మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
సంపాదకీయం

ఆ బంధాలలో తీపెంత?

by Kondapally Neeharini March 16, 2025
written by Kondapally Neeharini

మార్చ్ మయూఖ పత్రిక సంపాదకీయం

  • డాక్టర్ కొండపల్లి నీహారిణి, ⁠మయూఖ ఎడిటర్

మనిషి యాంత్రిక జీవితంలో కొత్తగా ఆర్టిఫిషల్ సంతోషాలు అలుముకున్న నేపథ్యం సంతృప్తి పరుస్తున్నాయా? మరోపక్క ఉమ్మడి కుటుంబాలు ఎంతవరకు మనుగడ కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా! ప్రతి జీవితం ఆశల సౌధమే…అయితే అర్భాటాలకు పెద్ద పీటలు ఎవరు వేస్తున్నారు! ఇది ఆలోచించాల్సిన విషయం. అన్నీ కలిసిన ” మిక్సర్ ప్యాకెట్ ” జీవితం అయినప్పటికీ , ఉండాల్సిన రుచి అనే ఆత్మీయతను కోల్పోయిన బంధాలు అనుబంధాలలో పొందుతున్న అనుభూతులెంత? వీటిలోతాత్కాలిక ఆనందానికి ఆ బాటలు ఎవరికి వారు వేసుకున్నవే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
   కలసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు.
అమ్మ, నాన్న, భార్య భర్త, కొడుకులు, కూతుర్లు, పిల్లలు , వాళ్ళ కు కలిగే సంతానం తో వచ్చే సంబంధాల పిలులుపు, అత్త మామ , చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ చిన్నాన్న, పెద్ద నాన, తాత వంటి మాటలు ఒక ధైర్యాన్ని , ఒక అనుబంధాన్నీ తెప్పించే మాటలు . వీటి విలువను తర్వాత తరాలకు అందించటానికి పునాదులు ఇప్పుడే వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది.
కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే  సంకేతాన్ని తెలియజేయడానికి,  ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. యాంత్రిక జీవితంలో  అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయిన కారణంగా… అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అతి చిన్న విషయాలైన ఒక వ్యక్తి ఒకరికి  చరవాణిలో పంపిన  మెసేజ్ ని చూడకపోతే , లేదంటే చూడటం సమయం ఎక్కువైపోయినా, ఆలస్యమైనా ఒక అభిప్రాయానికి వెంటనే సదరు వ్యక్తిపై సాధారణంగా ఏర్పరచుకుంటున్నారు. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. సాంకేతిక సౌకర్యాల వల్ల ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది.రోజూ వచ్చే సమస్యలు, అవి తీర్చుకునే అవసరాల వల్ల వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన, కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.
      ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఆవశ్యకతను తెలియజేయడం కోసం అందరం కృషి చేయాల్సిన కర్తవ్యం ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే చెర్చించుకుంటాం. అదే కుటుంబమే లేని రోజు మన బాధలు, మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా, ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి.  అంటే ఏకాకి జీవితాన్ని ఏర్పరుచుకొనే పరిస్థితులు రాకుండా ఉండడం కోసం  ప్రయత్నం చేయాలి. అన్ని జీవులలో మనిషి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ   కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం.  అన్నీ కలిస్తేనే జీవితమని కొత్త తరానికి అర్థం చేయించాలి.
       ఇప్పుడు ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు? పోనీ.. మనం ఉంటున్న ఊరిలో ఎక్కడన్నా  కుటుంబం అని చెప్పుకుంటున్న ఇంట్లో అయినా మొత్తం ఎంతమంది కలసి నివాసం ఉంటున్నారు? మహా అయితే, నలుగురు ఐదుగురు ఉంటున్నారేమో! ఓ పది పన్నెండు మంది కుటుంబసభ్యులు ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉన్నట్టు చెప్పగల వాళ్ళ ను మనం కూడా చూసే ఉంటాం. అంతకు మించి కలిసి జీవిస్తున్నవారిని చూసిన గుర్తు మీకుందా?   అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్తాం. ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రశ్నను చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం వింటే  ఒకే ఇంటిలో 38 మంది కలిసి నివసిస్తున్నారు  అంటే ఎవరైనా  నమ్ముతారా? అదీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో కూడా…అవును అటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎక్కడంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ దగ్గరలో. ఒక కుటుంబంలోని  పురుషులు బయట వ్యాపారాలు..ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉన్న విషయమని చెప్పవచ్చు.
కలసి ఉంటె కలదు సుఖం అని ఈరోజుల్లో కూడా ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్న ఆ పెద్ద కుటుంబం గురించి కొన్ని విశేషాలు పొందే పదే గుర్తుకు చేసుకోవాలి. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలకు ఇవే నిదర్శనం. కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై చర్చ చేయడం, బయటపడే మార్గం చూపడం చేయాలి. వీటిపై అవగాహన పెంచడం , కుటుంబాలను ప్రభావితం చేసేందుకు చాలా కోణాలలో పనిచేయడం మనందరి బాధ్యత.
” కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం – దేశాన్ని కాపాడుకుందాం”

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

ఆకాశవాణి

by mayuukha March 16, 2025
written by mayuukha

ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమాలు ఎఫ్ ఎం రేడియో 103.5 మెగా హెడ్స్ పై లేదా
https://onlineradiofm.in/stations/all-india-air-warangal
లింక్ ద్వారా కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా వినవచ్చు

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రాజవరం గ్రామ ప్రజల కొంగుబంగారం –  మల్లప్పయ్య స్వామి  జాతర

by Kancharla Mahesh March 16, 2025
written by Kancharla Mahesh

           భారతరాజ్యాంగం అన్ని కులాలకు, అన్ని మతాలకు సమోన్నత స్థానాన్ని కల్పించింది. కనుక ఏ కులము, ఏ మతము తక్కువ కాదు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ యొక్క విశిష్ట లక్షణం. ఇంతటి విశిష్టత కలిగిన 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానిది ప్రత్యేక స్థానం. తెలంగాణ రాష్ట్రము అనగా గుర్తుకొచ్చేది  వీరత్వం. అలాంటి వీరత్వం కలిగిన ఈ నేలలో ఒక యుద్ధానికే కాదు దైవత్వానికి కూడా చోటు ఉంది. ఉత్తర తెలంగాణ మొత్తం శైవాన్ని ఆరాధిస్తే, దక్షిణ తెలంగాణ మాత్రం వైష్ణవాన్ని ఆరాధిస్తూ వస్తుంది. దానికి కారణమేంటంటే చారిత్రక నేపథ్యం కలిగిన రాజులు ఆ ప్రాంతాలను పరిపాలించారు. చరిత్రలో చూస్తే కాకతీయులు ఓరుగల్లును కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. వీరి ప్రధాన దైవ ప్రచారం శైవ మతం. రాజులు తమ యొక్క గొప్పతనం తెలపడం కోసం మరియు ఇష్ట దైవాలా కోసం గుళ్ళు గోపురాలు కట్టడం రాజుల యొక్క ఆనవాయితీ. వాటిలో చూడదగినవి  వేయి స్తంభాల గుడి, స్వయంభు ఆలయం, అయినవోలు మల్లన్న  మొదలైనవి. కాకతీయుల కాలంలో గొప్ప కవుల సైతం శైవ మత ప్రచారానికి తమకలాన్ని బలంగా వాడారు. వారిలో తెలంగాణ ఆదికవిగా ప్రసిద్ధి చెందిన పాల్కురికి సోమనాథుడు ఈ నేలపైన శైవ మతాన్ని ప్రచారం చేశారు. అట్లని వైష్ణవం లేకపోలేదు ఉత్తర తెలంగాణలో వైష్ణవం మరియు జైనం  కూడా స్వల్ప స్థాయిలో కనబడుతుంది. మరి దక్షిణ తెలంగాణను విష్ణు కుండీనులు పరిపాలించారు. వీరు ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. స్వల్ప స్థాయిలో శైవాన్ని, జైనాన్ని శిఖర స్థాయిలో వైష్ణవాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు.  వాటిలో చూడదగినవి తెలంగాణ తిరుపతిగా వర్ధిల్లే యాదగిరి నరసింహస్వామి, కృష్ణా నది ఒడ్డున విరిసిల్లిన మఠంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి మొదలైనవి. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా విష్టకుండీలా కాలం నాటిదే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాకతీయులు తమ రాజ్యాధికారాన్ని విస్తరించుట కొరకు యుద్ధాలు చేస్తూ అక్కడక్కడ దైవత్వాన్ని ప్రతిష్టిస్తూ వెళ్లారు. అట్ల ఏర్పడినటువంటి గుళ్లలో నల్లగొండ జిల్లాలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, రాజవరంకు సమీపాన ప్రతిష్టించబడిన మల్లప్ప స్వామి గుళ్ళు నిలువెత్తు నిదర్శనాలు. 12వ శతాబ్దం నాటి ఈ గుళ్ళు చెక్కుచెదరకుండా నేటికీ కొన్ని గ్రామాల ప్రజల దైవంగా వర్ధిల్లుతూ వస్తున్నాయి.
గుడి చారిత్రక నేపథ్యం :
        తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం మరియు చుట్టుపక్కల  గ్రామప్రజల దైవం మల్లప్పయ్య స్వామి. కొలిచేవారికి కొంగుబంగారమై నిలిచింది. . రాజవరం గ్రామం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో గట్ల మధ్య కొలువైన ఒక అందమైన గుడి. ఈ గుడి చారిత్రక నేపథ్యం సుమారుగా 800 సంవత్సరాల క్రితం. అంటే కాకతీయుల కాలం నాటిది. వీరి కాలంలో కట్టిన గుళ్ళు ఎక్కువగా మండపాల రూపంలో కనబడుతుండేవి. కాకతీయులు యుద్ధానికి వెళ్లే సమయంలో పేరిణి నృత్యం  ద్వారా శివుని రౌద్రాన్ని ఆరాధిస్తూ వెళ్లేవారు. అలా చేస్తే వారి యుద్ధంలో గెలుస్తారని విశ్వాసం. అట్లాంటి విశ్వాసాన్ని తెలంగాణ నేలపై అంతా విస్తరించిన ఘనత కాకతీయులది. మల్లప్పయ్య స్వామి గుడి కూడా మండపం రూపంలో ఉన్నదే. అలా కట్టిన గుళ్ళు ఇప్పటిదాకా చెక్కుచెదరలే. ఇంతటి సుందరమైన గుడులను కట్టిన కాకతీయులు తెలంగాణ నేలను, తెలుగు నేలను సుసంపన్నం చేస్తూ దైవత్వాన్ని ప్రచారం చేశారు. కాకతీయులకు అద్దం పట్టిన ఈ గుడిలో అద్భుతమైన శివలింగాన్ని చూడవచ్చు. ఇక్కడ చుట్టూ అద్భుతమైన ప్రకృతి వనంలో ఆరాధ్య యోగ్యమైన శివలింగం నిండు పున్నమిలా కనబడుతుంది.
 మహాశివరాత్రి పర్వదినం…
             జాతర అనగా జనం గుమికూడటం. జనాలు మొత్తం గుమిపూడి తమ సుఖశాంతులను పంచుకునే అద్భుతమైన వాతావరణమే పండగ. చిన్న పెద్ద ముసలి ముతక, యువకులు, కులమతలకు అతీతంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండగే మహా శివరాత్రి. అలాంటి పండుగను రాజవర గ్రామం మరియు చుట్టు ప్రక్కల ప్రజల ఎక్కడలేని విధంగా అంగు ఆర్భాటాలతో  జరుపుకుంటారు. మహాశివరాత్రి అనేది ఇక్కడి గ్రామ ప్రజల పెద్ద పండుగ. తెలంగాణలో పెద్ద పండగ దసరా అయితే ఆ పండక్కు తమ ఆడ బిడ్డలని తీసుకొని రావడం ఆనవాయితి. కానీ రాజవరం గ్రామ ప్రజలు దసరా కంటే భిన్నంగా మహాశివరాత్రికి తమ ఆడబిడ్డలను తీసుకొని వస్తారు. మొక్కులు ఉన్నవారు ఉపవాసాలు ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే “ప్రభలు కట్టడం”. ఇలా  ప్రభలు కట్టడం, ఉపవాసాలు ఉండటం వల్ల తమ కోరికలు తీరుతాయని ప్రజల నమ్మకం. శివరాత్రి నాడు తమ మొక్కుల తీర్చుకొనుటకు ప్రభలను కట్టి ఆ రోజంతా ఊరేగింపు చేసి 12 గంటలు దాటిన తర్వాత మల్లప్పయ్య గుడి దగ్గరికి బయలుదేరుతారు. ధూప దీప నైవేద్యాలతో, మొక్కు ముడుపులను దేవునికి సమర్పిస్తారు. జాగారాలతో జరిగే ఈ పండగ దశ దిశల విస్తరిస్తూ, కోరిన కోరికలు తీరుస్తూ మహిమను చాటుతూ వస్తుంది. ఇక్కడ శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే సూర్యకిరణాలు నేరుగా లింగంపై పడడం. కాకతీయులు తమ గుళ్లను కట్టేటప్పుడు ఒక సైంటిఫిక్ అనువర్తనాలను అనువదిస్తూ కట్టి ఉండవచ్చు. ఈ మల్లప్ప స్వామి గుడి కూడా ఆకోవకు చెందినదే. ఇంతటి విశిష్టత కల్గిన మల్లప్పయ స్వామి మహిమలను దశ దిశలా చాటాల్సిన బాధ్యత రాజవరం మరియు చుట్టుపక్కల ఉన్న  గ్రామ ప్రజలపైనే ఉంది.
 కోనేరు ప్రత్యేకత :
    ప్రాణ కోటికి జీవనాధారం నీరు. అలాంటి నీరు భూమి పైన 97% ఉప్పునీరు. మూడు శాతం మంచినీరు కలదు. ఆ మూడు శాతం మంచినీరులో త్రాగడానికి యోగ్యమైన నీరు మాత్రం ఒక్క శాతం మాత్రమే. భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రయత్నాలు జరగొచ్చు. కనుక నీరు ఎంత ముఖ్యమైనదో మనం గమనించవచ్చు. మల్లప్ప గుడి దగ్గర ఉన్న కోనేరు మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. “నిత్య కళ్యాణం – పచ్చతోరణం” లాగా సంవత్సరం పొడుగు నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఏ కాలంలో పోయిన ఎంత కరువు వచ్చినా అక్కడ నీళ్లను మనము చూడవచ్చు. గుడి దగ్గరికి వచ్చిన భక్తులందరూ ఆ కోనేటిలో స్నానం చేసి తమ మొక్కుబళ్లను దేవునికి సమర్పిస్తారు. కోనేటిలో స్నానం చేయడం వల్ల తన పాపాలు పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఎంత ఎండాకాలమైనా రాళ్ల మధ్యలో నుండి వచ్చే నీరు రిఫ్రిజిరేటర్ లో నీటి కంటే చల్లదనంగా ఉంటాయి.
 ముగింపు:
   ప్రజలు అనుకున్న కోరికలు తీరాలని అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గ్రామ పెద్దలు ఎడ్ల పంద్యాలను కూడా పెడుతూ ఉండేవారు. ఈ పండక్కి ఎంత దూరాన ఉన్నా, ఏ పని చేస్తున్న కదిలి రావాల్సిందే. శివరాత్రికి వచ్చిన వారందరికీ మర్యాదలు చేస్తారు. నిజమైన భక్తి శ్రద్దలతో సేవించడం వల్ల కోరికలు తీరుతాయని, ఈ మహిమకరమైన పండుగ  సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. రాజవరం గ్రామ ప్రజలందరూ ఐక్యతతో అంగరంగ వైభవంగా నిత్య భక్తిశ్రద్ధలతో చేసే మహా అద్భుత పండుగ ఈ మహా శివరాత్రి. తమకు ఏ కష్టం వచ్చినా ముందుగా చెప్పుకునే దేవుడే మల్లప్పయ్య. స్వామి తమ కష్టాలను కన్నీళ్లను కడగండ్లను తీరుస్తారని ప్రజలందరి గట్టి నమ్మకం.                                          

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన నాటకాలు – భూతకాలం నాటకం

by Sammeta Vijaya March 16, 2025
written by Sammeta Vijaya

భూతకాలం ప్రముఖ రచయిత దివాకర్ బాబు గారు రచించిన నాటకం దీనిని డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వంలో 90 నిమిషాల నిడివిలో రూపొందించారు. ఈ నాటకం మానవ భావోద్వేగాలు విలువలు ప్రధానమైన అంశంగా ఎంచుకొని రచించిన నాటకం.
గోవాడ క్రియేషన్స్ 15 సంవత్సరాలుగా వివిధ నాటకాలను 25 కు పైగా ప్రదర్శించారు వీరి నాటకాలు సామాజిక స్పృహను కలిగించే దిశలో మానవ విలువల మీద దృష్టిని కేంద్రీకరించి మంచి నాటకాలను అందించే ప్రయత్నం కొనసాగిస్తూ చేసేటువంటి ప్రదర్శనలు అందులో భూతకాలం ఒకటి.
ఈ నాటకం రవీంద్రభారతిలో తొలి ప్రదర్శన మార్చి 1వ తేదీన 2024లో జరిగింది.రచయిత ఎం దివాకరబాబుతో పాటు డాక్టర్ కె.వి రమణ చారి గారు ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ బ్రహ్మానందం గారు ప్రముఖ సినీ నటులు, ఎస్వీ కృష్ణారెడ్డి గారు ప్రముఖ సినీ దర్శకులు, అచ్చిరెడ్డి గారు ప్రముఖ సినీ నిర్మాత, డాక్టర్ మామిడి హరికృష్ణ గారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, శ్రీ సాయి మాధవ్ గారు ప్రముఖ సినీ రచయిత, శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారు ప్రముఖ రంగస్థలం నటులు, రచయిత ,శ్రీ గుంటూరు శాస్త్రి గారు ప్రముఖ రంగస్థల దర్శకులు, శ్రీ డి రామకోటేశ్వరరావు గారు ప్రముఖ రంగస్థల ప్రయోక్త అతిథులుగా వేదికను అలంకరించి ముందస్తుగా నాటకం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

డాక్టర్ కేవీ రమణాచారి గారు ప్రసంగిస్తూ అద్భుతమైన నాటకం అని ప్రశంసలు కురిపించి మనిషిని సృష్టించిన భగవంతుడిని ఆ మనిషికి ఏది ఎంత ఇవ్వాలో తెలుస్తుందని అన్నారు.
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు మనీషా ఫిలిమ్స్ ద్వారా విజయవంతమైన సినిమాలు తీయడానికి ప్రధాన పాత్ర వహించిన దివాకర్ బాబు రచయితగా అందరికీ సుపరిచితులని అతని కలం నుంచి వచ్చిన నాటకం భూతకాలం గొప్ప నాటకం అన్నారు. ప్రతి మాట ప్రతి అక్షరం ఆచితూచి రచించగల సాహిత్యం మీద పట్టు ఉన్న రచయిత దివాకర్ బాబు అన్నారు పలు నాటకాలను ప్రస్తావిస్తూ నాటక పరిణామ క్రమం తెలియజేశారు అద్భుతమైన నాటక విన్యాసాలను తెలియజేస్తూ నాటక ప్రక్రియకు వన్నెతెచ్చేలా భూతకాలం అనే నాటకం రచించారని ప్రశంసించారు.
శ్రీ బుర్ర సాయి మాధవ్ గారు మాట్లాడుతూ దివాకర్ బాబు గారి రేపేంది నాటకంలో నన్నుచాలా ప్రభావితం చేసింది.నన్ను నటుడిగా గుర్తింపు తెచ్చిన నాటకం అని ప్రస్తావిస్తూ భూతకాలం వంటి నాటకాలు రావాలి ఇలాంటి నాటకాలు రాయాలి ప్రేక్షకులకు మంచి నాటకాలు పిల్లలకి చూపించాలి , చదివించాలి అన్నారు. నా మంచి నాటకం అంటే కాలాన్ని గెలవడం. నాటకం అమ్మతో సమానం అమ్మని బ్రతికించండి అన్నారు.
జూన్ 30వ తేదీన కర్నూల్ లో ద్వితీయ ప్రదర్శన జరిగింది టీ జీవి కళాక్షేత్రంలో ఈ నాటకం ప్రదర్శించబడింది .
ఇక మూడవ ప్రదర్శన డిసెంబర్ 27న రవీంద్ర భారతిలో గోవాడ క్రియేషన్స్ లో రెస్రంజని ఆధ్వర్యంలో జరిగింది బుక్ మై షో ద్వారా 50 రూపాయల టిక్కెట్టుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ నాటక ప్రదర్శనలో ప్రత్యేకతలు విస్తృతమైన ప్రచారం సోషల్ మీడియాలో ఇన్స్ట్రాగ్రామ్ లో హాజరవుతున్న అతిథులతో , నాటకం చూడాలనే ఉత్సాహం చూపించిన యువతతో వీడియోలు తీసి శ్రీ సాయి తేజ అయినంపూడి ఈ నాటకంలో ఒక పాత్రధారి అయి ఉండి చక్కని ప్రమోషన్ చేయడం శుభసూచకం. ఇది భవిష్యత్ నాటికలను యువతరానికి చేర్చేందుకు సుగమమైన బాటను వేసి నాటకాన్ని టిక్కెట్ కొని చూసే దిశలో మరికొందరిని అనుసరించేందుకు చేసిన చక్కని ప్రయోగం !
నాటకం యొక్క కథా సంగ్రహం ఎలుక దేవుడి కోసం తపస్సు చేసి ఏనుగుంట బలం కావాలని కోరిన దేవుడు ఇవ్వడు అలాగే ఏనుగు తపస్సు చేసి నాకు రెక్కలు కావాలి నేను ఎగరాలి అంటే ఇవ్వదు అదే చేస్తే ఎంత అనర్ధం జరుగుతుందో దేవుడికి తెలుసు మనకి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు అందుకే మనం నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఎన్ని పూజలు చేసిన భగవంతుడు ఇవ్వడు జీవితాన్ని జీవించాలి అనుకునేవాడు భూత కాలాన్ని పీడ కలగా భావించి విస్మరించాలి వర్తమానంలో కలలు కనాలి శ్రమించాలి భవిష్యత్తును భగవంతుడు నిర్ణయిస్తాడు.

ఆహారం, ప్రేమ సంతోషం సంతానం ఇలా సృష్టిలో కావలసిన వన్నీటిని మనకన్నా ముందే భగవంతుడు పంపేస్తాడు మనం చేయవలసిందల్లా మన మాట మనం తీసుకోవడంతో సహా కృషి చేయడం అలా కాదని అత్యాశకు పోతే మనకు అధికంగా ఏమీ రాకపోగా ఉన్నది కూడా పోతుంది కనుక
Be yourself
Live yourself
Achieve yourself
ఈ నేపథ్యం కలిగిన నాటికలు అతివ నాయక నాయకుడు కామనుడు. కామనుడు అతివను ప్రేమించగా అతివ అతను పేదవాడని తిరస్కరిస్తుంది .అది తట్టుకోలేక కామానుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెట్టు వద్దకు వస్తాడు. అక్కడ అతన్ని భూతాలు అడ్డుకొని తనని రక్షిస్తామని దేవుడు వరం ఇస్తే మేము రవం (రివర్స్ )ఇస్తామని నాలుగు రవాలు కోరికలుగా కోరుకోవచ్చని చెప్తారు .

దీనికి లోబడి తన బలహీనతను జయించి ఎలా నిలబడతాడు తెలుసుకోవాలంటే నాటకం ఆశాంతం చూడాల్సిందే!
నాటకంలో కామనుడిగా శ్రీ మంజునాథ , అతివగ కుమారి అనూష, ప్రధాన భూతంగా శ్రీ నిఖిలేష్ సురభి, బాబాయిగా శ్రీ స్వరాజ్ కుమార్ భట్టు, ఆడిటర్ గా డాక్టర్ వెంకట్ గోవాడ, వాస్తవ్ గా శ్రీ సతీష్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ సాయి తేజ ఐనంపూడి భూతాలుగా కుమారి దివ్య శ్రీ గణేష్ శ్రీ రుద్విఖ శ్రీ రాజేశ్వర్ శ్రీ సాకేత్ కుమారి దాక్షాయణి నటించారు నాటకం ప్రదర్శనకు అనువైన సహకారం అందించిన సాంకేతిక నిపుణులు పాటలు శ్రీ కార్తీక్ గానం శ్రీ విద్యాసాగర్ డాక్టర్ హారిక గోవాడ సంగీతం శ్రీ నాగరాజు సెట్ శ్రీ దివాకర్ ఫణీంద్ర అండ్ టీ లైటింగ్ శ్రీ చెన్నకేశవ మేకప్ శ్రీమతి సరిత నిర్వహణ డాక్టర్ రాధాగోవాడ డాక్టర్ గీతిక గోవాడ డాక్టర్ లిఖిత్కాంత్ నిర్వహణ ప్రసరంజని బృందం .
పరుచూరి రఘుబాబు నాటక కళాపరిషత్తులు ప్రదర్శించిన ఈ నాటకం ఉత్తమ ప్రదర్శనగా బహుమతి పొందడం విశేషం!
దర్శకుడు డాక్టర్ వెంకట్ గోవాడ ఈ నాటకం గురించి చెబుతూ అందరి సమిష్టి కృషి ఈ నాటకమని ఇంత అద్భుత ప్రదర్శనకు దోహదం చేసిన రచన దివాకర్ బాబు గారిదని సమినయంగా తెలిపారు. నాటకంలో ఒక తాత్వికత ఉందని జీవితంలో జరిగే అన్ని విషయాలకు భగవంతునిపై ఆధారపడే బదులు మన జీవితాలను మనం నిర్మించుకునేలా కథ మనల్ని ప్రోత్సహిస్తుంది . దురాశ మరియు నిజాయితీ మన మనసుల్ని కప్పి వేసినప్పుడు జరిగే పరిణామాలను కూడా ఈ నాటకం చూపిస్తుందన్నారు . నాటకం అంటే ఏమిటి అని ప్రశ్నించే వారికి ఈ నాటకం సమాధానంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు . నాటకం ఆధునికతతో ముందుకు దూసుకు వెళ్తుంది అనడానికి ఋజువుగా ప్రదర్శనకు ముందు నాటకం చూడమంటూ చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ ప్రత్యేక ఆకర్షణ అయితే నాటక ప్రదర్శన అనంతరం అతిధుల ప్రసంగాలన్నీ అభినయ శ్రీనివాస్ గారు యూట్యూబ్లో భూతకాలం నాటక సభలో సందేశాలుగా నిక్షిప్తం చేసి అందరికీ అందుబాటులో ఉంచడం గొప్ప విషయం.
నాటకం ఆధునికత వైపు పరుగులు పెడుతుంది . థియేటర్ కి టిక్కెట్ కొని చూసే దిశకు కావలిసిన రంగం సిద్ధం చేసి సజీవతకు సప్రమాణంగా నిలిచి ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురు చూస్తుంది.

March 16, 2025 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగు సాహిత్యం`కోయ సంస్కృతి

by Gouriveni Ravaneela March 16, 2025
written by Gouriveni Ravaneela

తెలంగాణలో నివసించే ఒక గిరిజన తెగ కోయ. ఇది షెడ్యూల్డు తెగల జాబితాలో 18వ కులంగా నమోదైంది. తెలంగాణలో వీరు వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో విస్తరించియున్న దట్టమైన అడవులైన తూర్పు కనుమలలో కనిపిస్తారు. భారతీయ కుల వర్గీకరణ ప్రకారం వీరు షెడ్యూల్‌ ట్రైబ్‌ గ్రూపుకి చెందినవారు. దేశభక్తి, ఐక్యత ఎక్కువగా ఉన్న వీరు 1880లో బ్రిటీషు పాలనపై తిరుగుబాటు చేశారు. భారతీయ స్వాతంత్య్ర పోరాట చరిత్ర ప్రకారం దీనినే కోయ తిరుగుబాటు అని అంటారు. కోయవారు మాట్లాడే భాష కోయి – తెలుగు భాషకు పోలికగా ఉంటుంది’’.
కోయవారి నమ్మకం ప్రకారం మొదటిగా జీవి నీటిలోని పుట్టింది. నాలుగు సముద్రాల మధ్య ఘర్షణ ఏర్పడి అందులోంచి నాచు, కప్పలు, చేపలు, సన్యాసులు పుట్టుకొచ్చారు. ఆఖరిగా దేవుడు పుట్టుకొచ్చి తునికి, రేగుపళ్ళను సృష్టించాడు. 18వ శతాబ్దంలో మరాఠాలు పెట్టిన చిత్రహింసలు భరించలేక వీరు కొండల్లో తలదాచుకొన్నారు. ఈ సమయంలో యాత్రికులు వీరిని అనాగరికులుగా పరిగణించేవారు. తరువాతి కాలంలో నిజాంవారు భద్రాచలం తాలూకాను బ్రిటీషువారికిచ్చారు. ఆప్పుడు ఆ డివిజన్లో 225 కోయ గ్రామాలుండేవి.
కోయవారిలో రాచకోయ, లింగదారి కోయ, కమ్మర కోయ, అరిటి కోయ అనే ఉప కులాలున్నాయి. ఈ ఉపకులాల్లోనే ఆహారపు అలవాట్లు ఒకలా ఉండవు. లింగదారి కోయలు గొడ్డు మాంసం తినరు. ఇతరులతో భోజనం చేయరు. కులాంతర వివాహాల వచ్చే నష్టాలను నివారించడానికి కొన్ని పూజలు చేస్తారు. రాచ కోయలు గ్రామ పెద్దలుగా ఉంటారు. పండుగ సమయాల్లో వీరు కూడా కొన్ని పూజలు చేస్తారు. కమ్మర కోయలు వ్యవసాయ పనిముట్లను తయారుచేస్తారు.
కోయ జనాభా ఈశాన్య తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో వీరు ప్రధానం ఖమ్మం, భద్రాది కొత్తగూడెం మరియు వరంగల్‌ జిల్లాలలో నివసిస్తున్నారు. అంతేకా పాత ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలలో చాలా తక్కువగా కనిపిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలోని కోయల జనాభా 5,90,739. అయీ పోలవరం ప్రాజెక్టు సమయంలో తమ భూములు ఆంధ్రప్రదేశ్లో భాగమైనప్పుడు చాలా ఆంధ్రప్రదేశ్లో నివాసితులయ్యారు.
ఎడ్గార్‌ థర్స్టన్‌ ప్రకారం – కోయలు గతంలో వివిధ పాలెగార్ల సేవలో సాయ సైనికులుగా ఉన్నారు. పోడు సాగును అభ్యసించారు. నేడు కోయలు ప్రధానంగా స్థిరపడిన సాగుదారులు, కళాకారులు, ఫెన్సింగ్‌ కోసం చాపలు, డస్ట్‌ పాన్లు, బుట్టలతో సహా వెదురు ఫర్నిచర్‌ను తయారు చేసే నైపుణ్యం కలిగి ఉన్నారు. వీరు జొన్న, రాగి, బజ్రా, ఇతర మినుములను పండిస్తారు.
ప్రపంచీకరణ పెరుగుతున్న కొద్దీ ఆదివాసీల అస్థిత్వం ప్రమాదంలో పడుతోంది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులను కాపాడేందుకు ఢల్లీి సుల్తానులతో వీరోచితంగా పోరాడిన ఆదివాసీలు.. తరువాత క్రమంలో ముస్లిం రాజుల ఊచకోతలకు బలయ్యారు. ఈ క్రమంలో తమను తాము కాపాడుకోవడం కోసం, ఢల్లీి సేనలను తమను గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఆదివాసీ తెగలు తమ సంప్రదాయాలను, వేష భాషలను వదులుకున్నారు. తరువాత తరాల్లో కోయభాష మాట్లాడే వారి సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతుండడంతో చివరికి ఆ తెగ తమ అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఏర్పడిరది.
గిరిజనుల సామాజిక నిర్మాణం బహిర్భూమి వంశ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. గోండ్‌, కోయ, కొలాం మొదలైన కొన్ని గిరిజన సమూహాలు ఫ్రాట్రీ వ్యవస్థను కలిగి ఉన్నాయి. గిరిజనుల వంశాలు టోటెమిక్‌ స్వభావం కలిగి ఉంటాయి.
గిరిజనుల టోటెమిక్‌ వస్తువులు కొన్ని: పొంగి R గాలిపటం, వంతల R పాము, కిల్లో R పులి, గొల్లోరి R కోతి, కొర్ర R సూర్యుడు, మత్య R చేప, కిముడు R ఎలుగుబంటి.
గిరిజనులు ఈ టోటెమిక్‌ వస్తువుల పట్ల ప్రత్యేక గౌరవం చూపుతారు. గిరిజనులు తమ సహచరులను పొందడంలో వివిధ పద్ధతులను అనుసరిస్తారు.
4 కోయలు వారి గూడెంలో ఎవరి ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా లేదా మరే ? పనిచేయాలన్న ఊళ్ళో వారందరూ కలిసిచేస్తారు. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తారు. ‘‘గృహాలను నిర్మించాలన్న ఊళ్ళో వాళ్ళందరూ అడవికి వెళ్ళి కలపను తెచ్చి ఇంటిని నిర్మించుకుంటారు. ఇంటి నిర్మాణంలో ప్రాధాన్యత వహించే సంభాన్ని మూలస్తంభంగా భావిస్తారు. కోయ భాషలో దీనిని ‘వెన్ను మద్ది’ అని అంటారు. మనిషి శరీరానికి వెన్నెముక ఎలాంటిదో గృహ నిర్మాణానికి కూడా ఇది ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. వెన్నుబండల మీద వెదురు కర్రలు పెట్టి వాసాలు దూరుస్తారు. కదలకుండ వెదురు బద్దలను ‘‘పెండికట్టు’’ తాటినారతో కడుతారు. వాటిపైన ఈతగడ్డి, చీపురుగడ్డి, అవిరిగడ్డి, తాటాకుల్ని కప్పుతారు. వీటిలో అవిరిగడ్డి ఎక్కువకాలం ఉంటుంది. దూలాల మీద తడకలు విరిచి సామాను దాచుకోవడానికి వీలుగా ఉంచుతారు. వాటిని ‘‘అటకలు’’ అంటారు. ఈ అటకలు ప్రతి ఇంట్లోను ఉంటాయి’’.
ప్రపంచంలోని ఏ భాషలోనైనా జానపద కథా లక్షణాలను పరిశీలించినప్పుడు అన్ని కథలు ఒకే తీరుగా ఉన్నట్లు గమనించవచ్చు. రూపాన్ని, ప్రకటనా పద్ధతినిబట్టి కథలను ముఖ్యంగా గేయ కథలు, కథలు అని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. కోయలవి వచన, గేయ మిశ్రితమైన కథలు. కోయ భాషకు లిపి లేనందువల్ల వాటిని జిల్లాలోని వృద్ధుల నుంచి చెప్పించుకొని పరిశీలించడం జరిగింది.
‘‘దేవతాపరమైన ఆఖ్యానాలే కథలు, కథ అంటే వృత్తాంతం. కొన్ని సత్యాంశాలతో కూడుకొన్న కల్పిత కథనం. గేయరూపంలోకాక వచనరూపంలో ఉన్న కథనం, జానపదత్వంలో కూడుకొని సత్యాంశాలతో మేళవించిన, కథన రూపకంగా ఉన్న కల్పిత జానపద కథ.’’’
ఒక సంఘటనను లేదా యదార్థాన్ని తెలియజేయవలసిన అవసరం మనిషికి ఏర్పడడంతోనే మొట్టమొదట కథకు ఆవిష్కరణ జరిగిందని చెప్పవచ్చు. మనిషికి జరిగిన సంఘటనలను కథనాలుగా చెప్పటం మనిషి జీవనంలో భాగంగా మారింది. రానురానూ ఎన్నో కథలు, గాథలు మనిషి జీవితంలో చేరిపోయాయి. ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే ఆ విషయానికి సంబంధించిన కథనం తెలియాలి. కథనం పూర్తిగా అవతలివారు అర్థం చేసుకోవాలంటే ఒక కథారూపంగాని, గేయ కథారూపంగాగాని చెప్పినప్పుడు రక్తి కడుతుంది. ఏదైనా ఒక చారిత్రక కథనాన్ని లేదా పురాణాన్ని లేదా ఐతిహ్యాన్నిగాని, వాస్తవ గాథనుగాని సామూహికంగా తెలియజేసేటప్పుడు జనానికి వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఆసక్తిని కలిగించడం కోసం కొంత కల్పితాలను జత చేయడం పరిపాటి. అలాగే కథలను, గాథలను రచించేవారు కూడా కొంతవరకు తమ స్వంత కవిత్వాన్ని కలపడం జరుగుతూ ఉంది. అలాంటి కథలు, కథనాలు కల్పిత కథలుగా చలామణి అవుతున్నాయి.
కోయ భాషలో కథలు, నవల కూడా వున్నాయి. కోయ భాషలో చాలా వరకు పాటలు కూడా వున్నాయి. కోయ సంస్కృతి సంప్రదాయాల పైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కోయ సస్కృతి సంప్రదాయాలు తెలుగువారిని పోలి ఉంటాయి. కోయ భాష తెలుగు భాషకు దగ్గరి సంబంధం ఉంటుంది. తెలుగు భాష మాదిరిగానే కోయ భాషలో సామెతలు, పొడుపుకథలు, జాతీయాలు విరివిగా ఉపయోగిస్తారు.
ఈ విధంగా తెలుగు సాహిత్యంలో కోయ సంస్కృతికి స్థానం కలిగింది. భవిష్యత్తులో కోయ సంస్కృతి, భాష, సాహిత్యం పటిష్టంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని ఆశిద్దాం.

`

March 16, 2025 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన తెలుగు నాటకాలు – మూల్యం

by Sammeta Vijaya March 16, 2025
written by Sammeta Vijaya

కావ్యాలలో నాటకం రమ్యమైనది.” నాటకాంతం హి సాహిత్యం ” అన్న మహాకవి కాళిదాసు భావనలో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం . కవిత్వం, వ్యాసం ,కథ, నవల వీటన్నిటి తర్వాత నాటకం వస్తు రూపంలో భావగంధం కలిగి మనోరంజనం కలిగిస్తూ సామాజిక ప్రయోజనం తో పాటు సందేశాన్ని అందించే అద్భుత దృశ్యరూపకం నాటకం.
సజీవ ప్రదర్శన తో నాటకం అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ ఏయే నాటకాలు నాటికలు ప్రదర్శించబడ్డాయో వాటి కథ, నటీనటులు , సాంకేతిక నిపుణులు ,దర్శకుడు వీరందరి గురించిన సమాచారం తిరిగి చూసుకోవాలంటే మనకు కనిపించదు అందుకోసం నా పరిధిలో నేను గమనించిన చూసిన నాటకాలను పరిచయం చేయాలని ఉద్దేశంతో మన తెలుగు నాటకాలు అనే పేరుతో నేను కొన్ని నాటకాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. తద్వారా మన తెలుగు నాటకాలు కొన్ని చదివి తెలుసుకునే అవకాశం కొంతమందికైనా కలుగుతుందని ఆశాభావం. అయితే నాటకం చదివి తెలుసుకోమన్నది నా ఉద్దేశం కాదు. నాటకం ఖచ్చితంగా రంగస్థలం మీద ప్రదర్శించినప్పుడు చూడవలసినదే . కాకపోతే ఆ నాటకం గురించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం ద్వారా నాటక రచయిత ,నటీనటుడు ,ప్రదర్శనలు తీసుకున్నటువంటి శ్రద్ధ కళాకారుల నైపుణ్యం వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి ఆదరణను కోరుకుంటున్నాను. ఇక పై నేను ధారావాహిక గా అందించే మన తెలుగు నాటకాలను మీరందరూ చదివి తెలుసుకుంటారు కదూ .. ఆయా నాటికలను మీ సమీపంలో ప్రదర్శించబడినప్పుడు తప్పనిసరిగా చూస్తారని ఆశిస్తున్నాను.

వ్యక్తిత్వాన్ని గురించి, తన అస్తిత్వాన్ని గురించి తనను తాను ఆవిష్కరించుకొని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కొన్న సంఘర్షణలను అధిగమించి చేసే యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించిన నాటకం మూల్యం . రచన శ్రీ సింహప్రసాద్ దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ . సింహ ప్రసాద్ గారు పరిచయం అవసరం లేని రచయిత. వారి పూర్తి పేరు చలంకూరి వరాహ నరసింహ ప్రసాద్. ఎన్నో కథలు నవలలు నాటికలు సీరియల్స్ రచించిన వీరు అన్నింటిలోనూ ఎక్కువ శాతం బహుమతులు అందుకోవడంలో తనకు తాను ప్రత్యేకతను నిలుపుకున్నారు 2013లో స్త్రీ పర్వం నవలకు స్వాతి అనిల్ అవార్డు అందుకున్నారు . 277 కథలు,
54 నవలలు రచించారు 2017 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారాత్మ పురస్కారం కథలకు సోమేపల్లి పురస్కారం అందుకున్నారు శ్రీ పర్వం నాటకం పలుమార్లు నాటక రచన పోటీల్లో ప్రథమ బహుమతి అందుకుంది 2022లో ఆకిళ్ల నాటక పోటీలలో గ్రహణం నాటకానికి ప్రథమ బహుమతిని అందుకున్నారు ఇటీవల ఆరు నాటికలు ఆరు ఇతివృత్తాలతో విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయంలో తపస్వి కల్చరల్ ఆర్ట్స్ ఆంధ్ర నాటక కళా సమితి కొడాలి బ్రదర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శింప చేసిన నాటికలలో మూల్యం ఒకటి.
డా. వెంకట్ గోవాడ తెలుగు నాటక రంగంలో యువ నాటక దర్శకుడు నటుడు నిర్మాత ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి పూర్తిస్థాయిలో నాటక రంగానికి తమ సేవలను అందిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ లో పీజీ డిప్లమా చేసిన డాక్టర్ వెంకట్ గోవాడ పలు నాటకాలలో విభిన్న పాత్రలను పోషించి అందర్నీ మెప్పించారు . 2013లో గోవాడ క్రియేషన్స్ ప్రారంభించి పలు నాటకాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు సినిమాలు సీరియల్స్ లో పాత్రలు పోషిస్తున్నారు. మూల్యం నాటికలో నటన తో పాటు దర్శకత్వం వహించి పలువురి ప్రశంసలను అందుకున్నారు.

గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారిద్వారా ప్రదర్శించిన మూల్యం విభిన్నమైన కథాంశం కలిగి ఉంది. నేటి మన సమాజంలో ఆడపిల్లల మీద అడుగడుగునా రకరకాల ఆంక్షలు విధించబడుతున్నాయి జననంతో మొదలుకొని పెంపకం చదువులు సమాజవర్తన , వివాహం , ఉద్యోగం , స్వేచ్ఛ , దృష్టి దృక్పథం , చిన్న చూపు , వివక్ష ..ఇది చాలదన్నట్టు పెళ్ళవగానే మహిళ శరీరం మీద శరీరాంగాల మీద తన ఆమె భర్తకు సర్వాధికారాలు సంక్రమిస్తాయి అనడం నిస్సందేహంగా అన్యాయమే! వివక్షే!
మహిళను సాటి మనిషిగా గుర్తించకపోవడం నిజంగా అకృత్యమే అమానుషమే. మగవారితో సమానంగా అన్ని రంగాలలో భుజం భుజం కలిపి నడుస్తూ విజయబావుట ఎగురవేస్తున్న మహిళా శక్తిని కించపరచడమే అవమానించడమే!
లింగ అసమానతను దుర్విచక్షణ హక్కుల హసనాన్ని నేటి మహిళ ఎలా సహిస్తుంది? మరి ఎలా భరిస్తుంది ? అలాంటి దారుణ వివక్షకు వ్యతిరేకంగా ఒక వివాహిత మహిళ శంఖారావం చేసి తన హక్కును నిరూపించుకొని మరీ సాధించిన ఒక అపూర్వ ఘటన ఈ నాటిక !
నాటకానికి సంబంధించి ఏ వివరము తెలియకుండా వెళ్లినవారు ఈ సరికొత్త కోణం చూసి ఆశ్చర్య పడతారు అనడం అతిశయోక్తి కాదు . కథలోని పదును దానికి తగిన నటన నాటకాన్ని సమున్నత స్థానంలో నిలబడుతుంది . నాటకంలో ప్రధాన పాత్ర జయతి గా శ్రీమతి జ్యోతి రాజ్ భీశెట్టి , భర్త రాజారావు పాత్రను డాక్టర్ వెంకట్ గోవాడ , తండ్రి – -భాగి శాస్త్రి ,
లాయరు వేణు -బలగంగాధర్ మరియు గోవిందరాజుల నాగేశ్వరావు , ప్రతి లాయరు బ్రహ్మం -స్వరాజ్ కుమార్ మరియు ఉదయ్ సంతోష్ , డాక్టరు- ఉదయ్ సంతోష్ మరియు రాజకుమార్ , సంగీతం – మువ్వా నాగరాజు ,ఆహార్యం – గోవాడ క్రియేషన్స్ టీం లైటింగ్ సెట్ – దివాకర ఫణీంద్ర. వీరందరి సమిష్టి కృషి మూల్యం .
జయతి తండ్రి ఆరోగ్య సమస్యతో ఇంటికి వస్తాడు . వైద్యం చేయిస్తే అతనికి కిడ్నీ పాడైంది ఎవరైనా కిడ్నీ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ చెబుతాడు . ఇంటికి వచ్చిన మామయ్యను అనారోగ్యంతో ఉండగా పట్టించుకోకుండా మన ఇంటి మీదికి పంపాడు ఏమిటి మీ అన్నయ్య .. అని జయతిని నిలదీస్తాడు. అన్నయ్య చూసుకోకపోతే ఏం నేను చూసుకుంటాను అంటుంది జయతి. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి . వైద్యం చేసుకునేందుకు కిడ్నీ తానే ఇస్తానంటుంది జయతి. మీరైనా చెప్పండి అని లాయర్ వేణుని అడిగితే మీ కుటుంబ సమస్యలలో మేము తల దూర్చకూడదని వెళ్ళి పోతాడతను. కోపంతో కిడ్నీ ఇవ్వడానికి వెళ్తే నువ్వు తిరిగి రానవసరం లేదంటాడు భర్త కిడ్నీని దానం చేసేటట్లయితే ఒక ఫారం మీద భర్త అనుమతితో సంతకం పెట్టించుకుని తీసుకురావాలంటాడు డాక్టర్ . నా శరీరంలో భాగం నేను మా నాన్నకు ఇవ్వడానికి నా భర్త అనుమతి దేనికి అని ప్రశ్నిస్తుంది జయతి.
చివరికి భర్తను అడుగుతుంది భర్త నిరాకరిస్తాడు దిక్కుతోచని స్థితిలో కోర్టు నాశ్రయిస్తుంది కోర్టులో డాక్టరు లాయరు, ప్రతి లాయరు ,తండ్రి ,భర్తల మధ్య సంభాషణలు ఆద్యంతం ఆసక్తికరంగా అద్భుతమైన వాదోపవాదాలతో కొనసాగుతాయి . ఎవరి వైపు వారు తమ వాదనలతో సమర్థించుకుంటారు. తండ్రి కోసం కిడ్నీ ఇస్తే భార్యగా తనకు తన పిల్లలకు భవిష్యత్తులో కొనసాగడం కష్టమంటాడు భర్త రాజారాం . ఒక తండ్రి యొక్క స్థానాన్ని అందరికీ చాటి చెబుతుంది జయతి. తల్లిదండ్రుల తర్వాతే భర్త అని చెప్తుంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు కానీ పతిదేవోభవ అనరని అంటుంది. సమర్ధించుకుంటున్న భర్తను ఈ పరిస్థితి మీకే వస్తే మీరేం చేస్తారు అని సూటిగా ప్రశ్నిస్తుంది.
నా శరీరం నాది నా శరీరంలో అవయవం నేను దానం చేసే హక్కు నాకు ఎందుకు లేదు అని కోర్టును ప్రశ్నిస్తుంది నా శరీరం మీద భర్త కు ఎలా హక్కు ఉంది అంటుంది? అంటుంది . అన్ని రంగాల్లో పురోగమిస్తున్న స్త్రీ వివాహమైనంత మాత్రాన తన దేహం మీద హక్కుల్ని ఎలా ఎందుకు వదులుకోవాలి అని తీవ్రంగా నిశితంగా నిరసించి న్యాయస్థానాన్ని సూటిగా నిలదీస్తుంది జయతి.
లింగ అసమానతను దుర్విచక్షణను హక్కుల హసనాన్ని నాటిక సహితుకంగా శక్తివంతంగా ఎండగట్టింది నా శరీరం మీద అవయవాల మీద ఉన్న హక్కులు నావే అని నిరూపించుకోవడానికి నేను ఏ మూల్యం చెల్లించుకోవాలి ఈ మూల్యానికి నేను ఏం చెల్లించుకున్నానో తెలుసా మా నాన్న ప్రాణాలు అని భావురం అంటుంది కుప్పకూలిన ఆ దృశ్యం పతాక సన్నివేశం అందరి హృదయాలను కదిలించి వేస్తుంది అద్భుతమైన నటనతో జీవించింది ఆ పాత్రలో జ్యోతిరాజ్ బి శెట్టి భర్త రాజారాం పాత్రకు తగిన నటనను పరిపూర్ణంగా పోషించారు వెంకట్ గోవాడ.
ఈ నాటకం 30కి పైగా ప్రదర్శనలు చేసి నాటకం యొక్క ఉత్తమ ప్రదర్శన , ద్వితీయ ఉత్తమ ప్రదర్శన , ఉత్తమ రచయిత , ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి , ఉత్తమ సహాయ నటుడు , ఉత్తమ లైటింగ్ & రంగాలంకరణ ఇలాంటి అనేకానేక అవార్డులను సొంతం చేసుకుంది.
రచయితగా శ్రీ సింహ ప్రసాద్ కు దర్శకుడుగా డాక్టర్ వెంకట గోవాడకు , నటిగా జ్యోతి రెడ్డి బి శెట్టి గారికి మూల్యం నాటకం అమూల్యమైన ఆదరణను అందించింది . చూడని వారందరూ తప్పని సరిగా చూసి తీరాల్సిన నాటకం మూల్యం !

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఆ దారి నిండా ఖననమైపోయిన మనసు వాసన..

by Shanti March 16, 2025
written by Shanti

( సుధామురళి రచించిన “తడి ఆరని వాక్యమొకటి” కవితా సంపుటి పై సమీక్ష )

ఆరంభం
నిల్చున్న పళంగా మన నెత్తి మీద ఒక పిడుగు పడితే ఎలా ఉంటుంది? చల్లగాలిలో, చుక్కల చిన్న వెల్తురు నడుమ పిట్టగోడంచున రిలాక్స్డ్ గా నిలబడి ఉన్నప్పుడు, ఒక్క ఉదుటన గుండెల మీద దబదబామని ఎవరైనా వచ్చి గట్టిగా గుద్దేస్తే..??, ఊట ఊరిపోతున్న ఉమ్మనీరు తడితోనో, ఊహలన్నీ కాలిపోతున్నాయని ఆర్పడానికి విడుదల చేసిన కన్నీటి జలపాతపు చిత్తడి తోనో చితాగ్గా తడిసిన చీరకొంగు మొహం మీద మొత్తేస్తే..???, ఊపిరాడకుండా చేసేస్తే…????,అంతలోనే సరికొత్త మిరపకాయ కారం కళ్ళల్లోకి కసి తీరా చల్లేస్తే…?????, అతలాకుతలమైపోమా…???!!! ఇదిగో, ఈ ‘ తడి ఆరని వాక్యమొకటి ‘ కవితా సంపుటి చదివినా అదే బాధ, అదే ఊపిరాడనితనం. “ఏతమేసి తోడినా..ఏరు ఎండదు,పొగిలి పొగిలి ఏడ్చినా..పొంత నిండద”న్న జాలాది మహాశయుడి పాత సినీగేయం చప్పున స్ఫురణకు వచ్చేలా ఈ తడి ఆరని వాక్యంలోని “తడి” (అది కన్నీటిదా, బహిష్టు రక్తానిదా, తల తెగిన అమాయకపు ఆడపడుచు కలదా..అన్న సంగతి పక్కన పెడితే…) నానబెట్టి, నాచు పట్టేలా మనల్ని గుచ్చి-గుచ్చి బాధిస్తుంటే.., ‘ఎవరిదీ కొత్త గొంతుక, ఏ ఎడారి కోయిల తన ఆక్రోశాన్నిలా విన్పిస్తోంద”ని కాలూ, చేయి కూడ తీసుకుని ఈ కవిత్వాన్ని చదవడం మొదలెడతాం. ఒక్కో సునామీ కుదిపినప్పుడు కదూ, అసలు నువ్వేంటో కొసరు నేనేంటో ఎరుకలోకి వచ్చేది , ఒక్కో విషపు చుక్క గొంతు దిగుతున్నప్పుడే కదూ, అసలు రంగు తను కుబుసాన్ని విడిచేద( మాయాలోకం )ని సుధామురళి తన కుబుసాన్ని విడిచి, మడి కట్టుకొని, తాను చేసే సర్పయాగంలోకి పితృస్వామ్యపు మగ కొండచిలువలను ఆమంత్రణతో అమాంతం మండిస్తున్నప్పుడు…,నిజానికప్పుడు, ఆ దారి నిండా ఖననమైపోయిన మనసు వాసన రానే రాదు.., యుగయుగాలుగా స్త్రీ జాతి మీద అధికారం చెలాయిస్తున్న పితృస్వామ్య పాషండం ఫెటిల్లున పగిలి, గాజు ముక్కల శబ్దం గుండె గదిలో మూలమూలనా ప్రతిధ్వనిస్తుంది, ధూళి, దుమ్ము, కన్నీరు, నెత్తురు కలిసిన ఒక క్రొత్త వాసన సుళ్ళు సుళ్ళుగా కలియ తిరుగుతుంది.

తెలుగు సాహిత్యంలోకి దూకుడుగా ప్రవేశించిన ‘స్త్రీవాద సాహిత్య పరంపర’ను పుణికి పుచ్చుకుంటూ, ఆ లోతుల్ని అవగాహన చేసుకుంటూ, తన కవిత్వానికి పురుషుడు, పితృస్వామ్య సమాజం, స్త్రీ దేహం, దాని పై జుగుప్స, సామాజిక రుగ్మతలు వంటివి ప్రాతిపదికలుగా చేసుకుని, యుగయుగాల స్త్రీ అణచివేతను నిరసిస్తూ, అందులోనూ నైసర్గిక వాస్తవాలను (native realities) విస్మరించకుండా, దిశా హీనత (direction less) కాకుండా, కేవలం శరీర దృష్టితో సామాజిక ధర్మాన్ని తిరస్కరించే వికృత ధోరణిలోకి పడిపోకుండా, చాలా చాకచక్యంగా తనను తాను బ్యాలెన్స్ చేస్కుంటూ, స్త్రీ జాతికి మేల్కొలుపుగా, పురుష జాతికి హెచ్చరికగా, కవితా ప్రియంభావుకులకు తడివాక్యంలో వెచ్చదనాన్ని పరిచయించిన [ఈ పదాన్ని కవయిత్రి మూడు సార్లు వాడింది] సుధామురళి వినిపించిన సొంత గొంతు..ఈ 90 కవితల సంపుటి, తడి ఆరని వాక్యమొకటి.

స్త్రీవాదమా..స్త్రీ చైతన్యమా?
ఈ సమీక్షను సుధ గారి కవిత్వం పై చేస్తున్నాను గనుక, ఆ పరిధికి మించిన భావజాల పరంపరతో నేను తగువు పెట్టుకో దలుచుకోలేదు, తల దూర్చడమూ లేదు. సంపుటి నిండా స్త్రీ అస్తిత్వాన్ని అనేక కోణాలలో ఆమె అక్షరీకృతం చేసింది. దేహము, ఋతుచక్రము, నేకేడ్ పెరేడ్, రేప్ లాంటి ఎన్నో సంఘటనలు కవితలుగా పురుడు పోసుకున్నాయి. (ఒక్క మెనోపాజ్ ను మాత్రమే ఈమె స్పృశించలేదు) ఈ రకమైన స్త్రీ సంబంధిత విషయాల కవిత్వాన్ని ఈమె రచించడం వల్ల ప్యూరిటన్ ఫెమినిస్ట్(puritan feminist) , పొలిటికల్ ఫెమినిస్ట్(political feminist), లేదూ పాజిటివ్ ఫెమినిస్ట్ (positive feminist) అన్న వర్గీకరణలోకి పూర్తిగా చొరబడకుండా, సైద్ధాంతిక నిరూపణలలో పొరపడకుండా , ఈ కవితా గుచ్ఛాన్ని మనస్ఫూర్తిగా ఆఘ్రాణించి, దాని ఆనుపానులను తరచి చూడడం మాత్రమే నా ప్రస్తుతపు కర్తవ్యంగా నిర్ణయించుకున్నాను. కానీ, ఒక మాట చెప్పక తప్పదు.

Local Feminism/ Rooted Culture
తమిళనాడుకు చెందిన ‘పెరుమాళ్ మురుగన్’ వన్ పార్ట్ వుమన్ ( తమిళంలో మాథోరూపగన్ ) పుస్తకాన్ని, దాని తరువాత మరి రెండు పుస్తకాలను అత్యద్భుతంగా అప్పటి సామాజిక రీతుల పై(multi generational gendered trauma within families) సంధించిన ఒక అస్త్రంలా గొప్ప ట్రయాల్జీని సృష్టించాడు. ఈ ట్రయాలజీ లోని మొదటిది ఎంతో వివాదానికు గురైంది. ఒక వర్గం వారు, వారి మాననీయ స్త్రీల మాన-మర్యాదలు మంటగలుస్తున్నాయని కోర్టుకెక్కడం కూడా జరిగింది. మురుగన్ పూర్తిగా సాహిత్య సన్యాసం తీసేసుకుని, దుఃఖంతో, నాలోని రచయిత మరణించాడని ప్రకటించేసి, పారిపోయి రాయడమే మానేశాడు. చివరికి కోర్టు ఫేవరబుల్గా జడ్జ్మెంట్ ఇవ్వటం వల్ల, ఆ పుస్తకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే మురుగన్ నవలల పై వ్యాసం రచించిన న్యూయార్క్ కు చెందిన అమితావా కుమార్ ఒక గొప్ప మాట అంటాడు. “I immediately recognized the novel as belonging to a genre called rooted literature. Murugan offered an opportunity to conceptualize local feminism and patriarchy through his novels”అని. [Pg 25, Nalini Iyer , Truama, Gender & Caste, Narratives of Truama in South Asian Literature, Routledge, 2023] దీనికి కంటిన్యుటీ గా నేనే మి అంటున్నా నంటే…same way Ms Sudha had offered the taste of local feminism that was brewed in the native culture with women exploitation as a crucial determinant or central theme of her poetry. The book is so rooted in the soul and soil and embellished in her nostalagia. అలాగున ఈమె ఒక local/ vocal feminist లకు గుత్తేదారని అనుమానం లేకుండా నేను ఈమెకు నామకరణం చేస్తున్నాను.

ఎందుకు ఇలాంటి కవిత్వం వ్రాయడం?
దుఃఖ భాజనమైన ఆత్మాశ్రయ కవిత్వం రచించినప్పుడు, పఠితలు ఋజువులు అడుగుతారు. ఎద్దు పుండు కాకికి రుచి మరి. కవి/కవయిత్రి ఏ సాక్ష్యం చూపించి, తన తరగని బాధను, చల్లారని తగువును, తెగని దోపిడీని, ఎలా తన తలపులలోకి తెచ్చుకుందో…, తమకు చూపించందే వల్ల కాదంటారు, లేదంటే నమ్మడానికి తిరస్కరిస్తారు! అప్పుడు కవి/కవయిత్రి తమ అనుభవం యొక్క పెనుగులాటను పునరావలోకనం చేసుకుని అనుకరణ (mimetic reflection) ద్వారా ఒక ప్రతిబింబాన్ని తిరగరాశి, చెక్కి, పఠితల ముందు ఉంచవలసిన అగత్యం ఏర్పడుతుంది. సుధకూ అదే జరిగింది. కానీ ఇలా చేయడం వల్ల కవయిత్రికి బాధోపశమనం కలుగుతుందట. దీనినే గౌతమ్ కర్మాకర్ ఇంకా జీనత్ ఖాన్ తమ వ్యాసంలో ఇలా తెలియజేశారు.
“Cognitive psychology and literary works operate in the same way. The process of ‘tell a story’ initiates mechanisms that re-create our consciousness and bring about the pedagogy of healing. Thus narratives of trauma are a process of retelling subjective experiences. [ ibid, pg 6]అందుకు, ఆమె ఈ కవిత్వాన్ని రాయడానికి పూనుకుంది. అయితే అలా రాసినప్పుడు ఏ పరిధులలో లోబడి రాసింది ? ఆమె న్యాయం చేయగలిగిందా..?? అన్నది మున్ముందు పేరాలలో చూద్దాం.

స్థితిస్థాపకత
సుధామురళి స్వతహాగా చాలా సున్నిత మనస్క. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె మనస్విని ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక్క విషయం ప్రస్ఫుటమైంది…,తన చిన్నతనంలో లేమితో జరిపిన పోరాటం. ఆమె హృదయం పై అదొక ఒక చెరగని ముద్ర వేసింది. ఇంకొక రకంగా, అది ఎంతో ఆత్మస్థైర్యాన్నీ ఇచ్చింది.కానీ సుధ తను సమాజంతో సలిపిన పోరులోని ఒక్కొక్క గాయాన్ని పూడ్చకుండా పచ్చిగా ఉంచుకొని, తను ఒక తడి ఆరని వాక్యమై, తనలాంటి సోదరీమణులకు కొంతైనా వెచ్చదనాన్ని పంచాలన్న ప్రయత్నంలోనే ఈ సంపుటిని వెలువరించడం జరిగింది. ఆమె ఈ కర్తవ్యం చాలా ఎఫీషియెంట్ గా నిర్వహించుకోగలిగింది. ఏదో మెత్తని అలజడి దేహంలోపల కంపిస్తోంది, కనిపించే తోలుమందపు చర్మం మాత్రం మన్ను తిన్న పాము లెక్క కదలక ఉంది , ఇంకెంత ఒరుచుకుపోను.., ఇంకెంత లోతుకు ముడుచుకుపోను, తవ్వే కొద్ది కన్నీటి చెలమలే ఊరుతుంటే, ఇంకే జ్ఞాపకాల ఇసుకమేటలు పోగేయను (పేజీ 49) అంటూ కన్నీటితో కబురు చెప్పింది. సీనియర్ కవయిత్రి శీలా సుభద్రా దేవి గారు ‘యుద్ధమొక గాయం’ కవిత లో ” అందుకే శవాలు కాలుతున్న వాసనలో, ఏ దేశపు ఆచూకీ తెలియద “ని విషాదంగా వివరిస్తే…,సుధామురళి బహుశా ” మనసులు కాలిన వాసనలో ఏ దేహపు ఆనవాలూ దొరకదని, అందుకే దారి పొడుగునా ఖనన మైపోయిన మనసు వాసన “ని విచారించింది. రెండూ యుద్ధాలే! అందుకనే, మడి కట్టుకున్న నా దేహం, అనేకానేక రంపాల మధ్య చిక్కుకుపోయే సజీవశీలకు తార్కాణం , ఎవరికి ఏం తెలుసు, నా లోపల ఎన్ని సుళ్ళు మౌనముద్రలు వేస్తున్నాయో, నా వేదనాభాగాలు ఎన్ని తునాతునకలై లోలోపలే విరుచుకుపడుతున్నాయో (పేజి 21) అని దీనత్వంతో అంటూనే, ఆ గళాలకు తెలియదు ఈ కలాలు ఎప్పటికీ మూగబోవని, ఆశయాలని సిరాగా నింపుకున్న కలాలని, కొమ్ములు కావు, వాటికి ఉన్నది చెడును చెండాడే శూరత్వపు పాళీలని, వెనకడుగు వేయని సబలత్వ(పు) పాదాల ని, అథారిటేటివ్ గానూ అనగలిగింది. అంటే she could very well maintained the elasticity స్థితిస్థాపకత.

విభిన్న పార్శ్వాలు
మొత్తం కవిత్వమంతా గదులు గదులుగా, లింగ వివక్షత, స్త్రీల అణచివేత, పురుషుల పోలీసింగ్, కట్టుబాట్ల కరకు శిక్షలు, క్రూరమైన మగ జీవి ఉదాసీనత, స్త్రీ దేహం అన్న కాల్తున్న కంకర రాళ్లతో కవయిత్రి కట్టడానికి ఉపక్రమించి, పొరలు పొరలుగా మధ్యన స్త్రీలు పొగిలిపొగిలి ఏడ్చిన ఏడ్పుల తడిని, తన దేహం ద్వారా జరిగే సామాజిక, ఋతు యాతనను కలిపి అతికించి ముద్దగా కుదుర్చుకుంది. కాకపోతే, కొన్నిచోట్ల ఆమె వస్త్వాశ్రయం తీవ్రమై తీరాలు దాటి, మరీ తీవ్రమైన ఆత్మాశ్రయానికి లోనై, నిరాశకు తన స్వదేహం పైన తానే నిందా దృక్కులు కక్కే స్థితికి చేరి గడ్డకట్టి, గూడు కట్టుకున్న దుఃఖంతో గుటక కూడా మింగలేకపోయింది. ఇలా ఆబ్జెక్టివిటీ నుంచి సబ్జెక్టివిటీకి జారిపడేలా బురిడీ కొట్టించడం లేతగా కవిత్వం రాస్తున్న కొత్త గొంతుకలందరికీ ఉన్నటువంటి పాటే! రాసి, రాసి తమ జాగ్రఫీని, జానర్ను గట్టిపరుచుకోవాల్సిన అవసరం నాలాగే ప్రారంభ దశలో ఉన్న అందరికీ ఏర్పడే ఒక అనివార్యమైన శిక్షే.. పరీక్షే! ఆమెను ఒక్కదానినే మనం ఆక్షేపించడానికి లేదు. అయినప్పటికీ, కవయిత్రి గొప్పతనం ఎక్కడంటే (బహుశా లెక్కల టీచర్ కనుక) తమ ఆత్మాశ్రయపు ట్రౌమాని తను సృష్టించిన భాషతో అంటగడుతూనే, కవిసమయం ఉష్ట్రపక్షి తంతు కారాదు గనుక, ఆమె తన నేను ను సమిష్టి వాచకంగా మలచడంలో సఫలీకృతమైంది. సంపుటి ప్రారంభంలో, బ్రతుకింతే… అని దీనాతి దీనంగా విలిపించి, సంపుటి చివరకు వచ్చేసరికి సమాజాన్నే డినౌన్స్ చేసి ధిక్కరించే స్థాయికి ఎదిగి, ( సిద్ధార్థ) , డియర్స్ అండ్ ఎనిమీస్ లో ” *క్షణం క్షణం మారడం నా నైజం, మరణం రణం ఏదైనా నాకు లేదు నిస్తేజం, కాలాన్ని శాసిస్తూ కవి కాలాన్ని జూలు విదిలిస్తూ సాగడం నా చిద్విలాసం (పేజీ 200) ” అని హుంకరించి, మత పెద్దలారా మీరు తవ్వుకున్న గోతిలో మీరే దూకండి! ఈ జాతి చరిత్ర, నా అవిశ్రాంత యాత్ర, ఏ శత్రువు లేనట్టి అజాతశత్రు దళాలను వేసుకున్నది తిరుగుతున్నది (పేజీ 164) అని ధిక్కరించి, “జాగో మహిళా జాగో, మన దిగంబర ఊరేగింపు మనకు మేలుకొలుపు, జరిగిన వస్త్రాపహరణ ఇంటింటి పాంచాలుల శపథానికి ఒక పూనిక, దుష్ట దైత్య పాలనకు తుది హెచ్చరిక”ని గర్జించింది. ఇది ఈ కవయిత్రికి ఒక చాలా, చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆమె ప్రస్థానం అణచివేయబడ్డ అబల స్వరం నుంచీ తిరగబడ్డ ఒక ఆడపులి గర్జనైంది. ఈ పరిణామం ఎంతో హర్షనీయం.

భావజాలం- వస్తుజాలం- భాషా కోలాహలం
ఇక వస్తుజాలం, భావజాలం, భాష వంటి గురించి కాస్త విపులంగా చర్చిద్దాం అంటే, తెలుగులోనే స్త్రీవాద కవిత్వం ఒక పూర్తి రూపానికి రాలేదని కొండేపూడి నిర్మల గారి వాదన. ఇది నిజం కూడాను! ఒక ఇంటర్వ్యూలో జయప్రభ గారన్నట్టు ఇవాళ్టి భాషంతా పురుషానుభవాల వ్యక్తీకరణం కోసం తయారైనది. ఈ భాషలో, స్త్రీల అనుభవ వ్యక్తీకరణ సాధ్యం కాదు. కనుక, కొన్ని చోట్ల వైరుధ్యాలనిపించే వాక్యాలు దొరలడం (ఇటువంటి కవిత్వంలో) సహజం. ఎందుకంటే తుప్పు పట్టిన పడిగట్టు పదాల నుంచి, నూతన దృక్కోణాలను ఆవిష్కరించడం సాధ్యం కాదుట. [ పేజి 24, స్త్రీ వాద వివాదాలు, సం. డా॥ ఎస్వీ సత్యనారాయణ ] దీన్ని మరి కాస్త విపులంగా సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేస్తాను. కవయిత్రి ఓల్గా, తమ అభిప్రాయంగా “ఋతుధర్మం ఆడపిల్లల జీవితాలలో ఎంత కల్లోలాన్ని రేపుతుందో అర్ధమైన వాళ్లకు దాని చుట్టూ ఉన్న భావజాలాన్ని బద్దలు కొట్టాలనిపిస్తుందంటా”రు ఇది అక్షర సత్యం. అంతవరకూ, కలిసిమెలిసి ఆడుకుంటున్న ఆడపిల్ల ఒక్కసారిగా తనకు శారీరకంగా జరుగుతున్న హార్మోన్ల ఇన్ఫ్లుయెన్స్ కి సమాజంతో, శరీరంతో, తన సహచరులతో ఎంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మన కవయిత్రి ఈ భావనలతోనే ఈ సంపుటిలో బహుఇష్టం అనే కవితను రాసుకొచ్చింది. నిజం చెప్పద్దూ, ఈ కవిత చదవగానే నేను ముందర తొట్రుబడ్డాను. ” ఒక తాత్కాలిక శారీరక వైకల్యానికి కవయిత్రి ఇంత repulsive గా రియాక్ట్ అవవలసిన అవసరం ఉన్నదా..??”అని. 1990 దశకంలో ఈ విషయాలపై పుంఖానుపుంఖాలుగా తెలుగు సాహితీ మూర్తులు, ఆంధ్రజ్యోతి,ప్రభ, ఉదయం, ప్రజాశక్తి పత్రికల్లో ఒక్కళ్ళనొక్కళ్ళు, ఎన్నో వ్యాసాలు వ్రాసి, కౌంటర్- కౌంటర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ తో చీల్చి చెండాడుకున్నారు. ఇవన్నీ పుస్తక రూపంలో కూడా వచ్చాయి[ స్త్రీ వాద వివాదాలు, సం. డా॥ ఎస్వీ సత్యనారాయణ]. అందులో లేబర్ రూమ్ కవితపై జరిగిన దుమారాన్ని, కాళ్ గర్ల్స్ మోనోలాగ్ పై వచ్చిన కాంట్రావర్సీ ని కన్నార్పక చదివాను. అప్పుడర్థమైంది…., “నా మటుకు నేను, ఫ్లష్ అండ్ బ్లడ్ తో మమేకం కానంతవరకూ, ఆ అవస్థను అనుభూతించనంతవరకూ, అటువంటి కవిత్వం పట్ల సానుకూల స్పందన చేయలేనేమోన”ని, అటువంటి కవిత్వాన్ని రాయలేననీ కూడా అనిపించింది! అందుకేనేమో, సుధామురళి తన కవితలో, “నీ అతివృష్టి అనావృష్టి వరదల్లో, ఓ గడ్డిపరకలా నన్ను కొట్టుకుపోయేలా చేయక, ఓ మనిషిగా గౌరవించు, ఎక్కువ, తక్కువ తూకంలో నన్ను రాయిని చేయక, నా విలువను నాకే ఉంచు, నాలానే బ్రతికించు, నా బహిష్టును బహుఇష్టగా మార్చుకునేలా (పేజీ 27)” అనే వాదానికి మారు మాట్లాడకుండా తలవొగ్గాను.

ఎందుకంటే, ఈ ప్రక్రియను ఒక జుగుప్సాకర మైన క్రియగా పితృస్వామ్య సమాజం శాసనం చేసి, మతం, కులం ప్రాతిపదికతన దాన్ని ఏకంగా ఒక నేరమే చేసేస్తే, సమాజ శ్రేయస్సుకు కంకణం కట్టుకున్న మేకవన్నె పులులిదంతా, “మాతృత్వానికి మహత్తరమైన మొదటి మెట్టు, ఈ మహదావకాశం పొందిన నీదే, నీదే గొప్పతనం..ఒట్ట”ని, నువ్వే దేవతవని, మేడి పండును స్త్రీకి మాత్రమే తినిపించింది. ఈ విషయాన్ని సాగదీస్తున్నాననుకోకపోతే, కొంత పాశ్చాత్య ఆలోచనలు కూడా మనం ఇక్కడ అరువు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పక ఉన్నది. మాతృత్వం మీద ఈ క్రింది వాక్యాలు చదవండి మీరే ఒప్పుకుంటారు. ఎందుకు సమానమైన బాధ్యత స్వీకరించకుండా స్త్రీ కి మాత్రం దీన్ని fair and just slavery గా మనం అంటగట్టాం అని పునరాలోచన చేయక మానం. “On conceiving motherhood shows us a way out of it via the question of affect. Although different societies have had different modes of sex/ affective production at different times, a cross cultural constant is involved in different modes of bourgeois patriarachial sex/ affective production. This is that women as mothers are placed in a structural bind by mother- centred, infant and small child care, a bind that ensures that mothers will give more than they get in the sex/ affective parenting triangle in which even lesbians and single parents are subjected. [ Pg 85 Breast Giver, Gayatri C Spivok, mahasweta devi, BREAST STORIES, Seagull Publications, 2018 ]

అందుచేతనే కవయిత్రి కరుకుగా, పురుషుడికి లింగ మార్పిడి జరిగి ఒక స్త్రీగా మారి, అదో ఇదో ఏదోలాంటి చూపులతో దేహాన్ని కోస్తూ చూస్తూ ఉండటమే అలవాటయిన ఆమె, హఠాత్తుగా దేవతలా చేసి పూజించడం మొదలెడితే…, తన మాటలతో తానే చచ్చి తిరిగి మనిషిగా జన్మించాలంటే…”ఆ మార్పిడి జరగాల్సిందేనని, సమాజానికి పట్టిన రాచపుండుకు శస్త్ర చికిత్స సూచిస్తుంది. ఓల్గా గారి మాటల్ని మరోసారి యథాతథంగా గనుక స్మరించుకుంటే…, “ఒకపక్క ఆడవాళ్ళ ఋతు ధర్మాలను అపవిత్రతలంటూ అసహ్యించుకుంటూ, వాళ్ళ పొట్టలను హేళన చేస్తూ, పురిటి గదులను నరక కూపాలుగా చేస్తూ, పురిటికంపు అంటూ ముక్కులు మూసుకుంటూ, స్త్రీలను మాతృమూర్తులుగా మారమంటే అది జరిగే పని కాదు. [ పేజి 36, స్త్రీ వాద వివాదాలు, సం. డా॥ ఎస్వీ సత్యనారాయణ]. బహుశా, ఈ అవగాహనతోనే నేటి లేబర్ రూమ్స్ లోకి ప్రసవ సమయంలో భర్తలు కంపల్సరీగా ఉండాలన్న నియమం కొన్ని ఆసుపత్రులు విధిస్తున్నాయి.

ద్విగుణీకృతమైన దోపిడి
సంపుటి నిండా ముందుగానే చెప్పినట్టు, స్త్రీల సంబంధిత విషయాలే చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఇటువంటి స్త్రీ చైతన్య కవిత్వం రాసే ప్రతీ వాళ్లు ప్రశ్నించే వాదాలు, చేసే సోదాలు ఈ కావ్యమంతా సుధామురళి తన కంఠశోష తో వెలువరించింది. ఈ వాదనకు ఉదాహరణగా సీనియర్ కవయిత్రి ఘంటశాల నిర్మల గారి కొన్ని కవితలను సుధా కవితలను కలిపి సారూప్యాన్ని నిలిపే ప్రయత్నం చేస్తాను. శరీర న్యాయం అనే కవితలో, ఘం. నిర్మల గారు, “మన దేహాన్ని పదిలంగా కాపాడుకోవాలి, దేహం మీద అధికారం, దేహంతో వ్యాపారం” అని నిరసిస్తే, సుధామురళి ఏకంగా, దేహం శరణం గచ్ఛామి అంటూ తన దేహాన్ని బయోలాజికల్ ఆస్పెక్ట్ నుంచి చూస్తూ, పూర్తిగా ద్వేషిస్తూ, ఛ అని చీత్కరించుకొని నిరసిస్తూ, నీరస పడుతూ…, ” ఘడియల్లో ప్రేమను చూచే కొలజాడి, దేహగర్భంలో పిండం ఎదగని బికారి,ఈ దేహం.., దేహమా నా దేహమా రణం శరణం గచ్ఛామి, నిత్యం మరణం సమర్పయామి ” అని సమాజం చేసిన అమానుష కృతకానికి దారుణంగా నిట్టూర్చింది. సంపుటి అంతా పురుషాధికారం నిండిన సమాజంపై దాని కామగ్రస్త చూపు పై నిరసనలు ధిక్కారాలు తెలియజేసిన కవయిత్రి, పాశ్చాత్య ప్రభావిత ప్రవర్ధిత విశృంఖలత్వాన్ని, unabashed sex that is detrimental to any society ని ప్రోత్సహించలేదు. నిజానికి, ఒకానొక కవితలో సగం ఆకాశానని నిట్టూర్చి, తేలిపోవాలన్న కవితలో మళ్లీ మూలాలకు జరిగి, సమాజ సంతులనకు ప్రకృతి పురుషులిరువురూ సమానమే కదా! అన్న అభిప్రాయాన్ని , అర్ధనారీశ్వర తత్వాన్ని అలవోకగా తెలియజేసింది. ” రెండు చేతులా కావలసినవి వండిపెట్టి, పస్తుని ప్రేమించే నేను గొప్పో.., చేతులారా సంపాదిస్తూ కూడా, నీకై ఏమీ మిగుల్చుకోని నువ్వు గొప్పో తేలిపోవాలంటుం “ది. కనుక కవయిత్రి కినుక, కోపం, వ్యగ్రతంతా..,”ఇరువురూ ఈ సమాజపు దోపిడీలో ఇరుక్కుపోయినా, అన్యాయంగా, హేతువు లేకుండా, అకారణంగా… స్త్రీని ఇంకా దోచడమే!” అని తేటతెల్లమవుతుంది. ” కార్మికులు దోపిడీకి గురవుతుంటే, స్త్రీలు ఆ దోపిడీతో పాటు పురుష పీడనకూ, దురహంకారానికీ కూడా అధికంగా గురవుతున్నారన్న వాదనను వినిపించడానికే ..” అని మనకు తెలుస్తుంది.

ఇంకా సంపుటి నిండా సంఘటితమైన స్త్రీవాదపు సెంటిమెంట్ ను సుధామురళి శంఖం ఆపకుండా పూరిస్తూనే ఉంది. లింగ వివక్షత మీద ఈమె కవిత మనసును కలత పెడుతుంది. ” ఆడపిల్లా నిన్ను దాచుతాన” ని ఒక తల్లి తన బిడ్డను తానే దాచే దుస్థితికి మన కంట నీరు ఒలుకుతుంది. ఒక్క శాఖాచంక్రమణం చేస్తున్నా ననుకోకపోతే, ఈ ‘లింగ వివక్షత’ మీద, సంకెళ్ళతోనే జైలులో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చే అమానుషమైనటువంటి క్రియ పట్ల, సుడాన్ కు చెందిన ఇథియోపియన్ కాందిశీకురాలైన మరియం ఇబ్రహీం యదార్ధ గాథ Shackled ( శృంఖలాబద్ధ )ను నేను గుర్తుకు తెచ్చుకోకుండా ఉండలేను. ఆ పుస్తకపు ప్రకాశకులు ప్రారంభంలోనే ఒక హెచ్చరిక ముద్రిస్తారు. “అది కలుగజేసే సంచలనానికి, భీతావహానికి భీరువులు కాకుండా మీరు ధీరువులైతేనే కొన్ని అధ్యాయాలు చదవండ”ని. కాకుంటే ఆ పుస్తకం లో అంతర్లీనంగా మతం ఒక ప్రగాఢమైన పునాదిని వేసుకుని, ప్రాణ ప్రతిష్ట చేసుకోవడం వల్ల అంత గొప్ప యదార్ధ గాథ కూడా, ప్రపంచ స్థాయిలో పోరాడి గెలిచిన ఒక అసహాయ స్త్రీ పోరాటానికి ప్రతీక గా నిలువ కుండా, కరదీపిక కాకుండా, వేరే జానర్లోకి మళ్లి పోయింది. ఆసక్తి గల మిత్రులు ఈ పుస్తకాన్ని చదవవచ్చు. లింగ వివక్షతోపాటు, వేశ్యలపై, గొడ్రాళ్లపై సంపుటిలో ఆలోచనాత్మక కవితలున్నాయి. ఆధునిక సమాజం స్త్రీ శరీరాన్ని ఒక ఉపాధేయ వస్తువుగా ఎలా మిగిల్చిందో, లాగిపెట్టి కొట్టిన లెంపకాయలా “న్యూడ్ థెరపీ” అన్న కవిత తెలియజేస్తుంది. ఇలాంటి భావననే ఘం. నిర్మల గారు తమ రంగుల చీకటి లో అంతే parallel thought తో వెలువరించారు. ఇంతటి అల్లకల్లోలం, ఆరని నిరాశలో అంకురించే ఆశావాదం అలరించే భావుకత కూడా మనల్నీ సంపుటిలో పలుకరిస్తాయి. “ఒక్కొక్క రేకు విడిపోయాక కూడా, పువ్వును సుగంధం అంటిపెట్టుకొని ఉంటుందేమో కానీ, మమత విరిగిపోయాక బ్రతుకు రెట్టింపు బరువు తగ్గుతుంది” అంటుందీమె ప్రేమలన్నీ ఒకేలా ఉండవు కవిత లో (పేజి182).

అక్వేరియం
సంపుటి మొత్తానికి నన్ను ఎంతో ఆకట్టుకున్న అక్వేరియం కవిత గురించి రెండు మాటలైనా వ్రాయకపోతే నాకు సంతృప్తి రాదు. ఈ కవితకూ , జెహ్రా నిఘా(Zehra Nigah) రాసిన స్టోరీ ఆఫ్ ఈవ్ లోని Justice న్యాయం కవితకు గొప్ప సారూప్యం ఉంటుంది. న్యాయం కవితలో తను చేయని నేరానికి, ఒక గుడ్డి పిల్ల అమాయకంగా జైలు గదిలో బందీ అయిపోతుంది. (ఈ నడుమనే ఈ కవితకు నేను స్వేచ్ఛానువాదం చేసి సిరికోన లో పంచాను.) కవయిత్రి కూడా ఈ అక్వేరియం అనబడే పారదర్శకమైన నాలుగు గాజు పలకల మధ్యన, ఎవరు, ఎప్పుడు, ఎలా కావాలంటే, అలా…, ఏ కోణం నుంచీ కావాలంటే ఆ కోణం నుంచీ రెప్పవాల్చకుండా తనను గమనిస్తూ ఉన్నా, నిస్సిగ్గుగా నిర్లజ్జగా పురుషాధిక్య సమాజపు కట్టడికి, ఆమె బ్రతుకంతా ఆ పలకల మధ్యనే ఉలుకూ-పలుకు లేకుండా బందీ గా పడి ఉండటం గ్రహించి నా గొంతు గద్గదమైంది. ఈమె చక్కటి కవనానికి ఇదొక మచ్చుతునక.

ముగింపు
స్త్రీవాద కవిత్వం విప్లవ కవిత్వంలో ఒక భాగమని ఎందరో ప్రముఖులు వాక్రుచ్చారు. “విప్లవం లాగే అది కూడా ముందుగా మనసులోనే పుడుతుంద”ని చలసాని ప్రసాద్ గారు ఒకచోట అన్నారు. చుట్టూ ఉన్న సమాజం, స్త్రీవాద దృక్పథం కలిగిన కవిత్వానికి, స్త్రీల అనుభవాల్ని మాత్రమే చిత్రించే కవిత్వానికి, అలాగే స్త్రీవాదమని కొందరు పురుషపుంగవులు చేస్తున్నటువంటి male voyeuristic attitudes కు తేడా తెలియకుండా ఉన్న ఈ రోజుల్లో, సుధామురళి లాంటి కొందరు స్త్రీలు కంకణం కట్టుకొని, “ఇది మా శరీరం, ఇదీ మా భావన, ఇదీ మా యాతన”ని వారి శారీరక స్పృహను సామాజిక స్పృహకు సకారాత్మకంగా సమాజంలో ఉపయోగించేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో అభిలషీయణం.

సుధామురళికి, సస్నేహపూర్వకంగా కొన్ని సలహాలను సూచించాలని భావిస్తున్నాను. భాష వాడకంలో నేను ముందే చెప్పినట్టు కొన్నిచోట్ల ఆవేశం ఆమె ఆశయాన్ని తీవ్రంగా ఆక్రమించి అభాసుపాలు చేసే ప్రమాదం ఉన్నది. అందుకు కాస్త సంయమనం పాటించాల్సి ఉంది. ఉదా., బహుఇస్టు లో స్త్రీ మూర్తి బాధను శిలను చెక్కినట్టుగా ఓపికగా చెక్కి చెక్కి, చివరికి … ఆ రక్తాన్ని కూడా తాగకు …అనడం, ఇంకొక కవితలో ఉన్మత్త శిశ్నాలను జన్మస్థానాలపై ఉసిగొల్పుతున్న వక్ర భాష్య దురంధరుల” నడం, రక్త ప్రవాహ ధారలతో అలసిపోతున్న ఆ ద్వారం జీవాన్ని దూర్చుకోలేని ఒకానొక జీవ రహిత గొట్టం (పేజీ 148, నిర్వాణ) లాంటి వాక్యాలు మరీ పేలవంగా, repulsive గా అన్పిస్తాయి. కవయిత్రికి తన గమ్యం పట్ల స్పష్టమైన దిశా నిర్దేశం ఉన్నది. అంతరాత్మ అటువైపు గానే ప్రబోధం చేస్తున్నది కనుకనే, తన ఆత్మ నిర్భర్ కవిత లో (పేజీ 165) ఆమె ఆశంసనం స్పష్టంగా తెలియజేయబడింది. ” ఏ అగోచరగోరీలోనో ఇరుక్కున్న నా దేహాన్ని, నా దాహాన్ని, వస పిట్టను చేసి ఊరి మీదకు వదలాలి ” , ” నేను, నేనుగా వినిపించి కనిపించాలి, నేనుగా మిగిలి మురిసిపోవాల “ని ఎంతో సాధికారికతతో, సత్తాతో అనగలిగిన కవయిత్రికి సంచలనాత్మకమైన, శ్లేష పూరితమైన అటువంటి పదబంధాల అవసరం సహేతుకంగా ఉందా..?, అన్నది ఒక ప్రశ్న.(ఈ నడుమనే జాతీయ గీతాన్నే అవమాన పరచేటట్టుగా.”…. జలధి తరంగా ” అన్న సంకలనమొకటి వెలువడిందని కొందరు మిత్రులు కబురు పంపారు. ఐనా, ఈ విషయం ఇక్కడ అప్రస్తుతం) ఎందుకంటే, ఈ కవితలో ఆమె “నేను” సమిష్టి వాచకం. విశ్వజనీయమైన స్త్రీకి ప్రతీక. కనుకనే వాళ్ళందరి కోసం ఆమెనే ..,నేనైనా నువ్వైనా, ఆ మజిలీ దాటవలసిందే, గుర్తులు మిమ్మల్ని కొన్ని తడి తడిగా ప్రతిష్టించవలసిందే అని కంటతడి కూడా పెడుతుంది (పేజీ 184), ” పురుషుడా..గో టు హెల్ ” అని అగ్ని వర్షమూ కురిపిస్తుంది.

కవయిత్రి తన భాషను, భావాలను మరింత పరిపుష్టం చేసుకుంటూ విస్తృతంగా విశ్వ సాహిత్యాన్ని, అందునా స్త్రీతత్వపు కేంద్ర బిందువుగా ఉన్న సాహిత్యాన్ని చదవవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తను కూడా నాకు లాగే ఆరంభంలో ఉన్నటువంటి కవయిత్రి కనుక, వ్రాసే ప్రతీ వాక్యాన్ని ఒకటికి పది సార్లు సరిచూసుకొని, ఆవేశం అంతరార్ధాన్ని అణగదొక్కకుండా జాగ్రత్త పడాలి. మర్మరంగు, అన్యాయ చట్టాలు లాంటి పలుకు రాళ్లు కవితలు పొడచూపకుండా జాగ్రత్తపడాలి. దాదాపు తొమ్మిది కవితలకు ఆంగ్లంలో శీర్షికలు ఉన్నాయి. కొన్ని సంపూర్తిగా ఇంగ్లీషులోనే రాయడం కూడా జరిగింది. నేటి ఆధునిక కవిత్వపు కొలమానాలలో ఇది ఇమిడి పోవచ్చునేమో గానీ, భాషాపరంగా మనం ఎంతవరకు దీనిని స్వాగతించవచ్చు అనేది ఇంకొక ప్రశ్న? అలాగే, ఒట్టి ఆత్మాశ్రయం నుంచి ఎదిగి ఎదిగి, ఆంధ్ర దేశం దాటి, ఆల్ ఇండియా దాటి, అంతర్జాతీయ పీఠికకు ఎదిగి, స్త్రీ అంతర్వేదనను భూమ్యాకాశాల లో వ్యాపింపచేసేలా భావాలను విస్తృత పరుచుకోవాలి. అందుకు ఎంతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. పోరాటాలు జరుపుతున్న ఎందరో స్త్రీలు, గృహసీమలు విడిచి, గగనాన యుద్ధవిమానాలు సైతం నడుపుతూ అన్ని రంగాలలో పురుషులకు సరిసమానమని చూపుతున్నారు. సాహిత్యంలో కూడా ఈ మార్పు రావాలి. ఇంకా ఎక్కువగా జరగాలి. స్త్రీల సమస్యలను హైలైట్ చేస్తూ వాదవివాదాలు పక్కకు పెట్టి తెలుగులోనూ చక్కటి కవిత్వం రావాలి. నా ఉద్దేశంలో అందుకోసం అల్లిరాణి లా వేరే లోకాలు సృష్టించుకోవడం, మాకింకా కొన్ని శోకాలు కావాలి (పేజి115) అనడం సబబు కాదు. పోరాడాలి. ఘం నిర్మల గారు, తన నిర్వచనం లో ఢంకా బజాయించి చెప్పినట్లు.., ” మూలం మూసలో సమాజం ఒక సాగుడువల, దయా, తర్కము, సహానుభూతి లేని సంఘమే తరుముతుంది మనని విముఖత్వం వైపు, విప్లవం వైపు, విపరీత వాదాల వైపు, అవమాన క్రమ పరిమాణంలో నిలువెల్లా మెలేసి బాధలు దుఃఖాలు, మనసంతా సలేసి తిరుగుబాటుగా రూపెత్తాలి… యుద్ధం పడవకు తెరచాపనెత్తాలి..”, అదీ నేడు కావాల్సింది!

కొని చదవండి- చదివించండి
ఇంత చక్కటి ఆలోచనాత్మకమైన తడి ఆరని వాక్యమొకటి సంపుటిని కొని చదవండి, మరి కొందరితో చదివించండి. “పిడిఎఫ్ ఉందా, సాఫ్ట్ కాపీ ఉందా” అని అడగొద్దు?! తెలుగులో నిజాయితీగా నిక్కచ్చిగా వ్రాస్తున్న కవయిత్రులే తక్కువ శాతం. సామాజిక మాధ్యమాలలో, పండుగలు, పేరంటాళ్ళు, ప్రేమ కవిత్వాలు, విరహ గీతాలు రాసుకుంటూ కాలం వెళ్ల బుచ్చుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అందుకనే, సుధామురళి రాసినట్టుగానే.., ” నమ్ముకున్న సిద్ధాంతాలు కళ్ళకు గంతలు కట్టాయో, ఒకే కోణపు దాడులు నోట్లో గుడ్డలు కుక్కాయో..అతడు లేడని, అతడు రాడ న్న” మాటలు అబధ్ధం చేద్దాం, మన వంతు భుజం కాద్దాం.

చివరిగా ఒక చిన్న మాట. మ్యూజింగ్స్ లో చలం ఇలా అంటాడు. “చాలామంది ఆర్టిస్టులు తమ శక్తిని ఈ లోకపు రొదలో నశింపజేసుకొని త్వరలోనే ఆరిపోతారు. ఏదన్నా పైనుంచి చూసి, ఆ పైనే కళారూపాన కక్కేసే ఆర్టిస్టు కన్నా, అనుభవించిన దాన్ని లోపలికి తీసుకొని, దాన్ని రిపీట్ చేసి, దాని అందాన్ని రసం తీసి పలికేవాడు గొప్ప ఆర్టిస్ట్ [మ్యూజింగ్స్, పేజీ 237]” ఒక లెక్కలు టీచర్ అయిన కారణంగానో, తన సహజ సిద్ధ కవితాత్మకత కారణంగానో సుధామురళి ఈ విషయంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుందని చెప్పడంలో నేను ఏ మాత్రం సంశయించను.

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

*నీ వెంటే నేను వస్తున్నా నుగా!!

by Rasheed March 16, 2025
written by Rasheed

నీ ముఖం కళకళలాడుతోంది.
నా ముఖం వెలవెలబోతోంది. నీవు ప్రశాంత వదనంతో శాశ్వత నిద్రలోకి జారుకున్నావు. నేను నిరంతరo నీ జ్ఞాపకాలతో వ్యాకులతతో జీవిస్తున్నాను.

నీవు నీ మరణం కోసం
బంధు మిత్రులందరినీ
పిలిపించుకున్నావు. అందరికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయావు.

అందరూ నా చుట్టూ ఉన్నా
ప్రస్తుతం నేను ఒంటరిగానే
ఉన్నాననిపిస్తోంది నీవు లేక!

ఐదు పదుల సాంగత్యాన్ని
ఐదు నిమిషాల సమయంలో
తెగతెంపులు చేసుకున్నావు.
ఎన్నడూ నేను ఊహించలేదు నేనుండగానీవువెళ్ళిపోతావని!?

నేను ముందే చెప్పానుగా నీకంటేముందు వెళ్తానని!
నీవుoడాలని,నీవెక్కడైనా
బ్రతుకు తావని నీవు లేని
బతుకు చిందర వందర
అవుతుందని.. అయినా
నిర్మోహమాటంగా అంత కఠిన నిర్ణయంతీసుకొని వెళ్ళిపోయావే!

నా గురించి నీకు
ఆలోచన రాలేదా!?

వాష్ రూమ్ లో సబ్బు బిళ్ళ
కండువకూడా పెట్టుకోలేనని
వెళ్లేముందు నీకు అసలు
జ్ఞాపకం రాలేదా?
ముతక బట్టలు వేసుకోవద్దని చేతకాక పోయినా దుస్తులు
ఇస్త్రీచేసితొడిగించే దానివి కదా!?
మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరు
చేసి పెడతారనే ఆలోచన నీకు
అసలు రాలేదా!!

ఈ అశక్తుడు ఈ బలహీనుడు
నీకు ప్రేమను పంచి ఇవ్వడం
తప్ప ఒక్క ముక్కుపుడకైనా
తేలేదని ఎన్నడూ షికాయతు
చేయని నీ కృతజ్ఞత గల
జీవితానికి నేనేమిచ్చి రుణం
తీర్చుకోను ఒక్క సారి చెప్పవా!

విలువైన బట్టలు

అందమైన అలంకార వస్తువులు నీకు నేను కొనిపెట్టక పోయినా
నకిలీ వస్తువులు ధరించి వెళ్లే
దానివి కదా ఫంక్షన్లకు ఈ నీ
క్రియలన్నీ తెలిసి ఉన్న ఆ
సృజన కర్త నిన్నుతప్పకుండా
స్వర్గంలో ప్రవేశింప చేస్తాడని
ఖచ్చితంగా చెప్పగలను.

మరి నీవు నీ ప్రభువు
ప్రసన్నత పొందిన దానివి కదా!
నాకోసం సిఫార్సుచేయగలవా!
నన్ను నీవు మర్చిపోకు సుమా !!నీ వెంటనే నేను వస్తున్నానుగా!
నీ ప్రభువే నా ప్రభువుకదా!
నిరాశలేదు. తప్పకుండానిన్ను
స్వర్గంలో కలుసుకుంటాను!?

మొహమ్మద్ అబ్దుల్ రషీద్ తెలుగు రచయిత అనువాదకుడు కవి సాహిత్య భూషణ్ అవార్డు గ్రహీత

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మానసిక వికాసానికి రాచబాట – పూల పూల వాన కవిత్వం

by Dr. Uppala Padma March 16, 2025
written by Dr. Uppala Padma
   సాహిత్యానికి ప్రేరణ సమాజం. సమాజ సంస్కరణే సాహిత్యం పరమావధి. ఇది సాహితీ ప్రయాణం చేసిన, చేస్తున్న కవులు, రచయితలందరికీ తెలిసిన విషయం. అంత ప్రశస్తమైన సాహిత్యంలో  ప్రసిద్ధమైనవారు, తెలుగు సాహితీ జనావళికి సుపరిచితులైన కవి, రచయిత, విమర్శకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. వారి సాహిత్యం  కవితలు, రుబాయిలు, పాటలు,వ్యాసాల రూపంలో  అక్షరమక్షరం మూడు దశాబ్దాలుగా వ్యక్తిత్వ వికాసానికి వాహికయి, చైతన్యమే పరమావధిగా గుబాళింపులను వెదజల్లుతూ సాగుతున్నది. ఈ పరంపరలో ఏనుగు నరసింహారెడ్డి గారు ' పూల పూల వాన' గా పాఠకులకు అందించిన మినీ కవితల సౌరభాలను పాఠక హృదయాలపై స్ప్రే చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.
    సైకాలజిస్టుల ప్రకారం ఒక వ్యక్తి మూర్తిమత్వం అంటే అతని ప్రతి విషయాన్ని తెలిపే సంపూర్ణ వ్యక్తిత్వం. ముఖం, పళ్ళు, కళ్ళు మొదలుకొని మాట్లాడే విధానం, అలవాట్లు, ఆలోచనా విధానం ఇలా ప్రతి విషయాన్ని తెలియజేసేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి శారీరక, మానసిక, నైతిక, సాంఘిక లక్షణాల సమాహారం మూర్తిమత్వం. ఈ అన్ని కోణాలకు సరితూగే వారు ఏనుగు నరసింహారెడ్డి. ఈ విషయం వారి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వారికి అవగతమవుతుంది.  ఒక కవిని, రచయితనీ అర్థం చేసుకోవాలంటే వారి సాహిత్యాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఆటోమేటిగ్గా వారు అర్థమవుతారు.  ప్రసిద్ధ విమర్శకులు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి మాటలు గమనించినప్పుడు  " రచయిత వ్యక్తిత్వం రెండు రకాలుగా వ్యక్తమవుతుంది. 1. రచయిత తీసుకొనే వస్తువు 2. వస్తువును రచయిత అభివ్యక్తం చేసే విధానం. ఈ రెండు మార్గాల ద్వారా రచయితలు తమ వ్యక్తిత్వాలను చాటుకుంటారు"(చంద్ర శేఖర రెడ్డి, రాచపాళెం: కవుల తెలంగాణం, అక్టోబర్, 2016) అన్న రాచపాళెం మాటలు ఇక్కడ సరిపోతాయి.
 కలం పుష్టికి చిరునామాగా నిలిచే ఏనుగు నరసింహారెడ్డి 'పూల పూల వాన' లో " నేను పనిలో భాగంగా అప్పుడప్పుడు ఒరాల మీద నడుస్తాను. గట్ల వెంట, చెట్ల నీడన, రాళ్ల వెంట, బోళ్ళ మీద, సామాన్యులతో, మాన్యులతో కలసి పర్యవేక్షణ చేస్తాను. నోరున్న వాళ్లను, నోరుమెత్తని వాళ్లను కలుస్తాను. గ్రామీణతను పట్టణత్వాన్ని దగ్గరగా పరిశీలిస్తాను." అంటాడు.   'పూల పూల వాన 'లోని మినీ కవితలలో ఈ అంశాలే ప్రస్ఫుటమవుతాయి. "కొత్త ప్రదేశాల్ని చూసినప్పుడు, కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు, కొత్త అనుభవాలకు గురైనప్పుడు, పరవశించినప్పుడు, పస్తాయించినప్పుడు, ప్రకృతి దినం దినం తనను తాను సంజాయించుకుంటూ ఎదురైనప్పుడు నాలో కొన్ని ఊహల ముత్యాలు రాలుతుంటాయి. సమయం రాత్రి, పగలు ఎంత మాత్రం ఆగకుండా నడుస్తుండడం వల్ల అవి కొన్నిసార్లు పెద్ద కవితలుగా ఎదగలేదు."  ఆయా సందర్భపు ఊహలు ఇదిగో ఇలా కాగితం చెట్టు మీద పోత పూసుకున్న పూలయ్యాయని 'పూల పూల వాన' సంపుటిలోని మినీ కవితల నేపథ్యాన్ని తెలిపారు.  'పూల పూల వాన ' లో తాను తడవడమే కాకుండా పాఠకలోకంపై పూల వానని కురిపిస్తారు. వాన అందరికీ తెలిసిందే. కానీ పూల వాన, పూల పూల వాన నరసింహారెడ్డి లాంటి కవులకు మాత్రమే తెలుస్తుంది.

‘పూల పూల వాన’ సంపుటిలోని మొత్తం 285 మినీ కవితలను పరిశీలించినప్పుడు మానసిక వికాసం, సామాజిక దృక్పథం, ప్రకృతి, స్త్రీ దృక్కోణం, వృత్తులు, జీవన నైపుణ్యాలు, స్నేహం, పెళ్లి, రాజకీయాలు ఇత్యాది అంశాలు కనిపిస్తాయి.

మానసిక వికాసం:-
‘పూల పూల వాన’ లోని కవితలన్నీ మినీ కవితలు అయినప్పటికీ చిట్టి పాదాలలో గట్టి కవిత్వం పలికించారు కవి. వ్యక్తి శారీరకంగా ఎంత ఫిట్గా అయినా ఉండవచ్చు గాక, మానసికంగా ఫిట్టు లేనప్పుడు అటువంటి శారీరక పట్టుత్వం చొప్ప బెండుతో సమానం. ఆ విధంగా చూసినప్పుడు కవితలు పెద్దవా! చిన్నవా! అనేది ప్రధానం కాదు. ఈ సంపుటిలోని మినీ కవితలలో ఏనుగు నరసింహారెడ్డి వ్యక్తి వికాసానికి తోడ్పడే అనేక అంశాలను చర్చకు తెస్తారు. తద్వారా మనిషిని మానసికంగా బలోపేతం చేయడమే కాక సమ్యక్ దృక్పథానికి బాటలు వేస్తారు.
“వాడు కత్తి పట్టుకొని
పువ్వుల్ని కోసేయగలడేమో కానీ
రాబోయే వసంతాన్ని
ఏ ఆయుధమూ ఆపలేదు”
నిజంగా ఏ రోజుల్లో అయినా సాధారణమైన వ్యక్తి ఎదుగుదల అంత సాధారణమైనదేమీ కాదు. అడుగడుగునా అవాంతరాలు, అడ్డంకులు వ్యక్తి రూపంలోనో, పరిస్థితుల రూపంలోనో మొత్తానికి రూపం ఏదైనా కానీ ఎదురవుతూనే ఉంటాయి. ఆ ముల్లులను పువ్వుల్లా మలుచుకోవాలి. పోతే పోనీ! పువ్వులే కదా! చెట్టు లాంటి వ్యక్తి ప్రతిభా పాటవాలు కాదు. వేరు లాంటి ప్రాణమూ కాదు. వసంతం లాంటి పచ్చని భవిత కచ్చితంగా వస్తది. ప్రతి వ్యక్తి అలవర్చుకోవాల్సిన ఆశావహ దృక్పథాన్ని అలా కవి నూరి పోస్తాడు.
” అందుకుందామని
పోయిన కొద్దీ చంద్రుడు మెత్తబడి
ఏదో ఒక రోజు తనపై
తప్పక దిగమంటాడు”
అసలు ఈ వాక్యాలు ఎన్ని విషయాలకో అన్వయించుకోవచ్చు. అవకాశాలు, అధికారులు, ఇతరులతో అక్కరలు, అనుబంధాలు… ఇక్కడ ఏవైనా కావచ్చు అందుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం ఆగకూడదు. చెయ్యి పైకెత్తి చంద్రుని అందుకోగలమా! చేయి కందలేదు నిచ్చెన కందుతాడేమో! అందలేదు. తాడుకు అందుతాడేమో! ఏమో ఏదో ఒక రోజు మన ప్రయత్నాన్ని చూసిచూసి చలించి అయితే తనపై తప్పక దిగమంటాడు. లేదా తానే మనిషి దగ్గరకు దిగి వస్తాడు. ఇక్కడ చంద్రుడు మనం అందుకోవాలని అనుకున్న అంశం. అది ఏదైనా కావచ్చు. ప్రయత్నిస్తే పోయేదేముంది? వస్తే ఫలితం. లేదంటే అనుభవం.
ఇలా నేను వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కవితలను చెప్తూ వెళితే ఎన్నో చెప్పాల్సి వస్తుంది.
” పగలడాన్ని భరించిన
పలుగురాళ్ళు
మెరుస్తాయి
వెలుగులోనూ,చీకట్లోనూ” అంటాడు.
ఆటుపోట్లను ఎదుర్కోవడం అలవాటైన మనిషి చీకటి, వెలుగుల విజేత. “పోనీ పోనీ పోతే పోనీ.. రానీ రానీ వస్తే రానీ కష్టాల్ నష్టాల్ కోపాల్ శాపాల్ రానీ రానీ .. కానీ కానీ గానం ధ్యానం హాసం ళాసం కానీ కానీ.. అన్న శ్రీ శ్రీ గుర్తొచ్చాడు ఇక్కడ.
” వాళ్ళు
నన్ను రోజూ నిందించనీ
నాలో నిందించలేని లక్షణాలేవో
నాకూ తెలిసి వస్తాయి” అంటాడు.
ఇది కదా! నిజమైన పాజిటివ్ ఆటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ను అలవర్చుకోవాలి అదే జీవిత పథగమనంగా నిర్దేశించుకుని ముందుకు కదలాలని చెప్పే సైకాలజిస్టులకు కూడా అందని శిఖరాత్మక భావన ఇది.
“శత్రువుకు వందనం
నిజంగా అతనొక్కడే
భుజాలు కందేలా
మనల్ని మోసుకు తిరుగుతాడు” పరిపక్వమైన ఆలోచనకు, ధనాత్మక వైఖరికి అద్దం పట్టే కవితా పంక్తులు ఇవి.

సామాజిక దృక్పథం:-
సమ్యక్ సమాజమే కవి లక్ష్యమైనప్పుడు కవి కవిత్వమంతా సామాజిక దృశ్యమే అవుతుంది.
” ఎండలో కూడా
చల్లగా ఉన్నై పూరిండ్లు
అవును మరి!
అవి చెమటతో కట్టినవి”
గుడిసెలో చల్లగా ఉంటుందనేది సాధారణ భావన. ఆ చల్లదనం వెనుక ఎంత చెమట దాగి ఉంటుందో తెలుసుకోగలగడం మనసున్న కవికే సాధ్యం.
” మా అమ్మ రోటి కారంతో
తినబెట్టింది
ఈ నోటికి
ఘాటెక్కువ “
కష్టపడి ఎదిగిన వ్యక్తికి తన చుట్టూ జరిగే లోటుపాట్లను సహించడం కాస్త కష్టమే. ప్రశ్నించడం, ప్రతిఘటించడంలో ఘాటు కూడా ఎక్కువే ఉంటుంది మరి.
” కుర్చీల మీద
మనం కూర్చున్నా
ఆఫీసులు
ప్రజలవనే జ్ఞానం ముఖ్యం”

“నీ అయ్య జాగీరా?
అనలేకపోతుంది
ప్రజ
ఆఫీసులో చూసి మనల్ని” అంటాడు.
ఇదే తరహాలో
“చట్టాల నూతుల్ని
తవ్విందెందుకు?
నిరుపేదల్ని
తొయ్యడానికే!”అంటాడు.
ఎంతమంది అధికారులకు ఈ వాక్యాల అర్థం తెలుసు. నిజంగా తెలిస్తే, తెలుసుకుంటే గనక అధికార దర్పం అనే పదాన్ని నిఘంటువుల నుండి తొలగించవచ్చనిపిస్తుంది.
“మీ పాళీల
పత్తు లిరిగి పోనూ
ఇన్ని పేజీల పేపర్లో
ఒక్క నిజమూ రాయరే”
ఇక్కడ కవిలో ఒక పల్లె తల్లి కనిపించింది. ఆ తల్లి గొంతుక వినిపించింది. ఫోర్త్ స్టేట్ గా పేరుగాంచినది పత్రికా రంగం. అటువంటి పత్రికలు పక్కదోవలు పడుతున్న రోజులివి. పత్రికల్లోని రాతలను నిలదీస్తూ కలం గట్స్ చాటిన కవిత ఇది.
” కట్టడంలో
గొప్పతనం కాదు
కలరింగ్ లో చమత్కారం
నగరంలో భవన సముదాయం”
రియల్ ఎస్టేట్ మోసాలకు ప్రతిబింబం ఈ మినీ కవిత. కట్టుబడిలో ఒకప్పుడు ఉన్న నాణ్యత నేడు ఉండడం లేదు. మూన్నాళ్ళ ముచ్చటగా కట్టిన నాలుగు రోజులకే గోడలు బీటలు వారడం, పెచ్చులు ఊడటం, ఇంకా చెప్పాలంటే కట్టిన పెద్ద పెద్ద వంతెనలు కొన్ని రోజులకే కూలిపోయిన ఉదంతాలు నేటి సమాజంలో కోకొల్లలు.
” వలలు
పులుల్ని పడేయలేవు
పిచ్చుకల పైనే
వాటి ధ్యాస” అంటాడు కవి.
ఎవరైనా మోసపోయే వాళ్ళనే కదా మోసపుచ్చేది. మోసపోకుండా ఉండే జాగరూకత మనిషికి అవసరం అని చెప్పే వాక్యాలు ఇవి. ఇలా చెప్తూ వెళితే అనేకమైన సామాజిక అంశాల గురించి కవి స్పందించిన విధానం, సంస్కరణ పూరితమైన వారి ఆలోచనలు ఉన్నతంగా అనిపిస్తాయి.

స్వీయానుభూతి:-
సాధారణంగా కవి తనకు అనుభవంలోకి వచ్చిన అంశాన్ని కానీ, తాను అనుభూతి చెందిన సంఘటనను కానీ లేదా ఇతరులకు సంబంధించిన వివిధ అంశాలకు తాను తాదాత్మ్యం చెంది కవిత్వం సృజిస్తాడు.
” అంత విశాలమంటారా ఆకాశాన్ని
ఆనందంతో గంతులేయడానికి
అంతరంగమంత పెద్దదేదీ
నాకు ఇంతవరకు కనపడనే లేదు” ఈ ఒక్కటి చాలు. ఒక్క మెతుకు లాగా ‘పూల పూల వాన’ అనే ఈ సంపుటి శీర్షికను బలపరచడానికి.
“లోకాన
ఇంతమంది అందగత్తెలు
దైన్యం!
చూసేందుకు రెండే కళ్ళు”
” అందంగా
చూపించే అద్దాలు
శాస్త్రవేత్త లింకా
ఎప్పుడు కనిపెడతారో “
“ఢీకోడ్ చేస్తే తప్ప, అర్థం కాని, సాంకేతిక సందేశాలు, ఆమె చూపులు”… ఇలా కవి చిన్ని చిన్ని అనుభూతులను, కొన్ని కొన్ని సందర్భాలలో మనసుపెట్టే గిలిగింతలను చిట్టి చిట్టి కవితలుగా అందించి పాఠకులను రంజింపచేస్తారు.

” పిలిస్తే
ఒలికే ప్రేమ కంటే
వెతుకులాడే
ఆత్మకు తడి”
పెదాల మీద ప్రేమను అంటించుకుని నటించే మనుషుల వైఖరికి ప్రతిబింబం ఈ మినీ కవిత. పైపై మాటల ప్రేమల కలికాలంలో ఆత్మ తడి ఎంతమందికి పడుతుంది.
” తిరుగు ప్రయాణం లేని
చివరి రైలెక్కకముందే
ఎవరికైనా బాకీ పడ్డామేమో
తరచి తరచి చూసుకోవాలి” కాటికి టికెట్ తీసుకోవడానికి ముందుగనే ఈ జన్మలోని ఋణాలను తీర్చుకోవాలి. ” ఋణాను బంధ రూపేణా పశుపతి సుతాలయహః” అన్న శ్లోకం గుర్తొస్తుంది. కర్మ సిద్ధాంతానికి ఊతమిచ్చే కవిత ఇది.
” వాన బరువును
ఆగబట్టిన మొక్కను చూసి
మహావృక్షం
సిగ్గుతో చితికింది” అంటాడు కవి. ఎన్నో విషయాలలో బలహీనమైన వ్యక్తి తనకు ఎదురయ్యే కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం, అన్నిటికి అన్ని ఉన్నా, చిన్న కష్టానికి మహావృక్షం లాంటి బడా మనుషులు బెంబేలెత్తిపోవడం సమాజంలో చూస్తుంటాం. ఇటువంటి పరిణామాన్ని ఒడిసి పట్టింది ఈ కవిత. ప్రకృతిని, సమాజానికి అన్వయిస్తూ రెంటినీ మిక్సింగ్ చేస్తాడు కవి.
” రుచి దొరకటం లేదు
అన్నంలో
ఒక పూట జంపిచ్చి చూడు
అదే పరమాన్నం”
ఆకలి రుచి కరువైన మనిషికి అన్నం రుచించకపోవడం, రుచి దొరకపోవడం సహజం. ఆకలిని చమత్కరించిన కవిత ఇది.

ప్రకృతి తాదాత్మ్యం:-
ప్రకృతికి పరవశించని కవి ఉండడు. కానీ ఆ పరవశంలో కూడా లోకహితాన్ని వెతికే కవులు అరుదు.
” తాటి చెట్టులో
కల్లోక్కటే చూస్తే ఎలా
ఆ తల్లి
కావ్యాల్ని మోసింది” ఇదే తాటి చెట్టులో కళ్ళుని మాత్రమే చూసే సాధారణమైన వ్యక్తికి కవికి ఉండే తేడా. అలనాటి నుండి తాటి పత్రాలే కదా తాళపత్రాలై తెలుగు సాహితీ సంపదను సుస్థిరం చేసింది. తల్లిలా భావితరాలకు అందించింది. అల్పాక్షరాలలో అంతులేని భావం అంటే ఇదే కదా!
” ఈదురుగాలి
జోరువాన ఎక్కడ కలిసాయో
ఆగని సయ్యాట
తెగని యుగళగీతం”
గాలికి, వానకు ముడిపెట్టిన కవితా హృదయం. గమ్మత్తయిన కవిత ఇది. ఇలా గాలి మీద, వాన మీద, చెట్టు మీద వివిధ ప్రాకృతికాంశాల మీద చెప్పిన మినీ కవితలు కోకోల్లలు.

” మందారం పెరుగుతుంటే
ఇనుప గేటు బిక్కమొహం
అంత గట్టిగా ఉంటే
ఎదుగుదల కష్టం మరి” అన్న కవి మాటలలోని లోతు చాలా ఎక్కువ.
నిజానికి ఊహ గొప్పది. దాని పరిధి కూడా అనంతం. కానీ ఈ కవిత చదివినప్పుడు కవిలోని భావాత్మకతమందు ఊహ చిన్నబోయినట్టు అనిపించింది. గేటు పక్కన ఎత్తుగా పెరిగిన మందారం చెట్టు ముందు, ఇనుప గేటు చిన్నదైపోయిందని కవి అనడాన్ని బట్టి, ఎదగాలంటే ఒదుగుతూ వెళ్లాలని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తుంది.

స్త్రీ దృక్కోణం:-
సమ సమాజాన్ని కాంక్షించే ఒక వ్యక్తి స్త్రీల పట్ల ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? ఎలా ఉన్నప్పుడు స్త్రీవాద ఉద్యమాలకు, స్త్రీ హక్కులకు తెరపడుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలుగా నరసింహారెడ్డి మినీ కవితలు కనిపిస్తాయి. వారు వ్యక్తం చేసిన భావజాలం లోకమంతా పరచుకున్నప్పుడు పుడమి తల్లికి పులకింతే మరి. వీటికి నిరూపణగా ఈ మినీ కవిత..
” ఏ రోజు మహిళల్ది
కాదో చెప్పండి
మార్చి 8న
మహా సంబరం చేయడానికి”
పురుషులతో సమానంగా స్త్రీలకు అన్నింటిలో సమాన అవకాశాలు, సమానమైన విలువ దక్కినప్పుడు నిజమే మార్చి 8లు ఎందుకు? మహిళా దినోత్సవాలతో మహిళకేమక్కర.
” అందిపుచ్చుకోలేక
ఆమెను కవిత్వంలో చిత్రించాను
అక్కడ కూడా
నవ్వమని ఎవరన్నారు” స్త్రీ ఔన్నత్యాన్ని గొప్పగా చాటిన కవి హృదయానికి, మహిళలను తక్కువ చేసి చూసే మురికి మనసుల విచక్షణకు ఈ పంక్తులు మచ్చుతునక.
“ఆమె కంటి నీట
మెరుపు శకలాలు
మన మాటలన్నీ
ఎండు పుల్లలు” అంటాడు కవి.
రామ పాదము తాకి రాయి అహల్యగా మారిందని చెప్తే విన్నాము. చదివి తెలుసుకున్నాము. ఈ కవితలో ఎందరో అహల్యలను అర్థం చేసుకున్న రాముడు ప్రత్యక్షంగా కనిపించాడు. పురుషులందరూ కవులు కావాలని ఒక కొత్త ఆశ పుట్టించిన మినీ కవిత ఇది. ఆడవాళ్లను అర్థం చేసుకోవడానికి ఇంతకు మించి ఇంకొకటి ఉంటుందా!
ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలను గౌరవిస్తూ,అభిమానిస్తూ, అర్థం చేసుకుంటూ ఎంతో ఉన్నతంగా వారి గురించి ఆలోచించినట్లు పాఠకులకు అవగతమవుతుంది.

వృత్తులు:-
“కోటి విద్యలున్నా కులవృత్తికి సాటి రావు” అన్నట్లుగా వృత్తులకు పట్టం కడుతూ కవితలల్లారు నరసింహారెడ్డి.
” గౌడు చెట్టెక్కి
చుక్కల్ని చూస్తాడు
మోకు విప్పి
అంపశయ్యపై పవళిస్తాడు”
“చెట్టులెక్కగలవా ఓ నరహరి! పుట్టలెక్కగలవా”అని ఓ పాట ఉంది. కానీ తాటి చెట్టు ఎక్కడం మామూలు మాటలు కాదు.అది గౌడన్నకే సొంతమైన నైపుణ్యం. కమ్మని కల్లుకోసం ఆవురావుమనే గొంతులను తడుపుతూ తన, తన కుటుంబీకుల జానెడు పొట్ట నింపడానికి అంపశయ్యపై నిత్యం పవళిస్తాడు గౌడన్న.
“భూదానం చరిత్ర
వర్తమానం పట్టుచీర
ఎటు మర్లినా
మెరిసే పోచంపల్లి”
చారిత్రకంగా భూదానోద్యమానికి భూమికై నిలిచిన పోచంపల్లి వర్తమానంలో నేతన్నల శ్రమకు ప్రతీకగా పట్టుచీరలతో మెరుస్తుందని కవి భావన. పోచంపల్లి చేనేతతో మెరుస్తుందని గుర్తించి, చేనేత వృత్తి పట్ల కవి వ్యక్తం చేసిన గౌరవ పూర్వక భావన ఇది.
వ్యవసాయ సంబంధిత కవితలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి.
” కాల్వల్తో కాదు
కన్నీటితో పండుతాయి
పీఠభూమిలో
పునాసలు”
“ఒంపు మడిలోకి దూకడం
నీళ్ల ఒడుపు కాదు
మిర్ర మడిని అద్దం
చేసిన నేర్పరిది” అంటూ రైతు పరిశ్రమను తెలుపుతాడు.

భాష:-
కవులకు రచయితలకు భాషాభిమానం మెండు.” మనం ఏ రాచరికంలో
డంకా భాజాయించినా
ఊహలన్నీ
మాతృభాషలోనే పురుడుపోసుకుంటై”
మాతృభాష ప్రాధాన్యతను నిరూపించిన కవిత ఇది. మాతృభాషను తక్కువగా భావించే భాషా ద్రోహులకు చెంపపెట్టు లాంటి వాక్యాలివి.
ఈ విధంగా ఇంకా మానవ సంబంధాలు, స్నేహం, ప్రేమ, వివాహం, వర్తమాన సమాజ పోకడలు ఇలా ఎన్నో అంశాలపై చక్కని మినీ కవితలున్నాయి. పరిశ్రమకు పచ్చ జెండా అయినా ఏనుగు నరసింహారెడ్డి గారి శక్తివంతమైన సృజన ‘పూల పూల వాన’. ఈ సంపుటిని చదివినవారు ఎవ్వరైనా సరే కచ్చితంగా నూతన చైతన్యంతో కొత్త శక్తిని పెంపొందించుకుంటారు.
సాహిత్యం పట్ల, సమాజం పట్ల తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్న డాక్టర్ ఏనుగు సింహారెడ్డి గారి ‘పూల పూల వాన’ కచ్చితంగా వ్యక్తి మానసిక వికాసానికి రాచబాటే. సమాజానికి మంచి సాహిత్యాన్ని అందిస్తున్న కవి డా. ఏనుగు నరసింహారెడ్డి అభినందనీయులు.

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అభిసారిక

by K. Madhuri March 16, 2025
written by K. Madhuri

అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవల రచయిత రవిమంత్రి గారు..
పేరు లో మంత్రి ఉన్నా, రచయితగా రారాజు స్థానాన్ని చేరుకున్నారు ఈ రచన తో..
అమ్మ డైరీలో కొన్ని పేజీలు మీ నవలకు మనస్ఫూర్తిగా
అభినందనలు..శుభాకాంక్షలు..

ఈ పుస్తకం చదవడం కోసం ఎన్నిరోజులుగా వేచి ఉన్నానో,.. చదివాక అనిపించింది వర్త్ వర్మ వర్త్ (వర్త్ ఫర్ వెయిటింగ్) .
నాకో సంగతి చెప్పు.. అసలు ఎవరైనా నీకు ఉత్తరం రాశారా? పోనీ నువ్వెప్పుడైనా రాశావా? (అంటే ఏం చెప్తాం అండి రాసుంటే బాగుండేది అనుకోవడం తప్ప.) అని మొదలు పెడుతూ ఉత్తరాలు రాద్దాం అన్న ఆలోచనలకి బీజం వేశారు.
నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలియకుండానే రాస్తున్నాను అంటూ తెలియకుండానే పుస్తకoమొత్తం చదివేలా చేశారు..
కథ పుట్టుక- సాధారణంగా కథలు చెప్పడం బాగా తెలిసిన రవి మంత్రి గారు అమ్మ కథని చెప్పాలి అనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు అని సందేహంగానే కథ సందర్భాన్ని తెలియజేశారు.
కథలోని పాత్రల పరిచయం- ఈ కథలో ప్రధాన పాత్రలు నాలుగు. వాటిని నడిపించే పాత్రలు మరో మూడు.
1) సారిక- మన కథానాయిక. కార్పోరేట్ స్కూల్ ప్రిన్సిపాల్. టీనేజర్ నుంచి అమ్మ వరకు ప్రయాణం లో వయసుతో పాటు వచ్చే మార్పులకి తగ్గట్టు ప్రవర్తిస్తూ,ఒక దశ తర్వాత భావాల్ని నియంత్రించుకోవడం నేర్చుకొని పరిస్థితులని తన అదుపులోకి తెచ్చుకోగలిగే పాత్ర.
పాఠకులు తను నవ్వితే నవ్వి, ఏడిస్తే ఆమెతో పాటే ఏడ్చారు అంటే అతిశయోక్తి కాదు.
2) అభిరామ్- కథానాయకుడు. తనకు బాధ కలిగినా ఇతరులను బాధ పెట్టని మంచి మనసున్న పాత్ర. రామ్ లా ప్రేమించడం చాలా కష్టం.
3) నందగోపాల్- సారిక భర్త. సౌమ్యుడు. ఇతనిలా మనుషులని స్వీకరించటం చాలా కష్టం.
రామ్, నందు ఈ రెండు పాత్రల్నీ పోలిన మనుషుల్ని చాలా అరుదుగా చూస్తాం.
4) వర్థనమ్మ- సారిక తల్లి. ఈవిడ ప్రతీ ఆడపిల్ల తల్లికీ ప్రతినిధి లా అనిపిస్తారు.
5) సుచిత్ర- రామ్ భార్య. గతాలు, భవిష్యత్తులు అనే ఉచ్చులో చిక్కుకోకుండా ఆ రోజుని మాత్రమే ఆస్వాదించే మనస్తత్వం.
6) గీత,జిత్తు- నేటి సమాజంలో విభిన్న మనస్తత్వాలు గల పిల్లలకు ప్రతిరూపాలు.

సారిక వాళ్ళ వెనక ఇంట్లో కి కొత్తగా వచ్చారు గీత మరియు గీత వాళ్ళ నాన్న. గీత పరిచయం తో కాలక్షేపం కోసం కొమ్మపై వాలిన పక్షి ఎగిరిపోతుందని తెలిసినా, బాగున్న ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ రేపటి గురించి తలుచుకోవటం మానేసింది సారిక. కొన్నిరోజుల్లోనే గీత సారిక కి, వాళ్ళ కొడుకు జిత్తు కి చాల దగ్గరైంది.
గీత సారిక అలవాట్లని, ప్రపంచాన్ని, ఆకారాన్ని కొంచెంకొంచెంగా మార్చేసింది. తనకి తననే కొత్తగా పరిచయం చేసింది.
ఒకరోజు గీత సారిక ని డిన్నర్ కి ఆహ్వానించింది. తన తండ్రి ని పరిచయం చేస్తానని చెప్పింది గీత.
మీ నాన్న పేరేంటి అని అడగగా, అభిరామ్ నాయుడు అని సమాధానమిచ్చింది గీత. రామ్ అంటే నువ్వు… అని సారికా అంటుండగానే,, అందుకొని అవును నేను గీతాంజలి అని చెప్పి వెళ్ళిపోయింది గీత.
రామ్ అంటే తనేనా ఇప్పుడెందుకు వచ్చాడు. కలవాలా వద్దా అని ఆలోచనలో పడింది సారిక..
ఇంతకీ రామ్ ఎవరంటే ?
సారిక ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సీనియర్. ర్యాగింగ్ ద్వారా పరిచయం అయ్యి మెల్లమెల్లగా మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. పరీక్ష సరిగ్గా రాయలేదన్న కోపం రామ్ మీద చూపిస్తూ అందరి ముందు తిట్టింది సారిక. సారి సారిక ఇంక నీ జోలికి రాను అంటూ మాయమయ్యాడు రామ్.
రామ్ ని తిట్టి తప్పు చేశావ్ చిన్నప్పుడు తెలిసిన అమ్మాయివి అని చనువుగా మాట్లాడాడు రామ్ అని రాజేష్ చెప్పగా, ఆరా తీసి తను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నపుడు కలిసి ఆడుకున్న స్నేహితుడు అని, అప్పట్లో రామ్ కి సారిక అంటే చాలా ఇష్టం ఉండేదని వాళ్ళ మామ్మ ద్వారా తెలుసుకుంది.
వేసవి సెలవులు కావడం తో కలవడం కుదరక ఆకాశవాణి ద్వారా నీకై అభిసారికనై పాట తో సందేశం పంపింది.
సినిమాకి అని చెప్పి సారిక స్నేహితురాలు పద్మ. బీచ్ లో వేచి ఉన్న రామ్ కి సారిక ని కలిపించింది.
ఇంకేముంది ప్రేమ చిగురించి బీచ్ లు, సినిమాలు, షికార్లు తిరగడాలతో పెరిగిపోతూ ఉంది.
వర్ధనమ్మ వాళ్ళ అన్నయ్య తో ఆస్తి లో వాట కోసం పోరు పెట్టుకొని సాధించింది.
అన్న కూతురు పెళ్లి నిశ్చయం తో సింహాచలం లో కలిసిపోయారు ఇరు కుటుంబాలు. సారిక బావ నందు అందగాడు ,మంచి ఉద్యోగం అవ్వటం తో సారిక ఇష్టం తో పనిలేకుండా పెళ్ళిచూపులు కానిచ్చేశారు తల్లిదండ్రులు. మామయ్య వాళ్ళు వెళ్ళిపోగానే మదిలోని ప్రేమను బయట పెట్టింది సారిక. ఇంకేముంది సారికని నందుతో పెళ్లికి ఒప్పించటానికి ఇంట్లో రోజు యుద్ధవాతావరణమే సాగుతుంది.
ఇక లాభం లేదు అనుకొని వర్దనమ్మ రామ్ ని కలిసి మాట్లాడింది. సారిక తో పెళ్లికి ఒప్పుకోక పోవటానికి కారణం కులమేనా అని రామ్ ప్రశ్నించగా,
కులము ఒక్కటే కాదని. నందు తన అన్న కొడుకు రక్త సంబంధం, తెలిసినవాడు, మంచి ఉద్యోగం, నందు ని చేసుకుంటే సుఖపడుతుందని సారిక భవిష్యత్తు కి భరోసానిచ్చింది.
ఇక చేసేదేమీ లేక సారిక ఎంత వారిస్తున్నా వినకుండా, భరోసా లేని తన భవిష్యత్తుతో సారికని ముడిపెట్టలేక తను సుఖంగా ఉండాలని వాదించి గెలిచి, సారికను నందు తో పెళ్లికి ఒప్పించాడు రామ్.
సారిక నందుని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళింది. నందు చిన్నపుడు పూజిత అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె వయస్సు ఎక్కువ అవ్వటం వల్ల వారి ప్రేమ ముందుకు సాగలేదు. సారిక – నందు ఇద్దరు గతాలను స్వాగతించి,
మెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అలవాటు గా సాగిపోతున్నారు. పుట్టిన కొడుకు కి అభిరామ్, పూజిత లా పేర్లు కలిసేలా అభిజిత్ అని పేరు పెట్టారు.
బాబు పెద్దవాళ్ళ దగ్గర పెరిగితే బాగుంటుందని బెంగుళూరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు నందు. భారత్ కి వచ్చే చివరి రోజు ఆఫీస్ లో సెండ్ ఆఫ్ పార్టీ కి వెళ్లి అగ్నిప్రమాదం లో చిక్కుకొని మరణించాడు.
తరువాత నందు కోరిక ప్రకారం సారిక జిత్తు ని తీసుకొని భారత్ కి వచ్చి డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తూ జీవిస్తుంది.

మరునాడు గీత ఆహ్వానాన్ని మన్నించి డిన్నర్ లో రామ్ ని కలిసి మాట్లాడింది.
మళ్ళీ కలపాలనే ఉద్దేశమే ఉంటే తనకి దూరంగా ఉండమని గీత ని హెచ్చరించింది.
రామ్ చిత్రను యిష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు.
సారిక గురించి తెలుసుకొని, గతాన్ని స్వీకరించి, చిత్ర తన ప్రేమతో రామ్ ని మార్చేసింది. పుట్టిన పాప కి వారు ప్రేమించిన రోజులలో సారిక చెప్పినట్లు గీతాంజలి అని పేరు పెట్టారు. కొన్నాళ్ళకి చిత్ర కాన్సర్ తో మరణించింది. ఇదంతా చిత్ర డైరీ చదివి తెలుసుకుంది సారిక. తన అమ్మ డైరీ చదివిన గీత సారికని వాళ్ళ నాన్న తో కలిపే ప్రయత్నం చేసింది. రామ్ కి చేసిన అన్యాయానికి క్షమాపణ కోరుతూ నందు రాసిన లేఖ చదివి జిత్తు కూడా అదే ప్రయత్నం చేశాడు.
ఈ వయసు లో ఎవరు ఏం అనుకుంటారో అని అనిపించినా ఎప్పటికీ మనల్ని వేల కళ్ళు చూస్తాయి, వందల నోళ్ళు మాట్లాడతాయి. ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్తూ పోలేము కదా! అందరిని మెప్పించాలి అంటే ఎప్పటికీ మనం మనలా ఉండలేం. మనం ఎవరి కోసమో జీవించకూడదు అని మళ్ళీ మొదటి నుంచి కొత్త గా ప్రయాణం మొదలు పెట్టారు అభి- సారిక…
అమ్మకు కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం అతిశయోక్తి కాకపోయినా, చివరికి ఆ ప్రేమని కలిపి గెలిపించడం మాత్రం ఇండియా లో ఈ రోజుల్లో అమాయకత్వమే అవుతుంది అనిపించింది, కానీ నిజంగా జరిగితే బాగుండు అనేంత అందగా ఉంది..
మనసు లేని పెద్దలు విడదీసిన పిల్లల ప్రేమకథ ని పెద్దమనసు తో వారి పిల్లలు మళ్ళీ కలపడం .. ఇదే అన్నింటిలో ప్రత్యేకం.
పుస్తకం చదువుతున్నంత సేపు బయటి ప్రపంచాన్ని బహిష్కరించి, అభి – సారిక ల ప్రేమ ప్రపంచం.. నందు, చిత్ర, జిత్తు, గీతా లతో సంసారిక బంధం, త్యాగం, సర్దుబాటు, అర్థం చేసుకోవటం అన్ని.. వారితో పాటు నవ్వడం, వారి బాధలో వారితో పాటు ఏడ్వడం.. అన్ని చుట్టూ అల్లుకునేలా చేసిన
రచయిత మాటలు, భావాలు పాఠకులని సుతిమెత్తగా ఎప్పటికప్పుడు స్పృశిస్తూనే ఉన్నాయి.

ఈ కథని పాఠకుడు తన మనసులోని భావాలను తానే రాసుకుని చదువుతున్నట్లుగా భావిస్తాడు..
నవల మధ్యమధ్యలో షేక్స్పియర్, బుద్ధుడు, రోజ్ వైల్డర్, పింగళి…లను అలాఅలా పలకరిస్తూ.. మనుస్మృతి లోకి వెళ్ళిరావడం చాలాచాలా బాగుంది..
ఈ ప్రేమలు విడిపోవడాలు ప్రేమ వెతుక్కుంటూ రావడాలు,చాలా అరుదుగా జరిగే విషయాలు అనే ముగింపుతో..
అరుదుగా జరిగే విషయాన్ని కూడా ఆలోచనలోకి తెచ్చి, అద్భుతంగా వర్ణించే రవిమంత్రి లాంటి రచయిత కూడా మాకు అరుదే మరి!…
ధన్యవాదాలు..

March 16, 2025 0 comment
2 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us