మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

చీరలోని గొప్పతనం.. 14

by Ramakrishna Manimadde July 29, 2024
written by Ramakrishna Manimadde

చీరకట్టులో సౌశీల్యం ప్రతిబింబిస్తుంది..
సౌందర్యం ఇనుమడిస్తుంది..
భౌగోళిక అస్తిత్వం భాసిల్లుతుంది..
సంప్రదాయం ఉరకలేస్తుంది..

అంతేనా..?
మరెంతో ఉంది అంటున్నారు కవి ‘చంద్రబోస్.’
‘చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ
‘పల్లకిలో పెళ్ళికూతురు ‘ సినిమా కోసం
ఆడపిల్లకు చీరను ఆయనంగా ఇస్తున్న ఆ వైనాన్ని తెలుసుకుందాం..!

చీరలోని గొప్పతనం తెలుసుకో… ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర. ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

సహజ వారసత్వంగా.. సంప్రదాయంగా
మనకు తరతరాలుగా అందుతున్న
అస్తిత్వ సంపద చీరను ఈ తరం అమ్మాయిలు విస్మరిస్తున్నారు.. పక్కన పెట్టేస్తున్నారు.

ఈ చీర కట్టును ఆధునికత కనుమరుగు చేస్తుంది.
దాని గొప్పతనాన్ని కమ్మేస్తుంది..
అందుకే చీరలోని గొప్పతనం తెలుసుకో..!
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటున్నారు గీతరచయిత చంద్రబోస్.

చీర అల్లిక వెనుక సింగారం అనే దారం ఉంది..
అది అందాన్ని రెట్టింపు చేస్తుంది..

ఆనందపు రంగుల అద్దకం ఉంది..
అది మనసు పొరల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

మమకారపు మగ్గం ఉంది..
అది పుట్టినింటికి మెట్టినింటికి మధ్య
అనుబంధాన్ని పెంచుతుంది అంటూ చీర తయారీ విధానంలోని కళాత్మకతకు కవితాత్మక సొగసులు దిద్దారు గీత రచయిత.

మడికట్టుతో నువ్వు పూజచేస్తే..గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే..సిరిలక్ష్మిని కురిపించును పంటలు

ఆధునిక దుస్తులు ధరించి
నియమ నిష్ఠలతో నువ్వు పూజ చేస్తే అందులో నిండుతనం ఉండదు.. నిండార చీరకట్టుకుని, మడికట్టుతో నువ్వు చేసే పూజ వలన గుడిని సైతం వదిలి దిగివస్తాడు దేవుడు. అంతటి మహత్యం ఉంది చీరకు.

చీరను దోసి, ఎంకి కట్టుతో సౌకర్యవంతంగా పొలం పనులు చేస్తుంటే ధాన్యాగారం నీ ఇంట పొంగిపొరలి సాక్షాత్తు మహలక్ష్మియే నట్టింట నిలిచి సిరులు కురిపిస్తుంది.

జారుకట్టుతో పడకటింట చేరితే..గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే.. దండాలే పెడతారు అందరూ

కనీ కనిపించని అందాలను పడకటింట భర్త కంట పడేలా చేసేది చీర మాత్రమే.. ఆ కనికట్టు చీరకు ఉంది కాబట్టే జారుకట్టుతో భర్తకు చేరువగా భార్య వచ్చినప్పుడు తన గుండె జారి చూస్తాడు పురుషుడు.. ఎంతటి అలకలు ఉన్నా ఆ క్షణం అన్నీ క్షణభంగురమే కదా..!

నిండైన ఆహార్యంతో చీర కట్టుకుని, ఆత్మవిశ్వాసంతో నడిచి వెళ్తుంటే.. అందరూ దండాలు పెడతారు. ఆ పవిత్రత చీరకట్టుకు ఉంది.

అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది.. కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది

కడుపారా అన్నం తిన్న తదుపరి మూతిని తూడ్చే చీర కొంగు, కన్నీరై ఉన్నప్పుడు చెంపను కూడా తడుమును. అన్నంలో ఆపదలో అమ్మను చూపేది, అమ్మలా బాసటగా నిలిచేది చీర కొంగు మాత్రమే అని.. మన జీవనంలో చీర కొంగు నిర్వహించే ఉద్దాత్తమైన పాత్రను తెలియజేస్తున్నారు చంద్రబోస్.

పసిపాపలా నిదురపోయినప్పుడు.. అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు..ఈ చీరేగా అందాలకు అడ్డుతెర

ఆదమరిచి పసిపాపలా నిద్దుర పోయినప్పుడు ఊయలగా మారి హాయినిచ్చును. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే ఘడియలకు సాక్షీభూతంగా నిలిచి, అరవిరిసిన అందాలకు అడ్డుతెరగా నిలుచును ఈ చీర..!

గాలి ఆడక ఉక్కపోసినప్పుడు..ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు.. ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది..
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది..

గాలి స్తంభించి ఉక్కిరబిక్కిరైన సమయాన వింజామరలా మారి నీ ఉక్కపోతను తీర్చేది ఆ పైటే..

ఎండనుండి నిన్ను కంది పోకుండా కాపాడిన ఆ కడకొంగే, వాన నుండి నిన్ను రక్షించటానికి గొడుగుగా మారి నీ వెతలు తీర్చును.

విదేశీ వనితకు సారే పోసి సోదరిగా గౌరవమిచ్చి ఆదరించి, మన భారతీయ సంస్కృతిని సగౌరవంగా చాటేది చీర.. అంతెత్తున ఎగిసే మన జాతీయ జెండాకు సరితూగి సమానంగా నిలిచేది చీర అని,
ఈ తరానికి చీర గొప్పతనం చాటి చెప్పే గీతాన్ని అందించారు చంద్రబోస్.

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కథాభారతి – 55

by Madhu Jella July 29, 2024
written by Madhu Jella

అంశం: వీడిన మబ్బులు
కథా శీర్షిక:
ఆదివారం.. పిల్లలు..ఆయనా బయటికెళ్ళారు.పనులన్నీ తీరినాక టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తూ కూర్చున్నా. అంతలో ఫోన్ మ్రోగింది..ఆయనదే.ఇంట్లోనే మరిచిపోయినట్లున్నాడు.పట్టించుకోలేదు.
నాలుగైదుసార్లు అదే పనిగా ఫోన్ రింగవుతూంటే .. నేనే వెళ్ళి లిఫ్ట్ చేసా. “హలో సార్..’ ఓ స్వీట్ వాయిస్ పలకరించింది. ‘హెలో..ఎవరు’ అన్నాను.’సార్ .. సార్ లేరా అండీ’ అంది. ‘లేరు.. ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటికెళ్ళారు’.ముక్తసరిగా అనేసరికి కాల్ కట్ చేసింది. కొద్దిసేపటికి
మళ్ళీ అదే నంబరు నుండి కాల్.కట్ చేసా. మళ్ళీ కాల్ చేస్తున్నారెందుకో..చిరాకేసింది.
మళ్ళీ కాల్ వస్తోంది.ఇప్పుడు.. కాల్ లిఫ్ట్ చేయగానే ‘హలో..’ అదే గొంతు.తీయగా పలకరిస్తోంది.’ఎవరు?’ .. కొద్దిగా గట్టిగా అనగానే కాల్ కట్ చేసింది.
బయటికెళ్ళి ఇంకా ఈయన రానేలేదు. ఈ ఫోన్ల గోలొకటీ..వెంటతీస్కెళ్ళొచ్చుగా.. ఉన్నట్టుండి ఏదో ఆలోచన మనసులో మెదిలి కళుక్కుమంది. ఏదో అనుమానపు తెర మనస్సును కమ్మేయబోతుంది .ఆ ఊహే భయం కలుగజేసింది.. ఎంత కంట్రోల్ చేసుకున్న..ఆ ఫోన్ కాల్.. తీయని గొంతు.. గుర్తుకొస్తున్నాయి..ఈయనేమైనా….అంతటితో బలవంతంగా ఆ ఆలోచనను మానుకుందామని ప్రయత్నిస్తున్నా..
ఇంతలో అదే నెంబరు నుండి మళ్ళీ కాల్ వస్తోంది.
కాల్ లిఫ్ట్ చేసి ‘హలో..ఎవరు మీరు. కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడకుండా కట్ చేస్తున్నారు.విషయం ఏమిటో చెప్పండి ‘ గట్టిగా అన్నాను. ‘హలో.. అమ్మ..సార్ లేరా?.. ఇప్పుడు మధ్య వయస్సు ఆవిడ మాట్లాడుతోంది.’అమ్మా.. సార్ గారికి చాలా థాంక్సమ్మా.. నిన్న సార్ గనుక సాయం చేయకుంటే నా కొడుకు ప్రాణాలతో బయటపడేవాడే కాదు. మా చిన్నబ్బాయి నిన్న బైక్ ఆక్సిడెంట్ అయి పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూంటే అక్కడే ఉన్న సార్ హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేసి అవసరమైన సాయం చేసాడు.మా వాడి ఫోను,పర్సులో ఉన్న అడ్రస్ తో మాకు సమాచారమిచ్చాడు తల్లి. గాబరాగా..అందరం షాక్ తోనే హాస్పిటల్ కి వెళ్ళాం.మమ్మల్ని సారే గుర్తించి మా అబ్బాయిని ఉంచిన వార్డు కు తీసికెళ్ళాడు.డాక్టర్లతో మాట్లాడించి, మాకు ధైర్యం చెప్పాడు. ఇంతకు ముందు కాల్ చేసింది మా అమ్మాయేనమ్మా..ఆ సార్ కి ఫోన్ చేయమని నేనే చెప్పాను. బాధలో,కంగారులో సార్ పేరు కూడా కనుక్కోలేదు. సార్, మాకు ఫోన్ చేసిన నెంబరు గుర్తించి ఫోన్ చేస్తున్నాము తల్లీ.. దేవుడిలా వచ్చి నా కొడుకుని రక్షించాడమ్మా.. అందరిలా ఆయనా వదిలేసి వెళ్ళుంటే..”’ ఆమే గొంతు గద్గదమైంది.వెక్కి ఏడుస్తోంది..తనే ‘ నా కొడుకు ప్రాణాలు నిలబెట్టాడు.. ఆయనకు చాలా ఋణపడి ఉంటామమ్మా.. సార్.. మీరందరూ చల్లగా ఉండాలి తల్లి.. సార్ తో చెప్పమ్మా..మా వాడు బాగానే ఉన్నాడు..” కృతజ్ఞతతో నిండిన గొంతుతో చెబుతూ ఆమె ఫోన్ పెట్టేసింది.
కొద్ది సేపు నన్ను మౌనం ఆవహించింది. చాలా గిల్టీగా అనిపించింది. క్షణంలో మనసు చేసిన మాయలోపడి మా ఆయనని అపార్థం చేసుకొనే స్థాయికి వెళ్ళినందుకు. ఇప్పుడు మనసు తేలికైంది.ఆ పెద్దావిడ మాటల్లో వినిపించిన కృతజ్ఞతాభావం నాలో మా ఆయనపట్ల ఉన్న ప్రేమా, నమ్మకమూ మరింత బలపడ్డాయి.. తాత్కాలికంగా నా మనసును ముసిరిన అనుమానం మబ్బు తెరలు ఒక్కసారిగా తొలగిపోయాయి. అపోహపడినందుకు మనసులోనే క్షమాపణలు కోరుకున్నా. ఎవరూ కూడా పూర్తిగా విషయం తెలుసుకోకుండానే ఎవరినీ.. మనవారినీ..అయినవారినీ అపార్థం చేసుకోవద్దని నిర్ణయించుకున్నా. అలికిడైతే ఈ లోకంలోకొచ్చి..గేటుతీసుకుని ఇంట్లోకి వస్తున్న మా ఆయనవైపు కన్నార్పకుండా ఆరాధనభావంతో చూస్తున్నా…

July 29, 2024 1 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మిత్రుని కాలం

by Ramesh July 29, 2024
written by Ramesh

ఆనందమంటే
తారల్లా దూరతీరాల్లో ఉన్న మిత్రుడు
తళుక్కుమని చెంతన మెరవడం
రెండుమనసులు ముఖాముఖవ్వడం
కష్టసుఖాల కరచాలనమవ్వడం

ఎదురు చూపులంటే
క్రొత్తజంట కలయిక కోసం కలగనడమే కానక్కర్లేదు
ఇన్నాళ్లు నేను మోసింది
ప్రేయసీ ప్రియుల విరహానికి
ఏ మాత్రం తీసిపోనిదని నేను భావిస్తాను

దీన్ని స్నేహవిరహమని
అనురాగ విరామని అంటాన్నేను

నీళ్లులేక ఎండలకు వలవల
వాడిన పూలచెట్టు
చిరుజల్లులకే
కొమ్మ కొమ్మల పూలై పూచిన చెట్టూ ఆకాశం
పువ్వై నవ్వడమే కదా అందమంటే

ఎన్నాళ్లుగా ఎదురు చూసిన
స్నేహితుని ముఖము
నాకు కేవలంగా కళ్లు ముక్కులు కానేకాదు
అది వేలకొమ్మలు పూచిన మహాపూలమాను

ఎండిన గుండైన చెరువు
వానాకాలం చెరవుగట్టు దాకా
నీళ్లతో నిండిన చందం
చిరకాల మిత్రుడు కలసిన ఆనందం
మమతల మాటలన్నీ అలలు అలలై
మనసునే తాకుతాయి
ఆ సమయమే
ఆ సమయమే మరుపురానిది
ఆ కాలం మిత్రునికాలం.

చందమామను మబ్బులు దాచినట్టు
మిత్రుణ్ణి వేసవి సెలవులు దాచాయి

జీవితాలకే చావుపుట్టుకలు
స్నేహమెపుడూ శాశ్వతమే
మనసున మనసైన
చెలిమి తోడుంటే అదికదా స్వర్గము.

మిత్రుని చెంత ఆనందం ఉంటే
ఆ ఆనందం
వేసవి సెలవులవెంటే ఉందనుకుంటా బహుశా
వేసవి సెలవులు వస్తే
ఉపాధ్యాయులకు,బడి పిల్లలకు సంబరమైతే
అల్లరిపిడుగుల అమ్మానాన్నల్ని,నన్నూ
ఒకింత భరించరానితనం అల్లుకుంటుంది

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వేణు నక్షత్రం కథలు సమకాలీన జీవన చిత్రాలు

by రంగరాజు పద్మజ July 29, 2024
written by రంగరాజు పద్మజ

వేణు నక్షతం కవి, కథా రచయిత. అమెరికా లో నివసిస్తున్నా భారత దేశాన్ని అను క్షణం మననం చేసుకుంటూ ఉంటారని వీరి కథలను చదివినప్పుడు కలిగిన అభిప్రాయం. “మౌనసాక్షి” “అరుగు “అనే రెండు కథా సంపుటాలు వెలువరించారు.

రైల్వే సత్యం ,అరుగు, బిడ్డా నువ్వు గెలవాలి! ధీమా పార్ట్ 1, ధీమా పార్ట్-2,వేకప్, మరియు ముద్రణా రూపంలో మృగాల మధ్య, నాతిచరామి, అశృవొక్కటి,
కౌముది నాటకం మరియు కథ, పర్యవసానం మొదలైన కథలు సమీక్ష కోసం ఎన్నుకున్న కథలు.

” ఏయది హృద్య మపూర్వం బే
యది యెద్ధాని వినిన యెరుక సమగ్రం బై యుండు అఘ నిబర్వణ మే యది యక్కథయే వినగ నిష్టము మాకున్॥”
అంటే కథ హృద్యంగా ఉండాలి !అంటే మనసును ఆకట్టుకునేలా… అపూర్వంగా అంటే అంతకుముందు చెప్పబడని కథ, లేదా ఇంత గొప్ప కథ నేనెప్పుడు వినలేదే? అని అనిపించాలి అని భావము.

సూతుడిని శౌనకాది మునులు అడిగిన ప్రశ్న ఇది!

ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంచి కథ వినదలచుకుంటే అడగాల్సిన ప్రశ్న ఇది. అఘము అంటే పాపమనే కాకుండా అలసట అని కూడా అర్థం ఉన్నది అలసట తీరే కథ చెప్పమని అడుగుతారు మునులు. అలసట అనేది ఒక శరీరానికే కాదు మనసుకు ఉంటుంది ఆ మనసు అలసట తీరేలా కథ చెప్పాలని ఇక్కడ ఒక హృద్యమే సరిపోదు!

కథ అంటే నీతి ప్రబోధమని…,
కథంటే ఆ కాలంలో నివసించే రీతులు చెబుతుందనీ….
కథ అంటే నిజాయితీ నేర్పిస్తుందనీ,
జీవన ప్రమాణాలు పెంచుతాయని విమర్శకుల ఉద్దేశ్యం…
పిల్లలకు- పెద్దలకు మానసిక వికాసం కలిగించేవి కథలు,
కథలు కళాత్మకమైన ఆలోచనలు కలిగించాలి!
రచయిత కథ చెప్పేటప్పుడు ఆ కథలలోని రేఖా మాత్రపు తన ఆలోచనను, బుద్ధి కుశలతను తన శిల్పంతో పాఠకులకు అందించాలి.

ఇక వేణు నక్షత్రం అశ్రువొక్కటి కథ చదివినప్పుడు… మా అన్నయ్య చాలా కాలం కింద మాకు చదివి వినిపించిన అనా ఫ్రాంక్ డైరీ నవల గుర్తొచ్చింది. ఇందులో 14 సంవత్సరాల అమ్మాయి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనలను తన డైరీలో రాసుకుంటుంది.
హిట్లర్ సాగించిన మారణకాండలో అనా ఫ్రాంక్ చనిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అటక మీద మూడు నెలలు దాక్కొంటారు. అప్పటి యదార్థ సంఘటనలు అన్నీ పూసగుచ్చినట్టు రాస్తుంది. అదే నవలగా వచ్చింది.
ఈ కథ నన్ను ఓ 45-50 సంవత్సరాల వెనక్కు తీసుకెళ్ళింది.
అన్నలు అని పిలిచే ఉద్యమకారుల గురించి, వాళ్లు సాధిద్దాం అనుకునే ఆశయం గురించి, వారు ఎన్నో కష్టాలు పడడం, అడవుల్లో వారి జీవితాలను గడిపేయడం, వారి ఆచూకీ తెలుపమని వేధించే పోలీసుల గురించి మా ఊళ్లో కథలు..కథలుగా చెప్పుకునేవారు.
కాబోయే పరిస్థితి ఏంటో తెలియనందున వారెందుకు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం వల్ల ఏం సాధిస్తున్నారో తెలియదు అది సరే దాన్ని పక్కన పెడితే ఎంతో కష్టపడి పార్టీ నడపడానికి వారి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడానికి కూడా పెట్టిన డబ్బులు ఆ సైద్ధాంతిక విలువలు తెలియని వారు వాటికి విలువనివ్వక దుర్వినియోగం చేసి వారి గురించి ఆ కార్యకర్తల అవగాహన లేని తన గురించి చర్చించబడిన సంఘటనల సమాహారకథ ఈ అశృవొక్కటి.
కాల మధ్య కథ కూడా ఇలాగే నడిచింది… ఈ కథ నడక చాలా బాగుంది.
ఏ సమస్యైతే మనసును బాధ పెడుతున్నదో? ఆ బాధ తొలగించేలా అంటే ఆయా.. సమస్యలకు ఉపశమనమో? పరిష్కారమో సూచించే కథలు చెప్పితే యువత వారి జీవిత లక్ష్యాలను సాధించుకుంటారని కథా రచయిత ఉద్దేశం.
చెప్ప ప్రభావంతో కథ రూపురేఖ విలాసాలు మారిపోయాయి… ఇప్పటి సమీక్షలకు అవి అందవు.
కాలంతో పాటు మనము మారాలి!
మరి కథలు దేని గురించి చెప్పాయి అని అడిగితే… వెంటనే నాకు సమాధానం చెప్పడంరాదు కానీ కథలు మాత్రం ఏదో ఒక విషయం గురించి చెప్తూనే ఉన్నాయి.
అయినా కథా నియమాలను అనుసరించి సామాజిక పరిస్థితులు గానీ, సమకాలీన సమస్యలు కానీ కథా వస్తువులు అవుతాయి!
కానీ దాని చుట్టూ కథ అల్లడం అంత సులువేం కాదు! చెప్పాల్సిన విషయానికి తగిన పాత్రలను సృష్టించి, సన్నివేశాలు కల్పించి, పాత్రల అనుభవాలనుండి- ప్రవర్తన నుండి తన ఆశించిన భావం పాఠకులకు చేరేలా చేయడం కథారచన నియమం మరియు శైలి!
వేణు నక్షత్రం దాదాపు కథ నియమాలు పాటిస్తూనే రీడబులిటీ ఉన్న కథలనే రాసారు.
రీడబులిటీ ఉన్న కథలు చదువరుల పఠనం సాఫీగా సాగించడమే కాకుండా…ఆకర్షించాయి.అవగాహననూ పెంచాయి, ఆలోచనలను రేకెత్తించాయి. అందుకృ గాను రచయితను అభినందిస్తూ…
ఒక్కొక్క కథను చదివినప్పుడు నాకు కలిగిన భావాలు ఇలా ఉన్నాయి….
ఈ మృగాల మధ్య కథ దిగువ మధ్యతరగతిలోని ఆదాయమంతగా లేని కుటుంబా నేపద్య కథ కొంతవరకు అన్ని కథల వలనే నడిచి , బాబ్రీ మసీదు సమస్య వైపు మలుపు తిరిగింది.
అందునా కాంతమ్మ కులం గురించి చెబుతూ… “గరీబోళ్ల కులము” అని సమాజాన్ని ప్రశ్నించింది అని రచయిత అన్నారు.
తనకు జ్ఞానోదయం అయింది అని రాశారు. అలా రాయడంతో రచయిత హృదయంఅవగతం అవుతుంది పాఠకులకు….
ముష్కర ముఖ కాంతం మను విచక్షణారహితంగా పొడవడం ఆమెకు వైద్యం చేయించడం మానవత్వం ఇంకా బతికి ఉందనీ, ఉండాలనీ చక్కటి సందేశం ఇచ్చారు.
అధికార దాహానికి “మృగాలు వేటాడినా…
అమ్మా! అన్న మూలుగు అతనిక ఆనందాన్ని ఇవ్వడం, దానికోసం అన్ని మతాలవారూ ఆమె ప్రాణాన్ని నిలబెట్టారని చెప్పడం మతసామరస్యాన్ని చెబుతున్నదీ కథ!
నాతిచరామి
ఈ నాతిచరామీ కథ అమెరికా అబ్బాయితో ఇండియా అమ్మాయి పెళ్లి కథాంశం.
T.V నీ మోసాలు జరుగుతున్నాయని, బాధపడడం …కొంత కాలం ఏవేవో ఊహించుకోవడంతో చికాకులు కలిగినా, కొంతకాలం తర్వాత చక్కగా సాగినా.. కడుపులో Sisto రూపంగా వేదన మొదలై, పిల్లలు పుట్టరన్న విషయం కుంగ తీస్తుందా జంటను.
పిల్లల కోసం రమేష్ నురెండో పెళ్లి చేసుకోమని తల్లిదండ్రుల దగ్గర నుండి ఒత్తిడి రావడం నాతిచరామి అర్థం ప్రసక్తి రావడం, దానికి అర్థమే లేదని అనడం పావని మానసిక స్థితిని తెలుపుతున్నది…రచయిత నూతన థృక్పథం తెలుస్తున్నది.
విడాకులు ఇమ్మని అడిగినప్పుడు “విడాకులు నువ్విచ్చేదేముంది”? నేనే ఇస్తాను! అనే మాట ఆడవారికి స్వాభిమానం, స్వతంత్రత ఉండాలని చక్కని సందేశం ఇచ్చిన కథ .
ఇలా వేణు నక్షత్రం గారి రచన ఇటు ఆధునికతను అటు ప్రాచీనతను సంతరించుకున్నవి.
కౌముది
గుఱ్ఱపు స్వారీ చేస్తూ వర్తకం చేసే యువకుడి వలె రాకుమారుడు రావడం, అందమైన అమ్మాయిని చూసి ఆకర్షితుడవడం, ఆ అమ్మాయి సాహసాన్ని చూసి ఆశ్చర్య పోవడం, మిథిలా నగరానికి తోవ ఎటువైపు అని అడగడం… అది అక్కడికి కనపడుతుండడంతో…
కళ్ళు కనపడటం లేదా? అని ఆ అమ్మాయి ఆ రాకుమారుడిని వెక్కిరించడం…ఈ సంభాషణ చదువుతుంటే కాస్త జానపద పౌరాణిక కథను పోలి ఉన్నది కథ ధైర్యం తెలివి చూసి ఆశ్చర్యపోతూ నేను యువరాజునని నీకు ఎలా తెలుసు అని అడిగితే ఆ అమ్మాయి తన నాయనమ్మ గుర్రం మీద రాకుమారుడు వచ్చి తనను తీసుకుపోతాడు అని చెప్పిన మాటకు తమరే యువరాజు అనుకున్నానని అమాయకంగానూ చమత్కారంగాను అనడం..
అయినా ఈ దేశంలో ఆడపిల్లలతో మాట్లాడే సాహసం ఎవరికీ లేదనడం ఆ రాజు చక్కని పాలనతెలియ చెప్పినట్టైంది.
దేశ పౌరులకు నీతి- నిజాయితీ ఉండాలనే సందేశం చక్కగా కథ సాగుతూనే… కథలోనే ఇమిడిపోయింది.
కౌముదికి ప్రేమించానని,పెళ్లి చేసుకుంటానని మాట అయితే ఇచ్చి వచ్చాడు కానీ తండ్రి ఒప్పుకుంటాడా? లేదా? అనే సందేహం అలాగే ఉంది .
ఎందుకంటే తన ఒక్కగానొక్క అక్క తండ్రి తెచ్చిన సంబంధం కాకుండా… మంత్రి కొడుకును వివాహం చేసుకున్నందుకు కొత్త పెళ్ళి జంటకు మరణ దండన విధించడం గుర్తుకు వచ్చి, బాధ భయం రెండూ కలిసి, తండ్రికి తన విషయం ఎలా చెప్పాలో తెలియక, ఆయన పట్టింపులు నచ్చక తాను కోరిన కౌముదినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవడం అది తాననుకున్నంత సులువు కాదని అనుకున్నా గట్టి పట్టుదల కలవాడు కనుక తనకు లేని జబ్బు ఉన్నట్టు ప్రాణాపాయం ఉందని పుకారు పుట్టించాడు రాకుమారుడు.
పుకారులు నమ్మికుంటల రాజు తన కూతురు వివాహం రాకుమారుడుతో రద్దు చేస్తున్నట్లు కబురు చేయడం మరింత బాధపడిన రాజు కూతురు పట్ల చూపిన మండివైఖరితో ఆమె చనిపోవడం కొడుకు కూడా చనిపోతే తన గతి తన రాజ్యాంగము ఏమవుతుందని తన కొడుకుకు సేవలు వ్యాధి నయం చేస్తే అర్ధరాజ్యం ఇస్తాననడం ఎవ్వరూ రాకపోవడం తరువాత కౌముది తాను వైద్యం చేస్తానని యువరాజు దగ్గరికి వెళ్లిన కౌముదికి అసలు విషయం తెలిసి ఇద్దరు సంతోషంగా ఉండడం వ్యాధి తగ్గిందని సంబరాలు చేయడం ముందు ప్రకటించిన అర్ధరాజ్యం తీసుకోమని కౌముదిని అనడం..హ ఆమె తిరస్కరించడం
వ్యాధి వచ్చిన వారికి ఆదరణ ముఖ్యమనే
మరో సందేశాన్ని చక్కగా కథకు కనుగుణంగా రాశారు రచయిత.
ఈ ఆస్తి అంతస్తులు ముఖ్యం కావని, ప్రేమ ముఖ్యమనే మరో సందేశం ఇవ్వబడిందీ కథలో…
ఇక్కడ కాస్త ఉత్కంఠ అంటే సస్పెన్స్ కథను చదివించేలా తోడ్పడింది.
పూల మాలలతో వివాహం జరిపి, తెలిసి తప్పు చేయవద్దని… అలాగే తప్పు చేస్తున్న వ్యక్తిని సమర్ధించవద్దని రాసి,ఒక నినాదాన్ని గుర్తుచేశారు రచయిత.
ఏకపక్షంగా రాజే నిర్ణయాలు తీసుకోవద్దనీ… సభలోని వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని రాసి, ఈనాటి ప్రభుత్వాలకో హెచ్చరిక చేశారు వేణు నక్షత్రం .
ఈ కథ చదివినప్పుడు ఫీల్ గుడ్( Feel good)కథా కోవలోకి వస్తుంది అనిపించింది.
గుర్రం మీద రాకుమారుడు వచ్చి సామాన్యురాలు వివాహమాడనే కాన్సెప్ట్ తో ఉన్న కథలు వినక చాలా సంవత్సరాలు గడిచింది.
ప్రముఖ చలన చిత్ర దర్శకుడు విఠలాచార్య గారు సినిమాలు తీయడం మానేశాక ఈ గుర్రాల మీద రాకుమారులు వచ్చేసి సినిమాలు చూడనే లేదు.
కాబట్టి మనసుకు ఉల్లాసం, ఉత్సాహం కలిగి
వెనుకటి తరం కోరుకునే సుఖాంతం టైటిల్ పడింది.
సంతోషంతో కొనసాగుతున్న కుటుంబ కథలను చదివినప్పుడు మనపై ఆ సంతోష ప్రసారాలు మన మీద పడతాయనీ, అలాగే ఇలాంటి స్త్రీ- పురుష వర్ణనలున్న కథలను చదివితే భావుకత కలుగుతుంది. ఇలా కథ రకరకాల రసాస్వాదన చేస్తుంది.
కథ చిన్న పిల్లలకే కాదు పెద్దవారికి మానసిక వికాసం కలుగుతుంది. అటువంటి కథలే ఈ వేణు నక్షత్రం కథలు.
ఇవాళ మనమున్న సమాజానికి మానవత్వం మేలుకొలుపే కథలు మానవ సంబంధాలు మెరుగుపరుచుకునే కథల అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.
అదే కాకుండా ఎలా చెప్తున్నారు అన్నది కూడా ముఖ్యం. ఈ రెండూ కథ నిండుగా ఉండాలని మా నాన్నగారు అనేవారు..
వేణు నక్షత్రంకథలలో అలాగే ఆ రెండూ ఉన్నాయి. మొదట కథలు ఎలా ఉండాలని ఆకాంక్షించానో దాదాపుగా అలానే ఉన్నాయి.
కథా సమీక్షలు కొత్తగా కథలు రాసే వారికి ఎంతో ఉపయోగం. రచయితకూ ఉపయోగమే!
వేణూనక్షత్ర కలం మరిన్ని కథలను అల్లాలని..చదువరులను- వినుకరులనూ అలరించాలని శుభకామనలతో…

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వచన కవితాకన్య రూప లావణ్యం – దాస్యం సేనాధిపతి ‘దిక్సూచి’

by Aruna Dhulipala July 29, 2024
written by Aruna Dhulipala

          కాలక్రమానుగతంగా అన్ని రంగాల్లోనూ మార్పు అనివార్యం. అందులో దేనికీ మినహాయింపు ఉండదు. అలాగే సాహిత్యంలోనూ ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు సామాజిక పరిస్థితులకు, మనుష్యుల భావాలకు అనుగుణంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఛందో బద్ధమైన పద్యకవిత్వం నుండి, మాత్రా ఛందస్సులతో కూడిన గేయకవిత్వంతో పాటు అనేక కవితాప్రక్రియలు సాహిత్య పూదోటలో వికసించి లతలుగా పెనవేసుకున్నాయి. అటువంటి వాటిలో వచనకవిత్వానికి నేటికాలంలో ఎంతోమంది కవులు తమ హస్తాక్షరాలతో అలంకారాలు తొడిగి ప్రకాశింప జేస్తున్నారు.

        కవుల భావనా తరంగమై ప్రవహించి కవిత్వం ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. అలాగని అది ఎటువంటి నియమాలకు లోబడి ఉండక పూర్తి స్వేచ్ఛా కాంక్షతో రూపు దిద్దుకున్నప్పుడు కొంత లోప భూయిష్టంగాను, మరికొంత పొరపాట్లతోను, ఇంకొంత పాఠకులకు అనాసక్తిగా పరిణమించే అవకాశం లేకపోలేదు. జీవన మనుగడ నియంత్రణ అవసరమైనట్లే దేనికైనా ఒక నియమం, ఒక నియంత్రణ అత్యవసరం.

        ‘వచన కవితా పితామహుడు’ గా కుందుర్తి ఆంజనేయులు గారు ఆధునిక కాలంలో వచన కవిత్వ ఆవశ్యకతను గుర్తించి 1958 లో ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ ను స్థాపించారు. వచన కవిత్వ లక్షణాలతో ‘నగరంలో వాన’ కావ్యాన్ని రచించారు. ‘ఫ్రీవర్స్’ అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా తెలుగులో వచనకవిత చెప్పబడుతోంది. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్యులు, డా. సి.నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ మొదలైన వారు వచన కవిత్వాన్ని ఆదరించారు. రచించారు. తరువాతి తరాలకు మార్గదర్శకులయ్యారు.

         ప్రజలకు సన్నిహితంగా ఉండేందుకు, వాడుక భాషలో, అలతి పదాలతో, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వచన కవితకు ప్రధాన లక్షణం. దీన్ని రాసేటప్పుడు కవులు ఏ విధమైన నియమాలను, లక్షణాలను పాటించాలో, సమాజంలో ఏ విధంగా చైతన్యాన్ని వికసింపజేయాలో తెలుపుతూ దాస్యం సేనాధిపతి గారు ‘దిక్సూచి’ అనే పుస్తకాన్ని వెలువరించారు. దీనిని వచన కవితకు కరదీపికగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి ఈ పేరు పెట్టడం లోనే ఆయన అంతరార్థం ప్రస్ఫుటమవుతోంది. శక్తివంతమైన రచనా నైపుణ్యతను సాధించే దిశగా ప్రస్తుత కవులకు సుబోధకంగా, సులభసాధ్యంగా ఆయన ఈ పుస్తకాన్ని వెలువరించారు.
           ‘కవిత్వమంటే’ …అని ప్రారంభిస్తూ, అనేకమైన మౌలిక లక్షణాలను క్రోడీకరిస్తూ ‘కవిత్వంలో మానవతావాదం’ వరకు ఉన్న విభాగాలు  వచనకవిత్వ ప్రాధాన్యత, దాని నియమావళిని తెలుపుతాయి.

ఈ భాగాలలో దాదాపు 320 మందికి పైగా ప్రాచీన కవుల నుండి నేటి కవులవరకు వారి రచనలలోని పాదాలను దశలవారీగా ఉటంకించడం, స్వరూప సామ్యాలను తెలపడం సేనాధిపతి గారి తులనాత్మక పరిశీలనను ప్రతిబింబిస్తుంది.

          “కవిత్వమంటే హృదయాలను కదిలించే అనుభూతినివ్వాలి. వస్తువును దాచడం కాదు. పొరలు పొరలుగా విప్పుతూ పద బంధాలతో, భావచిత్రాలతో పాఠకుడిని తన్మయుడిని చేసేది కవిత్వం, కవిత్వం హృదయాన్ని మీట గలగాలి” ఈ మాటలు చాలు కవిత్వం రాసే కవుల కర్తవ్యాన్ని బోధించడానికి. దీనికి ఉపపత్తిగా ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ గారు రచించిన ‘కవిత్వం కావాలి కవిత్వం’ అనే కవితను మనముందు నిలుపుతారు.

         అలంకారాల గుబాళింపు, పద చిత్రాలు, ప్రతీకలు, విరుపులు, మెరుపులు, ఎత్తుగడ, ముగింపు ఎంతవరకు అమరాలో, ఒదగాలో అది మంచి కవిత్వమని నందిని సిధారెడ్డి గారు చెప్పిన భావాల విశ్లేషణతో సేనాధిపతి గారు ఉత్తమ కవిత్వానికి ఉండాల్సిన ఎన్నో లక్షణాలను విశదీకరిస్తారు.

డా. సి నారాయణ రెడ్డిగారు రాసిన ‘మనోదృశ్యం’ కవిత

ఎత్తుగడ….

“ఆ దృశ్యాన్ని ఎన్నాళ్లుగా చూస్తూ ఉన్నానో/
దాని అందాలను ఎన్నిసార్లు తాగి చూస్తున్నానో/
దాహం తీరలేదు”….ఇలా మొదలవుతుంది. అది పాఠకుని అవ్యక్తభావనలో ముంచుతుంది. అందుకే కవిత్వ నిర్మాణానికి ఎత్తుగడ చాలా ముఖ్యమైనది.
           అలాగే కవితా వస్తువును విశ్లేషించడానికి వినియోగించబడే భాష, పదబంధ ప్రయోగంలో ఔచిత్యం, శైలి, శిల్పం ఇవి ప్రధాన భూమికను పోషించడంతో పాటు నర్మ గర్భత, సంక్షిప్తీకరణలు, కవితా నిర్మాణంలో శబ్ద, అర్థాలంకార ప్రయోగాలు కవిత్వాన్ని పరిపుష్టం చేస్తాయంటారు సేనాధిపతి గారు.

ప్రముఖ కవి యాకూబ్ గారు…

“నిన్ను కలిసాకే
నా మనో ఉద్యానవనంలో పూలు పూచాయి
అక్షరాల కలువలు విప్పారాయి…..” అన్నప్పుడు

మరో ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి…

“ముక్కారు
పచ్చని వరెన్నుల్ని ప్రసాదించే
బంగారు బాతు మా వాగు..” అని చెప్పినప్పుడు
ఆ అలంకార ప్రయోగాలు ఎదలను హత్తుకుంటాయి.

            కవిత్వాన్ని నిర్వహించేటప్పుడు భావాలను గణాలుగా, భావవ్యక్తీకరణకు అనువుగా విభజించుకోవడం ఒక పద్ధతి. కవి ప్రతిభను వెల్లడించడానికి, కవిత్వ సౌందర్యానికి, పాఠకులలో ఆసక్తిని పెంచి, క్రమంగా కవిత్వంతో నడవడానికి, సులభంగా అవగాహన చేసుకోవడానికి ఈ గణాలు ఉపయోగపడతాయి.

‘కాలం కాలం చేసింది’ కవితలో సినారె గారు…

మొదటి పేరాలో మూడు పంక్తులు, రెండవ పేరాలో నాలుగు పంక్తులు, మూడవ పేరాలో మూడు, నాలుగవ పేరాలో రెండు…ఇట్లా స్వేచ్ఛా భావనకనుగుణంగా కవితను రూపొందించారు.

అదే విధంగా దాశరథి గారు ‘తమ పునర్నవం’ లో కావ్యంలో ‘రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందట’

అన్న శీర్షికతో రాసిన కవిత నిన్న, ఇవాళ, రేపు పేరాలుగా క్రాంత దర్శనం చేయిస్తుంది. ఈ భావగణాల్లో అక్షరాలు, పాదాల విషయంలో ఎటువంటి నియతి ఉండదు. భావమే ప్రధానం.

           ‘వక్రోక్తి’ వచన కవిత్వానికి ఉండే ప్రధాన లక్షణాల్లో మరొకటి. పాఠకుల హృదయంలో ఆలోచన రేకెత్తించి, స్తబ్ద మనస్తత్వాన్ని నిరసించడం కోసం వక్రోక్తి కొంతవరకు ఉపయోగపడుతుంది. వ్యంగ్యం, చమత్కారం వక్రోక్తికి ఆభరణాలు. కానీ అది వస్తువు యొక్క పరిధి దాటకూడదు. పదబంధ ఔచిత్యానికి భంగం వాటిల్లకూడదు.

శ్రీశ్రీ నిరసన గళంలో…
“మనదీ ఒక బ్రతుకేనా?
కుక్కలవలె నక్కల వలె
సందులలో పందుల వలె…..” అనే వక్రోక్తులు తమను
తాము ప్రశ్నించుకునేలా చేస్తాయి.

కవి డా. ఎన్. గోపి ‘ఫ్రీడం ఫైటర్’ కవితలో…
“అతడు నాకు రోజూ కనిపిస్తాడు
లక్షల్తో త్యాగాన్ని వెలిగించి
ఇంట్లో ఎండిన డొక్కల కోసం
ఇల్లిల్లూ తిరుగుతుంటాడు…” లాంటి పాదాలు ఆకలి పేగులను దృశ్యమానం చేస్తాయి.

          కవిత్వ నిర్మాణంలో ‘భావచిత్రాలు’ ఒక ప్రత్యేక లక్షణం. వీటిని ఇంగ్లీషులో ‘ఇమేజరీ’ అంటారు. భావచిత్రాలు కవి భావావేశాన్ని, భావధారను స్పష్టీకరిస్తాయి. భావచిత్రం కంటికి కనిపించేది కాదు. అనుభూతి ప్రధానమైనది.

దాశరథి గారి ‘అగ్నిధార’ లో
“లోకపు చీకటి చీరకు/ ఆకాశం రైక మీది/ చిన్ని చుక్కల పువ్వులు/ తళుక్కుబెట్ట గలిగేనా/ జరి అంచు మెరిసేనా?…..” లాంటి పాదాల భావ చిత్రాలు దృశ్యాలను కట్టెదుట నిలుపుతాయి.

అహ్మద్ ఫైజ్ రాసిన కవిత్వాన్ని వి.జి. కిర్నన్ ఆంగ్లంలోకి అనువదిస్తే దానిని జం జం సత్యనారాయణ అనే మహబూబ్ నగర్ కు చెందిన కవి తెలుగులోకి అనువాదం చేసారు. అందులో ‘నేటి రాత్రి’ కవితలో “ఈ రాత్రి వీణపై విషాద రాగాలకు/ గతం బాధలన్నీ దూరమైనాయి…..” వంటి పాదాలు కవిత్వ సౌందర్యాన్ని ఇనుమడింపజేసాయి.
సినారె గారు ‘రెక్కలు’ కవితా సంపుటిలో కొవ్వొత్తులు తాగుతాయి/తనమీద దాడి చేసిన/ పురుగుల రెక్కలను….. ” అంటూ అద్భుత భావచిత్ర పద మాధుర్యాన్ని అందించారు.

         కవిత్వంలో వస్తువు ప్రధానమన్నది అందరికీ తెలిసినదే. దాన్ని అందంగా, పొందికగా నిర్మించడంలోనే కవి సృజనాత్మకత ఆవిష్కారమవుతుంది. అయితే కవిత్వంలో విరుపులు, పాదాంతాలు వీటి దగ్గర ఉపయోగించే విరామచిహ్నాలు కూడా కవిత్వంలో ప్రాధాన్యతను సంతరించుకున్న అంశమే. వీటిని కూడా సందర్భోచితంగా, అవసరమైనంత మేరకే ఉపయోగించుకోవాలి.

       కవిత్వంలో ‘ఔచిత్య పద బంధ ప్రయోగం’ చాలా ముఖ్యమైనది. కవిత్వం మనిషి అంతరాత్మతో సంభాషణవంటిదంటారు సేనాధిపతి గారు. కవి తన భావావేశాన్ని కొన్నిసార్లు అగ్నిపర్వతంలా వెడల గక్కుతాడు. ఒక్కోసారి ఆర్ద్రతతో నల్లని మబ్బులా వర్షిస్తాడు. అయితే సంయమనం కోల్పోయే పరిస్థితుల్లో పద ఔచిత్య విస్మరణకు గురయ్యే ప్రమాదం ఉంది. పాఠకులలో అన్ని రకాల వాళ్ళుంటారు కాబట్టి సభ్యత, సంస్కారయుతమైన పదాలు కవికి గౌరవాన్ని ఆపాదిస్తాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరమని సేనాధిపతిగారు చెప్పిన విషయాలు కవులు తప్పక పాటించి తీరాలి.

        చాలా సందర్భాల్లో కవి ‘స్వగతం’ కవితారూపాన్ని పొందుతుంది. ఆనందం, విషాదం రకరకాల పాత్రలుగా దృగ్గోచరమవుతుంది. ఈ స్వగతాన్ని బహిర్గతం చేసేటప్పుడు చమక్కులు, వ్యంగ్యం, మెరుపులు, చురకలు చోటు చేసుకోవచ్చు. వస్తువు స్వగత రూపంలో అంతర్వేదన వాహిని అవుతుంది.

        కవిత్వ నిర్మాణంలో భాష చాలా కీలకమైనది. కవి తన హృదయంతో కవిత్వం రాస్తాడు. ఏ భాషలో నైనా కవులు విశ్వజనీన భాషకే పట్టం కడతారు. వస్తు రూపాలు, శిల్పం, అభివ్యక్తి వీటన్నింటికీ మూలాధారం భాష. కవిని కవిగా నిలబెట్టేది భాష. భాషకు కావలసింది పాండిత్యం కాదు వస్తువును ప్రతిభావంతంగా,

సందర్భోచితంగా, ఔచితీవంతంగా ప్రకటించడానికి మామూలు పదాలు అయినా ఉండవచ్చు అని తమ అభిప్రాయ ప్రకటన చేస్తారు సేనాధిపతి గారు. మాండలికంలో కవిత రాసేటప్పుడు మొదటి నుండి చివరిదాకా ఆ పదాలనే ఉపయోగించాలి. కవిత్వ పదాల్లో సంక్లిష్టత, సందిగ్ధతలకు తావు ఉండకుండా జాగ్రత్త పడాలి. అక్షరదోషాలు ఉండకుండా చూసుకోవాలి.

         ఇక ‘ముగింపు’ అనేది కవితను మొత్తంగా ఆలోచింపజేస్తుంది. ఇది కవి రచనా నైపుణ్యాన్ని వ్యక్తీకరిస్తుంది. కవి శైలి,ముద్ర ఇందులో కనిపించాలి. ఇది ఆలోచనాత్మకంగా, సందేశాత్మకంగా ఒక వ్యంగ్యం, ఒక మెరుపు, ఒక చురుకు, ఒక చరుపులతో ఉండాలి. కొత్త ఆలోచనకు తెరతీయాలి. కవితాత్మకమైన స్పష్టత కనిపించాలి. ఇవన్నీ రావాలంటే కవికి అధ్యయన శీలత్వం, ప్రముఖుల రచనల పరిశీలన, వాటి తీరుతెన్నులను గ్రహించే నేర్పు ఉండాలని కవులకు పథ నిర్దేశం చేస్తారు దాస్యం సేనాధిపతి గారు. ఇంకా ఇలాంటి అనేకమైన విషయాలు ఈ పుస్తకంలో పొందు పరచబడ్డాయి.

         నేటి కాలంలో కవులు, కవయిత్రులు అనేక మాధ్యమాల ద్వారా వారి కలాలను, గళాలను కదిలిస్తున్నారు. కొంతవరకు వాటిని పరిశీలిస్తే  ఆత్మవిమర్శకు తావు లేకుండా, రాయడమే ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాంటి వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం దిక్సూచి. రాయడం ప్రారంభించాలనుకున్నవారికైనా, రాస్తున్న వారికైనా ఆత్మ పరిశీలన చేసుకొని మంచి కవిత్వాన్ని రాయగలిగే మెళకువలను బోధించే ఉత్తమ గ్రంథమిది. దీనికోసం ఆయన చేసిన కృషి అనితరసాధ్యం. ఎవ్వరైనా చేతి ఊతంగా దీన్ని పట్టుకొని వచన కవితా సాగరతీరాన్ని సులభంగా చేరుకోవచ్చు.  తరతరాలు నిలిచివుండేలా ప్రామాణికమైన కవిత్వ లక్షణాలతో ఒక గొప్ప పుస్తకాన్ని అందించిన సేనాధిపతిగారు అభినందనీయులు.

July 29, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

పిచ్చుక

by Gaddam sulochana July 29, 2024
written by Gaddam sulochana

ఊర పిచ్చుక ఊరు వదిలిందా? ఊరు పొమ్మందా?
చేలల్లో ,చేలకల్లో, వాకిళ్లలో నీ సందడి లేక చిన్న పోతుంది.

వాడదాటి, ఊరు వదిలి, చూరు విడిచి పోయావెక్కడికి?
నీ కిచ కిచల పాటలు
ఓర చూపులు
చిలిపి గంతులు
నీటి ఆటల చిందులు చూస్తుంటే మాకెంత ఆనందమో! తెలుసా?
చిన్ని రెక్కలతో తుర్రుమని ఎత్తులకు ఎగిరిపోతావు.

చూరులో నీవు గూడు కడితే మురిసిపోయాము.
ఇప్పుడేమో
కనపడవు
వినపడవు..
బుర్రుపిట్ట పాటలు
పిట్ట కథలు
పిచ్చుక గుళ్ళు
ఇక కట్టు కథలు అంటే తట్టుకోలేము.

బుజ్జి పిట్ట బాధ ఎవరికి
పట్టదు..
మనిషి మారిపోయాడు..
స్వార్థంతో ప్రకృతి
వినాశనం..
ఎండవేడి భూతాపం కాలుష్యాలు..
తాళలేని చిన్ని ప్రాణి..
తిండి లేక,నీరు లేక, తలదాచుకోలేక తల్లడిల్లుతున్నది. రెక్కలు ఉడిగి పిట్టలు పిట్టల్లా రాలిపోతున్నాయి..
పిల్లల బంగారు
బాల్యంలో బంగారు
పిచ్చుక సందడే
లేదు.

చిన్ని ప్రాణులను
చరిత్రలోకి తోయొద్దు
నిలుపుకుందాం..

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శవ యాత్ర “పాఠం !”

by రాఘవాచార్య‌ July 29, 2024
written by రాఘవాచార్య‌

పటాటోపంగా ప్రచారంగా
పైన కాషాయం గుర్తులు లేకుంటేనేం
శవం నిజంగా త్రికరణ శుద్దిగా సన్యాసి !
కండ్లు మూసుకుని జపంలోనే ఉంటుంది
దొంగజపం కాదు సుమా!
గిచ్చినా లేవదు

ఆశగా వెంట దాచుకుని ఏమీ తెచ్చుకోదు !
బహిరంగంగా ఊరందరి ముందే నిష్క్రమణ !
చివరకు తన పైన చల్లిన రుచికర కరకర పేలాలను
కాకులకే వదిలేస్తుంది !

వెంట వచ్చిన వారిని తనను మరిచి పొమ్మంటుంది 
ఉన్నవన్నీ వదిలేసిన
వఠ్ఠి వఠ్ఠి చేతులు !
కనీసం కాళ్లకు చెప్పులైనా లేవు

ఖాళీ ఖాళీ చేతులుగా
శవం ఎంతో విశ్వాసంగా విశ్వజనీన సత్యం !
 ఎవరైనా శవ యాత్రలో పాల్గొంటే పరిణతి చెందుడే !!
శవం బతికున్న వారికి మార్గదర్శనంగా లెజెండ్ !
“ప్రజా నాయకులై ఎంత దోచుకు తిన్నా
చివరకు ప్రజలకు వదిలేసి పోవాల్సిందేనని !!”
ఎంత గొప్పది  “శవం పాఠం”

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

The Learned

by Rudrakhala Matam Prabhu linga Shastri July 29, 2024
written by Rudrakhala Matam Prabhu linga Shastri

“I” could be understood
No doubt be in this regard.

He could understand “I”
As same “I” in any context?

If He could go on doing So
Chance would be there surely.

Is certainty possible there?
When Sincerity is in going on.

“I” would be understood means?
“HE” merges into “I” forevermore.

Without merging, Couldn’t He?
Understanding means Learning “I”
Who would be The Learned in Each.

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనసు – మాట

by Aruna Dhulipala July 29, 2024
written by Aruna Dhulipala

వాళ్లిద్దరూ….
ఎంతో ఆత్మీయులు
అప్పుడప్పుడు
విడదీయలేని శత్రువులు

అంతరంగ జగత్తుకు
ఒకరు సాధికారులు
శబ్దాశ్రయంగా
బహిరంగ స్వరాధికారులు
వేరొకరు

లోతుల్లోని భావాల
మర్మం ఒకరైతే
భావ వినిమయ ప్రసారాల
చతురులు మరొకరు

ఆలోచనల సూక్ష్మత
ఒకరిదైతే
పెదవుల వాహకంగా
పరుగులు తీసే
ధ్వని తరంగాలు ఇంకొకరివి

మనసు చెప్పినా
మాట పలుకదు ఒక్కోసారి
వద్దంటున్నా
పలుకక ఉండదు మరోసారి
వీటి మధ్య మౌనం
మింగుతుంది కాలాన్ని
అనేకసార్లు

మనసు, మాటకు నడుమ
కావాలి మేలనం
అదే కరువైతే
వ్యక్తిత్వపు చిరునామాకు
తప్పవు అవమానాలు
అనుభవం ఎంతటిదైనా-!!

దాచుకోవాల్సినవి కొన్ని
దాపరికం ఉండకూడనివి మరిన్ని
ఏది తగునో?
ఏది తగువో?
పెదవి దాటడమంటే
మనసు స్వచ్ఛమై వికసించడమే !!

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆషాఢం – విశిష్ఠత

by Vijaya Goli July 29, 2024
written by Vijaya Goli

భారతీయ హిందూ సంస్కృతి లో ప్రతి పురాతన సాంప్రదాయానికి శాస్త్రీయ కారణం ఉంటుంది . అలాగే మన తెలుగు నెలలు ఛైత్రము నుండి ఫాల్గుణం వరకు ప్రతి మాసం ప్రత్యేకమైనదే.ప్రతి మాసానికి ఆ సమయపు వాతావరణాన్ని బట్టి ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ,శాస్త్రీయ బద్ధంగా ఉంటాయి.ఇపుడు మనం ఆషాఢ మాసం గురించి విశ్లేషించుకుందాము.
ఈ సంవత్సరం జూన్ 24ఆదివారము నుండి మొదలుగా జులై 21 వరకు ఆషాఢ మాసం వుంది .
ఆషాఢమాసం అనగానే అందరికీ ముందుగా గుర్తు కొచ్చేది వానలు .
తెలుగు నెలలలో ఛైత్రం తర్వాత ఆషాఢం నాల్గవ నెలగా వస్తుంది .ఆషాఢ పౌర్ణమి ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ కానీ నక్షత్రాలతో కలిసి వస్తుంది కాబట్టి ఆషాఢ మాసంగా పరిగణించారు .
ఈ నెల నుండే వర్షాకాలం మొదలవుతుంది. అప్పటి వరకు వున్న వేసవి తాపాన్ని చల్ల బరుస్తూ ..చిరు జల్లులతో వాతావరణం చాలా ఆహ్లాద కరంగామారుతుంది .
ప్రకృతి ఆకుపచ్చని చీర కట్టిన పెద్ద ముత్తైదువలా ఉంటుంది . వర్షంలో తడిచి …పచ్చగా కొత్త చిగురులతో నిగారింపు తేలుతుంది .ఆకాశమంతా ఒక్క సారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చి …ఆమబ్బుల మధ్య మెరుపు తీగల నాట్యం కనుల విందుగాకనిపిస్తుంది .అదేసమయంలో ఒక్కోసారి దేవ దానవ యుద్ధాన్ని స్పురణకు తెస్తూ భయపెడుతూ ఉరుములు ..ఒక్కోసారి శుభకార్యాలను గుర్తు చేస్తూ మంగళ వాద్యాలుగా వీనుల విందు చేస్తాయి .నదులు ,చెరువులు పొంగి పొర్లుతూ వుంటాయి. అంతలోనె మబ్బులన్నీ చెదిరిపోయి వెండి వెలుగులతో సూర్యుడు వేడుక చేస్తాడు. అప్పడప్పుడు హరివిల్లులు దాగుడు మూతలాడుతూ అల్లరి చేస్తాయి.వ్యవసాయానికి కూడా చాలా అనువైన సమయం .
శుభకార్యాలు చేయక పోయినా ఆధ్యాత్మికతను అంతరించుకున్న మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం అంతా విష్ణు చింతన మంచిదంటారు .
ఏకాదశి నుండి విష్ణుమూర్తి క్షీర సముద్రంలో యోగ నిద్రలో శయనిస్తాడని ,ఆరోజును శయన ఏకాదశిగా ,తొలి ఏకాదశిగా ఉపవాస వ్రతాలు ,సముద్ర స్నానాలు చేస్తారు . దక్షిణాయనం ప్రారంభ దినంగా కూడా శాస్త్రం చెపుతుంది .సాధు సన్యాసులు చేసే చాతుర్మాస దీక్షలు కూడా ఈ రోజు నుండే మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి తో ముగుస్తాయి .అలాగే భాను సప్తమి ఆ రోజు పగలు ,రాత్రి సమంగా ఉంటాయి.
ఈ మాసం లోనే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతాయి .ఆడవారికి విశిష్ఠమైన బోనాల పండుగ కూడా ఆషాఢం లోనే ఆరంభ మవుతుంది. ప్రకృతి ప్రసాదించే పచ్చని కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ఆరాధిస్తారు.మొదటి పంటగా అమ్మ వారికి నైవేద్యం పెడతారు.
ఆషాఢమంతా కూడా ఆధ్యాత్మిక పరిమళాలతో భక్తులు పరవశం చెందుతారు .ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి గురు పూర్ణిమగా ,వ్యాసపూర్ణిమగా పిలువబడుతుంది . గురుపూజ ఉత్సవాలు జరుగుతాయి .పితృ తర్పణాలకు ప్రత్యేకమైన మాసంగా కూడా పరిగణిస్తారు .
ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా చెప్పారు .వేసవి వల్ల వేడెక్కిన భూమి ఒక్క సారిగా వర్షాలతో చల్ల పడటం వలన వాతావరణం లో వచ్చే మార్పులతో
ప్రజల్లో రుగ్మతలు పెరుగుతాయి . అధిక వర్షాల వలన కాలువలు నదులలో కాలుష్యం చేరటం వలన అంటు రోగాలు ప్రబలుతాయి . చిత్తడి నేలల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందుతాయి .ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతారు . ఆషాఢం ఆడవారు గోరింట తప్పక పెట్టు కోవాలని వారి ఐదోతనానికి ముడి పెడతారు .అసలు శాస్త్రీయ కారణం …వర్షం వలన తడి ఆరక గోళ్ళు ,కాలి వేళ్ళు పుండ్లుగా మారుతాయి .గోరింట ఔషధ గుణాలు ఉన్న
మొక్క . చర్మ రక్షణగా పనిచేస్తుంది. అందువలన ఆడవారిని తప్పక గోరింటపెట్టుకోవాలని చెపుతారు .
కొత్తగా వివాహమైన జంటలు కలిసి ఉండ కూడదనే ఒక సాంప్రదాయం కూడా ఉంది .ఆషాఢ మాసం నెల రోజులు ఆడపిల్లను పుట్టింటికి పంపి.ఆషాఢం వెళ్ళగానే ఆషాఢ పట్టీ అనే వేడుకతో అల్లుడిని స్వాగతిస్తారు .వారి ప్రాంతీయ సాంప్రదాయాలను బట్టి వేడుకలు చేసుకుంటారు .కానీ..
నిజానికి శాస్త్రీయంగా …ఆషాఢంలో ఆడపిల్ల గర్భం దాలిస్తే …ప్రసవం నిండు వేసవిలో అంటే ఏప్రిల్ మే నెలల్లో వస్తుంది .ఆ సమయం ప్రసవానికి అనువైనది కాదు కాబట్టి ఈ నియమాన్ని పెట్టి ఉండవచ్చు .
ఇలా ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని శాస్త్రీయ కోణం లో ఆలోచిస్తే మన పండుగలు ,వేడుకల్లో ఎంత విలువైన సందేశాలున్నాయో అర్ధ మవుతుంది .ఆషాఢ మాసం ప్రతి రోజూ కూడ ఆధ్యాత్మికతను సంతరించుకుని వుంటుందనటానికి ఎలాంటి సందేహం లేదు .

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us