మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

విశ్వకర్మ – యజ్ఞకర్త – సృష్టికర్త

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) September 19, 2025
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)


( విశ్వకర్మ జయంతి)

ప్రపంచానికి అసలైన సృష్టికర్తగా పిలువబడుతున్న విశ్వకర్మ ప్రపంచం కంటే ముందునుండే ఉన్నాడు. చతుర్ముకుడైన విశ్వకర్మ కిరీటాన్ని సువర్ణాభరణాలతో ఎనిమిది చేతులు, ఒక చేతిలో నీటి బిందె, ఒక చేతిలో పుస్తకం, ఒక చేత ఉచ్చు మిగిలిన చేతులలో వివిధ ఆయుధాలను పనిముట్లను కలిగి ఉంటాడు. విశ్వకర్మ, విశ్వకర్మ ఋగ్వేదములో , శుక్ల యజుర్వేదంలో, సృష్టికర్తగా పేర్కొనబడినాడు పురుష సూక్తం లో విరాట్ పురుషుడిగా కీర్తించబడినాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మ సృష్టికర్త, వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి గలవాడు కనుకనే ఈయన భగవంతుడు అని ఋగ్వేదం ఈయనను భగవంతుడిగా పరిగణించింది. ఇతని ఆర్చా మూర్తిని విశ్వకర్మ పురాణం పంచ శీర్షుడుగా వర్ణించింది.
దైవిక వాస్తు శిల్పియైన విశ్వకర్మ పుట్టినరోజు పండుగను సెప్టెంబర్ 17వ జరుపుకుంటున్నారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడు దివ్య వడ్రంగి అని కూడా పిలవబడ్డాడు మెకానిక్స్, దేవత రాజభవనాల నిర్మాణ రంగంలో శాస్త్రమైన స్థపత్య వేదంతో ఘనత పొందాడని రుగ్వేదంలో ప్రస్తావించబడ్డాడు

“విశ్వకర్మ ” అంటే అన్నింటిని చేసేవాడు అని అర్థం. ఆయన దేవతలకు శిల్పి మరియు వాస్తుశిల్పి. ఆయన దేవతలకు మానవులకు శిల్ప గురువు. పురాణాల ప్రకారం ప్రభాసుడైన మనువు, యోగసిద్ధి దంపతులకు జన్మించారు. సృష్టినిర్మాణం మరియు ఇంజనీరింగ్ లో విశ్వకర్మ యొక్క పాత్రను వివరిస్తుంది. విశ్వకర్మ పురాణములో తన పని పట్ల గర్వపడి బంగారు రాజభవనాలు,క్లిష్టమైన శిల్పాలు మరియు దోషరహిత ఇంజనీరింగ్ తో లంక వంటి అద్భుత నగరాలను ఎలా నిర్మించాడు చెప్పబడింది. ఈ పురాణం పరిపూర్ణత, తేజస్సు మరియు సంపదకు ప్రతీకగా ఉంటుంది. హిందూ మతంలో విశ్వకర్మను దేవుళ్ళ శిల్పిగా మరియు దైవిక వాస్తు శిల్పిగా గౌరవిస్తారు. పురాణాల ప్రకారం శిల్పి విశ్వకర్మ ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలోనూ నిర్మించారు. సత్యయుగంలో దేవతల నివాసం కొరకు స్వర్గలోకమును నిర్మించారు. అయోధ్యను శివుని కొరకు సువర్ణ లంకను నిర్మించారు. ద్వాపర యుగంలో రాజభవనాన్ని ద్వారకా నగరాన్ని, కలియుగంలో హస్తినాపురంలో వారణావతి( లంక భవనము) ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతోపాటు దేవతలకు అనేకమైన అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడు.

దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు, మానవులకు ఇతడు శిల్ప గురువైయున్నాడు. పురాణముల ప్రకారం ప్రభాసుడైన మనువుకు, బృహస్పతి చెల్లెలైన యోగసిద్ధికి జన్మించిన వాడు దేవశిల్పి విశ్వకర్మ. యోగసిద్ధి ప్రభాసుని భార్య. ప్రభాసుడు వసువులలో ఎనిమిదవవాడు. ప్రభాసుడు వశిష్టమహాముని ఆశ్రమము లోని నందిని అనే ఆవును యోగసిద్ధి కోరిక మేరకు అపహరించిన వాడైనందున శాపగ్రస్తుడై మానవ జన్మనెత్తి (దేవపుత్రుడు) భీష్మాచార్యునిగా శంతనుడికి, గంగకు జన్మించేను. అంగీరసుడు, అంగిరుడు అను ఈ ఇద్దరు ఒక్కరే వేరు వేరు కాదు, బ్రహ్మమానసపుత్రులలో అంగీరసుడు ఒక్కడు. అంగీరసుని భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూతురును కలిగిరి. ఈ యోగసిద్ధిని అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొనెను.

దేవశిల్పివిశ్వకర్మయను ప్రజాపతి వేల శిల్పములకాయన కర్త. భౌవన పుత్ర విశ్వకర్మ దేవశిల్పి విశ్వకర్మ తపఃశక్తితో సాక్షాత్కరింపబడి తన సర్వశక్తులను దేవశిల్పి విశ్వకర్మకోసంగినాడు. త్రిదశలకు (దేవతలకు) అతడు వర్ధకి (శిల్పి). సర్వభూషణ శిల్పకల్పనము చేయువాడు. దేవతా విమాననిర్మాత యాతడు. దేవశిల్పి విశ్వకర్మ భార్య ఆకృతి .కుమార్తె సంజ్ఞ ఈమె సూర్యుని భార్య.సూర్యుని వేడికి సంజ్ఞ తట్టుకోనలేకపోటచే విశ్వకర్మ సూర్యుని సానబెట్టి అతని వేడిని కొద్దిగా తగ్గించాడు. సూర్యుని సానబెట్టగా వచ్చినటువంటి పొడి నుంచి తయారు చేసినటువంటి చక్రము విష్ణుమూర్తి ఆయుధమై శోభన్లుచున్నది.

విశ్వకర్మ గొప్పదైన మేరు పర్వతములాంటి ఎల్లలోకములకు ఆధరమైన విశ్వశంకువుగా భావింపబడిన బ్రహ్మండమునకు నడుమ తామర మొగ్గవంటి మేరువును ఉంచి పదునాలుగు భువనములను సృష్టించాడు. ఆలాంటి ఒక భువనమునకు ప్రభువు భౌవన విశ్వకర్మ అని తెలియుచున్నది. భౌవన పుత్ర విశ్వకర్మ శిల్పి విశ్వకర్మ తపఃశక్తితో సాక్షాత్కరింపబడి తన సర్వశక్తులను దేవశిల్పివిశ్వకర్మ కోసంగి భవిష్యమానవులకు ఉద్దరింప మనెను. అటు పిమ్మట మానవులందరూ దేవశిల్పివిశ్వకర్మను స్మరించుచూ తమతమ నైపుణ్యమును చూపుతున్నవారై జీవనమును సాగించుచున్నారు.

పరబ్రహ్మ విశ్వకర్మని సాక్షాత్ కారం చేసుకున్నా మొట్ట మొదటి గురువులైయిన భావన పుత్ర విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు. విశ్వకర్మలు విశిష్ట జ్ఞానమును పొందుదురు. విశ్వకర్మ యజ్ఞకర్త,అశేష సృష్టికర్త.

విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనది. భగవంతుడు విశ్వకర్మ రచనలు రుగ్వేదం, స్థాపత్య వేదాలలో ప్రస్తావించబడ్డాయి. వాస్తు శాస్త్రం మరియు యాంత్రిక శాస్త్రం గురించి ఇందులో అనేక విషయాలున్నాయి. ఎవరైతే పని చేస్తుంటారో.. అలాంటి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు ఈ రంగంలోని ప్రజలు విశ్వకర్మ పూజ విజయవంతం కావాలని.. ఆ దేవుని ఆశీస్సులు తమకు లభించాలని.. తమ కుటుంబం ఆయురారోగ్యాలతో అనునిత్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. పని చేసే వారితో పాటు హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున వాటిని ఏ పనికి ఉపయోగించరు. తాము క్షేమంగా ఉండాలని.. తమకు నిత్యం జీవనోపాధిని కల్పించి సురక్షింతగా ఉంచాలని.. తాము చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని వారు విశ్వకర్మ దేవుడిని ప్రార్థిస్తారు.

పురాణాలలో అసలు విశ్వకర్మకు జయంతి అనేది కనిపించదు. కానీ ఇటీవల విశ్వకర్మలు విశ్వకర్మపై గల అపారమైన భక్తిని ప్రకటించుకోవడానికి ఆయన పేరా *” జయంతి ” అనేది జరుపుకోవడం జరుగుతుంది. బృహత్ కార్యక్రమాలు చేపట్టి విశ్వకర్మను స్మరిస్తున్నారు… తరిస్తున్నారు.

September 19, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అక్షర ప్లాంట్స్

by vanaparti padma September 16, 2025
written by vanaparti padma

డా॥ కందేపి రాణీ ప్రసాద్ కవయిత్రి, బాల సాహితి వేత్త, పరిశోధకులు, చిత్రకారిణి, హస్తకళాకారిణి అనువాదకులు, బాల సాహిత్యంతో అనేక ప్రయోగాలు చేస్తుంటారు. సృజన్ చిల్డ్రన్ ఆసుపత్రి గోడల నిండా పొడుపు కథలను దాదాపు 300 వందలకుపైగా చార్టులను అతికించి పొడుపు కథల ఆసుపత్రిగా మార్చారు.
పజిల్స్ ప్లాంట్ అనే పుస్తకాన్ని, మరియు చెట్లతో చెలిమి అనే రెండు కొత్త పుస్తకాల గూర్చి మనం తెలుసుకుందాం.
మొదట పజిల్స్ ప్లాంట్ పుస్తకము గూర్చి తెలుకుందాం. ఇందులో ఖండాలు, నదులు, కొలతలు, సముద్రాలు, ప్రపంచ వింతలు, ప్రపంచ నగరాలు వంటి అనేక అంశాలు ఇందులో వున్నాయి. ఉచ్చరించడానికి రెండు పదాలు ఒకటే కాని వాటి మధ్యనే ఓ ఫరికొత్త పదం దాగి వుంటుంది.
“క్షణం కాని క్షణం – వీక్షణం”, “ద్రాక్ష కాని ద్రాక్ష –రుద్రాక్ష” లాంటి పదంలో మరో పదం రాయడం వారి ‘కలం’ కు మాత్రమే తెలుసు, నిత్యం చిన్నారులు ఉపయోగించే రాత వస్తువును కూడ పొడుపు కథగా మర్చారు రచయిత్రి.
నల్లని గ్రాఫైటు బళ్ళు
చెక్కతో చేసిన కోటు
కొనదేలిన సూది ముక్కు
ఎవరది? ఏం పేరు చెప్పు అని ప్రశ్న వేస్తునే ‘పెన్సిల్’ అనే జవాబును ఇస్తారు.
మట్టిలో పుట్టి మంటల్లో కాలి
మనింటికే వచ్చి మంచి నీళ్ళిస్తుంది
ఎవరో చెప్పుకోండి చూద్దాం! అని అంటూనె ‘చల్లటి కుండ’ అనే జవాబును ఇస్తూ చమత్కారంగా రాస్తారు.
పిండి వంటల్లోను అందరు ఇష్టపడే తీపి పదార్థంతో పొడుపు కథ: ఈ పూత చెట్టు మీద కాదు కుండ మీద పేరులోని రేకు విచ్చుకోదు, గుచ్చుకోదు అంటునే ‘పూత రేకు’ సమాధానంతో మనల్ని తీయ్యటి జ్ఞాపకాల్లోకి తీసుకుపోతారు. మరో స్వీట్: ఒళ్ళంతా నాకు నొక్కులు, పంచాదార పాకాలు, పేరులో సముద్ర జీవులు అంటారు. ఎంటో తెలుసా “గవ్వలండి”, సరస్సులకు కూడ పోడుపు కథలు: ‘పప్పు’ తినే సరస్సు పేరు ఏమిటి ‘దాల్ లేక్’ అండి ఛాల తమాషాగా ఉంది కదా.
ప్రసిద్ది నగరాల్లోకి వెళ్దాం. ‘లా’ చదువుకున్న”సిమ్” ఎక్కడుందో చెప్పగలరా “సిమ్లా” కదాండి, టీచర్లు అందరు నివాసముండే గ్రామమేమిటి “గూర్ గావ్”. చెర్రీలున్న నగరం – పాండిచేరి. బాల బాగున్నాయి రచయిత్రి ఆలోచన విధానం పిల్లలకి కాలక్షేపంలో పాటు విజ్ఞానం.
ఊర్ల పేర్ల విషయం చుద్దాం. దేవుడు వరాలిస్తాడని తెలుసు కాని ఇక్కడ అన్న వరాలిస్తాడు తెలుసా. అది ఏ ఊరిలొ చెప్పండి. “అన్నవరం” సత్యదేవుడు కదాండి.

రవి ఉంటే పేట ఏదో చెప్పండి- సూర్యపేట ఇలా అనేక ఊర్ల పేర్లను పొడుపు కథలుగా మలిచారు.
రాష్ట్రల పేర్లు చూస్తే: రాజులకు నిలయమైన రాష్ట్రమిది.
జ: “రాజస్థాన్” – 36 కోటలు కట్టుకున్న రాష్ట్రమేది ఛత్తీస్ గడ్ అంటారు.
కొండలతో ఊరి పేర్లున్న పొడుపు కథలు.
1. రామ భక్తుడు కొండ ఎక్కింది ఎక్కడ;- హన్మకొండ.
2. ప్రభలతో తిరుణాలకు ప్రఖ్యాతి చెందిన కొండ ఎక్కడ- కోటప్ప కొండ అంటారు.
నక్షత్రాల పేర్లతో కూడిన పదాలు
1. చిత్త శుద్ధితో పని చేసే నక్షత్రం – చిత్త (నక్షత్రం)
2. కృష్ణని ప్రియురాలు ఉన్న నక్షత్రం – అనురాధ
ఇలా తమాషాగా మర్మగర్భంతో కూడిన పదజాలం చాలా ఉపయోగించారు రచయిత్రి రాణీ ప్రసాద్.
ప్రహరీ గోడకట్టి పుసిద్ధి కెక్కిన ప్రపంచ వింత- చైనావాల్ అంటునే స్వచ్ఛను కోరె విగ్రహపు వింత –స్టాచ్యూఆఫ్ లిబర్టీ అని ప్రపంచ వింతలను కూడ జోడిండిచారు. ఇంక నదుల విషయానికొస్తే 1. నల్లని పాయలు కలిగిన జీవనది – కృష్ణ వేణి కాగ 2. నీరు కడుపులో పెట్టుకుని మోసేసే నది – మూసి (నది) అంటారు.
దేశాల పేర్లకు వస్తే 1. ‘డెన్’ లకు మార్కు వేసే దేశం ఏది – డెన్మార్క్ అంటారు.
2. బీధధైన సింహం ఉండే దేశం – సింగపూర్ అంటునే
3. తీగల్ని పందిరికి పాకిస్తా అనే దేశం – పాకిస్తాన్ చాల సానిగా ఉంది కదా
బాల్యం ఒక మధురం జ్ఞాపకం ఏలాంటి స్వార్ధం, ద్వేషం లేని ప్రేమైక్య దశ కాని నేడు ‘బాల్యమా నీ చిరునామా ఎక్కడా’ అని అనుకునే స్థాయికి దిగజారుతున్నాము. పోటి ప్రపంచం ఆర్థిక వనరుల కోసం తల్లి తండ్రుల పరుగు వ్యక్తిగత కుటుంబాల్లో పెద్దవారు కరువు. కథలు, బుజ్జగింపులు లేక బాలలు ఒంటరిగా మానసికంగా ఒడి దుడుకులు పడుతున్నారు. సేల్ ఫోన్ ప్రపంచంగా మారుతున్న తరుణంగా రాణీప్రసాద్ గారి రచనలు ‘అక్షర ప్లాంట్’ చాల ఉపయక్తంగా వుంది. ఈ పుస్తకాన్ని పాఠశాలలో ఉంచితే మంచి పరిణామంగా భావిస్తున్నాను. నేటి పిల్లలకు ఇలాంటి తమాషా పదాలతో పోడుపు కథలు పిల్లలకు కాలక్షేపంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది.
పెద్దలు పిల్లలు చదవతగిన పుస్తకం – ‘పజిల్ ప్లాంట్’

September 16, 2025 8 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సిగాచీ

by Ramesh September 16, 2025
written by Ramesh

సిగాచీ చిరుపరిశ్రమ
అమ్మలా ప్రేమను కురుపించి
కార్మికులను ఆదరించి మురిపించిన
యాజమాన్యపు లాభాల వాడల్లో
నిఘా,నియంత్రణ ల్లేని నీడల్లో
అలసత్వం దాపురించి
సిగాచీ కొంపముంచింది
చిన్ని నిర్లక్ష్యం
కొన్ని తరాలు కోలుకోని నష్టంగా పేలింది
అమాయకబతుకుల్ని చిదిమేసి
కష్టాన్నే మిగిల్చింది
బాధిత కుటుంబాలు
బాధల ప్రతిబింబాలు
గుండె బరువయిన లోకాలు
ఎవరూ శృతి కల్పలేని శోకాలు
సిగాచీ
బూడిద పేరుకున్న కుంపటి
కన్నీటి కధల సంపుటి
ఇపుడు సిగాచి
అలలాగా కలలోకొచ్చేబూచి
సిగాచీ
ఆగిపోయిన వాచీ
దుఃఖరాగాలుపాడే విపంచి.

రమేశ్ నల్లగొండ
8309452179

September 16, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

” పుస్తకం ఊయలలో “

by Kura Bhanuja September 16, 2025
written by Kura Bhanuja

ముసుగు కప్పేస్తుంది
ఏ దారిన వెళ్ళినా
నాని ముద్దవుతున్నాను
తడిసిపోయి ఏమారుతున్నాను
చుట్టూ వలయమై తిరుగుతున్నాను
కాస్త ఆగుదామని ప్రక్కకు నిల్చుంటే…
దారి మారిపోయి గమనం అగుపించడమే లేదు
విచిత్రంగా
గుర్తులైనా వెతుకుదామని
బయలుదేరా
అక్కడ …
దొరికిందో పుస్తకం
గ్రహణం పట్టిన బ్రతుకుకు
గమనం ఏదో చెప్పింది

మనసుతెరుచుకుంది ఈ క్షణం
చుట్టూ మనుషులు మూసుకుపోతున్న వేళ
సంతోషం పెదవులు దాటి కాదు
హృదయం దాటి అక్షరంలా పరుచుకుంది
టెక్నాలజీ నన్ను లోబరుచుకుంది
ఆకర్షణీయమైన హాంగులతో
నా చూపుల గాలాలతో
మెరిసిన జీవితంలో
అంధకారం కనిపించలేదు
కానీ ….
తెలిసినది ఇపుడే
జ్ఞానం ప్రకాశించిన వేళ
పుస్తకం తెరిచిన వేళ
సాహిత్యం నాలోనూ ప్రవాహంలా సాగుతున్న వేళ
ఒక్కో పదబంధం నా నాడులను ఉత్తేజితం చేస్తూ
మనిషివలె తిరిగి మానవతవైపు
లోకం వదిలేసిన చేయూత వైపు
చేరువగా పల్లె వైపు కన్నతల్లి లాలనలో
పుస్తకం ఊయలలో హాయిగా నా మస్తకం

September 16, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అవిశ్రాంత శ్రామికుడు గురువు

by Nellutla Madhava Srinivas September 16, 2025
written by Nellutla Madhava Srinivas

ప్రతి వ్యక్తి జీవితం పాఠశాలలోని తరగతి గదిలో
నిర్మించబడుతుంది అంటారు
అటువంటి విద్యాలయం ఒక ఉద్యానవనమైతే…
గురువే ఆ ఉద్యానవనానికి తోటమాలి…
క్షేత్రం ఎంత సారవంతంగా ఉంటే…
ఫల సాయం అంత అద్భుతంగా వస్తుంది…
అంతటి సారవంతమైన పాఠశాల అనే క్షేత్రంలో…
గురువు అనే తోటమాలి
విద్యార్థి అనే విత్తనాన్ని నాటి…
దానికి ప్రేమ ఆప్యాయత అనే నీరు పోసి…
ఈర్ష్య, అసూయ అనే కలుపును ఎప్పటికప్పుడు పెరికి వేస్తూ…
కోపం, ద్వేషం అనే చీడ పీడలను దరిచేరినీయకుండా…
విద్యాబుద్ధులతోపాటు జ్ఞానం అనే ఎరువు వేస్తూ…
మంచితనం మానవత్వం అనే పూలు పూయిస్తూ…
ఎంత పెద్ద గాలివాన వచ్చిన విద్యార్థి అనే మొక్క నేలకొరకకుండా…
తానే ఊత కర్రలా నిలబడి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా…
ఆ విద్యార్థి అనే మొక్కను పెంచి పోషిస్తాడు.
అలుపెరుగని హాలికుడు, అవిశ్రాంత శ్రామికుడు గురువు.
తల్లిదండ్రుల తర్వాత సమాజంలో అంత గొప్ప స్థానాన్ని
దక్కించుకున్న మహోన్నత వ్యక్తి గురువు….
అటువంటి గురువులకు వారిలాగా ఉన్నతమైన
జీవన ప్రమాణాలతో జీవించి చూపించడమే మనం వారికి ఇచ్చే అసలైన గురుదక్షిణ.
మరొక మారు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

September 16, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నీలి మేఘం. నిరంతర యజ్ఞం..!

by ShailajaMitra September 16, 2025
written by ShailajaMitra

ఇప్పటికీ స్పష్టం కాని, స్త్రీల దు: ఖ అస్తిత్వాన్ని, ముసుగులో తిరుగుతున్న మర్యాదలని… సంస్కృతులని… తీర్మానాలని విస్పుర సత్యం కంటి ముందు కనిపిస్తున్న. మూసికొన్న కళ్ళతో తిరుగుతున్న సమూహాలు. అసంఘటిత దేహ నిర్మాణాల విషాద దర్శనం జరిగిన ఉద్విగ్న క్షణంలో పురుడు పోసుకున్న నీలం మెరుపు. స్త్రీ బాహ్యమై చేసిన ఓ సాంస్కృతిక సందర్భ కథనాల అరుపు. ఈ నీలిమేఘాలు.

మనిషి జీవితం నుండి వేదన పుడుతుంది. కవి జీవితం నుండి ఆవేదనకు, ఆవేశానికి అన్నింటికీ కవిత్వం పుడుతుంది. ఈ రెండు పార్శ్వాలనుండే కవి స్పందిస్తాడు. జీవితం నుండి ఎప్పుడైతే కవిత్వం వచ్చిందో దానికి సజీవకత, శాశ్వతత్వ్వం ఏర్పడుతుంది. కవితా ప్రపంచం ఇంతగా విస్తరించినా ఇప్పటికీ కొందరు స్త్రీలు తమ ఆవేదనను నిశ్శంకోచకంగా పంచుకోలేరనే అనిపిస్తుంది. స్త్రీకి అన్యాయం ఆదినుండి జరుగుతూనే ఉంది. కానీ ఆ అన్యాయం ఎక్కడనుండి అనలేము. కొందరికి పుట్టుకనుండే జరుగుతుంది. కొందరికి మెట్టినింటి నుండి ప్రారంభమవుతుంది. పుట్టుక అనేది మన చేతిలో లేదు. ఎక్కడ ఎందుకు పుడతామో తెలియదు. కానీ వివాహం అనేది స్త్రీ అయినా, పురుషుడైనా తమకు ఇష్టానుసారం జరగాలనేదే ప్రయత్నం. కనీసం నీకిష్టమేనా అని అడగకుండానే వివాహాలు కొన్ని లక్షలు జరిగాయి. వివాహం ఇష్టమైతేనే పిల్లలు జన్మిస్తారు అనేది వుండివుంటే ఈ జనాభా ఇంత పెరిగేది కాదేమో! అనుకుంటుంటాను అప్పుడప్పుడూ… ఎప్పుడైతే స్త్రీ శరీరం వాడుకునే వస్తువులా మారిందో ఒక చేతిరుమాలును ఉపయోగించినట్లుగా, ఒక తువ్వాలును ఉపయోగించినట్లుగా ప్రతి ఒక్కరూ వాడుకోవడానికే ప్రయత్నించారు. ఇప్పటికీ ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే వున్నారు. అలా ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ స్త్రీ ప్రయేయమే లేకుండా వాడుతూ పోతున్నారో. జీవితం పట్ల విరక్తి కలిగిన క్షణాల్ని మోసుకుంటూ అనేకమంది స్త్రీలు బతికేసారు. ఇంకా బతుకుతున్నారు కూడా. అత్యాధునిక యుగమైనా ఇప్పటికీ ఏదయినా ఒక మెచ్చుకోలు, లేదా ప్రశంస, ఎప్పుడో ఒక్కసారైనా ఇష్టం, ఎప్పుడైనా ఒక్కసారైనా చూపే ప్రేమ అనే పదం దొరుకుతుందేమో అని ఆశగా చూస్తున్న స్త్రీ జీవితాలన్నో…

సరే! ఇలా ఎంతకాలం? స్త్రీ పుట్టుక వున్నంతవరకూ ఇంతేనా? ఆధునికత పెరుగుతన్న కొద్దీ స్త్రీ పట్ల మరింతగా పెరిగిపోతున్న ఈ ఘోరాలు, అత్యాచారాలు, అన్యాయాలు, చులకన చూపులు, వెకిలి చేస్టలకు అంతం ఏదీ? వంటి అనేక స్త్రీ సమస్యల తాలూకు ప్రశ్నలన్నింటినీ ఒక్క ‘‘నీలి మేఘాలు’’ గ్రంథంతో సమాధానం వచ్చింది అని చెప్పకున్నా. స్త్రీ సమస్యలకు కూడా సమాధానం వుంటుంది అనిపించేలా కనిపించింది. స్త్రీ మాట్లాడటమే కాదు నిలదీసి ప్రశ్నించవచ్చు అనే ధైర్యం వచ్చింది. ‘‘నీలిమేఘాలు’’ గ్రంథం ప్రచురితమై ఇప్పటికి దాదాపు 30 ఏళ్ళు గడిచింది. అంటే దాదాపు రెండు తరాల ముందు అన్నమాట. అందులోని ప్రశ్నల తాలూకు తడి ఆరలేదు. బహుశా స్త్రీ జాతి వున్నంతవరకు వుంటుందేమో! అనిపించేలా రచించారు. ఆవేదన అనేది మనిషిని గొప్పగా మార్చే ఒక ఆయుధం. ఆవేదన నుండే ఆవేశం వస్తుంది. ఒక విధమైన తెగింపు వస్తుంది. అనడానికి ఈ గ్రంథం ఒక ఉదాహరణ. అలాగని కేవలం వేదనే వెలిబుచ్చారా అంటే కాదు. అందులో కావలసినంత కవిత్వం వుంది. శైలి వుంది. పదాల వాడకంలో అక్కడక్కడా కాస్తంత అభ్యంతరకరంగా అనిపించినా వాస్తవం వుంది. వాస్తవం ఎప్పుడూ చేదే కదా? మరి! కాకుంటే అంతకంటే ఆవేదన ఏమిటంటే ఈ గ్రంథం తర్వాత మరొక ఇలాంటి గ్రంథం రాలేదు. ఎందుకు? అనేది ఎవరికీ అర్థం కాదు. ఇకపై అడగాల్సింది ఏమీ లేదనుకున్నారా? ఇకపై ఇలా అడిగే ధైర్యం వున్నవారు లేరనుకున్నారా? ఇప్పటికి మూడు ముద్రణలు అయ్యాయంటున్నారు. నాల్గవ ముద్రణకూడా చేయాలి అని అనుకుంటున్నారు అంటున్నారు కానీ ఎవరైనా ఈ గ్రంథాన్ని గురించి అడిగితే కాపీలు రచించిన మా దగ్గరే లేవు అనే మాటలు పదే పదే వింటున్నాను. అంతలా ఇన్ని ముద్రణలు కూడా చేసాక కూడా ఒక్కరి దగ్గర కూడా ఈ గ్రంథం లేకపోవడం ఆశ్చర్యంగానే వుంది. ఏది ఏమయినా. ఎంత వెదికినా దొరకని గ్రంథాన్ని నేను సంపాదించాను. ఈ గ్రంథం గురించి వివరిస్తే నేనేదో గొప్పదాన్ని అయిపోతానని మాత్రం రాయటం లేదు. ఇప్పటివరకు నేను 750 గ్రంథాల సమీక్షలు, విశ్లేషణ వ్యాసాలు రచించాను. పత్రికలు అందించిన గ్రంథాలను కొన్ని తప్పనిసరిగా సమీక్షించాల్సివస్తుంది. అపుడప్పుడూ మనకు నచ్చిన గ్రంథం, సమాజానికి తెలియజేయాల్సిన గ్రంథాలు కూడా వుంటాయి కదా? అందుకే ఈ ప్రయత్నం. మరో తరం కూడా తెలుసుకుంటారని.. ఒక్కసారి ఇందులోని కవిత్వాన్ని పలకరిస్తే..

ఈ గ్రంథంలో కవయిత్రులు నలభైకి పైగా వున్నారు. వందకు పైగా కవితలున్నాయి. అంటే ఒక్కొక్కరు కనీసం మూడు లేదా నాలుగు కవితలు రచించారు. వీరిలో మనకు కొండేపూడి నిర్మల, ఓల్గా , విమల, ఘంటశాల నిర్మల మందరపు హైమావతి, మహెజబిన్‌, శిలాలోలిత, కుప్పిలి పద్మ గార్లు మనకు ఇప్పటికీ మనతోనే మనకు అపుడప్పుడూ ఎదురవుతూనే వున్నారు. కానీ మనకు కనిపించని వారు, వినిపించని వారు కూడా ఇందులో వున్నారు. వసంత కన్నభిరాన్‌, జయప్రభ, శివలెంక రాజేశ్వరీదేవి, కె.గీత, రజియాబేగం, పాటిబండ్ల రజని, రేవతీ దేవి, మొక్కపాటి సుమతి, ఊర్మిళ, సావిత్రి, అబ్బూరి ఛాయాదేవి,శ్రీమతి, ఏలూరి పార్వతి, అంజన, ఎస్‌.జయ, వాణీరంగారావు, కె. వరలక్ష్మి, పుట్ల హేమలత, వాణీ రంగారావు, కొండపల్లి కోటేశ్వరమ్మ, సుధ, శాంతి ప్రియ, బి. పద్మావతి, వకుళాభరణం లలిత, రావులపల్లి సునీత, వంటి వారు కూడా వున్నారు. ఈ పేర్లు ఎందుకు ఇక్కడ చెప్పానంటే మనలో చాలామంది కొందరి పేర్లు అసలు వినలేదు కనుక. ఆ పేర్లను కూడా అందరికీ వినిపించడానికి..

పూర్వకాలం నుంచీ ఒక ప్రక్క, స్త్రీని మాతృమూర్తిగా, ఇంటికి దీపంగా, త్యాగశీలిగా పరిగణిస్తూనే మరోపక్క బానిసగా, అసూర్యంపశ్యంగా, వ్యక్తిత్వం స్వేచ్ఛాలేని వ్యక్తిలా పరాధీనంలా చూసారు. కందుకూరినుండి స్త్రీ విముక్తికి మార్గం, చలం నుండి వివాహ స్వేచ్ఛ వారి రచనలద్వారా తెలియజేసారు. రంగనాయకమ్మ రచనల్లో ‘స్తీ స్వేచ్ఛ’ గురించిన ఆలోచనకి పునాది ఏర్పడిరది.అభ్యుదయ, విప్లవ కవిత్వాల్లో స్త్రీకి సముచితమైన స్థానం ఏర్పడిరది. కవయిత్రులు 1980 నుంచి స్త్రీవాద కవిత్వం విస్త్రృతంగా రావడం మొదలైంది. 1990లో త్రిపురనేని శ్రీనివాస్‌ ‘గురిచూసి పాడేపాట’ అనే సంకలనం ప్రచురించి ‘‘స్త్రీవాద కవితలు’’ అన్నారు. పురుషులకంటే స్త్రీలు రాస్తేనే స్త్రీవాద కవిత్వమవుతుందనీ, కవయిత్రులు మాత్రమే శక్తివంతంగా చెప్పగలరనీ పేర్కొన్నారు. ఈ సందర్భంలో ‘అస్మిత’ వారు 1993 అక్టోబరులో ‘‘నీలిమేఘాలు’’ అనే స్త్రీవాద కవితా సంకలనం వెలువరించారు. ఇందులో వసంత కన్నాభిరామ్‌ రాసిన ‘స్త్రీగా రాయడమంటే’ ఓల్గా రాసిన ‘సంకెళ్ళు తెగుతున్న సంగీతం’ అనే వ్యాసాలు స్త్రీవాద దృక్పథాన్ని సిద్థాంత పరిధిని వివరిస్తాయి.

నిజానికి పితృస్వామ్య సమాజంలో స్త్రీ అణచివేతకు గురవుతోంది, లైంగికత్వం, సంతానోత్పత్తి, ఇంటిచాకిరి అనేవి పురుషులు తమ ఆధిక్యతను చూపే పురుషాధిక్యత నశించాలి. స్త్రీ శరీరం, శరీర ధర్మాలు కూడా ఎప్పటికీ చర్చనీయాంశాలే. కానీ విశృంఖలత్వం కాదు. స్త్రీ శారీరక ఇబ్బందులకీ, ఆర్థిక ఇబ్బందులకీ వివాహబంధాలు, సమాజం కారణం. ఫ్యూడల్‌ పదబంధాలూ, ఆలోచనలూ వదిలి స్త్రీ సంఘర్షణనీ, ఆవేదన వ్యక్తం చేసే పదబంధాల్ని, శైలినీ నిర్భయంగా వాడవచ్చు. నైతిక ధర్మాల, మూఢాచారాల మత్తులో పడిపోకూడదు అనేదే స్త్రీవాదంలోని ముఖ్యాంశాలు. వీటిని ప్రతిఘటిస్తూ పురుషద్వేషం పనికిరాదు. స్త్రీ స్వేచ్ఛ పేరుతో కుటుంబ వ్యవస్థనీ, విచ్ఛిన్నం చేయకూడదని, అశ్లీల పదప్రయోగాలు చేయకూడదని ఎస్వీ సత్యనారాయణ తమ సంపాదకత్వంతో ఎస్‌. సూర్య ప్రకాశ్‌ సంకలనం చేయగా అభ్యుదయ రచయితల సంఘం 1997 మేలో ప్రకటించారు.

ముఖ్యంగా స్త్రీ వాదంలో 1972లోనే ఓల్గా ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే స్త్రీవాద కవిత రాయడం విశేషం. అప్పటికే ఇంత తీవ్రంగా రాయడం వల్ల బహుశా మొదటి స్త్రీవాద కవితగా దీన్ని చెప్పాల్సివస్తుందేమో’ ‘‘అందమైన దోపిడీకి/ పవిత్రమైన హింసకూ/న్యాయమైన దాస్యానికి/ బలైపోయిన నేను / భారత స్త్రీని/ న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారతస్త్రీని’’ అనడంలో తిరుగుబాటు కనిపిస్తుంది.

1988 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కవయిత్రి జయప్రభ కవిత సంచలనం సృష్టించింది. . . అల్పాక్షరాలతో అనల్పార్థ రచన అన్నట్లు రచించిన వీరి కవిత గొప్ప స్త్రీవాద కవిత ఇది. పాతివ్రత్యమంటే రెండు భుజాలపైనుండి కొంగు కప్పుకోవడం కాదు అంటూ ‘‘ పైట కొంగును చూస్తే నాకెందుకో పాతివ్రత్యం గుర్తొస్తుంది. భుజాల నుంచి వేల్లాడే గుదిబండలా అదెప్పుడూ నా స్వేచ్చను హరిస్తూనే వుంటుంది./ నన్ను నిటారుగా నిలవనివ్వక పైట నా గుండెలపై తన అంచు చేతులాన్చి నన్ను వంగదీయాలని చూస్తుంది.. అంటూనే చివరిగా నేను నడిచే శవాన్ని కాకుండా వుండాలంటే ముందుగా పైటను తగలెయ్యాలి’’ అంటారు. పైట కొంగు స్త్రీ స్వేచ్ఛను హరిస్తోందనేది వీరి వాదన. తరతరాల స్త్రీకి ఆలవాలం అయిన పైట ఇంతగా స్వేచ్ఛను హరిస్తున్న తీరు ఆవేదన సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వుంది. ‘‘వర్గశతృవు నా శ్రమనే దోచుకుంటాడు/ఈ దుష్ట శత్రువు నా బతుకే దోచుకుంటాడు/ వాడు నాకు కలనైనా కల్పిస్తాడు/ వీడు నా కలలన్నీ చెరిపేస్తాడు/ఆకాశంలో సగాన్ని చూపి మోసం చేస్తున్నాడు వాడు’’ అని మొక్కవాటి సుమతి అంటారు. వకుళాభరణం లలిత ‘‘అనాదినుంచి ప్రకృతి తో సహజీవనం నాది/ విధ్వంసం నీది/ పిల్లల కోసం నీకోసం/ కీకారణ్యాల్లో పడి వెతికి / దుంపలు మొక్కలూ ఏరి తెచ్చి పెడితే/ అవి తిని నువ్వు ఆయుధాలు తయారు చేసావు/ నన్ను ప్రకృతిగా మార్చుకున్నావు/ పశుపాలనతో నన్ను పశువును చేసి పసుపుతాడుతో కట్టాలని నేర్చుకున్నావు’’ ఉద్యమించి లేస్తున్నా కవితలో కనిపించిన స్త్రీ దుస్థితి, తుర్లపాటి రాజేశ్వరి ‘‘తాళికట్టిన మృగం’’ అని చూపే కోపంలో అన్ని దశల్లోనూ స్త్రీ అణచివేయడాన్ని కవిత్వంగా చెప్పారు. రావులపల్లి సునీత ‘‘ ఆత్మహత్య నా నిరసన’ అనే కవితలో ‘‘ పూరేకులాంటి నా మదిపై/ పుల్లలు పేర్చి రాజేసిన నా పతి లాలిత్యం మోయలేక/ నన్ను నేను తగలపెట్టుకున్నాను/ ఇపుడదే నా నిరసన.. నా మరణం మీ విలువల్ని గింగిరాలెత్తించాలని నేరాసిన మరణ వాగ్మూలం మీదాకా చేరిందా’’ అని ఒక స్త్రీ స్థితిని వర్ణించిన తీరు ఏ మనసునైనా కదిలిస్తుంది. ఈ గ్రంథంలో స్త్రీల జీవితాలు, అనుభవాలు, సమస్యలు, లైంగిక వేధింపులు, గృహ హింస, సమాజంలో వివక్ష వంటి భావాలు కవితా వస్తువులుగా ఉన్నాయి. ఈ సంకలనం స్త్రీవాద ఉద్యమానికి ఒక ముఖ్యమైన అడుగు, ఇది స్త్రీల సమస్యలను వెలుగులోకి తెచ్చింది మరియు స్త్రీల దృక్కోణాన్ని, అనుభవాలను సాహిత్యంలోకి తెచ్చింది.

ఇందులోని ప్రతి కవితలో ఒక స్త్రీ మనసు లోతుల్లోనివి మాట్లాడుతుంది. వాటి వెనుక శబ్దించేది ఆవేదన, ఆరాటం, ఆగ్రహం, ప్రశ్నలు ఇవన్నీ మౌనంగా ఎన్నో కాలాలుగా బిగుసుకుపోయిన మహిళా జీవితపు నిశ్శబ్ద సత్యాలు. ఈ సంకలనంలో కవయిత్రులు తమ వ్యక్తిగత అనుభవాల నుండి లౌకిక సాంఘిక విషయాల వరకు విస్తరించిన భావాలను కలగలిపి, స్త్రీ మనోవేదనను ఉప్పొంగించేలా అక్షరాలలో పరిపుష్టి చేశారు. ఈ కవిత్వంలో సంప్రదాయ లాలిత్యాన్ని తృణంగా వదిలేసి, నిజ జీవిత కఠినతను, నెరవేరని కోరికలను, అణచివేతను నిబద్ధతతో ప్రతిబింబించేలా రచించారు. తమలోని భయాలను, ఆశలను, శ్రమను, ప్రేమను, ప్రేమలోని ఓటమిని, నిరసనను అన్నింటినీ బలమైన పదాలతో వెలిబుచ్చుతారు. ఇది ఒక రకమైన కళాత్మక అర్థనాదం, సాంఘిక చైతన్యానికి మేలుకొలుపు.

‘‘నీలిమేఘాలు’’లో కనిపించే ప్రతీ కవితలో ఒక స్పష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. అవి వేదనతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచుతాయి. స్త్రీలు ఎదుర్కొనే దినచర్య అణచివేతలు, మౌనంగా భరించాల్సిన బాధలు, తల్లిగా, భార్యగా, కుమార్తెగా, ఉద్యోగిగా ఎన్నో పాత్రల్లోనూ పోరాడాల్సిన పరిస్థితులను, ఈ కవిత్వం నిర్భయంగా వ్యక్తపరుస్తుంది. ఇక్కడ కవయిత్రులు ప్రేమను, దుఃఖాన్ని, కోపాన్ని, నిరాశను శక్తివంతమైన ప్రశ్నలుగా మలిచింది.

ఈ సంకలనం ద్వారా స్త్రీ తన చుట్టూ ఉన్న లోపాలను, తనకు విధించిన సంకెళ్ళను, అవమానాలను నిలదీస్తుంది. అయితే ఈ నిలదీత కోపంగా మాత్రమే కాకుండా, లోతైన చింతనతో కూడి ఉంటుంది. అది విమర్శ మాత్రమే కాదు, మార్పు కోసం గళమెత్తే ప్రయత్నం. ఈ సంకలనం మనం ఆదర్శంగా చెప్పుకునే సాంప్రదాయాన్ని ప్రశ్నిస్తుంది. స్త్రీ తన శరీరాన్ని, తన భావాల్ని, తన స్వరాన్ని తనది చేసుకునే ప్రయత్నాన్ని ప్రతిఫలిస్తుంది. మన చుట్టూ ఉన్న సామాజిక నిర్మాణాల్లోని లింగ అసమానతల్ని, మూఢనమ్మకాలను, పురుషాధిపత్య ధోరణులను నిలదీసే శక్తి ఈ రచనకు ఉంది. ఇది కేవలం పుస్తక పుటలకే పరిమితమై ఉండదు. చదివిన ప్రతి మనసులో ప్రశ్నలు రేపుతుంది. ఆ ప్రశ్నలు మార్పుకు మొదటి అడుగులు. ఈ సంకలనం స్త్రీల సమస్యలపై సామాజిక స్పృహను పెంచింది. ప్రజలు స్త్రీల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారి పట్ల సానుభూతి చూపించడానికి సహాయపడిరది.

అలాగే ఇవాళ ఈ శతాబ్దపు పూర్వార్ధ భాగంలో తెలుగు కవిత్వంలో జరిగిన మార్పుల్ని గ్రహించటానికీ, అనుభవించటానికి ఆధారభూతమైన ఏకైక కవితా సంపుటి ‘‘వైతాళికులు’’, అనాటి అనేక కవుల కవితా సంపుటులు ఈనాడు దొరకటం లేదు. చాలామంది కవితా ఖండికలు సంపుటాలుగా సంకలితం కానేలేదు. అయినా ‘వైతాళికులు తిరగేస్తుంటే ఆనాటి కవితా ధోరణులు మన అంతరంగాల్లో ఆహ్లాద తరంగాలను కదిలిస్తాయి. ఆ రోజుల్లో కూడా ఇప్పటిలాగే నవ్య కవిత్వాన్ని మనసారా ఆహ్వానించిన వాళ్ళతోపాటు వ్యతిరేకించినవాళ్లు కూడా గణనీయమైన సంఖ్యలో వున్నారు. కాకుంటే ఒకే ఒక తేడా వుంది. అప్పుడు వ్యతిరేకించినవారు దిగ్ధంతులైన పండితులు, అక్కిరాజు ఉమా కాంతంగారు, జయంతి రామయ్యగారు, అనంత పంతుల రామలింగస్వామి గారు ఇట్లాంటి గొప్ప గొప్ప పండితులు నవ్య కవిత్వ ధోరణులను నిరసించారు. తమ తర్క శక్తితో ఎదుర్కొన్నారు. అధిక్షేప కావ్యాలు రచించి హేళన చేశారు. ఎన్ని చేసినా కాలప్రవాహంలో అవి మరుగున పడిపోయాయి. దొరుకుతున్న కావ్య సంపుటాల ద్వారా దొరకని వారిని ‘వైతాళికులు’ సంకలనం ద్వారా ఈనాటికీ మనకు ఆనాటి జీవితం ఏ సూత్రాల ఆధారంగా చలనం సాగిస్తుందో చెప్పే సాహిత్యం కాలక్రమంలో జీవితాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. జీవితం, సాహిత్యం పేనిన తాడులాగా ముందుకు సాగుతున్నాయి. ప్రజల ఆలోచనలను చక్కదిద్ది, జీవనం సులభతరం చేసేందుకు సాహిత్యం ఓ ఉద్యమంలా కృషి చేస్తోంది.

తరాల తరబడి మగవాడి పక్కటెముక నుంచి పుట్టినట్టుగా స్త్రీని చిత్రించి మనిషి మనుగడలో కీలక భూమిక వహిస్తున్న మహళలను వంటింటి కుందేలుగా మార్చి పారేసారు. కొన్ని వందల ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసిన మహిళ ఇప్పుడిప్పుడే స్వతంత్ర వ్యక్తిగా గుర్తింపు పొందుతోంది. తమ సమస్యలను, తమ బాధలను, తమ అనుభవాలను, తమ అనుభూతులను, తమ ఇష్టాఇష్టాలను, తమ దృష్టికోణాన్ని తమదైన శైలిలో తమకుతాము చెప్పుకోవడంతో మొదలైన స్త్రీవాద సాహిత్య ఉద్యమం మరే ఇతర ఉద్యమం కన్నా మంద్రంగా, గంభీరంగా, ఉరవడిగా సాగుతూ ప్రవహిస్తోంది. ‘‘కవిత్వం మనకు విలాసం కాదు. మనకు కవిత్వం సరదా పనికాదు. తమదైన శైలి, ఉద్యమస్పూర్తి గుండెలో పెట్టుకుని స్త్రీవాద ఉద్యమ స్పృహను అలవరచుకున్న తెలుగు కవయిత్రులు తమ భావాల పుష్పాలను ఒకచోట గుదిగుచ్చి అందించిన పుష్పహారం ‘‘నీలిమేఘాలు’’ ఒకప్పుడు ఎన్నో కువిమర్శలను, వ్యక్తిగత దాడులను నిబ్బరంగా ఎదుర్కొన్న ఫెమినిస్టు మూవ్‌ మెంట్‌ లో పురుషాహంకారం నిండిన రచయితల, విమర్శకుల విమర్శల్లో అశ్లీల సాహిత్యమంటూ నానా అగచాట్లు పడి. అయినా కొనసాగి, అందరి నోళ్లూ తన స్వచ్ఛమైన కవిత్వంతో మూయించగలిగింది. అంతకుమించి మరొక ముఖ్య లక్ష్యాన్ని సాధించగలిగింది. పితృస్వామ్యం, జండర్‌, అణచివేత, ఇంటి చాకిరీ స్వభావం, సంతానోత్పత్తి, స్త్రీలు వాడే భాషల గురించి ఎంతో చర్ఛకు తెరదీసింది. స్త్రీలలో కొత్త ఆలోచనలు రేపింది.

1990లలో వచ్చిన కొండేపూడి నిర్మల ‘లేబర్‌ రూమ్‌’ కవితలో వాడిన భాష, భావం రెంటిలోనూ తీవ్ర అలజడి సృష్టించింది. దీని గురించి వసంత కన్నాబిరామ్‌ ఇలా అంటారు: ‘‘ఆ కవితంతా నిరాశ, పరాయీకరణ ఉపమానాలతో నిండిపోయింది. పురుషులు పరోక్షంగా మాత్రమే ఉంటారు. బూటకపు కలలు, భ్రమలలో ఈ ప్రపంచమంతా తమ చుట్టే తిరుగుతుందనే విషయాన్ని ఎన్నడూ సందేహించని, ప్రశ్నించని పురుష పుంగవులకు, ఒక స్త్రీ పవిత్ర మాతృత్వ వ్యవస్థనిలా తీసిపారెయ్యటం నిజంగా చాలా భయాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవస్థ చుట్టూ భ్రమలను, మిత్‌ లను ప్రశ్నించడమంటే దాని మీద దాడిచేయడమే‘‘ అన్నారు

ఇదే కవిత గురించి ఓల్గా చాలా శక్తిమంతంగా విశ్లేషిస్తారు. ‘‘పిల్లల్ని కనటం, మాతృత్వం ఒకటి కాదని స్త్రీలు తెలుసుకుంటున్నారు. ఈ రెండు వేరువేరు విషయాలని అర్థం చేసుకున్న స్త్రీలు, పిల్లల్ని కనటం మీ సామాజిక బాధ్యత అనటానికి సాహసించే వారికి వారి సామాజిక బాధ్యతల్ని గుర్తు చేస్తారు. పిల్లల్ని కనలా వద్దా అని ఎంచుకునే హక్కు స్త్రీకి ఉందని, అది మానవ హక్కుల్లో ఒకటనీ చెబుతారు‘‘. మానవ హక్కుల్లో ఒకటనీ చెబుతారు‘‘.

వంటచేయటమూ స్త్రీ శక్తిని దోపిడీ చేయడంగానూ, పురుషాధిక్య ప్రభావంగానూ చిత్రీకరిస్తూ విమల తన ‘‘వంటిల్లు’’ కవితలో ‘‘రకరకాల శవాలు నిండిన శ్మశానంలా మా వంటిల్లు/ భయం భయంగా నిశ్శబ్థంగా, నిరాశగా/ మా అమ్మొక ప్రేతంలా తేలుతూ వుంటుందక్కడ/ అసలు మా అమ్మే నడుస్తున్న వంటిల్లులా వుంది’ అనేది

‘‘పెద్దవ్వనీ చెప్తా’’ అనే కవితలో శ్రీమతి స్త్రీ, పురుష సమానత్వం గురించి చాటిచెప్తుంది. వరకట్నాల దృష్ట్యా ఆడపిల్లలు మైనస్సులు, మగ పిల్లలను ప్లస్సులుగా వ్యవహరించి వదిలేయం. అన్నింటిలోనూ లెక్కలు వేసి మరీ తక్కువ చేస్తాం. అందుకే ఎంతో ఆశావహ దృక్పథంతో కవయిత్రి ఇలా అంటారు. ‘‘కానీ ఇప్పుడు నేనేం చెయ్యగలను / పెద్దయ్యాక ఓ ప్రయత్నం చేస్తా / నాకు ఒకమ్మాయి పుట్టాక / అమ్మకు తన తెప్పేమిటో తెలిసేలా చేస్తా!’’ ఘంటశాల నిర్మల ‘‘జుగల్‌ బందీ’’, పాటిబండ్ల రజని ‘‘క్షుద్రానందం’’, ‘‘ఇక్కడ జీవితం గాయపరచిన పక్షులన్నీ/ పేదరికం మూటకట్టుకుని వాలతాయి/ బాధలు గాధళు సమానత్వం పాటిస్తాయి/ బతుకు కోసం పాడే ఏకగ్రీవ జావళిలో జార్చిన కొంగులూ, పరచిన పైటలు నేపథ్య సంగీతమై భాసిల్లుతాయి’’ అంటూ మెహందీ శిధిల శకలాల సరిహద్ధు రేఖల్ని గీసే మహెజబిన్‌ ‘‘సరిహద్దు రేఖలు’’ కవితలు కొందరు పురుషాహంకార పూరిత ప్రేలాపనలకు తొంబైవ దశకంలో స్త్రీవాదులు ఘాటుగా చెప్పిన జవాబులు.

అక్షరాలను తూటాల్లా, తూనికరాళ్లలా, నూతన పదకోశంలా వాడడమంటే ఇదేననాలి. ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాధశాస్త్రి ఒకసారిచ్చిన ఇంటర్వ్యూలో ఫెమినిష్టులను గయ్యాళులంటారు. అది జస్ట్‌ ఒక ఫ్రాయిడియన్‌ స్లిప్‌ ఆఫ్‌ టంగ్‌ అని అనుకోవడానికి వీలులేకుండా ‘‘సోకాల్డ్‌ మధ్య తరగతి స్త్రీలకు వేరే పనీపాటా లేక చేసే అల్లర్లుగా’ఫెమినిస్టుల కృషిని నీరు గార్చేస్తారు. అధోజగత్తు సహోదరుల గురించి మార్క్సిస్టు అవగాహనతో దోపిడీతత్వపు విశ్వరూపాన్ని గొప్ప ప్రతిభావంతంగా చిత్రించిన మహారచయిత కూడా అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడడం తెలుగు స్త్రీవాద కవయిత్రులు అప్పట్లోనే కాదు ఇప్పటికీ జీర్ణించుకోలేరు. ‘‘ఔను మేం గయ్యాళులమే’ అంటూ ఓల్గా పెలుసుగా జవాబిస్తారు. ‘‘నూరేళ్ల క్రితం మధురవాణి మందలింపులు / మీ దళసరి చర్మాలకు ఆననప్పుడు / మేము ఈటెల్లాంటి మాటలతోనే పొడుస్తాం / మా గుండెలమీద కూర్చున్నది / పురుషాహంకారపు పెద్దపులి అని తెలిశాక కూడా / సుతిమెత్తగా ప్రేమ పలుకులు పలుకుతామా? / మేం గయ్యాళులమే కాదు భయంకర కాహళులం’అంటూ హెచ్చరిస్తారు. స్త్రీవాదులు వాడిన భాష విషయంలో రేగిన అలజడి ఉద్యమం దశాబ్దాలు దాటిన తర్వాత సద్దుమణిగింది. అంటే కొంతకాలానికి సోకాల్డ్‌ జనాలకు మింగుడుపడిరదన్న మాట!

రజియాబేగం రాసిన ‘‘అలాగే అన్నారు’ అనే మినీ కవితలో ఎలాంటి సంక్లిష్ట పదజాలమూ వాడకుండా, పురుషస్వామిక వ్యవస్థపట్ల విసుగునూ, తమ అసహనాన్ని, ఆందోళనను ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ‘‘బాల్యంలో / ‘చిన్న పిల్లవి నీకేం తెల్సు కూర్చో’అన్నారు / యవ్వనంలో / ‘ఉడుకురక్తం మంచిచెడూ తెలీదు కూర్చో’ అన్నారు / వృద్ధ్యాప్యంలో / ‘ముసల్దానివి ఇంకేం చేస్తావ్‌ కూర్చో’అన్నారు / అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు / కూర్చొని, కూర్చొని బద్దకం వచ్చినందుకే బాధగా ఉంది. పురుష ప్రపంచం అంతా ఈ కవితలు చదివి అవగతం చేసుకుని, తమ జీవితంలో ఆ విలువలు ప్రతిష్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే ఈ సంకలనంలో స్త్రీవాద సానుభూతిపరమైన పురుష దృక్కోణానికి చోటులేకపోవడం పెద్ద లోటు. ఇవన్నీ రచించిన స్త్రీల అనుభూతులని చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే ఒక గృహిణి మనసులోకి, వర్కింగ్‌ వుమెన్‌ మనసులోకి, మెహందీల మనసులోకి, కాల్‌ గాళ్స్‌ మనసుల్లోకి స్త్రీ చొచ్చుకుపోగా లేనిది, పురుషుల పట్ల కినుక దేనికి? నడుస్తున్న వంట గదిలో ఉప గదులు మాత్రమే అనుభవించి అనుభూతించి, తాము మాత్రమే రాయగలిగే భావాలకు అక్షర రూపమిచ్చారు. కవయిత్రులుగా కొత్త ప్రపంచపు తలుపులు తెరిచారు. పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరిస్తూ తమ కవిత్వపు కొరడా దెబ్బలు రaుళిపించారు. అక్షరాలను అగ్ని కేతనాలుగా ఎగుర వేశారు. పిడుగులు కురిపించారు. తుఫానులా విజృంభించారు.

స్త్రీ వాద కవిత్వంలో తొలి తెలుగు కవయిత్రి రేవతీ దేవి. తన అనుగార దగ్థ హృదయ జ్వాల సెగలతో తెలుగు కవితా ప్రపంచాన్ని జ్వలింపచేశారు. ‘నేనెవరినో మీ కెవరికీ తెలియదు. ఆర్తి సెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును. ఆ కళ్ళు అనురాగం కళ్ళు. లోకమంతట్లోనూ నన్నే చూసేది ఆ అనురాగపుటందమైన కళ్ళు. యుగ యుగాల సమస్త ప్రాణకోటి అనురాగాన్ని. నా పైన అవిరళంగా వర్షించే అనురాగ మేఘాలు ఆ కళ్ళు. ఈ హృదయం రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకొన్న నెత్తురు పువ్వు’. స్త్రీలంటే కేవలం శరీరాలే తప్ప హృదయాలు గుర్తుకు రాని ప్రపంచంలో రవంత అనురాగ సుగంధం కోసం, కాసింత వలపు పరిమళం కోసం తపించి, జ్వలించి తన హృదయ పుష్పాన్ని నిస్పంకోచంగా రేకులు రేకులుగా విప్పి పరచింది రేవతీ దేవి. అవయవాలకే తప్ప ఆత్మలకు తావు లేని స్త్రీ జీవితంలో మొట్టమొదట ‘అనురాగం’ అనే నాలుగు అక్షరాల పదాన్ని ప్రయోగించిన తొలి కవయిత్రి రేవతీ దేవి..తన కలల గాలిపటాన్ని నిర్భయంగా ఎరుగవేసి, తన కాంక్షల చిత్తరువులపై పరదాలు తొలగించి తన అంతరంగ వర్ణాలను ప్రదర్శించిన భావుకురాలు రేవతీదేవి. కోపం, ద్వేషం, కోరిక మొదలైన రంగు రంగుల ఇంద్ర ధనుస్సుల సౌందర్యాలను పాఠకుల హృదయ వేదికలపై ఆరబోసిన రేవతీ దేవి రచించిన మరో కవిత ‘దిగులు’. ‘దిగులు/ దిగులు దిగులుగా దిగులు/ ఎందుకా/ ఎందుకో చెప్పే వీలుంటే/ దిగులెందుకు’ అని చెప్పలేని దిగులును గురించి అద్భుతంగా వ్యక్తీకరిస్తారు. స్త్రీవాద కవిత్వంలో అనితర సాధ్యమైన శైలి రేవతీ దేవిది.

నేడు భార్య కన్నా భార్య తెచ్చే జీతాన్నే ప్రేమించే భర్తలు ఎక్కువయ్యారు. ఆనందానుభూతితో పరవశించవలసిన భర్త పరిష్వంగం భార్య పాలిటి సర్ప పరిష్వంగ మెలా అయ్యిందో మందరపు హైమవతి తన సర్ప పరిష్వంగం కవితలో ‘అంతా బాగానే ఉంటుంది/ అప్పటి వరకు/ కామంతో నైతే నేమి/ మోహంతో అయితే నేమి/ ఇరువురి తనువులొకటైనాక/ అద్వైత స్థితి పొందినాక/ ఈ లోకాన్నే మరచిపోయిన/ అమృత ఘడియలలో/ అక్షయ తూణీరం నుంచి/ ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు/ జీత మెప్పుడిస్తారు’ అని. ఈ లోకాన్నే మరచిపోయిన అద్వెట్కత స్థితిలో కూడా భర్త భార్యని జీతం గురించే అడుగుతాడు. అప్పుడామె ఒక్కసారిగా ‘వేయి రాక్షస బల్లులు/ మీద పాకినట్టు/ మనస్సు రaడుసుకొన్న ఆ క్షణంలో/ నా జీవితం నుంచి/ దూరంగా సుదూరంగా విదిలించి వేయాలనుకుంటాను నిన్ను!’ అని భర్తని వదలి వెయ్యాలనుకుంటుంది గానీ- భారత స్త్రీ నైనందుకు/ సంప్రదాయాల సజీవ సమాధిలో/ ఊపిరాడక గిల గిల కొట్టుకుంటూ/ వివాహం ఊబిలో/ కూరుకుపోతున్నప్పుడు/ జీవితం నుంచి కాదు కదా/ శరీరం నుంచైనా కించిత్తుకూడా/ దూరమవడం నా చేతుల్లో లేని పని’ అంటుంది. ఇక్కడ ఆలు మగల అనురాగ పూరితమైన పరిష్వంగం ఆర్ధిక కారణాల వలన, భార్యని బదులు డబ్బును ప్రేమించడం వలన ఆ పరిష్వంగం అత్యంత జుగుప్సాకరమైన సర్ప పరిష్వంగంగా మారిపోయింది. ఆధునిక యుగంలో సర్వత్రా కనిపించేవి ఇలాంటి సర్ప పరిష్వంగాలే. పతియే ప్రత్యక్ష దైవమైన వ్యవస్థలో ఆ పతి పరిష్వంగాన్ని అత్యంత జుగుప్సాకరమైన సర్ప పరిష్వంగంగా భావించడమే ఒక ధిక్కారం, ఒక సాహసం. .

సాహిత్యం అంతా పురుషుల దృష్టితోనే రాయడం వల్ల, వారి కాముక దృష్టికి స్త్రీలు కేవలం అవయవాల ప్రదర్శన శాలలు గానే కనిపిస్తారు. వారి దృష్టిలో స్త్రీలంటే రెండు వక్షోజాలు, రెండు జఘనాలు మాత్రమే. వారి చూపులు స్త్రీల నెలా ఇబ్బంది పెడతాయో కేవలం స్త్రీలు మాత్రమే రాయగలిగిన కవిత ‘చూపులు’. స్కూలుకు వెళ్ళే విద్యార్ధినులను, ఉద్యోగాలు చేసే స్త్రీలను, రోడ్డు మీద నడిచే మహిళలను మగవారు చూసే చూపులు, ఆకలి చూపులు, కామపూరితమైన వికృతమైన చూపుల గురించి- ‘రెండు కళ్ళనుంచి/ చూపులు/ సూదుల్లా వచ్చి/ మాంసపు ముద్దలపై/ విచ్చల విడిగా తిరుగుతూ ఉంటాయి’ అని జయప్రభ వర్ణిస్తారు. బడికి వెళ్తున్నా, గుడికి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, ఆఫీసుకు వెళ్తున్నా చూపులు ఆడవాళ్ళ శరీరాల మీద గాయాలు చేస్తూనే ఉంటాయి. ‘బస్సులోను/ క్లాసు లోనూ/ వేసే ప్రతి అడుగు వెనకా/ శరీరంలోని ఏదో ఒక భాగాన్ని/ గాయం చేస్తూ/ విషపు చూపులు గుచ్చుకుంటూనే ఉంటాయి’ అంటూ పురుషుల చూపులు పడతుల హృదయాలనెలా ముక్కలు చేస్తాయో వర్ణించిన కవిత ఇది. అలాంటి చూపులను సహించలేని స్త్రీలు అలాంటి పురుషులను ప్రతిఘటించాలనుకుంటారు. అందుకే ఈ కవయిత్రి ‘ఈ దేశంలోని ఆడదానికి/ వళ్ళంతా ముళ్ళుండే రోజు/ ఎప్పుడొస్తుందా అని’ ఎదురు చూస్తుంది. పిల్లల్ని కనే ప్రక్రియ ఎంత నరకమో ఆ స్థితిలో ఆమె పరిస్థితి ఎంత భయంకరమో కొండేపూడి నిర్మల ‘లేబర్‌ రూం’ కవితలో ‘ప్రపంచంలోని నరకమో/ నరకంలోని ప్రపంచమో/ త్రీడీలో చూస్తున్నట్టే ఉంటుంది’ అంటూ పరాకాష్ఠకు చేరిన బాధను వర్ణించిన తీరు వర్ణనాతీతం. తప్పనిసరి పరిస్థితిలో పిల్లలు వద్దనుకొని అబార్షను చేయించుకొని పరితపించే కొందరి తల్లుల మానసిక బాధను అబార్షను స్టేట్మెంట్లో పాటిబండ్ల రజని ‘నీకు పంచేందుకు రక్తం లేకనే కదా/ నిన్ను పెంచేందుకు తీరిక లేకనే కదా/ నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదనే గదా, నేన్నిన్ను వద్దనుకొన్నది/ నా టెంపరరీ ఉద్యోగమూ, ఆరోగ్యము, నీకు మరణశిక్షను ఖాయం చేస్తే/ తల్లడిల్లిన తల్లి మనసు అయ్యో/ పాలింకిపోవడానికికున్నట్టు/ మనసింకిపోవడానికి/ మాత్రలుంటే ఎంత బావుండు’ అని ఆక్రోశిస్తారు.

స్త్రీవాద కవితల్లో మరో ప్రముఖ కవిత వంటిల్లు. సమాజంలో వంటిల్లు స్త్రీలకు, ముందు గది పురుషులకు కేటాయించారు. మంచి స్త్రీకి కితాబు ఏమిటంటే మంచి మంచి వంటలు బాగా చేసి ఇంట్లో వాళ్ళను మెప్పించడము. ఏ కాలమైనా ఈ లక్షణం మాత్రం మారదు. ప్రవరుడు తీర్థయాత్రలు చేసి హిమాలయ సౌందర్యాలను ఆస్వాదిస్తే అతని భార్య మాత్రం అరుణాస్పద పురంలోనే ఉండి ‘వండ నలయదు వేవురు వచ్చిరేని’ అని వంటింటికే అంకితమవుతుంది. నల భీమ పాకమని మగవారి వంటలు ప్రశస్తికి వచ్చినా ఆ నల భీముల పాకశాస్త్ర ప్రావీణ్యం కొన్ని సందర్భాలకు మాత్రమే పరిమితం. ‘అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది’ అంటూ వంటింటి రహస్యాల్ని విప్పి చెప్తారు విమల. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి/ అయినా చివరికి వంటింటి గిన్నె లన్నిటిపైనా/ మా నాన్న పేరే’ అని పచ్చి నిజాన్ని చెప్తారు. వంట చెయ్యడం, వడ్డించడంలోనే రోజులో చాలా సమయం గడిచిపోతుంది స్త్రీలకు. చదవడానికే, రాయడానికీ దేనికీ సమయముండదు. అందుకే ‘ఎంత అమానుషమైందీ వంటగది? మన రక్తం పీల్చేసి మన ఆశల్నీ, కలల్నీ కాజేసి/ కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న రాకాసి గద్ద ఈ వంటిల్లు’ అని వంటిల్లు ఎలా స్త్రీల శక్తుల్ని ధ్వంసం చేస్తుందో చెప్తారు. మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం/ గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను ధ్వంసం చేద్దాం రండి’ అంటూ వంటిళ్ళలోనే జీవితమంతా అంకితమైపోయిన స్త్రీల గురించి ఘాటైన చురకలు వేస్తారు. లావుగా ఉన్నవాళ్ళు సన్నగా మారాలని, నల్లటివాళ్ళు తెల్లగా మారాలనే నేపథ్యంలో ఎంత హింసను అనుభవిస్తున్నారో ‘సౌందర్యాత్మక హింస’లో ‘మన మంటే 34, 24, 35 కొలతలమైన చోట, మొటిమలు మొలవడం, జుట్టు రాలడం/ నడుం సన్నగా లేకపోవడమే/ మన నిరంతరాందోళలైన చోట/ దైహిక సౌందర్య పిపాస యే/ మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట/ ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా!’ అని సకల స్త్రీల బాధల గురించి విమల వ్యాఖ్యానిస్తారు.

స్త్రీవాద రచయిత్రులు చాలా మంది వివాహ వ్యవస్థలోని అసమానతల గురించి, ఎంత సేపూ భార్యలు మాత్రమే సర్దుకు పోవడం గురించి, దాంపత్యంలోని బోలుతనం గురించి ఎన్నో కవితల్లో విప్పి చెప్పారు. ‘సర్దుకుపో ఈ నాలుగక్షరాలే/ స్త్రీని అగ్నికాహుతి చేసే సాధనాలు’ అని ఈ సర్దుకు పోవడం స్త్రీలకే ఎందుకు పరిమితం కావాలని ప్రశ్నిస్తూ ‘నీటిలోనే జీవిస్తుంది చేప/ కాసేపు నేలపైన ఉండమంటే/ నశిస్తుంది మరుక్షణమే/ నింగిలో విహరించే పక్షిని/ కాసేపు సర్దుకో నేలపైనే ఎగురు’ అంటే ఎంత అసహజమో ఈ సర్దుకు పోవడం కూడా అంతకష్టమైనదే అని మందరపు హైమవతి తన ‘సర్దుకుపో’ కవితలో వాస్తవ స్థితిని వివరిస్తారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో తెలిపే సిలబస్‌ను గూడ పురుషులే రూపొందించారు. స్త్రీలను ప్రాణ పరిమళంతో అణువణువు స్పందించే మనుషులుగా గాక ఒక బానిసగానో, ఒక ఆటబొమ్మగానో, ఒక విలాసవస్తువుగానో చూసే సంఘం గుండెల్లో ప్రశ్నల బాణాలు సంధిస్తూ ‘ఎన్నాళ్ళు ఈ పూర్వకాలపు పాఠాలు/మనసును గుర్తించలేని పాతకాలపు భావాలు’ అని నిలదీస్తుంది మందరపు హైమవతి. ‘అలా పగలబడి నవ్వడం తప్పు గదూ/ అధరాలపై చిరు దరహాసమే సుందరం/ అలా భర్త మాటను ఎదిరిస్తావెందుకు/ సహనం స్త్రీకి ఆభరణం/ గృహిణికి శాంతమే భూషణం’ ఇలాంటి పాఠాలనీ సిలబస్‌నీ అందరం కలిసి మార్చలేమా అని ప్రశ్నిస్తారు. స్త్రీల దైహిక బాధల గురించి, మానసిక వేదనల గురించి, తరతరాలుగా యుగ యుగాలుగా పురుషులు చేసిన గాయాలనుంచి, అనేకానేక అనుభూతుల గురించి మనసులో గుచ్చుకునేటట్టు కవితలు అనేకంటే సంచలనాలను రచించారంటే బావుంటుంది.

స్త్రీవాద సాహిత్య ఉద్యమం మూడు దశాబ్దాలు దాటిన సందర్భంలో సమాజంలో ఎన్నో విజయాలు సాధించింది. సంఘంలో మార్పుని వేగంగా తీసుకువచ్చింది. అధికారులకైనా, మామూలు ప్రజలకైనా స్త్రీ అంటే ఉన్న చులకన భావం పోయింది. సభల్లో నైనా, నిజ జీవితంలోనైనా స్త్రీల గురించి ఎడా పెడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి జంకుతున్నారు. ఆధునిక పురుషులు చాలా మంది ఇళ్ళల్లో భార్యలకి సాయం చేస్తున్నారు. పిల్లల పెంపకంలో పాలు పంచుకుంటున్నారు. నేడు మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, బస్సుల్లోనూ, రైళ్ళలోనూ, సినిమాల్లోనూ చంటిపిల్లల్ని మగవాళ్ళు ఎత్తుకున్న దృశ్యాలే కనిపిస్తాయి. స్త్రీవాదం తెలుగు కవిత్వంలో ఎంత సంచలనం కలిగించినా ఆ తర్వాత ఉద్యమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. స్త్రీలందరూ ఒకటి గాదు. ధనవంతులు, అగ్రవర్ణాల స్త్రీలతో బాటు దళిత స్త్రీలు, అణగారిన వర్గాల స్త్రీలున్నారని, వాళ్ళ సమస్యలు వేరని ఆ స్త్రీల సమస్యల్ని ప్రతిబింబిస్తూ దళిత వాద సాహిత్యం వచ్చింది. ఆ తర్వాత ముస్లిం వాద సాహిత్యం వచ్చింది. నీలి మేఘాలు, గురి చూసి పాడే పాట సంకలనాలు కాకుండా ‘నల్ల పొద్దు’ మొదలైన సంకలనాలు వచ్చాయి. దేనికైనా బలమైన పునాది స్త్రీవాద సాహిత్యమే. సమాజంలో నేడు శ్రామిక స్త్రీలు అధికంగా ఉన్నారు. ఇళ్ళలో పనిచేసేవారు, ఫేక్టరీలలో, షాపుల్లో, ఇళ్ళ నిర్మాణాల్లో, పొలాల్లో, తోటల్లో శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎంతమందో నుంచి ఉన్నారు. వారి సమస్యలను చిత్రీకరిస్తూ, ఇంకా అట్టడుగు ప్రజల జీవనాల్లోకి వెళ్ళినప్పుడే స్త్రీవాద సాహిత్యం బలోపేతమవుతుంది.

1993 అక్టోబర్‌ 3న రావు బాల సరస్వతి గారు ప్రథమ నేపథ్య గాయని ‘‘కలలన్ని కల్లలై కరిగిపోయే వేళ/ దారి చూపే పెద్ద వెలుగా రావే/ దారి వెలిగించ రావే!’’ అని పాడుతూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కవితా సంకలనం తర్వాత స్త్రీ వాద కవిత్వం ఒక సామాజిక ఆమోదాన్ని పొందింది. స్త్రీ వాద కవిత్వాన్ని అర్థం చేసుకోవటమెలాగో చెప్పిన ‘నీలి మేఘాలు’ ఒక చరిత్ర. స్త్రీల సామూహిక స్వరం ఎంత బలమైందో, స్పష్టమైందో చెప్పిన కవితా సంకలనం ఇది. స్త్రీలపై అనేక ప్రాంతాలలో,అనేక రూపాలలో జరిగే హింసను నీలిమేఘాలు గర్జించి చెప్పి ఇంత కాలమైనా హింస మరింత దారుణంగా, నగ్నంగా జరుగుతూనే ఉంది. ‘‘బోస్నియానో,ఎల్‌ సాల్విడాలో చలకుర్తో, త్రిలోక్‌ పురీ వీధులో దండకారణ్యమో, ఎక్కడైతేనేం మనల్ని వివస్త్రల్ని చేయటం వాళ్ళ వినోద క్రీడయింది’’ – అన్న విమల కవిత గుజరాత్‌ గుండా మణిపూర్‌ వరకూ, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ నేడు విస్తరించింది. వినోద క్రీడ మహిళా క్రీడాకారుల శరీరాలతో వినోదిస్తోంది. సందర్భాలు మారాయి గానీ సంవేదనలు మారలేదు. ఒకవైపు మహిళలకు రాజకీయ భాగస్వామ్యం ‘దానం’ చేస్తూ మరో వైపు స్త్రీలను అదృశ్య హింసా రూపాలతో అష్ట దిగ్బంధనం చేస్తూ, రాజ్యం, పితృస్వామ్యం కలిసి ఆడుతున్న వినోద క్రీడల గురించి ఈ తరం కవయిత్రులు మాట్లాడాల్సిన, గొంతు విప్పి అరచి, ప్రతిఘటించాల్సిన అవసరం ఇంకా ఇంకా అవసరమని నిత్యం మనం ఎదురుచూసే సంఘటనల దృష్ట్యా అనిపిస్తోంది. .

తెలుగు సాహిత్యంలో ద్వేషాన్ని ప్రతిఘటిస్తూ, హింసను ఖండిస్తూ, వివక్షను ప్రశ్నిస్తూ చేసిన రచనా సంప్రదాయం వెయ్యేళ్ళకు పైగా ఉంది. తిక్కన, ధూర్జటి, అన్నమయ్య, మొల్ల… మొదలుకొని ఆ ప్రతిఘటనా గళాలు అనేక ఉద్యమాల మీదుగా ప్రయాణిస్తూ వస్తున్నాయి. అనేకమంది కవులు, కవయిత్రులూ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. అవే మన ఆశాగీతికలు. అవే మన రాబోయే వెలుగుల ఉదయాలు.

ప్రముఖ స్త్రీ వాద కవయిత్రి, రచయిత్రి అయిన శాంతి ప్రియ రచించిన ‘‘క్షతగాత్రులు’’ కవిత్వంలో ‘‘ఆకాశమంతా ఒలికిపోయన మా అనంత వేదనా హృదయం/ కమిలి గడ్డకట్టుకుపోయి/ నిజంగా నీలినీలిగా వుంది/ మా శరీరంపై మనసుపై/ జీవితంపై చివరకు మానవత్వంపైనే/ మగదురహంకారంతో నీవు చేసిన సముద్రమంత గాయం/ నిరంతరం రక్తాన్ని స్రవిస్తూ రక్తస్రావపు చరిత్ర మాత్రమే మాకు మిగిల్చింది’’ అంటూ సంకలనంలో 1988 సంపపలో మెహందీ స్త్రీలపై జరిగిన సంఘటనకు స్పందిస్తూ కవితను రాశారు. ‘‘ ఓ మగ మద మృగాల్లారా! మీరు మీ ఇళ్ళల్లోనే చావండి/ మీ భార్యల ఒళ్ళల్లో చావండి/ మీరు చావడానికి దేశంలో పరమ పవిత్ర స్థలాలెన్నో వున్నాయి/ మీ గృహ స్వర్గసీమలూ/ మీ మమతాలయాలూ/ మీ పవిత్రబంధాల పొదరిళ్ళూ వున్నాయి’’ అంటూ చనిపోవాలనుకున్నవారు వారి ఇళ్ళలోనో, భార్యలవద్దనో, తల్లుల దగ్గరో ఎక్కడైనా దేశంలో స్థలాలెన్నో వున్నాయి. మెహందీ స్త్రీలకు బతికించడం సుఖపెట్టడమే తెలుసునని చావడానికి తమ వద్దకు రావొద్దని వేడుకుంటారు. ఆడపిల్లగా పుట్టిన వెంటనే గుడివెనక విషమిచ్చి చంపే రాజస్థాన్‌ గ్రామాల్లోని దుష్టాచారం విని శ్రీమతి గారు ‘నిషిద్ధ స్వప్నం’ అనే కవితలో ’’అక్కడ భగవంతుడు కూడా నా మరణానికి మౌనంగా సిగ్నలిచ్చేస్తున్నాడు నే పుట్టినట్టు అమ్మ కలగన్న పాపానికి తిండిలేకుండా కృశింప చేసినప్పుడు అమ్మ మౌనంగా కుళ్ళిపోయినప్పుడు నేననుకున్నా.. నేనొక నిషిద్ధ జీవినే కాదు నిషిద్ధ స్వప్నాన్ని కాదు.’’ అంటూ పుట్టబోయేది ఆడపిల్లని తెలియగానే వారి మరణానికి భగవంతుడు కూడా సిగ్నలిచ్చేస్తున్నాడు. తల్లి తనను కోరుకుంటుంటే తండ్రి తనను నిషిద్ధజీవిగా చూడడం జరుగుతుంది. పుట్టే పాపను గూర్చి కలలుగనే స్వేచ్ఛ తల్లికి లేదని నిషిద్ధ స్వప్నాన్ని అయ్యానని ఆడపిల్లగా పుట్టడం వల్ల ఎదురయ్యే కష్టనష్టాల్ని గూర్చి ఇందులో వ్యక్తీకరించారు. బోస్నియా హెర్జిగోచినాలోని ముస్లిం క్రోషియన్‌ జాతుల్ని నిర్మూలించి తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడం కోసం సెర్బ్లు వేలాదిమంది స్త్రీలను చిత్రహింసలు పెట్టి నిర్భంద మాతృమూర్తులుగా మార్చారు.

ఈ సంఘటనకు స్పందిస్తూ కొండేపూడి నిర్మలగారు ‘బాధాశప్తనది’ అనే కవితలో ’’మానానికి సంబంధించినదంతా అవమానాల భాషే అయిన చోట చెప్పుకున్నకొద్దీ చొప్పకట్టలా ఎటో కొట్టుకుపోయే మారోదన ’’ అంటూ తల్లులు తమ బిడ్డల్ని రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. తిరస్కరించిన తల్లుల్ని నిర్భంద మాతృమూర్తులుగా చేయడంతో ఆ తల్లుల ఆత్మఘోష అతికఠోరంగా వుంటుంది. తన బిడ్డల మృదు చరణాల్ని పుట్టుకతోనే చంపడంతో జాతుల్ని నిర్మూలించడం జరుగుతుంది. ఆడదాన్ని అవమానించడానికి కారణాలెన్ని తీసినా, చిత్తశుద్ధిలేని విచారణలెన్ని జరిగినా అంతిమ తీర్పు ఏమి వస్తుందని నిర్భంద మాతృమూర్తులు అడగడాన్ని ఈ కవితలో వివరించారు. దాదర్‌ ఎక్స్ప్రెస్లో ఓ బాలిక అత్యాచారానికి గురైన సంఘటనకు స్పందనగా బి. పద్మావతిగారు ‘గాయపడ్డ పనిముట్టు’ అనే కవితలో ’’తల్లీ, పనిముట్టూ/ పిల్లల్ని కనే పడక ఎక్కే పనిముట్టూ/ కొత్తగా గాయపడ్డావా పనిముట్టూ’’ అంటూ అని ఆడదంటే పడక ఎక్కే పనిముట్టుగా, పిల్లల్నికనే యంత్రంగా భావించడం జరుగుతుంది. తెలిసీ తెలియని పసిపిల్లల్ని, యౌవనుల్ని కొందరు రాక్షసులు తమ ప్రవర్తనతో ఒళ్ళు తెలీని మత్తులో అమానుషంగా అనుభవిస్తుంటారు. ఇలాంటి అభాగ్యుల జీవన స్థితిగతుల్ని ఈ కవితలో వ్యక్తీకరించారు.

‘నీలి మేఘాలు కేవలం స్త్రీల భావోద్వేగాలను ఆవిష్కరించడమే కాక, భారతీయ, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో మహిళా ఉద్యమానికి శక్తివంతమైన బాహ్యరూపం. ఇందులోని ప్రతి కవిత ఒక అక్షర యుద్ధంగా, ఒక వేదన పిలుపుగా, ఒక ప్రతిఘటన జ్వాలగా నిలుస్తుంది. సంపాదకులు అన్నెమ్మ రాజయ్య నేతృత్వంలో రూపొందిన ఈ సంకలనం, 1993లో విడుదలై, అప్పుడు పేరొందిన ఆరభిందుకాలం స్త్రీవాద ఉద్యమానికి గొప్ప వేదికగా మారింది. ఇందులోని రచయిత్రులు సమాజం నిషేధించిన విషయాలను భయపడకుండా కలానికి తెచ్చారు. వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీల అనుభవాలు, శారీరక-మానసిక హింసలు, సామాజిక వలయాల్లోని వంచనలు, లైంగిక బాధలు, అణచివేతలు మొదలైనవి బహిర్గతమయ్యాయి. ఎటువంటి బంధనాలకూ భయపడకుండా, అనేక సంఘ సంస్కరణా అంశాలను ఇందులో స్థిరపరచారు. కవిత్వం ద్వారా ఒక సామూహిక కూత ఇచ్చే ప్రయత్నమే ఇది. సంప్రదాయ సాహిత్యంలో కనిపించని అసలు శబ్దాలు, గాఢమైన భావాలు, రుచి మార్చే రక్తరంజిత వాక్యాలు ఇందులో ఉన్నాయి.

ఈ సంకలనం వ్యతిరేకతను ఎదుర్కొంది, విమర్శలూ ఎదుర్కొంది. ఎందుకంటే ఇది అసౌకర్యాన్ని కలిగించేది, ఎదురుచూడనితనాన్ని ఆవిష్కరించింది. పసిగట్టిన బాధను బలంగా వినిపించేది. కానీ అదే దాని శక్తి. ఇది కవిత్వానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది‘అందం’కు భిన్నంగా ‘అవశేషాన్ని’ శోధించడమే కళ అని ప్రతిపాదించింది. ‘నీలి మేఘాలు’ లోని కవయిత్రులు స్వీయ అనుభవాలను రచనలుగా మలిచిన సందర్భాలు ఎంతో మానవీయంగా, రాజకీయంగా నిలిచాయి. ఇది వ్యక్తిగతాన్ని రాజకీయంగా మలిచిన ప్రబల ప్రకటన. ఇది లింగవివక్షతో కూడిన సమాజంపై ఒక నిరంతర ప్రశ్న. ఇది అణచివేత పై ఎదురు నిలబడే శబ్దం. ఈ సంకలనం కేవలం పాఠ్యంగా కాదు. ఇది ఉద్యమానికి మౌలిక గ్రంథంగా మారింది. ఇది చదువరుని కేవలం మనసులోనే కాదు, ఆలోచనల్లోనూ కదిలించగలదు.

సరే..స్త్రీ స్వేచ్ఛ కోసం స్త్రీవాదులే కాదు స్త్రీ జాతి మొత్తం కోరుకోవడం జరుగుతోంది. అందుకు ఈ గ్రంథంలో రచించిన కవయిత్రులు కాస్తంత ఊతం అయ్యారు. ఒక స్త్రీ స్వరం బయటకు వినిపించడానికి కూడా ఆలోచించే రోజుల్లో ధైర్యంగా వినిపించడం ఈ గ్రంథం మనకు చూపింది. తదనంతరం కాలంలో స్త్రీ జీవితాలలో అనేక మార్పులు వచ్చాయి. కోరుకున్నంత కాకున్నా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అదీ కాకుండా వంటిల్లు దాదాపుగా మూతపడ్డాయి. ఎప్పుడో సరదాగా ఒండుకోవడం తప్ప వంట పదం దాదాపుగా దూరమైందనే చెప్పాలి. ఉద్యోగం పురుష లక్షణం కాస్త స్త్రీ లక్షణం గా కూడా మారింది. సంపాదనలు పెరిగాయి. ఉన్నతి పెరిగింది. స్త్రీ పురుషులు ఒకరినొకరు ఇంట్లో కూడా పనిని పంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఒకప్పుడు స్త్రీల వివాహం సమస్యగా వుండేది కాస్త పురుషుల వివాహం జరగడమే సమస్యగా మారింది. అసలు పెళ్లే వద్దు కలిసి బతుకుదాం అంటూ స్త్రీలే అంటున్నారు కదా?. ఈ ఒక్కటే కాదు తాము అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తున్నారు.

ఇదీ కాక పెళ్ళిదాకా వచ్చి ప్రేమించినవారితో పారిపోవడం, పెళ్ళిపీటల మీద తాళి మరొకరితో కట్టించుకోవడం, ప్రతి చిన్న కారణానికి విడాకులు తీసుకోవడం అనేది చాలా సులువును చేసింది కూడా ఈ స్వేచ్ఛే కదా? అసలు వివాహం అనే పదానికే పురుషులు భయపడుతున్న దాఖలాలు ఎక్కడో లేవు. ప్రతి ఒక్కరి గుమ్మందాకా వచ్చేసాయి. అలాగని స్త్రీలు తమకిష్టమైన వారినైనా వివాహం చేసుకుంటున్నారా అంటే అదీ లేదు. వివాహమే వద్దనే స్థాయికి స్వేచ్ఛ వచ్చిందంటే ఆలోచించాల్సిందే. ఈ స్వేచ్ఛలో వివాహ వ్యవస్థ, మరోవైపు కుటుంబ వ్యవస్థ రెండూ ఆకృతిని కోల్పోయాయి కదా? ఒకవేళ ఒక స్త్రీ వివాహానికి సిద్దపడినా ఆ ఆమ్మాయి తల్లి అడ్డుపెడుతూ విధిస్తున్న ఆంక్షల మూలంగా తన కూతురు జీవితాన్ని కూడా అర్థం లేకుండా చేస్తోంది కదా? ఇపుడీ పరిస్థితి పట్ల స్త్రీవాదం ఏమంటోంది? ‘‘నీలిమేఘాలు’’ లో స్వేచ్ఛ లేని స్త్రీల జీవితాలను ఆవిష్కరణ చేసారు. అది ఆ కాలానికి తలమానికమైంది. మరి విచ్చలవిడితనంతో జీవితాల్ని తలకిందులు చేసుకుంటున్న జీవితాల పట్ల ఏమంటారు? ఈ అంశం పట్ల తప్పనిసరిగా స్త్రీవాదం కలాన్ని కదిలించాలి. ఎప్పటికప్పుడు ఉనికినే కోల్పోతున్న స్త్రీ సమాజం పట్ల స్త్రీవాదపు స్పందన వుండాలి కదా?..

September 16, 2025 1 comment
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

బహుజన రాజ్యాధికార పున: ప్రతిష్ట దిశగా ‘వంక తాడు’ ప్రతిజ్ఞ

by Bhandari Rajkumar September 15, 2025
written by Bhandari Rajkumar

తెలుగు సాహిత్యలోకానికి సుపరిచితమైన పేరు. కవిత్వపరంగా చాలా తక్కువ కాలంలోనే చాలా వేగంగా అందివచ్చిన తెలంగాణ పల్లెటూరి పిలగాడు. వస్తురూప కవిత్వం రాసినా, కవిత్వంలో మోడ్రన్ ఎక్స్ ప్రెషన్స్, పదజాలం వాడినా, మనిషిలోని ఉక్కపోతను కవిత్వం చేసినా అతని శైలి దినదిన ప్రవర్ధమానం. మూస ధోరణి శిల్పాల్ని బద్దలు గొట్టుకుంటూ కవిత్వాన్ని మెరపెడుతున్న గౌండ్లోల్ల పోరడు. గౌడ వృత్తిని  వారసత్వంగా తండ్రి అందుకోకపోయినా, మనువడిగా తాత ముత్తాతలను తల్సుకుని  తాటికమ్మలపై కావ్య కన్యని నాట్యమాడిస్తున్న గీశిగాడు తండ హరీష్ గౌడ్.
      ప్రతి కులానికి ఒక వృత్తి నేపథ్యపు తాలూకూ జీవితముంటుంది. వృత్తి పురాణం వుంటుంది. కులదైవం ఆరాధ్యుడుగా కొనసాగుతుంటాడు. అట్ల గౌండ్ల కులస్తులకు కాటమయ్య. కవి నోస్టాల్జియా నుంచి పుట్టికొచ్చిన కవిత్వం కొంతయితే, సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తున్న వాడిగా ఎదుగూ బొదుగూ లేని గౌండ్ల బతుకును చూసి చలించిన మనసుతో కొంత కవిత్వం రాసినట్టు ‘వంకతాడు’ దీర్ఘ కవిత చదివితే మనకు అర్థమయితది.
        కాటమయ్య తండ్రికి కల్లుసాక ఆరబోసి ‘వంకతాడు’ కల్లు రుశి జూడ వనంలోకి కదులుతుంటాం. 20 భాగాలుగా సవురిచ్చిన పొందికైన ‘కల్లు పటువ లెక్క అవుపిస్తది. మఖ్యంగా ఈ విభజన తన సౌలభ్యం కోసమే ఏర్పాటుజేసుకున్నట్టు అనుకోవచ్చు. చదివించే గుణం మెండుగా వున్న కావ్యం అవటం వల్ల తాటికమ్మపై పడ్డ   నీరా బొట్లు గొంతు తడిపి కడుపు సల్ల జేసినట్టు తృప్తిని అనుభూతి చెందుతాం. ఈ దీర్ఘ కవిత కవి ఎంచుకున్న వస్తువు యొక్క సకల పార్శ్వాలను తడుముతూ భవిష్యత్తు కార్యాచరణకు పురికొల్పే దిశగా కొనసాగటం మనం గమనిస్తాం.
            గౌండ్ల వృత్తి కారుల వేషధారణ, తాటి, ఈత వనాల్లో ఎదురయ్యే ప్రమాద సూచికలు, ఆటంకాలు, వివిధ రకాలుగా పేర్లు పెట్టబడ్డ చెట్లు, చెట్టెక్కడం, కల్లు తీయడం, కల్లు ఒంపడం, మండవ కాడి తతంగం, అతారెలు(పనిముట్లు , ఆయుధాలు), కల్లు అమ్మటంలోని కష్టాలు, తాటి ఉత్పత్తులైన ముంజలు, తాటిపండ్లు, గేగులు, కమ్మలు; గౌండ్లు పడే నిందలు- అసలు నిజాలు; ప్రపంచీకరణలో గౌడన్న జీవితం, బతుకు దైన్యం, గౌడతల్లుల గోస, వృత్తిలో స్త్రీ పాత్ర, వారి శ్రమ, వాడికదార్లు, కొత్తల(పైసల) రాకటపోకట, గతం, వర్తమానం, భవిష్యత్తు – కొత్త తరానికి దిశానిర్ధేశం చేయటం, కర్తవ్యబోధ, రేపటిపై ఆలోచన కల్గించటం, కార్యాచరణకు సంసిద్ధ పర్చడం – ఆధునిక జీవితం దిశగా వేసే అడుగుల అలికిడి మొ.న పలు పార్వ్వాలు ‘వంకతాడు’ ను ఒక్కొక్క జంగ ఎక్కుతాంటె  తారసపడి ముచ్చట పెడుతాంటయి.
           ప్రతీ వృత్తి కార్మికునికి తనవైన పనిముట్లు (అతారెలు) వున్నట్లే, గౌడ వృత్తి కార్మికులకు సుత కొన్ని అతారెలు వుంటయి. ఒక్కొక్క అతారెకు ఒక్కో ప్రాధాన్యత వుంటుంది. మోకు, ముత్తాదు, గుజి, పిల్లబద్ద, నెరుసు రౌతు, గీతకత్తులు, కావడి బద్ద, మండువ, పటువ, బుడ్డి, లొట్టి, కుండ, మెర, నాగ, పాట, బుచ్చ, నీరా, పోద్దాడు, పరుపుతాడు, పండుతాడు, కర్రపుల్ల, నాపతాడు, సప్పశేదు,నలుసు, మోదుగాకు, మర్రిఆకు, పొందిచ్చుడు, నురుసు, మొర్రి, మొదలు, బింకీలు, ముంతలు, పట్టు, దమ్ము, కమ్మ, ర్యాక, చెలుగుడు,మడ్డి, మట్ట మొ.న   పదజాలం గౌడులు నిత్య వ్యవహారికంలో వాడుతుంటరు.
*
‘నెరుసు’ను తెల్లని మల్లెపూలతో, గౌడన్ననే ‘కాటమయ్య’ అనడం; మోకు, ముస్తాదులను ఉదయం, సాయంత్రాలతో; తాడిచెట్టును
నిలువెత్తు నల్లనిరంగు రోడ్డు అనటం(metaphor); తాటిచెట్లను కన్నబిడ్డలతో, కల్లును దూదితో; కల్లు తీయటం సులువుగా నీళ్లు తాగటంతో ఔచిత్యవంతమైన పోలికలు చెప్పడం కనిపిస్తుంది. గీతవృత్తి అనేది తాళపత్ర విద్యగా, 65వ కళగా, గీత శాస్త్ర నిపుణతగా కవి రాతల్లో చెప్పబడింది. పారుతున్న ఏటి ఒడ్డున దొరికే నూరుగంటి రాయినో, పలుగు రౌతునో పట్టుకొచ్చి కత్తులను మెత్తగా నూరడానికి మెత్తని పౌడరసొంటి పొడిని తీస్తరు. దీన్ని నెరుసు!’ అంటరు. కొంచెం కొంచెం పిల్ల బద్ద మీద వేసుకుంట కత్తులు నూరుతరు.  
        నురుగు కల్లును తెల్లని నదిగా, మనసు గాయాలకు పూసే మందుగా, గౌడన్నను లోకాన్ని గిర్రున తిప్పే చక్రంగా వర్ణిస్తాడు. తాడెక్కడంలో ఎంతటి ఒడుపుతనం వుండాలో, కల్లు ఒంపడంలో అంతటి నేర్పరితనం సుత వుండి తీరాలి. ఆకుపట్టి దమ్ముపట్టడం ఒక కళ. మర్రి ఆకు, మోదుగాకు, పాట, ర్యాక యిలా ఒక్కో దాన్ని ఒక్కోతీరు వాడటం పరిపాటి. మర్రి ఆకుల కల్లుతాగుతే రిమ్మ వత్తదంటరు. మోదుగాకును సుట్టాకు అని సుత అంటరు. ర్యాక అనేది తాటాకు కమ్మజీరి ఒకింత నైపుణ్యంతో చేసి ఇచ్చేది. చిన్న పిల్లలు తాగటానికి సులువైనది. పట్టుకుంటే పడవలెక్క, తాగుతాంటే కడుపు సల్వ అంటుంటరు. ‘పాట’ వీటన్నింటికీ భిన్నమైనది. ఇది తాటిచెట్టులోని భాగమే. గీత గీయడానికి ముందు చెట్టును సాపు జేత్తానికే గొలను చెలుగుతుంటరు. కల్లు గీశినంక కుండల కల్లు పటువల పట్టుకరాంగనే ఒంపుతే అందులోని మలినాలు అట్లనే వుంటయి. అందుకే ఫిల్టర్  జేయడానికి ‘బుచ్చ’ వాడుతరు. మర్రి ఆకును పొట్లంగట్టినట్టు మల్శి అందులో తాటి పీచును బెట్టి కల్లు వంచుతరు. గశి, నుశి,నలుసు, మడ్డి,మలినం ఏదైనా సరే అందులోనే ఆగుతది. ఇక స్వచ్ఛమైన కల్లు సర్రున బొండిగ జారుతది. కల్లు తాగే చోటును ‘మండువ’ అంటరు. రోజూ తాగే వారిని వాడికదార్లు అని, వారికి పోసే కల్లును ‘వాడిక’ అని అంటరు. వీళ్లు నెలకో, సంవత్సరానికో ఒకసారి ధన రూపంగానో, ధాన్యరూపంగానో ‘వాడిక’ పైసలు ఇస్తుంటరు. గౌడ్ అన్న కల్లు పోసిన గుర్తుకోసం బొగ్గు ముక్కతో గీతలు గీసుకునేటోడు. కల్లు బాగా పారుకం ఉన్న రోజుల్లో మూడు మాట్ల తాడును ఎక్కుతుంటరు. అట్లా రోజుకు మూడుసార్లు గీయటం వల్ల కల్లుకు తీపిదనం వత్తది. అట్ల వచ్చిన తీపిదనపు కల్లును ‘వడగల్లు’ అంటరు. దీన్ని సాధారణంగా రాత్రి బాగా పొద్దుపోయినంక తీస్తరు. దీన్ని ఎక్కువమంది చాలా ఇష్టంగా తాగుతరు. వడగల్లు తాగితే పెయ్యంత గుమ్ముగుంటది. మనసంతా తేలిక అయితది. వడగల్లు దొరికినోడు అదృష్టవంతుడని సుత చెప్పుకుంటరు. ఇట్లా మూడు మాట్ల ఎక్కే క్రమంలో తిండి మీద ధ్యాస ఉండదు. ఎండనక, వాననక కల్లు గీయడం, నల్లకట్టెబడి పోవడం వెనుక కవి ఆంతర్యం ఇదే అనిపిస్తది.
         గౌడ్ అన్న వ్యక్తిత్వం గురించి చెబుతూ ‘పిట్ట మనసు నీది’ అంటాడు కవి. చెట్టును గుండెకాయగా, దైవంగా కొలిచే కాటమయ్య తండ్రిగా భావిస్తాడని చెబుతాడు. ‘సుట్టమొస్తే ఊరంతా పండుగ చేస్తవు’ , ‘గూడున్నంతవరకే ముడుసుకుంటవు’ వంటి స్టేట్మెంట్స్ ‘విరోధాభాస’గా ధ్వనిస్తాయి. అట్లనే తీయటి మాటలు చెప్పడం, మాటలతో కోటలు కట్టడం రాని వ్యక్తిగా అభివర్ణించడంలో ఎవ్వరినీ మోసం చేయనితనం, నిజాయితీగా బతికే వ్యక్తిగా గౌడ్ అన్నను చిత్రీకరించడం చూస్తాం. ఇందుకు విరుద్ధమైన మనుషులు కూడా సమాజంలో, మన నిజ జీవితంలో తారసపడొచ్చుగాక! ఒక్క చుక్క విషం పాలలో కలిసినా మొత్తం విషమనే చెబుతాం కదా! “పుట్ట మొదట్ల మొక్కి చెట్టెక్కడం” అంటే పుట్టలోని పాములకు హాని చేయకుండా మొక్కి తన పని తాను చేసుకుపోతాడని, ఇతరులకు కీడు చేయని మనస్తత్వం అని చెప్పడం ఇందులోని భావంగా గ్రహించవచ్చు.
            సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూనే గౌడవృత్తిని కొనసాగించేవారు ఉంటారు. కేవలం కల్లు గీయడం ద్వారానే పూట గడవదు. మూడు నాలుగు నెలల కంటే ‘కల్లు సీజన్’ ఎక్కువ ఉండదు. కల్లు పారని సమయం కొంతైతే, కల్లు పారినా వర్షం పడటం వల్ల పనికి రాకుండా పోయే కాలం వెరిసి గౌడ్ అన్న జీవితం దుర్భరం. కల్లు లేని కాలంలో మళ్లీ ఏదో ఒక పని వెతుక్కోంది…పూట గడవని పరిస్థితి. అందుకే “ఒక్క రోజు కూడా నాకా పెట్టవు” అంటాడు కవి. అంటే ‘పని ఎగ్గొట్టకపోవడం’ అని అర్థం. ఇగ కట్టలు కట్టలు కూడబెట్టుకునే స్థితి ఎక్కడుంటది?
          ‘నైరాశ్యం, ఊపిరాడనితనం, దుఃఖం, నిస్సహాయత’ మొదలైనవి ప్రపంచీకరణ నేపథ్యం లో గౌడన్న స్థితిగతుల గురించి చెప్పడానికి కవి వాడుకున్న పదజాలం. ఇవన్నీ నెగటివ్ సెన్స్ లో ఉన్నవే. విషాదాన్ని చెప్పడానికి పనికొచ్చేవే. కాళ్లకు గుజి బంధమేసుకుని, మోకుతో తాడిచెట్టును అమురుకుని ఎగబాకుతున్నట్టు కనిపించే దృశ్యం ఆహా! అనిపించినా, తన గుండె మాటున దాగిన వేదన మాత్రం అతడికే తెలుసు. అయితే ఈ క్రమంలో ఒంటిమీద, కాళ్ళ మీద, చేతుల మీద కాయలు కాసిన గుర్తులు కనిపిస్తాయి. ఇవి గౌడ వృత్తి కార్మికునికి తరతరాల వారసత్వపు ఆనవాళ్లు. అందుకే కవి”ఎంతెత్తు చెట్లెక్కినా జీవితపు మెట్లెక్క లేని నిస్సహాయతల పొగ పచ్చబొట్టు పొడిపించుకున్నట్టు కాళ్లకు చేతులకు బర్రలు తప్ప మిగిలిందేముంది?” అని ప్రశ్నిస్తాడు. అంతలోనే వాడికదారుల నవ్వుల మాటలు వింటాంటే “మనిషితనం నిటారుగా నిలబడ్డట్టున్న వెన్నెముకను తొడుక్కునేది,” అనే ఆశాభావాన్ని సైతం ప్రకటిస్తాడు. నెత్తురు నెరుసుడు తప్ప గొప్పగా ఏం మారలేదని వెంటనే ఉద్ఘాటిస్తాడు.” ప్రపంచకమంతా ఆకుమీదుగా గొంతులకు జారే” సన్నివేశాల్ని ఒడిసి పట్టుకుని కల్లు మండువే ఇంటికాడ రచ్చబండ అయ్యే తీరును పదిల పరుస్తాడు.
       గౌడ్ అన్న బతుకు గాలికి పెట్టిన దీపం అని వేరే చెప్పనక్కర్లేదు. గతంలో గౌడ తల్లులు, ఆడిబిడ్డలు తాడిక్కబోయిన భర్త ఇంటికి తిరిగి వచ్చేవరకు ‘తాళిబొట్టు’ తీసి పక్కన పెట్టే వారట. పైలంగా ఇంటికి చేరుకున్నాకే తిరిగి మెడలోకి చేర్చుకునే వారట. జీవితంలో కష్టసుఖాల్లో సగభాగం పంచుకునే అవ్వలు మండువకాడ, కల్లు అమ్మబోయినకాడల్లా ఎన్ని దెప్పి పొడుపులు, సూటిపోటి మాటలు, పరాశికపు సరసాలు,బనాయుంపులు ఎన్నింటినో భరించేటోళ్లు. ఇసువంటి దినదిన గండం బతుకులు ఎట్లా నెట్టుకొచ్చిన్రో కవి సూఛాయగా చెబుతాడు. ఒకలకొకరు పక్కన నిలబడబట్టే మరో తరానికి బాటపడ్డదనే నిజాన్ని బట్ట బయలు చేస్తాడు. “కల్లు ఒంపి నలుగురి దూప తీర్చే ఆ చేతులే లేకుంటే శ్రామిక సూర్యుడు ఏ దిక్కుకు నడిచెళ్ళేవాడో”  అని శ్రమకు పట్టం కడతాడు. ‘స్వరాలముల్లె, ఉద్యమ గొంతుక, మకుటం లేని మహారాజు’ వంటి ప్రతీకలతో తాడి చెట్టు ఎక్కిస్తాడు. కల్లు అమ్మే కష్టాలు చెబుతూనే మూడు కన్నుల చందమామలైన  ముంజలను నోటికి అందిస్తాడు. బహుజన వృత్తి కులాలకు నపరింత ముంజల రుశిని చూపెడతాడు. ‘ముంజల దేశానికి అధిపతివని, ఎండాకాలం పూట చల్లని ప్రిస్క్రిప్షన్ రాసే నాడీ శోధకుడివి’ అని వెన్నెల ధారాన్ని కురిపిస్తాడు. కవి రాతల్లో గౌడ్ అన్న దేవదూతవుతాడు. తాడిచెట్టు దేవతా వృక్షం అవుతుంది. కల్లు అమృతమై కురుస్తుంది. తాటి ఉత్పత్తులు చిన్నపిల్లలకు ఆట వస్తువులైన తీరును చూపెడతాడు. నాలుకలను ముత్తాదుకు ముడి వేసుకోవడం, తాడిచెట్టు ఉన్నంతకాలం గౌడ్ అన్న పేరు వినబడుతూనే ఉంటదని చెప్పటం అద్భుతం అనిపించకమానదు.
          గీత వృత్తి కార్మికులు కాలక్రమంలో బతుకుదెరువు కోసం వలసలు బోతున్న వైనాన్ని చెబుతూనే మరోపక్క”మరో చెట్టు పుట్టుక కోసం మట్టలను చెలుగుతూనే ఉంటవు”వంటి వృత్తి ధర్మాన్ని తలకెత్తుకునే వాక్యాల్ని సైతం పఠింప చేస్తాడు. ప్రభుత్వ పథకాలు ఏమేరకు దోహదపడ్డాయో, ఓట్ల పండుగప్పుడు ఏ విధంగా చర్యలో పాల్గొనే ఉద్వేగ పూరిత ఉత్ప్రేరకాలు అవుతున్నారో తెలుసుకోమంటాడు. పిల్లల భవిష్యత్తుకు ఇకనైనా మంచి కార్యాచరణ పథకం రచించుకోమని చెబుతూ- ఉన్న అవకాశాల్ని వినియోగించుకోవాలని, రాజకీయంగా ఎదగాలని, స్ఫూర్తిని రగిలించిన” సర్వాయి పాపన్న” వారసత్వాన్ని పున: ప్రతిష్ట చేయాలని, అందుకు బహుజనులందర్నీ ఒకే తాటిపై నిలుపాలని, భావి చరిత్రకు కొత్త పేజీని అందివ్వాలని, ధైర్యాన్ని నూరిపోసే, జాగృతం చేసే కవి హితబోధ విజయవంతం కావాలని కోరుకుంటూ “లెమ్మనంగనే పిలుపందుకునే ‘వంకతాడు” కు ప్రణమిల్లుతూ శనార్తులు.

September 15, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఉమ్మడి కుటుంబం బరువు కాదు

by Dr. Vasundhara September 15, 2025
written by Dr. Vasundhara

డాక్టర్. చిటికెన కిరణ్ కుమార్ గారి “ఎర్ర సూరీడు” కథకు సమీక్ష.

మనిషికి శిరస్సు ఎంత అవసరమో కథకు, శీర్షిక అంత విలువనిస్తుంది.
“ఎర్ర సూరీడు” అన్న పేరు కథకు తగినట్లు ఉంది. వేడి కిరణాలతో ఎర్రబారిన సూర్యునితో పోల్చి సుహాన్ అనే పిల్లవాని పాత్ర ఇందులో ముఖ్య పాత్ర కావడం గమనించాల్సిన విషయం!

ఈ కాలం కుటుంబాలలో జరిగే ఒక విషాదకరమైన విషయానికి ఈ కథ ప్రతిబింబం అని చెప్పవచ్చు.
తన చదువులు వివాహాలు అయ్యేంతవరకు పెద్దరికాన్ని పెద్దలకిచ్చి ఒక్కసారిగా ఆ పెద్దలను వారి వృద్ధాప్యంలో అందరూ ఉన్నా, ఎవరూ లేని పేదవారిగా మార్చడం నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దీనిని కథా వస్తువుగా తీసుకొని తనదైన శైలి లో ఒక పరిష్కార మార్గం దిశగా కథను నడిపించిన కిరణ్ కుమార్ గారు చక్కటి విషయానికి విత్తు నాటారు!!!
నేడు అపార్ట్మెంట్లలోని పరిస్థితిని చక్కగా చూపించి పరిష్కార మార్గం చెప్పారు. పక్కఅపార్ట్మెంట్లో ఏం జరిగినా మనకు తెలియదు, మనం పట్టించుకోము – ఇది నేటి పరిస్థితి. దీనికి చరమగీతం పాడమని చెప్తూ కథకు చక్కటి ముగింపు ఇచ్చారు.
వీటన్నిటికన్నా ముఖ్యమైనది:
“పిల్లల మనస్తత్వం పెద్దలు గ్రహించాలి” అన్న అతి ముఖ్యమైన మానవత్వానికి సంబంధించిన గొప్ప విషయం ఈ కథలో మనం గమనించాల్సిన మొదటి విషయం.
కిరణ్ కుమార్ గారు ఈ కథలో నిజంగా చెప్పాలంటే ఒక 10 ఏళ్లకుర్రాడుగా మారిపోయారు. ఈ కథలో హీరో ఓ 10 ఏళ్ల కుర్రాడు – అతడి పేరు సుహాన్.
సుహాన్ తండ్రి అరవింద్, తల్లి సంధ్య. కథ నడవడానికి కారకుడు సీతారత్నం.
సీతారత్నం అరవింద్ తండ్రి, సుహాన్ కు తాత, సంధ్యకు మామగారు.
వృద్ధులు పిల్లలు ఒకే రకం మనస్తత్వం కలిగి ఉంటారు అన్నది పెద్దల మాట. అందుకే సుహాన్ కు తాతయ్యంటే ఎంతో ఇష్టం. కానీ పెద్దల వాసన దగ్గర కూడా ఉండకూడదన్న ఈ నాగరికత ప్రపంచంలో సీతారత్నం గారి కోడలు సంధ్య, మామగారిని ఇంటికి దూరం చేసి వృద్ధాశ్రమానికి దగ్గర చేసింది. కానీ సుహాన్ మనసుకు మాత్రం వాడి తాతయ్యను దూరం చేయలేక పోయింది. ఇక ఇక్కడినుంచి కథ మొదలు!!!

ఈ కథ పేరు “ఎర్ర సూరీడు”. ఇది “నేటి నిజం” దినపత్రికలో ప్రచురింపబడింది.
“డాడీ, తాతయ్య ఎప్పుడు వస్తాడు?” అంటూ సుహాన్ ప్రశ్నించడంతో కథ ప్రారంభం.
దానికి ఆ పిల్లాడి తల్లి జవాబు –
“నీవైతే ఆయనను మళ్లీ తీసుకొచ్చావనుకో నా యొక్క అసలు రూపం చూపిస్తా…” అని భర్తను బెదిరించి, పిల్లాడిని చెవులు పెట్టి లాగుతూ –
“మరోసారి తాతయ్య తొండం అంటూ వెధవ వేషాలు వేసావ్ అనుకో, తోలు తీస్తా రా!” అంటూ సంధ్య పిల్లవాడిని తీసుకెళ్తుంది.
ఆ తల్లికి కొడుకు మీద కోపమో, మామగారి మీద అసహ్యమో ద్వేషమో – రెండూ ఈ సంభాషణలో తారాస్థాయికి చేరుకున్నాయి. ఇది కొన్ని ఇళ్లలో జరిగే సర్వసామాన్యమైన సంఘటన.
దీనికి కారణం కొంతవరకు బయట నుంచి వచ్చిన కోడలు స్థానంలో ఉన్న స్త్రీలే! వారికి వంత పలుకుతున్న వారి భర్తలు. కానీ అటు భార్యలను కాదనలేక ఇటు తల్లిదండ్రులను వదులుకోలేక మగవాళ్ళు నలిగిపోతున్నారన్న సత్యాన్ని కిరణ్ కుమార్ గారు కథాంతంలో సూచించారు.
సీతారత్నంలాంటి వారెందరో ఈనాడు తాము కట్టుకున్న సొంత ఇంట్లోనే స్థానం లేక వృద్ధాశ్రమాల పాలవుతున్నారు. అందుకే తల్లిదండ్రులు కూడా కొంత మెలకువగా తెలివితేటలతో తమ వృద్ధాప్యం గురించి జాగ్రత్త పడాలి. పిల్లల మీద ఆధారపడడం గాలిలో పెట్టిన దీపం లాంటిది. లేదా వారి దగ్గర ఉండాలి అనుకుంటే తమ ఆలోచనను, అధికారాలను, ఆశయాలను అన్నిటిని మూటగట్టి పక్కన పెట్టి పిల్లలను నూటికి నూరుపాళ్ళు అనుసరిస్తూ ఉండాలి!
ఈ కథలోని సుహాన్ లాంటి పిల్లలు కూడా ఇప్పుడు అరుదుగా ఉన్నారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు వీటి ప్రభావం వల్ల పిల్లలు వృద్ధుల పట్ల శ్రద్ధ చూపించడం లేదు. అలాగే పక్కింటి గొడవ పట్టించుకునే నాధుడే లేరు.
ఇలాంటి పరిస్థితులను బాగా గమనించిన కిరణ్ గారు కథకు తగ్గట్టుగా సంభాషణలను, సంఘటనలను రూపొందించి రక్తికట్టించారు. “ఎర్ర సూరీడు” అన్న పేరు పిల్లవాడికి, తాతగారికి తగినట్టుగానే ఉంది.
ఎర్ర సూర్యుడు అనేదానికి సంకేతంగా ప్రత్యేకంగా ఎర్ర వస్త్రాన్ని చూపించారు కిరణ్ కుమార్ గారు.
ఒక కథకు ఆయువు పట్లు వర్ణనలు, మచ్చుకు కొన్ని చూద్దాం:
“తండ్రి సీతారత్నమును తీసుకుని కారులో ఎక్కించుకొని తిరుగు ప్రయాణానికి బయలుదేరాడు అరవింద్. తిరుగు ప్రయాణంలో సూర్యుడు వెనక వైపు ఉండగా పక్కన తన తండ్రి సీతారత్నం వెలిగిపోతున్నాడు. పండు వారిన ఆ మడతల చర్మంతో ముఖంలో ఏదో ఆనందం…”
“పంజరం నుండి పక్షి బయటకు ఎగిరిపోయినట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్ తీసి తాతయ్య బుజాలను ఎక్కాడు సుహాన్!”
సంతోషంతో ఆనందంతో ఉన్నప్పుడు మనిషి ముఖం కొంత లేత ఎరుపులోకి రావడం సహజం.
సీతారత్నం గారికి మనవడిని చూడగానే ముఖంలో కొద్దిగా తేలిపోతూ ఎర్రని… ఎంతో ఆనందంతో తేలిపోయాడు… ఎర్ర సూరీడులా వెలుగుతున్న ముఖంతో!!!
సుహాన్ కు కోపం వచ్చినప్పుడు వాడు చేసిన పనులు – టీవీని, ఫ్రిడ్జ్ ని పగలగొట్టడం, పెద్దగా అరుస్తూ “నాకు తాతయ్య కావాలి, ఇప్పుడే కావాలి!” అంటూ కోపంతో చేసిన పనుల వర్ణనలు కథా వస్తువుకు బలాన్ని ఇచ్చాయి.
కొడుకు కోపం వాడి బాధ మొదట్లో తల్లిదండ్రులకు చికాకు కలిగించి, చుట్టుపక్కల వారిని “మీకేం పనులు లేవా? మీ ఇంట్లో మీరు తగలడండి…” అంటూ సంధ్య ఆవేశంగా మాట్లాడినప్పటికీ, సుహాన్ తండ్రి అరవింద్ లో మార్పు వచ్చి, కొన్ని నిష్టుర వాక్యాలు సంధ్యతో పలకడంతో –
మనుషుల్లో మానవత్వం కొన్ని సంఘటనల వల్ల మేల్కొంటుంది అన్న సత్యాన్ని నిరూపించారు.
పదిమంది రావడం, ఆ దంపతులను చివాట్లు పెట్టడం – ఇవన్నీ ఏ ఇంట్లో అయినా పెద్దలను నిరాదరణ చేసినప్పుడు నిజంగా జరిగితే, ఆ పెద్దలు ఎంతో గొప్ప సంతోషాన్ని, మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది.
ఈ కథ ఈనాటి సంఘంలో జరిగే సంఘటనకు దర్పణం లాంటిది. పిల్లలలో సూర్యుని వలె చురుకుదనం, స్వచ్ఛమైన మనసు ఉంటే ఆ సంసారంలో పెద్దవారికి పెద్దపీట వేయొచ్చని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సరిదిద్దడానికి పిల్లలే పూనుకోవాలని చెప్పే మంచి కథ.
ఇరుగుపొరుగు వారు కూడా అనాలోచితంగా ఆవేశంలో ఉన్న వ్యక్తులను లాలించి, దండించి మంచి మార్గంలో పెట్టాలని… ఈనాడు తాము ఆచరిస్తున్నదే రేపు తమ పిల్లలు ఆచరిస్తారని భార్యాభర్తలు తెలుసుకోవాలని…
ఈ కథలో రచయిత కిరణ్ కుమార్ గారు గట్టిగా స్పష్టంగా చెప్పడం వల్ల పాఠకులకు మంచి సందేశం అందించారు.
ఉమ్మడి కుటుంబం బరువు కాదని, కలిసి ఉంటే సంతోషాలను కోల్పోవడం జరగదని సత్యం చాటి చెప్పే కథ “ఎర్ర సూరీడు”.
రచయిత డా. చిటికెన కిరణ్ కుమార్ గారికి అభినందనలు!!!

September 15, 2025 5 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni September 14, 2025
written by Narendra Sandineni

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) అరణ్య రోదన కవితపై విశ్లేషణా వ్యాసం

ప్రముఖ కవి,ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన అరణ్య రోదన కవితపై విశ్లేషణా వ్యాసం.అరణ్య రోదన అంటే అరణ్యం యొక్క ఏడుపు లేదా ప్రకృతి విలాపం. అరణ్య రోదన అంటే – అడవిలో నిర్మానుష్యమైన చోట ఏడిస్తే ఆ ఏడుపును ఎవరు వినలేరు. ఇతరులెవరూ కూడా సహాయం చేయలేరు.ఈ నికృష్టమైన స్థితి వల్లే అరణ్యాల ఏడుపులు,వాటి బాధలు తీర్చే వారు లేక అరణ్య రోదనగా ఉన్నదని కవి భావించడం జరిగింది.ప్రకృతిలోని ఆర్తనాదం. పచ్చని చెట్లను నరికి వేయడం, జంతువుల ఆవాసాలను ధ్వంసం చేయడం వంటివి అరణ్యానికి నొప్పిని కలిగించి అది విలపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.అరణ్య రోదన అనేది మనుషుల నిర్లక్ష్యం,దోపిడీకి ప్రకృతి వ్యక్తం చేసే మౌన విలాపం. చెట్లను నరికి వేయడం వల్ల పక్షులు గూళ్లు కోల్పోతాయి.అడవులు నాశనం కావడం వల్ల జంతువులు ఆవాసం లేక వలస వెళ్లాలి.నదులు ఎండిపోవడం,వర్షపాతం తగ్గిపోవడం,భూక్షీణత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఈ కవితలో ప్రకృతి నాశనం పట్ల ఒక హెచ్చరికను అందించారు. అరణ్యంలో ఏడిస్తే వినే వారు ఎవ్వరూ లేని పరిస్థితి.కవి సామాజిక సమస్యలపై తన వేదనను వ్యక్తం చేసినా సమాజం వినకపోతే అది అరణ్య రోదనగా మిగిలిపోతుంది.అరణ్య రోదన ప్రకృతి రోదన కూడా.ప్రకృతి పట్ల మనిషి నిర్లక్ష్యం,సమాజం యొక్క నిర్లిప్తత,మనిషిలోని మౌనవేదన అన్నీ అరణ్య రోదన అనే పదబంధం చేత వ్యక్తం అవుతున్నాయి.అడవులు దయనీయమైన స్థితికి చేరినాయి.అటవీ శాఖ వారు చేష్టలుడిగిపోయి చూస్తున్నారు.అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.మానవుల మనుగడకు చెట్లు ప్రధానం.ప్రతి ఒక్కరు విరివిగా చెట్లను నాటాలి.అట్టి నాటిన చెట్లను పరిరక్షించాలి అని పర్యావరణవేత్తలు గొంతు చించుకొని చెప్పుచున్నారు.మరో ప్రక్క అక్రమార్కుల ఇష్టా రాజ్యం కొనసాగుతోంది. అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లుగా చెట్లను నరుకుతూనే ఉన్నారు.అటవీ శాఖ వారు సరైన చర్యలు తీసుకోవడం లేదు.అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు.అందు వల్ల అడవుల దుస్థితి చక్కబడడం లేదు.ఈ దారుణమైన స్థితి వల్లే అరణ్యాల ఏడుపులు,బాధలు తీర్చే వారు లేక అరణ్య రోదనగా ఉన్నది అని కవి భావించడం జరిగింది.అరణ్యాలు నశించడం,అడవి జంతువులు జనుల నివాసాలలోకి రావడం,నీళ్ళ ట్యాంకులో పడి కోతులు దుర్మరణం పాలైన వార్తల చేత అశేష ప్రజానీకం తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనైంది.ఇట్లాంటి దారుణ సంఘటనలను లోకంలో ఎవ్వరు ఇష్టపడరు.అందరి మనస్సులలో తీవ్రమైన ఆవేదన నెలకొన్నది.కొందరి దుర్మార్గపు చేష్టల వల్ల అడవులు తగ్గిపోయి కోతులు జనుల ఇండ్లలోకి వచ్చి నీళ్ల ట్యాంకులో పడి చనిపోవడం కవి నారాయణ రెడ్డి (మానారె)హృదయాన్ని ద్రవింపజేసింది. వేదనలో నుండి కవిత్వం పుడుతుంది అంటారు.ఆ వేదనలో నుండి కవిత పురుడు పోసుకుంది.ఈ కవితలో ప్రకృతి సంపద, అటవీ జీవ వైవిధ్యం,మనిషి లోభం,వాని ఫలితంగా పర్యావరణానికి కలిగే హాని హృదయానికి హత్తుకునేలా చెప్పబడింది.
“చీమలు దూరని చిట్టడవులూ/కాకులు దూరని కారడవులూ/కథల పుస్తకాలలోనే కాదు/ పృథులమైన పృథ్వి అంతటా ఉండేవి/ అంటున్నారు.చీమలు కూడా ప్రవేశించ లేని చిట్టడవులు పూర్వం ఉండేవి.కాకులు కూడా చేర లేని మిక్కిలి దట్టమైన అడవులు ఉండేవి.ఇవి కేవలం కథల్లో ఉండే కల్పితాలు కాదు.నిజంగా అలాంటి అడవులు భూమి మీద ఉండేవి అని మనకు గుర్తు చేస్తున్నారు.విస్తృతమైన ఈ భూమి విస్తారమైన అడవులకు నెలవు. ఈ కవి ప్రకృతి యొక్క స్వర్ణ యుగం నాటి అడవుల పూర్వ రూపాన్ని ఈ కవితా పంక్తులలో అద్భుతంగా చిత్రించారు. పుస్తకాల్లో రాయబడిన కల్పన కంటే ప్రకృతి సహజ సౌందర్యం మిన్న అని కవిత ద్వారా తెలుపుతున్నారు.

“సింహాల రాచరికపు కొలువులూ/జంతు సమూహాల నెలవులూ/అడవుల నిండా ఉండేవి/అంటున్నారు. ఆనాటి అడవులు అనేక రకాల జంతు సమూహలతో కళకళలాడుతూ ఉండేవి.వన్య జీవులు ఒకప్పుడు తమ సహజ పరిసరాల్లో అధికంగా ఉండేవి.సింహాలు,పులులు,కోతులు, పక్షులు,అడవులలో స్వేచ్ఛగా తిరుగాడుతూ కనిపించేవి.కవి ఆ కాలపు జీవులు కలిసి జీవించే తీరును కవితలో చూపించారు.ఆనాడు జీవజాల సమృద్ధితో సింహాలు,పులులు,ఎలుగుబంట్లు, కోతులు,పక్షులు స్వేచ్ఛగా కలిసి జీవించే వాతావరణం నెలకొని ఉండేది.
“పక్షుల కిలకిలా రావాలు/చెవులకు విందు చేసేవి/ సెలయేరుల సరిగమలు/సరసంగా వినిపించేవి/ అంటున్నారు.పక్షుల కిలకిలమనే ధ్వనులు,పరుగెత్తే వాగుల నీటి శబ్దం,ప్రకృతిలోని సంగీతం మనస్సును పులకింపజేస్తుంది.ప్రకృతి కేవలం ఆహ్లాదాన్ని ఇచ్చేది మాత్రమే కాదు.ప్రకృతి మనస్సును రంజింప చేస్తుంది.పక్షుల స్వరాలు – చెవులకు విందుగాను, వాగుల శబ్దం – సంగీతంగాను చూపించారు.
“మిసిమి చివురుల కొమ్మలతో/గుసగుస లాడే గాలి తెమ్మెరలు/పచ్చదనపు పసిమి సొబగులతో/ అడవులు నందనవనంలా మురిపించేవి/ అంటున్నారు.అడవుల్లో ఎటు చూసినా పచ్చదనంతో కూడిన చెట్లు చేమలతో ప్రకృతి కాంత పరవశిస్తున్నది. అడవిలో గుబురుగా పెరిగిన చెట్లు గాలికి అటు ఇటు ఊగే కొమ్మల సయ్యాటల సౌందర్యంతో అలరారేవి.ప్రకృతి చూడ చక్కగా నందనవనంలా దర్శనమిస్తుంది. మనసును కట్టి పడేసే అందాలు,అడవులలో చిందులు వేస్తున్నాయి.ఇందులో కవి చిత్రణ అద్భుతంగా ఉంది.గుసగుసలాడే గాలిని సజీవంగా చూపించిన తీరు బాగుంది.
“పరికి పండ్లు,పాల పండ్లు,తునికి పండ్లు/వెలగ పండ్లు,మొర్రి పండ్లు,మారేడు పండ్లు/రేగుపండ్లు,గొట్టి పండ్లు,ఊడుగ పండ్లు/పరెం పండ్లు,రాగి పండ్లు, బలుసు పండ్లు/సీతాఫలం,కొండ మామిడి,కొండ నేరేడు/మొదలైన పండ్లకు కొదువే లేదు/ అంటున్నారు.అడవులలో అనేకమైన పండ్లు మెండుగా లభించేవి.పూర్వం అడవులు ఆహారానికి నిల్వ గదుల్లా ఉండేవి.కవి సమృద్ధితో కూడిన ప్రకృతిని,వివిధ రకాల పండ్లతో నిండిన అటవీ సంపదను అద్భుతంగా చిత్రించారు.అడవిలో లభించే పండ్ల జాబితాను చక్కగా వివరించారు
“అడవులలో దుంపలు ఎన్నో దొరికేవి/నార దుంపలు,అడవి ఏలేరి దుంపలు/నాగేల్ మాటి దుంపలు/నోస్కో మాటి దుంపలు/తీగ దుంపలు, నెమలి గడ్డలు/ఇలాంటివి ఇంకా ఎన్నో దొరికేవి/ అంటున్నారు.పండ్లతో పాటు పిండి పదార్థాలు గల అనేక విధములైన దుంపలు సమృద్ధిగా లభించేవి. ఆ కాలంలో జంతువులకు,ఆదివాసులకు ఆకలి సమస్య దాదాపుగా ఉండేది కాదు. అక్కడ నివసించే ఆదివాసుల జీవితం ఏ లోటు లేకుండా గడిచి పోయేది.ప్రకృతి తల్లి అన్ని విధాల తన బిడ్డలకు ఆహారాన్ని అందించి పోషించేది.
“ఇప్పపువ్వుకు కొరతే లేదు/తెల్లారేసరికి పచ్చని పసిమిలా/చెట్ల కింద పరుచుకొని రాలిపడేవి/ అంటున్నారు.ఇప్పపూలను, పాల పండ్లను,తునికి పండ్లను బాగా ఎండబెట్టి గుమ్ములలో భద్రపరుచుకునే వారు.ఇప్ప పువ్వులతో కుడుములు చేసుకుని తినేవారు.ఇప్ప పూలతో సారాను తయారు చేసుకొని ఇష్టంగా త్రాగే వారు.
ప్రకృతి మాత పలు రకాల విరిసిన పుష్పాల సుగంధాలను వెదజల్లుతూ కనువిందు చేసేది.అడవుల్లో సమృద్ధిగా లభించే ఇప్ప పువ్వులను పచ్చని పసిమితో పోల్చడం మనోహరంగా ఉంది.
“కల్తీ లేని జుంటి తేనెకు/అడవులే పుట్టినిండ్లు/ అంటున్నారు.అడవుల్లో సహజమైన తేనె లభించేది.ఇది ప్రకృతి మాత ఆటవికులకు ప్రసాదించిన అమృతం.ఆనాడు ప్రకృతిలో లభించే పండ్లు,తేనె,అటవీ ఉత్పత్తులు కల్తీ రహితంగా ఉండేవి.ఆ అడవి ప్రదేశం పచ్చని చెట్లతో,పారే వాగులతో కూడిన మనోహర దృశ్యాలతో కళకళలాడుతూ ఉండేది.వివిధ రకాలైన పండ్లు, దుంపలు,పూలు,తేనె మొదలైనవి సమృద్ధిగా లభించేవి.
“అడవులు క్షుధార్థుల ఆకలి తీర్చేవి/ సెలయేరులు దాహార్తుల దాహం తీర్చేవి/అంటున్నారు.అక్కడ అడవుల్లో నివసించే జంతువులతో పాటు మనుషులు ఆహారం,నీటి కోసం ప్రకృతి పైనే ఆధార పడి ఉండే వారు.అడవిలో లభించే పండ్లు,దుంపలు ఆకలిని తీర్చేవి.సెలయేరులలోని నీరు దప్పికను తీర్చేది.ప్రకృతి సౌభాగ్యం సమస్త ప్రాణికోటి జీవనానికి సహకరించేది.
“పులులు,సింహాలు,ఎలుగుబంట్లను/ కోతులు, కొండముచ్చులు,కుందేళ్ళను/దుప్పులు,మెకాలు, మహిష జాతులను/ నెమళ్ళు,చిలుకలు, పావురాలను/గువ్వలు,గోరువంకలు,గ్రద్దలను/ మృగజాతులను పక్షుల సంతతిని/అన్నింటిని అడవులు ఆదరించి/ఆహారాన్నిచ్చి దప్పిక తీర్చేవి/ అంటున్నారు.కవి ఇక్కడ వన్య జీవులు ప్రకృతిలో సమూహాలుగా జీవితాన్ని గడపడాన్ని చక్కగా చూపించారు.అడవి కేవలం మనుషులకే కాదు. అడవి తల్లి అన్ని జీవజాతులను తన ఒడిలో పెట్టుకుని పోషించడంతో పాటు రక్షణ కల్పించేది అని గుర్తు చేస్తున్నారు.
“అడవి బిడ్డలకు ఆ వనమాత/అవని తల్లి అన్నింటిని ఇచ్చేది/అంటున్నారు.కవి అడవిని తల్లిలాగా వర్ణిస్తున్నారు.అది తన బిడ్డలైన జంతువులు,పక్షులు,మనుషుల అవసరాలన్నిటిని తీర్చేది అని చెబుతున్నారు.ప్రకృతి పోషించే తల్లి. ఇందులో సందేహానికి తావు లేదు.అది అన్ని జీవజాతులను పోషిస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు.
“అడవి తల్లికి పులులు,సింహాలు/చెంచులు, గోండులు రక్షణ కవచాలు/ అంటున్నారు.అడవి తల్లిని పులులు,సింహాలు,చెంచులు, గోండులు, ఆదివాసులు రక్షణ కవచంగా ఉండి చక్కగా కాపాడుకునే వారు‌.ప్రకృతిని రక్షించేది కేవలం ప్రభుత్వాలు తయారు చేసిన చట్టాలు మాత్రమే కాదు.ప్రకృతి ఒడిలో మమేకమైన పులులు,సింహాలు మరియు ఆటవికులు అడవులను రక్షిస్తున్నారు అని కవి ఘంటాపథంగా తెలియ జేస్తున్నారు.
“ఆటవికులు అడవులను కన్నతల్లిలా/కళ్ళలో పెట్టుకుని కాపాడుకునే వారు/గుడిసెలు కట్టు కోవడానికో/గొడ్డలి కామకో నాగటి దుంపకో/వంట చెరుకుకో నెగళ్ళ కొరకో/ఎండి మోడు వారిన చెట్లను తప్ప/ఏ పచ్చని చెట్టునూ నరకని/ప్రకృతి ప్రియులు ఆటవికులు/అంటున్నారు.ఆదివాసులు వీలైనంత వరకు తమ అవసరం కొరకు ఎండి మోడు వారిన చెట్లను మాత్రమే ఉపయోగించే వారు.తమ అవసరాలైన గుడిసెలు కట్టుకోవడానికి,నాగటి దుంపలకు, గొడ్డలి కామలకు,వంట కట్టెలకు,ఇంటి ముందు చలి మంటలకు,ఎండి మోడు వారిన చెట్లను మాత్రమే వాడుకునే వారు. అంతే గాని ఏ ఒక్క పచ్చని చెట్టును నరికే వారు కాదు.పచ్చని అడవులను ఆటవికులు కంటికి రెప్పలా కాపాడుకునే వారు.ఆదివాసులు పచ్చని చెట్లను నరక వద్దు అనే నియమాన్ని ఆచరించిన వారు. ఆదివాసుల సుస్థిరమైన జీవన విధానం అందరికీ ఆదర్శంగా నిలవాలనే సందేశం ఈ కవితలో స్పష్టం చేయబడింది.
“స్వార్ధపరులైన నాగరికుల ప్రవేశంతో/అటవీ సంపదకు ఆపద వాటిల్లింది/అంటున్నారు. ఆటవికులు ప్రకృతిని అమితంగా ప్రేమించే వారు. మధ్యలో లోభులైన నాగరికులు అడుగు పెట్టడం వల్ల అడవుల వినాశనం మొదలైంది.నాగరికులైన స్వార్థపరులు ప్రకృతిని నాశనం చేస్తున్నారు అనే వాస్తవాన్ని కవి భావాలలో వ్యక్తం అవుతున్నది.
“అమాయకులైన గోండు గూడాలల్లో/కోయ గూడాలల్లో,చెంచు గూడాలల్లో/అమ్మకాలు కొనుగోళ్ళు మొదలైనాయి/అంటున్నారు.ఏ పటాటోపం హంగులు ఆటవికులకు తెలియదు. సాదా సీదాగా జీవించే ఆదివాసుల గ్రామాల్లోకి వాణిజ్యం ప్రవేశించడంతో వారి జీవితాల్లో పెను మార్పు వచ్చింది.వాణిజ్యం ప్రవేశించడం చేత, వర్తకుల దోపిడీ విధానం వల్ల ఆదివాసులు బానిసత్వం చెరలోకి నెట్టబడ్డారు.దానితో ప్రకృతి సంరక్షణకు ముప్పు ఏర్పడింది.
“అటవీ సంపద కొల్లగొట్టడానికి ప్రణాళికలు సిద్ధమైనాయి/అడవి జంతువులను వేటాడడం/ మాంసాన్ని అమ్ముకోవడం మొదలైంది/పులి చర్మం, జింక,దుప్పి చర్మాలకు/చీకటి అంగళ్ళలో గిరాకీ పెరిగింది/అంటున్నారు.అడవిలోని జీవ రాశిని, విలువైన కలపను కొల్లగొట్టడానికి ప్రణాళికలు సిద్ధం అయినాయి. విశృంఖలంగా వన్య జీవుల వేట కొనసాగింది.జంతువులను చంపి మాంసాన్ని అమ్ముకోవడం,జంతువుల చర్మాలను అమ్మడం మొదలైంది. విపరీతమైన స్వార్థం మనుషులలో పెరిగింది.స్వార్థపరుల దుందుడుకు చేష్టలతో మూగ జీవులైన జీవజాతులు నాశనం చేయబడ్డాయి.ఇది అత్యంత క్రూరత్వం అని కవి తెలియజేస్తున్నారు.
“కలప రవాణా నగరాలకు మొదలైంది/ కర్కశ మనస్కులైన మనుషులు/క్రూర మృగాల అవతారమెత్తారు/అంటున్నారు.పెరుగుతున్న జనాభా కారణంగా అతి వేగంగా నగరాలు విస్తరించాయి.అట్టి నగరాల నిర్మాణం కోసం కలప దోపిడీ విచ్చలవిడిగా పెరిగింది.మనుషుల హృదయాల్లో క్రూరత్వం చోటు చేసుకున్నది అని తెలియజేస్తున్నారు.ఇందులో మనిషి లోభత్వం – క్రూర మృగాల కంటే ప్రమాదకరమైనది అని చూపించబడినది.
“దిన దినం అడవి మాయమై పోయింది/మృగ పక్షుల సంతతి సన్నగిల్లింది/అంటున్నారు.అడవిలో చెట్లను నరకడం,జంతువులను వేటాడి చంపడం నేరం.చట్టాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళ అలసత్వం, నిర్లిప్తత వల్ల అటవీ వినాశనం పెరిగింది.వాస్తవంగా వన్య జీవుల సంఖ్య తగ్గిపోవడం జరిగింది. జంతువుల సహజ జీవనానికి ముప్పు ఏర్పడడం, పర్యావరణం దెబ్బ తినడం సరియైనది కాదు అని కవి తెలియ జేస్తున్నారు.ఆటవికులైన గోండు,చెంచు, కోయ గూడాలలోని ప్రజలు ప్రకృతిని తల్లిలాగా భావించి అవసరానికి మించి ఏ వనరును వినియోగించని తత్వం కల వారు.ఇది సహజ వనరుల సమతుల్యతకు చక్కటి తార్కాణం.మనిషి లోభం,నాగరికత అడవుల నాశనానికి దారి తీసింది. కవి మానవులలో స్వార్థం పెరిగి అడవులపై ఎలా విరుచుకు పడ్డారో చక్కగా వివరించారు. జంతువులను వేటాడి మాంసం,చర్మాలను అమ్మడం,చెట్లను నరకడంతో కూడిన కలప వ్యాపారం,అటవీ ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలకు మూలమైంది.కవి ఇక్కడ మనిషి నాగరికత అనే ముసుగులో ప్రకటితమైన క్రూరత్వాన్ని వ్యక్తం చేశారు.కర్కశ మనస్కులు క్రూర మృగాల కంటే ప్రమాదకరం అని సూచించారు.
“తరగని ఆహార భాండాగారం/ఆదివాసుల పెరటి కల్పకము/వట్టి పోయి ఉసూరుమంటున్నది/ అంటున్నారు. ఒకప్పుడు అడవి ఆహార సంపదలతో కళకళలాడుతూ ఉండేది.అట్లాంటి అడవి రూపురేఖలు మారిపోయాయి.అడవిని పెరటి కల్పకము అని అన్నీ ఇచ్చే కల్పవృక్షంగా పోల్చి చెప్పినారు.
“తన నాశ్రయించిన జనాన్ని మృగాదులను/ పోషించలేని అడవి తల్లి/తన చేతకానితనానికి/ విలవిలలాడిపోతున్నది/ఏక ధాటిగా ఏడుస్తున్నది/ అంటున్నారు.అడవి తల్లి తనపై ఆధారపడి జీవించే జంతువులకు,మానవులకు, ఆహారం,నీరు,ఆశ్రయం కల్పిస్తుంది.మనుషుల అహంకారం,అతి దోపిడి,వన నాశనం వల్ల అడవి తల్లి తన బిడ్డలకు కనీస అవసరాలైన ఆహారాన్ని అందించ లేని స్థితికి చేరింది.తల్లి తన బలహీనత,అసమర్థత వల్ల తన పిల్లలకు అన్నం పెట్టలేక విలవిలలాడుతుంది. అలాగే అడవి తల్లి కూడా తన వనరులు నాశనం అయిన తర్వాత ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. అడవి తల్లి ఏకధాటిగా ఏడుస్తున్నది.ఇది కేవలం భావోద్వేగంతో వచ్చిన కన్నీళ్లు కాదు.ఒక హెచ్చరికను తెలుపుతున్నది.వర్షాలు,తుఫానులు, వరదలు,కరువులు వివిధ రూపాలలో అడవి తల్లి తన వేదనను మనకు అందిస్తోంది. ప్రకృతి యొక్క నిరంతర రోదన మనిషి వినిపించుకోకపోతే భవిష్యత్తు మరింత భయంకరంగా మారుతుంది. కన్నతల్లి తన పిల్లలను కాపాడలేని ఘోరమైన స్థితి‌ కొనసాగుతున్నది.నిజానికి పిల్లలే తల్లిని హింసకు గురి చేయుచున్నారు.తల్లి దుస్థితికి తన పిల్లల పెంపకంలో లోపం,పిల్లలలో నెలకొన్న కాఠిన్యం కారణం అని తెలియ చేయడం జరిగింది.అడవి నాశనం అయిన తర్వాత మానవుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తల ఎత్తుతుంది.వరదలు,కరువులు, వాతావరణ మార్పులు అన్ని ఒక నిరంతర రోదన రూపాలు.ప్రకృతిని రక్షించకపోతే మన జీవనం కూడా రోదనలతో నిండిపోతుంది. పాలకులు, సమాజం తల్లి వలె తమను ఆశ్రయించిన ప్రజలను రక్షించలేని స్థితికి వస్తే ఆ సమాజం శిథిలం అవుతుంది‌.వరదల రూపంలో ప్రకృతి విలవిల లాడుతుంది.కరువుల రూపంలో ఏడుస్తుంది. తుఫానుల రూపంలో తన వేదనను వ్యక్తం చేస్తుంది. అడవితల్లి జంతువులను,మనుషులను పోషించలేని స్థితికి చేరింది,ప్రకృతి రోదన వినకపోతే మనిషి ఉనికి ప్రమాదంలో పడుతుంది. సమాజ రోదన పట్టించుకోకపోతే దేశం శిథిలావస్థకు చేరుతుంది. నేడు తనని ఆశ్రయించిన జనాన్ని పోషించ లేని అడవి తల్లి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు ఈ కవితలో ప్రతిబింబిస్తున్నది.ఒక వైపు ప్రకృతి పరిరక్షణ విఫలం.మరో వైపు సామాజిక న్యాయం లోపం కనిపిస్తున్నాయి.అడవి తల్లి బాధతో విలవిలలాడుతున్నది,ఎంతగానో ఏడుస్తున్నది అని కవి భావోద్వేగంతో ప్రకృతి యొక్క నిస్సహాయ స్థితిని తెలియ జేస్తున్నారు.
“అడవి తల్లి కడుపు రగిలిపోతున్నది/దావానల జ్వాలల చేత/ఆత్మాహుతి చేసుకుంటున్నది/ అంటున్నారు.స్వార్థపరుల దుందుడుకు చేష్టల వల్ల జ్వాలలు ఎగసిపడి అడవి తల్లి తగలబడింది.కవి అడవిని దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్న తల్లిలా చిత్రించడం అద్భుతమైన పోలికగా భావించవచ్చు.
“ఆహారం దొరకని పులులు/జనావాసాల పైన పడుతున్నవి/కోతులు పల్లెలకు,పట్టణాలకు,బ్రతుకు కోసం వలస పోతున్నాయి/తిండి వెదుక్కుంటూ తిరుగుతున్నాయి/ అంటున్నారు.అడవిలో ఆహారం లేక పోవడం వలన వన్య జీవులు మనుషుల నివాసాలకు వస్తున్నాయి.వాటి రాక వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.ఇందులో ప్రకృతి వినాశనం నేరుగా మనుషులకే ముప్పు తెచ్చి పెట్టింది అనే సందేశం ఉంది.
“ఇండ్లలో దూరి రచ్చ రచ్చ చేస్తున్నాయి/వాటిపై కోపమెందుకు,ద్వేషమెందుకు/ఇందులో వానరాల తప్పేముంది/వాటి ఆవాసాలను మనం ఆక్రమిస్తే/ మన నివాసాలకు అవి చేరాయి/అంటున్నారు. అడవులు క్షీణించడం వల్ల జంతువుల ఆహార వనరులు తగ్గిపోయాయి.పులులు గ్రామాలపై దాడి చేయడం మొదలు పెట్టాయి.కోతులు పల్లెలకు, పట్టణాలకు వలస వచ్చినాయి,ఆహారం కోసం రచ్చ రచ్చ చేయడం మొదలుపెట్టాయి.కోతుల విపరీత ప్రవర్తనపై కోపం వద్దు.ద్వేషం వద్దు. అన్యాయంగా అడవులను నాశనం చేసినాం,కోతుల నివాసాలను మనం ఆక్రమించుకున్నాం.కాబట్టి అవి పల్లెలకు, పట్టణాలకు వలస వచ్చినాయి.అట్టి ఘోరమైన కార్యానికి మనమే బాధ్యులుగా భావించాలి అని కవి సున్నితంగా తెలియజేస్తున్నారు.
“కోతులను ఆంజనేయులనుగా/పూజించే గొప్ప సంస్కృతి మనది/చచ్చిన కోతికి గుడిని కట్టి పూజిస్తున్న పుణ్యభూమి మనది/అంటున్నారు. కోతులను దేవుని రూపంలో పూజించే గొప్ప సంప్రదాయం మనది.చనిపోయిన కోతికి గుడిని కట్టి పూజించే పుణ్యభూమి మనది.ఇందులో మనం మానవత్వం మరియు దయను కలిగి ఉన్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నాం అనే సందేశం ఉంది.
“అట్టి సంస్కృతి కేమైందిప్పుడు/మానవత్వాన్ని గట్టున బెట్టి దయా దాక్షిణ్యాలకు తిలోదకాలిచ్చి/ వందల కొద్ది వానరాలకి/విషం పెట్టి చంపిన పాపం/ అంటున్నారు.మనలోని మానవత్వాన్ని దయా గుణాన్ని మరిచిపోయినాం.కోతుల వల్ల విసుగు చెందినాం.కోతులకు విషం పెట్టి వాటిని చంపడం హేయమైన చర్య.ఇప్పుడు కోతులకి విషం పెట్టి చంపే ఘోరమైన స్థితి దాపరించింది.ఇది దిగజారిన మానవతకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. మానవులు తరతరాల విశిష్టమైన సంస్కృతిని మరిచిపోయినారు,తమలోని మానవత్వాన్ని కోల్పోయినారు అని ఈ కవిత తెలియజేస్తున్నది.
“నీళ్ల ట్యాంకులో పడి మరణించిన/కోతుల ఉసురు ఊరికే పోదు/వాటిని ఆకలితో నకనకలాడించిన/మానవజాతికి నిష్కృతి లేదు/ అంటున్నారు.నీళ్లు దొరకని స్థితిలో నీళ్ల ట్యాంకులోని నీటిని త్రాగబోయి అందులో కోతులు పడి మరణించినాయి.ఇటు వంటి ఘోరమైన క్రూర ఘటనలకు మూలమైన మానవ జాతికి ఎన్నటికిని నిష్కృతి లేదు.ప్రకృతి వినాశనాన్ని ఘోరమైన పాపంగా భావించాలి.ఈ కవితలో ప్రకృతికి చేసిన ద్రోహం నుండి మానవులు తప్పించుకోలేరు అనే గొప్ప సందేశం ఉంది.
“ప్రకృతిని పోషించి కాపాడుకుంటేనే/ మానవుల మనుగడకు రక్షణ/ప్రకృతి ప్రేమికులారా/ కారుణ్యమూర్తులారా/మానవులారా తస్మాత్ జాగ్రత్త/అంటున్నారు.ఇందులోని సందేశం ప్రకృతిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.అప్పుడు మాత్రమే మానవులు,జంతుజాలం మనుగడకు ఆధారం దొరుకుతుంది. ప్రకృతిని కాపాడకపోతే మనమే నశిస్తాం.ప్రకృతి ప్రేమికులారా, కారుణ్యమూర్తులారా,మానవులారా,ప్రకృతిని దీక్ష,పట్టుదలతో రక్షించుకోవాలి అని కవి హెచ్చరిస్తున్నాడు.ఈ కవితలో ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్వ కాలపు అడవుల సౌందర్యం,నాగరికత ప్రవేశంతో కలిగిన నష్టం,మన సంస్కృతి క్షీణత,పర్యావరణ హెచ్చరికలను గమనించవచ్చు.ఇందులో ప్రకృతిని తల్లిగా తలంచిన భావం ఉంది.ఈ కవితలో అడవి – తల్లి అనే ప్రతీక ప్రధానంగా కనిపిస్తుంది.తల్లి తన పిల్లలకు ఆహారం,నీరు,ఆశ్రయం,భద్రత ఇస్తుంది. ప్రకృతితల్లి పండ్లు,దుంపలు,నీటి వనరులు, జీవనానికి అవసరమైన అన్నింటిని ఇచ్చింది.కానీ, మనిషి తాను లోభం వల్ల కన్నతల్లి వంటి అడవులనే నాశనం చేసినాడు.మనిషి ప్రకృతి నుండి వేరుపడిన ప్రాణి కాదు.మనిషి ప్రకృతిలో ఒక భాగం.మనిషి ప్రకృతి తల్లిని హింసకు గురి చేయడం తప్పు.మనిషి ఇట్టి ఘోరమైన చర్యలకు పాల్పడడం తనను తాను శిక్షించుకోవడంగా భావించవచ్చు.ప్రకృతి సహజ సమతుల్యతకు దర్పణం లాంటిది.పూర్వం వన్య జీవులు, మనుషులు,చెట్లు,నీరు అన్ని పరస్పర ఆధారంగా జీవించేవి.సింహాలు,పులులు అడవులను నరికే వారిని నియంత్రించేవి. పక్షులు విత్తనాలు వ్యాప్తి చేసేవి.చెట్లు వర్షాలను ఆకర్షించేవి.ప్రకృతిలోని సహజ సమతుల్యతను కోల్పోయినప్పుడు పులులు గ్రామాలపై దాడి చేస్తున్నాయి. కోతులు పట్టణాలకు వలస వస్తున్నాయి. కరువు కాటకాలు పెరిగాయి. మున్నెన్నడు లేనంతగా వరదలు ముంచెత్తుతున్నాయి.అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. కవి నవీన నాగరికత – వరమా? శాపమా?అనే దానిని కవితలో స్పష్టంగా వివరించారు.ప్రకృతిని సంరక్షించుకోవడంలో నిజమైన నాగరికత ఉంది.కానీ,మనం వాణిజ్యం పేరిట వ్యాపారం చేస్తూ కలప రవాణా,జంతువుల వేట వంటి క్రియలతో ప్రకృతిని దోచుకున్నాం. కాగితాల మీద అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు పెరిగినాయి.భూమి మీద ప్రకృతి సంపద తగ్గి పోయింది.ఈ కవితలో కోతులను ఆంజనేయులనుగా పూజించే గొప్ప సంస్కృతిని ప్రస్తావించారు.పూర్వం జీవులపై అపారమైన కరుణ తొణికిసలాడేది. మనుషుల హృదయాలలో పేరుకుపోయిన కాఠిన్యం వల్ల ఇప్పుడు జీవులకు విషం పెట్టి చంపే ఘోరమైన స్థితి వచ్చింది.మనలో దయాభావం లేకపోతే తరతరాల విశిష్టమైన సంస్కృతికి అర్థం లేదు.అట్టి సంస్కృతి కేవలం ఒక ముసుగుగా నిలుస్తుంది.మానవులారా తస్మాత్ జాగ్రత్త అనే కవితా పంక్తిలో అద్భుతమైన లోతైన అర్థం దాగి ఉంది.ప్రకృతిని మనం సంరక్షించక పోతే మనమే నశిస్తాం.ఇది కేవలం భావోద్వేగపు మాట కాదు.శాస్త్రీయ సత్యం.ఈ కవిత మనకు మూడు స్థాయిల్లో హెచ్చరిక చేస్తున్నది.దయ,కరుణ కోల్పోతే మానవత్వం కొనసాగదు,ఇది నైతిక స్థితి.ప్రకృతి సమతుల్యత లేకపోతే జీవనం దుర్లభం అవుతుంది, ఇది పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలుపుతుంది.మనం మారక పోతే,భూమిపై మన బ్రతుకు దుర్భరం అవుతుంది,ఇది భవిష్యత్తుకు చెందిన హెచ్చరిక.అరణ్య రోదన అనే చక్కటి కవితను రాసిన కవి మాదాడి నారాయణ రెడ్డి (మానారె) పాఠకులకు గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు.వారిని అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

September 14, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

” కౌమార అమృత శతకం”

by Rathod Sravan September 14, 2025
written by Rathod Sravan

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. అందులో వచన కవిత్వం  ఒకటి.
తెలుగు భాషా సాహిత్య జ్ఞాన ప్రపంచంలో వచన కవిత్వాన్ని, పద్యాన్ని ఎంతో ప్రాముఖ్యత ఉంది.   పద్యాలు  విద్యార్థుల్లో కంఠస్థ, ఉచ్చారణ పటిమను,ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,ఆలోచనను,వివేచనను,విచక్షణను,పెంపొందిస్తుంది.కనుక భాషాభోధనలో వచన  పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది.

తెలుగు భాషా మాధుర్యం లోని  నవరసాలను ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందే శతక   రచయిత  గజ్జారాం చట్ల ఆదిలాబాదు జిల్లా ,బజర్హత్నూర్ 
మారుముల ఏజెన్సీ మండల కేంద్రంలోని  శ్రీమతి/శ్రీ, చట్ల అమృతమ్మ,   బక్కయ్య  దంపతులకు 01 జూన్ 1961లోజన్మించారు.ప్రాథమిక విద్య స్వంత గ్రామంలో చదివి, ప్రాథమికోన్నత  విద్య  యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేలు గురుకులంలో  అభ్యాసించి ఉన్నత విద్యను హైదరాబాదులో పూర్తి చేశారు.డిగ్రీ  పట్టభద్రులై పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం జీవితం ప్రారంభించారు. తెలుగు భాష పై ఉన్న మమకారంతో  బాల్యం నుండే నాటికలు, కథలు, కవితలు  రాయడం  అలవాటు కావడంతో 
సాహిత్యంలో  బీజాలు పడ్డాయి.

వృత్తి రీత్యా ‌పంచాయితి రాజ్ శాఖలో  మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా  పనిచేస్తూ పదవీ విరమణ పొంది ప్రవృత్తి రీత్యా సాహితీ రంగంలో రాణిస్తూ  ”కౌమారామృత శతకం” ను రచించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం చేశారు. దేశానికి రోల్ మోడల్ నిలిచిన సర్వేలు గురుకుల పాఠశాలలో  చదివే రోజుల్లో నాటికలు రాసి  ప్రదర్శించి గురువుల మన్ననలు పొంది,  ప్రధాన చార్యులు చేతుల మీదుగా చిట్టి పురస్కారం సైతం అందుకున్నారు.  

తాను మాట్లాడే తెలుగు భాషకు ఒక గౌరవ జ్ఞాపకాన్నివ్వాలని గట్టి సంకల్పంతో సమాజ హితాన్ని కోరుకుంటూ  శతక పద్యంలో 
మానవుని జీవితంలో వికాస దశలు  అందులో బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం మొదలు దశలు ఉన్నాయి.  కౌమార దశ అన్ని దశలలో కెల్లా అతి ముఖ్యమైన దశ.  ఈ దశలో సంభవించే శారీరక  పరిపక్వత తో పాటు మానసిక వికాసంలో మార్పులు మరియు ఆరోగ్యం అభివృద్ధికి పునాదులు వేయబడతాయి. ఈ దశలో హార్మోన్లు ఉత్పత్తి కావడం, అతి ఒత్తిడితో  ద్వంద్వార్థాల పదాలు అతిగా వాడటం, మిత్రులతో  చిలిపి చేష్టలు చేయడం, చేడు స్నేహితుల వల్ల భవిష్యత్తును నాశనం చేసుకోవడం, చివరికి  జైలు పాలు కావడం  జరుగుతుంది. కౌమార దశ ముగిసే సమయానికి చదువు సంస్కారంతో మెదడుకు పదును పెడుతూ ఉపాధి పొందాలన్న గొప్ప ఆలోచనలతో ముందుకు సాగితే ఆనందదాయకమైన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ధైర్యంగా కొత్త అనుభవాలను స్వీకరించి,  వాటాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కౌమార దశలో సంభవించే కౌమార విజయం, కౌమార రుగ్మతలు వాటి పరిష్కారాల మార్గాలు మొదలగు  అన్ని అంశాల పైన ఛందో బద్ధమైన” కౌమారామృత శతకం” ను ఎంతో ఉత్సాహంతో  రచించారు.ఇది గజ్జారాం చట్ల గారి తొలి రచన కావడం విశేషం.

శతక కర్త పద్యం పట్ల మక్కువను పెంచుకొని, విద్యార్థులకు, పాఠకులకు, తెలుగు భాషాభిమానులకు, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో వచన  పద్యాలను తీసుకుని నేటి తరానికి  ఈ శతకము ద్వారా సమాజంలో కౌమార దశలో పతన మౌతున్న భక్తి,నీతి, ప్రేమ, జీవిత విలువలను తీసుకురావడానికి, బాలబాలికలు, విద్యార్థులు, సమాజ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మొదలగు వారు   చైతన్యవంతులు కావాలనే తపనతో, తన యొక్క రచన నైపుణ్యం వలన  ప్రయత్నాలు చేస్తూ, నిర్మల్ జిల్లా పద్యకవులలో ఒకరుగా స్థానం సంపాదించుకున్నారు.

ఈ  పద్య ఛందస్సు ప్రమేయం లేకుండా 108 పద్యాలు రచించన  గజ్జారాం చట్ల గారు. 2023లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్ లో అప్పటి తెలంగాణ తొలి  దేవాలయ గృహ, నిర్మాణ న్యాయ అటవీ శాఖ మంత్రి వర్యులు శ్రీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి శ్రీ , వరుణ్ రెడ్డి ఐఏఎస్,గార్ల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. తొలి గురువు ఆయన తన తండ్రి  కీ,శే, బక్కయ్య చట్ల గారితో ఏర్పడిన తండ్రి కొడుకుల బంధం కాస్తా గురుశిష్య  బంధంగా మారడంతో పాఠశాల స్థాయి నుంచే తెలుగులో కవితలు , కథలు, నాటకం, పద్యాల పట్ల ఆకర్షితులై  నాన్న గారి పద్యాలు విని స్ఫూర్తి పొందారు.తదనంతరం స్వయానా భగవద్గీత అర్థ తాత్పర్యాల పుస్తకాలు చదువుతూంటే వాటి అర్థాలను  నాన్న వివరించే వారు. ఇంతటి గొప్ప పాండిత్యాన్ని  తండ్రి వలన సంపాదించారు.

మాతృ మూర్తి, మాతృ  భాష అంటే ప్రాణమని  చేప్పే గజ్జారాం చట్ల తెలుగు భాష పై ఉన్న అభిరుచి తో  తనకు చిన్నప్పుడు   తల్లిదండ్రుల నేర్పిన సాహితీ విద్యతో శతకం పూర్తి చేసారు.తన తొలి శతకాన్ని బాల్యాన్ని నడిపేది – శివ కేశవులే అను దైవస్తుతి తో ఆరంభించడం గొప్ప విషయం.

కొన్ని శతక పద్యాలు పరిశీలిద్ధాం; –

1).
శైశవంలో సంరక్షణ – సరస్వతీపతి
బాల్యాన్ని నడిపేది – శివ కేశవులే 
యవ్వనం వార్దక్యం – పరిపక్వమే
చిక్కుల్లో చిక్కుకుంది కౌమారమే అమృత పుత్రా!!

భావము :- పిల్లలు దైవ సమానులు
అని అంటారు.రచయిత మనవ జీవితంలోని వికాస దశలను వివరిస్తూ   శైశవ దశలో బ్రహ్మ దేవుడు బాల్యంలో విష్ణువు సంరక్షిస్తూ నడిపిస్తారు.మరి యవ్వనం, ముసలితనంలో ఆదర్శంగా నిలిచిన మనిషి ,కౌమార దశలో పలు సమస్యలను ఎదుర్కొనక తప్పదు  అని  
చక్కగా వర్ణించారు.  
 
2).

స్నేహితుల సాంగత్యం – అధికమగుటచే
తల్లిదండ్రుల సాన్నిధ్యం – అధమమగునులే
సాంప్రదాయ సంస్కారం – గగనమగుటచే
ఆత్మస్థైర్య తగ్గుదల ఆత్మ న్యూనతే – అమృత పుత్రా !!

భావము:- ఓ అమృత పుత్రా! నీవు స్నేహితులతో కలిసి చేసే సరదా, చిలిపి చేష్టలు ఒత్తిడిని  తగ్గించి,స్నేహాన్ని బలోపేతం చేస్తాయి. కనుక తల్లిదండ్రుల చేప్పిన మాటలు పిల్లలు పట్టించుకొక దూరంగా ఉండటం ప్రారంభిస్తారు. తన సంస్కృతి సంప్రదాయాల పట్ల కూడా చిన్నచూపు కలిగి ఆత్మ విశ్వాసం తగ్గిపోవడంతో ఆత్మ న్యూనత పై ప్రభావం చూపుతుందని కవి స్పష్టం చేశారు 

3)
ఇట్టి ఘర్షణ తో గడిపేటి – కౌమారంలో 
ప్రేమ తగ్గి,పగనెగ్గి – బుగ్గిపాలె భవిష్యత్తు
హార్మోన్లు,మేధవృద్ధి కారణమని ఎరిగి – తల్లిదండ్రులె
మార్చాలి తనయుల బుద్ది – అమృత పుత్రా!

భావము:- కౌమార దశలో హార్మోన్ల మార్పు వల్ల మానసిక ఆందోళన, చిరాకుతో రక్తసంబంధికుల మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాలు తగ్గి పోతుంది. అలాంటప్పుడు  తల్లిదండ్రులు కారణాన్ని గుర్తించి తనయులను అనుకూలంగా మార్చుకోవాలని కవి భావోద్వేగంతో
తెలియజేశారు.

4).
తనుపడ్డ తిప్పల్ని – తనయులు పడకూడదంటు
గాడిద చాకిరి చేసి – డబ్బు గడించి పెడితే 
గార్థభ పుత్రులు మొత్తం – బూడిద పాల్చేసి
అడుక్కు తింటుంటారు – అమృత పుత్రా !

భావము:- తాను పడ్డ కష్టాలు భవిష్యత్తులో పిల్లలు పడకుడదు అనే ఉద్దేశంతో  తల్లిదండ్రులు పిల్లల్ని గారాబంగా పెంచడమే అస్సలు పిల్లలు చెడిపోవడానికి కారణం. దీని వల్ల పిల్లల పట్ల  మనం చూపిస్తూన్న ప్రేమ వారిని బద్దకస్తుల్ని చేస్తుందని దానితో  పిల్లలు దద్దమ్మలుగా తయారవుతున్నరని  రచయిత శత  శాతం వాస్తవాలను  కళ్ళకు కట్టినట్లు చూపించారు.

రచయిత గజ్జారాం చట్ల గారు సంఖ్యాపరమైన 
శతక లక్షణం పాటించి 108 పద్యాలు లిఖిస్తు “అమృతపుత్రా” అనే  తన అమ్మ పేరుతో మకుటంగా శతకం రాయడం అభినందనీయం.

వారి పదపొందిక, రచనా నైపుణ్యం, కవితా శైలి 
ఎంతో బాగుంది.ఎన్నో విషయాలను సృజించిన కౌమార రచయిత గజ్జారాముని కలము నుంచి మరింత కావ్యాలు జాలువారాలని వారి కీర్తి దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.

వెల : ₹=150/-
ప్రతులకు,
ఇ.నెం1- 4–130/3 
ఆదర్శనగర్ ,
నిర్మల్ జిల్లా,-504106
చరవాణి : 9959299039

September 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us