మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

మన ప్రగతి

by A. Venugopal August 15, 2022
written by A. Venugopal

ప్రగతి పథంలో పయనిస్తున్నది భారత మిది మనదీ

జగతి కంతటికి ‘మార్గదర్శి’యై చరిత ఘటించినదీ

**

కాశ్మీరయోధ్య జఠిల సమస్యల పరిష్కరించినది

రశ్మివోలె తా నేటితరానికి రక్షణ నిచ్చింది…1

**

ప్రపంచ క్రీడా మైదానంలో ప్రభవము నందినది

అపురూపంగా అందరి దృష్టిని ఆకర్షించినదీ

**

కరోన- రక్కసి కోరలు విరిచే ‘టీక’ కనుగొన్నదీ

హీరోలౌ మన శాస్త్రవేత్తలను ‘ఇతి’ మెచ్చకున్నది

**

మన సంస్కృతినీ, సంప్రదాయమును ‘మహి’ కందించినదీ

మనః పూర్తిగా నమస్కార – బహుమానము నిచ్చినదీ

**

ఋషులందించిన యోగ ప్రక్రియను రూఢిగ / రూలుగ జేసినది

దేశ విదేశమందు ‘ధ్యాన’ మను దీప్తిని నింపినదీ….

**

అంతరిక్ష గమనానికతివలకు అండగ నిల్చినదీ,

అంతులేని విజయాలు పొందుటకు అడుగులేస్తున్నదీ ||ప్రగతి||

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

భారత్ కీ అవాజ్!!

by madishetti gopal August 15, 2022
written by madishetti gopal

వజ్రోత్సవ సంబరం
వీరుల త్యాగాల పునాదుల మీద మొలచిన స్వాత్రంత్ర ఫలం
దేశo దాస్య శృంఖలాల నుండి విముక్తి పొంది
స్వేఛ్చావాయువులు పీల్చిన చారిత్రాత్మక సందర్భం

పిల్లా పాపలను వదిలేసి
వీరతిలకం దిద్దుకొని ప్రాణాన్ని
తృణప్రాయంగా అర్పించిన
అమరవీరుల పోరాటాల త్యాగాల మీద ఎగురుతుందీ జండా
పొగరుగా!!
ఈ అద్భుత సంస్కృతిని ఒంటినిండా పూసుకొని
ఎగురుతుంది!!

ఒక్క నినాదం బక్క మనిషి
సంగ్రామం
ఒక్క విల్లు, పిరికెడు ఉప్పు
తప్పుల మీది నిప్పులు చెరిగిన భగత్ సింగ్
భారత్ కీ అవాజ్

తల్లిపాల రుచి
భూమి తల్లి సహనం
వారసత్వ శూరత్వం
ఝాన్సీరాణి అమరత్వం

ఈ గాలి లో
వేద నాదాల ధ్వని మారుమోగింది
ఈ మట్టి లో గంగా సారం
నమస్కారపు సంస్కారం

అందుకే ఈ దేశం వట్టి మట్టికాదు
సహనాన్ని చేతకాని తనమని అనుకోకండి
ఎదురు తిరిగే
మధ్యాందిన మార్తాoడం
ముష్కరులారా ఖబడ్దార్

వజ్రోత్సవపు అనుభవాల మీద
ఎగురు తోంది
త్రివర్ణ పతాకం
ధగద్దగాయమానంగా
దేశభక్తితో హృదయమంతా ఉప్పొంగగా
జై భారత్ అందాం
జైహింద్ అని నినదిద్దాం !!

మాడిశెట్టి గోపాల్
అధ్యక్షుడు సమైక్య సాహితీ

August 15, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అహం బ్రహ్మస్మి

by Vani Devulapalli August 15, 2022
written by Vani Devulapalli

మనసు గదులు మూసుకుపోయాక
ఒంటరిగా గదిలో బందీ కావడమే బాగుంటుందా?

హృదయం తో పనిలేకుండా నామ్ కె వాస్తే గా జమీన్ ఆస్మా ఫరక్ తో సాగిపోతున్న దైనందికావసరాలు దేహ ప్రాణాల్ని నిలుపుతూనే ఉంటాయి

ప్రేమ పాశం తో మనసు గెల్చుకోవడమన్న యుద్ధనీతి
ఇప్పుడు పాతదై పనికి రాకుండా పోవడం విషాదం కాదా ?

ఎల్లలు దాటిన స్వార్థాన్నోదిలి ఒక్కసారైనా తనవైపు
దృష్టి సారించమంటూ పోరుతోంది ధర్మం …

అంతుపట్టని అంతర్ముఖీనత తో
అంతేలేని అహంభావం తో దగ్ధం కావడం …
సెగలు పొగల్ని పంచడం కాదు జీవితమంటే ..!

శతాబ్దాలుగా రగిలిపోతూ …
ఇంకా మిగిలిన అహం శకలాల మధ్య
కమ్ముకున్న పొగచూరిన భావజాల గోడలు
మరింత భ్రష్టుపట్టి పోకముందే వెల్లవేసుకొని
తెల్లబరుచు కోవాల్సిన సమయం ఆసన్నమైందిక..!

                                       -డాక్టర్ వాణీ దేవులపల్లి
                                             9866962414
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సమాజదర్పణం భీమేశ్వరపురాణం

by డా॥ వెలుదండ నిత్యానంద రావు August 15, 2022
written by డా॥ వెలుదండ నిత్యానంద రావు

తెలుగు వారి విస్తార చరిత్రలో రెడ్డిరాజుల యుగం (1324-1402  ) ఒకమహోజ్జ్వలఘట్టం. గీర్వాణాంధ్ర భాషా సారస్వతాలకు సువర్ణాధ్యాయం.  రాజులు, మంత్రులు స్వయంగా రసజ్ఞలైన కవి పండితులు కావడం; కృతికర్తలు. కృతిభర్తలు కావడం ఈ యుగవిశేషం. ప్రోలయవేమారెడ్డి(1324-53), అనపోతారెడ్డి(1353-64) అనవేమారెడ్డి (1364-1386)  కుమారగిరి రెడ్డి (1386-1402) లాంటి రెడ్డిరాజులు  షట్కాల శివపూజా పరాయణులై, దేవాలయ నిర్మాతలై, దాననిరతులై, ఉదారచింతనాపరులై విలసిల్లారు. ఆనాటి రాజులు మెచ్చిరా- రత్నాంబరాలు, కస్తూరిదానాలు, భూరి దినవెచ్చాలు, హేమపాత్రాన్న పంక్తి భోజనాలు… మెచ్చక పోయిరా- నిగళయుగళ సత్కారాలు, పురవీధి పొగడదండ పరిష్వంగాలు, వెదురు గొడియలతో వియ్యాలు, నగరి వాకిట నుండు నల్లగుండుకు  భూజాస్తంభ గౌరవాలు… ఈ యుగ సాహిత్య నాయకుడు శ్రీనాథకవిసార్వభౌముడు. అశేష మనీషిహృదయంగమంగ కావ్య సృజనం చేసిన ధీశాలి. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. ఉరుప్రజ్ఞా విశేషోదయడు. సాహిత్య పదవీ మహారాజ్య భద్రాసనాసీనుడు(1-7). సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్యభాషాపరిజ్ఞానం. మహాభాష్య విద్యా సమభ్యాసబలం, శ్రుతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంతకబళన వ్యుత్పత్తి గౌరవం, పూర్వ కవి ముఖ్యవిరచితాపూర్వ కావ్య భావరస సుధా చర్వణ విస్తారంగా గలిగిన వాడు శ్రీనాథకవీంద్రుడు.

శ్రీనాథ కవిసార్వభౌముడు ప్రౌఢనిర్భర వయః పరిపాకాన భీమేశ్వరపురాణాన్ని రచించాడు. మూలం స్కాంద పురాణాంతర్గతమని శ్రీనాథుడే స్వయంగా చెప్పినా అది అవిశ్వసనీయం.

దక్షారామ భీమేశ్వర సంకీర్తనను సభక్తికంగా సాగిస్తూనే స్థానిక కథా విశేషాలను, సాంఘిక సామాజిక స్థితిగతులను తనివితీరా వర్ణించాడు. శ్రీనాథుని సమకాలీన సమాజస్వరూపాన్ని మిగిలిన కృతులకన్నా భీమేశ్వర పురాణమే అత్యధికంగా ప్రతిఫలించిం దన్న అతిశయోక్తి కాదు.

జీవన స్థాయి, భోజనప్రీతి, మర్యాదలు లాంటి భౌతికాంశాలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలు. అర్చనాది  ఆధ్యాత్మికవిశేషాలు, అసూయలు, కోపతాపాలు మొదలైన మానసికాంశాలు  భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు ఔచితీమంతంగా నిక్షిప్తం చేశాడు. భీమేశ్వరపురాణం మొదటి సగంలో వున్న బిగి తరువాతి సగంలో చెడింది. సంకీర్తనకే పరిమితమై ఉదాత్త కావ్యనిర్మాణశోభాకరాలైన ఇతరేతరాంశాలను పక్కకు పెట్టాడనిపించింది. పునరుక్తులు పరిహరిస్తే సగానికి సగం కావ్యం తగ్గుతుంది. ప్రాచీనకావ్యాలలో సాంఘికాంశాలను అన్వేషించడం అనేది స్వాగతించదగిన ఉదాత్తయత్నమే. ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి చదువుతూ సాగించవలసిన సత్కాలక్షేపం.  

మానసికఅంశాలు

          బోద్ధారో మత్సరగ్రస్తాః. అసూయాగ్రస్తమైన మనస్సులకు, అపండితులకు కాల నియతి ఉండదు. పండితులకు పండితమ్మన్యులకు; కవులకు కవిబ్రువులకు నిత్యఘర్షణ ఎప్పుడు ఉండేదే. శ్రీనాథుని కాలం దీనికి మినహాయింపు కాదు. ఆంధ్రనైషధాజ్జ భవుని కీర్తి ధాళధళ్యం ముందు ఎందరో కవుల కనులు మూతబడివుండడం సామాన్యాంశం.

బోధ మల్పంబు గర్వమభ్యున్నతంబు,

శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము

కూప మండూకములుఁ బోలెఁ  గొంచె మెఱిఁగి,

పండితమ్మన్యులైన వైతండికులకు                             1-13

నికటమున నుండి శ్రుతిపుట నిష్ఠురముగ,

నడరి కాకులు బిట్టు పె ద్దఱచినప్పు

డుదధిరాయంచ యూరక యుంటలెన్స,

 సైఁపరాకున్న నెందేనిఁ జనుట యొప్పు.                     1-14

అని శ్రీనాథుడు విసిగి వేసారిపోయాడు.   గౌడడిండిమ భట్టు లాంటి మహావిద్వాంసునితో మొదలుకొని ఏస్థాయి, ఏ అర్హత లేని వాచాలుర దాక ఎదుర్కోవలసి వచ్చి వుంటుంది. తన జయకేతనాన్ని స్థిరంగా ఎగర వేసి ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలోకి వచ్చాక కూడా మళ్ళీ మళ్ళీ అవే కాకులు ఊరకే అరుస్తుంటే రాజహంస మౌనంగా ఉండడమే మంచిది. లేక వివాదాలు నుండి తప్పుకోవడమే ఔచిత్యమన్న ధోరణికి రాక తప్పలేదు. మునపటిలా వాదించే ఓపిక కానీ, అవసరం కానీ ఆయనకు లేవు. శ్రీనాథుని లాంటి పండిత కవులు ఒకరిద్దరయితే  కూపస్థ మండూకాల్లాంటి పండితమ్మన్యులు ప్రతి కాలంలోను అగణితమే.

తాము నివసించే ప్రాంతం, లేదా తాము విశ్వసించే దైవం అన్నింటి కన్నా గొప్పదని తలపోయడం సర్వ సామాన్యాంశం.  దక్షారామం కథాకేంద్రం కనుక  గొప్పదని శ్రీనాథుడు చెప్పారు. అన్ని తీర్థాల కన్నా కాశి గొప్పది. ఇది భారతీయులందరి సాధారణ విశ్వాసం. కాశి కన్న దక్షవాటి గొప్పది (2-8). కాశి కేవలం మోక్షదాయిని. కొన్ని నగరాలు భోగదాయినులు. మరికొన్ని మోక్షదాయినులు కాని దక్షారామం భోగమోక్షాలు రెండూ ప్రసాదిస్తుంది.(2-17). భీమేశ్వరుని కన్న పెద్ద వేల్పు, దక్ష వాటి కన్న గొప్ప ప్రాంతం,  సప్తగోదావరి కన్న తీర్థరాజం మరొకటి లేదు. (2-18) ఏటేట జాతరలు చేయడం (3-44), జపహోమదాన యజ్ఞము లుపవాస వ్రతాలు మోక్షదాయకాలు (3-12, 3-148) శ్రాద్ధతిల తర్పణాదులు (3-154 ) విధాయకాలుగా తలపోయడం కనిపిస్తుంది.

ఏమి శకునమున చొచ్చితిమో కాశికి (2-95) అని అనడం వల్ల శకునాలను నమ్మడం కూడ ఆ సమాజంలో వుందని తెలుస్తుంది. భారతీయ సమాజంలో ఇది సామాన్యాంశమే. ఏ పని చేసినా శుభముహర్తం చూసుకోవడం కాలశుద్ధి తెలుసుకోవడం అలవాటు. వ్యాసుడు అగస్త్యుడు దక్షారామానికి తిరిగి పోతున్నపుడు నగర ప్రవేశానికి శుభముహూర్తం (3-39) (3-56) చూశారు. ఏ ముహూర్తం సరిగా కుదరని పక్షంలో అభిజిన్ముహూర్తం మధ్యాహ్నం 11.45 నుండి 12.30 వరకు నిస్సంకోచంగా చేయవచ్చు. అది విజయముహూర్తం అన్న విశ్వాసం నాటికీ నేటికీ ప్రబలంగానే ఉంది.

అబద్ధాలాడే వాళ్ళ కళ్ళల్లో, ముఖంలో ఒక విధమైన సూచన కనిపిస్తుంది. దాన్ని పసిగట్టిన వారికి వారు అబద్ధలాడుతున్నారని తెలిసిపోతుంది మరి. చల్లని సౌమ్యదృష్టి, ప్రసాదము, మాధురియు, వివేకం, వెల్లదనం, మౌగ్థ్యం, నిర్మలినత్వం అబద్ధమాడే వాళ్ళల్లో ఉండక సత్యంపలికేవారిలో ఉంటుందని శ్రీనాథుడు రాశాడు. (2-134)

కార్తికీవేళభీమశంకరని నగరఁ

దూఱునెవ్వాడు చిచ్చఱతోరణంబు

వాడు దూఱడు ప్రాణనిర్యాణవేళ

ఘోరయమపట్టణద్వారతోరణంబు  3-25

దక్షారామ భీమేశ్వరునికి కార్తీక పౌర్ణమి నాడు రాత్రి జ్వాలాతోరణం ఏర్పరుస్తారట.  దాని గుండా దూరి పోతే భక్తుడు యమలోకంలోకి పోడు.  అంటే పుణ్యం వస్తుందని విశ్వాసం. దీన్ని శ్రీనాథుడు కాశీఖండంలో కూడ ప్రస్తావించాడు. తారకాసురుడు రెల్లుగడ్డిలో కుమారస్వామి జన్మించాడని చెప్పి రెల్లుగడ్డి నంతా కాల్పించాడట. ఆ కథకు ప్రతీకగా వచ్చిన ఆచార మిది అని అంటారు.

ఆకలి గొన్న వ్యాసుని, అతని శిష్యులు మూడువందలమందినీ కాశీ అన్నపూర్ణ ఆహ్వానించి చతుశ్శాలా భోజన మందిరంబున వృద్ధానుపూర్వకముగా ఉచితాసనంబుల కూర్చుండ నియమించినదట. (2-127). ఉచితాసనాలనగా తగిన పీటలు. పీటల మీద కూర్చొని, ఆపోసన చేసి, శాంతి మాత్రం చదివాక భోజనం చేయడం ఆచారం. చాల మంది కలిసి భోజనం చేసే అప్పుడు వారి వయస్సుల క్రమంగా కూర్చునే తినడం  ఆనాటి సాంఘిక ఆచారం తెలుస్తుంది.

అతిథి అభ్యాగతులకు   భక్తి శ్రద్ధా తాత్పర్య విశ్వాస పూర్వకంగా భోజనం పెట్టినపుడే అది ఫలితాన్నిస్తుంది (2-132). – అని ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా భావించడం గమనించవచ్చు.

తిట్లు , సామెతలు, ఎప్పుడూ వుంటాయి. కాని ఛందస్సు కనుగుణంగా కొంత మారవచ్చు. సభ్యత వల్ల రూపాంతరం చెందివుండవచ్చు.

ముండదైవం (3-6). కాశిని ఎడబాసిన వ్యాసుడు తన మనోవ్యథను అగస్త్యున కెరుక పరచు సందర్భంలో మనస్సును తేలిక పరచుకోవడానికి అన్నమాట. ఆకలికి తట్టుకోలేక వ్యాసుడు  కాశిని శపించబూనాడు.

మా భూ త్త్రైపూరుషీ విద్యా,   మా భూ త్త్రైపూరుషం ధనం,

మా భూ త్త్రైపూరుషీ భక్తిః,     కాశ్యాం నివసతాం సదా 2-108

కాశీనగరంలో మూడుతరాలపాటు విద్య, ధనం, భక్తి ఉండొద్దుగాక అని- అంటే మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధులకు ఇది గొడ్డలిపెట్టేకాక తరువాతి తరాలు కూడదీని ప్రభావానికి లోనవుతాయి.  అలా కాశిని శపించ బూనుకున్న వ్యాసుని కాశీ విశ్వేశ్వరుడు తీవ్రంగా దూషిస్తాడు.

ఓరి దురాత్మ! నీవారముష్టింపచా

భాస! యోజనగంధి ప్రథమపుత్ర!

దేవరన్యాయదుర్భావనాపరతంత్ర!

                        బహుసంహితావృథా పాఠపఠన!

భారతగ్రంథ గుంభన పండితంమన్య!

                        నీవా మదీయపత్నికి నశేష

కైవల్య కళ్యాణ ఘంటాపథమునకుఁ

గాశికాపురికి ని ష్కారణంబ

శాపమిచ్చెదనని యనాచారసరణి

నడుగు వెట్టినవాడవహంకరించి

పొమ్ము నిర్భాగ్య ! మాయూరి పొలము విడిచి

యెచటికేన్ శిష్యులును నీవు నీక్షణంబ                      2-153

ఓ దుష్టుడా!  సామాన్య గృహస్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కేవలం పిడికిట్లో పట్టేడన్ని బియ్యం దాన మివ్వడం సంప్రదాయమైంది. అది గొప్ప. కానీ గతిలేక ముష్టి అడుక్కుంటున్న వాడా అని ఇక్కడ  తిట్టు. యోజనగంథి ప్రథమ పుత్ర అనడంలోని ఆంతర్యం సామాజిక సంప్రదాయం తెలియనివాని కర్థం కాదు. సత్యవతికి పెళ్ళి కాకముందే పుట్టిన వాడా అని తిట్టడం. మరి పుట్టిన వాడిది తప్పా పుట్టించిన వారిది తప్పా అని చర్చించడం అప్రస్తతం. పెళ్ళి కాకుండా తల్లి కావడం నిషిద్ధమైన సమాజంలోనే ఇది తిట్టు కాగలదు. లేని చోట కాదు. వ్యాసుడు వరుసకు మరదళ్ళైన, భర్తృహీనలైన అంబిక అంబాలికలకు సంతానాన్ని కంటాడు. ఇది అక్కడ విధి లేని పరిస్థితి కావచ్చు.  కాని ఇక్కడ మాత్రం దూషణ. వ్యాసుడు ఏడురోజులు తిండికి ఓర్వలేక నగరాన్ని శపించబూనుకున్నాడు. అలాంటి వ్యాసుని వేద పురాణవిజ్ఞానం అంతా వృథానే కదా. భారతం లాంటి పంచమవేదాన్ని సృష్టించిన పండితుడయ్యు కాశికి శాపం ఇవ్వపూనుకొని పండితమ్మన్యుడయ్యాడు.  పండితంమన్యుడు అంటే తననుతాను పండితుడనుకొనేవాడు. నిజానికి కాడని భావం. చదువు కొన్న మూర్ఖుడయ్యాడు. నిర్భాగ్యనీచ చరిత్ర లాంటి వన్ని తిట్లు.  కాశినుండి వెళ్ళిపోకపోతే వ్యాసుని రాతిమీద రాకిస్తానన్నాడు శివుడు. రాతిమీద రాకించడం ఆ కాలంలో  శిక్షించే ఒక పద్ధతి కావచ్చు.   శ్రీనాథుడు వీరశైవుడు కూడ. వైదికుడైన వ్యాసుని తిట్టడానికి అందివచ్చిన సందర్భాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.   

రాచమర్యాదలు

కృతిస్వీకర్త బెండపూడన్నయ మంత్రి కీర్తి ఏడుసంధ్రాల అవతలి చీకటిని పోగొట్టిందనడం, ఆయన కీర్తి కర్ణాట లాట వంగ కుంతల అవంతి ఘర్జర రాజుల సభాస్థానాల్లోని బుధులు కీర్తిస్తారనడం లాంటి వాటిని అతిశయోక్తులని చిన్న చూపు చూడకుండా సాహిత్య సంప్రదాయమని మిన్నకుండడం సముచితం. అలాంటి మంత్రి గారి పేరోలగంలో ఉద్దండ పండితులు, వ్యాకర్తలు, వేదాంతులు, ఉపనిషత్ తత్వ్తజ్ఞులు, లాక్షణికులు, సంస్కృతాంధ్ర కవులు వీరితో పాటు వేశ్యలు, వీరభటులు  ఉండే వారు. ఇది సమకాలీన మర్యాద. కవులను సన్మానించడం, కావ్యం రాయించి అంకితం తీసుకోవడం పాలకుల కర్తవ్యాలలో ఒకటిగా తలపోసేవారు.

బెండపూడన్న మంత్రి కీర్తికారకాలైన సప్తసంతానాలలో “ఒక్క ప్రబంధస్వీకరణం తప్ప అన్నీ నాకు లభించాయి” ఆ ఒక్క వెలితి తీర్చలసిందని శ్రీనాథుని అర్థించి భీమేశ్వరపురాణరచనకు పురికొల్పాడు. ఇది అబద్ధంగానో, కవిత్వమనో భావించాల్సిన పని లేదు. రాచరిక వ్యవస్థలో రాజులు మంత్రులు అందరూ చేసేదే. సప్తసంతానాలంటే ఇవి.

  1. కూపం – మంచినీళ్ళ బావులు తవ్వించి దాహం తీర్చాలి.
  2. తటాకం – చెరువులు నిర్మించి పంటలకు దోహదం చేయాలి.
  3. ఉద్యానవనాలు – తోటలు నిర్మించి ఆహ్లాదకరవాతావరణానికి ఏర్పరచాలి.
  4. దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మిక చింతనను  పెంచాలి.
  5. పుత్రులను కని వంశాన్ని నిలబెట్టాలి.
  6. ధర్మబద్ధంగా జీవించాలి..
  7.  కవులను ప్రోత్సహించి కావ్యాలు రచింపచేయాలి.

సప్త సంతానములలోన భిలము గాకుండు నది ధాత్రి కృతియె గాన అని అల్లసాని పెద్దన అన్నాడు.

గుడి కూలును, నుయి పూడును

వడి నీళ్ళను చెరువు తెగును, వనమును ఖిలమౌ

చెడనిది పద్యం బొకటియె

కుడి యెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా.

అని గువ్వల చెన్నడు అన్నట్లే మిగిలిన ఆరింటి కన్నా కావ్యాన్ని అంకితం తీసుకోవడం శాశ్వత కీర్తికారకమని ప్రాచీనులు భావించారు. అలానే వ్యవహరించారు.   రాజరాజనరేంద్రుడు ఈ రోజు చిరస్మరణీయుడయ్యాడంటే ఆయన పాలనవైభవం వల్ల కాక కేవలం నన్నయ చేత భారతం రాయించడం వల్లనే అన్నది నిర్వివాదాంశం. బెండపూడన్నయ మంత్రి కూడా అంతే. దక్షారామంలో భీమేశ్వరునకు మొగలివాకిటధామం, తూర్పు దిక్కున మరొక మంటపం  నిర్మించాడు (1-74). బహుశా ఆ సందర్బంలో ఓ వారం పదిరోజులు ఇదే విషయంపై పురాణ కాలక్షేపం జరిపి వుంటారు. ఆ ప్రేరణతో  కనీసం వచ్చే సంవత్సరం వార్షికోత్సవాల (బ్రహ్మోత్సవాల) నాటికి దక్షారామ భీమేశ్వరునీ, సప్తగోదావరి తీర్థాలను కీర్తిస్తూ కావ్యరచన చేయవలసిందని  సబహుమానంబుగా కర్పూరతాంబూల జాంబూనద ఆభరణాలతో ఘనంగా సత్కరించి  అర్థించి వుంటాడు. భీమేశ్వరపురాణంలో వున్నవి రెండే పాత్రలు.  వక్త, శ్రోత. వక్తవ్యాంశం భీమేశ్వరసంకీర్తనం. ఇది కృతికర్త, కృతిభర్తలకు అభీష్టాంశం. కాశికన్నా గొప్పది దక్షవాటి అని అనుకోవడంలో, స్వస్థాన వేషభాషాభివ్యక్తీకరణంలో  ఒక నిర్వచనీయమైన ఆనందం దాగుండడం సహజం.  వింధ్యగర్వాన్ని అణచడంకోసం ఉత్తరాదినుండి వచ్చి దక్షిణాదిలో స్థిరపడ్డ అగస్త్యమహర్షి నివాసమే దక్షారామంగా చిత్రించాడు. కాశీపట్టణ మెంత గొప్పదైనా, ప్రీతి పాత్రమైనదైనా అగస్త్యుడు ఉత్తరాదికి పోలేని దుస్థితి.

దురదృష్టం వల్ల వ్యాసమహర్షి కాశీనుండి బహిష్కృతుడై కొత్తగా తనకు అంతగా తెలియని దక్షారామానికి రావలసి వచ్చినవాడు. 

వ్యాసాగస్త్యు లిరువురికీ కాశీకి విశ్వనాథుని సేవించలేమన్న ఆవేదన సమానధర్మం. అందువల్లనే దక్షారామప్రాశస్త్యాన్ని తెలిపే వక్తగా అగస్త్యుని , విని ఊరడిల్లే శ్రోతగా వ్యాసుని పాత్రలుగా శ్రీనాథుడు మలచడంలోని హేతువు ఈ సమానధర్మమే. నిజానికి ఇక్కడ వ్యాస అగస్త్యులు నిమిత్తమాత్రులే. శ్రీనాథుడే అసలు వక్త. అసలు శ్రోత బెండపూడన్నయమంత్రి. అంతే.   

   ప్రజానీకం

పద్మనాయకులు, వెలమలు, కమ్మలు, సరిసర్లు, పంటర్లు(1-32) ను మొదటిసారిగా కావ్యంలో నమోదు చేసిన ఘనత శ్రీనాథునిదేనేమో! పరిశీలించాలి.  బ్రాహ్మణులు, క్షత్రియులు, చతుర్థకులాలు, పంచజనులు, వైశ్యులు, వేశ్యలు,(3-63)  ఇంకా ఏకవింశతి కులాలవారు(3-153) ఆకాలంలో వున్నట్లు తెలుస్తుంది.   వర్ణసాంకర్యం లేకుండా చాతుర్వర్ణ్యస్థితి వుందని చెప్పడం గొప్పగా తలపోసేవారు. (1-110)  ఆనాటి వారికి బ్రాహ్మణ భక్తి మిక్కుటం. సాధారణంగా వేదపఠనం చేసే విప్రులు పేదలే. బెండపూడి అన్నయ మంత్రి లాంటి ఉన్నతాధికారుల ప్రాపు లభించిన వైదికులు ఉన్నత స్థాయి కెదుగుతారు. తక్కినవారు సాధారణులు గానే మిగిలి పోతారు.

   ధరియింప నేర్చిరి దర్భ పెట్టెడు వ్రేళ్ళ

            లీల మాణిక్యాంగుళీయకములు

    కల్సింపనేర్చిరి గంగమట్టియ మీఁదఁ

            గస్తూరికా పుండ్రకములు నొసలు.

    సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోలఁ

            దారహారములు ముత్యాల సరులు

   చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల

            గమ్మని క్రొత్త చెంగల్వ విరులు

ధామముల వెండియును బైఁడి దడఁబడంగ

బ్రాహ్మణోత్తము లగ్రహారములలోన

వేమ భూపాలుడనుజన్ము వీరభద్రు

ధాత్రి యేలింప గౌతమీతటమునందు.            1-41

కాశీఖండంలో సైతం శ్రీనాథుడు ఈ పద్యాన్ని ప్రీతితో వాడుకొన్నాడు.   విప్రుడు గాన నేరము వెదక దగదు అనుకోవడం(2-118). కనిపిస్తుంది. ప్రతి నెల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం సాధారణాచారం. వైకుంఠ ఏకాదశి నాడు మరీ ముఖ్యం. ద్వాదశి నాడు పారణచేసి భోజనం చేయడం విధాయకం. అందువల్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులకు సంతర్పణలు చేయడం పుణ్యకార్యంగా తలపోసేవారు, అది ఆ కాలంలో ఆచారంగా మారింది కూడా. ), అశ్వగోమహిషరూప్య సువర్ణ వస్త్రంబులు దానం చేయుట (4-32) పుణ్యమనుకొన్నారు.

భోజన రసికత

ఆనాటి వారి భోజన రసికతను శ్రీనాథుడు తనవితీరా వర్ణించాడు.  ఆనాటివారు తిన్నది అరిగించుకోగలగిన వారు. అది తింటే షుగర్ వస్తుంది ఇది తింటే ఇంకేదో వస్తుంది అని నాలుక చంపుకొని జీవించిన వారు కాదు. పంచభక్ష్యపరమాన్నాలను నిండార తిని పరవశించారు. త్రేంచారు. భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పేయం- ఇవి పంచభక్ష్యాలు. దోసెలు, వడలు, సేమ్యాపాయసం, కమ్మగా కాచిన నెయ్యి, శాకం, పాకం, పెసరుపప్పు, తేనె, పానకం, ఉప్పు, తెల్లని పెరుగు, పచ్చకప్పురం, సొజ్జెపిండి, పిండివంటలు, బెల్లం, ద్రాక్షాపానం ఖండశర్కర, అరటి పండ్లు. ఆవుపాలు, వరి అన్నం మొదలగు వాటిని నిశ్శంకతో అంటే ఎలాంటి సంశయం లేకుండా కుక్షుల్ నిండగ ఆరగించారు. అన్నీ అయ్యాక మందార తరుపుష్ప మధుపానగోష్టి (2-28) కొందరికైనా ఉండకపోతే ఎలా?

                పప్పును, బిండి వంటలును, బాయసముల్, ఘృతముల్, గుడంబులుం

                  గుప్పలు గాఁగఁ జుట్టునను గుర్పఁగఁ గూడిన యేరుఁబ్రాల తె

                  ల్గప్పురభోగి వంటకము గమ్మని తాలిపు సొజ్జ పిండితో       

                  నొప్పులుగా భుజించిరి బుధోత్తము లాఁకటి చిచ్చు పెచ్చునన్. 2-140

      ద్రాక్షపానక ఖండశర్కరలతో, రంభాఫలశ్రేణితో

       గోక్షీరంబుల తోడ, మండెఁగలతో, గ్రొన్నేతితోఁ , బప్పుతో

       నక్షయ్యంబగు నేరుఁబ్రాల కలమాహారంబు నిశ్శంకతం

                   గుక్షుల్ నిండఁగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్.    2-142

మోదకాపూప పాయస ఘృత మధుక్షీర శర్కకాపూపాలతో భోజనం( 4-91)          ఇలా భీమేశ్వరపురాణంలో రెండుమూడు చోట్ల ఆహార ప్రస్తావనలు వస్తాయి. ఆకాలంలో  అవన్నీ అందరూ తినేవేనని గుర్తించవచ్చు.

దేవదాసి సంప్రదాయం

      దక్షారామంలో దేవదాసి సంప్రదాయ ముంది. దేవదాసీలు భగవంతుని కంకితమైన పవిత్రమూర్తులు. భగవంతుని ఎదుట నాట్యం చేసే తరించేవారు. భగవంతునికి చేసే షోడషోపచారపూజల్లో నాట్యం కూడ ఒకటి. విశ్వనాథసత్యనారాయణ వేయిపడగలులో ముఖ్యంగా గిరిక ఘట్టం చదివితే దేవదాసీ సంపంప్రదాయ ఔన్నత్యం తెలిసి వస్తుంది. వారిని పోషించడం పురప్రముఖుల విధి. కాలక్రమంలో వేశ్యల స్థాయికి దిగజారడం వేరే అంశం.  

దక్షపురిసాని కూతుల దవిలి నాడు

విశ్వలోక కుటుంబి భీమేశ్వరుడు – 1-110

అనీ  పదునాల్గు మహాయుగాల ముదుసలి భీమేశ్వరునికి సానితో పెండ్లి (1-112) అని కూడ చమత్కరించాడు.  వికటశృంగారము నొప్పు భీమేశ్వరుడని కూడ(1-80) అన్నారు. ఇలా అనడంలో ఆంతర్యం అక్కడి సంప్రదాయ విశేషమే తప్ప అన్యంకాదు. దక్షారామంలో వెలసిన మాణిక్యాంబ ఒక దేవదాసి అని ఐతిహ్యం.

వస్తసంస్కృతి      

ముత్యాల గొడుగు (2-43), రత్న దర్పణం (2-49) పసిడి కమ్ముల పట్టు పచ్చడం,  తారహారాలు, కల్హారదామాలు, కట్టాణి ముత్యాల కంఠమాల మాణిక్యఖచిత కేయూరము. వజ్రపుటుంగరం, పగడాల ఒడ్డాణం. (1-115 &116) హేమ మణిభూషణాలు. ముత్యాలపేరు (2-52) . గోమేదికం = మణులు, బంగారం, రత్నాలు ( 3-61) రత్నకంకణాలు. ముత్యాల రంగవల్లలు (3-63)  కంకణాలు, అందియలు, మట్టియలు (2-110)  ఇవన్నీ భీమేశ్వరుడు ధరించినవి మాత్రమే కాదు సమకాలీన సంపన్న గృహస్థులందరూ దాల్చినవేనని భావించడంలో విప్రతిపత్తి లేదు.

కురంగనాభిసౌరభాలు, సంకుమద పరిమళాలు, కర్పూర వాసము, కాలాగురు కర్దమాలు సర్వులకూ ప్రీతి పాత్రాలే (1- 117) గొజ్జంగి నీటి నెత్తావి, దాన్ని మించిన గంధపుపొడి పొలుపు, దాన్ని మించిన ధమ్మిల్ల మల్లికాహల్ల వకుళవాసంతికా జాతి కేతకీకుంద కుసుమ గంధబులు (1- 117) వ్యాపించేవి. ఒకదాని మించి ఒకటి అని శ్రీనాథుడు వర్ణించడం వల్ల ఏ స్థాయి వారు ఆ స్థాయిలో వాటిని వినియోగించేవారని తలపోయవచ్చు. చెంగల్వ దండలు (2-51), (2-67) ధరించేవారు

 చతుశ్శాలా, భవంతులు, జోడరుగులు, అంతర్గేహాలు, బహిర్గేహాలు, సౌధమధ్యంలో వేదికాస్థలం.(2-146).  గోపురాలు, మేడలమీద పసిడి కలశాలు మొదలైనవి గృహ వైవిధ్యాలు. 

చామరము, తోమరము, ఛత్రము, ధనుస్సు, ఖడ్గాదులు ఆనాటి ఆయుధాలు. (1-31).

శంఖ భేరీ మృదంగ నిస్సాణ పటహ

ఝల్లరీ వేణు వీణాది వాయిద్యాలు

            శంఖం, భేరి, మద్దెల, విస్సాణ=చర్మ వాద్యం, పటహ= తప్పెట ఝల్లరి=డక్కి, పెద్దడోలు వేణు-పిల్లనగ్రోవి, వీణ =వీణ భీమేశ్వరుని మ్రోల మోగిస్తారు. దాని వల్ల పాపాలు తొలుగుతాయి. తొలుగుతాయో లేదో కాని ఆనాడు ఈ వాయిద్యాలున్నాయన్న సంగతి స్పష్టం.

ఉపసంహారం

ఇంకా నిశితంగా ఓపిగ్గా పరిశీలిస్తూపోతే మరెన్నో విశేషాలు దొరకగలవు. భీమేశ్వరపురాణం ఒక్కదానికే పరిమితం కాకుండా శ్రీనాథునికృతులన్నింటినీ పరిశీలించాలి. ఆపైన సమకాలిక కవులకృతులను పరిగణనలోకి తీసుకొని సేకరిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. అలా సేకరించినవాటిని తక్కినకాలాల కవుల రచనలతో తులనాత్మకంగా విశ్లేషిస్తే వాటి పరిణామాలు తెలియవస్తాయి. అలాంటి ఉత్తమ ప్రయత్నానికి ఈ సదస్సు దోహదం చేయగలదని విశ్వసిస్తు నిర్వాహకుల ఉత్తమాభిరుచిని, ఉదాత్తసంకల్పాన్నీ  మనఃపూర్వకంగా అభినందిస్తు ముగిస్తున్నాను.    

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

రాము కొరకు నిధి

by ఒద్దిరాజు మురళీధరంరావు August 15, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

రాము మరియు రాణి వ్యవసాయస్థులు. వాళ్ళు వారి చెలుకలో బాగా కష్టపడి బాగా డబ్బు సంపాదించారు. అది వారి పిల్లల తిండి మరియు ఇతర ఖర్చులకు సరిపోయేంత ఉంది. వారు ధనికులు కాదు, కొన్నిసార్లు కొన్న కొత్త బట్టలు మరియు అంత మంచి భోజనం కూడా లేకుండా సర్దుకుపోయేవారు.

ఒకరోజు, రాణి ఆమె తోటలో చెట్టు నాటేందుకు చెలుకలో ఒక మూలన తవ్వుతుండెను. ఆమె లోతుకు తవ్వేవరకు క్లాంగ్ అనే పెద్ద శబ్దం వినపడింది! ఆమె గడ్డపార భూమిలో ఏదో లోహపు వస్తువుకు తగిలింది. ఏదో ఉన్నదన్న సంతోషంతో గబగబ తవ్వింది. అక్కడ ఒక లోహపు పెట్టె దొరికింది. ఎప్పుడైతే ఆమె దాన్ని తెరిచిందో ఆమె కండ్లను ఆమె నమ్మలేకపోయింది. అది బంగారం, వెండి సొమ్ములతో నిండి వున్నది. కొద్దిసేపు రాణి మాటరాక నిలబడిపోయింది. అప్పుడు ఆమె సంతోషంగా ఊహ్ అని పెట్టెను చంకల పెట్టుకొని ఇంటికి పోయింది.

“ రామూ,

రామూ చూడు నాకు మన తోటలో ఏమి దొరికిందో” అని బిగ్గరగా అరిచింది.

రాము ఆ నెల కొరకు అయ్యే ఖర్చులు లెక్క రాస్తుండెను. మరియు కొంతసేపు వరకు అతను భార్య మాటలు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆమె సమీపానికి వచ్చి సంతోషంగా అతని దగ్గర పడిందో అప్పుడు ఆయన పైకి చూశాడు. ఆయన సొమ్ము పెట్టెను చూసినపుడు ఊహించండి ఆయన నోరు ఆశ్చర్యంతో ఎంత తెరువబడిందో?

త్వరలోనే గ్రామంలో రాము, రాణి అతి ధనవంతులు అయినారు. వాళ్ళు పనికి పోవడం మానేశారు. అయినా ఏమవసరం, వాళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నారు. వాళ్ళకు ఇంట్లో కట్టలకు కట్టల డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు ఎండలో ఎందుకు పని చేయాలి? వాళ్ళు వాళ్ళ చిన్న ఇల్లు వదిలిపెట్టి అదే ఊరిలో పెద్ద ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళకు నౌకర్లు ఉన్నారు, వారు రేయింబగళ్ళు ప్రతి చిన్న పని చేస్తూండడం వలన రాము, రాణిలకు వేలు కదిలే అవసరం కూడా లేకుండెను. వారికి అన్ని పదార్థాలు రుచిగా వండే వంట మనిషి, ఇంకో మనిషి వడ్డన కొరకు, ఇంకొకరు కేవలం బూట్లు

తుడిచేందుకు మరియు ఇంకో మనిషి దినమంతా రాము అతని నూతన మిత్రులతో తన బెడ్లో కూర్చొని గప్పాలు కొడుతున్నపుడు అతనికి విసురుతూ ఉండేవాడు.

తరువాత రాము గ్రామ జీవితం చాలా చిరాకుగా ఉంటుందని, ఇద్దరు పెద్ద సిటీకి వెళ్ళారు. అక్కడ వారికి ఒక పెద్ద ఇల్లు, ఎక్కువ నౌకర్లు మరియు అనేక పార్టీల్లో వారు సంతోషంగా గడిపారు. వారు ముందు ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి పనులు మరిచిపోయారు. వారు బాగా కఠినమయిన పనులు చేయడం, ఇతరులకు అవసరం ఉన్నపుడు సహాయపడటం మరిచిపోయారు. వారు డబ్బుతో ఏదైనా గౌరవంతో సహా కొనవచ్చని అనుకున్నారు. వారు ఇతరులతో మొరటుగా ఉండేవారు. వారు బట్టలమీద, పార్టీలమీద చాలా డబ్బు ఖర్చు పెట్టారు. మరియు వారు ఏ పని చేయనందున డబ్బు తగ్గిపోయింది. వారు ఇతరుల వద్ద అప్పు చేయడం అది తిరిగి ఇవ్వలేకపోవడం జరిగింది. ఒకరోజు రాము తన జమ, ఖర్చుల పుస్తకం చూసి బాధ పడ్డాడు.

దాని నిండా ఇతరులకు ఇవ్వవలసిన బాకీల వివరాలు ఉండెను. అక్కడ అతనికి ఏమాత్రం డబ్బు మిగిలి ఉండలేదు. బరువైన ధ్వనితో భార్యను పిలిచాడు, “ప్రియమైన రాణి, మంచిరోజుల మనవి అయిపోయాయి. నేను అనుకుంటూ మనం లక్ష్మి దేవత ఇష్టపడిన బీదప్రజలను మరిచిపోయాము. ఆమె వేరే ఎక్కడికో పోయింది, మరియు మన వద్ద ఏమి మిగులలేదు”.

రాణి కొద్దిసేపు మాట్లాడకుండ నిలబడి ఉండి, అప్పుడు జవాబు ఇచ్చింది. ఏం విచారించకు రామూ. మనం మన పాఠం నేర్చుకున్నాము. నేను ఇప్పుడు అనుకున్నా, దినం అంతా కష్టపడి పని చేసి బాగా అలసి గాఢనిద్రలకు పోగలను. నేను పక్కమీద వాలంగనే హాయిగ సుఖనిద్రలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను తెలివితో ఉండి రేపు ఉదయం ఏ చీర కట్టుకోవాలి, డబ్బుతో ఏం చేయాలి అనే ఆవేదనతో ఉంటున్నాను. నేను ఇప్పుడు ఇంతకుముందు సొమ్ము తవ్వి తీసినప్పటి వలె వంగకుండా బాగా లావైపోయాను.

రాము నవ్వి అతని భార్యను కౌగిలించుకున్నాడు. “మనం మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాము. మరియు మన పాత పద్ధతులే పాటిద్దాం. మనం ఇదివరకు చేసినట్లే బాగా కష్టపడుదాము మరియు మనం పక్కవాళ్ళకు సహాయం చేద్దాం.

మనం అలా చేస్తే లక్ష్మీదేవీ తిరిగి ఒక రోజు మన వద్దకు రావొచ్చు. ఒకవేళ ఆమె రానప్పటికి మనం ప్రయత్నం చేద్దాం మరియు ఉన్నదాంతో సంతోషంగా ఉందాం”.

ఆ తీరుగ రాము మరియు అతని కుటుంబం వారి పాత ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. మరియు ఏంటో నీకు తెలుసా? అప్పటినుండి వారు సంతోషంగా జీవించారు.

మనం మన ఇంట్లో కష్టపడి పని చేసుకుంటూ, ఇతరులకు సహాయం చేసినపుడే, మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది, లేనిచో వెళ్ళిపోతుంది, అంటే మనకు కష్టాలు వస్తాయన్నమాట.

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పాడే పక్షులు

by ఒద్దిరాజు మురళీధరంరావు August 15, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒకసారి ఒక అడవిలో పాడే పక్షుల సమావేశం జరుగుతుంది. కోకిల కూడా ఒక పాడే పక్షిగా ఉన్నది. దాని “కూహ్ కూహ్” పాట తీయనిది. ఇతర పక్షులు దాన్ని ఇష్టపడలేదు. ఎవరు కూడా దాని తీయని పాటనూ కూడా ఇష్టపడలేదు. ఏది ఎట్లైనా వీలు చేసుకొని, కోకిల మాట్లాడింది : “ప్రియమైన మిత్రులారా, మనం భూమి మీద ఉండే జనుల హృదయాలను సంతోషపెట్టే పాటను కనిపెట్టాలి. వాళ్ళు పాటలను వినడానికి సంతోషపడుతారు. అప్పుడు ప్రపంచం అంతా ఆనందమయ మవుతుంది” అన్నది.

వెంటనే “అది ఎట్లా సంభవం? అటువంటి పాటను ఎట్లా వెదకాలి? అది అంత సులభం కాదు” అన్నది హంస. (హంస = పొడుగైన మెడగల చైనా బాతు)

“ఎందుకు కాదు? మనందరమూ దూరపు ప్రాంతాలకు ఎగిరిపోదాం, వేరేవి చాలా పాటలను తెలుసుకుందాం. దాని తరువాత మనం మళ్ళీ అడవిలో కలుసుకొని ఒక్కొక్కరం విడివిడిగా పాడుదాం. అప్పుడు అన్నింటిలో చాలా బాగున్నదాన్ని ఎన్నుకొని దాన్ని ప్రపంచానికి విరాళంగా ఇద్దాం” అన్నది కోకిల.

పక్షులన్ని అంగీకరించాయి, వేరు వేరు ప్రాంతాలకు ఎగిరిపోయాయి. కూకూ, భ్రష్ అనే తీయని పాట పాడే పక్షులు మంచి ఊపులో ఉన్నాయి. ఆ చిన్నపక్షి కోకిల చాలా గ్రామాలు, పట్టణాలు దాటిపోయింది. ఎక్కడ కూడా శ్రావ్యమైన కంఠధ్వని వినలేదు. అవ్వన్ని కర్ణకఠోరంగా ఉన్నాయి, ఏమాత్రం తీయగ లేవు. అప్పుడు అది ఎత్తైన గుట్ట దగ్గరకు వచ్చింది. కానీ దాని రెక్కలు బాగా నొప్పి పెట్టడం వలన అది బాగా నీరసపడింది. అది ఒక బలహీనమైన పక్షి. చాలా నిరుత్సాహపడింది. అక్కడికి ఒక గద్ద వచ్చింది. ఆ సమయాన కోకిల రంధిగా ఒక పాట పాడుతున్నది.

“చెల్లీ, నీవు ఇంత రంధిగ ఉన్నావు ఎందుకు?” అని గద్ద అడిగింది.

“నేనేమి చేయగలను? నేను ఒక కొత్త పాటను వెదుకాలి, అది జనులందరిని సంతోషపెట్టాలి” ఆ చిన్న పక్షి అంది.

“నీకు ఆ పాట ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగిన గద్దతో

“ఒకవేళ ఆ ఎత్తైన కొండను దాటితే నేను వెదికే పాట నాకు దొరుకుతుంది” అన్నది కోకిల.

“ఓహ్! చెల్లీ. అదానీ సమస్య. నీవు ఒక పనిచేయి. నేను రేపు ఉదయాన ఎత్తైన పర్వతం దాటుతాను. నీవు నా మెడ రెక్కలను గట్టిగా పట్టుకో. నేను నిన్ను మంచుకొండల వరుసలు దాటిస్తాను. నీవు అక్కడ రెండు మూడు రోజులు వుండు. నీ పని అయిన తరువాత నేను నిన్ను తిరిగి తీసుకవస్తాను” అన్నది గద్ద.

ఆ చిన్నపక్షి అంగీకరించింది. మరునాడు ఉదయమే గద్ద ఆ చిన్నపక్షిని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది. గద్ద చాలా ఎత్తుకు ఎగిరింది. ఆ గద్ద చిన్నపక్షిని పర్వత శిఖరాన దింపింది.

ఆ చిన్న కోకిల కుతూహలంగ చుట్టూ చూసింది. ఆ శిఖరంపై ఒక చిన్న గుడిసె ఉన్నది. ఆ గుడిసెలో ఒక ఋషి ఉన్నాడు. అతడు వృద్ధుడు, తెలివైనవాడు కూడా.

ఆ ఋషి మాట్లాడాడు. “నాకు తెలుసు నువ్వు ఎవ్వరివో. నీవు ఒక చిన్న పక్షివి. కాని ఎందుకు ఆలస్యం చేశావు. చాలాకాలం నుండి నీ కొరకు ఎదిరి చూస్తున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో కూడా తెలుసు.” అన్నాడు.

“ఓహ్! నా అదృష్టం! ఋషి వర్యా, నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. కాని మీకు ఎట్లా తెలిసింది” అని అడిగింది.

ఓ పక్ష్మీ నేను భగవంతుని అన్వేషణలో ఉన్నాను. అతడు అతిబలవంతుడు. నాకు ఈ ప్రపంచంలో అన్నీ తెలుసు. నీవు ఒక పాట అన్వేషణలో వచ్చావు. నీవు మనుషుల హృదయాలను సంతోషపెట్టడానికి ఓ పాట నేర్చుకుందామని అనుకుంటున్నావు. కాని అది సామాన్యమైన పని కాదు. దానికొరకు చాలా ఓపికతో ఉండాలి” ఋషి సమాధానమిచ్చాడు.

“సార్, నేను రెడీ. ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే చాలా ఓపిక కల్గి ఉండటం అవసరం. ఎడతెగని ప్రయత్నం చేయకుంటే ఎవరు గొప్పవారు కాలేరు. దయతో నాకు బోధించండి” అన్నది ఆ పక్షి.

“సరే, నీవు ఈ తీరుగ చెయ్యి. నీ గుడిసె వెనుక ఒక ముళ్ల చెట్టు వుంది. అక్కడికి వెళ్ళి ముళ్ళ మీద కూర్చో. సహజంగానే ముళ్ళు నీకు గుచ్చుకుంటూ బాధపెడతాయి. నీవు ఆ బాధను ఒక వారం సహించాలి. నీ రక్తం బయటికి వస్తుంది, తప్పదు. కాని రోజు రోజుకు నీ గానం మెరుగు పడుతుంది. వారం రోజుల చివరన నీ గానం చాలా బాగుంటుంది. అది జనుల హృదయాలను సంతోష

పెడుతుంది. నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. నేను నా మహిమలతో నీ గాయాలను నయం చేస్తాను. గద్ద నిన్ను నీ స్థలానికి తీసుకుపోతుంది” అని చెప్పాడు ఋషి.

ఆ పక్షి అంగీకరించి ఋషి చెప్పినట్లు చేసింది. అది మొదటిరోజే పాడటం మొదలుపెట్టింది. దినం తరువాత దినం దాని పాట మెరుగయ్యింది. వారం చివరిలో గాయాలతో బాధపడుతున్న కోకిల తన పాటను చాలా శ్రావ్యంగా పాడగలిగింది. ఆ వయసు మళ్ళిన ఋషి అవస్థ పడుతున్న పక్షిని తన చేతుల్లోకి తీసుకొని తన మహిమతో దాని గాయాలను ముట్టుకొని నయం చేశాడు.

“పక్షి, నీవు ఇప్పుడు భూమి మీదికి తిరిగిపో, అక్కడ ఈ కొత్త పాట పాడు. జనాలు కూహ్ కూహ్ అను నీ తీయని స్వరం విని ఆశ్చర్యపడుతారు” ఋషి అన్నాడు. కోకిల ఋషికి ధన్యవాదాలు చెప్పి గద్ద కోసం ఎదురు చూస్తూ ఉన్నది.

గద్ద అన్నమాట ప్రకారం మరుసటి రోజు వచ్చింది. కోకిలను ఎత్తుకు పోయింది. కోకిల దాని ఇంటికి తిరిగి వచ్చింది. సమావేశంలో అది బహు శ్రావ్యంగ పాట పాడింది. అది ఒక గొప్ప సంతోష సంఘటన. పక్షులన్ని భళా భళా అని మెచ్చుకున్నాయి.

ఈ రోజు కూడా కోకిల గానం విన్న వాళ్ళందరి హృదయాలను సంతోషపెడుతుంది.

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

యోగాసనాలు

by Bandi Usha August 15, 2022
written by Bandi Usha

నిల్చొని చేసే ఆసనాలు

(part -3)

అర్థకటి చక్రాసన్

అర్థకటి చక్రాసన్

ఆసనం వేయు విధానం

తివాచీపై సమస్థితిలో నిల్చొని రెండు చేతులను భూమికి సమాంతరంగా, భుజాల పక్కగా చాచాలి. శ్వాసవదులుతూ తలను కుడివైపుకు వంచుతూ కుడిచేతిని క్రిందికి జరపాలి. ఎడమ చేతిని పైకెత్తి ఎడమ చెవిని తాకునట్లుగా చాచి, ఎడమ అరచేయిపై దృష్టి నిలపాలి. ఈ స్థితిలో 4,5 శ్వాసలు తీసుకొని సమస్థికి రావాలి. తదుపరి కుడివైపు చేసిన విధంగానే ఎడమవైపు చేయాలి.

ఉపయోగాలు

  1. మెడచుట్టూ వలయాలు తగ్గుతాయి.
  2. తలకు రక్తప్రసరణ జరగటఁ వలన జ్ఞాపకశక్తి పెరుగును.         
  3. నడుముకు ఇరువైపులా ఉన్న కొవ్వు తగ్గి నడుముకు చక్కటి ఆకృతి వస్తుంది.
  4. భుజాలు గట్టిపడును.

Step-2

చేయు విధానం : రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచుతూ తివాచిపై సమస్థితిలో నిల్చోవాలి. శ్వాస వదులుతూ తలను కుడివైపుకు వంచుతూ కుడి అరచేతితో ఎడమ మోకాలి క్రింద తాకాలి. ఎడమ చేతిని ఎడమ చెవి తాకునట్లుగా చాచి, ఎడమ అరచేతిపై దృష్టి నిలపాలి. తదుపరి కుడివైపు చేసిన విధంగానే ఎడమవైపు చేయాలి.

ఉపయోగాలు

  1. Step 1 లోని అన్ని ప్రయోజనాలతో పాటు ఛాతీ ధృడఁగా తయారగును.

గమనిక: యథాస్థితికి వచ్చేటప్పుడు శ్వాస తీసుకోవాలి.

సమ ఉత్కటాసన్

ఉత్కటాసనం

ఉత్కట అంటే ఎత్తు అని అర్థం. ఈ ఆసన స్థితి ఎత్తులో కూర్చున్నట్లు ఉండటం వలన ఉత్కటాసన్ అనే పేరు వచ్చింది. దీనిని నాలుగు విధములుగా వేయవచ్చు.

ఊర్థ్వ ఉత్కటాసనం
  1. సమ ఉత్కటాసన్ : ముందుగా రెండు కాళ్ళ దగ్గర చేసి తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు చేతులను ముందు నేలకు సమాంతరంగా చాచాలి. నెమ్మదిగా శ్వాస విడుస్తూ మోకాళ్లను సగం వంచి మడమలను పైకెత్తి వేళ్ళపై కూర్చోవాలి. దీనిని చేతులు పైకి ఎత్తి కూడా చేయవచ్చు. దృష్టిని సూటిగా కేంద్రీకరించి ఉంచాలి.
  2.  ఊర్థ్వ ఉత్కటాసనం – ముందుగా తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తరువాత పాదములను వ్యతిరేక దిశలో ఉంచి, చేతులను పైకి తీసుకొని వెళ్లి నమస్కార ముద్రలో ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్ళ వద్ద వంచుతూ కుర్చీపై కూర్చున్నట్లు కూర్చోవాలి. దృష్టి ఒకదానిపై సూటిగా కేంద్రీకరించాలి.
  3. స్థిర ఉత్కటాసనం – తివాచీపై సమస్థిలి నిల్చోవాలి. తదుపరి చేతుల్ని, కాలి మడమల్ని పైకెత్తాలి. చేతుల్ని మోకాళ్లపైకి తీసుకొని వస్తూ కాలిమడమలపై పిరుదులు ఆనేటట్లు కూర్చోవాలి. దృష్టిని సూటిగా ఉంచాలి. ప్రారంభంలో పదిసెకన్లు ఉంటూ తరువాత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.
  4. ఏకపాద ఉత్కటాసనం – ముందుగా తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. కుడికాలిని మడిచి ఎడమకాలి పైభాగంలో కుడిపాదంను ఉంచి నిటారుగా రెండు చేతులను పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచాలి. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎడమ మోకాలిని వంచుతూ కుర్చీలో కూర్చున్నట్లు కూర్చోవాలి. ఇదేవిధంగా మరో కాలుతో చేయాలి. దృష్టిని సూటిగా కేంద్రీకరించాలి.
ఏకపాద ఉత్కటాసనం

ఉపయోగాలు :  

  • నడుము, కండరాలు, శక్తివంతం అవుతాయి.
  • బోధకాళ్ళు సరిచేయబడతాయి.
  • గుండెకు మేలు చేకూరుతుంది.
  • కీళ్ళ నొప్పులు, మూలవ్యాధులు నయమవుతాయి.
  • మలబద్దకం ఉండదు.

ఏకపాద ఉత్కటాసన్ లో వీటితోపాటు తొడ కండరాలు, వెన్నెముక మరింత బలోపేతం అవుతాయి.

గరుడాసనం – గరుడ అంటే గ్రద్ధ. ఈ ఆసనం గ్రద్ధ ఆకారంలో ఉంటుంది. కావున  గరుడాసన్ అనే పేరు వచ్చింది. ఇది అందరూ వేయదగిన ఆసనం.

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చొని ఎడమ తొడను కుడి తొడ ఎడమ చేతిని కుడిచేతితో చుట్టి రెండు అరచేతులను నమస్కరిస్తున్నట్లు చేసి వీపును తలను నిటారుగా ఉంచాలి. తరువాత ఎడమవైపు కూడా కుడివైపు మాదిరిగానే చేయాలి. ఆసనం వేయునపుడు శ్వాస వదులుతూ గోడ కుర్చీ మాదిరిగా కూర్చోవాలి. తరువాత శ్వాస తీసుకుంటూ సమస్థితిలోకి రావాలి.

అర్థచంద్రాసనం

ఉపయోగాలు: మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

  •  వెన్నెముక దృఢంగా తయారగును.
  • రక్తనాళాలు బాగా సాగి బలపడతాయి.
  • వరి బీజం తగ్గుతుంది.
  • వృషణాల వాపులు, నొప్పులు ఉండవు.
  • గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుంది.
  • సర్వయికల్, థైరాయిడ్ తగ్గును.

అర్థచంద్రాసనం : తివాచీపై వజ్రాసనంలో కూర్చొని తరువాత మోకాళ్ళపై నిల్చొని రెండు చేతులను ఛాతీపై కలిపి ఉంచాలి. సుదీర్ఘ శ్వాస తీసుకుంటూ తలను వెనుకకు తీసుకెళ్ళాలి. జననాంగం, మలనాంగం బంధించాలి. ఉండగలిగినంతసేపు ఉండి మరలా యధాస్థితికి రావాలి.

ఉపయోగాలు – నడుము నొప్పి, వెన్నెముక సమస్యలు తొలగిపోతాయి.

  • థైరాయిడ్ సమస్యలు, జననేంద్రియ సమస్యలు, ఉదర సంబంధిత తొలగిపోతాయి.
  • ముఖవర్చస్సు పెరుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది..
  • కండరాలు గట్టి పడతాయి.
అర్థశీర్షాసనము

అర్థశీర్షాసనము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. వీలయినంత దూరంగా రెండుకాళ్ళను జరిపి, చేతులను నేలకు సమాంతరంగా అరచేతులు నేలను చూస్తున్నట్లు ఉంచాలి. గాలిని నెమ్మదిగా వదులుతూ ముందుకు వంగి అరచేతులను నేలపై ఉంచాలి. తదుపరి నెమ్మదిగా శ్వాస విడుస్తూ చేతుల సహాయంతో తలను కూడా నేలకు ఆనించాలి. ఈ స్థితిలో 4,5 శ్వాసలు తీసుకున్న తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి.

ఉపయోగాలు     – తలకు రక్త్రపసరణ బాగా జరుగును. 

  • కంటిచూపు మెరుగుపడుతుంది.
  • కాలి మరియు చేతి కండరాలు బలపడును.
  • వీపు నొప్పి తగ్గిపోవును.
  • నిద్రలేమి, మలబద్ధకం పోతుంది.
  • పక్షవాతం రానివ్వదు.

అర్థచక్రాసనము – తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తదుపరి నెమ్మదిగా రెండు చేతులను నడుముపై ఉంచి, శ్వాస తీసుకుంటూ వీలయినంత వెనకకు వంగి ఆకాశంవైపు చూడాలి. ఈ స్థితిలో 4,5 శ్వాసలు తీసుకున్న తరువాత శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి.

ఉపయోగాలు

  • వెన్నెముక, మూత్రపిండాలు ఆరోగ్యంగా తయారగును.
  • మెడనప్పులు, నడుము నొప్పులు తగ్గిపోవును.
  • భుజాలు గట్టిపడును.

ఉత్తట అర్థచక్రాసనము – తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తదుపరి రెండు చేతులను జతచేసి నాభిస్థానము నందు ఉంచి నెమ్మదిగా శ్వాస వదులుతూ నడుమును వీలయినంత వెనుకకు వంచాలి. ఈ స్థితిలో 4,5 శ్వాసలు తీసుకొని మరలా శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి.

ఉపయోగాలు:

  • థైరాయిడ్ సమస్య తగ్గును.
  • తలకు ఆక్సిజన్ బాగా అందుతుంది.
  • వెన్నెముక, మెడ కండరాలు, ఛాతీ కండరాలు మూత్రపిండాలు ఆరోగ్యంగా తయారగును.

ఊర్థ్వ ఉష్ట్రాసనము – తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తదుపరి రెండు చేతులను పిరుదులపై ఉంచి శ్వాస తీసుకొంటూ వీలయినంత వెనుకకు వంగాలి. 4,5 శ్వాసల అనంతరం మరలా శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి.

ఉపయోగాలు – ఉత్తిట అర్థచక్రాసనములోని ఉపయోగాలతోపాటు పొట్టలోపలి కండరాలు ఆరోగ్యంగా తయారగును.

ఖగాసనము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తదుపరి రెండు కాళ్ళ మధ్య అడుగుదూరం ఉంచి మోకాళ్ళపై కూర్చోవాలి. మోకాళ్ళపై చేతులుంచి ఎడమ మోకాలిని కుడిపాదంపై ఉండేలా శ్వాస విడుస్తూ కుడివైపుకు తిరగాలి. మరలా శ్వాస తీసుకుంటూ యధాస్థితికి రావాలి. ఇదే విధంగా కుడి మోకాలిని ఎడమపాదంపై ఉంచి శ్వాస విడుస్తూ ఎడమవైపుకు తిరగాలి.

ఉపయోగాలు : మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ పోతుంది.

  • మెడ ఛాతీ కండరాలు ఆరోగ్యవంతంగా ఉండును.
  • నడుము ఆకర్షణీయంగా తయారగును.
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

ఆగస్టు – వర్ష ఋతువు మయూఖ సంపాదకీయం

by mayuukha August 15, 2022
written by mayuukha

స్వతంత్రత – నీవు

ఈ జీవన పోరాటంలో అనునిత్యం అనుక్షణం కొత్తదనాన్నే ఆస్వాదిస్తారెవరైనా! కాని ఒప్పుకోరు. బ్రతుకు బడి చాలా పెద్దది. కూర్చుని చదువుకోని పాఠాలన్నో ఉంటాయి. పాఠాలు నేర్పని గురువులా కాలం వెంటనే ఉంటుంది.
చాలా విషయాల్లో తేలికగా తీసుకునే మనిషి తన అస్తిత్వానికి దెబ్బ అనుకుంటే మాత్రం సహించని స్థితి ఉంటుంది
పరాయిపాలనలో నికృష్టంగా ఉండే కష్టాలేమీలేవు ప్రస్తుతం , కానీ .. . ఈ “కానీ” కి చాలా అర్థాలున్నాయి. ఆ నాటి పరిస్థితులేవీలేని పరమ స్వేచ్ఛగా వెళ్ళదీసుకునే వీలున్నదిప్పుడు. కానీ…
భూగోళం మీద దాదాపు తొంభై శాతం ఆక్రమించి పాలించిన ఒక చిన్న దేశం బ్రిటన్! సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అంటూ ఉంటాము . అంటే ఏంటి ? అంటే బ్రిటన్ దేశం లో సూర్యుడు అక్కడ అస్సలే అస్తమించడా?కాదు! బ్రిటన్ లో కూడా సూర్యాస్తమయం అవుతుంది.మరెందుకు ఈ మాట అంటారు? అంటే, ప్రపంచం లో ఎక్కడచూడూ అన్ని దేశాలు బ్రిటిష్ వారి పాలనలోనే అప్పుడు ఉండేవి . భూమి ఎటుతిరిగినాగానీ అటు సూర్యుడు కనిపిస్తాడు ,సూర్యరశ్మి ఉంటుంది. ఆ ప్రాంతాలన్నీ బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగానే ఉండేవి. దీంతో “సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని “అని అనడం పరిపాటి అయ్యింది.
మన భారతదేశాన్ని కూడా బ్రిటషర్లు అలా యుక్తి , కుయుక్తులతో చేజిక్కించుకుని ఓ రెండు వందల సంవత్సరాలు పాలించారు. మనదేశ సంపద కొల్లగొట్టి, మనని మనుషులు గా చూడక అవమానపరుస్తూ హీనాతిహీనంగా చూసేవారు. అన్నదమ్ముల మధ్య , రాజ్యాలమధ్య , సంస్థానలమధ్య విభేదాలు సృష్టించి విభజించి , ఐదు ఆవులు ఒక పులి కథ లాగా మన పాలకులను అంతం చేసి తమ హస్తగతం చేసుకున్నారు. అన్నేళ్ళల్లో వాళ్ళు చేయని అరాచకం లేదు. మన విజ్ఞాన గ్రంథాలను, మన పండితులను ఎత్తు కెళ్ళి సంస్కృత భాషలో ఉన్న ఆయా శాస్త్రాలను ఇంగ్లీష్ లో కి అనువాదం చేయించి ప్రయోగాలు చేసుకున్నారు . ఆధునిక విజ్ఞాన సంపన్నులైనారు. మన దేవాలయాల లోని విగ్రహాలను ఎత్తుకెళ్లి వాళ్ళ మ్యూజియంలలో పెట్టుకున్నారు.అవి చూస్తున్నప్పుడు కడుపు తరుక్కుపోతుంది. అందమైన గాజు నిర్మాణాల్లో మన ఆధ్యాత్మిక అమృతవాహిని ని బంధించారు కదా అని మనసు అల్లకల్లోలమైపోతుంది.
ఇవన్నీ మేధావులకు తెలుసు . కానీ ఇవి తెలియని తరాలు వచ్చాయి . మారిన తరాలకు మన వీరులు , మన సైనికులు , మన నాయకులు పడిన కష్టాలు తెలియాలి. ఎన్ని ప్రాణాలు పోతే ఈ స్వాతంత్ర్య సాధించుకున్నామో తెలియాలి . లేకుంటే చాపక్రింద నీరులా వస్తున్న దేశ ద్రోహం మన పిల్లలకు ఈ కొత్త తరాలకు తెలియదు, అర్థం కాదు. ఆక్రమించే రూపం మారవచ్చు, అణగద్రొక్కే విధానం మారవచ్చు వాళ్ళ విషపు చూపులను పసిగట్టేందుకు కొత్త స్ఫూర్తి ఇప్పుడు అవసరం . వడ్డించిన విస్తరి అయింది మన దేశం . రేపటి రోజులలో “… చింపిన విస్తరి కావద్దు” ఇది ఈ అమృతోత్సవ శుభ సందర్బంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి . ఇది ఒక ప్రత్యేక అవసరం. మనకాలంలోనూ ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కూడా! పరోక్ష యుద్ధాలు ఏవో సభ్యసమాజానికి తెలుసు . ప్రత్యక్ష యుద్ధం కూడా జరుగుతున్నది . ఆక్రమణకు గురయ్యే దేశం ఎంత , ఎన్ని విధాలుగా నష్ట పోతున్నదో తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని , గమనింపులోకి తెచ్చుకొని మనం మన దేశాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఈ వజ్రోత్సవ సందర్భంగా మనమంతా , మన యువతరమంతా భారతదేశ సమగ్రతకోసం ఆలోచనలను పదునుపెట్టాలి. రేపటి తరానికి ఏ కష్టాలు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఒక్క గొంతుకలం కావాలి . నా దేశ సర్వోన్నతి నేను ఏం చేస్తున్నాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి, దేశ సుభిక్షత కోసం నేను ఏం చేయాలి అని నిన్ను ప్రశ్నికుని పూని ఏమైనా మేలు చేయాలి . అప్పుడే నీదే అనుకునే స్వతంత్ర భారత దేశం నీదవుతుంది.

అందరికీ డెభ్భై ఏళ్ల భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్ !!

August 15, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

జలం – ప్రాణ ధార                              

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ August 15, 2022
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్


జలం ఉనికి ఎప్పుడూ ఒక రహస్యమే! జలం పరుగు ఎప్పుడూ ఒక రాజకీయ పన్నాగమే!
జలాలపై చర్చ ఒక సాలెగూడు అల్లికయే! జలం ఎప్పుడూ ఒక పోరాటానికి ఎజెండానే!
తెలియదు గాని – జల అస్తిత్వపు దేహంపై గాయం చేసేదెవరో !?
ప్రకృతికి, పర్యావరణానికి, మానవ మనుగడకు సారాన్ని అందించే
జలం మనుగడకే ఎసరు పెట్టే కుతంత్రం ఎవరిదో?
జడత్వానికి చేతననిచ్చే జలస్పర్శకు విష తుల్యం చేసే ప్రణాళికలు –
మంచి నీటి చుక్కై గొంతు లోకి ప్రవహించి – గుండె లయకు జీవ సంగీతాన్నందించే గుక్కెడు జలాన్ని
కళ్ళలో ఉప్పు నీటి సంద్రమై ఎగసిపడే అలలుగా చేసి ఆనందించే రాక్షస క్రీడలు ఎవరివో?

* * *

విషాద వలయంలో వారు, అగాధాల చీకట్లలో వారు
వర్తమానపు విచారాలను మరిచి- రేపటి వెలుగు కిరణాల దాహార్తులుగా బలిపశువులై వారు
ఎండిన డొక్కలతో తడి మట్టి వాసనలకై పొడి బారిన నాలుకలు చాచి వారు
వేయి కలలతో – నిద్ర కళ్ళతో వారు

* * *

ఇక – వేదనాభారంతో పూడుకుపోయిన గొంతుకల పూడికలు తవ్వి తీద్దాం
మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు, హరిత హారాలను ఆయుధాలుగా చేద్దాం
గొలుసుకట్టు చెరువులను నిండు కుండల్లా మార్చుకుందాం
రేపటి ఉదయాలలో వానచినుకుల ధ్వనులతో నేటి తరాన్ని మేల్కొలుపుదాం
ఇంతకాలం దుఃఖ స్వరాలతోనే సుప్రభాతాలు విన్నాం
ఇంతకాలం వొడిలోని పాప అమాయకపు కళ్ళలోని చిలిపి తనాన్ని చూడనేలేదు
సంవత్సరాల నిరీక్షణలో ముక్కలైన గుండెలను ఎవ్వరి సాంత్వనతో అతికించను,
ఇకనైనా ప్రశాంతంగా జీవించనీ – కాలం తన నియతిలో నిజాయతీగానే సాగనీ –
అమాయక జీవుల సిరలలో జలాన్ని ప్రాణ ధారయై ప్రవహించనీ !!

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

‘నేను సైతం’

by Peddurti Venkatadasu August 15, 2022
written by Peddurti Venkatadasu

(స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నా కవిత.)

వెలుగును పంచుతూ బతుకును బలిఇచ్చే-
కొవ్వత్తిని కాను…..
కాసేపు మెరిసినా కళ్ళ కద్దుకునేలా బతుకును సాగించే –
కర్పూరాన్ని కాను…..
తాను అరిగిపోతూ కూడా సుగంధ పరిమళాన్ని అందిస్తూ మురిసే –
గంధపుచెక్క ను కాను…..
అంధకారం అలుముకున్న బతుకుల్లో అజ్ఞానాన్ని తొలగించే –
అక్షరం ముక్కను కాను…..
నీడ నిస్తూ,పూలనిస్తూ,ఫలాలనిస్తూ, ప్రాణవాయువు నందిస్తూ –
రకరకాల గృహోపకరణాల రూపంలో సేవలందిస్తూ –
సస్యశ్యామలంగా నా దేశాన్ని నిలుపుతూ –
మొడై పండు ముదుసలిలా చిక్కి శల్యమై ఎండుకట్టేలా మారినా –
కడకు కాలుతూ కూడా పరులకు పనికొచ్చే –
తరువును అసలే కాను…..
అందుకే ఎందుకు ఈ బతుకు అనుకున్నా –
మనిషినై ఈ మట్టిలో పుట్టినందుకు –
నా జన్మభూమి కి ఒక్క మంచి పనైనా చేయాలనుకున్నా –
అవసరమైతే – దేశంకోసం
నా దేహాన్ని – అర్పించాలనుకున్నా!!

                
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us