మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

అద్భుత యుద్ధం

by Chandaluri Narayana Rao May 22, 2024
written by Chandaluri Narayana Rao

అప్పటి దాకా
నీ మంచితనం నీవు చెప్పుకోవడం అనేది
తెలివితక్కువగా అవసరమనుకోవడం
ఓ పెద్ద లోపం.
కాలం ఖచ్చితంగా నీ కోసం
కొన్ని రోజులని దాచే ఉంటుంది

అందాకా ఆగితేనే
నీకు క్షమాపణ చెప్పుకుంటూ
నీ పేరు మీద గడిపే మిగిలిన రోజులన్నీ
మౌనంగా నిన్ను బలపరస్తూ
బహిరంగంగా  శ్రమిస్తాయి..

నీ తరుపున దేవుడు వాదించి
తానే సాక్షిగా రుజువు చూపుకుని
నీలో నిజానికి  ప్రేమతో
గెలుపును బహుమతి చేస్తాడు

సమస్యల్లా
సహనం అనే పరీక్ష  శిక్ష కాదు,
అద్భుత యుద్దమని మరువకుంటే  చాలు…

ఒకరేవరూ
తప్పును మోసం చేసి నటిస్తూ
తప్పించుకు పోలేరెక్కడికో…

దేవుడికి ఎన్ని పేర్లుతో  రూపాలున్నా
నిజం మాత్రం  ఒకే ఒక రూపంలో
తిరుగులేని తీర్పు చెబుతుంది…
కొద్దిగా ఆలస్యం అనిపించినా
మరింత పటిష్టంగా….

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఆద్యవధాన సరస్వతి, తొలితెలుగు మహిళావధాని శ్రీమతి ఎం.కె. ప్రభావతి

by Dr. Lakshmanacharyulu M May 22, 2024
written by Dr. Lakshmanacharyulu M

                                సత్యమె మనజాతి, నీతి / సత్యాచరణే
                                సత్య హరిశ్చంద్రు కథయే
                                సత్యము గాంధిని మహాత్ము సలిపెన్‌ భక్తా !
                                ఆంధ్ర భాగవతపు / టందాల వెన్నుచు
                                జన్మ ముగియులోన / చదువవలెను
                                ధన్యుడైతి వోయి / ‘తన’ పోవ(గ) పోతనం
                                ”పోత” ”నా భవాబ్ధి” / నే తరింతు.                                      – ఎం.కె. ప్రభావతి

అది కర్నాటక రాష్ట్రంలోని మధురగిరి తాలూకాలోని తుంకూరు జిల్లాలో ఉన్న దొడ్డధలి గ్రామం. ఆ గ్రామంలో 78-79 సం|| క్రితం జన్మించిన ఒక ‘పాప’, ఎక్కడో తెలుగు రాష్ట్రంలో వృత్తిరీత్యా సైన్సు ఉపాధ్యాయురాలుగా ఆ తర్వాత రైల్వే విద్యాలయం, జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ గా పనిచేసి, మంచిపేరు సంపాదించి, జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలు దాటి, శ్రీ పొత్తపి శ్రీనివాసరావు గారి అర్ధాంగియై, ముగ్గురు పిల్లలకు తల్లై ఆ తర్వాత, వాగ్ధేవి అద్భుత, అనూహ్య, అఖండ దివ్య కరుణకు పాత్రురాలై, తెలుగు సాహిత్యాన్ని మధించి, తొలి తెలుగు మహిళావధానిగా,  దేశ విదేశాలలో తెలుగు కీర్తి చంద్రికలు వ్యాప్తి చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
తనను ప్రేమించిన వ్యక్తికి 2 షరతులు పెట్టి, ఇంటి పెద్దకుమార్తెగా, తల్లిని పోషిస్తూ, సోదర, సోదరీమణుల జీవితాలు సరిదిద్దాల్సి ఉంటుందని, వారికి స్వావలంబన వచ్చేవరకు మనమే వారికి అన్నీ చూడాలని పెట్టిన అమ్మాయి, ఆ షరతులను తు.చ. తప్పక పాటించి తీరుతుందని, తనకూ భార్యగా ఏ లోటు రానీయక, ఉద్యోగ ధర్మాలు నెరవేరుస్తూనే,  తెలుగు అవధాన గగనంలో సముజ్వల తారగా వెలుగొందుతుందని, ఆ భర్తగాని, వివాహానికి హాజరయిన వారుగాని అస్సలు అనుకోలేదు.
తమకు సైన్సు పాఠాలు చెప్పిన ‘పంతులమ్మ’ తెలుగు అవధానంలో ఒక చరిత్ర సృష్టిస్తుందని 1966 నుండి 2006 వరకూ ఆమె దగ్గర చదువు నేర్చిన ఏ విద్యార్థి భావించలేదు.
అమ్మ తమకు ఏ లోటూ రానీయకుండా పెంచి పెద్దచేస్తూనే తెలుగు ప్రాచీన, ఆధునిక కావ్యాలను ఆపోశన పడుతూ, ఆశువుగా పద్యాలు చెప్పగలిగే స్థాయికి వెళ్ళి అన్ని ఛందస్సులలోనూ రచనలు చేసినదని, ”శ్రీనరసింహ శతకము”, ”రామా! నీ కథ వినుమా!”, ”భవాబ్ది పోతము”, ”భక్తి అంటే?”, ”శ్రీ విద్యాస్తుతి”, ”చదువు”, ”నవ్వు నవ్వించు”, ”చాటువులు”, ”వ్యాస కదంబం”, ”దేవుడొక్కడే” వంటి అద్భుత, అనితర సాధ్య రచనలు చేసి, కన్నవూరికి, తాను ఉద్యోగాలు చేసిన ఊళ్ళకు, నివసించిన  ఊరికి ఘనకీర్తి తెచ్చి, ”తాము ఆమె సంతానం” అన్న గౌరవం తమకు దక్కేస్తుందని వారూ అనుకోలేదు.
తానా సభలు (అమెరికా) ఆమెను ఘనంగా సన్మానించి, తద్వారా తాము గౌరవం పొందుతామని ప్రత్యేకంగా ఆలోచించలేదు. తోటి అవధానుల అవధానంతో పృచ్ఛకురాలిగా, ఎన్నో సాహిత్య ఆధ్యాత్మిక సమావేశాలకు, సభలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీమతి ప్రభావతి స్నేహశీలి, నిగర్వి, జిజ్ఞాసువు, హాస్యచతురత, సంభాషణా కుశలత, సహృదయ స్పందనతో ఎందరినో ప్రోత్సహించిన మృదుభాషిణి, మధురభాషిణి. ఎందరో వర్ధమాన కవుల, రచయితల రచనలకు (ఈ వ్యాసం వ్రాస్తున్న నాతో సహా) చక్కని, చిక్కని, ప్రోత్సాహకమైన, నిర్మాణాత్మక ‘మున్నుడి’ వ్రాసి, అర్థవంతమైన, నొప్పించని శైలిలో, ఆ రచనలను విమర్శ చేసిన విధుషీమణి. మచ్చుకి –
”పద్యంలో ఏ పాదానికా పాదంలో సంపూర్ణమై, అర్థాన్ని ఇవ్వగలిగితే అది సుందరంగా ఉండటమేకాక పాఠకునికి అర్థాన్వయంలో కాఠిన్యమనిపించదు. ఈ లక్షణాన్ని మీరు పట్టుకున్నారు. ఎటువచ్చీ దాన్ని నాలుగు పాదాలలో ఉపయోగించడం వలన ‘చెవికింపు’ మాత్రమే పొందారుగాని పద్యానికి రాదగిన రావలసిన ”చైతన్యం” కొన్ని పద్యాలలో మీరు అందించలేకపోయారు. (మీరు = డా.లక్ష్మణాచార్యులు)
”నేను వ్రాసిన విమర్శలో మొగమాటానికి, ముఖస్తుతికి తావు లేదు. వ్రాసిన ప్రతి మాటకు విలువ అందులోని సత్యమే సుమా!”

”ఈ కవి మంచి భావుకుడు” (అభినందనలు- (దృశ్యాదృశ్యాలు- (ఈ వ్యాసరచయిత పుస్తకం) ఎం.కె. ప్రభావతి)

అమలాపురంలోని ‘త్రివేణి’ సంస్థ ‘అవధాన భారతి’ అని బిరుదును ఇచ్చింది. ‘తానా’ (అమెరికా) రెండుసార్లు (2002 & 2004) ప్రథమ మహిళా అవధానిగా సన్మానించింది. పో.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.
భారతీయ సంస్కృతిని, హిందూ సంప్రదాయాన్ని, మానవ విలువల్ని, తెలుగు భాష సాహిత్యాలను ఎంతగానో ప్రేమించిన ప్రభావతి భౌతికంగా లేకున్నా, ఆమె యశస్సనే కాయానికి జరా మరణములు ఉండవు. ఆమె సాహిత్య సేవలు అవిస్మరణీయాలు, అనుస్మరణీయాలు.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆవలి వెలుగు

by Anumandla Bhumaiah May 22, 2024
written by Anumandla Bhumaiah

ప్రమిదను వత్తి వలె
వెలుగు నన్ను ఆధారం చేసుకొని వచ్చింది.

ఊరూ, వాడా నన్ను చేరదీశాయి.
ఎండా, వానా, చెట్టూ, గుట్టా స్నేహితులయినాయి.

భూమి తల్లియై
అన్నం పెట్టింది.

సుందర ప్రకృతి
కంటికి మెఱపు నిచ్చింది.
నాదం
నా శ్రుతిలో కొలువు తీరింది.

బడి గురువై
బ్రతుకు దారి చూపింది.

అన్నీ నేర్పుతున్నాయి
ఎన్నో ఎన్నెన్నో.

ఏమరుపాటున
ఎప్పుడు ఎక్కడ
ఏ పొరపాటు జరిగిందో
“ఆరుగురు”
ఒక్కొక్క దొంగ దెబ్బ కొట్టారు.

లోపలి వెలుగు ఆరింది.
నేను చీకటిగా మిగిలాను.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అద్భుత యాత్రా ప్రదేశం త్రిపుర

by Rangaraju Shyamsundar May 22, 2024
written by Rangaraju Shyamsundar

ఆ రోజు ఉదయం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి త్రిపుర లోని మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయం అగర్తలా కి చేరే సమయానికి మమ్మల్ని ఆహ్వానించడానికి అగర్తలోని మిత్రులు మా కోసం బయట నిరీక్షిస్తున్నారు. (Photo 1) మిత్రులందరికీ అగర్తలా లోని మాకు కేటాయించిన అతిథి గృహం కు వెళ్లడానికి చాలా సమయమే పట్టింది. దారికి ఇరువైపులా నేల కనపడనంత వివిధ రకాల మొక్కలు, చెట్లు, పొదలతో పాటు ప్రతి ఇంటి ముందు ఇంటికంటే విశాలమైన ఇంకుడు గుంతలు వాటిలో సమృద్ధిగా నిలిచి ఉన్న నీరు సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది రకరకాల మొక్కలు కొన్ని వందల సంవత్సరాలుగా నిటారుగా పెరుగుతున్న చెట్లు, గుబురుగా సమూహాల్లాగా వెదురు చెట్లతో నిండి ఎటు చూసినా ఆ ప్రాంతమంతా పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ప్రకృతిలో మైమరచి పూర్తిగా లీనమై పోవడం వల్ల మా అతిథి గృహం చేరింది కూడా గమనించుకోలేకపోయాము.
లగేజ్ తో సహా మాకు కేటాయించిన గదికి వెళ్లి సేద తీరాము అతిధి గృహంలో సైతం వెదురు బొంగులతో తయారుచేసి ప్రదర్శించబడుతున్న వివిధ వస్తువుల్ని చూసి కొనుగోలు చేయవలసిన వస్తువుల జాబితా రాసుకుని ఆరోజు కార్యక్రమాలు ముగించుకొని లోకల్ మార్కెట్ లోని షాపింగ్ కి వెళ్ళాం. ముఖ్యంగా యాత్రలంటే అత్యుత్సాహం ప్రదర్శించే నాకు ఇండియాలోని చాలా చారిత్రక ప్రదేశాలు అయితే దర్శించుకోవడం జరిగింది.కానీ ఎక్కువగా ఇష్టపడి వెళ్లాలనుకున్న ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడం మాత్రం వీలు కాలేదు. కొద్ది సంవత్సరాల క్రితం అస్సాంలోని కామాఖ్య, పరిసర ప్రాంతాలు చూడడం జరిగింది కానీ ఇంకా చాలా ప్రాంతాలు చూడాల్సిన జాబితాలో మిగిలిపోయాయి.
ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిపి వీటిని 7 సిస్టర్స్ గా పరిగణిస్తారు. ఇందులో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ మరియు త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.
ఇటీవల గత నెలలో త్రిపుర రాష్ట్రాన్ని దర్శించాలనే కోరికతో కొంతమంది మిత్రులతో కలిసి ప్రయాణించాం. త్రిపుర నే ఎంచుకోవడానికి ముఖ్య కారణం ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైనా మచ్చు పిచ్చు పోలికలతో ఈ ప్రాంతం ఉంటుందని దీన్ని ఇండియా మచుపిచ్చుగా కూడా పరిగణిస్తారని కారణం ఒక్కటైతే ఇంకోకారణం ఈ ప్రాంతాన్ని అమెజాన్ ఆఫ్ ఇండియా గా కూడా వ్యవహరిస్తారని దర్శించిన మిత్రులు చెబితే దీన్ని ఎన్నుకోవడం జరిగింది.
త్రిపుర చరిత్ర పరిశీలిస్తే 14వ శతాబ్దం నుండి 1949 లో త్రిపుర భారతదేశంలో విలీనం అయ్యే సమయం వరకు దీన్ని గిరిజన రాజులు పరిపాలించేవారు. ఈ ప్రాంతంలో దాదాపు 19 తెగలకు సంబంధించిన గిరిజన జాతులు నివసిస్తున్నారని అంచనా ఎక్కువగా అతి సమీపంలో ఉన్న బంగ్లాదేశ్ మరియు మయన్మార్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు వలస వచ్చి ఈ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్నారు.

1897 వ సంవత్సరంలో వచ్చిన అతి పెద్ద భూకంపం త్రిపుర రాష్ట్రానికి అంతులేని నష్టం మిగిల్చింది. ఆ తదుపరి ఇక్కడి పాలకులు యూరోపియన్ పద్ధతుల్లో అనేక నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ గొప్ప భవనాల్లో త్రిపురలోని గ్రాండ్ ఉజయాంట ప్యాలెస్ మరియు రుద్ర సాగర్ చెరువులో వేసవికాల విడిది గా నిర్మించబడ్డ నీర్ మహల్ ప్యాలెస్ లు ప్రముఖమైనవి. భారతదేశంలో అతి చిన్న మూడవ రాష్ట్రం త్రిపుర.
ఆ మరుసటి రోజు అగర్తలా నుండి 140 కి.మీ ప్రయాణించి ఉనకోటి అనే యాత్రా ప్రదేశానికి వెళ్ళాం. ఈ ప్రాంతం దరిదాపుల్లో యాత్రికులు, యాత్రికులను తీసుకొచ్చే వాహనాలు వారికి తినుబండారాలు సమకూర్చడానికి వచ్చిన ఆ ప్రాంతవాసులు తప్ప ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎవరూ ఉండరు.
మన తెలుగు సినిమా పాట” శిలలపై శిల్పాలు చెక్కినారు ” లాగా ఆ ప్రాంతంలో అనేక గుట్టలపై చదును చేసిన భాగంలో 3 అడుగుల నుండి 30 అడుగుల పైబడి నిడి విగల అనేక శిల్పాలు మనకు కనువిందు చేస్తాయి. ఇలాంటి దేవతా విగ్రహాలను పోలిన శిల్పాలు కాంబోడియాలోని బయాన్ టెంపుల్ లో కనువిందు చేస్తే, అమెరికా అధ్యక్షుల శిల్పాలు మౌంట్ రాస్నోర్ లోని గుట్టల పైన మాత్రమే కనిపిస్తాయి.
ఈ ఊనకోటి ప్రాంతం కైలాస శిఖరం మార్గంలో ఉంటుందంటారు. ఊనకోటి అంటే ఒక్కటి తక్కువ కోటి అంటే 99,99,999 ఈ ప్రాంతంలో మనం ఏ వైపు చూసినా రాళ్లపై చెక్కబడ్డ శిల్పాలే దర్శనం ఇస్తాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడ్డ ఈ ప్రాంతానికి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి యాత్రికులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఇక్కడ “అశోకాష్టమి” జాతరలో వేలాదిమంది గిరిజనుల, గిరిజనేతరులతో పాటు వచ్చిన యాత్రికులు కూడా పాల్గొంటారు. (Photo 2)

1897 వ సంవత్సరంలో వచ్చిన పెను భూకంపానికి చాలా శిల్పాలు భూగర్భంలో కలిసిపోగా చెక్కుచెదరకుండా ఉన్న అనేక విగ్రహాలు ఇచ్చట మనకు దర్శనం ఇస్తాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న కొన్ని విగ్రహాలను పురాతత్వ శాఖ వారు సేకరించి ఒక పెద్ద గది లో ప్రదర్శనకు పెట్టారు 30 అడుగులపై బడి ఉన్న కోటేశ్వర కాలభైరవ అనే శిల్పం ఇండియాలోనే అతి పెద్ద శిల్పంగా గుర్తింపబడింది. ఇలా చెక్కుచెదరకుండా ఉన్న విగ్రహాలు అనేక రూపాల్లో ఉన్నాయి. విష్ణువు, గణపతి, కార్తికేయుడు, కాలభైరవ శిల్పాలు ఈ ప్రాంతంలో విరివిగా ఉన్నాయి. ఉనకోటి అంటే బెంగాల్ భాషలో కోటికి ఒక్కటి తక్కువ అని. నిర్దిష్ట సమాచారం అందుబాటులో లేనప్పటికీ ఈ ప్రాంతంలో రెండు కథలు మాత్రం బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
మొదటి కథ ప్రకారం శివుడు తన తోటి దేవి, దేవత, సహచర గణంతో కైలాస శిఖరం నుండి కాశీ వెళ్లే మార్గంలో ప్రయాణిస్తూ సాయంత్రం అవ్వడం చేత సేద తీరడానికి ఈ ప్రాంతం ఎంచుకుంటారు. అందర్నీ సూర్యోదయం పూర్వమే తిరిగి కాశీ ప్రయాణానికి సన్నద్ధంగా ఉండాలని ఆదేశిస్తాడు. సూర్యోదయ సమయం వరకు ఒక్క శివుడు తప్ప మిగతా దేవతా గణాలు ఇంకా నిద్రలో ఉండటం గమనించి వాళ్ళందరినీ శిలారూపాలుగా మారిపొండని శపిస్తాడు. ఈ కారణం చేతనే ఈ ప్రాంతంలో 99,99,999 దేవి, దేవత, గణాలు, వారి వాహనాలు శిల్పాలుగా మారిపోయారనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది.

ఇంకో కథ ప్రకారం విశ్వకర్మ కుమారుడైన కల్హ కుమార్ అనే శిల్పి బొందితో కైలాసం చేరాలని పార్వతీ- పరమేశ్వరుల కోసం తపస్సు చేయగా పార్వతి అతన్ని వారించి బొందితో కైలాసం చేరడం అసంభవం అని చెప్పినా పట్టు విడవకపోవడంతో అతన్ని ఒకే రాత్రి సూర్యోదయం లోపు ఒక కోటి శిలా ప్రతిమలు చెక్కమని ఆదేశించడం మూలాన ఆ శిల్పి 99,99,999 శిల్పాలు చెక్కి చివరిది చెక్కే సమయంలో సూర్యోదయం అవ్వడం చేత ఆ ప్రాంతంలో ఒకటి తక్కువ కోటి శిల్పాలు ఉన్నట్లు ప్రతీతి. నిర్దిష్టంగా ఆధారాలు లేనప్పటికీ చరిత్రకారులు ఈ శిల్పాలు 6 నుండి 9 దశాబ్దంలోపు చెక్కబడి ఉండొచ్చని అంచనా వేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రాంతం అంతా కలియతిరిగి అందుబాటులో ఉన్న అన్ని శిల్పాల వద్ద ఫోటోలు దిగి ఈ ఒక్క ఊనకోటి కోసం అయినా మళ్లీ ఈ ప్రాంతం రావాలనే కోరికతో అగర్తలా చేరడానికి ప్రయాణం మొదలెట్టాం. నాలుగు గంటలు దట్టమైన అడవుల గుండా చిన్నచిన్న లోయల గుండా ప్రయాణించి అగర్తలా చేరుకొని ప్రయాణ బడలికతో ఉనకోటి శిల్పాలు స్మరించుకుంటూ నిద్రలోకి జారుకున్నాం. లోయల గుండా ప్రయాణించి అగర్తలా చేరుకొని ప్రయాణ బడలికతో ఉనకోటి శిల్పాలు స్మరించుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.
ఆ మరుసటి రోజు ఉదయం త్రిపుర పర్యాటక రాజధాని అయిన ఉదయపూర్ చేరుకున్నాం ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నప్పటికీ 51వ శక్తి పీఠాలలో ఒక్కటైన మాతాబరి త్రిపుర సుందరి ఆలయానికి చేరుకొని దర్శించుకున్నాం. 1501 వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో పరిశీలిస్తున్న మాణిక్య డేబర్మ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు. ఈ ఆలయం ప్రక్కనే కళ్యాణ్ సాగర్ అనే ఒక పెద్ద సరస్సు ఉంది. ఈ ప్రాంతంలో అనేక సరస్సులు ఉండటం చేత ఈ నగరాన్ని సరస్సుల నగరంగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ ఇంకా చాలా ఆలయాలు ఉన్నప్పటికీ సమయం లేకపోవడంతో తదుపరి పర్యాటక ప్రాంతమైన చాభిమురా కి వెళ్లిపోయాం.
ఆ తదుపరి మేము చూడాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన ప్రాంతం చాభిముర. ఈ చాభిముర మాత్రం మా జీవితాల్లో ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుంచుకునేలా నిలిచిపోయింది. ప్రఖ్యాతి వహించిన జలపాతాల్లోకి వెళ్తున్నా, నదుల్లో విహారయాత్రకు వెళ్తున్నా, సముద్ర ప్రాంతంలోని బీచ్లకు వెళ్తున్నా ఇక్కడి నదిలోని విహారయాత్రనుభవం మరి మరి గుర్తుకు వస్తుంటుంది.
చాభిమురా ను అమెజాన్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా గా కూడా పరిగణిస్తారు యాత్రికులు. ఎందుకంటే బ్రెజిల్ లోని అమెజాన్ ఫారెస్ట్ గురించి సాహస యాత్రికులకు అందరికీ సుపరిచితం. నది రెండు వైపులా ఆకాశం హద్దుగా sand స్టోన్ తో తయారైన గుట్టలు, వాటి పైన గల పెద్ద నిడివి గల శిల్పాలు, ఎంతో ఎత్తైన చెట్లు, మధ్యలో నిరంతరంగా ప్రవహించే 95 కిలోమీటర్ల గోమతి నది అందమైన ప్రకృతి దృశ్యాలు, యాత్రికుల మనసులను కట్టిపడేసేలా ఉంటాయి. అందువల్లనే ఈ ప్రాంతం గురించి తెలిసిన ప్రతి యాత్రికుడికి ఇది గమ్యస్థానం.(photo 3)
మా టూర్ షెడ్యూల్ ప్రకారం చాభిముర చేరవలసిన నిర్ణీత సమయం కంటే ఆలస్యం అవ్వడం మూలాన, దట్టమైన అడవి ప్రాంతం వల్ల అనుకోని వర్షం కారణంగా ఇంకా కొంత సమయం ఆలస్యం అయ్యింది. ఆలస్యం అవ్వడం మూలాన ఇంకా పెరిగిన ప్రయాణికుల వల్ల ఇంకా కొంత ఆలస్యంగా మా యాత్రికులతో మర పడవల ప్రయాణం కేరింతలతో ఆరంభమైంది.
దట్టమైన అడవి, ఇరువైపులా ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలా రావాలతో ఆ పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. కొంత దూరం ప్రయాణించాక నదికి ఒక వైపు ఉన్న గుట్టపైన అరుదైన శిల్పాలు రాతితో చక్కబడటం చూసి మేమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. శివ కళ్యాణం కు సంబంధించిన భరాత్ పోలికలతో కొన్ని శిల్పాలు ఒకచోట, ఇంకో ప్రాంతంలో వైష్ణవి మాత, మధ్య భాగంలో ఇరువైపులా గణపతి, కార్తికేయుడు పైన శివుడు, కింద భాగంలో విష్ణు పోలిన ఆకారంలో రాతిపై చెక్కిన శిల్పాలు మమ్మల్ని అబ్బురపరిచాయి. నిర్దిష్టంగా వీటి ఆధారాలు ఎప్పుడు చెక్కబడ్డావో అనే విషయం మాత్రం తెలవదు. కానీ ఈ శిల్పాలను బట్టి పంచ దేవతల ఉపాసన అనేది అప్పటికే ప్రాచుర్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. (Photo 4)
ఇంకా అలానే కొంత దూరం ప్రయాణించాక దాదాపు 2 అడుగుల నిడివి గల మహిషాసుర మర్దిని రూపంలో పెద్ద రాతిపై చెక్కబడ్డ శిల్పం అబ్బుర పరుస్తుంది. వీటికి సంబంధించిన చిత్రాలను కెమెరాల్లో బంధించి ఇంకా అలానే ముందుకు సాగాం.

ఇంకా కొన్ని కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మేం వెళ్లాల్సిన గమ్యం రానే వచ్చింది. తీర ప్రాంతంలో బోటుకు లంగర్ వేసాక మెల్ల మెల్లగా ఒకరి తర్వాత ఒకరం బోటు దిగి ఇరుకైన ప్రదేశం గుండా ముందుకు సాగాం. సూర్యకిరణాలు కూడా సోకనంతగా దట్టమైన అడవి, గుట్టల పైనుండి జాలువారి జలపాతాలు, వాటి తుంపర్లు మా మీద పడుతుంటే అనిర్వచనీయమైన అనుభూతితో ఇంకా ముందుకు సాగాం. జలపాతాల ద్వారా వచ్చే నీటిని మళ్లించేందుకు మెట్ల రూపంలో నిర్మించిన ప్రాంతం ద్వారా నీరు జలజలా పారుతుంటే మధ్యనుండి నీరు ప్రవాహంలో ముందుకు వచ్చి గోమతి నదిలో కలుస్తుంది. రెండు వైపులా కేవలం ఒక్కరు మాత్రమే నడవగలిగేలా అవకాశం ఉన్న స్థలం గుండా ఒకరి తర్వాత ఒకరం అతి కష్టంగా గుట్ట పైన ఉన్న గుహల్లోకి వెళ్ళాం.
ఎంతో ఇరుకుగా ఉండి స్వర్గానికి రహదారి గా పరిగణిస్తున్న ఈ రెండు గుహలు చూడడానికి, ప్రకృతిలో మమేకమై పరవశించడానికి నిర్దేశించబడిందే ఈ సాహస యాత్ర.
గుహలోకి ఒక్కొక్కరు వెళ్లడం, సరిపోను గాలి లేకపోవడం మూలాన కొన్ని క్షణాల్లో బయటకు రావడం యాంత్రికంగా జరిగిపోయాయి. ( Photo 5)
స్థానికంగా వీటికి స్వర్గలోకంలోకి ప్రవేశ ద్వారాలైన దేవతా గుహలుగా వర్ణిస్తారు.
అందమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాం. ప్రకృతిలో పరవశిస్తూ ఉండటం మూలాన కేటాయించిన నిర్దిష్ట సమయం కంటే ఇంకా ఎక్కువ సమయం ఆ ప్రాంతంలో గడపటం జరిగింది. మెల్లమెల్లగా చుట్టూ చీకట్లు అలుముకోవడం, అడవి ప్రాంతం అవ్వడం మూలాన ఇంకా తొందరగా ఆ ప్రాంతమంతా సూర్యాస్తమయ ఛాయలు అలుముకున్నాయి.
సెల్ ఫోన్ టార్చ్ ద్వారా గుహలోకి ప్రవేశించి, కెమెరాల్లో గుహల చిత్రాలను బంధించి సెల్ఫీలు తీసుకొని ఒక్కొక్కరం వచ్చి బోటులో మా స్థానాల్లో కూర్చున్నాం.
సమయపాలనను నిర్దిష్టంగా పాటించకపోవడం మూలాన వచ్చే ఇబ్బందులు మాకు తప్పలేదు. చుట్టూ దట్టమైన అడవి మూలాన ఆ ప్రాంతం అంతా త్వరత్వరగా చీకట్లు అలుముకుంటున్నాయి. బోటులోని ప్రయాణికులందరూ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ ప్రాంతం నుండి నిష్క్రమించి తిరిగి గమ్యం చేరాలనే ఆత్రుత ప్రతి ఒక్కరి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించ సాగింది. మా మర పడవ సారంగి బోటు లంగర్ విప్పి తిరుగు ప్రయాణానికి కోసం నది మధ్యకు బోటును తీసుకువచ్చాడు. అప్పటికే మా బోటుతో పాటు వచ్చిన ఇతర పడవలన్నీ వెళ్ళిపోయాయి మాదే చివరిది. నది మధ్యలోకి తీసుకువచ్చిన మా మర పడవ సెల్ఫ్ మోటార్ పనిచేయకపోవడం మూలాన ఎంతకీ స్టార్ట్ అవ్వడం లేదు. యాంత్రిక లోపమో, మరి ఏ ఇతర కారణమో తెలియదు.
ఎంత ప్రయత్నించిన పడవ స్టార్ట్ అవ్వకపోవడం మూలాన అందరి మనస్సు లోనూ ఒకింత భయం, ఉద్విజ్ఞత మొదలైంది. ఎంతో ఉత్సాహంగా, నవ్వులతో, కేరింతలతో ఆహ్లాదకరంగా గడిచిన సమయం కొద్ది నిమిషాల్లోనే ఏదో తెలియని భయం, అభద్రత మనసుల్లో మెదలడం మొదలయింది. శరీరం అలసిపోవడం, తెచ్చుకున్న తినుబండారాలు, నీళ్లు పూర్తిగా అయి పోవడం, సెల్ ఫోన్స్ కూడా చార్జ్ పూర్తిగా అయిపోవడం మూలాన సెల్ ఫోన్ లైట్స్ కూడా రావడం లేదు. ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్స్ లేకపోవడం మూలాన సిగ్నల్స్ కూడా లేవు. మర పడవల్లో ఉండాల్సిన వాకి టాకీ కూడా లేకపోవడంతో ప్రతి ఒక్కరూ పైకి గంభీరంగా ఉన్నా అంతర్లీనంగా అభద్రతలో క్షణం ఒక యుగంగా అనిపించి ఎంత తొందరగా ఈ ప్రాంతం వదిలి వెళ్లామా అనే ఆత్రుత అందరిలోను మొదలైంది. దీనికి తోడు గోమతి నదీ ప్రవాహం మూలాన మా మర పడవ మెల్లమెల్లగా తిరోగమన దిశలో వెనుకకు ప్రయాణిస్తున్న విషయం గమనించాం. ఇదే సమయంలో లైఫ్ జాకెట్స్ విప్పి నింపాదిగా వున్నా ప్రయాణికులు ఒక్కొక్కరు లైఫ్ జాకెట్ బటన్స్ టైట్ చేసుకోవడం కూడా యాంత్రికంగా జరిగిపోయింది. అందరం నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. మనసుల్లో మాత్రం అందరం దేవుని ప్రార్థిస్తూ ఎంత తొందరగా ఈ ప్రాంతం వదిలి భద్రత గల ప్రాంతానికి వెళ్లిపోవాలనే సంకల్పంతో నిమిష నిమిషానికి అందరిలోను ఉచ్చుకథ, ఉత్కంఠ మనసులో పరిపరి విధాల ఆలోచనలతో ఎంత సమయం గడిపామో మాకే గుర్తులేదు.
ఆ సమయంలో కొద్ది దూరంలో మా కోసం ఒక కాళీ మర బోటు రావడం గమనించి అందరం మా ప్రార్థనలు ఫలించాయని సంతోషపడ్డాం. గుహ గమ్యస్థానంగా వెళ్లే ప్రతి బోటు నిర్దిష్ట సమయానికంటే రెండు గంటల వరకు తిరిగి గమ్యం చేరకపోతే దానికి ఏదో ఆపద సంభవించిందని ఒక రెస్క్యూ బోట్ ని పంపించే నియమం ఉందట ఆ బోట్లు నడిపే యాజమాన్యానికి ఆ రెస్క్యూ బోటు లో తెచ్చినా తాళ్లతో మా మర పడవకి తాళ్లతో కట్టి మమ్మల్ని కొంత సమయానికి గమ్యస్థానానికి చేర్చింది. రెస్క్యూ బోటు రాకపోతే మా పడవ అలానే వెనక్కి ప్రయాణించి బంగ్లాదేశ్ జల్లాలోకి ప్రయాణించి, అలాగే బంగ్లాదేశ్ కూడా చూసి వచ్చేవాళ్ళం అంటు అందరం తెలికైనా హృదయాలతో కబుర్ల లోకి వెళ్లిపోయాం.
చాభిమురా నుండి మా ప్రయాణం మా తదుపరి గమ్యస్థానం అయినా డంబుర్ లేక్ కి బయలుదేరాం. డంబుర్ చెరువు అతి పెద్ద చెరువు దీని వైశాల్యం 41 స్క్వేర్ కిలోమీటర్ వుండి చుట్టుపక్కల ఎత్తైన గుట్టలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ చెరువు మధ్యలో నారల్ కుంజ్ అనే ఒక ద్వీపకల్పం అందులో నూతనంగా నిర్మించాబడ్డ అధునాతనమైనా కుటీరాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. (photo 6)
ఆ ప్రాంతం అంతా కొబ్బరి తోటల తో నిండి ఉండి సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఎంతో ఆకర్షవంతంగా ఉండి . అనేక వాటర్ క్రీడాలకి ముఖ్య కేంద్రంగా యాత్రికులను ఆకర్షిస్తున్నది.
గోమతి నదీ ప్రాంతంలో ఈ హైడల్ ప్రాజెక్టు నిర్మించడం చేత క్రిందికి దుమికే జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది. సరైన దారి లేకపోవడం, సమయం లేకపోవడం వల్ల ఆకర్షణీయమైన జలపాతం వైపు వెళ్లలేకపోయాం.
సాటిలైట్ ఇమేజ్ లో డంబుర్ లేక్ డమరుకం ఆకారంలో ఉండటం చేత దీనికి డంబుర్ లేక్ అనే పేరు స్థిరపడిందని చెప్పుకుంటారు. ఆరోజు జరిగిన యాత్ర విశేషాలను చర్చించుకుంటూ బాగా అలసిపోవడం చేత నిద్రలోకి జారుకున్నాం.
ఆ మరుసటి రోజు ఉదయం సూర్యోదయం పూర్వమే లేచి అందరం ఆ లేక్ పరిసరాల్లోకి వెళ్లి సూర్యోదయ సమయాన్ని మా కెమెరాల్లో బంధించి ఆ లేక్ పరిసరాల్లో జరుగుతున్న వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేసాం. ఇంకా కొంతమంది స్కూబా డైవింగ్, బోటింగ్, పెడ్లింగ్ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుండి ఆ
తదుపరి విహార ప్రాంతమైన మేలాఘర్ ప్రాంతానికి చేరాం. మేలాఘర్ నే నీర్ మహల్ అని కూడా అంటారు.

నీర్ మహల్ ఈశాన్య భారతదేశంలోనే ఒక గొప్ప నీటిపై తేలియాడుతూ ఉండే నీటి ప్యాలెస్. రుద్ర సాగర్ చెరువు మధ్య భాగంలో నిర్మింపబడ్డ ఈ లేక్ లో దాదాపు 24 పెద్ద పెద్ద గదులతో నిర్మించబడిన అందమైన ప్యాలెస్ లాంటి గృహం దీన్ని 1930 ప్రాంతంలో రాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య చేత నిర్మింపబడిన ఈ ప్యాలెస్ నిర్మాణానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టింది. మేళాఘార్ ప్రాంతం నుండి రుద్ర సాగర్ లేక్ లో పడవలో ప్రయాణించి ఈ నీర్ మహల్ ప్యాలెస్ కి చేరుకొని ఆ ప్రాంతంలో అన్ని ప్రదేశాల్లో ఫోటోలు తీసుకున్నాం. దాదాపు 5.3 sq కిలోమీటర్లు ఉన్న ఈ రుద్ర సాగర్ చెరువులోకి రకరకాల పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ ప్రాంతమంతా తామర పూలతో నిండి ఉన్నప్పటికీ సరైన పోషణ లేకపోవడం వల్ల గుర్రపు డెక్క తో పాటు వివిధ పిచ్చి మొక్కలు పెరిగి కొంత అసౌకర్యం కల్పించినప్పటికీ ఒక అద్భుత యాత్ర ప్రదేశంగా ఎంతో మంది యాత్రికులను ఆకర్షిస్తున్నది.
కొంత సమయం ఇక్కడ గడిపి అక్కడికి సమీపంలోనే బంగ్లాదేశ్ బోర్డర్ ప్రాంతంలోని ప్రఖ్యాత కాళీమాత ఆలయం దర్శించుకుని అక్కడి నుండి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సెఫహిజాల వన్యమృగాల ప్రాంతంలోకి వెళ్లి వివిధ వన్యమృగాలు దర్శించి తిరిగి రాత్రి 12 గంటల ప్రాంతంలో అగర్తలా చేరడం జరిగింది. తిరుగు ప్రయాణంలో మాతోపాటు ప్రయాణిస్తున్న ఒక ఇన్నోవా కి యాక్సిడెంట్ అవ్వడం మూలాన ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ నిర్ణీత సమయం కంటే చాలా ఆలస్యంగా అగర్తలా తిరిగి చేరుకోవడం జరిగింది.
ఆ తదుపరి రోజు చివరి రోజు అయిన ఆ రోజు అగర్తలాలోని లోకల్ మ్యూజియం మరియు ఉజంతా ప్యాలెస్ మరియు చాతుర్ దశ దేవత టెంపుల్ దర్శించుకుని అక్కడకి సమీపంలోని బంగ్లాదేశ్ బార్డర్ వరకు వెళ్లి బంగ్లాదేశ్ నుండి ఇండియాకు వచ్చే యాత్రికులను, ఇండియా నుండి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయాణికులతో కాసేపు ముచ్చటించి ఆ తదుపరి లోకల్ మార్కెట్ లో షాపింగ్ చేసి మా విశ్రాంతి గృహాలకు వచ్చి ఆ మరుసటి రోజు ప్రయాణించి హైదరాబాద్ చేరాం. (photo 7)

త్రిపుర ప్రాంతం లో ముఖ్యంగా ఉనకోటి, చాభిమురా, మరియు డంబుర్ చూడ్డానికి కోసం ఇంకో మారైన వెళ్లాలని అనిపిస్తుంది. ఇదే కాకుండా ఈ ప్రాంతం 100 అడుగుల ఎత్తు నుండి 3 వేల అడుగుల ఎత్తు వరకు ఉండే ఈ ప్రాంతాలను చూస్తే ప్రపంచ వింతల్లో ఒకటైన మచుపిచు లోని ప్రాంతాలు గుర్తుకు వస్తాయి. త్రిపురను ఇండియా మచ్చుపిచ్చు అని పిలవడానికి సరైన పోలికలు ఉన్నట్టుగా అనిపిస్తాయి.
చాభిమురా ప్రాంతం కూడా దాదాపు అమెజాన్ నదిని పోలి రెండు వైపులా ఆకాశాన్ని అంటే చెట్లతో నిండి ఉండటం వల్ల ఇండియన్ అమెజాన్ అనే పేర్లు పోలికకు సరితూగేలాగే ఉంది. ఈ ప్రాంతం అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మా జీవితంలో ఈ త్రిపుర విహారయాత్ర ఒక అద్భుతమైన సాహస యాత్రగా మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనోగతం

by Akkinepalli Venugopal Rao May 22, 2024
written by Akkinepalli Venugopal Rao

చెట్టును నరుకుట మానుడి
మట్టున బెట్టేను మనిషి మనుగడనెల్లన్
ఉట్టికి ఎక్కును వర్షము
అట్టడుగునచేరుజలముఆగముబ్రతుకే !
త్రాగగ దొరకదు నీరును
బాగుగయోచించ,సాగుబడియునుచేయన్
నాగలి పట్టుట కలయగు
ఆగతి దరిజేరురోజులతిదగ్గరలో !!
వృక్షము నరికిన పాపము
లక్షణముగతోచుచుండె లహరుల వోలెన్
శిక్షయె పడెనిక మనుజుల
కుక్షికికరువౌచునుండెకూడుయు,నీరున్!
[09:00, 5/6/2024] Niharini: ఉద్యమము వోలె జనులిక
బాధ్యతతో చెట్లు నాట పంతము తోడన్
సాధ్యమదవ్వును జూడగ
సేద్యమ్ములుపెరుగులోకశ్రేయముమెరుగౌ!
పక్క రాష్ట్రమందు పానీయములులేక
పల్కు చుండ్రి వలస బాట మాట
ముంచుకొచ్చు నీటి ముప్పది తప్పంగ
తెరువ వలయు కళ్ళు తెలుగు నాట !!

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

మంచి సాహిత్యం రావాలి

by Aruna Dhulipala May 22, 2024
written by Aruna Dhulipala

– గన్నమరాజు గిరిజా మనోహర బాబు

సాహితీ విరించి బిరుదాంకితులు సుప్రసిద్ధ కవి, రచయిత, వ్యాఖ్యాత గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారితో మయూఖ ముఖాముఖి……. అరుణ ధూళిపాళ

నమస్కారం సార్ 🙏కవిగా, రచయితగా సాహిత్య రంగంలో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాక రంగస్థల నటులుగా అలరిస్తూ మీ ఆధ్యాత్మిక ప్రసంగాలతో భక్తి తత్పరతను చాటుతున్న మిమ్మల్ని కలుసుకొని మా పాఠకులకు పరిచయం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
  నమస్కారమమ్మా ! మన ప్రశ్నోత్తరాల కార్యక్రమం కంటే ముందుగా మయూఖ పత్రిక గురించి నా అభిప్రాయాన్ని చెబుతాను.
అలాగే సార్..అంతకంటేనా..చెప్పండి.

         మయూఖ ద్వైమాసిక పత్రికను డా. కొండపల్లి నీహారిణి గారు ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అంతర్జాలంలో ఉపయోగించుకునే కొద్దీ, కొత్త కొత్త విజ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ మార్గంలో రెండునెలల కొక్కసారైనా తెలుగు సాహిత్యాన్ని గురించి, తెలుగు సాహిత్యంలో చాలా పరిశోధన చేసిన ఎంతో మందిని గురించి వాళ్ళ సృజనాత్మక దృష్టిని గురించి చెప్పేటటువంటి గొప్ప పత్రికను స్థాపించారు. పైగా ఆమె ఒద్దిరాజు సోదరుల పైన పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టాను పొందారు. అసాధారణ మేధాసంపన్నులై, ఆనాటికే సాంకేతిక విజ్ఞానాన్ని కూడా వాళ్ళు అద్భుతంగా లోకానికి అందించిన వాళ్ళు. ఒద్దిరాజు సోదరుల గురించి మేము వరంగల్లులో చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. వారి యొక్క మేధకు వారసురాలిగా నీహారిణి గారు ఈ పత్రికను నిర్వహిస్తున్నారేమో అనిపిస్తుంది.

మా పత్రిక నిర్వహణ పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు సార్.

1. మీ జననం, బాల్యానికి సంబంధించిన వివరాలు చెప్పండి. జ : అప్పటి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన ఆలంపూర్ లో గన్నమరాజు రామేశ్వర రావు, శకుంతలమ్మ దంపతులకు నేను మూడవ కుమారునిగా జన్మించాను. చిన్నతనం నుండే మా నాన్నగారు నాకు వందల శ్లోకాలను, పద్యాలను నేర్పించారు. వాటి గురించి నిత్యం ఆలోచింపజేస్తూ నన్ను ఒక విధంగా సాహిత్య రంగంలోకి మొదటి అడుగు వేయించిన గురువు. అదే సమయంలో ఆలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో సంస్కృత పాఠశాలను పెట్టడం జరిగింది. పంతంగి వెంకటేశ్వర శాస్త్రి గారు, నరసింహ ఘనాపాఠి అవధాని గారు, మామిడాల సీతారామ శాస్త్రిగారు మొదలైన పెద్దలు పాఠ్యాంశాలు బోధించేవారు. దాంట్లో నన్ను ప్రవేశ పెట్టారు. అక్కడ మేము అమరకోశము, శబ్దమంజరి, పంచకావ్యాలు, అష్టాధ్యాయి, కొంతవరకు వేద పాఠాలు చదువుకున్నాం. నాలుగు సంవత్సరాలు నిరాఘాటంగా సాగిపోయింది. అప్పటికే 90 మందిమి ఉన్నాము. ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు అక్కడికి వచ్చేవారు. ఒకవిధంగా అది గురుకుల పాఠశాల. అక్కడే నాకు గట్టి పునాది పడింది. కారణాంతరాల వల్ల అది మూతపడింది.

2. మరి మీ సాధారణ విద్యాభ్యాసం ఎలా కొనసాగించ గలిగారు?
జ : ఆ పాఠశాల మూతబడిన తరువాత సాధారణ విద్యలోకి వచ్చి 6, 7 తరగతులు, హెచ్ ఎస్ సి పూర్తి చేశాను. క్రమంగా నేను పి యు సి లో చేరకుండా అదే మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో ఉన్నటువంటి శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అడుగు పెట్టాను. అక్కడ చాలా అద్భుతమైనటువంటి విద్యా విధానం ఉండేది. ప్రిన్సిపాల్ తెలకపల్లి విశ్వనాథం గారు, డా. శ్రీ రంగాచార్యగారు, వింజమూరి శేషఫణి శర్మగారు, ములుకుట్ల రామకృష్ణ శాస్త్రి గారు, మాకు చిన్నప్పుడు అష్టాధ్యాయి బోధించిన సీతారామ శర్మ గారు వీళ్లంతా లెక్చరర్లుగా ఉండడం వల్ల అక్కడి విద్యావిధానంతో సాహిత్యరంగంలో పురోగమనం వైపు నేను ముందడుగు వేయడం జరిగింది. అంతేకాదు నేను మరిచిపోయాననుకున్న సంస్కృత పరిజ్ఞానం కొంతవరకు అక్కడ బాగా ఉపయోగపడింది. అదొక భూమికగా నేను మర్చిపోలేనటువంటి జీవితాన్ని ఇచ్చింది. నేను మధ్యలో ఐదేళ్లు చదవకపోయినా దాంట్లో ఉన్న అనేక విషయాల నిరంతర మననం వల్ల నేను ప్రవేశించిన సాహిత్యరంగంలో బాగా తోడ్పడ్డాయి. గురువుల వాత్సల్యం, బోధన వల్ల విశ్వవిద్యాలయంలో ప్రథమునిగా రావడం ఒక గొప్ప విజయంగా భావించాను

3. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీ గురువుల గురించి చెప్పండి.
జ :  పాలెంలో డిగ్రీ వరకు చదివాక నాకంటే ముందు కసిరెడ్డి వెంకటరెడ్డిగారు మొదలైన సీనియర్లు ఉండడం, వారిని ఆదర్శంగా తీసుకోవడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించడానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన తరువాత దివాకర్ల వేంకటావధాని గారు బాల, ప్రౌఢ వ్యాకరణాలు, అప్ప కవీయం వంటి వ్యాకరణ గ్రంథాలు బోధించారు. అసలు  మేము బాల వ్యాకరణం చదివామన్న భావన లేదు. వ్యాకరణాన్ని కూడా కావ్యంగా చెప్పిన గొప్ప మేధావి ఆయన. ఒక ప్రయోగం వస్తే అవధానిగారు దాన్ని ఏఏ కవులు ఎట్లా ప్రయోగించారో ఆ పద్యాలు చెప్పేవారు. దానివల్ల సమగ్ర విషయాలను తెలుసుకున్నాం. ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ప్రత్యేకంగా పద్యభాగం బోధించేవారు. ముఖ్యంగా శ్రీనాథుని శృంగార నైషథం, చేమకూర వేంకట కవి విజయ విలాసం గొప్పగా బోధించి పద్యాన్ని ఏ విధంగా మనం అవగాహన చేసుకోవాలో ఒక సమగ్రమైన దృష్టిని నాకు ప్రసాదించారు. “ప్రతి పద్య రచనా   చమత్కృతి కలుగంగ చెప్పనేర్తు” అని విజయ విలాస కర్త చెప్పుకున్నాడు. ఆయన గురించి చెప్పినపుడు ప్రతి పద్యంలో ఎలాంటి చమత్కృతి ఉందో చెప్పేవారు. అక్కడే మాకు యశోదారెడ్డి గారు, ఆచార్య నాయని కృష్ణకుమారి గారు, డా. పల్లా దుర్గయ్య గారు వీళ్ళు మాకు బోధకులుగా ఉండి సరియైన మార్గాన్ని చూపించారు. మేము రెండవ సంవత్సరం ఎమ్ ఏ చేసేసరికి అవధానిగారు పదవీ విరమణ చేయడం వల్ల ఆచార్య రామరాజు గారు వచ్చారు. వారు మమ్మల్ని కొన్ని ప్రాంతాలకు  తీసుకొనిపోయి ప్రసంగాలు ఇప్పించి ప్రసంగాలలో ఒక విధమైన శిక్షణ ఇచ్చారు. దీంట్లో ఒక చిన్న నేపథ్యం ఉంది. పాలెం కళాశాలలో ఉన్నప్పుడు “తెలుగులో నాకు నచ్చిన కావ్యం” అనే టాపిక్ లో ప్రతీ శనివారం ప్రతీ విద్యార్థి వక్తగా మాట్లాడే నియమం ఉండేది. నాలుగు సంవత్సరాలు అట్లా మాట్లాడేసరికి సభల్లో మాట్లాడడం, ఒక విషయాన్ని ఏ విధంగా విశ్లేషించాలి? శ్రోతల కెట్లా అర్థం కావాలి? ఈ విషయాల్లో మాకు తెలియకుండానే అవగాహన వచ్చింది. ఇక్కడ రామరాజు గారు ప్రత్యేకంగా నన్ను కామారెడ్డి మొదలగు చోట్లకు తీసుకు వెళ్లారు. వారితో పాటు కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మొదట సభల్లో పాల్గొనే మంచి సంప్రదాయంగా, తరువాత మాట్లాడే శక్తి మొదలగు విషయాలను నాకు బోధించినట్లయింది.

4. ఇంతటి సాహితీవేత్త అయిన మీరు పి హెచ్ డి ఎందుకు చేయలేదు?
జ: ముందుగా నేను సంస్కృతం చేశానమ్మా. తర్వాత ఎమర్జెన్సీ రావడం వల్ల దాదాపు 5, 6 నెలలు ప్రభుత్వం నిర్బంధించడం జైలు నుండి వచ్చాక ఉద్యోగంలో చేరడం వీటివల్ల ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. ఉస్మానియాలో ఉన్నప్పుడు వివిధ ప్రాంతాలకు వెళుతుండే వాళ్ళం అని చెప్పాను కదా! అందువల్ల నా పరిధి పెరిగింది. ప్రసంగించే అవకాశాలు ఎక్కువగా రావడం, దానిమీద ఆసక్తి మరింత పెరగడంతో పరిశోధన పక్కకు పోయింది. ప్రతిరోజూ ఏదో ఒక ఊరికి వెళ్లడం, ఎక్కడో ఒకచోట ప్రసంగాలకు పిలవడం, ప్రసంగాలు చేయడం పరిపాటి అయింది. ఇప్పటిదాకా పదిహేను వందల ప్రసంగాలు చేసి ఉంటాను. అప్పటికీ రామరాజు గారు మందలిస్తూనే ఉన్నారు. కానీ దాని మీద దృష్టి పోలేదు. అది అక్కడికే ఆగిపోయింది (నవ్వుతూ).

5. మీరు కారాగార శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయి?
జ : దేశమంతటా ఎమర్జెన్సీ విధింపబడిన రోజులవి. అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం మొదలైంది. మేము విద్యార్థులం ఆ ఉద్యమానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహించాం. అరెస్ట్ వారెంట్ జారీ చేసి ముషీరాబాద్ జైలులో పెట్టారు. కొన్నాళ్ళు గడిచింది. మామీద ఏవో కేసులు పెట్టారు. ఆ కేసులు నిలబడలేదు. కాబట్టి మేమంతా బయటకు వచ్చాం. అయితే విశేషమేమిటంటే దాదాపు ఐదారు వందల మందిమి ఇవే భావాలున్నవాళ్ళం ఉన్నాం. అప్పటికే చాలా మందిని జైళ్లల్లో పెట్టారు. కొంతమందిని ‘MISA’ (Maintenance of Internal Security Act)  కింద అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని ‘DIR’ (Defence of India Rules act) కింద అరెస్ట్ చేశారు. మేము డి ఐ ఆర్ కింద అరెస్ట్ అయినవాళ్ళం. మీసా కింద అరెస్ట్ అయిన వాళ్లకు సౌకర్యాలు ఎక్కువుంటాయి. కేసులు ఉండవు. మేమేవో పాంప్లెట్లు పంచి పెడుతున్నామని కేసు పెట్టారు. అయితే అది ప్రూవ్ కాలేదు. దాదాపు 5 నెలలు జైలులో ఉండి బయటకు వచ్చేసాం. ఆగస్ట్ 15 నుండి జనవరి 26 వరకు రోజూ సత్యాగ్రహాలు జరగాలని కమిటీ వాళ్ళు ప్రణాళిక వేశారు. జయప్రకాష్ నారాయణ ఉద్యమంతో పాటు ఆర్ ఎస్ ఎస్, విశ్వ హిందూ పరిషత్, విద్యార్థి పరిషత్ అందరమూ ఉన్నాం దాంట్లో. రోజుకు పదిమంది ఎక్కడో ఒకచోట సత్యాగ్రహం చేయాలి. అందులో ఒక్కరికి తప్ప మిగిలిన వారికి కూడా ఎక్కడ జరుగుతుందో తెలియకూడదు. ఏదో విధంగా సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవారు. అయితే నాకు కూడా మీరు ఫలానా చోట సత్యాగ్రహంలో పాల్గొనాలని సూచన వచ్చింది. కాకపోతే అంతకుముందే వేరే కేసులో నన్ను అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీ కావడం వలన ప్రశ్నించడానికి వీలు లేదు. కానీ ఎవరి మీదా కేసులు ప్రూవ్ కాలేదు. తర్వాత ఎలక్షన్స్ వచ్చి ప్రభుత్వం ఏర్పడింది. ఒక్కో బ్యాచ్ లో 120 మందిమి ఉండేవాళ్ళం. పెద్ద కాంపౌండ్ ఉండేది. అందరం అక్కడే కలిసి ఉండేవాళ్ళం. రాత్రి 7 గంటల తర్వాత లోపలికి వెళ్లేవాళ్ళం. మొదట రెండు, మూడు రోజులు భోజనానికి ఇబ్బందులు పడ్డాం.  తర్వాత అలవాటు పడ్డాం. అంతే తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.

6. మీ ఉద్యోగ ప్రస్థానాన్ని తెలపండి.
జ :  జైలు నుండి వచ్చాక 1978 జనవరిలో సత్తుపల్లి జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో మొట్టమొదటి సారి ఉద్యోగంలో చేరాను. అక్కడ రాళ్లబండి కవితా ప్రసాద్ నా స్టూడెంట్. అక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఆ కళాశాలలో దూర దూరప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పించేవారు. ఆ రోజుల్లో ప్రయివేటుగా బి.ఏ చేసే అవకాశం ఏ యూనివర్సిటీలోనూ లేదు. ఒక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు. అందువల్ల చదువు మానేసిన చాలామంది ఒంగోలు, మార్కాపురం, కంభం, ఖమ్మం, విజయవాడ, ఏలూరు మొదలగు ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారు. ఆ మొదటి బ్యాచ్ లో నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం బాగా ఉండేవి. నేనూ యువకుడినే కాబట్టి వయసు తారతమ్యం పెద్దగా లేకపోవడం వలన వారితో కలిసిపోయేవాడిని. వాళ్ళు చదువులో, నాటకాల్లో ముందుండి నడిచేవాళ్ళు. తర్వాత నాకు ఖమ్మం ట్రాన్స్ ఫర్ అయింది. అక్కడ ఆరు సంవత్సరాలు పనిచేసి, నేనే ప్రత్యేకంగా కోరుకొని వరంగల్ కు రావడం, అక్కడ మూడేళ్ళు పనిచేసి, చివరి అయిదేళ్ళు హనుమకొండకు వచ్చి అక్కడే కాకతీయ ప్రభుత్వ డిగ్రీ, పి.జి కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా 2009 లో పదవీ విరమణ చేయడం జరిగింది. ముప్ఫై మూడేళ్ళ ఉద్యోగ జీవితం నాది.

7. నాటకరంగంలో మీకు ఆసక్తి ఎలా కలిగింది?
జ : నాకు చిన్నతనం నుండే నాటకాల పట్ల అభిరుచి ఉండేది. హైస్కూలులో ఉన్నప్పుడు చిన్న చిన్న పాత్రలు వేయడం, ఏకపాత్రాభినయం చేయడం అలవాటు. పాలెం వచ్చాక నాటకరంగంలో మేము ప్రతీ సంవత్సరం జాతీయ జ్యోతి, వీరపాండ్య కట్ట బ్రహ్మన, అల్లూరి సీతారామరాజు, మహానటుడు మొదలైన అనేక నాటకాలు వేశాం. దీనిపట్ల అభిరుచి కలిగిన అధ్యాపకులు ఉన్నారక్కడ. రామకృష్ణ శాస్త్రిగారు, వింజమూరి శేషఫణి శర్మగారు దర్శకత్వం వహించి పెద్ద స్టేజీల మీద మాకు నాటకాలు ఎట్లా వేయాలో నేర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తరువాత ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. అవధాని మొదలైన వారు సాహిత్య రూపకాలు వేసేవారు. అవధాని గారు అల్లసాని పెద్దనగా, ఉత్పల సత్యనారాయణాచార్య గారు పింగళి సూరనగా, జి.వి. సుబ్రహ్మణ్యం గారు తెనాలి రామకృష్ణునిగా ఇట్లా ఉండేవారు. అది చూశాక ఇట్లాంటి రూపకం ఒకటి వేయాలనిపించింది. మా స్వగ్రామమైన ఆలంపురంలో ఇదే నాటకం వేశాము. మాకు ఆలంపురంలో గొప్ప అవకాశం గడియారం రామకృష్ణ శర్మగారు. మా ఇంటి పక్కనే మూడో ఇల్లు వారిది. మా ఊళ్ళో సంస్కృత పాఠశాల పెట్టడానికి వారే కారకులు. అప్పటికే వారు ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాద్ దానికి కార్యదర్శిగా ఉన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్నవారు. ‘భాగ్యనగర్ రేడియో’ అని అప్పట్లో నిజాం ప్రభుత్వ వ్యతిరేకంగా రేడియో స్టేషన్ నడిపారు. సామాజిక , సాంస్కృతిక సంస్కరణలు చేస్తున్న వ్యక్తి. ఆయనతో ఈ నాటక విషయం ప్రస్తావనకు వచ్చింది. మన ఊళ్ళోనే చేద్దాం అన్నారు ఆయన. ఆయన అల్లసాని పెద్దనగా, నేను తెనాలి రామకృష్ణుడుగా ఇంకా కొంతమంది మిత్రులతో కలిసి వేశాము. దానికి చాలా పెద్ద పేరు వచ్చింది. హైదరాబాద్ లో కూడా నాటకాల విషయంలో కొంత కృషి చేశాను. నేను సత్తుపల్లిలో పనిచేసినప్పుడు మా విద్యార్థుల్లో మంచి మంచి నటులు ఉండేవారు. వెంకటేశ్వర రావు అని ఇప్పుడు జడ్జీగా ఉన్నాడు. హనుమంతరావు అని ఖమ్మంలో ఉంటాడు. తరువాత కవితా ప్రసాద్. వీళ్ళతో రెగ్యులర్ గా నాటకాలు వేయించేవాడిని. నేను వరంగల్ కు వచ్చిన తర్వాత నాటకసంస్థను స్థాపించడం, ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయిలో నాటకాలు వేయడం, నాటకోత్సవాలు జరిపించడం చేస్తున్నాము. ఇప్పటికి 25 ఏళ్లుగా నడుపుతున్నాము. అట్లా సాహిత్య రంగంతో పాటు నాటకరంగం కూడా నా జీవితంలో భాగమయ్యాయి.

8. నాటకాల్లో మీకు నచ్చిన పాత్ర ఏది?
జ :  నాకు బాగా నచ్చిన పాత్ర అల్లూరి సీతారామరాజు. దాదాపు 40, 50 సార్లు వేసి ఉంటాను. దుర్యోధనుడు, రావణాసురుడి పాత్రలు వేయాలంటే నా రూపం సరిపోదు (గట్టిగా నవ్వుతూనే). కాకపోతే నేర్పించాను. బళ్ళారిలో “రాఘవ నాటక కళారంగం” అని ఉంది. అక్కడ ఇమ్మప్ప అని ఒక మంచి నటుడు ఉండేవాడు. ఆయన శారీరకంగా దృఢంగా ఉండడం వల్ల వీరపాండ్య కట్ట బ్రహ్మన, రావణాసురుడి పాత్రలకు చక్కగా సరిపోయేవాడు. రాయలసీమలో కోయిలకుంట్ల, సంజామల ఇట్లా ఎక్కడెక్కడో తిరిగి నాటకాలు వేశాం. అప్పుడు శరబండరాజు అని ఒకాయన మాయల ఫకీరు అద్భుతంగా వేసేవాడు. పాలెంలో నా క్లాస్ మేట్. వాళ్ళను నేను తయారుచేశాను. ఇప్పటికి కూడా ఆ అభిరుచి వేరే రకంగా కొనసాగుతోంది. సాహిత్య రూపకాల్లో అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, పోతన, భావకవి, ఒద్దిరాజు సీతారామారావు వంటి పాత్రలను ధరించాను. దాశరథి పాత్రను దాదాపు 60 సార్లు వేసి ఉంటాను. దాశరథి గారి పాత్రకు నేను చక్కగా సరిపోతానని గొల్లపూడి మారుతీరావు గారు ప్రశంసించేవారు.

9. సాహిత్యపు లోతుల్లోకి ఎలా ప్రవేశించగలిగారు?
జ : నా సాహితీ ప్రస్థానం ఆలంపూర్ పాఠశాల నుండి మొదలయిందని చెప్పాను కదా!  అప్పటివరకు సాహిత్యం అంటే ఊరకే చదివాను తప్ప పాలెంకు వచ్చేవరకు దాని విశ్వరూపం తెలియదు. పాలెంలో మా గురువు శ్రీరంగాచార్య గారింట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. వందలాది పుస్తకాలు ఉండేవి.  నాకు సీనియర్ విద్యార్ధులు కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, రుక్నొద్దీన్ గారు, మహమ్మద్ హుస్సేన్ గారు, నాగరాజు గారు, యాదగిరి గారు నిరంతరం ఆయన లైబ్రరీని చదివేవారు. వాళ్ళ స్ఫూర్తితో నేను కూడా సాహిత్యాన్ని చదవాలనే కోరికను పెంచుకున్నాను. అధ్యయనం అక్కడే జరిగింది. లోతుల్లోకి ప్రవేశించడం అక్కడే జరిగింది. కసిరెడ్డి గారి లాంటి సీనియర్లు వెళ్లిపోయిన తరువాత నేనింకా రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాను కాబట్టి ఎన్నో విషయాలను మా గురువు గారి నుండి నేర్చుకున్నాను. వాళ్ళింటికి ఎన్నో పత్రికలు వచ్చేవి. వాటిని పఠించడం ద్వారా సాహిత్యంలోకి ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం కలిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి రాకముందే దాదాపుగా ప్రసిద్ధమైన వ్యక్తులను గురించి కానీ, ప్రసిద్ధమైన కావ్యాలను గురించి కానీ తెలుసుకున్నాను. గురువు గారికి ఎంతో మంది సాహితీవేత్తలతో పరిచయం ఉండడం వల్ల నిడదవోలు వెంకటరావుగారు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు లాంటి పెద్దలను గురించి వినే అవకాశం కలిగింది. వాళ్ళ పరోక్ష పరిచయం కలిగింది.

గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారితో అరుణ ధూళిపాళ

10. పాలెం ప్రాచ్య కళాశాలలో ఇంతటి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన ఆ కళాశాలలో మిమ్మల్ని మీరు గర్వపడేలా చేసిన మరచిపోలేని అనుభవాన్ని తెలపండి.
జ : ఎంతోమంది సాహితీమూర్తుల పాండిత్యాన్ని ఆ కళాశాలలో తెలుసుకున్నానని ఇంతకు ముందే చెప్పాను కదా! అక్కడ ప్రతీ సంవత్సరం ఒక వక్తృత్వ పోటీ ఉండేది. దాని పేరు చాలా పెద్దదిగా ఉండేది. “వాద రంజిత వాగ్దేవతా వాగ్ధాటి నైపుణ్యాభివర్ధక సభలు” అనే పేరుతో పోటీలు నిర్వహించేవారు. అంటే ఏమిటంటే ఇరవై కిలోల ఒక సరస్వతీ విగ్రహం ఉండేది. రోలింగ్ షీల్డ్ అది. దానికి ‘సంచార వైజయంతికా’ అని మా ప్రిన్సిపాల్ తెలకపల్లి విశ్వనాథ శర్మగారు పేరు పెట్టారు. వివిధ కాలేజీల నుండి విద్యార్థులు పాల్గొనేవారు. ఎవరు మాట్లాడి పోటీలో నెగ్గుతారో వారి కాలేజీకి దాన్ని ఇస్తారు. శలాక రఘునాథ శర్మగారు దానికి ప్రథమ విజేత. రెండవ సంవత్సరం గౌతమీ విద్యాపీఠానికి అది దక్కింది. మూడవ సంవత్సరం నల్లగొండ గీతా విజ్ఞానాంధ్ర కళాశాలకు, నాల్గవ సంవత్సరం నల్లకుంట ఓరియెంటల్ కాలేజీకి వచ్చింది. ఇక ఐదవ సంవత్సరం నేను విజేతగా నిలిచి మా కళాశాలకు వచ్చింది. “మనం పెట్టిన తర్వాత ఇప్పుడే మనకు వచ్చిందిరా!” అంటూ మా ప్రిన్సిపాల్ గారు చాలా సంతోషపడ్డారు. అదెప్పటికీ మర్చిపోలేను. అప్పుడు జడ్జెస్ గా కోరా శాస్త్రిగారు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిగారు, దివాకర్ల వేంకటావధాని గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు లాంటి మహామహులున్నారు. వాళ్ళ ముందు విజేతగా నిలవడం గొప్ప విషయమే కదా! విశ్వనాథ సత్యనారాయణ గారిని, మాధవరామ శర్మ గారిని అక్కడే చూశాను. దాదాపు పండితులందరినీ ఆ కళాశాలలో చూశాను. వాళ్లంతా మా గురువు గారింట్లో ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్లకు సేవలు చేసే బాధ్యత నాకుండేది. అందువల్ల నాకు తెలియకుండానే వాళ్ళందరి నుండి ఒక స్ఫూర్తిని పొందాను.

11. ముత్యాల వంటి అందమైన మీ లేఖన నైపుణ్యాన్ని గురించి విన్నాం. ఆ అనుభూతులు కొన్ని చెప్పండి.
జ :  నేను రాసే అక్షరాలు అందంగా ఉంటాయని మా గురువులందరూ మెచ్చుకునేవారు. మా గురువు గారు శ్రీ రంగాచార్య గారు ఆయన వ్యాసాలన్నీ నా చేత శుద్ధ ప్రతి రాయించేవారు. వారప్పటిలోనే తెలుగులో ప్రసిద్ధ పత్రిక అయినటువంటి భారతిలోను, కాకినాడ నుండి  ఆంధ్ర సాహిత్య పరిషత్తు వాళ్ళ పత్రిక చాలా ప్రతిష్టాత్మకమైనది వస్తుండేది. జయంతి రామయ్య పంతులు లాంటి వాళ్ళు ఉన్న పత్రిక అది. అప్పుడు బండారు తమ్మయ్య గారు, కాకరపర్తి కృష్ణమూర్తి శాస్త్రిగారు వీళ్లంతా ఆ పత్రికను నడిపేవారు. వీటిలో మా గురువు గారు వ్యాసాలు రాసేవారు. ఆ వ్యాసాల శుద్ధ ప్రతులను నేను తయారుచేసేవాడిని. ఆ తరువాత గురువుగారు సాహిత్య అకాడెమీ గ్రంథాలను పరిష్కరించి దశరథ రాజనందన చరిత్ర, తాళంక నందినీ పరిణయం వీటిని ప్రకటించారు. వాటిని శుద్ధ ప్రతులు తయారుచేయడం, తాళపత్ర ప్రతులను చూసి రాయడం చేసేవాడిని. ఇది కూడా నా సాహితీ అధ్యయన లోతులకు ప్రేరణ అయింది.

12. మీరు చేసిన వివిధ సాహితీసేవల్లో ప్రధానమైన “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ” వ్యవస్థను  గురించి చెప్పండి.
జ :  నేను ఖమ్మంలో ఉన్నప్పుడు రెండు, మూడు సంస్థలతో అనుబంధం ఉండింది. సత్తుపల్లిలో ఒక సాహిత్య సంస్థ పెట్టి దానిని కొంతవరకు నిర్వహించాం. వరంగల్లుకు వచ్చిన తరువాత ఇక్కడ సాహిత్య, సాంస్కృతిక రంగాలను ఒక వేదిక మీద నుండి నడపడం బాగుంటుందని ఒక ఆలోచన కలిగింది. అప్పటికి రాళ్లబండి కవితాప్రసాద్ జాయింట్ డైరెక్టరుగా సాంఘిక సంక్షేమ శాఖలో పని చేస్తుండేవాడు. ఆయన వరంగల్లుకు వచ్చాడు. “మనం ఒక మంచి ఆర్గనైజేషన్ పెడదాం సార్” అన్నాడు.  వనం లక్ష్మీ కాంతరావు గారని మంచి నటులు. అప్పటికే  ఆయన రాష్ట్రస్థాయి నటులు. ఆయన, నేను, బి.వి. శేషాచార్య, ఎ.వి. నరసింహారావు గారు మేమంతా కలిసి కవితా ప్రసాద్ ఇంట్లో కూర్చొని ఈ సంస్థకు రూపకల్పన చేశాం. దీనికి “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ” అని కవితా ప్రసాదే పేరు పెట్టాడు. లోగో కూడా తానే తయారుచేశాడు. ఒక అవధానంలో రెండు, మూడు పద్యాలు చెప్పాడు. బాగున్నాయని శతకం వేయమన్నాను. వారం రోజుల్లో రాశాడు. అదే కాదంబిని పేరుతో వచ్చింది. మొట్టమొదట మా సంస్థ తరఫున కవితా ప్రసాద్ పుస్తకమే వేశాము. ఎ.వి. నరసింహారావుగారి వచన కవితా సంకలనం కూడా వేశాము. అప్పటికే వరంగల్లులో లబ్ధ ప్రతిష్ఠులైన ఇద్దరు సాహిత్య దిగ్గజాలు ఉన్నారు. ఒకరు కోవెల సంపత్కుమారాచార్య గారు, సుప్రసన్నాచార్య గారు. వాళ్ళిద్దరి మార్గ దర్శకత్వంలో ఈ సంస్థను ప్రారంభించాం. ఇప్పటికి 26 వసంతాలు గడిచినా దిగ్విజయంగా నడుస్తోంది. కార్యక్రమాల నిర్వహణ కూడా రెండు భాగాలుగా చేసుకొని ఎనిమిది మంది నాటక రంగానికి, ఎనిమిది మంది సాహిత్య రంగానికి ఉండేటట్లు (షోడశ కళలుగా) ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని నిర్మించుకొని నడిపిస్తున్నాం.

13. ఈ సంస్థ ద్వారా మీరు చేసిన ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు ఏవి?
జ :  మేము దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరినీ ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాము.  మహాభారతం మొత్తం పద్ధెనిమిది పర్వాలకు పద్ధెనిమిది మందితో ప్రసంగాలు ఇప్పించాం. ‘మహాభారత దర్శనం’ అని పేరు పెట్టాం. మైలవరపు శ్రీనివాసరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అనుమాండ్ల భూమయ్యగారు, ఇట్లా దాదాపుగా మా సంస్థకు రాని సాహిత్యవేత్త లేడు. అట్లానే భాగవతం తీసుకొని ‘భాగవత సుధ’ పేరుతో. పన్నెండు స్కంధాలను భారతానికి పిల్చిన వాళ్లనే పిలిచాము. అది ఎంత క్లిక్ అయిందంటే వినడానికి వచ్చిన వాళ్ళు కనీసం వెయ్యికి తక్కువ ఉండరు. మొదట్లో ఖర్చుకు భయపడ్డాం. కానీ “సార్ సభలు ఎప్పుడు పెడతారు? డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి?” అనే పరిస్థితులు వచ్చాయి (గట్టిగా నవ్వుతూ). ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి ‘రామాయణ కల్పవృక్షం’ ఆరు కాండలను పన్నెండు భాగాలుగా చేసి ‘రామకథా పరిమళం’ పేరుతో ప్రసంగాలు ఇప్పించాం. రాజమండ్రి నుండి కేశవప్రగడ సత్యనారాయణ గారు, విశాఖపట్నం నుండి బులుసు వెంకటేశ్వర్లు గారు, కాకినాడ నుండి గరికపాటి వారు మొదలైన వాళ్ళు ప్రసంగించారు. తర్వాత పది ఉపనిషత్తుల మీద పదిరోజులు ఉపన్యాసాలు పెట్టించాము. ‘ఉపనిషచ్చంద్రిక’ అనే పేరుతో నిర్వహించాము. భగవద్గీత పద్ధెనిమిది అధ్యాయాలను పద్ధెనిమిది మందితో మాట్లాడించాం. ఆచార్య లక్ష్మణమూర్తి గారు మొదలైన వాళ్ళు వచ్చారు. సుప్రసన్నాచార్య గారి దర్శకత్వంలో ఇవన్నీ జరిగాయి.
        పూర్వీకులు పృథ్వీ సూక్తం, అగ్నిసూక్తం మొదలైన అయిదు సూక్తాలతో పంచభూతాల ఆవశ్యకతను ఎట్లా గుర్తించారో ఆ కోణంలో ‘వేదసూక్త కౌముది’ అనే పేరుతో ప్రసంగాలు ఇప్పించాం. గరికపాటి వారు పురుషసూక్తం, దాని అంతరార్థం గురించి చెప్పారు. సాగి కమలాకార శర్మగారు శ్రీ సూక్తంలో ఉన్న వైజ్ఞానిక విషయాలను చెప్పారు. అంటే కేవలం ప్రవచనం లాగా కాకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త ధర్మాల ద్వారా ఇవన్నీ కూడా ఉన్నాయని, వాటి ఔన్నత్యాన్ని చెప్పడం కోసం ఏర్పాటు చేశాం. పాలకుర్తి రామమూర్తి గారు మొదలైన వాళ్ళు ప్రసంగాలు ఇచ్చారు. కరోనా వల్ల ఆగిపోయింది. వేద సూక్తాలు ఇంకా మిగిలివున్నాయి. మళ్లీ వాటిని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం.

14. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు నిర్వహించిన పోటీల  వివరాలను చెప్పండి.
జ : వీలైనంతవరకు విద్యార్థులలో అధ్యయనం పెంచాలనే తాపత్రయంతో హైస్కూలు విద్యార్థులకు ఒక సంవత్సరం సాహిత్యం మీద క్విజ్ పెట్టాం. వందపద్యాలు తప్పనిసరి చేశాం. పిల్లలు చేతులు కట్టుకొని గడగడా చెప్పేస్తుంటే ఆశ్చర్యం కలిగింది. మారుమూల పల్లెల్లో ఉన్న అమ్మాయిలు కూడా మొదటిస్థానంలో ఉండడం ఆనందాన్ని కలిగించింది. ప్రశ్నలు వేయడం, విజేతలను నిర్ణయించడం కష్టమైపోయింది. తర్వాత సంస్కృతీ క్విజ్ అని పెట్టాము. కేవలం భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలే. అది అత్యంత ఆశ్చర్యకరంగా సాగింది. తర్వాత నాటకాలకు సంబంధించిన అంశాలు, ‘మేరా భారత్ మహాన్’ అని భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలపై క్విజ్ పెట్టాము. ఎక్కడైనా, ఏ అంశాలకు సంబంధించి అయినా మేము వెనుకాడవలసి వచ్చిందే కానీ పిల్లలు వెనుకాడలేదు. స్కూళ్ళకు వెళ్లి (జిల్లా స్థాయిలో) అక్కడే పోటీలు నిర్వహించాం. ఆ తర్వాత అట్లా తిరగడానికి మాకు మ్యాన్ పవర్ తగ్గింది. ఒక గొప్ప విషయం భార్గవి అనే ఒక అమ్మాయి మేము పెటైన అయిదు క్విజ్ లలో టాప్ గా ఉండింది. ఆమె గ్రూప్స్ లో సెలెక్ట్ అయి ఎ. జి ఆఫీసులో ఆఫీసర్ అయింది. ఈ పోటీలు ఆమెకు ఉపయోగపడడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

15. మీ సంస్థ చేస్తున్న నాటకరంగ సేవ ఎటువంటిది?
జ :-  నాటకోత్సవాలలో భాగంగా ప్రతీ శివరాత్రికి మూడు రోజుల ముందు ప్రారంభించి శివరాత్రితో ముగిసేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అవి పర్మినెంట్ డేట్స్. మాలో ఎవరైనా ఒకరు ముందే అన్ని చోట్లకు వెళ్లి ఏ నాటకాలు వేయాలో సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా మేము ప్రదర్శించిన నాటకాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అటు సాహిత్యరంగాన్ని, ఇటు నాటకరంగాన్ని సమన్వయం చేసుకుంటున్నాం. దాదాపు వెయ్యి మంది సభ్యులున్నారమ్మా. మాకు ప్రతీ సంవత్సరం మూడు నుంచి ఆరు లక్షల ఖర్చు ఉంటుంది. వాటికోసం మేమేమీ కష్టపడకుండా ఎంతోమంది నుండి ఆర్థిక సహకారం లభిస్తూనే ఉంది. మాకు అర్థమైంది ఒక్కటే. పని చేసి ఫలితాన్ని చూపిస్తే సహకారం చేసేందుకు ముందుకు రావడానికి ఎవరూ వెనుకాడరని.

16. సహృదయ సంస్థ తరఫున మీరిచ్చే పురస్కారాలను గురించి చెప్పండి.
జ :-    మేము సంవత్సరానికి నాలుగు కార్యక్రమాలు తప్పనిసరి చేశాం. వార్షికోత్సవ సందర్భంగా ఒద్దిరాజు సోదరుల మీద ఒక పురస్కారాన్ని ఇస్తున్నాం. 25 ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. వారి కుటుంబీకులే దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో అయిదు ప్రక్రియలు తీసుకున్నాం. మొదటి సంవత్సరం నవల, రెండవ సంవత్సరం కథ, మూడవ సంవత్సరం వచన కవిత, నాల్గవ సంవత్సరం పద్యకవిత, అయిదవ సంవత్సరం సాహిత్య విమర్శ. ఇట్లా అయిదు ఆవృతులైనాయి ఇప్పటికి. అంటే 25 మందికి ఇచ్చాం. గరికపాటి నర్సింహారావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు, అల్లం శేషగిరిరావు గారు, కేశవరెడ్డి గారు, నాళేశ్వరం శంకరం గారు, కాలువ మల్లయ్య గారు, డా. బన్న ఐలయ్య గారు, ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారు ఇట్లా ప్రముఖులకు ఇచ్చాం. జనవరి, ఫిబ్రవరిలో పేపర్ ప్రకటన ఇచ్చి వచ్చిన వాటిని స్క్రూటినీ చేస్తాం. ఇద్దరు న్యాయ నిర్ణేతలను ఎంచుకుంటాం. వారెవరన్నది వాళ్లిద్దరికి కూడా తెలియదు నాకు తప్ప. వార్షికోత్సవ సభకు ఆ న్యాయ నిర్ణేతలను కూడా పిలుస్తాం. ఒకసారి ఎల్లూరి శివారెడ్డి గారికి, ఎస్వీ రామారావు గారికి ఇచ్చాను. వాళ్ళు పక్క పక్కనే కూర్చుంటారు. కానీ వాళ్లకు తెలియదు. సభలో ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోయారు. మాకు చెప్పలేదు అన్నారు (నవ్వేస్తూ). ఇట్లా ఎందుకంటే అవార్డుల విషయంలో కొంత అనుమానం ఉంటుంది. పారదర్శకత కోసం నాకు మాత్రమే తెలిసేలా ఈ పద్ధతి పాటిస్తున్నాం. ఆంధ్రదేశం మూలమూలల నుండి ఎంతోమంది ప్రముఖులను జడ్జీలుగా పెట్టాము. 25 సంవత్సరాలుగా ఏ ఇబ్బందులు వచ్చినా ఆపలేదు. జి.వి. సుబ్రహ్మణ్యం గారు “మీ ప్రియారిటీస్ ఏముంటాయి?” అన్నారు. అదేమీ లేదు సార్. “మీరు ఏది చెబితే అదే మా ప్రియారిటీ” అన్నాను. ఆయన ఎంతో ఆనందించారు. “కవిత్వానికి ఇస్తారు. సాహిత్య విమర్శకు ఇచ్చేవాళ్లను నేను చూడలేదు” అని ప్రశంసించారు.

17. మీ సంపాదకత్వంలో వెలువడిన రచనలేవి?
జ : కరీంనగర్ లో శ్రీభాష్యం విజయసారథి గారు మహా సంస్కృత విద్వాంసులు. ప్రతి సంవత్సరం మేమక్కడ కార్యక్రమాలు చేస్తుంటాం. 25 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ‘విశ్వారణి’ అని ధర్మాన్ని గురించి, ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఒక సంచిక వేయలనుకున్నాము. పుల్లెల శ్రీరామచంద్రుడు మాకు గురువు. ఆయన, రఘునాథాచార్యులు గారితో వ్యాసాలు తెప్పించి నా సంపాదకత్వంలో అదొక పుస్తకం వేశాను. మా సహృదయ వార్షికోత్సవ సందర్భంగా ఒక పుస్తకం, రజతోత్సవంలో ‘రసహృదయ’ అనే పేరుతో ఒక పుస్తకం వేశాను. సుప్రసన్నాచార్య గారి 80 ఏళ్ల వయస్సులో అసీతి ఉత్సవ సందర్భంగా వారి రచనలను గురించి వేశాను. దహగం సాంబమూర్తి అనే పెద్దమనిషి 80 ఏళ్ల సందర్భంగా పుస్తకం వేద్దామంటే ఆయన వద్దని ‘భారతీయ చింతన’ గురించి వేద్దామన్నారు. అందరినీ ఆహ్వానించి రాయించాను. వేదాలంటే ఏమిటి ? ఉపనిషత్తులంటే ఏమిటి? ఇట్లాంటి వాటికి సంబంధించి 90 వ్యాసాలు వచ్చాయి. ఇటీవలే ‘భారతీయ చింతన’ పేరుతోనే మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ గారు, శ్రీరంగాచార్య గారు ఆవిష్కరించారు. వీలైనంత వరకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించాలనే నా తాపత్రయం. ఓరుగల్లు వైభవం, గడియారం రామకృష్ణ శర్మ గారి శతపత్రము ఇలాంటివన్నీ నా సంపాదకత్వంలో వెలువడ్డాయి.

18. శతక సాహిత్యంపై మీకు ఎక్కువ మక్కువ కలగడానికి కారణం ఏమిటి?
జ :-  నాకు తెలుగులో శతక సాహిత్యం మీద ముందు నుండే ఆసక్తి ఎక్కువ. ఏ పద్యానికి ఆ పద్యమే అయినప్పటికీ మానవ విలువలకు మొదటి మెట్టు శతకమే. మా నాయనగారు చిన్నప్పుడు అన్నీ శతక పద్యాలే నేర్పించారు. కాబట్టి శతకాల మీద ఆలోచన చేసే కొద్దీ ధర్మపురి శేషప్ప కవి 17వ శతాబ్దంలో రచించిన “అధిక విద్యావంతులప్రయోజకులైరి పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి” అన్నట్లు ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే కదా! ఎంత గొప్ప మాట అది. “ఎండిన ఊళ్ల గోడెరిగింపడెవ్వడు, పండిన ఊళ్లకే ప్రభువులంత” అన్న కాళోజీ మాటలకు ఆయన కవిత్వం గురించి ఎంత గొప్పదిగా ఉందని అంటే కాళోజీ గారు “ఇన్ని కాలాలైనా ఇప్పటికీ గొప్పదిగా ఉందంటే, నేనిక్కడ సంతోషపడాల్నో దుఃఖపడాల్నో తెలియదయ్యా! నేను రాసింది బాగుందని సంతోషపడాల్నో, ఇప్పటికీ ఏమీ మారలేదని దుఃఖ పడాల్నో” అన్నారట. శేషప్పకవి ఇప్పుడుంటే అలాగే అనేవాడేమో( పెద్దగా నవ్వుతూ). మానవులకు సరియైన మార్గ నిర్దేశం చేసేది శతకమని నా విశ్వాసం. ఆలిండియా రేడియో వాళ్ళు అప్పట్లో ఒక సిరీస్ గా 20 శతకాలను పరిచయం చేయుమని నన్నడిగారు. దాన్ని తర్వాత ‘శతక సమీరం’ అనే పుస్తకంగా వేశాను. నేను రిటైర్ అయ్యేముందు “తెలుగు శతకాలు – సామాజిక, నైతిక విలువలు” అనే అంశం తీసుకొని కన్నడ శతకాలు, సంస్కృత శతకాలు వీటి మీద మద్రాస్ మరియు ఇతర ప్రాంతాల నుండి పెద్దవాళ్లను పిలిపించి కాలేజీలో సెమినార్ పెట్టాను. ఉదాహరణకు ధూర్జటి “రాజుల్మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు” అంటూ పరిపాలకుల్లో ఉన్న దుర్మార్గాలను ఎండగట్టాడు. ఇట్లాంటివి ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యం. వేణుగోపాల స్వామి శతకం, ఆంధ్రనాయక శతకం, గోగుల పాటి కూర్మనాథకవి సింహాద్రి శతకం మొదలైన వాటిపైన ప్రసంగాలు పెట్టించాను. రాజమండ్రి మొదలైన ప్రాంతాల నుండి ఎంతోమంది వచ్చారు. అవన్నీ కలిపి పుస్తకం వేశాను.

19. మీ రచనా వ్యాసంగం, దృశ్య మాధ్యమాల్లో మీ వ్యాఖ్యానాలు, ప్రసంగాలను గురించి చెప్పండి.
జ : రచనా రంగంలో అనేక పత్రికలకు వ్యాసాలు రాశాను. ఆ కాలంలో భారతి పత్రికకు కూడా రాశాను. ఆంధ్రజ్యోతిలో ‘పరంజ్యోతి’ అనే ఒక శీర్షిక వచ్చేది. ఆధ్యాత్మికమైనది. కరోనాలో దాన్ని ఎత్తివేశారు. కరోనా కాలంలో కొన్ని పేజీలు కూడా తగ్గించారు. అందువల్ల కొన్ని శీర్షికలను తీసివేశారు. తీసివేయడానికి మొట్ట మొదట వారికి కనిపించింది ఆధ్యాత్మిక శీర్షిక. ఏం చేస్తాం? నమస్తే తెలంగాణలో ‘నమస్తే నమః’ అనే శీర్షికలో భగవద్గీత మీద నేను రాశాను. ఇక దృశ్య మాధ్యమాల్లో  వేంకటేశ్వర భక్తి ఛానెల్ కంటే ముందు తిరుపతి బ్రహ్మోత్సవాల్లో లైవ్ చెప్పేవాడిని. పద్ధెనిమిది సంవత్సరాలు వ్యాఖ్యానం చెప్పాను. ధర్మపురిలో కేసీఆర్ ప్రారంభించిన గోదావరి పుష్కరాలకు వ్యాఖ్యానం చెప్పాను. కర్నూలులో తుంగభద్ర పుష్కరాలకు చెప్పాను. మేమొక తొమ్మిది మందిమి ఉండేవాళ్ళం. రొటేషన్ లో మూడు నెలలకు ఒకసారి తిరుపతికి వెళ్లి రెండు రోజులు ఉండి స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలకు వ్యాఖ్యానం చెప్పేవాడిని. చేతకాక ఇప్పుడు వెళ్లడం లేదు. టివి లో CVR ఛానల్లో పద్యాలను పరిచయం చేస్తూ పద్య సౌరభం అనే పేరుతో దాదాపు నలభై ఎపిసోడ్లు చేశాను. TV9 లో అంపశయ్య నవీన్ గారిని, కోవెల సుప్రసన్నాచార్య గారిని ఇంటర్వ్యూ చేశాను. దూరదర్శన్ వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయల 500 పట్టాభిషేక సందర్భంగా కవిసమ్మేళనం లైవ్ పెట్టినపుడు పాల్గొన్న 25 మందిలో నేనూ ఒకడిని. “మహా కవులకు నీరాజనం” అనే కార్యక్రమంలో సుప్రసన్నాచార్య గారు నన్నెచోడుడుగా, గరికపాటి వారు తెనాలి రామకృష్ణుడుగా, నంది తిమ్మనగా నేను నీరాజన సమర్పణ చేశాం. అదంతా పుస్తకంగా వచ్చింది. సాహిత్య కార్యక్రమాల కోసం దేశమంతటా తిరుగుతూనే ఉంటాను. తీసుకుపోయే వాళ్ళుండాలి అంతే (పెద్దగా నవ్వుతూ). ఇదంతా ఒక రకంగా నా సాహితీ యాత్ర అనుకోండి.

20. ఆంధ్ర సారస్వత పరిషత్తుతో మీకున్న అనుబంధం ఎటువంటిది?
జ : చిన్నప్పటి నుండీ సారస్వత పరిషత్తు నాకు తెలియకుండానే పరిచయం అయింది. మా ఊళ్ళో 1953లో ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవాలు జరిగాయి. మా నాన్నగారు దానికి కార్యదర్శి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారు. ఆంధ్రదేశంలో ఉన్న పండితుల్లో ఒక్క మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, వేలూరు శివరామ శాస్త్రిగారు ఆరోగ్యం బాగా లేక తప్ప అందరూ వచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ గారు స్నాతకోపన్యాసం. రాధాకృష్ణన్ గారు ప్రారంభకులు. రాని తెలుగువారు లేరట. వాటికి సంబంధించిన కరపత్రాలు అవన్నీ మాఇంట్లో ఉండడం, మా నాయనగారు, రామకృష్ణ శర్మగారు ఎప్పుడూ దాని గురించి చెబుతూ ఉండడం వల్ల సారస్వత పరిషత్తు మాదే అన్నట్టు ఉండేది. నేను హైదరాబాద్ కు వచ్చిన తరువాత రోజూ పరిషత్తుకు వెళ్ళేవాడిని. ఏవో మీటింగులు జరుగుతూనే ఉండేవి. ఒకసారి రామానుజరావుగారు “మీవాడు ఎమ్.ఏ. చేస్తున్నానంటున్నాడు కానీ ఎప్పుడూ ఇక్కడే కనిపిస్తున్నాడు” అని శర్మ గారితో అన్నారు (నవ్వుతూ). శర్మ గారి కుమారుడు శ్రీవత్స అని పరిషత్తులో లైబ్రేరియన్ గా చేస్తుండేవాడు. నేనెప్పుడూ వానితోనే ఉండేవాడిని. రామానుజరావు గారు ఎప్పుడు వచ్చినా అక్కణ్ణే కనిపించేవాడిని. ఆయన ఎంతో క్రమశిక్షణ కలవారు. ప్రతి నెలా మొదటి ఆదివారం ఒక విషయం మీద ప్రసంగం, చర్చ ఉండేవి. కె.కె. రంగనాథాచార్యులు గారని ఉండేవారు. ఆ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం నుండి అందరినీ తీసుకొచ్చే బాధ్యత నామీద పెట్టారు.
పన్నెండు పన్నెండు చొప్పున ఆ ప్రసంగాలను ఆరు సంవత్సరాలు ఆరు పుస్తకాలుగా వేశారు. ఎంతో విలువైన పుస్తకాలవి. అకాడెమీ మీటింగులు జరిగేవి. దాశరథి గారు వంటి ప్రముఖులు వచ్చేవారు. వాళ్ళందరినీ శర్మగారే నాకు పరిచయం చేశారు. దాన్ని ఎప్పుడూ మా ఇంటి సంస్థ గానే భావించాను.

21. పరిషత్తుతో అంతగా మమేకమైన మీకు దాని రథసారథి దేవులపల్లి రామానుజరావు గారి పురస్కారం పొందడం ఎటువంటి అనుభూతిని ఇచ్చింది?
జ : నేను అమెరికాలో ఉన్నప్పుడు శివారెడ్డి గారు ఫోన్ చేసి దేవులపల్లి రామానుజరావు గారి పురస్కారాన్ని ఈసారి నీకే ఇస్తున్నాం అన్నారు. ‘నాకెందుకు సార్?’ అన్నాను. “లేదు లేదు నీవు రావాల్సిందే!” అన్నారు. మిగతావి ఏవేవో పురస్కారాలు, యూనివర్సిటీ కీర్తి పురస్కారాలు ఏవో వచ్చాయి కానీ వాటి మీద ధ్యాస లేదు. చిన్నప్పటి నుండీ దాంట్లో మమేకమై ఉండడం వల్ల సారస్వత పరిషత్తు నుండి అవార్డు పొందడం గొప్ప అనుభూతి. ఆ సంస్థ 75 ఏళ్ల సంచికలో ‘అక్షరయానం – ఆత్మీయబంధం’ అని రాశాను. 1974 నుండే అది నాతో నడుస్తూనే ఉంది.

22. చివరగా సాహితీ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన మీరు ఇప్పటి రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.
జ : మీరడిగిన దానికి ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెబుతాను. సినారె గారు ప్రతి రోజూ క్లాస్ కు ప్రిపేర్ అయ్యేవారు. ఒకసారి “ఇన్నేళ్ళుగా చెబుతున్నారు కదా! ఇంకా ఎందుకు ప్రిపేర్ అవుతారు?” అని ఆయనను అడిగాను. “వీళ్ళు మహా కవులు. మన అనుభవం పెరిగే కొలది కొత్తగా దర్శనమిస్తారు” అన్నారాయన. గొప్ప సత్యమది. నిజానికి ఆయన చదవవలసిన పని లేదు. అది ఇప్పుడు నా అనుభవంలోకి వస్తోంది. నేనిప్పుడు చదువుతుంటే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సార్వకాలీనత అనేది ప్రాచీన కవుల్లో ఎందుకున్నదనడానికి ఒక రామాయణం, భారతం, ఇతర కావ్యాలు నిలబడ్డాయంటే దాంట్లో అన్ని కాలాలకు ఉపయోగపడే ధర్మాలున్నాయనే కదా! అంతే కాదు “ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం ఉండదయ్యా! కవిత్వం ఉంటుంది. పాతవాళ్ళు రాస్తే ప్రాచీనం, కొత్తవాళ్ళు రాస్తే ఆధునికం. మనం చేయవలసింది సమన్వయించుకోవడం, కవిత్వం ఏ స్థాయిలో ఉందో చూడగలగడం. ప్రాచీనమైనా, ఆధునికమైనా ఉత్తమ సాహిత్యం నిలబడుతుంది” అని సినారె గారు చెప్పిన మాటలు అందరికీ శిరోధార్యాలు. సాహిత్య విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతీ ఒక్కడూ మహాకవి అయిపోయినాడు. అధ్యయనం పూర్తిగా తగ్గిపోయింది. వాళ్లకు వాళ్లే గొప్ప. ఎదుటివాళ్ళ గొప్పతనాన్ని గుర్తించే స్థాయి లేదు. ఈ దుస్థితి నుండి బయటపడి మంచి సాహిత్యం రావాలి.

        ధన్యవాదాలు సార్. మీ అత్యంత విలువైన సమయాన్ని మా ముఖాముఖి కార్యక్రమానికి వినియోగించి, మీ సాహితీ ప్రయాణాన్ని, ఆధ్యాత్మిక విశేషాలను వివరించినందుకు మా తరఫున మా మయూఖ పాఠకుల తరఫున అభివందనాలు.

       తమ జీవితాన్ని పూర్తిగా విశేషమైన సాహితీ సేవకు అంకితం చేసిన ధన్యజీవులు గిరిజా మనోహర్ బాబుగారు. వారు మునుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు🙏🏼

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

జీవన మాధుర్యం

by Laxmi Madan May 22, 2024
written by Laxmi Madan


మొదటి భాగం

బస్సులో కూర్చున్న అపర్ణ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది.. ఎన్నేళ్ల కోరిక నెరవేరబోతుంది. తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్లాలని ఎప్పటినుండో మనసు లాగుతుంది కానీ !పరిస్థితులు అనుకూలించలేదు.
దాదాపు ముప్పయి ఏళ్ల తర్వాత తను పుట్టి పెరిగిన ఊరిలో కాళ్లు మోపబోతుంది ..ఆ ఆనందం అపర్ణను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తన ఊరికి వెళ్లాలంటే పల్లె వెలుగు బస్సులే ఆధారం. ఆ బస్సులైనా ఊర్లో వరకు వెళ్ళవు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఆగుతాయి అక్కడి నుండి రిక్షాలో వెళ్లాల్సి వస్తుంది. మరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు….
అపర్ణ ఉండేది చెన్నైలో… పెళ్లయ్యాక భర్తతోపాటు వెళ్లి అక్కడే ఉద్యోగం చూసుకొని స్థిరపడింది. పిల్లలు కూడా అక్కడే చదువుకొని విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి…భర్త తాను మాత్రమే ఉండటం వల్ల ఈ మధ్యకాలం ఊరి జ్ఞాపకాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.. అపర్ణ తల్లితండ్రులు కూడా అక్కడ ఉండకపోవడం వల్ల సొంత ఊరికి వెళ్లడం తనకి కుదరలేదు.
కొద్దిరోజుల క్రితమే ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ తన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయడం వల్ల ఆమె తన చిన్ననాటి స్నేహితురాలని తెలిసింది.. ఆమె అదే ఊర్లో ఉంటుందట. ఊరి విశేషాలు అన్నీ చెప్పింది… ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళు .. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లేవాళ్లు వసంత తల్లిదండ్రులు కూడా అపర్ణను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. వసంత కూడా అపర్ణ ఇంట్లో ఎంతో స్వేచ్ఛగా ఉండేది.. ఇద్దరు కలిసి ఎన్నో చోట్లకు తిరిగేవాళ్లు ఏది కావాలన్నా ఇద్దరు వెళ్లాల్సిందే ..అలా వసంత గుర్తొస్తూనే ఉంది…అప్పటినుండి ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్లాలని అపర్ణకు అనిపిస్తుంది ..కానీ తగిన సమయం రావాలి కదా…
ఆసమయం రానే వచ్చింది. అపర్ణ స్నేహితురాలు వసంత తన చిన్న కూతురు పెళ్లి ఉందని ఆహ్వానించింది.. తప్పకుండా రావాలని పదేపదే చెప్పింది. ఈ విషయం భర్తకి చెప్తే ఆయనకు ఆఫీసులో ముఖ్యమైన పని ఉండడం వల్ల రావడం కుదరదని వీలైతే నువ్వే వెళ్ళు అని చెప్పారు.
అంతే ఇక చెంగున దూకి బట్టలు సర్దుకుంది ఇంకా మూడు రోజులు ఉంది ప్రయాణానికి.. ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఆరాట పడుతుంది…
“ఏమండీ పెళ్ళికి ఈ చీరకట్టు కోనా! నేను సర్దుకున్న చీరలన్నీ బాగున్నాయా ఒకసారి చూసి చెప్పండి నాకు ఏమీ తోచడం లేదు” అన్నది అపర్ణ.
” అసలు నీ సంతోషం చూస్తుంటే అక్కడ నుండి మళ్ళీ వస్తావా అనిపిస్తుంది ఏంటా హడావిడి!” అన్నాడు భర్త.
” అదేం కాదు గాని ముందు ఈ విషయం చెప్పండి కాస్త సర్దుకోవడంలో సహాయం చేయండి? ” అని అడిగింది అపర్ణ.
ఆమె సంతోషాన్ని చూసి ముచ్చట పడ్డ అపర్ణ భర్త సాగర్ సూట్ కేస్ దగ్గర కూర్చొని ఏ చీర ఎప్పుడు కట్టుకోవాలి ఏ నగలు ఎప్పుడు పెట్టుకోవాలి అని అన్ని సెలెక్ట్ చేసి సర్ది ఇచ్చారు అలాగే వేసుకోవాల్సిన మందులు కూడా అందులో పెట్టారు.
” థాంక్యూ” అన్నది అపర్ణ.
” నీ స్నేహితురాలు పెళ్లికి పిలిచినప్పటి నుండి అసలు నన్ను పట్టించుకుంటున్నావా షాపింగ్ అని అదనీ ఇదనీ నన్ను రోజు తిప్పుతూనే ఉన్నావు” అన్నాడు సాగర్.
” సారీ సాగర్” చాలా రోజులకు వెళుతున్నానని ఆనందం నన్ను నిలవనీయడం లేదు” అన్నది అపర్ణ.
” ఊరికే అన్నానులే వెళ్లిరా! నాకు వీలైతే ఏదో ఒక రోజు నేను వస్తాను దిగులు పడకు” అని అపర్ణ భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు సాగర్.
ఆ మూడవ రోజు రానే వచ్చింది… సాగర్ స్టేషన్ వరకు వచ్చి రైలెక్కించి వెళ్ళాడు. ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు.. ఒక్కదాన్ని పంపించడం అతనికి కూడా ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితి..
“అప్పూ! జాగ్రత్త! చేరగానే నాకు ఫోన్ చెయ్యి ఫోన్ దగ్గరే ఉంచుకో.. నేను నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను సరేనా” అని చెప్పాడు.
” అలాగే సాగర్ నువ్వు కూడా వేళకి భోజనం చేయి.. పచ్చళ్ళు అన్నీ చేసి ఫ్రిజ్లో పెట్టాను, కొన్ని కూరలు కూడా చేసి పెట్టాను ,అవి వేసుకొని తిను అన్నం మాత్రం వేడిగా వండుకొని తిను భోజనం విషయంలో అశ్రద్ధ చేయకు ,పని ధ్యాసలో సమయాన్ని మర్చిపోకు మొక్కలకు నీళ్లు పొయ్యి… రాత్రి ఎక్కువసేపు టీవీ చూడకు విశ్రాంతి తీసుకో ఆరోగ్యం జాగ్రత్త” అని చెప్పింది.
సాయంత్రం 6 గంటలకు రైలు బయలుదేరింది.. హైదరాబాదు చేరేవరకు తెల్లవారి ఆరు గంటలు అవుతుంది….
ఒంటరిగా ప్రయోగించడం కొంచెం ఇబ్బందిగానే ఉంది.. కానీ సొంత ఊరికి వెళుతున్నాననే ఆనందం మిగతావి ఏవి కనిపించ కుండా చేసింది.
ఎదురు సీట్లో తన వయసు వాళ్లే ఇద్దరు కూర్చొని ఉన్నారు… మెల్లగా వాళ్లతో మాటలు కలిపింది.
అపర్ణ ఎక్కువ కలివిడిగా ఉండే మనిషి కాబట్టి అందరితో తొందరగా కలిసిపోతుంది ..ఒకసారి స్నేహం చేసిన వాళ్లు మళ్లీ వదిలిపెట్టరు ,అలాంటి మనస్తత్వం ., అవతలివారికి ఎలా నచ్చుతుందో అలా మాట్లాడగలుగుతుంది, అదీకాక ఎవరిని నొప్పించని మనస్తత్వం అందుకని అపర్ణ స్నేహం కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు. అలా ఎదురు సీట్లో ఉన్న వాళ్లతో మాట్లాడుతూ ఉంటే వాళ్లది తన పక్కగా ఊరే అని వాళ్లు కూడా చెన్నైలో స్థిరపడ్డారని తెలిసింది. అదృష్టవశాత్తు వాళ్లు వెళ్ళేది కూడా అపర్ణ వెళ్లే పెళ్లికే….
వాళ్ల సంభాషణ ఈ విధంగా జరిగింది..
ముందుగా అపర్ణ వాళ్ళను మాట్లాడించింది.
“హలో !మీరు హైదరాబాద్ వరకేనా ఇంకా ఎక్కడికైనా వెళ్లాలా?” అని అడిగింది అపర్ణ.
” హైదరాబాద్ కి 80 కిలోమీటర్ల దూరంలో మా ఊరు మేము అక్కడ దగ్గరే ఉన్న రామాపురంలో పెళ్లికి వెళ్తున్నాము” అనీ చెప్పారు.
“ఓ.. నేను కూడా అదే ఊర్లో పెళ్లికి వెళ్తున్నాను నాఫ్రెండ్ వసంత కూతురు పెళ్లి కోసం వెళ్తున్నాను నా పేరు అపర్ణ మీపేర్లు? అనీ అడిగింది.
వాళ్లు ” మేము కూడా వసంత వాళ్ళ అమ్మాయి పెళ్లికే వెళ్తున్నాము మాకు దూరపు బంధువులు వాళ్లు.. నా పేరు స్వప్న దీని పేరు సంధ్య మేమిద్దరం కజిన్స్ అవుతాము” అని చెప్పారు.
“మనం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మనం పెళ్లిలో కలవచ్చు సరే !ఎనిమిది కావస్తుంది డిన్నర్ చేద్దామా” అన్నది అపర్ణ.
“మాటల్లో పడి సమయమే చూసుకోలేదు” అనుకున్నారు ముగ్గురు.
వారి వారి బాక్సులను తెరిచి పేపర్ ప్లేట్స్ దగ్గర పెట్టుకున్నారు.. అపర్ణ పులిహోర తెచ్చింది.. స్వప్న చపాతి ఆలూ కూర తీసుకొచ్చింది, ఇంకా సంధ్యనేమో దద్దోజనం తీసుకొచ్చింది… ముగ్గురు అన్నిటినీ కలిపి కడుపునిండా తిన్నారు ఒకరి వంటకాలు ఒకరు మెచ్చుకున్నారు కూడా.
ఇక పడుకుందామని ఎవరు బెర్త్ లోకి వాళ్లు వెళ్లిపోయారు. అపర్ణకు మాత్రం నిద్ర పట్టడం లేదు. అలా కిటికీలో నుండి చూస్తూ కూర్చుంది. అసలు ఇన్నేళ్లు ఊరికి వెళ్లకుండా ఎలా ఉండగలిగింది.. మరీ సమయం లేదు అని చెప్పుకునే మాట అబద్ధం. తనకు తానే మనసులో బాధపడి ఇప్పటికైనా సమయం వచ్చింది నా చిన్నప్పటి బాల్యాన్ని కళ్ళారా చూసుకోవడానికి అది అనుకొని కళ్ళు మూసుకుంది.
హైదరాబాద్ చేరుకునే వరకు ఏడు గంటలు అయింది అనుకున్న దానికన్నా ఒక గంట ఆలస్యంగా రైలు చేరుకున్నది. దిగిన తర్వాత స్వప్న మరియు సంధ్య వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్లి పోయారు. అపర్ణ మాత్రం బస్టాండ్ కి ఆటో లో వెళ్ళింది.
బస్టాండ్ చేరుకోగానే తన ఊరికి వెళ్లే బస్సు కనబడింది వెంటనే ఎక్కింది. ముందు సీట్లో కిటికీ పక్కన కూర్చుంది.. అంతే! ఇలా ఆలోచన లోకి వెళ్ళిపోయింది. బస్సు కండక్టర్ పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.
“ఎక్కడికి వెళ్లాలి మేడం అప్పటినుండి పిలుస్తున్న మీరు వినడం లేదు” అన్నాడు కండక్టర్.
“సారీ సార్ వినిపించలేదు” అని చెప్పి రామాపురం కి ఒక టికెట్ ఇవ్వండి” అని అడిగింది. టికెట్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని మళ్ళీ కిటికీలో నుండి బయటకు చూడసాగింది.
బస్సులో నుండి చూస్తే చెట్లని వెనక్కి వెళుతున్నట్టు అనిపిస్తే చిన్నప్పుడు అనుకునేది చెట్లని అలా పరుగులు తీస్తాయి అని ..అది గుర్తొచ్చి పెదవుల పైన నవ్వు విరబూసింది. ఊరికి వెళ్లే బస్సు ఎక్కగానే బాల్యపు పచ్చివాసనలు దరిచేరుతున్నాయి అనిపించింది. ఒకప్పుడు ఉన్న చిన్న రోడ్డు ఇప్పుడు డబల్ రోడ్డుగా మారిపోయింది.. గుర్తుపట్టలేనంతగా మారిపోయినట్లు అనిపించింది. కిటికీలో నుండి ఒక్కొక్క ఊరు చూస్తూ కూర్చుంది. ఒక విషయం ఏంటంటే అప్పట్లో రామాపురంకి బస్సు లేదు మెయిన్ రోడ్డు మీద దిగి రిక్షాలో వెళ్లాల్సి వచ్చేది. ఊర్లోకి బస్సు కూడా అయింది ‘ఇంకా ఊరు ఎంత మారిపోయిందో “చూడాలి అనుకున్నది అపర్ణ. పచ్చని పొలాల మధ్య నుండి బస్సు వెళుతుంటే ఆహ్లాదకరంగా అనిపించింది అనిపించింది. ఊరికి వెళుతున్నట్లు హైదరాబాదులో ఉన్న అమ్మా నాన్నకి తమ్ముడు అక్కకి చెప్పనేలేదు చెప్తే ముందు అక్కడికి రమ్మంటారు అందుకని నేరుగా పెళ్లికి వెళ్లి ఊరంతా తిరిగి తర్వాత హైదరాబాద్ చేరుకోవాలని అనుకుంది. తన దిగాల్సిన స్టేజ్ వచ్చింది తన బ్యాగు సూట్ కేసు తీసుకుని క్రిందికి దిగింది అపర్ణ..
ఎదురుగా కనపడ్డ మనిషిని చూసి ఆశ్చర్య పోయింది

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మెరుగైన…సమాజం…ప్రగతి పథంలో దేశం…

by Polaiah Kukatlapalli May 22, 2024
written by Polaiah Kukatlapalli

ఎందరో
మేధావులు…
సమతా వాదులు…
సంఘ సంస్కర్తలు…ఈ
పుణ్యభూమిలో జన్మించి
మెరుగైన సమాజం కోసం…
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం…
ప్రజల్లో సామాజిక చైతన్యం కోసం…

ఎన్ని సందేశాలిచ్చినా…
ఎన్ని హెచ్చరికలు చేసినా… 
తమ జీవితాలను ఫణంగా
పెట్టి ఎన్ని ఉద్యమాలు
ఎన్ని పోరాటాలు చేసినా…
ఎంతగా పరితపించినా…
ఎంతగా ఆశపడినా…
ఎంతగా ఆరాటపడినా…

“విప్లవాత్మకమైన 
మార్పులు” రాకపోవడానికి…
“ఆశించి ప్రగతి”
కనిపించక పోవడానికి
కారణాల చిట్టా చూద్దామా…

పేదవాళ్లలో…
ధైర్యం లేకపోవడం…
సాహసం చేయకపోవడం…
అంతులేని అమాయకత్వపు
అజ్ఞానాంధకారంలో మునిగిపోవడం…

మధ్యతరగతి వారికి…
సమయం లేకపోవడం…
సమిష్టిగా స్పందించక పోవడం…
ధనవంతులకు దాసోహం అనడం …
పేదవారిపై పెత్తనం చెలాయించడం…
చైతన్య రహితులై మౌనవ్రతం దాల్చడం…

ధనవంతులకు…
అవసరం లేకపోవడం….
చీకటి వ్యాపారాలు చేసి
దొరికినంత దోచుకోవడం…
స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడం…
అట్టడుగు వర్గాల్ని అణగద్రొక్కడం…
మధ్యతరగతి వారిని మాయచేయడం…
ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకోవడం….

మరి …
సమసమాజం నిర్మాణ స్థాపనెప్పుడు?
దేశంలో శాంతిసౌభాగ్యాలు వర్థిల్లేదెప్పుడు?

మనిషి మనిషిలో…
మానవత్వం వికసించినప్పుడు…

పేదలు…
ఆర్థిక అసమానతలనుండి బానిసత్వపు
భావనలనుండి విముక్తి పొందినప్పుడు…

మధ్యతరగతి ప్రజల్లో…
విజ్ఞాన జ్యోతులు వెలిగినప్పుడు…
విప్లవజ్వాలలు రగిలినప్పుడు…

ధనవంతుల చేతుల్లో…దాతృత్వం
గుండెల్లో…దైవత్వం పొంగి పొరలినప్పుడు.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తెలంగాణ పెద్దన్న

by mayuukha May 22, 2024
written by mayuukha


మట్టి కోసం కలవరిస్తాడు. మనిషి కోసం తండ్లా డ్త డు.
“పేద పిల్ల” ఆకలి గోసలు పేపర్ మీద వెలిగిస్తడు.
బతుక్కు రంగు తొడగలేక భవనాలకు రంగులేసేటోళ్ల కు
గొడుగై నిలబడతడు .
“చెరు వొ డ్డు”ను
ప్రపంచం చేస్తడు
ప్రపంచాన్ని కవిత్వం చేస్తడు ఉద్యమమై ఉరుకుతడు పాటై మోగుతడు .
మాట ఉరుమైతది
మనసు వెన్న లెక్కుంటది
“ఒక్క బాధ గాదు ఒక్కరి కోసం కాదు” ,
ప్రతి మనిషికి “ప్రాణహితమైనోడు.
“ఇక్కడి చెట్ల గాలి”
లోకానికి పంచుతడు
“భూమి స్వప్నమై” పుట్టి
నాగేటి చాల్లల్ల
నాలుగిత్తులు అలికి మెరుపుల పువ్వులు పూయిస్తడు
రవ్వల పంటలు పండిస్తడు
“నది పుట్టువ డి” గురించి ఏం చెప్తo? వాగై, వంకై అలుగై, ఏరై ,ఉరికి ,ఉరికి
మహా సముద్రమై మన పొంటే వస్తుంటది .
అగ్నిని పాడుతున్న చూపు అమృతాన్ని పంచుతున్న చిన్న నవ్వు
ఔనుల్లా! మన పెద్దన్న ఎవరే అంటే?
తెలంగాణ తెలంగాణమంతా సిద్ధన్న దిక్కే తిరుగుతరు
పొద్దుపొడుపు తీర్గున్న సిద్దన్ననే చూస్తరు.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

1914 – A Sonnet

by Krishnav Rangaraju May 22, 2024
written by Krishnav Rangaraju

In those fields, where dandelions were red
And piercing screams filled the night with agony,
Those heartbroken animals thought with dread
How war was, beyond doubt, a tragedy.
Nations clashed on insubstantial ideas
While those who fought took their ultimate rest,
They looked through the poisonous haze,
Sending them to their final abode, by the Lord, blessed.
They died, nine point seven million died
All because of those in charge, who didn’t care,
Who let them suffer while families cried
O’er their friends who could no longer breathe the same air
They died, they all died, because of you,
You supported this idiocrity, they died because of you.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us