మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంట‌ర్వ్యూలు

జీవితచరిత్రలు చదవడం ఇష్టం

by రంగరాజు పద్మజ May 30, 2025
written by రంగరాజు పద్మజ
  • డా. ముక్తేవిభారతి

    మయూఖ పాఠకులకు పరిచయమే అక్కర లేని తరుణీ మణి ముక్తేవి భారతి గారు. వారితో పరిచయ కార్యక్రమం…

ముక్తేవి భారతి గారు యువతీ మండలి వైస్ ప్రెసిడెంట్ గానూ, ఆంధ్ర మహిళా సభ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ చైర్ పర్సన్ గానూ పనిచేసారు.

రంగరాజుపద్మజ:- అమ్మా! నమస్కారం!

ముక్తేవి భారతి:- నమస్కారమండీ!

పద్మజ:- తరుణీ పత్రిక పాఠకులకు మీ నేపధ్యం వివరిస్తారా?

భారతి :– ముందుగా తరుణీ పత్రిక నిర్వహిస్తున్న సంపాదకురాలికి- సిబ్బందికి ధన్యవాదములు.

నేను 10-6-1941 లో కృష్ణా జిల్లా పెడన గ్రామంలో పుట్టాను. మా తల్లిదండ్రుల పేర్లు అరవింద-వెలువలి శంకరం గారు. మా వారి పేరు ముక్తేవి లక్ష్మణ్ రావుగారు.

పద్మజ:– మీ విద్య ఎక్కడ కొనసాగింది?

భారతి:- బందరులో ప్రాథమిక విద్య, డిగ్రీ వరకు, 1961 లో M A History బెనారస్ హిందూ యూనివర్శిటీలో,
1968 M A తెలుగు ఉస్మానియా యూనివర్శిటీలోనూ,
1974 సం౹ M.Litt- ఉస్మానియాలో,
1978 సం. PG diploma in industries- ఉస్మానియాలో,
1980 Ph.D – ఉస్మానియాలో చేసాను.

పద్మజ:– మీ వృత్తికి సంబంధించిన విశేషాలు తెలుపండి.

భారతి:– నేను నారాయణ గూడలోని రావు బహద్దూర్ వెంకట్రామిరెడ్డి కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ ( Associate professor) తెలుగు విభాగంలో,
అలాగే చిక్కడపల్లిలోని సరోజనీనాయుడు మహిళా కళాశాల లో ప్రధాన అధ్యాపకురాలిగా ( Principle) ఈ హైదరాబాద్ లోనే పనిచేసాను.
రాజా బహద్దూర్ వెంకట్ రామరెడ్డి గారు తెలంగాణలో ఉన్న బాలికలకు చదువు సంధ్యలు నేర్చుకోవాలంటే తగిన విద్యాసంస్థలు లేవని, ఆర్థికంగా కూడా చదివే స్తోమత లేని వారి కోసం ఈ పాఠశాలను స్థాపించాలని నారాయణగూడ హైస్కూల్ మరియు రెడ్డి ఉమెన్స్ కాలేజీ ని స్థాపించారు. అందులో చదివిన పిల్లలు డిస్టింక్షన్ లో పాస్ అయి జీవితంలో నిలదొక్కుకున్నారు. కేవలం బాలికలను దృష్టిలో పెట్టుకొనే నడిపారు. దాంట్లోనే నేను చాలా సంవత్సరాలు పనిచేసాను. నేను ఉద్యోగ విరమణ చేసి 25 సంవత్సరాలు అయింది. మొన్న ఈ మధ్య ఉమెన్స్ డే రోజున ఆ కాలేజీలో అచ్యుత అని ప్రిన్సిపల్ గా వచ్చిన ఆమె నన్ను మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడాలి! రమ్మని ఆహ్వానిస్తే …”అమ్మా! ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నారా?” అని అంటే ఎలా, మరుస్తాము? అని అన్నారు. ఆ మాట నాకు చాలా సంతోషం కలిగించింది. అందుకే నేమో అబ్దుల్ కలాం గారు నన్ను దేశాధ్యక్షుడు అని పిలిచే కన్నా ఒక ఉపాధ్యాయుడు అని అంటేనే నాకు ఎంతో ఇష్టమని అన్నారంటే ఎంతో గౌరవప్రదమైనది.
ముఖ్యంగా చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులుగారు జీవిత చరిత్ర చదువుతుంటే మనకెంతో ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చాలా కష్టపడ్డాడు కంటిచూపు సరిగా ఉండదు. అయినా ఎన్నో రచనలు గణపతి వంటి నవలలు, గయోపాఖ్యానం వంటి నాటకాలు, ఎన్నో ప్రహసనాలు, జీవిత చరిత్రలు రాశారు. సంతోషం అని అన్నారు.

పద్మజ:- మీరు డాక్టరేట్ పుచ్చుకున్నారు కదా! ఏ అంశం పైన పరిశోధన చేశారు? ఆ సబ్జెక్ట్ తీసుకున్న కారణాలు ఏమిటి?

భారతి:– నేను చిలకమర్తి సాహిత్య సేవ పరిశోధనాంశంగా 1988 లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాను.
ఎందుకంటే సంఘసంస్కర్తలు అంటే నాకు చాలా గౌరవం. అందులో ముఖ్యంగా చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు చాలా ఇష్టం. ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉంటే మనకెంత ఆశ్చర్యమేస్తుందంటే… చెప్పలేము.
ఆయన సమాజం కోసం చాలా కష్టపడ్డాడు. వ్యక్తిగతంగానూ కష్టమైన జీవితమే! సమాజంలో ఉన్న అన్యాయాలనే ఎదుర్కోవడం కోసం సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న వ్యక్తి చిలకమర్తి లక్ష్మీనరసింహగారు.
ఆయన జీవితంలో మూడు కోణాలు గ్రహించాను. సంఘసేవ, దేశభక్తి, సాహిత్య సృష్టి. వారి ప్రతిభ గురించి ఒక మాట చెప్తాను.
బెంగాల్ విభజన అప్పట్లో పెద్ద ఉద్యమం. బిపిన్ చంద్ర పాల్ దేశమంతా పర్యటిస్తూ, రాజమహేంద్రవరం వచ్చారు. ఐదు రోజులు ఆంగ్ల భాషలో ఆయన ఉపన్యసించారు. సామాన్యులకు ఆంగ్ల భాష అర్ధంకాదు కదా! అందుకని ఆ ఐదు రోజులూ ఆయన వెంట ఉండి, వారి ఉపన్యాసాలు తెలుగులో అనువదించి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. అంటే ఆంగ్ల భాష మీద అంత పట్టు ఉండేదని తెలుస్తుంది. ఆయన ఎక్కువగా చదువుకోలేదు! మెట్రిక్యులేషన్ కూడా పాస్ కాలేదు. ఎందుకు చదవలేకపోయారంటే కంటి చూపు సరిగా లేకపోవడంవల్ల బ్లాక్ బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనిపించకపోయేవి. అందుకే పరీక్ష పాస్ కాలేకపోయారు. అయినా ఆ భాష మీద అంత పాండిత్యం సంపాదించుకున్నారు. ఈ ఐదు రోజుల ఉపన్యాసాల అనువాద భాషణం అయిపోయాక ,ఆయన దేశభక్తి ఉప్పొంగి పోగా ఆశువుగా ఒక పద్యం ఇలా చెప్పారు.
పద్యం:-

డాక్టర్ ముక్తేవి భారతిగారితో ముఖాముఖి గ్రహీత రంగరాజు పద్మజ

భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడసరి గొల్ల వారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి!

ఇది మొట్టమొదటి జాతీయ కవిత అని సి.నారాయణరెడ్డి గారి తన పిహెచ్డి (Phd) సిద్ధాంత గ్రంథంలో రాశారు. వీరి తర్వాతే రాయప్రోలు, గురజాడ గారు దేశభక్తి కవితలు రాసారు. వాటికి స్ఫూర్తి ఈ పద్యమే అని కూడా చెప్పారు. ఇది రాసిన తర్వాత ఒకచమత్కారం జరిగింది.

బ్రిటిష్ వారు తమను గడుసరి గొల్లవారు అన్నారని నేరం మోపారట. దానికి జవాబిస్తూ
“మీకు తెలుగు భాషలో ఉన్న సొగసు తెలవదని తెల్లవారెను గడసరి గొల్లవారని చెప్పారట కానీ నిజానికి గడుసరి తెల్లవారే ” అలాంటివి ఎన్నో రాసారు.
ఈరోజు దళితుల గురించి ఎందరో మాట్లాడుతున్నారు. కానీ సంఘసంస్కర్తగా ఆనాడే ఆయన దళితులకు న్యాయం జరగాలని అనుకుని ఊరికే అనుకుంటే లాభం లేదని,
దళిత పాఠశాల, రాత్రి పాఠశాలలు నిర్వహించారు. దళితులకు పుస్తకాలు, పెన్నులు కొనేందుకు వారికి డబ్బులు ఉండవని, తానే కొని వారికి ఇచ్చి చదువు చెప్పారు. మరి ఈయనేమన్నా ధనవంతుడా అంటే కానేకాదు!ఆయనకు ఏమీ లేదు… రెండు మూడు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. అటువంటి త్యాగమూర్తులు వారు. ఆయన గురించి చెప్తే పాఠకులు మరి కొంతమంది ప్రేరణ పొంది సంఘ సేవకులవుతారని నా భావన.
గణపతి నవల కూడా హాస్య నవల కాదు! అధిక్షేపాత్మక నవల. సమాజంలో అలాంటి యువకులు ఉండకూడదని ఆ పాత్రల ద్వారా తెలిపారు. కన్యాశుల్కంలో రాసిన గిరీశం, బారిష్టర్ పార్వతీశంలో పార్వతీశం, ఈ ముగ్గురు యువకులు సమాజానికి ఏ విధంగాను ఉపయోగపడని వారని చెప్పడానికి ఆ పాత్రలను సృష్టించారు ఆయన రచనలు కానీ జీవితం కానీ చూస్తే గొప్ప ప్రేరణ కలిగి ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో అందరికీ తెలియాలని ముఖ్యంగా యువకులకు తెలియాలని పరిశోధనకు ఎన్నుకున్నాను. గైడ్ గా జి.వి. సుబ్రహ్మణ్యం గారు మార్గదర్శకత్వం చేసారు.

పద్మజ:– మీరు ఎన్నో రచనలు చేసారు కదా! వాటి నేపథ్యం వివరిస్తారా?

భారతి:– 1960 లో చెల్లాయి పెళ్లి అనే కథ రాసాను. అది అప్పట్లో బందర్ లో ఉన్న తెలుగు విద్యార్థి పత్రికలో ప్రింట్ చేశారు.
65 ఏళ్లుగా సాహిత్య రంగంలో కృషి చేస్తూనే ఉన్నాను. 300 పైగా కథలను రాసాను.
చెల్లాయి పెళ్ళి రాసినప్పుడు వాసిరెడ్డి సీతాదేవి గారు నాకు మంచి స్నేహితురాలు. ఆవిడ ఏమన్నారంటే? నీ వయసు వారు ఎక్కువగా ప్రేమ కథలను రాస్తారు. నువ్వెందుకు ఈ కథరాసావు? అని అడిగారు. ఆ కథను సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే రాసాను. ఒక అమ్మాయికి మామూలుగా పెళ్లయిన తర్వాత భర్త మరణించాడు. ఆమెకు చదవు చెప్పించక, బయటకు ఎక్కడికీ వెళ్ళనీయక ఇంట్లోనే ఉంచేశారు. ఆ అమ్మాయి అన్నగారు చెల్లెలికి పెళ్ళి చేద్దామని తండ్రితో ఎంత పోట్లాడినా తండ్రి ఒప్పుకోలేదు. సమాజం తనను వెలివేస్తుందని తండ్రి భయపడ్డాడు. వితంతు వివాహం మన ఇంటా వంటా లేదు! అని అన్నాడు. అన్న ఎన్నో సంబంధాలు చూస్తాడు. అయితే తండ్రి కొడుకు పెళ్లి చేయాలని పట్టుబడతాడు.
చెల్లెలు పెళ్లి చేసుకున్న తర్వాతనే తాను పెళ్ళి చేసుకుంటానని పట్టు పట్టి కూర్చున్నాడు. ఆ అమ్మాయి విసిగిపోయి “అన్నయ్యా! నువ్వు పెళ్లి చేసుకో! నా కోసం నువ్వుఆగ వద్దు! అని అంటుంది.
ఒక పెళ్లే కాదు సమాజంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు ఉన్నాయని, ఇలా సమాజానికి ఉపయోగపడే కథలు రాసాను. ముఖ్యంగా భారతి కథలు అని రెండు సంపుటిలు 1993-94లో వచ్చాయి. ధర్మ గంట మోగదు అనే సాంఘిక కథలు అచ్చయ్యాయి. అద్దంలో అమ్మ మీద ఒక కథ మేడమ్ కథలసంపుటి వచ్చింది.
అంతకు ముందే చిలకమర్తి – యువ భారతి ప్రచురించారు.
భారతంలో ప్రేమ కథలు,1991లో తెలుగులోనూ- హిందీలోను ప్రింట్ అయ్యాయి.
1993 లో కంచె చేను మేస్తే ఆంధ్రప్రదేశ్ బాలల సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. ప్రబంధంలో భక్తికథలు మద్రాస్ పత్రిక భక్తి కుముదం (2001-2002) పత్రికలో వేసారు.
ఋషి పీఠం వారు భక్తితరంగాలు ( 2003-2012);
భారతీతీర్థ సమాఖ్య భారతంలో నీతికథలను ప్రచురించింది.

పద్మజ :- చాలా సంతోషం ! మరి నవలా ప్రక్రియలో కూడా మీదైన ప్రత్యేక శైలి ఉంది. నవలల గురించి చెప్పండి…

భారతి:— బతుకు నేర్పిన న్యాయం -1996 లో రాసాను.
మళ్ళీ వచ్చిన వసంతం అనే సాంఘిక నవల 2002 లో అచ్చైంది.
బతుకు నేర్పిన న్యాయం నవలలో మమత ( కథానాయిక) కుటుంబంలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో ఆమె మనసు వికలమై, ముందు పెళ్లి వద్దంటుంది. అందరికీ అలా ఔతుందా ? అని పెద్దవారు సర్దిచెప్పితే సరేనని పెళ్ళి చేసుకుంటుంది. తర్వాత ఆడపిల్ల తన గర్భంలో ఉందని తెలిసి అబార్షన్ చేయించుకుంటానని పట్టు పట్టింది. తర్వాత కొన్ని రోజులకు ఇలా ఎందుకు చేశానని పశ్చాత్తాపపడుతుంది. అంటే సంఘములో ఏదైనా చెడు జరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలిపే ఇతివృత్తం.
తర్వాత కొంతకాలానికి ఒక మగపిల్లాడిని పెంచుకోవాలని అనాధ శరణాలయం వెళ్ళి, అక్కడ మొదట పిల్లవాడిని తీసుకోవాలని అంతా సిద్ధపడ్డ తర్వాత మగ పిల్లవాడు ఎందుకు? ఆడపిల్లను పెంచుకుంటానని నిర్ణయించుకుంటుంది.
పాలగ్లాస్ అనే కథ సినిమాల్లో మొదటిరాత్రి కథానాయక పాలగ్లాస్ తీసుకొని పడకగదిలోనికి వెళ్లడం చూస్తాం. ఇక్కడ నేను రాసిన పాలగ్లాస్ కథ అది కాదు! మనం పనిమనిషికి సామాన్యంగా చాయ్ ఇస్తాం. ఆమె ఈ ఆ గ్లాసు కడిగి అక్కడ బోర్లించి పెడుతుంది. ఆ ఇంట్లో పని చేసే ఆమె పని మానేసింది. ఆమె స్థానంలో ఒక 14 సంవత్సరాల అమ్మాయి పని చేస్తానని వచ్చింది. ఆ అమ్మాయికి చాయ్ ఇవ్వబోతే నాకు చాయ్ పడదు! డాక్టర్ వద్దన్నాడు పాలు తాగమన్నాడు. పాలు తాగుతాను అని అంటుంది. యజమాను రాలు విస్తుపోతుంది పనివాళ్ళకు పాలు పోయడమేమిటని? పోయను అంటుంది.
భర్త, కొడుకు ఇద్దరు నీ ఇష్టం పాలు పోయకపోతే సరే! కానీ ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే నీకు పనిలో సహాయపడే వాళ్ళు ఎవరూ ఉండరు. నీకు కష్టం అవుతుంది అని అంటారు.
అమ్మో/! ఆమె పని మానేస్తే తాను చేసుకోలేనని ఆ పిల్లకు రోజు పాలు పోస్తుంది.
ఒక మార్పు రావాలంటే యువతనుండే వస్తుంది. ఆ ఇంట్లో ఇంటర్ చదివే పిల్లవాడు ఒకడున్నాడు. అతనికి తల్లి రోజు బోర్నవీటా కలిపిన పాలను ఇస్తుంది. తల్లికి తెలియకుండా ఆ పాలు తెచ్చి ఈ పని అమ్మాయికి ఇస్తున్నాడు. నువ్వు తాగు మా అమ్మ నాకు మళ్ళీ పోస్తుంది. అదిగాక మేం ఐస్ క్రీములు అవీ తింటామని అంటాడు.
సరే అని అమ్మాయి రోజు రెండు గ్లాసుల పాలు తాగుతున్నది. కొద్ది రోజులకు ఆ పిల్ల నేను రేపటి నుండి పనిలోకి రాను! అంటుంది అదేమిటి? ఎందుకు రావు? అని అడిగితే నేను చదువుకుంటున్నాను. సెలవులు అయిపోయాయి. రేపటినుండి స్కూల్ మొదలవుతుంది. సెలవుల్లో ఊరికే ఉండడం ఎందుకు అని నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చని పనిలో చేరాను. అని రెండు గ్లాసులు కడిగి అక్కడ బోర్లించింది. రెండేమిటీ? అడిగిన యజమానురాలతో అమ్మా! నన్ను క్షమించండి! నేను ఒక అబద్ధం చెప్పాను అంటుంది.
ఏం అబద్ధం చెప్పావు? అంటే డాక్టర్ నాకేమీ చెప్పలేదు. మీరు కుక్కకు పళ్ళంనిండా పాలు పోస్తుంటే నాకు కూడా పాలు తాగాలనిపించింది. ఊరికే మీరు పాలు పోయమంటే పోయారు కదా! అందుకని అబద్ధం చెప్పాను అన్నది.
చిన్నపిల్లల్లో కూడా మార్పు వస్తుంది. ఆ ఇంటర్ చదివే పిల్లవాడికి ఏమనిపిస్తుంది అంటే ఆమెకు మనవలె పాలు తాగాలని ఉండదా? అని
ఆస్ట్రేలియా నుండి శ్రీనివాసు గారు కథా సంకలనంలో వాన కథను వేస్తాను… మీ అనుమతి కోరుతూ ఫోన్ కాల్ చేశాను అన్నాడు. తప్పక వేయండి అన్నాను.
ఈ కథేమిటీ అంటే ఒకరోజు విపరీతంగా వాన పడుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. పక్కన ఉన్న జమీందారు గారి భార్య నీరు ఇంట్లోకి వస్తుందని ఎవరిని లోపలికి రానివ్వదు. ఓ బిచ్చగాడు వచ్చి వాన వెలిసే దాకా ఈ వసారా లో కూర్చుంటాను అంటాడు. ససేమిరా వద్దు! నీ తడి బట్టలూ… నువ్వూ కంపు కొడుతున్నావు! రావద్దు అంటుంది. ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ ఉంటుంది. అవి పాడై పోతాయని ఆమెకు బెంగ. ఆమెకు ఆ సామాన్లు ఆనందాన్నిస్తాయి.
ఆ బిచ్చగాడు తడుస్తూనే పక్క ఇంటికి వెళతాడు. ఆ ఇంట్లో చిన్నపిల్లలు తాతా! రా! తాతా! రా ! అని ప్రేమగా పిలుస్తారు. చలి పెడుతున్నవేమో అని ఒక తువ్వాలు ఇచ్చి, తల తుడుచుకోమని చెప్పి, అన్నం పెట్టి తినమని ఆప్యాయంగా మాట్లాడతారు. అతనికి చాలా ఆశ్చర్యం అవుతుంది.
వెళ్ళిపోతూ విస్తరిని పారేసి, ఇలాంటి పిల్లలు ఉండబట్టే ఇంకా సమాజం ఇంత గౌరవంగా ఉంది. అందరూ ఈ పక్కింటి అమ్మలాంటి వారైతే ఎలా ఉంటుందో? అన్న ఆ మాట ఆమె విని, నిజంగానే ఆ బిచ్చగాడికి కాసింత అన్నం పెడితే తనకు ఏం తక్కువ అయ్యేది? నాకు పిల్లలు లేరు!
ఈ వాన నా మనసులో కొత్త ఆలోచన కలిగించింది. మానవత్వం తెలిసింది. ఈ వాన నాలో మెరుపు తీసుకొచ్చింది అనుకున్నది.
ఈ కథ రెండు పేజేలే ఐనా ఒక సందేశం ఉన్న కథ తనకు నచ్చిందని అన్నాడు.

పద్మజ:– మహాభారతం ఈనాటికీ మీరు అన్వయించిన విధానం, దానికి మీరు చేసిన కృషి తెలుపుతారా?

భారతి:— ఉలూచి కథ కానీ, చిత్రాంగద కథ కాని అర్జునుడు తీర్థయాత్రకు వెళతారని తెలిసి కూడా నీమీదనే మనసుంది అని చెప్పారు.
శకుంతల పాత్ర నాకు ఆదర్శవంతం అనిపిస్తుంది. అందుకే నేమో ఇంటర్, డిగ్రీ ,పిజి, వరకు తర్వాత ఐఏఎస్ లో కూడా పాఠ్యాంశంగా శకుంతల కథ ఉండడం ఎందుకు? అని ఆలోచిస్తే మన నేటి సమాజంలో కూడా శకుంతల వంటి బాలికలు ఉన్నారు. జీవితంతో ఎంతగా పోరాడిందంటే? ఎక్కడో కణ్వాశ్రమంలో ఉన్న శకుంతల రాజదర్బార్ కు వచ్చి మరీ దుష్యంతునితో మాట్లాడి- పోట్లాడి ఒప్పించి, మెప్పించి చివరకు విజయం పొందింది. ఇదే పరిస్థితిలో ఆధునిక చదువుకున్న అమ్మాయి ఉన్నదనుకోండి! అంత పోరాటం చేయకపోవునేమో? ఐతే విడాకులు తీసుకుంటుంది. లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుంది కానీ తమ జీవితాన్ని నిలబెట్టుకోవాలన్న ధైర్యం ఉండక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి ఉండాలని చూసుకోవాలనే ఒక ఆలోచన శకుంతలను చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తుంది.
శకుంతల కథ ఒక సందేశం ఇచ్చే కావ్యం. ఈ కథలు విన్న చదివినా జీవితానికి అన్వయించుకుంటేనే వాటి ఫలితం ఉంటుంది.
భారతంలో ప్రేమకథలు రావడానికి నేపథ్యం ఏమిటంటే? ఒకప్పుడు వారపత్రికలలో ప్రతివారం ఒక కథ వచ్చేది. అవన్నీ ఒక పుస్తకం వేశాను.
శాంతి సుందరి గారు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదకురాలు హిందీలోనికి అనువదించారు. నా కథలు కొన్ని స్వాతి శ్రీపాద ఆంగ్లంలో అనువదించారు. రఘునాథన్ గారు మేడమ్ కథలను తమిళభాష లోకి అనువదించారు.
భారతంలో నీతికథలు రాసాను. నన్నయ రాసిన ఎన్నో ఉపాఖ్యానాలు ఉన్నాయి. మొట్టమొదటి కథే సురమ ఒక కుక్క కథ! సారమేయుడు జనమేజయుడు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వస్తే ఆయన తమ్ముడు నిష్కారణంగా కొడతాడు. తల్లితో ఈ విషయం చెప్తాడు సారమేయుడు. అనవసరంగా ఎవరినైనా బాధిస్తే అనిమిత్త ఆపదలు వస్తాయి, అంటే అనుకోని కష్టాలు వస్తాయని, యజ్ఞం ఆపేసి తిరిగి మొదలు పెడతాడు. చిన్న కుక్క పిల్ల చెప్పిన మాట ఏమిటంటే మనకేం హాని చెయ్యకపోయినా కుక్క కనపడితే చాలు కొడతాం! అలా కూడదని చెప్పిన నీతికథ.
ఇలాంటివే రాశాను మహాభారతంలో ప్రారంభంలో సరమ కుక్కతో మొదలై స్వర్గారోహణపర్వంలో ధర్మరాజు వెంట కుక్క ప్రయాణంతో భారతం ముగుస్తుంది. అంటే ఆ కుక్క పాత్ర ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పాను.

పద్మజ:- ప్రబంధాలను నవల రూపంలో రచన చేశారని విన్నాము. నవలా రూపంగా ఐనా సరే! ఈ కాలంలో ప్రబంధాలు చదివే వారు ఉన్నారా? మా తరుణి ప్రేక్షకులకు వాటి ప్రాశస్త్యం చెప్పండి.

భారతి :– ప్రబంధ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆధునిక సాహిత్యం – ప్రబంధ సాహిత్యం రెండూ రెండు కళ్ళు లాంటివి. ఆయా ప్రబంధాలను చదివే వారు తక్కువ అయ్యారని ఆవేదనగా కూడా ఉంటుంది. ఈ తరం వారికి సాహిత్యం చేరకుంటే ఎలా ?అని చాలా కాలంగా ఆలోచించి ఏమిటి మార్గం అంటే నేనేమైనా చేయాలంటే అధికారంలో లేను… ఏం చేయాలని అనునుకున్నప్పుడు ప్రబంధాలను నవలలుగా రాస్తే కొంతమంది నవలలు చదువుతారు కనుక ప్రబంధాలు నవలల వలె రాస్తే చదువుతారని మొదలు పెట్టాను.
అలా నేను రాసిన నవలలన్నీ అన్ని పత్రికల వారు సీరియల్స్ గా వేశారు.అల్లసాని నెద్దన రచించిన మను చరిత్రను గాంధర్వం పేరుతో నవలను రాశాను.
ఇందులోని పద్యాలను చూసి మను చరిత్ర శృంగార ప్రబంధము అని అంటారు. కానీ శృంగార ప్రబంధం కాదు! శృంగార రసాభాసం. దాని తర్వాత ఆశ్వాసాలను చెప్పాలి కదా! మనుచరిత్రలో ఈ అంశాన్ని చాలామంది చెప్పరు. మొదటి మూడు ఆశ్వాసాలు చదవడానికి ఉత్సాహంగా ఉండి శృంగారపరంగా ఉంటాయి కనుక చదువుతారేమో? తర్వాత కథను చదవరు కనుకనే నేను గాంధర్వం ( అల్లసాని మనుచరిత్ర) అనే పేరుతో నవల రాశాను. 2011అది పుస్తక రూపంలో వచ్చి ప్రచారంలోకి వచ్చింది.

పద్మజ :– గాంధర్వమని పేరు ఎందుకు పెట్టాలనిపించింది?

భారతి:– వరూధిని- ప్రవరాఖ్యుడు;
మాయాప్రవరుడు- స్వరూచి చేసుకున్న వివాహాలన్నీ గాంధర్వ వివాహాలే! కనుక నేను ఆ ప్రబంధాలకు గాంధర్వము అని పేరు పెట్టాను. మన సాహిత్యంలో ఒక అపప్రద ఉంది. మనుచరిత్ర శృంగార ప్రభంధం అని కానీ నిజానికి అది శృంగారం కాదు! శృంగార రసాభాసం…అని ఎందుకు అంటున్నానంటే? వరూధినికే ప్రేమ తప్ప ప్రవరాఖ్యుడికి ఆమె మీద ప్రేమ లేదు.
ఆయనకు ఎంతసేపూ తన భార్య, తన శిష్యులు, తన అనుష్ఠానం ఇవే తప్ప ఆమె మీద ఆకర్షణ లేదు. అందుకే ఆమె అంటుంది…

ఎక్కడి యూరు కాల్నిలువ కింటికిబోయెదనంచు పల్కెదీవక్కట మీ కుటీరనిలయంబులకున్‌ సరిరాకపోయెనేయిక్కడి రత్నకందరము లిక్కడి నందనచందనోత్కరంబిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీనికుంజముల్‌ !!

ఇన్ని అద్భుతాలు వదులుకొని పోతానంటున్నావు ఏమిటి మీ కుటుంబంలో ఉన్నది? అని అంటుంది.
అమ్మో! ఈమె నన్ను పంపించదేమో? అనుకుంటాడు ఆయన అగ్నిహోత్రుడిని ప్రతిరోజూ పూజిస్తాడు కాబట్టి ఆయనని ప్రార్థిస్తాడు.

నేనే గనుక భగవత్పదాంబుజ ధ్యాన రతుండడనేని
పరదార ధనాదుల కోరనేని, సన్మానము తోడ నన్ను సదనంబు చేర్చుము ఇనుండు పశ్చిమాంబుధిలోనికుంగకమున్ను
దీని భావమేమంటే??
నేనే గనుక నీ పాదాలను నమ్ముకుని పూజించిన వాడనైతే, నేనే గనుక ఇతర స్త్రీలపై వ్యామోహం లేని వాడినైతే, నేనే గనుక ధనం మీద వ్యామోహం లేని వాడనైతే, సూర్యుడు అస్తమించక ముందు నన్ను నా ఇంటికి చేర్చమని వేడుకుంటాడు.
మను చరిత్రను పాఠకులు మూడు ఆశ్వాసాలే చదువుతున్నారు. పాఠ్యాంశంగానూ అంతే చెప్తున్నారు.
మొదటి ఆశ్వాసంలో ప్రవరుడు అరుణాస్పదపురంలో ఉన్నట్టు చెబుతారు. సిద్ధుడు పసరు రాయడం, హిమాలయాలకు పోవడం, వరూధిని కనపడడం, రెండో ఆశ్వాసంలో ..
ఎవతె వీవు? భీత హరిణేక్షణ! ఒంటి చరించె…… దోవతప్పితిన్ !…పురంబుగాన … తెరువెద్ది?శుభం నీకు!
నాకు ఈ ఊరు తెలియదు. తోవ తప్పాను, నేను అహంకారంతో వచ్చాను, దయచేసి నాకు మార్గం చెప్పు అంటాడు.
ఆమె చెప్పొచ్చు కదా! చెప్పదు..
” ఇంతటి కన్నులున్న భూసురేంద్ర! ……
యెల్లిదమైతిమి మాటలేటికిన్

ఏదో నెపం పెట్టుకొని ఆడవాళ్ళతో మాట్లాడాలనీ కానీ, నీకు వచ్చిన తోవ తెలియదా? నేను చెప్పను పో! అంటుంది.
మూడో ఆశ్వాసంలో మాయాగంధర్వుడు ఎప్పటినుండో వేధిస్తున్నాడు. ప్రవరుడు వెళ్ళిపోయాడు కనుక నేనే ప్రవరుడి వేషంతో వెళ్తాను అనుకోని, అతనికి కామరూపం ఉంటుంది కనుక అక్కడ పూలు కోస్తూ కనిపించాడు. ఆమె చెలికత్తె చూసి వరూధినితో, నువ్వు పొరపాటు పడుతున్నావు ఆ ప్రవరుడు ఎంత బ్రాహ్మణోత్తముడైనా ఇంత గొప్ప అప్సరస సాంగత్యాన్ని వదులుకొని వెళ్ళడు. ఊరికే నిన్ను బెదిరించాడు.. ఇక్కడే ఎక్కడో ఉంటాడు… అదిగో అక్కడ ఉన్నాడని చెప్తుంది.
అటుచూస్తే మాయ ప్రవరుడు అచ్చంగా ప్రవరాఖ్యుడిలాగే ఉంటాడు. గంధర్వుడితో సంగమిస్తుంది. అతనితో స్వరోచి అనే పిల్లవాడు పుడతాడు. వీళ్ళు ఎలా విడిపోతారంటే మాయా ప్రవరాఖ్యుడు ఇలా చెప్తాడు.
“నాకు కాలికి పసరు పూసిన సిద్దుడు కనిపించాడు. నా తల్లిదండ్రులు నన్ను చూడకపోయేసరికి చాలా దుఃఖంలో ఉన్నారట! నేను వెళ్లి వాళ్లను చూసి నాలుగు రోజులుండి మళ్ళీ వస్తాను!” అంటాడు కానీ అతను రాలేదు.
ఈ కథను సెలబస్ లో ఎవరు చెప్పరు. పిల్లలు చదవరు.
స్వరోచి మహారాజు వేటకు వెడుతుంటే ఒక అమ్మాయి నన్ను రక్షించండి! నన్ను రక్షించండి! అని పరిగెడుతూ వస్తుంది. ఆ అమ్మాయి పేరు మనోరమ. ఆమె ఇందీవరాక్షుడు అనే గంధర్వుడి కూతురు. ఇందీవరాక్షుడు వరూధినికి సోదరుడు. అతను ఎందుకు రాక్షసుడు అయ్యాడు అంటే? ఒక గురువు దగ్గరకు వెళ్ళి ఆయుర్వేద విద్యను నేర్పమని అడిగితే “మీరు గంధర్వులు! విలాస పురుషులు! మీకు ఆయుర్వేదం నేను నేర్పను! అంటాడు.
నువ్వు చెప్పకుంటే నేను నేర్చుకోలేనా? అని అహంకారంతో మాయతో విద్యార్థుల మధ్య కూర్చొని ఆయుర్వేద విద్య నేర్చుకుంటాడు. అంతటితో ఆగక గురువుగారి దగ్గరికి వెళ్లి నేను ఆయుర్వేదం నేర్చుకున్నాను అంటాడు. నువ్వు ఇంత అహంకారవంతుడివి కనుక రాక్షసుడువై నీ కూతురు వెంట పడతావు! అని శాపం పెడతాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చి స్వరోచి రక్షణ కోరుతాడు. ఆ శాపం ఇవ్వగానే మరి ఈ శాపం ఎలా విముక్తి అవుతుంది? అని అడుగుతాడు. స్వరోచితో నువ్వు యుద్ధం చేసినప్పుడు, యుద్ధంలో ఓడినప్పుడు నీకు పూర్వరూపం వస్తుందని చెప్తాడు. అట్లాగే యుద్ధం చేస్తాడు. యుద్ధంలో మరణించే స్థితి వస్తే మళ్ళీ ఇందీవరాక్షుడి రూపం వచ్చి మనోరమను స్వరోచికిచ్చి పెళ్లి చేస్తాడు అది మొదటి కథ.
ఐతే ఈ మనోరమ ఒకసారి ఏడుస్తూ కూర్చుంది. ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడుగుతాడు. నాతో పాటు నా ఇద్దరు స్నేహితురాండ్రు వచ్చారు. వాళ్ళు అడవిలో ఎక్కడో తప్పిపోయారని అంటుంది. ఎందుకు వచ్చారు అని అడిగితే,ఒక ఆమె కళావతి, ఇంకొక ఆమె విభావతి, ఇద్దరూ నాతో పాటే వచ్చారు మేము అందరం వన విహారం చేస్తూ వస్తుంటే బూచి వలె తెల్లటి గడ్డాలు మీసాలున్నాయని కనపడితే ఏమిటో చూద్దామని పిల్ల చేష్టతో ఆయన కళ్ళు , ముక్కువేళ్ళతో పొడిచాను. ఆయన తపస్సు భంగమై లేచి నీకింత అహంకారమా? అని నిన్నొక రాక్షసుడు వెంటపడతాడు అన్నాడు.
ఆ స్నేహితురాండ్రు ఇద్దరూ ఆయనతో పోట్లాడితే వాళ్ళని మీకు ఇంత అహంకారమా? దేనికని కుష్టి వ్యాధి వచ్చుగాక! కాని శపించాడు. పాపం వాళ్ళు ఆ వ్యాధితో ఎక్కడో ఏడుస్తూ ఉంటారు అని అన్నది.
స్వరోచి తనకొచ్చిన ఆయుర్వేద విద్యతో వాళ్లను బాగు చేస్తానంటాడు. వారికోసం వెతికితే ఒకచోట చెట్టు మొదట్లో కూర్చొని ఏడుస్తూ కనపడ్డారు. వారికి స్వరోచి ఆయుర్వేద చికిత్స చేసి వ్యాధి నయం చేస్తాడు. అందులో ఒక అమ్మాయికి ఇదివరలో అమ్మవారు ఒక విద్య నేర్పుతుంది. ఆ విద్య ఏమిటంటే ఎప్పుడు సమస్త సంపదలు కలిగే ఆ విద్యను రాజుగారికి దానం చేస్తుంది. ఇంకో అమ్మాయికి పక్షుల, జంతువుల భాష వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఈ స్వరూచికి ఆ విద్యను ఇస్తుంది. అప్పుడు ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాడు. అంటే స్వరూచికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తరువాతి కథాంశం ఏమిటి అంటే స్వరోచి ఒకసారి ఈ భార్యలను వెంటబెట్టుకొని ఉద్యాన విహారానికి వెళతాడు వెళ్తుంటే అక్కడ ఒక సరస్సు తీరంలో చక్రవాక పక్షి ఒక హంస రెండు ఆడవే అక్కడ ఉంటాయి. చక్రవాక పక్షి అంటుంది కదా! ఆ రాజును చూడవే ఎంత అదృష్టవంతుడో ఆ స్త్రీలు ఎంత అదృష్టవంతులు ముగ్గురు భార్యలున్నా ముగ్గురునీ ప్రేమగా చూస్తున్నాడు. వాళ్లు కూడా అసూయాద్వేషాలు లేకుండా ఎంత బాగున్నారు అంటుంది.
అయితే ఆ రెండో పక్షి “నీ మొహంలే ఏ ఆడది కూడా తన భర్త వేరే ఆడదానితో ఉన్నాడంటే ఏమీ ఆనందించదు! పొరపాటు పడుతున్నావు నేను అదృష్టవంతురాలిని నా భర్తకు నేను ఒక్కదాన్నే భార్యను” అని అంటుంది.
అంటే బహు భార్యత్వాన్ని అన్యాపదేశంగా వ్యతిరేకిస్తున్నదీ రచన. సమాజానికి ఒక సందేశం వంటిది.
ఈ మాటలన్నీ విన్న స్వరోచి తనకు పక్షి భాష తెలుసు కనుక అర్థమై ఛీ…ఛీ .. నన్ను ఈ పక్షులు ఇంత అవమానిస్తున్నాయని ఇంటికి వెడతాడు. కానీ వేట ఉత్సాహంలో మళ్ళీ కొన్ని రోజులకు అడవికి వస్తాడు.
ఒక మగ జింక చుట్టూ ఆడ జింకలు తిరుగుతూ ఉంటాయి. స్వరోచి వినేటట్టుగా ఛీ.. ఛీ… నేనేమైనా స్వరోచిననుకున్నారా? ఆడవాళ్ళతో గడపడానికి పో! పో! పోండి అని అంటాడు.
ఆ మాట విన్న స్వరూచి నాకింత అప్రతిష్ట ఏమిటి? అని బాధపడతాడు మళ్ళీ కొన్ని రోజులకు అరణ్యంలో విహారానికి వస్తాడు. ఒక వరాహాన్ని బాణంతో కొట్టబోతుంటే అక్కడున్న అమ్మాయి ఆ వరాహాన్ని ఎందుకు కొడతావు? నన్ను బాణంతో కొట్టు అంటుంది. అదేమిటి? నిన్ను నేనెందుకు కొడతాను? అని అంటాడు.
అప్పుడు ఆమె నేను ప్రేమించిన వ్యక్తి నన్ను ప్రేమించలేదు కనుక చచ్చిపోతాను అంటుంది. అయితే నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరు? చెప్పు! తీసుకొని వస్తాను అంటాడు.
నిన్నే ప్రేమించాను అంటుంది.
అదేమిటి? నువ్వేమో జంతువు- నేనేమో మనిషిని! నీకు నాకు ప్రేమ ఏమిటి? సాంగత్యం ఏమిటి? అని అంటాడు.
కాదు, కాదు ఒకసారి నన్ను కౌగలించుకో తర్వాత చెప్తాను అంటుంది.
అతను ఆమెను కౌగిలించుకోగానే వనదేవతగా, అందమైన యవ్వనవతిగా మారుతుంది. ఎందుకొచ్చావు? ఇక్కడికి అని అడిగితే దేవతలంతా నన్ను కోరారు స్వరూచితో కలిసి నీకు కొడుకు పుడితే వాడే మనుధర్మ శాస్త్రాన్ని రచించే మనువు ఔతాడని, అతనే పరిపాలిస్తాడని చెప్పింది. దీన్నే స్వారోచిషమనుసంభవం అని అంటారు.
కొద్ది రోజులకు కొడుకు పుట్టి నేను విష్ణువును ధ్యానించుకోవడానికి వెళ్తాను అంటాడు. విష్ణువు ఇప్పుడు కాదు చాలా ఏండ్లు భూమిని పరిపాలించి మనుధర్మ శాస్త్రాన్ని రచించాలి! అని నువ్వు భూమ్మీద ఉండాలని అంటాడు. ఐదు ఆరు ఆశ్వాసాలలో ఉన్న కథ స్వారోచిష మనుసంభవానికి మూలం.
యయాతి, కచ,దేవయాని, మరియు శర్మిష్ట భారతాధారంగా రాస్తే ఎమెస్కో వారు ప్రచురించారు, బసవేశ్వరుడు, దక్షిణకాశి, జైత్రయాత్ర, పాండురంగలీలలు, ఆనంద కాననం,గిరిక పరిణయం, కోనేటిరాయడు, భక్తి తరంగాలు మొదలైన ప్రబంధాధారిత రచనలు చేసాను.

పద్మజ :— వెంగమాంబ సినిమా లో మీ సేవలు ఎలా ఉపయోగపడ్డాయి?

భారతి :– తరిగొండ వెంగమాంబ అన్నప్పుడు కొండ అంటున్నాము. కొండ కాదు కుండ అనాలి. దానికో చరిత్ర ఉంది. ఆమె ఓ కుండలో పెరుగు పోసి కవ్వంతో చిలుకుతున్నప్పుడు ఆ కవ్వం కింద ఏదో తగిలిందట.. ఏమిటని చూస్తే అక్కడ ఏమి కనిపించలేదు. ఆమె భయపడి భర్తకు చెప్తే అతను కూడా జాగ్రత్తగా కవ్వం కింద చెయ్యి పెట్టి చూస్తే అక్కడ సాలగ్రామం ఉందట. ఆ సాలగ్రామంలో లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపించిందట. అలా ఆ సంగతి ఆ ఊరంతా తెలిసింది. ఒకరోజున ఆకాశవాణి “ఈ ఊళ్లో ధనవంతుడి చేత నరసింహ స్వామి దేవాలయం కట్టించండి! ఈ ఊరికి క్షేమం కలుగుతుంది.” అని అంటే ఆ ఊళ్ళో లక్ష్మీనరసింహ స్వామి కోవెల కట్టారు. ప్రజల నోళ్ళల్లో తరికుండ కాస్తా పలుకుబడుల మార్పుతో తరికొండ… తరిగొండ అయింది. ఈమె మొట్టమొదట నరసింహ శతకం రాశారు.
వెంగమాంబ బాల్యంలో చదువుకోకుండా తిరుగుతూ ఉంటే అందరూ ఆమెను ఆక్షేపించారట.పిచ్చి పట్టిందని అన్నారట.
ఆమె తండ్రి బాధపడుతూ ఒక గురువు దగ్గర చదువుకోమని పంపించాడు. ఆ గురువు దగ్గర సమస్త శాస్త్రాలు నేర్చుకుంది. తర్వాత తరిగొండకు వచ్చింది. రచనా వ్యాసంగం కొనసాగించింది. తర్వాత ఆమె తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గొప్ప రచనలు చేయడం జరిగింది.
ఊటుకూరు లక్ష్మీనరసమ్మ గారి ఆంధ్ర కవయిత్రుల పుస్తకం చదువుతుంటే తరిగొండ వెంగమాంబ ఇంత గొప్ప కవయిత్రా ?అనిపించింది. మొల్ల రామాయణం, తిమ్మక్క సుభద్ర కళ్యాణం, రంగాజమ్మ మన్నార దాస విలాసం ఇలా వారంతా ఒక్కటే కావ్యం రాసినా, ఏడు ఎనిమిది యక్షగానాలు, పద్య కావ్యాలు, కీర్తనలు, ఇన్ని రాసిన వెంగమాంబను మరిచిపోతే ఎలా? అని నా మెదడు మేత మేస్తూనే ఉన్నది. నేనొక నవల రాశాను. అప్పటికి ఆమె గురించి రాసిన పుస్తకాలు లేవు. సుందరయ్య విజ్ఞాన భవన్లో ఒకటి రెండు ఉన్నట్టున్నాయి. వాటిని తెచ్చుకొని రాశాను. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆమె రచనలు అన్నింటిని ముద్రించారు. ఇప్పుడు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం కూడా భక్తులు వెళ్లి చూస్తారు. నేను కొంచెం సేకరించి నవలగా రాస్తే ఒక పత్రిక వారు ధారావాహికగా ప్రచురించారు. తర్వాత ఎమెస్కో ( EMSCO)
పబ్లికేషన్స్ అవన్నీ కలిపి ఒక పుస్తకం వలె నవలగా అచ్చు వేయించారు. దొరస్వామి రాజుగారు ప్రొడ్యూసర్ ఆయన నా తో ఫోన్ కాల్ చేసి అమ్మా! తరిగొండ వెంగమాంబ నవలలు మాకు ఇస్తారా? అన్నారు. నేను వెంటనే ఇచ్చాను. ఆయన దాన్ని సినిమాగా తీశారు. దాని ముందు 20 -30 ఎపిసోడ్ లు ఎస్వీబీసీ ( SVBC) ఛానల్ లో ప్రసారం చేశారు. తరిగొండ వెంగమాంబ నాకు ఎంత అభిమాన రచయిత్రయిందంటే? కేంద్ర సాహిత్య అకాడమీ వారు నాకు మోనోగ్రాఫ్ రాసే అవకాశం ఇచ్చారు. తర్వాత ఐనంపూడి శ్రీలక్ష్మి గారి అక్షరయాన్ సహస్ర కవయిత్రుల సంస్థ లోకూడా తరిగొండ వెంగమాంబ మీద నేను పెద్ద వ్యాసం రాసి ఇచ్చాను. వెంగమాంబ బాలవితంతువుగా చాలా కష్టాలు పడింది. వెంకటేశ్వర స్వామే నా భర్త! అని ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది. కానీ తల్లితండ్రులు బలవంతంగా ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆమె అతనికి మొదటి రోజే చెప్తుంది “నువ్వు నా భర్త కాదు! వేంకటేశ్వర స్వామే నా భర్త” అని..
ఈ మాటతో ఆయన ఎంతో వేదన చెంది మరణించాడు. ఆ కాలంలో భర్త మరణిస్తే సుమంగళి చిహ్నాలన్నీ తీసేయాలి. కానీ ఆమె ఏమీ తీయలేదు. అలాగే తిరిగేది. ఆ ఊరు వారికి అది నచ్చలేదు. ఊరి వారందరూ ఆమె అలా ఉంటే ఊరికి అరిష్టమని శిరోముండనం చేయాలని పట్టుబడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె చేయించుకోనంటుంది.
పుష్పగిరి పీఠాధిపతులను పిలిపించి ఆమెకు విధవగా మారమని చెప్పిస్తారు. అప్పుడు ఆమె అంటుంది ఒక పతివ్రత అయిన నన్ను ఒక మంగలి ముట్టుకోవడం ధర్మమేనా? అని ఇప్పుడు జుట్టు తీసేస్తాను అనుకోండి! మళ్ళీ పెరగదని మీరు హామీ ఇస్తారా? అని అడిగితే ఈమె సామాన్యురాలు కాదు! ఏదో మహత్తు ఉంది… అని వెళ్ళిపోతాడు. అక్కడున్న వారందరూ వెంగమాంబను స్వామికి దండం పెట్టమని ఒత్తిడి చేస్తారు. అప్పుడు ఆమె ఆ స్వామి సింహాసనం దిగితే దండం పెడతాను. అంటుంది సరే! ఎందుకంటున్నదో? అని వెంటనే ఆ సింహాసనం దిగుతాడు.ఆ సింహాసనం భగ్గున మండిపోయింది. అప్పుడు అనుకుంటాడు ఈమె భగవద అంశంలో పుట్టిన్నట్టున్నది కాబట్టి మనం ఎవరూ బాధించవద్దని చెప్పి ,అలా వదిలేయండి అని పీఠాధిపతి అన్నారు.
వెంగమాంబ హారతి ఇవ్వడానికి వెళితే దేవాలయంలో పూజారులు, పెద్దలు హారతి ఇవ్వవద్దని తలుపులు వేసి, తాళాలు వేసి,చేతికి సంకెళ్లు వేసేవారు.
ఒక వితంతువు దేవుడికి హారతి ఇవ్వడం ఏమిటి? అని వారి వాదన ! ఆ రోజుల్లోనే స్వామి వారి రథం ఇంటింటి ముందు హారతులందుకుని సాగుతుంది .
ఒక రోజు రథం ఆగిపోయింది. వెంగమాంబ తాను ఇంట్లోంచి హారతి ఇచ్చింది. ఆ రథం కదిలింది అప్పటి నుండి దాన్ని ముత్యాల హారతి అన్నారు. ఈ రోజుకు కూడా ముత్యాల హారతి ఇచ్చిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనికి వెళ్లి పవళింపు సేవ జరిపిస్తారు. ఈ హారతి ఇచ్చిన తర్వాతనే తలుపులు వేస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే మనం హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారికి, అయ్యవారికి హారతి ఇచ్చి వారి ఆశీస్సులు కోరుకుంటాం! కానీ తరిగొండ వెంగమాంబ కేవలం స్వామికి , అలివేలు మంగమ్మకే కాకుండా ఆ ఊర్లో ఉన్న రథాలకి, అక్కడున్న ప్రాకారాలకు, అక్కడి సామాన్య ప్రజలకు, వంటశాలలకు, వంట వారికి, అన్నింటికీ మంగళహారతి ఇచ్చేదట. అది ముత్యాల హారతి యొక్క గొప్పతనం.
ఇంత గొప్ప మహిళ నేను ఇక్కడ ఉండలేను అంటే వెంకటేశ్వర స్వామి ఒక బిలంలోనుండి తీసుకుని వెళ్లి అభయారణ్యంలోని గుహలో ఉండమని చెప్తాడు. అక్కడ ఉంటుంది ఆమె.
వేంకటాచల మహాత్మ్యం రాసింది. ఆ పద్య కావ్యం చదువుతూ ఉంటే మనకు తిరుపతిలో ఉన్నామా? అనే భావన కలుగుతుంది. అంత విశేషంగా ఉంది. నేను చాలా ప్రబంధాలు నవలలుగా రాసాను. దీనిని కూడా ఒక నవలగా రాసి సామవేదం షణ్ముఖ శర్మ గారి ఋషిపీఠం పత్రికకు పంపాను. ఆ పత్రిక వారు మూడు సంవత్సరాలు సీరియల్ గా వేశారు. ఆ నవల పేరు కోనేటి రాయడు ఆ పేరుతోనే పుస్తకం ప్రచురించారు. ఆ నవల కూడా పాఠకులకు చేరింది.
ఎన్నోరచనలు చేసింది .ఆమె సాహిత్యం అంటే ఇప్పటికీ నాకెంతో ఇష్టం.

పద్మజ:- అన్నీ మంగళప్రదంగా ఉండాలనే శుభకామన ఎంత గొప్పదో కదా!
అలాగే ధూర్జటి కవి రచనల గురించి వివరిస్తారా?

భారతి:– ముందే చెప్పాను ప్రబంధాలు అంటే చాలా ఇష్టం అని ధూర్జటి నాకిష్టమైన కవి అంత స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న కవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ధూర్జటి మరొకరు పోతన ఆయన మాటలలోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది.
పద్యం :–
రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు,
వారిచ్చు నంభోజాక్షీ చతురంతయాన తురగభూషాదు
లాత్మ వ్యధా బీజంబుల్,తదాపేక్ష చాలు పరితృప్తిం
బొందితిన్, జ్ఞానలక్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా ॥

కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్మ్యం రెండు రాశాడు. ముందు శతకం తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత కాళహస్తి దేవాలయం వెళ్లి ప్రబంధం రాశాడు.
విశేషం ఏమిటీ అంటే కాళహస్తి మహాత్మ్యంలో ఒక శైవాచార్యుడు వస్తాడు ఒక దాసి అతన్ని చూసింది. అతనెంత అందంగా ఉన్నాడు అనుకుంటుంది. శివ భక్తుడు కదా! నన్ను నేను అర్పించుకుంటాను. అనుకొని మా ఇంటికి రండి అని పిలుస్తుంది. ఆ దాసితో ఆ శైవాచార్యుడు వెళ్తాడు, భోజనం పెడుతుంది,అతనితో సంతోషంగా ఉండిపోతుంది.
అసలు ఈమె ఎవరంటే? రాజుగారి పళ్ళెరుపు దాసి! అంటే రాజుగారికి సరిగ్గా సమయానికి భోజనం తీసుకొని వెళ్ళాలి. అది ఆ అమ్మాయి ఉద్యోగం. శైవాచార్యుడి ఆకర్షణలో పడి ఆలస్యమైంది. రాజుగారు కోప్పడతారేమోనని భయపడిపోయింది. త్వరగా చీరా, రవికా, జుట్టు సవరించుకొని వెళ్తుంది. రాజుకు భోజనం ఆలస్యమవడంతో కోపంతో ఆమె ఏమి చూసుకొని అంతలా మిడిసిపడుతున్నది..? అనుకొని నీ జుట్టు చాలా అందంగా పొడుగ్గా ఉంటుందికదా! అది చూసుకొని నీకు గర్వం. అందుకే నాకు భోజనం ఆలస్యంగా తెచ్చావని కోపంతో రాజుగారు మంగలిని పిలిపించి ఆమెకు బోడగుండు చేయిస్తాడు. పాపం దాసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది . ఇంటికి వెళ్లి ఆ శైవ భక్తుడితో చెప్పి గోలు గోలున ఏడుస్తుంది.
ఏడవకు అంటూ ఆయన ఆమె తల మీద చేతితో నిమిరి ఓదార్చుతాడు. జుట్టు అంతా ఇదివరకటి వలె వచ్చేస్తుంది.
దాసి తెల్లవారి భోజనం పట్టుకుని రాజు గారి బంగ్లాకి వెళుతుంది. ఆమె జుట్టు చూసి ఒక్కరోజులో నీకు జుట్టు ఎలా వచ్చింది? అని మంగలికి నువ్వు లంచం ఇచ్చి జుట్టు తీయకుండా చేసి ఉంటావు! నన్ను మోసం చేశారు… అంటాడు. కాదు మంగలి నా జుట్టు నిజంగానే తీశాడు. కానీ మా ఇంట్లో శివభక్తుడున్నాడు అతని వల్లనే నా జుట్టు పెరిగింది. అంటే అతన్ని నేను చూడాలి అని దాసి ఇంటికి వస్తాడు రాజు. శైవభక్తుడి తేజస్సు చూసి రాజు విస్తుపోతాడు.
అయ్యా! రాజా మీ దర్శనం చేసుకుందామనే ఈ ఊరు వచ్చాను. ఎందుకంటే మీ ఊర్లో కాళహస్తి దేవాలయం లేదు. నువ్వు కట్టించు అని అంటాడు.
అప్పుడు ఆ రాజు కాళహస్తి దేవాలయాన్ని కట్టిస్తాడు. ధూర్జటి కాళహస్తి మహత్యంలో ఎన్నో కథలు ఉన్నాయి. చాలా చిన్న చిన్న కథలు ఉన్నాయి.
నేను మొట్టమొదట కథారచయిత్రిని కనుక నాకు కథలు ఆసక్తి కలిగిస్తాయి. అందుకే ప్రబంధంగా రాసినప్పుడు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని రాసి దక్షిణ కాశీ అని పేరు పెట్టాను. అది కూడా ముద్రణ అయింది.

పద్మజ:– కవులకు తమ రచనల మీద సామర్థ్యం మీద అంతులేని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉండేదిట. ధనాపేక్ష లేకుండా సాహితీ సేవ చేసారు. ధూర్జటి గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది!
అలాగే మీ కవితా రచన గురించి చెప్తూ…రేపటి తరం కవితలు ఎలా రాస్తే బాగుంటుందో చెప్పండి!!

భారతి:– పద్యాలు రాసే వాళ్ళ సంఖ్య తగ్గింది. వచన కవిత్వం పెరిగింది. అది నాలుగు ఐదు లైన్లు మాత్రమే అయితే అందులో కవిత్వం వెతుక్కోవాల్సి వస్తుంది. కవిత్వం రాయాలంటే పాండిత్యం, భావనా శక్తి ఉండాలి అందుకుగాను విపరీతంగా పుస్తకాలు చదవాలి. కవితలో కవిత్వం ఉంటేనే పది కాలాలపాటు నిలిచి ఉంటుంది. ప్రాచీన కావ్యాలు ఇవ్వాళ కూడా మనం చదువుతున్నామంటే క్యాచీగా ఉండి, జ్ఞాపకం ఉంటాయి. ప్రాథమిక పద్యాలు ఎక్కువ ధారణ ఉండదు ఎంత చదివితే అంత కొత్త ఆలోచనలు వస్తాయి. నేను ఒక కవితాసంకలనం వేసుకున్నాను.
ఆ సంకలనానికి భారతీయం అని పేరుపెట్టాను. అప్పట్లో ఉదయం పత్రిక ఉండేది అందులో ప్రతి వారం ఒక కవిత అచ్చు అయ్యేది. తర్వాత పసిపిల్లల గురించి ఫిమేల్ చైల్డ్ ఇయర్ శీర్షికన కవితలు ఒక సంవత్సరం పాటు వచ్చాయి. అప్పుడు ఊయలనే కవిత రాశాను. ఉయ్యాల దేనికి ప్రతినిధి అంటే ఒక ఆడపిల్లకి…
ఉయ్యాలలో ఉండే నెల రోజుల పసికందైనా సరే తల్లితో మాట్లాడుతుంది. అంటే అది కవి భావనే! తల్లి ఊయలలోకి తొంగి తొంగి చూస్తుంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే…
అమ్మా నేను ఆడపిల్లను పుట్టాను అని బాధపడుతున్నావా?
రౌడీ మగ పిల్లవాడి కన్నా ఆడపిల్ల నీకు ఆనందం కాదా?
నువ్వు హాస్పిటల్ లో డాక్టరమ్మను ,
బడిలో టీచరమ్మను చూసినప్పుడు
నీ కూతురు అలా కావాలని అనుకోలేదా? అని అంటుంది తల్లి కూతురు వేసిన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. చివరగా ఊయలలో ఉన్న పిల్ల ఏమంటుందంటే ..?
“అమ్మా నాకు పట్టుపరికిణీలు కొనవద్దు!
పట్టా గొలుసులూ వద్దు!
ప్రాణంతో ఉండనీయండి నన్ను!
నా కళ్ళతో నన్ను లోకాన్ని చూడనివ్వండి!
నా మనసుతో ఆలోచించనివ్వండి !
నేను అమ్మను అవుతాను!
ముగ్గురమ్మల మూలపుటమ్మనవుతాను!
శక్తిని అవుతాను! యుక్తినౌతాను!
నన్ను నన్నుగా బతకనీయండి!
అని ఉయ్యాలలో పాప అన్నట్టుగా రాసి
ఊయల అని దానికి పేరు పెట్టాను.

పద్మజ:– మీరు జీవిత చరిత్రలు రాశారని విన్నాను వాటిని ఎందుకు రాయాలనిపించింది?

భారతి:– జీవిత చరిత్రలు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే? నాకు వాటిని చదవడం చాలా ఇష్టం. వాటిని చదివితే మనకు అనుకోకుండా ఒక దేశభక్తో.. ఒక సమాజ సేవ చేయాలనో ఆకాంక్ష ఏర్పడుతుంది.
ఒక జీవితకాలంలో వారు అన్ని పనులు చేయగలిగితే మనం ప్రపంచానికి పనికొచ్చే ఒకటో రెండు పనులు చేయలేమా? అనే భావం కలుగుతుంది. అందుకే జీవిత చరిత్రలు చదవడం, రాయడం నాకు ఇష్టం. అందుకే ఇల్లిందల సరస్వతీ దేవి జీవిత చరిత్రను రాయించారు. అలాగే తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ వారు నాచే రాయించారు.
ఎల్లాప్రగడ సీతాకుమారి గారు ఎంతో కాలం కిందటే ఆడపిల్లలు బయట ప్రపంచంలోకి వచ్చి చదువుకోడానికి కష్టం… అనుకుని ఆ రోజుల్లో ఒక చిన్న యువతి మండలిని స్థాపించి, చిన్న చిన్నగా పెంచి ఆ యువతీ మండలిలో ఇప్పుడు పీజీలు కూడా చదువుతున్నారు.
ఆ సంస్థకు నేను వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసాను.
అలా ఎల్లాప్రగడ సీతాకుమారి జీవిత చరిత్రను రాశాను.
ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారి గురించి ఒక వ్యాసం రాశాను. అది చూసి వారి అబ్బాయి రాజరాజ నరేంద్ర అమెరికాలో నివసించే వారు ఆ వ్యాసం చదివి మా అమ్మగారి గురించి చక్కని వ్యాసం రాశారు. ఆమె చేతనే అమ్మ జీవిత చరిత్ర రాయించాలని వంశీ రామరాజు గారిని కోరారు. రామరాజు గారు వంశీ సంస్థ ద్వారా ఆ పుస్తకం అచ్చు వేయించారు. ఈ మహిళలంతా స్ఫూర్తినిచ్చే వారే. వారి జీవితమంతా త్యాగం చేసి దేశానికి, సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు. వారితో పోల్చుకుంటే మనం ఎంత స్వార్ధపరులమో కదా! మన గురించి మనం ఆలోచించుకోవడం తప్ప మరొక ఆలోచన రాదు.వాళ్ళు జీవితమంతా దేశానికి , సమాజాని కోసమే ఆలోచించారు.
అందుకే జీవిత చరిత్రలు రాయాలి! తప్పక ఈ తరం వారు వాటిని చదవాలి! చదివితే ప్రేరణ పొంది ఏవైనా మంచి పనులు చేయగలరు . అలా వారి జీవితాలు సార్ధకత పొందుతాయి.

పద్మజ:– ఇంతటి సాహిత్యాన్ని సృష్టించిన మీరు పొందిన పురస్కారాలు, అందుకున్న అవార్డులు సన్మానాలు తెలుపుతారా?

భారతి:– ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును 1991లో బహుకరించారు.
మద్రాసు కేసరి కుటీరం వారు గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారాన్ని 1996లో ఇచ్చారు.
1998 లో మద్రాసు తెలుగు అకాడమీ వారు ఉగాది పురస్కారాన్ని అందజేశారు.
1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ధర్మనిధి పురస్కారాన్ని ఇచ్చారు.
1995లో అభినందన సంస్థ వారు
దుర్గాబాయి దేశ్ ముఖ్ అవార్డు ప్రధానం చేసారు.
1989 లో ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ వారు చల్లపల్లి వెంకట శాస్త్రి
అవార్డును బహుకరించారు.
2000 సం.పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు బెస్ట్ ఉమెన్ రైటర్ అవార్డును అందజేశారు.
2002 లో వంశీ సాంస్కృతిక సంస్థ
ఇల్లిందల సరస్వతీదేవి *స్వర్ణ పథకం అందించారు.
2002 లో విశ్వసాహితీ సంస్థ వారు తెలుగు సాహిత్య విమర్శ , 2006 లో సుశీలా నారాయణ రెడ్డి సాహిత్య అవార్డ్, 2007 లో నాయని సుబ్బారావు సాహిత్య పురస్కారం, కొత్తూరు దేశికులు వెంకటలక్ష్మి పురస్కారం బహుకరించాయి. 2008 లో రావూరి కాంతమ్మ లిటరేచర్ అవార్డ్, 2011 లో విజయవాడ కళాపీఠం వారు ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ సాహిత్య పురస్కారం,
ఉపాసనా సంస్థ 2013లో మండపాక ఉమాదేవి సాహిత్య పురస్కారం,
సామవేదం షణ్ముఖ శర్మగారి తల్లి లలితాదేవి స్మారక పురస్కారం ఋషి పీఠంనుండి,
నవ్యసాహితీ సమితి నుండి వసంతోత్సవం – ఉగాది పురస్కారం, ఇలా పలు సంస్థల నుండే కాకుండా
2014 లో అమెరికాలోని హ్యూస్టన్ – వంగూరి ఫౌండేషన్ సంస్థ జీవన సాఫల్య పురస్కారం,
గిడుగు రామమూర్తి జీవనసాఫల్య పురస్కారం,
విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ ప్రభుత్వం 2024 మహిళాదినోత్సవ సందర్భంగా అందించారు.
అపురూప అమృత లత జీవన సాఫల్య పురస్కారం అందుకున్నాను.

పద్మజ:–ఇన్ని పురస్కారాలందుకున్నందుకు అనేక అభినందనలమ్మా!

అలాగే మయూఖ పత్రిక పాఠకులకు మీరు ఏం సూచనలు ఇస్తారు?

భారతి :– సూచనలు కాదు కానీ ఇవాళ నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎవరైనా విన్నవారు కొన్ని విషయాలైనా మనసుకు పట్టుకుంటే, ఒక్క మన కుటుంబానికే కాదు సమాజానికి ఏమైనా చెయ్యాలని అనుకోవాలి. రాయాలంటే పుస్తకాలు బాగా చదవాలి. నా వయసు 80 పైన ఇప్పటికీ సాహిత్య కృషి చేస్తూనే ఉన్నాను. సాహిత్యం ఎలా పని చేస్తుంది అనే దానికి ఉదాహరణగా నేను ఒక కథ చెప్తాను.
ఆరుగురు అక్క చెల్లెళ్లు అన్న తమ్ముళ్లు ఒక ఫంక్షన్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటి జనరేషన్లో ఎవరైనా ఒక్కొక్క పిల్లనే కంటున్నారు. ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే మీ అందరూ ఇలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు మీరందరూ ఒరేయ్! అన్నాయి అని, ఒసేయ్! చెల్లి అని ఒక్కొక్కరు ప్రేమగా పిలుచుకుంటున్నారు నాకు ఎవరూ తోడు లేరు. తోడు ఎవరున్నారని ఏడుస్తున్నాడు.
వాళ్ళ అమ్మ నిజమే కదా! అనుకుంటుంది.
కాలేజీకి వెళుతుంటే ఒకరు ఎదురొచ్చి మీ కథ తోడు చదివాను. ఒక నిర్ణయం తీసుకున్నాము మా అమ్మాయికి ఇప్పుడు 9 సంవత్సరాలు ఒక పిల్ల చాలు అనుకున్నాము కానీ మా తర్వాత మా అమ్మాయి ఒంటరిగా అయిపోతుందని ఇంకొకరిని కనాలని అనుకుంటున్నామని అన్నాడు.
అంటే నా కథ ఒకరి మనసు మార్చిందంటే సాహిత్య లక్ష్యం నెరవేరినట్టే!
అలాంటి ఎన్నో కథలు ఉన్నాయి.ఈ తరం వారు చదువుతూ, రాస్తూ, ఉంటే మన విలువలు రక్షింపబడతాయి.
పద్మజ:– ప్రేక్షకులకు ఇంత గొప్ప సాహితీవేత్తను, మానవతా మూర్తిని పరిచయం చేయడం, నా భాగ్యంగా తలుస్తున్నాను. ఇంకా ఎన్నో విషయాలున్నాయి వారినుండి నేర్చుకోవడానికి ఇంత తక్కువ సమయం సరిపోదు! ఎంత చెప్పిన తక్కువే వారు వృత్తి రీత్యా విద్యార్థులకు చేసిన సేవలు అమోఘం. ఇవాళ ఒక స్ఫూర్తివంతమైన మహిళా రత్నం శ్రీమతి ముక్తేవి భారతి గారితో పరిచయం చేసుకున్నాము.
మరొక మహిళా రత్నంతో కలుస్తాను! అందాకా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ..

మీ రంగరాజు పద్మజ.

May 30, 2025 55 comments
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

మిస్టరు గ్యాస్‌ కోయినె ఎలా పాఠశాలను ఆవిష్కరించాడు

by ఒద్దిరాజు మురళీధరంరావు May 30, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

గ్యాస్‌ కోయినేకు ఐదుగురు పిల్లలు. వాస్తవంగా పిల్లలేనని గ్యాస్‌ కోయినే అనేవాడు. చాలావరకు ఐదు పిల్ల మొసళ్ళ వలె ఉన్నారు. ఆమె అన్నది నిజమే. ఆ ఐదుగురు ఉదయం నుండి రాత్రి వరకు కోట్లాడుతూ తలలు పడిపోయేంత అరుపులు అరుస్తూ తగిలించుకున్న దెబ్బలు చూపించేందుకు కన్నీరుతో ఒకరి తరువాత ఒకరు ఇల్లు చేరేవారు. చేతులీడ్చుకుంటూ గ్యాస్‌ కోయినె భార్య ఇలా అయితే మేము ఉండలేము అన్నది. నాకు ఒక్కక్షణం శాంతి దొరకడం లేదు. నేను త్వరలో నా బలహీనమైన నరాలు కోల్పోతాను. మిస్టర్‌ గ్యాస్‌ కోయినె ఆమె అన్నది అంగీకరించాడు. అది ఆమె బాధను ఎప్పటికన్న ఎక్కువ చేసింది. తల ఊపుకుంటూ కూర్చోకు. ఏదో ఒకటి చెయ్యి అని అతని మీద అరిచింది. కానీ అతను ఏమి చేయాలో తోచక, ఏదో ఒకటి చేయాలని ఆలోచించాలి. ఎందుకంటే పిల్లల అల్లరి, గులిగే భార్యను భరించలేకపోయాడు.

ఆ రోజు అతను పిల్లలులేని మిత్రుడిని కలవడం జరిగింది. అతను ఏదో ఉద్యోగం కోసం చూస్తున్నాడు. వెంటనే, గ్యాస్‌ కోయినేకు ఒక ఆలోచన వచ్చింది. ఆ టౌన్‌ లో ఒక ప్రత్యేకమైన ఇల్లు కట్టించి, దాంట్లో కనీసం ఒక సగం రోజు ఊరి వారి పిల్లలను ఉంచి, తన మిత్రుడు వాళ్ళను చూసుకుంటూ ఉండొచ్చు కదా? వాళ్లకు చిరాకు కలగకుండా తన మిత్రుడు వాళ్ళకు ఏదో ఒకటి బోధించ వచ్చు గదా. చదివించడం, రాయించడం, లెక్కలు చేయించడం చేయవచ్చు కదా. అది ఆ పిల్లలకు చాలా ఉపయోగకరం కూడా. ఆ రకంగా అదే మొదటి పాఠశాలగా ఆరంభించారు. ఆ టౌన్‌ పిల్లలకు మొదటి ఉపాధ్యాయుడు దొరికాడు. ఉపాధ్యాయుని తల త్వరలోనే నెరిసిపోయింది. ప్రత్యేకంగా ఆ ఐదుగురు గ్యాస్‌ కోయినె దయ్యాలవంటి పిల్లల అల్లరితో.

May 30, 2025 53 comments
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

చెత్తకుప్ప మీద రెండు కోడిపుంజులు

by ఒద్దిరాజు మురళీధరంరావు May 30, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

వేన్‌ రైట్సు అనే అతనికి ఒక కోళ్ళగుంపుతో పాటు ఒక హాట్‌ స్టర్‌ అనే పుంజు మరియు గ్లోవర్సు అనే అతనికి కోళ్ళ గుంపుతో పాటు గర్వం కల ఒక పుంజు వుండెను. కోళ్ళు తిరిగే రెండు జాగల మధ్య ఒక పెద్ద చెత్తకుప్ప వున్నది. చాలాకాలం వరకు రెండు పుంజులకు ఆ చెత్తకుప్ప గురించి ఏమీ తెలియలేదు. కానీ అవి వాటి పెట్టలను దూరం దూరం తీసుకపోయినావో ఒకరోజు ఆ రెండు చెత్తకుప్పపైన కలవడం జరిగింది. ఆ రెండు ఒక దాని ముందు రెండవది కోపంగా ముక్కు ముందరికి అంటూ రెక్కలు ఆడించాయి. ఆ పెట్టలు వాని యజమానులు ఎట్లు సదురుకుంటారో ఎదిరి చూసాయి. ఈ చెత్తకుప్ప వేన్‌ రైట్సుకు చాలాకాలం నుండి చెందియున్నదని హాట్‌ స్టర్‌ గట్టిగా అంది. మేము ఇక్కడ మేత మేయుటకు అర్హులం అంది. కానీ గర్వం కలది తిప్పికొట్టింది. అది శుద్ధ అబద్ధం. ఆ చెత్తకుప్ప గ్లోవర్సుకు చెందినదని, ఇది మాది అని గట్టిగా అంది. చాపమొహం దానా ఇది మాది అని అరిచింది హాట్‌ స్టర్‌. ‘ఇది మాది, బలిసిన తలదానా!’ అని ప్రౌడ్‌ కోంచ్‌ నోరు మూయించింది. ఒకవేళ నీ గుంపును వెంటనే, ఇక్కడినుండి తీసుకపోకపోతే కోపంగ హాట్‌ స్టర్‌ నీ కంటి గుడ్లు పీకేస్తా నంది. నీ గుంపును ఇక్కడినుండి వెంటనే తీసుకపోకపోతే నీ రెక్కలను పీకేస్తాను మరియు నీవు మొండి శరీరంతో నడవగలవు అని ప్రౌడ్‌ కోంచ్‌ నోరు మూయించింది. ఈ తీరుగ అవి నోటికి వచ్చినట్లు ఒకదాని మీద ఒకటి అవమాకరమైన తిట్లు మరియు భయంకరమైన బెదిరింపులు చేసుకున్నాయి. ఇది ఒక గంట తరువాత మరో గంట సాగింది. ఈ రెండు పుంజులు అలసిపోయి చుట్టూ చూశాయి. అప్పుడు అక్కడ చెత్తకుప్ప మొదట్లో వేన్‌ రైట్సు మరియు గ్లోవర్ల పెట్టలు పక్కపక్కనే కలిసి గింజలు సంతోషంగా ఏరుకుని తింటున్నాయి. అప్పుడు ఆ పుంజులు సిగ్గుపడి తలలు వంచుకొని అక్కడినుండి ఇంటివైపు వెళ్ళాయి. వాటిలో ఎవరు గెలిచారో, ఎవరు ఓడారో తెలుసుకోండి.

”కలిసి ఉంటే కలదు సుఖం”.

May 30, 2025 54 comments
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

అయితే మీరే (భుజాలు తడుముకుంటున్నారుగా!)

by Sompaka Seetha May 30, 2025
written by Sompaka Seetha

ఆకాశంలో సగం అని కితాబు లిచ్చినా,ఆకాశమే మీది అని కీర్తిస్తున్నా నేటి మహిళలు ప్రస్తుత సమాజంలో అనునిత్యం ఎన్నో ఆటుపోట్లను,ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. తమదైన అనురాగం,ఆప్యాయతలతోవాటిని అధిగమించి జీవితంలో నిలిచిగెలుస్తున్నారు. హద్దులు దాటిన అమానుషత్వానికి, పైశాచిక తత్వానికి పరాకాష్ట గా మారిన పురుష నైజానికి ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలో
తమదైన స్వావలంబన,సాధికారతలనే మంత్రంతో తమ అస్తిత్వాన్ని సుస్థిరం చేసుకున్నతీరును ప్రతిబింబింపచేసే ” అయితే మీరే ….(భుజాలు తడుముకుంటున్నారుగా!) ” అనే పేరుతో సోంపాక సీత రచించిన

నవల

ను పాఠకులంతా ఆదరించాలని ఆకాంక్షిస్తూ… ఈ నవల ధారావాహిక గా మీ కోసం !

కొండపల్లి నీహారిణి
పత్రికా సంపాదకురాలు

ఆటోలో కూర్చున్న స్నేహితురాళ్లిద్దరి దృష్టి ఒకేసారిగా తమకు కుడివైపు ఎదురుగా ఉన్న సందు మొదట్లో నిలబడిన వ్యక్తి మీదుగా నిలిచిపోయాయి.

‘‘ఆ… ఆ… అతనేనండి. పద్మినిగారి వాళ్ళాయన’’ అంది మాలిని, మైథిలితో.

‘‘అవునా? సరిగా చూడండి… పద్మినిగారి తాలూకు అవునో? కాదో?’’ అనే ఓ చిన్న సందేహాన్ని వ్యక్తం చేసింది మైథిలి.

ఇంతలో ఆ సందు మొదటికి వచ్చిన ఆటో ఆగటమూ…

ఆయన ‘‘ఆ… ఇక్కడే నండి. ఇదేనంటూ’’ దిగమని ఆటోవానికి ఆపమన్నట్లుగా చేత్తో సైగ చేయటం క్షణాల్లో జరిగిపోయాయి.

మాలిని, మైథిలి ఇద్దరూ ఆటో దిగి, ఆటోవాలాకు ఆటోచార్జి ఇచ్చేసి, చేతిలో ఉన్న చిన్న చిన్న బ్యాగులను తీసుకుని వారు ఆటోలోంచి దిగుతూ పద్మిని వాళ్ళ ఆయన్ని విష్‌ చేస్తూ పలకరించారు.

మాలిని ఉండేది, పద్మిని ఉండేది ఒకే ఊరవటం మూలాన తను అప్పుడప్పుడు పద్మినిని కలవటంతో తను, పద్మిని వాళ్ళ ఆయనతో బాగానే కలివిడిగా మాట్లాడేస్తోంది. మైథిలి మాత్రం మాట్లాడడానికి కొంచెం బిడియపడుతోంది. ముప్ఫై ఏండ్లు దాటిపోయింది పద్మినిని, వాళ్ళ భర్తను, పిల్లల్ని చూసి. మనుష్యులలో మార్పు వాళ్ళ వయసును బట్టి వస్తుంది సహజంగా. ఆ వయసువల్ల వచ్చిన మార్పు తప్ప ఆయన మాట్లాడే తీరు, చూపే ఆప్యాయతలో ఏమాత్రం మార్పు రాలేదనిపించింది మైథిలికి ఆర్‌.పి.గారిని చూస్తుంటే.

ఆ అన్నట్టు ఆర్‌.పి.గారే మా ఫ్రెండైన పద్మిని గారి ఇంటాయన. ఆర్‌.పి.గారని షార్ట్‌కట్‌లో పిలవటం అలవాటు పద్మినికి. ప్రస్తుతం పండక్కి పద్మినివాళ్ళ పిల్లలు ఇంటికి రావటం మూలంగా మనవళ్లు, మనవరాళ్లకు అన్నం తినిపిస్తుండటంతో తాను రాలేక వాళ్ళాయనను ఆ వీధి చివరి వరకూ వెళ్లండంటూ, వాళ్లు వీధిని సరిగా గుర్తు పడతారో లేదోనని అంటే తానే వచ్చినట్లుగా చెబుతూ `

‘‘ఇదేనండీ మైథిలిగారూ! పైన ‘పి’ అని అక్షరం పెట్టుకుంది తనపేరే’’ అంటూ మూడవ అంతస్తుపైన అందంగా అమర్చిన ‘పి’ని చూసిస్తూ, చిరునవ్వు నవ్వారాయన.

‘‘ఆ… మా ఫ్రెండునంటున్నారు గానీ మీ పేరులో గూడా ‘పి’ ఉందిగదా’’ అన్నా, నేనూ నవ్వుతూ.

నెమ్మదిగా గేటు తీసుకుని మాలిని, నేనూ, ఆర్‌.పి.గారూ లోనికి వెళ్లాం.

మెట్లు ఎటువైపున్నాయా అని వెతికే పనిలో పడ్డాను నేను.

ఇంతలో ‘‘లిఫ్ట్‌ ఉందండీ’’ అన్న ఆర్‌.పి. గారి మాటతో ఓ చల్లని తెమ్మెర మనసును హాయిగా తాకిన ఫీలింగ్‌ కలిగింది నాకు.

లిఫ్ట్‌లో రెండో అంతస్తులోకి తీసుకెళ్ళారు మాలినిని, నన్నూ.

మారాక కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఎంతో ఆనందం, అంతకు మించిన ఇష్టాన్ని కలగలుపుకున్న ముఖారవిందంతో గుమ్మంలో ప్రత్యక్షమైంది పద్మిని. ఎడమ చేతిలో మనవళ్ళకు అన్నం తినిపిస్తున్న గిన్నె, కుడిచేతికి అంటిన పప్పూ, అన్నం ఇవేవీ గుర్తు రాలేదు పద్మినికి. సరాసరి అలాగే వచ్చేసింది.

చాలా రోజులు కాదు, ఏండ్లే అయింది ఒకళ్ళకొకరం చూసుకుని. నేను అమాంతంగా పద్మినిని హగ్‌ చేసుకున్నా.

‘స్నేహమంటే ఇదిగదా!’ అనిపించింది ఒక్కసారిగా. ఆ హగ్‌లో కలిగిన తీపి అనుభూతిని వర్ణించటానికి ‘మధురం’ అనే పదం కూడా సరిపోదనిపించింది.

‘‘ఏమోయ్‌! మీ ఫ్రెండ్స్‌ వచ్చిన సందర్భంలో ఓ మంచి టీ దట్టించవోయ్‌!’’ అన్నారు ఆర్‌.పి.గారు చమత్కారం నిండిన గొంతుకతో.

‘‘ఆ… అవును… వాళ్ళకే టీ పెడతా… మీకేం లేదుపోండీ!’’ అంతే చమత్కారం నిండిన గొంతుకతో అంటూ పద్మిని చెయ్యి కడుక్కోవటానికి వంటగదిలోకి వెళ్ళింది.

‘‘ఇప్పుడే వద్దండి టీ… ఫంక్షన్‌ నుండి ఇటే వస్తున్నాం. భోజనాల ఏర్పాట్లు బాగా చేశారు ఆమనివాళ్లు. కడుపునిండుగాగా లాగించేశాము. గులాబ్‌జాంలు అద్దిరిపోయాయ్‌. ఐస్‌క్రీమ్‌ కూడా రెండుసార్లు పెట్టించుకుని మరీ తిన్నాము. ఇంకా భుక్తాయాసమే తీరలేదండి’’ అంది మాలిని, వంటగదిలోకి వినపడేటట్లుగా.

నేను పద్మిని పిల్లల్ని పలకరిస్తున్నాను వరుసగా. పద్మిని, ఆమని దాదాపుగా అక్కడ ఉండేవాళ్ళే. ఏదో ఓ సందర్భంలో కలుస్తూనే ఉంటారు. ఏ సందర్భం కుదరకపోతే కనీసం రెండు నెలలకోసారైనా గెట్‌ టు గెదరో లేదా కిట్టీ పార్టీ లాంటిదో ఏదో ఒకటి పెట్టుకుని ఆ వంకతో కలుసుకుంటూ, మనసారా మాట్లాడుకుంటూ కష్ట, సుఖాలన్నీ కలబోసుకుని మనసు తేలిక పరుచుకుంటూ రిలాక్సేషన్‌ పొందుతుంటారు. వీరితో ఇంకో ముగ్గురు కూడా కలుస్తారు. వాళ్ళెవరంటే ఒకరు హాసిని, మరొకరు చంద్రిక, ఇంకొకరు ఆమని.

‘‘అసలిప్పుడు ఎవరింటి నుండి ఫంక్షన్‌ పూర్తి చేసుకుని వచ్చామంటే, ఆమని వాళ్ల మనవడి బర్తడే పార్టీ నుండి పిలిస్తే… తప్పకుండా హాజరవ్వాలనే పట్టుదలతో బయల్దేరి వచ్చా. వచ్చాగదా, అందర్నీ ఓసారి కలుసుకుని రావటమే నా ప్రయాణంలోని మరో ఆంతర్యం.

***

‘ఎప్పుడో గ్రహణాలు పాఠం చదువుకున్న గుర్తు చిన్నప్పుడు. కానీ నాకు పట్టింది అనారోగ్య గ్రహణం. ఎప్పుడు అది నన్ను విడుస్తుందో తెలియటం లేదు. అసలు నేను ఈ లోకం విడిచేదాకా నన్ను విడిచిపెడుతుందో? లేదో? ప్రశ్నార్థకమే! ఖగోళ శాస్త్రవేత్తలు, భూగోళం బోధించే లెక్చరర్లూ ఐతే మాత్రం దీనికి కచ్చితంగా క్రొత్త పేరు పెట్టి తీరుతారు అనుకుంటూ’ మనసులో నాకు నేనే నవ్వుకున్నాను, ఏడవలేక నవ్వారంటారే అలాగన్నమాట.

‘‘అసలు సంగతి మీకు చెప్పటం మర్చేపోయాను సుమా… నేను, మాలిని, పద్మిని, హాసిని, చంద్రిక, ఆమని… మేమంతా విజయవాడలో ఒక పాపులర్‌ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశాము. ఇదిగో అదే స్నేహం ఇప్పటికీ కొనసాగుతుందని గర్వంగా చెబుతాను. ఏ పొరపొచ్చాలు లేకుండా అప్పటి నుండి ఈనాటివరకు. వాట్సాప్‌ గ్రూపులో వేడుకలు, పండుగలు, పబ్బాలు అన్నింటికీ సంబంధించిన వాట్సాప్‌ ఫొటోలు అన్నీ పోస్టు చేసుకుంటాం, శుభోదయాలతో పాటుగా. ఇది మాకు దూరంగా ఉంటున్నామే, కలవలేకపోతున్నామనే ఫీలింగును దూరం చేస్తుందని గ్యారంటీగా చెప్పగలను. అసలు ఇంత బంధం ఏర్పడటానికి ముఖ్యకారణం మా పిల్లలంతా, మేం బోధించిన కళాశాలలోనే ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.

అటు తర్వాత చంద్రిక, హాసిని, పద్మినిలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావటం, వేర్వేరు ఊళ్ళల్లోకి బదిలీమీద వెళ్ళిపోవటం… అదీనుగాక ఇప్పట్లాగా పెద్ద ఫోన్లు కాదుగదా కనీసం మాకు అప్పట్లో చిన్న ఫోన్లు కూడా మార్కెట్లోకి రాకపోవటంతో, మాలో కొందరితో కొందరికి లంకెలు తెగిపోయి ఇదిగో మళ్ళీ ఓ సంవత్సరం క్రితం ‘స్నేహిత ఫ్యామిలీ’ అనే పేరుతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకుని, మళ్ళీ మేము అపూర్వ స్నేహ వైభవంలోకి అడుగుపెట్టే అవకాశం కల్పించింది. పెద్ద ఫోను, అందులోని ఫేస్‌బుక్‌ లదే అగ్రస్థానం. మేము కలిసేందుకు మార్గం ఏర్పాటు చేసిందని నేను గట్టిగా చెప్పగలను.

ఇంతలో పద్మిని వాళ్ళ మూడో అమ్మాయి లాస్య అందరికీ టీలు తెచ్చింది. మాటల ప్రవాహాలు రసవాహినిలా దొర్లిపోతున్నాయి. ఇల్లంతా పద్మినివాళ్ళ మధుర ఫలాలతో సందడి సందడిగా ఉంటే, హాల్లోని నేలంతా బొమ్మలతో రంగుల హరివిల్లులా సంతోషమంతా అక్కడే క్రుమ్మరించినట్లుగా తళుకులీనుతోంది. పెద్దలందరిదీ ఒక లోకం, పిల్లలందరికీ మరో లోకంగా… మొత్తం అందరం ఎవరి లోకాల్లో వాళ్ళే సంతోష తరంగాలమవుతున్నాం.

‘‘మైథిలీ, మాలినీ రండబ్బా! కాసేపు గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకుందురుగానీ’’ అన్న పద్మిని చేసిన సూచనాప్రాయానికి మేం అంగీకారంగా తల ఊపుతూ, పడకగదిలోకి వెళ్ళి, హాయిగా నేనూ, మాలిని చెరో దిండుకూ మా తలలిచ్చేసి, మా కెదురుగా కుర్చీలో కూర్చున్న పద్మినిని ` ‘‘నీవు కూడా మాతోపాటు కాసేపు వచ్చి ఒరగరాదూ?’’ అన్నా చనువుగా.

‘‘లేదోయ్‌! ఇలా ఎదురుగా కూర్చుంటే, మీ ముఖాలు కనబడుతుంటే బాగుంటుంది. అందుకే ఇలా కూర్చున్నా’’ అంది పద్మిని.

పిల్లల పెండ్లిండ్లు, పురుళ్లు, పుణ్యాలు, శుభకార్యాలు మొదలుకుని ఇండ్లు కొనుక్కోవటం, తను ప్రిన్సిపల్‌గా ప్రమోషన్‌ వస్తే తిరస్కరించటం లాంటి ఇబ్బందులన్నీ వీటితో పాటుగా చంద్రిక, ఆమని, రిటైర్మెంట్‌ ముచ్చట్లతో పాటుగా, మనవళ్ల, మనవరాళ్లు సాధించిన విజయాలు ఒకటేమిటి… అన్నీ దృశ్యరూపాలై మా అంతరంగాలను ఆనంద సముద్రంలో ముంచి తేల్చాయి.

ఎప్పుడు కిచెన్‌లోకి వెళ్ళిందో ఏమో… మాకూ, తనకూ ప్లేట్ల నిండా స్నాక్స్‌, స్వీట్లు తెచ్చి ముందు పెట్టింది, తినాల్సిందేనన్నట్లుగా చూశాయి పద్మిని కండ్లు మావైపు. ప్లేట్లలో ఉన్న స్వీట్సు రుచికంటే పద్మిని మాపై చూపే ఆప్యాయతే ఇంకా తియ్యగా అనిపిస్తోంది మాకు.

‘‘సరేగానీ పద్మినీ… మీ దగ్గర కార్డ్సు ఉన్నాయా?’’ అని అడిగా నేను.

‘‘ఆ మా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. మా అల్లుళ్లొచ్చినపుడు మేం అంతా కలిసి సరదాగా ఆడుతాం’’ అని తను చెప్పటంతో ఆశ్చర్యపోవటం నావంతయింది.

‘‘పాతవయితే మా ఆర్‌.పి.గారు అసలాడరు. వాళ్ళు అటు ఊళ్ళ నుండి రాగానే ఈయన గారిటు కొత్త ప్లేకార్డ్సు తెస్తారని’’ చెప్పింది పద్మిని నవ్వుతూ.

నాకు ఆ మాటలు వినగానే హుషారొచ్చేస్తోంది.

‘‘అయితే పాత సెట్టుంటే ఒకటి తీసుకురా పద్మినీ’’ అనటం ఆలస్యం, వెంటనే పద్మిని తన పతిదేవులకు, కార్డ్సు చూడండనే ఆర్డర్‌ జారీ చేయటం, క్షణకాలంలో జరిగిపోయింది.

ఆ… ఆయనేం సెట్‌ చేస్తారులే కాసేపట్లో అనుకున్నా నా మనసులో.

మాలిని స్నాక్స్‌, స్వీట్లను రుచి చూస్తూ, వాటికి పద్మిని చెప్పే ముచ్చట్లను అద్దుకుంటూ ఎంజాయ్‌ చేస్తోంది.

‘‘నువ్వు తినవా మైథిలీ?’’ అని పద్మిని అనటంతో…

‘‘ప్లీజ్‌… అబ్బా ఏమీ అనుకోకు. నాకు పొట్ట చాలా నిండుగా ఉంది’’ అంటూ తను నొచ్చుకోకూడదని కారాని కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకున్నా.

‘‘ఊ… చాలా బాగున్నాయి’’ ఎప్పుడు చేశావని అడిగా తనను.

‘‘చేయటమా? ఏమన్నానా? రెండు మోకాళ్లకి ఆపరేషన్‌ జరిగినప్పటి నుంచి, స్టౌ దగ్గర ఎక్కువసేపు నిలబడి వంటే చేయలేకపోతున్నా. ఇంకా పిండివంటలు కూడానా!’’ అని నిట్టూరిస్తూ… ‘‘లేదు మైథిలీ… మా కాలనీలో ఒకావిడ ఆర్డర్‌ మీద మనకు ఏ ఐటం కావాలంటే అది చేసిస్తుంది. బాగానే తయారు చేస్తుంది. పిల్లలొస్తున్నారని ఆర్డరిచ్చానని’’ చెప్పింది పద్మిని.

‘‘అవును నిజంగానే మనం ఇంట్లో చేసుకున్నట్లుగానే ఉన్నాయబ్బా’’ అంది మాలిని.

‘‘‘కార్డ్స్‌’ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక సెట్‌ కలెక్ట్‌ చేయమన్నా, మా వారితో’’ అంది పద్మిని.

మాటవరుసగా అన్నా పద్మినితో. నా మనసులోని ఇష్టాన్ని గమనించి, భర్తకి కార్డ్సును సెట్‌ చేయ్యమనటం చూస్తుంటే పద్మిని పట్ల నా మనసులో స్నేహ మాధుర్యం ఉప్పొంగుతోంది.

‘‘ఆ… అయిపోయింది… ఓ ఐదు నిముషాల్లో తీసుకొస్తా’’ నన్న జవాబు వినపడిరది అటునుండి.

అన్నట్లుగానే ఠంచనుగా ఐదు నిముషాల తరువాత ఒక ప్లే కార్డ్సు సెట్‌ టీపాయ్‌, పిల్లలు రాసుకునే పరీక్ష అట్ట, వాటితో పాటుగా పాత నోట్సు, స్కోర్‌ వేయటానికి ఓ బాల్‌ పెన్నుతో సహా ప్రత్యక్షమయ్యారు ఆర్‌.పి.గారు.

***

తమ బండిమీద ఫ్రెండ్స్‌ ఇళ్లకు దింపటమో, మళ్లీ తీసుకురావటమో లేదా వాళ్లు మన ఇళ్లకొచ్చినపుడు కాసేపు కూర్చుని మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ కబుర్లు కలపటమో… ఇంతవరకే తెలుసు తనకు. ఎక్కువ శాతం పెరిగిన ఏరియర్స్‌, రిటైర్మెంట్‌ తర్వాత రావలసిన బెనిఫిట్స్‌ ఇవే మాటలుంటాయి మా ఇంటికి ఎవరొచ్చినా. కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా ఉంటూ, ఎటువంటి భేషజాలకు తావీయని సందడితో, కలుపుగోలు తనంతో కూడిన సంభాషణలు నడుస్తుంటే, ఆనంద లోకాల్లో విహరిస్తున్న అనుభూతి కలుగుతోంది నాకు.

ఇంతలో పేకల్ని చకచకా కలపటం, మాలినినే ముందుగా కార్డ్సు వేయమనటం, తను నల్గురికీ వేయటం, చకచకా జరిగిపోయాయి. సాధారణంగా మన మహిళలకు సంబంధించిన (ఫ్రెండ్స్‌) వస్తే ఏదో మర్యాదకో, మొహమాటానికో వచ్చి ఓ రెండు నిమిషాలు మాట్లాడటం, తర్వాత ఏదో పనున్నట్లుగా, వాళ్లు బైటకు వెళ్ళిపోవటమో లేకపోతే పనున్నట్లుగా లోపలికి తమ గదిలోకి వెళ్ళిపోయి ఫోన్‌లో ఏదో ఓ సినిమా చూసుకోవటం, ఇంటికి వచ్చినవాళ్ళు వెళ్ళిపోగానే హమ్మయ్య అని లోలోపల అనుకుంటూ, హాల్లోకి వచ్చి టి.వి. ముందు కూర్చోవటం. ఇలానే జరుగుతుంది దాదాపుగా మా ఇంట్లో. కానీ ఆర్‌.పి.గారు కూడా సరదాగా కూర్చుని ఆడటం, వాళ్ళావిడ పద్మిని మీద చెణుకులు విసరటం, మాలినికీ నాకు ఎలా ఆడితే కౌంట్‌ తగ్గుతుందో కొన్ని టిప్స్‌ చెప్పటం… సరదాగా నవ్వుకోవటాలు… టైమ్‌ ఎలా గడిచిపోయిందో తెలియటం లేదు మాకు. అందరూ బాగానే షోలు కొడుతున్నారుగానీ, నాకు పట్టుకోవటం చేతగాక, చేతిలోంచి కార్డ్సు జారిపోతుంటే నాకే నవ్వొస్తోంది. మా అల్లుళ్లు వచ్చినప్పుడు అందరం సరదాగా కూర్చుంటాం, ఆడుకుంటాం అని పద్మిని అన్న మాటలను మననం చేసుకుంటుంటే ఆర్‌.పి.గారు గురించి, నాకు ఆశ్చర్యంతో కూడిన వింత దృశ్యం కండ్లముందు కదలాడిరది.

‘‘మళ్ళీ ఒకసారి చాయ్‌ పెట్టవోయ్‌!’’ అని అనటంతో పద్మిని వంటగదికి వెళ్ళింది. చిన్న విరామం తీసుకున్నాం అందరం.

ఏదో ఫోన్‌ వస్తే ఆర్‌.పి.గారు బాల్కనీలోకి వెళ్ళారు, ఆన్సర్‌ చేసేందుకు.

నేను, మాలిని వాష్‌రూంకి వెళ్ళొచ్చాం.

‘‘అవునండీ… పద్మినీ వాళ్ల అల్లుళ్ళు చాలా మంచివాళ్ళండీ… తనకు ఫోన్లు లాంటివి బహుమతులు కూడా ఇస్తూంటారట అప్పుడప్పుడు’’ అంది మాలిని నాతో.

అల్లుడంటే హోదాని వెలగబెట్టాలనుకునే కోవలోకే వస్తారు కొందరల్లుళ్లు. కానీ ఇక్కడ వరుసగా ఆశ్చర్యపు టపాసులు పేలటంతో మేమున్న ఆ గదితోపాటు నా మనసంతా హర్షపు వెలుగులతో నిండిపోయింది. మాటల, ఆశ్చర్యాల ఫలహారంతో నిండిపోయింది నా కడుపు. అందుకే సగం కప్‌ మాత్రమే టీ తాగగలిగాను. మిగతా సగం మాలిని కప్‌లో కొంచెం, ఇంకొంచెం పద్మిని కప్‌లో పోసేశాను, తాగమంటూ.

సరదాగా ఆడిన ఆటకు వేసిన స్కోర్‌ను చూశాను నేను. అందరూ బాగానే జాగ్రత్తగా ఆడారు. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు సరదాగా మొద్దాట ఆడిన గుర్తు నాకు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఆడటం ఆనందాన్నిచ్చింది. చెప్పద్దూ… నా స్కోర్‌. దిగ్విజయంగా రెండొందలు దాటేసింది. అంటే నేనే ఓడిపోయానని అర్థమైంది. అసలింతకీ నా పట్టుదల మీదే పద్మిని వాళ్ళాయనతో చెప్పి, పేకల్ని సెట్‌ చేయించటం, అందరం సరదాగా ఆడటం జరిగింది. ఇంతలోకి హాసిని నుండి ఫోన్‌ వచ్చింది పద్మినికి. ‘మైథిలిని, మాలినిని అక్కడే ఉండమను, నేనో గంటలో వచ్చేస్తా, మావారితో కలిసి’ అని దాని సారాంశం. ఆ ఇల్లంతా సంతోషాలకి చిరునామాగా అన్పించింది. నాకు.

నెమ్మదిగా మా ఫ్రెండ్స్‌ ముగ్గురమూ హాల్లోకి వచ్చాం. మా మేడమ్స్‌ అంటూ పద్మిని పిల్లలు ముగ్గురూ కూడా మాతో చేరిపోయారు.

‘‘ఎంతో సంతోషంగా అనిపిస్తోంది మిమ్మల్ని చూడగానే’’ అంటూ మాతో ఫొటోలు తీసుకోవటం… వాళ్ళ పిల్లల్ని మాకు పరిచయం చేయటం… ఇలా అన్నీ ఎవరి ప్రమేయం లేకుండానే ఒకదాని వెంట మరొకటి జరిగిపోతూ, సమయం అరచేతిలోని ఇసుకలా జరజరా జారిపోతోంది.

అదిగో అప్పుడు హాసిని హడావుడి చేస్తూ రానే వచ్చింది. రాగానే అమాంతం నన్నూ, మాలినిని వాటేసుకుంది. తన కండ్లలోని సంతోషపు చెమరింత నా చూపుల్నుండి తప్పించుకోలేకపోయింది. ‘ఏంటి?’ అని కనుసైగతోనే ప్రశ్నించా హాసినిని.

‘‘చాలా సంవత్సరాలైందిగా మిమ్మల్ని చూసి. అప్పుడెప్పుడో కలిపి పనిజేసినప్పుడు, మళ్ళీ ఇన్నేళ్ళకు’’ అంటూ తాను కూడా కండ్లతోటే సమాధానమిచ్చింది.

మళ్ళీ ఫోటోస్‌ సెకండ్‌ సెషన్‌ స్టార్టయింది. అయితే కొన్ని, పద్మినివాళ్ల హజ్బెండ్‌ తీస్తే, మరికొన్ని హాసిని వాళ్ళాయన జనార్థన్‌గారు తీశారు.

ఏంటో జనార్ధన్‌గారు లోపలికి రావటము బిడియంగానే వచ్చారు, సోఫాలో కూడా ఓ మూలకు ఒదిగి ఒదిగి కూర్చున్న తీరుని చూస్తే చాలా సిగ్గరిలాగా

అనిపించారు మాకు. అది గమనించిన హాసిని… తన భర్తను ఈ వాతావరణంలో పడేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఫొటోలు కూడా తీసేపని భర్తకు అప్పగించిందేమోనన్పించింది నాకు మనసులో.

లోపలికి రాగానే నేనూ, మాలిని కూడా జనార్థన్‌గార్ని పలకరించాము. హాసినికి పెండ్లి అయిన చాలా రోజుల వరకు అనేకంటే, కొన్ని సంవత్సరాలు వరకు అనచ్చేమో. ఆ… అవును ఇదే నిజం. అప్పుడు జనార్ధన్‌గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఎప్పుడైనా మాల్స్‌లోగానీ, బిగ్‌బజారు లాంటి వాటి దగ్గర కలిసినపుడు నాతో, ‘ఈయన మావారు. పేరు జనార్థన్‌గారని హాసిని పరిచయించటం అన్నీ గుర్తొచ్చాయి మళ్ళీ ఒకసారి. నవ్వు ముఖమే అతనిది. బాగానే మాట్లాడుతున్నారు. మాటల మధ్యలో తమకు ఇద్దరు పిల్లలని, బాబుకు చదువు పూర్తయి బెంగుళూరులో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నట్లుగా, పాపేమో హైదరాబాదులో మెడిసిన్‌ రెండవ సంవత్సరం చేస్తున్నట్లుగా చెప్పారు జనార్థన్‌ గారు. మేము ఊకొడ్తున్నాం.

‘‘చూడండి… చూడండి… ఏమీ ఎరగనట్లుగా నంగనాచిలా ఎంత వినయంగా మాట్లాడుతున్నాడో’’ అంటూ నా చెవిలో గుసగుసగా చెప్పింది హాసిని.

‘‘ఉష్‌… ఊరుకోమ్మా… వినపడుతుందని’’ కొద్దిగా నెమ్మదిగా మందలించినట్టుగా అన్నాను తనతో.

మా ఫ్రెండ్సుకి ఈతని గురించి చాలా విషయాలు ముందుగానే తెలుసన్నట్లుగా నావైపు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ, సంభాషణ మళ్లించే ప్రయత్నాలు చేశారు మాలిని, పద్మినిలు. నాకూ గతంలో కొన్ని విషయాలు జనార్థన్‌ గారి గురించి చూచాయగా తెలిసి బాధపడ్డాను. హాసిని మంచి ఎడ్యుకేటెడ్‌. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే. హాసినే చిన్నపిల్ల వాళ్ళ ఇంట్లో. ఎత్తుగా, తెల్లగా, బక్కపల్చగా అందంగా ఉంటుంది. అల్లారు ముద్దుగా పెరిగినట్లుగా అన్పించేది తన మాటలు వింటుంటే. అప్పుడప్పుడూ చంద్రిక ద్వారానో లేకపోతే ఆమని ద్వారానో సమాచారం తెలిసేది ఫోన్‌లో మాట్లాడుకునేటప్పుడు. వీలు చూసుకుని నేను వెళ్లేలోగా కొంతైనా హాసినిని ఊరడిరచాలనే నా నిర్ణయం. బాగా బలపడిరది. ఆలోచిస్తూనే హాసినిని క్లియర్‌గా గమనించటం మొదలెట్టా. పైకి తను నవ్వుతూ మాట్లాడుతున్నా, హాసిని మనసులో గూడు కట్టుకున్న బాధ తొంగి చూస్తూనే ఉంది. కంటి చెమరింపు ద్వారా అది బహిర్గతమవుతుంటే నా మనసంతా ఒక్కసారిగా దేవేసినట్టయిపోయింది.

‘‘ఇక మేము బయల్దేరుతామని చెప్పటంతో గబగబా లిఫ్ట్‌లో క్రిందకి వచ్చి ఆర్‌.పి.గారు తమ కారుని బైటకి తీశారు.

‘‘నేనూ వస్తాను’’ అంది పద్మిని.

‘‘అవును, చంద్రికను చూసి చాలా రోజులైంది. నేను కూడా వస్తానంది’’ హాసిని.

అలా మేం నలుగురం కారులో బైలుదేరాం, చంద్రికను కలవటానికి, వాళ్ళింటికి. ఆర్‌.పి.గారి డ్రైవింగ్‌. ఆ సీటు ప్రక్కనే ఎడమవైపు అయినా ఆయనగారి కుడిభుజంగా వర్థిల్లుతున్న మా పద్మినమ్మ, వెనుక సీట్లో నేనూ, మాలిని, హాసిని కూర్చుని మళ్లీ కబుర్ల తోటలోనికెళ్ళి సరదాల మల్లెల్ని, సంతోషాల జాజుల్ని, ఛలోక్తుల సంపెంగల్ని మనసు గదినిండా నింపుకున్నాం. మా కారు వెనుకే తన బండిమీద మాతో కూడా వస్తున్నారు జనార్థన్‌గారు. నెమ్మదిగా కారు దిగి మేము చంద్రికావాళ్ళుండే ఫస్ట్‌ ఫ్లోర్‌లోకి వెళ్లటానికి మెట్లు ఎక్కబోతుండగా, నలభై ఏళ్లుంటాయేమో, ఆ అమ్మాయికి పెళ్ళైందిటలేగానీ నైటీలో చిన్నగా అన్పిస్తోంది.

‘‘రండి… రండి మేడమ్‌గార్లు. మీ కోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాం’’ అంది నవ్వు ముఖంతో.

నా మోకాళ్లు మెట్లెక్కటానికి బెట్టు చేస్తాయి. మెట్లెక్కాల్సిన సందర్భం ఎదురైనప్పుడల్లా సహజంగా నా కండ్లు లిఫ్ట్‌ కోసం వెతుకుతాయి. నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. వెళ్ళిన ప్రతి భవనానికీ లిఫ్ట్‌ ఉండాలని నియమమేమీ లేదుగదా! అని నా ఆలోచనకు నేనే మనసులో నవ్వుకుంటూ కాళ్ళకి పని చెప్పటం మొదలుపెట్టాను. మా దయ్యాలు… క్షమించండి నెయ్యాలు పై మెట్టుదాకా చేరిపోయారు. నేనేమో నత్తలాగా నెమ్మది నెమ్మదిగా రెయిలింగ్‌ పట్టుకుని సగం మెట్లవరకూ చేరాను. హమ్మయ్య అనుకుంటూ మొత్తానికి మొదటి అంతస్తుకి చేరుకునేసరికి, చంద్రిక ఎదురుగా రానే వచ్చింది ‘‘వెల్‌కమ్‌ డియర్స్‌’’ అంటూ.

ఆ ఆత్మీయత నా మదిని తాకిన వెంటనే నా అలసట, కాలినొప్పి ఎటు ఎగిరిపోయాయో తెలవదు. నా మనసే గాదు, అక్కడికి చేరుకున్న మా ఫ్రెండ్సందరి మనస్సులు చిన్నపిల్లలు మాదిరిగా గంతులేస్తున్నాయి!

‘‘అబ్బా… రావేమో… అటునుంచి అటే వెళ్ళిపోతావేమో ననుకున్నా’’ అంది చంద్రిక నిష్టూరంగా మారబోతున్న స్వరాన్ని తమాయించుకుంటూ.

‘‘అలా ఎలా అనుకున్నావు చంద్రికా? ఇక్కడిదాకా వచ్చి, నిన్ను చూడటానికి రాకుండా ఎలా ఉంటానని అనుకున్నావ్‌?’’ అనేసరికి ఒక అంగలో వచ్చి, ఎంతో ఆనందంతో నన్ను హగ్‌ చేసుకుని కండ్లనీళ్ల పర్యంతమైంది చంద్రిక.

‘‘ఏంటోయ్‌! మమ్మల్నిలాగే వాకిట్లోనే ఉంచి, ఇట్నుంచి ఇటే గెంటేస్తావా ఏంటి?’’ అని నవ్వింది పద్మిని చంద్రికవైపు చూస్తూ.

‘‘అదేంలేదబ్బా! రండి…’’ రండంటూ లోపలికి తీసుకెళ్ళి, మాకు సోఫా చూపించి, కూర్చోమని చెప్పి, హడావుడిగా ఫ్రిజ్‌ దగ్గరకు పరిగెత్తబోతున్న చంద్రికతో దబాయించినట్లుగా మాట్లాడుతూ `

‘‘ఏం తల్లీ! రాకరాక మీ ఇంటికి వస్తే, మమ్మల్ని ఇంత ఇరుకులో కుదేస్తావా?’’ అంది మాలిని, తాము కూర్చున్న సోఫా చూపిస్తూ.

నిజానికి మా నల్గురుకూ సరిపోయే సోఫానే అది. కానీ ఎందుకో చంద్రికను ఉడికించాలనిపించింది మాకు.

‘‘అయ్యో! మీరొచ్చిన ఆనందంలో కన్ఫ్యూజ్‌ అయిపోయానబ్బా’’ అంటూ ఇంకో కుర్చీ చూపించి, తనూ ఎదురుగా ఉన్న ఓ కుర్చీలో కూర్చోబోయింది చంద్రిక.

‘‘ఏంటి… వచ్చి ఇంతసేపైనా కనీసం మంచినీళ్లైనా ఇచ్చేదుందా? లేదా?’’ అని గట్టిగా అడిగింది పద్మిని, చంద్రికను.

‘‘అయ్యో! సారీ అబ్బా… మిమ్మల్ని చూసిన సంతోషంలో అడగటం మర్చేపోయానని’’ నొచ్చుకుంది చంద్రిక.

ఇంతలో మెట్ల దగ్గర కనబడిన అమ్మాయి పైకి వచ్చి, చనువుగా `

‘‘మేడమ్స్‌ బాగున్నారా మీరంతా?’’ అంటూ ఎంతోకాలం పరిచయం

ఉన్న అమ్మాయిలా అడిగేసరికి మేము అవాక్కయ్యాము.

‘‘తను మా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటుంది. చాలామంచి అమ్మాయి. నాకు ఇంటిపనుల్లో సాయం చేస్తుంది, పేరు సుజాత.’’ అని చంద్రిక చెబుతుంటే…

తను ఎంత అండగా ఉంటుందో అన్ని పనులలో అనే విషయాన్ని చంద్రిక ముఖ కవళికలను పరిశీలించిన వారికెవరికయినా ఇట్టే అర్థమైపోతుందన్పించింది మాకు.

‘‘అబ్బే! అదేం లేదండీ… అక్క అలాగే చెబుతుంది వచ్చిన వాళ్ళందరికీ’’ అంటూ తను వంటగదిలోకి వెళ్లబోతుంటే, ఆపినంత యుద్ధం చేయాల్సి వచ్చింది సుజాతతో మాకు.

‘‘అద్దెకున్న వాళ్ళలో కనీసం ఒక్కళ్ళైనా ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళుంటే చుట్టాలు కూడా బలాదూరే’’ అంది హాసిని.

‘‘అవునని’’ మేమంతా హాసిని మాటలకు వత్తాసు పలికాము. అంతేగదా మరి! బంధువులొస్తే వాళ్ళు సాయం చేసేమాట ఎలావున్నా, కూర్చున్న చోటునుంచి లేచేవరకూ అన్నీ అందించాలి. ఇంతటితో అయిపోతుందా అంటే ఆహా… పెట్టుపోతలు ఏమాత్రం తగ్గినా ఈసారికి సర్దుకుందామనే ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా ఉండని వారి శాతమే ఎక్కువ ఈ రోజుల్లో. పైగా ఒకరు వృద్ధిలోకి వస్తున్నారంటే, మరొకరికి అసూయా ద్వేషాలు. వీటితో బంధుత్వాలు వీగిపోతుంటాయి అప్పుడప్పుడూ. మళ్ళీ ఏ శుభకార్యానికో అతుకు పెట్టుకున్నా మళ్లీ ఎప్పుడో ఏదో ఓ సందర్భంలో పుటుక్కుమని తెగటం, దానితో కారాలు, మిరియాలు నూరటాలు… అబ్బో ఇది ఓ చేటభారతమే అవుతుందనుకుంటా.

‘‘వీళ్ళంతా మా ఫ్రెండ్సురా సుజాతా. చాలా సంవత్సరాలు విజయవాడలో కలిసి పనిచేశాం’’ అని ఆ అమ్మాయికి మమ్మల్నందరినీ పేరుపేరునా పరిచయం చేసింది చంద్రిక.

‘‘చెప్పద్దూ.. ఆ అమ్మాయి సుజాతను చూస్తుంటే మాకందరికీ చాలా ముచ్చటేసింది. ఇంతలోకి తను ‘‘కొంచెం పనుందక్కా’’ అంటూ చంద్రికకు చెపుతూ`

‘‘ఇంత మంచి ఫ్రెండ్స్‌ ఉన్నందుకు, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అది కంటిన్యూ అవుతున్నందుకూ ‘‘మీరంతా గ్రేట్‌’’ అంటూ మా దగ్గర బై చెప్పి, క్రిందకి వెళ్ళిపోయింది సుజాత.

వద్దంటున్నా వినకుండా దబదబా ఫ్రిజ్జు ఓపెన్‌ చేసి, అందులోంచి పెప్సీ తీసుకొచ్చి, తలా ఒక గ్లాస్‌లో పోసిచ్చింది చంద్రిక.

ప్లీజ్‌ నాకది వద్దంది మైథిలి. ఈమధ్య వాట్సాప్‌లో చెక్కర్లు కొడుతున్న కూల్‌డ్రిరక్స్‌కు సంబంధించిన మెసేజులన్నీ కండ్లముందు కదలాడుతుండగా.

‘‘అసలే నేను బయట ఫుడ్‌ గానీ, ఇలాంటి డ్రిరక్సు తీసుకునే అలవాటు చాలా తక్కువ నాకు. ఎవరైనా బలవంతం పెట్టినా వాళ్ళని నొప్పించకూడదనే

ఉద్దేశ్యంతో కొంచెమే తీసుకుంటా. నా మనసులో ఉద్దేశ్యం గ్రహించిన దానిలా స్ప్రైట్‌ ఓ చిన్న గ్లాసులో పోసి చేతికిచ్చింది తాగమని. ఇక కాదనలేక అయిష్టంగానే తాగాను, చంద్రిక ఫీలవుకూడదని.

ఏ కబుర్లలోంచి ఎటు వెళ్తున్నామో మాకే తెలవనంతగా లోకాభి రామాయణం కాదులెండి గానీ, అంత హంగామా దొర్లింది మా మాటల్లో. అంతా ఆ ఊళ్ళో ఉండేవాళ్ళే. నేనొక్కదాన్నే వేరేవూరు నుంచి వచ్చా, ఫంక్షన్‌కి అటెండవటం కోసంగా.

‘‘ఇక వెళ్ళొస్తాం చంద్రికా’’ అని చెప్పి లేచాం అంతా.

‘‘ఉండండి’’ అంటూ లోపలికి వెళ్ళి పసుపు, కుంకుమ పెట్టటం కోసంగా, చీరలు, జాకెట్‌ పీసులు తెచ్చి, బొట్టుపెట్టి అందరికీ ఇచ్చింది, వద్దన్నా వినలేదు చంద్రిక.

‘‘నీవు త్వరగా ఇల్లు కదిలిరావుగా మైథిలీ’’ అంటూ అనురాగం నిండిన కండ్లతో చూస్తూ. మర్చిపోకుండా వచ్చినందుకు కృతజ్ఞతా పూర్వకంగా నావైపు చూసింది చంద్రిక. తేలికపడిన మనసులతో, స్నేహ మాధుర్యాన్ని పదిలంగా దాచుకున్న హృదయాలతో క్రిందికొచ్చాము.

వద్దన్నా వినకుండా, చంద్రిక కూడా మాకు బై చెప్పటాన్కి మాతో పాటే వచ్చింది. రిటైర్మెంట్‌ లైఫ్‌ని కుటుంబపరంగా ఎంజాయ్‌ చేస్తున్నా, అనారోగ్యాన్ని కప్పిపుచ్చలేని చంద్రిక శరీరం ఆయాస పడుతోంది. తనని అలా చూడగానే ఎందుకో నా మనస్సు ఉస్సురనిపించింది. కష్టం, సుఖం, బాధలు, ఆటంకాలు అన్నీ అనుభవించిన మనిషి చంద్రిక. లక్కీగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న అదృష్టవంతురాలు. కాబట్టే ఇద్దరు ఆడపిల్లల్ని చదివించి, మంచి సంబంధాలు చూసి, పెండ్లిండ్లు చేసింది. కొడుకుని కూడా చదివించి ప్రయోజకుడిని చేసి, తగిన సంబంధాన్ని కలుపుకున్నది. పేరుకు అందరూ ఉన్నా, ఒకరకంగా చెప్పాలంటే తన కష్టం మీదే భర్త, ఇద్దరు తమ్ముళ్లు, తండ్రి గెటానా అవుతున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చినా, అదే చెరగని చిరునవ్వు ముఖం మీద అప్పటికీ ఇప్పటికీ తనది.

‘‘అయ్యో పాపం వాళ్లిద్దర్నీ పైకి పిలవమని చెప్తే పట్టించుకోలేదేం హాసినీ’’ అంది నొచ్చుకుంటున్నట్లుగా జనార్థన్‌, ఆర్‌.పి. గార్లను చూస్తూ చంద్రిక.

‘‘ఆ… మనమధ్యన ఉంటే మనకూ ఉండదు, వాళ్లకీ ఉండదు ప్రైవసీ’’ అంది పద్మిని వాళ్ళ వారివైపు చిలిపిగా చూస్తూ.

‘‘అవునవును పిలుస్తేనేమో ఎక్కడొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్‌ చేస్తామోనని మీ అనుమానం. అందుకే మీకు ఇబ్బంది కలిగించటం ఎందుకులే పాపం అని మేం ఇక్కడే ఆగిపోయాం’’ అన్నారు జనార్థన్‌గారు సెటైరికల్‌గా.

‘‘అబ్బో బాగానే మాట్లాడుతున్నాడే… మూగ మనిషి!’’ అన్నా హాసినివైపు చూస్తూ.

‘‘వీడు పెట్టిన టార్చర్‌కి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’’ అంది నాతో గతం గుర్తు తెచ్చుకుంటూ.

వింటే ఏం గొడవ పెడతాడో ఇంట్లోనని కొంచెం భయంగా చూశా హాసినివైపు. అతగాడు పార్క్‌ చేసిన బండివైపు వెళ్ళటం చూసి హమ్మయ్య అనుకుని గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నా. నువ్వు ధైర్యంగా ఉండాలి హాసినీ. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. చీటికీ మాటికీ ఇలా బేలగా అయిపోకూడదు. గతం ఒక గ్రహణ మనుకో. కాస్త కాస్త వదిలిపోతోందిగా. కొంచెం ఫరవాలేదు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చిందని చెప్పావుగా అంటూ నాకు తోచిన రీతిలో హాసినిని సముదాయించాను.

‘‘నామీద మనసునిండా అనుమానం పెట్టుకుని దానికి ద్వేషాన్ని తగిలించి, మా అక్కలకు నామీద లేనిపోనివి ఎక్కించి వాళ్ళ దృష్టిలో నన్ను తప్పుగా చూపించి, వాడు మాత్రం మంచివాడుగా ముద్రవేసుకున్నాడు. ఇప్పటికీ అదంతా నటనే’’ అంది నాతో.

‘‘మరి మనం మాటల్లో పడి, చాలా లేటయింది. ఏమైనా కోపమొస్తుందేమో మీవారికి నీమీద’’ అన్నా సంశయంగా.

‘‘అదేం ఉండదు మైథిలీ… ఇలా ఫ్రెండ్స్‌ ఇళ్లకు వెళ్ళినా, వాళ్ళతో సరదాగా టైం స్పెండ్‌ చేసినా ఏమీ ఫీలవడు కాకపోతే అదో రకం సైకో మెంటాలిటీ’’ అంది  బాధగా.

అనవసరంగా హాసినిని కదిపి మానుపట్టిన గాయాన్ని రేపానేమోననే గిల్టీ ఫీలింగ్‌తో తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ `

‘‘మేమంతా నీకున్నాం. నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు. ఎప్పుడూ నువ్వు ఒంటరిగా ఫీలవ్వద్దు’’ మరీ మరీ చెప్పా.

కండ్లలోంచి ఎప్పుడెప్పుడు దూకుదామా అని ఎదురుచూస్తున్న కన్నీళ్ళు, కొద్దిసేపైతే కండ్లలోంచి దూకటానికి సిద్ధంగా ఉన్నాయి.

‘‘అవును, మిమ్మల్నంతా చూశాక నేను ఒంటిరిని కాను. నాకు ఇంతమంది ప్రాణ స్నేహితులున్నారనే ధైర్యం వచ్చింది’’ అన్నది రాబోయే కన్నీటికి అడ్డుకట్ట వేస్తూ హాసిని.

ఇంతలోకి వాళ్లాయన బైక్‌ తేవటంతో తను బైక్‌మీద, మేము కార్‌లో కూర్చున్నాము. మరొకసారి చంద్రికకు తృప్తిగా వీడ్కోలు చెప్పి, వెనుదిరిగాము మేము.

నన్నూ, మాలినిని ` మాలిని వాళ్ళింటి దగ్గర డ్రాప్‌ చేసి, పద్మిని దంపతులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.

***

మాలిని కొడుకు రమేష్‌, కోడలు రజని… వీళ్ళకి ఇద్దరు బాబులు. పెద్దవాడు అరుణ్‌, చిన్నవాడు కరణ్‌. సెలవురోజులు కావటంతో కొడుకు, కోడలు కల్సి ఏవో కిరాణా సామాను తెచ్చుకోవాలని బైటకు వెళ్తుంటే, ‘‘మేమూ వస్తాం, మాకు ఐస్‌క్రీమ్‌ కొంటామన్నారుగా మాకు. ఇప్పుడే కావాలి? మేమూ వస్తాం, తీసుకెళ్లండని పట్టు బట్టడంతో తీసుకువెళ్ళాల్సి వచ్చింది ఆంటీ…’’ రజని చెప్పింది నాతో నవ్వుతూ. రమేష్‌ చేతిలో బాగానే ఉంది కిరాణా లగేజ్‌. ఐస్‌క్రీం తిన్నారేమో ఇష్టంగా పిల్లల మొహాలు కళకళలాడుతున్నాయి.

‘‘ఏంటి రమేష్‌ చాలా బరువు బాధ్యతలు మోసేస్తున్నావ్‌?’’ అన్నా చిరునవ్వుతో.

‘‘అవును ఆంటీ!’’ చూడండి ఎన్ని సామాన్లు కొనిపించిందో నాతో’’ అంటూ రజనివైపు చిలిపిగా చూశాడు రమేష్‌.

మాలిని మురిపెంగా చూసుకుంటోంది కొడుకును, కోడలిని.

‘‘అవును ఆంటీ! ఈరోజు హాలిడే గదా! ఇప్పుడైతేనే కుదురుతుంది సామాన్లు సర్దుకోవటానికి’’ అంటూ తన హ్యాండ్‌ బాగ్‌లో ఉన్న కీ తీసుకుని తాళం తీసి, డోర్‌ తెరిచింది. లోపలికి వెళ్ళాం… నేనూ, మాలినీ వాళ్లతో పాటుగా.

‘‘ఇల్లు సూపర్‌గా ఉంది రమేష్‌’’ అన్నా.

‘‘అవునా ఆంటీ!’’ అన్నాడు చనువుగా చిరునవ్వుతో.

‘‘ఆంటీకి కాఫీ కలుపు’’ అన్నాడు భార్య రజనీతో రమేష్‌.

‘‘అమ్మా రజనీ ఇప్పుడే వద్దురా! ఇవాళ చాలాసార్లైంది ఇప్పటికే. అసలేం వద్దమ్మా. వంట కూడానూ వద్దు ఇద్దరికీ’’ అన్నాను నేను.

‘‘అవును నానీ. మధ్యాహ్నం ఫంక్షన్‌ భోజనం హెవీ అయింది. మళ్ళీ పద్మిని మేడం, చంద్రికా మేడం వాళ్ళిళ్లల్లో స్నాక్స్‌, కూల్‌ డ్రిరక్స్‌ తీసుకునే వరకూ’’ వదలలేదు మమ్మల్ని అన్నది మాలిని తన కొడుకు రమేష్‌తో.

‘‘ఐతే టిఫెనన్నా తినండి’’ అంటూ రమేష్‌ బైటికి బయలుదేరబోయాడు, వేడివేడిగా ఇడ్లీలు తెస్తానంటూ.

ఇక మరీ ఏమీ తినకపోతే బాధపడతారని సరేనన్నాను తల ఊపుతూ.

ఇంతలో ఈ మాటలు విన్న రజని, హాల్లో ఉన్న మా దగ్గరకు వచ్చి `

‘‘ఆంటీ, ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీలు వేసిస్తా వేడివేడిగా. బైటిఫుడ్‌ ఎందుకు’’ అంది రజని.

‘‘ఇప్పుడే షాపింగ్‌ చేసుకుని వచ్చారు. మళ్ళీ నీకు డబుల్‌ పని అవుతుంది గదమ్మా’’ అన్నా రజనీతో.

అబ్బే అదే లేదంటూ కిచెన్‌లోకి దారి తీసింది రజని.

మాతో చాలాసేపు ఆ ముచ్చట్లూ, ఈ ముచ్చట్లూ మాట్టాడి `

‘‘అవును ఈసారి అంకుల్‌ని కూడా తీసుకురండి మా ఇంటికి’’ అన్నాడు మాటల మధ్యలో రమేష్‌.

‘‘అయ్యో! నీకు తెలవనిదేముంది రమేష్‌. బంధువుల ఫంక్షనైతే తప్ప ఇల్లు త్వరగా కదలరు. వచ్చినా మళ్లీ రాత్రికల్లా ఇంటికి చేరుకోవ్వాల్సి వస్తోంది’’ అన్నా తనతో.

‘‘ఏం కాదులెండి! రమ్మని తీసుకురండి ఆంటీ… మీరు గట్టిగా రమ్మంటే రాకుండా ఉంటారా?’’ అన్నాడు రమేష్‌.

‘‘నీకంటే మీ మమ్మీకి తెలుసు బాగా మా ఆయన గారి సంగతి’’ అన్నా.

‘‘అవును అన్నయ్యగారు తొందరగా బైల్దేరరు ఊళ్ళంటే’’ అంటూ తల పంకించింది మాలిని.

తను పుట్టి పెరిగిన వాతావరణం, చిన్నప్పటి (ఫ్రెండ్స్‌) అదీగాక ఇంటి చుట్టూరా ఉండే బంధువులు. అంతేగాకుండా ఆయన చదువుకున్న కాలేజీలోనే రిటైర్డ్‌ అవటం. తర్వాత కూడా సర్వీస్‌ మోటివ్‌తో నడిచే వ్యక్తిత్వమే తనది. అందుకే అభిరుచికి అనుగుణంగా ఆల్‌ పెన్షనర్స్‌ ఆఫీస్‌లో బాధ్యులలో ఒకరుగా ఉండటం తన సర్వీసును అందించటం నేటివరకూ నిరాటంకంగా జరిగిపోతోంది అంటూ మాలిని, నేను మాట్లాడుకున్నాం. మావారి గురించి అన్నీ వింటూ ఊ కొడుతున్నాడు రమేష్‌.

మధ్య మధ్యలో తన కళాశాల విశేషాలు, భార్య రజని పనిచేసే కళాశాల వివరాలుÑ మా పిల్లల వివరాలు, పద్మిని, చంద్రిక పిల్లల వివరాలు అన్నీ దొర్లసాగాయి మాటల్లో. ఒక్క హాసిని పిల్లలు తప్ప మిగతా మా అందరి పిల్లలూ సీనియర్లు, జూనియర్లు ఒకరికొకరు. ఎందుకంటే దాదాపుగా మా పిల్లలంతా ఒకే ఏజ్‌ గ్రూప్‌ అవటంతో మేము, మా ఫ్రెండ్సెవరింట్లో కలిసినా దాదాపుగా ఈ కబుర్లన్నీ రిపీట్‌ అవుతూనే ఉంటాయి, మా మధ్యన, పిల్లల మధ్యన. అందరికీ ఇష్టమైన కబుర్లవటం వలన ఎన్నిసార్లు విన్నా విసుగు అన్పించదు ఎవరికీ. ఇది కదా, నిస్వార్థ పరమైన ఆప్యాయత అంటే అన్పిస్తుంది నాకు ఈ ముచ్చట్ల వనం పురివిప్పి నాట్యం చేస్తుంటే.

‘‘ఈ కబుర్లకు కామాలే తప్ప, ఫుల్‌స్టాప్‌ పడదని తెలుసు అందుకే, రమేష్‌ ఫ్రెష్‌ అవ్వు వెళ్లు’’ అన్నా నేను

సరేనన్నట్లుగా తల ఊపి లోపలికి వెళ్ళాడు రమేష్‌.

ఇంకా మా ఇద్దరి ముచ్చట్ల లింకును బలవంతంగా తెంచి, నెమ్మదిగా మాలినికి కేటాయించబడిన అనేకంటే తను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అంటే కొడుకు, కోడలు దగ్గర ఉండాల్సి వచ్చినప్పుడల్లా ఉండే రూమ్‌ అంటే సబబేమో. ఆ రూమ్‌లోనికి వచ్చి ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్‌ అయ్యాము. ఇళ్లలో బాగా పంజాబీస్‌, డ్రస్సులలో, నైటీలలో ఉండే అలవాటేమో చీరలు మార్చుకుని నైటీలు వేసుకోగానే ప్రాణానికి, శరీరానికి కూడా హాయిగా అన్పించసాగింది మాకు. ఇద్దరం బాల్కనీలో వేయబడిన కుర్చీలలో కూర్చున్నాం. అపార్టుమెంటు క్రింది భాగమంతా ఇది ఫలానా, ఇది ఫలానా అని చేత్తో చూపిస్తూ వరుసగా చెప్పుకొస్తోంది మాలిని నాతో. ఇంతలో అత్తయ్యా, ఆంటీ రండి టిఫెన్‌ తిందురుగానీ అంటూ పిలుస్తూ మా దగ్గరకు వచ్చింది రజని.

బాగా పరికించి చూస్తున్నా రజనిని. పసుపు, తేనె కల్సిన వర్ణంలో ఉంది ఆమె ముఖం. తీరైన కనుబొమ్మలు. నవ్వినపుడు తళుక్కుమనే పలువరుస, నల్లగా ఉండే కురులు. కొంచెం బొద్దుగా తయారైంది. గతంలో మా ఊరు ఒక ఫంక్షన్‌కి వచ్చినప్పుడు చూసిన దానికంటే ఇప్పుడు. షాపింగ్‌కు వెళ్ళొచ్చి వెంటనే వంట డ్యూటీలోకి నేరుగా వెళ్ళిపోయిందనటాన్కి సాక్ష్యంగా తన నుదుటి మీద చిరుచెమట అలుముకుంది. దానిపై లైటు కాంతి పడటం వల్ల రంగోలీ మీద జల్లిన తళుకుల్లాగా మెరవసాగాయి. ఈ అమ్మాయి, రమేష్‌ ఇద్దరూ లెక్చరర్లే, డిగ్రీ కాలేజీలో. చాలా చిన్న వయస్సులోనే జాబ్సు కొట్టుకున్నారు. ‘ఇద్దరూ కష్టపడి సంపాదించుకుంటున్నారు. చక్కగా రెండు అపార్టుమెంట్లు కొనుకున్నారు.’ అని మాలిని చెప్పింది ఒకసారి. ఒకటేమో హైదరాబాద్‌లోనట. ఇదిగో ఇప్పుడుంటున్నది రెండవది. ఇంకా సంవత్సరం కూడా కాలేదు గృహప్రవేశం అయి. రమ్మని పిలిచారు గానీ మేము రాలేకపోయాము ఆ టైంకి. ఇంట్లో బంధువులుండటం వల్ల.

‘‘ఏంటమ్మాయి! మీ ఇంటితోపాటు, నువ్వు… మీరిద్దరూ తెగ పోటీపడిపోతున్నారు తళుక్కుమంటూ’’ అన్నా చిరునవ్వుతో.

తను నవ్వేసింది చిరు సిగ్గుతో. ‘‘మీరలాగే అంటారాంటీ ఎప్పుడూ… ముందు మీరు రండి టిఫిన్‌కు అని మరోసారి చెప్పి తను డైైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్ళి, హాట్‌ ప్యాక్‌ ఓపెన్‌ చేసి, మా ఇద్దరికీ ఇడ్లీలను ప్లేట్లు నిండుగా పెట్టి, పల్లీ చట్నీ, కారప్పొడితో వడ్డించింది. వాటర్‌ బాటిల్స్‌ని సిద్ధం చేశాడు రమేష్‌.

‘‘నేనేమన్నా కొత్త చుట్టాన్నా ఏంటి రమేష్‌? మేము తెచ్చుకుంటాంగా కావలసినవి’’ అన్నా నవ్వుతూ.

తను కూడా ప్రతిస్పందనగా నవ్వుతూ ‘‘చల్లారిపోతాయి ఆంటీ త్వరగా తినేయండి’’ అంటూ తనకు ఏదో సిస్టమ్‌ వర్క్‌ ఉందని చెప్తూ తన బెడ్‌రూంలోకి వెళ్ళిపోయాడు రమేష్‌.

అసలు మజ్జిగో లేకపోతే ఇద్దరం చెరో గ్లాసుడు పాలో తాగి పడుకుందాం, పొట్ట లైట్‌గా ఉంటుందనుకున్నాం, ఆటోలో వచ్చేటప్పుడు మాలినీ, నేను. ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది మా ప్లానంతా. ఇడ్లీలు తెల్లగా, మృదువుగా నోట్లో వేసుకుంటుంటే ఇట్టే కరిగిపోతున్నాయి. ప్లేట్లు ఖాళీ అయిపోయాయి. మాలిని, నేను ఒకళ్ల మొహం ఒకళ్లు చూసుకుని ఒకటే పగలబడి నవ్వుకున్నాం, మా తిండిని మేమే చూసుకుంటూ.

రజనీని పిలిచి ‘‘చాలా థాంక్సమ్మా. మళ్లీ నా బొజ్జ ఫుల్‌ అయిపోయిందని’’ చెప్పా తనతో.

‘‘అసలు భోజనం చేస్తే మాకూ తృప్తిగా ఉండేది’’ అంది తను.

‘‘కాదమ్మా… అంకులు, నేనూ రోజూ నైట్‌ ఓట్స్‌గానీ, టిఫిన్‌గానీ ఇలా’’ అని ఖాళీ ప్లేటును చేత్తో చూపిస్తూ, ‘‘ఇలా తింటాం’’ అన్న నా మాటలకు చిరునవ్వులు చిందిస్తూ చూసింది రజని.

‘‘ఆంటీ రెస్ట్‌ తీసుకోండి. పడుకోండి’’ అనటంతో మాలినీ, నేను ఇద్దరం రూమ్‌లో బెడ్‌పై చేరిపోయాం.

అప్పుడు లింకు తెగిన కబుర్ల ప్రవాహానికి మళ్లీ లాకులు తెరిచాం. ముందు టిపినీలు తినటం, ఆ వెనుక మందులు తినటం మామూలే ననుకుంటూ ఎవరు వేసుకోవాల్సిన టాబ్లెట్లను వాళ్ళం మింగాము, తీసిన లాకులకు బ్రేకులు వేస్తూ.

ఫ్రెండ్సుతో కలిసినప్పుడల్లా మాటల్లో సాధక బాధకాలు దొర్లటం అతి సహజం. ఇప్పుడెలా ఉంది తను? ఫరవాలేదు ఫ్రీగా మాట్లాడుతోందా? అని అడిగా మాలినిని. తన కోడలిని ఉద్దేశ్యించి.

‘‘ఆ… అంతేనండీ… అన్నీ చేసి పెడుతుంది. డైనింగ్‌ టేబుల్‌ మీద తినమని. వాడు రమేష్‌ కూడా అంటాడు రోజూ. ‘మమ్మీ నువ్వు మాత్రలు వేసుకోవలసిన దానివి మాతోపాటు లేకపోతే అందరం తినటం అయ్యేవరకు ఆగటం దేనికి, తినేయ్యెచ్చుగా టైముకని ఒక్కోసారి కోప్పడుతుంటాడని’’ కూడా చెప్పింది మాలిని.

‘‘వాళ్ళిద్దరూ తినకుండా, ముఖ్యంగా పిల్లలు తినకుండా, నాకేమీ తినబుద్ధి కాదు’’ అంది మాలిని.

అందులో వాళ్ళకంటే నేను ముందుగా తింటే బాగోదనే సంకోచం వినపడిరది స్వరంలో.

మాలిని భర్త కాలం చేశారు. ఇప్పుడు తను ఒంటరి. భర్త రిటైర్మెంట్‌ అనంతరం వచ్చిన బెనిఫిట్స్‌ను కొడుకుకే ఇచ్చేశామని చెప్పింది గతంలో. ఇప్పుడు ఆర్థికంగా కొడుకు మీదే ఆధారం. అన్ని అవసరాలు, మెడికల్‌కు సంబంధించినవి సైతం సమకూరుస్తాడు. కానీ కొడుకు ముందు చేయి చాచలేని, నోరు తెరిచి అడగలేని సందర్భాలు, అవసరాలూ ఉంటాయి గదా! ఏమని అడుగుతా? నాకేమో అభిమానంగా ఉంటుంది అడగలేను అని తన ఇబ్బందిని తెలియజేసింది మాలిని.

నిజమే కొడుకులని అనే కాదు, కట్టుకున్న భర్తను కూడా అడగలేని పరిస్థితులుంటాయి కుటుంబాల్లో అదే సంపాదిస్తూ ఉంటే, ఉద్యోగంలో ఉంటే ఒకప్పుడు కాకుంటే మరోసారైనా కాస్త అడిగే ఆస్కారం ఉంటుంది. అదీ లేకపోతే నిజంగా కష్టమే. ఎందుకంటే ఇలాంటి ఒడిదుడుకులకు అతీతమేం కాదు నా పరిస్థితి కూడా.

May 30, 2025 52 comments
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

శుభ ముహూర్తం-1

by Maji Bharathi May 30, 2025
written by Maji Bharathi

మనం చిన్నప్పటినుండి విన్న కథలలో మొదటి కథ ఎప్పుడూ, అనగనగా ఒక రాజు… అంటూనే మొదలవుతుంది. అటు పౌరాణికమైనా, యిటు చారిత్రికమైనా రాజులు, రాణుల గురించిన కథలు మనల్నెప్పుడూ ఉర్రూతలూగిస్తూనే ఉంటాయి. మరలా మరలా చదవాలనిపించేలా ఆ పాత్రల ఔచిత్యాలుంటాయి. అలనాటి ఆ కథాగమనంలో భాగస్వాములమై, అటువంటి పాత్రల్లో ఊహించుకోవడం ఎవరికైనా తీయని అనుభూతినిచ్చేదే.
       అటువంటి కథలు మృగ్యమవుతున్న నేటి కాలంలో, ఒక కాల్పనిక చరిత్రను మన ముందుకు తెస్తున్నారు ప్రొఫెసర్ భారతి. నిండు గోదారిలా ఉరకలెత్తే కథాగమనంతో, చక్కని కథాశిల్పంతో, అబ్బురపరచే రచనా కావ్యంతో, కనుల ముందు కనిపించేలా అన్ని పాత్రలనూ ప్రతిసృష్టి చేసి, మనలను అలరించడానికి “శుభ ముహూర్తం” చూసుకుని మరీ, ధారావాహిక నవలగా మనకందించడానికి మన ముందుకు వస్తున్నారు. మరెందుకాలస్యం… ఆ “శుభముహూర్తం”లో, కళ్లకు కట్టినట్టు కనిపించబోయే రాజప్రసాదాలను అవలోకిస్తూ, మాధవీలత లల్లుకున్న వనాలలో విహరిస్తూ, యుద్ధతంత్రాలతో అచ్చెరువొందుతూ, మనకందించబోయే, అపురూపమైన ప్రేమకథా విందుకు మీకిదే మా ఆహ్వానం.
సంపాదకవర్గం, తరుణి

రచయిత్రి పరిచయం
ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి గారు, మన తరుణి పాఠకులకు సుపరిచితులే. భారతీయం పేరుతో కాలమ్ నిర్వహించారు. “విధి నిర్వహణలో నా అనుభవాలు” అంటూ, వైద్యవృత్తిలోని తన అనుభవాలను, మైక్రోబయాలజిస్టుగా వ్యాధులు గురించిన వ్యాసాలను మనకందించారు. “ఆలోచనా తరంగాలు”, “వేకువ” అనే రెండు కథా సంపుటాలను వెలువరించి, మూడవ కథాసంపుటి “జీవనగానం”ను త్వరలో విడుదల చేయబోతున్నారు.
“కళింగ కథాజాడ”లో నాలుగు తరాల రచయితలలో వీరూ ఒకరు కావడం అభినందించదగ్గ విషయం. దగ్గరగా 80 పై చిలుకు కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఒక్క ఈనాడు ఆదివారం అనుబంధంలోనే ఎనిమిది కథలు ప్రచురింపబడ్డాయంటే, ఆమె కలానికున్న పదును తెలుస్తుంది.
వృత్తిపరంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ప్రవృత్తిపరంగా రచనా వ్యాసంగంలో ఉన్న, ప్రొఫెసర్ మజ్జి భారతిగారి కలం నుండి వెలువడుతున్న ధారావాహిక నవల “శుభ ముహూర్తం”, మన పాఠకుల కోసం…సంపాదకవర్గం తరుణి

మగధ దేశపు మహారాజు విక్రమసింహ మనసు గాలిలో తేలిపోతున్నది. కోరుకున్న కన్య, వలచి చేపట్టిన సుగుణాల రాశి, అందాల ప్రోవు విదర్భ దేశపు రాకుమారి ప్రమీలాదేవితో ఈరోజు తన జీవితం పండబోతుంది. ఎంత గంభీరంగా ఉందామనుకున్నా, విశాలమైన కళ్ళు వెలుగులను వెదజల్లుతున్నాయి. పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటున్నాయి. అసలే సమ్మోహనాకారం. దానికి తోడు మనసులోని ఆనందం మోముపై ప్రతిఫలించగా, మగవారి మనసులను కూడా కొల్లగొట్టేంత సమ్మోహనంగా కనిపిస్తున్నాడు విక్రమసింహ.

అది చూసి “మన్మధుడే స్వయంగా వచ్చి పూల బాణాలు వేసినా, మరులు గొనరని పేరు గాంచిన మీరు, ఈరోజు యిలా అయిపోయారేమిటి మహారాజా! పున్నమి చంద్రుడు నీ మోమును ఆవహించాడా ఏమి? ప్రేమానురాగాల వెన్నెల సోనలు కురిపిస్తున్నాయి మీ కళ్ళు. మహారాణి వారు ఏం మాయ చేశారో?” అని హాస్యం ఆడనే ఆడాడు చిన్ననాటి నుండి స్నేహితుడు, ప్రస్తుతం ఈ దేశ సర్వ సేనాధిపతి, అనంతుడు.

ఆ మాట గుర్తొచ్చి ఒళ్లంతా పులకాంకితం కాగా, రాకుమారి ప్రమీలాదేవితో సమాగమానికి మనసు ఉరకలు వేసింది. ఇన్నినాళ్ళ తన తపఃఫలం ఈరోజు ఫలించబోతుంది. ఈరోజు కోసం ఎంత వేచి చూశాడో! ఎంతమందిని చూసినా చలించని తన మనస్సు, రాకుమారి ఆలోచన రాగానే అలా అయిపోతుందేమిటి? పురుషుడ్ని… నాకే యిలా ఉంటే మరి రాకుమారి? ఆమె కూడా తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారేమోనన్న ఆలోచన రాగానే, అంతఃపుర శయనమందిరం వైపు అడుగులు గబగబా పడ్డాయి. ప్రమీలాదేవిని చూడగానే మనసు ఆనందంతో ఉరకలేసింది.

పరిమళాలు వెదజల్లే పూమాలలతో అలంకరించిన అందమైన శయన మందిరంలో, విశాలమైన పాన్పుకు ఒక చివర, మేలి ముసుగులో, సిగ్గుతో తలదించుకొని రాకుమారి. పరాక్రమంలో పురుషులనెంత ఎదిరించినా, స్త్రీలకు సిగ్గే అలంకారమేమో! యుక్తవయసు వచ్చాక ఏ స్త్రీని ఇంత దగ్గరగా చూడాలని కూడా అనిపించని విక్రమసింహ మనసుకు, ఆమెను చూడగానే ఏమవుతుందో మరి? పరవశించిపోతుంది. ఇందుకేనా! మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు మన పెద్దలు. ఇంకా జాగు చేసి రాకుమారి మనసు నొప్పించకూడదు. ఎప్పటినుండి ఎదురుచూస్తున్నారో, మా కోసం! ఈ ఆలోచన వచ్చిన తడవే, ఆమెను సమీపించి, “రాకుమారీ. ఈ శుభదినం కోసం మేము ఎన్నినాళ్ళ నుండి వేచి చూస్తున్నామో! యిన్నినాళ్ళకు మా కల ఫలించింది” అని ఆమె కరస్పర్శకు చేయి చాచాడు.

విక్రమసింహ కరస్పర్శ కాగానే, రవికిరణాలు సోకిన కలువలా, ఆమె ముడుచుకుపోయింది. సిగ్గుతోనేమో అనుకుని, “రాకుమారీ! అగ్నిసాక్షిగా మిము వివాహమాడిన వారము. మా దగ్గర మీకీ బిడియమేల! నేటి నుండి మనమిరువరమూ ఒకరమే. తనువులే వేరుగాని, హృదయమొక్కటే” లాలనగా ఆమె చుబుకాన్ని ఎత్తి మేలిముసుగు తీయబోయాడు. పర పురుషుని స్పర్శ తగిలిన దానిలా అడుగు వెనుకకు వేసి, మరింత తలదించుకుంది. అది గ్రహించుకునే స్థితిలో లేడు. ఆనందంతో మబ్బుల్లో విహరిస్తున్నాడు. అందుకే, ఊహించని ఆమె చర్యకు “రాకుమారి! మేము, మిమ్ము వలచిన విక్రమ సింహులం. మా దగ్గర మీరు స్వేచ్ఛగా ఉండవచ్చు” అని అనునయంగా చెప్పాడు.

“క్షమించాలి. మేము మిమ్ములను అలా తలచలేము. మా మనసు అన్యాక్రాంతం” హీనస్వరంతో చెప్పింది.

అప్పటికి ఈ లోకంలోకి వచ్చాడు. ఐనా, తాను వింటున్నది నిజమేనా! లేక పొరపడుతున్నాడా! మమ్ము వివాహం చేసుకొని, వారలా ఎందుకంటారు? ఎక్కడో పొరపాటు జరిగింది. “రాకుమారీ! మేము మగధ దేశాధీశులం. మిమ్ము అగ్నిసాక్షిగా వివాహమాడిన వారం. మా చెంత మీరు బిడియపడనవసరం లేదు” మరింత అనునయంగా చెప్పాడు.

“క్షమించాలి. మా మనసు అన్యాక్రాంతం” ఈసారీ నెమ్మదిగానే, ఐనా పొరపాటుకు ఆస్కారం లేని విధంగా, చాలా స్పష్టంగా చెప్పింది.

ఆ మాట వీనులకు సోకగానే, శరాఘాతం తగిలినట్లు, పాతాళానికి కృంగిపోతున్నట్టు అనిపించింది. అంతటి మహారాజూ ఆ క్షణంలో మామూలు మనిషైపోయాడు. గడియపాటు ఏమనాలో తోచలేదు. ఎన్నో యుద్ధాలలో అలవోకగా నెగ్గిన ఆ ప్రభువుకు, నిలదొక్కుకోవడానికి కొద్దిసేపు పట్టింది. తాను ఊహించినదేమిటి? ఇక్కడ జరుగుతున్నదేమిటి? ఇన్ని దినముల నుండి, క్షణాలు లెక్కపెట్టుకుంటూ, వేచి చూస్తున్నది, యిందుకొరకా? ఈ మాట వినడానికేనా తామిన్నాళ్లూ నిరీక్షించింది? తామొక్కరేనా, వారిని వలచినది? వారికి తమయందు అటువంటి అభిప్రాయం యెన్నడూ కలగలేదా? అటువంటప్పుడు వారు తమనెందుకు వివాహం చేసుకున్నారు? తమనెందుకు ఆశల పల్లకిలో విహరింప చేశారు?

రాకుమారి వైపు చూశాడు. తన ఆలోచనలతో సంబంధం లేనట్టు, ఎదురుగా శిల్పంలా… అంతే! తనదనుకున్న కన్య మనసు, వేరేవాళ్ల మీద లగ్నమై ఉందన్న విషయం గ్రహింపుకు రాగానే, ఆవేశం ముంచుకొచ్చింది. అంతవరకు కళకళలాడిన ముఖం, పొద్దు గ్రుంకుతున్న సూర్యునిలా ఎర్రబారింది. కళ్ళల్లో రక్తమే పొంగి వస్తున్నట్టు… కళ్ళు మరింత విశాలమయ్యాయి. నాసికాపుటాలు అదురుతున్నాయి. వీటితో తనకేమీ సంబంధం లేనట్టు రాకుమారి, శిల్పంలా అలాగే నిలుచున్నారు.

“మరి మమ్ము ఎలా వివాహం చేసుకున్నారు?” కోపంతో ప్రశ్నించాడు విక్రమసింహ.

“మేము చేసుకోలేదు. మీరే చేసుకున్నారు. పెండ్లి కోసం మీరు రాయబారం పంపినప్పుడు, మా తండ్రిగారు మీతో ఉద్వాహం చేయలేనని విన్నవించుకున్నారు. ఎందుకలా చెప్పారా అని, ఆనాడే మీరు ఆలోచించి ఉండాల్సింది? అనాలోచితంగా మాపై యుద్ధాన్ని ప్రకటించి, మా రాజ్యాన్ని గెలుచుకున్నారు. మాది చిన్న రాజ్యమని మీకు తెలుసు. యుద్ధంలో మీతో నెగ్గలేమనీ తెలుసు. రాజ్యం కోసం మా తండ్రిగారు నన్ను మీకిచ్చి వివాహం చేయడానికి అంగీకరించారు. మా తండ్రిగారి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత, ఒక పుత్రికగా నాపై ఉంది. అందుకే మీతో వివాహానికి అంగీకరించాను. నా మనసు వేరే వారిమీద లగ్నమై వున్నా కూడా, కుమార్తెగా నా బాధ్యత నిర్వర్తించాను.”

ఆ మాటలు విన్న విక్రమసింహ, నిజమే! మీ కన్యను మా రాజ్య పట్టమహిషిగా చెయ్యమని, రాజమాత శుభపత్రిక పంపించినప్పుడు, వారు నిరాకరించారు. తామే ఈ నిజాన్ని గ్రహించుకోలేకపోయారు. కనీసం వివాహానికి ముందైనా రాకుమారి తన అభిప్రాయం చెప్పి ఉండాల్సింది అనుకుంటూ “మీకు యిష్టం లేనప్పుడు, ఈ వివాహానికి అంగీకరించకుండా ఉండాల్సింది మీరు” అన్నాడు.

“ఓడిపోయిన రాజు, రాజ్యంతో పాటు వారి కన్యలు కూడా విజయుడైన రాజు సొత్తన్న విషయం మీకు తెలియనిది కాదు. ఆ ధర్మాన్ని అనుసరించి, మీతో వివాహానికి అంగీకరించాను. వివాహం చేసుకోని పక్షంలో, నాకున్న ఇంకో మార్గం ఆత్మార్పణ చేసుకోవటం. ఆత్మార్పణ చేసుకుని, నా తల్లిదండ్రులను క్షోభ పెట్టి, నరకానికి పోలేను. అందుకే ఈ వివాహానికి అంగీకరించాల్సి వచ్చింది.” వేదన నిండిన స్వరంతో సమాధానమిచ్చి తలదించుకుంది.

తల దించుకున్న ప్రమీలాదేవిని చూశాడు. ఆమె ముఖంలో విపరీతమైన బాధ గోచరిస్తుంది. ఆ బాధ చూడగానే విక్రమసింహ కోపం, నీరు తాకిన పాలపొంగులా చల్లారిపోయింది. వివేకం మేలుకుంది. అవును! ఆమెను ప్రాణాధికంగా ప్రేమించాడు. కాని, ఆమె మనస్సు, తనమీద వుందో లేదో గ్రహించుకోకుండా రాయబారం చేశాడు. ఆమె తండ్రిగారు వివాహానికి అంగీకరించలేదు. యోగ్యుడైన తనతో, వారి కుమార్తె వివాహానికి వారెందుకు అంగీకరించలేదోనని, అప్పుడే తాను ఆలోచించవలసింది? తన తల్లిగారి మరణానికి ఆమే కారణమని, తొందరపడి యుద్ధం ప్రకటించాడు. తన రాజ్యంతో పోలిస్తే, విదర్భ దేశం చాలా చిన్న రాజ్యం. గెలవడం తనకు నల్లేరు మీద నడక. రాచమర్యాద నిలుపుకోవడం కోసం కుమార్తెకు యిష్టం లేకపోయినా తనతో వివాహం జరిపించేటప్పుడు ఆమె తండ్రిగారు ఎంత క్షోభ అనుభవించి వుంటారో, ఒక్కక్షణం కళ్ళముందు కనిపించింది.

తన తొందరపాటుతనానికి ప్రమీలాదేవి బలి అయిపోయింది. ఆమె మనసును చూరగొన్న ఆ భాగ్యవంతుడు ఎవరో? ఎంత అదృష్టవంతుడో? కాని, ఆ ఊహ రాగానే మనసు మరల బాధతో నిండిపోయింది. తనకు దక్కని అదృష్టం ఎవరికో దక్కినందుకు మనసు కృంగిపోయింది. రాజుననే విషయం మర్చిపోయాడు. తనమీద తనకే జాలి వేసింది. ఎందరో మహారాజులు వారి కన్యలను వివాహం చేసుకోమని రాయబారం నడిపారు. కానీ, తన మనసంతా ప్రమీలాదేవి మీదే లగ్నమై ఉండడం చేత, వారందరికీ సామరస్య పూర్వకంగా, కాదు అని బదులు చెప్పగలిగాడు.

ఈరోజు దేశమంతా రాజుగారి వివాహ వేడుకలలో మునిగివుంది. కాని, ఈ అంతఃపురంలో తన మనసు, తన ఎదురుగా ఉన్న ప్రమీలాదేవి మనసు విచారంలో మునిగి ఉన్నాయి. ఇంకా ఆమెను ప్రతిరోజూ చూస్తూ, ఈ క్షోభ భరించడం తన వల్లకాదు. ఆమెను, ఆమె తండ్రిగారి దగ్గరికి పంపించడం ఉత్తమం. ఇలా నిర్ణయించుకున్న విక్రమసింహుడు, “రాకుమారి! జరిగిన దానిని మేము వెనుకకు తీసుకురాలేం. కాని, మీ మనసుకు కష్టం కలిగించేలా, యిక్కడ మిమ్మల్ని ఉంచడం భావ్యం కాదు. మిమ్మల్ని మీ తండ్రిగారి దగ్గరకు పంపించి వేస్తాను. సిద్ధం కండి” అని  వెనుదిరిగాడు.

“క్షమించండి. ఈ పరిస్థితులలో, నేను మరలా మా రాజ్యానికి వెళ్ళలేను. ఒకసారి వివాహం అయ్యాక, ఆ కన్యకను భరించవలసినది ఉద్వాహం చేసుకున్న వారే. వివాహం అయిన వెంటనే కొమరిత, భర్తను విడిచి పుట్టింటికి చేరుకుందంటే, దాని పర్యవసానాలు మీకు తెలిసే ఉంటాయి. ఒకసారి వివాహం అయ్యాక, నేనిక విదర్భ రాజ్య రాకుమార్తెను కాదు. మగధ రాజ్యపు పట్టపురాణినే. ఆ మర్యాదను నేను కాపాడతాను” తలవంచుకొని నెమ్మదిగా బదులిచ్చింది ప్రమీలాదేవి.

“మనసు ఎవరికో అంకితం చేస్తూ, ఇక్కడ తన దేశపు పట్టపురాణిగా ఉంటానని, ఆమె అనడం చాలా అన్యాయమని మనసు ఆక్రోశించింది. తాను ప్రాణాధికంగా ప్రేమించిన స్త్రీమూర్తి, వేరే వాళ్లను మనసులో నిలుపుకుని, అనుక్షణం తన ఎదురుగా ఉంటానంటే ఎలా భరించేది?” ఆమె కోరికను మన్నించవద్దని విక్రమసింహ మనసు చెప్తుంది. కాని, వేరు మార్గం లేదు. ఎందరో రాజుల కొమరితలను తిరస్కరించి, వివాహం చేసుకున్న కన్యక, వివాహం కాగానే పుట్టింటికి వెళ్ళిపోతే, ఆమె రాజ్యం సంగతేమో కాని, తన రాజ్యప్రతిష్ట ఏమవుతుందో  ఒక్కక్షణం కళ్ళముందు కనిపించింది విక్రమసింహకు.

మనసుకు ఇష్టం లేకపోయినా, “సరే” అన్నమాట బయటకు వచ్చింది. “సరే” అని చెప్పి వెళ్ళిపోతున్న విక్రమసింహను, “ఇంకొక విషయం” అన్న ప్రమీలాదేవి మాట ఆపింది. వెనుదిరగకుండానే “చెప్పండి” అన్నాడు.

“మీరు మా రాజ్యాన్ని గెలవడానికి కారణం, మాది చిన్నరాజ్యం అనేకాదు, వారసుడు లేకపోవడం కూడా ఒక కారణం. నేనే పురుషున్ని అయి, మీతో సమానంగా యుద్ధ విద్యలలో, శౌర్య పరాక్రమాలలో ఆరితేరిన దానినయి ఉంటే, మీతో యుద్ధం చేసి గెలిచేదాననేమో!”

ఆమె మాట ముగియలేదు. నేనే పురుషున్ని అయితే అన్న ఆమె మాటకు, ఒక్కసారి ప్రమీలాదేవిని… ఈ అందాల లావణ్యరాశి, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న సుకుమారిని, దృఢమైన శరీరంతో, వీరోచితంగా పోరాడే ఒక పురుషునిగా ఊహించుకుని, ఫక్కున నవ్వాడు విక్రమసింహ.

“మా బాధ, మీకు హాస్యాస్పదంగా ఉందా?” తలెత్తకుండానే అడిగింది ప్రమీలాదేవి.

“క్షమించాలి. నా ఉద్దేశం అదికాదు. మీరు పురుషుడై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. అంతే.” సున్నితంగా బదులిచ్చాడు విక్రమసింహ.

తనను తాను పురుషునిగా ఊహించుకున్న, ప్రమీలాదేవికి కూడా పెదవులపై నవ్వు పారాడింది. అది బయటపడకుండా తల మరింత దించుకుంది ఆమె. పెదవులపై చిరునవ్వును బయటకు రాకుండా  కన్నులలోనే అదమగా, అది మోమంతా పరుచుకొని, ఆమె వదనం చంద్రకిరణాలు సోకిన కలువలా వికసించింది. మోము మరింత అందంతో కాంతులను వెదజల్లింది. అందంతో ఇనుమడించిన ఆమె మోముని చూసి ఒక్కసారిగా మైమరిచిపోయాడు విక్రమసింహ. అలా ఎంత కాలం గడిచిందో తెలియదు.

“ఇంకొక మనవి” అడగలేక అడిగిన, ప్రమీలాదేవి మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు. “మన, ఈ రహస్యం ఎవరూ గ్రహించకుండా ఉండాలంటే, అంతఃపురం పూర్తిగా మా అధీనంలో ఉండాలి.”

అంతఃపురం వారి అధీనంలో అంటే… ప్రస్తుతం ఆమె ఈ దేశపు మహారాణి కాదు. శత్రుదేశపు రాకుమారి. వారి అధీనంలో అంతఃపురం ఉంచడమంటే నిప్పుతో చెలగాటమే! అలాగని, ఆమెను చూస్తూ కాదనలేడు. వలచిన వనిత కోరికను కాదనలేని తన నిస్సహాయతకు, వగచక తప్పలేదు విక్రమసింహకు. “సరే” అన్నాడు.

“మరొక్క మనవి. క్షమించాలి. మీతో ఎలా చెప్పాలో! కానీ మా తండ్రిగారికి మేము యుద్ధంలో ఏ విధమైన సహాయం చేయలేక పోయినందుకు మేము ఓడిపోయాం. అందుకని … ” అంటూ సందిగ్ధంలో ఆగిపోయింది ప్రమీలాదేవి.

“ఫరవాలేదు. చెప్పండి.” ఇంతవరకూ వచ్చాక, ఏమైనా జరగనీ, అనే నిశ్చయానికి వచ్చాడు విక్రమసింహ.

“మాకు యుక్తవయసు వచ్చినవరకు,  మమ్ములను మగబిడ్డగానే పెంచారు మా తండ్రిగారు. మేము అన్ని యుద్ధవిద్యలూ నేర్చుకున్నాం. కాని, మాకు యుక్తవయసు రాగానే మమ్ములను అంతఃపురానికే పరిమితం చేశారు. అందుకని నేను యుద్ధ విద్యలలో ఆరితేర లేకపోయాను. నాకు ఇప్పుడవన్నీ నేర్చుకోవాలని ఉంది. ఎవరైనా నా మీదకు దాడికి వస్తే ఎదురొడ్డి గెలవాలని ఉంది. నాకు, నా చెలికత్తెలకు యుద్ధవిద్యలు నేర్పించే బాధ్యత మీరు తీసుకోవలసినదని సవినయంగా వేడుకుంటున్నాను” అంటూ చేతులు జోడించింది ప్రమీలాదేవి.

నవ్వొచ్చింది విక్రమసింహకు. ప్రేమించి, యుద్ధంలో గెలిచి  వివాహం చేసుకున్న స్త్రీమూర్తి, నా మనసు వేరే వారికి అంకితం, మీ రాజ్యంలో ఉంటాను గాని, మీకు సంబంధించిన వ్యక్తిని కాను. రేపు అవసరమొస్తే మీతో యుద్ధం చేయటానికి యుద్ధవిద్యలలో నేను ఆరితేరాలి. అందుకు మీరే నాకు సహాయం చేయాలి అని అడుగుతున్నందుకు. ప్రమీలాదేవి ముఖం చూస్తూ కాదని చెప్పలేకపోయాడు. “మీ అభిమతం. అలాగే కానివ్వండి” అని చెప్పి వడివడిగా ముందుకు అడుగులు వేశాడు విక్రమసింహ.

*

చిన్ననాటి నుండి ప్రాణస్నేహితుడు, ఈ దేశపు మహారాజు, కోరుకున్న సఖితో వివాహం జరిగి ఆనందపు అంచులు చూస్తూ ఉండి వుంటాడు. మహారాజు  ప్రేమ సామ్రాజ్యంలో ఆనందం ఆవలి అంచులను తాకే వరకు, దేశ భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై ఉంది. మహారాజు ఆనందానికి ఎవరూ అడ్డురాకుండా, రాజ్యవ్యవహారాలను చూసుకోవలసిన బాధ్యత కూడా  స్నేహితుడిగా తనమీద ఉంది, మనసులో ఇలా అనుకుంటూ, వెనక్కి తిరిగి అంతఃపురాన్ని అవలోకించాడు అనంతుడు. దీపాల కాంతుల్లో ధగధగలాడుతుంది అంతఃపురం. తన మహారాజు వదనంలాగే… మహారాజు తలపుకు రాగానే ప్రఫుల్లమయింది అనంతుని మనసు.

నెల రోజుల నుండి మహారాజు పరిణయ మహోత్సవ సందర్భంగా పేదవారికి దానధర్మాలు, ప్రముఖులకు కానుకలు, దేవాలయాలకు మడులు మాన్యాలూ అందజేయబడ్డాయి. పేద ధనిక అన్న తేడా లేకుండా పుర ప్రజలంతా ఈ సంబరాన్ని గొప్పగా జరుపుకుంటున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఇంటింటినీ, వాడవాడనూ అలంకరించారు. మహారాజంటే, ప్రజలకున్న అభిమానం అటువంటిది. అంతటి మహారాజును, అంతఃపురం వరకూ తోడ్కొని వచ్చి సింహద్వారం దగ్గరే ఆగిపోయి “మీ ముఖంలో ఆనందం ఎప్పుడూ ఇలాగే కలకాలం ఉండాలి” అని ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పాడు.

అంతఃపురం నుండి వెను తిరుగుతుంటే, అంతకు ముందు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. “ఎప్పుడూ గంభీరంగా, సూర్యుని ప్రతాపంతో నిండి ఉందా అనిపించేలా ఉన్న మా మహారాజుల ముఖం, ఈనాడు పున్నమి చంద్రునిలా ప్రేమానురాగాల సోనలు కురిపిస్తుంది. ఏలనో! ఎవరేమి మాయ చేసారో”నని తాను హాస్యమాడగానే, “అలాగే చూస్తూ ఉండు, అనంతా! శత్రువుల పట్ల కర్కశుడని పేరొందిన ఈ దేశ సర్వసేనాధిపతిని, తమ ప్రేమానురాగాల ధారలతో ముంచెత్తి, ముట్టుకుంటే కరిగిపోయే హిమఖండంలా మార్చటానికి, యెవరో యెక్కడో యెదురు చూస్తూనే ఉన్నారు. ఆ శుభ ఘడియలు రానీ! అప్పుడు చూద్దాం. నీ మోము యే సోనలు కురిపిస్తుందో!” అని బదులిచ్చాడు ప్రాణ స్నేహితుడు విక్రమసింహ. అది గుర్తుకు రాగానే అనంతుని ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది.

నిద్రించిన సమయంలో తప్ప, యింతవరకు ఎప్పుడూ విక్రమసింహను విడిచిపెట్టింది లేదు. ఇప్పుడు ఆ అలవాటు మార్చుకోవాలి. తనలో తానే అనుకుంటూ అంతఃపురం భటులను మరొక్కమారు హెచ్చరించి, తన మందిరం వైపు నడుస్తున్న అనంతుడు, దూరంగా చీకటి ముసుగులో మహారాజ మందిరం వైపు, గబగబా వెళ్తున్న వ్యక్తిని చూశాడు. ఇంత రాత్రివేళ మహారాజ మందిరం వైపు… మనసొక్కసారిగా త్రుళ్ళి పడింది… త్రుళ్ళి పడడమే కాదు, భయాందోళనలకు లోనయింది.  ఏమి జరుగుతుంది? ఆలోచనలతో తలబ్రద్దలై పోతుంది. ఏమి చెయ్యాలో తోచడం లేదు. అడుగు ముందుకు పడడం లేదు. మనసు కీడును శంకిస్తుంది. శిలలా బిగుసుకుపోయాడు అనంతుడు.

*

తర్వాత భాగం మలి సంచికలో…..

May 30, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

జీవన మాధుర్యం

by Laxmi Madan May 30, 2025
written by Laxmi Madan

5 వ భాగం

వసంత కూతురు పెళ్లికి వచ్చి అపర్ణ చిన్నప్పటి జ్ఞాపకాలను అన్ని మననం చేసుకుంటూ పెళ్లిలో ఎంజాయ్ చేస్తూ సుదత్తలు కలవడానికి అపర్ణ తన పుట్టి పెరిగిన ఇంటికి వెళుతుంది.. కథలోకి వెళ్దాం.

” అత్తా! అక్కడ మోరిలో నుండి పాము కనబడుతుంది” అన్నది అపర్ణ భయంగా.

మెల్లిగా వంగి చూసింది సుధ…

” నువ్వు భయపడకు అది పాము కాదు.కప్ప తల బయటకు పెట్టింది .అయినా ఇక్కడ పాములు రావడం కూడా సహజమేలే, చిన్నప్పుడు మనం ఎన్ని పాములను చూడలేదు” అన్నది సుధ.

” భయమేస్తుంది అత్తా! ఇంతకీ అది కప్పనేనా? “అని అడిగింది.

” అవును కప్పనే” అని ఒక కర్రతో కప్పను అలా నెట్టేసి చేతులు కడుక్కొని వచ్చింది సుధ.

మళ్లీ ఇద్దరూ మనసాలలో వచ్చి కూర్చున్నారు. ఇంతలో తలుపు చప్పుడు అయ్యింది.

” ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా?” అంటూ వెళ్లి బయట తలుపు తీసింది సుధ.

” ఓ మీరా వేణు! రండి లోపలికి” అని పిలిచింది.

ఎవరు వచ్చారో అపర్ణ కు అర్థం కాలేదు..

అతను లోపలికి వచ్చాక కుర్చీ చూపించి కూర్చోమని చెప్పింది సుధ.

వేణు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికే లేచిన అపర్ణ మరో కుర్చీలో కూర్చుంది. సుధ కూడా కూర్చొని,

” వేణు! ఈమె నా మేనకోడలు అపర్ణ.

అపర్ణ !ఇతను వేణు అని ఎమ్మెల్యే గారి అబ్బాయి. ఇతను కూడా రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. బిజినెస్ లు కూడా ఉన్నాయి.

అయినా మీరిద్దరూ ఒకరికొకరు తెలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంచుమించు మీ వయసు ఒకటే! స్కూల్లో ఏమైనా పరిచయం ఉందేమో మీకు” అని చెప్పింది సుధ.

అపర్ణను చూసిన వేణు ఒక్కసారి షాక్ అయ్యాడు.

“అపర్ణను ఎన్ని రోజులకి చూస్తున్నాను. అసలు నన్ను గుర్తు పట్టిందా”?అనుకున్నాడు.

అపర్ణ కూడా వేణుని చూసి ఆశ్చర్యపోయింది. “ఎన్ని రోజులకి చూసాను అతన్ని. నన్ను గుర్తుపట్టాడా” అని అనుకున్నది.

ఇద్దరూ ఒకేసారి అన్నారు.

” అవును మేమిద్దరం ఒకే క్లాసు” అన్నారు.

“అయితే మీరు మాట్లాడుకొండి. నేను వేణుకి కాఫీ తీసుకొని వస్తాను” అని అన్నది సుధ.

“ఈ సమయంలో కాఫీ వద్దు ,ఏమీ వద్దు. మీరు కూర్చోండి” అన్నాడు వేణు..

” మీరు చాలామంది విద్యార్థులకు ఉచితంగా చదువు నేర్పించడం మాకు తెలుసు. నేను కూడా ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అయితే మా నాన్నగారు మా స్కూల్లో మిమ్మల్ని టీచరుగా చేస్తారా? అడిగారు .దానికి మీరు ఒప్పుకుంటే మీరు తొందరలోనే జాయిన్ కావచ్చు. మీకు ఒక వ్యాపకం లాగా ఉంటుంది. నేను అందుకనే ఈ సమయంలో వచ్చానమ్మా” అన్నాడు వేణు.

” నిజమా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరికే ఉండడం నాకు ఇష్టం లేక, ఎవరైనా పిల్లలు వస్తే వాళ్లకి క్లాసులు తీసుకుంటున్నాను. ఇలా నాకు ఒక ఉద్యోగం ఇచ్చారంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది. తప్పకుండా నేను ఈ ఉద్యోగం చేస్తాను థాంక్యూ వేణు” అన్నది సుధ.

సుధ లేచి కిచెన్ లోకి వెళ్ళింది.

అప్పుడే వేణు అడిగాడు.

“అపర్ణా!ఎలా ఉన్నావ్ నేను గుర్తున్నానా” అన్నాడు.

” నిన్నెలా మరిచిపోతాను వేణు. ప్రతిరోజు గుర్తొస్తావు. కానీ ఈరోజు ఇక్కడ నిన్ను కలుస్తానని ఊహించలేదు” అన్నది అపర్ణ.

“నిన్ను కలవాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియలేదు. మన ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. వాళ్లు కూడా సరిగా చెప్పలేదు అన్నాడు వేణు.

ఇంతలో సుధ జ్యూస్ తీసుకుని వచ్చింది.

” జ్యూస్ తాగు వేణు” అని చేతికి ఇచ్చింది.

కాసేపు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఇంతలో సుధ మొబైల్ కి కాల్ వచ్చింది.

“ఒక్క నిమిషం” అంటూ సుధ లోపలికి వెళ్ళింది.

వేణూ! నేను ఇంకో రెండు రోజులు ఇక్కడ ఉంటాను. ఒకసారి నన్ను కలుస్తావా?నేను వసంత వాళ్ళ అమ్మాయి పెళ్లికి వచ్చాను” అని చెప్పింది.

“నాకు కూడా వసంత ఇన్విటేషన్ ఇచ్చింది. నేను పెళ్లికి వస్తాను. అక్కడ కలుద్దాం” అని చెప్పి వెళ్ళిపోయాడు.

వంటింట్లో నుండి బయటకు వచ్చిన సుధ, అపర్ణను అడిగింది.

” అప్పూ! వేణు నీకు పరిచయం కదా! అప్పట్లో ఒకటి రెండుసార్లు ఇతని గురించి చెప్పావు. నాకు లైట్ గా గుర్తుంది” అన్నది సుధ.

” అవును సుధత్తా! పరిచయం ఏమీ లేదు. కానీ ఇద్దరం ఒకటే క్లాస్ .నేనంటే అతనికి చాలా ఇష్టం ఉండేది. ఆ వయసులో ఆ ఇష్టాలు ఏం తెలియవు కదా? నాకు కూడా అతనంటే ఒక విధమైన ఇష్టం ఉండేది. చిన్న వయసులో దానికి పేరు ఏం పెట్టలేము. కానీ ఒకరిని ఒకరు కళ్ళతో మాత్రమే చూసుకున్నాము. నేను ఎక్కడికి వెళ్లినా నా వెనకాల నీడలా వచ్చాడు తప్ప, ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు” అన్నది అపర్ణ.

” సరే చాలా రాత్రి అయింది పడుకో. నువ్వు మళ్ళీ రేపు వసంత ఇంటికి వెళ్లాలి కదా” అన్నది సుధ..

ఇద్దరూ అట్లా హాల్లో పడుకున్నారు.

సుధ వెంటనే నిద్రపోయింది. కానీ అపర్ణకు అసలు నిద్ర రాలేదు. తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటి కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అందులో తను పుట్టి పెరిగింది ఈఇంట్లోనే. ఆ చిన్నప్పటి మట్టి వాసన ముక్కుపుటాలకు తగిలి ఎంతో ఆహ్లాదపరుస్తున్నాయి. గతంలోకి వెళ్లిపోయింది అపర్ణ.

అపర్ణ చిన్నప్పుడు ఆ ఇల్లు మట్టి నేల ఉండేది. పనిమనిషి బాలమ్మ వారానికి ఒకసారి ఎర్రమట్టి పేడ కలిపి చక్కగా అలికేది. అలికిన ఇంట్లో నాయనమ్మ, సుద్ధతో ముగ్గులు వేసేది .కాస్త నాయనమ్మ చేతకాకుండా అయిన తర్వాత, మెంచు రుబ్బి దానిలో చిన్న బట్ట ముక్కను ముంచి, దానితో రకరకాల ముగ్గులను వేసుకునే వాళ్ళు. ఎక్కువగా ఇంటిని అలంకరించడంలో నైపుణ్యం సుధదే.

ఉదయమే ఇంట్లో అంతా హడావుడిగా ఉండేది. ఇటు అపర్ణ తండ్రి దక్షిణామూర్తి ఆఫీసుకు వెళ్లాలి. పిల్లలు స్కూల్లోకి వెళ్లాలి. ఇంట్లో మడి, ఆచారం ,పూజలు వెరసి సందడిగా ఉండేది.

సుధ పిల్లలందరినీ లేపి, స్నానాలు చేయించి, చక్కగా తల దువ్వేది.తర్వాత తను స్నానం చేసి, పెరట్లో పూలు కోసుకొని వచ్చి, దేవుడి గదిలో పెట్టి, తర్వాత రాత్రి మిగిలిన అన్నం లో చింతకాయ పచ్చడి, నెయ్యి కలిపి అన్నయ్య పిల్లలకు తినిపించి, తాను తినేది.

దక్షిణామూర్తి గారు దేవుడి గదిలో కూర్చుని, అనుష్టానము ,పూజ చేసుకునేవారు. తల్లి అన్నపూర్ణమ్మ దేవుడి మహా నైవేద్యంకు సిద్ధం చేసేది. అపర్ణ తల్లి అత్తగారికి వంటలో సహాయం చేస్తూ, భర్తకు కావలసినవి చూస్తూ, ఇంటిలోని పనులన్నీ చక్కబెడుతూ ఉండేది. అప్పటి పనులు మామూలుగా ఉండేవా? మడి నీళ్ళు బావిలో నుండి తోడి పెట్టడం, స్నానాలకి గోళాల్లో నీళ్ళు నింపడం, మొక్కల సంరక్షణ, వ్యవసాయం పనులు , వచ్చి పోయే అతిధులు ఒకటేమిటి ఇవన్నీ చూసుకోవడం సుమతి వంతు అయ్యేది.

దక్షిణామూర్తి నలుగురు పిల్లల బాధ్యత అంతా చెల్లె సుధనే తీసుకునేది. సుధ హైస్కూల్ లో ఉన్నప్పుడు, ఈ పిల్లలు ప్రైమరీ స్కూల్లో ఉండేవాళ్లు. వీరిని స్కూలుకు పంపించి, తాను హై స్కూల్ కి వెళ్ళేది సుధ.

అంతేకాదు చక్కగా చదువుకునేది. తను చదువుకోవడమే కాకుండా, ఇంటికి వచ్చాక అన్నయ్య పిల్లలతో హోంవర్క్ చేయించడం, వాళ్లకు రాని లెక్కలను చెప్పడం, ఇవన్నీ ఇష్టంగా చేసేది. వారితో కలిసి ఎన్నో ఆటలాడేది. ఇలాఅందరితో సన్నిహితంగా మెలిగేది సుధ.

ఎవరికి ఏ అవసరం వచ్చినా..
“సుధా”అంటూ పిలిచే వాళ్ళు.

ఇవన్నీ కాకుండా చూడ చక్కని తీరు సుధది.
బారుగా తీరైన జడ .లక్ష్మీ కళ ఉట్టిపడే వర్చస్సు, చక్కని లంగా వోణీలో ఎంతో అందంగా ఉండేది.

“ఒరేయ్ దక్షిణామూర్తి! నీ చెల్లెలు రూపమే కాకుండా, గుణంలో కూడా అందమైనదే రా! ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళింట్లో దీపమై వెలుగుతుంది” అని దక్షిణామూర్తితో అనేవాళ్లు.

దక్షిణామూర్తికి కూడా చెల్లెలు అంటే చాలా ఇష్టం.

ఇంటికి ఎవరు వచ్చినా, ముందుగా మంచినీళ్లు ఇచ్చి పలకరించి వెళ్ళేది. చిన్నవయసులో ఎంతో పరిణీతి కలిగినట్లు ఉండేది. తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల ,తల్లి అన్నల పెంపకంలోనే పెరిగింది. వదినకు తలలో నాలుక లాగా ఉండేది.

ఇలా సుధలో అన్నీ మంచి లక్షణాలే.

పదవ తరగతి పరీక్షలు రాసిన సుధ. ఊళ్లో జరిగే సీతా రాముల కల్యాణానికి, అన్నయ్య పిల్లలతో కలిసి వెళ్ళింది.

తొమ్మిది రోజుల ఉత్సవాలకి తప్పక హాజరయ్యే వాళ్ళు. హరికథలు వింటూ, పూజా కార్యక్రమాలను చూస్తూ సీతారామ కళ్యాణం వీక్షించి ఇంటికి వచ్చేవాళ్ళు.

అలా ఒకరోజు గుడిలో కూర్చున్నప్పుడు, వారి బంధువుల కుటుంబం ఒకటి అక్కడికి వచ్చింది. వాళ్లు సుధను చూడటం, వాళ్లకు ఈ అమ్మాయి ఎంతో నచ్చి, ఇంటికి వచ్చి దక్షిణామూర్తి గారితో సంప్రదించడం జరిగింది.

బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ అబ్బాయికి సుధను ఇవ్వాలని కోరారు.

” ఇంత చిన్న వయసులో సుధకు పెళ్లి చేయాలని మేము అనుకోవడం లేదండి. సుధకు చదువులో ఆసక్తి ఉంది” అని చెప్పాడు దక్షిణామూర్తి.

” తాను ఎంత చదువుకుంటానంటే అంత మేము చదివిస్తాము. మీరు మాత్రం ఈ సంబంధం కాదన వద్దు” అంటూ వాళ్ళు ఎంతగానో ప్రాధేయపడ్డారు.

అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ..

“ఇంటికి వచ్చిన సంబంధాన్ని కాదనడం ఎందుకురా దక్షిణామూర్తి !మంచి సంబంధం పెళ్లి చేసేద్దాం రా” అని అన్నది.

అలా అనుకున్నదే ఆలస్యం, నిశ్చితార్థం, పెళ్లి అన్ని నెలలోపలే జరిగిపోయాయి. అలా సుధ అత్తవారింటికి వెళ్లిపోయిన తర్వాత, పిల్లలకి ఆమె లేని లోటు తెలిసి వచ్చింది. ఒక పిల్లలకే కాదు , ఇంట్లో అందరూ సుధను మిస్ అయిపోయారు.

కొన్ని రోజులు ఇంట్లో వస్తువులన్నీ స్తబ్దుగా తయారయ్యాయి .అసలు సుధ లేకుండా ఇల్లు గడుస్తుందా! అనిపించేది.

రాను, రాను అందరూ అలవాటు చేసుకున్నారు.

అపర్ణ అత్త సుధని అలా చూస్తూ ఉండి పోయింది.

” నిజంగా అత్త ఎంత మంచిది” అని అనుకుంది.

అలా సుధను చూస్తూ మళ్ళీ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది అపర్ణ.

సుధ వెళ్ళిపోయాక, “సుధా! ఇది ఎక్కడ? సుధా ?అదెక్కడ? అనే సుధను పిలవడం. మళ్లీ సుధ లేదని ఒక్కసారిగా మౌనం దాల్చడం జరిగేది.

పిల్లలైతే పొద్దున లేవగానే సుధత్త ఇక్కడికి రా! నా బ్రష్ ఇవ్వు. నా బ్యాగ్ ఎక్కడ?” ఇలా అడిగేవాళ్ళు.

చాలా రోజులకు కానీ అందరికీ సుధ ఇంట్లో లేదనే నిజం అర్థమయింది.

సుధకు ఎక్కువగా అపర్ణతో చనువు ఉండేది. ఆమె వెళ్లిపోయిన తర్వాత అపర్ణ నిస్తేజంగా తయారైంది. ఆ వయసులో అదేంటో కూడా అర్థం కాలేదు అపర్ణకి.

ఉదయమే లేచి పెరటి గడపలో కూర్చునేది. పెరట్లో పూసిన మందారాలను, గన్నేరు పువ్వులను, చామంతి పువ్వులను చూస్తూ ఆలోచనల్లో పడేది. ప్రకృతి పట్ల ఆరాధన అప్పుడే ఏర్పడింది అపర్ణకి.

అపర్ణ అనుకునేది నేను కూడా సుధత్త లాగా అందరికీ అనుకూలంగా ఉండాలని ,అలా మెల్లగా సుధ తత్వం అంతా అపర్ణకి అలవడింది. కాకపోతే సుధకు ఉన్నంత సహనం అపర్ణకు లేదు. అనవసరంగా ఎవరైనా ఏదైనా అంటే చెడా మడా కడిగిపారేసేది. ఇంట్లో కూడా ముక్కుసూటి తత్వమే. తప్పు చేస్తే వెంటనే ఒప్పుకునేది. తప్పు చేయకుంటే మాత్రం ఎంత పెద్ద వాళ్ళనైనా ఎదిరించి మాట్లాడేది. తల్లి సుమతి ఎన్నోసార్లు చెప్పేది.
” అలా అందరితోనే పెళుసుగా మాట్లాడవద్దని”

” నేను తప్పు చేయనప్పుడు ఎందుకు మాట పడాలి” అని సమాధానం ఇచ్చేది అపర్ణ.

ప్రైమరీ స్కూల్ అయిపోయి హై స్కూల్ కి వెళ్లారు అపర్ణ మరియు అన్న తమ్ముడు చెల్లె.

చురుగ్గా ఉండే అపర్ణ అంటే అందరికీ ఇష్టమే. క్లాసులో పోటీ తత్వం ఉండేది. ఆ రోజుల్లో అమ్మాయిలు అంత ధైర్యంగా ఉండే వాళ్ళు కాదు. కానీ అపర్ణ ఎవరికి భయపడేది కాదు.

తరగతిలో ఏ ప్రశ్న టీచర్ అడిగినా, టక్కున లేచి జవాబు చెప్పేది. అబ్బాయిలకు ఇది నచ్చేది కాదు. కొంతమంది వాదనకు దిగేవాళ్లు. కానీ అపర్ణ డోంట్ కేర్ అన్నట్టుగానే ఉండేది.

ఒకరోజు సాంఘిక శాస్త్రం పీరియడ్లో ,సార్ చెప్తుంటే శ్రద్ధగా వింటుంది అపర్ణ. పాఠం చెప్తూ చెప్తూ సార్ ఏదో జోక్ చెప్పాడు. ఆ జోకు విన్న అపర్ణ పగలబడి నవ్వింది. అలా నవ్వుతూ పక్కకు తలతిప్పి చూసింది. చివరి బెంచ్ లో కూర్చున్న ఒక అబ్బాయి తదేకంగా తన్నే చూస్తున్నాడు. అప్పుడే బాల్యం దాటిన వయసు. మగ, ఆడ తేడాలు తెలుసుకుంటున్న తరుణం. ఒక్కసారిగా గుండెలయ తప్పినట్లు అయింది అపర్ణకి.

మళ్లీ అదేం తెలియనట్లుగా, పాఠం వింటూ మెల్లిగా పక్కకు తిరిగి చూసింది. ఆ అబ్బాయి అలాగే చూస్తున్నాడు. అపర్ణలో కలవరం మొదలయ్యింది.

” ఏంటి ఏదో కొత్తగా అనిపిస్తుంది ఈ రోజు నాకు” అని అనుకున్నది.

కానీ ఆ వైపే మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. మనసుని నిగ్రహించుకొని, పాఠం వినడంలో నిమగ్నం అయిపోయింది అపర్ణ.

ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు. మధ్యలో ఎందుకో తల వెనక్కి తిప్పి చూస్తే, కొంచెం దూరంగా అనుసరిస్తూ వస్తున్నాడు ఆ అబ్బాయి. అతని పేరు వేణు.

“అతను వెళ్ళేది ఇంటికా? లేక నా కోసం తన వెనుక వస్తున్నాడా” అని అనుకున్నది అపర్ణ.

స్నేహితులకు ఎవరికి అనుమానం రాకుండా, అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా కొంచెం దూరంలో తన ఇల్లు వస్తుందని ఒక సందు దగ్గర అతని నిలబడ్డాడు. అపర్ణ వెళ్లేంతవరకు అక్కడే నిలబడి, అతను సందులోకి వెళ్ళిపోయాడు.

అపర్ణకు అప్పుడు అర్థమయింది. అతని ఇల్లు ఆ సందులోనే అని, కానీ అతను ఎదురుచూస్తున్నది మాత్రం తన కోసమేనని పూర్తి క్లారిటీ వచ్చేసింది.

ఇంటికి వెళ్ళిందన్నమాటే కానీ, పదేపదే అతని చూపులు గుర్తొస్తున్నాయి. చురుగ్గా ఉన్న అతని కళ్ళు తనను వెంటాడుతున్నాయి. చదువు మీద కానీ, ఏ పని మీద కానీ మనసు నిమగ్నం చేయలేకపోయింది.

వెంటనే లేచి తనకు ఇంటి దగ్గర ఉన్న తన స్నేహితురాలు ఇంటికి వెళ్లిపోయింది .ఆమెనే సువర్ణ.

ఈ విషయం చెప్పాలని నోటి వరకు వచ్చింది అపర్ణకి. కానీ ఎటు పోయి ఎటు వస్తుందోనని, ఏమీ చెప్పలేదు. కాసేపు సువర్ణతో మాట్లాడి ఇంటికి వచ్చేసింది.

ఇలాంటివి ఏవి ఇంట్లో చెప్పకూడదు, అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. మళ్ళీ తన చదువు ఆగిపోతుంది అని అనిపించింది. ఆ సమయంలోనే శ్యామ్ ఏడిపించడం, అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిపోయాయి.
శాం పైన కంప్లైంట్ ఇవ్వగలిగింది కానీ వేణుని చూస్తే అలా అనిపించడం లేదు.

అతను ఏరోజు అపర్ణ ఇబ్బంది పెట్టలేదు. అతను చేసేదల్లా కళ్ళలో తన ఆరాధనను నింపుకొని చూడటం. కానీ ఆ వయసులో అవేమీ అర్థం కావు కదా! పరస్పర ఆకర్షణ మాత్రం ఉంటుంది కదా!

అపర్ణ కూడా పదవ తరగతికి వచ్చింది. అన్న కాలేజీ కోసం పట్నం వెళ్ళాడు. చెల్లెలు తమ్ముడు మాత్రం అదే స్కూల్లో తనతో పాటు చదువుకుంటున్నారు.

అపర్ణ తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయి. అప్పుడు సుధత్తతో వెళ్ళినట్టుగా తను కూడా చెల్లిని, తమ్ముడిని తీసుకుని గుడికి వెళ్ళేది.

ఉదయం గుడికి వెళ్తే ఎప్పుడో మధ్యాహ్నం ఇంటికి చేరి, భోజనం చేసేవాళ్లు .మళ్లీ సాయంత్రం కాగానే హరికథల సమయానికి గుడికి వెళ్లేవాళ్లు. ఈ నేపథ్యంలో అక్కడ అపర్ణకి వేణు కనిపించేవాడు.

ఒకరోజు హరికథ వింటూ కూర్చుంది. అలా తన్మయత్వంతో వింటున్న అపర్ణకు మనసులో ఏదో అలజడి మొదలైంది. చూపుల బాణాలు గుచ్చుకున్నట్లు అనిపించింది. వెంటనే పక్కకు తిరిగి కళ్ళెత్తి చూసింది.

వేణు అపర్ణను చూస్తూ దూరంగా నిలబడ్డాడు. అతను హరికథ వినడం లేదు. అపర్ణ కోసం మాత్రమే గుడికి వచ్చాడు. అలాగే చూసిన అపర్ణ చూపులు తిప్పుకొని హరికథ వినడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈసారి ఆ ప్రయత్నం విఫలమైంది. ఎంతసేపటికి కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. తల్లితండ్రులు అందరూ గుడిలోనే ఉన్నారు .కానీ ఇంకా తనకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే తమ్ముడుని తీసుకొని ఇంటికి బయలుదేరింది.

అక్కడంతా చీకటిగా ఉంది. అలా వెళ్తుంటే భయమేసింది. చుట్టూ తిరిగి చూసింది. అప్పటికే వీళ్ళని అనుసరిస్తున్నాడు వేణు.

మొదటిసారిగా అనుకుంది. “హమ్మయ్య వేణు వెనకాల వస్తున్నాడు ఇంకేం భయం లేదు” అని.అలా వీళ్లు వాళ్ళింటి సందు వెళ్లే వరకు అతను అలా నిలబడి చూస్తూనే ఉన్నాడు.

ఇలా ఒకరినొకరు చూసుకోవడమే తప్ప, కనీసం పలకరించుకోలేదు.

ఎండాకాలం సెలవులు అయ్యాక ,స్కూలుకు వెళ్లాలని అపర్ణకు ఉత్సాహంగా ఉన్నది. అప్పట్లో జూన్ రాగానే వర్షాలు పడేవి. బోరున కురుస్తున్న వర్షం. అపర్ణ పుస్తకాలు తీసుకొని స్కూలుకు వెళ్లడానికి బయలుదేరగానే, ఇంట్లో అందరూ

“ఈ వర్షంలో స్కూలుకి వెళ్తావా? మొదటి రోజులు ఎలాగు క్లాసులు కావు” అని అన్నారు.

కానీ, అపర్ణకు వేణుని చూడాలని ఉంది. అందుకని

“లేదమ్మా పదవ తరగతి కదా !మొదటి రోజు నుండి క్లాసెస్ తీసుకుంటామని చెప్పారు .తప్పకుండా వెళ్లాలి “అని జవాబుకు ఎదురు చూడకుండా వర్షంలో తడుస్తూ బయలుదేరింది.

అప్పటికే బయట నిలిచి ఉన్న సువర్ణను చూస్తూ.

“ఏంటే వర్షంలో నువ్వు వస్తావని అనుకోలేదు. అసలే తప్పించుకోవాలని చూస్తావు కదా”! అన్నది అపర్ణ సువర్ణను చూస్తూ..

” నువ్వు ఈరోజు స్కూలుకు వెళ్తావని నాకు తెలుసు. అయినా నువ్వు ఎందుకు వెళ్తున్నావో కూడా నాకు అర్థం అయింది లేవోయ్” అంటూ చిలిపిగా నవ్వింది సువర్ణ.

” నేను ఎందుకు వెళ్తున్నానో నీకేం తెలుసు?ఆపవే, ఎవరైనా చూస్తే నా చదువు గోవిందా” అన్నది.

” ముందైతే స్కూల్ కి వెళ్దాం పద !గొడుగు తెచ్చాను ఇద్దరం కలిసి వెళ్దాం” అని సువర్ణ గొడుగు పట్టింది.

ఇద్దరూ గబగబా నడుచుకుంటూ స్కూల్ కి వెళ్ళిపోయారు.

మొదటి పీరియడ్లో సైన్స్ సార్ వచ్చాడు.

అందర్నీ నవ్వుతూ పలకరించాడు.

” ఈసారి పదవ తరగతి అందరూ బాగా చదువుకోవాలి. తప్పకుండా పాస్ కావాలి” అని చెప్పాడు.

” బాగా చదువుకుంటాం సార్” అని ముక్తకంఠంతో అందరూ అరిచారు.

అపర్ణ క్లాస్ అంతా పరికించి చూసింది

“ఏంటి, వేణు కనపడటం లేదు. స్కూల్కు ఎందుకు రాలేదు!” అని మనసులో అనుకుంది.

పక్కనే కూర్చున్న సువర్ణ,

“ఇంకా రాలేదా”! అని అడిగింది.

మనసు ఎక్కడో ఉన్న అపర్ణ “అవును రాలేదు” అంటూ ఒక్కసారి సువర్ణ వైపు చూసి,

“ఏంటి రాలేదా అని అడిగావు ఎవరు?” అని అమాయకంగా అడిగింది.

” ఇంకా నా దగ్గర అమాయకంగా నటించకు అప్పూ! నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. నేను ఎవరికీ చెప్పనులే! భయపడకు. కానీ నీ మనసు నాకు తెలియదా” అన్నది సువర్ణ.

సువర్ణను చూస్తూ అపర్ణ చిన్నగా నవ్వింది.

ఇంతలో వేణు క్లాస్ కి వచ్చాడు.

” ఏంటి మొదటి రోజే ఆలస్యంగా వచ్చావా”? అని అడిగాడు సార్

” చేతిలో పుస్తకాలు ఏవి” అని మళ్ళీ అడిగాడు.

“ముందు నన్ను క్లాసులోకి రానివ్వండి సార్ చెప్తాను” అన్నాడు వేణు నవ్వుతూ వినయంగా.

” సరే వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు” అన్నాడు సార్.

” నేను ఇక్కడ టీసి తీసుకొని హైదరాబాద్ స్కూల్లో జాయిన్ అవుతున్నాను. అందుకని ఒకసారి అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను” అని అన్నాడు వేణు.

ఒక్కసారిగా అపర్ణకి కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసాయి .

“ఏంటి వేణు ఇక్కడ నుండి వెళ్ళిపోతాడా?” అని మనసులో అనుకొని మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేసింది.

వేణు అపర్ణ వైపు చూస్తూనే ఉన్నాడు. కానీ అపర్ణ అతని వైపు ఒక్కసారి కూడా చూడలేదు. అతను ఎవరో తెలియనట్లుగానే ఏదో రాసుకుంటూ కూర్చుంది.

” అప్పూ! నీకోసం వేణు చూస్తున్నాడు ఒకసారి తలతిప్పి చూడు” అన్నది సువర్ణ మెల్లగా.

“వద్దు నేను చూడను” అంటూ తల పైకి కూడా ఎత్తకుండా కూర్చుంది అపర్ణ.

వేణు కాసేపు క్లాసులో కూర్చుని వెళ్లిపోయాడు.

కొన్ని రోజుల వరకు అన్యమనస్కంగా గడిపింది అపర్ణ. చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఆటల మీద ఆసక్తి తగ్గింది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చునేది.

తల్లి ,తండ్రి, నాయనమ్మ అందరు అడిగారు.

“ఏమైందే నీకు? ఇలా నిశ్శబ్దంగా ఉంటున్నావు? ముందులా చురుగ్గా ఉండటం లేదు. సుధత్త గుర్తొస్తుందా ఏంటి”? అని గుచ్చి గుచ్చి అడిగారు.

ఏమి సమాధానం చెప్పకుండా అపర్ణ ఆ విషయాన్ని దాటవేసేది.

కొన్ని రోజులు పోయాక మామూలు మనిషి అయిపోయి, చదువు పైన శ్రద్ధ పెట్టింది.

అలా ఎంత శ్రద్ధగాను చదువుకున్నది అపర్ణ.

అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం వేణు తనని ఫాలో అయ్యేది గుర్తుకొచ్చి కొంచెం బాధపడేది. ఆ తర్వాత మరిచిపోయింది.

అలా పదవ తరగతి పరీక్షలు రాసి ,మంచి మార్కులతో పాస్ అయింది అపర్ణ. ఆ రోజుల్లో పాస్ అవ్వడమే చాలా గొప్ప. ఇంకా ఆడపిల్లల వైపు మరీ తక్కువ మెజారిటీ ఉండేది.

పదవ తరగతి పాస్ అయిందని ఇంట్లో చాలా సంతోషపడ్డారు. ఇంకా ఏ కాలేజీలో ఎక్కడ చేర్చాలి అని ఆలోచించారు.

సశేషం

May 30, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

శిలోద్భవ

by Mala Kumar May 29, 2025
written by Mala Kumar

“మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా?”

అకస్మాత్తుగా వినిపించిన ప్రశ్నకు, ఆశ్చర్యంగా చూసి “ఏమిటీ? నన్ను పెళ్ళిచేసుకుంటారా?” పకపకా నవ్వింది రాజి.

“అబద్ధం కాదు నిజంగానే అంటున్నాను. మా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్, అతని సహాయంతో మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాను. నన్ను నమ్మండి” సీరియస్‌గా అన్నాడు విశ్వం.

“మీరు చదువుకున్నారు, మంచి ఉద్యోగం వస్తుంది. అసలు మీరు ఇక్కడికి రావటమే విచిత్రం! వచ్చినప్పటి నుంచి కబుర్లు చెపుతున్నారు. పైగా నన్ను పెళ్ళిచేసుకుంటారా? అభ్యుదయభావాలా?” గమ్మత్తుగా అడిగింది.

“ఈరోజు మా స్నేహితుడి బలవంతం మీద కొంత, అసలు ఈ అనుభవం ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలంతో కొంత వచ్చాను. మిమ్మల్ని చూడగానే ఏదో ఆత్మీయ భావం కలిగింది. అందుకే అడుగుతున్నాను నన్ను పెళ్ళి చేసుకుంటారా?” మళ్ళీ అడిగాడు విశ్వం.

విశ్వం కళ్ళల్లో కనిపించిన ప్రేమ, నిజాయితీని చూసి “మీకెందుకు ఆభావన కలిగింది? నాలో ఏమి ఆత్మీయత చూసారు? నేనొక వేశ్యనని మర్చిపోతున్నారా?” విస్మయంగా అడిగింది.

“ఎందుకు? ఏమిటి? అంటే ఏమి చెప్పను? కొన్నిటికి సమాధానం ఉండదు” జవాబిచ్చాడు విశ్వం.

విశ్వం వైపు సాలోచనగా చూసింది. ఒక్క క్షణం ఆగి, “ నిజంగా మీకు నామీద ఆత్మీయతాభావం ఉంటే ఒక సహాయం చేయగలరా?” కన్నీటిని కనురెప్పల మాటున దాచుతూ అడిగింది రాణి.

“ఏమి సహాయం చేయాలి?”

“మా నాన్న ఆటో డ్రైవర్. అమ్మ ఒక పెద్దింట్లో పని చేసేది.మేము హైద్రాబాద్‌లో ఒక బస్తీ లో ఉండేవాళ్లము. నేను, మా చెల్లి, తమ్ముడు అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో చదివేవాళ్ళము. నేను తెల్లగా, అందంగా ఉండేదానిని అని నన్ను రాణీ అని పిలిచేవారు అమ్మానాన్నా. నేను ఎనిమిదవ తరగతి చదువుతుండగా జబ్బు పడ్డాను. చాలా వీక్ అయ్యాను. అందుకని ఆ సంవత్సరం స్కూల్ మానిపించి, అమ్మ తనతో పెద్దింటికి తీసుకెళ్ళేది. వాళ్ళ నాలుగేళ్ళ లోయర్ కేజీ చదువుతున్న, బాబుని స్కూల్‌కు తీసుకెళ్ళి, మధ్యాహ్నం  స్కూల్ అయిపోయవరకు అక్కడే ఉండి, ఇంటికి తీసుకొచ్చేదానిని. మేడంకు చిన్నచిన్న పనులు చేసిపెడుతూ సహాయంగా సాయంకాలం వరకూ అమ్మతో ఉండేదానిని. బాబును స్కూల్‌కు తీసుకెళ్ళే డ్రైవర్ మురళి. అతనూ నాతోపాటే స్కూల్ అయిపోయేవరకూ ఉండేవాడు. ఆ సమయంలో నాతో చాలా చనువుగా ప్రేమ మాటలు చెపుతుండేవాడు. నన్ను పెళ్ళి చేసుకుంటాననేవాడు. అప్పుడు నాకు నిండా పద్నాలుగు ఏళ్ళు కూడా లేవు. ఏమీ తెలియని రోజులు.బాబు వచ్చేవరకూ కార్‌లో కూర్చొని అతను చెపుతుండే ప్రేమ కబుర్లు నన్ను సుందరస్వప్నలోకంకు తీసుకెళ్ళేవి. పైగా చూస్తున్న సినిమాల, టీ.వీ షోల ప్రభావమనుకోండి, ఏదైనా అనుకోండి, ఓ రోజు స్కూల్ నుంచి అటే అతనితోవచ్చేసాను. అమ్మా వాళ్ళ గురించి కానీ స్కూల్‌లో ఉన్న బాబు గురించికానీ ఆలోచించలేదు! ఇక ఆతరువాత చెప్పేదేముంది? అందరికీ తెలిసిన మామూలు కథే! కడుపుతో ఉన్న నన్ను ఇక్కడ అమ్మేసి చెక్కేసాడు! ఇప్పుడు నా బాబుశౌర్యకు నాలుగు సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే వాడికి ఊహ తెలుస్తోంది. ఇక్కడే ఉంటే నాకే విటులను తీసుకొచ్చేవాడవుతాడు. వాడు ఇక్కడ పెరగటం నాకు ఇష్టం లేదు. బాగా చదువుకొని జీవితంలో మంచి వ్యక్తిగా స్థిరపడాలని నా కోరిక. మీకు వీలవుతే వీడిని ఈ వాతావరణానికి దూరంగా  తీసుకెళ్ళి ఏదైనా స్కూల్‌లో, హాస్టల్‌లో చేర్చండి. డబ్బు సంగతి ఆలోచించకండి. నేను వీడికోసం ఎంతైనా కష్టపడుతాను. ఫీజులు నేనే కడుతాను. అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటాను. ఇక్కడి మౌసీకి నేను ఇక్కడే ఉండి, డబ్బులు సంపాదించి ఇస్తే చాలు. అభ్యంతర పెట్టరు” అని వేడుకోలుగా అన్నది రాజీ.

ఆ తల్లి హృదయం ను అర్థం చేసుకున్న విశ్వం శౌర్యను కలింగ్‌పాంగ్ లోని స్కూల్‌లో, తన స్నేహితుని కొడుకని, తల్లితండ్రులు ఆక్సిడెంట్‌లో చనిపోయారని, తను గార్డియన్ అని చెప్పి చేర్చాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. శౌర్య గ్రూప్ పరీక్షలు పాస్ అయ్యి, పోలీస్ ఆఫీసర్ అయ్యాడు.

“ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టు” విశ్వ తన ఎదురుగా నిలబెట్టిన యువకుడిని తేరిపారా చూసింది రాజి. అప్పుడప్పుడు కలింగ్‌పాంగ్ వెళ్ళి కొడుకును దూరం నుంచి చూస్తూ ఉండేది. ఇప్పుడుయూనీఫాంలో ఎదురుగా ఉన్న కొడుకును కన్నీరుతో కళ్ళు మసకలుబారుతుండగా, ప్రేమగా తడుముతూ భావోద్వేగానికి గురయ్యింది రాజి! విశ్వ వైపు తిరిగి రెండు చేతులూ జోడించింది!

తల్లిని పొదివి పట్టుకొని, తనవైపు భయంభయంగా, ఆసక్తిగా చూస్తున్న అందరినీ చిరునవ్వుతో చూసి, పెద్ద సోఫాలో కూర్చొని ఉన్నావిడతో “మౌసీ మా అమ్మను తీసుకెళుతున్నాను” అన్నాడు శౌర్య.

అప్పటి వరకూ వాళ్ళిద్దరినీ గమనిస్తున్న మౌసీ, యూనీఫాంలో ఉన్న శౌర్యను ఏమనలేక “సరే తీసుకెళ్ళు కానీ కాస్త మమ్మలిని కూడా చూసుకుంటూ ఉండు” అంది ఆదరంగా.

“అలాగే నువ్వింకే అమ్మాయినీ తీసుకురాకుండా కనిపెట్టి ఉంటానులే నవ్వుతూ అని పదమ్మా” అన్నాడు శౌర్య అమ్మతో.

అప్పటి వరకూ ఒక ట్రాన్స్‌లో ఉన్నట్టున్న రాజీ”నేనెందుకు వద్దు. నేను నీతో వస్తే సమాజంలో నీకు గౌరవం ఉండదు. నాతో గడిపిన ఎందరో ఎదురైనప్పుడు నిన్ను చిన్నచూపు చూస్తారు. నీకు పెళ్ళి కాదు. వద్దు నన్ను ఇట్లాగే ఉండనీయి. నేను కోరుకున్నట్లుగా నువ్వు పెద్ద ఆఫీసర్‌వి అయ్యావు. ఆతృప్తి చాలు నాకు” వణుకుతున్న గొంతుతో అంది రాజి.

“నాకు నా అమ్మ చాలు. ఈ సమాజంతో నాకు పనిలేదు. నిన్ను ఇష్ఠపడి, గౌరవంగా చూసుకునే అమ్మాయి వస్తే పెళ్ళి చేసుకుంటాను. లేకపోతేలేదు. ఇంక మాట్లాడక పద” అన్నాడు శౌర్య.

అదేమిటి రాజీ, ఈరోజు కోసమే కదా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసింది. ఇన్నాళ్ళు ఈ మురికి కూపంలో కష్టపడ్డావు. ఇక కొడుకు దగ్గర గౌరవంగా ఉండు” మందలింపుగా అన్నాడు విశ్వ.

ఇక మారు మాట్లాడకలోపలి నుంచి సూట్‌కేస్ తెస్తున్న రాజీ చేతిలోని సూట్‌కేస్ తీసి కింద పెడుతూ “ఇక్కడ నుంచి ఏమీ తేవద్దు. ఈ సామానులనూ, ఈ జ్ఞాపకాలనూ అన్నీ ఇక్కడే వదిలిరా” అంటూ తల్లిని పోలీస్ జీప్ ఎక్కించాడు.

పోలీస్ జీప్ ఎక్కుతుంటే రాజీ కాళ్ళు తడబడ్డాయి. కొడుకును పట్టుకున్న చేయి కూడా వణికింది. ఇప్పటి వరకూ ఎన్ని సార్లో పోలీస్ వాన్, పోలీసులు బందిలి దొడ్డిలోకి పశువులను తోలుతున్నట్లుగా లాఠీతో అదిలిస్తుంటే ఎక్కింది. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ తల్లిగా ఎక్కుతుంటే చెప్పలేని భావోద్వేగానికి గురి అవుతోంది. తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న శౌర్య అమ్మ చేతిని మృదువుగా తట్టి, చిన్నగా ఎక్కించాడు.

                                     ***

పదమ్మా అంటూ అమ్మ భుజాల చుట్టూ చేయివేసి ఇంట్లోకి నడిపించాడు శౌర్య. Sourya I.P.Sగేట్ ముందున్న నేమ్ ప్లేట్‌ను ఆప్యాయంగా, గర్వంగా తడుముతూ లోపలికి నడిచింది.

పోలీస్ కాలనీలో చిన్న, ముచ్చటైన క్వాటర్శౌర్యది. హాల్, కిచెన్, మూడు బెడ్ రూంస్, ఇంటి చుట్టూ అందమైన తోట, ఆర్డర్లీ, వంటమనిషి, పని మనిషి అన్నీ అమర్చిన ఇంటిని చూసి మురిసిపోయింది రాణి. ఇంత వైభోగానికి తను తగునా అని నూన్యతాభావం కలుగుతోంది. పోలీస్‌లను చూసి ఉలిక్కిపడుతోంది. ఎవరిని చూసినా తనను చూసి నవ్వుకుంటున్నారేమోననే భావననే కలుగుతోంది. అమ్మను గమనిస్తూనే ఉన్నాడు శౌర్య. ఓరోజు ఒక మధ్యవయస్కురాలిని వెంటబెట్టుకొచ్చాడు.

“అమ్మా, ఈవిడ పేరు శారద. ఈవిడ రామకృష్ణామఠం లో యోగా నేర్పిస్తారు. ఇక నుంచి రోజూ మనింటికి వచ్చి నీకు యోగా నేర్పిస్తారు. చదువు చెపుతారు. బయటకు తీసుకెళుతారు” అని ఆవిడను పరిచయం చేసాడు.

నాకెందుకు నాన్నా యోగా, చదువు అనబోయింది కానీ శౌర్యను చూస్తూ అనలేక పోయింది. శారద వైపు చూసింది. తెలుపుకు ఎరుపు రిబ్బెన్ అంచు ఉన్న నేత చీర, తెలుపునలుపు కలగలిసిన జుట్టుతో చిన్న ముడి, నుదుటన చిన్న కుంకుమ బొట్టుతో సింపుల్‌గా ఉంది. రాజీ తనవైపు చూడగానే చిన్నగా నవ్వింది ఆవిడ.

“మా అమ్మ, రాజేశ్వరి” శారదకు పరిచయం చేసాడు. 

ఎప్పుడో నా అసలు పేరు రాజేశ్వరి అని చెప్పింది వీడికి బాగానే గుర్తుందే అనుకుంది రాజీ.

మరునాడు సాయంకాలం నాలుగు గంటలకు రాజేశ్వరిని రామకృష్ణమఠంకు తీసుకెళ్ళింది శారద. అక్కడ ఒక హాల్‌లో ఒక స్వామీజీ భగవద్గీత వినిపిస్తున్నారు. కాసేపు అక్కడ కూర్చున్నాక, వేరే హాల్‌లోకి తీసికెళ్ళింది. అక్కడ పిల్లలకు యోగా నేర్పిస్తున్నారు. అక్కడ నుంచి వెనుక వైపు ఉన్న మందిరంకు తీసుకెళ్ళింది. అక్కడ కూర్చున్నారు. ప్రశాంతంగా ఉన్న మఠం పరిసరాలు రాజేశ్వరికి చాలా నచ్చాయి. రాజేశ్వరి సెల్ తీసుకొని, యూట్యూబ్ తెరిచి, చాగంటి, గరికపాటి వారి ప్రవచనాలు ఎలా వినాలో, నచ్చిన పాటలు ఎలా వినాలో చూపించింది. శారదతో వస్తున్నప్పుడు తన గురించి ఏమైనా అడుగుతుందేమో, తన సంగతి తెలిసి చిన్న చూపు చూస్తుందేమో అని ఉన్న రాజీ, శారద అసలు ఆ విషయం గురించే మాట్లాడకపోవటము, తెలిసినట్లే లేకపోవటముతో  నూన్యతాభావన, బెరుకు పోయాయి రాజేశ్వరిలో. శారద ఆహార్యం, స్నేహశీలత్వం నచ్చాయి రాజేశ్వరికి. ప్రతిరోజూ సాయంకాలం వచ్చి రాజేశ్వరిని బిర్లా మందిర్, రామకృష్ణామఠం అలా తీసుకెళ్ళేది. శారద సత్ సాంగత్యంలో రాజేశ్వరి మంచి సాహిత్య పఠనం, ప్రవచనాలు విని ఆకళింపు చేసుకోవడం అలవరుచుకుంది.

రాజేశ్వరిలోని మార్పును ఆనందంగా గమనిస్తున్నాడు శౌర్య. ఒకసారి అమ్మ చిన్నప్పుడు ఉన్న బస్తీని వెతుక్కుంటూ తీసుకెళ్ళాడు. పోలీస్ జీప్ ఇంటి ముందు ఆగేసరికి చాలా భయపడ్డారు వాళ్ళు. రాజేశ్వరిమాటలతో జ్ఞాపకం తెచ్చుకున్నారు. తమ్ముడి, చెల్లెలి పెళ్ళిళ్ళు అయ్యాయి. బాగానే సెటిల్ అయ్యారు. తమ్ముడి కుటుంబం, అమ్మానాన్నా కలిసి ఉన్నారు. కాలం తెచ్చిన మార్పు వారిలో కనిపిస్తోంది. కాసేపు కూర్చొని వచ్చేసారు. తనవాళ్ళను చూసేసరికి తనలో మనోబలం పెరిగినట్లుగా అనిపించింది రాజేశ్వరికి!

ఆ రోజు ఆగస్ట్ పదిహేను. బస్తీ మధ్యలో ఝండా ఎగురేసి మైక్ చేతిలోకి తీసుకొని చుట్టూ చూసింది. అక్కడ ఉన్న పిల్లలను చూస్తుంటే తన బాల్యం గుర్తొచ్చింది. ఝండాను పోలినట్లు, తెలుపుకు ఆకుపచ్చ అంచున్న ఖాదీ చీర, నారింజ రంగు జాకెట్టు, మెడలో సన్న స్పటికపు మాల, చిన్న ముడితో డిగ్నిఫైడ్‌గా ఉన్న రాజేశ్వరిని ఆరాధనగా, ఏమి చెపుతుందా?! అని అసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ.

“అందరికీ నమస్కారం. మీలో పెద్దవాళ్ళు కొంత మందికైనా నేను గుర్తు ఉండే ఉంటాను. నా చిన్నప్పుడు మీ అందరిలాగే ఆటపాటలతో ఇక్కడే పెరిగాను. ఆనందంగా అమ్మానాన్నల నీడన ఉన్న నాకు ఒక త్రాష్టుడు తగిలాడు. వాడి మాయమాటలకు మోసపోయి, నా జీవితాన్ని చిందరవందర చేసుకున్నాను. ఇంకో పుణ్యాత్ముని సహాయసహకారము వలన నా కొడుకు ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు వచ్చాడు. నేను ఒక ముళ్ళ కంచె నుంచి బయటకు వచ్చాను. ఇదంతా మీకెందుకు చెపుతున్నాను అంటే నాలాగా ఏ ఆడపిల్లా మోసపోకూడదని. అమ్మాయిలూ, అబ్బాయిలూ మీ వయసు చదువుకునే వయసు. ఇది వరకులాగా మనలని అమ్మానాన్నలు పనులకు పంపటం లేదు. వాళ్ళ శక్తి కొద్దీ మంచి స్కూల్స్‌లోనే చదివిస్తున్నారు. ప్రభుత్వం మనకు ఎన్నో రాయతీలూ, అవకాశాలు కల్పిస్తోంది. వాటిని ఉపయోగించుకోండి. చక్కగా చదువుకోండి. అమ్మాయిలూ అనవసరపు వ్యామోహాలకు లొంగిపోకండి. గుడ్ టచ్, బాడ్ టచ్ ఏదో తెలుసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే అమ్మకు, టీచర్‌కు చెప్పండి. వాళ్ళు మీ బాగు కోరేవారే. ముందుకోపం చేసినా తరువాత అక్కున చేర్చుకుంటారు. అబ్బాయిలూ మీరూ అనవసరమైన వ్యాపకాలు పెట్టుకోకండి. పిచ్చిపిచ్చి, భయంకరమైన వీడియోలు చూడకండి. వాటి వ్యామోహంలో పడితే మీ జీవితాలే నాశనమవుతాయి. మీ తోటి అమ్మాయిలను గౌరవించండి, తెలిసీతెలియక ప్రేమ అంటూ, ఏవో అనుభవాలు కావలంటూ వారిని వేధించకండి. మీకోసం మీ తల్లి తండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించండి. ఈనాటి బాలలే రేపటి పౌరులు. ఈనాడు మీ ప్రవర్తన బాగుంటే రేపటి సమాజం బాగుంటుంది. మీరే అందరికీ విజ్ఞాన దీపికలు.

ఏదీ అందరూ లేచి నిలబడి “మేము బాగా చదువుకుంటాము. మంచి ప్రవర్తన కలిగి ఉంటాము. పెద్దలు చెప్పిన మాట వింటూ వారిని గౌరవిస్తాము. దేశం కోసం పాటుపడతాము అని ప్రమాణం చేయండి” అని అందరితో ప్రమాణం చేయించింది.

‘జై హింద్’ అని సమావేశం ముగించింది.

ముళ్ళ కంచెను దాటి, శిధిలమైన శిలలా ఆత్మన్యూన్యతో బాధపడిన అమ్మ దేవుని గుడిలో వున్న శిల్పంగా కనిపిస్తున్న అమ్మను అపురూపంగా చూసాడు శౌర్య!

May 29, 2025 5 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

జ్ఞానోదయం

by Nellutla Madhava Srinivas May 29, 2025
written by Nellutla Madhava Srinivas

చిట్టి కథ గొప్ప సందేశం
ఒకరోజు ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్లాడు . అతడు కొన్ని పావురంలను వేటాడు సాయంత్రం ఇంటికి తిరుగు ముఖం పట్టాడు దారిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలై దారంతా జలమయం అయ్యింది. అప్పుడు ఆ వేటగాడు గబగబా ఒక మర్రి చెట్టు కింద తలదాచుకోవడానికి వెళ్ళాడు. వేటగాడు మర్రి చెట్టు కిందకు వెళ్లిన తర్వాత ఆ మర్రి చెట్టుకు ఒక వాగ్దానం చేశాడు. నన్ను విపత్కర పరిస్థితి నుండి ఈరోజు నువ్వు కాపాడినట్లయితే నేను రేపటినుండి వేటను వదిలేస్తాను ఇంకా ఏ కష్టమైనా చేసుకొని బ్రతుకుతాను ఈ జీవహింస చేయను అని అమరు చెట్టుకు వాగ్దానం చేస్తాడు. కాసేపటికి వాన కొంచెం తగ్గుముఖం పడుతుంది.అప్పుడే పైన చెట్టు మీద గుడి కట్టుకొని నివసిస్తున్న ఒక మగ పావురం మేత కోసం వెళ్లిన ఆడ పావురాన్ని తలుచుకొని దుఃఖిస్తుంది. అయ్యో!!! మేత కోసం వెళ్లిన నా భార్య ఇంకా రాలేదు ఏ ఆపద వచ్చిందో తనకు అని బాధపడుతుంది. ఇంతలో చెట్టు క్రింద వేటగాడు వేటాడి తెచ్చి పెట్టుకున్న పావురాలలో ఈ మగ పావురం భార్య అయిన ఆడ పావురం కూడా ఉండి మగ పావురం మాటలను వింటుంది. ఆహా!! నా జన్మ ధన్యం. నా భర్తకు నా మీద ఉన్న ప్రేమను ప్రత్యక్షంగా చూడగలిగాను. మొదటి అదృష్టవంతురాలిని అని అనుకుంటుంది. తనకోసం వ్యాకులత చెందుతున్న భర్తను చూసి జాలి వేసి ప్రేమగా అరుస్తుంది. ఆడ పావురం అరుపును గమనించిన మగ పావురం చెట్టు కిందకు వంగి చూస్తుంది. అక్కడ తన భార్య అయిన ఆడ పావురాన్ని చూసి చాలా సంతోషించి అది కూడా అడపావురం వద్ద వాలుతుంది. భర్తను చూసిన ఆడ పావురం మగ పావురంతో ఈ విధంగా అంటుంది. ఈ చెట్టు పైన మనం గూడు కట్టుకొని నివసిస్తున్నాం కనుక ఇదే మన ఇల్లు ఈ వేటగాడు మన ఇంటికి వచ్చిన అతిధి. కనుక నీవు అతనికి అతిధి మర్యాదలు చేయి అని మగ పావురంతో చెప్తుంది. మగ పావురం అలాగేనని అయ్యా!!! ఇది మా ఇల్లు. మీరు మా ఇంటికి వచ్చిన అతిధి. అతిధికి అతిధి మర్యాదలు చేయాల్సిన బాధ్యత కూడా నాదే కనుక మీకు నేను ఏ విధంగా మర్యాదలు చేయగలను తెలియజేయండి అని అడుగుతుంది మగ పావురం. అప్పుడు ఆ వేటగాడు ఇప్పటికైతే నాకు చాలా చలిగా ఉంది చలిని తగ్గించడానికి ఏమైనా చేయగలిగితే చేయి అని చెప్తాడు. అది విన్న మగ పావురం వెంటనే చెట్టు కింద అక్కడక్కడ పడి ఉన్న చిన్నచిన్న కర్ర పుల్లలను తెచ్చి చలిమంటను వేస్తుంది. వేటగాడు కాసేపు ఆ చలిమంట కాచుకొని కాసేపు ఆగిన తర్వాత తనకు బాగా ఆకలిగా ఉందని చెప్తాడు. అది విన్న మగ పావురం అయ్యా!!! మాకు ఆకలి వేస్తే అప్పటికప్పుడు వెళ్లి ఆహారాన్ని సేకరిస్తాము దానినే తింటాము. మీ మానవుల లాగా మేము ఆహారాన్ని దాచుకోము. కానీ మీరు పక్షులను వేటాడి తింటారు కదా!!! అయితే ఇప్పుడు నేను చేయగలిగింది ఒక్కటే నేను ఈ మంటల్లో దూకి మీకు ఆహారాన్ని అవుతాను స్వీకరించండి అంటూ…. మగ పావురం ఆ మంటల్లో దూకుతుంది. అది చూసిన వేటగాడు చలించిపోయి ఛీ!! పక్షికి ఉన్న పాటి జ్ఞానం కూడా నాకు లేకుండా పోయింది. అతిధి మర్యాద చేయడానికి వేరే దారి లేక అది పక్షి అయినప్పటికీ దాని ప్రాణాన్ని త్యాగం చేసి నాకు ఆహారంగా మారింది. మరే విధంగానైనా ఆహారం సంపాదించుకోగల శక్తి సామర్థ్యాలు కలిగిన నేను మాత్రం మూగ జీవులను హింసించి వాటిని ఆహారంగా సేకరిస్తున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది .అనుకొని వలలో ఉన్న పావురాలన్నింటిని ఆకాశంలోకి విసిరేస్తాడు. అన్ని పావురాలు గాల్లోకి సంతోషంగా ఎగిరిపోగా ఆడ పావురం మాత్రం అతిధి మర్యాద కోసం ప్రాణత్యాగం చేసిన భర్తను తలుచుకొని దుఃఖిస్తూ తను కూడా ఆ చితిమంటలో దూకి ఆత్మర్పణం చేసుకుంటుంది. అప్పటికే ముక్తిని పొందిన మగ పావురం దేవలోకంలో బంగారు విమానంలో కూర్చుని ఎదురుచూస్తుంది ఆడ పావురం కోసం. భార్య మాట కోసం భర్త ,భర్త కోసం భార్య ఒకరికొకరు త్యాగాన్ని ప్రదర్శిస్తారు. మనల్ని నమ్మి ఆశ్రయించి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించి అతిధి మర్యాదలు చేసినంత మాత్రము చేత పక్షులైన పావురాలకి మోక్షం కలిగింది. మనం చేసిన మంచి ఎప్పటికీ వృధా పోదు అనటానికి ఈ కథ ఒక నిదర్శనం. కథ కల్పితమే అయినప్పటికీ విని నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ కథలో. మనం మంచి విషయాన్ని స్వీకరించాలి అనుకున్నప్పుడు అది కథన, కల్పితమ, వాస్తవమా చూడాల్సిన అవసరం లేదు. సందేశాత్మకంగా ఉన్న దేని నుంచైనా మంచిని నేర్చుకోవచ్చు . చిట్టి కథ గొప్ప సందేశం. మిత్రులందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు నచ్చే మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో రాయటం జరిగింది.

(సామాజిక మాధ్యమం నుండి సేకరణ)

సర్వేజనా సుఖినోభవంతు

May 29, 2025 6 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పత్రిక పాతదైనా- సంపాదకీయం కొత్తది

by రంగరాజు పద్మజ May 29, 2025
written by రంగరాజు పద్మజ

మహిళా పత్రిక సంపాదకులు 100 సంవత్సరాల క్రితమే వారి పత్రిక లో ఏంచెప్పాలనుకుంటున్నారో ఒక నిర్దిష్ట అంశాన్ని లేదా వారు లేవనెత్త బోయే సమస్య గురించిన చక్కని అవగాహన ఉందనడానికి నిదర్శనము అప్పటి సావిత్రి పత్రిక.
1904 లో స్థాపించిన ఈ పత్రిక విదుషీమణి శ్రీమతి పులుగుర్తి లక్ష్మీ నరసమాంబగారు, సంపాదకురాలు.
స్వాతంత్ర్యం రాక మునుపు మహిళల పరిస్థితి చాలా దుర్భరంగాను, అధ్వాన్నంగా ఉండేది. అయితే వారికి తమ ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చాలామందికి తెలియకపోయేది.చదువులేకపోవడం ఒకటైతే, ఇంట్లోనూ- దేశంలోనూ స్వతంత్రత లేకపోవడం మరో కారణం. ఇంకా శోచనీయమైన విషయం ఏమిటంటే ఆయా కష్టాలు ఆ బాధలు తమకు వచ్చిన సమస్యలుగా గుర్తించక, నిశ్శబ్దంగా జీవితంలో ఒక అవీ భాగం అనుకొని, అవన్నీ భరించాలి కాబోలు అనుకునే అమాయకులే ఆనాడు ఎక్కువ!
అటువంటి ఆడవారి బాధలు చూడలేక, వారిలో ధైర్యాన్ని పెంచాలని, చైతన్యం తీసుకురావాలని, భాషా -సాహిత్యాల పట్ల వారికి అభిరుచి ఏర్పరిచి, వాటి ద్వారా జీవితమంటే ఇది కాదు! మరోలా ఉంటుందనీ, ఉండేలా ప్రయత్నించాలని ఎరుక కలిగిస్తూ, వారి అస్తిత్వ ఆత్మ గౌరవం నిలుపుకొనే దిశగా ఈ పత్రిక నిర్వహించబడింది.
ఎందుకంటే మహమ్మదీయుల పాలనలో ఉర్దూ భాషకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. తెలుగులో ఏ రచనా ప్రక్రియనైనా వస్తే పాలకుల( నైజాము) ఆక్షేపణలకు గురయ్యేవి.
తెలంగాణ నడిబొడ్డులో ప్రజల భాషను ఆక్షేపించడం,మగవారిని కూడా ఆఫీసులకు వారు కట్టుకునే పద్ధతిలోనే వస్త్రధారణ ఉండాలని షరతు పెట్టడం ఇవన్నీ భరించలేక,మహిళలుగా తమకంటూ ఒక పత్రిక ఉండాలని, దాని ద్వారా తమ మనోభావాలు సమాజానికి ఎరుక చేయాలని,
సావిత్రి పత్రిక యజమానురాలు, సంపాదకురాలు పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారు మహిళల కంటూ ఒక పత్రిక ఉండాలని భావించారు.
మగవారు స్వేచ్ఛగా పత్రికలకు ఉత్తరాలు రాసుకుంటారు. అదే వారికి చెందిన మహిళలు మాత్రం వారి మనోభావాలు ఎందుకు తెలుపుకోకూడదు? అని గృహిణులుగా ఉన్న ఉద్యోగస్తులైన వారిని రచించమని ప్రోత్సహించేది. ఎందుకంటే కొన్ని విషయాలు అనుభవించే కొందరికే తెలుస్తాయి! మరికొన్ని విషయాలు మరికొందరికి తెలుసు… ఇలా వారు- వీరు; వారికి తెలిసిన విషయాలను తెలిపినా మహిళలకు అన్ని విషయాలు తెలుసే అవకాశముంటుంది అనేది ఆమె ఆంతర్యం. అదే ఆమె పత్రికను స్థాపించడానికి కారణం అని కూడా చెప్పారు.
ఆమె ఎందరో రచయిత్రుల రచనలను వెలుగులోనికి తీసుకొని వచ్చారు. 1904లో తాను స్వయంగా ఎన్నో రచించి, తమ పత్రికలో ప్రచురించారు. అలా అని కేవలం మహిళల రచనలే కాదు! మగవారి రచనలు కూడా తమ పత్రికలో అచ్చు వేశారు. కాకపోతే ఈ పత్రికలో ఎక్కువ పాతివ్రత్యం గురించే ఎక్కువ రచనలు వచ్చాయి. ఈ పాతివ్రత్య ప్రబోధాలు పద్య రూపకంగా ఉండేవి.
నీతి పదములు –ఏప్రిల్ 1904;
సత్య ధర్మములు ఫిబ్రవరి ఏప్రిల్ 1904 ;
స్త్రీ నీతి దీపిక 1904 ఆగస్టు;
స్త్రీ నీతి గీతముల ఫిబ్రవరి 1904;
నీతి పదములు ఫిబ్రవరి ,మార్చి, ఏప్రిల్ 1912. ఇలా ఎన్నో రచనలు చేయగా వాటిని తమ పత్రిక లో ముద్రించారు.
ఈ రచనలు స్త్రీలకు సత్యధర్మం చాటు చెప్పాయి.
సంపాదకూరాలి దృష్టిలో స్త్రీ విద్యావంతురాలైతే ఆకుటుంబం అందరూ నీతినియమాలతో ఒక కట్టుబాటులో నడుస్తారని అనుకుని, ఆమె మంచి సంపాదకీయాలు రాసేవారు.
అలాగే ఇంటి పనులు కూడా తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటారని, అలానే పిల్లలు సత్ప్రవర్తనతో మెలగాలంటే మహిళలు చదువుకోవాలని,తెలుపుతూ… కాలాన్ని వృధా చేసుకోవద్దని, ఉబుసుకుపోక మాటలు, ఇల్లామల్లి ముచ్చట్లు మాట్లాడవద్దని రాసేవారు.
ఈ పత్రికలో స్త్రీ విద్యా పంచరత్నాలు 1910లో ఉప్పల నరసమాంబ, ర్యాలీ జానకీరామాయమ్మ,ఆత్మూరి అన్నపూర్ణమ్మ,మొదలైన రచయిత్రులు విద్యకు ప్రాధాన్యతనిస్తూ…. వనితలు చదువుకోవాలని తమకు తెలిసినవి రాసి పత్రికలకు పంపాలని కోరుతూ సంపాదకీయం రాయడం ఎంతో అభినందించదగ్గ విషయము.
అంతేకాదు స్త్రీల పట్ల మగవారి ప్రవర్తన కూడా బాగుండాలని అప్పుడే స్త్రీ తన విద్యతో వచ్చిన ఆలోచనలతో చక్కని ప్రణాళికలతో ఆ కుటుంబాలు రాణిస్తాయని, అలా పురుషులు సకల సద్గుణాలు ఆచరిస్తూ, వారింటి మహిళలు ఆచరించాలని విన్నపము అనే శీర్షికతో సెప్టంబర్ (1910) లో రాసారు.
ఆ కాలంలోనే ఆడవారు చదువుకొని ఉద్యోగాలు చేయాలని దామెర్ల సీతమ్మ అన్నారు.
బొంబాయిలో ఇలా చదివి ఉద్యోగం చేస్తున్న వారెందరో ఉన్నారని, రఖమాబాయి, డాక్టర్ కృష్ణాబాయి,డాక్టర్ కమలాకర్ బాయి, మొదలైన ఎందరో మహిళలు బాగా చదువుకొని ఇటు ఉద్యమం చేస్తూనే, అటు ఇంటిని చక్కదిద్దుకుంటున్నారని రాసారు.
ముఖ్యంగా వితంతువులు చదువుకుంటే వారు ఎలా జీవించాలో తెలుసుకొని,తమ కాళ్ళ మీద తాము నిలబడుతూనే, సమాజానికి కూడా అసరాగా నిలబడతారని రాసారు.
కొందరుకుని అపవాదులేసినట్టు చదువుకున్న మహిళలు వారి ఇష్టా రాజ్యంగా ప్రవర్తించి చెడునడ త అలవర్చుకుంటున్నారనేది అబద్ధమని చెప్పింది. అలా అన్నప్పుడు మగవారు మాత్రం చదువుకొని ఉద్యోగం చేయడం లేదా? వాళ్ళు దుర్మార్గులు అయినారా? అని సమాజాన్ని ప్రశ్నించింది.
ప్రవర్తన అనేది వారి గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది కానీ, చదువుకోవడం వల్ల చెడిపోయారని అనడం మూర్ఖత్వం అని రాసింది. ఇంకా చదువుకుంటే సంస్కారం అబ్బి సూఖశాంతులు నెలకొంటాయని రాసారు.
అలా అంటే మనం విదుషీమణులుగా చెప్పుకుంటున్న వారు గానీ, పురాణ స్త్రీలు కానీ పాతివ్రత్యాన్ని పాటించింది బాగా చదువుకోవడం వల్లనే కానీ… మరో విధంగా కాదు!
మైత్రేయి, సులభ మొదలైన వారంతా చదువుకోవడం వల్ల బ్రహ్మజ్ఞానం పొందగలిగారని, వాళ్ల కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందని, కాబట్టి మంచి విద్య వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, శ్రీమతి పులిగుర్తి లక్ష్మీ నరసమాంబగారు తన సంపాదకీయంలో వివరించారు. ఆమె దార్శనికత కలిగిన మహిళ.ఎప్పుడూ 20 సంవత్సరాల ముందు ఆలోచించి పరిస్థితులను ముటదే పసికట్టి, ముందే హెచ్చరికలు చేసేవారు.
ఎన్నో అభ్యుదయ భావాలతో నిర్వహించిన ఈ పత్రిక మీద కొన్ని అపవాదులొచ్చాయి. బాల్యవివాహాలను వ్యతిరేకించిందీ పత్రిక. అంతే కాదు ఎన్నో సమావేశాలలో ఆ బాల్య విహాలు చేస్తే వచ్చే సమస్యల మీద ప్రసంగించింది.
స్త్రీల కోసం గ్రంథాలయాలు ఏర్పరచి, వితంతువులకు ఆసరాగా నిలిచింది. ఇలా తన పత్రిక ద్వారా మహిళలకు సహాయ సహకారాలు అందించమని 1911 లోనే కోరిందంటే ఎంత ముందు చూపు ఉన్న పత్రికాధిపతో కదా?
1910 స్త్రీల సనాతన మండలి గుంటూరులో మొదటి మహిళా సభ రాష్ట్రస్థాయిలో జరిగింది. విద్యార్థిని సమాజం ఆధ్వర్యంలో రెండవ సభ జరిగింది. ఈ సందర్భాన్ని గురించి తన పత్రికలో పులుగుర్తి నరసమాంబ
ఆంధ్ర మహిళ కార్యదర్శిని పేరుతోఎనిమిది పేజీలలో సంపాదకీయం వివరించింది.
చిన్న పెద్ద తేడా లేకుండా కులాలకు అతీతంగా వారందరినీ ఆ సభకు ఆహ్వానించింది. ఇందులో విద్య గురించి చర్చించడానికి ఒక సభ, సమాజంలోని లోటుపాట్లు గురించి మాట్లాడడానికి ఒక సభ, ఇంటికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి మరోసభలు ఉపశీర్షికలు పెట్టి ఇరవైరెండు రకాలైన సమస్యలను చర్చించారు.
చర్చలలో ఒకరి మధ్య మరొకరికి బేధాభిప్రాయాలు వచ్చి కొంతకాలం పత్రిక నిలిచిపోయినా మహిళల గురించి మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలు వెతకడం అనే గొప్ప కార్యక్రమానికి నాంది పలికింది మాత్రం 1904 లోనే… ఆ నాటి నుండే మొదలైంది ఈ పరంపర.
పందిటి వీర రాఘవమ్మ గారు ఆంధ్ర సోదరీ సమాజం స్థాపించి, పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారి అధ్యక్షతన అత్యద్భుతంగా తన ప్రతిభా పాటవాలతో మహిళలను చైతన్యవంతులుగా చేయడానికి ఎంతో కృషి చేసింది.
అలా చైతన్య వంతులైన మహిళలు, స్వాతంత్య్రం కోసం ప్రజలను మేలుకొలిపారు.
ఇవాళ మనం రాజకీయ,ఆర్థిక, సాంకేతిక,నిర్వహణలలో ఇలా నిలదొక్కుకొని రాణించడానికి ఆనాటి నరసమాంబ వంటి మహిళల ప్రోద్బలం, ప్రోత్సాహం ఎంతోఉంది.
ఎందుకంటే గృహహింస ఎంత ఉన్నా ఇదిలానే ఉంటుందని, దాన్ని భరించాలకునే మనస్తత్త్వం నుండి ఎదురించి, ఆత్మాభిమానంతో బతకాలని నేర్పిన ఆనాటి పత్రికలు ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండానే నడిపారు.
మరో కారణం రవాణా సౌకర్యాల వసతి అంతగా లేక ఒక విషయం సామాన్యులకు చేరడం వ్యక్తిగతంగా సభలు ఏర్పాటు చేసి, ప్రసంగాల వల్ల కష్టమైయ్యేది. ఆర్థిక వనరులు అడ్డు తగిలేవి. తమకంటూ ఆదాయంలేని మహిళలకు సభా నిర్వహణ తలకు మించిన భారమయ్యేది.
పత్రికలైతే ఇంటింటా చేరి, విషయం అందరికీ చేరుతుందని ఆలోచన చేయడం మరో కోణం.
ఏదేతైనేమి ? సామాజిక స్పృహ ఉండి, అణచబడిన మహిళలలు తలెత్తుకుని జీవించాలన్న వారి ధ్యేయానికి, పత్రిక ప్రజలకూ – ప్రభుత్వానికి నడుమ వంతెనవలె పనిచేయాలనే ఆశయంతో… శాంతి సుస్థిర సమాజాన్ని కాంక్షించే పత్రికలకెప్పటికైనా ఋణపడే ఉంటాం! ఆ నారీ మణులందరికీ
నమోవాకములర్పిస్తూ…

May 29, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

భువిలో స్వర్గం

by Kattekola Vidyullata May 29, 2025
written by Kattekola Vidyullata

హిమాంశ్ – మణిపూర్‌లో పనిచేస్తున్న ఒక యువ ఇంజినీర్.

సుష్మిత – తమిళనాడులో పుట్టి పెరిగి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.

ఒక వివాహ పరిచయ వేదిక ద్వారా కలుసుకున్న వీరు, ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు పూర్తైంది. ఒకరికొకరు తగిన సహచరులుగా నిరూపించుకున్న  ఈ దంపతులు, తమ జీవితంలో మొదటి మూడు సంవత్సరాలు నిత్యజీవన పోరాటాలలో గడిపేశారు.

ఉద్యోగాలలో స్థిరత్వం వచ్చేసరికి, కొంత సమయం తమకోసం గడపాలనిపించింది. “నువ్వెప్పుడూ చెబుతూ ఉంటావుగా కాశ్మీర్ గురించి… స్వర్గమేనంటూ,” అన్నాడు హిమాంశ్.

ఆ మాటకు మురిసిపోయింది సుష్మిత. బాల్యంలో పుస్తకాల్లో చూసిన దాల్ సరస్సు, టులిప్ తోటలు, మంచుతో కప్పిన పర్వతాలు—తన కలల ప్రపంచం కళ్ళ ముందు కదలాడింది.

విమానం కాశ్మీర్ మీదుగా వచ్చినప్పుడు, వారిద్దరూ కిటికీ పక్కన కూర్చొని చూసిన దృశ్యం జీవితంలో మరువలేనిది. ఎత్తయిన పర్వతాలపై కురిసిన మంచు కప్పు, గగనాన్ని తాకే చిలిపి మేఘాలు, తాను ఊహించుకున్న రకాల రకాల పూల పరిమళం అప్పుడే తన నాసికను తాకిన అనుభూతి కలిగింది సుస్మిత కు.

“ఇది నిజంగా మన భారత్ లోనిదేనా?” అని ఆశ్చర్య పోయారు ఇద్దరూ.

శ్రీనగర్ చేరుకున్న మరుసటి రోజు వారిద్దరూ దాల్ సరస్సు సందర్శించేందుకు బయలుదేరారు. అలసిపోయిన మనసుకు అది ఒక శాంతి నిలయం. ఓ బోట్ హౌస్‌లోకి ఎక్కి, ఆ ప్రశాంతత మధ్య ప్రేమతో మాటలు చెప్పుకుంటూ సాగిపోయారు.

చుట్టూ దర్పణంలా మెరుస్తున్న నీళ్లు, వాటిలో ప్రతిబింబించే పర్వత శిఖరాలు, బోటు మీద కొలువైన కాష్మీరీ కళాకృతులు ఇవన్నీ ఒక గంధర్వ లోకాన్ని తలపించాయి. అక్కడే ఓ పూల బోటులో అమ్మాయిలు వదిలిన టులిప్ పూలు, ఆర్చిడ్ల పరిమళాలు శ్వాసలో నింపుకున్నారు.

“ఇదేనా మన కలల ప్రపంచం?” అని ఆశ్చర్యంగా అన్నాడు హిమాంశ్.

ఏప్రిల్ నెల. తక్కువ గాలి, మంచు ఇంకా కాస్త బాగానే ఉంది. శ్రీనగర్ చేరుకున్న రోజు నుంచే వాళ్లను అబ్బురపరిచిన పర్వతాలు, పూల తోటలు, దాల్చిన చెట్లు, చలిగాలి ఒకరిపై ఒకరికి మరింత అనురాగాన్ని పెంచుతున్నాయి. ఈ ప్రయాణానికి తన అత్తమామలను కూడా రమ్మని ఎంతగానో కోరింది సుస్మిత. వీరికి ఏకాంతం కలిగించేందుకో, లేక నిజంగానే చెప్పారో, “ నా ఆరోగ్యానికి అంత చల్లని వాతావరణం సరిపడదమ్మా, మీరు వెళ్ళండి. మరేదైనా తీర్థయాత్రకు అందరం కలసి వెళదాం,”  అంటూ తన మాట తోసి పుచ్చిన అత్తగారితో తన మనసులోని భావాలు పంచుకునేందుకు ఫోన్ చేసింది.

“అత్తయ్యా! మీరు చూడాలి ఈ పువ్వుల తోటల్ని… మన జీవితంలో ఒక్కసారైనా రావాలి ఇక్కడకి. భూమి మీద స్వర్గం అంటే ఇదే అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది,” అంటూ ఫోన్‌లో ఉద్వేగంతో చెప్పింది సుష్మిత.

“చాలా సంతోషం తల్లీ, నువ్వు ఎంతగా ఆనందిస్తున్నావో నీ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది. హాయిగా ఎంజాయ్ చేయండి. నాకూ, మీ అమ్మకూ మంచి షాల్స్ తీసుకురండి. సంతోషంగా తిరిగి రండి,” నిండుగా ఆశీర్వదించారు పార్వతి గారు.

తరువాత శ్రీనగర్ లోని ఓ ప్రముఖ ఆర్కిడ్ తోట. వివిధ రంగుల్లో విరజిమ్ముతున్న పూలు. వేలాది రంగుల పుష్పాల మధ్య నడవడం అంటే భూమిపై ఆకాశంలో నడిచినట్టే. సుష్మిత అబ్బురపడింది.

“ఒక్కో పువ్వు ఒక్కో భాషలో ప్రేమను పలికిస్తున్నాయనిపిస్తోంది,” అంది. హిమాంశ్ త‌న ఫోన్లో వాటి ఫోటోలు తీస్తూ నవ్వాడు. “నీ ముఖంలో ఆనందాన్ని చూసేందుకే ఈ ట్రిప్‌,” అన్నాడు ప్రేమగా.

అక్కడ నీలీ, పచ్చ, నారింజ రంగుల ఆర్కిడ్స్ తో పాటు, చాలా అరుదైన పుష్పాలు కూడా ఉన్నాయి. వాటిపై పడే మంచు తుంపర్లు, హాయిగా వీస్తున్న వసంతగాలులు — మదిని మంత్రముగ్ధం చేశాయి.

“ఇక్కడే ఓ చిన్న ఇంట్లో ఉండిపోతే ఎంత బాగుండు,” అంటూ తన భర్త చేతిని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుని మైమరపుగా అన్నది సుష్మిత.

బోట్ హౌస్ లో ఆ రాత్రి, చలిగాలి తాకుతూ ఉన్నా, సుష్మిత తన డైరీ తీసుకుని కాసేపు ఏదో రాసింది.

“ఏమిటది?” అడిగాడు హిమాంశ్.

“నీ కోసం. ఈ కాశ్మీర్ నాకు నిన్ను కొత్తగా పరిచయం చేసింది,” అంది. “ఏదీ, దేవిగారేం రాశారో మేం తెలుసుకోవచ్చా?” గోముగా అడిగిన హిమాంశ్ ను చూస్తూ తన పేరు లాగానే వెన్నెలలా హాయిగా నవ్వింది సుస్మిత.

ఈ మంచు చల్లదనం కంటే నీ పలుకులు మృదువైనవి,

ఈ సరస్సు ప్రశాంతతకంటే నీ మౌనం లాలిత్యమైనది.

ఈ పర్వత శిఖరాలను మించినవి

మనం ఆశగా అల్లుకున్న జీవన శిఖరాలు!

పూల తోటల మధ్య విహరిస్తున్నా,

నీ శ్వాసే నాకు గొప్ప పరిమళం.

ఇక్కడి వర్ణాలు, వాయువులు, నీటి ప్రతిబింబాలు

అన్నీ నాకు నీవైపే చూపిస్తున్నాయి.

ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటే

నిన్ను చూస్తే చాలనిపిస్తోంది.

నీవుంటే – ఈ పయనం పూర్ణం,

నీవే లేకపోతే – కాశ్మీర్ కూడా రంగులేని శూన్యం.

హిమాంశ్ నిశ్శబ్దంగా ఆమె కవితను విన్నాడు. ఆమె కళ్ళలో తనకోసం మెరిసిన ప్రేమలోతులు అర్థమయ్యాయి. ఆ క్షణం బోట్ హౌస్‌లో కాకుండా, వాళ్లు ప్రేమ అనే మరొక లోకంలో విహరించారు.

*************************

ఓ స్థానిక టూర్ గైడ్‌తో కలిసి మరికొంతమంది పర్యాటకులను కలసుకుని పహల్గామ్ చూడాలని నిర్ణయించుకున్నారు. చుట్టూ మంచు పర్వతాలు, నదుల ప్రవాహం. అక్కడే కొత్తగా పరిచయమైన బెంగుళూరుకు చెందిన నవవివాహిత దంపతులు – అనీష్, నీతా. వాళ్లతో కలసి సాయంత్రం హడావుడిగా గడిపారు.

“ఓ… నీతా ఎంత బాగుంది నువ్వు కట్టుకున్న దుపట్టా. మా ఆడపడుచుకి కూడా ఇలాంటిదే  తీసుకుంటాను,” అని సుష్మిత చిరునవ్వుతో చెప్పింది.

తర్వాతి రోజు పహల్గామ్‌కు బయలుదేరారు. పర్వతాల మధ్య నెమ్మదిగా ప్రయాణించి ఒక చిన్న మైదానం దగ్గర బస్ ఆగింది. పర్యాటకులంతా దిగారు. కొందరు ఫొటోలు తీస్తుంటే, కొందరు ఆ ప్రాంతం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మరికొందరు ఎడ్వెంచర్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వీరిద్దరూ తమ తల్లిదండ్రుల కోసం కశ్మీరీ శాలువాలు కొనాలనుకుని కొండ దిగువ దుకాణం వద్దకు వెళ్లారు.

కొంతసేపటికి టపటపా గాలిలో తూటాల మోత. పర్వత మార్గం అంతా గర్జనలతో, అరుపులతో మారుమోగింది. ప్రజలు పరుగులు, ఏడుస్తూన్న పిల్లలు, రక్తపు మడుగులో పర్యాటకులు, భీకరమైన మానవ సృష్ట దుశ్ఛర్య.

కొంత సేపటి తర్వాత సైన్యం వచ్చి పరిస్థితిని నియంత్రించగలిగారు. కానీ అప్పటికే… అనేక ప్రాణాలు మట్టిలో కలిశాయి.

హిమాంశ్ సుష్మిత అక్కడే ఉండాల్సింది. వారు షాల్ దుకాణానికి వెళ్లడం వాళ్ళ ప్రాణాలకు రక్షణగా మారింది. అదే సమయంలో తమ పెద్దవారి కోసం శాల్స్ కొనేందుకు వెళ్ళడం, వారి ఆశీర్వాదమేనేమో! కానీ, వారి కళ్ళముందు బాధాకరమైన దృశ్యం. అనీష్‌ను, నీతా భర్తను కాల్చి చంపారు ఆ ఉన్మాదులు. తల్లడిల్లిన నీతా, భర్త శవాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తుంటే, అక్కడ ఉన్న వారి హృదయాలు బద్దలయ్యాయి.

“ఇక్కడ మనిషిగా జీవించడం ఎంత కష్టం అన్నది ఇప్పుడు అర్థమయింది,” అంది సుస్మిత. ఆమె మాటల్లో ఉలిక్కిపాటు లేదు, ఉత్కంఠ లేదు — ఒక తీవ్రమైన మనోవేదన ఉంది. ఆ క్షణం వరకూ స్వర్గాన్ని తలపించిన ఆ ప్రాంతంలో మృత్యువు కరాళ నృత్యం చేయడం కళ్ళారా చూడడంతో ఆమె షాక్ కు గురయింది.

ఆ 26 మంది అమాయక హిందూ పర్యాటకులు, తమ కుటుంబాలతో కశ్మీర్ లోని పహల్గాం, గల్గస్, సోనమార్గ్ లాంటి అందమైన ప్రాంతాలు చూసేందుకు వచ్చినవారే. కానీ మతాన్ని అడిగి, ‘నువ్వు హిందువా? ముస్లింవా?’ అని ప్రశ్నించి, ‘హిందువు’ అని చెప్తేనే మృత్యుదండన విధించిన ఉగ్రవాదుల చర్య యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది.

ఈ వార్త కశ్మీర్ లోని స్థానిక చానెల్ లో వెలువడగానే, దేశవ్యాప్తంగా మీడియా దాన్ని బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేయసాగింది. “పహల్గామ్ లో ఉగ్రవాదుల పైశాచికత్వం. మతం అడిగి మరీ 26 మంది అమాయక హిందూ పర్యాటకుల హత్య.” దేశమంతా ఉలిక్కిపడింది.

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద యువతతోపాటు పెద్దలూ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ముంబైలో, బెంగుళూరులో, హైదరాబాద్‌లో, కోల్‌కతాలో నిరసనలు ఎగిసిపడ్డాయి. సోషల్ మీడియాలో –

#JusticeFor26, #StopTerrorin Kashmir, #HindusAreNotSafe అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.

పోలీసులు, సైన్యం తీవ్రంగా అలర్ట్ అయ్యాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి.

ప్రధానమంత్రి తక్షణమే విదేశీ పర్యటన రద్దు చేసుకుని తిరిగి వచ్చారు. టీవీ చానెళ్ల ద్వారా దేశ ప్రజలతో ప్రత్యక్ష ప్రసంగం చేశారు. “ఈ ఉన్మాద చర్య మన దేశ గౌరవాన్ని విచ్ఛిన్నం చేయడమే కాదు, ఇది మానవత్వం పై దాడి. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తాం. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను మాత్రమే కాదు, వారికి మద్దతుగా నిలిచిన వారికి కూడా తగిన గుణపాఠం నేర్పుతాం,” అని ప్రకటించారు.

ఆ తర్వాత ప్రయాణం ఆగిపోయింది. మరుసటిరోజు తిరుగు ప్రయాణం అయ్యే లోగా తమ బంధువులంతా తమ యోగక్షేమాల గురించి వాకబు చేస్తుండడంతో వారికి తమ క్షేమ సమాచారాన్ని మెసేజ్ ద్వారా తెలిపారు వారిద్దరూ.

భారమైన హృదయంతో తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. ఇప్పుడు జీవితంపై వారి దృక్పథం మారింది. వాళ్లు హోటల్ నుంచి ఇంటికి ఫోన్ చేసినప్పుడు, “ఇక్కడి ప్రజలకు ఈపాటికే మనసులు విరిగి పోయి ఉండాలి. అయినా సరే, చిరునవ్వుతో మనల్ని స్వాగతిస్తున్నారు,వారికి ధన్యవాదాలు,” చెప్పింది సుష్మిత తన తల్లితో.

హైదరాబాద్ చేరుకున్న తర్వాత, సుష్మిత తన ఉద్యోగంలోకి వెళ్లే ముందు చిన్న మెసేజ్ వ్రాసి టేబుల్ మీద పెట్టింది.

“ప్రతి ఉదయం నా కళ్లెదుట నువ్వు ఉండటం ఒక అద్భుతం. ప్రతిరోజూ మనం మనసు విప్పి మాట్లాడుకోగలిగితే – అదే నిజమైన స్వర్గం. కాశ్మీర్ ఇది నేర్పింది.”

ఆ ప్రయాణం వారిద్దరిలో మార్పు తీసుకొచ్చింది — సహజమైన అందం పట్ల ప్రేమను, మానవీయత పట్ల మమకారాన్ని, ఒకరి జీవితంలో మరొకరి విలువను మరింత లోతుగా అర్థం చేసుకునే సాధనగా మారింది.

ప్రకృతి ఎంత అందమైనదైనా, మనిషి హృదయం కన్నా పెద్ద స్వర్గం లేదు. మనం ప్రేమతో, శాంతితో జీవించగలిగితే, ఏకంగా ఒక కాశ్మీర్ మన హృదయంలోనే నెలకొంటుంది.

May 29, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us