మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

గుమ్మన్న యాదిలో..

by తిరునగరి శ్రీనివాస్ May 14, 2023
written by తిరునగరి శ్రీనివాస్

నిరంతర పరిశోధకుడు
నిత్య సాహిత్య సాధకుడు
స్నేహశీలి బాలన్న
అర్థాంతరంగా
అంతర్ధానమయ్యాడు
వ్యక్తిత్వం , వక్తవ్యంతో
సముజ్వలంగా ప్రకాశించిన
ఉత్తమ అధ్యాపకుడు
సాహిత్య సారాలను శోధించి
వెలికితీసిన బహుగ్రంథకర్త
ఆత్మాభిమానధనుడు
ఆ కృషి మహోన్నతం
ఆయన మార్గం అనుసరణీయం
( ప్రొఫెసర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి స్మృతిలో..

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శిష్ట సాహితీ శిఖ‌రం…

by తిరునగరి శ్రీనివాస్ May 14, 2023
written by తిరునగరి శ్రీనివాస్

( ప్ర‌ఖ్యాత సాహితీవేత్త డాక్ట‌ర్ గుమ్మ‌న్న‌గారి బాల‌శ్రీ‌నివాస‌మూర్తి సంస్మ‌ర‌ణ‌లో…)

బ‌హుముఖ కృషితో ప్రామాణిక‌మైన ర‌చ‌న‌ల‌ను తెలుగు సాహిత్యానికి అందించిన విద్వ‌న్మ‌ణి ఆచార్య గుమ్మ‌న్న‌గారి బాల‌శ్రీ‌నివాస‌మూర్తి. సాహితీవేత్త‌గా, ప‌రిశోధ‌కునిగా, ప‌త్రికా సంపాద‌కునిగా నిత్య‌కృషితో ఉజ్వ‌లంగా ప్ర‌కాశించిన ప్ర‌జ్ఞామూర్తి. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టుగా వేలాది ర‌చ‌న‌ల‌ను పత్రిక‌ల‌లో ప్ర‌చురించి ప్రామాణిక పత్రికా ర‌చ‌న‌కు అర్థం చెప్పిన జ్ఞాన‌శీలి.
గుమ్మ‌న్న‌గారి బాల‌శ్రీ‌నివాసమూర్తి 5 సెప్టెంబ‌రు 1966న మెద‌క్ జిల్లా పోతారెడ్డిపేటలో ల‌క్ష్మీన‌రసింహశ‌ర్మ‌, ప‌ద్మావ‌తి దంప‌తుల‌కు జ‌న్మించారు. శ్రీ‌నివాసమూర్తి తండ్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌శ‌ర్మ క‌వి, అవ‌ధానిగా ప్రఖ్యాతి పొందారు. చిన్ననాడే ఇంటి నుండే బాల శ్రీ‌నివాసమూర్తికి సాహిత్యంపై యెన‌లేని మ‌క్కువ ఏర్ప‌డింది. పాఠ‌శాల‌, క‌ళాశాల స్థాయి విద్యాభ్యాసానంత‌రం హైద్రాబాదులో విశ్వ‌విద్యాల‌య స్థాయిలో విద్య‌ను అభ్య‌సించి ప‌రిశోధ‌న చేసి డాక్ట‌రేట్‌ను అందుకున్నారు. జ‌ర్న‌లిస్టుగా, ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టుగా సుదీర్ఘ కాలం వివిధ ప‌త్రిక‌ల‌కు విభిన్న‌మైన ర‌చ‌న‌లు అందించి తెలుగు పాఠ‌కుల‌కు సుప‌రిచితుల‌య్యారు.
తెలంగాణ విశ్వ‌విద్యాల‌యం ఏర్ప‌డిన త‌రువాత అక్క‌డ బోధ‌కులుగా చేరి క్ర‌మంగా అసోసియేట్ ప్రొఫెస‌ర్, ప్రొఫెస‌ర్‌గా ప‌దోన్న‌తులు పొందారు. ప‌రిపాల‌నాప‌ర‌మైన వివిధ ప‌ద‌వులను కూడా ఆయ‌న నిర్వ‌హించారు. ప‌లు విశ్వ‌విద్యాల‌యాలు, సంస్థ‌లు నిర్వ‌హించిన జాతీయ, అంత‌ర్జాతీయ స‌ద‌స్సుల‌లో పాల్గొని అనేక ప‌రిశోధ‌నాప‌త్రాలు స‌మ‌ర్పించారు. వివిధ కార్య‌క్ర‌మాల‌లో సాహిత్య ప్ర‌సంగాలెన్నో చేశారు. సాహిత్య‌, సాంస్కృతిక‌, చారిత్ర‌క అంశాల‌పై ప‌ది వ‌ర‌కు ప్రామాణిక‌మైన పుస్త‌కాల‌ను వెలువ‌రించారు. ఆత్మ‌క‌థ‌ల్లో ఆనాటి తెలంగాణ‌, స‌మ‌కాలీన వాదాలు – సాహిత్య విమ‌ర్శ‌, తెలంగాణం – తెలుగు మాగాణం, తుషార స‌మీరం, తెలంగాణ ప‌త్రిక‌లు, వెలుతురు కొల‌ను, మా ప్ర‌సిద్ధ‌పేట‌, విల‌క్షణ – పి.వి న‌ర‌సింహారావు జీవిత చ‌రిత్ర‌, దేవుల‌ప‌ల్లి రామానుజ‌రావు (మోనోగ్రాఫ్), జీవ‌నహిందోళం (గుమ్మ‌న్న‌గారి ల‌క్ష్మీన‌రసింహ‌శ‌ర్మ గారి జీవితం – అవ‌ధానం), తెలంగాణ వైతాళికులు సంపాద‌క‌త్వం (మూడు సంపుటాలు.. జ‌న‌నేత‌లు, అక్ష‌ర మూర్తులు, ప్ర‌తిభామూర్తులు), సాహితీ సుధ‌, తెలంగాణ చ‌రిత్ర సంస్కృతి వార‌స‌త్వం, తెలంగాణ సాహిత్య చ‌రిత్ర మొద‌లైన ఆయ‌న ర‌చ‌న‌లు ఎంతో పేరొందాయి. 56 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే వెల‌క‌ట్ట‌లేని సాహిత్య, సాంస్కృతిక, చారిత్ర‌క, సామాజిక‌ అంశాల‌ను శోధించి, ప‌రిశోధించి సాహిత్య‌లోకానికి అందించారు.
పండిత క‌వి, అవ‌ధాని ల‌క్ష్మీన‌ర‌సింహ‌శ‌ర్మ‌ కుమారుడైన బాల శ్రీ‌నివాస‌మూర్తి త‌న అద్వితీయ ర‌చ‌నా ప్ర‌తిభతో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా సాహిత్య‌రంగంలో ఎంతో పేరొందారు. తెలంగాణ‌, తెలుగు మాగాణం, వెలుతురు కొల‌ను, తుషార స‌మీరం అన్నవి శ్రీ‌నివాస‌మూర్తి విమ‌ర్శా ప్ర‌తిభ‌ను చాటిచెప్ప‌డ‌మే కాక ఎంద‌రో ప్ర‌సిద్ధ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందాయి. ఆత్మ‌క‌థ‌ల్లో ఆనాటి తెలంగాణ అన్న ర‌చ‌న‌లో మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మ కాలంలోని క‌థ‌లు పోషించిన కీల‌క పాత్ర‌ను రాజ‌కీయ నిబ‌ద్ధ‌త‌తో అత్యంత జాగ్ర‌త్త‌గా శ్రీ‌నివాస‌మూర్తి ర‌చించారు. ఆధ్యాత్మిక ర‌చ‌నా విశిష్ట‌త‌ను తెలుపుతూ ర‌చించిన తెలుగులో ఆధ్యాత్మిక వ‌చ‌న కావ్యాలు అన్న ప‌రిశోధ‌నాత్మ‌క గ్రంథం ఎంతో మంది పండితుల ప్ర‌శంస‌లందుకుంది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైత‌న్యం – ప‌త్రిక‌ల పాత్ర అన్న ప‌రిశోధ‌నతో 1920 – 56 మ‌ధ్య కాలంలో తెలంగాణ‌లో ప‌త్రిక‌ల చైత‌న్య భూమిక‌ను, సామాజిక చారిత్ర‌క ఘ‌ట్టాల‌ను వివరించారు. విల‌క్షణ అన్న పేరుతో పీవీ శ‌త జ‌యంతి మోనోగ్రాఫ్‌ను నీల్‌క‌మ‌ల్ పుస్త‌క సంస్థ కోసం ఎంతో అద్భుతంగా శ్రీ‌నివాస‌మూర్తి రాశారు. పీవీ బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌కు ఈ గ్రంథం ప్ర‌త్య‌క్ష‌ నిద‌ర్శ‌నంగా నిలిచింది. తెలంగాణ గురించి మూడు ప్ర‌త్యేక సాహిత్య వ్యాస సంపుటాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించి ఎంద‌రో సాహితీవేత్త‌లను ప్రోత్స‌హిస్తూ విలువైన‌ వ్యాసాలను రాయించారు. ఎంతో గొప్ప సాహిత్య కృషిని ఈ సంపుటాల ద్వారా బాల‌శ్రీ‌నివాస‌మూర్తి అందించారు. సుల‌భ వ‌చ‌న ర‌చ‌నాశైలిలో ఏ స్థాయి పాఠ‌కుడినైనా వెంట‌నే ఆక‌ట్టుకునేలా ర‌చ‌న చేయ‌డం బాల‌శ్రీ‌నివాస‌మూర్తి ప్ర‌త్యేకత‌. చిన్న వాక్యాలు, సుల‌భ‌మైన ప‌దాల‌తో అర్థ‌వంతంగా అమూల్య గ్రంథాల‌ను అందించిన ఆయ‌న సాటిలేని మ‌హోన్న‌త సాహితీమూర్తి. విన‌మ్ర‌త‌తో, విజ్ఞానంతో అంద‌రికీ ఆత్మీయునిగా ఆయ‌న త‌న సాహిత్య ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు.
తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవ‌లందించిన బాల‌శ్రీ‌నివాసమూర్తి 24 ఏప్రిల్ 2023న హైద్రాబాదు సుచిత్రలోని త‌మ ఇంటిలో గుండెపోటుకు గురై మ‌ర‌ణించారు. తెలుగు సాహిత్యంలో చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోయే విశిష్ట కృషి చేసిన ప‌రిశోధ‌క‌మూర్తి, అరుదైన సాహితీవేత్త బాల‌శ్రీనివాసమూర్తికి క‌న్నీటి నివాళి.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఓ బాటసారి ఇది జీవిత రహదారి – పాట విశ్లేషణ

by Padmasri Chennojwala May 14, 2023
written by Padmasri Chennojwala

(మే నెల రెండవ ఆదివారం ‘మదర్స్ డే ‘ ని పురస్కరించుకుని)

తాతినేని రామారావు
దర్శకత్వం వహించి, జి . బాబు నిర్మాతలుగా వ్యవహరించి ,1981 లో విడుదలైన ఇల్లాలు చిత్రం లోని పాట ఇది . ఆత్రేయ రచించి , జేసుదాస్ , శైలజ గార్లు గానం చేశారు .ముఖ్య తారాగణం శోభన్ బాబు జయసుధ శ్రీదేవి.

సద్గుణ సంపన్నుడైన భర్త ,ముద్దులొలికే బిడ్డ ,జీవితం సాఫీగా సాగడానికి అవసరమైనంత డబ్బు ఉన్నప్పటికీ ,ఆమె మనసు ఎండమావుల వెంట పరుగులు తీస్తుంది . ఫలితంగా ముగ్గురి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి.

పల్లవి:

ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఎంత దూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది ఒకరికి సొంతం కాదు ఇది

ఆది అంతం తెలియని ఈ రహదారి పయనంలో ఎవ్వరికీ ఏది సొంతం కాదు . దీని లోతులు కనుగొనడం ఎవరివల్లా కాదు అని ఒకింత వైరాగ్యాన్ని వ్యక్తపరుస్తుంది (పల్లవి)

చరణం 1.
ఎవరు ఎవరికి తోడవుతారో ఎప్పుడెందుకు విడిపోతారో మమతను కాదని వెళతారో మనసే చాలని ఉంటారో ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ

కలిసి ఉండటానికైనా , విడిపోవటానికైనా ఒక్క కారణం చాలు. ఆ కారణం వారి వారి ఆలోచనా విధానంపై , వారి వారి మనస్తత్వాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేమాభిమానాల విలువ తెలియక ఒకరు వదులుకుంటే , ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన సంపద ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రేమే అని ఇంకొక స్త్రీ అతని జీవితంలోకి అడుగెట్టి శూన్యమైన అతని జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. ఏ నిర్ణయానికైనా కారణం ఏమిటని ఈ రహదారి ప్రయాణం అడగక పోవడానికి కారణం ఆలోచించే కోణాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. దీనికి ప్రయాణమే తప్ప కారణాలతో సంబంధం ఉండదు అని అభిప్రాయపడుతున్నారు.
చరణం 2:
కడుపు తీపికి రుజువేముంది అంతకుమించిన నిజమేముం
ది
కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా ఇప్పుడు తప్పును తెలుసుకుని జరిగేదేమిటనీ క్షమించదెవ్వ రినీ

శుష్కమైన ఆనందాల వేటలో పడి మాతృత్వాన్ని కాలదన్నకున్న నిన్ను భూమాత క్షమిస్తుందా ? చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు.

మనిషి పూర్తి సుఖంగా బ్రతకలేక పోవడానికి కారణం తనకున్న దానిపై నిర్లక్ష్యం , లేని దానికోసం ఆరాటం అంటారు ప్రఖ్యాత తత్వవేత్త రియో

కథానాయిక తనకున్న పచ్చని పైరు లాంటి జీవితం విలువ తెలియక జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటుంది.
పేగు బంధాన్ని బరువు అని తలచిన నిన్ను భూమాత ఎలా మోస్తుంది అనీ,జరగకూడని నష్టమంతా జరిగిపోయాక తప్పును తెలుసుకోవడం వల్ల ఫలితం శూన్యం అని వివరిస్తున్నారు.

చరణం 3:
తెంచుకుంటివి అనుబంధాన్ని పెంచుకున్నదొక హృదయం దాన్ని
అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతంగా తెచ్చుకుని తల్లివి కాగలవా తనయుడు కాగలడా

నవ మాసాల ఫలాన్ని నువ్వు కర్కశంగా , నిర్దాక్షిణ్యంగా వదులుకొని వెళితే ఆ అనుభూతి పరిమళాలేవీ ఆస్వాదించకపోయినా, కేవలం హృదయౌన్నత్యంతో ఆ పసిబిడ్డను గుండెకు హత్తుకున్న స్త్రీ ఎంతటి ప్రేమ మూర్తో , ఎంతటి అనురాగమూర్తో ఒకే ఒక పదంతో చెబుతున్నారు.

ప్రేమించే మనసు నీటి చెలిమి వంటిది . ఎన్ని నీళ్లు తోడుకున్నా ఇంకా ఇంకా ఊరుతూనే ఉంటాయి. నువ్వు ప్రేమను పంచినప్పుడే అవతలి వైపు నుండి పొందగలవు . అమ్మతనం గుండె లోతుల్లోంచి ఉప్పొంగాలే తప్ప బలవంతంగా తీసుకోవాలనుకుంటే దానివల్ల ప్రయోజనం శూన్యం అని చెబుతున్నారు.

చరణం 4 :

అడ్డదారిలో వచ్చావమ్మా అనుకోకుండా కలిశావమ్మా నెత్తురు పంచి ఇచ్చావు నిప్పును నువ్వే మింగావు ఆడదాని ఐశ్వర్యంమేమిటో ఇప్పుడు తెలిసిందీ కథ ముగిసే పోయింది.

జీవితం విలువ తెలియని నాడు , స్త్రీ యొక్క ఆనందం ఎందులో ఉంటుందనే విషయం అర్థం కాని రోజుల్లో, వదులుకున్న ఆనందాలని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసే నాటికే సమయం మించిపోయింది అని చెబుతున్నారు.

కథ మొత్తం ఈ ఒక్క పాటలోనే ఆవిష్కరింపబడిందా అన్నంతగా పదం పదం లో ఒదిగిన ఆర్ద్రత , నటీనటుల హావభావ వ్యక్తీకరణ ,శ్రోతలను అలరించగలిగిన అనేకంటే కదిలించగలిగిన గాయనీ గాయకుల ప్రతిభ, కాచి వడబోసిన జీవిత సత్యాలు , కుటుంబ విలువల గూర్చిన వివరణ , వాటిని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం గూర్చి ఒక చక్కని సందేశాన్ని అందించారు. కథను ఆవిష్కరించడానికి రహదారిని వస్తువుగా ఎంచుకోవడం బస్సు ప్రయాణంలోసాగే నేపథ్యగానం అత్యంత వైవిద్యభరితంగా ఉంది.
చక్కని పాటను మనకందించిన అందరికీ అభినందనలు.

             పద్మశ్రీ చెన్నోజ్వల
May 14, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాధలు రోదనల నీడలు కారాదు

by Jaggiah May 14, 2023
written by Jaggiah
నీళ్ళల్లో అలజడి కలిగి
జలం జ్వలించి జ్వాల పుట్టదా
తొక్కిన కొధ్ధీ మట్టి
గట్టిపడి రాయిలా మారదా!

నాటిన విత్తనం నేలను చీల్చుకొని
గెలుపును సూచించదా
ఒత్తిడిలో కుక్కర్
ఈల పాట పాడదా!

గాయమైన గుండె
హాయిగొలిపే గేయాలు రాయదా
కాలికి కట్టిన గజ్జె
గుండెల్లో శబ్ధం చేయదా!

బాధలు రోదనల నీడలు కారాదు
అవి జీవితానికి దారిచూపే బోధనలు
భయం పిల్లిని చేస్తుంది
ధైర్యం పులిని ఎదిరిస్తుంది!

అడుగులు ముందుకు వేస్తే
దూరం దగ్గరయి పలుకరిస్తుంది
విజయం బాట వేసి పిలుస్తుంది
ఆనందం ఆలింగనం చేసుకుంటుంది!

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కుందేలు ఉపాయం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, May 14, 2023
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

      అదొక అడవి .   ఆ అడవికి రాజులేడు.   అప్పుడు మరొక  అడవి నుండి ఒక  చిరుత పులి అక్కడికి  వచ్చింది. అది తన ఇష్టము వచ్చినట్లు జంతువులపై దాడి  చేయ సాగింది .దాని బాధ పడలేక జంతువులన్నీ తప్పించుకొని తిరగసాగాయి. ఆ చిరుత పులి ఆగడాలకు అంతే లేదు.
        ఇలా ఉండగా ఆ జంతువులన్నీ ఈ  చిరుతపులి బాధలు భరించలేక  అవి  కుందేలుతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు ఆ  కుందేలు” మీరు నేను చెప్పినట్లు చేయండి. మీ బాధలు నివారణ అవుతాయి” అని వాటికి ఒక ఉపాయం చెప్పింది. అవి సరేనన్నాయి. 
       కుందేలు చిరుతపులి వద్దకు వెళ్లి “ఓ  చిరుతపులి రాజా !నీవు పరిగెత్తి వేటాడే అవసరం లేకుండా  ఆ జంతువులు నీ ముందరే ప్రత్యక్షమయ్యే మంత్రం నా వద్ద ఉంది. ఒక మునీశ్వరుడు ఈ మంత్రాన్ని పఠించగా నేను దానిని విని నేర్చుకున్నాను.   ఇదిగో చూడు “అని తన కళ్ళు మూసుకుని ” టుర్ర్ ర్ర్  కాంజి” అని అంది.  వెంటనే అక్కడ ఒక జింక ప్రత్యక్షమైంది .అప్పుడు చిరుతపులి దానిని వేటాడబోయేంతలో కుందేలు దానిని ఆపి “ఆగండి చిరుత పులిరాజా! ఇంకా కొన్ని జంతువులు కూడా ఇలాగే మీ ముందు ప్రత్యక్ష మవుతాయి.  మీరు దేనిని కోరుకుంటారో  చెప్పండి.  ఆ జంతువు   ఇక్కడ మీ ముందు వెంటనే  ప్రత్యక్షమవుతుంది. చూడండి .  మీకు ఇంకా ఏ జంతువు  కావాలి “అని  అడిగింది .  అప్పుడు చిరుతపులి” కోతి” అని అంది.  వెంటనే కుందేలు ” టుర్ర్ ర్ర్ తికో ”  ”  అని అంది.   వెంటనే ఒక కోతి వాటి ముందు ప్రత్యక్షమైంది.
         తర్వాత చిరుతపులి “అడవి దున్న” అని కోరింది. అప్పుడు కుందేలు ” టుర్ర్ ర్ర్  న్నదువిడఅ  ”  అని అంది .వెంటనే అక్కడ  అడవిదున్న  ప్రత్యక్షమయింది. అలాగే ఎలుగుబంటి, దుప్పి, జిరాఫీ కూడా కుందేలు ఆ మంత్రం చదవగానే  ప్రత్యక్షమైనాయి.  చిరుతపులి సంతోషించి” ఓ కుందేలా! నాకు ఈ మంత్రం చెప్పవా! నేను నిన్ను ఏమీ చేయనులే!” అని అంది.
        అప్పుడు కుందేలు “చిరుతపులి  రాజా! ఈ మంత్రం చాలా మహిమ గలది.  ఇది  పనిచేయాలంటే  మీరు  కొన్ని నియమాలు పాటించాలి.   ఒక నెల రోజుల వరకు మీరు  ఏ జంతువును చంపకూడదు.  అలా చేస్తేనే మీకు ఈ మంత్రం  పనిచేస్తుంది “అని అంది. అందుకు చిరుత పులి  సరేనంది .
            ఇలా నెల రోజులు గడిచాయి.   తర్వాత  ఆ చిరుతపులి ఆ మంత్రాలను చదివింది.  కానీ ఒక్క జంతువు దాని  ముందర నిలువలేదు. ఇదేదో కుందేలు తనను మోసగించిందని దానికి అప్పుడు అర్థమైంది.  వెంటనే అది కోపంతో  కుందేలు కోసం ఎంత వెదికినా  అది కనబడలేదు.  అదే కాదు. ఆ  అడవిలో ఒక్క జంతువు కూడా కనిపించలేదు .
          అవి అన్నీ పక్క అడవికి పారిపోయి మృగరాజు సింహాన్ని శరణు వేడాయి .  వెంటనే ఈ చిరుతపులి ఆ అడవికి కుందేలును వెదకుటకై వెళ్లింది.    ఆ అడవికి వెళ్ళిన చిరుతపులిని సింహం తరిమి తరిమి కొట్టింది.   చివరకు ఆ చిరుతపులి తన అడవికి తిరిగి వచ్చి  అక్కడ ఒక్క జంతువు కూడా  లేకపోవడంతో చేసేది లేక  అది  అక్కడనుండి మరొక కొత్త అడవిని  వెతుక్కుంటూ బయలుదేరింది .
        ఈ సంగతి తెలిసిన జంతువులన్నీ తిరిగి ఆ అడవికి వచ్చి సుఖంగా ఉండసాగాయి. అవి కుందేలుతో ” ఆ మంత్రం ఏమిటి? మాకు కూడా చెప్సవా!” అని అడిగాయి. అప్పుడు కుందేలు నవ్వి ” అయ్యో! అది మంత్రం కానే కాదు. అక్షరాలను తలక్రిందులుగా చేసి అన్నాను. అంతే! ఆ తెలివి తక్కువ చిరుత పులి నమ్మింది ” అని అంది.
        ఆ తర్వాత  అవి తమను కాపాడిన సింహాన్నే తమ అడవికి  రాజుగా ఉండమని కోరాయి .  అందుకు సింహం అంగీకరించి ఈ రెండు అడవుల్లో ఏ జంతువుకు ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని హామీ ఇచ్చింది.  కుందేలు తెలివి వల్ల  చిరుతపులి బాధ తొలగి జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అందుకే పిల్లలూ! ఆపద వచ్చినప్పుడు ఇతరులకు చెప్పి వారి  సాయాన్ని కోరాలి.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బహుముఖ ప్రజ్ఞాశాలి :శ్రీమతి పాకాల యశోదారెడ్డి

by Radhika Suri May 14, 2023
written by Radhika Suri

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు ,వక్త, వ్యాసకర్త, అధ్యాపకురాలు ,బహుభాషా కోవిదరాలు ఐన శ్రీమతి పాకాల యశోద రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ .ఈమె ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ‘బిజినేపల్లి’ గ్రామం, నాగర్ కర్నూల్ లో ఆగస్టు 8 1929న జన్మించారు .తల్లిదండ్రులు సరస్వతమ్మ ,కాశిరెడ్డి గార్లు. మూడవ తరగతి వరకు మహబూబ్ నగర్ లో చదివి తదనంతరం ‘రాజబహదూర్ వెంకటరామిరెడ్డి ‘గారి ప్రోత్సాహంతో నారాయణగూడ లోని ‘బాలికోన్నత పాఠశాల’లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషల్లో స్నాతకోత్తరపట్టా పొందారు. 1976లో” అలీఘర్ విశ్వవిద్యాలయం’ నుండి డి.లిట్.అందుకున్నారు.హిందీ, ఉర్దూ ,కన్నడ భాషలతో పాటు జర్మన్ భాషలో కూడా ప్రవీణురాలు.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ పాకాల తిరుమలరెడ్డి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రెడ్డిగారు గీసిన ఎన్నో చిత్రాలకు ఆమే స్ఫూర్తి ప్రదాత .స్వతహాగా కళాపిపాసి ఐన ఈమె ‘ఇత్తడి విగ్రహాల’ సేకరణ చేసేవారు. భర్త చిత్రకళా ప్రదర్శనలో చురుకుగా పాల్గొని విజయవంతం అయ్యేలా చూసేవారు. రెడ్డి గారితో ప్రదర్శనల కోసం పలు దేశాలు పర్యటించిన సందర్భంలో ‘భారతీయ చిత్రకళ’ అనే గ్రంథాన్ని రచించారు.

యశోద గారు తన 12వ ఏట నుండే రచనలు చేయడం ప్రారంభించారు. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం రచయిత్రి .ఈమె రచనలు కల్పితాలు కావు. అవి అనుభవ సారాలు .తెలంగాణ జీవన విధానం ,సంస్కృతి- సంప్రదాయాలు ,ఆచార- వ్యవహారాలు ,సామెతలు సందర్భానుసారంగా తమ రచనల్లో నిక్షిప్తం చేసేవారు .బాల్యంలో ఈమెను ‘ఎచ్చమ్మ ‘అని పిలిచేవారట .ఆ పేరుతోనే ‘ఎచ్చమ్మ కథలు ‘రాశారు .యశోద గారు వందకు పైగా కథలల్లినా 63 మాత్రమే పుస్తక రూపం సంతరించుకున్నాయి. మూడు కథా సంపుటాల్లో ‘మా ఊరి ముచ్చట్లు’ (1973 )సంపుటిలో 1920 – 40 మధ్యకాలంనాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ‘ఎచ్చమ్మ కథలు'( 1999 )లో 1950- 70 నాటి తెలంగాణ సంస్కృతిని ప్రస్ఫుటంగా దర్శింప జేశారు .’ధర్మశాల'( 2000) సంపుటిలో 1980 – 90 మధ్యకాలం నాటి తెలంగాణ సమాజపు పరిస్థితులు చక్కగా వివరించారు. ఒక రకంగా తెలంగాణ సమాజపు నూతన శకానికి ‘దర్పణం’గా దీన్ని పేర్కొనవచ్చు. ఈ మూడు సంపుటాల్లో తెలంగాణ భాష, మాండలికం ,సంస్కృతి ,సామాజిక అంశాలను చక్కగా వివరించారు. ‘మా ఊరి ముచ్చట్లు ‘,’ఎచ్చమ్మ కథలు ‘పాలమూరు మాండలికంలోను, ‘ధర్మశాల’వ్యావహారిక తెలుగులో రాశారు.
మాండలిక భాష పరిరక్షణే ధ్యేయంగా ఆమె రాసిన పరిశోధక వ్యాసాలు భారతి, జాగృతి ,మూసీలాంటి ఎన్నో పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంచి వక్తయైన ఈమె ప్రాచీన తెలుగు సాహిత్యంపై చేసిన ప్రసంగాలతో పండితుల ప్రశంసలు అందుకున్నారు .తన మాండలిక యాసతో సభికులను ఆకట్టుకునేవారు .’ఆకాశవాణి’లో తెలంగాణ మాండలికంలో ప్రసంగించిన తొలి రచయితగా పేరుపొందారు .’ఆకాశవాణి’లో ‘పండుగలు – పబ్బాలు ‘,’జరఇను కోవే తల్లీ’ , ‘ఎచ్చమ్మ ముచ్చట్లు’ ఇలా పలు శీర్షికల పేరిట 200 పైగా ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
194 9- 50 ప్రాంతంలో” దక్కన్ రేడియో’లో మాండలిక భాషలో కథలు ,సంభాషణలు, పిల్లల నాటికలు మొదట ప్రారంభించిన ఘనత వహించారు. బాల సాహితీవేత్త ఐన ఈమె ‘బుచ్చయ్య పెబ్బె ‘నాటికను పిల్లలకోసం రచించారు.
యశోద గారు కవయిత్రిగా ఉగాదికి – ఉయ్యాల, భావిక అనే రెండు సంపుటాలు స్వయంగా వెలువరించారు. ఇంకా ద్విపద వాఙ్మయం, ప్రబంధ వాఙ్మయం, భాగవతసుధ రచించారు. సంయుక్తంగా వెలువరించిన మరొక రెండు రచనలు. 1.కావ్యానుశీలనం (డాక్టర్.కులశేఖర్ రావు గారితో కలిసి) 2.చిరుగజ్జెలు (ఆల్వార్ స్వామి ,సి.నారాయణరెడ్డి గార్లతో కలిసి)
వీరు పారిజాతాపహరణం, ఉత్తర హరివంశం ,తెలుగు సామెతలు, ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించి విలువైన పీఠికలు రాసి వెలువరించారు. అనువాదకురాలైన ఈమె’ హిందీ కవయిత్రులు’ గ్రంథాన్ని అనువదించారు.
యశోద గారి అభిప్రాయం: భాషలో నానుడిగాని ,సామెత గానీ, జాతీయం గాని అలవోకగా పుట్టదు. ఆయా ప్రాంతాల వారి అనుభవాల సారం నుండి ఉద్భవించినవి ఇవి. ‘నుడికారాలు ‘భాషకు ‘జీవనాడి’ అని ఆమె పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ,లలిత కళా అకాడమీ, సంగీతా అకాడమీ లలో సభ్యురాలిగా పనిచేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో కూడా అనుబంధము ఉండేది .
నిక్కచ్చి మాట తీరు, నిర్విరామ కృషి ,తెలంగాణ భాషపై పట్టు, మాండలికం పై అవ్యాజమైన మమకారంతో
శైలిలో హృద్యంగా రాసి మాండలికాన్ని ‘సజీవ శిల్పం’గా మలిచి తెలంగాణా భాషా సొబగుల్ని తన విశిష్ట రచనావ్యాసంగాల ద్వారా విశ్వవ్యాప్తం చేసి అలసి ,ఆ భారతీదేవి పాదాల చెంత అక్టోబర్ 7 ,2007న ప్రశాంత నిద్రలోకి జారుకున్న ఈ అవిశ్రాంత బహుముఖ ప్రజ్ఞాశాలికి అందించే ‘అక్షర నివాళి’యే ఏ నిజమైన శ్రద్ధాంజలి.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

లేఖల్లో తిలక్

by Cheedella Seetha Lakshmi May 14, 2023
written by Cheedella Seetha Lakshmi
“ఆంధ్ర సాహిత్యంలో వచన కవితా శిల్పి,కవికుల తిలకుడు,రస గంగాధరుడు అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తన రచనల ద్వారా ఒక విశిష్ట రచనా ప్రవృతిని,కవితా స్రవంతిని, నిర్దిష్టకులాలలో, నిరంతర రస ప్రవాహంగా ప్రవహింపచేశాడు. తన అమూల్య రచనల ద్వారా ఆంధ్ర సాహిత్య చరిత్రలో శాశ్వత కీర్తి చంద్రికల్ని ప్రసరింప చేశాడు. ఆయన రచనలు ఆంధ్ర సాహిత్య ధనాగారానికి ఒక అక్షయ రత్న సంపద వంటివి”.తిలక్ గొప్ప కవి.ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇతనికొక విశిష్ట స్థానముంది.

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తన కవితా లక్ష్యాన్ని చెప్పుకున్న దేవరకొండ బాల గంగాధర తిలక్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో ఆగస్టు 1 వ తేదీ 1921 సంవత్సరంలో జన్మించాడు.
సమాజంలో దగాపడిన వారి జీవితాలను చూసి చలించిన తిలక్ సున్నిత హృదయుడు కాబట్టి వాటినే తన కవితావస్తువులుగా మలచుకున్న
తిలక్ భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేతతో “అమృతం కురిసిన రాత్రి,ప్రభాతము సంధ్య,గోరువంక కవితాసంపుటిలు,సుందరీ సుబ్బారావు,ఊరి చివర ఇల్లు అనే కథా సంపుటాలు,సుశీల పెళ్లి,,సాలెపురుగు అనే నాటకాలు,సుచిత్ర ప్రయాణం,ఇరుగుపొరుగు,సప్తశిల అనే నాటికలు ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన తిలక్ కేవలం 45 ఏళ్ల అతి చిన్న వయసులో సెప్టెంబరు 1 వ తేదీ 1966వ సంవత్సరంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.చనిపోయాక కుందుర్తి ఆంజనేయులు రాసిన పీఠికతో 1968 సంవత్సరంలో ముద్రింపబడిన అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా 1971 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
సమాజాన్ని చూసి కరిగిపోయిన తిలక్
మిత్రులకు రాసిన లేఖల ద్వారా మిత్రులతో తిలక్ కున్న సత్సంబంధాలు ,తిలక్ వ్యక్తిత్వం,మనస్తత్వం మొదలగు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.

‘ఆవంత్స సోమసుందర్’ తిలక్ కు ప్రాణమిత్రుడు.సోమసుందర్ కు రాసిన లేఖలో ” జీవితంలో ఎప్పుడు ఎవరు వచ్చి గుండెల్ని పెనవేసుకుపోతారో ఏం తెలుస్తుంది.అలాగ సామీప్యంలోని ఆత్మీయమైన ఆవరణలోకి విచిత్రంగా సురభీకృతం చేస్తూ నువ్వొచ్చావు. అన్నా అని పిలిచావు.ఆ పిలుపు గుండె లోతులంటి, తిరిగి తమ్ముడూ అని ప్రతిబింబించక మానుతుందా? అందుకే ఇంకా మీరు అనే సంబోధన కృత్రిమంగా ఏదో దూరాన్ని పలకరిస్తున్నట్లు తోచి మానివేశాను.” అని రాయడం వల్ల మిత్రులను ఆత్మీయుతతో దగ్గరకు తీసే ప్రేమతత్వం కన్పిస్తుంది. వరవరరావుకు రాసిన లేఖలో ” నా కింత దగ్గరైన నువ్వు అలా అలా దూరదూరంగా ఎందుకున్నావో అని నా మనసు చాలా బాధ పడుతుంది.డబ్బూ,వ్యాపారమూ, ప్రయోజనమూ ప్రధానంగా ఎంచబడే నేటి సంఘంలో అవ్యాజమైన మైత్రి,ఆర్టిస్టుల మధ్య మైత్రి ఒకటి గదా!
కన్సిడరేషన్! నువ్వు నా కన్నా చాలా పిన్నవాడివైతే మాత్రం కుల వయో దశ భేదాలు కవులలో,కళారాధకులలో అప్లై చేయవు.” అంటాడు.మైత్రీ బంధానికి తిలక్ ఇచ్చిన విలువ గొప్పది.డబ్బు,హోదాకు లొంగనిది.కులాతీత,వయోతీతమైంది.నిస్వార్థ,అవ్యాజమైనదే అసలు సిసలైన మిత్రత్వము.నిజమైన మైత్రికి ఇవేవీ అడ్డుకావని మైత్రికి చక్కని నిర్వచనం చెప్పాడు.ఇలా లేఖలలో తిలక్ స్నేహానికిచ్చిన ప్రాధాన్యం తెలుస్తుంది.

జీవితంలో ఏదో సాధించాలనే ఆశ,తపన ” వేళ్ళ సందుల్లోంచి పొడి ఇసుకలా జారిపోయే కాలాన్ని, వయస్సునీ,తల్చుకుంటే భయమౌతుంది.” అని ఒక ప్రచురణ సంస్థ నెలకొల్పాలన్న తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ నీ సహకారం ఉంటే తప్పక కృతకృత్యుణ్ణవుతానని రాస్తూ సమయం దాటాక బాధపడి ప్రయోజనం లేదు.” అందుకే ఈ లోపుగా చేసి వెయ్యడం మంచిది కదా.” అంటూ సోమసుందర్ కు రాసిన లేఖలో తెలిపాడు.

మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో జీవితంలో తృప్తి ఎట్లా లభిస్తుందో వివరించాడు.” నెల బారుగా,చప్పగా,బాధగా వెళ్లిపోయే జీవితంలో ఏవో కొన్ని గొప్ప క్షణాల్ని మనవిగా చేసుకున్నామనే ఆనందమూ,దాన్ని నలుగురితో పంచుకోవడమూ కన్నా తృప్తి ఏముంది.” అంటూనే ” ఇక్కడ దట్టంగా పరచుకున్న మనుష్యారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ,దోమలూ,రాజకీయాలు జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలో కన్నా అడవుల పచ్చదనమూ,ప్రకృతి సన్నిహితంగా ఉన్న మీ జీవితమే సుఖకరమేమో.” అనడం వల్ల కుళ్లు మనుష్యుల మధ్య నలిగి బ్రతికే కంటే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అడవుల్లో ఉంటే మనసుకు తృప్తి అనే భావన కలిగినవాడు. అట్లాని మానసికమైన ఒంటరితనాన్ని భరించడం కూడా కష్టమే నంటాడు.

తిలక్ బాధాతప్త హృదయుడు.జీవితంలో జరిగిన సంఘటనలు, మనసులో మరపురాని ముద్రలే అతన్ని కవిగా చేశాయి మోగంటి మణిక్యాంబకు రాసిన లేఖలో చిన్నతనంలో ఒక వృద్ధుడు,జీర్ణాదేహుడు,ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి చూసి ఎంతో ఏడ్చాడు.” జీవితం అంటే ఏమిటి? సృష్టి పరమార్థం ఏమిటి? అన్న చింతనలో పడ్డాడు.16,17 సంవత్సరాల వయసులో ఒకసారి పార్క్ టౌన్ స్టేషన్ లో దిగివస్తుంటే ఇద్దరు ముగ్గురు బాబూ! ఒక మాట అని పిలిచారు.ఏమిటో నని వారి దగ్గరకు వెళ్ళాడు.ఒక వస్తువు మీద గుడ్డను తీసి చూపించారు.భయంకరమైన, వికృతమైన శవం.దహనానికి చందా అడుగుతున్నారు.జేబులోంచి చేతికి వచ్చిన డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళాడు.గది కెళ్లగానే ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లు భయపడ్డాడు.రాత్రంతా ఆలోచనలతో సతమతమయి అంతా మిథ్యగా అనిపించింది.బ్రతుకు మీద విరక్తి కలిగింది.

ఇంకోసారి మిత్రులతో సినిమాకి వెళ్తున్న సమయంలో ఒక ఎనిమిదేళ్ల పిల్ల ఆకలిగా ఉంది.డబ్బులిమ్మంది అందరూ ఆమెని విదిలించుకుని చీ అని తోసి వేస్తుంటే సభ్యత కోసం తిలక్ కూడా విదిలించుకున్నాడు.ఆ రోజు రాత్రంతా బాలికనే కళ్ళముందు నిలిచింది తెల్లవారి జేబులో పది రూపాయలు వేసుకుని ఆ అమ్మాయి కోసం అంతా గాలించాడు.కానీ ఆమె కనిపించలేదు.మూడు రోజులు వెతికాడు కానీ వృధా. ” ఆమె అందమూ ,సొగసైన కళ్ళు,ఆ బాల్య చాపల్యమైన మనస్సు ఏ ధూళిలో ఏ బాధలో ఏ మంటలో దినదినమూ కాలిపోతున్నాయి ” ఎవరు దీనికి కారణం?…విలవిలలాడి పోయాను.ఆమె నా చెల్లెలే అయితే అలా ఛీదరించుకునేవాణ్ణ ?” అనుకున్నాడు నెలరోజుల తర్వాత ఆమె కనిపిస్తే జేబులోంచి ఆరు రూపాయలు తీసి చేతిలో పెట్టి ఒక రోజు కడుపు నిండా తిను అని వెళ్ళిపోయాడు.అప్పటి సంఘటనలు మనసులో కలవరం రేపి ” ఈ జీవితానికి,సమాజానికి అర్థం తెలుసుకోవడానికి,ఒక అర్థం ఇవ్వడానికి ఒక ఆదర్శ జ్వాలలో నా బ్రతుకును చుట్ట బెట్టి తోడు లేని ఈ దారిని నాటి నుండి ప్రయాణం” సాగించి అనేక బాధలతో,అనారోగ్యంతో అలమటించి ” గొప్ప అనుభవాన్ని కవిత్వాన్ని పొందాడు మధురమైన
ఆ హృదయాన్ని,మనస్సుని లోకంచుట్టూ తిప్పి సౌందర్యాన్ని అవలోకించి ఆహ్వానించాడు.” అని చెప్పిన సున్నిత హృదయుడు,కోమల మనస్కుడు జీవితానికి,సృష్టికీ ఒక అర్థం వెదికి సమాజానికి సుఖ సంతోషాల్ని అన్వేషించాలనే తపన కలవాడు.” మనిషీ, సంఘమూ,దేశమూ, విశ్వమూ ఈ సర్వ జగత్తు జ్ఞాన సరస్సులో విరిసిన ప్రేమ పద్మం లాగా సత్యం,శివం, సుందర శీలమై ఉండాలి.” అంటాడు.”

వ్యుత్పత్తి,వివేకం,ఉద్రేకం ఇన్నింటిని సమ్యక్ స్వరంలా మేళవించి” ఏదో సాధించాలనే తహతహలాడేవాడు.నిజమైన వెలుగు కోసం ” ఏళ్ల తరబడి సృష్టించుకున్న మౌఢ్య భావాలు,సంకెళ్లని పగులగొట్టి” స్వార్థమూ, సంఘ గౌరవమూ, ధనమూ ప్రధానమైన ఈ లోకాన్ని ఖాతరు చేయక ఏ పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కోగల ఆత్మీయశక్తి నాకుంది ఆనుకొని ” సంపూర్ణ నిర్మలానురాగం ముందు తప్ప తల వాల్చగూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.” అని మానసిక ఆవేదనను,ఆశయాన్ని తేటతెల్లం చేశాడు.” నిర్ధయా, నిశ్చితమైన నిధి కొండరాళ్ల మీద తలబాదుకొని ఏడ్చినవాణ్ణి కాబట్టి ఏ విశ్వాసాన్ని వృధా పోనివ్వను.” సున్నితమైన నా మనస్సు మీద కూడా ఎన్నో దెబ్బలు తగిలాయి.” అంటూ మానసిక బాధను వ్యక్తపరచి ” ఒక్కొక్క కన్నీటి చుక్కను తుడువగలిగితే జన్మ సార్థకమన్న శరత్ మాటలను స్వతహాగా ఆచరించాలన్న ఉబలాటం కలిగిన వాడు.ఆయన మాటల్లోనే ” ఒక సంఘము నుండి ఉబికే బాష్పాన్ని తుడువగలిగితే ఒక్క అధరం మీదికి హాస్యాన్ని రప్పింపగలిగితే జీవితం ధన్యమౌతుందని నా ఉద్దేశ్యం.కరుణ,సౌందర్యమూ, మానవత్వమూ ఈ మూడు ప్రాతిపదికలుగా నా ఆదర్శాన్ని,ఆలోచనల్ని నిర్మించుకున్నాను నా రచనలూ నా జీవితమూ ఈ భావనల్ని వ్యక్తీకరించకపోతే నేను జీవచ్చవాన్ని” అని తన కవితా లక్ష్యాన్ని, జీవితాదర్శాన్ని వివరించాడు.తిలక్ మనస్తత్వమేమిటో ఎంతో చక్కగా వివరించాడు లేఖల ద్వారా.” *దుఃఖానికీ, బాధకీ కరుగలేకపోతే ఈ బాలగంగాధరుడు తన కవిత్వాన్ని,తన ప్రాణాన్ని కూడా బంగాళాఖాతంలో విసిరిపోతాడు అతనిలో ఎంతో దృఢవిశ్వాసం కన్పిస్తుంది.మనిషికి మానవత్వముండాలి.కరుణ, జాలి,దయా ఉండాలి.అవి లేకపోతే జీవచ్చవమేనన్న అభిప్రాయం కలవాడు.తిలక్.జీవితానుభవాలకు,రచనలకు అవినాభావ సంబంధమున్న విషయం ప్రస్పుటమైందీ లేఖల్లో.

” ఆర్ద్రమైన ప్రతి హృదయమూ అశ్రుసిక్తమైన ప్రతి నయనమూ సుందరమైన ప్రతి దృశ్యమూ నన్ను కలలో కూడా వశం చేసుకుంటాయి.ఒక్క పాటకోసం ఒక్క మాటకోసం అవసరమైతే ఈ ధనాన్ని జగత్తునీ కాదనగల సాహసం వుంది నాకు”.అని ప్రపంచాన్నే ఎదిరించి పోరాడిన ధీశాలి, కవితా వీరుడు.కవికి ఉండవలసిన ఉత్తమగుణం తిలక్ లో కనిపిస్తుంది.కవి ఊహలో చరించకుండా జగత్తులో చేదు నిజాన్ని చవిచూసి అనుభవించి ఆవిష్కరించాడు. బాహ్య జగత్తులోని విశిష్ట సన్నివేశాల వలన, ప్రజ్ఞా విశేషం వలన తమలో కలిగిన ఆలోచనా వైవిధ్యం చేత,తమకు కలిగిన అనుభవాలను కావ్య చిత్రణం ద్వారా వ్యక్తీకరించి ఆనందం చేకూర్చడం తిలక్ లక్ష్యం.ఇంద్రియాలకు తృప్తి కలిగించేది అతని దృష్టిలో ఆనందం కాదు మానవత్వంలో పరిపూర్ణత నొందుటలోనే ఆనంద మున్నదని అతని సిద్ధాంతం. *సుందర స్వప్నాల మేడమెట్ల నుండి వాస్తవిక శిథిల రూపాలలోకి హఠాత్తుగా జారిపడిన నాకు తెలుసు అంటాడు.” పైకి నవ్వుతున్నా అలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో వున్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు”. అని వాపోతాడు,లోతుల్ని వెతుకుతాడు.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గాయాలు తగిలినా ఎదుర్కోగలిగే శక్తి గలవాడు.కృంగిపోవడం నా స్వభావానికి వ్యతిరేకం అన్న ధీరమనస్కుడు.
అసలు కవి అంటే ఎవరు?కవి ధర్మాన్ని లేఖల్లో వివరించాడు.” సున్నితమైన ఊహ,ఉద్రేకము,” ఉంటేనే గొప్ప రచనలు వస్తాయన్న విశ్వాసము కలవాడు.సాధారణంగా మానవులందరూ దైనందిన సమస్యలతో ,బాధలతో సతమతమవుతూ వుంటారు.చిన్న చిన్న కోరికలూ,ద్వేషాలూ,అల్పమైన ఊహాలతో సతమతమవుతూ వుంటారు.” నేలబారుగా జడంగా స్తబ్దంగా గొంగళిపురుగుల్లా పాకుతారు.వాళ్ళకి సౌందర్యం డబ్బులోనూ ఉద్యోగం లోనూ భేషజంలోనూ కనబడుతుంది కానీ కళాశీలికి యివేమీ కనిపించవు.అతనికున్న విలువలు వేరు.అతని చూపు వినీల గగనాన్ని బురుసుకుంటూ నక్షత్రమండలంలోకి పోతుంది.అతడు మనిషి లోపల మనిషిని చూస్తాడు.అతని దృష్టి ఎక్కడ అందం వున్నా నిజం వున్నా అక్కడ వాలుతుంది. దేనికోసమో తపన,అన్వేషణ నిరంతరంగా సాగిస్తాడు.ఈ యాత్రలో అతడు లౌకిక జగత్తును లక్ష్య పెట్టడు. అందుకే అతని ఊహ శాశ్వతమైంది.అతని నీతి అతీతమైంది.అతని రచన అక్షరమైంది. నశించనిది.” కవి ఊహ లోకోత్తరమైంది. అందువల్లనే ఉత్తమ రచన సార్వజనీనము,సార్వకాలికమౌతుందన్న ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయాలను తలపింపచేశాడు.

కవి సంప్రదాయబద్ధుడుగా కాక కాలానుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకొని రచన సాగించాలంటాడు. కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని,బూజు పట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే. అంటూ సంఘాన్ని మేల్కొల్పాలి,ప్రజలను చైతన్యవంతులను చేయాలి.ఆత్మవిశ్వాసం ఉండాలి.కవిత్వాన్ని సమగ్రంగా దర్శించడమూ,జీవిత విధానాన్ని గురించి స్పందించడమూ చాలా అవసరం అంటాడు తిలక్.

తిలక్ ప్రకృతిలోని అందాన్ని చూసి పరవశించిపోయేవాడు.ప్రకృతిని ఆరాధించేవాడు.లేఖల్లో ప్రకృతి వర్ణన కూడా కనిపిస్తుంది.సహజ చిత్రీకరణ,కవి దృష్టి ప్రత్యేకంగా లోతుల్ని చూస్తుంది.గుండెను హత్తుకుపోయే విధంగా ఉంది.ప్రకృతి వర్ణన సహజంగా వుంది. సోమసుందర్ కు రాసిన లేఖలో ” ఈ రెండు రోజుల నుంచీ వర్షం కురిసి కురిసి భూమి తడిసి తడిసి పచ్చి పచ్చి బాలింతరాలిగా అందంగా వుంది ” అంటాడు
వర్షాకాలంలో తడిగా ఉన్న భూమి ఎట్లా ఉందో ఉపమాలంకార ప్రయోగం చేశాడు. ఆలంకారిక రచన,ప్రకృతిసాన్నిహిత్యాన్ని కోరుకునేవాడు.దట్టంగా పరచుకున్న మనుషారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ దోమలూ రాజకీయాలూ జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలోకన్నా అడవుల పచ్చదనము,ప్రకృతి సన్నిహితంగా వున్న జీవితమే మంచిదని మిరియాల రామకృష్ణ గారికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు.వర్షాకాలం అంటే తిలక్ ఇష్టపడేవాడు.ఆకాశంలో నల్లని మబ్బులు,ఒక్కసారిగా వాన,భూమి చల్లబడి పచ్చబడి మనసుకు ఎంతో హాయిసిస్తుందని చెప్తూనే ” స్నానం చేసి వచ్చిన యవ్వనవతి శరీరంలాగా విచిత్రమైన అందం,ఆకర్షణ.” ఉందని వర్ణించాడు.
మోగంటి మాణిక్యాంబా దేవికి రాసిన లేఖలో మనసులోని వ్యధను ఎవరూ గుర్తించలేరని రాస్తున్న సందర్భంలో పైకి నవ్వుతున్నా అలలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో ఉన్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు అంటూనే జీవితం చాలా విచిత్రమైంది,అద్భుతమైందని చెప్తూనే ” రంగురంగుల అలలలో వంగి బ్రతుకు అంచుల్ని ముంచుతూ వుంటుంది. ఎన్ని స్వప్నాలూ,ఎంత లోతు తెలియని భయంకరాఘాతాలు.” అంటూనే సూర్యోదయాన్ని యీ విధంగా ” చీకటి లొత్త గిత్తి మెత్తని వెల్తురు తూర్పున ఆడదాని అనురాగంలాగ వ్యాపిస్తోంది.నక్షత్రాలు కాంతి విహీనమై గాజుపూసల్లాగా వున్నాయి. అక్కడక్కడ ఒక మబ్బు ఏ అప్సరస ఒంటిమీద నుండో జారిన చీరకొంగులాగ గాలిలో తేలిపోతుంది.మనోహరమూ,శాంతమూ అయిన ఆ ప్రకృతిలో లీనమౌతున్న నా మనసుకు మళ్లీ అశాంతి.” అంటూ తన అనుభూతిని వివరించాడు ఇంతలోనే నిరాశావాదం.” లోపల్లోపల ఏదో ఒంటరితనం ఒక్కణ్ణే నా బాధలతో ఏదో ఎడారి అంచులమీద నడచిపోతున్నాను– అనిపించింది.ఈ సంసారమూ ఈ స్నేహాలూ అన్నీ ఎండమావులేమో– అనిపిస్తుంది.మబ్బు పట్టి ఆకాశంలో ఈ రోజంతా తెలియని చక్కని కౌశలమూ ప్రజ్ఞా వుంది.నేను కొంత ఆశ్చర్య పడ్డాను.ఇంత బాగా రాయగలడా కథలు కూడా అని— కాని నీ కథల పుస్తకంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకుగాని,బలపరచుటకుగాని నీవు చేసిన ప్రయత్నం- ఆ కథాశిల్పంలో ముఖ్య దోషంగా కనబడింది.ఆ కథల రక్తిని అనుభవించకుండా చేసింది. పాలటబులో డిజైనులవల్ల కళ ఎప్పుడూ పరిమితమూ సంకుచితమూ అయిపోతుంది.అయితే ఆ రోజుల్లో నువ్వు ఆ ప్రభావపు ఇనుప కౌగిలిలో ఉండేవాడిని.కాని ‘కాలనేమి’ లో దోషం మచ్చుకైనా లేదు”.

వరవరరావు రచనలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరవరరావుకు రాసిన లేఖలో “అమృతవృష్టిలో అక్కడక్కడ బెట్టుగా ఉంది.యజ్ఞంకై కొత్త టానిక్,సోషలిస్టు సీత–ఇటువంటివి అనుచితంగా తోచాయి.
కుక్క నోట్లోంచి ఎంగిలాకు– ఆ ఇమేజరీ ఎందుకో? ఫోర్స్ డ్ గా వున్నట్లు అనిపించింది.రాకాశశికి మబ్బురంగు పైట అన్నాడు.మబ్బే పైటగా ఉంటుంది గదా.ఆషాఢ మాసంలో ఆ రంగుగల మరో పైట ఏముంటుంది? శశికి మరోసారి రివైజ్ చేస్తే మంచిదేమో అనుకున్నాను.నాకు నచ్చిన లైన్స్ గురించి చెప్పడం లేదు.మీరు మరోసారి చూడండి.మరి మీ కెలా తోస్తుందో? అన్నట్లు “వూసి” అని రెండు మూడు సార్లు ప్రయోగించారు.దాని అర్థం? నాకు కొత్తగా ఉంది.” – యూసేజ్. వరవరరావు తన రచనను సమర్థించినట్లు తెలిశాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను,పొరపాటయింది అని వేరే లేఖలో” పేజీలు సరిజేసి చదివితే రచన సందర్బశుద్ధిగా కనబడింది.” అని రాశాడు. వెనుకటి కవులకు తన కాలంలో కవులకు తారతమ్యాన్ని వివరిస్తూ ” నా వెనుక తరంలో కవులలో ముఖస్తుతీ వెనకాలే దూషణా ప్రత్యేకంగా ఉండేవి.సామాన్యుడి కన్నా ఊహలో,సంస్కారంలో మరికాస్త పెరుగుదల సూచించవలసిన ఆ కవులలో కనబడే ఈ కృత్రిమత్వం ,పిరికితనం దుర్భరమనిపించేవి.ఆఖరుకి కవిత్వంలో కవిత్వాన్ని గురించి నిజాయితీగా చూడలేని వీరి నుంచి ఏ మాశించగలమనుకొనే వాడివి.” అంటాడు.

జానకీ జానికి రాసిన ఉత్తరంలో ‘ మోడరన్ పోయిట్రీ పేరుతో పత్రికలలో ప్రకటితమయ్యే వాటిని చూచి విసుగు చెందాను.దాని మూలంగా చాలా విచారిస్తున్నాను.ప్రబంధయుగంలో చివరికాలంలో వచ్చిన సాహిత్యంలోని సమానమయిన క్షీణత, పదాల గారడి,నడకల శూన్యత,ప్రాస కొరకు ప్రయత్నించుట అందులో మనకు గోచరిస్తాయి.” అంటూ నవీన కాలాన్ని గూర్చి శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి రాసిన వ్యాసమే బాగుందని చెప్తూ సమకాలీన చరిత్రను గూర్చి విశదంగా విమర్శిస్తారని అనుకుంటున్నాదన్నాడు.

ఈ విధంగా తిలక్ లేఖల్లో అతని అనుభూతులు,అనుభవాలు, కవితాలక్ష్యం,రచనోద్దేశ్యం,విమర్శ, ప్రకృతి వర్ణన,ఆరోగ్య విషయాలు,మిత్రత్వానికి యిచ్చిన విలువ మొదలైనవి అనేకాంశాలు విదితమౌతున్నాయి.స్నేహితులకు తన మనోగతాన్ని స్పష్టంగా,నిర్మొహమాటంగా, కవితాత్మకతలో విశదపర్చడం లేఖలవల్ల గమనించవచ్చు. మారుతున్న కాలాన్ని బట్టి సత్యాన్ని అన్వేషించి సమాజాన్ని జాగృతం చేసేదే నిజమైన కవిత్వమనే అభిప్రాయం వున్నవాడు మానవత్వంలో పరిపూర్ణత నొందజూచుటలోనే ఆనందమున్నదని అతని సిద్ధాంతం.
ఈ రకంగా లేఖల వలన కవిత్వంపట్ల తిలక్ కున్న ప్రత్యేకమైన,ఖచ్చితమైన అభిప్రాయం తెలుస్తుంది.
తెలుగు సాహిత్య కన్యకు తన రచనల ద్వారా తిలకం దిద్దిన ప్రముఖ కవి తిలక్ సాహిత్య పరంగా కూడా లేఖలకు ప్రముఖ స్థానముందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అమ్మ

by Rudrakhala Matam Prabhu linga Shastri May 14, 2023
written by Rudrakhala Matam Prabhu linga Shastri

ఉ.మోసెను గర్భమందు నగుమోముయె౹ సంతస మేనిరంతరమ్౹
కాసెను రెప్పవోలె తనకన్నుల౹నిద్రను లెక్కచేయకన్౹
చేసెను సేవలెన్నొ తనచేతను గొల్చు ప్రమాణ మున్నీరుగా?
వ్రాసెటి వేధకైన నది వ్రాయగ సాధ్యమె? అమ్మశ్రేష్ఠతన్౹
~~
(మాతృ దినోత్సవము-14-05-2023)

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

Of Mother too

by Rudrakhala Matam Prabhu linga Shastri May 14, 2023
written by Rudrakhala Matam Prabhu linga Shastri

(poem)

She is meant to beget an
Attachment is not known.

From her birth to death
She does breathe for it.

This is not an association
Venerated as Motherhood.

Fatherhood is regarded when
Womanhood is held with pride.

The Cause may not be inferred
Begetting odd ones is visioned.

He might not be attached
To beget whom He caused.

His Love towards Her would
Cause Him to have attached.

Her worshipping Him would
Let Her have attached to Him.

Love can expect this or that
Whereas worshipping doesn’t.

Worshipping Him would grace
Her Motherhood that is unique.

Uniqueness is not only of the
Almighty but of each mother.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కాలం కబళించిన కవి మిత్రుడు బాల శ్రీనివాసుడు

by madishetti gopal May 11, 2023
written by madishetti gopal

ఇటీవల కీర్తిశేషులైన తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్ డా. బాలశ్రీనివాస మూర్తి ఒక మంచి పరిశోధకులు, ఉత్తమ అధ్యాపకులు, గొప్ప సాహితీ వేత్త గా పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వయంకృషితో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నుంచి ఆచార్య స్థాయి వరకు ఎదిగిన ప్రతిభాశాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వినయం ఆయన సొంతం.
ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా చిరునవ్వుతో అన్నా అని సంభోదించే గొప్ప మనసు ఆయనది. కరీంనగర్ లో జరిగిన రెండు మూడు కార్యక్రమాలలో ఆయనను కలిసి ఆయన ప్రసంగం వినే అవకాశం కలిగింది. అలాగే నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో శ్రీ సి. పార్థసారథి, ఐఏఎస్ వైస్ ఛాన్స్ లర్ గా ఉన్నప్పుడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పక్కనే కూర్చుని చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. ఆయన మృదు స్వభావి సున్నిత మనస్కుడు. అన్నా,అక్క,తమ్మి అని ఆత్మీయ పిలుపులతో అందరినీ పలకరించేవాడు. ఏ విషయమైనా తనకు తోచినంత సహాయ సహకారాలు అందించేవాడు. ఎవరినైనా తొందరగా నమ్మే స్వభావం ఆయనది. కానీ ఎవరైనా నమ్మకద్రోహం చేశారనిపిస్తే మాత్రం అంతే కఠినంగా వ్యవహరించేవారు. సాహిత్యం అంటే విపరీతమైన ప్రేమ. ఏ పని చేసినా సాహిత్యాన్ని, సాహిత్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించేవారు. అంతేకాదు ఆయనను ఆహ్వానిస్తే సాహిత్య ప్రసంగాల కోసం ఎంత దూరమైనా, కష్టమైనా ఇష్టంగా వెళ్లేవారు. అతని ప్రసంగాలలో చక్కటి విశ్లేషణ ఉండేది. విషయ పరిజ్ఞానంతో పాటు శ్రోతలను తన వైపు తిప్పుకునే అద్భుత ధార ఉండేది. అనవసరమైన విమర్శకు దిగేవారు కాదు. తాను చేయాలనుకుంటే ఎంతటి కఠినమైన పని అయినా , కష్టమైన పనైనా ఓపికగా పూర్తి చేసేవారు. విమర్శ రంగంలో సాటిలేని మేటి సాహితీవేత్తగా పేరొందినారు. అనేక రచనలు, వ్యాసాలు ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించి చక్కటి సాహిత్యాన్ని అందించారాయన.

ప్రొఫెసర్ బాల శ్రీనివాసమూర్తి 1966 సెప్టెంబర్ 5న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లోని పోతిరెడ్డి పేట గ్రామం లో జన్మించారు. స్వగ్రామమైన పోతిరెడ్డి పేట, రామాయంపేట, చిన్నకోడూరు, సిద్దిపేట ప్రాంతాల్లో ప్రాథమిక ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ మరియు పీహెచ్డీ చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున జన్మించినటువంటి బాల శ్రీనివాసమూర్తి గురువుగా గొప్ప గౌరవాన్ని చూరగొన్నారు. శిష్యాదిచ్చేత్‌ పరాజయం అన్నట్టుగా శిష్యుడి ఉన్నతిని నిరంతరం కోరుకునే వారు.

తన తండ్రి సుప్రసిద్ధ అష్టావధాని దివంగత లక్ష్మీనర్సింహశర్మ జీవిత విశేషాలపై ఇటీవల రచించిన ‘జీవన హిందోళం’ పుస్తకాన్ని డాక్టర్‌ నందిని సిధారెడ్డి పీఠిక తో ప్రచురించారు. ఆయన తండ్రి కూడా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు. ఈ రచన పలువురు సాహిత్యాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నది. ఇటీవలే ఈ పుస్తకానికి కరీంనగర్ సాహితీ గౌతమి వారు డాక్టర్ గండ్ర హనుమంతరావు స్మారక పురస్కారాన్ని ప్రకటించారు. పురస్కారం అందుకోకుండానే ఆయన పరమపదించడం ఒక విషాదం. బాల శ్రీనివాసమూర్తి భార్య శైలజ. వీరి కుమార్తె హంసిక, కుమారుడు గౌతమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఆయన రాసిన ‘తెలంగాణం-తెలుగు మాగాణం’, ‘ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ’ పరిశోధనాత్మక గ్రంథాలు తెలంగాణ సాహిత్య చరిత్ర రచనల్లో మేటిగా నిలుస్తాయని విమర్శకుల ప్రశంసలు చూరగొన్నారు. ‘వానమామలై వరదాచార్య, విలక్షణ పి.వి జీవిత చరిత్రలు.. ‘తెలుగు వారి చరిత్ర మైలురాళ్ళు – మణిదీపాలు’, ‘65ఏళ్ళ నాటి అలంపురం సభలు’, ‘మా ప్రసిద్ధిపేట’ తదితర రచనలు ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఆయన రచించిన విలక్షణ పి.వి పి.వి నరసింహారావు గారి బహుముఖీనమైన విలక్షణ విశేషాలను తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని పి.వి. శత జయంతి సందర్భంగా మోనోగ్రాఫ్ గా రచించాడు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్ 23 2022 రోజున ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఆయన సంపాదకత్వంలో ‘తెలంగాణ వైతాళికులు’ మూడు సంపుటాలు, ‘తెలంగాణ సాహిత్య చరిత్ర’ పేరుతో మరో మూడు సంపుటాలు వెలువడ్డాయి. జాగృతి వార పత్రిక లో మంచి కథలను సంకలనం చేశారు. తెలుగులో ఆధ్యాత్మిక వచన కావ్యాలు అనే అంశంపై ఆయన రచించిన పరిశోధన గ్రంథం పండితుల మెప్పును పొందింది. తండ్రి గురించి తన బాల్యపు జ్ఞాపకాల గురించి “స్మృతి పదిలం” పేరుతో పుస్తకాన్ని రచించారు. విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం అద్భుతమైన పుస్తకాన్ని అందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుంచి ‘1920-56 మధ్యకాలంలో తెలంగాణలో సాహితీ సాంస్కృతిక చైతన్యం-పత్రికల పాత్ర’ అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందారు. ఆయన పరిశోధన కూడా సుమారు నాలుగు దశాబ్దాల తెలంగాణ సామాజిక చారిత్రక ఘట్టాల ను గొప్పగా ఆవిష్కరించింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చలం రాసిన “సుధ” గీతాలపై ఎంఫిల్ చేశారు. వివిధ పత్రికలలో అసంఖ్యాక వ్యాసాలను రాయడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలు సమర్పించారు.
పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నట్టుగా నువ్వు నాకన్నా ఎదగాలి అని ఆకాంక్షించిన తండ్రి మాటను నిజం చేసి చూపించిన శిఖర సమానుడాయన. సాంప్రదాయ ఆధునిక విమర్శనా రీతులను అధ్యయనం చేసి ప్రామాణిక సాహితీ విమర్శకునిగా ఎదిగిన పరిశోధనా చక్రవర్తి ఆయన.

కరీంనగర్‌లో తెరవే మిత్రులు ‘తెలంగాణ రుబాయిలు’ పరిచయసభ పెట్టినప్పుడు ఎం.నారాయణ శర్మతోపాటు హైద్రాబాద్ నుండి బాలశ్రీనివాస మూర్తిని హాజరైన జ్ఞాపకం ఉంది. అలాగే కరీంనగర్ లో జరిగిన అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక వారి సభల్లో ఆయన హాజరై అద్భుతమైన ప్రసంగం చేసినప్పుడు అల్లం రాజయ్య ఎంత గొప్ప వక్త అని ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ రూపొందించిన “బసవపురాణం పద ప్రయోగ సూచిక” పుస్తక ఆవిష్కరణకు డాక్టర్ బాల శ్రీనివాసమూర్తి మరియు ఆచార్య రవ్వా శ్రీహరి గారలు అతిథులుగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరై ఆ ఇద్దరి అద్భుత ప్రసంగాలు వినే అవకాశం నాకు దక్కింది. యాదృచ్ఛికంగా ఆ ఇద్దరు తక్కువ వ్యవధిలోనే అస్తమించడం సాహితీ ప్రపంచానికి తీరని లోటు.

బాలశ్రీనివాసమూర్తిగారితో రచయిత

విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రాక పూర్వం కొద్దికాలం సికింద్రాబాద్ ఎస్పీ కాలేజీలో పనిచేశారు. ఆ సమయంలో విజేత ఇతర పోటీ పుస్తక ప్రచరణ సంస్థలకు రెఫరెన్స్ గ్రంథాల రచన ప్రారంభించారు. పత్రికల్లో క్రమం తప్పకుండా కాలం రాసేవారు. ఎడిటోరియల్ పేజీలో ప్రతిరోజు ఒక వ్యాసం సమకాలీన రాజకీయాలపై రాసేవారు. సద్గురు శివానందమూర్తి శిష్యునిగా ఆయన సూచన పై పుస్తకాలు రాశారు. తెలుగు సాహిత్య రంగంలో లబ్ద ప్రతిస్తులైన వారిపై 1000 పేజీలకు పైగా సమగ్ర గంధాన్ని వెలువరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ఇటీవల ప్రచురించిన తెలంగాణ సాహిత్య చరిత్ర గ్రంథానికి సంపాదకత్వం వహించి విశేష కృషి చేశారు.

సాటి లేని మేటి పరిశోధకునిగా, విశిష్టత కలిగిన విమర్శకునిగా, గురువుకు పర్యాయపదంగా నిలిచిన ఆచార్యునిగా, సుసంపన్నమైన సాహిత్యాన్ని వెలువరించిన సాహిత్య మూర్తిగా తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసిన బాల శ్రీనివాసమూర్తి ఏప్రిల్ 24 2023 రోజున హైదరాబాదులో సుచిత్రలోనీ తన స్వగృహం లో 57 వ ఏట అస్తమించడం సాహితీ రంగానికి తీరని లోటు. ఆయనకు ప్రగాఢ నివాళులు

May 11, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us