్పి కాలుస్తూనే ఉంది. అటు ఇటు చూస్తే బజారు వీధి లైట్లు వెలుగుతూ ఉన్నాయి అక్కడక్కడ గతుకులు పడిన రోడ్డు కురిసిన వర్షానికి రంగు మారిన నీళ్ళు బురదరూపు సంతరించుకున్నాయి. పొయ్యి మంట బగబగమని మండుతూ ఉంటే ఆమె మొఖము ఆ వెలుగులో దగదగ మెరిసిపోతోంది . ఇంత పిండి ముద్ద మరొకటి తీసుకొని అప్పడంలా సాగదీస్తూ రొట్టెను చేస్తావుంది కానీ ఏదో పోగొట్టుకున్న దానిలా మొఖమంతా పాలిపోయి విచారంతో నిండిపోయింది ఆమె పక్కన ఆమెను చూస్తూ కూర్చున్న కూతురు ఆమె పనికి ఆటంకం కలిగిస్తూ ఉంది.
” ఏమే పిల్ల జరట్లుండు విసిగించకూ ” అని కసురుకుంటూ అన్నదామె
” నీయమ్మ నేన్జేస్తనే ” అని బిడ్డ విసిగిస్తూ అనసాగింది.
” జర్రాగే మమ్మగాని సతాయించకు” అని బతిమాలుతున్నట్టు అన్నది.
” నీయమ్మ నేన్జేస్తేందమ్మ నన్నొదంటవు నాకు చెయ్యరాదా ఎట్ల “
“జర్రాగు రొట్టె పిండి ముద్ద సరిగ చెయ్యరాదు నీకు పీటమీద కొడితే అప్పలాగ పల్సగ రావాలి ముందు చూడు తర్వాత చేద్దువు చిత్తడిల ఎందుకొచ్చినవే మళ్ళీ వానొస్తే నేన్తడుస్త నువ్ తడుస్తవ్ , వానకు తడిస్తే సర్ది అయితది రూమ్ దగ్గర ఉండి చదువుకోపో “
“ఊకే సదువు సదువు అంటవ్ నేన్ సదవన్ పో ఈయాల సెలవు సెలవు నాడు సదవాలా “
“ఒశే పిల్ల జోలి బాగుందిగా బలె గమ్మతి చేస్తుందేంరో మాకే సదువు లేక రోడ్ల మీద కుసోని రొట్టెలమ్ముకుంటున్నం నువ్వన్న గింత సద్వుకుంటవంటే” అని గుల్గ సాగింది.
మాటలవడి పెంకమీద రొట్టె నల్లగా మాడింది ” అయ్యో అయ్యో జర్రాగు సారు రొట్టే నల్లగ అయ్యింది ఇంకోటి చేస్తా “అని
లబోదిబోమంటు కూతురి వైపు గుడ్లురిమి చూసింది చూస్తూనే పీటపై తొందరతొందరగా రొట్టెను సాగదీయసాగింది సాగదీస్తుంటే రొట్టె పర్రెలు పర్రెలు గా ఇచ్చుకుంటుంది సరిచేస్తూ సాగదీస్తుంది
” ఏమ్మా నీ కూతురా” అని నేను అనగానే
” అవును సారు , చదువుతుంది సారు , నాకొడుకు వాటర్ ఫిల్టర్ మీద ఉండు వాడు సదువు సద్వురా అంటే… సదువుకు పంగనామాలు బెట్టిండు. ” అని అంటుండగా
” ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్” మంటూ ఆమె రొమ్ములో దాగివున్న సెల్ పోన్ మోగింది. గుండెల్లో పిడుగు పడ్డట్టు ఉలికిపడి తిన్నగా తడిచేత తీసుకుంది. ఒకవైపు అసహనంతో కూడిన ఆందోళన చెందుతూనే జీరబోయిన గొంతుకతో “అలో అలో” అంటూ తడబడుతూనే పలికింది. ఆమె మాటలో వనుకు స్పష్టంగా కనిపిస్తూవుంది. మొఖంపై చెమట కమ్మింది. తను మండుతున్న పొయ్యి ని తదేకంగా చూస్తానే పెంకపై జొన్నరొట్టె ను తిరిగేయబోయింది అంతలోనే చేయికి సురుక్కున వేడితగిలి అలాగే రొట్టెను విడిచింది రొట్టె పోయ్యిలో పడి బగబగ మండుతూ నల్లగా మాడింది “ అయ్యో వోరి దేవుడా … ఇయ్యాల లేసి ఎవరి మొఖం చూస్తినిరా శని చుట్టుకున్నట్టు వున్నది అని తనను తానే నిందించుకుంటూ జర్రాగు సారు ఇంకోటి చేసి ఇస్తాను అని ఒకచేత పిండి తీసుకొని పిసుకుతూనే మరోచేత “ అలో అలో ఎవరూ? “ అని అన్నది.
“ హలో నేను “ అంటూ అవతలి గొంతు పలికింది.
“ ఆ చెప్పుండ్రి “ అని బదులు పలికింది.
“ అదేనమ్మా నీ కూతురు గురించి నేను చెప్పిన విషయం గురించి ఏమి అనుకుంటున్నారు” అంటూ అతను సావదానంగా పలికిండు.
“ యాడియే …మీరే చెప్పుండ్రి . నేనా ఆడిమన్సిని నాకంటే మీకే బాగా తెలుసు , పిల్లల గురించి అంతా మీకు ఎర్కేనాయే మీరే ఏదో ఒకటి చెప్పుండ్రి ఏమి చేద్దామో?” అంటూ గబగబా పలికింది . పీటపై రొట్టె చేస్తూనే
“ అంతా నాకు తెలుసు అంటే ఎలాగమ్మా? మనం సావదానంగా ఒక నిర్ణయానికి వద్దాం ఏమంటవూ?” అని అతను అనగానే
“ అదేనయా నేనా ఆడపిల్ల తల్లిని. ఏదెర్కలేనిదాన్ని. నాకా సదువు గిదువు తెల్వని దాన్ని . జర్రంత మీరే నజర్ పెట్టి నా బిడ్డ బతుకు ఆగం గాకుండా సూడాలి జల్దిన లగ్గం జేస్తే సరి” అని కట్టెవిరిచినట్టు అన్నది.
“ అట్లా అంటే ఎట్లమ్మా? పెండ్లి పెండ్లి అని ఒకటే తొందర పెడుతున్నవ్. అట్లా గబగబ ఉర్కులాడితే ఎట్లా? ఉర్కి ఉర్కి పసుల కాస్తే కుదురుతుందా చెప్పు. ఇదిగో నేను ముందే చెప్పిన మా ఇంటికాడ పప్పన్నం తిందాం. మీ ఇంటికాడ ఎంగేజ్మెంట్
చేద్దాం. అలాగే మీ ఇంటి దగ్గరనే పిల్ల, పిలగానికి లగ్గం పెట్టుకొని లగ్నపత్రిక రాయిద్దాం . మన్చిరోజు చూసుకొని మీ ఇంటిదగ్గరనే పెండ్లి చేద్దాం సరేనా, లగ్గం మీ యింటి దగ్గర చేస్తే అది మీకే మంచిది” అంటూ నింపాదిగ పలికిండు అతను
“ సరే అట్లనే కానిద్దాం “ అని ఆమె అన్నది….
“ కానీ ఏందమ్మా, ఇంకా నేనే ఒకమెట్టు దిగివస్తే “ అంటూ కాస్తా కటువుగా పలికిండు అతడు.
“ అదికాదు బయ్యా.. పిల్లా, పిలగానికి పెండ్లి మీ యింటి దగ్గర జరుపుండ్రి. నేనా ఏదెర్కలేని ఆడిమన్సిని, అటసూత్తే పెండ్లి అన్ని ఇగురంగ చెయ్యగలనా? నాకేమన్న సదువా సాత్రమా, అసలే మగదిక్కు లేనిదాన్ని , నువు కూడ నన్నే చేసియమంటున్నవు. నీదేంబోయింది రేపు నలుగురు నన్నంటరు అడదాని పెత్తనం తమ్మల్ల దొరతనం అని వూకెనే అనలే , ఏది గింత సరిగ కుదురకున్నా వచ్చిన జనం నన్నాడిపోస్కుంటరు బయ్యా.. జర గది నువ్వే ముంగట నడ్సి పుణ్యం గట్టుకోండ్రి.” అని దీనంగా వేడుకుంటి. అయిన వుండి “ అలాగంటే ఏట్లనమ్మా , యిద్దరం కల్సి ఒకపని చేద్దాం . ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం , దసరా, దీపావళి లగ్గాలప్పుడన్న , కుదరకుంటే మళ్లి మాఘమాసం లగ్గాలప్పుడు పెండ్లికి వాయిదా వేద్దాం. అప్పుడు అందరం ప్రీగా వుంటాం కదా, ఇగపోతే నువు పిలగానికి ఇస్తానన్న కట్నం డబ్బులు యిప్పుడే ముందుగా యిస్తే అబ్బాయి ఏదేవొక యాపారం చేసుకుంటడు. వచ్చే ఎండాకాలం లగ్గాల నాటికి
“ ఆ.. ఏందమ్మా వినిపించనట్టు మాట్లాడుతవు. “ అని అతను అన్నడు
“ అట పతిదానికి తప్పులు తీస్తవేందయా యినవడ్డది కాని ముంగల ముంగల ఎట్ట ఇయ్యను పైసలతో పని” అని అన్ననోలేదో “ సూడమ్మా నువు ఇప్పుడు పైసలు ఇచ్చి సరేనంటే మనకు మంచిది. లేకుంటే పిలగాడు ఏదో ఒకటి చేసి కుదుర్కున్నంకనే పెండ్లి ఏమంటవు సరేనా? “ అని అనే.
“ ఆ… ఓరిదేవుడా ఎట్టా సచ్చేది గాళ్ళ మన్సుల మర్మం ఏందోగని అంతు చిక్కుతలేదు “ అని లోలోన గొనుగుతూ బాదతో కండ్లు పిండసాగింది. చేతులున్న పోను నేల జారింది. నేలచూపులు చూస్తూ నే కొంగు మొఖానికి పెట్టుకొని బోరుమంటూ ఏడుపందుకుంది. “ ఏమయిందమ్మా” అంటూ కూతురు కాసింత ఆందోళన చెందుతూ ఆత్రుతగా అడిగింది
….
” ఏందమ్మా ఏమైంది ఏడుస్తున్నవ్” అని ఆమె వైపు తీక్షణంగా చూస్తూ నేను అడిగిన.
ఇగో సారు నా పేరు తీత్రిబాయి
నాకు ఒక్కగానొక్క ఆడబిడ్డె , పేరు సామియా. మాది మీరంగాని తండా గా ముచ్చట ఇనుర్రి కొడుకును ఆపి పిల్లను డిగ్రీ దాక సదివిచ్చిన కాలేజు పోరల సోపతిల అది ఒక పిలగాన్ని ఇష్టపడింది మేము లంబాడ. గాళ్ళు సూదర్లట సరే పిల్ల మన్సు పడింది గదా గా ముచ్చట నా కండ్ల పడింది గాళ్ళను ఇడదీస్తందుకు నాకు మనసొప్పలే , గాళ్లను కలపాలని చూస్తున్న గా పిలగాన్ని అడిగితే ఇద్దరం ప్రేమించుకుంటున్నం పెళ్ళి చేస్కుంటం అని అన్నడు నా బిడ్డె కుద్దుగ అదే మాట పలికింది కని గా పిల్లగ్గాన్ని అయ్య గింత తేడు పెడుతుండు కిందికంటే మీదికేస్తడు మీదికంటే కిందికేస్తడు ఒక్కతీరు మనిషికాదు ఒకపాలి ఏమో “నాకు ఇష్టం లేదు గుడిల దండలు మార్చి చేపిచ్చుకో అంటడు. లేకుంటే రీస్టరు పెండ్లి చెపియ్యి అంటడు, ఇంకోపాలి పప్పన్నం తిందాము అంటడు సరే దారిలకు వచ్చిండని , పిల్లను గార్వంగ సాదుకుంటి ఉత్తగ ఎట్ల పట్టియ్యను దాన్ని ఎవరినో ఒకయ్యను జూసి పెండ్లిచేసి నాల్గిత్తులు నెత్తిన సల్లితే నా బర్వు దిగుద్ది అనుకుంటి గట్లనే మన్సుల అనుకుని పిల్లకు ఇంత ఒంటిమీదికి నల్లపూసలదంండను చేపిచ్చిన నా మెడల గుండ్లను సెడగొట్టి నా చెవుల గెంటీలు చెడగొట్టి పిల్లకు దిద్దులు బుట్టాలు చేపించిన రెక్కలు ముక్కలు చేసుకుని పైసపైస కూడబెట్టి సందేళ్ళ మాపు గీడ కూకొని జొన్న రొట్టెలు చేసి అమ్ముకుని పూట ఎల్లదీస్కుంట ఊస్నూరు పాస్నూరు చేసుకుని జర్రంత నలుగురిల నజరు గొడితట్టు తలెత్తి బతికేటట్టుగ ఉండాలని నేను చూస్తున్న , కాని నన్ను పగ్గుతూ ఇబ్బంది పెడుతుండ్రు గాళ్ళు పిల్ల ఒంటిమీదికి బంగారం పెడితే నీ పిల్లకు పెట్టుకుంటున్నవ్ అనే, సరే పిలగానికి లగ్గం కర్సులకు గిన్ని పైసలు జూస్త తియ్య అంటే నా పిలగానికి కట్నం ఇయ్యమనే, మళ్ళీ అయన ఆడిబిడ్డ కట్నం ఇయ్యమనే ఆ పిల్లగానికి ఏదో యాపారానికి నన్నే ఎగనూకమనే సరే అదులో బదులో చేసి దులుపుకుందాం అంటే ఆ ఇచ్చే డబ్బులు ముంగల ముంగల ఇయ్యమంటుండు లగ్గం తర్వాత అంటుండు. ఎట్టజెయ్య సారు …ఆయిన అత్తగారి సొమ్ము అయినట్టు ఇయ్యమంటే ఎట్లియ్యాలే సారు అదికూడ ముంగల ముంగలంటే లోకంల ఎవలన్న ఇస్తరా. నేనయుతే సూడలే సారు గిదేంపజ్జతి గతిలేని సంసారానికి గంజినీళ్ళే పాన్కం అని మేం బతుకుతుంటే ఆయిన సంపాయించి పెట్టిన ముల్లెలు వున్నట్టు ముంగల ముంగల ఇయ్యాలంట నాకు అరికాలిమంట నెత్తికెక్కింది వొచ్చిన కోపానికి కొర్కాసు వాత పెట్టాలన్నంత కోపం వుంది గని పిల్ల మొఖం సూడాల్సి వచ్చే. పిల్లను గార్వంగ సాదుకుంటి ఎట్ట జెయ్యాలే సారు… యిగ్గో
మొంచోడు మంచోడనుకుంటే మంచం కరాబు సేసిండట అట్టుంది గాయిన వాలకం , ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదంటరా . నమ్మితిరా సిద్దా అంటే ముంచితి బిడ్డా అన్నట్టుగుంది గాళ్ళ యిలవరస,
మిరాశి హక్కు వున్నట్లు పీస దీస్కుంట అడిగిండు
పిల్ల బతుకు ఆగం గావొద్దని సుట్టాల దాపుకు జేరుదామంటే
సెడి చెల్లెలు యింటికి అలిగి అత్తగారింటికి పోగుడదాయే ఎట్ట జెయను సారు
” అంటూ ఎగదన్నుకొచ్చే దుఃఖాన్ని పైటకొంగుతో తూడ్సుకోసాగింది.
“అమ్మా మరేం గాబరా పడకు నీ కూతురిపై నీకు మమకారం ఉంటది సహజం , విషయం సాగతీత మంచిది కాదు దీని పరిష్కారానికి వెంటనే వెళ్ళి పోలీసులను కలువు ” అని నేను అనగానే అలా అన్నానో లేదో సరసర అక్కడ పని పక్కన పెట్టి పిల్లను వెంటబెట్టుకొని ” దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కించే దారి చూపు” అని ఆమె మతిలో ప్రార్ధించింది శుభ సూచకంగా దూరాన వున్న గుడి లో గంట మోగిన సప్పుడు వినిపించింది . ఆమె తన కూతురు ను తోడు గా వెంటబెట్టుకొని ముందుకు సాగిపోయింది తెగిన గాలి పటంలా…! దిక్క దాపు ఆసరా కోసం.నేను వారినే చూస్తూ కొయ్య బారిన వాడిలా నిశ్చేష్టుడయ్యాను. అలా క్షణకాలం రెప్ప వేయకుండా చూస్తోవుండిపోయా. కానున్నది కాకమానదు ఎమైనా కానియ్యి బంధం ముడి పడి వుంటుందా? తెగుతుందా, సమస్య జటిలమే కానీ బుర్ర లో అలోచనలు పరిపరి విధాలుగా గింగిరాలు కొడుతున్నాయి. అటుగా చిరుగాలి వీచింది, మనసు కాసింత తేలికగా అనిపించింది.గుండెలో బరువు తగ్గి చినుకుల చిరుజల్లు ఆశ మిణుగురు లా మినుకు మినుకు మంటూ చిరుదివ్వే వెలిగింది.
……..
మాస రచనల పోటీకి
తేదీ:24/12/2021
పేరు:చంద్రకళ. దీకొండ
ఊరు : మల్కాజిగిరి
చరవాణి : 938131384
అంశము : పుస్తక సమీక్ష
రచన సంఖ్య : 11
పుస్తకం పేరు : గెలుపు పిలుపు
రచయిత : శ్రీ బుర్రా వెంకటేశం,ఐ. ఎ. ఎస్. గారు
పేద కుటుంబంలో పుట్టి,స్వయంశక్తితో ఎదిగి
పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, బలహీన వర్గాల సంక్షేమ కార్యదర్శి, వివిధ ప్రభుత్వ శాఖలలో పాతిక సంవత్సరములు వృత్తి నిర్వహణ గావించి,రెండువేల మంది మానసిక వికలాంగుల పునరావాసానికై కృషి చేసి జాతీయ,
అంతర్జాతీయ అవార్డులు,రివార్డులు అందుకున్న,
స్వయంగా గెలుపు శిఖరాగ్రం చేరుకుని,గెలుపు సంతకం చేసిన శ్రీ బుర్రా వెంకటేశం,ఐ. ఎ. ఎస్.గారి రచన…ఎంతో ప్రజాదరణ పొందిన సెల్ఫీ విత్ సక్సెస్ పుస్తకం గెలుపు పిలుపు గా తెలుగు భాషలో… బెంగాలీ,స్పానిష్ మరియు పోర్చుగీస్ భాషలలోనికి అనువదించబడినది.
మనం సాధించే ప్రతి విజయం ఆనందాన్ని ఇచ్చినప్పుడే అది నిజమైన సక్సెస్ పని చేయడం ఆపితే అదే ఫెయిల్యూర్
గెలుపును పలువురికి పంచినప్పుడే దానికి సార్థకత వంటి సూక్తులు…
ఏకలవ్యుడు,రెండు కప్పలు,నక్క-నాగలోకం వంటి కథలతో ఆసక్తిని రేకెత్తిస్తూ… గెలుపు దశలను, కోణాలను, గెలుపు శిఖరాగ్రం చేరుకొనుటకు కావలసిన ఓర్పు,జిగి, పట్టుదల అనే ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను సులభశైలిలో పిల్లలు,యువత, పెద్దలు అవగాహన చేసుకునేలా రచించబడినది.
ఇందులో “కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”కోట (గెలుపు దుకాణం)
బాపూజీ,టాటా వంటి గెలుపు శ్రేణులు
ఎన్నోసార్లు విఫలమై గ్రాంఫోన్, విద్యుద్దీపంతో పాటు మరెన్నో వస్తువులు కనిపెట్టి 1093 పేటెంట్లు పొందిన ఎడిసన్,ఐజాక్ న్యూటన్ వంటి శాస్తవేత్తలు…
హేళనకు గురై పట్టుబట్టి సంస్కృతం నేర్చుకున్న తిల్ శాస్త్రి …
గెలుపును పదిమందికీ పంచిన
ప్రేమ్ జీ, వారెన్ బఫెట్ వంటి వ్యాపార దిగ్గజాలు, వితరణశీలురు…
గురు స్థానాన్నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ రాధాకృష్ణన్ వంటి వారు…
రామోజీరావు,
ఐ. ఐ. టి.రామయ్య వంటి కృషీవలురు…
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదాహరణంగా నిలిచి మనకెన్నో గెలుపు పాఠాలు చెపుతారు.
ఈర్ష్య, కోపం,ప్రతీకారం,పగ, అహంకారం వంటి గెలుపు లోపాలతో పతనమైన హిట్లర్ వంటి చరిత్రకారులు…విధ్వంసాలు,
విద్వేషాలతో పతనమైన
మాదకద్రవ్యాల మాఫియా చక్రవర్తి “పాబ్లో ఎస్కోలర్” గెలుపులో పాపాలను వివరిస్తారు.
కష్టపడి నిచ్చెనలెక్కి పెద్దపాము నోట్లోకి జారిన పావుల్లా దుర్వ్యసనాలకు లోనైన మైఖేల్ జాక్సన్ ; అతిగా అందరినీ నమ్మి మోసపోయిన మహానటి సావిత్రి వంటి వారు గెలుపు లోపాలను మనకు తెలియబరుస్తారు.
గెలుపును సమన్వయంతో ఎలా సాధించవచ్చో బాపు-రమణలు చెపుతారు.
కలిసికట్టుగా సమస్యలను పారద్రోలిన డిస్నీ&పిక్సార్
గెలుపు పథానికి దారి చూపిస్తారు.
పన్నెండు మంది పబ్లిషర్ల వద్దకు తిరిగి ఓటమినే ఇంధనంగా తీసుకున్న ప్రఖ్యాత రచయిత్రి జె.కె.రోలింగ్ పరిచయం ఎంతో స్ఫూర్తిని కలుగజేస్తుంది.
బాధనే పెట్టుబడిగా పెట్టి రాప్ సంగీత రారాజుగా ఎదిగిన ఎమినమ్ వృత్తాంతం మనలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది.
అంతేకాదు…ఫార్స్ వర్త్ ప్రతిభను వాడుకుని అరువు గెలుపు అందుకున్న డేవిడ్ పార్నాఫ్ గురించీ,దాని పర్యవసానాల గురించీ మనం తెలుసుకోవచ్చు.
నిరుపేద కుటుంబంలో పుట్టి రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్ జీవన కథనమూ ఇందులో ఉంది.
తనకే తెలియని ప్రతిభ దాగున్న సైలెంట్ పాప బియాన్,
బాల్యంలో అత్యాచారానికి గురై, ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాతగా పేరు పొందిన నల్లజాతిరత్నం ఓప్రా విన్ ప్రే,
బంగారు పతకాన్ని అందుకున్న బాక్సింగ్ ఛాంపియన్,ఇద్దరు బిడ్డల తల్లి మేరికొం మహిళలలో స్ఫూర్తిని రగిలిస్తారు.
ఇంకా ఎందరో విభిన్న రంగాలలో దీక్షతో గెలుపు సాధించిన వారి గెలుపు చిత్రాల ను మన కళ్ళ ముందు నిలిపి
స్ఫూర్తిని,ఉత్తేజాన్ని రగిలించే
పుస్తకమిది.
ఓటమితో క్రుంగినప్పుడు,
అవకాశాలు అందక నిరాశలో కూరుకుపోయినప్పుడు ఈ పుస్తకం ఒక్కసారి తిరగేస్తే చాలు…మనలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగి,చైతన్యం పెల్లుబికి,అంతర్మథనమే మన ప్రగతికి సోపానమౌతుంది
పుస్తక ప్రదర్శనశాలకు వెళితే…
తప్పక ఈ పుస్తకంతో పాటు ఆత్మవిశ్వాసాన్నీ మీ వెంట తెచ్చుకుంటారు కదూ…?!
తప్పు తప్పే…
పక్కనే
కట్టుకున్న భర్త
అటు పక్కన సమయం చూసి
ప్రియురాల్ని కాటువేయాలని చూసే
పొంచి ఉన్న ప్రియుడు
క్షణంలో ‘భార్య’ గల్లంతు
భర్త ‘పరేషాన్’
ఇదీ ఇప్పటి సంస్కృతి
ఇది ప్రియుడి తప్పా
ప్రియురాలి తొందరపాటా….
ఏమై పోతుందీ ‘నవల’
ఎటు పోతుందీ ‘యువత’
(ఇటీవల విశాఖపట్నం బీచ్ లో జరిగిన సంఘటన ఆధారంగా)
నగరం తోడు
ఈ నగరం గమ్మత్తైన కిమ్మిక్కు
ఎడ తెరపి లేని వాన దెబ్బకు
త్రవ్విన రోడ్లపై
ట్రాఫిక్కంతరాయ కలిగి
ఏ హాస్పిటల్లోని పుట్టవలసిన పసిగుడ్డు
ఏ అంబులెన్స్ లోనో, ఏ ఆటోలోనో
పుట్టలేక పుట్టి ఏ తల్లికి గర్భశోకం
ఎప్పుడు ఎలా
ఈ మహానగరం ‘రోడ్లు’
కలిగిస్తాయో తెలియదు కదా….
పదకిరణకలనం -9
ఆధారములు
*****

అడ్డం
**
01. దినుసుల గంధం కోసం నూరే రాయి (2)
03. భారతీయ దృశ్యశ్రవణ మాధ్యమం తెలుగు రూపంలో (5)
07. అపుణ్యుడు చిరాయువు అంటారు (2)
09. తన్మయత్వం (3)
11. సముద్రం మెడ (2)
12. దయగల చురకత్తి (4)
14. పొల్లు మాంసం (2)
16. భార్యాభర్తలు (4)
18. పదములు కలిగిన సంఖ్య (2)
20. కొరడా (2)
22. డొల్లుగింజ (2)
23. దండు (2)
24. నెమ్మది కవి (3)
26. పరిఖ ఎటుచూచినా (3)
28. వివరంగా భూమి (3)
29. పొందాలనే కోరిక (3)
31. … ప్రభూ! మనసు (2)
33. బయట కాదు (3)
34. సంతకం రాత (2)
36. విశ్వామిత్ర పిత (2)
38. పూర్తిగా యావ తీరగ (4)
41. భవుడు (5)
44. కొయ్యముక్క తుంగ కాదు (2)
46. వివరం (2)
47. భిన్నంలో భాగములను తెలిపే కొంచెం (2)
49. పాలకూర భూమి(2)
50. భద్రంగా (4)
51. అశ్వినీ నక్షత్రం (4)
నిలువు
**
01. సత్యవంతుడు (5)
02. కొత్త దురద (2)
04. నరకంలో తీరు (2)
05. వెన్న (3)
06. మోసాలు (4)
07. చేయి (2)
08. కోకిలకోకిలలు చెల్లాచెదరగు (6)
10. మెఱుపు (2)
13. క్షీరం వంతు (2)
15. దీవి (2)
17. ధ్వజం (3)
18. తిరుగువాడు (3)
21. శతకంలో కాలప్రమాణం (2)
23. పశువు వీపు (2)
25. రక్తం పారేది దీనిలో (3)
27. అమావాస్య చూపు (2)
28. ద్రవ్యం (2)
30. ఆహ్వానపత్రికలో కుటుంబసభ్యులు, సేనతో ..(6)
31. పైనుండి చల్లు (3)
32. వేపుడుకు ప్రసిద్ధమైన గడ్డ (5)
35. మమతల బంగ సోదరి (2)
37. విడత (2)
39. ఉష్ణం (2)
40. ప్రసిద్ధచారిత్రక చిత్రకారుడు (4)
42. వెలుగు తోడు (2)
43. నేను కాదు నువ్వు లు (3)
45. అర రోగి (2)
48. వంగజేయు (2)


