మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
Uncategorized

మన తెలుగు నాటకాలు- అమ్మ చెక్కిన బొమ్మ

by Sammeta Vijaya July 20, 2025
written by Sammeta Vijaya

అద్భుతాలను సృష్టించిన నాటిక అమ్మ చెక్కిన బొమ్మ
మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.. అన్నారు తల్లిది ఎన్నటికీ ప్రథమ స్థానమే!
అమ్మ పేరులోని మాధుర్యానికి అక్షరాలతో అభిషేకించిన పాటలెన్నో..
• అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట..
• పెదవే పలికిన మాటల్లోని తీయని పలుకే అమ్మా
• అమ్మని మించి దైవమున్నదా..
ఇలా చెప్పుకుంటూ పోతే పాటలనేకం
కొత్తగా ప్రత్యేకంగా వినపడుతున్న పాట..
బొమ్మరా ఇది బొమ్మరా అమ్మచెక్కిన బొమ్మరా.. ఈ పాట మనల్ని అమ్మ ప్రేమలో ముంచెత్తుతుంది. శ్రీనిధి వీనులవిందుగా పాడిన ఈ పాట అమ్మ చెక్కిన బొమ్మ నాటికలోనిది.
మొదలు పెట్టిన కొద్ది కాలంలోనే పలువురి ప్రశంసలతో పలు ప్రదర్శనలవైపుకి విస్తరించి ప్రదర్శించిన ప్రతి చోటా అభినందనలు , అవార్డుల వెల్లువ కొనసాగుతున్న అమ్మచెక్కిన బొమ్మ . ఆ నాటకం వివరాలలోకి వెళితే …
రచయిత్రి :
అమ్మ చెక్కిన బొమ్మ నాటికను శ్రీమతి జ్యోతిరాజ్ బీశెట్టి రచించారు. ప్రముఖ నాటకరంగ దర్శకుడు, నటుడు అయిన డా. వెంకట్ గోవాడ తన తల్లి పేరు మీద నిర్వహించిన అమ్మ కథాంశంగా నిర్వహించిన నాటికలపోటీలో ద్వితీయ బహుమతి పొందిన నాటిక.
జ్యోతి రాజ్ బీశెట్టి పలు నాటకాలలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న నటి. అమ్మ చెక్కిన బొమ్మ లో ప్రధానమైన అమ్మ పాత్రను తానే నటించారు .నాటికను తనే రచించి నటించడం ఈ నాటిక ప్రత్యేకత. జ్యోతి పదకొండేళ్ళ వయసులో రేపేంది నాటికలో తొలిప్రదర్శన చేసి, తిరిగి 2017 లో “బావా ఎప్పుడు వచ్చితివీవు” నాటికతో మొదలుపెట్టి నేటి వరకు నిరంతరాయంగా నాటకాలలో నటిస్తున్నారు. శిష్లా చంద్రశేఖర్ గారి రచనల మీద ప్రస్తుతం పి హెచ్ డి చేస్తున్నారు . జ్యోతి అంతకు ముందు మూల్యం నాటికతో మంచి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు .మంచి ఇతివృత్తం , సామాజిక అంశాన్ని ఎంచుకోవడం జ్యోతి రచనకు నటనకు వన్నె తెచ్చాయి.

దర్శకత్వం : డా. వెంకట్ గోవాడ తెలుగు నాటక రంగంలో యువ నాటక దర్శకుడు నటుడు నిర్మాత ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి పూర్తిస్థాయిలో నాటక రంగానికి తమ సేవలను అందిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ లో పీజీ డిప్లమా చేసిన డాక్టర్ వెంకట్ గోవాడ పలు నాటకాలలో విభిన్న పాత్రలను పోషించి అందర్నీ మెప్పించారు . 2013లో గోవాడ క్రియేషన్స్ ప్రారంభించి పలు నాటకాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు సినిమాలు సీరియల్స్ లో పాత్రలు పోషిస్తున్నారు. మూల్యం నాటికలో నటన తో పాటు దర్శకత్వం వహించి పలువురి ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం వీరి దర్శకత్వంలో అమ్మ చెక్కిన బొమ్మ రెండు తెలుగు రాష్ట్రాలలోను అందరి ప్రశంసలను అందుకుంటుంది. పరిషత్తులలో పలు అవార్డులను సొంతం చేసుకుంది.
కథాంశం: అమ్మ చేతిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న అబ్బాయి ఎదుగుతున్న క్రమంలో కొన్ని మార్పులు గ్రహిస్తుంది తల్లి. మొదట పొరపడుతున్నాననుకుంది తర్వాత గమనించింది. అబ్బాయిగా ఉన్న కొడుకు అమ్మాయిగా ఉండటానికి ఇష్టపడటం అతనిలో మార్పులు ..తనలో జరుగుతున్న మార్పుల పట్ల సంఘర్షణ.. ఈ విషయమై తల్లి పాట్లు, భర్త విముఖత సమాజానికి భర్తకు ఎదురీది తల్లి తీసుకునే నిర్ణయం దాని ఫలితం .. వీటన్నింటి మధ్య రూపుదిద్దుకున్న నాటిక.
పాత్రలు: వెన్నెల గా రూపుదిద్దుకునే ముందు చిన్న బాబు గా దివేష్, కాస్త పెద్దయ్యాక భాను ప్రకాష్ వెన్నెలగా మారిన ట్రాన్స్ జెండర్ పాత్రలో ట్రాన్స్ జెండర్ హర్షిణి మేకల పాత్రలకు జీవం పోసారు. తండ్రిగా డా. వెంకట్ గోవాడ తల్లిగా జ్యోతి పరిణితి చెందిన కళాకారులుగా నాటకాన్ని తల్లితండ్రుల మానసిక స్థితిని భావోద్వేగ నాటకంగా మలిచి పాత్రలలో లీనమై నటించారు. బొమ్మరా ఇది బొమ్మరా పాటతో శ్రీనిధి, సంగీతం సమకూర్చిన నాగరాజ్ , ఫణీంద్ర రోహిత్ సెట్ డిజైన్.. ఇతర సిబ్బంది సహకారంతో రూపుదిద్దుకున్నదీ అమ్మ చెక్కిన బొమ్మ.

ప్రత్యేకత :
విన్నూత్న కథాంశం.. ఎదురు దెబ్బలకు తట్టుకున్న ధీరగా తల్లి పాత్ర, భర్తా బిడ్డా మధ్య బిడ్డవైవు మొగ్గు చూపిన సంఘటనలు సంభాషణలు.. ట్రాన్స్ జెండర్ల దుస్థితి వారి భవితను ఎంచుకొనే విషయంలో లేని సహకారం , ఎదుర్కొన్న వివక్ష, అవమానం చివరకు కన్న తండ్రి నిరాదరణ .. అన్నింటిని అధిగమించి చేరుకున్న లక్ష్యం ఐ ఏ ఎస్ వెన్నెల గా రూపాంతరం .. అనేక విషయాల కలబోత ఈ బొమ్మ.. తను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఏది? తను మాత్రం తన సాధనతో సమాధానమై నిలిచింది.

ప్రత్యేక ప్రశంస : ఈ నాటికలో ప్రత్యేక ప్రశంస అందించ వలసిన అమ్మ చెక్కిన బొమ్మ వెన్నెల పాత్రలో నటించిన హర్షిణి మేకల . హర్షిణి మేకల ఒక ట్రాన్స్ వుమన్, ఆమె అందాల పోటీలలో, నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చిన్నతనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె 2024 లో జరిగిన మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలలో ఐదవ స్థానంలో నిలిచారు మరియు మూడు టైటిల్స్ గెలుచుకున్నారు. తన జీవితం లాంటి ఈ నాటికలో తను నటించడం ఈ పాత్రకు న్యాయం చేసినట్లైంది. హర్షిణి నటన అందరి ప్రశంసలకు నోచుకుంది.
అద్భుతమైన కథనం రచించిన జ్యోతిరాజ్, విలక్షణంగా నటింపజేసి దర్శకత్వం వహించిన డా వెంకట్ గోవాడ, ట్రాన్స్ జెండర్ ఆత్మకథ అనిపించిన రీతిలో స్వయంగా ఆ పాత్రకు న్యాయం చేసిన హర్షిణి , తన స్వరంలో అమ్మ చెక్కిన బొమ్మను చూపిన శ్రీనిధి .. నాటకంలోని భావాలలోకి సంగీతం జోడించిన నాగరాజ్ , వెన్నంటి ఉన్న రాధ గారు స్వరాజ్ గారు తదితర బృందం మొత్తం అభినందనీయులే! ఈ మహత్తర నాటకంలో అవార్డులతో పాటు ప్రశంసల జల్లుకు పాత్రులు. మరిన్ని విజయాలను అందుకుంటూ సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల మన దారుణమైన ప్రవర్తన మార్చుకునేందుకు దోహదం చేస్తుందీ నాటిక.

July 20, 2025 28 comments
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారి కథలకు సమీక్ష

by Dr. Vasundhara July 20, 2025
written by Dr. Vasundhara

శీర్షిక. అంబోధిలో ఆణిముత్యాలు

విషయ సూచిక
1ముందుమాట 2రచయిత,చిరుపరిచయం
3 కథల సమీక్షలో,
పాత్రలు
సంభాషణ
అంతరార్థం
సందేశం. మొ!!నవి

1ముందుమాట

సంగీత సాహిత్యాలు రెండు, సరస్వతిదేవి మానవులకు ప్రసాదించిన క్షీరామృతాలు.

సంగీతం,శృతి మధురం.వింటేనే ఆనందం కలుగుతుంది. క్షీరంవలె
సులభతరం.
సాహిత్యం, అమృత మదనంవలె
కష్టతరం. అందుకే నన్నయ్య కవిత్వాన్ని (భారతాన్ని) “లోనారసి”
చూడాలన్నాడు. మన కవిత్వాది రచనలకు
సమీక్షలు,వివరణలు, ముందు మాటలు పీఠికలు ఉండడం వల్లే ఆ యాకావ్యాల విలువ, మనం తెలుసుకుంటున్నాం.
అందుకే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి నారాయణరెడ్డి గారు ఇలా అన్నారు “కప్పి చెప్పేవాడు కవి, విప్పి చెప్పేవాడు విమర్శకుడు”అని.

కథలు కాలక్షేపం కోసం రాయకూడదు.
సమాజ క్షేమం కోసం
సందేశాత్మకంగా రాయాలి. కవి, లేదా కథా రచయిత సమాజ స్పృహ కలిగి ఉంటేనే
అది సాథ్యమవుతుంది
***
2) రచయితపరిచయం
సాహిత్య సస్యాభివృద్ధికి
మాగాణి, కవి పండితులకు పుట్టినిల్లు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మస్థలమైన సిరిసిల్ల, కిరణ్ కుమార్ గారికి కూడా జన్మస్థానం కావడం విశేషం.
ఉమా, కనకయ్య గార్ల మొదటి సంతానం కిరణ్ కుమార్ గారు.
కనకయ్య గారు మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయాలలో ఉంటూ, వంశపారపర్యంగా ఉన్న వృత్తి, వస్త్ర వ్యాపారాన్నీ సాగించారు. కిరణ్ కుమార్ తండ్రికి సహాయంగా ఉంటూనే M.com పూర్తి చేశారు. కాలేజీ రోజులలో నుంచి సాహిత్య సేద్యం ప్రారంభించి అచిర కాలంలోనే
సాహిత్య బృందావనాన్నీపెంచి వివిధ సాహిత్య ప్రక్రియా పుష్పాలను
వందల సంఖ్యలో
పూయించిన ఘనత కిరణ్ కుమార్ గారిదే.
. ఆసంఖ్యాక అవార్డులు బహుమతులు వారి సొంతం.అతి చిన్న వయస్సు లోనే అలుపెరుగని సాహితీ ప్రయాణం ప్రారంభించి
ఉన్నత స్థాయికి ఎదిగిన కిరణ్ కుమార్ గారు శ్రమించే స్వభావం కలవారు, సౌమ్యులు, సాహిత్యా భిలాష వారిఊపిరి.
***
3) కథల సమీక్ష
కథ, నవలా ప్రక్రియలకు పాత్రలు సంభాషణలు ప్రాణం
వంటివి.
ప్రస్తుత సమీక్షలో కిరణ్ గారి రెండు కథలను సమీక్షకు ఎన్నుకున్నాను.
1 అనుబంధం.
2 ఉషోదయమా…
ఈ రెంటినీ ఎన్నుకోవడంలో ఉద్దేశం, ఈ రెండు కథలకు పాత్రలు, సంఘటనలు ఒకటే కావడం ముఖ్య కారణం.
రెండు కథలలో సమాజానికి కావలసిన సందేశాలు, ఉపదేశాలు మొదలైన వాటిని పాఠక హృదయాలకు దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నమేఈ సమీక్ష.

కబీర్ చెప్పినట్లు ఏదైనావిషయాన్ని ఉపమానంతో చెప్పాలి.
రసాల మామిడిపండును బాగా రసం తీసి గ్లాసులో పోసి ఇవ్వుచ్చినప్పుడు తాగేవాళ్లు బాగా ఆనందిస్తారు అలాగే కథలలో, రచనలలో ఉండే అంతరార్థాలను, సంభాషణ చాతుర్యాలను, ప్రజలకు ఆచరణీయమైన సందేశాలను సమీక్షలో విపులంగా చూపించగలిగినప్పుడు ఆకథ, సమీక్ష రెండు ధన్యమవుతాయ్.

.ముందు అనుబంధం+ ఉషోదయమా అనే వాటిని గురించి మీకు వివరించాలి.
అనుబంధం అనేది కిరణ్ కుమార్ గారు రాసినమొట్టమొదటి కథ.
అటు తరువాత ఉషోదయమా? అనే కథ తన మొదటి కథ, “అనుబంధా”నికి పొడిగింపుగా రాసిన రెండో కథ. ఇవి విడివిడిగా చదివినా, లేక కలిపి చదివినా వాటి వాటి సందేశం సమగ్రంగానే ఉన్నది. కానీ కలిపి చదివినప్పుడు పాఠకుని లోతుగా ఆలోచింపజేస్తుందనడంలో సందేహం లేదు.

మొదటి దానిలో మోసం కనపడితే రెండవ దానిలో మోసానికి తగిన ప్రతిఫలం, దర్పణంలో చూపించినట్లు చూపించారు రచయిత కిరణ్ కుమార్. అందుకే రెండు చదివినప్పుడు సంపూర్ణమైనటువంటి అవగాహన చదువరులకు ఏర్పడుతుంది.

అందువల్ల నేను అనుబంధం+ ఉషోదయమా? రెంటిని కలిపి సమీక్షిస్తున్నాను.
ఈ కథలను గురించిన ఒక గొప్ప విషయాన్నీ మీ ముందు సంతోషంగా సగర్వంగా నేను సమర్పిస్తున్నాను.
ఏ కొద్ది మంది రచయితలకోదక్కే ఇటువంటి అదృష్టం మన కిరణ్ కుమార్ గారికి దక్కింది అని చెప్పడం సమచితం
పై రెండు కథలలో
ఓ కొడుకు మోసం
ఓ తండ్రి నిర్ణయం కలిసి “ఓ తండ్రి తీర్పు” అనే లఘు చిత్రంగా తయారయింది. ఆ చిత్ర విశిష్టతను గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది.

ఓ తండ్రి తీర్పు లఘు చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు రెండు వరించాయి.
ఐ ఎఫ్ యం ఏ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్) వారి అవార్డు మరియు పిన్ టీవీ సంస్థ వారి అవార్డులు గెలుచుకున్నాయి.
శ్రీరామదూత ఫిల్మ్ మేకర్ పతాకంపై చిట్టా రాజేశ్వరరావు చిట్టా అపూర్వ అనేవారు నిర్మించగా ఈ చిత్రానికి ఐదు ప్రభుత్వ నంది అవార్డులు అందుకున్న శ్రీ గాదంశెట్టి ఉమామహేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. అంతర్జాల విఫణి నుండి 10 ఓ టి టి ఏజెన్సీ ఫ్లాట్ ఫార్ముల ద్వారా
ప్రేక్షకులు వీక్షిస్తున్నారు.
అనేక కుటుంబాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఇతివృత్తంగా తీసుకున్న కథా నేపథ్యంలో కొనసాగింది ఈ చిత్రం.

తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన తనయులే తమ బాధ్యతను విస్మరిస్తున్నారని, నిరాదరణకు గురి అవుతున్న తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని యువతలో మార్పు కోరే దిశగా ఈ లఘు చిత్రం నిర్మించబడింది.
ఓ తండ్రి తీర్పు లఘుచిత్రం లింక్, కథా సమీక్ష అనంతరం
చూడగలరు.
ఇక కథలోకి తొంగి చూద్దామా!
1వ కథ అనుబంధం.
****”
పాత్రలు 1 రంగనాథం 2 రాజా 3 ఆదిత్య
గుడ్డి ప్రేమ ప్రమాదం.
పిల్లలనుప్రేమించు
కానీ నమ్మవద్దు. నీ ఆస్తి, ఏదైనా నీ తర్వాతే ఎవరికైనా.

పిల్లవాడు నీ వాడే వాడి భార్య పరాయిది.
ఇత్యాది నిత్య సత్యాలను తెలిపే కథ అనుబంధం.
రంగనాథం గారి పిచ్చి ప్రేమను వాడుకొనీ ఆయన కొడుకు
రాజా, నాన్నగారి ఆస్తులుఅన్ని అమ్మించి తనపేర డబ్బు వేసుకొని నాన్నను ఎయిర్ పోర్ట్ లో వదిలే గుట్టుగా అమెరికా వెళ్ళిడం, రంగనాథం గారు
పక్కింటి ఆదిత్య సహాయంతో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావడం తో కథ ముగుస్తుంది.
కానీ ఈ కథలో రెండు విషయాలు అసంపూర్ణంగానే ఉన్నాయని రచయిత కిరణ్ గారికి అనిపించిది. ఆ రెంటిని పాఠకులకు తెలపడానికి రెండో కథ రాయడం జరిగింది.
అదే ఉషోదయమా…
అన్న పేరు గల రెండో కథ.
2)ఉషోదయమా..
“ముఖ్య”పాత్రలు 1 రాజా2 రాజా భార్య, నిషా 3 నిషా అన్న.4. రంగనాథం (రాజా తండ్రి )
“””””””””””””””””””
మనం తప్పు చేస్తుంటే ఎవరు చూడలేదనుకుంటా ము.
కానీ చూచేవాడు చూడనే చూస్తాడు. తగిన శిక్ష వేస్తాడు.
ఒకప్పుడు నిజంగా జరిగింది సాఫ్ట్వేర్ రంగం ఎందరో లక్షాది కారులు భిక్షాధికారులు అయినారు. అందులో రాజా నిషా ప్రధములు. ఉన్నదంతా ఊడ్చుకొని పోతే పొట్ట చేత పట్టుకుని ఇండియాకి వస్తారు
బావ మరిది తన నాన్నను కూడా రాజాకు అప్ప చెప్పి నాగపూర్. జారు కుంటాడు

రంగనాథం గారిని మోసం చేసి ఆస్తి కాజేసిన రాజాను, నిష ను నిష పుట్టింటి వాళ్ళు పురుగులను చూసినట్టు చూస్తారు ఇక్కడ సందర్బానికి తగ్గ సంభాషణతో కథ
రక్తి కట్టింది.

మూలిగే నక్క మీద తాటికాయ పట్టేట్టు
రాజా నిషాల జీవితం
దుర్భరమైంది.

రాజా, ఓమిత్రుని సహాయంతో, తనకు నిషాకు ఉద్యోగాలుసంపాదించినా ఆ ఉద్యోగాల్లో అనుకొని ఆపద వస్తుంది. తన మీద మోపిన నేరాన్నీ
తన యజమానికి చెప్పుకోవడానికి వెళ్లిన రాజా, నిషా, అక్కడ యజమాని స్థానంలో
ఉన్న రంగనాథం గారిని చూచి
వణికిపోతారు. ఇంతవరకు వారిని కమ్ముకొని ఉన్న అహంకారమనే చీకటి (నిషా ఆమెకు తగ్గ పేరు) తొలగి వారిలో ఉషోదయ రేఖలు కనపడినట్లు పశ్చాత్తాపంతో రంగనాథం గారి పాదాలపై పడతారు.

రంగనాథం గారు నిష్పక్షపాతంగా, కోర్టులో న్యాయమైన తీర్పు చెప్పే జడ్జి లాగా వారిద్దరిని అడగవలసిన అడిగేసి గెట్ లాస్ట్ అంటాడు.
దానికి కారణం రంగనాథం గారి
సిద్ధాంతాలు రెండు. 1) నమ్మిన వారినిమోసం చేయకూడదు.
2)
ఆత్మ విశ్వాసమే నీ ఆయుధం.

వాటిని నమ్ముకున్న రంగనాథం గారు కొడుకును కోడలిని
నిర్ధాక్షిణ్యంగా శాశ్వతంగా వదులుకున్నారు. ఇదే “ఓ తండ్రి తీర్పు” కొడుకు వల్ల రిక్తహస్తాలతో నిలిచిన రంగనాథం గారు ఆత్మవిశ్వాసంతో ఈనాడు కోట్లకు అధిపతి అయినారు.

చారిత్రాత్మకమైన ఈ తీర్పు ఈనాటి యువతీ యువకులకు గుణపాఠం కావాలి.
చివరి దశలో ఎవరు చూస్తారో (పనిమనిషో
పరాయి వాళ్ళోఎవరైనా)
,వారికి తమ ఆస్తినీ తల్లిదండ్రులు ఇచ్చేసే నిర్ణయానికి రావాలి.
ఈ కథలో ఇది చక్కని సందేశం.
విలువైనవిషయాలు..

1) కొడుకు మోసానికి గురైన రంగనాథం గారిని,తల్లి తండ్రి లేని ఆదిత్య, “నిన్ను నాన్నా అని పిలవచ్చా” అన్న వాక్యం, సందర్భానికి విలువనిచ్చే వాక్యం.

2)ఎంతవిద్యావంతులైనా,
నిషాలాంటి వారి నోట
వచ్చే మాటలు.”ఆ ముసలాడిడబ్బులు
కూడా అయిపోయాయి” అన్నది

2) తన కొడుకు, కోడలికి కనపడకుండా అటు తిరిగి కూర్చున్న రంగనాథం గారు “నేను తప్పు చేయలేదు నాపై కేసు పెట్టారు”అన్నకొడుకు మాటలకు “నీకు మోసం చేయడం, తప్పు చేయడం తెలియదా?” అంటూ కొడుకు వైపు తిరిగిన రంగనాథం గారి మాటలు,కదలిక చక్కగా సందర్భోచితంగ ఉన్నాయి..

ఇలాంటివి కవి యొక్క పదప్రయోగ దక్షతకు, వాక్య నిర్మాణ చాతుర్యానికి, పాత్ర పోషణ నైపుణ్యానికి
నిదర్శనం.
సాహిత్యాభిమానులు,సకల సాహిత్య ప్రక్రియా నిపుణులు,
అన్నిటికంటే ఓర్పు నేర్పు, గల రచయిత డా. చిటికన కిరణ్ కుమార్ గారు చక్కటి కథా రచయితగా ఈ కథల ద్వారా గుర్తింపు పొందారు. దానికి నిదర్శనమే “ఓ తండ్రి తీర్పు” ఇది పేరుకు లఘుచిత్రం. పెద్దరికం లో అలఘు చిత్రం.

ఈ సమీక్షతో కూడా ఆ లఘుచిత్రాన్ని జోడించడం జరుగుతుంది. పాఠకోత్తములు కదా సమీక్షలు చదివి లఘు చిత్రాన్ని వీక్షించి ఆనందిస్తారని ఆశిస్తూ…
ఐ. ఎఫ్. ఎమ్. ఎ మరియు పిన్ టి. వి ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు అందుకున్న ” ఓ తండ్రి తీర్పు”లఘు చిత్రం


July 20, 2025 27 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఒట్టి చాపలులో జీవనచైతన్యం

by Dr. Kachapuram Durgadevi July 20, 2025
written by Dr. Kachapuram Durgadevi

కొన్ని దశాబ్దాల క్రితం ప్రజల అభిరుచులను బట్టి నీతి, ప్రేమ, కార్మికులు, సంస్కరణ ఈ విధంగా కథా వస్తువు కాలక్రమం లో మారుతూ ఉండేది. ఇప్పుడు సామాజిక అవసరమే అత్యంత .ఆవశ్యకమైన కథావస్తువుగా మారింది. నేడు దళితుల ఆత్మగౌరవం, చైతన్యం, సంఘటిత పోరాటాలు, తిరుగుబాటు, తిరస్కారాలు కథా వస్తువులై తెలుగు కథా వస్తువు పరిధిని పెంచాయి. 1920 ప్రాంతం నుండి దళితుల జీవితాలను సానుభూతితో చిత్రించిన రచనలు నేడు సహానుభూతిని కలిగి ఉంటున్నాయి.

“ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరి చేయవచ్చుగాని జీవితం తెలియకపోతే సరిచేయడం ఎవరి వల్లా కాదు… శిల్పమూ భాషా రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అయితే అవి కథారచనకు మూల పరికరాలు. ముడి పదార్థం జీవితం” అంటారు కొడవటిగంటి. సాహిత్యకారుల జీవన గవనంలోని ప్రతి సంఘటన సృజన వైపు మళ్లకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలోని తీవ్రత అది కలిగించే ఒత్తిడి కవిగానో రచయితగానో నిలబెడతాయి. “ఒట్టి చాపలు” కథలు పరిశీలించి రాసినవి కావు. డా మండల స్వామి జీవితంలోంచి అనుభవాల నుండి ఆవిష్కృతమైనవే అని అనిపిస్తుంది. రచయిత వృత్తిపరంగా ఉపాధ్యాయులు వారి జీవన నేపథ్యానికి అనుగుణంగా ఈ సంపుటిలో కొన్ని విద్యాపరమైన పాఠశాలలకు సంబంధించిన కథలు ఉన్నాయి ఈ వైవిధ్యంలోనూ కథల ఇతివృత్తాలు పాత్రలు ఎక్కువగా దళిత జీవితాన్ని, చైతన్యాన్ని చిత్రించినవే కావడం వల్ల “ఒట్టి చాపలు” ను దళితవాద కథా సంపుటి గానే గుర్తించాలి.

ప్రభుత్వ ఉపాధ్యాయుడయినా కులం కారణంగా కిరాయికి ఇల్లు దొరకని పరిస్థితిని చిత్రించిన కథ “ఇల్లు దొరికింది”. “చేతిలో చేయి కలిపిన వెంకటయ్య జై భీములు అనడంతో శీనులో కొత్త ఆలోచన మొదలైంది” అనడంలో రచయిత దళిత సంఘటిత చైతన్య ఆవశ్యకతను స్పష్టం చేసినారు. వెంకటయ్య పాత్ర చేత “ఈ వ్యవస్థ పట్ల, ఈ వ్యవస్థ అందిస్తున్న అవమానాల బహుమతుల పట్ల మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది” అని అనిపిస్తారు. ప్రధాన పాత్ర కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించుకుంటున్న కొద్ది పాఠకుడు దళితులు పొందుతున్న సామాజిక గౌరవం ఇదేనా అన్న ఘాటు ప్రశ్నను ఎదుర్కొంటాడు.

“సదువుకున్న తెలివి” కథలో ఆత్మగౌరవంతో జీవించడానికి ఆర్థిక స్థోమత అవసరమని తెలిపే పాత్ర ముత్తమ్మది. అసహాయతలో చైతన్యం చెదిరిన తల్లికి ధైర్యాన్ని వ్యక్తిత్వాన్ని ఇచ్చే విద్యావంతుడైన కొడుకు పాండు. క్లిష్టమైన పరిస్థితులలో మానవ ప్రవృత్తులు సమయానుసారంగా ఎన్ని రకాలుగా మారుతాయో కూడా ఈ కథ తెలుపుతుంది. ఏళ్లుగా వివక్షచూపుతూ శ్రమదోపిడీ చేస్తున్న పటేలమ్మ “పాండూ! నువ్వు సదువుకున్నవురా! నీకన్నీ తెల్సురా!…. నేను పటేలమ్మను కాదు. ఓ మనిషి లెక్క అడుగుతున్న ఈ ఒక్క సాయం చెయ్యి బిడ్డా! నీకు దండం బెడ్తా” అంటుంది కథ ముగింపులో. ఆమెలో పరివర్తన తీసుకురావడంలో చదువుకున్న పాండు సఫలుడవుతాడు. కరోనా నేపథ్యంలో పాండు చదువుకున్న తెలివితో కరోనా నెగిటివ్ ని పాజిటివ్ అని చెప్పి తల్లిని శ్రమదోపిడి నుండి తప్పించడం కొసమెరుపు.

దళితులలో రూపొందిన చైతన్యాన్ని చిత్రించిన కథ “కాలం మారింది”.
దళితుడైన యాదగిరి జనరల్ సీటులో స్వతంత్ర అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో సర్పంచ్ అయి నాయకుడిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో పూలు పండ్లు పెట్టుకొని తిరిగి వస్తుండగా యాదగిరి బంధువర్గం ప్రయాణిస్తున్న డీసీఎం ప్రమాదానికి గురవుతుంది. ఆ సందర్భంలో “మన మాల మాదిగోల్లంతా మాటిమాటికి దేవునిగుల్యకు పోతుండ్రంట. అందుకనే ఇట్లయిందని అంటున్నదే! ఈల్ల ఇకమతుల మీద మన్నుబొయ్య!”
వంటి సంభాషణలు గ్రామాలలో ఇంకా మిగిలి ఉన్న వర్గ వైషమ్యాలను, ఆధిపత్య ధోరణులను, రచయితకు గల సామాజిక స్పృహను పట్టి చూపిస్తాయి. కొత్త గుడి గర్భాలయంలో యాదగిరి దంపతులు మొదటి కొబ్బరికాయ కొట్టడంతో కథ పూర్తి అవుతుంది. ఉన్నత విద్య మంచి వ్యక్తిత్వం రాజకీయ ప్రాతినిధ్యంతో సామాజిక గౌరవాన్ని సాధించగలమని నిరూపించిన కథ “కాలం మారింది”.

బాల్య వివాహాలు, లింగ వివక్షత, మూఢ నమ్మకాలు, విద్య ప్రాధాన్యత, శాస్త్రీయ దృష్టి కోణపు ఆవిశ్యకత లను చర్చించిన కథ “ఒట్టి చాపలు”. అండాలు కొడుకు శివ ఎం ఫార్మసీ చదివి ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంటాడు. ఎక్కువ చదివిస్తే కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తొమ్మిదవ తరగతి లోనే చదువు ఆపేయించబడిన కూతురు స్వాతి. చదువుకోవాలని నిగూఢవాంఛ, తనకు జరగబోయే బాల్య వివాహం పట్ల వ్యతిరేకతల వల్ల స్వాతి మానసిక అనారోగ్యానికి గురి అవుతుంది. ఆమెను బాగు చేయించడం కొరకు అండాలు ఆశ్రయించిన పద్ధతులు, మూఢనమ్మకాలు వాటిని వ్యతిరేకించిన కొడుకు, చివరగా తల్లి స్వీయ అనుభవంతో మోసాలను గ్రహించడం “ఒట్టి చాపలు” లోని కథాంశం. శాస్త్రీయ దృక్పథం కొరవడిన కారణంగా ఆర్థికంగా కూడా కొందరు చితికి పోవడాన్ని, తరాల మధ్య అంతరాలను నిలువుటద్దంలో చూపిస్తుందీ కథ.

రచయితగా కథనంలో జోక్యం చేసుకోకుండా పాత్రల మాటలతోనే కథలను నడిపింపచేయడం మండల స్వామి గారి సంభాషణాత్మక శైలి. అనవసరమైన పాత్రలు సంఘటనలు సంపుటిలో ఎక్కడా కనబడవు. గారడీ చేసే శిల్పానికి దూరంగా హంగు ఆర్భాటాలు లేని సహజత్వానికి దగ్గరగా ఉన్న కథలు ఇవి. పాత్రల రూపురేఖల వర్ణనలు ఒక్కచోట కూడా లేకపోవడం, మానవ ప్రవృత్తులకు ప్రాధాన్యత నివ్వడం ఆధునికతగా గమనింపులోకి వస్తాయి. విద్య ఆర్థిక స్థితిగతులలో వెనుకబడిన దిగువ మధ్యతరగతి దళిత బహుజన ప్రజలకు ప్రతీక ఈ ఒట్టి చాపలు. నీతిని తెలిపే ఇతివృత్తాలకు ప్రేమగాథలకు ప్రాధాన్యతనివ్వకుండా మనిషి ముఖ్యం, మనిషి బతుకు గౌరవంగా ఉత్సాహంగా సాగటం ముఖ్యం అనే భావాలను స్పష్టంచేసిన కథా సంపుటి ఒట్టి చాపలు.

July 20, 2025 19 comments
4 FacebookTwitterPinterestEmail
కవితలు

బుద్దుడు — బోధి వృక్షం . .

by రాఘవాచార్య‌ July 20, 2025
written by రాఘవాచార్య‌

బుద్దుని చిత్రం వేస్తే
బోధి వృక్షం చిత్రం వేయాల్సిందే
బుద్దుని గురించి ప్రసంగిస్తే
బోధి వృక్షం గురించి పది మాటలైనా మాట్లాడకుంటే
ఆ ఉపన్యాసం సంపూర్ణం కాదు

ఉపాధ్యాయుడు చెప్పిన
బుద్దుని బోధనల పాఠం విద్యార్థులు
అస్సలు మరువరు!
ఎందుకంటే పిల్లలు రోజూ ఆడుకునేది
బోధి వృక్షంగా ప్రసిద్ది గాంచిన
పెద్ద రావిచెట్టు కిందే!

ఆ ఊర్లో పంచాయతి అయేది
బోధి వృక్షం కిందే !
చెప్పే న్యాయం పొల్లు పోకుండా
సత్య ప్రమాణంగా హరిశ్చంద్ర ముద్ర !

చిత్రం ! బుద్దుని విగ్రహం ముందు
నిల్చుని దండం పెడుతూ స్వార్థంగా
ధన కనక వస్తు వాహనాలు అడుగరు !
నిస్వార్థ ప్రశాంతతను అడుగుతారు

July 20, 2025 18 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

అమ్ములు పెళ్లి

by Laxmi Madan May 31, 2025
written by Laxmi Madan

“అమ్ములు! లే నాన్నా! ఈరోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. తొందరగా లేచి తయారు కావాలి తల్లి” అంటూ ఒక గంట నుండి లేపుతుంది అమ్ములు తల్లి శాంత.

ఈ అమ్ములు అనబడే సుకుమారి 25 ఏళ్ల పాపాయి. అతి కష్టం మీద బీటెక్ పూర్తి చేసి, తనకి వచ్చిన ర్యాంక్ కి ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, అని నిశ్చింతతో ఇంట్లో ఓటిటిలో వచ్చిన సినిమాలన్నీ చూసేస్తూ, వెబ్ సిరీస్ ను నమిలేస్తూ, తల్లి చేసిన వంటకాలన్నీ మింగేస్తూ, శరీరాన్ని పెంచేస్తూ అలా ఇంట్లోనే సెటిల్ అయ్యింది.

ఇక పెళ్లి చేయాలి అని తలచిన తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ లో సంబంధాలు చూస్తున్నారు. ఫోటోల్లో ఈ సుకుమారి రూపం చూసి 90% మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు.

చివరికి ఒక సంబంధం వచ్చింది. వాళ్లే అమ్ములును ఈరోజు చూసుకోవడానికి వస్తున్నారు. పెళ్ళికొడుకు డాక్టర్. చదువు ధ్యాసలో పడి పెళ్లి విషయాన్ని మర్చిపోయాడు. అందులో డాక్టర్ వృత్తి బిజీగా ఉంటుంది కదా! చివరికి ఇంట్లో బామ్మ 4 మొట్టి కాయలు వేస్తే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అతనికి కూడా ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు. ముదురు టెంక అయ్యాక ,లేత టెంకలు ఎలా దొరుకుతారు? ముందు అందమైన అమ్మాయిలను చూస్తే, వాళ్లంతా రిజెక్ట్ చేశారు. చివరికి ఎవరైనా సరే అనేసి ఈ అమ్మాయి చూడటానికి ఒప్పుకున్నాడు.

“అమ్ములు! లేచావా”?

“ఆ లేచాను కాపీ ఏది”అన్నది బెడ్ మీద అలాగే కూర్చుని.

“ఇదిగో చూడు తీసుకొచ్చాను” అని ట్రై లో కాఫీ దానితో పాటు 6 బిస్కెట్స్, కొంచెం బూందీ తెచ్చి పెట్టింది.

అదంతా చూస్తున్నా తండ్రి బక్కారావు కి( సార్ధక నామధేయుడు) ఒళ్ళు చిలచిర లాడసాగింది.

“అసలు దీని వాలకం ఏంటో అర్థం కావడం లేదు. మంచం మీద నుండి సోఫాలోకి సోఫాలో నుండి బాత్రూంలోకి వెళుతుంది. అంతకుమించి నాలుగు అడుగులు ఎక్కడికి వేయదు. దీని పెళ్లి అయితే ఎన్ని సమస్యలు తెచ్చి పెడుతుందో! అందుకు తోడు ఈ శాంత ఒకటి ఎప్పుడూ దాన్ని మేపుతూనే ఉంటుంది. ఒక్క పని చెప్పదు”అనుకున్నాడు స్వగతంగా .పైకి అంటే ఇంకేమైనా ఉందా? తల్లి కూతుర్లు ఆయుధాలు లేకుండా యుద్ధానికి వచ్చే లాగా ఉంటారు. గతాన్ని మరవని బక్కా రావు మాట నోట్లోనే కుక్కుకున్నాడు.

“అమ్మ ఈరోజు స్వీట్ పెట్టలేదు”అని అరిచింది.

“ఈరోజు పెళ్లిచూపులు కదా! స్వీట్ తింటే ఇంకా లావుగా కనిపిస్తావు. కొంచెం స్లిమ్ గా ఉందాలి. ఈ మాత్రం తిను తల్లీ! వాళ్ళు వెళ్ళాక బోలెడు స్వీట్స్ మిగిలిపోతాయి. అవన్నీ నువ్వే తిను”అన్నది శాంత బుజ్జగిస్తూ.

“నువ్వెప్పుడూ ఇంతే! అడిగింది ఏది పెట్టవు”అన్నది మూతిని పిడకలా చేసుకుని. లక్క పిడత కాదండి బాబు పిడకనే.

పెద్ద మగ్గునిండా కాఫీ జురా జురా జుర్రుకుంటూ తాగేసింది. మధ్య మధ్యలో పెద్ద చప్పుడు వచ్చేలా బిస్కెట్లు, బూందీ తింటూ టీవీ ముందర సెటిల్ అయింది.

శాంత బ్రేక్ ఫాస్ట్ తేవడానికి హడావుడిగా ఉంది.

“అమ్ములు స్నానం చేసి రా! నీకు టిఫిన్ పెడతాను ఇప్పటికే 11 అయ్యింది మళ్లీ లంచ్ తినాలి. ఆ తర్వాత పెళ్లి వాళ్ళు వస్తారు. నువ్వు రెడీ కావాలి కదా”? అన్నది గారాబంగా.

“టీవీ కూడా ఎక్కువసేపు చూడని వ్వరు”అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది అమ్ములు.

అక్కడే ఉన్న తండ్రికి మనసులో రకరకాలుగా ఉంది. ఏ రకంగా ఉన్నా ఏమీ చేయలేడు అర్భకప్రాణి.

స్నానం చేసి ఒక నైటీ దిగేసుకుని వెంటనే వచ్చి సోఫాలో కూర్చుంది. కుయ్యో మని సోఫా సౌండ్ వచ్చింది. ఆ సోఫాకి మాటలొస్తే బండ బూతులు తిట్టేదేమో?

ఇంతలో శాంత ఒక ప్లేట్ లో నాలుగు వడలు, 4 ఇడ్లీలు, పచ్చడి సాంబారు పెట్టుకొని తీసుకొని వచ్చి, అమ్ములు ముందర ఉన్న టీపాయ్ మీద పెట్టింది.

“నాకు ఇడ్లీ వద్దు. ఆ ఇడ్లీలు తీసేసి దాని బదులుగా మరొక ఆరు వడలు పెట్టేసేయ్”అన్నది సుకుమారి అమ్ములు.

“అలాగే కన్నా” అంటూ ఆరు వడలు తెచ్చి ప్లేట్లో వేసి ఇడ్లీలు తీసేస్తుంటే,

“వద్దులే అమ్మ !ఇడ్లీలు ఆరోగ్యానికి మంచిది కదా! మధ్య మధ్యలో నంచుకుని తింటాను”అన్నది అమ్ములు ప్లేటు మీదకి దాడి చేస్తూ.

వేడివేడి వడలు తింటుంటే చెమట పట్టసాగింది. అమ్ములుకు లేచి ఫ్యాన్ వేసుకునే ఓపిక ఎక్కడిది? వెంటనే అటు పక్కకు వెళ్తున్న నాన్నను చూసి,

“నాన్న నాకోసం నువ్వు ఒక్క పని కూడా చేయవు? ఫ్యాన్ వేసి వెళ్ళు”అన్నది తండ్రిని కొర కొరా చూస్తూ.

“లేచి ఫ్యాన్ వేసుకుంటే, ఇంకో రెండు వడలు ఎక్కువ పడతాయి కడుపులో. అందుకే నేను వేయలేదు. లేచినప్పుడు ఫుడ్ కిందకి వెళ్తుంది. “అన్నాడు మనసులో కోపాన్ని దాచుకొని.

“లంచ్ లో అలాగే చేస్తాను. ఇప్పుడైతే ఫ్యాన్ వేసి వెళ్ళు”అన్నది పెద్ద పెద్ద వడలను నోట్లో పెట్టుకుంటూ.

“కర్మ కర్మ “అని తిట్టుకుంటూ ఫ్యానేసి వెళ్ళాడు బక్క రావ్.

ఇలా అమ్ములు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అయ్యేసరికి మూడున్నర అయ్యింది.

“ఇక చీర కట్టుకో తల్లి. అదిగో ఆ గదిలో చీర, నగలు అన్ని పెట్టాను”అన్నది శాంత.

“వెబ్ సిరీస్ చూస్తున్నాను. నాకు డిస్ట్రబ్ అవుతుంది. నేను టీవీ చూస్తుంటాను .నువ్వు నాకు చీర కట్టేసేయ్”అన్నది అమ్ములు.

అమ్ములు కి చీర కట్టే ప్రయత్నంలో ఉన్నది శాంత. ఆరు గజాల చీరకు రెండు కుచ్చిళ్ళు కూడా రాలేదు. జాకెట్ మోచేతుల వరకు కూడా ఎక్కలేదు. యుద్ధ ప్రాతిపదికన బ్లౌజ్ కుట్లని వి, చీరకు రెండు మీటర్ల బట్టను జాయిన్ చేసి చీర కట్టింది శాంత. లాంగ్ చైన్ కాస్త మెడకు బిగుతుగా సరిపోయింది. గాజుల అవస్థ చెప్పలే ము.

మొత్తానికి పెళ్లి చూపులకు తయారైంది అమ్ములు.

“అబ్బాయి ఫోటో చూసావా? అమ్ములు”అని తండ్రి అడిగాడు.

“చూసానులే నాన్న.ఎలా ఉంటే ఏంటి? వాళ్ళింట్లో టీవీ ఉంటే చాలు.వంటకి వంటమనిషి ఉందో లేదో అడగాలి” అన్నది నాలుగు చిప్స్ నోట్లో వేసుకుని.

తల కొట్టుకుని బయటకు వెళ్ళాడు బక్క రావ్

సాయంత్రం నాలుగు గంటల సమయంలో పెళ్లి వారు వచ్చారు. పెళ్ళికొడుకు, అతని తల్లిదండ్రులు.

పెళ్ళికొడుకుని పరిశీలించాడు బక్క రావ్.

తల మొత్తం రాజస్థాన్ ఎడారిలా ఉంది. ఎండకు ఇసుక మెరిసినట్లు గుండు మెరుస్తుంది. వెనుకకు ఉన్న నాలుగు వెంట్రుకలను జాగ్రత్తగా దువ్వి ముందరికి వేసుకున్నాడు.

ఇంట్లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ గా తిరుగుతుంది. పెళ్ళికొడుకుకు భయమేసింది. ఆ ఉన్న నాలుగు వెంట్రుకలు మళ్లీ వెనక్కి వెళ్ళిపోతే గుండోదయం అవుతుందని.

లోపలికి రావడంతోటే..

“కాస్త ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తారా? నాకు ఫ్యాన్ గాలి పడదు”అన్నాడు గడప దగ్గరే నిలబడి.

బక్కరావు వెళ్లి ఫ్యాన్ స్పీడ్ తగ్గించి, వాళ్లను కూర్చోమని చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

శాంత లోపలి నుండి నోటిని సెవెంటీ ఎంఎం సైజ్ చేసి, పారల్లాంటి పళ్ళతో నవ్వుకుంటూ వచ్చి, మంచినీళ్లు అందించింది.

వాళ్లు నీళ్లు తాగే ప్రయత్నంలో ఉండగా, పెళ్లికూతురుని బయటకు తీసుకొని వచ్చారు.

“అమ్ములు ముందు చిప్స్ ప్యాకెట్ లోపల పెట్టు. తర్వాత తిందువు గాని”అని బలవంతంగా చిప్స్ ప్యాకెట్ మంచం మీద పడేయించి, బయటకు తీసుకొని వచ్చింది.

బయటకు వచ్చిన అమ్ములు వాళ్ళందర్నీ తేరిపార చూసింది. పెళ్ళికొడుకు ఎవరో అర్థం కాలేదు.

బక్కరావు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మరియు పెళ్ళికొడుకును పరిచయం చేశాడు.

“అదేంటి మామగారు అనుకున్నాను. పెళ్లికొడుకా? ఎలా ఉంటే ఏముందిలే! సంపాదన బాగానే ఉంది కదా” అనుకుని తనకోసం వేసిన స్పెషల్ సోఫాలో కూర్చుంది. సోఫా స్క్రీగ్స్ కుయ్యో మొర్రో అంటూ మరొకసారి అరిచాయి.

“మా అమ్మాయిని ఎండ కన్నెరుగకుండా పెంచాం బాబు” అన్నది శాంత.

” నీ మొహం! ఎండ తగలకుంటే డి విటమిన్ తగ్గి సమస్యలు వస్తాయే పిచ్చి ముఖమా!” అనుకున్నాడు పెళ్లి కొడుకు బట్ట తలని నిమురుతూ.

” ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు” అన్నాడు బట్టా రావు( పెళ్లి కొడుకు).

“వాళ్ళమ్మ వండి పెడితే వేస్టే కాకుండా తిని పెడుతుంది అంతే” అన్నాడు అక్కసుగా బక్కా రావు.

శాంత ఉరిమి చూసింది. ఆ చూపుకే చలి జ్వరం వచ్చినట్లు వణికి ఎవ్వరూ చూడకుండా చెంపలు వేసుకున్నాడు.

“తినడం కాదు, ఉద్యోగం చేస్తుందా” అని అడిగాను.

“లేదండీ, అమ్మాయి ఉద్యోగం చేస్తే సినిమాలు, సిరీస్ లు ఎవరు చూస్తారు? మరీ ఇలా అడగటం బాగో లేదండీ” అన్నాడు బక్కారావు శాంత ఉరుము మరచి పోయి.

తల బాదుకున్నాడు బట్టా రావు. నెత్తి మీద గుప్పెడు జుట్టు లేదని మరచిపోయి. తల మంట పుట్టి కెవ్వు మనే అరుపు నోట్లో కుక్కేసుకున్నాడు.

“మా అమ్మాయిని కాలు కందకుండా పెంచాం” అన్నది శాంత.

“కాళ్లకు ఒత్తిడి కలగాలని మేము ఆక్యుపంచర్ చెప్పులను వాడమని అంటున్నా ము, చెప్పులు లేకుండా నడవాలని చెప్తున్నాము. ఈమె కాళ్లు కందకుండా పెంచారట. అసలు బిడ్డను పెంచుతుందా పిల్లి పిల్లని పెంచుతుందా? ఎందుకంటే అవి వాటి పనులు అవి చేసుకోలేవు. కానీ ఈ పిల్ల మనిషి కదా! అయినా నా పిచ్చి గానీ ,రూపం చూస్తే అర్థం కావట్లేదా ఓన్లీ తినడానికి పుట్టిందని?”అని మనసులో గులుగుకొని ఓ పిచ్చి నవ్వు నవ్వాడు బట్టా రావు.

ఇంతలో శాంత రకరకాల టిఫిన్లు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. అమ్ములు చూపంత ఆ టిఫిన్ మీదనే ఉంది. మొహమాటానికి పెళ్లి కొడుకు వాళ్ళు ఏమి తీసుకోలేదు.

ఆగలేకపోయిన అమ్ములు చటుక్కున నాలుగు జిలేబీలు అందుకున్నది.

బక్కరావుకు ఒళ్ళు మండుతున్నది. శాంత కళ్ళతో సైగ చేసింది. కానీ ఆ సైగలు ఏమి పని చేయలేదు. జిలేబి రసం కారుతుంటే కుక్కుకొని తింటూనే ఉంది అమ్ములు.

పాపం బట్ట రావు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. “అసలే కొడుకుకు వయసు పెళ్లీడు దాటింది. ఇప్పుడు ఈ అమ్ములు అనే శాల్తి ని చేసుకుంటే, జీవితాంతం నేను వంటగదికే అంకితం అవుతాను. తండ్రి సామాన్లు తేవడానికి సరిపోతాడు. కొడుకు మందులు ఇవ్వడానికి సరిపోతాడు. ఈ సంబంధం కొడుకు ఒప్పుకోకుండా ఉంటేనే బాగుంటుంది. పెళ్లి కాకున్నా సరే” అని పాత దేవుళ్ళు కొత్త దేవుళ్ళు అందరినీ తలుచుకుంది బట్ట రావు తల్లి బిక్కమ్మ.

బట్ట రావు ను చేయితో గోకింది. అతని ముఖంలోకి అమాయకంగా చూసింది బిక్కమ్మ.

భుజాలు వాల్చి కూర్చున్న తండ్రిని చూశాడు బట్టా రావు. ముఖమంతా పీక్కొని పోయి కొడుకు సమాధానం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయోమయరావ్.

ఇంతలో జూస్ తెచ్చింది శాంత. అందరూ గ్లాసులు అందుకున్నారు. అమ్ములు సీసా ఎత్తి తాగసాగింది. ఒక పక్క టీవీ చూడాలని మనసులో ఉంది.

ఇక బట్టా రావు ఆగలేక చేతిలో ఉన్న గ్లాస్ టప్పుమని శబ్దం వచ్చేలా టీపాయ్ మీద పెట్టి.

అమ్మ, నాన్న వెళ్లి కార్లు కూర్చోండి అన్నాడు.

జీవితమంతా రోగులకు సేవ చేస్తాను. కానీ నాకు ఈ అమ్ములు వద్దు. భవిష్యత్తు లో సొమ్ములు వద్దు. అంటూ ఉన్న నాలుగు వెంట్రుక పోచలను వెనక్కి తోసి పరిగెత్తాడు.

అమ్ములు హాయిగా సిరీస్ చూస్తూ చిప్స్ లాగించ సాగింది.

బక్క రావు బిక్కు బిక్కు మంటూ నిలబడ్డాడు.

శాంత అశాంతంగా లోపలికి వెళ్ళింది.

May 31, 2025 76 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఆహా! నీ లీల!     

by Aruna Dhulipala May 31, 2025
written by Aruna Dhulipala

ఉదయం 7 గంటలు అవుతోంది. ఫోను అదేపనిగా మోగుతున్నది. ఇండియా నుండి ఆంజనేయ శాస్త్రి కాల్.

         “హలో మామయ్యా! బాగున్నారా? ఏంటి విషయాలు?”  అడిగాడు అమెరికాలో ఉన్న ‘భారవ్’ అలియాస్ భార్గవరామ శర్మ. 

      “నాయనా! నిన్న గుడికి గర్భాలయం కట్టడం పూర్తి అయిందో లేదో! ఇవాళ పొద్దటి నుండి ఆగకుండా వాన పడుతోంది. ఇప్పుడు మాకు రాత్రయింది కదా! ఇంకా కురుస్తూనే ఉంది. వరస చూస్తుంటే తగ్గేటట్టు అనిపించడం లేదు. అంతా ఆ అమ్మవారి దయ. ఆనందంతో చెప్పుకుపోతున్నాడు ఆంజనేయ శాస్త్రి.

     “వాట్! ఎంత శుభవార్త చెప్పారు. ఇక మన ఊరి కష్టాలు తీరినట్టే మామయ్యా! గుడి పనులు మొత్తం పూర్తి చేయించండి.  ఇంకా ఎంత కావాలో చెప్పండి.

డబ్బులు వెంటనే పంపిస్తాను” అన్నాడు పొంగిపోతూ భార్గవరామశర్మ.

      “ఇదంతా నీ వల్లే నాయనా! పుట్టిన ఊరి ఋణం తీర్చుకుంటున్నావు” అన్నాడు శాస్త్రి.

     “ఇట్లాంటి మాటలతో నన్ను సిగ్గుపడేలా చేయకండి మామయ్యా! ఇప్పటికే నేను చేసిన దానికి కృంగిపోతున్నాను”

       “ఆ అమ్మవారు నీ హృదయంలో ప్రవేశించి నిన్ను ఇంతటి పని చేయిస్తున్నది. ఇంతకంటే మనకేం కావాలి? పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు పూర్తయినట్టే. వార్షికోత్సవం సమయానికి ప్రతిష్ఠ జరగాల్సిందే. ఇప్పటికైనా మీ తండ్రి ఆత్మ శాంతిస్తుంది. సరే నాయనా! ఉంటాను” అని ఫోను పెట్టేశాడు ఆంజనేయశాస్త్రి.

              ********* ********* *******

        నేలపల్లి ఊరు. ఎప్పుడూ సస్యశ్యామలంగా ధాన్యాలు కుప్పబోసిన రాశిలా నిండుగా నవ్వుతూ ఉండేది. ఊరిప్రజలు అరమరికలు లేకుండా ఎదుటివారి 

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. 

      ఆ ఊళ్ళో పురోహితుడు నరసింహశర్మ. ఆయన ఆ

ఊళ్ళో శ్రీరాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని కట్టించాడు. పురోహితుడు అనే పదానికున్న అర్థాన్ని సార్థకం చేస్తూ ఊళ్లోని బాగోగులను పట్టించుకునేవాడు. ఊరి పెద్దలు కూడా ఏ చిన్న సమస్య అయినా ఆయనతో చర్చించేవారు.

      గుడి చిన్నదే. కానీ చుట్టూ విశాలమైన ఆవరణ. రావి, వేప కలిసి ఉన్న నీడనిచ్చే పెద్ద చెట్టు ఉండేవి. శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు జరిగేవి. వచ్చే భక్తులకు అన్నదానం కూడా చేసేవారు. రైతులు తాము పండించిన పంటల్లో కొంతభాగాన్ని ఆలయానికి సమర్పించేవారు. పాడిసంపద ఉన్నవాళ్లు ఉత్సవాల సమయంలో పాలు, పెరుగు, నెయ్యి కావలసినంత ఇచ్చేవాళ్ళు. 

       ఇక గుడి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. చుట్టుపక్కల ఊళ్ల నుండి ఎంతోమంది

వచ్చేవారు. పూజా కార్యక్రమాలతో పాటు హరికథా శ్రవణం, ఒగ్గుకథలు, ఎడ్లబండ్ల పూజలు, అగ్నిగుండాలు, రథోత్సవం ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణలు. సంగీత, నాట్య కళా ప్రదర్శనలు కూడా రసజ్ఞులను అలరించేవి. ఆ సమయంలో వాటిని చూడడానికి జనం విరగబడేవారు. బొమ్మల షాపులు, తినుబండారాల బండ్లు, గారడీ ప్రదర్శనలు, కనికట్టు మాయాజాలాలు ఒకటేమిటి? విద్యుద్దీపాలతో రాత్రుళ్ళు కూడా పట్టపగళ్లయ్యేవి. 

         నరసింహ శర్మకు ఒక్కడే కొడుకు భార్గవరామశర్మ.

అందరిలాగే కొడుకును పెద్ద చదువులు చదివించి, విదేశాలకు పంపాలన్న కోరిక వేల కిలోమీటర్ల దూరంతో పాటు దగ్గరకు రాలేనంతగా మనసునూ దూరం చేసింది.

చదువుకొని ఉద్యోగరీత్యా వెళ్లినవాడు తండ్రి శ్రీరాముని మీద భక్తితో పెట్టిన పేరును కూడా ‘భారవ్’ అని స్టైల్ గా మార్చుకున్నాడు. అది తండ్రికి మరింత భారంగా తోచింది. తనతో చదువుకుంటున్న అమ్మాయి సౌమ్యను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు ‘భారవ్’. అప్పుడో ఇప్పుడో ఒక ఫోన్ కాల్ అంతే. తండ్రి ఫోన్ చేసినప్పుడు ముక్తసరి మాటలతో సరిపెట్టడం.

         దిగులుతో మంచం పట్టిన ఆయన అకాల మరణానికి చేరువయ్యాడు. కర్మ కాండ జరిపించడానికి భార్యతో సహా వచ్చిన భార్గవరామశర్మ తప్పదన్నట్టు తల్లిని తమతో రమ్మన్నాడు. ఆత్మాభిమానం గల ఆ ఇల్లాలు ఇల్లు, ఊరును వదిలి రానన్నది. తన మాట వినలేదని కోపంతో వెళ్ళిపోయాడు భార్గవరామశర్మ.

ఇల్లు బోసిపోయింది. అదే ఇంట్లో ఆమె కొడుకు పంపించే డబ్బుతో, భర్త జ్ఞాపకాలతో, ఇరుగుపొరుగువారి ఆదరణతో బతుకును ఈడుస్తున్నది. పూజలు కరువయి, ఉత్సవాలు లేక గుడి మెల్లమెల్లగా శోభను కోల్పోసాగింది.

        కారణం తెలియదు కానీ ఊరిపెద్దలు ఎంతగా ప్రయత్నించినా గుడిలో పూజారిగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఏడాది వర్షాలు కురవలేదు. ఏమో కాల మహిమ! అనుకున్నారు జనం. కష్టనష్టాలు భరిస్తూ కాలంతో రాజీ పడ్డారు. తరువాత మూడేళ్లు అదే పరిస్థితి. చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో వర్షం విపరీతంగా పడేది. ఇక్కడ పడకపోయేది. మబ్బులు ఎంతగా కమ్ముకున్నా తేలిపోయేవి. చినుకు పడేది కాదు. బతుకును వెతుక్కుంటూ ఊరిజనం మెల్లగా వలసదారి పట్టారు.

              ******  ******** ********

     ఆంజనేయ శాస్త్రి, నరసింహ శర్మ మంచి స్నేహితులు.

రెండూళ్ల అవతల నాగులపల్లి ఆయన ఊరు. ఆయన కూడా పౌరోహిత్యం చేసేవాడు. రెండు కుటుంబాలు ఎంతో ఆత్మీయంగా ఉండేవి. చిన్నప్పటి నుండీ భార్గవరామశర్మకు అతడిని ‘మామయ్యా’ అని పిలవడం అలవాటు. ఆ చనువుతో నరసింహ శర్మ చనిపోయినప్పుడే ఆంజనేయశాస్త్రి, భార్గవరామశర్మకు హితబోధ చేసే ప్రయత్నం చేశాడు కానీ భార్గవరామశర్మ పట్టించుకోకపోవడంతో వదిలేశాడు. 

      నేలపల్లి ఊళ్ళో జరుగుతున్న పరిస్థితులు ఆంజనేయ శాస్త్రికి తెలుస్తూనే ఉన్నాయి. చూస్తూ ఊరుకోలేక పోయాడు. ఏదో ఒక పరిష్కారం చూడకపోతే తన వృత్తికి అర్థం లేదనుకున్నాడు. భార్గవరామశర్మకు ఫోను చేసి విషయమంతా వివరించాడు. అయినా అతని మనసు కరగలేదు. నాకు ఇంకెప్పుడూ ఈ విషయంలో ఫోను చేయొద్దని, అది నా సమస్య కాదని కోపగించుకున్నాడు. అట్లా రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆంజనేయ శాస్త్రి 

భంగపడ్డాడు. 

             ******* ******** ******

      ఒకరోజు హఠాత్తుగా భార్గవరామశర్మ నుండి ఆంజనేయ శాస్త్రికి ఫోను వచ్చింది. 

“మామయ్యా! గుడి పునర్నిర్మాణం జరగాలంటే ఎంత ఖర్చవుతుంది?” అని అడిగాడు. ఆ గొంతులో ఆర్తి, ఆవేదన స్పష్టంగా తెలుస్తున్నాయి.

“భార్గవరామా! ఏమైంది నాయనా?” అడిగాడు నెమ్మదిగా ఆంజనేయశాస్త్రి.

“నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు మామయ్యా! నాన్నను దూరం చేసుకున్నాను. బతికి ఉన్న అమ్మను ఆదరించడం లేదు. నా పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నా. నిన్న రాత్రి నాకు వచ్చిన కలను మర్చిపోలేక పోతున్నాను. కరువుతో అల్లాడుతున్న ఊరి జనం నా చుట్టూ దీనంగా నిలబడి ఉన్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. బీడుగా మారిన పంటపొలాలు. కళ్ళముందు ప్రత్యక్షమైనట్లు కనిపించాయి. ఆ దృశ్యం చూడలేకపోయాను. నాన్న

తరువాత ఆయన కొడుకుగా గుడి పాడువడకుండా చూసుకోవాల్సింది. మీరు ఎంత చెప్పినా నేను వినలేదు. ఆ పాపమే కావచ్చేమో! పెళ్లయి పదేళ్లు అయినా నాకు సంతానం లేదు. మామయ్యా! నన్ను మన్నించి నా కోరిక ఒక్కటి తీర్చండి. అన్నీ తెలిసినవారు. ఇప్పుడు నా ధ్యేయం ఒక్కటే. మన ఊరి ప్రజలను కాపాడాలి. ఎంత డబ్బు అయినా పంపిస్తాను. మీరు దగ్గరుండి గుడి నిర్మాణం మొదలుపెట్టండి. ఇంతకుముందు దానికంటే విశాలంగా కట్టించండి. ఊరి పెద్దలతో నేను మాట్లాడతాను”అని పూడుకు పోతున్న కంఠంతో చెప్పాడు. 

         “కొద్ది రోజులు అమ్మకు మీ ఇంట్లో ఆశ్రయమిచ్చి ఇల్లును కూడా బాగు చేయించండి. దయచేసి కాదనొద్దు మామయ్యా!” అంటూ బతిమిలాడాడు. ఆంజనేయశాస్త్రి ఆనందానికి అవధులు లేవు. 

               ********* ****** ********

      భార్గవ రామశర్మ నిర్ణయానికి పెద్దలు హర్షించారు. ఊరు నిలబడితే చాలనుకున్నారు. ఆంజనేయశాస్త్రి ఆధ్వర్యంలో అన్నీ జరగడానికి ఒప్పుకున్నారు. డబ్బు

చేతిలో ఉంటే పనులు జరగడం ఎంతసేపు?ఎనిమిది నెలల్లో గుడి నిర్మాణం పూర్తయింది. గుడి పూజారిగా ఆంజనేయ శాస్త్రికి ఇల్లు ఏర్పాటయింది. నరసింహ శర్మ ఇల్లు కూడా బాగయింది

        వార్షికోత్సవ సమయంలోనే శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠాపన చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ జనాలతో కళకళ లాడింది ఆ ఊరు. రెండు నెలల సెలవు తీసుకొని నాలుగు రోజుల ముందే భార్యతో పాటు ఊరికి వచ్చాడు భార్గవరామశర్మ.

తాను వచ్చినప్పటినుండీ ఊరి పెద్దలు, ప్రజలు ఆదరిస్తున్న విధానానికి ఆశ్చర్యపోయాడు. గుడి నిర్మాణం  జరగుతుండడం వల్ల వాళ్ళకు కలుగుతున్న ఆనందాన్ని కళ్లారా చూశాడు. వాళ్లకు తండ్రి పట్ల ఉన్న అపార గౌరవాన్ని అర్థం చేసుకున్నాడు. ఇన్నిరోజులు తాను ఏం కోల్పోయాడో తెలిసి కన్నీరు ఉబికివచ్చింది.

        ఆరోజు వార్షికోత్సవంలో నాలుగవ రోజు. రాత్రి ఒంటిగంట. డప్పుల మోత అంతకంతకూ తీవ్రమవుతున్నది. సాయంత్రం నుండి తగులబెట్టిన కర్రలు నిప్పు కణికలై రుద్రుని ఫాలనేత్రం వలె ఎర్రగా

మండుతున్నాయి. సమానంగా పేర్చిన ఆ నిప్పుల మీద నడవడానికి ఆ అగ్నిగుండం చుట్టూ దాదాపు పదిహేను మంది నిలబడి ఉన్నారు. 

         వీరశైవజంగాల, బలిజల భక్తిపారవశ్యం మిన్నంటుతున్నది. ఆ రోజంతా వారి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. ‘దండకాలు’ చదువుతున్నారు. ఒక్కసారి “అశ్శరభ శరభ శరభ, అశ్శరభ శరభ శరభ”

అని గట్టిగా అరుస్తూ ఒకరి తరువాత ఒకరు నిప్పులమీద నడుస్తున్నారు. వారిలో కొంతమంది ఆడవాళ్లు కూడా ఉన్నారు. కోరికలు తీరాలనో, తీరిన కోర్కెల మొక్కులో? ఏది ఏమో కానీ వాళ్ళ పాదాలకు ఎటువంటి బాధ కలగడం లేదు. ఊపిరిబిగబట్టి చూస్తున్న వందలాది జనం ఆనందంతో, ఆశ్చర్యంతో, భయంతో తమను తాము మర్చిపోయారు. వారి ఆనందకేరింతలు గత వైభవాన్ని పునరావృతం చేస్తున్నాయి.

       గుడి మెట్ల మీద కూర్చొని ఇదంతా గమనిస్తున్న భార్గవ రామశర్మకు తన బాల్యంలో జరిగే జాతర గుర్తొచ్చింది. తిరిగి అటువంటి అనుభూతిని పొందుతూ

తన పక్కన ఉన్న  ఆంజనేయశాస్త్రి వైపు చూశాడు. ఒకేసారి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో అవ్యక్తమైన భావం. ఒకరి పట్ల ఒకరికి ఆరాధనా భావం కదలాడింది. కన్నీటి పొర కదలాడుతుండగా అమాంతం వంగి ఆంజనేయ శాస్త్రి పాదాలకు నమస్కరించాడు భార్గవరామశర్మ. అతడిని దగ్గరకు తీసుకొని లాలనగా తల నిమిరాడు ఆంజనేయ శాస్త్రి. 

        అంతా సద్దుమణిగే సరికి 3 గంటలు అయింది. తెల్లవారి వార్షికోత్సవం ముగుస్తుంది. ఇంటికి వెళ్లి తల్లి మంచం దగ్గరకు వెళ్ళాడు. అలికిడికి నిద్రలేచిన తల్లి ఒడిలో పడుకున్నాడు. తల్లి కళ్ళు చెమర్చాయి. తండ్రి రూపం కళ్ళల్లో కదలాడి తనను ఆశీర్వదిస్తున్నట్టు తోచింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. తలుపు చప్పుడుకు రూములో నుండి బయటకు వచ్చిన సౌమ్య వాళ్ళిద్దరిని అట్లా చూసి చిన్నగా నవ్వుకుంది. వచ్చిన ఈ వారం రోజుల్లోనే ఆమె అత్తగారికి చాలా దగ్గరైంది.

        చివరి రోజు పూర్ణాహుతి. ఉదయమే గుడికి వెళ్ళడానికి సిద్ధమైన సమయంలో “అమ్మా! బాగున్నారా?” అంటూ ఒక వ్యక్తి వచ్చాడు. నరసింహశర్మ భార్య ఆయనను గుర్తు పట్టలేదు.

“అమ్మా! నేను చంద్రాన్ని. నేను బతికి ఉన్నానంటే మీరే కారణం. ఏడేళ్ల కింద ఉత్సవానికి వచ్చినప్పుడు నాకు గుండెపోటు వచ్చింది. మీరు ఎవరితోనో మాట్లాడి కారు ఏర్పాటు చేసి నాభార్యకు తోడుగా మీరూ బయలుదేరి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమయానికి తీసురావడం వల్ల బతికాడని డాక్టర్లు చెప్పారు. మీ మేలు జీవితంలో మరువలేను” అని కాళ్లకు దండం పెట్టాడు. “ఓ నువ్వా చంద్రం! ఇప్పుడు గుర్తుకు వచ్చింది” అంటూ కబుర్లు మొదలు పెట్టిన తల్లిని, చంద్రాన్ని చూస్తూ మైమరచిపోయాడు భార్గవరామశర్మ. తన తల్లిదండ్రులకు ఆ ఊరితో పెనవేసుకున్న జ్ఞాపకాలకు చలించిపోయాడు.  అమ్మను తనతో రమ్మన్నప్పుడు ఆమె ఎందుకురాలేదో అర్థమై మనసు బాధతో మూల్గింది.  

         సెలవు పూర్తయిన భార్గవరామశర్మ తనతో పాటు కొంతకాలం తల్లిని తీసుకువెళ్లేందుకు ఒప్పించాడు. ప్రయాణానికి మూడు రోజుల ముందు షాపింగు కోసమని తల్లిని, భార్యను హైదరాబాద్ కు తీసుకువెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో షాపు మెట్లమీద కళ్ళు తిరిగి హఠాత్తుగా తనమీదకు ఒరిగిపోయిన సౌమ్యను హడావిడిగా ఆసుపత్రిలో

చేర్చాడు. ‘ఆమె గర్భవతి’ అని డాక్టర్లు చెప్పిన మాటకు అతని సంతోషం మిన్నంటింది. తల్లిని భుజాలు పట్టి కుదిపేశాడు. అమ్మవారికి మనసులో నమస్కరించుకున్నాడు. భార్య ఆరోగ్యదృష్ట్యా ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఊళ్ళోకి రావడంతోనే

ఆంజనేయశాస్త్రి చెవిలో తాను తండ్రి కాబోతున్న శుభవార్తను చెప్పాడు నవ్వుతూ. ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ “ఆహా! ఎంత కరుణామయివి తల్లీ! ఏమి నీ లీల?” అని రెండు చేతులు జోడించాడు

భక్తి పరవశతతో.

May 31, 2025 73 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

బ్రహ్మశ్రీ మోతుకూరి నరహరి గారితో ముఖాముఖీ

by రంగరాజు పద్మజ May 31, 2025
written by రంగరాజు పద్మజ

శ్రీమతి కొండపల్లి నీహారిణి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక ముఖాముఖిలో భాగంగా ప్రముఖ పండితులు, సాహిత్యానికి సామాజిక ప్రయోజనమే లక్ష్యమని నమ్మే సాహితీ మేరునగం బ్రహ్మశ్రీ మోతుకూరు నరహరి గారితో రంగరాజు పద్మజ ఈనాటి ముఖాముఖి….

ఏదేని సాహిత్యరచనలోని తప్పొప్పులు గమనించి చెప్పేది విమర్శ. అయితే అలా విమర్శ చేయాలంటే సాహిత్యంలో గొప్ప నిష్ణాతులై ఉండి, విద్వాంసులై ఉండి,ప్రాచీన వాఙ్మయంపై నిత్యం అధ్యయనం చేసేవారు మాత్రమే చక్కని విమర్శ చేయగలరు. దీనికి జ్ఞాపక శక్తితో పాటు, పునశ్చరణ ఉండాలి! ఇవన్నీ కలిసి చేసే విమర్శతో సారస్వత పరమార్ధం తెలుస్తుంది.
కవి ప్రవృత్తి జోలికి పోకుండా, కావ్యాన్ని మాత్రమే స్వచ్ఛమైన విమర్శ చేస్తూ, రచనలు ప్రోత్సహిస్తేనే నిజమైన విమర్శ అనిపించుకుంటుంది.
ఇటువంటి సద్విమర్శలు చేసే మాన్య మహోదయులు బ్రహ్మశ్రీ మోత్కూరు నరహరి గారు ఒక విమర్శకులే కాదు, ఏ విషయమైనా అనర్గళంగా ఉపన్యసించే మంచి వక్తలు… సాహితీవేత్తలు… వ్యాకర్తలు… సామాజిక స్పృహ కలిగిన మానవతామూర్తులు!ఉద్యమ సంఘాలను ముందుండి నడిపించగల నాయకులు…
ఏదేని విషయం అడగగానే ఆ నిర్దిష్ట విషయం ఏదైనా సరే వ్యుత్పత్తి అర్ధాలతో, వ్యాకరణ వివరణలతో వివరించగల విచక్షణులు.
అటువంటి కవి, పండిత, విమర్శకులైన మాన్యులు నరహరి గారితో సంభాషించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం!
మీ రంగరాజు పద్మజ.

రంగరాజు పద్మజ :– నమస్కారమండి!

మోతుకూరి నరహరి గారు:- శుభం అమ్మా!

పద్మజ:– కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో మయూఖ పత్రిక మీతో ముఖాముఖి చేసి ఎన్నో విషయాలు పాఠకులకందించాలని అభిలాష!
మీరు అంగీకరించడం మీతో మాట్లాడే అరుదైన అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది.

నరహరి గారు :– చాలా సంతోషమమ్మా! నీహారిణి నాకు పది సంవత్సరాలుగా పరిచయమే! ఆమె Phd చేస్తున్నప్పుడు, తన గైడ్ నిత్యానంద రావుగారిని వ్యాకరణ, సంస్కృత శ్లోకాల గురించి అడిగితే… నన్ను కలవమని చెప్పగా తను వచ్చింది.
కొండపల్లి శేషగిరి రావు గారి కోడలుగా సరే! కానీ వాళ్ళ నాన్నగారు సుప్రసిద్ధ కమ్యూనిస్టు, 52లో ఎంపీగా గెలిచాడు. అది కూడా కాళోజి గారి మీద. ఆయనంటే నాకు చాలా గౌరవం. నీహారిణిని నేను చెల్లెలిలాగ భావిస్తాను. ఆమె భర్త వేణుగోపాల్ తో కూడా సన్నిహితంగా ఉంటాను.

పద్మజ:– మీ కుటుంబ నేపథ్యం చెప్పండి?

నరహరి గారు :– మా స్వంత ఊరు మోతుకూరు పక్కనే బుజిలాపురం. ఇంటిపేరు కూడా మోత్కూరే! మన ఇండ్ల పేర్లు ఊళ్ళ పేర్లు అయినప్పుడు వలస అని అనుకోవాలి! నేను పుట్టింది 11-4-1944 అని రాసారు. తెలుగు పంచాంగం ప్రకారం బహుశా తారణ నామ సంవత్సర ఆషాడ శుద్ధ ఏకాదశి అయి ఉంటుంది. దానికి ఎలిబీ లేదు.
పక్కనే ఇక్కుర్తి అని ఒక ఊరు ఉన్నది. ఆ ఊర్లో మా అమ్మమ్మ గారు ఉండేవారు.
నేను మొట్టమొదటి సంతానాన్ని కాబట్టి అక్కడే పుట్టాను. 11 సంవత్సరాలు వచ్చేవరకు అమ్మమ్మగారింట్లోనే పెరిగి, అక్కడే చదువుకున్నాను. తర్వాత మోత్కూర్ కు వచ్చినాను. హై స్కూల్ వరకు చదువుకున్నాను. 62లో హైస్కూల్ చదువు అయిపోయింది. మా నాన్నగారు పౌరోహిత్యం చేసేవారు. ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యులు కూడా! ఆ రోజుల్లో కమ్యూనిస్టు కానివారు లేరు. ఎందుకంటే తెలంగాణ పోరాటం 1956 లో ప్రారంభమైంది. పోరాటాన్ని నేను చూడలేదు కానీ పోరాటం తర్వాత పోలీస్ యాక్షన్ పోలీసుల దాడులు, కమ్యూనిస్టులను చిత్రహింసలు పెట్టడం చూశాను.
1964 లో పార్టీ చీలిపోయేంత వరకు అంతా కలిసే ఉన్నారు కాబట్టి, నాన్న కూడా అందులో చురుగ్గా పనిచేసేవారు. మా మేనమామలు కూడా పౌరోహిత్యం చేసుకుంటున్నా సరే! కమ్యూనిస్టు సానుభూతిపరులుగా ఉండేవారు. కమ్యూనిస్టులు రాత్రిపూట వచ్చి “అమ్మా! మీకేమైనా ఇబ్బంది వస్తే మేము వస్తాము” అని చెప్పేవాళ్ళు.
మా అమ్మమ్మ వాళ్ళు అవ్వారు వాళ్ళు. నేను పుట్టేటప్పటికీ మా తాతయ్య రామకృష్ణయ్య గారు మరణించారు. మా పెద్దమ్మ మడికొండ పల్లా దుర్గయ్య గారి వదిన నరసమ్మ గారు వెంకటయ్య గారి భార్య. రెండవ వారు మా అమ్మ. త్రిపురారి వెంకట్రామయ్య గారి భార్య అహల్యగారు మూడు వీరంతా పేరుకు అగ్రవర్ణమే! కానీ ఏమీ చదువుకోలేదు. కానీ కార్తీకమాసంలోనూ, రోజూ విధివిధానంగా ఆచారాలు పాటించే వాళ్ళు. వాళ్లు పాడే పాటలు విని విని పాటల మీద, పద్యాల మీద, శ్లోకాల మీద ఒక రకమైన ఆసక్తి కలిగింది.
పద్మజ :– మీ అభిరుచులలో అటు కమ్యూనిస్టు భావాలు- ఇటు సంప్రదాయ రచనలు, ప్రాచీన వాఙ్మయం, సాహిత్యానికి ఆకర్షింపబడటం, అందులో రాణించగలగడం ఇలా పరస్పర వైరుధ్యాలు ఎలా సాధ్యమైంది?

నరహరి గారు :– ఇది ఒక అపోహ మాత్రమే! సంప్రదాయంలో పుట్టిన వారికి వామపక్ష భావాలు ఉండడం అసహజమనుకుంటారు కానీ, కమ్యూనిజం ఏం చెబుతుంది?

ఒక మనిషిని వేరొక మనిషి; ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై చెల్లదు అని కదా!

శ్రీశ్రీ చెప్పిందే మార్క్స్ చెప్పాడు. మార్క్స్ చెప్పింది ఏమిటి కమ్యూనిస్టు మేనిఫెస్టోలో మొట్టమొదటి వాక్యం ఏమిటి అంటే
ఇదివరకు జరిగిన చరిత్ర అంతా కూడా వర్గాల మధ్య జరిగిన పోరాటమే! అనే వాక్యం మొదటిది.
మన భారతీయ సంప్రదాయంలో నేను హిందూ అనడం లేదు! వైదిక అంటున్నాను… భారతీయ సంప్రదాయం కానివ్వండి, అద్వైతం కానివ్వండి, విశిష్టాద్వైతం ఏదైనా సరే కోరుకునేది ఏమిటి?

సర్వే భవంతు సుఖినః
సర్వేసంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్
(మా కశ్చిద్ – దుఃఖ- భాగ – భవేత్)

ఎవరికీ దుఃఖం కలుగకుండు గాక! అందరూ సమానంగా ఉందురు గాక !
అనే కదా! కోరుకునేది మరి కమ్యూనిజం కోరుకునేది కూడా అదే కదా? ఎందుకో కమ్యూనిష్టులను దుర్మార్గులు, దుష్టులు అని ఒక ముద్ర వేసారు. అలా ఏమీ లేదు. ఒక పీడనం ఉందా? లేదా? ఇవాళ దోపిడీ ఉందా? లేదా? ఈ దోపిడీని అంతం చేయాలంటే ఏం చేయాలి ?ఒక్క ముక్కలో చెప్పాలంటే వైదిక సంప్రదాయం అనేది సిద్ధాంతం చెబుతుంది… సూత్రీకరిస్తుంది… విషదీకరిస్తుంది.
మార్క్సిజం దాన్ని ఆచరణలో చూపెడుతుంది. అందువల్ల ఈ రెండింటి మధ్య ఏమాత్రం వైరుధ్యం లేదు.
ఎందుకంటే? నేను ప్రసంగించినప్పుడు రామానుజాచార్యుల వారిని కోట్ చేసి చెప్తాను.
“రామానుజాచార్యుల వారి గురువుగారు
మంత్రోపదేశం చేసి ఎవరికీ చెప్పకండి” అని అంటే…
“చెప్తే ఏమవుతుంద”ని? రామానుజులు అడిగారట. “చెప్తే నీకు నరకం వస్తుంది” అన్నారట గురువుగారు.
“విన్న వారికి ఏమొస్తుంది”? అని రామానుజులు అడిగారట.
“స్వర్గం వస్తుంది”! అన్నారట గురువుగారు. “అయితే నాకు నరకం వచ్చినా పర్వాలేదు” అని రామానుజులు గిరిశిఖరం ఎక్కి అందరికీ మంత్రం చెప్తాను” అని అందరికీ స్వర్గం వస్తుంది… నాకు నరకం వచ్చినా పర్వాలేదు! అని అన్నారట. రామానుజులవారు.
అలాగే శంకరాచార్యులవారు వస్తుంటే ఎదురుగా కల్లుముంత పట్టుకొని చండాలుడు వస్తూ ఉంటే… ఆయన శిష్యులు అందరూ అతనితో అపసర అపసర అంటే పక్కకు తప్పుకో! పక్కకు తప్పుకో! అని అన్నారట!
ఆ చండాలుడు అన్నాడట ఎవరు తప్పుకోవాలి?
ఆత్మనా? పరమాత్మ నా? అని అడిగాడట. అది విని,
చండాలోస్తూ స తు ద్విజోస్తు గురురిత్యేషా
మనీషా! మమ!! ( మనీషా= బుద్ధి)(జ్ఞానం)
ఆ చండాలుడి ముందు సాష్టాంగ పడ్డారట ఆది శంకరులు.
మనసు ఆలోచిస్తుంది- బుద్ధి వివేచన చేస్తుంది. కాబట్టి గురువు- గురువే!
చండాల అస్తు ద్విజః అస్తు
బ్రాహ్మణుడు కావచ్చు! చండాలుడు కావచ్చు! కాబట్టి ఇక్కడ ద్వైతాద్వైతా విశిష్టాద్వైత ఏమి చూసినా సరే కులం పేరుతో మతం పేరుతో వివక్ష చూపించడం అనేది ఎక్కడా లేదు!
తర్వాత కాలాల్లో వచ్చినవి ఇవన్నీ. అందువల్ల భారతీయ సంప్రదాయానికి ఏ విధమైన వైరుధ్యము లేదు! ఇందాక నేను చెప్పినట్టుగా మన విశ్వాసాలు మన సిద్ధాంతాలు! మన సూత్రాలన్నీ ఆకాంక్షలు. ఇవే మార్క్సిజం అనేది ఆచరణ.
మొన్న దాశరధి గారి గురించి జూమ్ మీటింగులో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ దాశరధి గారు ఆ రోజుల్లో అన్నాడు
రానున్నది ఏది నిజం?
అదే సోషలిజం కలపండోయ్ భుజం భుజం
కదలండోయ్ గజంగజం!!
అన్నాడు. కానీ సోషలిజం వచ్చిన రష్యాలోనే కమ్యూనిజం పోయింది.. అన్నారు.
నేను వెంటనే స్పందించి సోదరా! మీరు చెప్పింది వాస్తవమే! రష్యాలో పోయినంతమాత్రం చేత ప్రపంచంలో అంతా పోయిందని కాదు! ఇవాళ ఉత్తర కొరియా గాని, వియత్నం గాని, క్యూబా కాని, మన పక్కన శ్రీలంకలో ఈ మధ్యనే లూరా, డేనీ లాంటి వాళ్ళు, వెనిజులా లాంటి వాళ్ళు వచ్చారు. ఎక్కడ పీడన ఉంటుందో? అక్కడ మార్క్సిజం ఉంటుంది!
రష్యన్ కవి ఇలా అంటాడు
“ఎక్కడ బాధ ఉందో అక్కడల్లా నేను ఉన్నాను”!
కారిన ప్రతి కన్నీటి కణంలో నన్ను నేను శిలువ వేసుకున్నాను” అని అన్నాడు.
దాన్ని శ్రీశ్రీ అనువాదం చేశాడు.
అలాగే రామాయణంలో కూడా
యత్రయత్ర రఘునాథ కీర్తనమ్
తత్త్ర తత్ర నతమస్తకాంజలిమ్
భాష్ప వారి పరిపూర్ణ లోచనమ్
మారుతిమ్ నమత రాక్షసాంతకమ్!
అని వాల్మీకి అంటాడు.
ఎక్కడెక్కడ పీడన ఉంటుందో? అక్కడక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఈ రెండింటికి వైరుధ్యం లేదు! మనం కోరుకునేది అందరూ బాగుండాలని, ప్రవచన కారులు ఇదే విషయం పదేపదే చెబుతున్నారు. కొద్దిమంది వింటున్నారు. కానీ ఆచరణలో పెట్టడం లేదు. అందుకే సమాజంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని నా బాధ!
అందువల్ల రెండింటికి సమన్వయం చేసుకోవాలి! తప్ప వైదిక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం, మార్క్సిజం అనేవి పరస్పర పూరకాలు… పోషకాలే… తప్ప పరస్పర వైరుధ్యమైనవి కావు!
పద్మజ:— మీరు ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో ఎందుకు చేరాలనుకున్నారు?

నరహరి గారు :—- నేను 1962లో హైస్కూలు పాస్ అయ్యి రెండు సంవత్సరాలు ఉద్యోగం కోసం ప్రయత్నించాను. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. అప్పుడప్పుడే పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది కనుక హైస్కూల్ చదువుతోనే ఉద్యోగం వచ్చేది. అప్పుడు నాకు అనారోగ్యంగా ఉండడంతో ఉద్యోగంలో జాయిన్ కాలేకపోయాను.
1964 ఆగస్టులో హైదరాబాద్ వచ్చాను. అక్టోబర్లో వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖాధి కార్యాలయంలో ఎల్డీసీగా ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో ఒక రెవెన్యూ , మరొకటి విద్యకు రెండు విభాగాలు ఉండేవి. తర్వాత వాటిని ఒకదానిలో మరొకటి కలిపారు. ప్రమోషన్ లు త్వరగా రావని 1965 లో హైదరాబాద్ వచ్చాను. ఉపాధ్యాయుడుగా చేయాలనుకున్నాను. అక్కడ ఒక మిత్రుడు కలిస్తే సాయంకాల కాలేజీలో చేరాలనుకుంటున్నాను. ఎక్కడ చేరాలి? అని అడిగితే, నల్లకుంటలో ప్రాచ్య కళాశాల ఉంది. ఖండవల్లి లక్ష్మీ నిరంజనం గారు దాన్ని ప్రారంభించారు. సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది వరకు ఉంటుందంటే 1965లో దానిలో చేరాను. డిప్లమా ఓరియంటల్ 1970లో వరంగల్లో ట్రైనింగ్ చేసాను, 1973లో ఎం ఏ, 1974లో లెక్చరర్ గా చేరాను. మా శ్రీమతి కూడా ఓరియంటల్ కాలేజీలో చేరింది. బి ఓ ఎల్; డీవొయల్ చేసింది. 1972లో ట్రైనింగ్ చేసి ఉద్యోగంలో చేరింది. నేను రావడంతో నా కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి చదువుకుని అందరూ స్థిరపడ్డారు. ఒక వైదిక సంప్రదాయంలో పెరిగాను కాబట్టి అమ్మమ్మ నేర్పించిన మంత్రాలతో పౌరోహిత్యం చేయించేది. చిన్నప్పటి నుండి అవన్నీ వింటున్నాను.కాబట్టి ఓరియంటల్ కాలేజీ అనగానే సంస్కృతం ఉంటుందని ఆసక్తి కలిగింది. నమక చమకాలు; శ్రీ, భూ సూక్తాలు ఇవన్నీ విని నేర్చుకున్నాను. కానీ అది సంస్కృతం అని, దానిలో కవులు ఉన్నారు, సాహిత్యం ఉందని తెలియదు! DOL లో చేరాక కాళిదాసు అనే కవి , కాదంబరి రాసిన బాణబట్టు కవులున్నారని తెలిసింది.
మా గురువుగారు చేగుంట శివునూరి విశ్వనాథ శర్మ గారు సంస్కృతం, వ్యాకరణం, కాదంబరి వంటి కావ్యాలు చెప్పారు. ఇన్నేళ్లయిన వారు చెప్పిన పాఠాలు మర్చిపోలేదు. ఆ ఒరవడిలోనే నేను నా విద్యార్థులకు బాల వ్యాకరణం, ఇతర కావ్యాలు చెప్పాను. నరహరి సార్ అంటే బాల వ్యాకరణం అనే గుర్తింపు వచ్చింది.
పద్మజ:—- మీరు మూడు తరాల గురువులను చూసారు కదా! మీరు, మీగురువుగారు ఎలా ఉండేవారు? నేటి గురువుల పరిస్థితి ఏమిటి?

నరహరిగారు :– గురువులంటే హైస్కూల్లో అమృత పాఠశాలలో ఉన్నప్పుడు మాకు ఆత్మకూరు ప్రాంతంలో చాడ అనే ఒక ఊరు ఉంది. అక్కడ తిరునగరి శ్రీనివాసులు గారు మా గురువు. ఆయన మాకు తెలుగు నేర్పేవారు ప్రతి సంవత్సరం 26 జనవరి నాడు గాని, 15 ఆగస్టు నాడు గాని తప్పకుండా ఒక దేశ భక్తి కవిత చదివించేవారు. ఆయన ప్రోత్సాహం వల్ల షేక్స్పియర్ నాటకాన్ని అనువాదం చేసాను. ఆ రోజుల్లో ఆంధ్రప్రభ దినపత్రిక వచ్చేది. పల్లా దుర్గయ్య గారి గంగిరెద్దు, దాశరధి కవితలు మొదలైనవి చదవడం వల్ల భాష మీద పట్టు ఏర్పడింది. కాలేజీకి వచ్చిన తర్వాత విశ్వనాధ శర్మ గారు సంస్కృతం నేర్పడం, రామారావు గారు, ఆంజనేయ శాస్త్రి గారు మొదలైన వారంతా మాకు తెలుగు- సంస్కృతం నేర్పించారు.
పాతకాలం గురువులకు ఏ వ్యాపకాలు లేవు!
యజుర్వేద – తైత్తరీయ సంహితలో శీక్షావల్లి అని అనువాకం ఉంది. దాన్లో ఇలా చెప్తారు.

స్వాధ్యాయ ప్రవచనాత్ ప్రమధితవ్యమ్

స్వాధ్యాయం అంటే యజ్ఞం అని ఒక అర్థం. స్వయం శిక్షణ అని మరో అర్థం. మనం విద్యార్థులకు బోధించే ముందుచదువుకొని తయారై విద్యార్థులకు బోధించాలి అని దాని భావం.
పూర్వకాలపు ఆశ్రమాలలో గురువులు అనుష్టానం చేసుకోవడం ; చదువు చెప్పడం తప్ప మరో వ్యాపకం లేదు.
మా గురువుల తరంలోనూ ఫోన్లు వగైరాలు లేవు. నిత్య నైమిత్తిక కర్మలు చేసుకోవడం, చదువుకోవడం, పాఠాలు చెప్పడం వాళ్ళ కర్తవ్యంగా ఉండేది.
మా దగ్గరికి వచ్చేసరికి 1967 లోనూ, 1972లో ఆలియాలో పనిచేసే నాటికీ, 1974లో లెక్చరర్ గా చేరినప్పటికీ ఈ మొబైల్స్ రాలేదు! ఒక్క టీవీ ఉండేది. అందుకే మా చదువంతా పుస్తకాలు, పత్రికలతోనే నడిచింది. మాకు కోయిల్ కందాడై రంగనాథాచార్యులు మాకు ప్రిన్సిపాల్ గా ఉండే వారు.
తరగతిలో చాలామంది ఉపాధ్యాయులు గద్యమో, నాటకమో? ఇంకా ఏదో చెప్తామనేవారు. అలంకార శాస్త్రం ఛందస్సు చెప్పే వాళ్ళు విమర్శ చెప్పే వాళ్ళు కావాలి. అలంకార సంగ్రహం, ప్రతాప రుద్రీయము చెప్పాలి బాల- వ్యాకరణం ప్రౌఢ్యాకరణాలు చెప్పాలి. ఆంధ్ర శబ్ద చింతామణి కూడా చెప్పే వాళ్ళు కావాలి. వాళ్ళు దొరకడం లేదు అని అన్నారాయన. నేను తెలుగు ఉపాధ్యాయుడిని కనుక
నాకు వాటిమీద ఆసక్తి ఉంది. సిద్ధమే చెప్తాను సార్ అని నేను అన్నాను. సాయంకాల కళాశాల కాబట్టి పగలంతా సమయం దొరికేది అప్పటికే విద్యార్థి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ ఐకమత్యం కోసం ఉద్యమాల్లో పాల్గొంటున్నా కూడా ఎక్కువ చదివే వాడిని. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి రమణీయం మొదలైనవి చదువుకొని తరగతికి వెళ్లేవాడిని. అలంకార శాస్త్రంలో మొదట సంస్కృతంలో శ్లోకం చెప్పి దానికి పద్యం చెప్పాలి.
శ్లోకాన్ని కూడా చెప్పగలగాలి! పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఏమంటారంటే?
” యజ్ఞతి బహు నాధీశే తధాపీ పఠ పుత్ర వ్యాకరణమ్!
స్వజనః స్వజనో ఆభూత్ సకలం‐- శకలం; సకృత్- శకృత్ అని చెప్తుండేవారు.
కొడుకుతో ఒరేయ్ అబ్బాయీ! నువ్వు ఎంత చదువుకున్నా సరే! వ్యాకరణం చదువుకో లేకపోతే ఏ పదాలకు ఏం అర్థమో తెలియదు. కాబట్టి వ్యాకరణం చదువుకో!
ఎందుకంటే స్వజనః= మన వాళ్ళు; శ్వజనః= కుక్కల గుంపు; *సకలం= మొత్తం ; శకలం=ముక్క అని సకృత్ = అరుదుగా ; శకృత్= పేడ అని అర్ధం.

దీన్ని నేను ప్రయోగంలో ఇలా చెప్పేవాణ్ణి. ఉపనయనం చేసేటప్పుడు వెంట్రుకలు కత్తిరించే సమయంలో…
పూర్వతోపతి; దక్షిణతోపతి,కృత్తాన్, కేశాన్ పిండే దధాయ
అని మంత్రం చెప్పి అర్ధం చెప్పితే చక్కగా అర్ధమౌతుంది. నా పద్ధతి ఏమిటంటే? ఒక పదం చెప్పితే అర్ధంతో పాటు అలా ప్రయోగం కూడా చెప్తాను.
ఉదాహరణకు ఇటీవల కాలంలో కాంతారా సినిమా వచ్చింది. కాంతారా అంటే అర్థం ఏమిటని చాలామంది నన్ను అడిగారు. కాంతారా అంటే అడవి దానికి సంబంధించిన చరిత్ర అని అర్థం. అలా పదం దానికి అర్థం చెప్తే సరిపోదు ప్రయోగం చెప్పాలని…
వారికి శ్యామలా దండకంలో
కాంతార వాసప్రియే! కృత్తి వాసఃప్రియే సర్వలోక ప్రియే! సర్వమంత్రాత్మకే….

ఈ ఉదాహరణ చెప్పాను.
సింగం అనే పదానికి తెలుగు ఉదాహరణ ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు వస్తూ ఉంటే ద్రోణాచార్యుడు వచ్చేవాడు ఎవరనుకుంటున్నారు?

వచ్చెడు వాడు ఫల్గుణుడు,
సింగం బాకటితో గుహంతరమునన్ చేడ్పాటుమై…
“కాంతారనివాసఖిన్నమతి అంటే అడవిలో ఇంత కాలం ఉండి, చాలా చిరాకు తో వస్తున్నాడని”
ఇలా వివరించేవాడిని.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా గురువులకేమో వారి అనుష్టానం, మాకు చదువు చెప్పడం తప్ప ఇంకోటి లేదు. మా దగ్గరికి వచ్చేసరికి ఉద్యమాలు వచ్చాయి. నాకైతే సాయంకాలం కాలేజీ కాబట్టి మధ్యాహ్నం తీరిక దొరకడంతో ఉద్యమాలు చేస్తూనే చదువుకునే వాళ్ళం. ఎందుకంటే నాకు జీతం ఇస్తున్నది విద్యార్థులకు పాఠం చెప్పమని ఆ బాధ్యత నేను నెరవేర్చాలి. బాధ్యతలు నెరవేరిస్తే హక్కులొస్తాయ్… పాఠం చెప్పడం ముఖ్యం.
ఇప్పటికీ నిరంతరం రాస్తాను- చదువుతాను.
అందరికీ ఇంకొక సందేహం ఉంటుంది. శ్రుతి ఎలా రాయాలి? అని
స్మృతి ఎలా రాయాలని…
శ్రుతి ని శ కు కొమ్ము ఇచ్చి ర వత్తు ఇవ్వాలి.
స్మృతి ఎలా రాయాలంటే ? స కు మ వత్తు ఇచ్చి, వట్రుసుడి పెట్టాలి (రుత్వం)
ఇలానే ఎందుకు రాయాలంటే ?
శ్రుతి అంటే కొమ్ము ఇస్తాం కనుక
కుంతి కొడుకులు కౌంతేయులౌతారు.
బుద్ధుడిని బౌద్ధము ఔతుంది.
కుతూహలం = కౌతుకం ఔతుంది.
ఋషి లోని ఋ వేరు!
ఉ రాస్తే ఆది వృద్ధి వచ్చి ఔ అవుతుంది.
పుత్రుడు = పౌత్రుడు; పౌత్రి అవుతుంది.
పురము = పౌరులు కాబట్టి ఉ రాయాలి.శ రాసి వట్రుసుడి పెడితే రు కు ఆర్ ఆదేశమౌతే శార్త అవుతుంది. అయితే అందంగా ఉండదు

‘శ్రుతి’- సరి అయిన పదం. చాలామంది అనవధానత/ఔదాసీన్యం (Non-Serious ness)వల్ల ‘శ్రుతి-స్మృతి’ పదాలను-వాటి నుంచి ఏర్పడే రూపాలను గురించిన ఆలోచన లేకుండా-ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటారు.
శ్రుతి. =శ్ ర్ ఉ తి.
=శ్ ర్ ఔ తి-సంబంధార్ధంలో ఆది అౘ్చునకు వృద్ధి (ఉ->ఔ).
=శ్రౌతి-శ్రౌత…
‘శ్రౌత,స్మార్త నిత్యానుష్ఠాన..’
శృతి-అని రాస్తే ఏమవుతుంది?
=శ్ ఋ తి.
=శ్ ఆర్ తి/శ్ అర్ తి.
=శార్తి/శర్తి-వంటి అసాధు రూపాలు ఏర్పడుతాయి.
కనుక ‘శ్రుతి’ అనే రాయాలి.
స్మృతి=స్ మ్ ఋ తి.
=స్ మ్ ఆర్ తి/స్ మ్ అర్ తి
=స్మార్తి->స్మార్త…√. …
‘శ్రుతి స్మృతి పురాణానాం, ఆలయం కరుణాలయం..’.
స్మ్రుతి-అని రాస్తే ఏమవుతుంది?
స్ మ్ ర్ ఉ తి.
=స్ మ్ ర్ ఔ తి- సంబంధార్థంలో ఆది అౘ్చునకు వృద్ధి.
=స్మ్రౌతి-అనే అసాధు రూపం సిద్ధిస్తుంది. అందువల్ల ‘స్మృతి’ అని మాత్రమే రాయాలని అవసరమైన చోట్ల విద్యార్థులకు విడమర్చి చెప్పాలి!
మహాభారతంలో యయాతి చరిత్రలో యయాతి క్షత్రియుడు కదా! దేవయాని బ్రాహ్మణ అమ్మాయి కదా! పెళ్లి ఎలా చేసుకున్నాడు? అని ఒక ప్రశ్న వేసారు.
రాజు అనేవాడు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలి కదా!
వర్ణధర్మముల్ కాదు సురల నేలిన యయాతి భూసురోత్తమ భార్గవ పుత్రి తానెట్లు దేవిచేసే?

అనే ప్రశ్న వేస్తే ఆ కచదేవయాని కథంతా వస్తుంది. వ్యాకరణలో కూడా అదే కిమ్? అంటాడు.
అంటే ఈ పదాన్ని ఇలానే ఎందుకనాలి? ఇంకొక విధంగా ఎందుకు అనకూడదు? అనే ప్రశ్న వేసి దానికి జవాబు చెప్తాడు.
ప్రశ్న వేయడం అనేది భారతీయ సంప్రదాయంలో వైదిక సంప్రదాయంలో ఉంది.
అసలు నేనెవరిని?
కః అహం?
ఈ కః విసర్గకు ఓత్వం వస్తుంది. అహం అనేదానికి అకారపు శ్లేష పెట్టాలి.
కోహమ్? అనాలి నేనెవరిని?
పరమాత్మ- ఆత్మ – తత్ – త్వం – అసి
తత్ అంటే అది ( పరబ్రహ్మస్వరూపము)
త్వం అంటే నీవు
అసి అంటే క్రియా పదమైతే ఉన్నావు అని అర్థం. అసి నామవాచకమైతే కత్తి అని అర్థం.
ప్రతిదానికి అర్థాలు మారుతూ ఉంటాయి.
ఉదాహరణకు మత్తః అని ఉందనుకోండి!
మత్తః = మత్తుడు
మత్ + తః = నుండి ఇలా అర్ధాలు మారుతాయి. విభిన్నమైన భాషల్లో కూడా ఇలా నానార్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులకు ఇలా గురువు విడమర్చి చెప్పాలి అని…. ఆ విద్యార్ధికి విద్య ఎలా వస్తుందంటే???

ఉదా॥

ఆచార్యః పారమాదత్తే
ఆచార్యుడు చెప్పడం వల్ల ఒక వంతు, విద్యార్థి తన స్వంతంగా ఆలోచించి నేర్చుకోవడం వల్ల సగం వస్తుంది, సహాధ్యాయుల వల్ల ఒక పావు భాగం నేర్చుకుంటాడు. లోకజ్ఞానం వల్ల మరికొంత జ్ఞానం వస్తుంది. అందుకే గురువులను గౌరవిస్తూనే వారి మార్గంలో నడవాలి!
కొడకండ్ల సిద్ధాంతి గారు పరమపదించినప్పుడు నేనొక వ్యాసం రాసాను.
మహాజనో ఏనక సంబంధా అని
ఏన కథా = ఏ మార్గంలో పెద్దవారు నడిచారో అది మన మార్గం. మహాజనహా + ఏ న కథః సబంధాః
మామూలు శీర్షికలు పెట్టవచ్చు! కానీ సంస్కృతం గురించి కుతూహలం కలిగించాలని ఆ శీర్షిక పెట్టాను.
ఉద్యోగ విరమణదేముంది? అయిపోయింది. కానీ నిరంతరం ఇప్పటికీ చింతన చేస్తూ ఉండడం ఆలోచిస్తూ ఉండడం, ఆలోచనఅంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. నేను విద్యార్థులను లక్ష్మీదేవికి ఎంతమంది పిల్లలు? అని ప్రశ్నించాను. లక్ష్మీదేవికి పిల్లలు ఎవరు సార్? అన్నారు విద్యార్థులు…
“మన్మథుడున్నాడు కానీ అతని పుట్టుక మనకు తెలియదు. శరీరం లేకపోయినా ప్రాణం ఉంది.
కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు లక్ష్మీదేవికి” అని నేను అన్నాను.
“ఎక్కడ ఉన్నదని పండితులే” అడిగారు.
శ్రీ సూక్తం చదవండి అన్నాను.

ఆనందః కర్ధమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ౹
ఋషయః తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా॥
కర్తమేన ప్రజాభూతా మయి సంభవ కర్ధమ ౹ శ్రియం వాసయమే కులే మాతరం పద్మ మాలినీమ్॥

కర్థముడా! నీవల్ల అమ్మ తల్లి అయింది. లేకపోతే గొడ్రాలు అంటారు కదా! ఒక బిడ్డకే తల్లి అయితే కదలీ వధ్య అంటారు. అందుకే ముగ్గురున్నారని శ్రీ సూక్తం చదివితే తెలుస్తుంది.
పురుష సూక్తం చదవారా! అన్నాను.
“చదివాము అన్నారు” అందులో మూడు ప్రశ్నలు ఉన్నాయి చెప్పండి అన్నాను.
1- విరాట్ పురుషుడిని వర్ణిస్తున్నారు.
సహస్ర శీర్షా పురుషః ౹
సహస్రాక్షః సహస్ర పాత్ ౹
అని వర్ణించారు. ఈ మహా విగ్రహానికి ముఖం ఎవరు? చేతులు ఎవరు? పాదాలెవరు? తొడలెవరు? అని ప్రశ్నించాడు!!
ముఖం కిమస్య ? ( ముఖం ఏకవచనం)
కౌ బాహు? ( బహువులు ద్వివచనం)
కౌవూరూ ఉచ్చారణలో కావూరు అవుతుంది.
పాదావుచ్యేతే ఈ నాలుగు ప్రశ్నలు వేశాడు.
నాలుగు ప్రశ్నలకు జవాబు చెప్పాడు.
బ్రాహ్మణః అస్య ముఖం ఆసిత్
ఆసీత్ = ఉన్నాడు ఆ స్థానం వాళ్ళది.
బ్రాహ్మణ ముఖమాసిత్
సర్వేంద్రియానం నయనం ప్రధానం! సర్వస్య గాత్రస్య శిర ప్రధానం( Think Tank)
రాజన్యః కృతః = క్షత్రియులు దేశాన్ని కాపాడాలి! కదా! దానికి బహువుల అండ ఉండాలి.
ఊరూ తదస్య యద్వైశ్యః౹
కోమట్లు వ్యాపారం చేసేవారనే అనుకుంటారు కానీ భగవద్గీతలో 18 వ అధ్యాయంలో గీతాకారుడు ఏం చెప్పారంటే?
ఒక్కొక్క వర్ణం ఏం చేయాలో చాతుర్వణ్యం అని చెబుతూ కృషి, గోరక్ష, వాణిజ్యం వైశ్య కర్మ స్వభావం అన్నాడు.
అంటే వ్యవసాయం, గోరక్ష ,వ్యాపారం చేయాలి! వ్యవసాయం చేయాలంటే పశువులు కావాలి కదా! అందుకు గోరక్ష చేయాలి. వ్యవసాయం చేస్తే పంట వస్తే తినగా మిగిలిన దాన్ని ఎగుమతి చేయాలి!
నీ దగ్గర లేని దాన్ని దిగుమతి చేసుకోవాలి! ఇది వ్యాపారం.
వ్యవసాయం నుండి వ్యాపారం వచ్చింది
పాదార ఈ భూమి మీద నిలబడాలంటే పాదాలే కదా అవే ముఖ్యము.
ఉపాధ్యాయుడుగా గతంలో ఉన్నవారు మహానుభావులు. మా తరానికి చెందిన ఉపాధ్యాయులు కొంతమంది ఉద్యోగంలో ఉంటూ రకరకాల వ్యాపారాలు చేసేవారు. ఎప్పుడూ అలాంటి వారు ఉంటారు. మేము నిష్టగా ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించాము.
ఇప్పుడు మంచివారు లేరని కాదు! కానీ, సంఖ్య తగ్గుతున్నది. రకరకాల వ్యాపకాలు సంపాదన కోసం పాకులాట ఎక్కువై దానికే సమయం కేటాయిస్తున్నారు. నేనేమంటానంటే ఉదయం తొమ్మిది నుండి నాలుగు గంటల వరకు పని చేసి, అది కూడా యాంత్రికంగా కాకుండా పాఠాలు చెప్పేలా తాను ముందు చదువుకోవాలి! పిల్లలకు చెప్పాలి!
మా గురువులు ఎలా ఉండేవారు అంటే? కద్రువనాగమాత ఎక్కడుందిరా? అని అడిగేవారు.
జవాబుగా బాలవ్యాకరణం తత్సమ పరిచ్ఛేదం ఫలానా సూత్రం అని చెప్పాలి!
కద్రువ నాగమాత అని ఎందుకన్నాడు? ఏం సూత్రం? అంటే నిపాత సూత్రం.
నిపాతం అనే ఎందుకనాలి? అంటే కద్రువు అనేది సంస్కృతంలో దీర్ఘాంతంగా ఉంటుంది. తెలుగులో కద్రువ అంటున్నాము. సంస్కృతంలో కద్రూ దీర్ఘాంతం తెలుగులోకి వచ్చేసరికి “నామంబులకు దీర్ఘం హ్రస్వంబగు” అని సూత్రం! దాని ప్రకారం
కద్రువ అయింది.
కద్రూ ఏమిటి ? ఉకారాంతం కదా?
ఉకారాంత గో శబ్దములకు అంతట వు వర్ణకంబగు .( సూత్రం) అని రావాలి!
ఉదాహరణకు గురువు, తరువు,మనువు, మొదలైనవి మరి అలా అయితే కద్రువు కావాలి కదా? మరి ప్రయోగంలో కద్రువ అని ఉంది కదా! అందువల్ల కద్రువా అనే శబ్దాన్ని వ్యాకరణ సూత్రాలతో సాధించలేరు!! ఇది ఇలానే ఉంటుందని చెప్పడమే నిపాత సూత్రం .
కద్రువ అని ఇప్పుడు అడిగితే కద్రువ అనే చెప్తారు.
ధాత అనే ఒక పదం ఉంటుంది.
ధాత అంటే బ్రహ్మ
దాత అంటే ఇచ్చువాడు.
రెండింటి మధ్య ఒక ఒత్తు మాత్రమే భేదం …ఒత్తుతో అర్ధం అంతగా మారుతుంది. కాబట్టి ఇలాంటివి నిక్కచ్చిగా చెప్పాలి.
ఈ నాటి గురువులు కూడా ఇలా చక్కగానే చెప్తున్నారు.
కాకపోతే తప్పులు చెప్తే మటుకు వారికి తెలియచేయాలి! అధికారుల పర్యవేక్షణ ఉంటే పాఠాలు చెప్పమని అంటే తప్పక మెరుగుపడుతుంది విద్యా వ్యవస్థ.
M A phd చేసిన నేను శిశు తరగతి పిల్లలకు పాఠాలు చెప్పాలా? అని అనుకోవద్దు!
ఉద్యోగంలో చేరాక అవన్నీ ఆలోచించవద్దు! సెకండ్ గ్రేడ్ టీచర్ గా చేరితే సెకండ్ గ్రేడ్ కు పాఠాలు చెప్పాల్సిందే! మిగతా విషయాలు ఏమున్నా సరే డ్యూటీ మాత్రం సక్రమంగా చేయాలి. 10- 15 సంవత్సరాల క్రితమే నేను నాయకుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లో ఒక నిర్ణయం తీసుకున్నాను. తరగతి గదిలో ఎవరూ మొబైల్ ఉపయోగించకూడదని… మా ఉపాధ్యాయ సభ్యులందరికీ ఇదే విషయం చెప్పాను. ఈమధ్యనే ప్రభుత్వం ఈ ఆర్డర్ ఇచ్చింది. కొంతమంది అత్యవసరంగా ఇంటి నుండి ఫోను వస్తే ఎట్లా? అని అంటారు. కొంప మునుగుతుందా? స్టాప్ రూమ్ లో పెట్టి తరగతికి వెళ్ళాలి! లేదా స్విచ్ ఆఫ్ చేయాలి! విరామ సమయంలో చూసుకోవచ్చు! లేదా ఒక తరగతి నుండి మరో తరగతికి వెళుతున్నప్పుడు మధ్య సమయంలో చూడవచ్చని చెప్పాను.
ఒక వైవిధ్యం ఎక్కడ ఉందంటే? ప్రైవేట్ పాఠశాలల్లో 10, 15 వేలు రూపాయలు జీతం ఇచ్చి విపరీతమైన చాకిరీ చేయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో వేలల్లో జీతం వస్తుంది కదా! ఇక పర్వాలేదు పాఠం చెప్పినా, చెప్పకపోయినా ఏం కాదులే అనుకునేవారున్నారు. కానీ మంచిగా బోధించే ఉపాధ్యాయులు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించాలి.
రాజకీయ నాయకులకు అనుయాయులుగా ఉన్నవారు ఎక్కువగా పాఠశాలకు రారు. అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మా యూనియన్ జోక్యం తీసుకోదు అని అంటాను.
గత కాలముకంటె వచ్చు కాలము మేలు అని నన్నయ్యగారు చెప్పింది నిజమే! కానీ మళ్ళీ పూర్వం గురువుల వలె ఒక వశిష్ఠుడో, వాల్మీకో, సాందీపని వంటి వాళ్లు రారు! కానీ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని, వాళ్ళ మార్గదర్శకంలో నడవాలి కదా! వాళ్లు బోధించిన దాంట్లో 10శాతమో- వంద శాతమో మనమూ బోధించాలి కదా! భగత్ సింగ్ లాంటి వాళ్ళు మహానుభావులు లేరు. వాళ్ళు వస్తారని మనం కూర్చున్నామా? వాళ్లు ఆ రూపంలో వస్తారా? వాళ్ళు చేసిన దాంట్లో మనమేం చేయగలమని ఎవరికి వారే అనుకోవాలి! తప్పనిసరిగా ఒకటే పద్ధతి ఏ దేశమైనా బాగుపడాలంటే ముందు విద్యా వ్యవస్థ బాగుపడాలి… ఉపాధ్యాయులు తమకు తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి!
యజుర్వేద *-తైత్తరీయ ఉపనిషత్తుల్లో శిక్షావల్లిలో
స్వాధ్యాయ ప్రవచ సే చ ప్రమధితవ్యం అధ్యయనం చేయడంలోనూ- అధ్యాపనం చేయడంలోనూ పొరపాటు పడొద్దు!
ధర్మాన్న ప్రమధితవ్యం అంటే ధర్మం నుండి ప్రమిదితవ్యం జారకూడదు అని చెప్తుంది.

ఈ కాలంలో రెండు రకాల అతివాదాలు ఉన్నాయి. ఏమి చదవకుండానే కళ్ళు మూసికొని, చెంపలేసుకుని నమస్కారం చేసుకునేవారు ఒక రకం, ఏమి చదువుకోకుండానే అందులో ఏముందిలే చెత్త అనేవారు మరో రకం కాబట్టి ఈ రెండు అతివాదాలను సాధ్యమైనంత వరకు ఎంతవరకైతే అంతవరకు దులిపేసి మనం చదువుకోవాలి.
సంస్కృతం రాదు అనుకోవద్దు! వాటికి అనువాదాలు ఉన్నాయి. వాటిని చదివి మన వేదాంతాన్ని ,కానీ మన భారతీయ సంస్కృతిని గాని తెలుసుకోవాలి.

లోకాః సమస్తా సుఖినోభవంతు! అన్నాడే కానీ హిందూ భవంతు… అనలేదు కదా! లేదా ముస్లిం భవంతు సుఖినః అనలేదు కదా! కాబట్టి ఈ వాక్యాలు ప్రపంచానికి అంతటికి వర్తిస్తాయి.
అందువల్ల మనం ప్రధానంగా ఈ దేశం బాగుపడాలంటే సాంకేతికంగా కానీ, మరో రకంగా కానీ బాగుపడాలంటే విద్య ముఖ్యం కనుక చక్కగా బోధించాలి.
ఇటీవలి కాలంలో కార్పోరేట్ కాలేజీలన్నీ సంస్కృతం చెప్తున్నాయి. సంస్కృతానికి నేను వ్యతిరేకిని కాను. కానీ మాతృ భాష రాకుంటే ఎలా? విద్యార్ధి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఇంటర్ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతాడు. ఇంటర్ లో సంస్కృతం ఉంటుంది. ఆ తర్వాత భాషా బోధనలు ఉండవు.
అగ్రవర్ణమని చెప్పుకునే వాళ్లకు కూడా మా పిల్లలకు తెలుగు రాదండని చెప్తున్నారు ఎంత బాధాకరమైన విషయమో!
మా మనవడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. వాడు తెలుగు అద్భుతంగా మాట్లాడుతాడు కానీ చదవడం రాయడం రాదు. తెలుగు లో నమస్కారం తాతయ్యా! అని రాశాడు. “అమ్మ రాసిందా! ” అని అడిగాను. “నేను గూగుల్లో రాశాను” అని అన్నాడు.
ఏ ఇంజనీరు అయినా వైద్య విద్య అయినా చదవుకోండి. కానీ తెలుగు నేర్చుకోండి ఎందుకంటే విదేశాలకు పోయేది ఒక శాతం రెండు శాతం కానీ మిగతా వారంతా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేయాలి కదా! ప్రజలతో తెలుగు భాష రాకుండా ఉద్యోగం ఎలా చేయగలడు?
నాతో చదివిన ఒక తను కలెక్టర్గా పని చేస్తున్నప్పుడు ఒక ఆమె ఒక కాగితం తీసుకొని వచ్చిందట. “ఇదేదో వచ్చింది చూడు సార్” అని ఆయనకిచ్చిందట. అందులో
you are granted a house site అని ఉంది.
అంటే నీకు ఇంటి భూమి వచ్చిందని చెప్పాడట.
“నాకు ఇంటి జాగా వచ్చిందంటే నాకు తెలవడం లేదు కదా సార్” అని అన్నదట ఆమె.
కలెక్టర్ ఆ రోజు నుండి వెంటనే ప్రజలకు పంపేవాటిటి ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులోనే రాయమని ఆర్డర్ ఇచ్చాడట.
నేను కవిత్వం విషయంలో కూడా ఏమంటానంటే కవికి శ్రోతకు మధ్య ఒక వ్యాఖ్యాత ఉండనవసరం లేదు అంటాను.
ఉదా॥ కవి
పొలాలనన్నీ హలాల దున్ని
ఇలా తలంలో
అనే కవితకు ఒక వ్యాఖ్యాత అవసరమా? కేవలం మార్కుల కోసం కార్పోరేట్ కాలేజీలు పనిచేస్తున్నాయి. సంస్కృతం నేర్చుకోవాలంటే నేర్చుకోండి! కానీ పరీక్షలో కానీ ఎక్కడైనా సరే దేవనాగరలిపిలో రాయండి. మీరు ఇంగ్లీషులో సమాధానాలు రాసి, సంస్కృతం నేర్చుకున్నామంటే ఎలా? అదికాక ఎలా ఐతే తెలుగు ద్వితీయ భాషగా ఉందో ఆ స్థాయిలో సంస్కృతం కూడా ఉండాలి ! నాలుగు శబ్దాలు చెప్పి కంఠస్థం చేసి సంస్కృతం నేర్చుకున్నామంటే ఎలా? అలా ఐతే సంస్కృత భాషకు సేవ చేసినట్టు కాదు! భ్రష్టు పట్టించినట్టే అవుతుంది. సంస్కృతం నేర్చుకోవాల్సిందే! తెలుగు వారికి తెలుగు రాకుండా చేసి సంస్కృతం నేర్పడం హాస్యాస్పదం !
మేము ఒక ఉద్యమం తీసాము
సంస్కృత భాషకు నమస్కరిస్తాం!
అమ్మ భాష ముందు తర్వాతే ఏ భాషైనా అని
ఉద్యమించాం.

May 31, 2025 69 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

లోకం పోకడ

by Radhika Suri May 31, 2025
written by Radhika Suri

సంఘజీవియైన కవికి సామాజికాంశాలపై సునిశిత దృష్టి ఉండాలి , ఎరుకతో ఉంటూ విజ్ఞత ప్రదర్శించాలి. ముఖ్యంగా సూక్ష్మగ్రాహిగా ఉంటూ జనం గొంతుకై నినదీస్తూ కలాన్ని ఆయుధంగా
ఎక్కుపెట్టాలి. సమకాలీన అంశాల్ని కథా వస్తువులుగా చేసుకుని అలతి పదాలతో విషయాన్ని సూటిగా సహజంగా చెప్పాలి.

‘లోకం పోకడ’ పుస్తకంలో సోదరులు యరకల యాదయ్య గారు సామాజిక స్థితిగతులను గమనిస్తూ, జనజీవన వైవిధ్యాలను, వారి మనస్తత్వాలను దగ్గరగా చూస్తూ కవిగా తమ భావాలను వర్ణరంజితంగా మలిచి చక్కగా రాసుకున్న అక్షరసత్యాలు.

పేరు పెట్టని కవితలే అన్నీ ,
బతుకు పోరాటంలోని ఆరాటాల్ని , సంఘర్షణలను అద్దంలో
చూపెట్టారు.

ముందుగా కాలే కడుపుల కడగండ్లను కళ్ళ ముందుంచుతూ …
‘మలమల లాడి
ఎండిన డొక్కలు
కష్టాన్ని ఎత్తుకుంటాయి…
అంటూ ఆకలి పోరాటంలోని ఆర్తిని, అవసరాన్ని చిన్న వాక్యాల్లో తేటతెల్లం చేసిన తీరు బాగుంది.

మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెప్తూ’ గల్లీలో లొళ్ళైతే పిలిచిన పోరు
పక్కనుండి చెవులకు పని చెపుతరు… అంటూ
మనిషికి పక్కింట్లోకి తొంగి చూడడంలోని ఆసక్తిని ,ఆతృతను ఎత్తి చూపెడతారు.

ముసుగు వేసుకున్న మనుషుల ప్రవర్తన ,అవసరం తీరిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తూ…”అవసరమనుకుంటే అంగలారుస్తరు
ఆపద తీరగానే
ముఖం చాటేస్తరు”అంటూ స్వార్థం నిండిన మనుషులు ఎలా ఉంటారో చెప్తారొకచోట.

ఓటు విలువ, ఎన్నికల తంతు ఎంతలా దిగజారిపోయాయో చెప్తూ…
“ఓటు ప్రతి పౌరుడి హక్కు బిచ్చగాడిలా అడుక్కుతింటావేందుకు “అంటూ
ఓటరును అమ్ముడుపోవద్దంటూ మందలిస్తూ చిరుకోపం ప్రదర్శిస్తారు.

నగరీకరణతో పల్లెలు కళతప్పి రసాయన కర్మగారాలుగా రూపాంతరం చెందుతూ ఉంటే ఆవేదన వెళ్ళగక్కుతూ… “రసవాయువులు కొన్ని ఊపిరితిత్తులను
దిగ్బంధించి శాసిస్తే
ఎన్నోఅస్వస్త జీవితాలకు ఊపిరులు పోస్తవి”
అని బాధను వ్యక్తపరుస్తారు.

ఉత్పత్తిదారులను నిర్వీర్యం చేస్తున్న పెత్తందారీ వ్యవస్థను
ఎత్తి చూపిస్తూ…
“ఉత్పత్తి గొప్పేమి కాదంట
రాజ్యాలను ముంచి తేల్చిన
వర్తక పటిమనేనట”
అంటూ చురకలంటిస్తారు.

నాది నేననే భావనతో తప్పుడు దారిలో కూడబెట్టడం తగదంటూ, అశాశ్వతమైన జీవితంలో చివరికి ఏదీ మనతో రాదని తత్వబోధ చేసి శ్రమ దోపిడి మానుకోండని హితోపదేశం చేస్తారు.

రాజకీయ ఊసరవెల్లి రంగులు మార్చుతూ, కొండచిలువలా భూమిని భక్షిస్తుందంటూ ఆవేదన వ్యక్త పరుస్తారు . మౌనానికి మించిన ఆభరణం లేదని
వివేకవంతుడు సముచిత భాషణంతో భాసిస్తాడంటారు.

చివరగా ‘నా నగరం తెలంగాణ మణిహారం’ అంటూ యాభై యేండ్లలలో హైదరాబాద్ షహర్ ఎన్ని మార్పులు చేర్పులతో విశ్వనగరంగా ఎదిగిన పరిణామక్రమాన్ని చక్కగా వివరించారు.

యరకల యాదయ్య గారు ఒక సభలో కనిపించి రాధికమ్మా అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ తమ ‘ లోకం పోకడ’ పుస్తకం నాకందించారు. చదివిన తదనంతరం నా మనోభావాలను పేపర్ పై పెట్టాలని అనిపించింది. పుస్తకం సమతామానవతా విలువల కలబోతలతో సమాజం ఎలా ఉందో, మనం ఎలా ఉండాలో చెప్తూ, చిందే చెమట చుక్కలలోని అందాన్ని ,ఆత్మానందాన్ని చక్కగా వివరించిన యాదయ్యగారిని అభినందిస్తూ…

May 31, 2025 56 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

కూడలి చెట్టు

by Padmasri Chennojwala May 31, 2025
written by Padmasri Chennojwala

నల్లగొండ రమేష్ గారు నాటిన విత్తనం మొలకెత్తి,47 శాఖలుగా విస్తరించి (స్త్రీ శక్తి, ప్రకృతి, పెదవాగు, ప్రేమ, మానవ సంబంధాలు మొదలైన)ఒక్కో శాఖపై ఒక్కో రంగు పుష్పాలతో, తీయని పరిమళాలను వెదజల్లుతూ ‘కూడలిచెట్టు’గా సాహితీ అభిమానులను అలరించింది.

‘మన చెలిమి చెట్టుకు లేదు శిశిరం
మన మమతలకు లేదు ఏ దూరం
మనది ఆత్మీయమైన సమరం
మనది ఆనందాల తీరం ‘ (వసంతమే నిరంతరం) అంటూ చిగురేసిన చెలిమి చెట్టుపై వసంతగీతాన్నాలపించే స్నేహశీలి.

‘రొదల రొంపి కాంక్రీట్ పొదల హంపి
బందులకు ఇబ్బందులకు కేరాఫ్
సిటీ లైఫ్ నిజమైన పిటీ లైఫ్’ అంటూ సాగిన వీరి (మహానగరం)
ట్రాఫిక్ పద్మవ్యూహాలు, వాహనాల రణగొణ ధ్వనులు వీరికి సుతరామూ గిట్టవనే విషయాన్ని
ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో ప్రకృతి రమణీయతను,
పల్లె జీవనాన్ని వీరు అంతగా ప్రేమిస్తారన్న విషయాన్ని కూడా (ఒక తోవ)అనే కవిత తెలియజేస్తుంది.

‘రామప్ప గుడి నాట్యమదనిక శిల్ప లావణ్యం బలాదూరయ్యే తోవ ‘

ఎంత గొప్ప భావసంపద!
ఎంత చక్కని పోహళింపు!

తాను ప్రయాణిస్తున్న తోవలో నాట్యమదనిక శిల్పలావణ్యాన్ని చూడటం ( ప్రస్తావన దారి మళ్లుతోందని భావింపక,పాఠకులు కాస్త క్షమించగలిగితే… ఇంత అద్భుతమైన ఉపమానం చూడగానే ఒక్కసారిగా
‘పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల తేలేటి పూబంతివి ‘ అనే పాట నా మదిలో స్ఫురించింది. ఆ ఉపమానం ఎంత అద్భుతంగా ఉందో ఇది కూడా అంతే అద్భుతంగా ఉందని చెప్పడానికి మాత్రమే ఈ ప్రస్తావన తీసుకొచ్చాను.) రాళ్లలో జవరాళ్లను చూడటం(కదిలిన రాళ్లు) వీరిలోని భావుకతను తెలియజేస్తాయి.

‘అరకు అందాలు దిగదుడుపైన దోవలోకి నా బైకుతో నా ప్రయాణం ఆరంభం అవ్వగానే ఒక పులకరింత అలలా లోలో తనువంతా అల్లుకుంది ‘

‘ పెదవాగు ‘ లేని వీరి కవిత్వాన్ని చూడలేం. పెదవాగును ఎంతగా ఇష్టపడతారో ఆకుపచ్చని అందాల నడుమ సాగే తమ బైకు ప్రయాణాన్ని కూడా అంతే ఇష్టపడతారనే విషయం పాఠకులకు చాలాసార్లు అవగతమ వుతుంది.

‘వాగు వంపుల వయ్యారపు నడకలు గవ్వలు గువ్వలు అలలు గాలి వలలు
ఇటు తీరం అందం…. అటు పెదవాగు హోరందం(చానకాలం తర్వాత) అంటూ పెదవాగు అందాలపై తమ భావాల వంతెనను నిర్మిస్తారు.

‘తన బతుకొక వెలుగు చూడని కృష్ణ బిలం
తనకు కలిసి రాలేదు పాడుకాలం
ఐనా
కష్టానికి ఎదురీదిన తీరుకు ఒక సలాం (ఒంటరిగా)’
నాలుగు వైపులా చీకటి ఆవరించిన ఒక స్త్రీ జీవితాన్ని ,
విధి ఆడిన వికృతకేళిలో సర్వం కోల్పోయిన ఓ నిస్సహాయురాలి దీనస్థితిని
‘బాధల రేపల్లె రాధమ్మ
అశోకవనంలో శోకిస్తున్న సీతమ్మ ‘అంటూ
హృద్యంగా వర్ణిస్తూనే,
‘కష్టాల కన్నీళ్లను ఎదిరిస్తున్న మనోరథం ఆమెది
జీవన సమరంలో జవసత్వాలున్న సుప్తచేతనం ఆమెది ‘అంటూ ‘అశోక వనంలో సీతమ్మ ‘అనే కవితలో శూన్యం నుండి కొత్త అడుగులేసే సంకల్పశక్తిని బలంగా నినదించారు.

‘ప్రగతి రఫెల్ లాగా దూసుకెళ్తుంటే
పేదరికం వానపాము లాగా సాగుతుంది'(ఆమె నడిచి వెళుతుంటే) అనడం
సంక్షేమ పథకాలు సామాన్యుడికి చేరడం లేదనే విషయాన్ని గురి చూసి వదిలారు.

‘రాబడికి మించింది అప్పు
తెలియక చేసిందీ తప్పు
జీవితాన్ని ముంచు అప్పోక ఊబి
నిరాశ దాని నాభి (ఆమె కంటిలో సముద్రమే బొట్టు) ‘ అంటూ మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒ లకబోసుకునే మనస్తత్వాలకు చురకలంటించారు.

‘బహుసుందర బహుళ అంతస్తుల భవనాలు
అయితే నేమి నిమిషంలో నిలువునా శిథిలాలు (మరు భూమి) ‘ అంటూ యుద్ధం సృష్టించే వినాశనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం

‘రాయబారాలకు గ్రహణం పట్టిన వేళ
రాక్షస రాజకీయాలకు ఆగ్రహం పుట్టిన వేళ
పొగల్జిమ్ముతున్నవి సెగల నల్లని బూడిద కుప్పలు
పగల్జిమ్ముతున్నవి నాయకుల కద న ప్రకటనల గొప్పలు ‘
అంటూ (మరుభూమి )
యుద్ధం జనజీవనాన్ని ఛిద్రం చేసిన తీరును హృద్యంగా వర్ణించడమే గాకుండా, యుద్ధాలకు స్వస్తి పలకాలనీ,విశ్వమానవ సౌభ్రాతృత్వానికి చేతులు కలపాలనే శాంతికాముకుడు.

‘పొలమంతా నిండింది వాననీరు
కర్షకుడి కంట కట్ట తెగింది కన్నీరు’

‘ఆశలన్నీ ఆవిరి
ఊసులన్నీ హుష్ కాకి’
(సముద్రమంత దుఃఖం)
అంటూ అన్నదాత జీవితం ప్రకృతితో ముడివడిన విధానాన్ని ఆర్తిగా అల్లారు.

‘నా స్వేదం చిందించి మీకు కడుపు నింపే అమ్మను నేను
మరి నేను ఆకలికి అలమటిస్తున్నానెందుకో ‘(రైతు ధ్వజం) అంటూ దీపం కింది చీకటి వంటి అన్నదాత జీవితాన్ని బరువుగా పలికించారు.

‘పనే దైవం తనకి
కులంలో ఒక రజిత వెలుగు తన ఉనికి’

‘రక్తం కరిగించితే చెంగిలించిన తప్తలోహం
శ్రమించిన స్వర్ణకాల క్షణాలింకా ఎరుకే నాకు ‘అంటూ ఒక స్వర్ణకారుడి జీవితంలోని సాదక బాధకాలనీ, కుటుంబ పోషణకై ఒక తండ్రి చేసే పోరాటానికి(మా నాన్న) అద్దం పట్టారు.

‘ఆశల ఆవలి తీరాలగుండా ఊరేగే బాటసారులం మనం
లోకమంతా మాదే శోకమంతా మాదే(సూర్యులం)’
కవి ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాడో, “రవిగాంచని చోటు కవి గాంచున్” అని ఏ హృదయంలో ఏ వేదన ఉన్నా, అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగే శక్తి కవికే సాధ్యమనీ, అప్పుడే పదునైన కవిత్వం కాగితం పైకె క్కగలుగుతుందని చెప్పారు.

ప్రకృతి అందాలకు పరవశిస్తూ, దహేగాం తోవలో సాగే వీరి బైక్ ప్రయాణంలో ఏ కారణం వల్లనైనా మనసు స్విచ్ ఆఫ్ అయితే, ‘యూటర్న్ ‘ తీసుకుని వెండి వెన్నెల జల్లుల్లో హారతి పట్టిన ఆడబిడ్డ (కూడలి చెట్టు) చెంత మనసుని రీఛార్జ్ చేసుకుని, ఎదనిండా కొత్త ఊపిరి నింపుకొని, వారి అందమైన భావాలకు అరుణిమ కాంతులను, ధవళిమ వెలుగులను జతకూర్చి, వసంతవిపినపు సోయగాలతో మరో కవితాసంపుటిని సాహితీ అభిమానులకు అందించడానికి సమాయత్తం కావాలని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ…….

May 31, 2025 57 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

వీరుడా వందనం

by Padmasri Chennojwala May 31, 2025
written by Padmasri Chennojwala

శత్రువుపై ముప్పేట దాడి చేస్తూ ముట్టడి చేసే సామర్థ్యమున్నటు వంటి సైన్యాన్ని త్రివిధ దళాలు అంటారు. సరిహద్దు వివాదాలుగానీ, మరే ఇతర కారణాల వల్లగానీ తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సివస్తే వీరు ప్రదర్శించే ధైర్య సాహసాలుగానీ, శౌర్యప్రతాపాలు గానీ వర్ణించడానికి ఏ భాషా సరిపోదేమో, బంధాలు, అనుబంధాలను కోల్పోతామేమో నన్న బాధలో కొందరు, కోల్పోయి కొందరు అనుభవిస్తున్న బాధ ఒకవైపయితే, మనకోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న వారి కోసం, వారి కుటుంబాల కోసం ఏమీ చేయలేకపోతున్నామనే సాధారణ పౌరుల బాధ మరోవైపు. వారి త్యాగాలకు వెలకట్టడం అసాధ్యమే అయినా, కృతజ్ఞతాపూర్వకంగా వారి వేదనలపై సింహావలోకనం……

పొరుగు రాష్ట్రానికి చెంది, భాగ్యనగరంలో నివసిస్తున్న ఒక కుటుంబంతో నాకు చక్కని స్నేహ సంబంధాలున్నాయి. ఆ ఇంటి ఇల్లాలి గురించి చెప్పాల్సి వస్తే, సద్గుణ సంపన్నుడైన భర్త, చక్కని వ్యక్తిత్వం,విలువలతో పెరిగి, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులైన పిల్లలతో, పండ్ల బరువుకు వంగిన చెట్టువలె ఫలప్రదమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ, ఏదో ఒక సమయంలో ఆమె కంటి చెమరింత నా దృష్టిని దాటిపోలేదు, ఎంత దాచాలని ప్రయత్నించినా ఎప్పుడో ఒకప్పుడు ఆమె గొంతులో ధ్వనించే జీర నా చెవిని దాటిపోలేదు. ఎంత చక్కని స్నేహం అయినప్పటికీ, అది కొన్ని పరిమితులకులోనై ఉండాలన్న వివేకంతో నేను కూడా ఎప్పుడూ ఆమెను ఆ విషయంపై ప్రశ్నించలేదు. మా స్నేహం ఇలా సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండగా, తమాయించుకోలేని ఆమె ఒకరోజు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తనకు తానుగా నాతో పంచుకున్న విషయమేమిటంటే, తమ ఆరుగురు తోబుట్టువుల్లో అందరికంటే చిన్నదైన తమ చెల్లికి (వయసులో కూడా చాలా తేడా ఉండటంతో, ఆమె అడుగుల కింద తామంతా అరచేతులు పరిచి పెంచామని) పెళ్ళీడు రాగానే సమీప బంధువుతో పెళ్లి జరిపించామనీ, సరిగ్గా ఒక్క నెల రోజుల వైవాహిక జీవితానంతరం ఉద్యోగ నిర్వహణకని వెళ్లిన అతను కార్గిల్ యుద్ధభూమిలో వీరమరణం పొందాడనీ చెప్పింది.

ఎంతటి గాయాన్నైనా మాన్పే శక్తి కాలానికి ఉందన్న సత్యాన్ని అనుసరించి, పునర్వివాహానికై ఒప్పించాలని తామంతా ఎంతగా ప్రయత్నించినా (అత్తింటివారు నిండు మనసుతో సంపూర్ణ సమ్మతిని తెలియజేసినప్పటికీ కూడా) ఆమె ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వలేదనీ, తన సామర్థ్యానికి తగిన ఉద్యోగాన్ని చేసుకుంటూ, వృద్ధులైన తల్లిదండ్రులకు సేవచేస్తూ, కవల పిల్లలకు జన్మనిచ్చి, పురిట్లోనే కన్ను మూసిన ఓ మాతృమూర్తి అంతరంగాన పరకాయ ప్రవేశం చేసి, ఆ శిశువులిద్దరినీ తన ఒడికి చేర్చుకొని, గుండెలకు హత్తుకుని, వాళ్లను ప్రయోజకులను చేసి తన జన్మను సార్థకం చేసుకున్నప్పటికీ కూడా, ఆమె జీవితంలోని నీలి నీడల్ని ఒక తోబుట్టువుగా తాను హరాయించు కోలేకపోతున్నాననీ, షడ్రసోపేతమైన భోజనపళ్ళాన్ని భగవంతుడు తన చేతికి అందించినా, పూర్తిస్థాయిలో దాన్ని ఆస్వాదించలేకపోతున్నాననీ చెప్పింది.


ఈ విషయం నాకు తెలిసి చాలా సంవత్సరాలైనప్పటికీ,ఈ మధ్యనే వాళ్ళింట్లో అంగరంగ వైభవంగా జరిగిన ఒక శుభకార్యానికి నేను వెళ్లడం, ఆమె తన చెల్లిని నాకు పరిచయం చేయడం(నేను ఆమెను చూడటం అదే మొదటిసారి) జరిగింది. కలయిక మొదటిదే అయినప్పటికీ, ఒకరి గురించి ఒకరు తెలిసిన వాళ్ళం కావడం వల్ల, ఇద్దరం ఎంతో స్నేహంగా మాట్లాడుకుంటూ, వాళ్ల బంధువులు కూడా చాలా మట్టుకు తెలిసినవారే కావడంతో వారికి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ, పైకి కులాసాగా గడిపినట్టు కనిపించినప్పటికీ, లో లోపల నా గుండెనెవరో మెలిపెడుతున్నంత బాధన నుభవిస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని తిలకిస్తూ, వారి బంధువులు, ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతూ తిరుగుతున్నానన్న మాటేగానీ నా మనసు మనసులో లేదు. ముఖానికి చిరునవ్వు పులుముకుని, తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో రెండు గంటల నటనా నంతరం, ఆ ఇంటి వారి వద్ద సెలవు తీసుకుని, కంటి చెలిమెలో ఊరే నీటిని కనిపించనీయకుండా శతవిధాల ప్రయత్నిస్తూ, ఇంచుమించుగా నా వయసులోనే ఉన్న ఆ వీరపత్నికి పైకి కరచాలనం చేస్తూ, మనసులో పాదాభివందనం చేసి ఇల్లు చేరాను.


కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ పద్మపాణి గారిని గురించి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన విషయాలకు( వీరమరణం పొందిన ప్రతి సైనికుడి త్యాగం మరువలేనిదే, దానికి హెచ్చుతగ్గులు గానీ, స్థాయీ భేదాలుగానీ ఉండవనేది అందరూ అంగీకరించి తీరాల్సిన విషయమే)ప్రజల గుండెల్లో ఎప్పటికీ మరపుకు తావుండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అతని అర్ధాంగి గర్భం ధరించి ఉండటం, పుట్టబోయే శిశువుకు సంబంధించి అతను తన తల్లిదండ్రులకు ఉత్తరాలు రాయడం, అతని పార్థివ దేహం కుటుంబ సభ్యులకు చేరుకునే లోపు వార్తాపత్రికల్లో ఆ సమాచారం విస్తారంగా రావడం కారణమనిపి స్తుంది. ఆ వీరుడి రక్తంతో ఊపిరి పోసుకున్న చిట్టితల్లి, తన చిట్టి గుండెతో వ్రాసుకున్న పుస్తకానికి పెట్టిన శీర్షిక ‘నేను చూడని నాన్న’. శీర్షికతోనే గుండెల్ని మెలిబెట్టే ఆ పుస్తకాన్ని చదివే సాహసం బహుశా కొందరికే సాధ్యమవుతుందేమో.


దేశ శ్రేయస్సు కోసం అహర్నిశలు తపిస్తూ, వీరోచితంగా పోరాడుతూ నేలకొరిగిన ప్రతి వీరుడికీ, వారిని కోల్పోయి గర్వంతో కూడిన వేదన ననుభవించే వారి కుటుంబాలకి బదులుగా ఏమిచ్చినా, మన రుణం తీరేది కాదు.

వీరులారా వందనం
వీరమాతలారా వందనం
వీరపత్నులారా వందనం

May 31, 2025 53 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us