మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi June 14, 2022
written by Chillara Bhavanidevi

2


చిన్నాదేవికి నిద్రపట్టడం లేదు. కళ్ళు మూసినా, తెరిచినా ప్రభువు సుందరరూపమే మెదులుతోంది. కదిలితే తల్లికి నిద్రాభంగం అవుతుందని అలాగే కళ్ళుమూసుకుని పడుకుంది.
వాతావరణం వసంత మనోహరంగా ఉంది. కిటికీలోంచి పిల్లగాలి అల్లరిపెడుతోంది. అది కొంత ఊరట కల్గిస్తున్నా మరింత నిట్టూర్పుకు కూడా కారణమవుతోంది. నిండు పేరోలగంలో కొలువు తీరిన రాయలమూర్తి గంభీర రాజసంతో ధీర విలసితంగా ఉంది. నాడు తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో తన నృత్యం చూసిన కృష్ణరాయని కళ్ళల్లో తొణికిసలాడిన ఆ భావం ఏమిటో పూర్తిగా అర్థం కావటం లేదు. అది ప్రేమా? ప్రశంసా? అనురాగమా? అభిమానమా?భగవానుని సన్నిధిలో ప్రభుదర్శనం వల్ల తన జీవితంలో ఎటువంటి మార్పు జరుగనున్నదో ఆ నాట్యమయూరికి అవగతం కాలేదు. ఏమో! చల్లనితల్లి అలివేలుమంగమ్మ అనుగ్రహంతో రాయలు తనను అంగీకరిస్తే ఈ జన్మకదే వరం. ఇదంతా శ్రీకృష్ణరాయలు ప్రభువు కాకముందు. కానీ ఇప్పుడు ఆయన విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఒక దేవదాసి చేయి పట్టుకుంటాడా? ఒకవేళ ప్రభువు అలా అనుకున్నా అప్పాజీ అంగీకరిస్తారా! అప్పాజీ మాటను ప్రభువు శిరసావహిస్తాడు కదా! ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలీదు.
చిన్నాదేవి పారవశ్యంతో నృత్యం చేస్తున్నది. దేవాలయ ప్రాంగణంలో పలువురు ప్రముఖులున్నారు. ఆమె దృష్టి మాత్రం మురళీమోహనుడి మీదే కేంద్రీకృతమై ఉంది. ఇదేమిటి! స్వామి స్థానంలో కృష్ణరాయలు చిరునవ్వులతో తనకేసి చూస్తున్నాడు? రారమ్మని చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు?
‘‘స్వామీ పూజా ప్రసూనమై నీ
పద పద్మముల వాలెదను
ఎన్ని జన్మలైన నిన్నెడ బాయను స్వామి!’’
చిన్నాదేవి నర్తిస్తూ మురళీమోహనుడి వైపే అడుగులేస్తోంది. అందరికీ ఆవేళ చిన్నాదేవి ధోరణి కొత్తగా ఉంది. సమ్మోహనకరంగా ఆరాధనానృత్యం చేస్తూ అటు స్వామిని, ఇటు దేవాలయ ప్రేక్షకులను అలరించే ఆ కళాతపస్విని ఇవ్వాళ పూర్తిగా స్వామి తప్ప మరో ప్రపంచం పట్టనట్లు ఏదో మైకం కమ్మినట్లు ప్రవర్తిస్తున్నది.
విగ్రహంలోంచి కృష్ణదేవరాయలు తనకేసి చేతులు చాపి వచ్చేశాడు. ఆమె అతని విశాల వక్షస్థలంపై వాలిపోయింది. పెదవులు పాటను గుసగుసలాడు తున్నాయి. స్వామి చేతుల్లో బందీఅవటం హాయిగా ఉంది. సిగ్గుతో తలెత్తి రాయల మొహంకేసి కూడా చూడలేకపోతున్నది. ఆమె అణువణువూ అతని వశమై మనసు పరవశమైంది. కళావతంసుడు రాయలు కళాకారిణి చిన్నాదేవి మనుసులు ఐక్యమైన అద్భుత అనుభూతి. చుట్టూ ఎందరున్నా ఎవ్వరూ లేని ఏకాంత భావనా ప్రపంచం అది.
కల చెదిరింది. ఆశ్చర్యపడి చుట్టూ చూసింది చిన్నాదేవి. పక్కన తల్లి గాఢనిద్రలో ఉంది. ఆమెకీ అనుభూతి కొత్తది. తాను ఎవరిబిడ్డో ఏమో ఈ తల్లి పెంచి నాట్యం నేర్పింది. చిన్నతనం నుంచి ‘నీజన్మ కృష్ణార్పణం’ అన్న అమ్మమాట తలదాల్చి జీవిస్తున్న చిన్నాదేవి మనసీనాడు చెదిరిపోతున్నది.
రాయలు ఎంత అందగాడు! అచ్చు కృష్ణునిలా… తప్పు తప్పు! కృష్ణుడు భగవంతుడు. మరి రాయలు కూడా భగవంతుని అంశే! ప్రభువు అంటే విష్ణువే కదా! తన పిచ్చిగాని ప్రభువు తనని స్వీకరిస్తాడా! తన జన్మ ఎలాంటిదో ఆయనకి తెలుసా? దేవదాసీ వ్యవస్థలో దేవాలయాలలో ప్రభువుల సమక్షంలో మాత్రం నాట్యం చేసే నర్తకిని ప్రభువు రాణిగా చేసుకుంటాడా! కలతగా నిద్రపట్టింది చిన్నాదేవికి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘ఏయ్‌ మంజరీ ఆగు!’’ చంద్రప్ప మంజరిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
మంజరి అతనికి చిక్కినట్లే చిక్కి జారిపోతోంది.
‘‘ఇలా అయితే నేను నీతో మాట్లాడను’’ అతను బుంగమూతి పెట్టుకొని ఓ చంద్రకాంతశిల మీద కూర్చుండిపోయాడు. దిగువుగా ఉన్న శిలమీద కూర్చుని అతని వడిలో తన్మయంగా తలవాల్చి కూర్చుంది మంజరి.
ఆ ఉద్యానవనంలో వెన్నెల్లో చెట్ల పూలు కొత్తగా మిలమిల్లాడుతున్నాయి. చంద్రప్ప వేణువును తీసి పాడటం మొదలుపెట్టాడు. అతనికి తెలుసు మంజరినెలా అలరించాలో! నాగస్వరానికి వివశురాలైన నాగినిలా ఆమె శరీరమంతా ప్రకంపనలే.
చంద్రప్ప సమక్షంలో… మంజరి నర్తనం ముందు ఇంద్రసభలో అప్సరల నృత్యాలు కూడా సరిచాలవు.
అతని వేణువు నింపుకుంటున్న ఊపిరి విన్పించే పాటను ఆమె కాలి అందెయలు నాట్యంగా అనువదించుకుంటున్నాయి. ఆ నాదానికి ఈ పాదంతోడై ఇరువురి శరీరాలు తన్మయంగా పరవశిస్తున్నాయి. అలా ఎంతసేపు గడిచిందో వాళ్ళకే తెలీదు. రెండు నాగుపాములు జంటగా పెనవేసుకున్నట్లు.
రాత్రి ఒక జాము దాటింది.
పహారా నగారా మోగింది. చంద్రప్ప ఒళ్ళో తలపెట్టి పడుకొన్న మంజరి ఉలిక్కిపడిరది.
‘‘చంద్రా! చాలా పొద్దుపోయింది. నీ దగ్గర ఉంటే కాలం ఆగిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అమ్మ నన్ను చంపేస్తుంది’’ అంది భయంగా.
‘‘భయమెందుకు? నువ్వు నా దానివి… నా నుండి నిన్నెవ్వరూ దూరం చేయలేరు. మంజరీ! నీ నృత్యం నా గానానికి ఊపిరి. మీ అమ్మకి చెప్పెయ్‌. మనం వివాహం చేసుకుందాం’’ చంద్రప్ప ఆమె ముంగురులు సవరిస్తూ వెన్నెల కాంతిలో తళతళలాడే ఆమె కనుపాపల్లో తన బింబాన్ని చూసుకుంటూ చిలిపిగా నవ్వాడు.
ఆ నవ్వు ఆమె మనసులో పులకింతలు రేపింది. పెళ్ళిమాట వింటూనే మంజరి నిటారుగా అయింది.
‘‘నీకు తెలీదు చంద్రా! చిన్నాదేవిగారిని ప్రభువు కోరుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి మా అమ్మకి కూడా అదే ఆశ పుట్టింది. నన్నే రాజ ప్రముఖుడెవరైనా చేసుకుంటే రాజవైభోగాలన్నీ దక్కుతాయని ఆమె ఆలోచన. నీలాంటి సంగీతకారుడికి నన్నిచ్చి పెళ్ళి చేయదుగాక చేయదు’’ నిరాశగా అంది మంజరి.
‘‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నేను నిన్ను వదులుకోలేను మంజూ! మనది జన్మజన్మల బంధం’’ ఆమెను కౌగిట చేర్చుకున్నాడు చంద్రప్ప.
మంజరి అతన్ని వదలలేక వదలలేక వెళ్ళింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అది దేవదాసీల వీధి. ఆ భవనాల్లోంచి అనుక్షణం నృత్యగానాలు విన్పిస్తూ
ఉంటాయి. మంజరి తల్లి కృష్ణసాని ఆ వీధిలోకెల్లా సంపన్నురాలు. మంజరికి చిన్నతనం నుంచి నృత్యం, గానం నేర్పింది. మంజరి భగవంతుని కైంకర్యంగా నర్తిస్తున్నా, కృష్ణసాని కళ్ళు మాత్రం ధనవంతుల కోసం వెదుకుతున్నాయి. ఈ మధ్య మంజరి చంద్రప్పతో పొద్దుపుచ్చటం కృష్ణసాని దృష్టికి రాకపోలేదు. సమయం సందర్భం చూసి కుమార్తెను హెచ్చరించాలనుకుంది.
తల్లి నుంచి ఎటువంటి పెడసరపు మాటలు వినాల్సి వస్తుందోనన్న భయంతో మంజరి మెల్లగా తన కక్ష్యవైపు నడిచింది. పర్యంకం మీద కృష్ణసాని అరుణ నేత్రాలతో కుమార్తెకేసి తీక్షణంగా చూసింది.
మంజరి భయభీత అయి కంపించింది.
‘‘అమ్మా! ఈ వేళప్పుడు…’’ అర్థోక్తిలో ఆగిపోయిందా బేల.
‘‘అదే అడుగుతున్నాను. ఈ వేళప్పుడు ఎవరితో తిరుగుళ్ళు? ఎక్కడ నించి?’’ కృష్ణసాని తీవ్రస్వరంతో అడిగింది.
మంజరి మాట్లాడలేదు. తలవంచుకుని నిలబడిరది.
‘‘ఆ చంద్రప్పదగ్గర్నుంచేనా’’ కరకుగా ఉందా స్వరం.
అవునన్నట్లు తలూపింది మంజరి.
‘‘నేను నీకు గతంలో ఒకసారి చెప్పాను. ఆ ఉన్మత్త గాయకుడితో తిరిగితే లాభం ఏముండదని. ఇదే నీకు ఆఖరుసారి చెప్తున్నాను. నువ్వు అతన్ని మర్చిపో! చిన్నాదేవిలా నీక్కూడా ఓ ప్రభువు లేదా ప్రభువంతటివాడు…’’ తల్లిమాటలు పూర్తికాకుండానే మంజరి ఆపింది.
‘‘నేను చంద్రాన్ని ఇష్టపడుతున్నానమ్మా! అతనే నా జీవితేశ్వరుడు’’ ఆమె స్వరం మెల్లగా ఉన్నా దృఢంగా ఉంది.
కృష్ణసాని తోకతొక్కిన కృష్ణతాచులా లేచింది.
‘‘కళ్ళు పైకెక్కినాయా! చిన్నాదేవి వైభోగం చూశావా! శ్రీకృష్ణదేవరాయ ప్రభువు కూడా రాజుకాకముందే ఆమెను కోరాడు. మాట ఇచ్చాడు. ప్రభువైతే కూడా ఆమెని మరువడు. పట్టాభిషేకం జరుపుకోబోతున్న రాయల మనసులో పట్టమహిషి చిన్నాదేవే! ఎంత అదృష్టవంతురాలామె! నేనెంత కలలు కంటే మాత్రం ఏం లాభం!’’ నిట్టూర్చింది నిస్సహాయంగా కృష్ణసాని.
‘‘అమ్మా! ఇతరులతో మనకెందుకు? అది ప్రభువు ఆదరం. నన్నూ, చంద్రాన్ని ఆశీర్వదించు. కళాపోషకుడైన ప్రభువు నీడలో మా జీవితాలు తరిస్తే నాకదే పదివేలు’’ మంజరి నచ్చచెప్పింది.
‘‘నీ మాట నీదేనా! ఇక పడుకో! రేపటినుంచి నేను చెప్పినదే జరగాలి. మరో ఆలోచనకు తావులేదు’’ విసవిసా బయటికి నడిచింది కృష్ణసాని.
మంజరి విశ్రమించిందేగానీ మనోహర వేణుగానం మదిలో ఆ గదిలో విన్పిస్తూనే ఉంది. ఆమెకదే ఏకాంత సేవాభాగ్యం.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
నర్సప్ప నాయకుని మరణకాలానికి కృష్ణరాయని పట్టాభిషేక కాలానికి విజయనగర సామ్రాజ్య రాజకీయ పరిస్థితులు అంత బాగా లేవు. సరిహద్దు రాజ్యభాగాలు కోల్పోయి రాజ్యం అంతఃబహిర్‌ శత్రువులతో, అంతఃకలహాలతో, బహ్మనీ గూఢచారులతో నిండి సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితులలో ప్రబల రాజాధిరాజు, రాజ పరమేశ్వర, వీర ప్రతాప శ్రీకృష్ణదేవరాయు తిమ్మరుసు ధీయుక్తితో చక్రవర్తిగా పట్టాభిషిక్తుడౌతున్నాడు.
ఆరోజు కృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్నది.
శ్రీజయంతి నాడు జరుగుతున్న ఉత్సవానికి కర్ణాటకాంధ్ర దేశాల ఏలికలకు ఆహ్వానాలు అందాయి.
ఆనాడు విజయనగరం వికసించిన వనవాటికలా సుగంధ పరిమళాలతో విలసిల్లుతున్నది. అనేకమంది రాజులు, పండితులు, కవులు, జ్యోతిష్కులు విచ్చేశారు. నగరాన్ని అరటిబోదెలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. బ్రాహ్మణ శ్రేష్టులు గ్రహశాంతి, హోమయజ్ఞాలు చేశారు. శుద్ధోదక స్నానం చేసిన రాయలు నూతన వస్త్రాలంకార భూషితుడై మరో విష్ణువులా భద్రాసనంపై శోభిల్లుతున్నాడు, వేదపండితుల మంత్రోచ్ఛాటనంతో బంగారు కలశంలోని సకల నదీజలాలతో రాయలకు సంప్రోక్షణ చేశారు. అందరి జయజయధ్వానాల మధ్య శ్రీకృష్ణదేవరాయల కిరీటధారణ జరిగింది.
రాజోద్యోగుల పరిచయం, రాజధానీ సందర్శనం అయినాక రాయలు తల్లికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. మహామంత్రి, పితృసమానులు అప్పాజీ, గురువు వ్యాసరాయల ఆశ్సీసులు పొందాడు. కవులు పద్యాలతో ఆశ్సీసులందించారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరిగాక అప్పాజీ మరోసారి రాయల్ని గౌరవించి కౌగిలించి ఆశీర్వదించాడు. ఈ ఉత్సవానికి గుర్తుగా విరూపాక్ష మందిరంలో ‘రంగనాథ మందిర గోపురం’ నిర్మించబడిరది.
ప్రజలంతా అప్పటికే కృష్ణరాయని గురించి విన్నారు. అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దక్షిణాపథాన మహత్తర గిరి దుర్గం విజయనగరం. ఆ పేరును సార్థకం చేయటానికి రాయలు అనేక చర్యలు తీసుకున్నాడు.
రాచకార్యాలతో వ్యస్తుడైన రాయలకు చిన్నాదేవి అనుక్షణం గుర్తు వస్తున్నది. ఆమెని పట్టమహిషిని చేస్తానన్న తన వాగ్ధానం పదే పదే ఆయన స్మృతిపథంలో మెదుల్తూ అది నెరవేర్చటానికి వేగిరపడుతోంది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘చిన్నా! ఏమిటి ఈ బేలతనం!’’ చిన్నాదేవికి చేరువగా వచ్చి ఆమె మునిగడ్డం పట్టి ఎత్తి కళ్ళలోకి చూసింది మంజరి.ఆ కళ్ళు తామర కొలనులా ఉన్నాయి.
‘‘అవును మంజరీ! నీవీవేళ బాగా గుర్తొస్తున్నావు సుమా! మనిద్దరం ఒకే గురువు దగ్గర నాట్యం నేర్చాం. నా పాదాలు నేడెందుకో మొరాయిస్తున్నాయి. మనం నేర్చుకున్న కృష్ణనృత్యాన్ని ఓసారి ప్రదర్శిస్తావని.’’
చిన్నాదేవి స్వరంలో తెలియని ఆవేదన, అలసట.
నిరంతరం రాయల గురించిన ఆలోచనలతో ఆమె మనసు వడిలిపోయింది. తన రాయలు ప్రభువైనాడు గదా! తననింక గుర్తుంచుకుంటాడా! మనసు నిండా సంతాప మేఘాలు కమ్ముకుంటున్నాయి. తనవల్ల రాయల కీర్తికి ఎటువంటి మచ్చ రాకూడదు. పట్టమహిషి పదవిమీద కూడా ఆమెకి ఆశలేదు. రాయలే ఆమెకి సర్వస్వం. ఆమె అతనికి ప్రియురాలు, భార్య, అర్థాంగి, రాణి కూడా.
మంజరి ముద్ర పట్టి ‘కృష్ణనృత్యం’ చేస్తున్నది. రాధ విరహంతో వేగిపోతూ కృష్ణుని రాకకోసం చెట్టునీ, పుట్టనీ, పులుగునీ, పున్నమినీ స్వామి జాడకోసం అభ్యర్థిస్తోంది.
‘‘రాడేలనే స్వామి రాడేలనే
నా వాడని నమ్ముకొంటి
ఇంతకింత రేయిమించె
రాడేలనే స్వామి రాడేలనే!’’
మంజరి విరహోత్కంఠిత రాధలా మారిపోయింది. ఆమె హృదయంలో అగ్ని బాణాలు గుచ్చుకుంటున్నాయి. నేటికి పది దినాల నుండి చంద్రప్ప జాడ లేదు. అతని సన్నిధి కోసం ఆమె బేలహృదయం పలవరిస్తోంది.
‘‘నే తాళ లేనే చెలియా
నే తాళ లేనే ఓ సఖియా’’
అంటూ ఉన్మత్త విరహిణిలా మంజరి నేలకొరిగింది. అప్పటివరకూ అదే స్థితిని అనుభవిస్తూ విపరీత వేదనకు గురవుతున్న చిన్నాదేవి మంజరి స్థితికి కంగారుపడిరది. ఆమె పరిచారికల సహాయంతో మంజరిని సేద తీర్చింది.
‘‘మంజరీ! ఏమిటిది! నీది నర్తనమా! నిజస్థితి ప్రదర్శనమా?’’
మంజరి బలహీనంగా నవ్వింది. ఆమె ఆహారం తీసుకొని కొన్ని దినాలయిందని గ్రహించింది చిన్నాదేవి. మంజరిని మంచం మీదికి చేర్పించింది. పానీయం ఇప్పించింది. ఆమె సేద తీరాక విషయం అడిగింది.
‘‘మంజరీ! చెప్పు. మనం చిన్నప్పట్నుంచీ నేస్తాలం. ఒకరి మనసు మరొకరు బాగా తెలిసినవాళ్ళం. నీవు చంద్రప్ప ఒకరికొకరుగా మెలగటం నాకూ తెలుసు. ఇప్పటి నీ పరిస్థితికి అతను కారణమా?’’ ప్రేమగా మంజరి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.
మంజరి తలదించుకోవటం వల్ల ఆమె మనసులో ఏముందో తెలీటం లేదు. సన్నగా కంపిస్తున్న ఆమె శరీరం మనోవ్యాకులతను తెలుపుతోంది. చిన్నాదేవి మంజరిని మరి ప్రశ్నించదలచలేదు.
‘‘కాసేపు విశ్రాంతి తీసుకో తర్వాత మాట్లాడుకుందాం’’ అని మంజరిని ఏకాంతంగా వదిలేసి బయటి కక్ష్యలోకి వచ్చింది.
అప్పటికే ఆమెకోసం ఒక వార్తాహరుడు ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయల ప్రేమకు పాత్రమైన ఆమెపట్ల అంతా గౌరవం, వినయాలనే ప్రదర్శిస్తున్నారు. ఏమో! ‘రాబోవు కాలంలో కాబోయే రాణి’ అని తలచి కాబోలు!
‘‘ఏమి వార్త తెచ్చావయ్యా!’’ చిన్నాదేవి రాజసాన్ని ఒలకబోస్తూ ఆసనంపై ఆసీనురాలయింది.
‘‘మహామంత్రి తిమ్మరుసులవారు మరో రెండు గడియల్లో మిమ్ములను కలవనున్నారు. ఇది అతి గోపనీయమని సెలవీయమన్నారు’’ వార్తాహరుడు అభివాదం చేసి నిష్క్రమించాడు.
దిగ్గున లేచింది చిన్నాదేవి. మనసు భయాందోళనలతో, ఆశ్చర్యానందాలతో నిండిపోయింది. ఏమి చేయటానికీ పాలుపోవటం లేదు. అంతటి మహామాత్యుడేమిటి… తమ ఇంటిని పావనం చేయటమేమిటి? విజయనగర సామ్రాజ్య యశస్సుకు మూలస్తంభంలాంటి అప్పాజీ తమబోటి వారింటికి రావటమా! సమయానికి తల్లికూడా ఇంట లేదే!
ఆలోచిస్తుండగానే తిమ్మరుసు మహామంత్రి ధీరగంభీర మూర్తిలా ఆ దేవదాసి ఎదుట నిలిచాడు. తొట్రుపడిరది చిన్నాదేవి.
‘‘మహామంత్రికి ప్రణామాలు!’’ పాదాభివందనం చేసింది. ఆయనను ఆసనం మీద కూర్చుండబెట్టి ఎదుట తలవంచి వినమ్రంగా నిలిచింది ‘ఏమి ఆజ్ఞ’ అన్నట్లు.
సర్వాలంకారభూషితjైు శ్వేతాంబర ధారిణిగా అపర సరస్వతిలా నిలుచున్న చిన్నాదేవి ముగ్ధమనోహర రూపాన్ని ఒక నిమిషం పరికించాడు అప్పాజీ.
‘ఈమె ఇంతటి సౌందర్య సౌశీల్యాలు కల్గిఉంది కాబట్టే రాయలు మనసిచ్చాడు. పట్టమహిషి కాదగిన సకల లక్షణ సముపేత’ అనుకున్నాడు అప్పాజీ.
నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ చిన్నాదేవి మెల్లగా అడిగింది. ‘‘పెద్దలకి నా మీద ఇంత అనుగ్రహానికి కారణమేమో తెలుసుకోవచ్చునా?’’
అప్పాజీ గంభీరముద్ర వహించాడు. మరుక్షణం చిన్న చిరునవ్వు ఆయన పెదవులపై చంద్రవంకలా మెరిసింది.
‘‘అమ్మా! విజ్ఞురాలివి. రాయలు ఏనాడో నీవాడైనాడు.రాజుకు భార్యలెందరున్నా దోషం కాదు. అయినా నీ స్థానం నీదే! ప్రభువుల వివాహానికి అనేక కారణాలుంటాయి. నీవల్ల ఒక సహాయం కోరి వచ్చాను.’’
ఉలిక్కిపడిరది చిన్నాదేవి.
‘‘నావల్లనా అప్పాజీ! విజయనగర సామ్రాజ్యమే మీకెంతో ఋణపడిరది చెప్పండి మహామాత్యా!’’
‘‘చిన్నాదేవీ! కృష్ణరాయలు రాజుకాకముందే వారి అభిమానం సంపాదించావు. నీకాయన ఖడ్గవిద్య నేర్పారు. నీ సహజ లలిత కళాకౌశలాన్ని ప్రభువు అభిమానించారు. ఇప్పుడు రాజయ్యాక పట్టమహిషి స్థానం కూడా నీకివ్వదలిచారు. అయినా రాయలు మరో వివాహం కూడా చేసుకోవాలి. దీనికి రాయల్ని నువ్వే అంగీకరింపచేయాలి’’ అభ్యర్థనగా అన్పిస్తున్నా ఆదేశం ధ్వనించిందా స్వరంలో.
‘‘నేనా’’ చిన్నాదేవి గొంతు జీరవోయింది. ఆమె హృదయవేగం పెరిగింది.
‘‘అవునమ్మా! శ్రీరంగ పట్టణానికి చెందిన వీర శ్యామల రాయల కుమార్తె తిరుమలదేవితో రాయల వివాహం చేయదలిచాను. ఇది ప్రభువుకు, రాజ్యానికి కల్యాణకారణం అవుతుంది. రాయలు నా మాట కాదనడు. కానీ నీ ప్రేమ రాజ్యశ్రేయస్సుకు ప్రతిబంధకం కాకూడదు కదా!’’ అర్థస్ఫురణతో అన్నాడు అమాత్యుడు.
‘‘అప్పాజీ! మీరు నాకు తండ్రిలాంటివారు. ప్రభువు ఉన్నతి కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు నిశ్చింతగా ఏర్పాట్లు జరుపుకోండి’’ చిన్నాదేవి మాటల్లోని గంభీరతకు తిమ్మరుసు మంత్రి ఆశ్చర్యపడ్డాడు. ఆమె మట్టిలో మాణిక్యమని గుర్తించాడు.
‘‘మేము నిన్ను కల్సిన సంగతి రహస్యం సుమా’’ అని హెచ్చరించి గడప దాటుతూ ‘‘మంజరి క్షేమమా’’ అడిగాడు. చిన్నాదేవి తలూపింది.
అప్పాజీ అటువెళ్ళగానే కూలబడిరది చిన్నాదేవి. అశ్రుధారలతో ఆమె
చెక్కిళ్ళు, చీర తడిసిపోయాయి.
‘ప్రభువు తనకు దూరమవుతాడా’ ఆలోచనకే ఆమె హృదయవేదన మిక్కుటమయింది. అన్నింటికీ ఆ విరూపాక్షుడే సాక్షి అనుకున్నది. మంజరి ఎప్పుడువచ్చిందో చిన్నాదేవి భుజంమీద చేయివేసి పిలిచేదాకా తెలీలేదు.
‘‘చిన్నాజీ! నేనంతా విన్నాను. నీ నిర్ణయంలో ఎంత త్యాగముందో రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి.’’
‘‘ఏమో! నా ప్రభువు లేని జీవితం మాత్రం నేనూహించలేను’’ చిన్నాదేవి మంజరిని కౌగలించుకుని రోదించింది.
‘‘అలా ఎన్నటికీ జరుగదు. ప్రభువులు అనేక కారణాలతో ఎందర్ని చేసుకున్నా వారు అనుమతిస్తేనే భార్యగా చెలామణి అవుతారు. ప్రభువు నిన్నేనాడో పట్టమహిషిని చేశారు. మరెందరు భార్యలుంటేనేం? దుఃఖించకు’’ అని ఓదార్చింది మంజరి. చిన్నాదేవి ఒకింత సాంత్వన పొందింది.
‘‘అవును మంజరీ! నువ్వు మహామంత్రికి ఎలా తెల్సు? నువ్విక్కడ ఉన్నట్లు వారికి ముందే తెలుసా?’’ ఈ లోకంలోకి వచ్చినట్లుగా ప్రశ్నించింది చిన్నాదేవి.
‘‘విజయనగర సామ్రాజ్యంలో చీమ కదిలినా కూడా మహామంత్రికి తెలియకపోదు. శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల పట్టాభిషేక మహోత్సవంలో జరిగిన నాట్యప్రదర్శనలో నీతోపాటు నేనూ నాట్యం చేశాను కదా! తిమ్మరుసు మంత్రివర్యులు ఆనాడే నన్ను పసిగట్టారు. మనలో మాట… చంద్రప్ప సంగతి అడిగావుగా! చంద్రాకు అప్పాజీగారు కొన్ని రాచకార్యాలు అప్పగిస్తుంటారు. ఈ పదిరోజులుగా అతను కన్పించలేదంటే అదే అనుకుంటున్నాను.’’
చిన్నాదేవి ఆదరంగా మంజరి చెక్కిళ్ళు నిమిరింది. మేనా తెప్పించి ఆమెను ఆదరంగా సాగనంపింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చిన్నాదేవి రాయలను ఎలా ఒప్పించిందోగానీ, రాయల వివాహం తిరుమలాంబతో వైభవంగా జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగాంబ కోడల్ని ప్రేమతో అంతఃపురానికి ఆహ్వానించింది.
ముత్యాల హారతులు
ముదితలంతా ఈరె
ముద్దుల సీతకు
మురిపాలు మీర ॥
పగడాల హారతులు
పడతులంతా ఈరె
పసిడి పళ్ళెమ్ములో
పూవు లక్షతలుంచి ॥
వజ్రాల హారతులు
వనితలంతా ఈరె
వైభోగములు వెలయ
వాణీశుడే బ్రోవ ॥
తిరుమలదేవికి సాహిత్యమంటే బహుప్రీతి. ఆమె చాలా అందగత్తె. వీణావాదనలో నిష్ణాతురాలు. రాజసం ఉన్న ధీరవనిత. అంతఃపురంలో నృత్యగాన వినోదాలతో పొద్దుపుచ్చుతున్నా తిరుమలదేవి మానసంలో ఏదో ముల్లులా ఒక బాధ. అది చిన్నాదేవి గురించి తెలియటమే!
ఆ రోజు సాయంత్రం తిరుమలదేవి అంతఃపురంలో ‘కృష్ణలీలలు’ నృత్యసన్నివేశం జరుగుతోంది.
‘‘ఈమె ఎవరు? ఇంత అద్భుత సౌందర్యంతో తన్మయపరుస్తున్న ఈ నర్తకి విజయనగర సామ్రాజ్యానికే మణిదీపంలా ఉంది’’ అని మంజరిని చూస్తూ తలపోసింది మహారాణి.
నాట్యప్రదర్శన ముగిశాక మంజరి గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఆమె చిన్నాదేవికి అత్యంత ప్రీతిపాత్రురాలని అవగతమైంది. మంజరి దేవదాసి అనీ, ఆమె నర్తనంలో అలౌకిక దివ్యత్వం ఉందనీ అర్థం చేసుకుంది. ఆమెను అనేక బహుమతులతో సత్కరించింది.
తిమ్మరుసు మహామంత్రికి తన మనసులోని ఆవేదన నివేదించిన తిరుమలదేవి చిన్నాదేవిని అంతఃపురానికి సకల లాంఛనాలతో రప్పించమని కోరింది.
తిరుమలాంబ ధీరత్వానికి అప్పాజీ లోలోపల సంతోషించాడు. సామ్రాజ్య పటిష్టతకు రాయల వ్యక్తిగత జీవన ప్రశాంతత కూడా చాలా అవసరం అని ఆయనకు తెలుసు.
చిన్నాదేవి రాజమందిరంలో చెలికత్తెలతో ప్రవేశించటం రాయలకు మహదానందంగా ఉంది. తిరుమలదేవి స్వయంగా ఎదురువెళ్ళి హారతిచ్చి చిన్నాదేవిని ఆహ్వానించింది. తిరుమలదేవికి ఆమెను చూస్తూంటే తన ప్రతిబింబాన్ని చూస్తున్నట్లే అన్పిస్తున్నా మనసులో స్త్రీ సహజమైన కలత తొంగిచూస్తున్నది.
మంజరి చిన్నాదేవితో బాటు రాజమందిరంలోకి వచ్చిందే కానీ మొహాన చిరునవ్వు మాయమైంది. ఎప్పుడూ అన్యమనస్కంగా ఉంటున్నది. నాట్యం చేసినా ఆత్మ పలకటం లేదు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అప్పాజీ రహస్య సమావేశ మందిరంలో దీర్ఘాలోచనలో నిమగ్నమై ఉన్నాడు. వార్తాహరుడు వచ్చి అందించిన సమాచారం వల్ల ఆయన మనస్సు చాలా అశాంతిగా ఉంది. ఇంతలో చంద్రప్ప వచ్చినట్లు కబురందింది. లోపలికి అనుమతించాడు మహామంత్రి. చంద్రప్ప వచ్చి వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
‘‘చంద్రప్పా! వెళ్ళిన పని ఏమయింది’’ ఆయన మామూలుగా అడిగినా అది ఉరుమంత గంభీరంగా ఉంది.
‘‘మహామాత్యా! మీ ఆనతి ప్రకారం ఉమ్మత్తూరు, శివసముద్రం ప్రాంతాలు పరిశీలించి వచ్చాను. అక్కడి మన వేగులతో సంప్రదించాను. ఆ పాలెగాళ్ళు మన విజయనగర ఆధిపత్యాన్ని లెక్కచేయటం లేదు. వాళ్ళు మనకి పన్నుకట్టరట. త్వరలోనే స్వతంత్రత ప్రకటించుకుంటారట అప్పాజీ!’’ నమ్రతగా చెప్పాడు.
‘‘ఆహా! ఎవ్వరికీ ఏమీ ఉప్పందించలేదు కదా!’’ అప్పాజీ లోతుగా ప్రశ్నించాడు.
‘‘లేదు అప్పాజీ! ఈ మాసం రోజులు నా వేణుగాన ప్రదర్శనలతో ప్రజల్లో ధారాళంగా సంచరించాను.’’
‘‘ప్రజలేమనుకుంటున్నారు?’’
‘‘ప్రజలంతా కృష్ణరాయలవారి పాలనే కోరుకుంటున్నారు అప్పాజీ!’’
‘‘మంచిది. ఇక నువ్వు వెళ్ళవచ్చు’’ తిమ్మరుసు ఆజ్ఞఅయినందుకు వినమ్రంగా నమస్కరించి నిష్క్రమించాడు చంద్రప్ప.
సేనానాయకుడు దండపాణి ప్రవేశించాడు. మహామాత్యులు ఆసీనుడైనాడు. సుదీర్ఘ మంతనాలు జరిపాడు.
‘‘మహామంత్రి! మనం అభివృద్ధిపరిచిన ప్రకారం మన సైన్యం ఏడులక్షల కాల్బలం, ఐదువందల యాభై గజబలం, ముప్ఫైరెండు వేల ఆరువందల అశ్వికదళం, ఇది కాక కామానాయకుడు, తిప్పన్న నాయకుడు, కొండమరెడ్డి, మధుర నాయకుడి ఆధీనంలో వేల కాల్బలం, గుర్రపుదళం, గజబలం కేంద్రీకృతమై యుద్ధసామాగ్రితో సిద్ధంగా ఉంది. రాయలవారు పట్టాభిషిక్తులైన ఈ సంవత్సరంలో మనసైన్యం బహుధా శిక్షణ పొంది ఉంది. ఇంకా కొద్దిరోజుల్లోనే బహుమనీ సుల్తాన్‌ రెండవ మహమ్మద్‌షా, బీజాపూర్‌ యూసఫ్‌ అదిల్‌ఖాన్‌ షాతో కలిసి మనమీద యుద్ధం ప్రకటించబోతున్నారని వేగులవల్ల తెలిసింది.’’
‘‘మంచిది. సైన్యాన్ని ఆయత్తపరచండి. వాళ్ళు సరిహద్దు చేరగానే మన సైన్యం ఆ మ్లేచ్ఛులను చీల్చి చెండాడగలదు’’ మహామంత్రి ఆజ్ఞకాగానే దండపాణి సమరోత్సాహంతో నిష్క్రమించాడు.
ఆ రాత్రి రెండుజాముల వరకు తిమ్మరుసు దీపం వెలుగులో పలు లేఖలు రచించి వేగులతో వర్తమానాలు పంపించాడు. అవి ఎవరికోసం రాశాడో మున్ముందు చరిత్రే చెప్తుంది.
చిన్నాదేవి మందిరంలో ప్రణయ సామ్రాజ్యంలో ఓలలాడి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాయలకీ విషయాలేవీ తెలియవు. మహామంత్రి తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యాన్ని కంటి రెప్పలా కాపాడుతున్నంత కాలం నిశ్చింతగా ఉండొచ్చని రాయల అచంచల విశ్వాసం.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అంతఃపుర సౌధాన్ని ఆనుకొని ఉన్న సుందర ఉద్యానవనంలో చాలాసేపటి నుంచి మంజరి వేచిఉంది. చంద్రాన్ని చూసి ఎంత కాలమైంది! తనను కలవలేనంత రాచకార్యాలేముంటాయి? తను అతనికోసం అంతగా వేదన చెందుతుంటే చంద్రాకి ఇదేవిూ పట్టదా! ఈ రోజు చంద్రుడు నడినెత్తి మీదికి వచ్చే సమయానికి ఈ వసంతవాటికలో కలుస్తానని కబురంపాడు. ఇంతవరకు జాడలేదు.
ఆకాశంకేసి చూసింది మంజరి. మబ్బులు అడ్డగించడం చల్ల చంద్రుడు ఎంతమీదికి వచ్చాడో తెలీటం లేదు. ఉస్సురని నిట్టూర్చింది. చిన్నాదేవిదే అదృష్టం. ప్రభువుకాకముందే కృష్ణరాయని ప్రేమకి పాత్రురాలయింది. ప్రభువయినా రాయలవారి మనసు ఇసుమంతయినా మారలేదుసరికదా తిరుమలాంబతో వివాహమైనా చిన్నాదేవి పట్ల మక్కువ పెరిగిందే కానీ తరగలేదు. ఓసారి నిట్టూర్చి పాలరాతి మండపంలో స్తంభానికి చేరగిలపడి చంద్రప్ప గురించి తలపోస్తున్నది మంజరి.
‘‘ఎదుట ఉన్నవారిని మరిచి ఎంతసేపా ధ్యానం మంజూ’’ చంద్రప్ప ప్రేమపూరితమైన స్వరం విని నిలువెల్లా పులకించింది.
‘‘చంద్రా!’’ ఉదుటన లేచి నిలువెల్లా అల్లుకుపోయింది.
‘‘ఇన్నాళ్ళకా చంద్రా! నేనేమైపోవాలి’’ ఆమె గొంతు మూగవోతున్నది.
‘‘మన్నించు మంజూ! అప్పాజీవారు అప్పగించిన స్వామికార్యంలో నిమగ్నమై నిన్ను కలవలేకపోయాను’’ బుజ్జగిస్తూ చెప్పాడు. ఆమె భుజంమీదుగా చేయివేసి లతామండపానికి తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు.
‘‘నువ్వు వినే ఉంటావు. మనకీ, బహుమనీ సుల్తాను, బీజాపూర్‌ సుల్తాన్‌లు కలిసి జరిపిన యుద్ధం గురించి’’
‘‘అవును… మనం సాధించిన విజయవార్త కూడా విన్నాను… విజయనగర సైన్యం శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడిరదనీ, మహ్మద్‌షాకు తీవ్రగాయాలైనాయనీ’’
‘‘ఆ! అంతేకాదు. పిరికితనంతో పలాయనం చిత్తగిస్తున్న మహ్మదీయ సైన్యాన్ని మనవాళ్ళు తరిమి తరిమి కొట్టారు. ఈ యుద్ధంలో బీజాపూర్‌ యూసఫ్‌ ఆదిల్‌షా మరణించాడు. అతని కుమారుడు పన్నెండేళ్ళ బాలుడైన ఇస్మాయిల్‌ ఆదిల్‌ఖాన్‌ సుల్తాన్‌ అయ్యాడు. ఇస్మాయిల్‌ బాలుడు కావటాన బీజాపూర్‌లో కామల్‌ఖాన్‌ సర్దారు అధికారం చేజిక్కించుకున్నాడు. బీదర్‌ ఆక్రమించి సుల్తాన్‌ మహమ్మద్‌ షాని బందీని చేశాడు. రాయచూర్‌ని జయించాక కామల్‌ఖాన్‌ హత్య తర్వాత రాయలు మహమ్మద్‌ షాని బంధవిముక్తుడ్ని చేసి మళ్ళీ సుల్తాన్‌ని చేశాడు’’ సంతోషంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘ఇవన్నీ విజయనగర పౌరులందరికీ తెల్సినవే! రాయలవారికి ‘యవనసామ్రాజ్య స్థాపకాచార్య’ బిరుదు ప్రదానం అందుకే కదా’’ నవ్వింది మంజరి ఉల్లాసంగా.
‘‘మంజరీ! అన్నీ శుభవార్తలే! ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత మళ్ళీ నీ సుందర వదనారవిందాన్ని చూసే అదృష్టం కలిగింది. నా దేశాంతరవాస శ్రమంతా నీ చిరునవ్వుతో, ఆలింగన స్పర్శతో తీరిపోయింది’’ చంద్రప్ప మంజరిని తన బాహువుల మధ్య మళ్ళీ చేర్చుకున్నాడు. మంజరి గువ్వలా అతని కౌగిట ఒదిగిపోయింది.
‘‘చంద్రా! మరో ముఖ్య విషయం. నేను నీ ఎడల అనురాగాసక్తనై ఉన్నట్లు చిన్నాజీకి తెల్సింది.’’
అతను కౌగిలి నుంచి విడివడి ఆమె కళ్ళల్లోకి చూశాడు.
‘‘నువ్వే చెప్పావా?’’
‘‘లేదు. ఆమె గ్రహించింది. రాయలవారి అనుంగు పట్టమహిషి ఆమె. ఆమె ప్రియసఖిని నేను. నా మనసు తెలుసుకోవటం అంత కష్టమేమీ కాదులే!’’ బుంగమూతి పెట్టింది మంజరి.
‘‘అప్పాజీవారు కూడా మనకి ఆశీస్సులందిస్తారు’’ నమ్మకంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘అప్పాజీవారా’’ ఆశ్చర్యంగా చూసింది మంజరి.
‘‘అవును. ఈ రాచకార్యం మీద నేను దేశాంతరం వెళ్ళేముందు వారు ‘కళ్యాణమస్తు’ అని కూడా ఆశీర్వదించారు.’’
‘‘అయితే అది మన కోరిక తీరే దీవెనే’’
‘‘అయినా కొంచెం ఆగాలి సుమా’’
‘‘ఇంకానా’’ ఆమె అతని భుజంపై తలవాల్చింది.
‘‘రాయలవారు దక్షిణ దిగ్విజయయాత్రకు బయలుదేరుతున్నారు. నీకు తెలుసుకదా! ప్రభువుతోబాటు సైన్యమే కాదు కళాకారులు, కవులు కూడా యుద్ధరంగానికి తరలి వెళ్తున్నాం’’ ఉత్సాహంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘మీరు కూడానా! యుద్ధరంగానికా! ఇదేమిటి చంద్రా! అక్కడ మీకేం పని? వేగు పనిచేయటం వేరు. వేణుగానంతో మనసుల్ని అలరించే లలిత హృదయుడివి. రక్తపుటేరులు పారే కదనభూమిలో నిలువగలవా?’’ భయాందోళనలతో అడిగింది మంజరి.
ఆమె చేతిమధ్య అతని చేతిని బిగించి పట్టుకోవటంలోనే అతనిపట్ల ఆమెకున్న ప్రేమానురాగాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రప్ప చిన్నగా నవ్వాడు. అతనికి తెలుసు ఆమె మనసులో చెలరేగే సంఘర్షణాజ్వాల.
‘‘రాయలవారు ఏ జైత్రయాత్రచేసినా కవులు, కళాకారులు సైన్యంతో పాటు బయలుదేరాల్సిందే. సాయంత్రం యుద్ధవిరమణానంతరం ప్రభువు కవిపండిత గోష్ఠితో మానసోల్లాసం పొందుతారు. అల్లసానిపెద్దన, నందితిమ్మన వంటి కవులు కూడా వస్తున్నారు. నా గానంతో ప్రభువు అలసట ఉపశమిస్తే అంతకంటే మనకు కావలసినదేముంటుంది మంజరీ!’’ ఆమె చుబుకం పట్టి చెప్పాడు చంద్రప్ప మృదువుగా.
కళ్ళల్లో నీళ్ళు కనపడకుండా తలదించుకుంది మంజరి.
‘‘నేనూ వస్తాను. నా నాట్యంతో ప్రభువుల్ని అలరిస్తాను’’ బింకంగా అంది.
‘‘స్త్రీలను తీసుకెళ్ళటంలేదు’’ చంద్రప్ప అర్థవంతంగా నవ్వాడు.
‘‘ఓహో! ప్రభువు స్త్రీలను తగురీతిగా గౌరవిస్తారని విన్నామే!’’
‘‘అది ఆస్థానంలో! శత్రువుల మాయోపాయాలతో ద్వేషం బుసలుకొట్టే రణరంగంలో కాదు.’’
ఆమె నిరుత్సాహపడిరది. చంద్రప్పతో వియోగం సహింపరానిదిగా ఉంది. అతనామె మనస్థితిని గ్రహించాడు.
మరుక్షణం మొదలైన అతని వేణుగాన మాధురీ తరంగాలు ఆమెను చుట్టుముట్టేశాయి.
ఆమె ఉన్మత్త నాగినిలా ఉంది. ఆ రాత్రి శరీరమంతా వేయినాగులు చుట్టుకున్నట్లు మంజరి నర్తించింది. కారణం ఆ ప్రకృతికి తెలుసు. చంద్రప్పకీ తెలుసు. రాత్రి రెండవరaాము నగారా మోగింది.
చిన్నాదేవి మందిరంలో ఆమెను వక్షస్థలానికి చేర్చుకుని నిద్రిస్తున్న శ్రీకృష్ణరాయలకి లీలగా మెలకువ వచ్చింది. చిన్నాదేవి ప్రభువు హృదయంపై తలవాల్చి ‘రాయలే లోకం’ అన్నట్లు నిద్రిస్తోంది.
దూరంగా గాలితరంగాలు భారంగా మోసుకొస్తున్న వేణుగానం వింటుంటే ఆ కళాకారుడు ఆనందపరవశంతో పాడుతున్నట్లు అన్పించదు. ఏదో హృదయ తాపాన్ని గానరూపంలో వెలిబుచ్చుతున్నట్లనిపిస్తుంది. ఎవ్వరో ఆ గాయకుడు? మున్నెన్నడూ విన్నట్లు లేదు. నడిజామున ఈ విరహగానాలాపన ఏంటి? కృష్ణరాయలకు నిద్రాభంగమైంది. కాపలావారిని పిల్చి ఆ గానాన్ని ఆపించుదామనుకున్నాడు. కానీ మనసొప్పలేదు. ఒకనాడు చిన్నదేవి కోసం తాను పడిన వేదనను గుర్తుచేస్తున్న గానం అది. ఆ వేణుగానం మెల్లగా మంద్రస్థాయికి దిగింది. క్రమంగా గాలిలో విలీనమైంది. ప్రభువుకు కలతగానే నిద్రపట్టింది.
‘‘ఇక నేను వెళ్ళివస్తాను మంజూ!’’
‘‘అప్పుడేనా’’ దిగాలుగా అందామె.
‘‘ఉదయానికే ప్రయాణానికి సన్నద్ధం కావాలి మరి’’ ఆమెను మరోసారి సందిట చేర్చి ముద్దాడి వీడ్కోలు పలికాడు చంద్రప్ప.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలకు దేవేరిలిద్దరూ హారతిచ్చి వీరతిలకం దిద్ది యుద్ధరంగానికి సాగనంపారు. రాయల దక్షిణ దిగ్విజయ యాత్ర మొదలైంది. కాలం నడక వేగం పుంజుకుంది.
అంతఃపురంలో చిన్నాదేవి దిగులుగా ఉంది. ఆభరణాలు, అలంకారాలు లేవు. మంజరి రావటం చూసింది.
‘‘రా మంజరీ!’’
‘‘ఏంటి చిన్నాజీ ఇంతటి వైరాగ్య వేదన! నిరాలంకరణ దేనికి?’’
‘‘ప్రభువు దగ్గరలేని అలంకరణ దేనికి మంజరీ! నేటికి పదినెలలు గడిచింది ప్రభువు యుద్ధానికి వెళ్ళి.’’
‘చంద్రప్ప వెళ్ళి’ మనసులో మంజరి అనుకుంది.
‘‘ఆ వార్తలు తెలుస్తున్నాయి గదమ్మా! అంతా జయమే’’ పైకి బింకంగా అంది.
‘‘కానీ నాకు మాత్రం క్షణమొక యుగంలా ఉందే!’’
‘‘పాద సంవాహన చేయించనా’’
‘‘వద్దు! ఓ పాట పాడు’’
మంజరి గొంతు సవరించుకుని ఓ గీతాన్ని ఆలపించింది.
‘‘మోహన మురళి ఊదవోయి కృష్ణా!
తేనెలొలికే పాట మధువు
ఓపలేదీ రాధ బ్రతుకు’’
‘‘మంజరీ! నా బాధ పెంచే పాటే పాడుతున్నావే’’ చిన్నాదేవి వారించింది.
‘‘మనిద్దరిదీ ఒకే బాధగదా చిన్నాజీ’’
‘‘అంటే చంద్రప్ప కూడా’’ ప్రశ్నార్థకంగా అడిగింది చిన్నాదేవి.
మంజరి అవునన్నట్లు తలాడిరచింది. నిట్టూర్చింది చిన్నాదేవి. మంజరిని పంపేసింది గానీ మనసు కుదుటపడలేదు. రాజులకి యుద్ధాలు తప్పవు. అలాగే వారి ప్రియసతులకీ వేదనా తప్పదనుకొంది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
యాభైవేల కాల్బలం, రెండువేల అశ్వికదళంతో గంగరాజు పాలిస్తున్న శత్రుదుర్భేధ్యమైన ఉమ్మత్తూర్‌ కోటను రాయలు ముట్టడిరచాడు. భీకర పోరాటం సాగుతున్నది.
యుద్ధశిబిరంలో కృష్ణరాయలకి నిద్రరావటం లేదు. శ్వేతాంబరధారిణి అయిన చిన్నాదేవి జ్ఞప్తికి వస్తోంది. ఆమె బాహువుల్లో ఒదిగి హాయిగా నిద్రించే రోజెన్నడో! ఏదైనా గానం వింటే మనసుకి కొంత ఊరట. చంద్రప్పకు కబురందింది.
అతని బాధాతప్తగానం రాయల హృదయానికి ఊపిరులూదుతోంది. ఇదివరలో రాత్రివేళ విన్న గానమిదే! ఇతనికీ ఓ ప్రేయసి ఉందేమో! లేదంటే ఎందుకింత విరహ వ్యధ? ఈ యుద్ధంవల్ల లాభమా! నష్టమా! హిందూ సామ్రాజ్య సంస్థాపన కోసం కంకణంగట్టుకున్న తాను ఇలాంటి ఆలోచన చేయొచ్చా?
ప్రభువు నిద్రించారని గ్రహించి ఆలాపన ఆపేశాడు చంద్రప్ప.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
సంవత్సరం పాటు జరిగిన పోరులో గంగరాజు మరణంతో ఉమ్మత్తూర్‌పై విజయం సిద్ధించింది. శ్రీరంగపట్నం జయించి విజయుడై వస్తున్న రాయలకు విజయనగర ప్రజలు హర్షధ్వానాలతో జేజేలు పలికారు.
మంజరి మనసు పాలసముద్రంలా ఎగసిపడుతోంది. వార్తాహరుని ద్వారా చిన్నాదేవి మందిరంలో అందరికీ తెల్సిన వార్త ఆమెలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. చిన్నాదేవి కూడా పరవళ్ళు తొక్కే నదిలా పూజామందిరంలో నృత్యం చేయటం చూసి మంజరి చాలా సంతోషించింది. ఎవరికైనా మనసు ప్రతిబింబించేది ఆరాధించే కళలోనే గదా!
తిరుమలదేవి, చిన్నాదేవిలతో కొలువుతీరిన ప్రభువు రుక్మిణీ సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణునిలా భాసించాడు. నాటి కొలువులో చంద్రప్ప గానానికి మంజరినాట్యం కళాకోవిదుల ప్రశంసలు పొందింది. తిమ్మరుసు మంత్రి వాళ్ళిద్దరికీ ఆశీఃపూర్వకంగా సంభావనలిచ్చాడు. రాయలు మహాదానాలు చేశాడు.
దక్షిణాపధాన విజయప్పనాయకుడి దండయాత్రవల్ల చేర, చోళ, పాండ్యరాజులు విజయనగరానికి సామంతులు కావటం రాయల కిరీటంలో మరిన్ని మణులు చేరినట్లయింది.
కృష్ణరాయల కోసం బంగారంతో రత్నాలు, వజ్రాలు తాపడం చేసిన కళాత్మక సింహాసనం ఏర్పాటయింది. చక్రవర్తి కోశాగారం నిండిరది. లక్షకిపైగా నివాస గృహాలున్న విజయనగరం లక్ష్మీశోభతో కళకళలాడుతోంది. బహుభాషా కోవిదులు, చాకచక్యంగల చారుల సేవలవల్ల విజయనగరం మరింత భద్రంగా శోభిల్లుతున్నది.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖల్లో కవిరాజు…

by Cheedella Seetha Lakshmi June 14, 2022
written by Cheedella Seetha Lakshmi

కవిరాజు బిరుదాంకితులు త్రిపురనేని రామస్వామి చౌదరి " మహా మేధావి,తాత్వికుడు,పండితుడు,విమర్శకుడు,సంఘసంస్కర్త,భావుకుడూను.అందుచేత వారి ఆలోచనలు,భావాలు,వాటిలో వచ్చిన పరిణామం తెలుసుకోవడం అవసరం" అంటారు ఆవుల సాంబశివరావు గారు ఆముఖంలో

సూతపురాణం,కురుక్షేత్ర సంగ్రామం,శంబుకవధ,ఖూనీ,వివాహనిధి,కుప్పుస్వామి శతకం,ధూర్తమానవా,సూతాశ్రమ గీతాలు,పల్నాటి గీత మొదలైనవి రచించిన త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాది,నాస్తికుడు.స్వాతంత్ర్య సమరయోధుడు, ఆ కాలంలో సంఘాన్ని ఎదిరించి పోరాడి మానవతా విలువలను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టిన గొప్ప సామాజిక కవి జనవరి 15 వ తేదీ 1887 వ సంవత్సరంలో కృష్ణాజిల్లాలోని అంగలూరు గ్రామంలో రామమాంబ,చలమయ్య దంపతులకు జన్మించాడు.

రైతు కుటుంబంలో పుట్టినా చిన్నప్పటినుండి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు.మెట్రిక్యులేషన్ చదివేటప్పుడే పల్నాటి యుద్ధము ఆధారంగా కారెంపూడి కథనం,మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అను రెండు నాటికలు 23 వ యేట రచించాడు.1911 సంవత్సరంలో బందరు లోని నోబుల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అవధానం చేసి ప్రతిభను చాటుకున్నాడు.

1914 సంవత్సరంలో న్యాయశాస్త్రం చదివేందుకు లండన్ లోని డబ్లిన్ కు వెళ్లి న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యం, ఆధునిక ఐరోపా సంస్కృతిని కూడా అధ్యయనం చేశాడు. 1914 సంవత్సరంలో అనిబిసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమానికి మద్దతు నివ్వాలంటూ భారతీయులకు విజ్ఞాపన చేస్తూ డబ్లిన్ నుండి కృష్ణాపత్రికకు తన రచనలు పంపించాడు.దేశభక్తి గీతాలు రాశాడు.
భారతదేశం తిరిగివచ్చాక మచిలీపట్నంలో న్యాయవా వృత్తిని చేపట్టాడు.సామాజిక అన్యాయాల మీద పోరాటాలు చేస్తూ తెనాలిలో స్థిరపడి 1925 సంవత్సరంలో జస్టిస్ పార్టీ తరఫున తెనాలి పురపాలక సంఘ అధ్యక్షునిగా ఎన్నికై గంగానమ్మ కొలువులో నిర్వహించే జంతుబలిని నిషేధించినందుకు అవిశ్వాసతీర్మానం పెట్టి పదవినుండి తొలగించినా వెంటనే జరిగిన ఎన్నికల్లో ఎన్నికై తిరిగి అధ్యక్షుడై 1938 వరకు ఆ పదవిలో ఉన్నంతకాలం జంతుబలిని నిషేధించాడు. ఈయన గృహానికి సూతాశ్రమం అని పేరు పెట్టుకున్నాడు.

1898 సంవత్సరంలో పున్నమ్మను పెళ్లి చేసుకున్నాక అసమర్థుని జీవయాత్ర రచించిన ప్రముఖ కవి గోపీచంద్ 1910 సంవత్సరంలో పెద్దకుమారునిగా జన్మించాడు.
భార్య చనిపోగా చంద్రమతిని ఆమె చనిపోగా అన్నపూర్ణను 1932 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు.గోపిచంద్ కుమారుడే సినీ నటుడైన సాయిచంద్..
త్రిపురనేని సాహిత్యకృషిని గుర్తించిన ఆంధ్ర మహాసభ వారు కవిరాజు బిరుదునిచ్చి సత్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతీయేడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. 1987 సంవత్సరంలో శత జయంతి సందర్బంగా భారతదేశ ప్రభుత్వం కవిరాజు స్మారక చిహ్నంగా ఒక తపాలాబిళ్ళను విడుదల చేసింది.హైదరాబాద్ ట్యాంకుబండ్ పై రామస్వామి విగ్రహం నెలకొల్పారు.

సంస్కృత భాషలో ఉన్న పెళ్లి మంత్రాలను తెలుగులో అనువాదం చేయడమే కాక ఎన్నో పెళ్లిళ్లకు స్వయంగా పౌరోహిత్యం చేసి అంటరానితనాన్ని వ్యతిరేకించిన సంఘ సంస్కర్త ,ఆదర్శవాది. ఈయన 1943 సంవత్సరం జనవరి 16 వ తేదీన తనువు చాలించాడు. పుట్టుక గిట్టుక రెండు జనవరి 15,16 కావడం విశేషమే.

కవిరాజు 1914 సంవత్సరంలో డబ్లిన్ నగరానికి వెళ్లి బారిస్టర్ పట్టా గ్రహించి 1917 సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చారు.ప్రయాణ సమయంలో కొలంబో,ప్యారిస్ నగరాల నుండి,తర్వాత డబ్లిన్ నగరం నుండి ముట్నూరి కృష్ణారావు గారికి రాసిన లేఖల్లో వ్యక్తిగతాభిప్రాయాలు,
ప్రయాణ విశేషాలు, అనుభవాలు,మన దేశ సంస్కృతి,సాహిత్య విషయాలు ఇమిడి ఉన్నాయి.

ముందు సింహళ ద్వీపానికి వెళ్ళాడు.కొలంబో నుండి వ్రాసిన ఉత్తరం మొదటిది.ఇది 31.10.1914 నాడు వ్రాయబడింది.దీనిలో సింహళ ద్వీప సౌందర్యం వర్ణింపబడింది." లంక యంతయు నేడొక యుద్యానవనముగా గన్పట్టుచున్నది.ఎచ్చట జూచినను పచ్చని పట్టుబట్టలను పరచినట్లు జొమ్పములచే నలంకరింపబడిన లతా సముచ్ఛాదితములైన వృక్షములు గన్పట్టును.ఎండిన వృక్షములను చూపరులకు నింపుబెంపమని తీవలు గుబురుగా నలముకొని యుండును.

నేను జూచినవరకింత ఫలవంతమగు ప్రదేశము వేరొండు కన్పట్టదు.సింహళమునకు నేడు కొలంబో ముఖ్యపట్టణము.పాశ్చాత్య నాగరికతయు,బూర్వ నాగరికతయు నిచ్చట గ్రుమ్ములాడుచున్నవి.తుదకు పాశ్చాత్య నాగరికతయే మేలు చేయి యైనది.” అంటూ దృశ్యానుభూతిని ఎంతో చక్కగా వివరించాడు.గ్రాంథిక భాషలోనే రాయడం విశేషం.

అదే లేఖలో ఒక దుకాణంలో తనకు కావలసిన వస్తువులు కొంటున్న సమయంలో ఒక బౌద్దుడు వచ్చాడు.బౌద్ధునికి కవిరాజుకు మధ్య జరిగిన సంభాషణలో ఇండియాలో బౌద్దమతం నశించింది.సింహళంలో కూడా నశించిపోతుందని విన్నానంటూ చౌదరి గారు అనగా బౌద్దుడు ముప్పాతిక భాగం బౌద్ధులే కానీ మతానికి పాటుపడేవారు లేరని చెప్తూ మేము కులభేదాలతో చచ్చిపోతున్నామన్నాడు.చౌదరి ఆశ్చర్యపోయి ” సర్వ జంతువులయందు సోదరభావముండవలయుననిహెచ్చు లొచ్చులులేవనియు,బోధించిన కరుణామయుడగు బుద్ధుడిది వినిన ఎంత దుఃఖించునో గదా!” అని అనేసరికి బౌద్దుడు కులభేదం నశిస్తేనే మనకు పురోభివృద్ధి అని చెప్పాడు.
ఆ బౌద్ధుని పేరు ఫెర్నినాండ్.తర్వాత కవిరాజు స్టీమరెక్కి ప్రయాణం కొనసాగించాడు.

డబ్లిన్ నుండి రాసిన లేఖలో అర్చకుల విషయం,దేవాలయ మాన్యాల విషయంపై అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.అర్చకులను మతప్రచారకులుగా చేసి దినవెచ్చాలకై ,ఉత్సవాలు జరపడానికి ,దేవాలయాలు శిథిలావస్థ పొందకుండా కాపాడడం కోసమే మాన్యములీయబడ్డాయని,
అయితే అర్చకుల పోషణభారమెప్పుడూ గ్రామస్థులపైనే ఉండేదని,అధికాదాయాన్ని వినియోగపరచేదెట్లాయని బుద్ధిమంతులాలోచించాల్సిన విషయమని అంటాడు.

అర్చకుల ధర్మాన్ని గూర్చి ,పెద్దల కర్తవ్యాన్ని గురించి చక్కగా వివరించాడు. అర్చకులచేత ఊడిగం చేయించడం కంటే అర్చకులకు వారి విద్యుక్తధర్మాలను తెలిపి వారిని విద్యావంతులుగా చేసి,మతగ్రంథాలను చదివించి,అర్చక సమాజమేర్పరచి మతప్రచారకులుగా నెందుకు ప్రయత్నం చేయరాదని ప్రశ్నిస్తాడు.
అర్చకులను కూలివాండ్రను చేసి దేవునిసేవ చేయించుట కన్న మతంపట్ల వారికాసక్తి కలిగించి,దేవాలయాలందు అభిమానం కుదిర్చి మతవ్యాప్తికి దోహదపడేట్లు చేయడం యుక్తమని భావించాడు.హిందువులమై యుండి కూడా హిందూమతమంటే ఏమిటో తెలియకుండా మాట్లాడేవాళ్ళం మనం అంటాడు.

మతాచార్యులంటే మానవులే కదా.గృహస్తు ఏ మతస్తుడో ఆ మతాచార్యుని కూడా భగవత్పూజ తర్వాత పూజించాలి కానీ త్రిమతాచార్యులనెందుకు పూజించాలి అని ప్రశ్నిస్తూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు లేఖలో..
సంఘాన్ని విమర్శించడం లేఖల్లో కనిపిస్తుంది.” హిందూదేశము స్వరాజ్యమును కాంక్షించుటలేదు”.అన్న వార్తను పత్రికలో చదివి బ్రాహ్మణేతరులు చేసిన ఈ తీర్మానాన్ని నిరసిస్తూ లేఖాముఖంగా తెలియచేశాడు.” ఈ చెన్నపట్టణమున బ్రోవైన యీ బ్రాహ్మణేతరులకు యావత్భారత దేశమునందున్న బ్రాహ్మణేతరుల పక్షమున నీగతి దీర్మానించుటకు నెవ్వరధికారమిచ్చిరి? కటా! స్వలాభపరులెవ్వరో యీ నీచకార్యమునకు దిగి యుందురు.కాని నీ తీర్మానము బ్రాహ్మణేతరులందరు నంగీకరించుటలేదనియు,బ్రిటిషువారి యధికారము క్రింద స్వరాజ్యమును ( హోమ్ రూల్) బొందుట మాకు బరమ సమ్మతమనియుం దెలియజేయుచున్నాను.” అని తన నిర్ణయాన్ని వెంటనే తెలియచేశాడు. మనము తాకితే స్నానము చేయడం,నీరు ముట్టుకుంటే త్రాగకపోవడం,దేవాలయాల్లోకి పోనీయక పోవడం మొదలగు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిగుట్టు విదేశీయులకు తెలిపి, బ్రాహ్మణులు మనకపకారం చేశారని హిందువుల కుత్తుకలను కత్తిరించడానికి కత్తిని ఇతరుల చేతిలో పెట్టడం అవివేకం అంటూ” బ్రాహ్మణులు నా కడనుండి యపహరించిన హక్కులను వారికడనుండి బలిమియై గుంజుకొనియెద గాని యీ కార్యమును జేయము.” అని తన మనో నిశ్చయాన్ని వ్యక్తపరచాడు.మనలో మనకు ఎన్ని విభేదాలున్నా ఉండొచ్చు కానీ బయట వారిముందు మనందరం ఒక్కటే .ఇతరుల ముందు మన లోటుపాట్లను బయటపెట్టడం మూర్ఖత్వం అని అనడంలో కలిసి మెలసి స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం వెలిబుచ్చాడు.

ప్యారిస్ నుండి రాసిన ఉత్తరంలో హిందూ స్త్రీ ఔన్నత్యాన్ని నిరూపిస్తూ వివరించాడు.ప్యారిస్ నగరానికి వెళ్ళడానికి రైలెక్కాడు కవిరాజు.రైలులో జరిగిన సంఘటనను తిలకించి ” ఫ్రెంచి మత్తకాశిని యోర్తు మా ప్రక్క గదిలో కూర్చుండెను.ఆ విలాసినికిని మా గదిలోనున్న ఇంగిలీషు యువకునికి ప్రసంగము గలసినది.ఆ యుత్తర క్షణముననే హృదయములు కలిసిపోయినవి.పదంపడి నా యెట్ట యెదుట,నా కట్టెదుట ,నా కన్నుల యెదుట జరిగిపోయినవి.మన దేశమున నిట్టి యకృత్యము వారాంగనయైనను సల్పదని నా నమ్మకము ” అని తన జుగుప్సాభావాన్ని వ్యక్తం చేస్తూ హిందూ స్త్రీల ఔన్నత్యాన్ని సమర్ధిస్తూనే పశ్చిమదేశాలనుండి ఎన్ని విషయాలను మనం నేర్చుకోవాల్సినవి వున్నా ఈ విషయంలో మాత్రం మనమే వారికి నేర్పాల్సిన అవసరం ఉంది అంటాడు.” హిందూదేశము యొక్క ఔన్నత్యమంతయు చిరకాలము నుండి స్త్రీల పాతివ్రత్యముపై నాధారపడి యున్నది. అది లేని నాడు హిందూదేశము సమూలముగా నధోలోకము పాలయినను మనము చింతింపవలసిన యగత్యము లేదు…మనమే సగర్వముగ,సానందముగ మన మహా పతివ్రతలను జూసి వాని చిత్త స్వాస్థ్యమును బొందగలుగుదము.మనకెట్టి ఔన్నత్యము కూర్చునవియైనను,దీనికి బ్రతిబంధకములగు మార్గములను వందనములతో ద్యజింపవలయును”. అని ఎంతో గొప్పగా హిందూ స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతూ ఏ.వారాంగన కూడా ఇంత నీచానికి పాల్పడదు అనడం వల్ల మన సంస్కృతి పట్ల ఉన్నతభావం కలిగిన వ్యక్తిగా కన్పిస్తాడు.విదేశాల్లో చదివినప్పటికి దేశం పట్ల అపారప్రేమను చాటుకున్నాడు లేఖల్లో.

“స్త్రీ స్వాతంత్య్రమే ఐరోపాఖండ సకలైశ్వర్యాలకు యాధారము” అంటూ వారి చిత్తశుద్ధి,కార్యదీక్ష,దయారసము,శౌర్యసాహసాలు చూసినట్లయితే వారు స్త్రీ ప్రపంచానికే కీర్తి తెచ్చిపెడుతున్నారని అజ్ఞానాంధకారములో మునిగిన భారత స్త్రీలు సంఘసేవ అనే ఉత్తమ ధర్మాన్ని పాశ్చాత్య స్త్రీల నుండి నేర్చుకోవాల్సింది అని అంటాడు ఆనాడు చౌదరి ఆశించిన ఆశయం నేడు మనం స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజ వేసి ఉన్నత శిఖరాలధిరోహించడంలో తిలకిస్తున్నాం.దేశానికి పేరుప్రతిష్టలు తెచ్చి వారి వంతు స్థానాన్ని ఆక్రమిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.

డబ్లిన్ నుండి వ్రాసిన ఉత్తరంలో ‘ధర్మసాధని’ పత్రికలో ” లవ్” శబ్దంపై తగిన నిర్వచనమివ్వలేదని సంతృప్తిచెందక ‘ లవ్’ శబ్దంపై సుదీర్ఘ లేఖ రాశాడు.ఒక పారశీక కవి వ్రాసిన శ్లోకంలో హిందూసతిని గురించి రాసిన వాక్యసారాంశం గమనింపవలసి వుంది ” హిందూ సాధ్వివలె సమరాగము నందు స్వార్థ త్యాగమును జూపించు జంతువును నీ జీవత్ప్రపంచమున నెచ్చటను గానము.వెలుగుచున్న దీపమునుండి వేలకొలది పురుగులు మ్రగ్గ గలవు గాని,మారిపోయిన రూపరహితమైన నిప్పునంబడి యొక్కటేని మ్రగ్గజాలదు…లవ్ నందు స్వార్థ త్యాగములని యెడల పవిత్ర భావ మెచ్చట నుండును” అంటూ ఆంధ్ర భాషలో లవ్ శబ్దానికి పర్యాయపదమే లేదని సీతారాముల పరస్పరానురాగం,సావిత్రీ సత్యవంతుల ప్రేమానుబంధం,కృష్ణునియందు లీనమయిన రాధ ఐక్యభావం మొదలైనవి లవ్ మూలధనం” యవ్వనంలో ఆవిర్భవించిన లవ్ క్షణికమైంది ఇది నేటి పాశ్చాత్యులలో కనిపిస్తుంది తాత్కాలిక కష్టాలకోర్వజాలని “లవ్” లవ్ ఎట్లా అవుతుందని ప్రశ్నిస్తాడు.
విషయ సుఖానుభూతితో కూడింది మృగలక్షణమని ఈసడించి ఇతర దేశాలనుండి మన దేశంలోకి దిగుమతి కాబడిన లవ్ ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉన్నాము.బ్రిటిష్ సామ్రాజ్యంలో ” సామాన్య జనుల యందు నూటికి పదిమంది కొఱకుడు చేతను,నిరువదిమంది సెగరోగము చేతను,నిరువది మంది యితర రోగముల చేతను బీడింపబడుచున్నారు.ఇక బ్రిటిషు సైన్యమునందు నూటికి నెనుబదిమంది యీ వ్యాధిగ్రస్తులై యున్నారు” అని సుఖవ్యాధుల గురించి వివరించాడు.” పాశ్చాత్యులనుండి గ్రహింపదగినవి యావగింజలో నరభాగమైన లేదు.రాజకీయవిషయముల మనము నేర్చుకొనదగినది పెక్కులున్నవి” అని అంటూ ధర్మసాధని ఇటువంటి నీతులుపదేశించి దేశీయులను మోసపుచ్చడం మంచిది కాదని సత్యం తెలుసుకొని హితోపదేశాలను ప్రచురించాలని హెచ్చరిస్తూ లవ్ పవిత్రతను తెలియచేశాడు.

వేరే లేఖలో మార్సెల్సు పట్టణం చేరుకున్న తర్వాత ప్యారిస్ పోవడానికి పాస్ పోర్ట్ కోసం 'బ్రిటిష్ కన్సల్' దగ్గరకు వెళ్లగా,ఆయన గదిలో భారతదేశ సంస్థానంలోని ప్రభువులు తమతమ సైన్యాలతో రణరంగంలో ఉరుకుతున్న చిత్రాలను చూసి ఆనందం కల్గిందని రాస్తూ పాస్ పోర్ట్ తీసుకొని ఫ్రెంచి గవర్నమెంట్ దగ్గర ' అధికార పత్రము' తీసుకోవడానికి వెళ్లగా ఫ్రెంచి పోలీసువాడు నవ్వుతూ చౌదరిగారి చేయిపట్టుకొని అధికారి దగ్గరకు తీసికెళ్లగా ఫ్రెంచి అధికారి" మీ ఇండియన్లు మా దేశంలో యుద్ధంబొనర్చు చుండిరి.కాన ఇండియనులైన నీకు నొక యధికారపత్ర మిచ్చుటకు నేనెంతయు సంతోషించుచుంటిని " అని రాశాడు భారతదేశ వీరుల ఘనత విదేశాల్లో ఏ విధంగా ప్రస్తుతింపబడిందో ఈ లేఖ నిరూపిస్తుంది.

చౌదరి గారు రాసిన ఉత్తరాల్లో సాహిత్య విషయం కూడా స్పృశింపబడింది.డబ్లిన్ నుండి 29-4-1916 నాడు రాసిన లేఖలో ఆంధ్ర నాటకాలను గురించిన విమర్శ గమనింపదగింది.పూర్వ కాలంలో గీర్వాణ కవులు వారి పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికి,

రాజానుగ్రహం పొందడానికి,విద్వాంసుల్లో అగ్రపీఠం సంపాదించుకోవడానికి ఒకే ఇతివృత్తాన్ని గ్రహించి వారి ప్రజ్ఞలు చూపిస్తూ రచనలు చేశారని”నేడన్ననో నాటక మూలమున ప్రజలు జ్ఞానవంతులుగను,నీతిమంతులుగను జేయవలసిన బాధ్యత వర్తమాన కవులందున్నది” అని నిస్సంశయంగా తెలిపి పూర్వగ్రంథాల్లోని ఇతివృత్తాన్ని తీసుకొని వారి వారి శక్తిసామర్థ్యం వ్యర్థపుచ్చుకోవడం కన్నా వేరే కథను గైకొని ప్రజలను జ్ఞానవంతులుగా చేయడం సమంజసం అంటాడు.ఒకే ఇతివృత్తం తీసికొని పలువురు నాటకాలు రచిస్తే దానివల్ల వచ్చే లాభమేంటి? అని ప్రశ్నిస్తాడు.” నాటకములు పెంచుట,క్లుప్తము చేయుటయందు మనము గీర్వాణ నాటకముల నతిక్రమింపరాదు.ఈ యభిప్రాయముతో నేనేకీభవింపజాలను.కవికి స్వాతంత్రముండవలెను.
లేనిచో అనర్థములు పెక్కులు వాటిల్లును.గీర్వాణ నాటక సంప్రదాయములని,ఆంగ్లేయ నాటక సంప్రదాయములని కవి చేతులు గట్టివేయుట భాషాలతను మొదలంట గోసివేయుటయే”.అని ఇతివృత్త స్వీకరణలో కొత్తదనాన్ని ,మార్పును ఆశించి కవికి స్వేచ్ఛ ఉండాలని,పూర్వ సంప్రదాయాలను అతిక్రమించి నాటకం రసపుష్టి గావించడమే పరమోత్తమమని వ్యక్తం చేశాడు.
అలాగే భాష విషయంలో కూడా తన అభిప్రాయాన్ని లేఖల్లో తేల్చేశాడు.నీచోక్తులు,నీచుల గ్రామ్య సంభాషణ విషయంలో విమర్శిస్తూ” నాటక పాత్రము రంగమున వివిధ గ్రామ్య భాషా సంభాషణ మొనరింపరాదను వాదమాదరణీయమని నా యాశయము” అంటూ మూడు భాషలు మాట్లాడే ముగ్గురు విదేశీ వాళ్ళు వివిధ గ్రామ్యము లైన ఇంగిలీషులో మాట్లాడక సలక్షమైన ఇంగిలీషులో మాట్లాడితే ఉచితంగా ఉంటుంది అంటాడు.అక్బర్ పాదుషా’ మాకీ ,మీకీ ‘ అని మాట్లాడినా,నీచ తురుష్క పాత్ర గ్రాంథిక భాషను మాట్లాడినా కూడా హాస్యాస్పదమంటాడు.గీర్వాణ భాషలో చెప్పబడ్డ నియమాలు గీర్వాణ నాటకాలకే అన్వయిస్తాయి కానీ ఆంధ్ర నాటకాలకు పనికి రావని నిస్సంకోచంగా చెప్పాడు.” ద్రావిడ భాషలు దేశభాషలుగా నున్నచోటుల నా భాషల నీచపాత్రములకే గ్రామ్య భాష గాని,మిశ్రమ భాష గాని యుపయోగింపబడవలయును,ఉచ్చ పాత్రముకు భిన్న జాతీయుడైన నేమి,భిన్న మతస్తుడైన నేమి గ్రాంథిక భాషనే యుపయోగించుట సమంజసం”. అంటూ పాత్రోచిత భాషా విషయంలో త్రిపురనేని తన నిర్ణయాన్ని లేఖలో నిక్షిప్రం చేశాడు

 రామస్వామి గారి లేఖల్లో ఆయన అలవాట్లు,వ్యక్తిగత విషయాలను తెలుసుకోవచ్చును.వ్యక్తిగతం అయినప్పటికీ ఆనాటి సమాజపరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఉత్తరాలు ఎంతగానో ఉపకరణాలు అని చెప్పొచ్చు.

తలకు బట్ట చుట్టుకోవడం అంటే తలరుమాలు ధరించే వాడని తెలుస్తుంది.కేవలం శాకాహారాన్నే భుజించేవాడు.
కొలంబో నుండి బయలు దేరెటప్పుడు స్టీమరెక్కాడు.స్టీమరులో ఒక సంఘటన జరిగింది.జపాను భాష తప్ప వేరే భాష తెలియని జపాను ఉద్యోగి చౌదరి ముందుకు వచ్చి” కసాయి దుకాణము బరచెను.కత్తి,గరిటె మాంసము,చేపలు చూడగానే నా శరీరము జలదరించెను. ఏమి చేయను? సేవకునితో వీనిని దీసికొనిపోయి శాకములను గొనిరమ్మని యింగ్లీషులో జెప్పితిని.అయినా వాడికర్థం కాలేదు.చివరికి మాంసం వైపు చూపించి ఇవి అక్కరలేదా అని అడిగితే పండ్లు కానీ శాకము కానీ గానీ తెచ్చివ్వమంటే కొన్ని పండ్లు,బంగాళాదుంప కూర తెచ్చి పెట్టాడు.పదార్థాల్లో ఏదో వాసన వచ్చి తిన్నదంతా వాంతి” చేసుకున్నాడట.ఇదీ ఆయన అవస్థ.ఆయనకే కాదు అలవాటు లేని వారికెవరికైనా ఇదే పరిస్థితి.ఏడు రోజులకు ఒక పక్షి గాని,చెట్టుగాని కన్పించలేదట.కవిరాజు సున్నిత మనస్తత్వం ,మాంసాహారం పట్ల గల వైముఖ్యం మొదలగు విషయాలను ఈ లేఖలో తెలుసుకోవచ్చును.

డబ్లిన్ నుండి రాసిన ఉత్తరంలో తనకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో తెలపమని అనేక ఉత్తారాలు వస్తున్నాయని పత్రికాముఖంగా తెలపడం సమంజసమని తనకు నెలకయ్యే ఖర్చును వివరంగా తెలియచేశాడు.ఆనాడు విదేశాల్లో ఖర్చు ఎలా ఉండేదో తెలుసుకోవడానికి యీ లేఖ పనికి వస్తుంది.

” ఈ వ్యయము సాధారణముగ విద్యార్థి స్థితిగతుల మీదను,సత్ప్రవర్తన మీదను నాధారపడి యుండును గాన ఎంత వ్యయమగునని నిశ్చయించుట దుర్లభమైనను,ప్రస్తుతము విద్యార్థులకగు వ్యయమును పరిశీలించిన కొంతవరకు తెల్లమగును.” సాధారణంగా చాలామంది విద్యార్థులకు సగటున 100 రూపాయలు ఖర్చు అవుతాయని, తాను 100 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలిపాడు.వారి వారి స్తోమతను బట్టి ఎంత పంపిస్తే అంత ఖర్చు పెడతారని చెప్తూ ఒక చిన్నగదిలో ఇద్దరు కలిసి ఒకే మంచముపై పడుకుని ఎట్లో కాలం గడిపే విద్యార్థుల్లో కూడా ఒక విద్యార్థి సంవత్సరానికి ఆరువేలు ఖర్చు చేసిన వాడున్నాడని తెలిపాడు.తుదకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ” దుర్వ్యయముల జోలికి బోక సర్వసుఖములనుభవించుచు ( నాటకములకు తరచు బోవుచున్నను) జాగ్రత్తగ సంచరించుచుండిన యెడల నూరు రూపాయలు చాలును “
అని వివరించాడు.దీన్ని బట్టి ఎంత జాగ్రత్తపరుడో,ఎంత పొదుపు పరుడో తెలుస్తుంది.నాటకాలు చూసే అలవాటుతప్ప అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టేవాడు కాదని తెలుస్తుంది.క్రమశిక్షణ కలిగిన వాడుగా,శాకాహారము మాత్రమే తీసుకునే వాడుగా తెలుస్తుంది.
ఈ రకంగా కవిరాజు లేఖలను పరిశీలించినట్లయితే ఆయన అలవాట్లు, మనస్తత్వం,వ్యక్తిత్వం,

కుండబద్దలు కొట్టినట్లు నిజాన్ని చెప్పడం,పాత్రోచిత భాష, నాటికేతివృత్తం గురించి ఆయన అభిప్రాయాలు ,ఆనాటి సాంఘిక పరిస్థితులు ,ప్రయాణ అనుభూతి మొదలైన విషయాలను తెలుసుకోవచ్చు.ఆయనకు గల స్వాతంత్ర్య కాంక్ష కూడా తెలుస్తుంది.ఈ విధంగా లేఖలు సమాజానికి దర్పణాలు అనడంలో ఎట్టి సందేహం లేదు..

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
ప్రభుత్వ విశ్రాంత సహాయాచార్యులు
హైదరాబాద్
చరవాణి:
949036738

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అనుబంధాలకు సెలవెందుకు మరి!

by Pragati June 14, 2022
written by Pragati

“ఈ దమయంతి ఏ మహారాజు కూతురో కాదు… నలుడు నడిరాత్రి నట్టడివిలో వదిలేసి పోయినా పుట్టింటికి పోవడానికి. తల్లిదండ్రులు లేని… తన కుటుంబాన్నే పోషించుకోలేని ఓ నిరుపేద అన్నకు చెల్లెలు. నీకు చెప్పుకునే కారణాలు ఎన్ని ఉన్నా… నాకు ఉన్న ఒకే ఒక్క కారణం… నా బిడ్డల్ని బతికించుకోవడం… బిడ్డల కోసం నేను బతకడమే! పరిస్థితులు, అవసరాలే అన్నీ నేర్పుతాయి. దాచుకోవడానికి నాదగ్గర ఏమీలేదు.” ఓ దమయంతి నిస్సహాయ స్థితిలో తీసుకున్న నిర్ణయాన్ని ఈ మాటలు చెబుతాయి. (మన్నించండి… మరో సారీ)
“నీ దెగ్గిర ఐదేండ్లు సదవతారు పిలకాయలు. వాల్లకు మంచీ సెడ్డా ఇవరంగా సెప్పొద్దా?” తన కొడుక్కు చదువు చెప్పిన ఓ టీచర్ను నిలదీసిన తల్లి. (అందుకో నా లేఖ)
“మరుగు, మరుపు చేస్కోపోతే బతుకు ఎట్టా సాగుతాది చిన్నోడా? సుకానికి ఉన్నా లేకపోయినా… కష్టానికి కాపుకాసే వాళ్ళే కదా అయినోళ్ళు. బాధలో ఉన్నప్పుడు పాత కతలు ఎత్తిపోదిస్తే పెద్దంతరం అయితాదా?” పిల్లలు చేసిన తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించేసిన ఓ తల్లి. (ముత్యాల దారం)
“…ఇన్నేండ్లూ మొగుడు, బిడ్డలు, కుటుంబరమే ప్రపంచమని బతికినావు. ఇప్పుడు ప్రపంచాన్ని చూడు వా. నీకోసం నువ్వు బతుకు. నీకు అప్పుడు ఎంత ధైర్యం వస్తాదో చూద్దువు గాని. ఇదో కొత్తబతుకు.” ఎంతో ఆత్మీయంగా, లాలనగా, మృదువుగా, ఓదార్పుగా చెప్తున్న సుగుణ. (కొత్తబతుకు) ఇంతకూ ఆమెకు సుగుణ ఏమవుతుంది? మనిషవుతుంది!
అమ్మా నాన్న విడిపోయినప్పుడు కోర్టులో జడ్జిగారు అడిగినప్పుడు నాన్నతోనే ఉంటామని ఎందుకు చెప్పారా పిల్లలు? అలా అన్నవాళ్లు పన్నెండేళ్ళ తర్వాత తిరిగి తల్లి ఒడిలోకి ఎందుకు చేరారు? (వసంత రాగాలు)
ఆ రోజు కోర్టుకు వచ్చిన వింత కేసు విన్నప్పటి నుండీ జడ్జి గారి మనస్సు నలతపడుతోంది. ఆ కేసు వేసిన వ్యక్తి కాళ్ళు మొక్కాలి అనిపించింది. ఏమిటా వింత కేసు? తను ఎంత భంగపడి పిలిచినా వృద్ధులైన తన తల్లి, సోదరుడు తన వద్దకు రావడం లేదని, వారిని వారికంటే చిన్నవాడు, ఆర్థిక స్తోమతా ఉన్న తాను చూసుకుంటానని… వారిని తనవద్దకు వచ్చేలా చేయమని కేసుపెట్టాడు. (అమ్మను చూడాలి)
“అమ్మా! నువ్విక ఆ మూలగదిలోకి వెళ్ళక్కర్లేదు. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడక్కర్లేదు. ఇవాళ సాయంత్రమే మన ప్రయాణం. హైదరాబాద్ కే కాదు… స్వేచ్ఛ, ఆనందం నిండిన మనదైన మన ప్రపంచంలోకి.” తల్లికి ధైర్యాన్నిచ్చిన బిడ్డ మాటలు. (మూలగది)
ఈసందర్భాలను చదువుతుంటే జీవితాలను చదువుతున్నట్టుంది కదా. అవును, యం.ఆర్. అరుణకుమారి గారు ముందుమాటలో చెప్పుకున్నట్టు పాపులర్ రచయిత్రి కావాలని రాసిన కథలు కాదివి. జీవితాల్లో ఆప్యాయతా, అనురాగాలను స్పర్శిస్తూ జీవితం పట్ల ప్రేమతో రాసిన కథలు. ‘ఇంగ సెలవా మరి!’ అంటూ ఇరవై ఒక్క కథల గుచ్ఛాన్ని తెలుగు పాఠకులకు అందించారు. ‘ఇంగ సెలవా మరి’ అనే శీర్షికతో ఓ కథ ఉన్నప్పటికీ చాలా కథలకు ఈ శీర్షిక సరిపోతుంది, బహుశా అందుకే పుస్తకానికి అదే పేరు పెట్టుంటారు. ఈ కథలన్నీ మానవ సంబంధాల ఔన్నత్యాన్ని చిత్రిస్తూ రాసినవి.
పెంచిపెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని సంతానం గురించి మనం చాలా చూస్తుంటాం. కానీ తల్లిని తను చూసుకోవడానికి తన దగ్గరకు రమ్మని కోర్టులో కేసు వేసిన కొడుకు గురించి తెలుసుకోవాలంటే ‘అమ్మను చూడాలి’ కథ చదవాలి. తన తల్లిదండ్రుల ప్రేమను తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్న భర్తకు బుద్ధి రావడానికి ‘మీ ఇంటికి పొండి’ అంటూ తల్లిదండ్రులను పంపించిన కూతురి కథ ‘మీ ఇంటికి పొండి’.
జీవితమంతా తనవెంట నీడలా నడిచి, అర్ధాంతరంగా సెలవు తీసుకున్న అర్ధాంగి నీలతో సంభాషణం ‘ఇంగ సెలవా మరి!’ ఆమె ఆదరించిన జనమంతా ఎవరికి వారుగా బతికేస్తుంటే మనుషుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు ఏమైపోతున్నాయంటూ ఆవేదనతో ఒరిగిపోతాడు. భార్యాభర్తల అపురూపమైన బంధాన్ని ప్రేమకావ్యంగా చూపెడుతుందీ కథ.
ఈ పుస్తకంలో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన కథలు ‘గూట్లో రామచిలుక’, ‘రెక్కలు చాచిన పంజరం’. స్త్రీ సాధికారతకు గొప్ప ఉదాహరణలీ కథలు. ‘గూట్లో రామచిలుక’ కథలో కుటుంబాన్ని ఆదుకోవడానికి భర్త, అత్తమామల ఒత్తిడితో పసిబిడ్డను వదిలి సౌదీ వెళ్లిన జమున పదేళ్ళ తరువాత తిరిగివస్తే కనిపించిన పరిణామాలతో ఆగ్రహోదగ్రురాలవుతుంది. తన స్థానంలో మరో స్త్రీని, తన రక్తం పంచుకున్న బిడ్డ ఆ ఇంట పనిమనిషిగా ఉండటం చూసి భర్త, అత్తమామల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం పాఠకులకు సంతోషాన్నిస్తుంది.
‘రెక్కలు చాచిన పంజరం’ కథలో భర్త పోయిన జీవమ్మ కొడుకు ఇంటి నుంచి పల్లెకు వెళ్లిపోతానంటుంది. కారణం అడిగిన కోడలికి, కూతురుకు ఆమె చెప్పిన మాటలు కళ్ళు తెరిపించేలా ఉంటాయి. “నాలుగు గోడల మధ్య ఉండాల్సినప్పుడు ఎక్కడైతే ఏమిటి?” అంటూ ప్రశ్నిస్తుంది. వంటింటి నాలుగు గోడల పంజరం… పడకటింటి నాలుగు గోడల పంజరం… మొత్తం ఇంటి నాలుగు గోడల పంజరం…! పంజరమే ప్రపంచం అయిపొయింది స్త్రీకి. కోడలు చదువుకున్నది. ఈ విశాల ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం అనుకుంది. కానీ కాదని అర్థమైంది. ఆమె కూడా పంజరంలోనే ఉంది. కాకపోతే ఆమె ఉన్న పంజరం తలుపు థెరిచిఉన్తున్ది. కుటుంబ అవసరాల రీత్యా బయటకు వెళ్ళినా, అదృశ్య కట్టుబాట్లు, ఆధిపత్య ఆంక్షలు, ఊచల్లా ఆమె చుట్టూ దడి కట్టుకునే ఉంటాయి. భర్త బతికినంత కాలం ఆయన అదుపాజ్ఞల్లో భయంతో బతికిన తాను ఇప్పుడు ఆ భయాన్ని వదిలించుకోవడానికి ఆ యింటికి వెళ్ళాలనుకోవడం చాలా గొప్పగా ఆలోచన. ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరగాలని, తనకు నచ్చినట్టు బతకాలని నిర్ణయించుకోవడం చాలా గొప్ప ముగింపు.
అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి సంబంధించిన మరో కథ ‘ఏడడుగులు’. తన శరీర ఆకృతిని హేళన చేసిన పెళ్ళికొడుకును తోసిరాజిన ఆధునిక యువతి సుప్రజ కథ ఇది. భిన్నమైన శిల్పంలో రాసిన ‘మూలగది’ కథలో ‘ మగాడు సెక్స్ కోసం ఆడదాన్ని ప్రేమిస్తే, ఆడది ప్రేమ కోసం సెక్స్ ఇస్తుంది’ మాటలు నిజం ,చాలా బంధాలలో.
‘అపురూపమా అందుకో నా లేఖ’, ‘ఉయ్యాల… మొయ్యాల!’ కథలు కొడుకులు కావాలని, చివరికి వారివల్ల భంగపడిన తల్లిదండ్రుల కథలు.
తన జీవితంలో ఎదురైనా విషాదాన్ని దిగమింగుకొని, ‘ప్లీజ్ నాన్నా, నా కొడుకు భద్రం!’ కథగా రూపొందించినట్లు పుస్తకం అట్ట లోపలి భాగంలో రాసిన మాటల ద్వారా అర్థమవుతుంది. ఆమె రాసిన మాటలు, ఆ కథ పాఠకుల హృదయాలను కదిలించివేస్తుంది.
మన జీవితాల్లోని అనేక కోణాలను ఆవిష్కరించే ఈ కథలు కేవలం సందేశాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఆలోచింపజేస్తాయి. మనిషితనాన్ని ప్రతి కథలోనూ పలికించిన అరుణకుమారి గారు అభినందనీయులు. సుద్దాల అశోక్ తేజ గారి మాటల్లో చెప్పాలంటే ప్రతి కథలో మానవ సంబంధాలను మానవీయ పరిమళ పూమాలగా చేయాలనే సంకల్పం కనిపిస్తుంది. కథలన్నీ చదివాక మనల్ని మనం బేరీజు వేసుకునే ప్రయత్నం చేస్తామనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆ రకంగా అరుణకుమారి గారు రచయిత్రిగా సంపూర్ణ విజయం సాధించినట్లు.

  • ప్రగతి
June 14, 2022 1 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

జానపదసాహిత్యవేత్త డాక్టర్ రావి ప్రేమలత

by Vanga yashoda June 13, 2022
written by Vanga yashoda

మానవ సంబంధాలు, వైతిక విలువలు శిథిలమవుతున్న ప్రస్తుత తరుణంలో మన మూలాలను తెలియజేసే ఎన్నో పరిశోధనలు రావల్సిన అవసరం ఉంది.  ఇలాంటి తరుణంలో  మన సాహిత్యంలోని అమూల్యమైన అంశాలను గుర్తించి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.  అందుకే జానపదసాహిత్యంపై పరిశోధనలు పెరగాలి.  భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించడమే జానపద విజ్ఞాన ప్రత్యేకత.   అలాంటి ప్రత్యేకత కలిగిన జానపద సాహిత్యంలో స్త్రీల స్వరాన్ని సాధికారికంగా వినిపించే బాధ్యతను కొందరు మాత్రమే తీసుకోగలరు. వారిలో ప్రముఖులు డాక్టర్ రావి ప్రేమలత గారు. ఆమె  గత నాలుగు దశాబ్దాలుగా జానపద, ప్రాచీన సంప్రదాయ, ఆధునిక సాహిత్య రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. మూడు దశాబ్దాలు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి, ఉత్తమ విమర్శకురాలిగా, సాహిత్య పరిశోధకురాలిగా  అనేక కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనం వాకిట్లో వేసే ముగ్గుల గురించి ఆమె ఒక పుస్తకమే తీసుకువచ్చారు.  ఆమెతో జరిగిన మాట ముచ్చట మయుఖ పాఠకుల కోసం.

జానపద సాహిత్య పరిశోధనలో మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీకు జానపద సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది.?

చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా ఇష్టమైన వ్యాపకం.  అలా  పుస్తకాలు చదువుతున్నప్పుడు అందులో ఉండే అంశాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలనే తపన కలిగేది. అందుకోసం మరిన్ని రిఫరెన్స్ పుస్తకాలు చదివేదాన్ని. అలా చదివిన అంశాలన్నింటినీ వ్యాసంగా రాయడంతో అది పరిశోధనాత్మక వ్యాసం అయ్యేది. జానపద సాహిత్యంలో విశేష కృషి చేసిన ఆచార్య నాయిని కృష్ణకుమారి గారి మార్గదర్శకత్వంలో పిహెచ్ డి చేశాను.  అప్పుడు తెలిసింది చరిత్ర చెప్పని, పుస్తకాల్లో లేని చాలా విషయాలు ప్రజలల్లో ఉన్నాయి అన్న విషయం. అలా తెలుసుకున్న వాటికి అక్షర రూపం ఇవ్వడం వల్ల  రాబోయే తరాలకు సంస్కృతి, సంప్రదాయాలు అందించడం సాధ్యమవుతుంది.  మన సంప్రదాయంలో ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక చరిత్ర ఉంటుంది. అది ఏంటో తెలుసుకుని చేయగలిగితే ఏ సంస్కృతియైనా, సంప్రదాయమైన, ఆచారమైన భవిష్యత్ తరాలకు అందుతుంది. అలా చెప్పలేకపోతే క్రమక్రమంగా వాటి ఉనికి అంతర్ధాన మవుతుంది. అందుకే నేను తెలుసుకున్న విషయాలను వ్యాసాలు రాశాను. అయితే జానపద సాహిత్యంలో ఎక్కువగా పరిశోధనాత్మక వ్యాసాలు రాశాను.

మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కదా మరి రచనలు ఎప్పుడు  ప్రారంభించారు?
చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడంపై ఉన్న అభిరుచితో మాలతీచందూర్, వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, శ్రీశ్రీ, సినారె తదితరుల సాహిత్యం ఎక్కువగా చదివేదాన్ని., తెలుగు సాహిత్యంపై ఉన్న ఆసక్తి, పెద్దవాళ్లు చెప్పే జానపదకథలు నన్ను రచనావ్యాసంగం వైపు మళ్లించాయి.  ఎం.ఏ చదువుతున్నప్పుడు వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. అయితే ఇది ఒక రోజుతో జరిగిన ప్రక్రియ కాదు.
మొదటి సారిగా ‘స్రవంతి’లో నేను రాసిన వ్యాసం వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చాయి. ఆ తర్వాత చాలా పత్రికల్లో పరిశోధనాత్మక వ్యాసాలు వచ్చాయి. పాఠకుల నుంచి మంచి స్పంధన రావడంతో జానపద సాహిత్యంపై , పరిశోధనాత్మక వ్యాసాల వైపు ఆసక్తి మరింత పెరిగింది. 

మీ పరిశోధనలో భాగంగా క్షేత్రస్థాయి అంశాల కోసం గ్రామల్లో ఎక్కువగా తిరిగారు కదా? మీ దృష్టికి వచ్చిన అంశాలు?

కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తితో మారుమూల గ్రామాలకు సైతం వెళ్లేదాన్ని. అక్కడ ఎన్నో ఆసక్తికరమైన అంశాలను తెలుసుకున్నాను.  పూర్వం మతాలు మనుగడలో లేని కాలంలో మాతృస్వామ్య  వ్యవస్థ ఉండేది. అందుకు నిదర్శనం గ్రామదేవతలు. ప్రతి ఊరికి రక్షణ గా గ్రామ దేవతలు ఉంటారు. కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి గ్రామ దేవతల పేర్లు మారినా వారందరినీ గ్రామ రక్షకులు గానే ప్రజలు భావిస్తారు. అందుకే వందల ఏండ్ల చరిత్ర ఉన్న గ్రామ దేవతల కథలు మనకు జానపద సాహిత్యంలో కనిపిస్తాయి.  మహిళలు ఇంటికే కాదు  గ్రామాలు, రాజ్యాలకు కూడా రక్షకులుగా, పూజ్యులుగా వచ్చ చరిత్ర మనకు కనిపిస్తుంది.  ప్రజల మధ్య నుంచి వచ్చిన జానపదకథల్లో మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు మెండుగా ఉంటాయి. వాటికి తెలుసుకోవడం వల్ల మన మూలాలు గ్రహించే వీలు కలుగుతుంది.  అందుకే  జానపదకథలను పుస్తక రూపంలో తీసుకువస్తున్నాను. అనేక పల్లెల్లో తిరిగి దాదాపు రెండువందల కథలను సేకరించాను. వాటిలో కొన్నింటిని పుస్తక రూపంలో తీసుకువస్తున్నాను.

జానపద కథల్లో మూడు రకాల కథలుంటాయి. సందర్భోచిత కథలు, కాలక్షేపకథలు, నీతికథలు. ఒక్కొక్క విభాగంలో నాలుగైదు కథలను ఎంపిక చేశాను.   పిల్లలకు మంచిఅలవాట్లు, ప్రవర్తన నేర్పేలా ఎన్నో కథలు వాడుకలో ఉన్నాయి. అయితే అవి అన్నీ మౌఖిక రూపంలోనే తప్ప లిఖిత రూపంలో లేవు.. వాటిని సేకరించి పుస్తకంలో పొందుపరుస్తున్నాను. 

తెలంగాణ జానపద సాహిత్యం పై మీ అభిప్రాయం?

 తొలి తెలుగుకథ, శతకం, వాజ్మయం వంటి అనేక సాహిత్య ప్రక్రియ లకు పుట్టినిల్లు తెలంగాణ. అయితే సమాచార రాహిత్యంతో ఇన్ని రోజులు జానపద సాహిత్యం మరుగున పడింది. ఇప్పుడిప్పుడే జానపద కళా రూపాలు వెలుగులోకి వస్తున్నాయి.

జానపదసాహిత్యంలో పరిశోధనలు చేశారు. మరి ఇంటి ముందు వేసే ముగ్గులపై పరిశోధన చేయడానికి కారణం? మీరు రచించిన ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ గురించి చెప్పండి.

మన సంప్రదాయాల్లో ఒక సైన్సు ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక ఆరోగ్యకరమైన అంశం ఉంటుంది. అది ఏంటో చెప్పకపోతే క్రమక్రమంగా వాటి ఉనికి అంతర్ధాన మవుతుంది. నేను ముగ్గుల గురించి పరిశోధన చేస్తున్నప్పుడు ఇదే విషయం స్పష్టమైంది. అతి ప్రాచీన కాలం నుంచి సంప్రదాయకం గా మహిళలు వేస్తున్న అనేక ముగ్గులను పరిశీలించినపుడు అనేక ఆసక్తి కరమైన విషయాలు తెలిశాయి. ముగ్గులు అనేవి భావవ్యక్తీ కరణ సాధనాలుగా, ఒక విధమైన లిపిగా గుర్తించాను. మహిళల కళానైపుణ్యానికి, కల్పనాశక్తికి చిహ్నాలు. వాకిట్లో వేసే ముగ్గులు చిత్రకళాధిదేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు అన్న విషయాన్ని చెబుతూ ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’గా వాటన్నింటినీ పుస్తకం రూపంలో తీసుకువచ్చాను. ఈ పుస్తకానికి రామరాజు జానపద విజ్ఞాన బహుమతి వచ్చింది.  మన రాష్ట్రంలోని మహిళల చిత్రకళా నైపుణ్యం ప్రపంచంలోని వివిధ దేశాల్లోని మహిళల చిత్రకళతో పోలి ఉంటుంది. ఈ విషయం పరిశీలిస్తే  జానపద విజ్ఞానానికి ఎల్లలు లేవు అన్నది మరింత స్పష్టంగా తెలుస్తుంది. 

ఇప్పటివరకు మీ సాహిత్యం, పరిశోధనల గురించి చెప్పారు. ఇప్పుడు మీ గురించి చెప్పండి.

 భువనగిరి దగ్గర నాగిరెడ్డి పల్లె మా సొంతూరు. నాన్న రావి రామిరెడ్డి, ఆర్ అండ్ బి లో ఇంజనీర్ గా పనిచేశారు. అమ్మ మనోరమ. ముగ్గురు అమ్మాయిలం, ఒక అబ్బాయి. ఇంటికి నేనే పెద్దదాన్ని. హైస్కూల్ వరకు భుననగిరిలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్ లోని రెడ్డి కాలేజీ లో పియుసీ, వనితా మహావిద్యాలయలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో బిఎడ్, పిజీ(తెలుగు), తెలుగు పద సాహిత్యం పురాగాథలు’ అంశంపై పి హెచ్ డి పూర్తి చేశాను. రామచంద్ర డిగ్రీ, పీజీ కాలేజీ లో ముప్పై ఏండ్లు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశాను. డిగ్రీ చదువుతున్నప్పుడే అగ్రికల్చర్ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేసే జె.వి.సత్యనారాయణ రెడ్డితో పెండ్లి అయ్యింది. మాకు ఒక అమ్మాయి. డాక్టర్‌ ప్రణీత, ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. 

  అవార్డులు.. – ఉత్తమ విమర్శ గ్రంథం ‘వ్యాసలతిక కు తెలుగు విశ్వవిద్యాలయం

పురస్కారం – ఉత్తమ గ్రంథం ‘ తెలుగు స్త్రీల చిత్రలిపి’ తెలుగు విశ్వవిద్యాలయం

పురస్కారం – ఉత్తమ పరిశోధకురాలు తంగిరాల బహుమతి – ప్రముఖ రచయిత పాకాల యశోదరెడ్డి స్మారక పురస్కారం – వై. రంగనాయకమ్మ స్మారక పురస్కారం – ఉత్తమ విమర్శ గ్రంథం’అవలోకనం’ తెలుగు విశ్వవిద్యాలయం

పురస్కారం – ఉత్తమ అధ్యాపకురాలు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం – తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం

రచనలు..

[1. తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు – 1980

2. జానపద విజ్ఞాన పరిశీలనం – 1990

3. తెలుగు స్త్రీల చిత్రలిపి – 1991

4.జానపద విజ్ఞానంలో స్త్రీ – 1996

5. వ్యాస లతిక – 2002

6. Folk tales of south india – Andhra pradesh – Editor – 2005

7. ఆలోకనం – 2015

8. పాకాల యశోదరెడ్డి – 2015

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

చిలుక కథలు (కథాగుచ్ఛము)

by Arutla Sridevi June 13, 2022
written by Arutla Sridevi

గర్వమణిగిన చిలుక

అందాల అడవిలో ఓ మేడి చెట్టుపై చిలుకమ్మ గూడుకట్టుకొని అందులో హాయిగా ఉ ంటుంది. ఉన్నట్లుండి తుఫాను రావడంతో అడవి అంతా గాలి దుమ్ముతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి పక్షులన్నీ వాటి వాటి గూళ్ల లోపల వెచ్చగా తల దాచుకొన్నాయి. అటువైపుగా వస్తున్న ఒక కాకి వర్షానికి బాగా తడిచిపోయి ఓ కొమ్మచాటున సేద దీరుదామని చిలుకమ్మ ఉన్న గూటివైపు వచ్చి ఒక కొమ్మచాటున కూచుంది. కాకి అంటే చిలుకకు అసహ్యం. చిలుక గూటిలో నుండి బయటకు వచ్చి “ఏయ్ కాకి వెళ్లిపో నా గూటిని ముట్టుకోకు. మేము అందమైన చిలుకలం పండ్లు మాత్రమే తినే వాళ్లం. నువ్వు ఎంగిలి కూడు, మాంసం తినేదానివి. పైగా శరీరమంతా నల్లరంగు, ఆ గొంతన్నా బాగుంటుందా అంటే అదీ లేదు. పొద్దస్తమానం కావు కావు అని పిచ్చి కేకలు నువ్విక్కడుంటే మా గూటి అందం చెడిపోతుంది. మా పరువు కూడా పోతుంది. వెంటనే వెళ్లిపో” అన్నది. అందుకు కాకి “చిలుక గారు మీరన్నదంతా వాస్తవాలే. నేను కాదని అనను. కాని భగవంతుని సృష్టిలో నేను ఒకదాన్ని నా కర్మ ఇట్ల రాసి ఉంది. కొంత వాన తగ్గగానే వెళ్లిపోతాను. బాగా చలివేస్తుంది” అని కాకి చిలుకను కాళ్లవేళ్ల పడి బ్రతిమాలుకుంది. అయినప్పటికీ చిలుకకు కాస్తయినా కనికరం లేకుండా లేదు వెళ్లిపో ఇప్పుడే వెళ్లిపో అని కసురుకుంది. చేసేదేమి లేక కాకి చిన్నబుచ్చుకుని అదే వర్షంలో తడుస్తూ తన గూటికె వెళ్లిపోయింది.

తెల్లవారింతర్వాత సూర్యుడి లేలేత కిరణాలు అడివిలో ప్రసరిస్తున్నాయి. ఆ కిరణాలకు ఆకులపై నిలబడ్డ మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అడవంతా పండగకి కడుక్కున్న ఇల్లులా శుభ్రంగా కనబడుతుంది. చెట్ల కింద గడ్డిపువ్వులు నవ్వుతూ పలకరిస్తున్నాయి. గూటిలోని చిలుకమ్మకు ప్రకృతి అందాలు చూసిరావాలని కోరిక కలిగింది. అనుకున్నదే తడువు అది వెంటనే ఎగురుతూ ఎగురుతూ అట్లా అడవిలో వింతలు చూస్తూ పోతోంది. అది ఒక చెట్టుకొమ్మపై వాలింది. ఆ చెట్టుకు సమీపంలో ఒక స్వచ్ఛమైన నీరున్న గుంట కనబడింది.

ఎగిరి, ఎగిరీ అలిసి ఉన్న చిలుకకు ఆ నీరు తాగాలనిపించింది. అది వెంటనే ఆ నీటి గుంట దగ్గరకు వెళ్లి నీళ్లు తాగుదామని మెల్లగా ఒక కాలు ముందుకు వేసింది. అంతే అది

జర్రున జారి గుంటలో పడ్డది. నిజానికి అది స్వచ్ఛమైన నీటి గుంటకాదు. అందులో అంతా బురద నిండుకొని ఉన్నది. ఆ బురదంతా చిలుకకు అంటింది. దాని ఆకుపచ్చటి రెక్కలు కాని నల్లగా అయిపోయినాయి. ఒళ్లంతా కంపుకొడుతుంది.

జరిగిందానికి చిలుక చాలా బాధపడ్డది. ఏడ్చింది.

కానీ ఆ బురదను ఆ కంపును ఎట్లా వదిలించుకోవాలో చిలుకకు తెలియలేదు. అది అట్లా ఎగురుతూ ఎగురుతూ ఒక పాడుబడ్డ గుడిలోని గూటిలో తల దాచుకున్న పావురం గూటిలో వాలింది. ఆ సమయంలో పావురం ఆ గూటిలో లేదు. అది గింజలేరుకొనడానికి అట్లా బయటికి వెళ్లింది. పావురము గూటికి తిరిగి వచ్చేసరికి బురదతో కంపుకొడుతున్న చిలుక కనిపించింది. పావురము చిలుకతో “ఛీ ఛీ నువ్వెవరు ఈ బురదేమిటి నడు.. ముందు నా గూటినుండి బయటికి పో” అన్నది. అందుకా చిలుక దీనంగా పావురం గారూ నేను చిలుకమ్మను నన్ను గుర్తు పట్టలేదా. ఒకసారి సరిగ్గా గమనించి చూడండి” అన్నది.

“హు, చిలుకవైతే ఏమిటి? అప్పటి అందమేది నీలో అంతా బురదంటింది. ఇటువంటి దానికి ఆశ్రయమిస్తే నా పావురాల జాతి నన్ను వెలివేస్తుంది. మర్యాదగా బయటకు పో” అని పావురము చిలుక ఎంత బ్రతిమాలుకున్నా వినకుండా గూటి నుండి వెళ్లగొట్టింది.

అయ్యో! తానొకప్పుడు ఎంత అందంగా ఉండేది అందరిలో ఎంత గౌరవంగా ఎంత హుందాగా

ఉండేదాన్ని ఇప్పుడు నాకీ గతి పట్టింది. అని ఏడుస్తూ ఏడుస్తూ ఒక చెట్టుకొమ్మపై వాలింది చిలుక. ఆ కొమ్మ మీద పాలపిట్టలు కాపురముంటున్నాయి. అందులో

మొగ పాలపిట్ట తన భార్య పిట్టను ఇలా తిట్టసాగింది. “ఏమేవ్ ఏదో దరిద్రపు గొట్టు పక్షి మన పక్క కొమ్మపై వాలింది నువ్వు లోపలికిరా” అంటూ అరిచింది. అలాగే అని ఆడ పాల పిట్ట అటువైపు కొమ్మపై వాలింది. చిలుక వెంటనే పాలపిట్టల ముందు వాలి అయ్యా నేను చిలుకమ్మను అనుకోకుండా బురదలో పడి ఇట్లా తయారయ్యానే కాని ఇది నా నిజరూపం కాదు. దయచేసి నాకు ఆశ్రయమివ్వండి అని కోరింది. అమ్మో ఇంతకుముందు నీవు చిలుకవు “ఇప్పుడు నువ్వు దుర్వాసన అంటించు కున్నదానవు. నువ్విట్లాగే ఎక్కువ కాలం మా దగ్గరుంటే మా పిల్లలకూ ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దయచేసి వెళ్లిపో చిలుకమ్మా. మర్యాదగా వెళ్లకపోతే

మెడపట్టి గెంటి వేయవలసి వస్తుంది”. అని ఆడ పాలపిట్ట చిలుకతో అన్నది. చిలుక తనకెంత దుర్గతి పట్టిందిరా దేవుడా… అని ఏడుస్తూ ఏడుస్తూ ఊరపిచ్చుకలుండే చెట్టుపై వాలింది. అక్కడ కూడా చిలుకకు శృంగ భంగమే అయ్యింది. నిరాశ చెందిన చిలుక ఇక తనకేదారీ లేదని, అటు తన జాతి రామ చిలుకలు రానివ్వడం లేదు. ఇటు పర జాతి పక్షులూ రానివ్వడం లేదని బాగా బాధపడ్డది. నిరాశ చెందిన చిలుక చివరకు ఒక స్మశానంలోని వేప చెట్టుపైకి చేరింది. అక్కడ ఎవరో పిండం పెట్టిన పదార్థాలు తింటున్న కాకులు చిలుకకు కనిపించాయి. బాగా ఆకలితో ఉ న్న చిలుక ఆకలికి తట్టుకోలేకపోయింది. అది కూడా కాకులతో చేరి అవే ఎంగిలి మెతుకులు ఏరుకోసాగింది. ఇంతలో ఒక కాకి చిలుకకు అడ్డం పడి, నువ్వు ఈ ఎంగిలి మెతుకులు ఏరుకోవడానికి వీల్లేదు అన్నది. చిలుక అయ్యా ! “కాకి గారు ఇది కూడా తినక పోతే ఇక నేను చచ్చిపోవలసిందే దయచేసి ఇదన్నా తిననివ్వండి” అని దీనంగా అడిగింది. “నువ్విలా రా చిలుకా !” అని కాకి చిలుకను ఒక నీటి పంపు దగ్గరకు తీసుకెళ్లింది. స్మశానంలో శవ దహనం తర్వాత స్నానాలు చెయ్యడానికి గాను మనుషులు ఏర్పాటు చేసుకున్న నల్లాలు అక్కడున్నవి ఒక నల్లకింద చిలుకను కూర్చొమ్మన్నది. చిలుక అట్లాగే చేసింది. కాకి దాని మూతితో నల్లపై భాగాన్ని గట్టిగా వత్తి పట్టుకొన్నది. అంతే నీళ్లు చిలుకపై జలజలా రాలిపడ్డాయి. చిలుకకున్న బురదంతా కొట్టుకుపోయింది. చిలుక ఎప్పటి మాదిరి పచ్చగా శుభ్రంగా తయారయ్యింది. ఈలోపుగా కాకి ఎక్కడనుండో రకరకాల పండ్లు తెచ్చి చిలుకకు ఆహారంగా ఇచ్చింది. చిలుక కడుపు నిండా పండ్లు తిన్నది.

‘గతంలో తాను కాకి పట్ల ఎంత నీచంగా, ఎంత నిర్ధయంగా ప్రవర్తించింది. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా కాకి తననెంతగా ఆదరించింది. నాకు పై భాగమే అందము. బుద్ది లేనిదానను నేనే ఈ కాకి ముందు గుణశీలత ముందు నా అందమెంత? అవి మనసులో తలచుకొంది పాశ్చాత్తాపంతో చిలుక కళ్లలో నీళ్లు తిరిగాయి. చిలుక కాకితో ఇలా అంది నేను జీవితమంతా నీ దగ్గరే ఉండి నీకు సేవ చేస్తాను. ఇక నుండి నువ్వే నాకు గురువు అంది. కాకి చిలుకలో వచ్చిన మార్పుకి సంతోషించింది.

అప్పటి నుండి చిలుకమ్మ పక్షులన్నింటినీ పోగుచేసి వేదాంతం, నైతిక విలువలు, గురించి చెప్తూ దాని జీవనం కొనసాగించింది.

June 13, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆత్రేయకు ఆత్మీయ నివాళి

by M.Umalaxmi June 13, 2022
written by M.Umalaxmi

ఇంత గొప్ప రచయిత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. మన మనసులను చదివి మధురకవిగా నిలిచిన మనసుకవి ఆత్రేయకు ఆత్మీయ నివాళి.

ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 – సెప్టెంబర్ 13, 1989) తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి. అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.

1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి ‘ప్రవర్తన’, ‘ఎన్.జి.వో’ నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే ‘కప్పలు’ బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే ‘మాయ’ నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను ‘ఈనాడు’ అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే ‘విశ్వశాంతి’ నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. ‘సామ్రాట్ అశోక, గౌతమ బుద్ధ’, ‘భయం’ నాటకాలు కూడా వ్రాసారు.

ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. “వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి” అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.

ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. “వెలుగు నీడలు” చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.

రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని అతనుపై ఓ ఛలోక్తి. కానీ అతను ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్థానో ఎందరికి తెలుసు అనేవారు.

• తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత అతనును బూత్రేయ అనీ అన్నారు.

• ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు “చోళ” అందుకే “పల్లవి” తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే చోళులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.

• తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. ఉదాహరణకి, తేనె మనసులు సినిమాలో ఈ రెండు పాటలు “ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు,” “నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు.” అలాగే ప్రేమనగర్ సినిమాలో “నేను పుట్టాను ఈలోకం మెచ్చింది,, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది.” పాట,, “తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా” పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా అనంతమే అవుతుంది.

మరోచరిత్ర సినిమాకి రాసిన పాటలు ఏ తీగ పువ్వునో…ఏ కొమ్మ తేటినో… పదహారేల్లకు…నీలో నాలో బలే బలే మగాడివోయ్ …నీ అన నీ దానినోయ్…అనే పాటలు ఇప్పటికి శ్రోతలని అలరిస్తూనే ఉన్నాయి.

‘అంతులేని కథ’లో ‘కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు…’, ‘మరోచరిత్ర’లో ‘విధి చేయు వింతలన్నీ…’, ‘ఇది కథ కాదు’లో ‘సరిగమలు గలగలలు…’, ‘స్వాతిముత్యం’లో ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య…’ తోపాటు ‘తేనే మనసులు’, ‘ప్రైవేట్ మాస్టర్’, ‘బ్రహ్మాచారి’, ‘మట్టిలో మాణిక్యం’, ‘బడి పంతులు’, ‘పాపం పసివాడు’, ‘భక్త తుకారం’, ‘బాబు’, ‘జ్యోతి’, ‘అందమైన అనుబంధం’, ‘గుప్పెడు మనసు’, ‘ఆకలి రాజ్యం’, ‘అభిలాష’, ‘కోకిలమ్మ’, ‘అభినందన’, ‘ప్రేమ’ వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను ‘మనసు కవి’గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని అతను సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు. కృష్ణ శారదలు నటించిన “ఇంద్రధనుస్సు” సినిమాలోని పాట “నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి” అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. అతను ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.

ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే అతను రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని “మనసున మనసై బ్రతుకున బ్రతుకై” పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీగా వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే …… సినిమాలో “కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన” పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.

ఆత్రేయ పాటల రచయిత మాత్రమే కాకుండా, అనేక సినిమాలకు మాటల రచయితగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రేమనగర్ సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు. అందులో, మచ్చుకు ప్రేమ్ నగర్

‘దీక్ష’ (1950) చిత్రానికి తొలిసారి అతను పాటలు రాశారు. “పోరా బాబు పో..” అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్ ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన ‘సంసారం’ చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. ‘అర్థాంగి’ చిత్రంలో ‘రాక రాక వచ్చావు చందమామా..’, ‘తోడి కోడళ్ళు’ చిత్రంలో ‘కారులో షికారుకెళ్లి…’, ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’లో ‘శీశైలవాసా శ్రీ వెంకటేషా…’, ‘మంచి మనసులు’ల్లో ‘శిలలపై శిల్పాలు చెక్కినారు…’, ‘మూగ మనసులు’ చిత్రంలో ‘ముద్దబంతి పువ్వులో… ‘డాక్టర్ చక్రవర్తి’లో ‘నీవులేక వీణ …’, ‘అంతస్తులు’లో ‘తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము…’, ‘ప్రేమనగర్’లో ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది…’, ‘మరోచరిత్ర’లో ‘ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో…’, ‘ఇంద్రధనస్సు’లో

‘నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి…,

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఓ మనిషీ.. కాలాతీతం కానీకు!

by కె. వీణారెడ్డి, June 13, 2022
written by కె. వీణారెడ్డి,

నింగి అంచులదాకా అంచెలంచెలుగా…

 ఆకాశపు చేలాంచలాన్నే అందుకోవాలని,

ముద్దు ముద్దుగా తన పాదముద్రలనే..

సముద్రపులోతుల్లోన ముద్రించాలని,

 తనకన్నా ముందేవున్న అవనీతలాన్నంతా..

తన కబంద హస్తాల్లో బంధించాలని,

గగనచర, భూచర, వనచర,జలచరాలన్నీ..

తన అదుపాజ్ఞల్లో చరించాలని,

సృష్టిలోని పంచభూతాలన్నీ..

తన దృష్టిని దాటి పోకూడదని,

విశ్వమందలి అణురేణువునంతా..

మేథో మంత్రంతో, ధనతంత్రంతో…

తన వశవర్తిగా చేసుకోవాలని,

తన దురాశాదురాక్రమణలనెరవేసి…

స్వార్ధపు గాలంతో సాంకేతిక వల విసిరి,

తన వలలోనే పడాలి విశ్వవలయమంతా..

అనుకొంటూ, గొప్ప కలగంటున్నాడు..

కనిపించేది మాత్రమే సత్యమని,

కనిపించనిదంతా అసత్యమని

భావించిన నరుడు.. అతి తెలివిపరుడు..

అన్నీ తెలుసనుకొంటున్న నేటి మానవుడు!

కాలక్రమేణా.. తన ఊహకందని విధివిధానా..

తను పరచిన వలయే తన చుట్టూ వలయమై,

తను వేసిన గాలమే కాలమై తనను లాగినపుడు..

లాగి లెంపకాయ వేసి బోర్లా పడేసినపుడు, 

అపుడుగానీ అర్థంకాదీ మేథావికి.. 

అనంత ప్రకృతిముందు తానెంత? 

మృత్యువు కబళించగల తన బ్రతుకెంత? 

మహా సముద్రంలో ఓ నీటి బొట్టంతైనా, 

ఇసుక రాశిలో ఓ చిన్న రేణువంతైనా, 

ప్రళయ ప్రభంజనంలో గడ్డిపోచంతైనా, 

కానివాడనని.. అస్వతంత్రుడనని… 

ఏ అజ్ఞాతశక్తి చేతిలోనో ఇమిడివున్న వాడనని.. 

అర్థమయ్యేనాటికే.. అంతా మించిపోయేనని.. 

మనిషిలోని అజ్ఞానం.. అహంకారం, 

మేథోమదం.. ఐశ్వర్యగర్వం, 

అధికార దర్పం.. అవినీతి బలం, 

కీర్తి కాంక్షలు.. పొగడ్తల వాంఛలు 

తనలోని తప్పులన్నీ తననే కాలమై కాటేశాయని, 

కాలాతీతమైపోయిందన్న కలవరంతో… 

ఆ మనిషి ఆఖరి శ్వాస ఇలా అంటున్నది… 

మంచీ మానవత, నీతి నిజాయితి, శాంతీ సహనం,

ప్రేమా త్యాగం వంటి మానవీయ గుణాలే.. 

అశాశ్వతమైన మానవ జీవితానికవే 

శాశ్వతమైన వెలుగునిచ్చే కాంతిమణులని! 

నిజమేనంటూ నిష్క్రమించింది మనిషి నిశ్వాస.

June 13, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

భూతల్లి పుట్టింది..

by Chandu Pendyala June 9, 2022
written by Chandu Pendyala

అడుగులకు ఆదరువైన అమ్మ
అందరిని పిలిచింది
మనిషి పుట్టిండు జంతు జాతి పుట్టింది
చెట్టు చేమ లు వెలసినయి
నదీ జలాలు పారినయి ఆకలి ఆరంభమైంది
వీసమంత మనిషి మనసు
గాసంకోసం తిరిగిండు
బతుకు బాట వెదికింది
పోడు ఎవుసం మొదలైంది భూములు బావురుమనని
భూసారం బుగ్గి కాని
పంటలు పండించె తెలివినబడ్డరు
గొర్రె పిల్లల మందలు
మడిమడికి తిరిగినవి
అర్ధ రాతిరి యాల్ల
కుక్కలు వాటిని కాపాడే
సైనికులయినవి
గొంగడి కొప్పెరలు
మోతుకాకు సుట్టలు
జకుముకి నిప్పులు
కంది పొరక మంటలు
నిదుర కాచినవి
జొన్న కొయ్యకాల్లు
కొర్రాల్లు అయినవి
చిమ్మని చీకట్లో
మిణుగురు పురుగులు
కందీల్లు అయినవి
ముల్లు కర్రలు
విల్లంబులైనవి
పంది కూనల కసువు
భూపసిడి అయ్యింది
కోడిపిల్లల పెంట
కొంగుబంగారమయ్యింది
దొడ్డెడు గొడ్ల పెంట
బండి పొనుక నింపుకొని పొలాలకు జాతర కట్టినవి
పెంట కుప్పలు
చెలకల అలికినవి
ఎద్దు తిరిగిన నేల
ఎగిరి దునికింది
రాగాలు తీస్తూ వంగి
పొలం నాట్లు వేసిన
రైతు కూలీలందరు రోగాలు
లేని పంట పండించినరు
భూమాత కాక తగ్గించినరు
ప్రపంచానికి చల్లదనం
అనే ధనం ఇచ్చిండ్రు
గత చరిత్రను మరచిన
ఆధునిక మానవులు
ధరణి దహించకముందే
విచిత్ర రోగాల
విలయతాండవం
విజృంభించకముందే
మత్తు నుండి మేల్కొనకపోతే
జగత్తులో ఉత్తమ జాతి
అని చెప్పుకునే మానవజాతి
తమకు తాము జప్తు కాక తప్పదు…

June 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

యోగ చేయటానికి నియమాలు

by Bandi Usha May 3, 2022
written by Bandi Usha

బ్రహ్మమూహూర్త సమయము అనగా ఉదయం గం. 4.00 లేదా గం. 4.30లకు లేచి, నోటిని శుభ్రం చేసుకని అర లీటర్ గోరు వెచ్చని నీరు త్రాగి ఆ తరువాత కార్యక్రమాలు పూర్తి చేసి, స్నానం చేసి ఆసనాలు చేయవలెను.

స్నానం చేసిన యెడల శరీరము తేలికగా ఉండి ఆసనములకు సహకరించును. స్నానం వీలుకానిచో యోగా పూర్తయిన తరువాత అరగంటకు చేయవలెను.

  • అనారోగ్యంగా ఉన్నప్పుడు యోగా చేయరాదు.
  •  గాలి, వెలుతురు వచ్చే ప్రదేశములో మాత్రమే యోగ చేయవలెను.
  • యోగా నేలపై కాకుండా మందపు తివాచీపై చేయవలెను.
  • బిగుతుగా ఉండే దుస్తులు ధరించరాదు. కాటన్ దుస్తులు ధరించుట మంచిది.
  • ఉదయం వీలుకాని యెడల సాయంత్రం చేసినను తిన్న తర్వాత కనీసం మూడు గంటలు గడిచాకే చేయాలి కానీ యోగాకు అనువైన సమయము ఉదయమే.
  • సాధన గురుసమక్షంలో చేయవలెను. అప్పుడే ఒక క్రమ పద్ధతిలో అభ్యాసం జరుగుతుంది. ఏ సమస్యకు ఎటువంటి ఆసనం వేయాలో, ఏది వేయకూడదో తెలుసుకోవచ్చు.
  • వత్తిడికి దూరంగా ఉండాలంటే కాఫీ, టీ, ధూమపానం మానివేయలి. శీతల పానీాలు కూడా అనారోగ్యానికి హేతువు.
  • రోజూ తేలికపాటి ఆహారం తీసుకుంటే సాధన బాగా జరుగుతుంది.

స్త్రీలు

వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. బహిష్ఠు సమయంలో చేయరాదు.

గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా మేరకు కొన్ని ఆసనాలు 5వ నెలవరకు చేయవచ్చు.

మయూరాసనం వేయకూడదు.

బాలింతలు నాలుగు నెలల తర్వాత డాక్టరం సలహా మేరకు చేయాలి.

పిల్లలు

పది సంవత్సరాలు వచ్చేంతవరకు అన్ని ఆసనాలు వేయరాదు. పిల్లలతో చేయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైనప్పుడు మధ్యలో విశ్రాంతి ఆసనం వేయించాలి.

సాధన పూర్తికాగానే పాలు, జ్యూస్ లు ఆహారపదార్థాలు పెట్టరాదు.

అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి.

పిల్లలు సాధనపై మనసు కేంద్రీకరించునట్లు చూడాలి.

ఆసనములు

తాడాసన్ – తాడ అంటే పర్వతం. ఈ ఆసనాన్ని సమస్థితిలో నిలబడి చేయాలి.

ఈ ఆసనాన్ని మొదటగా నేలపై నిల్చొని రెండు పాదాలు కలిపి ఉంచాలి.

చేతివేళ్ళను కలిపి తలపై బోర్లించాలి.

నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతుల్ని లాగుతున్నట్లుగా పైకి తీసుకొని వచ్చి కాలివేళ్ళపై నిలబడాలి.

శ్వాస విడుస్తూ పూర్వపు స్థితికి రావాలి.

ఇది ప్రతిరోజూ రెండూ లేదా మూడుసార్లు చేయాలి.

2. సమస్థితిలో నిల్చొని రెండు చేతుల్ని శరీరానికి ఇరువైపులా ఉంచాలి.

శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతుల్ని పైకెత్తుతూ కాలిమడమల్ని కూడా ఎత్తాలి. 

శ్వాస విడుస్తూ మరలా సమస్థితికి రావాలి

ఆసన స్థితిలో మూడు, నాలుగు శ్వాసలు తీసుకొని విడవొచ్చు.

ఇది రెండు లేదా మూడుసార్లు చేయవచ్చు.

3. పాదాలను జతచేసి సమస్థితిలో నిల్చోవాలి.

చేతులను ముందుకు సాగదీసి చేతివేళ్లను కలిపి ఉంచి అరచేతులు ముందుకు చాచునట్లు తిప్పాలి.

శ్వాస విడుస్తూ చేతివేళ్లను అలాగే కలిపి ఉంచి ఛాతీపై అరచేతులు ఉంచాలి. ఇలా నాలుగు నుండి ఐదుసార్లు చేయాలి.

4. పాదాలను జతచేసి సమస్థితిలో నిల్చోవాలి. పైన చెప్పినట్లుగానే చేతివేళ్లను కలిపి ఉంచి పూర్తిగా ముందుకు, పైకి కాకుండా మధ్యలోకి చేతులను, ఛాతీకన్నా కాస్త ఎత్తులో ఉండేలా సాగదీయాలి.

ఇది కూడా నాలుగు నుండి ఐదుసార్లు చేయాలి.

రోజూ చేసేవారు ఈ నాలుగింటిలో ఏవైనా రెండింటిని చేస్తే సరిపోతుంది.

5. చేతులను ముందుకు, వెనకకు సాగదీస్తూ చేయుట.

పాదాలను జతచేసి సమస్థితిలో నిల్చోవలెను. తరువాత చేతులను ముందుకు చాచి అరచేతులను కలిపి ఉంచవలెను.

శ్వాస తీసుకుంటూ చేతులను వెనక్కి చాచుతూ, ఛాతీని కూడా వెనుకకు వంచి తలపైకెత్తాలి.

శ్వాస విడుస్తూ చేతులను ముందుకు తీసుకొచ్చి ఛాతీ, తల కూడా నిటారుగా ఉంచాలి.

ఇది రోజులో నాలుగైదు సార్లు చేయాలి.

ఉపయోగాలు

  • నాడీ మండలం బలోపేతం అవుతుంది.
  • మడమలు, పిక్కలు ధృడంగా అవుతాయి.
  • వెన్నెముక సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
  • ఛాతీ భాగము, భుజాలు, మెడలో కలిగే ఇబ్బందులు తొలగుతాయి.
  • చేతులు సన్నగా అవుతాయి.
  • వీటితోపాటు మడమ, మోకాలు, నడుము జాయింట్స్ పట్టకుండా ఉండటానికి వ్యాయామం చేసినట్లయితే శరీరము ఆసనాలు వేయటానికి సిద్ధమవుతుంది.
  • ముందుగా మడమ కోసం.

రెండు చేతులను నడముపై ఉంచుకొని కుడి మోకాలిని కొంచెం పైకెత్తి బొటనవేలుతో సున్నా చుడుతూ మడమను తిప్పాలి.

  • క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ పదిసార్లు తిప్పాలి. అదే విధంగా ఎడమ మోకాలని ఎత్తి ఎడమ మడమను తిప్పాలి.

ప్రయోజనాలు : మడమ నొప్పులు తగ్గుతాయి.

మోకాళ్ల కొరకు

మొదట సమస్థితిలో నిల్చువాలి.

కాస్తవంగి రెండు చేతులకు మోకాళ్ళపై బరువు పడకుండా మోకాళ్ళపై ఉంచి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ పదిసార్లు తిప్పాలి.

మోకాళ్ళ ముందుకు వస్తున్నప్పుడు కాలిమడమలు ఎత్తాలి.

వెనకి్క వస్తున్నప్పుడు మడమలు నేలకు ఆన్చాలి.

ప్రయోజనాలు : మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

నడుము కొరకు :

  • కాళ్ళమధ్య అడుగు దూరం ఉంచాలి.
  • రెండు చేతులను నడుముపై ఉంచి నడుమును గుండ్రంగా తిప్పాలి.
  • క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఎనిమిదిసార్లు తిప్పాలి.
  • శ్వాసతీసుకుంటూ నడుమును ముందుకు, శ్వాసవిడుసూ్త వెనుకకు తిప్పాలి.

ప్రయోజనాలు : నడుము నొప్పులు తగ్గుతాయి.

May 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

స్వర్ణ పతాకలు

by ఆచార్య మస‌న‌ April 23, 2022
written by ఆచార్య మస‌న‌

ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు

చూడ చూడ రుచుల జాడవేరు

పురుషులందు పుణ్యపురుషులు వేరయా

విశ్వదాభిరామ వినురవేమ!

నేనొక డిగ్రీ కళాశాలకు, వార్షికోత్సవానికి ముఖ్య వక్తగా వెళ్ళిన సందర్భంలో ఒక డిగ్రీ విద్యార్ధిని పై పద్యాన్ని చదివి “పురుషులందే పుణ్యపురుషులుంటారా ? స్త్రీలలో ఉండరా ? సారు!” అని ప్రశ్నించింది.

పురుషులంటే మగవారని సామాన్యార్థం. కాని పురుష శబ్దానికి అర్థం తెలిస్తే విషయం ఎంత ఉదాత్తమైందో బోధపడుతుంది. ‘పురీశేతి ఇతి పురుషు’ అని నిర్వచనం. పురమునందు ప్రకాశించువాడని అర్థం. ఇక్కడ పురశబ్దానికి రెండర్థాలున్నాయి. ఒక అర్ధం బ్రహ్మాండమని, రెండవ అర్థం శరీరమని. బ్రహ్మాండంలో ప్రకాశించేవాడు దేవుడని, శరీరంలో ప్రకాశించేవాడు జీవుడని తెలుసుకోవాలి.

అప్పుడు జీవులందు పుణ్యజీవులు వేరుగా ఉంటారనే అర్థం వస్తుంది. మగవారుగాని, స్త్రీలుగాని ఎవరైనా పుణ్యాత్ములేననే విశేషార్ధం స్ఫురిస్తుంది. నేను ఇదే విషయాన్ని స్త్రీ పురుషుల మధ్య తేడాలేకుండా తెలియజేసినప్పుడు ప్రశ్నించిన అమ్మాయి, ఆమె తోటి విద్యార్థినులు విన్నారు. ఎంతో సంతోషించారు.

మహాకవి కాళిదాసు రఘువంశ కావ్యాన్ని ఆరంభిస్తూ చెప్పిన “వాగర్ధా వివసంపృత్తా” అనే శ్లోకం పార్వతీ పరమేశ్వరులను జగత్తుకు తల్లిదండ్రులుగా పేర్కొన్నది. శబ్దార్థాల వలె భార్యా భర్తలు అవినాభావ సంబంధం కలిగిన వారుగా తెలియజేసింది.

మన ప్రాచీన సంస్కృతిలో పురుషునికెంత ప్రాధాన్యమో స్త్రీకంతే ప్రాధాన్యం. యాజ్ఞ వల్కుడు ‘బృహదారణ్యకోపనిషత్తు’లో భార్యాభర్తల సంబంధాన్ని ‘అర్ధభృగలం’తో పోలుస్తాడు. గింజలోని రెండు పలుకుల లాంటివారు భార్యాభర్తలు, వంశాభివృద్ధికి దాంపత్యమే శరణ్యము కదా!

నాకు ఎక్కడా ప్రాచీన సంప్రదాయంలో స్త్రీ పురుషుని కంటే తక్కువ అన్న విషయం కనిపించలేదు.

“త్వమేవ మాతాచ పితాత్వమేవ” అని భగవంతుణ్ణి మాతృమూర్తిగా స్తుతిస్తాం. భారతీయులకు వేదం, భూమి, గోవు, గాయత్రి, తులసి, గంగానది మాతృ సమానులు. ఇంత గొప్ప సంప్రదాయం మనకుండగా మనం విదేశాల నుంచి వచ్చిన చదువుల ఆధారంగా స్త్రీ చైతన్యాన్ని పొందవలసిన అవసరం ఉందా ? అనిపిస్తుంది.

“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” స్త్రీలు గౌరవింపబడిన చోట దేవతలుంటారని మనుస్మృతి చెప్తుంది. అంతేకాదు, ఉపాధ్యాయునికంటే ఆచార్యుడు పదిరెట్లెక్కువగా, ఆచార్యుని కంటె తండ్రి వందరెట్లెక్కువగా, తండ్రికంటె తల్లి వెయ్యిరెట్లెక్కువగా గౌరవానికి అర్హురాలని కూడా మనుస్మృతి చెప్తుంది.

ప్రాచీన కాలంలో ఇన్ని విధాలుగా స్త్రీ ఔన్నత్యం తెలుపబడుతుండగా, స్త్రీని విద్యకు దూరంగా ఉంచిన కొన్ని సందర్భాలు నన్నెంతగానో బాధించాయి. విద్యావేత్త లెవ్వరూ జ్ఞానార్జన విషయంలో స్త్రీ పురుషులను వేర్వేరుగా చూడరు.

యజ్ఞయాగాదులందు భర్తకు భార్య కుడివైపున కూర్చోవడమంటే, అన్ని వ్యవహారాలలో పురుషుని స్త్రీ కుడి భుజం అనే అర్థం స్పష్టమౌతుంది.

ఉపనిషత్తుల కాలానికి వస్తే ఒక జబాల, ఒక మైత్రేయి, ఒక గార్గి స్త్రీ ఔన్నత్యానికి ఎత్తిన స్వర్ణ పతాకలు. జనకుని సభలో గార్గి యాజ్ఞ వల్యుణ్ణి బ్రహ్మవేత్తగా నిరూపించిన ఘట్టం మన సంప్రదాయంలో స్త్రీ విద్యకు గల ప్రాధాన్యాన్ని తెలుపుతుంది.

జబాల సత్యకాముణ్ణి పెంచిన విధం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మైత్రేయి యాజ్ఞ వల్యుణ్ణి ఆత్మ గురించి అడిగిన ప్రశ్నలు స్త్రీ సాహసాన్ని, ఆధ్యాత్మిక పరిణతిని తెలుపుతున్నాయి. జీవితంలో సీత అనసూయకంటే రెండాకులు ఎక్కువ చదివినట్లు రామాయణ అరణ్యకాండ తెలియజేస్తుంది. వసిష్ఠుని ధర్మపత్ని అరుంధతి విజ్ఞాన జ్యోతి. అన్న విషయం అందరూ ఎదిగిందే.

పూర్వం ఏ కాలంలోను స్త్రీ విద్యకు దూరంగా లేదు. బహుశా ముస్లింల ఏలుబడిలో స్త్రీలు గడపదాటి బయటికి రాకపోవడం వల్ల వారికి విద్య దూరమైంది. ఇది భారతేదశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఒక విధంగా ఆంగ్లేయులు స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారనే దాంట్లో కొత్త దనమేమీ లేదు. భారతీయ సంస్కృతిలో తల్లి మొదటి గురువు అన్న మాట విస్మరించరానిది . ఈ సందర్భంగా

స్వాతంత్ర్యానంతర క్రమంగా స్త్రీ విద్యకు ప్రాముఖ్యం లభించింది. కాని మనం ఏనాడు స్త్రీని విద్యకు దూరం చేయలేదు. ఒక్కసారి వేదమంత్రాలను గమనిస్తే, మంత్రార్ధం తెలిసిన ద్రష్టలుగా ఎంతోమంది స్త్రీలు కనిపిస్తారు

సంప్రదాయాన్ని అవగాహన చేసుకొని, మన సంస్కృతిని గౌరవిస్తూ మళ్ళీ స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహానుభావులెందరో ఉన్నారు. అటువంటి పుణ్యపురుషుల మూలంగా బాలికలు బాలురతో పాటు పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించి తమ ప్రతిభాపాటవాలను చూపుతున్నారు. తల్లి దండ్రులకు గౌరవాన్ని తెస్తున్నారు.

జాతీయ, అంతర్జాతీయ రంగాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఒక్క రాజకీయ రంగమనేకాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ స్త్రీల యోగదానం ప్రశంసనీయం. అగ్రరాజ్యాధిపత్యాన్ని కైవసం చేసుకోవడానికి కూడా స్త్రీ శక్తి ఉరకలేస్తుందంటే, స్త్రీలకు సమాజంలో గల స్థానం ఎంత గొప్పదో ఊహించవచ్చు. అయితే కొన్ని దేశాలలో స్త్రీ విద్యగల ప్రాధాన్యం

అంతంతమాత్రమే. కాని భారతీయులు మాత్రం సాంప్రదాయకంగా మహిళాభ్యుదయ సాధనలో విద్యార్జనకు అగ్రతాంబూలమివ్వడం సత్యం.

April 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us