మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

‘‘నటభైరవి’’

by Konduri KashiVishveshwara Rao October 5, 2022
written by Konduri KashiVishveshwara Rao

శ్రీ త్యాగరాజ గానసభ­లో రసజ్ఞులతో కిటకిటలాడుతున్న సంగీత కచేరీలో రామాచార్యులుగారి సంగీత గాత్రం బహు రసవత్తరంగా సాగిపోతోంది. కానీ ఇంతలో కొంతమంది పొగరుబోతు యువతరం సరాసరి సభా వేదిక పైకి వచ్చి రామాచార్యులుగారు పాడుతున్న త్యాగరాజ కృతిని అవహేళన చేశారు. అంతటితో ఊరుకోక ఇదే కీర్తనను మోడరన్‌ శైలియైన ఫ్యూజన్‌లో పాడమని అహంకార ధోరణిలో ఆదేశించారు.

సభావేదికపైకి వచ్చిన పోకిరీ మూకను అదుపు చేయటానికి సెక్యూరిటీ గార్డులు కూడా వేదికపైకి వచ్చి వారిని అదుపు చేయటానికి లాఠీచార్జ్‌ చేశారు. ప్రక్క వాయిద్యాలైన ఫిడేలు, మృదంగం మరియు కంజీరా, తాళములు ఒక్కసారిగా ఆగిపోయాయి. రామాచార్యులుగారు ఈ అనూహ్యమైన సంఘటన చూచి తీవ్ర ఆవేదనకు లోనై కోపంతో ఆయన ముఖమంతా కందగడ్డలా తయారయ్యింది.

అయినా పొగరుబోతు యువకులు మాత్రం ‘‘రామాచార్యులుగారు మీరు మోడరన్‌ స్టైల్‌లో, ఫ్యూజన్‌లో ఇదే కీర్తను పాడి తీరాలి’’.  అప్పుడే మీరు నిజమైన సంగీత సామ్రాట్‌ అంటూ రెచ్చగొట్టే ధోరణిలో నినాదాలిచ్చారు.

రామాచార్యులుగారు తన రాగి పాత్రలోని మంచినీళ్ళను గడగడా త్రాగి అదే త్యాగరాజ కీర్తనను మోడరన్‌ స్టైల్‌లో, ఫ్యూజన్‌ శైలిలో అద్భుతంగా ఆలాపించారు. ఆయనకు మధుర గానానికి మంత్ర ముగ్ధులైన ఆబాలగోపాలం పరవశించిపోయారు. తప్పట్లతో రామాచార్యులుగారిని అభినందించారు. తదనంతరం ప్రేక్షకులంతా నిలబడి ఆయనకు ‘‘స్టాండిరగ్‌ ఒవేషన్‌’’ను  గౌరవ సూచకంగా తెలియజేశారు.

కళాకారులందరికీ సన్మాన కార్యక్రమం అయిన తరువాత ఆయన ప్రసంగిస్తూ ‘‘కళాకారులకు ముఖ్యంగా గాయకులకు శాస్త్రీయ సంగీతమైనా లేక ఆధునిక డిస్కో, ఫ్యూజన్‌ సంగీతమైనా ఒక్కటే. కానీ మాయొక్క బృందానికి ముందుగా మీరు తెలియజేస్తే మేము కచేరీకి కావలసినంత రిహార్సల్స్‌ చేసుకుంటాము. అలాగని సంగీత కళాకారులంతా ఇలాంటి ప్రకియలు, జుగల్‌ బందీలు అప్పటికప్పుడే పాడలేరు. కానీ నాకూ, నా బృందానికీ ఇలాంటి సమస్యలు, అభ్యర్థనలు ఎదురవుతాయన్న ధోరణిలో మేము ఫ్యూజన్‌ సంగీతాన్నికూడా సాధనచేయటం, తద్వారా మీ అభినందనలు పొందటం మా అదృష్టంగా భావిస్తున్నాను.

రామాచార్యులుగారు ప్రసంగిస్తూ…  ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలోని పాల్గొన్న యువతరానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పటంతో పోకిరీ మూక యొక్క అహం దెబ్బతింది. వెంటనే ఆ ప్రక్కగా ఉన్న పూలకుండీలను తీసుకొని ఆయనపైన విసిరేసి, వేగంగా అక్కడ నుండీ పారిపోయారు.

ఆయన తలకు తీవ్రగాయం అవటంతో హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ఆయనకు రెండు రోజులు వైద్యం చేశారు డాక్టర్లు.

*   *   *

క్లాస్‌ ఫస్ట్‌ మోక్ష. అంతేకాకుండా మిగతా ఐచ్ఛిక విషయాలలోను, పోటీలలోను కూడా ఎన్నో ఉత్తమ బహుమతులను అందుకొంది రామాచార్యులుగారి పెద్దమ్మాయి మోక్ష. విరామ సమయంలో తోటి విద్యార్థులందరూ కాఫిటేరియాకెళ్లి హాయిగా బాతాఖానీ కొడుతున్నారు. కానీ మోక్ష మటుకూ తరగతి గదిలోనే కూర్చుని పాఠ్యాంశాలు చదువుతూ, వ్రాసుకుంటోంది. అదే అదనుగా తీసుకున్న అజయ్‌ కుమార్‌ మోక్ష దగ్గరకు ఏదో పుస్తకం కావాలనే ఒంకతో రావటం మొదలుపెట్టాడు.

అజయ్‌ కుమార్‌ నిజంగానే చదువుతాడేమోనని నమ్మి తన పుస్తకాలను అతనికిచ్చింది. అదే అదనుగా చేసుకొని ఆ పుస్తకాలలో ప్రేమ లేఖలను వ్రాసి మోక్ష కిచ్చాడు. ‘‘మోక్ష నా మాట విను, ఒక్కసారి నాతో అలా పార్క్‌ కి రా హాయిగా మనసు విప్పి మాట్లాడుకుందాం’’ అంటూ ఏవేవో మాయ మాటలు చెప్పేవాడు.

ఒక రోజు మోక్ష అజయ్‌ కుమార్‌ మాట్లాడుతుండగా ప్రిన్స్‌పాల్‌ తరగతి గదిలోకి వచ్చాడు. ఏం చేస్తున్నారిక్కడ మీరిద్దరు? అంటూ కోపంతో ప్రశ్నించాడు. సార్‌! మోక్ష రమ్మంటేనే నేను వచ్చాను. ఇవిగో మోక్ష నా కిచ్చిన పుస్తకాలు చూడండి. అంతేకాదు సార్‌! నన్ను ప్రేమిస్తున్నట్లు ప్రేమ లేఖ కూడా రాసింది సార్‌! అని ఆమె పుస్తకంలో నుండీ ఒక ఉత్తరాన్ని ప్రిన్స్‌పాల్‌కి ఇచ్చాడు మాయామాటల పోకిరీ అజయ్‌కుమార్‌. ఈ సంఘటన జరుగుతున్న సమయానికి తోటి విద్యార్థులంతా తిరిగి తరగతి గదికి వచ్చి మోక్షని, అజయ్‌కుమార్‌లను దోషులుగా చూశారు.

కాలేజీ గోడలపై మోక్ష, అజయ్‌కుమార్లపై పిచ్చిరాతలు రాశారు ఆకతాయి విద్యార్థులు. మోక్ష తండ్రి రామాచార్యులు వచ్చి ప్రిన్స్‌పాల్‌తో మాట్లాడారు. అసలు మా అమ్మాయి ఎవరితోనూ మాట్లాడదండీ. తన చదువేదో తను చదువుకుంటుంది. మా అమ్మయాని మాత్రం నా మీద దయఉంచి డిబార్‌ చేయకండి అని ప్రాధేయపడటంతో ప్రిన్స్‌పాల్‌ శాంతించాడు.

‘‘రామాచార్యులుగారు మీ అమ్మాయి చాలా మంచిదని నాకు తెలుసు, ఈ కాలంలో కూడా ఇలా మెత్తగా ఉంటే మన నెత్తిమీద ఎక్కి నాట్యం చేస్తారందరూ’’ అని ఆయనకి ధైర్యాన్ని చెప్పటంతో సంతోషంతో ఇంటికి చేరుకున్నాడు ఆయన. అయినా ఆ రోజు సభలో మీరు ఫ్యూజన్‌ సంగీతం పాడకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ పాడేరే అనుకోండి! అనవసర ప్రసంగం ఇవ్వకుండా ఊరుకోవచ్చుగా! అంటూ భార్య శ్యామలాదేవి దీర్ఘాలు, అభాండరాగాలు తీసింది. ‘‘దీన్నే మూలిగే నక్కపైన తాటిపండు పడటం అంటే’’ అని కోపంతో చిరాకు పడ్డాడు రామాచార్యులు.

ఆ రోజు ఇంట్లో ఎవరూ భోజనాలు చేయలేదు. దాదాపు వారం రోజుల వరకూ మోక్ష కాలేజీకి వెళ్ళలేదు. అక్కా నీవు ఇలా డిగ్రీ స్థాయికి వచ్చి కూడా గట్టి పడకపోతే ఈ సమాజంలో నీవు బ్రతకటం చాలా కష్టం. అందుకే నాలాగా మాటకు మాట రఫ్‌ గా జవాబు చెప్పటం నేర్చుకో. ఇలాంటి పొగరుబోతు మూకలున్నారనే కదా నేను కరాటే కూడా నేర్చుకుంటున్నానని అక్కను ఓదార్చింది చెల్లాయ్‌ దీక్ష.

మోక్ష డిగ్రీ ఫైనల్‌ ఇయర్లో ఉంది. దీక్ష సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. నాన్నా! నాకు డిగ్రీ చదవటం ఇష్టం లేదు. నీకు లాగానే మన శాస్త్రీయ సంగీతం, నాట్యం నేర్చుకుంటానని చిన్నమ్మాయి దీక్ష అడగడంతో సంగీతంతోపాటు మన కూచిపూడి నాట్యం కూడా నేర్పిస్తూ చిన్న కుమార్తెను ప్రోత్సహిస్తున్నాడు పెద్ద మనసున్న రామాచార్యులు.

కాలక్రమేణా పరిస్థితులు చక్కబడుతున్నాయని తలచిన మోక్ష తిరిగి కాలేజీ కెళ్ళటం ప్రారంభించింది. కానీ మోక్ష మనసులో ఏదో భయంగానే ఉంది. అంతేకాకుండా ఏదో తప్పుచేసిన దానిలా బాధపడుతోంది. దారిలో అమ్మవారి గుడికెళ్ళదామని అటుగా నడుస్తుండగా, అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారులో పొగరుబోతు మూకతో రింగ్‌ లీడర్‌ అజయ్‌ కుమార్‌ వచ్చి మోక్షని కిడ్నాప్‌ చేసి వేగంగా తీసుకుపోవటం మెరుపు మెరిసినట్లు క్షణాల్లో జరిగిపోయింది. ఊరి పొలిమేర్లకు  ఆమెను తీసుకుపోయారు. పొగరుబోతు మూకలందరూ మోక్షని పైశాచికంగా పాడుచేసి, తమ మృగ కామ వాంఛను తీర్చుకున్నారు. ఆ తరువాత కాళ్లు చేతులూ కట్టేసి నదిలోకి విసిరేశారు. కేకలు వేయటానికి నోరు కట్టేసి ఉంది. నీళ్ళు త్రాగి త్రాగి ఊపిరాడక కట్లు విడిపించుకోవటానికి విశ్వం ప్రయత్నం చేసి విఫలమైపోయింది పాపం. మోక్షకి మోక్షం వచ్చేసింది.

 *   *   *

డిగ్రీలు పూర్తి చేసిన తరువాత తన ఇద్దరు కుమార్తెలకూ వివాహాలు చేద్దాం అనుకున్నారు రామాచార్యులు దంపతులు. కానీ విధి ఆడిన భయంకర నాటకంతో ఇలా దారి తప్పిపోయింది జీవితం అని ప్రతిక్షణం కుమిలిపోతున్నారు.

పొగరుబోతు అజయ్‌ కుమార్‌ స్నేహితులతో కలసి మోక్షను బలాత్కారం చేసి, హత్యచేసినా న్యాయస్థానాలకు వాటికి సంబంధించిన సరైన ఆధారాలు దొరకలేదు. దొరకకుండా చేశాడు అజయ్‌కుమార్‌ తండ్రి. ధన మదంతో చట్టాన్ని మాయచేసి కేసును కొట్టేయించిన కలియుగ రాక్షసుడు.

చిన్నమ్మాయి దీక్ష తండ్రివలే తను కూడా సంగీత కచేరీలు ఇస్తోంది. దీక్ష నాట్యంలో ప్రవీణతను సాధించి కూచిపూడి మరియు ఇతర రంగస్థల ప్రదర్శనలు ఇస్తోంది. అందుకే దీక్షకు సినిమా అవకాశాలు కూడా రావటం మొదలయ్యాయి.

ఒకరోజు నాటకోత్సవంలో ‘‘మహిషాసుర మర్థిని’’ నాటకం వేస్తున్నారు. అందులో మహిషాసుర మర్థినిగా దీక్ష నటిస్తోంది. కానీ ఆ రోజు నిత్యం తమ బృందంతో వచ్చే మహిషాసుర పాత్ర వేసే కళాకారుడు ఆ రోజు రాలేదు. గ్రీన్‌రూమ్‌లో మేకప్‌ వేసుకుంటోంది దీక్ష. ఇంకొక కొత్త కళాకారుణ్ణి తీసుకొచ్చి వేషం వేయించి నాటకానికి సిద్ధం చేయించాడు మేనేజర్‌ మాణిక్యాలరావు.

మహిషాసురమర్ధిని నాటకం మొదలయ్యింది. నాటకంలోని ప్రతి సన్నివేశం రక్తి కట్టడంతో ఆహుతులు కరతాళ ధ్వనులు చేస్తూ ఈలలు, అరుపులు, కేకల మధ్య నాటకం మంచి రసవత్తరంగా సాగుతోంది.

ఓరీ మహిషాసురా! భక్తులనూ, బలహీనులను దేవతలను సైతం అరాచకంగా హింసిస్తున్నావు కదరా! నీకు ఈనాటితో ఆయువు మూడిరది. నీ అకృత్యాలన్నీ అంతమయ్యే కాలం దగ్గరపడిరది! అని భయంకరంగా విజయవికట్టాహాసం చేసింది విజయదుర్గ.

అయిగిరినందిని విశ్వవినోదిని…. అనే స్తోత్రాన్ని ఆలపిస్తూ మహిషాసురుని మీదకు ఒక్కొక్క అస్త్రాన్నీ ప్రయోగించింది. విజయదుర్గ, కాళీమాత మరియూ అపరచండీ దీక్ష. ఆమె ప్రయోగించే అస్త్రాల నుండీ తనను తాను కాపాడుకుంటున్నాడు మహిషాసురుడు.

ఆ మహిషాసురుని వేషంలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూచినట్లుంది అపరచండి దుర్గjైున విజయ దుర్గ దీక్షకు. అతడే అజయ్‌కుమార్‌ అని గుర్తించింది. వెంటనే ఆమెకు పూనకం వచ్చి రౌద్ర దుర్గగా మారింది. అతనిని అంతం చేయటానికి ఇదే అదునైన సమయం అని సంకల్పించింది దీక్ష. ఆమె మనసులో అమాయకురాలైన అక్క మోక్ష రూపం కదలాడుతోంది. ఇదే సరైన సమయమని పళ్లు గట్టిగా బిగించి కాళికాదేవిని ప్రార్థించింది. దీక్ష నాటభైరవి రాగాన్ని దిక్కులు పెక్కటిల్లేలాగా ఆలపిస్తూ, అవని కృంగిపోయే లాగా నాట్యం చేస్తోంది.

దీక్ష వెనకాల ఇంకా 8మంది అమ్మవార్లు వేషధారులై ఆయుధాలు ధరించి వున్నారు. అదే సమయంలో భారీ ఎత్తున భూకంపం సంభవించింది. అనుకోకుండా శరవేగంతో అమ్మవారి చేతినుండి త్రిశూలం జారి మహిషాసురుని (అజయ్‌కుమార్‌ కుక్షిలో దిగబడిరది) రక్తం కక్కుకుంటూ మహిషాసురుడు ఆర్తనాదాలు చేస్తూ మరణించాడు. సైకో శాడిస్టు అజయ్‌కుమార్‌ అంతరించిపోయాడు. దుష్టసంహారిణి విజయదుర్గ.

October 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

మంత్రముగ్ధులను చేసిన వృశ్చికములు (తేళ్ళు)

by ఒద్దిరాజు మురళీధరంరావు October 4, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనువాద రచయిత – ఒద్దిరాజు మురళీధర్ రావు గారు
మూల రచయిత – సుధా మూర్తి
పుస్తకం-గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్

సిద్ధార్థ అనే ఒక యువకుడు మంచి నడవడి గల వ్యాపారి. మంచి వ్యాపారం కోసం వేరే ఊరు వెళ్ళాడు. అతడు ఆ గ్రామస్తులను ఎంతో ఇష్టపడి తను అక్కడే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. తను కూడబెట్టుకున్న డబ్బంతా పెట్టి అక్కడనే ఒక ఇల్లు కొందామనుకున్నాడు. ఇల్లు వెతకడానికి వెళ్ళినప్పుడు అతనికి ఉదయ్ అనే యువకుడు కలిశాడు.

ఉదయ్ అప్పుడు ఒక బీదవాడు. అతనిది ఒకప్పుడు ధనిక కుటుంబం. కాని ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉన్నారు. ఉదయ్ తన కుటుంబ పాతబంగ్లా అమ్మేసి తన కుటుంబ అప్పులు తీర్చాలని అనుకుంటున్నాడు.

ఉదయ్ చూపిన ఇల్లు సిద్ధార్థకు నచ్చి వెంటనే కొనేశాడు. శిథిలంగా ఉన్న ఆ ఇంటిని రిపేరు చేయడం మొదలు పెట్టించాడు. అతను పాత ఫ్లోరింగ్ను తవ్విస్తున్నపుడు ఒక సీల్డు పెట్టె భూమిలో పాతిపెట్టబడినది కనిపించింది. దాన్ని తెరిచినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు, దాని నిండా కదులుతున్న వృశ్చికములను (తేళ్లను) చూశాడు. భయపడి వెంటనే ఆ పెట్టెను దూరంగా విసిరేశాడు.

సాయంత్రం అతను తేళ్ళపెట్టె గురించి తెలుసుకుందామని ఆ ఊళ్లో ఒక పండితుని వద్దకు వెళ్ళాడు. ఆ పండితుడు కొంతసేపు విచారించి బహుశ ఉదయ్ పూర్వీకులు ఎవరో తమ కుటుంబంలో ఎవరికైన అవసరం ఏర్పడినపుడు ఆ ధనం ఉపయోగపడుతుందనే భావంతో ఆ పెట్టెను పాతిపెట్టి ఉండవచ్చు అన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ పెట్టె గురించి మరిచిపోయి ఉండవచ్చు.

సిద్ధార్థకు ఏమి తోచలేదు. కాని పెట్టెలో డబ్బుగాక తేళ్ళు ఉండటమేమి?

అప్పుడు ఆ వృద్ధుడు నవ్వాడు. “ఆ పెట్టె ఎంతోకాలం నుండి కాపాడబడి ఉంది. దాన్ని కుటుంబీకులు తప్ప ఇతరులకు తేళ్ళతో నిండిన పెట్టె కనబడుతుంది. కేవలం ఆ కుటుంబీకుల్లో ఎవరైనా చూస్తే వారికి పెట్టెలో డబ్బు కనిపిస్తుంది. ఇది ఒక మంత్రబలం కావచ్చు” అన్నాడు ఆ పండితుడు.

సిద్దార్థ ఇది విని బాధపడ్డాడు. ఉదయ్ తన పూర్వీకుల ఇంటిని చివరి సారిగా చూసి ఊరు వదిలిపెట్టి పోతున్నప్పుడు కన్నీరు ఉబికిరావడం సిద్ధార్థకు జ్ఞాపకం ఉంది. ఒకవేళ అతనికి దాచబడిన ధనం తెలిసిఉంటే అతనికి ఇల్లు అమ్మే అవసరం ఉండకపోయేది. సిద్ధార్థ ఇల్లు చేరాక, అతను పెట్టెను ఎవరైన ఉదయ్క సంబంధీకులు వచ్చి అడిగేవరకు భద్రంగా దాచిపెట్టాలని అనుకున్నాడు. పెట్టెకు సంబంధించిన నిజమైన ఉదయ్ కుటుంబ వారసులను గుర్తించేందుకు, పెట్టెనుండి నాల్గు తేళ్ళను తీసుకొని పోయి, అతను కొత్తగా తెరిచిన షాపుముందు నాల్గు మూలల్లో నాల్గు తేళ్ళను వేలాడదీసాడు.

అతని గిరాకులందరు షాపులోని వచ్చినపుడు ఏదో వ్యాఖ్యానం చేసేవారు. ‘సిద్ధార్థ గారు, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? మీ షాపు ముందర ఎందుకు ప్రమాదకర తేళ్ళను వేలాడదీశారు? మీరు షాపుకు వచ్చేవారిని భయపెట్టాలనుకున్నారా?” అని అనేవారు.

కాని సిద్ధార్థ ఏమీ అనకుండా కేవలం నవ్వేవాడు. అతని షాపులోని వస్తువులు చాలా మంచివని చుట్టు కొన్ని మైళ్ళవరకు తెలుసని తనకు తెలుసు. జనులు తేళ్ళను లెక్కచేయకుండా తన షాపుకే వస్తారు అనే గట్టి నమ్మకం అతనిది.

క్రమక్రమంగా ఆ షాపు తేళ్ళషాపని అనబడేది. గ్రామస్తులు అతని వెనకాల నవ్వుకునేవారు. కాని సిద్ధార్థ ఏమీ పట్టించుకోకపోయేది.

చాలా సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు సిద్ధార్థ నడివయసు వాడు, భార్యాపిల్లలతో మరియు చాలినంత ధనంతో తృప్తిగా ఉంటున్నాడు. కాని అతనికి ఒక అసంతృప్తి ఉంది. ఇంతవరకు ఆ తేళ్ళపెట్టె హక్కుదారులు ఎవరు కూడా లేదు అని.

ఒకరోజు ఒక యువకుడు షాపుకు వచ్చి, సార్, నేను మీరు ధనికులని, అవసరమున్నవారిని సహాయపడుతారని తెలిసి వచ్చాను. నేను ఫీజు కట్టలేనందుకు స్కూలుకు పోవడం ఆపేయవలసి వచ్చింది. నేను చదువు పూర్తి చేసుకునేందుకు మీరు దయతో కొంత డబ్బు సహాయపడగలరా?

సిద్ధార్థ రంధిగా తల అడ్డం తిప్పాడు. గ్రామస్తులు నా గురించి అతిగా చెప్పారు అని అన్నాడు. అవును, నేను బాగానే సంపాదిస్తున్నాను. కాని నీకు సహాయ పడేంత కానీ లేక అప్పు ఇచ్చేంత కానీ ధనం లేదు, నేను సంతోషంగా ఇచ్చేందుకు.

ఆ అబ్బాయి అది విని కోపంతో మండిపడ్డాడు. ‘సార్, ఒకవేళ మీరు సహాయ పడదలచుకోకుంటే, దయతో అలానే చెప్పండి నిర్మొహమాటంగా. ఎందుకు అబద్ధం ఆడుతారు? మీకు ఎంత ధనం ఉందంటే దానితో ఏంచేయాలో మీకు తెలియదు. అటువంటప్పుడు మీ షాపుకు ఎదురుగా బంగారు నాణాలు నాల్గు మూలల్లో ఎందుకు వేలాడదీసారు? తప్పకు మీరు నా వంటి బీదవిద్యార్థికి కొన్ని నాణాలు ఇవ్వగలరు’.

సిద్ధార్థ అతన్ని కనురెప్ప వాల్చకుండా తేరిపార ఆశ్చర్యంతో చూశాడు. ఏంటీ? ఏంటి? నువ్వు ఇప్పుడేం అన్నావు? తన కనుగుడ్లు ఉబ్బించి ఉద్రేకంతో అడిగాడు.

‘ఒకవేళ మీరు సహాయపడననుకుంటే’ అని అన్నాను. అబ్బాయి మరల చెప్పాడు. ఆం, అవును, అవును అది విన్నాను. కాని దాని తరువాత ఏమన్నావు, నా షాపు ముందర బంగారు నాణాల గురించి?

ఇప్పుడు అబ్బాయి సిద్ధార్థకు కోపం వచ్చిందని భయపడి రెండడుగులు వెనక్కు వేసి, మీరు షాపు ఎదురుగా నాల్గుమూలల్లో బంగారు నాణాలు వేళాడ దీసేంత ధనికుడవని అన్నాను. కాని సిద్ధార్థకు, ఇతర జనులకు అవి ప్రాణమున్న తేళ్ళుగానే అక్కడ కనిపిస్తున్నాయి.

సిద్ధార్థ చాలా సంతోషంగా బిగ్గరగా నవ్వాడు. అతను ముందుకెళ్ళి ఆ అబ్బాయిని ఆలింగనం చేసుకున్నాడు. నీవు ఉదయ్ కమలాకర్ వంశీయుడివా? మీ కుటుంబం ఎప్పుడైనా ఈ గ్రామంలో ఉండిందా? అని అతను దాదాపు అబ్బాయి చెవులో అరిచాడు.

ఆ అబ్బాయి భయపడి వెనకడుగు వేశాడు. బహుశ ఈ ధనికుడు కోపిష్టి, ప్రమాదకరుడు అనుకున్నాడు.

ఆఁ ఆఁ ఆఁ అవును, నా పేరు ఉదయ్. మా తాతగారి పేరు నాకు పెట్టారు. అతని కుటుంబం ఇక్కడ చాలాతరాలు ఉండేదని విన్నాను. తర్వాత, వారికి ఇబ్బందులు వచ్చి, మా తాతగారు ఇల్లు అమ్మి వెళ్ళిపోయారు. అతను తన పూర్వీకుల ఆస్తి అమ్మిన బాధతో కోలుకోలేక గుండె బగిలి మరణించాడు.

సిద్ధార్థ తన కండ్లనీరు తుడిచేసుకున్నాడు. ‘ఇక్కడే ఆగు, నా కుమారా’ అని అతను పరుగు పరుగున తన ఇంటికి వెళ్ళి, పాత పెట్టెతో తిరిగి వచ్చి దాన్ని ఆ యువకునికి ఇచ్చాడు. వెళ్ళు, పెట్టె బంగారు, వెండి నాణాలు మరియు ఆభరణాలతో నిండి ఉంది.

అతను, అతి సంతోషంతో ఉన్న సిద్ధార్థ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఇది నీకు చెందినదని సిద్ధార్థ వివరించాడు. నేను చాలా సంవత్సరాల నుండి దీన్ని జాగ్రత్తగా దాచాను, ఎన్నడైనా ఎవరైనా ఒకరు ఉదయ్ కుటుంబీకుడు దీన్ని అడిగేందుకు రాగలడని నమ్మకంతో. ఇప్పుడు నీ కష్టాలు తీరిపోయాయి. ఇంటికివెళ్ళి నీ పూర్వీకుల ఆస్తిని జాగ్రత్తగా వాడుకొని జీవితంలో హాయిగా ఉండు.

అప్పుడు అతను ఎలా పెట్టె పొందాడో, దాన్నిండా కదులుతున్న తేళ్ళు ఉదయ్ కుటుంబం వారికి తప్ప ఇతరులకు ఎలా కనిపించాయో వివరించాడు కథగా.

ఉదయ్ కథ విని విపరీతమైన ఆశ్చర్యం పొందాడు. అతను సిద్ధార్థకు అతని ధనంలో సగం కృతజ్ఞతతో ఇవ్వబోయాడు. కాని సిద్ధార్థ ఆ మాట ఏమాత్రం వినలేదు. ఇది నీది అని అతను నొక్కిచెప్పాడు. వెళ్ళు, వెళ్ళి నీ జీవితాన్ని ఆనందంగా మలుచుకో.

ఉదయ్ పెట్టెతో వెళ్ళిపోయాడు. తన జీవితాంతం ఆశ్చర్యకరమైన నిజాయితీ గల ముదుసలతను ఎవరైతే తమ ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాడో అతడిని జ్ఞాపకం చేసుకున్నాడు.

XXXXXX

October 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కావేరి మరియు దొంగ

by ఒద్దిరాజు మురళీధరంరావు October 4, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

కావేరీని తన సోమరిపోతు భర్త ఎప్పుడూ చికాకు పెట్టేవాడు. ఆమె పొలం దున్నడం, నీళ్ళు పెట్టడం, భూమిని నాటు పెట్టుటకు గాడిదవలె చాలా శ్రమ పడుతుండేది. అప్పుడు ఆమె భర్త ఇంట్లో హాయిగా గుర్రుకొడుతూ నిద్రించేవాడు. ఎందుకు ఒకసారి ఎవరో కొత్తతను అన్నం మరియు నీళ్ళు అడుగుతూ వంటగది చూపించి నిద్రించేందుకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ కొత్తతను ధన్యవాదాలు తెలుపుతూ కావాలసినంత మాత్రమే తనకు తన గుబ్దానికి తీసుకున్నాడు.

కావేరి చిన్న ఇంట్లో దొంగతనం చేయుటకు ఎక్కువేమి లేదు. వాళ్ళు బీద కర్షకులు. కేవలం కొద్ది భూమే పండించుటకు ఉంది, కాని అక్కడ ఏమి పండక పోయేది. ఏదో తీరుగ కావేరీ పొలం దున్ని పక్క ఇండ్లల్లో అవో ఇవో పనులు చేస్తూ ఇల్లు గడిపేది.

ఆమె భూమి దేవాలయానికి పక్కనే ఉంది. కొన్ని రోజులు ఆమెకు సహాయం చేసి నటనతో వచ్చి ఆమె వెంట తిరిగిన వెంటనే తిరిగి వెళ్ళి దేవాలయ ప్రాంగణంలో కాళ్ళు జాచి వచ్చిపోయే వారితో గప్పాలు కొట్టేవాడు భర్త.

ఒకనాడు, ఆమె పొలంలో పనిచేస్తునప్పుడు, విత్తనాలు చల్లేందుకు భూమిని తవ్వుతున్నపుడు ఒక బక్కపలుచటి మనిషి పెద్ద మీసాలవాడు ఆమె ప్రక్కన ప్రత్యక్ష

మైనాడు. అతను ఒక దొంగ మరియు ఎందుకు పనికిరాడు. కావేరికి ఇది తెలియదు. ఆమె మర్యాదగా దండం పెట్టి తన పనిలోకి తిరిగిపోయింది.

ఇప్పుడు దేవాలయంలో విగ్రహంపై ఉన్న ఆభరణాలు, కానుకలుగా అర్జించిన నాణాలు దొంగిలించాలనుకున్నాడు. గుడిలోకి వెళ్ళేందుకు కేవలం కావేరి పొలంలో నుండే దారి. కాని ఆ తెలివైన మరియు గట్టి ఆవిడకు తెలియకుండ చేయడం ఎలా?

కావేరికి డబ్బులు సరిగా లేవని ఊహించి ఆమెకు గుసగుసగా “చెల్లీ, నీవు ఈ పంట పండని భూమిని పట్టుకొని ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నేను నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను, నాకు అమ్మేసెయి” అన్నాడు.

కావేరి కనురెప్పలు లేపింది. అతను అన్ని రూపాయలకు ఈ భూమి ఎందుకు కొంటాడు? కచ్చితంగా ఏదో లోపం ఉంటుంది.

ఆ దొంగ ఆమె అమ్మదని ఊహించాడు. కాబట్టి అతని ధర పెంచాడు. వెయ్యి మరియు యాభై? లేదు? రెండు వేలు? లేదు మరల? ఐదువేలు? లేదు.

కావేరి తల అడ్డం తిప్పుతుంటుంది. ఆమె ఆ కొద్ది భూమికి అంత డబ్బు ఇచ్చే పనికిరాని మనిషిని ఇష్టపడలేదు. తప్పనిసరిగ అతనిలో చెడు ఆలోచనలు ఉంటాయి. చివరకు, అతని నోరు మూయించేందుకు, ఆమె ఒక కథ ఆలోచించింది. నేను ఎన్నటికి కూడా ఈ భూమి అమ్మను. ఎందుకంటే ఇది మా పూర్వీకులది. ఇప్పుడు మేము బీదవారిమి. కాని నాకు తెలిసింది ఏమంటే మా కుటుంబం ఒకప్పుడు చాలా ధనికులది. మేము చాలా ధనం పోగొట్టుకున్నప్పటికి, అందులో ఎక్కువ

భాగం ఈ భూమిలోనే మా పూర్వీకులలో ఒకతను దొంగల నుండి రక్షించుకునేందుకు పాతిపెట్టాడట. ఎన్నో ఏండ్ల క్రితం మనుషులు అది మరిచిపోయారట. కొద్ది రోజుల క్రితమే నా భర్త దాచిన ధనం లం గురించి ఒక ఉపాయం తెలుసుకున్నాడు. నేను ఇంత గట్టి నేలను ఎందుకు తవ్వుతున్నానని అనుకుంటున్నావు? విత్తనాలు వేసేందుకు కాదు, ఓహో కాదు, అందరూ అదే అనుకుంటారు. నేను కేవలం దాచబడిన సొమ్ము కొరకు తవ్వుతున్నాను!

ఆ దొంగ ఆశ్చర్యచకితుడైనాడు. ఈ ఆడమనిషి ఇంత విలువైన సమాచారాన్ని ఎవరో కొత్త మనిషికి తెలుపడం, ఉట్టి అమాయకురాలు అనుకున్నాడు. నేను ఈ పరిస్థితిని నా లాభం కొరకు ఎందుకు వాడుకోకూడదు? ఇక్కడ అతను ఉండి ఆలయంలోని నాణాలను దొంగిలించుదామని ఆశించాడు మరియు ఈ ఆడమనిషి ఇక్కడ ధనం దాచిన సంగతి చెప్పుతున్నది! అతను చాలా నమ్రతగా ‘అవును చెల్లీ, నాకు అర్థమయింది, కేవలం అది మీ కుటుంబ సొమ్ము. నీవే దాన్ని పొందాలి’ అతను వెళ్ళిపోతున్నట్లు నటించాడు. కొంతదూరం పోయి ఆ రోడ్డు పక్కన దాక్కున్నాడు.

రాత్రి అయింది, కావేరి తన పనిముట్లు తీసుకొని ఇంటివైపు వెళ్ళింది. ఆలయం కూడా ఖాళీ అయింది. మరియు పూజారి ఆ

రాత్రికి తాళం వేశాడు. అప్పుడు మధ్యరాత్రి, అంతా నిశ్శబ్దం మరియు రాత్రి కీటకాలు వాటి ఇండ్ల నుండి బయటికి వస్తున్నవి, ఆ దొంగ ఆ పొలంలోకి పాకాడు.

రాత్రంతా అతను తవ్వాడు, తవ్వాడు, తవ్వాడు సొమ్ము కొరకు. కాని అక్కడ సొమ్ము ఉన్న గుర్తు ఏమీ లేకుండెను. అసలు అక్కడ సొమ్మే లేదు. తెల్లవారే వరకు కావేరి తనను ఫూల్ చేసిందని గ్రహించి ఇక చేయవలసింది అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవడమే.

ఎప్పుడైతే కావేరి పొలం వద్దకు వెళ్ళిందో ఆమెను ఆమెనే మెచ్చుకుండి. ఆమె ఊహించినట్లే పొలం ఆ దొంగ రాత్రంతా మంచిగా త్రవ్వాడు ఆమె కొరకు. ఇప్పుడు ఆమె చేయవలసింది కేవలం గింజలు నాటడమే. ఆమె పొలంలో కొన్ని నెలలు బాగా కష్టపడింది మరియు మంచి పంట పండించింది. ఆమె ఆ పంట అమ్మేసింది. ఖర్చులు పోను వారి వద్ద కొంత డబ్బు మిగిలింది. దాంట్లో నుంచి కొంత డబ్బుతో కావేరి సొమ్ములు కొనుక్కుంది.

చాలా నెలల తరువాత, ఆ దొంగ ఆ గ్రామంలో ముఖం చూపించ దలిచాడు. అతను తన మారువేషంలో జాగ్రత్తగా ఉండేవాడు. అతను తన పొడుగాటి

మీసాలు కత్తిరించుకొని అందంగా తయారు అయినాడు, రంగు రుమాలు కట్టుకుని వ్యాపారస్తుని వలె నటించాడు. అతను గ్రామంలో అడుగు పెట్టగానే పనికి పోతున్న కావేరిని చూశాడు. కాని ఇదేంటి… మామూలు అమ్మాయి ఏ ఆభరణాలు వేసుకొని, ఇప్పుడు వెనుకటి నుండి సంపన్న కుటుంబందాని వలె కనిపించింది. తప్పనిసరిగ వాళ్ళ కుటుంబం భూమిలో దాచుకున్న ధనం దొరికి ఉండవచ్చు చివరకు. అతను ఆమె ఇంటికి పోయి మిగతా డబ్బు, సొమ్ములు చూద్దామని నిశ్చయించుకున్నాడు.

ఆ రాత్రి అతను కావేరీ ఇంటికిపోయి ఆమె భర్తతో ఇలా అన్నాడు. నేను ఒక బాటసారిని కాని నాకు ఈ రాత్రి గడుపుటకు స్థలం దొరకలేదు. దయతో నాకు ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వండి’ అని.

కావేరి భర్త వెంటనే అంగీకరించాడు. కావేరీ ఎట్లాగో అతడిని లోపలి నుండి చాటుగా అతడు మారువేషంలో ఉన్నది కనిపెట్టింది. ఆమెకు ఎరుకే, అతను ఏదో దొంగిలించాలనే ప్లాలో వచ్చాడని, కాబట్టి ఆమె పెద్ద గొంతుతో ఆ యాత్రికుడు వినేట్లు పలికింది. “ఓ నా ప్రియుడా, మీ ప్రియమైన అత్త ఒక్కతే రాత్రంతా ఉంటుంది మరియు మనను ఆమెతో ఉండేందుకు రమ్మంది. నీకెరుకే, మీ మామయ్య లేనప్పుడు చీకటి ఆమెను ఎలా భయపెడుతుందో” అంది. “రా, ఈ రాత్రికి అక్కడికే పోదాం.” అప్పుడు తన మాట శబ్దం కొంత తగ్గించి ఆమె మాట్లాడుతూ, ‘మన సొమ్ముల గురించి విచారించకు. నేను వాటిని ఇంటి గోడ రంధ్రాల్లో దాచిపెట్టాను. ఎవరు కూడా దాచిన చోటను అనుమానించరు. అప్పుడు ఆమె తన సహజ శబ్దంతో దొంగకు చెప్పింది. అన్నా, మీరు వరండాలో నిద్రించవచ్చు. ఇల్లు తాళం వేయబడు తుంది. ఇక్కడ నీ కొరకు కొంత అన్నం, నీరు ఉంది. మేము రేపు ఉదయం రాగలము’ అంది. ఆ దొంగ తనలోనే అమాయకపు కావేరి గురించి నవ్వుకున్నాడు.

ఆమె భర్త నోరు తెరిచి ఆమె ముఖం వైపు కనురెప్ప వాల్చకుండా చూశాడు.

ఎక్కడి అత్త మరియు ఎక్కడి సొమ్ములు ఆమె మాట్లాడుతున్నది అని ఆశ్చర్యపడినాడు. ఎప్పుడైతే ఆమె గట్టిగా నడువసాగిందో, ఆయన విధేయుడుగా వెంట నడిచాడు.

ఆ దొంగ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. ఆయనకు రాత్రంతా గోడలు కొట్టి చూసేందుకు, మరియు దాచిన బంగార ఆభరణాలు చూసేందుకు సమయం దొరికింది. అందుకు ఆయన మొదలుపెట్టాడు. ట్యాప్, ట్యాప్, ట్యాప్. చెయ్యితో గుద్దాడు మరియు గట్టిగా నెట్టాడు. నగలు ఉన్న చోటు దొరుకుతుందని అతను ఇల్లంతా గాలించాడు, ట్యాప్ చేశాడు, గోడలను తన్నాడు, నెట్టాడు. చివరకు గోడలన్నీ కూల్చేశాడు. కాని అక్కడ అతనికి ఏమీ దొరకలేదు. బాగా అలసిపోయి నిద్రలోకి పోయాడు. మరియు కోడికూత, సూర్యోదయం అప్పుడు లేచాడు. త్వరగా తన వస్తువుల మూట తీసుకొని పరుగెత్తాడు. కొన్ని నిముషాల్లోనే కావేరీ మరియు ఆమె భర్త తిరిగివచ్చారు.

“ఓహ్ కావేరీ, చూడు ఆ చెడ్డమనిషి మర ఇంటిని ఎలా చేశాడో, నీవు అతనికి భోజనం మరియు చోటు ఇచ్చావు మరియు రాత్రి ఒకడికే ఇల్లు వదిలిపెట్టావు, నన్ను వెంట తీసుకుపోయావు” అని భర్త ఏడ్చాడు. కానీ కావేరి నవ్వుతున్నది. అప్పుడు ఆమె నవ్వులు నవ్వుతూ అంది “విచారపడకు, నేనే ఇదంతా ప్లాన్ చేశాను. నీవు చూడు. నేనే ఇల్లు కట్టుకునేందుకు గత పంట డబ్బు నుండి కొంత దాచాను. నేనే కూలీలను పిలిచి గోడ కూలగొట్టి దామనుకున్నాను, కాని మన చుట్టం ఆ పని చేశాడు! మనం ఇప్పుడు మన కోసం ఒక పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ఎప్పుడూ మనం అనుకున్నట్లు”.

గ్రామమంతా ఈ కథ విని ఆమె అద్భుతమైన తెలివిని మెచ్చుకున్నారు. ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఆ దొంగ ప్రతీకారం తీసుకోవాలని మండిపోతున్నాడు. ఎంత ధైర్యం గ్రామస్త్రీ నన్ను మోసగించేందుకు, అది కూడా ఒకసారి కాదు, రెండు సార్లు! ఆమె చాలా తెలివైనదని గ్రహించాడు.

ఒకరోజు అతను గాజుల బేరగాని వలె డ్రెస్ వేసుకొని గ్రామంలో తిరుగు తున్నాడు. కావేరీ అతడిని చూసింది మరియు వెంటనే అతను ఎవరో గ్రహించింది. గాజుల బేరగాని చుట్టూ మూగిన తన స్నేహితురాళ్ళతో కావేరి అంది. “ఓహ్ మిత్రులారా, నేను కూడా కొన్ని వేయించుకునేందుకు ఇష్టపడేదాన్నే. కాని ఎప్పుడైతే ఈ పనికిరాని దొంగమా ఇల్లు కూలగొట్టి మా డబ్బంతా దోచుకోవాలని ప్రయత్నం చేశాడో, అప్పుడు నేను నా డబ్బంతా అడవిలోని ఒక చెట్టు తొజ్జలో దాచాను.” అంది.

“ఏ చెట్టు?” తన స్నేహితులు అడిగారు.

“ఓహ్ కాదు, ఏ చెట్టని చెప్పను, కాని అడవిలో ఆ డబ్బంతా భద్రంగా ఉంటుంది.

ఆ దొంగ ఆమె వైపు చూశాడు. అవును కావేరీ మామూలు చీర కట్టుకుంది, ఏ ఆభరణాలు వంటిమీద లేవు.

గాజుల బేరగాడు గాజులు అమ్మిన డబ్బు కిందపడేసి ఎగిరి అడవివైపు పోవడం చూసి ఆమె మిత్రులు ఆశ్చర్యపడినారు. కేవలం కావేరియే ఆమె ముఖం చిట్లించి జాగ్రత్తగా చూసింది.

అడవిలో ఆ దొంగ కింద మీద సొమ్ముల కొరకు బాగా వెదికాడు. అతను చెట్లు ఎక్కాడు, పొదల్లో కట్టెతో పొడిచి చూశాడు. ఏదో కుట్టింది,

గోక్కున్నాడు మరియు కోపంతో అరిచాడు, కాని అతను వదలలేదు. ఆ సొమ్ములు ఇక్కడే ఎక్కడనో ఉంటాయి. వాటిని అతను తెలుసుకోవాలి.

అతనిది కాని సొమ్ము కొరకు వెదికేవాడిని వదిలిపెడుదాము. కావేరి సమయస్ఫూర్తితో గ్రామాన్ని దొంగ నుండి రక్షించినందుకు అందరు పొగిడారు.

ఆమె కష్టపడి పనిచేస్తూ ఆమె పొలంనుండి బాగా డబ్బు సంపాదించి చాలా ధనవంతురాలయింది. ఆమె భర్త కూడా చేతకాదనే నటన విడిచి ఆమెకు సహాయపడే వాడయ్యాడు. దొంగ గురించి ఎవరికి ఎరుక, బహుశా అతను తనది కాని దాని గురించి వెతుకుతుండవచ్చు. ఇప్పుడు అతను కూడా కావేరీ వలె కష్టపడి పని చేసుకుంటే అతను కూడా ధనికుడు అయి వుండేవాడు.

కథ అయిపోయాక పిల్లలు నవ్వారు, మరీ నవ్వారు. ‘అయ్యో పాపం దొంగ’. మీను మరియు క్రిష్ణ చిలిపిగా నవ్వారు. అతను పులి నోట్ల పడి ఉండవచ్చు!

అమ్మమ్మ సీరియస్ గా అంది, కొద్ది అదృష్టం మరియు తీసిపారేసిన గడ్డి పరకలతో వారి పరిస్థితిని మార్చుకోవచ్చు.

October 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆధ్యాత్మిక నగరం

by Eturi Nagendra Rao October 4, 2022
written by Eturi Nagendra Rao

నన్ను నేను మర్చిపోయి

ఏదో దృశ్యంలో

లీన మవుతున్నాను

ఈ రాత్రి!

కాంతులీనే ఆధ్యాత్మిక

నగరం నడి బొడ్డులో

తత్వాన్ని కలగంటున్నాను.

ఎవరో

నన్ను ప్రశ్నిస్తున్నారు.

భక్తుల నిర్వేదానికి

అక్షర రూపమిచ్చేవా అని!

భక్తో, ఉన్మాదమో

లోపల రగులుతున్న

క్రోధం ఆశాంతిగా 

నా ముఖంపై!

మనుషుల్లో ప్రమాదకర

ఉన్మత్తత ప్రసారమవుతూనే

వుంటుంది.

ఎక్కణ్ణుంచో

ఆధ్యాత్మిక పొగలు

కుమ్ముకు లేస్తున్నాయి.

మనిషి

‘ వాడి’ లోనే వుండిపోతున్నాడు.

నిజంగా

దేవుడిని చూడాలంటే

ఈ అనంత సృష్టిని చూడు. అందులో

నువ్వూ భాగమే!

ఏటూరి నాగేంద్రరావు

7416665323

October 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

అస్తిత్వ పరీక్ష

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు October 4, 2022
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

ఇతడు డాంటే కాడు

 ఇది డాంటే ఫోటో

 ఇది డాంటేగా నటించే నటుడున్న సినిమా

 ఇది డాంటే డాంటే పాత్రలో నటించిన సినిమా

 ఇతను డాంటేను కల గనే మనిషి

 ఇతడు డాంటే కాకున్నా

 డాంటే అని పిలువబడే మనిషి

 ఇతను డాంటేను అనుకరించే మనిషి

 ఇతడు తనను తాను డాంటేగా

 చెల్లుబాటు చేసుకునే మనిషి

 ఇతడు తాను డాంటే అనే కలను కనే మనిషి

 ఇతడు డాంటే నోట్లోంచి ఊడిపడ్డట్టుగా

 ఉన్న రూపం గల మనిషి

 ఇది డాంటే మైనపు బొమ్మ

 ఇది మార్పిడి చేయబడిన శిశువు,

 రెండో రూపం, ఒక కవల పాప

 ఇతడు తను డాంటే అని విశ్వసించే మనిషి

 ఇతడు డాంటే తప్ప

 అందరూ డాంటే అని నమ్మే మనిషి

 ఇతడు అందరూ డాంటేలే అని నమ్మే మనిషే కాని

 ఆ విషయాన్ని తనే మోసపోయి నమ్మడు

 ఇతడు డాంటే తప్ప మరెవరూ

 డాంటే అని నమ్మని మనిషి

 ఇతను డాంటే

ఆంగ్లమూలం: హాన్స్ మాగ్నుస్ ఎన్సిస్టాగా

అనువాదం: ఎలనాగ

***

October 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నమో! నా దేశమా!!

by Peddurti Venkatadasu October 3, 2022
written by Peddurti Venkatadasu

అమ్మను దేవతగా పూజించే నా దేశంలో… ప్రతిదీ అద్భుతమే…

సాంకేతికతలో ఈ అవనిలోనే తలమానికమై

అలరారుతున్నా!

నైతికతలోనూ నా దేశం

అన్ని దేశాలకు ఆదర్శమే…

ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య విషయంలో ఎన్నో

కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నా

మన ఆధ్యాత్మికతతో అంటు కట్టుకున్న యోగా

విశ్వవ్యాప్తంగా ఆదరణకు

నోచుకోవడం ఆశ్చర్యమే-

చెట్టును పుట్టను గట్టును

గాలిని నీటిని వేటినీ వదలక

కళ్ళకద్దుకని ప్రకృతిని ప్రాణప్రదంగా

గౌరవించడం అపూర్వమే –

పుంఖాను పుంఖాలుగా పుస్తకాలను

వల్లే వెస్తే పుట్టలేదు ఇక్కడ భక్తి

మెదడు మొదళ్ళను తలుచుకొని

అనువంశికంగా మొలుస్తుంది

అది ఈ మట్టి శక్తి

ఒక చెంపపై కొడితే మరో చెంప

చూపించిన మహాత్ముణ్ణి గన్న

మన అవని – పరమ పావని

సౌశీల్య రాముణ్ణి రాజుగా కాక

దేవునిగా గుండెల్లో దాచుకున్న

ఈ దేశంలో పుట్టడమే మన భాగ్యం

నైస్వర్గికంగా కూడా మన దేశం

సర్వశ్రేష్ఠం అది మన సౌభాగ్యం!!

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ పండుగ

by Dasari (jangiti) Shantakumari October 3, 2022
written by Dasari (jangiti) Shantakumari

తెలంగాణ సంస్కృతి విశిష్టమైనదే కాదు విలక్షణమైంది.తెలంగాణ ప్రజలు జరుపుకునే పండగల్లో బతుకమ్మ పండుగ ప్రత్యేకమైనది.బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.ప్రకృతిని ఆరాధిస్తూ,పూజిస్తూ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పండుగ బతుకమ్మ పండుగ.ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు అంతా కులాలు,మతాలు అంతస్థుల తారతమ్యం ,చిన్నా పెద్దా,వయోభేదం లేకుండా సంబరంగా ఆడుతూ పాడుతూ గౌరీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే పూల ఉత్సవం.ఈ పండుగ కోసం ఆడపడుచులమంతా ఎదురు చూస్తుంటాము.నగరాలలో ఉన్నవారు సైతం ఊళ్లకు పయనమై పండగలో పాల్గొంటారు.ఉరుకుల పరుగుల జీవితంలో ఈ పండగ ఇంటింటా సరికొత్త ఆనందాలను నింపి,ఉత్సాహాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఆటవిడుపు కాలమిది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏటా బతుకమ్మను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించటం విశేషం.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకుంటూ జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ.శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25 న ప్రారంభం కానున్నాయి.బతుకమ్మ ఉత్సవాలు కూడా ఇదే రోజున మొదలై 9 రోజులపాటు జరుగుతాయి. అక్టోబర్ 3 వ తేదీన సద్దుల బతుకమ్మ ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు జరుపుతోంది. బతుకమ్మ పండుగ వారసత్వ పండుగ.చరిత్రకు సాక్ష్యమైన పూల జాతర. ఈ పండుగ ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో చారిత్రక కథలు,పురాణాల రూపంలో ప్రచారంలో ఉన్నాయి.నవాబులు, భూస్వాముల,పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.వారి అకృత్యాలకు బలైపోయి,నలిగిపోయినవారిని,వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి పూలను పేర్చి,బతుకవమ్మా…లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడుతాము.”బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ” పాటల వెనుక ఉన్న మర్మం ఇదే.వెయ్యేళ్లుగా ఇక్కడి ప్రజలము బతుకమ్మను తమ ఇంటిదేవతగా పూజిస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర అంతా ఇంతా కాదు. ఒకరకంగా ఉద్యమానికి ఊపునిచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని కదిలించటమే కాదు మన అస్తిత్వాన్ని నిలబెట్టిందనటంలో ఏ మాత్రం సందేహం లేదని చెప్పాలి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రధాన్యాన్నిచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది.

బతుకమ్మ పండుగ కథ :

తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్దం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ (ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా ) లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళనే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది.అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006 లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు.తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు.అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకోవడం జరిగింది. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను జరుపుకుంటున్నాము. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నాము. అంతేకాకుండా తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగలన్నీ సామాజిక సంబంధాలకు అద్దం పడతాయి.ప్రకృతిలో మమేకమై ఆత్మీయంగా బంధాలను పెనవేసుకోవడం ఇక్కడి ప్రజల సహజ జీవన సౌందర్యానికి ప్రతీక.బతుకమ్మకు వాడే పూలు కూడా సహజ సిద్ధంగా లభించేవి కావడం విశేషం.మానవ ప్రయత్నం లేకుండా సహజంగా లభించే మొక్కలకు,తీగలకు పూసేవే. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో…భూమితో,జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటాము.ఈ సంబరాల్లో పెండ్లికాని అమ్మాయిలు”బొడ్డెమ్మ”(పుట్టమన్ను తో చేసే దుర్గాదేవి బొమ్మ)ను చేసి వాకిట్లో ముగ్గులు వేసి ఆడుతారు.ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలై బతుకమ్మగా రూపుదిద్దుకుంటుంది.ఇలా మట్టిరూపం నుంచి పూలరూపం పొంది నీళ్లలో కలిసిపోయే తంతు అంతా జానపదుల సంస్కృతిలో భాగం.ఆద్యంతం జానపదుల జీవన విధానం ఈ పండుగలో మేళవిస్తూ…అటు ప్రకృతితో ఇటు మనిషితో గాఢమైన నిరంతర సంబంధాన్ని ప్రదర్శించే అపురూపమైన ఉత్సవం.ప్రకృతిలో లభించే రకరకాల పూలవలె అందరూ కలిసి మెలిసి బతకాలనే గొప్ప సందేశం అంతర్గతంగా మనకు బోధిస్తుంది. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటేనే పల్లెవాసుల జీవనశైలి, శ్రామిక రైతుల బతుకు చిత్రం ఇమిడి ఉండే సామాజిక ఉత్సవంగా …వృత్తి, వర్గ,కుల,ప్రాంత,మత సాంప్రదాయ భేదాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కలిసి సమతాభావాన్ని పెంపొందించే గొప్ప ఉత్సవం ఈ బతుకమ్మ పండుగ.

పర్యావరణ హితం :

 బతుకమ్మ పండుగ వర్షాకాలపు చివరలో,శీతాకాలపు తొలిరోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ నీటితో నిండి ఉంటాయి.రకరకాల పూలు దొరుకుతాయి.వర్షాకాలం,శీతాకాలం సంధి సమయంలో ఉపయోగించడంతో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.నిండుకుండలాగా ఉండే చెరువులు, కుంటలూ వీటితో శుభ్రం అవుతాయి. పర్యా వరణాన్ని కాపాడుతాయి. బతుకమ్మ పాటలు కష్టసుఖాలు, - ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాల మేళవింపుగా అలరిస్తూ...సంస్కృతి, సంప్ర దాయాలకు అద్దం పడతాయి. ఈ పర్వదినం సందర్భంగా తొమ్మిది రోజుల పాటు రకరకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. మొక్కజొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం లాంటి పదార్థాలను నైవేద్యాల తయారీలో ఉపయోగిస్తారు

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పేర్లు,నైవేద్యాలు :

1.ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజు. దీన్నే “పెత్రామాస” అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతాము.
2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తాము
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తాము.
4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.
5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తాము.
6. అలిగిన బతుకమ్మ : ఆశ్వయుజ పంచమి. ఈనాడు నైవేద్యం సమర్పించము.
7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తాము.
8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తాము.
9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఇదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటాము. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం,మలీదా,నువ్వుండలు అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదిస్తాము.
బతుకమ్మ పూల పండగే కాదు ఆటపాటల పండగ.కోలాటాల పండగ.వేడుక ఒక ఎత్తయితే ఆ ఆటలు,పాటలు అనిర్వచనీయ ఆనంద హేలలు.బతుకమ్మ ఆట ఆడుతూ పాడే పాటలు ఆనందానుభూతిని పంచుతాయి.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు,ప్రేమ,స్నేహం,బంధుత్వం, ఆప్యాయతలు,త్యాగం,భక్తి,భయం,గౌరవం,చరిత్ర పురాణాలను మేళవించి పాడటం ఒక గొప్ప విషయం.
శతాబ్దాలుగా ధ్వంసమైన మన సంస్కృతి సంప్రదాయాలకు తిరిగి ప్రాణం పోసిన మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కృషి ఎనలేనిది.మరువలేనిది.మన భాష సంస్కృతిని బతికించి, భావితరాలకు అందించటంలో తెలంగాణ జాగృతి చేస్తున్న కృషి ద్వారా ప్రపంచ స్థాయిలో బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది.పూల పండగ అయిన బతుకమ్మ నేడు ఖండాంతరాలు దాటి, ప్రపంచమంతా విస్తరించి అట్టహాసంగా నిర్వహించబడుతోంది.

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorizedకవితలు

వెరపు లేని త్యాగానిదే రాజ్యం!

by -కోట్ల వెంకటేశ్వర రెడ్డి October 3, 2022
written by -కోట్ల వెంకటేశ్వర రెడ్డి

తెగించి పిడికిలెత్తినప్పుడే
ఎవరైనా తేరిపార జూసుకోవాలి
వెనకా ముందు ఆలోచించు కోవాలి
అవహేళనలన్నీ అగ్గి రాజేసేవే!

తెగింపు కొట్లాటలన్నీ
వెరపు లేని త్యాగలనుంచి పుట్టుకొచ్చినవే
వాపెప్పుడు బలుపు కారాదు
చలి చీమలేకమవుతుంటే సర్పానికి వణకు పుట్టాలి!

చూసీ చూసీ ఎలుగెత్తి చాటీ చాటీ
ఎద ఉప్పొంగే దృశ్యంగా
దేశ భక్తి మొలకెత్తాలి
విద్వేషాలు నింపే ఎన్నికల పెట్టుబడి కారాదు!

ఆధునిక కాలంలో ఎవరికైనా
సుదీర్ఘ పోరాటాలక్కర లేదు
ప్రజలు తలచుకుంటే ఆకాశం చిల్లుబడ్డట్లు
అధికారం కొంపలు మునుగుతాయి!

విలువలు దిగజారినప్పుడు
నువ్వెదిగొచ్చిన సంగతి మరచి పోరాదు
సూత్రమొక్కటే ఎవరికైనా
అహంకారం పతనానికి దారులు వేస్తుంది!

ఫోటో కోసం జరిగిన రచ్చ
బాల్యంలో చినిగిన చొక్క కోసం చేసిన
హాస్యాస్పద పోరాటాన్ని గుర్తు చేసింది
ఎవరేం చేస్తున్నది ప్రజలకెరుకైతున్నది!

పాద యాత్రలు పస లేని ప్రగల్భాలు
ప్రజా జీవితాలను ప్రతిబింబించనంత కాలం
విద్వేషాలు కుతంత్రాలేవీ
రాజ్యాధికారాన్ని కట్టబెట్ట లేవు నిలబెట్ట లేవు!

చీలికలు తెచ్చే వారిదెన్నడు
దేశానికి ఏలిక కారాదు
ఏకం చేసే వారికే
భిన్న సంస్కృతుల రాజ్య పట్టం!!
:- కోట్ల వెంకటేశ్వర

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నవ్వు ముఖం !!

by రాఘవాచార్య‌ October 3, 2022
written by రాఘవాచార్య‌

మనిషికి ముఖం ఉన్న దొకటే 
ముఖంలో ఒకసారి విచారం 
మరోసారి ఏడ్పు
మాటిమాటికి మాట మాటకు రంగులు మారే ముఖం 
ఒక్క ముఖం పై ఎన్ని తెరలు తెరలో 
రాత్రి కన్నులు మూసుకుంటే  నిద్ర ముఖం
నువ్వు ఏది ఆలోచిస్తే అది ముఖం పై చెంపపెట్టే 

పేరుకే పెద్ద ముఖం 
కాని నవ్వు ముఖంలోకి రావడం అంటే కష్టమే 
అద్దంలో చూసుకుని కావాలని నవ్వితే 
అది నీ ముఖం కాదు
అద్దం సొంతమే 

కారణం లేకున్నా
చిన్న పిల్లలు రోజుకు వందసార్లైనా నవ్వుతారు 
బాల్యమే కారణ జన్మ !
అకారణంగానూ ఆనందమే 
ఆనందో బాల్యం!
పెద్దలు కారణమున్నా నవ్వి ఏడ్వరు
భేషజం పెద్దరికం 
అన్నీ నవ్వుకు అడ్డం దిడ్డం వస్తాయి 

సర్కసులో జోకర్ 
సినిమాలో హాస్య నటులు మన ముఖాలను
 నవ్వు ముఖాలుగా మార్చే గొప్ప శిల్పులు !
మహా రాజులు నవ్వడానికి విదూషకులను      
ఎదురు బదురుగా ఉంచుకునే వారు  
బీర్బల్ కథలు నవ్వు బలం 
తెనాలి రామలింగని కథలు
రాయలు సైతం రాయలేన్నన్నీ !

 నవ్వు నిజంగా ఆరోగ్యంగా  
మన జీవితంలో ధన్వంతరి

ముక్కోటి దేవతలలో ఏ ఒక్కరిదీ నవ్వు ముఖం కాదు 
ఒక్క లాఫింగ్ బుద్ధ తప్ప
అదీ చైనాదే 

పెండ్లిలో ఫోటోగ్రాఫర్ వధూ వరులను   
నవ్వు ముఖం పెట్టమంటాడు
ఫోటోలోనైనా మనుషులు నవ్వితే ఫోటోలకు విలువ 
ఫోటోగ్రాఫరుకు గిరాకి 
నా కొడుకు నా కోడలు అంటూ  గర్వపడతారు
ఆల్బమ్ ను వందల సార్లు చూస్తారు

అసలు పాలకులు బాగుంటే
ప్రజలందరివీ నవ్వు ముఖాలే 
నిజంగా  నవ్వు ముఖమే స్వాతంత్య్రంగా మనం

      – 
                     879059396

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

స్వార్థం గొడుగు నీడలో…

by Senathipathi Dasyam October 3, 2022
written by Senathipathi Dasyam

స్వార్థం గొడుగు నీడలో…
లోకమంతా
ఇచ్చి పుచ్చుకునే సంత బేరాలవుతుంటే…ఒకనాటి
అనుబంధాలు…నేడు
చూద్దామన్నా…కనబడక..
కనుమరుగవుతున్నాయి!
అనుకోని అతిథి రాకోయి
అంటూ..
సన్నాయి రాగాలు వినిపిస్తుంటే..
రాటు దేలిన
మనసుల మధ్య…
ఆప్యాయతా చివురులు
చిగురించ లేక పోతున్నాయి!

తోలు బొమ్మలాట వంటి..
బతుకులో…నటిస్తూ
మసలటం రివాజైపోతుంటే..
నాలుకపై మాట గుండెలో దిగనీయక…
గుండెలో మాట పెదవి గడప దాటక…
భావం…గొంతు ముడిలో
ఉరి వేసుకుంటున్నాయి!
బంధాలు అనుబంధాలు..
ఎండుటాకులై రాలిపోతూ
నటించే వానికే…
హారతి పడుతుంటే..
ఆనందాల..
ఆత్మీయతల అర్థాల
స్వరాలు మారుతున్నాయి!

ఇకనైనా..
సంకుచిత గుహ నుండి
బయట పడదాం!
మసక బారుతున్న
బంధాలకు…
మానవత్వపు
మెరుగులు అద్దుదాం!!

దాస్యం సేనాధిపతి
హైదరాబాద్

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us