మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఏకత్వంలో భిన్నత్వం 

by Agora September 14, 2025
written by Agora

ఒక్క నిప్పు రవ్వ 
అరణ్య దహనం చేయగలదు!
ఆహార పచనం చేయగలదు!

ఒక్క తప్పు తొవ్వ 
పతనానికి చేర్చే ముప్పు కాగలదు
గుణపాఠం నేర్పే కనువిప్పు కాగలదు! 

ఒక చీత్కారం
మదిని చీల్చే అవమాన శరం కాగలదు!
మనిషిని సరిదిద్దే అసమాన స్వరం కాగలదు!

ఒక్క శ్రీకారం
విధి ప్రారంభానికి దీవన కాగలదు!
కార్యపూరణకు రక్షణ కాగలదు!

ఒక్క బీజం
సఘనారణ్యానికి ఆది జీవ ధనం కావచ్చు!
గొప్ప వంశవృక్షానికి తొలి 
జన్యు కణం కావచ్చు!

ఒక మహా విస్పోటనం
విశ్వ వికాసానికి కారణం కావచ్చును!
ప్రపంచ వినాశనానికి ప్రేరణం
 కావచ్చును!

. ఒక మహా సాగరం
మనో నిగ్రహానికి నిదర్శనం కావచ్చును!
భీకర ఆగ్రహానికి నిరూపణం కావచ్చును!

ఒక చినుకు
ఎడారిలో నిరర్థకం కావచ్చును!
ఆల్చిప్పలో మౌక్తికం కావచ్చును!

ఒక దిటవైన దీక్ష
ఆత్మ శోధనకు నడవ కావచ్చు!
జన్మార్థ సాధనకు సడవ కావచ్చు!
.
ఒక్క ఆలోచన
ఆత్మ త్యాగానికి నిర్ధారణ కాగలదు!
కళ్యాణ యాగానికి అంకురార్పణ కాగలదు!
        ——*——

.

September 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహిత్యస్ఫూర్తి రజితగారికి అక్షరనీరాజనం

by అనూశ్రీ. September 14, 2025
written by అనూశ్రీ.

“ఈ దుఃఖం.. ఏనాటి శాపమో ఈ శోకం.. ఎందరెందరి శాపమో..”

అంటూ ఉద్వేగభరిత పదాలను లిఖించిన ఆ స్వరం ఇప్పుడు మన మధ్య లేదు.. ఆమె కేవలం కవయిత్రి కాదు, పోరాట స్ఫూర్తి, సమానత్వం కోసం స్త్రీ హక్కుల కోసం రగిలిన “అగ్నిశిఖ”

“చైతన్యం పడగెత్తింది” అంటూ తొలి రచనతోనే ఒక నినాదమై కదిలిన “నిర్భయాకాశం”

“గులాబీలు జ్వలిస్తున్నాయి” అంటూ మహిళలపై అన్యాయాలను ఎత్తి చూపి శ్రమజీవుల పక్షాన నిలిచిన “చెమట చెట్టు”

కాకతీయ విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా, ప్రజా గాయనిగా, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షురాలిగా వెలిగిన తెలంగాణ ఉద్యమకారిణి.

1958లో వరంగల్ జిల్లాలో జన్మించిన రజిత గారు, చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని, తెలంగాణ తొలి ఉద్యమదశలోనే చురుకుగా పాల్గొన్నారు.

దస్తఖత్, అనగనగా కాలం, మట్టిబంధం, మార్కెట్‌,స్మార్ట్‌ శ్రీమతి “వెతలే కథలై”, “ఉద్విగ్న” (2013, అత్యాచార విరోధ సంకలనం), “అగ్నిశిఖ” (2014), “జీగర్”, “ముజఫర్‌నగర్ మారణకాండ”, “పోలవరం-ప్రాణాంతక ప్రమాదం” వంటి సమాజానుసారమైన సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. సామాజిక ఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ, ఆదివాసీలు,దళితులు అట్టడుగు వర్గాల గొంతును తనదిగా చేసుకుని కవితలు, వ్యాసాలు,పాటలు వ్రాసిన అసాధారణ సాహిత్య యోధురాలు.

ఉపన్యాసాలలో ఆమె కవిత్వం ఉత్సాహం నింపేది, సాహిత్య వేదికలపై ఆమె మాటలు ఆలోచనల జ్యోతిని వెలిగించేవి. 2017లో తెలంగాణ ప్రభుత్వం ఆమెను “రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం”తో సత్కరించడం, ఆమె కృషికి లభించిన గౌరవం.

తన ఆలోచనలకు ఏ ముసుగులు లేకుండా స్పష్టంగా మాట్లాడడం ఆమెకే సాధ్యం. హృదయంలో మృదుత్వం. ఆలోచనల్లో స్పష్టత..ఆచరణలో
దృఢత్వం.. ఆమె నైజం. జీవితంలో సాదాసీదాగా కనిపించినా,ఆచరణలో, ఆలోచనల్లో ముక్కుసూటి తత్వం.

వారి వ్యక్తిత్వంలో నాకు బాగా నచ్చింది నిరాడంబరమైన వ్యవహారశైలి. రాతల్లో రాస్తున్నది ఆచరణల్లో ఉండాలని, హంగు ఆర్భాటాలను పొగడ్తలను తిరస్కరించేవారు. వ్యక్తిగత ప్రయోజనం కాదు, సమాజ హితంకోసమే రచనలు సాగాలని ముఖ్యంగా మహిళలు మహిళల గురించి ఆలోచించాలని అనేవారు.

ప్రోత్సహించడం ధైర్యం చెప్పడం ఆమె సహజ స్వభావం కష్ట సమయాల్లోనూ తడబడకుండా ముందుకు నడిచే నాయకత్వం వారిది. రజిత గారి వ్యక్తిత్వం మనందరికి స్ఫూర్తిదాయకం ఆమె జీవితం మంచి విలువలను నేర్పుతుంది అలాంటి వ్యక్తి సాహిత్యంలో ఉండడం మన అదృష్టం. నా మొదటి నవల “వేద” ఆవిష్కరణకు ఎంతో సంతోషంగా వచ్చారు. రెండవ నవల జగతికి ముందుమాటలు రాశారు. నవల అందుకున్న క్షణం నుండి ఆవిడకు నాకు ఒక మంచి బంధం ఏర్పడింది. నన్నెందుకు అంతగా ఇష్టపడ్డారో నాకు తెలియదు గానీ “కవిత్వం కన్నా నవలా రచన నీనుండి కోరుకుంటున్నా” అని ఎప్పుడూ గుర్తుచేసేవారు. ఏ సాహిత్య సమావేశానికి వెళ్లినా అక్కడి విశేషాలను నాతో పంచుకునేవారు.

అనిశెట్టి రజిత గారు లేరన్న విషయం తెలియగానే, ఆమెను సన్నిహితంగా చూసినవారు మాత్రమే కాదు, ఆమెను రచనల ద్వారా తెలుసుకున్న పాఠక హృదయాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఎన్నో కలాలు వారిని స్మరిస్తూ కన్నీటి అక్షరాలను లిఖించాయి.

రజిత గారు లేకపోవడం లోటు మాత్రమే కాదు నా వరకు ఒక వెలితి కొన్ని ఖాళీలు మరొకరితో భర్తీ చేయలేము. నిజంగా
“ఈ దుఃఖం ఏనాటి శాపమో.. “

ఆమె ఆశయం ఒక వెలుగుతున్న దీపం..
ఆ దీపకాంతులు అంతటా ప్రసారించాలని ఎంతోమందిని ప్రభావితం చేయాలని కోరుకుంటూ

మనసు నిండా తొణుకుతున్న కన్నీటితో నివాళి.

September 14, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

చుట్టపు దయ్యం

by Laxmi Madan September 14, 2025
written by Laxmi Madan

అమ్మగారు ఓ అమ్మగారు! అంటూ పిలుస్తూ లోపలికి వచ్చింది కుమారి.

లోపలికి వచ్చిన కుమారికి హాల్లో ఎవరు కనిపించలేదు.

“అదేంటి ఈపాటికి పెద్దమ్మ గారు వంట చేస్తూ, వంటింట్లో కనిపిస్తారు. ఈరోజు చడీ, చప్పుడు లేదు. ఆరోగ్యం బాగాలేదా ఏంటి?”అని అనుకొని పెద్దమ్మ అనబడే దమయంతి గదిలోకి వెళ్ళింది.

అప్పటికే దమయంతి స్నానం చేసి, పూజ చేసుకున్నట్లు కనిపించింది. కానీ రోజు వంటింట్లో ఉండే బదులు ఈరోజు గదిలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చునిఉంది.

“ఇక్కడ ఉన్నారామ్మా! వంట అయిపోయిందా? లోపల లేకుంటే ఒంట్లో బాగా లేదేమో అనుకొని వచ్చానమ్మా”అన్నది కుమారి.

“ఒంట్లో బాగానే ఉంది. రోజు వంటింట్లో పని చేసి, చేసి చిరాకు వచ్చేసింది. ఎవరికి బాధ్యత లేదు
నేను చేసి పెట్టడం అందరూ కూర్చొని తినడం”అనీ దమయంతి కొంచెం కోపంగా అన్నది.

“అదేంటమ్మా? ఎప్పుడు సంతోషంగా పనిచేస్తూనే ఉంటారు. ఈరోజు అంత మాట అనేసారు”అన్నది కుమారి.

“నువ్వు వెళ్లి పని చేసుకో కుమారి”అంటూ పుస్తకం చదవటంలో నిమగ్నం అయ్యింది దమయంతి.

“కోడలమ్మ ఏం చేస్తుందో చూస్తాను. అయినా ఆ అమ్మాయి ఆలస్యంగానే లేస్తుంది కదా”అనుకుంటూ కోడలు వినీల గదిలోకి వెళ్ళింది.

అప్పటికే లేచి కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది వినీల.

“వినీలమ్మ కూడా పని చేసుకుంటూ ఉంది. ఆలస్యంగా లేచినా, వినీలమ్మ తాను మొదటిసారి టీ తాగుతూ, అత్తగారికి ఓ కప్పులో ఇస్తుంది. ఇద్దరు కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ తాగుతారు. ఈరోజు ఏంటి! చెరొక గదిలో కూర్చున్నారు”అనుకుంటూ..

“వినీలమ్మ! ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటే ఏం చేస్తున్నారో అని ఇక్కడికి వచ్చాను. చాయ్ తాగారామ్మ! మీఅత్తమ్మ నువ్వు ఇద్దరు కూర్చుని తాగుతారు కదా”అన్నది కుమారి.

“నాకు చాయ్ పెట్టుకునే ఓపిక లేదు. అవసరమనుకుంటే ఆమె పెట్టుకొని తాగుతుంది”అన్నది వినీల.

ఇదేంటబ్బా? ఎప్పుడూ లేనట్లుగా వీళ్ళిద్దరూ ఎడ ముఖం పెడ ముఖం గా ఉన్నారు” అనుకున్నది.

తన పని తాను చేసుకోవడం మొదలు పెట్టింది కుమారి.

కుమారి ఇలా ఎందుకు ఆలోచించిందో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే మనకి అర్థం అవుతుంది.

పొద్దున్నే కాలింగ్ బెల్ మోగ గానే దమయంతి తలుపు తీస్తుంది.

” కప్పులో టీ పోసి పెట్టాను. తాగి పని చేసుకో కుమారి”అని నవ్వుతూ చెప్పింది దమయంతి.

“నాకు చాయ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవు నువ్వు ఎన్ని పనులున్నా, రోజు ఇక్కడే టీ తాగి వెళ్తానమ్మ”అన్నది కుమారి టీతో పాటు దమయంతి ఇచ్చిన బిస్కెట్ టీలో ముంచుకుని తింటూ.

“ఒక్కదానివే పని అంతా చేస్తావు. నీకు కష్టం అనిపించదా అమ్మా” అన్నది కుమారి.

“మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి కష్టమంటే ఎలా? అయినా ఎవరికి చేస్తున్నాను? నా కొడుకు ,కోడలు మనవళ్ళుకే కదా”అన్నది దమయంతి సాంబార్లో పోపు వేస్తూ..

“మా అత్తయ్య అయితే ఒక్క నాడు ఇంత పని చేయదమ్మ. నేను ఇళ్లలో పనిచేసే ఇంటికి పోయి, నేనే చేసుకోవాలి. తిని బిడ్డ ఇంట్లో పోయి కూర్చుంటది. నా పిల్లలు మాత్రం తన మనవళ్లు కాదా? అన్నం అయినా తినిపించవచ్చు కదమ్మ! మీరు చేసేది మంచి పని. కోడలును ఇలా చూసుకోవాలి”అన్నది బాధగా.

“అయ్యో! చేస్తే ఏమైంది ?రెక్కలు ఏం కట్టుకుపోతామా? నలుగురికి చెయ్యని చేతులు ఏం చేతులు?”అన్నది దమయంతి.

ఎనిమిది గంటల వరకు రోజు స్నానం పూజ వంట ముగించేది.

నెమ్మదిగా లేచిన కోడలు, తాను చాయ్ పెట్టుకుని, అత్తగారికి ఒక కప్పు ఇచ్చి, తాను కూడా పక్కనే కూర్చుంటుంది.పిల్లలకు బాక్సు లు కూడా దమయంతి పెడుతుంది.

ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. ఇంట్లోకి కావలసిన సరుకులు, పిల్లల బట్టలు, చదువులు ఇలా ఎన్నో.

ఆ తర్వాత వినీల కంప్యూటర్ ముందు కూర్చుంటుంది. పనిమనిషి పని అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత తోచిన పారాయణం చదువుకొని, పిల్లలకి వచ్చే వరకు ఏదైనా చేద్దామని ఆరాటంలో ఉంటుంది దమయంతి. ఊరికే ఉండడం అంటే అసలే నచ్చదు. భర్త పోయి దాదాపు నాలుగేళ్లు అయింది. అప్పటినుండి ఊరు విడిచి ఉన్న ఒక్క కొడుకు దగ్గరే ఉంటుంది వీలైనప్పుడు ఊరికి వెళ్లి వస్తూ ఉంది.

కొడుకు, కోడలు కూడా దమయంతికి బాగా గౌరవం ఇస్తారు. గౌరవంతో పాటు ప్రేమను కూడా పంచుతున్నారు.

అన్ని విధాల అమర్చిపెట్టే అత్తగారంటే దమయంతికి ఎనలేని అభిమానం. తాను వర్క్ చేసుకుంటుంటే టీ తెచ్చి పెట్టడం, స్నాక్స్ ఇవ్వడం చేస్తుంది దమయంతి.

“నేను వచ్చి చేస్తాను కదా అత్తయ్య! ఎందుకు మీరు కష్టపడతారు”అని అన్నది వినీల.

“ఈ పనులు నేను చేయగలనమ్మ! నీ ఉద్యోగం నేను చేయగలనా? అందుకే నాకు వచ్చిన పనులు నన్ను చేయని, ఊరికే కూర్చొని మాత్రం ఏం చేస్తాను? మీకు ఏదైనా చేసి పెడితే నాకు సంతోషంగా ఉంటుంది. మీ మామయ్యకి కూడా అంతే, ఎప్పుడూ మీ గురించే ఆలోచించేవాడు”అన్నది కొంచెం బాధగా దమయంతి.

నవ్వుతూ టీ కప్పు అందుకున్నది వినీల.

సెలవులు ఉన్నప్పుడు మాత్రం దమయంతిని ఒక్క పని చేయ నీయకుండా అంతా తానే చేసుకునేది వినీల. బయటకు వెళ్తే తప్పకుండా దమయంతి రావాల్సిందే.

“వాళ్లకి ప్రైవసీ లేకుండా తాను వెళ్లడం ఎందుకు” అని ఎన్నోసార్లు వద్దని చెప్పినా, వినకుండా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతారు.

అత్తగారికి కావలసిన వస్తువులు ఏవైనా ఉంటే అప్పటికప్పుడు కొనుక్కొని వస్తుంది వినీల.

దమయంతి ఎప్పుడైనా బయటకు వెళ్తే, కోడలు కోసం ఎన్నో వస్తువులను తెస్తుంది.

అప్పుడప్పుడు వీళ్ళతో కొడుకు రాకున్నా,వీళ్ళిద్దరూ మాత్రం వెళ్లడం పక్కగా ఉండేది.

ఇలా ప్రశాంతంగా సాగుతున్న కుటుంబంలోకి ఒక చిన్న రాయి అడ్డంగా వచ్చింది. అంతే పరిస్థితి అంతా తారుమారు అయ్యింది.

ఒక రోజు ఇంటికి ఒక దూరం బంధువు వచ్చింది. ఇక్కడ నగరంలో ఏదో పని ఉందని, వారం రోజులు ఉండిపోయింది. ఉన్న మనిషి తిని ఊరికే ఉండక, ఇటు దమయంతి మనసు, అటు వినీల మనసును పాడు చేసింది.

పొద్దున్నే వంటింట్లో హడావుడిగా ఉన్న దమయంతి దగ్గరికి వచ్చింది. చుట్టం చూపుగా వచ్చిన దయ్యపు మనిషి.

“దమయంతి వదినా! ఇంత వయసు వచ్చినా, నీకు వంటింటి పని తప్ప లేదన్నమాట. హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపే వయసులో, ఈ పనులన్నీ చేసుకోవలసి వచ్చింది”అన్నది సన్నాయి నొక్కులు నొక్కుతూ.

“నా చేతుల్లో శక్తి ఉంది చేస్తున్నాను. అయినా ఎవరికి చేస్తున్నాను? నా పిల్లలకే కదా”అన్నది దమయంతి.

“నీ పిల్లలు నీ పిల్లలు అని నువ్వు అనుకుంటావు. కానీ ఆ వచ్చిన కోడలు అనుకోవద్దు ఇంత సేపైనా లేవలేదు. అత్తగారి వయసు అయిపోయింది .కాస్త యినా సహాయం చేద్దాం అనేది ఉందా? అదే నీకు కూతురు ఉంటే ఇలా చేసేదా వదిన! నువ్వే ఆలోచించుకో”అన్నది చుట్టపు దయ్యం.

ఇలా మూడు రోజులుగా ప్రతి దాంట్లో తాను వేలు పెట్టి, తాను ఎంత కష్ట పడుతుందో అనేది దమయంతి మనసులోకి బాగా ఎక్కించేసేది.

ఇక దమయంతి మధ్యాహ్నం పడుకున్న సమయంలో వినీల దగ్గరకు వెళ్లి..

“ఎంత కష్టపడి పోతున్నావు తల్లి! ఇటు ఆఫీసు పని, మళ్ళీ ఇంటి పని. అందులో మీ అత్తగారు ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుందాయే! మరో కొడుకు ఉంటే అక్కడికి నాలుగు రోజులు వెళ్లి వచ్చేది. మీకు ఇబ్బంది కదా! మీ భార్యాభర్తలిద్దరూ ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెను తీసుకొని వెళ్లాల్సిందే, పాపం ఈరోజుల్లో నీలాంటి వాళ్ళు ఎవరున్నారే పిచ్చి తల్లి”అని వినీల దగ్గర మరో రాగం అందుకుంది.

“అదేంటి మా అత్తయ్య గురించి అట్లా అంటారు. పొద్దున వంటంతా తానే చేస్తుంది. బయటకు వెళ్తే మాతో వస్తుంది తప్పేంటి? బయట మేమిద్దరమే ఉంటామా ఏంటి? వేరే జనం ఉండరా”అన్నది వినీల చిరాగ్గా.

“మీ అత్తయ్య అంటే నీకు ఎంత ప్రేమనే తల్లి! కానీ ఆమె అలా అనుకుంటుందా? కష్టపడి నేనే పని చేస్తున్నాను అని పొద్దున్న అంటూనే ఉంది. పనిమనిషి తో కూడా నీ మీద ఏదేదో చెప్పడం నేను విన్నానమ్మ”అన్నది చుట్టపు దయ్యం.

“అదేంటి నేను అత్తయ్యను సొంత తల్లి లాగా చూసుకుంటే, ఇలా నామీద చెప్తోందా? వంట తానిష్టంతోనే చేస్తాను అన్నది కదా? లేకుంటే నేను చేసుకో లేనా?”అనీ బాధపడ సాగింది.

ఇటు దమయంతికి కూడా బాధ పెరిగింది. “ఇంటెడు పని నేనే చేస్తున్నాను. పోనీ చేస్తున్నాను అనే సానుభూతి కూడా ఎవరికీ లేదు. ఈ వయసులో నేను ఎందుకు చేయాలి? మా అత్తయ్య నాకు చేసి పెట్టిందా “?అంటూ ఆలోచించసాగింది.

చుట్టపు దయ్యం నాటిన విషపు బీజాలు ఇద్దరిలో మొలకలై, వృక్షాలై పెరిగిపోయాయి. అంతే ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి.

దమయంతి పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది.

వినీల కూడా లేచిన తర్వాత తన టీ కప్పు తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతుంది.

ఎప్పుడో మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చి అన్నం ఒక కూర చేసి తాను ప్లేట్లో పెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది.

వినీల చేసిన కూర సహించని దమయంతి తాను ఏదో పచ్చడి ఒకటి చేసుకుని తినేస్తుంది. కొడుకు ఎక్కువగా ఆఫీస్ లో తింటాడు కాబట్టి ఈ కోల్డ్ వార్ అతనికి అర్థం కాలేదు. ఒకసారి వరుసగా మూడు రోజులు సెలవు వచ్చాయి. కొడుకుకి విషయం అంత అర్థమయింది. “ఇద్దరు మాట్లాడుకోవటం లేదు కానీ కారణం తెలియదు.ఎలా ఈ సమస్యకు పరిష్కారం?” అనుకున్నాడు.

అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇల్లంతా అశాంతిగా ఉంది. మునుపటి సంతోషం లేకుండా పోయింది.

ఒకరోజు వినీల ఆఫీసుకు వెళ్లింది. అప్పుడు కుమారి వచ్చి దమయంతి దగ్గర కూర్చుంది.

“అమ్మగారు ఒక మాట చెప్తా. మీ అత్త కో డళ్ళిద్దరూ, తల్లి కూతుర్ల లాగా ఉండేవాళ్లు. ఎందుకు అమ్మ ఈమధ్య ఇలా అయిపోయారు?”అని అడిగింది.

“మీఅమ్మని అడగాల్సింది నన్ను ఎందుకు అడుగుతున్నావ్?”అన్నది దమయంతి.

“నాకు అర్థమైంది ఒకటి ఉందమ్మా! ఈ ఇంటికి ఒక చుట్ట పామే వచ్చింది. దయ్యం లాగా మీ మధ్య ఏదో పెట్టింది. అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వంటింట్లో ఉన్నంతసేపు మీతో ఏదో మాట్లాడేది. తర్వాత మీరు పడుకున్నప్పుడు వినీలమ్మ గదిలోకి వెళ్లి గుసగుసగా చెప్పేది. నాకు ఎలా తెలుసు అంటే, ఒకరోజు మధ్యాహ్నం పనికి వచ్చాను నేను. మీరు పడుకొని ఉన్నారు. ఆ గది ఊడుస్తుంటే ఆమె ఏదేదో చెప్తుంది. అప్పుడే అనుకున్నాను ఈవిడ ఏదో చిచ్చు పెడుతుంది అని ,అదే నిజమైందమ్మ. అలాంటి వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి మీపచ్చని కుటుంబాన్ని అశాంతిపాలు చేసుకోవద్దమ్మ! నేను చదువుకోని దాన్ని. కానీ ఎన్నో ఇళ్లల్లో చూస్తున్నాను మీ ఇంట్లో ఉన్నంత మంచిగా ఎక్కడ ఉండరు .కలిసి ఉండండి అమ్మ”అని చెప్పింది.

దమయంతికి ఒక్కసారిగా విషయం అర్థమైంది.” అవును, ఆ చుట్టం వచ్చినప్పటి నుండి మనశ్శాంతి కరువైంది. ఆమె ఇవన్నీ చెప్పడం వల్లనే కదా నేను ఇలా చేస్తున్నాను” అనుకుంది.

దమయంతి మధ్యాహ్నం పడుకున్నప్పుడు, ప్రత్యేకంగా కుమారి ఇంటికి వచ్చి వినీల గదిలోకి వెళ్ళింది..

“చిన్నమ్మ నేనొక మాట చెప్తాను విను. మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది ఆ చుట్టపామేనమ్మ. పొద్దున పెద్దమ్మకి మీ గురించి ఏదేదో చెప్పేది. మధ్యాహ్నము ఆమె గురించి మీకేదో చెప్పింది. అప్పటినుండి మీ కుటుంబం లో కలతలు మొదలయ్యాయి. మీ ఇద్దరు మీదికి గొడవ పడకున్నా,మనసులో ఏదో దిగులు ఉన్నారు. వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, ఎప్పటిలాగా ఉండండమ్మ,! నా మాట వినండి”అని చెప్పి వెళ్ళిపోయింది.

వినీల కూడా ఆలోచించసాగింది. ఇంత చదువుకొని ఎవరో చెప్పిన మాటలు విని, నేను ఇలా అవడం ఏంటి? వెళ్లి అత్తయ్యను క్షమించమని అడుగుతాను” అని గదిలో నుండి బయటకు వచ్చింది.

అప్పుడే దమయంతి కూడా “నా వయస్సు, నా జ్ఞానం ఏమైపోయింది? ఎవరి మాటనో పట్టుకొని ఇలా అయ్యాను. చిన్నదైనా కోడలికి నేను క్షమాపణ చెప్తాను” అంటూ బయటకు వచ్చింది ఇద్దరూ ఒక్కసారిగా ఎదురుపడ్డారు.

ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరు ముఖాలలో బాధ కనిపిస్తుంది. మాటల్లో ఏమి చెప్పకుండా ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ఒకరి మనసు ఒకరికి అర్థమయిపోయింది ఇద్దరి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. .తేరుకున్న దమయంతి,

“వినీల! మంచి టీ తయారుచేసి తీసుకొస్తాను. నువ్వు లోపలికి వెళ్లే పని చేసుకో”అన్నది దమయంతి.

“మీరెళ్ళి హాల్లో కూర్చోండి. నేనే టీ పెట్టుకుని అలాగే ఏదైనా స్నాక్స్ చేసుకొని వస్తాను”అన్నది వినీల.

సరే ఇద్దరం వంటింట్లోకెళ్లి చేసుకుందాం పద” అంటూ నవ్వుకుంటూ ఇద్దరు వంటింట్లోకి వెళ్లిపోయారు. మాటల్లో చెప్పలేని భావం వాళ్ళ మనసుల్లో కలిగింది. ఇకముందు ఏ చుట్టపు దయ్యాలకి వాళ్లు అవకాశం ఇవ్వలేదు. అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకు ఇద్దరిని చూసి సంతోష పడ్డాడు.

September 14, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్రీమతి నందగిరి ఇందిరాదేవి జీవితం – సాహిత్యం..

by Cheedella Seetha Lakshmi September 14, 2025
written by Cheedella Seetha Lakshmi

14వ అంతర్జాతీయ తెలుగు సాహితీ సదస్సు ,అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన సభలో సమర్పించిన ప్రసంగపాఠం

జీవనరేఖ

తెలంగాణ తొలి తరం రచయిత్రి నందగిరి ఇందిరాదేవి 22.09.1919 సంవత్సరంలో శ్రీ వడ్లకొండ నరసింహారావు శ్రీమతి వెంకటమ్మ దంపతులకు హనుమకొండలో జన్మించారు..అదేసంవత్సరం నవంబర్ మాసంలో ఏకైక మహిళా భారత ప్రధాని ఇందిర కూడా జన్మిచడం విశేషం వీరి పేరు కూడా ఇందిరఅని పెట్టడం కాకతాళీయం. వీరి స్వగ్రామం హనుమకొండ దగ్గర వంగపహాడ్ గ్రామం. వీరి తండ్రి శ్రీ వడ్లకొండ నరసింహారావు గారు వరంగల్ లోని రంగశాయి పేటలో ఒక హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడుగాగా పనిచేస్తూ ఉండగా వారిక ఆంగ్ల భాషలో ఉన్న పట్టు కారణంగా నిజాం ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉద్యోగం దొరకడం వలన వారు హనుమకొండ నుండి హైదరాబాద్ సుల్తాన్ బజార్ కు మకాం మార్చారు. దాదాపుగా ఇందిరా దేవి బాల్యం అంతా ఇక్కడే గడిచింది.
శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం గ్రంథాలయానికి కార్యదర్శిగా వుండి తన విధినిర్వహణలో భాగంగా రజతోత్సవాలు,స్వర్ణోత్సవాలు ఘనంగా జరిపించారు. గ్రంథాలయానికి తండ్రితో కలిసి తరుచుగా వెళ్లేవారు చిన్నారి ఇందిర. తండ్రి ప్రభావమే ఇందిరపై గాఢంగా పడిందని చెప్పొచ్చు.

శ్రీమతి నందగిరి ఇందిరాదేవి తన 15 ఏటనే హైదరాబాద్ నారాయణగూడ లోని రెడ్డి హాస్టల్ వార్షికోత్సవంలో అష్టావధానం చేసి అందరిని అబ్బురపరిచారు.
ఆనాటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సాహితీ ప్రియురాలు గద్వాల మహారాణి శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మ గారు 15 సంవత్సరాల చిన్నారి ఇందిరాదేవిని ఘనంగా సత్కరించారు.

నైజాం కాలంలో ఉర్దూ మాధ్యమికంగా కొనసాగుతున్న రోజులు.ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకొనే స్థితి లేదు.ఆసమయంలో తెలుగు మాధ్యమికంగా ఆడపిల్లలకు చదువు ఆవశ్యకతను,అవసరాన్ని గుర్తించిన వడ్లకొండ నరసింహారావు గారు ఆంధ్ర బాలికల పాఠశాలను నెలకొల్పడం పెద్ద సాహసకార్యమే. నందగిరి ఇందిరా దేవి నారాయణగూడ ఆంధ్రా బాలికల పాఠశాలలో (అంటే ఇప్పటి మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.

నైజాం రాజ్యం పోయి భారత దేశంలో కలిసాక బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వలన మాడపాటి హనుమంతరావు గారితో కలిసి నెలకొల్పిన పాఠశాలకు మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలగా నామకరణం చేయబడింది.
వ్యవస్థాపకులలో వీరి తండ్రి వడ్లకొండ నరసింహారావు గారు ఒకరు. వీరు తాను అద్దెకుండే ఇంట్లోనే రెండుగదులను పాఠశాలకుపయోగించడం ,అమ్మాయిలను స్వంత డబ్బు ఖర్చుపెట్టి రిక్షాలో బడికి తీసుకొని రావడం ఆయనకు విద్యపట్ల ఆసక్తి వ్యక్తమౌతుంది. ప్రజాసేవ చేయడం,సంఘసంస్కరణ అనే లక్షణాలు తండ్రి గారినుండే వారసత్వంగా కూతురైన ఇందిరాదేవి పుణికి పుచ్చుకున్నారు.

ఇందిరాదేవి ఎస్.ఎం.డి.టి. మహిళా విశ్వవిద్యాలయం పూణే నుంచి 1937 వ సంవత్సరంలో జి.ఏ., లో పట్టభద్రురాలయ్యారు. G.A. అంటే (గృహ ఆగమ.)
ఈమె ఆ రోజులలో అంటే 1940 ప్రాంతంలో తొలి తెలంగాణ మహిళా పట్టభద్రురాలు.

శ్రీమతి నందగిరి ఇందిరాదేవి తన 14వ ఏట నుండే అనేక సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలలో పాలుపంచుకున్నారు. ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపక సభ్యులలో ఆమె ఒకరు. సంఘ సంస్కరణోద్యమ సారథిగా ఎన్నో పోరాటాలు చేశారు. వాటిలో ఒకటి బాల్యవివాహాల పట్ల నిరసన.
తాను స్వయంగా యుక్త వయస్కురాలు అయ్యాకనే వివాహం చేసుకుని నలుగురికి మార్గదర్శకురాలు అయ్యారు. ఆ రోజులలో తండ్రి నరసింహారావు కూతురు ఇందిరకు పెళ్లి చేయట్లేదని బంధువులు ఎన్నో సూటిపోటి మాటలు అంటున్నా బంధుత్వాలు సడలిపోయే స్థితి ఎన్నో అవాంతరాలు వచ్చినా తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి తన కూతురిని బాల్య వివాహం నుండి తప్పించారు. ఆమె పట్టభద్రురాలు అయిన తర్వాతనే వివాహం జరిపించారు.

ఆ తర్వాతి కాలంలో ఇందిరాదేవి బాల్య వివాహాలను తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా తీవ్రంగా ఖండించారు. 1937 సంవత్సరంలో నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర మహాసభ అనుబంధంగా జరిగిన ఆంధ్ర మహిళా సభకు ఇందిరాదేవి అధ్యక్షత వహించారు.

ఆ నిజాం కాలంలో “నషర్” గా పిలువబడే కార్యక్రమం ద్వారా దక్కన్ రేడియోలో ప్రసంగించిన మొట్టమొదటి తెలంగాణ మహిళ ఇందిరాదేవి.1937 సంవత్సరంలో తన 18 ఏటనే నిజాం ప్రభుత్వం వారు ప్రసారం చేయదలచుకున్న సందేశం తెలుగులో ఇందిరాదేవి తమ వాణిగా మొట్టమొదటిసారిగా వినిపించారు. కథారచయుతలకు కథలు ఎట్లా రాయాలో సూచనలు చేసేవారు.

కుటుంబ వ్యవస్థలోని వైరుధ్యాలను, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను,సామాజిక సమస్యలు, సంసారంలో వయసు మళ్ళిన వారి సమస్యలు,
సాంఘిక దురాచారాలు మొదలగు విషయాలను ఏడు దశాబ్దాల కిందటే చిత్రించిన కథా రచయిత్రి శ్రీమతి నందగిరి ఇందిరాదేవి. తెలంగాణ
సాహిత్యంలో ఆమెది చెరగని ముద్ర. ఒక ప్రత్యేక స్థానం.

కథలు, నాటకాలు, వ్యాసాలు,ఎన్నో వ్రాశారు. రేడియో కోసం కూడా ఎన్నో కథలు రాశారు.
ఆకాశవాణి బాలనందం కార్యక్రమాల ద్వారా మంచి స్నేహం విలువ, కష్టాలలో ఉన్న వారికి సాయపడాలని, సోమరిపోతుగా ఉండకూడదని, అనేక నీతి కథలు “అమ్మమ్మ కథలుగా” ఆమె విభజించారు.
ఈ అమ్మమ్మ కథలు అనే బాలల కథల పుస్తకం కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ వారు 2019 సంవత్సరంలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి సంపాదకత్వంలో ప్రచురించారు.

ఇందిరా దేవి గారికి శ్రీ నందగిరి వెంకట్రావు గారితో వివాహం జరిగింది. ఆమెకు శౌరి,అరుణ్,వీర అనే ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు.ఆ తర్వాత కూడా ఆవిడ రచనా వ్యాసంగాలు మానుకోలేదు.
నిజాం కాలంలో,
ఆ తర్వాత కూడా ఆమె రేడియో ప్రసంగాలు చాలా చేశారు. దాదాపు 50 ఏళ్ల పాటు రచించిన రేడియో ప్రసంగాలను ఆమె “మసకమాటున మంచు ముత్యాలు” అను పేరుతో 1995 సంవత్సరంలో వెలువరించారు..జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి,మా గురువు గారు ఆవిష్కరించారు ఈ గ్రంథాన్ని.

ఆవిడ రాసిన కథలు,వ్యాసాలు,నాటకాలు ఆ కాలం లోని పత్రికలు భారతి,యువ,
వినోదిని, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి ,మాతృభూమి,చిత్రగుప్త,ఆంధ్రకేసరి, శోభ,ప్రజాహిత,వనితా జ్యోతి వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

ఈమె భర్త శ్రీ నందగిరి వెంకట్రావు గారు,సమాజ సేవకుడు ప్రముఖ న్యాయవాది,న్యాయమూర్తి ఉద్యమకారుడే కాక ఆంగ్ల, తెలుగు,ఉర్దూ భాషలలో ప్రసిద్ధ కథా రచయిత 1926 – 1935 మధ్యకాలంలో 50 కి పైగా కథలు రాశారు. గిరి అనే కలం పేరుతో వారు రాసిన కథలు భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికలలో
అచ్చు అయ్యాయి.

ఇందిరా దేవి రచనలలో హాస్య రసం పాలు ఎక్కువ. సాహిత్యంలో వారికి హాస్యం అంటే చాలా ఇష్టం.
“నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్న జంధ్యాల వారి
హాస్యోక్తికి నిలువెత్తు నిదర్శనం ఇందిరాదేవి.
అందుకేనేమో
2006లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు వీరి హాస్య రచనలకు “ధర్మనిధి” పురస్కారాన్ని అందజేశారు.

వడ్లకొండ కుటుంబంతో మా అనుబంధం

శ్రీమతి నందగిరి ఇందిరా దేవి 1940 దశకం నుండి తెలంగాణా సాహితీ చరిత్ర లో తొలితరం తెలంగాణ రచయిత్రిగా,సమాజోద్ధరణ కర్తగా తన భుజాన వేసుకుని ఉన్నతమైన పాత్రను పోషించినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆమెకు పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు.

ఆమె ఎన్నో కథలు, వ్యాసాలు, వార, పక్ష మాసపత్రికలలో వచ్చినప్పటికీ
ముద్రణ రూపంలో ఒక సంకలనంగా చేసే ప్రయత్నం నేను అంటే డా.చీదెళ్ళ సీతాలక్ష్మి మా వారు పరిమి వెంకట సత్యమూర్తి తోనే మొదలైంది.

నందగిరి ఇందిరా దేవి గారి తమ్ముడు, వడ్లకొండ నరసింహారావు గారి కుమారుడు డాక్టర్ వడ్లకొండ రవీంద్ర గారు
కాలక్రమంలో మాకు మంచి ఆప్త మిత్రులయ్యారు.
వారు రాష్ట్ర
భూగర్భ జలశాఖలో డైరెక్టర్ గా పని చేసి పదవీ విరమణ చేశారు. వారి ధర్మపత్ని ఆచార్య
వడ్లకొండ స్వరాజ్యలక్ష్మి గారు ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. నారాయణ గూడా చౌరస్తా లోని వారి ఇంటికి మేము తరచుగా వెళ్తుండేవాళ్ళం.

డాక్టర్ వడ్లకొండ రవీంద్ర గారు మేము ఎప్పుడు వారి ఇంటికి వెళ్లినా
ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చిందని చాలా సంతోషపడి ఎంతో సేపు వదలకుండా కూర్చుని సంతోషంగా మాట్లాడుతూ గత విషయాలు ఎన్నెన్నో చెబుతూ వాళ్ళ నాన్న గురించి అక్కయ్య ఇందిరాదేవి గురించి వివరించేవారు.
ఈ సందర్భంలోనే
అక్కయ్య నందగిరి ఇందిరాదేవి రాసిన రచనలను ముద్రించాలనే తాపత్రయంతో మీరే చేయాలమ్మా ఆ పని అని వారు మేము చేస్తామన్న ధృడ విశ్వాసంతో మాకు ఇందిరాదేవి గారు రాసిన శుద్ధ
వ్రాత ప్రతులను మాకు
చూపించారు.అలా
నందగిరి ఇందిరాదేవి గారి రచనలను వింగడించి, ముద్రించి
ప్రజలకు చేరువ చేసే బాధ్యతను మాకు అప్పగించారు.

ఈలోపే రవీంద్రగారి అకాల మరణం చెందటం మమ్మల్ని చాలా వ్యధకు గురిచేసింది. తర్వాత కొంతకాలానికి ఆయన భార్య ఆచార్య స్వరాజ్య లక్ష్మి గారు ఇందిరాదేవి గారు స్వయంగా రాసిన వ్రాతప్రతితో పాటు మొత్తం మెటీరియల్ మా చేతిలో పెట్టారు.

2018 సంవత్సరంలో అప్పటి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ మెటీరియల్ అంతా చూపించాము. వారు చాలా సహృదయతతో నందగిరి ఇందిరాదేవి తెలంగాణ తొలి తరం గొప్ప రచయిత్రి అని మన అకాడమీ తరఫున తప్పక ముద్రిస్తామని చెప్పగా చాలా సంతోషించాము .

వారి ఆనతి మేరకు మెటీరియల్ ను మొత్తం విడదీసి మొదటి దశలో ఇందిరాదేవి రాసిన 13 కథలను “నందగిరి ఇందిరాదేవి కథలు” గా నామకరణం చేసి అకాడమీ ద్వారా నేను అంటే డా.చీదెళ్ళ సీతాలక్ష్మి మరియు మా శ్రీవారు పరిమి వెంకట సత్యమూర్తి సంపాదకులు గా వెలువరించడం జరిగింది. ఈ పుస్తకం
నందగిరి ఇందిరాదేవి శత జయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ సిద్ధారెడ్డి గారిచే 8 అక్టోబర్ 2018 సంవత్సరంలో రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో పెద్ద సభ నిర్వహించి ఆవిష్కరించడం జరిగింది.

తరువాత రెండవ దశలో ఆమె రాసిన 13 కథలను సేకరించి “నందగిరి ఇందిరాదేవి అమ్మమ్మ కథలు”అని
పేరు పెట్టి తెలంగాణ సాహిత్య అకాడమీ 2019 సంవత్సరంలో శతాబ్ది వేడుకల సందర్భంగా మా సంపాదకత్వంలో ముద్రించడం జరిగింది.
అలా మా ఇద్దరి సంపాదకత్వంలో నందగిరి ఇందిరాదేవి రెండు గ్రంథాలు వెలువడడం మాకెంతో గర్వకారణం.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి గారికి తొలి కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి గారికి,వడ్లకొండ వారి కుటుంబానికి ఇక్కడే ఉన్న నందగిరి పుత్రుడు శౌరి గారికి ధన్యవాదములు.ఇంత చక్కని అవకాశం కల్పించిన అమెరికా వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు చిట్టెంరాజు గారికి నమస్కారం ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.
శ్రీమతి నందగిరి ఇందిరాదేవి గారు ఇలా తన జీవితాంతం వరకు సాహిత్య సేవ చేస్తూ తన అవసాన దశలో 1998 సంవత్సరం నుండి అమెరికాలోని హ్యూస్టన్ షుగర్ ల్యాండ్ లో తన కుమారుని వద్ద ఉంటూ22 జనవరి 2007 సంవత్సరంలో తుది శ్వాస విడిచారు.

తొలి తెలుగు కథా రచయిత్రి బండారు అచ్చమాంబ అయితే, ఆ తరం లోనే వచ్చిన తెలంగాణ తొలి కథా రచయిత్రి నందగిరి ఇందిరాదేవి గారని చెప్పవచ్చు.

డాక్టర్ నందిని సిధారెడ్డి గారు అన్నట్టు తన సోదరి ఇందిరాదేవి కథలు గ్రంధరూపంలో చూడాలని కలలుగని తీరా కోరిక నెరవేరే సమయానికి అందరి నుంచి దూరమైన కీర్తిశేషులు డాక్టర్ రవీంద్రకు ఈ రెండు గ్రంథాలు నివాళిగా భావించవచ్చును.

September 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కవితలు

by Kayita Anusha September 14, 2025
written by Kayita Anusha

అనుభూతులు…


ఎందుకొ మాట మూగబోయింది.
తెలియడం లేదు అస్సలు ఏమయింది.
ఆలోచిస్తే ఎదో కొత్తగా ఉంది.
అనుభవిస్తే అర్థం అవుతుంది.
కొన్ని అనుభూతులు జీవితాన్ని
మార్చివేస్తాయని…
కొన్ని అనుభూతులు జీవితాన్ని
కలచివేస్తాయని…
కొన్ని అనుభూతులు జీవితాన్ని
అలరిస్తాయని…
జీవితం అంతా అనుభూతులు అనేవి,
సముద్రంలో అలల వలే జీవితంలో
ప్రతి క్షణం ఉంటాయి…

మెుక్క

చిన్న విత్తనం నుండి వెలువరిస్తూ…
మట్టి అనే గర్భం నుండి ప్రతిబింబిస్తూ…
రవిజలవాయువులతో అనుబంధాన్ని పెంపోదిస్తూ…
మనిషి జీవితాన్ని ఆయుష్షుతో మూడివేస్తూ…
సుమధురమైన సుహసన్ని వెదజల్లె పుష్పములను అందిస్తూ…
మనిషి జీవితాన్ని నీతో జతచేస్తూ…
ఈ భూమండలంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ…
చెడువాయువులను ఇష్టంగా స్వీకరిస్తూ…
ప్రతి జీవి యెుక్క జీవితాన్ని నడిపిస్తూంది…

September 14, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

“నాగరికత ఆవిష్కృత కళ – కుమ్మరి”

by Kancharla Mahesh September 14, 2025
written by Kancharla Mahesh

చెరువు గర్భం నుండి
మట్టిని తెచ్చి
అలంకరణ సృష్టిలో జీవం నింపి
బంగారు బింబాలకు శిల్పం చెక్కే
అద్బుత సృష్టి కర్త కుమ్మరి

సూర్యుని కిరణాలతో
మొదలయ్యే ఈ చక్రం,
నాగరికతకు ఊపిరి పోసి
మృత్తికా మంత్రమై చల్లని నీరందించి
గుండె తడిని తాకే సుజలం..

చక్రం చుట్టూ తిప్పుతూనే
కాలాన్ని కరిగించే
గరగ బుడ్డి కి
అద్భుతమైన రూపాన్ని ఆవిష్కరిస్తాడు…

పెళ్లికి పెద్దవై
ఇంటికి దీపానివై
కొత్తింటి వంటగదికి మట్టి సుగంధమై
దీపావళి రాత్రి వెలిగే దీపాల కాంతివై,
కుమ్మరి చెయ్యితో తయారైన సౌందర్య రేఖవి.

మట్టిలో మమకారం
కళలో కౌశలం
తరతరాలుగా వారసత్వం
చక్రం ఆగినా వారి కలలు ఆగవు..
మట్టిలో నుంచి మనిషి ఎదలను తాకుతారు.

పల్లెల గుమ్మంలో పొలిమేర ముంతలు..
వంటింటి పొగలో మట్టి వాసనలు,
బజారులో కుండల రాకపోకలు –
ఇవన్నీ కుమ్మరుల జీవన గీతాలు.

కష్టాల కడగడ్లు నిల్చిన
కళను విడవని మనసు,
ప్రపంచీకరణ వినాశనం..
కులవృత్తికి ఉరితాడు.
ఐనా
పల్లెకు బంధంగా
సమాజానికి సేవకుడిగా
లక్ష్య సాధన కృషివలుడిగా
వృత్తే జీవన సరళీగా
నడిపించే శాస్త్రవేత్త…

ఇలాంటి
మట్టి పరిమళాల చిట్టి కవిత
చక్రం తిరిగే శబ్దం వారి గీతం
వారి శ్రమ
మన సంస్కృతికి శిరోమణి.

September 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni July 31, 2025
written by Narendra Sandineni

అమ్మ కవిత
కవిత్వం ఓ విశ్లేషణ
ప్రముఖ కవి,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన నా లక్ష్యం – నా గమ్యం కవితా సంపుటిలోని అమ్మ కవిత పై విశ్లేషణా వ్యాసం.కవి క్రాంత దర్శి.రవి గాంచని చోటు కవి గాంచును అన్నది అక్షరాలా నిజం అనిపిస్తుంది. మల్లారెడ్డి పోరాటాల పురిటి గడ్డ అయిన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని పోతారం (జె) తుర్కవానికుంట గ్రామం రైతు కుటుంబంలో జన్మించాడు.మల్లారెడ్డి విద్యాభ్యాసం పోతారం (జె) గ్రామం,హుస్నాబాద్, సిద్దిపేట,హైదరాబాదులో కొనసాగించారు.మల్లారెడ్డి సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే గులాబీ అనే పత్రిక నడిపాడు. మల్లారెడ్డికి చదువుకునే రోజుల్లోనే సాహిత్య సృజన పట్ల అనురక్తి పెరిగింది.మల్లారెడ్డి విద్యార్థిగా రాయడం ప్రారంభించి సాహిత్యాన్ని నిత్య కృషీవలుడుగా కొనసాగిస్తున్నాడు.నిరంతర అధ్యయనం,సునిశిత పరిశీలనా శక్తి ఉన్న వారే చక్కటి కవితలను రాయగలరు అని కవి మల్లారెడ్డి నిరూపించాడు.వ్యక్తి ఎదుగుదలకు కుటుంబం మరియు సమాజం ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చును.తెలంగాణలో తొలి పోరాట యోధుడు మల్ దాదా యొక్క మనవడు మల్లారెడ్డి.మల్ దాదా కుమారుడు లింగా రెడ్డి కూడా పోరాట యోధుడు.మల్లారెడ్డి తాత,తండ్రి నుండి పుణికిపుచ్చుకొన్న సంస్కారంతో పీడితుల పక్షాన నిలిచాడు.మల్లారెడ్డి 1978 నుండి కరీంనగర్ లో వకీలు వృత్తిని కొనసాగిస్తున్నాడు.మల్లారెడ్డి అణగారిన వర్గాలకు అండగా ఉన్నాడు.మల్లారెడ్డి స్వగ్రామమైన పోతారం (జె) తుర్కవానికుంట గ్రామానికి సర్పంచిగా ఎన్నికైనాడు.గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు.మల్లారెడ్డి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘానికి కార్యదర్శిగా పనిచేసి సేవలందించాడు.రచయిత నరేంద్ర సందినేని,కవి మల్లారెడ్డిని వారి స్వగృహం వావిలాలపల్లిలో కలవడం జరిగింది.మల్లారెడ్డి కరీంనగర్ జిల్లాలో సీనియర్ న్యాయవాదిగా పని చేస్తున్నాడు.మల్లారెడ్డి రచించిన “నా లక్ష్యం– నా గమ్యం” కవితా సంపుటి చదవమని ఇచ్చాడు. మల్లారెడ్డి ఆఫీసులో కేసులకు సంబంధించిన ఫైళ్లు మరియు న్యాయవాద వృత్తికి సంబంధించిన జర్నల్స్ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు వారి లైబ్రరీలో నిండి ఉన్నాయి.రచయిత నరేంద్ర సందినేని మల్లారెడ్డితో సాహిత్య విషయాలతో పాటు న్యాయవాద వృత్తికి సంబంధించిన విషయాలను గురించి కూడా చర్చించడం జరిగింది.రచయిత నరేంద్ర నాన్నగారు ఎస్. కె. పిళ్ళే ప్రముఖ కవిగా ప్రసిద్ది పొందారు.ఎస్ కె పిళ్ళే సమాజ అభ్యున్నతి కాంక్షించి చక్కటి రచనలు అందించాడు.ఎస్.కె.పిళ్ళే తెలంగాణ సాయుధ పోరాటంలో అమృత లాల్ శుక్ల గారలతో కలిసి పని చేశారు.మల్లారెడ్డి ఎస్.కె పిళ్ళేను జ్ఞాపకం చేశాడు. కవి,మల్లారెడ్డి నా లక్ష్యం– నాగమ్యం కవితా సంపుటిలోని అమ్మ కవితలోని చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.చక్కటి అనుభూతులను సొంతం చేసుకోండి.

“అమ్మ ఎన్ని కొమ్మల చెట్టు/అంటున్నారు.ప్రకృతి అంటే అమ్మ.ప్రకృతి అంటే చెట్లు చేమలు.ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనలను తల్లిలా కాపాడుతుంది.వృక్షో రక్షతి రక్షితః అని శాస్త్రాలు చెబుతున్నాయి.మనం చరిత్ర పుస్తకాలు చదివితే కళింగరాజు అశోకుడు చెట్లు నాటించాడు అని చదివాం.ఆనాటి రాజులు మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు.ప్రజల అభ్యుదయానికి తోడ్పాటు అందించారు.ఆనాటి రాజులు మానవ నాగరికత వికాసానికి తమ వంతు సాయం అందించారు.ఏపుగా పెరిగిన చెట్టు నీడన ఎండన వెళ్ళే బాటసారి సేద తీరతాడు.వర్షం కురుస్తున్నప్పుడు కూడా తడవకుండా ఉండటానికి చెట్టును ఆశ్రయిస్తారు.చెట్ల కట్టెలతో వంట చేసుకుంటారు.చెట్ల కలపతో దర్వాజాలు, తలుపులు,కిటికీలు,దూలాలు,కుర్చీలు,బల్లలు మరియు పారిశ్రామిక కార్యకలాపాలకి కూడా ఉపయోగిస్తారు.పేదవాడి ఏసీ.రూం చెట్టు.ఎందరో పేదవాళ్లు చెట్ల కిందనే ఆవాసాలు ఏర్పరచుకుంటూ జీవనం సాగిస్తున్నారు.స్వచ్ఛమైన గాలి చెట్లనుండి లభిస్తుంది.చెట్టు కార్బన్ డయాక్సైడ్ ను పీల్చి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది.చెట్లు కాలుష్యం దరిచేరకుండా నివారిస్తుంది.చెట్లు వాతావరణాన్ని పరిరక్షిస్తుంది.ఆకాశంలో కనిపించే నక్షత్రాల్లాగే అమ్మను ఎన్ని కొమ్ముల చెట్టు అనే మల్లారెడ్డి కవి భావన కల్పన కాదు,వాస్తవం అని మనం అర్థం చేసుకోవాలి.
“అమ్మలో ఎన్ని పూల మెట్లు/అంటున్నారు. పూల చెట్లను చూడండి.రకరకాల పూలు. రంగురంగుల పూలు.కనులవిందు చేసే పూలు.అవి మల్లెలు,బొండు మల్లెలు,బంతులు,చామంతులు, విరజాజులు,గోరింటలు,నంది వర్ధనాలు, కనకాంబరాలు,జాజి పువ్వులు,కట్ల పూలు,తంగేడు పూలు,గుమ్మడి పూలు,తెలుపు,ఎరుపు,పసుపు,నీలి పువ్వులు.పూలతో దేవుని పూజిస్తారు.శుభకార్యాల్లో గృహంలో దర్వాజాలకి పూలదండలు కడతారు. స్త్రీలు తమ సిగలను పూలతో అలంకరించుకుంటారు.అశుభకార్యాల్లో కూడా వ్యక్తి చనిపోతే అతన్ని పూలతో అలంకరిస్తారు. చనిపోయిన వ్యక్తిని పూలతో సాగనంపుతారు. సన్మాన సభల్లో సన్మానిస్తూ పూలదండలు వేస్తారు. పూలు శాంతికి ప్రతిరూపాలు.పూలు లోక కళ్యాణానికి తోడ్పాటు అందిస్తాయి.పూలు సకల జనసౌఖ్యానికి మరియు శాంతికి ప్రతీకలు అని తెలుస్తుంది.అమ్మలో ఎన్నో పూల మెట్లు దాగి ఉన్నాయి అని కవి మల్లారెడ్డి తెలియజేస్తున్నాడు.

“నిజానికి అమ్మనే ఒక సతత హరితారణ్యమ్ ‘ఒట్టు/ అంటున్నారు.అమ్మను సతత హరితారణ్యముతో పోల్చాడు.కవి మల్లారెడ్డి ఒట్టు పెట్టి ప్రమాణం చేస్తున్నాడు.పచ్చని చెట్లతో పక్షుల కిలకిలా రావాలతో జంతువుల అరుపులతో ఆహ్లాదంగా అరణ్యం కళకళలాడుతుంటుంది.మనం ఇంటి వద్ద కానీ,మరెక్కడైనా కానీ,పంచాయతీలో కానీ,ఒట్టు పెట్టుకుంటే అమ్మతోడు అని అంటాం.దేవుని తోడు అని కూడా అంటారు.ఒట్టు అంటే ప్రమాణం చేయడం.అమ్మ పట్ల చెప్పలేనంత భక్తి,అనురక్తి, నమ్మకం మరియు అంత ప్రాధాన్యత ఉంది.
“ఒక పరిపూవులా నవ్వుతుంది అమ్మ/అంటున్నారు.
నవ్వు టానిక్ లాంటిది.నవ్వు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.నవ్వితే శారీరక మానసిక రోగాలు నయమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.లాఫింగ్ థెరపీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.లాఫింగ్ థెరపీని ఆచరించి ఎందరో తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకుంటున్నారు.అమ్మ నవ్వులో అనురాగపు జల్లులు కురుస్తాయని కవి మల్లారెడ్డి తెలియజేశాడు.
“ఎంత పరిమళమో అమ్మ నవ్వు/ అంటున్నారు. అమ్మ నవ్వులో గులాబీలు,మల్లెలు,బంతులు, చామంతుల పరిమళాల సుగంధాలు వ్యాపిస్తాయి. పూల పరిమళాలను గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.
“మరుక్షణమె తేనెలా కురుస్తుంది అమ్మ/ అంటున్నారు.ఆయుర్వేదం,ఆల్లోపతి, హోమియోపతి,యునాని వైద్యంలో మరియు పతంజలి మహర్షి మరియు చరకుడు,హోమియో వైద్య పితామహుడైన హనిమన్ మహాశయుడు మొదలుకొని అలనాటి ఋషుల పరంపర మరియు ఈనాటి ఆధునిక వైద్యంలో తేనె ప్రాముఖ్యత గురించి చెప్పబడింది.తేనె త్రాగడం వల్ల ఎన్నో జబ్బులు నయమౌతాయి,శారీరక మానసిక శక్తులు వికాసం పొందుతాయి.అమ్మ ఎప్పుడు అలసట ఎరుగక ఉల్లాసంగా ఉంటుంది.అమ్మ కుటుంబాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.అమ్మ కుటుంబ సంక్షేమం కొరకు తన తనువును మనసును ఏకాగ్రం చేసి పనిచేస్తుంది.కవి మల్లారెడ్డి తేనెలా కురుస్తుంది అమ్మా అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఎన్ని తీయదనాలో అమ్మలో/అంటున్నారు.చంటి పిల్లవాడికి అమ్మ పాల తీయదనం గురించి తెలుసు. చెరుకుతో తయారైన పంచదార,బెల్లం ఎంతో తీపిగా ఉంటుంది.అమ్మ ఏది చేసినా అమృతంలా ఉంటుంది.అమ్మ మనసు తీపి అని కవి మల్లా రెడ్డి తెలియజేయడం చక్కగా ఉంది.
“ అమ్మ ఒళ్ళు నిమిరితె ఎంత పారవశ్యం/ అంటున్నారు.అమ్మ ఒళ్ళు నిమిరితే ఆ పాప ఎంతో పారవశ్యంతో పొంగిపోతుంది.అమ్మ చేయి తాకగానే పాప ఆనందంతో ఓలలాడుతుంది.అమ్మను చూడగానే పాప కేరింతలు కొడుతుంది.అమ్మ లాలనలో పాప ఆనంద తాండవం చేస్తుంది అని కవి మల్ల రెడ్డి తెలియజేస్తున్నాడు.
“అమ్మ మాటలే మమతల మూటలు/అంటున్నారు.
పసిపాపకు అమ్మ మాటలే మమతానురాగాల మూటలు.తల్లి భాషను పసిపాప అర్థం చేసుకుంటుంది.అమ్మ స్పర్శ కోసం పసిపాప తపించిపోతుంది.పసి పాపకు అమ్మే కద ప్రాణం మరియు వెలుగు అని చెబుతున్నాడు.
“అమ్మ కళ్ళు నిజాయితీకి ఆనవాళ్లు/అంటున్నారు.
ఇప్పుడున్న వ్యవస్థలో నిజాయితీని వెదకడం చాలా కష్టంగా అనిపిస్తుంది.ఎటు చూసినా అవినీతి,ఆశ్రిత పక్షపాతం,బంధుప్రీతి ఆవరించి ఉంది.కానీ ఈ వ్యవస్థలో అమ్మ కళ్ళు నిజాయితీతో నిండి ఉంటాయి.అప్పటికి,ఇప్పటికీ,ఎప్పటికీ పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే అనే సినీ గీతం మన విని ఉన్నాం. అలాగే అమ్మ కళ్ళు కూడా నిజాయితీకి ఆనవాళ్లు అనేది సత్యం అని కవి మల్లారెడ్డి తెలియజేస్తున్నాడు.
“ఎన్నో ధీర గుణాలకి నకళ్ళు ఆ కళ్ళు/అంటున్నారు.
ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దింది తల్లి జిజియాబాయి. మనం అతన్ని వీర శివాజీ అని పిలుస్తాం. “అమ్మ ఒక్క చూపు చాలు సుదూర గమ్యం చేరడానికి/అంటున్నారు.అమ్మ యొక్క చల్లని చూపు ఆశీర్వాదాల వల్లనే ఎందరో పిల్లలు ఉన్నత విద్య కొరకు ఉద్యోగాల కొరకు అమెరికా,ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్,న్యూజిలాండ్,జర్మనీ,కెనడా మరెన్నో విదేశాలకు వెళ్లి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు.విదేశాల్లో స్థిరపడుతున్నారు.తమ దేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారు.
“ఎన్ని గండాలను గట్టెక్కించింది అమ్మ/ అంటున్నారు.అమ్మ నవ మాసాలు మోసి పసిపాపను కంటుంది.ఆ పసిపాపను పెంచి విద్యాబుద్ధులు నేర్పించి పెద్దవాన్ని చేస్తుంది.ఎన్ని గండాలు ఎదురైనా గట్టెక్కిస్తుంది అమ్మ.కవి మల్లారెడ్డికి అమ్మ పట్ల ఆనిర్వచనీయమైన ప్రేమ,నమ్మకం,విశ్వాసం ఉన్నట్లు తెలుస్తుంది.
“చిన్ని బ్రతుక్కి అమృత బాండమైంది అమ్మ/అంటున్నారు.మనం పురాణాలు చదివితే అమృతం దేవతలకి మాత్రమే లభించింది.కానీ రాక్షసులకు అమృతం దొరకలేదు.అమృతాన్ని గ్రోలిన వారు అమరులై ఉంటారంటారు.చిన్నారులు అమ్మ ప్రేమతో అమృత భాండాన్ని అందుకుంటున్నారు.
“నిజానికి అమ్మ సమస్త సమాజానికి అధి దేవత/ కొలిస్తేనే కాదు పిలిస్తేనే కాదు – /తనంత తానే ఒక శక్తిపీఠవుతుంది అమ్మ/ అంటున్నారు.అమ్మను దుర్గామాతగా కొలుస్తారు.సకల దేవతల స్వరూపం అమ్మ.రామకృష్ణ పరమహంస కాళీమాత ఉపాసకుడు.రామకృష్ణ పరమహంస శిష్యుడే స్వామి వివేకానంద.అమ్మ సకల మానవాళి సంక్షేమాన్ని కోరుతుంది.అమ్మకు సంబంధించిన ఆలయాలన్నీ శక్తి పీఠాలే.అమ్మను ఆరాధించడం వల్ల సకల భయాల నుండి సంకటాల నుండి అరి‌‌ష్ఠాల నుండి ఆమె నివారిస్తుంది.
“సంకల్పబలమనే స్తన్యమిచ్చి పెంచింది అమ్మ/ అంటున్నారు.అమ్మ పాలు తాగి సంకల్ప బలంతో వీర శివాజీ,నేతాజీ సుభాష్ చంద్రబోస్,భగత్ సింగ్,చంద్రశేఖర్ ఆజాద్ మరెందరో వీరులు మన భారతదేశం స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారితో పోరాడి వీరులుగా పేరు తెచ్చుకున్నారు.
“అమ్మనే జీవితానికి భూమిక దిగంతాలకి వేడుక/అంటున్నారు.అమ్మలేని జీవితం లేదు.అమ్మే కద అన్నిటికీ మూలం మరియు అమ్మ ఆకాశానికి వేడుక అని కవి మల్లారెడ్డి చెప్పాడు.
“మాతృదేవోభవ నమో నమామి/అంటున్నారు. అమ్మని దేవతగా ఆరాధించమని మన పురాణాలు చెపుతున్నాయి.అమ్మని పూజిస్తే దైవాన్ని పూజించినట్లే.కనిపించే దైవం అమ్మ.కానీ ఈనాడు ఎందరు తమ ప్రత్యక్ష దైవమైన తమ తల్లులను పూజిస్తున్నారు?.అహంకారం తలకెక్కి తల్లులను క్షోభకు గురి చేస్తున్నారు.వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలివేస్తున్నారు.తల్లుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదు.బంధాలు బాంధవ్యాలను మరిచి పోతున్నారు.మమతానురాగాలకకు మసి పూస్తున్నారు.మన ప్రభుత్వాలు తల్లుల సంక్షేమం కోసం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ అవి చట్టు బండలుగా మారుతున్నాయి.అమ్మను ఆప్యాయంగా పలకరించుకొనే సంప్రదాయం పల్లెలోనే ఉండేది.ఇప్పుడు ఆ పల్లెలు అన్ని ఖాళీ అయిపోతున్నాయి.వర్షాలు ఉండవు.కరువులు కాటకాలు.ఉన్న ఊరిలో ఉపాధి కరువై పల్లె జనాలు పట్టణాలకి విదేశాలకి వలస వెళుతున్నారు.పాడి పంటలతో తులతూగే పల్లెలు ఈనాడు వల్లకాడుగా మారుతున్నాయి.మరుభూమిని తలపింపజేస్తున్నాయి.పాత ఇండ్లు అన్నీ కూలిపోతున్నాయి.రోజులన్నీ మారిపోతున్నాయి. ఒక తల్లి పిల్లలే పాలి పగలు పెంచుకొని చంపుకుంటున్నారు.కన్నతల్లులను నిరాదరణకి గురి చేస్తున్నారు.తల్లులను ప్రేమించడం లేదు.తల్లులను ప్రేమించలేని వారు తమ వ్యక్తిత్వం,సంపద మరియు ఉన్నతమైన విలువలను కోల్పోతున్నారు.తల్లుల్ని ప్రేమించిన వారికి కామధేనువులా,కల్ప వృక్షంలా కోరినవన్నీ లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోతున్నారు.అమ్మను జగదాంబ,ఆదిశక్తి, పరాశక్తి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.అమ్మ గురించి చక్కటి కవిత రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి గులాబీల మల్లారెడ్డి మరిన్ని మంచి కవిత సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

July 31, 2025 137 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు.

by Narendra Sandineni July 31, 2025
written by Narendra Sandineni

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) ఇదీ నీ బాట కవిత కవిత్వం ఓ విశ్లేషణా
ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలంనుండి జాలువారిన ఇదీ నీ బాట కవిత పై విశ్లేషణా వ్యాసం.ఇదీ నీ బాట కవిత చదివాను.చాలా బాగుంది.నన్ను ఆలోచింప జేసింది.ఇదీ నీ బాట ఏమిటి?ఆంగ్లంలో This is the path అంటారు.తెలుగులో నీవు నడవవల్సిన దారి అని అర్థం.నారాయణ రెడ్డి (మానారె) తెలుగు భాషా ఉపన్యాసకులుగా మరియు ప్రిన్సిపల్ గా కళాశాలలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. అట్లా వివిధ రకాల అనుభవాలతో సంఘంలో ఒక బాధ్యత గల వ్యక్తి ఎలా నడుచుకోవాలో ఇదీ నీ బాట కవిత ద్వారా మార్గ నిర్దేశం చేశారు. విద్యార్థులకు విద్యను అందించిన గురువుగా తన జీవితానుభవం నుండి రాసినట్లుగా తోస్తోంది. ఆనాటి గురువులకు విద్యాబోధన మరియు విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దడం తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు.నారాయణరెడ్డి (మానారె)చిన్నతనంలో గురువుల వద్ద నేర్చుకొని గురువుగా ఎదిగిన తీరు పరిశీలించినట్లయితే ఇదీ నీ బాట కవితలో పంచుకున్న భావాలు హృదయం నుండి చీల్చుకు వచ్చినట్లుగా తోస్తోంది. నారాయణరెడ్డి (మానారె) డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా రిటైర్ అయిన తర్వాత కూడా ఆణిముత్యాల్లాంటి ప్రాచీన ఇతిహాసాలైన ఆదికావ్యం రామాయణం,మహాభారతం వంటి మరెన్నో పుస్తకాలను అధ్యయనం చేస్తున్నారు. ఇవ్వాళ మంచి చెప్పేవాళ్లు అరుదుగా ఉంటారు. నారాయణ రెడ్డి ఇప్పటికి మంచితనం తన గుండెల్లో నింపుకుని ఇదీ నీ బాట కవిత ద్వారా సందేశాత్మక బోధ చేస్తున్నారు.ఈ కవిత 1982 సంవత్సరంలో స్పందన కవితా సంపుటిలో వచ్చింది.ఇదీ నీ బాట కవిత రాసి 40 సంవత్సరాలు పూర్తి అయింది. అయినప్పటికి కవితలోని భావాలు సమాజంలో జరుగుతున్న వికృత ధోరణుల తీరుకు అద్దం పట్టినట్టుగా ఉంది.బోధ ఎవరు చేస్తారు?గురువులు బోధ చేస్తారు.నేను ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,1985-1986 సంవత్సరంలో బికాం డిగ్రీ చదువుతున్నప్పుడు నారాయణ రెడ్డి సారు నాకు తెలుగును బోధించారు.నా గురువు రాసిన కవితను విశ్లేషించడం ఆనందంగా ఉంది.ఇదీ నీ బాట ప్రతి ఒక్కరు చదవాల్సిన కవిత.సమాజం ఎటు పోతుంది?ఈనాటి సమాజానికి ‌సరియైన దారి చూపడంలో ఇదీ నీ బాట కవిత ఉపకరిస్తుంది.
“లేలేత కొమ్మల్ని చిదుమకు/పూచిన పువ్వుల్ని నలుపకు/స్నిగ్ధ ముగ్ధ హృదయాలలో/చిచ్చు పెచ్చుగా రగిలించకు/అంటున్నారు.జీవుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్ మరియు ఆహారం మొక్కల నుంచి లభిస్తుంది.మొక్కలతో చదువు నేర్చుకుంటున్న విద్యార్థులను పోల్చడం బాగుంది.మొక్కల ఎదుగుదలకు లేలేత కొమ్మలు కూడా అవసరం.అట్లాంటి ఎదుగుతున్న లేలేత కొమ్మల్ని గోరుతో చిదిమి వేయడం,చేతితో విరిచి వేయడం జరుగుతున్నది.మొక్కలకు ప్రాణం కొమ్మలు.కొమ్మలు ఉంటేనే ఆ మొక్క శాఖోప శాఖలుగా విస్తరించి మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందరికో నీడనిస్తుంది.ఎన్నో పక్షులు గూడు కట్టుకుని ఉంటాయి.ఎందరో మనుషులు చెట్టు నీడన సేద తీరుతారు.లేలేత కొమ్మల్లా ఎదుగుతున్న పిల్లలను కాపాడుకోవాలి.ఆ పిల్లలు సన్మార్గంలో నడుచుకునేలా తీర్చిదిద్దాలి.పువ్వు సాధారణంగా ఆకుల చివరలలో అభివృద్ధి చెందుతుంది.ఆకులు పునరుత్పత్తి పనితీరును కలిగి ఉంటాయి.ఈ నిర్మాణాలన్నింటిని ఆంథోపిల్స్ అంటారు. పువ్వులను మనం పవిత్రంగా చూస్తాం.దేవుని వద్దకు మనం ఖాళీ చేతులతో వెళ్లకుండా పూలమాల తయారు చేసుకుని వెళతాం.దేవుని విగ్రహానికి పూలమాల వేస్తాం.దేవుని ఆశీస్సులు కావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తాం.ప్రేమికులు తమ ప్రియురాలికి గులాబీ పువ్వులు అందించి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.పువ్వులను స్త్రీలు తమ కేశాల్లో కొప్పుల్లో అలంకరించు కుంటారు.పూలు పెట్టుకోవడం ద్వారా స్త్రీల అందం ఇంకా ఇనుమడిస్తుంది.పూచిన పువ్వులతో కూడిన చెట్టు ఎంతో అందంగా ఉంటుంది.పూలు కూడా ఉదయాన్నే పూస్తాయి.సాయంత్రానికి పూలు వాడిపోతాయి.రాలిపోయే పువ్వు అయినప్పటికి ఉన్నంత సేపు పరిమళాన్ని వెదజల్లుతుంది.పూల మీద వాలి తుమ్మెదలు,సీతాకోకచిలుకలు తేనెను త్రాగుతాయి.చిన్నచిన్న పక్షులు కూడా పూలలోని తేనెను ఆస్వాదిస్తాయి.పూచిన పువ్వులను నలపకు అంటే పూలలా సున్నితంగా ఉన్న హృదయాలు కల విద్యార్థులను పాడు చేయకుమని చెబుతున్నారు. పూలను చూసినట్లుగా పిల్లలను చూడాలి.పిల్లలు కూడా పూల లాగా మృదువుగా,స్వచ్ఛంగా ఉంటారు.పూరేకులాంటి పిల్లల హృదయాలు ఎప్పటికి తేటగా ఉంటాయి.పిల్లలు దేవుడు చల్లని వారే కల్లా కపటం ఎరుగని కరుణామయులే అని పిల్లలను కరుణామయుడైన దేవునితో సినీ గీతంలో పోల్చబడింది.దేవుని రాజ్యంలో ప్రవేశం పిల్లలకే ఉంది అని బైబిల్ లో వ్రాయబడి ఉంది.పిల్లల హృదయాలు సున్నితమైనవి.స్వచ్ఛమైనవి. పిల్లలను చూడగానే ముచ్చటేస్తుంది.అటువంటి అపురూపమైన పిల్లల హృదయాలలో వారి స్వచ్ఛమైన మనస్సులలో ద్వేషాగ్నిని రగుల్కొల్పి పెనుమంటగా జ్వలింపజేసి సమాజానికి ద్రోహం చేసే వారిగా పురికొల్పవద్దు.పిల్లలు ఇప్పుడిప్పడే మంచితనంతో మానవత్వంతో ఎదుగుతున్నారు. పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగించవద్దు.పిల్లల సున్నితమైన స్పటికంలాంటి హృదయాలను మంచితనానికి మారుపేరుగా తీర్చిదిద్దాలి.పిల్లలు సన్మార్గంలో నడిచేలా ప్రేరణను అందించాలి.భగత్ సింగ్ చిన్నతనంలో స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్నారు.23 సంవత్సరాల వయసులో దేశం కొరకు ఉరి కొయ్యకు వేలాడారు. భగత్ సింగ్ దేశానికి స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో,స్ఫూర్తితో దేశం కొరకు ప్రాణాలు అర్పించారు.భారత దేశ ప్రజల హృదయాల్లో మరువ రాని వీరుడిగా నిలిచిపోయాడు.ఆ మహనీయుని చరిత్ర ఎప్పటికీ కొత్తగా ఉంటుంది.ఈ దేశంలో పెరుగుతున్న బాలలు అందరు గొప్ప లక్ష్యం కలిగి ఉంటారు.అట్టి పిల్లల మనస్సులను కలుషితం చేయవద్దు అని కవి నారాయణరెడ్డి (మానారె) పిలుపునిస్తున్నారు.

“అమృతాంతరంగాలలో/హాలాహలం చిందించకు/
“పాలవెల్లి లాంటి పసి మనసులో/సంక్షోభపు సందడి కలిగించకు/అంటున్నారు.అంతరంగం అంటే మనస్సు యొక్క శక్తి.అట్టి అంతరంగంలోని శక్తి వల్ల మంచి చెడు స్పష్టంగా తెలుస్తుంది.అంతరంగం అనేది మనస్సులో జ్ఞాపకాల జ్ఞానాన్ని కలిగించే శక్తి. అంతరంగంలో నిలిచియున్న ఆత్మ ఎన్నటికి నాశనం కాదు.క్షీరసాగర మధనం : దుర్వాసముని శాపం కారణంగా సమస్త సంపదలు కోల్పోయినారు. దేవతలు దేవదానవ యుద్ధంలో రాక్షసులను గెలువలేక పోతున్నారు.ఆప్పుడు దేవతలు శ్రీమహావిష్ణువును శరణు వేడుతారు.దేవతలు అసురులతో సఖ్యంగా ఉండాలి.దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించమని సూచిస్తాడు.అప్పుడు దేవతలు, రాక్షసులు ఇద్దరు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా,సర్పమైన వాసుకిని తాడుగా చేసుకుని, పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెడతారు.ఈ క్షీరసాగర మధనంలో అనేక అపురూపమైన వస్తువులతో పాటు హాలాహలం కూడా ఉద్భవించింది.అట్టి హాలాహలం నుండి దేవ, రాక్షసులను మరియు ముల్లోకాలను కాపాడటానికి శివుడు హాలాహలంను మింగి తన కంఠంలోనే ఉంచుకున్నాడు.అందుకే శివునకు గరళకంఠుడు లేదా నీలకంఠుడు అనే పేరు వచ్చింది.హాలాహలం ప్రాణాలు తీసే విషం వంటిది.అమృతంతో కూడిన అంతరంగాలు కలిగిన లేలేత చిన్నారుల మనస్సులలో హాలాహలం లాంటి విష బీజాలు నాటకు.ఎదుగుతున్న చిన్నారుల మనస్సు అమృతతుల్యమైనది.పాలవెల్లి అంటే పాల సముద్రము అని అర్థమవుతుంది.పాల సముద్రంలా తేటగా ఉన్న ఆ చిన్నారులకు లోకంలోని కుటిలత్వం అంటే ఏమీ తెలియదు.చిన్నారులు సంఘ వ్యతిరేక శక్తులుగా మారకుండా చూడాలి.చిన్నారులు హింసా మార్గం వైపు అడుగులు వేయడం ప్రమాదకరమైనది.చిన్నారులను విధ్వంసకులు కాకుండా కాపాడుకోవాలి.జీవితంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్నారులు సముద్రంలో ఏర్పడిన అలల తాకిడి శ్రుతి మించి తుఫానుగా మారి సునామీ లాంటి విపత్తులకు మూలం కావడం ‌ మనకు తెలుసు.జీవితంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్నారులు అలజడులను సృష్టించడానికి ఆటంకవాదానికి లోనై సునామీ సృష్టించిన సముద్రమును పోలివుంటే సమాజానికి అపార నష్టం కలుగుతుంది.విపత్తుల వల్ల లేలేత చిన్నారుల జీవితం అధర్మ మార్గాన్ని అనుసరించి, అస్తవ్యస్తం,అల్లకల్లోలం కాకుండా కాపాడుకోవాలి అని కవి నారాయణ రెడ్డి (మానారె) బోధ చేస్తున్నారు.
“నెయ్యం తియ్యం కోరే వారికి/కత్తులతో పొత్తును గూర్చకు/కుత్తుక నెత్తురు దాహం కోరే/నినాదాల మత్తెక్కించకు/అంటున్నారు.నెయ్యం అంటే స్నేహం, రక్తసంబంధం కానిది.స్నేహంలో స్వార్థానికి స్థానం లేదు.నెయ్యం అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోను,పరులందరు తన వారే అనే భావన.ఆంగ్లంలో నెయ్యం అంటే To be kind or loving అని అర్థమవుతుంది.స్నేహ వర్షాన్ని కురిపిస్తూ అందరి క్షేమాన్ని కోరే మంచి మనసు కల చిన్నారులకు విధ్వంసాన్ని కోరే వారితో,హింసను రేకెత్తిస్తూ కత్తులు వాడే సంఘ విద్రోహులతో పొత్తులు కూర్చవద్దని కవి నారాయణరెడ్డి కోరుతున్నారు.సాటి మనిషిని చంపి రాక్షసానందాన్ని పొందే వారిలో చిన్నారులు జమ కాకూడదు.హింసా మార్గంలో నడుస్తున్న వాళ్ళతో చిన్నారులు కలిసి ఉండడం తగదు.హింసా మార్గంలో నడిచే వాళ్ళు కత్తులతో కొట్లాడుతారు.అట్లాంటి వారి సావాసం వల్ల చిన్నారులు హింస వైపు సాగుతారు.సాటి మనిషిని చంపి నెత్తురుతో కోర్కెలు తీర్చుకోకు అంటున్నారు.నినాదం అంటే ఆంగ్లంలో Slogan or Motto.నినాదం అంటే ఉద్దేశంతో కూడిన పరిచయ వ్యాఖ్య.ఒక వ్యక్తి సంఘం,సంస్థ లేదా దేశం యొక్క సాధారణ లేదా విశేషమైన ఉద్దేశం.ఉద్యమాలు, మతపరమైన సంఘర్షణలు రాజకీయ పార్టీ వాళ్లు నినాదాల పేరిట ప్రభావితం చేస్తుంటారు.చిన్నారుల హృదయాలలో మతం సాకు చూపి కొందరు, ఉద్యమాల పేరిట కొందరు,రాజకీయ నాయకులు అధికారం పేరిట వాళ్ల స్వార్థం కోసమే చిన్నారులను పావులుగా వాడుకుంటున్నారు.నినాదాల మాయలో పడి చిన్నారులు చదువుకు దూరం అవుతారు. చిన్నారులు తప్పుడు మార్గంలోకి వెళ్ల వద్దు అని చెబుతున్నారు.చిన్నారుల జీవితాలను కలుషితం చేయవద్దని హితవు పలుకుతున్నారు.పిల్లలు నినాదాల మాయలో పడి చదువు అనే సంకల్పం నుండి దూరం అవుతున్నారు అని కవి నారాయణ రెడ్డి(మానారె) ఆవేదన చెందుతున్నారు.
“మానవతా వాదంతో/మారణ హోమం తలపెట్టకు/
జనోద్దరణ పేరు చెప్పి/జన నాశం చేపట్టకు/ అంటున్నారు.మానవతా వాదం నీతి తత్వములకు సంబంధించిన ఒక విశాలమైన మార్గం.మానవతా వాదం ప్రజలందరి హుందాతనాన్ని ప్రకటిస్తుంది. మానవతా వాదం ఒక తత్వంగానో,మతం గానో పరిగణిస్తే దానిలో ఉన్న సహజత్వం ఔన్నత్యం లోపిస్తాయి.మానవతా వాదం ఒక జీవన దృక్పథం.మానవతా వాదానికి స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ మానవ వికాసానికి దోహదం చేస్తుంది. సత్యం కోసం,జ్ఞానం కోసం మానవులు చేసే పోరాటంలో ఉపకరించే అమోఘమైన సాధనం హేతువు.హేతువు ద్వారా మాత్రమే మానవుడు తన శక్తిని పరిమితులను సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతాడు.మంచి,చెడుల్ని విశ్లేషించగలుగుతాడు.ఏ సమాజమైన అభివృద్ధి చెందడానికి నీతి ఉండాలి.నీతికి పునాది మానవ స్వభావంలోనే ఉంటుంది.మనిషి నీతికి కట్టుబడి ఉండాలి.మనిషి దైవానికి,ప్రభుత్వానికి,చట్టానికి నీతిగా ఉండే విషయంలో ఏ మాత్రం భయపడ కూడదు.మానవత్వం యొక్క ఉత్తమ లక్షణం సహనం.మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది.మనిషిలోని అసహనం సమాజంలోని అల్లకల్లోలాలకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పనిసరి అని చెప్పుకోవాలి.మానవతా వాదంలో ప్రేమకి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది.మానవులు పరస్పర అవగాహన,సహానుభూతుల నుంచి ఉద్భవించేది ప్రేమ.ప్రేమ మనిషిలోని ఆటవిక ప్రవృత్తిని నాశనం చేస్తుంది.ప్రేమ స్వార్థాన్ని నిర్మూలించి మనిషిని మనిషిగా నిలబెడుతుంది.మానవతా వాదం ఐక్యతను ప్రసాదిస్తుంది.స్వేచ్ఛ, జ్ఞానం,నీతి కోసం హేతువు,ఐక్యత ఉండాలి.ఐక్యత సహనం వల్ల కలుగుతుంది. మానవులు దయతో వ్యవహరించడం వల్ల ఇతర మానవుల బాధలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.నీతిమంతులు, పరోపకార పరాయణులు,ధార్మికులు మానవత్వంతో తోటి వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి సహాయం అందించడం జరుగుతుంది.మానవతా వాదం పేరిట కొందరు మారణ హోమం సృష్టిస్తున్నారు.మన దేశంలో నివసించే ప్రజలంతా వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలి.అన్ని మతాలను ప్రేమించాలి.నీ మతం గొప్పది నా మతం గొప్పది అనే భేదాభిప్రాయాలతో ఒకరినొకరు చంపుకుంటున్నారు.ఈ దారుణ మారణ హోమంలో సామాన్యుల జీవితాలకు భద్రత లేకుండా పోతున్నది.హింస వైపు అడుగులు వేయడం వల్ల అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఈ దారుణ మారణ కాండను ఆపాలని కవి ప్రబోధిస్తున్నారు.జనోద్దరణ పేరు చెప్పి జననాశం చేపట్టకు.ఇవ్వాల జనాలను ఉద్ధరిస్తున్నామని చెబుతూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తూ ప్రజలకు తాయిలాలు అందిస్తామని మోసం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు.ప్రజల్లో విభేదాలు ఏర్పడి ప్రజలు ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి జననాశనం జరగకూడదని కవి నారాయణరెడ్డి(మానారె) తమ కవితలోని భావాల ద్వారా వ్యక్తీకరిస్తున్నారు.
“మంచిని మనసా కోరే పెద్దల/అభివృద్ధి నిరోధకులుగా ఎంచకు/కసితో కల్లోలం పుట్టించే కపటుల/అభివృద్ధి మార్గ వారధులుగా భావించకు/
అంటున్నారు.మంచిని మనసారా ఆచరించమని కోరే పెద్దలు అరుదుగా ఉంటారు.అట్లాంటి పెద్దలు నడుస్తున్న బాటలోనే మనం సాగాలి.మంచి చెప్పే పెద్దలను,సమాజ అభ్యుదయాన్ని కాంక్షించే వాళ్లను గౌరవించాలి.అట్లాంటి వెలుగులు చూపించే వాళ్లను అభివృద్ధి నిరోధకులుగా భావించకు అని హితవు చెబుతున్నారు.కొందరు ఇవ్వాళ సమాజంలో కసితో కల్లోలం పుట్టించే కపటులు ఎక్కడ చూసినా మనకు అగుపిస్తారు.ఆ కపటుల మాయలో పడ కూడదు. కపటులు సమాజాన్ని అల్లకల్లోలం చేస్తూ వంచన మార్గంలో పయనిస్తున్నారు.అట్లాంటి కపటుల జోలికి వెళ్ళవద్దు అని చెబుతున్నారు.కవి నారాయణ రెడ్డి (మానారె) భావం చక్కగా ఉంది.
“పడి కట్టు మాటల ప్రవాహంలో పడకు/పండంటి జీవితాన్ని కుళ్ళి పోనీయకు/గతాన్ని స్మరించి ఆ గతాన్ని ఊహించి/వర్తమానం లో బంగారు బాట వేసుకో/అంటున్నారు.సమాజంలో కొందరు మాటల మాంత్రికులు ఉంటారు.అట్లాంటి మాటల మాంత్రికులు మాయ చేసి గొప్ప గొప్ప మాటలు చెబుతారు.అట్లాంటి కపట మాంత్రికుల వలలో చిక్క వద్దు.ఆ మాయావుల వల్ల చిన్నారుల పండంటి జీవితం పాడైపోతుంది. గతంలో ఏం జరిగింది? చిన్నారులకు తెలుసు.ఆ గతాన్ని ఊహించి వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి.నడుస్తున్న కాలం,వర్తమాన కాలం.వర్తమాన కాలంలో సరిగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.బంగారు బాట వేసుకోవాలి.ఏది మంచి ఏది చెడు అనే విచక్షణతో మెదలాలి.చిన్నారుల మనస్సులో ఏం జరుగుతుంది? చిన్నారులు సరిగా ఆలోచిస్తే తెలుస్తుంది.అలాంటి మనస్సును పక్కదారి పట్టించే దుర్మార్గుల మాయ మాటలకు లొంగకుండా సరైన మార్గంలో పయనించాలి అని కవి నారాయణరెడ్డి (మానారె)సందేశాత్మక ప్రబోధం చేస్తున్నారు.ఇది అందరికి ఆచరణీయమైనది.ఇవాళ సమాజానికి అవసరమైన విషయాలను చెబుతూ చిన్నారుల జీవితాలు భావి తరాలకు మార్గదర్శకంగా నిలిచేలా చేస్తున్న ప్రయత్నంలో కవి సఫలమయ్యారు.ఇదీ నీ బాట ఈనాటి చిన్నారులకు, యువతకు,పెద్దలకు అందరికి ప్రేరణగా నిలుస్తుంది.కవి నారాయణరెడ్డి (మానారె) మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

July 31, 2025 8 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

పరిణత — పాళీ

by రంగరాజు పద్మజ July 31, 2025
written by రంగరాజు పద్మజ

చక్కటి నగిషీలు చెక్కిన అలమరలలో… అంతే చక్కని విలువైన పుస్తకాల నిలయంలో ఆమెను చూస్తే నిరాడంబరంగా కనిపిస్తున్న చదువుల తల్లిని పలకరించాం!

ఇంతలోనే మంచి పలకరింపుతో సుభద్రాదేవి గారి కూతురు మాకు మంచినీరు అందించిన వైనం మహాద్భుతం ఎందుకంటున్నానంటే…? అందంగా అలంకరించిన మట్టిపిడతలతో మంచి నీరు ఇచ్చారు… కాలుష్యాన్ని దూరంగా తరిమేయాలని బద్ధకంకణురాలైన పౌరురాలిగా తన వంతు కర్తవ్యాన్ని ప్లాస్టిక్ వాడకూడదనే నినాదాన్ని ఆచరణలో పెడుతున్నట్టుగా మాకనిపించింది.
కేవలం తమ రచనలలో అక్షరాలతో చెప్పడంకాదు! అక్షరాలా ఆచరించి చూపడం అభినందించతగిన విషయం.
అడుగడుగునా ఆ ఇంట్లో అందమైన పెయింటింగ్ చేసిన చిత్రాలు మన రచయిత్రి శీలా సుభద్ర గారి భర్త శీలా వీర్రాజు గారు స్వహస్తాలతో చిత్రించిన చిత్రాలతో అలంకరించిన ఆ ఇల్లు, ఓ చిత్ర ప్రదర్శన శాల వలె, ఓ గ్రంథాలయం వలె, ఆమె సాక్షాత్తూ సాహితీ మూర్తి వలె కనిపించి ఆనందం కలిగించింది మరెవరో కాదు! కథలు రాసే కథా రచయిత్రీ ; కవితలల్లే కవయిత్రి ; వ్యాస నిర్మాణ శీలి…. ఆమె పరిణత– పాళీ శీలా సుభద్రాదేవి గారు… ఈ రోజు మన తరుణి అతిథి!
వారిని పలుకరించి, వారి ద్వారానే మరెన్నో విషయాలు తెలుసుకుందాం!

రంగరాజు పద్మజ :– నమస్కారమండీ సుభద్రాదేవిగారూ!

శీలా సుభద్రాదేవి :— నమస్కారం పద్మజగారూ!

పద్మజ:– మీ నేపధ్యం తరుణి పాఠకులకు తెలుపుతారా?

సుభద్ర ;— ఆధునిక కథకు చిరునామా అయిన విజయనగరంలో 1949లో జన్మించాను. మానాన్నగారు కలెక్టర్ ఆఫీసులో పనిచేసేవారు. నాకు ఇద్దరు అక్కలు ,ఇద్దరు అన్నయ్యలు. మా పెద్దక్క పి.సరళాదేవి రచయిత్రి.పి.శ్రీదేవి, రంగనాయకమ్మ మొదలగువారి సమకాలీనురాలు. పెద్దన్నయ్య కొడవంటి లీలా మోహనరావు తొలిరోజుల్లో కథలూ, వ్యాసాలూ రాసేవాడు. నాకవితలు ఆంగ్లంలోకి అనువదించాడు. రెండో అన్నయ్య కొడవంటి కాశీపతిరావు వందకు పైగా కథలురాసాడు.
కాలేజీ రోజుల్లో శీలా వీర్రాజుగారి కథల్నీ, నవలనీ చదివి వుత్తరం రాయాలనిపించి KS దేవి పేరుతో, స్నేహితురాలి అడ్రస్ తో కొన్నినెలలు సాహిత్య చర్చలతో కలం స్నేహం నడిచాక ఓ సందర్భంలో నేను మేనమామ కూతురునని తెలిసి వివాహం చేసుకోడానికి ప్రపోజ్ చేయటంతో బహుభాషా పండితుడు రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభా వివాహం జరిగింది.

పద్మజ :—- మీ విద్యా – ఉద్యోగ ప్రస్థానాలు వివరిస్తారా?

సుభద్రా దేవి : — విద్య – ఉద్యోగం – అభిరుచులు చెప్పాలంటే విజయనగరంలో మహారాజ మహిళా కళాశాలలో BSc డిగ్రీ చేసాను.
1971లో వివాహానంతరం హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. పదేళ్ళ తరువాత MA(తెలుగు),BEd,మరో పదేళ్ళ తరువాత MSc(maths) పట్టాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అందుకున్నాను..
ఆర్టీసీ హైస్కూల్ లో గణితోపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా ఉద్యోగం చేసి పదవి విరమణ చేసాను..
చిన్నప్పటినుండి పత్రికలోని బాపూ చిత్రాలు చూసి ఇష్టంగా చిత్రాలు వేసేదాన్ని. విజయనగరం సంగీతం కళాశాలలో ఓ మూడేళ్ళు గాత్రం నేర్చుకున్నాను. కానీ నాకు లలితసంగీతమంటే మహా ఇష్టం. ఫేబ్రిక్ పెయింటింగ్స్, ఎంబ్రాయిడరీ వర్క్ ఒకప్పుడు ఇష్టంగా చేసేదాన్ని. సాహిత్యంలోకి వచ్చాక అవన్నీ వెనకబడ్డాయి.

పద్మజ :—- మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ప్రారంభించారు?

సుభద్రాదేవి :—- హైస్కూల్ లో చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టారు రామకృష్ణమాచార్యులు గారు ఛందస్సు నేర్పించినప్పుడు విరివిగా పద్యాలు రాసాను. మా మాష్టారు స్కూల్ కోసం లిఖిత పత్రిక నడిపేవారు అందులో పద్యాలు, గేయాలూ రాసే దాన్ని. కాలేజీ మాగజైన్ లో రాసాను. కానీ అవన్నీ పెద్దగా చెప్పుకోను.
అయితే ప్రత్యేకంగా చెప్పుకునేది మాత్రం 1970లో పొలికేకలో ప్రచురితమైన నా మొదటి కథ” పరాజిత” తో సాహిత్య రంగంలోకి రచయిత్రిగా అడుగు పెట్టాను.

పద్మజ :—- మీ రచనలలోని దేవుడు బండ కథా నేపథ్యం చెప్పండి!

సుభద్రా దేవి :— 1987 లో విపుల మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ ‘ దేవుడు బండ’. రాతిరోళ్ళు తయారు చేసి అమ్మే వలసజీవుల జీవన విధ్వంసాన్ని తెలంగాణా మాండలికంలో రాసినకథ. ఇందులో చదువుకోవాలని తపనపడే పేదపిల్లాడి వేదనవుంది. యాంత్రిక యుగపరిణామంలో రోళ్ళకు బదులు యంత్రాలు వంటిళ్ళలోనికి వచ్చేస్తుంటే అమ్ముడుగాని రాళ్ళ బరువు మోస్తున్నవారి జీవన వ్యథ, పాడైపోయిన పొత్రాలు యాదృచ్ఛికంగా గ్రామదేవతగా రూపొందే వ్యంగ్యంతో ముగిసిన కథ. ఇది నాకు బాగా నచ్చిన కథలలో ఒకటి. నేను స్కూల్ కి వెళ్ళటానికి మలక్ పేట బస్టాప్ లో నిలబడినప్పుడు బస్టాప్ వెనుక కాపురం ఉన్న రోళ్ళు తయారుచేసే కుటుంబాల్ని పరిశీలించి రాసిన కథ ఇది. ఈ కథ కేంద్ర సాహిత్య అకాడమీ వారి సంకలనంలో చేర్చారు. నా మొదటి కథలసంపుటి దేవుడు బండ పేరుతో 1990లో వెలువడింది.

పద్మజ :—- రచయిత్రుల కథలపై వ్యాసాలు రాసారు కదా! దాని గురించి, అవి ఎందుకు రాయాల్సి వచ్చింది, వివరించండి.

సుభద్రా దేవి :— 2010లో వందేళ్ళ కథాప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాక బయటున్న తెలుగు కథకులందరితో ఎన్నో సమావేశాలూ, ఎన్నో ఇంటర్వ్యూలూ, వ్యాసాలూ, అభిప్రాయాలు వెలువడ్డాయి. మొదటి కథారచయిత్రిగా భండారు అచ్చమాంబను పేర్కొని, ఆపైన 1980 తర్వాత రాసిన రచయిత్రులనే అనేకమంది పేర్కొన్నారు.
వందేళ్ల కథకు వందనాలు’ పేరిట హెచ్ఎంటీవీ లో 2012 లో గొల్లపూడి మారుతీ రావు ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ధారావాహికంగా నిర్వహించారు. 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం పన్నెండు మంది రచయిత్రుల కథలనే పరిచయానికి స్వీకరించటంకూడా గమనించాల్సిన విషయమే.
అవన్నీ గమనించిన తరువాత 1910కి-1980కి మధ్య ఒకరిద్దరు తప్ప కథారచయిత్రులు లేరా! అనే ఆశ్చర్యం కలిగింది. అరవయ్యో దశకంలో పత్రిక లన్నింటిలో ప్రభంజనం సృష్టించిన రచయిత్రులంతా ఏమయ్యారు? వారు నవల తప్ప చెప్పుకోదగిన కథలేమీ రాయలేదా? రాసినా విమర్శకులు, చాలామంది పేర్కొన్నట్లు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, అపార్థాలూ, కలహాలతో నిండి, వంటింటి సాహిత్యమేనా? – ఇలా అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి. ఆ సంఘర్షణ లోనే నా ముందుతరం 1950 నాటి 24 మంది రచయిత్రుల గురించి పరిశోధనాత్మక వ్యాసాలు రాసాను. పుస్తకంగా వెలువరించాను.

పద్మజ :—- ముద్ర సంపుటి వెలువరించారు కదా! ఏ సందర్భంలో ?

సుభద్రా దేవి :—- 2001 లో డా.పి.భార్గవీరావు గారూ, నేనూ కలిసి మొల్ల దగ్గర నుంచి ప్రారంభించి అప్పటివరకూ వున్న వంద మంది కవయిత్రుల కవితా సంకలనంగా ” ముద్ర”ను తీసుకువచ్చాము.

పద్మజ :— మీరు పొందిన పురస్కారాలు – ఆయా సందర్భాలు తరుణి పాఠకులకు చెప్పండి!

సుభద్రా దేవి :—- పురస్కారాలు:
తెలుగు విశ్వవిద్యాలయం నుండి 1997లో సృజనాత్మక సాహిత్యానికి *పట్టాభిరామిరెడ్డి ఎండోమెంట్ అవార్డ్
లేఖిని సాహిత్య సంస్థ నుండి వచ్చే కవిత్వానికి *కుసుమా రామారావు పురస్కారం.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి 1999లో *ఉత్తమ రచయిత్రి అవార్డు
కవిత స్మారక సాంస్కృతిక సంస్థ, కడప నుండి 2011లో ‘రెక్కలచూపు’ కథాసంపుటికి *గురజాడ అవార్డు
ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011లో దీర్ఘ కవిత్వానికి దేవులపల్లి రాజహంస *కృష్ణశాస్త్రి పురస్కారం.
2018లో ఉమ్మడిసెట్టి రాధేయ త్రిదశాబ్ది *ప్రతిభా పురస్కారం.
2018లో కవిత్వానికి అమృతలత *అపురూప పురస్కారం.
2018లో “నా ఆకాశం నాదే” కవితా సంపుటికి గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి *మాతృపురస్కారం
2022లో సుశీలానారాయణరెడ్డి పురస్కారం.
2022లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి *మాతృ పురస్కారం.
,శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం.
గుత్తికొండ రామరత్నం జీవన సాఫల్య పురస్కారం,
నీడల చెట్టు నవలకు విశాలాక్షి విశిష్ట పురస్కారం
మొదలైన పురస్కారాలు పొందాను.

పద్మజ :—- మీరు చిత్రకారిణి అని విన్నాను! ఆ చిత్రాలు ఏమైనా వున్నాయా? మా ప్రేక్షకులకు చూపించుదామా?

సుభద్ర దేవి :- నేను 1970లలో బాపూ బొమ్మలను చూసి కొన్ని చిత్రాలు వేసినవి.

పద్మజ :— ఇంటి బాధ్యత, ఉద్యోగ బాధ్యతలతో పాటూ రచనా వ్యాసంగం ఎలా సమన్వయం చేసుకున్నారు?

సుభద్రా దేవి :— వివాహానికి ముందే కథారచన ప్రారంభించినా, వివాహానంతరం ఉమ్మడి కుటుంబం,పిల్లలూ, రోగాలూ, రొష్టులుతో కొంత విరామం వచ్చి, మనసులోనే పదాలు అల్లుకొని సమయం దొరికినప్పుడు పేపరు మీద పెట్టే సౌలభ్యం వలన కవిత్వంలోకి వచ్చాను. తర్వాత ఉద్యోగం బాధ్యత కలిసింది. అందుకే పదకొండు కవితా సంపుటాలు ప్రచురించుకోగలిగాను కానీ మూడే కథల పుస్తకాలను ప్రచురించాను. పదవీవిరమణ అనంతరం విమర్శలో కూడా కృషిచేసి ఒక వ్యాస సంపుటి, రెండు మోనోగ్రాఫ్ లు రాసాను. మరో మూడు వ్యాస సంపుటాలను తీసుకు రావాల్సి వుంది.ఏపాటి సమయం దొరికినా సాహిత్యపఠనం ఆపలేదు,రాయటమూ ఆపలేదు. చిన్ననాటి నుండీ నా జీవితంలో ఎదుర్కొన్న అనేకానేక ఎదురుదెబ్బలూ, ఆటుపోట్లలో నేను ఇలా నిలదొక్కుకొని నిలబడగలిగానంటే సాహిత్యమే నా వూపిరి, సాహిత్యమే నాకు టానిక్.

పద్మజ :—-స్త్రీ వాద ఉద్యమం కవితలు రాయటానికి గల కారణాలు ఏమిటంటారు ?

సుభద్రా దేవి :—- చిన్నప్పటినుండి నేను చదివిన రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, రంగనాయకమ్మ మొదలైన వారి రచనలు సమాజంలోని జరిగే అనేకానేక విధ్వంసాల్ని, అణచివేతల్ని పరికించే దృక్పధాన్ని నాకు అలవడేలా చేసాయి. నిజానికి నేను కథలు రాసినా, కవితలు రాసినా స్త్రీ ప్రాధాన్య ఇతివృత్తాల్నీ, అంశాల్నే కాక సామాజికపరమైన ఇతర సమస్యలన్ని తీసుకుని రాయటానికే ప్రయత్నించాను. స్త్రీలపై ఆర్థిక సామాజిక సంక్షోభాలు ఏవిధమైన ఒత్తిడిని వివక్షల్నీ ప్రదర్శిస్తాయో ప్రధానంగా నా రచనలలో కన్పిస్తాయి.
ఒకవైపు స్త్రీగా జెండర్ వివక్షే కాకుండా సమాజంలో కుల పరమైన వెనకబాటు తనం కూడా బాధిస్తే రెండు పడగల నీడక్రింద స్త్రీ అస్తిత్వరాగాలాపనలే నా రచనలు.

పద్మజ ::— యుద్ధం ఒక గుండె కోత గురించి తెలియజేయండి!

సుభద్రా దేవి :—- 2001లో అమెరికాలో జంటటవర్లు కూల్చిన దుర్ఘటన అనంతరం, అమెరికా ఆఫ్ఘన్ యుద్ధ నేపథ్యంలో రాసిన 56 పేజీలు దీర్ఘకవిత ‘యుద్ధం ఒక గుండె కోత! రచయిత్రుల కలంనుండి వెలువడిన మొట్టమొదటి దీర్ఘ కవిత్వకావ్యంగా విమర్శకులు పేర్కొన్నారు. ప్రపంచమంతా కమ్ముకున్న యుద్ధ మేఘాలు, బాంబులు కురిపించటంతో కలచిన హృదయ వేదన, చిన్నిదేశాలపై అగ్రరాజ్య దురహంకారంపై ఆగ్రహం, జరుగుతున్న అనేకానేక సంఘటనల వెనక నలుగుతున్న స్త్రీల కనిపించని ఆర్తనాదాలు, ఏ యుద్ధమైనా మొట్టమొదట గాయం చేసేది తల్లి గర్భం పైనే అన్న అంతర్గత ఆలోచనలతో మాతృహృదయ ఆవేదనగా రాసినది ఈ కావ్యం. అప్పటికి కవులు కొందరు మాత్రమే దీర్ఘకవితలు రాసారు. అందులోనూ యుద్ధనేపథ్యంగా దీర్ఘకవిత్వం రాసిన వారూ లేరు. అప్పట్లోనే డా.పి భార్గవీరావు , డా. పి. జయలక్ష్మిగారలు కలసి “WAR, A Hearts’ Ravage” పేరిట ఆంగ్లంలోనూ,”యుద్ధ్ ఏక్ దిల్ కి వ్యథ” పేరిట నిర్మలానంద వాత్సాయన్ గారు హిందీ లోకి , రాజేశ్వరీ కోదండంగారు “ఉళ్ళక్ కుమురల్ ” పేరుతో తమిళంలోకి అనువదించారు.

పద్మజ :—- మీ రచనలపై పరిశోధనలు వచ్చాయా?

సుభద్రా దేవి : — ఇప్పటి వరకూ నా రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో మూడు MPhil పరిశోధనలూ,రెండు PHD పరిశోధనలూ జరిగాయి.

పద్మజ :—- మీ శ్రీవారు చిత్రకారులు కదా! మీ రచనా వ్యాసంగానికి వారి తోడ్పాటు ఎలా వుండేది?

పద్మజ :— మీకు నాభర్త శీలా వీర్రాజుగారు రచయిత కూడా అని తెలియదనుకుంటాను. ఇంటర్మీడియేట్ చదువుతోన్న రోజుల్లోనే 1956 లో మొదటి నవలతో మొదలుపెట్టి నాలుగు నవలలూ, తొమ్మిది కథలసంపుటాలు, ఎనిమిది కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి వీర్రాజుగారి సాహిత్య ఖాతాలో వున్నాయి. అందుచేత మొదటినుంచీ వారి ప్రోత్సాహం వుంది. నా పుస్తకాల ప్రచురణకు పూర్తి తోడ్పాటు వుంది.

పద్మజ :—- కాత్యాయనీ విద్మహే మీ పుస్తకానికి చక్కని పీఠిక రాసారు – ఆ సందర్భం ఎలా తారస పడింది?

సుభద్రా దేవి :— 2009 లో అప్పటి వరకూ వచ్చిన ఎనిమిది సంపుటాలను కలిపి “శీలా సుభద్రాదేవి కవిత్వం” పేరిట వీర్రాజుగారు నా అరవయ్యేళ్ళ జన్మదిన సందర్భంగా ప్రచురించారు. ఆ పుస్తకానికి కాత్యాయనీ విద్మహే చాలా వివరంగా సుమారు పదహారు పేజీల పీఠిక రాసారు.

పద్మజ :— రెక్కల చూపు. రెండవ కథా సంపుటి గురించి వివరించండి !

సుభద్రా దేవి :—- రెక్కల చూపు నా రెండవ కథలసంపుటి. ఇందులోని గోవుమాలచ్చిమి కథకి ఆంగ్లానువాదం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన సంపుటిలో చేరింది.”మార్పు వెనుక మనిషి కథ ” తిరుపతి SV విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరం డిగ్రీ తెలుగు సిలబస్ లో పాఠ్యాంశంగా చేర్చారు. చాలా కథలు సంకలనాలలో చేరాయి.

పద్మజ :– ఇస్కూలు కతలు పేరు ఆశ్చర్యంగా ఉంది! దీని నేపథ్యం చెప్పండి !

సుభద్రా దేవి :— ఇస్కూలు కతలు తెలుగు విద్యార్థి మాసపత్రికలో రెండున్నరేళ్ల ఏళ్ళ పాటూ ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. తర్వాత అదే పేరుతో గ్రంథస్థం చేసాను. ఇందులోని కథ మహారాష్ట్ర ప్రభుత్వపాఠశాల తెలుగు ద్వితీయ భాషగా చదివే ఏడవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా పదేళ్ళుగా చేర్చారు. ఇటీవల డా.గణేష్ రామ్ గారు హిందీలోకి అనువదించిన ఇస్కూలు కతలు పుస్తకం
గా వెలువడింది.

పద్మజ :—– కొన్ని సంకలనాలకు సంపాదకత్వం వహించారు కదా? ఆ వివరాలు ?

సుభద్రాదేవి :—. ముద్ర (వనితల కవితల సంకలనం – భార్గవీ రావుతో సంపాదకత్వం, 2001)

  1. వాళ్ళు పాడిన భూపాలరాగం (డా. పి. శ్రీదేవి కథలు, 2022)
  2. యాభై ఏళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు (2022)
  3. మధుకలశమ్ (డా.పి. శ్రీదేవి కవిత్వం(2023)
  4. నది ప్రయాణం (శీలానవీ స్మరణికలు)(2023)
  5. శీలావీ శిల్పరేఖలు (2024)
    7.ఒక చిత్రకారుడు -కొన్ని అవలోకనాలు ( 2025 శీలా వీర్రాజు చిత్రలేఖనంపై ప్రముఖులు రాసిన వ్యాసాలు)
    8.శీలాక్షరాలు కవితా సంకలనం (2025 శీలావీఫాంట్ తో కూర్చిన 250 మంది కవుల కవితలు)
    ఇవి ఇంతవరకూ నా సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు.

రంగరాజు పద్మజ :- మీ సాహిత్య పయనం చూస్తే చాలా సంతోషమైందండీ !

పద్మజ :— తరుణి పత్రిక గురించి మీ అభిప్రాయం చెప్పండి !

సుభద్రా దేవి : —- ఒకప్పటి కన్నా ఇప్పుడు మహిళలు సంపాదకత్వంలో వస్తున్న పత్రికలు, అందులోనూ అంతర్జాల పత్రికలు ఎక్కువగానే వున్నాయి. అది సంతోషించదగిన విషయం. కొండపల్లి నీహారిణి ఒకేసారి రెండు పత్రికలు తీసుకుని రావటం ముదావహం.

పద్మజ :— పత్రిక పాఠకుల ఆదరణ పొందాలంటే ఇంకా ఏమి చేయాలో సూచనలు చేయండి!

సుభద్రా దేవి :—- ఇప్పుడు అంతర్జాల పత్రికలు ఎక్కువగానే వున్నాయి. వాటిలో వస్తున్న శీర్షికలు, కథనాలూ పరిశీలించాలి. వాటికన్నా విభిన్నమైన రీతిలో పత్రిక ఉండటానికి ఎటువంటి మార్పులు, చేర్పులూ వుండాలో ఏడాదికొక సారైనా సమీక్షించుకొని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వుండాలి.
సామాజిక జీవితాల పట్ల చక్కగా చలించే హృదయమున్న రచయిత్రి శీలా సుభద్రాదేవి గారి సాహిత్యం స్పష్టతతో పాటు ఎవరైతే బాధించబడే వర్గం ఉంటుందో వారి పట్ల దయాగుణం చూపిస్తూ… ఆ దయాగుణం అందరికీ .. ఉండాలంటూ… అక్షరీకరిస్తారు సుభద్రా దేవి గారు!

నిజమే కదా! సమాజం పట్ల బాధ్యత ఉన్న ఎవరికైనా ఆ గుణం ఉండాలి! అందుకే ఆ బాధా తప్తుల కోసం ఓదార్పు వంటి రచనలు చేసి, వారిలో ఆలోచనలు రేకెత్తించే భావాలతో నింపి, సాహతీ సేవ చేస్తున్న శీలా సుభద్రా దేవి గారు ఆ తాడిత- పీడిత ప్రజలకే కాదు! ఇలాంటి రచనలు చేయాలని ఆలోచన కలిగించి, రచయిత్రులకూ మార్గదర్శకురాలే! వారి నుండి మరిన్ని ఇటువంటి రచనలు కోరుతూ వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నది…

July 31, 2025 26 comments
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

అయితే మీరే..(భుజాలు తడుముకుంటున్నారుగా!)

by Sompaka Seetha July 31, 2025
written by Sompaka Seetha

మా ఫ్రెండ్స్‌లో మేమిద్దరమే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించు కోలేకపోయాము. ముఖ్యంగా మరీ నేను అన్ని యోగ్యతలు ఉండి కూడా చిరుద్యోగిగా మిగిలిపోయా. ఎదుగు బొదుగూలేని జీతం తెచ్చుకుంటూ సమాజం చూపించే నికృష్టమైన చూపుల తాకిడికి చాలా మానసికమైన క్రుంగుబాటుకు లోనైన రోజులెన్నో. అవన్నీ గుర్తుకొచ్చి మనసంతా చేదుగా మారిపోయింది. మాలినివైపు చూశాను. ఒక మాత్ర, నిద్రకోసంగా వేసుకుంటానని చెప్పింది. బహుశా అందుకేనేమో నిద్రలోకి జారిపోయింది. నేనేమో గత జ్ఞాపకాల పుట్టకు చుట్టుకుపోయాను నా ప్రయత్నం లేకుండానే.

ప్రైవేట్‌ కళాశాలలంటే తెలవనిది ఏముంది? చాకిరీ ఎక్కువ, జీతాలు తక్కువ జీవితాంతం చేసినా. తరగతిలో విద్యార్థులు ఎక్కువ. వారం వారం పరీక్షలు. వాటిని మూల్యాంకనం చేయడం. అదనపు తరగతులు ఎక్కువ. సెలవులు తక్కువ. వెట్టిచాకిరీ లాగానే అన్పించేది ఒక్కోసారి. పుట్టింటి వేడుకలు, పెండ్లిండ్లకు కూడా ఓ అతిథిగా వెళ్ళినట్లుండేది. వేడుకకు ముందురోజు వెళ్లటం, వేడుక చూసుకోవటం, మళ్ళీ తెల్లారే వచ్చేయటం. ఇక ఇరుగు పొరుగు అమ్మలక్కల వింత మాటలు ‘ఆమెకేం హాయిగా పొద్దున్నే వెళ్లిపోతుంది. ఎప్పుడో పొద్దుగూకే సమయానికి వస్తుంది’ అన్నట్టుగా చాటుమాటు మాటలు ఒక్కోసారి చెవినపడి చాలా బాధ అన్పించేది. మావారు (కూడా) ఉద్యోగే ఆఫీసర్‌ స్థాయి. రోజూ వెళ్ళివస్తూండేవారు. ఇంటికి, మా కాలేజీకి మధ్య చాలా దూరం. పిల్లలిద్దరికీ, మా వారికి, నాకు క్యారేజీలు సర్దుకోవాలి. ఇంటిపనులు పూర్తి చేసుకుని ఇల్లు సర్దుకోవాలి. ఎంత సర్దుకుంటే మహిళలు ఎనిమిది గంటలకల్లా బైటపడగలరు. ఎంతటి మానసికమైన వత్తిడిని ఎదుర్కోవాలి ప్రతిరోజూ. ఇవ్వేమీ తెలవవు ఆ వాగుడ్లు వాగేవారికి. నేనేదో దర్జాగానే వెళ్తున్నట్లుంది చూసేవారికి. తలొంచుకుని నా దారిన పోతుంటే. ఎంత పొగరోననే చూపులు గుచ్చుకునేవి. పోనీ ఒకే వీధిలో ఉంటున్నాం గదాని పలకరిస్తే, ఏం మీకు ఈ రోజు సెలవు కాదా? అనే వెటకారపు మాటలు. ఎప్పుడైనా దొరకక దొరకక ఒక సెలవు రోజు దొరికి, ఏ షాపింగ్‌కో వెళ్తుంటే ‘మీరివాళ కాలేజీకి పోలేదా?’ అనే మాటలు ఇవే ఉంటాయి వెక్కిరింపుల మాటలు దొర్లుతాయి. ఇలాంటి మాటలు వింటుంటే చాలా ఎంబ్రాసింగ్‌గా, ఇరిటేటింగ్‌గా ఉండేవి.

ఇక బంధువర్గం నుంచి మాటలు మరోరకంగా బాణాలై చురుక్కుమని గుచ్చుకుంటాయి. ‘ఓ ఇంకా ప్రభుత్వ ఉద్యోగం రాలేదా నీకు? అయినా గవర్నమెంటు ఉప్పుతినే అదృష్టం ఉండాలి ఎవరికైనా?’ అంటూ మొహం మీదే సామెత చెప్పినట్లుగా చెపుతూ, వేళాకోళపు చూపులు, ఇంట్లోనేమో ఇంకా ప్రత్యేకంగా… ‘బోల్డంత మందికి ఉద్యోగాలొస్తున్నాయి. టిక్కుటిక్కుమంటూ నువ్వింకా అదే చేస్తున్నావు. సంవత్సరానికి బోడి రెండొందలు పెరుగుతుంది. మీరేమో గట్టిగా అడగరు మేనేజ్‌మెంట్‌ని, ఆ ఇచ్చేది కూడా పదో తారీఖు దాటిన తర్వాతనే అనే సణుగుళ్లు. ఇలాంటి మాటలు విని వినీ రాయిలాగా అయిపోయిన మనసు మౌనంగా కన్నీళ్లు కార్చేది.

అత్తగారు లేనేలేరు. ఆమె వంతుగా వినొచ్చే మాటల్ని కూడా మా ఆడబడుచులే మూటకట్టుకుని నానెత్తిమీద గ్రుమ్మరిస్తూ ఈసడిరపుగా పలికే మాటల్ని అటుంచితే భర్తనుంచే వినాల్సిరావటం ఆడవారికెవరికైనా బాధగానే ఉంటూ గుర్తొచ్చినప్పుడల్లా ములుకుల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి.

పట్టుదలగా నా మెతుకు నేనే సంపాదించుకోవాలనే ఆకాంక్షతో చిన్న

ఉద్యోగమైనా విడువకుండా సుమారుగా 35 ఏండ్ల పాటు వెట్టిచాకిరీనే చేశా. ఇన్నేళ్లు ఎట్లా చేశారాంటీ? అని తెలిసినవాళ్లు ఎవరైనా అడిగితే ఇంట్లో కూర్చుని ఏం చేస్తామమ్మా మనం నేర్చుకున్న చదువు వృధా పోకుండా నల్గురికీ పంచటమే నాకిష్టమని చెప్పేదాన్ని. దీనికి వెనుకవున్న అసలు ఉద్దేశ్యం మీకు తెలవటమే నాకు కావలసినది.

సెలవులు ఎక్కువగా లభించవుగదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారికి. మన దగ్గిర ముస్లిం పిల్లలు ఎక్కువ లేరని వారి పండుగలకు సెలవు లేకుండా చేయటం. పరీక్షా ఫలితాలు బాగా రావాలని ప్రైవేటు తరగతులతో రుద్దటం, కఠినంగా ఉన్న సబ్జెక్టుకు ఎక్స్‌ట్రా క్లాసులంటూ సమ్మర్‌లో కూడా మాకివ్వాల్సిన సెలవులను కుదిస్తూ మొత్తంమీద ఓ పదిరోజులివ్వటం గగనమైపోయేది. ఇక ఇలాంటి సందర్భంలో తీవ్రమైన వాగ్భాణాలు సంధింపబడేవి ఇంట్లో. ‘వాళ్ళిచ్చే ఇంతోటి జీతానికి సెలవురోజు కూడా కాలేజీకి పోవాలా? నువ్వే పోతున్నావా? ఇంకెవరైనా వస్తున్నారా లేదా? ఒకచో అనుమానపు చూపులు…

‘అదేంటండీ… అందరికీ సెలవులిచ్చారు గదా! ఐనా మీరు

వెళ్తున్నారెందుకంటూ…’ ఏదో నామీద లేనిపోని సానుభూతి ఒలకపోస్తూ చేసే కొందరి ఇచ్చకాల మాటలు… ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తున్నా… అందరి చేతా మాటలు శూలాలై గ్రుచ్చుకుంటున్నా, క్లాసుకు వెళ్లగానే, బోధనలో పడగానే మనసు దూదిపింజలా తేలిపోయేది. అసలు పనిచేస్తున్న కాలేజీలోకి అడుగు పెట్టగానే ఓ ఓ పవిత్రభావన నన్ను అలుముకునేది. ఇదంతా ఆ సరస్వతీ మాత అందించిన దీవెనలా భావిస్తుంటాను ఇప్పటికీ. కానీ ఒక్కోసారి మనసు మరీ బాధపడేదెందుకంటే పదో తారీఖు వచ్చేసింది. ఇంకా జీతమడిగి తీసుకోరా, అడగటం కూడా చేతకాదా? అనే పదునైన ప్రశ్నలు ప్రతినెలా వినాల్సి రావటం. అసలు చదువుకోకుండా ఉంటే ఎంత బాగుండేది? ఒకవేళ చదువుకున్నా ఏ పదో తరగతి తోటో ఆపేస్తే ఎంత బాగుండేది! నేను కళాశాల నుండి స్టడీ అవర్‌ గానీ లేదా అదనపు క్లాసుగానీ ముగించుకుని వచ్చే సమయానికి సూర్యాస్తమయం దాటిపోయేది. సూర్యోదయానికి ముందే అంట్ల గిన్నెలతో కుస్తీలు, వంటింట్లో తలమునకలయ్యే పనులు… నాలుగున్నర ఐదింటికి ఠంచనుగా లేస్తేనే అట్లాట్లా టైము సరిపోయేది. ఒంట్లో నలతగా ఉండి ఏరోజైనా లేవటం ఆలస్యమైపోతే ఇక ఆరోజు చెప్పనే అక్కర్లేదు. ఈ ఇబ్బందులతోటి పోల్చుకుంటే ఇంట్లో హౌజ్‌ వైఫ్స్‌గా ఉంటారే వాళ్లపని చాలా బెస్ట్‌ అన్పిస్తుంది. పైగా భర్త జీతాన్ని తాము అందుకుంటూ ఇంట్లో వాళ్లందరి మీదా పెత్తనం చెలాయించటం, ఇంట్లో అన్నింటికి వాళ్ళ మాటే చెల్లుబాటులోకి తెచ్చుకోవటం ఇవన్నీ గమనిస్తుంటే… నాలాంటి చిరు ఉద్యోగినులందరికీ మిగిలేది ఏంటయ్యా అంటే ఏతావాతా చీవాట్లు, ఈసడిరపులు, పని ఒత్తిడిలో నలిగిపోవటం మినహా ఏం మిగిలిందనీ అనిపిస్తుంది నాకు. కానీ ఓపిక ఉన్నంతవరకు చిన్నదైనా సరే జాబ్‌ చేస్తూ స్వాభిమానంతో బ్రతకటమే ఎంతో మేలుగదా! ఆలోచిస్తూ… ఆలోచిస్తూ… గతాన్ని నెమరు వేసుకుంటూ నేను కూడా ఎప్పుడు నిద్రలోకి జారిపోయానో తెలవదు.

మెలకువ వచ్చి చూస్తే తెల్లారి ఏడన్నరయింది గోడమీద ఉన్న గడియాం చూసేసరికి. నా చెయ్యి మాలినిని చుట్టుకుని ఉంది. పంక్షన్‌లో అలసిపోవటం మూలానో, ఆలోచనలకు నిద్రకు బ్రేకు వేయటమో… మొత్తానికి ఏమైందో తెలియదు గాని, తర్వాత గాఢ నిద్రే నన్ను వరించినట్లుగా అర్థమైంది. మనసు చాలా తేలికయినట్లన్పించింది.

***

ఆలోచనలను, బాధలను దులుపుకున్న మనసులు రాత్రిని కూడా దులుపుకున్నాయి. కప్పుకున్న దుప్పట్లను మడత పెట్టి, వాటి స్థానాల్లో సర్దేసి, బ్రెష్‌, స్నానం పూర్తిచేసుకుని, దేవుని దగ్గర దీపం పెట్టుకుని, టిఫిన్లు పని పూర్తిచేసుకుని ఇద్దరూ తయారవటం మొదలుపెట్టాము. ఎందుకంటే ఈరోజు ఆమని వాళ్ళింటికి వస్తామని తనకు మాటిచ్చాం. నిన్నంతా ఫంక్షన్‌కి వచ్చిన గెస్టులను రిసీవ్‌ చేసుకోవటం, భోజనాలకు తీసుకువెళ్ళటం, మళ్ళీ వాళ్లని సాగనపంటం. మధ్యమధ్యలో ‘మీరు కూడా రావాలి ఫోటోకి’ అని కోరే బంధువులతో, వచ్చిన ఫ్రెండ్స్‌తో స్టేజీ మీదకి ఫోటో దిగటానికి వెళ్ళాల్సి రావటం… ఇన్ని పనుల మధ్య సతమతమవుతూ కూడా కుదిరినప్పుడల్లా మా దగ్గరకు వచ్చి బాగా అయినవారిని మాకు పరిచయం చేయటం లాంటి పనులతో ఆమని హడావుడి పడుతోంది. మా పిల్లల చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు మేమంతా కలిసి ప్రైవేట్‌ కాలేజీలో పని చేశామని వారికి చెప్పటంతో ‘ఆ… ముప్ఫై, ముప్ఫై ఐదేండ్ల స్నేహమా మీది?’ అని వాళ్ళు ఆశ్చర్యపోవటం చూస్తుంటే చెప్పద్దూ… మాకు ఒకింత గర్వంగా

ఉండేది. అది ఆమని వాళ్ళ మనవడి బర్త్‌డే ఫంక్షను, పెండ్లిండ్లు, ఎంగేజ్‌మెంట్లు వాటితో పోల్చి చూస్తే ఇది చిన్నదే గదా!

అందుకే వాళ్ళు ‘ఈ ఫంక్షన్‌కి అంత దూరం నుండి వచ్చారా’ అని ఆశ్చర్యంగా అడుగుతుంటే మా మధ్య పాదుకొని ఉన్న స్నేహ మాధుర్యం నా మనసునిండా సుధలు చిమ్మించేది. ఇదీ అని చెప్పలేని, ఎంత చెప్పినా తనివితీరని, ఎప్పటికీ మాసిపోని మా స్నేహబంధమిది అని వాళ్ళకు ఏం తెలుస్తుంది? అనుకున్నా నా మనసులో.

మొహమాటాన్కి వచ్చేవాళ్లు కొందరు, పరిచయాన్ని పురస్కరించుకుని రాకపోతే ఫీలవుతారని వచ్చేవాళ్లు కొంతమంది, మనింటికి వచ్చారుగదా, మనం కూడా వెళ్ళాలి, బాగోదని కొందరు, దాన్ని బాధ్యతగా భావించి కొందరు, పనిచేసివున్న ఆఫీసు కాబట్టి మొక్కుబడి కోసం వచ్చేవారు ఇంకొందరు, ఒకే అపార్టుమెంటులో ఉండేవాళ్ళము తెల్లారి లేస్తే ఒకరి మొఖాలొకరు చూసుకోవాలి… ఇది తప్పనిసరి అని భావించి అటెండయ్యేవారు కొంతమంది… వాళ్లకూ, మనకూ అంతగా మాటల్లేక పోయినా పిలిచారు కాబట్టి వెళ్ళొద్దాం. వెళ్ళకపోతే మనింటికి మళ్ళీ పిల్చినా వాళ్లు రారు అని మొక్కుబడిగా వచ్చేవాళ్ళు… ఇలా హాలంతా నిండిపోయి మొత్తానికి సందడి సందడిగా, కోలాహలంగా ఉంటే, తిండి కోసమే వచ్చామన్నట్టుగా ఆబగా ప్లేటునిండా వడ్డించుకుని, ఆపై తినలేక వృధాగా పారేసే వేస్టురాయుళ్లు.. ఇందరి మధ్యన వెలుగుతున్న స్నేహ బంధం గొప్పదనం వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుంది చెప్పండి.

అందర్నీ గమనిస్తూ భోజనం చేస్తున్న మమ్మల్ని ‘‘ఆ కర్రీ వేయించుకోండి చాలా బాగుంది. ఇదిగో ఈ కర్రీ రోటీలోకి బావుంటుదని మా పిల్లలు స్పెషల్‌గా చేయించారని, తానే స్వయంగా తెచ్చి వడ్డించటంతో నేనే వారించా ఆమనిని.

‘‘మేమేమన్నా కొత్త చుట్టాలమా? ఏంటి చెప్పు. మాకు కావాల్సింది మేము పెట్టించుకుంటాంలే! అని చెప్తూ అతిథులను చూసుకో ఆమనీ’’ అని ఒకింత గట్టిగా చెప్పటంతో అయిష్టంగానే కదలటం తప్పింది కాదు తనకు. ఆ కబుర్లూ, ఈ  కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి, తలా ఓ కప్పు ఐస్‌క్రీము తినే పనిలో పడ్డాం. మాకు తెలిసిన వారిని పలకరిస్తూ, వారి యోగక్షేమాలు కనుక్కంటూ మధ్యమధ్యలో మా మా హ్యాండ్‌ బ్యాగ్‌ల మీద ఓ కన్నేసి ఉంచుతున్నాం. తప్పదుగదామరి! జనం తొక్కిడిలో వున్నప్పుడు మన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేగదా!

అతిథుల తాకిడి క్రమక్రమంగా తగ్గుతోంది. నిండుగా ఉన్న ఆ హాలు పలచబడుతూ, పొందికగా వేయబడ్డ కుర్చీలు అయిష్టంగా ఉన్న వ్యక్తులు ప్రక్క ప్రక్కనే ఉన్నా ఎలా పెడమొఖంగా ఉంటారో అట్లా ఉన్నాయి. బఫే మూలంగా అక్కడక్కడా వాటర్‌ తాగిన గ్లాసులు, ఫంక్షన్‌ మధ్యలో సర్వ్‌చేసిన కూలింగ్‌ డ్రిరక్‌ బాటిల్సు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడివున్నాయి. ఇంట్లో ఏదన్నా అభిప్రాయ బేధాలు లేదా గొడవలు జరిగినపుడు కుటుంబంలో ఏదో కష్టపడిపోయినట్లు. ‘ఇక మేం వెళ్లొస్తామండీ!’ అంటూ ఆమని దంపతులకు చెప్పి వెళ్తున్నారు వచ్చిన అతిథులు.

ఎక్కడి వాళ్లక్కడ స్తబ్దుగా ఉన్నట్లుగా తోచసాగాయి వాటిని చూస్తుంటే. సందడి సద్దుమణిగింది. మేం కూడా ఆమని దంపతులకు వెళ్లొస్తామని చెప్పి బైల్దేరాం అక్కడి నుండి.

మాలిని, నేనూ ఆటోలో వెళ్తున్నామన్న మాటేగానీ కందిరీగల్లా ఆలోచనలు ముసురుకోసాగాయి నా మనసులో.

‘‘ఆమని ప్రొద్దున్న కాల్‌ చేసింది నాకు. చూసుకోలేదు. ఇటురావటానికి తయారయ్యే ధ్యాసలోపడి’’ అంది నవ్వుతూ మాలిని నాతో.

వింటున్నట్లుగా తనని చూసి తలపంకించాను నేను.

‘‘ఈ పూట భోజనానికి రావాలి తప్పకుండా’’ అని మెజేస్‌ పెట్టింది. నేను ఫోన్‌ చూసుకోలేదని’’ అంది మాలిని మళ్ళీ.

మళ్ళీ ‘ఊ’ అన్నాను తల ఊపుతూ.

ఫంక్షన్‌ కొచ్చిన కొంతమంది అట్నుంచి అటే వెళ్లినా దగ్గిర బంధువులు కొందరైనా ఇంటికొచ్చి బస చేస్తారుగదా! వద్దంటే వినదు.

అసలు తననోసారి కలిసి కాసేపుండి ఆ బర్త్‌డే బుడ్డోడ్ని మరోసారి ఎత్తుకొని మురవాలని నా ఆశ. మాలినిది కూడా అదే ఆశ. ఆ ఆలోచనతోటే ఉన్న మాకు భోజనానికి ఇక్కడికే రావాలన్న ప్రేమ పూర్వక ఆదేశంలాంటిది అందటంతో తప్పించుకోలేకపోయాము మేమిద్దరం. మాలిని మనసులోని భావాలు కూడా ఇవే సాగుతున్నట్లుగా అర్థమవుతున్నాయి తన ముఖ కవళికలను చూస్తుంటే.

‘‘అవునబ్బా మైథిలి… రామారావు అన్నయ్యగారు చాలా మారిపోయారు. మునుపటిలాగా కాదు. నిప్పులోంచి పుటం పెట్టి బైటికి తీసిన వ్యక్తిలాగా స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో మెరిసిపోతుంటారు’’ నిండైన మనసుతో తొణికిసలాడుతుంటారు’’ అంది నాతో.

‘‘అవును భార్యభర్తలిద్దరూ చాలా హెల్పింగ్‌ నేచర్‌ ఉన్న సహృదయాలు అంటూ గతంలోని ఒక సంఘటనను ఇలా పంచుకుంది మైథిలి మాలినితో.

మా పెద్ద మనవరాలు పుట్టినపుడు హాస్పిటల్‌లో…

మా పెద్దమ్మాయి కిరణ్మయిని కాన్పు కోసం హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు మా ఇంటి చుట్టూతా ఉన్న ఆడపడుచులూ, మా తోటికోడలు అందరూ వచ్చారు రావటానికైతే. దానికి తొలిచూలు. నాకూ క్రొత్త. ఏదో భయంతో కూడిన హడావుడి. కాలూ చెయ్యి ఆడట్లేదు నాకు కంగారులో. ఉమ్మనీరు పడిపోవటంతో కాన్పు కష్టమయ్యేట్లుందని డాక్టరమ్మ సిజేరియన్‌ చెయ్యాలని చెప్పి మావారితో సంతకం తీసుకున్నారు. సర్జరీకి కావలసిన ఫార్మలిటీస్‌ ఏవో ఉంటాయి గదా! చకచకా ఆ పనులు పూర్తవుతున్నాయి ఒక ప్రక్కనుంచి. రెండోవైపు పిల్లని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు నర్సులు. నాకేమో ఇంకా భయం పెరిగిపోతోంది మనసులో. ఎట్లా బైట పడుతుందో ఏమోనని ఆదుర్దా మావారి మొహంలో స్పష్టంగా కన్పడుతోంది. ఎప్పుడూ ధైర్యం చెదరని వ్యక్తి ఆయన గంభీర వదనంలో కూడా కంగారు స్పష్టంగా కనబడుతోంది. ఏమి చెయ్యడము. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. అప్పుడు మా చిన్నపాప హరిణి అక్కడే ఉంది. ముందుగా ఈ  విషయం వెంటనే ఆమనికి ఫోన్‌ చేసిందట తను. కబురందిన వెంటనే ఆఘమేఘాలమీద వచ్చి వాలారు ఆమని దంపతులు. ఇక్కడొక విషయం చెప్పాలి. తను ఒక్కతే వస్తే చాలు నాకు సాయం చేయటాన్కి. కానీ తనతోపాటుగా వాళ్ళ వారు రామారావు అన్నయ్యగారు కూడా వచ్చి చాలా సేపటి వరకూ అక్కడే ఉండిపోయారు మాతోపాటుగా. మా బంధుగణం వాళ్ళల్లోవాళ్ళు ఛలోక్తులు వేసుకుంటూ టైంపాస్‌ చేస్తున్నారుగానీ, ఒకళ్లైనా వచ్చి ‘భయపడకు మైథిలీ, ఏం కాదు కిరణ్మయికి. తేలికగానే బయటపడుతుంది అని ఒక్కరు కూడా నాకు ధైర్యం చెప్పటం కాదుగదా, కట్టకట్టుకున్నట్టుగా అందరూ ఓ ఫ్యాన్‌ కింది చేరిపోయారు. నేను, మావారు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాము, థియేటర్‌ బయట తలుపులకు దగ్గరగా నిలబడి. నర్సులు బైటకి వచ్చి కొబ్బరినూనె, ఇంకా పాత క్లాతులు ఇట్లా ఏవేవో అడుగుతుంటే మా చిన్నపాపే అందిస్తోంది వాళ్లకు. నా ప్రక్కనే నిలబడి ఆమని నా చెయ్యి పట్టుకుని ‘ఏంకాదండీ… కంగారు పడకండి’ అంటూ ఉపశమనపు మాటలు చెబుతోంది. తన మాటలకు కాస్త ఊరట లభించింది నాకు. కొంచెం తెప్పరిల్లాను. ఈలోపులో థియేటర్‌లో నుండి అప్పుడే పుట్టిన చంటిపాప ఏడుపు కేర్‌కేర్‌ మని (పెద్దగా) వినపడటంతో అందరి మొహాల్లో నవ్వులు విరబూశాయి. ఈలోగా ఒక నర్సు తలుపు కొద్దిగా తెరిచి, ‘మీకు మనవరాలు పుట్టింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నార’ని చెప్పటంతో, ఇంతవరకూ పడ్డ ఆ కంగారూ, ఆదుర్దా ఎటు ఎగిరిపోయాయో తెలియదు. నా మనసు ఆనంద తరంగమైంది. మావారి మొహంలో సంతోషం ఎగిసిపడుతోంది.

ఇంతలో పాపను హాస్పిటల్‌ డ్రస్సప్‌తో చలిగాలి తగలకుండా భద్రంగా చుట్టి నాకు తెచ్చివ్వబోతుంటే, చటుక్కుమని ఆమని తన రెండు చేతులను చాచి పదిలంగా అందుకుంది. నాకేమీ అర్థం కాలేదు.

‘‘రండి మైథిలీ… మనమిప్పుడు పీడియాట్రిషన్‌ దగ్గరకు వెళ్ళి వ్యాక్సిన్‌ వేయించాలి బేబీకి’’ అంటూ అన్నయ్యగార్ని ఆటో తెమ్మని పురమాయించింది.

మావారు, మా చిన్నపాప కిరణ్మయిని చూసుకుంటానికి అక్కడే ఉన్నారు. బంధువుల కబుర్లు కొనసాగుతూనే ఉన్నాయి. హరిణీ అక్కను జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ, మావారి నుండి నేను కొంత డబ్బు అడిగి తీసుకుని, ‘జాగ్రత్తగా చూసుకోండి కిరణ్మయిని’ అని చెబుతూ, ఆమనితోబాటుగా నేనూ నెమ్మదిగా మెట్లుదిగి, అన్నయ్యగారు రెడీగా తెప్పించి ఉంచిన ఆటోలో జాగ్రత్తగా ఎక్కి, పిల్లల హాస్పిటల్‌కు చేరుకుని, పాపాయికి వ్యాక్సిన్‌ వేయించుకుని తిరిగి హాస్పిటల్‌కు నేను, ఆమని చేరుకున్నాము. రిసెప్షన్లో రూం నెంబరు కనుక్కుని రూమ్‌లోకొచ్చాము. మత్తు

ఉంటుందిగా కొద్దిపాటి మూలుగుతో మంచం మీద పడుకో పెట్టబడి ఉంది కిరణ్మయి. మావారు మెడిసిన్స్‌ తీసుకోవటాన్కి క్రింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న మెడికల్‌ షాపుకు వెళ్ళినట్లుగా చెప్పింది హరిణి. ఎంతో పదిలంగా ప్రేమతో పాపాయిని కిరణ్మయి ప్రక్కన జాగ్రత్తగా పడుకోబెట్టి, అంతే జాగ్రత్తగా బెడ్‌షీట్‌ను కప్పింది ఆమని, చలిగాలి తగలకుండా. మనసులో ఏ మారుమూలో దాగివున్న కంగారు, భయం క్రమేపీ తగ్గసాగాయి నాలో. ఆమని లేకపోతే నేను పాపాయిని వ్యాక్సిన్‌కి తీసుకెళ్లటం, తీసుకురావటం ఖచ్చితంగా చేయలేననిపించింది. తను ఉండబట్టి సరిపోయింది. అప్పుడే పుట్టిన బేబీస్‌ను ఎలా ఎత్తుకోవాలో తెలవదు నాకు. ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా ఆమని రెండు చేతులూ పట్టుకుని `

‘‘థ్యాంక్స్‌ ఆమనీ’’ అన్నా నిండైన మనసుతో, ఆనంద భాష్పాలు నిండిన కండ్లతో. గద్గదమైన కంఠం నుండి ఎక్కువ మాటలు వెలువడలేదు నాకు.

‘‘ఇవేం మాటలు. ఇలాంటి మాటలుండకూడదు ఫ్రెండ్స్‌ మధ్యలో’’ అంటూ నా వీపు నిమిరి, ఎనలేని ధైర్యాన్నిచ్చిన ఆపన్న ధైర్య హస్తం ఆమనిది.

బంధుగణం అనబడే మావాళ్లు నెమ్మది, నెమ్మదిగా ఒక్కొక్కరు మెచ్చుకోళ్ళుగా అభినందనలు చెబుతూ వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోవటానికి తిరుగు ముఖం పడుతున్న సమయంలో, మావారు పెద్ద మందుల పెట్టెతో వచ్చారు రూంలోకి. ఆ వెనుకే వచ్చిన నర్సు ఇంజక్షన్‌ని లోడ్‌ చేసుకుంటూ, ‘పాపాయికి మధ్య మధ్యలో దూదితో డిస్ట్రిల్‌ వాటర్‌ని చప్పరించేటట్లు చేయండి’ అంటూ కొంచెం దూదిని, డిస్ట్రిల్‌ వాటర్‌ బాటిల్‌ను నాకు ఇవ్వబోతే, ‘మీరాగండి’ అంటూ తనే అందుకుంది ఆమని.

ఆ వెళ్తున్న వాళ్లను చూస్తూ ఎవరన్నా ఇక్కడుండండి మైథిలికి తోడుగా అని మావారు అనబోతండగా, అది వినిపించుకునే స్థితిలో లేని వాళ్ళ కదలికలు ‘వెళ్ళొస్తాం మైథిలీ’ అని తిరుగుటపా కట్టారు. చేసేదిలేక వాళ్ళ వాళ్ళు కదా! పైగా మాతోపాటు వచ్చారాయె! బాగోదని క్రిందిదాకా వెళ్ళి వాళ్లు వెళ్ళిన తర్వాత పైకి రూంకి వచ్చారు మళ్ళీ మావారు.

‘‘మీకు తోడుగా నేనుంటాను ఈ నైట్‌కి ఇక్కడ. ఇద్దరం కల్సి తల్లి పిల్లల్ని చూసుకుందాం’’ అంది ఆమని నాతో.

ఎంతో భరోసానిచ్చిన తన మాటలను, తోడుండి తెల్లవార్లూ కిరణ్మయినీ, పాపాయినీ చూసుకున్న తీరుని నేను ఈ జన్మలో మర్చిపోలేను.

‘‘ఓయ్‌, మైథిలీ!’’ అని గట్టిగా మాలిని నా భుజాన్ని కుదపటంతో నేను గతంలోంచి వాస్తవంలోకి వచ్చిపడ్డాను. ఆటోనేమో ఆమని వాళ్ళ అపార్ట్‌మెంటు ముందుకొచ్చి ఆగింది.

డబ్బులిచ్చి ఆటోవాణ్ణి పంపేసి, ఇద్దరమూ లోపలికెళ్ళి లిఫ్ట్‌ సాయంతో పైకి చేరుకుని సరాసరి ఆమని వాళ్ళ పోర్షన్‌ ముందు ఆగాము.

ఇంకా కొంతమంది బంధువులున్నారు. చిన్నపిల్లలు బొమ్మలతో ఒకరిద్దరు పిల్లలు కార్టూన్‌ నెట్‌వర్క్‌ చూస్తూ ఒకింత హడావుడిగా ఉంది, మెస్‌ డోర్‌ లోంచి చూస్తుంటే. కాలింగ్‌ బెల్‌ నొక్కింది మాలిని. వెంటనే మా కోసమే ఎదురు చూస్తోందేమో… బెల్‌ మ్రోగిన వెంటనే సంతోషంగా వచ్చి మెస్‌ డోర్‌ తీసింది ఆమని నవ్వుతూ. తన వెనకే అన్నయ్యగారు కనపడ్డారు. ఇద్దర్నీ విష్‌ చేసి అక్కడున్న సోఫాలో కూర్చున్నాము. వాటర్‌ కావాలా? కాఫీగానీ, టీ గానీ తాగుతారా అని అడిగింది మమ్మల్ని.

‘‘అయ్యబాబోయ్‌! కాఫీ, టీలు ఏమీ వద్దు. అన్నీ అయ్యాయి. ఇప్పుడేం వద్దు. కాసేపయ్యాక భోజనాలు చేసేద్దాం’’ అన్నా ఆమనితో. సరేనని తనుకూడా తలవూపుతూ మాతోపాటు కూర్చుంది కాసేపు. ఎంత కేటరింగ్‌ అయినా, ఫంక్షన్‌ జరిగిందంటే ఆ ఇంట్లో అదేనండీ ఫంక్షన్‌ హాలయినా చేసిన వారికి అలసట అన్ని వస్తువులు సర్దుకునేవరకు హడావుడి మామూలే. దీనికేమాత్రం విరుద్ధంగా లేదు ఆ ఇల్లు.

‘‘ఇప్పుడీ భోజనాలు, గీజనాలూ పెట్టుకోకపోతే ఏమైంది ఆమనీ’’ అన్నా.

‘‘ఆ… ఇక్కడున్న మేమంతా ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటాం. నువ్వు మాత్రం రాలేకపోతున్నావుగా. ఇప్పుడొచ్చావు ఎలాగో! మళ్ళీ ఎన్నాళ్లకో’’ అంది కొంచె నిష్ఠూరం నిండిన స్వరంతో.

‘‘ఆ… ఇక అలాంటిదేమీ లేదోయ్‌! కనీసం రెండు నెలలకొకసారయినా వస్తుంటాను’’ అన్నాను నమ్మకంగా. కొంచెం అనారోగ్యం బారినుండి కోలుకున్నాననే ధైర్యం వచ్చింది కాబట్టి.

‘‘అవును… ఇకనుండీ తప్పకుండా వస్తుంది మనల్ని కలవటాన్కి’’ అని నా అభిప్రాయాన్ని సమర్థించింది మాలిని.

నైటీ మీద ఉంది ఆమని. పాపం ఇంతసేపూ వంటపనిలో ఉందిగదా. ఇప్పుడే డ్రస్‌ ఛేంజ్‌ చేసుకుని వస్తా, మాట్లాడుతుండండి’’ అంటూ లోపలికి వెళ్ళింది.

మేమొచ్చిన అలికిడిని తెలుసుకున్నట్లుంది. నిన్నటి వేడుకకు కర్త, కర్మ, క్రియలుగా వెలిగిన జంట బర్తడే బాబుతో హాల్లోకి వచ్చారు. అసలు వాళ్లమ్మ చంకలో ఉండట్లేదు వాడు. కిందకి దిగి పరుగెత్తాలని వాడి ఆలోచన. ఇక లాభం లేదనుకుని తల్లి బాబుని కిందకి దింపింది. అసలు నిన్నే బాబు ఫంక్షన్‌ హాల్లో పరుగులు పెడుతుంటే ఎక్కడ పడిపోతాడో ఆ కార్పెట్లూ, కుర్చీలూ తగిలి, అనే భయంతో వెనుకెనుకే తిరిగారు బాబు తాతైన రామారావుగారు. ముందు వచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అంటారు ఇదేగదూ అంటే చంద్రిక పగలబడి నవ్వింది. ఆ నవ్వుతో శృతి కలిపారు హాసిని, పద్మిని, మాలినులు. ‘అంతేగదా’ అంటూ.

అలా కిందికి దింపిందో లేదో తల్లి… బాబు హాలంతా తిరుగుతూ నన్నెవరూ చూడట్లేదులే అని గమనించినప్పుడల్లా పరుగులు తీస్తున్నాడు.

సంవత్సరమన్నా వెళ్లిందో లేదో ఆ బుడతడు అలా వేగంగా నడుస్తూ ఎవరికీ అందకుండా పరుగెత్తాలనే ఆ చిన్ని బుర్ర ఆలోచనకు నాకెంతో ముద్దొచ్చి, అమాంతం దగ్గిరగా వెళ్లి ఎత్తుకున్నాను. నవ్వు మొహం బాబుది. ఎవర్ని చూసినా కిలకిలా నవ్వుతాడు. బాబు మొహాన్ని మరింత అందంగా మారుస్తోంది వాడి చలాకీదనం.

అన్నయ్యగార్కి ఫోటోలు తియ్యమని సైగ చేశాం. వెంటనే దాదాపు ఓ ఐదారు ఫొటోలు ఫాస్ట్‌గా క్లిక్‌ చేశారు. బాబుని వాళ్లమ్మ కిచ్చాను. ఇంతలోకి లోపలనుంచి వచ్చిన ఆమని డైనింగ్‌ టేబుల్‌ మీద భోజనాలు సిద్ధం చేస్తూ, రమ్మని పిలవటంతో సింక్‌ దగ్గిరకు వెళ్లి చేతులు కడుక్కుని మాలిని, నేను డైనింగ్‌ డేబుల్‌ దగ్గరకు చేరుకున్నాము. ‘నువ్వు కూడా మాతోపాటు కూర్చో ఆమనీ’ అని పిలవటంతో తనూ మాతో చేరింది టేబుల్‌ దగ్గరకు. అన్నయ్యగారు కూడా వచ్చి కూర్చున్నారు భోజనానికి. పప్పు, చిక్కుడుకాయ కూర, పచ్చడి, సాంబారు, వడియాలు, ఒక ఆకుకూర… అన్నీ మా నల్గురికీ అందుబాటులో ఉండేవిధంగా అమర్చింది ఆమని.

* * *

మేము వడ్డించుకుందామనే లోపులోనే అన్నయ్యగారు కొన్ని పదార్థాలు, అమని కొన్ని పదార్థాలు మా ప్లేట్లలో వడ్డించి, వాళ్ళు వడ్డించే పదార్థాలకి నో చెప్పే అవకాశం లేకుండా చేశారు మొత్తానికి ఇద్దరూ కలిసి. సరదాగా కబుర్లాడుకుంటూ భోజనం ముగించాము. రామారావు అన్నయ్యగారు జోక్స్‌ కట్‌ చేస్తూ, తనకు ఉద్యోగం వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాం. మా టీచింగ్‌ పీరియడ్లో చూడటమే ఆయనని. సరదాగా మాట్లాడ్తారు రామారావు అన్నయ్య అని మాలిని చెబ్తుండగా, చాలాసార్లు వినివున్నాను గానీ, ఇంత క్లోజ్‌గా, సరదాగా స్వంత అన్నయ్యలాగా మాట్లాడటం చూస్తుంటే ఆ అభిమానానికి నా కండ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. అది వారికంట కనపడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించాను నేను.

మాలిని వాళ్ళ కొడుకు, కోడలు ఉండేది, ఆమని వాళ్ళు ఉండేదీ అదే ఊరు. కానీ నేనే చాలా సంవత్సరాల తర్వాత కలిసి, చూస్తున్నందువల్లనో ఏమో… నిన్నటికి నిన్న పద్మిని దంపతులు, చంద్రిక వాళ్లింటో, వారు చూపించిన అభిమానం, మాలిని వాళ్ళ కొడుకు, కోడలు నన్ను రిసీవ్‌ చేసకుని అక్కున చేర్చుకున్న తీరు… ముఖ్యంగా మా అందరి పిల్లలు (ఒక్క హాసినికి మినహాయించి) మా కాలేజీలోనే, అంటే మేము పని చేసిన కాలేజీ విద్యార్థులవ్వటం వల్ల అప్పట్లో మేడమ్‌ అని సంభోదించినా, అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపు ద్వారా ఆంటీగా మారిపోయా. ఈరోజు అది నన్నెంతో సంతోషానికి అంతకు మించిన సంతృప్తిని మూటకట్టించింది. ఇలాంటి స్నేహితులుంటే చాలుగదా! వీరి ముందు సొంత చుట్టాలైనా బలాదూరే నన్పించింది. ఇదేమాట మాలినితో అంటే ‘‘అంతేనబ్బా’’ అంది తను కూడా.

ఓ గంట కూర్చున్నాక, బస్టాండుకు బయల్దేరాను నేను, అందరి దగ్గరా సెలవు తీసుకుంటూ. మాలిని, ఆమని ఇద్దరూ బస్టాండుకు వచ్చి, బస్‌ వచ్చేవరకు నిరీక్షించి, రాగానే నన్ను బస్సెక్కించి జాగ్రత్త అని చెప్పి, బైబై చెబుతూ, ఆటోలో వాళ్ళిద్దరూ వారి వారి ఇండ్లకు వెనుతిరిగారు.

***

ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. మా జీవితాలు పరచిన ఎర్ర తివాచీలు అసలే కావు. ఇంటా, బయటా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఎన్నో ఢక్కా మొక్కీలు తిని పడిలేస్తూ, లేస్తూ పడుతూ… ఇదిగో ఈనాటికి అన్ని బాధ్యతలూ తీరిపోయాయి కాబట్టి నిన్నటి పుట్టినరోజు వేడుకని అంత ఆనందమయం చేసుకోగలిగాము.

టిక్కెట్‌ అన్న కండక్టర్‌ పిలుపుతో మనీ పర్సు తెరచి సరిపడా డబ్బులిచ్చి టికెట్‌ తీసుకొని, పర్సులో పెట్టి విండోకి దగ్గిరగా జరిగి కూర్చున్నాను.

వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించసాగింది. కిటికీలోంచి చల్లని గాలి మొహానికి తాకి, నా ఆహ్లాదానుభూతిని అది రెట్టింపు చేసింది.

ఆమని అందమైన పేరు. కానీ పేరుకీ, జీవితానికీ ఎటువంటి లంకె కుదరదు ఒక్కోసారి. కాలం కుదిపే కుదుపులకు అతీతులం కాదెవరమూ. వాటిని తట్టుకుని నిలబడేదే గదా జీవితమంటే.

ఒకరకంగా చెప్పాలంటే మా ఫ్రెండ్సందరి పేర్లూ చాలా సౌందర్యవంత మైనవే. అలా సాగిపోవాలనే ఆశతోటి మా తల్లిదండ్రులు చిన్నతనంలో పెట్టినవే. కానీ మానవుడు తలచేదొకటి, జీవితంలో జరిగేది వేరొకటి. అందరమూ ఈ కాలచక్ర భ్రమణంలో ఎదురయ్యే కష్టాలతో ఈడ్వబడుతూ అప్పుడప్పుడూ అతిథుల్లా పలకరించే సంతోషాలను బూస్టింగ్‌లా భావిస్తూ గెలుస్తూ ఓడిపోతూ, కొన్నాళ్ళు ఓడిపోతూ, గెలుస్తామనే ఆశతో కొన్నేళ్ళు… గెలుపు, ఓటముల కలయికే జీవితమనే యదార్థాన్ని జీర్ణం చేసుకుంటూ కాలంతో నడిచిన వసంతాలు కొన్ని.

ఏంటో ఈమధ్య బాగా వేదాంతం పుట్టుకొస్తోంది నాలో. ఇది వయసుతో పాటు ఆపాదింపబడినదా లేక జీవిత వాస్తవాల నుండి ఎగజిమ్మిన లావాలా చిలకరింపా? ఏదో మొత్తానికి వాటన్నింటినీ తట్టుకుంటూ, ఒకరకంగా చెప్పాలంటే మొండిగా అధిగమిస్తూ… ఇవాళ ఇలా నిలబడిగలిగాం మేమంతా. ఇంటింటికో చరిత్ర అన్నట్లుగా ఒక్కో కుటుంబానిది ఒక్కోగాథ. ఒక్కొక్కసారి జీవితంలో తెలుపు, నలుపుల మలుపులు. ఈనాటికీ చదరంగంలాంటి జీవిత పాఠాల, గుణపాఠాల గడులను నేర్పు అనే ఓర్మితో, ఒంటపట్టిన పాఠాలను నెమరువేస్తూ బంధాలను నిలుపుకుంటూ, గుణపాఠాల బడిలో ఇంకా నిత్య విద్యార్థులుగానే వెలుగుతూ అవసరమైన అంశాలను సేవ్‌ చేసుకుంటూ మనోవ్యాధికి గురిచేసి కుంగుబాటుని రానివ్వగల సంఘటనలను మొదడు నుండి డిలీట్‌ చేసుకుంటూ… అప్పుడప్పుడూ ఇదిగో ఇలా ఈ స్నేహ పరిమళాలను రీఛార్జ్‌ చేసుకుంటూ బ్రతుకు బ్యాటరీని వెలిగించుకుంటున్నాం.

మధ్యలో ఏదో ఊరొచ్చింది. పల్లీలు అమ్మేవాడి కేకలు చెవిలో ఘొల్లు మంటుంటే, ఆలోచనలతో ఓ కునుకు తీసిన నాకు గబుక్కున మెలకువ వచ్చింది.

మనసు మాయలమారి పుట్ట అంటారు చాలామంది. మనకు కోరికలను చుట్టేసి మనచుట్టూ మాయలనే పుట్టలాగా చుట్టగల నేర్పరి. కానీ నేను అనుభవాల పుట్ట, అల్లరి పుట్ట, జ్ఞాపకాల మాళిగ అని కూడా అంటాను, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.

మనం ఖాళీగా ఉన్నామని పసిగడితే చాలు ఒక్కో జ్ఞాపకాన్ని గాని, ఒక్కో సంఘటననుగాని మనమీదకు అస్త్రంగా సంధించి చోద్యం చూస్తూ మన మానసిక బలాబలాలను లెక్కగట్టే ఓ గొప్ప యంత్రమే మన మనసు.

వ్యసనాలు కొక్కేనికి తగిలించే చొక్కాలు కావు. అవి మనుష్యుల్ని రాపాడిరచి, చీడపురుగులై వ్యక్తిత్వాలను నిలువెల్లా కూల్చేస్తాయి. ముందు సరదాగానే మొదలవుతాయి. తర్వాత అలవాట్లుగా మారి కూర్చుంటాయి. వాటికి బానిసలుగా మారిన వారితో అనుక్షణం దాసోహం చేయించుకుంటాయి. చిత్తు చిత్తు చేస్తాయి జీవితాలను. ఒక్కరితోపోదు ఈ పీడ. చెట్టు వేళ్లను పెకిలిస్తే, ఇక చెట్టుకున్న కొమ్మలేం పచ్చగా ఉంటాయి? పూలేం పూస్తాయి? కాయలేం కాస్తాయి? చివరికి అంతా నాశనమే. వ్యసనాల బారినపడిన కుటుంబాలదీ అదే పరిస్థితి. మేల్కొంటే జీవితం మధ్య పేజీలో ఉన్నా ఆనందమే అంతటా. జీవితం వంద పేజీల పుస్తకమైతే మా జంటలన్నీ సెంటర్‌ పేజీని క్రాస్‌ చేసిన చదువరులమే!

ఆమధ్య పురా స్నేహితురాలు కలిసింది. తనపేరు సువర్ణ. ఇంచుమించు నా వయసే. మనసు మాణిక్యం. పేరుకు తగ్గట్టే పసిడి వర్ణం, గులాబీ వర్ణం రెండూ కలిపితే ఏర్పడే మేనిఛాయ తనది. పెద్ద పెద్ద కండ్లు. తీర్చినట్లుండే కనుబొమ్మలు. ఇంద్రధనువులా వంపు తిరిగి నల్లగా ఉంటాయి. వంకీల జుత్తు. పోనీ వేసుకుంటుంది. చేతినిండా మట్టిగాజులు. మాటలో సౌమ్యం. నడతలో నమ్రత. చీరకట్టులోనైనా, డ్రెస్‌లోనైనా తిరిగి చూడాలనిపించే అందమైన, ఆకర్షణీయమైన రూపం. నవ్వినపుడు తళుక్కుమనే పలువరుసని చూస్తే దానిమ్మ గింజలు కూడా అలుగుతాయేమో నన్పిస్తుంది. మా ఇద్దరిదీ ఒకేవూరు. వారి శ్రీవారిది, మా శ్రీవారిదీ ఒకటే డిపార్టుమెంటు అవ్వటం మూలంగా తరచుగా అనేకంటే దాదాపు అన్ని పెండ్లిళ్లల్లో, వేడుకల శుభసమయాల్లో కలుస్తుంటాం. అలా పరిచయం కాబడ్డ మేము క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయిపోవటానికి ఎన్నో రోజులు పట్టలేదు.

తరచుగా కలిసినపుడు, అదే చాలా ఏండ్ల నాటి సుపరిచయమై కష్టసుఖాలను మనసు విప్పి చెప్పుకునే స్థాయికి ఎదిగేట్టు చేసింది. అలాగే సంత రోజుల్లో కూడా కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినపుడు లేదా ఏదైనా షాపింగ్‌ సమయాల్లో కలిసేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్లం.

అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపులు, ఛాటింగ్‌లు ఉండనే ఉంటాయి. ఒకసారి కలిసినపుడు… ఎప్పుడూ కలివిడిగా, సందడిగా తిరిగే తను ముక్తసరిగా మొహంలో ఏదో చెప్పనలవికాని బాధ గూడు కట్టుకున్నట్లు కనిపిస్తే, నేనే అడిగాను ‘ఏంటి సువర్ణా ఇలా ఉన్నావు? మొహంలో హుషారు కనబడట్లేదేంటి? పిల్లలకేమన్నా ఒంట్లో బాగోలేదని కబురొచ్చిందా?’ అన్నా. ‘ఊహూ…’ అంటూ తల అడ్డంగా ఊపింది కాదన్నట్లుగా.

‘మరి మీ వారికి ఏమైనా అనారోగ్యమా’? అని అడిగా.

దానికీ కాదని మళ్లీ తల అడ్డంగా ఊపింది. ఈసారి తన కండ్లలో సన్నని నీటిపొరను చూశాను. ఎందుకో నా మనసు కలుక్కుమంది. ఆనోటా, ఈనోటా వాళ్లింటాయన గురించి విన్నాను. తర్వాత ఒకరిద్దరి ద్వారా తెలిసినది ‘నిజమే… సువర్ణ వాళ్ళాయన చాలా అనుమానం మనిషి’ అని. నాకెందుకో బాగా డౌట్‌ వచ్చింది. ఆ హాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. బాగా పరిచయస్తులవ్వటంతో మేము అంటే నేను, సువర్ణ ముందుగానే వెళ్ళాము. ఆలస్యంగా వెళితే బాగోదని. ఈ వ్రతం, పెట్టుబడులు అవ్వీ ఇవ్వీ అయ్యేటప్పటికి కనీసం గంటన్నర పైచిలుకే పట్టేట్లుంది. ఇక లాభం లేదు. తన మనసెందుకో బాగా బాధపడుతోందని అర్థమైంది. కనుక్కోవాలనుకున్నాను. అది గృహప్రవేశ ఫంక్షను. అంతకుముదే అవతలి రూంలో గణపతి హోమం చేశారు. ఇవతలి రూంలో వ్రతం పెట్టుకున్నారు. దీపారాధన వెలిగించబడి ఉన్నది గదా స్వామి వారి మంటపం ముందు ఫ్యాన్లు బంద్‌ చేసేశారు. నిజంగా ఆ హోమపు పొగ ఇవతలికి కూడా బాగా వస్తోంది. ఈ వంకతో తనని ‘కాసేపు అటు బైట కూర్చుందాం రా… పొగ తగ్గాక లోపలికి వద్దాంలే’ అంటే, సరేనని తల ఊపింది.

గట్టిగా అడిగితే చాలు ఆ కన్నీటి కుండలైన ఆ కండ్ల నుండి ధారగా మారటానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్ళు. నెమ్మదిగా తన భుజం చుట్టూ లాలనగా నా రెండు చేతులను చుడుతూ ‘ఏమైంది?’ అని అడిగా. ఇక నీవు చెప్పకపోతే ఊరుకోనన్నట్లుగా చూశాను. చెప్పకపోతే వదిలేలా లేదనుకుంది కాబోలు, అటూ ఇటూ తటపటాయిస్తూ చూసింది నాల్గువైపులా భీత హరిణిలా.

గృహ యజమాని, భార్య, వారి పిల్లలు వ్రతం చేసుకుంటున్నారు బుద్ధిగా దగ్గిర బంధువులని పిలవబడే వాళ్ళు వారి చుట్టూ జంపఖానాల మీద కొందరు మోకాళ్లనొప్పి, నడుము నొప్పి బాధితులు కుర్చీలలో కూర్చుని శ్రద్ధగా స్వామివారి కథను వింటన్నారు. మగవాళ్ళు బైట వరండాలో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు.

‘మనవేపు ఎవరూ చూడట్లేదుగాని, ఏంటమ్మాయి ఈరోజు చాలా మూడీగా ఉన్నావు’ అని నిలేశా. ఏ ఇంటిలోనైనా ఉత్తరం సందు వదులుతారు గదా. అలానే ఉంది ఆ ఇంటికి కూడా. అక్కడే సేఫ్‌ అని నే అటుదారి తీశా, కుర్చీ తీసుకుని, నాతోపాటే తానూ తన కుర్చీ తెచ్చుకుంది అక్కడికి.

గతంలో చిన్ని చిన్ని విషయాలు చెప్పి బాధ పడేదికానీ, దానిని మించిన బాధ పడ్తోందీరోజు అన్పించింది తన వాలకం చూస్తుంటే. కండ్లనిండా ధారగా కురుస్తున్న కన్నీటిని కర్చీఫ్‌తో అద్దుకుంటూ, సన్న గొంతుకతో, కేవలం నాకు మాత్రమే వినపడేటట్లుగా లో గొంతుకతో చెప్పటం ప్రారంభించింది. మా కష్టసుఖాలేవి కలబోసుకున్నా అవి మా కడుపులోనే ఉంటాయి. ఒకరిమీద మరొకరికి అలాంటి నమ్మకం ఉంది మాకు ఇప్పటికీ, ఎప్పటికీ. అది మాకు బాగా తెలుసు.

‘‘నేను రోజూ యోగా క్లాస్‌కి తెల్లవారురaామునే వెళ్తాను కదా!’’ అంది దుఃఖాన్ని తమాయించుకుని.

‘‘అవునూ’’ అన్నాను. తను, నేనూ యోగా క్లాసులో కూడా తను ముందు వెళితే, నా మ్యాట్‌ను ప్రక్కనే వేసి ఉంచేది. అలాగే ఒకవేళ నేను ముందుగా వెళ్ళినపుడు నా ప్రక్కనే తనకు మ్యాట్‌ వేసి ఉంచేదాన్ని. దాదాపు రెండేళ్లు యోగా క్లాస్‌ మేట్స్‌మి కూడా. తర్వాత నాకు కొంచెం అనారోగ్యంగా ఉండటంతో ఒక సంవత్సరం అయిపోతుంది వెళ్ళక. ఇంట్లోనే ప్రాణాయామం చేస్తాను. రోజూ సాయంత్రాలు యాభై నిముషాలు తగ్గకుండా నడుస్తాను. నా జ్ఞాపకాలకు బ్రేక్‌ వేస్తూ తనను ‘తర్వాతేం జరిగింది?’ అన్నా కండ్లతోటే.

యోగా సెషన్‌లో చివరిరోజు వార్షికోత్సవం లాగా చేస్తారు. బాగా అనుభవజ్ఞులైన యోగా టీచర్‌ జిల్లా కన్వీనర్‌గా పిలువబడే యోగా గురువు ఒకరిద్దరు హాజరవుతారు. యోగాపట్ల మీమీ స్పందన తెల్పండి అని అందరితో మాట్లాడిస్తారు. అందరితో అదే హాలులో ఆటలాడిస్తారు. మెమొరీ పవర్‌ పెంచేవీ, ఐక్యతను వృద్ధి చేసేలాంటి వాటితోటి. మధ్యలో ఆధ్యాత్మిక విషయాలను మన మనసులలో పదిలం చేసుకునే దిశగా భగవంతుని మీద ఉండే కీర్తనలు, పాటల కేసట్లను పెట్టి మనల్ని కండ్లు మూసుకోమని సూచనలిస్తూ భజనలు చేయిస్తారు. నిజంగా ఎంతో పారవశ్యంతో కూడిన ఆధ్యాత్మికానందాన్ని పోగు చేసుకుంటాం ఈ కార్యక్రమం ద్వారా. ఆరోజు ఫలహారం అందరికీ అక్కడే సమకూర్చబడుతుంది. మనల్నే పండ్లు తెమ్మంటారు. కొంతమంది ఆరోజు డ్రైఫ్రూట్స్‌ లాంటివి కూడా తెస్తారు. ఆ హాలే క్యాంటీన్‌. మనమే కుక్స్‌. మనం తెచ్చినవే వెరైటీ టిఫిన్స్‌. మధ్యలో ఒక గంట స్వల్ప విరామం కేటాయిస్తారు. అక్కడ నీనా అనే తేడాగానీ ఉచ్ఛ, నీచ, ఆడ, మగ బేధాలేవీ ఉండవు. ఉండేదల్లా అంతా ఒకే కుటుంబమనే సద్భావన మాత్రమే. అందరూ తెచ్చిన పండ్లన్నీ ముక్కలుగా కోసి, ఎంతమంది ఉంటే అంతమందికి ప్లేట్లలో పంచుతారు. వండిన ఆహార పదార్థాలు టిఫిన్‌కు నిషిద్ధం ఆరోజు. ఒకరోజు ముందే ఈ విషయాన్ని సూచిస్తూ మీతోపాటుగా ఇంకో ఇద్దరికి సరిపడా పండ్లు తెమ్మని చెబుతారు. కోసిన ఆ పండ్ల ముక్కలన్నీ కలిపితే బోల్డవుతాయి. అందరి కడుపునిండగా ఇంకా కొన్ని పదార్థాలు మిగిలిపోతే ఇంటికొచ్చేటప్పుడు ఎవరికి కావాలంటే వారిని తినమంటారు. ఎవరైనా కొబ్బరినీళ్ళు తెచ్చినా, ఫ్రూట్స్‌ సలాడ్స్‌ లాంటివి తెచ్చినా, వాటినీ గ్లాసుల్లో పోసిస్తారు అందరికీ. ఇలా బ్రేక్‌గా ఇచ్చిన గంట సమయం సరదా సరదా కబుర్లతో ఇట్లే గడిచిపోతుంది. టాయిలెట్స్‌కి వెళ్లొచ్చేవారు వెళ్లొస్తారు. అందరం అక్కయ్య, అన్నా, తమ్ముడు, చెల్లి లాంటి ఆప్యాయతా పూర్వక పిలుపులే. ట్రైనర్స్‌ని గురువుగారని సంబోధిస్తాం. వాలంటీర్లను చిన్న గురువుగారంటాం నవ్వుతూ. ఎక్కడా ఎలాంటి అమర్యాద పూర్వక వాతావరణాన్కిగానీ తావుండదు. యోగా హాల్‌ అంటే పవిత్ర దేవాలయం. మధ్య మధ్యలో గురూజీల ప్రసంగాలు ఉంటాయి. వాటి తర్వాత మరికొన్ని యోగాసనాలు, తర్వాత మళ్లీ ఏవైనా రెండు ఆటలు, మళ్లీ స్పీచ్‌, స్పందనలు ` ఇలా ఒకదాని తర్వాత మరో అంశం నిర్వహింపబడుతూ ఎక్కడా బోర్‌ అనేదానికి తావులేకుండా ఆరోజు మరపురాని రోజుగా మలుస్తారు యోగా గురువులు.

ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన యోగా ఈ చివరిరోజు మాత్రం దాదాపు ఇదంతా పూర్తయ్యేసరికి పదకొండున్నర, పన్నెండు అలా అయిపోతుంది. చెప్పలేదు కదూ! సాధకులందరూ గురూజీని దుశ్శాలువాతో సన్మానించి మెడలో పూలదండను సమర్పిస్తారు. కొంతమంది వారి వారి శ్రద్ధాసక్తుల మేరకు నూతన వస్త్రాలు కూడా సమర్పించటం కద్దు. కానీ ఈ వస్త్ర సమర్పణ అనేది అనివార్యం కాదు. మరి నాకేం గురుదక్షిణ ఇస్తారు? మీరంతా అని గురువుగారు అడిగిన ప్రశ్నకు సాధకులంతా తమకు తోచిన రీతిలో సమాధానమిస్తుంటే ఆయన నవ్వుతూ ఇవన్నీ ఏమీ వద్దు! మీరు నేర్చుకున్న ఈ యోగావిద్యను మీ వంతుగా మరో ఇద్దరికి పరిచయం చేయండి. ఒకవేళ కుదరక రోజూ క్లాసుకు హాజరవ్వకలేకపోయినా మీరు ఈ నేర్చుకున్న క్రియలను అభ్యాసం చెయ్యండి. సంపూర్ణ ఆరోగ్యంతో

ఉండండని దీవిస్తారు. ఎంతోమంది బాబాల పేరుతో, స్వామీజీల పేరుతో ఫలాపేక్షతోటే నడుస్తున్న నేటి సమాజంలో ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా మరో ఇద్దరికి మీ వంతుగా నేర్పండని కోరటమే గురుదక్షిణ అని చెప్పిన సంస్కారవంతమైన ఈ యోగా గురుపరంపర యొక్క విలువలను ఆచరించి, తరించటమే తప్ప ఏమిచ్చి కొనుక్కోగలం. ఈ యోగ కుటుంబం నేర్పిన నిస్వార్థ పూరితమైన కుటుంబిక సంస్కారాలను ఎన్ని లక్షలు పెట్టినా కొనగలమా?

‘గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన’ అన్న రీతిగా కొంతమంది యోగా చేసేవారిని చులకనగా చూస్తూ, పొద్దున్నే వెళ్తున్నారంటే ఏదో కూడని పనికే

వెళ్తున్నారనే కాలం. ఇలాంటి పచ్చకామెర్ల రోగులను ఏ వైద్యుడు బాగుచేయగలడు? ఏ గురువులు సంస్కారాలనందివ్వగలరు? ఏ ఉపాధ్యాయుడు సత్ప్రవర్తన గురించి బుర్రకెక్కేట్టు పాఠాలు బోధించగలడు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో పోవాల్సిందే. సరిగా ఇలాంటి కోవలోకే వచ్చే ఓ ఆణిముత్యం సువర్ణ వాళ్ల పతిదేవుడని తెలిసింది తను వెళ్లబోసుకున్న విషయాలు ద్వారా.

‘‘అతగాడి మనస్తత్వమిదేనని తెలుసుగదా మొదట్నుంచి? నువ్వెందుకు అతిగా బాధపడుతున్నావ్‌?’’ అన్నా.

‘‘అదికాదు మైథిలీ… యోగాసనాలు అన్నీ అయిపోయిన తర్వాత శవాసనం వేయమంటారు గదా, నాదసలే వంకీల జుట్టు, లేచినపుడు కొద్దిగా జుట్టు చెదురుతుంది గదా! పోనీకి పెట్టిన క్లిప్పు తీసేస్తా, శవాసనం వేసినపుడు. అందుకు అనుమానపు చూపులు వెళ్ళగానే. ఒక్కోరోజు మరీ గుర్రుగా ఉంటాడని చెప్పింది’’ వాపోతూ.

‘‘ఏం చెబితే అర్థమవుతుంది అతనికి? ఎలా చెబితే అర్థమవుతుందో? నాకేం అర్థం కావట్లేదు. ఒక్కోసారి బాగా ఏడుపొచ్చేస్తుంటుంది’’ అని చెబుతుంటే నాకు చాలా బాధ అన్పించింది సువర్ణను చూడగానే.

‘‘మొన్న వారం రోజుల క్రితం యోగా సెషన్‌ పూర్తయింది మైథిలీ. ఎప్పటిలాగే వార్షికోత్సవంలాగా చేస్తారు గదా ముగింపు పండుగంటూ. నీకు తెల్సు గదా..’’ అంది. ‘‘అవును’’ అన్నాను.

నేనైతే నాకున్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల మానివేశానుగానీ, సువర్ణ మానకుండా వెళుతూనే ఉంది యోగా క్లాసులకు.

ఇలాగా మాకీరోజు సెషన్‌ చివరి రోజు. లేటవుతుంది. మధ్యాహ్నం పన్నెండయి పోతుందని చెప్పిందట భర్తతో. సరేనని అన్నాడట. వాళ్ళకు జావ తాగే అలవాటు, టిఫిన్‌ తినగానే. తనొక్కడే గదాని వదిలెయ్యలేదు మైథిలీ. ఇడ్లీ వేసి హాట్‌ ప్యాక్‌లో సర్దా. పల్లీ చట్నీ కూడా చేశా తినలేరని. పక్కనే కొరప్పొడి డబ్బా

ఉండనే ఉంటుంది ఎప్పుడూ. జావచేసి ఫ్లాస్కులో పోశా. అన్నీ ఎదురుగా డైనింగ్‌ టేబుల్‌ మీద సర్ది పెట్టానని చెబితే సరేనన్నారు.

వాళ్ళకు పెరడు పెద్దది. పూలమొక్కలవీ బాగా ఉంటాయి. రోజూ ఊడుపు ఎక్కువే. అయినా ఏనాడు విసుగు కనిపించదు తన మొహంలో ఎప్పుడైనా అటుగా వెళ్లినపుడు వాళ్లింటికి వెళ్లటం అలవాటే నాకు. ఏ సమయంలో చూసినా చాలా

శుభ్రంగా ఉంటుంది వాకిలి గాని, పెరడుగానీ. ఇలా ఎలా సాధ్యమని అడిగితే, రెండుపూటలా శుభ్రంగా ఊడుస్తానని చెప్తే, నాకెంతో ముచ్చటేసేది. అట్లా అన్ని పనులూ చేసి, తనను ఉదయం తినటాన్కి, తాగటాన్కి కావలసినవి సిద్ధం ఏసి చెప్పి వచ్చినా ఆరోజు ‘‘ఏంటే ఇంత ఆలస్యమయింది? ఆ జుట్టంతా రేగిపోయి

ఉందేంటి? ఎక్కడ పడుకుని వచ్చావు ముండా’’ అని బూతులు తిడుతూ గొంతును పిసకబోయాడట. తన మెడచుట్టూ బిగుసుకుంటూన్న వాడి రెండు చేతులనూ ఎట్లాగో బలవంతంగా విడదీసుకుని నేను గదిలోకి పోయి చాలాసేపటిదాకా తలుపులేసుకున్నా భయంతోటి’’ అని సువర్ణ చెప్తుంటే తనగుండె వేగంగా ఎగిరిపడటాన్ని గమనించా. మొహమంతా బాధతోటి వివర్ణమైపోయింది.

‘‘ఇంతకుముందు అనుమానంగా చూసేవాడు, కోపంతో టీకప్పు విసిరేసేవాడు, టీ బోగోలేదంటూ. కూరలు ఎంత రుచిగా వండినా కుదరలేదు, నీ ధ్యాస ఎక్కడ ఏడుస్తోందని చాలా చులకన చేసి మాట్లాడేవాడట. అప్పుడు పిల్లలుండేవారట. ఎందుకు డాడీ అనవసరంగా మమ్మీని తిడుతున్నారని పిల్లలు గట్టిగా నిలదీస్తే, తన గదిలోకి పోయి ఆరోజంతా అలకపాన్పు ఎక్కేవాడట. ఎన్నిసార్లు పిలిచినా భోజనానికి రాకపోతే, చివరికి తనే ఉసూరనిపించి భోజనం ప్లేట్లో పెట్టి, గదిలో టీపాయ్‌ మీద పెట్టి వచ్చేదట. సువర్ణ మంచినీళ్లు, పెరుగు, రసంతో సహా. మళ్ళీ మధ్యలో తనెళ్లి కనబడితే ఎక్కడ మధ్యలో అహంతో చెయ్యి కడిగేసుకుంటాడోననే జాలితో. ఇదిగో ఇదే వీక్‌పాయింట్‌ ఆడాళ్లందరిదీ. మన తప్పులేకుండా తిట్లుపడటం, ప్రతి చిన్నదానికి సాకులు పెట్టి హేళనగా మాట్లాడే మాటల్ని భరించటం. మన కుటుంబాలే ఇలా ఏడ్చాయా? లోకంలో ఉన్న కొంపలన్నీ ఇట్లాగే తగలడ్డాయా? లేదా మన కొంపల్లోనే ఇలా ఉంటాయా అన్పిస్తుంటుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ వింటుంటే.

మళ్ళీ సువర్ణ ఏమనేదో తెలుసా ‘‘మైథిలీ… ప్లేటు మొత్తం ఖాళీ చేసేశాడు, ఒక్క చుక్క కూడా విడవకుండా పెరుగు మొత్తం తాగేసేవాడట. దొంగపిల్లి నాకినట్లుగా వుండేదట ఆ ఖాళీ అయిన పెరుగు కప్పును చూస్తుంటే అని చెప్పి నవ్వేది తర్వాత. అది దొంగపిల్లి కాదు, బలిసిన పెద్ద గండుపిల్లి. జంగు పిల్లి’’ అని నేను తిట్టుకునేదాన్ని మనసులో.

‘‘ఆకలైతే వాడే తింటాడులే అని ఈసారి నేనేం పట్టించుకోలేదు. ఈరోజు నా ధర్మంగా నేను అన్నం, కూరా వండి పెట్టాను టేబుల్‌ మీద. నన్ను నేను సమాదాయించుకుంటూ చెయ్యని తప్పుకు నేనెందుకు కడుపు మాడ్చుకోవాలని ఓ రెండు ముద్దలు పెట్టుకుని తిని చెయ్యి కడుక్కున్నాను. ఈసారి నాకు తినమని కూడా అడగాలనిపించలేదు. నా దారిననే వెళ్ళి పిల్లల రూమ్‌లో పడుకున్నాను. తర్వాత రెండు రోజులదాకా నాకు చాలా డిప్రెషన్‌లాగా అనిపించింది’’ అంటూ ఎంతో బాధతో చెబుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది తన బాధాపూరితమైన మాటలు వింటుంటే.

‘‘మరి ఆ రెండు రోజులూ ఏం చేశాడు మీ ఆయన? తిండి తిన్నాడా? లేదా’’ అని అడిగా… ఒకింత బాధతో మిళితమయిన కోపంతో’’

‘‘ఆ… ఎందుకు తినలా! శుభ్రంగా మెక్కాడు. నంగనాచిలా ఆ మరుసటిరోజే చికిన్‌ తెచ్చి, నాకు కనబడేటట్లు టేబుల్‌ మీద పెట్టాడు. వండు అన్నట్టు. నా బాధను, కోపాన్ని తమాయించుకుని వండి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు సిగ్గులేకుండా’’ అన్నది. తన మనసు ఎంత వేదనకు గురయితే ఈ మాట వచ్చిందోనని అనుకున్నా.

‘‘మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? మానేశావా యోగాకి వెళ్ళటం? మీ ఇంటి దగ్గర ఉన్న విమలా, రత్నమ్మ గార్లతో కలిసేగా వెళ్ళేది, వచ్చేదీ’’ అన్నా.

‘‘అవును, అయినా వాడికి అనుమానం పొరలు కమ్మి, కండ్లు కనబడని గుడ్డోడవుతాడు. అదే మావాడి స్పెషాలిటీ’’ అంది విరక్తిగా.

‘‘ఆ… ఎందుకులే పెంటగోల అని మానేశాను. యోగాకు వెళ్లట్లేదంది. ఇట్లా బాధపెట్టి బెదిరించి, మాన్పించాలనేగా వాడి ప్లానంతా. వాడనుకున్నది సాధించుకున్నాడు. చివరికి నన్ను నాల్గు గోడలకి బందీ చేసి’’ అన్నది మళ్ళీ కోపంగా.

ఇదివరకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు నయం. ఆలోచించేవాడు మాట వదలాలంటే. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంగుళూరులో

ఉంటన్నారుగా ఉద్యోగాల్లో. ఇక వీడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఒక్కోసారి ఏం వాగుతున్నాడో కూడా తెలవట్లేదు. ఆనోటికి హద్దూపద్దూ ఉండట్లేదని వాపోయింది సువర్ణ.

అందంగా పుట్టడం సువర్ణ చేసుకున్న పాపమా? అందంగా ఉన్న తమ కూతుర్ని, ఉద్యోగస్తుడూ… లక్షణంగా పెండ్లాన్ని చూసుకుంటాడని నమ్మి ఇతగాడికిచ్చి కట్టబెట్టిన తల్లిదండ్రులదా?

మగడు ఏదన్నా పడుండాలి. వాడికి కోపమొస్తే భరించాల్సిందేనమ్మా అంటూ సాగదీసే సదరు అత్తగారి టెంపరితనమా?

నిజంగానే ‘కాకి ముక్కుకు దొండపండు’ అనే సామెతకు నూటికి రెండొందల శాతం కరెక్టు సువర్ణ భర్తగారి విషయంలో. నాకు ఆ పేరెత్తి ఇదీ అని చెప్పాలన్నా కంపరమెత్తుతుంది ఇప్పటికి కూడా.

ఇలా చాలా విషయాలు తెలుస్తుంటాయి అప్పుడప్పుడు తన ద్వారా. అందుకే నాకు సువర్ణ భర్త అంటే ఏవగింపు. తను కూడా ఇంతకు మునుపు ఎంత బాధలో ఉన్నా మా ఆయన, మావారు అని సంబోధించేది నాతో మాట్లాడేటప్పుడు. ఎంత బాధ సలుపుతుంటే, మనసులో ఎంత విరక్తి పుడితే వాడు, వీడు అని తిడ్తుంది భర్తను. నాకు తప్పులేదనిపించింది. మరి తక్కువ పనులు చేశాడావాడు అని పిలవబడుతున్న సదరు సువర్ణ గారి మొగుడుగారు.

నువ్వు తెల్లగానే ఉంటావు గదా, నీకెందుకు క్రీములు, పౌడర్లు అని సాధించేవాడట. కొత్త బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేడట. మంచిగా తల దువ్వి జడ వేసుకున్నా అనుమానమేనట… ఎవరన్నా ఇంటికి అతిథులు వస్తే, అందులో

వాళ్ళు పురుష పుంగవులైతే తనను మంచినీళ్ళు కూడా తేనీయడట. ఒకసారి అలాగే టీ పెట్టి పట్టుకెళితే, నానా బూతులూ తిట్టాడట వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇక అప్పట్నుంచి అతగాడికే టీ కప్పులు ట్రేలో పెట్టి అందిస్తే తీసుకెళ్లి వాళ్లకిస్తాడట. దొడ్లో అంట్లు తోముతుంటుంటే రోజూ కుర్చీ వేసుకుని కూర్చొని, ఆ సమయానికి పేపరో, పుస్తకమో చదువుకుంటున్నట్లు నటిస్తాడట. మొదట్లో అర్థమయ్యేది కాదట సువర్ణకు. దొడ్డివైపు తలుపులు వేసేవుంటాయట. తియ్యరట ఎప్పుడూ. అయినా వాడికి అనుమానమేనట. ఒకసారి పౌడర్లో సున్నం కలిపాడట. మామూలుగా రోజూ రాసుకున్నట్లు రాసుకుంటే, మొహమంతా పొక్కిపోయి ఎలర్జీ వచ్చి, ఆసుపత్రికి వెళితే ఆ పౌడరును చూసి అందులో సున్నం కలిసిందని చెప్పారట డాక్లర్లు. మళ్ళీ ఇంకోసారి స్ప్రే బాటిల్లో హ్యాండ్‌ వాష్‌ లాంటిది కలిపాడట. ఇదీ వాడి నిర్వాకమేనని తెలిసి వాళ్ళ పెద్దబ్బాయికి చూపిస్తే ‘నిజమే మమ్మీ ఇందులో హ్యాండ్‌ వాష్‌ కలిపాడు అని తండ్రిని ఛీత్కరించుకున్నాడట.’ వాళ్ళ డాడీ వెలగబెట్టే నిర్వాకాలన్నీ తెలుసు పిల్లలకు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుగా! అందుకే ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే ఆ… డాడీ ఎందుకు మమ్మీ? మనమే వెళ్లొద్దాం అంటారట. తండ్రి అంటే అతను చేసే పనుల వల్ల ఎంత విలువ తగ్గిపోతోంది తండ్రిగా తనకు అని ఒక్కోసారి చెప్పి నిట్టూరుస్తూంటుంది సువర్ణ.

‘ఇన్ని చేస్తున్నా, మావారంటే నాకు చాలా ఇష్టం మైథిలీ’ అంటుంది నాతో ఒక్కోసారి.

‘‘కానీ నా ప్రేమను గుర్తించడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాడు సూటీ పోటీ మాటలు వదలటానికి’’ అన్నది మళ్ళీ.

నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదంటారు నిజమే. భార్యమీద, ఆమె నడత మీద అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అంత ఆవేదన సువర్ణకు.

సశేషం

July 31, 2025 27 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us