మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

డబ్బెందుకు చేదు?

by Nandiraju padmalata August 21, 2021
written by Nandiraju padmalata

రాత్రి భోజనం చేశాక కాసేపు  నడవడం అలవాటు నాకు.  ఈ మధ్య రాధ కూడా వస్తోంది నడకకి నాతో. ఆరోగ్యం కోసమనే కాదు, పగటి విషయాలు పంచుకునే మంచి సమయం అది.

“ ఈ రోజు ఎనిమిది సంబంధాలొచ్చాయి నా వాట్సాప్ లో. ఇదేంటో?స్రవంతి వివరాలు మన చుట్టాలకి తప్ప ఎవరికీ చెప్పకపోయినా, ఏ పెళ్ళిళ్ళ బ్యూరో కి ఇవ్వకపోయినా వస్తూనే ఉన్నాయి.” ట్రింగుమంటూ  వాట్సాప్ నోటిఫికేషన్ రావడంతో, ఫోను చూసుకుంటూ అంది రాధ.

ఈ మధ్యే మా పెద్దమ్మాయి స్రవంతికి సంబంధాలు చూస్తున్నాం.  ఇంజనీరింగ్ అయిన ఈ ఏడాది నుంచీ ఉద్యోగం చేస్తోంది. తాను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కనుక, కాబోయే భర్త సైతం తన రంగం వాడే అయితే మంచిదని భావిస్తోంది. ఆ క్రమం లో మంచి సంబంధం ఉంటే చెప్పమని దగ్గరి వాళ్లకి చెప్పి పెట్టాను, నాకు జాతకాల మీద నమ్మకం, కొద్ది ప్రవేశం కూడా ఉన్నాయి. నా ఫోనుకీ, రాధ ఫోనుకీ చాలా సంబందాలొస్తున్నాయి. చిత్రం. వడపోతల తర్వాత, ఒక్కటీ మిగలట్లేదు. అలా అని మేమేం  పెద్దగా  షరతులు, పరిమితులు నిర్ణయించలేదు. మంచి కుటుంబం, కుదురైన ఉద్యోగం  ఉండి, దురలవాట్లు లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నాం.

“ఇదుగో! ఈ అబ్బాయి ఫోటో చూడండి. బావున్నాడు కదూ!” చూపించింది రాధ.

చాలా బావున్నాడు కుర్రవాడు. స్రవంతికి ఈడు జోడు. నడక అయ్యాక ఇంటికి వెళ్లి, ప్రొఫైల్ ని తీరిగ్గా చూశాం. అతనికి మాస్టర్స్ డిగ్రీ ఉంది. ఉద్యోగమూ బాగానే ఉంది. అది కూడా హైదరాబాద్ లోనే! మిగిలిన వివరాల్లోకి వెళ్లాను. మా గోత్రం కాదు. నక్షత్రాలు కలుస్తున్నాయి. మొత్తం మీద ముప్పయ్యారుకు గానూ,  ముప్పయ్యయిదు గుణాలొచ్చాయి.

స్రవంతిని పిలిచి చూపించింది రాధ.

“సారంగపాణి. పేరు కూడా బావుంది నాన్నా!” తనకి అంగీకారమే అన్న సూచన ఉంది అందులో.

వివరాలలో తండ్రి పేరు రమా మనోహర్ అని ఉంది. ఇది నాకు బాగా పరిచయం ఉన్న పేరు. కానీ ఒకే పేరు చాలా మందికి ఉండొచ్చు కదా. తెల్లవారాక ఆ సంబంధం వాళ్లకి ఫోన్ చేశాను. పిల్లవాడి తండ్రి మాట్లాడాడు.

నేననుకున్నట్లే అయింది, ప్రపంచం బొత్తిగా చిన్నది.  ఆ కుర్రవాడు నా మిత్రుడు రమామనోహర్ కొడుకే! మనోహర్ బీయస్సీ లో నా సహాధ్యాయి. నన్ను గుర్తించిన తర్వాత వాడి ఆనందానికి హద్దుల్లేవు. కాసేపవీ ఇవీ మాట్లాడుకున్నాక ఫోను పెట్టేసేసరికి, ప్రక్కనే క్వశ్చన్ మార్కు ముఖాలతో రాధ, స్రవంతి, స్పూర్తి.

“ఈ సంబంధం వద్దులే రాధా….”

“అదేమిటి? ఇంతసేపు నవ్వుతూ మాట్లాడారు, ఇప్పుడీ మాటేంటీ?” నివ్వెరపోయింది రాధ.

“వద్దన్నానుగా…వదిలెయ్యి. ఇంకోటి చూద్దాంలే!” అన్నాను.

“ అన్నీ బావున్నాయి. జాతకాలు కుదిరాయి. మేం విన్నదాన్ని బట్టి, ఆయన మీ మిత్రుడే అని కూడా అర్థమయింది. అన్నింటికన్నా ముఖ్యంగా  స్రవంతికి నచ్చాడు.” రాధ నిష్టూరంగా అంటూంటే, స్రవంతి నిరాశగా చూసి లోపలికెళ్ళిపోయింది.

ఇంక వాళ్లకి సూటిగా, స్పష్టంగా చెప్పేయాలనుకున్నాను.

“రాధా! మనోహరూ, నేనూ డిగ్రీలో కలిసి చదూకున్నాం.  మా నాన్న, వాళ్ళ నాన్న ఒకటే డిపార్టుమెంటు. అంటే వాళ్ళ నాన్నగారికి, మా నాన్న ఆఫీసర్. ఆ భేదమేమీ మా మధ్య లేదనుకో! అయితే, చాలా విషయాల్లో మనోహర్ తీరు నాకు నచ్చేది కాదు. వాడుట్టి డబ్బు మనిషి. డబ్బే ప్రాణం. డబ్బే జీవితం. ఓ సరదా, షికారూ, షాపింగ్ ఏదీ లేదు వాడికి. పైసా, పైసా దాచుకునేవాడు. మేం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూంటే, ఒక్కసారి కూడా మాతో కలిసేవాడు కాదు. ఉదయం రెండు, సాయంత్రం రెండు హోం ట్యూషన్స్ చెప్పుకుని సంపాదించుకునేవాడు. దీపావళి పండగొస్తే టపాకాయలమ్మకం, సంక్రాంతికి గాలిపటాలు ఇలా సీజన్ చూసుకోవడం, డబ్బు చేసుకోవడమూ తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు వాడికి. ఎప్పుడు చదువుకునే వాడో ఏమో గానీ, మంచి మార్కులే వచ్చేవి. నాకస్సలు నచ్చేది కాదు వాడి వ్యవహారం.”

“అయితే…దానికీ దీనికేం సంబంధం? అప్పట్లో పాపం పేదరికమో, పెద్దకుటుంబమో అయి ఉంటుంది.” రాధ అంది.

“ అయితే గియితే ఏమిటి నీ మొహం? పెద్ద కుటుంబమే కానీ, గతి లేని వాళ్ళేం కాదు వాళ్ళు. మేం అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం, వాళ్ళది సొంత ఇల్లు. ఆ డబ్బు మనుషుల ఇంట్లో పడితే, మన పిల్ల ఎంత కష్ట పడవలసి వస్తుందో  ఒక్క సారి ఆలోచించు. అల్లారు ముద్దుగా పెంచాం మనం వీళ్ళని. కంటికి నచ్చింది కొనుక్కోవడం, నోటికి నచ్చింది తినడం అలవాటు మనకి. రేపటి నుంచీ మెతుకులు లెక్కపెట్ట్టుకుని తినాల్సొస్తే? చాలా కష్టంలే….వద్దు.” కాస్త ఖచ్చితంగానే చెప్పి లేచాను.

“ పాపం…అక్క ఆ అబ్బాయి వివరాలు మొత్తం ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వెతికేసింది నాన్నా! దానికి చాలా నచ్చాడు.” స్ఫూర్తి మాటలు విననట్లే ఊరుకున్నాను.

 

****

ఆదివారం. బద్ధకంగా కాఫీ త్రాగుతూ  వార్తలు చూస్తుంటే, కాలింగ్ బెల్ మ్రోగింది. స్రవంతి తలుపులు తీసి ఎవరో అడుగుతూండగానే,  నేను లేచి చూసాను.

ఆశ్చర్యం. రమా మనోహర్.

రాత్రేగా వాడితో మాట్లాడాను. ప్రొద్దున్నే ప్రత్యక్షమయ్యాడేమిటా  అనుకుంటూ ఉన్నానో లేదో, వాడి వెనుక వాడి భార్య. మరింత ఆశ్చర్యం. వాడి కొడుకు… అదే పెళ్లి కొడుకు సారంగపాణి.

‘ఇదేమిటి, ఉరుముల్లేని వానల్లే నేరుగా పటాలంతో ఇంటికొచ్చేశాడు.. వీడికి నా అసమ్మతి ఇంకా చెప్పలేదు. ఇప్పుడెలా?  కాదని ఎలా చెప్పాలి?’ మధన పడుతూనే, ఇంట్లోకి ఆహ్వానించాను. నేను ఆహ్వానించడమేమిటి? మొహమాట పడుతున్న భార్యతో, ‘వీడు నా జిగిరీ దోస్తు. రా… రా… పాణీ! మీ  తాతయ్య, ఈ అంకుల్ వాళ్ళ నాన్నగారి క్రిందే చేశారుద్యోగం’ అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు.

“రండి. కూర్చోండి” ఆహ్వానించింది రాధ.

“వార్నీ…ఎన్ని సార్లు ఈ వైపు నుంచీ తిరిగానో! నువ్విక్కడే ఉన్నావని తెలీనే లేదురా  ప్రసాదూ! పాతికేళ్ళయింది కలిసి. ఉండబట్టలేక ఫ్యామిలీతో దిగి పోయా! ఏమ్మా..రాధమ్మా? . నీ పేరు బయట నేమ్ బోర్డు మీద  చూశాలేమ్మా! తను… దమయంతి. నా భార్య. పెద్దబ్బాయి సారంగపాణి. వీడి తర్వాత ఒక కొడుకు, కూతురు కవలలు.” మంచి మాటకారి మనోహర్. తనే పరిచయం చేసేసుకున్నాడు మా వాళ్లకి.

స్రవంతిని, స్పూర్తిని పరిచయం చేసింది రాధ. స్రవంతి, సారంగపాణి ఒకర్నొకరు చూసుకోవడం నేను గమనించక పోలేదు. మనోహర్ భార్యకి మొహమాటం ఎక్కువనుకుంటా! తక్కువ మాట్లాడుతోంది. అంతేలే….దంపతులలో ఒకరిలా, మరొకరలా ఉంటేనే మంచిది.

“అంకుల్! కాఫీలో చక్కర వెయ్యచ్చా?”

“నేనింకా చక్కెర ఫ్యాక్టరీ కొనలేదమ్మా! నిరభ్యంతరంగా వెయ్యొచ్చు. దమయంతీ…నువ్వు తెచ్చినవి ఇవ్వూ!” స్పూర్తికి చెప్పి, భార్యతో అన్నాడు మనోహర్.

వాళ్ళు తెచ్చిన బుట్ట తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది అతని భార్య దమయంతి.

చాలా కబుర్లు చెప్పుకున్నాం.

“అయితే, అత్తయ్య, మావయ్యగార్లు నీ దగ్గరే ఉన్నారన్నమాట.” వాడితో అన్నాను.

గలగలా నవ్వాడు మనోహర్.

“మేమే వాళ్ళ దగ్గరున్నాం. అదే ఇల్లు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. నిన్ను కలవడానికి వెళ్తున్నామని చెప్తే ఎంత సంతోషించారో! మీ నాన్నగారు పోయారని తెలిసింది. అమ్మ ఎక్కడున్నారు?” అడిగాడు.

మా ఈ అపార్ట్ మెంట్ లో ఉండడం నచ్చలేదు అమ్మకి. తమ్ముడి దగ్గర కాకినాడలో ఉంటోంది. వాడిది ఇండిపెండెంట్ ఇల్లు. అదే చెప్పాను. పాత విషయాలు చాలా మాట్లాడుకున్నాం. ఇద్దరం యాభైలు దాటాం కాబట్టి, అప్పటి విషయాలు ఇపుడు చాలా సిల్లీగా అనిపించాయి. మనోహర్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడుట. ట్రాన్స్ఫర్ ఇష్టం లేక, పరీక్షలు రాయలేదట. అందుకే ప్రమోషన్ కూడా రాలేదుట. పిల్లలు ముగ్గురివీ మంచి చదువులేనట. సారంగపాణి ఖరగ్ పూర్ ఐ.ఐ.టీ లో చదివాడట. అదృష్టవశాత్తూ, అంతసేపట్లోనూ మా మధ్య పెళ్లి విషయాలేవీ రాలేదు.

“ మిస్సెస్ మనోహర్ మంచి కలుపుగోలు మనిషండీ! మాట తక్కువ కానీ చేత ఎక్కువ. ఆ కాసేపట్లో,  మాట్లాడుతూనే, నేను వంట కోసం పెట్టుకున్న చిక్కుడుకాయలు వలిచేసింది. కొబ్బరి తురిమేసింది. వారించినా వినలేదు. ‘చేతులు ఖాళీగానే ఉన్నాయి కదండీ’ అంది. వాళ్ళ ఇంటి పంటట. బోలెడు కూరగాయలు, ఆకు కూరలు తెచ్చారు.” చెప్పింది రాధ, వాళ్ళు వెళ్ళిపోయాక.

“చెప్పానా…ఉట్టి డబ్బుమనిషి అని. ఎవరయినా పళ్ళు తెస్తారు. స్వీట్స్ తెస్తారు. వీళ్ళ లాగా ఇంట్లోవి తెస్తారా?” మనసులో ఉన్న  మాట అనేశాను.

“తప్పేముంది నాన్నా? పళ్ళు, స్వీట్స్ దొరుకుతాయి కానీ, ఇంత తాజా వెజిటబుల్స్ మార్కెట్ లో దొరుకుతాయా?” ఎర్రటి క్యారెట్ ని నములుతూ తన గదిలోకెళ్ళిపోయింది స్రవంతి.

“స్వీట్లు  కూడా తెచ్చారండీ వాళ్ళు. ఆవిడ రెండు  చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతారట. ఒకటి స్వగృహ ఫుడ్స్, మరోటేమో మగ్గం వర్క్స్ చేయించి,  డిజైనర్ దుస్తులు కుట్టించి అమ్మే బొతీక్. పాతిక మంది పనివాళ్ళు ఉన్నారట.” కమ్మని నెయ్యి వాసన వస్తున్న బొబ్బట్టును పళ్ళెంలో పెట్టిచ్చింది నాకు రాధ. నేను తీసుకోలేదు.

“హు…తెలిసిందా….వాడొక్కడే కాదు, వెధవ డబ్బు కోసం   భార్యని కూడా కష్టపెడుతున్నాడన్నమాట! ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలూ ఉంటే…పగలూ, రాత్రీ లేకుండా మొగుడూ పెళ్ళాలు సంపాదనలో పడితే, అమ్మో…మనమ్మాయిని ఇచ్చామంటే ఎంత కష్టం?” అనేసి వెళ్ళిపోయాను.

డబ్బే జీవితం అనుకునే వాళ్ళు నాకసలు నచ్చరు. మనం సృష్టించుకున్న డబ్బు, మనని శాసించడం కరెక్ట్ కాదు. డబ్బు వల్ల వచ్చే పరువు, ప్రతిష్ట కృత్రిమం. శాశ్వతమయినవి మనవాళ్ళతో మనం గడిపే క్షణాలే! నేనెరిగిన మనోహర్ డబ్బునే శ్వాసిస్తాడు. వాడి ఆస్తిపాస్తుల గురించి నేనడగలేదు. వాడే మాటల మీద చెప్పాడు. ఒకప్రక్క బ్యాంకు ఉద్యోగం చేస్తూనే, పార్ట్ టైం జాబ్ లాగా కన్స్ట్రక్షన్ అడ్వైజర్ గా ఉండి ఇళ్ళూ, అపార్ట్మెంట్స్ కట్టిస్తాడట. ఈ మధ్య కాలంలో పారితోషికానికి బదులుగా ఓ ఫ్లాట్ ని ఇమ్మని అడుగుతున్నానని చెప్పాడు. .

ఏతా,వాతా అస్సలు మార్పులేని వాడి వైఖరి నాకు నచ్చలేదు. రాధకి దమయంతి నచ్చింది. స్పూర్తికి మనోహర్ కలివిడితనం నచ్చింది. స్రవంతికి ఎవరు నచ్చారో నేనడగలేదు. అది నాకు చెప్పనూ లేదు.

***

“సరేరా..ప్రసాద్! బై! వెళ్ళొస్తా! అయితే…ఒకటి… నేను డబ్బే సర్వస్వంగా బ్రతికే స్వార్ధపరుడిని అన్నావు చూడు. ఈ  నీ అభిప్రాయం తప్పు. మనలో ఉన్న శక్తెంతో , అర్హత ఏమిటో తెలుసుకొని అది పెంచుకుని ఎదుగుతే తప్పెలా అవుతుంది?చూడూ…సంపాదించడం తప్పు కాదు. అక్రమ సంపాదన తప్పు. వ్యాపారం తప్పు కాదు. ఆ పేరుతో మోసం చేసి దోచుకోవడం తప్పు. నేను డబ్బును ఆర్జించడమే కాదు, ఖర్చు కూడా సక్రమంగా పెడతాను. సంపాదించడంలో నాకు ఆనందం లభిస్తుంది. భవన నిర్మాణం లో  అనవసర ఖర్చులు తగ్గించి, మరింత నైపుణ్యత తో కట్టించి ఇచ్చి యజమానికి లక్షల ఖర్చుని మిగిల్చి, నేను వేలల్లో ఫీజు తీసుకోవడం తప్పెలా అవుతుందిరా?”  చాలా నొచ్చుకున్నాడు మనోహర్.

గత ఆదివారం మా ఇంటికి వచ్చి వెళ్ళాక, నాలుగు రోజులాగి నాకు ఫోన్ చేశాడు మనోహర్. మాకు ఇష్టమైతే, మాతో సంబంధం కలుపుకోవాలని ఉందని, స్రవంతి వాళ్ళ అబ్బాయికి నచ్చిందనీ చెప్పాడు. ఇంట్లో వాళ్ళ ముందు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అందుకని వాడిని మెయిన్ రోడ్ లో ఉన్న హోటల్ కి రమ్మన్నాను. మేము కలిశాక, నిర్మొహమాటంగా చెప్పేశాను.

“ డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మీయులతో గడిపే సమయాన్ని. డబ్బు వైద్యాన్ని అందించగలదేమో ఆరోగ్యాన్నివ్వలేదు. పరిచయస్తులనివ్వగలదు, స్నేహితుల్నివ్వదు. ఈ సంపాదన మోజులో పడి ఎన్ని కోల్పోతామో! నిన్నే చూడు. ఇంట్లో పెద్దవాళ్ళని వదిలి, నువ్వూ మీ ఆవిడా డబ్బు వెంట పడుతున్నారా లేదా? ఏం చేసుకుంటావురా మనోహర్ అంత డబ్బుని? ఒకటికి ఏడు ఫ్లాట్లున్నాయన్నావు. స్థలాలు కొన్నావు. అరే!  నువ్వు బ్రతకడానికి కావాల్సింది ఎంత? ఒక్క ఇల్లు. అంతేనా? చిన్నప్పటి నుంచీ డబ్బు వెనకాలే పడుతున్నావు. నీకంటూ తీరికగా ఓ పుస్తకం చదవడమో, సినిమా చూడడమో ఉందా అసలు? పెళ్ళాన్నీ తిప్పలు పెడుతున్నావు. రేపు నా పిల్లనీ మనీ మిషన్ గా మార్చేస్తావేమో! వద్దురా….ఏమీ అనుకోకిలా అన్నానని.” ఈ నా మాటలకే వాడలా అన్నాడు. లేచి నిల్చున్నాడు.

“ఓకే రా…పర్లేదు. కలుద్దాం. చెప్పడం మర్చిపోయాను. అమ్మ నిన్ను అడిగినట్లు చెప్పమంది. స్వగృహ ఫుడ్స్ నడిపేది అమ్మే! నాన్న దగ్గరుండి ఎకరాన్నర భూమిలో ఆర్గానిక్ కూరల సేద్యం చేయిస్తారు. అయితే, ప్రసాదూ  అది నా ప్రోద్బలం వల్ల మాత్రం  కాదు సుమా! అక్కడే పది ఆవులతో గోశాల కూడా ఉంది. పాలిచ్చే ఆవులు కావవి. వట్టిపోయి, కబేళాకి తీసుకు పోతూంటే డబ్బిచ్చి కొన్నాను.  ‘ఇంట్లో ఊరికే ఉండి ఏం చేయను? నేనూ ఏదో ఒకటి చేస్తాన’న్నది దమయంతి. తనకిష్టమైన పని చేస్తూ, చేయిస్తూంది.

డబ్బు కేవలం దాచుకోవడానికీ, ఖర్చు పెట్టడానికే కాదురా! సమాజసేవ చేయాలంటే కూడా డబ్బే అవసరం. పదిమంది పేదలకి చదువు చెప్పించాలన్నా, నలుగురికి ఉపాధి కల్పించాలన్నా డబ్బున్నవాడేగా చేయగలడు? డబ్బున్న వాళ్ళని ద్వేషించడం అనేది తరతరాలుగా చాలా మందిలో ఉన్న జాడ్యం. వాళ్లకి డబ్బు చేదు కాదు. డబ్బున్నవాళ్ళు చేదు. చెడిపోతేనే ధనవంతులవుతారని వాళ్ళ నమ్మకం. ఏం చేస్తాం? అందర్నీ మార్చే అవసరం నాకేం లేదు. సోమరిపోతులా బ్రతకవద్దనేవాడు మా  నాన్న. సమయాన్ని డబ్బుగా మార్చుకోవడం నేర్పాడు. పరుల మీద ఆధారపడకుండా నిజాయితీ తో  బ్రతకాలన్నాడు. నాకది నచ్చింది. నా వాళ్ళకీ నచ్చింది. అయినా నాకెంత కావాల్రా? ఇంకేం కావాలసలు? అమ్మా నాన్నల అండ దండలున్నాయి. అందమైన కుటుంబం ఉంది. ఆరోగ్యం ఉంది. నలుగురికీ మంచి చేయాలనే తపనుంది. నా దారి నాకు బాగుంది. …ఓకే రా…! నెవర్ మైండ్. విష్ యువర్ డాటర్ అల్ ది బెస్ట్. వీలున్నప్పుడు అందర్నీ తీసుకురా…అమ్మానాన్నా సంతోషిస్తారు.” చేయి కలిపి లేచాడు మనోహర్.  రెండు కప్పుల కాఫీకి నలభై రూపాయలకి బదులు, వంద నోటు వెయిటర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. మరో కప్పు కాఫీ త్రాగి నేనూ బయల్దేరాను.

*****

రాత్రంతా ఆలోచించాను. మనోహర్  మాటలే మననం చేసుకుంటూ ఉన్నాను. నిర్ణయం తీసుకున్నాకగానీ నిద్ర పట్టలేదు.

తెల్లవారింది.

“ఏం తల్లీ…నీకు సారంగపాణి నచ్చాడా? ముందుకు వెళ్దామా?” నా నుంచీ ఈ ప్రశ్న ఊహించలేదేమో, స్రవంతి బుగ్గలు ఎరుపెక్కాయి. కళ్ళు మెరిశాయి.

“మీ ఇష్టం నాన్నా!” రాధ వెనక్కి చేరి నెమ్మదిగా అంది.

“అక్కా…నేను చెప్పలేదూ…’నాన్న ఒప్పుకుంటారే! డోంట్ వర్రీ అని.’ మా నాన్న బంగారు.”  నా భుజాల్ని చుట్టి అంది స్ఫూర్తి.

నా వాళ్ళ ముఖాల్లో సంతోషం కాక, నేను కోరుకునేది ఇంకేముంటుంది?

 

August 21, 2021 2 comments
5 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

యా దొంకీ బారాత్

by వారాల ఆనంద్ August 20, 2021
written by వారాల ఆనంద్

వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు
——————
నా అరవై రెండేళ్ల జీవనయానంలో వేములవాడది ఒక ప్రధాన భూమిక. అనేక అనుభవాలకు,ఆనందాలకు,కొన్ని అవమానాలకు వేదికయిన ఆ వూరు మా అమ్మను కన్న వూరు,అమ్మమ్మ వూరు,తాతయ్య జోరు, గొప్ప జాతర హోరు.
వేములవాడ లో నేను అమ్మ గారింటి తోనే ఐడెంటి ఫై అయినప్పటికీ మా వారాల వంశం మూలాలు వేములవాడలోనే వున్నాయి.తరతరాలుగా మిఠాయిలోల్లం. అది తర్వాత ఎప్పుడయినా రాస్తాను.
నేను పుట్టింది వేములవాడలోనే అయినా పెరిగింది చదివింది కరీంనగర్. సెలవులకు,పండగలకు,పబ్బాలకు,అమ్మ గారింటికి వచ్చేవాడిని. అమ్మమ్మ సత్తమ్మ, తాతయ్య డాక్టర్ సుబ్రహ్మణ్యం,మామయ్యలూ, అత్తమ్మలూ, అందరిలో ఒక్కడినై కలగలిసి పోయి వేములవాడ వాడినే అయిపోయాను.
నా సుజనాత్మక జీవితంలో నటరాజ కళానికేతన్ ఒక ప్రధాన మూల మలుపు. ఆ మలుపు వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపించి జాతీయ అంతర్జాతీయ స్థాయి సినిమాల్ని ప్రదర్శించడం దాకా సాగింది.1983 దాకా నా ప్రధాన వేదిక భూమిక ఆ వూరే.
ఆ వేదిక గురించి విస్తృతంగా రాయాల్సివుంది. రాస్తాను ఎప్పటికయినా.
ఇప్పటికి గత అయిదు దశాబ్దాలుగా నన్ను వెంటాడుతున్న కొన్ని images గురించి రాస్తాను.
SOME Haunting images :
1 ) తిప్పాపురం బస్ స్టాండ్ :
చిన్నప్పటి నుండి దశాబ్ద కాలం వీక్షించిన దృశ్య మిది. జనంతో క్రిక్కిరిసి పోయి నిండు గర్భిణీ లా మెల్లిగా స్టాన్డ్ కు చేరుకున్న బస్సు చుట్టూ పొలోమంటూ పూజార్లూ వేద పండితులూ చేరి దేవుని దర్శనానికా అని పలకరిస్తూ పోటీలు పడి తలా ఒకటో రెండో కుటుంబాల్ని వెంట తీసుకెళ్లి. వారికి వసతి దర్శన తదితర బాధ్యతలు చూసే వారు. వేదపండితులు,విజ్ఞులు అయినా వారిని అలాంటి స్థితిలో చూడ్డం తీవ్రంగా కలత పెట్టేది.ఆ ఇమేజ్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది.
2 ) ధర్మ గుండం
అప్పట్లో దేవాలయ ధర్మ గుండానికి చెరువుకి నడుమ కేవలం చిన్న రాతి కట్టడం ఉండేది, ఇంకా కట్టడాలేవీ లేవు. యాత్రికులు దేవునిమీది విశ్వాసం తో గుండం లోకి పైసలు వేసేవాళ్ళు. అప్పుడేన్నని ఒకటో,రెండో, ఐదో పైసల బిళ్ళలు వేసేవాళ్ళు వాటికోసం కొంతమంది నీళ్ళల్లోకి దూకి మునిగి వెతికి కరుచుకుని
మరీ తెచ్చు కునే వాళ్ళు. ఎన్ని సంపాదించే వాళ్ళో కానీ ఆ ఇమేజ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే వుంది.
3 ) మిఠాయి దుకాణాలు
గుడి ముందు కాలువ పక్కన కేశన్నగారి ఇంటి వరుసలో పొందికగా వున్న మిఠాయి,గాజుల దుకాణాలు నాకిప్పటికీ గొప్పగా అనిపిస్తాయి. రంగు రంగుల చిలుకలు బత్తీసలు బెండ్లు శక్కరి పుట్నాలు, అందంగా పేర్చిన పేడాలు ఎంత కళాత్మకంగా ఉండేవో. గొప్ప దృశ్యాలవి పిల్లలు మేడలో చిలుకల పేర్లు వేసుకోవడం ఎంత అందంగా ఉండేదో.
4 ) బిచ్చ గాళ్ళు
జాతరలు ఆలయాల ముందు వీళ్ళు సాధారణం. కానీ వేములవాడ వీధుల్లో ముళ్ల కంపల పై పడుకుని కొందరు, ఇంకొందరయితే భూమిలో గోతి తవ్వి అందులో తల పెట్టి మట్టి తో కప్పుకుని పక్కనే ఒక ప్లేటు పెట్టుకుని గంటల తరబడి అట్లా వుండే వాళ్ళు. వాళ్లకు శ్వాస ఎట్లా ఆడేదో ఇప్పటికీ అర్టంకానీ విషయమే.ఆ దృశ్యాలు నన్ను వెంటాడు తూనే వున్నాయి. అప్పుడు కెమెరాల్లేవు ఇమేజెస్ మనసులోనే ఉండి పోయాయి
5 ) తూము
చెరువు కింది తూములోంచి నీళ్లు వదిలి నప్పుడు ఉప్పొంగి కాలువలోకి వచ్చే నీటి దృశ్యం పట్నం లో పెరిగే నాకు అబ్బురంగా కనిపించిన ఇమేజ్ .
6 ) పోచమ్మ
పోచమ్మ బోనాలు వాటికి ముందు మోగే దప్పుల చప్పుడు శివాలూగే భక్తులు ఓహ్ చూడాల్సిందే.మరీ చిన్నప్పుడు భయమేది కానీ ఆ ఇమేజ్ మామూలుది కాదు
7 ) జైన శిల్పాలు
ప్రధాన దేవాలయం నుండి తరలించిన వందలాది శిల్పాల్ని అనాధలుగా భీమన్న గుడి పక్క తోటలో పడేసిన దృశ్యం వెరీ మచ్ హాంటింగ్. కొంచెమయినా చారిత్రిక దృష్టి లేని తనం దుఃఖం కలిగిస్తుంది.వేదనగా ఉంటుంది.
8 ) తాతయ్య దవాఖానా
సుబ్రహ్మణ్యం తాత దవాఖానా రోజంతా పేషంట్ల తో క్రిక్కిరిసి ఉండేది. కషాయం దగ్గు పొట్లాలతో బిజీగా ఉండి సేవ చేసేది. సాయంత్రమయితే చాలు దవాఖానా ముందు ఊడ్చి శుభ్రం చేసి చాపలు వేసేవాళ్ళు. ఆప్పుడు తాతయ్య, ఠాకూర్ సాబ్, సాంబయ్య సారూ ఇంకా అనేక మంది పెద్దలు ఒక్కోసారి ఎం.ఎల్లే రాజేశ్వర్ రావూ కూర్చుని దేశం గురించి రాజకీయాల గురించీ చర్చించే వాళ్ళు. ఆ దృశ్యం ఎంత గొప్పగా ఉండేదో
9 ) దవాఖాన్ల అమ్మమ్మ రాజేశ్వరి అమ్మమ్మ
నా చిన్నప్పటి నుండి మనసులో అట్లా నిలిచి పోయిన స్త్రీ రూపం దావాఖాన్ల అమ్మమ్మ. ఒకింత నిండుగా ముక్కు పుడక, చెవులకు గంఠీలు సహా ఒంటినిండా ఆభరణాలతో కళకళ లాడేది.నోట్లో పాన్ ఎంత అందంగా ఉండేదో. దసరాకు జాతరాకో మా పిల్లలందరికీ ఒక్కో రూపాయి ఇచ్చేది. తను నాకయితే గొప్ప గ్రామ దేవతలా అనిపించేది. చాలా గొప్ప స్త్రీ మాత్రమే కాదు గొప్ప మనిషి కూడా.
ఇట్లా నన్ను హాంట్ చేసిన ఇమేజెస్ ని కొన్నింటిని నా ‘శివ పార్వతులు’ డాక్యుమెంటరీ లో పొందు పరిచాను.
ఆ ఫిలిం Slovenia ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకుంది.ఇంకా భూటాన్, మెక్సికో లాంటి చోట డాక్యుమెంటరీ ఫెస్టివల్స్ లో పాల్గొంది. ఆ వివరాలు మరో సారి.
ఇవన్నీ నన్ను వెంటాడిన ఇమేజెస్ మాత్రమే. నా ఫిలిం చూడాలనిపిస్తే చెప్పండి లింక్ ఇస్తాను.

వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు= 2
ఆయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆట విడుపు. ఆ ఆటవిడుపులో అమ్మగారింటికి వెళ్ళడంలో వున్న మజాయే వేరు. అదీ ఆత్మీయంగా చూసే తాతయ్య అమ్మమ్మలు వున్నప్పుడు ఆనందం ఎన్నో రెట్లు పెరిగేది. ఇంతకు మందే చెప్పినట్టు మా అమ్మగారిల్లు వేములవాడ. మావూరు కరీంనగర్. తాతయ్య డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం, అమ్మమ్మ సత్యమ్మ. ఎక్కడో మహాబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి వేములవాడ వచ్చి అక్కడి దేవస్థానంలో మొట్టమొదటి వైద్యాదికారిగా సేవలందించిన తాతయ్య కొల్లాపూర్ లో రాచరిక భూస్వామ్య వ్యవస్థ ముందు తల ఒగ్గ లేక వేములవాడ వచ్చినట్టు విన్నాను
ఆ విషయాలు తాతయ్యను ఎప్పుడు అడిగినా చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవాడు. నేను కరీంనగర్లో కార్ఖానాగడ్డ, గంజ్ స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు పరీక్షలవుతున్నప్పుడు తాతయ్యకు ఉత్తరం రాసేవాడిని ఫలానా రోజుతో పరీక్షలయిపొతున్నాయని. సరిగ్గా ఆరోజు పగటీలికల్లా తాతయ్య కరీంనగర్లో మా మిఠాయి దుకాణం ఇంట్లో దిగేవాడు. అనేక మంది పిల్లలతో మున్సిపల్ స్కూలులా వుండే మా ఇంట్లో అందరికీ ఐస్ ఫ్రూట్లు ఇప్పించి నన్ను తీసుకుని వేములవాడ బయలు దేరేవాడు. అట్లా దాదాపు స్కూలు సెలవులన్నీ వేములవాదలోనే గడిచేవి. అక్కడి మిత్రులు దేవాలయ వాతావరణం నా బాల్యం లో భాగం అయిపోయారు.
అమ్మమ్మ తతయ్యలకు తమ కూతుళ్ళ పిల్లలంటే ఎంత అభిమానమంటే వాళ్ళని ఏమయ్యా అనేవాల్లె గాని అరేయ్ ఒరేయ్ అని పిలిచే వాళ్ళు గాదు. అమ్మమ్మయితే ఆడబిడ్డల కొడుకులను అరేయ్ అంటామా అని అందరిముందూ అనేది. అదే మా ప్రసాద్ బావని మాత్రం అరేయి ప్రసాదూ అని పిలిచేది. అదీ అప్పటి పెద్దల అభిమానాలూ ఆదరణలూ.
తాతయ్య వేములవాడ దేవస్థాన మొట్టమొదటి వైద్యాధికారి. దేవాలయ వెనకాల కట్టమీద ఆసుపత్రి నివాసమూ వుండేదని చెప్పేవారు. అక్కడే అనేక ఏళ్ళు గొప్ప సేవా తత్వంతో సేవలందించిన ఆయన ఆజానుబాహువు. ముఖంలో గంభీర్యంతో కూడిన చిరునవ్వుతో అందరి ఆదరణకూ పాత్రుడయ్యేవారు. కరేమ్నగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ లో 1960 ప్రాంతంలో లైబ్రేరియన్ గా పనిచేసిన శ్రీ శ్రీరంగా రావు గారు ఇటీవల నాతో మాట్లాడుతూ మీ తాతయ్య ఎంత అందగాడనుకున్నావు కట్టమీద నడుస్తుంటే ఎవరికయినా గౌరవంగా పలకరించాలని పంచేది. నేనూ తన దగ్గర నా చిన్నప్పుడు వైద్యం చేయించుకున్నాను అన్నాడు. అంతేకాదు ప్రైవేట్ గా ఆసుపత్రి తెరిచి ఆయన చేసిన సేవ గురించి దావఖాన్ల అమ్మమ్మ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. (అవన్నీ మరెప్పుడయినా పంచుకుంటాను)
నాకయితే ఆర్ద్ర రాత్రి ఆపరాత్రి అనకుండా మందుల పెట్టె పట్టుకుని కాన్పులు చేయడానికి ఆపదలో వున్న వాళ్లకు వైద్యం చేయడానికి వెళ్ళిన ఆయనే గుర్తొస్తాడు. అట్లా వేముల వాడలోనే కాదు చుట్టూ పక్కల అనేక గ్రామాల్లోని ఆపన్నులకు ఆయన అందించిన సేవల్ని ఆయా గ్రామాల ప్రజలు దశాబ్దాలపాటు స్మరించుకున్నారు. చిన్నపిల్లలు మొదలు వృద్ధుల దాకా ఆకాలంలో ఆయన చేతి కషాయం, దగ్గు మందు, దగ్గు పొట్లాలు వాడని వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి.
ఆ మహానుభావుడి యాదిలో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు అనుభూతులు.
వ్యక్తిగతమయినవి కాకుండా వూరి పరంగా సామాజిక పరంగా నన్ను వెంటాడుతున్న మూడు దృశ్యాల్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

1) తాతయ్య ఉదయాన్నే లేచి బావి వెనకాల చెట్లకు నీళ్ళు పారించి పిల్లల స్నాన పానాదు లతో గడిపి గ్లాసెడు చాయ్, నోట్లో పాన్ బిగించి తన స్టాండర్డ్ డ్రెస్ లాల్చీ పైజామాలు ధరించి ఆసుపత్రికి బయలు దేరేవాడు. అప్పుడప్పుడు నేనూ వెంట వుండే వాడిని. తాను ఇంటి గడప దాటింది మొదలు ఆయనకు కుడిచేయి దించే అవకాశం వుండేది కాదు. తాతయ్యా నమస్తే, తాతా నమస్తే అంటూ బడి పిల్లలూ ఆడుకునే పిల్లలూ ఆయన్ని పలకరిస్తే అందరికీ ప్రతిగా నవ్వుతూ చేయి ఊపుతూ దగ్గరికి వచ్చిన వాళ్లతో చేతులుకలపదం చేసేవాడు. ఇక పెద్ద వాళ్ళయితే ‘దండాలయ్యా’, నమస్తే డాక్టర్ సాబ్, అయ్యా దండం పెడ్తున్నా అనేవాళ్ళు ఇంకొందరు, అందరికీ బదులిస్తూ అందరినీ పలకరిస్తూ తాతయ్య ఆసుపతికి చేరే సరికి ఎంతో సమయం పట్టేది. నిజంగా ఒక మనిషి అంతమంది ఆదరణను ప్రేమని పొందడం అపురూపమం. ఆ దృశ్యం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది. మనిషి కనిపిస్తే ముఖం చాటేసి వెళ్ళే ఈ కాలం లో అది అపురూప దృశ్యమే.

2) ఇక రెండవది రాజ రాజేశ్వరుని ‘సేవ’. ప్రతి దసరాపండుగ రోజు సాయంత్రం వేములవాడ దేవస్థానం ఆధ్వర్యంలో రెండు సేవలు (దేవుని పల్లకీలు) బయలుదేరేవి. శివకేశవుల సేవలు అవి. ఆలయంలో బయలుదేరి జమ్మి చెట్టు నిలబెట్టే స్థలానికి చేరి ఇక అక్కడినుంచి వూరు ఊరంతా అన్ని వీధులూ తిరిగి ఆలయానికి వచ్చేవి. ఆ రెండు సేవలూ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటి ముందుకు వచ్చి అక్కడ గౌరవంగా నిలబడేవి. అప్పటికే అమ్మమ్మ తో సహా అనేక మంది మహిళలు హారతులు పట్టుకుని నిలబెడేవారు. మేము పిల్లలమంతా సేవల కిందినుంచి అటూ ఇటూ దూరి పరుగులు తీసే వాళ్ళం. అదొక అద్భ్తమయిన దృశ్యం. దేవుని సేవలు ఒక వ్యక్తి ఇంటి మందు నిలబడడం ఒక అపురూపమయిన విషయం. ఆ ఆనవాయితీ తాతయ్య ఉన్నంత కాలం కొనసాగింది.

౩) ఇక మూడవది తాతయ్య అంతిమ యాత్ర. బహుశా నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని వెంటాడే దృశ్యం అది. అనారోగ్యం తో హైదరాబాద్ ఆసుపత్రిలో తన అంతిమ శ్వాస విడిచిన ఆయన అంతిమ యాత్ర వేములవాడలో మొదలయినప్పుడు వేములవాడ వూరు ఊరంతా దుఖమే. రోదించని వాళ్ళు లేరు. అంతిమ యాత్ర ముగిసే వరకు దేవాలయ ప్రధాన ద్వారం మోసేసారు. ఊరంతా బందు. అంతిమ యాత్ర సాగినంత మేరా ఇళ్ళముందు పిల్లా పెద్దా అంతా తమ ఇంట్లో మనిషి పోయినట్టు రోదిస్తున్న దృశ్యం నా కళ్ళల్లో ఇప్పటికీ మెదుల్తూనే వుంది. ఇదికదా ఒక మనిషికి మహానుభావుడికి ప్రజలు ఇచ్చే నివాళి. గౌరవం.
జయహో తాతయ్యా జయహో డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం జయహో.
కన్నీళ్ళతో ఇక ఏమీ రాయలేను’

August 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పొట్ల కాయ పొగరు

by డా.కందేపి రాణీప్రసాద్ August 20, 2021
written by డా.కందేపి రాణీప్రసాద్

ఓ ఇంటి పెరట్లో పొట్లకాయ పాదు, దొండకాయ పాదు ఇంకా రకరకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఆ ఇంటి యజమాని చక్కగా అన్నిరకాల కూరగాయల మొక్కల్ని ప్రేమగా పెంచుకుంటున్నాడు. పక్కపక్కనున్న పందిళ్లపై పాకి ఉన్న పొట్లకాయ, దొండకాయ తీగలు రోజు మాట్లాడుకుంటూ ఉంటాయి. పైకి మామూలుగా మాట్లాడుతున్నప్పటికి పొట్లకాయకు తాను బాగా పొడుగ్గా ఉంటానని అహంకారం ఉంది. పొడుగ్గా ఉంటే అందంగా ఉంటారని అనుకుంటుంది ఇలా మొదలైన దాని అహంకారం పెరిగి పెరిగి పొగరుగా రూపుదిద్దుకున్నది.

పొట్లకాయకు తాను పొడుగ్గా అందంగా ఉంటాననే కాకుండా, దొండకాయ పొట్టిగా, అందవికారంగా ఉంటుందని అనిపించసాగింది.  అలా ఆలోచన వచ్చిందే తడవుగా తాను దొండకాయకన్నా గొప్పదాన్నిని అనుకోవడంతో పాటు దొండకాయను అవహేళన చేయడం మొదలు పెట్టింది. ఈ మాత్రం సమయం దొరికినా, ఏ చిన్నపాటి అవకాశం లభించిన దొండకాయను వదలడం లేదు. పొట్లకాయ మాటలకు దొండకాయ చాలా బాధపడుతోంది. కానీ ఏం చేయలేకపోతున్నది. దూరంగా పారిపోదామా అంటే జంతువులకు ఉన్నట్లు తమకు కాళ్ళు చేతులు లేవాయే. ఎక్కడ ఉన్నవాళ్లం అక్కడే ఉండాలి. తమ తల్లిదండ్రులు ‘ఇరుగుపొరుగుతో మంచితనంగా ప్రేమగా ఉండాలి’ అని చెప్పారు. అందుకే పొట్లకాయతో ఎంత ప్రేమగా ఉన్న అది ఊరుకోవడం లేదు. దాని పొడుగును చూసుకొని విర్రవీగుతోంది. దొండకాయ తననింతపొట్టిగా పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకొంది. ‘నేనెందుకింత అందవిహీనంగా ఉన్నాను’ నేను చేసిన పాపమేమిటి? అనుకుంటూ రోజు తనలో తాను కుమిలిపోసాగింది.

ఈ వ్యవహారన్నంతా ఆ పక్కనే ఉన్న కాకరపాదు గమనించింది. విషయం కొద్దిగా అర్థమైన పూర్తిగా తెలుసుకుందామని దొండకాయను పలకరించింది. అడిగిందే తడవుగా తన మనసులోని బాధనంతా చెప్పేసుకుంది దొండకాయ. ‘నేను పొట్టిగా ఉండటం నా తప్పా? పొట్లకాయ ఎలా కూరగాయగా మానవులకు పనిచేస్తుందో నేను కూడా అలాగే కూరగాయగా పనికొస్తున్నాను కదా!’ అంటూ బోరుబోరున ఎడ్చింది. కాకరకాయ దొండకాయను ఊరడిస్తూ ఇలా చెప్పింది. ‘దేవుని దృష్టిలో గొప్ప, తక్కువ తేడా లేదు. అందరూ సమానమే. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది! కాబట్టి మొదట నువ్వు ఏడవడం మానేసి ప్రశాంతంగా ఆలోచించు! అన్నీ నీకే అర్థమవుతాయి!’ అన్నది.

దొండకాయ కొద్దిగా ఏడుపు ఆపి కళ్ళ నీళ్ళు తుడుచుకొని సరిగా కూర్చుంది.అప్పుడు కాకరకాయ మరలా ఇలా చెప్పింది. “చూడు! నన్ను కూడా అందరూ చేదు చేదని అసహ్యించుకుంటారు. పిల్లలైతే నన్నసలు ముట్టుకొనే ముట్టుకోరు. ఇంకా నా చర్మం మూడుతలు పది ఉంటుందని ముసలమ్మని అంటూ ఎగతాళి చేస్తారు. అయినా నేను ఇవేవి పట్టించుకొను. నన్ను ఇంతగా అసహ్యించుకున్నా షుగర్ వ్యాది ఉన్నోళ్ళు నన్ను ఎంతో ప్రేమగా తింటారు. నాలో షుగరు వ్యాధిని తగ్గించే గుణాలు ఉన్నాయట. మానవులు తినటానికి కూరగాయగా పనికిరావడమే కాకుండా వారి వ్యాధుల్ని కూడా తగ్గించగలుగుతున్నానన్నసంతోషం ముందు ఈ ఎగతాళులు ఎంత మాత్రం నన్ను బాధించవు! అలాగే నువ్వు కూడా ముందు బాధపడటం మానెయ్యి. చక్కగా తిని ఆరోగ్యంగా ఉండు. చూడు నీరసంతో ఎలా చిక్కి శల్యమయ్యావో!”. దాంతో దొండకాయ కొంత ఊరట చెందింది. ‘అంతేనంటావా! నాకు ఈ లోకంలో గుర్తింపు ఉందంటావా?’ ఇంకా పూర్తిగా అనుమానం పోక అడిగింది.

చూడు దొండకాయ మిత్రమా! అసలు నీ గొప్పదనం నీకు తెలియడం లేదు. మానవుల్లోని మహా మహాకవులు అందగత్తెలైన స్త్రీల పెదవుల్ని ‘దొండకాయ వంటి పెదవులు’ అని నీతో పోలుస్తారు తెలుసా! నేవ్వెమో కధలు చదవవు. నీకేమో పుస్తకాలు చదివే అలవాటే లేదాయే! అతిలోక సుందరులైన రంభ, ఊర్వశి, మేనకల్నైనా ఎర్రగా పండిన దొండపండు వంటి పెదవులు’ అంటూ పొగడాల్సిందే. నీ ప్రత్యేకత ఎవరికీ లేదు! అంటూ వివరిచింది.

ఇప్పుడు దొండకాయకు ఇంకాస్త ధైర్యం వచ్చింది. ‘ నేనీ అందమైన ఆడవాళ్ళ పెదవుల్లా ఉంటానా’ అనుకుంది. ‘నేను ప్రత్యేకమైనదాన్నని నాకు తెలిసొచ్చింది. నాకు పిరికితనం పోయి ఆత్మవిశ్వాసం వచ్చింది. మరి ఈ పొట్లకాయ ఆగడాలు ఇలా భరించాల్సిందేనా! దీనికేం దారిలేదా!’ మళ్ళీ బేలగా అడిగింది. దానికి కాకరకాయ సమాధానంగా దొండకాయ తల నిమురుతూ ఇలా చెప్పింది. ‘చూడు మిత్రమా! ప్రతిదానికీ ఒక సమయమంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చినపుడు ఏది ఎలా జరగాలో అలా అరుగుతుంది. దాని మాటలు పట్టించుకోవద్దు. సృష్టిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఏడిపించేవారిని వదిలేసి నీతో మంచిగా ఉండేవారితో స్నేహం చెయ్యి. ఏమి బాధపడకు. ధైర్యంగా ఉండు’ అంటూ ఉపదేశించింది. దాంతో దొండకాయ పూర్తిగా శాంతించింది. పొట్లకాయను మరిచి మిగతా స్నేహితులతో సంతోషంగా ఉండసాగింది.

ఇలా ఉండగా ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి ఇంటి యజమాని పొట్లపాదును తీసేస్తున్నాడు. తీగలన్నీ పీకెసి చెట్టు మొదలును తవ్వేస్తున్నాడు. పొట్లకాయ విపరీతమైన బాధతో ఏడుస్తున్నది. తనను చంపొద్దని యజమానిని ప్రాధేయపడుతుంది మౌనంగా. యజమాని అలా దొండకాయకు అర్థం కాలేదు. ఎంటా అని పక్కనే ఉన్న కాకరచెట్టు వంక చూసింది.

అప్పుడు కాకరచెట్టు ఇలా చెప్పింది. రాత్రి యజమాని వాళ్ళ చిన్న కొడుకు చీకట్లో పొడుగ్గా పెరిగిన పొట్లకాయను చూసి పాము అని జడుసుకున్నాడట. రాత్రి నుంచి జ్వరం తగ్గలేదు. పిల్లాడు బాగా భయపడ్డాడు అందుకే యజమాని పొద్దున్నే ఈ చెట్టును పీకెస్తున్నాడు. చూశావా ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నువ్వు దాని పొగరు చూసి భయపడ్డావు. దాని ఆకారాన్ని చూసి పొట్లకాయ గర్వించింది కానీ పిల్లాడు పామని ఎలా భయపడ్డాడో చూడు. మన గొప్పదనాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకోవాలి కానీ మనకు మనమే గొప్పనుకోకూడదు. నువ్వు ఇకనుంచైనా ఆత్మవిశ్వాసంతో మెలుగు. ఎవరేం చెప్పినా, ఎవరేం అన్నా పట్టించుకోవద్దు. నీ సంతోషమే నీకు ముఖ్యం.

అప్పటి నుంచీ దొండకాయ సంతోషంగా ఉండసాగింది. ఏడిపించే వాళ్ళను వదిలేసి స్నేహితంగా ఉండేవాళ్ళతో కలిసి ఉండసాగింది.

 

August 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పాయిరంగల్ల యిల్లు

by కూకట్ల తిరుపతి August 20, 2021
written by కూకట్ల తిరుపతి

పురుళ్లు వోసుకున్న జాగ
పుట్టుకూసాలు తొడుక్కున్న తలం
బొడ్డుపేగులు తెగిపడ్డ పురిటిగడ్డ
మాయి ముంతలు పాతిపెట్టిన పొలిగుంటలు
కూరాడు నీరాడులను నిలుపుకొన్న నిట్టాడు
బువ్వ కుండలను పొందిచ్చుకున్న సుట్టకుదుర్ల తోడు
సరప్పట్టెలకు ఉయ్యాలలోలే యాళ్లాడే ఉట్లు
ఉగ్గాలు ఊగులాడవడ్డ పాలు పెరుగు బుడ్లు
ఒత్తుకుండ పొయ్యి వొంపిన ఉడుకు నీళ్లు
పాలగోకును పంచిన దాలిల కాగిన పాలు
గడుకతిని గంజినీళ్ళు తాగిన తావు
నిండు జీవునాలను నిలిపిన రేవు

తలపెయ్యికి వొయ్యందే అడుగు తర్రవెట్టని దేవునర్ర
సామాన్లను వొచ్చోరకు వెట్టిన సాయమానర్ర
ఇసిరెలు పసిరెలను యిగురంగ మోసిన చిటుకు
కాయితపు కత్పలను కడుపుల దాచుకున్న తనాబ్బీ
ఇల్లు పొడుగూత ముగ్గులు మొల్సిన అరుగు
కుదురుగ కుదిరిచ్చిన కుమ్మరిగూన కప్పుటిల్లు
ముంగట నీడకు నిలవడ్డ గడ్డి గుడిసె
జమిలి సూరు దారలను మోసే రేకుల దోని
పదిమంది పండిబొర్రేంత ఎల్లుడంగ పెద్దర్వాజ
ఇరుగుపొరుగును మందలిచ్చు యింటెనుక పనుగడ
ఎర్రలుకు పూసి లప్పతొక్కిన మట్టి గోడల పడారి
జాజు పూతల్ల సున్నపు తీనెల వన్నెసిన్నెలు
చీమలకు శెక్కర వోసిన పున్నెవంతుడు
మా తాత చెట్మడిపి నిలవెట్టిన పాయిరంగల్ల యిల్లు
పాములకు సుతా పాలువోసిన బోళ్లకోరిది
మా అవ్వవ్వ బోనం కుండోలే పుదిచ్చిన గూనపెంకిల్లు

ఆయిటి పూనిన వాసనకు
ఓటికోటీ పోటీవడ్డట్టూ యిగిలిచ్చిన
సూరు కింద సోల్పుగ యేనుకొని యెదిగిన
ఉద్దరాసి గోరంట చాబంతి మొల్కల సాళ్ల సొగసు
కసువూడ్చి కల్లాపిసల్ల యాస్టకుదెచ్చే వాకిలి
నవ్వులపువ్వులతో ముర్సిన ఆటల లోగిలి
వాయిలి పొర్క తడ్కలను తొడుక్కున్న జీవాలదొడ్డి
కంకబద్దల ద్యాగర కమ్ముకున్న గొర్రెబొక్కులు
కొట్టంల కొలువైన యెడ్లూబర్ల అరుపులు
గంపలు బోర్లేసిన పిల్లల కోళ్ల పిలుపులు
ఇంటెనుక పబ్బులకు అల్లుక పారిన పచ్చదనం
బీర కాకర చిక్కుడు తీగెల ల్యాతాకుల పరువం

శాదబాయిల యెగిరే పిట్టల ఒయ్యారం
సితపతాల్లంకెళ్లే శాతాడు బొక్కెనల సోయగం
పెయ్యిల మైలలూడదీసే గదిల తానాలు
నిండు శూలాలోలే నిగనిగలాడే నీళ్లకుండలు
పాకురునుగీకి పడుకున్నట్టు గోలెంల కశికలు
కడుపుల తలవెట్టి కాళ్లకు నీళ్లిచ్చే అంపులు
కడుగులంట్లతో నిండిన కుడిది గోలెపుకడుపు

సట్టంబెట్టి మెత్తేసిన వడ్లు దినుసుల గుమ్ములు
పటువ బొత్తల బూడిదతో ఇత్తునంగట్టిన ఇగురం
అటుకు నిండార్గ మెలిగిన పొయ్యిలకట్టెల మండెలు
కుండ మీద కుండలు కూసున్న దొంతుల వర్సలు
సిక్కుడుకు చెక్కిన సువరాకలూ జాబులు

గొంగళ్లను పర్సుకొన్న నులుక మంచాలు
సుక్కలతో ముచ్చట వెట్టించిన గడెంచలు
శాత్రాలూ సంబురాలు కతలూ యెతలు
సుట్టాలూ పక్కాల కట్టనిట్టూరాల కలబోతలు
అచ్చేగాళ్లు బిచ్చగాళ్ల దీవెనార్తులు

ఏగిలేత్తే సేనుశెల్కల్ల మెదిలిన పనిమంతులు
మన్ను బుక్కి మన్ను కక్కిన మట్టిమనుషులు
తాతమ్మల బొక్కలు బొత్తిగ తెల్లవడంగ
మట్టి బొమ్మల మీద మన్సువడంగ
కట్టిన యిల్లూ పెట్టిన పొయ్యీ
ఇయ్యాల వచ్చెలువచ్చెలుగ యిచ్చకపోవచ్చు!
ఆ ఆత్మగల్ల దంట పేరైతే మాసిపోలేదు
గాల్ల సత్తువగల్ల యిత్తునం
కొడుకులూ కొమ్మలూ బిడ్డలూ బాందవులు
చెట్టంత నిండు బలగమయ్యింది
శెల్కంత పసిరిక సేనయ్యింది
గా పాయిరంగల్ల గూనపెంకల యిల్లు
కన్ను మలుగంగనే కలల కనవడుతంది
క్యాలికి రాంగనే కండ్లల్ల మెరుస్తంది.

August 20, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లలిత సంగీతం – ఆకాశవాణి

by chimmapudi Sriramamurti August 20, 2021
written by chimmapudi Sriramamurti

శ్రుతి, లయ, రాగ, భావయుక్తంగా సామాన్య శ్రోతలకు సైతం అర్థమయ్యే విధంగా వినిపించే మధుర మనోజ్ఞ గీతమే లలిత సంగీతం. లలిత సంగీతం శాస్త్రీయ – జానపద సంగీత స్రవంతికి వారధి వంటిది.

లలిత గీతం మాత్రా ఛందస్సులో ఉంటుంది. సరళమైన అలతి అలతి తెలుగు నుడులకు గుడి వంటిది. పల్లవి రెండు లేక నాలుగు పంక్తులతో మొదలై 3,4 చరణాలతో సమాప్తమవుతుంది. పంక్తుల మాత్రలన్నీ సమసంఖ్యలో ఉంటాయి.  4,6,8,10,12,16 ఇలా మాత్రల సంఖ్య ఉంటుంది. లలిత గీతం గాన యోగ్యత గలిగి ఉండటం ప్రధాన లక్షణం. గాన యోగ్యమైతేనే గేయం.

లలిత గీతానికి యతి నియమం, అంత్యప్రాస నియమం కూడా ఉంటుంది. కొందరు యతినే పాటిస్తారు. కొందరు కవులు అంత్యప్రాసను పాటిస్తారు. రెండూ పాటిస్తే గీతం చాలా అందంగా ఉంటుంది. వినసొంపుగా ఉంటుంది.

హ్రస్వాలన్నీ ఏకమాత్రికలు. దీర్ఘాక్షరాలన్నీ ద్విమాత్రికలు. ఒక మాత్రను లఘువు అనీ, రెండు మాత్రలను గురువు అని  కూడా అంటారు. లఘువు గుర్తు =I గురువు గుర్తు U. లయను సామాన్యార్థంతో వాడతారు. లయ విభిన్నగతులలో కనపడినప్పుడు తాళం అంటారు. ఉదా|| చతురస్రగతి, మిశ్రగతి, త్రిశ్రగతి. ఇవన్నీ తాళాల పేర్లు.

తాళం లేకుండా గేయమే ఉండదు. లలిత గీతానికి 5 ప్రధాన లక్షణాలు. 1. పల్లవి, 2. గతి లాలిత్యం, 3. ఏకకర్మత్వం, 4. తాళం, 5. పరమార్థ లక్ష్యం: భావోన్మీలత.

జానపద గీతాలు ఆశువుగా వచ్చేవి. పల్లెవాసులు వాళ్ళకొచ్చిన భాషలో యాసలో పాడుకున్నవి. వాటిలో ప్రామాణిక భాష దృష్ట్యా ఎన్నో భాషాదోషాలు, వ్యాకరణ దోషాలు ఉండవచ్చు.  జానపద గీతానికి పరిణామదశ లలిత గీతం అనవచ్చును. ఇందులో పరిశుద్ధమైన భాషతో, వ్యాకరణయుక్త పదబంధాలు ఉంటాయి. శిష్ట వ్యావహారిక భాష, సరళశైలిలో కనిపిస్తాయి.

లలితగీతాలు మొదట ప్రేమ, విరహం, ప్రకృతి, మానవత్వం భావుకతతోనే వెలువడ్తాయి. తరువాత దేశభక్తి, దైవభక్తి, సామాజిక చైతన్యం, సామయిక సమస్యలు – ఇలా ఎన్నో అంశాలు లలిత సంగీతంలో ఆవిష్కృతమవుతాయి.

ఎందరో కవులు, పండితులు, వర్ధమాన, వర్తమాన రచయితలు లలిత గీత రచన పట్ల ఆకర్షితులవుతున్నారు. దేశ స్వాతంత్ర్య సమర సందర్భాలలోనే లలిత గీతాల  రచన ఆరంభమైంది. సుప్రసిద్ధ తెలుగు లలిత గీత గాయకులు చిత్తరంజనంగారు లలిత సంగీతంపైన పాఠ్యప్రణాళికా రచన చేశారు.

గురజాడ, చిలకమర్తి, రాయప్రోలు, అబ్బూరి, విశ్వనాథ, నండూరి, బాపిరాజు, బసవరాజు, దేవులపల్లి, దువ్వూరి, కవికొండల, తల్లావజ్ఝల, బసవరాజు, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, చావలి బంగారమ్మ బసవరాజు రాజ్యలక్ష్మమ్మ, మల్లవరపు విశ్వేశ్వరరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, శ్రీశ్రీ, కొనకళ్ళ వెంకటరత్నం, వింజమూరి శివరామారావు, ఇంద్రగంటి, పైడిపాల, బోయిభీమన్న, పుట్టపర్తి, దాశరథి, సి.నారాయణరెడ్డి, కందుకూరి రామభ్రదరావు, శశాంక, బాపురెడ్డి, సుశీలాదేవి, ఆచార్య తిరుమల, ఆరుద్ర, తిరుమల శ్రీనివాసాచార్య, గిడుగు రాజేశ్వరరావు ఊటుకూరి సత్యనారాయణ, పిలకాగణపతి శాస్త్రి మొదలైన కవిశేఖరులెందరో గత శతాబ్దంలో లలితగీతాలు రాసి ప్రసిద్ధులైనారు. డా||వడ్డేపల్లి కృష్ణ లలిత గీతాలపైన సిద్ధాంత గ్రంథం రాసి ph.d తీసుకున్నారు.

ఆకాశవాణి కేంద్రంవారు ఈ లలిత గీతాలకు స్వయంగా బాణీలు కట్టి, తాము పాడి, ఎందరో గాయనీ గాయకుల చేత పాడించి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.  వారిలో వింజమూరి అనసూయాదేవి, సీత, రజని, బి.వి.నరసింహారావు సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల, బాలమురళీకృష్ణ, పాలగుమ్మి విశ్వనాథం, బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, భానుమతి, యస్. వరలక్ష్మి, రాజరత్నం, సుందరమ్మ, మల్లిక్, జగన్నాథరావు, చిత్తరంజన్, లబ్ధప్రతిష్ఠులు.

తరువాతి తరం గేయ కవులలో వడ్డేపల్లి కృష్ణ, బలభద్ర పాత్రుని రమి మధు, కోపల్లె శివరాం, తిరునగరి, ఎం.కె.రాము, జైహింద్ రెడ్డి, మృణాళిని, చిల్లర భవానీదేవి, సుధామ, కృష్ణమోహన్, శర్మ, సుద్దాల అశోక్ తేజ నాగపద్మినీదేవి, ఓలేటి పార్వతీశం, వి.ఎస్.నారాయణమూర్తి, చిమ్మపూడి శ్రీరామమూర్తి, వై.రామకృష్ణారావు, మొదలైనవారు పేర్కొనదగినవారు.

లలిత సంగీత గాయనీ గాయకులలో శశి కళాస్వామి, స్నేహలత, సురేఖామూర్తి, మితిల, చంద్రతేజ, మూర్తి విశ్వనాథ్, రామాచారి, ప్రభాకర్, చంద్రకాంత, కన్నరావు, సాయిబాబా, విన్నకోట మురళీకృష్ణ, ఎమ్.ఆర్.కె.ప్రభాకర్, వేదవతి, ఛాయాదేవి, రమణ, సురేశ్, శారదారెడ్డి, నిత్యసంతోషిణి, పద్మావతి, గోపికాపూర్ణిమ, సునీత, విజయలక్ష్మి, గాయత్రి, గీతామాధురి, మాళవిక, కౌశిక్, కల్యాణ్, హేమచంద్ర, చిమ్మపూడి, బాంధవి, రమణకుమారి, జ్యోత్స్న, వెంకట్రావు, మొదలైనవారు పేరు గడించారు.

లలిత సంగీత దర్శకులలో బొబ్బిలి భాస్కర్ రెడ్డి, వల్లూరి సుధీర్ కుమార్, గోపాలకృష్ణ, విన్నకోట, బంటి, స్నేహలతా మురళి, విశ్వనాథ్, ప్రభాకర్, సాయిబాబా, కలగా కృష్ణమోహన్ మొదలైనవారు ప్రముఖులు.

ఆధునిక కాలంలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులు ఇంకా ఎంతోమంది తమ ప్రతిభాపాటవాలు చూపుతున్నారు.

ఇవాళ పాట అనగానే చాలామంది సినిమాపాట అనే అనుకుంటారు. సినీ గీతానికి లలిత గీతమే బీజం. లలిత సంగీతానికి సంబంధించిన సేవ ఆకాశవాణి, దూరదర్శన్లు మాత్రమే చేస్తున్నాయి. ఈ దిశగా ఇంకా ముందుకు పోవాల్సి వుంది. ప్రసిద్ధ గీత రచయితలు, సంగీత దర్శకులు గాయనీ గాయకుల్ని ఇతోధికంగా ప్రోత్సహించి, వారి ప్రతిభకు పట్టం కట్టవలసి ఉంది. లలిత గీతం నవ సుప్రభాతాన్ని మళ్ళీ చూడగలదని ఆశిద్దాం! లలిత గీతం ఇటు శ్రవణపేమతను; అటు భావగమ్యతను సంపుటీకరించే మధుర సంగీత స్రవంతి.

ఆకాశవాణి – లలిత సంగీతం

లలితగీతాలు మొదట పత్రికాముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. ప్రప్రథమంగా 16.6.1938లో మద్రాసులో ఆకాశవాణి ప్రారంభమైంది. అప్పటి బ్రిటిష్ గవర్నర్ ‘లార్డ్ ఎర్స్ కిన్’ ప్రారంభోత్సవ సందేశాన్ని ప్రసారం చేశారు. ఓ వారం తర్వాత అనార్కలి నాటకం తెలుగులో ప్రసారమైంది. అందులో ఆచంట జానకిరాం, దేవులపల్లి, విశ్వనాథ, ఊటుకూరి సత్యనారాయణ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, పిలకాగణపతిశాస్త్రి ముద్దుకృష్ణ లలిత గీతాలు ఆ నాటకంలో వచ్చాయి. వీటినప్పుడు నాటక గీతాలన్నారు. 1939లో మల్లవరపు విశ్వేశ్వరరావుగారి బిల్హణీయం నాటకం ప్రసారమైంది. తర్వాత మోహినీ రుక్మాంగద, చండీదాసు, అతిథి శాల నాటకాలలో కూడా లలిత గీతాలు వచ్చాయి. 1941-42 నుంచి ‘గీతావళి’ కార్యక్రమాల ద్వారా లలిత గీతాలు ప్రసారమయ్యాయి. 1954 నుంచి లలిత సంగీతం పేరుతో గీతాలు ప్రసారమై క్రమంగా విశేషంగా ప్రాచుర్యం పొందాయి.

మద్రాసుతోపాటు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో రజని, బాలమురళీకృష్ణ, పాలగుమ్మి విశ్వనాథం లలిత సంగీత ప్రయోక్తలుగా వ్యవహరించారు.

లలిత సంగీతం కర్ణాటక సంగీత చ్ఛాయలతోను, అన్యప్రాంతీయ సంగీతపు చాయలతోను ప్రసారం కాసాగాయి. సాహిత్య ప్రధానంగా సరళంగా తేలికైన గమకాలతో పాడేది లలిత సంగీతం – అన్నారు సుప్రసిద్ధ సంగీత శాస్త్రవేత్త రజని. 1940లోనే బసవరాజు అప్పారావుగారి రచన బాలసరస్వతిగారు మద్రాసులోనే గానం చేశారు.

1, దినదినమూ పాపణ్ని దీవించి పొండి

  1. కావ్యపానము చేసి కైపెక్కినానే

మొదలైన పాటలకు సాలూరి రాజేశ్వరరావు బాణీలు కూర్చారు.

  1. తలుపు తీయునంతలోనె తత్తరమది ఏలనోయి (బసవరాజు)
  2. కోయంచుకూయకే – కూయకే కోయిలా
  3. రెల్లు పూల పానుపుపైన – దేవులపల్లి
  4. కన్నారనిన్ను చూడనా
  5. వినవే చెలీ పిలుపు అల్లదిగో
  6. నల్లనివాడా నే గొల్ల కన్నెనోయి – వింజమూరి
  7. పాడకోమామా! నా గుండె కుదిపే పాడకు పాడకు – శ్రీ శ్రీ
  8. సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ (ఇంద్రగంటి)
  9. ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు (ఆరుద్ర)
  10. నిండు పున్నమి పండు వెన్నెలలో (దాశరథి)
  11. ముసురేసిందటే (కొనకళ్ళ)
  12. మ్రోయింపుము జయభేరి (రజని)
  13. ప్రాభాత ప్రాంగణమున (దేవులపల్లి)
  14. మాదీ స్వతంత్ర దేశం (రజని రచన – గానం టంగుటూరి సూర్యకుమారి)
  15. యాత్రికుడా? గానం సాలూరి, రచన – మల్లవరపు
  16. పసిడి మెరుంగుల తళతళలు రజని రచన – గానం భానుమతి (1.10.53)
  17. అన్నాడే వస్తానన్నాడే (రచన, గానం వల్లూరి జగన్నాథరావు)
  18. పూలదోసిళ్ళెత్తరా (ఇంద్రగంటి)
  19. పూలదీపమెత్తరావే (గానం చిత్తరంజన్) దాశరథి రచన.
  20. . ఏలా ఈ మధుమాసము? సినారె రచన.

తొలి నాళ్ళలో దేవులపల్లి గేయాలే అధికంగా ప్రసారమైనవి.

  1. జయజయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి….
  2. రామచరణం రామచరణం
  3. నారాయణ అల్లా అల్లా!
  4. ఉప్పొంగి పోయింది గోదావరి (అడివిబాపిరాజు)
  5. తెప్పవోలిక చంద్రబింబం (మల్లవరపు)
  6. దేశమును ప్రేమించుమన్నా (గురజాడ)
  7. ఏ దేశమేగినా (రాయప్రోలు)
  8. త్రిలింగ దేశం మనదేనోయం (పైడిపాటి)
  9. తలనిండ పూదండ దాల్చిన దానా…. (దాశరథి)
  10. ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట (కందుకూరి రామభద్రరావు)
  11. చెయ్యెత్తి జైకొట్టు (వేముల పల్లి శ్రీకృష్ణ)

ఇంకా వక్కలంకల లక్ష్మీపతిరావు, నెల్లుట్ల వెంకటేశ్వరరావు, మధురాంతకం రాజారాం, జైహింద్ రెడ్డి, విద్యాసాగర్, పులికంటి, ఆనందమూర్తి, జొన్నవాడ రాఘవమ్మ, గంగరాజు సుశీలాదేవి, దుర్గానాగరాజు, శారదా అశోకవర్ధన్, యం.పద్మినీదేవి, పాపారావు, రాఘవరావు, అర్జునగౌడ్, శంకరకవి, శ్రీనివాసబాబు, అందెశ్రీ, నండూరి విఠల్, చైతన్య ప్రసాద్ మొదలైన వారెందరో గీత రచయితలుగా ప్రసిద్ధులు.

ఆధునిక గీత రచయితలు ఇప్పటికీ లలిత గీతాలు రాస్తున్నవారు – కలగా కృష్ణమోహన్, వడ్డేపల్లి కృష్ణ బలభద్ర పాత్రుని రమణి, రాము, ఓలేటి చిమ్మపూడి, మధు, నాగలక్ష్మి, ఎస్.వి.ఎల్.ఎన్ శర్మ, మిక్కిలినేని భగవంతరావు తదితరులు.

ఆధునిక గాయనీ గాయకులలో శశికళాస్వామి, సురేఖామూర్తి, ప్రసన్న లక్ష్మి, అవంతి, ఆమని, రమణమూర్తి జయలక్ష్మి, చంద్రతేజ, బాంధవి, కనకదుర్గ, అరుణసుబ్బారావు, నిత్య సంతోషిణి, హిమబిందు, రమణ, సురేష్, మూర్తి, రుక్మిణి, శైలజ, జ్యోత్స్న, పద్మశ్రీ నరసింహా, శంకర్రావు ఇలియాస్, శిరీష, నిష్మా మొదలైనవారు ఎందరో గాయనీ గాయకులు లలిత సంగీతం మెట్టు ఎక్కి చిత్రసీమలో స్థానం సాధించుకుంటున్నారు.

 

 

August 20, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

కంటిదీపాలు*

by Nv Raghveerpratap August 20, 2021
written by Nv Raghveerpratap

అభివృద్దికి నోచని అడవుల్లో

ఆనవాళ్ళు కరువైన వన్యప్రాణులు

ఆకాశం నిండా

ఆనందంతో స్వేచ్ఛగా

రెక్కలల్లార్చి ఎగరాల్సిన పిల్లపక్షులు

కాలుష్య కాసారాలలో

చిక్కుకు పోతున్న వైనాలు

హాస్టల్ ఇరుకుల గదుల్లో

కోల్పోతున్న చురుకుదనాలు

మార్కుల మహాపందేరంలో

మసకబారుతున్న మస్తిష్కాలు

ర్యాంకుల సాధనే ధ్యేయంగా

శరవేగ మవుతున్న పరుగులు

ధన సంపాదనే లక్ష్యంగా

విలువలకు తిలోదకాలు..

బాల చంద్రుల భవితవ్యంలో

కల్హారాలు మొలిపిస్తున్న

కార్పోరేట్ విద్యా సంస్థలు

ప్రపంచానికి వెల్గులు పంచినోళ్ళం

కంటి దీపాల్ని కొడగట్టించడమేంటి?

చీకటి ఛాయలేవి

అలముకోనీకుండా

రేపటి పౌరుల మేధస్సులో

విలువల జ్యోతుల్ని వెలిగింపజేయాలి

చదువును వ్యాపారం చేస్తున్న

వ్యవస్థలకిక పిండ ప్రధానం చెయ్యాలి.

 

August 20, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

కళతప్పిన వేడుక

by సంధ్య సుత్రావె, August 20, 2021
written by సంధ్య సుత్రావె,

ఈ వేకువ చిన్నబోయి

పంద్రాగస్టు వేడుకకు రాని

బడిపిల్లల  పాదముద్రలకోసం ఎదురు చూస్తున్నది

నిద్రలేచి అందంగా

ముస్తాబై  ముందస్తు ప్రణాళికతో

అందరికన్నా ముందుగా

బడిలో ఉండాలనే

ఉత్సాహంతో

ఆనందంతో

ఒకరితో ఒకరు పోటీపడిన పచ్చని జ్ఞాపకాలు మదిలో తారాడుతున్నవి

సాంస్కృతిక కార్యక్రమాల సందడిలో తానొక తేజం కావాలని

పాటలో పాటగా పాల్గొనాలని,బడి అంతా

తమని మెచ్చుకోవాలనే ఉబలాటం మూడు రంగుల తోరణం లా తొందరిస్తుండేది

టీచర్ల సూచనలు , దోస్తుల ప్రోత్సాహం

స్పీచ్ లు  రాసుకొని

స్టేజి పై చెప్పాలన్న కోరిక తెల్లని ఇస్త్రీ దుస్తుల్లా మెరుస్తుండేది

కాలం చేసే వింతలలో కననివెన్నో

విననివెన్నో నిత్యం తారసపడుతున్న ఈ వేళ

పాఠశాల ప్రాంగణాన్ని

తరగతి గదులను,

అందంగా అలంకరించుకొని

వేడుకను నిర్వహించాలనుకొనే

విద్యార్థుల  సంతోషాల  జాడనెత్తుకెళ్ళిన విపరీతమిది

కోవిడ్ మహమ్మారి కనుసైగ

కారణంగా టీచర్లు మౌన ఋషులయ్యారు

మూతికి మాస్కులతో

పాటించే భౌతికదూరం  తో

కొత్త గీతాలేవో ఆలపిస్తున్నారు.

విద్యార్థులులేక

బోసిపోయిన బడి నిశ్శబ్దాన్ని మోస్తున్న తల్లిలా ఉన్నది

బాధగా,

భారంగా

తప్పనిసరిగా జెండాను

ఎగురవేసి జనగణమణ

గీతాలాపన వేళలో

స్వాతంత్య్ర పోరాటాలను కాదు విద్యార్థులను

గుర్తుతెచ్చుకొంటు కోరేదొక్కటే

త్వరగా

వరంగా

ఈస్థితి  మారగా

మునుపటిలా

మల్లెలు నవ్వినట్టు

పక్షులు ఎగిరినట్టు

విద్యార్థుల గలగలలతో

కిలకిలలతో

ఆనందంగా

ఈ స్వాతంత్ర్యదిన వేడుకను

ఎప్పటిలా

కళ తప్పని కళగా

విద్యార్థుల సందళ్ల  సజీవత్వం ఉట్టిపడేట్టు

ఉల్లాసపరిచేట్టు

ఉర్వి మురిసేట్టు

జెండావందనం కళ తప్పిన వేడుక  కావద్దనే అందరి కాంక్ష

____________

August 20, 2021 0 comment
8 FacebookTwitterPinterestEmail
కవితలు

‘తెలుగు-వెలుగు!

by cvl sujatha August 20, 2021
written by cvl sujatha

పోతన కలం నుండి

సుమ సౌరభ పరిళాలు

వెదజల్లిన భాష..

సిరులు పొంగు భరతభూమి

పసిడి కాంతులు విరజిమ్ముతూ

దశదిశలా కీర్తి గాంచిన అమృతభాష..

గిడుగు వారి వ్యవహారిక రీతిలో వ్యాప్తి చెంది..

తెలుగుదనం విలువ పంచిన అమ్మభాష..

ఆదికవి నన్నయ్యకు ఖ్యాతి నొసగిన

మధుర భాష..

అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య పదకృతులై

అమృతాన్ని కురిపించే

తేనెలూరు తియ్యని భాష..

పద్య,గద్య, గేయ రూపాల్లో అలరారుతూ..

ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గా

ప్రణతులందుకున్న కమ్మనైన గుమ్మపాల భాష..

అజరామరమై బ్రౌను సేవనలరారిస్తున్న అజంత భాష..

విశ్వనాథ వారి వినసొంపు రచనలు

కృష్ణశాస్త్రి గారి కవితాకుసుమాలు

నండూరి వారి ఎంకి సొంపు సొబగులను పొదువుకున్నది నా మాతృభాష..

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తెలుగు..

ఘంటసాల, బాలమురళీ కృష్ణ, బాలు గారి కంఠస్వర మాధుర్యం తెలుగు..

విశ్వవిఖ్యాతి తెలుగు..

సంస్కృతి సంప్రదాయాల నెలవు..

హృదయాంతరాల కొలువు..

తెలుగు మన వెలుగు.!

August 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అంతరాలు

by Dr. Kasarla Rangarao August 20, 2021
written by Dr. Kasarla Rangarao

జ్యోతికి పన్నెండు, పదమూడు సంవత్సరాలు. చాలా చలాకీ పిల్ల. అమెరికా నుండి తల్లిదండ్రులతో సహా ఒక నెలరోజులు గడపటానికి హన్మకొండ వచ్చింది. వాళ్ళ బామ్మ, అమ్మమ్మ, తాతమ్మలతో వారి అనుభవాలను తెలుసుకొని ఒక వ్యాసమో, కథో వ్రాయాలని ఒకటే ఉబలాటం. తాతమ్మ శాంతాదేవి దగ్గర చనువెక్కువ. మీ తరానికి యిప్పటికి పోలికలు, తేడాలు తెలుపమని ఒకటే గొడవ. ముని మనవరాలు పోరు పడలేక శాంతాదేవి ఇలా చెప్పసాగింది. మా అప్పుడు తొమ్మది, పది సంవత్సరాల వయసుకే పెళ్ళిళ్ళు చేసేవారు. నాకు మా అత్తలు ముగ్గురు అక్కచెళ్ళెలు.

ఒకామె ఇగో హన్మకొండ, మీ ముత్తాత గారి తల్లి, ఇంకొకామె దేశముఖుగారి భార్య. మూడవ ఆమె బాలవితంతువు.

జ్యోతి వెంటనే అడిగేసింది :  అయ్యో తాతమ్మా! మరి ఆ తాతమ్మకు మళ్లీ పెళ్ళి చేయలేదా?

శాంతాదేవి : ఆ కాలంలో చెయ్యలేదే. మాటికి అడ్డం రాకు. చెప్పేది విను. మా మావగారు కరణం. చాలా నిక్కచ్చి మనిషి. చాలామందికి సహాయం చేసేవారు. ఎంతోమంది ఈ యింట్లో తిని వెళ్ళినవారే.  తమ పనులన్నియు చక్క దిద్దుకున్నవారే. మాకు ఐదుగురు ఆడబిడ్డలు. నాకు యిద్దరు యారాండ్లు. భూములు వ్యవహారాల్లో మామగారికి వారి ముగ్గురి కొడుకులకి పొరపొచ్చాలు, గొడవలు, పంచాయతీలు వచ్చినా, మేం ముగ్గురం ఎప్పుడూ గొడవలు పడలేదు.

జ్యోతి : ఓహో! సరే తాతమ్మా, మీరెంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు,

శాంతాదేవి : మా అమ్మకు ఆరుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. అందులో ఒక పిల్లాడేమో పుట్టగానే చనిపోయాడు. ఆ విధంగా నాకు ఐదుగురు అన్నయ్యలు. ముగ్గురక్కలు.

జ్యోతి : ఐతే తాతమ్మా, మీతరం చదువుకోలేదు. అయితే అమ్మమ్మ లందరూ చదువుకున్నారు కదా! అందులో ముగ్గురు కూడా టీచరుద్యోగాలే చేశారు.

శాంతాదేవి: ఔనే. మా తరానికి యీ యింటికి ఏడుగురు కొడుకులు. అందులో నలుగురు ఇక్కడ వున్నారు. ముగ్గురు అమెరికాలో స్థిరపడ్డారు.

జ్యోతి : ఓ తాతమ్మా, అమ్మ, బామ్మ వాళ్ళు, వేయి స్థంభాలగుడికి, భద్రకాళి గుడికి వెళ్ధామంటున్నారు.

శాంతాదేవి : సరే వెళ్ళిరావే. అక్కడి వివరాలు, విశేషాలు వాళ్ళనే అడుగు. ఒక్క నా ఒక్కదాని బుర్రతింటే ఎలా! వాళ్ళను కూడా ప్రయత్నించు.

జ్యోతి : సరే తాతమ్మా! బై.

*    *  *

ఆ రోజంతా వేయి స్థంభాల గుడి, భద్రకాళి గుడి సందర్శనలతోనే గడిచింది. జ్యోతివాళ్ళ బామ్మ, అమ్మమ్మలకు ఎక్కువ విషయాలు తెలియవు కాబట్టి ఆయా గుళ్ళ శంకుస్థాపన వివరాలు, పురాతత్వ బోర్డులు చూపించి తప్పుకున్నారు. సాయంత్రం ఈ సీమటపాకాయ పేపరు, పెన్నుతో సిద్ధం.

జ్యోతి : తాతమ్మా! ఈ నీరెడి కొమురయ్య వాళ్ళట ఎవరు, వారికి ముత్తాత గారికి చాలా దగ్గరట ఎందుకు?

శాంతాదేవి : నీకీ విషయం ఎవరు చెప్పారే?

జ్యోతి : అదే గుడిలో నీరెడి కొమురయ్య వాళ్ళ వాళ్ళు పెద్దమ్మమ్మను గుర్తుపట్టి మాట్లాడారు.

వాళ్ళ మాటల్లో గ్రహించాను.

శాంతాదేవి : మరి పెద్ద అమ్మ్మనే అక్కడే అడగక పొయ్యావా, తీరిగ్గా గుర్తుపెట్టుకొని అడుగుతున్నావ్.

జ్యోతి : ఆఁవాళ్ళనడిగితే నీకెందుకే ఇవన్నీ పొట్టిబుడంకాయం అన్నారు, తాతమ్మా.

శాంతాదేవి : ఆహాఁ, అలాగా, ప్రతి గ్రామంలో చెరువు నీరు పారకం, బాగోగులు చూడటానికి వుండేవారినే నీరెడివారు అంటారు. నీరు + ఇడి నీరు యిచ్చేవారే నీరెడివారు. కరణం ఆధ్వర్యంలో గ్రామపరిపాలనంతా సాగేది. యెలవాళ్ళు, షేకం సింధీలు కరణం చేతి క్రింది వుండి తోడ్పడేవారు. శిస్తు వసూళ్ళు పై అధికారులు వచ్చినపుడు ఏర్పాట్లు చూసేవారు. మా మామగారు రైతు అనుకూలురుగా మంచి పేరు నిలుపుకున్నారు. అప్పటి నీరెడివారి వయసు, మీ ముత్తాత వయసు ఒకటే సమ వయస్కులవటం వల్ల వారి మధ్య చనువెక్కువ. మీ ముత్తాత గారు పదవతరగతి కాగానే ఉద్యోగంలో చేరిపోయారు. ఆ తర్వాత క్రమక్రమంగా పరీక్షలు ప్యాసై యం.ఎ.బి.ఇడి అయ్యారు. గెజిటెడ్ హెడ్మాస్టర్గా పదవీ విరమణ చేశారు.

జ్యోతి : భద్రకాళి గుడిలో మన ఊరి వారట తాతయ్యతో కలిసి చాలాసేపు, చాలా ఆత్మీయంగా మాట్లాడారు. మీరు పదిహేను సంవత్సరాలు ఆ ఊరిలో ఉన్నారట కదా! ఎందుకు, చాలామంది ఊళ్ళళ్ళ నుంచి హన్మకొండకొస్తే మీరెందుకు ఊరికి వెళ్ళారు తాతమ్మా!

శాంతాదేవి : మీ తాతయ్యనే అడుగక పోయావానే సీమ టపాకాయ్.

జ్యోతి : అది కాదు తాతమ్మా! నీ కొడుకు కొంత చెప్పేసి నీ కెందుకే వివరాలు అని అధరగొడతాడు. నీ దగ్గరున్నంత మాలిమి, చనువు నాకెవ్వరి దగ్గరా లేవు. అందుకే నిన్ను అడుగుతున్నాను.

శాంతాదేవి : సరేనే నా తల్లి. ఆ రోజుల్లో మా మావగారికి మీ ముత్తాతగారికి ఏవో పొరపొచ్చాలు, పట్టింపులు వచ్చి మా మామగారు, మీ ముత్తాతగారిని ఊరి భూముల సేద్యానికి పంపించారు. అక్కడ మీ ముత్తాతగారు అందరితో మంచిగా వుండి మంచి పేరు తెచ్చుకున్నారు. మేము ఊరికి వెళ్లిన తర్వాతే అక్కడ విద్యుత్ సౌకర్యం, తారు రోడ్లు వచ్చాయి.

జ్య్తోతి :  మరప్పుడు నీవు గోల చేయలేదా, తాతమ్మా.

శాంతాదేవి : ఆఁ ఆ రోజుల్లో అత్తమామలకీ, భర్త, ఆడబిడ్డలకీ ఎదురు చెప్పలేదు. మా రోజుల్లో పద్ధతులావిధంగా ఉండేవి. మెల్లమెల్లగా మన ఊరు కూడా పట్టణంలో కలిసిపోయింది. అక్కడ కళాశాల, ఇంగ్లీషు మీడియం హైస్కూల్స్ వచ్చాయి. అంతకుముందే ఉన్న ప్రభుత్వ పాఠశాల క్రమక్రమంగా ఉన్నత పాఠశాలయింది.

జ్యోతి : ఓహో, అందుకేనా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళకు ఆ ఊరిలో స్నేహితులున్నారు. ఆ ఊరితో చనువెక్కువన్న మాట.

శాంతాదేవి : ఔనే, క్రమక్రమంగా ఊళ్ళో పిల్లలందరూ చదువుకొని ఉద్యోగరీత్యా అంతటా వ్యాపించారు. మీ ముత్తాత దగ్గర చదువుకున్నవారు చాలామంది ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆ రోజుల్లో పండుగలంటే ఊరంతా కలిసిమెలిసి కలిమిడిగా బాగా జరుపుకునేవాళ్లం.

జ్యోతి : ఐతే తాతమ్మా! అక్కడ అమెరికాలో అంటే మా దగ్గర కొంతమంది పిల్లలకు, తల్లో, తండ్రో ఒకరే ఉంటారు. ఇక్కడ ఆ పద్ధతులింకా రాలేదా!

శాంతాదేవి : ఏమోనే, బొంబాయి, హైదరాబాదుల్లో వచ్చినట్లుంది. ఇక్కడ కూడా అక్కడక్కడ ఉందేమో నాకు తెలియదు. ఐనా అటువంటి పద్ధతులు మంచివి కావు. పిల్లలకి తల్లిదండ్రులిద్దరి అవసరం, ఆజమాయిషీ కావాలి.

జ్యోతి : తాతమ్మా! మీ మామగారి నుంచి నీ మనవడి వరకు పరిస్థితులు ఎలా మారాయో, మీ పరిశీలనలేంటో తెల్పండి.

శాంతాదేవి: ఏముందే ఆస్థులు తరిగాయి. అంతస్థులు పెరిగాయి. మా మామగారు ఫ్యూడల్ ప్రజాస్వామ్యవాది. మూడు ఊళ్ళలో ఆస్థులుండేవి. ఎక్కువగా కాలినడకన, ఎప్పుడో కాని రిక్షాలో వెళ్ళేవారు. రెవిన్యూ విషయాలు, కరణీకం, కోర్టు వ్యవహారాలు ఎప్పుడూ వారికి చేతినిడా పని. ఆయన సైకిల్ కూడా వాడలేదు. కానీ పెద్దొర, పెద్దొర అని చాలా పేరు ప్రతిష్టలు ఉండేవి. ఇంక ఆయన కొడుకులు ముగ్గురూ బడిపంతుళ్ళే. ఫ్యూడల్ వాసనలు పోని ప్రజాస్వామ్యవాదులు. ఇంక మీ తాతయ్యలు, అమ్మమ్మలందరూ సోషలిస్టు ప్రభావజాలంతో స్నేహితులతో మెదిలి పెద్ద చదువులు చదివి ఉద్యోగస్థులయ్యారు, ఇంక మీ నాన్నలు విదేశాల్లో స్థిరపడి, మీరు అక్కడే పుట్టారు. మా మావగారి హయాంలో ఎందరో రాజకీయ నాయకులు, కవులు మన ఇంటి దగ్గరికి వస్తుండేవారు. బంధువులు కూడా బాగా వచ్చేవారు. ఐతే ఆ చుట్టరికాలు, కలిమిడులూ, కలుపుగోలు తనాలూ, ఆస్థులూ అన్నీ తగ్గిపోయి, కార్లూ, ఫ్లాట్లూ, ఉద్యోగాలూ, విదేశాలకు వలస వెళ్లటాలూ పెరిగాయి. మీ ముత్తాతలు సైకిలు పైబడులకెళ్లేవారు. మీ తాతల హయాంవరకు బండ్లు వచ్చాయి. మీ నాన్నల కాలానికి కార్లు వచ్చాయి. నీ తరానికి విమానాలూ, హెలికాఫ్టర్లు వచ్చాయే సీమటపాకాయా!

జ్యోతి : హమ్మ! ఎంత మార్పు చెప్పావు తాతమ్మా, మరి మీ కాలంలో మీరు ఎలా వెళ్లగలిగారు?

శాంతాదేవి : మాకు మొద్దుబండ్లు, సవారి కచ్చరాలుండేవి. ఆ తర్వాత టాంగాలు, రిక్షాలుండేవి. బస్సులు, ఆటోలు ఆ తర్వాత వచ్చాయి.

జ్యోతి : మరిప్పుడు తాతమ్మా! మీ మావగారి తరం నుంచి నా వరకు ఎన్ని తరాలయ్యాయి. ఊ…..1,2,3,4,5 తరాలయ్యాయి. ఇంక రెండు తరాలయితే ఏడుతరాలౌతుంది కదా.

శాంతాదేవి : ఆఁ అటు ఏముందీ మా మావగారి తండ్రిగారు గ్రామ కరణం. మా మావగారు పట్నం ఇల్లరికపు టల్లుడు. దాంతో పట్నం కర్ణీకం కూడా మా మావగారికే వచ్చి చేరింది. మా మావగారి తల్లికి అన్నదమ్ములు లేరు. వాళ్లిద్దరూ అక్క చెల్లెలు. అందువల్ల మా మామగారి తల్లి ద్వారా కూడా ఆస్థి సంక్రమించింది.

జ్యోతి : భలే, భలే, తాతమ్మా, మీరూ తాతయ్యలూ మాత్ర సంబంధ ఆస్తి అనుభవించారు. మరి మీ తరానికీ యిప్పటి తరానికీ ఆడవారి విషయాల్లో తేడాలేమిటి?

శాంతాదేవి : ఎందుకు లేవే, హస్తిమశకాంతరం ఉంది. మా అప్పుడు చదువులే లేవు. మీ బామ్మలు, అమ్మమ్మలు మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేశారు. మీ అమ్మలు, అత్తయ్యలు సరేసరి. ముందంజలో ఉన్నారు. మీరు ఇంకా మంచి పరిస్థితుల్లో ఉన్నారు.

జ్యోతి : తాతమ్మా! చాలా మంచి విషయాలు చెప్పావు. ఇది కథో, వ్యాసమో వ్రాసిం తర్వాత నీకు పంపిస్తా!!!

శాంతాదేవి : సరేనే తల్లీ, జాగ్రత్తగా విశ్లేషిస్తే, ఇది ఏడు తరాల భోగట్టా ఔతుంది. సరే, సరే!! ఇంక అన్నం తిని విశ్రాంతి తీసుకో. మీకు అన్నీ ప్రయాణాలే కదా!!!!

 

జ్యోతి: పరవాలేదులే, ఇంకా చెప్పవా, మరి తాతమ్మా !! ఇలా మూడు ఊళ్ళ ఆస్థి చేరితే మీ కుటుంబంలో డాక్టర్ , ఇంజనీర్లు , లాయర్లు తయారు కాలేదా

శాంతాదేవి: అప్పట్లో స్వాతంత్ర్యం వచ్చి దేశం అప్పుడప్పుడే కుదుటపడుతోంది. ఆకాలంలో మీ ముత్తాతలు ఆ మాత్రం చదువుకొని ఉద్యోగాలు చేయడమే ఎక్కువ. నేనింతకుముందు చెప్పినట్లు ఆ ప్రజాస్వామ్య భావాలు దేశపరిస్థితుల గురించి ఇంట్లో చిన్నగా చర్చలు జరిగేవి. కమ్యునిస్టు నాయకులు మనింటికి వచ్చేవారు. ఎక్కువగా ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు.మన బంధువులందిరివిషయాలు ఇక్కడే అందరికీ తెలిసేవి. అందుకే అప్పట్లో ఈ ఇంటిని ఆలిండియా రేడియో అనేవారు.ఇల్లు

జల్ జలాటంగా సాగింది. వాళ్ళ నెల వారీ ఖర్చు ఈ ఇంటి చాయనీళ్ళ ఖర్చంత కాదని పేరు పోయింది.

ఇప్పుడేముందే ఉద్యోగాలున్నాయి. ఉద్వేగాలు పెరిగాయి.

రాను రాను సమాజంలో హింస , దౌర్జన్యం పెరిగిపోయాయి. మూర్ఖత్వం , భీభత్సం మూర్తీభవిస్తే ఏ ఉద్యమమైనా ఈ ప్రజాస్వామ్య యుగంలో అణిచి వేయబడుతుందే తల్లీ. ఏదైనా విచక్షణ తో అందర్నీ కలుపుకుపోయేదిగా ఉండాలి.

జ్యోతి : ఆ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టు ల్లో చాలా యేళ్ళు పట్టేదట కదా

శాంతాదేవి: ఔనే తల్లీ ! ఇదేమిటే నీ పొట్టనిండా ప్రశ్నలే ఉన్నాయేమే ,నీ పొట్ట ఓ ప్రశ్నల పుట్టయిందే తల్లీ.

జ్యోతి: తాతమ్మా మా స్కూల్లో నేను NTRగారి డైలాగులతో సుయోధన ఏకపాత్రాభినయం చేశాను . తెలుగు రాకున్నా మా బడి పిల్లలంతా నా హావభావాలు ఉచ్ఛారణ , అభినయం బాగున్నాయని మెచ్చుకున్నారు తాతమ్మా.

శాంతాదేవి:  ఆహా ‌! అట్లానా ,నీకు భారత రామాయణాలు ఏం తెలుసే బుడంకాయా ?

జ్యోతి: ఆ(  అందులో ఏముంది తాతమ్మా కుటుంబంలో ఐకమత్యత లోపిస్తే అష్టకష్టాలపాలవుతారనీ పాపం వ్యాసవాల్మీకులు  ఎంతో ఓపికగా  పురాణేతిహాసాలుగా మలచి మనకందించారు. మన దేశంలో కుటుంబ విలువలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తామని అమెరికా వంటి దేశాలకు చాలా ఆశ్చర్యం తెలుసా.

శాంతాదేవి:ఏమే బుడంకాయ , నువ్వెంత ,నీ వయసెంత అన్నీ పెద్ధ పెద్ద మాటలు మాట్లాడుతున్నావేమే.

జ్యోతి:  నీ మనవడు అదే మా నాన్నే  విడువకుండా , వదలకుండా రోజూ అరగంటపాటు మన విషయాలన్నీ ఇండియా గురించి చెప్పి నేర్పిస్తున్నాడు తాతమ్మా.

శాంతాదేవి:  అసలివన్నీ ఎందుకు చెప్పాడట నీకూ!!!?

జ్యోతి:  అదే తాతమ్మా కౌరవ పాండవులు కలిసి మెలిసి ఐకమత్యం గా ఉంటే కర్ణ,శకునిలు , కృష్ణుడు లాంటి వారికి జోక్యం చేసుకునే అవకాశమే రాదనే వారు.

శాంతాదేవి:  సరే ఇగ అది అలా జరిగితే భారతమే ఉండేదికాదు. భగవద్గీత, విష్ణుసహస్రనామాలు వచ్ఛేవే కావు ,కానీ సరే జరిగిన దాని గురించి గుణపాఠాలు తెలుసుకుని ప్రతి కుటుంబం ఐకమత్యం తో అభివృద్ధి సాధించాలి.

జ్యోతి : థ్యాంకూ తాతమ్మా, చాలా విషయాలు చెప్పావు. ఆ కాలపు విషయాలను ఈ కాలంలో  ముడిపెట్టక తేడాలన్నీ పోయేటట్లు చెయ్యాలని నా ఆలోచన తాతమ్మా! భారతదేశమే ఒక  పెద్ద కుటుంబం లాంటిది కదా తాతమ్మా!

తాతమ్మా : ఔనే! మారుతున్న కాలం విలువను ఇద్దరూ మనస్సులో తర్కించుకుంటూ బాగా చెప్పావు.

ఇక పడుకో తల్లీ!!

నిద్రలోకి జారుకున్నారు. రేపటి వెలుగులు స్వాగతిస్తుంటాయని వాళ్లకు తెలుసు!

August 20, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

మూడు చీమలు

by chittiprolu Subbarao August 20, 2021
written by chittiprolu Subbarao

మూడు చీమలు

భద్రాచలం క్షేత్రంలో మంచిమిత్రులైన మూడు చీమలుండేవి.  అవన్నీ ఒకసారి పాపికొండలు చూడాలనుకున్నాయి.  ఒక్కొక్కటి ఎవరి దారిలో వారు వెళ్ళి పాపికొండల్లో కలుసుకోవాలనే షరతు విధించుకున్నాయి.

గోదావరి ఒడ్డుకు చేరిన మొదటి చీమకు అక్కడ ఒక పడవ కనిపించింది.  మనుషుల మాటలు విని ఆ పడవ పాపికొండలకు వెళ్తుందని అర్థం చేసుకుని పడవ మీద అపాయం లేని ఒక మూలన కూర్చుని ప్రయాణమైంది.

రెండవ చీమ గోదావరి ఒడ్డునే నడచుకుంటూ పాపికొండల వైపు సాగిపోయింది.

మూడవ చీమ కళ్ళుమూసుకుని దేవుడికి ప్రార్థించి గోదావరి నదిలోకి దూకేసింది.

ముందుగా మొదటి చీమ పాపికొండలు చేరింది.  ఇద్దరు మిత్రుల కోసం ఎదురుచూసింది.  ఎట్టకేలకు రెండవ చీమ చాలా ఆలస్యంగా వచ్చి మొదటి చీమను కలిసింది.  ఇక ఆ రెండు చీమలూ మూడవ చీమ కోసం నిరీక్షించాయి.  రోజులు గడిచాయి.  వారాలు గడిచాయి.  కానీ మూడవ చీమ జాడే లేదు.  చేసేది లేక రెండు చీమలూ కలిసి తిరుగుప్రయాణానికి భద్రాచలం వెళ్ళే పడవెక్కాయి.

భద్రాచలం చేరగానే రెండు చీమలూ సరాసరి మూడవ చీమ ఇంటికి వెళ్ళి తలుపుకొట్టాయి.  బయటకు వచ్చిన చీమ దిగులుగా జరిగిన విషయం చెప్పింది.

భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన మూడవ చీమ నీటిలో మునిగిపోతూ ప్రాణభయంతో ఈదటం మొదలుపెట్టిందట.  కొంతసేపటికి అలసిపోయిందట.  కళ్ళు తేలేసి నదిలో కొట్టుకుపోతున్న ఆ చీమను ఎదురుగా వస్తున్న ఒక తాబేలు చూసి తన వీపు మీదకు ఎక్కించుకుందట.

చీమ పాపికొండలు పోవాలని తాబేలుకీ, తాబేలు భద్రాచలం పోవాలని చీమకూ అర్థమైంది.  తాబేలు వెనక్కు వెళ్ళదు .  చీమ తనంతట తాను ఈదుకుంటూ పాపికొండలు వెళ్ళలేదు. బతికుంటే పాపికొండలు మళ్ళీ ఎప్పుడైనా చూడొచ్చని తాబేలుతోపాటు భద్రాచలానికే తిరిగివచ్చింది మూడవ చీమ.

విషయం మళ్ళీమళ్ళీ చెప్పీ చెప్పించుకునీ మూడు చీమలూ పెద్దగా నవ్వుకున్నాయి.  కానీ మూడవ చీమకు లోలోపల ఎక్కడో తీరని దుఃఖం మిగిలిపోయింది. ఆ రాత్రంతా నిద్రపట్టక అల్లాడిపోయింది.

మరుసటి రోజు తాను చేసిన పనికీ ఇద్దరు మిత్రుల పనులకూ గల తేడా ఏమిటోనని ఆలోచించుకుంటే విషయం అర్థమై మనసు కుదుటపడి హాయిగా నిద్రపోయింది.

“ఏదైనా గమ్యం చేరాలంటే దేవుడిచ్చిన తెలివితేటల్ని వాడుకోవాలి. దేవుడిచ్చిన దేహంతో కష్టపడాలి. అంతేగానీ దేవుడి మీద భారం వేశామనుకుని గుడ్డిగా ప్రవర్తించకూడదు, తన ప్రయత్నం మానకూడదు.”

 

August 20, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us