మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi April 22, 2022
written by Chillara Bhavanidevi

(ధారావాహిక నవల) by డా. చిల్లర భవానీదేవి

‘అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!

విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా!!…’’

ఘంటసాల గళంలోంచి ఉత్తేజకరంగా అద్భుతగీతం ఆడియో మంద్రస్థాయిలో విన్పిస్తోంది.

తెల్లారితే బస్‌ హంపీనగరాన్ని చేరుతుందంటే అమృతకి చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. బస్‌ అంతా నిద్రమూడ్‌లోకి జారుకుంటున్నారు. అభిషేక్‌ కూడా హంపీ గురించే ఆలోచిస్తున్నాడని అమృతకి తెలుసు. రాత్రి పదవుతోంది. దాదాపు నలభైమంది ప్రయాణిస్తున్న ఆ టూరిస్ట్‌ బస్‌ తెల్లవారితే ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నదని వాళ్ళిద్దరికీ అన్పిస్తున్నదంటే ఆ స్థలం వాళ్ళకి ఎంత ప్రీతిపాత్రమైందో మరి!

‘‘అభీ!’’ మెల్లగా పిల్చింది అమృత.

‘‘ఊ…’’ అభిషేక్‌ బదులిచ్చింది ఒక్క అక్షరమే అయినా అమృత మీద ప్రేమంతా రంగరించి అన్నట్లుంది.

‘‘ఇప్పుడు నీకేమన్పిస్తుంది’’ అతని భుజమ్మీద వాలి కళ్ళు మూసుకుంది.

‘‘మనం మనదైన లోకంలోని కాలానికి వెళ్ళిపోతున్నాం అమ్మూ’’ ట్రాన్స్‌లో

ఉన్నట్లు అన్నాడు.

‘‘నిజంగా  అప్పుడు  ఉండేఉంటాం  అభీ!’’  అమృత  రెప్పల  కింద  సినిమా రీళ్ళలాగా… అనేక దృశ్యాలు కన్పిస్తున్నాయి.

‘‘అమ్మూ!’’ మంద్రంగా హస్కీ వాయిస్‌తో పిలిచాడు అభిషేక్‌.

అలా పిలిస్తే అమృతకెంత ఇష్టమో అతనికి తెలుసు. నాగస్వరానికి ఆడే నాగినిలా అయిపోయింది అమృత.

‘‘చెప్పు అభీ!’’

‘‘రేపట్నుంచి   మన   జీవితంలో   కొత్త   అధ్యాయం   మొదలవుతుందని నాకన్పిస్తుంది.’’

‘‘అవును అభీ… నాక్కూడా’’

‘‘మనం ఇన్నాళ్ళుగా కన్న కలలు నిజం కాబోతున్నాయంటే… ఓప్‌ా నమ్మలేకుండా ఉన్నాను’’ ఉద్వేగంగా అన్నాడు అభిషేక్‌.

‘‘అవును అభీ! మనం యూనివర్శిటీ స్టూడెంట్స్‌గా ఏ క్షణంలో కలిశామో… ఆ ఘడియ అద్భుతమైంది అభీ. ఎందరో అక్కడ చదువుకుంటారు. కాని మనలాగా చరిత్రలోకి ప్రయాణించేవాళ్ళుంటారా! అనిపిస్తుంది.’’

‘‘అవును అమ్మూ! నీకు చెప్పాను గుర్తుందా! మొదటిసారి ఫీల్డ్‌వర్క్‌ కోసం నేను హంపీ వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో!క్లాసులో ప్రొఫెసర్‌ విజయనగర సామ్రాజ్యం గురించి చెప్తున్నప్పుడు అవన్నీ నేను చూసినవే అన్పించింది.’’

‘‘అవును అభీ! మనం ఈ సామ్రాజ్యంలో పుట్టామనే నా నమ్మకం.’’

‘‘ఏదో పరీక్షల కోసం చదివాను, రాశాను గానీ ఇద్దరం కల్సి హంపీ ఎప్పుడు వస్తామా అని నా మనస్సు వేగిరపడుతోంది.’’

‘‘అవును అభీ! పెళ్ళయితేగానీ ఇలా కల్సి రాలేం కదా!’’

‘‘కళాకారులుగా కల్సి మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. కానీ ఈ అనుభవం వేరు. చదువుకన్నా నీ నాట్యమే నన్ను నీ దగ్గరికి చేర్చింది అమ్మూ.’’

‘‘నీ పాటకోసమే నా పాదాలు ఎప్పుడూ ఎదురుచూస్తాయి అభీ!’’

‘‘రేపటి నుంచి మనం మనదైన అద్భుత ప్రపంచంలో విహరిద్దాం’’

అభిషేక్‌ ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు.

‘‘అందుకే గదా! హనీమూన్‌కి ఎక్కడికెళ్తారు? అని నాన్న అడిగితే ‘హంపీ’ పేరు చెప్పాను’’ కొంచెం సిగ్గుపడిరది అమృత.

‘‘అంతా నవ్వారు తెలుసా! శిథిలాల్లో హనీమూనా అని’’ అభిషేక్‌ అల్లరిగా చూశాడు.

‘‘నువ్వెక్కడుంటే అదే నా స్వర్గం అభీ! మనం కలలు కన్న కళాప్రపంచం కన్నా మనకింకేం కావాలి చెప్పు’’ తన్మయంగా అంటున్న అమృత భుజంచుట్టూ చేయివేసి దగ్గరగా తీసుకున్నాడు అభిషేక్‌.

నవదంపతుల   మనసులు   పరస్పరం   ఊసులాడుకుంటుంటే   నిద్రలోకి జారుకున్నారు.

బస్‌ రాత్రి చీకటిని లైట్ల కత్తులతో చీలుస్తూ పరిగెడుతోంది. రాబోయే రోజు వాళ్ళ జీవితాలనే మార్చేస్తుందని తెలీని ఆ యువజంట ఆదమరిచి నిద్రపోతున్నది.

తెలతెలవారుతోంది. సూరీడు కూడా బద్ధకిస్తున్నట్లు ఇంకా పూర్తిగా పక్కమీంచి లేవలేదు. బస్‌లో లైట్లేసి హారన్‌ కొట్టాడు డ్రైవర్‌. అంతా నిద్రలేచి గమ్యం చేరినట్లు గుర్తించారు.

‘‘అభీ!..  హంపీ  అదే  హాస్పేట్‌  వచ్చేశాం’’  అమృత  అతన్ని  నిద్రలేపింది ఆనందంగా.

అభిషేక్‌ కళ్ళు నులుముకుని చుట్టూ చూశాడు. అంతా దిగుతున్నారు. పెద్ద లగేజీలన్నీ బస్‌ డిక్కీలోంచి తీస్తున్నారు.

అమృత, అభిషేక్‌లు బస్‌ దిగారు.

ఎదురుగా హోటల్‌ ప్రియదర్శిని. టూరిజం ప్యాకేజీ సభ్యులుగా అందరికీ డబుల్‌ బెడ్‌ ఎ.సి రూంలు కేటాయించారు. అంతా వెళ్ళాక రిసెప్షన్‌లో కొంచెంసేపు ఆగి అభిషేక్‌ తనకి కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నాడు. రూంకి వచ్చి ఇద్దరూ రిఫ్రెష్‌ అయ్యారు. రూంకే బ్రేక్‌ఫాస్ట్‌ తెప్పించుకుని తిన్నారు.

‘‘అభీ! మనం అడిగినట్లు విడిగా ఒక కారు ఏర్పాటయిందా?’’

‘‘ఆ! ఒక గైడ్‌ కూడా’’

‘‘మనకి గైడ్‌ ఎందుకు అభీ! నువ్వున్నావుగా’’

‘‘అలా అనకు అమ్మూ! మనతో వచ్చేది డ్రైవర్‌ కం గైడ్‌. నేను ఆర్కియాలజీ విద్యార్థినే!  అయినా  మనం  చదువుకోని  ఎన్నో  విషయాలు  స్థానికులకు తెలుస్తాయి…’’ నవ్వాడు.

‘‘వాటికి ఆధారాలుంటాయా?’’ అనుమానంగా అడిగింది.

‘‘ఉండకపోవచ్చు… కానీ జనశ్రుతిలో పుట్టిన కథలుండొచ్చు…’’

‘‘అసలు  భారతదేశ  చరిత్రే  సరిగ్గా  రికార్డుకాలేదంటారు.  పోర్చుగీసు యాత్రికులు, బ్రిటీష్‌ చరిత్రకారులు, శిలాశాసనాలు, సాహితీ గ్రంథాలు ఇవేకదా మన చరిత్రకు ఆధారాలు.’’

‘‘నిజమే!’’ ఒప్పుకున్నాడు అభిషేక్‌.

‘‘మనవాళ్ళు సరిగ్గా అన్నీ రికార్డు చేసివుంటే మనకి ఇంకెంత విలువైన సమాచారం తెలిసేదో! నాకు మాత్రం విజయనగర సామ్రాజ్యం గురించి ఇంత అభిమానం పెరగటానికి కారణం నువ్వే అభీ! నేను తెలుగు లిటరేచర్‌ విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయల సాహితీ ప్రియత్వం, కవిపోషణ, ఆ కవుల గురించి వాళ్ళ కావ్యాల గురించి చదువుకున్నాను. కానీ నీలా విజయనగర సామ్రాజ్య శిథిలాల వెనుగ దాగిన చరిత్ర పునాదుల నుంచి తెలియదు.నీ మాటల్లో నేను ఆ స్వర్ణయుగం మళ్ళీ చూశాను. ఆ హంపీ గురించి మనిద్దరికీ ఎందుకింత ప్రేమ అభీ!’’

అతని చేయి తన చేతిలోకి తీసుకొని అడిగింది అమృత.

‘‘తెలీదు అమ్మూ! కారణం ఇదని చెప్పలేను. మేం ఈ ప్రాంతం వాళ్ళమేననీ, మా పూర్వీకులు తెలుగునాడుకు వలస వెళ్ళారనీ అమ్మ చెప్పేది. అయినా రాయల పాలనలో తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాలున్నాయని అందరికీ తెలుసు.’’

‘‘మరి అలా ఎందరో ఉంటారు. నీకు మాత్రం ఎందుకింత ఇది.’’

‘‘ఏమో! చిన్నప్పట్నుంచీ శ్రీకృష్ణదేవరాయల పేరు వింటే నా మనసు పులకరించేది. హంపీ విజయనగర సామ్రాజ్యం నేపథ్యం గల సినిమాలు గానీ పాటలు గానీ చాలా ఇష్టం అన్పించేవి. శ్రీకృష్ణదేవరాయల అసలు చిత్రపటం లభ్యంకాలేదుగానీ లేకపోతే రాయల చిత్రం చూస్తే అది ఏ జన్మలోనైనా గుర్తించగలను.’’ అభిషేక్‌ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు.

‘‘నాక్కూడా అంతే అభీ! విచిత్రంగా లేదూ! మనిద్దరి అభిరుచి ఒకటే కావటం’’ నమ్మలేనట్టు చూసిందామె.

‘‘అవును. కొన్నిసార్లు జన్మాంతర సంస్కారాలు వెంటవస్తాయి. అందుకే నర్తకిగా నువ్వు, గాయకుడిగా నేను కళ పట్ల సహజాభిమానంతో ఉన్నాం. ఇది మన జన్మాంతర హృదయధర్మంగా ఉంది.’’

‘‘కారు వచ్చేలోపు మనం ఈ హంపీ విజయనగర సామ్రాజ్య ఆత్మని పూర్తిగా స్పర్శించేలోపు ఇన్నాళ్ళూ నాకు చూపించాలని నువ్వు కలలుగన్న ఈ పుణ్యస్థలం గురించి కొంచెం చెప్పు అభీ!’’

‘‘అలా అయితే ప్రస్తుతానికి నేనే నీ గైడ్‌ని. విను’’ అంటూ అభిషేక్‌ ఏదో ప్రపంచంలో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఆర్కియాలజీ స్టూడెంట్‌గానే కాదు, ఈ మట్టి గురించిన జ్ఞాపకాలతో అతని మాటల్లో ఆ మట్టిబంధం పరిమళిస్తూంది.

‘‘నీకు తెలుసా అమ్మూ! ఇందాక మనం అనుకున్నట్లు మనవాళ్ళు రాసిన ఆధారాలే కాదు… ‘రాబర్ట్‌ సీవెల్‌’ అనే ఆంగ్ల ప్రభుత్వాధికారి ‘ద ఫర్‌గాటన్‌ ఎంపైర్‌’ పేరుతో ఈ మట్టిలో కలిసిన విజయనగర సామ్రాజ్యం అనే మాణిక్యాన్ని వెలికితీసేదాకా మనకెవ్వరికీ దీన్ని గురించి తెలియలేదు.’’

‘‘అయ్యో! ఇప్పటికీ పూర్తిగా తెలీదని నువ్వే అన్నావోసారి.’’

‘‘అవును. శ్రీకృష్ణదేవరాయల పూర్వీకులు బళ్ళారివారంటారు. ఈ రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశాలు పాలించారు. రాయలు తుళువ వంశీకుడు.  రాయల  తాత  ఈశ్వర  నాయకుడు,  తల్లిదండ్రులు  నాగాంబ నరసరాయలు. నరసనాయకుని పెద్దకొడుకు వీరనరసింహరాయలు ‘సాళువ’ వంశాన్ని కూలదోసి రాజై తుళువ వంశాన్ని ప్రతిష్టించాడు. అతని మరణం తర్వాత తిమ్మరుసు సహాయంతో శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక సింహాసనానికి క్రీ.శ 1509లో అధిపతి అయ్యాడు.

‘‘ఈ తిమ్మరుసుకేగా తర్వాతి కాలంలో రాయలు కళ్ళు పీకించింది’’ అమృత

ఉద్విగ్నంగా అడిగింది.

‘‘అవును!’’ విచారంగా చెప్పాడు అభిషేక్‌.

‘‘మరి కుందేళ్ళు వేటకుక్కల్ని తరమటం, హరిహరరాయలు బుక్కరాయలు విద్యారణ్యస్వామి కథ!’’ అర్థంగానట్లు చూసింది.

‘‘నువ్వు విన్నది సరైన ఐతిహ్యమే! దక్షిణాపథంలో తెలుగుల కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక అక్కడ్నుంచి పారిపోయి హరిహర, బుక్కరాయలనే అన్నదమ్ములు విద్యారణ్యస్వామి ఆశీస్సులతో ఈ స్థలప్రభావం గుర్తించి ఇక్కడ సామ్రాజ్య స్థాపన చేశారని ప్రతీతి. కొందరైతే ఆ కాలానికి విద్యారణ్యస్వామి లేరనీ, విజయనగర రాజగురువు క్రియాశక్తియోగి అనీ అంటారు. ఏదైతేనేం ఇంతటి కళావైభవాన్ని సంతరించిన ఆ పాలన మరపురానిది… మహనీయమైనది కదా!’’ అభిషేక్‌ మాట పూర్తి అవుతూనే రూం అటెండర్‌ కాలింగ్‌ బెల్‌ కొట్టాడు.

అమృత తలుపు తీసింది.

‘‘వెహికల్‌ రెడీ మేడమ్‌!’’ చెప్పేసి వెళ్ళిపోయాడతడు.

అమృత, అభిషేక్‌లు కార్లో కూర్చున్నారు. అమృత బ్యాగ్‌లో కెమెరా, బైనాక్యులర్స్‌, సెల్‌, వాటర్‌ బాటిల్‌ అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేవో సరిచూసుకుంది.

కొత్త  మోడల్‌  ఎ.సి కారు.  కొత్తగా  పెళ్ళయిన  జంట.  పాత  వైభవాన్ని చూడటానికి బయలుదేరారు. దోవలో పడిపోయిన ప్రాకారాలు శిధిలమైన కట్టడాలు కన్పిస్తున్నాయి. అభిషేక్‌ వాటి దగ్గర రెండు నిమిషాలు కారాపి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ మొండిగోడలను ఆత్మీయంగా తడుముతున్న అభిషేక్‌ని చూస్తుంటే అమృతకి విచిత్రంగా అన్పించింది. మనిషి హృదయం ఎంత గొప్పది! ఎంతగా స్పందిస్తుంది! ఒక్కొక్క మనిషి జీవమున్నా రాయిలాగే ప్రవర్తిస్తుంటాడు. కొందరు సున్నిత మనస్కులు రాళ్ళలో కూడా ప్రాణాన్ని చూస్తారు.

అమృతకి ఒక తెలుగుకవి పాట గుర్తొచ్చింది.

‘‘రాలలోపల పూలు పూచిన రామమందిరలీల

                ఆరామ సుందర హేల

రాలలో హృదయాలు మ్రోగిన రాచకేళీశాల

                ఆరామమందిర లీల

నిన్నటిదా మరి మొన్నటిదా ఇది

                ఎన్ని జన్మల గాథ!…’’        

పాటని హమ్‌ చేస్తూ అభిషేక్‌ చేయి పట్టుకొని ఆ ప్రాచీన శిథిలాల్లో తిరుగుతుంటే అమృతకి  గమ్మత్తుగా  అనిపించింది.  హంపీ  శిథిలాల  విూంచి  గెంతుకుంటూ వెళ్తున్నాయి కోతుల గుంపులు. కొన్ని పిల్లకోతులు ఆగి వీళ్ళ చేతుల్లో ఏమైనా తినే వస్తువులున్నాయేమో లాక్కునిపోదామని చూస్తున్నాయి. అభిషేక్‌ గాగుల్స్‌ చూసి వెక్కిరించిందో పిల్లకోతి. మళ్ళీ ఇంతలోనే తల్లిపొట్ట కరుచుకొని వెళ్ళిపోయింది. సృష్టిలో ఏ ప్రాణికైనా మాతృత్వం అనే వరాన్ని  భగవంతుడు ఇవ్వకపోతే ఈ కాస్త ప్రేమ, కరుణ కూడా మాయమైపోయేవేమో!

‘‘అమ్మూ! ఇటు చూడు. గతవైభవదీప్తికి చిహ్నాలుగా ఈ ప్రాకారం మీద అద్భుత శిల్పాలు. ఇది రాయల రాజముద్ర. ఈ అందమైన స్త్రీమూర్తి మొహాన్ని ఇలా చెక్కేయటానికి దాడిచేసి ఆక్రమించిన ఆ దురాత్ములకి మనసెలా ఒప్పిందో! ఏ శిల్పి కలగని ఈ శిల్పాన్ని చెక్కాడో! ఇప్పుడీ శిల్పాన్ని చూస్తే ఆ శిల్పికి గుండె ముక్కలవదూ…’’

అమ్మూ! ఇటుచూడు. కొండకు కొండ కొక్కేలు వేసినట్లు బారులు తీరి ఇంత పటిష్టంగా ఉన్న ప్రాంతం కాబట్టే విజయనగర రాజులు దీనిని రాజధానిగా కోట కట్టారు.  ఇప్పుడు  బీటలువారిన  వీటిని  చూస్తుంటే  కొడాలి  సుబ్బారావుగారి ‘హంపీక్షేత్రం’లో ఆ పద్యమే గుర్తొస్తున్నది.

‘‘శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లో

పల, గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుం

పులకు చరిత్రలో మునిగిపోయిన దాంద్ర వసుంధరాధి పో

జ్జ్వల విజయప్రతాప రభసంబొక స్వప్నకథా విశేషమై’’`

అంటూ మధురంగా అభిషేక్‌ పాడిన ఆ పద్యానికి అమృత పరవశించి పోయింది. అతని కంఠం అచ్చంగా ఘంటసాల గళమే! అదే భావోద్దీపన. అందుకే ఆ పాట వినేవాళ్ళ హృదయాలలో తిష్టవేసుకుంటుంది. అమృత కళాహృదయం దోచుకున్న గాయకుడు అభిషేక్‌. ఆమెకి ఎన్నిసార్లు విన్నా తనివితీరదు అతని పాట.

‘‘అమృతా! కొడాలివారు ఈ హంపీ చూసే అంత గొప్పకావ్యం రాశారు! మరి నువ్వేం రాస్తావు!’’ అభిషేక్‌ కవ్వించాడు.

‘‘నేను హంపీలో మన ప్రేమకావ్యానికి మారాకు తొడిగిస్తాను’’ అమృత గుసగుసలాడిరది.

విజయనగర సామ్రాజ్య వైభవ ద్వారంలో అడుగుపెట్టిన ఆ దంపతులకి కళ్ళముందున్న శిథిల కట్టడాల నుండి నాటి విజయ నగరశోభ మనోహర కథన దృశ్యంగా సాక్షాత్కరించింది.

ష్ట్ర  ష్ట్ర  ష్ట్ర

సప్తప్రాకార పరివేష్టితమై ఆదర్శప్రావీణ్యంతో కట్టబడిన అరవైమైళ్ళ చుట్టుకొలత ఉన్న ఆ పట్టణం మొదటి కోటగోడ వరస హాస్పేటకి ఆగ్నేయంగా రెండు కొండలు కలిసేచోట ఉంది. మొదటి ప్రాకారం నుంచి మూడో ప్రాకారం వరకు పొలాలు, తోటలు. రెండవది హాస్పేటలో ఉంది. దానికి ఉత్తరంగా మూడోది, మలపనహోగుడి గ్రామానికి దక్షిణాన నాల్గోది. దానికి ఉత్తరంగా కన్పించేది ఐదోది. కమలాపురం చెరువుకు దక్షిణాన ఆరోది. నిలిచి ఉన్నది ఏడోది. ఇదే అంతర్భాగ ప్రాకారం. నిరంతరం కట్టుదిట్టమైన పహారాలతో ‘మూరురాయలగండ’ శ్రీకృష్ణదేవరాయలు అమిత ధీశక్తిశాలి తిమ్మరుసు మహామంత్రి చల్లని నీడలో విలసిల్లుతోంది. ఆ ప్రాకారాల లోపలే నగరానికి కావలసిన సర్వసంపదలు నెలకొని ఉన్నాయి. అందుచేత కోటతలుపులు మూసివేసినా ఎవరికీ ఎటువంటి కష్టం కలుగదు.

రాజభవనానికి దగ్గరలో ఎదురుగా నాల్గు విపణి వీధులున్నాయి. ఆ వీధులలో పురుషులంతా సమస్త వస్త్రాలంకార భూషితులయి కన్పిస్తున్నారు. వీధుల్లో రత్నాలు, వజ్రాలు రాసులుగా పోసి అమ్ముతున్నారు.

రక్షక భటులు గుర్రాలపై హడావుడిచేస్తూ వచ్చారు. ‘‘తొలగండి.. తొలగండి..’’

ప్రజల మధ్యనించి మార్గం ఏర్పడిరది.

గుర్రాలు ఆగాయి. రాజోద్యోగి దిగటంతో అంతా భయభక్తులతో లేచి నిలిచారు. ఆయన ఒక వర్తకుని వద్దకు వెళ్ళి ‘‘మీ వర్తకం బాగా జరుగుతోందా!’’ గంభీరంగా అడిగాడు.

‘‘చిత్తం’’ వర్తకుడు గౌరవంగా బదులిచ్చాడు.

‘‘బీజాపూర్‌ యుద్ధం ముగిసింది. తెలుసుకదా! మన సైన్యం కుటుంబాలకు ఆర్థిక సాయానికి’’ అర్థోక్తిలో ఆగాడు.

‘‘చిత్తం!’’

‘‘మహామంత్రులవారు రేపు సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మీరంతా.’’

‘‘చిత్తం!… ఏలిన వారి కృప.’’

వర్తకుల  రాజభక్తి  ఆ  సమావేశంలో  మణి  మాణిక్యాల  రూపంలో ప్రతిఫలించింది.

విజయనగర సామ్రాజ్యంలో రాయలపాలన వచ్చాక ముందు అంతశ్శత్రువుల్ని  సరిచేయటం  జరిగింది.  మహామంత్రి  ఏర్పాటుచేసిన సమావేశంలో తిమ్మరుసు ఇలా చెప్పాడు.

‘‘అధికారులు సత్యాహింసలు, నీతిసూత్రాలకు కట్టుబడి ఉండాలి. మనం పోర్చుగీసువారితో స్నేహం చేసి వారివద్ద గుర్రాలు, తుపాకులు, ఆయుధాలు కొంటున్నాం.  సైన్యానికి  వివిధ  భాగాల్లో  శిక్షణ  ఇచ్చాం.  అశ్వారోహకులు, గజారోహకులు, విలుకాండ్రు, సైనికులు అంతా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. మన ప్రభువు కూడా యుద్ధవిద్యలో అసమానులే!

ఆయన జగజ్జెట్టి, వీరుడు. తాను స్వయంగా సైన్యం ముందుండి నడిపిస్తారు. మన ప్రభువు ప్రతి విజయానికి మనవంతు కర్తవ్యం నెరవేర్చాలి.’’

కాదంటే బతకలేరు అనే కఠోర హెచ్చరిక అందరికీ తెలుసు. తిమ్మరుసు మహామంత్రి మేథోకుశలత ఆ ప్రముఖులకి తెలియందికాదు.

ష్ట్ర  ష్ట్ర  ష్ట్ర

దృశ్యాన్ని కళ్ళకి కట్టించిన ఆ శిథిల వైభవాన్ని చూస్తూ కారులో ముందుకు కదిలారు అభిషేక్‌, అమృతలు. అభిషేక్‌ కళ్ళతో చూసినట్లుగా అమృతకు చెప్తున్నాడు.

‘‘అమృతా! అటుచూడు! అక్కడ రాయలవారి అంతఃపురం ఉండేది. దానిచుట్టూ ఇది విశిష్టమైన మహానగరంగా నిర్మితమైంది. సుమారు ఏడుమైళ్ళ చుట్టుకొలత కలిగి బలిష్టంగా యాభై అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పు గల ప్రాకారం ఉండేది. దీని ప్రధాన ద్వారాన్ని ఇరవై వేలమంది అశ్వికులు రాత్రింబవళ్ళు కాపలా కాసేవారు.

‘‘అభీ! కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం అని ప్రసిద్ధికెక్కిందిగదా!’’

‘‘అవును అమ్మూ! రాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం అద్భుతమైన సంపదలతో వెలలేని అమూల్య అరుదైన వస్తువులతో దేవలోకంలా ఉండేది. దేనికీ లోటులేక శాంతి సౌభాగ్యాలతో తులతూగేది. ఇదంతా కేవలం రాయల ప్రతిభ మాత్రమే కాదు. అప్పాజీ మేధస్సు కూడా! వివిధ కార్యక్రమాలతో కృష్ణదేవరాయలు నిమగ్నమై ఉంటే తిమ్మరుసు మహామంత్రి తన అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో రాజ్యపాలనను నిర్వర్తిస్తూ రాయలను, రాజ్యాన్ని రెండు

కళ్ళుగా చూసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య చరిత్ర గురించి చెప్పేటప్పుడు తిమ్మరుసు గురించి చెప్పకపోతే అది అసంపూర్ణమే!’’

కారు మళ్ళీ ఆగింది.

అభిషేక్‌ ఆ ప్రాంతమంతా చిరపరిచితమైనట్లు సొంతింట్లో నడుస్తున్నట్లు అనుభూతి చెందటం అతనికే విచిత్రంగా అన్పిస్తుంది. అతను వరుసగా ఒక్కొక్క స్థలాన్ని  చూపిస్తూ  రాయల  స్వర్ణయుగాన్ని  మళ్ళీ  అమృత  కనుల  ముందు ఆవిష్కరించాడు.

‘‘శ్రీమద్రామాయణంలో వాల్మీకి వర్ణించిన కిష్కింధ ఈ హంపీయే. తుంగభద్రా నదీతీరంలో కిష్కింధ ముఖ్యపట్టణంగా ఆనెగొంది కలిపి ‘వానరధ్వజ’మనే పేరుతో విలసిల్లాయి.  నగరాన్ని  భద్రంగా  కాపాడే  ఐదు  పర్వతాలు  మాతంగం, మాల్యవంతం,  హేమకూటం,  బసవశృంగం,  కిష్కింధ.  వీటిలో  మాతంగం సుగ్రీవుడెక్కటానికి సాధ్యమైంది. వాలి దీనిని ఎక్కలేక పోయాడని రామాయణ శృతి. వాలి, దుందుభుల గుహ ఇప్పటికీ  ఇక్కడ కనిపిస్తుంది.

రావణాసురుడు సీతని చెరపట్టి ఆకాశ మార్గాన తీసికెళ్ళినప్పుడు ఆమె నగలు మూటగట్టి ఇక్కడి పంపా సరోవరం ఒడ్డున పడేసింది. శ్రీ విరూపాక్ష దేవాలయం ఉన్న ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా వర్ణిస్తారు. కన్నడంలో ‘పాలు’ అనే పదాన్ని ‘హాలు’ అంటారు. ‘పంపా’ అనే పదం ‘హంపా’, ‘హంపీ’గా రూపాంతరం చెందింది.  హనుమంతుడు  పుట్టిన  హనుమత్పర్వతం  కన్పిస్తుంది.  వాలిని శ్రీరాముడు దహనం చేసిన ‘వాలికాష్టం’ ఇక్కడ ఉంది.

ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో హంపీ రథోత్సవం జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షమంది ప్రజలు ఈ ఉత్సవానికి వస్తారు.

శిథిల కట్టడాలు, రాతిగుళ్ళు, శిలాకనుమలు, కరకులోయలు, నిర్జన వీధులు, శిథిల దేవాలయాలు, నదిలోంచి వచ్చే కాలువలు, చెరుకు, అరటి తోటలతో కన్పించే ఈ హంపీ పట్టణంలో నాటి రాయల ప్రాభవం ఈ శిథిలాల నేపథ్యం లోంచి చూస్తేనే ఇంత అద్భుతంగా అన్పిస్తుంది. ఇక నిజంగా ఈ కాలంలో ఈ పట్టణం ఎంత ఉజ్వలంగా వెలిగిందో కదా’’ తన్మయంగా చెప్పాడు అభిషేక్‌.

‘‘అవును అభీ! ఈ దేవాలయం పేరేంటి? ఇంతటి శిల్పకళతో చాలా సంపన్నంగా ఉంది’’ అమృత ఒక పెద్ద దేవాలయం గోడలమీది శిల్పకళను తనివితీరా చూస్తూ అడిగింది.

‘‘ఇది పట్టాభిరామ దేవాలయం. ఇక్కడ నుంచి కమలాపురం దాదాపు ఒక కిలోమీటరుంటుంది. ఇది అచ్యుతరాయల నిర్మితం. దీనికి దగ్గరే తుంగభద్రా ప్రాజెక్టు పెద్దకాలువ ఉంది. ఇక్కడ ఇలాంటి దేవాలయాలన్నీ దీర్ఘచతురస్రంగా గానీ సమచతురస్రంగా గానీ ఉన్నాయి. ఐదు కక్ష్యాంతరాలుగా బహిర్‌ద్వారం, రంగమండపం, అర్థమండపం, అంతరాళ మండపం, గర్భగృహం అనే పేర్లతో కన్పిస్తాయి. బహిర్‌ద్వారం ఉపరితలంలో గోపురం ఉంటుంది. దీనినే ‘రాయల గోపురం’ అంటారు. ద్వారానికి రెండువైపులా శిల్పాకృతులు, ధ్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపం సమ చతురస్ర స్తంభాల మండపాలు కన్పిస్తాయి. దేవతా శిల్పాలంకరణలు సర్వసామాన్యం. గర్భగుహలో ఏ అలంకరణా ఉండదు. పై భాగంలో పరిణతి పొందిన తల విమానం ఉంటుంది. అధిష్టానం, పట్టిక, తలం, శిల్పం, పట్టిన పైన కలశం… ప్రతిభావంతమైన

శిల్పాచార్యుల పర్యవేక్షణలో రాయల కాలంలో కట్టబడిన అనేక దేవాలయాలున్నాయి. పెనుగొండ, లేపాక్షి, కంబ, కదిరి, మధుర, తంజావూరుమొదలైనచోట్ల విజయనగర శైలికి సంబంధించిన వాస్తుకన్పిస్తుంది.

ఈ దేవాలయమే కాదు హంపీలో పంపాపతిస్వామి, చక్రతీర్థంలో కోదండ రామస్వామి, విఠలస్వామి దేవాలయాలు ఇలాంటివే!

‘‘అభీ! ఇవన్నీ ఎప్పుడో చూసినట్లన్పిస్తుంది. నేను మొదటిసారి ఇప్పుడేగా వచ్చానిక్కడికి’’ ఆశ్చర్యంగా అడిగింది అమృత.

ఆమె చేతిని సున్నితంగా ప్రేమగా పట్టుకున్నాడు అభిషేక్‌.

‘‘అమృతా! పద! ఆ మండపంలో విశ్రాంతిగా కూర్చో… ఆ… ఈ నీళ్ళు తాగు. కళ్ళకి కన్పించినంత మేరా సువిశాలంగా కన్పించే ఈ హంపీ విజయనగర పట్టణంలో మనం ఉండేవాళ్ళమని నాకు చాలాసార్లు అన్పించింది. గతజన్మలు నమ్ముతావో లేదోనని నీతో అనలేదు. ఇప్పుడు నీక్కూడా అలాగే అన్పిస్తుందంటే మనకి ఈ హంపీకి ఏదో ఆత్మబంధం ఉంది. అమ్మూ! ఇది మనకి చిరపరచితమైన నగరమే! ఈ వీధులు మనం తిరిగినవే! నీకు ఒక్కొక్కటి గుర్తుచేస్తూ రాయలవారి కాలంలోకి తీసుకెళ్తాను. ఇలా నా హృదయానికి నీ అరచేతిని ఉంచు’’ వివశంగా కళ్ళు మూసుకున్నాడు.

ఆమె అలాగే చేసింది.

ఇద్దరూ  విజయనగర  సామ్రాజ్య  వైభవోన్నతికి  కారకుడైన  ప్రభువు శ్రీకృష్ణదేవరాయల  పాలనలో  పౌరులుగా  రాయల  ఆదరణ  చూరగొన్న కళాకారులుగా, శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగ అనుభవాలనూ, గతజన్మ జ్ఞాపకాలనూ నిశ్శబ్దంగా మననం చేసుకుంటున్నారు.

అదొక విచిత్ర కాలసంయోగం.

(సశేషం)

April 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

కొత్త జీవితం

by shaik saleem April 18, 2022
written by shaik saleem

సాయంత్రం కావొస్తుంది. గది కిటికీ పక్కనే కూర్చున్న రిజ్వానా దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయి ఉంది. అస్తమిస్తున్న సూర్యుడు తన లేత నారింజ రంగును భూమంతా పరిచాడు. ఆ వెలుగు పడిన పరిసరాలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. సన్నగా వీస్తున్న చల్లటి గాలి ఆమె ముఖాన్ని మెత్తగా తాకుతోంది.

అదే పాత రిజ్వానా అయితే ఆ దృశ్యాలను మనసారా ఆస్వాదించేది. కానీ ఇప్పుడు ఆమె మనసు మనసులో లేదు. ఆమె, ఆమెనే కాదసలు. కొద్ది రోజుల్లోనే అంతా మారిపోయింది. నిత్యం ఆత్మవిశ్వాసం తొణకిసలాడే ఆమె కళ్ళల్లో ఇప్పుడు శూన్యం నిండుకుంది.

ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎటూ దిక్కు తోచడం లేదు. తననే నమ్ముకున్న తల్లి, ఇద్దరు చెల్లెళ్లు. ఇల్లు పట్టకుండా తిరిగే తండ్రి. అన్నింటినీ మించి తన కడుపులో పడిన నలుసు గురించిన బాధ స్థిమితంగా ఉండనీయడంలేదు. సరిగ్గా ఊపిరైనా పోసుకోని ఆ నలుసును తలచుకుంటే రిజ్వానాకు ఊపిరాడ్డం లేదు. తామిద్దరి ప్రతిరూపం తన కడుపులో అంకురించింది.

కానీ స్నేహితులు ‘రానివాడి రూపెందుకు? అబార్షన్ చేయించుకో’ అని సలహాలిస్తున్నారు. బంధువులైతే ‘నీచమైన పని చేసావ్’ అంటూ చీదరించుకున్నారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని తికమకలో తనతో తానే పోరాటం చేస్తుంది. తనలాగే ఈ లోకాన్ని చూడబోయే ఆ అంకురాన్ని నలిపేయాలంటే మనసు రావడం లేదామెకు. ఇది ఆడవాళ్ళ బలమో బలహీనతో ఇదమిత్థంగా తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి.

“లేదు నా రియాజ్ నా కోసం కచ్చితంగా వస్తాడు. ఎక్కడున్నా వస్తాడు. తండ్రి కాబోతున్నాడని తెలిస్తే కచ్చితంగా వస్తాడు. మళ్లీ పాత రోజులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను చంపుకోకూడదు” అని దృఢ నిశ్చయంతో అనుకుంది రిజ్వానా. అయినా ఎక్కడో చిన్న అనుమానం పొడసూపుతనే ఉంది.

“రియాజ్ రాకపోతే… ఎప్పటికీ రాకపోతే. ఈ బిడ్డ పరిస్థితి ఏంటీ? తండ్రి లేని బిడ్డగా పెరగాల్సిందేనా” భవిష్యత్తును తలచుకుంటే తల తిరిగిపోతుంది.

“ఏది నీ బడీ బేటీ… నీ ప్యారీ బిడ్డా. ఎటు పోయింది. వాడెవడితోనే ప్రేమా ప్రేమా అంటూ తిరిగింది. వద్దంటున్నా వినకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పెళ్ళి చేసుకుంది. చివరకు వాడు కడుపు చేసి ఎటో పారిపోయాడు. ఊళ్ళో నా పరువు తీసింది” బయట వరండాలో తండ్రి రంకెలు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా భార్య చెంపలు పగలగొడుతున్నాడు.

అదే గతంలోని రిజ్వానా అయితే కొట్టబోతున్న తండ్రి చేతిని పట్టుకుని ఆపేసేది. తల్లిపై ఒక్క దెబ్బ పడనిచ్చేది కాదు. ఎముకలు తప్ప చెంచా కండైనా లేని తల్లి భరించలేక ఆర్తనాదాలు పెడుతున్నా రిజ్వానా బలవంతంగా తనను తాను ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయింది.

“పైసా సంపాదించవు. ఆడపిల్ల జీతంపై బతుకుతున్నావు. నీకెక్కడిదిరా పరువు. నువ్వు నా కూతుర్ని అనేంత మగాడివా” అని భర్తను నిలదీయాలని వుంది ఆమెకూ. కానీ ఆ పని చేయలేదు.

పెండ్లయిన కొత్తలోనే భర్త తాగొచ్చి కొడుతుంటే పుట్టింట్లో ఎన్నో సార్లు చెప్పుకుంది. అతన్ని మార్చడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. తాగుబోతోడు ఎవరి మాట వింటాడు. పైగా మూర్ఖుడు. అందుకే వాళ్ళూ చేతులు దులుపుకున్నారు.

“మొగుడు కొట్టినా తిట్టినా పడుండాలి. మేమేం చేయగలం. నిన్ను కన్నాము గానీ నీ తలరాతను కనలేముగా. చావైనా బతుకైనా అతనితోనే” పుట్టింటికి వచ్చిన ప్రతిసారీ తండ్రి బలవంతంగా భర్త దగ్గరకు పంపేవాడు.

ఆ మాటలు ఆమె చెవిలో అలా ఉండిపోయాయి. దెబ్బలకు అలవాటు పడిన ఆమె శరీరం పుట్టింటి సంగతే మరచింది. ముగ్గురు ఆడపిల్లలకు తల్లయింది. ఆమె కష్టాలు మరింత పెరిగాయి. అబ్బాయిని కనలేదని హింసించేవాడు. అయితే పెద్ద కూతురు రిజ్వానా కాస్త ఎదిగిన తర్వాత తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టింది. “అమ్మీ… అబ్బా అలా కొడుతుంటే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడవేంటి?” అడిగేది రిజ్వానా.

“చావైనా బతుకైనా మొగుడితోనే” అన్న తండ్రి మాటలు గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోయేది. అమాయకమైన తల్లిని చూసి రిజ్వానాకు జాలిపడాలో, కోప్పడాలో అర్థమయ్యేది కాదు.

తండ్రి ఇల్లు పట్టించుకోకపోయినా రిజ్వానా కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదవాలని ఉన్నా కుటుంబం కోసం ఉద్యోగంలో చేరింది. ఇద్దరు చెల్లెళ్ళను చదివిస్తుంది. ఆడపిల్ల అయినా కుటుంబాన్ని పోషించేది. ఎవరి మాటనూ లెక్క చేయని తండ్రి ఉద్యోగం చేసి, డబ్బు సంపాదించే రిజ్వానాని చూస్తే మాత్రం భయపడతాడు. కానీ ఆడపిల్ల గడపదాటి బయటకు వెళ్ళడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. పైసా సంపాదించడు. పైగా రిజ్వానా తన మాట వినదని తెలుసు. కూతురు ఎదురైతే కొరకొరమని చూస్తాడు. ఏమీ చేయలేక నోరు మూసుకుని ఉంటాడు.

అలాంటి అతనికి ఇప్పుడు కూతురంటే భయం లేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. దీనంతటికీ కారణం రియాజ్. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని రిజ్వాన కలలో కూడా అనుకోలేదు. అన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ ధైర్యంగా ఉండే రిజ్వానా అలా ఎలా చేసిందో తల్లికి కూడా అర్థం కావడం లేదు.

సరిగ్గా ఏడాది కిందట తను పని చేసే చోటనే రియాజ్ ను చూసింది. తొలి చూపులోనే బాగా నచ్చేశాడు. చూపు తిప్పుకోలేని అందం రిజ్వానాది. అందుకే రియాజ్ ఆమెను కలవడానికి రోజూ అక్కడకు వచ్చేవాడు. రియాజ్ కూడా అందంలో తక్కువేం కాదు. ఓ రోజు ధైర్యం చేసి రిజ్వానాని పలకరించాడు. అతని పలకరింపు కోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే స్పందించింది. ఆ పలకరింపే వారి మధ్య పరిచయానికి నాంది పలికింది.

మెల్లిమెల్లిగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రియాజ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అప్పటి వరకు ఇల్లూ, చెల్లెలు, తల్లీ బంధాలను మోసిన రిజ్వానాకు అతని పలకరింపులో ఓదార్పు కనిపించింది. కష్టాల్లో పాలుపంచుకుంటానని ధైర్యం చెప్పాడు. ఇద్దరం పెండ్లి చేసుకుందామన్నాడు. అతని మాటలు పూర్తిగా నమ్మింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఆరు నెలలు హాయిగా గడిపేశారు.

వీరి ప్రేమ గురించి చుట్టు పక్కల అందరికీ తెలిసిపోయింది. దాంతో రిజ్వానా పెండ్లి చేసుకుందామని తొందరపెట్టింది. రియాజ్ విషయం ఇంట్లో చెప్పాడు. కానీ ఒప్పుకోలేదు. పైగా ఆ పెండ్లి చేసుకుంటే చచ్చిపోతామని బెదిరించారు. భయపడ్డ రియాజ్ అప్పటి నుంచి రిజ్వానాకు ముఖం చాటేశాడు. అతన్ని కలవడానికి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఎంత ప్రయత్నించినా రియాజ్ దొరకలేదు. చివరకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.

పోలీసులు రియాజ్ ను, అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులకు భయపడి పెండ్లి చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులే మాట్లాడి వేరు కాపురం పెట్టించారు.

పెండ్లి తర్వాత రిజ్వానా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. అక్కడ తల్లి, చెల్లెళ్ళ పరిస్థితి దారుణంగా తయారయింది. ‘నా సుఖం నేను చూసుకొని వచ్చేశాను. అమ్మా, చెల్లెళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో’ అని ఆవేదన చెందింది. వాళ్ళ కోసం రిజ్వానా మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటే భర్త ఒప్పుకోలేదు. తల్లినీ, చెల్లెళ్ళను ఆదుకోవడం కోసం ఆమె రియాజ్ కు చెప్పకుండా ఉద్యోగంలో చేరిపోయింది. దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది. అసలే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రియాజ్ తల్లిదండ్రులకు ఇదొక సాకుగా దొరికింది. వద్దన్నా ఉద్యోగంలో చేరిందని కొడుక్కు లేనిపోనివి చెప్పారు.

‘ఇలాంటి పిల్ల మనకు వద్దు. దాన్ని ఎలాగైనా వదిలించుకో, నీకు మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్ళి చేస్తాం’ అనేవారు. అటు కన్న వాళ్లకు ఎదురు చెప్పలేక, పెండ్లి చేసుకున్న రిజ్వానాను వదిలేస్తే పోలీసులు ఏం చేస్తారో అనే భయంతో ఎవరికీ చెప్పకుండా ఎటో పారిపోయాడు.

రియాజ్ వెళ్ళిన కొద్ది రోజులకే తను తల్లికాబోతుందని తెలిసింది. ఈ విషయం అతనికి చెప్పడానికి ఎన్నోసార్లు ఫోన్ చేసింది.

కానీ ఫోన్ పని చేయలేదు. చివరకు మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ‘ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము. మావాడిని వదిలి వెళ్ళమనండీ’ పోలీసులు పిలిపించి మాట్లాడితే రియాజ్ తండ్రి జవాబు ఇది.

‘నాకు డబ్బు వద్దు, నా కడుపులో బిడ్డకు తండ్రి కావాలి, నేను నా భర్తతోనే కలిసి బతుకుతాను’ అంది. ఆమె కన్నీళ్ళకు కాస్త కూడా కరగని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అత్తమామల కాళ్ళు పట్టుకుంది. అయినా ఆ కఠిన హృదయాలు చలించలేదు. చేసేది లేక ఏడ్చుకుంటూ పుట్టింటికి చేరింది.

‘మీ అమ్మాయిని మొగుడు వదిలేసి ఎటో వెళ్ళిపోయాడంట కదా. అందర్నీ ఎదిరించి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నేను సంపాదిస్తున్నాను కదా అంటూ తండ్రినే లెక్కచేసేది కాదు. ఇప్పుడేమయింది? ఆకొచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే. అందుకే ఆడపిల్ల హద్దుల్లో ఉండాలి’ అంటూ తల్లి దగ్గరకు వచ్చి నీతులు చెప్పే వారు చుట్టుపక్కల వాళ్ళు. వాళ్ళంతా ఒకప్పుడు రిజ్వానాను చూసి మురిసిపోయిన వాళ్ళే.

“మీ అమ్మాయికి ఎంత ధైర్యం. కొడుకులు లేకపోయినా నీకు ఆ లోటు తీర్చింది నీ బిడ్డ. ఇలా కుటుంబం కోసం ఆరాటపడే ఆడపిల్లలు ఎంత మంది ఉంటారు. నిజంగా నూ అదృష్ట వంతురాలివి” అని రిజ్వానా తల్లితో తెగ చెప్పే వారు. ఇప్పుడేమో ఇలా నోటి కొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది.

ఇప్పుడు కూతురికి మూడో నెల. తమకు అండగా ఉంటుందనుకున్న బిడ్డ ఇలా ఢీలా పడేసరికి ఆ తల్లికి ఏం చేయాలో తోచడం లేదు. నలుగురూ అంటున్న మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ఓ సారి ఆ ప్రయత్నం కూడా చేసింది. తల్లి కాళ్ళా వేళ్ళా పడి బతిమలాడితే మనసు మార్చుకుంది. ఇక ఎప్పుడూ దిగాలుగా తన గది కిటికీ దగ్గర కూరొచ్చి ఆలోచిస్తూనే ఉంటుంది.

“దీదీ… అబ్బా అమ్మీని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. మేం ఎంత చెప్పినా వినడం లేదు. నూ ఒకసారి బయటకు వచ్చి నాన్నను ఆపు” రిజ్వానా పెద్ద చెల్లెలు ధైర్యం చేసి అక్క దగ్గరకు వచ్చి బతిమలాడింది. .

“ఇప్పుడు నాన్న నా మాట వింటాడా. నేను చేసిన తప్పు అలాంటిది. నోరు తెరిచి మాట్లాడే హక్కు నాకు లేదు” అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే మంచంపై ఒరిగింది.

ఓపికున్నంత సేపూ రంకెలేసిన తండ్రి అలసిపోయి పడుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ ఇంట్లో ఎవరి ముఖాల్లో జీవం లేదు. ఒకప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండేది. రిజ్వానా చేసే అల్లరితో సందడి సందడిగా ఉండేది. ఇంట్లో అందరి కన్నా పెద్ద పిల్ల అయినా చిన్న పిల్లలా సరదాగా ఉండేది.

“ఇక ఈ బతుకు బతకడం అనవసరమా? చావు మాత్రమే నా సమస్యకు పరిష్కారం” అనే నిర్ణయానికి వచ్చింది రిజ్వానా. మెల్లగా లేచి తన గది తలుపు తీసుకుని బయటకు వచ్చింది. తల్లిని చివరి చూపు చూసుకుందామని వెదికింది. వంటగది బయట తలుపుకు ఆనుకుని నిద్రపోతుంది. భర్త కొట్టిన దెబ్బలకు అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అలాగే నిద్రపోతోంది. పక్కనే తన ఇద్దరు చెల్లెళ్ళు అమాయకంగా నిద్రపోతున్నారు. వాళ్ళను ఆ స్థితిలో చూసి రిజ్వానా దుఖం ఆగలేదు.

‘వీళ్ళను ఇలా వదిలేసి నా చావు నేను చస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి?’ అని ఒక్క క్షణం ఆలోచించింది. మళ్ళీ వెళ్ళి దిండులో తల దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు.

కిటికీ నుండి వెచ్చగా పడుతున్న సూర్య కిరణాల వేడిమి భరించలేక కండ్లు తెరిచింది. మళ్ళీ అవే ఆలోచనలు చుట్టుముట్టాయి. స్నేహితురాలు మున్ని పరుగులాంటి నడకతో వచ్చింది.

“మామీ… మామీ… రిజ్వానా ఏదీ? ఎక్కడుంది..?” అంటూ కంగారుగా అడిగింది.

ఆ కంగారు చూసి భయపడ్డ ఆమె “ఏమైంది మున్నీ.. ఎందుకంత కంగారుగా ఉన్నావు. అసలేం జరిగింది. నాకు చెప్పు” అంది.

“లేదు మామీ…. రిజ్వానాకే చెప్తా… గదిలోనే ఉందా…” అంటూ అటువైపుగా పరిగెత్తింది. లోపల నుండి మున్నీ మాటలు వినిపించిన రిజ్వానానే ఆత్రంగా బయటకు వచ్చింది.

“ఏంటి మున్నీ… రియాజ్ గురించి ఏమైనా తెలిసిందా. తను నిన్ను కలిశాడా. నా గురించి తనకు చెప్పావా. నా కోసం వస్తానన్నాడా..?” అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించింది.

“రియాజ్ పై ఎంత ప్రేమ ఈమెకు. అతనిపై ఎంత నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమైపోతుందో ఏమో? కానీ చెప్పకపోతే ఎలా… చెప్పాల్సిందే. లేకపోతే ఇలా భ్రమల్లోనే బతికేస్తుంది” అని ధైర్యం తెచ్చుకుంది.

“లేదు రిజ్వానా తను నన్ను కలవలేదు. కానీ రియాజ్ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడంట. వాళ్ళ అమ్మానాన్ననే ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఊళ్ళో పెళ్ళి చేసి సైలెంట్ గా ఇక్కడకు తీసుకొచ్చారు. పెళ్ళి జరిగి కూడా పది రోజులయ్యిందంట” అని చెప్పింది.

ఆ మాటలు విన్న ఆమెకు నెత్తిన పిడుగుపడ్డట్టు అనిపించింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. మళ్ళీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.

కూతురు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో అని బయట తల్లి తల్లడిల్లిపోయింది. దబదబా తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయింది. రిజ్వానా కుక్కిమంచంలో పడి ఏడుస్తూనే ఉంది. “ఏమీ చేసుకోనని నాకు మాట ఇవ్వు రిజ్వానా” అంటూ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది.

“ఈ విషయం చెప్పడానికే మా అబ్బాకు తెలియకుండా మీ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఇంట్లో నన్ను చంపేస్తారు. నేను మళ్ళీ వస్తా” అని మున్నీ వెళ్ళిపోయింది.

రియాజ్ గురించి తెలిసి కూతురు ఏం చేసుకుంటుందో అని ఆ తల్లి భయపడింది. ఆ రోజంతా బిడ్డను క్షణం కూడా వదిలిపెట్టలేదు. రిజ్వానా రోజంతా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. రాత్రి పది దాటింది. తల్లి ఎంత బతిమలాడినా మెతుకు ముట్టుకోలేదు.

“అమ్మీ… కొద్ది సేపు నన్ను ఒంటరిగా వదిలెయ్, ఊరికూరికే తినమని విసిగించకు. నేనేమీ చేసుకోనులే, నువ్వెళ్ళి తినుపో” అంది చిరాగ్గా.

కొద్దిసేపు వదిలేస్తే మనసు కుదుటపడుతుందిలే అని తల్లి వచ్చేసింది. ఏమీ తినకుండా గ్లాసుడు నీళ్ళు తాగి అలా నడుం వాల్చింది. బాగా అలసిపోయింది వుంది. అయినా నిద్ర పట్టడం లేదు. రాత్రి పన్నెండు అయ్యింది.

రిజ్వానా గదిలో ఏదో అలికిడైనట్టు వినిపించి అటువైపు వెళ్ళింది. ఉరి వేసుకోవడానికి చున్నీని ఫ్యానుకు కడుతుంది రిజ్వానా. అది చూసి తల్లి గుండెలు బాదుకుంది.

“అంత పని చేయకే తల్లీ, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా, నిన్నే నమ్ముకున్న మేము ఎలా బతకాలి” అంటూ వెళ్ళి కూతురి కాళ్ళు పట్టుకుంది. ఉదయం తలుపు పగలకొట్టడంతో రిజ్వానాకు లోపలి నుండి గడియ పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది.

“అమ్మీ… అసలు నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా వల్ల కావడం లేదు. అందర్నీ ఎదిరించి పెండ్లి చేసుకున్నాను. ఎవరికీ సుఖం లేకుండా పోయింది. ఇన్ని రోజులు రియాజ్ వస్తాడని ఆశగా ఎదురు చూశా. ఇక

రాడని అర్థమయింది. ఇక నేనెందుకు బతకాలి. ఈ బిడ్డను ఎలా బతికించాలి. నన్ను చావనీ అమ్మీ” అంటూ తల్లి గుండెలపై పడి పొగిలి పొగిలి ఏడ్చింది.

“నీ కడుపులో బిడ్డ కోసం బతకాలి. నీతో పాటు ఆ బిడ్డను కూడా చంపేస్తావా? నిన్ను నమ్ముకుని చెల్లెళ్ళు ఉన్నారు. మీ అబ్బా ఇల్లు పట్టించుకోడు. నువ్వు కూడా ఇలా చేస్తే మేమేం చేయాలి. చచ్చిపోవడమే నీ నిర్ణయమైతే అందరం కలిసే చద్దాం” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ ఏడుపు విని నిద్ర పోతున్న ఇద్దరు చెల్లెళ్ళు కూడా వచ్చారు. పరిస్థితి అర్థమై అమ్మనూ, అక్కనూ చుట్టుకొని వాళ్ళూ ఏడుపు మొదలుపెట్టారు.

అలా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు, రిజ్వానా కండ్లు తెరిచే సరికి ఎదురుగా స్వాతి. “స్వాతీ నువ్వేనా… ఎప్పుడు వచ్చావు. నువ్విక

రావేమో అనుకున్నాను. కోపంతో నా మొఖమే చూడవనుకున్నాను” అంటూ తలదించుకుంది.

“ఏంటే నువ్వు చేసిన పని. ఇదేనా రిజ్వానా అంటే. నా స్నేహితురాలు ఎలా ఉండేది. ఏంటిది? పిరికి దానిలా చావాలనుకుంటావా?” అంటూ కోప్పడింది.

“అమ్మీ నీకు అన్ని విషయాలు చెప్పినట్టుంది” అంది.

“అవును చెప్పింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా నేను వున్నాననుకున్నావా లేదా? ఇంత జరిగినా నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు” అంది మళ్ళీ కాస్త కోపంగా.

“ఎలా చెప్పమంటావే? అప్పుడు అంటే, నువ్వు ఎంత చెప్పారు. ఇంకా చదువుకో, ఇప్పుడే పెళ్ళి ఎందుకని. అంటీ అయితే మరీ మరీ బతిమలాడారు.

కానీ నేను మీ మాట వినలేదు. చివరకు అంకుల్ కూడా చెప్పారు. ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఆంటీకి నా ముఖం ఎలా చూపించేది? అందుకే రాలేదు” సంజాయిషీగా చెబుతూ తలదించుకుంది.

“నీ మొహం. అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా. అసలిప్పుడు నాతో పాటు అమ్మ కూడా నీ దగ్గరకు రావాలనుకుంది.

కానీ యూనివర్సిటీలో సెమినార్ ఉంది. అమ్మ డిపార్ట్ మెంట్ హెడ్ కదా.. కంపల్సరీగా ఉ ండాలి. అందుకే వెళ్ళాల్సి వచ్చింది. నిన్ను నాతో మాటు మా ఇంటికి తీసుకురమ్మంది. నాన్న కూడా ఇదే చెప్పారు.” అంది. “అవునా… అంటీ నా గురించి అడిగారా? నిజమేనా..?” అంటూ అత్రంగా అడిగింది రిజ్వానా. “నేను నీకు అబద్దం చెప్తానా” “లేదు, నువ్వెప్పుడూ అబద్దం చెప్పవు. అప్పుడు మీ మాట విని ఉంటే ఎంత బాగుండేదో” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

“ఇప్పుడేం జరిగిందని ఇలా ఏడుస్తున్నావు? వాడు పోతే ఇక నీ జీవితమే పోయిందా? మేమంతా ఏంటి మరి?” కోప్పడింది స్వాతి.

“ఏడ్వక ఏం చేయమంటావే. తల్లినైతే రేపు నా బిడ్డ భవిష్యత్ ఏమిటి? ఎలా పెంచాలి? తండ్రి గురించి నిందించే లోకాన్ని నేనసలు ఎదుర్కొనగలనా?”.

“ఎవర్నే ఎదుర్కోవలసింది. ముందు నీకు నువ్వు సమాధానం చెప్పుకో చాలు. సూటి పోటి మాటలు అనే సమాజం గురించి ఆలోచించకు. అయినా మోసపోవడం కాదే తప్పు. మోసగించిన ఆ వెధవది. అటువంటి దరిద్రులదే తప్పంతా. ఇప్పుడు రోజులు మారిపోయాయే. ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లోలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఒంటరి తల్లులు ఎందరో ధైర్యంగా, ఇష్టంగా తమ బిడ్డలను పెంచుకుంటున్నారు. చివరకు పాస్పోర్టులో కూడా తండ్రి పేరు లేకుండా తల్లి పేరుతోనే విదేశాలకు వెళుతున్నారు. సర్టిఫికేట్లో తల్లి పేరు కోసం పోరాటం చేసి గెలిచిన

వారు ఎందరో ఉన్నారు. నీ బిడ్డకు తండ్రి లేడు. అయితే ఏం. తల్లి వుంది. తానే అవసరం ఉన్న చోట తండ్రిగా మారుతుంది. అది నువ్వే. ధైర్యంగా ఉండు. మేమంతా నీ ప్రతి కష్టంలో ఉన్నామని మరిచిపోకు”.

విశ్వాసంగా స్వాతి చెబుతున్న మాటలు ఎంతో ఊరటనిచ్చాయి. విషాద ఛాయల చీకటి అలుముకున్న ముఖంలో పున్నమి వెన్నెల వికసిస్తున్నది. అయినా చిన్న చిన్న భయాలేవో ఇంకా వదల్లేదు. తిరిగి ఇలా అడిగింది.

“నన్ను ఈ సమాజం బతకనిస్తుందా? అంతెందుకు మా నాన్నే నన్ను నీచంగా చూస్తున్నాడు”

“నాన్న గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వేమీ తప్పు చేయలేదన్న నిజాన్ని నీ మనసుకు చెప్పు. ప్రేమించడం తప్పెలా అవుతుందే. అవతలి వాడికి నీ ప్రేమను పొందే అర్హత లేదన్న నిజాన్ని ముందు నువ్వు

అంగీకరించు. మళ్లీ నువు కోరుకున్న రోజులు నీ ముందుకు వస్తాయి. మళ్ళీ ఉద్యోగం మొదలుపెడితే మీ నాన్నను దారిలోకి తేవడం ఎంతసేపు చెప్పు”.

“నువ్వు చెప్పేది నిజమే కానీ..” అంటూ ఏదో అనబోయింది రిజ్వానా. “చూడవే.. అనవసరంగా ఏదేదో అలోచించి మైండ్ పాడుచేసుకోకు. ఇప్పుడు నీ జీవితానికి ఏం కాలేదు. ధైర్యంగా ఉండు. హాయిగా బతుకు” అంది స్వాతి.

“నువ్వు చెప్తుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అసలు నేను ఇన్ని రోజులు ఇలా ధైర్యంగా ఉన్నానన్నా, అమ్మను హింసించే నాన్నను ఎదిరించి బతికానన్నా దానికి కారణం నీ స్నేహమే. నువ్విచ్చిన ధైర్యమే. ప్రేమ పిచ్చిలో పడి నిన్నూ, నా ధైర్యాన్ని ఇన్ని రోజులూ పోగొట్టుకున్నాను.

యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఆంటీ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గిరిజన మహిళల కోసం ఎంత చేస్తున్నారు. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన నువ్వు కూడా ఆంటీలాగే సమాజం అంటూ, సమస్యలంటూ పోరాడుతున్నావు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటావు. నీలాంటి స్నేహితురాలు ఉండడం నిజంగా నా అదృష్టం. కానీ నేను ఏం చేశాను? మీ మాటలు పట్టించుకోలేదు. నేను చేసిన చిన్న పొరపాటు నా జీవితం మొత్తాన్నే తలకిందులు చేసేసింది.” మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంది.

“నీకెన్ని సార్లు చెప్పాలి. పాత విషయాలు గుర్తు చేసుకోకు. మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ముందు ఆ ఏడుపు మానుకో. నీకు తెలుసుగా ఏడిస్తే నాకు నచ్చదని. అంతేకాదు. లోపల రూపుదిద్దుకుంటున్న బిడ్డకు అస్సలు మంచిది కాదు” అంది స్వాతి.

“అవును. నీకు ఏడిస్తే నచ్చదు. ఇక ఏడ్వనులే. నువ్వు చెప్పినట్టు కొత్త జీవితం మొదలుపెడతా. నువ్వు నా తోడుంటే చాలు. ఈ ప్రపంచాన్నైనా జయిస్తా. నా బిడ్డకు ధైర్యంగా జన్మనిస్తా. మంచి మనిషిగా తీర్చిదిద్దుతా. ఉ ద్యోగం చేసుకుంటూనే పై చదువులు చదువుకుంటాను. అమ్మను, చెల్లెళ్ళను కూడా చూసుకుంటాను. అంతే కాదు నీలా, అంటీలా సమాజం కోసం కూడా నాకు చేతనైనది చేస్తా. నాలా ప్రేమ పేరుతో మోసపోతున్న ఆడపిల్లలకు అండగా ఉంటా” గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని అంది రిజ్వానా.

“అద్దీ లెక్క! స్వాతీ ఫ్రెండంటే ఆశామాషీగా ఉంటుందా ఏమి? నాకు తెలుసు. నువ్వు తలచుకుంటే సాధించగలవు. నీకెలాంటి సాయం కావాలన్నా చేసేందుకు నేనూ. అమ్మా సిద్ధంగా ఉన్నాము” అంటూ స్నేహితురాలిని ఓ నిమిషం గాఢంగా కౌగిలించుకుని మంచంపై కూర్చోబెట్టి అన్నం ముద్దలు కలిపి పెట్టింది.

“అంటీ, దీన్ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళతాను. వాతావరణం కాస్త మారితే మనసు కాస్త కుదటపడుతుంది” “సరే స్వాతమ్మా… ఆ పని చెయ్యి. కొన్ని రోజులు నీతోనే ఉంచుకో” అంటూ బట్టలు సర్దే పనిలో పడింది రిజ్వానా

“అంతా ఓకేనే… మరి ఆ రియాజ్ ను అలా వదిలేయాల్సిందేనా” అంది రిజ్వానా. “అలా ఎలా వదిలేస్తాం. వాడి సంగతి నాన్న చూసుకుంటారు”.

“అవును స్వాతి. నిజమే… అంకుల్ లాయర్ కదా, ఆ సంగతే మర్చిపోయా. ఇలాంటి వాళ్ళకు కచ్చితంగా శిక్ష పడాలి. ఆడపిల్లల్ని ప్రేమించి మోసం చేస్తారు. మళ్ళీ పెండ్లి చేసుకుని హాయిగా బతికేస్తారు. చట్టాలంటే అసలు భయం లేకుండా పోయింది. ఎలాగైనా తప్పించుకోవచ్చని వీళ్ళ ధీమా. వీడికి అంకులే సరైన మందు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందే. నువ్వొచ్చి నాకు కొత్త ఊపిరి పోశావు” అంటూ నవ్వుతూ స్వాతి మెడచుట్టూ తన రెండు చేతులు వేసి అల్లేసుకుంది రిజ్వానా.

April 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఇంద్రసేన

by Sudharshan Chintapatla April 17, 2022
written by Sudharshan Chintapatla

                   మూలం: కలైగ్నర్ ఎం.కరుణానిధి                   అనువాదం : చింతపట్ల సుదర్శన్

అద్భుతమైన అందం ఆమెది. ఆమె ముఖంలో కాంతి ఆమె సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్నది. ఆమె ధరించిన ధవళ వ్రస్తం ఆమె నడకలోని హొయల్ని ప్రదర్శిస్తున్నది. తెల్లని ఆమె కంఠాన్ని నలుపురంగు పూసల కంఠాభరణం అలంకరించి వుంది. ఆమె తన అందమైన కేశాలను చుట్టగా చుట్టింది. ఆమె తలమీద ఒక బుట్ట ఉన్నది. తల మీద బుట్టటను మోస్తూ వీధి వెంట ఆమె నడుస్తుంటే ఒక అసమానమైన సౌందర్యరాశి కదిలిపోతున్నట్టుంది. చీకటిగా ఉన్న ఆ వీధిలో ఆమెను చూసిన వారెవరైనా ఆమె దివి నుండి భుమికి దిగివచ్చిన నక్షత్రమా అనుకుంటారు.

బంగారు వర్ణంలో ఉన్న ఆ సౌందర్య రాశి తలమీద ఉన్న బుట్టలో నుంచి భయంకరమైన దుర్వాసన వస్తున్నది. ఆ బుట్టలో ఒక కుళ్ళిన ఆకారం వుంది. బుట్టను మోయడం భారంగా ఉన్నందున ఆమె చేతులు కొంచెం వణుకుతున్నవి. అయినా ఆ అందగత్తె విశ్రమించకుండా నడుస్తూనే ఉంది. ఆమె అద్భుతమైన అవయవ సౌష్ఠవం కవులకు విషాదంలో కూడా అందం సహజత్వం కోల్పోదని ఋజువు చేస్తుంది.  బుట్టలో ఉన్న కుళ్ళిన దేహం ఉన్న ఆకారం తను అనుభవించబోతున్న ఆనందాన్ని ఊహించుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నది. ఆ ఆకారం ఒక పురుషుడిది!

వికారంగా ఉన్న ఈ మనిషి తన దేహంలోని పావుభాగాన్ని ఇదివరకే పోగొట్టుకున్నాడు. ఆయన మామూలు మనిషేం కాదు. గొప్ప మహర్షి. విద్య, సంపద, బలం మనిషిని మార్చేసినట్టుగానే అనారోగ్యం కూడా మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ మనిషి కుష్టురోగి. ఈయన తన భార్య తల మీద ఉన్న బుట్టలో ప్రయాణిస్తున్నాడు.

“ఏయ్! ఏమిటానడక! తొందరగా నడవలేవా?” అన్నాడు పతి.

‘స్వామీ నా జీవన సహచరుడా నేను వేగంగానే నడుస్తున్నాను’ అంది సతి.

‘త్వరగా త్వరత్వరగా పద ఇంద్రసేనా నువ్వు కింద పడాల్సి వచ్చినా నన్ను మాత్రం క్రిందపడవేయకు సుమా!’

‘అలా అనకండి స్వామీ!’ నా కంఠం నుంచి ప్రాణం పోయినా సరే మిమ్ములను క్రింద పడనీయను. నా తలమీద బుట్టలో ఉన్నది అమ్మకానికి సరుకు కాదు. మీరు నాకు అమూల్యమైన రత్నం. మిమ్మల్ని ఎలా కింద పడేస్తాను?’

కుష్టురోగి అయిన భర్తను తలపై బుట్టలో మోస్తున దేవసేన అందమైన ముఖాన్ని దుఃఖం కమ్మసేంది. ఆమె తన భర్తను ఎక్కడికి తీసుకువెళ్తున్నది? ఆమె భర్త ఏదైనా పవిత్ర తీర్థంలో స్నానమాడి దైవదర్శనం చేసుకోవాలనుకుంటున్నాడా? కాదు… కాదు, ఆ మనిషి తన భార్యను వాహనంగా ఉపయోగిస్తూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ ప్రయాణం ఏ దేవాలయానికీ కాదు, ఏ దేవుని సేవకూ కాదు.

ఈ ప్రయాణం ఒక వైశ్య గృహానికి. దేని కోసం? ఆమెను తన వృత్తి మాని భగవధ్యానంవైపు దృష్టి మళ్లించమని చెప్పడానికా? ఆ కుష్టురోగి ఉద్దేశ్యం ఆ వేశ్యా గృహాన్ని ఒక పవిత్రస్థలంగా మార్చేయడమా? కాదు.

ఆ ఋషి ప్రయాణం వేశ్య దగ్గరికి ఆ ఋషి ఉద్దేశ్యం ఆ వేశ్యంలో సుఖించడమే. ముక్కంటి అయిన శివుడ్ని ఆయన చూడాలనుకోవడం లేదు. తన రెండు కళ్ళను వేశ్య జతకళ్ళతో కలిపి ఆమెను కౌగలించుకోవాలనుకుంటున్నాడు.

తన భర్తకు ధనంతో సుఖాన్ని అందించడానికి ఆయనను తలమీద మోసుకుపోతున్న స్త్రీ పూర్తిగా వికసించిన గులాబీ పువ్వులా వుంది. ఈ గులాబీనే కుళ్ళిపోయిన తేనెటీగను ఒక ఎండిపోయిన పుష్పం దగ్గరికి మోసుకుపోతున్నది.

వాళ్ళిద్దరూ సుఖాన్ని అందించే వనిత ఇంటిని సమీపించారు. ఇంద్రసేన కష్టం తీరబోతున్నది. గమ్యం చేరడంతో బుట్టలో ఉన్న భర్త ఆందోళన తగ్గింది. ఇంద్రసేన బుట్టను దించి నేలమీద పెట్టింది. ఆమె అలసిపోయిన శరీరాన్ని నొప్పిగా ఉన్న ఎముకలను సరిచేసుకోవడానికి ఒళ్ళు విరుచుకుంటూ అన్ని వైపులకూ తిరిగింది.

అక్కడ కవి ఎవరైనా ఉండి ఉంటే ఆమెను ఇంద్రధనుస్సుతో పోల్చి ఉండేవాడు. చిత్రకారుడు ఎవరైనా ఉండి ఉంటే ఆమె చిత్రాన్ని గీసి ఉండేవాడు. ఇంతటి సౌందర్యవతి భర్త సుఖం కోసం సమాజం అంగీకరించని స్త్రీ ఇంటికి ఆయనను తలమీద బుట్టలో మోస్తూ తీసుకువచ్చింది.

ఇంద్రసేన సున్నితమైన చేతిలో ఆ ఇంటి తలుపు తట్టింది. తలుపు పూర్తిగా తెరవడానికి ముందు ఒక ముఖం బయటకు తొంగి చూసింది. ముడతలు పడ్డ ముఖంలో రక్తం స్రవిస్తున్న చెంపలతో ఉన్న ఆ ఋషి తీవ్రమైన కామవాంఛతో సుఖం… నిజమైన సుఖం అని అరవసాగాడు. నొప్పిగా ఉన్న ఎముకలను సరిచేసుకోవడానికి ఒళ్ళు విరుచుకుంటూ అన్ని వైపులకూ తిరిగింది.

అక్కడ కవి ఎవరైనా ఉండి ఉంటే ఆమెను ఇంద్రధనుస్సుతో పోల్చి ఉండేవాడు. చిత్రకారుడు ఎవరైనా ఉండి ఉంటే ఆమె చిత్రాన్ని గీసి ఉండవాడు. ఇంతటి సౌందర్యవతి భర్త సుఖం కోసం సమాజం అంగీకరించని స్త్రీ ఇంటికి ఆయనను తలమీద బుట్టలో మోస్తూ తీసుకు వచ్చింది.

ఇంద్రసేన సున్నితమైన చేతితో ఆ ఇంటి తలుపు తట్టింది. తలుపు పూర్తిగా తెరవడానికి ముందు ఒక ముఖం బయటకు తొంగి చూసింది. ముడతలు పడ్డ ముఖంలో రక్తం స్రవిస్తున్న చెంపలతో ఉన్న ఆ ఋషి తీవ్రమైన కామవాంఛతో సుఖం.. నిజమైన సుఖం అని అరవసాగాడు.

బయటకు వచ్చిన వేశ్య తల మీద చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఆ చేతికి వేళ్ళు లేవు.

ఇంద్రసేన అంది, ‘ఓ స్త్రీ నేను చెప్పేది విను. ఈయన నా భర్త. నువ్వు కావాలని కోరుకుంటే తీసుకువచ్చాను. ఆయనను సంతోషపెట్టు.

వేశ్యకు ఆశ్చర్యంతో మాట పెగలలేదు. ఒక భార్య తన భర్తను వేశ్య ఇంటికి తీసుకురావడం జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నాను అని అనుకుంటూ బుట్టలో ఉన్న కుష్టురోగివైపు ఈసడింపుగా చూసింది. ఆయన  బుట్టలో నుంచి బయటకు రావడానికి ముందు ఇంద్రసేన వేశ్యకు బంగారు నాణాల సంచీ అందించింది. వేశ్య కళ్లు మెరిశాయి. ఆమె కుష్టురోగిని కావలించుకుని స్వర్గసుఖాలు అందించడానికి తన పడకగదికి తీసుకుపోయింది.

ఇంద్రసేన భారంగా నిట్టూర్చింది. ఇంటి తలుపుముందు బుట్టను ఉంచి కాపలా వాడితో ‘నేను ఉదయాన్నే తిరిగి వస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయింది.

ధూళి కప్పిన పుష్పగుచ్ఛంలా ఉన్న ఇంద్రసేన ఎవరో వెనుక నుంచి ‘ప్రియమైన ఇంద్రసేనా క్షణం ఆగు’ అనడంతో నడక ఆపింది. తమ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉండే మరో ఆశ్రమపు స్త్రీ పరుగెత్తుకు వచ్చింది.

‘నువ్వా! ఉలగా! నువ్వు ఈ వీధికి ఎందుకు వచ్చావు’ అని అడిగింది. బుగ్గలమీది నుంచి కారుతున్న కన్నీటిని తుడిచేస్తూ ‘ఉద్యానవనానికి వెళ్తున్న నేను నిన్నూ చూసి వచ్చాను. ఏమీ అనుకోనంటే ఒక విషయం అడగనా’ అంది ఉలగ. ‘ఏమిటో అడుగు’ అంది ఇంద్రసేన నవ్వడానికి ప్రయత్నిస్తూ,

‘నీకు నీ భర్త అంటే ఎంతో ప్రేమ అని నాకు తెలుసు. కానీ ఆయనను నువ్వొక వేశ్య ఇంటికి తీసుకురావడాన్ని నా మనస్సు అంగీకరించడం లేదు.’

‘మాట్లాడకు ఉలగా! స్త్రీకి భర్తే దైవం. భర్త కోరికలు తీర్చడమే భార్య కర్తవ్యం. అనారోగ్యం కారణంగా నా భర్త ఆకారం ఇతరులకు నచ్చకపోవచ్చు. కానీ నా కంటికి మాత్రం ఆయన అందగాడే. నా భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు సలహా ఇవ్వకు.’

‘క్షమించు ఇంద్రసేనా. నేను నీ ప్రేమను భక్తిని అపార్థం చేసుకున్నాను. నీలా భర్తను అర్థం చేసుకునే స్త్రీ పధ్నాలు లోకాల్లో ఎక్కడా ఉండదు.’

‘నన్ను అర్థం చేసుకుంటే చాలు ఉలగా నేను నిన్ను క్షమించాల్సిన పనిలేదు. నువ్వు కూడా నాలా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించు. నా లాంటి పతివ్రత అడుగుజాడల్ని అనుసరించు’ అంటూ ఇంద్రసేన తమ ఆశ్రమంవైపు నడిచింది. ఉలగకు తన తప్పు తెల్సి వచ్చింది. మహా పతివ్రత అయిన ఇంద్రసేన మాటలను పునశ్చరణ చేసుకుంటూ వెళ్తుంటే ఒక యువకుడు వచ్చి తన చేతులతో ఆమె కళ్ళు మూశాడు. తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ ఉద్యానవనానికి వెళ్ళారు.

దారి పొడవునా దుఃఖపడుతూ ఇంద్రసేన ఆశ్రమం చేరుకుంది. కిందపడి పెద్ద పెట్టున శోకించింది. ఆమె నీలికళ్ళ నుంచి కన్నీరు కాలువ కట్టింది. పున్నమి చంద్రుడ్ని మబ్బులు దాచేసినట్టు చిందరవందరగా ఉన్న నల్లని జుట్టు ఆమె ముఖాన్ని కప్పేసింది.

తోటలో నుంచి ఒక పాట గాలిలో తేలుతూ వచ్చింది. ఇంద్రసేన నీళ్ళు నిండిన కళ్ళతో ఆ పాట విన్నది. ఇది ఉలగ కంఠమే అనుకుంది. ఒక పురుష కంఠం కూడా వినిపించింది. ఇంద్రసేనను పవిత్రమైన స్త్రీగా అంగీకరించిన ఉలగ తన ప్రియుడితో యుగళగీతం ఆలపిస్తున్నది. ఉలగ వయస్సు నా వయస్సు ఒకటే. నేను ఆమె కంటే అందగత్తెను కానీ నన్ను ప్రేమించే వాడు లేని దాన్ని. ఆమె ప్రియుడు ఆమె చెవిలో గుసగుసలాడుతుండి ఉంటాడు అనుకుంది ఇంద్రసేన.

ఇంద్రసేన తమ ఇదివరకు ఎన్నడూ ఊహించనిది ఊహించసాగింది. ఆమె ముఖం మళ్ళీ కన్నీటితో తడిసింది కాని ఆమె కన్నీటిని తుడవలేదు. ఇంద్రసేన లాగానే ఉన్న మరో యువతి గదిలో ప్రవేశించింది. ఇద్దరూ పక్కపక్కనే ఉంటే ఎవరు ఎవరో కనుక్కోవడం కష్టమే. ఆ స్త్రీ వచ్చి ఇంద్రసేన పక్కనే కూచుంది. ఇంద్రసేన ‘రా! రా! నా హృదయమా! నా అంతరాత్మా’ అంటూ ఏడుస్తూనే స్వాగతం పలికింది.

‘ఇంద్రసేనా! ఎందుకు దుఃఖిస్తున్నావు? అంది అంతరాత్మ.

‘నీకు తెలియదా నా హృదయమా? నేను ఎడారి ఇసుకలో క్రిమిగా మారానని, తోటలో నుంచి ప్రేమపక్షులపాట వినిపిస్తున్నది కదా. కోరికకు సంబంధించిన అలాంటిపాట వింటే నా వంటి వయసులో ఉన్న స్త్రీకి ఎలాంటి భావాలు కలుగుతాయో నీకు తెలుసని నాకు తెల్సుకానీ నువ్వు నన్ను శాంతపరచడానికి మౌనంగా ఉంటావు.’

‘నువ్వన్నది అక్షరాలా నిజం ఇంద్రసేనా. ఉలగ కూడా నువ్వు పతివ్రతావని అన్నది. ఆ కీర్తికాంతిలో నువ్వు తృప్తిగా ఉండవచ్చు కదా!’

‘నువ్వు చెప్పు నా హృదయమా! నిజం చెప్పు నేను పతివ్రతనా ఎలా? ఎలా?’

‘నువ్వు కుష్ఠురోగి అయిన నీ భర్తను ఒక వేశ్య దగ్గర దించి వచ్చావు. ఖచ్చితంగా నువ్వు పతివ్రతవే.’

‘వేళాకోళం ఆడకు హృదయమా. నేను ఒక కుష్టురోగితో కోరికలు తీర్చుకోలేను. కానీ ఆయన నన్ను సుఖం యివ్వమని కోరుతాడు. ఆయనను కనీసం కౌగలించుకోవడానికి నా చేతులు వణుకుతాయి. అందుకే వేశ్య ఇంటికి పంపివచ్చాను. తన కామదాహాన్ని తీర్చుకుంటడని. నా అందానికి హాని కలగదని. అర్థం అయిందా నా హృదయం’

‘ఉలగ మాత్రం నీకు నీ భర్త పట్ల ఉన్న ప్రేమను నమ్ముతున్నది. తన తల మీద కుష్టురోగి భర్తను తలమీద మోసుకుని వేశ్య దగ్గరికి తీసుకెళ్లిన పతివ్రత అనుకుంటున్నది.’

‘నేను నా భర్తను తలమీద మోసుకు వెళ్ళిన మాట నిజం. నేను నా తలమీద బుట్టను మాత్రమే మోసుకువెళ్తాను. ఆయన గంపలో ఉన్నాడు. ఒక కుష్టు రోగిని చేతులతో ముట్టుకోవడానికి తలమీద మోయడానికి నేనేం పిచ్చిదాన్నా!’

‘నిన్ను కూడా ఉలగ ఉన్నది. నీ భర్త నిన్ను కఠినంగా దూషించినా నువ్వు ఒక్కమాట కూడా మారు మాట్లాడవని?

‘కుష్టురోగి అయిన భర్త మాటలు నేను పట్టించుకోను. నేను తిరిగి మాట్లాడాలంటే ఆయన పక్కనే నిలబడి మాట్లాడాల్సి వస్తుంది. అది నాకు అసహ్యం. అందుకే నేను ఆ కుష్టురోగిని అలా మొరగనిస్తాను.’

‘అలాగా! ఏదయితే యేంలే. ఇప్పుడు నువ్వు భర్తకు అంకితమయిన భార్యగా పేరు తెచ్చుకున్నావు. పాతివ్రత్యానికి నువ్వు ప్రతిరూపం అని ప్రపంచం మెచ్చుకుంటుంది’.

‘నాలో సజీవంగా ఉన్న అగ్నిపర్వతం గురించి ఎవరికి తెలుసు? ఈ కీర్తివల్ల యవ్వనాన్ని వృధా చేస్తున్న నాకు ఏమి లాభం? నాకు కావల్సింది దాంపత్య సుఖం. దాంపత్య సుఖాన్ని అనుభవించే మార్గం చెప్పు అంతరాత్మా!’

‘ఇంద్రసేనా నీ అంతరాత్మగా నిన్ను ఆశీర్వదిస్తాను. వీలయినంత త్వరగా ఈ జన్మను ముగించు. మరుజన్మలో నువ్వు ద్రౌపదిగా జన్మిస్తావు. భర్త ఉండీ నువ్వు ఏ ఆనందాన్ని పొందలేకపోయావు. నీ జీవితం నిరుత్సాహంగా నిరాశాజనకంగా గడిచిపోయింది నీ మనస్సుకు ప్రశాంతత అన్నది ఎప్పుడూ లేదు. మరు జన్మలో నువ్వు ఐదుగురు భర్తలతో జీవిస్తావని నేను గట్టిగా నమ్మతున్నాను.’

‘ఐదుగురు పతులా? నువ్వు చెప్పేది నిజమేనా?’

‘నిజమే. నీ కోసం కొత్త జీవితం రెండూ ఒకటే అర్థం చేసుకో నా ప్రియసఖీ’.

ఇంద్రసేన ఆనందానికి అవధుల్లేవిప్పుడు. అంతరాత్మను గాఢంగా ఆలింగనం చేసుకుంది. ఆమె దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులుగా మారాయి. ఆ రోజు ఆశ్రమమంతా ఒక మధురమైన గానం ప్రతిధ్వనించింది.

కలైగ్నర్ కరుణానిధి ప్రసిద్ధ భారతీయ రచయిత, రాజకీయ నాయకుడు. రెండు దశాబా్దల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన కరుణానిధి 1924లో జన్మించి 2018లో అస్తమించారు. ్రదవిడ మున్నేట్ర కజగమ్ పార్టీ నాయకుడైన కరుణానిధి కుమారుడు స్టాలిన్ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి. కరుణానిధి తమిళభాషలో కథలు, నాటకాలు, నవలలు రాశారు. సంస్కరణ, వ్యంగ్యం, అధిక్షేపం ఆయనకు కథలో ప్రత్యేకత. పురాణకథల ఆధునిక రూపం కల్పించిన కరుణానిధి కథల్లో ‘ఇంద్రసేన’ ఒకటి.

ఇంద్రసేన నలదమయంతుల కుమార్తె. ఆమె భర్త మౌదల్యుడు స్త్రీ మనస్తత్వాన్ని ఈ కథలో ఆధునికంగా చిత్రించాడు కరుణానిధి. హిందూ పురాణాల ప్రకారం ఇంద్రసేన మరుజన్మలో ద్రౌపదిగా జన్మించింది.

April 17, 2022 2 comments
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

నవకవులకు కరదీపిక-‘దాస్యం దిక్సూచి’

by Burra Vijayalaxmi Nagraj April 15, 2022
written by Burra Vijayalaxmi Nagraj

హృదయ స్పందనకి, మస్తిష్కపు మథనానికి వెల్లువైసాగే భావోద్వేగాల పరంపరకి అక్షరరూపమే కవిత్వం.అయితే… రాసేది అంతా కవిత్వమేనా? కవిత్వం రాయాలని సంకల్పించిన ప్రతి మదిని తొలిచే ప్రశ్న….

తుప్పల్ తెప్పల్ మాటల్ రాల్చి కవిత్వమని మొరాయించకు
కవిత్వాన్ని వంచించకు
వచనమై సోలిపోతావ్

అంటారు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ గారు తమ రహస్యోద్యమం గ్రంథంలో.

మరి పది కాలాల పాటు సాహితీ ప్రపంచంలో నిలిచి పోవాలి అంటే ఏ విధంగా కవిత్వం రాయాలి? కవిత్వం రాయాలి అని నిర్ణయించుకున్న ప్రతి కవి మదిలో మెదిలే ఆలోచనలు ఇవి. ఏం చేయాలి ?ఎలా రాయాలి రాసేదంతా కవిత్వమేనా? అంటూ ఎన్నో సందేహాలతో సతమతమవుతూ వుంటారు. అలాంటి నవ కవులకు కరదీపిక లాంటిది దాస్యం సేనాధిపతి గారు రచించిన దిక్సూచి .

కథ, కవిత్వం, సమీక్షకులుగా, విమర్శకులుగా …అంశం ఏదైనా ఆధునిక సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు దాస్యం సేనాధిపతి గారు. వారు ఇప్పటికే వివిధ ప్రక్రియల్లో 14 అమూల్యమైన గ్రంధాలను వెలువరించారు. వారి కలం నుండి వెలువడిన పదిహేనవ గ్రంథం ఇది. సీనియర్ కవి ,రచయిత శ్రీ దాస్యం లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నేటికవిత అంతర్జాల సమూహంలో సలహాదారులుగా ఉంటూ… 80 వారాలపాటు నిర్విఘ్నంగా దాస్యం సేనాధిపతి గారు “మనలో మనం” శీర్షిక పేరుతో నిర్వహించిన కవిత్వ కార్యశాలకు అక్షర రూపం… అందులో నుండి మరింత మంది కొత్త కవులకు ఉపయుక్తంగా ఉండే విధంగా వ్యాసాల రూపంలో అందించబడిన మార్గదర్శి …ఈ “దిక్సూచి”.

ఈ గ్రంథంలో కవిత్వమంటే ఉబుసుపోక చేసే వ్యాపారమో… కాలక్షేప వ్యాపకమో కాదు… కవిత్వమంటే కవి చేసే సామాజిక చింతనకు కళారూపం ,సామాజిక పరిస్థితుల మీద కవి ప్రకటించే తీర్పు కవిత్వం అని ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి వాక్యాలను సందర్భోచితంగా దాస్యం గారు ఉదహరించిన తీరు బాగుంది.

ఉత్తమ కవిత్వానికి ఉండవలసిన లక్షణాలను గురించి చెబుతూ… మంచి భావన, హత్తుకునే భాష, మనసును మురిపించే శిల్పం… మూడింటి మేళవింపు మంచి కవిత అని ప్రసిద్ధ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి అభిప్రాయాలను ప్రస్తావించారు .కవితా వస్తువుకు కాదేది అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు కవితా వస్తువును ఈ ఎంపిక చేసుకోవడానికి వస్తువు ఏదైనా సరే…కవితా వస్తువు ఎంపికలో వైవిధ్యం చూపాలని , సమకాలీన అంశాలను కవితా వస్తువుగా తీసుకుంటూ… పాఠకుల్లో ఆలోచన పెంచే విధంగా ఉండాలి అంటారు దాస్యం గారు.

కవిత శీర్షిక అంశానికి లోబడి ఉంటూ,ఆసక్తిని పెంచేలా , సూక్ష్మంలో మోక్షం అన్నట్లు శీర్షిక మొత్తం కవితా వస్తువును ప్రతిబింబించేలా ఉండాలి అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఎత్తుగడ అంటే కవితకు స్వాగత తోరణంలా ఉండాలి …పాటకు పల్లవి ఎంత ముఖ్యమో వచన కవితకు ఎత్తుగడ అంత ముఖ్యం అని… ఎత్తుగడ యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు. ఎత్తుగడ ఏవిధంగా ఉండాలో విపులంగా చర్చిస్తూ డాక్టర్. రాధేయ గారి రెప్పలు మోయలేని దుఃఖం కవిత లోని ఎత్తుగడ

“నేనీ మధ్యనే
మందహాసాన్ని జారవిడిచుకొని
ప్రశ్నార్ధకాన్ని మోస్తున్నాను”.

ని ఉదహరిస్తూ…ఎంత ఆర్ద్రంగా పాఠకున్ని ఎత్తుగడతో ఆకట్టుకోవచ్చో వివరించారు.

కవిత్వ నిర్వహణ మరియు నిర్మాణ క్రమం గురించి తెలియజేస్తూ ఎంత ప్రయోజనకరమైన వస్తువును ఎంచుకున్నా అది ఎక్కువమంది పాఠకులను చదివించ లేనప్పుడు ఆ రచన వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి కవితకు ఎత్తుగడ ప్రారంభ పంక్తులు ఎంత ముఖ్యమో , నిర్వహణ నిర్మాణ క్రమంలో అభివ్యక్తి విశ్లేషించడానికి వినియోగించబడే భాష, పదబంధాల ప్రయోగంలో ఔచిత్యం మరియు కవితను గాఢంగా మలచడానికి ప్రతీకలు, ఉపమానాలు, వర్ణనలు, పోలికలు విషయంలో కవి అంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అని… కవితను అందంగా ,ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా, కవితాత్మకంగా గాఢంగా మలచడానికి శిల్పం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కవిత్వంలో అలంకారాల ప్రయోగం గురించి చెబుతూ మంచి కవితకి అలంకారాలు ఆభరణాలు అని చక్కగా పోల్చారు. ప్రతి అలంకారాన్ని ఉదాహరణలతో విశ్లేషిస్తూ ఒక్కో అలంకారాన్ని విడమర్చి వివరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది.

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన” మరణం నా చివరి చరణం కాదు” అనే కవితలో

మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రు కణం కాదు …
నిర్విరామంగా నిత్య నూతనంగా
కాలం కలం అంచున చిగురించే నెత్తుటి…
ఊహను నేను
కవితలో ఉపమానాలు కవి యొక్క అభ్యుదయ భావాలకు అద్దం పట్టాయి అని చెబుతూ కవితలో ప్రయోగించబడిన ప్రతి పదబంధాలను ఎంతైనా విశ్లేషించుకోవచ్చు అంటారు.

కవి చెప్పదలచుకున్న భావాన్ని స్వీకరించబడిన వస్తూ ఆధారం చేసుకుని ఒక్కో పంక్తిలో ఎన్ని అక్షరాలు ఉండాలో నిర్ణయించుకుంటూ… భావవ్యక్తీకరణకు భావధార ననుసరించి ఒక్కో భావాన్ని ఆయా భాగాల్లో ఆవిష్కరించుకుంటూ భావ గణాలను విభజించుకోవాలన్నారు. కవిత్వం నిర్వహణలో క్లుప్తత గుప్తతకు పెద్దపీట వేస్తూ పునరుక్తి దోషం రాకుండా కవితని ఆకర్షణీయంగా మార్చుకోవాలన్నారు ప్రముఖ కవి కోటం చంద్రశేఖర్ గారు తమ ఇష్టపది కవితా సంపుటి లో సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి గురించి రాసిన ఆయన కవితని ఈ అంశానికి ఉదహరించడం సందర్భోచితంగా ఉంది.

ఆయన కంచు
కరిగే మంచు కూడా
ఆయన ఉరుము,చినుకయ్యే మేఘం కూడా

అంటూ రాసిన ప్రతి పాదం ప్రతి పద బంధం లో అద్భుతంగా సిద్ధారెడ్డి గారి మూర్తిమత్వాన్ని సంక్షిప్త పదాలతో క్లుప్తంగా గుప్తంగా ఏ విధంగా రాయాలో నమూనీకరించారు .

కవిత్వం పఠితుల హృదయాలను కదిలించేలా సమాజంలో మృగ్యమై పోతున్న విలువల గురించి ఆవిష్కరించే క్రమంలోవచన కవిత్వ సృజనలో వక్రోక్తి, ఆర్ద్రతలను ప్రతిబింబిస్తూ మనసులను కదిలించేదిగా ఉండాలి. అలాగే కవిత్వం నిర్మాణంలో ధ్వని, ప్రాస, విసురు, లయ, భావలయ, మెటానమీ, ప్రతీకాత్మక అభివ్యక్తిలు కవితను గాఢంగా మార్చడానికి ఉపయోగపడతాయని తెలియజేస్తూ కవయిత్రి కే రాధిక గారు అన్నదాత శీర్షికతో రాసిన కవితలోని చక్కని ఎత్తుగడ ఉదహరించారు.

చినుకమ్మ పలకరించనిదే
నేలమ్మ నవ్వదు…
నేలమ్మ నవ్వనిదే… చిగురాకు వేయదు…
చిగురాకు వేసి… గింజ చేతికి వస్తే గానీ …
రైతన్న కడుపు నిండదు.

అంటూ అలతి అలతి పదాలలో చిక్కనైన భావాన్ని నిక్షిప్తం చేశారు.

ఎంపిక చేసుకున్న కవితా వస్తువును శక్తివంతంగా సంగ్రహంగా ధ్వని యుక్తంగా చెప్పడానికి ఉపకరించే భావచిత్రాల గురించి తెలియజేస్తూ.. ఒక భావ చిత్రాన్ని కవితలో దృశ్యం మానం చేసే క్రమంలో అది అనుభూతిని పెంచే అంశంగా ఉంటూ ..పాఠకులకు ఉత్తేజ పరిచే విధంగా పదబంధాల ప్రయోగం ఉండాలి. ఎందుకంటే భావ చిత్రం కంటికి కనిపించక పోయినప్పటికీ పాఠకుడు తన పంచేంద్రియాల ద్వారా అనుభూతి చెందుతాడు . కవితా వస్తువులు సమర్థంగా అభి వ్యక్తీకరించేందుకు ఔచిత్యమైన ఉపమానాలు వర్ణనలు చేయడానికి భావచిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి .ఈ అంశాన్ని గురించి విశదీకరించడానికి సినారే మరియు అహ్మద్ ఫైజ్ ,జున్ను లక్ష్మి గార్ల కవిత్వాన్ని ఉదహరణగా తీసుకోవడం సందర్భానికి తగినదిగా ఉంది.

కవిత్వంలో విరామ చిహ్నాలు గురించి తెలియజేస్తూ కవితలో పాదాన్ని ఎక్కడ విరవాలో తెలుసుకోవడం ఒక కవిత్వ నిర్మాణాత్మక కళ. కవితలో ఒక పంక్తి/ వాక్యం/ పాదం అంత మైనప్పుడు ఒక క్షణం విరామం తీసుకుంటాం. తర్వాతి పాదాన్ని చదివే ముందు ఆలోచిస్తాం… కాబట్టి కవితలు పదాన్ని సరైన చోట ముగించడం వల్ల గొప్ప అర్థాన్ని ఇవ్వగలిగిన వాళ్లమవుతాం అంటారు. ఫుల్ స్టాప్, కామ, సెమీ కోలన్, కోలన్ , హైఫన్ ,బ్రాకెట్ వంటి విరామ చిహ్నాలు కవితా పాదాల్లో సరైన విధంగా ఔచిత్యరీతిలో… ప్రయోగించడం వల్ల కవితలు మరింత ప్రభావవంతంగా శక్తివంతంగా మలచవచ్చు అంటారు విరామ చిహ్నాలకు కవితల్లో సముచిత స్థానం కల్పిద్దాం అంటూ సూచించారు ఇలా విరామ చిహ్నాలతో పదబంధాలు బలంగా ప్రయోగిస్తూ… కోటం చంద్రశేఖర్ గారు రాసిన ఒక గులాబి కథ అనే కవితని ఉటంకించారు.

మానవతే మాయం, అత్యంత హేయం
కుళ్ళిన చర్య, దారి మళ్లిన చర్య-
మగాడైతే గర్వమా, మృగాడై కీచకపర్వమా
పదే పదే ఆవిష్కృతం
పదే పదే పునరావృతం
ఇది “అణకువ అణచివేత” లో గాయపడ్డ ఒక గులాబీ కథ
” ఆత్మాభిమానం గుండెకోతలో” రాలిపడ్డ ఒక గులాబీ కథ

అవసరం ఉన్న చోట అవసరమైనవే సందర్భోచితంగా భావ గణం కవితా వస్తువుకు పుష్టిని ఇచ్చే విధంగా చిహ్నాల ప్రయోగం ఉండాలి అని అభిప్రాయపడ్డారు. కవిత్వంలో పదబంధాల ప్రయోగం ఔచిత్యం గురించి వివరిస్తూ…

నిన్ను నువ్వు వెతుక్కోవటం ప్రారంభిస్తే
లోకాన్ని దూషించవు…
జీవితం గుండెల్లో చిత్రశాల నువ్వే…!
దరహాసానివీ నువ్వే!

అంటూ కవి ఏటూరి నాగేంద్రరావు గారు రచించిన చిత్రశాల కవితలోని నర్మగర్భంగా అద్భుత భావాలకు అక్షరాకృతి ఇచ్చిన కవి గారిని ప్రశంసిస్తూ పద బంధ ప్రయోగంలో ఔచిత్యాన్ని పాటించారు అంటారు.

మరొక అంశం “స్వగతం” గురించి ప్రస్తావిస్తూ సాధారణంగా వేదన భరితమైన అంశాలను, నివేదన రూపమైన అంశాలను, అంతరంగం లోని ఆలోచన తరంగాలను వస్తువుగా స్వగతం రూపంలో నిక్షిప్తం చేస్తాము. వీటిని ఆర్తిని జోడించి అభ్యర్థన రూపంలో ఆవిష్కరించవచ్చు లేదా ఆకాంక్షలను అక్షరాల్లో సంబంధిత పదబంధాల్లో జొప్పించవచ్చు. స్వగతంలో కవి నేరుగా వస్తువు పక్షాన నిలిచి తన భావ ప్రకటన చేయడం సహజం. చాలా సందర్భాల్లో మనకు చెట్టు గురించి అంతర్వేదన …ఇల్లు గురించిన స్వగతం…ఇల్లాలి గురించిన అంతరంగం… అమ్మ గురించి, నాన్న గురించి స్వగతాలు చదువుతూ ఉంటాం.స్వగతం గురించి స్వయంగా దాస్యం సేనాధిపతి గారి మొదటి కవితా సంపుటి నుంచి తీసుకున్న ఒక కవితను పరిశీలిస్తే…

ఎవ్వరూ పట్టించుకోరు
పర్యావరణం అంటూ…
పెద్ద పెద్ద మాటలు!
ట్రీ గార్డులో ట్రిమ్ముగా
నేను షోకేస్ బొమ్మను!
మున్ముందు ఫలాలను ఇస్తానని కాబోలు
నాతో ఫోటోగ్రాఫులు
గుక్కెడు నీళ్లే
బుక్కెడు బువ్వ నాకు !
అయినా ఎవడూ
ఓ చుక్క విదల్చడు
పర్యావరణం
ప్రతి వాడికీ ఓ ఫేషన్!
అంటూ ఒక మొక్క యొక్క అంతర్వేదనను ఆర్థ్రంగా ఆవిష్కరించారు.

మనిషి అంతరంగంలో భావ తీవ్రత ఉన్నప్పుడు మాత్రమే కవిత్వం రాయగలడు అయితే వస్తువుని విశ్లేషించే క్రమంలో… వస్తువుని బలంగా వ్యక్తీకరించే సందర్భంలో కవికి ఆసరాగా నిలిచేది… కవిని కవిగా నిలబెట్టేది…భాషే! చక్కని భాషతోనే కవిత్వం నిలబడ గలుగుతుంది. కవిత్వం సృజన చేసే క్రమంలో… కవికి భాష గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అంటారు. అంతేకాకుండా కవిత్వ రచనలో ఎక్కడ సంక్లిష్టతకు , సందిగ్ధతకు తావు ఇవ్వకుండా భాషను ప్రయోగించాలనీ… సరళంగా వ్యక్తీకరించినప్పటికీ… అలతి అలతి పదాలను ఎంపిక చేసుకున్నప్పటికీ …కవితాత్మకంగా రాయడం మాత్రం మరువకూడదు. చేతి రాతలోనే కానీ… టైపు లో కానీ అక్షర దోషాలు దొర్లకుండా చూసుకోవాలి అని సూచించారు.

కవిత్వ నిర్మాణం- ముగింపు విషయం గురించి చర్చిస్తూ… కవి ఎంపిక చేసుకున్న కవితా వస్తువును బట్టి ,కవి యొక్క అభివ్యక్తి పటిమను అనుసరించి, కవి యొక్క భాషా సంపత్తిని బట్టి, అన్నింటికీ మించి… కవిత ద్వారా కవి ఏం చెప్పదలచుకున్నాడో దాన్నిబట్టి కవితకు ముగింపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముగింపు మరింత కవితాత్మకంగా ఉండాలి .కవిత్వం ముగింపు విషయంలో కవులు మరింత శ్రద్ధ పెట్టి…
కవిత చివరలో అంశాన్ని బట్టి వ్యంగ్యంగా/ ఓ మెరుపు/ఓ చరుపు/ఓ విరుపులతో స్పష్టంగా ముగించాలి అంటారు.

కవిత్వంలో అభ్యుదయ భావాల ప్రకటన, ధిక్కార స్వరం, భావ కవిత్వంలో ప్రణయ సంకీర్తనం, కవిత్వంలో మానవతావాదం…వంటి అంశాలను గురించి కూలంకషంగా సోదాహరణంగా ప్రముఖుల మరియు వర్ధమాన కవులు యొక్క రచనలు తీసుకొని చక్కగా విశ్లేషించారు.

కవిత్వానికి పెద్దబాలశిక్షవంటి ఈ పుస్తకంలో… కవయిత్రి పాటిబండ్ల రజని , కొండేపూడి నిర్మల ,విమల ,వాసా ప్రభావతి , ముక్తేవి భారతి , శైలజా మిత్ర , కె శివారెడ్డి , నన్నపు వెంకట రామి రెడ్డి ,దాస్యం సేనాధిపతి వంటి ప్రముఖులు రాసిన కవితలే కాకుండా… రమాదేవి బాల బోయిన ,అనుశ్రీ ,గోస్కుల శ్రీలత రమేష్ ,రమాదేవి కులకర్ణి ,బండారు సుజాత ,చీదెళ్ళ సీతాలక్ష్మి , లక్ష్మీ మదన్, రంగరాజు పద్మ , ఉదయశ్రీ ప్రభాకర్ , వకుళవాసు ,అరుణ కీర్తి పతాక ,బుర్ర విజయలక్ష్మీనాగరాజ్ , జయంతి సుధాకర్, వేల్ముల జైపాల్ రెడ్డి ,స్వప్నకృష్ణ ,శ్రీదాస్యం లక్ష్మయ్య, కాసర్ల లక్ష్మీ సరోజ రెడ్డి, చిందం సునీత, విజయ దుర్గ, హసీనా బేగం, లింగుట్ల వెంకటేశ్వర్లు, నవీన్ హోతా ,ఆది విజయలక్ష్మి శ్రీనివాస్, భాస్కర బాలభారతి,అప్సర్వలీషా, వెగ్గళం ఉషశ్రీ ,కొమురవెల్లి అంజయ్య, భాను శ్రీ వంటి వర్ధమాన కవుల రచనలు కూడా ఉదహరించడం ముదావహం. పలువురు వర్ధమాన కవుల కవితలను పరిశీలిస్తూ వాటిలోని గుణదోషాలు తెలియజేస్తూ రాయబడిన ఈ గ్రంథం వారిలో ఆత్మ విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంపొందిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

కవిత్వ రచనలోని ప్రతి అంశాన్ని కూడా సోదాహరణంగా వివరిస్తూ… విపులంగా వ్యాఖ్యానిస్తూ… సీనియర్ రచయితల యొక్క కవితలను అంశాలకు అనుగుణంగా ఉటంకిస్తూ …కవిత్వ రచనలో మెలకువలను గురించి దాస్యం సేనాధిపతి గారిచే రచించబడిన ఈ గ్రంథం వర్ధమాన కవులకు కరదీపిక అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
-బుర్ర విజయలక్ష్మీనాగరాజ్
9966559567

పేజీలు:198
వెల :200రూ.
ప్రతులకు :దాస్యం సేనాధిపతి
9440525544

April 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వేములవాడ రాజన్న క్షేత్ర వైభవాన్ని పద్యాల్లో అభిషేకించిన చొప్పకట్ల భాను!

by సంకేపల్లి నాగేంద్ర శర్మ April 15, 2022
written by సంకేపల్లి నాగేంద్ర శర్మ

పుస్తకం పేరు: వేములవాడ వైభవం పద్యకావ్యం. రచన: చొప్పకట్ల భాను, వేములవాడ. పుటలు:156. వెల: 116 రూపాయలు.
వేములవాడ క్షేత్రేశ్వరుడైన రాజరాజేశ్వర స్వామి వారిపై ఈ వంద సంవత్సరాలలో ఎంతోమంది కవులు, పండితులు వివిధ ప్రక్రియల్లో విలువైన రచనలు చేశారు. కీ.శే. మామిడిపల్లి సాంబకవి, వేదాంతం కాశీనాథం, కేశన్నగారి రాజశర్మ, వజ్జల సాంబశివశర్మ, బ్రహ్మనగారి నరహరి శర్మ మొదలగు పద్యకవులు స్వామి వారిపై కావ్యాలు రాశారు. దండకాలు రాశారు. స్తుతులు, సంకీర్తనలు, భజన పాటలు రాశారు. 150 సంవత్సరాల క్రితం యోగులైన బ్రహ్మశ్రీ సీతారామ యోగీంద్రులు, సంకేపల్లి రామశాస్త్రులు వంటి వారు స్వామి వారి పై సంకీర్తనలు రాశారు. కర్ణాటక సంగీత విద్వాంసులైన చౌటి భాస్కర్ లాంటి సంగీత కళాకారులు కూడా శాస్త్రియ సంగీతంలో తేనీయల్లాంటి కీర్తనలు రాశారు. ఇవన్నీ చతుష్కాల పూజల్లో అర్చకులు చదువుతున్నారు. కరీంనగర్ లో 1958-60 ప్రాంతాలలో నివసించిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా వేములవాడ రాజేశున్ని దర్శించి, స్వామి వారి మహిమను కొనియాడుతూ, మధ్యాక్కరలో పద్యాలు రాసి తన మొక్కు చెల్లించుకొన్నాడు. డా. వడ్డేపల్లి కృష్ణ, మిద్దెరాములు తదితరులు జానపదాల పాటలు, ఒగ్గు కథలు రాశారు. ధర్మపురి శేషప్ప, తిరుమలలో అన్నమాచార్యుడు, తెలుగు వాజ్మయ ప్రథమాచార్యులైన శ్రీ కృష్ణమాచార్యులు సింహగిరి వచనాలు రాసి ఇలా ఎంతో మంది వారి వారి భక్తి మార్గాలలో ఆ పరమేశ్వరున్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ తరించారు. తమ రచనల్లో భక్తి తత్వాన్ని ప్రాతిపదికగా తీసుకొన్నారు. అలాంటి కోవలో హృద్యమైన శివభక్తితో వృత్తాలలో పద్యాలు రాసి తన జన్మను సార్థకం చేసుకొన్నారు, సంస్కృత, తెలుగు పండితులు చొప్పకట్ల భాను గారు. కవి చక్కటి గాయకులు, చక్కగా పాడి వీటిని వాట్సాప్ గ్రూఫుల్లో పోస్టింగ్ లు చేయడంతో ఈ పద్యాలకు ఔచిత్యమేర్పడిందని చెప్పవచ్చును. ఈ పుస్తక ప్రచురణలో వెన్నుముకగా నిలిచిన రచయిత, న్యాయవాది వాసాలమర్రి నాగరాజు గారు ధన్యులు. వేములవాడ బ్రాహ్మణ్యం లో కొత్త నీరు రావడానికి ఇలాంటి రచనలు ఉపకరిస్తాయని చెప్పవచ్చును.

దక్షిణ కాశీగా ప్రసిద్దమైన వేములవాడ క్షేత్ర్రాన్ని, విరాట్ మూర్తులను, అమ్మవారు, గణపతి, నందీశ్వరుడు, దేవాలయ అవరణలోని వివిధ ఉపాలయాలైన భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, బద్ది పోచమ్మ, కేదారేశ్వరుడు, మహలక్ష్మీదేవి ఆలయాలను చక్కగా కవి వర్ణీస్తాడు. ప్రధాన ఆలయంలో కొలువైన దేవతలు, కోటి లింగాలు, పంచాయతనాలు, ధర్మకుండ పుష్కరిణి, ఇక్కడి పండితులు, వేదమూర్తులు, సంస్కృత విద్యాలయ ఆచార్యులు, అర్చకుల పై ఆధ్యాత్మిక, తాత్విక దోరణీలో 140 పుటల్లో 124 పద్యాలతో వేములవాడ క్షేత్ర వైభవాన్ని పండించడంలో కృతకృత్యులయ్యారు. కొన్ని పద్యాలలో సామాజిక చింతనను రంగరిస్తూ దేవదేవున్ని ప్రశ్నిస్తుంటారు. లోకంలోని అనుచితమైన పోకడలపై దండెత్తుతారు. వీరు రాసిన పద్యాలు సరళంగా ఉండి, సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఇంపుగా ఉన్నాయి. ప్రతి పద్యంలో ఒక కొస మెరుపుతో శివభక్తి అక్షరమక్షరంలో తాండవిస్తూ కనబడుతుంటుంటుంది. ఈ పద్యాలకు అనుబంధంగా మరో 14పేజీల్లో ఆరు రచనలు చేసి భేషనిపించుకొన్నారు. తాను రాసిన పద్యాల కిందటే భావాన్ని కూడా జతచేసి పఠితులకు ఆహ్లాదం కల్గిస్తాడు.

రచయిత భాను గారు వేములవాడ క్షేత్ర ఆనువంశిక అర్చక సంతతికి చెందిన వారు, తెలుగు, సంస్కృతాలలో పిజీ చేసి, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, వన భూమి యైన ఆదిలాబాద్ జిల్లాలో మూడు దశాభ్దాలకు పైగా, తెలుగు పండితునిగా ఉద్యోగించి, తన శేష జీవితాన్ని సార్థకం చేసుకోవాడానికై వేములవాడ వైభవం పేరుతో పద్యకృతిని తన ఇష్టదైవమైన రాజన్నకు రాసి సమర్పించుకొన్నారు. గుడి వైభవం పై అలవోకగా పద్యాలు అల్లి తనలోని శివభక్తిని పద్య పుష్పాలుగా, బిల్వ దళాలుగా మలిచి అభిషేకిస్తూ, కైమూడ్పులర్పించుకొన్నారు. ఈ కావ్యంలోని పద్యాలు మోక్ష రసగంగై, సుబోధకమైన రీతిలో అర్థవంతమైన పద బంధాలతో అలరారి, పాటకున్ని ప్రభావితం, ప్రసన్నం చేస్తాయి. ఇందులోని పద్యాలు స్వతంత్ర ప్రతి పత్తిని కల్గి యుండి, దార్శనికునికి వేములవాడ క్షేత్ర సందర్శనను పునీతం చేస్తాయని కవే తన ముందు మాటగా చెప్పుకొన్నారు. మానవున్ని భక్తి మార్గంలో నడిపించడానికి ఇందులోని పద్యాలు మందార మకరంధాలై భాసిల్లాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో. క్షేత్రేశ్వరుడైన మహదేవున్ని పరిపరి రకాలుగా స్తుతిస్తూ, తాత్విక చింతనతో ప్రశ్నిస్తూ, పద్యాలలో కవితా సౌందర్యాన్ని ఇనుమడింపజేశాడు. శివనామ స్మరణమ్ము సేయ మదిలో సిద్దుల్ ప్రవేశించిరో, శివ భావంబు రగిల్చిరో?శివ సుధారసమ్ము త్రాగించిరో అంటూ, శివ ధామమ్ము మహాధ్బుతమ్ము జన సంసేవ్యమ్ము నీ ధాత్రిలోన్! అంటూ దేవదేవున్ని స్తుతిస్తారు. వేములవాడ వైభవము వేడుకగా రచియింప బూని నీ/ నామము నే స్మరింప కవనామృత శైక కృతుల్ జనించె నా/ కోమల పద్యబిల్వములు కోరిక శివార్పణమ్ముగా/ నామది మొక్కి నీకు నిట అంకితమిచ్చితి శీ మహేశ్వరా!!అంటూ తన పద్యాలతో వైభవోపేతంగా కావ్యాన్ని అంకితమిస్తూ శివార్చన చేశాడు.

మా ఊరే ఒక ఈశ్వరార్చన పదమ్మూ వూరు కైలాసమే/ మా వూరందలి ధర్మకుండ జలముల్ మందాకినీ తీర్థముల్/ మా వూరినంతకు గాలి వెల్గు నతడే మా ఊరి రాజన్నయే/ మా ఊరంగల గోపురాల వితతుల్ మాహేశ్వర స్థానముల్!! అంటూ వేములవాడ క్షేత్ర ప్రాధాన్యతను కళ్ళకు కడుతాడు. మా ఊరి రాజన్న గోపురాలన్నీ మహేశ్వరుని స్థానాలేనని కవిసమయాన్ని వెల్లడిస్తాడు. ధర్మకుండ పుష్కరిణి ప్రాశస్త్యాన్ని గూర్చి రాస్తూ, ఇవి మందాకినీ(పవిత్ర గంగానది) జలములని, ఆ దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొన్నాడని, మోక్షాత్ముండయి తానమాడె తమితో మోక్షార్థియై నిచ్చటన్!! అని చెబుతాడు. ధర్మకుండ జలాన్ని పవిత్రంగా దూడాలని, అపవిత్రం కాకుండా కాపాడుకోవాలని నివేదిస్తూ, ఆందోళన చెందుతాడు. అతి కాలుష్యపు భాండమయ్యే నికటా, స్థితి తప్పి కాసారమై పోయిందని అంటూ, గతి నీవే సర్వ కల్మష హరా గంగాధరా శంకరా అంటూ వేడుకొంటాడు. అరు, ఏడు పద్యాలలో దేవాలయంలోని ప్రాచీనమైన చరిత్ర కనుమరుగై పోయిందని, బౌద్ద, జైన మూర్తుల కళాఖండాలు, కోమలుల విగ్రహాలు వంటివి శిల్పవిధంసములై మాయమై పోయాయని, మౌనంగా ఉండటం నీకిది ధర్మమేనాని నిందాస్తుతిలో ప్రశ్నిస్తాడు. లేరే అర్థ నిమిలితాక్షులు శీలా లీలా కళా ఖండముల్ /వారేరయ్యా తదీయ ధర్మ నిరతుల్ వాక్సత్య సంశోధితుల్ అంటూ ఆరవ పద్యంలో ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు.

రాజన్న రాజగోపురాలను పరమేశ్వర స్థానంగా, సుమహోహరంగా వర్ణించడంలో కవి తన నేర్పరి తనాన్ని, స్థానీయతను ప్రదర్శిస్తాడు. అదిగో చూడు మహోర్ధ్వ లోక మదిగో, ఆనంద సంధాయక/మదిగో, వేదమహర్షి దర్శిత మహామంత్ర ప్రభావమ్మదే/ అధిగో బ్రహ్మ మురారి ముఖ్య సురులే యాశించు భవ్య స్థల/ మదిగో చూడుము రాజగోపుర మదే, మాహేశ్వర స్థానమిదే|| పూర్తిగా దేవాలయ వైభవాన్ని ఇలా చెబుతాడు. ఆ దేవాలయ శిల్పముల్ శిఖరముల్, కోడెమొక్కుల విధం, ధర్మకుండపు జలం, భవ్య గర్భాలయ ఆ దివ్యోజ్జ్వల రాజలింగని మదిన్ తలుతున్ అని చక్కటి దైవీభావ అనుభూతికి లోనై చెబుతాడు. ఆలయంలోని ఒక పక్కగా పేర్చి యున్న కోటిలింగాలను 19వ పద్యంలో ఇలా చెబుతాడు. ఏ రాజన్యులు పేర్చిరో, ఏ రుష్యాదుల ఊహయో నిల్పిరి దివ్య లింగ వితతిన్ అంటూ కవితాధారలో అభిషేకిస్తాడు. క్షేత్ర స్థలపురాణాన్ని, వేములవాడ చాళుక్యుల చారిత్రక పాలనను సమ్మీళితం చేస్తూ పద్యాలు భావబందురతో రాయడం కనిపించింది. తొలి చాళుక్యపు రాజరాజు ఇచటనే తోయంబునన్ స్నాతుడై గనినట్టి రాజమూర్తియని దక్షిణామూర్తి లింగ వర్ణనలో 28, 83వ పద్యాలలో చెబుతాడు. విరాన్మూర్తి రాజలింగాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలలో, పంచభూత లింగాలతో మయమైన లింగంగా పోలుస్తూ వర్ణించి చెప్పే విధానం, కవి జ్నాన సంపన్నుడై, ఎంతగా శివభక్తిలో తాదాత్యం చెందాడో అర్థమవుతుంది. కాశీనాథ విశ్వేశుడై వెలిశాడని, శివ గోకర్ణ, కాళహస్తీశ్వరుడై, భువి రామేశ్వరుడై, చిదంబర పురీ వాసుడై,హేమాద్రి పురాన వెలసిన కేదారేశ్వరుడై ఇట అమరనాథేశ్వరుడు భాసిల్లుతున్నాడని స్తుతిస్తాడు. పదమొక పద్యమయ్యె శివపాదపు పీఠిక నాశ్రయించి సొంపెదిగిన వాక్యముల్ విమల బిల్వ దళంబుల రూపమెత్తగా పదపద భావముల్ చెలగి పారినాయని 54 వ పద్యంలో కవి తన్మయుడై పోతాడు. అమ్మవారైన తల్లి శ్రీరాజరాజేశ్వరీ దేవి గూర్చి 74,75,77,79 పద్యాలలో రసరమ్యంగా స్తుతించారు. కల్లోలముల్ బాపు నట్టి భవ లోకానంద స్తోత్రముల్/ ఉల్లమ్మంతయు నిండె విశ్వజననీ, ఉద్యప్రభా రూపిణీ అని కీర్తిస్తాడు. ఇది ఒక రాజపీఠ మనే శక్తి పీఠమని, ఇందుకు గ్రంథాల్లో ఆనవాళ్ళు లేకున్నా తల్లి పాదముల వద్దే కాసేపు నిలిచినట్లయితే నిజం తెలిసి పోతుందని తన్మయుడవుతాడు. శ్రీ రాజేశ్వరి పాద పద్మ యుగమా, శ్రీ చక్ర స్థానమేనని, ఒక మణీద్వీపమని శక్తి స్వరూపాన్నిసుందరంగా ఆవిష్కరిస్తాడు. చల్లని తల్లివమ్మ హరిచందన చర్చిత చారుగాత్రివే, చల్లని చూపులున్న సిరి జల్లుల వెల్లి వరాల తల్లివే||అని ప్రార్థిస్తాడు.

లోకవిదితమైన బాధలను పేర్కొంటూ, కక్షలు శిక్షలు శివుని కాలిగోటిని తాకగలవా ప్రశ్నిస్తూ కోపతాపాల శివశివా అని 62వ పద్యంలో చెబుతాడు. సదముల భక్తి భావనయు, సంచిత పుణ్య ఫలార్ధ సంపదన్/ శైవ వైభవ రసామృత పానపరాయణత్వమున్/ధర్మ తత్పరతలు, సద్గుణ శీలతలు, సత్యనిష్టతలు శివ సన్నిధిని చేరే యోగ్యతలని 63వ పద్యంలో యదార్థత భక్తి చింతనను అరటి పండు ఒలిచి పెట్టినట్లు చెబుతాడు. బ్రాహ్మణార్చకుల గూర్చి 91వ పద్యంలో జట ఘన చెప్పగల్గెదరు, చారు మనోజ్న సువర్ణ సంపుటముల వోసినట్లే ఇక్కడి వేదభూమిలో శ్రుతులు వినిపిస్తాయని కడు రమ్యంగా చెబుతాడు. 123లో బ్రాహ్మణుల అగ్రహారంగా మహాగ్రపురమై వేములవాడ భాసిల్లిందని చెబుతాడు. దేవాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్కృత విద్యాలయం గూర్చి 116,117, 118 పద్యాలలో జిజ్నాసతో వర్ణిస్తాడు. ఘన సంస్కృతాలయము, నచ్చట నేర్చిన విశేష పూర్వ పుణ్య ఫలములేనని, ఇది ఒక శిపప్రసాదమేనని, వేద ప్రాజ్నుల బోధనల వల్ల అవధానులు, కవులు, కళాకారులెందరో తయారయ్యారని వర్ణిస్తాడు. నాదోపాసకులర్థ శాస్త్ర విభుధుల్, నాట్య ప్రవీణుల్, వాచక చతురులు వర్థిల్లినారని అంటాడు. ఒక శివ సుప్రభాత, ఒక శతక కావ్యంగా కూడా ఈ రచనా శైలి శివభక్తితో నిండిపోయిందని చెప్పవచ్చును. రాజన్న ఆలయంలో ప్రత్యేకంగా విశిష్ట శివమహా లింగార్చన గూర్చి 76లో చెబుతాడు. మన్నును సంస్కరించి పరమాధ్బుతమౌ శివలింగ విగ్రహా/లన్నియు పేర్చి నొక్కసుకళాకృతి తీర్చి మహేశ లింగమున్ అని వర్ణీస్తాడు. పర్యావరణ విహితమైన రావి చెట్టు, అశ్వత్థ వృక్షాల వర్ణనలు 8.9 పద్యాలలో కానవస్తావి. ఇవి గత కాలపు తీఫి గుర్తులని, చాళుక్యరాజుల సంపదలకు ప్రతీకలుగా నిలిచాయని అంటాడు. 16,17 పద్యాలలో దేవాలయంలోని గండాదీపాన్ని స్తుతిస్తూ, కవి తాత్విక చింతనలు అద్ది చీకటి లోకంలో ఉన్న జనజీవనులకు, ఆకలి చీకట్లు నిండిన లోకానికి, దినదిన గండంగా బతుకుతున్న ప్రజలను పవిత్ర జీవనులుగా మార్చడానికి వెలుగు రేఖలను ప్రసరింపజేయాలని కోరుతాడు. . అనుబంధ రచనల్లో రాజరాజేశ్వర కరావలంబ స్తోత్రం, దండకం, అక్షరార్చన, స్తుతి పంచకంతో సహా శ్రీరామచంద్ర కరావలంబ స్త్రోత్రాన్ని చేర్చి తన భక్తి ప్రపత్తులను వేములవాడ వైభవంలో పొదిగి పునీతుడయ్యారు. ఉపయుక్తమైన ఫోటోలు చేర్చి పద్యాలకు సొగసులు చేర్చారు.

April 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మను నెల్లుట్ల “జన్య భారత” సరికొత్త ఆలోచనల నవల

by mayuukha April 15, 2022
written by mayuukha

మను నెల్లట్లు
            నవతరానికి ప్రతీకగా  నవలా సాహిత్యంలోకి మరో కొత్త గొంతుక వచ్చింది, మను నెల్లుట్ల పేరుతో “ జన్య భారతం” అంటూ . కాలం ఎంత వేగంగా పరుగెడుతుంటే యువకుల ఆలోచనలూ అంత వేగంగా పరుగెడుతున్నాయి అనడానికి ఈ “ జన్య భారత” నవల   ఒక  ఉదాహరణగా నిలిచింది. ఈ నవలను రచించింది మను నెల్లుట్ల , కెనడా దేశంలో నివసిస్తున్నారు.

“జన్య” అనే సంస్కృత శబ్దానికి యుద్ధం , సాధారణ జనులు అనే అర్థాలున్నవి .”మహా “ కాదు ఇది “మామూలు” కూడా ఉంటుందనే భావంతో ఇది జనుల భారతం అనే ఉద్దేశంతో రాసినట్టున్నది నవల. ఈ నవలారచయిత మనోభిరామ్ నెల్లుట్ల ( మను నెల్లుట్ల) నవల పేరు Janya Bharata , క్రింద The War అని రాయడం వలన తెలుస్తున్నది. “ జన్య భారత” నవల ఇంగ్లీష్ భాష లో రాసిన నవల.
మరలనిదేల భారత యుద్ధ కథ అని అనుకోవద్దు . మహాభారత యుద్ధం మొత్తం రాజుల , రాణుల గురించి కురుక్షేత్ర సమరం గురించి ఉంటే ఈ జన్య భారత కథమొత్తం సామాన్యుడు, సామాన్యురాలి గురించి వారి జీవన సమరం గురించి ఉన్నది.
మహాభారత యుద్ధం జరిగింది అని మనమంతా నమ్ముతున్నాం . ఆ యుద్ధంలో కేవలం రాజులే ఉన్నారా? వేరే సాధారణ ప్రజలు లేరా ?అంటే, ఉన్నారు . ఆనాటి ఆ యుద్ధం లో ఎందరో పాల్గొన్నారు.వారిలో ఉస్త్రకర్ణిక అనే పేరుతో పిలువబడే గిరిజనులు ఆ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన నిలుచుని యుద్ధం చేశారు.
కల్పనాచాతుర్యంతో రచయిత ఈ గిరిజనుల ప్రతినిధిగా మిత్రాజిత్ అనే అతను భారత యుద్ధానికి వెళ్ళినట్లు, వెళ్ళేముందు వెళ్ళిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు, అతని కుటుంబము వారి జీవన విధానమూ చిత్రీకరిస్తూ కథను అల్లడం చూస్తాం. ఈ నవల లో యుద్ధం మొదటి
రోజు ఏమైంది?రెండో రోజు ఏమైంది?ఈ సైనికుల పరిస్థి ఏమిటి? ఖడ్గ విద్యలో నిష్ణాతుడైన ఈ కథానాయకుడు మిత్రాజిత్ కు ఏం జరుగుతుంది? అతని కుటుంబమేమయ్యిందనేది ఈ నవల చదివితే తెలుస్తుంది.ఈ “జన్య భారత” నవల అమెజాన్ లో దొరుకుతుంది. భారత దేశంలో ఉన్నవాళ్ళు e Book , కిండిల్ ఎడిషన్ గా తీసుకోవచ్చు.
e Book , పేపర్బాక్, హార్డ్కవర్ వంటి వాటిద్వారా అమెరికా,కెనెడా,ఆస్ట్రేలియా ,ఇంగ్లాండ్ దేశాలవారు కొంటున్నారు.
మను నెల్లుట్ల MPT , MA(Edu), MBA చేసాడు. ఇండియా , రువాండా( సెంట్రల్ ఆఫ్రికా) లో 13 ఏళ్ళు ఫిజియోథెరఫీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసాడు.ప్రస్తుతం అమెజాన్ లో job చేస్తున్నాడు.అమెజాన్ లో చేరడానికి ముందు కెనెడా లో Actsafe Safety Association కు CEO గా జాబ్ చేసాడు. మను నెల్లుట్ల ఒక మంచి గాయకుడు. సింగర్. ప్రాడ్ కాస్ట్ హోస్ట్ podcast host (Manu Tho Muchatlu) కూడా! Facebook lo సింగర్ మను N గా వెతికితే కనిపిస్తాడు.
270 పేజీలలో 65000 పదాలతో సులభంగా చదవగలిగే ఇంగ్లీష్ తో ఉన్న నవల “జన్య భారత” నవల. ఈ నవల ముఖచిత్రాన్ని అంజన చేపూరి , USA చిత్రించారు.
ఎక్కడెక్కడైతే సంస్కృత శబ్దాలు ప్రయోగాలు చేసాడో ఆ కఠిన పదాలకు అర్థాలను ఇచ్చారు.
“ జన్యభారత ద డెల్యూజ్” అనే పేరుతో దీని కంటిన్యూయేషన్ కూడా రాస్తున్నారు మను .
మహాభారతం చదివిన వారికి ‘ ఔనుకదా వీళ్ళను గురించి ఈ సామాన్యులను ఎవరూ పట్టించుకొని రాయలేదుకదా అని ఈ నవలలోని పల్లెజనుల బ్రతుకు గాథ లను చదివి తప్పకుండా మన మనసులో అనుకొనితీరుతాం.
మను నెల్లుట్ల కు శుభాకాంక్షలు .
ఈ పుస్తకం—
https://lnkd.in/gKi_A99b (Amazon Canada)
https://lnkd.in/gE8FT_HK (Amazon US)
https://lnkd.in/gTC-YFzS (Amazon India) (Ebook version only)
ఈ లింక్ లలో లభిస్తుంది. మనమంతా చదువుదాము!!

April 15, 2022 1 comment
3 FacebookTwitterPinterestEmail
కవితలు

జన సముద్రం

by డా|| నాళేశ్వరం శంకరం April 10, 2022
written by డా|| నాళేశ్వరం శంకరం

నిరంజనుడి ప్రభంజనం నీటి మనసుకు తెలుసు

పాలమూరు పాల సముద్రమన్నా

అస్తిత్వాకాశంలో

వెలుగుతున్న ధృవతార అన్నా నిజమే మరి!

నేనైతే ఆయన వెంట

నాలుగడుగులు నడిచిన పాపాన పోలేదు గానీ

నా ఆదర్శ దాంపత్యానికి ఆత్మబంధువతనే!

ఆయనదంతా

ప్రజాదివ్వెల్ని వెలిగించడానికి

చమురుగానో వత్తిగానో

యేదోవొకటి కావడానికేగా ఆయన జీవనయాణం

పాలిచ్చే పొదుగుల్ని

పితుక్కునే శ్రద్దెంకు లేదో తెలియదుగానీ

పల్లెకు పాలుపోసే పశువుల మీది ప్రేమకొద్ది

బతుకును పచ్చి గడ్డిలా పునీతం చేసుకున్న దేశభక్తుడతడు

రాజహంస రెక్కల్ని ముడుచుకున్నట్లు

సేద్యగాళ్ళ సోయగాలను

పంచకట్టు మడతల్లో దాచిదాచి చూపగలడు

ఆయన నగువు ముందు

ఎన్ని తగువులైనా అదృశ్యమైపోతాయంతే!

కరువులోయలో పుట్టిన బిడ్డ కావడంవల్లే అనుకుంట

వంచకుల రెక్కల్నితుంచే

ఉప్పొంగిన ఉద్యమ ఉషస్సుకు ఊపిరి ఊదడంవల్లే

మన జాతి పాలపిట్ల విజయదుందుభి మ్రోగించ గలిగింది!

ఔను

సమర శంఖస్వరంలో

ప్రతిధ్వనించిన ముక్తస్వరం ఆయనదే!

నిబద్ధతకు నీడనిచ్చే చెట్టేగా ఆయన ఆదర్శం

ప్లీడరా లీడరా అని కాదు

ఆయనకున్న రెండు చేతులు అవే!

నిరంజనా! నిరంజనా!

నీవు జలసముద్రానివే కాదు జనసముద్రానివి కూడా!

ఓ కృషీవలుడా!

మా కాంక్ష ఆకాంక్ష వొక్కటే

అడుగు తీసి అడుగేసినప్పుడల్లా

ఆ అడుగుల అస్త్రవిద్యను మట్టి పాదాలకు నేర్పుతూనే ఉండు

నీ వెనక నడిచే పంటపొలం ఆడుతూ పాడుతూ అవనికి అన్నం పెట్టగలదు.

April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాల

by డా॥ సంగనభట్ల నరసయ్య April 10, 2022
written by డా॥ సంగనభట్ల నరసయ్య

లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు మం

జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరో

జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై

వెలయున్ భాగవతాఖ్య కల్పతర్వురిన్ సద్ద్విజశ్రేయమై –భాగవతంలో పోతన

బమ్మెర పోతనామాత్యుని శ్రీ మదాంధ్ర మహాభాగవతంలోని అవతారికాపద్యమిది. మూలంలో గల సంస్కృత భాగవత వైశిష్ట్యాన్ని తెలిపే ఈ పద్యం తెలుగులోకి మహాకవి పోతనచే అనూదితం. భాగవతాఖ్య కల్పతరువనే మాటతో భాగవతం కల్పతరువు (వృక్షం)తో పోల్చబడి ద్వ్యర్థిలో రచించబడింది.

భాగవతార్థంలో పరిశీలిస్తే లలితాదేవి కాండంగా, శ్రీకృష్ణుడు తల్లివేరుగా, శుకమహర్షి ప్రవచించగా మనోహరత్వంతో శోభిస్తూ, దేవతలను తృప్తిపరుస్తూ, మిక్కిలి అందమైన కథతో, గొప్ప భక్తి ఫలాన్ని ఇస్తూ, స్వచ్ఛమైన కథకుడు వ్యాసమహర్షికి ఆలంబనై మంచివారికి (పుణ్యాత్ములకు) ఆశ్రయమిస్తున్నది. భాగవతమనే వృక్షార్థంలో పరిశీలిస్తే చిన్న చిన్న కొమ్మలతో, నల్లని మూలంతో కొమ్మపై వాలిన చిలుకుల పలుకులతో, చక్కని లతలు తనకాధారమై పైకి పాకగా, మంచి ఆకులు, పుష్పాలతో, గుండ్రని కాండంతో, చక్కటి పండ్లనిస్తూ, విశాలమైన మొదలుతో, అనేక పక్షుల కాశ్రయమైన చెట్టు భాగవతంలా శోభిస్తున్నది.

ఈ పద్యం శ్లేషసొబగుల్లో లలితాదేవి కాండంగా ఉండటమేగాక లలితమైన (కోమలమైన) అనే అర్థం వచ్చింది. “మూగురమ్మల మూలపుటమ్మ”ను పోతన విశేషంగా స్మరించినాడు. కృష్ణ శబ్దానికి శ్రీ కృష్ణపరమాత్మ, నల్లనైన కాండం అనే అర్థంతోబాటు “నల్లనివాడు పద్మనయనంబులవాడన్న మహాకవి వాక్యం స్మరణీయం. కృష్ణుడు నల్లనయ్య కదా! శుకమహర్షి భాగవతం పరీక్షిత్తుకు చెప్పినట్టుగా విశదమైన ఈ పురాణం చిలుక పలుకులవంటి మధురవాక్య శోభితమని అర్థం. “మంజులత” మంజులత్వమనే అర్థంలోనూ, మంజు – లత అనగా మనోహరమైన తీగలతో అల్లుకొన్నదని ద్వ్యర్థి జోడించబడింది. సువర్ణు లంటే దేవతలని, సుమనః అంటే మంచివారని, సుజ్ఞేయమంటే చక్కగా తెలుసుకొనబడవలసినదని భాగవత శోభను, తత్త్వాన్ని తెలిపి, మంచి ఆకులు, పువ్వులతో చక్కని వృక్షంగా తెలుసుకోవాలని సూచించబడింది.

వ్యాసమనే మాటకు వృక్షవ్యాసమనీ, జోడించబడి భాగవతంలో సంబంధం గల లలిత, కృష్ణ, శుక, వ్యాసులను, స్మరించి వృక్షార్థంలో శ్లేష సాధించడంలోనే ఈ పద్యం రాబడింది.

వృత్త శబ్దానికి కావ్యేతివృత్తం అనగా భాగవత కథ అని, చెట్టు చుట్టూ గల గుండ్రని తనం, ఫల శబ్దానికి పురాణశ్రవణ జనిత మోక్ష ఫలం, చెట్టు పండు అని, ద్విజ శబ్దానికి పండితుల శ్రేయస్సును, పక్షులకు ఆశ్రయమని ఇలా పది అంశాలు భాగవత వృక్షార్థాల్లో రెండర్థాల్లో శోభించడం ఈ పద్య విశిష్టత.

భాగవతం ఎంత లోతుగా తెలిస్తే ఈ పద్యం అంత అందంగా అర్థమవుతుంది. వృక్షం లక్షణం అందరికీ తెల్సిందే గదా!ఉత్తమ వృక్షంలా భాగవతం, భాగవతం వలె ఉత్తమ వృక్షం ఈ భూమిపై ప్రకాశిస్తోంది.

April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ యాదాద్రీశ వైభవమ్-16

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు April 10, 2022
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు

దీనత్రాణైక నామం దినదినశుభ సంధాయ కామేయ నామం ధ్వస్తాఘామోఘ నామం మునిజనదమన స్తోమ నిర్భిన్న నామం కామక్రోధమ్న నామం కరివరవరదానంత సుస్వాంత నామం

వందే యాదక్షమాభృత్కటక వటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ || తాత్పర్యం : శ్రీహరినామస్మరణ ఎంత మహిమాన్వితమైనదో ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. ఆపన్నులైన దీనజనుల్ని ఉద్ధరించగల ఏకైక నామం! ప్రతినిత్యమూ శుభాలను చేకూర్చే మితిలేని మహిమాన్వితమైన నామం! నీతిమాలిన ఘోరపాపాలను సైతం నశింపజేయగల నామం! మునులను, ఋషులను హింసించే రాక్షస సమూహాలను భేదించగల నామం! కామక్రోధాది అరిషడ్వర్గాన్ని మట్టుపెట్టగల నామం! మొసలిచేత పట్టుబడిన గజరాజును విముక్తుణ్ణి చేసి, వరప్రసాదం చేత, అనంతమైన సాంత్వనము చేకూర్చిన నామం! అటువంటి శక్తివంతమైన తన నామస్మరణతో భక్తులను అనుగ్రహిస్తూ శ్రీ యాదాద్రిపై వెలసి, తన పటుతరమైన భుజబలపరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని నమస్కరిస్తున్నాను. విశేషాలు : విష్ణు భక్తులు తమకున్న పదవీ, అధికార, జన, ధన బలాలు దేనిపైనా నమ్మకం ఉంచరు. ఓర్వలేని బాధలు చుట్టుముట్టిన సందర్భంలో కూడ హరినామస్మరణ ఒక్కటే తరణోపాయంగా భావిస్తారు. ప్రహ్లాదాది భక్తవర్యుల చరిత్రే ఇందుకు ఉదాహరణ. దీనులైన భక్తులను ఆపదల నుండి రక్షించే (దీన+త్రాజైక+నామం=) ఏకైక మార్గం హరినామస్మరణ మాత్రమే! “శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం” ఈ తొమ్మిదీ భక్తి మార్గాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పేర్కొన్న మార్గాలన్నీ నామస్మరణ పూర్వకాలే! మహర్షులు అందుకే భగవన్నామ స్మరణకు ప్రథమ స్థానం కల్పించారు.

(దినదిన+శుభ సంధాయక+అమేయ+నామం=) ప్రతి నిత్యమూ హరినామస్మరణ చేసే భక్తులకు సకల శుభాలనూ కలిగించే అపరిమిత శక్తి కలిగిందీ హరినామం! ప్రతి జీవి జన్మ ఎత్తిన తరువాత క్షణకాలమైనా కర్మనాచరించకుండ ఉండలేదు. ఆచరించిన కర్మకు, అది పాపమైనా పుణ్యమైనా, దానికి తగిన ఫలితం తప్పక జీవి అనుభవించవలసిందే! తెలిసి కాని, తెలియక కాని చేసిన పాపకర్మల నుండి విముక్తి పొందాలంటే హరినామస్మరణ తప్ప మరొక్క మార్గం లేదు! (ధ్వస్త+అఘ+అమోఘ+నామం=) హరినామస్మరణ చేసే భక్తుల పాపాలను నశింపజేయగల గొప్ప నామం హరినామం!

దుష్కర్మల్ని, మహాపాపాల్ని ఆచరించిన వారూ, శాపగ్రస్తులూ రాక్షసులు మొదలైన దుష్టజన్మల్ని ఎత్తుతూ ఉంటారు. మళ్ళీ వారు (మునిజన+దమన+నోమ+నిర్భిన్న నామం=) ఋషులు, మునులు, సాధువులు మొదలైన వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అటువంటి దుష్టుల సమూహాలను నశింపజేయగల శక్తి కలది హరినామం!

ఏనుగు శారీరక బలానికే కాకుండా మదానికి కూడ ప్రతీక, గజేంద్రమోక్ష ఉపాఖ్యానం దుర్మదాంధులకు ఎటువంటి స్థితి కలుగుతుందో చక్కగా వివరిస్తుంది. గజేంద్రుడికి ఆ జన్మ రావటానికి కారణం దాని మదోన్మత్త ప్రవర్తనా – తత్ఫలితంగా మునిశాపం కలగటమే కదా! (కరివర+వరద+అనంత+సుస్వాంతనామం =) మొసలి చేత పట్టుకోబడ్డ గజేంద్రుడు ఎంతో కాలం తన బలాన్ని మాత్రమే నమ్ముకొని పోరాడాడు. చివరికి కృశించి, నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. అప్పుడు భగవంతుణ్ణి శరణుపొందటం తప్ప మరో మార్గం లేదని అతను గ్రహించాడు. హరిని మొరపెట్టుకున్నాడు. అప్పుడు (కరివర +వరద +అనంత+సుస్వాంత + నామం =) మొసలిని తన చక్రంతో ఖండించి, గజేంద్రుణ్ణి రక్షించి, తన ‘వరద’, ‘అనంత’ నామాల నామౌచిత్యాన్ని మరొక్కసారి నిరూపించుకుని, గజరాజుకు మోక్షాన్ని కలిగించి, అతని మనస్సుకు ఊరట కలిగించిన నామం హరినామమే కదా!

శ్రీ యాదాద్రిపై వెలసి, తన పటుతర భుజబలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని తన మృదుమధుర పద సుమాలచే అర్చించి, స్వామి నామం యొక్క అనంత బలాన్ని స్మరిస్తూ నమస్కరిస్తున్నాడు కవి.

April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పలవరింత…

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ April 10, 2022
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్

ప్రతిమలుపులో

దుఃఖాలను ఒంపుకున్న మనసు….

జీవితం సరళ రేఖయని ఎలా చెప్పను!

భ్రమలతో నిండుకున్న బతుకు

ముఖంపై ఆనందపు తెరలను ఎలా కప్పుకోను!

నిర్దయతో నిండుకున్న సమాజం

గాయాల సమూహాలను ఎలా విప్పుకోను!

ఎండిన గులాబీ రేకులతో ఈ తోట

వసంతాలనెలా పరిచయం చేయను!

శిథిలమైన పాత గోడలాంటి దేహం కప్పుకున్న శిశిరపు నీడలకు

చంద్రుడి వెన్నెల తప్ప ఇంకేమి చూపించగలను

April 10, 2022 1 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us